• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: CHINA

చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !

17 Wednesday Dec 2025

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, UK, USA

≈ Leave a comment

Tags

Chip war 2.0, Chip war 2.0 against China, Elon Musk, Nvidia's H200, Pax Silica, US and China Chip War

ఎం కోటేశ్వరరావు

సాంకేతిక రంగంలో ముందుకు పోకుండా చైనాను అడ్డుకొనేందుకు ఇప్పటి వరకు ఒంటరిగా ప్రయత్నించిన అమెరికా తాజాగా తనకు తోడుగా మరికొన్ని దేశాలను కూడగట్టుకొని గోదాలోకి దిగింది. బహుశా అందుకే కృత్రిమ మేథ(ఏఐ) రంగంలో పూర్తిస్థాయి యుద్ధ ముప్పు ఉందని ప్రపంచ ధనికుడు ఎలన్‌ మస్క్‌ వ్యాఖ్యానించాడు. అమెరికా దిగ్గజ సంస్థ ఎన్‌విడియా తదుపరి తరం హార్డ్‌వేర్‌ బ్లాక్‌వెల్‌ చిప్‌తో అది ప్రారంభం అయినట్లే అన్నాడు. వచ్చే ఏడాది మార్కెట్‌లోకి అది రానుందనే వార్తల పూర్వరంగంలో జరుగుతున్న పరిణామాలపై తాజాగా మస్క్‌ స్పందించాడు. ఈ చర్యతో పోటీదారులు వేగం,ఖర్చు,విస్తృతి అంశాల్లో తమ సత్తా చూపేందుకు పూనుకుంటారన్నాడు. ద్రవ్యపెట్టుబడిదారు గవిన్‌ బేకర్‌ మాట్లాడిన అంశాల మీద మస్క్‌ స్పందించాడు. బ్లాక్‌వెల్‌ చిప్స్‌ తయారీలో అనేక సవాళ్లు ఉన్నట్లు బెకర్‌ చెప్పాడు. అందుకే అది ఆలస్యం అవుతున్నదని అన్నాడు.ఏది ఏమైనప్పటికీ ఈ రంగంలో ఉన్న గూగుల్‌, ఎలన్‌మస్క్‌ ఎక్స్‌ఏఐ, మేటా (ఫేస్‌బుక్‌ ) వంటి కంపెనీలన్నీ పోటీపడతాయని వేరే చెప్పనవసరం లేదు. మరోవైపు పశ్చిమ దేశాల సంస్థలకు చైనా పెద్ద సవాలు విసురుతున్నది. గత పదిహేను సంవత్సరాలుగా సాంకేతిక రంగంలో బీజింగ్‌ ఎదగకుండా చూసేందుకు అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు చేయని యత్నం లేదు. వాణిజ్యపోరుతో పాటు చిప్స్‌ పోరును కూడా ప్రారంభించాయి. తాజా పరిణామాలను బట్టి ఈ యుద్ధంలో అమెరికాకు ఊహించని దెబ్బ తగిలిందని చెప్పవచ్చు.అందుకే అది కొత్త ఎతుత్తగడలతో పోరును కొనసాగించేందుకు పాక్స్‌ సిలికా పేరుతో కొత్త కూటమిని రంగంలోకి తెచ్చింది.

చిప్‌ యుద్ధంలో చైనా ఒక్కటే ఒకవైపు ,అనేక దేశాలు మరోవైపు ఉన్నాయి. జోబైడెన్‌ సర్కార్‌ 2022 అక్టోబరు నుంచి ా చైనాకు అధునాతన చిప్స్‌ ఎగుమతులపై ఆంక్షలు విధించింది. ఇటీవలనే ట్రంప్‌ ఏలుబడి ఎన్‌విడియా కంపెనీకి అనుమతి ఇచ్చింది. అయితే అధికారికంగా ఎలాంటి సమాచారం లేనప్పటికీ ఆ చిప్స్‌ తమకు అవసరం లేదన్నట్లుగా చైనా తీరు ఉందని, తిరస్కరించినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఈ పూర్వరంగంలో చిప్‌ యుద్దంలో తన బలం ఒక్కటే చాలదని భావించిన అమెరికా డిసెంబరు 12న తొలిసారిగా పాక్స్‌ సిలికా పేరుతో ఒక కూటమికి శ్రీకారం చుట్టింది. పాక్స్‌ అంటే లాటిన్‌ భాషలో శాంతి, స్థిరత్వం, సిలికా అంటే ఇసుకతో సహా వివిధ రూపాల్లో ఉండే ఖనిజం. దాన్నుంచి కంప్యూటర్లకు అవసరమైన చిప్స్‌ తయారు చేస్తారు,అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఐటి, సాంకేతిక పరిజ్ఞానం కేంద్రాలు కేంద్రీకృతమైన ప్రాంతాన్ని సిలికాన్‌ వ్యాలీ అని పిలుస్తున్న సంగతి తెలిసిందే. పాక్స్‌ సిలికా లక్ష్యం ఏమిటంటే విలువైన ఖనిజాల సరఫరా, సాంకేతిక పరిజ్ఞాన సహకారంతో ఆ కూటమిలోని దేశాలు బలపడటం, చైనా ఆధిపత్యాన్ని ఉమ్మడిగా సవాలు చేయటం. అమెరికా వైపు నుంచి ఇలాంటి చొరవ చూపటం అంటే కమ్యూనిస్టు చైనా ముందు ఒక విధంగా తన ఓటమిని అంగీకరించటమే.చిత్రం ఏమిటంటే ఈ బృందం నుంచి భారత్‌ను మినహాయించారు.దీని అర్ధం మనలను చేర్చుకున్నందున తమకు ఉపయోగం లేదని భావించినట్లేనా ? లేక తమకు అనుకూలమైన షరతులతో వాణిజ్య ఒప్పందానికి ఒప్పించటానికి మరోవిధంగా వత్తిడి చేయటమా ?

ప్రస్తుతం ప్రపంచంలో విలువైన ఖనిజాలు, వాటి ఉత్పత్తుల విషయంలో 70శాతంతో చైనా అగ్రభాగాన ఉంది. వాటి ఎగుమతుల నిలిపివేతతో ఇటీవల ప్రపంచంలోని అనేక దేశాలు గిజగిజలాడిన సంగతి తెలిసిందే.ఈ ఖనిజాలతో పాటు కృత్రిమ మేథ(ఏఐ), చిప్స్‌ తయారీ వంటి కీలక రంగాలలో పరస్పరం సహకరించుకొనేందుకు అమెరికా,దక్షిణ కొరియా, సింగపూర్‌, జపాన్‌, ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్‌, నెదర్లాండ్స్‌, బ్రిటన్‌, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ స్థాపక సభ్యులుగా పాక్స్‌ సిలికా ఏర్పడింది. ఆర్థిక కూటములు తప్ప సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించి ఏర్పడటం ఇదే ప్రధమం.దీన్ని అమెరికా కృత్రిమ మేథ దౌత్యంగా వర్ణించారు. ఈ కూటమికి సహకరించేందుకు లేదా అతిధులుగా తైవాన్‌, ఐరోపా యూనియన్‌, కెనడా,ఓయిసిడి ఉంటాయి. ఈ సంస్థలకు చెందిన దేశాలు తమవంతు సహకారాన్ని అందిస్తాయి. అమెరికా ఆర్థిక వ్యవహారాల సహాయమంత్రి జాకబ్‌ హెల్‌బర్గ్‌ ఈ చొరవను ” నూతన స్వర్ణ యుగం ” అని వర్ణించాడు. దీని గురించి చైనా ఇంతవరకు అధికారికంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. ఇతరులపై ఆధారపడకుండా చైనా స్వయంశక్తితో ఎదిగేందుకు దీర్ఘకాలిక పథకాలను రూపొందించింది.దాన్లో భాగంగానే అక్కడి ప్రభుత్వం పెద్ద మొత్తాలలో పరిశోధన, అభివృద్ధికి ఖర్చు చేస్తున్నది.స్వయంగా ఉత్పత్తులను చేస్తున్నది. ఇప్పుడు పాక్స్‌ సిలికాను కూడా సవాలుగా తీసుకొని మరింతగా తన సంస్థలను ప్రోత్సహిస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదు. గతంలో అమెరికా, పశ్చిమ దేశాలు ఎంతగా ఒంటరిపాటు చేయాలని చూస్తే ఎలాంటి ఆర్భాటం లేకుండా అంతగా నూతన విజయాలతో ముందుకు వచ్చి సమాధానం చెప్పింది.

చైనా గురించి అనేక అబద్దాలను ప్రచారం చేశారు. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. ఎన్‌విడియా కంపెనీ తయారు చేసిన చిప్స్‌ను చైనాకు ఎగుమతి చేయరాదని అమెరికా ప్రభుత్వం నిషేధం విధించింది. అయితే వాటిని అక్రమ పద్దతుల్లో సేకరించి డీప్‌సీక్‌లో వినియోగిస్తున్నట్లు వార్తలు రాశారు. అయితే అలాంటిదేమీ లేదని ఎన్‌విడియా ప్రకటించి వాటిగాలి తీసింది. సదరు ఆరోపణకు ఎలాంటి ఆధారాలు లేవని, తాము అమెరికా నిబంధనలకు అనుగుణంగానే పని చేస్తున్నట్లు పేర్కొన్నది. అత్యంత తక్కువ ఖర్చుతో స్వల్పకాలంలోనే ఏఐ డీప్‌సీక్‌ను తయారు చేసి 2025లో ప్రపంచాన్ని కుదిపివేసింది. చాట్‌ జిపిటి వంటి ఏఐ వ్యవస్థలను తయారు చేసేందుకు భారీ మొత్తాలలో ఖర్చు చేసిన సంస్థలు తలలు పట్టుకున్నాయి. కంపెనీల వాటాల ధరలు పతనమయ్యాయి. ఆధునికమైన చిప్స్‌తో పనిలేకుండానే తక్కువ ఖర్చుతో ఏఐ వ్యవస్థలను తయారు చేయవచ్చని ఇప్పుడు అనేక మంది భావిస్తున్నారు. సాంకేతిక రంగంలో కొన్నింటిలో ఇప్పటికీ ముందున్నప్పటికీ మొత్తంగా చూసినపుడు గతంలో మాదిరి అమెరికా ఒక నిర్ణయాత్మక శక్తిగా లేదు. ఎన్‌విడియా హెచ్‌200 రకం చిప్‌లను చైనాకు ఎగుమతి చేయవచ్చని ట్రంప్‌ అనుమతించాడు.చైనా మార్కెట్‌లో ప్రవేశించటం ఒకటైతే, వాటిని కొనుగోలు చేసిన చైనా తనపరిశోధనలను పక్కన పెట్టి వాటిపైనే ఆధారపడుతుందనే అంచనాతో ఈ చర్య తీసుకున్నాడు. అయితే అలా జరుగుతుందని చెప్పలేమని అధ్యక్ష భవనంలో ఏఐ జార్‌గా పరిగణించే డేవిడ్‌ శాక్స్‌ చెప్పాడు. ఎగుమతులపై నిషేధం పెట్టిన అమెరికా తానే ఏకపక్షంగా ఎత్తివేసింది. ఆట నిబంధనలను తానే రూపొందించి తానే మార్చినట్లయింది.

కొన్ని దశాబ్దాల పాటు తన నిబంధనలతో అమెరికా ప్రపంచాన్ని ఏలింది. ఇతర దేశాల తలరాతలను రాసేందుకు ప్రయత్నించింది. మనతో సహా అలీన దేశాలకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తే అది సోవియట్‌, ఇతర సోషలిస్టు దేశాలకు, పెట్టుబడిదారీ దేశాల్లోనే తమ ప్రత్యర్ధులకు చేరుతుందనే భయంతో అనేక చర్యలు తీసుకుంది. పోటీదారులు తలెత్త కుండా చూసుకుంది, సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా తన రాజకీయ అవసరాల కోసం ఒక ఆయుధంగా వాడుకుంది. మన దేశానికి అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం అందకుండా అన్ని విధాలుగా అడ్డుకుంది. సోవియట్‌ యూనియన్‌, తరువాత రష్యా అండతో దాన్ని అధిగమించాం. అణుపరీక్షలు జరిపితే ఆంక్షలు విధించింది. ఆహార ధాన్యాలు కావాలంటే మాకేంటని బేరం పెట్టింది. ఇలా అనేక అంశాలను చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు కుదరదు, పరిస్థితులు మారాయి. అది చేసిన చారిత్రక తప్పిదం వలన ఇతర దేశాల మీద ఆధారపడక తప్పని స్థితి. వస్తు ఉత్పాదక పరిశ్రమలన్నింటినీ మూసివేసింది, లేదా ఇతర దేశాలకు తరలించింది. ఇప్పుడు టాయిలెట్లలో తుడుచుకొనేందుకు అవసరమైన కాగితాన్ని కూడా అది ఏదో ఒక దేశం నుంచి దిగుమతి చేసుకోవాల్సిందే. కోట్లకు వేసుకొనే టై దగ్గర నుంచి కాళ్లకు వేసుకొనే బూట్ల వరకు ఇతర దేశాల నుంచి తెచ్చుకుంటే తప్ప గడవదు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సంపాదించిన సొమ్ముతో వాటన్నింటినీ ఎక్కడో అక్కడ నుంచి తెచ్చుకుంది. ఇప్పుడు అలాంటి అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. ఉదాహరణకు ఎన్‌విడియా చిప్స్‌ను చైనాకు ఎగుమతి చేసి రాబడిలో 25శాతం ఖజానాకు జమచేస్తానని ట్రంప్‌ చెప్పాడు. ఎలా అంటే 25శాతం ఎగుమతి పన్ను విధించి అన్నాడు. ఆ కంపెనీ ఏటా పది బిలియన్‌ డాలర్ల వరకు హెచ్‌ 200 రకం చిప్స్‌ను ఎగుమతి చేస్తే దాని మీద 25శాతం పన్నుతో రెండున్నర బిలియన్‌ డాలర్ల మేర రాబడి వస్తుందని ట్రంప్‌ లెక్కలు వేసుకున్నాడు. తీరా ఏమైంది. అమెరికా చిప్సా అసలు మనకు వాటి అవసరం ఉందో లేదో సమీక్షించాలని, ప్రభుత్వ రంగంలో వాటిని వాడవద్దని తన అధికారులు, సంస్థలను చైనా ప్రభుత్వం ఆదేశించినట్లు మీడియాలో వచ్చింది. మన చిప్స్‌ను చైనా తిరస్కరిస్తున్నది అని అధ్యక్ష భవన అధికారి డేవిడ్‌ శాక్స్‌ బ్లూమ్‌బెర్గ్‌ వార్తా సంస్థతో చెప్పాడు. అదే నిజమైతే ట్రంప్‌ వ్రతం చెడ్డా ఫలం దక్కలేదని చెప్పాల్సి ఉంటుంది. 2023 నుంచి నిషేధం అమలు చేసినందున మూడు సంవత్సరాల్లో ఎంతో నష్టపోయినట్లు ఎన్‌విడియా కంపెనీ వాపోయింది. అమెరికా భద్రత పేరుతో ఈ నిషేధం కారణంగా ఎవరిమీదో ఎందుకు ఆధారపడటం మీరే తయారు చేయండని స్థానిక కంపెనీలకు 70 బిలియన్‌ డాలర్ల ప్రోత్సాహక పాకేజ్‌ను చైనా ప్రకటించింది. అంతే శక్తివంతమైన ప్రత్నామ్నాయాలను రూపొందించింది కనుకనే అమెరికా చిప్స్‌తో పనిలేదన్నట్లుగా ఉంది. భద్రత సాకును వదలివేసి లాభాలే పరమావధిగా ఎగుమతులకు అమెరికా అనుమతి ఇచ్చింది.

ముందే చెప్పుకున్నట్లు చైనా పరిశోధనా రంగంలో చేస్తున్న ఖర్చుకు ఫలితాలు కనిపిస్తున్నాయి.2025 డిసెంబరు ఒకటవ తేదీన ఆస్ట్రేలియన్‌ స్ట్రాటజిక్‌ పాలసీ ఇనిస్టిట్యూట్‌ విడుదల చేసిన సమాచారం ప్రకారం అది విశ్లేషించిన 74 కీలక రంగాలకు గాను 66లో చైనా పరిశోధనలు ముందున్నాయి.అమెరికా కేవలం ఎనిమిదింటిలో మాత్రమే ఉంది. 2000 దశకంలో అమెరికా అగ్రస్థానంలో ఉంది, ఇప్పుడు తిరగబడింది. అయితే చైనా ఆ తరువాత అల్లా ఉద్దీన్‌ అద్బుతదీపాన్ని సంపాదించిందా ? లేదు, ఒక దీర్ఘకాలిక ప్రణాళిక ప్రకారం ప్రాధాన్యత రంగాలను ఎంచుకొని సాగించిన కృషికి ఫలితమిది.అమెరికా ఎప్పుడైతే అడ్డుకోవాలని చూసిందో అప్పటి నుంచి మరింత పట్టుదల పెరిగింది.అనేక రంగాలలో విదేశాల కోసం ఎదురుచూడాల్సిన అవసరం ఇప్పుడు లేదు. అలా అని తలుపులు మూసుకోలేదు, అవసరమైన వాటికోసం వెంపర్లాడటం లేదు. చిప్స్‌ కొనటం లేదని అమెరికా అధికారి వాపోవటానికి కారణం చైనా కాదు, అమెరికా అనుసరించిన ఎత్తుగడలే అన్నది స్పష్టం. అవసరం అయినపుడు అమ్మకుండా తీరిన తరువాత ఇస్తామంటే ఎవరైనా కొనుగోలు చేస్తారా ? చైనా కొన్ని అంశాలలో తన విధానాలను ఇతర దేశాలను చూసి నిర్ణయించుకోవాల్సిన స్థితిలో లేదు. చైనాతో సహా వర్ధమానదేశాలన్నింటినీ తమ గుప్పిటలోకి తెచ్చుకోవాలని అమెరికా శ్వేత సౌధంలో రిపబ్లికన్లు, డెమోక్రాట్లు ఎవరు ఉన్నా అనుసరించిన విధానం ఒక్కటే.అక్కడి అధికారం కోసం వారిలో వారు పోట్లాడుకుంటారు తప్ప ఇతర దేశాలను దోచుకోవటంలో, తంపులు పెట్టి ఆయుధాలు అమ్ముకోవటంలో ఎవరికెవరూ తీసిపోలేదు. ట్రంప్‌ రెండవసారి అధికారానికి వచ్చిన తరువాత చైనాపై చిప్‌ యుద్ధం 2.0 ప్రారంభించాడు, ఇది ఏ పరిణామాలు, పర్యవసానాలకు దారితీస్తుందో చూద్దాం !

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !

10 Wednesday Dec 2025

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, Japan, Opinion, USA, WAR

≈ Leave a comment

Tags

China, Donald trump, Japan pacifist constitution, PLA Liaoning, PLA warships, Sanae Takaichi, Taiwan Matters, Xi Jinping

ఎం కోటేశ్వరరావు

నిత్యం ఎక్కడో ఒక దగ్గర ఉద్రిక్తతలను రెచ్చగొట్టి ఆయుధాలను అమ్ముకొని సొమ్ము చేసుకుంటే తప్ప అమెరికాకు రోజుగడవదు. దాన్లో భాగంగానే దక్షిణ చైనా సముద్రంలో ఉద్రిక్తతలను రెచ్చగొడుతున్నది. ఇటీవల రెండు సార్లు తమ విమానాల రాడార్లపై చైనా ఆయుధాలను గురిపెట్టిందని జపాన్‌ ఆరోపించింది. మిలిటరీ పరిభాషలో లాక్‌ ఆన్‌ అంటే ఒక దేశానికి చెందిన మిలిటరీ విమానాలు మరోదేశానికి చెందిన విమానాలపై రాడార్ల ద్వారా నిఘావేసి సంకేతాలు పంపటమే. ఇదికొన్ని సందర్భాలలో కూల్చివేతలకు కూడా దారి తీయవచ్చు. నిఘా అవసరాలకూ వినియోగించవచ్చు. దేనికి అలా చేశారన్నది ఆయా దేశాలు చెప్పే భాష్యాలు వివాదం అవుతున్నాయి. దొంగే దొంగ అని అరచినట్లుగా జపాన్‌ నిఘావిమానాలను తమపై కేంద్రీకరించి తామేదో చేసినట్లు గుండెలు బాదుకుంటూ ప్రపంచాన్ని నమ్మింపచూస్తున్నదని చైనా విమర్శించింది. అయితే ఎటు వైపు నుంచి ఎలాంటి అవాంఛనీయ ఉదంతాలు చోటు చేసుకోలేదు గానీ గత దశాబ్దికాలంలో ఎన్నడూ లేని విధంగా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలకు దారితీసింది. లాక్‌ ఆన్‌ ప్రచారం జపాన్‌ ప్రారంభించిన ఆయుధీకరణకు ఒక ముసుగు మాత్రమే. జపాన్‌ ఆరోపణలకు మంగళవారం నాడు అమెరికా మద్దతు పలికింది.చైనా చర్యలు ఆ ప్రాంతంలో శాంతియుత వాతావరణానికి దోహద పడటం లేదన్నది. అమెరికా ప్రకటన తమ రెండు దేశాల మధ్య ఉన్న బంధం ఎంతగట్టిదో వెల్లడించిందని జపాన్‌ స్పందించింది. రెండవ ప్రపంచ యుద్దంలో కేవలం ఆత్మరక్షణకు అవసరమైన మిలిటరీ మాత్రమే జపాన్‌కు ఉండాలని ఒప్పందం కుదిరింది. అయితే 2015 ప్రభుత్వం కొత్త చట్టం తీసుకువచ్చి తమకే గాక మిత్రదేశాలకు ఆపద వచ్చినపుడు కూడా జోక్యం చేసుకోవచ్చని కొత్త నిబంధన చేర్చారు.నిజానికి తైవాన్‌ ఒక దేశం అని ఐరాస గుర్తించలేదు, అక్టోబరులో బాధ్యతలు స్వీకరించిన ప్రధాని సానాయి టకాయిచి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఆమె ఇటీవల మాట్లాడుతూ బలవంతంగా తైవాన్‌ ప్రాంతాన్ని చైనా స్వాధీనం చేసుకుంటే తమ దేశభద్రతకు ముప్పు వచ్చినట్లే అని దాన్ని తాము అంగీకరించేది లేదని ప్రకటించారు.

చైనాలో అంతర్భాగమైన తైవాన్‌ ప్రస్తుతం ఒక తిరుగుబాటు రాష్ట్రంగా ఉంది.శాంతియుత పద్దతుల్లో తిరిగి ప్రధాన భూభాగంతో అనుసంధానం చేసేందుకు చూస్తామని,అవసరమైతే మిలిటరీచర్యతో అయినా ఆ పని చేస్తామని చైనా పదే పదే ప్రకటించింది. హాంకాంగ్‌, మకావో దీవుల విలీనం మాదిరి ఒక దేశం రెండు వ్యవస్థల విధానం కింది తైవాన్‌లో ఉన్న వ్యవస్థను 2049 వరకు ఎలాంటి మార్పులు చేయబోమని కూడా స్పష్టం చేసింది, అంటే అప్పటి వరకు స్వయం పాలనకు అవకాశమివ్వటమేగాక అక్కడ ఉన్న పెట్టుబడులకు రక్షణ కల్పించటమే. అయితే ఒక వైపు తైవాన్‌ ప్రాంతం చైనా అంతర్భాగమే అని అంగీకరిస్తూనే అమెరికా, జపాన్‌ ఇతర పశ్చిమ దేశాలు బలవంతంగా స్వాధీనం చేసుకోవటాన్ని తాము అంగీకరించేది లేదని వితండ వాదనకు దిగుతున్నాయి. స్వాతంత్య్రం ప్రకటించుకున్న తైవాన్‌లోని వేర్పాటువాద శక్తులకు అన్ని రకాలుగా మద్దతు ఇస్తున్నాయి. ఒక దేశం మాదిరి అక్కడ మిలిటరీని ఏర్పాటు చేసేందుకు, వాటికి యుద్ధ విమానాలతో సహా అన్ని రకాల ఆయుధాలను అందచేస్తున్నాయి. అమెరికా కవ్వింపులను గమనించిన చైనా ఆచితూచి వ్యవహరిస్తున్నది, ఎప్పటికప్పుడు తన అధికారాన్ని అది పునరుద్ఘాటిస్తున్నది. తెగేదాకా లాగితే ఏం జరుగుతుందో చూడండి అంటూ తరచు తైవాన్‌ చుట్టూ మిలిటరీ విన్యాసాలను కూడా నిర్వహిస్తున్నది. వాటిని చూపి ఇంకేముంది చైనా బలప్రయోగానికి పూనుకుందంటూ అమెరికా కూటమి దేశాలు నానా యాగీ చేస్తున్నాయి.

