ఎం కోటేశ్వరరావు
త్వరలో ప్రపంచ జిడిపిలో జపాన్, జర్మనీలను వెనక్కు నెట్టి మూడవ స్థానం ఆక్రమించే ధనిక దేశంగా మనలను నరేంద్రమోడీ ముందుకు తీసుకుపోతున్నారు. టీవీలు చూడండి రోజూ ఎన్ని గ్యారంటీలను ప్రకటిస్తున్నారో, రామరాజ్యాన్ని తెచ్చారు, రామాలయాన్ని నిర్మించారు, ప్రపంచంలో తలెత్తుకొనేట్లు చేశారు. ఓట్ల కోసం మోడీ ఏమీ చేయరని బరాబర్ చెబుతున్నాం అంటూ భక్తులు ఊరూరా తిరుగుతున్నారు. అదే నిజమైతే ”ధనికులైన” మన జనాలకు ముష్టి విదిల్చినట్లుగా తాజాగా పెట్రోలు, డీజిలు మీద లీటరుకు రు.2 తగ్గించటం అవమానించటం కాదా ? ఈ చర్యతో జనం పండగ చేసుకుంటున్నారని బిజెపి నేతలు చెబుతున్నారు. పూర్వం గ్రామాల్లో వృత్తుల వారికి పండుగల సందర్భంగా రైతులు తాము చేసుకున్న పిండివంటలు ఇస్తే ఎంతో సంతోషించేవారు(దీని అర్ధం వృత్తుల వారిని కించపరచటం కాదు, అలాంటి పరిస్థితి గతంలో ఉందని చెప్పటమే.ఇప్పుడు ఇంకా ఎక్కడైనా అలా ఉందేమో తెలియదు). దాన్నుంచి వచ్చిందే కుడుమేస్తే పండగ అనే లోకోక్తి. ఇప్పుడు ముష్టివిదిల్చినట్లుగా రెండు రూపాయలు , గ్యాస్ సిలిండర్కు వంద ఇచ్చి బిజెపి వారు జనాలను డూ ఫెస్టివల్ (పండగ చేస్కో) అంటున్నారు.2022 ఏప్రిల్ ఆరు నుంచి చమురు ధరలను స్థిరంగా ఉంచిన పెద్దలు ఓట్లు కొల్లగొట్టాలని తప్ప ఇప్పుడు ఇంత స్వల్పంగా తగ్గించటానికి ప్రాతిపదిక ఏమిటి ? ఈ మాత్రానికే పండగ చేసుకొని ఓట్లు వేస్తామని ఎవరైనా అంటే అది వారిష్టం.
అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగితే పెంచుతాం, తగ్గితే తగ్గించే విధానం అమలు జరుపుతున్నట్లు ప్రతి రోజూ సుప్రభాతం మాదిరి ధరలను ప్రకటించే వారు. రెండు సంవత్సరాలుగా ఎందుకు నిలిపివేసినట్లు ? ఎన్నికల్లో మీట నొక్కిన తరువాత తిరిగి పెంచరనే గ్యారంటీ ఏముంది ? కేంద్ర ప్రభుత్వ పెట్రోలియం ప్లానింగ్ అండ్ ఎనాలసిస్ సెల్(పిపిఏసి) వెబ్సైట్లోని తాజా సమాచారం ప్రకారం పదేండ్ల యుపిఏ పాలనా కాలంలో 2004-05 నుంచి 2013-14 వరకు కేంద్ర ప్రభుత్వం లేదా చమురు ఉత్పత్తుల మార్కెటింగ్ కంపెనీలు వినియోగదారులకు ఇచ్చిన సబ్సిడీల మొత్తం రు.8,88,024 కోట్లు. సగటున ఏటా 88.8వేల కోట్లు. తరువాత నరేంద్రమోడీ అచ్చేదిన్ పాలనలో ఈ మొత్తం రు.2,82653 కోట్లు మాత్రమే. సగటున 30.1వేల కోట్లు. వీటిలో ప్రజాపంపిణీ కిరోసిన్, ఉజ్వల గ్యాస్ సబ్సిడీ ఉన్నాయి. ఇది సబ్సీల కోత తీరు కాగా ఈ కాలంలో చమురు రంగంలో జనంపై మోపిన భారమెంతో చూద్దాం.