Tags
అవినీతి ఆరోపణల పూర్వరంగంలో వెల్లడైన తీవ్ర వత్తిడి మేరకు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్ జుమా తొలుత మొరాయించినా చివరకు తలొగ్గి రాజీనామా చేయక తప్పలేదు. గత గురువారం నాడు జుమా రాజీనామా వెంటనే ఉపాధ్యక్షుడిగా వున్న సిరిల్ రమఫోసా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. పదవి నుంచి గౌరవ ప్రదంగా తప్పుకోవాలని దక్షిణాఫ్రికా పాలక కూటమి ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్(ఏఎన్సీ) జాతీయ కార్యవర్గం చేసిన నిర్ణయాన్ని మరోదారి లేక అమలు జరిపిన తొలి అధ్యక్షుడు తాబో ఎంబెకీ కాగా, రెండవ అధ్యక్షుడిగా జాకబ్ జుమా చరిత్రకెక్కారు. 1994లో జాత్యహంకార పాలన అంతమైన 24ఏండ్లలో తొలి అధ్యక్షుడు నెల్సన్ మండేలా అన్న విషయం తెలిసిందే. మరొకరు ఒక ఏడాదిపాటు తాత్కాలిక అధ్య క్ష బాధ్యతలలో వున్నారు. మండేలా తరువాత దీర్ఘకాలం పదవిలో వున్న ఎంబెకీ, జుమా రాజీనామాలతో ఇంటిదారి పట్టటం ఏఎన్సీ బలహీనతలు, బలాన్ని సూచిస్తున్నది.
జుమా రాజీనామా చేసి పదవి నుంచి తప్పుకోవాలని పాలక త్రిపక్ష కూటమిలోని దక్షిణాఫ్రికా కమ్యూనిస్టుపార్టీ(ఎస్ఏసీపీ) గత కొద్ది డిమాండ్ చేస్తూ వస్తోంది. మరో పక్షమైన కార్మిక సంఘాల కూటమి(కొసాటు) కూడా రాజీనామా చేయాలని కోరింది. చివరకు ఏఎన్సీ కార్యవర్గం సుదీర్ఘ తర్జనభర్జనల అనంతరం జుమా రాజీనామా కోరుతూ తీర్మానించింది. జుమా పాలనలో అనేక అవినీతి ఆరోపణలు, ఆశ్రిత పక్షపాత వంటి ఆరోపణలతో పాటు అనేక రంగాలలో వైఫల్యం కారణంగా 2016లో జరిగిన స్ధానిక సంస్ధల ఎన్నికలలో ఏఎన్సీ అనేక పరాజయాలు చవిచూసింది. ఏఎన్సీ పరువు ప్రతిష్టలు నిలబడాలంటే, కార్పొరేట్ వ్యతిరేక చర్యలు తీసుకొనేందుకు గాను జుమా రాజీనామా చేయాలన్న డిమాండ్ను ముందుగా కమ్యూనిస్టుపార్టీ లేవెనెత్తింది. దానితో ఆగ్రహించిన జుమా కమ్యూనిస్టు మంత్రి ఒకరిని తొలగించారు. జుమాపై చర్యతీసుకోని పక్షంలో తాము అధికార కూటమి నుంచి వైదొలుగుతామని, అవసరమైతే వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలలో వంటరిగా పోటీ చేస్తామని కమ్యూనిస్టులు హెచ్చరించారు. డిసెంబరులో ఏఎన్సీ పార్టీ అధ్యక్షుడిగా జుమాను తొలగించి సిరిల్ రాంఫొసా ఎన్నికైన తరువాత ఏఎన్సీ కార్యవర్గం ఏదో ఒక నిర్ణయం చేయాల్సిన పరిస్ధితి ఏర్పడింది. దానిలో భాగంగానే పదవి నుంచి మర్యాద పూర్వకంగా తప్పుకోవాలని కోరింది. దానికి జుమా తిరస్కరించటంతో అల్టిమేటం జారీ చేయాల్సి వచ్చింది.
సిరిల్ రాంఫొసా
జాత్యహంకార పాలనకు వ్యతిరేకంగా సాగిన పోరులో ఆయుధాలు పట్టిన జుమా అనేకమంది ఇతర నేతల మాదిరిగానే జైలు పాలయ్యారు. యువనేతగా దేశం దృష్టిని ఆకర్షించిన ఆయన 1997లో ఏఎన్సీ ఉపాధ్యక్షుడిగా, 1999లో దేశ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. తరువాత ఐరోపా కంపెనీతో జరిగిన ఆయుధ లావాదేవీలలో చోటు చేసుకున్న అక్రమాలతో జుమాకు సంబంధమున్నట్టు ఆరోపణలొచ్చాయి. జుమా ఆర్ధిక సలహాదారు నిందితుడిగా తేలాడు. జుమా2005లో పదవీచ్యుతుడయ్యాడు. తానెలాంటి అక్రమాలకు పాల్పడలేదని, అధ్యక్షుడు తాబో ఎంబెకీ అక్రమాలను వ్యతిరేకించినందుకు తనను కేసులలో ఇరికించారని చేసిన వాదనలను ఏఎన్సీ నాయకత్వం విశ్వసించింది. దాంతో ఎంబెకీని రాజీనామా చేయించి ఆ స్ధానంలో జుమాను 2009లో అధ్యక్షుడిగా నియమించారు. ఇటీవల జుమాపై 18 అంశాలలో వచ్చిన అవినీతి, ఆరోపణలపై విచారణ ఎదుర్కోవాల్సిందేనని ప్రతిపక్ష డెమోక్రటిక్ అలయన్స్ దాఖలు చేసిన కేసులో సుప్రీంకోర్టు గతేడాది స్పష్టం చేసింది. తాను అమాయకుడిని అన్న జుమా వాదన కోర్టు కొట్టివేసింది. డిసెంబరు 13న ఇచ్చిన తీర్పులో జుమా, అతని అనుచరులపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణకు ఒక కమిషన్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఆ మేరకు జనవరిలో ఒక కమిషన్ ఏర్పడింది. ఒక అవినీతి నివేదికను తొక్కిపెట్టటంలో జుమా అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టు మరో కేసులో న్యాయస్ధానం స్పష్టం చేసింది. భారతీయ సంతతికి చెందిన గుప్తా కుటుంబం జుమాతో వున్న సంబంధాలను ఉపయోగించుకొని అనేక ప్రభుత్వ కాంట్రాక్టులను పొందినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. కోర్టు తీర్పుల తరువాత వారం రోజులకే డిసెంబరు 18న జుమాను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించి సిరిల్ రాంఫొసాను ఎన్నుకున్నారు.
ఏఎన్సీ జాత్యహంకార పాలన అంతం కోసం ఏర్పడిన ఒక బూర్జువా వేదిక. సోషలిస్టు సమాజ స్ధాపనలక్ష్యంగా ఏర్పడింది దక్షిణాఫ్రికా కమ్యూనిస్టుపార్టీ (ఎస్ఏసీపీ). ఈ రెండు శక్తులు పని చేస్తున్న కార్మిక సంఘాలతో ఏర్పడిన సమాఖ్య (కొసాటు). దశాబ్దాల తరబడి ఒకే లక్ష్యంతో పనిచేసిన ఈ శక్తులు ఏఎన్సీలో భాగస్వాములు. 1994లో శ్వేతజాతి పాలన అంతమైన తరువాత ఏఎన్సీ పతాకం, గుర్తుపైనే వారందరూ ఎన్నికలలో పోటీ చేసి పాలనలో భాగస్వాములయ్యారు. అవినీతి ఆరోపణలతో ఇద్దరు అధ్యక్షులను అర్ధంతరంగా తొలగించటం ఏఎన్సీ బలహీనత. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చటంలో విఫలమైనప్పటికీ జనంలో ఇంకా విశ్వాసం ఉన్నకారణంగానే రాజీనామా చేసిన అధ్యక్షులు తోక ముడవటం దాని బలానికి చిహ్నం. గత 24ఏండ్లుగా ఏఎన్సీ అనుసరించినవి స్ధూలంగా నయా ఉదారవాద విధానాలు తప్ప మరొకటి కాదు. పర్యవసానంగా జనంలో తీవ్ర అసంతృప్తి నెలకొన్నది. జాత్యహంకార పాలన అంతమైన తరువాత జాతీయ ప్రజాస్వామిక విప్లవాన్ని(ఎన్డీఆర్) సాధించాలన్నది త్రిపక్ష కూటమి అంగీకరించిన కార్యక్రమం. 1995లో కూటమి అంగీకరించిన ‘స్వేచ్ఛా ప్రణాళిక”లో దీనిని చేర్చారు.
అయితే ఆచరణలో దీనికి భాష్యాలు భిన్నంగా ఉన్నాయి. నల్లజాతి సాధికారత అంటే ప్రజాస్వామిక వ్యవస్థ ఏర్పాటు చేసి గుత్తాధిపతులుగా వున్న శ్వేతజాతి పెట్టుబడిదారులతో సమంగా అవకాశాలు కల్పించటం అన్నది ఏఎన్సీ అవగాహనగా కనిపిస్తున్నది. ప్రజాస్వామిక వ్యవస్థను ఏర్పాటు చేయటంతో పాటు ప్రత్యేకించి నల్లజాతీయులను, ఆఫ్రికన్లందరినీ తొలుత విముక్తి చేయాలని, జాతివివక్ష లేని సమాజాన్ని ఏర్పాటు చేసి సోషలిస్టు వ్యవస్థ స్థాపనకు దారి తీసే విధంగా ముందు దశగా ఎన్డీఆర్ను అమలు జరపాలన్నది కమ్యూనిస్టుపార్టీ అవగాహన. ప్రస్తుతం అధ్యక్షుడిగా ఎన్నికైన ఒకనాటి కార్మికనేత సిరిల్ రమఫోసా 1994 తరువాత వాణిజ్య, పారిశ్రామికవేత్తగా ఎదిగాడు. అలాంటి వారు ఏఎన్సీలో ఎందరో ఉన్నారు. రాజీనామా చేసిన జుమా భారతీయ సంతతికి చెందిన గుప్తా సోదరులకు అండదండలిచ్చి అవినీతికి పాల్పడిన విషయం తెలిసినదే. స్థానిక నల్లజాతి, శ్వేతజాతి వ్యాపారులు తమ పోటీదార్లకు మద్దతు ఇవ్వటాన్ని సహించలేక జుమాపై వత్తిడి తేవటంలో వారు కూడా తమవంతు పాత్ర పోషించారనే అభిప్రాయాలున్నాయి. పన్నెండేండ్ల క్రితం జాతీయ ప్రజాస్వామిక విప్లవం గురించి సమీక్షించిన కమ్యూనిస్టుపార్టీ సాధించిన విజయాలను తక్కువ చేసి చూడనవసరం లేదని అయితే మొగ్గు పెట్టుబడిదారీ వ్యవస్ధను పటిష్టపరిచే వైపే ఉందని అభిప్రాయపడింది. అప్పటి నుంచి అక్కడి పరిణామాలలో పెద్ద మార్పులేమీ లేవు. జాత్యహంకార వ్యవస్థ రద్దయిన తరువాత నల్లజాతీయులలో విద్యావ్యాప్తి, గృహవసతి, తదితర సంక్షేమ చర్యలకు పెద్ద మొత్తంలో ప్రభుత్వం నిధులు కేటాయించినమాట వాస్తవం. ఒక అంచనా ప్రకారం 45శాతం కుటుంబాలు సామాజిక భద్రతా పధకాల కింద ఆర్థిక సాయం పొందుతున్నాయని చెబుతున్నారు. అయితే ఇవి పేదలకు ఉపశమనం కలిగించేవి తప్ప మరొకటి కాదు.
ఇప్పటికీ 95శాతం సంపదలు పదిశాతంగా వున్న శ్వేతజాతీయుల చేతుల్లో ఉన్నాయి. సారవంతమైన భూములు కూడా వారికిందే ఉన్నాయి. 14శాతం భూములు ప్రభుత్వానికి చెందినవి కాగా, 79శాతం వివిధ ట్రస్టులు, ఇతర రూపాలలో శ్వేతజాతీయుల ఆధిపత్యంలోనే వున్నాయి. వాటిని స్వాధీనం చేసుకొనేందుకు ఇంతవరకు సరైన చట్టాలను రూపొందించలేదు. వాటికి పరిహారం ఇచ్చి స్వాధీనం చేసుకోవాలా లేక ఇవ్వకుండా తీసుకోవాలా అనే చర్చ ఇంకా ఏఎన్సీలో నడుస్తూనే వుంది. అంటే సూత్రప్రాయంగా అంగీకరిస్తూనే ఆచరణలో నీరుగార్చటం తప్ప మరొకటి కాదు.
1994 నుంచి గతేడాది జనవరి వరకు ప్రభుత్వం 49లక్షల హెక్టార్ల భూమి స్వాధీనం చేసుకుంది. దీనిలో 34లక్షల హెక్టార్లను పంపిణీ చేసింది. ఇదిగాక మరొక పథకం ప్రకారం స్వాధీనం చేసుకున్న భూమిలో సగానికి ప్రభుత్వం పరిహారం ఇచ్చి దానిని సమభాగస్వామ్య పద్ధతిలో నల్లజాతీయులు- శ్వేతజాతీయులతో సాగు చేయించటం కూడా చేస్తున్నది. ఇలాంటివి కొన్ని ఉన్నప్పటికీ మొత్తం మీద భూకేంద్రీకరణ దెబ్బతీసి మెజారిటీ ప్రజలకు అప్పగించి వారి ఆదాయాల పెంపుదలకు విప్లవాత్మక చర్యలేవీ తీసుకోలేదు. ఇలాంటి తీరుతెన్నుల కారణంగానే సమాజంలోని మెజారిటీ తరగతులలో అసంతృప్తి పెరుగుతోంది. అది పాలక కూటమిలో రాజకీయ సమస్యలకు దారితీస్తున్నది. దక్షిణాఫ్రికాలో అవినీతి ఒక పెద్ద సమస్యగా తయారైంది. పెట్టుబడిదారీ వ్యవస్ధలో వస్తూత్పత్తితో పాటు అవినీతి ఒక ఉప ఉత్పత్తిగా వుంటుంది. అందువలన అధ్యక్షులు మారినప్పటికీ అవినీతి ఏదో ఒక రూపంలో కొనసాగుతూనే వుంటుంది. పైకి ఏమి చెప్పినప్పటికీ నయా ఉదారవాద విధానాలనే అమలు జరుపుతున్నందున రానున్న రోజులలో ఏఎన్సీలో అంతర్గత వైరుధ్యాలు తలెత్తటం అనివార్యం.
జాకబ్ జుమా రాజీనామాతో ఒక ఘట్టం ముగిసింది తప్ప అవినీతి సమస్య పరిష్కారం కాలేదు. అవినీతిపరులపై కఠిన చర్యలు తీసుకోవాల్సి వుంది. నాటకీయ పరిణామాల మధ్య జుమా స్ధానంలో రమాఫోసా వచ్చారు. వచ్చే ఏడాది ఏప్రిల్లో ఎన్నికలు జరగనున్నాయి. రమాఫోసా ఇంతవరకు మంత్రివర్గాన్ని ప్రకటించలేదు. మంత్రుల శాఖలు, సంఖ్యను కూడా తగ్గిస్తానని అధ్యక్షుడిగా పార్లమెంట్ తొలి ఉపన్యాసంలో చెప్పారు. ఏఎన్సీ ప్రతిష్ట పెంచాలంటే కొంతమంది మంత్రుల పేర్లను ఉటంకిస్తూ వారిని తిరిగి చేర్చుకోరాదని కొసాటు డిమాండ్ చేసింది. రమాఫోసా పాత వ్యవస్థతోనే ప్రయాణించాలని చూడటాన్ని మెజారిటీ జనం అంగీకరించరని, అది ఆయనను ఎక్కువ దూరం ప్రయాణించనివ్వదని కమ్యూనిస్టు పార్టీ హెచ్చరించింది. మంత్రివర్గానికి కాయకల్ప చికిత్స చేయాలని, మంత్రిత్వశాఖలను పునర్విభజించాలని కూడా కోరింది.
రానున్న రోజులలో జాతీయ ప్రజాస్వామ్య విప్లవ కార్యాచరణ గురించి త్రిపక్ష కూటమిలో అంతర్గత పోరు తీవ్రమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అవి ముదిరితే రాజకీయ పునరేకీకరణకు దారితీసినా ఆశ్చర్యం లేదు. అనివార్యమైన ఈ పరిణామం ఎప్పుడన్నదే సమస్య. అంగీకృత కార్యక్రమం నుంచి వైదొలుగుతున్న తీరు కనిపించినా ఏఎన్సీలో కమ్యూనిస్టుపార్టీ, కొసాటు ఇంతకాలం కొనసాగటమే ఆశ్చర్యం. వివిధ ఎన్నికలలో తగిలిన ఎదురుదెబ్బలు, పలు తరగతులలో పెరుగుతున్న అసంతృప్తి కారణంగా కమ్యూనిస్టుపార్టీ పునరాలోచనలో పడింది. ఏఎన్సీ నుంచి విడగొట్టుకోవాలనే ఆలోచన దానిలో ప్రారంభమైంది. డిసెంబరులో జరిగిన ఏఎన్సీ సభలో కమ్యూనిస్టు పార్టీ నేత జిమాండే జాతీయ కార్యవర్గానికి ఎన్నిక కాలేదు. పార్టీలు వేర్వేరుగా వున్నప్పటికీ చట్టసభలకు ఏఎన్సీ గుర్తుమీదే మూడు పక్షాలూ పోటీ చేస్తున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్లో జరిగే ఎన్నికల నాటికి ఈ కూటమి ఇలాగే వుంటుందా అన్నది ఒక పెద్ద ప్రశ్న. తాము వచ్చే ఎన్నికలలో విడిగా పోటీ చేస్తామని కమ్యూనిస్టుపార్టీ నాయకులు చెబుతున్నారు. కింది శాఖలలో అలాంటి చర్చ అనుమతిస్తున్నారు. రానున్న ఎన్నికలలో విడిగా ప్రచారం చేయాలని కమ్యూనిస్టుపార్టీ మహాసభ గతేడాది నిర్ణయించింది. అవసరమైతే వచ్చే ఎన్నికలలో విడిగా పోటీ చేసే దిశలో ఇదొక అడుగుగా చెప్పవచ్చు. ఏఎన్సీ పాలనలో అవినీతికి వ్యతిరేకంగా కమ్యూనిస్టులు గళమెత్తుతున్నారు. తొమ్మిదేండ్ల క్రితం ఏ కమ్యూనిస్టుపార్టీ జాకబ్ జుమాను బలపరిచిందో అదే పార్టీ అతడిని తొలగించాలని ముందుగా గళమెత్తింది. అనేక అంశాలపై పార్టీ విభేదిస్తున్నది. అందువలన వచ్చే ఎన్నికల నాటికి అది దేశాన్ని నడిపించేందుకు తనదైన పంథాలో పయనిస్తుందా అన్నది ఆసక్తి కలిగించే అంశం. అదే అయితే కమ్యూనిస్టుపార్టీ, కొసాటు ఒకవైపు, ఏఎన్సీ మరోవైపు అధికారం కోసం పోటీపడినా ఆశ్చర్యం లేదు.