క్లుప్తంగా తైవాన్‌ సమస్య గురించి చూద్దాం.చైనా స్వాతంత్య్రం కోసం కొమింటాంగ్‌ పార్టీ ఏర్పడింది.సన్‌ యెట్‌ సేన్‌ నాయకత్వంలో 1912లో చైనా స్వాతంత్రం ప్రకటించుకొని రిపబ్లిక్‌గా అవతరించింది. తరువాత జరిగిన కొన్ని పరిణామాలలో అధికారానికి దూరమైన సన్‌ తరువాత మరోసారి అధికారానికి వచ్చి కమ్యూనిస్టులతో కలసి తొలి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. ఆయన మరణం తరువాత 1925లో అధికారానికి వచ్చిన ఛాంగ్‌కై షేక్‌ కొమింటాంగ్‌ పార్టీలో కమ్యూనిస్టులతో సయోధ్యను కోరుకొనే వారిని పక్కన పెట్టి కమ్యూనిస్టు వ్యతిరేకిగా మారాడు. మావో నాయకత్వాన కమ్యూనిస్టులు 1949లో అధికారానికి వచ్చిన సమయంలో భారీ సంఖ్యలో మిలిటరీ, ఆయుధాలను తీసుకొని చాంగ్‌కై షేక్‌ తైవాన్‌ దీవికి పారిపోయి అక్కడి నుంచి కమ్యూనిస్టులను ప్రతిఘటించాడు. ప్రధాన భూభాగంలో అధికారాన్ని సుస్థిరం చేసుకోవటం ముఖ్యమని భావించిన కమ్యూనిస్టులు దాని మీద కేంద్రీకరించారు. రెండవ ప్రపంచ యుద్దం తరువాత ఏర్పడిన ఐరాసలో అప్పుడు అధికారంలో ఉన్న చాంగ్‌కై షేక్‌ నియమించిన ప్రతినిధులనే గుర్తించారు. కమ్యూనిస్టులు అధికారానికి వచ్చిన తరువాత చైనా అంటే తైవాన్‌లో తిష్టవేసిన కొఇమింటాంగ్‌ పార్టీయే చైనా ప్రతినిధి అని 1970దశకం వరకు పరిగణించారు.ఎట్టకేలకు కమ్యూనిస్టు చైనాను గుర్తించకతప్పని పరిస్థితి ఏర్పడింది. 1971 అక్టోబరులో జరిగిన 26వ సమావేశంలో 2,758 తీర్మానం ద్వారా కమ్యూనిస్టుల నాయకత్వంలో ప్రధాన భూభాగంలో ఉన్న జనచైనా(పిఆర్‌సి) అసలైన ప్రతినిధి అని గుర్తించారు. నాటి నుంచి తైవాన్‌లో ఉన్న పాలకులు నియమించిన వారికి గుర్తింపు రద్దు చేశారు. చైనాలో తైవాన్‌ అంతర్భాగమని అందరూ అంగీకరించారు. అయితే అప్పుడు జరిగిన చర్చలో దీర్ఘకాలం విడిగా ఉన్నందున బలవంతపు విలీనం జరగకూడదని పలుదేశాలు చెప్పిన అభిప్రాయాన్ని చైనా నాయకత్వం కూడా అంగీకరించింది. నాటి చర్చను సాకుగా తీసుకొని తరువాత ఎప్పుడు విలీన యత్నం చేసినా తగిన పరిస్థితి ఏర్పడలేదని పశ్చిమ దేశాలు పాటపాడుతున్నాయి. ఇప్పటికీ అదే సాకు చెబుతూ విలీనాన్ని అడ్డుకుంటున్నాయి. తన పౌరులపై బలప్రయోగం అంటే రక్తపాతమే గనుక చైనా అందుకు పూనుకోవటం లేదు, దాని సహనాన్ని పదే పదే రెచ్చగొడుతున్నారు. దానిలో భాగమే తైవాన్‌ విలీనం తమ దేశానికి ముప్పు అని జపాన్‌ చెబుతున్న కుంటిసాకు. ప్రస్తుతం తైవాన్‌ వేరుగా ఉన్నందున చైనాకు వచ్చిన ముప్పేమీ లేదు గనుక ఉపేక్షిస్తున్నది. అది చెబుతున్న 2049 గడువులోగా దారికి వస్తే సరే, రాకుంటే అప్పుడేం జరుగుతుందో ఇప్పుడు ఊహించి చెప్పలేము. ఒక్కటి మాత్రం స్పష్టం. తైవాన్‌ వ్యవహారాల్లో మరోదేశం జోక్యం చేసుకోవటం, భిన్నంగా మాట్లాడటం అంటే తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటం, తమ సార్వభౌమత్వం, రాజ్యాంగం, అంతర్జాతీయ న్యాయసూత్రాలను ఉల్లంఘించటమే అని చైనా చెబుతున్నది. ఇదే అంశాన్ని సోమవారం నాడు జర్మనీ విదేశాంగ మంత్రితో మాట్లాడిన చైనా విదేశాంగ మంత్రి, కమ్యూనిస్టు పార్టీ పొలిట్‌బ్యూర్‌ సభ్యుడు వాంగ్‌ ఇ స్పష్టం చేశారు. తైవాన్‌ గురించి అనేక అంశాలను వివరించాడు. ఈ ప్రాంతాన్ని జపాన్‌ అర్ధశతాబ్దం పాటు ఆక్రమించుకొని వలసగా చేసుకున్నదని, తమ పౌరుల మీద లెక్కలేనని అత్యాచారాలు చేసిందని కూడా చెప్పాడు.

చైనా బూచిని చూపుతూ జపనీయులను రెచ్చగొడుతున్న అక్కడి పాలకులు మిలటరీ బడ్జెట్‌ను పెంచేందుకు సాకులు వెతుకుతున్నారు.ఇదంతా అమెరికా ఆడిస్తున్న క్రీడ తప్ప మరొకటి కాదు. తాను నేరుగా దిగితే చైనాతో సమస్యలు వస్తాయని తెలుసుగనుక ట్రంప్‌ యంత్రాంగం జపాన్ను ఎగదోస్తున్నది. తైవాన్‌ దీవికి 110 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన చివరి దీవుల సముదాయం,( ఇది చైనాకూ అంతే దూరం) జనాభా పెద్దగా లేని యంగునీ దీవుల సముదాయంలో దీర్ఘశ్రేణి క్షిపణులను మోహరించేందుకు పూనుకుంది. అక్కడ రాడార్‌ కేంద్రాలు, మందుగుండు గిడ్డంగులు, అమెరికా అందచేసిన ఎఫ్‌-35 విమానాల మోహరింపు, ఇతర మిలిటరీ నిర్మాణాలకు పూనుకుంది. ఇప్పటికే సిబ్బంది నివాసాలకు కొన్ని భవనాల నిర్మాణం పూర్తి చేసింది. కొద్ది రోజుల క్రితం ఆ దీవుల్లో ఉన్న పౌరులు కొంత మందితో సమావేశం జరిపి చైనాపై నిఘా, దాని ఎలక్ట్రానిక్‌ పరికరాలనుంచి వెలువడే అయస్కాంత తరంగాలను స్థంభింప చేసేందుకు మిలిటరీ నిర్మాణాలు అవసరమని తేల్చి చెప్పారు. ఇది చైనాను కవ్వించటం తప్ప మరొకటి కాదు. ఒక వేళ రెండు దేశాల మధ్య యుద్దం అంటూ వస్తే అది జపాన్‌ వైపు నుంచే మొదలు కావాలి తప్ప చైనా నుంచి జరగదు. ఒక వేళ జరిగితే అమెరికా తమను ఆదుకొనే పరిస్థితి లేదని గతంలో ప్రభుత్వ విశ్లేషకురాలిగా ఉండి, ప్రస్తుతం నిగాటా విశ్వవిద్యాలయంలో పని చేస్తున్న ఒక మహిళా ప్రొఫెసర్‌ చెప్పారు. ప్రభుత్వ మిలిటరీ, క్షిపణుల మోహరింపు గురించి అక్కడి కమ్యూనిస్టు పార్టీ పార్లమెంటరీచర్చలో వ్యతిరేకతను వెల్లడించింది. ఇతర దేశాల మాదిరే జపాన్‌ కూడా చేస్తున్నదని రక్షణ మంత్రి సమర్ధించాడు.

గత వారంలో విమర్శలకు దారితీసిన ఉదంతం జపాన్‌లో అమెరికా మిలిటరీ కేంద్రం ఉన్న ఒకినావా దీవి సమీపంలో జరిగింది. చైనా తమ విమానాలను లక్ష్యంగా చేసుకున్నదని తప్ప గగనతలాన్ని అతిక్రమించినట్లు జపాన్‌ ఇంతవరకు చెప్పలేదు.ముందుగా అంతర్జాతీయ జలాల్లో ఉన్న తమ విమానవాహక యుద్ధ నౌక సమీపానికి ప్రమాదకరంగా జపాన్‌ యుద్ధ విమానాలే వచ్చాయని, తమవైపు నుంచి అనివార్యమైన ప్రతిస్పందన ఉందని బీజింగ్‌ చెబుతున్నది.చైనా విమానవాహక యుద్ద నౌక లియావోనింగ్‌ వైపు జపాన్‌ యుద్ధ విమానాలు సమీపంలోకి వచ్చినపుడు చైనా విమానాలు అడ్డుకొని హద్దు మీరితే అంతే సంగతులని హెచ్చరించినట్లు, అవి పూర్తిగా సమర్దనీయమే అని చైనా నిపుణులు చెబుతున్నారు. జపాన్‌ సమీపంలో చైనా విమానవాహక నౌక కార్యకలాపాలు నిర్వహించటం ఇదే మొదటిసారి అని జపాన్‌ వార్తా సంస్థ కొయోడో పేర్కొన్నది. తూర్పు ఆసియా సముద్రంలో చైనా నౌకాదళానికి చెందిన వివిధ రకాల వంద నౌకలు పాల్గ్గొన్నట్లు రాయిటర్స్‌ వార్త ఆరోపించింది. తమ నౌకలు పశ్చిమ పసిఫిక్‌ ప్రాంతంలో ఇలాంటి విన్యాసాలు జరపటం సాధారణమని అయితే ప్రతిసారీ జపాన్‌ తమకు చైనా నుంచి ముప్పు ఉందని చెప్పేందుకు, తన మిలిటరీ శక్తిని పెంచుకొనేందుకు వాటిని బూతద్దంలో చూపుతున్నదని, అంతర్జాతీయ సూత్రాలకు అనుగుణంగానే తాము జరుపుతున్నట్లు, జపాన్‌ ఆత్మరక్షణ రాజ్యాంగం నుంచి పక్కకు జరుగుతున్నదని చైనా నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.వాటి మీద అతిగా స్పందించటం, విపరీత భాష్యాలు ఎవరూ చెప్పకూడదని చైనా విదేశాంగశాఖ ప్రతినిధి లిన్‌జియాన్‌ చెప్పాడు.అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా జరుపుతున్న తమ విన్యాసాల గురించి గుండెలు బాదుకుంటున్న జపాన్‌ అదే పని అమెరికా చేస్తుంటే ఎందుకు మౌనంగా ఉంటున్నదని చైనా ప్రశ్నిస్తోంది.

తైవాన్‌ సమస్యపై రెచ్చగొడుతున్న జపాన్‌ తీరును చూస్తే అమెరికా పన్నిన వ్యూహంగా కనిపిస్తోంది. ఈ వివాదం చెలరేగిన సమయంలోనే తైవాన్‌ సమస్యపై తక్షణమే చైనాతో యుద్ధం రాకుండా చూసుకోవాలని ఒక పథకం రూపొందించినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. ముందుగా అమెరికా, దాని మిత్రదేశాలు మిలిటరీ బలాన్నిపెంచుకోవాలని, చైనా వైపునుంచి తైవాన్‌, జపాన్‌ మీద వత్తిడి పెరుగుతున్నదని డిసెంబరు ఐదున ప్రచురించిన ఒక పత్రంలో అమెరికా జాతీయ వ్యూహకర్తలు పేర్కొన్నారు.2017లో ప్రచురించిన పత్రంలో ఒక వాక్యంలో మూడుసార్లు తైవాన్‌ ప్రస్తావన చేయగా తాజా పత్రంలో మూడు పేరాల్లో ఎనిమిదిసార్లు ఉన్నట్లు రాయిటర్స్‌ తెలిపింది. వాణిజ్య యుద్దాలు జరుగుతున్న, సెమికండక్టర్ల ఉత్పత్తిలో ఆధిపత్యం వహిస్తున్న ప్రాంతంలో తైవాన్‌ గురించి సరిగానే కేంద్రీకరించినట్లు, జపాన్‌ నుంచి ఆగేయాసియా వరకు ఏ దీవి మీద కూడా ఎక్కడా దురాక్రమణ జరగకుండా అమెరికా మిలిటరీ సామర్ధ్యాన్ని పెంచుకోవాలని ఆ పత్రం పేర్కొన్నది. ఇదే సమయంలో అమెరికా ఒక్కటే చేయలేదని, చేయకూడదని, మిత్రదేశాలు మిలిటరీ ఖర్చు పెంచుకోవాలని, ఉమ్మడిగా రక్షణకు పని చేయాలని హితవు పలికింది.ఈ బలం తైవాన్‌ ఆక్రమణ యత్నాలు మానుకొనే స్థాయికి పెరగాలని కోరింది. ఈ వ్యూహం, ఎత్తుగడల్లో భాగంగానే ఆత్మరక్షణ యుద్ధం నుంచి ఎదురుదాడులు చేసే విధంగా ఆయుధాలను పెంచుకోవాలని జపాన్‌ చూస్తున్నది, దానికి సాకుగా చైనా బూచిని చూపుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తున్నది !

Share this:

  • Tweet
  • More
Like Loading...

అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

30 Sunday Nov 2025

Posted by raomk in BJP, CHINA, Congress, Current Affairs, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Political Parties, USA, WAR

≈ Leave a comment

Tags

14th Dalai Lama, 1962 India–China war, Anti China Media, Arunachal Pradesh Dispute, CIA on Tibet, CPI, CPI(M), Jawaharlal Nehru, Mao Zedong, Narendra Modi, USSR

ఎం కోటేశ్వరరావు

ఇటీవల చైనాతో సంబంధం ఉన్న రెండు వార్తలు, విశ్లేషణలు మీడియాలో వచ్చాయి.ఒకటి, 1962లో చైనాతో వచ్చిన యుద్ధం సరిహద్దు సమస్యల మీద కాదు, రెండవది అరుణాచల్‌ ప్రదేశ్‌కు చెందిన మన పౌరురాలి పాస్‌పోర్టు, వీసా చెల్లదు అని చైనా విమానాశ్రయంలో ఇబ్బంది పెట్టారు అన్నది రెండవది. మొదటి అంశాన్ని మన మీడియా పెద్దగా పట్టించుకోలేదు, రెండవదాని మీద పెద్ద ఎత్తున స్పందించింది, ఎందుకు ?చైనాతో వచ్చిన యుద్దం గురించి వచ్చిన విశ్లేషణ మీద కేంద్ర ప్రభుత్వం మౌనంగా ఉంది, దాని మనసెరిగి, కనుసన్నలలో నడుస్తున్న మీడియా కావాలనే విస్మరించింది. రెండవ ఉదంతం మీద దానికి భిన్నంగా జరిగింది. చరిత్ర దాస్తే దాగేది కాదు, చెరిపితే పోయేది కాదు.రెండు దేశాల మధ్య యుద్ధం ప్రాధమికంగా సరిహద్దులపై ఏకాభిప్రాయం లేకపోవటం లేదా దౌత్యపరమైన వైఫల్యాల వలన జరగలేదని, పథకం ప్రకారం 1950 మరియు 60దశకాల్లో అమెరికా అనుసరించిన వ్యూహంలో భాగంగా చోటు చేసుకుందని సిఐఏ, దౌత్యకార్యాలయాల పత్రాలు, ప్రచ్చన్న యుద్ద అంతర్జాతీయ చరిత్ర ప్రాజెక్టు పత్రాలు వెల్లడించాయి. కొన్ని ప్రధాన మంత్రి మ్యూజియం మరియు లైబ్రరీలో కూడా ఉన్నట్లు పేర్కొన్నారు.

చైనాతో ఉన్న సరిహద్దు వివాదాన్ని సంప్రదింపులతో పరిష్కరించుకోవాలన్న వైఖరిని వెల్లడించినందుకు తరువాత సిపిఐ(ఎం)గా ఏర్పడిన నాయకులను యుద్ధ సమయంలో ప్రభుత్వం, నాడు జనసంఘం రూపంలో ఉన్న నేటి బిజెపి నేతలు, ఆర్‌ఎస్‌ఎస్‌, ఇతర పార్టీలు, సంస్థలు దేశద్రోహులుగా చిత్రించాయి. ప్రభుత్వం జైల్లో పెట్టింది. యుద్దాన్ని సమర్ధించి నాటి కేంద్ర ప్రభుత్వానికి మద్దతు తెలిపిన సిపిఐతో ఇతరులను దేశభక్తులుగా చిత్రించారు, జనం కూడా అత్యధికులు నిజమే అని నమ్మారు. అది జరిగి ఆరు దశాబ్దాలు దాటింది. ఇప్పుడు వెలువడిన నిజానిజాలేమిటి ? యుద్ధానికి కారణం సరిహద్దు సమస్య కాదని, టిబెట్‌ కేంద్రంగా అమెరికా జరిపిన కుట్రలో భాగంగా జరిగిందని ఇటీవల బహిర్గత పరచిన నాటి రహస్య పత్రాలను అధ్యయం చేసిన వారు చెప్పిన మాట ఇది. వారెవరూ కమ్యూనిస్టులు కాదు. ఆ పత్రాలన్నీ అందరికీ అందుబాటులో ఉన్నాయి గనుక దీనికి భిన్నమైన విశ్లేషణను ఎవరైనా జనం ముందు పెట్టవచ్చు. అప్పటి వరకు కమ్యూనిస్టుల మీద నిందవేయటం తప్పని దాన్ని వెనక్కు తీసుకుంటామని ఎవరైనా నిజాయితీతో అంగీకరిస్తారా ?

” 1962 చైనా-భారత్‌ సంఘర్షణ భౌగోళిక రాజకీయ పరిణామాల వెల్లడి : చైనాా-భారత్‌ విభజనను అమెరికా ఎలా మలచింది ? ” అనే శీర్షికతో అమెరికాలోని పబ్లిక్‌ ఎఫైర్స్‌ జర్నల్‌ ఏప్రిల్‌ 2025 సంచికలో వెల్లడించారు. దాని రచయిత జిందాల్‌ స్కూల్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ ఎఫైర్స్‌లో పని చేస్తున్న డాక్టర్‌ లక్ష్మణ కుమార్‌. ది హిందూ బిజినెస్‌లైన్‌ పత్రికతో ఆయన సంభాషించిన అంశాలను ఆ పత్రిక ప్రచురించింది. సోషలిస్టు దేశాలపై అమెరికా ప్రారంభించిన ప్రచ్చన్న యుద్దం, సోవియట్‌ యూనియన్‌-చైనా మధ్య తలెత్తిన సైద్ధాంతిక వివాదాలను ఆసరా చేసుకొని టిబెట్‌ అంశాన్ని ముందుకు తెచ్చి భారత్‌-చైనా మధ్య వివాదాన్ని రగిలించేందుకు అమెరికా రూపొందించిన దీర్ఘకాలిక కుట్రకు రెండు దేశాలూ గురయ్యాయి. నాటి నుంచి నేటి వరకు తరువాత కాలంలో సాధారణ సంబంధాలు ఏర్పడినప్పటికీ పరస్పరం నమ్మకంలేకుండా గడుపుతున్నాయంటే అతిశయోక్తి కాదు. అమెరికా ఎత్తుగడ నిజానికి టిబెట్‌ తిరుగుబాటుదార్లకు ఏదో చేద్దామని కాదు, వారికి సాయపడే ముసుగులో భారత్‌-,చైౖనా మధ్య వైరం పెంచటమే అసలు లక్ష్యంగా రహస్య పత్రాల్లో వెల్లడైంది.

1962 అక్టోబరు 20న చైనా దాడి ప్రారంభించి నవంబరు 20న ఏకపక్షంగా కాల్పుల విరమణ ప్రకటించి అరుణాచల్‌ ప్రదేశ్‌లో తన ఆధీనంలోకి తెచ్చుకున్న ప్రాంతాల నుంచి సేనలను ఉపసంహరించుకొని వాస్తవాధీన రేఖకు పరిమితమైంది. అవి తన ప్రాంతాలని అంతకు ముందునుంచి చెబుతున్నప్పటికీ చైనా వెనక్కు తగ్గింది. టిబెట్‌లో జరిగిన కుట్రల క్రమ సారాంశం ఇలా ఉంది.1956లో అక్కడ దలైలామా పలుకుబడిలో ఉన్న ప్రభుత్వ మద్దతుతో తిరుగుబాటుకు నాందిపలికారు. సిఐఏ దాన్ని అవకాశంగా తీసుకొని ముందే చెప్పుకున్నట్లు 1957 నుంచి 1961వరకు వారికి శిక్షణ, ఆయుధాలు,రేడియోలు, ఇతర పరికరాలను ఇచ్చింది.విమానాల ద్వారా 250టన్నుల మిలిటరీ సరఫరాలు చేసింది.నిఘావిమానాల ద్వారా సమాచారాన్ని అందచేసింది. చైనా మిలిటరీ తిరుగుబాటును అణచివేయటంతో 1959లో దలైలామాను టిబెట్‌ నుంచి తప్పించి అరుణాచల్‌ ప్రదేశ్‌ ద్వారా భారత్‌కు చేర్చారు.దీనికి నాటి నెహ్రూ సర్కార్‌ పూర్తి మద్దతు ఇచ్చింది, అధికారులను పంపి మరీ స్వాగత ఏర్పాట్లు చేసిందంటే అమెరికా సిఐఏతో సమన్వయం చేసుకోకుండా జరిగేది కాదు. అంతేనా మన దేశంలో ఆశ్రయం కల్పించటమే గాక తిరుగుబాటు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశమిచ్చింది. దీన్ని రెచ్చగొట్టటం, తమ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటంగా చైనా పరిగణించింది.1961లో ఉత్తర నేపాల్లోని ముస్టాంగ్‌కు సిఐఏ తన కార్యకలాపాలను విస్తరించింది. దలైలామా పరారీ తరువాత అరుణాచల్‌ప్రదేశ్‌లో చైనా మిలిటరీ మన సైనికుల మధ్య చిన్నపాటి ఘర్షణ జరిగింది.చైనాను నిలువరించాలని ప్రధాని నెహ్రూ నాటి సోవియట్‌ నేతలను కోరారు. అయితే తాము తటస్థంగా ఉంటామనే సందేశాన్ని వార్తల ద్వారా సోవియట్‌ పంపింది. తరువాత దాని నేత కృశ్చెవ్‌ 1959 అక్టోబరు రెండున బీజింగ్‌ పర్యటనలో నెహ్రూ మంచివాడని, భారత్‌తో వైరం వద్దని మావోకు సూచించటంతో ఈ వైఖరి చైనా-సోవియట్‌ మధ్య విబేధాలను పెంచింది. సరిహద్దు సమస్యలను పరిష్కరించుకుంటామని అది పెద్ద సమస్య కాదని, అసలు అంశం టిబెట్‌ అని ఈ విషయంలో భారత్‌తో రాజీపడేది లేదని మావో చెప్పినట్లు కథనాలు వచ్చాయి. దాని పర్యవసానాలు మనదేశంలో కూడా ప్రతిబింబించాయి. అవిభక్త కమ్యూనిస్టు పార్టీలోని ఒక వర్గం సోవియట్‌ వైఖరికి అనుగుణంగా నెహ్రూ అనుకూల, చైనా వ్యతిరేక వైఖరిని తీసుకుంది.దానికి భిన్నంగా సరిహద్దు వివాదాలను చర్చల ద్వారా సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలనే వైఖరిని మరో వర్గం తీసుకుంది. అందుకు వారిని జైలుపాలు చేశారు. తరువాత వారే సిపిఐ(ఎం)గా ఏర్పడ్డారు. నాటి నుంచి నేటి వరకు జరిగిన పరిణామాలు సిపిఐ(ఎం) వైఖరే సరైనదని రుజువు చేశాయి.సరిహద్దు వివాదం ఉన్నప్పటికీ కాంగ్రెస్‌, బిజెపి ఎవరు అధికారంలో ఉన్నా వాటి మీద ఎవరి వైఖరికి వారు కట్టుబడి ఉంటూనే చైనాతో సంబంధాలను కొనసాగించారు. ఏ ప్రధానీ కలవనన్ని సార్లు చైనా నేతలతో భేటీ అయి నరేంద్రమోడీ ఒక రికార్డు సృష్టించారు.చైనా నుంచి చేసుకుంటున్న దిగుమతులలో మోడీ తన రికార్డును తానే బద్దలు కొట్టుకున్నారు.

