Tags

, , , , , , ,

ఎం కోటేశ్వరరావు

కుక్క మనిషిని కరిస్తే సాధారణం, అదే మనిషి కుక్కను కరిస్తే పెద్ద వార్త. జర్నలిజం విద్యార్ధులకు చెప్పే ఉదాహరణ ఇది. అదే మాదిరి చట్టసభల నుంచి ప్రతిపక్ష పార్టీలకు చెందిన సభ్యులు వాకౌట్‌ చేయటం పెద్ద వార్త కాదు, కానీ గవర్నర్లు అదే పని చేస్తే సంచలనం. కానీ మన మీడియా చర్మాలు మొద్దుబారటంతో దాని గురించి పెద్దగా పట్టించుకోవటం లేదు. పెద్దన్న నరేంద్రమోడీ పైనుంచి గమనిస్తున్నారన్న భయంతో రాజ్యాంగ పరిరక్షణకు మద్దతుదార్లం అని చెప్పుకొనే వారు కూడా గొణుగుతున్నారు తప్ప నోరు విప్పటం లేదు. మన దేశంలో అపహాస్యం పాలైన వాటిలో గవర్నర్ల వ్యవస్థ ఒకటి. తొలిసారిగా 1959 జూలై 31న రాష్ట్రగవర్నర్‌ సిఫార్సుతో ఆర్టికల్‌ 356ను ఉపయోగించి ఎన్నికలలో కేరళలో ఇఎంఎస్‌ నంబూద్రిపాద్‌ నాయకత్వంలో అధికారానికి వచ్చిన తొలి కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని రద్దు చేశారు. భూ సంస్కరణల చట్టం తెచ్చి అమలు జరిపేందుకు పూనుకున్న కారణంగా అక్కడ ఉన్న అన్ని రకాల కమ్యూనిస్టు వ్యతిరేక శక్తులు ఏకమై విమోచన సమరం పేరుతో సాగించిన ఆందోళనను సాకుగా చూపి అక్కడ శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడిందనే సాకుతో ఆ దుండగానికి పాల్పడ్డారు. నాడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ పెద్దలే సదరు ఆందోళన వెనుక ఉన్నారు. ఆ తరువాత పశ్చిమ బెంగాల్‌లో సిపిఐ(ఎం) నాయకత్వాన ఏర్పడిన యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం బలనిరూపణకు సిద్దం అవుతున్న తరుణంలో గవర్నర్‌ ధరమ్‌ వీర అధర్మంగా వ్యవహరించి ఆ ప్రభుత్వ రద్దుకు సిఫార్సు చేయటంతో రాష్ట్రపతి పాలన విధించారు. నాటి నుంచి నేటి వరకు కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీని వ్యతిరేకించే పార్టీలు రాష్ట్రాలలో అధికారానికి వస్తే గవర్నర్ల ద్వారా కుట్రలు, కూలదోయించటంలో ఎవరూ తక్కువ తినలేదు, 2014 నుంచి మోడీ సర్కార్‌ నియమించిన గవర్నర్లు బరితెగించి వ్యవహరిస్తున్నారు.

పార్టీ ఏజంట్ల మాదిరి గవర్నర్లు వ్యవహరిస్తున్నారని, ఎన్నికైన ప్రభుత్వాల పట్ల రాజ్యాంగ విరుద్ధంగా వ్యవవరిస్తున్నారని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌ విమర్శించారు. చట్టసభలను ఉద్దేశించి ఏడాది ప్రారంభంలో గవర్నర్లు ప్రసంగించాల్సిన అవసరం లేకుండా రాజ్యాంగ సవరణ చేయటమే పరిష్కారమని, ఇతర పార్టీలతో కలసి దీని గురించి రానున్న పార్లమెంటు సమావేశాలలో లేవనెత్తుతామని చెప్పారు. జనవరి 22(2026)న కర్ణాటక గవర్నర్‌ తహ్వార్‌చంద్‌ గెహలట్‌ కేవలం కొన్ని పేరాల ప్రసంగాన్ని మాత్రమే చదివి మిగతాది వదలి ఉభయ సభల సమావేశం నుంచి వాకౌట్‌ చేశారు.గవర్నర్‌తో పాటు ప్రతిపక్ష బిజెపి, జెడిఎస్‌ సభ్యులు కూడా అనుసరించారు. రాజ్యాంగం ప్రకారం గవర్నర్‌ ప్రసంగాన్ని రాష్ట్ర మంత్రివర్గం తయారు చేస్తుందన్నది తెలిసిందే. దానిలో పదకొండు పేరాలను చదివేందుకు గవర్నర్‌ నిరాకరించారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి దాని బదులు ఒక స్కీమును ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వ విధానాన్ని ఆ ప్రసంగంలో విమర్శించారు. ఇలాంటివే మరికొన్ని ఉన్నాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 176, 163 ప్రకారం రాష్ట్ర మంత్రివర్గం తయారు చేసిన ప్రసంగాన్ని విధిగా చదవటం తప్ప గవర్నర్‌కు మరొక అవకాశం లేదని, తన స్వంత అభిప్రాయాలను దానిలో చొప్పించే అధికారం లేదని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ద రామయ్య గవర్నర్‌ చర్యను ఖండించారు. అంతకు ముందు తమిళనాడు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే భాగాలు ఉన్నందున అసెంబ్లీ నుంచి వాకౌట్‌ చేశారు.కేరళ గవర్నర్‌ రాజేంద్ర అర్లేకర్‌ మంత్రివర్గం ఆమోదించిన ప్రసంగంలో కొన్ని భాగాలను వదలి, కొన్నింటిని తాను చేర్చి చదివారు.తాము సూచించిన భాగాలను చేర్చకుండా ప్రసంగాన్ని రూపొందించారని లోక్‌భవన్‌ పేర్కొన్నది.కేరళకు నష్టం కలిగించే కేంద్ర ప్రభుత్వ ద్రవ్యవిధానాన్ని, అసెంబ్లీ ఆమోదించిన బిల్లులకు ఆమోద ముద్రవేయని గవర్నర్‌ చర్యను విమర్శిస్తూ రాసిన భాగాలను గవర్నర్‌ విస్మరించినట్లు ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ చెప్పారు. అనవసరమైన, ఆధారం లేని అంశాలు మంత్రివర్గం రూపొందించిన ప్రసంగంలో ఉన్నాయని, వాటిని తొలగించాలన్న తమ సూచనను పట్టించుకోకుండా రెండవసారి కూడా తొలి ముసాయిదానే పంపారని గవర్నర్‌ కార్యాలయం ఆరోపించింది. ఏ అంశ ం అవసరమో కాదో నిర్ణయించే విచక్షణ అధికారం గవర్నర్‌కు లేదు. అయితే గవర్నర్‌ ఏమి ప్రసంగించినప్పటికీ అసెంబ్లీ రికార్డులలో మంత్రివర్గం రూపొందించిన ప్రసంగపాఠమే ఉండాలని ప్రభుత్వం కోరింది. గతంలో మాదిరే మంత్రివర్గం తయారు చేసినదే రికార్డులలో ఉంటుందని స్పీకర్‌ ఎఎన్‌ షంషీర్‌ ప్రకటించారు.

కేంద్ర ప్రభుత్వ చర్యలు, విధానాలనే కాదు తొలిసారిగా గవర్నర్‌ చర్యను కూడా పశ్చిమబెంగాల్‌ యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వ మంత్రివర్గం రూపొందించిన ప్రసంగంలో విమర్శించింది.1967లో ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన పెట్టిన తరువాత 1969లో ఎన్నికలు జరిపారు. తిరిగి వామపక్షాలతో కూడిన ఫ్రంట్‌ అధికారంలోకి వచ్చింది. అప్పుడు రూపొందించిన ప్రసంగంలో గవర్నర్‌ చర్యను తప్పుపట్టింది. తన చర్యను తానే విమర్శించినట్లు అవుతుంది గనుక ఆ పేరాను చదివేది లేదని ధరమ్‌ వీర తిరస్కరించారు. తరువాత కూడా బెంగాల్లో పునరావృతమైంది. గవర్నర్‌ బిడి పాండేను బంగ్లా డామన్‌ పాండే( బెంగాల్‌ను నాశనం చేస్తున్న పాండే)గా వామపక్షాలు వర్ణించాయి.1984లో గవర్నర్‌ ఏపి శర్మ కొల్‌కతా విశ్వవిద్యాలయ వైస్‌ ఛాన్సలర్‌గా తాను ఎంపిక చేసిన వ్యక్తిని తప్ప రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన జాబితా నుంచి నియమించేందుకు తిరస్కరించారు.ఇలాంటి అనేక చర్యలకు పాల్పడుతుండటంతో గవర్నర్‌ కార్యక్రమాలను బహిష్కరించాలని వామపక్ష సంఘటన నిర్ణయించింది. గవర్నర్‌ పదవిని రద్దు చేయాలని సర్కారియా కమిషన్‌కు నివేదిక పంపింది.2007లో నందిగ్రామ్‌ హింసాకాండ సందర్భంగా గవర్నర్‌ గోపాలకృష్ణ గాంధీ (మహాత్మా గాంధీ మనవడు) ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మాట్లాడారు.ఈ డొంకతిరుగుడెందుకు ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గంటే పోతుందిగా అని అప్పుడు సిపిఐ(ఎం) నేతలు గడ్డిపెట్టారు. అప్పుడు ప్రతిపక్ష నేతగా గవర్నర్‌ను సమర్ధించిన మమతా బెనర్జీకి తరువాత బిజెపి నియమించిన గవర్నర్లు అదేపని చేస్తే భగ్గుమన్నారు,కొంత మందికి అంతే, తమదాకా వస్తే తప్ప తత్వం బోధపడదు. తరువాత కాలంలో ఉపరాష్ట్రపతి పదవికి ఎంపికై అర్ధంతరంగా రాజీనామా చేసిన బిజెపి అసంతృప్త నేత జగదీప్‌ థంకడ్‌ బెంగాల్‌ గవర్నర్‌గా ఉన్నపుడు బహిరంగంగానే పరస్పర విమర్శలు చేసుకున్నారు.

మనదేశంలో గవర్నర్లను మూడు తరగతులుగా చూడాలి. స్వాతంత్య్రానికి ముందు, తరువాత 1967వరకు, ఆ తరువాత వ్యవహరించిన తీరులో స్పష్టంగా దిగజారుడు కనిపిస్తుంది. బ్రిటీష్‌ వారి కాలంలో గవర్నర్‌ అంటే ప్రభుత్వ ప్రతినిధి, సర్వాధికారి. మనదేశంలోని ప్రోవిన్స్‌లకు అధిపతులుగా ఉన్నారు.ప్రజాప్రభుత్వాలు లేవు, స్వాతంత్య్రానికి ముందు 1935 నుంచి పరిమితంగా ప్రావిన్సు( రాష్ట్ర ) ప్రభుత్వాల ఏర్పాటుకు అవకాశమిచ్చినా వాటికి పెద్దగా అధికారాలు లేవు, గవర్నర్లే సర్వస్వం. తరువాత రెండు దశాబ్దాలలో దేశంలో ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలే లేవు(1957లో కేరళ కమ్యూనిస్టు ప్రభుత్వం తప్ప, దాని గురించి ముందే చెప్పుకున్నాం) గవర్నర్లుగా నియమితులైనవారు స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నతరం వారే అత్యధికులు కనుక రాజ్యాంగ విలువలను పాటించారు.గవర్నర్ల గురించి జనానికి పెద్దగా తెలియదంటే అతిశయోక్తి కాదు. తొలిసారిగా కాంగ్రెస్‌ అనేక రాష్ట్రాలలో ఓడిపోయిన 1967 నుంచి ఇప్పటి వరకు చూస్తే రాజకీయ పార్టీలలో తమకు పోటీగా వస్తున్నారని పక్కకు తప్పించిన నేతలు, సామాజిక సమీకరణల్లో భాగంగా కొందరిని గవర్నర్‌లుగా నియమిస్తున్నారు. వారు కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటే వారి చేత నియమాకాలు పొందినవారు కావటంతో పార్టీల ఏజంట్లుగా సిగ్గువిడిచి ప్రవర్తిస్తున్నారు.

రాజ్యాంగాన్ని రచించే సమయంలో గవర్నర్ల వ్యవస్థ గురించి పెద్ద చర్చే జరిగింది. గవర్నర్లు వద్దని, కావాలని వాదించిన వారు ఉన్నారు. రాజీమార్గంగా రాష్ట్రంలో రాజ్యాంగ అధిపతిగా గవర్నర్‌ను ఏర్పాటు చేస్తూ మంత్రివర్గ సలహామేరకు పని చేయాల్సి ఉంటుందని పరిమితి విధించారు. ఇదే సమయంలో కొన్ని విచక్షణాధికారాలను కూడా కల్పించారు. ఇప్పుడు ఆ పేరుతో అడ్డగోలు వ్యవహారాలకు పాల్పడుతున్నారు. అయితే ఎస్‌ఆర్‌ బొమ్మరు-కేంద్ర ప్రభుత్వ కేసులో సుప్రీం కోర్టు ఒక ముఖ్యమైన తీర్పు ఇచ్చింది. గవర్నర్ల చర్యలు కోర్టు సమీక్షలకు లోబడి ఉంటాయన్నదే అది.దానికి అనుగుణంగానే కొన్ని రాష్ట్రాలు సుప్రీం కోర్టును ఆశ్రయించి గవర్నర్ల చర్యలను సవాలు చేశాయి.అడ్డగోలుగా ఆర్టికల్‌ 356ను ఉపయోగించి రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేయకూడదని, గవర్నర్లు రాజ్యాంగ నిబంధనలను పాటించాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. తరువాత 2005లో రామేశ్వర ప్రసాద్‌-కేంద్ర ప్రభుత్వ వివాదంలో గవర్నర్ల విచక్షణ అధికారం,రాష్ట్ర అసెంబ్లీ పనివిధానం గురించిన అంశం ముందుకు వచ్చింది. బీహార్‌ ముఖ్యమంత్రి అసెంబ్లీని లాంఛనంగా రద్దు చేయకముందే గవర్నర్‌ అసెంబ్లీ రద్దు, రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేశారు. ఉత్తరాఖండ్‌లో తలెత్తిన రాజకీయ సంక్షోభంలో గవర్నర్‌ జోక్యం చేసుకున్నారు. కేంద్రం-రాష్ట్రాల మధ్య వారధిగా ఉండాల్సిన గవర్నర్లు కేంద్ర పాలకపార్టీ ఏజంట్లుగా తయారయ్యారు.1984లో తెలుగుదేశం పార్టీలో తలెత్తిన సంక్షోభంలో గవర్నర్‌గా ఉన్న రామ్‌లాల్‌ ఎన్‌టి రామారావు ప్రభుత్వాన్ని కూలదోసి నాదెండ్ల భాస్కరరావును ముఖ్యమంత్రిగా చేసిన సంగతి తెలిసిందే. ఈ చర్యకు నిరసనగా తలెత్తిన ప్రజానిరసనతో తిరిగి ఎన్‌టిఆర్‌ను ముఖ్యమంత్రిగా ప్రతిష్టించాల్సి వచ్చింది. ఇలాంటి పరిణామం మరేరాష్ట్రంలోనూ జరగలేదు.

సుప్రీం కోర్టు 2025 ఏప్రిల్‌ ఎనిమిదిన మైలురాయిగా నిలిచే తీర్పునిచ్చింది. తమిళనాడు ప్రభుత్వం ఆమోదించిన పది బిల్లులకు ఆమోదముద్ర వేసేందుకు తిరస్కరించటం గవర్నర్‌ రాజ్యాంగవిరుద్ధ చర్య అని ప్రకటించింది.తమిళనాడు ప్రభుత్వం 2020 నవంబరు నుంచి 2023 ఏప్రిల్‌ మధ్య పదమూడు బిల్లులను ఆమోదించగా వాటిలో పదింటిని ఆమోదించకుండా, తిప్పి పంపకుండా గవర్నర్‌ తనదగ్గరే అట్టిపెట్టుకున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 200ప్రకారం గవర్నర్లకు నాలుగు అవకాశాలు ఉన్నాయి. ఒకటి బిల్లులకు ఆమోదం తెలపటం, ఆమోదం నిలిపివేయటం, ద్రవ్య బిల్లుతప్ప ఇతర వాటిని తిరిగి పరిశీలించాలని కోరటం,తిరిగి వచ్చిన వాటిని ఆమోదించటం, రాష్ట్రపతి ఆమోదానికి పంపకుండా నిలిపివేయటం. అయితే ఆ నిబంధనలో ఎటూ తేల్చకుండా ఎంతకాలం కొనసాగించవచ్చు అన్నది ఎక్కడా లేదు. దాన్ని అవకాశంగా తీసుకొని గవర్నర్లు రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బంది పెడుతున్నారు.తమిళనాడు గవర్నర్‌ చర్య ఉద్దేశ్య పూర్వకంగా బిల్లులను అడ్డుకున్నట్లున్నదని,రాజ్యాంగ పద్దతిని ఉల్లంఘించటమే అని కోర్టు పేర్కొన్నది. ఎలాంటి మార్పులు లేకుండా రెండవసారి పంపిన బిల్లులను రాష్ట్రపతి ఆమోదానికి పంపకుండా ఉండటం తగదని, నిలిపివేయకూడదని రాజ్యాంగం పేర్కొన్నదని విధిగా పంపాలని పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యకు గవర్నర్‌ రవి పాల్పడ్డారని స్పష్టం చేసింది. బిల్లు వచ్చిన నెలరోజుల్లో ఆమోదం తెలపాలి,ఆమోదం తెలపని వాటిని కారణం తెలుపుతూ మూడు నెలల్లోగా తిప్పి పంపాలి.రెండవసారి వచ్చిన బిల్లుకు నెలరోజుల్లో ఆమోదం తెలపాలి, మూడు నెలలకు మించి బిల్లులను నిలిపివేయరాదు. ఆర్టికల్‌ 201ప్రకారం రాష్ట్రపతి కూడా నిరవధికంగా ఆమోదం నిలిపివేయరాదు. ఒకవేళ బిల్లు రాజ్యాంగవిరుద్ధంగా ఉందనకుంటే రాష్ట్రపతి దాని గురించి తప్పనిసరిగాకపోయినప్పటికీ సుప్రీం కోర్టు సలహాను కోరవచ్చు అని కూడా కోర్టు చెప్పింది.ఈ తీర్పులు వచ్చిన తరువాత కూడా గవర్నర్లు మంత్రివర్గం రూపొందించిన ప్రసంగాలకు బద్దులై ఉండకుండా స్వంతపైత్యాలను జోడించటం చూస్తున్నాం. అందువలన ఈ అంశంపై కూడా రానున్న రోజుల్లో రాష్ట్రాలు మరోసారి సుప్రీం కోర్టు తలుపు తట్టటం మినహా మరొక మార్గం లేదు. రాజ్యాంగ వ్యవస్థలను నీరుగార్చేందుకు క్షణ క్షణం ప్రయత్నిస్తున్న బిజెపి చర్యలను అడ్డుకొనేందుకు అటు న్యాయవ్యవస్థను ఆశ్రయించటంతో పాటు వ్యతిరేకంగా ప్రజాసమీకరణ కూడా అవసరం.