Tags

, , , , , ,


ఎం కోటేశ్వరరావు


మొన్న సిపిఎం నేత సీతారాం ఏచూరి, నిన్న కాంగ్రెస్‌ నేతలు మల్లిఖార్జున ఖర్గే, సోనియా గాంధీ అయోధ్య రామాలయ ప్రతిష్టకు రావటం లేదని చెప్పగానే బిజెపి నేతలు అసలు వారి డిఎన్‌ఏలోనే హిందూ వ్యతిరేకత ఉందంటూ ధ్వజమెత్తారు. పెద్ద ఎత్తున సామాజిక మాధ్యమాల్లో ప్రచారదాడి చేస్తున్నారు. రధయాత్ర నిర్వహించిన ఎల్‌కె అద్వానీని ఆ ఛాయలకే రావద్దని చెప్పిన పెద్దలు ఓటు బాంకు రాజకీయం గాకపోతే వారి డిఎన్‌ఏ గురించి ముందే తెలిసినపుడు అసలు ఆహ్వానాలు పంపటం ఎందుకు ? కమ్యూనిస్టులు దేవాలయాలు, మసీదులు, చర్చ్‌ల ప్రారంభాలకు రారని అందరికీ తెలుసు.వారు లేదా కాంగ్రెస్‌ నేతలు గానీ బిజెపి మత రాజకీయాలను విమర్శించటం ఇప్పుడు కొత్తగా చేసింది కాదు. హిందూమతానికి భాష్యకారులుగా, పీఠాధిపతులుగా ఉన్న నలుగురు శంకారాచార్యలూ అయోధ్య వెళ్లటం లేదన్న సమాచారం ఇది రాసిన సమయానికి ఉంది. చివరి నిమిషంలో వారు మనసు మార్చుకుంటారో లేక ఏం చేస్తారు అన్నది పెద్ద సమస్య కాదు. పూరీ శంకరాచార్య నిశ్శలానంద, ఉత్తరాఖండ్‌ జ్యోతిర్‌ మఠం శంకరాచార్య అవిముక్తేశ్వరానంద తాము రావటం లేదని తమ కారణాలను వివరిస్తూ చెప్పారు. ద్వారకా పీఠం అధిపతి స్వామి సదానంద సరస్వతి, శృంగేరి పీఠాధిపతి భారతీ తీర్ధ రామాలయ ప్రతిష్టకు ఆశీర్వచనాలు చెప్పారే తప్ప వస్తున్నదీ లేనిదీ ఇంతవరకు ప్రకటించలేదు. ఆలయ నిర్మాణం పూర్తి కానందున నలుగురమూ అయోధ్య వెళ్లటం లేదని అవిముక్తేశ్వరానంద చెప్పిన మాటల మీద వారు మౌనంగా ఉన్నారు. అందరి తరఫున మాట్లాడేందుకు అనుమతించలేదని ఎవరూ ఇంతవరకు ప్రకటించలేదు. హిందూ శాస్త్రాలకు వ్యతిరేకంగా అసంపూర్తి నిర్మాణంలో ఉన్న దేవాలయాన్ని ప్రారంభించటం తగదని అవిముక్తేశ్వరానంద ఎక్స్‌లో ఒక ప్రకటన చేశారు. తమ చర్యలను మోడీ వ్యతిరేకమైనవిగా చూడరాదని, శాస్త్ర వ్యతిరేకులుగా మారటం ఇష్టం లేకనే తాము ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు స్పష్టం చేశారు. మేమెందుకు వెళ్లటం లేదు ? మాకు ద్వేషం ఉండి కాదు. శాస్త్ర విధిని పాటించటం, పాటించేట్లు చూడటం శంకరాచార్యుల బాధ్యత, ఇక్కడ శాస్త్ర విధిని విస్మరించారు, ఆలయ నిర్మాణం ఇంకా పూర్తిగాక ముందే ప్రాణ ప్రతిష్టకు పూనుకోవటం ఇక్కడ పెద్ద సమస్య, దీన్ని మేం చెబితే మమ్మల్ని మోడీ వ్యతిరేకులని పిలుస్తున్నారు, ఇక్కడ మోడీ వ్యతిరేకత ఏముంది అని అవిముక్తేశ్వరానంద ప్రశ్నించారు. రామాలయాన్ని రాజకీయం చేస్తున్నారని రాజకీయ పార్టీలు చెబితే, శాస్త్రవిరుద్దమని శంకరాచార్యలు భావిస్తున్నారు. రాజకీయ నేతల డిఎన్‌ఏల గురించి ధ్వజమెత్తుతున్న బిజెపి శంకరాచార్యల డిఎన్‌ఏల గురించి ప్రశ్నించగలదా ? వారిని అనుసరించే వారి మనోభావాలను గాయపరచి తట్టుకోగలదా ?


