• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: WAR

నరేంద్రమోడీ పాలన : అంబానీకి ” మంచి యుద్ధం ” అదానీకి ”మంచి రోజులు ” !

25 Saturday Jun 2022

Posted by raomk in Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Prices, RUSSIA, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

Adani Coal, Ambani and Adani, Ambani’s Reliance, BJP, Narendra Modi


ఎం కోటేశ్వరరావు


ఎవ్విరిబడీ లవ్స్‌ ఏ గుడ్‌ డ్రాట్‌ ( మంచి కరువును ప్రతివారూ ప్రేమిస్తారు) అనే పేరుతో ప్రముఖ జర్నలిస్టు పాలగుమ్మి శాయినాధ్‌ పాతికేండ్ల క్రితం రాసిన పరిశోధనాత్మక కధనాలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. అవి నిత్య సత్యాలు. వర్తమానంలో కొనసాగుతున్న ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని చూసిన తరువాత ” మంచి యుద్ధాన్ని ప్రేమిస్తారు ” అనే పేరుతో విశ్లేషణలు రాయవచ్చు. ఉక్రెయిను మీద సైనిక చర్య జరుపుతున్న రష్యా మీద తాము విధించిన ఆంక్షలను భారత్‌ ఖాతరు చేయటం లేదని అమెరికా, ఐరోపా ధనిక దేశాలు గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే. వలలో పడుతుందనుకున్న పిట్ట జారిపోయిందని ఆశాభంగం చెందినట్లుగా మింగలేక కక్కలేక ఎప్పటికైనా తిరిగి పడకపోతుందా అన్నట్లుగా వలలు పన్ని ఎదురు చూస్తున్నాయి.


ప్రతిదేశ రాజకీయ వైఖరుల వెనుక ఆ దేశ పాలకవర్గాల ఆర్ధిక ప్రయోజనాలుంటాయన్నది జగమెరిగిన పచ్చినిజం.అమెరికాను శాసించే సంస్థల్లో ఒకటైన అమెజాన్‌ కంపెనీ సిఇవో బెజోస్‌ భారత్‌ వచ్చినపుడు నరేంద్రమోడీ కలుసుకొనేందుకు ఇష్టపడలేదు. విదేశాలకు వెళ్లి మరీ పెద్ద పీటవేసి పెట్టుబడులను ఆహ్వానించినట్లు చెప్పుకున్న మోడీ ఏకంగా మన దేశానికి వచ్చిన అమెజాన్‌ అధిపతి పట్ల అలా ఎందుకు వ్యవహరించినట్లు ? అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం ఏమంటే అమెజాన్‌ కంపెనీ తన జియోకు ఎక్కడ పోటీ వస్తుందో, ఎలా మింగివేస్తుందో అని ముకేష్‌ అంబానీ భావించటమే. తరువాత జరిగిన అనేక పరిణామాలు దీన్నే నిర్ధారించాయి. తమకు అనుకూలంగా మోడీ సర్కార్‌ ఉంది కనుక అంబానీ మీడియా నరేంద్రమోడీకి భజన చేస్తుంటే అమెజాన్‌ కంపెనీకి అవకాశం ఇవ్వటం లేదు గనుక అదే కంపెనీకి చెందిన వాషింగ్టన్‌ పోస్టు పత్రిక విమర్శనాత్మకంగా ఉంది, మోడీ సర్కార్‌ను విమర్శిస్తూ రాస్తున్నది. ఉక్రెయిన్‌ వివాదంలో కూడా అమెరికా మీడియా మొత్తంగా అదే చేస్తున్నది. ఇక ఉక్రెయిన్‌ సంక్షోభం ముకేష్‌ అంబానీకి ” మంచి యుద్ధం ” గా మారి లాభాలు కురిపిస్తున్నదంటే చాలా మంది నమ్మకపోవచ్చు గానీ ఇది పచ్చినిజం.


అమెరికా ఆంక్షలను ధిక్కరించి రష్యా నుంచి చౌకధరలకు మన దేశం కొనుగోలు చేస్తున్నట్లు చెబుతున్న ముడి చమురు వివరాలను చూస్తే అసలు కధ ఏమిటో అర్ధం అవుతుంది. మన దేశం రష్యా నుంచి కొనుగోలు చేస్తున్న చమురు ఏప్రిల్‌ నుంచి 50 రెట్లు పెరిగింది. ఈ చమురులో 69శాతం రిలయన్స్‌, నయారా వంటి సంస్థలే దిగుమతి చేసుకుంటున్నట్లు వార్తలు.ప్రభుత్వ లేదా ప్రయివేటు సంస్థలు ఏవి దిగుమతి చేసుకున్నా దిగుమతి ఖర్చు తగ్గినపుడు జనాలకు ఆమేరకు తగ్గాలి. అలా తగ్గటం లేదు ఎందుకని ? రిలయన్స్‌, నయారా తదితర ప్రైవేటు బంకుల్లో చమురు విక్రయాలు దాదాపు లేవు, ఎక్కడైనా తెరిచి ఉంచినా కొనుగోలు చేసే వారు కూడా ఉండరు. మరి దిగుమతి చేసుకున్న చమురును శుద్దిచేసి ఏమి చేస్తున్నట్లు ? విదేశాలకు, అమెరికా, ఆఫ్రికా, ఐరోపాకు ఎగుమతి చేసి లాభాలు పోగేసుకుంటున్నాయి.


రాయిటర్స్‌ వార్తా సంస్థ జూన్‌ ఒకటవ తేదీ కధనం ప్రకారం 2021 తొలి ఐదు నెలల్లో మన దేశం ఎగుమతి చేసిన చమురు ఉత్పత్తుల కంటే ఈ ఏడాది అదే కాలంలో 15 శాతం పెరిగినట్లు కెప్లర్‌ సంస్థ సమాచారం వెల్లడించింది. ఒక లీటరు డీజిలు మీద రు.20, పెట్రోలు మీద రు.17 నష్టం వస్తున్నందున ప్రయివేటు చమురు శుద్ధి సంస్థలు మార్కెటింగ్‌ను గణనీయంగా తగ్గించాయి. శ్రీలంక పరిణామాలను చూసిన తరువాత ధరల పెరుగుదలతో ప్రభుత్వం మీద జనంలో అసంతృప్తి తలెత్తుతుందనే భయంతో కేంద్ర ప్రభుత్వం కొంత మేరకు పన్ను తగ్గించటంతో పాటు ఏప్రిల్‌ ఆరు నుంచి ధరల సవరణను స్థంభింపచేసింది. రిలయన్స్‌ కంపెనీ గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఉన్న శుద్ధి కర్మాగారాన్ని వార్షిక నిర్వహణలో భాగంగా కొంతకాలం మూసి పనులు చేపట్టాలని భావించింది.అలాంటిది ఉక్రెయిన్‌ సంక్షోభం కారణంగా అందుబాటులోకి వచ్చిన చౌక ధర రష్యా చమురు కారణంగా నిర్వహణ పనులను వాయిదా వేసి శుద్ది కొనసాగిస్తూ ఎగుమతులతో లాభాలను పొందుతున్నది. ఆ సంక్షోభం ఎంతకాలం కొనసాగితే అంతకాలం లాభాలే లాభాలు. మన దేశం కొనుగోలు చేసే ధరల కంటే పీపాకు 30 డాలర్ల వరకు రష్యా రాయితీ ఇస్తున్నది. మరో ఆరునెలల పాటు ఒక నిర్ణీత ధరకు సరఫరా చేస్తారా అంటూ ఈ కంపెనీలు రష్యాతో ఇప్పుడు బేరమాడుతున్నట్లు బ్లూమ్‌బెర్గ్‌ తెలిపింది. అందుకే అంబానీకి ఇది మంచి యుద్ధంగా, జనానికి చెడుగా మారింది. ప్రధానంగా లబ్ది పొందుతున్నది రిలయన్స్‌, వచ్చే ఎన్నికల్లో ఆదుకొనే వాటిలో ఆ కంపెనీ ఒకటి గనుక అమెరికా బెదిరింపులను నరేంద్రమోడీ ఖాతరు చేయటం లేదని వేరే చెప్పనవసరం లేదు.

ఇటీవల మన దేశానికి చమురును సరఫరా దేశాల్లో రెండవ స్థానంలో ఉన్న సౌదీని వెనక్కు నెట్టేసి రష్యా రెండవ స్థానానికి చేరుకుంది. జర్మనీని రెండవ స్థానానికి నెట్టి చైనాకైతే మొదటిదిగా మారింది. అమెరికా, ఐరోపా దేశాలు విధించిన ఆంక్షల పర్యవసానాలు దీర్ఘకాలంలో ఎలా ఉంటాయో చెప్పలేము గానీ, ముడి చమురు ధరలు పెరిగిన కారణంగా రాయితీ ఇచ్చినప్పటికీ రష్యాకు లాభంగానే ఉంది. గత ఏడాది కంటే సగటున 60శాతం ధర పెరిగింది. ఈ స్థితిని అంచనా గట్టటంలో అమెరికా, పశ్చిమదేశాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. ఐరోపాకు 75శాతం ఇంధన ఎగుమతి తగ్గినప్పటికీ ధరల పెరుగుదల వలన రోజుకు పది కోట్ల డాలర్లు వస్తున్నట్లు, గతేడాదితో సమంగా ఉన్నట్లు అంచనా.ఉక్రెయిన్‌ సంక్షోభం తొలి వంద రోజుల్లో ( ఫిబ్రవరి 24 నుంచి జూన్‌ 3 వరకు) ఇంథన ఎగుమతుల ద్వారా రష్యా 98బి.యురోలను పొందింది. వాటిలో 61శాతం ఐరోపా దేశాల నుంచే ఉంది. దేశాల వారీ చూస్తే చైనా 12.6, జర్మనీ 12.1, ఇటలీ 7.8, నెదర్లాండ్స్‌ 7.8, టర్కీ 6.7, పోలాండ్‌ 4.4, ఫ్రాన్స్‌ 4.3, భారత్‌ 3.4, బెల్జియం బి.యురోల మేరకు దిగుమతి చేసుకున్నాయి. మన అవసరాల్లో రష్యా నుంచి దిగుమతులు ఫిబ్రవరి 24కు ముందు ఒకశాతం ఉంటే మే నెలలో 18శాతానికి పెరిగాయి. మన దేశం దిగుమతి చేసుకున్న ముడి చమురు నుంచి తయారు చేసిన ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు.


అమెరికా వడ్డీరేట్లు పెంచటం, అక్కడ, ఇతర ధనిక దేశాల్లో మాంద్యం తలెత్తవచ్చనే అంచనాల వెల్లడితో ఇటీవల 124 డాలర్లకు చేరిన ప్రామాణిక బ్రెంట్‌ రకం ముడిచమురు ధర గత వారంలో 103 డాలర్లవరకు పడిపోయింది.జూన్‌ 24వ తేదీన 113 డాలర్లుంది. అమెరికాలో ద్రవ్యోల్బణాన్ని అరికట్టేందుకు వడ్డీ రేట్ల పెంపు వలన ప్రయోజనం ఉండదని, ఏడాది-ఏడాదిన్నరలో అక్కడ మాంద్యం తలెత్తవచ్చని అనేక మంది ఆర్ధికవేత్తలు హెచ్చరిస్తున్నారు. నవంబరులో జరిగే పార్లమెంటు ఎన్నికలలో ఓటర్లను ప్రసన్నం చేసుకొనేందుకు జో బైడెన్‌ కూడా చమురు పన్ను తగ్గించే ప్రతిపాదనలో ఉన్నట్లు వార్తలు. డాలరు విలువ పెరుగుతున్నందున చమురు దిగుమతి చేసుకొనే దేశాల మీద తీవ్ర ప్రతికూల ప్రభావం చూపవచ్చని చెబుతున్నారు. దానికి నిదర్శనంగా మన రూపాయి విలువ పతనంలో ఇటీవల కొత్త రికార్డులను నెలకొల్పుతున్నది.


ఇక అదానీ కంపెనీల విషయానికి వస్తే నరేంద్రమోడీ సర్కార్‌ ఆస్ట్రేలియాలోని అదానీ బొగ్గు గనుల నుంచి దిగుమతులు చేసుకొనేందుకు అనువైన పరిస్థితిని కల్పించింది. అదానీకి మంచి రోజుల కోసమే ఇదంతా అన్నది స్పష్టం. మన దేశంలో 1,07,727 మిలియన్‌ టన్నుల మేరకు బొగ్గు నిల్వలున్నట్లు నిర్ధారణైంది. ప్రపంచంలో ఐదవ దేశంగా 9శాతం కలిగి ఉంది. వర్తమాన వినియోగాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఈ నిల్వలు 111.5రెట్లు ఎక్కువ. ఇంత మొత్తం ఉన్నప్పటికీ బొగ్గు తవ్వకంలో నరేంద్రమోడీ సర్కార్‌ వైఫల్యం కారణంగా విదేశాల నుంచి దిగుమతులు చేసుకోవాల్సి వస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థ ఎన్‌టిపిసి ఆస్ట్రేలియాలోని అదానీ కంపెనీ నుంచి పదిలక్షల టన్నుల బొగ్గు దిగుమతి ఒప్పందం చేసుకుంది. మరో సంస్థ డివిసి మరో పదిలక్షల టన్నుల దిగుమతికి సంప్రదింపులు జరిపింది. దిగుమతి చేసుకున్న బొగ్గుధర ఎక్కువగా ఉంది. అదానీ వంటి కంపెనీలకు లబ్ది కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం దిగుమతి చేసుకున్న బొగ్గును విధిగా దేశీయ బొగ్గుతో మిశ్రమం చేసిి వినియోగించాలని ఆదేశించింది. ఇది విద్యుత్‌ చార్జీల పెంపుదలకు దారి తీస్తున్నది. నరేంద్రమోడీ పాలనలో దేశీయ చమురు ఉత్పత్తి కూడా పడిపోయిన సంగతి తెలిసిందే.


కేంద్ర విద్యుత్‌ శాఖా మంత్రి ఆర్‌కె సింగ్‌ మే నెలలో అన్ని రాష్ట్రాలకు రాసిన లేఖలో విదేశీ బొగ్గు దిగుమతుల గురించి ఆదేశించారు.2022 అక్టోబరు వరకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు గాను రాష్ట్రాల విద్యుత్‌ ఉత్పత్తి కంపెనీలు, ప్రయివేటు సంస్థలకు షరతులు విధించారు. మే నెలాఖరులోగా వాటి అవసరాల్లో పదిశాతం దిగుమతులు చేసుకోని పక్షంలో జరిమానాగా తరువాత 15శాతానికి పెంచుతారు. జూన్‌ 15లోగా విదేశీ-స్వదేశీ బొగ్గును మిశ్రితం ప్రారంభించని పక్షంలో జరిమానాగా స్వదేశీ బొగ్గు కేటాయింపులో ఐదుశాతం కోత విధిస్తారు. దేశంలోని 173 విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలలో సగటున ఏడు రోజులకు సరిపడా బొగ్గు నిల్వలులేని స్థితిలో ఈ ఆదేశాలను జారీ చేశారు.97 కేంద్రాలలో ఏడు రోజుల కంటే తక్కువ, 50 కేంద్రాలలో నాలుగు రోజుల కంటే తక్కువ, కొన్నింటిలో ఒక రోజుకు సరిపడా నిల్వలున్నట్లు పేర్కొన్నారు. మొత్తం విద్యుత్‌ కేంద్రాలలో కేవలం 18 మాత్రమే బొగ్గుగనుల సమీపంలో(ఉదా: కొత్తగూడెం) ఉండగా 155 కేంద్రాలు 500 కిలోమీటర్లు అంతకంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

రూపాయి పతనంలో మరో రికార్డు – నరేంద్రమోడీ ” ఘనత ”కు చెల్లిస్తున్న మూల్యం ఎంతో తెలుసా !

13 Monday Jun 2022

Posted by raomk in BJP, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, RUSSIA, WAR

≈ Leave a comment

Tags

BJP, Fuel Price in India, Narendra Modi Failures, Rupee Fall


ఎం కోటేశ్వరరావు


ఎనిమిది సంవత్సరాల పాలనలో నరేంద్రమోడీ సాధించిన ఘనతలు లేదా విజయాలు అంటూ వాట్సాప్‌ పండితులు జనాలకు వండి వడ్డిస్తున్నారు. యజమానులు చెప్పినట్లుగా వారి పని వారు చేస్తున్నారు. వంటలు ఎంత కష్టపడి చేశారని కాదు, అవి తినేందుకు పనికి వస్తాయా లేదా అన్నది గీటురాయి. ఎనిమిదేండ్లుగా తిన్నవారికి అవెలాంటివో తెలియటం ఇప్పుడే ప్రారంభమైంది. ఎప్పటికీ రుచి పచీ తెలియని జనాలు కొందరుంటారు. వారికి సానుభూతి తెలుపుదాం. బిజెపి నుంచి తాత్కాలికంగా పక్కన పెట్టిన అధికార ప్రతినిధి నూపూర్‌ శర్మ చిల్లర మాటల వివాదం తరువాత వాట్సాప్‌ పండితులు నరేంద్రమోడీ గారి ” ఘనతల” గురించి ప్రచారం మొదలు పెట్టారు. వాటిలో చమురు గురించి కూడా ఉంది. వాటితో పాటు దాని కంటే ముందే చమురు రంగంలో” ఘనత ” గురించి గురించి చూద్దాం.


మన దేశం కొనుగోలు చేస్తున్న ముడి చమురు ధర పదేండ్ల నాటి స్థాయికి పెరిగిందన్న వార్తలను కొద్ది మందైనా చదివే ఉంటారు.2011-12లో మన దేశం కొనుగోలు చేసిన ముడి చమురు సగటు ధర 111.89 డాలర్లు. ఆ ఏడాది అంటే 2012 మార్చి నెలలో ఉన్న సగటు ధర 123.66 డాలర్లుంది.2012 మార్చి 29 నుంచి ఏప్రిల్‌ పదకొండువరకు సగటు ధర 121.28 డాలర్లు. కేంద్ర ప్రభుత్వ సంస్థ పిపిఏసి వెల్లడించిన సమాచారం ప్రకారం 2022 జూన్‌ పదవ తేదీన మనం కొనుగోలు చేసిన చమురు ధర 121.28 డాలర్లు. ఇక్కడే మనం నరేంద్రమోడీ ఘనత గురించి చెప్పుకోవాలి. అదే ధరకు 2012లో మన చెల్లించిన మొత్తం మన కరెన్సీలో రు.6,201.05 కాగా ఎనిమిదేండ్ల పాలనలో నరేంద్రమోడీ అదే డాలర్లకు చెల్లించిన మొత్తం రు.9,434.29.అంటే మంచి రోజుల పేరుతో అధికారాన్ని పొంది బాదుడేబాదుడు అన్నట్లుగా చమురు మీద పెంచిన పన్నులను పక్కన పెడితే రూపాయి విలువ పతనాన్ని అరికట్టలేని అసమర్ధత కారణంగా ఈ రోజు మనం ప్రతి పీపాకు పదేండ్ల నాటి కంటే అదనంగా రు.3,233.24 చెల్లిస్తున్నాము. పదేండ్ల క్రితం రూపాయి విలువ డాలరుకు 51.13 ఉండగా మోడీ ఏలుబడిలో 2022 జూన్‌ పదిన అది 77.79కి దిగజారింది, పదమూడవ తేదీన 78.29కి పతనమై మరో కొత్త రికార్డు నమోదు చేసింది. అందువలన పదేండ్ల క్రితం, ఇప్పుడు ముడి చమురు ధర ఒకే విధంగా ఉన్నప్పటికీ మనం చెల్లించే మొత్తం భారీగా పెరిగింది. రూపాయి విలువను కాపాడలేదంటూ నరేంద్రమోడీతో సహా బిజెపి నేతలందరూ మన్మోహన్‌ సింగ్‌ సర్కార్‌ను దులిపివేశారు. మోడీ సర్కార్‌ నిర్వాకానికి ఇప్పుడు దేశ ప్రజలందరూ మూల్యం చెల్లించాల్సి వస్తోంది.


గతేడాది నవంబరు నుంచి ఈ ఏడాది మార్చి వరకు 137 రోజుల పాటు చమురు ధరలను స్థంభింప చేశారు. తరువాత పదిహేను రోజుల్లో 13సార్లు పెంచారు. తిరిగి ఏప్రిల్‌ ఆరు నుంచి ధరల స్థంభన కొనసాగుతోంది. ఏప్రిల్‌ నెలలో మన దేశం కొనుగోలు చేసిన ముడిచమురు సగటు ధర 102.97, మే నెలలో 109.51, జూన్‌ నెలలో పదవ తేదీ వరకు 118.34 డాలర్లుగా ఉంది. జూన్‌ 12న 122 డాలర్లుంది. అందువలన ఏ క్షణంలోనైనా తిరిగి ధరలు పెరగవచ్చు. గతంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల కోసం ధరలను స్థంభింప చేస్తే శ్రీలంక పరిణామాలను చూసిన తరువాత ఇప్పుడు ధరల పెరుగుదలను అరికట్టేందుకుగాను కొంత మేర పన్ను తగ్గింపు, ధరల స్థంభన కానసాగిస్తున్నారు. ఇది మంచిదే కదా అని ఎవరైనా అనవచ్చు. ఎప్పుడు మంచిది అవుతుంది అంటే ఏప్రిల్‌ ఆరునుంచి పెరిగిన ధరల భారాన్ని ప్రభుత్వం భరిస్తే, అలాగాక తిరిగి ఆ మొత్తాన్ని జనం మోపితే పరిస్థితి ఏమిటి ? ఇప్పటికే ఎనిమిది సంవత్సరాల ద్రవ్యోల్బణ రికార్డును మోడీ సర్కార్‌ అధిగమించిన ఘనత సాధించింది.


2022-23 బడ్జెట్‌ను ముడిచమురు ధర 75 డాలర్లు ఉంటుందనే అంచనాతో రూపొందించారు. ఈ ఏడాది తొలి మూడు నెలల్లో సగటున ఎంత ఉందో పైన చూశాము. ఆర్‌బిఐ, ఇతర సంస్థలు మన జిడిపి వృద్ధి గురించి వేసిన అంచనాలన్నిటినీ కుదింపులతో సవరిస్తున్నాయి. పెట్రోలు, డీజిలుకు కూరగాయల సాగుకు నేరుగా సంబంధం లేకున్నా రవాణా,సాగు, ఇతర ఖర్చు పెరిగి వాటి ధరలు కూడా పెరుగుతాయి. మే నెల మూడవ వారం ప్రారంభంలో ఉన్న ముడిచమురు ధరలను బట్టి డీజిలు ధర లీటరుకు రు. 3-4, పెట్రోలు ధర 2-3 వరకు పెంచవచ్చని ప్రభుత్వం లీకులు వదిలింది. మరోవైపు డీజిలు మీద 25-30, పెట్రోలు మీద పది వరకు నష్టాలు వస్తున్నట్లు కొందరు గుసగుసలాడుతున్నారు. చమురు దిగుమతి బిల్లు 2020-21లో ఏడాదికి 62.2బిలియన్‌ డాలర్లుంటే 2021-22కు అది 119.2 బి.డాలర్లకు పెరిగింది. ఈ ఏడాది ఎంత అవుతుందో చెప్పలేము.


