Tags
BJP, Chinese weapons capability matters, India-Pak conflict, India’s Rafale ordeal, Military Matters, Narendra Modi Failures, SIPRI
ఎం కోటేశ్వరరావు
పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా మన మిలిటరీ జరిపిన ఆపరేషన్ సిందూర్లో ఉపయోగించిన ఆయుధాలు, పాకిస్తాన్ ప్రయోగించిన వాటి గురించి దేశంలో, ప్రపంచ వ్యాపితంగా చర్చ జరుగుతోంది. ఉద్రిక్తతల సమయాల్లో వెలువడే అభిప్రాయాలు పూర్తిగా నిజమే లేదా పూర్తిగా అవాస్తమే అని భావించినా పప్పులో కాలేసినట్లే. ఆయుధదాడులు కొన్ని ప్రాంతాలకే పరిమితం అయితే దానికంటే ప్రమాదకరమైన తప్పుడు వార్తల ప్రచారదాడి ఎక్కువగా జరుగుతోంది. అందువలన వినదగునెవ్వరు చెప్పిన…. అన్నట్లుగా వేగపడకుండా నిదానంగా వాస్తవాలు తెలుసుకోవాలి.ఈ క్రమంలో సంక్షిప్తంగా కొన్ని అభిప్రాయాలను చూద్దాం.వాటితో ఎవరైనా విబేధించవచ్చు, ఏకీభవించవచ్చు. క్షిపణుల తయారీ మన శాస్త్రవేత్తల ఘనత తప్ప రాజకీయనేతలది కాదు. మన దేశం ఆయుధాల ఎగుమతి గురించి గోరంతలను కొండంతలు చేస్తూ నరేంద్రమోడీ భజన చేస్తున్నారు. ఇదీ ప్రచారదాడే !
చైనా బజార్ల పేరుతో అమ్మిన ఢల్లీి నకిలీ సరుకునంతా చైనాకు అంటగట్టి తూలనాడిన రోజులున్నాయి. కొన్ని వస్తువుల నాణ్యత ప్రశ్నార్దకంగా ఉండవచ్చు.వాటిని కొనాలని చైనా ఎవరినీ బలవంతం చేయలేదు. ఇప్పుడు దాని ఆయుధాల నాణ్యత గురించి చర్చ జరుగుతోంది. చైనా తయారీ నూతన ఆయుధాలను ఏ యుద్ధం లేదా ఘర్షణల్లో ప్రత్యక్షంగా వాడని మాట వాస్తవం. అమెరికా తన ఆయుధాలకు ఇరాన్, ఇరాక్, ఇతర యుద్ధాలను ప్రయోగశాలలుగా చేసుకున్నది. అందుకని అనేక మందికి చైనా వాటి సామర్ధ్యం మీద అనుమానాలు ఉండటం సహజం. పాకిస్తాన్ వాటిని మనదేశం మీద ప్రయోగించిన తరువాత అనుకూలంగా వ్యతిరేకంగా విశ్లేషణలు వెలువడుతున్నాయి.తాజాగా కొత్త పల్లవి అందుకున్నారు. చైనా ఆయుధాల వెల తక్కువేగానీ, వాటి నిర్వహణ, మరమ్మతులు ఖర్చు ఎక్కువ అంటూ కొందరు అమెరికా, ఐరోపా ధనికదేశాల ఆయుధాల నిపుణులు చాణక్యనీతిని ప్రయోగిస్తున్నారు.
పాకిస్తాన్ ఉపయోగించిన చైనా ఆయుధాలను చూసిన తరువాత వాటి సామర్ధ్యంపై నెలకొన్న ఆందోళనకు ముగింపు పలికినట్లు కనిపిస్తోందని అకడమిక్ గులాం అలీ పేర్కొన్నారు.‘‘ రాఫేల్ కూల్చివేత : ప్రపంచ వేదికపై చైనా ఆయుధాలకు ఒక మలుపు ? ’’ అని సింగపూర్ ప్రెస్ హోల్డింగ్స్ అనే సింగపూర్ కంపెనీ నిర్వహిస్తున్న ‘‘ థింక్చైనా ’’ అనే పత్రిక(వెబ్) 2025 మే 16వ తేదీన ప్రచురించిన విశ్లేషణలో ఉంది.కొన్ని అంశాల సారం ఇలా ఉంది. పశ్చిమ దేశాలు అమ్మే అయుధాలకు షరతులు ఉంటాయి, చైనా ఎలాంటి ఆంక్షలు పెట్టదు. ఎలా కావాలంటే అలా ఉపయోగించుకోవచ్చు. వెల తక్కువ, పశ్చిమదేశాల వాటితో పోలిస్తే నాణ్యత తక్కువని భావించటానికి ప్రధాన కారణాలలో ఇది ఒకటి.1979 తరువాత నేరుగా చైనా ఆయుధాలను ఉపయోగించిన దాఖలా లేదు గనుక నాణ్యత గురించి అనుమానం. అందుకే అమెరికా, ఇతర పశ్చిమ దేశాల ఆయుధాలకు ప్రాధాన్యత ఇస్తారు.మేనెల ఏడవ తేదీ చైనా జెట్ విమానాలకు అమర్చిన చైనా క్షిపణులతో పాకిస్తాన్ ఐదు భారత జెట్లను కూల్చివేసింది గనుక ఈ ఉదంతం చైనా ఆయుధాల గురించి ఉన్న అభిప్రాయాన్ని గణనీయంగా దెబ్బతీసింది.దీంతో మార్కెట్లో చైనా వాటా పెరిగింది. రంగంలో ఒక రాఫెల్ జెట్ను కూల్చివేయటం దాని చరిత్రలో ఇదే తొలిసారి, అదే విధంగా చైనా జె10, పిఎల్15క్షిపణికి కూడా ఇదే ప్రధమం. మూడు రాఫెల్ జెట్లను కూల్చివేసినట్లు పాకిస్తాన్ ప్రకటించగానే వాటి తయారీ సంస్థ దసాల్ట్ వాటాల ధర ఆరుశాతం తగ్గింది, మరోఐదుశాతం తగ్గవచ్చని భావిస్తున్నారు. చైనా జెట్ల తయారీ కంపెనీ ఎవిఐసి ధర ఒక్కరోజే 17.05శాతం, మరోకంపెనీ 6శాతం, మొత్తంగా చైనా ఆయుధ కంపెనీల వాటాలు 1.6శాతం పెరిగాయి. ఈ పరిణామం అనేక ప్రాంతాల్లో చైనా పలుకుబడి, విశ్వసనీయత పెరగటానికి తోడ్పడుతుంది.
స్విడ్జర్లాండ్ వెబ్ పోర్టల్ ఎన్జెడ్జెడ్.సిహెచ్ మే 16వ తేదీన ప్రచురించిన విశ్లేషణకు ‘‘ పాకిస్తాన్పై భారత్ దాడి సమయంలో ఫ్రెంచి రాఫేల్ కూల్చివేత పశ్చిమదేశాలకు పాఠం చెబుతుంది ’’ అని పెట్టారు.పాకిస్తాన్, దాని ఆక్రమణలో ఉన్న కాశ్మీరుపై భారత్ జరిపినదాడి సందర్భంగా చైనా నిర్మిత జెట్తో భారత్ కనీసం ఫ్రాన్సు నిర్మించిన ఒక ఆధునిక జెట్ను కోల్పోయింది. ఈ నష్టం తన స్వంత మిలిటరీ వ్యూహాలను పరిశీలించుకొనేందుకు ఐరోపాకు ఒక మేల్కొలుపు. ఈ ఉదంతం పశ్చిమదేశాల మిలిటరీ సాంకేతికతల సామర్ధ్యం గురించి ఆందోళన కలిగించింది.ఐరోపా వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి రాఫేల్ మీద చాలా ఎక్కువగా ఆధారపడి ఉంది. పశ్చిమదేశాల వైమానిక దళాలు చైనా, రష్యా రక్షణ వ్యవస్థలకు వ్యతిరేకంగా తమ సన్నద్దతను మెరుగుపరచుకోవాలి.పరిస్థితికి తగిన జాగరూకత లేకపోతే ఆధునిక పరిజ్ఞానం మీదే ఆధారపడితే కుదరదు.అమెరికా, ఇజ్రాయెల్ మాదిరి ఎలాంటి నష్టం లేకుండా చూసుకొనేందుకు ముందస్తు సూచన లేకుండా భారత్ కూడా చేసింది, భారత వైమానికులు తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొన్నారు. సాంకేతికంగా ఉన్నతంగా ఉన్నామనే భావన మీద ఆధారపడి పాకిస్తాన్ సామర్ధ్యాలను భారత్ తక్కువ అంచనా వేసింది. మరోవైపు చైనా జె10 జెట్ మరియు పిఎల్15 క్షిపణి సామర్ధ్యం గురించి వైమానిక దళం తక్కువ అంచనా వేసింది.
డిఫెన్స్ ఇండస్ట్రీ యూరోప్ అనే వెబ్సైట్ ‘‘ కాశ్మీరు వివాదంలో భారత రాఫేల్ ఫైటర్ జెట్ కూల్చివేత ’’ అనే శీర్షికతో విశ్లేషణ చేసింది. భారత్ ఒక రాఫెల్ జెట్ను కోల్పోయినట్లు పేర్కొన్నది. అనధికారికంగా ఫ్రెంచి అధికారులు నిర్ధారించారు, అమెరికా వర్గాలు కూడా చెప్పాయని తెలిపింది. డిఫెన్స్ సెక్యూరిటీ ఆసియా అనే వెబ్సైట్ మే 15వ తేదీన వెల్లడిరచిన విశ్లేషణకు ‘‘ రాఫేల్ కూల్చివేత ? బిలియన్ల డాలర్ల ఒప్పందంపై ఇండోనేషియా పున:సమీక్షలో పడటంతో ఫ్రెంచి జెట్ పరువుపై దాడి ’’ అని పేరు పెట్టింది.మూడు భారత రాఫేల్ విమానాలను కూల్చినట్లు పాకిస్తాన్ ప్రకటించటంతో ఇండోనేషియా ఉన్నత స్థాయి రక్షణ అధికారులు రాఫేల్ యుద్ధ సామర్ధ్యం గురించి సమీక్ష చేస్తున్నట్లు తెలిసింది. ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి వెలువడిన ప్రకటనల ఆధారంగా నిర్దారణలకు రాకూడదని నిపుణులు హెచ్చరించినట్లు కూడా దానిలో ఉటంకించారు.ఎంతో అనుభవం ఉన్న అమెరికా తయారీ ఎఫ్16,18,22 రకాలను కూడా కూల్చివేశారని కూడా గుర్తు చేశారు. ఇటీవల జరిపిన పత్రికా గోష్టిలో భారత ఎయిర్ మార్షల్ ఎకె భారతి ఒక ప్రశ్నకు సమాధానంగా ‘‘ మేం యుద్ధ తరహా పరిస్థితిలో ఉన్నాం పోరులో నష్టాలు భాగంగా ఉంటాయి ’’ అన్న మాటలు పరోక్షంగా విమానాలను కోల్పోయినట్లుగా అంగీకరించినట్లే అని కొందరు విశ్లేషించారు. విమర్శలు వచ్చినప్పటికీ రాఫెల్ ప్రపంచంలో ఇప్పుడున్న వాటిలో మంచి వాటిలో ఒకటి అని కొందరు మద్దతు ఇచ్చినట్లు కూడా ఈ విశ్లేషణలో పేర్కొన్నారు. ఇండోనేషియా సామాజిక మాధ్యమంలో వస్తున్న వ్యాఖ్యలను కూడా ప్రస్తావించింది. ‘‘ జె10జెట్లతో దాన్ని ఎదుర్కోవచ్చని, అదెంతో చౌకని తెలుసుకొని ఒక ఇండోనేషియన్గా రాఫేల్ జెట్లను కొనుగోలు చేస్తున్నందుకు విచారపడుతున్నాను. మా అధ్యక్షుడు కొన్ని జె10 జెట్లు, ఇతర చైనా మిలిటరీ పరికరాలను కొనుగోలు చేస్తారని భావిస్తున్నాను.’’ అన్న ఎక్స్ పోస్టును మచ్చుకు ఉటంకించింది. ‘‘ భారత్ మరియు పాకిస్తాన్ వివాదం తరువాత చైనా ఆయుధాలకు పెరిగిన విశ్వసనీయత ’’ అనే శీర్షికతో మే 13వ తేదీన బ్లూమ్బెర్గ్ మీడియా ఒక విశ్లేషణ వెలువరించింది.ఇదేమీ చైనా అనుకూల సంస్థ కాదు. చైనాలో తయారయ్యే ఆయుధాలు నాశిరకం అనే అభిప్రాయం ఉన్నవారు మరోసారి మదింపు చేసుకోవాలని పేర్కొన్నది. తైవాన్ ఏర్పాటు చేసిన మేథోసంస్థ పరిశోధకుడు షు హసియావో హువాంగ్ మాట్లాడుతూ ‘‘ పిఎల్ఏ(చైనా మిలిటరీ) యుద్ధ సామర్ధ్యాల గురించి మరోసారి మదింపు చేసుకోవాల్సి ఉంది. తూర్పు ఆసియాలో అమెరికా మోహరించిన వైమానిక శక్తికి చైనా దగ్గరగా వస్తుండవచ్చు లేదా అధిగమించనూ వచ్చు ’’ అన్నట్లు బ్లూమ్బెర్గ్ పేర్కొన్నది. పాకిస్తాన్కు అందచేసిన తరువాత దాడుల్లో తొలిసారిగా వినియోగించిన చైనా జె10సి విమానం సత్తాను రుజువు చేసుకుంది, ఇప్పటి వరకు వాటిని తైవాన్ జలసంధిలో పహారాకు మాత్రమే మోహరించారు. పేద దేశాలకు చైనా ఆయుధాలు ఆకర్షణగా ఉంటాయని సింగపూర్లోని రాజారత్నం అంతర్జాతీయ అధ్యయనాల సంస్థ అసిస్టెంట్ ప్రొఫెసర్ జేమ్స్ చెప్పటాన్ని విశ్లేషణలో ఉటంకించారు. చైనా ప్రభుత్వ సంస్థలు ఆయుధ ఎగుమతులకు సంబంధించి వివరాలను వెల్లడిరచనప్పటికీ స్టాక్హోంలోని సిప్రి సంస్థ అంచనా ప్రకారం గడచిన ఐదు సంవత్సరాల్లో చైనా ఎగుమతులు మూడిరతలకు పైగా పెరిగాయని బ్లూమ్బెర్గ్ పేర్కొన్నది.
చైనా ఆయుధాలు నాణ్యమైనవి కాదనే వారు కొన్ని ప్రశ్నలకు జవాబులు చెప్పాల్సివుంది. గడచిన మూడు దశాబ్దాల్లో చైనా ఆయుధ దిగుమతులను తగ్గించుకొని తానే స్వంతంగా తయారు చేసుకుంటున్నది. అత్యంత ఆధునిక ఆయుధాలను తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్కు అమెరికా విక్రయిస్తున్నది, పక్కనే ఉన్న జపాన్, దక్షిణ కొరియాలలో సైనిక స్థావరాలను ఏర్పాటు చేసుకొన్న అమెరికా అత్యాధునిక ఆయుధాలను చైనాకు వ్యతిరేకంగా మోహరించింది, దక్షిణ చైనా సముద్ర ప్రాంతాన్ని వివాదం గావిస్తూ తనకు అనుకూలమైన దేశాలను సమీకరిస్తున్నపుడు సత్తా ఏమిటో రుజువుకాని తన ఆయుధాల మీద ఆధారపడేంత అమాయకంగా చైనా ఉంటుందా అన్నది ప్రశ్న. 2014లో దిగుమతుల్లో మనదేశం, సౌదీ అరేబియా తరువాత చైనా 5.1శాతంతో ఉంది. ఇప్పుడు 1.8శాతానికి తగ్గిపోయాయి, మొదటి పది దేశాల్లో దాని పేరు కనిపించదు.
ప్రపంచంలో ఆయుధాల దిగుమతుల్లో మూడు సంవత్సరాలుగా యుద్ధంలో ఉన్న కారణంగా ఉక్రెయిన్ ప్రధమ స్థానంలో ఉంది. ఏటా మనదేశం వేలాది కోట్ల ధనాన్ని వేరేదేశాలకు సమర్పించుకోవటం కంటే స్వయంగా రూపొందించుకోవటం ఆర్థికంతో పాటు ఆయుధాలకోసం ఇతరుల మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు. నరేంద్రమోడీ నాయకత్వంలో మనదేశం ఆయుధాల ఎగుమతుల రంగంలో ప్రవేశించిందని కొంత మంది ఆహా ఓహో అంటున్నారు.కొన్ని ఆయుధాలను తయారు చేస్తున్నమాట నిజం, దిగుమతులు, ఎగుమతుల్లో ఎక్కడున్నామో అతిశయోక్తులు లేకుండా చెప్పాల్సి ఉంది. ఆయుధాలను దిగుమతి చేసుకొనే పది అగ్రశ్రేణి దేశాల జాబితా నుంచి 199094 తరువాత తొలిసారిగా 2024లో చైనా పేరు తొలగించారు.అంతగా స్వంత తయారీలో ఉంది. గత ఐదు సంవత్సరాలుగా ప్రపంచ ఆయుధాల ఎగుమతుల్లో 5.9శాతంతో చైనా నాలుగవ స్థానంలో ఉంది. మూడవ స్థానానికి చేరవచ్చని చెబుతున్నారు. మనం మాత్రం పదేండ్ల నుంచి దిగుమతుల్లో మొదటి స్థానంలోనే కొనసాగుతున్నాం. మన మేకిన్ ఇండియా కార్యక్రమం తీరిది. గతేడాది అంటే 202425లో మన దేశం ఎగుమతి చేసిన రక్షణ ఉత్పత్తుల విలువ రు.23,622 కోట్లని(2.76బిలియన్ డాలర్లు) రక్షణశాఖ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు, దీనిలో పదిహేనువేల కోట్లు ప్రయివేటు రంగం నుంచే ఉన్నాయి. 2029 నాటికి రు.50వేల కోట్ల లక్ష్యాన్ని నిర్ణయించారు. మనదేశం నుంచి ఆయుధాలు కొనుగోలు చేసే దేశాలకు రుణాలు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇది ఎవరికి ఎక్కువగా ఉపయోగపడుతుందో చెప్పనవసరం లేదు. మన మిలిటరీ ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్న దేశాలలో ఆర్మీనియా, అమెరికా, ఫ్రాన్సు అగ్రస్థానంలో ఉన్నాయి.ప్రపంచమంతటికీ ఆయుధాలను అమ్మే అమెరికా మనదగ్గర కొనేవాటిని తయారు చేసుకోలేని స్థితిలో ఉందా, కానే కాదు, వాటిని చౌకగా ఉత్పత్తి చేస్తున్నాం గనుక దానికి లాభం. హైటెక్ ఉత్పత్తులను అది అధికలాభాలకు మనవంటి దేశాలకు అమ్ముతున్నది.మనం ఆ స్థాయికి చేరటానికి ఇంకా చాలా సమయం పడుతుంది. పదేండ్లలో ఆయుధ దిగుమతుల్లో మన వాటా 9.5 నుంచి 8.3శాతానికి మాత్రమే తగ్గింది. వినియోగవస్తువుల ఉత్పత్తిలో చైనాను పక్కకు నెట్టి ప్రపంచ ఫ్యాక్టరీగా మారతామని చెప్పారు. అది జరగలేదు. రక్షణ ఉత్పత్తుల్లో స్వయం సమృద్ధి సాధిస్తే ఇతర దేశాల వత్తిళ్లకు గురికావాల్సిన అవసరం ఉండదు. పోనీ ఈ విషయంలోనైనా ముందడుగు పడిరదా అంటే ఇంకా చేయాల్సింది చాలా ఉందని అంకెలు చెబుతున్నాయి.పాకిస్తాన్ మీద జరిగిన దాడుల తరువాత తన ప్రతిష్టను పెంచుకోవటం మీదే ఎక్కువ శ్రద్ద పెడుతున్నట్లు కనిపిస్తోంది !
