• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Monthly Archives: May 2020

డోనాల్డ్‌ ట్రంప్‌ అసహనం, బెదిరింపుల వెనుక అసలు కథేంటి !

31 Sunday May 2020

Posted by raomk in CHINA, Current Affairs, History, INDIA, International, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, UK, Uncategorized, USA

≈ Leave a comment

Tags

Donald Trump threats and intolerance on WHO, G7 summit, WHO Controversy, WTO


ఎం కోటేశ్వరరావు
ప్రపంచ ఆరోగ్య సంస్ధ : చైనా చేతిలో కీలుబమ్మగా మారింది.
ప్రపంచ వాణిజ్య సంస్ధ: దీన్ని రద్దు చేయాలి, మాకు ఉపయోగపడటం లేదు. చైనా ఆర్ధిక సామ్రాజ్యవాదిగా వ్యవహరిస్తోంది.
ప్రపంచ మానవ హక్కుల కమిషన్‌: తన స్వార్ధం తాను చూసుకొంటోంది, దొంగ ఏడ్పులు ఏడుస్తోంది.
అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టు : దీన్ని మేము గుర్తించం, మా మీద విచారణ జరిపే అధికారం దానికి లేదు.
ఏడుదేశాల బృందం(జి7) : దీనికి కాలదోషం పట్టింది. ఈ బృందంలో భారత్‌, రష్యా, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియాలను చేర్చాలి.
ఇలాంటి సాకులు చెబుతూ ఒక్కొక్క ప్రపంచ సంస్ధ నుంచి తాము తప్పుకుంటామని ప్రకటించటం లేదా బెదిరించటం ఇటీవలి కాలంలో అమెరికాకు మామూలైంది.దశాబ్దాల పాటు తామే అయి నడిపిన యాంకీలు ఇప్పుడు ఆ సంస్ధలనే తూలనాడుతున్నారు, బెదిరిస్తున్నారు ఎందుకు ? కరోనా వైరస్‌ను అవకాశంగా తీసుకొని ప్రపంచ ఆరోగ్య సంస్ధ నుంచి బయటపడేందుకు పూనుకుంది. చైనీయులను బూచిగా చూపుతోంది. ఇలా మరికొన్నింటి నుంచి కూడా తప్పుకొనేందుకు పూనుకుంది వాటన్నింటికీ కారణం ఏమిటి , కారకులు ఎవరు ?
ప్రపంచంలో మానవ హక్కులను కాపాడే ఏకైక దేశంగా ఫోజు పెట్టిన అమెరికా ఆచరణలో వాటిని హరించేదిగా మారింది. స్వేచ్చకు ప్రతి రూపంగా లిబర్టీ విగ్రహాన్ని పెట్టుకున్న వారు ఒక వైపు యాత్రీకుల నుంచి ఆదాయం పిండుకొనే వనరుగా మార్చుకున్నారు. మరోవైపు ప్రపంచంలో అనేక దేశాల పౌరుల స్వేచ్చా, స్వాతంత్య్రాలను హరించిన మిలిటరీ, ఇతర నియంతలను ఆ విగ్రం ముందు నిలబెట్టి అసలైన రక్షకులుగా ప్రపంచానికి చూపారు.
2018లో ప్రపంచ మానవహక్కుల సంస్ధ నుంచి అమెరికా వైదొలగింది. పాలస్తీనియన్ల సమస్య మీద ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఆ సంస్ధ పని చేస్తున్నట్లు ఆరోపించింది. నిజానికి పాలస్తీనియన్ల మాతృదేశాన్ని లేకుండా చేసి వారి ప్రాంతాలను ఆక్రమించి, బందీలుగా మార్చి, నిత్యం దాడులు చేస్తున్న ఇజ్రాయెల్‌ యూదు దురహంకారులకు నిస్సిగ్గుగా మద్దతు ఇస్తున్న ఏకైక దేశం అమెరికా. తాను చేసిన ఆరోపణలకు ఆమోద ముద్రవేయకపోవటం, తాను నందంటే నంది, పందంటే పంది అని వంతపాడేందుకు ఆ సంస్ధ నిరాకరించటమే అసలు కారణం. ఆ సంస్ధ నుంచి వైదొలిగిన అమెరికా సాధించిందేమీ లేదు, అమెరికా లేనంత మాత్రాన దాని కార్యకలాపాలు ఆగిపోలేదు. సిరియా, ఇరాక్‌, లిబియా, ఆఫ్ఘనిస్తాన్‌ వంటి చోట్ల అమెరికన్లు దాడులు,తిరుగుబాట్లను ప్రోత్సహించి, రెచ్చ గొట్టి, తామే స్వయంగా దాడులకు పాల్పడి మానవహక్కుల ఉల్లంఘనలకు పాల్పడిన సత్యం దాస్తే దాగేది కాదు. ఆ నేరాలు ఏడాది కేడాది పెరుగుతున్నాయి గనుక తమను ఎక్కడ బోనులో నిలబెడతారో అనే భయంతో ఐక్యరాజ్యసమితి చొరవతో ఏర్పడిన అంతర్జాతీయ నేర కోర్టును గుర్తించేందుకు నిరాకరిస్తున్నారు.
అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టును ఏర్పాటు చేయాలని అనేక సంప్రదింపుల అనంతరం రోమ్‌ సమావేశంలో తీర్మానించారు.1998 జూలై 17న దాన్ని 120దేశాలు ఆమోదించగా, 21 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. వ్యతిరేకించిన ఏడు దేశాలలో అమెరికా, చైనా, లిబియా, ఇరాక్‌, ఇజ్రాయెల్‌, ఎమెన్‌, కతార్‌ ఉన్నాయి. అయితే 2000 సంవత్సరంలో అమెరికా అధ్యక్షుడు బిల్‌క్లింటన్‌ ఒప్పందం మీద సంతకం చేశాడు. ఇలాంటి ఒప్పందాల మీద దేశాలు సంతకాలు చేస్తేనే చాలదు, వాటిని ఆయా దేశాల పార్లమెంట్‌లు ఆమోదించాలి. క్లింటన్‌ పార్లమెంట్‌కు నివేదించలేదు. రెండు సంవత్సరాల తరువాత ఐక్యరాజ్యసమితికి ఒక లేఖ రాస్తూ రోమ్‌ ఒప్పందానికి తాము కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదంటూ నాటి అధ్యక్షుడు బుష్‌ స్పష్టం చేశారు. ఒకసారి అంగీకరిస్తే ఆయా దేశాల మీద వచ్చే ఆరోపణలు, విమర్శల మీద విచారణ జరపాల్సి ఉంటుంది. అమెరికా గనుక చేరి ఉంటే ఏదో ఒకసాకుతో అనేక దేశాలలో జోక్యం చేసుకుంటున్నదాని దుర్మార్గాలపై ఈ పాటికి ఎన్నో విచారణలు జరిగి ఉండేవి, దాని దుర్మార్గం మరింతగా లోకానికి బట్టబయలు అయి ఉండేది. అందుకే చేరేందుకు నిరాకరిస్తోంది. ఒక వైపు తాము సహకరిస్తామని చెబుతూనే నేరాలకు పాల్పడిన తమ సైనిక, గూఢచార ఇతర పౌరులను రక్షించుకొనేందుకు, కోర్టు కార్యకలాపాలను అడ్డుకొనేందుకు చేయాల్సిందంతా చేస్తోంది. మరికొన్ని అంతర్జాతీయ ఒప్పందాల నుంచి కూడా ఏకపక్షంగా వైదొలగింది. వాటిలో ఇరాన్‌తో కుదిరి అణు ఒప్పందం అన్నది తెలిసిందే. దాన్నుంచి వైదొలగిన తరువాత అమెరికా దాడులు, దానికి ఇరాన్‌ ప్రతిదాడుల సంగతి తెలిసిందే.
ప్రపంచ వాణిజ్య సంస్ధ ఏర్పాటులో అమెరికా ప్రముఖ పాత్ర పోషించింది. ప్రపంచీకరణను అమలు జరిపే సాధనంగా దాన్ని మార్చుకొని తన ప్రయోజనాలు సాధించుకోవాలని చూసింది.కొన్ని సంవత్సరాల తరువాత భారత్‌, చైనాలు ఇంకేమాత్రం అభివృద్ధి చెందుతున్న దేశాలు కాదని, ఆ పేరుతో వాటికి రాయితీలు కల్పించటం అక్రమం అని, తమకు సంస్ధలో ఉన్నందున ప్రయోజనాలేమీ లేవని, తమకు సైతం అదే హౌదా ఇవ్వాలని లేకుంటే తాము సంస్ధ నుంచి విడిపోతామని ట్రంప్‌ బెదిరింపులకు దిగాడు. వర్ధమాన దేశాలు పన్నులను తగ్గించేందుకు ఇచ్చిన వ్యవధి మేరకే భారత్‌, చైనాలు అవకాశాలను వినియోగించుకుంటున్నాయి తప్ప ఎవరి దయాదాక్షిణ్యమో కాదు. నిజానికి నిబంధనలను ఉల్లంఘించి లబ్ది పొందుతోంది అమెరికాయే. అనేక దేశాలపై కేసులు దాఖలు చేసి బెదిరింపులకు దిగింది. మన దేశం పత్తికి మద్దతు ధర ప్రకటించటాన్ని రాయితీ ఇవ్వటంగా చిత్రించి ప్రపంచ వాణిజ్య సంస్దలో మనకు వ్యతిరేకంగా కేసు దాఖలు చేసింది. బోయింగ్‌ విమాన కంపెనీకి పెద్ద ఎత్తున దొడ్డిదారిన రాయితీలు ఇస్తోంది. ఆ విమానాలను కొనాలని ఇతర దేశాలపై తన పలుకుబడిని వినియోగిస్తోంది. బోయింగ్‌కు పోటీగా ఐరోపా ధనిక దేశాలు ఎయిర్‌బస్‌కు మద్దతు ఇస్తున్నాయి. రెండూ పరస్పరం ఆరోపణ చేసుకొని దాఖలు చేసిన కేసు ఇంకా కొలిక్కి రాలేదు. పదహారేండ్ల నుంచి సాగుతున్న ఈ వివాదంలో ఐరోపా యూనియన్‌ను బెదిరించేందుకు అక్కడి నుంచి దిగుమతి చేసుకొనే విమానాలు, విడిభాగాలపై విధిస్తున్న పన్ను 10 నుంచి 15శాతానికి ఈ ఏడాది ప్రారంభంలో అమెరికా పెంచింది.
ప్రపంచ ఆరోగ్య సంస్ధ విషయానికి వస్తే కరోనా వైరస్‌కు కారణం చైనాయే అని ప్రకటించాలన్నది అమెరికా వత్తిడి. దానికి ఆ సంస్ధ లొంగకపోవటంతో ట్రంప్‌ ఎదురుదాడి ప్రారంభించి చైనాతో కుమ్మక్కయిందని ఆరోపించాడు, ముందు నిధులు నిలిపివేస్తామని ప్రకటించి ఇప్పుడు ఏకంగా వైదొలుగుతామని బెదిరింపులకు దిగాడు. ఈ సంస్ధకు ఇచ్చే నిధులను ప్రపంచంలో ప్రజారోగ్యానికి చేసే ఖర్చుకు అంద చేస్తామని గొప్పలు చెప్పాడు. కరోనా వైరస్‌ ఎక్కడ నుంచి ప్రారంభమైందో దర్యాప్తు జరిపేందుకు చైనా సంస్థలను తమకు అప్పగించాలని అమెరికా ముందు డిమాండ్‌ చేసింది, అంతేకాదు, బాధిత దేశాలకు నష్టపరిహారం చెల్లించాలని కేసుల నాటకం ఆడించింది. చివరికి ప్రపంచ ఆరోగ్య సంస్ధ సమావేశాల్లో తాము చెప్పిన పద్దతుల్లో దర్యాప్తు తీర్మానం చేయించాలని వత్తిడి తెచ్చింది. అయితే రాజకీయ కోణంతో జరిపే దర్యాప్తులకు బదులు వాస్తవం తెలుసుకొనేందుకు కరోనా సమస్య సమసిపోయిన తరువాత స్వతంత్ర సభ్యులతో దర్యాప్తు జరపవచ్చని దానికి తాము కూడా సహకరిస్తామని చైనా ప్రకటించింది. భారత్‌తో సహా 122 దేశాలు ఉమ్మడిగా ప్రవేశపెట్టిన తీర్మానంపై ఎలాంటి ఓటింగ్‌ లేకుండా ఏకగ్రీవంగా ఆమోదించటం అమెరికాకు మింగుడు పడలేదు. చైనా వ్యతిరేకిస్తుందని, దాన్ని సాకుగా తీసుకొని దాడి చేయాలని చూసిన ఆమెరికా దీంతో హతాశురాలైంది. ఇక లాభం లేదనుకొని తాము సంస్ధ నుంచి వైదొలుగుతామని ప్రకటించింది. సంస్కరణలు తేవటంలో ప్రపంచ ఆరోగ్య సంస్ధ విఫలమైందని ట్రంప్‌ ఆరోపించాడు. అయితే అమెరికా కోరుతున్న సంస్కరణలు ఏమిటో స్పష్టత లేదని, బయట చర్చకు పెట్టలేదని, ఒక నెల వేచి చూస్తామని చెప్పిన ట్రంప్‌ వారం రోజులకే బెదిరింపులకు ఎందుకు దిగారో తెలియటం లేదని సంస్ధ ప్రధాన కార్యదర్శి టెడ్రోస్‌ చెప్పారు. ట్రంప్‌ నిర్ణయం ముందు చూపులేమి, అమెరికన్ల ప్రాణాలకు ముప్పు తేవటమే అని విమర్శలు వచ్చాయి.
ప్రపంచ ఆరోగ్య సంస్ధ అసెంబ్లీ ఆమోదించిన ఒక చారిత్రాత్మక ప్రతిపాదన కూడా అమెరికా నిర్ణయాన్ని ప్రభావితం చేసినట్లు కనిపిస్తోంది.కరోనా వైరస్‌ నిరోధానికి తయారు చేసే వ్యాక్సిన్‌ ప్రజల వస్తువుగా ఉండాలి తప్ప ఒకటి రెండు సంస్ధలకు పేటెంట్‌ ఔషధంగా ఉండకూడదని కోస్టారికా చేసిన ప్రతిపాదనను అమెరికా, బ్రిటన్‌ తప్ప మిగిలిన దేశాలన్నీ అంగీకరించాయి. వాటిలో అమెరికా అనుయాయి దేశాలు అన్నీ ఉన్నాయి. ప్రపంచానికి మహమ్మారులుగా మారిన వ్యాధుల నివారణకు రూపొందించిన ఔషధాలు చౌకగా అందరికీ అందుబాటులో ఉండాలి తప్ప కొన్ని కంపెనీలకు లాభాలను తెచ్చిపెట్టేవిగా ఉండకూడదు. అదే జరిగితే ఏం జరుగుతుందో ఎయిడ్స్‌ ఔషధాల విషయంలో చూశాము.
తాము కూడా కరోనా వాక్సిన్‌ తయారీలో ఉన్నామని, అవి జయప్రదమైన తరువాత ప్రజల వస్తువుగా అందుబాటులో ఉంచుతామని చైనా అధ్యక్షుడు గ్జీ జింపింగ్‌ ప్రకటించారు. అంతే కాదు ప్రజల వస్తువుగా ఉంచే వాక్సిన్‌ తయారీ యత్నాలకు రానున్న రెండు సంవత్సరాలలో రెండు బిలియన్‌ డాలర్లు అందచేస్తామని కూడా చెప్పారు. ప్రస్తుతం ఎనిమిది సంస్ధలు వాక్సిన్‌ ఒకటి, రెండవ దశ పరీక్షలలో ఉన్నాయి. వాటిలో నాలుగు చైనాలో, రెండు అమెరికా, జర్మనీ, బ్రిటన్‌లో ఒక్కొక్కటీ ఉన్నాయి.
ఎయిడ్స్‌ ఔషధ పేటెంట్‌ పొందిన కంపెనీ ఏడాదికి ఒక్కో రోగి నుంచి పది నుంచి పదిహేనువేల డాలర్లు వసూలు చేసి విక్రయించింది. పదేండ్ల పాటు అంత ఖర్చు భరించలేని రోగులందరూ దుర్మరణం పాలయ్యారు.2004లో మన దేశ కంపెనీలు ఏడాదికి కేవలం 350 డాలర్లకే మందులను అందుబాటులో తెచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రపంచానికి కావలసిన ఎయిడ్స్‌ ఔషధాలలో 80శాతం మన దగ్గర నుంచే సరఫరా అవుతున్నాయి. కాన్సర్‌ చికిత్సకు ఉపయోగించే నెక్సావార్‌ ఔషధంపై బేయర్‌ కంపెనీ పేటెంట్‌ హక్కు కలిగి ఉంది. నూట ఇరవై బిళ్లలను రెండు లక్షల ఎనభైవేల రూపాయలకు కొనుగోలు చేయాల్సి వచ్చేది. అలాంటిది మన దేశంలోని నాట్కో కంపెనీ జనరిక్‌ ఔషధాన్ని కేవలం రూ.8,800లకే అందుబాటులోకి తెచ్చింది. తాము ఈ ఔషధాన్ని భారత మార్కెట్‌కోసం తయారు చేయలేదని పెద్ద మొత్తం చెల్లించి కొనుగోలు చేయగల పశ్చిమదేశాల వారికి ఉద్దేశించింది అని నాట్కో కంపెనీపై కేసు దాఖలు చేసిన సందర్భంగా బేయర్‌ కంపెనీ సిఇఓ చెప్పాడు. అయితే ఆ కేసులో బేయర్‌ ఓడిపోయింది.
ఇప్పుడు కరోనా వాక్సిన్‌తో వ్యాపారం చేయాలన్నది అమెరికా, బ్రిటన్‌ ఆలోచన. అనేక వ్యాధులు పశ్చిమ దేశాలలో అంతగా రావు, అయినా పశ్చిమ దేశాల కంపెనీలు ఆ వ్యాధులకు ఔషధాలను ఎందుకు రూపొందిస్తున్నాయంటే రోగులను పీల్చి పిప్పి చేసేందుకే అన్నది స్పష్టం. ప్రపంచ ఆరోగ్య సంస్ధలో ఉంటూ ఇలాంటి చర్యలకు మద్దతు ఇస్తే అమెరికన్లు సభ్య సమాజం నుంచి మరింతగా వేరుపడతారు. ఇతర జబ్బులకు ఒకసారి పెట్టుబడి పెట్టి అభివృద్ది చేస్తే తరువాత రోజుల్లో పెద్ద మార్పుల అవసరం ఉండదు. కరోనా వైరస్‌ లేదా మరొక వైరస్‌ దేనికీ ఒకసారి తయారు చేసిన ఔషధం శాశ్వతంగా పనికి రాదు. వైరస్‌లో మార్పులు జరిగినపుడల్లా మార్చాల్సి ఉంటుంది. అన్నింటికీ మించి ఎయిడ్స్‌ కోరి తెచ్చుకొనే జబ్బు, కరోనా కోరకుండానే దాడి చేస్తుంది కనుక ప్రతి ఒక్కరూ భయంతో జీవించాల్సి ఉంటుంది, వాక్సిన్‌కోసం ఎంతైనా ఖర్చు చేసేందుకు సిద్దపడతారు.మహమ్మారులుగా మారినపుడు లక్షలు, కోట్ల మందికి సోకుతాయి. ఈ అవసరం, బలహీనతను సొమ్ము చేసుకోవాలని అమెరికా, బ్రిటన్‌ కార్పొరేట్‌ సంస్ధలు కాచుకు కూర్చున్నాయి. వాటి ఆకాంక్షలను ట్రంప్‌ వెల్లడిస్తున్నాడు.
ప్రపంచ వాణిజ్య సంస్ధ(డబ్ల్యుటిఓ) నుంచి అమెరికా వైదొలగాలన్న అంశం గత పదిహేను సంవత్సరాలుగా నలుగుతున్నదే. అధికార పార్టీకి చెందిన ఎంపీలు ఇటీవల ఈ సంస్ధను రద్దు చేయాలంటూ ఊగిపోయారు. అలాంటి అధికారం గనుక అమెరికాకు ఉంటే ఈ పాటికి ట్రంప్‌ ఎప్పుడో ఆ పని చేసి ఉండేవాడు. ఈ విషయంలో ప్రతిపక్ష డెమోక్రాట్లు కూడా తక్కువ తినలేదు.ఆ సంస్ధ నుంచి తప్పుకోవాలంటూ పార్లమెంట్‌లో ఆ పార్టీ సభ్యుడు ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు. ఒక వేళ ట్రంప్‌ అలాంటి పిచ్చిపని చేస్తే ముందు నష్ట పోయేది అమెరికా తప్ప మిగతా ప్రపంచం కాదు. అయితే తీర్మానం నెగ్గి వెంటనే అమెరికా బయటకు పోతుందని ఎవరూ భావించటం లేదు. అదే జరిగితే ప్రపంచ వాణిజ్యం మీద ఐరోపా యూనియన్‌, చైనా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందరితో పాటు కూర్చునేందుకు తమకు స్ధలం ఉండదు అని అమెరికా వాణిజ్య మాజీ ప్రతినిధి వెండీ కట్లర్‌ చేసిన వ్యాఖ్య తీవ్రతకు నిదర్శనం.
గాట్‌లో, తరువాత దాని స్ధానంలో ఏర్పడిన ప్రపంచ వాణిజ్య సంస్ధలో స్ధాపక సభ్యురాలిగా చైనాకు స్ధానం కల్పించేందుకు అమెరికా, దాని మిత్ర రాజ్యాలు అనుమతించలేదు.ఏ వర్ధమాన దేశానికీ విధంచని షరతులను చైనాకు పెట్టి చివరకు చేర్చుకున్నారు.అప్పటి నుంచీ చైనా తమ దేశం నుంచి ఫ్యాక్టరీలు, సంస్ధలను తరలించుకుపోతున్నది, ఉద్యోగాలకు ఎసరు పెట్టింది, వాణిజ్యాన్ని దెబ్బతీసింది అంటూ అమెరికా సణగని రోజు లేదు.
అమెరికా ఒక్క ఐక్యరాజ్యసమితి సంస్ధల నుంచే కాదు. ఇతర వ్యవస్ధలను కూడా చిన్నాభిన్నం చేయాలని చూస్తోంది. బలహీనులనే కాదు బలవంతులను కూడా తన పాదాల చెంతకు తెచ్చుకొనేందుకు పూనుకుంది. చరిత్రలో జరిగిన అనేక ప్రాంతీయ, రెండు ప్రపంచ యుద్దాలకు సామ్రాజ్యవాదుల ఇలాంటి వైఖరే కారణమైంది.
జి7 దేశాల బృందానికి కాలదోషం పట్టిందని ప్రకటించటానికి ట్రంప్‌ ఎవరు ? దానిలో అమెరికాతో పాటు కెనడా, ఫ్రాన్స్‌, బ్రిటన్‌, ఇటలీ, జర్మనీ, జపాన్‌ ఉన్నాయి. మధ్యలో కొన్ని సంవత్సరాలు రష్యాను ఎనిమిదవ దేశంగా చేర్చుకొనేందుకు నిర్ణయించి క్రిమియా ప్రాంతాన్ని ఆక్రమించుకొందనే సాకుతో పక్కన పెట్టారు.ఈ ఏడాది జరిగే సమావేశానికి తిరిగి అధికారికంగా పిలవాలని నిర్ణయించారు. గత ఏడాది మనదేశంతో సహా తొమ్మిది దేశాలను అతిధులుగా ఆహ్వానించారు. ఆరు దేశాల బృందంగా ఏర్పడిన ఈ ఆర్ధిక కూటమిలో తరువాత ఏడవద దేశంగా కెనడాను చేర్చుకున్నారు. కొన్ని సంవత్సరాల తరువాత ఐరోపా యూనియన్‌ శాశ్వత ఆహ్వానిత సంస్ధగా పిలుస్తున్నారు. నిజానికి ఇది ధనిక రాజ్యాలు తమ ప్రయోజనాలకోసం ఏర్పాటు చేసుకున్నది తప్ప ఐక్యరాజ్యసమితితో ఎలాంటి ప్రమేయం లేదు. ఈ ఏడాది జూన్‌ 10-12 తేదీలలో అమెరికా మేరీలాండ్‌ రాష్ట్రంలోని కాంప్‌డేవిడ్‌లో జరపాలని నిర్ణయించారు. అయితే కరోనా కారణంగా సమావేశాన్ని ఆన్‌లైన్‌ జరపనున్నట్లు మార్చి నెలలో తెలిపారు. ఇప్పుడు దాన్ని కూడా ఏకంగా సెప్టెంబరుకు వాయిదా వేస్తున్నట్లు ట్రంప్‌ ప్రకటించారు. అప్పటికి అమెరికా ఎన్నికలు దగ్గరపడతాయి కనుక తన లాభనష్టాలను బేరీజు వేసుకొని తదుపరి నిర్ణయం తీసుకోవచ్చు.
ఒకే గూటి పక్షులైన ఈ బృంద దేశాలతో కూడా అమెరికా సక్రమంగా వ్యవహరించటం లేదు. మిగతా దేశాలన్నీ తనకు అణగి మణగి ఉండాలని కోరుకుంటోంది. ఈ నేపధ్యంలో 2018లో కెనడాలోని మాంట్రియల్‌ నగరంలో జరిగిన సమావేశం రసాభాస అయింది. డోనాల్డ్‌ ట్రంప్‌తో మిగిలిన ఆరుగురు నేతలు పడిన ఇబ్బందులను గమనించిన జర్నలిస్టులు ఆ సమావేశాన్ని ” జి6ప్లస్‌ ఒన్‌ ” అని అపహాస్యం చేశారు. ఆ సమావేశం ఎలాంటి ప్రకటనను ఆమోదించకుండా ముగియటానికి అమెరికా, ట్రంపే కారణం అంటే అతిశయోక్తి కాదు. ఆ ఏడాదే చైనా, కెనడా , ఐరోపా యూనియన్‌ ఇతర అనేక దేశాలపై బస్తీమే సవాల్‌ అంటూ ట్రంప్‌ వాణిజ్య యుద్దం ప్రకటించటమే దీనికి కారణం. ఈ ఏడాది ఆతిధ్యం ఇస్తూ ఈ బృందం పనికిమాలినది అని వ్యాఖ్యానించటాన్ని బట్టి ట్రంప్‌ సంస్కారం ఏమిటో బయటపడింది. అదే నోటితో మన దేశంతో సహా మిగిలిన దేశాలతో దాన్ని విస్తృత పరచాలంటూ ఆదేశాల తరఫున మాట్లాడుతున్నట్లు ఫోజు పెట్టాడు. నిజానికి ఆ బృందంలో ఉన్నంత మాత్రాన ఏ దేశానికైనా పెద్దగా ఒరిగేదేమీ లేదు. దానితో నిమిత్తం లేకుండానే చైనా అంతర్జాతీయ వాణిజ్యంలో ఎంతగా ఎదిగిందో, ఆ బృందంలోని అమెరికా మినహా మిగిలిన దేశాలను దాటి ఎలా ముందుకు పోతోందో ఇప్పుడు కరోనా వైరస్‌ను అరికట్టటంలో సోషలిస్టు వ్యవస్ధ ప్రత్యేకతను ప్రపంచానికి చాటింది. ఒక్క జపాన్‌ మినహా మిగిలిన అన్ని జి7దేశాలూ కరోనాతో సతమతం అవుతున్నాయి. అమెరికా గురించి చెప్పనవసరం లేదు. ప్రపంచంలో ఇది రాస్తున్న సమయానికి నమోదైన 62లక్షల కేసుల్లో పద్దెనిమిది లక్షల కేసులను దాటి పోయింది. 2008లలో ధనిక దేశాలలో తలెత్తిన ఆర్ధిక సంక్షోభం నుంచి జి7లోని ఏ ఒక్కదేశమూ బయటపడకపోగా మరో సంక్షోభంలోకి కూరుకుపోతుండటాన్ని చూస్తున్నాము.
అమెరికా పాలకవర్గం, దాని ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ అనుకుంటున్నది ఒకటి-జరుగుతున్నది మరొకటి కావటంతో తట్టుకోలేకపోతున్నాడు. ఏదో ఒక పిచ్చిపనో, ప్రకటనో, బెదిరింపులో చేస్తున్నాడు. వాటిలో ఒకటి తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్ధ నుంచి అమెరికా తప్పుకుంటుందన్న అంశం. గతంలో ప్రపంచాన్ని బెదిరించేందుకు జపాన్‌పై అణుబాంబులు వేశారు. ట్రంప్‌ అధికారానికి వచ్చిన తరువాత బెదిరింపులు ఎక్కువయ్యాయి. ప్రపంచ సంస్ధల నుంచి తప్పుకుంటామనే రూపంలో అవి ముందుకు వస్తున్నాయి.అందుకుగాను ప్రతిదానికీ ఏదో ఒక సాకు చూపుతున్నారు.
రెండవ ప్రపంచ యుద్దం తరువాత తలెత్తిన పరిస్ధితుల్లో అమెరికా ఒక పెద్ద ఆర్ధికశక్తిగా ఎదిగింది. కమ్యూనిజం వ్యాప్తిని అరికట్టే బాధ్యతను నెత్తికి ఎత్తుకొని ప్రపంచలోని కమ్యూనిస్టు వ్యతిరేకశక్తులన్నింటినీ కూడగట్టింది. ఆ ముసుగులో తన కార్పొరేట్‌ సంస్ధలకు ఆయా దేశాలను మార్కెట్‌గా చేసుకొనేందుకు, సహజవనరులను కొల్లగొట్టేందుకు ప్రయత్నించింది. తన మిలిటరీ,రాజకీయ వ్యూహాలను అమలు జరిపేందుకు కేంద్రాలుగా చేసుకున్నది. గడచిన ఏడున్నర దశాబ్దాలలో అమెరికా అనుసరించిన ఎత్తుగడలు దానికి ఎదురుతన్నాయి.ఈ కారణంగానే డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రపంచ సంస్ధలలో అమెరికా కొనసాగటం, వాటికి పెద్ద ఎత్తున నిధులు ఇవ్వటం దండగ, తమ లక్ష్యాలకు ఉపయోగపడటం లేదని భావించటం, తప్పుకుంటామని బెదిరింపులకు పాల్పడుతున్నారు. అమెరికాయే కాదు ఏదేశంలో అయినా పాలకవర్గాలకు తమ ప్రయోజనాలే ముఖ్యం తప్ప వ్యక్తులు కాదు. తాము నిర్దేశించిన అజెండాను అమలు జరపకపోతే ఒక బొమ్మ బదులు మరొక బొమ్మను గద్దెపై కూర్చోబెడతాయి. ఈ నేపధ్యంలోనే నవంబరు ఎన్నికలలో ట్రంప్‌ ఓడిపోయి మరొకరు వచ్చినా భాష, హావభావాలు, పిచ్చిమాటలు మారవచ్చు తప్ప ఇదే వైఖరి కొనసాగుతుంది.
ఇలాంటి వైఖరి అమెరికాకు ఉపయోగపడుతుందా ? ప్రపంచ సంస్ధలతో నిమిత్తం లేకుండా తనకున్న ఆర్ధిక, మిలిటరీ శక్తితో ప్రపంచాన్ని శాసించి తన అదుపులోకి తెచ్చుకోవాలని గత కొంత కాలంగా ప్రయత్నిస్తోంది. అది సాధ్యం కాదని దానికి అవగతం అవుతోంది. 2008లో పెట్టుబడిదారీ దేశాలలో వచ్చిన మాంద్యం తరువాత అనేక దేశాలు రక్షణాత్మక చర్యలు తీసుకోవటం, ప్రపంచ వాణిజ్య సంస్ధను పక్కన పెట్టి విడిగా ఒప్పందాలు చేసుకోవటం పెరుగుతోంది. గత ఏడాది నవంబరు వరకు వచ్చిన వార్తల ప్రకారం రక్షణాత్మక చర్యల్లో అమెరికా 790తో అగ్రస్ధానంలో ఉంది. మన దేశం ప్రపంచ వాణిజ్యంలో చాలా తక్కువశాతమే కలిగి ఉన్నప్పటికీ దాన్నయినా కాపాడుకొనేందుకు రక్షణాత్మక చర్యల్లో 566తో అమెరికా తరువాత రెండో స్ధానంలో ఉన్నాం. దేశాల వారీ జర్మనీ 390, బ్రిటన్‌ 357, ఫ్రాన్స్‌262, చైనా 256, కెనడా 199, ఆస్ట్రేలియా 174 చర్యలు తీసుకున్నాయి.2018 చివరిలో ప్రపంచ వాణిజ్యం మాంద్యంలోకి జారిపోయింది. కరోనా వైరస్‌ కారణంగా ప్రపంచం ఎలాంటి పర్యవసానాలను చూడాల్సి వస్తుందో అప్పుడే చెప్పలేము.
ఐక్యరాజ్యసమితికి ఉండే బలహీనతలు దానికి ఉన్నాయి. అంతకంటే మెరుగైన వ్యవస్ధను ఏర్పాటు చేసుకొనేంతవరకు దాన్ని కొనసాగించటం తప్ప మరొక మార్గం లేదు. ఉన్నదాన్నే కొనసాగించటానికి అంగీకరించని అమెరికన్లు దాన్ని బోనులో నిలబెట్టే అంతకంటే శక్తివంతమైన ప్రపంచ వ్యవస్ధ ఏర్పాటుకు అంగీకరిస్తారని ఆశపెట్టుకోనవసరం లేదు. గతంలో సామ్రాజ్యవాదులు ప్రపంచాన్ని పంచుకొనేందుకు, రక్షణాత్మక చర్యలు అమలు జరిపిన కారణంగానే ప్రపంచ యుద్దాలు వచ్చాయి. ట్రంప్‌ చేస్తున్న పిచ్చిపనులు నవంబరులో జరిగే ఎన్నికల్లో లబ్దిపొందేందుకు అన్నది ఒకటైతే రెండవది అమెరికా వైఖరిలో రోజు రోజుకూ పెరుగుతున్న అసహనానికి నిదర్శనం. ట్రంప్‌ ఓడిపోతారా, డెమోక్రాట్‌ జోబిడెన్‌ గెలుస్తారా అన్నది పక్కన పెడితే అగ్రస్దానం అమెరికాదే అన్న వైఖరిని మరింత ముందుకు తీసుకుపోతే దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో ఇప్పుడే తెలియదు గానీ, తీవ్రంగా ఉంటాయని కచ్చితంగా చెప్పవచ్చు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ఏడాదిగా అడుసు తొక్కుతూ కాళ్లు కడుక్కుంటున్న వైసిపి నేతలు !

29 Friday May 2020

Posted by raomk in AP NEWS, Current Affairs, History, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

