Tags

, , , , , , , , ,


ఎం కోటేశ్వరరావు


ఏక రూప పౌర స్మృతి గురించి ఆసక్తి ఉన్న వారు నోటిఫికేషన్‌ జారీ చేసిన జూన్‌ 14వ తేదీ నుంచి నెల రోజుల్లోగా తమ అభిప్రాయాలను తెలపాలంటూ ఇరవై రెండవ లా కమిషన్‌ ఒక ప్రకటన చేసింది. అది లేకపోతే దేశం ఇంకేమాత్రం ముందుకు పోదు, తీవ్ర ఆటంకంగా ఉందన్నట్లు కొందరు గుండెలు బాదుకుంటున్నారు. రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల్లో పేర్కొన్నదే కదా దాన్ని అమలు చేస్తామంటుంటే ఎందుకు లేనిపోని దురుద్దేశాలు అంటగడుతున్నారు అంటూ అమాయకత్వాన్ని నటిస్తున్నారు. అదే గనుక వాస్తవమైతే నరేంద్రమోడీ తొమ్మిది సంవత్సరాలుగా ఏం చేస్తున్నట్లు ? చట్టాన్ని తీసుకువచ్చేందుకు ఎలాంటి ఆటంకాలు లేవు. లా కమిషన్‌ సరిగ్గా ఇప్పుడు దాన్ని ఎందుకు ముందుకు తీసుకు వచ్చిందన్నది ప్రశ్న. దీని గురించి దాన్ని ఎవరూ సవాలు చేయటం లేదు, విబేధించటమూ లేదు. ఎన్నో తర్జన భర్జనల తరువాత మన దేశంలోని సంక్లిష్ట పరిస్థితుల కారణంగా ఏకాభిప్రాయసాధనతో సాధించాల్సిన అంశంగా పరిగణించి అర్టికల్‌ 44లో ఇతర అదేశిక సూత్రాలలో దాన్ని చేర్చారు. వాటిని కోర్టులు అమలు జరపలేవని కూడా రాజ్యాంగంలో ఉంది. వాటిలో పని హక్కు, నిరుద్యోగ భృతి వంటి వివాదం లేని వాటిని అమలు జరపటం మీద శ్రద్ద లేని బిజెపి వివాదాస్పద ఏక రూప పౌర స్మృతి మీద కేంద్రీకరిస్తున్నది. మతోన్మాదాన్ని, విద్వేషాన్ని రెచ్చగొట్టే మెజారిటీ-మైనారిటీ మతశక్తులు రెచ్చిపోతున్న తరుణంలో అనేక అపోహలు ఉన్న ఈ అంశం ఇప్పుడు తక్షణ అవసరం అంటూ బిజెపి ముందుకు తెస్తున్నది.

మహిళల ఉద్దరణ అని చెబుతున్నది. నిజానికి దానికి అంత శ్రద్ద ఉంటే చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్‌ ఎందుకు కల్పించలేదు. ఒక ముసాదాను రూపొందించి జనం ముందు ఎందుకు పెట్టలేదు ? త్వరలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు, తరువాత లోక్‌సభ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఇరవై రెండవ లా కమిషన్‌ ద్వారా ఒక ప్రచార అస్త్రంగా తన అజెండాను ముందుకు తెచ్చింది.
ఏక రూప పౌర స్మృతి ఈ దశలో అవసరమూ కాదు వాంఛనీయమూ కాదని 2018 ఆగస్టులో ఇరవై ఒకటవ లా కమిషన్‌ విడుదల చేసిన సంప్రదింపుల పత్రంలో స్పష్టంగా పేర్కొన్నది. ఆ పత్రం విడుదల చేసి మూడు సంవత్సరాలు దాటినందున నాటి నోటిఫికేషన్‌ గడువు ముగిసిందని, వివిధ కోర్టుల ఉత్తర్వులు దీని మీద ఉన్నందున ఈ అంశం మీద కొత్తగా అభిప్రాయాలను సేకరించనున్నట్లు పేర్కొన్నది. అభిప్రాయాలు తప్ప కోర్టు ఉత్తరువులేమీ లేవు.తాజా సేకరణతో ఏమి చేస్తారో చెప్పలేదు. గత కమిషన్‌ 2016 జూన్‌ 17 నోటి ఫికేషన్‌ ద్వారా అభిప్రాయాలను సేకరించింది. వాటిని క్రోడీకరించి కుటుంబ చట్ట సంస్కరణలు పేరుతో 185 పేజీల పత్రాన్ని విడుదల చేసింది. ఏక రూప దేశం అంటే సమరూపత ఉండనవసరం లేదు. మానవహక్కుల అంశంలో ప్రపంచమంతటా ఉన్న వివాదాలు లేని తర్కాలతో మన భిన్నత్వాన్ని సమ్మతింప చేసేందుకు ప్రయత్నాలు చేయాల్సి ఉందని ఆ పత్రం పేర్కొన్నది. వివిధ మతాలకు సంబంధించి పర్సనల్‌ చట్టాల్లో ఉన్న వివక్ష, అసమానతలను ఎదుర్కొనేందుకు ఇప్పుడున్న కుటుంబ చట్టాలను అవసరమైన మేరకు క్రోడీకరించి, సవరించవచ్చని కూడా పేర్కొన్నది. సుప్రీం కోర్టు తన ముందుకు వచ్చిన వివిధ కేసుల విచారణ సందర్భంగా ఏకరూప పౌర స్మృతి అవసరమని అభిప్రాయపడింది. తాజాగా మార్చి 23వ తేదీన వివిధ పిటీషన్ల మీద తీర్పు చెబుతూ ఇలాంటి పిటీషన్లను ఆమోదించి విచారించటం అంటే అలాంటి చట్టాన్ని తీసుకురావాలని పార్లమెంటును ఆదేశించటమేనని, తామాపని చేయకూడదని ప్రధాన న్యాయమూర్తి డివై చంద్ర చూడ్‌ ఆధ్వర్యంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. దీని గురించి తాజాగా ఆలోచించాలని, ఏ చర్యలు తీసుకున్నది కోర్టుకు తెలపాలని ప్రభుత్వాన్ని కోరింది. 2022 అక్టోబరులో సుప్రీం కోర్టులో దాఖలైన పిటీషన్లపై ప్రభుత్వం స్పందిస్తూ మత ప్రాతిపదికన ఉన్న వ్యక్తిగత చట్టాలు దేశ ఐక్యతకు భంగం కలిగిస్తున్నట్లు, ఏకరూప పౌర స్మృతిని తీసుకువస్తామని పేర్కొన్నది.


దేశ ఐక్యతకు, సామాజిక సమతుల్యతకు ముప్పు తెస్తున్న అంశాలలో విద్వేష పూరిత ప్రసంగాలు, ఇతర వివాదాస్పద అంశాలు, చట్టాన్ని కొందరు చేతుల్లోకి తీసుకోవటం, వ్యవస్థల దుర్వినియోగం వంటివి నేడు ప్రధానంగా ముందుకు వచ్చాయి. అలాంటి వారి మీద ఫిర్యాదు లేకున్నా కేసులు నమోదు చేయాలని సుప్రీం కోర్టు ఒకటికి రెండుసార్లు చెప్పాల్సి వచ్చింది. దీన్ని మరో విధంగా చెప్పాలంటే అలాంటి ప్రసంగాలు చేసిన వారి మీద కేసు నమోదు చేసిన వారికి భద్రత లేదన్నది స్పష్టం. ఆదేశిక సూత్రాల్లోని పని, విద్య, నిరుద్యోగ భృతి వంటి హక్కులను అమల్లోకి తెస్తే కరోనాలో వలస కార్మికులు దిక్కులేని చావులకు, ఇబ్బందులకు గురయ్యేవారు కాదు. వలస కూలీలు తమ ఉపాధిని దెబ్బతీస్తున్నారని స్థానికులు దాడులకు దిగేవారూ కాదు.రిజర్వేషన్ల కోసం తన్నుకు చచ్చేవారూ కాదు.తాజాగా మణిపూర్‌ మంటలూ ఉండేవి కాదు, ప్రధాని మోడీ కనిపించటం లేదనే పోస్టర్లూ వెలువడేవి కాదు.


ఏకరూప పౌర స్మృతి అంటే ఎలా ఉంటుందో కేంద్ర ప్రభుత్వం ఒక ముసాయిదా చట్టాన్ని రూపొందించి ఎలాంటి మార్పులు చేసేదీ జనంలో చర్చకు పెడితే దాని గురించి ఉన్న అనేక అపోహలు తొలుగుతాయి. ఏమైనా సరే వెంటనే అమలు జరపాలని కోరుతున్న మోడీ సర్కార్‌ గత తొమ్మిది సంవత్సరాలుగా అలాంటిదేమీ తీసుకురాలేదు. రూపు రేఖలు లేని ఒక ప్రతిపాదన మీద అభిప్రాయాలు చెప్పమంటే ఏమి చెబుతారు ? గతంలో చెప్పిన అభిప్రాయాలకు కాలదోషం పట్టిందని వర్తమాన లా కమిషన్‌ ఏ ప్రాతిపదికన నిర్దారించింది. అసలది ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్థ తప్ప రాజ్యాంగబద్దమైనది కాదు, ప్రభుత్వం దాని ద్వారా అభిప్రాయసేకరణ జరపమని కోరింది గాని రాజ్యాంగ ఆదేశం లేదు. ఏకరూప పౌర స్మృతిని ముస్లింలు లేదా ఏమతం వారైనా ఎలాంటి హేతుబద్దత లేకుండా గుడ్డిగా తిరస్కరించనవసరంలేదు, భిన్న అభిప్రాయం వెల్లడించవచ్చు, ముసాయిదాను ముందుపెడితే వివరణలు కోరవచ్చు.


ఆదేశిక సూత్రాల్లో అనేక అంశాలు ఉన్నప్పటికీ మిగతావాటిని అమలు జరపకుండా ఏకరూప పౌర స్మృతి మీద బిజెపి కేంద్రీకరణ అన్నది ముస్లింలను లక్ష్యంగా చేసుకున్నారని ఆ మతానికి చెందినవారితో పాటు ఇతర మతాల వారు, మతం, కుల పట్టింపులు లేనివారు కూడా బలంగా నమ్ముతున్నారు. దాన్ని ఏకాభిప్రాయంతో సాధించాల్సి ఉందని అంబేద్కర్‌తో సహా మెజారిటీ భావించిన కారణంగానే ఆదేశిక సూత్రాల్లో చేర్చారు. దళితులు, గిరిజనులకు రిజర్వేషన్లు పది సంవత్సరాలు చాలని నాడు భావించారు. ఆ లక్ష్యం నెరవేర లేదు గనుక పొడిగిస్తూ వస్తున్నారు. తరువాత ఓబిసిలకూ వర్తింప చేశారు. పౌర స్మృతి మీద ఇప్పటికీ ఏకాభిప్రాయ పరిస్థితి ఉందా అంటే లేదు. అసలు హిందువులందరూ దానితో ఏకీభవిస్తారా అన్నది ప్రశ్న. కర్ణాటకలో ఎక్కువగా ఉన్న లింగాయతుల తమను ప్రత్యేక మతానికి చెందిన వారిగా పరిగణించాలని డిమాండ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే.శైవులు, వైష్ణవులు వారిలో కులాల వారీ భిన్న ఆచారాలు, ఇలా ఎన్నో విభిన్నతలు ఉన్నాయి. వాటన్నింటిలో బిజెపి లేదా కేంద్ర ప్రభుత్వం వేలు బెట్టాలని, ఫలానా పద్దతి పాటించాలని ఆదేశించాలని చూస్తున్నదా ? అందుకే ముసాయిదా చట్టాన్ని ముందుపెడితే ఇలాంటి అనుమానాలకు తెరపడుతుంది లేదా కొత్త అంశాలు ముందుకు రావచ్చు. ఆర్టికల్‌ 370ని రద్దు చేస్తే అదేదో ముస్లింలకు సంబంధించిందని అనేక మంది భావించి మద్దతు ఇచ్చారు. రాముడి గుడి కడతామంటే సరే అన్నారు. వ్యక్తిగత అంశాల్లో తమదాకా వస్తే అలాగే ఉంటారా ? ఒక కులానికి చెందిన వారు మరో కులం, మతానికి చెందిన వారిని వివాహం చేసుకోకూడదని తీర్మానాలు చేస్తున్న పంచాయత్‌లు సాగుతూనే ఉన్నాయి.ఎవరికి వారు తమ కులాన్ని, మతాన్ని పవిత్రంగా మార్చాలని చూస్తున్నారు. అలాంటి స్థితిలో అందరూ సమానమే, ఒకటే అనే భావనను అంగీకరిస్తాయా ?


గోవాలో ఏకరూప పౌర స్మృతి అమలు జరుపుతున్నపుడు ఇతర చోట్ల ఎందుకు అమలు జరపకూడదు అని కొందరు వాదిస్తున్నారు. పోర్చుగీసు పాలనలో ఉన్న గోవా 1961లో దేశంలో విలీనమైంది. అప్పటి వరకు అక్కడ అమల్లో ఉన్న పౌర స్మృతిని మార్చి కొత్త విధానాన్ని వర్తింప చేయాల్సిన అగత్యం తలెత్తలేదు. దాన్నే వర్తింప చేసేందుకు నాడు కేంద్రం అంగీకరించింది, ఎవరూ అభ్యంతర పెట్టలేదు. అలాంటి చట్టాన్ని మిగతా దేశంలో అమలు జరపవద్దని ఎవరూ అనటం లేదు, బలవంతంగా రుద్దటం గాక అనుమానాలను తీర్చి అమలు జరపాలని చెబుతున్నారు. అందుకు అనువైన వాతావరణం లేదు గనుక తొందరపడవద్దంటున్నారు. మిగిలిన ఆదేశిక సూత్రాలు అమలు జరిపిన తరువాత దీన్ని కూడా చేపట్టవచ్చు. గోవాలో ఉన్న చట్టం ప్రకారం వివాహమైన వెంటనే ఏ మతం వారికైనా భర్త ఆస్తిలో భార్యకు సగం వాటా మీద హక్కు దఖలు పడుతుంది. దేశంలో దాన్ని అమలు చేస్తే ఇప్పుడున్న హిందూ అవిభక్త కుటుంబం, దానితో పాటే ఆ పేరుతో పొందుతున్న పన్ను రాయి రద్దవుతుంది. దీన్ని దేశంలోని హిందువులందరూ సమ్మతిస్తారా ? ఉత్తరాదిన సప్తపది హౌమం చుట్టూ ఏడుసార్లు ప్రదక్షిణ చేస్తేనే వివాహం జరిగినట్లు, దక్షిణాదిన అదే హిందువుల్లో ఎవరైనా పాటించ వచ్చు తప్ప విధి కాదు. లేదు. ఇలాంటి అనేక తేడాలు ఉన్నప్పుడు ఏక రూప చట్టం ఎలా ఉంటుందో ఎవరిని ఎలా ప్రభావితం చేస్తుందో, ఎలా స్పందిస్తారో తెలియదు. పంజాబ్‌లో వారసత్వహక్కులు హిందువులకు ఒక విధంగా సిక్కులకు మరొక విధంగా ఉన్నాయి. ముస్లిం పర్సనల్‌ లా ప్రకారం ఆ మతానికి చెందిన పురుషులు నలుగురిని వివాహం చేసుకోవచ్చు, ఆ మేరకు వివాహాలు చేసుకుంటూ హిందువులు మెజారిటీగా ఉన్న దేశాన్ని ముస్లిం మెజారిటీగా మార్చేందుకు కుట్రపన్నుతున్నారంటూ కాషాయదళాలు నిరంతరం చేస్తున్న గోబెల్స్‌ ప్రచారం తెలిసిందే.


నిషేధం ఉన్నప్పటికీ ముస్లింలలో కంటే హిందువులు, ఇతరుల్లోనే ఎక్కువగా బహుభార్యాత్వం ఉందని గతంలో జరిపిన విశ్లేషణలో తేలింది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2005-06 ప్రకారం హిందువుల్లో 1.9, ముస్లింలలో 2.9, ఇతరుల్లో 2.9శాతం ఒకరి కంటే ఎక్కువ మంది భార్యలను కలిగి ఉన్నారు. అదే 2019-20 సర్వే ప్రకారం 1.3,1.9,1.6 శాతాలకు తగ్గారు. తగ్గుదల అందరిలోనూ ఉంది. అందువలన ముస్లింలు పనిగట్టుకొని ఎక్కువ మందిని వివాహమాడి పిల్లలను కని దేశాన్ని ఆక్రమిస్తున్నారనే ప్రచారం వాస్తవం కాదు. విద్యలేని వారు, పేదలు, చిన్న వయస్సులోనే వివాహాలు చేసుకున్న వారిలో ఈ దురాచారం ఎక్కువగా ఉన్నట్లు కూడా అధికారిక సర్వే వెల్లడించింది. కులాల వారీ చూసినపుడు తాజా సర్వే ప్రకారం గిరిజనుల్లో 2.4, ఎస్‌సి 1.5, ఒబిసి 1.3, ఇతరుల్లో 1.2శాతం చొప్పున, మతాలవారీ హిందూ 1.3, ముస్లిం 1.9, క్రైస్తవులు 2.1, బౌద్దులు 1.3, సిక్కులు 0.5, ఇతరులు 2.5 శాతం మంది ఉన్నారు. ముస్లింలకు మినహా ఇతరుల్లో ఒకరి కంటే ఎక్కువ మందిని కలిగి ఉండటం నిషేధం. దేశంలో జరిపిన నేషనల్‌ శాంపుల్‌ సర్వే ప్రకారం ఓబిసిలు 40.94, దళితులు 19.59, గిరిజనులు 8.63 శాతం ఉన్నారు. వీరిలో అనేక కులాలు, ఉపకులాలు ఆచారాలు, సాంప్రదాయాలన్నీ ఒకటే కాదు, వీరందరూ హిందువులే, ఎంతో భిన్నత్వం కలిగిన వారందరికీ ఒకే పౌరస్మృతిని అమలు జరిపే ముందు వీరిలో ఉన్న అనుమానాలను తొలగించాలా లేదా ? దానికి మార్గం నమూనా చట్టం జనం ముందు పెట్టటమే.


ప్రస్తుతం వివిధ మతాల వ్యక్తిగత చట్టాల ప్రకారం ఒకే అంశంపై ఏకీ భావం లేదు. ఎవరి భాష్యాలు వారు చెబుతున్నారు. జనంలో అనేక అనుమానాలు, గందరగోళం ఉంది. ఏక రూప పౌరస్మృతిని బిజెపి బలవంతంగా రుద్దాలనుకుంటే ప్రస్తుతం దానికి అడ్డులేదు. పార్లమెంటులో దానికి గుడ్డిగా మద్దతు ఇచ్చే పార్టీలు ఉన్నందున అదేమీ పెద్ద అంశం కాదు. దాన్ని ఒక ఎన్నికల ప్రచార అస్త్రంగా, ముస్లింల మీద విద్వేషాలు, వ్యతిరేకతను రెచ్చగొట్టి మెజారిటీ ఓటు బాంకు సృష్టికి, సంతుష్టీకరణకు పూనుకుంది. దీనికి ఇస్లాం లేదా దేశంలోని ముస్లింలు వ్యతిరేకమనే ప్రచారం చేస్తున్నారు. దీనిలో వాస్తవం-వక్రీకరణ రెండూ ఉన్నాయి. ముస్లిం మతశక్తులు గుడ్డిగా సంస్కరణలను వ్యతిరేకిస్తున్నాయి తప్ప సామాన్య ముస్లింలందరూ అలా లేరు, అదే విధంగా హిందూత్వ పేరుతో వీరంగం వేస్తున్న వారు ముస్లింల పట్ల గుడ్డి ద్వేషాన్ని వెళ్లగక్కుతుంటే మొత్తం హిందువులందరూ అలా లేరు. ఏ మతమైనా వర్తమానానికి అనుగుణంగా మారకపోతే మౌఢ్యం పెరుగుతుంది. ఉన్న మతాల్లో హిందూ అని చెబుతున్న అనేక సామ్యాలున్న శైవ, వైష్ణవ ఇతర వివిధ మతాలు వేల సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్నందున అనేక సంస్కరణలు చోటు చేసుకున్నాయి. లేకపోతే జనం మతాలను పక్కన పెట్టేస్తారు. అమెరికా వెళ్లి హిందూమత గొప్పతనం గురించి ప్రసంగించిన స్వామి వివేకానందుడి గురించి గొప్పగా చెబుతారు. సముద్రయానం చేశాడనే కారణంగా తిరిగి వచ్చిన తరువాత అదే హిందూమతం వివేకానంద దేవాలయ ప్రవేశాన్ని అడ్డుకుంది. ఇటీవలి కాలంలో ఆ మూఢనమ్మకాన్ని సవరించుకొని పరిహారంగా కొన్ని క్రతువులు చేస్తే చాలని సరిపుచ్చుతున్నారు. ఎందుకంటే అనేక మంది స్వామీజీలు విదేశాల సందర్శన సరదాను అణుచుకోలేకపోయారు. మడిని గట్టున పెట్టి వెళ్లారు. సముద్రం దాటిన వారు కులాన్ని కోల్పోతారని శాస్త్రాల్లో రాసి ఉంది మరి. ఎవరైనా కులం పోగొట్టుకున్నవారు ఉన్నారా ? లేకపోగా విదేశాల్లో కూడా కుల గజ్జిని వ్యాపింప చేస్తున్నారు. దేశ పరువును గంగలో కలుపుతున్నారు. ఉన్న మతాలలో తాజాది ఇస్లాం గనుక ఆ మతం మీద ముల్లా ” అగ్రహారికుల ” ప్రభావం ఎక్కువగా ఉంది. వివాహం, విడాకులు, ఆస్తి హక్కులు, సంరక్షణ, దత్తత వంటి అంశాలు ఎంతో సున్నితమైనవి గనుక వాటిని సమానత్వ ప్రాతిపదికన, లింగవివక్ష లేకుండా ఎలా చట్టాన్ని రూపొందించాలన్నది పెద్ద ఎత్తున చర్చ జరగాలి. అన్ని మతాలూ మహిళను చిన్న చూపు చూసేవే, అణచేందుకు చూసేవే. అందువలన వారికి అనుకూలమైన ఏ చట్టం రూపొందాలన్నా చట్ట సభల్లో వారికి హక్కుగా ప్రవేశించే హక్కు కల్పించటం ముందుగా జరగాలి. అప్పుడే పితృస్వామిక సమాజ పెత్తనాన్ని చట్టబద్దంగా కూడా అడ్డుగోగలరు. అనుమానాలను తొలగిస్తూ, విశ్వాసాన్ని పాదుకొల్పుతూ తేవాల్సిన ఏకరూప పౌరస్మృతిని బిజెపి కోరుకుంటున్నట్లుగా ఏకపక్షంగా రుద్దకూడదు.