• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Japan

చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !

17 Wednesday Dec 2025

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, UK, USA

≈ Leave a comment

Tags

Chip war 2.0, Chip war 2.0 against China, Elon Musk, Nvidia's H200, Pax Silica, US and China Chip War

ఎం కోటేశ్వరరావు

సాంకేతిక రంగంలో ముందుకు పోకుండా చైనాను అడ్డుకొనేందుకు ఇప్పటి వరకు ఒంటరిగా ప్రయత్నించిన అమెరికా తాజాగా తనకు తోడుగా మరికొన్ని దేశాలను కూడగట్టుకొని గోదాలోకి దిగింది. బహుశా అందుకే కృత్రిమ మేథ(ఏఐ) రంగంలో పూర్తిస్థాయి యుద్ధ ముప్పు ఉందని ప్రపంచ ధనికుడు ఎలన్‌ మస్క్‌ వ్యాఖ్యానించాడు. అమెరికా దిగ్గజ సంస్థ ఎన్‌విడియా తదుపరి తరం హార్డ్‌వేర్‌ బ్లాక్‌వెల్‌ చిప్‌తో అది ప్రారంభం అయినట్లే అన్నాడు. వచ్చే ఏడాది మార్కెట్‌లోకి అది రానుందనే వార్తల పూర్వరంగంలో జరుగుతున్న పరిణామాలపై తాజాగా మస్క్‌ స్పందించాడు. ఈ చర్యతో పోటీదారులు వేగం,ఖర్చు,విస్తృతి అంశాల్లో తమ సత్తా చూపేందుకు పూనుకుంటారన్నాడు. ద్రవ్యపెట్టుబడిదారు గవిన్‌ బేకర్‌ మాట్లాడిన అంశాల మీద మస్క్‌ స్పందించాడు. బ్లాక్‌వెల్‌ చిప్స్‌ తయారీలో అనేక సవాళ్లు ఉన్నట్లు బెకర్‌ చెప్పాడు. అందుకే అది ఆలస్యం అవుతున్నదని అన్నాడు.ఏది ఏమైనప్పటికీ ఈ రంగంలో ఉన్న గూగుల్‌, ఎలన్‌మస్క్‌ ఎక్స్‌ఏఐ, మేటా (ఫేస్‌బుక్‌ ) వంటి కంపెనీలన్నీ పోటీపడతాయని వేరే చెప్పనవసరం లేదు. మరోవైపు పశ్చిమ దేశాల సంస్థలకు చైనా పెద్ద సవాలు విసురుతున్నది. గత పదిహేను సంవత్సరాలుగా సాంకేతిక రంగంలో బీజింగ్‌ ఎదగకుండా చూసేందుకు అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు చేయని యత్నం లేదు. వాణిజ్యపోరుతో పాటు చిప్స్‌ పోరును కూడా ప్రారంభించాయి. తాజా పరిణామాలను బట్టి ఈ యుద్ధంలో అమెరికాకు ఊహించని దెబ్బ తగిలిందని చెప్పవచ్చు.అందుకే అది కొత్త ఎతుత్తగడలతో పోరును కొనసాగించేందుకు పాక్స్‌ సిలికా పేరుతో కొత్త కూటమిని రంగంలోకి తెచ్చింది.

చిప్‌ యుద్ధంలో చైనా ఒక్కటే ఒకవైపు ,అనేక దేశాలు మరోవైపు ఉన్నాయి. జోబైడెన్‌ సర్కార్‌ 2022 అక్టోబరు నుంచి ా చైనాకు అధునాతన చిప్స్‌ ఎగుమతులపై ఆంక్షలు విధించింది. ఇటీవలనే ట్రంప్‌ ఏలుబడి ఎన్‌విడియా కంపెనీకి అనుమతి ఇచ్చింది. అయితే అధికారికంగా ఎలాంటి సమాచారం లేనప్పటికీ ఆ చిప్స్‌ తమకు అవసరం లేదన్నట్లుగా చైనా తీరు ఉందని, తిరస్కరించినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఈ పూర్వరంగంలో చిప్‌ యుద్దంలో తన బలం ఒక్కటే చాలదని భావించిన అమెరికా డిసెంబరు 12న తొలిసారిగా పాక్స్‌ సిలికా పేరుతో ఒక కూటమికి శ్రీకారం చుట్టింది. పాక్స్‌ అంటే లాటిన్‌ భాషలో శాంతి, స్థిరత్వం, సిలికా అంటే ఇసుకతో సహా వివిధ రూపాల్లో ఉండే ఖనిజం. దాన్నుంచి కంప్యూటర్లకు అవసరమైన చిప్స్‌ తయారు చేస్తారు,అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఐటి, సాంకేతిక పరిజ్ఞానం కేంద్రాలు కేంద్రీకృతమైన ప్రాంతాన్ని సిలికాన్‌ వ్యాలీ అని పిలుస్తున్న సంగతి తెలిసిందే. పాక్స్‌ సిలికా లక్ష్యం ఏమిటంటే విలువైన ఖనిజాల సరఫరా, సాంకేతిక పరిజ్ఞాన సహకారంతో ఆ కూటమిలోని దేశాలు బలపడటం, చైనా ఆధిపత్యాన్ని ఉమ్మడిగా సవాలు చేయటం. అమెరికా వైపు నుంచి ఇలాంటి చొరవ చూపటం అంటే కమ్యూనిస్టు చైనా ముందు ఒక విధంగా తన ఓటమిని అంగీకరించటమే.చిత్రం ఏమిటంటే ఈ బృందం నుంచి భారత్‌ను మినహాయించారు.దీని అర్ధం మనలను చేర్చుకున్నందున తమకు ఉపయోగం లేదని భావించినట్లేనా ? లేక తమకు అనుకూలమైన షరతులతో వాణిజ్య ఒప్పందానికి ఒప్పించటానికి మరోవిధంగా వత్తిడి చేయటమా ?

ప్రస్తుతం ప్రపంచంలో విలువైన ఖనిజాలు, వాటి ఉత్పత్తుల విషయంలో 70శాతంతో చైనా అగ్రభాగాన ఉంది. వాటి ఎగుమతుల నిలిపివేతతో ఇటీవల ప్రపంచంలోని అనేక దేశాలు గిజగిజలాడిన సంగతి తెలిసిందే.ఈ ఖనిజాలతో పాటు కృత్రిమ మేథ(ఏఐ), చిప్స్‌ తయారీ వంటి కీలక రంగాలలో పరస్పరం సహకరించుకొనేందుకు అమెరికా,దక్షిణ కొరియా, సింగపూర్‌, జపాన్‌, ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్‌, నెదర్లాండ్స్‌, బ్రిటన్‌, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ స్థాపక సభ్యులుగా పాక్స్‌ సిలికా ఏర్పడింది. ఆర్థిక కూటములు తప్ప సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించి ఏర్పడటం ఇదే ప్రధమం.దీన్ని అమెరికా కృత్రిమ మేథ దౌత్యంగా వర్ణించారు. ఈ కూటమికి సహకరించేందుకు లేదా అతిధులుగా తైవాన్‌, ఐరోపా యూనియన్‌, కెనడా,ఓయిసిడి ఉంటాయి. ఈ సంస్థలకు చెందిన దేశాలు తమవంతు సహకారాన్ని అందిస్తాయి. అమెరికా ఆర్థిక వ్యవహారాల సహాయమంత్రి జాకబ్‌ హెల్‌బర్గ్‌ ఈ చొరవను ” నూతన స్వర్ణ యుగం ” అని వర్ణించాడు. దీని గురించి చైనా ఇంతవరకు అధికారికంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. ఇతరులపై ఆధారపడకుండా చైనా స్వయంశక్తితో ఎదిగేందుకు దీర్ఘకాలిక పథకాలను రూపొందించింది.దాన్లో భాగంగానే అక్కడి ప్రభుత్వం పెద్ద మొత్తాలలో పరిశోధన, అభివృద్ధికి ఖర్చు చేస్తున్నది.స్వయంగా ఉత్పత్తులను చేస్తున్నది. ఇప్పుడు పాక్స్‌ సిలికాను కూడా సవాలుగా తీసుకొని మరింతగా తన సంస్థలను ప్రోత్సహిస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదు. గతంలో అమెరికా, పశ్చిమ దేశాలు ఎంతగా ఒంటరిపాటు చేయాలని చూస్తే ఎలాంటి ఆర్భాటం లేకుండా అంతగా నూతన విజయాలతో ముందుకు వచ్చి సమాధానం చెప్పింది.

చైనా గురించి అనేక అబద్దాలను ప్రచారం చేశారు. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. ఎన్‌విడియా కంపెనీ తయారు చేసిన చిప్స్‌ను చైనాకు ఎగుమతి చేయరాదని అమెరికా ప్రభుత్వం నిషేధం విధించింది. అయితే వాటిని అక్రమ పద్దతుల్లో సేకరించి డీప్‌సీక్‌లో వినియోగిస్తున్నట్లు వార్తలు రాశారు. అయితే అలాంటిదేమీ లేదని ఎన్‌విడియా ప్రకటించి వాటిగాలి తీసింది. సదరు ఆరోపణకు ఎలాంటి ఆధారాలు లేవని, తాము అమెరికా నిబంధనలకు అనుగుణంగానే పని చేస్తున్నట్లు పేర్కొన్నది. అత్యంత తక్కువ ఖర్చుతో స్వల్పకాలంలోనే ఏఐ డీప్‌సీక్‌ను తయారు చేసి 2025లో ప్రపంచాన్ని కుదిపివేసింది. చాట్‌ జిపిటి వంటి ఏఐ వ్యవస్థలను తయారు చేసేందుకు భారీ మొత్తాలలో ఖర్చు చేసిన సంస్థలు తలలు పట్టుకున్నాయి. కంపెనీల వాటాల ధరలు పతనమయ్యాయి. ఆధునికమైన చిప్స్‌తో పనిలేకుండానే తక్కువ ఖర్చుతో ఏఐ వ్యవస్థలను తయారు చేయవచ్చని ఇప్పుడు అనేక మంది భావిస్తున్నారు. సాంకేతిక రంగంలో కొన్నింటిలో ఇప్పటికీ ముందున్నప్పటికీ మొత్తంగా చూసినపుడు గతంలో మాదిరి అమెరికా ఒక నిర్ణయాత్మక శక్తిగా లేదు. ఎన్‌విడియా హెచ్‌200 రకం చిప్‌లను చైనాకు ఎగుమతి చేయవచ్చని ట్రంప్‌ అనుమతించాడు.చైనా మార్కెట్‌లో ప్రవేశించటం ఒకటైతే, వాటిని కొనుగోలు చేసిన చైనా తనపరిశోధనలను పక్కన పెట్టి వాటిపైనే ఆధారపడుతుందనే అంచనాతో ఈ చర్య తీసుకున్నాడు. అయితే అలా జరుగుతుందని చెప్పలేమని అధ్యక్ష భవనంలో ఏఐ జార్‌గా పరిగణించే డేవిడ్‌ శాక్స్‌ చెప్పాడు. ఎగుమతులపై నిషేధం పెట్టిన అమెరికా తానే ఏకపక్షంగా ఎత్తివేసింది. ఆట నిబంధనలను తానే రూపొందించి తానే మార్చినట్లయింది.

కొన్ని దశాబ్దాల పాటు తన నిబంధనలతో అమెరికా ప్రపంచాన్ని ఏలింది. ఇతర దేశాల తలరాతలను రాసేందుకు ప్రయత్నించింది. మనతో సహా అలీన దేశాలకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తే అది సోవియట్‌, ఇతర సోషలిస్టు దేశాలకు, పెట్టుబడిదారీ దేశాల్లోనే తమ ప్రత్యర్ధులకు చేరుతుందనే భయంతో అనేక చర్యలు తీసుకుంది. పోటీదారులు తలెత్త కుండా చూసుకుంది, సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా తన రాజకీయ అవసరాల కోసం ఒక ఆయుధంగా వాడుకుంది. మన దేశానికి అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం అందకుండా అన్ని విధాలుగా అడ్డుకుంది. సోవియట్‌ యూనియన్‌, తరువాత రష్యా అండతో దాన్ని అధిగమించాం. అణుపరీక్షలు జరిపితే ఆంక్షలు విధించింది. ఆహార ధాన్యాలు కావాలంటే మాకేంటని బేరం పెట్టింది. ఇలా అనేక అంశాలను చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు కుదరదు, పరిస్థితులు మారాయి. అది చేసిన చారిత్రక తప్పిదం వలన ఇతర దేశాల మీద ఆధారపడక తప్పని స్థితి. వస్తు ఉత్పాదక పరిశ్రమలన్నింటినీ మూసివేసింది, లేదా ఇతర దేశాలకు తరలించింది. ఇప్పుడు టాయిలెట్లలో తుడుచుకొనేందుకు అవసరమైన కాగితాన్ని కూడా అది ఏదో ఒక దేశం నుంచి దిగుమతి చేసుకోవాల్సిందే. కోట్లకు వేసుకొనే టై దగ్గర నుంచి కాళ్లకు వేసుకొనే బూట్ల వరకు ఇతర దేశాల నుంచి తెచ్చుకుంటే తప్ప గడవదు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సంపాదించిన సొమ్ముతో వాటన్నింటినీ ఎక్కడో అక్కడ నుంచి తెచ్చుకుంది. ఇప్పుడు అలాంటి అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. ఉదాహరణకు ఎన్‌విడియా చిప్స్‌ను చైనాకు ఎగుమతి చేసి రాబడిలో 25శాతం ఖజానాకు జమచేస్తానని ట్రంప్‌ చెప్పాడు. ఎలా అంటే 25శాతం ఎగుమతి పన్ను విధించి అన్నాడు. ఆ కంపెనీ ఏటా పది బిలియన్‌ డాలర్ల వరకు హెచ్‌ 200 రకం చిప్స్‌ను ఎగుమతి చేస్తే దాని మీద 25శాతం పన్నుతో రెండున్నర బిలియన్‌ డాలర్ల మేర రాబడి వస్తుందని ట్రంప్‌ లెక్కలు వేసుకున్నాడు. తీరా ఏమైంది. అమెరికా చిప్సా అసలు మనకు వాటి అవసరం ఉందో లేదో సమీక్షించాలని, ప్రభుత్వ రంగంలో వాటిని వాడవద్దని తన అధికారులు, సంస్థలను చైనా ప్రభుత్వం ఆదేశించినట్లు మీడియాలో వచ్చింది. మన చిప్స్‌ను చైనా తిరస్కరిస్తున్నది అని అధ్యక్ష భవన అధికారి డేవిడ్‌ శాక్స్‌ బ్లూమ్‌బెర్గ్‌ వార్తా సంస్థతో చెప్పాడు. అదే నిజమైతే ట్రంప్‌ వ్రతం చెడ్డా ఫలం దక్కలేదని చెప్పాల్సి ఉంటుంది. 2023 నుంచి నిషేధం అమలు చేసినందున మూడు సంవత్సరాల్లో ఎంతో నష్టపోయినట్లు ఎన్‌విడియా కంపెనీ వాపోయింది. అమెరికా భద్రత పేరుతో ఈ నిషేధం కారణంగా ఎవరిమీదో ఎందుకు ఆధారపడటం మీరే తయారు చేయండని స్థానిక కంపెనీలకు 70 బిలియన్‌ డాలర్ల ప్రోత్సాహక పాకేజ్‌ను చైనా ప్రకటించింది. అంతే శక్తివంతమైన ప్రత్నామ్నాయాలను రూపొందించింది కనుకనే అమెరికా చిప్స్‌తో పనిలేదన్నట్లుగా ఉంది. భద్రత సాకును వదలివేసి లాభాలే పరమావధిగా ఎగుమతులకు అమెరికా అనుమతి ఇచ్చింది.

ముందే చెప్పుకున్నట్లు చైనా పరిశోధనా రంగంలో చేస్తున్న ఖర్చుకు ఫలితాలు కనిపిస్తున్నాయి.2025 డిసెంబరు ఒకటవ తేదీన ఆస్ట్రేలియన్‌ స్ట్రాటజిక్‌ పాలసీ ఇనిస్టిట్యూట్‌ విడుదల చేసిన సమాచారం ప్రకారం అది విశ్లేషించిన 74 కీలక రంగాలకు గాను 66లో చైనా పరిశోధనలు ముందున్నాయి.అమెరికా కేవలం ఎనిమిదింటిలో మాత్రమే ఉంది. 2000 దశకంలో అమెరికా అగ్రస్థానంలో ఉంది, ఇప్పుడు తిరగబడింది. అయితే చైనా ఆ తరువాత అల్లా ఉద్దీన్‌ అద్బుతదీపాన్ని సంపాదించిందా ? లేదు, ఒక దీర్ఘకాలిక ప్రణాళిక ప్రకారం ప్రాధాన్యత రంగాలను ఎంచుకొని సాగించిన కృషికి ఫలితమిది.అమెరికా ఎప్పుడైతే అడ్డుకోవాలని చూసిందో అప్పటి నుంచి మరింత పట్టుదల పెరిగింది.అనేక రంగాలలో విదేశాల కోసం ఎదురుచూడాల్సిన అవసరం ఇప్పుడు లేదు. అలా అని తలుపులు మూసుకోలేదు, అవసరమైన వాటికోసం వెంపర్లాడటం లేదు. చిప్స్‌ కొనటం లేదని అమెరికా అధికారి వాపోవటానికి కారణం చైనా కాదు, అమెరికా అనుసరించిన ఎత్తుగడలే అన్నది స్పష్టం. అవసరం అయినపుడు అమ్మకుండా తీరిన తరువాత ఇస్తామంటే ఎవరైనా కొనుగోలు చేస్తారా ? చైనా కొన్ని అంశాలలో తన విధానాలను ఇతర దేశాలను చూసి నిర్ణయించుకోవాల్సిన స్థితిలో లేదు. చైనాతో సహా వర్ధమానదేశాలన్నింటినీ తమ గుప్పిటలోకి తెచ్చుకోవాలని అమెరికా శ్వేత సౌధంలో రిపబ్లికన్లు, డెమోక్రాట్లు ఎవరు ఉన్నా అనుసరించిన విధానం ఒక్కటే.అక్కడి అధికారం కోసం వారిలో వారు పోట్లాడుకుంటారు తప్ప ఇతర దేశాలను దోచుకోవటంలో, తంపులు పెట్టి ఆయుధాలు అమ్ముకోవటంలో ఎవరికెవరూ తీసిపోలేదు. ట్రంప్‌ రెండవసారి అధికారానికి వచ్చిన తరువాత చైనాపై చిప్‌ యుద్ధం 2.0 ప్రారంభించాడు, ఇది ఏ పరిణామాలు, పర్యవసానాలకు దారితీస్తుందో చూద్దాం !

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !

10 Wednesday Dec 2025

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, Japan, Opinion, USA, WAR

≈ Leave a comment

Tags

China, Donald trump, Japan pacifist constitution, PLA Liaoning, PLA warships, Sanae Takaichi, Taiwan Matters, Xi Jinping

ఎం కోటేశ్వరరావు

నిత్యం ఎక్కడో ఒక దగ్గర ఉద్రిక్తతలను రెచ్చగొట్టి ఆయుధాలను అమ్ముకొని సొమ్ము చేసుకుంటే తప్ప అమెరికాకు రోజుగడవదు. దాన్లో భాగంగానే దక్షిణ చైనా సముద్రంలో ఉద్రిక్తతలను రెచ్చగొడుతున్నది. ఇటీవల రెండు సార్లు తమ విమానాల రాడార్లపై చైనా ఆయుధాలను గురిపెట్టిందని జపాన్‌ ఆరోపించింది. మిలిటరీ పరిభాషలో లాక్‌ ఆన్‌ అంటే ఒక దేశానికి చెందిన మిలిటరీ విమానాలు మరోదేశానికి చెందిన విమానాలపై రాడార్ల ద్వారా నిఘావేసి సంకేతాలు పంపటమే. ఇదికొన్ని సందర్భాలలో కూల్చివేతలకు కూడా దారి తీయవచ్చు. నిఘా అవసరాలకూ వినియోగించవచ్చు. దేనికి అలా చేశారన్నది ఆయా దేశాలు చెప్పే భాష్యాలు వివాదం అవుతున్నాయి. దొంగే దొంగ అని అరచినట్లుగా జపాన్‌ నిఘావిమానాలను తమపై కేంద్రీకరించి తామేదో చేసినట్లు గుండెలు బాదుకుంటూ ప్రపంచాన్ని నమ్మింపచూస్తున్నదని చైనా విమర్శించింది. అయితే ఎటు వైపు నుంచి ఎలాంటి అవాంఛనీయ ఉదంతాలు చోటు చేసుకోలేదు గానీ గత దశాబ్దికాలంలో ఎన్నడూ లేని విధంగా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలకు దారితీసింది. లాక్‌ ఆన్‌ ప్రచారం జపాన్‌ ప్రారంభించిన ఆయుధీకరణకు ఒక ముసుగు మాత్రమే. జపాన్‌ ఆరోపణలకు మంగళవారం నాడు అమెరికా మద్దతు పలికింది.చైనా చర్యలు ఆ ప్రాంతంలో శాంతియుత వాతావరణానికి దోహద పడటం లేదన్నది. అమెరికా ప్రకటన తమ రెండు దేశాల మధ్య ఉన్న బంధం ఎంతగట్టిదో వెల్లడించిందని జపాన్‌ స్పందించింది. రెండవ ప్రపంచ యుద్దంలో కేవలం ఆత్మరక్షణకు అవసరమైన మిలిటరీ మాత్రమే జపాన్‌కు ఉండాలని ఒప్పందం కుదిరింది. అయితే 2015 ప్రభుత్వం కొత్త చట్టం తీసుకువచ్చి తమకే గాక మిత్రదేశాలకు ఆపద వచ్చినపుడు కూడా జోక్యం చేసుకోవచ్చని కొత్త నిబంధన చేర్చారు.నిజానికి తైవాన్‌ ఒక దేశం అని ఐరాస గుర్తించలేదు, అక్టోబరులో బాధ్యతలు స్వీకరించిన ప్రధాని సానాయి టకాయిచి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఆమె ఇటీవల మాట్లాడుతూ బలవంతంగా తైవాన్‌ ప్రాంతాన్ని చైనా స్వాధీనం చేసుకుంటే తమ దేశభద్రతకు ముప్పు వచ్చినట్లే అని దాన్ని తాము అంగీకరించేది లేదని ప్రకటించారు.

చైనాలో అంతర్భాగమైన తైవాన్‌ ప్రస్తుతం ఒక తిరుగుబాటు రాష్ట్రంగా ఉంది.శాంతియుత పద్దతుల్లో తిరిగి ప్రధాన భూభాగంతో అనుసంధానం చేసేందుకు చూస్తామని,అవసరమైతే మిలిటరీచర్యతో అయినా ఆ పని చేస్తామని చైనా పదే పదే ప్రకటించింది. హాంకాంగ్‌, మకావో దీవుల విలీనం మాదిరి ఒక దేశం రెండు వ్యవస్థల విధానం కింది తైవాన్‌లో ఉన్న వ్యవస్థను 2049 వరకు ఎలాంటి మార్పులు చేయబోమని కూడా స్పష్టం చేసింది, అంటే అప్పటి వరకు స్వయం పాలనకు అవకాశమివ్వటమేగాక అక్కడ ఉన్న పెట్టుబడులకు రక్షణ కల్పించటమే. అయితే ఒక వైపు తైవాన్‌ ప్రాంతం చైనా అంతర్భాగమే అని అంగీకరిస్తూనే అమెరికా, జపాన్‌ ఇతర పశ్చిమ దేశాలు బలవంతంగా స్వాధీనం చేసుకోవటాన్ని తాము అంగీకరించేది లేదని వితండ వాదనకు దిగుతున్నాయి. స్వాతంత్య్రం ప్రకటించుకున్న తైవాన్‌లోని వేర్పాటువాద శక్తులకు అన్ని రకాలుగా మద్దతు ఇస్తున్నాయి. ఒక దేశం మాదిరి అక్కడ మిలిటరీని ఏర్పాటు చేసేందుకు, వాటికి యుద్ధ విమానాలతో సహా అన్ని రకాల ఆయుధాలను అందచేస్తున్నాయి. అమెరికా కవ్వింపులను గమనించిన చైనా ఆచితూచి వ్యవహరిస్తున్నది, ఎప్పటికప్పుడు తన అధికారాన్ని అది పునరుద్ఘాటిస్తున్నది. తెగేదాకా లాగితే ఏం జరుగుతుందో చూడండి అంటూ తరచు తైవాన్‌ చుట్టూ మిలిటరీ విన్యాసాలను కూడా నిర్వహిస్తున్నది. వాటిని చూపి ఇంకేముంది చైనా బలప్రయోగానికి పూనుకుందంటూ అమెరికా కూటమి దేశాలు నానా యాగీ చేస్తున్నాయి.