AP SEC Row, YS jagan, ysrcp


ఎం కోటేశ్వరరావు
రాష్ట్ర ఎన్నికల అధికారిగా నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ను తొలగించటం చెల్లదని, దానికి దోహదం చేసిన ఆర్డినెన్స్‌, ప్రభుత్వ ఉత్తరువులను కొట్టి వేస్తూ రాష్ట్ర హైకోర్టు శుక్రవారం నాడు తీర్పు ఇచ్చింది. శనివారం నాడు ఏడాది పాలన ఉత్సవాలు జరుపుకొనేందుకు ఏర్పాట్లు చేసుకున్న జగన్‌ మోహనరెడ్డి, అనుయాయులకు ఇది ఊహించని ఎదురు దెబ్బ. అడుసు తొక్కనేల కాలు కడగనేల అన్న సామెత తెలిసిందే. గత ఏడాది కాలంలో జరిగిన అనేక పరిణామాలను చూస్తే జగన్‌ పరివారం అదే పని చేస్తున్నట్లు కనిపిస్తోంది.
అధికారానికి వచ్చిన తొలిరోజుల్లో అనుభవం లేక లేదా ప్రతిపక్ష నేతగా తాను అనుభవించిన అవమానాల అక్కసును భరించలేక ప్రత్యర్ధి పార్టీ పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారనుకొని ఏ పార్టీకి చెందని వారు సరిపెట్టుకున్నారు. ఏడాది కాలంలో అలాంటి వారందరినీ వైసిపి దూరం చేసుకుంది. జగన్‌ నాయకత్వం చేస్తున్న పనులు తెలియక కాదు తెలిసే చేస్తున్నారని, పర్యవసానాలను అనుభవించకతప్పదనే అభిప్రాయం పెరుగుతోంది. జగన్‌ తన మంత్రులకు సమాంతరంగా సలహాదారులను ఏర్పాటు చేసుకున్నారు. వారంతా భజనపరులుగా, మనసెరిగి మసలుకొనే అవకాశవాదుల్లా కనిపిస్తున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ కొంప ముంచటంలో సలహాదారులు తక్కువేమీ తినలేదు. ఇప్పుడూ అదే పునరావృతం అవుతోందా అన్నది వైసిపి శ్రేణులు పరిశీలించుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది.
తిరుమల వెంకన్న భూములు కొన్ని నిరర్ధక ఆస్తులుగా ఉన్నాయని, వాటిని అమ్మేందుకు నిర్ణయించినట్లు వార్తలు వచ్చాయి. ఆ చర్యను సమర్ధించుకుంటూ ఆ నిర్ణయం గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన దేవస్ధానం బోర్డే నిర్ణయం తీసుకుందని దాన్నే తాము అమలు జరుపుతున్నామని సమర్ధించుకున్న నేతల తీరు తెన్నులు యావత్‌ రాష్ట్రం చూసింది. తరువాత వచ్చిన వత్తిడి మేరకు తాము గత నిర్ణయాలను సమీక్షించామే తప్ప విక్రయ నిర్ణయం తీసుకోలేదని, ఒక వేళ అలాంటిది చేయాల్సివస్తే సంప్రదించే చేస్తామని అదే నోళ్లు ఎలాంటి వెరపు లేకుండా ప్రకటించటాన్ని చూసి విస్తుపోతున్నది. అంతే కాదు గతంలో వచ్చిన కానుకలు, భూముల విక్రయాలు తదితర అంశాలన్నింటితో ఒక శ్వేతపత్రం విడుదల చేస్తామని ప్రకటించారు. ఎవరు వద్దన్నారు ? ఎవరి బండారం ఏమిటో బయటపడుతుంది. జనం కోరుకున్నదీ అదే. అంతేకాదు, రాబోయే రోజుల్లో ఒక్క అంగుళం కూడా భూములు విక్రయించం అని కూడా ప్రకటించారు. ఇదేదో తొలిరోజే చెప్పి ఉంటే పోయేది. ప్రతిపక్షాలను అల్లరి పాలు చేయాలని యత్నించి తమ గోతిలో తామే పడినట్లుగా ఉంది వైసిపి వ్యవహారం. ఇలాంటి చర్యలతో గ్రామాలు, పట్టణాల్లో దిగువ స్ధాయిలో రొమ్ములు విరుచుకొని గుడ్డిగా సమర్ధించిన సామాన్య కార్యకర్తల పరువు ఏమౌతుందో, దాని ప్రభావం ఏమిటో ఆలోచించే వారున్నారా ?
ప్రభుత్వం చేసిన నిర్ణయాలకు వ్యతిరేకంగా హైకోర్టులో, సుప్రీం కోర్టులో తీర్పులు వస్తున్న తరువాత అయినా కొత్తగా వేసే కేసులు నిలుస్తాయా లేదా ఓడిపోతే పరువు సంగతి ఏమిటని ఎవరూ ఆలోచిస్తున్నట్లు లేదు, తమ నేతలను ప్రశ్నిస్తున్నట్లూ కనపడదు. కోర్టుల్లో కేసులు ఓడిపోయినా జనంలో తమ పలుకుబడి తగ్గటం లేదని వైసిపి నాయకత్వం భావిస్తున్నదా ? దానికి ఆస్కారం లేకపోలేదు. ఆంగ్ల మాధ్యమంపై కోర్టులో ఓడిపోయిన తరువాత ఆ నిర్ణయాన్ని సమర్ధిస్తున్న వారందరూ కోర్టు తీర్పును తప్పుపట్టారు. అది సహజం. ఎందుకంటే ఆంగ్ల మాధ్యమంలో విద్య తమ బిడ్డలను అందలాలెక్కిస్తుందని ఆశలు పెంచుకున్నవారికి సహజంగానే కోర్టు తీర్పు రుచించదు, కనుక కేసు పోయినా మా మద్దతు మీకే అని అలాంటి వారందరూ మద్దతు ప్రకటించి ఉండవచ్చు. అయితే అది శాశ్వతంగా ఉంటుందనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఆంగ్ల మాధ్యమాన్ని గతంలో చెప్పినట్లు అమలు జరపకపోతే చేతగాని వారు ఎందుకు చెప్పినట్లు అనే అసంతృప్తి మెల్లగా ప్రారంభం అవుతుంది.
పోలీసు ఉన్నతాధికారి ఎబి వెంకటేశ్వరరావు కేసులో ప్రభుత్వం ఓడిపోయినా అదేమీ ప్రజాసమస్య కాదుకనుక తమకు వచ్చే నష్టమేమీ లేదని వైసిపి శ్రేణులు సమర్ధించుకోవచ్చు. సామాన్య జనానికి సంబంధించిన సమస్య కాదు గనుక దానితో పలుకుబడి మీద ప్రభావం చూపదు. కానీ తిరుమల వెంకన్న భూములపై తమ మాటలను తామే మింగిన తీరు, ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ తొలగింపుపై తలెత్తిన తీవ్ర రగడ, రాజకీయ నేపధ్యం చూస్తే అది మిగతా కేసుల కంటే ఎక్కువగా ప్రతికూల ప్రభావాలు చూపే అవకాశాలు ఎక్కువ.
ముఖ్యమంత్రిగా అసలైన అధికారం నాదా ఎన్నికల కమిషనర్‌దా అని ప్రశ్నించిన వైఎస్‌ జగన్‌కు అసలైన అధికారం ఎవరిదో సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నపుడు ఎన్నికల కమిషనరే సుప్రీం అని చెప్పింది. సర్వాధికారి ఎవరు అన్న ప్రశ్నను స్వయంగా లేవనెత్తిన జగన్‌మోహన్‌రెడ్డికి ఆ విషయం అర్ధమైందని అనుకోవాలి. ఈ విషయంలో తనను తానే కించపరచుకున్నారు. స్వతంత్ర భారత చరిత్రలో ఒక ముఖ్య మంత్రి తన అధికారాలేమిటో, ఎన్నికల కమిషనర్‌ అధికారం ఏమిటో తెలియదని స్వయంగా వెల్లడించుకున్నారు. ఇంతవరకు ఏ ముఖ్యమంత్రీ ఇలా వ్యవహరించలేదు. అంతటితో ఆగకుండా సుప్రీం కోర్టుకు కూడా వెళ్లారు. బహుశా ఏ ముఖ్య మంత్రికీ లేనంత మంది సలహాదారులు ఉన్నప్పటికీ ఇది జరిగిందంటే సలహాదారుల సరకేమిటో బయటపడింది. ఎవరి మాటా వినరు అనే గత విమర్శలను జగన్మోహనరెడ్డి నిర్ధారించారు.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ కేంద్ర హౌంశాఖకు రాసిన లేఖను ఎవరు స ష్టించినా, పంపినా క్రిమినల్‌ కేసులు ఎదుర్కోక తప్పదని వైఎస్సార్‌ సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి హెచ్చరించారు. లేఖ వెనుక పెద్ద కుట్ర ఉందని, దీనిపై క్షుణ్ణంగా విచారించాలని కోరుతూ వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యేలు డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌కు ఫిర్యాదు చేశారు. దానిలో అనేక అంశాలను ఆరోపించారు. విచారణ తతంగం జరిపారు. లేఖను రమేష్‌ కుమార్‌గారే రాశారన్నది తేలిపోయింది, విజయసాయి రెడ్డిగారన్నట్లు ఆయన మీద క్రిమినల్‌ కేసు పెడతారా ? ఆ లేఖ గురించి నానా యాగీ చేసిన వైసిపి నేతలు అనూహ్యంగా ఎన్నికల కమిషనర్‌ పదవీకాలాన్ని తగ్గిస్తూ ఆర్డినెన్స్‌ తీసుకురావటం, దాని మేరకు నిమ్మగడ్డ పదవీ కాలం ముగిసిందని ప్రకటించటం, కొత్త కమిషనర్‌ నియామకం జరిగిపోయింది. ఆంధ్రప్రదేశ్‌లో ఆ పదవికి తగిన వారెవరూ లేనట్లు తమిళనాడులో పాస్టర్‌గా ఉన్న రిటైర్డ్‌ జస్టిస్‌ కనకరాజ్‌ను తీసుకురావటం, ఆయన దళిత సామాజిక తరగతికి చెందిన వారని ప్రచారం చేసి దళితుల్లో సానుభూతి పొందేందుకు ప్రయత్నించటం తెలిసిందే.
నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు కులాన్ని అంటగట్టిందీ, కొత్త కమిషనర్‌కూ అదే పని చేసిందీ వైసిపి వారే కావటం గమనించాలి. అదీ, ఇదీ రెండూ చౌకబారు రాజకీయాలే. ఒక దళితుడి నియామకాన్ని తప్పుపడతారా అని మనోభావాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారు. ఇది సలహాదారుల బుర్రలో పుట్టిందా లేక జగన్‌మోహనరెడ్డిగారికే తట్టిందో తెలియదు. ఇప్పుడు రమేష్‌ కుమార్‌ తొలగింపు చెల్లదు అని తీర్పు వచ్చిన తరువాత దాని మీద సుప్రీం కోర్టుకు వెళ్లవచ్చని కొందరు, కోర్టు తీర్పును ఆమోదిస్తామని మరి కొందరు అధికార పార్టీ నేతలు చెప్పారు. ఒక వేళ అదే జరిగితే మరో సమస్యను తలకెత్తుకొనేందుకు పూనుకున్నట్లే ?
నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ తిరిగి అధికారం చేపట్టిన తరువాత పరిణామాలు ఎలా ఉంటాయో ఊహించుకోనవసరం లేదు. ఈ తీర్పుతో ప్రభుత్వ పలుకుబడి తగ్గుతుందా, రమేష్‌ కుమార్‌కు సానుభూతి పెరుగుతుందా? పర్యవసానాలు ఎలా ఉంటాయనే ప్రశ్నలు ముందుకు వస్తున్నాయి. కారకులు వారా వీరా ఎవరు, ఎవరు ప్రారంభించారు, ఎవరు కొనసాగిస్తున్నారు అన్నది ఒక అంశమైతే నేడు ఆంధ్రప్రదేశ్‌లో కులాల కుమ్ములాటలు, సమీకరణలు మరింతగా ఘనీభవించాయన్నది ఒక అభిప్రాయం. ఆ ప్రాతిపదికన ఆలోచించే వారు ఏ పార్టీకి చెందినప్పటికీ లోపల ఎలా ఉన్నా బయటికి మాత్రం తమ పార్టీ ఏది చేసినా సరైనదే అనే అడ్డగోలు సమర్ధనకు పూనుకుంటున్నారు. దాన్ని సమర్ధించేందుకు ప్రత్యర్ధి పక్షం కూడా చేసింది అదేగా అని వారి తప్పులను తమకు రక్షణగా ముందుకు తెస్తున్నారు. ఈ నేపధ్యంలో చూసినపుడు నిమ్మగడ్డకు కొత్తగా వచ్చే సానుభూతి ఏమీ ఉండదు. అదే విధంగా కేవలం ఈ అంశం మీద అధికార పార్టీ పెద్దగా మద్దతు కోల్పోయే అవకాశాలు కూడా తక్కువే అని చెప్పవచ్చు.
అయితే అధికార పార్టీమీద ఎలాంటి ప్రభావం ఉండదా ? తప్పకుండా ఉంటుంది. ఏలుబడిలోకి వచ్చి ఏడాది మాత్రమే గడచింది. పెట్టుబడులు పెట్టిన వారు వాటిని రాబట్టుకోవటం ప్రారంభించిన సమయానికి కరోనా సమస్య వచ్చింది. సంక్షేమ పధకాలలో అధికార పార్టీ వారికి వచ్చే వాటాలేమీ ఉండవు. ఇసుక, మట్టిని పిండటం ప్రారంభమైంది. అవే చాలవు, ప్రభుత్వం చేపట్టే రోడ్లు, నిర్మాణాలు, ప్రాజెక్టుల వంటివి ఉంటే పంటపండుతుంది. ఉన్న సొమ్మంతా నవరత్నాలకే పోతే అలాంటివి ఎన్ని పనులు చేపడతారు, ఎలా అన్నది బడ్జెట్‌ ప్రవేశపెట్టినపుడు తేలిపోనుంది.
కోర్టులలో తగిలిన ఎదురు దెబ్బల కారణంగా వైసిపిలో స్ధానిక కార్యకర్తల మనస్ధైర్యం క్రమంగా సడలటం ప్రారంభం అయింది. ముఖ్యమంత్రే స్వయంగా రచ్చ చేసిన నిమ్మగడ్డ వ్యవహారంలో వచ్చిన తీర్పు ఒక మలుపు, అధికారపక్షానికి ఒక షాక్‌ వంటిదే. రాబోయే రోజుల్లో ఇలాంటివన్నీ ప్రతిపక్షాలకు ప్రచార ఆస్త్రాలుగా, పాలక పార్టీకి ప్రతికూలంగా మారతాయి.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

భారత్‌ – చైనా మధ్యలో దూరే అవకాశం లేదు ట్రంప్‌ గారూ !

29 Friday May 2020

Posted by raomk in CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Uncategorized, USA

≈ Leave a comment

Tags

Donald trump, India and China, India-China border stand off

ఎం కోటేశ్వరరావు
భారత్‌ాచైనాల మధ్య వివాదాస్పర సరిహద్దు సమస్యలో మధ్యవర్తిత్వం వహించేందుకు తాను సిద్దంగా ఉన్నానని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ విషయాన్ని రెండు దేశాలకూ తెలియచేశానని కూడా చెప్పారు. మరుసటి రోజు ఇదే అంశంపై మాట్లాడుతూ ” మోడీతో మాట్లాడాను. చైనాతో తలెత్తిన పరిస్ధితి గురించి ఆయన మంచి మానసికస్దితిలో(గుడ్‌ మూడ్‌) లేరని నేను చెప్పగలను.రెండు దేశాలూ సంతోషంగా లేవు” అని కూడా ట్రంప్‌ చెప్పారు. ఇది ఎంతో తెలివిగా చేసిన వ్యాఖ్య. నిజంగా మోడీ ఎలా ఉన్నారో తెలియదు. నీవు నీ భార్యను కొట్టటం మానుకున్నావా అని ఎవరైనా అడిగినపుడు ఏ సమాధానం చెప్పినా తంటాయే. మామూలుగానే మన ప్రధానికి మాట్లాడే అలవాటు లేదు కనుక స్పందన తెలియదు. అయితే మన విదేశాంగ ప్రతినిధి మాట్లాడుతూ చైనాతో శాంతియుతంగా పరిష్కరించే పనిలో ఉన్నామని వ్యాఖ్యానించారు. ఇదే విధంగా చైనా కూడా స్పందించింది. ట్రంప్‌ ప్రస్తావన లేకుండా చైనా రక్షణశాఖ ప్రతినిధి మాట్లాడుతూ చైనా-భారత్‌ సరిహద్దు విషయంలో చైనా వైఖరి స్పష్టం. శాంతి, ప్రశాంతతను కాపాడేందుకు చైనా దళాలు కట్టుబడి ఉన్నాయని చెప్పారు. రెండు దేశాల మధ్య ట్రంప్‌ జోక్యం అవసరం లేదని చైనా మీడియా వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చాయి. మరోవైపు లడఖ్‌ ప్రాంతంలో తలెత్తిన తాజా పరిణామాల గురించి చైనా వ్యాఖ్యాతలు పరిస్ధితి అదుపులోనే ఉందని చెబుతున్నారు తప్ప మన దేశంలో మీడియా మాదిరి యుద్ధానికి దారి తీస్తుందా అన్నట్లు చిత్రీకరించటం లేదు.
కరోనా వైరస్‌తో సహజీహనం చేయాలంటూ పాలకులు తమ బాధ్యతల నుంచి క్రమంగా తప్పుకొనేందుకు పూనుకున్నారు.దరిద్రం, నిరుద్యోగం, ఆకలి, అవినీతి, అక్రమాలు, రోగాలు, రొష్టులు, అంటరానితనం, కులతత్వం, మతోన్మాదం, సామాజిక వివక్ష, అణచివేత ఇలా చెప్పుకొంటే శతకోటి అవాంఛనీయాలతో సహజీవనం చేయటానికి, దేనికీ స్పందించలేని స్ధితికి అలవాటు పడ్దాం.
కరోనా వైరస్‌ మీద కేంద్రీకరించిన మీడియాకు ఇప్పుడు భారతాచైనా సరిహద్దు వివాదం ఒక రేటింగ్‌ సాధనంగా మారింది. యుద్దం వస్తే బాగుండు అన్నట్లుగా కొందరి వ్యవహారం ఉంది. ఎంత రంజుగా రాస్తే అంత గొప్ప, ఎంత చైనా వ్యతిరేకతను రెచ్చగొడితే అంత కసి ఉన్నట్లు, ఎంతగా జాతీయ(దురహంకారం)వాదాన్ని ప్రదర్శిస్తే అంత గొప్ప దేశభక్తులని భావిస్తున్న ఈ రోజుల్లో భిన్న అభిప్రాయం సంగతి దేవుడెరుగు, భిన్న సమాచారాన్ని పాఠకులు, వీక్షకుల ముందుంచటం కూడా దేశద్రోహంగా ముద్రవేస్తున్న ఒక ప్రమాదకర స్ధితిలో ఉన్నాం.
రెండు దేశాల మధ్య ఏదైనా వివాదం తలెత్తితే ముందు బలయ్యేది నిజం. ఇప్పుడు అదే జరుగుతోందా ? చైనా-భారత్‌ సరిహద్దు వివాదం బ్రిటీష్‌ పాలకుల పుణ్యం. కాగితాల మీద గీసిన సరిహద్దుల ప్రకారం ప్రాంతాలు లేవు. ఆయా దేశాల ఆధీనంలో ఉన్న ప్రాంతాల ప్రకారం సరిహద్దు గీతలు లేవు. తమ ఆధీనంలో లేని ప్రాంతాల మీద హక్కులు తమవే అని రెండు దేశాలూ చెప్పటమే వివాదాలకు కారణం. పరస్పరం సంప్రదింపులు, ఇచ్చిపుచ్చుకోవటం తప్ప మిలిటరీ చర్యల ద్వారా పరిష్కారాలు సాధ్యం కావన్నది ప్రపంచ అనుభవం. రష్యాతో, ఇతర పూర్వం సోవియట్‌ రిపబ్లిక్‌లుగా ఉండి తరువాత స్వతంత్రులుగ మారిన మధ్య ఆసియా దేశాలతో చైనా ఈ పద్దతిలోనే సరిహద్దు వివాదాలను పరిష్కరించుకుంది. మన దేశం కూడా ఇలాగే పరిష్కరించుకోవాలన్న అభిప్రాయం వెలిబుచ్చినందుకు కొందరు కమ్యూనిస్టులను 1962లో నాటి పాలకులు జైల్లో పెట్టారు. చైనాతో యుద్దానికి మద్దతు ఇచ్చిన మరి కొందరు కమ్యూనిస్టులను బయట తిరగనిచ్చారు.
ఏదైనా ఒక సంఘటన జరిగితే తప్ప అనుభవం రాదని పెద్దలు చెబుతారు.1962 యుద్దం తరువాత పదమూడు సంవత్సరాలకు 1975లో భారత్‌-చైనా ఒక అవగాహనకు వచ్చాయి. దాని ప్రకారం సరిహద్దుల్లో ఏదైనా వివాదం తలెత్తితే ఏ వైపు నుంచి తుపాకులు పేలకూడదు, తూటాలు బయటకు రాకూడదు. దానికి రెండు దేశాలూ ఇప్పటి వరకు కట్టుబడి ఉన్నాయి.అయితే మధ్యలో ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తలేదా ? రెండు దేశాల మధ్య ఉందని చెబుతున్న వాస్తవాధీన రేఖ ఒక ఊహ, తాత్కాలిక సర్దుబాటు మాత్రమే. దాన్ని అధికారికంగా ఎవరూ గుర్తించటం లేదు. ఎవరి ఆధీనంలో ఉన్న ప్రాంతాన్ని వారు సంరక్షించుకోవటం, దానిలో భాగంగా కాపలా ఏర్పాట్లు తప్ప నిర్దారణ లేదు. దాన్ని లేదా ఇతర మార్పులు చేర్పులతో గుర్తిస్తే అదే అధికారిక సరిహద్దు అవుతుంది.
సరిహద్దు ఉల్లంఘనలు జరిగాయి అని భావించిన ప్రతిసారీ గతంలో అటూ ఇటూ మోహరించిన సైనికులు చేతులతో తోసుకున్నారు, కాస్త ముదిరితే ముష్ఠిఘాతాలకు తలపడ్డారు, రాళ్లు విసురుకున్నారు. ఈ లోగా రెండు వైపులకూ సమాచారం చేరటం, జోక్యంతో సర్దుమణగటం మామూలైంది.2017 డోక్లాం వివాదంలో 72రోజుల పాటు రెండు వైపులా సైనికులు మోహరించటం తప్ప ఒక్క తూటా, ఫిరంగి పేలలేదు. తాజాగా జరుగుతున్న ఉదంతాలలో ఇనుపరాడ్లు ఉపయోగించినట్లు వార్తలు వచ్చాయి. అసలెందుకు ఇది జరిగింది, జరుగుతోంది ?
సరిహద్దులలో రెండు వైపులా మౌలిక వసతులు క్రమంగా మెరుగుపడుతున్న కారణంగా పహారా పెరుగుతోంది. ఆ ప్రాంతాలకు సరిహద్దు భద్రతా దళాలు చేరేందుకు పెద్దగా వ్యవధి అవసరం లేకపోతోంది. పర్యవసానంగా ఉల్లంఘనలు జరిగాయని భావించినపుడు వివాదాలు చెలరేగేవి.సర్దుబాటు చేసుకొనే వారు. అనేక ఉదంతాలు మీడియా వరకు వచ్చేవి కాదు. వచ్చిన వాటికి వాస్తవం గోరంత అయితే కొండంత కల్పనలతో చెలరేగిపోయేవి.
భారత్‌-చైనా మధ్య లడఖ్‌ ప్రాంతానికి ఆనుకొని ఉన్న ఆక్సారు చిన్‌ ఒక వివాదాస్పద ప్రాంతం. అక్కడ యుద్దం కూడా జరిగింది.అది తొలి నుంచీ తమ ఆధీనంలో ఉంది అని చైనా చెబుతోంది. కాదు మనదే అని మన దేశం అంటోంది. మన ఏలుబడిలోని అరుణాచల్‌ ప్రదేశ్‌ తమ టిబెట్‌లోని దక్షిణ ప్రాంతం కనుక తమదే అని చైనా చెబుతోంది. ఎన్నడూ టిబెట్‌లో భాగంగా లేదు, మాతోనే ఉంది అని మనం చెబుతున్నాం. ఈ వివాదాన్ని ఎవరు తేల్చాలి ? మూడో పక్షానికి అవకాశం ఇచ్చామా ? అవి అక్కడ తిష్టవేస్తాయి. రెండు దేశాల జుట్లూ చిక్కించుకుంటాయి. మరి ఎలా తేలాలి. సంప్రదింపులు, సంప్రదింపులు, సంప్రదింపులు. రెండు వైపులా చిత్తశుద్ధి ఉంటే పరిష్కారం అసాధ్యం కాదు.
తాజా వివాదానికి కారణం ఏమిటి ? సరిహద్దు సమస్య పరిష్కారం కానప్పటికీ ఏ దేశానికి ఆదేశం తన ఆధీనంలో ఉన్న ప్రాంతంలో రోడ్లు వేసుకోవటం, మిలిటరీ ఏర్పాట్లు చేసుకోవటానికి ప్రయత్నించినపుడు అదిగో మా ప్రాంతంలో మీరు ఆక్రమణకు పాల్పడ్డారు అని ఉభయులూ వివాదపడతారు. లడక్‌ ప్రాంతంలోని గలవాన్‌ లోయ. సముద్ర మట్టానికి పదిహేనువేల అడుగున ఎత్తు ఉంటుంది. అక్కడ రెండు దేశాల మధ్య వాస్తవాధీన రేఖ కాశ్మీర్‌ నుంచి మయన్మార్‌ వరకు ఉంది. దాన్ని ఇద్దరూ అంగీకరించరు. ఎవరి ఆధీనంలో ఉన్న ప్రాంతంలో వారు తమ తమ బలగాలను పటిష్టపరచుకొనేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గలవాన్‌లోయ ప్రాంతంలోని వాస్తవాధీన రేఖ సమీపంలో ముందుగా భారత్‌ రోడ్ల నిర్మాణాన్ని ప్రారంభించిందని వార్తలు. ఇది వివాదాస్పద ప్రాంతంలో జరుగుతోందంటూ అడ్డుకొనేందుకు చైనా ప్రయత్నించింది. చైనా మిలిటరీ కదలికల తరువాతనే మన ప్రాంతంలో మిలిటరీ వ్యవస్దల నిర్మాణానికి చైనా పూనుకుందంటూ మన దేశం అభ్యంతరం వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి. దీంతో రెండు వైపులా సైనికులు గుడారాలు వేసుకొని అడ్డుకొనేందుకు కాచుక్కూర్చున్నారు. చైనా వైపున 80 నుంచి వంద గుడారాలు, భారత్‌ అరవై గుడారాలు వేసినట్లు వార్తలు. అటు అన్నివేల మంది సైనికులు ఉన్నారు, ఇటు ఇన్నివేల మంది సిపాయిలున్నారనే వార్తలు అటూ ఇటూ మీడియా విభాగాలు ఒక పధకం ప్రకారం ఇచ్చే లీకులు, ఇష్టాగోష్టి వార్తలు తప్ప ఎవరూ తలలు లెక్కపెట్టింది లేదు. ఇంతకు మించి అటూ ఇటూ ఎలాంటి ఒప్పంద ఉల్లంఘనలు జరిగినట్లు విమర్శలు లేవు.
లడఖ్‌లో దౌలత్‌ బేగ్‌ ఓల్డీ విమానస్దావరాన్ని గతేడాది అక్టోబరులో మన దేశం ప్రారంభించింది.దానికి దారితీసే 66 రోడ్లను 2022 నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో మన దేశం నిర్మిస్తోంది. వాటిలో కొన్ని చైనా ఆధీనంలోని గలవాన్‌లోయకు దగ్గరగా ఉన్నాయి. ఒక ప్రధాన రోడ్డు వాస్తవాధీన రేఖకు సమాంతరంగా అనేక పాయింట్లను కలుపుతూ నిర్మితమౌతోంది. దీన్ని చైనా అభ్యంతర పెడుతోంది.ఈ ప్రాంతంలోని కొన్ని ఏరియాలు తమవని చైనా చెబుతోంది. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. 2017లో డోక్లాం ప్రాంతంలో చైనా రోడ్లు నిర్మించటాన్ని మన దేశం అభ్యంతరం పెట్టింది. అది వాస్తవానికి భూటాన్‌ -చైనా మధ్య ఉన్న వివాదాస్పద ప్రాంతం. అయితే భూటాన్‌తో మనకు ప్రత్యేక సంబంధాలు ఉన్నాయని, భూటాన్‌ కోరిక మేరకు డోక్లాంలో చైనాను అడ్డుకున్నట్లు మన ప్రభుత్వం చెప్పింది. అయితే అసలు వాస్తవం ఏమిటంటే డోక్లాం మన సిలిగురి ప్రాంతానికి అతి సమీపంలో ఉన్నందున మన భద్రతా ప్రయోజనాలకు ముప్పు అన్నది మన వ్యూహకర్తల ఆందోళన. గత ఏడాది మన దేశం లడఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించింది. మన మ్యాపులో తమ ఆధీనంలో ఉన్న ఆక్సారు చిన్‌ ప్రాంతాన్ని కూడా లడఖ్‌ ప్రాంతంగా చూపటాన్ని అప్పుడే చైనా అభ్యంతర పెట్టింది. మ్యాపులో చూపినా వాస్తవాధీన రేఖ యథాతధ స్దితి కొనసాగుతుందని మన దేశం ప్రకటించింది. అరుణాచల్‌ ప్రదేశ్‌లో నిర్మించిన రోడ్లపై కూడా చైనా అభ్యంతరాలు తెలిపింది.
గత నాలుగు వారాలలో నాలుగు చోట్ల రెండు దేశాల కాపలా బృందాలు తారసపడ్డాయి. వాటిలో మూడు లడఖ్‌లో, నాలుగోది సిక్కిం దగ్గర టిబెట్‌ను కలిపే నుకాలా కనుమవద్ద అని వార్తలు వచ్చాయి.1993లో రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఎవరైనా వాస్తవాధీన రేఖను అతిక్రమించినపుడు మీరు అతిక్రమించారు, వెనక్కు పోండి అని చెప్పటం, అదే విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియచేయాల్సి ఉంటుంది. ఇప్పుడు పెద్ద ఎత్తున చైనా సైనికులు చొచ్చుకు వచ్చారని మన మీడియాలో వార్తలు వస్తున్నాయి. చైనా కూడా అదే చెబుతోంది, తమ గలవాన్‌లోయలో భారత్‌ రోడ్డు నిర్మిస్తోందని అంటున్నది. భారత దళాల సాధారణ పహారాకు ఆటంకం కలిగించే విధంగా చైనా వ్యవహరిస్తోందని భారత విదేశాంగశాఖ విమర్శించింది.
మన దేశం-నేపాల్‌ మధ్య ఉత్తరాఖండ్‌లో 62చదరపు కిలోమీటర్ల కాలపానీ ప్రాంతం మన ఆధీనంలో ఉంది. అయితే అది తమ ప్రాంతమని నేపాల్‌ 1998 నుంచి వివాదాన్ని రేపింది. అది పరిష్కారం కాలేదు. మేనెల ప్రారంభంలో రక్షణ మంత్రి రాజనాధ్‌ సింగ్‌ రిమోట్‌తో ఆ ప్రాంతంలో ఒకరోడ్డు ప్రారంభోత్సవం చేశారు. ఆ చర్యను నేపాల్‌ నిరసించింది. వేరే వారి ప్రమేయంతో నేపాల్‌ ఆ చర్యకు పాల్పడిందంటూ చైనాను ఉద్దేశించి పరోక్షంగా మన సైనికాధికారి ఎంఎం నవరానే వ్యాఖ్యానించారు.1816లో నేపాల్‌, నాటి బ్రిటీష్‌ ఇండియా మధ్య కుదిరిన ఒప్పందంలో మహాకాళీ నది నుంచి నేపాల్‌ పడమటి సరిహద్దు ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు. అయితే ఆ నది ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుందన్నదానిపై రెండు దేశాల మధ్య స్పష్టత లేకపోవటం వివాదానికి కారణం.
తాజా పరిణామాలపై రెండు దేశాల సామాజిక, సాంప్రదాయ మాధమాల్లో అనేక అభిప్రాయాలు వెలువడుతున్నాయి. వాటిని ఇక్కడ పేర్కొంటున్నామంటే ఏకీభవించినట్లు కాదు. మన దేశంలో ట్విటర్లలో వెలువడుతున్న అభిప్రాయాల ఒక మచ్చుతునక ఇలా ఉంది.” సింధు జలాలపై మోడీ పాకిస్ధాన్‌ను బెదిరించినపుడు చైనా బ్రహ్మపుత్ర నీటితో చేస్తుంది.లిపులేఖ్‌ దగ్గర సరిహద్దును మార్చాలని మోడీ నేపాల్‌ మీద వత్తిడి తెచ్చినపుడు చైనా లడఖ్‌లోని వాస్తవాధీన రేఖను దాటుతుంది. మోడీని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచటమే చైనా పధకం” దీనిలో వాస్తవాలు ఎలా ఉన్నాయన్నది పక్కన పెడితే ప్రతి దేశం తన రాజకీయాలను తాను చేస్తుందన్నది కనిపిస్తోంది.
చైనా మీడియాలో వచ్చిన వార్తలు, విశ్లేషణల సారాంశం ఇలా ఉంది.” తాజా సరిహద్దు వివాదం ఏదో యాదృచ్చికంగా జరిగింది కాదు. భారత్‌ ఒక పధకం ప్రకారమే వ్యవహరించింది. గాలవాన్‌ లోయ ప్రాంతం చైనా ఆధీనంలోనే ఉందని భారత్‌కు స్పష్టంగా తెలుసు. మే తొలి వారంలో చైనా ప్రాంతంలోకి భారత్‌ ప్రవేశించింది, సైన్యం కావాలని రెచ్చగొట్టింది. చైనా పహరా బృందాలకు ఆటంకాలు కల్పించింది. ఆ లోయలో చైనా మిలిటరీది పైచేయి అని తెలుసు కనుక భారత సైన్యం తెగేదాకా లాగుతుందని అనుకోవటం లేదు. ఒక వేళ పరిస్ధితిని దిగజార్చితే భారత మిలిటరీ భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. కరోనా వైరస్‌ నివారణ చర్యల్లో వైఫల్యం వలన భారతీయ సమాజం నుంచి వచ్చిన వత్తిడి పెరిగింది. ఇంతకు ముందే బలహీన పడిన భారత ఆర్ధిక పరిస్ధితి కరోనా కారణంగా మరింతగా దిగజారి మాంద్యలోకి పోనుందని గోల్డ్‌మన్‌శాచస్‌ పేర్కొన్నది. ఇప్పటికీ నరేంద్రమోడీ పలుకుబడి ఉన్నత స్ధాయిలోనే ఉన్నప్పటికీ దేశం ఎదుర్కొంటున్న ఆర్ధిక సవాళ్లను అధిగమించటానికి అది పని చేయదు.కనుక స్ధానిక సమస్యల నుంచి జనం దృష్టిని మళ్లించేందుకు జాతీయవాదాన్ని ముందుకు తెచ్చి మరోసారి చైనాతో సరిహద్దు సమస్యను పెంచి పెద్దది చేసేందుకు నిర్ణయించింది. ఆర్ధిక, వైద్య సహాయం కోసం చైనాతో బేరమాడేందుకు కూడా దీన్ని ఉపయోగించవచ్చు. సరిహద్దు వివాదాలను రోజువారీ సాధారణ వ్యవహారంగా మార్చేందుకు భారత్‌ పూనుకుంది.ఎందుకంటే సరిహద్దులకు తరచుగా సైన్యాన్ని పంపేందుకు దానికి భౌతిక సానుకూలతలు ఎక్కువగా ఉన్నాయి.కనుక ఇదొక దీర్ఘకాలిక సమస్యగా మారే అవకాశం ఉంది. చైనా కంటే భారత్‌కు అంతర్జాతీయ వాతావరణం అనుకూలంగా ఉందని భారత్‌లోని కొందరు పండితులు నమ్ముతున్నారు.చైనా-అమెరికా మధ్య విబేధాలు తీవ్రతరమైతే అమెరికాకు దగ్గరయ్యేందుకు భారత్‌కు అవకాశాలు పెరుగుతాయని వారు భావిస్తున్నారు.
రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదం ఒకటైతే అంతర్జాతీయ రాజకీయాల కారణంగా తీసుకుంటున్న వైఖరులు కూడా వివాదాన్ని ముదిరేట్లు చేస్తున్నాయి. టిబెట్‌, తైవాన్‌ రెండు ప్రాంతాలూ చైనాలో అంతర్భాగమే అన్నది మన ప్రభుత్వ అధికారిక వైఖరి. అయితే అమెరికా, బ్రిటన్‌ వంటి దేశాల మద్దతుతో టిబెట్‌లో తిరుగుబాటు చేసిన దలైలామాను అక్కడి కమ్యూనిస్టు ప్రభుత్వం అణచివేసింది. దాంతో దలైలామా పారిపోయి మన దేశం వచ్చాడు. ప్రాణభయంతో ఆశ్రయం కోరిన వారికి రక్షణ కల్పించటాన్ని కొంత మేరకు అర్ధం చేసుకోవచ్చు. కానీ జరిగిందేమిటి ? దలైలామా మన దేశంలోని హిమచల్‌ ప్రదేశ్‌లో ఏర్పాటు చేసిన ప్రవాస ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించనప్పటికీ ఆ పేరుతో సాగించే చైనా వ్యతిరేక కార్యకలాపాలను అనుమతించింది. చైనా వ్యతిరేకులకు ఆశ్రయం కల్పించింది. అనేక చోట్ల నివాసాలను ఏర్పాటు చేసింది. అరుణాచల్‌ ప్రదేశ్‌ తమ టిబెట్‌లో భాగం అని చైనా చెబుతున్నది. అక్కడి తవాంగ్‌ పట్టణాన్ని దలైలామా సందర్శించేందుకు 2009లో యుపిఏ పాలనా కాలంలోనూ, 2017లో మోడీ ఏలుబడిలో మరోసారి సందర్శించేందుకు అనుమతించటాన్ని చైనా వ్యతిరేకించింది. అరుణాచల్‌ ప్రదేశ్‌లోని ఆరు ప్రాంతాలకు తమ పేర్లు పెట్టింది. అరుణాచల్‌ ప్రదేశ్‌, తైవాన్‌లను తమ ప్రాంతాలుగా చూపకుండా ముద్రించిన ప్రపంచ మ్యాప్‌లను 2019లో చైనా కస్టమ్స్‌ అధికారులు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే.
భారత-చైనాల మధ్య ఉన్న మరో వివాదాస్పద అంశం దక్షిణ చైనా సముద్రంలో జోక్యం. ఈ సముద్ర ప్రాంతం మన దేశానికి ఎంతో దూరంగా ఉంది, దానితో మనకు ఎలాంటి సంబంధం లేదు. మనకంటే ఇంకా ఎంతో దూరంలో ఉన్న అమెరికా ఈ ప్రాంత వ్యవహారాల్లో జోక్యం చేసుకొని రెచ్చగొడుతోంది.దానికి మన దేశం వంతపాడుతున్నట్లు చైనా భావిస్తోంది. ఆ సముద్రంలో ఉన్న కొన్ని దీవులపై హక్కు తమదే అని చైనా చెబుతోంది. మరో సోషలిస్టు దేశమైన వియత్నాంతో సహా ఫిలిఫ్పీన్స్‌, బ్రూనే,మలేషియా, ఇండోనేషియాలు చైనా హక్కు వాదనతో విబేధిస్తున్నాయి. ఆ దీవులలో చమురు, ఇతర సంపదలు ప్రధానమైన అంశం. ఈ వివాదాన్ని అంతర్జాతీయం చేయవద్దని చెబుతూనే దక్షిణ చైనా సముద్రంలో తాము స్వేచ్చగా ప్రయాణించే హక్కు కలిగి ఉండాలని మన దేశం కోరుతోంది. ఈ జలాలపై చైనా హక్కును గుర్తిస్తే ఆ మార్గం గుండా ప్రయాణించే నౌకలు వినియోగ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. మనకూ ాచైనా మధ్య ఏవైనా తీవ్ర విబేధాలు తలెత్తితే మనకు ఇబ్బందులు వస్తాయి. మన దేశ వాణిజ్యంలో 55శాతం ఈ ప్రాంతంలోని మలక్కా జలసంధి ద్వారా జరుగుతోంది. ఈ ప్రాంతంలో బలహీనపడుతున్న అమెరికా తన ప్రతినిధిగా భారత్‌ ఉండాలని కోరుకుంటోంది.
ప్రపంచ ఆరోగ్య సంస్ధ అధ్యక్ష స్ధానానికి తాజాగా మన దేశం ఎన్నికైంది. ఈ సంస్ధలో స్వతంత్ర రాజ్యాలు మాత్రమే సభ్యత్వానికి అర్హత కలిగి ఉంటాయి. అయితే తైవాన్‌కు సభ్యత్వం ఇవ్వాలని, అధికారయుతంగా సమావేశాలకు ఆహ్వానించాలని అమెరికా పట్టుపడుతోంది. అందుకు చైనా ససేమిరా అంటోంది. మన దేశం తైవాన్‌ ప్రాంతం చైనాకు చెందిందే అని అధికారిక వైఖరిని కలిగి ఉన్నప్పటికీ బిజెపి దానికి కట్టుబడి ఉండటం లేదు. అమెరికా క్రీడలో పావుగా వ్యవహరిస్తోంది. చైనాకు చెందిన ఒక తిరుగుబాటు రాష్ట్రం తైవాన్‌. అక్కడ జరిగిన ఎన్నికలలో అధికారానికి వచ్చిన పార్టీ చైనాలో విలీనాన్ని వ్యతిరేకిస్తోంది. ఇటీవల అధ్యక్షురాలు శారు ఇంగ్‌ వెన్‌ అధికారస్వీకారోత్సవానికి బిజెపికి చెందిన మీనాక్షీ లేఖి మరొక ఎంపీని ఆహ్వానించారు. ఆ మేరకు వారు ఆన్‌లైన్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇది తమను రెచ్చగొట్టే చర్యగా చైనా పరిగణిస్తోంది.
ఈ నేపధ్యంలో తాజా పరిణామాలను ఏ విధంగా చూడాలి అన్నది సమస్య. అంతర్జాతీయ రాజకీయాలు, ఎత్తుగడలలో ఒక దగ్గర స్విచ్‌ వేస్తే మరొక దగ్గర లైట్‌ వెలగటం తెలిసిందే. ఏ దేశంతో అయినా ప్రస్తుత ప్రపంచీకరణ యుగంలో సత్సంబంధాలను కలిగి ఉండటం, ప్రత్యేకించి ఇరుగుపొరుగుదేశాలతో సఖ్యతగా ఉండటం ఎంతో అవసరం. దాని వలన బోలెడు మిలిటరీ ఖర్చు తగ్గిపోయి, అభివృద్ధికి వెచ్చించవచ్చు. రెండవ ప్రపంచ యుద్ధానికి కారణమైన జర్మనీ, జపాన్‌లు ఆ యుద్దం ముగిసిన తరువాత రెగ్యులర్‌ మిలిటరీ కలిగి ఉండటానికి వీల్లేదని విజేతలు శాశించారు. అప్పటి నుంచి ఆత్మరక్షణ దళాల పేరుతో పరిమితి సాయుధ బలగాలే ఉన్నాయి. మిలిటరీకి చేసే ఖర్చును ఆ రెండు దేశాలు పరిశోధన, అభివృద్ధికి ఉపయోగించి పెద్ద ఎత్తున పారిశ్రామిక, వాణిజ్య రంగాలలో అభివృద్ది చెందాయి. అక్కడ పెట్టుబడిదారీ వ్యవస్ధలే ఉన్నందున దానిలోని అంతర్గత వైరుధ్యాల కారణంగా అవి కూడా సమస్యలను ఎదుర్కొంటున్నా మిగతా దేశాల కంటే మెరుగ్గానే ఉన్నాయి.
ఏ రీత్యా చూసినా ఇప్పుడు ఏ దేశమూ యుద్దం చేయగల స్ధితిలో లేదు. అటు గ్జీ జింపింగ్‌, ఇటు నరేంద్రమోడీ వెనుక 140 కోట్ల మంది చొప్పున జనం ఉన్నారన్నది మర్చిపోకూడదు. ప్రస్తుత పరిస్ధితుల్లో రెండు దేశాల సరిహద్దు భద్రతా బలగాల మధ్య తలెత్తిన వివాదం గతంలో ముందుకు వచ్చిన వాటికంటే భిన్నమైనది, తీవ్రమైనది అని చెబుతున్నవారితో ఏకీభవించవచ్చు, ఏకీభవించకపోవచ్చు. ఇది ఇంతకు మించి మిలిటరీ చర్యలకు దారి తీసే అవకాశాలు పరిమితం. రెండు దేశాల మధ్య మధ్యవర్తిత్వం పేరుతో దూరేందుకు అమెరికా చేస్తున్న ప్రయత్నాలు ఎట్టి పరిస్ధితుల్లోనూ నెరవేరదు. అది తన అనుయాయులను సంతృప్తిపరచినా ఒక ప్రధానిగా నరేంద్రమోడీ అంగీకరించే అవకాశం లేదు. 1. రెండు దేశాలూ కరోనా వైరస్‌ మీద పోరాడుతున్నాయి. చైనాలో కరోనాను కట్టడి చేసినా ఇంకా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. మన దేశంలో కట్టడి చేశామని చెబుతున్నప్పటికీ అది కొన్ని ప్రాంతాలకే పరిమితం. గతంలో కంటే కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. విదేశాల నుంచి, ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి తిరిగి వచ్చిన వారి నుంచి కేసులు గణనీయంగా నమోదవుతున్నాయి. మనకు ఇంకా ముప్పు తొలగలేదు. 2.కరోనా కారణంగా చైనాలో ఒక్క హుబెరు రాష్ట్రమే లాక్‌డౌన్‌లో ఉంది. మన దేశం మొత్తం ఉంది. అక్కడ ఆర్ధిక కార్యకలాపాలూ పూర్తిగా కొద్ది వారాల క్రితమే ప్రారంభం అయ్యాయి. మన దగ్గర ఇంకా అనిశ్చితంగానే ఉంది. 3.కరోనాకు ముందే మన దేశం తీవ్ర ఆర్ధిక సమస్యల్లో కూరుకుపోయింది. చైనాలో అలాంటి పరిస్ధితి లేకపోయినా వృద్ది రేటు తగ్గింది. కరోనా అనంతరం దాని వృద్ధి రేటు రెండున్నరశాతం వరకు ఉండవచ్చని అంచనాలు వెలువడుతుండగా మనది మైనస్‌ ఆరుశాతం వరకు ఉండవచ్చు అంటున్నారు. స్వల్ప యుద్దం జరిగినా రెండు దేశాలూ నష్టపోతాయి, ఎంత చెట్టుకు అంతగాలి అన్నట్లు, ఎంతో మిగులులో ఉన్న చైనాతో పోలిస్తే వాణిజ్య లోటుతో ఉన్న మన నష్టం ఎంతో ఎక్కువగా ఉంటుంది.
భారత్‌-చైనాలు రెండూ అణ్వస్త్రదేశాలే కనుక యుద్దమంటూ వస్తే పరస్పరం నాశనం తప్ప విజేతలంటూ ఉండరు. రెండూ వర్ధమాన దేశాలే కనుక యుద్దం కంటే జనజీవితాల మెరుగుదలకు ప్రాధాన్యత ఇవ్వాలి.భారత-పాకిస్ధాన్‌ మధ్య యుద్దం వస్తే ఆయుధాలు అమ్ముకొని లాభపడేది అమెరికా.భారత-చైనాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తినా జరిగేది అదే. కనుక సంప్రదింపుల ద్వారా తాజాగా తలెత్తిన ఉద్రిక్తతలను ఉపశమింప చేసేందుకు ప్రయత్నించాలి. జాతీయవాదం, దురహంకారాన్ని రెచ్చగొట్టటం సులభం, దాన్నుంచి వెనక్కు రావటం ఎంతో కష్టం. అది సామాన్యుల్లో తలెత్తితే సమసిపోతుంది, కానీ పాలకులకే ఆ వైరస్‌ అంటుకుంటే ఏం జరుగుతుందో గతంలో చూశాము. చరిత్ర పునరావృతం కారాదని కోరుకుందాం.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

అచ్చేదిన్‌ నుంచి ఆత్మనిర్భరత వరకు….ఆరేండ్ల మోడీ పాలన ?