చమురు రంగానికి సంబంధించి నరేంద్రమోడీ ఘనత గురించి చెప్పుకోవాలంటే ఇంకా ఉన్నాయి.2014తో ముగిసిన ఆర్ధిక సంవత్సరంలో మన దేశంలో ఉత్పత్తి చేసిన ముడిచమురు 35.9మిలియన్‌ టన్నులు. అది 2020-21కి 29.1కి, 2021-22లో ఖరారు కాని లెక్కల ప్రకారం 28.4మి.టన్నులని పిపిఏసి సమాచారం వెల్లడించింది. పరిస్థితి ఇది కాగా వాట్సాప్‌ పండితులు లేదా పండిత పుత్రులు తిప్పుతున్న ఒక పోస్టులో అంశాల గురించి చూద్దాం.


” భాగస్వామ్య పద్దతిలో రష్యాతో కలిసి కొత్త ఆయిల్‌ బావుల అన్వేషణ కోసం ఒప్పందం చేసుకోవాల్సిందిగా ఓఎన్‌జిసితో పాటు ప్రభుత్వరంగ ఆయిల్‌ సంస్థలను కోరారు మోడీజీ.కొత్త్త ఆయిల్‌ బావుల అన్వేషణ భారీ ఖర్చుతో కూడిన వ్యవహారం అవడంతో ప్రస్తుతం ఆ ఖర్చును రష్యా భరించే స్థితిలో లేకపోవటంతో కొత్త ఆయిల్‌ బావుల అన్వేషణ కోసం భారత్‌ను కోరింది రష్యా.” వెనుకటికి ఎవడో సన్యాసి నాకు పదివేల రూకలిస్తే మీకు బంగారం తయారు చేసే ఉపాయం చెబుతా అన్నాడట. వాడే బంగారాన్ని తయారు చేసుకొని కోట్లు సంపాదించవచ్చు కదా ! చమురు దిగుమతులను తగ్గించి విదేశీమారకద్రవ్యాన్ని ఆదా చేస్తానని చెప్పిన నరేంద్రమోడీ గత ఎనిమిదేండ్లలో ఉన్న ఉత్పత్తిని కూడా కొనసాగించలేని స్థితిలోకి చమురు సంస్థలను నెట్టారు. ఐదులక్షల కోట్ల డాలర్లు కాకున్నా ఇప్పుడు జిడిపిలో రష్యా కంటే మెరుగైన స్థితిలో ఉన్న మన దేశం మన కొత్త బావుల సంగతి చూడకుండా రష్యా వెళ్లమని మోడీ కోరారట, వినేవారుంటే కథలు భలేచెప్తారు కదా ! ఈ రోజు రష్యా సమస్య – కొత్తవాటిని తవ్వటం గురించి కాదు, ఉన్న వాటి నుంచి తీసిన చమురును అమ్ముకోవటం ఎలా అన్నదే. మనతో నిమిత్తం లేకుండానే అది గతంలో బావులను తవ్వుకుంది. మనతో సమంగా దాని దగ్గర కూడా విదేశీమారకద్రవ్య నిల్వలు ఉన్నాయి. చమురు కొనుగోలు చేసి మనమే ప్రతినెలా దానికి సమర్పించుకుంటున్నాము. నరేంద్రమోడీ గారికి గొప్పతనాన్ని ఆపాదించేందుకు ఇలాంటి కట్టుకథలను ప్రచారం చేస్తారు.


”మోడీజీ ఓఐసి(ఇస్లామిక్‌ ఆర్గనైజేషన్‌ దేశాలు) దేశాల నుంచి దిగుమతి చేసుకొనే క్రూడ్‌ ఆయిల్‌లో కోత విధించి దానిని రష్యా నుంచి దిగుమతి చేసుకోవాలని ఆయిల్‌ కంపెనీలను కోరారు”. ఇది ఒక పచ్చి అబద్దం. నూపూర్‌ శర్మ చిల్లర మాటల వివాదానికి ముందు నుంచే తక్కువ ధరకు వస్తున్నందున రష్యా నుంచి దిగుమతిని భారీగా పెంచారు.
”ఇప్పటి వరకు అమెరికా రష్యానుంచి ముడిచమురు బారెల్‌కు 30డాలర్లు పెట్టి దిగుమతి చేసుకొని దానిని శుద్ది చేసి తిరిగి ఐరోపా దేశాలకు అమ్ముతున్నది.ఇప్పుడు భారత్‌ కూడా తక్కువ రేటుకి రష్యా నుంచి కొని దాన్ని శుద్ది చేసి ఐరోపా దేశాలకు అమ్ముతున్నది. ఇది పరోక్షంగా గల్ఫ్‌ దేశాల ఆయిల్‌ వ్యాపారానికి చెంపదెబ్బ ” ఈ పోస్టును రచించిన వారికి ముందేమి రాస్తున్నామో వెనకేమి రాశామో అన్న ఆలోచన ఉన్నట్లు లేదు.పైన పేర్కొన్న రాతకు ఎగువన ఏం రాశారో తెలుసా ! ” మన దేశంలో ఉన్నట్లు ఇయు దేశాలలో భారీ రిఫైనరీలు లేవు. నేరుగా రష్యా నుంచి పెట్రోలును పైప్‌ లైన్‌ నుంచి దిగుమతి చేసుకుంటూ వచ్చాయి.” ఉక్రెయిను సంక్షోభానికి ముందు వరకు రష్యా నుంచి పెట్రోలు, డీజిలు, పెట్రోలియం ఉత్పత్తులను అమెరికా దిగుమతి చేసుకునేది. ఇక్కడ గమనించాల్సిన అంశం ఒకటుంది. కరోనా సంక్షోభంలో కార్పొరేట్‌ శక్తులను నరేంద్రమోడీ సర్కార్‌ ఎలా ఆదుకున్నదో, జనం అప్పులపాలై దివాలా తీస్తే ధనికుల దగ్గర సంపద ఎలా పోగుపడిందో చూశాము. ఇప్పుడు ఉక్రెయిను సంక్షోభం కారణంగా మన దేశంలో జనం ధరల పెరుగుదలతో అల్లాడిపోతుంటే రష్యా నుంచి చౌకగా దిగుమతి చేసుకున్న ముడిచమురును శుద్ది చేసి ఐరోపా దేశాల కోసం ఎగుమతి చేస్తున్నారంటే దీని వలన లబ్ది పొందేది ఎవరు? మన జనమైతే కాదు, పోనీ ఐరోపా దేశాల నుంచి వాటికి ప్రతిగా నరేంద్రమోడీ పలుకుబడితో తక్కువ ధరలకు సరకులను దిగుమతి చేసుకుంటున్నామా అంటే అదీ లేదు. రష్యా నుంచి దిగుమతుల వలన మన జనానికి కలిగిన-కలుగుతున్న మేలు ఇదీ అని ఎవరినైనా చెప్పమనండి !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

రష్యా మీద ఆంక్షల పర్యవసానాలను ఊహించని పశ్చిమ దేశాలు !

08 Wednesday Jun 2022

Posted by raomk in Current Affairs, Economics, History, imperialism, International, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, UK, USA, WAR

≈ Leave a comment

Tags

100 days Ukraine crisis, Ukraine war, Ukraine-Russia crisis, US imperialism


ఎం కోటేశ్వరరావు


ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య ప్రారంభమై బుధవారం నాటికి 105వ రోజుకు చేరింది. అమెరికా, ఇతర నాటో దేశాలు ప్రపంచం మీద రుద్దిన సంక్షోభ పర్యవసానాలను ఉక్రెేనియన్లు ప్రత్యక్షంగా అనుభవిస్తున్నారు. పరోక్షంగా మన దేశంతో సహా అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. వందవ రోజు సందర్భంగా ఆ సంక్షోభం గురించి అనేక మంది పాఠాలు, గుణపాఠాలు అంటూ తమ వైఖరులను వెల్లడించారు. ఏ దాడి లేదా యుద్దంలోనైనా ముందుగా నిజాలు బలి అవుతాయి. వంద రోజులు దాటిన తరువాత కూడా ఉక్రెయిన్లో నిజంగా జరుగుతున్నదేమిటి? అమెరికా కూటమి దేశాలు చెబుతున్నట్లుగా రష్యాకు ఎదురు దెబ్బలు తగిలాయా ఏమిటి అన్నది స్పష్టంగా వెల్లడికావటం లేదు.అందుబాటులో ఉన్న సమాచారం మేరకు కొన్ని అంశాలను చూద్దాం.


ఇరవై శాతం భూభాగం తమ పట్టునుంచి తప్పిందని స్వయంగా ఉక్రెయిన్‌ నేత జెలెనెస్కీ ప్రకటించాడు. అది గత ఎనిమిది సంవత్సరాలుగా స్వాతంత్య్రం ప్రకటించుకున్న తిరుగుబాటుదారులది పైచేయిగా ఉన్న డాన్‌బాస్‌ ప్రాంతం. ఉక్రెయిన్‌ మిలిటరీ, దాని కనుసన్నలలో పని చేసే కిరాయి నాజీమూకలు ఒక వైపు, రష్యా మద్దతు ఉన్న తిరుగుబాటు దార్ల మధ్య అక్కడ అంతర్యుద్దం జరుగుతున్నది. రష్యా ప్రారంభించిన సైనిక చర్యలక్ష్యాలలో ఈ ప్రాంతంలోని నాజీ మూకలను అంతం చేయటం, నాటోలో చేరి తమ సరిహద్దులో అమెరికా, ఇతర దేశాల మిలిటరీ,ఆయుధాలను మోహరించేందుకు పూనుకున్న ఉక్రెయిన్‌ జీవనాడులను దెబ్బతీసి ఆ ప్రక్రియనుంచి వెనక్కు తగ్గేట్లు చేయటం ఉన్నాయి. ఈ ప్రక్రియ కొద్ది రోజుల్లోనే పూర్తవుతుందని వేసిన అంచనాలు తప్పాయి. పశ్చిమ దేశాలు అందించిన ఆధునిక ఆయుధాలే దానికి కారణం. నయా నాజీ మూకలు, మిలిటరీ దాడుల నుంచి డాన్‌బాస్‌ పౌరులను రక్షించాలన్న లక్ష్యం నెరవేరేందుకు వందరోజులు పట్టింది. ఇక్కడ గ్రహించాల్సిన అంశాలు రెండున్నాయి. ఒకనాడు రష్యాలో అంతర్భాగంగా ఉన్న క్రిమియా ప్రాంతాన్ని స్వాధీనం చేసుకొనేందుకు రష్యాను పురికొల్పిన కారణం కూడా ఉక్రెయినుకు నాటో తీర్ధం ఇవ్వాలన్న పశ్చిమ దేశాల ఎత్తుగడే.


క్రిమియాను తిరిగి స్వాధీనం చేసుకోవటం ఉక్రెయినుకు సాధ్యం కాలేదు, ఇప్పుడు తమ పట్టునుంచి జారిందని చెబుతున్న డాన్‌బాస్‌ ప్రాంతాన్ని కూడా నాటో కూటమి దేశాలు ఎన్ని ఆయుధాలు ఇచ్చినా తిరిగి ఉక్రెయిన్‌ ఆధిపత్యంలోకి వస్తుందా అన్నది అపూర్వచింతామణి ప్రశ్న.పూర్వపు సోవియట్‌ నుంచి విడిపోయి దేశంగా ఏర్పడిన వాటిలో జార్జియా ఒకటి. దీనిలో అబ్కాజియా, దక్షిణ ఒసెట్టి అనే ప్రాంతాలు ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసి స్వాతంత్య్రం ప్రకటించుకున్నాయి. వాటిని రష్యా గుర్తించటమే కాదు, అక్కడి ప్రభుత్వాలతో రక్షణ ఒప్పందాలను కూడా కుదుర్చుకొన్నది. జపాన్‌తో అమెరికా రక్షణ ఒప్పందం కుదుర్చుకొని అక్కడ తన సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేసి మిలిటరీని ఎలా దించిందో అదే పద్దతిలో ఇక్కడ రష్యా కూడా ఆ రిపబ్లిక్కులకు రక్షణ కల్పిస్తోంది.ఈ రెండు ప్రాంతాలు జార్జియాలో ఇరవైశాతం కలిగి ఉండేవి. అందువలన డాన్‌బాస్‌ ప్రాంతం కూడా వచ్చే రోజుల్లో ఇదే మాదిరి స్వతంత్ర రాజ్యం లేదా రెండు రాజ్యాలుగా ఏర్పడి రష్యాతో మిలిటరీ రక్షణ ఒప్పందాలను కుదుర్చుకొని విడిగా కొనసాగవచ్చు.


ఉక్రెయిన్‌ సంక్షోభం నేర్పిన ఒక పాఠం ఏమంటే అమెరికాను నమ్ముకుంటే తన ఎత్తుగడలో భాగంగా ఒక దేశాన్ని మరొక దేశం మీదకు ఉసిగొల్పుతుంది తప్ప తన మిలిటరీని పంపి ప్రత్యక్షంగా రంగంలోకి దిగదు అన్నది స్పష్టమైంది. కొరియా, వియత్నాంలపై జరిపిన దాడులు, ఉగ్రవాదులను ఎదుర్కొనే పేరుతో ఆఫ్ఘనిస్తాన్‌లో జోక్యం చేసుకొన్ని తిన్న చావుదెబ్బలే దీనికి కారణం అని వేరే చెప్పనవసరం లేదు. సిరియా ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కిరాయి మూకలను పశ్చిమదేశాలు సమీకరించినా అది సాధ్యం కాలేదు. ఉక్రెయిన్లో కూడా దాదాపు పాతిక వేలమందిని సమీకరించి జనం మీద దాడులు చేయించారు. మరియుపూల్‌ నగరంలోని ఉక్కు కర్మాగారాన్ని స్థావరంగా చేసుకొని మూడు నెలలపాటు రష్యన్లను ఎదిరించింది కూడా ఈ మూకలే. ఆ ఫ్యాక్టరీని ముట్టడించిన రష్యన్లు అక్కడి వారికి అవసరమైన సరఫరాలను అడ్డుకోవటంతో చివరికి వేలాది మంది లొంగిపోయిన సంగతి తెలిసిందే. నాలుగు కోట్ల నలభై లక్షల మంది జనాభాలో కోటీ నలభై లక్షల మంది విదేశాలకు శరణార్ధులుగా వెళ్లటం లేదా స్వదేశంలో నెలవులు తప్పటం గానీ జరిగింది. వారిని ఎంతకాలం అలా అనిశ్చితంగా పరాయిపంచల్లో కొనసాగిస్తారో తెలియటం లేదు. ఇరుగుపొరుగు దేశాలు వారిని దీర్ఘకాలం భరించటం అంతతేలిక కాదు. సంప్రదింపుల పేరుతో జెలెనెస్కీ నాటకం ఆడారు తప్ప చిత్తశుద్దిని ప్రదర్శించలేదు.తమకు నాటోలో చేరే ఉద్దేశ్యం లేదని చెప్పిన పెద్దమనిషి ఆ మాటమీద నిలిచి ఉంటే ఈ పాటికి సంక్షోభం సద్దుమణిగి ఉండేది. చావు దెబ్బలు తింటున్నా ఇంకా విదేశీఆయుధాలు తీసుకుంటూ మరింత నాశనానికి కారకుడు అవుతున్నాడు. పశ్చిమ దేశాలకు సమన్య పరిష్కారం కావటం సుతరామూ అంగీకారం కాదని తేలిపోయింది. రష్యన్‌ దాడుల్లో దెబ్బతిన్నవాటి పునరుద్దరణకు రుణాలిస్తామంటూ సంక్షోభం నుంచి కూడా లాభాలు పిండుకొనేందుకు పూనుకున్నారు.


ఈ వివాదాన్ని ఆసరా చేసుకొని రష్యాను బూచిగా చూపి ఐరోపాలో మరోసారి మిలిటరీ శక్తిగా మారేందుకు జర్మనీ పావులు కదుపుతున్నది. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత మిలిటరీ ఖర్చును తగ్గించి దాన్ని పరిశోధన-అభివృద్ధి, కార్పొరేట్లకు సబ్సిడీల వంటి వాటికి మళ్లించటంతో పారిశ్రామికంగా ఎదిగింది. ఇప్పుడు భారీ ఎత్తున మిలిటరీ ఖర్చుకు నిర్ణయించింది. ఆధునిక ఎఫ్‌35 రకం విమానాలను కొనుగోలు చేస్తానని ప్రకటించింది. ఐరోపాలో పెద్ద మిలిటరీ శక్తిగా ఎదిగేందుకే ఇది అన్నది చెప్పనవసరం లేదు. తటస్థదేశాలుగా ఉన్న స్వీడన్‌, ఫిన్లండ్‌తో పాటు డెన్మార్క్‌ కూడా నాటోలో చేరాలని నిర్ణయించింది. వీటి కదలికల వెనుక ఉన్న అసలు లక్ష్యాలు వెల్లడికావాల్సి ఉంది.


తమ ఆంక్షలతో రష్యా ఆర్ధికవ్యవస్థ కుప్పకూలి జనం పుతిన్‌ మీద తిరగబడతారని పశ్చిమ దేశాలు వేసిన అంచనాలు, పెట్టుకున్న ఆశలు ఫలించలేదు. మాస్కో స్టాక్‌ మార్కెట్‌ మూతపడింది. రష్యన్‌ కరెన్సీ విలువ తొలి వారాల్లో సగానికి సగం పతనమైనా తిరిగి సైనికచర్యపూర్వపు స్థితికి చేరుకుంది. తమతో కాళ్లబేరానికి వస్తాడని భావించిన పుతిన్‌లో అలాంటి సూచనలేమీ లేవు. దాదాపు 300 బిలియన్‌ డాలర్ల మేర విదేశీమారక ద్రవ్యాన్ని పశ్చిమ దేశాలు స్థంభింప చేశాయి. ఎగుమతులపై నిషేధం విధించి ఆధునిక పరికరాలు, యంత్రసామగ్రి, పరిజ్ఞానం అందకుండా కట్టడి చేశారు.అమెరికా, ఐరోపా దేశాలు చమురు దిగుమతులను నిలిపివేసినా రష్యా ఇప్పటివరకు నిలదొక్కుకుంది. తన ఎగుమతులకు వేరే మార్కెట్లను చూసుకుంది. అమెరికా వడ్డీరేట్లను పెంచుతుంటే రష్యా తగ్గిస్తున్నది. మార్చి నెలలో భారత్‌కు చమురు సరఫరా చేసే దేశాల్లో రష్యా పదవస్థానంలో ఉంటే అది ఏప్రిల్‌ నెలలో నాల్గోస్థానానికి ఎదిగింది. మరో ఆరునెలల పాటు చమురు కొనుగోలుకు మన దేశ సంస్థలు ఒప్పందాలు చేసుకున్నట్లు తాజా వార్తలు తెలిపాయి. మరోవైపు చైనా కూడా పెద్ద ఎత్తున చమురుతో పాటు ఇతర దిగుమతులను పెంచింది. రష్యా ఆర్థికవ్యస్థ నిలదొక్కుకొనేందుకు ఇదొక ప్రధాన కారణం. కొన్ని ఐరోపా దేశాలు కూడా ఆంక్షలను పక్కన పెట్టి అక్కడి నుంచి చమురు, గాస్‌ దిగుమతి చేసుకుంటున్నాయి. రష్యా వద్ద బంగారం, విదేశీకరెన్సీ గానీ 640 బిలియన్‌ డాలర్ల మేరకు ఉన్నట్లు చెబుతున్నారు. ఈ కారణంగానే విధించిన ఆంక్షలను అది తట్టుకోగలుగుతోందని చెప్పవచ్చు.


రష్యా మీద పశ్చిమ దేశాల ఆంక్షలు అంటే తమ కాళ్లను తామే తొక్కుకుంటున్నట్లని కొందరు వర్ణిస్తున్నారు. రష్యా నుంచి నిలిపివేసిన ఇంథనాన్ని ఇతర దేశాల నుంచి పొందాలంటే ఐరోపా దేశాలకు వెంటనే కుదిరేది కాదు.తమ నుంచి దిగుమతులు చేసుకోవాలంటే రూబుళ్లలోనే చెల్లించాలని లేకుంటే తామే నిలిపివేస్తామని పుతిన్‌ షరతులు విధించాడు. పశ్చిమ దేశాల ఆంక్షల కారణంగా చమురు ధరలు పెరగటం వలన ఎగుమతుల కారణంగా విదేశీ మారకద్రవ్యం పెద్ద ఎత్తున చెలామణిలోకి రావటం కూడా రూబుల్‌కు సానుకూల అంశంగా మారింది. రూబుల్‌ విలువ పెరగకుండా చూసేందుకు రష్యా రిజర్వుబాంకు వడ్డీ రేట్లను తగ్గించాల్సి వచ్చింది. తమ నుంచి దిగుమతులను నిలిపివేయటం అంటే ఐరోపా ఆర్ధిక ఆత్మహత్య చేసుకోవటమే అని పుతిన్‌ ఎద్దేవాచేశాడు. ఇంధన ధరలు,ద్రవ్యోల్బణం పెరుగుతాయని అన్నాడు. అయితే రష్యా ఇబ్బందులను ఎదుర్కొంటోందని కూడా చెబుతున్నారు. సైనిక చర్యకు ముందు బడ్జెట్‌లో చమురు ఎగుమతుల ఆదాయం 30శాతం ఉంటే ఇప్పుడు 65శాతానికి పెరిగిందంటున్నారు.
పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షలు రష్యాకు వరంగా మారాయి. మార్చి రెండవ తేదీన ముడి చమురు ధర 60 డాలర్లవరకు ఉంటే తరువాత 110 డాలర్లు దాటింది. అందువలన రష్యా తన ఖాతాదార్లకు పెరిగిన ధరమీద పెద్ద మొత్తంలో రాయితీ ఇచ్చినా గతంతో పోల్చుకుంటే నష్టం లేదు, మన వంటి దేశాలకు ఎంతగానో కలసి వస్తుంది.రష్యా మీద వత్తిడి తెచ్చేందుకు ఆంక్షల మార్గాన్ని ఎంచుకున్న పశ్చిమ దేశాలు వాటి వలన ఇతర దేశాలకు, చివరికి తమకూ కలిగే ప్రతికూల పర్యవసానాలను ఊహించలేకపోయాయి. కొన్ని ఐరోపా దేశాల వత్తిడికి లొంగి కొంత మేరకు చమురు దిగుమతులకు అనుమతించారు. వందరోజుల తరువాత అనేక దేశాల్లో తలెత్తిన పరిస్థితి అక్కడి పాలకులకు సమస్యలు తెస్తున్నది. 2014కు ముందు రష్యా ఆహారాన్ని దిగుమతి చేసుకోగా ఇప్పుడు ఎగుమతిదారుగా మారింది. అక్కడి నుంచి రవాణాపై ఆంక్షలున్న కారణంగా ప్రపంచంలో సరఫరా తగ్గి ఇప్పుడు ధరలు పెరిగాయి.