క్లుప్తంగా తైవాన్‌ సమస్య గురించి చూద్దాం.చైనా స్వాతంత్య్రం కోసం కొమింటాంగ్‌ పార్టీ ఏర్పడింది.సన్‌ యెట్‌ సేన్‌ నాయకత్వంలో 1912లో చైనా స్వాతంత్రం ప్రకటించుకొని రిపబ్లిక్‌గా అవతరించింది. తరువాత జరిగిన కొన్ని పరిణామాలలో అధికారానికి దూరమైన సన్‌ తరువాత మరోసారి అధికారానికి వచ్చి కమ్యూనిస్టులతో కలసి తొలి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. ఆయన మరణం తరువాత 1925లో అధికారానికి వచ్చిన ఛాంగ్‌కై షేక్‌ కొమింటాంగ్‌ పార్టీలో కమ్యూనిస్టులతో సయోధ్యను కోరుకొనే వారిని పక్కన పెట్టి కమ్యూనిస్టు వ్యతిరేకిగా మారాడు. మావో నాయకత్వాన కమ్యూనిస్టులు 1949లో అధికారానికి వచ్చిన సమయంలో భారీ సంఖ్యలో మిలిటరీ, ఆయుధాలను తీసుకొని చాంగ్‌కై షేక్‌ తైవాన్‌ దీవికి పారిపోయి అక్కడి నుంచి కమ్యూనిస్టులను ప్రతిఘటించాడు. ప్రధాన భూభాగంలో అధికారాన్ని సుస్థిరం చేసుకోవటం ముఖ్యమని భావించిన కమ్యూనిస్టులు దాని మీద కేంద్రీకరించారు. రెండవ ప్రపంచ యుద్దం తరువాత ఏర్పడిన ఐరాసలో అప్పుడు అధికారంలో ఉన్న చాంగ్‌కై షేక్‌ నియమించిన ప్రతినిధులనే గుర్తించారు. కమ్యూనిస్టులు అధికారానికి వచ్చిన తరువాత చైనా అంటే తైవాన్‌లో తిష్టవేసిన కొఇమింటాంగ్‌ పార్టీయే చైనా ప్రతినిధి అని 1970దశకం వరకు పరిగణించారు.ఎట్టకేలకు కమ్యూనిస్టు చైనాను గుర్తించకతప్పని పరిస్థితి ఏర్పడింది. 1971 అక్టోబరులో జరిగిన 26వ సమావేశంలో 2,758 తీర్మానం ద్వారా కమ్యూనిస్టుల నాయకత్వంలో ప్రధాన భూభాగంలో ఉన్న జనచైనా(పిఆర్‌సి) అసలైన ప్రతినిధి అని గుర్తించారు. నాటి నుంచి తైవాన్‌లో ఉన్న పాలకులు నియమించిన వారికి గుర్తింపు రద్దు చేశారు. చైనాలో తైవాన్‌ అంతర్భాగమని అందరూ అంగీకరించారు. అయితే అప్పుడు జరిగిన చర్చలో దీర్ఘకాలం విడిగా ఉన్నందున బలవంతపు విలీనం జరగకూడదని పలుదేశాలు చెప్పిన అభిప్రాయాన్ని చైనా నాయకత్వం కూడా అంగీకరించింది. నాటి చర్చను సాకుగా తీసుకొని తరువాత ఎప్పుడు విలీన యత్నం చేసినా తగిన పరిస్థితి ఏర్పడలేదని పశ్చిమ దేశాలు పాటపాడుతున్నాయి. ఇప్పటికీ అదే సాకు చెబుతూ విలీనాన్ని అడ్డుకుంటున్నాయి. తన పౌరులపై బలప్రయోగం అంటే రక్తపాతమే గనుక చైనా అందుకు పూనుకోవటం లేదు, దాని సహనాన్ని పదే పదే రెచ్చగొడుతున్నారు. దానిలో భాగమే తైవాన్‌ విలీనం తమ దేశానికి ముప్పు అని జపాన్‌ చెబుతున్న కుంటిసాకు. ప్రస్తుతం తైవాన్‌ వేరుగా ఉన్నందున చైనాకు వచ్చిన ముప్పేమీ లేదు గనుక ఉపేక్షిస్తున్నది. అది చెబుతున్న 2049 గడువులోగా దారికి వస్తే సరే, రాకుంటే అప్పుడేం జరుగుతుందో ఇప్పుడు ఊహించి చెప్పలేము. ఒక్కటి మాత్రం స్పష్టం. తైవాన్‌ వ్యవహారాల్లో మరోదేశం జోక్యం చేసుకోవటం, భిన్నంగా మాట్లాడటం అంటే తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటం, తమ సార్వభౌమత్వం, రాజ్యాంగం, అంతర్జాతీయ న్యాయసూత్రాలను ఉల్లంఘించటమే అని చైనా చెబుతున్నది. ఇదే అంశాన్ని సోమవారం నాడు జర్మనీ విదేశాంగ మంత్రితో మాట్లాడిన చైనా విదేశాంగ మంత్రి, కమ్యూనిస్టు పార్టీ పొలిట్‌బ్యూర్‌ సభ్యుడు వాంగ్‌ ఇ స్పష్టం చేశారు. తైవాన్‌ గురించి అనేక అంశాలను వివరించాడు. ఈ ప్రాంతాన్ని జపాన్‌ అర్ధశతాబ్దం పాటు ఆక్రమించుకొని వలసగా చేసుకున్నదని, తమ పౌరుల మీద లెక్కలేనని అత్యాచారాలు చేసిందని కూడా చెప్పాడు.

చైనా బూచిని చూపుతూ జపనీయులను రెచ్చగొడుతున్న అక్కడి పాలకులు మిలటరీ బడ్జెట్‌ను పెంచేందుకు సాకులు వెతుకుతున్నారు.ఇదంతా అమెరికా ఆడిస్తున్న క్రీడ తప్ప మరొకటి కాదు. తాను నేరుగా దిగితే చైనాతో సమస్యలు వస్తాయని తెలుసుగనుక ట్రంప్‌ యంత్రాంగం జపాన్ను ఎగదోస్తున్నది. తైవాన్‌ దీవికి 110 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన చివరి దీవుల సముదాయం,( ఇది చైనాకూ అంతే దూరం) జనాభా పెద్దగా లేని యంగునీ దీవుల సముదాయంలో దీర్ఘశ్రేణి క్షిపణులను మోహరించేందుకు పూనుకుంది. అక్కడ రాడార్‌ కేంద్రాలు, మందుగుండు గిడ్డంగులు, అమెరికా అందచేసిన ఎఫ్‌-35 విమానాల మోహరింపు, ఇతర మిలిటరీ నిర్మాణాలకు పూనుకుంది. ఇప్పటికే సిబ్బంది నివాసాలకు కొన్ని భవనాల నిర్మాణం పూర్తి చేసింది. కొద్ది రోజుల క్రితం ఆ దీవుల్లో ఉన్న పౌరులు కొంత మందితో సమావేశం జరిపి చైనాపై నిఘా, దాని ఎలక్ట్రానిక్‌ పరికరాలనుంచి వెలువడే అయస్కాంత తరంగాలను స్థంభింప చేసేందుకు మిలిటరీ నిర్మాణాలు అవసరమని తేల్చి చెప్పారు. ఇది చైనాను కవ్వించటం తప్ప మరొకటి కాదు. ఒక వేళ రెండు దేశాల మధ్య యుద్దం అంటూ వస్తే అది జపాన్‌ వైపు నుంచే మొదలు కావాలి తప్ప చైనా నుంచి జరగదు. ఒక వేళ జరిగితే అమెరికా తమను ఆదుకొనే పరిస్థితి లేదని గతంలో ప్రభుత్వ విశ్లేషకురాలిగా ఉండి, ప్రస్తుతం నిగాటా విశ్వవిద్యాలయంలో పని చేస్తున్న ఒక మహిళా ప్రొఫెసర్‌ చెప్పారు. ప్రభుత్వ మిలిటరీ, క్షిపణుల మోహరింపు గురించి అక్కడి కమ్యూనిస్టు పార్టీ పార్లమెంటరీచర్చలో వ్యతిరేకతను వెల్లడించింది. ఇతర దేశాల మాదిరే జపాన్‌ కూడా చేస్తున్నదని రక్షణ మంత్రి సమర్ధించాడు.

గత వారంలో విమర్శలకు దారితీసిన ఉదంతం జపాన్‌లో అమెరికా మిలిటరీ కేంద్రం ఉన్న ఒకినావా దీవి సమీపంలో జరిగింది. చైనా తమ విమానాలను లక్ష్యంగా చేసుకున్నదని తప్ప గగనతలాన్ని అతిక్రమించినట్లు జపాన్‌ ఇంతవరకు చెప్పలేదు.ముందుగా అంతర్జాతీయ జలాల్లో ఉన్న తమ విమానవాహక యుద్ధ నౌక సమీపానికి ప్రమాదకరంగా జపాన్‌ యుద్ధ విమానాలే వచ్చాయని, తమవైపు నుంచి అనివార్యమైన ప్రతిస్పందన ఉందని బీజింగ్‌ చెబుతున్నది.చైనా విమానవాహక యుద్ద నౌక లియావోనింగ్‌ వైపు జపాన్‌ యుద్ధ విమానాలు సమీపంలోకి వచ్చినపుడు చైనా విమానాలు అడ్డుకొని హద్దు మీరితే అంతే సంగతులని హెచ్చరించినట్లు, అవి పూర్తిగా సమర్దనీయమే అని చైనా నిపుణులు చెబుతున్నారు. జపాన్‌ సమీపంలో చైనా విమానవాహక నౌక కార్యకలాపాలు నిర్వహించటం ఇదే మొదటిసారి అని జపాన్‌ వార్తా సంస్థ కొయోడో పేర్కొన్నది. తూర్పు ఆసియా సముద్రంలో చైనా నౌకాదళానికి చెందిన వివిధ రకాల వంద నౌకలు పాల్గ్గొన్నట్లు రాయిటర్స్‌ వార్త ఆరోపించింది. తమ నౌకలు పశ్చిమ పసిఫిక్‌ ప్రాంతంలో ఇలాంటి విన్యాసాలు జరపటం సాధారణమని అయితే ప్రతిసారీ జపాన్‌ తమకు చైనా నుంచి ముప్పు ఉందని చెప్పేందుకు, తన మిలిటరీ శక్తిని పెంచుకొనేందుకు వాటిని బూతద్దంలో చూపుతున్నదని, అంతర్జాతీయ సూత్రాలకు అనుగుణంగానే తాము జరుపుతున్నట్లు, జపాన్‌ ఆత్మరక్షణ రాజ్యాంగం నుంచి పక్కకు జరుగుతున్నదని చైనా నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.వాటి మీద అతిగా స్పందించటం, విపరీత భాష్యాలు ఎవరూ చెప్పకూడదని చైనా విదేశాంగశాఖ ప్రతినిధి లిన్‌జియాన్‌ చెప్పాడు.అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా జరుపుతున్న తమ విన్యాసాల గురించి గుండెలు బాదుకుంటున్న జపాన్‌ అదే పని అమెరికా చేస్తుంటే ఎందుకు మౌనంగా ఉంటున్నదని చైనా ప్రశ్నిస్తోంది.

తైవాన్‌ సమస్యపై రెచ్చగొడుతున్న జపాన్‌ తీరును చూస్తే అమెరికా పన్నిన వ్యూహంగా కనిపిస్తోంది. ఈ వివాదం చెలరేగిన సమయంలోనే తైవాన్‌ సమస్యపై తక్షణమే చైనాతో యుద్ధం రాకుండా చూసుకోవాలని ఒక పథకం రూపొందించినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. ముందుగా అమెరికా, దాని మిత్రదేశాలు మిలిటరీ బలాన్నిపెంచుకోవాలని, చైనా వైపునుంచి తైవాన్‌, జపాన్‌ మీద వత్తిడి పెరుగుతున్నదని డిసెంబరు ఐదున ప్రచురించిన ఒక పత్రంలో అమెరికా జాతీయ వ్యూహకర్తలు పేర్కొన్నారు.2017లో ప్రచురించిన పత్రంలో ఒక వాక్యంలో మూడుసార్లు తైవాన్‌ ప్రస్తావన చేయగా తాజా పత్రంలో మూడు పేరాల్లో ఎనిమిదిసార్లు ఉన్నట్లు రాయిటర్స్‌ తెలిపింది. వాణిజ్య యుద్దాలు జరుగుతున్న, సెమికండక్టర్ల ఉత్పత్తిలో ఆధిపత్యం వహిస్తున్న ప్రాంతంలో తైవాన్‌ గురించి సరిగానే కేంద్రీకరించినట్లు, జపాన్‌ నుంచి ఆగేయాసియా వరకు ఏ దీవి మీద కూడా ఎక్కడా దురాక్రమణ జరగకుండా అమెరికా మిలిటరీ సామర్ధ్యాన్ని పెంచుకోవాలని ఆ పత్రం పేర్కొన్నది. ఇదే సమయంలో అమెరికా ఒక్కటే చేయలేదని, చేయకూడదని, మిత్రదేశాలు మిలిటరీ ఖర్చు పెంచుకోవాలని, ఉమ్మడిగా రక్షణకు పని చేయాలని హితవు పలికింది.ఈ బలం తైవాన్‌ ఆక్రమణ యత్నాలు మానుకొనే స్థాయికి పెరగాలని కోరింది. ఈ వ్యూహం, ఎత్తుగడల్లో భాగంగానే ఆత్మరక్షణ యుద్ధం నుంచి ఎదురుదాడులు చేసే విధంగా ఆయుధాలను పెంచుకోవాలని జపాన్‌ చూస్తున్నది, దానికి సాకుగా చైనా బూచిని చూపుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తున్నది !

Share this:

  • Tweet
  • More
Like Loading...

తగ్గేదే లేదని క్షిపణి ప్రయోగంతో జవాబిచ్చిన ఉత్తర కొరియా – వాణిజ్య ఒప్పందాలతో సాగిన ట్రంప్‌ ఆసియా పర్యటన !

29 Wednesday Oct 2025

Posted by raomk in CHINA, Current Affairs, imperialism, INTERNATIONAL NEWS, Japan, Opinion, USA, WAR

≈ Leave a comment

Tags

APEC, asean summit, Donald trump, Kim Jong-un, Trump business tour, Xi Jinping

ఎం కోటేశ్వరరావు

ఉత్తర కొరియా నేత కిమ్‌ జోంగ్‌ అన్‌కు అంగీకారమైతే తాను అతనితో కూడా భేటీ అవుతానని తన ఆసియా పర్యటనలో విలేకర్ల ప్రశ్నకు ట్రంప్‌ బదులిచ్చాడు. ఉత్తర కొరియాను అణ్వస్త్ర రహితం కావిస్తే పెద్ద బహుమతి( ఆంక్షల ఎత్తివేత) పొందుతారంటూ ట్రంప్‌ బిస్కెట్‌ వేసేందుకు చూశాడు. అయితే నా స్పందన ఇది అంటూ మంగళవారం నాడు సముద్రం మీద నుంచి ఉపరితలానికి క్రూయిజ్‌ క్షిపణిని ప్రయోగించి కిమ్‌ బదులిచ్చాడు. శత్రువుతో మాటలు కాదు చేతలే అని చెప్పినట్లయింది. అది జరిగేందుకు ఆస్కారం లేదనే చెప్పవచ్చు ! జపాన్‌ నుంచి బుధవారం నాడు దక్షిణ కొరియాకు వెళ్లే ముందు ఈ ప్రయోగం జరిపారు. తమ వద్ద ఉన్న అణ్వాయుధాల గురించి శత్రువులకు గుర్తు చేయటమే ఇదని ఉత్తర కొరియా అధికారిక మీడియా వర్ణించింది. ఈ ప్రయోగం భద్రతా మండలి విధించిన నిషేధాన్ని ఉల్లంఘించినట్లు కాదని, తమ అణ్వాయుధాల గురించి చర్చించటానికి తాము సిద్దం కాదనే సందేశం ఇచ్చినట్లని బిబిసి వర్ణించింది. దక్షిణ కొరియాలో జరిగే అపెక్‌ సమావేశానికి ఉత్తర కొరియా నేత కిమ్‌ హాజరు కావటం లేదు. వియత్నాంలో 2019లో ట్రంప్‌ ఆహ్వానం మేరకు కిమ్‌తో భేటీ జరిగింది. అయితే ఆ చర్చలు విఫలం కావటంతో తరువాత వారి మధ్య ఎలాంటి సమావేశమూ జరగలేదు. కిమ్‌కు అంగీకారమైతే తాను ఒక రోజు దక్షిణ కొరియాలో అదనంగా ఉంటానని ట్రంప్‌ విలేకర్లతో చెప్పాడు. దానికి కిమ్‌ నుంచి ఇంతవరకు ఎలాంటి జవాబు రాలేదు. అణు పరీక్షలు జరుపుతున్నందున ఉత్తర కొరియా మీద అమెరికా అనేక ఆంక్షలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. రష్యా మీద మరిన్ని ఆంక్షలు ప్రకటించిన తరువాత ఉత్తర కొరియా విదేశాంగ మంత్రి చోయి సన్‌ హుయి గత వారంలో మాస్కో వెళ్లి చర్చలు జరిపాడు. ట్రంప్‌ ఆసియా పర్యటన సందర్భంగా క్షిపణి పరీక్షలు నిర్వహించటం విశేషం.

మంగళవారం నాడు అమెరికా, జపాన్‌ మధ్య వాణిజ్య, విలువైన ఖనిజాల ఒప్పందం కుదిరింది.అధ్యక్షుడు ట్రంప్‌, జపాన్‌ ప్రధమ మహిళా ప్రధాని తకాయిచి టోక్యోలో సంతకాలు చేశారు.వివరాలు పూర్తిగా వెల్లడి కాలేదు. అమెరికాలో 550 బిలియన్‌ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు జపాన్‌ అంగీకరించగా ప్రతిగా దాని వస్తువులపై 15శాతం దిగుమతి పన్ను విధించేందుకు అమెరికా అంగీకరించింది. ట్రంప్‌కు కావాల్సినన్ని పొగడ్తలు తప్ప అమెరికాకు పెద్దగా ఒరిగిందేమీ లేదని డెమోక్రటిక్‌ పార్టీ మద్దతుదారైన న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక వ్యాఖ్యానించింది. ఈ ఒప్పందాలను రెండు దేశాల మధ్య సంబంధాలలో ” నూతన స్వర్ణయుగం ” అని వర్ణించారు.అదిరింపులు బెదిరింపుల మధ్య జూలై నెలలోనే పెట్టుబడులు, పన్నుల గురించి ఒక అవగాహన కుదిరినట్లు డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించాడు. అయితే మంగళవారం నాడు సంతకాలు జరగటానికి ముందు చివరి క్షణం వరకు అనేక అనుమానాలు షికారు చేశాయి. పశ్చిమాసియాలో శాంతి, థారులాండ్‌-కంపూచియా మధ్య వివాదాన్ని పరిష్కరించటంలో ట్రంప్‌ పాత్రను తకాయిచి ఆకాశానికి ఎత్తారు. అసాధారణ చారిత్రక విజయాలుగా ఆమె వర్ణించారు. వారి చర్చల తరువాతే టోక్యోలోని అక్సాకా పాలెస్‌లో జరిగిన స్వాగత కార్యక్రమానికి ట్రంప్‌ హాజరయ్యాడు. ఈ ఒప్పందం గురించి ప్రశంసలు, విమర్శలు గతంలోనే వెల్లడయ్యాయి.

జపాన్‌ నుంచి అమెరికా ఇప్పటివరకు లక్ష కోట్ల డాలర్ల మేర రుణాలుగా తీసుకుంది. అమెరికా డాలర్లకోసం ప్రతిదేశాన్నీ బెదిరిస్తున్నది. అయితే తాజాగా కుదిరిన ఒప్పందం గురించి గతంలోనే ట్రంప్‌ మీద విమర్శలు వచ్చాయి. ఆ ఒప్పందంలో తరువాత ఎలాంటి మార్పులూ చేసినట్లు ఎవరూ ప్రకటించలేదు గనుక గత విమర్శలేమిటో ఒకసారి చూద్దాం. ఐదువందల యాభై బిలియన్‌ డాలర్ల మొత్తాన్ని ప్రభుత్వానికి ఇస్తే తమ ఇష్టం వచ్చినట్లు వినియోగించుకుంటామని, దాని మీద వచ్చే లాభాలలో 90శాతం తమకే అని ట్రంప్‌ వత్తిడి చేశాడు. అయితే ఆ మొత్తంలో కేవలం రెండు శాతం మాత్రమే పెట్టుబడిగా ఉంటుందని, మిగిలిన మొత్తం రుణాలు, రుణ హామీల వంటి ఇతర రూపాల్లో ఉంటుందని జపాన్‌ ప్రతినిధి వర్గనేత రోయెసీ అకజావా టీవీలో బహిరంగంగా చెప్పాడు. కొంత మంది అమెరికన్లకు జపాన్ను విక్రయించారని విమర్శిస్తున్నారని, లాభాల్లో 90శాతానికి అంగీకరించినందున నష్టం పెద్దగా ఉండదని దీనికి ప్రతిగా అమెరికా తగ్గించే పన్నుల వలన 68 బిలియన్‌ డాలర్ల మేర జపాన్‌కు లబ్ది కలుగుతుందని కూడా చెప్పాడు. బహుశా ఈ కారణంతోనే మంగళవారం నాడు ఒప్పందంపై సంతకాల తరువాత న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక ప్రతికూలంగా వ్యాఖ్యానించిందని చెప్పవచ్చు. తమ దేశంలో పెట్టుబడులకు, పన్నులు విధింపుకు లంకెపెట్టటం ఒక జపాన్‌ విషయంలోనే కాదు. ఇప్పటికే ఐరోపా యూనియన్‌తో 600బిలియన్‌ డాలర్లు పెట్టుబడులు పెడితేనే 15శాతం పన్నులు విధిస్తామని లేకుంటే ఎక్కువ అని ట్రంప్‌ బెదిరించాడు.

వాణిజ్యం చేయటం, లాభాలు పిండుకోవటంలో అమెరికా, జపాన్‌ ఎవరికి ఎవరూ తీసిపోరు గనుక పరస్పర లబ్ది లేకుండా అంగీకరించే అవకాశం ఉండదని చెప్పవచ్చు. ముందే చెప్పుకున్నట్లు ఒక లక్షకోట్ల డాలర్లు అమెరికాకు అప్పు ఇవ్వటమేగాక మరో రెండులక్షల కోట్ల డాలర్ల మేర ఇప్పటికే జపాన్‌ పెట్టుబడులు పెట్టింది. జపాన్‌లో డాలర్లు గుట్టలుగా పడి ఉన్నాయి. ఎవరైనా అక్కడి బాంకుల్లో డబ్బుదాచుకుంటే వారే బ్యాంకులకు ఎదురు ఇవ్వాల్సి ఉంటుంది. తమ దేశంలో ఉన్న వడ్డీ రేట్లతో పోలిస్తే అమెరికాకు అప్పులు ఇవ్వటం జపాన్‌కు ఎంతో లాభం కలుగుతుంది. జపాన్‌లో తక్కువ వడ్డీ చెల్లించి జనాల నుంచి బాంకులు రుణాలు తీసుకుంటాయి, వాటిని ఎక్కువ వడ్డీ రేట్లకు అమెరికా, ఇతర దేశాలలో పెట్టుబడులుగా పెట్టి లాభాలు ఆర్జిస్తాయి, ఈ క్రమంలోనే అమెరికాకు అత్యధికంగా జపాన్‌ లక్ష కోట్ల డాలర్ల మేర రుణబాండ్లలో పెట్టుబడులు పెట్టింది. ఈ విషయంలో బ్రిటన్‌ రెండవ స్థానంలో ఉంటే చైనా మూడవదిగా ఉంది. అమెరికాలో ఉన్న జపాన్‌ కంపెనీలైన సోనీ,టొయోటా వంటి బహుళజాతి కంపెనీలు, ద్రవ్యపెట్టుబడి సంస్థలు అక్కడ పెట్టుబడులు పెట్టి లాభాలు సంపాదిస్తున్నాయి, వచ్చిన లాభాలను తిరిగి అక్కడే పెట్టుబడులుగా పెడుతున్నాయి. తాజా ఒప్పందంలో అమెరికా కార్లకు ద్వారాలు తెరిచేందుకు జపాన్‌ అంగీకరించినట్లు చెబుతున్నారు. గాలికిపోయే పేలపిండి కృష్ణార్పణం అన్నట్లు డీజిలు, పెట్రోలు తాగే అమెరికన్‌ కార్లను జపాన్‌లో కొనుగోలు చేసేదెవరు ? లేదూ అమెరికన్లు అమ్ముకోవాలనుకుంటే జపనీయుల అవసరం, అభిరుచులకు అనుగుణంగా సరసమైన ధరలకు అందచేస్తే ఇబ్బంది ఉండదు. అక్కడ అమెరికా కార్లకు డిమాండ్‌ కూడా తక్కువే గనుక వాటి దిగుమతులకు అనుమతించినా జపాన్‌ కార్ల మార్కెట్‌కు పెద్దనష్టమేమీ ఉండదు. జపాన్‌లో తలెత్తిన ఆర్థిక మాంద్యం కారణంగా జనాలు ప్రజా రవాణా వ్యవస్థ పట్ల మొగ్గుచూపుతున్నారు. నిర్వహణ ఖర్చు ఎక్కువగా ఉండే అమెరికన్‌ కార్లను పట్టించుకుంటారా ? గతంలో కార్లంటే అమెరికా, ఇప్పుడు జపాన్‌ ఆ స్థానాన్ని ఆక్రమించింది, జర్మనీ, దక్షిణ కొరియా వంటి దేశాలూ తక్కువ తినలేదు, విద్యుత్‌ కార్ల రంగంలో చైనా సవాలు విసురుతోంది. అందువలన ట్రంప్‌ విధించే పదిహేనుశాతం దిగుమతి పన్నుతో అమెరికా కంపెనీల యజమానులు కొంత కాలం పాటు ఊరట పొందవచ్చు తప్ప తరువాత పోటీకి అనుగుణంగా తయారుగాకపోతే అంతే సంగతులు.

