Tags
BILLIONAIRE RAJ, BJP, ECONOMIC INEQUALITY IN INDIA, Narendra Modi Failures, RSS, World Happiness Report 2024
ఎం కోటేశ్వరరావు
తెల్లోడి రాజ్యమే బాగుంది, కమ్యూనిస్టులే మంచోళ్లు అని మా తాత చెప్పేవాడు. ఎందుకంటే రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఆంగ్ల పాలకులు ఆహార ధాన్యాల ఉత్పత్తి పెంచండి అన్న విధానంలో భాగంగా బండి పట్టాలకు అవసరమైన ఇనుము ఇచ్చారట, వాటిని పంపిణీ చేయటంలో ఆ నాడే కాంగ్రెస్ వారు తన, పర బేధాన్ని పాటిస్తే కమ్యూనిస్టులు అందరికీ ఇప్పించేందుకు చూశారట. తెల్లోడి పాలనను తప్పు పట్టనందుకు మా తాతను విమర్శించాలా ? ఒక రైతుగా తన పరిమిత ప్రయోజనాన్ని చూసి సంతోషించినందుకు విమర్శించాలా ? ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. జనజీవితాలను దిగజారుస్తూ కార్పొరేట్లకు కట్టబెడుతున్న మోడీని వ్యతిరేకించాలా ? రామాలయం కట్టినందుకు సానుకూలంగా ఉండాలా ? ముఖ్యవైరుధ్యం ఏమిటన్నదే కీలకం. నరేంద్రమోడీ పదేండ్ల విజయ గీతాలాపన వికసిత భారత్ చెవుల తుప్పు వదిలిస్తున్నది. అఫ్ కోర్స్ 2004 ఇదే బిజెపి దేశం వెలిగిపోతోందంటూ తాను ఆరిపోయిందనుకోండి. ఇప్పుడూ అదే జరగనుందా ? ఎవరి అంచనాలు వారివి ! పదేండ్లలో తమను మరింతగా పెంచిన మోడీ ఏలుబడిని బిలియనీర్లు అంత తేలికగా వదులుకోరు, వారి చేతుల్లో ఉన్న మీడియాలో మోడీ భజన మరింత పెరుగుతుంది, దీనికి మత మత్తు ఎలాగూ ఉంది. ఈ అంశాన్ని తక్కువ అంచనా వేయకూడదు.
వికసిత భారత్ అంటూ బిజెపి ప్రచార గాలి తీస్తూ రెండు నివేదికలు తాజాగా వెలువడ్డాయి. ఒకటి ప్రపంచ సంతోష సూచికలో మనదేశ స్థానం గత పది సంవత్సరాల్లో దిగజారింది తప్ప జనానికి అచ్చేదిన్ జాడలేదని స్పష్టం చేసింది. ఐక్యరాజ్య సమితి రూపొందిస్తున్నది గనుక సంతోష సూచికను మేం అంగీకరించం అని బిజెపి ఠలాయిస్తే కుదరదు.తలసరి జిడిపి, సామాజిక మద్దతు,ఆరోగ్యం, జీవన విధానాన్ని ఎంచుకొనే స్వేచ్చ,ఉదారత, ప్రభుత్వం, ప్రైవేటు రంగాలలో అవినీతిని జనం ఎలా చూస్తున్నారు అనే ప్రాతిపదికల మీద ప్రతిదేశం తెచ్చుకొనే మార్కులను బట్టి సూచికలను ప్రకటిస్తారు. ప్రతి ఏడాది సూచిక అంతకు ముందు రెండు సంవత్సరాల తీరుతెన్నుల ప్రాతిపదిన ఉంటుంది. కొన్ని సార్లు పరిగణనలోకి తీసుకొనే దేశాల సంఖ్యలో తేడాలు ఉండవచ్చు. అందువలన మార్కులను బట్టి దిగజారిందా మెరుగుపడిందా అన్నది కూడా చెప్పవచ్చు. మన ఇరుగు పొరుగు దేశాల వివరాలను చూద్దాం. 1.సూచిక, మార్కులు అంటే 2014-16 పంవత్సరాలకు సంబంధించి 2017వ సంవత్సర నివేదిక, 2 సూచిక, మార్కులు అంటే 2021-23కు సంబంధించి 2024 నివేదిక వివరాలు అని గమనించాలి.
దేశంపేరు×1.సూచిక×1.మార్కులు×2.సూచిక××2.మార్కులు
భారత్ ×× 118 ×× 4.407 ×× 126 ×× 4.054
చైనా ×× 83 ×× 5.245 ×× 60 ×× 5.979
పాకిస్థాన్ ×× 92 ×× 5.132 ×× 108 ×× 4.657
నేపాల్ ×× 107 ×× 4.793 ×× 93 ×× 5.158
బంగ్లాదేశ్ ×× 110 ×× 4.643 ×× 129 ×× 3.886
శ్రీలంక ×× 117 ×× 4.415 ×× 128 ×× 3.898
నరేంద్రమోడీ అధికారానికి వచ్చినపుడు ప్రపంచ జిడిపిలో పదవ స్థానంలో ఉన్నదానిని ఐదవ స్థానానికి చేర్చారని గొప్పలు చెప్పుకుంటారు.త్వరలో చైనాను అధిగమించి పోతామని అందుకే వికసిత భారత్ అని చెబుతున్నారు.వచ్చే రోజుల్లో రాజెవరో రెడ్డెవరో అన్నట్లుగా వాటి గురించి వదలివేద్దాం. గడచిన పదేండ్లలో చైనాకు పోటీగా దేశాన్ని నిలబెడతానని చెప్పిన మోడీ దానితో పోలిస్తే దేశాన్ని ఎక్కడ ఉంచారోపైన పేర్కొన్న సంతోష సూచికల్లోనే డొల్లతనం వెల్లడైంది. ఉన్నదాన్ని ఉన్నట్లుగా కూడా ఉంచటంలో విఫలమయ్యారు. పదేండ్ల క్రితం ప్రపంచ జిడిపిలో చైనా వాటా 13.1శాతంగా ఉన్నదాన్ని 2023లో 17.7శాతానికి పెంచుకోగా మన వాటా 2.6 నుంచి 3.73కు పెరిగింది. పాకిస్థాన్ జిడిపి 2014లో 271.4బిలియన్ డాలర్ల నుంచి మధ్యలో ఒక ఏడాది 374.66 బి.డాలర్లకు పెరిగి 2023లో 340.64బి.డాలర్ల వద్ద ఉంది. జిడిపి పెరిగినా సంతోష సూచిక పతనంలో మనకూ పాకిస్థాన్కూ తేడా ఏముంది ? అచ్చేదిన్, వికసిత భారత్ నినాదాలు ఇచ్చిన వారూ, విదేశాల్లో దేశ ప్రతిష్ట పెంచినట్లు చెప్పుకున్నవారూ అక్కడ లేరు. బిజెపి వారు చెబుతున్నట్లు మనకు అన్నీ ఉన్నా జనాలు ఎందుకు సంతోషంగా లేకపోతున్నారు ?
నాటి బ్రిటీష్ వలస పాలనలో కంటే నేటి స్వతంత్ర పాలనలో ఆర్థిక అసమానతలు ఎక్కువగా పెరిగినట్లు తాజాగా ప్రపంచ అసమానతల ప్రయోగశాల(వరల్డ్ ఇనీక్వాలిటీ లాబ్) 2024 మనదేశం గురించి ప్రకటించిన విశ్లేషణలో పేర్కొన్నది. నాడు మన జనాన్ని విదేశీ దొరలు దోచుకుంటే నేడు స్వదేశీ దొరలు ఆపని చేస్తున్నారు. అనేక అంశాల మీద అందుబాటులో ఉన్న సమాచారాన్ని క్రోడీకరించి ఆర్థికవేత్తలు నితిన్ కుమార్ భర్తీ, లూకాస్ ఛాన్సెల్, థామస్ పికెట్టీ, అన్మోల్ సోమాంచీ ఒక పత్రాన్ని రూపొందించారు.దానిలో పేర్కొన్న ప్రధాన అంశాలేమిటి ? స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి 1980దశకం వరకు అసమానతలు తగ్గాయి. తరువాత ముఖ్యంగా 1990దశకంలో సంస్కరణలు ప్రారంభించిన పదేండ్ల తరువాత విపరీతంగా పెరిగాయి.నరేంద్రమోడీ ఏలుబడిలో అది మరింత ఎక్కువైంది. 1982 నాటికి దేశంలోని ఎగువ ఒకశాతం మంది రాబడి 6.1శాతం, అది 2014-15 నుంచి 2022-23 వరకు పరిశీలించినపుడు 22.6శాతం ఉంటే వారి వద్ద పోగుబడిన సంపదలు 40.1శాతంగా ఉన్నాయి. ఎగువ పదిశాతం మంది వద్ద 2022 నాటికి దేశ సంపదల్లో 60శాతం ఉన్నాయి. ఇలాంటి పరిస్థితి ప్రపంచంలో ఎక్కడా లేదు.అంతరాలు ఎక్కువగా ఉన్నట్లు భావిస్తున్న దక్షిణాఫ్రికా, బ్రెజిల్, అమెరికాల్లో కూడా ఆదాయరాబడి వాటా ఇంతగా లేదు. పన్నుల విధానం, ప్రపంచీకరణ దీనికి కారణం.ధనికులుగా ఉన్న 167 కుటుంబాల సంపదపై రెండుశాతం పన్ను విధిస్తే జాతీయ ఆదాయం 0.5శాతం పెరుగుతుందని అంచనా వేశారంటే సంపద ఎలా గుట్టలుగా పడి ఉందో అర్ధం చేసుకోవచ్చు. సక్రమంగా లేని సమాచారం మేరకే తాము అసమానతల గురించి చెబుతున్నామని, నాణ్యమైన, సమగ్ర సమాచారం ఉంటే అసమానతలు ఇంకా ఎక్కువగా ఉంటాయని పేర్కొన్నారు. ధనికుల్లో ఉన్న ఎగువ తరగతిలో కూడా మిగతావారితో పోలిస్తే వారిలో 0.1శాతం మంది పదిశాతం రాబడిని పొందారు. ప్రస్తుతం రెండు భారత దేశాలు కనిపిస్తున్నాయని కొందరు చెప్పిన మాటలను నరేంద్రమోడీ నిజం చేస్తున్నారు. అందుకే కార్పొరేట్ మీడియా, ధనికుల ప్రతినిధులందరూ మరోసారి వచ్చే ఎన్నికల్లో మోడీని కోరుకుంటున్నారన్నది స్పష్టం.
దేశంలో అనేక సమస్యలకు జనాభా పెరుగుదలే కారణం అని గతంలో ఊదరగొట్టారు, కుటుంబనియంత్రణ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. ఇప్పటి పాలకులు అధిక జనాభా మన దేశానికి వరం అని ప్రపంచ పారిశ్రామిక కేంద్రంగా మారటానికి అవసరమైన చౌక శ్రామిక శక్తి అందుబాటులో ఉందని తమ జబ్బలను తామే చరుచుకుంటున్నారు. మరోవైపు గత పదేండ్లుగా కేంద్రంలో, వివిధ రాష్ట్రాలలో అధికారంలో ఉన్న కాషాయ దళాలు ముస్లిం జనాభా పెరిగి హిందువుల కంటే మెజారిటీగా మారనున్నదనే తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. అది నిజమా, సంతోషం ఆవిరి అవుతున్న స్థితిలో ఏ మతానికి చెందిన వారైనా ప్రతి కుటుంబమూ పరిమితం చేసుకొనేందుకు చూస్తున్నాయని ఐదవ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వివరాలు వెల్లడిస్తున్నాయి.జనన-మరణాల రేటును ప్రాతిపదికగా తీసుకున్నపుడు జననాల రేటు 2.1గా ఉండాలని ఆ రంగనిపుణులు పేర్కొన్నారు. కానీ తాజా సర్వ ప్రకారం రెండుశాతమే ఉన్నందున రానున్న రోజుల్లో జనాభా తగ్గుతుంది తప్ప పెరగదని చెబుతున్నారు. జనాభాలో పదిహేనేండ్ల లోపు వారు 2015-16లో 28.6శాతం ఉండగా 2019-21లో 26.5శాతానికి తగ్గారు. అంటే కుటుంబాల్లో పిల్లల సంఖ్య తగ్గుతోంది. జమ్మూ-కాశ్మీరు జనాభాలో 68శాతం ముస్లింలే ఉన్నారు. అక్కడ జననాల రేటు దేశ సగటు కంటే తక్కువగా 1.4శాతమే ఉంది. దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న ముస్లిం జననాల సగటు కంటే కూడా ఇది తక్కువ. విద్య, ఉపాధి, వైద్య, ఆరోగ్య రంగాల్లో కేటాయింపులు ఎక్కువగా ఉండి జనాల పరిస్థితి మెరుగుపడితే కులం, మతంతో నిమిత్తం లేకుండా కుటుంబనియంత్రణ ఎవరికి వారు పాటిస్తారన్నది అందరికీ తెలిసిన సత్యం.
రెండు సంవత్సరాల క్రితం ఆక్స్ఫామ్ ఇండియా సంస్థ వెల్లడించిన విశ్లేషణ ప్రకారం కేవలం 98 మంది ధనికులైన భారతీయులు రు.49.15లక్షల కోట్ల సంపదలను అదుపు చేస్తుండగా పేదల్లోని 55.5 కోట్ల మంది వద్ద అంత ఉందని పేర్కొన్నది. 2021లో ఒక వ్యక్తి జాతీయ ఆదాయ సగటు రు.2,04,200గా లెక్కించగా దిగువ 50శాతం మంది ఆదాయం రు.53,610 ఉంది. ఎగువ పదిశాతం మంది జనాల సగటు రాబడి రు.11,66,520గా ఉంది. కరోనా తరువాత పేదలలో 20శాతం మంది రాబడి 2020-21లో 53శాతం తగ్గగా ఇదే సమయంలో ఎగువ 20శాతం మంది రాబడి 39శాతం పెరిగింది. కరోనా కారణంగా ఆరు కోట్లుగా ఉన్న పేదలు 13.4 కోట్లకు పెరిగారు. వైద్య ఖర్చుల కారణంగా 2017లో 5.5 కోట్ల మంది పేదరికంలోకి దిగజారారు. ద్రవ్యోల్బణానికి అనుగుణంగా దిగువ తరగతి జనాల రాబడి పెరగకపోతే వారి జీవితాలు అతలాకుతలం అవుతాయి. విద్య, వైద్య రంగాల నుంచి ప్రభుత్వాలు తప్పుకుంటూ ప్రయివేటు వారిని ప్రోత్సహిస్తున్నాయి. రుణగ్రస్తులు కావటానికి వీటి మీద పెట్టే ఖర్చు కూడా ఒక అంశంగా మారింది.జిడిపిలో విద్య మీద ఆరుశాతం ఖర్చు పెట్టాలన్నది లక్ష్యం. కానీ నరేంద్రమోడీ తొలి ఐదు సంవత్సరాలలో మూడు శాతానికి మించలేదు, ఏటేటా తగ్గుతున్నది.జిడిపిలో ఐదవ స్థానానికి దేశాన్ని చేర్చామని గొప్పలు చెప్పుకోవటం కాదు. మన కంటే ఎంతో తక్కువగా ఉన్న బ్రెజిల్ విద్యకు 6.1, వైద్యానికి 9.5శాతం, రష్యా 4.7-5.3 చొప్పున దక్షిణాఫ్రికా 6.8-8.2శాతాల చొప్పున కేటాయిస్తున్నాయి. సంతోష సూచికలో సామాజిక రంగాల మీద పెట్టే ఖర్చును కూడా పరిగణనలోకి తీసుకుంటారని గమనించాలి. వాటి కేటాయింపులు సరిగా లేకపోతే,తగ్గుతుంటే సంతోషం ఆవిరి అవుతుంది. గడచిన పదేండ్లలో సూచికలో దిగజారటానికి కారణం ఇదే.
