Tags
BJP, Kashmir Files, Mahashweta Jani, Manipur files, Narendra Modi Failures, Parul Khakhar, RSS, Saffron gang, Vivek agnihotri
ఎం కోటేశ్వరరావు
కాశ్మీరీ ఫైల్స్ సినిమాతో డబ్బుకు డబ్బు, కాషాయ దళాలను ఎంతగానో రంజింప చేసి వారి మద్దతు పొందిన వివేక్ రంజన్ అగ్నిహౌత్రిని మణిపూర్ ఫైల్స్ గురించి అడగ్గానే అగ్నిహౌత్ర అవధానులయ్యారు. అగ్నిహౌత్రి సంఘపరివార్ సభ్యుడా లేక అనేక మంది మాదిరి ముసుగులో ఉన్న అదే తెగ సినిమా రంగ పెద్దమనిషా అన్నది పక్కన పెడదాం. మణిపూరీ ఫైల్స్ సినిమా ఎందుకు తీయరు అని ప్రశ్నించిన వారి మీద నేను తప్ప వేరే మగాళ్లే లేరా అంటూ మండిపడ్డారు. ఎదురుదాడికి దిగారు. కాశ్మీరీ ఫైల్స్ సినిమా 2022లో ప్రపంచమంతటా 350 కోట్ల రూపాయలను వసూలు చేసి హిందీ సినీ రంగంలో ఒక రికార్డు నెలకొల్పింది. దాని కొనసాగింపుగా మరింతగా సొమ్ము చేసుకొనేందుకు, ప్రచార పర్వంలో భాగంగా కాశ్మీరీ ఫైల్స్ అన్రిపోర్టెడ్ పేరుతో అంటే వెలుగులోకి రాని కాశ్మీరి పండిట్ల ఉదంతాల పేరుతో ఒక సిరీస్ విడుదల చేయనున్నారు. తొలి భాగం ఆగస్టు 11న జీ5లో ప్రసారం కానుంది. తాము పరిశోధించిన దానిలో పది నుంచి ఇరవై శాతమే ఈ సిరీస్లో చూపనున్నామని, వాస్తవ గాధలను వీటిలో చూస్తారని, తమ పరిశోధన సారాన్ని కాశ్మీరీ ఫైల్స్ సినిమాగా తీశామని అగ్నిహౌత్రి చెప్పారు. ఇది రాజకీయ ప్రచారం కోసం అన్నది వేరే చెప్పనవసరం లేదు. కాశ్మీరీ పండిట్ల మీద జరిగిన దాడుల గురించి అప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వాలేవీ దాచలేదు, వార్తల మీద ఆంక్షలు విధించలేదు. వాటిని అన్ని పార్టీలూ ఖండించాయి. నేడు మణిపూర్ ఉదంతాల మీద జరిగినట్లుగా పార్లమెంటు దద్దరిల్లలేదు. నాడు కేంద్రంలో అధికారంలో ఉన్న విపి సింగ్ ప్రభుత్వానికి బిజెపి కూడా వెలుపలి నుంచి మద్దతు ఇచ్చింది. రాముడి రధ యాత్ర పేరుతో 1990 నవంబరు రెండున అయోధ్యకు చేరుకున్న కరసేవకులను నిరోధించేందుకు నాడు అధికారంలో ఉన్న ములాయం సింగ్ ప్రభుత్వం కాల్పులు జరపటానికి దారితీసిన పరిస్థితి తరువాత బిజెపి దానికి నిరసగా కేంద్రంలో విపి సింగ్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంది తప్ప కాశ్మీరీ పండిట్ల మీద జరిగిన దాడులకు కాదు. మూడు దశాబ్దాల తరువాత నాటి ఉదంతాల పేరుతో సినిమా తీసిన వివేక్ అగ్నిహౌత్రి వర్తమాన మణిపూర్ ఫైల్స్ గురించి పరిశోధనా లేదు, సినిమా లేదు.
మణిపూర్లో ఇద్దరు మహిళలను నగంగా ఊరేగించి, అత్యాజరిపిన ఉదంతం ప్రపంచమంతటినీ కదిలించింది. వివేక్ అగ్నిహౌత్రి ఒక సంఘపరివార్ విధేయుడిగా స్పందించారు. ఆ ఉదంతాన్ని తక్కువ చేసి చూపేందుకు బిజెపి ఎత్తుగడనే ఆ పెద్దమనిషి కూడా అనుసరించి తన నిబద్దతలో ఎలాంటి సడలింపు లేదని ప్రదర్శించుకున్నారు. వెలుగులోకి రాని కాశ్మీరీ పండిట్ల ఉదంతాలు అనే సిరీస్ను విడుదల చేస్తున్నట్లు అగ్నిహౌత్రి ట్విటర్ ద్వారా, ఇతరంగా ప్రకటించారు. కాశ్మీరీ హిందువులను ఊచకోత కోస్తే భారత న్యాయవ్యవస్థ దాన్ని చూడకుండా, మౌనంగా నిస్సహాయంగా ఉందని ధ్వజమెత్తారు. మన రాజ్యాంగం వాగ్దానం చేసినట్లుగా కాశ్మీరీ హిందువుల జీవిత హక్కును రక్షించేందుకు తనంతట తానుగా స్పందించటంలో విఫలమైంది, ఇప్పటికీ విఫలమౌతూనే ఉంది అని ఆరోపించారు. మణిపూర్ ఉదంతాల మీద నెలల తరబడి మౌనంగా ఉన్న ప్రధాని మోడీ మీద అదే స్పందన ఎందుకు వెల్లడించలేదు ? నిజానికి అగ్నిహౌత్రి కడుపు మంట కాశ్మీరీ పండిట్ల మీద స్పందించలేదు అన్నదాని కంటే మణిపూర్ మీద నోరు విప్ప నోరు విప్ప అంటూ ప్రధాని నరేంద్రమోడీ నోటికి వేసుకున్న తాళాన్ని న్యాయవ్యవస్థ తీయించిందన్న దుగ్దను ఆ రూపంలో వెల్లడించుకున్నారు. సమయాన్ని వృధా చేయకండి మీరు దమ్మున్న మగాడే అయితే అక్కడికి వెళ్లండి, మణిపూర్ ఫైల్స్ సినిమా తీయండి అని దాని మీద ఒక ట్విటర్ సవాలు విసిరారు. ఒక ప్రముఖుడి నుంచి అలాంటి ట్వీట్ వెలువడితే వేరు. కానీ ఆ సాధారణ ట్వీట్ మీద స్పందించి మీకు నా మీద విశ్వాసం ఉన్నందుకు కృతజ్ఞతలు, కానీ నన్ను అన్ని సినిమాలూ తీయాలంటున్నారు దమ్మున్న వారు ఇంకెవరూ లేరా అని ఎదురుదాడికి దిగి అతి తెలివి ప్రదర్శించారు.
అంతకు ముందు వివేక్ అగ్నిహౌత్రి మణిపూర్ మీద ట్వీట్లు చేశారు, ఒక కవితను కూడా రాశారు. ఒక ట్వీట్లో ఇలా ఉంది. ” మణిపూర్ : మోప్లా, డైరెక్ట్ యాక్షన్ డే( ప్రత్యేక దేశంగా పాకిస్తాన్ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకోకపోతే 1946 ఆగస్టు 11న ప్రత్యక్ష కార్యాచరణ దినాన్ని పాటిస్తామని ముస్లింలీగ్ నేత జిన్నా అదే ఏడాది జూలైలో చేసిన ప్రకటన), నౌఖాలీ, బంగ్లాదేశ్, పంజాబ్, కాశ్మీర్, బెంగాల్, కేరళ, అసోం, బస్తర్ ఇప్పుడు మణిపూర్…ప్రతిసారీ అంతిమంగా మన అమాయక తల్లులు, సోదరీమణులు అమానుష,ఆటవిక చర్యలకు బలౌతున్నారు. ఒక భారతీయుడిగా, ఒక పురుషుడిగా, ఒక మనిషిగా ప్రతిసారీ నా ధైర్యం చెదిరింది, నేను సిగ్గుపడ్డాను, నా చేతగాని తనానికి అపరాధన భావనతో ఉన్నా అని పేర్కొన్నారు. ఇక ఆ పెద్దమనిషి కవితా స్పందన గురించి చూద్దాం. ” ఓ మణిపూర్… నేను యత్నించా…నేను యత్నించా… కానీ విఫలమయ్యా……నా నైపుణితో ఇప్పుడు నేను చేయగలిగింది వారి విషాద గాధలను చెప్పటమే, కానీ అప్పటికి అది ఎంతో ఆలశ్యం అవుతుంది…… ఎంపిక చేసుకున్న, అతితో కూడిన పోటీ తత్వపు ఎన్నికల రాజకీయాలకు మనమందరం బాధితులం…..మనమందరం మత అతి బాధితులం….. మనమందరం ప్రమాదకర మీడియా బాధితులం…..మనం భారత పౌరులం, బాధితులం……..స్వేచ్ఛా భారతంలో జీవన హక్కులేదు, దాని గురించి మనమేమీ చేయలేం…… ఇది నేను కోరుకున్న స్వేచ్చ కాదు…. ఇలాంటి ప్రజాస్వామ్యం కాదు నేను కోరుకున్నది…… పరస్పరం కొట్టుకున్నవారి రక్తంతో ఒక అఖాతాన్ని మనతో ఏర్పాటు చేయిస్తే దానికి అర్దమే లేదు…..మనది ఒక విఫల సమాజం…. నా సోదరీమణులారా నేను విచారిస్తున్నాను…. నా తల్లులారా నేను విచారిస్తున్నాను…….భారత మాతా నేను విచారిస్తున్నాను.” ఇలా సాగింది ఆ కవిత.
ఇది చదివిన తరువాత ఎవరిలోనైనా తలెత్తే ప్రశ్న ఏమిటంటే దానిలో ఎక్కడైనా మణిపూర్ దురాగతానికి పాల్పడిన శక్తుల గురించి ఖండన ఉందా ? దాని మీద రెండు ఇంజన్ల పాలక పార్టీ, ప్రభుత్వాల తీరుతెన్నుల మీద అధిక్షేపణ ఎక్కడైనా ఉందా? మూడు దశాబ్దాల క్రితం జరిగిందని చెబుతున్న, అతిశయోక్తులతో కూడిన కాశ్మీరీ ఫైల్స్ సినిమాను తీశారు. ఇప్పుడు కానసాగింపుగా సిరీస్ను ఇప్పుడెందుకు తీస్తున్నట్లు ? మణిపూర్ గురించి తాను సినిమా తీసే సరికి ఎంతో ఆలశ్యం అవుతుందని చెప్పటాన్ని ఏమనాలి ? తప్పించుకొనే ఎత్తుగడ తప్ప ఇంకేమైనా ఉందా ? ఎంపిక చేసుకున్న ఎన్నికల రాజకీయాలని ఎత్తి చూపుతున్న పెద్దమనిషి వర్తమానాన్ని వదలి మూడు దశాబ్దాల నాటి సంఘటనలను ఇప్పుడెందుకు ”ఎంపిక” చేసుకున్నట్లు ? అవి జరిగినపుడు నా వయస్సు 17, అప్పుడు నాకు తెలియదు అని చెప్పవచ్చు. ఇప్పుడు 49 సంవత్సరాల పరిణితి వచ్చింది కదా పైన చెప్పిన కవితలోని అంశాలతో వర్తమాన భారతమాత ఫైల్స్ ఎందుకు తీయలేదు ? ఐరోపా పార్లమెంటుతో సహా ప్రపంచమంతా చర్చిస్తున్నప్పటికీ మణిపూర్ ఫైల్స్కు అంత సీన్ లేదు, గిరిజనుల జీవితాలు అంత విలువైనవి కాదు, వారికి కాశ్మీరీ పండిట్లకు ఉన్నంత పలుకుబడి వారికి లేదు, కాశ్మీరీ ఫైల్స్ మాదిరి సంఘపరివారం ప్రోత్సహించదు, డబ్బురాదు అనుకుంటున్నారా ? లేక అన్నింటికీ మించి అక్కడ అసలు కారకులు సంఘపరివారం అని చెప్పాల్సి వస్తుందనా ? బేటీ బచావో అని చెప్పిన పెద్దమనిషి మణిపూర్ బేటీల గురించి తనంతట తాను ముందుకు వచ్చి దేవాలయం అని వర్ణించిన పార్లమెంటులో మాట్లాడకుండా భవనపు మెట్లు, గోడల ముందు మొక్కుబడి ప్రకటన చేసిన ప్రధాని నరేంద్రమోడీ ఫైల్స్ను విప్పాల్సి ఉంటుందనా ?
గతంలో శవ గంగా వాహిని పేరుతో దిక్కులేని కరోనా మృతుల కళేబరాలను గంగానదిలో నెట్టివేసి చేతులు దులుపుకున్న యోగి ఆదిత్యనాధ్ ఏలుబడి నిర్వాకం మీద, సాక్షాత్తూ ప్రధాని నరేంద్రమోడీ ప్రతినిధిగా ఉన్న వారణాసి వద్ద ప్రవహించే గంగను పవిత్ర నదిగా భావించే గుజరాతీ కవయిత్రి పారుల్ కక్కర్ రాసిన ఆగ్రహ, నిరసన కవిత మీద హిందూత్వశక్తులు విపరీతంగా దాడి చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వివేక్ అగ్నిహౌత్రి మణిపూర్ ఫైల్స్ సినిమా తీస్తే అదే దాడి అతని మీద కూడా జరుగుతుంది. దేశంలో ఉన్న వర్తమాన స్థితి అది. అందుకే చచ్చిన చేప వాలు కథనాన్ని ఎంచుకున్నారన్నది స్పష్టం.మణిపూర్ మీద అల్లిన కవిత అలాంటిదే. దానితో సంఘపరివారానికి, పాలక బిజెపి నేతలకు ఎలాంటి ఇబ్బందీ ఉండదు. మానవాళి మీద జరుగుతున్న దోపిడీ, అణచివేత గురించి చరిత్రలో అనేక మంది చెప్పారు. దాన్ని తొలగించే కార్యాచరణను కూడా ప్రతిపాదించటమే కారల్ మార్క్స్, ఎంగెల్స్ ప్రత్యేకత. విఫల సమాజం గురించి చెప్పిన వారి కోవలో వివేక్ అగ్నిహౌత్రి మొదటి వారూ కాదు చివరి వారూ కాదు.
గంగ గురించి, దాని మురికి గురించి అనేక మంది రాశారు. ఇప్పుడు ఎవరైనా రాస్తే కొత్త దనం ఏమిటన్నది ప్రశ్న. ప్రధాన స్రవంతి మీడియా గంగలో కొట్టుకు వస్తున్న కరోనా శవాల గురించి అనివార్యమై పోటీ కారణంగా వార్తలు, చిత్రాలను ఇవ్వాల్సి వచ్చి ఇచ్చింది తప్ప ఆ నిర్వాకానికి కారణభూతమైన ప్రభుత్వానికి వ్యతిరేకంగా మొత్తం మీద ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. నిజానికి పారుల్ ఖక్కర్ కూడా రాజకీయ కోణంతో రాయలేదు. ఒక హిందువుగా గంగానదిని పవిత్రమైనదిగా భావించే కోవకు చెందిన సామాన్యురాలు ఆమె. కొట్టుకు వస్తున్న శవాల వార్తలు, వాటిని కుక్కలు పీక్కు తింటున్న దశ్యాలను చూసిన తరువాత అలాంటి పవిత్ర భావనలను కుదిపివేయటంతో తట్టుకోలేక వెల్లడించిన స్పందన తప్ప మరొకటి కాదు. అలాంటి స్పందన కూడా వివేక్ అగ్నిహౌత్రిలో కనిపించలేదు. ఆమె కవితను మరోసారి ఇక్కడ చూద్దాం.అనువాదం : రాఘవశర్మ
శవవాహిని గంగ
భయపడకు..ఆనందపడిపో…ఒకే గొంతుతో శవాలు మాట్లాడుతాయి….ఓ రాజా..నీ రామ రాజ్యంలో శవాలు గంగానదిలో ప్రవహించడం చూశాం….ఓ రాజా..అడవి అంతా బూడిదయ్యింది,ఆనవాళ్ళు లేవు, అంతా శ్మశానమైపోయింది,…..ఓ రాజా..బతికించే వాళ్ళు లేరు,…..శవాలను మోసేవాళ్ళూ కనిపించడం లేదు,…..ధుఃఖితులు మాత్రం మిగిలారు……అంతా కోల్పోయి మిగిలాం…..మాటలు లేక బరువెక్కిన మా హదయాలు శోకగీతాలైనాయి…..ప్రతి ఇంటిలో మత్యుదేవత ఎగిసిపడుతూ తాండవమాడుతోంది……ఓ రాజా..నీ రామ రాజ్యంలో శవ గంగా ప్రవాహమైంది……ఓ రాజా..కరిగిపోతున్న పొగగొట్టాలు కదిలిపోతున్నాయి, వైరస్ మమ్మల్ని కబళించేస్తోంది……ఓ రాజా.. మా గాజులు పగిలిపోయాయి, భారమైన మా హదయాలు ముక్కలయ్యాయి……అతను ఫిడేలు వాయిస్తున్నప్పుడు మా నగరం కాలిపోతోంది…..బిల్లా రంగాల బరిసెలు రక్తదప్పిక గొన్నాయి….. రాజా..నీ రామ రాజ్యంలో శవ గంగా ప్రవాహమైంది……ఓ రాజా..నీవు మెరిసిపోతున్నట్టు, మండుతున్న కొలిమి లాగా నీ దుస్తులు తళుక్కుమనడం లేదు…..ఓ రాజా..ఈ నగరమంతా చివరిగా నీ ముఖాన్ని చూస్తున్నాయి…..ఇక పరిమితులు, మినహాయింపులు లేవు నీ దమ్ము చూపించు,…..రా..బయిటికి రా.. గట్టిగా చెప్పు, పెద్దగా అరువు,……దిగంబర రాజు అవిటివాడు, బలహీనుడు……ఇక నీవు ఏ మాత్రం మంచివాడిగా ఉండలేనని చెప్పు……కోపంతో ఊగిపోతున్న నగరం మంటలు ఎగిసిపడుతూ ఆకాశాన్ని తాకుతున్నాయి…..,ఓ రాజా.. నీ రామరాజ్యంలో శవగంగా ప్రవాహాన్ని చూశావా?
ఇప్పుడు ప్రధాని నరేంద్రమోడీ మణిపూర్ ఉదంతం మీద దాల్చిన మౌనం, అక్కడి మానవతుల మీద జరిపిన దుర్మార్గ పూర్వరంగంలో మరో గుజరాతీ రచయిత్రి మహాస్వేతా జానీ స్పందించారు. ఆ ఉదంతాలు గతంలో జరిగిన వాటి కొనసాగింపే అన్న అగ్నిహౌత్రకు, ఇక్కడ అలాంటివి ఎన్నో జరిగాయన్న మణిపూర్ సిఎం బిరేన్ సింగ్కూ తేడా ఏముంది ? మహిళలు, వారి శరీర భాగాల మీద మనువాదుల భావజాలాన్ని, అత్యాచారాన్ని ఆయుధంగా చేసుకొని దాడులు చేస్తున్న వారిని నిరసిస్తూ మణిపూర్ ఉదంతం మీద వెల్లడించిన మహాస్వేతా జానీ రచన ఇది. ఇతర రాష్ట్రాలలోని అనేక మంది కవులు, కవయిత్రులు స్పందించటం వేరు. గుజరాత్కు చెందిన వారు తమ మీద పెద్ద ఎత్తున కాషాయదళ దాడి జరుగుతుందని తెలిసినా గళం విప్పటం, అది కూడా ప్రధాని నరేంద్రమోడీ తీరు తెన్నుల నేపధ్యంలో అన్నది గమనించాలి. ఆ రచన ఇలా సాగింది.సంఘపరివార్ నీడలో జీవిస్తున్న వివేక్ అగ్నిహౌత్రి స్పందనకు దీనికి ఉన్న తేడాను వేరే చెప్పాల్సిన పనిలేదు.
ఇటీవల కామన్ కాజ్, లోకనీతి, సిఎస్డిఎస్ సంస్థలు గుజరాత్లో ఉన్న పరిస్థితి గురించి ఒక సర్వే చేశాయి. సామాజిక మాధ్యమంలో ఒక రాజకీయ లేదా సామాజిక అంశం మీద ప్రతికూలంగా స్పందిస్తే దాడికి దిగుతున్నవారిని చూసి తాము చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని భయపడుతున్నట్లు సర్వేలో మూడింట రెండు వంతుల మంది చెప్పారని తేలింది. వారిలో మూడో వంతు మంది తీవ్రంగా భయపడుతున్నట్లు, తమ ఫోన్ల మీద నిఘాఉన్నట్లు చెప్పారట. ఆ సర్వేలో లోకనీతి ప్రతినిధిగా ఉన్న మహాశ్వేతా జానీ ఆ తరువాతే మణిపూర్ ఉదంతం గురించి గుజరాతీ భాషలో ఒక కవితను రాశారు. దాన్ని సలీల్ త్రిపాఠీ ఆంగ్లీకరించారు. అది ఇలా సాగింది.
నేను
భగరంధ్రము…..నేను ఒక యుద్ధ క్షేత్రాన్ని కాదు……లేదా ఏ విశ్వాసాన్ని రక్షించేదాన్ని కాదు…..లేదా ఏ సంస్మృతినీ మోసేదాన్ని కాదు…..లేదా పవిత్రతవైపు నడిపించే మార్గాన్ని కాదు……లేదా ఏ సమాజపు సొత్తునూ కాదు…..లేదా బానిసత్వానికి దారి తీసే మార్గాన్ని కాదు….లేదా రక్త ప్రవాహాన్ని కాదు….లేదా స్త్రీత్వ సారాన్ని కాదు……కచ్చితంగా చెబుతున్నా భూమికి భారాన్ని కాదు……కానీ……ఆమె కోరుకుంటే…..
తరువాత…నేను …..ఒక నవసృష్టికి సారధిని అవుతా !