ట్రంప్‌ ఆసియా పర్యటనలో వివిధ దేశాలతో ఒప్పందాలను కుదుర్చుకొనేందుకు కొన్ని షరతులను రుద్దినట్లుగా కనిపిస్తోంది. చిన్న చిన్న దేశాలలో ఎంత దొరికితే అంత అన్నట్లుగా విలువైన ఖనిజాల గురించి ఒప్పందాలు చేసుకున్నాడు. మలేషియా వస్తువుల మీద 19శాతం పన్నుల విధింపు అమల్లో ఉందని చెబుతూనే కొన్నిమినహాయింపులు ఇచ్చాడు.దీనికి ప్రతిగా అమెరికా వస్తువులు, గ్యాస్‌, వ్యవసాయ ఉత్పత్తులను మలేషియా కొనుగోలు చేయనుంది. అమెరికా కంపెనీ బోయింగ్‌ నుంచి 30 విమానాలను కొనుగోలు చేస్తామని, మరో 30 గురించి ఆలోచిస్తామని చెప్పింది. ఇవిగాక అమెరికాలో 70 బిలియన్‌ డాలర్లు పెట్టుబడులుగా పెట్టేందుకు అంగీకరించింది. అయితే కీలకమైన సెమీ కండక్టర్ల ఉత్పత్తి చేస్తున్న మలేషియా అమెరికా షరతులకు తలొగ్గలేదు. కంపూచియాతో కుదిరిన ఒప్పందం ప్రకారం అమెరికా వస్తువుల దిగుమతిపై ఎలాంటి పన్ను ఉండదు. విలువైన ఖనిజాల శుద్ధి వంటి ప్రక్రియకు అమెరికా పెట్టుబడులను అనుమతిస్తుంది. వియత్నాంపై విధించిన 46శాతం పన్నులను 20శాతానికి తగ్గించేందుకు అమెరికా దిగివచ్చింది. దీనికి ప్రతిగా ఎనిమిది బిలియన్‌ డాలర్లతో 50 బోయింగ్‌ విమానాలను కొనుగోలు చేస్తుంది. వీటితో పాటు అమెరికా వ్యవసాయ ఉత్పత్తులను కూడా దిగుమతి చేసుకుంటుంది.చైనా నుంచి దిగుమతి చేసుకున్న విడిభాగాలతో తయారు చేసి అమెరికాకు ఎగుమతి చేసే వస్తువులపై పన్ను వివాదం కొనసాగుతూనే ఉంది. ఒక నిర్దిష్ట నిర్వచనం లేదు. థారులాండ్‌ వస్తువులపై 19శాతం పన్నుల నుంచి అనేక వస్తువులకు మినహాయింపు ఇస్తారు. ఎనభై విమానాలను థారు కొనుగోలు చేస్తుంది. దక్షిణ కొరియా వస్తువుల మీద పన్ను 15శాతానికి పరిమితం చేయాలంటే తమ దేశంలో 350 బిలియన్‌ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టాల్సిందే అని అమెరికా వత్తిడి చేస్తున్నది.అది దక్షిణ కొరియా జిడిపిలో 6.5శాతానికి సమానం. అంత పెట్టుబడి పెడుతుందా అన్నది ప్రశ్న.

డోనాల్డ్‌ ట్రంప్‌ కౌలాలంపూర్‌లో జరుగుతున్న ఆసియన్‌ ప్లస్‌ 3 (ఏపిటి) సమావేశాలకు, తరువాత దక్షిణ కొరియాలో జరిగే మరోసభలో పాల్గ్గొనేందుకు వస్తూ అనేక దేశాలతో విలువైన లోహాలు, ఇతర ఒప్పందాలు కుదుర్చుకొనేందుకు డోనాల్డ్‌ ట్రంప్‌ వచ్చాడు. పది ఆగేయాసియా దేశాలతో కూడిన ఆసియన్‌ కూటమిలో తాజాగా తైమూర్‌-లెస్తే చేరింది. ఇవిగాక చైనా, జపాన్‌, దక్షిణ కొరియా అనుబంధంగా ఉన్న కారణంగా ఆసియన్‌ ప్లస్‌ మూడు అని పిలుస్తున్నారు. ధనిక దేశాలు అనుసరిస్తున్న రక్షణాత్మక విధానాల నుంచి తట్టుకోవాలంటే ఈ కూటమి దేశాల మధ్య సహకారాన్ని విస్తరించుకోవాలని చైనా ప్రధాని లీ క్వియాంగ్‌ కోరాడు. గత కొద్ది సంవత్సరాలుగా తూర్పు ఆసియా వేగంగా వృద్ది చెందుతున్నది. ఇదే సమయంలో కొన్ని సమస్యలను కూడా ఎదుర్కొంటున్నది. ఈ సమావేశాలకు తమ మంత్రిద్వారా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభూ సుబియాంతో ఒక సందేశం పంపాడు. ఆర్‌సిఇపితో సమన్వయం చేసుకొని దాన్నొక వేదికగా ఆసియన్‌ దేశాలు వినియోగించుకోవాలని కోరాడు.ఏకపక్ష వైఖరితో వ్యవహరిస్తున్న దేశాలను ఐక్యంగా ఎదుర్కొవాలని దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జేయి మయుంగ్‌ కోరాడు. రక్షణాత్మక చర్యలతో పాటు సరఫరా గొలుసుల సమస్యలను కూడా ఎదుర్కొంటున్నట్లు చెప్పాడు. పెరుగుతున్న రక్షణాత్మక ధోరణులు, సరఫరా వ్యవస్థల్లో వస్తున్న మార్పులు ఆసియన్‌ దేశాలకు హెచ్చరికలు పంపుతున్నాయని, వాటిని చూసి నిర్ఘాంతపోయి అచేతనంగా ఉండరాదని మలేసియా ప్రధాని అన్వర్‌ చెప్పాడు. ఇప్పుడున్న భాగస్వామ్యాన్ని మరింతగా మెరుగుపరుస్తూ కొత్త భాగస్వామ్యాల కోసం ధైర్యంగా వ్యవహరించాలన్నాడు. వర్తమాన సంవత్సరంలో జనవరి నుంచి సెప్టెంబరు వరకు తొమ్మిది నెలల కాలంలో చైనా మరియు ఆసియన్‌ దేశాల మధ్య వాణిజ్య లావాదేవీలు 782 బిలియన్‌ డాలర్ల మేర జరిగాయి. అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే 9.6శాతం ఎక్కువ. కౌలాలంపూర్‌ సమావేశంలో చైనా-ఆసియన్‌ దేశాల స్వేచ్చావాణిజ్య ప్రాంతం 3.0 ఒప్పందం కుదిరింది. అమెరికా పన్నులకు అందరం బాధితులమే అని దాని రక్షణాత్మక వైఖరిని వ్యతిరేకించాలని ఆసియన్‌ దేశాలన్నింటా ఏకీ భావం కనిపించింది. అయితే వివిధ కారణాలతో అనేక దేశాలు అమెరికాతో నేరుగా ఒప్పందాలు చేసుకుంటున్నప్పటికీ ఒక్కటిగా ఉండకపోతే నష్టమనే భావన ఏర్పడింది.

గత ఏడాది లావోస్‌లో జరిగిన 27వ సమావేశం పెరుగుతున్న ప్రాంతీయ సహకారం గురించి చర్చించింది, దాన్ని మరింతగా ముందుకు తీసుకుపోయేందుకు కౌలాలంపూర్‌ సమావేశం దృష్టి సారించింది, ఇది అనివార్యమైన పరిణామం. అన్ని దేశాల మీద ట్రంప్‌ పన్నుల దాడి మొదలు పెట్టిన పూర్వరంగంలో దానికి గురయ్యే దేశాలకు ఇంతకు మించి మరొక మార్గం లేదు.ఈ కూటమి లేదా వ్యవస్థ 1997లో ఉనికిలోకి వచ్చింది. ఆసియన్‌ కూటమిలో బ్రూనీ, కంపూచియా, ఇండోనేషియా, లావోస్‌, మలేషియా, మయన్మార్‌, ఫిలిప్పీన్స్‌, సింగపూర్‌, థారులాండ్‌, వియత్నాం సభ్యులుగా ఉండగా పదకొండవ దేశంగా తైమూర్‌-లెస్తే చేరింది. ఇప్పుడు ప్రపంచ దృష్టి అంతా దక్షిణ కొరియాలో జరిగే ఆసియా -పసిఫిక్‌ ఆర్థిక సహకార వేదిక (ఎపిఇసి) సమావేశాల మీద ఉంది. అక్కడ 30వ తేదీన చైనా అధినేత షీ జింపింగ్‌తో ట్రంప్‌ భేటీ కానున్నాడు. విలువైన ఖనిజాల ఉత్పత్తులపై చైనా ఆంక్షలు విధించిన తరువాత కొద్ది రోజుల క్రితం ఒక ఒప్పందం జరిగినట్లు వార్తలు వచ్చాయి. తుది ఒప్పందం మీద ఇరు దేశాల నేతలు సంతకాలు చేయవచ్చని చెబుతున్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

పసిడి ధర ఐదేండ్లలో మూడు రెట్లు పెరుగుదల ? ప్రపంచ అప్పుకు దీనికి సంబంధం ఉందా !