25 Monday May 2020

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, USA

≈ Leave a comment

Tags

India economy slowdown, Modi Six Years regime, Narendra Modi Failures


ఎం కోటేశ్వరరావు
తారీఖులు, దస్తావేదులు ఇవి కాదోరు చరిత్ర సారం అన్నాడు మహాకవి శ్రీశ్రీ. అలా చూస్తే ఈనెల 30 తేదీకి నరేంద్రమోడీ2.0పాలనకు ఏడాది పూర్తి, ఖాతాలో ఆరేండ్లు జమ చేసుకోవటం తప్ప ఏం సాధించారన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. సాధారణంగా చివరి సంవత్సరంలో ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పాలకుల వైఫల్యాల గురించి చర్చ ప్రారంభం అవుతుంది. కానీ చిత్రం ఏమిటంటే మోడీ రెండవ సారి అధికారానికి వచ్చిన తొలి ఆరునెలల్లోనే దిగజారుతున్న దేశ ఆర్ధిక స్ధితికి కారకులు ఎవరనే ప్రశ్న ముందుకు వచ్చింది. దిగ్గజాలనిపించుకుంటున్న మన మంత్రులు హాస్యభరితమైన సమాధానాలు చెబుతుండగా కరోనా వైరస్‌ పుణ్యమా అంటూ అది వెనక్కు పోయింది. కరోనా వైరస్‌ పేరుతో వైఫల్య వైరస్‌ బయటకు రాకుండా ఎంతకాలం, ఎలా కాపాడతారో దేశం చూడనుంది.
ఏడాది పాలన మంచి చెడ్డల కంటే ముందుగా కరోనా నిరోధ చర్యల విషయంలో ప్రభుత్వ వైఫల్యం గురించి వచ్చిన విమర్శలకు అధికారపక్షం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. సామాజిక మాధ్యమంలో బిజెపి మరుగుజ్జులు విన్యాసాలు చేసేందుకు భయపడుతున్నారు.ఎంత ఎక్కువ తప్పుడు ప్రచారం చేస్తే అంత ఎక్కువగా జనంలో పలచనౌతారు. ఏడాది పాలన ఉత్సవాలను ఎలా చేసుకుంటారో, ప్రతిపక్షాలు ఎలా స్పందిస్తాయో, జనం ఏవిధంగా చూస్తారో చూద్దాం. క్రికెట్‌లో మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ రెండవ ఇన్నింగ్స్‌లో తరచూ విఫలమయ్యాయరన్నది ఒక విశ్లేషణ. రాజకీయాల్లో రెండవ ఇన్నింగ్స్‌ ప్రారంభించిన మోడీకి ఇది వర్తిస్తుందా?
కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలలో చేతులు కడుక్కోవటం ఒకటి.పేరుకు 20లక్షల కోట్ల రూపాయల పాకేజ్‌ అని ప్రకటించినప్పటికీ రెండున్నర లక్షల కోట్లకు మించి ఖజానా నుంచి ఖర్చు చేయకుండా కేంద్ర ప్రభుత్వం చేతులు కడిగేసుకోవటాన్ని చూశాము. అదే విషయాన్ని ప్రతిపక్షాలు ఎత్తి చూపితే అదిగో చూడండి పాకేజ్‌ను అర్ధం చేసుకోకుండా లోపాలు వెతికేందుకు పూనుకున్నారు అంటూ నిర్మలమ్మ ఎగిరి పడ్డారు.
2024 నాటికి మన ఆర్ధిక వ్యవస్ధను ఐదు లక్షల కోట్ల డాలర్ల స్ధాయికి పెంచాలని ప్రధాని పిలుపు ఇచ్చారు. సర్వేజనా సుఖినో భవంతు మాదిరి ఐదు కాదు ఆయన మంత్రదండంతో పదిలక్షల కోట్లకు పెంచినా మంచిదే, దాంతో ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేదు. ఎలా సాధిస్తారన్నదే కదా సమస్య. దానికంటే ముందు 2022 నాటికి రైతుల ఆదాయాలను రెట్టింపు చేస్తామన్న వాగ్దానం గురించి మాట్లాడటం మానేశారు. ఒకసారి చెప్పినదాని గురించి మరోసారి మాట్లాడకపోవటమే కదా అనితర సాధ్యమైన నరేంద్రమోడీ ప్రత్యేకత. గతంలో కాంగ్రెస్‌, ఇతర పార్టీలు, చివరికి బిజెపికే చెందిన వాజ్‌పారు ప్రభుత్వాన్ని కూడా తప్పు పట్టే అవకాశం ఉండేది. ఇప్పుడు విమర్శిస్తే ఎక్కడ దేశ ద్రోహి అంటారో, తుకడే తుకడే గాంగ్‌ అని ముద్రవేస్తారో అని ప్రముఖ పారిశ్రామికవేత్తల మొదలు మేథావుల వరకు ఎవరూ ప్రభుత్వ విధానాలు,వాటి పర్యసానాల గురించి మాట్లాడేందుకు భయపడి చస్తున్నారు.
సిఎఎ, ఎన్‌ఆర్‌సి సంబంధిత అంశాలు, ఢిల్లీ మతదాడులతో మలివిడత తొలి ఏడాది ప్రారంభంలో ఆర్టికల్‌ 370, జమ్మూకాశ్మీర్‌ రాష్ట్రం, ముమ్మారు తలాక్‌ రద్దు వంటి విజయగానాలు మూగపోయాయి. ఏదో ఆరోజు అలా అనుకున్నాం అని గాక ఆర్టికల్‌ రద్దు, కాశ్మీర్‌ రాష్ట్ర రద్దు వలన ఆ రాష్ట్ర ప్రజలకు, మొత్తంగా దేశ ప్రజలకు జరిగిన మంచి ఏమిటో మోడీ లేదా మద్దతు ఇచ్చిన ప్రాంతీయ పార్టీలు జనానికి ఈ సందర్భంగా చెప్పాలి. ఏదో ఒక రోజు కరోనా లాక్‌డౌన్‌ ఎత్తివేత జరుగుతుంది తప్ప గత ఏడాది ఆగస్టు 5న ప్రకటించిన కాశ్మీర్‌ లాక్‌డౌన్‌ ఎత్తివేత కనుచూపు మేరలో కనిపించటం లేదు. దాన్ని సమర్ధించిన పార్టీలేవీ మాట్లాడటం లేదు. అది ఇంక శాశ్వతం అన్నట్లుగా జనాలు కూడా ఆలోచించటం మానుకున్నారు. దాని గురించి మాట్లాడేందుకే పాలక పార్టీ భయపడుతోంది. ఆర్ధిక వ్యవస్ధ మరింత సంక్షోభంలోకి కూరుకుపోకుండా చూసేందుకు ఊబిలో ఉన్న జనాలను రక్షించేందుకు గాక వెలుపల ఉన్న పారిశ్రామిక, వాణిజ్యవేత్తలకు ప్రభుత్వం చేయూతనిస్తోంది. అయితే కొత్తగా పెట్టుబడులు పెడితే తాము కూడా ఊబిలో కూరుకుపోవాల్సి వస్తుందని వారు ముందుకు రావటం లేదు. బంగారు బాతులను కోసి గుడ్లు తీసుకున్నట్లుగా ఎల్‌ఐసి, చమురు సంస్ధల వాటాల విక్రయం, ప్రయివేటీకరణ అజెండా గురించి వేరే చెప్పనవసరం లేదు.
దేశంలో హిందువులున్న ప్రతి గ్రామంలో రామాలయం ఉంది, వాటి సరసన ఆయోధ్యలోని వివాదాస్పద స్ధలంలో మరో ఆలయ నిర్మాణానికి సుప్రీం కోర్టు తీర్పు అవకాశం ఇచ్చింది. రాముడి మనోభావాలకు విలువ ఇచ్చిన ఉన్నత న్యాయస్ధానం వలస కార్మికుల విషయంలో మేమేం చేస్తామంటూ కడిగేసుకుంది. తమ స్వస్ధలాలకు వెళ్లేందుకు అవకాశం, వ్యవధి ఇవ్వకుండా ప్రకటించిన లాక్‌డౌన్‌ కారణంగా కోట్లాది మంది పడిన ఇబ్బందులు మోడీ సర్కార్‌కు తొలి ఏడాది పాలనలో మాయని మచ్చగా మారాయి. ఎన్ని మరకలు పడితే అంత మంచిది అని భావించే వారిని అవి బాధించవు. అన్నింటికీ మించి 20లక్షల కోట్ల జుమ్లా పాకేజ్‌ మోడీ సర్కార్‌ బూటకాన్ని మరోసారి బట్టబయలు గావించింది. మన ప్రజారోగ్య వ్యవస్ధ ఎంత బలహీనంగా ఉందో మహమ్మారుల సమయంలో వైద్యులు, సిబ్బందికి కనీసం అవసరమైన ముఖతొడుగులు, పిపిఇ కిట్స్‌ కూడా అందించలేని దుస్ధితిని కరోనా వెల్లడించింది. అతని కంటే ఘనుడు ఆచంట మల్లన అన్నట్లు పారాసిటమాల్‌, బ్లీచింగ్‌ పౌడర్లతో వైరస్‌ను అరికట్టవచ్చని ముఖ్యమంత్రులే చెప్పారు.
ఏడాది పాలన సందర్భంగా వందిమాగధులు చప్పట్లు కొట్టే పరిస్ధితి లేదు, అభిమానులు దీపాలు వెలిగించి హారతులు పట్టేంత గొప్పలేమీ లేవు. పూలు చల్లి పూజలు చేసే మహిమలేవీ మోడీ బాబా ప్రదర్శించలేదు. కాంగ్రెస్‌ ఐదు దశాబ్దాలలో చేయలేని దానిని లేదా చేసిన నిర్వాకాలను మేము ఐదు సంవత్సరాలలో సరిదిద్దామని బిజెపి నేతలు చెప్పుకున్నారు. అవునంటే కాదనిలే, కాదంటే అవుననిలే అని ఒక కవి చెప్పిన మాటలను ఆ పార్టీకి అన్వయించుకోవలని వారే స్వయంగా రుజువు చేసుకున్నారు. మచ్చుకు ఒకదానిని చూద్దాం. 2013-14 ఆర్ధిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ స్వదేశీ, విదేశీ అప్పు మొత్తం రూ. 46,15,250 కోట్లు కాగా 2019-20కి రూ.100,18,120 కోట్లు. సెంచురీ సాధించిన ఘనత కచ్చితంగా మోడీదే. నాటి నెహ్రూ మొదలు మధ్యలో వాజ్‌పేయితో సహా మన్మోహన్‌ సింగ్‌ వరకు చేసిన అప్పుల బకాయిల కంటే అరు సంవత్సరాలలో మోడీ గారి ప్రగతి ఆకాశానికి ఎలా ఎగిరిందో వ్యాఖ్యలు అవసరం లేదు. జనానికి ఇస్తున్న లక్షల కోట్ల రూపాయల రాయితీల రద్దు తరువాత జరిగినది ఈ పురోగతి.
వృతం చెడ్డా ఫలం దక్కలేదు. నిరుద్యోగం విపరీతంగా పెరిగింది. ఈ సమస్యను కరోనాకు ముందు, తరువాతగా చూసేట్లయితే మోడీ 2.0 రెండవ ఏడాది ఎదుర్కోబోయే సవాలు అర్ధం అవుతుంది.లాక్‌డౌన్‌ ప్రకటించిన తరువాత మార్చి 25న దేశంలో నిరుద్యోగుల శాతం 7.58శాతంగా ఉందని సిఎంఐయి విశ్లేషణ పేర్కొన్నది. అదే మేనెల 24న 24.6శాతంగా తెలిపింది. లాక్‌ డౌన్‌ ఎత్తివేసిన తరువాత ఇది ఎలా మారుతుందో చూడాల్సి వుంది. ఏప్రిల్‌ నెలలో పెద్ద రాష్ట్రాలలో గరిష్టంగా తమిళనాడులో 49.8శాతం ఉంది, కేంద్ర పాలిత రాష్ట్రమైన పుదుచ్చేరిలో 75.8శాతం కాగా ఆంధ్రప్రదేశ్‌లో 20.5, తెలంగాణాలో 6.2శాతం ఉన్నట్లు సిఎంఐయి తెలిపింది. దేశ ఆర్ధిక రంగంలో వైఫల్యాలు లేదా ఎదురువుతున్న సవాళ్ల గురించి మచ్చుకు ఇవి చాలు. ఈ పరిస్ధితికి కారకులు ఎవరు ?
గాంధీ, నెహ్రూలే అని ఆరు సంవత్సరాల ఏలుబడి తరువాత మోడీ పరివారం చెబితే నడవదు, భక్తులు కూడా మరీ అంతగా కమలం పువ్వులు ఎక్కువ కాలం పెట్టుకోలేరు. మోడీ సర్కార్‌ చెప్పుకున్నట్లు చైనా కంటే అధిక వృద్ధి రేటు అంటే ప్రపంచంలోనే అత్యంత వేగంగా, ఎక్కువగా ఉన్న మన దేశం ఒక్కసారిగా తిరోగమనంలోకి జారిందన్నది కాదనలేని వాస్తవం. త్వరలో మాంద్యంలోకి పోబోతున్నదని అందరూ అంగీకరిస్తున్న అంశం. అనాలోచితంగా మోడీ ప్రకటించిన 2016నాటి పెద్ద నోట్ల రద్దు,తరువాత తగినంత కసరత్తు లేకుండా ప్రవేశపెట్టిన జిఎస్‌టి, తదితర అంశాలు అంతగా అంతుబట్టని ఆర్ధిక గొలుసుకట్టు రాతను జనం అర్ధం చేసుకొనే తరుణం వచ్చింది.
యుపిఏ హయాంలో ముడుపులు తీసుకొని కాంగ్రెస్‌ మంత్రులు ఫోన్లు చేసి లక్షల కోట్ల రూపాయలను ఆశ్రిత పారిశ్రామిక, వాణిజ్యవేత్తలకు రుణాలుగా ఇప్పించారని, తీసుకున్నవారంతా ఎగవేస్తున్నారని, దానికి బాధ్యత కాంగ్రెస్‌దే, ఫోన్‌ బ్యాంకింగ్‌ అంటూ ఇప్పటి వరకు ప్రచారం చేస్తున్న బిజెపి తన ఏలుబడిలో ఆ అప్పులను రద్దు చేస్తున్నది లేదా ఎంతో కొంత వసూలు చేసి లావాదేవీలను మూసివేయమంటున్నది. నాడు అప్పులు ఇప్పించినందుకు కాంగ్రెస్‌కు ఎన్ని ముడుపులు ముట్టాయో వాటిని రద్దు చేస్తున్నందుకు ఇప్పుడు అంతకంటే ఎక్కువే బిజెపికి ముడుతూ ఉండాలి. లేకుంటే ఉత్తి పుణ్యానికే రద్దు చేస్తారా ? కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బిజెపి నేత నళిన్‌ కోహ్లీతో చెప్పినట్లుగా బిజెపి సోషల్‌ మీడియా వేదికలు వెల్లడించిన సమాచారం ప్రకారం సిబిఐ, సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌.కాగ్‌(మూడు సి’లు) గురించి భయపడాల్సిన పనిలేదని, అర్హులైన వారికి ఉదారంగా రుణాలివ్వాలని, నిర్ణయం తప్పయినా, ఏదైనా నష్టం జరిగినా ప్రభుత్వం నూరుశాతం హామీగా ఉంటుందని బ్యాంకు, ఆర్ధిక సంస్ధల అధికారులకు చెప్పినట్లు వార్తలు వచ్చాయి. వాటిని ఎక్కడా ఖండించినట్లు కనిపించలేదు. అంటే ఆర్ధిక సంస్ధల ఉన్నతాధికారులు, బడాబాబుల బంధం మరింత గట్టిపడి రాబోయే రోజుల్లో జనం సొమ్ము లూటీ చేసేందుకు హామీ ఇవ్వటం తప్ప ఇది వేరు కాదు. కాంగ్రెస్‌ నేతలు అనధికారికంగా సిఫార్సులు చేసినా మేం చూసుకుంటామని ఎక్కడా చెప్పలేదు, పోయినోళ్లే మంచోళ్లు అనిపిస్తున్నారు బిజెపి నేతలు.
మన దేశం ఎదుర్కొంటున్న ఆర్ధిక సంక్షోభం లేదా మాంద్యానికి ద్రవ్య వ్యవస్ధను ప్రయివేటీకరించకపోవటమే అని అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడిదారీ లాబీ చెబుతోంది. రుణాల వృద్ది రేటు బలహీనంగా ఉందని, మూడింట రెండు వంతుల బ్యాంకింగ్‌ ఆస్ధులను ప్రభుత్వ రంగబ్యాంకులే అదుపు చేస్తున్నాయని, గత ఆకస్మిక రుణ వృద్ధి తరువాత నిరర్ధక ఆస్తుల్లో 90శాతం ప్రభుత్వ బ్యాంకుల్లోనే ఉన్నాయని, ప్రభుత్వరంగ బ్యాంకులను తెగనమ్మకుండా వాటిని సంస్కరించటానికి పూనుకున్నట్లు నిషఉ్ఠరాలాడుతున్నారు. 2008 సంక్షోభంలో ప్రయివేటు రంగ బ్యాంకులు ఇతర దేశాల్లో ఎలా కుప్పకూలాయో చూసిన తరువాత మన దగ్గర అలాంటి సంక్షోభం తలెత్తకపోవటానికి కారణం బ్యాంకింగ్‌ రంగం ప్రభుత్వ ఆధీనంలోనే ఉండటం అన్నది తెలిసిందే. ఇప్పుడు ఆ బ్యాంకులను దెబ్బతీసేందుకు, ప్రయివేటు పరం చేసేందుకు వత్తిడి తెస్తున్నారు.
ి ఏడవ వేతన సంఘ సిఫార్సుల ప్రభావం తొలి రోజుల్లో ఎక్కువగా ఉన్నప్పటికీ అది తగ్గిపోవటం ప్రారంభమైందని ఆర్ధిక వ్యవస్ధ మందగించటానికి ఇది ఒక కారణమన్నది ఒక అభిప్రాయం. ఆర్ధిక పునరుద్దరణకు వడ్డీ రేట్ల తగ్గింపు జిందాతిలిస్మాత్‌ కాదు.పరిమిత ప్రయోజనాలు మాత్రమే ప్రతికూల పర్యవసానాలు కూడా వెంట ఉంటాయి. అనేక దేశాల్లో సున్నా లేదా ఒకటి రెండు శాతమే వడ్డీ రేటు ఉన్నా అవి ఆర్ధిక సుడిగుండాల నుంచి బయటపడటం లేదు.
ఒకవైపు ప్రపంచంలోనే అత్యంత వేగంగా, చైనా కంటే అధికంగా నరేంద్రమోడీ హయాంలో దేశం అభివృద్ధి చెందుతున్నదని ఊదరగొట్టిన వారు, తిరోగమనం ప్రారంభం కాగానే మాట మార్చారు. మన మందగమనానికి కారణం ప్రపంచ వ్యవస్ధ లేదా అన్ని దేశాల మాదిరిగానే మనదీ సమస్యలను ఎదుర్కొంటోందంటూ విమర్శకులపై ఎదురుదాడి చేస్తున్నారు. మరోవైపు ప్రపంచ మందగమనానికి మన దేశం ప్రాధమిక కారణమని, సులభలెక్కల్లో అయితే 80శాతం అని ఐఎంఎఫ్‌ ప్రధాన ఆర్ధికవేత్త గీతా గోపీనాధ్‌ జనవరినెలలో దవోస్‌ ప్రపంచ ఆర్ధిక వేదిక సమావేశాల్లో చెప్పారు.భారత అభివృద్ధి మందగించిన కారణంగానే ప్రపంచ సూచికలను తగ్గించాల్సి వస్తోందన్నారు.
ప్రపంచ వాణిజ్యంలో భారత వాటా నామమాత్రమని అమెరికా-చైనాల మధ్య సాగుతున్న వాణిజ్యపోరు, అమెరికా-ఇరాన్‌ వైరం, అమెరికా నుంచి ఐరోపా, రష్యా వరకు ఏ ఒక్క దేశంలోనూ పురోగతి కనిపించటం లేదు, ఇవన్నీ మన దేశాన్ని దెబ్బతీస్తున్నాయి తప్ప మనం కారణం అనటం ఏమిటనిఅనేక మంది ఆర్దికవేత్తలు గీతపై రుసరుసలాడారు. ఇవన్నీ కరోనా వైరస్‌ వ్యాప్తి పర్యవసానాల గురించి అంచనాలు లేక ముందు జరిగిన చర్చ అంశాలు. కరోనాకు ముందు 2019లో మన ఆర్ధిక వ్యవస్ధ వృద్ధి రేటు అక్టోబరు అంచనాలో 6.1శాతం కాగా తరువాత 4.8శాతానికి ఐఎంఎఫ్‌ తగ్గించింది. కేంద్ర ప్రభుత్వం 6.8శాతం నుంచి జనవరిలో ఐదు శాతానికి తగ్గించింది. వాస్తవంలో ఎంతో ఇంకా తెలియాల్సి ఉంది. ఇప్పుడు 2020లో మనదీ, ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ తిరోగమనంలో ఉండవచ్చనే అంచనాలు ఉన్నాయి. రిజర్వుబ్యాంకు గవర్నర్‌ శక్తికాంతదాస్‌ ఎంత శాతమో ఇంకా తెలియదు గానీ తిరోగమనమే అని చెప్పగా పదిహేనవ ఆర్ధిక సంఘం చైర్మన్‌ ఎన్‌కె సింగ్‌ మాత్రం మైనస్‌ ఆరు నుంచి ఒకశాతం మధ్య ఉంటుందన్నారు. చైనాకు సంబంధించి గణనీయంగా తగ్గినా పురోగమనమే తప్ప తిరోగమం కాదని అంచనాలు వెలువడిన విషయం తెలిసిందే.
క్రిసిల్‌ రేటింగ్‌ సంస్ధ ప్రధాన ఆర్ధిక వేత్త డికె జోషి ప్రపంచ ఆర్ధిక మందగమనానికి భారత్‌ కారణం అనటాన్ని తోసిపుచ్చారు. మూలము ధనిక దేశాల నుంచి అభివృద్ధి చెందుతున్న దేశాలకు పాకుతుంది అన్నారు.భారత మందగమనానికి స్ధానిక అంశాలే మొత్తంగా కారణం అన్నారు. అంకెల రీత్యా భారత్‌ ప్రభావం చూపినట్లు కనిపించవచ్చుగానీ భౌతికంగా కాదు అన్నారు. కొనుగోలు శక్తి తుల్యత(పర్చేజింగ్‌ పవర్‌ పారిటీ) ప్రాతిపదికన అభివృద్ధి రేటును లెక్కిస్తే ప్రపంచంలో భారత్‌ మూడవ పెద్ద దేశం.(2020 అంచనాల ప్రకారం చైనా 27.8, అమెరికా 20.29, భారత్‌ 11.32, జపాన్‌ 5.45, రష్యా 4.18 లక్షల కోట్ల డాలర్ల వంతున తొలి ఐదు స్ధానాల్లో ఉన్నాయి. కరోనా ఈ అంకెలను ఎలా మారుస్తుందో తెలియదు.) భారత మందగమనం కానసాగటానికి కారణం ద్రవ్య రంగ సమస్యలు. వస్తు ఉత్పత్తి, సేవలు, ద్రవ్య రంగం ఒకదానికి ఒకటి సాయపడాల్సి ఉంది. ఆర్ధికవ్యవస్దకు ఉత్తేజం, ఉల్లాసం కలిగించే సామర్ధ్యం దేశ ద్రవ్యవిధానాలకు పరిమితంగా ఉంది, కాబట్టి ముడి చమురు ధరలు, రుతుపవనాల మీద అదృష్టం ఆధారపడి ఉంటుందని జోషి చెప్పారు.
ప్రపంచ-భారత ఆర్ధిక సంస్ధలు పరస్పర ఆధారితమైనవి.అనేక మంది ఆర్ధికవేత్తలు చెప్పినట్లు వర్తమాన భారత మందగమనాన్ని బయటి అంశాలు తీవ్రం చేశాయి. అయితే స్ధానిక సమస్యలే దానికి మూలం అన్నది ముఖ్యమని గుర్తుకు తెచ్చుకోవాలి. వ్యవసాయ సంక్షోభం, గ్రామీణ ప్రాంతాలలో దారిద్య్రం, గిరాకీ(డిమాండ్‌) పడిపోవటం, పెట్టుబడుల రేటు తీవ్రంగా పడిపోవటం, పెద్ద నోట్ల రద్దు, లోపాలతో కూడిన జిఎస్‌టి భారత వృద్ధి రేటు పడిపోవటానికి ప్రాధమిక కారణాలు అని ఆర్ధికశాఖ మాజీ కార్యదర్శి అరవింద్‌ మాయారామ్‌ చెప్పారు.
పారిశ్రామిక ఉత్పత్తి, వ్యవసాయ రంగాలలో అమెరికా, ఐరోపా యూనియన్‌ అనుసరిస్తున్న రక్షణాత్మక విధానాలే మన దేశీయ అభివృద్ధికి ప్రతికూలంగా మారాయని బిజెపి ఆర్ధిక వ్యవహారాల ప్రతినిధి గోపాల కృష్ణ అగర్వాల్‌ చెప్పారు. దేశ ఆర్ధిక వృద్ధి కంటే నరేంద్రమోడీ తన రాజకీయ, సామాజిక అజెండాను నెరవేర్చుకోవటం మీదే కేంద్రీకరించిన పర్యవసానమే మందగమనం అని రిజర్వుబ్యాంకు మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ వ్యాఖ్యానించారు.
దేశ ఆర్ధిక మందగమనానికి నెహ్రూ, ఇందిరా గాంధీలే కారణం అని చెప్పవద్దని శివసేన పత్రిక సామ్నా వ్యాఖ్యానించింది. అధికారాలన్నీ చేజిక్కించుకొని మంత్రులకు అధికారం లేకుండా చేసిన ప్రధాన మంత్రి కార్యాలయమే ఒక ప్రధాన కారణమని, ఆర్ధికం అంటే షేర్‌ మార్కెట్‌ జూదంగా భావిస్తున్న బిజెపి నాయకత్వం ఆర్ధికవేత్తలు చెప్పేది వినటం లేదని పేర్కొన్నది.
” టీవీలలో చూపే లెక్కల జోలికి మీరు పోవద్దు, దేశం ఐదులక్షల కోట్ల డాలర్ల ఆర్ధిక వ్యవస్ధగా ఎదగాలంటే పన్నెండుశాతం వంతున ఎదగాలి. ఈరోజు ఆరుాఏడుశాతం చొప్పున పెరుగుతున్నది. మీరు ఆలెక్కల్లోకి పోవద్దు గురుత్వాకర్షణ సిద్దాంతాన్ని కనుగొనేందుకు ఐనిస్టీన్‌కు లెక్కలు ఎప్పుడూ ఉపయోగపడలేదు ” (ఐనిస్టీన్‌ పుట్టటానికి దాదాపు రెండు వందల సంవత్సరాల ముందే న్యూటన్‌ ఆ సిద్దాంతాన్ని కనుగొన్నాడు. ఐనిస్టీన్‌ సాధారణ సాపేక్ష సిద్దాంతాన్ని కనుగొన్నాడు. అవి రెండూ లెక్కల ప్రాతిపదికగా చెప్పినవే ) అని చెప్పిన మంత్రి పియూష్‌ గోయల్‌, ఆటోమొబైల్‌ పరిశ్రమలో మాంద్యం ఎందుకు వచ్చిందంటే జనాలు ఊబర్‌,ఓలాలు వినియోగించటమే కారణం అని చెప్పిన నిర్మలాసీతారామన్‌, మూడు సినిమాలు కిక్కిరిసిన ప్రేక్షకులతో నడుస్తుంటే ఇంకా ఆర్ధిక మందగమనం ఎక్కడ అని ప్రశ్నించిన రవిశంకర్‌ ప్రసాద్‌ వంటి వారు నరేంద్రమోడీ కొలువులో మంత్రులుగా ఎన్ని ఉత్సవాలు చేసుకున్నా, ఎంతకాలం పదవుల్లో ఉన్నా దేశ మందగమనానికి అసలైన కారణాలు, బాధ్యుల గురించి వారి నోట వినగలమా ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

అన్నీ శుభసూచనలే అయినా నరేంద్రమోడీకి ఎందుకీ అపశకునాలు !

22 Friday May 2020

Posted by raomk in BJP, CHINA, COUNTRIES, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

Economic Crisis In India, Economic reforms In India, Failed Economic Reforms in India, India Economic slowdown, Narendra Modi, PM Modi, Unemployment Crisis In India

Slowdown blues: State of Indian economy and its fragile-five past ...

ఎం కోటేశ్వరరావు
కరోనా విపత్తు సమయంలో ప్రధాని నరేంద్రమోడీ ఇస్తున్న పిలుపులు, వాటి తీరుతెన్నులను చూస్తే ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. మోడినోమిక్స్‌ ద్వారా అంతర్జాతీయ సహకారం, ప్రపంచ ఆర్ధిక వృద్ధికి గాను చేసిన కృషికి చరిత్రలో మన ప్రధానుల్లో ఎవరూ పొందని విధంగా రెండు సంవత్సరాల క్రితం సియోల్‌ శాంతి బహుమతి అందుకున్న వ్యక్తి, ప్రస్తుత మోడీ ఒకరేనా అన్న అనుమానం కలగకపోదు. గత ఆరు సంవత్సరాల కాలంలో ఎన్ని పిలుపులు, ఎంత హడావుడి చేశారు. గతంలో మాదిరి స్వదేశీ వస్తువులనే కొనండి అన్న పిలుపు తిరిగి ఇస్తే తన ప్రత్యేకత ఏముంటుంది అనుకున్నారేమో ” స్వదేశీ వస్తువులనే అడగండి ”(వోకల్‌ ఫర్‌ లోకల్‌ ) అని ఇచ్చిన పిలుపు నిజంగానే వీనుల విందుగా ఉంటుంది. నరేంద్రమోడీ, ఆయన మాతృసంస్ధ ఆర్‌ఎస్‌ఎస్‌ పెద్ద పెద్ద స్వదేశీ లేదా భారతీయ నామాలు పెట్టుకొని జనం ముందు ప్రదర్శిస్తున్నా ఆచరణలో ఎక్కువగా విదేశీ వైపు మొగ్గుచూపటం నగ సత్యం. ప్రపంచ దేశాల వారందరూ వచ్చి మన దేశంలో ఖాయిలా పడిన లేదా అమ్మకానికి పెట్టిన కంపెనీలను కొనుగోలు చేసేందుకు ఎలాంటి ఆంక్షలు విధించని, కొన్ని రంగాలలో నూటికి నూరు శాతం విదేశీ పెట్టుబడులకు తలుపులు తెరిచిన కేంద్ర ప్రభుత్వం చైనా పెట్టుబడుల విషయంలో తాజాగా కొన్ని నిబంధనలు విధించింది. అది ప్రపంచ వాణిజ్య సంస్ధ, స్వేచ్చా వాణిజ్య విధానాలకు వ్యతిరేకం అని చైనా విమర్శించింది. అయితే ఇదే మోడీ సర్కార్‌ చైనా నుంచి చేసుకుంటున్న దిగుమతులపై ఇంతకాలం ఇలాంటి ఆంక్షలు ఎందుకు విధించలేదు అన్న ప్రశ్నకు జవాబు లేదు. పెట్టుబడులు వద్దు-దిగుమతులు ముద్దు అని చెబుతారా ? పళ్లూడ గొట్టుకొనేందుకు అమెరికా రాయి హాయి నిస్తుంది, చైనా రాయి బాధనిస్తుంది అంటారా ?
మన దేశ ఆర్ధిక సంస్కరణల చరిత్రను చూసినపుడు అవి బాధ ఉపశమనానికి పైపూత ఔషధాల మాదిరిగా పని చేశాయి తప్ప చైనా మాదిరి మన దేశం ఒక ఆర్ధిక శక్తిగా ఎదగటానికి గానీ, సామాన్యుల జీవన స్ధితిగతులు మెరుగుపడేందుకు గానీ తోడ్పడలేదు. మన దేశమే కాదు అనేక లాటిన్‌ అమెరికా దేశాలు సంస్కరణల పేరుతో అనేక చర్యలు తీసుకున్నాయి ఏ ఒక్కటీ చైనా మాదిరి లబ్ది పొందలేదు. చైనా కమ్యూనిస్టు దేశం, అక్కడ ప్రజాస్వామ్యం లేదు, మనది ప్రజాస్వామ్యం అక్కడి మాదిరి మనకు కుదరదు అని ఎవరైనా చెప్పవచ్చు. అలాంటపుడు చైనాతో పోల్చుకోవటం ఎందుకు? త్వరలో చైనాను అధిగమిస్తామని ప్రగల్భాలు పలకటం ఎందుకు ? కమ్యూనిస్టు చైనా మాదిరిగాక పోతే మిగతా దేశాల మాదిరి పురోగమించకుండా అడ్డుకున్నదెవరు ? అత్యంత పేద దేశం, ఫ్రెంచ్‌, జపాన్‌, అమెరికన్‌ సామ్రాజ్యవాదుల దురాక్రమణ యుద్ధాలు సాగిన వియత్నాం సాధించిన మేరకు అయినా మనం ఎందుకు ఎదగలేకపోయాం.2018లో ప్రపంచ ఎగుమతుల్లో మన దేశం 323,056,409,000 డాలర్లతో 18వ స్ధానంలో ఉండగా వియత్నాం 290,395,445,000 డాలర్లతో 22వ స్ధానంలో ఉంది. తొమ్మిదిన్నర కోట్ల జనాభాగల ఆదేశం ఎక్కడ 140 కోట్లు గల మనం ఎక్కడ ?

Slowdown: Does the Narendra Modi govt even understand what is ...
మన దేశంలో అమలు జరిపిన ప్రతి దశ సంస్కరణల లక్ష్యం గురించి ఎన్ని తీపి కబుర్లు చెప్పినా, పర్యవసాన మన మార్కెట్‌ను విదేశీ కార్పొరేట్‌ సంస్ధలకు, ద్రవ్యపెట్టుబడికి మరింతగా తెరవటమే అన్నది చేదు నిజం. స్వాతంత్య్రానికి ముందు పరాయి బ్రిటీష్‌ పాలకులు మన దేశాన్ని ప్రత్యక్షంగా పరిపాలిస్తే విదేశీ కార్పొరేట్లు ఇప్పుడు మనలను పరోక్షంగా నడిపిస్తున్నారు. నాడు కాంగ్రెస్‌, కమ్యూనిస్టులు బ్రిటీష్‌ వారిని వ్యతిరేకిస్తే కాషాయ దళాలు వారికి సేవ చేస్తూ స్వాతంత్య్ర ఉద్యమానికి దూరంగా ఉన్నాయి. ఇప్పుడు కమ్యూనిస్టులు మాత్రమే విదేశీ పెత్తనం, కార్పొరేట్‌ దోపిడీని వ్యతిరేకిస్తుంటే కాంగ్రెస్‌, బిజెపి, ఆ ప్రాంతీయ పార్టీ ఈ ప్రాంతీయ పార్టీ అని లేకుండా అన్ని పార్టీలు విదేశీ, కార్పొరేట్‌ సేవలో తరిస్తున్నాయి. మన దేశ ఫెడరల్‌ వ్యవస్ధ మౌలిక లక్ష్యాలను దెబ్బతీసే విధంగా వివిధ రంగాలలో రెగ్యులేటరీ వ్యవస్ధల ఏర్పాటుకు ఆద్యుడు బిజెపి నేత వాజ్‌పేయి, ఆయన హయాంలోనే నాంది పలికారు. తాజాగా కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్‌ సంస్కరణల బిల్లు కూడా అలాంటిదే. నిత్యం ప్రభుత్వ కార్యాలయాలకు ఆ రంగు వేశారు, ఆర్‌టిసి బస్సులకు ఈ రంగు వేశారంటూ గుండెలు బాదుకుంటున్న, సమర్ధించుకుంటున్న తెలుగుదేశం-వైసిపిలు రాష్ట్ర అధికారాలను హరించి వేసే ఈ బిల్లు విషయంలో కేంద్రానికి భజన చేస్తున్నాయి. తెలుగుదేశం బహిరంగంగా ప్రకటిస్తే వైసిపి తన వైఖరిని ప్రకటించేందుకు భయపడుతోంది.
దేశమంతా కరోనా వైరస్‌ను ఎలా కట్టడి చేయాలా అన్న గొడవలో ఉంటే ఇక నరేంద్రమోడీ హయాంలో మరో దఫా సంస్కరణలకు ఇదే సరైన తరుణం అని కార్పొరేట్‌ మీడియా చెవిలో జోరిగలా తొలుస్తోంది. సినిమాల్లో క్లబ్‌డాన్సర్లు నృత్యం ప్రారంభం నుంచి ముగిసే వరకు ఒంటి మీది దుస్తులు ఒక్కొక్కటి తొలగిస్తూ జనాలకు మత్తు ఎక్కిస్తుంటారు. మన దేశంలో సంస్కరణల ద్వారా ఒక్కొక్క రంగాన్ని తెరుస్తూ అదే మాదిరి విదేశీ సంస్ధలకు కిక్కు ఎక్కిస్తున్నారు. ఒక మోజు తీరగానే కొంత కాలానికి మరో కొత్తదనం(సంస్కరణ) కావాలనే డిమాండు ముందుకు వస్తోంది. 1991 తరువాత ప్రతి సంస్కర్త పాలనాకాలం వైఫల్యంతోనే ముగిసింది. మరో ముఖ్య అంశం ఏమంటే 2014 ఎన్నికల్లో తప్ప అంతకు ముందు జరిగిన ప్రతి ఎన్నిక సంకీర్ణ కూటములకే తీర్పు ఇచ్చింది. ఏక పార్టీ ఆధిపత్యం లేదు. ఆ ప్రభుత్వాలకు నాయకత్వం వహించిన వారు తమ వైఫల్యాలకు దాన్నొక కారణంగా చెప్పుకున్నారు. కిచిడీ ప్రభుత్వాలంటూ రాజకీయంగా బిజెపి ఆ పరిస్ధితిని బాగా వాడుకుంది. ఈ నేపధ్యంలోనే నరేంద్రమోడీ నాయకత్వంలోని బిజెపికి అలాంటి సమస్యలు లేకుండా ఒకటికి రెండు సార్లు జనం తిరుగులేని మెజారిటీ ఇచ్చారు. మేము సంకీర్ణ ధర్మాన్ని పాటించాల్సి ఉంది, పూర్తి మెజారిటీ లేదు, ఉంటే మా తడాఖా ఏమిటో చూపే వారం అని చెప్పుకొనే అవకాశం లేకుండా చేశారు.
నిర్ణయాత్మక ప్రజాతీర్పే కాదు, నరేంద్రమోడీ నాయకత్వానికి గత ఆరు సంవత్సరాలలో అనేక సానుకూల అంశాలు ఉన్నాయి. అత్యధిక రాష్ట్రాలలో ఆ పార్టీ పాలనే సాగుతోంది. అయినా అనేక అంశాలలో గత రికార్డులను తలదన్నే వైఫల్యాలను ప్రభుత్వం ఎదుర్కొంటోంది. వాటికి తగిన చికిత్సబదులు వేరే మార్గాలను ఎంచుకొంటోంది. వాటికి మరో తరం సంస్కరణలు అని ముద్దు పేరు పెడుతోంది. 1991 సంస్కరణలతో ఎన్నో ఆశలు పెంచుకున్న నాటి యువతీ యువకులకు వరుస వైఫల్యాలకు కారణాలు తెలియటం లేదు. ఆ తరువాత పుట్టిన నేటి యువతరానికి అసలేం చేయాలో తోచటం లేదు.
బంగారాన్ని తాకట్టు పెట్టి విదేశీ చెల్లింపులు చేయాల్సిన దుస్ధితిలో ఆర్ధిక వ్యవస్ధ ఉన్న సమయంలో పివి నరసింహారావు 1991లో ఆర్ధిక సంస్కరణలకు తెరతీశారు. ఆ సమయంలో మన విదేశీ అప్పులో కేవలం ఏడుశాతమే విదేశీ మారక ద్రవ్య నిల్వలున్నాయి. నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన 2014లో 68.2శాతం ఉండగా 2018లో అవి గరిష్టంగా 80.2శాతానికి పెరిగాయి, ఈ ఏడాది జనవరి 11న రిజర్వు బ్యాంకు ప్రచురించిన సమాచారం ప్రకారం 77.8శాతం ఉన్నాయి. పివి నరసింహారావు సంస్కరణలు ప్రకటించిన తరువాత అవి 23శాతానికి పెరిగాయి. అందువలన ఇప్పుడు విదేశీ మారక ద్రవ్యం కోసమైతే సంస్కరణలు అవసరం లేదు. సంస్కరణలో భాగంగా పివి తన పాలనా కాలంలో రూపాయి విలువను గణనీయంగా తగ్గించారు లేదా పతనం అయ్యేట్లు చూశారు. 1991 మార్చినెలలో డాలరుకు రు.19.64 ఉన్నది కాస్తా 1996 నాటికి రూ.34.35కు పతనమైంది. గత ఆరు సంవత్సరాల మోడీ పాలనలో రూపాయి విలువ రూ.61.14 నుంచి ప్రస్తుతం 75కు పడిపోయిన విషయం తెలిసినదే. వాజ్‌పేయి హయాం నాటి రూపాయి విలువ స్ధాయికి అయినా ఎందుకు పెంచలేదో , ఇలా ఎందుకు జరిగిందో, దాని వలన మనకు జరిగిన లాభ నష్టాలేమిటో అధికారం పక్షం చెప్పదు, ప్రతిపక్షం లేదా ఆర్ధికవేత్తలు చెప్పేదానిని అంగీకరించకపోగా ఎదురుదాడి చేసే ఒక నిరంకుశ పరిస్ధితిలో ఉన్నాం. బేటీ బచావో అని చెప్పిన నరేంద్రమోడీ పాపాయి వంటి రూపాయిని బజారులో(మార్కెట్‌ శక్తులకు) వదలి పెట్టి మరింత బలహీనపరచకుండా చూసేందుకు ఏమి చేస్తున్నారు? ఆయనలో మూర్తీభవించినట్లు చెప్పే భారతీయత, దేశభక్తి ఏమైనట్లు ?
ఇక పివి నరసింహారావు తరువాత పదమూడు రోజుల పాలనను పక్కన పెడితే 1998 నుంచి 2004వరకు అధికారంలో ఉన్న బిజెపి నేత వాజ్‌పేయి కూడా అనేక సంస్కరణలకు తెరతీశారు. ఆయన పాలనలో ప్రత్యేకత ఏమంటే మన విదేశీ అప్పులో 36శాతంగా ఉన్న విదేశీ మారక ద్రవ్యం 103శాతానికి పెరిగింది, అంతే కాదు ఆయన పాలన చివరి రెండు సంవత్సరాలలో మన విదేశీ వాణిజ్యం జిడిపిలో 1.5శాతం మిగులులో ఉంది. స్వాతంత్య్రం తరువాత అలాంటి పరిస్ధితి ఆయన ఏలుబడికి ముందూ, తరువాత కూడా లేదు. అయితే రూపాయి విలువ వాజ్‌పేయి హయాంలో రూ.37.16 నుంచి 45.95కు దిగజారింది. ఆయన పదవి నుంచి దిగిపోయే ముందు పెట్రోలు, డీజిల్‌ మీద సబ్సిడీలను రద్దు చేశారు. మొత్తంగా తమ పాలనలో దేశం వెలిగిపోయింది అనే నినాదంతో ఎన్నికలకు పోయిన బిజెపి 2004లో ఘోరపరాజయం పాలైంది.

Decoding Slowdown: Dip in household savings, investment an ...
వాజ్‌పేయి నాయకత్వంలోని ఎన్‌డిఏ పరాజయాన్ని చూసిన తరువాత అధికారంలోకి వచ్చిన మన్మోహన్‌ సింగ్‌ సర్కార్‌ చమురు సబ్సిడీలను తిరిగి ప్రవేశ పెట్టింది. తొలి ఏడాది రూ.5,430 కోట్ల నుంచి పదేండ్లలో రూ.1,60,000 కోట్లకు పెంచారు. యుపిఏ పాలనా కాలంలో ఎరువుల వినియోగం గణనీయంగా పెరిగింది. సబ్సిడీ దాదాపు సున్నా నుంచి 1,38,000 కోట్ల రూపాయలకు పెరిగింది. వాజ్‌పేయి హయాంలో దిగుమతి చేసుకున్న ఎరువులు పదిశాతం ఉంటే పదేండ్లలో 60శాతానికి పెరగటం దీనికి ఒక కారణం. ఈ కాలంలో చమురు ధరలు, దానికి అనుగుణంగానే దిగుమతి చేసుకున్న ఎరువుల ధరలు, వాటికి సబ్సిడీ విపరీతంగా పెరిగింది. మోడీ హయాంలో దిగుమతి ఎరువుల శాతం 30కి అటూఇటూగా ఉంటోంది. విపరీతంగా పెరిగిన చమురు, ఎరువులు, బొగ్గు దిగుమతి ఖర్చు కారణంగా యుపిఏ పాలనా కాలంలో వాణిజ్యలోటు విపరీతంగా పెరిగింది. పదేండ్లలో జిడిపిలో 1.5శాతం మిగులు నుంచి నుంచి 5.1శాతం లోటుకు చేరింది. పర్యవసానంగా విదేశీ అప్పుకు 103శాతంగా ఉన్న విదేశీ మారక ద్రవ్యం 68శాతానికి తగ్గిపోయింది. ఈ కాలంలోనే రూపాయి విలువ రూ .45.95 నుంచి 60.09కి దిగజారింది.
యుపిఏ పాలనా కాలంలో రూపాయి విలువ పతనం గురించి నానా యాగీ చేసిన బిజెపి నాయకత్వం 2014లో అధికారానికి వచ్చిన తరువాత ఆ పతనాన్ని కొనసాగించి ప్రస్తుతం 75కు దిగజార్చింది. మోడీ తొలి మూడు సంవత్సరాల కాలంలో చమురు ధరలు గణనీయంగా తగ్గాయి. ఫలితంగా విదేశీ మారక నిల్వలు 80శాతానికి పెరిగాయి. ఈ ఏడాది మార్చి ఆరవ తేదీ నాటికి కరంట్‌ ఖాతా లోటు 0.2 ఒకశాతానికి తగ్గిపోయింది. ఇది మన విదేశీ చెల్లింపులకు ఢోకాలేని స్ధితిని తెలుపుతోంది. అయితే ఇదే పరిస్ధితి కొనసాగుతుందని చెప్పలేము. లోటు పెరిగే కొద్దీ రూపాయి విలువ మీద వత్తిడి పెంచుతుంది. ఈ ఏడాది ఆఖరుకు 1.6శాతానికి లోటు పెరగవచ్చని అంచనా వేశారు. అయితే అనూహ్యంగా చమురు, గ్యాస్‌ ధరలు రికార్డు స్ధాయిలో పడిపోవటంతో పరిస్ధితి ఎంతో మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇన్ని సానుకూల అంశాలు నరేంద్రమోడీ సర్కార్‌కు కలసి వచ్చినా అనేక రంగాలలో వైఫల్యం చెందటానికి కారణాలు ఏమిటి, దాన్నుంచి బయట పడేందుకు సర్కార్‌ తీసుకుంటున్న లేదా రాష్ట్రాలతో అమలు చేయిస్తున్న కార్మిక చట్టాల సవరణల వంటి సంస్కరణలు ఏమేరకు తోడ్పడతాయి అన్నది ప్రశ్న. కరోనా సంక్షోభం రాక ముందే అన్ని రంగాలలో తలెత్తిన సంక్షోభాన్ని ప్రభుత్వం దాచి పెట్టింది. మాంద్యం లేదు గానీ మందగమనం ఉందని సన్నాయి నొక్కులు నొక్కింది. గతంలోనే అనేక కార్మిక చట్టాలను నీరు గార్చటంలో బిజెపి పాలిత రాష్ట్రాలు ముందున్నాయి. ఇప్పుడు కేంద్రంలో కూడా వారే ఉన్నారు గనుక మరోసారి మిగిలిన వాటిని దెబ్బతీసేందుకు పూనుకున్నారు. ఓవర్‌ టైమ్‌ చేయించేందుకు వీలు కల్పించే పేరుతో పన్నెండు గంటల పని పద్దతిని అమలు చేయాలని అనేక చోట్ల ప్రతిపాదించారు. అంటే పని స్ధలాలకు దూరంగా ఉన్న కార్మికులు ఇండ్లకు వెళ్లేందుకు వీలు కలగదు, బ్రిటీష్‌ వారి కాలంలో మాదిరి పని చేసి ఇంటికి పోకుండా మరుసటి రోజు విధులకు వెళ్లేందుకు ఫ్యాక్టరీ గేట్ల ముందే విశ్రమించే రోజులు వచ్చినా ఆశ్చర్య ం లేదు.
1971లో ఇందిరా గాంధీ జనం దృష్టిలో దేవత దుర్గాదేవి. పాక్‌ సేనలను లొంగదీసుకొని బంగ్లాదేశ్‌ విముక్తికి తోడ్పడిన సమయంలో ఆమె తిరుగులేని నేత. బంగ్లా విముక్తికి కొద్ది నెలల ముందు గరీబీ హఠావో పేరుతో మధ్యంతర లోక్‌సభ ఎన్నికల్లో ఆమె తిరుగులేని విజయం సాధించారు. కానీ రెండు సంవత్సరాలు కూడా గడవక ముందే పరిస్ధితులు మారిపోయాయి. కాలేజీ ఫీజుల పెంపుదల, అధిక ధరలకు వ్యతిరేకంగా విద్యార్ధులు ప్రారంభించిన ఉద్యమాలు దేశ రాజకీయాలనే మార్చివేశాయి. బంగ్లా విముక్తి వంటి విజయం నరేంద్రమోడీ ఖాతాలో లేకపోయినా వివిధ కారణాలతో జనంలో పలుకుబడి కలిగి ఉన్నారు. సర్కార్‌ ఏలుబడిలో తీవ్ర సమస్యలున్నా అలాంటి ఉద్యమాలు లేవు.
1971లో పాక్‌ ఆర్మీతో తూర్పు పాకిస్ధాన్‌లో యుద్దం పదమూడు రోజులే జరిగినప్పటికీ అప్పటికే అంతంత మాత్రంగా ఉన్న మన ఆర్ధిక వ్యవస్ధకు భారంగా మారిందంటే అతిశయోక్తి కాదు.1971-72 మన జిడిపి వృద్ధి రేటు 0.9శాతమే. తరువాత రెండు సంవత్సరాలలో అనేక చోట్ల కరవు, ఆహార ధాన్యాల కొరత, అధిక ధరలు, బంగ్లా శరణార్దుల రక్షణ వంటి అంశాలు చుట్టుముట్టాయి. విదేశీ మారక ద్రవ్యం కరిగిపోయింది. పరిశ్రమల మూత, నిరుద్యోగం పెరుగుదల, 1973లో పశ్చిమాసియాలో తలెత్తిన సంక్షోభం చమురు సంక్షోభానికి దారితీసి ధరలు విపరీతంగా పెరిగాయి. ఈ ఏడాది కొద్ది వారాల్లోనే పీపా 60 నుంచి ఇరవై డాలర్లకు పడిపోతే నాడు కొద్ది రోజుల్లోనే మూడు నుంచి పన్నెండు డాలర్లకు పెరిగింది. మోడీకి ఎన్నో డాలర్లు మిగిలితే ఇందిరా గాంధీకి ఖర్చయ్యాయి. నాడు అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరిగితే జనానికి పెరిగాయి, నేడు గణనీయంగా తగ్గినా పెరిగాయి. మోడీకి యుద్ధం లేదు, చమురు బిల్లు గణనీయంగా తగ్గింది గానీ జిడిపి వృద్ధి రేటు దిగజారింది. ఇందిరా గాంధీ నాటి స్ధాయికి నిరుద్యోగం పెరిగింది. ద్రవ్యోల్బణం ఇరవైశాతం పైనే ఉంది, దానికి తగినట్లు ధరలు పెరిగాయి. ఇప్పుడు ఆ స్ధాయిలో ద్రవ్యోల్బణం లేదు. చమురు ధరలు తగ్గి ప్రభుత్వం మీద ఆర్ధిక వత్తిడి గణనీయంగా తగ్గినా చమురు పన్ను ఒక ఆదాయవనరుగా మార్చు కుంది.2014లో లీటరు పెట్రోలు మీద రూ.9.48 ఉంటే ప్రస్తుతం ఆ మొత్తాన్ని రూ.32.98కి మోడీ సర్కార్‌ పెంచింది. పెట్రోలు, డీజిల్‌ మీద ఒక లీటరుకు ఒక రూపాయి పన్ను పెంచితే కేంద్ర ప్రభుత్వానికి ఏటా పదమూడు- పద్నాలువేల కోట్ల రూపాయల అదనపు ఆదాయం వస్తుందని అంచనా అంటే అదనంగా సాధారణ రోజుల్లో ఏటా మూడు లక్షల కోట్ల రూపాయల అదనపు ఆదాయం సమకూరుతుంది. ఈ మొత్తం అదనం అయితే పెట్రోలు, డీజిల్‌ సబ్సిడీ ఏటా ఒక లక్ష కోట్ల రూపాయలు ఆదా అయింది. 2004-05 నుంచి 2018-19 వరకు పెట్రోలియం ఉత్పత్తుల మీద ఇచ్చిన సబ్సిడీ మొత్తం 10,99,234 కోట్ల రూపాయలు. అయితే 2014-15 నుంచి 2018-19 వరకు చూస్తే పెట్రోలియం ఉత్పత్తుల మీద వసూలు చేసిన పన్ను మొత్తం రూ. 11,90,777 కోట్లు అన్న పచ్చినిజం ఎంత మందికి తెలుసు ?
2014 మార్చి ఒకటవ తేదీన ముడిచమురు పీపా ధర 118 డాలర్లు ఉన్నపుడు వినియోగదారుడికి ఢిల్లీలో రూ.73.20 పెట్రోలు దొరికింది, ఈ ఏడాది మే 22న పీపాధర 33.25 డాలర్లకు పడిపోయినప్పటికీ పెట్రోలు ధర రూ.71.30 ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌ ధరలను బట్టి చమురు ధరల పెంపు తగ్గింపు అనే విధానాన్ని గత రెండునెలలుగా పక్కన పెట్టేశారు. ఇలాంటి పాలకులు సంస్కరణలతో బొందితో కైలాసానికి తీసుకుపోతామని చెపితే నమ్మటం ఎలా ?
ఒకవైపు జనం మీద బాదుడు, మరోవైపు చమురు బిల్లు తగ్గుదల, అనేక ఆర్ధిక సూచికలు గతంతో పోల్చితే బాగున్నప్పటికీ అభివృద్ధి జాడల్లేవు. ప్రపంచంలో అభివృద్దికి పలు నమూనాలు ఉన్నాయని కొందరు చెబుతున్నారు. దానితో ఏకీభవించటమా లేదా అన్నది పక్కన పెడదాం. ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీ గుజరాత్‌ నమూనాను అభివృద్ధి చేశారని గతంలో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. దాన్ని దేశమంతటా విస్తరించకుండా విదేశాలు, విదేశీ కార్పొరేట్ల కోసం వెంపర్లాడటం ఎందుకు అన్న ప్రశ్నకు జవాబు చెప్పేవారు లేరు.

Economic Crisis: View: India's economic crisis can bring about ...రిజర్వుబ్యాంకు శుక్రవారం నాడు మరోసారి వడ్డీ రేట్లను తగ్గించింది. ఈ తీరు చూస్తుంటే వడ్డీ సంగతి తరువాత ఒక రూపాయి అప్పు తీసుకుంటే మరో రూపాయి ఉచితం అనే రోజులు వస్తాయా అని పిస్తోంది. రుణాలు తీసుకొనే వారు లేరు, పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావటం లేదు. గత ఆరు సంవత్సరాలలో మోడీ సర్కార్‌ సాధించినట్లు చెప్పుకుంటున్న అభివృద్ధి ఎంత బలహీనమైనదో అర్ధం అవుతోంది. వర్తమాన ఆర్ధిక సంవత్సరంలో మన జిడిపి వృద్ధి రేటు మైనస్‌ 2.5 నుంచి మైనస్‌ 3.6శాతానికి దిగజార నుందని రేటింగ్‌ సంస్ధ గోల్డ్‌మాన్‌ శాచస్‌ తాజా అంచనాలో పేర్కొన్నది. లాక్‌డౌన్‌ పూర్తిగా ఎత్తివేసిన తరువాత ఈ అంచనా ఎలా మారుతుందో తెలియదు. 2020-21లో మన జిడిపి రేటు మైనస్‌ ఆరు, ప్లస్‌ ఒక శాతం మధ్య ఉండవచ్చని పదిహేనవ ఆర్ధిక సంఘం అధ్యక్షుడు ఎన్‌కె సింగ్‌ జోశ్యం చెప్పారు. ఇవన్నీ నిజానికి ఆందోళనకర వార్తలు. మరోవైపు చైనాలో వృద్ధి రేటు కనిష్టంగా 1.8శాతం ఉంటుందని అంచనాలు వెలువడతున్నప్పటికీ తాము ఒక లక్ష్యాన్ని నిర్దేశించే స్ధితిలో లేమని చైనా ప్రధాని శుక్రవారం నాడు ప్రకటించారు. గత ఆరు సంవత్సరాల కాలంలో బ్యాంకుల నిరర్దక ఆస్తులు విపరీతంగా పెరిగిపోవటం, ఎనిమిది లక్షల కోట్ల రూపాయల వరకు వాటిని రద్దు చేయటం చూశాము. వీటిలో కావాలని ఎగవేసిన వాటితో పాటు ఆర్ధిక వ్యవస్ధ దిగజారుడు కూడా కనిపిస్తోంది. మోడీ సర్కార్‌ గత ఏడాది కాలంలో క్రమంగా వడ్డీ రేట్లను ఎంత తగ్గించినా, తీసుకొనే వారు కనిపించకపోవటం పలుమార్లు కోత పెడుతోంది. మన మీద ఏ విదేశీ ఆంక్షలు లేవు, విదేశీ కంపెనీలు తమ లాభాలను స్వేచ్చగా తరలించుకుపోయేందుకు ద్వారాలను ఎప్పుడో తెరిచి ఉంచాము. అయినా పెట్టుబడులు రావటం లేదు.
మన రిజర్వుబ్యాంకు వడ్డీ రేట్లను తగ్గించుకుంటూ పోతే బ్యాంకులు డిపాజిట్లపై ఇచ్చే వడ్డీని తగ్గించాల్సి ఉంటుంది, అదే జరిగితే బ్యాంకుల్లో సొమ్ముదాచుకొనే వారు తగ్గిపోతారు. అది సరికొత్త సమస్యలకు దారి తీస్తుంది.దీన్ని ఆసరా చేసుకొని ద్రవ్యపెట్టుబడికి దారులు తెరిచేందుకు మోడీ సర్కార్‌ సరికొత్త వాదనలను ముందుకు తెచ్చింది. అదే విదేశాల్లో డాలర్‌ రుణాలను ప్రభుత్వమే తీసుకోవటం. ఇదొక ప్రమాదకరమైన క్రీడకు పూనుకోవటమే. రిజర్వుబ్యాంకు వడ్డీ రేట్లు తగ్గించినా ఆ మేరకు బ్యాంకులు తమ ఖాతాదార్లకు బదలాయించటం లేదన్నది ఒక వాస్తవం.స్ధానికంగా ఉన్న వడ్డీ రేట్లలో సగానికంటే తక్కువకే విదేశీ సంస్ధల నుంచి రుణాలు తీసుకుంటే స్వదేశంలో బాండ్లకు గిరాకీ తగ్గుతుంది. దీని వలన స్ధానిక వడ్డీ రేట్లు, భారం తగ్గుతుంది. ఇది జరిగితే బ్యాంకులు ఆ మేరకు తమ దగ్గర రుణాలు తీసుకున్న ఖాతాదారులకు భారాన్ని తగ్గిస్తాయి. ప్రయివేటు రంగానికి రుణ లభ్యత పెరుగుతుందని చెబుతున్నారు.
ఏ దేశానికైనా ప్రాధాన్యతలు ఉంటాయి. ఉట్టికి ఎగరలేని వారు స్వర్గానికి ఎగురుతామంటే ఎలా ? కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధానికి అవసరమైన పిపిఇ, మాస్కులను కూడా దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది.ఒక వైపు వలస కార్మికులు మాటిక్కెట్లను మా డబ్బులతో కొంటాం మా స్వంత ఊళ్లకు పంపండి మహాప్రభో అని వేడుకుంటున్నా పట్టించుకోని పాలకులు మన జనాన్ని చంద్రుడి మీదకు అంతరిక్షయానం చేయించేందుకు విదేశీ కంపెనీలతో ఏర్పాట్లు చేస్తున్నామని చెబుతుంటే నవ్వాలో ఏడవాలో అర్ధం కావటం లేదు. అమెరికాతో సహా అనేక పశ్చిమ దేశాలు మనకు సాంకేతిక పరిజ్ఞానం అందచేసేందుకు తిరస్కరించినపుడు సోవియట్‌ యూనియన్‌, తరువాత రష్యా సాయంతో మన ఇస్త్రో శాస్త్రవేత్తలు గణనీయమైన విజయాలు సాధించారు. ఇవాళ్లగాకపోతే రేపు ఇప్పుడు చౌకగా రాకెట్లను, ఉపగ్రహాలను ప్రయోగిస్తున్నట్లే అంతరిక్ష యానం కూడా చేయించగల సత్తా ఉంది. వారిని అవమానించే విధంగా ఇప్పుడు ప్రయివేటు విదేశీ కంపెనీలను రమ్మంటున్నారు. సంస్కరణల్లో భాగంగా మన అంతరిక్ష పరిశోధనా సంస్ధ సౌకర్యాలను వినియోగించుకొనేందుకు ప్రయివేటు కంపెనీలను అనుమతిస్తూ కేంద్రం నిర్ణయించింది. మన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన సౌకర్యాలను వినియోగించుకోవటం అంటే పుట్టా గుట్టా కొట్టి పెంచిన చెట్లు కాయలు కాసే తరుణంలో వాటికి నీరు పోసి పండ్లు కోసుకుపోయేందుకు వేరే వారికి అప్పగించటం తప్ప మరొకటి కాదు.

Where Are The Jobs? There Is A Real And Growing Unemployment Crisis In India
కరోనా సహాయచర్యలకు డబ్బులేదు , కావాలంటే అప్పులు ఇప్పిస్తామని చెబుతున్న ప్రభుత్వం ఈ సమయంలోనే ఢిల్లీలో కొత్త పార్లమెంట్‌ భవనం, సచివాలయం, ప్రధాని, ఉపరాష్ట్రపతి భవనాల నిర్మాణం పేరుతో ఇరవై వేల కోట్ల రూపాయలను తగలేయనుంది. ఇప్పుడు ఉన్నవాటితో వచ్చిన ఇబ్బంది ఏమిటి ? వర్షాకాలంలో మన ఇండ్ల మాదిరి అవేమీ కారటం లేదు, వేసవి వస్తే వాటిలో ఉండేవారికి వడదెబ్బ తగలటం లేదే ? న్యూఢిల్లీలో కొత్తగా పర్యావరణానికి, వారసత్వ నిర్మాణాలకు భంగం కలిగించే ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని అనేక మంది మొత్తుకుంటున్నా పట్టించుకోకుండా ముందుకు పోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.1970 దశకంలో ఇందిరా గాంధీ కుమారుడు సంజరు గాంధీకి ఏడాదికి యాభైవేల మారుతీ కార్ల తయారీకి ఇందిర ప్రభుత్వం లైసెన్సు ఇస్తే ఆర్దిక సంక్షోభ సమయంలో కార్లు అవసరమా అంటూ ఆ రోజు ధ్వజమెత్తిన ప్రతిపక్షాలలో నేటి బిజెపి పూర్వరూపం జనసంఫ్‌ు కూడా ఉంది. అదేమీ ప్రభుత్వ పెట్టుబడితో సంజయ గాంధీ స్వంతానికి పెట్టే కంపెనీ కాదు. అదే విమర్శ ఇప్పుడు బిజెపికి సైతం వర్తించదా ? ఆంధ్రప్రదేశ్‌లో సచివాలయం తరలింపును, తెలంగాణాలో నూతన సచివాలయ, అసెంబ్లీ భవనాల నిర్మాణాల ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్న బిజెపి న్యూఢిల్లీలో చేస్తున్నదేమిటి ? కరోనా పరీక్షలకు నిధులు కేటాయించని కేంద్రం ఆర్ధికంగా దిగజారిన స్ధితిలో ఒకవైపు జనాల మీద పన్నులు బాదుతూ అన్నివేల కోట్ల రూపాయలతో నూతన నిర్మాణాలు చేయటం అవసరమా ? రోమ్‌ తగులబడుతుంటే ఫిడేలు వాయించుకుంటూ కూర్చున్న నీరో చక్రవర్తి వైఖరి కనిపించటం లేదా !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

కరోనా సాయంలో ఇమ్రాన్‌ ఖాన్‌ కంటే మోడీ తక్కువ ఇచ్చారా ?

20 Wednesday May 2020

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, Greek, INDIA, INTERNATIONAL NEWS, Latin America, NATIONAL NEWS, Opinion, Political Parties, RUSSIA, USA

≈ Leave a comment

Tags

COVID- 19 pandemic package, imran khan, Narendra Modi, narendra modi vs imran khan, World Bank on covid-19 packages

Did India handle Covid crisis better or Pakistan? The answer lies ...

ఎం కోటేశ్వరరావు
ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించిన 20లక్షల కోట్ల కరోనా సంక్షోభ నివారణ పాకేజ్‌ గురించి ప్రస్తుతం దేశంలో మధనం జరుగుతోంది. ప్రభుత్వం, అధికారపార్టీ, దాని మిత్రపక్షాలు ఆ పధకం నుంచి అమృతం రానుందని చెబుతున్నాయి. అంతా ఒట్టిదే ఇదంతా జుమ్లా, పంచపాండవులంటే మంచం కోళ్ల మాదిరి మూడనుకొని రెండువేయబోయి ఒకటి వేసి దాన్ని కూడా కొట్టి వేసి సున్నా చుట్టినట్లుగా ఉంటుందని, అమృతం రాదు, వచ్చేది ఏమిటో తెలియదు, అది ప్రాణాలు నిలుపుకొనేందుకు సైతం పనికి రాదని ప్రతిపక్షాలు అంటున్నాయి. ఏం వస్తుందో, ఏం రాదో తెలియక జనాలు జుట్టుపీక్కుంటున్నారు. తమ స్వస్థలాలకు పోయేందుకు వలస కార్మికుల తెగింపు తీరు తెన్నులను చూస్తుంటే తమకు వచ్చేదేమీ లేదు, రాబోయే రోజులు ఎలా ఉంటాయో తెలియని నిరాశా, నిస్పృహలతో ఉన్నట్లు చెబుతున్నాయి.
పాకేజ్‌ ఎలాంటిదో ప్రతి అంశాన్ని చూడనవసరం లేదు. ఉదాహరణకు ఎంఎస్‌ఎంఇ( సూక్ష్మ,చిన్న, మధ్య తరహా పరిశ్రమలు)లకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్ధలు లాక్‌డౌన్‌ ప్రకటించే సమయానికి ఐదున్నరలక్షల కోట్ల రూపాయల మేరకు బకాయిలు ఉన్నాయి. వాటిని వెంటనే చెల్లిస్తే ఆ పరిశ్రమలకు అంతకంటే వరం మరొకటి లేదు. ఆ బకాయిలను చెల్లించకుండా ఆ సంస్ధలకు మూడులక్షల కోట్ల రూపాయల హామీ లేని రుణం ఇప్పిస్తామని కేంద్ర ప్రకటించటం హాస్యాస్పదం. ఐదున్నర లక్షల కోట్ల బకాయిలే చెల్లించలేని వారు ఇరవై లక్షల కోట్ల పాకేజ్‌ అమలు జరుపుతామని చెబుతుంటే తల్లికి కూడు పెట్టని వాడు పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తా అన్న సామెత గుర్తుకు వస్తోంది. అందువలన పనికిరాని పాకేజ్‌ను కాసేపు పక్కన పెడదాం. ప్రపంచబ్యాంకు నిపుణులు ప్రతివారం వివిధ దేశాలలో అమలు చేస్తున్న, ప్రకటిస్తున్న కరోనా సంక్షేమ పధకాల గురించి సమాచారాన్ని సేకరించి మదింపు చేస్తున్నారు. వ్యాధి విస్తరిస్తున్నకొద్దీ ప్రతికూల ప్రభావాల తీవ్రత పెరిగే కొద్దీ పలు కొత్త పధకాలను ప్రకటించటం, అమల్లో ఉన్నవాటిని మెరుగుపరుస్తున్నారు. పాలకుల చిత్తశుద్ధి, శ్రద్ద ఎలా ఉంటుందో గ్రహించటానికి కరోనా సంక్షోభం పెద్ద అవకాశం కల్పించిందంటే అతిశయోక్తి కాదు.
ప్రపంచ వ్యాపితంగా సంక్షేమ చర్యలన్నీ ఒకే విధంగా లేవు. నగదు బదిలీ, ఆహార పంపిణీ తక్షణ సహాయ చర్యలుగా ఉన్నాయి. విద్యుత్‌, నీటి బిల్లుల రద్దు, వాయిదా, రాయితీల మొదలు ఉద్దీపనలు, తక్షణ సాయాలు రకరకాలుగా అమలు జరుపుతున్నారు. తాజాగా మేనెల 15వరకు వచ్చిన సమాచారం మేరకు 181 దేశాల్లో 870 రకాల సంక్షేమ చర్యలను ప్రకటించి అమలు జరుపుతున్నారు. మొత్తంగా చూసినపుడు 30.3శాతం(264) నగదు బదిలీ పధకాలు ఉన్నాయి. ఇవి గణనీయంగా పెరిగాయి. వీటిలో 104 దేశాల్లో148 నగదు పధకాల కొత్తవి. నాలుగో వంతు పధకాల్లో ఇస్తున్న నగదును ఒకేసారి ఇస్తున్నారు. వస్తుసహాయ పధకాలు కూడా గణనీయంగా ఉన్నాయి. కొన్ని చోట్లా సామాజిక భద్రతా పధకాలకు వినియోగదారులు చెల్లించాల్సిన వాటాల మొత్తాన్ని ప్రభుత్వాలు రద్దు చేశాయి.
నగదేతర సంక్షేమ పధకాల్లో ప్రజాపనుల వంటివి 26.5శాతం, వస్తుపధకాలతో పోల్చితే నగదు పధకాలు రెట్టింపు ఉన్నాయి. నగదు అందచేత పధకాల సగటు వ్యవధి 3.1నెలలు, ఇది క్రమంగా పెరుగుతోంది. ఒక నెల నుంచి గరిష్టంగా ఆరునెలల వరకు ప్రకటించిన దేశాలు ఉన్నాయి. కొన్ని దేశాలలో వైరస్‌ సంక్షోభం ఎంతకాలం ఉంటే అంతకాలం అని కొన్ని దేశాలు ప్రకటించాయి. నగదు విషయానికి వస్తే మొత్తం మీద ఆయా దేశాలలోని తలసరి నెలవారీ జిడిపిలో సగటున 27శాతం ఉన్నాయి. ఉదాహరణకు మన దేశ తలసరి వార్షిక ఆదాయం 2020 అంచనాలో రు.1,76,976 ఉంది. దీన్ని నెలవారీ లెక్కిస్తే రూ.14,740 అవుతుంది. దీనిలో 27శాతం అంటే రూ.3,981. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మొత్తం రూ.1,500 కనుక ప్రపంచ సగటులో సగానికంటే తక్కువే ఉంది. ఈ మాత్రానికే బిజెపి నేతలు ఎంతో గొప్ప సాయం అందించినట్లు చెప్పుకుంటున్నారు. పాకిస్ధాన్‌ తలసరి జిడిపి 2019లో 1388 డాలర్లు. దీన్ని మన రూపాయల్లోకి మారిస్తే 1,05,065. దీన్ని నెలవారీ చూస్తే రూ.8,755. దీనికి గాను పాక్‌ ప్రభుత్వం ఇచ్చిన మొత్తం ఆరువేల రూపాయలు( పాక్‌ రూపాయల్లో పన్నెండువేలు), అంటే మనం ఎక్కడ ఉన్నాం ? పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ కంటే మన ప్రధాని మోడీ తక్కువ ఇచ్చినట్లే కదా ! ఎంత చెట్టుకు అంతగాలి, ఎంత మందికి అవకాశం ఉంటే అంత మందికి ఇస్తారు, ఇచ్చేది ఎంత అన్నది కూడా ముఖ్యమే కదా ! ప్రపంచ జిడిపిలో మన దేశాన్ని ఐదవ స్ధానంలోకి తీసుకుపోయామని చెప్పిన పెద్దలు సాయం విషయానికి వస్తే దరిద్రం తాండవించే దేశాల సరసన చేర్చారు. దీన్ని చూసి ఇంతకు ముందు ప్రశంసలు కురిపించిన వారు విస్తుపోతున్నారు. మనలను చూసి ప్రపంచం నేర్చుకొంటోందని చేస్తున్న ప్రచారం ఇలాంటి చర్యలతో గోవిందా ! మంగోలియాలో కరోనాకు ముందు పిల్లల నగదు సాయ ఆ దేశ కరెన్సీ ఎంవిటి పదివేలు ఉంటే కరోనా తరువాత లక్షకు పెంచారు. ఇలా అనేక దేశాలలో జరుగుతోంది. ఇలాంటి సాయం ప్రపంచం మొత్తం మీద 134శాతం పెరిగింది.మాల్డోవాలో కనిష్టంగా 43శాతం పెరిగితే గరిష్టంగా మంగోలియాలో 900శాతం ఉంది. మార్చినెల 27న నగదు బదిలీ పధకాలు 107 కాగా వస్తు సహా పధకాలు 22 ఉన్నాయి. అవి మే15నాటికి 264, 120కి పెరిగాయి.
కరోనానో నిమిత్తం లేకుండానే కొన్ని దేశాలలో నగదు బదిలీ పధకాలు ఉన్నాయి. ఇప్పుడు వాటికింద చెల్లించే మొత్తాలు 45దేశాలలో పెరిగాయి, 157దేశాలలో పధకాన్ని ఎక్కువ మందికి వర్తించేలా విస్తరించారు. కేవలం నగదు సాయాన్ని పొందుతున్న వారు ప్రపంచంలో 130 కోట్ల మంది అయితే సామాజిక పధకాల సాయం పొందుతున్నవారు 170 కోట్ల వరకు ఉన్నారు.
ప్రస్తుతం ప్రపంచంలో పంపిణీ చేసే నగదు మొత్తం పెంచటం ఒక తక్షణ సవాలుగా ముందుకు వస్తోంది. నూట పదకొండు దేశాలలో సాధారణంగా రెండు రకాలుగా ప్రభుత్వాలు స్పందిస్తున్నాయి. కరోనా సంక్షోభానికి ముందే తమ వద్ద ఉన్న జాబితాలకు కొత్త కుటుంబాలను జత చేయటం, ఆన్‌లైన్‌ కంప్యూటర్లు లేదా ఫోన్ల ద్వారా దరఖాస్తులను స్వీకరించటం, మూడవది ప్రభుత్వాలే అర్హులను గుర్తించటం.కొన్ని దేశాల్లో తమ వద్ద ఉన్న ఫోన్‌ నంబర్ల ద్వారా లబ్దిదార్లకు తెలియ చేస్తున్నారు.
నూటపదిహేడు దేశాలలో సామాజిక పధకాలకు లబ్దిదారులు చెల్లించాల్సిన వాటాల మొత్తాలను రద్దు చేయటం లేదా రాయితీలు ఇస్తున్నారు.సిక్‌లీవులకు చెల్లింపులు, నిరుద్యోగ భృతి వంటివి కూడా ఉన్నాయి. ప్రస్తుతానికి ప్రకటించిన మేరకు సామాజిక భద్రతా పధకాలకు తలసరి ఖర్చు సగటున 44 డాలర్లు ఉంది. ఒక డాలరు చొప్పున ఎనిమిది దేశాల్లో , నాలుగు డాలర్లు 12చోట్ల, 25 దేశాలలో 25 డాలర్లు, 99 డాలర్ల చొప్పున 17దేశాలలో ఖర్చుచేస్తున్నారు. సామాజిక బీమా పధకాలు మన దేశంలో ఎనిమిదిశాతం మందికి వర్తింప చేస్తుండగా పాకిస్ధాన్లో నాలుగుశాతం ఉంది.
కొన్ని ముఖ్యమైన దేశాల్లో అమలు జరుగుతున్న పధకాల వివరాలు సంక్షిప్తంగా ఇలా ఉన్నాయి. చెల్లింపులు, ఇతర సాయం బాధితులు, అవసరమైన వారికే అని గమనంలో ఉంచుకోవాలి. అయితే పెట్టుబడిదారీ దేశాలలో కార్మికవర్గం ఎక్కువగా ఉంటుంది కనుక బాధితులూ ఎక్కువగానే ఉంటారు. మన దేశంలో వృద్ధాప్య, వికలాంగుల, ఒంటరి మహిళల పెన్షన్లు ఇస్తున్నట్లుగానే అనేక దేశాలలో అలాంటి పధకాలతో పాటు పరిమితంగా నగదు బదిలీ కూడా కరోనాతో నిమిత్తం లేకుండానే జరుగుతోంది. అనేక ఐరోపా దేశాలలో నిరుద్యోగ భృతి, నిరుద్యోగ బీమా పరిహారం వంటి పధకాలు ఉన్నాయి. మన వంటి అనేక దేశాలలో అవి లేవు.
అల్జీరియాలో రంజాన్‌ సందర్భంగా పేదలకు 79 డాలర్ల విలువగల పదివేల అల్జీరియన్‌ దీనార్‌లు చెల్లిస్తారు. గర్భిణులకు, పిల్లలను చూసుకోవాల్సిన మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు, తాత్కాలిక ఉద్యోగులకు 50శాతం సిక్‌ లీవు చెల్లింపు.ఆస్ట్రేలియాలో ప్రభుత్వ పెన్షనర్లకు ఒకసారి చెల్లింపుగా 750 ఆస్ట్రేలియన్‌ డాలర్లు(455 అమెరికా డాలర్లు), ఉద్యోగార్ధులకు, యువ అలవెన్సుకింద పదిహేనురోజులకు ఒకసారి 550 డాలర్లు చెల్లిస్తారు. కొత్తగా వలస వచ్చిన అర్హతగల వారికి వేచి ఉండే వ్యవధిని రద్దు చేసి అలవెన్సు ఇస్తున్నారు.తాస్‌మనానియన్‌ రాష్ట్రంలో అల్పాదాయం గల వారు స్వయంగా క్వారంటైన్‌లో ఉండేట్లయితే వ్యక్తికి 250, కుటుంబానికి1000 డాలర్లు అత్యవసర సాయంగా ఇస్తారు.
బంగ్లాదేశ్‌లో పేదలకు విక్రయించే బియ్యం రేటును కిలో 30టాకాల నుంచి ఐదుకు తగ్గించారు. బెల్జియంలో నిరుద్యోగ భృతి, అలవెన్సులను 60 నుంచి 70శాతం వరకు పెంచారు, గరిష్ట పరిమితిని నెలకు 2,754యూరోలుగా నిర్ణయించారు, మూడునెలల పాటు ఇస్తారు.కార్మికులకు నిరుద్యోగ భృతితో పాటు రోజుకు 5.63యూరోలు అదనంగా చెల్లిస్తారు. స్వయం ఉపాధి పొందుతున్న వారికి కరోనా కారణంగా ఏడాది పాటు వారు తమ సామాజిక బీమాకు చెల్లించాల్సిన మొత్తాన్ని రద్దు చేశారు. వారికి ఇచ్చే సాయంలో ఎలాంటి కోత ఉండదు. బ్రెజిల్‌లో నిరుద్యోగులైన అసంఘటిత రంగ కార్మికులైన పెద్దలకు మూడు నెలల పాటు 115 డాలర్లు లేదా కనీసవేతనంలో 60శాతం వంతున చెల్లిస్తారు.అయితే కుటుంబానికి గరిష్టంగా ఇద్దరికి మాత్రమే వర్తిస్తుంది.వంటరి తల్లులకు 230 డాలర్లు ఇస్తారు.
కెనడాలో ఉపాధి హామీ బీమా వర్తించని వారికి నాలుగు నెలల పాటు రెండువేల డాలర్ల చొప్పున చెల్లిస్తారు.బ్రిటీష్‌ కొలంబియాలో కరోనా కారణంగా ఆదాయం కోల్పోయిన వారికి ఒకసారిగా వెయ్యి కెనడియన్‌ డాలర్లు చెల్లిస్తారు.అద్దెలకు ఉండేవారికి ఐదు వందల డాలర్లు ఇస్తారు, విద్యార్ధుల రుణాల వసూలును ఆరునెలలు వాయిదా వేశారు. ఛాద్‌లో ఆరునెలలు నీటి పన్ను, మూడు నెలలు విద్యుత్‌ బిల్లులను రద్దు చేశారు. చిలీలో మొదటి అసంఘటిత రంగ కార్మికులకు మొదటి నెల 340 డాలర్లు తరువాత దానిలో 85శాతం, మూడవ నెలలో 65శాతం నగదు చెల్లిస్తారు.
చైనాలోని ఊహాన్‌ నగరంలో వలస వచ్చిన కార్మికులకు గుండుగుత్తగా ఐదువందల యువాన్లు(మన రూపాయల్లో నాలుగువేలకు సమానం) ఫిబ్రవరి నుంచి జూన్‌ వరకు చైనాలో సామాజిక భద్రతా పధకాల కింద నమోదైన కంపెనీలన్నింటిలో హుబెరు రాష్ట్రంలో ప్రతి కంపెనీ యజమానులు చెల్లించాల్సిన వాటాను రద్దు చేశారు. మిగతా చోట్ల ఎంఎస్‌ఎంఇలకు రద్దు చేశారు. ఇదిగాక నిరుద్యోగ బీమా పధకం నుంచి వేతనాలు, సబ్సిడీలను చెల్లిస్తారు.ఈ మొత్తం అన్ని రాష్ట్రాలలో ఒకే విధంగా లేదు. ఉదాహరణకు నాన్‌జింగ్‌లో రోజుకు ఒక కార్మికుడికి వంద యువాన్లు చెల్లిస్తారు. దారిద్య్ర నిర్మూలన పధకంగా చైనాలో కనీస జీవన ప్రమాణ హామీ పధకం అమల్లో ఉంది. దీన్ని దిబావో అనిపిలుస్తారు. దీని కింద ఒక వ్యక్తికి పట్టణాల్లో ఐదు వందలు,గ్రామాల్లో మూడు వందల యువాన్లు కనీసంగా చెల్లిస్తారు. ఇది కూడా అన్ని చోట్లా ఒకే విధంగా లేదు, ఎక్కువ మొత్తాలను చెల్లించే ప్రాంతాలు కూడా ఉన్నాయి. షెంజన్‌లో స్ధానిక దిబావో మొత్తాలకు రెండు నుంచి 18 రెట్లు పొందేవారు కూడా ఉన్నారు.
క్యూబాలో వృద్దులు,వ్యాధి గ్రస్తులు, కరోనా వైరస్‌ బాధితులై ఇంటి దగ్గరే ఉండిపోయిన వారికి మొదటి నెలలో వందశాతం వేతనం, రెండవ నెలలో 60శాతం చెల్లిస్తారు.డెన్మార్క్‌లో లేఆఫ్‌ ప్రకటించని పక్షంలో ప్రభుత్వం మూడు నెలలపాటు 75శాతం వేతనాలు చెల్లిస్తుంది.ఈ మొత్తం గరిష్టంగా 3,418 అమెరికన్‌ డాలర్లు ఉంటుంది.ఈజిప్టులో అసంఘటితరంగ కార్మికులకు నెలకు 500 ఈజిప్టు పౌండ్లు లేదా మన రూపాయల్లో 2400 మూడు నెలల పాటు చెల్లిస్తారు.
అమెరికాలో నాలుగు నెలల పాటు పెద్ద వారికి 1200, పిల్లలకు 500 డాలర్ల చొప్పున చెల్లిస్తారు. పాకిస్తాన్లో ఒక విడతగా పన్నెండువేల రూపాయలు, మన కరెన్సీలో ఆరువేలు చెల్లిస్తారు. జర్మనీలో కళాకారులు, నర్సుల వంటి వారికి మూడునెలల్లో 15వేల యూరోలు చెల్లిస్తారు. ఆదాయం కోల్పోయిన వారి పిల్లలకు మార్చినెల నుంచి సెప్టెంబరు వరకు 185యూరోలు చెల్లిస్తారు.వ్యాధి సోకిన వారికి ఆరువారాల పాటు సిక్‌ లీవు కింద పూర్తి వేతనం ఇస్తారు. సామాజిక బీమా పధకాలకు యజమానులు చెల్లించాల్సిన మొత్తాన్ని ప్రభుత్వమే ఇస్తుంది. యజమానులు లేఆఫ్‌ చేయకుండా ఉన్న కంపెనీలలో పన్నెండు నెలల పాటు 60శాతం వేతనాలు చెల్లించవచ్చు, పిల్లలున్న కార్మికులకు 67శాతం ఇవ్వాల్సి ఉంటుంది. ఫ్రాన్స్‌లో అత్యవసర సాయం కింద కుటుంబానికి 150, పిల్లలకు వంద యూరోల చొప్పున చెల్లిస్తారు. స్వయం ఉపాధి పొందేవారికి 1500, విధుల్లో ఉన్న ఉద్యోగులకు వెయ్యి యూరోల బోనస్‌ చెల్లిస్తారు. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన వారికి మొత్తం వేతనంలో 70శాతం చెల్లిస్తారు, కనీసం వేతనం, అంతకంటే తక్కువ పొందేవారికి నూటికి నూరుశాతం చెల్లిస్తారు.