తొమ్మిది సంవత్సరాల తొమ్మిది నెలల కాలంలో మోడీ సర్కార్ పెంచిన పన్నులు, సెస్సులు,చమురు కంపెనీల నుంచి వచ్చిన రాబడుల మొత్తం రు.34,53,930 కోట్లు. అంటే సగటున రు.3.45లక్షల కోట్లు వచ్చింది. అధికారానికి వచ్చిన తొలి ఏడాది అంటే అంతకు ముందు మన్మోహన్ సింగ్ సర్కార్ విధించిన పన్నులు, ఇతర రాబడి రు.1.72లక్షల కోట్లు మాత్రమే. అది 2021-22లో గరిష్ట స్థాయికి రు.4.92లక్షల కోట్లకు పెరిగింది. ఈ ప్రాతిపదికన అంటే తొలి ఏడాది పన్నులే కొనసాగి ఉంటే పదేండ్లలో రు17.22 లక్షల కోట్లుగా ఉండేది, కానీ మొత్తం మీద చూసినపుడు రెట్టింపైంది. రద్దు చేసిన సబ్సిడీ, పెంచిన భారాలను కలుపు కుంటే 23లక్షల కోట్ల మేరకు భారం జనం భరించినట్లు లెక్క.
2020లో మనదేశంలో 88.2 బిలియన్ లీటర్ల డీజిల్,37.2 బిలియన్ లీటర్ల పెట్రోలు(స్టాటిస్టా సమాచారం) వినియోగం మొత్తం 125.4బిలియన్ లీటర్లు. ఇప్పుడు రెండు రూపాయల చొప్పున తగ్గించారు గనుక ఏడాది పాటు అమలు చేస్తే 250.8బిలియన్లు అంటే 25వేల కోట్లు జనానికి విదిల్చి ఓట్లు కొల్లగొట్టాలని పధకం వేశారు.మోపిన భారం ఎంత ? తగ్గించిన ధర ఎంత ? తరువాత వినియోగం పెరిగి ఉంటే ప్రభుత్వానికి పన్ను ఆదాయం పెరిగినట్లే తగ్గింపు మొత్తం కూడా అదే దామాషాలో పెరుగుతుంది. జనం మరీ ఇంత అమాయకంగా ఉన్నారని, కుడుమేస్తే పండగ చేసుకొనే వారి మాదిరి కనిపిస్తున్నారా ? పది సంవత్సరాల కాలంలో రాష్ట్రాలకు చమురు ఉత్పత్తుల మీద వచ్చిన పన్ను, ఇతర రాబడి రు.22,19,558 కోట్లు అంటే సగటున 2.3 లక్షల కోట్లు. పదేండ్ల క్రితం వార్షిక రాబడి 1.6లక్షల కోట్ల నుంచి 2.3లక్షల కోట్లకు తప్ప కేంద్రం మాదిరి రు.1.72లక్షల నుంచి 3.45లక్షల కోట్లకు పెరగలేదు. కేంద్రం నుంచి పన్నుల్లో రాష్ట్రానికి వచ్చే వాటా సంగతేమిటని కొందరు ప్రశ్నించవచ్చు. ఎక్సైజ్, ఇతర పన్నులో రాష్ట్రాలకు వాటా ఉంటుంది తప్ప సెస్సుల పేరుతో మోపిన దానిలో ఒక్క పైసా కూడా రాదు. మోడీ మోపిందంతా సెస్సుల పేరుతోనే. ధరలు తగ్గించాలని ఒక వైపు డిమాండ్ చేసే వారు ప్రభుత్వం అదే చేస్తే సంతోషించకుండా విమర్శలెందుకు చేస్తారు అనే వారు ఉన్నారు.వారందరికీ ఒకటే సమాధానం పెంచాలని ఎవరూ కోరలేదు, వద్దంటున్నా విపరీతంగా పెంచి జేబులు కొల్లగొట్టారు.దానిలో ఓట్ల కోసం నామమాత్రం తగ్గిస్తే పండుగ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ తగ్గింపు నేతలకు భజన చేయాల్సినంత గొప్పదేమీ కాదు. రద్దు చేసిన సబ్సిడీలతో పోలిస్తే ఇచ్చిన రాయితీ మొత్తమెంతో ఈ ప్రశ్నలు వేసే వారు సమాధానం చెప్పాలి.యుపిఏ పాలనా కాలంలో వార్షిక సగటు ముడిచమురు పీపా ధర డాలర్లలో, రూపాయలలో పెట్రోలు, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో, నరేంద్రమోడీ హయాంలో ఎలా ఉందో దిగువ చూడవచ్చు.