01 Wednesday Oct 2025

Posted by raomk in CHINA, Current Affairs, Economics, Germany, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

Donald trump, GLOBAL DEBT SURGE, Gold Price Record, India debt matters, Narendra Modi Failures, World Debt, Xi Jinping

ఎం కోటేశ్వరరావు

ఈ ఏడాది తొలి ఆరునెలల్లో ప్రపంచ రుణం 338 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ ఫైనాన్స్‌(ఐఐఎఫ్‌) సంస్థ తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ వివరాలు ఉన్నాయి.(ఎవరికైనా ఆసక్తి ఉండి యుఎస్‌ డెబిట్‌ క్లాక్‌ డాట్‌ ఓఆర్‌జి వెబ్‌సైట్‌లోకి వెళితే ప్రతి క్షణం ఏ దేశానికి ఎంత అప్పు పెరుగుతున్నదో చూడవచ్చు.) మన జిడిపి నాలుగు లక్షల కోట్ల డాలర్లు, ప్రపంచ రుణం మాత్రం ప్రతి నెలా సగటున 3.4లక్షల కోట్ల డాలర్లు పెరుగుతున్నది.ఈ లెక్కన ఈ ఏడాది డిసెంబరు నాటికి మరో 20లక్షల కోట్ల డాలర్ల మేర ప్రపంచ రుణం పెరగనుంది. ఇలా పెరుగుతున్న అప్పులతో జనాలకు తిప్పలు కూడా అధికం అవుతున్నాయి. అమెరికా కరెన్సీ డాలరు ఈ ఏడాది జనవరి నుంచి 9.75శాతం పతనమైంది. అందువలన రుణం బాగా పెరిగినట్లు కనిపిస్తోందని కొంత మంది భాష్యం చెబుతున్నారు. కరోనా వచ్చిన 2020లో ఈ మాదిరి భారీ పెరుగుదల ఉంది. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకున్నా పెరగటం ఆందోళన కలిగిస్తున్నది. కుటుంబాలకు అప్పులు పెరిగితే ఏమౌతుంది. దానికి తగిన రాబడి లేకపోతే వాటిని తీర్చేందుకు కొన్ని కుటుంబ అవసరాలను తగ్గించుకొని రుణ చెల్లింపులకు కొంత మొత్తాన్ని మళ్లించాల్సి వస్తుంది. ప్రభుత్వాలు అయినా చేస్తున్నది అదే. ఉదాహరణకు ప్రపంచంలో అత్యధికంగా అమెరికా అప్పు 37.5లక్షల కోట్ల డాలర్లు. దానికి ఏటా చెల్లిస్తున్న వడ్డీ,అసలు మొత్తం 1.157లక్షల కోట్ల డాలర్లు. కొత్తగా తీసుకొనే అప్పులో సగానికి పైగా రుణ చెల్లింపులకే పోతున్నది.

అప్పులు పెరిగే కొద్దీ చేసిన వాగ్దానాలకు, అమలు చేస్తున్న పథకాలకు ఏదో ఒక సాకుతో కోత పెడతున్నారు.నిజానికి సామాన్యులకు ఏం జరుగుతున్నదో కూడా తెలియటం లేదు. నరేంద్రమోడీ సర్కార్‌ తీరుతెన్నులను చూద్దాం. మన దేశ మొత్తం అప్పు 2025 మార్చి నాటికి రు.181,74,284 కోట్లు దీన్ని 2026 మార్చి నాటికి రు.196,78,772 కోట్లకు పెంచుతామని బడ్జెట్‌లో పేర్కొన్నారు. శాశ్వత ఆస్తుల కల్పనకు మూలధన పెట్టుబడిగా పెట్టాలి లేదా సంక్షేమానికి కేటాయించాలి.అప్పు తెస్తామన్న రు.15.69లక్షల కోట్లలో వడ్డీలు, అసలు చెల్లించేందుకు రు. 12.76లక్షల కోట్లు కేటాయించారు.2024-25 బడ్జెట్‌లో సబ్సిడీలకు రు.4.28లక్షల కోట్లు కేటాయించి పదకొండువేల కోట్లు కోత పెట్టారు. తాజా బడ్జెట్‌లో రు.4.26వేల కోట్లు మాత్రమే కేటాయించారు. మొత్తం మీద గతేడాది కేటాయింపులతో పోలిస్తే 0.4శాతం తగ్గించారు. నూతన ఉపాధి కల్పన పధకానికి గతేడాది పదివేల కోట్లు కేటాయించి 6,800 కోట్లు ఖర్చు చేసి వర్తమాన కేటాయింపుల్లో 20వేల కోట్లు చూపి 194శాతం అదనం అని గొప్పలు చెప్పారు.గ్రామీణ ప్రాంతాలకు మంచినీటిని అందచేసే జలజీవన్‌ పథకానికి 70వేల కోట్లు కేటాయించి చేసిన ఖర్చు చేసిన కేవలం 22.693వేల కోట్లు మాత్రమే. ఈ ఏడాది 67వేల కోట్లు కేటాయించి చూశారా 195 శాతం పెంచామంటూ ఊదరగొడుతున్నారు. వీటన్నింటినీ నిజంగా ఖర్చు చేస్తారా అన్నది చూడాలి. ఎరువుల సబ్సిడీగా 2023-24లో రు.1.88 వేల కోట్లు ఖర్చు చేసిన సర్కార్‌ ఈ ఏడాది దాన్ని 1.67లక్షల కోట్లకు కోత పెట్టింది. ఈ కారణంగానే అవసరమైన మేరకు యూరియా ఇతర ఎరువులను దిగుమతి చేసుకోకుండా డబ్బు మిగుల్చుకొని రైతాంగాన్ని ఇక్కట్ల పాలు చేసింది. కార్పొరేట్‌ పన్ను తగ్గించిన కారణంగా గతేడాది లక్ష కోట్ల మేరకు ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి కోత పడింది. ఇవన్నీ చూసినపుడు పాత అప్పులు తీర్చేందుకు కొత్త అప్పులు, కార్పొరేట్లకు రాయితీల కొనసాగింపు, కోట్లాది మంది రైతాంగానికి, ఇతరులకు సబ్సిడీల కోత స్పష్టంగా కనిపిస్తున్నది.

నరేంద్రమోడీ మిత్రుడు డోనాల్డ్‌ ట్రంప్‌ చేస్తున్నది కూడా ఇదే. వివిధ దేశాల వస్తువుల మీద దిగుమతి పన్నులు వేసి రానున్న పది సంవత్సరాల కాలంలో నాలుగు లక్షల కోట్ల డాలర్ల మేర లోటుబడ్జెట్‌ను తగ్గించుకోవాలని చూస్తున్నాడు. దీన్ని మరోవిధంగా చెప్పాలంటే ఆ పన్నుల మొత్తాన్ని చెల్లించాల్సింది సామాన్య పౌరులే గనుక తన అసమర్ధతను జనం మీద రుద్దుతున్నట్లే. నరేంద్రమోడీ చేస్తున్నది కూడా అదే మన అవసరాల్లో 80శాతం ముడిచమురును దిగుమతి చేసుకుంటున్నాం.దాని ఉత్పత్తులైన పెట్రోలు, డీజిలుపై సెస్‌, ఇతర పన్నుల భారాన్ని పెంచారు. మోడీ అధికారానికి వచ్చిన 2014-15 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ పెట్రోలియం ప్లానింగ్‌ ఎనాలసిస్‌ సెల్‌ సమాచారం ప్రకారం ఎక్సైజ్‌ డ్యూటీ రు.99,068 కోట్లు, దాన్ని 2020-21 నాటికి రు.3,72,930 కోట్లకు పెంచారు. తరువాత ఎన్నికలు, తదితర కారణాలతో 2023-24 నాటికి రు.2,73,684 కోట్లకు తగ్గించారు. ఏటా లక్షా 73వేల కోట్ల మేర జనం నుంచి అదనంగా వసూలు చేస్తున్నారు. 2022 ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు ముడి చమురు ధర పీపాకు 20డాలర్లు తగ్గినా ఒక్క పైసా కూడా వినియోగదారులకు ధరలు తగ్గించలేదు. రష్యా నుంచి చౌకధరలకు ముడి చమురు దిగుమతి చేసుకొని లాభాలకు ఐరోపా దేశాలకు ఉత్పత్తులను అమ్మిస్తున్నారు. దేశంలో ముడిచమురు ఉత్పత్తి 2014-15లో ప్రభుత్వ-ప్రైవేటు ఉత్పత్తి 35.9 మిలియన్‌ టన్నులుంటే 2023-24నాటికి 27.2మి.టన్నులకు పడిపోయింది. అందుకే అభివృద్ధి కోసం రుణాలు చేస్తున్నామని రాజకీయ నేతలు చెప్పే మాటలు బూటకం అని చెప్పాల్సి వస్తోంది.

కేంద్ర ప్రభుత్వమే కాదు, రాష్ట్రాలు కూడా నానాటికీ రుణ ఊబిలో కూరుకుపోతున్నాయి. అవి కూడా సంక్షేమ పథకాలకు కోత పెడుతున్నాయి.హిమచల్‌ ప్రదేశ్‌ ప్రభుత్వం పద్నాలుగు రకాల సబ్సిడీలను క్రమబద్దీకరించే పేరుతో కోత పెట్టేందుకు కసరత్తు చేస్తున్నది.మహారాష్ట్రలో రెండింజన్ల పాలన ఉంది. రాష్ట్ర రుణ భారం 9.25లక్షల కోట్లకు పెరగనుంది. ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి లడకీ బహిన్‌ పధకానికి రు.46వేల కోట్లు కేటాయించారు. తాజాగా దాన్ని రు.36వేల కోట్లకు కోత పెట్టారు.వృద్ధులకు యాత్రల సబ్సిడీ కొత్త కేటాయింపులు లేవు. మరో రెండింజన్ల పాలన రాష్ట్రం మధ్య ప్రదేశ్‌. అక్కడ ప్రాధమిక పాఠశాల విద్యకు ఈ ఏడాది రు.15,509 కోట్ల నుంచి రు.11,837 కోట్లకు కుదించారు. మహిళలకు ఉచిత బస్‌ పథకాన్ని ప్రకటించిన కర్ణాటక సర్కార్‌ 15శాతం బస్‌ ఛార్జీలను పెంచింది.

ఒక్క చైనా తప్ప రుణ భారం పెరిగిన ప్రపంచ దేశాలన్నింటా సంక్షేమ పథకాలకు కోత పెడుతున్నారు. అందుకే అనేక చోట్ల వలస వచ్చిన వారు తమ అవకాశాలను తన్నుకుపోతున్నారంటూ మితవాద శక్తులు జనాలను రెచ్చగొడుతున్నాయి.జి 7 దేశాలతో పాటు చైనా రుణభారం గణనీయంగా పెరుగుతున్నట్లు ఐఐఎఫ్‌ నివేదిక పేర్కొన్నది.అమెరికా వెబ్‌సైట్‌ సమాచారం ప్రకారం జపాన్‌ పన్నెండు లక్షల కోట్ల డాలర్ల రుణం కలిగి ఉంది. ఇది జిడిపికి 293శాతం ఎక్కువ. ఇంత రుణం కలిగిన జపాన్‌ అమెరికాకు లక్ష కోట్ల డాలర్ల రుణం ఇచ్చింది. అదే విధంగా జిడిపిలో 86.7శాతం 16లక్షల కోట్ల రుణం ఉన్న చైనా మరోవైపున అమెరికాకు 750 బిలియన్‌డాలర్ల రుణం ఇచ్చింది. ఇతర దేశాలలో సూడాన్‌ రుణం జిడిపికి 252 శాతం ఉంది. నిరంతరం అంతర్యుద్ధాలతో సూడాన్‌ అప్పు పెరిగింది. జపాన్‌లో కార్పొరేట్లకు ఉద్దీపన పథకాలు, వృద్ధుల సంఖ్య పెరగటం కారణాలుగా చెబుతున్నారు. సింగపూర్‌ 175, బహరెయిన్‌ 141, ఇటలీ 137 అమెరికా 123శాతం రుణభారంతో ఉన్నాయి. ధనిక దేశాలు ఇలా ఉండటానికి కారణంగా కార్పొరేట్లకు ఇస్తున్న రాయితీలే ప్రధాన కారణం. ధనిక దేశాలకు సగటున 110, వర్దమాన దేశాలకు 74శాతం రుణభారం ఉంది. ధనిక దేశాల కంటే వర్ధమానదేశాల రుణ భారం వేగంగా పెరగటం ఆందోళన కలిగిస్తోందని ఐఎంఎఫ్‌ హెచ్చరించింది.గతంలో యుద్ధ సమయాల్లోనే దేశాలు పెద్ద మొత్తంలో రుణాలు తీసుకొనేవి. 1980దశకం నుంచి అభివృద్ధి పేరుతో ప్రభుత్వాలు రుణాలు తీసుకోవటం జరుగుతున్నది. చిత్రం ఏమిటంటే అప్పులు పెరుగుతున్నాయి అభివృద్ధి దిగజారుతున్నది, అనేక ధనిక దేశాల అనుభవం ఇదే. అంటే అభివృద్ధికి అప్పులు అనేది పూర్తిగా నిజం కాదు. అనేక దేశాలు రుణాలు తీసుకోవటమే కాదు ఇస్తున్నాయి. ఉదాహరణకు పన్నెండు లక్షల కోట్ల డాలర్ల రుణం ఉన్న జపాన్‌ అమెరికాకు లక్ష కోట్లతో సహా ఇతర దేశాలన్నింటికీ ఇస్తున్న రుణం 2024 నవంబరు నాటికి 4.18 లక్షల కోట్ల డాలర్లకు చేరింది.ఇలాగే ఇతర దేశాలు కూడా ఇస్తున్నాయి. అందువలన ఇలాంటి వాటన్నింటినీ పరిగణనలోకి తీసుకొంటే నిఖరంగా ఎంత అప్పు అన్నది తేలుతుంది. మన జిడిపి చాలా తక్కువే అయినప్పటికీ 216, చైనా 750 బిలియన్‌ డాలర్లు అమెరికాకు అప్పు ఇచ్చాయి. కరీబియన్‌ సముద్రంలో కేమన్‌ దీవుల జనాభా 90వేలకు అటూ ఇటూ, అది అమెరికాకు ఇచ్చిన అప్పు 2024లో 423 బిలియన్‌ డాలర్లు. అదెలా అంటే అదొక పన్నుల స్వర్గం, అక్కడ డబ్బుదాచుకుంటే ఎవరూ లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదు. ఇతర దేశాల్లో పన్నులు ఎగవేసిన పెద్దల నల్లధనం మొత్తం ఇలాంటి చోట్లకు చేర్చి అక్కడి నుంచి ఏ దేశానికైనా రుణాలు ఇచ్చి బ్లాక్‌ను వైట్‌గా మార్చుకుంటారు. అమెరికా అప్పు 37.5లక్షల కోట్ల డాలర్లలో అక్కడి ఫెడరల్‌ రిజర్వు ప్రభుత్వం జారీచేసిన రుణబాండ్లను ఆరులక్షల డాలర్లమేర కొనుగోలు చేసింది, అంటే అప్పు ఇచ్చింది. మన కేంద్ర ప్రభుత్వ మొత్తం రుణం 196లక్షల కోట్లలో 190లక్షల కోట్లు అంతర్గత రుణాలే. అంటే మన బాంకులు, ఉద్యోగులు, ద్రవ్య సంస్థలు ఇచ్చిన అప్పులే అవి. వడ్డీ రాబడి కోసం ఇదంతా జరుగుతున్నది. ఇతర దేశాల మాదిరి జిడిపిలో మన రుణం 93శాతం, దానికి మించి పెరిగితే ఇబ్బందులు వస్తాయి.