UN general assembly session: Imran Khan lashes out at Prime ...

దక్షిణ కొరియాలో నిరుద్యోగ భృతి అక్కడి కరెన్సీలో నెలకు రెండు నుంచి ఐదు లక్షలకు పెంచారు. రష్యాలో గర్భవతులకు నెలకు 63 డాలర్లు, నిరుద్యోగులకు మూడు నెలల పాటు 38డాలర్లు చెల్లిస్తారు. జపాన్‌లో ప్రతి పౌరుడికి 930 డాలర్లు ఇస్తున్నారు. ఇరాన్‌లో నాలుగు విడతలుగా 400 డాలర్లు, ఇరాక్‌లో ప్రతి ఒక్కరికి 253 డాలర్లు,హాంకాంగ్‌లో ఒక విడతగా 1,280 డాలర్లు, ఒక నెల సామాజిక భద్రత పధకం అలవెన్సు అదనం. గ్రీసులో మూతబడిన సంస్ధల సిబ్బందికి 800 యూరోలు చెల్లిస్తున్నారు. పాకిస్ధాన్‌లో ఒక విడతగా పన్నెండు వేల రూపాయలను ప్రకటించారు. ఇది మన ఆరువేల రూపాయలకు సమానం. ఈ నేపధ్యంలో ప్రతి దేశంలోనూ అందించాల్సిన సాయం, కోల్పోయిన ఉపాధి పునరుద్దరణ గురించి పెద్ద చర్చ జరుగుతోంది. ఏ దేశంలో అయినా అందరికీ ఇవ్వాల్సిన అవసరమూ లేదు, అవకాశమూ ఉండదు. కొందరికి అయినా ఇచ్చే మొత్తం ఎంత అన్నది చూసినపుడు మనం ఇస్తున్నది చాలా తక్కువ. ఎంత ఇవ్వాలనే అంశంపై మన దేశంలో చర్చకు పాలకులు తావివ్వటం లేదు. చర్చ జరిగితే బండారం బయట పడుతుంది కనుక పాచిపోయినా సరే మూసి పెట్టటానికే సిద్దపడుతున్నారు.

కార్పొరేట్లకు కట్టబెట్టే సమయంలో ప్రదర్శించే ఉత్సాహం, ఉదారత, ఉద్దీపనలు సామాన్యుల విషయంలో కనిపించటం లేదు. ఏటా కనీసం ఐదు లక్షల కోట్ల రూపాయల మేర కార్పొరేట్లకు, ఇతర ధనికులకు రాయితీలు ఇస్తూ ఖజానాకు రావాల్సిన అంటే జనానికి ఖర్చు చేయాల్సిన మొత్తాన్ని వదులుకుంటున్నారు. వేల కోట్ల రుణాలు తీసుకొని కావాలని ఎగవేసిన బడా సంస్ధలకు ఎనిమిది లక్షల కోట్ల రూపాయల రుణాలను రద్దు మన కళ్ల ముందే జరిగింది. అందువలన ఇలాంటి సమయాల్లో చప్పట్లు, దీపాలు వెలిగించటం, స్వదేశీ వంటి కబుర్లు కాదు, కార్యాచరణ కావాలని జనం కోరుకుంటున్నారు. సుభాషితాలు పెరిగే కొద్దీ చిరాకు నిరసనగా మారుతోంది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

సంక్షోభ సమయాల్లోనే సంస్కరణలు- ఇందిరా గాంధీ హయాంలో ఏం జరిగింది !

19 Tuesday May 2020

Posted by raomk in CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, USA

≈ Leave a comment

Tags

economic reforms during crisis, Indian Rupee devalue, Indira gandhi, Indira Gandhi regime, Narendra Modi, what happened in indira gandhi regime, World Bank

Did Indira Gandhi impose Emergency to escape economic crisis ...

ఎం కోటేశ్వరరావు
జిడిపిలో పదిశాతం విలువగల 20లక్షల కోట్ల రూపాయల పాకేజి ప్రకటించినప్పటికీ నరేంద్రమోడీ ఆ సంతోషాన్ని స్వయంగా మీడియాతో ఎందుకు పంచుకోలేదు అని ఒక మీడియా మిత్రుడికి సందేహం వచ్చింది. నరేంద్రమోడీకి ప్రచారం కండూతి లేదు, అది ఒక బాధ్యతగా చేశారు కనుక మీడియాలో డబ్బాకొట్టుకోవాలనుకో లేదు, మోడీగారీ నమ్రతకు అది చిహ్నం అని మరొకరు వ్యాఖ్యానించారు. యావత్‌ జాతికి కష్ట కాలం రావటం దేశంలో ఇదే ప్రధమం, అలాంటపుడు కూడా జర్నలిస్టులతో మాటా మంతీ కలపలేదంటే ఇంకెప్పుడు మాట్లాడతారు ? అని మరొకరి వ్యాఖ్య. ఇలా పలు అంశాలపై సాగిన సంభాషణల్లో కరోనా సమయంలో దాన్ని ఎదుర్కొనేందుకు అవసరమైన చర్యలకు బదులు ఆ ముసుగులో ” సంస్కరణ ”లకు ఎందుకు తెరలేపారు అన్న ప్రశ్న వచ్చింది. నిజమే కదా !
మేడంటే మేడా కాదు, గూడంటే గూడూ కాదు అన్నట్లుగా ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించిన 20లక్షల కోట్ల రూపాయల కరోనా పాకేజి ఒక పాకేజి కాదు, మోడీ గారి ఆత్మ అమిత్‌ షా మాటల్లో చెప్పాలంటే జుమ్లా ! అవసరానికేదో చెబుతాం అవన్నీ నిజమనుకుంటే ఎలా అన్నది జుమ్లా అనే పదానికి అర్ధం. తిరస్కరించిన దరఖాస్తులను కూడా పరిష్కరించిన లెక్కల్లో చూపే రోజులివి. పాకేజ్‌లో బడ్జెట్‌ పధకాలతో నిమిత్తం లేకుండా అదనంగా ఖర్చు చేసేది ఎంత? మామూలుగా లేదా అదనంగా ఇవ్వదలచిన అప్పుల మొత్తాన్ని ఇరవై లక్షల కోట్లలో చూపారా ? ఒక రోజులోనో రెండు రోజుల్లోనో మరచిపోవాల్సిన సమస్య కాదు గనుక ఇలాంటి వాటి మంచి చెడ్డల గురించి మరో సందర్భంలో చూద్ధాం.
కనీవినీ ఎరుగని సంక్షోభ సమయంలో వివాదాస్పద సంస్కరణలు ప్రకటించటం ఇదే మొదటిసారా ? మన దేశంలో సంస్కరణల పేరుతో తీసుకున్న దేశ, ప్రజావ్యతిరేక చర్యలన్నీ సంక్షోభ సమయాల్లో తీసుకున్నవే అన్నది నమ్మలేని నిజం. అదే విధంగా చేదు సంస్కరణలు చేపట్టిన ప్రతిసారీ జనం చేత వాటిని మింగించటానికి స్వదేశీ, స్వావలంబన, స్వయం సమృద్ధి నినాదాల పంచదార పూత పూయటాన్ని కూడా చూడవచ్చు. ఏదో ఒకటి చేసి ఇబ్బందుల నుంచి గట్టెక్కించాలని జనం భావిస్తారు, పాలకులు తీసుకొనే చర్యల మంచి చెడ్డలను విశ్లేషించే సంపూర్ణ పరిజ్ఞానం ఉండదు కనుక ఆ ముసుగులో తమ అజెండాను అమలు జరుపుతారు. ఇప్పటి వరకూ జరిగిన సంస్కరణల చరిత్రను చూస్తే ఆర్భాటంగా లేదా మోసపూరితం లేదా బలవంతంగా అమలు జరిపిన పాలకులందరూ తరువాత చరిత్ర చెత్తబుట్టలోకి జారిన వారే ! అయితే ప్రధాని నరేంద్రమోడీ చేస్తున్నది సంస్కరణల కిందకే వస్తుందా ? అవును అంటే ఏమౌతారు ? కాకపోతే మరేమిటి, ఏం జరుగుతుంది? అన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్న ! ఇప్పటికైతే, తినబోతూ రుచి అడగటం ఎందుకు అన్నదే సమాధానం !
దేశంలో కరోనా మహమ్మారి విస్తరణ ప్రారంభం అయినప్పటి నుంచి ముఖ్యంగా జాతీయ మీడియాను పరిశీలిస్తే మరిన్ని సంస్కరణలకు ఇదే మంచి తరుణం అని అనేక మంది మంచి చెడ్డల విశ్లేషణల పేరుతో సలహాలు ఇచ్చారు. నరేంద్రమోడీ 1.0లో ఘోరవైఫల్యం కారణంగా ఆర్ధిక వ్యవస్ధ అభివృద్ధి రేటు ఐదు శాతం లోపుకు పడిపోయింది. దీనికి కరోనా కూడా తోడు కావటంతో సున్నా లేదా మైనస్‌ కావచ్చని కూడా అంచనాలు వెలువడుతున్నాయి. ఆ సూచనలు లోక్‌సభ ఎన్నికలకు ముందే కనిపించినా దాచిన మోడీ మరింత మెజారిటీతో అధికారానికి వచ్చిన దగ్గర నుంచి 2.0 ” సంస్కరణ”ల గురించి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. కరోనా వైరస్‌ రూపంలో అలాంటి అవకాశం వస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. గత ఏడాది కాలంలో వడ్డీరేట్లు తగ్గించినప్పటికీ పారిశ్రామిక, వాణిజ్య రంగాలలో వైఫల్యం తప్ప పురోగతి లేదు. గత కొన్ని సంవత్సరాలుగా విదేశీ వస్తువులకే కాదు, విదేశీ నిధుల ప్రవాహానికి కూడా మన ద్రవ్య మార్కెట్‌ను తెరవాలని ద్రవ్య పెట్టుబడిదారులు డిమాండ్‌ చేస్తున్నారు.
దేశం ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉంది కనుక బయటపడేందుకు ఏదో ఒకటి చేయాలని జనం భావిస్తున్నారు కనుక తమకు ఇదే మంచి అవకాశమని కేంద్ర పాలకులు గత ఏడాదే గ్రహించారు. ప్రభుత్వం తీసుకొనే అప్పులను బాండ్ల పేరుతో వేలం వేస్తారు. కేంద్ర ప్రభుత్వం జారీచేసే బాండ్లను విదేశీ సంస్ధలు కొనుగోలు చేసేందుకు అనుమతించాలని తొలిసారిగా మోడీ సర్కార్‌ నిర్ణయించింది. ఈ ఆర్ధిక సంవత్సరంలో 10బిలియన్‌ డాలర్ల వరకు డాలర్‌ రుణాలు తీసుకుంటారని వార్తలు వచ్చాయి. ఇది గత విధానాల నుంచి వైదొలగటమే. లాటిన్‌ అమెరికాలోని అనేక దేశాలు ఇలాంటి అప్పులు తీసుకొని తిప్పలను కొని తెచ్చుకున్నాయని తెలిసీ ఇందుకు పూనుకున్నారు. ప్రభుత్వాలకు అప్పులు కావాలంటే మన దేశంలోని వారి నుంచే తీసుకోవచ్చు. అయితే అమెరికా, జపాన్‌, ఐరోపా ధనిక దేశాలతో పోల్చితే వడ్డీ రేట్లు మన దేశంలో ఎక్కువ కనుక అప్పు ఖరీదు పెరుగుతుంది. దీన్ని సాకుగా చూపుతూ విదేశీ సంస్ధలకు తలుపులు తెరిచారు.
దీన్ని సమర్ధించుకొనేందుకు చేస్తున్న వాదనల సారాంశం ఇలా ఉంది. స్ధానికంగా ఉన్న వడ్డీ రేట్లలో సగానికంటే తక్కువకే విదేశీ సంస్ధల నుంచి రుణాలు తీసుకుంటే స్వదేశంలో బాండ్లకు గిరాకీ తగ్గుతుంది. దీని వలన స్ధానిక వడ్డీ రేట్లు, భారం తగ్గుతుంది. ఇది జరిగితే బ్యాంకులు ఆ మేరకు తమ దగ్గర రుణాలు తీసుకున్న ఖాతాదారులకు భారాన్ని తగ్గిస్తాయి. ప్రయివేటు రంగానికి రుణ లభ్యత పెరుగుతుంది. ప్రస్తుతం మన విదేశీ అప్పు జిడిపిలో ఐదోవంతు మాత్రమే ఉంది, అందువలన అదనంగా అప్పులు తీసుకున్నందున ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మధ్యతరగతి జనాలకు ఈ వాదన వీనుల విందుగా ఉంటుంది. ఇది నాణానికి ఒకవైపు మాత్రమే. డాలర్‌ అప్పులన్నీ డాలర్లలోనే చెల్లించాలి తప్ప మన రూపాయల్లో చెల్లిస్తామంటే కుదరదు.
యుపిఏ హయాంలో మన దేశంలోని పెద్ద కార్పొరేట్‌ కంపెనీలు చౌకగా వస్తున్నాయి కదా అని విదేశాల నుంచి డాలర్‌ రుణాలు పెద్ద మొత్తంలో తీసుకున్నాయి. అవి అనుకున్నదొకటి జరిగింది మరొకటి. అందరికీ తెలిసిన అనిల్‌ అంబానీ, జివికె, లాంకో వంటి సంస్ధలు విద్యుత్‌ ఉత్పత్తి కంపెనీల పేరుతో అలాంటి అప్పులు తీసుకొని ఒక విడత వడ్డీ కూడా చెల్లించలేక దివాలా తీసిన ఉదంతాన్ని ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకోవాలి. లాంకో కంపెనీ వడ్డీ రేటు 130శాతం, జివికేకు 55శాతం వరకు చేరింది. ఈ కంపెనీలన్నీ రూపాయి మారకపు విలువ పతనంతో మరింతగా అప్పులపాలయ్యాయి. రూపాయి రుణం తీసుకుంటే ప్రతి ఏటా లేదా చివరిలో వడ్డీ, అసలు కలిపి ఇచ్చినా రూపాయల్లోనే ఇవ్వాల్సి ఉంటుంది, కానీ డాలర్ల వ్యహారం అలా కాదు. ఉదాహరణకు ఇలాంటి కంపెనీలు 2007-08లోవంద డాలర్లు అప్పులు తీసుకున్నాయనుకుందాం. ఆ ఏడాది రూపాయి సగటు మారకపు విలువ 40.24 కనుక వాటికి 4,024 రూపాయలు పెట్టుబడిగా అందుబాటులోకి వచ్చాయి. ఆ వందడాలర్లను 2013-14లో చెల్లించాల్సి ఉందనుకుంటే తీసుకున్న రోజు నుంచి తీర్చే వరకు ఏటా వడ్డీ, చివరిలో అసలు లేదా మొత్తం ఒకేసారి చెల్లించాలి అన్నది ఒప్పందం అనుకుందాం.ఆ ఏడాదిలో రూపాయి విలువ 60.50కి పడిపోయింది. అంటే తిరిగి డాలర్లలో చెల్లించాలి అంటే ఆ రోజు మార్కెట్లో వాటిని కొనుగోలు చేయాలంటే రూ.6,050 చెల్లిస్తే తప్ప వంద డాలర్లు రావు. అంటే అప్పు తీసుకున్నవారికి తడిచి మోపెడు అయింది. అప్పుతీసుకున్న నాటితో పోలిస్తే తరువాత ఆర్ధిక వ్యవస్ధ దిగజారటంతో అసలుకే మోసం వచ్చింది. అందుకే దివాలాతీసి రంగం నుంచి అంతర్ధానమయ్యాయి. అదే ప్రభుత్వాలు అలాంటి అప్పులు తీసుకుంటే అంతర్ధానం అయ్యే అవకాశం లేదు. దేశం మొత్తాన్ని విదేశీ కంపెనీలకు తాకట్టు పెట్టటం, తెగనమ్మటం తప్ప మరొక మార్గం లేదు. గతంలో ఈ కంపెనీలకు ఏం జరిగిందో తెలిసి కూడ అలాంటి ప్రమాదకర విధానాలను ఇప్పుడు నరేంద్రమోడీ అమలు జరుపుతున్నారు.
విదేశీ డాలర్‌ రుణాలను తీసుకున్నపుడు ఉన్న మారకం రేటు కంటే మన రూపాయి బలపడిందనుకోండి అప్పుడు మనకు లాభం. మన రూపాయి చరిత్రను చూస్తే పతనం తప్ప బలపడిన దాఖలా లేదు. బిజెపి, ఇతర పార్టీల చేత అసమర్ధ ప్రధాని అని ముద్రవేయించుకున్న మన్మోహన్‌ సింగ్‌ హయాంలో రూపాయి విలువ 44.93 నుంచి 60.50కి దిగజారింది. అత్యంత సమర్దుడని పొగిడించుకున్న నరేంద్ర మోడీ హయాంలో అక్కడి నుంచి ఇప్పుడు 75కు పతనమైన విషయం తెలిసిందే. ఇదింకా ఎంతకు దిగజారనుందో తెలియదు. గత ఆరు సంవత్సరాల పోకడ చూసినపుడు రూపాయి పతనాన్ని అరికట్టే సామర్ధ్యం లేదా చిత్తశుద్ది మోడీ సర్కార్‌కు లేదని తేలిపోయింది.ఎగుమతులను పెంచే పేరుతో రూపాయి పతనాన్ని ప్రోత్సహిస్తున్నారు.
చైనా కూడా సంస్కరణలు చేపట్టింది, దాని వలన అది ఎంతో లబ్దిపొందింది. మనమూ చేపట్టాం వాటితో మరింత దిగజారిపోతున్నాము. అందుకే వాటిని ఘనంగా చెప్పుకున్నవారూ, గట్టిగా సమర్ధించిన వారూ చరిత్రలో ప్రజావ్యతిరేకులుగా మిగిలిపోయారు. నరేంద్రమోడీ సర్కార్‌ కరోనా సంక్షోభ సమయంలో ప్రకటించిన సంస్కరణలు దేశాన్ని మరింతగా విదేశీ కార్పొరేట్లకు అప్పగించేవే తప్ప మన జనానికి ప్రయోజనకరం కాదన్నది స్పష్టం. మన సంస్కరణలన్నీ సంక్షోభ సమయంలో చేపట్టినవే. అవసరానికి ఎవరి దగ్గరకైనా వెళ్లినపుడు వారి షరతులకు మనం తలొగ్గాలి తప్ప మన మాట చెల్లదు. మన సంస్కరణలకూ చైనా సంస్కరణలకూ ఒక మౌలిక తేదా ఉంది. చైనాలో ప్రభుత్వరంగ ఆధిపత్యంలో ప్రయివేటు రంగాన్ని అనుమతించారు. ఇక్కడ ప్రభుత్వరంగాన్ని దెబ్బతీసి, ప్రయివేటీకరణ చేస్తూ విదేశీ, స్వదేశీ ప్రయివేటు పెట్టుబడులకు పెద్ద పీట వేస్తున్నారు. చైనాలో ప్రభుత్వరంగంలో వచ్చే లాభాలను తిరిగి పెట్టుబడులుగా పెడుతున్నారు. మన దగ్గర ప్రభుత్వరంగ సంస్ధలను తెగనమ్మి లోటు బడ్జెట్‌ను పూడ్చుకొనేందుకు, ప్రయివేటురంగానికి సబ్సిడీలు, ఇతర రూపాల్లో కట్టబెట్టేందుకు పూనుకున్నారు.
గతంలో మన పాలకులు చేపట్టిన సంస్కరణలన్నీ విదేశీ చెల్లింపుల అంశాలతో సహా వివిధ సంక్షోభాలతో ముడిపడి ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గర ఒక ఏడాదికి అటూ ఇటూ సరిపడా నిల్వలున్నా దేశం ఆర్ధిక సంక్షోభంలోకి కూరుకుపోతోంది. కారణం ఆశించిన స్ధాయిలో ఎగుమతులు పెరగలేదు, దిగుమతులతో వాణిజ్య లోటు పెరుగుతోంది. దేశీయంగా మన జనాల వినిమయ ఖర్చు తగ్గుతోంది, అంటే వస్తు వినిమయం తగ్గుతోంది.ఫలితంగా పరిశ్రమలు పూర్తి సామర్ధ్యంతో పని చేయటంలేదు, కార్మికులకు పనీ లేదు, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావటం లేదు.అభివృద్ధి రేటు పడిపోతోంది. వెరసి ఆర్ధిక సంక్షోభం ముసురుతోంది. ఈ ఆరేండ్ల కాలంలో చమురు దిగుమతి ఖర్చు గతంతో పోలిస్తే బాగా తగ్గింది. ఇదే సమయంలో పన్నుల వాత మోగిపోతోంది.ఆదా అయిన సొమ్ము ఏమౌతోందో, అదనంగా వసూలు చేస్తున్న డబ్బు ఏమౌతోందో తెలియదు. ఈ సంక్షోభం నుంచి ఎలా బయట పడాలా అని చూస్తున్న మోడీ సర్కార్‌కు కరోనా వైరస్‌ మంచి అవకాశం ఇచ్చిందనే చెప్పాలి.
గత ఆరు సంవత్సరాలుగా నరేంద్రమోడీ సర్కార్‌ ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ లోటు బడ్జెట్‌ పెద్ద సమస్యగా ముందుకు వస్తోంది. అది జిడిపిలో 3.5శాతానికి లోపుగానే ఉంచుతామని చెబుతున్నప్పటికీ సాధ్యం కావటం లేదు. 2021 మార్చినాటికి 6.2శాతానికి చేరవచ్చని కొందరి అంచనా, కరోనా కారణంగా ఇంకా పెరిగినా ఆశ్చర్యం లేదు. ఈ నేపధ్యంలో ప్రకటించిన సంస్కరణల పర్యవసానాల గురించి తరువాత చర్చించుదాం. మన దేశంలో సంస్కరణలకు ఆద్యురాలు ఇందిరా గాంధీ. అయితే ఆమె సంస్కరణలను బ్యాంకుల జాతీయ కరణ, గరీబీ హఠావో వంటి నినాదాల రూపంలోకి మార్చి జనంలోకి వెళ్లారు. ప్రతి పాలకుడూ అదే చేసినా మీడియాలో ఇప్పటి మాదిరిగాక సంస్కరణల పేరుతో చర్చ తక్కువగా జరిగింది. మీడియా మొత్తంగా గతంలో చేపట్టిన వాటినీ, ఇప్పుడు మోడీ ప్రభుత్వ సంస్కరణలనూ సమర్ధిస్తోంది గనుక విమర్శనాత్మక వైఖరికి బదులు భ్రమలను మరింత పెంచే విధంగా వ్యవహరిస్తోంది.

Indira Gandhi: If we tolerate communalism, how will we preserve ...
మన సంస్కరణల భారతం గురించి క్లుప్తంగా చూద్దాం. రెండవ ప్రపంచ యుద్ధం ముగియటం, స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో తలెత్తిన అనిశ్చిత స్ధితిలో కొందరు స్వేచ్చా మార్కెట్‌ విధానాలను అనుసరించాలని ప్రతిపాదించగా మరికొందరు అంగీకరించలేదు. ప్రయివేటు రంగంలోని పరిశ్రమలను రక్షించుకోవాలంటే ప్రభుత్వ రంగ పరిశ్రమల ఏర్పాటు అవసరమని బోంబే క్లబ్‌ పేరుతో జెఆర్‌డి టాటా, జిడి బిర్లాతో సహా ఎనిమిది ప్రముఖ పారిశ్రామికవేత్తలు చేసిన సూచన మేరకు పారిశ్రామిక విధానాన్ని రూపొందించారు. తరువాత ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేశారు. తొలి ప్రణాళిక ఏడాది అమలు తరువాత విదేశీ చెల్లింపుల సమస్య తలెత్తింది. నాడు ఆర్ధిక సలహాదారుగా ఉన్న ప్రశాంత చంద్ర మహలనబిస్‌ స్వదేశీ లేదా స్వయం సమృద్ధి స్ఫూర్తిని ముందుకు తెచ్చారు. ఈ క్రమంలో పారిశ్రామికీకరణకు ప్రాధాన్యత ఇచ్చి వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేయటంతో దేశంలో ఆహారధాన్యాల కొరత ఏర్పడింది. వాటి దిగుమతికి విదేశీ మారక ద్రవ్యాన్ని వినియోగించాల్సి వచ్చింది. దీనికి తోడు చైనాతో యుద్దం మన సమస్యలను మరింత పెద్దవి చేసింది. తరువాత లాల్‌బహదూర్‌ శాస్త్రి అధికారానికి వచ్చారు. పాకిస్ధాన్‌తో జరిగిన యుద్దంలో విజయం-పర్యవసానాల నేపధ్యంలో ఆర్ధిక సంస్కరణలకు తెరతీశారు. దానిలో భాగంగా కేంద్ర ప్రణాళికా విధానం నుంచి వైదొలగాలని ఆలోచన చేశారు. దాంతో ప్రణాళికా సంఘ అధికారాలను పరిమితం చేసి విదేశీ పెట్టుబడులు, ప్రయివేటు పెట్టుబడులకు ఆహ్వానం పలికారు. ఇదే సమయంలో ఆహార రంగంలో ఉత్పత్తి పెంపుదలకు జైజవాన్‌ జైకిసాన్‌ నినాదమిచ్చారు. ఇది హరిత విప్లవానికి నాంది పలికింది. ఆ ఉత్సాహంతో పాడి పరిశ్రమను ప్రోత్సహించి శ్వేత విప్లవానికి బాటలు వేశారు.
చైనాతో యుద్ధంలో ఓడినా, పాకిస్ధాన్‌తో గెలిచినా, పెట్టుబడులకు ఆహ్వానం పలికినా, నాడున్న అంతర్జాతీయ పరిస్ధితుల్లో అవి రాక మన ఆర్ధిక సమస్యలు తీవ్రమయ్యాయి. మన రాజకీయ,ఆర్ధిక వ్యవస్ధకు సవాళ్లు ఎదురు అయ్యాయి. లాల్‌ బహదూర్‌ శాస్త్రి మరణం, ఇందిరా గాంధీ అధికారానికి వచ్చిన వెంటనే ఆమెకు అటు పార్టీలో ఇటు ఆర్ధిక రంగంలో ప్రతిఘటన ప్రారంభమైంది. జనంలో తీవ్ర అసంతృప్తి తలెత్తింది. చైనా తరువాత అతి పెద్దదైన మన మార్కెట్‌ను ఆక్రమించుకొనే అవకాశం దక్కలేదన్న అక్కసుతో ఉన్న ధనిక దేశాలు ప్రపంచబ్యాంకు ద్వారా మన దేశంలో ప్రవేశించేందుకు అవకాశం కోసం కాచుకున్నాయి. కాంగ్రెస్‌ పాలకుల దివాలా కోరు విధానాలు అందుకు అవకాశం ఇచ్చాయి. 1964లో ప్రపంచ బ్యాంకు బృందం బెర్నార్డ్‌ బెల్‌ నాయకత్వంలో మన దేశంలో పర్యటించి మన రూపాయి విలువను తగ్గించాలని, విదేశీ వాణిజ్యంపై ఉన్న అనేక ఆంక్షలను ఎత్తివేయాలని ప్రతిపాదించింది. వాటిని నాటి ఆర్ధిక మంత్రి టిటి కృష్ణమాచారి తిరస్కరించారు. పాకిస్ధాన్‌ మద్దతుదారుగా ఉన్న అమెరికా అంతకు ముందు మనకు ప్రకటించిన సాయాన్ని యుద్దం కారణంగా ఆకస్మికంగా నిలిపివేసింది. 1965 లాల్‌ బహదూర్‌ శాస్త్రి మరణించటం, ఇందిరా గాంధీ ప్రధాని కావటం, ఆమె ప్రపంచ బ్యాంకు పట్ల సానుకూల వైఖరి ప్రదర్శించటం దానికి నిదర్శనంగా కృష్ణమాచారిని పదవి నుంచి తొలగించటం, భారత్‌కు తిరిగి సాయం చేస్తామని అమెరికా ప్రకటించటం, ప్రపంచ బ్యాంకు విధానాలను అమలు జరుపుతామని ఇందిరా గాంధీ అంగీకరించటం వంటి పరిణామాలు వెంటవెంటనే జరిగాయి.
1965 జూన్‌ 6న ఇందిరా గాంధీ డాలరుతో మారకంలో మన రూపాయి విలువను 4.75 నుంచి 7.50కి తగ్గించారు. అనేక దిగుమతి ఆంక్షలను, ఎగుమతి సబ్సిడీలను తగ్గించారు. ఇవన్నీ షరతుల్లో భాగం. వృతం చెడ్డా ఫలం దక్కలేదు. మన ఎగుమతులు పడిపోయాయి, దిగుమతులు పెరిగాయి. ప్రపంచ బ్యాంకు ఇస్తామని చెప్పిన మేరకు సాయం చేయలేదు. మరోవైపు ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో జనం దృష్టిలో కాంగ్రెస్‌ పలుచనైంది. ప్రతిపక్షాలు తీవ్రంగా ధ్వజమెత్తాయి. పర్యవసానంగా 1967 ఎన్నికల్లో కాంగ్రెస్‌ కేంద్రంలో గెలిచినా తొలిసారిగా ఏడు ఉత్తరాది రాష్ట్రాలలో అధికారాన్ని కోల్పోయింది. పశ్చిమ దేశాలు మనల్ని మరింతగా తమ పాదాల ముందు మోకరిల్లేట్లు చేసుకొనేందుకు పూనుకున్నాయన్నది తేలిపోయింది. ఆ సమయంలో అమెరికా-సోవియట్‌ మధ్య తీవ్ర వైరం ఉండటంతో ఇందిరా గాంధీ సోవియట్‌ యూనియన్‌తో రక్షణ ఒప్పందం చేసుకొని పశ్చిమ దేశాల మెడలు వంచి రెండు వైపుల నుంచి సాయం పొందాలని చూశారు. అధికారంలోకి రాగానే ఏ ప్రపంచబ్యాంకుతో ఒప్పందం చేసుకున్నారో, ఏ అమెరికాతో చేతులు కలపాలని చూశారో వాటి బ్లాక్‌మెయిల్‌ కారణంగా వ్యతిరేకంగా ఇందిరా గాంధీ రాజకీయంగా వ్యవహరించాల్సి వచ్చింది.
పంచ వర్ష ప్రణాళికలను అమలు జరపలేని స్ధితి, దాంతో 1966 నుంచి మూడు సంవత్సరాల పాటు వార్షిక ప్రణాళికలను రూపొందించాల్సి వచ్చింది. పాలకపార్టీలో ముఠాపోరు ఒకవైపు, ఆర్ధికంగా అనిశ్చితి మరోవైపు, ఈ బలహీనతను ఆధారం చేసుకొని ప్రయివేటు బ్యాంకులు, ప్రయివేటు బీమా సంస్ధలు ప్రభుత్వ విధానాలకు అనుగుణ్యంగా వ్యవహరించటంగాక తమ ఇష్టానుసారంగా వ్యవహరించటం, అక్రమాలకు పాల్పడటం వంటి పరిణామాల నేపధ్యంలో రాజభరణాల రద్దు, బ్యాంకులు, బీమా కంపెనీల జాతీయం వంటి చర్యలతో ఇందిరా గాంధీ తిరిగి ప్రజల మన్ననలను పొందేందుకు ప్రయత్నించారు. కాంగ్రెస్‌ పార్టీలో కూడా పట్టు సాధించారు. చివరకు కాంగ్రెస్‌ రెండు ముక్కలుగా చీలిపోవటానికి పరిణామాలు దారి తీశాయి. స్వయం సమృద్ధి నినాదం మరోసారి ముందుకు వచ్చింది.