అసలు రెండు దేశాల మధ్య యుద్దానికి దారితీసిన పరిస్థితి ఏమిటి ? తెరవెనుక అమెరికా సృష్టించిన టిబెట్‌ చిచ్చుకాగా బయటికి సరిహద్దు వివాదంగా ముందుకు వచ్చింది.1954లో చైనా-భారత్‌ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదు. అయితే అప్పటికే అమెరికా కుట్ర మొదలైంది. దాన్లో భాగంగా బుద్ద జయంతిని జరుపుకొనే పేరుతో 14వ దలైలామా భారత్‌ వచ్చాడు. ఆ సందర్భంగా అంగీకరిస్తే భారత్‌లో ఆశ్రయం పొందుతానని చేసిన వినతిని నెహ్రూ తిరస్కరించారు. కానీ అదే నెహ్రూ సిఐఏ పధకం ప్రకారం టిబెట్‌ నుంచి పారిపోయి 1959 ఏప్రిల్‌ 18న అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తేజ్‌పూర్‌ చేరుకున్న దలైలామాకు మానవతాపూర్వక కారణాల సాకుతో ఆశ్రయం ఇవ్వటమేగాక ప్రవాస ప్రభుత్వ ఏర్పాటుకూ అనుమతించించారు. వేలాది మంది టిబెట్‌ నుంచి వచ్చిన వారికీ ప్రభుత్వం ఆశ్రయం కల్పించింది. కాలనీలను ఏర్పాటు చేసింది. ఇప్పటికీ అదే కొనసాగుతోంది.సరిహద్దులో మన ప్రభుత్వం 1961 కొన్ని పోస్టులను కొత్తగా ఏర్పాటు చేసి ఆ ప్రాంతం తమ అదుపులోనే ఉందని ఉద్ఘాటించింది. అప్పటికే దలైలామా ప్రవాస ప్రభుత్వం చైనా వ్యతిరేక కార్యకలాపాలను సాగిస్తోంది.దీనికి తోడు సరిహద్దుల్లో కొత్తగా పోస్టులను ఏర్పాటు చేయటాన్ని అవకాశంగా తీసుకొని చైనా వాటిని తొలగించేందుకు పూనుకోవటం, మన మిలిటరీ ప్రతిఘటించటంతో అది తరువాత నెల రోజుల యుద్ధంగా మారింది.

అరుణాచల్‌ ప్రదేశ్‌ మహిళ ప్రేమా వాంగ్‌జోమ్‌ థోంగ్‌డాక్‌ దగ్గర ఉన్న పాస్‌పోర్టు చెల్లదంటూ షాంఘై పుడోంగ్‌ విమానాశ్రయ అధికారులు కొన్ని గంటల పాటు నిలిపివేశారంటూ వచ్చిన వార్తలకు మన మీడియా పెద్ద ఎత్తున ప్రచారమిచ్చిన సంగతి తెలిసిందే.మనదేశం, చైనాల మధ్య సరిహద్దులంటూ మాపులపై బ్రిటీష్‌ అధికారులు గీచిన రేఖలు రెండు దేశాల మధ్య వివాదాన్ని సృష్టించాయి. వివిధ సందర్భాలలో ప్రచురించిన మాప్‌ల ప్రకారం ప్రస్తుతం మన దేశంలో అంతర్భాగంగా ఉన్న అరుణాచల్‌ ప్రదేశ్‌ చైనాకు చెందినది, చైనా ఆధీనంలో ఉన్న లడఖ్‌ సమీపంలోని ఆక్సారుచిన్‌ ప్రాంతం మనదిగా చూపాయి. అందువలన రెండుదేశాలూ అవి తమ ప్రాంతాలని మాపుల్లో చూపుతున్నాయి. అరుణాచల్‌ తమ టిబెట్‌లోని దక్షిణ ప్రాంతమైన జాంగ్‌నాన్‌ అని చెబుతుండగా ఆక్సారు చిన్‌ మా లే (లడఖ్‌) జిల్లాలో భాగమని అంటున్నాము. దలైలామా 2023లో తవాంగ్‌ పర్యటన చేస్తామని ప్రకటించగా అనుమతించకూడదంటూ నాడు చైనా అభ్యంతరం చెప్పింది.అంతకు ముందు కూడా అభ్యంతరాల మధ్య పర్యటించినా చివరిసారిగా గాల్వన్‌ ఉదంతాల తరువాత ఏర్పడిన పరిస్థితుల నేపధ్యంలో పర్యటనను రద్దు చేసుకున్నాడు. అరుణాచల్‌ ప్రదేశ్‌-భారత్‌ పేరుతో ఉన్న పాస్‌పోర్టు, వీసాలను చైనా తిరస్కరించటం ఇదే మొదటిసారి కాదు. పాస్‌పోర్టు మీద స్టాంప్‌ వేయటానికి నిరాకరించి ఒక తెల్లకాగితం మీద అనుమతి పత్రాన్ని జారీ చేస్తామని చైనా చెప్పింది. దానికి నిరాకరించిన మనదేశం చైనాలో జరిగిన ఆసియా క్రీడలకు మన క్రీడాకారులను పంపలేదు. తాజాగా ప్రేమ అనే మహిళ విషయంలో కూడా అదే జరిగింది, మీరు భారతీయురాలు కాదు, చైనీస్‌ అందువలన వీసా కోసం దరఖాస్తు చేసుకోండి అని చైనా అధికారులు చెప్పినట్లు వార్తలు వచ్చాయి.

చిత్రం ఏమిటంటే మన దేశంలో ఆశ్రయం పొంది,ప్రవాస టిబెట్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 1959 నుంచి అన్ని సౌకరాలను అనుభవిస్తున్న 14వ దలైలామా 2003లో మాట్లాడుతూ అరుణాచల్‌ ప్రదేశ్‌ టిబెట్‌లో అంతర్భాగం అన్నాడు తప్ప మనదేశంలో భాగం అని గుర్తించలేదు. అయినప్పటికీ అతగాడికి సౌకర్యాలు కల్పించటం రాజకీయం తప్ప వేరు కాదు. మనదేశం తెచ్చిన వత్తిడి, విధిలేని పరిస్థితిలో 2008లో తన వైఖరిని మార్చుకున్నాడు. 1914లో బ్రిటీష్‌ వారు గీచిన మక్‌మోహన్‌ రేఖను భారత్‌-టిబెట్‌ సరిహద్దుగా నిర్ణయిస్తూ బ్రిటీష్‌ ఇండియా పాలకులు టిబెట్‌ పాలకులతో సిమ్లాలో ఒప్పందం చేసుకున్నారు.బ్రిటీష్‌ వారి పాలనకు చరమగీతం పాడారు, దాంతో ఉక్రోషం పట్టలేని బ్రిటన్‌ కుట్రకు తెరలేపింది. అప్పుడే స్వాతంత్య్రం పొందిన చైనాకు టిబెట్‌ మీద హక్కులేదని చెప్పేందుకు బ్రిటీష్‌ పాలకులు పన్నిన కుట్రలో భాగం సిమ్లా ఒప్పందమంటూ నాటి, నేటి చైనా ప్రభుత్వం అంగీకరించలేదు. టిబెట్‌ తమ సామంత దేశమని అంతర్జాతీయ ఒప్పందాలు చేసుకొనేందుకు దాని పాలకులకు హక్కు లేదు, చెల్లదని చైనా చెబుతున్నది. ఉదాహరణకు, బ్రిటీష్‌ పాలనలో సామంత రాజ్యాలుగా ఉన్న కాశ్మీరు, నిజాం సంస్థానాలు స్వాతంత్య్రం ప్రకటించుకోవటాన్ని నాడు మన కేంద్ర ప్రభుత్వం అంగీకరించలేదు. ఈ పూర్వరంగంలో సరిహద్దు వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవటం తప్ప దగ్గరదారి లేదు. అప్పటి వరకు యథాతధ స్థితి కొనసాగించాల్సి ఉంది. రెండు దేశాలూ ఎవరి వైఖరికి వారు కట్టుబడి ఉన్నప్పటికీ సాధారణ సంబంధాలకు ఢోకా ఉండదు. వివాదాన్ని కాలమే పరిష్కరించాల్సి ఉంది. యుద్ధాల ద్వారా ప్రాంతాలను స్వాధీనం చేసుకోవటం కుదిరే అంశం కాదు. ఆక్రమిత కాశ్మీరుపై మనకు తిరుగులేని హక్కు ఉంది, ఎలాంటి వివాదం లేకున్నా బలప్రయోగంతో స్వాధీనం చేసుకొనేందుకు పూనుకోలేదు. చైనా గురించి న్యూయార్క్‌ టైమ్స్‌ వంటి అమెరికా బడా పత్రికలు అనేక తప్పుడు వార్తలు ఇచ్చాయి. మీడియాలో వచ్చే వార్తలు, వ్యాఖ్యలు లేదా అధికారంలో లేని సంస్థలు, వ్యక్తులు చేసే వ్యాఖ్యలు, రెచ్చగొట్టే అంశాలకు రెండు దేశాలకు చెందిన పౌరులు భావోద్వేగాలకు గురైతే బుర్రలు ఖరాబు చేసుకోవటం తప్ప జరిగేదేమీ ఉండదు. వివాదాలు పభుత్వాలు తేల్చాల్సిన, తేల్చుకోవాల్సిన అంశాలని గ్రహించాలి !

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనాకు భారత ఎగుమతులు పెరిగాయా ! జనాలకు గోడీ మీడియా చెబుతున్న నిజానిజాలేమిటి !!

26 Wednesday Nov 2025

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Uncategorized

≈ Leave a comment

Tags

#India trade matters, BJP, China exports, India exports and Imports, Media Bluffing, Narendra Modi Failures, world exports

ఎం కోటేశ్వరరావు

చైనాకు ఏడు నెలల్లో 25శాతం పెరిగిన భారత ఎగుమతులు. మీడియాలో కొద్ది రోజుల క్రితం వచ్చిన శీర్షిక ఇది. ఏప్రిల్‌ నుంచి అక్టోబరు వరకు వరుసగా ఏడు నెలల నుంచీ పెరుగుతూనే ఉన్నాయి.మంచిదే, మన ఎగుమతులు ఏమాత్రం పెరిగినా సంతోషించాల్సిందే. అయితే అసలు కథేమిటంటే నరేంద్రమోడీకి భజన చేసేందుకు అలవాటు పడిన వారు చేసిన జిమ్మిక్కు లేదా తిమ్మిని బమ్మిని ఇది. నిజంగా జరిగిందేమిటి ? గతేడాదితో పోలిస్తే ఎగుమతులు పెరిగిన మాట నిజం. ఇదే సమయంలో చైనా నుంచి దిగుమతులు అంతకంటే ఎక్కువగా పెరిగిన సంగతి, పదేండ్ల స్థాయికి ఎగుమతులు పడిపోయిన నిజాన్ని జనాలకు చెప్పరేం ! నరేంద్రమోడీ ఏలుబడి పదకొండు సంవత్సరాలను మూడు భాగాలుగా విభజిద్దాం. 2014-15 నుంచి 2018-19 మధ్య కాలంలో చైనాకు మన ఎగుమతులు 11.96 నుంచి 16.75 బిలియన్‌ డాలర్లకు పెరిగాయి. తరువాత మూడు సంవత్సరాలలో 21.56 బిలియన్‌ డాలర్లకు చేరాయి. అప్పటి నుంచి 2024-25లో 14.25 బిలియన్‌ డాలర్లకు పతనమయ్యాయి. గత ఏడాది తొలి ఏడు నెలలతో పోల్చి చూపి వర్తమాన సంవత్సరంలో 10.03 బిలియన్‌ డాలర్లకు 25శాతం పెరిగినట్లు చిత్రించారు. మిగిలిన ఐదు నెలల కాలంలో గత ఏడాది మొత్తాలకు చేరవచ్చు, స్వల్పంగా పెరగవచ్చు తప్ప గతంలోని 21.56 బిలియన్‌ డాలర్లకు చేరే స్థితి ఉందా ? చైనాకు మన ఎగుమతులు పెరగటం వెనుక అంతర్జాతీయ రాజకీయాలు కూడా లేకపోలేదు. అమెరికా వైపు మొగ్గుచూపుతున్న నరేంద్రమోడీకి పన్నుల రూపంలో ట్రంప్‌ తీసుకున్న వైఖరి మింగుడు పడలేదు.ఈ స్థితిలో ఎత్తుగడగా అవసరం ఉన్నా లేకున్నా చైనా ఏప్రిల్‌ నుంచి మన దేశం నుంచి దిగుమతులను పెంచింది, దీని కొనసాగింపు రానున్న రోజుల్లో మనదేశం అనుసరించే వైఖరిని బట్టి ఉంటుంది.చైనాకు మన మార్కెట్‌ను ఎంతగా తెరిస్తే దానికి ప్రతిగా మనకూ మేలు చేకూరే విధంగా బీజింగ్‌ వ్యవహరిస్తుందని వేరే చెప్పనవసరం లేదు. చైనా పెట్టుబడులను స్వీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. మన దేశం నుంచి విమానాలను నడిపేందుకు రెండు చైనా కంపెనీలు దరఖాస్తు చేసినట్లు తాజా వార్తలు వెల్లడించాయి.

చైనా మీద ఆధారపడకూడదు, దాన్ని పక్కకు నెట్టేసి అసలు మనమే ప్రపంచానికి వస్తువులను ఎగుమతులు చేద్దాం అంటూ పైకి ఎన్ని కబుర్లు చెప్పినా అలాంటి సూచనలు లేవు.తొలి ఏడు నెలల్లో ఎగుమతులు పెరిగాయని చెప్పిన వారు అదే సమయంలో చైనా నుంచి దిగుమతులు 57.65 నుంచి 64బిలియన్‌ డాలర్లకు పెరిగాయని చెబితే నిజాయితీగా ఉంటుంది. గత సంవత్సరం చైనాతో మన వాణిజ్య లోటు 99.12 బిలియన్‌ డాలర్లు. దీన్నే మరోవిధంగా చెప్పాలంటే నరేంద్రమోడీ సర్కార్‌ అసమర్ధతకు బీజింగ్‌కు మనం చెల్లించిన మూల్యం.ఇంకా చెప్పాలంటే గత పదకొండు సంవత్సరాల్లో 701.95 బిలియన్‌ డాలర్లు సమర్పించుకున్నాం. మోడీ అధికారానికి వచ్చిన తొలి ఏడాది మన వాణిజ్య లోటు 48.45 బిలియన్‌ డాలర్లు కాగా పదకొండేండ్లలో రెట్టింపై 99.21 బి.డాలర్లకు చేరింది, ఎందుకని ? గత ఐదు సంవత్సరాల్లో చైనాకు మన ఎగుమతులు 33శాతం పడిపోగా దిగుమతులు 74శాతం పెరిగాయి. ఆత్మనిర్భరత ఏమైనట్లు, ప్రపంచంలో పెరిగినట్లు చెబుతున్న మోడీ పలుకుబడి సంగతేమిటి ? కాంగ్రెస్‌ యాభై ఏండ్లలోచేయలేని వాటిని తాను తొలి ఐదేండ్లలోనే చేసినట్లు గతంలో చెప్పుకున్నారు. సంతోషం. వర్తమాన అవసరాలకు అనుగుణంగా వస్తూత్పత్తిని ఎందుకు చేయలేకపోయినట్లు ? రెండింజన్ల పాలనే కదా ఉన్నది. యాపిల్‌ ఐఫోన్లను తయారు చేస్తున్నాం, ఎగుమతి చేస్తున్నాం చూడండహౌ అంటూ ప్రచారం చేస్తున్నారు. మిగతా ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తుల సంగతేమిటి ? గ్లోబల్‌ ట్రేడ్‌ రిసర్చ్‌ ఇనిస్టిట్యూట్‌(జిటిఆర్‌ఐ-ఇండియా) చెప్పినదాని ప్రకారం కీలకమైన ఎనిమిది పారిశ్రామిక ఉత్పత్తుల విషయంలో చైనా ప్రధాన సరఫరాదారుగా ఉంది. చైనా నుంచి దిగుమతుల వలన రెండు రకాల నష్టాలు, ఒకటి స్థానిక మన పరిశ్రమలు గిడసబారిపోతున్నాయి, కార్మికులకు ఉపాధి దొరకటం లేదు.విలువైన విదేశీమారక ద్రవ్యాన్ని చైనాకు సమర్పించుకుంటున్నట్లు ముందే చెప్పుకున్నాం. గత కాంగ్రెస్‌ పాలనకూ మోడీ ఏలుబడికి తేడా ఏమిటి ? చైనా నుంచి దిగుమతుల్లో మన్మోహన్‌ సింగ్‌ రికార్డులనే కాదు, తన రికార్డులను కూడా తానే మోడీ బద్దలు కొట్టుకున్నారు. చైనాతో తిరిగి సత్సంబంధాలను నెలకొల్పుకొనటం మంచిదే. కానీ అనేక వస్తువుల దిగుమతులపై ఆంక్షలను సడలించిన కారణంగా గత రికార్డులను అధిగమించే సూచనలు కనిపిస్తున్నాయి.

అమెరికాతో వాణిజ్య ఒప్పందం గురించి గత పదినెలలుగా చెబుతూనే ఉన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపివేతతో సహా అన్నీ డోనాల్డ్‌ ట్రంప్‌ చెబుతున్నట్లే జరుగుతున్నందున అనేక అనుమానాలు. ఇంతవరకు ఏం జరుగుతోందో జనానికి తెలియదు. ట్రంప్‌ చెబితే తప్ప మనకు తెలిసేట్లు లేదు, మన మార్కెట్‌ను వారి వస్తువులకు బార్లా తెరవాలని అమెరికా వత్తిడి తెస్తోంది. అదే జరిగితే స్థానిక పరిశ్రమలు, వాణిజ్యాలను మూసుకోవాల్సిందే అని మన కార్పొరేట్లు హెచ్చరిస్తున్నాయి. వర్తమాన ఆర్థిక సంవత్సరం తొలి ఏడునెలల్లో మన ఎగుమతులు ఎక్కువగా అమెరికాకు జరిగితే దిగుమతులు చైనా నుంచి జరిగాయి. ఇదేం కుదరదు అన్నీ మానుంచే దిగుమతి చేసుకోవాలని ట్రంప్‌ బెదిరిస్తున్నాడు. అసలు సంగతేమిటంటే చైనా నుంచి తక్కువ ధరలకు వస్తున్నాయి గనుక దిగుమతి చేసుకుంటున్నాం తప్ప షీ జింపింగ్‌ మీద ప్రేమతో కాదు. అమెరికాకు చోటిస్తే ఎడారి వ్యాపారి, ఒంటె కథ మాదిరి దేశీయ సంస్థలను బయటకు నెట్టేయటం లేదా మింగివేస్తుంది. అందుకనే రెండు దేశాలతో సమన్వయం చేసుకోవటం మోడీకి కత్తిమీద సాములా ఉంది. రానున్న రోజుల్లో మనకు మేలు జరిగే విధంగా విదేశాంగ విధానం ఉండాలని ఇప్పటికే కార్పొరేట్ల లాబీ మాట్లాడుతోంది. కరవమంటే కప్పకు విడవమంటే పాముకు కోపం ! మన దేశ వస్తు ఎగుమతులను చూస్తే 2024లో 434.44 బిలియన్‌ డాలర్లు కాగా దిగుమతులు 698-702 బి. డాలర్ల మధ్య ఉన్నాయి. నిఖర వాణిజ్యలోటు 263.31బిలియన్‌ డాలర్లు. ఎగుమతుల్లో అమెరికా 18.3, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ 8.5, నెదర్లాండ్స్‌ 5.6, సింగపూర్‌ 3.6, చైనా 3.4,బ్రిటన్‌ 3.2, సౌదీ అరేబియా 2.8, బంగ్లాదేశ్‌ 2.6, జర్మనీ 2.4, ఇటలీ 1.92శాతాల చొప్పున ఉన్నాయి. 2024 జనవరి నుంచి జూన్‌ వరకు వివరాలు చూస్తే మన దేశం 151దేశాలతో వాణిజ్య మిగులు, 75దేశాలతో తరుగులో ఉంది. మోడీ భక్తులు చూశారా మానేత పలుకుబడి అని డబ్బా కొట్టుకోవటానికి ఈ అంకెలు తప్ప వాస్తవ పరిస్థితి ఏమిటోపైన చెప్పుకున్నాం. అమెరికాను వదులుకొనేందుకు భయపడటానికి, డోనాల్డ్‌ ట్రంప్‌ ఎంతగా అవమానించినా మౌనంగా ఉండటానికి అక్కడికి మన ఎగుమతులు ఎక్కువగా ఉండటమే.మరోవైపు ఐదేండ్లపాటు చైనాతో వైరంతో గడిపిన తరువాత సాధారణ సంబంధాలు ఏర్పరుచుకోవటానికి కారణం దాని మీద ఆధారపడాల్సి రావటమే. పదకొండు సంవత్సరాల్లో పరాధీనతను తగ్గించటానికి మోడీ చేసిందేమీ లేదు. అందుకే రాజీపడ్డాం. మన దిగుమతులను చూస్తే 2024లో చైనా నుంచి 15.5,రష్యా 9.1, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ 8.6, అమెరికా 6.1, సౌదీ అరేబియా 4.3, ఇరాక్‌ 4.2, ఇండోనేషియా 3.4,స్విడ్జర్లాండ్‌ 3.1,దక్షిణ కొరియా 3, సింగపూర్‌ 2.9శాతం చొప్పున ఉన్నాయి. గాల్వన్‌ లోయ ఉదంతాల సమయంలో కాషాయ దళాలు చైనా నుంచి దిగుమతుల నిలిపివేస్తే డ్రాగన్‌ మన కాళ్ల దగ్గరకు వస్తుందంటూ ఊగిపోయారు.నిజానికి మనకు అంత సీన్‌ లేదు, 2024లో చైనా నుంచి దిగుమతులు చేసుకున్న మొదటి పది దేశాలలో మనం కేవలం 3.4శాతంతో ఆరవ స్థానంలో ఉన్నాం.

మన ఎగుమతులు, దిగుమతులు రెండు రకాలు. ఒకటి వస్తువులు, రెండవది సేవలు. వస్తు లావాదేవీల్లో 2014-15లో లోటు 137 బిలియన్‌ డాలర్ల నుంచి 2024-25 నాటికి 283బి.డాలర్లకు పెరిగింది. సేవల విషయంలో ఇదే కాలంలో మిగులు 74 నుంచి 189 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. రెండింటినీ కలిపి చూసినపుడు నిఖర లోటు 63 నుంచి 94 బిలియన్‌ డాలర్లకు పెరిగింది.ప్రపంచంలో 2024లో మొత్తం 24.5లక్షల కోట్ల డాలర్ల విలువగల వస్తు ఎగుమతులు జరగ్గా ఎగువన ఉన్న 30దేశాల వాటా 20.3లక్షల కోట్ల డాలర్లు.మొదటి స్థానంలో ఉన్న చైనా వాటా 14.6 శాతం కలిగి మొదటి స్థానంలో ఉండగా పద్దెనిమిదవదిగా మనదేశ వాటా కేవలం 1.8శాతమే, రష్యా, స్విడ్జర్లాండ్‌ కూడా ఇదే వాటాను కలిగి ఉన్నాయి. చైనాను వెనక్కు నెట్టేయాలన్న సంకల్పాన్ని ఎవరూ కాదనరు, పోటీ పడాల్సిందే. కానీ ఒక్కసారిగా ఈ పరిస్థితి మారాలన్నా, 2047 నాటికి దేశాన్ని ఎక్కడికో తీసుకుపోవాలన్నా నరేంద్రమోడీ అల్లావుద్దీన్‌ అద్భుత దీపాన్ని సంపాదించాల్సిందే. అల్లావుద్దీన్‌ ముస్లిం మేం బరాబర్‌ హిందువులం పొడగిట్టదు అని అంటారా, మనోభావాలను ముందుకు తెస్తే మన వేదాల్లో ఉన్నవాటిని వెలికి తీయాలి మరి, దగ్గరిదారి లేదు, చేస్తారా !

Share this:

  • Tweet
  • More
Like Loading...

అమెరికాకు చెంపపెట్టు – 2025 జి20 సభ !

26 Wednesday Nov 2025

Posted by raomk in Africa, CHINA, Current Affairs, Europe, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

2025 G20 Summit, Donald trump, G20 Johannesburg meet, Narendra Modi

ఎం కోటేశ్వరరావు

అమెరికా జి20 సదస్సును బహిష్కరించటమంటే ప్రపంచ ఆర్థిక ఆకర్షణ శక్తి వేరేవైపు మరలుతున్నదనేందుకు సూచిక అని కెనడా ప్రధాని మార్క్‌ కార్నే చెప్పాడు. ప్రపంచ రాజకీయాలలో కెనడా అమెరికా అనుయాయిగా ఉంటున్నది, కొన్ని సందర్భాలలో విబేధిస్తున్నది. నవంబరు 22,23వ తేదీలలో దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన 2025 సంవత్సర జి20 శిఖరాగ్ర సమావేశంలో కార్నే చేసిన ప్రసంగంలో ఈ వ్యాఖ్య చేశాడు. దీన్నే మరోవిధంగా చెప్పాలంటే అమెరికా కోడి కూయనంత మాత్రాన తెల్లవారకుండా ఉండదన్నాడు..” సంఘీభావం, సమానత్వం, సుస్థిరత ” అనే ఇతివృత్తంతో ఈ సమావేశం జరిగింది. ఐరాస నిర్దేశించిన 2030 నాటికి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు ఇంకా కేవలం ఐదు సంవత్సరాలు మాత్రమే వ్యవధి ఉన్న తరుణంలో ఈ సమావేశం జరిగింది. ఈ సదస్సును డోనాల్డ్‌ ట్రంప్‌ బహిష్కరించటమేగాక సమావేశ ప్రకటనను ఆమోదించవద్దంటూ ముందే అధ్యక్ష స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికాను బెదిరించాడు. వచ్చే ఏడాది జరిగే సదస్సుకు ఆతిధ్యం ఇచ్చే సభ్యదేశంగా, అధ్యక్ష స్థానాన్ని స్వీకరించాల్సి ఉండి కూడా ఒక చిన్న అధికారిని పరిశీలకుడిగా పంపాడు. బాధ్యతలను స్వీకరించే సాంప్రదాయ కార్యక్రమానికి కూడా రాకుండా దక్షిణాఫ్రికాను అవమానించాడు. ఈ ఏడాది మే నెలలో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రమాఫోసాను అమెరికా అధ్యక్ష భవనంలో మీడియా ముందే ట్రంప్‌ అవమానించాడు. తెల్లజాతీయుల ఆధీనంలోని భూములను స్వాధీనం చేసుకుంటున్న ఆఫ్రికన్ల వీడియోను చూపి ఇది శ్వేతజాతీయుల మారణకాండ అంటూ ట్రంప్‌ రచ్చ చేశాడు. అప్పటి నుంచి కక్షకట్టినట్లుగా ప్రవర్తిస్తున్నాడు. వారి విధానాలు తనకు నచ్చటం లేదని అందువలన అక్కడ జరిగే జి20సమావేశాలకు వెళ్లటం లేదని జూలైలోనే ప్రకటించాడు. దక్షిణాఫ్రికా వస్తువులపై గరిష్టంగా 30శాతం పన్నులను విధిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దౌత్యమర్యాదలను తుంగలో తొక్కిన డోనాల్డ్‌ ట్రంప్‌ చర్య పర్యవసానాల గురించి అనేక విశ్లేషణలు వెలువడుతున్నాయి.

ఒక సభ్యదేశమై ఉండి నిజంగా ప్రాతినిధ్యం వహించాలని అనుకుంటే సరైన స్ధాయి ఉన్న ఎవరినైనా పంపవచ్చు, ఇది అధినేతల సమావేశం, సరైన స్థాయి అంటే తన ప్రతినిధిగా ప్రత్యేకంగా ఆయా దేశాల అధ్యక్షులు, ప్రధానులు పంపవచ్చు గాని అమెరికా చేసింది ఏమాత్రం సమర్ధనీయం కాదని దక్షిణాఫ్రికా విదేశాంగ మంత్రి రోనాల్డ్‌ లామోలా విమర్శించాడు. శతాబ్దాల తరబడి మైనారిటీ శ్వేతజాతీయులు దక్షిణాఫ్రికాలో సాగించిన జాత్యహంకార పాలన, ఆఫ్రికన్ల అణచివేత, బంటూస్థాన్‌(మన దళితవాడల వంటివి)లకే వారిని పరిమితం చేయటం వంటి దుర్మార్గం గురించి తెలిసిందే.1994లో ఆ పాలన అంతమైన తరువాత ఇన్నేండ్లకు అక్కడి శ్వేతజాతి రైతులను ప్రభుత్వం అణచివేస్తున్నదంటూ ట్రంప్‌ ఈ సమావేశాలను బహిష్కరించటం ఒక సాకు తప్ప మరొకటి కాదు.శ్వేత జాతీయుల మారణకాండ అని కూడా వర్ణించాడు. బహిష్కరించటమేగాక అమెరికా ఎదురుదాడికి దిగింది. అధ్యక్ష భవనపు మీడియా కార్యదర్శి కరోలిన్‌ లీవిట్‌ మాట్లాడుతూ దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్‌ రమాఫోసా తమ దేశ అధ్యక్షుడిపై నోరుపారవేసుకుంటున్నట్లు ఆరోపించింది.వాతావరణ మార్పు, ప్రపంచ సంపద అసమానతల వంటివాటిపై దక్షిణాఫ్రికా కేంద్రీకరించి సదస్సు ప్రకటనలో వాటిని ప్రస్తావించటాన్ని అమెరికా తట్టుకోలేకపోయినట్లు వార్తలు వచ్చాయి.తాము సమావేశాన్ని బహిష్కరించటమేగాక సదస్సు ప్రకటన వెలువడకుండా అడ్డుకుంటామని అమెరికా బెదిరించింది.తమ అంగీకారం లేకుండా ప్రకటన ఎలా చేస్తారని ప్రశ్నించింది. అమెరికా వైఖరిని ఒక్క అర్జెంటీనా తప్ప ఐరోపా, ఇతర ఖండాల దేశాలేవీ ఆమోదించలేదు. అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్‌ మిలి డోనాల్డ్‌ ట్రంప్‌ అనుయాయి, అతగాడు కూడా ప్రకటనను వ్యతిరేకించి సదస్సును బహిష్కరించాడు. దక్షిణాఫ్రికా అమెరికా ప్రయోజనాలకు వ్యతిరేకంగా పని చేస్తున్నదని, అక్రమవాణిజ్య పద్దతులను అనుసరిస్తున్నదని పాలస్తీనా మీద గట్టి వైఖరి తీసుకోవటమే గాక చైనా, రష్యాలతో కలుస్తున్నదని కూడా అమెరికా దాడి చేస్తున్నది. ఆర్థిక అసమానతల గురించి తక్షణమే చర్చించాల్సిన అవసరం ఉందని ప్రపంచ నేతలు గుర్తించిన తొలి సమావేశం ఇదని ఆక్స్‌ఫాం సంస్థ ప్రతినిధి మాక్స్‌ లాసన్‌ వ్యాఖ్యానించాడు.

ప్రపంచంలో అనేక కూటములు ఉన్నాయి. అవి సమావేశాలు జరపటం, సంకల్పాలు చెప్పుకోవటం, తీర్మానాలు ఆమోదించటం తప్ప సభ్య దేశాలకు వాటిని పాటించాల్సిన విధి లేదు. అలాంటి వాటిలో ఒకటి జి20. దీనిలో అర్జెంటీనా,ఆస్ట్రేలియ,బ్రెజిల్‌, కెనడా, చైనా,ఫ్రాన్సు, జర్మనీ, భారత్‌, ఇండోనేషియా, ఇటలీ, జపాన్‌, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, దక్షిణ కొరియా, టర్కీ, బ్రిటన్‌, అమెరికా దేశాలతో పాటు ఐరోపా యూనియన్‌, ఆఫ్రికా యూనియన్‌ సభ్యులుగా ఉన్నాయి. ఆహ్వానితులుగా నెదర్లాండ్స్‌, స్పెయిన్‌, ఐరాస, ప్రపంచ బ్యాంకు, ఆసియన్‌ కూటమి ఉంది. ఆఫ్రికా ఖండం నుంచి దక్షిణాఫ్రికా ఒక్కటే ఈ కూటమిలో ఉంది. తొలిసారిగా ఆఫ్రికా గడ్డమీద సదస్సు జరిగింది. జి20లోని సభ్య దేశాలు (ఐరోపా, ఆఫ్రికా యూనియన్లు మినహా) ప్రపంచ జిడిపిలో 85,అంతర్జాతీయ వాణిజ్యంలో 75, జనాభాలో 56, భూమిలో 60శాతం కలిగి ఉన్నాయి. అందువలన పరోక్షంగా ఈ దేశాల మీద ప్రభావం చూపేందుకు పెద్ద దేశాలన్నీ ప్రయత్నిస్తాయని వేరే చెప్పనవసరం లేదు. జోహన్నెస్‌ సభకు మన ప్రధాని నరేంద్రమోడీ హాజరై అన్ని ముఖ్య సమావేశాల్లో పాల్గ్గొన్నారు. పలుదేశాల నేతలతో జరిపిన చర్చలు ఫలితాలను ఇచ్చేవిగా ఉన్నాయని చెప్పారు. చైనా ప్రతినిధిగా ఆ దేశ ప్రధాని లీ క్వియాంగ్‌ పాల్గొన్నాడు.

జి7 ధనిక దేశాలే కాలక్షేపపు కబుర్లకు పరిమితం అవుతున్నపుడు భిన్న ధృవాలుగా ఉన్న జి20 అంతకు మించి ఫలవంతమైన చర్చల వేదికగా మారుతుందన్న భ్రమలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆర్థిక అంశాల కంటే రాజకీయ పరమైనవాటికే జోహన్నెస్‌బర్గ్‌ సమావేశాల వేదిక నాంది పలికింది. సదస్సు తీర్మానం గురించి సంతకాలు చేయవద్దని ట్రంప్‌ చేసిన విన్నపాల రూపంలో ఉన్న ఆదేశాలను ఎవరూ ఖాతరు చేయలేదు. ఇది దక్షిణాఫ్రికా విజయాల్లో ఒకటి. ముప్పై పేజీలు, 122 పేరాల అంతిమ ప్రకటనలో అనేక అంశాలు ఉన్నాయి. అది సాధారణ ప్రకటనగానే చూసే వారికి అనిపిస్తుంది, నిజం కూడా. అసమానతలు, రుణభారం, కీలకమైన ఖనిజాలు, ఇంథనం, సమానత్వం, నిరంతర అభివృద్ధి, పర్యావరణం ఇలా లేని అంశం లేదు. ముందే చెప్పుకున్నట్లు వాటిని అమలు జరపాల్సిన విధి సభ్యదేశాలకు లేదు గానీ వాటిని విస్మరిస్తే కుదరదు అనే సందేశాన్ని ఈ సమావేశం ఇచ్చింది.అసమానతల గురించి సదస్సు ఆమోదించిన పత్రంలో అరవై కోట్ల మంది ఆఫ్రికన్లకు విద్యుత్‌ అందుబాటులో లేదని పేర్కొన్నారు.2030 నాటికి పునరుత్పత్తి ఇంథనాన్ని మూడు రెట్లు, ఇంథన సామర్ధ్యాన్ని రెండు రెట్లు పెంచాలని పేర్కొన్నారు. ఆఫ్రికా దేశాలకు సంబంధించిన అభివృద్ధి రుణాలు, రుణ భారం తదితర అంశాల గురించి పరస్పరం సమాచార మార్పిడి,రుణాలు ఇచ్చే దేశాలు, సంస్థల పట్ల ఎలా వ్యవహరించాలి అనే అంశాలను పరిశీలించేందుకు ఒక నిపుణుల కమిటీ నియామకం ఈ సందర్భంగా జరిగింది. ఆఫ్రికాలో అభివృద్ధికి దక్షిణాఫ్రికా చొరవ, కృషికి ఒక గుర్తింపు దక్కింది. రెండు రోజుల పాటు 130 వర్కింగ్‌ గ్రూప్‌ల సమావేశాలను సమర్ధవంతంగా నిర్వహించటంలో అక్కడి ప్రభుత్వ సామర్ధ్యం వెల్లడైంది.

జోహన్నెస్‌బర్గ్‌ సమావేశానికి ట్రంప్‌ గైరుహాజరు కావటంతో నాయకత్వ స్థానంలోకి వచ్చేందుకు చైనాకు అవకాశం వచ్చిందంటూ కొందరు విశ్లేషణలు చేస్తున్నారు. అమెరికా పలుకుబడి కోల్పోతున్నదనే ఉక్రోషం దీనిలో ఎక్కువగా కనిపిస్తున్నది.అమెరికా ఏకపక్ష వైఖరి, పెత్తందారీతనం కారణంగా అనేక ఆఫ్రికా దేశాలు ఇప్పటికే చైనా వైపు చూస్తున్నాయి. ట్రంప్‌ తాజా వైఖరులతో అది వేగం పుంజుకొనే అవకాశాలు ఉన్నాయి. ప్రభావం పెంచుకొనేందుకు అమెరికాయే చైనాకు అవకాశం ఇస్తున్నదని దానితో పాటు ఐరోపా సమాఖ్య కూడా అవకాశాన్ని వినియోగించుకోవచ్చని బక్‌నెల్‌ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌ ఝీక్విన్‌ ఝ చెప్పాడు. అమెరికా బహిష్కరించిన వెంటనే దాని స్థానంలో చైనా చేరే అవకాశం ఉండదని అయితే మరింత నమ్మకమైన భాగస్వామిగా తనను తాను ప్రదర్శించుకొనేందుకు దోహదం చేస్తుందని బ్రిటన్‌ ఆర్థికవేత్త జింగ్‌ గు చెప్పారు.అంతర్జాతీయ సంస్థలు, పశ్చిమ దేశాలు విధించే కఠినమైన షరతులు లేకుండా ఇప్పటికే అనేక దేశాల్లో వివిధ ప్రాజక్టులకు చైనా సాయం చేసింది. ఆఫ్రికా ఇంథన అవసరాలలో భాగంగా ఇటీవలి కాలంలో చైనా నుంచి 60శాతం సౌరపలకలను దిగుమతి చేసుకున్నారు. బహిష్కరణ రాజకీయాలు, బెదిరింపులు చెల్లవని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రమాఫోసా అమెరికాను నేరుగానే హెచ్చరించాడు. ఈ ఏడాది ఇప్పటివరకు జి20తో పాటు దక్షిణ కొరియాలో జరిగిన ఆసియా-పసిఫిక్‌ ఆర్థిక సహకార సంస్థ(ఎపెక్‌), బ్రెజిల్లో జరిగిన ఐరాస వావావరణ మార్పు సమావేశాన్ని అమెరికా బహిష్కరించింది. ఇలాంటపుడు ఇతర దేశాలు చైనా వైపు చూడటం సహజం.అంతే కాదు డోనాల్డ్‌ ట్రంప్‌ ఏకపక్షంగా విధించిన దిగుమతి సుంకాలు కూడా దేశాలను ఆలోచింపచేస్తున్నాయి. ఆఫ్రికాలోని 22 దేశాల దిగుమతులపై ఇప్పటి వరకు ఎలాంటి పన్నులు లేకపోగా ట్రంప్‌ ఇప్పుడు 15 నుంచి 30శాతం విధించాడు. తమతో దౌత్య సంబంధాలు కలిగిన అన్ని ఆఫ్రికా దేశాల సరకులపై ఎలాంటి పన్ను విధించబోమని ఎపెక్‌ సమావేశంలో చైనా నేత షీ జింపింగ్‌ ప్రకటించాడు. చైనా ప్రధాని లీ ఐరాస 80వ వార్షిక సమావేశాల్లో మాట్లాడుతూ వాతావరణ మార్పులను ఉమ్మడిగా ఎదుర్కోవాలని పిలుపు ఇవ్వగా డోనాల్డ్‌ ట్రంప్‌ పునరుత్పత్తి ఇంథనం గురించి అపహాస్యంగా మాట్లాడాడు. వచ్చే ఏడాది డిసెంబరులో జి20 సమావేశాలు అమెరికా ఫ్లోరిడా రాష్ట్రంలోని మియామీలో జరగనున్నాయి. ఈ మేరకు డోనాల్డ్‌ట్రంప్‌ గతంలోనే ప్రకటించాడు. ఇరవై సంవత్సరాల చరిత్రలో అమెరికాలో జరగటం ఇదే తొలిసారి. జోహన్నెస్‌ సమావేశాల సందర్భంగా అమెరికా అనుసరించిన వైఖరి వచ్చే ఏడాది సమావేశాలపై ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది. ప్రపంచ రాజకీయాలు అనూహ్య మలుపులు తిరుగుతున్న పూర్వరంగంలో అనేక దేశాలు దాన్ని బహిష్కరించినా ఆశ్చర్యం లేదు !

Share this:

  • Tweet
  • More
Like Loading...

తగ్గేదే లేదని క్షిపణి ప్రయోగంతో జవాబిచ్చిన ఉత్తర కొరియా – వాణిజ్య ఒప్పందాలతో సాగిన ట్రంప్‌ ఆసియా పర్యటన !

29 Wednesday Oct 2025

Posted by raomk in CHINA, Current Affairs, imperialism, INTERNATIONAL NEWS, Japan, Opinion, USA, WAR

≈ Leave a comment

Tags

APEC, asean summit, Donald trump, Kim Jong-un, Trump business tour, Xi Jinping

ఎం కోటేశ్వరరావు

ఉత్తర కొరియా నేత కిమ్‌ జోంగ్‌ అన్‌కు అంగీకారమైతే తాను అతనితో కూడా భేటీ అవుతానని తన ఆసియా పర్యటనలో విలేకర్ల ప్రశ్నకు ట్రంప్‌ బదులిచ్చాడు. ఉత్తర కొరియాను అణ్వస్త్ర రహితం కావిస్తే పెద్ద బహుమతి( ఆంక్షల ఎత్తివేత) పొందుతారంటూ ట్రంప్‌ బిస్కెట్‌ వేసేందుకు చూశాడు. అయితే నా స్పందన ఇది అంటూ మంగళవారం నాడు సముద్రం మీద నుంచి ఉపరితలానికి క్రూయిజ్‌ క్షిపణిని ప్రయోగించి కిమ్‌ బదులిచ్చాడు. శత్రువుతో మాటలు కాదు చేతలే అని చెప్పినట్లయింది. అది జరిగేందుకు ఆస్కారం లేదనే చెప్పవచ్చు ! జపాన్‌ నుంచి బుధవారం నాడు దక్షిణ కొరియాకు వెళ్లే ముందు ఈ ప్రయోగం జరిపారు. తమ వద్ద ఉన్న అణ్వాయుధాల గురించి శత్రువులకు గుర్తు చేయటమే ఇదని ఉత్తర కొరియా అధికారిక మీడియా వర్ణించింది. ఈ ప్రయోగం భద్రతా మండలి విధించిన నిషేధాన్ని ఉల్లంఘించినట్లు కాదని, తమ అణ్వాయుధాల గురించి చర్చించటానికి తాము సిద్దం కాదనే సందేశం ఇచ్చినట్లని బిబిసి వర్ణించింది. దక్షిణ కొరియాలో జరిగే అపెక్‌ సమావేశానికి ఉత్తర కొరియా నేత కిమ్‌ హాజరు కావటం లేదు. వియత్నాంలో 2019లో ట్రంప్‌ ఆహ్వానం మేరకు కిమ్‌తో భేటీ జరిగింది. అయితే ఆ చర్చలు విఫలం కావటంతో తరువాత వారి మధ్య ఎలాంటి సమావేశమూ జరగలేదు. కిమ్‌కు అంగీకారమైతే తాను ఒక రోజు దక్షిణ కొరియాలో అదనంగా ఉంటానని ట్రంప్‌ విలేకర్లతో చెప్పాడు. దానికి కిమ్‌ నుంచి ఇంతవరకు ఎలాంటి జవాబు రాలేదు. అణు పరీక్షలు జరుపుతున్నందున ఉత్తర కొరియా మీద అమెరికా అనేక ఆంక్షలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. రష్యా మీద మరిన్ని ఆంక్షలు ప్రకటించిన తరువాత ఉత్తర కొరియా విదేశాంగ మంత్రి చోయి సన్‌ హుయి గత వారంలో మాస్కో వెళ్లి చర్చలు జరిపాడు. ట్రంప్‌ ఆసియా పర్యటన సందర్భంగా క్షిపణి పరీక్షలు నిర్వహించటం విశేషం.

మంగళవారం నాడు అమెరికా, జపాన్‌ మధ్య వాణిజ్య, విలువైన ఖనిజాల ఒప్పందం కుదిరింది.అధ్యక్షుడు ట్రంప్‌, జపాన్‌ ప్రధమ మహిళా ప్రధాని తకాయిచి టోక్యోలో సంతకాలు చేశారు.వివరాలు పూర్తిగా వెల్లడి కాలేదు. అమెరికాలో 550 బిలియన్‌ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు జపాన్‌ అంగీకరించగా ప్రతిగా దాని వస్తువులపై 15శాతం దిగుమతి పన్ను విధించేందుకు అమెరికా అంగీకరించింది. ట్రంప్‌కు కావాల్సినన్ని పొగడ్తలు తప్ప అమెరికాకు పెద్దగా ఒరిగిందేమీ లేదని డెమోక్రటిక్‌ పార్టీ మద్దతుదారైన న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక వ్యాఖ్యానించింది. ఈ ఒప్పందాలను రెండు దేశాల మధ్య సంబంధాలలో ” నూతన స్వర్ణయుగం ” అని వర్ణించారు.అదిరింపులు బెదిరింపుల మధ్య జూలై నెలలోనే పెట్టుబడులు, పన్నుల గురించి ఒక అవగాహన కుదిరినట్లు డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించాడు. అయితే మంగళవారం నాడు సంతకాలు జరగటానికి ముందు చివరి క్షణం వరకు అనేక అనుమానాలు షికారు చేశాయి. పశ్చిమాసియాలో శాంతి, థారులాండ్‌-కంపూచియా మధ్య వివాదాన్ని పరిష్కరించటంలో ట్రంప్‌ పాత్రను తకాయిచి ఆకాశానికి ఎత్తారు. అసాధారణ చారిత్రక విజయాలుగా ఆమె వర్ణించారు. వారి చర్చల తరువాతే టోక్యోలోని అక్సాకా పాలెస్‌లో జరిగిన స్వాగత కార్యక్రమానికి ట్రంప్‌ హాజరయ్యాడు. ఈ ఒప్పందం గురించి ప్రశంసలు, విమర్శలు గతంలోనే వెల్లడయ్యాయి.

జపాన్‌ నుంచి అమెరికా ఇప్పటివరకు లక్ష కోట్ల డాలర్ల మేర రుణాలుగా తీసుకుంది. అమెరికా డాలర్లకోసం ప్రతిదేశాన్నీ బెదిరిస్తున్నది. అయితే తాజాగా కుదిరిన ఒప్పందం గురించి గతంలోనే ట్రంప్‌ మీద విమర్శలు వచ్చాయి. ఆ ఒప్పందంలో తరువాత ఎలాంటి మార్పులూ చేసినట్లు ఎవరూ ప్రకటించలేదు గనుక గత విమర్శలేమిటో ఒకసారి చూద్దాం. ఐదువందల యాభై బిలియన్‌ డాలర్ల మొత్తాన్ని ప్రభుత్వానికి ఇస్తే తమ ఇష్టం వచ్చినట్లు వినియోగించుకుంటామని, దాని మీద వచ్చే లాభాలలో 90శాతం తమకే అని ట్రంప్‌ వత్తిడి చేశాడు. అయితే ఆ మొత్తంలో కేవలం రెండు శాతం మాత్రమే పెట్టుబడిగా ఉంటుందని, మిగిలిన మొత్తం రుణాలు, రుణ హామీల వంటి ఇతర రూపాల్లో ఉంటుందని జపాన్‌ ప్రతినిధి వర్గనేత రోయెసీ అకజావా టీవీలో బహిరంగంగా చెప్పాడు. కొంత మంది అమెరికన్లకు జపాన్ను విక్రయించారని విమర్శిస్తున్నారని, లాభాల్లో 90శాతానికి అంగీకరించినందున నష్టం పెద్దగా ఉండదని దీనికి ప్రతిగా అమెరికా తగ్గించే పన్నుల వలన 68 బిలియన్‌ డాలర్ల మేర జపాన్‌కు లబ్ది కలుగుతుందని కూడా చెప్పాడు. బహుశా ఈ కారణంతోనే మంగళవారం నాడు ఒప్పందంపై సంతకాల తరువాత న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక ప్రతికూలంగా వ్యాఖ్యానించిందని చెప్పవచ్చు. తమ దేశంలో పెట్టుబడులకు, పన్నులు విధింపుకు లంకెపెట్టటం ఒక జపాన్‌ విషయంలోనే కాదు. ఇప్పటికే ఐరోపా యూనియన్‌తో 600బిలియన్‌ డాలర్లు పెట్టుబడులు పెడితేనే 15శాతం పన్నులు విధిస్తామని లేకుంటే ఎక్కువ అని ట్రంప్‌ బెదిరించాడు.

వాణిజ్యం చేయటం, లాభాలు పిండుకోవటంలో అమెరికా, జపాన్‌ ఎవరికి ఎవరూ తీసిపోరు గనుక పరస్పర లబ్ది లేకుండా అంగీకరించే అవకాశం ఉండదని చెప్పవచ్చు. ముందే చెప్పుకున్నట్లు ఒక లక్షకోట్ల డాలర్లు అమెరికాకు అప్పు ఇవ్వటమేగాక మరో రెండులక్షల కోట్ల డాలర్ల మేర ఇప్పటికే జపాన్‌ పెట్టుబడులు పెట్టింది. జపాన్‌లో డాలర్లు గుట్టలుగా పడి ఉన్నాయి. ఎవరైనా అక్కడి బాంకుల్లో డబ్బుదాచుకుంటే వారే బ్యాంకులకు ఎదురు ఇవ్వాల్సి ఉంటుంది. తమ దేశంలో ఉన్న వడ్డీ రేట్లతో పోలిస్తే అమెరికాకు అప్పులు ఇవ్వటం జపాన్‌కు ఎంతో లాభం కలుగుతుంది. జపాన్‌లో తక్కువ వడ్డీ చెల్లించి జనాల నుంచి బాంకులు రుణాలు తీసుకుంటాయి, వాటిని ఎక్కువ వడ్డీ రేట్లకు అమెరికా, ఇతర దేశాలలో పెట్టుబడులుగా పెట్టి లాభాలు ఆర్జిస్తాయి, ఈ క్రమంలోనే అమెరికాకు అత్యధికంగా జపాన్‌ లక్ష కోట్ల డాలర్ల మేర రుణబాండ్లలో పెట్టుబడులు పెట్టింది. ఈ విషయంలో బ్రిటన్‌ రెండవ స్థానంలో ఉంటే చైనా మూడవదిగా ఉంది. అమెరికాలో ఉన్న జపాన్‌ కంపెనీలైన సోనీ,టొయోటా వంటి బహుళజాతి కంపెనీలు, ద్రవ్యపెట్టుబడి సంస్థలు అక్కడ పెట్టుబడులు పెట్టి లాభాలు సంపాదిస్తున్నాయి, వచ్చిన లాభాలను తిరిగి అక్కడే పెట్టుబడులుగా పెడుతున్నాయి. తాజా ఒప్పందంలో అమెరికా కార్లకు ద్వారాలు తెరిచేందుకు జపాన్‌ అంగీకరించినట్లు చెబుతున్నారు. గాలికిపోయే పేలపిండి కృష్ణార్పణం అన్నట్లు డీజిలు, పెట్రోలు తాగే అమెరికన్‌ కార్లను జపాన్‌లో కొనుగోలు చేసేదెవరు ? లేదూ అమెరికన్లు అమ్ముకోవాలనుకుంటే జపనీయుల అవసరం, అభిరుచులకు అనుగుణంగా సరసమైన ధరలకు అందచేస్తే ఇబ్బంది ఉండదు. అక్కడ అమెరికా కార్లకు డిమాండ్‌ కూడా తక్కువే గనుక వాటి దిగుమతులకు అనుమతించినా జపాన్‌ కార్ల మార్కెట్‌కు పెద్దనష్టమేమీ ఉండదు. జపాన్‌లో తలెత్తిన ఆర్థిక మాంద్యం కారణంగా జనాలు ప్రజా రవాణా వ్యవస్థ పట్ల మొగ్గుచూపుతున్నారు. నిర్వహణ ఖర్చు ఎక్కువగా ఉండే అమెరికన్‌ కార్లను పట్టించుకుంటారా ? గతంలో కార్లంటే అమెరికా, ఇప్పుడు జపాన్‌ ఆ స్థానాన్ని ఆక్రమించింది, జర్మనీ, దక్షిణ కొరియా వంటి దేశాలూ తక్కువ తినలేదు, విద్యుత్‌ కార్ల రంగంలో చైనా సవాలు విసురుతోంది. అందువలన ట్రంప్‌ విధించే పదిహేనుశాతం దిగుమతి పన్నుతో అమెరికా కంపెనీల యజమానులు కొంత కాలం పాటు ఊరట పొందవచ్చు తప్ప తరువాత పోటీకి అనుగుణంగా తయారుగాకపోతే అంతే సంగతులు.

ట్రంప్‌ ఆసియా పర్యటనలో వివిధ దేశాలతో ఒప్పందాలను కుదుర్చుకొనేందుకు కొన్ని షరతులను రుద్దినట్లుగా కనిపిస్తోంది. చిన్న చిన్న దేశాలలో ఎంత దొరికితే అంత అన్నట్లుగా విలువైన ఖనిజాల గురించి ఒప్పందాలు చేసుకున్నాడు. మలేషియా వస్తువుల మీద 19శాతం పన్నుల విధింపు అమల్లో ఉందని చెబుతూనే కొన్నిమినహాయింపులు ఇచ్చాడు.దీనికి ప్రతిగా అమెరికా వస్తువులు, గ్యాస్‌, వ్యవసాయ ఉత్పత్తులను మలేషియా కొనుగోలు చేయనుంది. అమెరికా కంపెనీ బోయింగ్‌ నుంచి 30 విమానాలను కొనుగోలు చేస్తామని, మరో 30 గురించి ఆలోచిస్తామని చెప్పింది. ఇవిగాక అమెరికాలో 70 బిలియన్‌ డాలర్లు పెట్టుబడులుగా పెట్టేందుకు అంగీకరించింది. అయితే కీలకమైన సెమీ కండక్టర్ల ఉత్పత్తి చేస్తున్న మలేషియా అమెరికా షరతులకు తలొగ్గలేదు. కంపూచియాతో కుదిరిన ఒప్పందం ప్రకారం అమెరికా వస్తువుల దిగుమతిపై ఎలాంటి పన్ను ఉండదు. విలువైన ఖనిజాల శుద్ధి వంటి ప్రక్రియకు అమెరికా పెట్టుబడులను అనుమతిస్తుంది. వియత్నాంపై విధించిన 46శాతం పన్నులను 20శాతానికి తగ్గించేందుకు అమెరికా దిగివచ్చింది. దీనికి ప్రతిగా ఎనిమిది బిలియన్‌ డాలర్లతో 50 బోయింగ్‌ విమానాలను కొనుగోలు చేస్తుంది. వీటితో పాటు అమెరికా వ్యవసాయ ఉత్పత్తులను కూడా దిగుమతి చేసుకుంటుంది.చైనా నుంచి దిగుమతి చేసుకున్న విడిభాగాలతో తయారు చేసి అమెరికాకు ఎగుమతి చేసే వస్తువులపై పన్ను వివాదం కొనసాగుతూనే ఉంది. ఒక నిర్దిష్ట నిర్వచనం లేదు. థారులాండ్‌ వస్తువులపై 19శాతం పన్నుల నుంచి అనేక వస్తువులకు మినహాయింపు ఇస్తారు. ఎనభై విమానాలను థారు కొనుగోలు చేస్తుంది. దక్షిణ కొరియా వస్తువుల మీద పన్ను 15శాతానికి పరిమితం చేయాలంటే తమ దేశంలో 350 బిలియన్‌ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టాల్సిందే అని అమెరికా వత్తిడి చేస్తున్నది.అది దక్షిణ కొరియా జిడిపిలో 6.5శాతానికి సమానం. అంత పెట్టుబడి పెడుతుందా అన్నది ప్రశ్న.

డోనాల్డ్‌ ట్రంప్‌ కౌలాలంపూర్‌లో జరుగుతున్న ఆసియన్‌ ప్లస్‌ 3 (ఏపిటి) సమావేశాలకు, తరువాత దక్షిణ కొరియాలో జరిగే మరోసభలో పాల్గ్గొనేందుకు వస్తూ అనేక దేశాలతో విలువైన లోహాలు, ఇతర ఒప్పందాలు కుదుర్చుకొనేందుకు డోనాల్డ్‌ ట్రంప్‌ వచ్చాడు. పది ఆగేయాసియా దేశాలతో కూడిన ఆసియన్‌ కూటమిలో తాజాగా తైమూర్‌-లెస్తే చేరింది. ఇవిగాక చైనా, జపాన్‌, దక్షిణ కొరియా అనుబంధంగా ఉన్న కారణంగా ఆసియన్‌ ప్లస్‌ మూడు అని పిలుస్తున్నారు. ధనిక దేశాలు అనుసరిస్తున్న రక్షణాత్మక విధానాల నుంచి తట్టుకోవాలంటే ఈ కూటమి దేశాల మధ్య సహకారాన్ని విస్తరించుకోవాలని చైనా ప్రధాని లీ క్వియాంగ్‌ కోరాడు. గత కొద్ది సంవత్సరాలుగా తూర్పు ఆసియా వేగంగా వృద్ది చెందుతున్నది. ఇదే సమయంలో కొన్ని సమస్యలను కూడా ఎదుర్కొంటున్నది. ఈ సమావేశాలకు తమ మంత్రిద్వారా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభూ సుబియాంతో ఒక సందేశం పంపాడు. ఆర్‌సిఇపితో సమన్వయం చేసుకొని దాన్నొక వేదికగా ఆసియన్‌ దేశాలు వినియోగించుకోవాలని కోరాడు.ఏకపక్ష వైఖరితో వ్యవహరిస్తున్న దేశాలను ఐక్యంగా ఎదుర్కొవాలని దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జేయి మయుంగ్‌ కోరాడు. రక్షణాత్మక చర్యలతో పాటు సరఫరా గొలుసుల సమస్యలను కూడా ఎదుర్కొంటున్నట్లు చెప్పాడు. పెరుగుతున్న రక్షణాత్మక ధోరణులు, సరఫరా వ్యవస్థల్లో వస్తున్న మార్పులు ఆసియన్‌ దేశాలకు హెచ్చరికలు పంపుతున్నాయని, వాటిని చూసి నిర్ఘాంతపోయి అచేతనంగా ఉండరాదని మలేసియా ప్రధాని అన్వర్‌ చెప్పాడు. ఇప్పుడున్న భాగస్వామ్యాన్ని మరింతగా మెరుగుపరుస్తూ కొత్త భాగస్వామ్యాల కోసం ధైర్యంగా వ్యవహరించాలన్నాడు. వర్తమాన సంవత్సరంలో జనవరి నుంచి సెప్టెంబరు వరకు తొమ్మిది నెలల కాలంలో చైనా మరియు ఆసియన్‌ దేశాల మధ్య వాణిజ్య లావాదేవీలు 782 బిలియన్‌ డాలర్ల మేర జరిగాయి. అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే 9.6శాతం ఎక్కువ. కౌలాలంపూర్‌ సమావేశంలో చైనా-ఆసియన్‌ దేశాల స్వేచ్చావాణిజ్య ప్రాంతం 3.0 ఒప్పందం కుదిరింది. అమెరికా పన్నులకు అందరం బాధితులమే అని దాని రక్షణాత్మక వైఖరిని వ్యతిరేకించాలని ఆసియన్‌ దేశాలన్నింటా ఏకీ భావం కనిపించింది. అయితే వివిధ కారణాలతో అనేక దేశాలు అమెరికాతో నేరుగా ఒప్పందాలు చేసుకుంటున్నప్పటికీ ఒక్కటిగా ఉండకపోతే నష్టమనే భావన ఏర్పడింది.

గత ఏడాది లావోస్‌లో జరిగిన 27వ సమావేశం పెరుగుతున్న ప్రాంతీయ సహకారం గురించి చర్చించింది, దాన్ని మరింతగా ముందుకు తీసుకుపోయేందుకు కౌలాలంపూర్‌ సమావేశం దృష్టి సారించింది, ఇది అనివార్యమైన పరిణామం. అన్ని దేశాల మీద ట్రంప్‌ పన్నుల దాడి మొదలు పెట్టిన పూర్వరంగంలో దానికి గురయ్యే దేశాలకు ఇంతకు మించి మరొక మార్గం లేదు.ఈ కూటమి లేదా వ్యవస్థ 1997లో ఉనికిలోకి వచ్చింది. ఆసియన్‌ కూటమిలో బ్రూనీ, కంపూచియా, ఇండోనేషియా, లావోస్‌, మలేషియా, మయన్మార్‌, ఫిలిప్పీన్స్‌, సింగపూర్‌, థారులాండ్‌, వియత్నాం సభ్యులుగా ఉండగా పదకొండవ దేశంగా తైమూర్‌-లెస్తే చేరింది. ఇప్పుడు ప్రపంచ దృష్టి అంతా దక్షిణ కొరియాలో జరిగే ఆసియా -పసిఫిక్‌ ఆర్థిక సహకార వేదిక (ఎపిఇసి) సమావేశాల మీద ఉంది. అక్కడ 30వ తేదీన చైనా అధినేత షీ జింపింగ్‌తో ట్రంప్‌ భేటీ కానున్నాడు. విలువైన ఖనిజాల ఉత్పత్తులపై చైనా ఆంక్షలు విధించిన తరువాత కొద్ది రోజుల క్రితం ఒక ఒప్పందం జరిగినట్లు వార్తలు వచ్చాయి. తుది ఒప్పందం మీద ఇరు దేశాల నేతలు సంతకాలు చేయవచ్చని చెబుతున్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

సముద్రంలో చైనా డేటా సెంటర్‌ : నిజంగా నరేంద్ర మోడీ, చంద్రబాబు భవిష్యత్‌ దార్శనికులా !

27 Monday Oct 2025

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, Education, employees, Environment, Europe, Germany, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Science, USA

≈ Leave a comment

Tags

# China underwater data center, BJP, CHANDRABABU, China, Data Centers, Data centers Employment, Narendra Modi Failures, Vizag Google Data Center, Xi Jinping, YS jagan

ఎం కోటేశ్వరరావు

సముద్రంలో చైనా నిర్మించిన పదమూడు వందల టన్నుల బరువుగల డేటా సెంటర్‌ ఆదివారం నాడు(2025 అక్టోబరు26న) ప్రారంభమైంది. ఇది గాలి మరలతో ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను వినియోగించనుంది. హై క్లౌడ్‌ అనే కంపెనీ మొదటి దశలో భాగంగా 24మెగావాట్ల కేంద్రాన్ని షాంఘై తీరంలో నెలకొల్పింది. న్యూస్‌ అట్లాస్‌ వెల్లడించిన సమాచారం ప్రకారం సముద్రపు ఒడ్డున నిర్మించిన గాలి మరల విద్యుత్‌ కేంద్రం నుంచి 95శాతం విద్యుత్‌ను ఈ కేంద్రానికి సరఫరా చేస్తారు, సముద్రపు నీటిని చల్లబరిచేందుకు వినియోగిస్తారు. మొత్తం 22.6 కోట్ల డాలర్ల ఖర్చుతో నిర్మించిన ఈ కేంద్రంలో సాంప్రదాయపు డేటా సెంటర్ల కంటే 23శాతం విద్యుత్‌ వినియోగం తగ్గుతుంది. సముద్రంలో 114 అడుగుల అడుగున ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలోని ఒక్కో గదిలో 4 నుంచి ఐదు వందల సర్వర్లు ఉంటాయి. సముద్రంలో ఏర్పాటు చేసిన టెలికాం కేబుళ్ల ద్వారా ఈస్ట్రన్‌ డేటా, వెస్ట్రన్‌ కంప్యూటింగ్‌ వ్యూహం ప్రకారం ప్రధాన భూభాగంలోని కేంద్రానికి అనుసంధానం చేశారు. రానున్న రోజుల్లో ఇలాంటివే మరో వందగదులను నిర్మించి విస్తరిస్తారు. మైక్రోసాఫ్ట్‌ కంపెనీ చైనాలో 2015లో పైలట్‌ ప్రాజక్టుగా సముద్రంలో ఒక డాటా కేంద్రాన్ని నిర్మించింది. ప్రాజెక్ట్‌ నాటిక్‌ పేరుతో చేసిన ఈ ప్రయోగానికి స్వస్తి పలికి 2024జూన్‌లో దాన్ని సముద్రంలో ముంచివేసింది. ఆదివారం నాడు సముద్రంలో తొలి వాణిజ్య డాటా కేంద్రాన్ని నిర్మించి ప్రారంభించిన తొలి దేశంగా చైనా చరిత్రకెక్కింది. ఇలాంటివే మరో రెండు నిర్మాణంలో ఉన్నాయి. ఈ కేంద్రం చైనాలో అతి పెద్ద తొలి స్వేచ్చా వాణిజ్య కేంద్రం ఉన్న హైనాన్‌ సమీపంలో ఉంది. పూర్తిగా విదేశీ పెట్టుబడులతో నిర్మించారు.

విశాఖలో అదానీ, ఎయిర్‌టెల్‌ కంపెనీలతో కలసి గూగుల్‌ నిర్మించనున్న డేటా కేంద్రం ఎంత మందికి ఉపాధి కల్పిస్తుందన్నది చర్చ. లింక్‌డ్‌ఇన్‌లో వచ్చిన ఒక విశ్లేషణ జర్మనీలోని బిఎఎస్‌ఎఫ్‌ రసాయన కంపెనీతో డేటా సెంటర్ల ఉపాధిని పోల్చింది. సదరు జర్మనీ సంస్థ 684మెగావాట్ల విద్యుత్‌ను వినియోగిస్తుంది, 50వేల మందికి పూర్తి స్థాయి ఉపాధిని కల్పిస్తున్నది. అదే జర్మనీలో డాటా కేంద్రం 2,283మెగా వాట్ల విద్యుత్‌ను వినియోగించే చోట పూర్తి కాలపు ఉపాధి 6,849 నుంచి 13,699 మందికి చూపుతుంది. రసాయన ఫ్యాక్టరీ ఒక మెగావాట్‌కు 73 మందికి ఉద్యోగ కల్పన చేస్తుంటే డేటా సెంటర్‌ ఒక మెగావాట్‌కు 3 నుంచి ఆరు ఉద్యోగాలను ఇస్తున్నది. గూగుల్‌ ఆధునిక సాంకేతిక ప్రక్రియలను వినియోగిస్తుంది గనుక ఇంకా తగ్గవచ్చు. ఆ లెక్కన చూసినా విశాఖలో నిర్మించే ఒక గిగావాట్‌(వెయ్యి మెగావాట్లు) కేంద్రం మూడు నుంచి ఆరువేల మందికి పర్మనెంటు ఉద్యోగాలను కల్పిస్తుంది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ చెప్పిన అంకెలు దీనికి దగ్గరగా ఉన్నాయి. దానికి భిన్నంగా రాష్ట్ర మంత్రి లోకేష్‌ చెప్పారు. ఇద్దరికి సమాచార వనరు ఏమిటి ? ఈ విషయాన్ని చెప్పటానికి బిడియపడాల్సిందేముంది. అదే గూగుల్‌ను అడిగితే అందించిన ఇతర విశ్లేషణలు కూడా దీనికి దగ్గరగానే ఉన్నాయి. ప్రైవేటు కంపెనీలన్నీ సాధ్యమైనమేరకు తక్కువ మందితో పని చేయించుకొనేందుకు చూస్తాయి. కన్సిడర్‌ మైక్రోసాఫ్ట్‌ ఏర్పాటు చేసిన సిడ్నీలోని డాటా కేంద్రం 2023లో అకస్మాత్తుగా ఆగిపోయింది. తగినంత మంది సిబ్బంది లేని కారణంగా జరిగిన ఆ అంతరాయం 46 గంటల పాటు సేవల నిలిపివేతకు దారితీసింది. అప్‌టైమ్‌ ఇనిస్టిట్యూట్‌ అనే సంస్థ సిబ్బంది కొరత గురించి పేర్కొన్నది. ప్రపంచ డాటా సెంట్లర్లలో 2019లో ఇరవైలక్షల మంది పూర్తి కాలపు ఉద్యోగులు ఉంటే 2025 నాటికి కేంద్రాలు పెరిగినా 23లక్షల మంది మాత్రమే ఉన్నారు. ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగులా అన్నది వివరణ లేదు. ప్రపంచంలో ఇప్పుడున్న 122 గిగావాట్ల సామర్థ్యంలో సగటు తీసుకుంటే ఒక్కో గిగావాట్‌కు 18,700 ఉన్నట్లు కనిపిస్తున్నది. విశాఖ గూగుల్‌ సెంటర్‌కు అందరూ కలసి 20 నుంచి 30వేల మంది ఉంటారని కూడా పెమ్మసాని చంద్రశేఖర్‌ చెప్పారు. డాటా కంపెనీలు సిబ్బందిని చేర్చుకోవటం, నిలుపుకోవటంలో తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నాయి. చిన్న కేంద్రాలు(ఒకటి నుంచి ఐదు మెగావాట్లు) 8 నుంచి 15 మంది, ఐదు నుంచి ఇరవై మెగావాట్ల కేంద్రాలు 15 నుంచి 35 మంది, ఇరవై అంతకు మించిన సామర్ధ్యం కలిగినవి 35 మందికి పైగా, 40 మెగావాట్ల సంస్థలు 45 మందిని, వంద మెగావాట్లు అంతకు మించి సామర్ధ్యం కలిగినవి కొద్దిమందితోనే నిర్వహిస్తున్నాయి, ఎందుకంటే యాంత్రీకరణ మరియు నిర్ణీత ప్రమాణాలతో ఉండే వ్యవస్థలు అందుకు దోహదం చేస్తున్నాయి. నియమించుకుంటున్నాయి. డేటా సెంటర్లలో మొత్తం 230 రకాల సిబ్బంది అవసరం అని చెబుతున్నారు. అయితే చిన్న సంస్థలు అంతమందిని నియమించవు, అవి అవసరమైనపుడు పొరుగు సేవలను ఉపయోగించుకుంటాయి. సగం డేటా సెంటర్లు అవసరమైన నిపుణులు దొరక్క ఇబ్బందులు పడుతున్నాయి.

రెండును రెండుతో కలిపినా, హెచ్చవేసినా ఫలితం నాలుగే. ఇది చెప్పటానికి గణితమేథావులతో పనిలేదు. డేటా సెంటర్లతో కలిగే పర్యావరణహాని, విషపూరితమైన వ్యర్ధాల వంటి ఇతర దుష్ఫలితాల గురించి వైఎస్‌ జగన్మోహనరెడ్డి చెప్పినా(అఫ్‌ కోర్స్‌ అధికారంలో ఉన్నపుడు ఈ పెద్దమనిషి వీటి గురించి చెప్పలేదు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా నోరు విప్పరు) ఆ రంగం గురించి అధ్యయనం చేసినవారు చెప్పినా విషయం ఒకటే. ఎవరైనా రాజకీయాలతో నిమిత్తం లేని వారు చెబితే చూశారా రాష్ట్ర అభివృద్దిని వ్యతిరేకించేవారు జగన్‌తో చేతులు కలిపి అవే వాదనలు చేస్తున్నారంటూ ప్రచారదాడికి దిగుతున్నారు. అంటే నోరు మూయించేందుకు ఇదొక రకం నియంతృత్వపోకడతప్ప మరొకటి కాదు. తేమ కారణంగా యంత్రాలు పనికి రాకుండా పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున అమెరికాలోని డేటా కేంద్రాలన్నీ పొడివాతావరణం ఉండే ప్రాంతాల్లోనే ఏర్పాటు చేశారని చెబుతున్నారు.పెట్టుబడిలో నాలుగో వంతు సబ్సిడీలు, సంవత్సరాల తరబడి రాయితీ ధరలకు నీరు, విద్యుత్‌ అందచేస్తున్న తరువాత ఏ పెట్టుబడిదారుడు మాత్రం చంద్రబాబు నాయుడి దరిచేరడు ! డాటా సెంటర్‌ మాప్‌ డాట్‌ కామ్‌ సమాచారం ప్రకారం గూగుల్‌కు ప్రపంచంలో 113 డాటా సెంటర్లు ఉండగా వాటిలో 68 పని చేస్తున్నాయి, మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. వీటిలో ఎందరు ఉద్యోగులు పని చేస్తున్నారని అడిగితే సమాచారం లేదని బదులు వచ్చింది. ప్రపంచంలో గూగుల్‌ సంస్థలో లక్షా 83వేల మంది పనిచేస్తున్నారనే సమాచారం ఉంది తప్ప ఏ విభాగంలో ఎందరు అన్నది లభ్యం కావటం లేదు. ఎవరికైనా దొరికితే ఈ విశ్లేషణకు జత చేస్తాను. మానవహక్కుల ఫోరం(హెచ్‌ఆర్‌ఎఫ్‌) సమాచారం ప్రకారం అమెరికాలోని అష్‌బర్న్‌ మరియు లీస్‌బర్గ్‌ డాటా సెంటర్లు రెండిలోనూ కలిపి ప్రత్యక్షంగా 400 మందికి పరోక్షంగా 3,100 మంది ఉపాధి దొరుకుతున్నట్లు పేర్కొన్నది.లోకేష్‌ చెప్పినట్లు లక్షా 88వేల ఉద్యోగాల్లో 88వేలు పర్మనెంటు అనుకుంటే మొత్తం గూగుల్‌ ఉద్యోగులు విశాఖలోనే ఉంటారన్నట్లుగా భావించాలి, అది జరిగేదేనా !

ఇంటర్నెట్‌ వెతుకులాటలో డాటా సెంటర్ల ఉపాధి గురించి ఎవరెటు తిప్పి చెప్పినా పెట్టుబడులు, స్థలాల విస్తీర్ణం ఎక్కువ, ప్రత్యక్ష ఉపాధి తక్కువ, పరోక్ష ఉపాధి గురించి మాత్రమే వెల్లడవుతున్నది. పరోక్షం అంటే భవనాల నిర్మాణ సమయంలో దొరికే ఉపాధి, వాటి చుట్టూ ఉండే నివాసాలతో కలిగే లబ్ది గురించి మాత్రమే ప్రస్తావన ఉంటున్నది. ఆ లెక్కన బడా పరిశ్రమలు అంతకంటే ఎక్కువ కల్పిస్తున్నాయి. వస్తూత్పత్తిలో చైనాను పక్కకు నెట్టే ప్రపంచ ఉత్పాదక కేంద్రంగా దేశాన్ని మారుస్తామన్న మాటలు ఇప్పుడు ఎకువగా వినిపించటం లేదు. డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థ గురించి కబుర్లు పెరిగాయి.ఒకదానికి ఒకటి పోటీ కాదు, పరస్పరం సాయం చేసుకొనేవే.పెట్టుబడులు ఎక్కువ ఉపాధి తక్కువ ఉండే టెక్‌ కంపెనీల కోసం మోడీ, చంద్రబాబు వంటి వారు వెంపర్లాడుతున్నారు. ఒకసారి భవనాల నిర్మాణాలు పూర్తయిన తరువాత తాత్కాలిక కార్మికులకు పని ఉండదు. ఆటోమేషన్‌ ప్రధాన ప్రక్రియగా నడిచే ఈ కేంద్రాలలో కీలకమైన సిబ్బంది ఎవరంటే సెంటర్ల మేనేజర్లు, నెట్‌వర్క్‌ మరియు వ్యవస్థల అడ్మినిస్ట్రేటర్లు, సెక్యూరిటీ నిపుణులు, సాంకేతిక నిపుణులు, వారికి సహాయ సిబ్బంది.

ఆర్థిక ప్రయోజనాల విషయానికి వస్తే ఏటా పదివేల కోట్ల మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి రాబడి వస్తుందని తెలుగుదేశం పార్టీ నేతలు చెబుతున్నారు. డేటా సెంటర్లు అవసరమే, అయితే అవి కొత్త సమస్యలను సృష్టించకూడదు. మనదేశంలో అనేక చోట్ల ఏర్పాటు చేస్తున్న పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్యం గురించి తెలిసిందే. పాలకులు పరిశ్రమలకు అనుమతులు ఇచ్చారంటే ఉత్పత్తులకు తప్ప కాలుష్యానికి కాదు, దాన్ని నివారించేందుకు పరిశ్రమలే చర్యలు తీసుకోవాలన్న నిబంధనలు ఉంటాయి. వాటిని అమలు చేస్తే తమ లాభాలు తగ్గుతాయని తిలోదకాలు ఇస్తున్నాయి. ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదు. ఉదాహరణకు పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ ప్రాంతంలో ఫార్మా, ఇతర సంస్థల నుంచి వెలువడుతున్న కాలుష్యం సమీపంలోని సముద్రంలో కలుస్తున్నది. దాంతో మత్స్యకారుల ఉపాధికి దెబ్బతగులుతున్నది. పరిష్కరించండి మహానుభావా అని ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ను అడిగితే ఈ మధ్యే మాట్లాడుతూ పరిశ్రమలకు అనుమతి ఇచ్చింది తాము కాదని, వంద రోజుల గడువులో పరిష్కరిస్తానని చెప్పారు. అధికారానికి వచ్చి 15నెలల తరువాత ఈ మాటలు చెప్పిన పెద్ద మనిషి ఇంతకాలం ఏం చేస్తున్నట్లు ?

డేటా అనేక విధాలుగా కీలక పాత్ర పోషిస్తున్న పూర్వరంగంలో మనదేశం కూడా వెనుకపడకూడదు. కానీ నరేంద్రమోడీ లేదా రెండింజన్ల పాలనలో ఉన్న ప్రభుత్వాలు గానీ ఎంతో నిర్లక్ష్యం చేశాయన్నది అంకెలే చెబుతున్నాయి.2019లో 350 మెగావాట్ల సామర్ధ్యం ఉండగా 2025 నాటికి 1,350 మెగావాట్లకు చేరుతుందని చెబుతున్నారు. ఈ రంగంలో మిగిలిన దేశాలు ఎంతో ముందున్నాయి.దీనికి కూడా నెహ్రూయే కారణం అని చెబుతారేమో తెలియదు. ముందు చూపు లేకపోవటం తప్ప మరొకటి కాదు.చైనాలో గూగుల్‌, ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లు లేవు, మైక్రోసాఫ్ట్‌ కొన్ని ప్రయివేటు రంగ సంస్థల్లో తప్ప ప్రభుత్వం వినియోగించటం లేదు.కృత్రిమ మేథ, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌లో చైనా వెనుకబడిందని శత్రువులు కూడా చెప్పలేరు.తాజా సమాచారం ప్రకారం 2024నాటికి చైనాలో డేటా వాణిజ్య విలువ 47.23 బిలియన్‌ డాలర్లు కాగా 2030 నాటికి అది 97.30బి.డాలర్లకు పెరుగుతుందని రిసర్చ్‌ అండ్‌ మార్కెట్స్‌ సంస్థ పేర్కొన్నది. స్టాటిస్టా సంస్థ విశ్లేషణ మరోవిధంగా ఉంది.అమెరికాలో 2025 నాటికి డాటా సెంటర్ల ఆదాయం 171.9 బిలియన్‌ డాలర్లు, కాగా చైనాలో 103.19 బిలియన్‌ డాలర్లని 2030 నాటికి 142.64 బి.డాలర్లకు పెరుగుతుందని అంచనా. మరో సమాచారం ప్రకారం ప్రపంచ డేటా సెంటర్ల సామర్ధ్యం 2024నాటికి 122.2 గిగావాట్లు. దీనిలో అమెరికా 53.7(44శాతం) కలిగి ఉండగా చైనా 31.9 గిగావాట్లు కలిగి ఉంది. మూడో స్థానంలో ఒక కూటమిగా ఐరోపా యూనియన్‌ 11.9 గిగావాట్లు, మనదేశం 3.6గా ఉంది.చైనాలో ఇటీవల జత చేసిన సామర్ధ్యాన్ని పని చేయించటం లేదని వార్తలు వచ్చాయి. దీన్ని బట్టి అర్ధం అవుతున్నదేమిటి ? దేశం వ్యవసాయ, పారిశ్రామిక, సేవారంగాలన్నింటా వృద్ది చెందితేనే డేటా కేంద్రాలకు చేతినిండా పని ఉంటుంది. గడచిన పదకొండు సంవత్సరాలుగా కబుర్లు తప్ప అభివృద్ధి లేని కారణంగా డేటా సెంటర్ల సామర్ధ్యం కూడా పెరగలేదన్నది స్పష్టం.విశ్లేషణలను కొనుగోలు చేసేవారు లేకపోతే రేపు విశాఖ గూగుల్‌ సెంటర్‌ అయినా ఈగలు తోలుకుంటూ కూర్చోవాల్సిందే.

దేశాన్ని, రాష్ట్రాన్ని వికసిత్‌ భారత్‌లో ఎక్కడికో తీసుకుపోతామని ప్రధాని నరేంద్రమోడీ, ఆయన అడుగుజాడల్లో లేదా అడుగులకు మడుగులద్దుతున్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక మంది దృష్టిలో దేశంలో అతి పెద్ద దార్శనికులు, ఇతరులకు తట్టనివి అనేకం వారికి కనిపిస్తాయని చెబుతారు. ఆ ప్రచారం వలన దేశానికి ఎంత లాభమో తెలియదు గానీ నష్టం కలిగిస్తున్నారంటే ఎవరూ నొచ్చుకోవాల్సిన అవసరం లేదు. పరిశోధన మరియు అభివృద్ధి(ఆర్‌ అండ్‌ డి) నేడు ప్రపంచాన్ని ఎలా నడిపిస్తున్నాయో చెప్పనవసరం లేదు.తన పాలనలో జిడిపిని పదకొండవ స్థానం నుంచి నాలుగవ స్థానానికి తెచ్చిన ఘనత నాదే అంటారు మోడీ. కాసేపు అంగీకరిద్దాం, ఆ పురోగతి ఇతర రంగాల్లో ఉందా ? వాటిలో కీలకమైన పరిశోధనకు కేటాయింపుల సంగతేమిటి ? 1995-96 నుంచి 2014-15వరకు రెండు దశాబ్దాల వార్షిక సగటు జిడిపిలో 0.73 శాతం ఉంది. యుపిఏ పాలనలో 2008-09లో జిడిపిలో 0.8శాతం నిధులు కేటాయిస్తే మోడీ ఏలుబడిలో 2017-18లో 0.7, ఇప్పుడు 0.64శాతానికి తగ్గించారు. దీనికైతే జవహర్‌లాల్‌ నెహ్రూ కారణం కచ్చితంగా కాదు. అన్నీ వేదాల్లో ఉన్నాయష అనే భావజాలంతో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వ పెద్దల ఈ నిర్వాకాన్ని చంద్రబాబు నాయుడు సమర్ధిస్తారా ? 2013 నాటి సైన్స్‌ మరియు టెక్నాలజీ విధానంలో, 2017-18 ఆర్థిక సర్వేలో కూడా కనీసం రెండు శాతం కేటాయించాలని చెప్పిన అంశం ఎవరికీ తెలియదా ? ఇద్దరు నేతలు దేశ దేశాలు తిరుగుతున్నారు కదా ఎక్కడ ఎంత మొత్తం ఖర్చు చేస్తున్నారో తెలుసుకోరా ? ఎందుకీ నిర్లక్ష్యం ? మన అభివృద్ధి మీద గణనీయమైన ప్రభావం చూపాలంటే 2047నాటి వరకు కనీసం ఒక శాతం, ఆదర్శవంతంగా(ఐడియల్‌) ఉండాలంటే మూడుశాతం చొప్పున ఖర్చు చేయాలని నిపుణులు చెబుతున్నారు. పిండికొద్దీ రొట్టె, పరిశోధనా రంగంలో మనం ప్రపంచ బస్‌ను అందుకోకుండా చేసింది ఎవరంటే ఎవరిని చూపాలి ? పరిశోధనలకు మనం తక్కువ కేటాయిస్తున్నా, పరిశోధనా పత్రాలు గణనీయంగానే మనవారు సమర్పిస్తున్నారుగా అని సమర్ధించుకొనే వారిని చూసి నవ్వాలో ఏడవాలో అర్ధం కావటం లేదు ! ఎలాంటి పాలకులను మోస్తున్నాంరా బాబూ అని తల పట్టుకోవాలి !!

సంబంధిత మరో విశ్లేషణ దిగువ లింక్‌లో చదవవచ్చు ;

మేథోమధనం : డేటా సెంటర్లంటే గోడౌన్లా ! ఉత్పత్తి కేంద్రాలా !! జగన్‌, చంద్రబాబు చెబుతున్నదానిలో నిజానిజాలేమిటి ?
https://vedikaa.com/2025/10/25/are-data-centers-godowns-or-production-houses-what-is-the-truth-about-ycp-and-tdp-claims-on-employment/

Share this:

  • Tweet
  • More
Like Loading...

ముందు నుయ్యి – వెనుక గొయ్యి : దూరదృష్టిలేమితో దేశాన్ని ఇరకాటంలోకి నెట్టిన ” సమర్ధ ” నరేంద్రమోడీ !

18 Saturday Oct 2025

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, Farmers, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, USA

≈ Leave a comment

Tags

CHANDRABABU, Donald trump, Narendra Modi 2047, Narendra Modi Failures, visionless Narendra Modi, Vladimir Putin, Xi Jinping

ఎం కోటేశ్వరరావు

అన్నీ వారే చేశారంటూ గాంధీ, నెహ్రూ వంటి నేతలను ఇప్పటికీ ఆడిపోసుకుంటున్నారు. కాంగ్రెస్‌ ఐదు దశాబ్దాలలో చేయలేనిదానిని తమ మోడీ ఐదేండ్లలో చేశారు చూడండని డబ్బాకొట్టుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వంటి వారు రంగంలోకి దిగి జిఎస్‌టిి సంస్కరణలతో బొందితో కైలాసానికి తీసుకుపోతున్నారన్నట్లుగా ఆకాశానికి ఎత్తుతున్నారు. గతంలో ఏం మాట్లాడారో తెలిసిందే ! నిజానికి ఏం జరుగుతోంది ? తాజాగా సెప్టెంబరు మాసంలో దేశ వాణిజ్యలోటు వివరాలు వెల్లడయ్యాయి. ఎగుమతులు 6.7శాతం పెరిగి 36.38 బిలియన్‌ డాలర్లకు చేరగా దిగుమతులు 16.7శాతం పెరిగి 68.53 బిలియన్‌ డాలర్లకు చేరాయి.కిందపడ్డా గెలిచింది మేమే అన్నట్లుగా దిగుమతులు అంటే మేం వస్తుకొనుగోలు శక్తి పెంచిన కారణంగానే అవసరం అవుతున్నాయని సమర్ధించుకుంటున్నారు. రూపాయి పాపాయిని ఆరోగ్యంతో బలిష్టంగా పెంచుతామని చెప్పారు. మోడీ మూడోసారి పాలన ఐదేండ్లు గడిచే సరికి ఇప్పుడున్న 89 డాలరుకు ముచ్చటగా వంద రూపాయలకు పతనమైనా ఆశ్చర్యం లేదు.

వికసిత భారత్‌ 2047 పేరుతో నరేంద్రమోడీ దేశాన్ని ఎక్కడికో తీసుకుపోతామన్నారు, ఇప్పుడు ఎటు తీసుకుపోతున్నారో తెలియదు. కొన్ని చేదు నిజాలను అంగీకరించకతప్పదు. ప్రపంచబ్యాంకు నివేదిక ప్రకారం మన దేశానికి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు మోడీ అధికారానికి వచ్చిన తరువాత జిడిపిలో 2.1శాతం ఉండగా 2023 నాటికి 0.8శాతానికి దిగజారాయి. అంకెల్లో చూస్తే 2014 నుంచి 2024వరకు వచ్చిన మొత్తం 509.69 బిలియన్‌ డాలర్లు(సగటున ఏడాదికి 46.34బి. డాలర్లు) అధికారానికి వచ్చిన కొత్తలో విమానం వేసుకొని దేశదేశాలూ ఎందుకు తిరుగుతున్నారంటే దిగజారిన దేశ ప్రతిష్ట పునరుద్దరణ, పెట్టుబడుల కోసం అని చెప్పారు. గొర్రెతోక బెత్తెడు అన్నట్లుగా 2016లో 46 బిలియన్‌ డాలర్లు వస్తే 2024లో 53 బిలియన్‌ డాలర్లు ఉంది. చైనాకు 2019 నుంచి 21వరకు మూడు సంవత్సరాల్లో వచ్చిన మొత్తం 787 బిలియన్‌ డాలర్లు. తరువాత కాలంలో చైనాకు మనదేశానికి వచ్చిన మొత్తం కూడా రాలేదు.2021లో 344 బిలియన్‌ డాలర్లు వస్తే 2023లో 51.3, 2024లో 18.6బిలియన్‌ డాలర్లు మాత్రమే వచ్చాయి. దానికి ఉన్న కారణాల గురించి మరోసందర్భంలో చెప్పుకోవచ్చు.చైనాలో పెరిగిన ఉత్పాదకత ఖర్చులతో వచ్చే లాభదాయకత కంటే అమెరికాలో వడ్డీ రేటు ఎక్కువగా ఉండటం ఒకటి. ఇక్కడ ముఖ్యాంశమేమంటే చైనాకు పెట్టుబడులు ఆగిపోయాయి, మనదేశానికి అవి రూటుమార్చాయి, కంపెనీలు వరుసలో నిలుచున్నాయి అని చెప్పిన వారు యాపిల్‌ కంపెనీ గురించి పదే పదే చెప్పటం తప్ప చైనాకు తగ్గిన ఎఫ్‌డిఐ మనకు ఎందుకు రాలేదో చెప్పాలి. చైనా కంపెనీలు మనదేశంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్దపడితే గత ఐదు సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం అడ్డుకున్న సంగతి తెలిసిందే.ఆశించిన అమెరికా, ఇతర దేశాల కంపెనీల జాడకనిపించకపోవటంతో ఇప్పుడు చైనా పెట్టుబడులకు ద్వారాలు తెరిచేందుకు మోడీ సర్కార్‌ పూనుకుంది.

కుండలో కూడు కదల కూడదు బిడ్డడు దుడ్డులా ఉండాలన్నది మన ఆలోచనా విధానంగా ఉంది. అది మారనంత వరకు అటూ ఇటూ కాని స్థితే. ఇతర అభివృద్ధి చెందిన, చైనా వంటి దేశాలతో పోల్చితే మనదేశంలో కాలం చెల్లిన సాంకేతిక పరిజ్ఞానం, పెట్టుబడుల పరిమితం, బలహీనమైన మౌలిక సదుపాయాలు ఆకర్షణీయంగా లేనపుడు రాజకీయ నేతలు, వారికి భజన చేసే మీడియా ఎన్ని కబుర్లు చెప్పినా ఉపయోగం ఉండదు.” విదేశీ కంపెనీలకు భారత్‌ శ్మశానం వంటిది ” అని ఏకంగా ప్రపంచబ్యాంకే వాణిజ్య నివేదికలో పేర్కొన్నది.ఆ ముద్ర నుంచి ఇంతవరకు బయటపడిందా అన్నది సందేహమే. ఇంతే కాదు 2014 నుంచి 2021 వరకు మన దేశంలో ఉన్న 2,800 విదేశీ కంపెనీలు దుకాణాలు మూసుకొని వేరేచోట్లకు వెళ్లిపోయాయి.మన దేశానికి రావాలనుకొనే వారు ఇలాంటి వాటన్నింటినీ ఒకటికి రెండుసార్లు చూసుకుంటారు. ఇప్పుడు అమెరికా విధించిన పన్నులతో ఇక్కడ పరిశ్రమలే ఎలా మనుగడ సాగించాలా అని ఆలోచిస్తుండగా కొత్తగా వచ్చేవారి సంగతి వేరే చెప్పనవసరం లేదు. మన కార్పొరేట్ల తీరుతెన్నులు చూస్తే మిగతావారి మాదిరే తమ లాభాలు తప్ప వేరే పట్టవు. కేంద్రంలో అధికారంలో ఎవరున్నా తమకు అనుకూలమైన విధానాలను అమలు చేయిస్తారు. ఇప్పుడు అమెరికా, ఇతర దేశాలతో తలెత్తిన పరిస్థితుల్లో ఏం చేయాలో దిక్కుతోచటం లేదని చెప్పవచ్చు.గతంలో ఆసియన్‌ దేశాలతో కూడిన ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం (ఆర్‌సిఇపి) కూటమిలో లేదా పసిఫిక్‌ భాగస్వామ్య కూటమి సిపిటిపిపి(కాంప్రహెన్సివ్‌ అండ్‌ ప్రోగ్రెసివ్‌ ఎగ్రిమెంట్‌ ఫర్‌ ట్రాన్స్‌ పసిఫిక్‌ పార్టనర్‌షిప్‌)లో చేరాలా ? చేరితే వచ్చే లాభాలేమిటి ? నష్టాలేమిటనే గుంజాటనలో పాలకవర్గం దాని ప్రతినిధిగా ప్రస్తుతం ఉన్న నరేంద్రమోడీ సర్కార్‌ ఉంది. ఏదో ఒక కూటమిలో చేరాలనే వత్తిడి ప్రారంభమైంది.చేరితో పౌరుల నుంచి వచ్చే వ్యతిరేకత తమ అధికారానికే ఎసరు తెస్తుందేమో అన్న భయం బిజెపి, దాని మద్దతుదార్లలో కూడా తలెత్తింది. పైకి చెప్పుకోకపోవచ్చు.

ముందుగా ఆర్‌సిఇపి గురించి చూద్దాం. ఈ కూటమి ఒప్పందంపై 2020 నవంబరు 15 సంతకాలు చేసింది. అది 2022 జనవరి నుంచి అమల్లోకి వచ్చింది.దీనిలో ఆస్ట్రేలియా,బ్రూనీ, కంపూచియా, చైనా, ఇండోనేషియా, జపాన్‌, దక్షిణ కొరియా, లావోస్‌, మయన్మార్‌, మలేసియా, న్యూజీలాండ్‌, ఫిలిప్పీన్స్‌, సింగపూర్‌,థారులాండ్‌, వియత్నాం ఉన్నాయి. ఏడు సంవత్సరాలు తర్జన భర్జన పడిన తరువాత 2019 నవంబరులో ఈ కూటమిలో చేరకూడదని నరేంద్రమోడీ సర్కార్‌ నిర్ణయించింది. ముందు ఎట్టిపరిస్థితిలోనూ చేరకూడదని రైతు, వ్యవసాయ కార్మిక, పారిశ్రామిక కార్మికులు, ఇతరులూ స్పష్టం చేశారు. చైనా ఉన్న ఏ వాణిజ్య కూటమిలోనూ చేరకూడదని పారిశ్రామికవేత్తలు గట్టిగా పట్టుబట్టారు. దాంతో ఈ కూటమికి మనదేశం దూరంగా ఉంది. అయితే ఇప్పటికీ ఆర్‌సిఇపి మన దేశానికి ఆహ్వానం పలుకుతూనే ఉంది. గతంలో వ్యతిరేకించిన కార్పొరేట్‌ శక్తులే డోనాల్డ్‌ట్రంప్‌ దెబ్బతో పునరాలోచన చేయాలని కోరుతున్నాయి. వారెందుకు నాడు వ్యతిరేకించారంటే ఒకటి, చైనాతో అప్పటికే ఉన్న వాణిజ్యలోటు మరింత పెరుగుతుంది, రెండు, ఆ కూటమిలోని ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ తమ పాడి ఉత్పత్తులకు మన మార్కెట్‌ను తెరవాలని డిమాండ్‌ చేస్తున్నాయి, అదే జరిగితే మన పాడి పరిశ్రమలో ఉన్న కోట్లాది మంది రైతులు నష్టపోతారు.రాజకీయంగా, ఆర్థికంగా ఎంతో సున్నితమైన అంశం. మూడవది, సేవారంగానికి ఇతర దేశాలు తమ మార్కెట్లను తెరిచే అంశంపై మన ప్రతిపాదనలకు ప్రత్యేకించి నిపుణుల రాకపోకలకు సంబంధించి తగిన మద్దతు రాకపోవటం.

అయితే ఇప్పుడు కార్పొరేట్లలో పునరాలోచనకు పరిస్థితులేమైనా మారాయా ? ఒక్క మాటలో చెప్పాలంటే లేదు. చైనాతో వాణిజ్య లోటు ఆరేళ్ల క్రితం 48.6 బిలియన్‌ డాలర్లు ఉంటే ఇప్పుడు వంద బిలియన్‌ డాలర్లకు చేరింది. వ్యవసాయం, పాడి పరిశ్రమలపై మన వైఖరిలో అప్పుడూ ఇప్పుడూ ఒకటిగానే ఉంది. అందుకే ఆస్ట్రేలియా, అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవటానికి మోడీ సర్కార్‌ భయపడుతోంది. నయా ఉదారవాదం ప్రకారం మనకు లబ్ది కలిగించే సేవారంగ మార్కెట్‌లను తెరవాలన్న మన ప్రతిపాదనలకు ఇతర దేశాలు సుముఖంగా లేవు. దీని అర్ధం ఎవరి రక్షణ చర్యలకు వారు కట్టుబడి ఉన్నారు. ఈ స్థితిలో పునరాలోచన చేయాలని కొందరు ఎందుకు కోరుతున్నారంటే ట్రంప్‌ ఇచ్చిన షాక్‌తో ప్రభావితమైన రంగాలకు ఏం చేయాలో తోచక ఈ ప్రయత్నం ఏమైనా ఉపయోగపడుతుందా అని భావిస్తున్నారని చెప్పవచ్చు.పోనీ చేరితే వెంటనే ఏమైనా ప్రయోజనం ఉంటుందా అంటే ఉండదు. దాని నిబంధనావళి ప్రకారం 2022 నుంచి ఇరవై సంవత్సరాల వ్యవధిలో నాడున్న పన్నులను 92శాతం తగ్గించాల్సి ఉంటుంది. అదే విధంగా ఎగుమతి, దిగుమతుల కోటాలను ఖరారు చేస్తారు. తెల్లవారేసరికి మన సరుకులను ఎగుమతి చేసి లాభాలు సంపాదించాలంటే కుదరదు. మన రైతాంగానికి, పాడి, కోళ్ల పరిశ్రమల రక్షణకు అవసరమైన చర్యలు తీసుకొని మార్కెట్‌ను తెరిస్తే అదొక తీరు. కనీస మద్దతు ధరలకు చట్టబద్దత కల్పించటానికే మొరాయిస్తున్న నరేంద్రమోడీ సర్కార్‌ అలాంటి జాగ్రత్తలు తీసుకుంటుందంటే నమ్మేదెవరు ? రైతాంగమే కాదు కొన్ని పరిశ్రమలు కూడా దెబ్బతింటాయి.

ఇక రెండో ఆర్థిక కూటమి సిపిటిపిపిని చూద్దాం. దీనిలో ఆర్‌సిఇపిలో ఉన్న కొన్నింటితో పాటు ఇతర దేశాలు ఉన్నాయి. ఆస్ట్రేలియా, న్యూజీలాండ్‌, వియత్నాం, సింగపూర్‌, బ్రూనీ,కెనడా, మలేసియా,జపాన్‌, చిలీ, పెరూ, బ్రిటన్‌,మెక్సికో ఉన్నాయి. వీటి మధ్య ఒప్పందం 2018లో ఉనికిలోకి వచ్చింది. దీని ప్రకారం 99శాతం వరకు పన్నులను తగ్గించాల్సి ఉంటుంది.ఆర్‌సిఇపి కంటే నిబంధనలు గట్టిగా ఉన్నాయి. అంతకు ముందు ట్రాన్స్‌ ఫసిఫిక్‌ పార్టనర్‌షిప్‌ (టిపిపి) పేరుతో కుదిరిన ఒప్పందం నుంచి అమెరికా వైదొలగటంతో అది మూలన పడి దాని స్థానంలో కొత్తగా ఉనికిలోకి వచ్చింది.దీనిలో సభ్యత్వం కోసం చైనా దరఖాస్తు చేసినప్పటికీ దానికి ఇచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఆర్ధిక సేవారంగాన్ని తెరవాలన్న నిబంధనతో పాటు సమాచారాన్ని స్వేచ్చగా ఇచ్చిపుచ్చుకోవాలని, ప్రభుత్వ రంగ సంస్థల గుత్తాధిపత్యాన్ని తొలగించాలనే షరతులు ఉన్నాయి. వాటిని చైనా అంగీకరించటం లేదు. అమెరికా, చైనా రెండూ లేవు గనుక మనం చేరితే ఉపయోగం ఉంటుందన్న ఆశతో సిపిటిపిపిలో చేరితే ఎలా ఉంటుందని మన కార్పొరేట్లు ఆలోచన చేస్తున్నారు. ఆర్‌సిఇపి కంటే మరింతగా ఉదారవాద విధానాలను అమలు జరపాల్సి ఉంటుంది.ప్రస్తుతం నరేంద్రమోడీ చేస్తున్నవాటికే ప్రతిఘటన ఎలా ఉంటుందో రైతాంగ ఉద్యమం స్పష్టం చేసింది. ఇప్పుడు కార్మిక చట్టాలలో తెస్తున్న మార్పులకు వ్యతిరేకంగా కార్మికవర్గం కూడా ఆందోళనకు సిద్దం అవుతున్నది. ప్రభుత్వ రంగ సంస్థలను పరిమితం చేసే యత్నాలకు వాటి సిబ్బంది కూడా వ్యతిరేకత వెల్లడిస్తున్న సంగతి తెలిసిందే. అందువలన ఈ కూటమిలో చేరటం కూడా అంత తేలిక కాదు.

ఏ దేశానికైనా ఒక దీర్ఘకాలిక, స్వల్పకాలిక లక్ష్యాలు ఎత్తుగడలు అవసరం. నరేంద్రమోడీ సర్కార్‌కు అలాంటి ఆలోచనగానీ, ఆచరణగానీ లేదు. అందువల్లనే అమెరికా మనమీద పెద్ద ఎత్తున వత్తిడి తెస్తున్నది.దాన్ని తప్పించుకొనేందుకు మాటల్లేవ్‌, మాట్లాడుకోవటాలు లేవు అన్నట్లుగా ఐదేండ్ల క్రితం అన్ని సంబంధాలను తెంచుకున్న చైనాతో తిరిగి చేయి కలపటం, అవసరమైతే రష్యా, చైనా, భారత్‌ ఒక కూటమిగా ఏర్పడతాయనే సందేశాన్ని షాంఘై సహకార సంస్థ సమావేశాల సందర్భంగా ఇచ్చారు. అయితే అమెరికాతో సంబంధాలకు కూడా తహతహలాడుతున్నారు.అందుకే చైనా, రష్యా బహిరంగంగా చెప్పనప్పటికీ ప్రతి అడుగూ అనుమానంతో వేస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. అమెరికాతో వాణిజ్య ఒప్పందం, ఐరోపా సమాఖ్యతో స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోవాలని, స్థానిక గిరాకీని పెంచేందుకు పరిశ్రమలకు మద్దతు ఇవ్వాలని, అదనపు రిస్కులను తీసుకోకుండా అన్ని దేశాలతో ఉన్న స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలతో గరిష్టంగా లబ్దిపొందేందుకు చర్యలు తీసుకోవాలని మనకార్పొరేట్లు కోరుతున్నారు. పదేండ్ల మేకిన్‌ ఇండియా, మేడిన్‌ ఇండియా పిలుపులు ఘోరంగా విఫలమయ్యాయి. దీంతో చైనా ప్లస్‌ 1పేరుతో కొత్త పల్లవి అందుకున్నారు.

బహుళజాతి కంపెనీలు ముందుకు తెచ్చిన ఈ వ్యూహం వాణిజ్యపరమైనది. సరఫరా వ్యవస్థ లేదా గొలుసులో చైనాను విస్మరించలేరు.కనుచూపు మేరలో ప్రత్యామ్నాయం కనిపించటం లేదు. చైనాలో కార్మికవేతనాలు పెరుగుతున్నందున, ఇతర నిబంధనలతో ఉత్పాదక ఖర్చులు పెరుగుతున్నాయి. అయితే 140 కోట్ల జనాభా ఉన్న మార్కెట్‌ను వదులుకోలేరు. అందుకే చైనాతో పాటు మరొక దేశంలో తమ కార్యకలాపాలను ప్రారంభించాలన్నదే చైనా ప్లస్‌ 1 అర్ధం. మన దేశంలో యాపిల్‌ కంపెనీ కార్యకలాపాలకు కారణమిదే. దీని భావం అన్ని కంపెనీలు మన దేశానికి బారులు తీరాయని కాదు. వియత్నాం,ఇండోనేషియా,థారులాండ్‌ ఇలా ఏది అనుకూలంగా ఉంటే దాన్ని ఎంచుకోవచ్చు.మన విషయానికి వస్తే సానుకూల, ప్రతికూల అంశాలు ఉన్నాయి. యువజనాభా గణనీయంగా ఉండటం, కార్మికవేతన ఖర్చు తక్కువ(2023 సర్వే ప్రకారం చైనా కంటే వేతనాలు 47శాతం తక్కువ.) ఉత్పాదకతతో ముడిపెట్టిన ప్రోత్సాహకాలు ఉన్నాయి. రోడ్ల వంటి మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నారు. ఇవి సానుకూల అంశాలు కాగా సవాళ్లు కూడా ఉన్నాయి. 2013 నుంచి చైనాలో వేతనాలు పెరుగుతున్నందున కంపెనీలు మనదేశానికి వస్తాయని చెప్పినా వాటి జాడలేదు. నియంత్రణలు ఎక్కువ ( అంబానీ, అదానీలకు ఎవరూ పోటీ రాకూడదు, అందుకే అమెజాన్‌ అధిపతి బెజోఫ్‌కు గతంలో మోడీ కనీసం దర్శన భాగ్యం కూడా కల్పించలేదు) మౌలిక సదుపాయాలు అంటే ” తోలు ” వలిచే రోడ్లు మాత్రమే కాదు. వియత్నాం, థారులాండ్‌ వంటి చిన్నదేశాల నుంచి కూడా మనకు పోటీ ఎక్కువగా ఉంది. కబుర్లు ఎక్కువ ఆచరణ తక్కువ.మొత్తంగా చూసినపుడు సమర్ధుడైన నావికుడిగా భావించి మన నావను నరేంద్రమోడీకి అప్పగిస్తే ఇప్పుడది చుక్కాని లేనట్లు ఎటు పోతుందో తెలియకుండా నడి సముద్రంలో ఉంది. చిత్రం ఏమిటంటే దీనికి కూడా నెహ్రూ కారణమని చెప్పగల సమర్ధులుంటే నిజమే అని నమ్మే అమాయకులు పుష్కలంగా ఉండటం అసలైన సమస్య !

Share this:

  • Tweet
  • More
Like Loading...

పసిడి ధర ఐదేండ్లలో మూడు రెట్లు పెరుగుదల ? ప్రపంచ అప్పుకు దీనికి సంబంధం ఉందా !

01 Wednesday Oct 2025

Posted by raomk in CHINA, Current Affairs, Economics, Germany, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

Donald trump, GLOBAL DEBT SURGE, Gold Price Record, India debt matters, Narendra Modi Failures, World Debt, Xi Jinping

ఎం కోటేశ్వరరావు

ఈ ఏడాది తొలి ఆరునెలల్లో ప్రపంచ రుణం 338 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ ఫైనాన్స్‌(ఐఐఎఫ్‌) సంస్థ తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ వివరాలు ఉన్నాయి.(ఎవరికైనా ఆసక్తి ఉండి యుఎస్‌ డెబిట్‌ క్లాక్‌ డాట్‌ ఓఆర్‌జి వెబ్‌సైట్‌లోకి వెళితే ప్రతి క్షణం ఏ దేశానికి ఎంత అప్పు పెరుగుతున్నదో చూడవచ్చు.) మన జిడిపి నాలుగు లక్షల కోట్ల డాలర్లు, ప్రపంచ రుణం మాత్రం ప్రతి నెలా సగటున 3.4లక్షల కోట్ల డాలర్లు పెరుగుతున్నది.ఈ లెక్కన ఈ ఏడాది డిసెంబరు నాటికి మరో 20లక్షల కోట్ల డాలర్ల మేర ప్రపంచ రుణం పెరగనుంది. ఇలా పెరుగుతున్న అప్పులతో జనాలకు తిప్పలు కూడా అధికం అవుతున్నాయి. అమెరికా కరెన్సీ డాలరు ఈ ఏడాది జనవరి నుంచి 9.75శాతం పతనమైంది. అందువలన రుణం బాగా పెరిగినట్లు కనిపిస్తోందని కొంత మంది భాష్యం చెబుతున్నారు. కరోనా వచ్చిన 2020లో ఈ మాదిరి భారీ పెరుగుదల ఉంది. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకున్నా పెరగటం ఆందోళన కలిగిస్తున్నది. కుటుంబాలకు అప్పులు పెరిగితే ఏమౌతుంది. దానికి తగిన రాబడి లేకపోతే వాటిని తీర్చేందుకు కొన్ని కుటుంబ అవసరాలను తగ్గించుకొని రుణ చెల్లింపులకు కొంత మొత్తాన్ని మళ్లించాల్సి వస్తుంది. ప్రభుత్వాలు అయినా చేస్తున్నది అదే. ఉదాహరణకు ప్రపంచంలో అత్యధికంగా అమెరికా అప్పు 37.5లక్షల కోట్ల డాలర్లు. దానికి ఏటా చెల్లిస్తున్న వడ్డీ,అసలు మొత్తం 1.157లక్షల కోట్ల డాలర్లు. కొత్తగా తీసుకొనే అప్పులో సగానికి పైగా రుణ చెల్లింపులకే పోతున్నది.

అప్పులు పెరిగే కొద్దీ చేసిన వాగ్దానాలకు, అమలు చేస్తున్న పథకాలకు ఏదో ఒక సాకుతో కోత పెడతున్నారు.నిజానికి సామాన్యులకు ఏం జరుగుతున్నదో కూడా తెలియటం లేదు. నరేంద్రమోడీ సర్కార్‌ తీరుతెన్నులను చూద్దాం. మన దేశ మొత్తం అప్పు 2025 మార్చి నాటికి రు.181,74,284 కోట్లు దీన్ని 2026 మార్చి నాటికి రు.196,78,772 కోట్లకు పెంచుతామని బడ్జెట్‌లో పేర్కొన్నారు. శాశ్వత ఆస్తుల కల్పనకు మూలధన పెట్టుబడిగా పెట్టాలి లేదా సంక్షేమానికి కేటాయించాలి.అప్పు తెస్తామన్న రు.15.69లక్షల కోట్లలో వడ్డీలు, అసలు చెల్లించేందుకు రు. 12.76లక్షల కోట్లు కేటాయించారు.2024-25 బడ్జెట్‌లో సబ్సిడీలకు రు.4.28లక్షల కోట్లు కేటాయించి పదకొండువేల కోట్లు కోత పెట్టారు. తాజా బడ్జెట్‌లో రు.4.26వేల కోట్లు మాత్రమే కేటాయించారు. మొత్తం మీద గతేడాది కేటాయింపులతో పోలిస్తే 0.4శాతం తగ్గించారు. నూతన ఉపాధి కల్పన పధకానికి గతేడాది పదివేల కోట్లు కేటాయించి 6,800 కోట్లు ఖర్చు చేసి వర్తమాన కేటాయింపుల్లో 20వేల కోట్లు చూపి 194శాతం అదనం అని గొప్పలు చెప్పారు.గ్రామీణ ప్రాంతాలకు మంచినీటిని అందచేసే జలజీవన్‌ పథకానికి 70వేల కోట్లు కేటాయించి చేసిన ఖర్చు చేసిన కేవలం 22.693వేల కోట్లు మాత్రమే. ఈ ఏడాది 67వేల కోట్లు కేటాయించి చూశారా 195 శాతం పెంచామంటూ ఊదరగొడుతున్నారు. వీటన్నింటినీ నిజంగా ఖర్చు చేస్తారా అన్నది చూడాలి. ఎరువుల సబ్సిడీగా 2023-24లో రు.1.88 వేల కోట్లు ఖర్చు చేసిన సర్కార్‌ ఈ ఏడాది దాన్ని 1.67లక్షల కోట్లకు కోత పెట్టింది. ఈ కారణంగానే అవసరమైన మేరకు యూరియా ఇతర ఎరువులను దిగుమతి చేసుకోకుండా డబ్బు మిగుల్చుకొని రైతాంగాన్ని ఇక్కట్ల పాలు చేసింది. కార్పొరేట్‌ పన్ను తగ్గించిన కారణంగా గతేడాది లక్ష కోట్ల మేరకు ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి కోత పడింది. ఇవన్నీ చూసినపుడు పాత అప్పులు తీర్చేందుకు కొత్త అప్పులు, కార్పొరేట్లకు రాయితీల కొనసాగింపు, కోట్లాది మంది రైతాంగానికి, ఇతరులకు సబ్సిడీల కోత స్పష్టంగా కనిపిస్తున్నది.

నరేంద్రమోడీ మిత్రుడు డోనాల్డ్‌ ట్రంప్‌ చేస్తున్నది కూడా ఇదే. వివిధ దేశాల వస్తువుల మీద దిగుమతి పన్నులు వేసి రానున్న పది సంవత్సరాల కాలంలో నాలుగు లక్షల కోట్ల డాలర్ల మేర లోటుబడ్జెట్‌ను తగ్గించుకోవాలని చూస్తున్నాడు. దీన్ని మరోవిధంగా చెప్పాలంటే ఆ పన్నుల మొత్తాన్ని చెల్లించాల్సింది సామాన్య పౌరులే గనుక తన అసమర్ధతను జనం మీద రుద్దుతున్నట్లే. నరేంద్రమోడీ చేస్తున్నది కూడా అదే మన అవసరాల్లో 80శాతం ముడిచమురును దిగుమతి చేసుకుంటున్నాం.దాని ఉత్పత్తులైన పెట్రోలు, డీజిలుపై సెస్‌, ఇతర పన్నుల భారాన్ని పెంచారు. మోడీ అధికారానికి వచ్చిన 2014-15 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ పెట్రోలియం ప్లానింగ్‌ ఎనాలసిస్‌ సెల్‌ సమాచారం ప్రకారం ఎక్సైజ్‌ డ్యూటీ రు.99,068 కోట్లు, దాన్ని 2020-21 నాటికి రు.3,72,930 కోట్లకు పెంచారు. తరువాత ఎన్నికలు, తదితర కారణాలతో 2023-24 నాటికి రు.2,73,684 కోట్లకు తగ్గించారు. ఏటా లక్షా 73వేల కోట్ల మేర జనం నుంచి అదనంగా వసూలు చేస్తున్నారు. 2022 ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు ముడి చమురు ధర పీపాకు 20డాలర్లు తగ్గినా ఒక్క పైసా కూడా వినియోగదారులకు ధరలు తగ్గించలేదు. రష్యా నుంచి చౌకధరలకు ముడి చమురు దిగుమతి చేసుకొని లాభాలకు ఐరోపా దేశాలకు ఉత్పత్తులను అమ్మిస్తున్నారు. దేశంలో ముడిచమురు ఉత్పత్తి 2014-15లో ప్రభుత్వ-ప్రైవేటు ఉత్పత్తి 35.9 మిలియన్‌ టన్నులుంటే 2023-24నాటికి 27.2మి.టన్నులకు పడిపోయింది. అందుకే అభివృద్ధి కోసం రుణాలు చేస్తున్నామని రాజకీయ నేతలు చెప్పే మాటలు బూటకం అని చెప్పాల్సి వస్తోంది.

కేంద్ర ప్రభుత్వమే కాదు, రాష్ట్రాలు కూడా నానాటికీ రుణ ఊబిలో కూరుకుపోతున్నాయి. అవి కూడా సంక్షేమ పథకాలకు కోత పెడుతున్నాయి.హిమచల్‌ ప్రదేశ్‌ ప్రభుత్వం పద్నాలుగు రకాల సబ్సిడీలను క్రమబద్దీకరించే పేరుతో కోత పెట్టేందుకు కసరత్తు చేస్తున్నది.మహారాష్ట్రలో రెండింజన్ల పాలన ఉంది. రాష్ట్ర రుణ భారం 9.25లక్షల కోట్లకు పెరగనుంది. ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి లడకీ బహిన్‌ పధకానికి రు.46వేల కోట్లు కేటాయించారు. తాజాగా దాన్ని రు.36వేల కోట్లకు కోత పెట్టారు.వృద్ధులకు యాత్రల సబ్సిడీ కొత్త కేటాయింపులు లేవు. మరో రెండింజన్ల పాలన రాష్ట్రం మధ్య ప్రదేశ్‌. అక్కడ ప్రాధమిక పాఠశాల విద్యకు ఈ ఏడాది రు.15,509 కోట్ల నుంచి రు.11,837 కోట్లకు కుదించారు. మహిళలకు ఉచిత బస్‌ పథకాన్ని ప్రకటించిన కర్ణాటక సర్కార్‌ 15శాతం బస్‌ ఛార్జీలను పెంచింది.

ఒక్క చైనా తప్ప రుణ భారం పెరిగిన ప్రపంచ దేశాలన్నింటా సంక్షేమ పథకాలకు కోత పెడుతున్నారు. అందుకే అనేక చోట్ల వలస వచ్చిన వారు తమ అవకాశాలను తన్నుకుపోతున్నారంటూ మితవాద శక్తులు జనాలను రెచ్చగొడుతున్నాయి.జి 7 దేశాలతో పాటు చైనా రుణభారం గణనీయంగా పెరుగుతున్నట్లు ఐఐఎఫ్‌ నివేదిక పేర్కొన్నది.అమెరికా వెబ్‌సైట్‌ సమాచారం ప్రకారం జపాన్‌ పన్నెండు లక్షల కోట్ల డాలర్ల రుణం కలిగి ఉంది. ఇది జిడిపికి 293శాతం ఎక్కువ. ఇంత రుణం కలిగిన జపాన్‌ అమెరికాకు లక్ష కోట్ల డాలర్ల రుణం ఇచ్చింది. అదే విధంగా జిడిపిలో 86.7శాతం 16లక్షల కోట్ల రుణం ఉన్న చైనా మరోవైపున అమెరికాకు 750 బిలియన్‌డాలర్ల రుణం ఇచ్చింది. ఇతర దేశాలలో సూడాన్‌ రుణం జిడిపికి 252 శాతం ఉంది. నిరంతరం అంతర్యుద్ధాలతో సూడాన్‌ అప్పు పెరిగింది. జపాన్‌లో కార్పొరేట్లకు ఉద్దీపన పథకాలు, వృద్ధుల సంఖ్య పెరగటం కారణాలుగా చెబుతున్నారు. సింగపూర్‌ 175, బహరెయిన్‌ 141, ఇటలీ 137 అమెరికా 123శాతం రుణభారంతో ఉన్నాయి. ధనిక దేశాలు ఇలా ఉండటానికి కారణంగా కార్పొరేట్లకు ఇస్తున్న రాయితీలే ప్రధాన కారణం. ధనిక దేశాలకు సగటున 110, వర్దమాన దేశాలకు 74శాతం రుణభారం ఉంది. ధనిక దేశాల కంటే వర్ధమానదేశాల రుణ భారం వేగంగా పెరగటం ఆందోళన కలిగిస్తోందని ఐఎంఎఫ్‌ హెచ్చరించింది.గతంలో యుద్ధ సమయాల్లోనే దేశాలు పెద్ద మొత్తంలో రుణాలు తీసుకొనేవి. 1980దశకం నుంచి అభివృద్ధి పేరుతో ప్రభుత్వాలు రుణాలు తీసుకోవటం జరుగుతున్నది. చిత్రం ఏమిటంటే అప్పులు పెరుగుతున్నాయి అభివృద్ధి దిగజారుతున్నది, అనేక ధనిక దేశాల అనుభవం ఇదే. అంటే అభివృద్ధికి అప్పులు అనేది పూర్తిగా నిజం కాదు. అనేక దేశాలు రుణాలు తీసుకోవటమే కాదు ఇస్తున్నాయి. ఉదాహరణకు పన్నెండు లక్షల కోట్ల డాలర్ల రుణం ఉన్న జపాన్‌ అమెరికాకు లక్ష కోట్లతో సహా ఇతర దేశాలన్నింటికీ ఇస్తున్న రుణం 2024 నవంబరు నాటికి 4.18 లక్షల కోట్ల డాలర్లకు చేరింది.ఇలాగే ఇతర దేశాలు కూడా ఇస్తున్నాయి. అందువలన ఇలాంటి వాటన్నింటినీ పరిగణనలోకి తీసుకొంటే నిఖరంగా ఎంత అప్పు అన్నది తేలుతుంది. మన జిడిపి చాలా తక్కువే అయినప్పటికీ 216, చైనా 750 బిలియన్‌ డాలర్లు అమెరికాకు అప్పు ఇచ్చాయి. కరీబియన్‌ సముద్రంలో కేమన్‌ దీవుల జనాభా 90వేలకు అటూ ఇటూ, అది అమెరికాకు ఇచ్చిన అప్పు 2024లో 423 బిలియన్‌ డాలర్లు. అదెలా అంటే అదొక పన్నుల స్వర్గం, అక్కడ డబ్బుదాచుకుంటే ఎవరూ లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదు. ఇతర దేశాల్లో పన్నులు ఎగవేసిన పెద్దల నల్లధనం మొత్తం ఇలాంటి చోట్లకు చేర్చి అక్కడి నుంచి ఏ దేశానికైనా రుణాలు ఇచ్చి బ్లాక్‌ను వైట్‌గా మార్చుకుంటారు. అమెరికా అప్పు 37.5లక్షల కోట్ల డాలర్లలో అక్కడి ఫెడరల్‌ రిజర్వు ప్రభుత్వం జారీచేసిన రుణబాండ్లను ఆరులక్షల డాలర్లమేర కొనుగోలు చేసింది, అంటే అప్పు ఇచ్చింది. మన కేంద్ర ప్రభుత్వ మొత్తం రుణం 196లక్షల కోట్లలో 190లక్షల కోట్లు అంతర్గత రుణాలే. అంటే మన బాంకులు, ఉద్యోగులు, ద్రవ్య సంస్థలు ఇచ్చిన అప్పులే అవి. వడ్డీ రాబడి కోసం ఇదంతా జరుగుతున్నది. ఇతర దేశాల మాదిరి జిడిపిలో మన రుణం 93శాతం, దానికి మించి పెరిగితే ఇబ్బందులు వస్తాయి.

ఒక వైపు అప్పులు పెరుగుతుంటే మరోవైపు ప్రపంచ మార్కెట్లో బంగారం ధర దూసుకుపోతోంది.ఈ రెండింటికీ సంబంధం ఉంది అంటున్నారు. గత చరిత్ర ఇదే చెబుతోంది.రుణాలు పెరిగే కొద్దీ కరెన్సీ విలువలు కూడా పడిపోతున్నాయి. ఈ నేపధ్యంలోనే దేశాలూ, వ్యక్తులూ కూడా బంగారం కొనుగోళ్లు సురక్షితం అని భావిస్తున్నారు.మొదటి ప్రపంచ యుద్ధంలో అప్పులపాలైన జర్మనీ తీర్చేందుకు 1920దశకంలో విపరీతంగా నోట్లను ముద్రించింది. దాంతో ద్రవ్యోల్బణం పెరిగి నోట్లు దేనికీ పనికిరాకుండా పోయాయి. జనాలు కరెన్సీ నోట్లను గోడలకు కాగితాల మాదిరి అంటించి నిరసన తెలిపారు. సంక్షోభాలకు బీమా వంటిది బంగారం అని చెబుతారు. ఇప్పుడు ప్రపంచంలో రిజర్వు ఆస్తులలో బంగారానిది రెండవ స్థానం.ప్రపంచ ధనిక దేశాల్లో 2008లో తలెత్తిన ద్రవ్య సంక్షోభంతో ఉద్దీపన పథకాలు అమలు జరిపిన కారణంగా ప్రపంచ రుణం 2007 నుంచి 2009 కాలంలో 20శాతం పెరిగి 178లక్షల కోట్ల డాలర్లకు చేరింది. ఇదే సమయంలో బంగారం ఔన్సు(28.35గ్రాములు) ధర 869 డాలర్ల నుంచి 1,224 డాలర్లకు చేరింది. ఇప్పుడు ప్రపంచ రుణం ముందే చెప్పుకున్నట్లు 338లక్షల కోట్లడాలర్లు దాటింది. ప్రస్తుతం ఔన్సు ధర 3,800 డాలర్లుగా ఉన్నది త్వరలో 4,800 డాలర్లకు పెరగవచ్చని జోశ్యం చెబుతున్నారు. ఐరోపాలో 2011-2012లో తలెత్తిన రుణ సంక్షోభ సమయంలో మదుపుదార్లకు యూరో మీద విశ్వాసం తగ్గి బంగారంవైపు మొగ్గు చూపటంతో 2011 సెప్టెంబరులో 1,920 డాలర్లకు పెరిగింది. జపాన్‌లో 2020-21 సంవత్సరాలలో రుణ భారం 266శాతానికి పెరగటంతో మదుపుదార్లు బంగారం కొనుగోలుకు ఎగబడటంతో కరెన్సీ విలువలో ధర 18శాతం పెరిగింది.2024లో అమెరికా ఐపి పెట్టేవరకు వచ్చి బయటపడింది.రుణం 34లక్షల కోట్ల డాలర్లు దాటింది.దాంతో బంగారం ధర 2,100 డాలర్లకు పెరిగింది. ఏడాది కాలంలోనే 3,800 డాలర్లకు చేరిందంటే సంక్షోభం మరింత ముదురుతున్నట్లు మదుపుదార్లు భావిస్తున్నారు.ప్రస్తుతం ప్రపంచ రుణం జిడిపిలో 95శాతం ఉంది, 2030 నాటికి అది వందశాతానికి చేరవచ్చని ఐఎంఎఫ్‌ అంచనా వేసింది. అంటే సామాన్యులకు ముప్పు మూడినట్లే ! మరి బంగారం ధర సంగతి ? జోశ్యాలను చూస్తే సామాన్యులు దానివైపు చూడనవసరం లేదనట్లుగా ఉన్నాయి. అక్టోబరు ఒకటవ తేదీన ఔన్సు ధర 3,875 డాలర్లకు చేరింది.1999లో కనిష్ట ధర 252 డాలర్లు. డిసెంబరు ఆఖరుకు 4,036 డాలర్ల వరకు పెరగవచ్చని ఆ రంగ నిపుణులు చెబుతున్నారు. కొందరైతే 4,289 డాలర్లకు చేరవచ్చన్నారు.వచ్చే ఏడాది(2026) ఆఖరుకు 5,488 డాలర్లు, 2027-30 మధ్య 5,479 నుంచి 7,956 డాలర్ల మధ్య ధర ఉండవచ్చని కొందరు చెబుతుంటే 2030 నాటికి 11,330 డాలర్లకు పెరగవచ్చని మరికొందరు. కొనుగోలు చేయాలా వద్దా ? ఎవరికి వారు నిర్ణయించుకోవాల్సిందే !

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఎముకలు కుళ్లిన, వయస్సు మళ్లిన సోమరులారా చావండి – సోషలిజానికి సై అంటున్న నెత్తురు మండే, శక్తులు నిండే అమెరికా యువత !

28 Sunday Sep 2025

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, imperialism, International, INTERNATIONAL NEWS, Left politics, Opinion, USA

≈ Leave a comment

Tags

Anti communist, Anti Trump, capitalism or socialism, communism, Donald trump, Joe McCarthy', Kamala Harris, Leftist Zohran Mamdani, Socialism

ఎం కోటేశ్వరరావు

అమెరికాలో ఉన్న మీడియా, కొంత మంది ప్రముఖ వ్యాఖ్యాతలు తెలిసిగానీ తెలియకగానీ, వ్యతిరేక భావంతో, వక్రీకరించి సోషలిజం, కమ్యూనిజాల గురించి తెగ ప్రచారం చేస్తున్నారు. యువత వామపక్ష భావాలవైపు మళ్లకుండా ఉండాలంటే ఇదే దారి అని భావిస్తున్నట్లుగా కనిపిస్తున్నది. ” ట్రంప్‌ సోషలిస్టా ? మీడియా అలా ఆలోచిస్తున్నది ” అనే శీర్షికతో ట్రిల్‌ అనే మాగజైన్‌ సెప్టెంబరు 26న ఒక విశ్లేషణ రాసింది. దాని సారాంశం ఇలా ఉంది. మీడియా, కొంత మంది ప్రముఖులు ట్రంప్‌ చర్యలను కొన్నింటిని వర్ణించేందుకు సోషలిస్టు అనే పదాన్ని వినియోగించినట్లు, ఆ పదం సరైనదేనా అంటూ వర్ణన సాగింది. గతనెలలో అట్లాంటిక్‌ పత్రిక ప్రచురించిన ఒక వ్యాసానికి ” ట్రంప్‌ మితవాద సోషలిజం ” అనే శీర్షిక పెట్టింది. ప్రైవేటు రంగంలో ఉన్న మీడియా, విశ్వవిద్యాలయాలు, న్యాయ కంపెనీల పట్ల ట్రంప్‌ నిరంకుశ పోకడలను ప్రత్యేకంగా ప్రస్తావించి ఆట్లాంటిక్‌ పత్రిక విశ్లేషణ రాసింది. ఈ పూర్వరంగంలో అనేక ప్రసారాల్లో, ప్రముఖులు కూడా ట్రంప్‌ జోక్యాల మీద అలాంటి వర్ణనలు చేస్తున్నారు.వారిలో కాలిఫోర్నియా డెమోక్రటిక్‌ గవర్నర్‌ గావిన్‌ న్యూసమ్‌ ఒకడు. రిపబ్లికన్‌ పార్టీ సెనెటర్‌ రాండ్‌ పాల్‌ కూడా సోషలిజం వైపుగా ఒక అడుగు వేసినట్లు ట్రంప్‌ గురించి వ్యాఖ్యానించాడు. ఫార్యూన్‌ పత్రిక ” మాగా (మేక్‌ అమెరికా గ్రేట్‌ ఎగైన్‌ -అమెరికాను మరోసారి అగ్రస్థానంలో నిలపండి) కార్యక్రమం మార్క్సిస్టుగా ఇంకా చెప్పాలంటే పెరిగి మావోయిస్టుగా ” ఉన్నట్లు పేర్కొన్నది. ఇక న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రికైతే పెట్టుబడిదారీ విధానం మీద దాడి అంటూ ట్రంప్‌ చర్యలను వర్ణించింది.అధ్యక్షుడిని కామ్రేడ్‌ అని వర్ణించింది. ఇంటెల్‌ కంపెనీలో పదిశాతం వాటాలను ప్రభుత్వం తీసుకోవటాన్ని సోషలిజంగా వ్యాఖ్యాత పేర్కొన్నాడు.

సోమవారం నాడు డెమోక్రటిక్‌ పార్టీకి చెందిన మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ ” మనం ఒక కమ్యూనిస్టు నియంత ” తో వ్యహరిస్తున్నాం అని చెప్పారు. ” నూట ఏడు రోజుల జ్ఞాపకాలు ” అనే పేరుతో రాసిన సంకలనాన్ని ఆమె విడుదల చేశారు. ట్రంప్‌ రెండవ ఏలుబడి ఎలా ఉంటుందో ఆమె జోశ్యం చెప్పారు. ప్రైవేటు రంగం అణగిమణిగి ఉంటుందని తాను అనుకోవటం లేదని పేర్కొన్నారు. సోమవారం రాత్రి ఒక టీవీలో మాట్లాడుతూ పరిశ్రమలో అగ్రగణ్యులు ప్రజాస్వామ్య పరిరక్షకులుగా ఉంటారని ఆశించానని, వారు మౌనంగా ఉన్నారని చెప్పారు. ప్రజాస్వామ్యం పెట్టుబడిదారీ విధానాన్ని నిలబెడుతుంది, పెట్టుబడిదారీ విధానం ప్రజాస్వామ్యంలో వర్ధిల్లుతుంది అన్నారు. గత ఏడాది తాను ట్రంప్‌ను ఒక క్రూరుడు అని వర్ణించానని ఇప్పుడు అతనితోనే పని చేస్తున్నామని చెప్పారు. మన ప్రజాస్వామ్యాన్ని కమ్యూనిస్టు నియంతలతో పోలిస్తే మనం ఇప్పుడు నియంత ట్రంప్‌తోనే వ్యవహరిస్తున్నామన్నారు.కార్పొరేట్‌ శక్తులు ట్రంప్‌ బెదిరింపులకు భయపడి నోరు విప్పటం లేదని చెప్పారు.

అమెరికాలో కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొట్టటంలో, వక్రీకరించటంలో రిపబ్లికన్లు, డెమోక్రాట్లు దొందూ దొందే. ఈ రెండు పార్టీలను అనుసరించే మీడియా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. రాజును మించిన రాజభక్తిని ప్రదర్శించినట్లుగా వ్యవహరిస్తున్నాయి. వారెంతగా రెచ్చగొట్టినా అక్కడ జరుగుతున్నదానిని చూస్తే ఎముకలు కుళ్లిన వయస్సు మళ్లిన సోమరులారా చావండి, నెత్తురు మండే శక్తులు నిండే సైనికులారా రారండీ అంటూ మహాకవి శ్రీశ్రీ యువతరానికి ఆహ్వానం పలికాడు. ఇటీవలి కాలంలో అమెరికాలో జడ్‌ జనరేషన్‌ సోషలిజం, కమ్యూనిజం పట్ల సానుకూలతను వ్యక్తం చేయటాన్ని చూస్తే సోషలిస్టు జగన్నాధ రధ చక్రాలను అడ్డుకోవటం శత్రువుల వల్లకాదన్నది స్పష్టం.పెట్టుబడిదారీ విధాన కుంభస్థలం వంటి న్యూయార్క్‌ నగరంలో నవంబరులో జరిగే మేయర్‌ ఎన్నికలో డెమోక్రటిక్‌ సోషలిస్టు జోహ్రాన్‌ మమ్దానీ తాజా సర్వేల ప్రకారం 45శాతం ఓట్లతో ముగ్గురు ప్రత్యర్ధులకంటే ఎంతో ముందున్నాడు. సమీప ప్రత్యర్ధి, డెమోక్రటిక్‌ పార్టీ తిరుగుబాటు నేత మాజీ గవర్నర్‌ ఆండ్రూ కుమో 25శాతం దగ్గరే ఉన్నాడు. అదే పార్టీకి చెందిన ప్రస్తుత మేయర్‌ ఎరిక్‌ ఆడమ్స్‌ కూడా తిరుగుబాటు అభ్యర్థిగా పోటీలో ఉన్నాడు.న్యూయార్క్‌ మేయర్‌ ఎన్నికల్లో డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డెమోక్రటిక్‌ సోషలిస్టు జోహ్రాన్‌ మమ్దానీకి ఓటు వేయాలని కోరుతూ న్యూయార్క్‌ రాష్ట్ర గవర్నర్‌ కాథీ హౌచుల్‌ ప్రకటన చేయటంతో డోనాల్డ్‌ ట్రంప్‌ చిందులు తొక్కాడు. గత కొద్ది నెలలుగా తాను మేయర్‌ ఎన్నికల్లో జోక్యం చేసుకోనంటూ గవర్నర్‌ దూరంగా ఉండి ఆకస్మికంగా మద్దతు ప్రకటించింది. దాంతో కేంద్రం ఇచ్చే నిధులు నిలివేస్తానని ట్రంప్‌ బెదిరించాడు.కరుడు గట్టిన కమ్యూనిస్టుకు గవర్నర్‌ మద్దతు ప్రకటించాడంటూ వ్యాఖ్యానించాడు.అదెలా జరుగుతుంది, వాషింగ్టన్‌ (ఫెడరల్‌ ప్రభుత్వం) పరిస్థితిని దగ్గరగా పరిశీలిస్తున్నదని పేర్కొన్నాడు.మమ్దానీ ఎన్నికైతే పోలీసు యంత్రాంగానికి నిధుల కోత పెడతాడని, పౌరులకు రక్షణ ఉండదని వ్యతిరేకులు ప్రచారం చేస్తున్నారు.గాజాలో ఇజ్రాయెల్‌ జరుపుతున్న దారుణాలను వ్యతిరేకించటం, పాలస్తీనియన్లకు మద్దతు ప్రకటించటాన్ని ట్రంప్‌ జీర్ణించుకోలేకపోతున్నాడు. ధనికుల మీద పన్నులు పెంచుతానంటూ చేసిన వాగ్దానంతో ధనికులుగా ఉన్నవారు ఎలాగైనా ఓడించాలని పెద్ద ఎత్తున డబ్బు సంచులతో రంగంలోకి దిగారు. ఆ పన్నులతో నగర పౌరులకు ఉచిత బస్‌ ప్రయాణం, పిల్లల సంరక్షణ కేంద్రాలు, కార్పొరేషన్‌ తరఫున చౌకధరలకు సరకులను అందించే దుకాణాలను ప్రారంభిస్తానని, అద్దెలను పెంచకుండా చూస్తానని కూడా మమ్దానీ చెప్పాడు.

గతంలో సోషలిజం విఫమైంది అన్న ప్రచారం పెద్ద ఎత్తున జరగింది. ఇప్పుడు సోషలిజం విఫలమైంది అనే భావన రోజు రోజుకూ పెరుగుతున్నది. ఇటీవల కాటో, యు గవ్‌ సంస్థలు జరిపిన సర్వేలో అమెరికా సమాజంలో మార్పులు కనిపించాయి. విద్యా సంస్థలు, మీడియాలో కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారం యువత మీద పెద్దగా కనిపించటం లేదని చెప్పవచ్చు. మొత్తంగా సోషలిజం పట్ల 43, కమ్యూనిజం పట్ల 14శాతం, 18-29 ఏండ్ల మధ్య వయస్సువారిలో సోషలిజం పట్ల 62శాతం, కమ్యూనిజం పట్ల 34శాతం మంది సానుకూల వైఖరిని వెల్లడించారు. అమెరికా సమాజంలో 18-29 సంవత్సరాల వయస్సు వారు 5.2కోట్ల మంది ఉన్నారు, అంటే 3.2 కోట్ల మంది సోషలిజం పట్ల సానుకూలతను ప్రదర్శించినట్లు అయితే సోషలిజం అంటే ఏమిటో నిర్వచించలేదు గనుక స్పష్టత లేదని కొందరు భాష్యం చెబుతున్నారు. కొంత మంది అలా ఉన్నప్పటికీ సైద్దాంతిక చర్చ జరుగుతున్నది గనుక తెలుసుకోవటం అసాధ్యమేమీ కాదు.డెమోక్రటిక్‌ పార్టీలో 66శాతం మంది సోషలిజం పట్ల సానుకూలంగా ఉన్నారని కూడా సర్వేలు వెల్లడించాయి. అసలు విషయం ఏమంటే ఎవరెన్ని చెప్పినా కమ్యూనిస్టు వ్యతిరేకులకు ఇది పెద్ద దెబ్బ.సోషలిజానికి అనుకూలమా కాదా అనేదాని కంటే పెట్టుబడిదారీ విధానం వైఫల్యం చెందిందని గ్రహించటం కూడా పాలకవర్గాలకు ఆందోళన కలిగించే అంశం. డోనాల్డ్‌ ట్రంప్‌ మరియు సోషలిజం గురించి వ్యంగ్యంగా ఉక్రోషంతో మీడియా ఏమి రాసినప్పటికీ అసలు సోషలిజం అంటే ఏమిటి అని తెలుసుకొనేవైపు యువతను నెడుతుండటం ఒక విధంగా మంచి పరిణామమే.

మొత్తంగా సమాజంలో 14 శాతం, 18-29 ఏండ్ల యువతలో 34శాతం మంది కమ్యూనిజం పట్ల సానుకూలత వ్యక్తం చేయటాన్ని జీర్ణించుకోలేని వారు కమ్యూనిజం పని చేయదని యువతరం తెలుసుకోవాలంటూ విశ్లేషణలు రాస్తున్నారు. పాత చింతకాయ పచ్చడి జాడీల దుమ్ముదులుపుతున్నారు. సోషలిజం పని చేయకపోతే వివిధ రంగాలలో కమ్యూనిస్టు చైనా నేడు అమెరికాను సవాలు చేసే స్థితికి ఎలా ఎదిగిందన్నదానికి సమాధానం చెప్పటం లేదు.ఆస్ట్రేలియాలోని లేబర్‌ పార్టీ నిజానికి ఒక బూర్జువా పార్టీ తప్ప మరొకటి కాదు. ప్రస్తుతం అధికారంలో ఉంది. దాని పోకడ నయా కమ్యూనిజం వైపు ఉన్నదంటూ వ్యతిరేకులు ధ్వజమెత్తుతున్నారు. వారు చూపుతున్న కారణాలేమిటంటే ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను అమలు జరుపుతున్నదన్నది ఒకటి. స్వేచ్చ తక్కువగా ఉండే విధానాలను అనుసరిస్తున్నదని, ఆ ప్రాంతంలో చైనా ప్రాబల్యాన్ని అడ్డుకోలేకపోతున్నదని, ప్రధాని ఆల్బనీస్‌ రాజకీయ జీవితం ప్రారంభ దినాల్లో కమ్యూనిస్టు ఉద్యమంతో దగ్గరి సంబంధాలు కలిగి ఉన్నాడని, కమ్యూనిస్టులను పొగిడాడని, కొంత మంది లేబర్‌ పార్టీ నేతలకు చైనా కమ్యూనిస్టు పార్టీతో సంబంధాలు ఉన్నాయని, చైనా బిల్డింగ్‌ అసోసియేషన్‌ సభ్యులతో కలసి భోజనం చేశారని, గతంలో ఆల్బనీస్‌ పొరుగున ఉన్న విక్టోరియా రాష్ట్ర మాజీ ప్రధాని డేనియల్‌ ఆండ్రూస్‌ చైనాను చూసి కరోన సమయంలో కఠిన నిబంధనలను అమలు జరిపాడని, చైనా మిలిటరీ పరేడ్‌కు వెళ్లాడని, రెండవసారి గెలిచిన తరువాత షీ జింపింగ్‌తో భేటీ కోసం ఆల్బనీస్‌ ఆరు రోజుల పాటు జరిపిన చైనా పర్యటన అనుమానాస్పదంగా ఉందంటూ ఒక వ్యాఖ్యాత తన చౌకబారు తనాన్ని వెల్లడించుకున్నాడు.

సోషలిజం, కమ్యూనిజాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారానికి ఇవి మచ్చుతునకలు మాత్రమే. ఐరోపా, ఇతర అనేక దేశాల్లో ఇలాంటి వక్రీకరణలు నిత్యకృత్యం. అగ్రభాగాన ఉన్న అమెరికాలో న్యూయార్క్‌, మినియపోలిస్‌ పట్టణ మేయర్లకు జరిగే ఎన్నికలలో డెమోక్రటిక్‌ సోషలిస్టులు జోహ్రాన్‌ మమ్దానీ, ఓమా ఫతే పోటీ చేస్తున్నారు. వారు ఓడినా, గెలిచినా అమెరికాలో పెనుమార్పులు ఇప్పటికిప్పుడు జరగవు. అయినప్పటికీ పాలకవర్గం భయపడుతున్నది. అందుకే సోషలిస్టు, కమ్యూనిస్టు సిద్దాంతాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రచార దాడికి మరోసారి పూనుకున్నారు. కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారానికి పెట్టింది పేరైన జో మెకార్ధీ తిరిగి రావాల్సిన అవసరం ఉందని కొందరు పిలుపు ఇచ్చారంటేనే మితవాదశక్తులు బెంబేలెత్తుతున్నట్లు స్పష్టం అవుతున్నది. అందుకే కమ్యూనిస్టులు, ఇతర పురోగామి శక్తులు నయా మెకార్థిజాన్ని ఎదుర్కోవటంలో గతంలో చేసిన పొరపాట్లను పునరావృతం కానివ్వకూడదని నిర్ణయించాయి.దాన్లో భాగంగా మధనం జరుపుతున్నాయి.ట్రంప్‌ పోకడలు మెకార్థీని పోలి ఉన్నట్లు చెబుతున్నారు.1950 దశకంలో జో మెకార్థీ ఒక రిపబ్లికన్‌ సెనెటర్‌. అబద్దాలు చెప్పటంలో పేరుమోసిన వాడు.ఒక నిచ్చెన మీద నుంచి పడిపోయినపుడు తగిలిన గాయం తాను యుద్ధంలో పాల్గొన్నపుడు అయిందని జనాన్ని నమ్మించాడు. ఒక గొప్ప ప్రజాస్వామ్యం(నిజానికి అదొక భ్రమ) నాశనం అయిందంటే దానికి కారణం అంతర్గత శక్తులు తప్ప వెలుపలి నుంచి వచ్చిన ముప్పు కాదని అనేక మంది ప్రముఖులు చెప్పారు. ఇప్పుడు అమెరికాలో డోనాల్డ్‌ ట్రంప్‌ అండ్‌ కో నుంచే అది జరుగుతున్నది. నాడు మెకార్థి చేసిన ప్రచారం ఏమంటే విద్రోహులైన కమ్యూనిస్టులు విదేశాంగశాఖలో ప్రవేశించారని 205 మంది జాబితా తన దగ్గర ఉందని చెప్పాడు. అయితే దాన్నెపుడూ బహిర్గతపరచలేదు. తరువాత జరిపిన విచారణలో మెకార్థీ చెప్పినవన్నీ అసత్యాలని తేలింది. ఆ సమయంలో హాలీవుడ్‌తో సహా అనేక రంగాలలో పురోగామి భావాలు కలిగిన అనేక మందికి కమ్యూనిస్టు ముద్రవేసి ఎంతో హానికలిగించారు. ఇప్పుడూ అదే జరుగుతోంది, గిట్టని ప్రత్యర్ధులపై ఆ పేరుతో దాడి చేస్తున్నారు.మీడియాలో ట్రంప్‌ను,అతగాడి విధానాలను విమర్శించే వారిని నిర్దాక్షిణ్యంగా తొలగిస్తున్నారు.హత్యకు గురైన ట్రంప్‌ అనుయాయి పచ్చి మితవాది చార్లీ కిర్క్‌ గురించి చేసిన వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టును తొలగించారు, లేకపోతే ప్రసార అనుమతులను రద్దు చేస్తామని ట్రంప్‌ యంత్రాంగం బెదిరించింది. పాలస్తీనాకు మద్దతు ప్రకటించటం, ఇజ్రాయెల్‌ దుర్మార్గాన్ని నిరసించటాన్ని సహించలేని యంత్రాంగం కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో 160 మంది విద్యార్థుల పేర్లను ప్రభుత్వానికి అందచేసింది. అందుకే మెకార్థీ చచ్చినా మెకార్థీయిజం పురుడు పోసుకుంటున్నదని చెబుతున్నారు.అయితే రోజులు మారాయి. జడ్‌ జనరేషన్‌ 66శాతం మంది సోషలిజం పట్ల సానుకూలత వ్యక్తం చేశారన్న అంశాన్ని విస్మరిస్తున్నారు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడిని మూసిపెట్టటం ఎలా అసాధ్యమో భావజాలాన్ని అణిచిపెట్టటం కూడా అంతే !. శీఎ.aబ06:41

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d