Tags

, , , , ,

ఎం కోటేశ్వరరావు

ధాన్య ఉత్పత్తి పెరిగితే దేశానికి భారంగా మారుతుందా ? నేరుగా రైతులకే ఎగుమతి అవకాశాలు కల్పిస్తామంటూ కబుర్లు చెప్పిన నరేంద్రమోడీ సర్కార్‌ అదే చెబుతోంది, రాష్ట్రాలకు లేఖలు రాస్తోంది. అవర్‌ వరల్డ్‌ డాటా ప్రకారం మన పక్కనే ఉన్న చైనాలో 2022లో రోజుకు ప్రతి వ్యక్తికి సగటున 3,454 కాలరీల శక్తి నిచ్చే ఆహారాన్ని అందిస్తుండగా నెలకు ఐదు కిలోల ఆహార ధాన్యాలను ఉచితంగా అందిస్తున్న నరేంద్రమోడీ ఏలుబడిలో 2,574 కాలరీలు ఉంది. అయినప్పటికీ ధాన్యం పండించే రైతులకు బోనస్‌ ఇస్తే ఉత్పత్తి పెరుగుతుందని, అది దేశానికి భారంగా మారుతుందని కేంద్ర ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు.కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ కేంద్ర వైఖరిని ఆదివారం నాడు ఒక ప్రకటనలో విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వరి మద్దతు ధరకంటే అదనంగా క్వింటాలుకు కేరళ ప్రభుత్వం రు.631 అందిస్తున్నది. కేంద్రం ప్రకటించిన మద్దతు ధరల కంటే ఎక్కువగా ఇవ్వటాన్ని నిలిపివేయాలని కేంద్ర ఆర్థికశాఖలో ఖర్చుల విభాగ కార్యదర్శి కేరళ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఇలా ఇస్తున్న కారణంగా ధాన్య సేకరణ ఖర్చు పెరిగి ప్రభుత్వ ఖజానా మీద వత్తిడిని పెంచుతున్నదని కేరళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాసిన అధికారిక లేఖలో పేర్కొన్నారు. తెలంగాణాలో సన్న రకాలు పండించే వారికి బోనస్‌ ఇస్తున్న సంగతి తెలిసిందే. కేంద్ర లేఖ ఒక్క కేరళకేనా, అన్ని రాష్ట్రాలు పంపిందా అన్నది తెలియదు. ఎలాంటి శషభిషలు లేకుండా కార్పొరేట్‌ కంపెనీలకు వేలాది కోట్ల రూపాయల రుణాలను రద్దు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల ఇలా ఎందుకు వ్యవహరిస్తున్నదని, రైతులకు ఇచ్చే బోనస్‌ను ప్రధాన ఆర్థిక భారంగా ఎందుకు భావిస్తున్నదని పినరయి విజయన్‌ ప్రశ్నించారు. ఈ లేఖలో వెల్లడించిన అభిప్రాయం వెనుక మనదేశ మార్కెట్‌ను అమెరికా వ్యవసాయ ఉత్పత్తులకు తెరవాలన్న ఆలోచన ఉందా అని కూడా ప్రశ్నించారు.వరి రైతులకు చెల్లించాల్సిన సాయాన్ని సకాలంలో విడుదల చేయటంలో కేంద్రం విఫలమైందని విమర్శించారు.

కేంద్ర ప్రభుత్వం ఈ లేఖను వెంటనే వెనక్కు తీసుకోవాలని ఎల్‌డిఎఫ్‌ రాష్ట్ర కన్వీనర్‌ టిపి రామకృష్ణన్‌ డిమాండ్‌ చేశారు. కేంద్ర వైఖరి ఆహార భద్రత, స్వయం సమృద్ధిని దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. జనవరి తొమ్మిదవ తేదీన కేంద్ర ప్రభుత్వం రాసిన ఈ లేఖలో గోధుమ,వరి పంటలకు అదనపు ప్రోత్సాహాన్ని నిలిపివేయాలని, కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా పప్పు ధాన్యాలు,చమురు గింజలు,చిరుధాన్యాలకు ప్రోత్సాహాకాలను అందించాలని పేర్కొన్నారు.కేంద్ర సూచనను తిరస్కరిస్తున్నామని, వరి సాగు విషయంలో రాజీపడేది లేదని వ్యవసాయ శాఖ మంత్రి పి ప్రసాద్‌ కేంద్రానికి లేఖ రాశారు. చిరుధాన్యాలు, పప్పుధాన్యాల సాగు ప్రోతాహకాలను తాము వ్యతిరేకించటం లేదని, వరిని ఫణంగా పెట్టి ఆ పని చేయలేమని, వాటి ఉత్పత్తికి కూడా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి పేర్కొన్నారు. కేరళ అవసరాలలో కేవలం 21శాతం మాత్రమే స్థానికంగా బియ్యం ఉత్పత్తి ఉంది, దాన్ని 30శాతానికి పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అదనపు ప్రోత్సాహం అందిస్తున్నది.

కొసమెరుపు ఏమంటే కేంద్ర చర్యతో రైతాంగంలో వెలువడిన వ్యతిరేకతతో రాష్ట్ర బిజెపి బెంబేలెత్తింది. వెంటనే ఆ లేఖను ఉపసంహరించుకోవాలని రాష్ట్ర అధ్యక్షుడు రాజీవ్‌ చంద్రశేఖర్‌ కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాసినట్లు సోమవారం నాడు వార్త వచ్చింది. అంతవరకైతే అదో దారి, రాష్ట్ర ప్రభుత్వం ధాన్య రైతాంగాన్ని పట్టించుకోవటం లేదని, ముఖ్యంగా ఉత్పాదక ఖర్చు, సేకరణ యంత్రాంగం, మార్కెటింగ్‌ మద్దతు ఇవ్వటం లేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం అదనంగా బోనస్‌ ప్రకటించలేదని కూడా చెప్పారు.కేంద్రం పంపిన లేఖలో పేర్కొన్నట్లు కేరళలో అదనపు ఉత్పత్తిలేదని, కేంద్ర నిల్వలు కూడా అదనంగా లేవని, భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయని చెప్పిన అంశాలు కేరళకు వర్తించవని బిజెపి నేత వాపోయారు. ధాన్య సాగు విస్తీర్ణం తగ్గుతున్నదని, ఇక్కడ ఉన్న ప్రత్యేకతలు, ఆహార భద్రతను పరిగణనలోకి తీసుకోవాలని కూడా పేర్కొన్నారు.ఈ కారణంగానే కేంద్రం ఆర్థికంగా కేరళను ఎన్ని ఇబ్బందులు పెడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం వరి సాగును పెంచేందుకు అదనంగా బోనస్‌ ఇస్తున్నది. దీన్ని సాకుగా చూపి మరిన్ని ఇబ్బందులు పెట్టేందుకే ఆర్థిక శాఖ రాసిన లేఖ అన్నది స్పష్టం. త్వరలో ఎన్నికలు జరగనుండగా ఇలాంటి పనులు చేస్తే వచ్చే ఇబ్బందులను ఊహించి బిజెపి నేత నిర్మలా సీతారామన్‌కు మొరపెట్టుకున్నారు.దీంతో కేంద్ర ప్రభుత్వం, బిజెపి కూడా ఇరుకునపడింది.ఇప్పుడు లేఖను వెనక్కు తీసుకున్నా, లేకున్నా బిజెపికే నష్టం.అదొక అసెంబ్లీ ఎన్నికల అస్త్రంగా మారుతుంది.

ప్రకటిస్తున్న కనీస మద్దతు ధరలకు చట్టబద్దత కల్పించటం గురించి పరిశీలనకు కేంద్ర ప్రభుత్వం 2022జూలైలో వేసిన కమిటీ ఇంతవరకు ఎలాంటి నివేదిక సమర్పించలేదు, ఏం చేస్తున్నారని కేంద్రం అడగనూ లేదు. రైతుల పట్ల మోడీ ప్రభుత్వ శ్రద్దకు ఇది చక్కటి తార్కాణం.అమెరికా ఉత్పత్తులకు ఒక్కసారే పూర్తి స్థాయిలో మార్కెట్‌ను తెరిస్తే రైతాంగం నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందన్న భయంతో దశలవారీ చర్యలకు పూనుకున్నట్లు కనిపిస్తోంది. ఎవరినైనా హత్య చేయదలచుకుంటే మెల్లగా పనిచేసే విషం ఇవ్వటం తెలిసిందే. అలా ఒక్కొక్కటిగా వెల్లడిస్తే ఈలోగా జనం అలవాటు పడిపోతారన్నది భావన కావచ్చు. మంత్రి పియూష్‌ గోయల్‌ స్వయంగా చెప్పినట్లు ఇప్పుడు కుదిరింది ఒక స్వరూప అవగాహన మాత్రమే. ఉదాహరణకు ఇల్లు కట్టేటపుడు ఒక ప్లాన్‌ గీస్తారు. తరువాత పిల్లర్లు, గోడలు, స్లాబ్‌ వేస్తారు. ఇంట్లో ఏమేమి ఉండేది తరువాత మాత్రమే బయటివారికి తెలుస్తుంది. అలాంటిదే అమెరికాతో కుదిరిన అవగాహన. తాత్కాలిక ఒప్పందం పేరుతో పశుదాణా అవసరాలకు ఎర్ర జొన్నలు, పలురకాల ధాన్యాలతో చేస్తున్న ఇథనాల్‌ తయారీలో ఉప ఉత్పత్తిగా తయారయ్యే చెక్కను కూడా కూడా దిగుమతి చేసుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి దిగుమతి పన్నులేకుండా అనుమతించింది. ఇప్పటికే పత్తి దిగుమతి పన్ను తగ్గింపుతో క్వింటాలకు వెయ్యి నుంచి రెండువేల వరకు రైతాంగం నష్టపోయింది.ఈ పశుదాణా పేరుతో దిగుమతులు, అందుకోసం మనదేశంలో సాగు చేస్తున్న మొక్కజొన్న, జొన్న, ఇతర పంటల ధరల పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్ధకంగా మారింది. సోయా ఆయిల్‌ దిగుమతి ఆ పంట పండించే రైతాంగంతో పాటు పామాయిల్‌, నూనె గింజల సాగుమీద ఎలాంటి ప్రతికూల ప్రభావం పడనుందో అధ్యయనం చేయాల్సి ఉంది. యాపిల్‌ పండ్ల దిగుమతులు కాశ్మీర్‌,హిమచల్‌ ప్రదేశ్‌ ఇతర ప్రాంతాల్లోని రైతాంగానికి గొడ్డలి పెట్టని యాపిల్‌ సాగుదార్ల అఖిల భారత సంఘ అధ్యక్షుడు, సిపిఐ(ఎం) నేత మహమ్మద్‌ యూసుఫ్‌ తారిగామి పేర్కొన్నారు.

అమెరికాతో ఒప్పందం రైతాంగానికి నష్టం గనుక ఆందోళన చేయాలని సంయుక్త కిసాన్‌ మోర్చా, దాన్నుంచి విడిపోయిన వారితో సహా అనేక రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. దేశ వ్యవసాయ రంగాన్ని అమెరికన్‌ కార్పొరేట్లకు పూర్తిగా అప్పగించేశారని పేర్కొన్నాయి.వాణిజ్యశాఖ మంత్రి పియూష్‌ గోయల్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశాయి. అమెరికా నుంచి దిగుమతి చేసుకొనే వస్తువులపై ఎలాంటి పన్నులు ఉండవని, మనం ఎగుమతి చేసే వాటిపై 18శాతం పన్ను విధిస్తామని ట్రంప్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. అమెరికా, ఐరోపా యూనియన్‌ దేశాల ఆర్థిక వ్యవస్థలు గిడసబారిన స్థితిలో ఉన్నందున చేసుకొనే ఒప్పందాలు వాటికి ఉపయోగం తప్ప భారత్‌కు మేలు చేయవని అనేక మంది చేస్తున్న ఆందోళనను కేంద్రం పట్టించుకోవటం లేదు. ఈనెల పన్నెండున లేబర్‌ కోడ్‌లు, ఇతర కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాపిత సమ్మెకు కార్మిక సంఘాలు పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే, వారికి మద్దతుగా, రైతు వ్యతిరేక చర్యలకు నిరసనగా ఆ రోజున రైతాంగం కూడా పాల్గ్గొనాలని రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. ఆ రోజున ట్రంప్‌, మోడీ దిష్టి బొమ్మలను దగ్దం చేయాలని కోరాయి. సంయుక్త కిసాన్‌ మోర్చా(రాజకీయేతర) ఒక ప్రకటన చేస్తూ త్వరలో సమావేశం జరిపి, అమెరికాతో ఒప్పందానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలకు పిలుపునిస్తామని పేర్కొన్నది. ప్రతిపక్షాలు, రైతు సంఘాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, వ్యవసాయానికి ఎలాంటి ముప్పు ఉండదని పియూష్‌ గోయల్‌ చెప్పుకున్నారు.

వాణిజ్య ఒప్పందం గురించి 2025 ఫిబ్రవరి 13న డోనాల్డ్‌ ట్రంప్‌ – నరేంద్రమోడీ చర్చలకు శ్రీకారం చుట్టారు.రెండు దేశాల మధ్య కుదిరిన తాత్కాలిక ఒప్పందంలోని అంశాలు ఇలా ఉన్నాయి. అమెరికా పారిశ్రామిక వస్తువులు మరియు పలు ఆహార, వ్యవసాయ ఉత్పత్తులపై పన్నులను భారత్‌ పూర్తిగా ఎత్తివేయటం లేదా తగ్గించటం చేస్తుంది.వాటిలో పశుదాణా అవసరాల కోసం డ్రైడ్‌ డిస్టిల్లర్స్‌ గ్రెయిన్స్‌(పైన చెప్పుకున్న ఇథనాల్‌ ఉప ఉత్పత్తులు), ఎర్ర జొన్నలు,ట్రీ నట్స్‌, తాజా మరియు ప్రోసెస్‌ చేసిన పండ్లు, సోయాబీన్‌ నూనె, వైన్‌, ఆల్కహాల్‌ మరియు అదనపు ఉత్పత్తులు.దీనికి ప్రతిగా ఏప్రిల్‌ రెండవ తేదీన జారీ చేసిన ఆదేశాల ప్రకారం భారత ఉత్పత్తులపై 18శాతం పన్నులు విధిస్తారు. వాటిలో వస్త్రాలు, దుస్తులు, తోలు వస్తువులు, చెప్పులు, ప్లాస్టిక్‌ మరియు రబ్బరు, ఆర్గానిక్‌ రసాయనాలు,గృహ అలంకరణ వస్తువులు, కళా ఉత్పత్తులు మరియు కొన్ని యంత్రాలు ఉన్నాయి.జనరిక్‌ ఔషధాలు, వజ్ర వైఢూర్యాలు, విమానాల విడిభాగాల మీ పన్నులను రద్దు చేస్తారు.అమెరికా జాతీయ భద్రతకు ముప్పుగా భావించి గతంలో పన్నులు విధించిన భారత విమానాల విడిభాగాలు,అల్యూమినియం, ఉక్కు, రాగి, వాహన ఉత్పత్తులపై రాయితీలు, కోటాలను అమలు చేస్తారు. రానున్న ఐదు సంవత్సరాల్లో అమెరికా నుంచి ఇంథన ఉత్పత్తులు, విమానాలు, విమానవిడి భాగాలు, వంట బొగ్గు, విలువైన లోహాలు, సాంకేతిక ఉత్పతులను 500 బిలియన్‌ డాలర్ల మేర కొనుగోలు చేయాలనుందని భారత్‌ చెప్పింది. ఈ ఒప్పందంలో భారత్‌ నుంచి అమెరికా ఏ వస్తువులను, ఎంత మొత్తంలో కొనుగోలు చేసేందుకు అంగీకరించిందీ లేదా వాంఛిస్తున్నదీ వివరాలు లేవు.ఈ కారణంగానే దీన్ని ఖరారు చేసే నాటికి వాటిలో ఎన్ని చేరుస్తారో ఏమిటో జనాలకు అంతుబట్టటం లేదు గనుకనే అనేక అనుమానాలు తలెత్తాయి. ఇది అమెరికాకు అనుకూలంగా ఉందనే అభిప్రాయం రావటానికి అనేక అంశాలు దోహదం చేస్తున్నాయి. మరిన్ని వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది, ఒప్పందంపై సంతకాల తరువాత అవి వెల్లడౌతాయి !