Indian Banks Nationalisation | Indira Gandhi's bank ...
ముందే చెప్పుకున్నట్లు ప్రపంచ బ్యాంకు చెప్పినట్లు చేసినా ఫలితం లేకపోవటమే కాదు, 1966లో విదేశీ చెల్లింపుల సమస్య మరోసారి ముందుకు వచ్చింది. దీన్ని అవకాశంగా తీసుకొని ఉపయోగించుకొనేందుకు దెబ్బతిన్న సంబంధాలను మరింతగా దిగజారకుండా చూసుకొనేందుకు, అర్ధిక దిగజారుడును ఆసరా చేసుకొని 1967లో మరోసారి ప్రపంచ బ్యాంకు రంగంలోకి దిగింది. అప్పటికే హరిత విప్లవం ప్రారంభమైంది. దాన్ని ఆసరా చేసుకొని పెట్టుబడిదారీ తరహా వ్యవసాయాన్ని ప్రోత్సహించటం ఒకటైతే దానికి అవసరమైన ఎరువుల రంగంలో విదేశీపెట్టుబడులకు అనుమతి సాధించే ప్రతిపాదనలతో ప్రపంచ బ్యాంకు ముందుకు వచ్చింది.
ఒక వైపు ప్రపంచ బ్యాంకు వత్తిడికి లొంగి కొన్ని సంస్కరణలు చేపట్టిన కాంగ్రెస్‌ పార్టీ మరోవైపు దాని విధానాలకు వ్యతిరేకంగా స్ధానిక అంశాల కారణంగా 1969లో బ్యాంకుల జాతీయకరణ, 1972లో బీమా కంపెనీలు, 1973లో బొగ్గు, చమురు కంపెనీల జాతీయకరణ వంటి చర్యలను తీసుకుంది. ప్రయివేటు రంగం వైఫల్యం, అవినీతి అక్రమాలు, అవసరాలకు అనుగుణ్యంగా పురోగతి లేకపోవటం వంటి వివిధ కారణాలు ఇందుకు పురికొల్పాయి. ఈ చర్యలతో ఈ రంగాలలో విదేశీ పెట్టుబడులకు దారులు మూసుకుపోయాయి. అయితే ఇదే సమయంలో ఇతర రంగాలలో విదేశీ పెట్టుబడులను ఎలాంటి నియంత్రణ లేకుండా కొనసాగించటం కూడా చూడవచ్చు. ఒక వైపు ఈ చర్యలను జనమంతా హర్షించి కాంగ్రెస్‌, ఇందిరా గాంధీకి జనం బ్రహ్మరధం పట్టినట్లు ఎన్నికల ఫలితాలు వెల్లడించాయి. ఎన్నికలలో అక్రమాలకు పాల్పడిన ఇందిరా గాంధీపై కేసులు, కోర్టు తీర్పు ప్రతికూలంగా రావటం వంటి పరిణామాలతో సానుకూల సంస్కరణ వాతావరణం ఉన్నప్పటికీ ఇందిరా గాంధీ తన పదవికోసం 1975లో అత్యవసర పరిస్ధితిని ప్రకటించి సరికొత్త రాజకీయ సంక్షోభానికి కారకురాలయ్యారు.
ఇందిరా గాంధీ-నరేంద్రమోడీని పోల్చటం కాదు, పరిస్దితులు అప్పుడూ ఇప్పుడూ ఒకే విధంగా లేవు గానీ ఒక రాజకీయవేత్త పలుకుబడికి-ఆర్ధిక సంక్షోభాలకు సంబంధం ఉండదు. వారు అనుసరించే ఎత్తుగడలు పలుకుబడిని తెచ్చిపెడితే అనుసరించే విధానాలు సంక్షోభాలకు కారణం అవుతాయి. ఇప్పుడు మన దేశంలో అదే పునరావృతం కానుందా ? ఈ దిశగా ఆలోచించాల్సిన అవసరం నరేంద్రమోడీ వ్యతిరేకులకే కాదు, ఆయన్ను పదికాలాల పాటు కాపాడుకోవాలనే అనుకూలురకు కూడా ఉంటుంది కదా !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

చైనా కంపెనీలు : అరచేతిలో వైకుంఠం, అంతా భ్రాంతియేనా !

16 Saturday May 2020

Posted by raomk in CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, USA

≈ 1 Comment

Tags

china boycott, China companies to India, coronavirus narendra modi, Make In India

Thousands of Companies from America, Japan and Korea leave China ...

ఎం కోటేశ్వరరావు
కష్ట కాలంలో కడుపు నిండా తిండి పెట్టకపోయినా కడుపు నింపే కబుర్లు చెబితే చాలు. చివరికి ఏమీ జరగకపోయినా ఎవరైనా ఏమి చేస్తారులే, మన ఖర్మ అలా ఉంది అని సర్దుకుపోయే స్ధితిలో మన సమాజం ఉంది. మనిషి ఆశాజీవి కనుక దారీ తెన్నూ కనిపించనపుడు ఏ చిన్న వెలుగు కనిపించినా , ఏ కాస్త శుభవార్త చెప్పినా పోయేదేముంది చూద్దాం అని గుడ్డిగా నమ్మేస్తారు. ప్రపంచ ఫ్యాక్టరీగా ఉన్న చైనా నుంచి మన దేశానికి వాణిజ్య, పారిశ్రామిక సంస్ధలు ముఖ్యంగా అమెరికాకు చెందినవి తరలి రానున్నట్లు గత కొద్ది రోజులుగా ఊదరగొడుతున్నారు. సాక్షాత్తూ ప్రధాని నరేంద్రమోడీయే అందుకు తెరలేపారంటే అతిశయోక్తి కాదు. రాబోయే కంపెనీల కోసం ముందుగానే స్ధలాలు, పొలాలను సిద్ధం చేస్తున్నామని, అందరికంటే ముందుగా ఎగిరి అందుకోవటానికి సిద్ధంగా ఉండాలని అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు సన్నాహాలు చేస్తున్నారు.నమ్మిన వారు కలలు కంటున్నారు. గతంలో నమ్మి దెబ్బతిన్నవారు వెనుకా ముందూ ఆలోచిస్తున్నారు. అనుమానాలను వ్యక్తం చేస్తున్నవారి మీద మీరసలు దేశభక్తులేనా, ఒక వేళ వస్తే గిస్తే మీకేమైనా ఇబ్బందా, చైనాయే అభివృద్ది చెందాలా? మనం వెనుకబడిపోవాలాని అని కొందరు వీరావేశంతో ఎదురు దాడికి దిగుతున్నారు. వారిలో ఒక తెగ వృత్తినటులు, అవసరానికి తగినట్లు తమ నట విశ్వరూపాన్ని ప్రదర్శిస్తారు. మరి కొందరు నటీనటుల హావభావాలు, విన్యాసాలకు పడిపోయి నటనే నిజమని భ్రమించి భుజానవేసుకొని వాదించే వారు. అసలు ఏం జరుగుతోంది ?
ఒక వైపు కరోనా వైరస్‌ కారణంగా తమ బతుకులు అతలాకుతలం కావటంతో పరాయి చోట దిక్కులేకుండా పడి ఉండటం కంటే స్వంత ఊళ్లో కడుపులో కాళ్లు పెట్టుకొని ఉండవచ్చని కోట్లాది మంది వలస కార్మికులు ప్రాణాలకు తెగించి వెళ్లిపోతున్నారు. ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. పరిస్ధితులు ఎప్పుడు బాగుపడతాయో, మూతపడిన పరిశ్రమలు తిరిగి ఎన్ని తెరుచుకుంటాయో, వెళ్లిన వారు ఎంతకాలానికి తిరిగి వస్తారో తెలియదు. అందుకే తమ పనులకు అవసరమైన వారిని ఊళ్లకు పంపవద్దని నిర్మాణ కంపెనీలు, పారిశ్రామికవేత్తలు పాలకులపై వత్తిడి తెస్తున్నారు. కొందరు పరోక్షంగా అందుకు సహకరిస్తే తెగించిన వారికి తెడ్డే లింగం అన్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి ఎడ్డియూరప్ప ఏకంగా బహిరంగంగానే మద్దతు ఇస్తూ శ్రామిక రైళ్లను రద్దు చేయాలని నిర్ణయించారు. ముది మది తప్పిందా అని పార్టీ పెద్దల నుంచి అక్షింతలు పడటంతో ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారనుకోండి.
ప్రపంచ వ్యాపితంగా కరోనాకు ముందే ఆర్ధిక సంక్షోభ ఛాయలు ముసరటం ప్రారంభమైంది. ఈ ఏడాది ప్రపంచ జిడిపి వృద్ధి రేటు ఎంతశాతమన్నది తప్ప తిరోగమన దిశలోనే ఉండబోతున్నది. కోట్లాది మంది కార్మికులు, ఉద్యోగులకు మన దేశంలో కూడా పని ఉండదనే అంచనాలు వెలువడుతున్నాయి. ఇది మన కొనుగోలు శక్తిని మరింత దెబ్బతీస్తుంది. ఇప్పటికే ఉన్న కంపెనీల ఉత్పత్తులనే కొనుగోలు చేసే వారు తగ్గిపోయినట్లు గతంలోనే నివేదికలు వెలువడిన విషయం తెలిసిందే. అలాంటపుడు చైనా, మరొక దేశం నుంచి వచ్చే కంపెనీలు తయారు చేసే వస్తువులను కొనే దెవరు? కొత్త సాంకేతిక పరిజ్ఞానం, ఆధునిక యంత్రాలతో ఒక వేళ అవి చౌకగా తయారు చేస్తే పోటీకి తట్టుకోలేక ఉన్న కంపెనీలు మూత పడతాయి. సిమెంట్‌ రంగంలో ఏమి జరిగిందో చూశాము. కొత్త కంపెనీలకు ఇచ్చే రాయితీల కోసం పాత కంపెనీలను మూత పెట్టి విలువైన స్దలాలను రియలెస్టేట్‌తో సొమ్ము చేసుకొన్న కంపెనీలు మన కళ్ల ముందే ఉన్నాయి. ఇప్పుడు మన దేశంలో కొత్తగా పెట్టేవైనా, విదేశాల నుంచి వచ్చేవైనా కార్మికులు తక్కువ-యాంత్రీకరణ ఎక్కువ అన్నది తెలిసిందే. అందువలన అవి కొత్త సమస్యలను తీసుకువస్తాయి.

Thousands of companies mull China exit after Covid; India next ...
ఒక వైపు విదేశీ వస్తువులు వద్దు,స్వదేశీయే ముద్దు అనే కొత్త పల్లవిని మన పాలకులు అందుకున్నారు. తెలివి తేటలు ఏ ఒక్కరి సొత్తూ కాదు, చైనా నుంచి అరువు తెచ్చుకొని లేదా అనుకరించి మనం లాక్‌డౌన్‌ అమలు జరిపినట్లే మన స్వదేశీ పిలుపును చూసి ఇతరులూ అమలు జరపరా? ప్రపంచమంతటా కరోనా వైరస్‌ సమస్య ఉంది కదా ! కరోనా లేనపుడే మన మేకిన్‌ ఇండియా పిలుపు దారుణంగా విఫలమైంది, జనం చెవుల్లో కమలం పువ్వులు పెట్టటం గాకపోతే ఇప్పుడు మేకిన్‌ ఇండియా పిలుపు వలన ప్రయోజనం ఏమిటి? దానిలో భాగంగా తయారు చేసే వస్తువులను ఏ దేశానికి ఎగుమతి చేస్తాము? ఇవన్నీ ఆలోచించాలా వద్దా ? దున్న ఈనిందనగానే గాటన కట్టేయమన్నట్లు పాలకులు, వారికి వంత పాడే మీడియా ఏది చెబితే దాన్ని నమ్మటమేనా మన పని ?
గతాన్ని మరచిన జాతికి భవిష్యత్‌ ఉండదు. ఆరు సంవత్సరాల క్రితం నరేంద్రమోడీ ముఖ్యమంత్రిగా తాను పొందిన అనుభవంతో గుజరాత్‌ అభివృద్ది నమూనాను దేశవ్యాపితంగా అమలు జరిపి అభివృద్ధి చేస్తా అన్నారు. మనమంతా నిజమే కదా అనుకున్నాం.తరువాత ఎన్నడైనా దాని గురించి నోరు విప్పారా ? విదేశీ, స్వదేశీ నల్లధనాన్ని వెలికి తీస్తామని, దాన్ని పంచితే ప్రతి ఒక్కరికీ పదిహేనులక్షల వరకు వస్తుందని చెప్పారు. ప్రత్యేక తెలంగాణా వస్తే ఆంధ్రావారంతా వెనక్కు వెళ్లిపోతారని, హైదరాబాదులో వారు ఖాళీ చేసిన ఇండ్లు (దీనికి ప్రాతిపదిక లేకపోలేదు. నైజాం నవాబు మీద తిరుగుబాటు చేసిన సమయంలో అనేక మంది నవాబు వంశీకులు, ఇతరులు హైదరాబాద్‌, కొన్ని పట్టణాలలోని కొంపా గోడూ, పొలాలు, స్దలాలు వదలి పాకిస్ధాన్‌ లేదా మరోచోటకు పోయారు. ఆ ఆస్ధులను అనేక మంది ఆక్రమించుకున్నారు) తమకు వస్తాయని కొంత మంది భ్రమించినట్లుగా నిజంగానే అంతగాకపోయినా కొంతయినా అందిస్తారని చాలా మంది నమ్మారు, ఆశగా ఎదురు చూశారు అదేమైందో తెలియదు. అసలెంత నల్లధనం వెలికి వచ్చిందో, దానిలో ఖజానాకు ఎంత చేరిందో సంఘపరివార్‌ సామాజిక మాధ్యమ మరుగుజ్జు వీరులు చెబుతారా ?
అధికారానికి వచ్చిన కొత్తలో నరేంద్రమోడీ రకరకాల కొత్త కొత్త కోట్లు వేసుకొని వరుసబెట్టి విదేశీ ప్రయాణాలు చేస్తుంటే నల్లడబ్బు వెలికితీతకేమో అని జనం అనుకుంటే , కాదు, దేశానికి అవసరమైన పెట్టుబడులు తేవటానికని వెంకయ్య నాయుడు వంటి వారు చెప్పారు. నల్లడబ్బూ తేలేదు, అదనంగా విదేశీ పెట్టుబడులూ లేవు, మేకిన్‌ ఇండియా ఎటుపోయిందో తెలియదు. పెద్ద నోట్ల రద్దు నల్లధనం వెలికి తీత, దేశభక్తి అంటే కామోసనుకున్నాం. స్వాతంత్య్రపోరాటంలో జనం బ్రిటీష్‌ వారి తుపాకి తూటాలకు ,లాఠీలకు ఎదురొడ్డి నిలుచున్నట్లుగా కోట్లాది మంది తమ డబ్బు తాము తీసుకొనేందుకు బ్యాంకులు, ఎటిఎంల ముందు వరుసలు కట్టినిలుచున్నారు. పనులతో పాటు కొందరు ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. నరేంద్రమోడీ ప్రపంచంలో ఎవరూ చేయని పిచ్చి పని చేశారని విమర్శించిన వారిని దేశద్రోహులు అన్నట్లుగా చూశారు. ఇప్పుడు వాటిని గుర్తు చేస్తే కొందరికి ఎక్కడెక్కడో కాలుతోంది నిజమే. మరి ఆ చర్యవలన వచ్చిన ఉపయోగాలేమిటో ఎన్నడైనా మోడీగారు నోరు విప్పి మాట్లాడారా ? విలేకర్లతో మాట్లాడే ధైర్యం ఎలాగూ లేదని తేలిపోయింది. పోనీ కనీసం మన్‌కీ బాత్‌లో అయినా చెప్పారా ? పైన చెప్పినవి, మరి కొన్నింటినీ కలగలిపి జనానికి అచ్చేదిన్‌ తెస్తామని అన్నారు. ఆచరణలో జనాలకు చచ్చే దినాలు వచ్చాయి. అన్నింటా విఫలమైనా ఐదేండ్లలో మోడీ మీద జనాలకు మోజు తీరక, నమ్మకం చావక, ప్రతిపక్షాల మీద విశ్వాసం లేక రెండోసారి మరిన్ని సీట్లు ఇస్తూ ఓటువేశారు.

China's mobile and digital dominance runs deep into Indian economy ...
జరిగిందేమిటి ? నరేంద్రమోడీ ఏలుబడిలో తట్టలోని సంసారం బుట్టలోకి వచ్చింది. దాన్ని దాచి పెట్టేందుకు ఇప్పుడు కరోనాను సాకుగా చూపుతున్నారు. ఆపేరుతో కార్మిక చట్టాలను మార్చేందుకు శ్రమజీవులను మరింతగా కట్టుబానిసలుగా మార్చేందుకు సిద్దం చేస్తున్నారు. ఏ దేశ చరిత్ర చూసినా ఆర్దికంగా సంక్షోభంలో ఉన్న సమయంలోనే దాన్నుంచి బయటపడవేసే సాకుతో, ప్రజా, కార్మిక వ్యతిరేక చర్యలకు శ్రీకారం చుట్టారు. ఇప్పుడూ జరుగుతోంది అదే. జనానికి జ్ఞాపకశక్తి తక్కువ గనుక గతంలో విదేశాల నుంచి పెట్టుబడులు తెస్తామని ఎలా ఊరించారో ఇప్పుడు చైనా నుంచి ఫ్యాక్టరీలను తెస్తామని అంతకంటే ఎక్కువగా నమ్మబలుకుతున్నారు. దీని గురించి ఎవరైనా సందేహాలు వ్యక్తం చేస్తే అసలు మీరు దేశభక్తులేనా, చైనా నుంచి ఫ్యాక్టరీలు రావటం ఇష్టం లేదా అని ఎవరైనా అడ్డుతగలవచ్చు. చైనా నుంచే కాదు, యావత్‌ దేశాలలో ఇంకా మిగిలి ఉన్న ఫ్యాక్టరీలు, సంస్దలన్నీ వచ్చినా సంతోషమే.
నిద్రిస్తున్న మహా దేశం మేలుకొంటోంది, చైనా నుంచి వచ్చే ఫ్యాక్టరీలకు స్వాగతం పలికేందుకు రాష్ట్రాలు సిద్ధం కావాలని స్వయంగా ప్రధాని నరేంద్రమోడీ ముఖ్యమంత్రులకు సూచించినట్లు వార్తలు వచ్చాయి. అమెరికా-చైనాల మధ్య తలెత్తిన వాణిజ్యం యుద్దం, కరోనా మహమ్మారి కారణంగా తలెత్తిన పరిస్ధితుల నేపధ్యంలో చైనా నుంచి కంపెనీలు రావాలనుకుంటున్నాయని వాటికి అవసరమైన మౌలిక సదుపాయాల వంటివి కల్పిస్తే చైనాకు తగిన ప్రత్యామ్నాయం అవుతామని ప్రధాని చెప్పినట్లు మీడియా పేర్కొన్నది. ఏ దేశానికి ఆదేశం మరొక దేశంతో పోటీబడి అభివృద్ది చెందితే అభ్యంతరం ఎవరికి ఉంటుంది. ఎదుటివారిని దెబ్బతీసి మనం లాభపడాలనుకుంటే ఎదుటి వారు కూడా మన గురించి అదే అనుకుంటారు అని గ్రహించటం అవసరం.
మనమహాదేశం మోడీ అధికారానికి వచ్చిన ఆరుసంవత్సరాల పాటు నిద్రలో ఉండటానికి కారణం ఎవరు? పోనీ దానికి కారణం కాంగ్రెస్‌ అనుసరించిన విధానాలే అని అంగీకరిద్దాం. యాభై సంవత్సరాల పాటు కాంగ్రెస్‌ చేసిన తప్పిదాలను కేవలం ఐదు సంవత్సరాలలో సరిదిద్దామని చెప్పుకున్నవారు, దేశాన్ని నిద్రలేపటానికే ఆరు సంవత్సరాల వ్యవధి తీసుకుంటే, దాన్ని నడిపించటానికి ఎన్ని ఆర్లు కావాలి ? ఇలాంటి కబుర్లు గతంలోనే చాలా చెప్పారు. జరిగిందేమిటి ?
ఏప్రిల్‌ 22నాటి బిజినెస్‌ టుడే వార్త ప్రకారం వెయ్యి విదేశీ కంపెనీలు ప్రస్తుతం సంప్రదింపులు జరుపుతున్నాయని కనీసం 300 సంస్ధలను రప్పించే లక్ష్యంతో పని చేస్తున్నట్లు ఒక అధికారి చెప్పినట్లుగా ఉంది. పోనీ ఇవన్నీ చైనా నుంచే వస్తాయని అనుకుందాం. అసలు చైనాలో ఉన్న విదేశీ కంపెనీలు ఎన్ని ? 2012లో 4,36,800 ఉండగా 2018లో 9,61,000 ఉన్నాయి. తరువాత పెరిగినా తరిగినా మొత్తం మీద స్ధిరంగా ఉన్నాయని అనుకుందాం. వీటిలో వెయ్యి కాదు మన మోడీ ఎంతో పలుకుబడి గలవారు గనుక మరో పది వేల కంపెనీలను రప్పించినా మన దేశం మరొక చైనా మాదిరి తయారవుతుందా ? చైనా దెబ్బకు అంత పెద్ద అమెరికాయే గిలగిల్లాడుతుంటే మనం తట్టుకోగలమా ? మన ఆలోచనలు ఎక్కడ ఉన్నాయి ? గతంలో గ్రామాల్లో బుర్రకథలు చెప్పేందుకు వచ్చిన వారు గ్రామీణులను ఉబ్బించి ఎక్కువ బహుమతులను రాబట్టుకొనేందుకు వెళ్లిన ప్రతి ఊరిలో మీ గ్రామం చుట్టుపక్కల అరవై ఆరు గ్రామాలకు పోతుగడ్డ అని చెప్పేవారు. మన దేశం, రాష్ట్రాల గురించి అలాగే ఉబ్బవేస్తుంటే నిజమే అనుకుంటున్నారు.
చైనా కంపెనీలు విదేశాలకు పోక, మన దేశానికి రాక గురించి ఊరించటం కొత్త కాదు.చైనాలో వేతన ఖర్చు క్రమంగా పెరుగుతున్న కొద్దీ అంతకంటే తక్కువ ఖర్చయ్యే దేశాల గురించి వెతుకులాట గత ఐదు సంవత్సరాల నుంచి పెరుగుతోంది.2016-17 మన ఆర్ధిక సర్వేలో ” చైనాలో పెరుగుతున్న వేతన ఖర్చు కారణంగా దుస్తులు, తోళ్లు, పాదరక్షల తయారీ రంగాలలో ఉత్పత్తుల మార్కెట్లలో చైనా వాటా స్ధిరపడటం లేదా తగ్గుతున్న నేపధ్యంలో ఈ రంగాలను ప్రోత్సహించటానికి మన దేశానికి అవకాశం వచ్చింది. చైనాతో పోల్చితే భారత్‌లోని అత్యధిక రాష్ట్రాలలో వేతన ఖర్చు తక్కువగా ఉంది. చైనా నుంచి తరలిపోయిన వాటిలో వేగంగా దుస్తుల రంగం బంగ్లాదేశ్‌, వియత్నాంకు తరలిపోయింది. తోళ్లు,పాదరక్షల రంగం వియత్నాం, ఇండోనేషియాకు పోయింది. మన దేశంలోని దుస్తుల కంపెనీలు కూడా బంగ్లాదేశ్‌, వియత్నాం, మయన్మార్‌, చివరికి ఇథియోపియాకు కూడా తరలిపోతున్నాయి” అని పేర్కొన్నారు. మొన్నటికి మొన్న అంటే తాజా ఆర్ధిక సర్వేలో చైనా తరహా అభివృద్ది, ఆకర్షణ గురించి పేజీలకు పేజీలే రాసుకున్నాం. నిజానికి దానికీ కరోనాకు అస్సలు సంబంధమే లేదు. నాలుగేండ్ల నాటికి ఇప్పటికీ జరిగిన పెద్ద మార్పు ఏమిటో ఎవరైనా చెప్పగలరా ?
తమ రాష్ట్రాలలో ఏర్పాటు చేసే సంస్దలలో మెజారిటీ ఉద్యోగాలను స్ధానికులకే ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్‌తో సహా అనేక రాష్ట్రాలు చట్టాలను చేశాయి. దీని మీద దేశీయంగా భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. తమ కంపెనీలలో తాము ఎంపిక చేసుకున్న సిబ్బందినే పెట్టుకోవాలని కోరుకొనే కంపెనీలకు ఈ చట్టాలు ఆటంకంగానే కనిపిస్తాయి. ఇలాంటి చట్టాలను చేసిన రాష్ట్రాలు గానీ చేయని రాష్ట్రాలకు గానీ విదేశీ పెట్టుబడులు, సంస్ధలను ఆకర్షించటంలో పెద్ద తేడా కనిపించటం లేదు. గత మూడు సంవత్సరాలలో కొత్త కంపెనీల తీరుతెన్నులను చూసినపుడు పెట్టుబడులు తగ్గిపోతున్నాయి. ఈ స్ధితిలో ఉన్న కంపెనీలు తమ సామర్ధ్యాన్ని పెంచుకొనేందుకు లేదా అదనపు సిబ్బందిని నియమించేందుకు ముందుకు రావటం లేదు. ఈ స్ధితిలో కొత్తగా వచ్చే కంపెనీలకు మన దేశంలో కనిపించే ఆకర్షణలు ఏమిటి ?
చైనా నుంచి వస్తాయని చెబుతున్న కంపెనీలలో ఎక్కువ భాగం అమెరికాకు చెందినవిగా చెబుతున్నారు. అవే ఎందుకు ఆసక్తి కనపరుస్తున్నాయి? ఒక వైపు ట్రంప్‌ అమెరికాలో పెట్టుబడులు, పరిశ్రమల స్ధాపనకు విదేశీ పెట్టుబడులను ఆహ్వానిస్తున్నాడు. చైనా మీద ఆధారపడిన కారణంగానే అమెరికాలో ఇబ్బందులు తలెత్తాయన్నట్లుగా మాట్లాడుతున్నాడు. అలాంటపుడు చైనాలోని అమెరికా కంపెనీలు తమ దేశానికి పోకుండా మన దేశానికి ఎందుకు రావాలని కోరుకుంటున్నాయి. వాటికి దేశభక్తి లేదా ? మన దేశాన్ని ఉద్దరించాలనే సదాశయంతో వస్తున్నాయా ? 2018 నుంచి డోనాల్డ్‌ ట్రంప్‌ చైనాతో వాణిజ్య యుద్ధం చేస్తున్నాడు. చైనాలోని అమెరికన్‌ కంపెనీలు తయారు చేసే వస్తువులను కూడా చైనావిగానే పరిగణించి వాటి మీద దిగుమతి పన్ను విధిస్తున్నాడు. అమెరికా దేశభక్త కంపెనీలు ఆ పన్ను భారాన్ని తాము భరించాలా లేక తమ దేశ వినియోగదారుల నుంచి వసూలు చేయాలా అనే సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ఒక వేళ చైనా మరిన్ని ప్రతీకార చర్యలకు పూనుకుంటే తాము ముందు బలౌతామనే భయం అమెరికన్‌ కంపెనీల్లో కలుగుతోంది. దీనికి తోడు వేతన పెరుగుదల వంటి అంశాలు, చైనా సుంకాలను పెంచితే గిట్టుబాటు కావనే దిగులు, ఇలా అనేక అంశాలను గమనంలో ఉంచుకొని ముందుగానే జాగ్రత్త పడితే మంచిదనే ఆలోచనతో కూడా కొన్ని కంపెనీలు తరలిపోవాలనే ఆలోచనలు చేస్తున్నాయి.

Why Companies Shift From China To Vietnam More Than
అయితే అసలు చైనా నుంచి విదేశీ కంపెనీలు తరలిపోవటం లేదా ? లేదని ఎవరు చెబుతారు ?లాభాల కోసం తమ స్వంత దేశాలను వదలి చైనా వచ్చిన కంపెనీలు మరొక దేశంలో లాభం ఎక్కువ వస్తుందనుకుంటే అక్కడికి తరలిపోవటంలో ఆశ్చర్యం ఏముంది. పెట్టుబడి లక్షణమే అది. పెట్టుబడులను ఆకర్షించేందుకు మోడీ సర్కార్‌ అనేక చర్యలు తీసుకుంది, రాయితీలు ప్రకటించింది, కార్మిక చట్టాలను నీరుగార్చింది. సులభతర వాణిజ్యం ర్యాంకులో ముందుండటం కోసం పోటీ పడుతోంది. అయినా ఆకర్షణ కలగటం లేదు.2018 ఏప్రిల్‌ నుంచి 2019 ఆగస్టు వరకు 56 చైనా కంపెనీలు అక్కడి నుంచి బయటకు వచ్చాయి. వాటిలో 26 వియత్నాంకు,11 తైవాన్‌కు, 8 థారులాండ్‌కు తరలిపోగా మన దేశానికి మూడు, ఇండోనేషియాకు రెండు వెళ్లాయని జపనీస్‌ సంస్ధ నొమురా నివేదించింది. అంతెందుకు సిఎన్‌బిసి అనే అమెరికన్‌ టీవీ మే 14న ప్రసారం చేసిన ఒక సమీక్షలో చైనా నుంచి ఎలా తరలిపోవాలా అని కంపెనీలు చూస్తుంటే మరోవైపు ఎక్కువ విలువ కలిగిన వస్తు తయారీకి చైనా సాంకేతిక రంగం మీద పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతోందని ఎర్నెస్ట్‌ అండ్‌ ఎంగ్‌ కంపెనీ ఆసియాపసిఫిక్‌ మేనేజింగ్‌ పార్టనర్‌ పాట్రిక్‌ వింటర్‌ చెప్పారు. చైనాలో వేతన ఖర్చులు పెరగటం, అమెరికాతో వాణిజ్య యుద్దం కారణంగా చాలా కాలం నుంచి కంపెనీలు తరలిపోయే ఆలోచన చేస్తున్నాయన్నారు. బమ్మలు,కెమెరాల తయారీ మెక్సికోకు, పర్సనల్‌ కంప్యూటర్లు తైవాన్‌కు, ఆటోమోటివ్‌ కంపెనీలు థారులాండ్‌, వియత్నాం,భారత్‌కు తరలుతున్నాయని చెప్పారు. అంటే మనం కూడా మిగతాదేశాల్లో ఒకరం తప్ప చైనా కంపెనీలన్నీ ఏకంగా మన ఒళ్లో వచ్చి వాలిపోవటం లేదు.
సామాజిక మాధ్యమంలో మరుగుజ్జులు వేసే జిమ్మిక్కులు నిజమే అని నమ్మే జనం గణనీయంగా ఉన్నారు. అలాంటి ఒక పోస్టు ప్రస్తుతం వాట్సాప్‌లో తిరుగుతోంది. నిన్న నోయిడా వ్యాపారులు 150 మిలియన్‌ డాలర్ల చైనా ఆర్డర్‌ను రద్దు చేశారని దేశం మొత్తం నుంచి రెండు బిలియన్‌ డాలర్ల మేరకు రద్దు చేసి అనధికారికంగా చైనాను కాళ్లబేరానికి తెచ్చారని, గత సంవత్సరం దీపావళికి చైనా లైట్లను కొనుగోలు చేయనందున చైనా వస్తువులు 20శాతం నాశనం అయ్యాయని, అదే మొత్తం 62బిలియన్‌ డాలర్ల ఆర్డర్లు రద్దు చేస్తే ఏమౌతుందో చూడండి.90 రోజులు ఏ విదేశీ వస్తువులు కొనకండి, డాలరుతో రూపాయి మారకపు విలువ రెండు రూపాయలకు సమానం అవుతుంది అంటూ ఆ పోస్టు మహా రంజుగా సాగింది. చదివిన వారు లొట్టలు వేసుకుంటూ ఇతరులకు పంపుతున్నారు.
ఈ పోస్టులో నిన్న నోయిడా అంటే అది 2016 అక్టోబరు 13వ తేదీనాటి హిందూస్దాన్‌ టైమ్స్‌ వార్త. ఆ తరువాత మన దేశం చైనా నుంచి దిగుమతులను పెంచుకుందే తప్ప ఏమాత్రం తగ్గించలేదు. అంటే అనుమతించిన పాలకులు, దిగుమతి చేసుకున్న వ్యాపారులను దేశభక్తులనాలా, దేశద్రోహులనాలా ! ఇలాంటి పోసుకోలు కబుర్లు, పగటి కలలతో జనాన్ని ఎంతకాలం మభ్యపెడతారు. నరేంద్రమోడీ గారి ఏలుబడి తొలి ఏడాది 2014-15లో డాలరుతో రూపాయి సగటు మారకపు విలువ 61.14 ఉంటే ఇప్పుడు 75 రూపాయలు నడుస్తోంది. తిరిగే చక్రం మీద కూర్చున్న ఈగ తానే చక్రాన్ని నడుపుతున్నట్లు కలగంటుందట. మనం వస్తువులు కొనుగోలు చేయకపోతే చైనా కాళ్ల బేరానికి వస్తుంది, కుప్పకూలిపోతుంది అన్నది కూడా ఈగ బాపతే. 2019లో చైనా నుంచి ఎక్కువగా దిగుమతులు చేసుకున్న తొలి పదిహేను దేశాలలో మూడు శాతంతో మనది ఏడవ స్ధానంలో వుంది. అంటే మిగిలిన దేశాలన్నీ 97శాతం వాటా కలిగి ఉన్నాయి. మన మూడుశాతం నిలిపివేస్తే చైనాకు వచ్చే నష్టం ఏముంటుంది? అగ్రస్ధానంలో ఉన్న అమెరికాకు చైనా 16.8శాతం ఎగుమతి చేస్తోంది. అలాంటి దేశ అధ్యక్షుడు ట్రంప్‌ను చైనీయులు మూడు చెరువుల నీరు తాగించి తమ కాళ్ల బేరానికి తెచ్చుకుంటున్నారు. ఇక మన దేశ వాణిజ్య భాగస్వాములలో చైనా 2019లో 5.08శాతంతో మూడవ స్ధానంలో ఉంది. తొలి రెండు స్ధానాలలో అమెరికా, యునైటెడ్‌ అరబ్‌ ఏమిరేట్స్‌ ఉన్నాయి. చైనా ఎగుమతి చేసే వందలో మూడు వస్తువులను మనం తెచ్చుకుంటుంటే, మనం ఎగుమతి చేసే వందలో చైనా ఐదింటిని తీసుకొంటోది. పరిస్ధితి ఇలా ఉంటే మనం చైనాను కాళ్లబేరానికి తెచ్చుకోవటం ఏమిటి? మతి ఉండే ఆలోచిస్తున్నామా ? మన ఘనమైన సంస్కృతి ఎంత ఎదిగినా ఒదిగి ఉండమని చెప్పింది తప్ప దురహంకారానికి లోను కమ్మని చెప్పలేదు.

Foreign companies are coming to India leaving China, will settled ...
బాధ్యత కలిగిన వారెవరైనా వెనుకా ముందూ చూసుకోవాలి, చర్యకు ప్రతి చర్య పర్యవసానాల గురించి ఆలోచించకుండా ముందుకు పోతే గోతిలో పడతారు. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్‌ నెలల్లో విదేశీమారక ద్రవ్యం గణనీయంగా ఉన్న తొలి పది దేశాలలో మనది ఐదవ స్ధానం. అయితే తొలి స్ధానంలో ఉన్న చైనా దగ్గర 3,091, దాని ఏలుబడిలోని హాంకాంగ్‌లో 441, మకావులో 22 అంటే మొత్తం చైనా దగ్గర 3,554 బిలియన్‌ డాలర్లు ఉంటే, మన దగ్గర 485 బిలియన్‌ డాలర్లు ఉన్నాయి. మన దేశం అక్కడి పరిశ్రమలను ఆహ్వానించి చైనాతో వాణిజ్య యుద్దానికి దిగితే ఏమి జరుగుతుందో ఆలోచించుకోవాలి. మన దేశానికి చెందిన నోబెల్‌ బహుమతి గ్రహీత అయిన ఆర్ధికవేత్త అభిజిత్‌ ముఖర్జీ మే 12న ఒక బెంగాలీ టీవీతో మాట్లాడుతూ ఒక వేళ చైనా తన కరెన్సీ విలువను తగ్గిస్తే ఏం జరుగుతుంది ? దాని వస్తువుల ధరలు తగ్గుతాయి, జనాలు వాటినే కొంటారు అన్నారు. ఆలా చెప్పిన ఆయన దేశభక్తుడు కాదా ?
ఒక దేశ జీవన ప్రమాణాలకు తలసరి జిడిపి ఒక గీటు రాయి. 2019లో చైనాలో పదివేల డాలర్లకు పైబడితే మన దేశంలో రెండువేల డాలర్లు. అందువలన చైనాను మిగతా దేశాలు ఇబ్బందుల పాలు చేసినా తాను తయారు చేసిన వస్తువులను తన ప్రజలకే విక్రయించి తన కాళ్లమీద తాను నిలబడగదు. 2008 తరువాత ధనిక దేశాల్లో సంక్షోభం కారణంగా దాని ఎగుమతి ఆధారిత వ్యవస్ధకు ఎదురుదెబ్బలు తగిలాయి. అయితే ఆ మేరకు తన అంతర్గత వినియోగాన్ని పెంచే విధంగా చర్యలు తీసుకొని వాటి నుంచి కాచుకుంది.మనం అటువంటి స్ధితిలో ఉన్నామా ?
చైనాలో ఉన్నది కమ్యూనిస్టు నియంతృత్వం అని ఒక పాటపాడతారు. ప్రపంచ పెట్టుబడిదారులు మరి అక్కడకు ఎందుకు వెళుతున్నట్లు ? ప్రపంచ దేశాలన్నీ దాని నేతలను ఎందుకు ఆహ్వానిస్తున్నట్లు ? నిన్నగాక మొన్న చైనా జింపింగ్‌ను మోడీ గారు రావయ్యా జింపింగూ అజెండా ఏమీ లేదు గానీ మంచి చెడ్డలు మాట్లాడుకుందాం రమ్మని మహాబలిపురానికి ఎందుకు ఆహ్వానించినట్లు ? మోడీ గారు చైనా ఎందుకు వెళ్లినట్లు ? ప్రపంచంలో కమ్యూనిస్టులు లేని దేశాల్లో నియంతలు ఎందరో ఉన్నారు. మరి అక్కడికి పెట్టుబడులు ఎందుకు వెళ్లటం లేదు ? మన దేశంలో ప్రజాస్వామ్యం ఉంది కనుక చైనా మాదిరి మనం అభివృద్ది చెందలేమని మరొక ముక్తాయింపు. అదే తర్కానికి కట్టుబడితే చైనా నుంచి కంపెనీలు వచ్చినా మనం ఎలా అభివృద్ధి చెందగలం ?
ఒక దేశంతో మరొక దేశం పోల్చుకోవటం అసంబద్దం. దేనికి ఉండే అనుకూల ప్రతికూలతలు దానికి ఉంటాయి. అందువలన అభివృద్ధి మార్గం కూడా భిన్నంగానే ఉండాలి తప్ప మరొక దాన్ని అనుసరించటం, అనుకరించటం వలన ప్రయోజనం ఉంటుందా ? ఆ రీత్యా చూసినపుడు మన భారతీయ విధానాలను అభివృద్ధి చేసుకోకుండా చైనాను అనుకరించటం భారతీయత ఎలా అవుతుంది. అసలు సిసలు దేశభక్తులం అని చెప్పుకొనే వారు ఆలోచించాలి మరి. చైనా అభివృద్ధి చైనా కమ్యూనిస్టు పార్టీ విధానాల కారణంగానే సాధ్యమైంది. మన దేశం అభివృద్ధి గాకపోవటానికి కాంగ్రెస్‌-బిజెపి వాటి విధానాలకు మద్దతు ఇచ్చే పార్టీలే కారణం. కమ్యూనిస్టులకు అధికారం ఉంటే కరోనా మహమ్మారిని ఎదుర్కోవటంలో కమ్యూనిస్టుల ప్రత్యేక ఏమిటో మన దేశంలో కేరళ, ప్రపంచంలో చైనా, వియత్నాం, క్యూబా, ఉత్తర కొరియా వంటి దేశాలు నిరూపించాయి.
ప్రపంచంలో గత కొద్ధి సంవత్సరాలుగా దిగజారుతున్న ఆర్ధిక పరిస్ధితిని కరోనా వైరస్‌ తాత్కాలికంగా అయినా మరింతగా దిగజార్చనుంది. గతంలో అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్ద(ఐఎంఎఫ్‌), ప్రపంచ బ్యాంకు చెప్పిన అనేక జోశ్యాలు, చూపిన రంగుల కలలు కల్లలయ్యాయి. అయినా అవి తప్ప మరొక ప్రత్యామ్నాయం లేనందున అవి చెప్పిన అంశాల ప్రాతిపదికనే అయితే, గియితే అనే షరతులు, హెచ్చరికలతో చర్చించుకోక తప్పటం లేదు.

COVID-19 and the new coronavirus: Fact versus fiction - COVID-19 ...
ఐఎంఎఫ్‌ అంచనా ప్రకారం 2020-21లో మన జిడిపి వృద్ధిరేటు 0.5శాతమే. మరొక అంచనా ప్రకారం 2020లో 1.9శాతం, ఇంకో అంచనా మైనస్‌ మూడుశాతం. ఇవన్నీ లాక్‌డౌన్‌కు ముందు, కొనసాగుతున్న సమయంలో వెలువడిన అంచనాలు. ఎంతకాలం కొనసాగుతుంది, ఆర్ధిక కార్యకలాపాలు తిరిగి ఎపుడు, ఎలా ప్రారంభం అవుతాయి అనేదాని మీద ఈ అంకెల్లో, వాస్తవంలో మార్పులు ఉంటాయి. ఈ నేపధ్యంలో చైనా నుంచి కంపెనీలు రావటం అంటే ఏటిఎంలో కార్డు పెట్టి వెంటనే నగదు తీసుకున్నంత సులభం కాదని గ్రహించాలి. అక్కడ 1978 నుంచి అనుసరించిన విధానాలు జిడిపిలో అమెరికాకు ధీటుగా చైనాను ముందుకు తెచ్చింది. తాము ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉన్నామని, అందువలన మరింత అభివృద్ధి చెందేందుకు సంస్కరణలను కొనసాగిస్తామని, పెట్టుబడులకు మరిన్ని అవకాశాలిస్తామని చైనా ప్రకటించింది. అంతే కాదు, 1970దశకం వరకు ఐక్యరాజ్యసమితి, ప్రపంచ సంస్ధలకు దూరంగా ఉంచిన అమెరికా, ఇతర దాని మిత్ర దేశాల మెడలు వంచి ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యరాజ్యమైంది. తరువాత ప్రపంచ వాణిజ్య సంస్ధలో అడుగుపెట్టి తన ఎగుమతి అవకాశాలను పెంచుకుంది.2049 నాటికి చైనాలో పూర్తిగా విలీనం కావాల్సిన హాంకాంగ్‌, మకావు దీవుల్లో పెట్టుబడిదారీ వ్యవస్ధను కొనసాగిస్తామని, అక్కడి ప్రయివేటు పెట్టుబడులకు రక్షణ కల్పిస్తామని చైనా హామీ ఇవ్వటం ప్రపంచ పెట్టుబడిదారుల్లో పెద్ద విశ్వాసాన్నిచ్చింది.స్ధిరమైన ప్రభుత్వం, స్ధిరమైన విధానాలను కొనసాగించటమే చైనా విజయ రహస్యం.ఆ కృషి వెనుక ఉన్న స్ధిరమైన విధానాలు ప్రపంచ పెట్టుబడిదారులను చైనా బాట పట్టించాయని అంగీకరిస్తారా ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

అమెరికా అల్లిన 24 అబద్దాలు- చైనా చెప్పిన 24 నిజాలు !

