Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


టీవీలు, పత్రికల్లో ప్రస్తుతం హమస్‌ అనే సంస్థ గురించి వార్తలు వస్తున్నాయి. ఇజ్రాయెల్‌-పాలస్తీనా తాజా పరిణామాలపై ఎన్నో అవస్తవాలు, వక్రీకరణలు వెల్లువెత్తుతున్నాయి. వాటిలో కొన్నింటిని చూద్దాం. చరిత్రనంతటినీ ప్రస్తావించటం ఇక్కడ సాధ్యం కాదు గనుక క్లుప్త వివరణకే ఇది పరిమితం.


పాలస్తీనా – ఇజ్రాయెల్‌ ఉనికి !
ఈ రోజు మనం పాలస్తీనా అని చెబుతున్న ప్రాంతం లేదా చరిత్రలో ఉందని భాష్యం చెబుతున్న ఇజ్రాయెల్‌ గానీ ఎన్నడూ ఒక స్వతంత్ర దేశంగా లేవు. ఏదో ఒక సామ్రాజ్యంలో భాగాలుగా చేతులు మారుతూ వచ్చాయి. క్రీస్తు పూర్వమే ఈ రెండు పేర్లూ వాడుకలో ఉన్నట్లు చరిత్ర చెబుతోంది. పేరు ఏదైనా అవి ఏదో ఒక సామ్రాజ్యంలో భాగాలు, సామంతదేశాలే. రోమన్‌, లేదా ఒట్టోమన్‌ మాదిరి యూదుల సామ్రాజ్యం అనేది లేదు. తొలుత క్రీస్తు పూర్వం ఏడవ శతాబ్దంలో అస్సీరియన్లు యూదుల మీద దాడి చేసి జుడా రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. యూదులను తరిమివేశారు. తరువాత క్రీస్తుశకం మధ్యయుగాల్లో మత యుద్దాల్లో యూదులు అనేక ప్రాంతాలకు పారిపోయారు. చరిత్రలో పాలస్తీనా-ఇజ్రాయెల్‌ ప్రాంతం చివరిగా టర్కీ కేంద్రంగా పాలన సాగించిన ఒట్టోమన్‌ సామ్రాజ్యంలో భాగంగా ఉంది. జనాభాలో తొంభైశాతంపైగా అరబ్బులే ఉన్నారు. ప్రపంచమంతటినీ ఆక్రమించిన బ్రిటీష్‌, ఫ్రెంచి ఇతర సామ్రాజ్యవాదులకు అది స్వాధీనం కాలేదు. మొదటి ప్రపంచ యుద్దంలో దాన్ని విచ్చిన్నం చేసేందుకు బ్రిటీష్‌ పాలకులు అనేక పాచికలను వాడారు. వాటిలో ఒకటి ఒట్టోమన్‌ సామ్రాజ్యం నుంచి స్వాతంత్య్రం కోరుతున్న అరబ్బులకు పాలస్తీనాను ఏర్పాటు చేస్తామని ఒక వైపు ఆశచూపారు. మరోవైపు యూదులకు ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేస్తామని వారి మద్దతును కూడగట్టేందుకు పూనుకున్నారు. ఎందుకంటే అనేక దేశాల్లో యూదులు బాంకర్లుగా, ఇతరత్రా ధనవంతులుగా ఉన్నారు కనుక వారి అవసరం ఉన్నందున అలా చేశారు. బ్రిటీష్‌ , తరువాత వారి స్థానాన్ని ఆక్రమించిన అమెరికన్‌ సామ్రాజ్యవాదులు పెట్టిన చిచ్చే పాలస్తీనా-ఇజ్రాయెల్‌ వివాదం.