వంద రోజుల సైనిక చర్య తరువాత జరగనున్నదేమిటి అన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. డాన్‌బాస్‌ ప్రాంతంపై పూర్తి పట్టు సాధించినందున ఇక ముందు రష్యా తూర్పు నుంచి భారీ దాడులకు సిద్దం అవుతుంది. ఉక్రేనియన్లు ఇంకేమాత్రం దాడులను తట్టుకోలేని స్థితిలోకి వెళుతున్నారు. తమకు ఇంకా ఆయుధాలు ఇమ్మని జెలెనెస్కీ కోరితే ముందు ముందు జనాగ్రహాన్ని ఎదుర్కోవచ్చు. ప్రస్తుత పోరులో ఉక్రెయిన్‌ గెలుస్తుందనే నమ్మకం రోజు రోజుకూ పశ్చిమ దేశాల్లో సడలుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇరవైశాతం ప్రాంతం మీద తమ పట్టులేదని జెలెనెస్కీ ప్రకటించిన తరువాత ఆ భావన ఇంకా పెరుగుతోంది. ఇప్పుడు పశ్చిమ దేశాలకు ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని కొనసాగించాలా లేదా అన్న ప్రశ్న ఎదురుకానుంది. అమెరికా, ఐరోపా దేశాల్లో ఆర్ధిక పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది. ధనికదేశాల్లో మాంద్యం తలెత్తవచ్చనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. అలాంటపుడు రష్యామీద పోరు కొనసాగించి సాధించేదేమిటి అన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

చైనా, రష్యాలను బూచిగా చూపేందుకే బైడెన్‌ ఆసియా పర్యటన !

26 Thursday May 2022

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, RUSSIA, UK, USA, WAR

≈ Leave a comment

Tags

Joe Biden, Joe Biden Asia tour, Narendra Modi, Quad, Quadrilateral Security Dialogue, Taiwan Matters, Xi Jinping


ఎం కోటేశ్వరరావు


వార్తలద్వారా ఎలా రెచ్చగొట్టవచ్చో ఒక మంచి ఉదాహరణను చూద్దాం.” ప్రధాని మోడీ పాల్గొన్న చతుష్టయ సమావేశానికి దగ్గరగా చైనా, రష్యా యుద్ద విమానాలు : జపాన్‌ మంత్రి ” అన్నది ఒక వార్త శీర్షిక. జపాన్‌ రాజధాని టోకియోలో జరిగిన ఆ సమావేశంలో అమెరికా,జపాన్‌,ఆస్ట్రేలియా దేశాధినేతలు కూడా ఉన్నారు. నరేంద్రమోడీ ఉన్నందున అనే అర్ధం వచ్చేట్లు శీర్షిక పెట్టటం చైనా, రష్యాలతో మన దేశానికి తంపులు పెట్టే లేదా పెంచే వ్యవహారం తప్ప మరొకటి కాదు. చతుష్టయ దేశాలను హెచ్చరించేందుకే ఈ చర్య అని మన దేశంలో కొన్ని పత్రికల సంపాదకీయాలు రాయటం సరేసరి.ఇది తీవ్ర ఆందోళన కలిగించేది అని జపాన్‌ రక్షణ మంత్రి నోబు కిషి గుండెలు బాదుకున్నాడు. ఇలా జపాన్‌ సరిహద్దుల వరకు చైనా-రష్యా విమానాలు రావటం గతేడాది నవంబరు నుంచి నాలుగవసారి అని కూడా కిషి చెప్పాడు. మరి అప్పుడే సమావేశాలు జరిగినట్లు ? ఎవరిని హెచ్చరించేందుకు వచ్చినట్లు ?వాటిలో నరేంద్రమోడీ గారు లేరు కదా ! మా మంత్రిగారు ఏం చెప్పారన్నది వేరే గానీ ఆ విమానాలు తమ గగనతలాన్ని అతిక్రమించలేదని జపాన్‌ రక్షణ మంత్రిత్వశాఖ చెప్పినట్లు ఎఎఫ్‌పి వార్తా సంస్ద పేర్కొన్నది. జపాన్‌ సముద్రం మీద రెండు చైనా విమానాలతో జత కలసిన మరో రెండు రష్యా విమానాలు తూర్పు చైనా సముద్రం నుంచి పసిఫిక్‌ సముద్రం వైపు వెళ్లినట్లు జపాన్‌ మంత్రి చెప్పాడు. గూఢచార సమాచారాన్ని సేకరించేందుకు రష్యా విమానం ఒకటి కూడా జపాన్‌ వైపు వచ్చినట్లు, ఈ చర్యలు రెచ్చగొట్టేందుకే అని ఆరోపించాడు. అంతర్జాతీయ నిబంధనలను పాటించి మరొక దేశ గగనతలాన్ని అతిక్రమించకుండా విమానాలు తిరగటం సర్వసాధారణం.


ఇలా తమ విమానాలు సంయుక్తంగా తిరగటం నిరంతర గస్తీలో భాగమే అని చైనా, రష్యా పేర్కొన్నాయి.వార్షిక మిలిటరీ సహకార ఒప్పందంలో భాగంగా తిరిగినట్లు చైనా రక్షణశాఖ నిర్ధారించింది.టోకియో చతుష్టయ సమావేశాల సందర్భంగా తన రెచ్చగొట్టుడు చర్యలను సమర్దించుకొనేందుకు జపాన్‌ ఇలాంటి ఆరోపణలను చేస్తోందని చైనా పేర్కొన్నది. అమెరికా, జపాన్‌ రెచ్చగొడుతున్న తరుణంలో రెండు యుద్ద నౌకలను జపాన్‌ సమీపంలోని రెండు జలసంధులకు చైనా పంపింది. పశ్చిమ పసిఫిక్‌ సముద్రంలోని చైనా విమానవాహక నౌక నుంచి గత ఇరవై రోజుల్లో కనీసం మూడువందల సార్లు విమానాలు చక్కర్లు కొట్టినట్లు, తైవాన్‌ విషయంలో జోక్యం చేసుకుంటే తమ సత్తా ఏమిటో చూపేందుకే ఇలా చేసినట్లు వార్తలు వచ్చాయి.


జపాన్‌ పార్లమెంటు వెలుపల చతుష్టయ సమావేశాలు జరిగే చోట ఏర్పాటు చేసిన బానర్లు, పోస్టర్లలో ” హాంకాంగ్‌ స్వాతంత్య్రం, విప్లవం, ఉఘిర్‌లో మారణకాండను ఆపండి ” అని రాయటం చైనాను రెచ్చగొట్టటమే అన్నది స్పష్టం. ఇక జపాన్‌ సంగతికొస్తే 2021లో ఇరుగు పొరుగు దేశాలు తన గగనతలాన్ని అతిక్రమిస్తున్నాయనే అనుమానంతో తానే రికార్డు స్ధాయిలో ఎగబడి పట్టుకొనేందుకు ప్రయత్నించటం లేదా తానే గస్తీ తిరగటం వంటి పనులు చేసింది.ఇది ఆప్రాంతంలో తలెత్తిన తీవ్ర పరిస్ధితికి అద్దం పడుతోంది. ఇదంతా చతుష్టయం పేరుతో చైనా వ్యతిరేక కూటమి చర్యలు ముమ్మరం అయిన తరువాతే అన్నది స్పష్టం. 2020లో 279లో సార్లు , 2021లో 1,004 సార్లు జపాన్‌ విమానాలు తిరిగాయి. అంతకు ముందు 2016లో గరిష్టంగా 1,168సార్లు వెంటపడినట్లు అధికారికంగా వెల్లడించారు. దానికి 2012లో జపాన్‌ జనావాసం లేని మూడు దీవులను ప్రయివేటు వారినుంచి కొనుగోలు చేసింది, అవి తమవని చైనా చెప్పటంతో వాటి చుట్టూ జపాన్‌ తన విమానాలను గస్తీ తిప్పింది. దక్షిణ, తూర్పు చైనా సముద్రాల్లో చైనా చర్యలు ఆందోళన కలిగిస్తున్నట్లు చైనా తన శ్వేతపత్రంలో ఆరోపించింది.

యధాతధ స్ధితిని బలవంతంగా మార్చేందుకు పూనుకుంటే సహించేది లేదని ఏ దేశం పేరు పెట్టకుండా టోకియో చతుష్టయ సమావేశం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నప్పటికీ అది చైనా, రష్యాల గురించే అన్నది స్పష్టం. పేరుకు తమది మిలిటరీ కూటమి కాదంటూనే ఆ దిశగా దాన్ని మార్చేందుకు పూనుకున్నారు.దానికి విరుగుడుగా చైనా కూడా జాగ్రత్తపడుతోంది.దానిలో భాగంగానే తన మిలిటరీని పటిష్టపరుస్తోంది.దక్షిణ పసిఫిక్‌ ప్రాంతంలోని అనేక చిన్న దేశాలతో సంబంధాలను పటిష్టపరుచుకుంటోంది. 2017వరకు ఒక భావనగానే ఉన్న ఈ కూటమి గడచిన రెండు సంవత్సరాలలో నాలుగు సార్లు సమావేశం కావటం గమనించాల్సిన అంశం. ఆ తరువాతే లడఖ్‌లోని గాల్వన్‌ లోయ ఉదంతం జరిగినట్లు అంతర్జాతీయ పరిశీలకులు చెప్పారు. ఆస్ట్రేలియా-చైనా మధ్య వాణిజ్యపోరు మొదలైంది. సోలోమన్‌ దీవుల ప్రభుత్వంతో చైనా కుదుర్చుకున్న భద్రతా ఒప్పందం తమకు వ్యతిరేకంగానే అని ఆస్ట్రేలియా ఆరోపిస్తోంది. చైనా నావలు ఆ దీవుల్లో లంగరువేసేందుకు వీలుకలుగుతుందని అంటోంది.దీనికి ప్రతిగా బ్రిటన్‌, అమెరికాతో కలసి అకుస్‌ పేరుతో మిలిటరీ ఒప్పందం చేసుకుంది. బ్రిటన్‌ నుంచి అణుశక్తితో నడిచే జలాంతర్గాముల కొనుగోలుకు ఒప్పందం చేసుకుంది. దాదాపు శతాబ్దికాలంగా జపాన్‌-చైనా మధ్య వివాదాస్పదంగా ఉన్న కొన్ని దీవుల అంశమై ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఒకవైపు తైవాన్‌ దీవిని చైనా అంతర్భాగంగా గుర్తిస్తున్నామని చెబుతూనే దాన్ని సైనికంగా బలపరిచేందుకు అమెరికా పూనుకుంది.ఒక వేళ చైనా గనుక బలవంతంగా విలీనం చేసుకోవాలని పూనుకుంటే తాము మిలిటరీతో రక్షణ కల్పిస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఆసియా పర్యటనలో బెదిరించిన అంశం తెలిసిందే.


చతుర్ముఖ భద్రతా మాటామంతీ( ద క్వాడ్రిలేటరల్‌ సెక్యూరిటీ డైలాగ్‌) పేరుతో 2007లో జపాన్‌ చొరవతో భారత్‌,ఆస్ట్రేలియా, అమెరికా చర్చలు ప్రారంభించాయి. దీన్నే క్వాడ్‌(చతుష్టయం) అంటున్నారు. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో చైనాను ఎదుర్కోవటమే దీని లక్ష్యం. అదే ఏడాది ఆస్ట్రేలియా వెనక్కు తగ్గటంతో ఆ కూటమి ముందుకు సాగలేదు.2017లో మనీలాలో జరిగిన ఆసియన్‌ కూటమి సమావేశాల సందర్భంగా ఈ కూటమిని పునరుద్దరించాలని నాలుగు దేశాలు నిర్ణయించాయి.ఆ ప్రాంతంలో నౌకలను అడ్డుకున్న ఉదంతం ఒక్కటీ లేకున్నా ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలోని తూర్పు, దక్షిణ చైనా సముద్రాల్లో స్వేచ్చగా నౌకా రవాణా ఉండే పరిస్ధితి కల్పించాలనే పేరుతో ఒక అజెండాను ముందుకు తెచ్చాయి.పైకి ఏమి చెప్పినా చైనాను అడ్డుకోవటమే అసలు ఎత్తుగడ. ఇండో-పసిఫిక్‌ ప్రాంతం గురించే తమ కేంద్రీకరణ అని చెప్పిన చతుష్టయ కూటమి క్రమంగా ఇతర అంశాల మీద కూడా దృష్టి సారిస్తోంది.టోకియో భేటీతో పాటు ఈ ఏడాది మార్చి నెలలో జరిగిన సమావేశంలో ఉక్రెయిన్‌ సంక్షోభం గురించి చర్చించింది.
ఉక్రెయిన్‌ మీద రష్యా దాడి చేసినపుడు వివిధ కారణాలతో మిలిటరీతో ఆదుకోలేదు, తైవాన్‌ విషయంలో కూడా చైనా దాడి చేస్తే అలాగే ఉంటారా లేక రక్షణకు వస్తారా అని టోకియోలో విలేకరి అడిగిన ప్రశ్నకు వెంటనే జో బైడెన్‌ అవసరమైతే తైవాన్‌లో మిలిటరీతో ఎదుర్కొంటామని చెప్పాడు. ఒకే చైనా విధానాన్ని అమెరికా అంగీకరించింది నిజం, ఆ మేరకు ఒప్పందంపై సంతకాలు కూడా చేశాము. దానిలో ఎలాంటి మార్పూ లేదు. కానీ తైవాన్ను బలవంతంగా స్వాధీనం చేసుకోవటం సబబు కాదు. అందుకు పూనుకుంటే మిలిటరీతో ఎదుర్కొంటాం అన్నాడు. బలప్రయోగం చేసే హక్కు చైనాకు లేదన్నాడు. బలవంతంగా ఆక్రమించేందుకు చైనా పూనుకుంటుందని తాను అనుకోవటం లేదని, అది ప్రపంచం ఎంత గట్టిగా స్పందస్తుంది అనేదానిపై ఆధారపడి ఉంటుందని, దురాక్రమణకు మూల్యం చెల్లించాల్సి ఉంటుందన్నాడు. అంతకు ముందు జపాన్‌ ప్రధాని కిషిడాతో కలసి మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడైనా ఏకపక్షంగా యధాతధ స్ధితిని మార్చేందుకు ఎవరైనా పూనుకుంటే సహించేది లేదని, రష్యా దాడి ప్రపంచ వ్యవస్ధ పునాదులను కదలించిందని బైడెన్‌ అన్నాడు.

బైడెన్‌ ప్రకటనల మీద చైనా తీవ్రంగా స్పందించింది. ఏదో అనుకోకుండా మాట్లాడినట్లుగా తాజా స్పందనను పరిగణించలేమని, అంగీకరించిన ఒకే చైనా విధానం నుంచి వెనక్కు తగ్గుతున్నదనేందుకు సూచిక, మరొక అడుగు ముందుకు వేసినట్లు చైనా భావిస్తోంది. ఉక్రెయిన్‌ ముసుగులో తైవాన్‌ స్వాతంత్య్రం గురించి అమెరికా, జపాన్‌ తమ పధకాలతో ముందుకు పోతే వాటిని గట్టిగా ఎదుర్కొంటామని స్పష్టం చేసింది. ఉక్రెయిన్లో మాదిరి బలప్రయోగంతో ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో కూడా ఏకపక్షంగా యధాతధ స్దితిని మార్చితే చూస్తూ ఊరుకోబోమని జపాన్‌ ప్రధాని కిషిదా కూడా చెప్పటాన్ని చైనా పరిశీలకులు గుర్తు చేశారు. తైవాన్‌ తమ అంతర్గత అంశమని, దానిలో విదేశీ శక్తుల జోక్యాన్ని అనుమతించబోమని చైనా విదేశాంగశాఖ ప్రతినిధి వాంగ్‌ వెన్‌బిన్‌ విలేకర్లతో స్పష్టం చేశాడు. అమెరికా సైనికులను తైవాన్‌కు తరలించనప్పటికీ ఏదో ఒకముసుగులో ఆయుధాలను పెద్ద ఎత్తున అందచేస్తున్నది. అందువలన సైనికులను పంపటం ఒక్కటే మిలిటరీ జోక్యం కాదని ఆయుధాల అందచేత కూడా మిలిటరీ జోక్యమే అని చైనా పరిగణిస్తున్నప్పటికీ సంయమనం పాటిస్తున్నది. చైనా మీదకు పోవాలని బైడెన్‌ కోరుకున్నట్లయితే చైనా-అమెరికా సంబంధాలు టైటానిక్‌ ఓడ మంచుకొండను ఢకొీన్నపుడు జరిగిన మాదిరే జరుగుతుందని చైనా పరిశీలకులు వర్ణించారు. ఉక్రెయిన్‌ అంశాన్ని తైవాన్‌ సమస్యతో కలిపి చూపటం వెనుక తైవాన్‌ దీవిపై చైనా సార్వభౌమత్వాన్ని తిరస్కరించే ఎత్తుగడ ఉంది.అంతేకాదు తైవాన్ను చూపుతూ ఆసియా పసిఫిక్‌ ప్రాంతానికి చైనా ముప్పు ఉందని ఈ ప్రాంత దేశాలను నమ్మించటం,తప్పుదారి పట్టించటం కూడా తెలిసిందే.


జో బైడెన్‌ ఆసియా పర్యటనను మొత్తంగా చూసినట్లయితే ప్రధానంగా రెండు లక్ష్యాలతో సాగినట్లు చెప్పవచ్చు. గత రెండు దశాబ్దాలలో తొలిసారిగా ఆసియా పర్యటన జరిపిన అమెరికా నేతలందరూ చైనాను సందర్శించారు. తొలిసారిగా జోబైడెన్‌ చైనాలో అడుగుపెట్టలేదు. ప్రాంతీయ సమగ్ర ఆర్ధిక భాగస్వామ్యం (ఆర్‌సిఇపి) పేరుతో ఏర్పడిన అతి పెద్ద ఆర్ధిక కూటమిలో అమెరికా లేదు. దానికి పోటీగా ఇండో పసిఫిక్‌ ఎకనమిక్‌ ఫ్రేమ్‌వర్క్‌ (ఐపిఇఎఫ్‌) పేరుతో కొత్త కూటమిని ఉనికిలోకి తెచ్చి ఆ ప్రాంత దేశాలను ఆకర్షించటం, తద్వారా తనపెత్తనాన్ని నిలుపుకొనేందుకు పూనుకోవటం. దీని వలన మనకు కలిగే లబ్ది ఏమిటో తెలియకుండానే మన దేశం సిద్దం సుమతీ అన్నది. ఆర్‌సిఇపిలోని మరికొన్ని దేశాలు కూడా దీనిలో చేరుతున్నట్లు ప్రకటించాయి.ఈ కూటమిలో అమెరికా మార్కెట్లో ప్రవేశించే అవకాశాలు పరిమితమని ఇప్పటికే విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఇది కూడా చైనాను దూరంగా పెట్టే ఎత్తుగడే. రెండవదాని కొస్తే ఉక్రెయిన్‌ విషయంలో తాము మిలిటరీని పంపేది లేదని అమెరికా చెప్పటంతో దాన్ని నమ్ముకుంటే అంతే సంగతులని అనేక దేశాలు భావిస్తున్నాయి. ఇది అమెరికాకు రాజకీయంగా ఎంతో నష్టం కలిగించింది. తన ప్రయోజనాలకోసం రెచ్చగొట్టి ముందుకు తోసి తాను తప్పుకుంటుందనే భావం ఎల్లెడలా కలిగింది. దాన్ని పోగొట్టేందుకు, మద్దతుదార్లలో విశ్వాసాన్ని కల్పించేందుకు తైవాన్‌ అంశంలో తాము సైనికంగా జోక్యం చేసుకుంటామని బైడెన్‌ చెప్పాడు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

రంగనాయకమ్మ గారూ”కుహనా మిత్ర శత్రువు” లతోనే నష్టం ఎక్కువ !

23 Saturday Apr 2022

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, Left politics, NATIONAL NEWS, Political Parties, RUSSIA, USA, WAR

≈ 2 Comments

Tags

#Ranganayakmma, Ranganayakmma, Ukraine-Russia crisis, ultra – leftism


ఎం కోటేశ్వరరావు


రంగనాయకమ్మ గారి మహా రష్యన్‌ దురహం కారం అనే విశ్లేషణపై స్పందించిన నాకు ఆమె ఆత్మానందాన్ని ఆపాదించారు. దానికి పారమార్ధిక పదకోశంలో చెప్పిన ఒక వ్యాఖ్యానం లేదా భాష్యం ప్రకారం కలిమి,బలిమి మరెందులోనూ తనకు మించిన వారు లేరని సంబరపడటం. అలాంటి అంబర సంబరం నాకు లేదుగానీ పురోగామి వాదిగా ఉన్నా అనే సంతృప్తి పక్కాగా ఉంది. మార్క్స్‌కంటే మార్క్సిజాన్ని ఎక్కువగా ఔపోసనపట్టినట్లు భావిస్తూ అలాంటి స్ధితిలో రంగనాయకమ్మ గారు ఉన్నారేమో అన్న సందేహం కలుగుతోంది. ఆ స్పందనకు ప్రతిస్పందనగా కొన్ని అంశాలను పాఠకుల ముందుంచుతున్నాను. (ఆంధ్రజ్యోతిలో మార్చి రెండవ తేదీన రంగనాయకమ్మ గారి విశ్లేషణకు నా స్పందన మార్చి12న ప్రచురితం కాగా ఏప్రిల్‌20న రంగనాయకమ్మ గారి ప్రతిస్పందన ప్రచురితమైంది)


1. లెనిన్‌ నాయకత్వంలో వున్న పార్టీ ప్రభుత్వం ” రష్యన్‌ రిపబ్లిక్‌ ” అని నామకరణం చేసిందని నేను రాయలేదు.’రష్యన్‌ సోవియట్‌ ఫెడరేటివ్‌ సోషలిస్ట్‌ రిపబ్లిక్‌’ అనే రాశాను. ‘ఫెడరేటివ్‌’ అనే పదాన్ని వదలివేయ లేదు. తదుపరి పేరాలో దాన్ని పునశ్చరణ చేసిన సందర్భంలో పొట్టిగా రష్యన్‌ రిపబ్లిక్‌ అని రాశాను.(చైనా అసలు పేరు పీపుల్స్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ చైనా కానీ వాడుకలో చైనా అంటున్నాం తప్ప ప్రతిసారీ మొత్తం పేరును వాడటం లేదు, పీపుల్స్‌ రిపబ్లిక్‌ రిపబ్లిక్‌ను విస్మరించారు అంటే ఎలా, అలాంటిదే ఇది) ఆ పేరును అంతకు ముందు ప్రభుత్వ నేతగా ఉన్న కెరెన్‌స్కీ పెట్టారని రంగనాయకమ్మగారు రాశారు. కెరెన్‌స్కీ సర్కార్‌ పెట్టిన పేరు ” రష్యన్‌ డెమోక్రటిక్‌ ఫెడరల్‌ రిపబ్లిక్‌ ” అని తెలుసుకుంటే చాలు. లెనిన్‌ అధికారానికి వచ్చిన 1917 నవంబరు ఏడు నుంచి 1918 జనవరి 18న రాజ్యాంగ సభ ‘రష్యన్‌ సోవియట్‌ ఫెడరేటివ్‌ సోషలిస్ట్‌ రిపబ్లిక్‌’ అని పేరు మారుస్తూ డిక్రీ జారీ చేసే వరకు కెరెన్‌స్కీ పెట్టిన పాత పేరు కొనసాగింది. కెరెన్‌స్కీ-లెనిన్‌ ప్రభుత్వం పెట్టిన రెండు పేర్లలోనూ మధ్యలో పదాలు మారినప్పటికీ ” రష్యన్‌ ” అనే పదంతోనే ప్రారంభమైంది కనుక లెనిన్‌ కూడా రష్యన్‌ మహాదురహంకారానికి గురైనట్లు భావించాలా అని ప్రశ్నించాను తప్ప లెనిన్‌ గురైనట్లు నేను చెప్పలేదు. ” రష్యన్‌ ” పదం లేకుండా తరువాత 1924లో వివిధ రిపబ్లిక్‌ల మధ్య ఒప్పందం జరిగి ”యూనియన్‌ ఆఫ్‌ సోవియట్‌ సోషలిస్టు రిపబ్లిక్‌(యుఎస్‌ఎస్‌ఆర్‌)గా పేరు మార్చారు. స్టాలిన్‌ మీద ఉన్న గుడ్డి ద్వేషంతో ఉన్నవారిని ఏ విధంగానూ సంతుష్టీకరించలేము.యుఎస్‌ఎస్‌ఆర్‌లో ఉన్నది ఫెడరల్‌ ప్రభుత్వం తప్ప రంగనాయకమ్మగారు పేర్కొన్నట్లుగా రష్యాలోని కేంద్ర ప్రభుత్వం కాదు. అధికార కేంద్రం(రాజధాని) మాస్కోలో ఉన్నంత మాత్రాన అది రష్యన్‌ కేంద్ర ప్రభుత్వం కాదు.


