Tags
America's tech war with China, India’s R&D, Narendra Modi, Narendra Modi Failures, R&D investment, Research on cow dung, Semicon India 2023, Semiconductor
ఎం కోటేశ్వరరావు
ప్రధాని నరేంద్రమోడీ గారికి,
అయ్యా ప్రతి నెలా మీ మన్కీ బాత్ అంశాలను చదివేవారిలో నేను ఒకరిని.ఒక జర్నలిస్టుగా జన్కీ బాత్లో ఉన్న కొన్ని ంటిని ఈ బహిరంగ లేఖ ద్వారా మీ ముందుకు తీసుకువస్తున్నాను. జూలై 28-30 తేదీలలో గుజరాత్ రాష్ట్ర రాజధాని గాంధీనగర్లోని మహాత్మా మందిర్లో తమరు సెమికాన్ ఇండియా 2023 రెండవ వార్షిక సమావేశాన్ని ప్రారంభించారు. ఆ సందర్భంగా దేశమంతటా పత్రికల్లో పూర్తి పేజీ ప్రకటనలు కూడా జారీ చేశారు. దేశాన్ని సెమీకండక్టర్ల కేంద్రంగా మార్చుతామని, మూడు వందల కాలేజీల్లో సెమికండక్టర్ కోర్సులను ప్రవేశపెడతామని తమరు ప్రకటించటం సంతోషం. గతంలో దేశంలో జరిగిన అనర్ధాలకు, వెనుకబడి ఉండటానికి,మనకు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం రాకపోవటానికి నెహ్రూనే కారణం అని బిజెపి, దాని మాతృసంస్థ సంఘపరివారం ఠకీమని సమాధానం చెబుతుంది. సెమికండక్టర్ల రంగంలో వెనుకబడటానికి కూడా నెహ్రూనే నిందిస్తారా ?
అన్నీ మీరే చేశారు అని మా తెలుగు సినిమాలో ఒక పాత్ర తండ్రిని తప్పుపడుతుంది. అలాగే అన్నీ ఆ నెహ్రూ చేశారనే కాసేపు అనుకుందాం.ఆయన అనుసరించిన విధానాల నుంచి కాంగ్రెస్ 1990దశకంలోనే నూతన ఆర్ధిక విధానాల పేరుతో వైదొలిగిందని మీకు తెలియంది కాదు. వాటినే మీరు అమలు జరుపుతున్నారు తప్ప కొత్త విధానాలు కాదు, ఎందుకంటే వాటిని మన మీద ప్రపంచ బాంకు, ఐఎంఎఫ్ రుద్దింది. గత పది సంవత్సరాలలో మీకు పూర్తి అధికారం ఉన్నప్పటికీ మీరు అంగీకరించినా లేకున్నా అనేక రంగాలలో వైఫల్యబాటలోనే దేశం ఉండటానికి కారణం ఆ విఫల విధానాలనే మరింత వేగంగా అమలు జరపటమే. అరిగిపోయిన రికార్డు అంటే ఇప్పటివారికి తెలియదు కనుక అన్నీ నెహ్రూనే చేశారు అనే పాచిపాట ఇంకా ఎంతకాలం పాడాలి అని మీ భక్తులు, జనం నుంచి ప్రశ్న ఇప్పుడు ఎదురవుతోంది. మీరు చెప్పిన మేకిన్ ఇండియా, మేడిన్ ఇండియా, దేశమంతటా గుజరాత్ నమూనా అభివృద్ధి వంటి విఫల నినాదాలను చూసిన తరువాత ఎన్నికల కోసం ఆడుతున్న ఆటలో భాగం ఇదని అనేక మంది భావిస్తున్నారు. ఎందుకంటే ఒకసారి ఇచ్చిన నినాదం, చెప్పిన మాట మరోసారి మీ నోటి వెంట రాదన్నది స్పష్టమే. మీ శైలి అనితరసాధ్యం. గతంలో అమెరికా, పూర్వపు సోవియట్ మధ్య ప్రచ్చన్న పోరులో అణ్వాయుధాలు కేంద్ర స్థానంలో ఉంటే ఇప్పుడు అమెరికా, చైనా మధó్య తలెత్తిన పోరులో సెమీకండక్టర్లు ఉన్నాయి.ఆయుధాలలో కూడా ఇవి కీలకంగా మారనున్నాయని విశ్వగురువుగా ప్రపంచాన్ని ఔపోసన పట్టిన మీకు నేను చెప్పాల్సినపని లేదు.
ఎయిర్బస్లో అనేక దేశాలను అలా వెళ్లి ఇలా చుట్టివచ్చిన మీరు సెమీకండక్టర్ బస్ను ఎలా మిస్ అయ్యారన్నది చాలా మందికి అర్ధం కావటం లేదు. తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తరువాత వచ్చిన ప్రధానులెవరికీ(వారిలో అతల్ బిహారీ వాజ్పాయి ఉన్నదీ లేనిదీ తెలియదు) దూర దృష్టి లేదని విమర్శించే మీ అనుయాయులు (సుబ్రమణ్య స్వామిని పక్కన పెడదాం) మీ గురించి ఏం చెబుతారో తెలియదు. ఎందుకంటే కాంగ్రెస్ యాభై సంవత్సరాలలో చేసిన దాన్ని మీరు తొలి ఐదు సంవత్సరాల్లోనే చేసి చూపించారని గత ఎన్నికలపుడు ప్రచారం చేశారు. చేసిందేమిటో సాధికారిక సమాచారాన్ని జనానికి అందిస్తే వాస్తవం తెలుస్తుంది. మన దేశంలో మీ కంటే ముందు నుంచి జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే(ఎన్హెచ్ఎఫ్ఎస్) పేరుతో వివరాలను సేకరిస్తున్నారు. దానిలో మీ పాలనలో అనేక సూచికలు దిగజారినట్లు కనిపించింది. మీ ఏలుబడిలో నిరుద్యోగం పెరిగిందన్న సమాచారాన్ని గత లోక్సభ ఎన్నికల ముందు తొక్కిపెట్టిన సంగతి మీకు చెప్పనవసరం లేదు. వచ్చే సర్వేలో ఎలాంటి ఫలితాలు వస్తాయో అని సమాచారాన్ని సేకరించే పద్దతిని రూపొందించే సంస్థ అధిపతినే తప్పించారు అని జనం అనుకుంటున్నారు.
నరేంద్రమోడీ పెద్ద విజనరీ అంటే భూత, వర్తమాన, భవిష్యత్ను చూడగలిగిన దృష్టి కలవారని అని ప్రచారం చేశారు. నిజమే కావచ్చు, సర్వేల్లో వచ్చే సమాచారం ఎలాంటిదో మీకు ముందే తెలిసి ఉంటుంది గనుక దాని రూపకర్తనే తొలగించారు. అన్నట్లు మరిచాను. ఈ ఏడాది మీ మీద ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతాయని మీరు ముందే గ్రహించి ఆ విషయాన్ని ఎన్నో సంవత్సరాల ముందే మీరు చెప్పినట్లు కొందరు సామాజిక మాధ్యమంలో మీ గొప్ప గురించి ప్రచారం చేస్తున్న పోస్టు ఉంది. దాని నిజా నిజాలు మీకే ఎరుక. నిజంగా మీకు తెలిసి ఉంటే మణిపూర్ దురంతాన్ని ఎందుకు నివారించలేకపోయారు అన్న ప్రశ్న వస్తోంది. దాన్ని వదలివేద్దాం. నాలుగవ తరం పారిశ్రామిక విప్లవం గురించి కూడా మీరు చెప్పారు. పిండి లేకుండా రొట్టెలు రావు కదా ? దానికి అవసరమైన పరిశోధన, అభివృద్ధి రంగాల ప్రాధాన్యత, దానిలో సెమికండక్టర్ల గురించి ప్రధాని కాగానే లేదా అంతకు ముందు గుజరాత్ సిఎంగా ఎందుకు పసిగట్టలేకపోయినట్లు ? ఈ రంగానికి నిధుల కేటాయింపు కేంద్ర ప్రభుత్వం లేదా ప్రైవేటు సంస్థలు చేయాల్సి ఉంది. రెండూ జరగటం లేదు. ముంబై కేంద్రంగా పని చేస్తున్న గేట్వే హౌస్ అనే ఒక మేథో సంస్థ 2015 జనవరి పదహారున టెక్నాలజీ పరుగులో చైనా ముందు భారత్ ఓడిపోనుందా అనే శీర్షికతో ఒక విశ్లేషణను ప్రచురించింది. మీ సలహాదారులకు దీని గురించి తెలియదని అనుకోలేము.లేదా ఇలాంటి వాటిని పట్టించుకోకపోతే మన దేశ ఖర్మ అనుకోవటం తప్ప చేసేదేమీ లేదు. దానిలో పరిశోధన, అభివృద్ది ఖర్చు గురించి చర్చించారు. 1991 నుంచి చైనా పరిశోధన ఖర్చును ఏటా 19శాతం పెంచుతూ 2012నాటికి జిడిపిలో 1.97శాతానికి చేరినట్లు పేర్కొన్నారు.అప్పటికి మనదేశ ఖర్చు 0.9శాతం మాత్రమే ఉంది.ఫస్ట్ పోస్ట్ అనే పత్రికలో 2023 ఫిబ్రవరి ఒకటిన ప్రచురితమైన ఒక విశ్లేషణలో జిడిపిలో మనదేశ తాజా ఖర్చు 0.7శాతమే అని చైనా 2.1శాతంగా పేర్కొన్నారు. జిడిపిలో రెండు శాతం ఖర్చు చేయాలని గతంలో వాజ్పాయి సర్కార్ కూడా చెప్పింది. దూరదృష్టి గల మీ పాలనలో గతం కంటే తగ్గిందేమిటి ? మన దేశంలో నిపుణులకు, పరిశోధకులకు కొరత ఉన్నదా ?
కుహనా అంశాలమీద పరిశోధనకు మీరు చూపుతున్న శ్రద్ధ సెమికండక్టర్స్ వంటి ప్రాధాన్యరంగాల మీద లేదు, ఆవు పేడ, మూత్రం, పాలలో బంగారం ఉందా, ఇంకా ఏమైనా ఉన్నాయా అంటూ పరిశోధనలకు ప్రజాధనాన్ని ప్రభుత్వం వృధా చేస్తున్నదని 2020 సంవత్సరంలో వందలాది మంది శాస్త్రవేత్తలు ప్రభుత్వతీరుతెన్నులను తప్పు పడుతూ ఆ పరిశోధనలను ఆపివేయాలని కోరినా మీరు పట్టించుకోలేదు. అంతకు ముందు 2017లో పంచగవ్య గురించి ఆయుర్వేద పుస్తకాల్లో రాసిన వాటిని రుజువు చేసేందుకు పరిశోధనలు చేసేందుకు ప్రభుత్వం పూనుకుంది. మొత్తంగా పరిశోధనలకు తగినన్ని నిధులు కేటాయించకుండా ముందుకు పోవటానికి మీ దగ్గర మంత్రదండమేదైనా ఉంటే హాం ఫట్ అంటూ తిప్పండి.ప్రతి లక్ష మంది జనాభాకు ఇజ్రాయెల్లో 834, దక్షిణ కొరియా 749,అమెరికాలో 441, చైనాలో 130 మంది పరిశోధకులు ఉండగా మనదేశంలో కేవలం 25 మంది మాత్రమే ఉన్నారని చెప్పటం మీకు ఇష్టముండదని తెలిసినా తప్పటం లేదు.
తినేందుకు బంగాళాదుంప, అరటి చిప్స్ లేకున్నా రోజు గడుస్తుందిగానీ ఎలక్ట్రానిక్స్ చిప్స్ లేకుండా మనకు క్షణం గడవదంటే అతిశయోక్తి కాదు.ప్రపంచంలో నిపుణులైన సెమికండక్టర్ రూపకల్పన ఇంజనీర్లు ప్రపంచం మొత్తంలో ఉన్నవారిలో 20శాతం మంది మనదేశంలో ఉన్నారని అంచనా. వారందరినీ విదేశీ కంపెనీలకు చౌక శ్రామికులుగా సమర్పించటం తప్ప ఇప్పుడు జరుగుతున్నదేమైనా ఉందా ? వారు సాధించే పేటెంట్స్ మన దేశానికి దక్కవు. మన ఇంజనీర్లు ఐటి రంగంలో ముందున్నారు. దీనికి మీ సర్కార్ ప్రత్యేకంగా చేసిందేమీ లేదు. హార్డ్వేర్ రంగంలో ఆ స్థితి లేదు. ఆ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎక్కువ భాగం మనం దిగుమతి చేసుకుంటున్నార. అదే విధంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రాయితీలతో విదేశీ కంపెనీలు రూపకల్పనలో లబ్ది పొందటం తప్ప చిప్స్ తయారీ మన దేశంలో ఎంతమేరకు జరుగుతుందన్నది ప్రశ్నార్ధకమే. ప్రస్తుతం అమెరికా మైక్రాన్ కంపెనీ ఎక్కడో ఉత్పత్తి చేసిన వాటిని మనదేశంలో పరీక్షించి పాకింగ్ చేయిస్తున్నది. దానితోనే పండగ చేసుకుందామా ?
చైనా మీద అమెరికా ప్రారంభించిన టెక్నాలజీ పోరులో ఎవరికి నష్టం ఎవరికి లాభం అన్న చర్చ జరుగుతోంది.తమ దేశంలోనే సెమీ కండక్టర్లను ఉత్పత్తి చేయాలని, అక్కడి నుంచి ఎగుమతులు జరపాలని అమెరికా సర్కార్ పట్టుబడుతోంది. తైవాన్లోని టిఎస్ఎంసి కంపెనీ ఉత్పత్తి మీద అదుపు కలిగి ఉంది.1990లో ప్రపంచ సెమీకండక్టర్ల ఉత్పతిలో అమెరికా వాటా 37శాతం ఉంటే 2020లో 12శాతానికి తగ్గింది. తిరిగి పూర్వపు స్థితికి చేరాలంటూ కొత్త పరిశ్రమలకు ఇచ్చేందుకు 280 బిలియన్ డాలర్లను అమెరికా కేటాయించింది.ఈ మొత్తానికి స్థానిక ప్రభుత్వాలు ఇచ్చేది అదనం. ఇప్పటి వరకు అమెరికా, ఐరోపా సమాఖ్య, జపాన్ సెమీకండక్టర్ల తయారీ కంపెనీలను ఆకర్షించేందుకు సబ్సిడీల నిమిత్తం పదివేల కోట్ల డాలర్లు పక్కన పెడుతున్నట్లు ప్రకటించాయి. ఇంటెల్ కంపెనీ జర్మనీలో 30బిలియన్ యూరోల ప్లాంట్ పెట్టాలంటే మూడో వంతు తమకు సబ్సిడీ ఇవ్వాలని బేరమాడింది.పోలాండ్, జర్మనీ, ఇజ్రాయెల్లో కొత్త ప్లాంటులు పెట్టేందుకు 50బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ఇంటెల్ పేర్కొన్నది. మొత్తం మీద చూస్తే ఈ రంగంలో ముందున్న కంపెనీలు పెద్ద ఎత్తున లబ్దిపొందనున్నాయి. ఈ పోరులో మనదేశం ఎక్కడ అన్నది ప్రశ్నార్ధకమే.
గత పది సంవత్సరాలుగా ఈ రంగాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేశారు. దీనికి కూడా నెహ్రూ, కాంగ్రెసే కారణం అని మీ మద్దతుదార్లు చెప్పినా ఆశ్చర్యంలేదు. అమెరికా వాణిజ్య మంత్రి గినా రైమండోతో మన మంత్రి పియూష్ గోయల్ 2023 మార్చి పదవ తేదీన సెమీకండక్టర్ల సరఫరా, నూతన ఆవిష్కరణల భాగస్వామ్యం గురించి ఒక ఒప్పందం చేసుకున్నారు. అంతకు ముందు జనవరిలో సంక్లిష్టమైన, వర్ధమాన సాంకేతికతల (ఐసిఇటి) సహకారం గురించి ఒప్పందం జరిగింది. చిత్రం ఏమంటే అధ్యక్ష కార్యాలయం వెల్లడించిన వాస్తవాల పత్రంలో మిగతా అంశాల గురించి ఉంది తప్ప సెమీకండక్టర్ల మీద నిర్దిష్టంగా ఏమీ లేదు అని కార్నెగీ ఇండియా వెబ్సైట్లో 2023 మే నెల 23వ తేదీన కోణార్క భండారీ రాశారు. మన దగ్గర దానికి భిన్నమైన సమాచారం ఉంటే ఆ పత్రాన్ని విడుదల చేస్తే వాస్తవం తెలుస్తుంది. మనదేశంలో ఉత్పత్తి చేసి ఎగుమతి చేసే వాటిని ప్రోత్సహించేందుకు ఉత్పాదకతతో ముడివడిన ప్రోత్సాహక(పిఎల్ఐ) పధకాన్ని 2021 నుంచి ఐదేండ్లలో రు.1.97లక్షల కోట్లు ఇచ్చే ప్రవేశపెట్టారు. కానీ దాన్ని ఆచరణలో ఉత్పత్తి బదులు విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న విడిభాగాలను ఒక దగ్గర చేర్చే సెల్ఫోన్లకు, చిప్స్ పరీక్షలకు ఇస్తున్నారు. అందుకే భలే మంచి పధకం, వదలితే దొరకదని పొలోమంటూ ఆపిల్, మైక్రాన్ వంటి కంపెనీలు మన దేశానికి వస్తున్నాయి.
రెండు దిగ్గజదేశాలైన అమెరికా, చైనా సెమీకండక్టర్ల రంగంలో పైచేయి సాధించేందుకు భారీ సబ్సిడీలతో పోటీ పడుతున్నాయి. అదే సమయంలో చైనా తన స్వంత రూపకల్పన, ఉత్పత్తికి గాను భారీ మొత్తంలో పరిశోధనకు నిధులు వెచ్చిస్తున్నది. మనదేశంలో ఒక సమగ్ర విధానాన్ని కూడా ఇప్పటికీ రూపొందించుకోలేకపోయాము.అలూ లేదూ చూలూ లేదు అన్నట్లుగా ఉంటే మన దేశాన్ని సెమీకండక్టర్ హబ్గా మారుస్తానని మీరు చెబుతున్నారు. వరల్డ్ పాపులేషన్ రివ్యూ తాజా(2023) సమాచారం ప్రకారం సెమీకండక్టర్ల ఉత్పత్తిలో తైవాన్, దక్షిణ కొరియా, జపాన్, చైనా, అమెరికా తొలి ఐదు స్థానాల్లో ఉన్నాయి. ఫాబ్రికేషన్లో 2022 డిసెంబరు నాటికి జపాన్లో 102, తైవాన్ 77, అమెరికా 76, చైనా 70, జర్మనీ 20, బ్రిటన్ 12, మలేషియా 7 ప్లాంట్లను కలిగి ఉన్నాయి. తరువాత స్థానాల్లో ఇజ్రాయెల్, నెదర్లాండ్స్ ఉన్నాయి. గుజరాత్లో 70శాతం సబ్సిడీ ఇచ్చి అమెరికా మైక్రాన్ కంపెనీతో ఒక పాకింగ్ కేంద్రాన్ని పెట్టించి దీంతో ప్రపంచ హబ్గా మారుస్తానని మీరు జనాలకు చెబుతున్నారు. ఇది ఎంతకాలం నడుస్తుంది ? అమెరికా మనలను తన సహజ భాగస్వామిగా పరిగణిస్తున్నదని, పిలిచి పెద్ద పీటవేస్తున్నదని చెబుతున్నారు. గతేడాది (2022) మార్చి నెలలో తొలిసారిగా అమెరికా చొరవతో చిప్స్ 4 లేదా ఫాబ్ 4 కూటమి ఏర్పడింది. దానిలో తైవాన్(చైనా తిరుగుబాటు రాష్ట్రం), జపాన్, దక్షిణ కొరియా ఇతర భాగస్వాములు తప్ప మనకు చోటు లేదు. ప్రపంచ సెమీకండక్టర్ల పరిశ్రమలో 70శాతం వాటా ఈ నాలుగు దేశాలదే. విధాన రూపకల్పన, ఉత్పత్తిలో పరస్పరం సహకరించుకొనేందుకు, విస్తరణకు దీన్ని ఏర్పాటు చేశారు.
గత తొమ్మిది సంవత్సరాల్లో దేశ అప్పును విపరీతంగా పెంచివేశారు. 2023 మార్చి 31నాటికి కేంద్ర ప్రభుత్వ అప్పు మొత్తం రు.152,61,122 కోట్ల 12లక్షలకు చేరుతుందని, అది 2024 మార్చి 31కి రు.169,46,666 కోట్ల 85లక్షల కోట్లకు చేరుతుందని నిర్మలమ్మగారి బడ్జెట్ పత్రాల్లో ఉంది.కాగ్ ఖరారు చేసిన గణాంకాల ప్రకారం 2014 మార్చి 31నాటికి కేంద్ర ప్రభుత్వ అప్పు రు.50,68,235 కోట్లు కాగా 2015 మార్చి నాటికి అంటే తొలి ఏడాది దాన్ని రు.56,07,315 కోట్లకు తరువాత మీరు దాన్ని ఎడాపెడా పెంచారు.కేవలం మీరు చేసిన అప్పు 2024 మార్చి నాటికి 118,78,431కోట్లకు పెంచుతామని ప్రతిపాదించారు.మీరు అధికారానికి వచ్చినపుడు కేంద్ర ప్రభుత్వ రుణం జిడిపిలో 67.1 శాతం కాగా 2021లో 88.5 శాతానికి పెరిగింది, 2023 నాటికి అది 83.1శాతంగా ఉంది. ఇంత చేసిన వారు పరిశోధనకు పెంచకపోగా ఎందుకు తగ్గించిందీ ఏదైనా ఒక మన్కీ బాత్లో చెబితే సంతోషం. ఆవు పేడ పరిశోధన నిధులు సెమీ కండక్టర్లకు మళ్లించండి, సబ్సిడీలతో పాటు పరిశోధనలకూ నిధులు ఇవ్వండి. ఇప్పటికి ఇంతటితో ముగిస్తున్నా.
తోటి భారతీయుడు
ఎం కోటేశ్వరరావు