మొదటి ప్రపంచ యుద్దంలో ఒట్టోమన్‌ సామ్రాజ్యం పతనమైన తరువాత సామ్రాజ్యవాదుల పంపకాల్లో పాలస్తీనా ప్రాంతాన్ని బ్రిటీష్‌ వారు తీసుకున్నారు. అప్పటికే పశ్చిమాసియాలో చమురు నిల్వలు, ఇతర ప్రాంతాల్లో సహజ సంపదలను గమనించి ఆ ప్రాంతంలో తమకు నమ్మకమైన బంటు ఉండాలంటే ఇజ్రాయెల్‌ ఏర్పాటు ఒక సాధనంగా బ్రిటీష్‌ వారు భావించారు. అందుకు గాను అనేక దేశాల్లో దాడులకు గురైన యూదులందరినీ పాలస్తీనాకు అక్రమంగా రప్పించారు. అక్కడ వారు నివాసాలను ఏర్పాటు చేసుకొనేందుకు అవకాశం కల్పించారు. స్థానికంగా ఉన్న అరబ్బులను వారి ప్రాంతాల నుంచి గెంటివేయటం అప్పుడే ప్రారంభమైంది. బ్రిటీష్‌ వారి కుట్రను గమనించేలోగా రెండవ ప్రపంచ యుద్దం, తరువాత యూదుల వలసలు మరింత పెరిగాయి. తరువాత పాలస్తీనా ప్రాంతాన్ని మూడుగా విభజించి పాలస్తీనా, ఇజ్రాయెల్‌ దేశాలుగా ఏర్పాటు, జెరూసలెం పట్టణం, పరిసరాలను ఐరాస ఆధీనంలో ఉంచాలంటూ చేసిన ప్రతిపాదనకు ఐరాస సాధారణ అసెంబ్లీలో 1947 నవంబరు 29న మెజారిటీ ఆమోదం వచ్చేట్లు సామ్రాజ్యవాదులు చూశారు. దానిని ఆ ప్రాంత దేశాలు, అరబ్బులు అంగీకరించలేదు. ఐరాస తీర్మానం సాకుతో అప్పటికే సాయుధంగా సిద్దంగా ఉన్న యూదులు తీర్మానాన్ని పక్కన పెట్టి పాలస్తీనా ప్రాంతాలను కూడా ఆక్రమించి అరబ్బులను తరిమివేశారు.దాంతో అరబ్బులు ప్రతిఘటన ప్రారంభించారు. నాటి నుంచి నేటి వరకు పాలస్తీనా ఏర్పడలేదు. ఇజ్రాయెల్‌ ముందుగా వేసుకున్న పధకం ప్రకారం పాలస్తీనా ప్రాంతాల ఆక్రమణకు పూనుకోవటంతో పక్కనే ఉన్న ఈజిప్టు, సిరియా, జోర్డాన్‌, ఇరాక్‌ పాలస్తీనా ప్రాంతాలను దురాక్రమణ నుంచి కాపాడి కొన్నింటిని తమ అదుపులోకి తీసుకున్నాయి. ఐరాస తీర్మానాన్ని గుర్తించేందుకు ఇజ్రాయెల్‌ నిరాకరిస్తోంది. తన భద్రతకు కొన్ని పాలస్తీనా ప్రాంతాలు కావాలని చెబుతోంది. దానికి అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు మద్దతు పలుకుతున్నాయి.


హమస్‌ ఎప్పుడు ఏర్పడింది ?