2. ఒక దేశం మరొక దేశ ప్రభుత్వంతో కుదుర్చుకొనే ఒప్పందాలమీద దేశాధినేతల సంతకాలు, తరువాత వాటిని పార్లమెంటు ఆమోదించటాలు, పార్టీల విధాన రూపకల్పన పద్దతికి ఉన్న తేడా గురించి రంగనాయకమ్మగారికి తెలియదనుకోలేం. ప్రభుత్వ ఒప్పందాలను సులభతరంగా పాఠకులు అర్ధం చేసుకొనేందుకు అధినేతలు ఒప్పందాలు చేసుకున్నారని ఒక జర్నలిస్టుగా అనేక సార్లు స్వయంగా రాశాను. ఒక విధానాన్ని స్టాలిన్‌కు ఆపాదించి తాను చేసిన దాడిని సమర్ధించుకొనేందుకు నేను చేసిన ప్రస్తావనను ఉటంకిస్తూ నేను కూడా వ్యక్తులకు ఆపాదించినట్లు ఆమె చిత్రించారు. ఒప్పందాలపై సంతకాలు సాంకేతికంగా ప్రభుత్వాల తరఫు దేశాధిపతులు లేదా మంత్రులు కూడా చేస్తారు.ఒక పార్టీ లేదా ప్రభుత్వం ఆమోదించే,అనుసరించే విధానం అన్నది సమిష్టి నిర్ణయం. ఆమోదించిన తరువాత వాటి మీద లెనిన్‌, స్టాలిన్‌ లేదా ఒక వేళ రంగనాయకమ్మగారే ఏదైనా పార్టీ నేతగా ఉంటే ఆమె సంతకాలు, గెజెట్‌ నోటిఫికేషన్లు అవసరం లేదు. ప్రభుత్వాల ఒప్పందాలను లిఖించేది అధికారులు. పార్టీల విధాన రూపకల్పన పరిధి, అంశాలను కమిటీలు ఆవెెూదించిన తరువాత ముసాయిదా రాతపనిని ఒకరికో, ఒక బృందానికో అప్పగిస్తారు, వారు దాన్ని ప్రతిపాదిస్తారు, లేదా వివాదం తలెత్తినపుడు కొంత మంది కలసి ప్రత్నామ్నాయ ప్రతిపాదనలు చేస్తారు. వాటికి ఆమోదం లేదా తిరస్కారం తరువాత అది వ్యక్తులది కాదు ఉమ్మడి అభిప్రాయం మాత్రమే. లెనినిజం, స్టాలినిజం,మరొకయిజం అన్నది మార్క్సు-ఎంగెల్స్‌ల తరువాత సంభవించిన నూతన పరిణామాలు లేదా రంగనాయకమ్మగారి వంటి వారు ముందుకు తెచ్చిన భాష్యాల్లోని వక్రీకరణలను తిప్పికొట్టేందుకు లెనిన్‌ ఇచ్చిన వివరణలు మార్క్కిస్టు సిద్దాంతాన్ని పరిపుష్టం చేశాయి, వాటిని దాదాపుగా కమ్యూనిస్టులందరూ అంగీకరించారు గనుక తరువాత కాలంలో మార్క్సిజం-లెనినిజం అని పిలిచారు. స్టాలిన్‌ కూడా కొన్ని అంశాలకు వివరణ ఇచ్చినప్పటికీ వాటిని స్వీకరించినా దాన్ని స్టాలినిజంగా ఎవరూ పరిగణించటం లేదు. అలాగే మావో వివరణలు ఆమోదించిన వారు మార్క్సిజం-లెనినిజాలకు మావో ఆలోచనా విధానమనో, మావో ఇజమనో పెట్టుకుంటున్నారు. అలా పెట్టుకోని వారు కూడా చైనా పరిస్ధితులకు మావో అన్వయించిన సూత్రీకరణలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఇక రంగనాయకమ్మగారి భాష్యాలను ఆమోదించిన వారు మార్క్సు-లెనిన్‌ సరసన ఆమె ఇజాన్ని కూడా చేర్చి విప్లవాలను తేవచ్చేమో ? ఇంతకీ ఆమె ఇజాన్ని ఆమోదించే లేదా అమలు చేసే పార్టీ ఏదైనా ఉందా ? నిజంగా తెలుసుకొనేందుకే !

3) 1953లో స్టాలిన్‌ మరణం తర్వాత అధికారానికి వచ్చిన కశ్చెవ్‌ స్టాలిన్‌ మీద చేసిన దాడి గురించి చెప్పనవసరం లేదు. అదే పెద్ద మనిషి, బ్రెజ్నెవ్‌ కూడా స్టాలిన్‌ విధానాన్నే కొనసాగించాడని అందుకే ఇతర జాతుల వారు విడిపోవాలనే డిమాండ్‌ను ముందుకు తేలేదని రంగనాయకమ్మగారు చెప్పారు. అలాంటపుడు ఆమె దాడి ఒక్క స్టాలిన్‌ మీదనే ఎందుకు కేంద్రీకరించినట్లు ?


4. సోవియట్‌ యూనియన్‌ నించీ విడిపోయాక ఉక్రెయిన్‌లో రాజకీయ అనిశ్చితి ఉంది. వివిధ పార్టీల, ప్రభుత్వాల నేతలు అమెరికా లేదా రష్యా ప్రభావంలో ఉన్నప్పటికీ ఇతర దేశాలతో సాధారణ దౌత్య సంబంధాలు పెట్టుకున్నారు తప్ప ఏ కూటమిలోనూ చేరలేదు అని మరోసారి చెబుతున్నాను. తాము నాటోలో చేరాలనుకుంటున్నట్లు బుఖారెస్ట్‌ 2008 నాటో సభకు ఉక్రెయిన్‌, జార్జియా దరఖాస్తు చేశాయి. అమెరికా అంగీకరించగా ఐరోపా దేశాలు కొన్ని కాదన్నాయి, కానీ రాజీగా నిర్ధిష్ట గడువును పేర్కొనకుండా ఈ దేశాలు నాటో సభó్యదేశాలు అవుతాయి అని ప్రకటన చేశారు. తాజా సంక్షోభానికి ఆ విధంగా నాటో కూటమి నాంది పలికింది. తరువాత 2010 ఉక్రెయిన్‌ ఎన్నికల్లో గెలిచిన అధ్యక్షుడు విక్టర్‌ ఎన్‌కోవిచ్‌ వెంటనే సెవాస్తపూల్‌ రేవు కౌలు గడువును 2042వరకు పెంచుతూ రష్యాతో ఒప్పందం చేసుకున్నాడు. అదే పెద్ద మనిషి తరువాత పశ్చిమ దేశాల వత్తిడితో ఐరోపా యూనియన్‌ కూటమితో ఒప్పందానికి 2013 ఏప్రిల్‌లో సుముఖత తెలిపాడు. వెంటనే రష్యా రంగంలోకి దిగటంతో సంతకాలు చేసేందుకు కొద్ది రోజుల ముందు ఆ ఒప్పందాన్ని తిరస్కరిస్తున్నట్లు ఒక ప్రకటన చేశాడు. ఎవరు వత్తిడి చేస్తే అటు మొగ్గాడు.చివరకు పశ్చిమ దేశాలు నిరసనలను ఎగదోయటంతో దేశం విడిచి వెళ్లాడు. వాస్తవం ఇది కాగా ” అతనికి ముందు 1991 నించీ 2012 వరకూ వున్న వాళ్ళూ, అతని తర్వాత వాళ్ళూ అమెరికా కూటమికి అనుకూలురూ అన్నమాట! ” అంటూ రంగనాయకమ్మగారు చెప్పారు. రాజుగారి చిన్న భార్య అందగత్తె అంటే పెద్దామె అనాకారి అన్నట్లుగా ఉంది.


5) ” రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు సోషలిస్టు సోవియట్‌ యూనియన్‌ వుంది అని వ్యాసకర్త సమర్ధన. అసలు అక్కడ, అప్పుడు వున్నది ప్రభుత్వ పెట్టుబడిదారీ విధానం. ఇంకా సరిగా చెప్పాలంటే, పార్టీ పెట్టుబడిదారీ విధానం. ఉత్పత్తి సాధనాలు వ్యక్తుల స్వంత ఆస్తిగా లేనంత మాత్రాన, అది సోషలిజం కాదు. ” అన్నారు. అంటే సోవియట్‌ యూనియన్ను సోషలిస్టు దేశంగా గుర్తించలేదు. తత్వం తలకెక్కింది రోకలిని తలకు చుట్టమనటం తప్ప మరొకటి కాదు. సోషలిస్టు వ్యవస్దలో ప్రభుత్వం కార్మికవర్గ ఆధిపత్యంలో ఉంటుంది. అంటే ఉత్పత్తి సాధనాలు ఎవరి చేతిలో ఉన్నట్లు ? ఫలితాలను ఎవరు అనుభవిస్తారు ?

6) ” కొన్ని దేశాలు అమెరికా పెత్తనానికీ, దుర్మార్గానికీ బలయ్యాయనీ రష్యాకి అలాంటి దుర్మార్గ చరిత్ర లేదనీ వ్యాసకర్త కితాబు. మరి, 1956లో హంగరీ మీదకీ, 1968లో చెకొస్లవేకియా మీదకీ, 1979లో అఫ్గనిస్తాన్‌ మీదకీ యుద్ధ టాంకుల్ని పంపింది, రష్యాయా, అమెరికాయా? ” అని ప్రశ్నవేశారు. మొదటి రెండు ఉదంతాల్లో సోషలిస్టు వ్యవస్ధకు అమెరికా సిఐఏ కుట్రలతో ముప్పు తలపెట్టినపుడు వాటి రక్షణకు అక్కడి ప్రభుత్వాల కోరిక మేరకు సోవియట్‌ జోక్యం చేసుకుంది, ఆఫ్ఘనిస్తాన్‌లో అధికారానికి వచ్చిన వామపక్ష శక్తుల ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు అమెరికా చేసిన కుట్రను ఎదుర్కొనేందుకు అక్కడి ప్రభుత్వ కోరిక మేరకే అడుగు పెట్టింది. దానిలో ఇప్పుడు స్వతంత్ర దేశంగా ఉన్న ఉక్రెయిన్‌ కూడా భాగస్వామే. అంతర్జాతీయ కర్తవ్యంగా ఆపని చేసినందుకు సోషలిస్టు అభిమానులందరూ హర్షించారు. రంగనాయకమ్మ వంటి వారు పురోగామివాదులుగా చెప్పుకుంటూ శత్రువులతో గొంతు కలిపి ఖండించారు. సోషలిస్టు శత్రువులకూ-మిత్రులుగా చెప్పుకున్నవారికీ భలే కలిసింది. సోషలిజం, కమ్యూనిజం అంటే గిట్టదు అని సూటిగా వ్యతిరేకించే వారిని అర్దం చేసుకోగలం. వారి గురించి పురోగామి శక్తులకు స్పష్టత ఉంటుంది. కానీ మార్క్సిస్టు ముసుగులో ఉండి దాడి చేసే వారు ” కుహనా మిత్ర శత్రువులు ” తప్ప మరొకటి కాదు. అసలు శత్రువుల కంటే వీరు చేసే నష్టం ఎక్కువ. వారు సృష్టించిన గందరగోళంలో పడిన పురోగామి వాదులు ఎటూ తేల్చుకోలేక పడక కుర్చీలకు తప్ప దేనికీ పనికి రారు. అంతిమంగా వారు పాలకవర్గాలకు మేలు చేస్తున్నారు తప్ప కార్మికవర్గానికి కాదు.
7) ”ఉక్రెయిన్‌ మీద రష్యా దురాక్రమణని సమర్ధించడానికి, వ్యాసకర్త ఒక కొత్త సూత్రాన్ని తయారు చేశారు. ‘అన్ని పెట్టుబడిదారీ దేశాలూ దురాక్రమణదారులు కాదు’ అని ” అవును, అది మన కళ్ల ముందున్న ఒక వాస్తవం.శాశ్వతంగా అలాగే ఉంటాయని నేను చెప్పలేదు. పెట్టుబడిదారీ దేశాల స్వభావం గురించి మార్క్సూ- ఎంగెల్సులు చెప్పిన మాట నిజం. అది సాధారణ సూత్రీకరణ. పారిశ్రామిక విప్లవం తరువాత మార్కెట్ల ఆక్రమణకు వాటి మధ్య ఉన్న వైరుధ్యాల కారణంగానే యుద్దాలు జరిగాయి. తరువాత పెట్టుబడిదారీ విధానాన్ని అనుసరించిన దేశాలన్నీ మార్కెట్ల కోసం చూసినా దురాక్రమణదారులుగా మారలేదు. వలసలు అంతరించాయి. దాన్ని గుర్తించకపోతే మొరటుతనం అవుతుంది తప్ప మార్క్సిజం లెనినిజం కాదు. సోషలిస్టు చైనా మీద అమెరికా కుట్రలు చేస్తోంది. దాన్ని ఎదుర్కొనేందుకు ఎవరు తోడ్పడితే వారి సహకారం తీసుకోవాలి. దానిలో భాగమే రష్యా-చైనా మైత్రి. అది శాశ్వతం అని ఎవరైనా చెప్పారా ? అమెరికాను దెబ్బ తీసేందుకు చైనా, మరొక సోషలిస్టు దేశం గానీ అవకాశం వచ్చినపుడు అంతర్జాతీయ పరిణామాల్లో జోక్యం చేసుకోకపోతే శత్రువలలో చిక్కినట్లే ! అసలు ఇంతకూ రంగనాయకమ్మగారు చైనాను సోషలిస్టు దేశంగా గుర్తిస్తున్నారా లేక అది కూడా ప్రభుత్వ పెట్టుబడిదారీ విధానం అనుసరిస్తున్నది అనే వారితో యుగళ గీతం పాడుతున్నారా ?
8) దురాక్రమణ యుద్ధానికి నాజూకైన పేరే ‘ప్రత్యేక సైనిక చర్య’ అని రంగనాయకమ్మగారు అంటున్నారు. ఎవరు దేన్ని ముట్టుకుంటే దాన్ని అలా వర్ణిస్తారు అన్న అంధ వికలాంగులు- ఏనుగు కథ తెలిసిందే. దీని కంటే కళ్లుండీ చూడలేక మార్క్సిస్టు కబుర్లు చెబుతున్నవారు తమ వక్రీకరణలకు నాజూకైన పేర్లు పెట్టటమే పెద్ద నష్టం కలిగిస్తోంది. రష్యా తన లక్ష్యం ఏమిటో స్పష్టంగా చెప్పింది. ప్రజాస్వామ్యకబుర్లు చెప్పలేదు. ఉక్రెయిన్లో ప్రజాస్వామ్యఖూనీ జరిగిందనా లేదు. నాటో చేరాలనే ప్రతిపాదనను వదులు కుంటే అక్కడి ప్రభుత్వాన్ని గుర్తిస్తానని, ప్రాదేశిక సమగ్రతకు హామీ ఇస్తానని చెప్పింది.


9)” అమెరికా, రష్యా, రెండూ పెట్టుబడిదారీ దేశాలే అని ఒక పక్కన ఒప్పుకుంటూ, అమెరికాకు వ్యతిరేకంగా రష్యాని బలపరచాలని సలహా ఇస్తున్నారు వ్యాసకర్త” అన్నారు రంగనాయకమ్మగారు. మార్క్సిజంలో ఔపోసన పట్టటానికి ఇంకేమీ మిగిలినట్లు లేదు కనుక ఆమె చరిత్రను ఒక పట్టుపట్టాలి. చైనా విప్లవ చరిత్రలో జపాన్‌ సామ్రాజ్యవాదుల మీద పోరాడేందుకు అప్పటి వరకు తమను అణిచివేస్తున్నచాంగ్‌కై షేక్‌తోనే కమ్యూనిస్టులు చేతులు కలిపారు.” ఇద్దరు బందిపోటు ముఠాలున్నప్పుడు, ఆ ఇద్దరికీ వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని కూడగట్టాలి. అంతేగానీ, ‘ఈ బందిపోటుది న్యాయం, ఆ బందిపోటుది కుట్ర’ అని ఏదో ఒక పక్షాన నిలబడడం అంటే, రెండు దేశాల ప్రజలకూ ద్రోహం చెయ్యడమే.” అని చెప్పిన రంగనాయకమ్మగారి సూత్రీకరణలో చైనా పరిణామాన్ని ఎలా ఇముడ్చుతారు ? మావో నాయకత్వంలో అక్కడి పార్టీ ప్రజలకు ద్రోహం చేసిందని చెబుతారా, ఏమో !


10) ”వ్యాసకర్త… అమెరికా, పెట్టుబడిదారీ దేశాలనే కాదు, సోషలిస్టు దేశాలనూ వ్యతిరేకిస్తోందని అన్నారు. ఆ సోషలిస్టు దేశాలు ఎక్కడున్నాయో చెపితే బాగుండేది. చైనాలో మావో గ్రూపూ, చౌ ఎన్‌ లై గ్రూపూ, లిన్‌ పియావో గ్రూపూ అంటూ 3 పెద్ద గ్రూపుల మధ్య కమ్యూనిస్టు పార్టీలోనే వర్గ పోరాటం లాంటిది జరుగుతూ వుండేది. దాని ఫలితంగానే, అప్పటికి ఎన్నో ఏళ్ళుగా సంబంధం లేని అమెరికాతో చైనా సంబంధాలు మొదలైనాయి.” అని రంగనాయకమ్మగారు చెప్పారు. విస్సన్న చెప్పిందే వేదం – నేను చెప్పిందే అసలు సిసలు మార్క్సిజం అని ఆమె అనుకుంటున్నట్లున్నారు. చైనాతో సహా ఇతర సోషలిస్టు దేశాలను గుర్తించటం లేదు. చైనా కమ్యూనిస్టు పార్టీలో సైద్దాంతిక, విధానాల అమలు మీద అంతర్గత చర్చలు పెద్ద ఎత్తున జరిగాయి. దాన్ని ” వర్గపోరాటం ” అని ఏ మార్క్సిస్టు అవగాహన ప్రకారం వర్ణించినట్లు ? అందుకే పద ప్రయోగాలు, భాష్యాలు చెప్పేటపుడు రంగనాయకమ్మగారు జాగ్రత్తలు తీసుకోవాలి అని నా తొలి స్పందనలో మనవి చేశాను. మరోసారి అదే చేస్తున్నాను.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

” నాగరిక ” ఐరోపాలో ఉక్రెయిన్‌ మహిళల మాన మర్యాదలకు ముప్పు !

20 Wednesday Apr 2022

Posted by raomk in Current Affairs, imperialism, INTERNATIONAL NEWS, RUSSIA, UK, USA, WAR

≈ Leave a comment

Tags

sexual exploitation, Ukraine-Russia crisis, Ukrainian Refugees, UN refugee agency


ఎం కోటేశ్వరరావు


యుద్ధాన్ని ఎవరూ కోరుకోరు, వద్దే వద్దు ! దానిలో ముందుగా బాధితులుగా మారేది మహిళలు, పిల్లలే అన్నది ప్రపంచ అనుభవం. సామ్రాజ్యవాదులు తమ లబ్దికోసం యుద్దాలను రుద్దుతున్నారు. అమెరికా, ఐరోపా నాటో కూటమి రగిలించిన వివాదం కారణంగా జరుగుతున్నదే ఫిబ్రవరి 24న ఉక్రెయిను మీద రష్యా ప్రారంభించిన సైనిక చర్య. దశాబ్దాల తరబడి పశ్చిమ దేశాలు అనుసరించిన విస్తరణ వాదం చివరకు తన ముంగిట్లో ముప్పుకు దారితీస్తున్నదనే భయాన్ని రష్యా పదే పదే వెల్లడించినా ఐరాస పట్టించుకోలేదు. దుష్టవిధానాల కారణంగా ప్రారంభమైన దాడులను ఎందరు మరణించినా సరే, అతివల మాన మర్యాదలు మంట కలిసినా, పిల్లల జీవితాలు నాశనమైనా తగ్గేదేలే అన్నట్లుగా అమెరికా, కొన్ని పశ్చిమ దేశాలు మరింతగా ఎగదోస్తున్నాయి. ఫలితంగా ఏప్రిల్‌ 16వ తేదీ నాటికి 49లక్షల మంది ఇరుగు పొరుగు దేశాలకు కాందిశీకులుగా ఉక్రెయిన్‌ పౌరులు వలస వెళ్లారు. దేశంలో 71లక్షల మంది చెల్లాచెదురయ్యారు. కొన్ని అంచనాల ప్రకారం మరొక కోటీ ఇరవైలక్షల మంది ఎటూ పోలేని స్ధితిలో ఉన్నారని వార్తలు. మొత్తం జనాభా నాలుగున్నర కోట్ల మంది అంటే పరిస్ధితి ఎంత తీవ్రంగా ఉందో అర్దం చేసుకోవచ్చు. అయినా సరే నాటో కూటమి చేతిలో కీలుబొమ్మగా మారిన జెలెనెస్కీలో ఎలాంటి మార్పు లేదు. దేశ సార్వభౌమత్వానికి ఎలాంటి ముప్పు తమవైపు నుంచి ఉండదని రష్యా పదే పదే చెబుతున్నా నాటో దేశాలు ఇచ్చే ఆయుధాలను చూసుకొని మరింతగా పరిస్ధితిని దిగజార్చుతున్నాడు.