” మోడీ గారు విగ్రహాన్ని తాకి ప్రారంభోత్సవం చేస్తుంటే నేను అక్కడ ఉండి చేసేదేమిటి ?నేను లేచి నిలబడి చప్పట్లు కొట్టాలా ? నాకు పదవి అవసరం లేదు, ఇప్పటికే నేను పెద్ద స్థితిలో ఉన్నాను, నాకు పేరు అవసరం లేదు. శంకరాచార్యలు అక్కడికి వెళ్లి చేసేదేమిటి ఇది అహంకారం కాదు, నేనున్న స్థానపు గౌరవం గురించి నాకు తెలుసు, అందుకే నేను అక్కడికి వెళ్లటం లేదు, నాకు ఆహ్వానం వచ్చింది, దానిలో నాతో పాటు ఒకరిని తీసుకురావచ్చు అని ఉంది, నాతో పాటు ఒకరిని నేనెందుకు తీసుకుపోవాలి ” అని ఒక వీడియోలో స్వామి నిశ్చలానంద ప్రశ్నించారు. మత వ్యవహారాల్లో మోడీ జోక్యం చేసుకుంటున్నారని, తనకు అయోధ్య అంటే వ్యతిరేకత లేదని కూడా చెప్పారు. విశ్వహిందూ పరిషత్‌ అంతర్జాతీయ ఉపాధ్యక్షుడు, శ్రీరామ జన్మభూమి తీర్ధ క్షేత్ర ట్రస్ట్‌(రామాలయ నిర్మాణ, నిర్వహణ) ప్రధాన కార్యదర్శి చంపత్‌ రారు అమర్‌ ఉజాలా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రామాలయం వైష్టవులకు చెందిన రామానంద సాంప్రదాయానికి చెందింది తప్ప సన్యాసులది లేదా శైవులదీ కాదు అని చెప్పారు.ఆది శంకరుడు శైవుడు, ఆయన స్థాపించిన నాలుగు శంకరమఠాధిపతులూ శైవులే, అయితే వారు విష్ణుమూర్తిని కూడా అంగీకరిస్తారు.శైవుల అభ్యంతరాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్న ధ్వని చంపత్‌ రారులో వినిపించింది.రారు ప్రకటన తరువాత అవిముక్తేశ్వరానంద స్పందించారు.” ధర్మశాస్త్రాల ప్రకారమే జరగాలని మేమూ, జనం కూడా కోరుకుంటున్నారు. రాముడు మనకు చెప్పిన పాప పుణ్యాలేమిటో మనకు తెలిసినవే. రామాలయ ప్రతిష్టకు రావటం లేదన్న మా నిర్ణయం ఏమిటో బహిర్గతమైంది. అక్కడకు శంకరాచార్యలు రానవసరం లేదని చంపత్‌ రారు చెబుతున్నారు, ఎందుకంటే ఆ స్థలం రామానంద సంప్రదాయానికి చెందినది అంటున్నారు. ఇక్కడ సమస్య ఏమంటే రామాలయం వైష్ణవులదే అయితే చంపత్‌ రారు అక్కడెందుకు ఉన్నారు ? నిర్మాణ కమిటీ చైర్మన్‌ నృపేంద్ర మిశ్రా, పూర్వపు అయోధ్య సంస్థానం, రామాలయ ట్రస్టీ రాజా సాహెబ్‌ అక్కడ ఎందుకు ఉన్నట్లు ? వారు రాజీనామా చేసి రామానంద సంప్రదాయ ప్రతినిధులకు ఆలయాన్ని ప్రతిష్టాపనకు ముందే అప్పగించాలి.ప్రతిష్టను రాజకీయం చేశారు, మతాధిపతులను కావాలనే పక్కన పెట్టారు, ఆలయం రామానంద సంప్రదాయవాదులదే అయితే వారు విరాళాలు తీసుకొనే ముందే ఆ ముక్క చెప్పాలి. ఆ సమయంలో మీరు మా నుంచి కూడా విరాళాలు పొందారు.అలయం శంకరాచార్యులది కాదంటే మీరు మానుంచి విరాళాలను ఎందుకు స్వీకరించినట్లు? అని అవిముక్తేశ్వరానంద ప్రశ్నించారు. రామానంద పరంపరలో నిర్మోహీ అఖారా మతపరమైన చిహ్నం, సుప్రీం కోర్టు తీర్పు రాకముందు అక్కడ పూజలు నిర్వహిస్తున్న సంస్థ అది, దానికే ఆ బాధ్యతను కూడా మరోసారి అప్పగించాలి, మీరు మరింత మంది పూజారులను ఎందుకు నియమిస్తున్నారు, పూజ బాధ్యతను రామానంద సాంప్రదాయం ప్రకారం నిర్మోహి అఖారాకు అప్పగించాలి, దాన్ని మేము ఆమోదిస్తాము, దీంతో నలుగురు శంకరాచార్యలూ సంతోషిస్తారు అని కూడా ముక్తేశ్వరానంద అన్నారు.


రామాలయ నిర్మాణాన్ని ఓట్లకోసం బిజెపి ఉపయోగిస్తున్నదని లోకం కోడై కూస్తున్నది. వచ్చేలోక్‌సభ ఎన్నికల్లో రామాలయాన్ని ప్రభావితం చేసేందుకు ఐదువేల మంది చొప్పున ప్రతి నియోజకవర్గంలో నియమించాలని బిజెపి పధకం వేసినట్లు ఒక బిజెపి నేత చెప్పినట్లు ది ప్రింట్‌ న్యూస్‌ పోర్టల్‌ తన విశ్లేషణలో పేర్కొన్నది. రానున్న మూడు మాసాలలో దేశమంతటి నుంచి రెండున్నర కోట్ల మందికి రామదర్శనం ఏర్పాటు చేసి హిందూ ఓటు బాంకును ఏర్పాటు చేసుకోవాలని చూస్తున్నట్లు కూడా తెలిపింది. అయోధ్యను సందర్శించిన వారు తమ అనుభవాలను ఇతరులకు తెలియచేస్తారని బిజెపి ఎంపీ ప్రదీప్‌ చౌదరి చెప్పినట్లు ప్రింట్‌ రాసింది. రామాలయ ప్రతిష్ట రాజకీయం తప్ప సనాతనం కాదని అయోధ్యలోని మహంతులు కొందరు భావిస్తున్నారు. ప్రధాని నరేంద్రమోడీ నిర్వహించే ప్రాణ ప్రతిష్ట కార్యాక్రమాన్ని వారణాసికి చెందిన లక్ష్మీకాంత దీక్షిత్‌ నిర్వహిస్తున్నారు. దీపావళి ఉత్సవానికి మమ్మల్ని ఆహ్వానించారు ఇప్పుడెందుకు పిలవలేదని మహంత్‌ భానుదాస్‌ ప్రశ్నించారు. విమర్శలు చేసిన శంకరాచార్యలను సామాజిక మాధ్యమంలో పెద్ద ఎత్తున మోడీ అభిమానులుగా ఉన్న వారు చీల్చి చెండాడుతున్నారు. వారు ఎప్పుడైనా రామాలయం కోసం ఎప్పుడైనా ఆందోళన చేశారా అని ప్రశ్నిస్తున్నారు.శంకరాచార్యులను అనుసరించే వారి మనోభావాలను వారు తీవ్రంగా గాయపరుస్తున్నారు.మొత్తం మీద రాముడిని మరోసారి వివాదాస్పదం కావించారు. వీధుల్లో రచ్చ రచ్చ చేస్తున్నారు