పాలస్తీనా విముక్తి కోసం పిఎల్‌ఓ ఏర్పడింది. అది శాంతియుత, సాయుధ పద్దతుల్లో పోరాడుతోంది. 1980 దశకం నాటికి అరబ్బుల్లో అసహనం పెరిగింది. పిఎల్‌ఓ సమర్దవంతంగా ఎదుర్కోవటం లేదనే అసంతృప్తి ఉంది. ఈ పూర్వరంగంలో హమస్‌ అనే సంస్థ 1987లో ఉనికిలోకి వచ్చింది. దాన్ని ఏర్పాటు చేయటంలో మత పెద్దలు కూడా ఉన్నారు.1973లో ముస్లిం బ్రదర్‌హుడ్‌ అనే సంస్థ ఈజిప్టులో ఏర్పడింది. దానిలో పాలస్తీనా ప్రాంతానికి చెందిన వారు కూడా ఉన్నారు. ఆ సంస్థలో చీలిక వచ్చి హమస్‌ ఏర్పడింది.1988ఆగస్టున హమస్‌ ప్రణాళిక పేరుతో తొలిసారిగా ఆ పేరును వెలుగులోకి తెచ్చారు. తమ ప్రభుత్వం మీద పోరాడే ప్రతివారినీ ఉగ్రవాద ముద్రవేసి ఇజ్రాయెల్‌ అణచివేస్తున్నది. అంతకు ముందు పిఎల్‌ఓ, తరువాత హమస్‌ ఇతర సంస్థలనూ అదే మాదిరి పరిగణించింది. 1994 ఫిబ్రవరిలో రంజాన్‌ ప్రార్ధనలు చేస్తున్న ముస్లింలను 29 మందిని గోల్డ్‌ స్టెయిన్‌ అనే యూదు దురహంకారి మిలిటరీ దుస్తులతో వెళ్లి పశ్చిమ గట్టు ప్రాంతంలోని హెబ్రాన్‌ నగరంలోని ఒక మసీదులో కాల్చి చంపాడు. తరువాత జరిగిన ఉదంతాలలో మరో 19 మంది పాలస్తీనియన్లను భద్రతా దళాలు చంపి వేశాయి. సామాన్య పౌరులు, మిలిటెంట్లకు తేడా చూపకుండా ఇజ్రాయెల్‌ చర్యలు ఉన్నందున తాము కూడా అదే బాట పడతామని హెబ్రాన్‌ ఉదంతం తరువాత హమస్‌ ప్రకటించింది.అప్పటి నుంచి అది ఇజ్రాయెల్‌ పోలీసులు, భద్రతా దళాల దుశ్చర్యలకు ప్రతిగా తానూ దాడులు జరుపుతోంది. అది సరైందా కాదా అంటే పౌరుల మీద ఎవరు దాడులు జరిపినా సమర్దించనవసరం లేదు. ఇజ్రాయెల్‌ యూదులు సామాన్యపౌరుల మీద బాంబులు విసురుతుంటే పాలస్తీనా అరబ్బులు రసగుల్లాలు విసురుతారా ? ఇదే సమయంలో పిఎల్‌ఓ-ఇజ్రాయెల్‌ మధ్య కుదిరిన ఓస్లో ఒప్పందాన్ని అది వ్యతిరేకించింది. దానిలో భాగంగానే 1996లో జరిగిన పాలస్తీనా ఎన్నికలను,2005లో పాలస్తీనా అధ్యక్ష ఎన్నికను బహిష్కరించింది. యాసర్‌ అరాఫత్‌ మరణించిన తరువాత 2006లో జరిగిన జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసింది. గాజా ప్రాంతంలో మెజారిటీ సీట్లు తెచ్చుకొని అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. వెస్ట్‌ బాంక్‌ ప్రాంతంలో ఫతా అధికారంలో ఉంది. మన దేశంలో రాష్ట్ర ప్రభుత్వాలకు అంతర్జాతీయ గుర్తింపు ఉండదు, అలాగే గాజాలోని హమస్‌ ప్రభుత్వానికి అంతర్జాతీయ గుర్తింపు లేదు, ఎందుకంటే అది పాలస్తీనాలోని ఒక ప్రాంత ప్రభుత్వం మాత్రమే. హమస్‌ ప్రభుత్వానికి మిలిటరీ లేదు, హమస్‌ గెరిల్లాలు మాత్రమే దాడులు చేస్తున్నారు. ఇజ్రాయెల్‌ మిలిటరీ ఆ గెరిల్లాలను అణచేపేరుతో జనావాసాలపై దాడులు చేసి పౌరులను హతమారుస్తున్నది. విమానాలతో బాంబులు వేస్తున్నది, గాజా వాసులకు మంచినీరు, విద్యుత్‌, ఆహారం, ఔషధాల సరఫరాలను నిలిపివేసిందంటే సామాన్య పౌరుల మీద దాడి తప్ప మరొకటి కాదు.గాజా ప్రాంతం నుంచి తప్పుకున్న 2006 నుంచి ఇప్పటి వరకు ఇజ్రాయెల్‌ పదిసార్లు మిలిటరీదాడులు జరిపింది.