రష్యా దాడులతో విదేశాలకు కాందిశీకులుగా వెళ్లినవారిలో పిల్లలు, మహిళలు ఎక్కువ మంది ఉన్నారు.వారికి బాంబులు, బుల్లెట్లు,క్షిపణుల ముప్పు లేదు. ఆశ్రయం ఇచ్చిన వారి చేతుల్లో మరొక ఉపద్రవాన్ని ఎదుర్కొంటున్నారు. ఆడపిచ్చితో తపించేవారు, దేహాలతో వ్యాపారం చేసే తార్పుడుగాళ్ల వలలకు చిక్కుకుంటున్నారనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. మృతకళేబరాల కోసం వాలే రాబందుల మాదిరి కాందిశీక మహిళల కోసం సాయం చేసే స్వచ్చంద సేవకులు, ఇతర ముసుగులో పోర్నోగ్రాఫర్స్‌(బూతువ్యాపారులు) వాలిపోతున్నారు. కాందిశీకులకు భాష కూడా పెద్ద సమస్యగా మారి వేటగాండ్ల వలలో చిక్కుకుంటున్నారు. తీవ్ర గర్హనీయ అంశం ఏమంటే ఒంటరిగా ఉండే పురుషుల ఇండ్లకు శరణార్ధులైన మహిళలు, పిల్లలను బ్రిటన్‌ ప్రభుత్వం పంపుతున్నదని, ఇది వారిని లైంగికంగా దోపిడీ చేసేందుకు దోహదం చేస్తుందని సాక్షాత్తూ ఐరాస కాందిశీకుల కమిషనర్‌ తప్పుపట్టారంటే వారెంత నిస్సహాయ స్ధితిలో ఉన్నారో అర్ధం చేసుకోవచ్చు. ఇది ఒక్క బ్రిటన్‌కే పరిమితం కాదు. అనేక మంది తాము ఎక్కడ ఎలాంటి వారి చేతుల్లో ఇరుక్కున్నామో వెల్లడిస్తున్న గాధలు పత్రికల్లో వస్తున్నాయి.


ఐరోపా దేశాల బూతు వెబ్‌సైట్లలో ఇప్పుడు ఉక్రెయిన్‌ పేరు పెద్ద ఎత్తున ప్రాచుర్యంలోకి వచ్చింది.మహిళల దేహాలు మగతనపుదాడుల కేంద్రాలుగా మారుతున్నాయి.” మేము ఉక్రెయిన్‌పై బాంబులు వేశాము, అమ్మాయిలను అనుభవించాము.యుద్దానికి వెళ్లే ముందు రష్యన్‌ బాలికను అనుభవించిన ఉక్రెయిన్‌ సైనికుడు. ఉక్రెయిన్‌ యుద్దంలో శృంగారం ” వంటి అంశాలు బూతుసైట్లలో దర్శనమిస్తున్నాయి. ఇంకా ఇంతకంటే దారుణమైన భాష వాడుతున్నారు. ” ఉక్రెయిన్లో యుద్దం బూతుకు ప్రతిరూపంగా మారింది ” అని ఒక విశ్లేషణకు ఇచ్చిన శీర్షిక. ఇదంతా ఎక్కడో కాదు మానవహక్కుల గురించి నిత్యం కబుర్లు చెబుతూ నాగరికులం అని తమకు తామే కితాబునిచ్చుకుంటున్న ఐరోపాలో జరుగుతోంది. ప్రపంచంలో మానవహక్కుల పరిరక్షకులం తామే అని ఫోజు పెట్టే అమెరికా, ఐరోపా దేశాలకు ఈ దారుణాలు పెద్దగా పట్టినట్లు లేదు. ప్రతి మానవ విపత్తులోనూ సర్వం కోల్పోయినపుడు ఇలాంటి లైంగిక దాడులు లేదా దోపిడీకి మహిళలు గురికావటం, లాభాల కోసం ఉపయోగించుకోవటం సర్వసాధారణంగా మారింది.


” రుమేనియా సరిహద్దులో మాటువేసిన పురుషులు ఆకర్షణీయ వాగ్దానాలతో లోబరుచుకుంటున్నారు. మీ సెల్‌ఫోన్లకు చార్జిచేసుకోండి, మీరు ఏదైనా కారు ఎక్కితే వాటి నంబర్లు నమోదు చేసుకోండి అని హంగరీ అధికారులు చెబుతున్నారు. పాసుపోర్టులు తమకు స్వాధీనం చేస్తే ఆశ్రయం కల్పిస్తామని, డబ్బిస్తామని కొందరు చెబుతున్నారు” అని ఐరోపా కౌన్సిల్‌ అనే మానవహక్కుల సంస్ధ తన నివేదికలో పేర్కొన్న కొన్ని అంశాలివి. తీరా ఆశ్రయం కల్పించిన వారి ఇండ్లకు వెళ్లిన తరువాత వారి నిజస్వరూపాలు వెల్లడి కావటంతో అనేక మంది తప్పించుకొని తిరిగి సరిహద్దులకు చేరి కొత్తగా వస్తున్న కాందిశీకులను హెచ్చరిస్తున్నారు. పదిహేనులక్షల మంది పిల్లలు పెద్దవారి తోడు లేకుండా సరిహద్దులు దాటి వచ్చారని వారికి ముప్పు ఉందని యునిసెఫ్‌ ఆందోళన వ్యక్తం చేసింది.మానవ వ్యాపారులు వారిని ఐరోపా దేశాలకే కాదు, వెలుపలకు కూడా తరలించవచ్చని, ఇలాంటి వారితో జరిపే బూతు వ్యాపార విలువ ఏటా వంద బిలియన్‌ డాలర్లని అంచనా. అవయవవ్యాపారుల సంగతి సరేసరి. ఉక్రెయిన్‌ ఆర్ధిక దుస్ధితి కారణంగా మహిళలు చాలా కాలం నుంచి దోపిడీకి గురవుతున్నారు. అద్దెగర్భాలతో పిల్లల్ని కనటం ఇక్కడ చట్టబద్దం కావటంతో ఆ విధంగా కూడా వారు బాధితులే. కరోనా కారణంగా పరిస్ధితులు దిగజారటంతో యుద్ధానికి ముందే అనేక మంది ఉక్రెయిన్‌ మహిళలు విదేశాల్లో ఉపాధిపేరుతో మానవ వ్యాపారుల(తార్పుడు) వలలో చిక్కుకున్నారు. ఇది మరొక విపత్తు. తాజాగా పోలెండ్‌, తదితర దేశాల్లో అలాంటి వారి వలనుంచి తప్పించుకున్నవారి ఉదంతాలు కూడా ఉన్నాయి.


మార్చినెలలో స్వీడెన్‌ పోలీసులు 38 మంది పురుషులను వ్యభిచార నేరం కింద అరెస్టు చేశారు. వారిలో 31 మందితో ఉన్న మహిళలు ఉక్రెయినుకు చెందిన వారే, ఇటీవల వచ్చిన వారు అని పోలీసులు వెల్లడించారు. రవాణా, ఆశ్రయం వంటి ఇంటర్నెట్‌లో ప్రకటనలతో సంఘటితంగా లావాదేవీలు జరుగుతున్నట్లు తెలిపారు. ఉక్రెయిను కాందిశీకులు 40కిపైగా దేశాలకు వలస వెళ్లినట్లు ఇప్పటి వరకు వివరాలు చెబుతున్నాయి.ఐరాస పేర్కొన్న 49లక్షల మందిలో ఒక్క పోలెండులోనే 27,63,786 మంది ఉన్నారు. మూడు లక్షలకు పైబడి రుమేనియా,హంగరీ, మాల్డోవా, స్లోవేకియా, జర్మనీ ఉన్నాయి. ఉక్రెయిన్లోని డాన్‌బాస్‌ ప్రాంతంపై ఉక్రెయిన్‌ మిలిటరీ, కిరాయి నయానాజీలు జరుపుతున్నదాడులు, అత్యాచారాల నుంచి తప్పించుకొనేందుకు 4,84,725 మంది రష్యాకు కాందిశీకులుగా వెళ్లారని కూడా ఐరాస తెలిపింది. ఈప్రాంతం నుంచి జనాలు వెళ్లిపోవాలని ఉక్రెయిను ప్రభుత్వమే ఆదేశించింది.
ప్రభుత్వం రూపొందించిన పధకం ప్రకారం బ్రిటన్‌లోని కుటుంబాలు, ఒంటరి పురుషులు ఉక్రెయిన్‌ మహిళలకు తమ రూముల్లో లేదా ఇతరంగా ఆశ్రయం కల్పిస్తామని ప్రభుత్వం దగ్గర నమోదు చేసుకోవాలి. వారికి ప్రభుత్వం కాందిశీక మహిళలను కేటాయించి పంపుతుంది. ఈ కార్యక్రమం తార్పుడు గాళ్లకు చెకుముకి రాయి వంటిదని ఒక స్వచ్చంద సంస్ద తూర్పారబట్టింది. వేలాది మంది బ్రిటన్‌ పురుషులు వివిధ వెబ్‌సైట్లలో తమ పేర్లు నమోదు చేసుకున్నారు. తమతో శృంగారంలో పాల్గొంటేనే ఆశ్రయం కొనసాగుతుందని తేల్చి చెప్పటంతో వారి కారుణ్యం వెనుక ఉన్న వలేమిటో అర్ధమైంది. నిజానికి ఇది ఒక్క బ్రిటన్‌కే పరిమితం కాదు అనేక దేశాల్లో ఇలాంటి ఉదంతాలు కోకొల్లలు. ఉచితంగా జర్మనీ లేదా పోలెండ్‌ తీసుకుపోతామంటూ ముందుకు వచ్చిన వారెందరో లైంగికదోపిడీ గాళ్లని తేలింది. తమ ఆశ్రయం పొందాలన్నా, తాము చూపిన ఉపాధిలో చేరాలన్నా తమను లేదా తాము పంపేవారిని గాని లైంగికంగా తృప్తి పరచాలనే షరతులను ముందుకు తెస్తున్నారు.


ఉక్రెయిన్‌ మిలిటరీ లేదా నయా నాజీలకు ఆయుధాల అందచేతలో అమెరికా,బ్రిటన్‌ ముందున్నాయి. బ్రిటన్‌ పాలకుల మరొక దుర్మార్గం ఏమంటే వివిధ దేశాల కాందిశీకులకు తమ దేశంలో ఆశ్రయం కల్పించకుండా ఖర్చును తగ్గించుకొనేందుకు తూర్పు ఆఫ్రికాలోని ర్వాండా దేశానికి పంపుతున్నది.ఈ చర్యను ఐరాస కాందిశీకుల కమిషనర్‌ ఖండించినా బ్రిటన్‌ ఖాతరు చేయటం లేదు, అక్రమంగా ఇంగ్లీషు ఛానల్‌ దాటుతూ ప్రమాదాలపాలు కాకుండా నిరుత్సాహపరిచేందుకు ఇలా చేస్తున్నామని కుంటిసాకులు చెబుతున్నది. ఉక్రెయిన్‌ కాందిశీకులకూ దీన్నే అమలు జరుపుతున్నారు. తమ ఆర్ధిక వ్యవస్ధకు తోడ్పడని వారు ఎవరైనా బ్రిటన్‌ వస్తే వారిని వదిలించుకోవటం ఒక విధానంగా పెట్టుకున్నది. కొన్ని ఐరోపా దేశాలు ఉక్రెయిన్‌ కాందిశీకులను చౌకగా పని చేసే శ్రామికులుగా వినియోగిస్తూ గతంలో ఉన్నవారిని తొలగిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.


లండన్‌ టైమ్స్‌ పత్రిక విలేకరి ఒకామె కాందిశీకుల దురవస్తలను తెలుసుకొనేందుకు ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ నుంచి వచ్చిన 22 ఏండ్ల నటలయ అని ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టింది. కొద్ది నిమిషాల్లోనే కుప్పలు తెప్పలుగా శృంగార సందేశాలు పంపుతూ బ్రిటన్‌ పురుషులు స్పందించారు. నా దగ్గర పెద్ద పరుపు ఉంది, ఇద్దరం ఇబ్బంది లేకుండా నిద్రించవచ్చని, నేను సాయం చేస్తా ప్రతిగా నీవు కూడా ఏదో చేయాలి, నీకు వివాహం కాకపోతే నేను చేసుకుంటా,నిన్ను మంచిగా చూసుకుంటా వంటి సందేశాలు వచ్చాయి. ఆమెకు రెండు రోజుల్లో వచ్చిన 75 ప్రయివేటు సందేశాలు పంపిన వారిలో 41 మంది ఒంటరి పురుషులే ఉన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వడపోతలో నేర చరితులను నిరోధించటం సాధ్యం అవుతుంది తప్ప శృంగార వలవిసిరే వేటగాళ్లు దొరకరు. ఆ వలకు చిక్కిన వారి పరిస్ధితి ఏమిటి ?


ఏప్రిల్‌ 20 నాటికి రష్యా సైనిక చర్య ప్రారంభమై 57వ రోజుకు చేరుకుంది. తన యుద్ద నౌకను ముంచి వేసిన తరువాత రష్యాదాడులను ముమ్మరంగావించింది. కీలకమైన రేవు పట్టణం మరియుపూల్‌ను స్వాధీనం చేసుకున్న తరువాత తూర్పు ఉక్రెయిను మీద దాడి మరింత సులభం అవుతుంది. డాన్‌బాస్‌ ప్రాంతంలో స్ధానికంగా ఉన్న తన మద్దతుదారులతో కలసి పెద్ద ఎత్తునదాడులకు దిగనున్నట్లు తాజావార్తలు వెల్లడించాయి. రష్యా నౌకను ముంచామని, సైనికులకు నష్టం కలిగించామని ఉక్రెయిన్‌ పాలకులు ఆనందం వెల్లడించటం ఆయుధాలు అందిస్తున్న పశ్చిమ దేశాలకు ఆనందం, తృప్తి కలగవచ్చునేమో గానీ తన పౌరులకు, ఆర్ధికరంగానికి జరుగుతున్న నష్టం గురించి జెలెనెస్కీ, ఇతర విధాన నిర్ణేతలకు పట్టినట్లు లేదు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

చైనాతో సఖ్యత కోరితే దేశద్రోహం – వాణిజ్యం చేస్తే దేశభక్తి ! ఏమి తర్కంరా బాబూ !!

17 Sunday Apr 2022

Posted by raomk in BJP, CHINA, Congress, Current Affairs, Economics, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RUSSIA, UK, USA, WAR

≈ Leave a comment

Tags

2022 BRICS Summit, BJP, BRICS, China-India Relations, Indo-China trade, Narendra Modi Failures, RSS, Ukraine-Russia crisis


ఎం కోటేశ్వరరావు


మేకిన్‌ ఇండియా(భారత్‌లో తయారీ) అంటే చైనా నుంచి కొనుగోలు, బిజెపి అంటే బీజింగ్‌(చైనా రాజధాని నగరం పేరు) జనతా పార్టీ. జుమ్లా ఫర్‌ ఇండియా(భారత్‌కు మాటలు) జాబ్స్‌ ఫర్‌ చైనా (చైనాకు ఉద్యోగాలు) రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై పార్లమెంటు చర్చలో ఫిబ్రవరి నెలలో కాంగ్రెస్‌ నేతలు మల్లిఖార్జున ఖర్గే. రాహుల్‌ గాంధీ విసిరిన చెణుకులివి. ఎందుకీ పరిస్థితి అంటే నరేంద్రమోడీ సర్కార్‌ ఆచరణే అన్నది స్పష్టం. గతంలో కాంగ్రెస్‌ మీద బిజెపి విసిరిన వాటికి ఇప్పుడు బదులు తీర్చుకుంటున్నారు. అధికారంలో ఉన్నవారికి తప్పదివి. రెండు పార్టీలు అనుసరించే ఆర్ధిక విధానాలు ఒకటే గనుక దొందూ దొందే !!


చైనా విదేశంగ మంత్రి వాంగ్‌ ఇ మార్చి నెలాఖరులో ఢిల్లీ పర్యటన జరిపారు.ఈ ఏడాది సెప్టెంబరులో బీజింగ్‌లో జరిగే బ్రిక్స్‌(బ్రెజిల్‌,రష్యా,ఇండియా,చైనా, దక్షిణ ఆఫ్రికా) కూటమి పద్నాలుగవ సమావేశాలు, బ్రిక్స్‌ 15వ వార్షికోత్సవం కూడా జరపనున్నారు. లడఖ్‌ సరిహద్దులోని ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి చైనా తన సేనలను ఉపసంహరించుకోని పక్షంలో తాను ఈ సమావేశాలకు వచ్చేది లేదని ప్రధాని నరేంద్రమోడీ ముందస్తు సందేశాలను పంపుతున్న పూర్వరంగంలో వాంగ్‌ పర్యటన జరిగింది. ప్రధాని ఉత్తర ప్రదేశ్‌ కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకార హడావుడిలో ఉన్నందున వాంగ్‌తో భేటీ కుదరలేదని చెప్పారు. సరిహద్దు సంగతి తేలకుండా తాను బీజింగ్‌ వచ్చేది లేదని స్పష్టం చేయటమే దీని అంతరార్దం అని విశ్లేషకులు పేర్కొన్నారు. సరిహద్దు వివాదం, సైనిక బలగాల ఉపసంహరణ, గతంలో కుదిరిన ఒప్పందాల అమలు వంటి అంశాలపై రెండుదేశాల మధ్య ఇప్పటి వరకు 15దఫాలుగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి.


బ్రిక్స్‌ శిఖరాగ్ర సభ భారత్‌-చైనాలకే పరిమితం కాదు. ఏ సంవత్సరం ఆ కూటమికి ఏ దేశం అధ్యక్షత వహిస్తుందో ఆ దేశంలో సభలు జరుపుతారు. ఈ సమావేశాలకు హాజరు కావటానికి సరిహద్దు వివాదానికి ముడి పెట్టటం ఏమిటన్నది ప్రశ్న. పోనీ చైనాతో లావాదేవీల్లో అన్ని అంశాల్లో ఇలాగే ముడిపెట్టి అడుగు ముందుకు వేయనని నరేంద్రమోడీ చెబుతున్నారా ? లేదే ! 2020 గాల్వన్‌ ఉదంతం తరువాత చైనా వస్తువులను బహిష్కరించాలంటూ సంఘపరివార్‌కు చెందిన వారు, వారి ప్రభావానికి లోనైన మీడియా, ఇతరులు కూడా పెద్ద హడావుడి, దేశభక్తి ప్రదర్శనలు చేశారు. చైనా యాప్‌లను నిషేధించారు, దీపావళికి చైనా టపాసులు వద్దన్నారు. చిత్రం ఏమిటంటే అలాంటి వారిని వెర్రి వెంగళప్పలను చేస్తూ ఆ ఏడాదితో పోల్చితే 2021లో చైనా నుంచి దిగుమతులను అనుమతించటంలో మోడీ సర్కార్‌ కొత్త రికార్డు నెలకొల్పింది.126 బిలియన్‌ డాలర్ల మేర దిగుమతి-ఎగుమతి లావాదేవీలు జరిగాయి. ఈ సంవత్సరం తొలి మూడు మాసాల్లో గత రికార్డులను బద్దలు కొట్టే దిశలో 31.9 బి.డాలర్ల లావాదేవీలు జరిగాయి. పోనీ మన దేశ ఎగుమతులు ఎక్కువగా ఉన్నందున చూసీ చూడనట్లు ఉన్నారని అనుకుందామా ? ఉభయ దేశాల మధ్య 2021లో 125.66 బి.డాలర్ల వాణిజ్యం జరిగితే చైనా నుంచి అంతకు ముందేడాదితో పోలిస్తే 46.2 శాతం దిగుమతులు పెరిగి 97.52 బి.డాలర్లకు చేరింది. మన ఎగుమతులు 34.2శాతం పెరిగి 28.14 బి.డాలర్ల మేరకు జరిగాయి.


ఇక ఈ ఏడాది జనవరి-మార్చి మాసాల్లో 31.96 బి.డాలర్ల లావాదేవీలు జరగ్గా మన దిగుమతులు 27.1 బి.డాలర్లు, ఎగుమతులు 4.87 బి.డాలర్లుగా ఉన్నాయి. మన దిగుమతులు 28.3 శాతం పెరగ్గా ఎగుమతులు 26.1శాతం తగ్గాయి. మన ఇనుపఖనిజం ఎగుమతులు పడిపోవటమే దీనికి ప్రధాన కారణం అంటున్నారు. దీన్ని మరోవిధంగా చెప్పాలంటే ఈ మూడు నెలల కాలంలో చైనాకు మనం 22బిలియన్‌ డాలర్లు సమర్పించుకున్నాం. చైనా నుంచి దిగుమతులు పెరగటం అన్నది కళ్ల ముందు కనిపిస్తున్న వాస్తవం. మోడీ సర్కార్‌ దీన్ని ఏ విధంగా చిత్రించ చూస్తున్నదో పార్లమెంటుకు ఇచ్చిన సమాధానం వెల్లడిస్తున్నది. డిజిసిఐ సమాచారం మేరకు 2006-07 నుంచి 2013-14 నాటికి చైనా నుంచి దిగుమతులు 17.47 నుంచి 51.03 బిలియన్‌ డాలర్లకు 192శాతం పెరిగిందని, తమ హయాంలో 2014-15 నుంచి 2020-21 వరకు 60.41 నుంచి 65.21 బి.డాలర్లకు అంటే ఎనిమిదిశాతం పెరిగిందని వాణిజ్యశాఖ మంత్రి లోక్‌సభకు ఇచ్చిన సమాధానంలో చెప్పారు. గత రికార్డులను బద్దలు కొట్టిన ఘనతను నరేంద్రమోడీ సర్కార్‌ ఇప్పటికే సాధించింది, తన రికార్డును తానే ఈ ఏడాది కూడా అధిగమించినా ఆశ్చర్యం లేదు. ఒక వైపు వ్యాపారులు, పారిశ్రామికవేత్తల లాభాల కోసం దిగుమతులను అనుమతిస్తూ తాను ప్రోత్సహించిన చైనా వ్యతిరేకులను సంతుష్టీకరించేందుకు ఇలాంటి అంకెల జిమ్మిక్కులకు మోడీ సర్కార్‌ పూనుకుందన్నది స్పష్టం.