సంవత్సరం× ధర డాలర్లలో×× పెట్రోలు ×× డీజల్
2010-11××× 85.09 ×× 52.64 ×× 38.56
2011-12××× 111.89 ×× 64.71 ×× 40.26
2012-13××× 107.97 ×× 68.71 ×× 45.26
2013-14××× 105.52 ×× 73.70 ×× 51.90
2014-15××× 84.16 ×× 66.36 ×× 52.23
2015-16××× 46.17 ×× 68.71 ×× 45.26
2016-17లో మనదేశం దిగుమతి చేసుకున్న ముడి చమురు సగటు ధర 47.57 ,2017-18లో 56.43, 2018-19లో 69.88,2019-2020లో 60.57, 2020-21లో 44.82, 2021-22లో 79.18, 2022-23లో 93.15, 2023-24లో 82.41డాలర్లు ఉంది. 2022 ఏప్రిల్ ఆరున ఢిల్లీలో లీటరు పెట్రోలు ధర రు.105.41, డీజిల్ ధర రు.96.67 కాగా మే 22 నుంచి రు. 96.72, రు.89.62కు తగ్గించారు. అప్పటి నుంచి 2024 మార్చినెల 14వరకు అదే రేట్లు కొనసాగాయి. యుపిఏ పాలనలో 112 డాలర్లకు ముడి చమురు దిగుమతి చేసుకుంటే వినియోగదారుల నుంచి వసూలు చేసింది పెట్రోలు రు.64.71, డీజిల్కు రు.40.26 మాత్రమే. ఇప్పుడు తాజా రేటు పైన చెప్పుకున్నట్లు 82.41 డాలర్లు ఉంటే ఢిల్లీలో 96.67, 89.62గా ఎందుకు ఉన్నట్లు? తెలంగాణా, ఆంధ్రప్రదేశ్లో పెట్రోలు రేటు రు.109, 111 వంతున ఉన్నాయి, మరికొన్ని చోట్ల ఇంకా ఎక్కువ ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గినా వినియోగదారుల నుంచి ఇంతగా ధర వసూలుకు కారణమేమిటి అంటే విపరీతంగా సెస్సులను వడ్డించటం, రూపాయి మారకపు విలువ పతనాన్ని అరికట్టలేని అసమర్ధతే తప్ప మరొక కాదు. వీటి గురించి నరేంద్రమోడీ దేశానికి ఇస్తున్న గ్యారంటీలు ఏమిటి అన్నది ప్రశ్న.
.2011-12లో మన దేశం కొనుగోలు చేసిన ముడి చమురు సగటు ధర 111.89 డాలర్లు. ఆ ఏడాది అంటే 2012 మార్చి నెలలో ఉన్న సగటు ధర 123.66 డాలర్లుంది.2012 మార్చి 29 నుంచి ఏప్రిల్ పదకొండువరకు సగటు ధర 121.28 డాలర్లు. కేంద్ర ప్రభుత్వ సంస్థ పిపిఏసి వెల్లడించిన సమాచారం ప్రకారం 2022 జూన్ పదవ తేదీన మనం కొనుగోలు చేసిన చమురు ధర 121.28 డాలర్లు. ఇక్కడే మనం నరేంద్రమోడీ ఘనత గురించి చెప్పుకోవాలి. అదే ధరకు 2012లో మన చెల్లించిన మొత్తం మన కరెన్సీలో రు.6,201.05 కాగా ఎనిమిదేండ్ల పాలనలో నరేంద్రమోడీ అదే డాలర్లకు చెల్లించిన మొత్తం రు.9,434.29.అంటే మంచి రోజుల పేరుతో అధికారాన్ని పొంది బాదుడేబాదుడు అన్నట్లుగా చమురు మీద పెంచిన పన్నులను పక్కన పెడితే రూపాయి విలువ పతనాన్ని అరికట్టలేని అసమర్ధత కారణంగా ఈ రోజు మనం ప్రతి పీపాకు పదేండ్ల నాటి కంటే అదనంగా రు.3,233.24 చెల్లించాము. పదేండ్ల క్రితం రూపాయి విలువ డాలరుకు 51.13 ఉండగా మోడీ ఏలుబడిలో 2022 జూన్ పదిన అది 77.79కి దిగజారింది, పదమూడవ తేదీన 78.29కి పతనమై మరో కొత్త రికార్డు నమోదు చేసింది. ఇప్పుడు 83కు అటూ ఇటూగా ఉంది. అందువలన పదేండ్ల క్రితం, ఇప్పుడు ముడి చమురు ధర ఒకే విధంగా ఉన్నప్పటికీ మనం చెల్లించే మొత్తం భారీగా పెరుగుతుంది. రూపాయి విలువను కాపాడలేదంటూ నరేంద్రమోడీతో సహా బిజెపి నేతలందరూ మన్మోహన్ సింగ్ సర్కార్ను దులిపివేశారు. మోడీ సర్కార్ నిర్వాకానికి ఇప్పుడు దేశ ప్రజలందరూ మూల్యం చెల్లించాల్సి వస్తోంది. గత కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల గురించి నిరంతరం ఊదరగొడుతుంటారు. 1995లో స్వదేశీ ముడిచమురు ఉత్పత్తి 32.2మిలియన్ టన్నులు. దిగుమతుల మీద ఆధారపడటం తగ్గించుకోవాలి, స్వదేశీ ఉత్పత్తిని పెంచుకోవాలని రోజూ సుభాషితాలు చెబుతుంటారు.మోడీ ఏలుబడిలో 2022 నాటికి 28.4మిలియన్ టన్నులకు దిగజారింది. ఎంతో కీలకమైన ఈ రంగంలోనే మన ప్రతిభ ఇలా ఉంటే దేశాన్ని ముందుకు తీసుకుపోతాం, అగ్రస్థానానికి చేరుస్తాం అంటే ఉట్టికి ఎగరలేని వారు స్వర్గానికి ఎగురుతాం అన్నట్లుగా ఉంది.
కరోనా సంక్షోభంలో కార్పొరేట్ శక్తులను నరేంద్రమోడీ సర్కార్ ఎలా ఆదుకున్నదో, జనం అప్పులపాలై దివాలా తీస్తే ధనికుల దగ్గర సంపద ఎలా పోగుపడిందో చూశాము. ఇప్పుడు ఉక్రెయిను సంక్షోభం కారణంగా మన దేశంలో జనం ధరల పెరుగుదలతో అల్లాడిపోతుంటే రష్యా నుంచి చౌకగా దిగుమతి చేసుకున్న ముడిచమురును శుద్ది చేసి ఐరోపా దేశాల కోసం ఎగుమతి చేస్తున్నారంటే దీని వలన లబ్ది పొందేది ఎవరు? మన జనమైతే కాదు, పోనీ ఐరోపా దేశాల నుంచి వాటికి ప్రతిగా నరేంద్రమోడీ పలుకుబడితో తక్కువ ధరలకు సరకులను దిగుమతి చేసుకుంటున్నామా అంటే అదీ లేదు. రష్యా నుంచి దిగుమతుల వలన మన జనానికి కలిగిన-కలుగుతున్న మేలు ఇదీ అని ఎవరినైనా చెప్పమనండి !

మంచి వేదిక
LikeLike