Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


అయోధ్య రామాలయంలో జనవరి 22న రాముడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి తాను రావటం లేదని పూరీ శంకరాచార్య స్వామి నిశ్చలానంద కుండబద్దలు కొట్టి మరీ చెప్పారు.దీని మీద మోడీ భక్తులు సామాజిక మాధ్యమంలో పెద్ద ఎత్తున ట్రోలింగ్‌ చేస్తున్నారు. వస్తే ఎంత రాకపోతే ఎంత అసలు రామాలయం కోసం పూరీ శంకరాచార్య ఏం చేశారంటూ నిలదీస్తున్నారు.రధయాత్ర నిర్వహించి, బాబరీ మసీదు కూల్చివేత కేసులను ఎదుర్కొన్న ఎల్‌కె అద్వానీకి ఆహ్వానం ఇస్తూనే అసలు కార్యక్రమానికి రావద్దని చెప్పినట్లు నిర్వాహకులు ప్రకటించారు. చిత్రం ఏమిటంటే రామాలయంతో ఎలాంటి సంబంధంలేని, బాబరీ మసీదు కూల్చివేతను ఖండించిన సీతారాం ఏచూరి, ఇతర పార్టీల నేతలనూ ఆహ్వానించారు గానీ రావద్దని చెప్పలేదు. హాజరు కావటం లేదని చెప్పిన వారి మీద ప్రచారదాడులు చేస్తున్నారు. అద్వానీ(96), మురళీమనోహర్‌ జోషి(90) ఏండ్ల పెద్దవారు గనుక వారు వచ్చి ఇబ్బంది పడతారని అందువల్లనే రావద్దని చెప్పామని విమర్శలు చెలరేగిన తరువాత వివరణ ఇచ్చుకున్నారు. తరువాత నష్ట నివారణ చర్యల్లో భాగంగా విశ్వహిందూపరిషత్‌ నేతలు ఆహ్వానించినట్లు ప్రకటించారు. కానీ మాజీ ప్రధాని దేవెగౌడకూ 90 ఏండ్లే అయినప్పటికీ ఆయన వయసు రీత్యా రావద్దని నిర్వాహకులు చెప్పలేదు.ఎందుకు అంటే గత అసెంబ్లీ ఎన్నికల తరువాత దేవెగౌడ-కుమారస్వామి పార్టీ జెడిఎస్‌ వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బిజెపితో జట్టుకట్టాలని నిర్ణయించింది. అందుకే అయోధ్య రామాలయ రాజకీయం రంజుగా నడుస్తోంది అని చెప్పాల్సి వస్తోంది. ఈ మాట అంటే కొందరు మనోభావాలను ముందుకు తెచ్చుకొని బాధపడితే చేసేదేమీ లేదు. వయసు రీత్యా కదలలేని స్థితిలో ఉన్నప్పటికీ శుభ కార్యాలు జరిగినపుడు ఆహ్వానం పలకటం, వారు రాలేమని చెప్పినపుడు వీలు చూసుకొని రావాలని ఆకాంక్ష వెలిబుచ్చటం మన భారతీయ సంప్రదాయం. కానీ దాన్ని తుంగలో తొక్కి రావద్దని మేమే చెప్పామని నిర్వాహకులు చెప్పటాన్ని ఏ సంప్రదాయం అంటారో ఎవరికి వారు నిర్ణయించుకోవచ్చు.రధయాత్ర పేరుతో బిజెపి నేత ఎల్‌కె అద్వానీ నిర్వహించిన కార్యక్రమం అది సృష్టించిన వినాశకర, అవాంఛనీయ ఉదంతాల గురించి తెలిసిందే. వారు వస్తారా లేదా స్పందన ఏమిటో చూడాల్సి ఉంది. ఒక వేళ వారు నిజంగా రాగలిగినా రానిచ్చేవారా అన్న సందేహాలు కూడా వారిని వద్దన్న తరువాత జనంలో తలెత్తాయి. తనదారిని సుగమం చేసుకొనేందుకు ప్రధాని నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన వెంటనే అద్వానీ, ఎంఎ జోషి వంటి వారితో మార్గదర్శక మండలిని ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. అది ఇంతవరకు ఒక్కసారి కూడా సమావేశమైన సమాచారంగానీ, ఇచ్చిన మార్గదర్శనం గురించి గానీ ఎవరికీ తెలియదు. గుడులకు పరిమితం కావాల్సిన రాముడిని ఓట్ల కోసం వీధుల్లోకి తెచ్చారు.


ఆది శంకరాచార్య ఏర్పాటు చేసిన నాలుగు పీఠాల్లో పూరీలోని గోవర్ధన మఠం ఒకటి. దాని అధిపతిగా ఉన్న స్వామి నిశ్చలానంద సరస్వతి(80)కి కూడా రామాలయ నిర్వాహకులు ఆహ్వానం పంపారు. దాన్ని తిరస్కరించినట్లు స్వామి చెప్పారు, గతవారంలో ఒక టీవీ ఛానల్‌తో, అదే విధంగా మధ్యప్రదేశ్‌లోని రత్లాంలో జరిగిన ఒక సనాతన ధర్మ సభకు హాజరైనపుడు విలేకర్లతో మాట్లాడారు. తనకు పంపిన ఆహ్వానాన్ని పురస్కరించుకొని ఒక వేళ హాజరు కావాలని అనుకుంటే తోడుగా గరిష్టంగా ఒకరిని మాత్రమే తెచ్చుకోవాలని దానిలో పేర్కొన్నట్లు చెబుతూ ఒక్కరు కాదు వందమందిని అనుమతించినా ఆ రోజు తాను వెళ్లేది లేదని నిశ్చలానంద చెప్పారు. గతంలో కూడా వెళ్లానని భవిష్యత్‌లో కూడా అయోధ్య వెళ్లి రాముడిని సందర్శిస్తానని అన్నారు. రాముడి విగ్రహాన్ని శాస్త్ర విధి ప్రకారం ఏర్పాటు చేయాలని ఇప్పుడు అలా జరగటం లేదన్నారు. తమ మఠపరిధి ప్రయాగ వరకు ఉందని అయినప్పటికీ తమ సలహా, మార్గదర్శనం కానీ కోరలేదని చెప్పారు. ఈ పరిణామాల గురించి ” నేను ఏ మాత్రం ఆశాభంగం చెందలేదు. ఇతర హిందూ సనాతనుల మాదిరి సంతోషంగా ఉన్నాను. ప్రత్యేకించి ప్రస్తుత ప్రధాని ఒక లౌకికవాదిగా కనిపించేందుకు తాపత్రయపడటం లేదు.విగ్రహారాధన, హిందూత్వ అంశాలలో అతనెంతో ధైర్యశాలి, వాటి పట్ల గర్వపడతారు. తనను ఒక లౌకికవాదిగా ప్రదర్శించుకొనేందుకు అతనేమీ పిరికివాడు కాదు.అయితే ఒక శంకరాచార్యగా నేను అక్కడికి వెళ్లి ఏం చేయాలి ? మోడీగారు విగ్రహాన్ని ప్రతిష్టిస్తుంటే చప్పట్లు కొట్టి పొగడాలా ? అని ప్రశ్నించారు. ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసే ముందు తనను నరేంద్రమోడీ ఎలా కలిశారో నిశ్చలానంద గుర్తు చేసుకున్నారు.కరోనాకు ముందు యోగి ఆదిత్యనాధ్‌ ఏడాదికి రెండు మూడు సార్లు కలిసేవారు. విశ్వహిందూ పరిషత్‌ మాజీ అధ్యక్షుడు దివంగత అశోక్‌ సింఘాల్‌ కనీసం 70సార్లు కలిశారని చెప్పారు.తీర్థస్థలాలను అభివృద్ధి పేరుతో భోగస్థలాలుగా మార్చుతున్నారు,టూరిజం కేంద్రాలుగా చేస్తున్నారని అన్నారు. ఇదే అంశంపై సోమవారం నాడు మరోసారి నిశ్చలానంద తన వ్యతిరేకతను వెల్లడించారు. చత్తీస్‌ఘడ్‌ రాజధాని రాయపూర్‌లో విలేకర్లతో మాట్లాడుతూ ఈనెల 17న ఒడిషా ప్రభుత్వం ప్రారంభించనున్న శ్రీమందిర్‌ పరికర్మ ప్రకల్ప పధకం గురించి స్పందించారు.పుణ్య స్థలాలను విహార కేంద్రాలుగా మార్చటం అంటే వాటిని విలాస కేంద్రాలుగా మార్చటమే అన్నారు.హౌటళ్ల వారు, రవాణా రంగంలో ఉన్నవారు లబ్ది పొందుతారు తప్ప ఆ కేంద్రాలకు ఉన్న ప్రత్యేకత తగ్గుతుందన్నారు.ఆ కార్యక్రమానికి తనను ఆహ్వానించారని అయితే వెళ్లాలా లేదా అన్నది ఇంకా నిర్ణయించుకోలేదన్నారు. రామాలయ ప్రతిష్టాపన గురించి చేసిన వ్యాఖ్యల మీద నిశ్చలానందపై కాషాయ మరుగుజ్జు దళాలు పెద్ద ఎత్తున ట్రోలింగ్‌ చేస్తున్నాయి.


సిఎన్‌ఎన్‌ న్యూస్‌ 18 టీవీ ఛానల్‌తో 30 నిమిషాలు మాట్లాడిన శంకరాచార్య రాముడి విగ్రహాన్ని ప్రతిష్టించేటపుడు క్రతువులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.చాతుర్వర్ణ వ్యవస్థకు భగవద్గీతలోని కృష్ణుడి బోధనల్లోనే మూలాలు ఉన్నాయి.గుణము, చర్యలను బట్టి నాలుగు వర్ణాలుగా సమాజాన్ని వర్గీకరించారు.ఇది పుట్టుకను బట్టి అని చెప్పటంగాక చేసే పనులు, వాటి స్వభావాన్ని వర్ణాలు ఉంటాయి.పశ్చిమ దేశాల్లో కూడా వర్ణ వ్యవస్థ మాదిరే విద్య, ఆర్థికం, రక్షణ, సేవా రంగాలు ఉన్నాయి.ఇప్పుడు వర్తమాన సమాజంలో పోలీసుల లేదా ప్రధానులు ఏలాంటి పాత్రను పోషించారో వర్ణ వ్యవస్థలో కూ ఎవరికి వారు తమ స్థితిని బట్టి సమతూకాన్ని నిర్వహించారు. శివపురాణంలో వివిధ రకాల బ్రాహ్మలు ఉన్నారని ఒక కుటుంబంలో పుట్టినంత మాత్రాన్నే బ్రాహ్మలుకాదన్నారు.ఒక బ్రాహ్మడు వ్యాపారం చేస్తే వైశ్య బ్రాహ్మణ అని పిలవాలి, పురాతన గ్రంధాలలో చెప్పిన వాటిని అచరిస్తేనే ఒకబ్రాహ్మడిని బ్రాహ్మడిగా పరిగణించాలి అన్నారు.


ఏసుక్రీస్తు, మహమ్మద్‌ ప్రవక్త పూర్వీకులు సనాతన హిందువులే అని స్వామీజి గతేడాది సెలవిచ్చారు(ఫిబ్రవరి 1, 2023 ఓపి ఇండియా పోర్టల్‌) అమెరికా ప్రతిపక్ష సభ్యులు పార్లమెంటులో ఈ అంశాన్ని లేవనెత్తారని అది రుజువైందని నిశ్చలానంద చెప్పారు. వారు క్రైస్తవం, ఇస్లాం స్వీకరించే ముందు హిందువులే అన్నారు. ఏసు క్రీస్తు పది సంవత్సరాలు భారత్‌లో ఉన్నారని దాన్ని ఎక్కడా పేర్కొనలేదన్నారు. పూరీలో మూడు సంత్సరాలు ఉన్నారని క్రీస్తు వైష్ణవుడని హిందూ క్రతువులన్నీ చేసినట్లు చెప్పారు. ఏసు క్రీస్తుకంటే ముందే హిందూయిజం ఉందని అందువలన ఆయన పూర్వీకులు హిందువులే అన్నది స్వామి వారి అభిప్రాయమని ఎన్నోసార్లు చెప్పారని, పూరీ మఠ ప్రజా సంబంధాల అధికారి మాతృదత్తా చెప్పారు. ప్రభుత్వాలకు మఠాలు, దేవాలయాల మీద అదుపు ఉండకూడదని, ప్రతి మూలను అభివృద్ధి చేసేందుకు ఖర్చు చేయాల్సిన అవసరం కూడా లేదన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ను అనుసరిస్తున్నారంటూ తన మీద వచ్చిన విమర్శలు నిశ్చలానంద ఖండించారు, నేను అనుసరించటం లేదు, కావాలంటే వారే నా వెనుక నడవొచ్చు,ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి మోహన్‌ భగవత్‌ నాముందు బాలగోపాలుడి మాదిరి కూర్చుంటారని అన్నారు.


రామాలయం గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ వచ్చే ఎన్నికల్లో లబ్ది పొందేందుకు చూస్తున్నదనే విమర్శలను ఎదుర్కొంటున్న బిజెపి ఒడిషాలో అక్కడి సిఎం నవీన్‌ పట్నాయక్‌ శ్రీమందిర్‌ పరిక్రమ రధాల ద్వారా ఎన్నికల రాజకీయం చేస్తున్నారని బిజెపి నేత పృధ్వీరాజ్‌ హరిచందన్‌ ఆరోపించారు. జగన్నాధ సంస్కృతిని రూపుమాపేందుకు కుట్ర జరుగుతోందని, తన మాజీ ప్రయివేటు కార్యదర్శి ద్వారా ఒరియా పౌరుల మీద దక్షిణ భారత సంస్కృతిని బలవంతంగా రుద్దేందుకు చూస్తున్నారని ధ్వజమెత్తారు.దాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు.శ్రీమందిర్‌ పధకం ఒక రాజకీయ నాటకమని, ఎన్నికల ముందు తమ అక్రమాలను కప్పిపుచ్చుకొనేందుకు తలపెట్టారని, 160 కోట్ల రూపాయల ప్రజల సొమ్మును బిజెడి తన ఎన్నికల ప్రచారానికి వినియోగించటం గర్హనీయమైన చర్య అన్నారు. బిజెపి నేతల విమర్శలను బిజెడి నేత, ఎంఎల్‌ఏ పద్మనాభ బెహరా తిప్పికొట్టారు. మనమంతా జగన్నాధుని పిల్లలం, మనంగాకపోతే భగవంతుడి పేరును ఎవరు తీసుకుంటారు, దీని గురించి మాట్లాడేందుకేమీ లేదు, రాజకీయం అసలే లేదన్నారు. భువనేశ్వర్‌ నగరంలోని అరవై ఏడు వార్డుల్లో శ్రీమందిర్‌ పరిక్రమ పధకంలోని రధాలను రెండు రోజుల పాటు తిప్పుతారు. ప్రతి ఇంటి నుంచి ఆకు వక్కలను, ప్రసాదాలను స్వీకరిస్తారు. ఈ పధకంలో భాగంగా పూరీలోని జగన్నాధ ఆలయ పరిసరాలలో రధయాత్ర వేగంగా కదలటాన్ని సులభతరం చేసేందుకు, తొక్కిడి లేకుండా సాగేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. జగన్నాధ దేవాలయం చుట్టూ 75 మీటర్ల పరిధిలో ఉన్న కట్టడాలను తొలగించేందుకు యాత్రకు అవసరమైన పద్దతుల్లో తీర్చిదిద్దేందుకు అవసరమైన భూ,భవనాలను సేకరించారు. జనాలకు అవసరమైన మరుగుదొడ్లు, మంచినీరు, సామాన్లు భద్రపరుచుకొనే గదులతో పాటు భద్రతకు అవసరమైన కేంద్రాల వంటివి ఈ పధకంలో ఏర్పాటు చేశారు. దీన్ని బిజెపి రాజకీయం చేస్తున్నది.