ఒక వైపు అప్పులు పెరుగుతుంటే మరోవైపు ప్రపంచ మార్కెట్లో బంగారం ధర దూసుకుపోతోంది.ఈ రెండింటికీ సంబంధం ఉంది అంటున్నారు. గత చరిత్ర ఇదే చెబుతోంది.రుణాలు పెరిగే కొద్దీ కరెన్సీ విలువలు కూడా పడిపోతున్నాయి. ఈ నేపధ్యంలోనే దేశాలూ, వ్యక్తులూ కూడా బంగారం కొనుగోళ్లు సురక్షితం అని భావిస్తున్నారు.మొదటి ప్రపంచ యుద్ధంలో అప్పులపాలైన జర్మనీ తీర్చేందుకు 1920దశకంలో విపరీతంగా నోట్లను ముద్రించింది. దాంతో ద్రవ్యోల్బణం పెరిగి నోట్లు దేనికీ పనికిరాకుండా పోయాయి. జనాలు కరెన్సీ నోట్లను గోడలకు కాగితాల మాదిరి అంటించి నిరసన తెలిపారు. సంక్షోభాలకు బీమా వంటిది బంగారం అని చెబుతారు. ఇప్పుడు ప్రపంచంలో రిజర్వు ఆస్తులలో బంగారానిది రెండవ స్థానం.ప్రపంచ ధనిక దేశాల్లో 2008లో తలెత్తిన ద్రవ్య సంక్షోభంతో ఉద్దీపన పథకాలు అమలు జరిపిన కారణంగా ప్రపంచ రుణం 2007 నుంచి 2009 కాలంలో 20శాతం పెరిగి 178లక్షల కోట్ల డాలర్లకు చేరింది. ఇదే సమయంలో బంగారం ఔన్సు(28.35గ్రాములు) ధర 869 డాలర్ల నుంచి 1,224 డాలర్లకు చేరింది. ఇప్పుడు ప్రపంచ రుణం ముందే చెప్పుకున్నట్లు 338లక్షల కోట్లడాలర్లు దాటింది. ప్రస్తుతం ఔన్సు ధర 3,800 డాలర్లుగా ఉన్నది త్వరలో 4,800 డాలర్లకు పెరగవచ్చని జోశ్యం చెబుతున్నారు. ఐరోపాలో 2011-2012లో తలెత్తిన రుణ సంక్షోభ సమయంలో మదుపుదార్లకు యూరో మీద విశ్వాసం తగ్గి బంగారంవైపు మొగ్గు చూపటంతో 2011 సెప్టెంబరులో 1,920 డాలర్లకు పెరిగింది. జపాన్‌లో 2020-21 సంవత్సరాలలో రుణ భారం 266శాతానికి పెరగటంతో మదుపుదార్లు బంగారం కొనుగోలుకు ఎగబడటంతో కరెన్సీ విలువలో ధర 18శాతం పెరిగింది.2024లో అమెరికా ఐపి పెట్టేవరకు వచ్చి బయటపడింది.రుణం 34లక్షల కోట్ల డాలర్లు దాటింది.దాంతో బంగారం ధర 2,100 డాలర్లకు పెరిగింది. ఏడాది కాలంలోనే 3,800 డాలర్లకు చేరిందంటే సంక్షోభం మరింత ముదురుతున్నట్లు మదుపుదార్లు భావిస్తున్నారు.ప్రస్తుతం ప్రపంచ రుణం జిడిపిలో 95శాతం ఉంది, 2030 నాటికి అది వందశాతానికి చేరవచ్చని ఐఎంఎఫ్‌ అంచనా వేసింది. అంటే సామాన్యులకు ముప్పు మూడినట్లే ! మరి బంగారం ధర సంగతి ? జోశ్యాలను చూస్తే సామాన్యులు దానివైపు చూడనవసరం లేదనట్లుగా ఉన్నాయి. అక్టోబరు ఒకటవ తేదీన ఔన్సు ధర 3,875 డాలర్లకు చేరింది.1999లో కనిష్ట ధర 252 డాలర్లు. డిసెంబరు ఆఖరుకు 4,036 డాలర్ల వరకు పెరగవచ్చని ఆ రంగ నిపుణులు చెబుతున్నారు. కొందరైతే 4,289 డాలర్లకు చేరవచ్చన్నారు.వచ్చే ఏడాది(2026) ఆఖరుకు 5,488 డాలర్లు, 2027-30 మధ్య 5,479 నుంచి 7,956 డాలర్ల మధ్య ధర ఉండవచ్చని కొందరు చెబుతుంటే 2030 నాటికి 11,330 డాలర్లకు పెరగవచ్చని మరికొందరు. కొనుగోలు చేయాలా వద్దా ? ఎవరికి వారు నిర్ణయించుకోవాల్సిందే !

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఇది కదా కమ్యూనిస్టుల ముందు చూపు – మేథోవలస- తిరిగి రాకపై దశాబ్దాలనాడే చైనా ముందు జాగ్రత్త !

24 Wednesday Sep 2025

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, Education, employees, Europe, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, Science, USA

≈ Leave a comment

Tags

BJP, Brain drain and Gain, China, china communist party, Donald trump, Narendra Modi Failures, Xi Jinping

ఎం కోటేశ్వరరావు

రానున్న రోజుల్లో తమ దేశానికి హెచ్‌ 1 బి వీసా మీద వచ్చే వారు లక్ష డాలర్లు(88 లక్షలరూపాయలు) చెల్లించాల్సి ఉంటుందన్న అమెరికా అధ్యక్షుడి నిర్ణయం భారతీయులను విస్మయానికి గురిచేసింది. అనేక మంది డాలర్‌ కలలు కల్లలైనట్లు భావిస్తున్నారు. ఈ నిర్ణయానికి ట్రంప్‌ కట్టుబడి ఉంటాడా కార్పొరేట్లు తెచ్చే వత్తిడికి లొంగి సవరించుకుంటాడా అన్నది చూడాల్సి ఉంది. ప్రపంచ వ్యాపితంగా మేథోవలస-తిరిగి రాకల గురించి మధనం ప్రారంభమైంది.ట్రంప్‌ నిర్ణయం ఎవరికి లాభం, ఎవరికి నష్టం అన్నది మరికొంత స్పష్టత వచ్చిన తరువాతనే చెప్పుకోవటం మంచిది. ఈ సందర్భంగా వచ్చిన కొన్ని వ్యాఖ్యలు, పత్రికా శీర్షికలు, వాటి వెనుక ఉన్న అంశాల గురించి చూద్దాం. అమెరికా లక్షల డాలర్ల ఫీజు కేవలం ఒక చెడ్డ విధానమేగాక చైనాకు వ్యూహాత్మక బహుమతి అంటూ ఒక బడా ఆంగ్ల పత్రికలో విశ్లేషణ ప్రారంభమైంది. హ్రస్వదృష్టితో ఉన్న అమెరికా వైఖరి కేవలం చైనా సాంకేతిక ప్రగతి పెరగటానికే తోడ్పడుతుందని కూడా వ్యాఖ్యాత వాపోయారు. విలువైన సంపదలను వెండి పళ్లెంలో పెట్టి చైనాకు అప్పగిస్తున్నారంటూ మరొకరు. ఎవరు ఎన్ని ఏడ్పులు ఏడ్చినా, పెడబొబ్బలు పెట్టినా గడచిన ఐదు దశాబ్దాల చరిత్రను చూసినపుడు అమెరికా, ఇతర ధనిక దేశాల విధాన నిర్ణేతలు, మేథావులు అనుసరించిన విధానాలు, అడ్డుకోవటాలు జనచైనా ఎదుగుదలకు ఎంతో తోడ్పడ్డాయన్నది జగమెరిగిన సత్యం. చైనా గురించి ఈ మాటలు చెబుతున్నవారు ట్రంప్‌ నిర్ణయం భారత్‌కు బహుమతి అని ఎందుకు చెప్పలేకపోయారు ? అత్తారింటికి దారేది సినిమాలో పదిలక్షల రూపాయల సూట్‌కేసును పవన్‌ కల్యాణ్‌ బహుమతిగా ఇస్తే దాన్ని తీసుకు వెళ్లిన ఆలీ తాళం రావటం లేదంటూ తిరిగి వచ్చిన దృశ్యాన్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుందాం. ఆకస్మికంగా వచ్చిన ఈ అవకాశాన్ని ఎలా వినియోగించుకోవాలో తెలియని స్థితిలో పదకొండేండ్ల మోడీ పాలన మనదేశాన్ని ఉంచిందని భావించాలా ? ఎందుకంటే ఏది జరిగినా మోడీ కారణంగానే అంటున్నారు గనుక ఇలా వ్యాఖ్యానించాల్సి వస్తోంది.

ప్రతిభావంతులకు చైనా,బ్రిటన్‌ వల అన్నది ఒక ప్రముఖ తెలుగు పత్రిక శీర్షిక. అమెరికా అడ్డుకుంటే ప్రతిభను వృధా కానివ్వాలా ? ఆ పని మనమెందుకు చేయటం లేదని ప్రశ్నించాల్సిన వారు ఇతర దేశాల గురించి అలాంటి పదజాలంతో కించపరుస్తూ వ్యాఖ్యానించటాన్ని ఏమనాలి. అక్టోబరు ఒకటవ తేదీ నుంచి కె వీసాల జారీతో చైనా ఎంతో చురుకుగా ప్రపంచంలోని స్టెమ్‌ (సైన్సు,టెక్నాలజీ, ఇంజనీరింగ్‌, గణిత) మేథావులను ఆకర్షిస్తున్నదని ట్రంప్‌ ప్రకటన తరువాత వార్తలు వెలువడ్డాయి. నిజానికి చైనా నిర్ణయం ఎంతో ముందుగానే తీసుకున్నది. మన మీడియా, అధికారంలో ఎవరు ఉన్నప్పటికీ మన పాలకులు చైనా చర్యలను గుర్తించలేదు, అసలు ప్రయత్నం కూడా చేయలేదంటే అతిశయోక్తి కాదు.మనం లేకపోతే అమెరికాకు గడవదు అని మనజబ్బలు మనం చరుచుకున్నాం తప్ప అసలు వారెందుకు ప్రపంచమంతటి నుంచీ మేథావంతులను ఆకర్షిస్తున్నారు, తేడా వచ్చి ఆకస్మికంగా అడ్డుకుంటే ప్రత్యామ్నాయం ఏమిటి అని 2047 విజన్‌ గురించి చెబుతున్న నరేంద్రమోడీ గానీ, అంతకు ముందే విజన్లను ప్రచారం చేసిన చంద్రబాబు నాయుడు గానీ ఎప్పుడైనా ఆలోచించారా ? కాక మీద ఉన్నపుడే ఇనుము మీద దెబ్బలు వేసి అవసరానికి అనుగుణంగా మలుచుకోవాలి. ఇప్పుడు యువత కూడా ఆలోచించాల్సిన తరుణం వచ్చింది. అమెరికాగాకపోతే ఆస్ట్రేలియా, అదిగాక పోతే ఆఫ్రికా అన్నట్లు కొందరు మాట్లాడుతున్నారు. సంచార తెగమాదిరి ఎక్కడికో అక్కడికి పోవటం తప్ప మన దేశం పురోగమించటం గురించి, గౌరవ ప్రదమైన ఉపాధి గురించి ఎందుకు ఆలోచించరు ?