మన పరిశ్రమలు కరోనా ముందు స్దాయికి చేరితే చైనా నుంచి దిగుమతులు ఇంకా పెరుగుతాయని ఆర్ధికవేత్తలు చెబుతున్నారు. అదే జరిగితే మరిన్ని మన డాలర్లతో చైనాను పటిష్టపరచటమే మరి. ఒక వైపు చైనాను కట్టడి చేయాలని చూస్తున్న అమెరికాతో మన దేశం చేతులు కలుపుతూ మరోవైపు చైనా ఆర్ధిక వ్యవస్దను మరింతగా బలోపేతం చేసే విధంగా మనం దిగుమతులు ఎందుకు చేసుకుంటున్నట్లు ? ఇక్కడ సరిహద్దు వివాదం, అక్కడ మోహరించిన మిలిటరీ గుర్తుకు రాదా అన్నది మోడీ మద్దతుదారులు తమను తాము ప్రశ్నించుకోవాలి. లేదూ వ్యాపారం వ్యాపారమే, దానికి సరిహద్దు వివాదాన్ని ముడిపెట్టకూడదు అని చెబుతారా ? అదే సూత్రం బ్రిక్స్‌ సమావేశంలో పాల్గొనటానికి ఎందుకు వర్తించదు. మన దేశంతో భూ సరిహద్దు కలిగిన దేశాల నుంచి వచ్చే పెట్టుబడులపై గాల్వన్‌ ఉదంతం తరువాత కేంద్రం ఆంక్షలు విధించింది, అది చైనా గురించే అన్నది చెప్పనవసరం లేదు. ఇక్కడ వాణిజ్య తర్కం వర్తించదా ? దాని పెట్టుబడులు వద్దు దిగుమతులు అంత ముద్దా ? 2018లో సిఐఐ భాగస్వామ్యంతో నిర్వహించిన ఒక సర్వే చైనాలో పెట్టుబడులు పెట్టిన 54 భారత కంపెనీల అభిప్రాయాలను వెల్లడించింది. గాల్వన్‌ ఉదంతం తరువాత ఆ ” దేశభక్త పెట్టుబడిదారు ”లెవరూ మన ప్రధానిని ఆదర్శంగా తీసుకొని నిరసనగా అక్కడి నుంచి కంపెనీలను ఎత్తివేసిన దాఖలా ఒక్కటీ కనపడదు.మన దేశం చైనా నుంచి దిగుమతులను నిలిపివేస్తే చైనాకు వచ్చే నష్టమేమీ లేదు. మన ఎగుమతులు లేకపోతే గడవని స్ధితీ లేదు. మన పరిశ్రమలు, మన వ్యవసాయ వస్తువుల ఎగుమతులే దెబ్బతింటాయి. మన దేశంతో పెద్ద మొత్తంలో వాణిజ్యమిగులు ఉంది కనుక వారికి అవసరం లేకున్నా కొన్నింటిని దిగుమతి చేసుకుంటున్నారు.చైనా వినియోగ మార్కెట్‌ విలువ ఆరులక్షల కోట్ల డాలర్లు. అందువలన చెరువు మీద అలిగితే….. అన్నట్లుగా చైనా మీద అలిగిన వారికే నష్టం.


చైనా పెద్ద ఎగుమతిదారే కాదు, వివిధ దేశాల వస్తువులకు పెద్ద మార్కెట్‌ కూడా అని గమనించాలి. కమ్యూనిస్టులు అధికారానికి వచ్చిన తరువాత చైనాను ఒక దేశంగా గుర్తించేందుకు రెండుదశాబ్దాల పాటు 1970దశకం వరకు నిరాకరించిన అమెరికా చివరకు దానితో కాళ్లబేరానికి వచ్చి ఐరాసలో గుర్తింపు, ప్రపంచ వాణిజ్య సంస్దలో ప్రవేశానికి అంగీకరించింది. దానితో పోలిస్తే ఎక్కడో ఉన్న మనం తాయత్తు కట్టుకొని బస్తీమే సవాల్‌ అంటూ బరిలోకి దిగే స్ధితిలో ఉన్నామా ? 1962లో సరిహద్దు వివాదంలో మన దేశం-చైనా యుద్దానికి దిగినప్పటికీ తరువాత కాలంలో రెండు దేశాల మధ్య సాధారణ సంబంధాలకు ఆ ఉదంతం అడ్డంకి కాలేదు. తమ సర్కారు మీద తిరుగుబాటు చేసిన దలైలామాకు ఆశ్రయం ఇచ్చినప్పటికీ మన దేశ పర్యటనకు వచ్చేందుకు చైనా నేతలు దాన్నొక సాకుగా ఎన్నడూ చూపలేదు. ఇప్పుడు బ్రిక్స్‌ సమావేశానికి హాజరుకావటానికి మిలిటరీ మోహరింపు గురించి ఎందుకు పట్టుబడుతున్నట్లు ? అలా చేయకపోతే చైనా వ్యతిరేక ఉన్మాదం ఎక్కిన వారు ఇప్పుడు మోడీకి పడుతున్న నీరాజనాల స్ధానంలో మరొకటి చేస్తారు.
గాల్వన్‌ ఉదంతాలు చూసినపుడు మన సోషల్‌ మీడియాలో కొందరు స్పందించిన తీరు చూస్తే మన దిగుమతులు కారణంగానే చైనా బతుకుతున్నదని, వాటిని ఆపివేస్తే మన కాళ్ల దగ్గరకు వస్తుందని నిజంగానే నమ్మినవారు లేకపోలేదు. ఆ ఉదంతానికి కారకులు మీరంటే మీరని పరస్పరం విమర్శలు చేసుకున్నాం. ఉదంతం జరిగింది వాస్తవాధీన రేఖ ఆవల చైనా ఆధీన ప్రాంతంలో అన్నది తెలిసిందే. చైనా మన భూభాగాలను ఆక్రమించలేదని స్వయంగా ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించారు. పరస్పర అవిశ్వాసంతో రెండు వైపులా మిలిటరీ సమీకరణలు జరిగాయి. ఎవరి జాగ్రత్తలు వారు తీసుకోవటం సహజం. ఎవరెన్ని చెప్పినా మిలిటరీని ఉపసంహరణ వెంటనే జరగదు. ఆర్ధికంగా ఎంతో బలంగా ఉన్న చైనాకు పెద్ద ఇబ్బందులేమీ ఉండవు కనుక మరికొంత కాలం కానసాగించినా వారికి నష్టం ఉండదు. కొద్ది వారాలు తక్కువగా రెండు సంవత్సరాలు కావస్తున్నది. మనం ఆ ఖర్చును తట్టుకోగలమా అన్నదే కీలకం. ఆ ఉదంతాల తరువాత చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ తొలిసారిగా మన దేశానికి వచ్చాడు. మనం పిలిస్తే వచ్చాడా, లేదా తనంతటతానే వచ్చాడా అన్నది వేరే అంశం.


ఉక్రెయిన్‌ వివాదం తరువాత అనేక దేశాల ప్రముఖులు మన దేశం వచ్చారు. వారందరినీ మనం ఆహ్వానించలేదు, ఎవరైనా వస్తామంటే వద్దని అనలేము.చైనా మంత్రి రాక గురించి ముందుగానే వార్తలు వచ్చినా చివరి క్షణం వరకు నిర్ధారణ కాలేదు. ఎందుకని ? చైనా మంత్రి రాకను స్వాగతిస్తే అమెరికాకు, ఇతర పశ్చిమ దేశాలకు ఎక్కడ ఆగ్రహం వస్తుందో లేదా అపార్ధం చేసుకుంటాయనే మల్లగుల్లాలు కావచ్చు, చివరి క్షణంలో అనుమతించాము. వచ్చిన విదేశీ ప్రముఖులందరూ తాజా ప్రపంచ పరిణామాలపై మన వైఖరిని తెలుసుకొనేందుకు, తమ అవగాహన లేదా వైఖరి గురించి మనకు వివరణ ఇవ్వటానికి, పనిలో పనిగా చరిత్రలో మీ స్ధానం ఎక్కడ ఉంటుందో ఆలోచించుకోండని అమెరికా మాదిరి బెదిరించటానికి అన్నది స్పష్టం. మరి చైనా మంత్రి మంత్రి వచ్చి ఏమి చేశారని ఎవరైనా సందేహించవచ్చు. నీ అమ్మ మొగుడున్నాడా అని పశ్చిమ దేశాలు అడిగితే బాబూ మీ నాన్న ఉన్నాడా అని చైనా అడిగింది. అదే తేడా ! మన దేశానికి ఎందుకీ ప్రాధాన్యత ఏర్పడిందంటే ప్రపంచ రాజకీయాలే కారణం. తమ ఎడమ చేతి చిటికెన వేలు పట్టుకొని తమ వెంట వస్తుందని, రష్యాను తిట్టేందుకు గొంతు కలుపుతుందని ఆశించిన వారి కోరిక నెరవేరలేదు. అనేక ఉదంతాల్లో అమెరికాను నమ్ముకున్న దేశాలు నట్టేట మునిగాయి. అమెరికాతో చేతులు కలిపితే ఎన్నో దశాబ్దాలుగా నమ్మకమైన మిత్రదేశంగా ఉన్న రష్యాను పోగొట్టుకుంటే మనకు మిగిలే మిత్రులెవరూ ఉండరు. ఇప్పటికే అనేక మందిని పోగొట్టుకున్నాం. అందుకే లాభనష్టాల బేరీజు వేసుకుంటూ అందరినీ సంతుష్టీకరించేందుకు కసరత్తు చేస్తున్నాం. అది కుదిరేనా ? అందుకే మన మీద అనేక దేశాల వత్తిడి, పర్యటనలు.


గతంలో కొంత మంది మన దేశంలో పాలకవర్గంగా ఉన్న పెట్టుబడిదారులను దళారీలుగా వర్ణించారు. ఇప్పటికీ వారి వారసులు మనకు కనిపిస్తారు.మన కార్పొరేట్లు దళారీలు కాదు, పశ్చిమ దేశాల్లో మాదిరే స్వదేశంలో బలమైన కార్పొరేట్లుగా, వీలైతే ప్రపంచ కార్పొరేట్లుగా ఎదిగేందుకు పోటీపడేస్ధితిలో ఉన్నారు. అమెజాన్‌-రిలయన్స్‌ వివాదం, మన కార్పొరేట్‌ సంస్ధలు విదేశాలకు విస్తరించటం దాన్నే సూచిస్తున్నది. మన తటస్ధ వైఖరి గురించి అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు మన మీద ప్రత్యక్షంగా, పరోక్షంగా దాడి చేస్తుంటే విశ్వగురుపీఠాన్ని మనకు మనమే ఇచ్చుకుని మౌనంగా ఉన్నాం.మన మీద జరుగుతున్న దాడికి సంజాయిషీ లేదా పరోక్ష సమాధానాలే తప్ప ఆత్మగౌరవాన్ని ప్రదర్శించే తీరు ఎక్కడా కనపడదు. తనకు వ్యక్తిగతం అంటూ ఏదీ లేదని ఏం చేసినా దేశానికే అని నరేంద్రమోడీ చెప్పారు.వివాదాలకు- క్రీడలకు ముడిపెట్టటం అమెరికా, ఇతర పశ్చిమ దేశాల సంస్కారం. మనం కూడా వాటి బాటలోనే నడిచాం. శీతాకాల బీజింగ్‌ ఒలింపిక్స్‌లో గాల్వన్‌లోయ దాడుల్లో పొల్గొన్న చైనా సైనికుడు ఒలింపిక్‌ జ్యోతి ప్రదర్శనలో పాల్గొంటున్నాడన్న కారణం చూపి వాటిని మన దేశం బహిష్కరించింది. చివరకు మన దూరదర్శన్‌ ఆ క్రీడలను చూపకుండా మూసుకుంది. మరి అదే చైనా పాల్గొనే ఇతర వేదికలకు మన దేశం దూరంగా ఉంటుందా ? గాల్వన్‌ ఉదంతాలకు బాధ్యులైన చైనా మిలిటరీ ప్రతినిధులతో మన వారు ఇప్పటికి 15సార్లు చర్చలు జరిపారు. ఎందుకు జరిపినట్లు ? లడఖ్‌లో మిలిటరీని ఉపసంహరించకపోతే బీజింగ్‌ బ్రిక్స్‌ సమావేశాలకు రానంటూ మంకు పట్టుపట్టం కొందరికి సంతోషంగానే ఉండవచ్చు, అది పైన చెప్పుకున్న మిగతా అంశాల్లో కూడా ఉంటే అదొక తీరు.బ్రిక్స్‌ ఒక అంతర్జాతీయవేదిక, దానికి వెళ్లకుండా మంకుపట్టుపడితే మిగతా దేశాల దృష్టిలో మన దేశం పలుచన కాదా ? రెచ్చిపోయి ఎగుమతి, దిగుమతి లావాదేవీలు జరపటానికి లేని బెట్టు దీనికి ఎందుకు అనుకోవా ? చైనాతో సఖ్యత కోరుకొనే వారిని దేశద్రోహులుగా చిత్రించటాన్ని చూస్తున్నాం. అక్కడి నుంచి దిగుమతులు చేసుకొనే వారు, అక్కడ పెట్టుబడులు పెట్టేవారు దేశద్రోహులా ? ఏమి తర్కరరా బాబూ ఇది !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

రష్యా మీద ఆంక్షలు – అమెరికా అసలు లక్ష్యం ఇంధన మార్కెట్‌ కబ్జా !

05 Tuesday Apr 2022

Posted by raomk in Current Affairs, Economics, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Prices, RUSSIA, USA, WAR

≈ Leave a comment

Tags

fuel politics, Narendra Modi, oil, Sanctions on Russia, US crude to India, US imperialism


ఎం కోటేశ్వరరావు


” మన దేశానికి ముందు ఇంధన భద్రత ముఖ్యం, ఎక్కడైనా చౌకగా చమురు దొరికితే అక్కడ ఎందుకు కొనకూడదు ? రష్యా నుంచి కొనుగోలు చేస్తున్నాం, పెద్ద మొత్తంలో ఇప్పటికే వచ్చింది, మొత్తంగా దేశ ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుంటాం ” అని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. నిజమే కదా ! అభ్యంతర పెడుతున్నది ఎవరు? అమెరికా ! దాన్ని ఒక్కమాట అనలేకపోవటం దేశ ప్రయోజనాలకోసమేనా అన్నది ప్రశ్న. 2021ఏడాది మొత్తంగా మన దేశం రష్యానుంచి కొనుగోలు చేసిన చమురు 16 మిలియన్ల పీపాలు, ఈ ఏడాది ఫిబ్రవరి చివరి వారం నుంచి ఇప్పటి వరకు కొనుగోలు చేసిన మొత్తం 13మి.పీపాలు. ఇది పెద్ద పెరుగుదలే ఐనా మన దిగుమతుల మొత్తంలో రెండుశాతం లోపే అన్నది గమనించాలి.


ఉక్రెయిన్‌-రష్యా వివాదం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరుగుతున్నందున మనం కూడా ధరలు పెంచకతప్పటం లేదని కేంద్ర మంత్రులు, బిజెపి నేతలు నమ్మబలుకుతున్నారు ఇది పూర్తిగా నిజమా ? నవంబరు నాలుగు నుంచి 137 రోజుల పాటు వినియోగదారుల చమురు ధరలను కేంద్ర ప్రభుత్వం( ప్రభుత్వరంగ సంస్ధల ద్వారా) స్ధంభింప చేసింది. మార్చినెల 21వ తేదీ నుంచి పెంపుదలకు శ్రీకారం చుట్టారు. గతంలో మనకు చెప్పిందేమిటి ? అంతర్జాతీయంగా ఎంత ధర పెరిగితే అంత మొత్తాన్ని జనాల నుంచి వసూలు చేస్తాము, ఎంత తగ్గితే అంత మేరకు రోజూ ఉదయాన్నే తగ్గిస్తామని, ఇది విధాన నిర్ణయం అన్నారు. మరి అది 137 రోజుల పాటు ఎందుకు అమల్లో లేదు.ఐదు రాష్ట్రాల ఎన్నికలకోసమే అని ప్రతిపక్షాలు అంటే కాదన్నారు తప్ప కారణం చెప్పలేదు. గట్టిగా అడిగితే దేశభక్తులతో గొడవెందుకని సర్దుకుపోదాం రండి అన్నట్లుగా జనం ఉన్నారు. చిత్రం ఏమిటంటే మార్చి 21 నుంచి మన దేశంలో చమురు ధరలు పెరుగుతుంటే అంతర్జాతీయంగా తగ్గుతున్నాయి. దీని భావమేమి గోమాతా !


మార్చినెల తొమ్మిదవ తేదీన మనం కొనుగోలు చేసే పీపా చమురు ధర 128.24 డాలర్లు. అది తరువాత క్రమంగా తగ్గుతూ ఏప్రిల్‌ ఒకటవ తేదీన 103.02 డాలర్లు(కేంద్ర ప్రభుత్వ పెట్రోలియం ప్లానింగ్‌ అండ్‌ అనాలసిస్‌ సెల్‌ ) ఉన్నట్లు నాలుగవ తేదీన ప్రకటించింది. మరి ఈలెక్కన పెంపుదల-తగ్గించటం ఉంటే జనాలకు ధరలు తగ్గాలి. మార్చి 22వ తేదీ ధరను ప్రామాణికంగా తీసుకున్నప్పటికీ అది 113.41 డాలర్లే, దాని ప్రకారం చూసినా తగ్గాల్సింది పోయి ” తగ్గేదేలే ” అన్నట్లుగా పెంచుతున్నారు. ఎందుకని ? ప్రజా ప్రయోజనాల కోసమే అనుకుందామా ? లక్షల కోట్లు ప్రజల కోసం కుమ్మరించామని ఒక నోటితో చెబుతారు, వాటితో పోలిస్తే 137 రోజులో చమురు సంస్ధలకు వచ్చినట్లు చెప్పిన నష్టమెంత కేవలం 19వేల కోట్ల రూపాయలు. ఇంత చిన్న మొత్తాన్ని భరించలేని దుస్ధితిలో కేంద్ర ప్రభుత్వం ఉందా ?


నిజానికి ఇది పాక్షిక అంచనాగానే భావించాలి. ఇది వచ్చిన నష్టం, కంపెనీలకు రావాల్సిన లాభాలు కూడా కలుపుకుంటే ఇంకా ఎక్కువ ఉండవచ్చు. ఈ కారణంగానే నిలిపివేసిన మొత్తాన్ని ఇప్పుడు వసూలు చేస్తున్నారు. మనం కొనుగోలు చేసిన ముడి చమురు సగటు ధర నవంబరు నెలలో 80.64డాలర్లు, డిసెంబరులో 73.30, జనవరిలో 84.67, ఫిబ్రవరిలో 94.07, మార్చినెలలో 112.87 డాలర్లుంది. తొలుత ఈ మొత్తాన్ని లెక్కించి వచ్చిన లోటును వసూలు చేస్తారు, అందుకే అంతర్జాతీయ మార్కెట్లో మార్పులతో నిమిత్తం లేకుండా వరుసగా పెంచుతున్నారు. పైసా వసూలు మొత్తం జరిగిన తరువాత పెరుగుదలను బట్టి వడ్డింపు ఉంటుంది.


ప్రస్తుత ధరల(మార్చిచివరి వారం) ప్రకారం చమురు కంపెనీలు లీటరుకు రు.15 తక్కువ ధరకు విక్రయిస్తున్నాయని, ఈ మేరకు ధరలు పెంచవచ్చన్నది ఒక అంచనా. ఏప్రిల్‌ 5వ తేదీ పెంపుతో లీటరు పెట్రోలు ధర ఢిల్లీలో రు.104.61 ఉంది, అంటే ఇప్పటికే రు.9.20 పెరిగింది. దీపావళి కానుక పేరుతో ఐదు రాష్ట్రాల ఎన్నికల కోసం కేంద్ర ప్రభుత్వం పెట్రోలు మీద ఐదు, డీజిలు మీద పది రూపాయల సెస్‌ తగ్గించింది. గోళ్లూడగొట్టి వసూలు చేస్తున్న దానిలో ఆ మేరకు తగ్గింపు మంచిదే కదా అనుకున్నాం. ఇప్పుడు పెంచిన ధరలతో అది కూడా హరించుకుపోయింది. ఒక లీటరు మీద ఒక రూపాయి సెస్‌ తగ్గిస్తే కేంద్రానికి ఏటా పదిహేనువేల కోట్ల ఆదాయలోటని అంచనా.దీన్నే జనం వైపు నుంచి చూస్తే ఒక రూపాయి పెంచితే అంతే మొత్తం భారం అవుతుంది. నరేంద్రమోడీ సర్కార్‌ అధికారానికి వచ్చిన తొలి ఏడాది కేంద్ర ప్రభుత్వానికి చమురు మీద ఎక్సైజ్‌ డ్యూటీ లేదా సెస్‌ ఖాతా కింద వచ్చిన రాబడి 2014-15లో రు.99,068 కోట్లు కాగా 2020-21లో వచ్చిన మొత్తం రు.4,19,884 కోట్లు.


ఇంధన ధరలు బాగా తగ్గినపుడు ఆ మేరకు వినియోగదారులకు తగ్గకుండా మన్మోహన్‌ సింగ్‌ గారి ” చెడు ” రోజులు చివరిలో లేదా నరేంద్రమోడీ గారి ” మంచి రోజుల ” ప్రారంభంలో లీటరు పెట్రోలు, డీజిలు మీద కేంద్ర ప్రభుత్వ పన్ను రూ.9.48, 3.56 చొప్పున ఉంటే దాన్ని పెంచారు. తాజా తగ్గింపునకు ముందు రూ.32.98, 31.83 చొప్పున ఉంది.పెట్రోలుపై లీటరుకు ఐదు, డీజిలుపై పది రూపాయల భారాన్ని తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు ఈ పెంచిన పన్ను, మరోసారి చమురు ధరల పెంపుదల ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదలకు దారి తీస్తుంది. అందువలన అది జరిగి జన జీవితాలు అతలాకుతలం కాకుండా ఉండాలంటే ఇంధనం మీద పన్నులను తగ్గించాలని ఆర్ధికవేత్తలందరూ మొత్తుకుంటున్నారు. కేంద్ర పాలకులు దాని గురించి మాట్లాడటం లేదు. రాష్ట్రాలు కూడా పన్నులు తగ్గించవచ్చు కదా అని ఎవరైనా సన్నాయి నొక్కులు నొక్కవచ్చు. కేంద్ర ప్రభుత్వం భారీగా పన్ను పెంచినపుడు బిజెపి అధికారంలో ఉన్న చోట్లతో సహా ఏ రాష్ట్రం కూడా ఈ రీతిలో పన్ను పెంచలేదు. ఒకటీ అరా రాష్ట్రాలు రూపాయో,రెండో ఇంకాస్త ఎక్కువో సెస్‌లు మాత్రమే పెంచాయి. కేంద్రం మాత్రం పన్నుల పెంపుదలతో పాటు అంతకు ముందు ఇస్తున్న రాయితీలను కూడా ఎత్తివేసి ఎంత పెరిగితే అంత మొత్తాన్ని వినియాగదారుల నుంచి వసూలు చేస్తున్నది. అందువలన కేంద్రం ముందుగా తాను పెంచిన వాటిని పూర్తిగా తగ్గించి రాష్ట్రాలను కూడా తగ్గించమనటం సమంజసం. లేదా చమురు ఉత్పత్తులను కూడా జిఎస్‌టి పరిధిలోకి తేవాలి. ఆ మేరకు రాష్ట్రాలకు తగ్గిన రాబడిని కేంద్రం భరిస్తే అదొకదారి. ఇప్పటికే పరిమిత ఆదాయ వనరులున్న రాష్ట్రాలను తగ్గించమనటం సబబు కాదు.


