Tags

, , , , , , ,


ఎం కోటేశ్వరరావు


ఐరోపా యూనియన్‌లోని 27దేశాలలో జూన్‌ ఆరు నుంచి తొమ్మిదవ తేదీవరకు జరిగిన యూనియన్‌ పదవ పార్లమెంటు ఎన్నికల ఫలితాల్లో అందోళనకర సూచనలు వెలువడ్డాయి. అధికారికంగా ఫలితాల పూర్తి ప్రకటన వెలువడలేదు, నాలుగు దేశాల్లో లెక్కింపు కొనసాగుతోంది. మంగళవారం సాయంత్రానికి అందిన సమాచారం, ఫలితాల తీరుతెన్నుల ప్రకారం నయా నాజీ, ఫాసిస్టు, పచ్చి మితవాద శక్తులు బలం పుంజుకున్నాయి. ఈ పరిణామం ఐరోపా విధానాలనే తీవ్రంగా ప్రభావితం చేసేదిగా ఉంది. వివిధ దేశాలలో పాలక పార్టీలు, కూటములకు ఎదురుదెబ్బలు తగిలాయి.ఐరోపా సమాఖ్య వైఖరిలో వచ్చే మార్పులు, చేర్పుల గురించి చర్చ ప్రారంభమైంది ఐరోపా సమాఖ్యకు ఒక స్థంభం వంటి ఫ్రాన్సు మీద పిడుగులా పడి ఇంకా రెండు సంవత్సరాల గడువు ఉన్న పార్లమెంటురద్దుకు దారితీసింది.పాలకపక్షం ఘోరంగా దెబ్బతినటంలో పార్లమెంటును రద్దు చేసి తిరిగి ఎన్నికలు జరపనున్నట్లు అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్‌ మక్రాన్‌ వెంటనే ప్రకటించాడు. అక్కడి రాజ్యాంగం ప్రకారం పార్లమెంటులో ప్రతిపక్షాలకు మెజారిటీ ఉన్నా, ప్రధాని, మంత్రులు వేరే పార్టీకి చెందినవారైనా, అధ్యక్షుడికే సర్వాధికారాలు ఉంటాయి. 2027లో జరిగే అధ్యక్ష ఎన్నికలలో మక్రాన్‌ పోటీ చేసేందుకు నిబంధనలు అంగీకరించవు . జర్మనీ ప్రతిపక్షం మధ్యంతర ఎన్నికలకు డిమాండ్‌ చేసింది. అధికార త్రిపక్ష సంకీర్ణ కూటమికి ఎదురు దెబ్బ తగిలినా ఎన్నికలకు వెళ్లేది లేదని ప్రకటించింది.


పార్లమెంటులోని మొత్తం 720స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మెజారిటీ 361 సాధించిన కూటమి ఎంచుకున్న నేత ఐరోపా కమిషన్‌ అధ్యక్ష పదవిని అధిష్టిస్తారు. కమిషన్‌ విధానాలను ఐరోపా పార్లమెంటు రూపొందిస్తుంది. ప్రతి దేశానికి జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయిస్తారు. గత ఎన్నికల్లో 751 స్థానాలుండగా 27 సీట్లున్న బ్రిటన్‌ ఐరోపా సమాఖ్య నుంచి వైదొలిగినందున వాటిని ఇతర దేశాలకు కేటాయించినప్పటికీ తరువాత వాటికి ఉపఎన్నికలు జరగలేదు. తరువాత 46 స్థానాలను రద్దు చేశారు. తాజా ఎన్నికలకు ముందు ఆమోదించిన విధానం ప్రకారం 705 నుంచి 720కి స్థానాలను పెంచారు. జర్మనీలో 96,ఫ్రాన్స్‌81, ఇటలీ 76 స్థానాలతో అగ్రభాగాన ఉన్నాయి. మాల్టా, సైప్రస్‌, లక్జెంబర్గ్‌ దేశాలలో తక్కువగా ఆరేసి స్థానాల చొప్పున ఉన్నాయి. ఏ దేశానికి ఆదేశం ఎంచుకున్న పద్దతిలో ఎన్నికలు జరుగుతాయి. పార్లమెంటులో ఒక పక్షాన్ని గుర్తించాలంటే ఏడు దేశాలలో పోటీచేసి కనీసం 23 స్థానాలను తెచ్చుకోవాల్సి ఉంది. ఆ నిబంధనకు అనుగుణంగా లేని వాటిని గుర్తింపులేని పార్టీలుగా పరిగణిస్తారు.ఈ ఎన్నికల్లో కేవలం 51శాతం మాత్రమే ఓటర్లు పాల్గొన్నట్లు తొలి వార్తలు తెలిపాయి. గరిష్టంగా బెల్జియంలో 89.2, లక్జెంబర్గ్‌లో 82.3శాతం పోలు కాగా క్రోషియాలో అత్యల్పంగా కేవలం 21.3శాతమే ఓటర్లు పాల్గొని ఒక రికార్డు సృష్టించారు. కొన్ని దేశాలలో ఈ సందర్భంగానే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా నిర్వహించారు.


ఈ ఎన్నికలలో ప్రస్తుతం సమాఖ్య అధ్యక్షురాలిగా ఉన్న ఉర్సులా వాండరె లెయన్‌ నాయకత్వంలోని యూరోపియన్‌ పీపుల్స్‌ పార్టీ(ఇపిపి) 191సీట్లతో పెద్ద పక్షంగా అవతరించింది. పచ్చి మితవాదులను అధికారంలోకి రాకుండా నిరోధించగలమని ఆమె చెప్పింది. మరోసారి ఆమె సమాఖ్య అధ్యక్ష స్థానం కోసం పోటీలో ఉన్నారు. ఐరోపా రాజకీయ పరిభాషలో ఇపిపిని మధ్యేవాద మితవాద పార్టీగా పరిగణిస్తారు. ఫ్రాన్సులో మేరీనె లీపెన్‌ నాయకత్వంలోని పచ్చిమితవాద ఐడెంటిటీ(ఉనికి)-డెమోక్రసీ(ప్రజాస్వామ్య) పార్టీ(ఐడి)కి 57 వచ్చాయి. ఇటలీ ప్రధాని జియోర్జియా మెలోనీ నాయకత్వంలోని యూరోపియన్‌ కన్సర్వేటివ్‌, రిఫార్మిస్టు(ఇసిఆర్‌) పార్టీకి 71 వచ్చాయి. ఈ మూడు పక్షాలూ గతం కంటే ఎక్కువ సీట్లు తెచ్చుకున్నాయి. సోషలిస్టు మరియు డెమోక్రాట్స్‌ కూటమి(ఎస్‌డి) రెండవ పెద్ద పక్షంగా 135 సీట్లు తెచ్చుకుంది. గుర్తింపు పొందని చిన్న పక్షాలు 95 గెలుచుకున్నాయి.గ్రీన్స్‌ పార్టీ 53,రెన్యూ(పునరుద్దరణ) యూరోప్‌(ఆర్‌ఇ) 83, ఐరోపా వామపక్ష పార్టీ 35 సీట్లు తెచ్చుకుంది. గత ఎన్నికల్లో ఐరోపా కమిషన్‌ అధ్యక్షురాలిగా ఉర్సులా వాండెర్‌ లెయాన్‌ అభ్యర్థిత్వాన్ని సమర్ధించి గెలిపించిన పార్టీలు తాజా ఎన్నికల్లో 720కి గాను 402 స్థానాలను తెచ్చుకున్నట్లు వెల్లడైంది. అందువలన ఆమె తిరిగి మరోసారి అదే పదవిలో కొనసాగవచ్చు. ఆమె గనుక పచ్చిమితవాద పార్టీల మద్దతుకోసం ప్రయత్నిస్తే తాము దూరంగా ఉంటామని, ఉదారవాద, మితవాద పార్టీల ప్రతినిధులు హెచ్చరించారు. ఆమె బలహీన పడిన గ్రీన్స్‌, ఇటలీ మితవాది మెలోనీ పార్టీ మద్దతు కోరవచ్చని కొందరు విశ్లేషకులు జోశ్యం చెప్పారు.హంగరీలో జాతీయవాద నేత విక్టర్‌ ఒర్బాన్‌ పార్టీ బలం తగ్గినా 44శాతం తెచ్చుకుంది.ఇటలీలో మితవాద ప్రధాని మెలోనీ పార్టీ 30శాతం తెచ్చుకుంది.


ఫ్రెంచి పార్లమెంటును ఆకస్మికంగా రద్దు చేయటంతో ఫ్రాన్స్‌లో సంకీర్ణ రాజకీయాలకు తెరలేచింది. ఈనెల 30,జూలై ఏడున ఎన్నికలు జరగనున్నాయి. పదహారవ తేదీలోగా అభ్యర్థుల ప్రకటన జరుగుతుంది. అధ్యక్షుడు మక్రాన్‌ ప్రకటన వెలువడిన వెంటనే ఐడి పార్టీ నాయకురాలు మేరీనే లీపెన్‌ దేశ పౌరులు ఈ ఎన్నికల్లో కూడా తనకు మద్దతు ఇవ్వాలని కోరారు.ఐరోపా పార్లమెంటు ఎన్నికల్లో ఆమె పార్టీ 31.5శాతం ఓట్లతో ప్రధమ స్థానంలో ఉంది. గతంలో నేషనల్‌ ఫ్రంట్‌ పేరుతో పార్టీని ఏర్పాటు చేసిన జీన్‌ మారీ లీపెన్‌ కుమార్తె మేరీనే కాగా మనుమరాలు మరియో మార్చెల్‌ ఆమెతో వేరుపడి రికగ్నిట్‌ పేరుతో మరో పచ్చిమితవాద పార్టీని ఏర్పాటు చేసింది. ఎన్నికల సమయంలో మేనత్త మీద ఎలాంటి విమర్శలూ చేయలేదు, మితవాదులందరూ కలవాల్సిన అవసరం గతం కంటే నేడు ఎక్కువగా ఉందంటూ ఎన్నికల ఫలితాల తరువాత మరియో వ్యాఖ్యానించింది. వ్యతిరేకులు, పోటీదార్లకు తేడా ఉంది అన్నారు.అయితే ఇప్పటికే మార్చెల్‌తో మేరీ లీపెన్‌ ప్రతినిధి జోర్డాన్‌ బార్‌డెలా సంప్రదింపులు జరిపినట్లు వార్తలు వచ్చాయి. మక్రాన్‌ నాయకత్వాన్ని వ్యతిరేకించే మితవాద పార్టీలు మేరీ లీపెన్‌, మార్చెల్‌తో కలిసే అవకాశాలు ఉన్నాయి. వివిధ పార్టీలలో చీలికలు తెచ్చి తనవైపు తిప్పుకొనేందుకు మక్రాన్‌ ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించాడు. అతగాడి అధ్యక్ష పదవీకాలం 2027వరకు ఉంది. పార్లమెంటులో ప్రతిపక్షాలకు మెజారిటీ ఉంటే ఇబ్బంది కనుక వాటిని అడ్డుకొనేందుకు సర్వశక్తులూ వడ్డాలని చూస్తున్నాడు. సోషలిస్టులు, గ్రీన్స్‌, మరికొన్ని వామపక్ష పార్టీలు కూడా కూటమిగా ఏర్పడేందుకు చూస్తున్నాయి. ఐరోపా యూనియన్‌ ఎన్నికలలో సోషలిస్టు పార్టీ(పిఎస్‌)కు 14శాతం ఓట్లు వచ్చాయి.కొన్ని సర్వేల ప్రకారం ప్రస్తుతం ఉన్న సీట్లలో మక్రాన్‌ నాయకత్వంలోని రినయసాన్స్‌ పార్టీ(ఆర్‌ఎన్‌) సగం స్థానాలను కోల్పోనున్నట్లు వెల్లడైంది.


జర్మనీలో పాలక కూటమిలోని సోషల్‌ డెమోక్రటిక్‌ పార్టీ(ఎస్‌పిడి) 13.9శాతం ఓట్లు తెచ్చుకొని మూడవ స్థానంలో ఉంది. పచ్చిమితవాద పార్టీ ఏఎఫ్‌డి 16శాతం తెచ్చుకొని చరిత్ర సృష్టించింది. ప్రతిపక్ష క్రిస్టియన్‌ డెమోక్రటిక్‌ యూనియన్‌-క్రిస్టియన్‌ సోషల్‌ యూనియన్‌ కూటమి 30శాతం తెచ్చుకొని ప్రధమ స్థానంలో ఉంది.తూర్పు జర్మనీ ప్రాంతంలో ఎఎఫ్‌డి అగ్రస్థానంలో ఉంది. సంకీర్ణ కూటమిలోని సోషల్‌ డెమోక్రాట్స్‌(ఎస్‌పిడి), పర్యావరణ గ్రీన్స్‌,ఫ్రీ డెమోక్రాట్స్‌ పార్టీలు వరుసగా 13.9 -11.9-5.2శాతాల చొప్పున తెచ్చుకొని చావు దెబ్బతిన్నాయి.దీంతో వెంటనే ఎన్నికలు జరపాలని ప్రతిపక్షం డిమాండ్‌ చేసింది.నాలుగింట మూడు వంతుల మంది జనం కూటమి పాలన పట్ల అసంతృప్తితో ఉన్నారని ఎన్నికల సర్వేలు వెల్లడించాయి. జర్మన్‌ ఛాన్సలర్‌ ఒలాఫ్‌ షుల్జ్‌ బెర్లిన్‌లో విలేకర్లతో మాట్లాడుతూ ఫలితాలు తమకు ప్రతికూలంగా వచ్చినందున మామూలుగా తమపని తాము చేసే అవకాశాలు ఉండకపోవచ్చని అన్నాడు. వచ్చే జాతీయ ఎన్నికల్లో ఓటర్ల అభిమానాన్ని చూరగొనేందుకు ప్రయత్నిస్తామన్నాడు.నూటముప్ఫై సంవత్సరాల చరిత్రలో ఇంత తక్కువగా ఎస్‌పిడి ఎన్నడూ ఓట్లు తెచ్చుకోలేదు. ప్రత్యామ్నాయ జర్మనీ (ఎఎఫ్‌డి) ఈ ఎన్నికలలో తెచ్చుకున్న ఓట్లతో సుస్థిరం కావటాన్ని అడ్డుకుంటామని, వెనక్కు కొడతామని అన్నాడు. జర్మనీలో, ఐరోపా అంతటా సంప్రదాయ ప్రజాస్వామిక పార్టీలు ఇప్పటికీ మెజారిటీగా ఉన్నాయని అన్నాడు. ప్రతిపక్షం కోరినట్లుగా మధ్యంతర ఎన్నికలకు వెళ్లే అవకాశం లేదని, గడువు ప్రకారమే జరుగుతాయని షుల్జ్‌ ప్రతినిధి స్టెఫెన్‌ ó చెప్పాడు. జాతీయవాదం,విద్వేష ప్రమాదాలను జనం మరచిపోరాదని జర్మనీ అధ్యక్షుడు (మన రాష్ట్రపతి మాదిరి) ఫ్రాంక్‌ వాల్టర్‌ స్టెయిమెయిర్‌ హెచ్చరించాడు. రెండవ ప్రపంచ యుద్దంలో నాజీల మారణకాండకు బలైనవారి గౌరవార్ధం ప్రాన్సులో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఐరోపా పార్లమెంటు ఎన్నికల్లో పచ్చిమితవాద పార్టీలు ఎదగటాన్ని ప్రస్తావించి జర్మనీలో నేషనల్‌ సోషలిస్టులు(హిట్లర్‌ నాజీ పార్టీ) సాగించిన అత్యాచారాలను గుర్తు చేశాడు.


ఉక్రెయిన్‌ సంక్షోభం, గాజాలో జరుగుతున్న పరిణామాలు,ఐరోపా అంతటా కొనసాగుతున్న ఆర్థిక సంక్షోభం వంటి అంశాలన్నింటి కారణంగా మరింత భద్రత కావాలని ఓటర్లు కోరుకున్నారని, దాని మీద పచ్చి మితవాదులు వాగ్దానం చేశారని, ఈ ఎన్నికలు జాతీయ నాయకుల మీద జరిగిన ప్రజాభిప్రాయవెల్లడి అని ఐరోపా సమాఖ్య విదేశీ సంబంధాల డిప్యూటీ డైరెక్టర్‌ వెసెలా టెక్నర్‌నెవా అన్నారు.ఐరోపాలో ఫాసిస్టు, నాజీ, పచ్చి మితవాద శక్తులు పుంజుకోవటమే కాదు, తమ స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్న ధోరణి కనిపిస్తున్నది. అయితే ఈ ఎన్నికల్లో అనేక మంది ఊహించిన మాదిరి అవి ఎక్కువ బలాన్ని పెంచుకోలేదు. మూడోవంతు సీట్లు తెచ్చుకోవటం రానున్న ముప్పును వెల్లడిస్తున్నది.ఇప్పటివరకు అనేక కారణాలతో వివిధ దేశాల్లోని ఈ శక్తుల మధ్య ఐక్యత లేదు, అసంఘటితంగా కూడా ఉన్నాయి.ఎవరికి వారుగానే పని చేస్తున్నారు. మితవాదులు, పచ్చిమితవాదులకు స్వల్పతేడాలు మాత్రమే ఉన్నాయి. ఆర్థిక సంక్షోభం కొనసాగుతున్న పూర్వరంగంలో పార్లమెంట్‌లో ఈ శక్తులు కలిస్తే పరిణామాలు ఎలా ఉండేదీ చెప్పలేము. ఒక వేళ అదే జరిగితే వాటిని వ్యతిరేకించే వారందరూ ఒక కూటమిగా ఏర్పడవచ్చు, వారితో వామపక్షాలు కూడా చేతులు కలిపే అవకాశం లేకపోలేదు.పచ్చిమితవాద శక్తులు బలం పుంజుకోవటం వలన పర్యావరణ,వలసలు, ఉక్రెయిన్‌కు సాయంతో సహా విదేశాంగ విధానంలో మార్పుల కోసం పట్టుపట్టవచ్చు, వేగంగా నిర్ణయాలు తీసుకోవటాన్ని అడ్డుకోవచ్చు.