• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: WAR

చైనాను బూచిగా చూపి పేట్రేగుతున్న అమెరికా మిలిటరీ ఉన్మాదం !

18 Wednesday Jan 2023

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, Japan, Opinion, RUSSIA, UK, USA, WAR

≈ Leave a comment

Tags

Anti China Propaganda, Military Spending Frenzy, Nuclear Warheads, PENTAGON, Pentagon on China military, US imperialism


ఎం కోటేశ్వరరావు


2023లో 858 బిలియన్‌ డాలర్ల మేరకు మిలిటరీ ఖర్చు చేయాలని పెంటగన్‌ (అమెరికా రక్షణ శాఖ ) నిర్ణయించింది. ఇది అడిగినదానికంటే 45 బి.డాలర్లు అదనం. నిజానికి 1200బి.డాలర్లు ఖర్చు పెట్టాలని కొందరు డిమాండ్‌ చేస్తున్నారు. రాజు తలచుకోవాలే గానీ దెబ్బలకు కొదవా అన్నట్లుగా మిలిటరీ పరిశ్రమల కార్పొరేట్లు కనుసైగ చేయాలేగానీ అమెరికా పాలకులు డాలర్లతో వాలిపోతారు. స్టాక్‌హౌం అంతర్జాతీయ శాంతి పరిశోధనా సంస్థ(ఎస్‌ఐపిఆర్‌ఐ-సిప్రీ) గతేడాది వెల్లడించిన సమాచారం ప్రకారం 2021లో తొలిసారిగా ప్రపంచ రక్షణ ఖర్చు రెండు లక్షల కోట్ల డాలర్లు (2,113 బి.డాలర్లు) దాటింది. అమెరికా, చైనా, భారత్‌, బ్రిటన్‌, రష్యా వాటా మొత్తంలో 62శాతం ఉంది. కరోనాను ఎదుర్కొనేందుకు లేదా బాధితులను ఆదుకొనేందుకు చేసిన ఖర్చు సంగతేమో గానీ వరుసగా ఏడేళ్లు , కరోనాలో ఆర్థిక రంగం దిగజారినప్పటికీ వరుసగా రెండవ సంవత్సరం మిలిటరీ ఖర్చు మాత్రం పెరిగింది.


అమెరికాలో 2021లో 801 బిలియన్‌ డాలర్లు ఖర్చు పెట్టారు. సాంకేతికంగా ఇతర దేశాల కంటే పైచేయిగా ఉండాలన్న వైఖరితో ఏటా భారీ ఎత్తున పరిశోధన – అభివృద్ధికి ఖర్చు చేస్తున్నారు. రష్యా నుంచి ప్రధానంగా ఎగుమతి జరిగే చమురు ధరలు తక్కువగా ఉండి రాబడి తగ్గటంతో 2016 నుంచి 2019 వరకు దాని మిలిటరీ ఖర్చు కూడా తగ్గింది. అయితే, అమెరికా, ఇతర నాటో దేశాల కుట్రలను పసిగట్టి తరువాత ఉక్రెయిన్‌ సరిహద్దులో మిలిటరీని పెంచటంతో ఖర్చు కూడా పెరిగింది. అంతకు ముందు ఏడాదితో పోల్చితే 2021లో ఖర్చు పెరిగినందున 65.9బి.డాలర్లకు చేరింది. గతేడాది 75, ఈ ఏడాది 84బి.డాలర్లకు పెరగవచ్చని అంచనా. రెండవ స్థానంలో ఉన్న చైనా ఖర్చు 293 బి.డాలర్లుంది. గత 27 సంవత్సరాలుగా వరుసగా పెరుగుతూనే ఉంది.76.6 బి.డాలర్లతో మన దేశం మిలిటరీ ఖర్చులో మూడవ స్థానంలో ఉంది. ఇటీవల జపాన్‌ భారీ మొత్తాలను పెంచటంతో మనలను వెనక్కు నెట్టి మూడవ స్థానాన్ని ఆక్రమించనున్నట్లు వార్తలు. 2021లో 50 బి.డాలర్లకు మించిన ఖర్చు ఉన్న దేశాలు వరుసగా అమెరికా(801), చైనా (293), భారత్‌ (76.6), బ్రిటన్‌ (68.4), రష్యా (65.9), ఫ్రాన్స్‌ (56.6), జర్మనీ (56), సౌదీ అరేబియా (55.6), జపాన్‌(54.1), దక్షిణ కొరియా (50.2) ఉంది.
అమెరికాతో సహా ప్రత్యేకించి చైనాను దెబ్బతీసేందుకు చూస్తున్న దేశాలు దాన్నొక బూచిగా చూపుతూ తమ ఖర్చును పెంచుతున్నాయి.

ఏ దేశమూ మరో దేశాన్ని నమ్మే పరిస్థితి లేనందున మిలిటరీ నవీకరణకు తప్పనిసరిగా కొంత ఖర్చు పెరగటం సహజం. అమెరికా, ఐరోపాలోని ప్రయివేటు రంగంలోని ఆయుధ కంపెనీల లాభాలను పెంచేందుకు వివిధ ప్రాంతాలలో చిచ్చు రేపుతున్నందున, చిన్నా పెద్ద అనే తేడా లేకుండా అనేక దేశాలు ఖర్చును పెంచాల్సి వస్తోంది. రెండవ అంశమే ప్రధానంగా పని చేస్తోంది. ప్రపంచాన్ని భయ పెట్టేందుకు, తన పెత్తనాన్ని రుద్దేందుకు అవసరం లేకున్నా తొలిసారిగా అణుబాంబులను ప్రయోగించిన అమెరికా తరువాత కాలంలో ప్రపంచమంతటా అణ్వాయుధాల తయారీ, ఇతర వాటికి పదును పెట్టే, సేకరణ పోటీకి తెరతీసింది. సోవియట్‌ యూనియన్ను బూచిగా చూపి రక్షణ పేరుతో నాటో కూటమిని ఏర్పాటు చేసి ఐరోపా ఖండాన్నే ఏకంగా తన గుప్పెట్లో పెట్టుకుంది. తన మిలిటరీ శక్తితో చైనా, ఇండో-చైనా దేశాలను ఆక్రమించుకున్నది జపాన్‌.అది రెండవ ప్రపంచ యుద్దంలో ఓడిన తరువాత దాని మీదకు ఎవరో దాడికి రానున్నట్లు బూచిగా చూపి రక్షణ ఒప్పందం పేరుతో తన గుప్పిటలోకి తీసుకున్నదీ అమెరికానే. ఇప్పుడు చైనాను బూచిగా చూపి ఇతర దేశాలను తన ఉపగ్రహాలుగా మార్చుకొనేందుకు పూనుకుంది. దానిలో భాగంగానే కొత్త కథలు అల్లుతోంది.


చైనా దగ్గర ఇప్పుడున్న నాలుగు వందల అణ్వాయుధాలు 2035 నాటికి 1,500కు పెరుగుతాయని, అందువలన దాన్ని ఎదుర్కొనేందుకు ఇప్పటి నుంచే సన్నద్దం కావాలని పెంటగన్‌ అందరినీ ఉసిగొల్పుతోంది. అంతే కాదు, అమెరికాలోని ఆయుధ పరిశ్రమల కోసం కూడా మీడియాలో కట్టుకథలను అల్లించటం, వాటిని చూపి బడ్జెట్‌ను పెంచాలని వత్తిడి తేవటం అమెరికాలో అనేక మంది అధికారుల, ఎంపీల రోజువారీ వృత్తి. ప్రస్తుతం ప్రపంచంలో అన్ని దేశాల దగ్గర 13,080 అణ్వాయుధాలు ఉన్నట్లు ఒక అంచనా. ఇక అణువిద్యుత్‌ కేంద్రం ఉన్న ప్రతి దేశం వాటిని ఏ క్షణంలోనైనా రూపొందించగల సత్తా కలిగినదిగా పరిగణిస్తున్నారు. రష్యా వద్ద 6,257 అణ్వస్త్రాలు ఉంటే వాటిలో తక్షణమే దాడికి పనికి వచ్చేవి 1,458, అందుబాటులో ఉన్నది 3,039, పనికి రానివి 1,760గా చెబుతున్నారు. ఆ తరువాత అమెరికా వద్ద ఇలాంటివే వరుసగా 5,550-1,389-2,361-1,800 ఉన్నట్లు అంచనా. వీటితో పోలిస్తే చైనా ఒక మరుగుజ్జు మాదిరి ఉంటుంది. ఇక దేశాల వారీగా చైనా వద్ద 350, ఫ్రాన్స్‌ 290, బ్రిటన్‌ 225, పాకిస్థాన్‌ 165, భారత్‌ 156, ఇజ్రాయెల్‌ 90, ఉత్తర కొరియా వద్ద 40 నుంచి 50 వరకు ఉన్నట్లు అంచనా. ఈ అంచనాలు, సంఖ్యలను ఎవరూ పూర్తిగా నిర్ధారించలేరు. అవసరమైతే ఎప్పటికప్పుడు రూపొందిందే ఆధునిక పరిజ్ఞానం అమెరికా, రష్యా వద్ద ఉంది. ఇప్పుడు చైనాను చూపి మరింతగా మిలిటరీ ఖర్చు ఎందుకు చూపుతున్నట్లు అన్నది ప్రశ్న.


ఏడాదికి ఒక సారో రెండుసార్లో ఎవరైనా కొనుగోలు చేసి కాల్చగల దీపావళి బాంబుల వంటివి కాదుఅణ్వాయుధాలు. వాటి రూపకల్పనకు ఖర్చైన మాదిరే నిర్వీర్యం చేసేందుకు కూడా చేతి సొమ్ము వదిలించుకోవాల్సిందే. అమెరికా తప్ప ఇంతవరకు ఏ దేశమూ వాటిని ప్రయోగించలేదు.అలాంటి పని చేస్తే ఏ దేశమూ మిగలదు.భారత్‌కు పాకిస్థాన్‌ ఎంత దూరమో పాకిస్థాన్‌కూ భారత్‌ అంతే దూరం. అదే విధంగా ఇతర అణుశక్తి దేశాలూ కూడా. ఎవరు అస్త్రాన్ని వదిలినా వెంటనే మరొకరు సంధిస్తారు. కట్టుకథలు, పిట్టకతలను ఆకర్షణీయంగా మలచటం తప్ప వాటిలో హేతుబద్దత కనిపించదు. ఉదాహరణకు గతేడాది నవంబరు 29న సిఎన్‌ఎన్‌ ఒక వార్తను అల్లింది. దాని ప్రకారం చైనా వద్ద 2020లో రెండువందల అణ్వాయుధాలుండగా 2022 నాటికి 400కు పెరుగుతాయని పేర్కొన్నారు. ఈ వేగానికి అనుగుణంగా 2035 నాటికి 1,500కు పెరగవచ్చని చెప్పారు. ప్రతి రెండు సంవత్సరాలకు రెట్టింపు పెరిగితే పదమూడు సంవత్సరాల్లో 12,800కు చేరతాయి.అది జరిగేదేనా ? ఈ లోగా ఇతర దేశాలు చేతులు ముడుచుకు కూర్చుంటాయా ? ఇలాంటి అంకెలకు ఆధారం ఏమిటి ?


అణ్వాయుధాలంటే ఫాక్షనిస్టులు ఇండ్ల దగ్గర నాటు బాంబులను చుట్టినట్లు కాదు. అవసరమైన యురేనియం,ప్లుటోనియం కోసం అణురియాక్టర్లు, శుద్ధి కేంద్రాల నిర్మాణం జరగాలి.దానికోసం ఎంతో ఖర్చు అవుతుంది. అనేక దేశాలు విద్యుత్‌ వంటి పౌర అవసరాల కోసం అణుకేంద్రాల నిర్మాణం చేస్తున్నాయి. అక్కడే అణ్వాయుధాల రూపకల్పనకు అవసరమైన గ్రేడ్ల యురేనియం,ప్లుటోనియం కూడా తయారు చేయవచ్చు.విద్యుత్‌ కోసం చైనాతో సహా అనేక దేశాలు అణుకేంద్రాల నిర్మాణం చేపట్టాయి. మన దేశంలో 22 రియాక్టర్లు, ఎనిమిది విద్యుత్‌ కేంద్రాలున్నాయి. మరో పది రియాక్టర్లు, విద్యుత్‌ కేంద్రాలు నిర్మాణం,ప్రతిపాదనల్లో ఉన్నాయి. పెంటగన్‌ నివేదికల్లో చెప్పినవన్నీ ప్రమాణాలు కాదు. ఊహాగానాలు, ఆధారం లేని ఆరోపణలు అనేకం ఉంటాయి. మూడు వందల ఖండాంతర క్షిపణుల(ఐసిబిఎం)ను ప్రయోగించేందుకు అవసరమైన నిర్మాణాలను చైనా జరుపుతోందన్నది దానిలో ఒకటి. దీనికి ఎలాంటి ఆధారం లేదని అమెరికా పత్రికలే రాశాయి. ఫెడరేషన్‌ ఆఫ్‌ అమెరికన్‌ సైంటిస్ట్స్‌ సంస్థకు చెందిన వారు చైనా వద్ద కేవలం 110 మాత్రమే ఖండాంతర క్షిపణులున్నట్లు, బహుశా దీర్ఘశ్రేణి క్షిపణులను కూడా కలుపుకొని 300 సంఖ్య చెప్పి ఉండవచ్చని పేర్కొన్నారు. అమెరికా1960 దశకం నుంచి ఐసిబిఎం, అణుక్షిపణి జలాంతర్గాములు, దీర్ఘశ్రేణి బాంబర్లను సమన్వయం చేస్తున్న విధానాన్ని రూపొందించి అమలు చేస్తున్నది. బరాక్‌ ఒబామా పాలనా కాలంలో వీటిని మరింత నవీకరించేందుకు 1.8లక్షల కోట్ల డాలర్లతో ఒక పధకాన్ని ప్రారంభించారు. చైనా కూడా ఇలాంటి వ్యవస్థలను రూపొందిస్తున్నదనే అనుమానం పెంటగన్‌కు ఉండి, చీకట్లో బాణాలు వేస్తున్నట్లు చెబుతున్నారు. ఏ దేశానికైనా తన జాగ్రత్తలో తానుండే హక్కు, అవకాశం ఉంది.


అణుక్షిపణుల జలాంతర్గాములతో 1959 నుంచే అమెరికా పహారా కాస్తున్నది. చైనా వద్ద ఉన్న అలాంటి జలాంతర్గాములు 2021 నుంచి పని చేస్తున్నట్లు అంచనా. అమెరికా వద్ద 11,840 కిమీ దూరంలోని లక్ష్యాన్ని చేరుకొనే జలాంతర్గాములు క్షిపణులు ఉండగా చైనా వద్ద 6,880 కిమీ దూరం వెళ్లే క్షిపణులున్నట్లు ఊహిస్తున్నారు తప్ప ఆధారాలు లేవు. ఒక్కటి మాత్రం వాస్తవం చైనా అంటే చౌక ధరలకు అందించే పాదరక్షలు, దుస్తులు,ఫోన్లు, టీవీల వంటి వినియోగవస్తువులను మాత్రమే భారీ ఎత్తున తయారు చేయగలదని అనేక మంది ఇప్పటికీ ఒక భ్రమలో ఉన్నారు. బొమ్మ విమానాలు, దీపావళి తారాజువ్వలనే కాదు నిజమైన వాటిని రూపొందించగల సత్తా సమకూర్చుకుంది. చైనాలో గుట్టు ఎక్కువ. రోజువారీ వస్తువులతో పాటు తనను దెబ్బతీసేందుకు చూసే వారికి దడపుట్టించే ఆధునిక అస్త్రాలను కూడా అది ఇప్పుడు కలిగి ఉంది. అమెరికాకు పట్టుకున్న భయాలలో అదొకటి. ఇటీవల తైవాన్‌ జలసంధిలో అలాంటి వాటిని చైనా ప్రదర్శించింది.


2023లో జర్మనీతో సహా నాటో దేశాలన్నీ రక్షణ ఖర్చును భారీ ఎత్తున పెంచనున్నాయి. వాటి జిడిపిలో రెండు శాతం అందుకు కేటాయించాలని, నాటో ఖర్చును తామెంత కాలం భరించాలంటూ, ఒక వేళ రష్యా గనుక దాడి చేస్తే రక్షణకు తాము వచ్చేది లేదంటూ డోనాల్డ్‌ ట్రంప్‌ అధ్యక్షుడిగా ఉన్నపుడు బహిరంగంగానే వత్తిడి తెచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఉక్రెయిన్‌ సంక్షోభ నేపధ్యంలో భారీగా పెంచుతున్నప్పటికీ పెంటగన్‌ వాటిని లోక కల్యాణం కోసం అన్నట్లుగా చూస్తున్నది. జిడిపిలో రెండు శాతం అన్న దానికి అనుగుణంగా ప్రత్యేక ఆయుధ నిధి కోసం తాము 106బి.డాలర్లు ఖర్చు చేస్తామని గతేడాది ఫిబ్రవరి 27న ఉక్రెయిన్‌ సంక్షోభం ప్రారంభమైన మూడు రోజుల తరువాత జర్మన్‌ ఛాన్సలర్‌ ఓల్ఫ్‌ షఉల్జ్‌ ప్రకటించాడు.జర్మనీ ఆయుధ కొనుగోళ్లపై ఉన్న ఆంక్షలను తప్పించుకోవటంతో పాటు, అమెరికాను సంతుష్టీకరించటం నాటోలో అమెరికా తరువాత పెత్తనం తనదే అని ప్రదర్శించుకొనే ఎత్తుగడ కూడా ఉంది. ఇప్పటి వరకు ఆ స్థానంలో ఉన్న ఆర్థికంగా దిగజారి ఉన్నందున బ్రిటన్‌ ఖర్చు పెంచే స్థితిలో లేదు. జపాన్‌ మాదిరే ఇటీవలి కాలంలో జర్మనీ తన ఆధిపత్యాన్ని పెంచుకొనేందుకు చూస్తున్నది. తటస్థ దేశాలుగా ఉన్న స్వీడన్‌,ఫిన్లండ్‌ కూడా నాటోలో చేరి మిలిటరీ ఖర్చును పెంచనున్నాయి. పోలాండ్‌ కూడా ఖర్చు పెంచేందుకు పూనుకుంది.ఇవన్నీ జరిగితే సింహభాగం అమెరికా సంస్థలే లబ్ది పొందుతాయి.


భారీ ఎత్తున పెంచిన పెంటగన్‌ బడ్జెట్‌తో సంతృప్తి చెందని మిలిటరీ కార్పొరేట్ల కనుసన్నలలో నడిచే ఎంపీలు, అధికారులు, విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు. వైట్‌హౌస్‌ మాజీ జాతీయ సలహాదారు మెక్‌ మాస్టర్‌ పన్నెండువందల బి.డాలర్లు కావాలని చెప్పాడు. జపాన్‌ రెండింతలు చేసేందుకు పూనుకున్నదని దాన్ని చూసి నేర్చుకోవాలంటూ చైనాను నిలువరించేందుకు అవసరమైనదాని కంటే అమెరికా తక్కువ ఖర్చు చేస్తున్నట్లు విమర్శించాడు. పెరిగిన ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే పెంటగన్‌ వాస్తవ కొనుగోలు శక్తి తగ్గుతుందని కొందరు గుండెలు బాదుకున్నారు. ఆసియాలో చిచ్చు పెట్టేందుకు చూస్తున్న అమెరికాకు తోడుగా, జపాన్‌, ఆస్ట్రేలియా కూడా రక్షణ ఖర్చు పేరుతో సమీకరణ కావటం ఆందోళన కలిగించే పరిణామం.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త్రాలు- హెచ్చరికగా చైనా మిలిటరీ విన్యాసాలు !

28 Wednesday Dec 2022

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, imperialism, International, Opinion, RUSSIA, UK, USA, WAR

≈ 1 Comment

Tags

AUKUS, china communist party, Joe Biden, PLA actions, PLA Eastern Theater Command, Quadrilateral Security Dialogue, Taiwan independence, Taiwan Next propaganda, US imperialism, US-CHINA TRADE WAR, Xi Jinping


ఎం కోటేశ్వరరావు


మరోసారి చైనాను అమెరికా రెచ్చగొట్టింది. రానున్న ఐదు సంవత్సరాల్లో తైవాన్‌కు పది బిలియన్‌ డాలర్ల మిలిటరీ సాయం చేసేందుకు ఆమోదించిన బిల్లు మీద అధ్యక్షుడు జో బైడెన్‌ డిసెంబరు మూడవ వారంలో సంతకాలు చేసి మరోసారి రెచ్చగొట్టాడు. ఆగస్టు (2022)లో అమెరికా పార్లమెంటు స్పీకర్‌ నాన్సీ పెలోసి వివాదాస్పద చైనా పర్యటన తరువాత తైవాన్‌లోని వేర్పాటు వాదులను హెచ్చరిస్తూ చైనా మిలిటరీ భారీ విన్యాసాలను జరిపింది. ఇప్పుడు చైనా ఆగస్టు కంటే పెద్ద ఎత్తున మరోసారి తైవాన్‌ చుట్టూ మిలిటరీ విన్యాసాలను జరిపింది. ప్రపంచ నలుమూలలా ఎక్కడో ఒక చోట ఏదో ఒక వివాదాన్ని సృష్టించకపోతే అమెరికా మిలిటరీ కార్పొరేట్లకు నిదరపట్టదు. నిజానికి ఆసియాలో యుద్ద రంగాన్ని తెరవాలన్నది ఎప్పటి నుంచో ఉన్న అమెరికా ఆలోచన, దానికి పరిస్థితులు అనుకూలించటం లేదు. క్వాడ్‌ (అమెరికా, భారత్‌,జపాన్‌, ఆస్ట్రేలియాలతో ఏర్పాటు చేసిన చతుష్టయ కూటమి) పేరుతో 2007 అమెరికా ప్రారంభించిన కూటమికి మన్మోహన్‌ సింగ్‌ సర్కార్‌ ఆసక్తి చూపకపోవటంతో మూలనపడింది. దాన్ని నరేంద్రమోడీ రాకతో అమెరికా మరోసారి ముందుకు తెచ్చింది. దీనిలో మన దేశం మరోసారి వెనక్కు తగ్గవచ్చు అన్నమానం లేదా ఇతర కారణాలతో మరో కూటమి ” అకుస్‌ ”ను ఏర్పాటు చేసింది. 2021లో ఆస్ట్రేలియా,బ్రిటన్‌, అమెరికాలతో ఏర్పడిన అకుస్‌ లక్ష్యం ఆస్ట్రేలియాకు అణు జలాంతర్గాములను సరఫరా చేయటం. వాటిని చైనా మీదకు వదలటానికి తప్ప మరొకటి కాదు. ఇదిగాక ఐదు కళ్లు (ఫైవ్‌ ఐస్‌) పేరుతో ఈ మూడు దేశాలతో పాటు కెనడా, న్యూజిలాండ్‌తో కూడిన గూఢచార సమాచారాన్ని పంచుకొనే మరో ఏర్పాటు, ఇదిగాక ఇండో-పసిఫిక్‌ పేరుతో ఇంకో కూటమి ఇలా ఎన్ని వీలైతే అన్నింటిని కూడగట్టి ఏదో విధంగా చైనాను దెబ్బతీయాలన్నది అమెరికా పధకం.


తాజా పరిణామాలకు ముందు డిసెంబరు రెండవ వారంలో అమెరికన్‌ ఎంటర్‌ప్రైజ్‌ ఇనిస్టిట్యూట్‌ ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో తైవాన్ను స్వాధీనం చేసుకుంటే భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని అమెరికా రక్షణశాఖ అధికారి ఎలీ రాట్నర్‌ బెదిరించాడు. 2027 నాటికి తైవాన్‌ మీద మిలిటరీ చర్యకు పూనుకొనేందుకు చైనా చూస్తున్నదని ఆరోపించాడు.గతంతో పోల్చితే నాన్సీ పెలోసీ పర్యటన తరువాత మరింత స్థిరంగా ఉందన్నాడు. అవధులు లేని భాగస్వామ్య ఒప్పంద చేసుకున్నప్పటికీ ఆగస్టు విన్యాసాలలో మాస్కో చేరలేదన్నాడు. తాము వెనక్కు తగ్గేదేలేదని, ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో తమ విమానాలు ఎగురుతూనే ఉంటాయి, నౌకలు తిరుగుతూనే ఉంటాయన్నాడు. ఉత్తర ఆసియా, ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో తమ సేనలను మరింతగా పెంచేందుకు చూస్తున్నామని, చైనాను నిలువరించాలంటే అవసరమైన స్థావరాల కొరకు ఒప్పందాలు చేసుకోవాల్సి ఉందన్నాడు. ఈ పూర్వరంగంలో చైనా మిలిటరీ పరిణామాలను చూడాల్సి ఉంది.


చైనా ప్రజావిముక్త సైన్య (పిఎల్‌ఏ) చర్య కేవలం ” తైవాన్‌ స్వాతంత్య్రాన్ని ” అడ్డుకోవటానికి మాత్రమే కాదని చైనా పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ తాజా సంపాదకీయంలో పేర్కొన్నది. తైవాన్‌లోని వేర్పాటు వాద పార్టీ డిపిపి నేతలు అమెరికా అండచూసుకొని మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారని పేర్కొన్నది. చైనా తూర్పు కమాండ్‌ డిసెంబరు 25, 25 తేదీలలో తైవాన్‌ చుట్టూ పహారా, వైమానిక, నావికా విన్యాసాలు జరిపింది. తైవాన్‌ అధికారిక సమాచారం ప్రకారం 71 విమానాలు, ఏడు నౌకలు వీటిలో ఉన్నాయి. కొన్ని విమానాలు తమ గగన తలంలోకి చొచ్చుకు వచ్చినట్లు పేర్కొన్నది. అసలు తైవాన్‌ ప్రాంతం తమదే గనుక దానికి ప్రత్యేక గగనతలం అంటూ లేదని చైనా గతంలోనే చెప్పింది. తైవాన్‌ ఏకపక్షంగా ప్రకటించిన ఎవరూ ప్రవేశించని ప్రాంతాన్ని కూడా చైనా అంగీకరించలేదు. అమెరికా, ఇతర చైనా వ్యతిరేకులు ఏవిధంగా వర్ణించినప్పటికీ తాజా చైనా విన్యాసాలు తైవాన్‌ వేర్పాటు వాదుల మీద మానసికంగా వత్తిడి తెచ్చేందుకు, వేర్పాటు వాదానికి దూరం చేసేందుకు, వారికి మద్దతు ఇస్తున్నవారిని హెచ్చరించేందుకే అన్నది స్పష్టం.ఇదే సమయంలో ఈ ప్రాంతంలో ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తినపుడు తీసుకోవాల్సిన చర్యలకు ఇది ముందస్తు కసరత్తుగా కూడా ఉంటుందని గ్లోబల్‌ టైమ్స్‌ పేర్కొన్నది. ప్రతి దేశ మిలిటరీ తమ దేశ సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక భద్రతను కాపాడేందుకు పూనుకున్నట్లుగానే చైనా మిలిటరీ కూడా అందుకు సన్నద్దతను ఇలాంటి వాటి ద్వారా ప్రదర్శిస్తున్నది. అమెరికా-తైవాన్‌ ప్రాంత ప్రభుత్వ నేతల కుమ్మక్కు, రెచ్చగొట్టుడుకు ఇది ధృఢమైన ప్రతిస్పందన అని తూర్పు కమాండ్‌ ప్రతినిధి స్పష్టం చేశారు. ఏటా రెండు వందల కోట్ల డాలర్ల చొప్పున రానున్న ఐదు సంవత్సరాల్లో వెయ్యి కోట్ల డాలర్ల మేరకు మిలిటరీ సాయం చేసేందుకు డిసెంబరు 23న జో బైడెన్‌ సంతకాలు చేశాడు. ఇంతే కాదు ఒకే చైనా అని అంగీకరించిన విధానానికి తూట్లు పొడిచి 2024లో జరిపే పసిఫిక్‌ ప్రాంత దేశాల సమావేశానికి కూడా తైవాన్ను ఆహ్వానించేందుకు అమెరికా పూనుకుంది. వీటిని చూస్తూ చైనా మౌనంగా ఉండజాలదు. తైవాన్లో అమెరికా వేలు పెట్టటాన్ని తమ అంతర్గత అంశాల్లో జోక్యంగా చూస్తోంది.


1995లో చైనాను రెచ్చగొట్టేందుకు అమెరికన్లు తైవాన్‌ అధ్యక్షుడు లీ టెంగ్‌ హుకు వీసా ఇచ్చారు. దానికి నిరసనగా చైనా అనేక క్షిపణి పరీక్షలు జరిపింది, దాంతో చైనాను బెదిరించేందుకు అమెరికా 1996లో రెండు విమాన వాహకయుద్ధ నౌకలను తైవాన్‌ జలసంధికి పంపింది. దాని కొనసాగింపుగా 1997లో నాటి స్పీకర్‌ న్యూటన్‌ గింగ్‌రిచ్‌ను తైవాన్‌ పర్యటనకు పంపింది. ఆగస్టులో నాన్సీ పెలోసీ మాదిరి అనుమతి లేకుండా గింగ్‌రిచ్‌ రాలేదు. చైనాతో ముందుగా సంప్రదించిన తరువాతే జరిగింది. తైవాన్‌ గురించి తమ నేత ఎలాంటి ప్రతికూల వ్యాఖ్యలు చేయరని అమెరికా చెప్పిన మాటలు నమ్మింది చైనా. ఆ మేరకు అధికారికంగానే అనుమతించింది తప్ప తైవాన్‌ మీద ఎలాంటి రాజీ వైఖరిని అనుసరించలేదు. తమతో రక్షణ ఒప్పందం ఉన్న జపాన్ను కూడా అమెరికా రెచ్చగొడుతోంది. ఒక వేళ ఏదైనా కారణంగా జపాన్‌ మీద చైనా దాడి చేస్తే దాన్ని సాకుగా తీసుకొని రక్షణ ఒప్పందం పేరుతో నేరుగా అమెరికా రంగంలోకి దిగవచ్చు. తైవాన్‌ సమీపంలో జపాన్‌ ఒకినావా దీవులుండగా అక్కడ అమెరికా మిలిటరీ స్థావరం ఉంది. తూర్పు చైనా సముద్రంలో ఉన్న సెనెకాకు దీవుల్లో జనావాసాలు లేవు,అవి గతంలో చైనాలో భాగంగా ఉండేవి. రెండవ ప్రపంచ జపాన్‌ యుద్దం తరువాత జపాన్‌ అదుపులో ఉన్నాయి. అవి తమవని, జపాన్‌కు వాటి మీద హక్కులేదని వాదిస్తున్న చైనా వాటి మీద సార్వభౌత్వం తమదే అని ప్రదర్శించుకొనేందుకు తరచూ విమానాలను ఆ ప్రాంతానికి పంపుతున్నది. లియాఓనింగ్‌ అనే విమాన వాహక యుద్ద నౌక నుంచి విమానాలు ఆ దీవుల సమీపంలో చక్కర్లు కొడతాయి. దానికి ప్రతిగా జపాన్‌ కూడా స్పందించి విమానాలను పంపుతుంది.


చైనా చుట్టూ వివిధ దేశాలలో పెద్ద సంఖ్యలో అమెరికా సైనిక కేంద్రాలను ఏర్పాటు చేసింది. రోజు రోజుకూ వాటిని మంరింతగా పటిష్టం చేస్తున్నది. చైనా కూడా అమెరికా, దాని మిత్రదేశాల మిలిటరీని తట్టుకోగలిగేట్లు క్షిపణులను రూపొందించింది. ఉపగ్రహాల సంకేతాలు, మార్గదర్శనంలో ఒకే సారి ఒకే వ్యవస్థ నుంచి పలు దిక్కులకు క్షిపణులను ప్రయోగించగల ఎంఎల్‌ఆర్‌ఎస్‌ వ్యవస్థలను కూడా రూపొందించింది. అవి ప్రస్తుతం అమెరికా వద్ద ఉన్నవాటి కంటే ఎక్కువ రాకెట్లను పంపగలిగినవని బిజినెస్‌ ఇన్‌సైడర్‌ అనే పత్రిక రాసింది. ఒకేసారి ఎనిమిది 370 ఎంఎ రాకెట్లను 350 కిలోమీటర్ల దూరం, రెండు 750 ఎంఎం రాకెట్లను 500 కిలోమీటర్ల దూరం వరకు వదలవచ్చు. చైనా-తైవాన్‌ మధ్య దూరం 150 కిలోమీటర్లే గనుక ఆ ప్రాంతంపై ఎక్కడికైనా క్షిపణులను చైనా వదలగలదు. తైవాన్‌కు రక్షణ పేరుతో సముద్ర జలాల్లో ప్రవేశించిన మరో దేశ మిలిటరీని కూడా ఎదుర్కొనే సత్తాను కలిగి ఉంది. అమెరికా సైనిక స్థావరం ఉన్న ఒకినావా(జపాన్‌)కు తైవాన్‌కు దూరం 730 కిలోమీటర్లు కాగా, జపాన్‌ ప్రధాన ప్రాంతానికి ఒకినావా 1456 కిలోమీటర్ల దూరంలో ఉంది. అందువలన ఎక్కడి నుంచో వచ్చి అమెరికా, జపాన్‌, ఇతర దేశాలు చైనా మీద తలపడాల్సి ఉంది.


తాము ఎంతగా రెచ్చగొట్టినా ఇప్పటికిప్పుడు తైవాన్‌ విలీనానికి చైనా బలాన్ని వినియోగిస్తుందని అమెరికా నేతలు అనుకోవటం లేదు. కానీ ఆయుధ వ్యాపారుల లాబీ 2027లో చైనా ఆ పని చేస్తుందని దానికి అనుగుణంగా ఉండాలని చెబుతున్నది. దానికి ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని ఉదాహరణగా చూపుతున్నది. నిజానికి తైవాన్‌-ఉక్రెయిన్‌ మధ్యపోలికే లేదు. వివాదం అసలే లేదు. దీర్ఘకాలం పాటు చైనా ప్రధాన ప్రాంతానికి దూరంగా ఉంది కనుక అనుమానాల నివృత్తి తరువాత విలీనం జరగాలని చెప్పారు తప్ప మరొకటి కాదు. అందుకే హాంకాగ్‌, మకావో దీవులు బ్రిటన్‌, పోర్చుగీసుల కౌలు గడువు ముగిసిన తరువాత తనలో విలీనం చేసుకున్నది చైనా . ఒకే దేశం-రెండు వ్యవస్థల పేరుతో ఒక విధానాన్ని ప్రకటించి అమలు జరుపుతున్నది. తైవాన్‌కూ దాన్ని వర్తింపచేసేందుకు అది సిద్దమే. దాన్ని ఒక స్వతంత్ర దేశంగా మార్చి తిష్టవేయాలని అమెరికా చూస్తున్నది. అది జరిగేది కాదని చైనా చెబుతున్నది.


త్వరలో చైనా మిలిటరీ చర్యకు పాల్పడవచ్చని చెబుతున్నవారు నవంబరు నెలలో తైవాన్‌లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలను చూపుతున్నారు. ఆ ఎన్నికలలో అధికార పార్టీ డిపిపి చావు దెబ్బతిన్నది. ప్రధాన ప్రతిపక్షమైన కొమింటాంగ్‌ పార్టీ భారీ విజయాలు సాధించింది. అది విలీనానికి పూర్తి వ్యతిరేకం కాదు. ఈ పార్టీ నేతగా మాజీ చైనా పాలకుడు చియాంగ్‌ కై షేక్‌ ముని మనవడు వేనీ చియాంగ్‌ ఉన్నాడు. రాజధాని తైపే మేయర్‌గా గెలిచాడు.1949 నుంచి తైవాన్‌లో తిష్ట వేసిన చియాంగ్‌ కై షేక్‌, తరువాత 1975లో అధికారానికి వచ్చిన అతని కుమారుడు 1987వరకు నిరంకుశ పాలన సాగించాడు. ప్రధాన ప్రాంతం లేకుండా తైవాన్‌ స్వాతంత్య్రానికి, ఒకే ఒకే దేశం-రెండు వ్యవస్థలనే ప్రతిపాదనను కొమింటాంగ్‌ పార్టీ అంగీకరించదు. తైవాన్‌ జలసంధికి ఇరువైపులా ఉన్న రెండు ప్రాంతాలు ఒకే చైనా అన్న 1992 ఏకాభిప్రాయాన్ని అంగీకరించినప్పటికీ భిన్న భాష్యాలతో అస్పష్టంగా ఉంటుంది. డిపిపి మాదిరి చైనా వ్యతిరేక వైఖరి లేదు. 2024లో జరిగే ఎన్నికలలో తిరిగి ఈ పార్టీ అధికారానికి వస్తుందా అని కొందరు ఎదురుచూస్తున్నారు.గతంలో కూడా స్థానిక ఎన్నికలలో డిపిపి ఓడినప్పటికీ సాధారణ ఎన్నికల్లో గెలిచిందని ఈసారి కూడా అదే పునరావృతం కావచ్చన్నది మరొక వైఖరి. అక్కడ ఎవరు అధికారానికి వచ్చినప్పటికీ అమెరికా ప్రభావం ఎక్కువగా ఉన్నందున చైనా తన జాగ్రత్తలను తాను తీసుకుంటుంది. పదే పదే రెచ్చగొడుతున్న అమెరికా వెనుక దుష్ట ఆలోచనలు లేవని చెప్పలేము.ఉక్రెయిన్లో చేసిన మాదిరి తైవాన్లో కుదరదని తెలిసినా అమెరికా తీరుతెన్నులను చూస్తే వెనక్కు తగ్గేట్లు కనిపించటం లేదు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

చైనాతో జోడీ కట్టాలా ! విడగొట్టుకోవాలా ! తైవాన్‌ చిప్స్‌ పరిశ్రమ ధ్వంసం అమెరికా బెదరింపు !

21 Wednesday Dec 2022

Posted by raomk in BJP, CHINA, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, UK, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

BJP, China goods boycott, Decouple from China, Narendra Modi, Narendra Modi Failures, RSS, Taiwan Matters, TRADE WAR, US-CHINA TRADE WAR


ఎం కోటేశ్వరరావు
ఇటీవల మరోసారి చైనాను కట్టడి చేయాలని, దాని ఉత్పత్తులను బహిష్కరించాలని, లావాదేవీలను నిలిపివేయాలని మన దేశంలో, ప్రపంచంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. చైనాతో సరిహద్దు ఉన్న అరుణాచల్‌ ప్రదేశ్‌లోని యాంగ్సీ వద్ద డిసెంబరు తొమ్మిదవ తేదీన రెండు దేశాల సైనికుల మధ్య జరిగిన తోపులాటను చైనా దాడిగా, దురాక్రమణగా చిత్రించిన మీడియా రాతలను చూస్తే మహేష్‌ బాబు అతడు సినిమాలో బ్రహ్మానందం ఎంత వైన్‌ తాగితే అంత జ్ఞానం అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. ఇరుగు పొరుగు దేశాల మధ్య తలెత్తిన పొరపచ్చాలను మరింతగా రెచ్చగొట్టటమే దేశభక్తి అన్నట్లుగా ఉంది. ఈ సందర్భంగానే ఢిల్లీ సిఎం అరవింద్‌ కేజరీవాల్‌ చైనా నుంచి దిగుమతులను ఆపివేయకుండా ఎందుకు కొనసాగిస్తున్నారని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సంగతి తెలిసిందే. తగ్గేదే లే అన్నట్లుగా గాల్వన్‌ ఉదంతం తరువాత రికార్డు స్థాయిలో మన దేశం చైనా నుంచి దిగుమతులు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. గాల్వన్‌ ఉదంతంలో మరణించిన మన సైనికుల గురించి మనోభావాలను ముందుకు తెచ్చిన వారెవరో తెలిసిందే. ఆ తరువాత చైనా నుంచి దిగుమతులలో నరేంద్రమోడీ తన రికార్డులను తానే బద్దలు కొట్టారు. మోడీని పైకి తీసుకువచ్చిందీ, గద్దెమీద కూర్చోపెట్టింది సంఘపరివార్‌ అనీ అది చైనా మీద గతంలో చేసిన వ్యతిరేక ప్రచారం, ఇప్పుడు పరోక్షంగా దాని సంస్థలన్నీ సామాజిక మాధ్యమాల్లో చేస్తున్న ప్రచారం గురించి జగమెరిగినదే.


కమ్యూనిజంపై ఉన్న సైద్ధాంతిక లేదా గుడ్డి వ్యతిరేకత చైనాను తిరిగి పైకి తేలకుండా పక్కనున్న సముద్రంలో ముంచాలని లేదా శాపాల మహిమ చూపి హిమాలయాల మంచును కరగించి వరదలతో ముంచాలన్న్న కసికొందరిలో కనిపిస్తుంది. వీటిని చూసిన సామాన్యులు అదంతా నిజమే కామోసనుకుంటారు. కొందరు ఆ భావజాలాన్ని మెదళ్లకు ఎక్కించుకోవటం కూడా తెలిసిందే. అలా కనిపించే వారందరూ దానికి కట్టుబడి ఉండటం లేదు, ఉండరు అన్న వాస్తవాన్ని తెలుసుకోవటం అవసరం. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని అని కమ్యూనిస్టు సిద్దాంతకర్తలు కారల్‌ మార్క్స్‌-ఎంగెల్స్‌ చెప్పక ముందే ధనం మూలం ఇదం జగత్‌ అని క్రీస్తు పూర్వం 375లో జన్మించినట్లు భావిస్తున్న చాణుక్యుడు తన అర్ధ శాస్త్రంలో చెప్పాడు అంటే అది అంతకు ముందే ప్రాచుర్యంలోకి వచ్చి ఉండాలి. ఇక నటించేవారి సంగతి చెప్పనవసరం లేదు. ఎప్పుడు ఏ పాత్రలో లీనం కావాలనుకుంటే దానిలో ఒదిగిపోతారు.


చైనాతో విడగొట్టుకుంటే ప్రపంచం భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని జర్మనీ మేథో సంస్థ షిల్లర్‌ ఇనిస్టిట్యూట్‌ చైర్‌పర్సన్‌ హెల్గా జెప్‌ లా రోచీ చెప్పారు. రెండు రోజుల క్రితం అమె చైనా వార్తా సంస్థ సిన్హువాతో మాట్లాడుతూ చైనాతో సంబంధాల విస్తరణ, కొనసాగింపు జర్మనీ ప్రయోజనాల కోసమే అని చెప్పారు. చైనాతో విడగొట్టుకోవాలనటం భౌగోళిక రాజనీతి ఎత్తుగడ అని, దానితో విడగొట్టుకోవటం జర్మనీకి ఆర్థిక ఆత్మహత్యతో సమానమని రోచీ వర్ణించారు. అమెరికా వత్తిడితో చైనాతో తెగతెంపులు చేసుకుంటే దేశాన్ని గందరగోళంలోకి నెట్టినట్లే అన్నారు.చైనాతో తెగతెంపుల గురించి జర్మనీ, ఐరోపా సమాఖ్యలో తీవ్రమైన చర్చ జరుగుతోందని చెప్పారు. చైనాతో జర్మనీ గనుక తెగతెంపులు చేసుకుంటే ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్‌ వెలుపలికి వెళ్లిన దానికి ఆరు రెట్లు అదనంగా మూల్యం చెల్లించాల్సి ఉంటుందని, చైనాతో వాణిజ్య పోరుకు దిగితే ఆటోమోటివ్‌ పరిశ్రమ పెద్ద ఎత్తున నష్టపడుతుందని ఒక సంస్థ వేసిన అంచనాను రోచీ ఉటంకించారు. అమెరికా భౌగోళిక రాజనీతి క్రీడలో సేవకురాలిగా ఉండటం కంటే స్వంత ప్రయోజనాల పరిరక్షణకు నిలబడాల్సిన స్థితికి జర్మనీ చేరిందని అన్నారు. విడగొట్టుకోవాలని కోరుతున్నది కేవలం కొన్ని దేశాలు మాత్రమేనని 120కి పైగా దేశాలు, ప్రాంతాలు చైనాతో సహకరించటానికి సుముఖంగా ఉన్నట్లు ఆమె చెప్పారు.


అమెరికా ఇటీవలి కాలంలో తైవాన్ను అడ్డం పెట్టుకొని చైనాను సాధించాలని చూస్తున్న సంగతి తెలిసిందే. తిరుగుబాటు ప్రాంతమైన తైవాన్‌లో 1949 నాటి పాలకుడు చాంగ్‌కై షేక్‌ ఆధ్వర్యంలోని మిలిటరీ అక్కడే కేంద్రీకరించింది. దాన్నే అసలైన చైనాగా గుర్తించి, ప్రధాన భూభాగాన్ని దానిలో అంతర్భాగంగా ఐరాస కూడా పరిగణించింది. తరువాత మారిన పరిణామాల్లో అసలైన చైనా కమ్యూనిస్టు ప్రభుత్వ ఏలుబడిలో ఉన్నదే అని, తైవాన్‌ దానిలో అంతర్భాగమని ఐరాస కూడా గుర్తించింది. అందువలన ఏదో ఒక రోజు అది విలీనం గాక తప్పదని తెలిసిందే. ఆ ప్రక్రియను అడ్డుకొనేందుకు అమెరికా, బ్రిటన్‌ వంటి దేశాలు తైవాన్‌ తిరుగుబాటుదార్లను చేరదీసి ఆయుధాలతో సహా అన్ని రకాలుగా మద్దతు ఇస్తున్నాయి. విలీనానికి తగిన తరుణం ఆసన్నం కాలేదని, బలవంతంగా స్వాధీనం చేసుకోరాదంటూ వేర్పాటు, స్వాతంత్య్ర ప్రకటనలు చేస్తున్న శక్తులకు మద్దతు పలుకుతున్నాయి. అటువంటి తైవాన్‌ మీద చైనాను రెచ్చగొడితే , సంబంధాలు దిగజారితే, జో బైడెన్‌ ప్రకటించినట్లు అమెరికా నేరుగా జోక్యం చేసుకుంటే జరిగే పర్యవసానాలు, ప్రపంచానికి జరిగే అర్థిక నష్టం గురించి గురించి కొందరు విశ్లేషణలు చేస్తున్నారు.


రష్యాకు పక్కలో బల్లెం మాదిరిగా ఉక్రెయిన్ను నిలిపేందుకు అమెరికా చూసింది, అదే మాదిరి తైవాన్ను స్వతంత్ర దేశంగా మార్చి చైనా పక్కలో చేరాలని చూస్తున్నది. ఉక్రెయిన్‌పై 2022 ఫిబ్రవరి 24న రష్యా తన భద్రతకోసం ప్రారంభించిన సైనిక చర్య ప్రపంచానికి తెచ్చిన ఆర్థిక ఇబ్బందులు తెలిసినవే. ఇప్పటికిప్పుడు ఒక వేళ అమెరికా గనుక తైవాన్‌ ప్రాంతంలో చిచ్చు పెడితే, దాన్ని వమ్ము చేసేందుకు రంగంలోకి దిగిన చైనా ఒక వేళ దిగ్బంధనానికి పూనుకుంటే అన్న కోణంలో చూస్తే తైవాన్‌తో ఇతర ప్రపంచ దేశాలకు ఉన్న ఆర్థిక లావాదేవీలను పరిగణనలోకి తీసుకుంటే ఆంక్షలు, మిలిటరీ ఖర్చు వంటి వాటి పర్యవసానాలను పక్కన పెడితే తైవాన్‌ సరఫరా చేసే చిప్స్‌పై ఆధారపడిన ప్రపంచంలోని కంపెనీలకు లక్షల కోట్ల డాలర్ల మేర ఆర్థిక నష్టం జరుగుతుందని ఒక సంస్థ అంచనా. ఇది ప్రపంచానికి తెలిసిన అంశాల గురించే, నిగూఢంగా జరిగే చిప్‌ లావాదేవీల వివరాలు తెలిస్తే ఇంకా ఎక్కువే ఉండవచ్చు. అదే జరిగితే చైనాతో సహా ప్రపంచ ఆర్థిక రంగానికి సరఫరా గొలుసు విచ్చిన్నం అవుతుంది. ఒక వేళ తన ప్రాంతాన్ని కాపాడుకొనేందుకు చైనా గట్టి చర్యలు తీసుకున్నా తలెత్తే పరిస్థితి గురించి ఊహాగానాలు చేస్తున్నారు.


అమెరికా దుష్ట పధకం అమలు జరిగి తైవాన్‌ దిగ్బంధానికి గురైతే 2021లో ప్రపంచ దేశాలతో అది జరిపిన 922బిలియన్‌ డాలర్ల విలువగల ఎగుమతి-దిగుమతి లావాదేవీలు నిలిచిపోతాయి. వీటిలో 565 బి.డాలర్ల ఎగుమతులకు కచ్చితంగా ముప్పు వస్తుందని అంచనా. ప్రపంచంలో ఆధునిక చిప్స్‌లో 92శాతం తైవాన్‌లో ఉత్పత్తి అవుతున్నాయి. ఆటోమోటిక్‌ మైక్రో కంట్రోలర్స్‌ 35శాతం, స్మార్ట్‌ ఫోన్‌ చిప్‌ సెట్స్‌ 70శాతం అక్కడి నుంచే జరుగుతోంది. ఇవి నిలిచిపోతే వాటి మీద ఆధారపడిన కంపెనీలకు ఏటా 1.6లక్షల కోట్ల డాలర్లమేర రాబడి నష్టం జరుగుతుంది. ఇది తక్షణం జరిగే నష్టమైతే సరఫరాలను పూర్తి స్థాయికి తీసుకు వచ్చేందుకు ఎన్ని సంవత్సరాలు పట్టేది, పెట్టుబడులు ఎంత అవసరమనేది అంచనా వేయటం కష్టం.


ఒక వేళ చైనా గనుక బలవంతంగా స్వాధీనం చేసుకుంటే తైవాన్‌లోని చిప్స్‌ ఇతర ఆధునిక పరిశ్రమలను ధ్వంసం చేయాలని అమెరికన్లు పిలుపునిచ్చారు. నవంబరు పదవ తేదీన వాషింగ్టన్‌ నగరంలో రిచర్డ్‌ నిక్సన్‌ ఫౌండేషన్‌ నిర్వహించిన ” మహత్తర వ్యూహ సభ( గ్రాండ్‌ స్ట్రాటజిక్‌ సమిట్‌)లో అమెరికా మాజీ రక్షణ సలహాదారు, రాయబారిగా పనిచేసిన ఓ బ్రియన్‌ మాట్లాడుతూ ఒక వేళ చైనా గనుక తైవాన్ను విలీనం చేసుకుంటే అక్కడ ఉండే చిప్స్‌, ఇతర పరిశ్రమలను ఉన్నవాటిని ఉన్నట్లుగా చైనాకు దఖలు పరిచేది లేదని చెప్పాడు. తైవాన్నుంచి మన కార్లు, ఫోన్లకే కాదు మిలిటరీ పరికరాలకు కూడా తైవాన్‌ చిప్స్‌ వస్తున్నట్లు చెప్పాడు. చైనాకు చిప్స్‌ సరఫరా చేయరాదని, తయారీకి సహకరించరాదని జపాన్‌ వంటి తన మిత్ర దేశాలను అమెరికా తన చిప్స్‌ వార్‌లో భాగంగా ఆదేశించిన సంగతి తెలిసిందే. 2021 నవంబరులో అమెరికా ఆర్మీ వార్‌ కాలేజీ ప్రెస్‌ ప్రచురించిన ఒక పత్రంలో కూడా ఒక వేళ చైనా విలీనానికి పూనుకుంటే తైవాన్‌ సెమికండక్టర్‌ మాన్యుఫాక్చరింగ్‌ కంపెనీ(టిఎస్‌ఎంసి)లను ధ్వంసం చేయాలని సిఫార్సు చేశారు. బ్రోకెన్‌ నెస్ట్‌ – డిటరింగ్‌ చైనా ఫ్రం ఇనవాడింగ్‌ తైవాన్‌ అనే పేరుతో ఈ పత్రాన్ని వెలువరించారు. తరువాత నెలల్లో అమెరికా మరింతగా రెచ్చగొట్టటంతో పాటు రూపొందించిన తాత్కాలిక పధకంలో భాగంగా తైవాన్‌లోని చిప్స్‌ ఇంజనీర్లను అక్కడి నుంచి తరలించాలని చూస్తున్నట్లు అక్టోబరు ఏడున బ్లూమ్‌బెర్గ్‌ వెల్లడించింది. తైవాన్‌తో నిమిత్తం లేకుండా అమెరికాలోనే చిప్స్‌ తయారీకి 280 బి.డాలర్లమేర కంపెనీలకు సబ్సిడీ ఇవ్వాలని ఆగస్టులో ఏకంగా ఒక చట్టాన్నే చేశారు. హెచ్చరికలను ఖాతరు చేయకుండా అమెరికా కాంగ్రెస్‌ స్పీకర్‌ నాన్సీ పెలోసి తైవాన్‌ పర్యటనకు వచ్చి రెచ్చగొట్టిన తరువాత ప్రతిగా సెమికండక్టర్ల తయారీకి అవసరమైన ఇసుక ఎగుమతులను తైవాన్‌కు చైనా నిలిపివేసింది. అమెరికన్లు నిజంగా తైవాన్‌ పరిశ్రమల ధ్వంసానికిి పాల్పడితే సంవత్సరాల పాటు వాటిని పూడ్చుకోవటం సాధ్యం కాదు.


ప్రపంచ ఫ్యాక్టరీగా ఎగుమతులతో పాటు, 140 కోట్ల జనాభాతో అతి పెద్ద దిగుమతుల మార్కెట్‌గా కూడా చైనా ఉంది. ఎగుమతిాదిగుమతి లావాదేవీలకు గాను బాంకులు ఏటా 6.5 నుంచి ఎనిమిది లక్షల కోట్ల డాలర్ల మేర రుణాలు ఇస్తున్నాయి. చైనాతో ఇతర దేశాలు వివాదానికి దిగితే ఈ లావాదేవీలు చాలా భాగం నిలిచిపోతాయి. ప్రస్తుతం తైవాన్నుంచి చిప్స్‌ దిగుమతులు చేసుకుంటుంటే, చైనా నుంచి అనేక దేశాలు ఆటోమొబైల్‌ విడిభాగాలను పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటున్నాయి. కరోనా తరుణంలో అక్కడి నుంచి సరఫరాలు నిలిచిపోవటంతో అనేక ఇబ్బందులు పడిన సంగతి తెలిసిందే. చైనాతో వాణిజ్యం కొనసాగిస్తున్న అమెరికా ఇటీవల దాని తీవ్రతను పెంచింది. తనకు అవసరమైన వస్తువులను చైనా నుంచి దిగుమతులను కొనసాగిస్తూనే చైనాకు అవసరమైన సాంకేతిక బదిలీల మీద ఆంక్షలను విధిస్తోంది.దాన్ని అధిగమించేందుకు చైనా పూనుకుంది. ఎగుమతులకు అవకాశాలు తగ్గితే ఆ మేరకు దేశీయంగా మార్కెట్‌ను వృద్ధి చేసేందుకు పూనుకుంది.దీని అర్ధం తెల్లవారేసరికి విదేశీ పెట్టుబడులు, కంపెనీలు చైనా నుంచి వెళ్లిపోతాయని లేదా ఎగుమతులు నిలిచిపోతాయని కాదు. ఈ రోజు చైనా ఉన్న స్థితిలో ఏ దేశమూ దాని దిగుమతులను నిలిపివేసే స్థితిలో లేదు. అంతగా ప్రపంచం దాని మీద ఆధారపడింది. దానిలో భాగంగానే మన దేశం కూడా. కొందరు కోరుతున్నట్లు చైనా దిగుమతులను నిలిపేసేందుకు నరేంద్రమోడీ సర్కార్‌ పూనుకోలేదు. కారణం వాటి మీద ఆధారపడిన మన అనేక పరిశ్రమలు దెబ్బతింటాయి.మన దిగుమతులు మన అవసరాల కోసం తప్ప చైనాకు తోడ్పడేందుకు కాదు. నిజానికి చైనా నుంచి దిగుమతి చేసుకొనే వస్తువులు ఇతర దేశాల్లో దొరకనివి కాదు. చైనాతో పోలిస్తే అమెరికా, ఐరోపా దేశాల నుంచి చేసుకొనే దిగుమతి ఖర్చు మన కంపెనీలు భరించలేవు. అందుకే వాటి వత్తిడి మేరకు మోడీ సర్కార్‌ అనుమతించకతప్పటం లేదు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

అమెరికా సబ్సిడీలు – ఐరోపాతో వాణిజ్య పోరుకు నాంది కానున్నాయా !

08 Thursday Dec 2022

Posted by raomk in Current Affairs, Economics, History, imperialism, International, INTERNATIONAL NEWS, Prices, Uncategorized, USA, WAR

≈ 1 Comment

Tags

America’s green subsidies, Inflation Reduction Act, subsidy war with America, Trade Protectionism, TRADE WAR, US-EU Trade war


ఎం కోటేశ్వరరావు


ఉక్రెయిన్‌ రక్షణ పేరుతో రష్యా మీద ఆంక్షలు, ఆయుధాలతో ఉమ్మడిగా పోరుచేస్తున్న అమెరికా – ఐరోపా సమాఖ్య మధ్య అమెరికా సబ్సిడీలు కొత్త వాణిజ్య పోరుకు నాంది కానున్నాయా అన్న చర్చ ఇప్పుడు జరుగుతోంది. ఈ రాయితీలు ప్రధానంగా జర్మనీ, ఫ్రెంచి కార్ల కంపెనీలకు ముప్పుగా కనిపించటంతో ఫ్రెంచి అధ్యక్షుడు మక్రాన్‌ కంటికి కన్ను పంటికి పన్ను అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. జర్మనీ కాస్త ఆచితూచి స్పందిస్తున్నది.ఉక్రెయిన్‌ పోరులో అన్ని రకాలుగా అమెరికా లబ్ది తమకు ఇబ్బందులా అన్న ఉక్రోషం ఇప్పటికే ఐరోపాలో ప్రారంభమైంది. దాన్ని మరింతగా పెంచేదిగా తాజా పరిణామాలున్నాయి. సబ్సిడీ వివాదం టీ కప్పులో తుపానులా ముగుస్తుందా మరింత తీవ్రం అవుతుందా ? అమెరికాలో తయారైన ఉత్పత్తులకు పెద్ద ఎత్తున అక్కడి ప్రభుత్వం ప్రకటించిన సబ్సిడీ, పన్ను రాయితీల గురించి ఐరోపా సమాఖ్య ఒక్కటిగా ఉండాలని తొలిసారిగా సమాఖ్య అధ్యక్షురాలు ఉర్సులా వాండెర్‌ లేయాన్‌ పిలుపునిచ్చారు.అనుచిత పోటీకి దారితీసి మార్కెట్ల మూత, సరఫరా గొలుసుల విచ్చిన్నానికి దారి తీస్తుందని వాన్‌డెర్‌ అన్నారు. నిజానికి ఆమె ఐరోపాలో అమెరికా అనుకూల నేత, అంతరంగంలో ఏమున్నప్పటికీ ఐరోపాలో తలెత్తిన ఆందోళనను ప్రతిబించించే విధంగా ఆమె మాట్లాడాల్సి వచ్చింది.


ద్రవ్యోల్బణం తగ్గింపు చట్టం(ఐఆర్‌ఏ) పేరుతో జో బైడెన్‌ సర్కార్‌ 430 బిలియన్‌ డాలర్ల పథకాన్ని ప్రకటించింది. దీనిలో అమెరికాలో తయారైన వస్తువులను కొనుగోలు చేసే వారికి రాయితీలు ఇస్తారు. ఇది అక్కడి కంపెనీలకు ఇచ్చినట్లే. ఈ పధకం అమెరికాతో స్వేచ్చా వాణిజ్య ఒప్పందం చేసుకున్న కెనడా, మెక్సికో దేశాలకు కూడా వర్తిస్తుంది. మరోవైపు తమ కంపెనీలకు నష్టదాయకమని ఐరోపా సమాఖ్య ఆందోళన వెల్లడించింది. అమెరికాకు ప్రతిగా సమాఖ్య కూడా తన స్వంత నిబంధనలను సరి చేసుకొని అమెరికాకు పోటీగా చర్యలు తీసుకోవాలని ఉర్సులా సూచించారు. అమెరికా ఐఆర్‌ఏ చట్టం గురించి ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యుటిఓ)కు ఫిర్యాదు చేయాలని ఐరోపా పార్లమెంటు వాణిజ్య కమిటీ అధిపతి బెరెండ్‌ లాంగే అన్నాడు. అమెరికా ఇప్పటికే చట్టాన్ని ఆమోదించినందున పెద్దగా ఒరిగేదేమీ ఉండదని కూడా అన్నట్లు వార్తలు.ద్రవ్యోల్బణం తగ్గింపు చట్టం పేరుతో ఇస్తున్న సబ్సిడీ నిజానికి పోటీదార్లను బలహీనపరిచేందుకు తప్ప మరొకటి కాదు. ఇదే విధంగా అమెరికా చిప్స్‌ చట్టం పేరుతో తీసుకున్న చర్య తన స్వంత సెమికండక్టర్‌ పరిశ్రమ రక్షణ కోసమే.


అమెరికా ప్రకటించిన సబ్సిడీల మొత్తం అమెరికాలో ఉత్పత్తి అయిన వాటికి ఇవ్వటం డబ్ల్యుటిఓ నిబంధనలకు విరుద్దమని, దానితో తాము పోటీ పడలేమని 27దేశాల ఐరోపా సమాఖ్య అంటోంది. అమెరికా సబ్సిడీలు మహా కలహశీలమైనవి, పశ్చిమ దేశాలను విడదీస్తాయని ఫ్రెంచి అధినేత మక్రాన్‌ వాషింగ్టన్‌ పర్యటనలోనే తన అసమ్మతిని వెళ్లగక్కాడు. మరోవైపున ఐఆర్‌ఏలో ఎలాంటి మార్పులు చేసేది లేదని అధికార డెమోక్రాట్లు స్పష్టం చేశారు. లోపల ఏమి ఉన్నప్పటికీ సబ్సిడీల వివాదాన్ని అట్లాంటిక్‌ వ్యాపిత దేశాల వాణిజ్య వివాదంగా మార్చకుండా చూడాలని మక్రాన్‌-జో బైడెన్‌ ప్రకటించారు. అమెరికా సబ్సిడీలకు ఐరోపా నుంచి గట్టి స్పందన ఉండాలని జర్మనీ ఆర్థిక మంత్రి రాబర్ట్‌ హెబెక్‌ అన్నాడు. జర్మనీ విత్త మంత్రి క్రిస్టియన్‌ లిండ్‌నెర్‌ స్పందిస్తూ అమెరికాతో వాణిజ్యపోరుకు సిద్దపడాలన్నాడు. తమ వాణిజ్య ప్రయోజనాల రక్షణకు ఆర్థిక దౌత్యం మీద ఆధారపడాలని కూడా చెప్పాడు. ఎవరి వైఖరికి వారు కట్టుబడి ఉన్నట్లు వార్తలు వచ్చిన నేపధ్యంలో అమెరికా-ఐరోపా ప్రతినిధులు టెక్‌ సహకారం గురించి చర్చలు జరపనున్నారు. ఈ చర్చలల్లో సబ్సిడీల గురించి తేలేదేమీ ఉండదు గనుక ఐరోపా తన పరిశ్రమకు మద్దతు ఇచ్చేందుకు సిద్దం కావాలని ఐరోపా పార్లమెంటు వాణిజ్య కమిటీ అధిపతి బెరెండ్‌ లాంగే అన్నాడు. ఐరోపా అంతర్గత మార్కెట్‌ కమిషనర్‌ థిర్రీ బ్రెటన్‌ మాట్లాడుతూ ఐరోపా పరిశ్రమలను కాపాడుకొనేందుకు ఒక నిధిని ఏర్పాటు చేసుకోవాలని సూచించాడు.అమెరికాకు ప్రతిగా ఇతర దేశాలు కూడా కొన్ని ప్రతికూల చర్యలు తీసుకోకపోలేదు. ఉదాహరణకు డిజిటల్‌ సార్వభౌమత్వం పేరుతో అమెరికా టెక్‌ కంపెనీల మీద ఫ్రాన్సు డిజిటల్‌ పన్ను విధించింది. అమెరికా మీద ఆధారపడకుండా సబ్సిడీలతో ఐరోపా సెమికండక్టర్‌ పరిశ్రమను ఏర్పాటు చేసుకోవాలని ప్రతిపాదించింది. అమెజాన్‌, గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌ వంటి అమెరికా కంపెనీలను తమ దేశంలో కాంట్రాక్టుల్లో పాల్గొనకుండా నిషేధించాలని చూస్తున్నది. నిజంగా విబేధాలు ముదిరితే ఇలాంటి వాటిని చూపి అమెరికా ఎదురుదాడికి దిగవచ్చు.


అమెరికా-ఐరోపా మధ్య వాణిజ్య పోరు జరిగే అవకాశాలున్నాయనే ఆందోళన పెరుగుతోందని, ఈ పూర్వరంగంలో తాము మూల్యం చెల్లిస్తూ అమెరికా పెత్తనానికి తలవంచి అనుసరించటం కంటే తమ ప్రయోజనాల రక్షణకు స్వంత నిర్ణయాలు తీసుకోవటం మంచిదని చైనా విశ్లేషకులు ఐరోపాకు సూచించారు. ప్రస్తుతం ఐరోపా నేతలు అటు అమెరికా ఇటు చైనాతోను సంబంధాలను కొనసాగిస్తున్నారు.చైనాతో విడగొట్టుకోవాలని అమెరికా నిరంతరం ఇతర దేశాలకు చెబుతోంది.ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మక్రాన్‌ జనవరిలో చైనా రానున్నాడు. ఎలక్ట్రిక్‌ వాహనాలు, క్లీన్‌ ఎనర్జీకి అమెరికా ఇస్తున్న భారీ సబ్సిడీల కారణంగా పెట్టుబడులు ఐరోపా నుంచి అమెరికాకు తరలుతాయని భావిస్తున్నారు. అందుకే ప్రతి ఐరోపా నేత వాటి గురించి ఆందోళన వెల్లడిస్తున్నారు.


ఉదాహరణకు అమెరికాలో తయారు చేసిన ఒక విద్యుత్‌ వాహనాన్ని కొనుగోలు చేసిన వారికి ధరను బట్టి గరిష్టంగా ఏడున్నరవేల డాలర్లు సబ్సిడీ ఇస్తారు. సదరు కారు విడి భాగాలు అమెరికా లేదా అమెరికాతో స్వేచ్చా వాణిజ్య ఒప్పందం ఉన్న దేశాల నుంచి దిగుమతి చేసుకున్నవై ఉండాలి. ఐరోపా సమాఖ్య – అమెరికాకు అలాంటి ఒప్పందాలు లేవు. అందువలన ఐరోపా కార్లకు సబ్సిడీ వర్తించదు.సోలార్‌ పానెల్స్‌, హీట్‌ పంప్స్‌, బయోమాస్‌ స్టవ్‌ల వంటి వాటికి కూడా సబ్సిడీలు ఇస్తారు. ఇవి జనవరి నుంచి అమల్లోకి రానుండటంతో ఆగస్టులోనే అమెరికా చట్టం చేసినా ఇప్పుడు ఐరోపాలో చర్చగా మారింది. మాతో సహకరిస్తున్నవారికి హాని కలిగించం అని జో బైడెన్‌ చెబుతూ ఐరోపాను బుజ్జగిస్తున్నప్పటికీ చట్టంలో మార్పులు చేసేందుకు అవకాశాలు లేవని చెబుతున్నారు.


ప్రపంచ వాణిజ్య సంస్థలో కేసు దాఖలు చేస్తే అది ఎంత కాలానికి తేలుతుందో, ఏ తీర్పు వస్తుందో అన్న అనుమానాలు కూడా ఐరోపాలో ఉన్నాయి. అమెరికా కంపెనీ బోయింగ్‌- ఐరోపా కంపెనీ ఎయిర్‌బస్‌ విమానాలకు ఇచ్చే సబ్సిడీ వివాదం పదిహేడు సంవత్సరాలు నడిచింది. ఆ సంస్థలో కొత్త జడ్జీల నియామకాన్ని అమెరికా అడ్డుకుంటున్నది, అందువలన అసలు కొత్త కేసులను అది చేపట్టటం కూడా అనుమానమే. దెబ్బకు దెబ్బ పంటికి పన్ను అన్నట్లుగా మనం కూడా సబ్సిడీలు ఇద్దామని మక్రాన్‌ అంటున్నాడు. ఐతే ఈ చర్య ఐరోపా అంతర్గత మార్కెట్‌ను దెబ్బ తీస్తే సమాఖ్య వాటిని తిరస్కరించే అవకాశం ఉంది. ఉమ్మడి పారిశ్రామిక విధానంతో పాటు సబ్సిడీలు ఇచ్చేందుకు కూడా ఉమ్మడి నిధి అవసరం, దాని కోసం అప్పు తేవాలి లేదా దేశాలన్నీ నిధులు సమకూర్చాలి. ఇప్పుడున్న స్థితిలో దాన్ని ఏమేరకు అంగీకరించేది అనుమానమే. కావాలంటే ఐరోపా కూడా పెద్ద ఎత్తున సబ్సిడీలు ఇస్తే తాము ఇస్తున్నదానికి సరితూగవచ్చు అని అమెరికా వాణిజ్య కాథరీన్‌ తాయి సలహా ఇచ్చారు. అలా ఇవ్వగలిగిన అవకాశం జర్మనీకే ఉంది. ఒక వేళ ఇస్తే ఒకే మార్కెట్‌ అన్న ఐరోపా సమాఖ్య లక్ష్యానికే ఎసరు వస్తుంది. చిన్న దేశాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పటికే పెరిగిన ఇంథన ధరల నుంచి గృహాలు, వాణిజ్య సంస్థలకు ఉపశమనం కలిగించేందుకు జర్మన్‌ ప్రభుత్వం ముందుకు తెచ్చిన 206 బిలియన్‌ డాలర్ల సబ్సిడీ పథకం మీద మిగతా దేశాలు గుర్రుగా ఉన్నాయి.


ఐరోపా కార్పొరేట్ల లబ్ది ప్రధానంగా రష్యా నుంచి చౌకగా వచ్చే ఇంథనం, చైనా నుంచి వస్తువుల మీద ఆధారపడి ఉంది. అమెరికాకు తోకగా మారి నడుస్తున్న కారణంగా ఇప్పుడు రష్యా నుంచి ఇంథనం నిలిచి ధరలు విపరీతంగా ధరలు పెరిగాయి. పరిశ్రమలకు ముప్పు వచ్చింది. దీనికి అమెరికా సబ్సిడీలు తోడైతే ఐరోపా పరిశ్రమల భవిష్యత్‌ సందిగ్దంలో పడుతుంది. ఇప్పటికే అక్కడ ఇంథన ధరలు విపరీతంగా పెరగటంతో అనేక మంది ఐరోపా పారిశ్రామిక, వాణిజ్య వేత్తలు తమ స్వంత దేశాల్లో బదులు అమెరికాలో పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గుచూపుతున్నారు. వారికి కావాల్సింది లాభాలు తప్ప మరొకటి కాదు. ఈ స్థితిలో అమెరికా మాట నమ్మి చైనాతో కూడా తెగతెంపులు చేసుకొంటే ఇబ్బంది పడేది ఐరోపా దేశాలే. అందువలన అది జరగకపోవచ్చు. అమెరికా-ఐరోపా మధ్య దూరం పెరిగే అవకాశాలు వస్తే చైనా దాన్ని వదులు కోదన్నది తెలిసిందే.


ఇతర దేశాల సబ్సిడీల గురించి వివిధ రకాలుగా నానా గొడవ చేస్తున్నది అమెరికా, ఐరోపా దేశాలు. పలు రకాలుగా వాటిని అదుపు చేస్తూ తమ మార్కెట్‌ను కాపాడుకుంటున్నాయి. ఇప్పుడు అమెరికా జాతీయవాదం, రక్షణాత్మక చర్యలకు దిగింది.అమెరికాకు అగ్రస్థానం అన్న విధానానికి డోనాల్డ్‌ ట్రంప్‌ తెరతీస్తే జో బైడెన్‌ దాన్ని కొనసాగిస్తున్నాడు. దీన్ని ఎదుర్కొనేందుకు ఐరోపా వద్ద ఎక్కువ అస్త్రాలు లేవు. తొలుత చర్చలతో ప్రారంభించి కుదరకపోతే ప్రపంచ వాణిజ్య సంస్థను ఆశ్రయించవచ్చు. వాటితో అమెరికా కొంత మేర దిగిరావచ్చు లేదా ససేమిరా అంటే నీవు నేర్పిన విద్యే అన్నట్లుగా ఐరోపా కూడా సబ్సిడీలు ప్రారంభించటం, అమెరికా వస్తువులపై పరిమితులు విధింపు వంటి పనులకు పూనుకోవచ్చు. ఇప్పుడున్న ప్రపంచ పరిస్థితిలో అమెరికా తెగేదాకా లాగుతుందా ? చైనా, రష్యాలను అదుపు చేసేందుకు దానికి ఐరోపా అవసరం. అందువలన ఇతరంగా దానికి లబ్ది చేకూర్చేందుకు పూనుకుంటుందా? కొందరు ఐరోపా నేతలు, పెద్దల్లో అమెరికా గురించి ఇంకా భ్రమలు ఉన్నాయి. ఉక్రెయిన్‌ సంక్షోభంతో ఇంథన సరఫరాకు ఇబ్బందులు, ధరల పెరుగుదలతో ఇప్పటికే ఐరోపా అతలాకుతలం అవుతున్నందున ఇప్పుడు అమెరికా సబ్సిడీలతో తన పరిశ్రమలను కూడా దెబ్బతీస్తే జనం ఊరుకుంటారా ? ఐరోపా సమాఖ్య ఒకటిగా ఉన్నట్లు కనిపిస్తున్నా అన్ని దేశాలు ఒకే విధంగా లేవు. అమెరికాతో రాజీకి కొన్ని సుముఖంగా, మరికొన్ని స్వతంత్ర వైఖరితో ఉండాలని కోరుకుంటున్నాయి. జర్మనీ, ఫ్రాన్సు వంటి దేశాలు అవసరమైతే తాము చైనాకు దగ్గర అవుతామనే సంకేతాలను పంపటం అమెరికా నుంచి మరిన్ని రాయితీలు పొందేందుకే అన్నది స్పష్టం. మక్రాన్‌ వాషింగ్టన్‌లో జో బైడెన్‌తో చర్చలు జరుపుతున్న సమయంలోనే బీజింగ్‌లో షీ జింపింగ్‌తో పెట్టుబడుల గురించి ఐరోపా కౌన్సిల్‌ అధ్యక్షుడు చార్లెస్‌ మైఖేల్‌ భేటీ జరిపాడు. నిజంగా అమీ తుమీ తేల్చుకోవాల్సి వస్తే ఎవరెటు ? ఏం జరుగుతుందనేది తెరమీద చూడాల్సిందే !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ఉక్రెయిన్‌ పోరులో కంటే ఇంథన సంక్షోభంతో ఐరోపాలో చలి మరణాలే ఎక్కువా !

30 Wednesday Nov 2022

Posted by raomk in Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, UK, USA, WAR

≈ Leave a comment

Tags

energy cost, High fuel prices, imperialism, Ukraine war, Ukraine-Russia crisis, Vladimir Putin



ఎం కోటేశ్వరరావు


ఉక్రెయిన్‌పై రష్యా ప్రారంభించిన సైనిక చర్య బుధవారం నాటికి 280 రోజులు. అగ్నికి ఆజ్యం పోస్తున్న మాదిరి వ్యవహరిస్తున్న పశ్చిమ దేశాలు దీన్ని ఇంకా ఎంత కాలం కొనసాగిస్తాయో ఎవరూ చెప్పలేని స్థితి. రష్యాతో చర్చలకు ఉక్రెయిన్‌ నేత జెలెనెస్కీ తొలి రోజుల్లో సిద్దపడినప్పటికీ అమెరికా, బ్రిటన్‌ ఇతర నాటో దేశాలు వాటిని పడనివ్వలేదని తరువాత స్పష్టమైంది. అమెరికా, దాన్ని అనుసరించే పశ్చిమ దేశాలు వేసిన తప్పుడు అంచనాలు, ఎత్తుగడల గురించి ఇతరులు చర్చించుకోవటం ఒక ఎత్తు కాగా తొమ్మిది నెలల తరువాత ఐరోపా సమాఖ్యలోని కొన్ని దేశాలు భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఈ సంక్షోభంతో తలెత్తిన పరిస్థితి, పర్యవసానాలు కార్మికవర్గం మీద ప్రభావం చూపటం ప్రారంభమైంది. డిసెంబరు నుంచి ఫిబ్రవరి వరకు చలి కాలం ఎలా గడపాలిరా బాబూ అని సామాన్యులు ఆందోళన చెందుతున్నారు.


మరోవైపున ఈ సంక్షోభాన్ని అమెరికా తన లాభాల కోసం వినియోగించుకుంటున్నదని ఐరోపా గొణగటం ప్రారంభించింది.ఉక్రెయిన్‌ సంక్షోభం మీద తటస్థ వైఖరిని అనుసరిస్తున్న భారత్‌, చైనా తదితర దేశాలు పశ్చిమ దేశాల బెదరింపులను పక్కన పెట్టి రష్యా నుంచి పెద్ద ఎత్తున ముడిచమురును చౌకధరలకు కొనుగోలు చేసి పుతిన్‌కు లబ్ది కలిగించటంతో పాటు డాలర్లను పొదుపు చేసుకుంటున్నాయి. డిసెంబరు ఒకటవ తేదీన చైనా అధినేత షీ జింపింగ్‌ ఆహ్వానం మేరకు ఐరోపా సమాఖ్య మండలి అధ్యక్షుడు ఛార్లెస్‌ మైఖేల్‌ చైనా రానున్నాడు. క్రిమియా వంతెన పేల్చివేతకు ఉక్రెయిన్‌ చేసిన కుట్ర వెల్లడి కావటంతో రష్యా దళాలు విద్యుత్‌ కేంద్రాలను దెబ్బతీశాయి. దీంతో రాజధాని కీవ్‌తో సహా దేశంలోని అనేక ప్రాంతాల్లో మంచినీరు, విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. దాడులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. చలికాలాన్ని ఆయుధంగా చేసుకొని తమ దేశం మీద పుతిన్‌ దళాలు విరుచుకుపడుతున్నట్లు జెలెనెస్కీ ఆరోపించాడు. డిసెంబరు ఐదు నుంచి రష్యా చమురును తాము నిర్ణయించిన ధరలకే కొనుగోలు చేయాలనే ఆంక్షలను అమెరికా, నాటో కూటమి ప్రకటించిన సంగతి తెలిసిందే. దాన్ని ఉల్లంఘించిన వారి మీద చర్య తీసుకుంటామని అమెరికా చెప్పగా ధరల అదుపును అంగీకరించిన దేశాలకు అసలు తాము విక్రయించేది లేదని రష్యా స్పష్టం చేసింది.


ఒక వైపు ఉక్రెయిన్‌కు తాము మద్దతుగా ఉన్నామని చెబుతూనే ఎక్కడన్నా బావేగాని వంగతోట దగ్గర కాదన్నట్లుగా ఆర్థిక అంశాల దగ్గరకు వచ్చేసరికి లాభాలు మీకు – భారాలు మాకా ఏమిటీ పద్దతి అని ఐరోపా దేశాలు అమెరికాను ఇప్పుడు అడుగుతున్నాయి. అమెరికా చేసిన దురాగతాలన్నింటిని ఆమోదించి అనుసరించిన గతం వాటిని వెన్నాడుతోంది. అనేక విధాలుగా అమెరికా బంధంలో చిక్కుకొని ఉన్నాయి. ఉక్రెయిన్‌ పరిణామాలను చూస్తే ఐరోపా కంటే అమెరికాపెత్తనమే ఎక్కువగా ఉంది. నాటో పేరుతో అక్కడ తిష్టవేసేందుకు చూసిన సిఐఏ పథకంలో భాగంగా 2014లో జరిగిన తిరుగుబాటులో నయా నాజీలను అధికారానికి తెచ్చారు. ఈ పూర్వరంగంలో జనాభిప్రాయానికి అనుగుణంగా గతంలో తమ ప్రాంతంగా ఉన్న ఉక్రెయిన్‌లోని క్రిమియా ద్వీపకల్పాన్ని తనలో విలీనం చేసుకుంది. అదేబాటలో నడచిన డాంటెస్క్‌ ప్రాంతంలోని జనాన్ని ఉక్రెయిన్‌ మిలిటరీతో అణచివేతకు పాల్పడటం, గతంలో రష్యాకు ఇచ్చిన హామీకి భిన్నంగా నాటో విస్తరణకు పూనుకోవటంతో ఈ ఏడాది ఫిబ్రవరి 24న రష్యా సైనిక చర్యను ప్రారంభించింది.


చర్చలను అడ్డుకోవటంతో పాటు దీర్ఘకాలం కొనసాగేలా, తీవ్ర పర్యవసానాలకు దారి తీసేందుకు దోహదం చేసే విధంగా భారీ ఎత్తున అమెరికా ఆయుధాలను అందిస్తున్నది. మరోవైపున రష్యా నుంచి చమురు తదితర దిగుమతులను నిషేధించి ఐరోపాను తమపై ఆధారపడేట్లు చేసుకుంది. గోడదెబ్బ చెంపదెబ్బ మాదిరి ఐరోపా దేశాలు ఉక్రెయిన్నుంచి వచ్చిన శరణార్ధుల భారంతో పాటు పెరిగిన చమురు, విద్యుత్‌ ధరల భారాలను అనుభవిస్తున్నాయి. కరోనాకు ముందే తక్కువ వృద్ధి రేటుతో ఉన్న పరిస్థితి తరువాత మరింత దిగజారింది. దాని మీద ఇప్పుడు ఉక్రెయిన్‌ సంక్షోభంతో ద్రవ్యోల్బణం, ధరల భారాలతో ఆర్థిక రంగం కుదేలౌతున్నది. ఇది పాలకపార్టీల మీద వత్తిడితో పాటు జనాన్ని వీధుల్లోకి రప్పిస్తున్నది. మరోవైపు రాజకీయంగా అమెరికాతో స్నేహం కోసం కొన్ని దేశాలతో వైరం తెచ్చుకోవాల్సి వస్తోంది. ఇప్పుడిప్పుడే వాస్తవాలు బోధపడుతుండటంతో సుభాషితాలు చెబుతున్న నాయకగణం నేల మీద నడిచేందుకు చూస్తున్నది. తాము చేయాల్సింది చేయకుండా వ్లదిమిర్‌ పుతినే అన్నింటికి కారణం అని చెబితే నమ్మేందుకు జనాలు సిద్దంగా లేరు.


తాజాగా పొలిటికో అనే పత్రికలో ఒక విశ్లేషణ వెలువడింది. ” ఉక్రెయిన్‌పై తొమ్మిది నెలల దురాక్రమణ(ఇది పొలిటికో పదజాలం) తరువాత పశ్చిమ దేశాల ఎముకలు విరగ్గొట్టేందుకు పుతిన్‌ పూనుకుంటున్నాడు. ఐరోపా ఉన్నతాధికారులు జో బైడెన్‌ అధికార యంత్రాంగం పట్ల ఆగ్రహంతో ఉన్నారు. ఐరోపా సమాఖ్య దేశాలు ఇబ్బందులు పడుతుండగా అమెరికన్లు యుద్దం నుంచి లాభాలు పొందుతున్నారు.” అని పేర్కొన్నది. ఇన్ని నెలలుగా పుతిన్‌ శకం ముగిసింది, ఉక్రెయిన్‌ గెలిచింది అంటూ గంతులు వేసిన వారు ఇప్పుడు ఎముకలు విరగ్గొట్టటం గురించి మాట్లాడటం గమనించాలి. విధించిన ఆంక్షలు వికటించి ఐరోపాకు దిక్కుతోచని స్థితిలో జో బైడెన్‌ అమెరికా పరిశ్రమలకు ఇస్తున్న పన్ను, హరిత రాయితీలు ఐరోపా పరిశ్రమలను దెబ్బతీస్తున్నాయి. ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని తమ మిలిటరీ పరిశ్రమలకు లబ్ది చేకూర్చేందుకు ఉపయోగించుకుంటున్నారని, శాంతియుత పరిష్కారానికి పూనుకోవాలన్న తమ వినతులను చెత్తబుట్టలో పడవేస్తున్నారని పేరు వెల్లడించటానికి ఇష్టపడని ఐరోపా అధికారి ఒకరు చెప్పినట్లు పొలిటికో పేర్కొన్నది. ” వాస్తవం ఏమంటే, మీరు గనుక నిమ్మళంగా చూస్తే ఈ యుద్దం నుంచి ఎక్కువగా లబ్ది పొందిన దేశం ఏదంటే అమెరికా, ఎందుకంటే వారు అధిక ధరలకు గాస్‌ అమ్ముతున్నారు, ఎక్కువగా ఆయుధాలు అమ్ముతున్నారు. మేము నిజంగా ఇప్పుడు చారిత్రాత్మక సంకట స్థితిలో ఉన్నాము. ముందు చెప్పినట్లుగా అమెరికా ఇస్తున్న సబ్సిడీలు, అధిక ఇంథన ధరల ముప్పు అట్లాంటిక్‌ కూటమి(నాటో),యుద్ధానికి వ్యతిరేకంగా ప్రజాభిప్రాయం మారుతున్నది. అనేక ఐరోపా దేశాలలో ప్రజాభిప్రాయం మారుతున్నదని అమెరికా గుర్తెరగాల్సిన అవసరం ఉంది.” అని కూడా సదరు అధికారి చెప్పినట్లు పొలిటికో పేర్కొన్నది.


రష్యా అంటే ఒంటికాలి మీద లేచే ఐరోపా సమాఖ్య విదేశాంగ విధాన అధిపతి జోసెఫ్‌ బోరెల్‌ ఉక్రెయిన్‌కు ఉమ్మడిగా సాయపడాలనే భావననే ప్రశ్నించాడు. ” అమెరికన్లు – మా స్నేహితులు – నిర్ణయాలుతీసుకుంటారు, అవి మాపై ఆర్ధిక ప్రభావం చూపుతాయి ” అన్నాడు. ” అమెరికా మాకు అమ్ముతున్న గాస్‌ ధర అట్లాంటిక్‌ దాటే సరికి అనేక రెట్లు పెరిగి నాలుగింతలు అవుతున్నది. అమెరికన్లు మా స్నేహితులనటంలో ఎలాంటి సందేహం లేదు….. కానీ మిత్రుల మధ్య ఎక్కడో తప్పు జరుగుతున్నది అనిపించినపుడు దాని గురించి చెప్పాల్సిన అవసరం కూడా ఉంది ” అని ఐరోపా అంతర్గత మార్కెట్‌ కమిషనర్‌ థెరీ బ్రెటన్‌ ఒక ఫ్రెంచి టీవీతో మాట్లాడుతూ చెప్పాడు. పొలిటికోతో మరొక ఐరోపా ప్రతినిధి మాట్లాడుతూ ద్రవ్యోల్బణాన్ని తగ్గించే చట్టం పేరుతో జో బైడెన్‌ సర్కార్‌ 369 బిలియన్‌ డాలర్ల పారిశ్రామిక రాయితీల పథకాన్ని ప్రకటించాడు. అది ఐరోపా రాజధానులన్నింటా ఆకస్మిక భయాన్ని కలిగించింది.ద్రవ్యోల్బణాన్ని తగ్గించే చట్టం అన్నింటినీ మార్చివేస్తున్నది. అమెరికా ఇప్పటికీ మా మిత్రదేశంగా ఉన్నట్లా లేనట్లా అని అడిగినట్లు పొలిటికో పేర్కొన్నది.


అక్టోబరులో చైనా కమ్యూనిస్టు పార్టీ మహాసభ తరువాత ఐరోపా సమాఖ్య నుంచి ఒక ఉన్నతాధికారి చైనా సందర్శించటం ఇదే ప్రధమం. చివరి నిమిషంలో నిర్ణయాన్ని మార్చుకుంటే తప్ప ఐరోపా మండలి అధ్యక్షుడు ఛార్లెస్‌ మైఖేల్‌ బీజింగ్‌ సందర్శన జరుగుతుంది. చైనాను ఒంటరిపాటు గావించాలని, అక్కడి నుంచి సరకులు కొనుగోలు నిలిపివేయాలంటూ రోజూ పారాయణం చేస్తున్న అమెరికా వైఖరిని తోసిరాజనటమే ఇది. చైనా మిగతా దేశాలన్నింటికీ పోటీదారు, వ్యవస్థాపరంగా శత్రువు అని అమెరికా, బ్రిటన్‌ వంటి దేశాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో ఇటీవలి కాలంలో అమెరికాకు మరింత దగ్గరైన ఐరోపా సమాఖ్య ప్రముఖుడు చైనా సందర్శన ఒక కీలక పరిణామం. ఎంతో కసరత్తు జరిగితే తప్ప ఇలాంటివి జరగవు.చైనా మీద గుర్రుగా ఉన్న ఐరోపా సమాఖ్యలోని అగ్రదేశం జర్మనీ ఛాన్సలర్‌ ష్కుల్జ్‌ ఇటీవల చైనా సందర్శించి తాము ఘర్షణకు సిద్దం కాదనే సందేశాన్ని నాటో కూటమికి పంపాడు. తరువాత బీజింగ్‌తో సంబంధాలకు సిద్దమే అని ఫ్రెంచి అధ్యక్షుడు మక్రాన్‌ ప్రకటించాడు. దానికొనసాగింపుగా మండలి నేత వస్తున్నట్లు చెప్పవచ్చు. ఐరోపాను తన అవసరాలకు వాడుకుంటూ ఆ మేరకు లబ్ది పొందుతూ ఐరోపాకు వాటా ఇచ్చేందుకు అమెరికా నిరాకరిస్తున్నకారణంగానే అవసరమైతే తమదారి తాము చూసుకుంటామనే సందేశాన్ని ఐరోపా ఇస్తున్నది. అమెరికా పెత్తనాన్ని అడ్డుకొని తాము బతకాలంటే చైనా లేకుండా జరిగేది కాదన్న గ్రహింపు కూడా దీనిలో ఉంది. అంటే వారి అవసరాల కోసమే చైనాతో చెలిమి అన్నది స్పష్టం.


ఉక్రెయిన్‌ పోరు సంక్షోభం కారణంగా మరణించేవారి కంటే దాని పర్యవసానాలతో తలెత్తిన పరిస్థితి కారణంగా చలి కాలంలో ఎక్కువ మంది ఐరోపా వారు మరణిస్తారని బ్రిటన్నుంచి వెలువడే వారపత్రిక ఎకానమిస్ట్‌ నవంబరు 28వ తేదీ సంచిక విశ్లేషణ పేర్కొన్నది. ఐరాస అధికారికంగా ప్రకటించిన తాజా సమాచారం ప్రకారం ఉక్రెయిన్‌ సంక్షోభం కారణంగా అక్కడ మరణించిన పౌరులు 6,900 మంది, గాయపడిన వారి సంఖ్య పదివేలకు చేరింది. మిలిటరీ పరంగా ఎందరు సైనికులు మరణించిందీ నిర్ధారించటం కష్టమని రెండు వైపులా మరణించిన వారు 25 నుంచి 30వేల చొప్పున ఉండవచ్చని ఎకనమిస్ట్‌ పేర్కొన్నది. చలికాలంలో ఇంథన ధరలు పెరిగితే దాని ప్రభావం ఎలా ఉంటుంది అనే ఇతివృత్తంతో గత సమాచార ప్రాతిపదికన ప్రాణ నష్టం గురించి పేర్కొన్నది. అసాధారణ రీతిలో గాస్‌, విద్యుత్‌ ధరలు పెరిగిన కారణంగా రానున్నది ప్రత్యేకమైన చలికాలంగా మారితే సాధారణ మరణాలకంటే లక్షా 47వేల మంది అదనంగా మరణిస్తారని పేర్కొన్నది. చలి మరింత తీవ్రంగా ఉంటే, వాతావరణ మార్పులు జరిగితే ఈ సంఖ్య 3,35,000 ఉండవచ్చని పేర్కొన్నది. చలి తక్కువగా ఉన్నప్పటికీ కనిష్టంగా 79 వేలు అదనంగా ఉండవచ్చని తెలిపింది.జూన్‌-ఆగస్టు నెలలతో పోలిస్తే డిసెంబరు-ఫిబ్రవరి మధ్య మరణాలు 21శాతం ఎక్కువగా ఉంటాయని అంచనా. ఈ విశ్లేషణ తరువాత ఐరోపా ప్రభుత్వాలు, సమాజాల్లో స్పందన ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది.రికార్డు స్థాయిలో పెరిగిన ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల కారణంగా పేదలు, మధ్యతరగతి జనాలు చలికాలంలో ఆహారానికి ఎక్కువ సొమ్ము వెచ్చించాలా గృహాలను వెచ్చచేసుకొనే ఇంథనానికి ఎక్కువ ఖర్చు చేయాలా అన్నది పెద్ద ప్రశ్నగా ఉంది.2000 నుంచి 2019 ధరలతో పోల్చితే గాస్‌ ధర 144, విద్యుత్‌ ధర 78శాతం పెరిగింది. ఇటలీలో 2020 నుంచి 200శాతం వరకు విద్యుత్‌ బిల్లులు పెరిగాయి. ఎక్కువగా నష్టం, ఇబ్బందులు పడుతున్నది ఐరోపా సమాజమే గనుక దాన్నుంచి బయటపడేందుకు ఉక్రెయిన్‌ – రష్యా చర్చలకు వత్తిడి తెచ్చే అవకాశం ఉంది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

పాలస్తీనాను అడ్డుకుంటున్న అమెరికా – నేడు సంఘీభావ దినం !

28 Monday Nov 2022

Posted by raomk in Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, Opinion, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

Israel, Jerusalem, Palestine Solidarity Day, Palestinian People, US imperialism


ఎం కోటేశ్వరరావు


ఏడున్నర దశాబ్దాలుగా మాతృదేశంలోనే బందీలుగా, కొలువులు నెలవులు తప్పిన వారిగా, ఇరుగు పొరుగు దేశాల్లో శరణార్ధుల శిబిరాల్లోనే పుట్టి పెరిగి, మరణించిన వారెవరైనా వర్తమాన ప్రపంచంలో ఉన్నారంటే వారే పాలస్తీనా అరబ్బులు. ఐరాస చరిత్రలో ఘోర వైఫల్యాల్లో తాను చేసిన పాలస్తీనా తీర్మానాన్ని అమలు జరపలేని అసమర్ధత. జోర్డాన్‌, లెబనాన్‌, సిరియా, సౌదీ అరేబియా, ఇరాక్‌లలో లక్షలాది మంది పాలస్తీనియన్లు శరణార్ధులుగా ఉన్నారు.1947 నవంబరు 29న ఐక్య రాజ్యసమితి సాధారణ అసెంబ్లీ ఆమోదించిన 181వ తీర్మానం ప్రకారం పాలస్తీనాను రెండుగా చీల్చి ఒక ముక్కను ఇజ్రాయల్‌గా ప్రకటించారు. చారిత్రాత్మక జెరూసలెం పట్టణం, పరిసరాలను ఎవరికీ చెందకుండా వాటికన్‌ మాదిరి ప్రత్యేక ప్రాంతంగా ఉంచాలని ప్రతిపాదించారు. ఈ తీర్మానాన్ని అరబ్బులు తిరస్కరించారు.1948 మే 14 అధికారికంగా ఇజ్రాయల్‌ ఏర్పాటు ప్రకటన జరగ్గానే అరబ్బులు తిరుగుబాటు చేశారు అప్పటికే బ్రిటన్‌, అమెరికా తదితర సామ్రాజ్యవాదులు కుట్ర చేసి ఇతర దేశాల్లోని యూదులను రప్పించటమే గాక విభజిత ప్రాంతంలో వారికి ఆయుధాలు, డబ్బు అందచేసి సిద్దంగా ఉంచారు. ఎప్పుడైతే అరబ్బులు తిరుగుబాటు చేశారో దాన్ని సాకుగా తీసుకొని . యూదు సాయుధ మూకలు మొత్తం పాలస్తీనా ప్రాంతాన్ని ఆక్రమించేందుకు పూనుకున్నాయి.ఆ క్రమంలో ఇజ్రాయల్‌ దురాక్రమణను నివారించేందుకు ఇరుగు పొరుగు అరబ్బు దేశాలు పాలస్తీనా ప్రాంతాన్ని తమ స్వాధీనంలోకి తెచ్చుకున్నాయి. తరువాత జరిగిన అనేక పరిణామాల్లో అమెరికా రంగ ప్రవేశం చేసి పాలస్తీనాకు గుర్తింపు రాకుండా అడ్డుపడుతున్నది. దాని అండ చూసుకొని ఇరుగుపొరుగు దేశాలపై ఇజ్రాయల్‌ దాడులకు దిగి కొన్ని ప్రాంతాలను తన ఆక్రమణలోకి తెచ్చుకుంది. పాలస్తీనాకు కేటాయించిన ప్రాంతాలను ఆక్రమించుకుంది. ఇతర చోట్ల నుంచి యూదులను రప్పించి అక్కడ శాశ్వత నివాసాలను ఏర్పాటు చేసి అరబ్బులను మైనారిటీలుగా మార్చివేసి అవి కూడా తనవే అనే అడ్డగోలు వాదనకు దిగింది. జరూసలెం పట్టణాన్ని కూడా ఆక్రమించి అది కూడా తనదే అని ప్రకటించుకుంది. తన రక్షణకు హామీగా మరికొన్ని ప్రాంతాలను తనకు అప్పగించాలని విపరీత కోర్కెలను ముందుకు తెస్తున్నది.


మధ్య యుగాల్లో జరిగిన మత యుద్దాలలో యూదులను పాత ఇజ్రాయల్‌, జుడా దేశాల నుంచి తరిమివేశారు. ఆక్రమంలో వారంతా అనేక దేశాలకు వెళ్లారు. చరిత్రలో వారికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే పేరుతో ఇజ్రాయల్‌ను పునరుద్దరించాలనే వాదాన్ని ముందుకు తెచ్చారు. పశ్చిమాసియాలో కనుగొన్న చమురు నిల్వలను సొంతం చేసుకోవటం కూడా దానివెనుక ఉంది. తమకు విశ్వాసపాత్రధారిగా ఉండేందుకు బ్రిటన్‌ సామ్రాజ్యవాదులు పన్నిన ఎత్తుగడలో భాగంగా మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత ఏర్పడిన పాలస్తీనాను రెండు ముక్కలుగా చేసి ఇజ్రాయల్‌ను ఏర్పాటు చేశారు. అడ్డగోలుగా చేసిన తీర్మానాన్ని యూదులు అంగీకరించగా అరబ్బులు తిరస్కరించారు. ఒక పరిష్కారాన్ని కనుగొనే పేరుతో ఐరాస కొత్త వివాదాన్ని ముందుకు తెచ్చింది. పాలస్తీనాను మూడు ముక్కలుగా చేసి వాటి చుట్టూ ఉన్న ప్రాంతాలను ఇజ్రాయల్‌కు కేటాయించింది. జెరూసలెం నగరం పాలస్తీనా మధ్యలో ఉంది. పాలస్తీనా పౌరులు తమ దేశంలోని ప్రాంతాలకు వెళ్లాలంటే ఇజ్రాయల్‌ అనుమతి అవసరం. 1948 దాడులలో యూదులు జెరూసలెంను ముట్టడించారు. దాన్ని ఎదుర్కొనేందుకు రంగంలోకి దిగిన జోర్డాన్‌ పాలకులు జోర్డాన్‌ నదికి పశ్చిమాన ఉన్న (దాన్నే పశ్చిమ గట్టు ప్రాంతం అంటారు) పాలస్తీనా ప్రాంతాలు, తూర్పు జెరూసలెంను అదుపులోకి తీసుకొని తరువాత వాటిని విలీనం చేసుకున్నట్లు ప్రకటించారు. తరువాత వాటి మీద తమ హక్కును వదులుకున్నట్లు ప్రకటించింది.


అంతకు ముందు పశ్చిమ జెరూసలెం పట్టణాన్ని ఆక్రమించుకున్న ఇజ్రాయిల్‌ తరువాత అసలు మొత్తం నగరాన్ని స్వంతం చేసుకుంది. రాజధానిగా టెల్‌అవీవ్‌ ఉన్నప్పటికీ ఐరాస తీర్మానం,అరబ్బుల అభిప్రాయాలకు విరుద్దంగా పార్లమెంటుతో సహా ప్రభుత్వశాఖలన్నింటినీ అక్కడ ఏర్పాటు చేసింది. దేశ అధ్యక్షుడు, ప్రధాని నివాసాలు, సుప్రీం కోర్టును కూడా అక్కడే ఏర్పాటు చేశారు. దీన్ని అంతర్జాతీయ సమాజం ఆమోదించలేదు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ 2017 డిసెంబరులో జెరూసలెంను ఇజ్రాయల్‌ రాజధానిగా గుర్తిస్తూ టెల్‌ అవీవ్‌లోని తమ రాయబార కార్యాలయాన్ని అక్కడికి తరలిస్తున్నట్లు ప్రకటించాడు. వివాదాస్పద ప్రాంతంలోని ఒక భవనంలో తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. ఇటీవలనే శాశ్వత భవనానికి స్థలం కేటాయించినట్లు అక్కడి మేయర్‌ ప్రకటించాడు. ఈ విధంగా ఐరాస తీర్మానాన్ని అమెరికా కూడ ఉల్లంఘించింది. పశ్చిమ గట్టు ప్రాంతం పాలస్తీనాది కాగా అక్కడ 167 అరబ్బుల నివాస ప్రాంతాలు మాత్రమే పాలస్తీనా ప్రభుత్వ నియంత్రణలో ఉన్నాయి. ఇజ్రాయల్‌ తన పౌరులతో నింపేందుకు నిర్మించిన 200 నివాస ప్రాంతాలు దాని ఆధీనంలో ఉన్నాయి. ఈ ప్రాంతాలలో మిలిటరీ,యూదు దురహంకార శక్తులు నిత్యం అరబ్బులతో గిల్లి కజ్జాలకు పాల్పడుతుంటాయి, వారు ప్రతిఘటిస్తే దాడులు జరుపుతాయి. గాజా ప్రాంతంలో పాలస్తీనా విముక్తి కోసం పోరాడే హమస్‌ సంస్థ అధికారంలోకి వచ్చిన తరువాత 2007 నుంచి ఆప్రాంత మొత్తాన్ని ఇజ్రాయల్‌ దిగ్బంధనం గావించింది. గతంలో దాడులు కూడా చేసింది.


పాలస్తీనా ప్రాంతాలన్నింటితో కూడిన ప్రభుత్వాన్ని 1948 సెప్టెంబరు 22న అరబ్‌లీగ్‌ నాడు ఈజిప్టు రక్షణలో ఉన్న గాజా ప్రాంతంలో ఏర్పాటు చేసింది. దాన్ని ఒక్క జోర్డాన్‌ తప్ప అన్ని అరబ్‌ దేశాలూ గుర్తించాయి. 1988లో పాలస్తీనా ప్రవాస ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు అల్జీర్స్‌లో పిఎల్‌ఏ నేత యాసర్‌ అరాఫత్‌ ప్రకటించాడు.1993లో ఓస్లో ఒప్పందాల తరువాత పశ్చిమ గట్టు, గాజా ప్రాంతాల్లో పరిమిత అధికారాలు గల ప్రభుత్వం ఏర్పడింది. ప్రస్తుతం పాలస్తీనాను ఐరాసలోని 193కు గాను 138 దేశాలు గుర్తించాయి.2012లో ఐరాస ఆమోదించిన తీర్మానం ప్రకారం సభ్యురాలు గాని పరిశీలక దేశ హౌదాను కల్పించారు. ప్రస్తుతం అరబ్‌లీగ్‌, ఇస్లామిక్‌ దేశాల సంస్థ, జి77, అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ,యునెస్కో, అంక్టాడ్‌, అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టులో ప్రతినిధిగా ఉంది. పూర్తి స్థాయిలో ఐరాసలో సభ్యత్వం ఇస్తే ఐరాస 181 తీర్మానం ప్రకారం అన్ని ప్రాంతాలను పాలస్తీనాకు అప్పగించాల్సి ఉంటుంది. జరూసలెం సమస్యనూ పరిష్కరించాల్సి ఉంటుంది. అది జరగుకుండా అమెరికా తన వీటో హక్కుతో అడ్డుపడుతున్నది. అందువలన ఇజ్రాయల్‌తో పాటు దానికి మద్దతు ఇస్తున్న అసలైన నేరస్థురాలు అమెరికా, మద్దతు ఇస్తున్న దేశాల వైఖరిని నిరసిస్తూ నవంబరు 29న ప్రపంచమంతటా పాలస్తీనాకు మద్దతుగా జన సమీకరణ జరుగుతున్నది.మన దేశంలో అఖిల భారత శాంతి సంఘీభావ సంస్థ ఈ మేరకు పిలుపునిచ్చింది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలు : ఆసియాలో అమెరికా చిచ్చు పర్యవసానమే !

23 Wednesday Nov 2022

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, International, INTERNATIONAL NEWS, Japan, Opinion, RUSSIA, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

Joe Biden, Kim Jong-un, North Korea’s missile tests, Pyongyang, US imperialism, yankees


ఎం కోటేశ్వరరావు


ఉత్తర కొరియా ఖండాంతర క్షిపణి ప్రయోగాలను ఖండించేందుకు,మరిన్ని ఆంక్షలను మోపేందుకు సోమవారం నాడు జరిగిన భద్రతా మండలి సమావేశం చైనా, రష్యా అభ్యంతరాలతో ఎలాంటి ప్రకటన చేయకుండానే ముగిసింది. దీంతో వత్తిడి పెంచేందుకు అధ్యక్ష స్థానం పేరుతో ఖండన ప్రకటనకు అమెరికా ప్రతిపాదించింది. నవంబరు నెలలో ఘనా ప్రతినిధి అధ్యక్షత వహిస్తుండగా డిసెంబరు నెలలో మన దేశ వంతు రానుంది. పదిహేనుకు గాను భారత్‌తో సహా ఎనిమిది భద్రతా మండలి సభ్యదేశాలు, అమెరికాను అనుసరించే మరో ఆరు, 14 దేశాలు ఉత్తర కొరియాను ఖండిస్తూ చేసిన ప్రకటనను అమెరికా ప్రతినిధి మండలి సమావేశంలో చదివి వినిపించారు.ఉత్తర కొరియా నవంబరు 18వ తేదీన తన దగ్గర ఉన్న శక్తివంతమైన క్షిపణి ప్రయోగం జరిపిందని, అది అమెరికా ప్రధాన భూ భాగం మీద కూడా దాడి చేసే సత్తాకలిగినదని జపాన్‌ రక్షణ మంత్రి హమదా చెప్పాడు. ఈ క్షిపణి జపాన్‌ తీరానికి 200 కిలోమీటర్ల దూరంలోని సముద్రంలో పడింది.


కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలు పెరగటం. వైరుధ్యం తీవ్రం కావటం పట్ల తాము కూడా ఆందోళన చెందుతున్నట్లు సోమవారం నాడు ఐరాసలో చైనా రాయబారి ఝాంగ్‌ జున్‌ అన్నాడు.అయితే భద్రతా మండలి ఉద్రిక్తతలను సడలించటానికి బదులు ఎప్పుడూ ఉత్తర కొరియాను ఖండించటం, వత్తిడి తెస్తున్నదని విమర్శించాడు. న్యాయమైన ఉత్తర కొరియా ఆందోళనలకు ప్రతిస్పందనగా వాస్తవికమైన ప్రతిపాదనలను ముందుకు తెచ్చేందుకు అమెరికా చొరవ తీసుకోవాలని ఝంగ్‌ అన్నాడు. అన్ని పక్షాలూ సంయమనం పాటించాలని, జాగ్రత్తగా మాట్లాడాలని హితవు పలికాడు. రష్యా ప్రతినిధి అనా విస్టిజెనీవా మాట్లాడుతూ ఏకపక్షంగా ఆయుధవిసర్జనకు ఉత్తర కొరియాపై అమెరికా వత్తిడి తెస్తున్నదని, అమెరికా, దాని అనుచర దేశాలు జరిపిన సైనిక విన్యాసాల కారణంగానే క్షిపణి పరీక్షలు జరిపినట్లు చెప్పారు. అమెరికా రాయబారి లిండా థామస్‌ గ్రీన్‌ ఫీల్డ్‌ మాట్లాడుతూ బీజింగ్‌, మాస్కో అడ్డుకుంటున్న కారణంగానే ఉత్తరకొరియాకు ధైర్యం వస్తున్నదని, ఈ రెండు దేశాలూ ఈశాన్య ఆసియా, మొత్తం ప్రపంచానికి ముప్పు తెస్తున్నట్లు ఆరోపించారు.తమకు శత్రువుల నుంచి అణు ముప్పు కొనసాగుతున్నట్లయితే తమ పార్టీ, ప్రభుత్వం కూడా అణ్వాయుధాల తయారీతో సహా అన్ని రకాలుగా ధృడంగా ఎదుర్కొంటామని ఉత్తర కొరియా నేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ప్రకటించాడు. ఉత్తర కొరియా అణు, క్షిపణి కార్యక్రమాలను నిరోధించే పేరుతో 2006 నుంచి భద్రతా మండలి ఆంక్షలను విధిస్తూ తీర్మానాలు చేస్తున్నది.


ఒక పధకం ప్రకారం అమెరికా, దాని మిత్ర దేశాలు తమ పధకాలు, ఎత్తుగడల్లో భాగంగా అనేక ప్రాంతాల్లో ఉద్రిక్తతలను రెచ్చగొడుతున్నాయి. అలాంటి వాటిలో చైనా, రష్యాలతో సరిహద్దులను కలిగి ఉన్న కొరియా ద్వీపకల్పం ఒకటి. రెండవ ప్రపంచ యుద్దంలో జపాన్‌ ఆక్రమణల నుంచి వియత్నాం, కొరియాలను విముక్తి చేసే క్రమంలో ఒక వైపు నుంచి సోవియట్‌, మరోవైపు నుంచి అమెరికా సేనలు జపాన్ను ఓడించటంలో కీలక పాత్ర వహించాయి. ఆ క్రమంలో ఎవరి ఆధీనంలోకి వచ్చిన ప్రాంతంలో వారు స్థానిక ప్రభుత్వాలను ఏర్పాటు చేశారు. పరిస్థితులు చక్కబడిన తరువాత విడిన రెండు దేశాలను విలీనం చేయాలని ఒప్పందం జరిగింది. ఆ మేరకు సోవియట్‌ సేనల రక్షణలో ఉన్న ఉత్తర వియత్నాం, ఉత్తర కొరియాలలో జపాన్‌ వ్యతిరేక పోరాటంలో ఆయుధాలు పట్టిన కమ్యూనిస్టులు అధికారానికి వచ్చారు. సోవియట్‌ సేనలు వెనక్కు వెళ్లాయి. అమెరికా ప్రాబల్యం కింద ఉన్న దక్షిణ వియత్నాం, దక్షిణ కొరియాలలో తన తొత్తులుగా మారిన మిలిటరీ నియంతలను రుద్దారు. అంతేగాక రకరకాల సాకులతో అమెరికా అక్కడ సైనికంగా తిష్టవేసింది. దక్షిణ వియత్నాంలో కమ్యూనిస్టులు, జాతీయ వాదులు ఏకమై అమెరికా, దాని తొత్తులను తరిమి కొట్టి 1975లో రెండు దేశాలను విలీనం చేశారు. మొత్తం సోషలిస్టు దేశంగా మారింది.


దక్షిణ కొరియాలో తిష్టవేసిన అమెరికా, దాని తొత్తులు కలిసి ఉత్తర కొరియా ప్రాంతాన్ని ఆక్రమించేందుకు 1950దశకంలో పూనుకోవటంతో చైనా, సోవియట్‌ సేనలు అడ్డుకొని తిప్పికొట్టాయి. అప్పటి నుంచి అమెరికా తన సైనిక కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఏదో ఒకసాకుతో ఉభయ కొరియాల విలీనాన్ని అడ్డుకుంటున్నది. జపాన్ను లొంగదీసుకొని తన రక్షణ ఒప్పందంలో భాగస్వామిగా చేసి అక్కడ కూడా తన స్థావరాలను ఏర్పాటు చేసింది. ఆ రెండూ కలసి అప్పటి నుంచి చైనా, గతంలో సోవియట్‌, అది విచ్చిన్నం తరువాత రష్యాలను దెబ్బతీసేందుకు నిరంతరం ఏదో ఒక పేరుతో రెచ్చగొడుతున్నాయి. అక్కడ శాశ్వతంగా తిష్టవేసేందుకు పూనుకుంది. అక్కడ జరుగుతున్న పరిణామాలకు అసలు కారణం ఇదే. దక్షిణ కొరియాలో చాలా కాలం మిలిటరీ, ప్రస్తుతం పేరుకు పౌరపాలన ఉన్నా అంతా మిలిటరీ,దాని వెనుక ఉన్న అమెరికా కనుసన్నలలోనే ఉంటుంది. ఐరోపాలో జర్మనీ విభజన జరిగి ఇదే మాదిరి రెండు ప్రాంతాల్లో ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. అమెరికా, ఫ్రాన్స్‌,బ్రిటన్‌ ప్రాబల్యంలో పశ్చిమ జర్మనీ, సోవియట్‌ అదుపులో తూర్పు జర్మనీ ఉంది. రెండింటినీ విలీనం చేసేందుకు 1952లో సోవియట్‌ నేత స్టాలిన్‌ ఒక ప్రతిపాదన చేశాడు. దాని ప్రకారం ఐక్య జర్మనీ తటస్థ దేశంగా ఉండాలి. దానికి అమెరికా, పశ్చిమ జర్మనీ పాలకులు అంగీకరించలేదు. వెంట వెంటనే జరిగిన పరిణామాల్లో అది ఐరోపా సమాఖ్య, నాటో కూటమిలో చేరింది. తూర్పు జర్మనీ సోషలిస్టుదేశంగా కొనసాగింది. నాటో ముసుగులో అమెరికా సేనలు తిష్టవేశాయి. 1990దశకంలో తూర్పు ఐరోపా సోషలిస్టు దేశాల్లో జరిగిన పరిణామాలు, సోవియట్‌ విచ్చిన్నం తరువాత రెండు జర్మనీలను కలిపివేశారు. దాన్ని అంగీకరించిన అమెరికా ఆసియాలో కొరియా విలీనానికి మోకాలడ్డుతోంది. ఉత్తర కొరియాను బూచిగా చూపుతోంది. దానికి జపాన్‌ వంతపాడుతోంది.


ఐరాస ప్రధానకార్యదర్శి గుటెరస్‌ ఈ ఉదంత పూర్వపరాలను పరిగణనలోకి తీసుకోకుండా రెచ్చగొట్టే పనులకు పూనుకోవద్దని తమను హెచ్చరించటంపై ఉత్తర కొరియా తీవ్ర విచారం ప్రకటిస్తూ గర్హనీయమైన వైఖరిని ప్రదర్శించారని విదేశాంగ మంత్రి చో సన్‌ హుయి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఐరాస ఏర్పాటు, దాని నిబంధనలు, లక్ష్యాలు అన్ని అంశాల్లో నిష్పాక్షికత, వాస్తవికత, సమానత్వం పాటించాల్సి ఉందని అలాంటి సంస్థ ప్రధాన కార్యదర్శి గుటెరస్‌ అమెరికా తొత్తు మాదిరి ఉన్నాడని ఉత్తర కొరియా మంత్రి చెప్పారు. ఆందోళనకరంగా ఉన్న భద్రతా వాతావరణంలో ఆత్మరక్షణకు అన్ని చర్యలూ తీసుకోవాల్సి ఉంటుదని తమ దేశం స్పష్టం చేసిందని, అమెరికా, దాని చేతికింద ఉండే ప్రమాదకరమై మిలిటరీ సహకారంతో ఈ ప్రాంతంలో కలిగిస్తున్న ఉద్రిక్తతల కారణంగానే ఇదంతా జరుగుతుండగా అమెరికాను వదలి ఐరాస తమను మాత్రమే తప్పు పట్టటం ఏమిటని ఉత్తర కొరియా ప్రశ్నిస్తున్నది. పద్దెనిమిదవ తేదీన ఆ దేశ అధినేత కిమ్‌ పర్యవేక్షణలో జపాన్‌ మీదుగా 1,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించి సముద్రంలో పడిన క్షిపణి గురించి అమెరికా, దాని భజన బృందం నానా యాగీ చేస్తున్నది. ఈ క్షిపణి పరీక్ష జరిగిన వెంటనే అమెరికా-జపాన్‌ వైమానిక దళాలు జపాన్‌ సముద్రంపై విన్యాసాలు జరిపి ఉత్తర కొరియాను బెదిరించినప్పటికీ గుటెరస్‌కు పట్టలేదు.


ఆగస్టు నెల నుంచి అమెరికా – దక్షిణ కొరియా అనేక చిన్నా చితకవాటితో పాటు ఐదు భారీ మిలిటరీ విన్యాసాలు జరిపిన సంగతి, గడచిన రెండు నెలలుగా రోజూ ఏదో ఒక క్షిపణి ప్రయోగం పశ్చిమ దేశాల మీడియా, గుటెరస్‌ వంటి వారికి కనిపించదని అనుకోవాలా లేక చూసేందుకు నిరాకరిస్తున్నట్లా ?నవంబరు ఐదవ తేదీన రెండు దేశాలూ 240 విమానాలతో గతంలో ఎన్నడూ జరపని డ్రిల్లు జరిపిన తరువాతే 18వ తేదీ కిమ్‌ తమ దగ్గర ఉన్న తీవ్రమైన క్షిపణిని వదిలి వారికి చూపించాడు. ఐదవ తేదీకి ముందు కూడా కొన్నింటిని ప్రయోగించాడు. అమెరికా బెదిరింపులు పెరిగిన పూర్వరంగంలో సెప్టెంబరు తొమ్మిదవ తేదీన ఉత్తర కొరియా పార్లమెంటు ఆమోదించిన ఒక బిల్లు ప్రకారం దేశ రక్షణకు అవసరమైతే అణ్వస్త్రాల ప్రయోగానికి కూడా అధ్యక్షుడికి అనుమతి ఇచ్చారు.


గతంలో ఇరాక్‌ మీద దాడి జరిపి సద్దామ్‌ను హతమార్చాలని పథకం వేసిన అమెరికా దానికి ముందు పచ్చి అబద్దాలను ప్రచారం చేసింది. సద్దామ్‌ మారణాయుధాలను గుట్టలుగా పోసి పరిసర దేశాలకు ముప్పుగా మారాడని చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఉత్తర కొరియాను కూడా అదే మాదిరి బూచిగా చూపేందుకు చూస్తున్నారు. ప్రపంచంలో అనేక దేశాలు క్షిపణి ప్రయోగాలను నిరంతరం జరుపుతూనే ఉంటాయి. కానీ ఉత్తర కొరియా జరిపినపుడు తమ మీద దాడి జరుగుతున్నట్లుగా జనాన్ని భ్రమింపచేసేందుకు సొరంగాల్లోకి, ఇతర రక్షిత ప్రాంతాలకు వెళ్లాలని జనాలకు చెప్పి జపాన్‌ ప్రభుత్వం హడావుడి చేస్తున్నది. ఇంతవరకు ఒక్కసారి కూడా విఫలమైన క్షిపణులు గానీ మరొకటి గానీ జపాన్‌ భూభాగంపై పడిన దాఖలా లేదు. దానికి సుదూరంగా సముద్రంలో మాత్రమే పడ్డాయి. ఉత్తర కొరియా వద్ద శక్తివంతమైన క్షిపణులు ఉన్నది వాస్తవం, ఇతర దేశాల మాదిరి నిరంతరం వాటి పరిధిని పెంచేందుకు పరిశోధనలు చేస్తున్నారు. అణు కార్యక్రమాన్ని కూడా కొనసాగిస్తున్నారు. ప్రపంచాన్ని తన మిలిటరీ శక్తితో శాసించేందుకు చూస్తున్న అమెరికా ఏకంగా తన ముంగిట ఉన్న తరువాత ఉత్తర కొరియా తన భద్రతను తాను చూసుకోకుండా ఎలా ఉంటుంది. అమెరికా,జపాన్‌ దేశాల వద్ద క్షిపణులను పసిగట్టి వాటిని కూల్చివేసే ఆధునిక వ్యవస్థలున్నాయి. అందుకే వాటి రాడార్లకు దొరక్కుండా వేగంగా, తక్కువ ఎత్తులో ఎగురుతూ సుదూరంలోని లక్ష్యాలను చేరే సూపర్‌ సోనిక్‌ క్షిపణుల కోసం నిరంతరం తన అస్త్రాలకు పదును పెడుతున్నది. ఇంతవరకు మరొక దేశం మీద దాడికి దిగిన దాఖలాల్లేవు. అమెరికా ఆయుధాలను మిత్ర దేశాలకు ఇస్తున్నట్లుగానే ఉత్తర కొరియా కూడా తన మిత్ర దేశాల నుంచి సాయం పొందటంలో తప్పేముంది?


ఉత్తర కొరియా దగ్గర ఎంత దూరంలోని లక్ష్యాలను ఛేదించగల క్షిపణులు ఉన్నదీ ఎవరికి వారు ఊహించుకోవటం తప్ప నిర్ధారణ లేదు. ఒక దుష్ట దేశంగా చిత్రించేందుకు పెద్ద ఎత్తున ప్రచారదాడి జరుగుతున్నది. వారి దగ్గర పదిహేనువేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి అమెరికాలోని ఏ ప్రాంతం మీదైనా దాడి చేయగల సత్తా కలిగినదని జపాన్‌ రక్షణ మంత్రి సుకాజు హమడా ప్రకటించాడు. మమ్మల్ని రక్షిస్తామని చెబుతున్న మీ మీదే దాడి చేయగల క్షిపణులు కిమ్‌ దగ్గర ఉన్నట్లు జపాన్‌ చెప్పటం అమెరికాను రెచ్చగొట్టటం తప్ప మరొకటి కాదు. శుక్రవారం నాడు వదిలిన క్షిపణి ఒకేసారి అనేక బాంబులను మోసుకుపోగలదని, రక్షణ వ్యవస్థలను తప్పించుకోగలదని కొందరు విశ్లేషించారు. 2017లో చివరి సారిగా ఉత్తర కొరియా అణుపరీక్షలు జరిపింది. అప్పటి నుంచి అమెరికా రెచ్చగొడుతూనే ఉంది. దానిలో భాగంగా గత ఐదేండ్లలో తొలిసారిగా నవంబరు మొదటి వారంలో పెద్ద మొత్తంలో అస్త్రాలను మోసుకుపోగల బి-1బి బాంబర్లను అమెరికా ఐదింటిని దక్షిణ కొరియాకు తరలించింది. ఆంక్షలను కఠినతరం గావించేందుకు అమెరికా పూనుకోవటం, చైనా, రష్యా వాటిని వీటో చేయటం జరుగుతోంది. తాడిని తన్నేవాడుంటే వాడి తలదన్నేవాడు వస్తాడు అన్నట్లుగా సాంకేతిక పరిజ్ఞానం ఒకరి సొత్తు కాదు, వెనుకా ముందూ ఉండటం తప్ప ఎవరికీ అసాధ్యం కాదు. అమెరికా ఇప్పుడు ఆర్థికంగా, మిలిటరీ పరంగా అనేక దేశాలను బెదిరిస్తున్నది, ప్రలోభపెడుతున్నది, లొంగదీసుకుంటున్నది. ఉత్తర కొరియా, ఇరాన్‌ వంటివి దానికి కొరకరాని కొయ్యలుగా మారాయి. నిరంతరం ఎక్కడో అక్కడ ఉద్రిక్తతలను రెచ్చగొట్టే క్రమంలో ఇప్పుడు అమెరికా ఆసియాలో చిచ్చు పెట్టింది. గడచిన మూడు దశాబ్దాలుగా అమెరికా బెదిరింపులకు లొంగని ఉత్తర కొరియాను ఇప్పుడు అదుపులోకి తెచ్చుకోవాలనుకోవటం అమెరికా పగటి కల తప్ప మరొకటి కాదు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

పేరులో ఏమున్నది పెన్నిధి : ప్రధాని నరేంద్రమోడీ దేశభక్తుడా – నిజమైన దేశ భక్తుడా !

30 Sunday Oct 2022

Posted by raomk in BJP, CHINA, Current Affairs, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, RUSSIA, UK, USA, WAR

≈ Leave a comment

Tags

BJP, Boris Johnson, Donald trump, Narendra Modi, Narendra Modi Failures, RSS, Vladimir Putin

ఎం కోటేశ్వరరావు


నిజమే ! అనేక మందికి అలాంటి సందేహమే కలిగింది. కొన్నింటిని తీర్చే అవకాశాలు లేవు. అక్టోబరు 27న మాస్కోలోని మేథావులు ఉండే వాలెడై క్లబ్బులో రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్‌ పుతిన్‌ చేసిన ప్రసంగంలో మన ప్రధాని నరేంద్రమోడీ గురించి నిజంగా వాడిన పదాలేమిటి అనే చర్చ అలాంటిదే. రోమియో-జూలియట్‌ నాటకంలో పేరులో ఏమున్నది పెన్నిధి అన్న షేక్స్పియర్‌ మాటలు తెలిసినవే. గులాబీని ఎవరు ఏ పేరుతో పిలిచినా దాని వాసన తీపిని గుర్తుకు తెస్తుంది అన్నట్లుగా పేరు ఏదైనా భావం ఏమిటన్నది కీలకం. దేశభక్తి కూడా అలాంటిదే. దేశభక్తులం అని చెప్పుకున్నవారందరూ దేశ భక్తులు కాదు.దేశ ద్రోహులని కొందరు చిత్రించిన వారందరూ దేశ ద్రోహులు కాదు. 2019 డిసెంబరు 15వ తేదీన ఎఎన్‌ఐ ఒక వార్తను ఇచ్చింది. దాని ప్రకారం ఝార్కండ్‌లోని దమ్‌కా బిజెపి ఎన్నికల సభలో ప్రసంగించిన ప్రధాని నరేంద్రమోడీ చెప్పిన మాటలు ఇలా ఉన్నాయి.” కాంగ్రెస్‌, దాని మిత్ర పక్షాలు ఒక గొడవను సృష్టిస్తున్నాయి.వారికి దారి దొరకనందున మంటపెడుతున్నారు. హింసాకాండను సృష్టిస్తున్నవారెవరో వారి దుస్తులను బట్టే గుర్తించగలం ” అని సెలవిచ్చారు. తద్వారా పేరెత్త కుండా మాటలతో కూడా మత విద్వేషాన్ని రెచ్చగొట్టవచ్చనే మార్గాన్ని చూపారు. ఇక పేరుతో జరుపుతున్న మారణకాండల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మన దేశపరువుకు మంచిది. దీన్ని ఎందుకు గుర్తుకు తెచ్చుకోవాల్సింది అంటే మన ప్రధాని గురించి పుతిన్‌ పొగడ్తలకు పెద్ద ఎత్తున ప్రచారం వచ్చింది గనుక.


” భారత నిజమైన దేశ భక్తుడు నరేంద్రమోడీ ” రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్‌ పుతిన్‌ ఇచ్చిన కితాబిది అని కొన్నింటిలో ” భారత దేశభక్తుడు నరేంద్రమోడీ ” అన్నట్లుగా మీడియాలో భిన్న వర్ణనలు వచ్చాయి. మొత్తం మీద నరేంద్రమోడీ దేశభక్తుడు అన్నది పుతిన్‌ చెప్పిన మాటలకు అర్ధం. మన దేశంలో ఇటీవలి కాలంలో ఎవరు నిజమైన దేశభక్తులు అనే చర్చ జరుగుతున్నది, తామే అసలైన దేశభక్తులం అని బిజెపి వారు ఢంకా బజాయించి మరీ చెప్పుకుంటున్న రోజులివి. బ్రిటీష్‌ వారిని ఎవరు వ్యతిరేకిస్తున్నారు, ఎవరు కొమ్ము కాస్తున్నారు అన్న ప్రాతిపదికన దేశభక్తులా కాదా అన్నది స్వాతంత్య్ర ఉద్యమ కాలంలో పెద్ద చర్చ, పరీక్ష. ఇప్పుడు విధానాల ప్రాతిపదిక తప్ప అలాంటి గీటురాయి లేదు. పద్మశ్రీ కంగనా రనౌత్‌ వంటి వారు దేశానికి నిజమైన స్వాతంత్య్రం 2014లో వచ్చిందని చెప్పారు మరి. ఆ ఏడాది నరేంద్రమోడీని అధికారానికి తెచ్చినందున తామే అసలైన దేశభక్తులమని బిజెపి వారు చెప్పుకుంటున్నారు. దుస్తులను బట్టి ఎవరో గుర్తించవచ్చు అన్న నరేంద్రమోడీకి ఉన్న ప్రజ్ఞ లేదా అపార తెలివితేటలను ఎవరైనా అభినందించాల్సిందే, అంగీకరించాల్సిందే. అందరికీ అది సాధ్యం కాదు. ” ప్రధాని మోడీ నాయకత్వంలో ఎన్నో చేశారు. అతను ఆ దేశభక్తుడు. ఆర్ధికంగా మరియు నైతిక ప్రవర్తన రీత్యాకూడా అతని మేకిన్‌ ఇండియా ఆలోచనలో కూడా ఎంతో విషయం ఉంది.భవిష్యత్‌ భారత్‌దే. ప్రపంచంలో అది అతి పెద్ద ప్రజాస్వామిక దేశమన్నది గర్వంగా చెప్పుకోగల గలవాస్తవం.బ్రిటీష్‌ వలస దేశంగా ఉండి ఆధునిక దేశంగా మారేక్రమంలో భారత్‌ బ్రహ్మాండమైన పురోగతి సాధించింది. సయోధ్య లేదా కొంతమేర పరిమితం చేసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అనుసరించటంలో ప్రపంచంలో సామర్ధ్యం ఉన్నవారిలో ప్రధాని నరేంద్రమోడీ ఒకరు. భారత వ్యవసాయానికి అవసరమైన ఎరువుల సరఫరా పెంచాలని నరేంద్రమోడీ కోరారు. మనం 7.6 రెట్లు పెంచాము, వ్యవసాయంలో వాణిజ్యం రెట్టింపైంది ” అని పుతిన్‌ అన్నాడు. నరేంద్రమోడీలో ఏ లక్షణాన్ని బట్టి దేశభక్తుడు అని పుతిన్‌ కితాబిచ్చారన్నదే ఆసక్తి కలిగించే అంశం.


నరేంద్రమోడీతో చెట్టా పట్టాలు వేసుకు తిరిగిన అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పదవిలో ఉండగా ” నరేంద్రమోడీ భారత దేశ పిత ” అని వర్ణించాడు. దీనితో పోలిస్తే పుతిన్‌ ప్రశంస పెద్దదేమీ కాదు. ఎందుకంటే మోడీ దేశభక్తి గురించి ఇప్పటికే దేశంలో ఎందరో చెప్పారు.2019 సెప్టెంబరులో ఐరాస సమావేశాల్లో పాల్గొనేందుకు నరేంద్రమోడీ న్యూయార్క్‌ వెళ్లినపుడు డోనాల్డ్‌ ట్రంప్‌ వీర లెవెల్లో పొగిడి మునగచెట్టెంకించటమే కాదు, హౌడీ మోడీ సభలో అబ్‌కి బార్‌ ట్రంప్‌ సర్కార్‌ అని మోడీ పలికే విధంగా వ్యవహరించాడు. అప్పుడు అవసరం అలా ఉంది మరి ! అవసరం వచ్చినపుడే ఎవరైనా పొగుడుతారా అంటే, లోకం తీరు అలా ఉంది. ” నరేంద్రమోడీ పాలనకు ముందు నాకు భారత్‌ గురించి అంత పెద్దగా గుర్తు లేదు గానీ తీవ్రంగా చిన్నాభిన్నంగా ఉందని గుర్తు. ఎంతగానో కుమ్ములాడుకొనే వారు, వారందరినీ మోడీ ఒక్కటి చేశారు. ఒక తండ్రి మాదిరి ఒకదగ్గరకు చేర్చారు. బహుశా అతను దేశ పిత కావచ్చు. మనం అతన్ని దేశ పిత అని పిలవవచ్చు. అన్ని అంశాలను ఒక దగ్గరకు చేర్చారు, వాటి గురించి మనమింకేమాత్రం వినం ” అని జర్నలిస్టులు, రెండు దేశాల దౌత్యవేత్తల ముందు ట్రంప్‌ చెప్పాడు. ఎన్నో అనుకుంటాంగానీ అనుకున్నవన్నీ జరుగుతాయా ? బైడెన్‌ గెలుస్తాడని, ట్రంప్‌ మట్టి కరుస్తాడని నరేంద్రమోడీ ఏ మాత్రం పసిగట్టినా అబ్‌కి బార్‌ ట్రంప్‌ సర్కార్‌ అనేవారు కాదు.


నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత దేశ ప్రతిష్ట పెంచినట్లు బిజెపి లేదా మిత్రపక్షాల వారే కాదు. అనేక మంది అలాగే చెప్పారు. ప్రతిష్టను పెంచటమే కాదు, ప్రపంచ నేతల మీద చెరగని ప్రభావాన్ని కలిగించారని కూడా రాశారు.” మోర్నింగ్‌ కన్సల్ట్‌ పొలిటికల్‌ ఇంటెలిజన్స్‌ ” అనే సంస్థ ఇచ్చిన రేటింగ్స్‌లో ప్రపంచ నేతల్లో నరేంద్రమోడీ 71శాతంతో ప్రధమ స్థానంలో ఉన్నారు. ఓడిపోవటానికి ముందు 2020లో డోనాల్డ్‌ ట్రంప్‌ మన దేశానికి వచ్చాడు. అంతకు ముందు ఏడాది అమెరికాలో హౌడీ మోడీ సభను ఏర్పాటు చేస్తే మర్యాదలకు మనమేమీ తక్కువ కాదన్నట్లు ” నమస్తే ట్రంప్‌ ” కార్యక్రమాన్ని పెట్టారు. నరేంద్రమోడీ ఎంతో విజయవంతమైన నేత అని, భారత్‌ను మరో ఉన్నత స్థానానికి తీసుకుపోతారని ట్రంప్‌ పొగిడాడు.డేవిడ్‌ కామెరాన్‌ బ్రిటన్‌ ప్రధాని(2010-16)గా ఉండగా లండన్‌లో భారత సంతతి వారితో జరిగిన ఒక సభలో మాట్లాడుతూ నరేంద్రమోడీ బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారంటూ అచ్చేదిన్‌ జరూర్‌ ఆయెంగే అంటూ మోడీ నినాదాన్ని ఉటంకించి జనాన్ని ఉత్సాహపరిచాడు. బ్రిటన్‌లోని గ్లాస్‌గో పట్టణంలో 2021లో జరిగిన ప్రపంచ వాతావరణ సభలో ఇజ్రాయెల్‌ ప్రధాని నఫ్తాలీ బెనెట్‌ మన ప్రధాని నరేంద్రమోడీతో పిచ్చాపాటీ మాట్లాడుతూ ” మీరు ఇజ్రాయెల్‌లో ఎంతో బాగా తెలిసినవారు, రండి మా పార్టీలో చేరండి ” అని బెనెట్‌ అనగానే నరేంద్రమోడీ పగలబడి నవ్విన వీడియో బహుళ ప్రచారం పొందింది.


నరేంద్రమోడీని ఇతర ప్రపంచ నేతలు వివిధ సందర్భాలలో పొగిడిన ఉదంతాలు ఉన్నాయి. తమకు అనుకూల వైఖరి తీసుకోనపుడు వత్తిడి తెచ్చిన ఉదంతాలు కూడా తెలిసిందే. ముఖ్యంగా ఉక్రెయిన్‌ సంక్షోభంలో తమ పాటలకు అనుగుణ్యంగా నరేంద్రమోడీ నృత్యం చేస్తారని ఆశించిన అమెరికా, ఇతర పశ్చిమ దేశాల అంచనాలు తప్పాయి. స్వతంత్ర వైఖరిని తీసుకున్నారు, తద్వారా రష్యా అనుకూల వైఖరి తీసుకున్నారని పశ్చిమ దేశాలు కినుక వహించినా వైఖరిని మార్చుకోలేదు.భారీ మొత్తంలో చమురును కొనుగోలు చేస్తూ పుతిన్‌ సర్కార్‌కు అదనపు రాబడిని కూడా మోడీ సమకూర్చుతున్నారు. ఎనిమిది నెలలు గడచిన తరువాత కూడా అదే వైఖరి అనుసరించటంతో వచ్చే రోజుల్లో కూడా అదే వైఖరితో ఉంటారనే నమ్మకం కుదిరి లేదా వుండాలనే కాంక్షతో నరేంద్రమోడీని పుతిన్‌ పొగిడి ఉండాలన్నది ఒక అభిప్రాయం. నరేంద్రమోడీ ప్రధాని పదవిలోకి రాక ముందే పుతిన్‌ 1999 నుంచి ప్రధాని లేదా అధ్యక్ష పదవుల్లో ఉన్నాడు. 2012 నుంచి అధ్యక్షుడిగా ఏకబిగిన ఉన్నాడు, అన్నీ సక్రమంగా ఉంటే 2024 వరకు ఉంటాడు. మోడీ అధికారానికి వచ్చిన ఎనిమిదిన్నర సంవత్సరాల తరువాత పుతిన్‌ ఎందుకు అన్నాడు అన్నది సందేహాలకు ఉక్రెయిన్‌పై తీసుకున్న వైఖరే అన్నది స్పష్టం. అంతర్జాతీయ రాజకీయాల్లో, తమ దేశాలకు ఆర్ధికంగా లబ్ది కలిగినపుడు ఇలాంటివి సహజం.


డేవిడ్‌ కామెరాన్‌ అచ్చే దిన్‌ నినాదాన్ని ప్రస్తావించి పొగిడినా, పుతిన్‌ మేకిన్‌ ఇండియా గురించి చెప్పినా అవి అవెంత ఘోరంగా వైఫల్యం చెందిందీ మనకు బాగా తెలిసిందే. అంతర్జాతీయ సహకారం, ప్రపంచ ఆర్ధిక వృద్దికి గాను చేసిన కృషికి 2018 సియోల్‌ శాంతి బహుమతిని నరేంద్రమోడీకి ప్రదానం చేశారు. ఆ తరువాత మన దేశంలో అదే మోడీ ఏలుబడిలో ఆర్ధిక వృద్ధి దిగజారిన సంగతి తెలిసిందే. పుతిన్‌ ఒక్కడే కాదు, అంతకు ముందు పదవీచ్యుతుడైన పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ కూడా భారత విదేశాంగ విధానాన్ని పొగిడాడు. స్వతంత్ర దేశాలు తమ విదేశాంగ విధానాలను ఎలా రూపొందించుకోవాలో భారత్‌ను చూసి నేర్చుకోమని కూడా చెప్పాడు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయవద్దంటే ధిక్కరించి కొనుగోలు చేసిందన్నాడు.


భావజాల రీత్యా అమెరికాకు దగ్గర కావాలని తొలి రోజుల్లో నెహ్రూ కాలంలోనే ఊగినప్పటికీ అది విధించిన షరతులకు తలొగ్గకూడదని మన పాలకవర్గం వత్తిడి తెచ్చిన కారణంగానే నాటి సోవియట్‌ వైపు మొగ్గారు. దేశానికి లబ్ది చేకూరేట్లు చూశారు. ఇప్పుడు అమెరికాతో కలసి మార్కెట్ల వేటలో లబ్దిపొందాలని మన పాలకవర్గం ఉత్సాహపడినా ఎక్కడన్నా బావేగానీ వంగతోట కాదన్నట్లు అమెరికా నిరూపించింది. తమ అమెజాన్‌ కంపెనీకి మన మార్కెట్‌లో పూర్తి ప్రవేశం కల్పించాలని అమెరికా వత్తిడి తెచ్చింది. అది భారతీయ అమెజాన్‌గా మారాలని చూస్తున్న అంబానీ రిలయన్స్‌ ప్రయోజనాలకు దెబ్బ. దీనికి తోడు నరేంద్రమోడీ మీద వత్తిడి తెచ్చేందుకు అమెరికా ప్రముఖ పత్రికల్లో ఒకటైన వాషింగ్టన్‌ పోస్టు పత్రిక నరేంద్రమోడీ విధానాలను విమర్శనాత్మకంగా చూసింది. అది అమెజాన్‌ కంపెనీదే. ఆ కోపం, అంబానీల వత్తిడి కారణంగా అమెజాన్‌ అధిపతి జెఫ్‌ బెజోస్‌ ఢిల్లీ వస్తే కలిసేందుకు ప్రధాని నరేంద్రమోడీ తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రష్యా నుంచి తక్కువ ధరలకు ముడిచమురు దిగుమతి చేసుకొని పెట్రోలు,డీజిలు, ఇతర ఉత్పత్తులను తయారు చేసి విపరీత లాభాలు పొందుతున్న కంపెనీ అంబానీ రిలయన్స్‌. అమెరికా విధానాలకు మద్దతు ఇస్తే వచ్చేది బూడిదే. వ్రతం చెడ్డా ఫలం దక్కనట్లు మన దేశంలో కరోనా వాక్సిన్‌ తయారీకి అవసరమైన ముడి సరుకు, ఇతర వస్తువుల దిగుమతులపై ఆంక్షలు విధించిన జో బైడెన్ను మర్చిపోగలమా? అంతకు ముందు మనలను బెదిరించిన ట్రంప్‌ను మన మిత్రుడిగా చూడగలమా ? ఇప్పుడు పుతిన్‌ చెప్పినట్లు భారీ మొత్తంలో ఎరువులను దిగుమతి చేసుకుంటే వాటికి మన కరెన్సీలో చెల్లిస్తే భారీ బడ్జెట్‌ లోటును ఎదుర్కొంటున్న కేంద్ర ప్రభుత్వానికి కూడా ఎంతో ఊరట కలుగుతుంది. అందుకే ఎన్ని బెదిరింపులు వచ్చినా నరేంద్రమోడీ పరోక్షంగా రష్యాకు మద్దతు ఇస్తున్నారు. దాన్ని నిర్దారించుకున్న తరువాతనే పుతిన్‌ ఇప్పుడు నోరు తెరిచి మెచ్చుకోలు మాటలు చెప్పాడు. ఇదే వైఖరిని మోడీ సర్కార్‌ ఎంత కాలం కొనసాగిస్తుంది అన్నది ఊహాజనితమైన ప్రశ్న.


గాల్వన్‌ ఉదంతాలతో చైనాతో అమీతుమీ తేల్చుకుంటారని నరేంద్రమోడీ గురించి అనేక మంది భావించారు. కానీ అదేమీ లేకుండా అక్కడి నుంచి రికార్డులను బద్దలు కొడుతూ దిగుమతులకు అనుమతిస్తున్నారు. ఇది చైనా మీద ప్రేమ కాదు, మరొకటి కాదు. చైనా నుంచి ముడి సరకులను దిగుమతి చేసుకొని ఇతర దేశాలకు ఎగుమతి చేసే కంపెనీల కోసమే, అది లేకుంటే సదరు కంపెనీలు కన్నెర్ర చేస్తాయి. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబరు వరకు రెండు దేశాల లావాదేవీలు 103.63 బిలియన్‌ డాలర్లకు చేరాయి. ఈ లెక్కన ఈ ఏడాది గత రికార్డులను బద్దలు కొట్టనుంది. ఉక్రెయిన్ను ముందుకు తోసి ఆయుధాలు అమ్ముకుంటూ లబ్ది పొందుతున్నది అమెరికా. తైవాన్‌ విలీనాన్ని అడ్డుకోవటంలో కూడా దాని ఎత్తుగడ, ఆచరణ అదే. మనకూ చైనాకు తగాదా పెట్టి మనకు ఆయుధాలు అమ్మి అంతకంటే ఎక్కువ లాభాలను ఆర్జించాలన్న అమెరికా ఎత్తుగడ మన కార్పొరేట్లకు తెలియంది కాదు. అందుకే కాషాయ దళాలు ఒక వైపు వ్యతిరేకతను రెచ్చగొడుతున్నా చైనాతో తెగేదాకా లాగకూడదన్నది మన కార్పొరేట్ల వైఖరి. ఈ కారణంగానే సరిహద్దుల్లో ఎలాంటి దురాక్రమణలు లేవు అని ప్రధాని నరేంద్రమోడీ అఖిల పక్ష సమావేశంలో ప్రకటించాల్సి వచ్చింది.


పెద్ద మొత్తంలో బహుమతులు పొందేందుకు గాను చుట్టుపక్కల అరవై ఆరు గ్రామాలకు మీ ఊరు పోతుగడ్డ అని గతంలో హరికథలు, బుర్రకథలు చెప్పేవారు గ్రామీణులను ఉబ్బించేవారు. వారిని మించిపోయాడు బ్రిటన్‌ మాజీ పధాని బోరిస్‌ జాన్సన్‌.” ఒక్క మనిషి, ఎంతో బాగా అర్ధం చేసుకొని తన దేశమైన భారత్‌కు పూర్తిగా అసాధారణమైన వాటిని సాధించి పెట్టిన వ్యక్తి భారత ప్రధాని నరేంద్రమోడీ. సూర్యుడు ఒక్కడే,ప్రపంచం ఒక్కటే, నరేంద్రమోడీ ఒక్కరే ” అన్నారు.ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని రెచ్చగొట్టిన వారిలో జాన్సన్‌ ఒకడు. అంతే కాదు ఆ వివాదంలో, అంతకు ముందు కూడా పూర్తిగా అమెరికా శిబిరంలో ఉంటూ రష్యాను వ్యతిరేకించిన జపాన్‌ దివంగత ప్రధాని షిజో అబె తాను ఎంతో ఎక్కువగా ఆధారపడే, విలువైన స్నేహితుల్లో నరేంద్రమోడీ ఒకరు అని పొగిడారు. రష్యాను తీవ్రంగా వ్యతిరేకించే ఆస్ట్రేలియా కూడా అమెరికా ఆడించే కీలుబొమ్మే. ఆ దేశ ప్రధాని స్కాట్‌ మోరిసన్‌ తమదేశంతో వాణిజ్య ఒప్పందం కుదిరిన సందర్భంగా మాట్లాడుతూ ఆ సందర్భాన్ని ఆనందంగా గడిపేందుకు నా ప్రియమైన స్నేహితుడు ప్రధాని నరేంద్రమోడీకి ఇష్టమైన కిచిడీతో సహా మోడీ స్వంత రాష్ట్రమైన గుజరాత్‌ కూరలను వండేందుకు సిద్దంగా ఉన్నట్లు పేర్కొన్నారు. రెండు విరుద్ద శిబిరాల్లోని వారు నరేంద్రమోడీని ఈ విధంగా పొగుడుతున్నారు అంటే వాటి వెనుక రాజకీయాలు లేవని చెప్పగలమా ?


సాధారణంగా రాజులకు ముగ్గురు భార్యలు ఉంటారని మనం చూసిన సినిమాలు, కథలు, కొందరి చరిత్రలను బట్టి తెలిసిందే. వారిలో పెద్ద భార్య మహాపతివ్రత అంటేనే కదా పేచీ వచ్చేది. నరేంద్రమోడీ నిజమైన లేదా అసలైన దేశభక్తుడు అని పుతిన్‌ చెప్పినదానికి ప్రాతిపదిక ఏమిటి ? సజీవులై ఉన్న వారిలోనా లేక భారత చరిత్రలోనే నిజమైన దేశ భక్తుడని అన్నాడా అన్న అనుమానం రావటం సహజం. నిజమైన దేశభక్తుడని అన్నట్లు ఆలిండియా రేడియో, దూరదర్శన్లలో కూడా చెప్పారు గనుక దాన్నే ప్రమాణంగా తీసుకుందాం.(దీని అర్దం అన్నింటినీ అని కాదు) పుతిన్‌ రష్యన్‌ భాషలో చేసిన ప్రసంగం గురించి రాయిటర్స్‌ వార్తా సంస్థ ఇచ్చిన అనువాదంలో దేశభక్తుడు అని ఉంది. అందుకే కొన్ని సంస్థలు అలాగే ఇచ్చాయి.ఎవరైనా దేశం కోసం ప్రాణాలు అర్పిస్తే వారికి ఇచ్చే గౌరవం వేరు. మిగిలిన ప్రతి పౌరుడూ దేశభక్తుడే. ఎక్కువ తక్కువ, నిజమైన, సాధారణ అనే కొలబద్దలేమీ లేవు. అందువలన పుతిన్‌ చెప్పిన వర్ణన ప్రకారం మన దేశం మీద వత్తిడి తెస్తున్న వారిని వ్యతిరేకించిన దేశ భక్తుడు నరేంద్రమోడీ అన్న అర్ధంలో పుతిన్‌ చెప్పి ఉంటే పేచీ లేదు. అలాగాక అసలైన దేశభక్తుడు అంటే పేచీ వస్తుంది. గతంలో మన మీద ఇంతకంటే ఎక్కువగా వత్తిడి తెచ్చిన అమెరికా, ఇతర దేశాలకు వ్యతిరేకంగా, అలీన విధాన సారధులుగా దశాబ్దాల తరబడి( దీని అర్దం దేశ రాజకీయాల్లో వారి పాత్రను బలపరుస్తున్నట్లు కాదు) విదేశాంగ విధానాన్ని అనుసరించిన మన ప్రధానులు ఉన్నారు. మరి వారినేమనాలి ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌హ‌త‌హ‌..  శ‌ర‌వేగంగా మారుతున్న పరిస్థితులు

25 Tuesday Oct 2022

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, UK, USA, WAR

≈ 1 Comment

Tags

American hegemony, Joe Biden, Ukraine-Russia crisis, US imperialism, Vladimir Putin

 

డాక్టర్ కొల్లా రాజమోహన్,

 ఇతిహాసపు చీకటికోణం

అట్టడుగున పడి కాన్పించని

కధలన్నీ కావాలిప్పుడు!

దాచేస్తే దాగని సత్యం …

అంటారు మ‌హాక‌వి శ్రీ‌శ్రీ‌. ప్ర‌స్తుతం జరుగుతున్న  ఉక్రేయిన్, ర‌ష్యా దాడి అనంత‌రం   ప‌రిణామాలు గ‌మ‌నిస్తే అనేక అంశాలు ప్ర‌జ‌ల దృష్టికి రాకుండా చేస్తున్న కుట్ర‌లు స్ప‌ష్ట‌మౌతాయి. ఉద్దేశ పూర్వ‌కంగానే అమెరికా సామ్రాజ్య‌వాద శ‌క్తుల‌కు మ‌డుగులొత్తుతూ మీడియా చేస్తున్న ప్రాప‌కాండ అంతా ఇంతా కాదు.  అమెరికా దేశానికి మ‌ద్దతు ఇస్తున్న అనేక దేశాల్లో తెర‌చాటుగా జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను నిశితంగా ప‌రిశీలిస్తే ఆయా దేశాల రాజ‌కీయ‌, ఆర్ధిక వ్య‌వ‌హారాలు తీవ్ర సంక్షోభంలో ఉన్న విష‌యం బ‌హిర్గ‌తమౌతుంది. 

రష్యాను లొంగతీసుకోవాలనే ఎత్తుగడతో అమెరికా ఆంక్షలను విధించింది. ఎత్తుగడ బెడిసికొట్టింది. రష్యా తన ఆయిల్ నిల్యలను ఆయుధాలుగా వాడుకుని ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ దేశాలను వణికిస్తున్నది.  అమెరికా- రష్యాలనే కాకుండా ప్రపంచాన్నేఆర్ధికసంక్షోభంలోకి, ఆర్ధిక మాంద్యం దిశగా నెట్తున్నది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత సామ్రాజ్యవాదం మొదటిసారిగా చిక్కుల్లో పడింది. బ్రిటన్ పౌండ్ రికార్డు స్ధాయిలో పతన మయింది. ఆర్ధిక సంక్షోభం వలన ధరలు పెరిగిపోతున్నాయి. రవి అస్తమించని సామ్రాజ్యంగా పేరుపొందిన బ్రిటన్లో సంక్షోభం వలన ఇద్దరు ప్రధానులు మారిపోయారు. మూడో ప్రధాని వరసలో వున్నాడు. ఆహార ధరలు, గ్యాసు, పెట్రోలు ధరలు పెరిగిపోయాయి. ప్రజల ఆదాయాలు తగ్గిపోతున్నాయి. కార్పోరేట్ అనుకూల విధానాలతో  ప్రధాని లిజ్ ట్రస్ 44 రోజులలోనే తన పదవికి రాజీనామా చేయవలసి వచ్చింది. *ఫ్రాన్స్ లో ప్రజలు రోడ్డెక్కారు.

. పోరాట సాంప్రదాయాలు కలిగిన ఫ్రెంచ్ కార్మికులు, విద్యార్ధులు ఆందోళనాపధంలో వున్నారు. ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ కు పదవీగండం తెచ్చేటట్లున్నది.ఇటలీ. ఆస్ట్రియా, హంగెరీ, యూరోపియన్ దేశాలన్నిటిలో అసంతృప్తి ప్రజాందోళనలను ప్రభుత్వాలు తట్టుకోలేకపోతున్నాయి.సౌదీ అరేబియా అమెరికాకు ఎదురుతిరిగింది. అక్టోబరు 5 న ఒపెక్ ప్లస్  దేశాలు 2మిలియన్ బారళ్ళ చమురు ఉత్పత్తిని తగ్గించటానికి నిశ్చయించారు. ఫలితంగా ఆర్ధిక మాంద్యం కి చేరువలో వున్న యూరప్. అమెరికా లలో తీవ్ర ఆందోళన మొదలయింది.  ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కోవలసివస్తుంది.

 *అమెరికా లో రాజకీయ కల్లోలం* .

నవంబరు 8న జరిగే మధ్యంతర ఎన్నికలలో రిపబ్లికన్లు విజయం సాధిస్తే ఉక్రెయిన్ కు అమెరికా చేస్తున్న సహాయాన్ని నిలిపేస్తామని రిపబ్లికన్ పార్టీ నాయకుడు కెవిన్ మెక్ కార్తీ విలేఖరుల సమావేశం లో చెప్పాడు. ఫిబ్రవరి లో రష్యా-ఉక్రెయిన్-నాటో యుద్ధం ప్రారంభమయిన దగ్గరనుంచీ అమెరికా ఆయుధాలు, నిధులు, నిఘా పరికరాలతోపాటుగా సైనిక శిక్షణ ను అందిస్తున్నది. శాటిలైట్ ల ద్వారా అత్యంత ఆధునిక నిఘావ్యవస్ధను ఉక్రెయిన్ కు ప్రతి నిముషం రష్యా సైనికుల కదలికలను తెలుపుతున్నది. ఇప్పటివరకూ 16.8 బిలియన్ డాలర్ల సహాయాన్ని అందించిందని అంచనా. ప్రభుత్వ ఖర్చులు పెరిగాయి. ద్రవ్యోల్బణం తీవ్రరూపం దాల్చింది. ప్రజాగ్రహం తో యుద్ద‌వ్యతిరేక ప్రదర్శనలు పెరుగుతున్నాయి.   

 *ఫ్రాన్స్, జర్మనీ ప్రజల  ప్రదర్శనలు  

అమెరికా మాట విని యూరప్‌ దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి. రష్యా తో వ్యాపారాలనన్నిటినీ ఆపేశారు. గ్యాస్ సరఫరా బందయింది. అమెరికా లిక్విఫైయిడ్ గ్యాసును సరఫరా చేస్తామంటే సంతోషించారు. లిక్విఫైయిడ్ గ్యాసును నాలుగు రెట్లు ధర ఎక్కువతో అందుబాటులోవుంచింది. కావాలంటే కొనుక్కోండంది. చౌకగా వస్తున్న రష్యన్ గ్యాసు రాకుండా చేసి కష్టకాలంలోవున్నమిత్రదేశంతో నెత్తురు పిండే వ్యాపారమేమిటని ఫ్రాన్స్, జర్మనీలు ప్రశ్నిస్తున్నాయి. ప్రస్తుతం జర్మన్ ప్రజలు భారీ మూల్యాన్ని చెల్లించవలసివస్తోంది. చలి రోజులు రానున్నాయి. ఎముకలు కొరుక్కుతినే చలిని తట్టుకోవటానికి వాతావరణాన్నివేడిగా వుంచే హీటర్లు కావాలి. హీటర్లు పని చేయటానికి గ్యాసు కావాలి. ఇంధనం కొరతతో ఫ్యాక్టరీలు మూతపడుతున్నాయి  పరిశ్రమలు నడవనందున కార్మికులు నిరుద్యోగులయ్యారు. వారు ఉద్యోగాలను కోల్పోతున్నారు. నాటో విధానాల ఫలితంగా రష్యా పై విధించిన ఆంక్షల వలన ప్రజలు ఆకలితో అలమటించడమే కాకుండా, నిరుద్యోగులుగా మారుతున్నారని జర్మన్లు గుర్తించడంతో వీధిలో ప్రదర్శనలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.

మీడియాలో చోటు చిక్కని యూరప్ ప్రజల నాటో వ్యతిరేక ప్రదర్శనలు..

ఫ్రాన్స్ లో ప్రజలు రోడ్డెక్కారు. సైన్యంతో వీధి పోరాటాలకు దిగారు. బారికేడ్లను, ముళ్ళకంచెలను ఎదుర్కొంటున్నారు. వేలాదిమంది భారీ ప్రదర్శనలను నిర్వహిస్తున్నారు. నాటో సైనికకూటమి నుండి వైదొలగమని కార్మికులు, విద్యార్దులు దేశవ్యాపిత సమ్మెకు దిగారు. ఆదివారం ప్యారిస్ లో భారీ మార్చ్ ను నిర్వహించారు. దేశవ్యాపితంగా 180 చోట్ల భారీ ప్రదర్షనలను నిర్వహించారు. అమెరికా ప్రేరేపిత యుద్ధం వలన. ఆయిల్, గ్యాస్ సరఫరాకు తీవ్ర అంతరాయాన్ని కలిగించింది. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి పోతున్నాయి.  పరిశ్రమలు మూతపడుతున్నాయి. నిరుద్యోగుల సంఖ్య పెరుగుతోంది. ఏమీకొనేటట్లు లేదు.  ఏమీ తినేటట్లులేదు. ద్రవ్యోల్బణం అదుపుతప్పి 6.2 శాతానికి మించింది. ఇంధన కొరతతో పెట్రోల్ పంపులముందు బారీక్యూ లైన్ల తో ప్రజలు విసుగెత్తిపోయారు. కొన్ని పెట్రోల్ పంపులలో ఇంధనం అందుబాటులో లేనందున ధరలు  ఆకాశాన్నంటాయి. దేశంలోని మూడోవంతు గ్యాసు స్టేషన్లలో ఇంధనం అయిపోయింది. రాబోయే చలికాలంలో ఇంటిలో వేడిచేసే గ్యాస్ లేక చలికి గడ్డకట్టుకుపోయే  పరిస్ధితులను ఊహించుకొని ఆందోళనకు గురవుతున్నారు. యుద్ధం, ఇంధన కొరత, ధరల పెరుగుదల వలన సంభవించిన కార్మికుల, ప్రజల ఆగ్రహం  ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ కు పదవీగండం తెచ్చేటట్లున్నది. ఫ్రాన్స్ లో ప్రపంచ యుధాలకు, అణచివేటకు కారణమైన నాటోను  రద్దు చేయమని ఫ్రెంచ్ కార్మికులు కోరుతున్నారు

 *అణుయుద్ధం తప్పదా..?* 

రష్యా భూభాగాన్ని రక్షించటానికి మాస్కో “తనకున్న అన్ని మార్గాలనూ” ఉపయోగిస్తుందని, తప్పనిసరి పరిస్ధితులలో అణ్వాయుధాలు ఉపయోగించటానికి వెనకాడబోమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ హెచ్చరించాడు. రెండవ ప్రపంచయుద్ధంలో అణ్వాయుధాలను ఉపయోగించటం ద్వారా అమెరికా ఒక “ఆనవాయితీని” సృష్చించిందని హిరోషిమా, నాగసాకీలపై ణుబాంబుల దాడిని పుతిన్ గుర్తు చేశాడు. రష్యా మరియు నాటోదేశాల మధ్య అస్తిత్వ యుద్ధంగా ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని పుతిన్ అభివర్ణించారు. రష్యాను రక్షించేందుకు అణ్వాయుధాలను ఉపయోగించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని పాశ్చాత్య దేశాలను హెచ్చరించాడు. కొంతమంది విశ్లేషకులు పుతిన్‌ను “బ్లఫ్“చేస్తున్నారని అంటున్నారు, అయితే వాషింగ్టన్, పుతిన్‌ను తీవ్రంగా పరిగణిస్తోంది.60 ఎళ్ళ క్రితం క్యూబా మిస్సైల్ సంక్షోభం వచ్చింది. మరల ఇపుడు అణుయుధ ప్రమాదం తీవ్ర స్ధాయిలో వుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరించారు.

 అణ్వాయుధాలను తమ జాతీయ భద్రతకు హామీ ఇచ్చే ఆయుధాలుగా, యుధనిరోధక సాధనాలుగా అణ్వాయుధ దేశాలు పరిగణిస్తున్నాయి. ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ న్యూక్లియార్ వార్ హెడ్స్ రష్యావద్ద 5977 వుండగా అమెరికా వద్ద 5428 న్యూక్లియార్ వార్ హెడ్స్ వున్నాయి తమ ప్రజల సంపదను ఫణంగా పెట్టి, తమ శక్తికి మించి ఖర్చు చేసి అణ్వాయుధాలను నిర్మిస్తున్నాయి.

యద్దం ఎపుడు ఆగుతుందో తెలియని అనిశ్చిత పరిస్ధితి దాపురించింది. బైడెన్ జనవరి 2021న అధ్యక్షపీఠాన్ని అదిష్టించినప్పటినుండీ  రష్యా సరిహద్దుదేశాలన్నిటిలో రష్యా వ్యతిరేక విష ప్రచారాన్నిఉధృతంచేశాడు.  రష్యాని నాశనం చేయపూనుకున్నాడు. సరిహద్దుల వైపు నాటో విస్తరణను కొనసాగించాడు. ఉక్రెయిన్ ను తటస్ధదేశంగా వుంచే అవకాశాన్ని జారవిడిచి రష్యాను నాశనం చేయాలనే తలంపుతో యుధానికి పాచికలు విదిలాడు. రష్యా, చైనాలపై విషాన్ని చిమ్మాడు. నాటో సైనిక కూటమి లో సభ్యత్వాలను ఆధారం చేసుకుని యూరోపియన్ యూనియన్ దేశానన్నిటినీ  ఉక్రెయిన్ కి సహాయంగా యుద్ధం లోకి లాగారు. రష్యా పైకి రెచ్చకొట్టాడు. సైనికంగా అమెరికా పై ఆధారపడిన నాటో దేశాలైన జర్మనీ, బ్రిటన్, ఫ్రాన్స్ ల నాయకత్వాలు అమెరికా ఉచ్చులో పడి బయటకు రాలేక ప్రజల క్రోధాగ్నిని ఎదుర్కొంటున్నాయి. అమెరికా యుధోన్మాధం వలన ప్రపంచ ప్రజలంతా ద్రవ్యోల్బణంలో చిక్కుకుని గిలగిల లాడుతున్నారు. రష్యా సరిహద్దు దేశాలను నాటో సైనిక కూటమిలో చేర్చుకునేప్రయత్నంలో అమెరికా సఫలం అయింది. రష్యాను వేరు చేసి ఒక మూలకునెట్టి నాశనం చేయాలనే తలంపుతో పావులు కదుపుతుంది. రష్యా కమ్యూనిస్టు దేశం కాకపోయినా అమెరికా ను ఎదుర్కొనే సైనిక శక్తి, అణ్వాయుధాలు, సహజవనరులు గల శక్తివంతమైన దేశంగా వుంది. రష్యా కమ్యూనిజాన్నివదిలి , స్వేఛామార్కెట్ , ప్రజాస్వామ్యం అంటూ పెట్టుబడిదారీ విధానాన్ని, నాటోపట్ల మెతక వైఖరిని అనుసరించినా అమెరికా సామ్రాజ్యానికి తృప్తి కలగలేదు. యూరప్ కు దగ్గర కానీయలేదు. అమెరికా అగ్రరాజ్య అధిపత్యాన్ని ప్రశ్నించేవారిని సహించే పరిస్ధితి లేదు. బలమైన ప్రత్యర్ధిగా రూపొందే అవకాశం వున్నపెద్ద దేశాన్ని నాశనం చేయటమే ధ్యేయంగా అమెరికా నాటో ను విస్తరించింది. సోవియట్ యూనియన్ ని విఛిన్నం చేసిన గోర్బచేవ్ తో నాటో ను రష్యా వైపు విస్తరించబోమన్నవాగ్దాన భంగమే ఈ యుధానికి కారణం. నాటోను విస్తరించి పుతిన్ ని యుద్ధంలోకి లాగి ప్రపంచ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు. అమెరికా యుద్దోన్మాదంతో ప్రపంచాధిపత్యంకోసం ఉక్రెయిన్ లో అంతర్యుధాన్నిప్రోత్సహించి రష్యా అనుకూల ప్రభుత్వాన్ని కూల్చేసి రష్యాని రెచ్చకొట్టింది.

 *అమెరికా దేశ భధ్రత… Vs…క్యూబా దేశభధ్రత* 

1962, క్యూబా మిస్సైల్ సంక్షోభానికి ఉక్రెయిన్ యుధానికి ఉన్న పోలికలను గమనించాలి. ఉక్రెయిన్ ను నాటో లో చేర్చుకుంటే మా దేశ భధ్రతకు ప్రమాదం అనే కారణంతో ఉక్రయిన్ పై రష్యా యుద్దానికి దిగింది. స్వతంత్రదేశమైన ఉక్రెయిన్ నాటో లో చేరాలనే నిర్ణయం తీసుకునే స్వేఛ ఉందని అమెరికా వాదన. అమెరికాకి 90 మైళ్ళ దూరంలో తన భధ్రతకు ప్రమాదమైన  అమెరికా వ్యతిరేక సోవియట్ అనుకూల ప్రభుత్వం వుంటానికే వీలులేదంది. ఆకాశమార్గంకుండా వేలాదిమంది తో సాయుధ దళాలను  క్యూబాదేశంలో దింపింది. ఒక స్వతంత్ర ప్రభుత్వాన్నికూలదోయటానికి “ బే ఆఫ్ పిగ్స్” పేరున సైనిక చర్య చేపట్టింది. క్యూబాప్రజలు విద్రోహ సైన్యాన్నిబంధించి అమెరికా కుట్రను భగ్నం చేశారు. చిన్న దేశమైన క్యూబా తన రక్షణ కోసం సోవియట్ సహాయం తీసుకుంది. సోవియట్ అణు క్షిపణులను క్యూబాలో ఏర్పాటు చేసుకున్నారు. మామీద దాడిచేస్తే 5 నిముషాలలో అమెరికా ప్రధాన నగరాలైన న్యూయార్క్, వాషింగటన్ లపై దాడి చేయగలమన్నారు. అమెరికాభధ్రతకు ప్రమాదమైన అణు క్షిపణులను క్యూబా నుండి తీసేయకపోతే యుద్ధం తప్పదని కెన్నడీ హెచ్చరించాడు. సోవియట్ నౌక లు క్యూబా రాకుండా నావికా దిగ్బంధాన్నివిధించారు. ఆరోజున అమెరికా తన భధ్రత కోసం స్వతంత్ర దేశమైన క్యూబా భూభాగం నుండి అణు క్షిపణులు తీసేయకపోతే యుద్ధం తప్పదన్నది. ఈ రోజున రష్యా తన భధ్రత కోసం ఉక్రెయిన్ దేశాన్ని నాటో సైనిక కూటమి లో చేర్చుకోవద్దంటున్నది. తన దేశ సరిహద్దుదేశాలలో అణ్వాయుధాలు మోహరించి నిముషాలలో దాడి చేసేపరిస్ధితి వస్తే అణుయుద్దానికైనా సిధం అంటున్నది.   

క్యూబా మిస్సైల్స్ సంక్షోభంలో ప్రపంచం అణుయుధపుటంచుకు చేరింది. ఏ క్షణమైనా క్యూబా పై అమెరికాదాడి చేయవచ్చనీ మరో క్షణంలో సోవియట్ అణ్వాయుధాలు అమెరికా పై ప్రయోగించటం తప్పదనీ ప్రపంచ నాశనం అనివార్యమనే పరిస్ధితి దాపురించింది.  క్యూబా నుండి అణు క్షిపణులను తొలగించటానికి రష్యా అంగీకరించింది. క్యూబా పై దాడి చేయనని అమెరికా హామీ ఇచ్చింది. రష్యా సరిహద్దున వున్న టర్కీనుండి అణుక్షిపణులను తొలగించటానికి అమెరికా అంగీకరించింది.  సంక్షోభాన్ని శాంతియుతంగా పరిష్కరించి ప్రపంచ యుధాన్ని నివారించారు.

 *ప్రజలే చరిత్ర నిర్మాతలు.* 

ఈ రోజున రష్యా ఒక మూలకు నెట్టబడింది. అమెరికా ద్రవ్యోల్బణంలో చిక్కుకుంది. ఆర్ధిక మాంద్యం అంచుల్లో వుంది. నాటో నుండి వైదొలగమని యూరప్ ప్రజలు తిరగపడుతున్నారు. ప్రపంచ ప్రజల ఆహార భధ్రత ప్రమాదంలో పడింది. అణ్వాయుధ ప్రమాదం ముంచుకొస్తున్నది. అమెరికా కుట్రలను అర్దం చేసుకున్నయూరప్ యువత, కార్మికుల  ప్రజాందోళనలు యుద్ద‌గ‌తిని  మార్చబోతున్నాయి. అంతిమంగా ప్రజలే చరిత్ర నిర్మాతలు.

——————————————

డాక్టర్ కొల్లా రాజమోహన్,

నల్లమడ రైతు సంఘం.

9000657799

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

తైవాన్‌ వేర్పాటు వాదులు, అమెరికాకు షీ జింపింగ్‌ హెచ్చరిక !

19 Wednesday Oct 2022

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, Japan, Left politics, Opinion, UK, USA, WAR

≈ Leave a comment

Tags

CPC 20th congress, Taiwan independence, Taiwan Matters, Xi Jinping, Xi Jinping warns US-Taiwan separatists


ఎం కోటేశ్వరరావు


ప్రపంచంలో అతి పెద్ద దేశం చైనా. అతి పెద్ద రాజకీయ సంస్థ చైనా కమ్యూనిస్టు పార్టీ. ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి జరిగే పార్టీ సభల్లో భాగంగా 20వ మహాసభ అక్టోబరు 16-22 తేదీలలో జరుగుతున్నది.తొమ్మిది కోట్ల 67లక్షల మంది సభ్యులకు ప్రాతినిధ్యం వహిస్తూ మిలిటరీతో సహా వివిధ విభాగాలు, తిరుగుబాటు ప్రాంతంగా ఉన్న తైవాన్‌ నుంచి మొత్తం 2,296 మంది పాల్గ్గొంటున్నారు. తదుపరి మహాసభ 2027లో జరగనుంది. సహజంగానే చైనా అధికార పార్టీ మహాసభ తీసుకొనే నిర్ణయాలు, చేసే దశ, దిశ నిర్దేశాల గురించి ప్రపంచం ఆసక్తితో ఎదురు చూస్తుంది. కొంత మంది ఆ ఏముంది, నేతలు ఏమి చెబితే ప్రతినిధులు దానికి తలూపటం తప్ప భిన్నాభిప్రాయాలను వెల్లడి కానివ్వరుగా అని పెదవి విరుస్తారు.వీరిలో కమ్యూనిస్టు పార్టీల పని పద్దతుల గురించి తెలియని వారు కొందరైతే, తెలిసీ బురద చల్లేవారు మరి కొందరు. మన దేశంలో సిపిఎం మహాసభలు మూడు సంవత్సరాలకు ఒకసారి జరుపుతారు.గతం, వర్తమాన పరిస్థితులను బేరీజు వేసి వచ్చే మూడు సంవత్సరాల్లో అనుసరించాల్సిన రాజకీయ విధానం గురించి పాత కేంద్ర కమిటీ కొత్త మహాసభకు ఒక ముసాయిదా తీర్మానాన్ని రూపొందించి దిగువన ఉన్న ప్రాధమిక శాఖ నుంచి రాష్ట్ర కమిటీల వరకు చర్చకు పంపుతారు, సవరణలు, వివరణలను ఆహ్వానిస్తారు. అంతిమంగా ఖరారు చేసిన దానిని ప్రతినిధుల మహాసభ ఆమోదానికి పెడతారు. అక్కడే దాన్ని ఖరారు చేస్తారు. చైనా కమ్యూనిస్టు పార్టీ మహాసభ దాని నిబంధనావళి ప్రకారం ఐదు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అధికారంలో ఉంది గనుక రాజకీయ విధానంతో బాటు దేశ అభివృద్ధికి అనుసరించాల్సిన మార్గం గురించి కూడా చర్చిస్తుంది.


కొంత మంది ఆశిస్తున్నట్లు లేదా కోరుకుంటున్నట్లుగా అనేక పార్టీల మాదిరి భిన్నాభిప్రాయాలను పార్టీ ప్రతినిధులు వీధుల్లోకి తీసుకురారు. పార్టీ వేదికల మీదే కుస్తీ పడతారు. మెజారిటీ అంగీకరించిన విధానాన్ని మిగతావారు కూడా అనుసరిస్తారు. నేను పార్టీలోనే దీన్ని గురించి నిరసన తెలిపాను, కనుక అంగీకరించను, అమలు జరపను అని వెలుపల చెప్పటం క్రమశిక్షణా రాహిత్యం, కేంద్రీకృత ప్రజాస్వామిక విధానానికి విరుద్దం. ఎవరైనా అలాంటి వాటికి పాల్పడితే పార్టీ నుంచి బహిష్కరణతో సహా తగిన చర్యలుంటాయి.చైనా కమ్యూనిస్టు పార్టీ మహాసభ చేసే నిర్ణయాలు, విశ్లేషణలు, ప్రపంచ స్పందనల గురించి ఒక వ్యాసంలో వివరించటం కష్టం. ఇంకా పూర్తిగా వివరాలు వెల్లడి కూడా కాలేదు. ప్రారంభ సభలో పార్టీ అధినేత షీ జింపింగ్‌ చేసిన ప్రసంగంలో తైవాన్‌ గురించి చేసిన ప్రస్తావన గురించి చూద్దాం.


ఈ మహాసభ పూర్వరంగంలోనే చైనాను రెచ్చగొట్టేందుకు వేసిన ఎత్తుగడ, చేసిన కుట్రలో భాగంగా అమెరికా అధికార వ్యవస్థలో మూడవ స్థానంలో ఉండే ప్రజాప్రతినిధుల సభ(కాంగ్రెస్‌) స్పీకర్‌ నాన్సీ పెలోసీని అడ్డదారిలో తైవాన్‌ పంపారు, అక్కడి వేర్పాటు వాదులకు మద్దతు తెలిపి గతంలో తాను అంగీకరించిన ఒకే చైనాఅన్న విధానానికి తూట్లు పొడిచారు. ఈ వైఖరి ఐరాస, భద్రతా మండలి నిర్ణయాలకు సైతం వ్యతిరేకమే. అది వేరుగా ఉన్నందున శాంతియుత పద్దతుల్లో విలీనం జరగాలన్నది వాటి తీర్మానాల సారాంశం. దానికి భిన్నంగా తైవాన్‌లో కొంత మంది చైనా వ్యతిరేక దేశాల తెరచాటు మద్దతుతో తమది స్వతంత్ర దేశమని చెబుతున్నారు. ఒక వైపు విలీనం జరగాలని చెబుతూనే అమెరికా వంటి దేశాలు తైవాన్‌ వేర్పాటు వాదులకు అవసరమైన ఆయుధాలను అందిస్తూ తిరుగుబాటుకు పురికొల్పుతున్నాయి. ఈ పూర్వరంగంలోనే షీ జింపింగ్‌ తైవాన్‌ వేర్పాటు వాదులు, వారికి మద్దతు ఇస్తున్న దేశాలకు ఈ మహాసభలో తమ వైఖరి గురించి మరోసారి పునరుద్ఘాటించారు. తైవాన్‌ విలీనానికి శాంతియుత పద్దతులు విఫలమైతే అవసరమైతే బలప్రయోగం తప్పదన్న తమ ప్రకటన, వైఖరిని వెనక్కు తీసుకొనే ప్రసక్తే లేదని జింపింగ్‌ చెప్పారు.” తైవాన్‌ సమస్య పరిష్కారం చైనీయులకు సంబంధించింది. దాన్ని పరిష్కరించుకోవాల్సింది చైనీయులే. పూర్తి చిత్తశుద్ది, చివరి క్షణం వరకు శాంతియుత పద్దతుల్లో విలీన యత్నాలను కొనసాగిస్తాం. బలప్రయోగం చేయబోము అని మేము వాగ్దానం చేసే ప్రసక్తే లేదు. అన్ని రకాల చర్యలు తీసుకొనే అవకాశాలను అట్టి పెట్టుకుంటాం. వెలుపలి శక్తుల జోక్యం, తైవాన్‌ స్వాతంత్య్రం కోరుతున్న కొంత మంది, వారి వేర్పాటు వాద కార్యకలాపాలే ఈ వైపుగా మమ్మల్ని నడిపిస్తున్నాయి. దీని అర్దం ఏ విధంగానూ మా తైవాన్‌ సోదరులను లక్ష్యంగా చేసుకోవటం కాదు ” అన్నారు. షీ జింపింగ్‌ మాటలను బట్టి మరింత వేగంగా తైవాన్ను చైనా స్వాధీనం చేసుకుంటుందని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్‌ చెప్పాడు. మాజీ విదేశాంగ మంత్రి కండోలిజా రైస్‌తో మాట్లాడినపుడు ఈ మాటలు చెప్పాడు.


ఈ మహాసభకు తైవాన్‌ ప్రాంతం నుంచి పది మంది ప్రతినిధులు వచ్చారు. వారు పార్టీ వైఖరిని సమర్ధిస్తూ ఒక చైనా, రెండు వ్యవస్థలనే విధానం ( బ్రిటీష్‌ వారి 99 సంవత్సరాల కౌలు గడువు తీరిన హంకాంగ్‌ , అదే విధంగా పోర్చుగీసు వారి కౌలు గడువు తీరిన మకావో దీవులను చైనాలో విలీనం చేశారు. ఆ సందర్భంగా అక్కడి వాణిజ్య, పారిశ్రామిక సంస్థలను 50 సంవత్సరాల పాటు ఉన్నవి ఉన్నట్లుగా కొనసాగిస్తామని, పౌరపాలనకు ప్రత్యేక పాలనా మండళ్లను ఏర్పాటు చేస్తామని చైనా ఒప్పందం చేసుకుంది. అంటే ప్రధాన భూభాగంలో సోషలిస్టు వ్యవస్థ-విలీన ప్రాంతాల్లో పెట్టుబడిదారీ విధానాన్ని కొనసాగించటం. ఇదే విధానాన్ని తైవాన్‌ ప్రాంతానికి కూడా వర్తింప చేస్తామని చైనా చెబుతోంది. హాంకాంగ్‌, మకావో విలీనాలు జరిగి పాతికేండ్లు అవుతోంది. ఈ ప్రాంతాలకు చైనా భద్రతా చట్టాలు వర్తిస్తాయి, వాటితోనే అక్కడి వేర్పాటు వాదులను అదుపులోకి తెచ్చారు.) శాంతియుత విలీనం అన్న విధానానికి అనుగుణంగా, విలీనం కోసం పార్టీ చేస్తున్న యత్నాలకు రుజువుగా నివేదిక ఉందని పేర్కొనటం పట్ల సభ ప్రతినిధులందరూ హర్షాతిరేకాలు వెల్లడించారు. బ్రిటీష్‌ వారి పాలనలో ఎన్నడూ స్వాతంత్య్రం, ఎన్నికల గురించి మాట్లాడని కొన్ని శక్తులు చైనాలో విలీనం తరువాత తొలిసారిగా జరిపిన ఎన్నికలను తప్పు పట్టటం, విద్యార్దులను రెచ్చగొట్టి స్వాతంత్య్రం పేరుతో శాంతి భద్రతల సమస్యల సృష్టికి కుట్రల గురించి తెలిసిందే. తైవాన్‌లో ఏకంగా అక్కడి ప్రభుత్వం ఏకంగా మిలిటరీ, ఆయుధాలను సేకరిస్తున్నది. ఈ కారణంగానే అవసరమైతే చివరి అస్త్రంగా బలప్రయోగం తప్పదని చైనా చెబుతోంది. ఉక్రెయిన్‌కు నాటో సభ్యత్వమిచ్చి ఆయుధాలను మోహరించి రష్యాకు పక్కలో బల్లెంలా మారేందుకు అమెరికా, నాటో కూటమి పూనుకుంది. అదే మాదిరి టిబెట్‌, తైవాన్లను స్వతంత్ర దేశాలుగా చేసి అక్కడ పాగా వేసి చైనా, భారత్‌లకు తల మీద కుంపటి పెట్టాలన్నది అమెరికా ఎత్తుగడ. అందుకే అక్కడ వేర్పాటు వాదాన్ని ప్రోత్సహిస్తున్నది. దలైలామా తిరుగుబాటు, మన దేశంలో ప్రవాస ప్రభుత్వ ఏర్పాటు కూడా దానిలో భాగమే.

1949లో కమ్యూనిస్టులు చైనాలో అధికారానికి వచ్చినపుడు పాలకుడిగా ఉన్న చాంగ్‌కై షేక్‌ మిగిలిన మిలిటరీ, ఆయుధాలను తీసుకొని తైవాన్‌ దీవికి పారిపోయి అక్కడ తిష్టవేశాడు. అమెరికా, బ్రిటన్‌ వంటి దేశాలు పరోక్షంగా మద్దతు ఇచ్చాయి. అప్పటికే ఉన్న ఐరాస భద్రతా మండలిలో శాశ్వత దేశంగా ఉన్న చైనా ప్రభుత్వం తన ఆధీనంలోనే కొనసాగుతున్నదంటూ ఐరాసలో చాంగ్‌కై షేక్‌ నియమించిన వారినే ఐరాస గుర్తించింది. ఉన్నది ఒకే చైనా అని పేర్కొన్నారు. ఇది 1970 దశకం వరకు కొనసాగింది. విధిలేని పరిస్థితిలో అసలైన చైనా అంటే ప్రధాన భూభాగంలో ఉన్న కమ్యూనిస్టులదే ప్రభుత్వమని గుర్తించిన తరువాత తైవాన్‌ గుర్తింపు రద్దు, దాన్ని కూడా చైనాలో అంతర్భాగంగానే పరిగణించారు. అందువలన సాంకేతికంగా దాని స్వాతంత్య్ర ప్రకటనను అమెరికాతో సహా శాశ్వత సభ్యదేశాలేవీ సమర్దించే అవకాశం లేదు. దొడ్డిదారిన ఏదో ఒకసాకుతో విలీనాన్ని అడ్డుకుంటున్నాయి. 1950 దశకంలో ఒకసారి విలీనానికి చైనా ప్రయత్నించినపుడు అణుబాంబులు వేస్తామని అమెరికా బెదిరించింది. దాంతో అప్పటికే హిరోషిమా-నాగసాకీలపై అవసరం లేకున్నా బాంబులు వేసిన దాని దుర్మార్గాన్ని చూసిన తరువాత అలాంటి పరిస్థితిని చైనా పౌరులకు కలిగించకూడదనే జవాబుదారీతన వైఖరితో పాటు తరువాత చూసుకుందాం లెమ్మని చైనా తన ఇతర ప్రాధాన్యతలపై కేంద్రీకరించింది. అంతే తప్ప తైవాన్‌పై తన హక్కును ఎన్నడూ వదులు కోలేదు. సందర్భం వచ్చినపుడల్లా పునరుద్ఘాటిస్తూనే ఉంది. ఏదో ఒక రూపంలో తడిక రాయబారాలు జరుగుతూనే ఉన్నాయి.


పార్టీ మహాసభ ప్రారంభంలో షీ జింపింగ్‌ తైవాన్‌ గురించి చెప్పిన మాటలు, చేసిన హెచ్చరిక అమెరికాకే అని అనేక మంది విశ్లేషించారు. దానిలో ఎలాంటి సందేహం లేదు. తన ఉపన్యాసంలో విలీన ప్రక్రియలో భాగంగా చైనాకు చెందిన తైవాన్‌ జలసంధి సంబంధ సంస్థ, తైవాన్‌లోని జలసంధి ఎక్సేంజ్‌ ఫౌండేషన్‌, బ్రిటీష్‌ పాలనలోని హాంకాంగ్‌ ప్రతినిధులతో చైనా జరిపిన సంప్రదింపుల్లో కుదిరిన అవగాహన 1992 ఏకాభిప్రాయానికి తాము కట్టుబడి ఉన్నామని కూడా షీ చెప్పారు. అయితే ప్రస్తుతం తైవాన్‌ అధికారంలో ఉన్న వేర్పాటు వాదులు దాన్ని తిరస్కరిస్తున్నారు. తైవాన్‌లో అప్పుడున్న జాతీయ ఐక్యతా మండలి ఇప్పుడు లేదు. నాటి ఏకాభిప్రాయం ప్రకారం చైనా అంటే ఒకటే గానీ అసలు చైనా అంటే ఏమిటి అన్నదానిపై విబేధం ఉందని తప్పుడు భాష్యం చెబుతున్నారు. విలీనం తరువాత ప్రత్యేక పాలిత ప్రాంతంగా తైవాన్‌ ఉంటుందని చైనా చెబుతుండగా, 1911 నాటిదే అసలైన చైనా అని దానిలో తైవాన్‌, ఇతర ప్రాంతాలతో పాటు ప్రధాన భూభాగం కూడా ఒక ప్రాంతమే అని తైవాన్‌ వేర్పాటువాదులు అన్నారు. దివంగత తైవాన్‌ నేత లీ టుంగ్‌ హుయి అసలు 1992ఏకాభిప్రాయం లేదని, ఒకే చైనాలో రెండు దేశాలు అనే ప్రతిపాదనను ముందుకు తేగా చైనా తిరస్కరించింది. ఇప్పుడు ఏకంగా తమది స్వతంత్ర దేశమని అక్కడి పాలకులు అంటున్నారు. అమెరికా ఆడిస్తున్న నాటకంలో భాగంగా ఒకసారి చెప్పినదాన్ని మరోసారి చెప్పటం లేదు. మొత్తం షీ జింపింగ్‌ మాటల సారం గురించి చెప్పాలంటే స్వాతంత్య్రం అంటున్న తైవాన్‌ వేర్పాటు వాదులు, వారికి మద్దతు ఇస్తున్న అమెరికా, ఇతర చైనా వ్యతిరేకుల ఆటలు సాగనివ్వబోమన్నదే హెచ్చరిక !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...
← Older posts

Recent Posts

  • మనవాళ్లు వట్టి వెధవాయి లోయి అన్న గిరీశాన్ని గుర్తుకు తెస్తున్న వాట్సాప్‌ పండితులు !
  • బిజెపి మిత్రోం అదానీ, బికినీలను కాదు సామాన్య జనాన్ని చూడండి !
  • వైవిధ్య సమస్యలతో ప్రపంచ వ్యవసాయ రంగం !
  • రష్యా – జర్మనీలను శాశ్వత శత్రు దేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం !
  • అక్రమం జరిగిందా లేదా విచారణకు ఆదేశిస్తారా లేదా : అదానీ కంపెనీలపై నోరు విప్పని ప్రధాని నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • మనవాళ్లు వట్టి వెధవాయి లోయి అన్న గిరీశాన్ని గుర్తుకు తెస్తున్న వాట్సాప్‌ పండితులు !
  • బిజెపి మిత్రోం అదానీ, బికినీలను కాదు సామాన్య జనాన్ని చూడండి !
  • వైవిధ్య సమస్యలతో ప్రపంచ వ్యవసాయ రంగం !
  • రష్యా – జర్మనీలను శాశ్వత శత్రు దేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం !
  • అక్రమం జరిగిందా లేదా విచారణకు ఆదేశిస్తారా లేదా : అదానీ కంపెనీలపై నోరు విప్పని ప్రధాని నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • మనవాళ్లు వట్టి వెధవాయి లోయి అన్న గిరీశాన్ని గుర్తుకు తెస్తున్న వాట్సాప్‌ పండితులు !
  • బిజెపి మిత్రోం అదానీ, బికినీలను కాదు సామాన్య జనాన్ని చూడండి !
  • వైవిధ్య సమస్యలతో ప్రపంచ వ్యవసాయ రంగం !
  • రష్యా – జర్మనీలను శాశ్వత శత్రు దేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం !
  • అక్రమం జరిగిందా లేదా విచారణకు ఆదేశిస్తారా లేదా : అదానీ కంపెనీలపై నోరు విప్పని ప్రధాని నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Follow Following
    • vedika
    • Join 234 other followers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Customize
    • Follow Following
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d bloggers like this: