Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


సెప్టెంబరు 18 నుంచి 22వ తేదీ వరకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎందుకో పార్టీలకూ, జనానికి తెలవదు. ఆ ప్రకటనతో పాటు ఒకేసారి పార్లమెంట్‌-అసెంబ్లీల ఎన్నికలు జరిపే అంశం గురించి నివేదిక ఇవ్వాలని మాజీ రాష్ట్రపతి రామనాధ్‌ కోవింద్‌ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. దీంతో జమిలి ఎన్నికల కోసం అవసరమైన బిల్లు, రాజ్యాంగ సవరణల కోసమే ఐదు రోజుల పాటు ప్రత్యేక సమావేశాలన్న చర్చ దేశంలో ప్రారంభమైంది. ఊరకరారు మహాత్ములు అన్నట్లు నరేంద్రమోడీ నాయకత్వం ఏది చేసినా బిజెపికి, తాను, తన ఆశ్రితుల లబ్ది చూస్తారు అన్నది తెలిసిందే. గత శతాబ్దిలోనే ముందుకు వచ్చింది ఒకేసారి ఎన్నికల అంశం. ఇది సమాఖ్య వ్యవస్ధ, రాజ్యాంగం, ప్రజాస్వామ్య వ్యతిరేకమని అనేక పార్టీలు, నిపుణులు తిరస్కరించినప్పటికీ 2014 నుంచీ ఒకే దేశం-ఒకే ఎన్నికలంటూ వదలకుండా చెబుతున్నారు.విడివిడిగా ఎన్నికలు జరగటం వలన అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకం గనుక ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించి చర్చించాలని వాదనలు చేస్తారు.


స్వాతంత్య్రం వచ్చిన తరువాత 1967వరకు లోక్‌సభ,అసెంబ్లీ ఎన్నికలన్నీ ఒకేసారి జరిగాయి. కానీ ఆకాలంలో జరిగిందేమిటి ? దేశ ఆర్ధిక వ్యవస్థ దెబ్బతినటం, అది రాజకీయ సంక్షోభాలకు కారణం కావటం తెలిసిందే. దాని ఫలితమే 1969లో కొన్ని అసెంబ్లీల రద్దు, తరువాత ముందుగానే 1970లోపార్లమెంట్‌ రద్దు, 1971 ప్రారంభంలో ఎన్నికలు అన్న విషయం తెలిసిందే. ఒక దేశవృద్ది రేటు ఒకేసారి ఎన్నికలు జరపటం, ఎన్నికల ఖర్చు తగ్గింపు మీద, ఆ సమయంలో ప్రవర్తనా నియమావళి మీద ఆధారపడదు. చివరకు దేశం కోసం ధర్మం కోసం అనే పేరుతో ఈ వాదన అసలు ఎన్నికలే వద్దు అనేదాకా పోతుంది. ఆయా దేశాల జిడిపిలు, ఆదాయాలతో పోల్చితే ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వాల ఖర్చు నామమాత్రమే. పార్టీలు పెట్టే ఖర్చే దానికి ఎన్నో రెట్లు ఎక్కువ ఉంటోంది. దాని నివారణకు ఒకేసారి ఎన్నికలు పరిష్కారం కాదు.2019లోక్‌సభ ఎన్నికల్లో పార్టీలు ఖర్చుచేసిన మొత్తాలతో సహా అరవైవేల కోట్లు ఖర్చు చేసినట్లు అంచనా వేశారు. ఇది పోటీచేసిన అభ్యర్ధులు ఇచ్చిన సమాచారం మేరకు అంచనా తప్ప, వాస్తవ ఖర్చు దాని కంటే కొన్ని రెట్లు ఎక్కువ ఉంటుంది. చీటికి మాటికి ఎన్నికలు జరిగితే అభివృద్ధి పధకాల అమలు నిలిచిపోతుందన్నది ఒక పెద్ద తప్పుడు ప్రచారం. ప్రవర్తనా నియమావళి అంటే ఎన్నికల సమయంలో అధికారంలో ఉన్న పార్టీ ఓటర్లను ప్రలోభ పెట్టే కొత్త కార్యక్రమాల ప్రకటనలను నివారించటం తప్ప వాటితో నిమిత్తం లేకుండా ముందే ప్రారంభమై సాగే పధకాల అమలు నిలిపివేత ఉండదు. రైలు మార్గాల నిర్మాణం, విద్యుదీకరణ, ప్రభుత్వ గృహాలు, రోడ్ల నిర్మాణం, పెన్షన్ల చెల్లింపు, చౌకదుకాణాల్లో వస్తువుల సరఫరా వంటివి ఏవీ ఆగటం లేదే.గతంలో గుజరాత్‌, హిమచల్‌ ప్రదేశ్‌ ఎన్నికల సమయంలో ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నప్పటికీ గ్రామీణ ఉపాధి పధకం పనులకు విడుదల చేయాల్సిన నిధులకు ఎన్నికల కమిషన్‌ అనుమతి ఇచ్చింది. అయితే ఆ విషయాన్ని మీడియాలో ఎక్కడా వెల్లడించకూడదని షరతు పెట్టింది.


కొన్నిదేశాల్లో ఒకేసారి జాతీయ, ప్రాంతీయ, స్థానిక సంస్థ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ విధంగా చేసి ఖర్చును ఆదాచేయటం వల్ల అవి అభివృద్ధి సాధించినట్లు ఎక్కడా రుజువు లేదు. ఉదాహరణకు అమెరికాలో 1962-2019 మధ్య 57 ఏండ్లలో 26 సంవత్సరాలు తిరోగమన, 16 సంవత్సరాలు ఒక శాతంలోపు, ఐదు సంవత్సరాలు ఒకటి-రెండు శాతం మధ్య వృద్ది నమోదైంది.అమెరికాలో ఎన్నికల ప్రకటన నుంచి పోలింగ్‌ రోజువరకు మన దేశంలో మాదిరి ప్రవర్తనా నియమావళితో నిమిత్తం లేకుండా అనేక చర్యలు తీసుకోవటాన్ని చూశాము. అక్కడ రాష్ట్రానికి ఒక ప్రత్యేక రాజ్యాంగం ఉంది. ఎన్నికల కారణంగా అభివృద్ధి కార్యక్రమాలు ఆగవు, ప్రవర్తనా నియమావళి లేదు. అయినా అక్కడ వృద్ధి రేటు ఎక్కువ సంవత్సరాలు దిగజారింది. కొన్ని లాటిన్‌ అమెరికా, ఐరోపా దేశాలలో నిర్ణీత కాలం వరకు చట్ట సభలు రద్దు కావు, ప్రభుత్వాలు మారుతుంటాయి. అలాంటి దేశాలూ అభివృద్ది సమస్యలను, సంక్షోభాలను ఎదుర్కొంటున్నాయి. మన దేశంలో కూడా ఇలా ఐదేండ్ల పాటు పార్లమెంటు, అసెంబ్లీలు రద్దు కాకుండా రాజ్యాంగ సవరణ చేస్తే ఇప్పుడున్న లోపభూయిష్టమైన పార్టీల ఫిరాయింపు చట్టం అవసరం కూడా ఉండదు. ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటే అది కూలిపోయి కొత్త ప్రభుత్వం వస్తుంది. సభ్యత్వాలు రద్దు కావు, అంటే ప్రజాప్రతినిధులను ఎవరు ఎక్కువ మందిని సమీకరిస్తే అది డబ్బుద్వారా లేదా కండబలం ద్వారా కావచ్చు అధికారం వారికే ఉంటుంది. కొన్ని దేశాల్లో జరుగుతోంది అదే. ధనస్వామ్యం తప్ప ప్రజాస్వామ్య జాడ ఉండదు.


నిజానికి ఇప్పుడు కావాల్సింది ఒకే సారి ఎన్నికలు కాదు. ప్రజాస్వామ్యం మరింతగా వర్దిల్లేవిధంగా, ధన ప్రలోభాలను గణనీయంగా తగ్గించి, ప్రజాభిప్రాయానికి చట్టసభల్లో తగు ప్రాతినిధ్యం లభించేందుకు ఉన్నంతలో మెరుగైన దామాషా పద్దతి ఎన్నికల సంస్కరణలు కావాలి. ప్రజాస్వామ్య కబుర్లు చెప్పే అమెరికాలో దేశాధ్యక్ష ఎన్నికల్లో 50రాష్ట్రాల్లో రెండు చోట్ల తప్ప మిగిలిన చోట్ల మెజారిటీ ఓట్లు తెచ్చుకున్న పార్టీకి అధ్యక్షుడిని ఎన్నుకొనే ఎలక్టరల్‌ కాలేజీ ప్రతినిధులను మొత్తంగా కేటాయిస్తారు. అందువలన దేశం మొత్తంలో ఓట్లు తక్కువ తెచ్చుకున్నా కొన్ని రాష్ట్రాలలో వచ్చిన మెజారిటీ ఆధారంగా ఎలక్టరల్‌ కాలేజీలో పైచేయి సాధించి 2016లో అధ్యక్ష పదవిని డోనాల్డ్‌ ట్రంప్‌ గెలిచారు. దామాషా ప్రాతినిధ్య విధానంలో మైనారిటీ ఓట్లకూ ప్రాతినిధ్యం ఉంటుంది. డబ్బుతో ఓట్లు కొన్నప్పటికీ గెలుస్తారో లేదో తెలియదు కనుక ఎవరూ డబ్బు పెట్టరు, నిజమైన ప్రజాభిప్రాయం వెల్లడి కావటానికి అవకాశాలు ఎక్కువ. ఇప్పుడు అధికారమే పరమావధిగా ఉన్న పార్టీలు, వ్యక్తులు డబ్బున్నవారికే పెద్దపీట వేస్తూ అధికారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. అందుకే దామాషా ప్రాతినిధ్య విధానం గురించి వామపక్షాలు తప్ప మిగిలిన పార్టీలేవీ మాట్లాడవు.


తరచూ ఎన్నికల వలన ప్రభుత్వాలు దీర్ఘకాలిక విధానాలను రూపొందించే అవకాశాలకు ఆటంకం కలుగుతుందని కొందరు సన్నాయి నొక్కులు నొక్కుతారు. పాలకులు మారినా లక్ష్యాల నిర్దేశం, పధకాలు కొనసాగేందుకు ఏర్పాటు చేసిన ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి నీతి అయోగ్‌ పేరుతో అజాగళ స్థనం వంటి అధికారాలు లేని సంస్థను ఏర్పాటు చేసిన పెద్దలు గద్దె మీద ఉండగా దీర్ఘకాలిక విధానాల గురించి మాట్లాడటం హాస్యాస్పదం, జనాన్ని తప్పుదారి పట్టించే వ్యవహారమే.ఒకేసారి అన్నింటికీ ఎన్నికలు అనేది ప్రజాస్వామిక సూత్రాలకే విఘాతం. ఫెడరల్‌ సూత్రాలకు, రాజ్యాంగ మౌలిక స్వభావానికే విరుద్దం. ఏక వ్యక్తి ఆధిపత్యానికి దారి తీస్తుంది. ఫెడరల్‌ వ్యవస్థను కూలదోసి యూనిటరీకి మళ్లేందుకే బిజెపి ఈ ప్రతిపాదనను పదే పదే ముందుకు తెస్తున్నదనిపిస్తున్నది.1983లో తొలిసారి ఎన్నికల కమిషన్‌ ఈ ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం పక్కన పెట్టింది. వాజ్‌పేయి హయాంలో 1999లో లా కమిషన్‌ ద్వారా ఈ ప్రతిపాదనన తెచ్చారు. తరువాత యుపిఏ పాలనలో దాని ప్రస్తావన లేదు. నరేంద్రమోడీ తొలిసారి అధికారానికి వచ్చి,బిజెపికి మెజారిటీ రాష్ట్రాల్లో అధికారం వచ్చినపుడు 2016లో నీతి ఆయోగ్‌ ద్వారా ముందుకు తెచ్చారు.2018లో లా కమిషన్‌ ఐదు రాజ్యాంగ సవరణలు అవసరమని చెప్పింది. నరేంద్రమోడీ రెండవ సారి అధికారానికి వచ్చిన వెంటనే మరోసారి చర్చకు తెచ్చారు. కరోనా మహమ్మారి విస్తరిస్తున్న సమయంలో కూడా చర్చ సాగించారు. నిర్మాణాత్మక అవిశ్వాసం పేరుతో మరొక ప్రతిపాదనను లా కమిషన్‌ ద్వారా ముందుకు తెచ్చారు. ఒక ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం పెట్టటానికి ముందు ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉందని సభ విశ్వాసం పొందాలని చెప్పారు.2022లో నాటి ప్రధాన ఎన్నికల కమిషనర్‌ సుశీల్‌ చంద్ర ఒకేసారి ఎన్నికలు జరిపేందుకు తాము సిద్దంగా ఉన్నామని, అందుకు గాను రాజ్యాంగ సవరణ జరపాలని చెప్పారు. అదే ఏడాది డిసెంబరులో లా కమిషన్‌ అన్ని రాజకీయ పార్టీలు, మేథావులు, అధికారులు తమ సూచనలు పంపాలని కోరింది. ఇపుడు రామనాధ్‌ కోవింద్‌ నాయకత్వంలో ఒక కమిటీని వేసి మరోసారి మోడీ సర్కార్‌ ముందుకు తెచ్చింది.వివరాలు తెలియదు.


ఐడిఎఫ్‌సి అనే ఒక సంస్ధ 1999 నుంచి 2014వరకు జరిగిన లోక్‌సభ ఎన్నికలతో పాటు జరిగిన కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సమాచారాన్ని విశ్లేషించింది. ఒకేసారి జరిగితే కేంద్రంలోనూ, రాష్ట్రాల్లోనూ ఓటర్లు ఒకే పార్టీని ఎంచుకొనేందుకు 77శాతం అవకాశాలుంటాయని పేర్కొన్నది. ఐఐఎం అహమ్మదాబాద్‌ డైరెక్టర్‌గా ఉన్న జగదీప్‌ ఛోకర్‌ జరిపిన విశ్లేషణ కూడా దీన్నే చెప్పింది. 1989 నుంచి ఒకేసారి జరిగిన లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగితే 24 ఉదంతాలలో ప్రధాన రాజకీయ పార్టీలు అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలలో దాదాపు ఒకే విధమైన శాతాలలో ఓట్లు పొందాయి. కేవలం ఏడు సందర్భాలలో మాత్రమే ఫలితాలు భిన్నంగా వచ్చాయి. ఈ కారణంగానే గతంలో కాంగ్రెస్‌ మాదిరి ప్రస్తుతం దేశవ్యాపితంగా ఉన్న బిజెపి ఒకేసారి ఎన్నికలు జరిగితే తనకు ఉపయోగమని, ఉన్న అధికారాన్ని మరింతగా సుస్ధిరపరచుకోవచ్చని, ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడే అవకాశాలను తగ్గిస్తాయని భావిస్తున్నది. ఒకేసారి ఎన్నికలు జరపాలంటే రాజ్యాంగ సవరణలు చేయాల్సింది ఉంది. అదే జరిగితే రాష్ట్రాలలో, కేంద్రంలో ఏ కారణాలతో అయినా ప్రభుత్వాలు కూలిపోతే నిర్ణీత వ్యవధి వరకు కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్రపతి పాలన విధించాల్సి ఉంది. దాని అర్ధం కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే దాని అధికారమే పరోక్షంగా ఉంటుంది. లేదా ముందే చెప్పుకున్నట్లు అవకాశవాదంతో ఏర్పడే కూటములకు అధికారాన్ని అప్పగించాల్సి వస్తుంది.


కరోనా ప్రభావం గురించి దేశమంతా ఆందోళన చెందుతోంటే దాన్ని పక్కన పెట్టి ప్రధాని కార్యాలయం స్దానిక సంస్ధలతో సహా అన్ని ఎన్నికలకు ఒకే ఓటర్ల జాబితా తయారీ సాధ్యా సాధ్యాల గురించి చర్చించేందుకు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. అలా చేయాలంటే ముందుగా ఆర్టికల్‌ 243కె, 243జడ్‌, ఏ లకు సవరణలు చేయాల్సి ఉంటుందని చర్చ జరిగింది.ఇప్పుడు కరోనా ప్రభావం తగ్గినప్పటికీ అంతకు ముందున్న స్థితికి అభివృద్ది రేటు పెరగటం గురించి ఎవరికీ విశ్వాసం లేదు. దిగజారిన వృద్ది పునాది మీద పెరుగుదలను చూపి జనాన్ని తప్పుదారి పట్టించేందుకు చూస్తున్నారు. దేశ అభివృద్ది, ప్రయోజనాల గురించి తమకు తప్ప మరొకరికి పట్టవని, దేశభక్తి ఇతరులకు లేనట్లుగా, దేశద్రోహులకు మద్దతు ఇస్తున్నట్లు గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా ఒక పధకం ప్రకారం ప్రచారం చేస్తున్నారు. ఒక అవాస్తవాన్ని వందసార్లు చెబితే 101వసారి నిజంగా మారుతుందని సూత్రీకరణ చేసిన జర్మన్‌ నాజీ మంత్రి గోబెల్స్‌ తరహా ప్రచారం ఇది. పార్లమెంట్‌ ఉభయ సభల్లో ఉన్న మెజారిటీ, దేన్నయినా బలపరిచే ఇతర పార్టీలు కూడా ఉన్నందున ఒక్క రోజులోనే కాశ్మీర్‌ రాష్ట్రాన్నే రద్దుచేసినట్లు ఒకేసారి ఎన్నికల కోసం జనాభిప్రాయాన్ని తోసిపుచ్చి రాజ్యాంగ సవరణలు చేయటం నరేంద్రమోడీకి ఒక పెద్ద సమస్య కాదు. అలాంటి పరిణామం జరిగినా ఆశ్చర్యం లేదు.రాజ్యాంగాన్ని మార్చకుండానే తూట్లు పొడిచేందుకు వీలైన అన్ని చర్యలూ తీసుకుంటున్నారు. ఫెడరల్‌ అంటూనే అధ్యక్ష తరహా పాలనకు వీలు కల్పించేదే ఒకే సారి ఎన్నికలు అనే భావన.అలాంటి అధికార కేంద్రీకరణ ఉంటేనే సంస్కరణల వేగం పేరుతో దేశ సంపదలను ఆశ్రితులకు అప్పగించేందుకు, కార్మికుల, రైతాంగ హక్కులను హరించి వేసేందుకు అవకాశం ఉంటుంది. స్వేచ్చను హరించుతున్న పాత చట్టాలను రద్దు చేయాలన్నది ఒక ప్రజాస్వామిక డిమాండ్‌. దాన్ని అమలు చేసే పేరుతో మరింత కఠినమైన చట్టాలను రూపొందించేందుకు పూనుకున్నారు. కార్మిక చట్టాలను క్రోడీకరించే పేరుతో కార్మికుల హక్కులకు ఎసరు పెట్టారు. రైతాంగాన్ని కార్పొరేట్లకు అప్పగించే యత్నాన్ని రైతాంగం విజయవంతంగా తిప్పికొట్టినప్పటికీ ఆ కత్తి మెడమీద వేలాడుతూనే ఉంది. ఇండియా కూటమి రూపంలో ముందుకు వచ్చిన పార్టీలు బిజెపి ముక్త భారత్‌కు పిలుపునిచ్చి ముందుకు పోతుండటంతో నరేంద్రమోడీ నాయకత్వానికి భయం పట్టుకుంది.అందుకే జనం దృష్టిని మళ్లించేందుకు సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటారని అనేక మంది భావిస్తున్నారు. వాటిలో భాగంగానే పార్లమెంటును ప్రత్యేకంగా సమావేశ పరుస్తున్నారా ?