Tags
BJP, Kumbha Mela, Narendra Modi Failures, R&D China and India, R&D Expenditures, RSS, Science, scientific temper, Yogi Adityanath
ఎం కోటేశ్వరరావు
జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ప్రయాగ్ రాజ్ పాతపేరు అలహాబాద్లో మహాకుంభమేళా, ఫిబ్రవరి 28వ తేదీ జాతీయ సైన్సు దినోత్సం జరిగింది. మీడియా దేనికి ఎంత ప్రచారమిచ్చింది ? కుంభమేళాకు ఇచ్చిన ప్రచారంలో వెయ్యోవంతైనా శాస్త్రవిజ్ఞానం, మూఢవిశ్వాసాలు సంబంధిత లాభనష్టాల గురించి పాఠకులు, వీక్షకులకు చెప్పిందా ? కుంభమేళా స్నానాలకుసైన్సును జోడిరచిన ప్రవచనాలకు ఎక్కడలేని ప్రాధాన్యత ఇచ్చారు. ఎవరి నమ్మకాలు వారివి. ప్రభుత్వం చెబుతున్నదాని ప్రకారం 66 కోట్ల మంది గంగ, యమున, అంతర్వాహిని అని చెబుతున్న సరస్వతి నది త్రివేణీ సంగమంలో మునకలేసి స్నానాలు చేశారు. దీని వెనుక అనేక నమ్మకాలు ఉన్నాయి. కొందరు పుణ్యం కోసం అంటే మరికొందరు చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తంగా, పాపాలను కడిగి వేసుకొనేందుకని రకరకాల కారణాలు చెప్పారు. ఎవరికి ఏమి లభించిందో తెలియదు. ఎవరి గోల, ఎవరి లెక్కలు వారివి. వెళ్లినవారు తమ యాత్ర, స్నానం జరిగిన తీరు గురించి చెప్పుకుంటుంటే ఈ కార్యక్రమం వలన రెండున్నరలక్షల కోట్ల రూపాయల మేర లావాదేవీలు జరిగినట్లు కొందరు అంచనా వేశారు. జాతీయ స్థూల ఉత్పత్తికి నాలుగు లక్షల కోట్ల రూపాయల మేర లబ్ది కలిగిందని దీన్ని ‘‘ శాస్త్రీయం ’’ గా లెక్కలు కట్టి రాష్ట్రంలోని సంఘటిత, అసంఘటిత రంగానికి కలిగిన లబ్ది, ఉపాధి గురించి నిర్ధారించాలని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశించినట్లు వార్తలు(దైనిక జాగరణ్,2025 ఫిబ్రవరి 27) వచ్చాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఒక ప్రచార అస్త్రంగా దీన్ని మార్చుకుంటారు గనుక అలాంటి లెక్కలను తేల్చాలని కోరటం అర్ధం చేసుకోదగిందే. ఒక అశాస్త్రీయ అంశాన్ని ప్రోత్సహించి దాని ద్వారా కలిగిన ఆర్థిక లబ్దిని శాస్త్రీయంగా తేల్చాలనటం కొందరికే సాధ్యం. భక్తి శివుడి మీద చిత్తం చెప్పుల మీద అన్న లోకోక్తి ఊరికే రాలేదు.
సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జు 2012 ఏప్రిల్ నాలుగవ తేదీన జనాన్ని వెర్రివెంగళప్పలు చేసేందుకు పది మార్గాలంటూ ఒక వ్యాసం రాశారు. మన దేశంలోని 90శాతం మంది జనాలకు శాస్త్రీయ దృక్పధం లేదని పేర్కొన్నారు. ఈ శాతాన్ని మీరు ఎలా చెప్పారంటూ అమెరికా పత్రిక వాల్స్ట్రీట్ జర్నల్ ఢల్లీి విలేకరి కట్జును ప్రశ్నించారట. ఇది గణాంకం కాదు, ఒక అంచనా మాత్రమే అంటూ అది 85శాతం లేదా 95శాతం కూడా కావచ్చని చెప్పానని, తాను రాసిన దానికి అర్ధం భారతీయులు అత్యధికులు వెర్రి వెంగళప్పలు అని చెప్పినట్లు తరువాత ఆయనే మరో వ్యాసంలో రాశారు. కుంభమేళా గురించి మీడియా కల్పించిన ప్రచారం, దానికి ప్రభావితులైన వారిని చూస్తే కట్జూ చెప్పినట్లు ఆ సంఖ్య ఇంకా పెరిగిందా, తగ్గిందా అన్నది ఎవరికి వారే అంచనావేసుకోవచ్చు. ఈ పదమూడు సంవత్సరాలలో దేశాంలో శాస్త్రీయ దృక్పధం పెరిగిందని, కట్జూ చెప్పింది తప్పని, శాస్త్రీయంగానే 66 కోట్ల మంది గంగలో మునిగారని ఎవరైనా శాస్త్రీయంగా నిరూపిస్తే అంగీకరించటానికి ఇబ్బంది లేదు. ముస్లిం, క్రైస్తవం, ఇతర మతాల్లో కూడా ఇలాంటివి గాకపోయినా పెద్ద సంఖ్యలో గుమికూడే వారికి ఇదే వర్తిస్తుంది. మతం, అది వ్యాపింపచేసే నమ్మకాలు మత్తు మందు.
అంతరిక్షంలోకి ఉపగ్రహాలను పంపే శాస్త్రవేత్తలు అవి కూలిపోకుండా ఎగరాలంటూ దేవుళ్లు, దేవతలను ప్రార్ధించటం తెలిసిందే. బిజెపి వాగ్దానాలలో సైన్సు అభివృద్ధి ఒకటి. చూడండి మా మోడీ కారణంగానే డిజిటల్ ఇండియా ఉనికిలోకి వచ్చింది, బిచ్చగాండ్లు కూడా బాంకు ఖాతా ఓపెన్ చేసి స్కానర్ పెట్టి అడుక్కుంటున్నారు అని తమ భుజాలను తామే చరుచుకొనేవారు ఉన్నారు. నిజమే, ఎలా వచ్చిందనేది అందరికీ తెలుసు గనుక ఆ ఖ్యాతిని మొత్తం నరేంద్రమోడీ తన ఖాతాలో వేసుకున్నా దేశానికి నష్టం లేదు, గతంలో ఒక సిఎం హైదరాబాదును తానే నిర్మించానన్నట్లుగా చెప్పుకున్నారు. కానీ బిచ్చగాండ్ల సంగతేమిటి ? అందుకే సైన్స్, సాంకేతిక పరిజ్ఞానం అంటే ఒక్క డిజిటల్ ఇండియా మాత్రమే కాదు. ఆ పరిజ్ఞానం ద్వారా అమెరికా కంటే ఎక్కువ లావాదేవీలు జరుగుతున్నాయి, కానీ ఆర్థికంగా దానికి మనం ఎంతదూరంలో ఉన్నాం ? పని చేసే ప్రభుత్వ నేతగా మోడీ గురించి చెబుతారు. పరిశోధన మరియు అభివృద్ధి రంగం(ఆర్ అండ్ డి) గురించి ఒక విధాన నిర్ణయానికే తొమ్మిదేండ్లు పట్టింది. జాతీయ పరిశోధనా ఫౌండేషన్ 2023లో ఉనికిలోకి వచ్చింది. ఐదేండ్లలో ఆరువందల కోట్ల డాలర్లు ఖర్చు చేయాలని నిర్ణయించారు. అంటే అన్నారని గింజుకుంటారు గానీ ఇష్టంలేని పెండ్లికి తలంబ్రాలు పోసినట్లుగా దీని వ్యవహారం ఉంది. గత కాంగ్రెస్ పాలకులు, నరేంద్రమోడీకి పెద్ద తేడా ఏమీలేదు.
అమెరికా చాట్ జిపిటి, చైనా డీప్ సీక్లో మునిగితేలుతుంటే మనం గంగలో మునకలేస్తున్నాం. మన వారు డీప్ సీక్ రూపొందించలేకపోవటానికి మనదేశాన్ని విదేశీ పాలకులు ఆక్రమించుకోవటమే అంటూ ఆర్ఎస్ఎస్ పత్రిక ఆర్గనైజర్లో మత కోణాన్ని జోడిరచి విశ్లేషణ చేశారు.వేదాల్లోనే అన్నీ ఉన్నాయష అని లొట్టలు వేసుకుంటూ చెబుతారు. ఆ ఒక్కటీ అడక్కు అనే సినిమాలో జ్యోతిష్కుడు చెప్పినదాన్ని నమ్మి పనిపాటాలేకుండా గడిపిన పాత్ర మాదిరి కాలక్షేపం చేస్తున్నారు. గత పది సంవత్సరాల్లో పురాణాల్లో చెప్పిన పుక్కిటి కబుర్లను వల్లెవేస్తూ మనదేశంలో ఎప్పుడో అవయవ మార్పిడి జరిగిందనటానికి వినాయకుడికి ఏనుగు తొండం అమర్చటం, కృత్రిమ గర్భం ద్వారా పిల్లలకు ఉదాహరణకు కౌరవులని, ఎంత మంది ఎక్కినా ఒకరికి చోటుండే పుష్పక విమానాలను రూపొందించారని సొల్లు కబుర్లు చెబుతున్నారు తప్ప వేదాల్లో ఉన్నవాటిని వెలికి తీసింది లేదు. శాస్త్రీయ దృక్పధాన్ని పెంపొందించాలని మన రాజ్యాంగం నిర్దేశించగా దానికి విరుద్దంగా సిలబస్ నుంచి డార్విన్ జీవ పరిణామ సిద్దాంతాన్ని తొలగించారు.మనుషులు బ్రహ్మ ముఖం కాళ్లు చేతులు ఇతర భాగాల నుంచి పుట్టారని టీచర్లు చెప్పాలన్నమాట. ఎలాంటి వారి చేతులో చిక్కుకున్నాం ! రాజ్యాంగాన్ని దెబ్బతీయటం అంటే ఇదే. ఇలాంటి పాలకులు సైన్సు గురించి జనానికి ఎందుకు బోధిస్తారు.పరిశోధనలకు నిధులు ఎందుకు కేటాయిస్తారు.
నేషనల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రిసర్చ్ ఫౌండేషన్ ఏర్పాటు చేయాలని 2005లో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్కు జాతీయ సైన్సు సలహా మండలి సిఫార్సు చేసింది, 2008లో ఆమోదం తెలిపారు.ఆ మేరకు ఒక చట్టాన్ని చేశారు. తరువాత మోడీ సర్కార్ అనుసంధాన్ నేషనల్ రిసర్చ్ ఫౌండేషన్(ఎన్ఆర్ఎఫ్) పేరుతో 2023లో ఒక చట్టాన్ని తెచ్చింది. అంతకు ముందు ఎన్ని కబుర్లు చెప్పినా ఇక చూడండి అంటూ 2023 నుంచి 2028 కాలంలో 50వేల కోట్ల రూపాయలతో పరిశోధనలు చేపడతామని చెప్పారు. ఈ మొత్తాన్ని సమీకరించేందుకు ప్రైవేటు, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రోత్సహిస్తామన్నారు, 70శాతం నిధులు ప్రెవేట్ రంగం నుంచి సేకరిస్తామన్నారు. దీనికి ప్రధాన మంత్రే అధ్యక్షత వహిస్తారు. త్వరలో దేశాన్ని అమెరికా, చైనాల సరసన నిలబెడతామంటున్నారు. మహానుభావులు ఊరికే కబుర్లు చెప్పకూడదు కదా ! ఆ స్థాయికి చేరటానికి ఒక మార్గం పరిశోధనా రంగానికి పెద్ద మొత్తంలో కేటాయించాలి. ప్రపంచంలో ఈ కేటాయింపు జిడిపిలో సగటున రెండుశాతం ఉంది. మన దేశంలో 200910లో గరిష్టంగా 0.82శాతం ఉండగా అది మోడీ అధికారానికి వచ్చేనాటికి 0.7శాతానికి తరువాత 202425 ఆర్థిక సర్వే పేర్కొన్నదాని ప్రకారం 0.64శాతానికి దిగజారింది. ఎన్ఆర్ఎఫ్ ద్వారా ఐదేండ్లలో ఏడాదికి పదివేల కోట్ల రూపాయలు కేటాయించాల్సి ఉండగా 202324లో రు.2,000 కోట్లు కేటాయించి తరువాత దాన్ని కేవలం రు.258.6 కోట్లకు సవరించారు. వీరు దేశాన్ని ఉద్ధరిస్తారు, యువ పరిశోధకులను ప్రోత్సహిస్తారని ఆశించి భజన చేయాలి.
చైనాను త్వరలో అధిగమిస్తామని, ప్రపంచ వస్తుఉత్పత్తిదారుగా మారతామని కొంత మంది చెబుతుంటారు. మంచిదే, నరేంద్రమోడీ, ఆయనను గద్దె మీద కూర్చోపెట్టేందుకు ఊతమిస్తున్న చంద్రబాబు వంటి వారి 2047 రంగుల కలను కూడా నిజమే అనుకుందాం. కానీ ఆచరణ ఏమిటన్నది ప్రశ్న.1990దశకంలో భారత్చైనా రెండూ కూడా పరిశోధనలకు జిడిపిలో కేటాయించిన మొత్తం 0.7శాతమే. కానీ నేడు చైనా 2024లో 2.68శాతం ఖర్చు చేసింది. 202526 మన కేంద్ర బడ్జెట్ డాలర్లలో 584 బిలియన్లు కాగా 2024లో చైనా ఒక్క పరిశోధనకు ఖర్చు చేసిన మొత్తమే 496 బిలియన్ డాలర్లు.అర్ధం అవుతోందా ! కేంద్ర ప్రభుత్వం 2024నవంబరు 29న పార్లమెంటులో వెల్లడిరచిన సమాచారం ప్రకారం పది సంవత్సరాలలో మన పరిశోధన ఖర్చు జిడిపిలో 0.60.7శాతం మధ్య ఉండగా ఇజ్రాయెల్ 5.4, అమెరికా 3.5 శాతాల చొప్పున ఖర్చు చేస్తున్నాయి.మా తాతలు నేతులు తాగారు కావాలంటే మా మూతులు వాసన చూడండి అన్నట్లు కబుర్లు చెబితే దేశం ముందుకు పోదు. అన్నీ నెహ్రూయే చేశారు అని చెప్పే పెద్దలు పరిశోధనకు నిధులు పెంచకుండా ఎవరు అడ్డుకున్నారు? కుండలో కూడు అలాగే ఉండాలి పిల్లాడు భీముడిలా తయారు కావాలంటే కుదురుతుందా ?
పోనీ మన దేశం పరిశోధనలకు దూరంగా ఉందా అంటే లేదు.గోమూత్రంలో బంగారం ఎంతుంది, పేడలో ఏముంది అంటూ శోధిస్తున్నారు. సంఘపరివార్ భావజాలానికి అనుగుణంగా ప్రోత్సహిస్తున్నారు. ఉదాహరణకు జన్యు పరిశోధనలు చేసి దేశంలో ఉన్న జనాభా ‘‘ శుద్ధమైన జాతి ’’ జాతి ఏదో తేల్చేందుకు 2022లో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వశాఖ నిధులు ఇస్తున్నదనే వార్తలు వచ్చాయి. ఇది ప్రమాదకరమని, విరమించాలని జన్యుశాస్త్రంలో నిపుణులు, చరిత్రకారులు, సామాజిక శాస్త్రవేత్తలు 120 మంది నాడు కేంద్రానికి లేఖ రాశారు. జన్యు చరిత్రను తెలుసుకోవటం అనే కారణాన్ని ప్రభుత్వం చెప్పింది.వివిధ ప్రజా సమూహాల నుంచి గతంలో డిఎన్ఏలను సేకరించి చేసిన విశ్లేషణ ప్రకారం అనేకవాటి సమ్మిళితం అని తేలింది. ఫలానా జన్యువులు ఉన్నవారు పరిశుద్దులు అంటే మిగతావారిని అవమానించే తీర్పు తప్ప సైన్సు కాదు. ఇలాంటి పనులన్నింటికీ స్ఫూర్తి జర్మన్ హిట్లర్. ఆర్ఎస్ఎస్ సిద్దాంతవేత్త , గురువుగా పరిగణించే ఎంఎస్ గోల్వాల్కర్ 1960 డిసెంబరులో గుజరాత్ విశ్వవిద్యాలయ విద్యార్దులను ఉద్దేశించి ప్రసంగించారు. దానిలో చెప్పిన అంశాల గురించి రచయిత, గతంలో ఆర్థికశాఖ సలహాదారుగా పనిచేసిన మోహన్ గురుస్వామి ప్రాంటియర్ పత్రిక 2018వ సంవత్సరం40వ సంచికలో ఒక వ్యాసం రాశారు. ‘‘ఉత్తమ జాతి సృష్టిక్రియేటింగ్ ఏ మాస్టర్ రేస్ ’’ శీర్షిక పెట్టారు. దాని ప్రకారం గోల్వాల్కర్ చెప్పిన అంశాలు ఇలా ఉన్నాయి.‘‘ మనం కేవలం జంతువులలో మాత్రమే సంకర జాతిని సృష్టించేందుకు ప్రయోగాలు చేశాం. మానవ సంకరం ద్వారా మెరుగైన మనుషు సృష్టించేందుకు మన పూర్వీకులు ధైర్యవంతమైన ప్రయోగాలు చేశారు.ఉత్తరాదికి చెందిన నంబూద్రీ బ్రాహ్మణులు కేరళలో స్దిరపడ్డారు. ఒక సాహసోపేతమైన నిబంధన తెచ్చారు. దాని ప్రకారం ఏ తరగతికి చెందిన వారైనా వివాహిత మహిళ ముందుగా ఒక నంబూద్రీ బ్రాహ్మణుడిని కూడి ఒక బిడ్డను కనాలి, తరువాతే ఆమె భర్తతో పిల్లలను కనాలి.( ఆర్ఎస్ఎస్ వాణి ఆర్గనైజర్ పత్రిక 1961 జనవరి రెండు సంచికలో ఉపన్యాస పూర్తి పాఠం ఉంది) ’’.
ఇలాంటి గురువుల శిష్యులు చేస్తున్నదేమిటి ? సంఘపరివార్ ఏర్పాటు చేసిన అనేక సంస్థలలో ఆరోగ్యభారతి ఒకటి. అది గర్భ విజ్ఞాన సంస్కార్ పేరుతో ఒక ప్రాజెక్టు నడుపుతున్నది. ఆజానుబాహులు, మంచి రంగు, రూపుతో ఉండే పిల్లలను పుట్టించటానికి పూనుకుంది. గుజరాత్లో మొదలెట్టి దేశమంతటా దీన్ని విస్తరించేందుకు తలపెట్టారు. అనేక చోట్ల ఈ మేరకు సభలు, సమావేశాలు కూడా నిర్వహిస్తుంటారు. జర్మన్ హిట్లర్ ఆర్యజాతి ఉత్తమమైనదని చెప్పినట్లుగానే ఉత్తమ హిందూజాతిని, హిందూ దేశభక్తులను రూపొందించేందుకు ఈ ప్రయత్నాలని జనాలను నమ్మిస్తున్నారు. జర్మన్ కాని సైన్సు పుస్తకాలను 1933లో నాజీలు తగులబెట్టారు. వాటిలో నాజీల భావజాలానికి వ్యతిరేకంగా ఉన్నవాటితో పాటు యూదు రచయితలు రాసినవి ఉన్నాయి. బెర్లిన్లో ఉన్న లైంగిక విజ్ఞాన సంస్థను లూటీ చేసి విధ్వంసకాండ సృష్టించారు. అంతే కాదు దేశంలో వివిధ సంస్థలలో శాస్త్రవేత్తలైనా, విద్యావేత్తలు, మేథావులు ఆర్యనేతరులు ఉంటే వారి స్థానాల నుంచి తొలగించారు. ఆర్య జాతి పవిత్రతను పరిశోధించి తేల్చే పేరుతో, తమ భావజాల లక్ష్యాలకు అనుగుణంగా జైళ్లలోని వేలాది మంది ఖైదీలపై అమానుషంగా పరీక్షలు, ప్రయోగాలు చేశారు.
మన దేశంలో అలాంటి ఉదంతాలు చోటు చేసుకుంటున్నాయి. 2025 ఫిబ్రవరి ఎనిమిదిన తిరుపతి పుస్తక మహోత్సవంలో కాషాయ మూకలు దాడులకు పాల్పడ్డాయి.ఖురాన్ గ్రంధంలోని అంశాలను ఉటంకిస్తూ ఇస్లామిక్`హిందూ విలువల గురించి పోల్చిన ఖురాన్ అనాలసిస్ అనే పుస్తకాన్ని విక్రయించినందుకు ఒక స్టాల్మీద దాడి జరిగింది. దాన్ని రాసింది శర్మ అనే హిందువే. అలాగే పెరియార్ రచనలతో పాటు రంగనాయకమ్మ రచన రామాయణ విషవృక్షం అనే గ్రంధాలను ఎందుకు విక్రయిస్తున్నారంటూ విశాలాంధ్ర స్టాల్ మీద దాడి చేశారు. అంతకు ముందు హైదరాబాద్ బుక్ఫెయిర్లో తిరుపతి బాలాజీ విగ్రహం గురించిన ఒక పుస్తకాన్ని ఉంచినందుకు వీక్షణం స్టాల్ మీద అదే చేశారు. చాలా సంవత్సరాల క్రితం హైదరాబాద్ బాగ్లింగంపల్లిలో ఉన్న సుందరయ్య విజ్ఞాన కేంద్రం మీద దాడి చేశారు. చరిత్రలో యంత్ర విధ్వంసకుల గురించి చదివాము.కొన్నింటిని నాశనం చేస్తే తరువాత వేలాది యంత్రాలు వచ్చాయి, వస్తాయి. అలాగే పుస్తకాలను అడ్డుకుంటే భావజాల వ్యాప్తి ఆగుతుందా ? పురాతన తక్షశిల విద్యాకేంద్రాన్ని ధ్వంసచేసినంత మాత్రాన మనదేశంలో భావజాల వ్యాప్తి ఆగిందా ! అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపాలని చూసే బాపతు గురించి వేరే చెప్పాలా ? ఇలాంటి వారు అజ్ఞానాన్ని తప్ప విజ్ఞాన శాస్త్రాలను ప్రోత్సహిస్తారా ? వేదాల్లోనే అన్నీ ఉన్నాయష అని నమ్మేవారు పరిశోధన మరియు అభివృద్ధికి నిధులు కేటాయిస్తారా ? దేశాన్ని మధ్యయుగాల నాటికి తప్ప ముందుకు తీసుకుపోతారా ?
