Tags

, , , , , , ,

ఎం కోటేశ్వరరావు

రైతులు నిజంగా అమాయకులే, ముల్లుగర్రతో ఎద్దుముడ్డి మీద పొడవటం తప్పఏమీ తెలియదు,(కొంత మందికి ఇప్పుడు ఎద్దులతో సాగు చేస్తారని తెలియదు, వాటి స్థానంలో ట్రాక్టర్లు, ఇతర పరికరాలు వచ్చాయి) ఏం చెప్పినా తలూపుతారన్న గట్టి విశ్వాసం లేకపోతే మన వాణిజ్యశాఖ మంత్రి పియూష్‌ గోయల్‌ అలా ఎందుకు మాట్లాడతారు. అమెరికా మన దేశంతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం మన ఎగుమతులపై 18శాతం దిగుమతి పన్ను విధిస్తారు. అదే బంగ్లాదేశ్‌తో చేసుకున్న అవగాహన ప్రకారం దిగుమతి చేసుకొనే దుస్తులపై అమెరికా ఎలాంటి పన్ను విధించదు. ఈ అంశం మన దేశ వస్త్రపరిశ్రమ,వాణిజ్యవేత్తలలో ఆందోళనకు గురిచేసింది. దాంతో కేంద్ర మంత్రి రంగంలోకి దిగారు.మనకూ అలాంటి సౌకర్యం ఉందన్నారు. ఉంటే అమెరికా జారీ చేసిన ప్రకటనలో ఆ వివరం ఎందుకు లేదు ! అదంతే,మనకా రాయితీ ఎలా వస్తుందంటే మనం కూడా అమెరికా పత్తి దిగుమతి చేసుకుంటే ఎలాంటి పన్నులూ ఉండవని, ఈ అంశాన్ని సంతకాల సమయానికి ఒప్పందంలో భాగంగా చేర్చుతామని చెప్పారు. ఖాళీ చెక్కు మీద సంతకం చేసినపుడు ఎంతమొత్తమైనా రాసుకోవచ్చు. అమెరికాతో అలాంటి అవగాహనకు వచ్చినందున ఇంకా ఇలాంటి వాటిని మరెన్నింటిని చేర్చుతారో ! ఆ నిబంధన రైతాంగానికి నష్టం కదా అంటే కాదని సెలవిచ్చారు. ఎందుకటా అమెరికాలో పత్తి పరిమితంగానే పండుతుంది గనుక అన్నారు. ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకు తిరిగేందుకు చూస్తున్నారు గనుకనే అడుగడుగునా అనుమానించాల్సిందే. ప్రభుత్వంపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తగా పియూష్‌ గోయల్‌ కూడా అదే స్థాయిలో విరుచుకుపడ్డారు. ముందు ఎవరేం చెప్పారో ? చూద్దాం !