ఏప్రిల్‌ మూడుతో ముగిసిన వారంలో అంతర్జాతీయ చమురు ధరలు పదమూడుశాతం తగ్గాయి. ఒక వారంలో ఇంత పెద్ద మొత్తంలో గత రెండు సంవత్సరాల్లో జరగలేదు. ఈ తగ్గుదలకు కారణం సౌదీ అరేబియా – ఎమెన్‌లోని హౌతీ(షియా) తెగ తిరుగుబాటుదార్లతో కుదిరిన ఒప్పందం మేరకు చమురు సరఫరాలకు ఆటంకం తొలగటం ఒక కారణంగానూ, అమెరికా తన వ్యూహాత్మక నిల్వల నుంచి ఒక మిలియన్‌ పీపాల విడుదలకు బైడెన్‌ ప్రకటన దోహదం చేసిందని వార్తలు వచ్చాయి. ఈ పరిణామం జరిగినపుడు బ్రెంట్‌ రకం ధర 103.38డాలర్లుంటే ఏప్రిల్‌ ఐదున ఇది 109 డాలర్లుగా ఉంది అందువలన చమురు ధరల పెరుగుదలాపతనానికి ఏకైక కారణం ఏదీ కనిపించటం లేదు. ఎవరైనా ఉక్రెయిన్‌ – రష్యా వివాదాన్ని సాకుగా చూపితే కుదరదు.


రష్యా నుంచి చమురు కొనుగోలు వద్దని మన దేశాన్ని అమెరికా వత్తిడి చేస్తోంది. దాన్ని తెరవెనుక నుంచి చూస్తే తమ నుంచి ఇంకా ఎక్కువ మొత్తం కొనుగోలు చేసి తమ కార్పొరేట్లకు లబ్ది చేకూర్చాలన్న వత్తిడి కనిపిస్తుంది. రాయిటర్స్‌ వార్తా సంస్ద పేర్కొన్న సమాచారం ప్రకారం జనవరితో పోలిస్తే ఫిబ్రవరిలో అమెరికా నుంచి మన దేశం కొనుగోలు చేసే చమురు 48శాతం పెరిగింది. దీంతో మన దేశం దిగుమతి చేసుకొనే చమురువాటా అమెరికా నుంచి 14శాతానికి చేరింది. దశాబ్దాల తరబడి మనతో సత్సంబంధాలు కలిగి ఉన్న పశ్చిమాసియా దేశాల నుంచి చమురు కొనుగోలు తగ్గించి అమెరికా వైపు నరేంద్రమోడీ సర్కార్‌ మొగ్గటానికి రాజకీయ కారణాలు, అమెరికా చమురు కంపెనీల ప్రభావం ప్రధాన కారణం. మన దిగుమల్లో ఇరాక్‌ ప్రధమ స్ధానంలో ఉండగా ఇప్పటివరకు రెండవదిగా ఉన్న సౌదీ అరేబియాను ఇప్పుడు అమెరికా వెనక్కు నెట్టేసింది. గతంలో చమురు దిగుమతి దేశంగా ఉన్న అమెరికా ఇప్పుడు ఎగుమతిదారుగా మారింది. అందువలన అక్కడి కార్పొరేట్లకు మార్కెట్‌ను సంపాదించేందుకు వైట్‌హౌస్‌లో పాలకులు ఎవరున్నా ఒకేదెబ్బతో అనేక దేశాలను తమ ఖాతాదారులుగా మార్చుకొనేందుకు పూనుకున్నారు.


మన కంటే ఎక్కువ మొత్తం దిగుమతి చేసుకొనే చైనాకు అమెరికాతో ఉన్న వైరం కారణంగా అది దిగుమతి చేసుకోవటం లేదు. మన దేశం ఇప్పటికే అమెరికా వలలో పడింది. మధ్యప్రాచ్య లేదా పశ్చిమాసియా నుంచి మన దిగుమతుల్లో 52.7శాతం ఉండగా ఆఫ్రికా నుంచి 15, అమెరికా నుంచి 14శాతం ఉంది. వీటితో పోల్చుకుంటే రష్యానుంచి దిగుమతి చేసుకుంటున్నది 1-2శాతం మధ్యలో ఉంది. దీన్ని కూడా నిలిపివేయాలని మన నరేంద్రమోడీని అమెరికా ఆదేశిస్తున్నది. మన దేశ ఎగుమతుల్లో నాలుగో వంతు శుద్ది చేసిన చమురు లేదా చమురు ఉత్పత్తులు ఉన్నాయి. అందువలన చమురు శుద్ది కంపెనీలు రష్యానుంచి తక్కువ ధరలకు దిగుమతి చేసుకుంటే ఎగుమతులకు దాన్ని వినియోగిస్తే ఆ కంపెనీలకు లాభం. ఐరోపా దేశాలు రష్యా నుంచి ఇంధన కొనుగోళ్లను నిలిపివేస్తే ఐరోపా మార్కెట్లో పాగావేసేందుకు అమెరికా పూనుకుందన్నది స్పష్టం. ప్రపంచంలో చైనా తరువాత రెండో పెద్ద దిగుమతిదారుగా ఉన్న మన మార్కెట్‌ను కూడా కబళించేందుకు పూనుకుంది. బహుశా ఆ ఎత్తుగడతో కూడా రష్యాను మన నుంచి వేరే చేసేందుకు పూనుకున్నట్లు భావించవచ్చు. అమెరికా, ఇతర పశ్చిమ దేశాల పాటలకు(ఆంక్షలకు) అనుగుణంగా ఇప్పటికే మనదేశంతో నరేంద్రమోడీ డాన్స్‌ చేయిస్తున్నారు. దాన్లో óభాగంగానే ఇరాన్‌, వెనెజుల నుంచి చమురు కొనుగోళ్లను ఆపివేశారు. గతంలో వెనెజులా నుంచి మన అవసరాల్లో 12శాతం, ఇరాన్‌ నుంచి ఆరుశాతం దిగుమతి చేసుకున్న ఉదంతాలున్నాయి.ఇలా లొంగిపోయిన కారణంగానే ఇప్పుడు రష్యా నుంచి కొనుగోలు వద్దనే ధైర్యం అమెరికాకు వచ్చింది.


మరో వైపు అదే అమెరికా చేస్తున్నదేమిటి ? రాయిటర్స్‌ మార్చి ఎనిమిదవతేదీ వార్తా కథనం ప్రకారం అమెరికా 2021లో రోజుకు 6,72,000 పీపాల ముడి చమురు లేదా చమురు ఉత్పత్తులను రికార్డు స్దాయిలో రష్యానుంచి దిగుమతి చేసుకుంది. దీనిలో 1,99,000 పీపాల చమురు ఉంది. అమెరికా గల్ఫ్‌ తీరంలో వచ్చిన భారీ తుపాన్ల కారణంగా దిగుమతులను ఎక్కువగా చేసుకున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో ఆంక్షలతో నిమిత్తం లేకుండానే రోజుకు 57వేల పీపాలకు కొనుగోళ్లను తగ్గించి, తిరిగి లక్ష పీపాలకు పెంచినట్లు వార్తలు.ఈ నెల 22లోగా లావాదేవీలను నిలిపివేయాలని అమెరికా ఆర్ధికశాఖ కోరింది. మనం వెంటనే కొనుగోలు నిలిపివేయాలని చెబుతున్న పశ్చిమ దేశాల్లో ఒకటైన బ్రిటన్‌ తాను మాత్రం ఈ ఏడాది చివరి నాటికి దశలవారీగా రష్యా దిగుమతులను నిలిపివేస్తుందట.


తాజాగా అమెరికా తమ నుంచి కొనుగోళ్ల మొత్తాన్ని 43శాతం పెంచినట్లు రష్యా భద్రతామండలి ఉప కార్యదర్శి మిఖాయిల్‌ పొపోవ్‌ ఏప్రిల్‌ మూడున చెప్పాడు. రోజుకు లక్ష పీపాలు దిగుమతి చేసుకుంటున్నట్లు, అత్యవసర వస్తువుల కింద మినరల్‌ ఎరువులను దిగుమతి కూడా చేసుకోవచ్చని అమెరికా కంపెనీలకు అనుమతిచ్చినట్లు తెలిపాడు. అమెరికా వద్ద చమురు పెద్ద మొత్తంలో ఉన్నప్పటికీ అక్కడి చమురుశుద్ది సంస్ధలకు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకొనే ముడిచమురుతో లాభాలు ఎక్కువగా వస్తున్నందున దిగుమతి చేసుకొని దాన్ని ఇతర దేశాలకు అధిక ధరలకు అమ్ముకొని లబ్ది పొందుతున్నాయి. అందుకే 2014 నుంచి అమెరికా సర్కార్‌ రష్యా మీద అనేక ఆంక్షలను విధించినప్పటికీ చమురు జోలికి పోలేదు. బైడెన్‌ ప్రకటించినట్లు నిజంగానే అమెరికా పూర్తి నిషేధం అమల్లోకి వస్తే అక్కడి కార్పొరేట్‌ శక్తులు అంగీకరిస్తాయా ? తమ మార్కెట్‌ను అమెరికాకు అప్పగిస్తే వచ్చే పర్యవసానాలను ఐరోపా దేశాలు ఆలోచించుకోవా ? చూద్దాం !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

జాడలేని అపర జాతీయవాదులు – ఆచూకీ లేని ఆత్మగౌరవం !

02 Saturday Apr 2022

Posted by raomk in CHINA, Current Affairs, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, RUSSIA, USA, WAR

≈ 1 Comment

Tags

BJP, imran khan, Narendra Modi Failures, RSS, Russia-Ukraine War, US, US Coup-Pak, US imperialism, US Threatens India

నాడు సావర్కర్‌కు ఎత్తుగడ బొంకు – నేడు నరేంద్రమోడీకి దేశ హితం సాకు !



ఎం కోటేశ్వరరావు


పొరుగుదేశమైన పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ ప్రభుత్వం పతనపు అంచుల్లో ఉంది. ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొంటాను తప్ప రాజీనామా చేసేది లేదని ఇమ్రాన్‌ చెప్పాడు. ఆదివారం నాడు ఓటింగ్‌ జరిగేలోపల ఏమైనా జరగవచ్చు. అనూహ్య పరిణామాలు జరిగితే తప్ప ఇమ్రాన్‌ పదవి పోవటం ఖాయంగా కనిపిస్తోంది.2018 జూలై 25న జరిగిన ఎన్నికల్లో 31.82శాతం ఓట్లతో 342 స్ధానాలున్న జాతీయ అసెంబ్లీ (పార్లమెంటు)లో 149 స్ధానాలతో ఇమ్రాన్‌ఖాన్‌ నాయకత్వంలోని పాకిస్తాన్‌ తెహరిక్‌ ఏ ఇన్సాఫ్‌(పిటిఐ) పెద్ద పక్షంగా అవతరించింది. ప్రభుత్వ ఏర్పాటుకు 172 స్దానాలు అవసరం కాగా ఏడు చిన్న పార్టీలు, ఒక స్వతంత్రుడి మద్దతుతో 176 ఓట్లతో ఇమ్రాన్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. వాటిలో కొన్ని పార్టీలు మద్దతు ఉపసంహరించుకోవటంతో మద్దతు ప్రస్తుతం 164కు పడిపోయింది. స్వంత పార్టీవారే కొందరు తిరుగుబాటును ప్రకటించటంతో ఓటింగ్‌ సమయానికి ఇంకా తగ్గవచ్చు. గడువు ప్రకారం తదుపరి ఎన్నికలు 2023 అక్టోబరు 12లోగా జరగాల్సి ఉంది. అవిశ్వాస తీర్మానాన్ని ఉపసంహరించుకుంటే ఆగస్టునాటికి ఎన్నికలు జరుపుతానని ఇమ్రాన్‌ ప్రతిపక్షాలకు సందేశం పంపాడు. ఓటింగ్‌ జరిగేలోగా పార్లమెంటును రద్దు చేస్తే ఏం జరుగుతుందో చెప్పలేము.


ఇమ్రాన్‌ఖాన్‌పై ఆకస్మికంగా ఈ తిరుగుబాటు ఎందుకు వచ్చిందన్నది ప్రశ్న. ఎప్పటి నుంచో ఆర్ధికరంగంలో అనిశ్చితి కొనసాగుతోంది. కొత్తగా వచ్చిన వైఫల్యాలు లేవు.పోనీ కొత్త ప్రభుత్వం వస్తే తెల్లవారేసరికి పరిష్కారం అవుతాయా అంటే కావు. తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా పశ్చిమదేశాలు కుట్ర చేస్తున్నాయంటూ ఇమ్రాన్‌ ఒక లేఖను మంత్రులకు చూపాడు. దాన్నే ఒక బహిరంగసభలో కూడా ప్రదర్శించారు. కుట్రచేస్తున్న దేశం అమెరికా అని చెప్పి వెంటనే కాదు నోరు జారింది ఒక పశ్చిమ దేశం అని సవరించుకున్నాడు. జనానికి, ప్రపంచానికి వెళ్లాల్సిన సందేశాన్ని పంపి ఎత్తుగడగా నోరు జారిందని చెప్పాడన్నది వేరే చెప్పనవసరం లేదు. అంతకు ముందే మీడియాకు లీకు చేయటం అమెరికా ఖండించటం వంటి పరిణామాలు జరిగాయి.


సోవియట్‌ పతనం తరువాత మన దేశం క్రమంగా అమెరికా వైపు మొగ్గుచూపటం ప్రారంభమైంది. భారత ఉపఖండంలో భారత్‌ ఎంత కీలక స్ధానంలో ఉందో పాకిస్తాన్‌ కూడా వ్యూహాత్మకంగా అంతే ప్రాధాన్యత కలిగి ఉంది. అందుకే రెండు దేశాలను చెరోచంకన ఎక్కించుకొని తన పబ్బంగడుపుకోవాలన్నది అమెరికా ఎత్తుగడ. మారుతున్న పరిణామాల నేపధ్యంలో అది దానికి సాధ్యం కావటంలేదు. రష్యా, చైనాలవైపు ఇటీవలి కాలంలో పాక్‌ మొగ్గుదల ఉంది. ఇంతకాలం దాగుడుమూతలాడినా ఉక్రెయిన్‌-రష్యా వివాదం ఒక స్పష్టమైన వైఖరిని ప్రదర్శించాల్సిన అగత్యాన్ని ముందుకు తెచ్చింది. జోబైడెన్‌ అధికారం స్వీకరించిన తరువాత ఇంతవరకు ఇమ్రాన్‌తో మాటల్లేవు. వివాదం ముదురుతుండగా ఇమ్రాన్‌ ఖాన్‌ రష్యా పర్యటన జరిపి తాము పుతిన్‌వైపే ఉన్నట్లు చెప్పటం, ఐరాసలో తటస్ధ వైఖరి తీసుకోవటం వంటి పరిణామాలు అమెరికా అగ్రరాజ్య దురహంకారాన్ని రెచ్చగొట్టాయి. దాంతో తనకు వెన్నతో పెట్టి విద్యను ప్రయోగించి తనతో చేతులు కలపని వారికి ఏ గతి పడుతుందో చూడండనే సందేశాన్ని మిగతా దేశాలకు ఇస్తోంది. అదే పాక్‌ పరిణామాలకు కారణం. పది సంవత్సరాల క్రితం ఉక్రెయిన్‌ పాలకులు రష్యావైపు మొగ్గినపుడు అక్కడ సిఐఏతో కుట్రలు చేయించి ప్రభుత్వాన్ని కూలదోశారు. అనేక దేశాల్లో ఇదే జరిగింది. పాక్‌ మాదిరి మన దేశం, చైనాతో ఒకే గేమ్‌ ఆడాలంటే కుదరదు. అందుకే వేర్వేరు ఆటలు ఆడుతోంది.


రష్యాను ఖండించేందుకు తమతో గొంతుకలపాలన్న పశ్చిమ దేశాల మీద మార్చి ఆరవ తేదీన ఒక బహిరంగసభలో ఇమ్రాన్‌ ఖాన్‌ మాట్లాడుతూ మా గురించి ఏమనుకుంటున్నారు, మీరు చెప్పింది చేసేందుకు మీ బానిసలమా అని ప్రశ్నించాడు. మన దేశాన్ని అమెరికా బెదిరించినా, వణుకుతన్నదని ఎద్దేవా చేసినా ప్రధాని నరేంద్రమోడీ స్పందించలేదు. భారతీయ సంతతికి చెందిన అధికారి చేతనే మన దేశాన్ని బెదిరించటం తాజా ఉదంతం. చైనా గనుక వాస్తవాధీన రేఖను అతిక్రమించితే రష్యా సాయపడదని, ఎందుకంటే వారి మధ్య హద్దులు లేని భాగస్వామ్యం ఉందని అమెరికా జాతీయ భద్రతా ఉప సలహాదారు దలీప్‌ సింగ్‌ మన దేశాన్ని బెదిరించాడు. రష్యా మీద తాము విధించిన ఆంక్షలను ఎవరైనా అతిక్రమించినట్లైతే పర్యవసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుందన్నాడు. అమెరికా, ఇతర దేశాలు అంతర్జాతీయంగా ఆంక్షలు విధించిన ఇంధనం, ఇతర వస్తువులను రష్యా నుంచి ఎక్కువగా భారత్‌ దిగుమతి చేసుకోవటాన్ని తాము కోరుకోవటం లేదన్నాడు.” స్నేహ స్ఫూర్తితో మా ఆంక్షల తీరుతెన్నుల గురించి వివరించేందుకు, ఉభయుల ప్రయోజనాలను మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు కట్టుబడి ఉన్నట్లు (భారత్‌) మాతో కలసి చెప్పాల్సిన ప్రాధాన్యతను స్పష్టం చేసేందుకు నేను ఇక్కడకు వచ్చాను. అవును ఆంక్షలకు తూట్లు పొడిచినా లేదా వమ్ము చేసినా అలాంటి దేశాలు పర్యవసానాలను అనుభవించాల్సి ఉంటుందని స్పష్టం చేస్తున్నా, ఆంక్షలకు ప్రత్నామ్నాయంగా చెల్లింపుల కోసం భారత్‌-రష్యా చేస్తున్న యత్నాలను కూడా గమనిస్తున్నామని ” అన్నాడు.


అంతేనా ! ” స్నేహితులు పరిమితులను విధించరాదు. డాలరు ప్రాతిపదికగా ఉన్న ద్రవ్య వ్యవస్ధను బేఖాతరు చేసి రూబుల్‌ను ముందుకు తెచ్చేందుకు చేస్తున్న మంత్రాంగాలు చేయవద్దు, మేము అన్ని దేశాలను ప్రత్యేకించి మా మిత్రదేశాలు, భాగస్వాములను చాలా సునిశితంగా పరిశీలిస్తున్నాం. చైనాతో సంబంధాల్లో రష్యా ఒక చిన్న భాగస్వామిగా మారబోతోంది. చైనా పైచేయి సాధిస్తుంది. అది భారత్‌కు అంతమంచిది కాదు.చైనా గనుక వాస్తవాధీన రేఖను మరోసారి అతిక్రమించితే భారత రక్షణకు రష్యా ముందుకు వస్తుందని ఎవరైనా అనుకుంటారని నేను భావించటం లేదు.” అన్నాడు.


దలీప్‌ సింగ్‌ మాటలు దౌత్య సాంప్రదాయాలకు లేదా ఇద్దరు స్నేహితుల సంబంధాలకూ విరుద్దమని ఐరాసలో భారత మాజీ రాయబారి సయ్యద్‌ అక్బరుద్దీన్‌ ఖండించారు. ఒక ట్వీట్‌తో పాటు ఇండియా టుడే టీవీతో కూడా మాట్లాడారు.” అమెరికా వంటి ఒక మిత్రదేశం ఇలాంటి మొరటు దౌత్యాన్ని ప్రదర్శిస్తుందని ఊహించలేదు. ప్రపంచం నేడు శాంతిగా లేదు, నిజానికి ముక్కలు కాబోతున్నది. ఇటువంటి స్ధితిలో ప్రతివారు తమ స్ధానాన్ని గరిష్టంగా పటిష్టపరచుకొనేందుకు పూనుకోవటం సహజం.ఉక్రెయిన్లో మిలిటరీ వివాదాలతో పాటు ఒక విధంగా అసాధారణ రీతిలో ఆయుధీకరణ వంటి వాటికి కూడా పూనుకుంటున్నారు.అసాధారణ రీతిలో ఒక జి20దేశం మీద ఆంక్షలు విధించారు. పరస్పర ఆధారితమైన ప్రపంచం మీద దీని ప్రభావాలు తప్పకుండా ఉంటాయి. ఒక ఆయుధంగా ఆంక్షలు విధించటం ఇదే తొలిసారి కాదు. అంతర్జాతీయచట్టం ముందు అవి నిలిచేవి కాదని ఈ కుర్రవాడికి(దలీప్‌ సింగ్‌) ఎవరో ఒకరు చెప్పాలి.తమ ప్రయోజనాల కోసం కొన్ని దేశాలు వీటిని ఉపయోస్తాయి. అమెరికా చేస్తున్నదాన్నే కొన్ని ఐరోపా దేశాలూ చేస్తున్నాయి. సంబంధం లేని భారత్‌ వంటి దేశాలకు అవి ఆందోళన కలిగిస్తాయి, దూరంగా ఉన్నా మనం ప్రభావితులం అవుతున్నాము. ఇలాంటి వాటి గురించి మనకు వివరించేందుకు అమెరికా ఒక రాయబారిని పంపటం బానే ఉంది. అయితే సదరు దలీప్‌ సింగ్‌ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరం, అవి దౌత్య సంప్రదాయాలు, స్నేహ సంబంధాలకు విరుద్దం. దౌత్యంలో, భారత్‌ వంటి దేశాలతో వ్యవహరించేటపుడు కాస్త లౌక్యంగా ఉండాలని ఆ కుర్రవాడికి చెబుతున్నాను. ఇది జులం తప్ప దౌత్యపరిభాష కాదు.” అని అక్బరుద్దీన్‌ స్పష్టం చేశారు. సంక్షోభ సమయాల్లో దేశాల ప్రభుత్వాలు తమ పౌరులకు ఏది మంచిదనే చూస్తాయి, ఐరోపా దేశాలు రష్యానుంచి ఇంధన కొనుగోలు చేస్తూనే ఉన్నాయని ఏ దేశం పేరూ ప్రస్తావించకుండా మన విదేశాంగ మంత్రి జైశంకర్‌ వ్యాఖ్యానించారు. ఇతరత్రా ఎలాంటి స్పందన లేదు.


అమెరికా బెదిరింపులు, మన దేశ అధికారిక స్పందన తీరు తెన్నులు చూస్తే జాతీయ వాదుల జాడ ఎక్కడా కనిపించటం లేదు, ఆత్మగౌరవం ఆచూకీ కనిపించటం లేదు. ఎవరి ఛాతీ పొంగటం లేదు. ఎందుకీ పరిస్ధితి ? దీన్ని చూస్తే విడి సావర్కర్‌ బ్రిటీష్‌ వారికి రాసిన ప్రేమ (లొంగుబాటు ) లేఖలు గుర్తుకు వస్తున్నాయి. అవి బయపడిన తరువాత అప్పటి వరకు వీరుడు శూరుడు అంటూ పొగిడిన వారు సమర్ధించుకోలేక జైలు నుంచి బయటకు వచ్చి తిరిగి స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనేందుకు ఒక ఎత్తుగడగా లేఖలు రాసినట్లు కొందరు టీకా తాత్పర్యం చెప్పారు. పోనీ అదే నిజమైతే తరువాత ఎక్కడా పాల్గొన్నదాఖలాలు లేవెందుకంటే నోట మాటలేదు. మన సర్కార్‌ను అమెరికా, దాని మిత్రదేశాలు బెదిరిస్తుంటే ఇప్పుడు నరేంద్రమోడీ మౌనం దాలుస్తున్నారు. ఏమిటంటే ప్రజల కోసం మౌనం తప్ప చేతకాక కాదని భక్తులు సమర్ధిస్తున్నారు.గతంలో కూడా అమెరికా చేసిన అవమానాన్ని నరేంద్రమోడీ భరించారు. పోనీ దానివలన మన జనానికి కలిగిన మేలు ఏమిటో ఎవరైనా చెప్పగలరా ? మలేరియా చికిత్సకు మనం తయారు చేసే హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ మాత్రలు కరోనా చికిత్సకు పనికి వస్తాయని కొందరు చెప్పారు. అది నిర్దారణ కాలేదు, వాటిని తమకు సరఫరా చేయకపోతే ప్రతికూల చర్యలు తీసుకుంటామని డోనాల్డ్‌ ట్రంప్‌ మన దేశాన్ని బెదిరించగానే నిషేధాన్ని సడలించిన నరేంద్రమోడీ తీరుతెన్నులను చూశాము.అదే అమెరికా మనకు కావాల్సిన కరోనా వాక్సిన్‌ తయారీకి అవసరమైన ముడిపదార్దాలు, పరికరాల ఎగుమతులపై నిషేధం విధించినపుడు మౌనం దాల్చటం తప్ప చేసిందేమీ లేదు. కనీస మద్దతు ధరలకు వ్యతిరేకంగా ప్రపంచ వాణిజ్య సంస్ధలో కేసు వేసింది. ఇలాంటి అనేక ఉదంతాలను చెప్పవచ్చు.అమెరికా, బెదిరింపులకు దిగుతున్న ఇతర దేశాలపై ఎదురుదాడికి దిగమని ఎవరూ చెప్పటం లేదు, కనీస నిరసన తెలపాల్సిన అవసరం లేదా ? ఆత్మగౌరవ ఆచూకీ లేదని, మన అపర జాతీయవాదుల జాడ ఎక్కడా కనిపించటం లేదంటే కాదని ఎవరైనా చెప్పగలరా !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ఉక్రెయిన్‌ సంక్షోభం : రైతాంగానికి గోడదెబ్బ-చెంపదెబ్బ !

31 Thursday Mar 2022

Posted by raomk in CHINA, Current Affairs, Economics, Farmers, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Prices, RUSSIA, USA, WAR

≈ Leave a comment

Tags

BJP, burden on farmers, fertilizer prices enhancement, Fertilizers subsidies, India fertilizer prices, India's farmers, Narendra Modi, Ukraine-Russia crisis


ఎం కోటేశ్వరరావు


ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య ఫిబ్రవరి 24న ప్రారంభమైంది. విమానంలో వెళితే 5,089, రోడ్డు మార్గమైతే 6,528 కిలోమీటర్ల దూరంలో అది జరుగుతోంది. కానీ దాని ప్రభావం అనేక రూపాల్లో మనకు దూరంతో నిమిత్తం లేకుండా స్వానుభవంలోకి వస్తోంది. కలికాల మహిమ కాదు ప్రపంచీకరణ పర్యవసానమిది. దీని వెనుక ఉన్న అమెరికా,దాని గురించి ఎంత చెప్పుకున్నా తరగదు. అన్ని తరగతుల కష్టజీవులను ఇబ్బంది పెడుతోంది. ఈ సందర్భంగా దేశానికి అన్నంపెట్టే రైతన్నకు ఈ యుద్దం ఎలాంటి ఇబ్బందులను కలిగిస్తుందో చూద్దాం. భారత్‌లో తీవ్ర కొరత మధ్య ఎరువుల ధరలు భారీగా పెరుగుతాయని అంతర్జాతీయ స్టాక్‌మార్కెట్‌ సూచీల కదలికల మీద విశ్లేషణలు అందించే ఎస్‌ అండ్‌ పి(స్టాండర్డ్‌ అండ్‌ పూర్‌) సంస్ధ మార్చి 30వ తేదీన పేర్కొన్నది.


ప్రపంచం మొత్తం మీద వంద కిలోల ఎరువుల ఉత్పత్తి జరిగితే పద మూడు కిలోలు రష్యాలో తయారవుతాయి. వాటి నుంచి మనతో సహా అనేక దేశాలు తెచ్చుకుంటాయి.2022 మార్చినెల ప్రారంభంలో ఎరువుల ఎగుమతులను అక్కడి ప్రభుత్వం తాత్కాలికంగా నిషేధించింది. ఫిబ్రవరి ఆఖరు నాటికి మన దేశంలో 8.12మిలియన్‌ టన్నుల డిఏపి, 1.9మి.టన్నుల ఎంఓపి, 7.7మి.టన్నుల ఎన్‌పికె మిశ్రమ ఎరువుల నిల్వలున్నాయని, అవి వచ్చే ఖరీఫ్‌ పంటకాలంలో అవసరమైన వాటి కంటే తక్కువని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ఖరీఫ్‌లో 65.4మి.టన్నుల డిఏపి, 23.4మి.టన్నుల ఎంఓపి, 58.3మి.టన్నుల ఎన్‌పికె మిశ్రమ ఎరువుల అవసరం ఉంటుందని అంచనా.యూురియా 19.8మి.టన్నులు అవసరం కాగా ఫిబ్రవరి చివరి నాటికి 25.5మి.టన్నుల నిల్వలున్నాయని చెప్పినట్లు ఎస్‌ అండ్‌ పి పేర్కొన్నది. అంతర్జాతీయ మార్కెట్లో ఇప్పటికే ఎంఓపి, డిఏపి ధరలు 30-40శాతం పెరిగాయని, రానున్న రోజుల్లో పెరిగే ధరలు, ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలను బట్టి రైతులకు ఏ ధరలకు ఎరువులు దొరుకుతాయనేది చెప్పలేమని ఇండియా రేటింగ్స్‌ విశ్లేషకుడు భాను పాట్ని చెప్పారు.


తమ శత్రుదేశాలకు తాము ఎగుమతి చేసే సరకులకు రూబుళ్లలోనే సొమ్ము చెల్లించాలని రష్యా అధినేత పుతిన్‌ ప్రకటించాడు. మన దేశం ఆ జాబితాలో లేనందున రూపాయి-రూబుల్‌ లావాదేవీలకు అవకాశం ఉంది.మనం అమెరికా, నాటో దేశాల ఆంక్షలను ఖాతరు చేయనప్పటికీ నౌకలపై ఆంక్షలు, బీమా సౌకర్యం వర్తించవనే అనుమానాల నేపధ్యంలో రవాణా సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ప్రభుత్వం సబ్సిడీని పెంచని పక్షంలో ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల ఉంటుంది. ఎరువుల ధరల పెరుగుదల వలన సాగు విస్తీర్ణం తగ్గవచ్చని, సూపర్‌(ఎస్‌ఎస్‌పి) వంటి ఇతర ఎరువుల వైపు రైతులు మరలవచ్చని చెబుతున్నారు. గాస్‌ ధరల్లో ప్రతి ఒక్క డాలరు పెరుగుదలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ మొత్తం రు.4000-5000 కోట్ల వరకు అదనంగా ఇవ్వాల్సి ఉంటుందని ఎస్‌బిఐ పరిశోధనా బృందం వెల్లడించిన ఒక పత్రంలో పేర్కొన్నారు.


నత్రజని ఎరువుల తయారీకి అవసరమైన ముడిపదార్దాల ధరల పెరుగుదల కారణంగా గత ఏడాది కాలంలో ఉత్పత్తి ఖుర్చు రెండున్నర రెట్లు పెరిగినట్లు కంపెనీలు చెబుతున్నాయి. మన అవసరాల్లో 25శాతం యూరియా, 90శాతం ఫాస్పేట్‌ ఎరువులు లేదా ముడిపదార్ధాలను, నూటికి నూరుశాతం పొటాష్‌ ఎరువులను దిగుమతి చేసుకుంటున్నాము.2021 ఆర్ధిక సంవత్సరంతో పోల్చితే 2022లో(ఏప్రిల్‌-జనవరి కాలంలో) రష్యా నుంచి మనం దిగుమతి చేసుకున్న యూరియా విలువ 27.15 మిలియన్‌ డాలర్ల నుంచి 123.79మి.డాలర్లకు పెరిగింది, ఉక్రెయిన్‌ నుంచి 2021జనవరి నాటికి 368.79మి. డాలర్ల మేరకు దిగుమతి చేసుకున్నాము. రష్యా ఎరువుల ఎగుమతులపై తాత్కాలిక ఆంక్షలు విధించగా ఉక్రెయిన్నుంచి సరఫరాలు అనిశ్చితంగా మారాయి. ఇతర దేశాల నుంచి ఏదో విధంగా తెచ్చుకున్నా సబ్సిడీల మొత్తం పెరగనుంది. ప్రస్తుతం కేటాయించిన రు.1.05లక్షల కోట్లు చాలకపోతే పెరిగిన మొత్తాన్ని రైతుల మీద మోపాలి లేదా బడ్జెట్‌ మొత్తాలను పెంచాల్సి ఉంటుంది. ఫాక్టంఫాస్‌(20-20-0-13) ధరలు గత పది నెలల కాలంలో బస్తా ధర రు.500 పెరిగి ఇప్పుడు రు.1,490కి చేరింది.

పాత స్టాక్‌ పూర్తిగా అమ్ముడు పోయిన తరువాత పెరిగిన కొత్త ధరలు అమల్లోకి వస్తాయని ఎరువుల కంపెనీలు కొద్ది నెలల క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పటికి ఉక్రెయిన్‌ – రష్యా వివాదం లేదు. అంతకు ముందు అంతర్జాతీయంగా పెరిగిన ఎరువుల ధరలు, దేశీయంగా పెరిగిన ఖర్చుల కారణంగా ఎంత మేరకు ధరలు పెంచవచ్చో కంపెనీలు తమ అంతర్గత సమాచారంలో డీలర్లకు తెలిపా యి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి. కంపెనీలు తాజా పరిణామాలను కూడా గమనంలోకి తీసుకొని వాటిని ఇంకా పెంచటమే తప్ప తగ్గించేది ఉండదు. ఇఫ్‌కో సంస్ధ ప్రకటించిన దాని ప్రకారం ఎరువుల ధరల పెంపుదల ప్రతిపాదన ఇలా ఉంది.( యాభై కిలోల ధర రూపాయలలో )
ఎరువు రకం××××× పాత ధర×××× కొత్త ధర
10:26:26×××××× 1,175 ×××× 1,775
12:32:16×××××× 1,185 ×××× 1,800
20:0:13 ×××××× 925 ×××× 1,350
డిఏపి ×××××× 1,200 ×××× 1,900
ఎరువుల ధరల పెరుగుదలకు అనుగుణంగా సబ్సిడీ మొత్తాన్ని కేంద్రప్రభుత్వం పెంచని పక్షంలో ఆ భారం రైతుల మీదనే పడుతుంది.దీనికి తోడు డీజిలు, పెట్రోలు ధరల భారం రైతుల మీద పడనుంది. చిన్న కమతాల్లో కూడా యంత్రాల వాడకం పెరిగినందున ఆ మేరకు ఖర్చు రైతులే భరించాల్సి ఉంటుంది.ఇది గోడదెబ్బ-చెంపదెబ్బ వంటిదే. పెద్ద మొత్తంలో ఒకేసారి కొనుగోలు చేసే వారికి లీటరుకు డీజిలు ధరను రు.25పెంచుతూ చమురు సంస్ధలు నిర్ణయించిన సంగతి తెలిసిందే. మానసికంగా అంతభారం భరించకతప్పదని జనాన్ని సిద్దం చేసేందుకే అలా చేశారు. ఆ మేరకు చిల్లర కొనుగోలుదార్లకు పెరగనున్నాయి.ఒకేసారి పెంచితే నిరసన వెల్లడౌతుందనే భయంతో మార్చి నెల 21వ తేదీ నుంచి రోజూ కొంత చొప్పున పెంచుతున్నారు. వీటికి అంతర్జాతీయ మార్కెట్‌తో సంబంధం లేదు. గత లోటును పూడ్చుకున్న తరువాత ధరలనుబట్టి నిరంతర పెరుగుదల ఎలానూ ఉంటుంది.


బెలారస్‌ నుంచి పొటాష్‌, రష్యానుంచి ఫాస్ఫేట్‌ ఎరువుల దిగుమతి అనిశ్చితంగా మారిందని రేటింగ్స్‌ సంస్ధ ఇక్రా పేర్కొన్నది. ఈ రెండు దేశాలు ప్రపంచ ఎగుమతుల్లో నలభైశాతం పొటాష్‌ను సరఫరా చేస్తున్నాయి. అమోనియాలో 22, అమోనియం ఫాస్పేట్‌ , యురియా 14శాతాల చొప్పున రష్యా ఎగుమతులు చేస్తున్నది. రక్షణ భయంతో నౌకలు నల్లసముద్రం వైపు వెళ్లేందుకు సుముఖత చూపటం లేదు. ఎరువుల సరఫరాకు అంతరాయం కలిగితే అది ఆహార ధాన్యాల ఉత్పత్తుల మీద కూడా ప్రభావం చూపుతాయి.ఉక్రెయిన్‌-రష్యా వివాదం కారణంగా ఎరువులు, పురుగుమందుల ధరలు 11 నుంచి 15శాతం పెరుగుతాయని కోటక్‌ మహేంద్ర సంస్ధ పేర్కొన్నది. కంపెనీలు, రైతులకు ఖర్చు పెరిగిన కారణంగా కనీస మద్దతు ధరలను పెంచవచ్చని కూడా జోశ్యం చెప్పింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది జనవరి-మార్చి నెలల కాలంలో అమోనియా ధరలు 200శాతం, పొటాష్‌ ధర 100శాతం పెరిగిందని ఎలారా కాపిటల్‌ తన నివేదికలో పేర్కొన్నది. సబ్సిడీ మొత్తాన్ని ఆ మేరకు పెంచని పక్షంలో రైతులే పెరిగిన మొత్తాలను భరించాల్సి ఉంటుందని తెలిపింది. సరఫరాలో ఇబ్బందులు తలెత్తవచ్చనే అంచానాతో ఎరువుల కంపెనీల వాటాలను కొనుగోలు చేసేందుకు మదుపుదార్లు ఎగబడటంతో గత నెలలో కొన్ని కంపెనీల వాటాల ధరలు 50శాతం పెరగ్గా సగటున 20శాతం పెరుగుదల నమోదైంది. మద్రాస్‌ ఫర్టిలైజర్స్‌ ధరలు 76.7శాతం పెరిగాయి.


రైతులకు అవసరమైన ఎరువులు, చమురు ధరల పెరుగుదల ప్రపంచమంతా ఆందోళన కలిగిస్తున్నది.లాటిన్‌ అమెరికాలోని బ్రెజిల్‌ రైతాంగం మొక్కజొన్న పంటకు ఎరువుల వాడకాన్ని తగ్గించగా, పొటాష్‌కు డిమాండ్‌ పెరగటంతో సొమ్ము చేసుకొనేందుకు అమెజాన్‌ ప్రాంతంలోని రక్షిత భూమిపుత్రుల(మన దగ్గర గిరిజనులు అంటున్నాం) భూముల్లో పొటాష్‌ను వెలికి తీసేందుకు అనుమతించాలని పాలకపార్టీ ఎంపీలు డిమాండ్‌ చేస్తున్నారు. ఆఫ్రికాలోని జింబాబ్వే, కెన్యాలో చిన్న రైతులు ఎరువుల వాడకాన్ని తగ్గించారు. ఉత్తర అమెరికాలోని కెనడాలో ముందు జాగ్రత్త చర్యగా కనోలా రైతులు 2023కు కూడా ఇప్పుడే నిల్వలు చేసుకుంటున్నట్లు వార్తలు. ఇప్పటికే ధరలు పెరగ్గా వచ్చే ఏడాది ఇంకా పెరుగుతాయని వారు భావిస్తున్నారు. అమెరికాలో గతేడాది ఎరువుల ధరలు 17శాతం పెరగ్గా, ఈ ఏడాది 12శాతంగా ఉండవచ్చని అంచనా. కొందరు రైతులు తక్కువ ఎరువులతో పండే పంటల వైపు చూడటం, సాగు తగ్గించాలనే ఆలోచన చేస్తున్నారు. తమ పంటలకు ఎంత ధరలు వస్తాయనిగాక ఇంత ఖర్చు పెట్టి సాగులోకి దిగాలా, ఎరువుల సరఫరా ఉంటుందా అనే ప్రాతిపదికన ఆలోచించి రైతులు నిర్ణయాలు తీసుకుంటున్నారని అమెరికాలోని కొందరు ఎంపీలు అమెరికా అంతర్జాతీయ వాణిజ్యకమిషన్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకొనే ఎరువుల మీద పన్నులు తగ్గించాలని కోరారు. గతేడాది తన రైతుల రక్షణకు గాను చైనా ఎరువుల ఎగుమతులపై ఆంక్షలు విధించింది. ఈ ఏడాది సడలించవచ్చని, అదే జరిగితే కొంత మేరకు ఇతర దేశాలకు సరఫరా పెరగవచ్చని భావించారు. ఇప్పుడేర్పడిన అనిశ్చిత పరిస్ధితుల్లో అది జరగకపోవచ్చని చెబుతున్నారు.


మూడు సాగు చట్టాలను రద్దు చేస్తూ కనీస మద్దతు ధరలకు చట్టబద్దత కల్పించే అంశం మీద ఒక కమిటీని వేస్తామని కేంద్రం ప్రకటించి నెలలు గడిచినా మాటల్లేవు, చేతల్లేవు.2022 నాటికి రైతుల ఆదాయాలు రెట్టింపు చేస్తామన్న కబుర్లు ఇప్పుడు ఎక్కడా వినిపించటం లేదు. పెంచుతున్న చమురు ధరలకు అంతర్జాతీయ పరిస్ధితులు కారణమని కేంద్ర మంత్రులు చెబుతున్నారు. ఎరువుల ధరలకూ ఇదే పాటపాడతారా ? భారం మొత్తాన్ని రైతుల మీదనే వేస్తారా ? అదే జరిగితే గ్రామీణ భారతంలో పరిస్ధితులు మరింత దిగజారుతాయి. మొత్తంగా ధరలు పెరుగుతాయి.

.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...
← Older posts

Recent Posts

  • రాజస్తాన్‌ దర్జీ దారుణ హత్యలో నూపుర్‌ శర్మ నోటి దూల పాత్ర ఎంత !
  • రష్యా, చైనాలపై దాడే 48వ జి7 శిఖరాగ్ర సభ లక్ష్యం !
  • నరేంద్రమోడీ పాలన : అంబానీకి ” మంచి యుద్ధం ” అదానీకి ”మంచి రోజులు ” !
  • కొలంబియాలో విరిసిన తొలి ఎర్రమందారం !
  • నరేంద్రమోడీకి వివరించేందుకు త్రివిధ దళాధిపతులు – ప్రధానికి తెలియకుండానే అగ్నిపథ్‌ను ప్రకటించారా ?

Recent Comments

మోడీ ఎనిమిదేండ్ల పాల… on మోడీ ఎనిమిదేండ్ల పాలన ( రెండవ…
మోడీ ఎనిమిదేండ్ల పాల… on మోడీ ఎనిమిదేండ్ల పాలన (మొదటి భ…
SHEIK ALI HUSSAIN on ప్రపంచాన్ని భయపెడుతున్న మంకీపా…
raomk on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…
యూహెచ్ ప్రీతమ్ on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…

Archives

  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • రాజస్తాన్‌ దర్జీ దారుణ హత్యలో నూపుర్‌ శర్మ నోటి దూల పాత్ర ఎంత !
  • రష్యా, చైనాలపై దాడే 48వ జి7 శిఖరాగ్ర సభ లక్ష్యం !
  • నరేంద్రమోడీ పాలన : అంబానీకి ” మంచి యుద్ధం ” అదానీకి ”మంచి రోజులు ” !
  • కొలంబియాలో విరిసిన తొలి ఎర్రమందారం !
  • నరేంద్రమోడీకి వివరించేందుకు త్రివిధ దళాధిపతులు – ప్రధానికి తెలియకుండానే అగ్నిపథ్‌ను ప్రకటించారా ?

Recent Comments

మోడీ ఎనిమిదేండ్ల పాల… on మోడీ ఎనిమిదేండ్ల పాలన ( రెండవ…
మోడీ ఎనిమిదేండ్ల పాల… on మోడీ ఎనిమిదేండ్ల పాలన (మొదటి భ…
SHEIK ALI HUSSAIN on ప్రపంచాన్ని భయపెడుతున్న మంకీపా…
raomk on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…
యూహెచ్ ప్రీతమ్ on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…

Archives

  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • రాజస్తాన్‌ దర్జీ దారుణ హత్యలో నూపుర్‌ శర్మ నోటి దూల పాత్ర ఎంత !
  • రష్యా, చైనాలపై దాడే 48వ జి7 శిఖరాగ్ర సభ లక్ష్యం !
  • నరేంద్రమోడీ పాలన : అంబానీకి ” మంచి యుద్ధం ” అదానీకి ”మంచి రోజులు ” !
  • కొలంబియాలో విరిసిన తొలి ఎర్రమందారం !
  • నరేంద్రమోడీకి వివరించేందుకు త్రివిధ దళాధిపతులు – ప్రధానికి తెలియకుండానే అగ్నిపథ్‌ను ప్రకటించారా ?

Recent Comments

మోడీ ఎనిమిదేండ్ల పాల… on మోడీ ఎనిమిదేండ్ల పాలన ( రెండవ…
మోడీ ఎనిమిదేండ్ల పాల… on మోడీ ఎనిమిదేండ్ల పాలన (మొదటి భ…
SHEIK ALI HUSSAIN on ప్రపంచాన్ని భయపెడుతున్న మంకీపా…
raomk on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…
యూహెచ్ ప్రీతమ్ on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…

Archives

  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Follow Following
    • vedika
    • Join 925 other followers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Customize
    • Follow Following
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d bloggers like this: