Tags
BJP, China, Gaza, Hamas, Israel, Joe Biden, Narendra Modi Failures, Palestinian People, RSS, USS Gerald R Ford
ఎం కోటేశ్వరరావు
పాలస్తీనా సమరయోధుల సంస్థ హమస్- ఇజ్రాయెల్ మధ్య మరోసారి చెలరేగిన పోరు ఏ పరిణామాలు, పర్యవసానాలకు దారి తీస్తుందా అని ఒకవైపు ప్రపంచం ఆందోళన చెందుతుంటే మరోవైపు అమెరికా స్టాక్మార్కెట్లో ఆయుధ ఉత్పత్తి కంపెనీల వాటాల ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఇల్లుకాలుతుంటే బొగ్గులేరుకొనేందుకు చూడటం అంటే ఇదే. గత మూడు సంవత్సరాల్లో ఎంతగా లేనంతగా సోమవారం ఒక్కరోజే ఎనిమిది శాతం ఎగువకు దూసుకుపోయాయంటే తమకు లాభాల పంట పండుతుందని మదుపుదార్లు వాటాల కొనుగోలు ఎగబడిన ఫలితమే అది. ఇజ్రాయెల్కు మరింతగా సాయం చేయాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించటంతో ఆయుధ కంపెనీలకు చేతినిండా పని అన్నది తెలిసిందే. తాజా పరిణామాల్లో అటూ ఇటూ పెద్ద ఎత్తున జననష్టం, ఆస్థి విధ్వంసం గురించి వివరాలు ఇంకా వెల్లడికావాల్సి ఉంది. తక్షణమే దాడులు నిలిపివేయాలన్న అభిప్రాయం వెల్లడి అవుతోంది. ఎవరు ముందు ప్రారంభించారు, ఎవరు ప్రతిఘటిస్తున్నారు అన్న విచక్షణలోకి పోతే పైకి హమస్ దాడులు కనిపించవచ్చుగానీ అంతకు ముందు ఇజ్రాయెల్ చేసిన దారుణాలు తక్కువేమీ కాదు.ఇది ప్రారంభం కాదు, అంతమూ కాదు. ఆకస్మికంగా జరిగిన ఈ పరిణామాలకు కారణాలు ఏమిటన్నది చూద్దాం. ఒకటి పాలస్తీనా ఏర్పాటును అడ్డుకోవటమే కాదు, ఐరాస దానికి కేటాయించిన ప్రాంతాలను క్రమంగా ఆక్రమించుకుంటున్న ఇజ్రాయెల్, దానికి మద్దతు ఇస్తున్న పశ్చిమ దేశాల వైఖరి ఒకటైతే, తక్షణ కారణాలేమిటన్నది మరొక అంశం. తాజాగా తలెత్తిన వివాదానికి అమెరికా మరింతగా ఆజ్యం పోస్తున్నది, ఇజ్రాయెల్కు మద్దతుగా మధ్యధరా సముద్రానికి తన సప్తమ నౌకా దళం, జెట్ యుద్ధ విమానాలను పంపుతున్నది. మధ్యవర్తిగా ఉన్న ఒక దేశం ఇలా ఒకపక్ష కొమ్ముకాయటం దుర్మార్గం.
పాలస్తీనా-ఇజ్రాయెల్ వివాదంలో జరూసలెం పట్టణం ఎవరికి చెందాలన్నది ఒక అంశం. ఇటీవలి వరకు టెల్ అవీవ్లో ఉన్న తన ఇజ్రాయెల్ రాయబార కార్యాలయాన్ని జెరూసలెంకు తరలించాలని అమెరికా నిర్ణయించటం ఏకపక్షం, పాలస్తీనా ప్రాంతాలను ఆక్రమిస్తున్న ఇజ్రాయెల్ దుర్మార్గానికి మద్దతు ఇవ్వటమే. ఇంకా అమెరికా కనుసన్నలలో నడిచే అనేక దేశాలు అదే మాదిరి తమ కార్యాలయాలను కూడా జెరూసలెంకు తరలించాలని చూడటం యూదుల ఆక్రమణలను శాశ్వతం చేసే కుట్రలో భాగమే. జెరూసలెంలోని చారిత్రాత్మక అల్ అక్సా మసీదును ఆక్రమించుకొనేందుకు ఇజ్రాయెల్ పూనుకోవటమే తాజాగా హమస్ను దాడులకు పురికొల్పిందని చెప్పవచ్చు. 2021 ఏప్రిల్లో రంజాన్, యూదుల పండుగ పాసోవర్ సందర్భంగా ఉద్రిక్తతలు తలెత్తాయి. గతంలో కుదిరిన ఒప్పందం ప్రకారం ముస్లిమేతరులు ఆ మసీదు ప్రాంగణాన్ని సందర్శించాలంటే అనుమతి తీసుకోవాలి. ఇజ్రాయెల్ ప్రభుత్వ ప్రోత్సాహంతో మసీదు పరిసరాలను ఆక్రమించిన యూదులు ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించి పాసోవర్ పండగ సందర్భంగా ప్రాంగణాన్ని దురాక్రమించి ప్రార్ధనలు జరిపారు. ఏప్రిల్ 14వ తేదీన ఇజ్రాయెల్ పోలీసులు బలవంతంగా ప్రవేశించి మసీదులో ఉన్న మైకుల వైర్లను తెంచివేశారు.ఎందుకు అంటే మసీదు పక్కనే జరుగుతున్న ఇజ్రాయెలీ అధ్యక్షుడి కార్యక్రమానికి అంతరాయం కలుగుతుందని సాకు చెప్పారు. తరువాత రెండు రోజులకు పాలస్తీనియన్లు ఇజ్రాయెల్ పోలీసుల ఆంక్షలను తోసిపుచ్చి వేలాది మంది చేరి ప్రార్ధన చేశారు. మరుసటి నెలలో యూదు దురాక్రమణదార్లు పాలస్తీనియన్ల మీద జరిపిన దాడుల్లో వందలాది మంది పాలస్తీనియన్లు గాయపడ్డారు. అదే ఏడాది ఇజ్రాయెల్ – హమస్ మధ్య పదకొండురోజుల పాటు దాడులు ప్రతిదాడులు జరిగాయి. గతేడాది ఏప్రిల్లో ఇజ్రాయెలీ దళాలు ప్రవేశించి పాలస్తీనియన్ల మీద దాడులు చేశాయి. మసీదులో తిష్టవేసిన వారు తమ మీద రాళ్లు వేసినట్లు సాకు చెప్పారు. ఈ ఏడాది ఏప్రిల్ ఐదున కూడా ఇజ్రాయెల్ దళాలు మసీదు మీద దాడి జరిపాయి. మసీదులో ఉన్నవారు రాళ్లు విసిరినట్లు పాత కథనే తిరిగి వల్లించారు. అప్పటి నుంచి ఏదో ఒక సాకుతో అల్ అక్సా మసీదు, పరిసరాల్లో ఉన్న పాలస్తీనా ప్రాంతాలను ఆక్రమించుకొనేందుకు ఇజ్రాయలీలు రెచ్చగొడుతుండటమే ఈనెల ఆరున హమస్ దాడులకు కారణంగా చెబుతున్నారు. యాభై సంవత్సరాల క్రితం 1973 అక్టోబరు ఆరున ఇజ్రాయెల్ ఆక్రమిత పాలస్తీనా ప్రాంతాలపై అరబ్బులు ఆకస్మికంగా దాడులు జరిపారు. నాటి ఉదంతాల గురించి ఇజ్రాయెలీ మీడియాలో గత కొద్ది రోజులుగా పాలస్తీనియన్లను రెచ్చగొడుతూ వార్తలు, విశ్లేషణలు వెలువడుతున్నాయి.దాన్లో భాగంగానే సిమ్చాట్ తోరా పేరుతో యూదులు పండుగ చేసుకుంటున్న పూర్వరంగంలో దాడులకు ఆక్టోబరు ఆరవ తేదీనే హమస్ కూడా ఎంచుకున్నదని, ” ఆపరేషన్ అల్ అక్సా ఫ్లడ్ ” పేరు పెట్టినట్లు చెబుతున్నారు. దీని గురించి ఇజ్రాయెలీ గూఢచారులు ఏ మాత్రం పసిగట్టలేకపోయారు. తాడిని ఎక్కేవాడుంటే వాడి తలదన్నేవాడుంటాడు.
ఆయుధాలతో అరబ్బులను బెదిరించి వారి ప్రాంతాలను ఆక్రమించి ఇజ్రాయెల్ను ఏర్పాటు చేయాలన్న బ్రిటీష్ పాలకుల చర్యలను 1938లోనే గాంధీ మహత్ముడు హరిజన్ పత్రికలో రాసిన ఒక వ్యాసంలో వ్యతిరేకించారు.యూదులు ఏదేశంలో ఉంటే అదే వారి మాతృదేశం అవుతుందని పేర్కొన్నారు. సామ్రాజ్యవాదుల కుట్రలో భాగంగా 1948లో పాలస్తీనాలో కొన్ని ప్రాంతాలను గుర్తించి ఇజ్రాయెల్ను ఏర్పాటు చేశారు. తరువాతే అసలు కుట్ర బయటపడింది. పాలస్తీనా ప్రాంతాలను ఆక్రమించి తన రక్షణకు అవి అవసరమంటూ నాటి నుంచి నేటి వరకు అసలు పాలస్తీనా ఉనికినే లేకుండా చేసింది ఇజ్రాయెల్. అంతకు ముందు ఎక్కడెక్కడో ఉన్న యూదులందరినీ సమీకరించి బ్రిటీష్ పాలకులు అక్రమంగా పాలస్తీనాలో ప్రవేశపెట్టారు. వారికి ఆయుధాలతో శిక్షణ, నిధులు అందచేశారు.ఐరాస చేసిన విభజన తీర్మానాన్ని పాలస్తీనా అంగీకరించలేదు. ఇతర దేశాల్లోని యూదులను చేర్చటంతో అప్పటి వరకు పాలస్తీనాలో 90శాతంగా ఉన్న అరబ్బులు 67శాతానికి తగ్గారు. సారవంతమైన ప్రాంతాలతో సహా పాలస్తీనాలో 55శాతాన్ని యూదులకు కేటాయిస్తూ విభజన పధకంలో చేర్చారు. అరబ్బులకు 42శాతం, మూడుశాతం విస్తీర్ణంలో ఉన్న జెరూసలేం ప్రాంతాన్ని అంతర్జాతీయ పర్యవేక్షణలో ఉంచేందుకు నిర్ణయించారు.ప్రస్తుతం పశ్చిమ గట్టు, గాజా పాలస్తీనా పాలిత ప్రాంతాలుగా పేరుకు 23శాతం విస్తీర్ణంలో ఉన్నప్పటికీ వాటిలో కూడా ఇజ్రాయెల్ ఆక్రమణలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. పాలస్తీనాను విభజించినపుడు ఏడున్నరలక్షల మంది అరబ్బులు నిర్వాసితులై విదేశాలకు శరణార్ధులుగా వెళ్లారు. గడచిన 75 సంవత్సరాల్లో వారి వారసుల సంఖ్య అరవైలక్షలకు పెరిగింది. వారంతా పాలస్తీనాలోని కొన్ని శిబిరాలు, ఈజిప్టు, లెబనాన్, జోర్డాన్, సిరియాల్లో తలదాచుకుంటున్నారు.
తాజాగా హమస్ దాడుల గురించి పశ్చిమ దేశాల వార్తా సంస్థలు ఇచ్చిన వార్తల్లో వారి ఆధీనంలో ఉన్న గాజా ప్రాంతంలో వంద మంది ఐరోపావాసులు బందీలుగా ఉన్నట్లు పెద్ద ఎత్తున కథనాలు ఇచ్చాయి. ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న వేలాది మంది తమవారిని విడిచిపెడితే వారిని తాము కూడా స్వదేశాలకు పంపుతామని హమస్ చెప్పినట్లు వార్తలు వచ్చాయి.పశ్చిమ దేశాలు, అక్కడి మీడియాను అనుసరించే మన దేశంలోని కొందరు హమస్ను ఉగ్రవాదులుగానూ, ఇజ్రాయెల్ను ప్రజాస్వామిక శక్తిగా చిత్రిస్తున్నారు. ఇజ్రాయెల్ ఆక్రమించుకున్న తమ దేశాన్ని విముక్తి కావించేందుకు అనేక శక్తులు అనేక పద్దతుల్లో పోరాడుతున్నాయి. పాలస్తీనా విమోచనా సంస్థ యాసర్ అరాఫత్నే ఉగ్రవాదిగా చిత్రించిన వారు హమస్ను మరొక విధంగా పేర్కొంటారని అనుకోలేము.హమస్ గాజా ప్రాంతంలో అధికారంలో ఉంది.అది సాయుధపోరాటాన్ని ఒక మార్గంగా ఎంచుకుంది. పశ్చిమ దేశాల మద్దతు, బలమైన మిలిటరీ ఉన్న ఇజ్రాయెల్ను ఎదుర్కొనేందుకు కొన్ని సందర్భాల్లో గెరిల్లా పద్దతిలో దాడులు జరుపుతుంది. మన దేశ చరిత్రలో శివాజీ కూడా ఔరంగజేబు సేనల మీద, అల్లూరి సీతారామ రాజు బ్రిటీష్ వారి పాలకుల మీద గెరిల్లా పద్దతిలో దాడులు జరిపిన సంగతి తెలిసిందే. వారిని ఉగ్రవాదులందామా ? బ్రిటీష్ వారు భగత్ సింగ్నే ఉగ్రవాది అని నిందించిన సంగతి తెలిసిందే.
చరిత్రలో హిట్లర్ మూకలు యూదులను నిర్బంధ శిబిరాల్లో చిత్రహింసలు పెట్టి చంపిన దారుణ మారణకాండను ప్రపంచం చూసింది. గాజా ప్రాంతంలో ఇరవైలక్షల మందికి పైగా అరబ్బులు నివశిస్తున్నారు. ప్రపంచంలో అదొక పెద్ద జైలు అంటే అతిశయోక్తి కాదు. అక్కడి జనం బయటకు రావాలన్నా, పరిసరాల్లో పనిపాటలు చేసుకోవాలన్నా ఇజ్రాయెల్ మిలిటరీ అనుమతి తీసుకోవాల్సిందే. తనిఖీ లేందే జనాలను కదలనివ్వరు.హమస్ దాడులకు ముందే ఇజ్రాయెల్ పోలీసులు 5,250 మంది పాలస్తీనియన్లను బందీలుగా ఉంచుకున్నారు, వారిలో 170 మంది పిల్లలు కూడా ఉన్నారు. వీరి గురించి మీడియా, పశ్చిమ దేశాల మానవతావాదులు పట్టించుకోరు. ఉగ్రవాదం మీద దాడులు చేయండి తప్ప పాలస్తీనియన్ల మీద కాదంటూ కొందరు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఏడున్నర దశాబ్దాలుగా దాడులు చేస్తున్నది సామాన్యజనం మీదనే అన్న వాస్తవాన్ని దాచేందుకే ఈ పదజాలం.పాలస్తీనా వాసులు పోరులోనే పుట్టి ,పోరులోనే పెరిగి ,పోరులోనే మరణిస్తున్నారు. అంతకంటే వారికి పోయేదేమీ లేదు. వారి మాతృదేశ కాంక్ష మరింతగా పెరుగుతుందే తప్ప నిర్భంధంతో అణిగేది కాదు. జెరూసలెంతో సహా అరబ్బులకు నిర్దేశించిన ప్రాంతాలను పూర్తిగా తిరిగి వారికి అప్పగించకుండా, వారి ప్రాంతాలలో యూదుల నివాసాలను ఖాళీ చేయించకుండా సమస్య పరిష్కారం కాదు. పాలస్తీనియన్ల మాతృదేశ కాంక్ష తీరదు.
ఇప్పటికే మాతృగడ్డమీద దశబ్దాల తరబడి బందీలుగా మారిన పాలస్తీయన్ల భవితవ్యం గురించి ఒకవైపు ప్రపంచం ఆలోచిస్తుంటే మరోవైపు వారిని మరింతగా అణచివేసేందుకు అవసరమైన ఆయుధాలను అమ్ముకొనేందుకు అమెరికా పూనుకుంది. ఇజ్రాయెల్ మీద దాడి చేసినందుకు ప్రతీకారంగా పాలస్తీనాకు అందచేస్తున్న సాయాన్ని సమీక్షించే నెపంతో ఐరోపా నిలిపివేసింది. అదే పాలస్తీనా మీద యుద్ద విమానాలతో దాడులు చేస్తున్న ఇజ్రాయెల్కు అమెరికా సాయాన్ని పెంచాలని నిర్ణయించింది. యూదుల అణచివేతను ఆయుధంగా చేసుకొని హిట్లర్ మారణకాండకు పాల్పడ్డాడు. అదే యూదులకు మాతృదేశాన్ని ఏర్పాటు చేయాలనే సాకుతో పశ్చిమాసియాలో ఉన్న చమురు, ఇతర సహజ సంపదలను ఆక్రమించాలని చూసిన బ్రిటన్, అమెరికా తదితర పశ్చిమ దేశాలు అందుకోసం తమ తొత్తుగా పనిచేసే ఇజ్రాయెల్ను ఏర్పాటు చేయాలన్న ఎత్తుగడలను ప్రపంచం చూసింది.ఉక్రెయిన్ వివాదంలో తటస్థవిధానాన్ని అనుసరించిన మనదేశం పశ్చిమాసియాలోనే కాదు, ప్రపంచ శాంతికి విఘాతం కలిగించే ఇజ్రాయెల్ దుశ్చర్యలను ఖండించాల్సిందిపోయి ఇప్పుడు ఇజ్రాయెల్కు మద్దతు ప్రకటించింది. ఇది గడచిన ఏడుదశాబ్దాలుగా అనుసరిస్తున్న మన విదేశాంగ విధానానికే విరుద్దం. నరేంద్రమోడీ సర్కార్ వైఖరి బిజెపితో సహా సంఘపరివార్ సంస్థల ముస్లిం వ్యతిరేకతకు ప్రతిబింబం తప్ప మరొకటి కాదు. ఇలాంటి వైఖరితో తలెత్తే పర్యవసానాల గురించి ఎవరెన్ని హెచ్చరికలు చేసినా, సుద్దులు చెప్పినా పట్టించుకోకపోవటం విచారకరమే కాదు గర్హనీయం.స్వాతంత్య్రపోరాటంలో భాగస్వామ్యం లేకపోవటమే కాదు దానికి వ్యతిరేకంగా పని చేసిన శక్తుల వారసులు పాలస్తీనియన్ల మాతృదేశ విముక్తి వాంఛ, దురాక్రమణ వ్యతిరేక పోరాటాన్ని అర్ధం చేసుకొంటారని భావించటం అత్యాశే అవుతుంది. ఇజ్రాయెల్ను సమర్ధిస్తున్న అమెరికా తదితర దేశాల వైఖరిని యావత్ శాంతి శక్తులు ఎలుగెత్తి ఖండించాలి, పాలస్తీనా విముక్తికి పోరాడుతున్న వారికి సంఘీభావం ప్రకటించాలి.

హమాస్ ఆ దాడిని చేసి ఉండాల్సింది కాదు. ఇప్పుడు ఫలితం మరింత దురవస్తలోకి పాలస్తీనా ప్రజలను నెట్టారు.
LikeLike