12 Tuesday May 2020

Posted by raomk in CHINA, Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion, Politics, USA

≈ 1 Comment

Tags

#US Lies, 24 American lies, 24 American lies- Chinese 24 truths, 24 ‘lies’ by US over Covid-19, Chinese 24 truths, COVID-19

Rob Rogers on Twitter: "Lies cartoon: https://t.co/SamLHmQDgA ...
ఎం కోటేశ్వరరావు
అగ్రరాజ్యం అమెరికా. దాని అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌. అమెరికా లేదా ప్రపంచ చరిత్రలో ఒక దేశాధిపతిగా ట్రంప్‌ మాట్లాడినన్ని అబద్దాలు మరొకరు మాట్లాడి ఉండరు. ఎన్ని అబద్దాలు చెబితే అంత బలం వస్తుందన్న నమ్మకం ఉన్న వ్యక్తిగా ఇప్పటికే విశ్లేషకులు తేల్చివేశారు. నోరు తెరిచి నాలుగు అంశాలు చెబితే వాటిలో మూడు పాక్షిక లేదా పూర్తి అబద్దాలే. అలాంటి వ్యక్తి, ఆయన యంత్రాంగం కరోనా వైరస్‌ గురించి అనేక కట్టుకథలు సృష్టించటం, వాటిని మీడియా ద్వారా ప్రచారంలో పెట్టటం తెలిసిందే. అనేక మంది తాము తటస్ధులం అని చెప్పుకుంటారు. ట్రంప్‌ అబద్దాల కోరని అంగీకరిస్తారు, అదే సమయంలో ఆ నోటి నుంచి లేదా సిఐఏ ఇతర కట్టుకథల ఫ్యాక్టరీల నుంచి వెలువడే అబద్దాల ఉత్పత్తులను ఉపయోగించుకొని ఏక పక్షంగా మరో దేశం మీద దాడి చేస్తారు. వీరిలో ఒక రకం తమకు తెలియకుండానే ప్రచార సమ్మోహన అస్త్రానికి పడిపోయిన వారు, రెండవ తరగతి అన్నీ తెలిసి కూడా రాళ్లేసే రకం. గతంలో ప్రచ్చన్న యుద్దం పేరుతో సోవియట్‌ యూనియన్‌, తూర్పుఐరోపా సోషలిస్టు వ్యవస్ధలకు వ్యతిరేకంగా చేసిన ప్రచారం గురించి తెలిసిందే. ఇప్పుడు కరోనా వైరస్‌ సందర్భంగా అదే రకమైన ఏకపక్ష దాడి ప్రారంభమైంది. అమెరికా పాటపాడితే కొన్ని దేశాలు గొంతు కలుపుతున్నాయి, మరికొన్ని పక్కవాద్యాలు వాయిస్తున్నాయి.
తెలుగు మీడియా ఇచ్చే అంతర్జాతీయ వార్తలన్నీ అమెరికా, ఐరోపా దేశాల అదుపులో ఉండే వార్తా సంస్ధల నుంచి తీసుకుంటున్నవే. కాళిదాసు కవిత్వానికి తమ పైత్యాన్ని జోడించి రాసేవారు, చూపే వారు పోటీపడుతున్నారు. ఎంత సంచలనాత్మకంగా ఉంటే అంతకిక్కు, అంత రేటింగ్‌ ఉంటుంది మరి. దిగువ అంశాలు చైనా వార్తా సంస్ధ గ్జిన్హువా విడుదల చేసిన సమాచారం ఆధారంగా రాస్తున్నవే. నిడివి పెద్దది కాకుండా చూడటం కోసం సంక్షిప్తీకరించి ఇస్తున్నాను. దీనిలో 24 అంశాలపై తమ మీద వేస్తున్న అభాండాలు, చేస్తున్న అబద్ద ప్రచారం ఏమిటో చెబుతూనే దానికి సమాధానాలు ఇచ్చారు. అయినా దీన్ని ఏకపక్ష ప్రచారం అని ఎవరైనా అనుకుంటే అది వారి విజ్ఞతకే వదలి వేద్దాం. చైనా తాను చెప్పిన సమాధానాలకు, వివరణలకు, విమర్శలకు ఆధారాలతో సహా ఇచ్చింది. పాఠకుల సౌకర్యం, విశ్వసించని వారి నిర్ధారణ కోసం ఆ లింక్‌ను కూడా దిగువ ఇస్తున్నాను.
ఏ పదజాలం వెనుక ఏ ప్రయోజనం దాగుందో తెలియనంత కాలం జనం మోసపోతూనే ఉంటారని కమ్యూనిస్టు లెనిన్‌ చెప్పారు. ఆయన పుట్టక ముందే అమెరికా అధ్యక్షుడిగా పని చేస్తూ హత్యకు గురైన అబ్రహాం లింకన్‌ మరో విధంగా చెప్పారు. ఎవరైనా జనం మొత్తాన్ని కొంతకాలం, కొంత మందిని కొంతకాలమే వెర్రి వెంగళప్పలను చేయగలరు గానీ అందరినీ, ఎల్లవేళలా చేయలేరు అన్నారు. వెలుగు వచ్చేకొద్దీ చీకటి పారిపోతుంది, అబద్దాలు కూడా కూడా నిజం రానంతవరకే అది పెత్తనం చేస్తాయని పెద్దలు ఏనాడో చెప్పారు. ఇక ఆరోపణలు, వాటి మీద చైనా వార్తా సంస్ధ సమాధానాల సారాంశం చూద్దాం.
1.ఆరోపణ: కోవిడ్‌-19 అనేది చైనా లేదా ఊహాన్‌ వైరస్‌.
వాస్తవం : ఒక వ్యాధి పేరులో ప్రతికూల ప్రభావం చూపే అంటే అనవసరమైన భయాలు కలిగించే విధంగా ఒక ప్రాంతం, దేశం, ఆహారం, సంస్కృతి, జనాభా, పరిశ్రమ, వృత్తి లేదా జంతుజాతి పేరు ఉండకూడదని 2015 మే ఎనిమిదవ తేదీ ఐక్యరాజ్యసమితి సంస్ధలు మార్గదర్శకాలను విడుదల చేశాయి. అంతకు ముందే కొన్ని అభ్యంతరాలు ఉన్నప్పటికీ 2012లో తలెత్తిన ”మెర్స్‌” మిడిల్‌ ఈస్ట్‌ రెస్పిరేటరీ సిండ్రోమ్‌) పేరు మీద తలెత్తిన పరిస్ధితిని సమీక్షించి ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనికి అనుగుణ్యంగానే 2020 ఫిబ్రవరి 11న నోవెల్‌ కరోనా వైరస్‌ కారణంగా తలెత్తే న్యూమోనియా వ్యాధికి కరోనా వైరస్‌ డిసీజ్‌ 2019(కోవిడ్‌-19) అని పేరు పెట్టారు. అయితే బ్రిటీష్‌ సైన్స్‌ పత్రిక ఏప్రిల్‌ నెలలో ఈ సంప్రదాయాన్ని ఉల్లంఘించి రాసిన సంపాదకీయాలలో కోవిడ్‌-19ను చైనా మరియు ఊహాన్‌తో జతచేసి ప్రస్తావించి తదుపరి క్షమాపణ చెప్పింది. బిబిసి, న్యూయార్క్‌ టైమ్స్‌, అమెరికన్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కంపెనీ(ఏబిసి) వంటివి ఆసియా వాసులతో సంబంధాన్ని అంటగట్టి వార్తలను ప్రచారం, ప్రసారం చేయటంతో పశ్చిమ దేశాలలో ఆసియా వ్యతిరేకత, జాత్యంహాకార ధోరణులతో ఆసియా ఖండ పౌరులను వేధించిన ఉదంతాలు జరిగాయి.
2. ఆరోపణ: వైరస్‌ ఊహాన్‌లోనే పుట్టింది.
వాస్తవం: వైరస్‌ తొలిసారి ఊహాన్‌లో బయటపడినంత మాత్రాన అది అక్కడే పుట్టిందని అర్ధం కాదు, శాస్త్రవేత్తలు దాన్ని ఇంకా గుర్తించలేదు. ఉదాహరణకు ఎయిడ్స్‌ వ్యాధిని తొలుత అమెరికాలో గుర్తించారు. అది అక్కడ పుట్టింది కాకపోవచ్చు. అలాగే స్పానిష్‌ ఫ్లూ స్పెయిన్‌లో పుట్టలేదు అనేందుకు అనేక ఆధారాలు దొరికాయి. ఎక్కడ నుంచి తలెత్తిందన్నది శాస్త్ర అంశం. జనవరి 24న బ్రిటీష్‌ వైద్య పత్రిక లాన్‌సెట్‌లో ప్రచురితమైన విశ్లేషణలో డిసెంబరు 16 నుంచి జనవరి రెండవ తేదీ వరకు ఊహాన్‌ నగరంలో నిర్ధారణ అయిన 41కరోనా కేసులలో 27 మందికి ఊహాన్‌ సముద్ర ఉత్పత్తుల మార్కెట్‌లో సోకినట్లు తేలింది, మిగిలిన వారికి వేరే ప్రాంతాలలో సోకింది. తొలి రోగిని డిసెంబరు ఒకటవ తేదీన గుర్తించారు. అతనికీ మార్కెట్‌కు ఎలాంటి సంబంధం లేదు, కుటుంబ సభ్యులకు శ్వాస సంబంధ సమస్యలు తలెత్తలేదు. అతని నుంచి ఇతరులకు వ్యాపించిందనే ఆధారాలు దొరకలేదు. వైరస్‌ ఎక్కడ ఉద్బవించింది అనే అంశంలో అమెరికా నుంచి తమ సంస్ధకు ఎలాంటి సమాచారం లేదా నిర్ధిష్ట రుజువులు అందలేదని మే ఒకటవ తేదీన ప్రపంచ ఆరోగ్య సంస్ధ అత్యవసర కార్యక్రమాల డైరెక్టర్‌ డాక్టర్‌ మైఖేల్‌ ర్యాన్‌ చెప్పారు. అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలోని బెలెవిలే మేయర్‌ మైఖేల్‌ మెల్‌హామ్‌ తనకు కరోనా పాజిటివ్‌ వచ్చిందని, ఇదే వైరస్‌తోనే తాను 2019నవంబరులో కూడా అస్వస్తతకు గురై ఉండవచ్చని చెప్పారు. అంటే అది అమెరికాలో బయటపడిన తొలి కేసు జనవరి 20కి రెండునెలల ముందునాటి సంగతి. మే ఆరవ తేదీన యుఎస్‌ఏ టుడే వెల్లడించిన సమాచారం ప్రకారం ఫ్లోరిడాలో జనవరి ప్రారంభంలోనే 171 మందిలో కరోనా లక్షణాలు కనిపించాయి, అయితే వారెవరూ చైనాకు ప్రయణించిన వారు కాదు.
మే మూడవ తేదీన యాంటీమైక్రోబియల్‌ ఏజంట్స్‌ అనే అంతర్జాతీయ పత్రికలో ప్రచురించిన వ్యాసంలో 2019 డిసెంబరు చివరి నుంచే సారస్‌-కోవ్‌-2 వైరస్‌ ఫ్రాన్స్‌లో వ్యాప్తి చెందినట్లు పేర్కొన్నారు. డిసెంబరు రెండు నుంచి జనవరి 16వరకు ఫ్లూ లక్షణాలతో ఐసియులో చికిత్స పొందిన 14 మందికి ఏప్రిల్‌ ఆరు-తొమ్మిదవ తేదీల మధ్య ఆర్‌టి-పిసిఆర్‌ పరీక్ష చేశారు.వారిలో 42ఏండ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్‌ బయటపడింది. అయితే అతనేమీ ఇటీవలి కాలంలో చైనా లేదా మరో విదేశీ ప్రయాణం చేయలేదు.

Political cartoons: Donald Trump blasts Google
3. ఆరోపణ: వైరస్‌ను ఊహాన్‌ వైరాలజీ సంస్ధలో తయారు చేశారు
వాస్తవం: అందుబాటులో ఉన్న రుజువులన్నీ సహజంగానే పుట్టినట్లు చూపుతున్నాయి. కృత్రిమంగా తయారు చేసింది కాదు. జనవరి 30వ తేదీ లాన్‌సెట్‌ వైద్య పత్రిక వ్యాసం ప్రకారం మిగతా వైరస్‌లతో పోల్చితే గుడ్లగూబల నుంచే వ్యాప్తి చెందినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 19వ తేదీన ఎనిమిది దేశాలకు చెందిన 27 మంది ప్రముఖ నిపుణులు చేసిన ప్రకటనలో కరోనా వైరస్‌ మిగతా వాటి మాదిరే వన్య ప్రాణుల నుంచి వచ్చినట్లు పేర్కొన్నారు. మార్చి 17న అమెరికా, బ్రిటన్‌, ఆస్ట్రేలియాలకు చెందిన ఐదుగురు ప్రముఖ నిపుణులు వైరస్‌ను ప్రయోగశాలలో తయారు చేయలేదని, పని గట్టుకొని వ్యాపింప చేయలేదని తెలిపారు. మార్చి 26న అమెరికా జాతీయ ఆరోగ్య సంస్ధ డైరెక్టర్‌ ఫ్రాన్సిస్‌ కోలిన్స్‌ రాసిన వ్యాసంలో సహజంగానే కరోనా వైరస్‌ పుట్టిందని, ఎవరూ తయారు చేయలేదని పేర్కొన్నారు. ఏప్రిల్‌ 21న ప్రపంచ ఆరోగ్య సంస్ధ ప్రతినిధి ఫడేలా చాయిబ్‌ మాట్లాడుతూ వైరస్‌ జంతువుల నుంచే వచ్చిందని అయితేగబ్బిలాల నుంచి మానవులకు ఎలా వచ్చిందన్నది ఇప్పటికీ అంతుబట్టలేదన్నారు. ఏప్రిల్‌ 30న అమెరికా జాతీయ గూఢచార డైరెక్టర్‌ కార్యాలయం తన అధికారిక వెబ్‌సైట్‌లో వెల్లడించిన ప్రకారం కరోనా వైరస్‌ కృత్రిమంగా తయారు చేసింది లేదా జన్యుమార్పిడి చేసింది కాదనే శాస్త్రవేత్తల అభిప్రాయంతో గూఢచార సమాజం ఏకీభవిస్తున్నదని పేర్కొన్నారు. మే ఒకటవ తేదీన ప్రపంచ ఆరోగ్య సంస్ధ అత్యవసర కార్యక్రమ డైరెక్టర్‌ మైఖేల్‌ ర్యాన్‌ మాట్లాడుతూ వైరస్‌ జన్యుక్రమం గురించి అనేక మంది శాస్త్రవేత్తలు చెప్పినదాని ప్రకారం సహజంగా ఉద్భవించిందే అన్నారు. మే ఐదవ తేదీన అదే సంస్ధ ప్రతినిధి డాక్టర్‌ గువ్‌డెన్‌ గాలెయా కూడా అదే చెప్పారు. ఫ్రెంచి పత్రి వాలెర్‌ యాక్ట్యువల్‌ తమ దేశ గూఢచార వర్గాలను ఉటంకిస్తూ వైరస్‌ ఊహాన్‌లోని పి4లాబ్‌ నుంచి వెలువడలేదని పేర్కొన్నది.
4 ఆరోపణ : ఊహాన్‌ వైరాలజీ సంస్ధ నుంచి ప్రమాదవశాత్తూ వైరస్‌ లీకైంది.
వాస్తవం: ఊహాన్‌ నేషనల్‌ బయోసేఫ్టీ లాబరేటరీ(పి4) చైనా-ఫ్రెంచి ప్రభుత్వాల సహకారం కింద అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మితమైంది. దీనిలో పనిచేసే తొలి బృందం సిబ్బందికి ఫ్రాన్స్‌, అమెరికాలోనే శిక్షణ ఇచ్చారు. ఇక్కడి సౌకర్యాలు, పరికరాలను మూడవ పక్షం ప్రతిఏటా తనిఖీ చేస్తుంది. తనిఖీలో అన్నీ సక్రమంగా ఉన్నట్లు నిర్ధారితమైన తరువాతే పని చేయటాన్ని అనుమతిస్తారు. ఆ లాబ్‌కు కృత్రిమ వైరస్‌ తయారు చేసే సామర్ధ్యం లేదు, వైరస్‌ లీకై సిబ్బందికి సోకిన రుజువులేదు. ఈ లాబ్‌ కార్యకలాపాల గురించి, కరోనా వైరస్‌ గురించి తెలుసుకొనేందుకు యావత్‌ ప్రపంచం నుంచి ఆరులక్షల మంది వెబ్‌సైట్‌ను దర్శించగా 2.1కోట్ల డౌన్లోడ్‌లు నమోదయ్యాయి. ఎలర్జీ మరియు అంటువ్యాధుల అమెరికా జాతీయ సంస్ధ డైరెక్టర్‌ ఆంథోనీ ఫౌసీ మే4న మాట్లాడుతూ చైనా లాబ్‌లో వైరస్‌ తయారు కాలేదని, ప్రకృతిలోనే పుట్టి జంతువుల్లోకి ప్రవేశించినట్లు కనిపిస్తోందని అన్నారు. జంతువుల నుంచి సోకిన వైరస్‌ను లాబ్‌కు తెచ్చినపుడు ప్రమాదవశాత్తూ అక్కడి నుంచి లీకైందన్న కథనాన్ని తాను నమ్మటం లేదన్నారు. వైరస్‌ కృత్రిమ సృష్టి అని ఎలాంటి రుజువులు లేవని బ్రిటీష్‌ ఆరోగ్య మంత్రి మాట్‌ హనాక్‌ అక్కడి పత్రిక ఇండిపెండెంట్‌ ఇంటర్వ్యూలో చెప్పారు.
5. ఆరోపణ: ఊహాన్‌లో వైరస్‌ను అరికట్టిన చైనా తమ జాతీయులను మిలన్‌, న్యూయార్క్‌ ఇతర నగరాల్లో వైరస్‌ను వ్యాప్తి చేసేందుకు పంపింది.
వాస్తవం: స్వల్ప వ్యవధిలోనే చైనా కఠిన చర్యలు తీసుకుంది. చైనా నుంచి బయటకు చాలా తక్కువగా వ్యాప్తి చెందినట్లు గణాంకాలు చెబుతున్నాయి. జనవరి 23 నుంచి ఏప్రిల్‌ ఎనిమిది వరకు ఊహాన్‌ నగరం లాక్‌డౌన్‌లో ఉంది. ఈ సమయంలో నగర వాసులు బయటకు వెళ్లలేదు. జనవరి 23న అమెరికాలో ఒక కేసు నమోదైంది. ఫిబ్రవరి రెండున అమెరికా తన సరిహద్దులను మూసివేసింది. అంతకు ముందు కేవలం ఎనిమిది కేసులు మాత్రమే అమెరికాలో నమోదయ్యాయి. మార్చి 13న అమెరికా జాతీయ అత్యవసర పరిస్ధితిని ప్రకటించింది. ఆరోజుకు 1,896 కేసులు నిర్ధారణ అయ్యాయి. చైనాలో లాక్‌ డౌన్‌ ఎత్తివేసిన ఏప్రిల్‌ 8వ తేదీనాటికి అమెరికాలో కేసులు నాలుగు లక్షలకు పెరిగాయి. ఒకటి నుంచి పది లక్షలకు పెరగటానికి అమెరికాలో వందరోజుల కంటే తక్కువే పట్టింది. తమ రాష్ట్రానికి చైనా నుంచి వైరస్‌ రాలేదని నార్త్‌ఈస్ట్రన్‌ యూనివర్సిడీ పరిశోధన వెల్లడించినట్లు న్యూయార్క్‌ గవర్నర్‌ ఆండ్రూ కుమో చెప్పారు. న్యూయార్క్‌ కరోనా వైరస్‌ ఆసియా నుంచి వచ్చింది కాదని అమెరికా పరిశోధనను ఉటంకిస్తూ న్యూయార్క్‌ టైమ్స్‌ వార్తను ప్రచురించింది. తమ దేశానికి అమెరికా సందర్శకులు వైరస్‌ను తీసుకు వచ్చినట్లు కెనడా సమాచారం వెల్లడించింది. గుర్తు తెలియని వనరు నుంచి ఫ్రాన్స్‌లో స్ధానికంగానే వైరస్‌ వ్యాపించిందని, చైనా, రష్యాల నుంచి రాలేదని ఫ్రెంచి పరిశోధనా సంస్ధ పాస్టర్‌ వెల్లడించింది.
6.ఆరోపణ: చైనీయులు గబ్బిలాలను తింటూ వైరస్‌ను వ్యాపింప చేశారు.
వాస్తవం: చైనీయుల ఆహారంలో ఎన్నడూ గబ్బిలాలు లేవు. ఒక చైనా మహిళ గుడ్ల గూబ చారు తాగుతున్నట్లు చూపే వీడియో ఇంటర్నెట్‌లో తిరుగుతోంది. ఒక చిన్న పసిఫిక్‌ దీవిలో విహార యాత్రల ప్రచారంలో భాగంగా ఆమె బృందం తీసిన వీడియో అది, దాన్ని 2016లోనే ఆన్‌లైన్‌లోనే పోస్టు చేశారు. గబ్బిలాల చారు అక్కడి ప్రత్యేకత.
7.ఆరోపణ: చైనా వన్య ప్రాణుల మార్కెట్లను తెరిచింది.
వాస్తవం: చైనాలో వన్య ప్రాణుల మార్కెట్లనేవి లేవు. వాటిని వేటాడటం, అమ్మకాలను చైనా నిషేధించింది. కోళ్లు, చేపల వంటి సముద్ర ఉత్పత్తులను మాత్రమే ప్రాణాలతో విక్రయించే మార్కెట్లు ఉన్నాయి. ఇలాంటివి ఒక్క చైనాలోనే కాదు అనేక దేశాలలో ఉన్నాయి. అలాంటి అమ్మకాలను నిషేధించే అంతర్జాతీయ చట్టాలు లేవు. రైతు బజార్లనే ఊహాన్‌లో తెరిచారు. ఊహాన్‌, హుబెరు, హునాన్‌లోని సముద్ర ఉత్పత్తుల మార్కెట్లు ఇప్పటికీ మూసివేసి ఉన్నాయి.
8 ఆరోపణ: వైరస్‌ వ్యాప్తి గురించి తొలి రోజుల్లో దాచి పెట్టింది, వెల్లడించటం ఆలస్యం చేసింది. దాంతో వ్యాప్తి పెరిగింది.
వాస్తవం: ఆకస్మికంగా గుర్తు తెలియని వైరస్‌ దాడి జరిగినపుడు అవగాహన, అధ్యయనం చేసేందుకు సమయం పడుతుంది. డిసెంబరు 27న న్యూమోనియాతో రోగులు ఉన్నట్లు గుర్తించారు. అదే రోజు వెల్లడించారు. మూడు రోజుల తరువాత కారణం తెలియని న్యూమోనియా గురించి ప్రకటించారు.డిసెంబరు 31న దీని గురించి ప్రపంచ ఆరోగ్య సంస్ధకు తెలిపారు. జనవరి మూడు నుంచి ప్రపంచ ఆరోగ్య సంస్ధకు, అమెరికా ఇతర దేశాలకు క్రమం తప్పకుండా సమాచారాన్ని వెల్లడించారు. ఫిబ్రవరి మూడు వరకు 30సార్లు అమెరికాకు సమాచారం తెలియచేశారు. జనవరి ఏడవ తేదీ నాటికి జన్యుక్రమాన్ని గుర్తించారు. పదకొండవ తేదీన ఆ సమాచారాన్ని ఇతర దేశాలకు అందచేశారు. వెంటనే నివారణ కిట్ల తయారీకి ఉపక్రమించారు. ఇరవై నాలుగవ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో సమాచారాన్ని వెల్లడిస్తున్నారు. చైనాలో వైరస్‌ గురించి ప్రకటన చేసిన 70రోజుల తరువాత అమెరికా అత్యవసర పరిస్ధితిని ప్రకటించింది

Sack cartoon: In Trump we trust? | Star Tribune
9.వైరస్‌ వ్యాప్తిని గోప్యంగా ఉంచిందని బయట పెట్టిన డాక్టర్‌ లీ వెనలియాంగ్‌ను అరెస్టు చేశారు.
వాస్తవం: వెనలియాంగ్‌ స్వంత సంస్ధ అక్రమాలను బయట పెట్టే వ్యక్తి కాదు, అతన్ని అరెస్టు చేయలేదు. అంటు వ్యా ధులను నిర్ధారించటానికి కఠినమైన నిబంధనలు అన్ని దేశాల్లోనూ ఉన్నాయి. ఇది సాధారణ అంశం. అంటువ్యాధుల నిర్ధారణ గురించి వెల్లడించటానికి ఒక చట్టం, పద్దతులు ఉన్నాయి. డాక్టర్‌ ఝాంగ్‌ జిక్సియాన్‌ ఒక శ్వాసనిపుణుడు, కోవిడ్‌-19 గురించి తొలిసారి నివేదించాడు, అతనికి అవార్డును ఇచ్చారు. జిక్సియాంగ్‌ నివేదించిన మూడు రోజుల తరువాత డిసెంబరు 30న, అధికారికంగా విడుదల చేయటానికి ఒక రోజు ముందు డాక్టర్‌ లీ వెనలియాంగ్‌ అనే కంటి వైద్యుడు తన సహచరులకు ఉరు ఛాట్‌ గ్రూప్‌లో ఏడు నిర్ధారితమైన సారస్‌ కేసులు ఉన్నాయని, అయితే ఈ విషయాన్ని ప్రచారం చేయవద్దని పోస్టు పెట్టాడు. అయితే అది ఇంటర్నెట్‌లో బయటకు వచ్చి భయాన్ని కలిగించింది. జనవరి మూడవ తేదీన ఊహాన్‌ పోలీసులు అతన్ని స్టేషన్‌కు పిలిపించి విచారణ జరిపి నిర్ధారణ కాని సమాచారాన్ని వెల్లడించకూడదని, ప్రచారాన్ని ఆపాలని చెప్పి అధికారయుతంగా మందలిస్తూ ఒక లేఖను ఇచ్చి పంపారు. తరువాత అతనికి వైరస్‌ సోకింది, జనవరి 31న నిర్ధారణ అయింది. ఫిబ్రవరి ఏడవ తేదీన అతను మరణించాడు. అతనికి సంబంధించిన అంశాల మీద దర్యాప్తు జరపాలని ఒక బృందాన్ని నియమించారు. మార్చి 19న దర్యాప్తు నివేదికను వెల్లడించారు.అతని విషయంలో చట్టపరమైన అంశాలను తప్పుగా అన్వయించారని, మందలింపు లేఖను రద్దు చేయాలని సిఫార్సు చేశారు. డాక్టర్‌ లీ మంచి వైద్యుడు, కమ్యూనిస్టు పార్టీ సభ్యుడు, ప్రభుత్వ వ్యతిరేకి కాదు, మార్చి ఐదున కరోనా వ్యతిరేక పోరులో మరణించిన ఆదర్శ జాతీయ ఆరోగ్య కార్యకర్తగా లీని ప్రకటించి ఒక అమర జీవిగా ఏప్రిల్‌ రెండున గౌరవించారు. ప్రభుత్వ వ్యతిరేకిగా లీని చిత్రించటం అతన్ని, అతని కుటుంబాన్ని అగౌరవ పరచటమే.
10.మనుషుల నుంచి మనుషులకు వైరస్‌ వ్యాపిస్తుందని వెల్లడించటంలో చైనా చాలా ఆలస్యం చేసింది. దాంతో తగిన సమాచారం లేక అమెరికా, ఇతర దేశాలు వెంటనే స్పందించటంలో విఫలమయ్యాయి.
వాస్తవం: చైనా, ప్రపంచ ఆరోగ్య సంస్ధ నుంచి వర్తమానాలు సకాలంలోనే గట్టిగానే వెళ్లాయి, అమెరికాకు తొలి నుంచీ అన్నీ తెలుసు. ఒక కొత్త వైరస్‌ ఒక మనిషి నుంచి మరొక మనిషికి సోకుతుందా లేదా అని తెలుసుకొనేందుకు కఠినమైన శాస్త్రీయ క్రమం ఉంటుంది. జనవరి తొమ్మిదిన నోవెల్‌ కరోనా వైరస్‌ అని చైనా నిపుణులు ప్రకటించారు. ఇరవయ్యవ తేదీన ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి సోకుతుందని నిర్ధారించారు. అప్పటికి అమెరికాలో నిర్దారిత కేసులు లేవు. ఇరవై మూడవ తేదీన కోటీ 20లక్షల మంది జనాభా ఉన్న ఊహాన్‌ నగరాన్ని లాక్‌డౌన్‌ చేసి ప్రపంచానికి గట్టి హెచ్చరికను పంపింది. ఆరోజుకు అమెరికాలో ఒకే ఒక్క కేసు నమోదైంది.అంతకు ముందు రోజు ప్రపంచ ఆరోగ్య సంస్ధ మానవుల్లో వ్యాప్తి గురించి వెల్లడించింది, 27వ తేదీ ప్రమాద తీవ్రతను పెంచింది, 30వ తేదీన మహమ్మారిగా మారినట్లు వెల్లడించింది. ఊహాన్‌లోని తన రాయబార కార్యాలయ సిబ్బందిని వెనక్కు పిలిపించి, జనవరి 25వ తేదీ నుంచి కార్యాలయాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించిన తొలి దేశం అమెరికా. ఫిబ్రవరి రెండున తన సరిహద్దులను మూసివేస్తూ చైనా పౌరులు అంతకు ముందు 14రోజులు చైనాలో ఉన్న ఇతర దేశీయులకు ప్రవేశం లేదని నిషేధించింది. ఆరోజున అమెరికాలో కేవలం ఎనిమిది కేసులే ఉన్నాయి. మార్చి తొలి వారం వరకు అమెరికా తీవ్ర సమస్యగా పరిగణించలేదు. అమెరికా సమస్యలకు చైనా కారణమని చెప్పటం పెద్ద అబద్దం అని అమెరికా ప్రముఖ ఆర్ధికవేత్త జెఫ్రీ సాచ్స్‌ పేర్కొన్నారు. తాము డిసెంబరులోనే ప్రపంచ ఆరోగ్య సంస్ధను హెచ్చరించామని చైనా రాష్ట్రమైన తైవాన్‌ అధికారులు పేర్కొన్నారు. అయితే డిసెంబరు 31న తమకు తైవాన్‌ నుంచి వచ్చిన ఇమెయిల్‌లో ప్రత్యేక లక్షణాలు గల న్యూమోనియా కేసుల గురించి వచ్చిన వార్తలను ఉటంకిస్తూ తమకు దాని గురించి మరింత సమాచారం కావాలని అడిగారు తప్ప దానిలో హెచ్చరికలు లేవని ప్రపంచ ఆరోగ్య సంస్ద వివరణ ఇచ్చింది.
11.ఆరోపణ: చైనాలో కేసులు, మరణాల గురించి వాస్తవాలు చెప్పటం లేదు, ప్రకటించిన దాని కంటే 50రెట్లు ఎక్కువ.
వాస్తవం: కరోనా సమాచారం విషయంలో చైనా పారదర్శకంగా ఉంది. జనవరి 21 నుంచి ప్రతి రోజూ అధికారికంగా సమాచారాన్ని వెల్లడించింది.జాతీయ, ప్రాంతీయ స్ధాయిలో మూడువేలకు పైగా పత్రికా గోష్టులు నిర్వహించారు. ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకున్నకారణంగానే కేసులు, మరణాలు తగ్గాయి. వ్యాధి గ్రస్తులను ఇతరుల నుంచి పూర్తిగా వేరుచేశారు. ఈ చర్యల కారణంగా ఏడు లక్షల కేసులను నివారించినట్లు సైన్సు పత్రిక అంచనా వేసింది.
12.ఆరోపణ: ఊహాన్‌లో వైరస్‌ కేసుల సంఖ్యను తరువాత సవరించటం కేసులను తొక్కిపెట్టారన్నదానికి నిదర్శనం.
వాస్తవం: సమాచార సమీక్ష, సవరణ అంతర్జాతీయంగా సాధారణంగా జరిగేదే. దీనికి కారణాలు ఇలా ఉన్నాయి. ఒక్కసారిగా ఆసుపత్రులు రోగులతో నిండిపోవటంతో అనేక మంది ఆసుపత్రులకు రాకుండానే ఇండ్ల దగ్గరే మరణించారు. ఆసుపత్రులన్నీ నిండిపోవటంతో ఆరోగ్య కార్యకర్తలు కేసులన్నీ నమోదు చేయలేని స్ధితి ఏర్పడింది లేదా ఆలస్యం అయింది. తక్కువ సంఖ్యలోనే ఉన్నప్పటికీ ప్రయివేటు ఆసుపత్రులు, సంచార వైద్యశాలలు, కొన్ని సంస్ధలలో చికిత్స పొందిన వారు, మరణించిన వారిని జాబితాలకు అందచేయలేదు. కొన్ని కేసులు ఒకటికి రెండుసార్లు నమోదు కావటం, కొన్ని అసంపూర్ణంగా ఉండటం వంటి కారణాల వలన సమాచారాన్ని సరి చేసి సవరించారు. ఇది అంతర్జాతీయంగా జరుగున్నదే. ఉదాహరణకు బ్రిటన్‌లో ఆసుపత్రుల వెలుపల మరణించిన వారిని లెక్కించలేదు, తరువాత దాన్ని సరిచేశారు. స్పెయిన్‌ ప్రభుత్వం కూడా తమ సమాచారాన్ని సవరిస్తామని ప్రకటించింది.

trump lies
13. ఆరోపణ: కరోనా వైరస్‌ గురించి చైనా తప్పుడు సమాచారాన్ని వ్యాపింప చేస్తోంది.
వాస్తవం: తప్పుడు సమాచార బాధితురాలు చైనా. అమెరికా రాజకీయవేత్తలు, పండితులు, మీడియా చైనా వ్యతిరేక ప్రచారం చేస్తోంది.
14.ఆరోపణ:చైనా రాజకీయ వ్యవస్ధ సమస్యలకు మూలం.
వాస్తవం: సామాజిక వ్యవస్ధ లేదా భావజాలానికి వైరస్‌కు సంబంధం లేదు. వైరస్‌ను అరికట్టటంలో చైనా పౌరులు విజయం సాధించారు. నూటనలభై కోట్ల మందిని ఐక్యపరచటంలో రాజకీయ వ్యవస్ధ విజయం సాధించింది. ఒక అభివృద్ది చెందుతున్న దేశంగా చైనా సమస్యలను అధిగమించాల్సి ఉంది. వెయ్యి పడకల ఆసుపత్రిని పది రోజుల్లో, 1600 పడకల ఆసుపత్రిని 15 రోజుల్లో నిర్మించేందుకు చైనా రాజకీయ వ్యవస్ద పెద్ద ఎత్తున మానవ, వస్తుసామగ్రిని సమీకరించగలిగింది. రోజు లేదా ఒకటిన్నర రోజుల వ్యవధిలో 13వేల మంది రోగులను చేర్చేందుకు వీలుగా మరో 16 సంచార వైద్యశాలలను ఏర్పాటు చేసింది. వైరస్‌ నుంచి జనాన్ని రక్షించేందుకు గాను 13,800 గృహ సముదాయాలకు ఊహాన్‌ నగరంలో 44,500 మంది స్ధానిక పార్టీ కార్యకర్తలను సమీకరించి, భౌతిక దూరం పాటింపు, తదితర చర్యలను గట్టిగా అమలు జరిపింది. సింగపూర్‌లోని బ్లాక్‌బాక్స్‌ పరిశోధనా సంస్ద జరిపిన సర్వేలో 23దేశాల్లో తీసుకున్న చర్యల గురించి ప్రశ్నించగా చైనాకు నూటికి 85మార్కులు వచ్చి అగ్రస్ధానంలో నిలిచింది. సంక్షోభం నుంచి దేశం బయటపడగలదని 85శాతం మంది చైనీయులు విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అదే అమెరికాలో 11, ఐరోపా యూనియన్‌లో 15,భారత్‌లో పదిశాతం మాత్రమే ఉన్నారు.
15. ఆరోపణ : నిజాలను బయట పెట్టకుండా అమెరికా విలేకర్లను చైనా నుంచి బహిష్కరించారు.
వాస్తవం: చాలా కాలంగా అమెరికా తీసుకుంటున్న చర్యలకు ప్రతిచర్య తప్ప మరొకటి కాదు. ఇటీవలి కాలంలో అమెరికా పరోక్ష చర్యల ద్వారా మీడియా సిబ్బందిని పరిమితం చేసి 60 మంది చైనా జర్నలిస్టులను బహిష్కరించింది. వీసాల విషయంలో కూడా అమెరికా అనుచితంగా వ్యవహరిస్తోంది.
16. ఆరోపణ: ప్రపంచ ఆరోగ్య సంస్దకు చైనా లంచాలు ఇచ్చి అదుపు చేస్తోంది.
వాస్తవం: చైనా ఎన్నడూ ఆ సంస్ధను అదుపు చేసేందుకు ప్రయత్నించలేదు.సంస్ధలో 194 దేశాలకు సభ్యత్వం ఉండగా ప్రధాన కార్యాలయంలో పని చేసే 21 మంది నాయకత్వ బృందంలో 11 మంది అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, ఐరోపా యూనియన్‌కు చెందిన వారే కాగా చైనా నుంచి ఒకే ఒక్కరు ఉన్నారు. వారందరూ నిపుణులే. 2018,19 సంవత్సరాలలో అమెరికా, జపాన్‌ తరువాతనే చైనా అతి పెద్ద దాతగా ఉంది. సభ్యత్వం, విరాళాన్ని పరిగణనలోకి తీసుకుంటే చైనా తొమ్మిదవ స్దానంలో ఉంది.చైనా వాణిజ్య సంస్ధలు, ప్రభుత్వేతర సంస్ధలు ఇచ్చిన మొత్తాలను మినహాయిస్తే చైనా స్ధానం ఇంకా దిగజారుతుంది.
17.ఆరోపణ: మనుషల నుంచి మనుషులకు సోకుతుందని డిసెంబరు 31వ తేదీనే తైవాన్‌ సమాచారమిచ్చినా ప్రపంచ ఆరోగ్య సంస్ద తీవ్రంగా పరిగణించలేదు.
వాస్తవం: తైవాన్‌ రాష్ట్రం ఆరోగ్య సంస్దకు ఎలాంటి హెచ్చరికను పంపలేదు.వ్యాధి గురించి ఊహాన్‌ మున్సిపల్‌ అధికారులు వెల్లడించిన తరువాత అదనపు సమాచారం కావాలని ఆరోగ్య సంస్దను తైవాన్‌ కోరింది. అదే విధంగా చైనా జాతీయారోగ్య సంస్ధకూ లేఖ రాసింది.తైవాన్‌తో ఆరోగ్యం, వైద్యానికి సంబంధించి ఉన్న ఒప్పందం మేరకు వెంటనే సమచారాన్ని పంపారు. అదే రోజు తైవాన్‌ ఆరోగ్య సంస్ధకు ఇమెయిల్‌ పంపింది.
18. ఆరోపణ: ప్రపంచ ఆరోగ్య సంస్ధలో చేరేందుకు తైవాన్‌ ప్రయత్నాన్ని చైనా అడ్డుకుంది. తద్వారా అక్కడి పౌరుల ఆరోగ్యానికి ముప్పు తెచ్చింది.
వాస్తవం: చైనాలో అంతర్భాగమైన తైవాన్‌కు ఆరోగ్య సంస్దలో చేరేందుకు హక్కు లేదు. సర్వసత్తాక దేశాలకు మాత్రమే దానిలో చేరే హక్కు ఉంది. సాంకేతిక సహకారం వాటి మధ్య నిరాఘాటంగా కొనసాగుతోంది. తైవాన్‌ నిపుణులు అనేక సమావేశాలకు హాజరయ్యారు. తైవాన్‌ నుంచి ఊహాన్‌కు సైతం నిపుణులు వచ్చారు.
19. ఆరోపణ: ప్రపంచ వ్యాపితంగా వైరస్‌ వ్యాపించటానికి చైనాయే కారణం కనుక, ఆ విషయాలపై దర్యాప్తు జరపాలి, పరిహారం చెల్లించాలి.
వాస్తవం: చైనాయే బాధ్యురాలని, పరిహారం కోరేందుకు చట్టపరంగా ఎలాంటి అవకాశాలు లేవు. స్ధానిక రాజకీయ అజెండా కారణంగా అమెరికా రాజకీయవేత్తలు చైనా మీద నెపం వేస్తున్నారు. చైనా కూడా బాధిత దేశమే. ఒక చోట తొలుత వెల్లడైనంత మాత్రాన ఆ దేశం నష్టపరిహారం చెల్లించాలని ఎక్కడా లేదు.1980దశకంలో ఎయిడ్స్‌ తొలుత అమెరికాలో బయటపడింది, అప్పటి నుంచి పరిహారం చెల్లించాలని దాన్ని ఎవరూ అడగలేదు. ప్రజారోగ్యం గురించి అమెరికాతో చైనాకు ఎలాంటి ఒప్పందమూ లేదు.
20. ఆరోపణ: వైరస్‌ నుంచి లబ్దిపొందేందుకు వైద్య సరఫరాలను చైనా దాచిపెట్టింది. అమెరికాలో వెంటిలేటర్ల వంటి వాటికి కొరత ఏర్పడటానికి ఇదే కారణం.
వాస్తవం: దేశీయంగా వైరస్‌ను ఎదుర్కొంటూనే ఇతర దేశాలకు సాయపడేందుకు చైనా తన శక్తికొద్దీ ప్రయత్నించింది. ఇప్పటికి 150దేశాలకు వైద్య సరఫరాలు చేసింది. మార్చి ఒకటి నుంచి ఏప్రిల్‌ 30వరకు 71.2బిలియన్ల వైద్య పరికరాలను ప్రపంచ దేశాలకు సరఫరా చేసింది. మార్చి ఒకటి మే అయిదవ తేదీల మధ్య అమెరికాకు చైనా నుంచి 6.6బిలియన్ల ముఖతొడుగులు,344 మిలియన్‌ జతల సర్జికల్‌ తొడుగులు, 44.09 మిలియన్ల రక్షణ సూట్లు, 6.75 మిలియన్ల కళ్లద్దాలు, ఏడున్నర వేల వెంటిలేటర్లను సరఫరా చేశారు. ఇవిగాక అమెరికాలోని 30 రాష్ట్రాలు, 55 నగరాలకు అనేక లక్షల కిట్లు, తొడుగులు మొదలైన వాటిని విరాళంగా పంపారు.
21. ఆరోపణ: ఇతర దేశాలకు మహమ్మారి వ్యతిరేక సాయంలో కూడా చైనా రాజకీయ, ప్రచార కండూతితో వ్యవహరించింది.
వాస్తవం: వైరస్‌ను ఎదుర్కోవటంలో ఇతర దేశాలు చైనాకు చేసిన సాయానికి ప్రతిగానే చైనా కూడా సాయం చేసింది. చైనా నిపుణులు 120 వీడియో కాన్ఫరెన్సుద్వారా 160దేశాల వారితో అనుభవాలను పంచుకున్నారు. పందొమ్మిది దేశాలకు 21 చైనా బృందాలు వెళ్లాయి.
22. ఆరోపణ: డోనాల్డ్‌ ట్రంప్‌ తిరిగి ఎన్నిక అవకుండా అమెరికా ఎన్నికల్లో చైనా జోక్యం చేసుకుంటోంది.
వాస్తవం: చైనా ఏ దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోరాదనే సూత్రానికి కట్టుబడి ఉంది. అమెరికాలోని కొందరు రాజకీయవేత్తలే అక్కడి ఎన్నికల్లో చైనా వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో చైనా మీద దాడిని ఎక్కుపెట్టాలని రిపబ్లికన్‌ పార్టీ సెనెటోరియల్‌ కమిటీ 57పేజీల పత్రాన్ని ప్రచార విభాగానికి అందచేసినట్లు పొలిటికో పత్రిక వెల్లడించింది. కరోనా వైరస్‌కు చైనాయే కారణమని, దాన్ని దాచిపెట్టిందని, డెమోక్రాట్లు చైనా పట్ల సానుకూలంగా ఉన్నారని, తాము ఎన్నికైన తరువాత వైరస్‌ను వ్యాప్తి చేసినందుకు చైనా మీద ఆంక్షలు విధిస్తామని ప్రచారం చేయాలని దానిలో పేర్కొన్నారు.