జో బైడెన్‌ అబద్దమాడాడా !
అమెరికాలోని యూదు సంస్థల ప్రతినిధులతో సమావేశమైన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఇలాంటి దృశ్యాలను చూడాల్సి వస్తుందని తాను అనుకోలేదని చెప్పినట్లు వార్తలు వచ్చాయి. హమస్‌ సాయుధులు ఇజ్రాయెలీ పిల్లలను చంపుతున్న దృశ్యాల చిత్రాలను చూసిన తరువాత బైడెన్‌ స్పందించినట్లు మీడియా పేర్కొన్నది.ఇజ్రాయెల్‌ ప్రభుత్వం, నేతలు చెప్పిన మాటలను బట్టి అలా మాట్లాడారు తప్ప బైడెన్‌ ఎలాంటి ఫొటోలను చూడలేదని అధ్యక్ష భవనం వివరణ ఇచ్చింది. పిల్లలను హతమారుస్తున్నట్లు ఎలాంటి దాఖలాలు లేవని తరువాత వెల్లడైంది. కానీ తప్పుడు ఫొటోలను ఇజ్రాయెల్‌ , అమెరికా, ఐరోపా పత్రికలు ప్రచురించి పెద్ద ఎత్తున హమస్‌ మీద అసత్యవార్తలను జనంలో పెట్టాయి. పశ్చిమ దేశాల పాలకులు, వారి కనుసన్నలలో నడిచే మీడియా ఎలాంటి తప్పుడు వార్తలను ప్రచారంలో పెడుతుందో తెలిసిందే.1991లో ఇరాక్‌ మీద దాడి చేయదలచుకున్న అమెరికా, ఐరోపా దేశాలు అంతకు ముందు ఒక కట్టుకథను ప్రచారంలో పెట్టాయి. కువాయిట్‌ ఆసుపత్రిల్లోని ఇంక్యుబేటర్లలో ఉన్న వందలాది మంది పిల్లలను ఇరాకీ సైనికులు చంపివేశారని నమ్మించేందుకు చూశారు. అంతేకాదు నాటి ఇరాక్‌ పాలకుడు సద్దాం హుసేన్‌ మారణాయుధాలను గుట్టలుగా నిల్వ చేశాడని కూడా ప్రచారం చేసిన సంగతి, తీరా తాము చేయదలచుకున్నది చేసి సద్దాంను హత్య చేసి లక్షలాది మంది ఇరాకీల జీవితాలను నాశనం చేసిన తరువాత అబ్బే అలాంటి గుట్టల ఆయుధాలు ఎక్కడా కనిపించలేదని చెప్పిన సంగతి తెలిసిందే. ఇక జో బైడెన్‌ పెద్ద అబద్దాల కోరని గతంలోనే రుజువైంది. నెల్సన్‌ మండేలాను కలిసేందుకు వెళ్లినపుడు 1970దశకంలో తనను అరెస్టు చేశారని 2020 ఎన్నికల ప్రచారంలో పచ్చి అబద్దం చెప్పాడు.


ఇజ్రాయెల్‌ నిఘా వైఫల్యమా ! కుట్రా !!
పాలస్తీనాకు చెందిన గాజా ప్రాంతాన్ని ఇజ్రాయెల్‌ ప్రభుత్వం ఒక నిర్బంధశిబిరంగా మార్చివేసింది. దాని చుట్టూ సరిహద్దులో మనుషులు దాటటానికి వీలులేని ఆరు మీటర్ల ఎత్తున పెద్ద ఇనుప ముళ్ల కంచెను ఏర్పాటు చేసింది. దాని పొడవు 65కిలోమీటర్లు, డ్రోన్లు, రిమోట్‌ కంట్రోలు మెషిన్‌ గన్లు, కెమెరాలు దానికి అమర్చి ఉంటాయి. ఏదైనా అలజడి సమాచారం ఉంటే ఐదు నిమిషాల్లో దాడులు చేసే హెలికాప్టర్లు సిద్దంగా ఉంటాయి. బుల్డోజర్లతో తప్ప ఆ కంచెను మానవ మాత్రులు ధ్వంసం చేయలేరు. దాన్ని దాటి 400 మంది హమస్‌ గెరిల్లాలు ట్రాక్టర్ల మీద వచ్చారని చెబుతున్నారు. ఒకవైపు ఈజిప్టు, మరోవైపు మధ్యధరా సముద్రం, రెండు వైపులా ఇజ్రాయెల్‌ మిలిటరీ ఉంటుంది. గాజా వాసులు వెలుపలికి రావాలంటే ఇజ్రాయెల్‌ అనుమతి లేకుండా కుదరదు.హమస్‌ గెరిల్లాలు కంచెను దాటి కొందరు క్షిపణులు ప్రయోగించారు. కొన్ని చోట్ల కంచెలోపలి నుంచే వదిలారు. దీన్ని ఇజ్రాయెల్‌ పసిగట్టలేకపోయింది.ఏదో జరగబోతోందని ముందే తాము హెచ్చరించామని ఈజిప్టు నిఘా అధికారులు చెప్పారు. తాము కూడా మిలిటరీని హెచ్చరించామని ఇజ్రాయెలీ గూఢచారులు కూడా చెబుతున్నారు. తమకెలాంటి సమాచారమూ లేదని మిలిటరీ చెప్పింది. తెలిసినా ఇజ్రాయెల్‌ మిలిటరీ కావాలనే నిరోధించలేదని చెబుతున్నారు. ఇది ఒక రహస్యంగా మిగిలిపోయింది.


హమస్‌ను అంతం చేయటం సాధ్యమా ?
పాలస్తీనా ప్రాంతాల మీద ఇజ్రాయెల్‌ దాడులు చేయటం ఇదే ప్రధమం కాదు. గతంలో అనేకసార్లు దాడులు చేసింది. తమ వ్యతిరేకులను అణచివేసినట్లు చెప్పుకుంది. ఇప్పుడు కూడా అదే చెబుతోంది. హమస్‌ లేదా మరొక తిరుగుబాటుదార్లను అణచివేయటం నిజంగా సాధ్యమౌతుందా ? ప్రజల మీద దాడులు కొనసాగినంత కాలం ప్రతిఘటన వీరులు పుడుతూనే ఉంటారన్నది చరిత్ర చెప్పిన సత్యం. హమస్‌గాకపోతే మరొక పేరుతో మరో సంస్థ పుట్టుకువస్తుంది. హమస్‌ కంటే ముందుకు కూడా సాయుధదాడులు చేసిన వారు ఉన్నారు కదా ! పాలస్తీనాకు 1947 తీర్మానం ప్రకారం దాని ప్రాంతాలను దానికి అప్పగిస్తేనే ఇజ్రాయెల్‌ మీద తిరుగుబాటు లేదా ఆత్మరక్షణ దాడులు నిలిచిపోతాయి. లేకుంటే మరో ఏడు దశాబ్దాలు గడిచినా చరిత్ర పునరావృతం అవుతూనే ఉంటుంది. వందల సంవత్సరాల నాడు మత యుద్ధాలలో, రెండవ ప్రపంచ యుద్దానికి ముందు హిట్లర్‌ యూదులను లక్షల సంఖ్యలో హతమార్చినా వారు అంతరించలేదు. అలాంటిది పాలస్తీనియన్లు లేదా అరబ్బులను అణచివేయటం, పూర్తిగా తుడిచిపెట్టటం సాధ్యమౌతుందా ? ఈ పాఠాన్ని యూదులు, వారిని సమర్ధించేవారు మరచిపోతే ఎలా ?