అమెరికాతో కుదిరిన ఒప్పందంతో వచ్చే ముప్పు గురించి అనేక రైతు సంఘాల ప్రతినిధులు లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీని కలిసి దానిపై గళమెత్తాలని కోరారు. అదేమీ తప్పు కాదు, అన్ని పార్టీల నేతలను అలా కలిసిన ఉదంతాలు ఎన్నో. కొంత మందిని రప్పించుకొని రాహుల్‌ నాటకమాడుతున్నారని కేంద్ర వాణిజ్యశాఖ పియూష్‌ గోయల్‌ ఆరోపించారు. రైతులు, వస్త్ర పరిశ్రమ వర్గాల్లో భయాన్ని రేపుతున్నారని అన్నారు. వాస్తవాలు తెలియకుండా తన అవివేకాన్ని స్వయంగా బయటపెట్టుకున్నారని, దేశ అభివృద్ధిని దెబ్బతీయాలని చూస్తున్నారని, ప్రతికూల రాజకీయాలకు పాల్పడుతున్నారని కూడా ధ్వజమెత్తారు. ” కఠిన వాస్తవాలు ” అంటూ ఎక్స్‌లో కొన్ని విషయాలను మంత్రి పోస్టు చేశారు. అభివృద్ధి చెందిన 38దేశాలతో కుదుర్చుకున్న తొమ్మిది స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలతో ఇప్పుడున్న నాలుగు లక్షల కోట్ల రూపాయల వస్త్ర ఎగుమతులు 45 లక్షల కోట్ల పెరుగుతాయంటే ఎంతగా వృద్ధి అవకాశాలు ఉన్నాయో స్త్రీ, పురుషులకు లక్షలాది ఉద్యోగాలు ఎలా వస్తాయో ఊహించుకోవచ్చన్నారు. అమెరికా పత్తి ఉత్పత్తి చాల తక్కువని, స్థానిక అవసరాలకు పోను ఆరుబిలియన్‌ డాలర్ల విలువగల పత్తి, నూలు ఎగుమతులు చేస్తున్నారని, భారత్‌ నుంచి 2.7 బిలియన్‌ డాలర్ల విలువగల పత్తి, నూలును బంగ్లాదేశ్‌ దిగుమతి చేసుకుంటున్న విషయం రాహుల్‌కు తెలియదని అన్నారు. రాహుల్‌ గాంధీ కుటుంబం పాలన సాగించిన రోజుల్లో అమల్లోకి తెచ్చిన సెజ్‌ చట్టం నిబంధన 27(1) ప్రకారం ఎగుమతి చేసే వస్తువులకు గాను పత్తితో సహా ముడివస్తువులను ఎలాంటి పన్ను లేకుండా దిగుమతి చేసుకోవచ్చని, ఎగుమతుల కోసం సున్నా పన్నుల విధానం తెచ్చిన స్వంత పార్టీ మీదే రాహుల్‌ గాంధీ దాడి చేస్తున్నారని మంత్రి ఎద్దేవా చేశారు. అంతకు ముందు రోజు రాహుల్‌ గాంధీ ఎక్స్‌ ద్వారా ప్రభుత్వ విధానాన్ని విమర్శించారు. ప్రభుత్వం ఊబిలోకి నడుస్తూ కోట్లాది మందిని దానిలోకి లాక్కుపోతున్నదని పేర్కొన్నారు. పద్దెనిమిది, సున్నా శాతం పన్నులంటూ జనాన్ని ప్రభుత్వం గందరగోళపరుస్తున్నదని అవాస్తవాలు చెప్పటంలో ప్రధాని ఎంతో నిపుణులని, మంత్రివర్గం గందరగోళాన్ని వ్యాపింప చేస్తున్నదని విమర్శించారు. బంగ్లాదేశ్‌కు అమెరికా ఇచ్చిన ప్రత్యేక రాయితీ మనకూ రావాలంటే మనం కూడా అమెరికా పత్తి దిగుమతి చేసుకోవాల్సి ఉందని రాహుల్‌ పేర్కొన్నారు.పత్తి వివరాలేమిటి, ఎవరు చెబుతున్నది వాస్తవం, ఎవరిది అవాస్తవం !

ప్రపంచ పత్తి ఉత్పత్తి వివరాలను చూస్తే చైనాలో 7.5, భారత్‌లో 5.1,బ్రెజిల్‌ 4.1, అమెరికాలో 3,పాకిస్తాన్‌లో 1.1మిలియన్‌ టన్నుల పత్తి పండిందని 2025 అంచనా. బ్రెజిల్‌లో ప్రతి మనిషికి 0.19మి.ట, అమెరికాలో 0.088 , చైనాలో 0.052,మనదేశంలో 0.032 మి.టన్నులు ఉంది. ఈ వివరాలన్నీ తెలియకుండానే గోయల్‌ అమాత్యగిరీ వెలగబెడుతున్నారని అనుకోవాలా ? 2024 వివరాల ప్రకారం ప్రపంచంలో 90లక్షల టన్నుల ఎగుమతి జరగ్గా బ్రెజిల్‌ 27.74, అమెరికా 24.91, మనదేశం 4.65లక్షల టన్నులు ఎగుమతి చేసింది. రెండవ స్థానంలో ఉన్న మనం అంత తక్కువ, నాలుగవదిగా ఉన్న అమెరికా అంత ఎక్కువ ఎందుకు ఎగుమతి చేస్తున్నట్లు ! మనకంటే ఎక్కువగా పండిస్తున్నప్పటికీ చైనా ఎందుకు దిగుమతి చేసుకొంటోందంటే అక్కడ వస్త్ర పరిశ్రమకు అవసరం, తద్వారా విదేశాలకు ఎగుమతి చేసి లబ్ది పొందుతోంది.మన దేశంలో ఐదు కోట్లకు పైగా కదుళ్లు ఉండగా చైనా పది కోట్లు కలిగి ఉంది, వాటితో అక్కడి జనాభాకు పని కల్పిస్తోంది. అమెరికాతో వాణిజ్య ఒప్పందంతో నిమిత్తం లేకుండానే పిలుపులు ఇచ్చిన మన మేకిన్‌, మేడిన్‌ ఇండియా, ఆత్మనిర్భర భారత్‌ సంగతేమిటి ? ఒక మౌలిక ప్రశ్న ఏమంటే వస్త్ర ఎగుమతులకు నిజంగా అంత అవకాశం ఉంటే మోడీ సర్కార్‌ 12 సంవత్సరాలపాటు అలాంటి ఒప్పందాలను ఎందుకు చేసుకోలేదు ? లక్షలాది మందికి ఉపాధి ఎందుకు కల్పించలేదు ?

మన రైతాంగం, పరిశ్రమ బంగ్లాదేశ్‌ గురించి ఎందుకు భయపడాలి ? బంగ్లాదేశ్‌ ప్రధాన ఉత్పత్తి వస్త్రాలు,రెడీమేడ్‌ దుస్తులు. అక్కడ పత్తి పెద్దగా పండదు, దిగుమతి చేసుకోవాల్సిందే. ప్రస్తుతం ప్రపంచంలో అదే ఎక్కువగా ఇతర దేశాల నుంచి తెచ్చుకుంటున్నది. వస్త్ర ఉత్పత్తులతో చైనా, భారత్‌, వియత్నాం వంటి దేశాలను సవాలు చేస్తున్నది. తాజా ఒప్పందం ప్రకారం అమెరికా నుంచి నూలు, పత్తి దిగుమతి చేసుకొని దుస్తులను తమకు ఎగుమతి చేస్తే ఎలాంటి పన్నులు ఉండవు అన్న వెసులుబాటు అమెరికా కల్పించింది. నిజానికి అది తమ పత్తి కొనుగోలు చేయాలనే షరతును రుద్దింది.ఒక దశలో షేక్‌ హసీనా పదవీచ్యుతురాలు గాక ముందు మన పత్తి, నూలు ఎగుమతుల్లో 70శాతం బంగ్లాదేశ్‌కే జరిగాయి.పైకి ఎన్ని చెప్పినప్పటికీ ఇప్పుడు అక్కడ మనకు వ్యతిరేకమైన బిఎన్‌పి అధికారానికి వచ్చింది. అక్కడి నుంచి అమెరికాకు ఎగుమతి చేసే రెడీమేడ్‌ దుస్తులలో 70శాతం అమెరికా ముడి సరకులేే ఉంటే ఎలాంటి దిగుమతి పన్ను ఉండదు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం పత్తి సంవత్సరం 2025-26 (అక్టోబరు నుంచి సెప్టెంబరు వరకు) బంగ్లాదేశ్‌ 84లక్షల బేళ్ల పత్తి దిగుమతి చేసుకోవాలని నిర్ణయించింది. బ్రెజిల్‌ నుంచి 19(22శాతం) భారత్‌ 14(15శాతం) బెనిన్‌ 10.6, కామెరూన్‌ 6.2, అమెరికా, ఆస్ట్రేలియాల నుంచి 5.95లక్షల బేళ్ల వంతున దిగుమతి చేసుకోవాలని తలపెట్టింది. ఇప్పుడు తాజా ఒప్పందంతో అమెరికా నుంచి దిగుమతులు భారీగా పెరుగుతాయని భావిస్తున్నారు. మన పత్తి కంటే అమెరికా సరకు రేట్లు తక్కువ, ఎందుకని ? 2026లో ఒక పౌను(453 గ్రాములు) దూదికి ప్రభుత్వ సాయంగా 55 సెంట్లు, మననగదులో రు.50 ఇస్తుంది. అంతమొత్తం సబ్సిడీ పొందుతున్న తరువాత ప్రపంచానికి చౌకధరలకు పత్తి ఎగుమతులు చేయకుండా ఎలా ఉంటుంది. పైసా పైసా లాభాన్ని లెక్కవేసుకొనేవారు అమెరికా పత్తికి ఎగబడక చస్తారా ? బంగ్లాదేశీయులు దూరంగా ఉంటారా ? ట్రంప్‌ విధించిన పన్నులతో మన ఎగుమతిదారులు అమెరికన్లకు చౌకగా దుస్తులు అందించలేకపోతున్నారని అచ్చే దిన్‌కు దూరం చేస్తున్నారనే ”జాలి గుండె ” నరేంద్రమోడీ సర్కార్‌ అక్కడి నుంచి దిగుమతి చేసుకొనే పత్తిపై 11శాతం పన్ను తగ్గించింది. పొడవు పింజ పత్తిని మాత్రమే దిగుమతికి అనుమతించామంటారు, రెండు తెలుగు రాష్ట్రాలు, దక్షిణాదిన పండేది అదే గనుక మన రైతులకు వెయ్యి నుంచి రెండువేల వరకు నష్టం వచ్చింది, అయితేనేం అమెరికన్లకు తక్కువ ధరలకు దుస్తులను అందించినందుకు మన బిజెపి నేతలు తమ భుజాలను తామే చరుచుకున్నారు. ఇప్పుడు కూడా అమెరికా నుంచి దిగుమతులు చేసుకోవాలని పియూష్‌ గోయల్‌ చెబుతున్నారు. అంటే ఈ ఏడాది కూడా పత్తి రైతుల నోట్లో మట్టికొట్టేందుకు పూనుకున్నారు. ప్రభుత్వం ఎన్ని సబ్సిడీలు ఇచ్చినా పత్తిసాగు గిట్టుబాటు కావటం లేదంటూ అమెరికన్‌ రైతులు విస్తీర్ణాన్ని తగ్గిస్తున్నారు. దాంతో ట్రంప్‌ ప్రభుత్వం రంగంలోకి దిగి వాణిజ్య ఒప్పందాల్లో తమ వ్యవసాయ ఉత్పత్తులను కొనాల్సిందే అనే షరతులు పెడుతోంది.బ్రెజిల్‌ నుంచి పత్తి ఎగుమతుల్లో తీవ్ర పోటీ ఎదురుకావటంతో సబ్సిడీలతో రంగంలోకి దిగనుంది.

అమెరికాతో ఒప్పందం గురించి అడుగడుగునా దాగుడుమూతలే,పైకి చెబుతున్నది ఒకటి లోపల మరొకటి జరుగుతోందన్న అనుమానాలు బలపడుతున్నాయి. వివిధ రకాల ధాన్యాల నుంచి అమెరికాలో ఎథనాల్‌ తయారు చేస్తారు, ఆ క్రమంలో వచ్చే పిప్పి లేదా చెక్కను పశువుల దాణాగా వినియోగిస్తారు.తాజా ఒప్పందం ప్రకారం దాన్ని మనం ఎలాంటి పన్నులు లేకుండా దిగుమతి చేసుకోవాలి, అది కోళ్ల ఫారాల యజమానులకు లబ్ది కలిగిస్తుంది, కానీ మన దగ్గర అందుకోసం సాగు చేస్తున్న రైతులేం కావాలి ? ఇదే మాదిరి సోయా ఆయిల్‌ను పన్నుల్లేకుండా దిగుమతి చేసుకునేందుకు అంగీకరించారు. ఆ రైతుల పరిస్థితి ఏమిటి ? ఒక వైపు నూనె గింజల సాగును ప్రోత్సహిస్తామంటారు మరోవైపు ఆ రైతులను దెబ్బతీస్తారు. బయో ఇంథన ఉత్పత్తిలో భాగంగా ఇథనాల్‌ తయారీని ప్రోత్సహిస్తారు. అమెరికా నుంచి దాని చెక్కను దిగుమతి చేసుకుంటే ఇక్కడి కంపెనీల ఉత్పత్తులను ఎవరు కొంటారు ?

ముందే చెప్పుకున్నట్లు పైకి చెబుతున్నది ఒకటి లోపల జరుగుతున్నది మరొకటి.అమెరికా నుంచి పప్పు ధాన్యాలను కూడా దిగుమతి చేసుంటారని ట్రంప్‌ యంత్రాంగం ”వాస్తవాల పత్రం ”లో చెప్పింది. మన రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావటంతో మాట మార్చింది. ఫిబ్రవరి పన్నెండు కార్మికుల సార్వత్రిక సమ్మె సందర్భంగా రైతులు మద్దతు ప్రకటించి నిరసన కార్యక్రమాల్లో పాల్గ్గొన్నారు. అలాగే ఐదేండ్ల పాటు ప్రతి ఏటా వంద బిలియన్‌ డాలర్ల అమెరికన్‌ వస్తువులు, ఇంథనాన్ని కొనుగోలు చేసేందుకు భారత్‌ అంగీకరించినట్లు తొలుత చెప్పారు. తరువాత మాట మార్చి అంగీకారం కాదు వాంఛిస్తున్నదని సవరించారు. డిజిటల్‌ సేవలపై పన్నులు ఎత్తివేసేందుకు మోడీ సర్కార్‌ అంగీకరించిందని తొలుత ప్రకటించారు.తరువాత దానికి సంబంధించిన పేరాను తొలగించారు.దాని బదులు డిజిటల్‌ వాణిజ్య సేవల గురించి సంప్రదింపులు జరిపేందుకు అంగీకరించిదని మార్చారు. ఇలా అమెరికా రోజుకొక మాట చెబుతున్నా మోడీ నోరు విప్పటం లేదు, ఇదేమని అడిగిన వారిని అభివృద్ధి నిరోధకులు, దేశ వ్యతిరేకులని ముద్ర వేస్తున్నారు. మార్చి నెలలో సంతకాలు జరుగుతాయని చెబుతున్న ఒప్పందంలో ఇంకెన్ని చేరుస్తారో, ఆ తరువాత చేర్చటానికి మరెన్ని షరతులకు అంగీకరిస్తారో, రైతాంగాన్ని ఎలా నట్టేట ముంచేందుకు చూస్తున్నారో తలచుకొంటే ఆందోళన కలుగుతోంది, జనం ఎలా స్పందిస్తారో చూద్దాం !