Cartoon Movement - Trump Lies
23.ఆరోపణ : కిట్స్‌, మాస్కులు, వెంటిలేటర్ల ఎగుమతుల గురించి ఎగుమతిదారులు కస్టమ్స్‌ వివరాలు వెల్లడించాలని చైనా కోరింది, ఎగుమతులపై నిషేధం విధించేందుకు అలా చేశారు.
వాస్తవం: నాణ్యతా ప్రమాణాల మెరుగుదల కోసమే ఆ సమాచారాన్ని అడిగారు. ఈ చర్యలు మంచి ఫలితాలనిచ్చాయి. నాణ్యత లేని ఉత్పత్తులను నిరోధించటానికి, కనుగొనేందుకు తోడ్పడింది. త్వరగా కస్టమ్స్‌ అనుమతులు ఇవ్వటానికి వీలు కలిగించింది. ఎగుమతుల మీద ఎలాంటి ఆంక్షలు విధించలేదు.
24. ఆరోపణ: ఆఫ్రికన్ల విషయంలో గువాంగ్‌డోంగ్‌లో వివక్ష ప్రదర్శించారు.

వాస్తవం:చైనీయులు, విదేశీయులెవరైనా ఎలాంటి వివక్ష చూపలేదు. స్ధానికంగా ఎన్ని ఇబ్బందులు పడినా హుబెరు రాష్ట్రంలోని మూడువేల మంది ఆఫ్రికన్‌ విద్యార్ధుల సంక్షేమానికి చర్యలు తీసుకుంది. ఒక విద్యార్ధికి వైరస్‌ సోకితే వెంటనే చికిత్స అందించారు. ఏప్రిల్‌13న గ్వాంగ్‌డోంగ్‌లో విదేశాల నుంచి వచ్చిన వారిలో 26 మందికి వైరస్‌ ఉంది, వారిలో 19 మంది ఆఫ్రికన్లు ఉన్నారు.ఎవరినీ లక్ష్యంగా చేసుకొని చర్యలు తీసుకోలేదు. ఊహాన్‌ వీధుల్లో కెనియన్‌ దంపతుల మీద దాడి జరిగినట్లు బిబిసి ఏప్రిల్‌ 17న బిబిసి ప్రసారం చేసింది. నిజానికి అది అమెరికాలోని న్యూయార్క్‌ నగరంలో జరిగింది.

http://www.xinhuanet.com/english/2020-05/10/c_139044103.htm

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

దేశంలో ఏం జరుగుతోంది, మనం దేన్నయినా పట్టించుకుంటున్నామా !

10 Sunday May 2020

Posted by raomk in BJP, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

coronavirus narendra modi, covid 19 India Stimulus package, Covid-19 lockdown

Coronavirus: PM Modi to address nation on Thursday - INDIA ...

ఎం కోటేశ్వరరావు
దేశంలో ఏమి జరుగుతోంది ? బుద్ధి జీవులు(మేథావులు) ఏమి ఆలోచిస్తున్నారు, ఏమి చేస్తున్నారు, ఏ దిశానిర్దేశం చేస్తున్నారు. వివిధ తరగతులు ఏమి ఆలోచిస్తున్నాయి,ఏం చేయాలనుకుంటున్నాయి? మన చుట్టూ జరుగుతున్న వాటి గురించి పట్టించుకుంటున్నామా? మనమేం చేస్తున్నామో మనకు తెలుస్తోందా ? ఇది ఒక ఆలోచన మాత్రమే, ఆసక్తి ఉన్నవారు మాత్రమే ముందుకు పోండి, ఆల్‌ ఈస్‌ వెల్‌ (అంతా బాగుంది ) అనుకుంటున్నవారు చదివి ఇబ్బంది పడకండి. ఆలోచనా పరులైతై మీ భావాలను బయట పెట్టండి. దేశంలో ఇంకా ప్రజాస్వామ్యం కాస్త బతికే ఉంది. జరుగుతున్నవి నాకు సంబంధం లేనివి కదా నేనెందుకు మాట్లాడాలి అనుకోకండి. మీవరకు వచ్చే సరికి మీకోసం మాట్లాడేవారు మిగలరని తెలుసుకోండి.
గృహబందీ శాశ్వతం కాదని,పరిమితకాలమైనా తప్పదని తెలుసు. గతంలో నరేంద్రమోడీ అనాలోచితంగా పెద్ద నోట్లను రద్దు చేసినపుడు జనం నీరాజనాలు పట్టారు. ఇప్పుడు గృహబందీ ప్రకటించినా అనేక మంది కోటీశ్వరులు, మధ్యతరగతి, చీకట్లో ఉన్న వారు అదే చేస్తున్నారు. నోట్ల రద్దు జనం, ఆర్ధిక వ్యవస్ధ ప్రాణాలు తీసింది. రెండవది జాగ్రత్తలు పాటించిన వారి ప్రాణాలు కాపాడుతుంది. మొదటి చర్య మోడీ స్వమస్తిష్కం నుంచి పుడితే, రెండవది చైనా నుంచి అరువు తెచ్చుకున్నది.(చైనా వస్తువులను, దాని కమ్యూనిస్టు ఆలోచనలను బహిష్కరించాలని చెప్పేవారు దీని గురించి మౌనం దాల్చారు ఎందుకో మరి )
ప్రపంచంలో జిడిపిలో ఐదో స్ధానంలో ఉన్న మన దేశం జనధన్‌ ఖాతాలకు 1500(డాలర్లలో 20) రూపాయలు నేరుగా నగదు మూడు దఫాలుగా పంపిణీ చేస్తోంది.(ఒకేసారి ఇస్తే దుర్వినియోగం చేస్తారని కాబోలు) అదే 42వ స్ధానంలో ఉన్న పాకిస్ధాన్‌ దాని కరెన్సీలో ఒకేసారి పన్నెండువేల రూపాయలు(డాలర్లలో 75) ఇస్తోంది. అయినా తాము చేసింది పెద్ద గొప్పని మన బిజెపి నేతలు చెప్పుకుంటారు. పాక్‌ పధకాన్ని ప్రపంచ బ్యాంకు ప్రశంసించింది. మరోవైపు మన దేశానికి ఆరోగ్య సంరక్షణ చర్యలకు గాను ప్రపంచబ్యాంకు ఒక బిలియన్‌ డాలర్ల పాకేజ్‌ ప్రకటించింది. పాకిస్దాన్‌ కూడా తీసుకొని ఉండవచ్చు. కానీ ప్రపంచంలో కరోనా విపత్తు సహాయ చర్యలకు గాను మన దేశం జిడిపిలో మూడు నుంచి ఐదుశాతం ఖర్చు చేసేందుకు ఆలోంచాలని ప్రకటించింది. కానీ మోడీ ప్రకటించింది 0.7శాతమే అని తెలిసినా కొందరు ఆహా ఓహౌ అంటూ విరగబడిపోతున్నారు. మన వివేకం ఏమైనట్లు ?
జిడిపిలో మన దేశాన్ని ఐదవ స్ధానంలో తీసుకుపోయామని బిజెపి వారు చెప్పుకుంటుంటే ఆ విషయాన్ని మనం లొట్టలు వేసుకుంటూ ఆహా మోడీ గారి ఘనత కదా అనుకుంటున్నాం. తలసరి జిడిపిలో ఎక్కడున్నాం, ఎవరితో పోల్చుకోవాలి, సంబరాలు చేసుకొనేంతగా పరిస్ధితి మెరుగుపడిందా అన్నది ప్రశ్న. 2017లో చైనా 75, పాకిస్ధాన్‌ 1501వ స్ధానాల్లో ఉంటే మనది 145. అదే 2019 అంచనాలకు వచ్చేసరికి చైనా 65, పాకిస్ధాన్‌ 151 మనం 139వ స్ధానంలో ఉన్నాం. ఇది కూడా ఘనతేనా, దీనికి బాధ్యత ఎవరిది ? మన కంటే నరేంద్రమోడీ ఉన్నారు కనుక చక్రం తిప్పి రాంకు పెంచారనుకుందాం కాసేపు. బంగ్లాదేశ్‌ ఈ కాలంలోనే 153 నుంచి 150, 143వ స్ధానానికి మెరుగు పరచుకుంది. అక్కడ మోడీ లేకపోయినా పది స్ధానాలు పైకి ఎగబాకితే మోడీ మంత్రదండం ఉన్నా కేవలం ఆరు రాంకులే పెరిగింది. దీని గురించి వ్యాఖ్యానం అవసరం ఏముంది ?
ప్రపంచంలో అనేక దేశాలు కరోనా కారణంగా వందలాది సంక్షేమ చర్యలను చేపట్టాయి. వీటన్నింటిలో ఇప్పటివరకు నరేంద్రమోడీ సర్కార్‌ చేపట్టింది అన్నింటి కంటే మెరుగ్గా ఉందని గానీ లేదా మెరుగైన చర్యలు చేపట్టిన వాటిలో ఒకటిగా ఉందని గానీ ఏ అంతర్జాతీయ సంస్ధా చెప్పలేదు, అయినా స్వంత డబ్బా మోగుతూనే ఉంది. ఒక బిలియన్‌ డాలర్లను మన ఆరోగ్య రంగానికి ఇస్తామని ప్రపంచ బ్యాంకు ప్రకటించింది. ఇది అప్పా, దానమా అన్నది పక్కన పెడదాం. అప్పయినా దానమైనా మోడీ గారికి ఘనత తెచ్చే అంశం కాదు. ఈ సందర్భంగా బ్యాంకు మన దేశ డైరెక్టర్‌గా ఉన్నó జునైద్‌ అహమ్మద్‌ మాట్లాడుతూ భారత్‌ కరోనా ఉద్దీపనకు భారత్‌ జిడిపిలో మూడు నుంచి ఐదుశాతం వరకు ఖర్చు చేసేందుకు ఆలోచించాలని చెప్పాడు. ఆయన బంగ్లాదేశ్‌ ఆర్ధికవేత్త అయిపోయాడు కనుక సరిపోయింది గానీ అదే పాక్‌ జాతీయుడు అయి ఉంటే మా మోడీని ఇరకాటంలో పెట్టేందుకు అలా మాట్లాడి ఉండే వారని ఈ పాటికి బిజెపి మరుగుజ్జులు సామాజిక మాధమాల్లో గంతులు వేసి ఉండేవారు. ఒకటికి రెండు సార్లు ధృడ సంకల్పాన్ని యావత్‌ జాతి ప్రకటించాలని పిలుపు ఇచ్చిన ప్రధాని నరేంద్రమోడీ మూడవసారి గృహబందీ పొడిగించినపుడు దేశ ప్రజలను ఉద్దేశించి మాటా పలుకు లేదు. సంకల్పాన్ని మరో ప్రదర్శించమని జనాన్ని కోరలేదు. ఎందుకనో ఎవరైనా ఆలోచించారా ?
సుభాషితాల వల్లింపు ఎక్కువైతే ఏమి జరుగుతుందో రాజకీయాల్లో జనాన్ని ఏమార్చటంలో తలపండిన నరేంద్రమోడీకి తెలియంది కాదు. తమ ఆర్ధిక ఇబ్బందుల గురించి రాష్ట్రాలు మెల్లగా గొణుగుతున్నాయి. కేంద్రం ఎలాంటి పాకేజ్‌లు ప్రకటించే సూచనలు లేవు. అందువలన మరోసారి చప్పట్లు కొట్టాలనో, విద్యుత్‌ దీపాలు ఆర్పి వేరే దిపాలు వెలిగించాలనో మరొకటో చెబితే ఈ కబుర్లు ఇంక చాల్లే అనే స్ధితి వచ్చేసింది కనుక జనంలో పలుచనౌతారు. అందుచేత మరో మాట లేకుండా ఆర్మీతో పూలు చల్లించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
గృహబందీ తొలిసారి ప్రకటించినపుడు పెద్ద నోట్ల రద్దు మాదిరి ఆకస్మికంగా ప్రకటించేశారు. ఇంత పెద్ద దేశంలో కోట్లాది మంది ప్రతి రోజూ ప్రయాణిస్తారని, వారంతా ఎక్కడిక్కడ చిక్కుకుపోతే ఇబ్బందులు పడతారని సామాన్యుల గుండె చప్పుడు తనకంటే మరొకరికి తెలియదని చెప్పుకొనే ప్రధానికి తట్టలేదా ఎవరూ చెప్పలేదా ? మొత్తానికి ఏమి జరిగిందో ఇంతవరకు తెలియలేదు. పోనీ వలస కార్మికులను స్వస్ధలాలకు తరలించేందుకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయాలని ఎట్టకేలకు నిర్ణయించారు. అందుకయ్యే ఖర్చును ఎవరు భరించాలనేది కూడా ముందుకు చర్చించకుండా ఎంత నగుబాట్ల వ్యవహారం చేశారో చూశాము. ఎవరికీ బుర్రలేదా లేక మరేదైనా జరిగిందా ? ఆ ఖర్చు మేము భరిస్తామని కాంగ్రెస్‌ ప్రకటించిన తరువాత నష్టనివారణ చర్యలు తీసుకున్నారు. పిఎం కేర్‌కు చేరిన వేల కోట్ల రూపాయల్లో రైల్వేలు ఇచ్చిన 150 కోట్లు కూడా ఉన్నాయి. దానికి ఎంత వచ్చిందో దేనికి కేటాయిస్తున్నారో మనకు తెలుసా ? వలన కార్మికుల రవాణాకు అయ్యే ఖర్చును పిఎం కేర్‌ నిధి నుంచి ఇస్తామని చెబితే సొమ్మేం పోయేది? పరాయి రాష్ట్రంలో చిక్కుకుపోయిన గుజరాతీల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. దాంతో మిగతా చోట్ల నుంచీ అదే డిమాండ్‌ వచ్చింది. విదేశాలలో చిక్కుకుపోయిన వారిని తీసుకురావటం గురించి ప్రతిదేశమూ ఏర్పాట్లు చేసింది గానీ మన దేశంలో కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రచార ఆర్భాటం ఎక్కడా కానరాదు. దానికి వందే భారత్‌ అని ఒక పేరు, పోనీ అదేమైనా కొత్తదా కాదే వందే మాతరానికి అనుకరణ కాదా ? విదేశాల్లో వున్న వారికోసం విమానాలు, మిలిటరీ నావలను పంపి తీసుకువస్తున్నారు, వారి దగ్గర ఖర్చు వసూలు చేస్తున్నారు. దాన్నొక విజయంగా ఘనకార్యంగా ప్రచారం చేసుకుంటున్నారు. కానీ వలస కార్మికులు మేము టిక్కెట్లు కొని ప్రయాణిస్తామని మొత్తుకుంటున్నా రైళ్లను ఏర్పాటు చేసేందుకు వారాల తరబడి ఎందుకు ముందుకు రాలేదు. అలాంటి ఏర్పాటే ఉంటే ఔరంగాబాద్‌ దగ్గర వలస కూలీలు రైలు పట్టాలపై పడుకొనే వారా, వారి మీదుగా రైలు వెళ్లి దుర్మరణం చెందేవారా? అనేక రాష్ట్రాలు వేరే చోట చిక్కుకుపోయిన తమ రాష్ట్ర కూలీలను తిరిగి వచ్చేందుకు అనుమతి ఇవ్వటం లేదు. ఏమిటిది? మనం ఎటు పోతున్నాం, ఇది ప్రజాస్వామ్యమా మరొకటా ?
చరిత్రలో, కొన్ని సినిమాల్లో కార్మికులను బందీలుగా తీసుకుపోయి వారిని అక్కడి నుంచి బయటకు వెళ్లనివ్వకుండా చచ్చేంత వరకు వెట్టి చాకిరీ చేయించుకోవటం చూశాము. కర్ణాటక నుంచి వలస కార్మికులు వెళ్లిపోవటానికి వీల్లేదు, మేము నష్టపోకూడదని భవన నిర్మాణ కంపెనీల లాబీ వత్తిడి తెస్తే ఆ రాష్ట్ర బిజెపి ముఖ్యమంత్రి ఎడ్డియూరప్ప ప్రత్యేక రైళ్లను రద్దు చేయాలని ఆదేశించటాన్ని ఏమనాలి ? బిజెపి ఒక జాతీయ పార్టీ, దానికి ఒక విధానమంటూ ఉండాల వద్దా? ముదిమది తప్పిన వ్యవహారమా, మరొకటా ? కేంద్రం ప్రకటించిన విధానాన్ని కూడా అమలు జరపరా ?చివాట్లు పడిన తరువాత నిర్ణయాన్ని మార్చుకున్నారు. గృహబందీ నిబంధనల సడలింపు గురించి కేరళ ప్రభుత్వం ప్రకటించగానే కేంద్ర హౌంశాఖ బహిరంగ ప్రకటనల ద్వారా ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పు పట్టింది. మరి ఎడ్డి యూరప్ప విషయంలో ఎందుకు మౌనంగా ఉంది? రెండు నాలుకల ధోరణి, కరోనాలో కూడా రాజకీయం చేయటం కాదా ?

Coronavirus In India: How Indians are dealing with the onset of a ...
మద్యం దుకాణాలను తెరిచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అనుమతి ఇవ్వలేదని బిజెపి నేతలు ఎదురుదాడి చేస్తున్నారు. పోనీ బిజెపి పాలిత రాష్ట్రాలతో సహా పలుచోట్ల సడలించారు, భౌతిక దూరం పాటించకుండా మందుబాబులు కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు అవసరమైన నిధులు ఇచ్చేందుకు, ( మందు షాపులు ఎందుకు తెరిచారంటే కరోనా కారణంగా తలెత్తిన నిధుల కొరతను అధిగమించటానికనేకదా పాలకులు చెబుతోంది) విరగబడి మందు కొనేందుకు పోటీలు పడటం వారికి ఉన్న దేశభక్తి ప్రదర్శనకు నిదర్శనం అనుకుందాం. అనుమతి ఇవ్వకపోతే వరుసల్లో మందుకోసం బేటాలతో పాటు బేటీలు కూడా నిలబడటాన్ని చూసిన తరువాత అయినా రాష్ట్రాలను ఎందుకు హెచ్చరించలేదో ఆలోచిస్తున్నామా ? ఈ కారణంగా ఎక్కడైనా కరోనా ప్రబలితే బాధ్యత ఎవరిది ?
కరోనా వ్యాప్తి నిరోధానికి గృహబందీని జనవరి మూడవ వారం నుంచే చైనాలో అమలు జరుపుతున్నారని తెలుసు. తబ్లిగీ జమాత్‌ సంస్ధ మలేషియాలో నిర్వహించిన సామూహిక సమావేశాల కారణంగా ఫిబ్రవరినెలలో కరోనా వైరస్‌ వ్యాపించిందని ప్రపంచానికంతకూ తెలిసిందే. ఆ అనుభవంతో మార్చినెల రెండవ వారంలో మన దేశం కంటే ముందు పాకిస్ధాన్‌లో అదే సంస్ధ సమావేశాలను అక్కడి ప్రభుత్వం నిషేధిస్తే అర్ధంతరంగా సమావేశాలను ముగించారు. అక్కడా వైరస్‌ వీరి కారణంగానే వ్యాపించింది. ఇవన్నీ తెలిసి ఢిల్లీలో అలాంటి సమావేశాలను ఎందుకు అనుమతించారు, ఎవరు అనుమతించారన్నది ఎవరమైనా ఆలోచించామా ? తబ్లిగీ సంస్ధ బాధ్యతా రహితంగా వ్యహరించిందనటంలో మరోమాట లేదు. వారి సమావేశాలకు కేంద్ర హౌం మంత్రి అమిత్‌ షాగారే కదా అనుమతులు ఇచ్చింది. మలేషియా నుంచి ఇతర దేశాల నుంచి వైరస్‌ను మోసుకువచ్చిన వారి వీసాలను ఎందుకు రద్దు చేయలేదు, పోనీ టూరిస్టులనో మరో పేరుతోనే వచ్చారు, వారికి ఎందుకు పరీక్షలు చేయలేదు, కరోనా ఉంటే క్వారంటైన్‌ ఎందుకు చేయలేదు. ఈ ప్రశ్నలన్నీ వేయాలా వద్దా? లేక మోడీ పార్టీ పాకేజ్‌లకు అమ్ముడు పోయిన లేదా మతోన్మాదం తలకెక్కిన మీడియా కరోనా వ్యాప్తికి కారణమైన తబ్లిగీ జమాత్‌ పేరుతో యావత్‌ ముస్లిం సామాజిక తరగతి మీద దాడి చేస్తుంటే, ఇదేమి విపరీతం అని ఎందుకు ఆలోచించలేకపోయాము, అసలు తబ్లిగీ సమావేశాలకు అనుమతి ఇవ్వటం వెనుక కారణం ఆ సమావేశాల తరువాత ఆయోధ్యలో ఇతర చోట్లా తలపెట్టిన అంతకంటే పెద్ద శ్రీరామనవమి సమావేశాలే కారణమని(తరువాత రద్దు చేయటం వేరే) ఎందుకు ఆలోచించలేకపోయాము ?
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పాకేజ్‌ లక్షా 70వేల కోట్లు, ఈ పాకేజ్‌తో నిమిత్తం లేకుండా జూన్‌లో రైతాంగానికి రెండువేల రూపాయల చొప్పున ఇవ్వాల్సిన దాదాపు 20వేల కోట్లు ముందే ఇచ్చి దాన్ని కూడా పెద్ద సాయంగా చిత్రించారు. ఇంకా ఇలాంటివే దాదాపు లక్ష కోట్ల రూపాయల వరకు ఉన్నాయని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. పోతే మార్చినెలలో మూడు రూపాయలు, తాజాగా పెట్రోలియం ఉత్పత్తుల మీద పెంచిన పన్నుల ద్వారా మొత్తం ఏడాదికి రెండులక్షల కోట్ల రూపాయల వరకు కేంద్రానికి అదనపు ఆదాయం రానుంది. డీజిల్‌ లేదా పెట్రోలు మీద లీటర్‌కు ఒక రూపాయి పెంచితే కేంద్రానికి ఏడాదికి 14వేల కోట్ల రూపాయల అదనపు ఆదాయం వస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరి నుంచి పెంచిన డిఏ, జూలై, వచ్చే ఏడాది జనవరిలో పెరగాల్సిన(ద్రవ్యోల్బణం పెరుగుతూనే ఉంది కనుక ఎక్కువా తక్కువ కావచ్చుగానీ డిఏ పెరుగుతుంది) డిఏను కూడా జూలై వరకు పెంచకుండా 17శాతాన్ని కొనసాగించాలని నిర్ణయించారు. దీని వలన అటు కేంద్రానికి, ఇటు రాష్ట్రాలకు లక్షా 20వేల కోట్ల రూపాయలు చెల్లింపు బాధ్యత ఏడాదిన్నరపాటు తగ్గుతుంది. ఎల్‌టిసి, వేతనంతో కూడిన సెలవుల వంటి వాటి మీద మరికొన్ని ఆంక్షలు విధించారు. ఇవిగాక పారిశ్రామిక సంస్ధలు ఇచ్చిన వేల కోట్ల రూపాయల పిఎం కేర్‌ నిధులున్నాయి. అంటే ఇప్పటి వరకు జనానికి ఇచ్చింది ఎక్కువా కరోనా పేరుతో జనం జేబుల నుంచి కొట్టివేస్తున్నది ఎక్కువా? దేశభక్తి కళ్లతో చూసినా వేద గణితం ప్రకారం చూసినా ఎక్కువే కదా !
గృహబందీ వ్యవధి పెరిగే కొద్దీ ప్రధాని నరేంద్రమోడీ తన ఎత్తుగడలు మారుస్తున్నారు. దానిలో భాగమే తాజా పరిణామాలు. కేంద్రం సుభాషితాలు వల్లిస్తూ, పెత్తనం చలాయిస్తున్నది, పైసా విదల్చటం లేదు, సమస్యలను రాష్ట్రాలు పరిష్కరించుకోవాల్సి వస్తోంది. పోనీ ప్రత్యేక చర్యగా భావించి పరిమితికి మించి కరోనా అప్పులు చేసేందుకు అనుమతి ఇస్తున్నారా లేదు. కేంద్రం మీద నిధుల వత్తిడి తగ్గాలంటే రాష్ట్రాలలో ఒక ప్రధాన ఆదాయవనరుగా ఉన్న మద్యం అమ్మకాలను అనుమతించారు తప్ప అదేమైనా కరోనా నియంత్రణ చర్య కాదే.దేశంలోని మధ్య తరగతి, ధనికుల మన్ననలను పొందే చర్యలను ప్రకటించి భజన చేసే మీడియాలోనూ, చెక్క భజన చేసే పాలకపార్టీ సామాజిక మాధ్యమ విభాగాలతో ప్రచారం చేయిస్తున్నారు.
అత్యవసర వస్తువుల సరఫరాను మెరుగుపరచే పేరుతో కార్మికుల పని గంటలను ఎనిమిది నుంచి పన్నెండు గంటల వరకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అనేక రాష్ట్రాలు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశాయి. తాజా ఆదేశాల ప్రకారం యజమానులు కోరితే పన్నెండు గంటల వరకు విధిగా కార్మికులు పని చేయాల్సి ఉంటుంది. మాకు అదనపు వేతనం లేదా ఓవర్‌ టైమ్‌ వద్దు నిబంధనల ప్రకారం ఎనిమిది గంటలు మాత్రమే పని చేస్తామంటే కుదరదు. వాస్తవానికి ఇప్పటికే కార్మిక చట్టాలను గాలికి వదలిన కారణంగా అనేక చోట్ల పన్నెండు గంటల పని చేయిస్తున్నారు. ఓవర్‌టైమ్‌లేదు, కనీస వేతనాలు, పని పరిస్ధితుల నిబంధనల అమలు లేదు. కేంద్రం, రాష్ట్రాలు ఈ నిర్ణయం తీసుకొనేందుకు తక్షణ కారణం తమ స్వస్ధలాలకు వెళ్లిపోయిన వలస కార్మికులు వెంటనే తిరిగి వచ్చే అవకాశాలు పరిమితం కావటమే. అందువలన కొత్తవారిని నియమించి వారికి శిక్షణ ఇవ్వటం, ఒకసారి పని ఇచ్చిన తరువాత తొలగింపు సమస్యలతో కూడుకున్నది కావటంతో యజమానులు అందుబాటులో ఉన్న వారిమీదే పని భారం పెంపుదలకు పూనుకున్నారు. దానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించటం తప్ప మరొక కారణం లేదు.

Prime Minister Narendra Modi On Coronavirus: Total Lockdown From ...
గృహబందీ సమయంలో సరకు రవాణాలో ఇబ్బందులు తప్ప ఇంతవరకు నిత్యావసర సరకుల కొరత ఏర్పడలేదు. నిజానికి అనేక కారణాలతో వినిమయం పరిమితం అయింది. తగ్గిపోయింది కూడా. కరోనాతో నిమిత్తం లేకుండానే డిమాండ్‌ పడిపోయింది.2011-12తో పోల్చితే 2017జూలై 2018జూన్‌ మధ్య గ్రామీణ ప్రాంతాలలో వినియోగ గిరాకీ 8.8శాతం పడిపోయిందని జాతీయ గణాంక సంస్ధ(ఎన్‌ఎస్‌ఓ) తెలిపింది. దేశ జనాభాలో మూడింట రెండువంతుల మంది గ్రామాలలోనే ఉంటున్నారు. దుస్తులు, ఆహారం,విద్యపై ఖర్చు పడిపోయింది, తృణ ధాన్యాల వంటి అత్యవసర వస్తువుల డిమాండ్‌ 20శాతం వరకు పడిపోయిందని అంచనా.1972-73 తరువాత తొలిసారిగా దేశంలో పట్టణ ప్రాంతాలలో రెండుశాతం డిమాండ్‌ పెరిగినా గ్రామీణ ప్రాంతాలలో దిగజారిన కారణంగా మొత్తంగా 3.7శాతం తలసరి వినిమయ ఖర్చు పడిపోయింది. అయితే ప్రభుత్వం ఈ గణాంకాలను విశ్లేషించే పేరుతో ఖరారు చేయకుండా తొక్కి పెడుతోంది. కరోనా కారణంగా గ్రామాలకు తరలి పోతున్న కోట్లాది మంది వలస కార్మికులకు గ్రామాలలో పనులు ఉండవు. అందువలన గ్రామీణ వినియోగం రానున్న రోజుల్లో ఇంకా పడిపోయే అవకాశం ఉంది. అటువంటపుడు పన్నెండు గంటల పాటు పనిచేయించాల్సిన అవసరం ఏముంది ?
2016లో చేసిన బుర్ర తక్కువ పని పెద్ద నోట్ల రద్దు వలన మోడీగారు చెప్పినట్లు సత్ఫలితాలకు బదులు దుష్ఫలితాలు కలిగాయి. మరుసటి ఏడాది ప్రవేశపెట్టిన జిఎస్‌టి మరికొంత దెబ్బతీసింది. ఆ దెబ్బలకు అలవాటు పడుతున్న స్ధితిలో పులిమీద పుట్రలా కరోనా ప్రభావం దేశ ఆర్ధిక స్ధితిని మరింత దిగజార్చనుంది. జిడిపి వృద్ధి రేటు సున్నా అవుతుందా ఇంకా దిగజారుతుందా అన్నది ఎవరూ చెప్పలేని స్ధితి. అయినా ఇంకా మంచిదినాలు రానున్నాయి(అచ్చేదిన్‌) అంటే మూతికి చిక్కెం బిగించి కంటికి కనపడేలా దూరంగా గడ్డి కట్ట చూపుతుంటే ఆశతో ముందుకు సాగే గుర్రాల మాదిరి పరుగెడుతూనే ఉన్నాం. మన మాదిరి మెదడు పెరగలేదు కనుక అవి పరుగెడతాయి, మన సంగతేమిటి.
ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు పెరిగితే ఇక్కడ పెంచుతాము, తగ్గితే తగ్గిస్తాము అని కబుర్లు చెప్పారు. మార్చినెల 31తో ముగిసిన ఆర్ధిక సంవత్సరంలో పీపా ధర సగటున 60డాలర్లకు కొనుగోలు చేసిన మనం ఏప్రిల్‌లో ఇరవై డాలర్లకు లోపే కొన్నాం. జనవరి నుంచి అంతర్జాతీయ మార్కెట్‌ ధరలు తగ్గుతున్నాయి, మార్చినెలలో మరింత తగ్గాయి. అయినా మార్చి 16 నుంచి నేటి వరకు అంతకు ముందు ఉన్న ధరనే ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. ఎందుకు ఆ పని చేస్తున్నారో వారు చెప్పరు, ఏమిటీ పట్టపగలు జేబు కొట్టుడు అని మనమూ అడగం. ధరలు తగ్గిన తరువాత వినియోగదారుల మీద రెండులక్షల కోట్ల రూపాయల వరకు పన్నుబాదితే ఇదేమని ప్రశ్నించలేని బలహీనత లేదా లొంగుబాటు ఏమిటి ?

Brick Tamland Anchorman - I have no idea What's going on! | Funny ...
తప్పులు అందరూ చేస్తారు. వాటిని అంగీకరించి సరిదిద్దుకోవటమే గొప్ప అని మన పెద్దలు చెప్పారే. కమ్యూనిస్టులు తాము అనుసరించిన విధానాలు, ఎత్తుగడల తప్పుల గురించి మూడు సంవత్సరాలకు ఒకసారి జరిగే మహాసభల్లో సమీక్షించుకుంటారు. వాటిని బహిరంగంగానే అంగీకరిస్తారు. కొందరు దెప్పుతున్నట్లు విదేశీ సిద్ధాంతాలను పాటించేవారిలోనే ఆ నిజాయితీ కనిపిస్తున్నప్పుడు పక్కా భారతీయం అమలు జరుపుతున్నామని చెప్పుకొనే నరేంద్రమోడీ పెద్ద నోట్ల రద్దు పెద్ద తప్పిదం అని జాతికి ఎప్పుడైనా చెప్పారా ? ఎందుకు చెప్పలేదు ? ఆయన ఖర్మకు ఆయన్ను వదిలేద్దామా ? వ్యక్తులుగా అయితే అలాగే చేద్దుము, కానీ ప్రధాని, ముఖ్యమంత్రులు వ్యక్తులు కాదే, వ్యవస్ధకు ప్రతినిధులు. వారి ఖర్మలకు జనం అనుభవించాలా ? ఇదెక్కడి వేదాంతం ? ఇదెక్కడి భారతీయత ?
ఇలా చెప్పుకుంటూ పోతే బిజెపి వారు ఆలపించిన భజన గీతాల కంటే చాలా ఎక్కువగా ఉన్నాయి.ఏ విదేశీ దుండగీడు వచ్చినా చేవచచ్చినట్లు భరించి పాలన అప్పగించి ఎన్ని విధాలుగా నష్టపోయామో తెలిసిందే. అలాగే స్వదేశీయుడు ఏమి చేసినా అలాగే భరించాలా ? కొంత మంది మన వేదవిజ్ఞానం, పురాతన తర్కజ్ఞానం గురించి గొప్పగా చెబుతారు. అదే నిజమైతే మనం వాటిలో ఆవగింజలో అరవయ్యో వంతు వంటబట్టించుకున్నా ఎందుకు అనే ఒక చిన్న ప్రశ్న కూడా మనల్ని మనం, పాలకులను అడిగి ఉండేవారం కాదా ? ఎక్కడుందీ లోపం, ఎవరైనా ప్రశ్నిస్తే కమ్యూనిస్టు విదేశీ సిద్ధాంతాన్ని అరువు తెచ్చుకున్నారని ఎదురుదాడికి దిగుతారు. ఏం జరిగినా నోరు సహా అన్నీ మూసుకొని కూర్చోమని మన స్వదేశీ వేదజ్ఞానం, తర్కం చెప్పిందా ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...
← Older posts

Recent Posts

  • బెలూన్‌ కూల్చివేత ఉదంతం : చైనా వ్యతిరేక ప్రచారానికి అమెరికాకు ఒక సాకు మాత్రమే !
  • మనవాళ్లు వట్టి వెధవాయి లోయి అన్న గిరీశాన్ని గుర్తుకు తెస్తున్న వాట్సాప్‌ పండితులు !
  • బిజెపి మిత్రోం అదానీ, బికినీలను కాదు సామాన్య జనాన్ని చూడండి !
  • వైవిధ్య సమస్యలతో ప్రపంచ వ్యవసాయ రంగం !
  • రష్యా – జర్మనీలను శాశ్వత శత్రు దేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • బెలూన్‌ కూల్చివేత ఉదంతం : చైనా వ్యతిరేక ప్రచారానికి అమెరికాకు ఒక సాకు మాత్రమే !
  • మనవాళ్లు వట్టి వెధవాయి లోయి అన్న గిరీశాన్ని గుర్తుకు తెస్తున్న వాట్సాప్‌ పండితులు !
  • బిజెపి మిత్రోం అదానీ, బికినీలను కాదు సామాన్య జనాన్ని చూడండి !
  • వైవిధ్య సమస్యలతో ప్రపంచ వ్యవసాయ రంగం !
  • రష్యా – జర్మనీలను శాశ్వత శత్రు దేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • బెలూన్‌ కూల్చివేత ఉదంతం : చైనా వ్యతిరేక ప్రచారానికి అమెరికాకు ఒక సాకు మాత్రమే !
  • మనవాళ్లు వట్టి వెధవాయి లోయి అన్న గిరీశాన్ని గుర్తుకు తెస్తున్న వాట్సాప్‌ పండితులు !
  • బిజెపి మిత్రోం అదానీ, బికినీలను కాదు సామాన్య జనాన్ని చూడండి !
  • వైవిధ్య సమస్యలతో ప్రపంచ వ్యవసాయ రంగం !
  • రష్యా – జర్మనీలను శాశ్వత శత్రు దేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Follow Following
    • vedika
    • Join 234 other followers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Customize
    • Follow Following
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d bloggers like this: