మారుతున్న ప్రపంచం-4
పీటర్ బెయినార్ట్
అమెరికన్ కాంగ్రెస్(ప్రజా ప్రతినిధుల సభ)లో రిపబ్లికన్ల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొన్న అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆర్ధిక సంక్షోభాన్ని అవకాశంగా తీసుకొని వాల్స్ట్రీట్ అధికారానికి ఎందుకు కోత పెట్టలేదో తెలియదు, అయితే ఆయన ఆ పనిచేయలేదన్నది స్పష్టం.ఒక అధ్యక్షుడిగా ఇతరులెవరూ చేయలేని విధంగా ఒబామా వుత్తేజపరిచాడు . మూడు సంవత్సరాలలోపే తన చుట్టూ వున్న యువతరం ఇబ్బందులు పడుతుండగా ఆర్ధిక మత్తగజాలు ఇప్పటికీ ఆధిపత్యం వహిస్తున్నాయి. దానికి స్పందనగా యువతరం సృష్టించిందే వాల్స్ట్రీట్ ఆక్రమణ వుద్యమం. దానిలో భాగంగా జుకొట్టి పార్కును ఆక్రమించుకున్నది ఎవరా అని ఆరాతీసేందుకు అక్కడికి వెళ్లిన న్యూయార్క్ సిటీ విశ్వవిద్యాలయ విద్యావేత్తలకు ఆ యువకుల్లో 40శాతం మంది 2008 అధ్యక్ష ఎన్నికలలో ఒబామా విజయం కోసం పనిచేసిన వారేనని తేలింది. ఒక అధ్యక్షుడిగా ఒబామా మౌలిక మార్పులు తెస్తారని వారిలో అనేక మంది ఆశించారు. అది నిరాశ అని తేలటంతో వాల్స్ట్రీట్ను ప్రత్యక్షంగానే ఎదుర్కోవాలనే ఆలోచన వారిని నడిపించింది.ఆక్రమణ వుద్యమాన్ని దగ్గరగా పరిశీలించిన న్యూయార్క్ విశ్వవిద్యాలయ పరిశోధకులు ‘ ఆక్రమణ వుద్యమంలో పాల్గొన్న ఎక్కువ మంది యువకులలో ఒబామాపై భ్రమలు తొలగటమే వారిని అందుకు పురికొల్పింది’ అన్నారు. ‘ఆక్యుపై నేషన్ ‘ అనే పేరుతో పుస్తకాన్ని రచించిన కొలంబియా విశ్వవిద్యాలయ సోషియాలజిస్టు టోడ్ గిట్లిన్ న్యూ స్కూల్ ఫర్ రిసర్చ్లో బోధకుడైన జెర్మీ వరాన్ ఇలా అన్నారని తన పుస్తకంలో వుటంకించారు.’ ఒబామా యంత్రాంగం నుంచి స్వాతంత్య్రం ప్రకటించుకున్న ఒబామా తరం ఇది, ఆయన గళం మాదిగా వుంటుందని ఆలోచించాము, ఇప్పుడు మా గురించి మేమే మాట్లాడుకోవాల్సి వచ్చింది’ ఆ వుద్యమం కొద్ది కాలమే నడిచిందికానీ జాతి దృష్టిని ఆకర్షించింది. చరిత్రలో ఇది గొప్ప నిరసన వుద్యమంగా రాజకీయ శాస్త్ర పండితుడు ఫ్రాన్సిన్ ఫాక్స్ పివెన్ వ్యాఖ్యానించారు.అది ఒక ప్రజావుద్యమంగా విస్తరించి వుండకపోవుచ్చు, వారు ఒక ప్రత్యేక స్థలంలో కూర్చొని చేసిన వుద్యమం, అది ముగిసిపోయిందంటే మరోచోట మరో రూపంలో తిరిగి ముందుకు రావటానికే అని కూడా ఫ్రాన్సిస్ చెప్పారు.
ఆ వుద్యమ జ్యోతి ఆరిపోవచ్చు, కానీ అమెరికా రాజకీయ చర్చలోకి ఆర్ధిక అసమానత అంశాన్ని చొప్పించింది.( జుకొట్టి పార్కు ఆక్రమణ ప్రారంభమైన కొద్ది వారాలలోనే మీడియాలో దాని గురించి ప్రస్తావన ఐదు రెట్లు పెరిగింది) అయితే ఆ ఆగ్రహం కేవలం వాల్స్ట్రీట్కే పరిమితం కాలేదు, డెమోక్రటిక్ పార్టీని కూడా తాకింది. పార్టీ పెద్దల వాంఛలకు భిన్నంగా న్యూయార్క్ నగర మేయర్గా బిల్ డి బ్లాసియో(కొందరు బ్లాసియోను కమ్యూనిస్టుగా చిత్రించి ప్రచారం చేశారు) ఎన్నికవటానికి, ఎలిజబెత్ వారెన్ జాతీయ స్థాయికి పెరగటానికి దోహదం చేసింది. ఈ వుద్యమం జరగకపోతే వెర్మౌంట్ డెమోక్రటిక్ పార్టీ ఎంపీ, సోషలిస్టు అయిన బెర్నీ శాండర్స్ ప్రారంభ ప్రచారంలో హిల్లరీ క్లింటన్కు తీవ్రమైన సవాలు ఇచ్చి వుండేవారు కాదు. ఆయన తన అభ్యర్ధిత్వాన్ని ప్రకటించిన రోజున ఆక్రమణ వుద్యమ కార్యకర్తలు తమ మద్దతు ప్రకటించారు.
ఆయన ప్రచారంలో చెప్పినదానికంటే దాని పట్ల డెమోక్రటిక్ పార్టీలోని శిష్ట(వున్నత) జనం స్పందించిన తీరు ముఖ్యమైనది.1980దశకం చివర, 1990దశకాలలో అయితే ఆయనను చీల్చి చెండాడి వుండేవారు అ. వాణిజ్యవర్గాలకు అనుకూలంగా వుండాలని చెప్పి వుండేవారు .ఈ రోజు వామపక్షానికి శత్రువులు లేరు అన్నట్లుగా వుంది. అందుకే శాండర్స్కు పెద్దగా సైద్దాంతిక ప్రతిఘటన ఎదురు కాలేదు.ఈ పరిస్ధితి మేథావులు, కార్యకర్తలలోనే కాదు, ఆ పార్టీకి నిధులు ఇచ్చే అనేక మంది, తరచుగా పురోగామి అజెండాను వ్యతిరేకించే జర్నలిస్టులలో కూడా కనీసం ఆర్ధిక అంశాల విషయంలో అనేక మందిలో వుంది. జార్జి సోరోస్, టామ్ స్టేయర్ వంటి పెద్ద ఎత్తున నిధులు సేకరించే వారితో కూడిన అత్యంత ప్రభావం కలిగించే డెమోక్రసీ అలయన్స్ క్లబ్ కూడా ఒబామా కాలంలో వామపక్షం వైపు మొగ్గిందని నేషనల్ పత్రికలో జాన్ జుడిస్ వ్యాఖ్యానించాడు. ఈ క్లబ్ రచయితల వార్షిక సమావేశానికి 2014లో హాజరైన ఎలిజబెత్ వారెన్(వామపక్ష వాది)కు కేరింతలతో స్వాగతం పలకటమే కాదు, ఆర్ధిక అసమానతకు తాము అగ్ర ప్రాధాన్యత ఇస్తున్నట్లు గత వసంత కాలంలో ప్రకటించింది. ఇవన్నీ హిల్లరీ క్లింటన్పై ప్రభావం చూపాయి. శాండర్స్ మాదిరిగా మొత్తం పెట్టుబడిదారీ విధానాన్నే వదలివేయాలని గాక ఆ విధానపు అతిని అరికట్టేందుకు తాను ప్రయత్నిస్తానని ఆమె చెప్పాల్సి వచ్చింది.అంతే కాదు ఆక్రమణ వుద్యమం-ఎలిజబెత్ వారెన్- బెర్నీశాండర్స్ కూటమి హిల్లరీ స్వంత ఆర్ధిక అజెండాను ప్రభావితం చేసింది.గత ఎన్నికలలో ధనికులపై అధిక పన్నులు విధించాలనటాన్ని వ్యతిరేకించిన ఆమె ఇప్పుడు గట్టి నియంత్రణ వుండాలని, గతంలో తాను వుత్సాహంతో సమర్ధించిన ట్రాన్స్ పసిఫిక్ భాగస్వామ్య ఒప్పందాన్ని ఇప్పుడు విమర్శిస్తున్నది.ఆమె భర్త మరియు ఒబామా విధానాల నుంచి దూరంగా వుందని కొందరు వ్యాఖ్యానించారు.
నేర న్యాయం, జాతుల విషయంలో కూడా ఇదే విధమైన ప్రభావం కనిపిస్తోంది. ఒబామాపై భ్రమలు కోల్పోయిన కార్యకర్తలు వామపక్షం వైపు మొగ్గుతున్నారు. హిల్లరీ, మిగిలిన పార్టీ నాయకత్వం తమతో వస్తున్నందుకు సంతోషంగా వున్నారు. ఒబామా హయాంలో అనూహ్యంగా తలెత్తినది ఆక్రమణ వుద్యమాన్ని చెప్పుకుంటే మరొకటి నల్లజాతీయుల జీవిత సమస్య. ట్రాయవన్ మార్టిన్ హత్యకేసులో జార్జి జిమ్మర్మన్ను కోర్టు నిర్దోషిగా ప్రకటించటంతో ఈ వుద్యమం 2013లో ప్రారంభమైంది, 2014లో మైఖేల్ బ్రౌన్ మరణంతో అది వివిధ మార్గాలలో బద్దలైంది.అది గత దశాబ్దకాలంగా పెరుగుతున్న పోలీసు హత్యలకు ప్రతిస్పందన. కొందరు వీడియోలల కూడా దొరికి పోయారు. అయితే ఈ వుద్యమం కూడా ఒబామాపై భ్రమలు వీడిపోయిన పర్యవసానమే. ఆఫ్రికన్-అమెరికన్లపై పోలీసుల హింసాకాండ నిజానికి కొత్తది కాదు, ఒక నల్లజాతీయుడైన ఒబామా హయాంలో కూడా అది కొనసాగి పెరగటంతో యువతరం, వుదారవాదులు, ఇతరులలో కూడా నల్లవాడు కూడా తమవాడు కాకపోయాడే అన్న ఆవేదన తలెత్తటంతో అది వ్యవస్ధీకృత మార్పులను తీసుకువచ్చింది.
