• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: Ten years Narendra Modi rule

చివరికి గొడుగులు కూడా చైనా నుంచి దిగుమతా ! హతవిధీ పదేండ్లలో నరేంద్ర మోడీ ప్రగతి ఇదా !!

02 Monday Sep 2024

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices

≈ Leave a comment

Tags

Anti China Media, Anti communist, BJP, China imports to India, Indian manufacturers, Narendra Modi Failures, RSS, Tata EV, Ten years Narendra Modi rule


ఎం కోటేశ్వరరావు


మన దేశంలో అగ్రశ్రేణి ఆటోమొబైల్‌ కంపెనీ టాటా మోటార్స్‌ తన విద్యుత్‌ కార్లకు చైనా బ్యాటరీలను కొనాలని నిర్ణయించింది. మేకిన్‌ ఇండియా పథకం కింద విద్యుత్‌ బాటరీలను తయారు చేస్తున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన తరువాత ఈ పరిణామం చోటు చేసుకుంది. ఇదే సమయంలో గతంలో విధించిన నిషేధాలను తొలగించి ఇబ్బందిలేని ఎలక్ట్రానిక్స్‌ వంటి రంగాలలో చైనా పెట్టుబడులను అనుమతించాలని కూడా నిర్ణయించారు. 2030నాటికి దేశంలో 30శాతం వాహనాలు విద్యుత్‌ బాటరీలో నడిచే అవకాశం ఉన్నందున వాటి ఉత్పత్తిని ఇబ్బడి ముబ్బడిగా పెంచాల్సి ఉంది. ఈ క్రమంలో చైనా పెట్టుబడుల అవసరం మనదేశానికి ఉందా లేదా అని మోడీ గారి బిజెపిలో ‘‘ అంతర్గత పోరు ’’ ఉన్నట్లు 2024 ఆగస్టు ఒకటవ తేదీన అమెరికాభారత సంయుక్త యాజమాన్యంతో నడుపుతున్న సిఎన్‌బిసి టీవీ ఛానల్‌ ఒక వార్తను ప్రసారం చేసింది. ఇటీవల కొద్ది నెలలుగా జరుగుతున్న పరిణామాలను చూసినపుడు చైనా లేదా అమెరికా,రష్యా దేశం ఏదైతేనేం వాటి నుంచి వచ్చే పెట్టుబడులు లేదా సంబంధాలను నిర్ణయించేది, నడిపేది మన పాలకులా కార్పొరేట్లా అన్న సందేహం కలుగుతున్నది. గతంలో సరిహద్దు వివాదం ఉన్నప్పటికీ చైనాతో సంబంధాలు సజావుగా ఉన్నాయి. గాల్వన్‌ ఉదంతాల సందర్భంగా చైనా మన భూభాగాన్ని ఆక్రమించలేదని స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ చెప్పిన సంగతి తెలిసిందే. సంఘపరివార్‌ చైనా, కమ్యూనిస్టు వ్యతిరేకత గురించి తెలిసినప్పటికీ గత పదేండ్లలో వాణిజ్య,పారిశ్రామికవేత్తలు ఇబ్బడి ముబ్బడిగా చైనా నుంచి దిగుమతులు చేసుకుంటుండగా లేనిది దాని పెట్టుబడుల అంశంలో ఎందుకు మడిగట్టుకోవాలనే ధోరణి ఇటీవలి కాలంలో పెరిగింది.

గాల్వన్‌ లోయలో జరిగిన ఉదంతాల తరువాత దేశంలో పెద్ద ఎత్తున చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టారు. ఆ దేశ యాప్‌లను నిషేధించారు.పెట్టుబడులు రాకుండా ఆంక్షలు పెట్టారు.కాషాయ దళాలు, మీడియాలో కొంత భాగం చైనా వస్తు దిగుమతులను నిలిపివేస్తే అది మన కాళ్ల దగ్గరకు వస్తుందనే ప్రచారం చేశారు.తీరా చూస్తే మన ఉక్కు మంత్రిత్వశాఖ తాజా నివేదిక ప్రకారం మన దేశం దిగుమతి చేసుకుంటున్న ప్రతి నాలుగు ఉక్కు వస్తువులలో మూడు చైనా నుంచే ఉన్నట్లు ఆగస్టు 29వ తేదీ హిందూ బిజినెస్‌లైన్‌ పత్రిక వార్త పేర్కొన్నది.గతేడాది ఏప్రిల్‌జూలై నెలలతో పోల్చితే మన దిగుతులు అక్కడి నుంచి 30శాతం పెరిగాయి.ఏడాది క్రితం మన ఎగుమతులు ఎక్కువగా ఉండేవి కాస్తా ఇపుడు పరిస్థితి తారుమారైంది.ఇతర దేశాలకూ మన ఎగుమతులు పడిపోయాయి.విచారకరమైన అంశం ఏమంటే చివరికి గొడుగులు, బొమ్మలను కూడా చైనా నుంచి దిగుమతి పెరగటం వలన మన ఎంఎస్‌ఎంఇ సంస్థలు దెబ్బతింటున్నాయని గ్లోబల్‌ ట్రేడ్‌ రిసర్చ్‌ ఇనీషియేటివ్‌(జిటిఆర్‌ఐ) స్థాపకుడు అజయ్‌ శ్రీవాత్సవ చెప్పారు(2024సెప్టెంబరు ఒకటవ తేదీ పిటిఐ వార్త).ఈ ఏడాది జనవరి నుంచి జూన్‌ వరకు మనం చైనాకు 850కోట్ల డాలర్ల విలువగల వస్తువులను ఎగుమతి చేయగా అక్కడి నుంచి 5,040 కోట్ల డాలర్ల మేర దిగుమతి చేసుకున్నామని జిటిఆర్‌ఐ నివేదిక వెల్లడిరచింది.చైనాతో పోటీ పడి గొడుగులను కూడా ఉత్పత్తి చేయలేని దుస్థితికి గత పదేండ్లలో మన దేశాన్ని నరేంద్రమోడీ నెట్టారా ? చిన్నప్పటి పాఠాల్లో భార్య ఎండకు తాళలేక ఆపసోపాలు పడుతుంటే ఒక రుషి ఆగ్రహ శాపానికి భయపడి సూర్యుడు దిగివచ్చి చెప్పులు, గొడుగు ఇచ్చినట్లు చదువుకున్నాం. ఇప్పుడు చైనా వారు ఇస్తున్నారు. ఆ రుషులేమయ్యారు, ఆ సూర్యుడు ఎందుకు కరుణించటం లేదు ! చైనాతో పోటీ పడి నాణ్యంగా, చౌకగా గొడుగులు తయారు చేసేందుకు మన వేదాల్లో నిగూఢమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని వెలికితీసే నిపుణులు, దేశం కోసంధర్మం కోసం పని చేసే వారే లేరా ?

ఇటీవలన మన దేశ వార్షిక ఆర్థిక సర్వే విడుదల చేశారు. దాని వివరాల ప్రకారం చైనా నుంచి ఎఫ్‌డిఐని ఆహ్వానించాలని ప్రధాన ఆర్థిక సలహాదారు వి.అనంత నాగేశ్వరన్‌ చెప్పారు.రెండు దేశాల మధ్య వాణిజ్య లావాదేవీలను పెంచుకోవటం కంటే చైనా నుంచి పెట్టుబడులను ఆహ్వానించటం మెరుగని ఆర్థిక మంత్రికి నివేదించారు. గాల్వన్‌ ఉదంతాల తరువాత వైఖరిలో వచ్చిన మార్పుకు సూచిక ఇది.అమెరికా, ఐరోపాలు చైనా నుంచి సేకరణకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నందున మనం చైనా నుంచి దిగుమతులు చేసుకోవటం, వాటికి కొంత విలువను జోడిరచి తిరిగి ఎగుమతి చేయటం కంటే చైనా కంపెనీల పెట్టుబడులతో మనదేశంలో వస్తువులను ఉత్పత్తి చేసి విదేశీ మార్కెట్లకు ఎగుమతి చేయటం మరింత ప్రభావం చూపుతుందని ఆ నివేదికలో పేర్కొన్నారు. దీనికి నిర్మలా సీతారామన్‌ కూడా విలేకర్ల సమావేశంలో మద్దతు తెలిపారు. అయితే ప్రస్తుతానికి అలాంటి పునరాలోచన లేదని వాణిజ్య మంత్రి పియూష్‌ గోయల్‌ చెప్పినట్లు రాయిటర్స్‌ పేర్కొన్నది.‘‘ బిజెపి ప్రతిష్టను దెబ్బతీసే పర్యవసానాలకు దారితీసే దీన్ని ఎవరూ కోరుకోవటం లేదు. ఈ విధానాన్ని భారతీయులు మెచ్చరు, కానీ అది అవసరమని మోడీ ఆయన ఆర్థిక మంత్రిత్వశాఖ గుర్తించింది ’’ అని నాటిక్సిస్‌లోని ఆసియా పసిఫిక్‌ ఎకానమిస్ట్‌ అల్సియా గార్సియా హెరారో చెప్పినట్లు సిఎన్‌బిసి వార్త పేర్కొన్నది. రానున్న ఐదు సంవత్సరాల్లో ఏటా వంద బిలియన్‌ డాలర్ల మేర ఎఫ్‌డిఐలను ఆకర్షించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.గత ఆర్థిక సంవత్సరంలో 71బిలియన్‌ డాలర్లు వచ్చాయి. సోలార్‌ పలకలు,విద్యుత్‌ బాటరీల తయారీ రంగాలలో చైనా పెట్టుబడులను అనుమతించేందుకు నిబంధనలను సులభతరం చేయనున్నారు.‘‘ భారత ఉత్పత్తి రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు అమెరికా,ఐరోపా వారు విముఖంగా ఉన్నారు. అత్యధిక విదేశీ పెట్టుబడులు ఐసిటి(ఇన్ఫర్మేషన్‌, కమ్యూనికేషన్‌ టెక్నాలజీస్‌) డిజిటల్‌ సర్వీసెస్‌ వంటి రంగంలోకి వెళ్లాయి’’ అని హెరారో చెప్పాడు. ఆసియా ఉత్పత్తి కేంద్రంగా మారాలని భారత్‌ కోరుకుంటే చైనా సరఫరా గొలుసులతో సంబంధాలు పెట్టుకోవాలని ఢల్లీి కేంద్రంగా పని చేస్తున్న అబ్జర్వర్‌ రిసర్చ్‌ ఫౌండేషన్‌లోని విదేశీ విధాన అధ్యయన విభాగ ఉపాధ్యక్షుడు హర్ష వి పంత్‌ చెప్పారు.

ముందే చెప్పుకున్నట్లుగా చైనా వ్యతిరేకతను పెద్ద ఎత్తున రెచ్చగొట్టిన కారణంగా వ్యతిరేకులను సంతుష్టీకరించేందుకు , రాజకీయంగా పరువు నిలుపుకొనేందుకు గత కొద్ది నెలలుగా చైనా పెట్టుబడులను అందరితో అంగీకరింపచేయించేందుకు ఢల్లీి పెద్దలు కసరత్తుచేస్తున్నారు.‘‘ ఆర్థిక కోణంలో చూస్తే కొన్ని రంగాలలో చైనా పెట్టుబడులు మనకు అవసరమే అని చక్కటి తర్కంతో చెప్పవచ్చు. కానీ ఆక్రమంలో దేశ భద్రత,అంతర్జాతీయ రాజకీయ కోణాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది, ప్రస్తుతం చైనాతో సంబంధాలు అంత మంచిగా,సాధారణంగా లేవు ’’ అని విదేశాంగ మంత్రి జై శంకర్‌ ఇటీవల చెప్పారు. 2070నాటికి పూర్తి కాలుష్య రహిత లక్ష్యాన్ని చేరుకోవాలని మనదేశం లక్ష్యంగా పెట్టుకుంది.దానిలో భాగంగా 2030 నాటికి 50శాతం విద్యుత్‌ను పునరుత్పత్తి ఇంథన వనరుల నుంచి తయారు చేయాల్సి ఉంది.చైనా ఆ రంగంలో ఎంతో ముందుంది,తక్కువ ఖర్చుతో, సమర్ధవంతంగా ఉత్పత్తి చేస్తున్నది. ప్రస్తుతం అది 584 టెరావాట్‌ అవర్స్‌ సామర్ధ్యం కలిగి ఉండగా మనది కేవలం 113టెరావాట్‌ అవర్స్‌ మాత్రమే.చైనా కమ్యూనిస్టుదేశం, మనది ప్రజాస్వామ్యం అక్కడి నుంచి పెట్టుబడులు ఎలా తీసుకుంటాం అని మడిగట్టుకు కూర్చొనేందుకు మనదేశంలోని కార్పొరేట్‌ కంపెనీలు సిద్దంగా లేవు.అక్కడి నుంచి దిగుమతులు చేసుకొనే బదులు పెట్టుబడులు తీసుకొని మనదేశంలోనే సంస్థలను ఏర్పాటు చేస్తే ఇక్కడ ఉపాధిని కూడా కల్పించవచ్చు. ప్రస్తుతం మన దేశం తప్ప ప్రపంచంలో మరేదేశమూ చైనా పెట్టుబడులపై పూర్తి నిషేధం విధించలేదు.దాన్నుంచి పూర్తిగా విడగొట్టుకునేందుకు ఏ దేశమూ సిద్దంగా లేదు.తోటి సోషలిస్టు దేశమైనా చైనావియత్నాం మధ్య కొన్ని సరిహద్దు విబేధాలున్నాయి, అయినా చైనా నుంచి పెట్టుబడులను తీసుకుంటున్నది.


టాటా కంపెనీ అనేక దేశాల అనుభవాలను చూసిన తరువాతనే చైనా నుంచి బ్యాటరీలను కొనాలని నిర్ణయించింది.సరఫరా, సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిగణనలోకి తీసుకుంది.మన దేశ విద్యుత్‌ వాహన మార్కెట్‌లో దాని వాటా 60శాతం. ఇంతకు ముందుదాని ఉత్తత్తుల్లో బాటరీల నుంచి ఎదురైన సమస్యలతో పాటు మార్కెట్లో పోటీని కూడా అది గమనంలోకి తీసుకుంది.చైనాతో ఉన్న సరిహద్దు, రాజకీయ విధానాలను అది పక్కన పెట్టింది. ఇప్పటికే చైనా బివైడి కంపెనీ మన దేశంలోని సంస్థలతో భాగస్వామిగా లేదా విడి భాగాలను ఎగుమతి చేసేదిగా ఉంది. విద్యుత్‌ వాహనాలలో బ్యాటరీ ధర, సామర్ధ్యమే కీలకం.చైనాతో అమెరికా ప్రభుత్వానికి ఉన్న రాజకీయ విబేధాల కారణంగా అమెరికా దిగ్జజ కంపెనీ ఫోర్డ్‌ చైనా కంపెనీతో కలసి అమెరికాలో ఒక ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు ఒప్పందం చేసుకొని కూడా అనేక ఆటంకాలను ఎదుర్కొని విరమించుకుంది. అది చేసిన తప్పిదాన్ని టాటా చేయదలచలేదని పరిశీలకులు పేర్కొన్నారు.తొలుత కొన్ని రంగాలలో ఆటంకాలను తొలగిస్తే క్రమంగా ఇతర రంగాలకు విస్తరిస్తారు. మన దేశంలో ఇప్పటి వరకు కేంద్రంలో ఎవరు అధికారంలో ఏ పార్టీ లేదా కూటమిఉన్నప్పటికీ కార్పొరేట్లకు అనుకూలమైన విధానాలనే అనుసరించింది. ఇప్పుడు కూడా అదే జరుగుతున్నది.వాటి అడుగులకు మడుగులొత్తితేనే ఎవరైనా అధికారంలో ఉంటారు !

Share this:

  • Tweet
  • More
Like Loading...

నరేంద్రమోడీ ఫైల్స్‌ అట్టర్‌ ఫ్లాఫ్‌ : అప్పుల కుప్పలు, ఉత్పత్తిలో కాదు ఉత్తుత్తి కబుర్లలో చైనాతో పోటీ !

18 Thursday Jul 2024

Posted by raomk in BJP, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Uncategorized

≈ Leave a comment

Tags

BJP, India Exports, India Imports, India imports from China, India TRADE BALANCE, Narendra Modi Failures, Ten years Narendra Modi rule


ఎం కోటేశ్వరరావు


వచ్చే ఏడాది 2025 మార్చి నెలాఖరుకు మన వస్తు, సేవల ఎగుమతులు 800 బిలియన్‌ డాలర్లకు పెరుగుతాయని వాణిజ్య శాఖ కార్యదర్శి సునీల్‌ బరత్‌వాల్‌ తాజాగా చెప్పారు. గత ఆర్థిక సంవత్సరలో 778.2బి.డాలర్లు ఉన్నాయి. వర్తమాన ఆర్థిక సంవత్సరం తొలి మూడు మాసాలలో 200బి.డాలర్ల మేర ఎగుమతులు జరిగినందున ఇదే ధోరణి మిగిలిన తొమ్మిది మాసాల్లో కూడా కొనసాగుతాయన్నది ఆశాభావం మాత్రమే. దిగుమతులు వెయ్యి బిలియన్‌ డాలర్లకు మించే ఉంటాయని కూడా చెప్పవచ్చు. గడచిన పది సంవత్సరాలలో ట్రైలర్‌ మాత్రమే చూపానని అసలైన సినిమా తరువాత ఉంటుందని నరేంద్రమోడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. సాధారణంగా సినీ ప్రేక్షకులను ట్రైలర్లతో ఆకట్టుకొనేందుకు చూస్తారు. ఈ రీత్యా చూసినపుడు ట్రైలర్‌ చూసిన తరువాత జనానికి నచ్చని కారణంగానే లోక్‌సభలో స్వంతంగా మెజారిటీని తెచ్చుకోలేకపోయారు. కూటమిగా కూడా నాలుగు వందల సీట్లకు చాలా దూరంలో ఉన్నారు. ఇక నరేంద్రమోడీ ఫైల్స్‌ అనే సినిమాలో అనేక అంశాలు ఉన్నాయి. ముందుగా విదేశీ అప్పుల గురించి చూద్దాం.
మోడీ గద్దె నెక్కిన 2014లో మన విదేశీ అప్పులు 446.2బిలియన్‌ డాలర్లు. మోడీ కొత్త అప్పులు చేయలేదు, పాత అప్పులు తీర్చారంటూ భక్తులు గొప్పగా దైవాంశ సంభూతుడి మహిమల గురించి ప్రచారం చేశారు.కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ 2024 మార్చినెలలో వెల్లడించిన సమాచారం ప్రకారం 2023 డిసెంబరు ఆఖరుకు 648.2బిలియన్‌ డాలర్ల విదేశీ అప్పు ఉంది. అంటే రెండు వందల బిలియన్‌ డాలర్లు పెరిగింది. పాత అప్పు తీర్చితే బకాయి తగ్గాలి, కానీ పెరిగిందంటే కొత్త అప్పులు చేసినట్లే కదా ! దీనికి బాధ్యులెవరు ? మన విదేశీ మారక ద్రవ్య నిల్వ ప్రస్తుతం 657 బిలియన్‌ డాలర్లకు అటూ ఇటూగా ఉన్నాయి. ఇవి అప్పులకు సరిపోతాయి. మోడీ అధికారానికి వచ్చిన తొలి ఏడాది మన విదేశీ వాణిజ్య లోటు 137 బిలియన్‌ డాలర్లు కాగా తాజాగా నెలకు ఇరవై బిలియన్‌ డాలర్లకు అటూ ఇటూగా ఉంది, అంటే 240బి.డాలర్లు. లోటు తగ్గించలేకపోతే మానే పెత్తనంలో పెంచకూడదనుకుంటారు, కానీ దాదాపు రెట్టింపుకు దగ్గరగా ఉంది. వాణిజ్య, పరిశ్రమల శాఖ సమాచారం మేరకు 2023-24లో మన వాణిజ్యలోటు 238 బిలియన్‌ డాలర్లు.దీనిలో మూడోవంతుకు పైగా 85.09బి.డాలర్లు చైనాకే సమర్పించుకున్నాం, కొన్ని వస్తువులను హాంకాంగ్‌ ద్వారా చైనా ఎగుమతులు చేస్తున్నది కనుక దానితో ఉన్న 12.21 బి.డాలర్లను కూడా కలుపుకుంటే ఇంకా పెరుగుతుంది. మన విదేశీ మారక నిల్వలు అప్పులకు సరిపడా ఉన్నాయి. ఎగుమతులతో వచ్చే రాబడి దిగుమతులకు చాలటం లేదు, దేశం ముందుకుపోతున్నట్లా వెనక్కు నడుస్తున్నట్లా ? చివరకు లాటిన్‌ అమెరికా దేశాల మాదిరి అప్పుల ఊబిలో కూరుకుపోవాల్సి వస్తుందా ? విదేశాల్లో ప్రతిష్ట, పలుకుబడి, మార్కెట్లను పెంచానంటారు తప్ప అది దేవతా లేదా మాయవస్త్రంలా మామూలోళ్లకు కనిపించటం లేదు.


మాక్రోట్రెండ్స్‌ నెట్‌ సమాచారం ప్రకారం 1970లో ఎనిమిది బిలియన్‌ డాలర్లుగా ఉన్న విదేశీ అప్పు నూతన ఆర్థిక విధానాలను అమల్లోకి తెచ్చిన 1990నాటికి 83బి.డాలర్లకు చేరింది. తరువాత పదేండ్లకు 101, 2010 నాటికి 290, నరేంద్రమోడీ అధికారానికి వచ్చేనాటికి 457 బి.డాలర్లకు చేరింది. అప్పటి నుంచి ఐఎంఎఫ్‌ తాజా విశ్లేషణ ప్రకారం 2024 మార్చి నాటికి 681, మరుసటి ఏడాది మార్చికి 748 బిలియన్‌ డాలర్లకు పెరుగుతుందని అంచనా వేసింది.ఈ సంవత్సరాలలో వార్షిక అప్పు పెరుగుదల శాతాల్లో ఎగుడుదిగుళ్లు ఉండవచ్చు తప్ప మొత్తంగా చూసినపుడు పెరుగుదల ధోరణే ఉంది. ఇదే కాలంలో కేంద్ర ప్రభుత్వ దేశీయ రుణ భారం 58.6లక్షల కోట్ల నుంచి 156.6లక్షల కోట్లకు 174శాతం పెరిగింది.కరోనా కారణంగా ఇంత అప్పు చేశాము, ఉచితంగా వాక్సిన్లు వేశాము అని బిజెపి పెద్దలు చెప్పవచ్చు. ఇన్ని లక్షల కోట్లు దానికే తెచ్చారా ? బడ్జెట్‌ పత్రాల్లో పేర్కొన్నదాని ప్రకారం 2024 మార్చి నాటికి దేశీయ అప్పు రు.164లక్షల కోట్లు, విదేశీ అప్పు 5లక్షల కోట్లు మొత్తం కలిపితే రు.169లక్షల కోట్లకు, 2025 మార్చి ఆఖరుకు 184లక్షల కోట్లకు చేరనుంది.


మన ఎగుమతుల తీరుతెన్నులను చూద్దాం. సిఎంఐఇ సేకరించిన సమాచారం ప్రకారం మన ఎగుమతుల తీరుతెన్నులు ఎలా ఉన్నాయో చూద్దాం. బాగా పలుకుబడి పెరిగిందని చెప్పుకున్న కారణంగా జనం రెండోసారి అధికారాన్ని కట్టబెట్టారు. సంవత్సరాల వారీ మొత్తం ఎగుమతుల్లో వస్తువుల శాతాలు ఇలా ఉన్నాయి.
వస్తువులు×××××××2019-20×2020-21×2021-22×2022-23×2023-24
చమురు ఉత్పత్తులు××× 13.2 ××× 8.8 ××× 16.0 ××× 21.6 ××× 19.3
చమురేతర ఉత్పత్తులు×× 86.8 ××× 91.2 ×× 84.0 ××× 78.4 ××× 80.7
వ్యవసాయ ఉత్పత్తులు×× 11.2 ××× 14.2 ×× 11.8 ××× 11.6 ××× 11.0
ఖనిజ ఉత్పత్తులు ×××× 01.5 ××× 02.4 ×× 01.4 ××× 01.1 ××× 01.5
పారిశ్రామికవస్తువులుు×× 73.0 ××× 73.5 ×× 69.8 ×× ×64.3 ××× 66.8
ఎగువన ఉన్న వివరాలు చెబుతున్నదేమిటి ? కరోనా సమయంలో పెద్దగా చర్చ లేకుండా ఎవరూ వ్యతిరేకించరనే ఎత్తుగడతో మూడు సాగు చట్టాలను తీసుకువచ్చినపుడు రైతులకు చెప్పిందేమిటి ? మన వ్యవసాయ ఉత్పత్తులకు పెద్గగా మార్కెట్‌ను పెంచాం, నేరుగా ఎక్కడికైనా ఎగుమతులు చేసుకొనేందుకు వీలుగా ఈ చట్టాలను తీసుకువచ్చామని చెప్పారు.కానీ మన ఉత్పత్తులకు మోడీ చెప్పినంత మార్కెట్‌, ఎగుమతి అవకాశాలు లేని కారణంగానే ఎదుగూబొదుగూ లేకపోవటం లేదా గిడసబారిన తీరు కనిపిస్తోంది.ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల ఎగుమతులను పెంచామని తమ జబ్బలను తామే చరుచుకుంటారు. మొత్తం ఎగుమతుల్లో అవి 4.1 నుంచి ఐదేండ్లలో 7.1శాతానికి పెరిగాయి. ఇదే సమయంలో మేకిన్‌ ఇండియా, మేడిన్‌ ఇండియా, ఎగుమతుల ప్రోత్సాహక పథకం వంటి కబుర్లు ఎన్ని చెప్పినా మొత్తం పారిశ్రామిక వస్తువుల ఎగుమతుల వాటా తగ్గుతోంది.మనం ముడి చమురును దిగుమతి చేసుకొని దాన్నుంచి ఉత్పత్తులను తయారు చేసి ఎగుమతి చేయటం ఒక్కటే పెరుగుతోంది.అది కూడా రష్యా నుంచి చౌకగా దిగుమతులు చేసుకొని ఎగుమతులు పెరిగినందున ఆ మేరకు ఉంది. చమురుకు విదేశాల మీద ఆధారపడటం తగ్గించాలని గద్దెనెక్కగానే చెప్పారు. స్వదేశీ ఉత్పత్తి పెంచుతామన్నారు.2014-15లో మొత్తం దేశీయ ముడిచమురు ఉత్పత్తి 37.46మిలియన్‌ టన్నులు కాగా అదేమి దరిద్రమో పదేండ్లలో 30మి.టన్నులకు పడిపోయింది.దీనిలో 22.6 మిలియన్‌ టన్నులు పనికిరాని వంటూ నిత్యం ఆడిపోసుకొనే ప్రభుత్వ రంగ సంస్థలే చేస్తున్నాయి.రిలయన్స్‌ వంటి ప్రయివేటు కార్పొరేట్లకు అప్పగించేందుకు వాటిని కూడా సరిగా పని చేయనివ్వకుండా చేస్తున్నందున వాటి ఉత్పత్తి కూడా తగ్గిపోయింది. వ్రతం చెడ్డా ఫలం దక్కిందా అంటే ప్రయివేటు కంపెనీలు పొడిచిందేమీ లేదు.


చైనా వృద్ధి రేటు భారత్‌ కంటే ఎంతో తక్కువగా ఉందని,రియలెస్టేట్‌ రంగం సంక్షోభంలో పడిందని, మొత్తం ఆర్థిక వ్యవస్తే కుప్పకూలిపోనుందన్నట్లుగా రోజూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. జూన్‌ మాసంలో మన ఎగుమతులు 2.5శాతం పెరగ్గా, దిగుమతుల వృద్ధి రేటు ఐదు శాతం ఉన్నట్లు వెల్లడించిన తరుణంలోనే చైనా గురించి కూడా వార్తలు వచ్చాయి. రాయిటర్స్‌ విశ్లేషణ ప్రకారం జూన్‌లో చైనా ఎగుమతులు అంచనాలకు మించి జరగ్గా దిగుమతులు తగ్గాయి. ఇలా జరగటం అంటే స్థానిక డిమాండ్‌ తగ్గటం ఆందోళన కలిగించే పరిణామం, గిరాకీని పెంచాలంటే ఉద్దీపన పథకాలను అమలు జరపాలని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. గడచిన పదిహేను మాసాల్లో ఎగుమతులు జూన్‌లో వేగంగా పెరిగినట్లు కూడా ఆ వార్త పేర్కొన్నది. ప్రపంచంలో డిమాండ్‌ పెరిగిన కారణంగా చైనా ఎగుమతులు 8.6శాతం పెరిగినట్లు జపాన్‌ ఆసియా నికీ డాట్‌కామ్‌ పేర్కొన్నది. చైనా వస్తువుల దిగుమతులను అడ్డుకొనేందుకు అనేక దేశాలు భారీ మొత్తాలలో దిగుమతి పన్నులను విధించినప్పటికీ ఈ పెరుగుదల ఉంది. ఇదే సమయంలో మన వస్తువుల మీద అలాంటి పన్నులు లేకున్నా ఎగుమతులు 2.5శాతానికే ఎందుకు పరిమితం అయినట్లు ? చైనా దిగుమతులు తగ్గినందున గిరాకీ పెంచేందుకు ఉద్దీపన ప్రకటించాలని కోరుతున్నవారు విదేశీ కార్పొరేట్ల ప్రతినిధులు తప్ప వేరు కాదు. స్వదేశీ వస్తు వినియోగం తగ్గితే ఆందోళన చెందాలి లేదా పెంచటానికి ప్రోత్సాహకాలు ఇస్తే ఏ దేశానికైనా లాభం, గిరాకీ పెరిగితే పరిశ్రమలు పని చేస్తాయి, కార్మికులకు ఉపాధి దొరుకుతుంది, జనాలకు రాబడి పెరిగితే గిరాకీ పెరుగుతుంది తప్ప విదేశీ వస్తువులకు రాయితీలు ఇస్తే ఆయా దేశాల పరిశ్రమలకు, కార్మికులకు లబ్ది ఉంటుంది. ఇప్పుడు మనం చేస్తున్నది అదే.అయితే చైనా దిగుమతుల్లో మూడో వంతు పరికరాలు తిరిగి ఎగుమతి చేసేందుకు ఉద్దేశించిన విడి భాగాలే. ఈ రీత్యా చైనాకు సమస్యలొస్తే వాటిని ఎగుమతి చేసే దేశాలకూ వచ్చినట్లే. కనుక అవి కూడా చైనాతో సంబంధాలను పునరాలోచించుకోవాలి. ఇతర దేశాల ఆంక్షల కారణంగా దిగుమతులకు అవకాశం లేని సెమీ కండక్టర్ల వంటి వాటిని చైనా స్వయంగా తయారు చేసుకోవటం కూడా ప్రారంభించింది. తొలి ఆరు నెలల కాలంలో చైనా ఎగుమతులు 3.6శాతం పెరిగి 1.71లక్షల కోట్ల డాలర్లకు, దిగుమతులు రెండుశాతం పెరిగి 1.27లక్షల కోట్ల డాలర్లకు చేరాయి. వాణిజ్య మిగులు 435బిలియన్‌ డాలర్లు. మన అధికారులు చెప్పినట్లు మొత్తం ఎగుమతులు 800బిలియన్‌ డాలర్లకు పెరిగినప్పటికీ అది చైనా వాణిజ్య మిగులు కంటే తక్కువే.అమెరికా వంటి వ్యతిరేక దేశాలు తమ ఆర్థిక వ్యవస్థలను మెరుగుపరచుకోవటం కంటే అదిరించి బెదిరించి తమ వస్తువులను కొనిపించాలని లేదా చైనాను ఎలా దెబ్బతీయాలా అన్నదాని మీదే ఎక్కువ కేంద్రీకరిస్తున్నట్లు కనిపిస్తోంది. అనేక దేశాలు రక్షణాత్మక చర్యలకు పూనుకున్నాయి. చైనా వస్తువుల మీద అవి కేంద్రీకరిస్తున్నప్పటికీ అంతిమంగా ఇతర దేశాల మీద కూడా ఆంక్షలకు పూనుకుంటాయి. చైనా కమ్యూనిస్టు పార్టీ ప్లీనంతీసుకున్న నిర్ణయాల గురించి అనేక దేశాలు ఎదురు చూస్తున్నాయి.


అధికారానికి వచ్చినప్పటి నుంచీ చైనాను అధిగమిస్తామని, దేశాన్ని ప్రపంచ ఫ్యాక్టరీగా మారుస్తామని నరేంద్రమోడీ చెబుతూనే ఉన్నారు. పదేండ్లలో ఒక్క ఏడాదైనా వాణిజ్య మిగులును సాధించలేకపోయారు.మోడీకి పొగడ్తలు తప్ప మన వస్తువులకు మార్కెట్‌లేదు. దిగుమతులు పెరిగినప్పుడు తమ ఘనతే, దేశంలో కొనుగోలు శక్తి పెరగటానికి నిదర్శనం అంటారు.ఎప్పుడైనా తగ్గితే చూశారా దిగుమతుల మీద ఆధారపడటం తగ్గించాం, విజయం కాదా అంటారు. వాణిజ్య విషయాలకు వస్తే 2022-23తో పోలిస్తే వస్తు ఎగుమతులు 451 నుంచి 437 బి.డాలర్లకు తగ్గగా సేవలు 325 నుంచి 339బి.డాలర్లకు పెరిగాయి.దిగుమతులు 752 నుంచి 677 బి.డాలర్లకు, సేవలు 182 నుంచి 177 బి.డాలర్లకు తగ్గాయి. జిడిపిలో ఐదవ స్థానానికి చేర్చటం తమ ఘనత అని, త్వరలో మూడో స్థానానికి తీసుకుపోతాం అని చెప్పుకుంటున్న మోడీ బృందం వస్తు ఎగుమతుల్లో ఎక్కడ ఉందో ఎందుకు చెప్పదు. గత పది సంవత్సరాల్లో ప్రపంచంలో 19 నుంచి 17వ స్థానానికి ఎగబాకింది. మొదటి స్థానంలో ఉన్న చైనా 3,380 బిలియన్‌ డాలర్ల మేర 2023లో ఎగుమతి చేయగా మనం 432బి.డాలర్ల దగ్గర (స్టాటిస్టా సమాచారం) ఉన్నాం. చివరకు చైనా ఏలుబడిలో 70లక్షలకు పైగా జనాభా ఉన్న హాంకాంగ్‌ 573బి.డాలర్లతో పదవ స్థానంలో ఉంది.చైనాతో పోటీ పడాల్సిందే ! దేనిలో, ఉత్పత్తిలో తప్ప ఉత్తుత్తి కబుర్లలో కాదు !!

Share this:

  • Tweet
  • More
Like Loading...

నరేంద్రమోడీ దశాబ్ది పాలన : రాజస్థాన్‌లో సముద్రం, హిమాలయాల్లో వేడి కబుర్లు !

14 Wednesday Feb 2024

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, History, INDIA, Loksabha Elections, NATIONAL NEWS, Opinion, Politics, Prices

≈ Leave a comment

Tags

BJP, modinomics, Narendra Modi Failures, Ten years Narendra Modi rule, White Paper


ఎం కోటేశ్వరరావు


మనం బుర్రను పక్కన పెట్టి చెవులప్పగిస్తే ఎదుటి వారు రాజస్థాన్‌లో సముద్రం, హిమాలయాల్లో భరించలేని వేడి, ఎండిపోయిన బంగాళాఖాతం అంటూ ఎన్నికబుర్లైనా చెబుతారు. ఈ మధ్యనే ప్రపంచ ఆర్థిక వేదిక మీద 34 ముప్పుల్లో తప్పుడు సమాచారంలో భారత్‌ మొదటి స్థానంలో ఉందని ప్రపంచవ్యాపితంగా1,490 వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను సర్వే చేసినపుడు వెల్లడైన నిష్టుర సత్యం. విశ్వగురువుగా నరేంద్రమోడీకి ప్రపంచం నీరాజనాలు అర్పిస్తున్నదని చెబుతున్నవారు దీని గురించి ఏం చెబుతారో తెలియదు. అలాంటి ముప్పులో భాగమే ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి మీద విడుదల చేసిన శ్వేత పత్రంలోని అంశాలు. పదేండ్ల క్రితం తాము అధికారంలోకి వచ్చినపుడు దేశం సంక్షోభ స్థితిలో ఉందని, దాని గురించి చెబితే పెట్టుబడులు పెట్టేవారు ప్రతికూలంగా ఆలోచిస్తారని, అందుకే అప్పుడే శ్వేత పత్రం ప్రకటించకుండా ఇపుడు పరిస్థితి బాగుపడినందున విడుదల చేస్తున్నట్లు మొదటి పేరాలోనే జనాన్ని తప్పుదారి పట్టించారు.నిజంగా ఇప్పుడు పరిస్థితి బాగుపడిందా, దాని అర్ధం ఏమిటి ?


ఏటా రెండు కోట్ల ఉపాధిని పెంచుతామని 2014లో చెప్పారు. వాస్తవ పరిస్థితి ఏమిటి ? బిజెపి అధికారానికి రాకముందు ఉన్న సమాచారం ప్రకారం 2012లో నిరుద్యోగం 2.1శాతం అది 2018లో నేషనల్‌ సర్వే సంస్థ సమాచారం ప్రకారం 6.1శాతానికి చేరింది. దేశ కార్మికశక్తి సర్వేల ప్రకారం అంతకు ముందు 45 సంవత్సరాలతో పోలిస్తే అది అధికం. పదిహేను నుంచి 24 సంవత్సరాల యువతలో నిరుద్యోగం ఎంత అన్నది ప్రధానంగా చూడాలి. స్టాటిస్టా సంస్థ విశ్లేషణ ప్రకారం 2014లో మోడీ అధికారానికి వచ్చినపుడు 22.4శాతం మందికి ఉపాధి లేదు. తరువాత 2022లో 23.22 శాతం, తొమ్మిది సంవత్సరాల సగటు 24.74శాతం ఉంది. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలను కల్పించి ఉంటే ఈ పెరుగుదల ఎలా సంభవించింది? మాక్రోట్రెండ్స్‌ సమాచారం ప్రకారం 15-24 ఏండ్ల వయస్సులోని యువత కార్మిక శక్తిలో 2014లో 31.64శాతం ఉండగా మోడీ ఏలుబడిలో 2022లో 28.04శాతానికి తగ్గింది. విద్య పెరిగిన కొద్దీ యువతలో నిరుద్యోగశాతం కూడా పెరుగుతున్నదనే అంశాన్ని ఎందుకు మూసిపెడుతున్నట్లు ? నరేంద్రమోడీ గొప్పగా చెప్పుకొనే నైపుణ్యం తీరు ఎలా ఉంది. 2021 భారత నైపుణ్య నివేదిక ప్రకారం దాదాపు సగం మంది డిగ్రీ కలిగిన వారు నిరుద్యోగులు. ప్రైవేటు కాలేజీలు పెరిగినందున నైపుణ్యాలు లేని పట్టాదారులు తామర తంపరగా పెరిగారన్నది మింగుడు పడని వాస్తవం. అందుకే ప్రభుత్వం 2015లో జాతీయ నైపుణ్య విధానాన్ని ప్రకటించింది.కార్మిక శక్తిలో 40 కోట్ల మందికి 2022 నాటికి నైపుణ్యాలను పెంచుతామని చెప్పారు. జరిగిందేమిటి ? 2012లో కార్మికశక్తిలో వృత్తి విద్యావంతులు లేదా శిక్షణ పొందిన వారు 2.3శాతం కాగా మోడీ గారి శిక్షణ తరువాత 2.4శాతానికి మాత్రమే పెరిగారు. కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన సమాచారం ప్రకారం పిఎంకెవివై (నైపుణ్య శిక్షణ) మూడు రకాలుగా శిక్షణ పొందిన వారు 18-45-4 లక్షల మంది చొప్పున ఉన్నారు.వారిలో 14-43-7శాతాల చొప్పున ఉపాధి పొందినట్లు పేర్కొన్నారు.ఈ శిక్షణ తీరుతెన్నుల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. సాంకేతిక విద్య అభ్యసించిన ఇంజనీరింగ్‌,పాలిటెక్నిక్‌ పూర్తి చేసిన వారిలో నిరుద్యోగం గత పది సంవత్సరాల్లో రెట్టింపైంది. మన దేశంలో 2030 వరకు ఉపాధిని కోరుకొనే వారి సంఖ్య ఏటేటా గణనీయంగా పెరగనుందని వర్తమాన ధోరణి వెల్లడిస్తోంది. అంటే నిరుద్యోగమూ పెరగనుంది.


కార్మిక శక్తిలో మొత్తంగా, ప్రత్యేకించి మహిళల శాతం పెరగటం లేదన్నది అందరికీ తెలిసిందే. ఎందుకు అన్నది సమస్య. అధికారానికి వచ్చిన తొలి రోజుల్లో విదేశాలు తిరిగి పెద్ద మొత్తంలో విదేశీ పెట్టుబడులు తెచ్చినట్లు నరేంద్రమోడీ చెప్పారు. పది సంవత్సరాల తరువాత జనానికి అందిన వాటి ఫలితాలేమిటో చెప్పరు. తమ వికసిత భారత్‌ నినాదంతో త్వరలో చైనా, అమెరికాలను మించిపోతామని చెబుతున్నారు. ఎంతగా చెట్టపట్టాలేసుకొని తిరుగుతున్నప్పటికీ మన దేశంలో పెట్టుబడి వాతావరణం వ్యాపారం చేసేందుకు పెద్ద సవాలుగా ఉందని 2022 నివేదికలో అమెరికా చెప్పింది. రక్షణాత్మక చర్యలు, భారతీయ ప్రమాణాల నుంచి అంతర్జాతీయ స్థాయికి చేరలేకపోవటం వంటి కారణాలను దానిలో పేర్కొన్నారు. అంతేకాదు ప్రపంచ ఆర్థిక స్వేచ్చ సూచిక 2023 నివేదిక ప్రకారం 131వ స్థానంలో మనదేశం ఉంది. ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలోని 39దేశాల్లో 27వదిగా ఉంది. దేశ ప్రతిష్టను, పలుకుబడిని పెంచానని, భారీ మొత్తంలో పెట్టుబడులను ఆకర్షిస్తున్నట్లు చెప్పుకోవటమే తప్ప కనిపించటం లేదు, విదేశీ పెట్టుబడుల ఆకర్షణలో 2022లో తొలి పది దేశాల్లో మనం పదవ స్థానంలో ఉన్నాం.మొదటి స్థానంలో ఉన్న అమెరికాకు 388, రెండవదిగా ఉన్న చైనాకు 180 బిలియన్‌ డాలర్లు వస్తే మన దేశానికి వచ్చింది 50బి.డాలర్లు. విదేశీ పెట్టుబడుల సంగతి అలా ఉంటే చైనా జిడిపిలో 50శాతం పెట్టుబడులు పెడుతుంటే మనదేశంలో 30శాతమే ఉంది. చైనా ఉత్పాదకరంగం జిడిపికి 30శాతం సమకూర్చుతుంటే మనదగ్గర 20శాతమే ఉంది. యుపిఏ పాలనలో ఎన్నివేల కిలోమీటర్ల రోడ్లు వేశారు, మా పాలనలో ఎలా వేశామో చూడండి అని బిజెపి అడ్డుసవాళ్లు విసురుతుంది. మౌలిక సదుపాయాలకు గాను 2013-14లో జిడిపిలో 1.7శాతం ఉన్న మొత్తాన్ని 2022-23లో 2.9శాతానికి పెంచాం చూడండి అని చెబుతారు. పదేండ్ల సగటు 1.93శాతం. ఇక్కడ సమస్య పెట్టుబడి వ్యయాన్ని పెంచాల్సిందేఅది అవసరాలకు తగినట్లుగా ఉండాలి. పారిశ్రామిక ఉత్పత్తి లేకుండా ఎన్ని రోడ్లు, రైలు మార్గాలువేసినా, ఓడరేవులను అభివృద్ధి చేసినా ప్రయోజనం ఏముంటుంది.


పెట్రోలు, డీజిలు మీద విపరీతంగా సెస్‌లను పెంచారు. ఎందుకు అంటే దేశ రక్షణకు డబ్బు ఎక్కడ నుంచి తేవాలనే మనోభావాన్ని ముందుకు తెచ్చారు. ఇది నిజమా ? కేంద్ర ప్రభుత్వ 2022-23 ఆర్థిక సర్వే60వ పేజీలో ఇచ్చిన సమాచారం ప్రకారం 2013-14లో జిడిపిలో 1.1శాతం కేటాయిస్తే 2022-23లో 0.9శాతంగా ప్రతిపాదించారు.పదేండ్ల సగటు 1.04శాతం. ఈ కాలంలో చేసిన అప్పులు 4.5 నుంచి 6.4శాతానికి చేరాయి. పదేండ్ల సగటు 4.99శాతం.దీనికి అనుగుణంగానే వడ్డీ చెల్లింపులు 3.3 నుంచి 3.6శాతానికి పెరిగాయి. అచ్చేదిన్‌ గురించి కబుర్లు చెప్పిన పెద్దలు సబ్సిడీ మొత్తాన్ని 2.3 నుంచి 1.2శాతానికి దిగ్గోశారు. పదేండ్ల సగటు 1.74శాతం. ముందే చెప్పినట్లుగా అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాల ఖర్చు పెరగాలి. దాని కోసం సంక్షేమ కార్యక్రమాల ఖర్చు తగ్గింపు సమర్దనీయమా ? పారిశ్రామిక ఉత్పత్తి విలువ తమ ఏలుబడిలో ఎంత పెరిగిందో చూడమని మోడీ భక్తులు చెబుతారు. ఆ మేరకు ఉపాధి ఎందుకు పెరగలేదో చెప్పలేరు. మరోవైపు జిడిపిని ఎంత పెంచామో చూడండి అంటారు. ప్రపంచబాంకు విశ్లేషించినదాని ప్రకారం 2014లో మన పారిశ్రామిక ఉత్పత్తి విలువ 307బిలియన్‌ డాలర్లు, అది 2022 నాటికి 450 బి.డాలర్లకు పెరిగింది. ఇదే కాలంలో జిడిపిలో దాని వాటా 15 నుంచి 13.32శాతానికి దిగజారింది. కార్మిక శక్తిలో 15-24 సంవత్సరాల వయస్సు వారు ఎందరున్నారు అంటే 2014లో 31.64శాతం ఉంటే 2022 నాటికి 28.04కు పడిపోయింది. దీని అర్ధం ఏమిటి ఉపాధి రహిత వృద్ధి జరుగుతున్నది. దీని వలన కార్పొరేట్ల సంపద పెరుగుతుంది తప్ప జనానికి దక్కేదేముంది.


ఏ దేశమైనా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నపుడు డిమాండ్‌ను పెంచేందుకు ప్రభుత్వాలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడతాయి. దాని వలన వివిధ రంగాలు కొంత మేరకు సానుకూలంగా స్పందిస్తాయి. ఉదాహరణకు రోడ్ల నిర్మాణం జరిపితే సిమెంటు, ఉక్కు, చమురు, రోడ్డు నిర్మాణ వాహనాలు తదితర ఉత్పత్తులకు గిరాకీ పెరుగుతుంది. ఈ కారణంగానే 2020-21లో మూలధన వ్యయం కేంద్ర బడ్జెట్‌లో రు.4.26లక్షల కోట్లుండగా 2023-24లో రు.10లక్షల కోట్లకు పెంచారు.(ఎన్నికల సంవత్సరం కదా !) ఒక్కసారిగా ఇంత పెరుగుదల ఎప్పుడూ లేదు. రైల్వే, రోడ్లు,రక్షణ రంగం వాటా 66శాతం ఉంది. రాష్ట్రాలలో మౌలిక సదుపాయాలకు ఇచ్చే 50 ఏండ్ల వడ్డీ లేని రుణ మొత్తం అంతకు ముందు ఉన్న రు.76వేల కోట్లను 130వేల కోట్లకు పెంచారు. ఇదే సమయంలో కొన్ని రంగాలకు ఎలా కోతలు పెట్టారో చూద్దాం. 2009 తరువాత తొలిసారిగా సామాజిక సంక్షేమ ఖర్చు 18శాతానికి తగ్గింది.2023-24 బడ్జెట్‌లో రు.8.28లక్షల కోట్లుగా ప్రతిపాదించారు. అంతకు ముందు సంవత్సరం కంటే 56వేల కోట్లు తక్కువ. విద్యారంగానికి కేటాయింపులు 2009-2021 మధ్య 20 నుంచి 9శాతానికి తగ్గాయి. 2023-24లో 14శాతం ఉన్నప్పటికీ తక్కువే కదా ! గ్రామీణాభివృద్ధి కేటాయింపులు 28 నుంచి 19శాతానికి తగ్గాయి. ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఆరోగ్యం, విద్య, పోషకాహారం వంటి వాటికి తగ్గటం లేదా గిడసబారి ఉన్నాయి. పదకొండు సాంఘిక సంక్షేమ రంగాలలో కరోనాకు ముందు 2019-20లో ఉన్న కేటాయింపుల కంటే 2023-24లో ఐదింటిలో తగ్గాయి. అవి స్వచ్చ భారత్‌, సమగ్ర విద్యా శిక్షణ, గ్రామీణ ఉపాధి హామీ పధకం, జాతీయ ఆరోగ్య కార్యక్రమం. రాష్ట్రాలు తమ వాటాను చెల్లించని కారణంగా కొన్ని పధకాలకు నిధులు పెంచలేదని కేంద్ర అధికారులు చెప్పారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కొన్ని రంగాలకు పెంచారు.మొత్తంగా చూసినపుడు కార్పొరేట్లకు లబ్ది చేకూర్చే మౌలిక సదుపాయాలకు ఖర్చు పెంపుదల కోసం కోట్లాది మంది సంక్షేమానికి చేసే ఖర్చును కోత పెడుతున్నారు లేదా మంచం చాలకపోతే కాళ్లు ముడుచుకొని సర్దుకోమని చెప్పినట్లుగా చేస్తున్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఆకలో రామచంద్రా తప్ప అచ్చేదిన్‌ జాడలేదు – మరో ఐదేండ్లు ఉచిత బియ్యం పధక అర్ధమిదేనా ?

10 Friday Nov 2023

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, Farmers, Health, History, INDIA, Loksabha Elections, NATIONAL NEWS, Opinion, Prices, Women

≈ Leave a comment

Tags

BJP, Free Ration Scheme, Hunger India, India Hunger Index, Narendra Modi Failures, Ten years Narendra Modi rule


ఎం కోటేశ్వరరావు


ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ పధకాన్ని మరో ఐదు సంవత్సరాలు పొడిగిస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోడీ చత్తీస్‌ఘర్‌ ఎన్నికల సభలో ప్రకటించారు. గతేడాది జరిగిన రాష్ట్రాల ఎన్నికలపుడు ప్రకటించి ఏడాది పొడిగింపు డిసెంబరు వరకు ఉంది. కానీ మోడీ కోయిల ముందే కూసింది అంటే ఇప్పుడు జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల గానమే ! వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికలు కూడా ఎంతో దూరం లేనందున అప్పుడు కూడా దీని గురించి ఊదరగొడతారని వేరే చెప్పనవసరం లేదు. ఈ పధకం ఖజానా మీద మరింత భారం మోపుతుందని కొందరు అంటున్నారు. కొత్తగా పడేదేమీ లేదన్నది మరొక వాదన.ఏది ఏమైనా పేదలకు మేలు చేస్తుంది. ఉచిత పధకాల వలన రాష్ట్రాలు దివాలా తీస్తాయని నరేంద్రమోడీ కర్ణాటక ఎన్నికల సందర్భంగా చెప్పారు. ఉచిత ఆహార భారాన్ని భరిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఇబ్బందుల్లో పడదా ? చెప్పే మాటలకు చేతలకు పొంతన లేదంటే ఎక్కడో తేడా కొడుతోందని మోడీ గ్రహించారనుకోవాలి. పౌరులు గౌరవ ప్రదమైన, ఆరోగ్యకర జీవనం గడపాలంటే తగినంత ఆహారం, పోషకాలు అవసరం. వాటిని హక్కుగా పరిగణిస్తూ 2013 జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని పార్లమెంటు ఆమోదించింది. 2011 జనాభా లెక్కల ఆధారంగా గ్రామాలలో 75శాతం, పట్టణాలలో 50శాతం మంది అర్హులని పేర్కొన్నారు. కొత్తగా నరేంద్రమోడీ సర్కార్‌ దేశంలో ఎక్కడైనా రేషన్‌ పొందేందుకు వీలుగా కార్డులు జారీ చేస్తామని ప్రకటించింది. బహుశా దేశ భద్రతకు సంబంధించిన రహస్యంగా భావించి లేదా పరువు పోతుందని సిగ్గుపడిగానీ ఉచిత పధకాన్ని పొడిగించటానికి కారణం ఏమిటో ప్రధాని చెప్పలేదు అనుకోవాలి. ఒకవైపు ఆహార భద్రతకు తూట్లు పొడిచేందుకు మోడీ మంత్రాంగంలో భాగమైన నీతి ఆయోగ్‌ చూస్తుంటే మరోవైపు ఓట్లకోసం పడుతున్న పాట్లు ! అల్లుడికి బుద్ది చెప్పిన మామ అదే తప్పు చేసినట్లు !


మోడీ కేంద్రంలో అధికారానికి వచ్చినపుడు ఆకలి సూచికలో దేశం 120కిగాను 99వ స్థానంలో ఉంది.అది 2022లో 121దేశాల్లో 107కు, 2023లో 125దేశాల్లో 111కు దిగజారింది. ఈ సూచికలను గత పదేండ్లలో ఏనాడూ కేంద్ర ప్రభుత్వం, బిజెపి అంగీకరించలేదు, తప్పుల తడక అని చెప్పటం తప్ప ఆకలి గురించి మాట్లాడదు. ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ పధకాన్ని మరో ఐదేండ్లు పొడిగించటం అంటే పదేండ్ల నాడు చెప్పిన అచ్చేదిన్‌ (మంచి రోజులు) రాలేదని, జనం చచ్చే ఆకలితో ఉన్నారని, పరిస్థితి దిగజారుతున్నది వాస్తవమేనని అంగీకరించటం కాదా ! నిర్దిష్టమైన సమాచారాన్ని ప్రభుత్వం సేకరించలేదు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే, ఇతర అంచనాల ప్రకారం పదేండ్ల అమలు తరువాత కుర్రవాళ్లలో 40శాతం మందికి తగినంత ఆహారం లేదు. మూడోవంతు మంది దేశ జనాభా పోషకార లేమితో ఉన్నారు. మనకు రెండు భారత దేశాలు కనిపిస్తున్నాయి. తగినంత ఆహారం లేక గిడసబారి పోయిన, బానకడుపుల వారు ఒకవైపు, ఉన్న డబ్బుతో విచ్చలవిడిగా తిని పెంచుకున్న ఊబకాయాలతో కార్పొరేట్‌ ఆసుపత్రులను పోషిస్తున్న వారిని మరోవైపు చూడవచ్చు.


తగినంత ఆహారం, పోషకపదార్ధాలు అందుబాటులో లేని కారణంగా దేశంలో ఉన్న ఆడా మగా రక్తహీనతతో ఉన్నారు.ఆహార భద్రతా పధకం ఈ సమస్యను పరిష్కరించటంలో విఫలమైంది. మరోవైపున నరేంద్రమోడీ, కేంద్ర ప్రభుత్వానికి, బిజెపి పాలిత రాష్ట్రాల పాలకులకు మార్గదర్శనం చేస్తున్న ఆర్‌ఎస్‌ఎస్‌ ఏర్పాటు చేసిన సంస్థ ఆరోగ్య భారతి. దేశంలో ” ఉన్నతమైన తెలివితేటలతో అందమైన, పొడవైన ” పిల్లలను పుట్టించేందుకు గర్భవిజ్ఞాన అనుసంధాన కేంద్రం పేరుతో గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఒక పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. తలిదండ్రులు నల్లగా ఉన్నా, తెలివితేటలు పెద్దగా లేనివారైనప్పటికీ పురాతన భారత విజ్ఞానంతో పైన పేర్కొన్న లక్షణాలతో పిల్లలను పుట్టించేందుకు సంస్థ నిపుణులు పని చేస్తున్నట్లు ప్రచారం చేస్తున్నది. తరుణ్‌ విజరు అనే బిజెపి నేత నల్లవారితో కలసి సామరస్యపూర్వకంగా జీవిస్తున్నట్లు చేసిన ప్రకటన గురించి తెలిసిందే. ఇదే ఆరోగ్యభారతి మేథావులు ఆకలితో వచ్చే అనారోగ్య సమస్యలకు పరిష్కారాన్ని ఎందుకు చూపలేకపోతున్నారు. ప్రాచీన విజ్ఞానం, వేదాల్లో ఉన్నాయంటున్న పరిష్కార మార్గాలను వెలికి తీసి పైసా ఖర్చు లేకుండా లోపాలను సరి చేయవచ్చు కదా !


కరోనా కాలం నుంచి 80 కోట్ల మందికి ఉచితంగా ఆహారధాన్యాలు ఇస్తున్నట్లు, రెండు లక్షల కోట్ల రూపాయలను అందుకు ఖర్చు చేస్తున్నట్లు బిజెపి పెద్దలు విజయగాధలను గానం చేస్తుంటారు. వారి జేబుల్లోంచి తీసి ఖర్చు చేయటం లేదు. దేశంలో ఆకలి ఇవాళ కొత్తగా ప్రారంభం కాలేదు.యుపిఏ పాలనకు ముందు అధికారంలో ఉన్న బిజెపి వాజ్‌పాయి సర్కార్‌ ఆహార భద్రతా పధకం గురించి ఎలాంటి ఆలోచనా చేయలేదు. సిఎంగా ఉన్న నరేంద్రమోడీ ఎన్నడూ అలాంటి ప్రతిపాదన కూడా చేసినట్లు తెలియదు. ఇక 80 కోట్ల సంఖ్య ఎలా వచ్చిందంటే గ్రామాల్లో 75శాతం, పట్టణాల్లో 50శాతం లెక్కన 67శాతం మందికి ఆహార భద్రత కల్పించాలని 2013 చట్ట చెప్పింది. అప్పటికి ఉన్న జనాభా 122 కోట్లు వారిలో 67శాతం అంటే 81.74 కోట్లు. ఇప్పుడు 142 కోట్లకు చేరింది, అంటే ఇవ్వాల్సింది 95.14 కోట్ల మందికి. పదిహేను కోట్ల మందికి మొండిచేయి చూపుతున్నారు. మరోవైపు ఆరోగ్య సూచికలేవీ మెరుగుపడిన దాఖలా లేదు. అందువలన ఆహార భద్రత, పోషకాహార పధకాలను సవరిస్తే తప్ప దీనివలన ఎలాంటి ప్రయోజనం లేదని అనేక మంది చెబుతున్నారు. అది వాస్తవం కాదని చెప్పేందుకు ప్రభుత్వం ఎలాంటి సర్వేలను నిర్వహించలేదు.దేశంలో ఆహార సబ్సిడీ కేటాయింపులు తగ్గుతున్నాయి. 2020-21లో కేంద్ర ప్రభుత్వం రు.5.41లక్షల కోట్లు ఖర్చు చేసింది.(2016 నుంచి ఎఫ్‌సిఐ తీసుకున్న అప్పులను ఒక్కసారే కేంద్ర ప్రభుత్వం తీర్చిన కారణంగా ఒక ఏడాదిలో ఇంతగా పెరిగింది) 2021-22లో వాస్తవ ఖర్చు రు.3,06,571 కోట్లు, 2022-23లో సవరించిన అంచనా రు.2,96,523, 2023-24లో ప్రతిపాదించిన మొత్తం రు.2,05,765 కోట్లు. యుపిఏ చివరి సంవత్సరం నుంచి నరేంద్రమోడీ తొలి ఆరు సంవత్సరాలలో ఆహార సబ్సిడీ మొత్తం లక్ష కోట్లకు అటూ ఇటూగా ఉంది. కరోనా లేకున్నా ఇప్పుడు కొనసాగిస్తున్న ఆహార ధాన్యాల ఉచిత పధకం గురించి అంతకు ముందు మోడీకి ఎందుకు తట్టలేదు. తన ఏలుబడిలో పరిస్థితి ఆకస్మికంగా దిగజారిందా ? గతంలో ఏ ప్రభుత్వం చేయలేనంతగా దేశ జిడిపిని పెంచినట్లు ప్రచారం చేసుకుంటున్నారు. కాసేపు అంగీకరిద్దాం, దానికి అనుగుణంగా ఆహార సబ్సిడీ పెంచకపోగా తగ్గించారు.


2014-15లో ఆహార సబ్సిడీ కేటాయింపు జిడిపిలో 0.9శాతం, తరువాత 2019-20 నాటికి 0.5శాతానికి కోత పెట్టారు. కరోనా కాలంలో పాత బకాయిల చెల్లింపుతో 2.7శాతానికి పెరిగింది, క్రమంగా దిగజార్చుతూ 2023-24లో దాన్ని 0.7శాతానికి తగ్గించారు. ఇదేదో ఏదో అలా జరిగిపోయిందని చెప్పినట్లుగా సంభవించింది కాదు.పౌర పంపిణీ వ్యవస్థ(పిడిఎస్‌)ను ప్రైవేటీకరించాలని, ఉచిత ఆహార లబ్దిదారులను, సబ్సిడీలు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నీతి ఆయోగ్‌ చేసిన సూచనలు తెలిసిందే. ప్రపంచబాంకు, ఐఎంఎఫ్‌ వేసిన బాటలో నడుస్తున్న రాజు కనుసన్నలలోనే సిబ్బంది పని చేస్తారు.ఆహార భద్రత పధకం కింద లబ్దిదారులను స్థంభింప చేశారని, అదనంగా అవసరమైన వారికి ఇవ్వటం లేదంటూ దాఖలైన పిటీషన్‌ మీద లబ్దిదారులను పెంచాలని సుప్రీం కోర్టు 2021 జూన్‌ 29న చేసిన సూచనను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు.( ఎనభై కోట్ల సంఖ్య 2011 జనాభాప్రాతిపదిక అని ముందే చెప్పుకున్నాం.) దాంతో అదే ఏడాది సెప్టెంబరులో పిటీషనర్ల తరఫు లాయర్‌ ప్రశాంత భూషణ్‌ సంబంధిత కేంద్ర మంత్రికి నోటీసు పంపారు. అయినా చలనం లేకపోవటంతో 2022జనవరిలో కోర్టు సూచనలను అమలు జరపాలంటూ మరోపిటీషన్‌ దాఖలు చేశారు.దాంతో విధిలేక కొత్త జనాభా లెక్కలను సేకరించిన తరువాతనే విస్తరణ సాధ్యమని, సమీప భవిష్యత్‌లో విస్తరించే పధకాలేవీ లేవని కూడా ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఏదో ఒక మార్గాన్ని చూడాలని కోర్టు కేంద్రానికి చెప్పింది. అయినా ఇంతవరకు చేసిందేమీ లేదు.


జనాభా లెక్కల సేకరణ ఎప్పుడు జరుగుతుందో తెలియని స్థితి. అప్పటి వరకు కోట్లాది మంది ఆకలితో మాడాలన్నమాట. కేంద్రం తన వాదనకు మద్దతుగా సమర్పించిన అఫిడవిట్‌లో కొన్ని నీతి ఆయోగ్‌ అభిప్రాయాలను పొందుపరచింది. మూడింట రెండువంతుల మందికి ఉచిత ఆహార ధాన్యాలు అందచేతకు ఉన్న అవకాశాలు, అవసరమా అన్న అంశాలను పరిశీలించాలని ఆ సంస్థ పేర్కొన్నది. అంతేకాదు ఆహార ధాన్యాల సేకరణ, పధకాల పంపిణీకి ప్రభుత్వ వ్యవస్థలను ఉపయోగించుకొనే విధంగా ప్రైవేటు,కార్పొరేట్‌ సంస్థలకు బాధ్యతలను అప్పగించాలని కూడా సూచించింది. అంతకంటే దారుణం ఏమంటే సుప్రీం కోర్టు సూచించింది తప్ప ఆదేశాలు జారీ చేయలేదని, ఆహార భద్రత పధకం వర్తింప చేసేందుకు జనాభా అంచనాలను పరిగణనలోకి తీసుకోవాలని గతంలో చేసిన చట్టంలో లేదని అందువలన కోర్టు మార్గదర్శనం చట్టంలోని సెక్షన్‌ 9కి విరుద్దమని కూడా నీతి ఆయోగ్‌ 2022 ఆగస్టు 31న జరిపిన సమీక్షా సమావేశంలో ఒక వాదనను కేంద్రానికి అందించింది. అయితే ఈ అంశాలను ప్రభుత్వం కోర్టు ముందు సమర్పించలేదు. నిబంధనల సాకుతో అర్హులైన వారికి ఆహార హక్కు లేకుండా మాడ్చి చంపాలని చట్టం చెప్పిందా ? ఆ తరువాత అంటే అదే ఏడాది సెప్టెంబరులో నీతి ఆయోగ్‌ మేథావులు కొత్త వాదనను ముందుకు తెచ్చారు. ఆహార భద్రత పధక చట్టం అమలు జరిపిన ఎనిమిదేళ్ల కాలంలో జనాభా తలసరి ఆదాయం 33.4శాతం పెరిగిందని, అందువలన జనమంతా 2013-14లో ఉన్న మాదిరి ఉండరు గనుక పెరిగిన తలసరి ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని నీతి ఆయోగ్‌ పెద్దలు వాదించారు. ఇది అసంబద్దమైన వాదన. అంబానీ, అదానీల సంపదను, అడుక్కొనేవారి ఆదాయాన్ని సరాసరి కట్టే లెక్కలవి.


ఆహార సబ్సిడీ అనేది అటు రైతాంగానికి ఇటు వినియోగదారులకు ఇచ్చేది. ఎఫ్‌సిఐ లేదా రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు పంటలను మద్దతు ధరలకు కొనుగోలు చేసి ప్రభుత్వ విధానాల మేరకు వినియోగదారులకు అందచేస్తాయి. వాటిలో ధరకు విక్రయించేవి, ఉచితంగా అందచేసేవీ ఉంటాయి. ఈ లావాదేవీల్లో వచ్చే తేడా మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం భరిస్తున్నది.గతంలో ఆయా రాష్ట్రాలలో ఉన్న దారిద్య్రాన్ని బట్టి ఏ రాష్ట్రానికి ఎంత ఆహారం కేటాయించేదీ నిర్ణయించేవారు. 2017-18 నుంచి దారిద్య్ర సర్వే, కొత్త కార్డులు ఇవ్వటం నిలిపివేశారు. రాష్ట్రాలు జారీ చేస్తే అందుకయ్యే ఖర్చును అవే భరించాల్సి ఉంటుంది. ఉచితంగా ఇస్తున్నారు కాబట్టి ఎవరు ఎక్కడైనా రేషన్‌ తీసుకోవచ్చని ఒకే కార్డు పద్దతిని ముందుకు తెచ్చారు. మన దేశంలో దారిద్య్రరేఖ నిర్వచనంలో అనేక లోపాలు ఉన్నాయి. ఒక నిర్దిష్టత లేనికారణంగా ఎవరికి తోచిన అంచనాను ఆయా కమిటీలు ఇచ్చాయి. ప్రపంచ బాంకు అంతర్జాతీయ దారిద్య్ర రేఖను రూపొందించింది. దాని ప్రకారం 2011లో రోజుకు 1.90 డాలర్ల కంటే తక్కువ ఆదాయం వచ్చే వారు దారిద్య్ర రేఖకు దిగువన(దుర్భరదారిద్య్రంలో) ఉన్నట్లు. దాన్ని 2017 ధరల ప్రకారం 2022 సెప్టెంబరులో 2.15 డాలర్లకు పెంచింది. ప్రస్తుతం డాలరుకు 83 రూపాయలు ఉంది కనుక నెలకు రు.5.353 కంటే తక్కువ ఆదాయం వచ్చిన వారు దుర్భరదారిద్య్రంలో ఉన్నట్లు. కానీ మన ప్రభుత్వం పట్టణాల్లో నెలకు రు.1,260, గ్రామాల్లో రు.1,059గా గీత గీసింది.ఎందుకంటే ఏ దేశానికి ఆ దేశం తన రేఖను నిర్ణయించుకోవచ్చు.వాటిని చూపి దారిద్య్రాన్ని తగ్గించినట్లు చెప్పుకోవచ్చు. ప్రపంచ బాంకు తాజాగా రూపొందించిన మూడు ప్రమాణాల ప్రకారం డాలర్లలో రాబడితో వివిధ దేశాలలో దారిద్య్రం ఎలా ఉందో, ఉంటుందో పేర్కొన్నది.దాని ప్రకారం భారత్‌, చైనాల పరిస్థితి దిగువ విధంగా ఉంది. రాబడి గీతను బట్టిి ఎంత మంది దారిద్య్రంలో ఉన్నారో ఈ పట్టిక సూచిస్తుంది. ఉదాహరణకు రోజుకు 2.15 డాలర్లకంటే తక్కువ ఆదాయం వచ్చే వారు ఆఫ్రికాలోని కాంగో డెమోక్రటిక్‌ రిపబ్లిక్‌లో 69.9శాతం ఉన్నారు, అంటే వారంతా దుర్భరదారిద్య్రంలో ఉన్నట్లు లెక్క.
దేశం ×× 2.15 ×× 3.65 ×× 6.85
భారత్‌ ×× 11.9 ×× 46.5 ×× 83
చైనా ×× 0.10 ×× 2.00 ×× 24.7
పై అంకెల అర్ధం ఏమంటే చైనా గనుక దారిద్య్ర రేఖను రోజుకు 6.85 డాలర్లుగా నిర్ణయిస్తే అక్కడ 24.7శాతం మంది, అదే మనదేశంలో అయితే 83శాతం మంది దారిద్య్రంలో ఉన్నట్లు భావించాలి. 2.15 డాలర్లంటే చైనాలో దారిద్య్రం లేనట్లే. అందువలన మన పాలకులు దారిద్య్ర రేఖను ఎంతగా నిర్ణయిస్తారో, ఏ దేశంతో పోల్చుకుంటారో చూడాలి. దున్నబోతే దూడల్లో మెయ్యబోతే ఎద్దుల్లో అన్నట్లుకాకుండా చైనాను త్వరలో అధిగమిస్తామని చెబుతున్నారు గనుక దానితో పోల్చుతారా ?


ప్రపంచ ఆకలి సూచికను తయారు చేస్తున్న వారు పిల్లల్లో గిడసబారుతనం,ఎత్తుకు తగిన బరువు లేకపోవటం, బరువు తక్కువగా పుట్టటం, పసి ప్రాయ మరణాలు, తగినన్ని కాలరీల శక్తిని తీసుకోకపోవటాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. పిల్లల్లో ఈ లోపాలు ఉన్నాయంటే తలిదండ్రులకు తగిన రాబడి లేకపోవటం తప్ప వేరు కాదు.2019 నుంచి 2021 మధ్య జరిపిన ఐదవ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో వెల్లడైన వివరాల ప్రకారం ఐదేండ్ల లోపు పిల్లల్లో 35.5శాతం మంది గిడసబారిన వారు, 19.3శాతం ఎత్తుకు తగిన బరువు లేమి, 32.1శాతం మంది ఉండాల్సినదాని కంటే తక్కువ బరువుతో ఉన్నట్లు తేలింది. అచ్చేదిన్‌ అని చెప్పి అధికారానికి వచ్చిన వారి ఏలుబడిలో గురజాడ చెప్పినట్లు భావిభారత పౌరులు ఈసురోమంటున్నారు. పోషణ అభియాన్‌ పేరుతో బడుల్లో మధ్యాహ్న భోజన పధకం అమలు చేస్తున్నారు. దాని లక్ష్యం ఏమిటి అంటే ఆరు సంవత్సరాల లోపు ఉన్న పిల్లల్లో 38.4శాతంగా ఉన్న గిడసబారుతనాన్ని 2016 నుంచి 2022 నాటికి ఏటా రెండుశాతం చొప్పున 25శాతానికి తగ్గింపు, పూర్తిగా పోగొట్టాలంటేే మరో పదమూడు సంవత్సరాలు పడుతుంది. ఇదే విధంగా పోషకాహార లేమి, తక్కువ బరువుతో పుట్టే పిల్లల తగ్గింపు కూడా ఏటా రెండు శాతం అని, రక్తహీనతను మూడుశాతం చొప్పున తగ్గిస్తామని పేర్కొన్నారు.రక్త హీనత అనేక అనర్దాలకు హేతువుగా ఉంది. రక్తహీనత ముక్త భారత్‌ పేరుతో కేంద్ర ప్రభుత్వం 2018లో కొన్ని పధకాలను ప్రారంభించింది. ఐదవ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2019-20 ప్రకారం దేశంలో 15-49 సంవత్సరాల వయస్సు ఉన్న మహిళల్లో 50శాతం మంది, ఆరు నెలల నుంచి ఆరేండ్ల లోపు పిల్లల్లో 59శాతం మంది రక్తహీనతతో ఉన్నారు.ఏటా మూడు శాతం చొప్పున 2018 నుంచి 2022లోపు దాన్ని తగ్గిస్తామని చెప్పారు.ఇప్పుడు ఎలా ఉందో తెలియదు. సర్వేకు ఎంపిక చేసిన ప్రశ్నావళి నుంచి రక్తహీనత అంశాన్ని తొలగించారు. అంటే వాస్తవ పరిస్థితి తెలవకుండా పాతరేసేందుకు పూనుకున్నారు. ఐదులక్షల కోట్ల డాలర్ల ఆర్ధిక వ్యవస్థ గురించి కలలు కంటున్నా, ప్రపంచంలో ఐదవ స్థానానికి జిడిపిని వృద్ది చేశామని చెప్పినా ప్రయోజనం ఏమిటన్నది ప్రశ్న. జనాలకు ఒక్క బియ్యమో, గోధుమలో ఉచితంగా ఇస్తే సమగ్ర పోషకాహారం లభిస్తుందా ? మిగతా వాటి సంగతేమిటి ? వాటికి కావాల్సిన ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వ విధానాలేమిటి ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

జాడలేని భారత ఉత్పత్తి, తయారీ – చైనాతో వాణిజ్యలోటుపై కొత్త డ్రామాకు తెరతీసిన మోడీ సర్కార్‌ !

27 Friday Oct 2023

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, Europe, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, Uncategorized, USA

≈ Leave a comment

Tags

BJP, Boycott of goods made in China, India Trade with China, Make In India, Narendra Modi Failures, Niti Aayog, Ten years Narendra Modi rule


ఎం కోటేశ్వరరావు


2018 ఏప్రిల్‌ నెలలో మన ప్రధాని నరేంద్రమోడీ చైనాలోని ఊహాన్‌ నగరంలో చైనా నేత షీ జింపింగ్‌తో కలసి ఊయల ఊగేందుకు వెళ్లారు. అప్పుడు నీతి ఆయోగ్‌ ఒక పత్రాన్ని ప్రధాని బృందానికి సమర్పించింది. దానిలో ఏం చెప్పిందంటే గడచిన దశాబ్దకాలంలో చైనాతో వాణిజ్యలోటు పదమూడు రెట్లు పెరిగిందనీ, పాత స్వేచ్చావాణిజ్య ఒప్పందాలను సమీక్షించాలని, నూతన ఒప్పందాల్లో ఏదైనా ఉపేక్ష ఉంటే అది మన మార్కెట్లను దెబ్బతీస్తుందని, భారత్‌ పట్ల చైనా ఔదార్యాన్ని ప్రదర్శించాల్సిన సమయం వచ్చిందని, చైనాతో మనదేశం జాగ్రత్తగా ఉండాలని సలహా ఇచ్చింది. మంచిదే, అంతకంటే కావాల్సిందేముంది ! ఇప్పటికి ఐదున్నర సంవత్సరాలు గడిచాయి. జరిగిందేమిటి ? రెండు దేశాల మధ్య కొత్త ఒప్పందాలేమీ కుదరలేదు. ఉన్నవి రద్దు కాలేదు. 2004-05నుంచి 2013-14 మధ్య కాలంలో 148 కోట్ల డాలర్లుగా ఉన్న చైనా-భారత వాణిజ్య లోటు 3,621కోట్లకు చేరిందని, అది 2,346శాతం పెరుగుదల అని అప్పటి నుంచి తమ ఏలుబడిలో 2021-22 నాటికి 7,331 కోట్లకు అంటే కేవలం వందశాతమే పెరిగిందని రాజ్యసభకు వెల్లడించిన సమాచారంలో కేంద్ర మంత్రి పియూష్‌ గోయల్‌ సమర్ధించుకున్నారు. మరుసటి ఏడాది అంది పదివేల కోట్ల డాలర్లకు చేరింది.ఈ ఏడాది తొలి ఆరునెలల్లో 5,653 కోట్ల డాలర్లు ఉంది.చైనాతో వాణిజ్య లోటును తగ్గించేందుకు అవసరమైన సూచనలు చేసేందుకు నవంబరు ఏడవ తేదీలోపు దరఖాస్తులు చేసుకోవచ్చని నీతి ఆయోగ్‌ సంస్థ తాజాగా కన్సల్టెన్సీ సంస్థలను కోరింది. రెండు రకాల అధ్యయనాలు చేస్తారట.సిఫార్సులు చేయటం, నివేదికలను రూపొందించటం తప్ప అధికారాలు లేని ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థను నరేంద్రమోడీ ప్రణాళిక సంఘాన్ని రద్దుచేసి నెలకొల్పారు.


వాస్తవానికి చైనా నుంచి విధిగా దిగుమతులు చేసుకోవాలనే ప్రత్యేక ఒప్పందమేమీ మనదేశానికి లేదు. మనకు అవసరం ఎక్కువగా ఉంది గనుక అక్కడి నుంచి తెచ్చుకుంటున్నాం, వారికి మన నుంచి పెద్దగా దిగుమతులు అవసరం లేదు గనుక లోటు పెరుగుతోంది. అందువలన వాణిజ్య లోటు తగ్గించాలన్నా పూర్తిగా లేకుండా చేయాలన్నా చైనా నుంచి దిగుమతులను నిలిపివేస్తే సరిపోతుంది. లేదా మన ఎగుమతులు పెంచాలి. గత పదేండ్లుగా ఈ రెండూ చేతగాని స్థితిలో మోడీ దేశాన్ని ఉంచారా ? ఏం చేయాలో నీతి అయోగ్‌ సంస్థకు తెలియదా ? కొన్ని కోట్లు సమర్పించుకొని సలహలను కొనుక్కోవాలా ? లడక్‌ సరిహద్దులో జరిగిన ఘర్షణ ఉదంతాల తరువాత మన దేశంలో అనేక మంది మనం చైనా నుంచి దిగుమతులను నిలిపివేస్తే అది మన కాళ్ల దగ్గరకు వస్తుందని చెప్పారు. ఇంతకాలం రికార్డు స్థాయిలో తన రికార్డులను తానే బద్దలు కొట్టుకొని నరేంద్రమోడీ సర్కార్‌ దిగుమతులకు అనుమతులు ఇచ్చింది. స్టాటిస్టా సంస్థ వివరాల ప్రకారం 2022లో మన దేశం చేస్తున్న ఎగుమతుల్లో 18.5శాతం అమెరికాకు, 6.65శాతం యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌కు, మూడవ స్థానంలో ఉన్న చైనాకు 5.04శాతం ఉన్నాయి. ఇదే కాలంలో చైనా ఎగుమతుల్లో 16.2శాతం అమెరికాకు ఆరవ స్థానంలో ఉన్న మన దేశానికి 3.29శాతమే ఉన్నాయి. అందువలన మనం దిగుమతులు, ఎగుమతులు నిలిపివేస్తే అరిటాకు మీద ముల్లు సామెత అవుతుంది. పదేండ్లుగా చెబుతున్న మేకిన్‌ ఇండియా(భారత ఉత్పత్తి), మేడిన్‌ ఇండియా(భారత తయారీ), ఆత్మనిర్భరత పిలుపుల వలన జరిగిందేమీ లేదు. 2022-23లో మన జిడిపిలో ఉత్పాదకరంగం వాటా 14.7శాతం, మోడీ ఏలుబడి పది సంవత్సరాల్లో దీనికి అటూ ఇటూగానే ఉంది తప్ప 25శాతానికి పెంచాలన్న లక్ష్యం ఎండమావిగానే ఉంది. పన్నెండు రంగాలలో దేశాన్ని ఉత్పత్తి కేంద్రంగా మార్చేందుకు సలహాలు ఇవ్వాలని నీతి అయోగ్‌ కోరుతున్నది. చైనా నుంచి దిగుమతులను తగ్గించాలని 2018లోనే నీతి అయోగ్‌ చెప్పింది కదా ! పోనీ అప్పుడే ఎందుకు అడగలేదు ? తగ్గించకపోగా ఎందుకు పెంచినట్లు ? ఇప్పుడు జనాన్ని మభ్య పెట్టేందుకు తన వైఫల్యాలను దాచిపెట్టేందుకు నీతి అయోగ్‌ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఆడుతున్న ఒక నాటకం తప్ప ఇది మరొకటి కాదు. అమెరికా, జర్మనీ వంటి దేశాలు మేము చైనా మీద ఆధారపడకుండా ఉండలేంగానీ మీరు ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు ప్రోత్సహిస్తామని మనలను మునగచెట్టు ఎక్కిస్తున్నాయి.


వాటికే సాధ్యం కానిది మనకెలా కుదురుతుంది ! చైనా నుంచి దిగుమతి చేసుకొనే వస్తువులు ఎక్కడైనా దొరుకుతాయి. మరి ఎందుకు ఇతర దేశాల నుంచి తెచ్చుకోవటం లేదంటే చైనా మాదిరి తక్కువ ధరలకు మరొకదేశమేదీ ఇవ్వదు. అధిక ధరలకు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటే మన చేతి చమురు మరింత వదులుతుంది.ద్రవ్యోల్బణం, ధరలు పెరుగుతాయి. మన జనం కొనాలంటే జిఎస్‌టి పెంచుతారు, విదేశాలకు పద్నాలుగు రకాల వస్తువులను చౌకగా ఎగుమతి చేసేందుకు జనం సొమ్ము రెండు లక్షల కోట్ల రూపాయల మేర సబ్సిడీ ఇస్తున్నా ఎదుగూబొదుగూ లేదు. చైనాను పక్కకు నెట్టి ఆ స్థానాన్ని మనదేశం ఆక్రమిస్తుందని చెప్పటం పరిణితిలేనితనమని ఆర్‌బిఐ మాజీ గవర్నర్‌ రఘురామ రాజన్‌ గతంలో చెప్పాడు. ఐఎంఎఫ్‌ తాజా అంచనా ప్రకారం 2028నాటికి మన జిడిపి 5.94లక్షల కోట్ల డాలర్లకు చేరుతుందని, అదే చైనాలో 23.61లక్షల కోట్ల డాలర్లు ఉంటుంది. కానీ కొందరు అప్పటికి మన దేశం చైనాను అధిగమిస్తుందని చెబుతుంటే మరి కొందరు నిజమే కామోసనుకుంటున్నారు. ఎవరి నమ్మకం వారిది ? వినేవారుంటే చెప్పేవారికి కొదవ ఉండదు. చైనా వ్యతిరేక కళ్లద్దాలను పెట్టుకొని చూస్తే అలాగే కనిపిస్తుంది మరి ! గోల్డ్‌మాన్‌ శాచస్‌ సంస్థ అంచనా ప్రకారం 2075 నాటికి చైనా 57లక్షల కోట్ల డాలర్లతో ప్రధమ స్థానంలో 52.5లక్షల కోట్ల డాలర్లతో మనదేశం రెండవదిగా 51.5లక్షల కోట్ల డాలర్లతో అమెరికా మూడవ స్థానంలో ఉంటుందని చెప్పింది. ఇవన్నీ అంచనాలు తప్ప యాభై ఏండ్ల తరువాత రాజెవరో రెడ్డెవరో !


ప్రపంచం రక్షణాత్మక చర్యలు తీసుకుంటోందని, చైనా మీద ఇప్పటికే అమెరికా వాణిజ్యపోరు ప్రారంభించిందని, చైనా మీద అన్ని వైపుల నుంచి వత్తిడి పెరుగుతున్నందున దాన్ని అవకాశంగా మలుచుకోవాలని, మనదేశం చైనా వస్తువులకు మార్కెట్‌ను తెరవకూడదని నీతి అయోగ్‌ 2018 పత్రంలో స్పష్టంగా పేర్కొన్నది. చైనా వస్తువులను మన దేశంలో కుమ్మరించటం గాకుండా చైనా తమ దేశంలో తయారు చేస్తున్నవాటిని మన దేశంలో కూడా పెట్టుబడులు పెట్టి, మన కంపెనీలతో కలసి తయారు చేయించాలని నరేంద్రమోడీకి సలహా ఇచ్చింది. అలా చేస్తే దానికి బదులు ప్రపంచంలో ఇతర దేశాల రక్షణాత్మక చర్యలకు వ్యతిరేకంగా మనదేశ సహాయాన్ని చైనా కోరే అవకాశం ఉందని కూడా చెప్పింది. తెలివితేటలకు తక్కువేం లేదు. అదైనా చేశారా ? లడక్‌ సరిహద్దు ఉదంతం తరువాత చైనాను ఒక శత్రుదేశంగా పరిగణిస్తున్న సంగతి తెలిసిందే.పోనీ మనలను ఎగదోస్తున్న అమెరికా, ఇతర ఐరోపా దేశాలు మనకేమైనా సాయం చేస్తున్నాయా ? తమ దేశంలో ఒక సిక్కు ఉగ్రవాదిని భారత్‌ దేశమే హత్య చేయించిందన్న కెనడా ఆరోపణకు అమెరికా, ఐరోపా దేశాలు మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే.


ప్రతి దేశం తన ప్రయోజనాలను తాను చూసుకుంటున్నది, తన పరిస్థితిని బట్టి అభివృద్ధి వ్యూహాన్ని రూపొందించుకోవాలి తప్ప చైనా దెబ్బతింటే మనకు అవకాశం వస్తుందని చెప్పేవారి మాటలు వింటే జరిగేదేమీ ఉండదని ఇప్పటికే తేలిపోయింది. ఇతర దేశాల వైఫల్యాల కారణంగా చైనా నేడు ఈ స్థితికి రాలేదు. తన స్వంత విధానాలను రూపొందించుకుంది. కరోనా నిరోధానికి అక్కడ అమలు జరిపిన కఠిన ఆంక్షలు కొంత మేరకు వృద్ధిని దెబ్బతీశాయి తప్ప అనేక మంది ఆశించినట్లు కుప్పకూలలేదు, ఇప్పుడు అలాంటి మాటలు చెప్పేవారి నోళ్లు మూతపడ్డాయి. నాలుగు సంవత్సరాల నాడు ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పంద(ఆర్‌సిఇపి) చర్చల నుంచి మనదేశం వైదొలిగిన తరువాత మనం సాధించిందేమీ లేదు. 2022 జనవరి నుంచి ఆ ఒప్పందం అమల్లోకి వచ్చింది. దానిలో చేరాలని తాజాగా బంగ్లాదేశ్‌, శ్రీలంక దరఖాస్తు చేసుకున్నాయి. దానిలో మనం చేరితే దిగుమతి వ్యాపారం చేసే శక్తులు లాభపడతామని భావిస్తుండగా నష్టపోతామని పారిశ్రామిక రంగం వ్యతిరేకిస్తోంది. మన దేశానికి తలుపులు తెరిచే ఉంచామని ఆ కూటమి పదే పదే చెబుతోంది.


అసలు చైనాతో మనదేశం పూర్తిగా తెగతెంపులు చేసుకోగలదా ? చైనా సంస్థలను నిరోధించగలదా ? చైనా నుంచి వస్తు దిగుమతులను నిలిపివేయవచ్చు. అదే జరిగితే ఆ దిగుమతులతో లబ్ది పొందుతున్న ఫార్మా, ఇతర రంగాల కార్పొరేట్ల నుంచి ప్రతిఘటన ఎదురవుతుంది. చైనా సభ్యురాలిగా ఉన్న ఆసియన్‌ డెవలప్‌మెంట్‌ బాంక్‌(ఎడిబి), ఏఐఐబి, ప్రపంచబాంకు వంటి ఆర్థిక సంస్థలలో మనదేశం కూడా భాగస్వామి. వాటి నుంచి రుణాలు తీసుకొని మనదేశంలో అమలు జరిపే ప్రాజెక్టులలో కాంట్రాక్టులను దక్కించుకొనేందుకు చైనా సంస్థలకు హక్కు ఉంటుంది. వాటికవి దూరంగా ఉంటే లేదా నిబంధనలను ఉల్లంఘిస్తే తప్ప నిరాకరించటానికి కుదరదు. గాల్వన్‌ ఉదంతాల తరువాత ఢిల్లీ-మీరట్‌ రాపిడ్‌ రైల్‌ మార్గంలో చైనా కంపెనీల కాంటాక్టులను రద్దు చేయాలని ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ స్వదేశీ జాగరణ మంచ్‌ తదితర సంస్థలు ఆందోళన చేసినప్పటికీ కుదరలేదు.ఎందుకంటే అవసరమైన నిధులను ఏడిబి నుంచి రుణాలుగా తీసుకున్నారు. చైనా కంపెనీలు పూర్తి చేసిన మార్గాన్నే ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించారు. మన దేశంలో దాదాపు ఎనిమిది వందల చైనా కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి. స్నాప్‌డీల్‌, ఫ్లిప్‌కార్ట్‌, బైజూస్‌,స్విగ్గీ, జొమాటో,ఉడాన్‌, ఓలా,పేటియం, పేటియం మాల్‌, బిగ్‌బాస్కెట్‌,పోలసీబజార్‌,ఓయో వంటి కంపెనీలలో చైనా పెట్టుబడులు ఉన్నాయి. వాటన్నింటిని తెల్లవారేసరికి వెళ్లిపొమ్మని నరేంద్రమోడీ చెప్పవచ్చు, వాటికవి వెళ్లిపోతే సరే, లేకుంటే నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. దాన్ని ప్రభుత్వం భరిస్తుందా ? ఇష్టం లేదని ఈ రోజు చైనా కంపెనీలను వెళ్లగొడితే మనదేశాన్ని నమ్మి పెట్టుబడులు పెట్టేందుకు ఇతర దేశాల కంపెనీలు ముందుకు వస్తాయా ? పాలకులకు ఇష్టం లేకపోతే రేపు మనకూ అదే గతి అని ఆలోచించవా ? సరిహద్దు వివాదం తరువాత మనం చైనా వైపు తలుపులు మూసుకున్నాం తప్ప ఇతర దేశాల నుంచి సాధించిందీ లేదు, ఏ ఒక్క చైనా కంపెనీ కూడా వెనక్కు వెళ్లిపోలేదు.


చైనా టెక్‌ కంపెనీల ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటే తమ సమాచారాన్ని తస్కరించే అవకాశం ఉందని, రక్షణకు ముప్పని అమెరికా, ఐరోపా దేశాలు చెబుతున్నాయి.ఇప్పుడు మన దేశమూ అదే చెబుతోంది. నిజమే అనుకుందాం. ఇంటెల్‌ వంటి అమెరికా, ఐరోపా కంపెనీల ఉత్పత్తులను దశాబ్దాల తరబడి చైనా దిగుమతి చేసుకుంది.వాటితో చైనాకూ భద్రతా ముప్పు ఉన్నట్లే కదా ! పోనీ మన దేశం చైనా బదులు ఇతర దేశాల నుంచి కొనుగోలు చేస్తే వాటి నుంచి మనకు ముప్పు ఉండదా ? మన సమాచారాన్ని అవి తస్కరించవా ? జపాన్‌ నాగసాకీ నగరంలో 2023 మే నెలలో జరిగిన జి7 దేశాల సమావేశం చైనాతో ఉన్న సరఫరా గొలుసు నుంచి విడగొట్టుకుంటామని చెబుతూ మన దేశాన్ని చైనా స్థానంలోకి నెడతామని చెప్పాయి.వాటిని నమ్ముకుంటే కుక్కతోక పట్టుకొని గోదావరిని దాటేందుకు చూసినట్లే ! దశాబ్దాల తరబడి చైనా నుంచి వస్తువులను దిగుమతి చేసుకున్న పశ్చిమ దేశాలకు ఇప్పుడెందుకు జ్ఞానోదయం కలిగినట్లు ? వాటి మాటలు నమ్మి చైనా అనే కొండను ఢ కొడతామని మనం అనుకోవటం సరైందేనా ? చైనాతో తెగతెంపులు చేసుకుంటే తమ ఆర్ధిక వ్యవస్థలు మెరుగుపడతాయని పశ్చిమ దేశాలు అనుకుంటున్నాయి. అలాంటివి తమ దేశాల్లోనే పరిశ్రమలు, పెట్టుబడులు పెట్టుకుంటాయి తప్ప మనదేశం ఎందుకు వస్తాయి ? చైనా మీద ఆధారపడి చేతులు కాల్చుకున్నామని భావిస్తున్నవారు మన మీద ఆధారపడి మరోసారి అదే తప్పు చేస్తారా ? సొల్లు మాటలను కట్టిపెట్టి ముందు చైనాతో విడగొట్టుకోమనండి !

Share this:

  • Tweet
  • More
Like Loading...

పదేండ్ల నరేంద్రమోడీ పాలన : పెరిగిన అప్పులు – తగ్గిన మానవాభివృద్ధి, పన్నుబాదుడులో ఔరంగజేబే ఆదర్శం !

02 Monday Oct 2023

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, Health, History, INDIA, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

BJP, China, India debt matters, India HDI, Modi 2014 vs 2024, Narendra Modi Failures, Ten years Narendra Modi rule


ఎం కోటేశ్వరరావు


వెలిగిపోతున్న పాలన సాగిస్తున్నామని చెబుతున్న నరేంద్రమోడీ సర్కార్‌ సెప్టెంబరు చివరి వారంలో జనానికి రెండు ” శుభవార్తలు ” చెప్పింది. ఒకటి వర్తమాన ఆర్థిక సంవత్సరం తొలి ఐదు మాసాల్లో ద్రవ్యలోటు రు.6.43లక్షల కోట్లకు పెరిగింది. బడ్జెట్‌లో సూచించిన మొత్తం కంటే ఎక్కువగా రిజర్వుబాంకు మిగులు నుంచి రు.87,420 కోట్లు బదలాయించిన తరువాత కూడా ఇలా జరిగింది. గతేదాది ఈ మొత్తం రు.5.42లక్షల కోట్లు. దీన్ని సులభంగా చెప్పుకోవాలంటే తెలుగింటి కోడలు నిర్మలమ్మ ఆర్థికశాఖ మంత్రిగా 2023-24 బడ్జెట్‌ను ప్రవేశపెట్టినపుడు వచ్చే పన్నెండు నెలల్లో ఒక వంద రూపాయలు కొత్తగా ద్రవ్యలోటు ఉంటుందని ప్రతిపాదించారని అనుకుందాం. అది ఐదు నెలలకే 36 రూపాయలకు చేరింది, అదే కాలానికి గత ఏడాది రు.32.60 మాత్రమే ఉంది.మరింత వివరణ ఏమంటే గతేడాది మొత్తం లోటు రు.16.61లక్షల కోట్లని చెప్పగా వర్తమాన సంవత్సరంలో రు.17.86లక్షలుగా ప్రతిపాదించారు. మొత్తం పెరుగుదల లక్షా 25వేల కోట్లు, ఇప్పటికే లక్ష కోట్లు పోగా ఇంకా మిగిలింది 25వేల కోట్లు మాత్రమే. వచ్చే ఏడు నెలల్లో ఏ పధకానికి కోత పెడతారు, కొత్త అప్పులు తెస్తారా, కొత్త నోట్లను ముద్రిస్తారా ఏం చేస్తారన్నది చూడాలి. నరేంద్రమోడీకి సర్వాధికారాలు ఉన్నాయి కదా ! ఏం చేసినా అడిగేవారు లేరు. నోట్ల ముద్రణ జరిగితే ధరలు మరింతగా పెరుగుతాయి, రూపాయి విలువ పతనం అవుతుంది.


ఇక రెండవ మంచి వార్త ఏమంటే మన విదేశీ రుణ భారం 2023 జూన్‌నాటికి 629.1 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. తమ విశ్వగురువు విదేశీ రుణాల మీద ఆధారపడరని, తగ్గిస్తారని భక్త జనులు అధికారానికి వచ్చిన తొలి రోజుల్లో ప్రచారం చేశారు. 2014లో మోడీ అధికారానికి వచ్చినపుడు 2013 డిసెంబరు నాటికి ఉన్న విదేశీ రుణం 409.4 బిలియన్‌ డాలర్లు మాత్రమే. దానిలో తీర్చింది తీర్చగా ఆ మొత్తం అలాగే ఉందనుకుంటే అదనంగా 220 బిలియన్‌ డాలర్లు కొత్త అప్పులు చేశారు. ఇది ప్రతి మూడు నెలలకు పెరుగుతున్నది తప్ప తగ్గటం లేదు.ఈ ఏడాది మార్చి నాటికి 624.3 బిలియన్‌ డాలర్లకు అదనంగా 470 కోట్ల డాలర్లు తోడైంది. దీన్ని మోడీ సర్కార్‌ వైఫల్యంగా చెబుతారా, ఘనత అంటారా ? గతంలో వాజ్‌పాయి ఏలుబడిలో, యుపిఏ కాలంలో కూడా అప్పులు గణనీయంగా తీసుకున్నారు. విదేశీ రుణాలన్నీ డాలర్లలో ఉండవు.1991లో మన విదేశీ రుణం 83.8 బిలియన్‌ డాలర్లు కాగా దానిలో రాయితీలతో కూడిన మొత్తం 45.9శాతం ఉండేది. అది తరువాత క్రమంగా తగ్గుతూ 2013నాటికి 11.1కి 2022 డిసెంబరు నాటికి 8.1శాతానికి తగ్గింది.


అంకెలతో జనాన్ని తిమ్మిని బమ్మిని చేయవచ్చు. దానిలో భాగంగానే విదేశీ అప్పు మొత్తం పెరిగిందని ఒకవైపు అంగీకరిస్తూనే మార్చినెలతో ముగిసిన దానితో పోలిస్తే జూన్‌ నాటికి జిడిపిలో అప్పు శాతం 18.8 నుంచి 18.6 శాతానికి తగ్గినట్లు ఆర్‌బిఐ చెబుతోంది.ప్రభుత్వ అప్పు తగ్గింది, ప్రభుత్వేతర అప్పు పెరిగిందని కూడా పేర్కొన్నది. గతంలో కూడా ప్రభుత్వ అప్పు తగ్గింది తప్ప పెరగలేదు, కానీ బిజెపి నేతలు దాని గురించి ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి అన్నట్లు కాంగ్రెస్‌ పాలన గురించి నానా యాగీ చేశారు. మొత్తంగా పెరిగిందా లేదా అన్నది గీటురాయి. ఇతర దేశాలతో పోలిస్తే మన అప్పు తక్కువ అని మరోసన్నాయి నొక్కు. ప్రతిదానికి చైనాతో పోలుస్తున్నారు, దాని విదేశీ అప్పు జిడిపిలో 13.6శాతం ఉంది, దాని కంటే మన అప్పు ఆరుశాతం ఎక్కువ. ఇంటా బయటా అప్పులు చేసి లేదా ప్రయివేటు అప్పులకు హామీ ఇచ్చి సాధించింది ఏమిటి ? కాంగ్రెస్‌ యాభై సంవత్సరాలలో చేయలేని వాటిని తన తొలి ఐదు సంవత్సరాల పాలనలోనే సాధించినట్లు నరేంద్రమోడీ చెప్పుకున్నారు. అందువలన పదేండ్ల కాలం తక్కువేమీ కాదు. కేంద్రంలో, మెజారిటీ రాష్ట్రాలలో బిజెపి అధికారంలో ఉంది. విధానాలను అమలు జరపటానికి వచ్చిన ఇబ్బంది లేదు.ఒక దేశ అభివృద్ధికి ఒక కొలమానం మానవాభివృద్ధి సూచిక. ఐరాస అభివృద్ధి ప్రమాణాల(హెచ్‌డిఐ) ప్రకారం 0.550 కంటే తక్కువ పాయింట్లు వచ్చిన దేశాలు తక్కువ, 0.550 -0.699 మధ్య ఉన్నవి మధ్యరకం, 0.699 నుంచి 0.799 పాయింట్లు వస్తే ఉన్నత, 0.800 కంటే మించితే అత్యున్నత వృద్ధి సాధించిన దేశాలుగా పరిగణిస్తున్నారు. ఈ ఏడాది ప్రకటించిన 2022 నివేదిక ప్రకారం 0.633 పాయింట్లతో మనదేశం 188 దేశాల జాబితాలో 132వదిగా ఉంది.నరేంద్రమోడీ అధికారానికి వచ్చినపుడు ఉన్న 130 నుంచి రెండు స్థానాలు దిగజారింది. మన దేశం ఇచ్చిన సమాచారం ప్రకారమే విశ్లేషించి సూచికలను రూపొందిస్తారని తెలిసిందే. ఎందుకీ దిగజారుడు ? ఇష్టం ఉన్నా లేకున్నా చైనాతో పోలుస్తున్నారు గనుక అదెక్కడ ఉందో చూద్దాం. తాజా సూచిక ప్రకారం 0.768 పాయింట్లతో 79వ స్థానంలో ఉంది. ఈ సూచికలకు ఇచ్చే పాయింట్లు ఆయా దేశాల్లో జరిగే వృద్ధిని బట్టి ఏటా మారుతూ ఉంటాయి. లింగ సమానత్వం, ఆరోగ్యం, విద్య, ఆదాయం, అసమానతల వంటి 13 అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. గడచిన నాలుగున్నర దశాబ్దాలుగా కొన్ని దేశాల మానవాభివృద్ధి సూచికలలో వచ్చిన మార్పులు దిగువ విధంగా ఉన్నాయి. బ్రాకెట్లలో ఉన్న అంకెలు సదరు ఏడాది పరిగణనలోకి తీసుకున్న దేశాల సంఖ్యగా గమనించాలి.
హెచ్‌డిఐ ××× 1980 ×× 1990 ×××× 2000 ×××× 2010 ×× 2014 ×××× 2022
చైనా ×××××0.423 ×× 0.501 ×× 0.588 ××0.699 ××0.727 ×× 0.768
చైనారాంక్‌ ×××92(124) ××103(143) ××108(166) ××102(188)××90(188) ××79(191)
భారత్‌ ×××0.369 ×× 0.428 ××0.496 ××0.586 ×××× 0.609 ×× 0.633
భారతరాంక్‌×××100(124) ××114(143) ××120(166) ××136(188)××130(188) ××132(191)
అమెరికా ×××0.825 ×× 0.859 ××××0.883 ××××0.909 ××××0.915 ×××× 0.921
అమెరికారాంక్‌×× 2(124) ×× 2 (143) ×× 5 (166) ×× 5 (188)×× 8 (188) ×× 21(191)


తన పాలనలో జిడిపి గణనీయంగా పెరిగిందని, త్వరలో ఐదు లక్షల కోట్ల డాలర్లకు చేర్చుతామని, 2047 నాటికి చైనాను కూడా అధిగమిస్తామని బిజెపి నమ్మింప చూస్తున్నది. రాష్ట్రాలు రుణాలు తీసుకోవద్దని, సంక్షేమ పధకాలకు అనవసరంగా ఖర్చు చేయవద్దని ప్రధాని నరేంద్రమోడీ పదే పదే చెబుతున్నారు.కానీ ఆ పెద్ద మనిషి ఏలుబడిలో జరిగిందేమిటి ? 2013-14 సంవత్సరంతో పోల్చితే 2022-23నాటికి స్వదేశీ అప్పు 174శాతం, విదేశీ అప్పు వందశాతం పెరిగింది.కాగ్‌ ఖరారు చేసిన గణాంకాల ప్రకారం 2014 మార్చి 31నాటికి కేంద్ర ప్రభుత్వ విదేశీ, స్వదేశీ అప్పు మొత్తం రు.50,68,235 కోట్లు. వర్తమాన సంవత్సర బడ్జెట్‌ ప్రతిపాదనల్లో అప్పుల గురించి నిర్మలమ్మ పార్లమెంటుకు సమర్పించిన పత్రం ప్రకారం 2023 మార్చి నెల ఆఖరుకు రు. 152,61,122.12 కోట్లుగా ఉన్నది 2024 మార్చి ఆఖరుకు రు.169,46,466.85 కోట్లకు చేరుతుంది. ఎన్నికల సంవత్సరం గనుక ఇంకా పెరగటమే తప్ప తగ్గే అవకాశం లేదు. దీనిలో స్వదేశీ అప్పు రు.147,77,724.43 కోట్ల నుంచి రు.164, 23,983.04కు, విదేశీ రుణం రు.4,83,397.69 నుంచి రు.5,22,683.81 కోట్లకు పెరుగుతుందని చెప్పారు. ఇంత అప్పు చేసినా మానవాభివృద్ధి సూచికలు దిగజారాయంటే ఆ సొమ్మును జనానికి గాకుండా కార్పొరేట్లకే కట్టపెట్టారన్నది స్పష్టం. పెంచిన పన్ను భారాలు, అప్పుల గురించి అడిగితే జాతీయ రహదారులు, రైల్వేలను అభివృద్ధి చేశామంటారు. నిజమే, వాటిని వినియోగించుకున్నవారి నుంచి వసూలు చేస్తున్న టోలు టాక్సు, ఎంత ? సామాన్యులు ఎక్కే పాసింజరు రైళ్లను రద్దు చేసి వాటిని ఎక్స్‌ ప్రెస్‌ల పేరుతో జనాన్ని బాదుతున్నారు. వృద్దులకు ఇచ్చే రాయితీలను రద్దు చేశారు.రిజర్వేషన్ల రద్దుకు ఎంత వసూలు కోత పెడుతున్నారో తెలిసిందే. స్టాటిస్టా సంస్థ వెల్లడించిన సమాచారం ప్రకారం 2017 ఆర్థిక సంవత్సరం నుంచి 2023 వరకు టోల్‌టాక్సు రు.17,942 కోట్ల నుంచి 48,028 కోట్లకు పెరిగింది. దీనిలో సరకు, ప్రయాణీకుల రవాణా వాహనాల నుంచి వసూలు చేసేదే ఎక్కువ అన్నది తెలిసిందే, అంటే ఆ మేరకు జనం మీద భారం మోపుతున్నారు.


ఆరోగ్య పరిస్థితిని చూస్తే ఆందోళనకరంగా ఉంది. తగినన్ని ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయని కారణంగా దేశంలో అన్ని వయసుల వారిలో రక్త హీనత (అనీమియా)పెద్ద సమస్యగా ఉంది. కుటుంబ జాతీయ ఆరోగ్య సర్వే 5 (2019-21) ప్రకారం ఆరు నెలల నుంచి ఐదేండ్ల మధ్య వయస్సు పిల్లల్లో 67శాతం, 15-19 సంవత్సరాల బాలికల్లో 59, బాలురలో 31,పిల్లల్ని కనేవయస్సున్న మహిళల్లో 57, గర్భిణుల్లో 52, గర్భిణులు కాని మహిళల్లో 57 మంది రక్త హీనతో ఉన్నారు. అంతకు ముందు చేసిన సర్వే 4 వివరాలతో పోలిస్తే పైన చెప్పుకున్న అన్ని తరగతుల వారిలో ఈ సమస్య తీవ్రత పెరిగింది. దేశానికి గుజరాత్‌ తరహా అభివృద్ధిని అమలు చేస్తానని నరేంద్రమోడీ చెప్పారు, ఆ గుజరాత్‌ పిల్లల్లో తీవ్రత 62.6 నుంచి 79.7శాతానికి పెరిగింది. ఈసురో మని మనుషులుంటే దేశమేగతి బాగుపడునోరు అని మహాకవి గురజాడ చెప్పింది ఇలాంటి వారి గురించే.2018లో అనీమియా ముక్త భారత్‌ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని ప్రకటించింది. అది ఏమేరకు ఫలితాలు ఇచ్చిందో ఇంకా ఏమి చేయాలో తెలియాలంటే సర్వేలు తప్ప మరొక మార్గం లేదు కానీ, ఆరవ విడత నిర్వహించదలచిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో ఆ సమాచారాన్ని రాబట్టే ప్రశ్నలనే కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. ఎందుకంటే తీవ్రత తగ్గకపోతే మోడీ సర్కార్‌ వైఫల్యం వెల్లడౌతుంది. అంతకు మించి మరొక కారణం కనిపించటం లేదు. దీని మీద తీవ్ర విమర్శలు రావటంతో డైట్‌ మరియు బయోమేకర్స్‌ సర్వే(డాబ్స్‌-1) ఆ సమాచారాన్ని సేకరిస్తుందని కేంద్ర ప్రకటిచింది. మన దేశంలో తృణధాన్యాల వినియోగం గురించి ఐరాస ఆహార, వ్యవసాయ సంస్థ 2019 సంవత్సర వివరాలను వెల్లడించింది.ప్రపంచ వ్యాపితంగా తలసరి ఆహారం,దాణాగా 304కిలోలు వినియోగిస్తున్నారు. మన దేశంలో 171 కిలోలు, ఆఫ్రికాలో 190, బాగా వెనుక బడిన దేశాల్లో 205, బ్రెజిల్‌, చైనాలో 360, రష్యాలో 407,ఐరోపా పారిశ్రామిక దేశాల్లో 494, అమెరికాలో 590 కిలోలు ఉంది. దీన్ని బట్టి 121 దేశాల్లో మన దేశం ఆకలి సూచికలో 107వదిగా ఎందుకు ఉందో అర్ధం చేసుకోవటం కష్టం కాదేమో ? రాష్ట్రాలకు చెందాల్సిన న్యాయమైన వాటాను రాకుండా ఎగవేసేందుకు కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న కొన్ని భారాలను చూస్తే స్వచ్చ భారత్‌, విద్య, ఆరోగ్యం,రోడ్డు , నాణ్యమైన ఇంథనం, వ్యవసాయం పేరుతో విధిస్తున్న సెస్‌ల గురించి జనానికి తెలిసిందే తక్కువే. రాబడి కోసం ఔరంగజేబు ముస్లిమేతరుల మీద విధించిన జిజియా పన్ను గురించి చరిత్ర పాఠాల్లో చదువుకున్నాం.ఇప్పుడు జరుగుతున్నదేమిటి ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

నరేంద్రమోడీ పదేండ్ల ఏలుబడి : మూడోసారి అధికారం కోసం ఎగుమతుల నిషేధంతో రైతాంగాన్ని బలిపెడతారా !

25 Friday Aug 2023

Posted by raomk in BJP, Current Affairs, Economics, Farmers, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices

≈ Leave a comment

Tags

#Farmers matter, agri exports ban, Agricultur, BJP, Narendra Modi Failures, Ten years Narendra Modi rule


ఎం కోటేశ్వరరావు


ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ తీరు తెన్నులను చూస్తుంటే ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలోని బిజెపి మూడోసారి అధికారానికి వచ్చేందుకు కోట్లాది మంది రైతాంగాన్ని బలిపెట్టేందుకు పూనుకుందా అంటే అవునని చెప్పాల్సి వస్తోంది. తాను చెప్పిన మాటలను తానే దిగమింగి ప్రకటిత విధానాల నుంచి వైదొలగటాన్ని చూసి అనేక మంది అలాగే భావిస్తున్నారు.ఎగుమతి నిషేధాల జాబితాలో ఇక పంచదార వంతు అంటూ ఆగస్టు 23వ తేదీన ఒక వార్త వెలువడింది. అంతకు ఒక రోజు ముందు ” రైతులు లాభపడటాన్ని అడ్డుకుంటున్న ప్రభుత్వం ” అనే శీర్షికతో డెక్కన్‌ హెరాల్డ్‌ పత్రికలో అజిత్‌ రనడే అనే ఆర్థికవేత్త కేంద్ర ప్రభుత్వ విధానాల గురించి ఒక విశ్లేషణ రాశారు.కేంద్ర నిర్ణయాల మీద వివిధ కోణాల్లో మరికొందరు కూడా రాస్తున్నారు. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులపై ఉన్న ఆంక్షలన్నింటినీ సడలిస్తామని, ఎలాంటి పరిమితులు విధించబోమంటూ 2018లో కేంద్ర ప్రభుత్వం ఎగుమతి-దిగుమతి విధానంలో పేర్కొన్నది. తరువాత దాని కొనసాగింపుగా రాష్ట్రాలతో సంప్రదించకుండా, వాటి అభిప్రాయం తీసుకోకుండా మూడు సాగు చట్టాలను తీసుకువచ్చి దేశం మీద రుద్దాలని చూసిన సంగతి తెలిసిందే. రైతుల ఆందోళన కారణంగా తప్పనిసరై వాటిని వెనక్కు తీసుకున్నప్పటికీ వాటితో నిమిత్తం లేకుండా అంతకు రెండేళ్ల ముందు ప్రకటించిన ఎగుమతి -దిగుమతి విధానాన్ని కూడా అటక ఎక్కించింది. ఎప్పుడేం చేస్తారో తెలియని ఇలాంటి పాలకులను నమ్మి ఎవరైనా ముందుకు పోగలరా ? గడచిరైతొమ్మిదేండ్ల పాలనలో ఒకటి స్పష్టం. పారిశ్రామిక, వాణిజ్యవేత్తల మీద ఉన్న శ్రద్ద, ప్రేమ రైతాంగం మీద లేదు. వారికి ఇచ్చినన్ని రాయితీలు, రద్దు చేసిన రుణాలు రైతులకు లేవు.


ఇప్పటి వరకు పంచదార ఎగుమతుల మీద ఆంక్షలు, పరిమితులు మాత్రమే విధించిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా నిషేధం విధిస్తూ నేడో రేపో ప్రకటన చేయనుందని ఆగస్టు 23న రాయిటర్‌ వార్తా సంస్థ పేర్కొన్నది. అంతకు ముందు వచ్చే సీజన్‌లో 40లక్షల టన్నులకు ఎగుమతులు పరిమితం చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. అక్టోబరు ఒకటవ తేదీ నుంచి చెరకు ఆర్థిక సంవత్సరం ప్రారంభమౌతుంది. దేశంలో అనేక ప్రాంతాల్లో తగినంత వర్షపాతం లేని కారణంగా చెరకు దిగుబడి తగ్గవచ్చని అందువలన పంచదార ధరలు పెరగకుండా ఎగుమతులపై నిషేధం విధించవచ్చని ప్రభుత్వ వర్గాలు చెప్పినట్లు వార్తలో తెలిపింది. సెప్టెంబరు 30వ తేదీ వరకు 61లక్షల టన్నుల పంచదార ఎగుమతికి కేంద్ర ప్రభుత్వం మిల్లులకు అనుమతి ఇచ్చింది. గత ఏడాదిలో 111లక్షల టన్నుల ఎగుమతికి అనుమతించారు.వచ్చే రెండు సంవత్సరాల్లో దిగుమతి తగ్గవచ్చని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. మరో నెల రోజుల్లో ముగియనున్న సంవత్సరంలో పంచదార ఉత్పత్తి 3.6 కోట్ల టన్నులు ఉంటుందని అంచనా వేయగా 3.28ోట్లకు మించే అవకాశం లేదని పరిశ్రమ వర్గాలు అంచనా వేశాయి. మన దేశం నుంచి ఎగుమతి లేకుంటే ఇప్పటికే ప్రపంచ మార్కెట్లో పెరిగిన ధరలు మరింత పెరుగుతాయని, బ్రెజిల్‌ ఎగుమతిదారులు మంచి ధరతో లబ్దిపొందుతారని భావిస్తున్నారు.


2022 ఏప్రిల్‌ 13న గుజరాత్‌ రాజధాని అహమ్మదాబాద్‌లో ఒక భవనాన్ని నరేంద్రమోడీ వీడియో ద్వారా ప్రారంభించారు. ఆ సందర్భంగా సందేశమిస్తూ ఉక్రెయిన్‌ యుద్దం తరువాత ఏ దేశానికి ఆ దేశం తన ఆహార భద్రత సంగతి తాను చూసుకుంటోందని తాను ఒకసారి అమెరికా అధినేత జో బైడెన్‌తో మాట్లాడినపుడు ప్రస్తావించానని, ప్రపంచ వాణిజ్య సంస్థ గనుక అనుమతి ఇస్తే ప్రపంచానికి ఆహార ధాన్యాలను సరఫరా చేసేందుకు సిద్దంగా ఉన్నాం అని చెప్పినట్లు మోడీ ఆ సందర్భంగా వెల్లడించారు. మన జనానికి సరిపడా ఆహారం ఇప్పటికే మన దగ్గర ఉందని, కానీ మన రైతులను చూస్తుంటే ప్రపంచానికే ఆహారం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా కనిపిస్తున్నదని, ప్రపంచ వాణిజ్య సంస్థ ఎప్పుడు అనుమతిస్తుందో తెలియదు గానీ మనం మాత్రం ప్రపంచానికి ఆహారం అందించగలం అని నరేంద్రమోడీ చెప్పారు. అదే ఏడాది మేనెల నాలుగవ తేదీన ఐరోపాలోని కోపెన్‌హాగన్‌లో ఒక సమావేశానికి హాజరైన ప్రధాని మోడీ అక్కడి భారతీయుల సమావేశంలో మాట్లాడుతూ ఆహార ధాన్యాల్లో భారత్‌ స్వయ సమృద్ధి సాధించిందనీ, ఆకలి నుంచి ప్రపంచాన్ని రక్షించేందుకు ముందుకు వచ్చిందని చెప్పారు. ప్రపంచ ఆకలి సూచిక 2013లో 78 దేశాల జాబితాలో మనది 63 కాగా శ్రీలంక 43, నేపాల్‌ 49, పాకిస్తాన్‌ 57వ స్థానాలతో మన కంటే ఎగువన ఉన్నాయి. 2022లో 121 దేశాలకు గాను 107వ స్థానంలో మన దేశం ఉంది. శ్రీలంక 64, మయన్మార్‌ 71, నేపాల్‌ 81, బంగ్లాదేశ్‌ 84, పాకిస్తాన్‌ 99 స్థానాల్లో ఉన్నాయి. ఈ వివరాలన్నీ తెలిసిన తరువాత కూడా ప్రపంచ ఆకలి తీరుస్తామని వేదికల మీద చెప్పటం నరేంద్రమోడీకి తప్ప మరొక నేతకు సాధ్యం అవుతుందా ?


ప్రధాని మాటల కొనసాగింపుగా అంతకు ముందు ఏడాది చేసిన 20లక్షల టన్నులను 2022-23లో కోటి టన్నులకు పెంచి గోధుమలను ఎగుమతి చేసే లక్ష్యాన్ని సాధించేందుకు ఇండోనేషియా,ట్యునీషియా, మొరాకో, ఫిలిప్పీన్స్‌,టర్కీ, థాయిలాండ్‌, వియత్నాం, అల్జీరియా, లెబనాన్‌లకు ప్రతినిధి బృందాలను పంపనున్నట్లు మే 12న కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ ప్రకటించింది.అంతే కాదు, కొన్ని దేశాలకు ఎగుమతులు ప్రారంభమైనట్లు కూడా చెప్పారు. చిత్రం ఏమిటంటే మరుసటి రోజే గోధుమల ఎగుమతులపై కేంద్రం ఆంక్షలు విధించింది. తరువాత సెప్టెంబరు తొమ్మిది నుంచి అమల్లోకి వచ్చే విధంగా బాస్మతేతర బియ్యం ఎగుమతులపై ఇరవైశాతం ఎగుమతి పన్ను విధించటంతో పాటు, కొద్దిగా ముక్కలైన బియ్యం ఎగుమతులపై కూడా పూర్తి నిషేధం విధించారు. ప్రభుత్వ నిర్ణయంతో ఓడలకు ఎక్కించేందుకు వివిధ రేవుల్లో ఉన్న ఐదు లక్షల టన్నుల గోధుమలను ఎగుమతిదార్లు వెనక్కు తీసుకువచ్చి మార్కెట్లో అమ్మేందుకు పూనుకోవటంతో మార్కెట్లో పది-పదిహేనుశాతం ధరలు పడిపోయాయి. దాంతో ఎగుమతిదార్ల వత్తిడికి లొంగి రేవుల్లో నమోదైన మేరకు ఎగుమతులు చేసుకోవచ్చని ప్రభుత్వం ఉత్తరువులను సవరించింది. మొత్తం మీద రైతులు పెద్ద ఎత్తున నష్టపడ్డారు.


ఈ ఏడాది తాజాగా గోధుమ పిండి, మైదా, గోధుమ రవ్వ ఎగుమతులను కూడా నిషేధించింది. అంతే కాదు ఇప్పటికే రష్యా నుంచి తక్కువ ధరలకు ముడి చమురు దిగుమతి చేసుకుంటున్న మన దేశం ఇప్పుడు గోధుమలను కూడా దిగుమతి చేసుకోవాలని చూస్తోంది. టన్నుకు 25 నుంచి 40 డాలర్ల వరకు తక్కువకు దిగుమతి చేసుకోవచ్చని వార్తలు వచ్చాయి. స్థానిక మార్కెట్లో పెరిగిన ధరలను తగ్గించేందుకు అని చెబుతున్నారు. ఇదంతా త్వరలో జరిగే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు,తదుపరి జరిగే లోక్‌సభ ఎన్నికల నాటికి ధరలను తగ్గించామని జనం ముందు చెప్పుకొనేందుకు తప్ప వేరు కాదన్నది స్పష్టం.. ఉల్లి ధరల పెరుగుదల సూచన కనిపించటంతో వాటి ఎగుమతులపై 40శాతం పన్ను విధించుతూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.దీంతో నాసిక్‌ ప్రాంతంలోని వ్యాపారులు ఉల్లి కొనుగోళ్లను నిలిపివేశారు. క్వింటాలు రు.2,410 రూపాయల ధరతో తాము కొనుగోలు చేస్తామని కేంద్ర మంత్రి పియుష్‌ గోయల్‌ ప్రకటించారు.ఎగుమతులు లేక కేంద్రం దిగుమతులు చేసుకుంటే తాము కొన్న ధరలకంటే మార్కెట్లో తగ్గితే నష్టపోతామన్న భయంతో వారు మానుకున్నారు. ధరలు పెరిగినపుడు కొద్ది నెలలు ఉల్లి తినటం మానుకుంటే సరి అధిక ధరలకు ఎవరు కొనమన్నారు అంటూ మహారాష్ట్ర బిజెపి నాయకత్వంలోని ప్రభుత్వ మంత్రి దాదా భూసే అన్నారు. 2019లో ఉల్లి ధర కిలో రు.100కు చేరినపుడు నేను ఉల్లిపాయలు తినను అని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్న సంగతి తెలిసిందే. ఉల్లి ధరలను ఎన్నికల ప్రచార అస్త్రంగా మార్చిన గతం బిజెపికి గుర్తుకు వచ్చి ముందు జాగ్రత్తపడుతున్నది. కానీ నష్టపోతున్నది రైతులే. ధరలు పతనమైనపుడు కేంద్ర ప్రభుత్వం క్వింటాలు రు.2,410కి కొన్న దాఖలా లేదు. స్వేచ్చామార్కెట్‌లో ఎక్కడ ధర ఎక్కువగా ఉంటే అక్కడే అమ్ముకోవచ్చు, రైతులు కూడా నేరుగా ఎగుమతులు కూడా చేసుకోవచ్చు అందుకే మూడు సాగు చట్టాలు అని బల్లలు చరిచి, ఊరూవాడా తిరిగి మరీ చెప్పారు. వ్యాపారుల నిల్వలతో సహా అన్ని రకాల నియంత్రణలను ఎత్తివేస్తామని రైతులు నేరుగా ఎగుమతులు చేసుకోవచ్చని అరచేతిలో ప్రపంచ మార్కెట్లను చూపారు. ఇప్పుడు ఆ అవకాశాలను ఎందుకు అడ్డుకున్నట్లు ? తమ మీద ఉద్యమించినందుకు రైతుల మీద కక్ష తీర్చుకుంటున్నారా ? మరోవైపున పారిశ్రామిక, సేవా ఉత్పత్తుల ఎగుమతులకు ప్రోత్సాహకాలిస్తున్నారు. వ్యవసాయ ఉత్పత్తులపై ఎగుమతి పన్ను విధించి అడ్డుకుంటున్నారు, రైతులపై ఎందుకీ కత్తి ? పారిశ్రామికవేత్తలకు ఇస్తున్న ఎగుమతి ప్రోత్సాహకాల మాదిరే రైతాంగ ప్రయోజనాలను కాపాడాలా లేదా ? ఎగుమతులకు రాయితీలు ఇచ్చి విదేశీయులకు మన వస్తువులను చౌకగా అందించేందుకు పడుతున్న తాపత్రయంలో నూరోవంతు మన వినియోగదారుల మీద చూపి సబ్సిడీలు ఇచ్చి ఆదుకోవాలి తప్ప రైతుల నడ్డి విరవటం ఏమిటి ?


ఏ రోటి దగ్గర ఆ పాట పాడుతున్న బిజెపి పాలకుల విధానాలు తెలియనంత అమాయకంగా జనాలు లేరు. ప్రభుత్వరంగ సంస్థలను తెగనమ్మే సందర్భంగా ప్రభుత్వాలు పాలన కోసం తప్ప వ్యాపారాలు చేసేందుకు కాదని చెబుతారు. అదే కేంద్ర ప్రభుత్వం ఇటీవల టమాటాలను, ఇప్పుడు ఉల్లిపాయలను కూడా రాయితీ ధరలకు ఎన్‌సిసిఎఫ్‌, నాఫెడ్‌ ద్వారా అమ్ముతూ వ్యాపారం చేస్తున్నది. ఇందుకోసం వెచ్చిస్తున్న సబ్సిడీ మొత్తాన్ని ఎక్కడ నుంచి చెల్లిస్తున్నట్లు ? ప్రజల సొమ్మును బిజెపికి ఓట్ల కోసం ప్రభుత్వం ద్వారా ఖర్చు చేస్తున్నారు. ఇటీవల బాస్మతి రకాలు తప్ప మిగిలిన అన్ని రకాల బియ్యం ఎగుమతుల మీద కేంద్రం నిషేధం విధించింది. దాంతో అమెరికాలో మనవారు అక్కడి దుకాణాల మీద ఎగబడి ఎలా కొనుగోలు చేసిందీ చూశాము. కొంత మంది చెబుతున్నదాని ప్రకారం ఇథనాల్‌ ఉత్పత్తిదారుల కోసమే ఈ పని చేశారు. ముక్కలుగా మారిన 50-60లక్షల టన్నుల బియ్యంలో 30లక్షల టన్నులను ఇథనాల్‌కు కేటాయించనున్నట్లు వార్తలు. బియ్యం ఎగుమతులపై నిషేధం రైతాంగానికి నష్టం.తమకు కావాల్సిన బియ్యానికి క్వింటాలుకు రు.3,400 చెల్లించి మరీ కొంటామని అడిగినప్పటికీ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వానికి విక్రయించేందుకు కేంద్ర నిరాకరించింది. అదే ప్రభుత్వం పెట్రోలులో కలిపేందుకు తయారు చేసే ఇథనాల్‌కు మాత్రం రు.2,000కే సరఫరా చేస్తున్నది. నీతి అయోగ్‌ రూపొందించిన ఒక పత్రంలో పేర్కొన్న సమాచారం మేరకు 2025-26 నాటికి పెట్రోలులో 20శాతం ఇథనాల్‌ను మిళితం చేయాలని ప్రతిపాదించారు. దీనిలో సగం బియ్యం నుంచి తయారు చేయాల్సి ఉంది.


కేంద్ర ప్రభుత్వం 2019 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని బిజెపికి లబ్ది చేకూర్చేందుకు ఏటా ఆరువేల రూపాయలను రైతులకు చెల్లించేందుకు ఒక పధకాన్ని ప్రకటించింది.తొలి విడత మొత్తాన్ని 2018 డిసెంబరు నుంచి అమలులోకి వచ్చే విధంగా ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు కోసం అప్పటి నుంచి ఏటా అరవైవేల కోట్ల మొత్తాన్ని చెల్లిస్తున్నది. ఈ మొత్తాన్ని నరేంద్రమోడీ రైతులకు ఇస్తున్న సాయంగా బిజెపి ప్రచారం చేసుకుంటున్నది. ఈ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం అప్పనంగా ఇవ్వటం లేదు. వ్యవసాయ మౌలిక సదుపాయాలు, అభివృద్ధి పేరుతో పేరుతో ప్రతి లీటరు పెట్రోలు మీద రు.2.50, డీజిల్‌ మీద రు.4 సెస్‌ వసూలు చేస్తున్నది.ఆ నిధి నుంచే కిసాన్‌ సమ్మాన్‌ చెల్లింపులు జరుగుతున్నాయి.2021-22 బడ్జెట్‌లో ఈ సెస్‌ ద్వారా వసూలు చేయాల్సిన మొత్తం రు.76,950 కోట్లుగా ప్రతిపాదించారు. అంటే రైతులకు చెల్లించుతున్నదాని కంటే అదనంగా వసూలు చేస్తున్నారు. ఈ మొత్తాన్ని ఎక్సైజ్‌ డ్యూటీ నుంచి సర్దుబాటు చేస్తున్నాం తప్ప వినియోగదారుల మీద అదనపు భారం మోపటం లేదని కేంద్రం వాదిస్తున్నది. అసలు కిటుకు ఏమంటే ఎక్సైజ్‌ డ్యూటీ పేరుతో వసూలు చేసే మొత్తాలలో రాష్ట్రాలకు 41శాతం వాటా ఇవ్వాల్సి ఉంటుంది. దాన్ని నామమాత్రం చేసి సెస్‌ పేరుతో వసూలు చేస్తే సెస్‌ నుంచి ఒక్క పైసా కూడా రాష్ట్రాలకు పంపిణీ చేయాల్సిన అవసరం ఉండదు. అంటే ఆ మేరకు రాష్ట్రాలకు రాబడి తగ్గినట్లే. రైతులకు ఇచ్చే ఎరువుల రాయితీ గురించి గొప్పగా చెబుతున్నారు. కొన్నివేల కార్పొరేట్లకు ఇస్తున్న రాయితీలు, రుణాల రద్దుతో పోల్చితే కోట్లాది మంది రైతాంగానికి ఇస్తున్న మొత్తాలు ఎంత ? నరేంద్రమోడీ అధికారానికి వచ్చినపుడు రు.73వేల కోట్ల సబ్సిడీ 2022-23లో రెండున్నరలక్షల కోట్లకు పెంచినట్లు ప్రచారం చేస్తున్నారు. పదేండ్ల ఏలుబడిలో ఎరువుల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించటంలో తమ వైఫల్యానికి నరేంద్రమోడీ చెల్లిస్తున్న పరిహారమిది. ప్రపంచ మార్కెట్లో ఎరువుల ధరలు విపరీతంగా పెరగటంతో దిగుమతి ఖర్చు పెరిగింది. దాన్ని రైతుల ఉద్దరణ అంటున్నారు. పెరిగిన ధరలతో ఎరువులు కొనాలంటే రైతులు సాగు మానుకోవటం తప్ప మరో దారి ఉండదు. నూటనలభై కోట్ల మందికి ఆహారం అందించే పరిస్థితి ఉండదు గనుక తప్పనిసరై భరిస్తున్నారు.ఈ మొత్తం ప్రతి ఏటా ఇవ్వరు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు వెల్లడించిన సమాచారం ప్రకారం 2014-15లో రు.75,067 కోట్లు ఇస్తే తరువాత సంవత్సరాలలో వరుసగా 76,538, 74,100, 69,206,73,435 కోట్లు ఇచ్చింది. 2019-20 నుంచి తరువాత మూడు సంవత్సరాల్లో ఆ మొత్తాలు రు.83,468, 1,31,229,1,57,640 కోట్లు చెల్లించింది. దీనికి ప్రధాన కారణం దిగుమతి ఎరువుల ధరల పెరుగుదల ఒకటైతే, రూపాయి విలువ పతనాన్ని నిరోధించలేని అసమర్ధత మరో కారణం. ఈ కారణంగానే సబ్సిడీ పెరిగింది. దిగుమతి ఎరువుల ధరలు తగ్గితే సబ్సిడీని తగ్గించి వేస్తారు.


నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తొలి సంవత్సరం 2014-15 నుంచి ఇప్పటి వరకు వివిధ బాంకుల నుంచి రద్దు చేసిన రుణాల మొత్తం రు.14లక్షల 56వేల కోట్లు. దీనిలో సగానికిపైగా మొత్తం బడా పారిశ్రామికవేత్తలు, సేవలందించే కంపెనీలవే ఉన్నాయి.ఈ రుణాలను రద్దు అనకూడదు, పక్కన పెట్టాము, వసూలు చేస్తాము అని కేంద్ర ప్రభుత్వ పెద్దలు చెబుతారు. అదేలా ఉంది.2014 ఏప్రిల్‌ నుంచి 2023 మార్చి నెల వరకు వసూలు చేసిన మొత్తం రు.2.04లక్షల కోట్లు మాత్రమే. బడా సంస్థలకు పన్ను రాయితీల మొత్తం ఎలా ఉందో చూద్దాం.2014-15లో కార్పొరేట్‌ టాక్సు రు.4.3లక్షల కోట్లు ఉండగా అది 2018-19నాటికి 6.6లక్షల కోట్లకు పెరిగింది. తరువాత దాన్ని తగ్గించటంతో 2021-22 నాటికి రు.5.5లక్షల కోట్లకు పడిపోయింది. దిగుమతుల మీద విధించే కస్టమ్స్‌ సుంకం రు.1.9లక్షల కోట్ల నుంచి రు.1.4లక్షల కోట్లకు తగ్గింది. మధ్య తరగతి ఉద్యోగులు ఎక్కువగా చెల్లించే ఆదాయపన్ను మాత్రం ఇదే కాలంలో రు.2.6 నుంచి 5.6లక్షల కోట్లకు పెరిగింది. ఈ కాలంలోనే కేంద్ర ప్రభుత్వానికి వచ్చే మొత్తం పన్నుల్లో కార్పొరేట్‌ టాక్సు వాటా 34.5 నుచి 24.7శాతానికి, కస్టమ్స్‌ పన్ను 15.1 నుంచి 6.1శాతానికి తగ్గగా ఆదాయపన్ను 20.8 నుంచి 25.3శాతానికి పెరిగింది. ఇంతగా కార్పొరేట్ల కొమ్ము కాస్తున్న పాలకులు రైతుల దగ్గరకు వచ్చేసరికి ఎగుమతులపై నిషేధాలతో వారి నడ్డివిరిచేందుకు చూస్తున్నారు. వారి స్వయం ప్రకటిత విధానాలనే పక్కన పెట్టి మరీ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇదంతా వచ్చే ఐదు రాష్ట్రాల ఎన్నికలు, తరువాత లోక్‌సభ ఎన్నికల నాటికి ధరల పెరగకుండా చూసుకోవటం, ఆ ఘనత తమదే అని చెప్పుకొనేందుకు తప్ప మరొకటి కాదు. ఎగుమతుల రద్దు అంటే దాన్ని అవకాశంగా తీసుకొని కృత్రిమ కొరతను సృష్టించి ధరలను పెంచిన గతం పునరావృతం అవుతుందా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d