అమెరికా వ్యూహాత్మకంగా స్వయంగా చేసిన తప్పిదం అంటున్నారు సరే, దాంతో మనకు పోయేదేమీ లేదు, మనం ఎందుకు వ్యూహాత్మకంగా ఆలోచించలేదు అని కదా పాఠాలు తీసుకోవాల్సింది. చైనా కె వీసా ఎంతో స్మార్ట్‌గా, వ్యూహాత్మకంగా, నిర్దాక్షిణ్యమైన అవకాశవాదంతో ( రూత్‌లెస్లీ ఆపర్చ్యునిస్టిక్‌) ఉందని కూడా ఉక్రోషం వెలిబుచ్చారు. ఈ వీసాలకు దరఖాస్తు చేసుకొనేందుకు చైనాలోని ఏదో ఒక కంపెనీ ఇచ్చే అవకాశంతో పని లేదు. అనుభం కూడా అవసరం లేదు. వారు కోరిన అర్హతలు ఉంటే నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. ముందే చెప్పుకున్నట్లు ప్రతిభావంతులను ఆకర్షించటం ఇప్పుడే ప్రారంభం కాలేదు. వేయి ప్రతిభల పథకం(టిటిపి) పేరుతో చైనా 2008 నుంచే ఆకర్షించటం ప్రారంభించింది. అయితే చైనా మీద ఉన్న తప్పుడు ప్రచారం, అమెరికాతో పోలిస్తే దక్కే ప్రతిఫలం తక్కువగా ఉండటం, కమ్యూనిస్టు నిరంకుశ ప్రభుత్వం అనే వ్యతిరేక భావనలు ఇలా అనేక అంశాలు చైనా వైపు చూడటానికి యువతను అడ్డుకున్నాయి. అది కూడా చాపకింద నీరులా తన పథకాన్ని అమలు జరిపింది తప్పహడావుడి చేయలేదు. ఇప్పుడు చైనా సాధిస్తున్న పురోగతి, ఇతర దేశాల్లో విధిస్తున్న ఆంక్షలు, జాత్యహంకారం వంటి వివక్ష ఇతర సమస్యల కారణంగా గతంలో మాదిరి అడ్డుకొనే అవకాశాలు పరిమితం. అనేక మంది వైద్య విద్యకోసం చైనా వెళ్లిన సంగతి తెలిసిందే.

మన దేశానికి ట్రంప్‌ మంచి అవకాశాన్ని కల్పించాడు. దాన్ని సద్వినియోగం చేసుకోవటం మన విధాన నిర్ణేతలు, పాలకుల చేతుల్లో ఉంది. సేవారంగంలో మన యువత ముందంజలో ఉంది.మొత్తంగా చూసినపుడు సాధించాల్సింది ఇంకా ఉంది. అందుకు కేంద్ర ప్రభుత్వం చేయాల్సింది ఎంతో ఉంది. ప్రపంచంలో పరిశోధన మరియు అభివృద్ధి మీద చేస్తున్న ఖర్చు వంద రూపాయలు అనుకుంటే మనం చేస్తున్నది కేవలం రు.2.90 మాత్రమే. అదే అమెరికా 24.8, చైనా 22.80 ఖర్చు చేస్తున్నాయి. దీనికి అనుగుణంగానే ప్రపంచంలో నవకల్పనలకు పేటెంట్‌ హక్కులు లభిస్తున్నాయి. వరల్డ్‌ పాపులేషన్‌ రివ్యూ వెబ్‌సైట్‌ సమాచారం ప్రకారం 2023లో చైనా అత్యధికంగా 16,19,268 దరఖాస్తులు సమర్పించగా 7,98,347 మంజూరయ్యాయి. రెండవ స్థానంలో ఉన్న అమెరికా 5,94,340కి గాను 3,20,410 పొందింది. మన విషయానికి వస్తే ఐదవ స్థానంలో 70,068 మాత్రమే సమర్పించి 30,490 పొందాము. మూడవ స్థానంలో ఉన్న జపాన్‌ 2,89,530కి గాను 2,01,420, నాలుగవది దక్షిణ కొరియా 2,37,633కు గాను 1,35,180 పొందాయి. ఏదైనా పిండికొద్దీ రొట్టె.గడచిన పదకొండు సంవత్సరాలుగా అంతకు ముందు కూడా పరిశోధన, అభివృద్ధికి మనదేశం చేసిన ఖర్చు పెరగలేదు. అన్నీ వేదాల్లో ఉన్నాయష అనే కబుర్లతో కాలక్షేపం చేస్తే ఇలాగే ఉంటుంది.పోనీ వాటినైనా వెలికి తీస్తారా అంటే అదీ చేయరు. పడక కుర్చీ కబుర్లు చెబుతుంటారు. యుద్ద ప్రాతిపదికన కొన్ని సంవత్సరాల పాటు అవసరమైన నిధులు కేటాయించి ప్రోత్సహిస్తే మనం కనీసం మూడవ స్థానానికి చేరుకుంటాం.ఈ అవకాశాన్ని మోడీ సర్కార్‌ సద్వినియోగం చేస్తుందా ? చౌకబారు రాజకీయాల మీదనే కేంద్రీకరిస్తుందా ? కొంత మంది అంచనా వేస్తున్నట్లు రానున్న రోజుల్లో ప్రావీణ్యం అసలైన శక్తిగా ముందుకు రానుంది. దీన్ని చైనా ఎప్పుడో గుర్తించింది, అమెరికా ఇప్పుడు నేర్చుకుంటున్నది, మరి మనం ? అవు సైన్సును నమ్ముకుంటే గోమూత్రం, పేడ దగ్గరే ఉండిపోతాం. వార్షిక ప్రపంచ రాంకింగ్‌లను చూసినపుడు చైనా విద్యా సంస్థల పురోగతి స్పష్టంగా తెలుస్తున్నది. ఇప్పటికీ చైనాను గుడ్డిగా వ్యతిరేకించే వారు అది అనుకరించేది తప్ప నవకల్పనలు చేసేది కాదని వాదిస్తారు. వారిని అలాగే ఉండనిద్దాం, వాస్తవాలను చూద్దాం. అమెరికాకు చెందిన న్యూస్‌ అండ్‌ వరల్డ్‌ నివేదికలో 105 దేశాలకు చెందిన 2,250 ఉన్నత విద్యా సంస్థలు ఉన్నాయి. ఈ సంవత్సరం బీజింగ్‌లోని సిన్హువా విశ్వవిద్యాలయం ప్రపంచ రాంకుల్లో పదకొండవ స్థానం పొందింది. పెకింగ్‌, ఝెజియాంగ్‌ 25,45వ స్థానాల్లో ఉన్నాయి. 2018లో సిన్హువా, పెకింగ్‌ 50, 68 స్థానాలతో తొలి వందలో ఉన్నాయి.ఈ ఏడాది వాటి సంఖ్య పదిహేనుకు చేరింది.చైనాలో అమలు జరిపిన కరోనా ఆంక్షలు, అంతకు ముందే 2018లో ట్రంప్‌ తొలి పాలనా కాలంలో ప్రారంభమైన అమెరికా వేధింపులు పెరగటంతో 2019-20లో 3,72,532గా అమెరికాలో చదివిన చైనా విద్యార్థుల సంఖ్య 2023-24లో 2,77,398కి తగ్గింది. దీంతో ఇప్పుడు మన దేశం మొదటి స్థానంలోకి వెళ్లింది.

ఇప్పటి వరకు చైనా నుంచి అమెరికాకు మేథోవలస జరిగింది. ఇప్పుడు అక్కడి నుంచి తిరిగి రావటం ప్రారంభమైంది. దీనికి అక్కడ పరిశోధన మరియు అభివృద్ధికి చేస్తున్న ఖర్చు పెరగటంతో పాటు ప్రపంచ సరఫరా గొలుసులో చైనాను విస్మరించలేని స్థితికి చేరుకోవటం, అక్కడ కూడా అనేక స్టార్టప్‌లు ప్రారంభించటానికి ప్రభుత్వం అవకాశం కల్పించటం వంటి కారణాలు దీనికి దోహదంచేస్తున్నాయి.2035 నాటికి ప్రపంచ అగ్రస్థానంలో సాంకేతిక రంగాన్ని నిలబెట్టేందుకు చైనా పూనుకుంది. అందుకు అవసరమైన పెట్టుబడిలో అమెరికాతో పోటీపడుతోంది.ఓయిసిడి సంస్థ సమాచారం ప్రకారం పదేండ్ల క్రితం అమెరికా చేసిన పరిశోధన ఖర్చులో 72శాతం చేసిన చైనా 2023నాటికి 780 బిలియన్‌ డాలర్లు వెచ్చించి 96శాతానికి చేరుకుంది. పరిశోధన ఉత్పత్తిలో 2017లోనే అమెరికాను అధిగమించింది. డీప్‌ సీక్‌ సంచలనం తెలిసిందే. దానిలో పనిచేసిన వారందరూ చైనా యువకులే.కొంత మందికి ఎక్కడా పని చేసిన అనుభవం కూడా లేదు. దీనితో పాటు ఝజియాంగ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన గ్రాడ్యుయేట్లు డీప్‌ రోబోటిక్స్‌లో ప్రావీణ్యం పొందారు. విద్యుత్‌ సబ్‌స్టేషన్లు, ప్రమాదకరమైన హై ఓల్టేజి సమస్యల పరిష్కారానికి వారు కృషి చేస్తున్నారు. సిలికాన్‌ వాలీతో పోటీ పడేట్లుగా చైనా ప్రోత్సహిస్తున్నది. సాంకేతిక పరిజ్ఞాన ఎగుమతులపై అమెరికా విధించిన నిషేధాలను సవాలుగా తీసుకుంది.అవకాశాలను అందిపుచ్చుకోవటంలో చైనాను చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. 1970దశకంలో అనివార్యమైన స్థితిలో ఐరాస భద్రతా మండలిలో కమ్యూనిస్టు చైనాను అసలైన శాశ్వత ప్రతినిధిగా అమెరికా గుర్తించాల్సి వచ్చింది.

దాని కొనసాగింపుగా చైనా ప్రారంభించిన సంస్కరణలను సొమ్ము చేసుకోవాలని అమెరికా భావించింది. తాత్కాలిక లాభాలను అమెరికన్లు చూస్తే దీర్ఘకాలిక లక్ష్యంతో సంస్కరణలను చైనా తలపెట్టింది.1978 వరకు అమెరికా ఉన్నత విద్యా సంస్థలలో చైనీయులకు ప్రవేశం లేదు. సాధారణ సంబంధాలను ఏర్పాటు చేసుకొనే ప్రక్రియలో భాగంగా అమెరికా సైన్సు సలహాదారు ఫ్రాంక్‌ ప్రెస్‌ బీజింగ్‌ సందర్శనకు వచ్చాడు. అక్కడి నుంచి నాటి అధ్యక్షుడు జిమ్మీ కార్టర్‌కు ఫోన్‌ చేసి తమ విద్యార్థులు ఐదువేల మందిని అమెరికా విద్య కోసం పంపేందుకు ఆసక్తితో ఉన్నట్లు చైనా చెప్పిందని, ఏం చేయమంటారని అడిగాడు. ఐదువేలేం ఖర్మ లక్ష మందిని పంపవచ్చని వారికి చెప్పండని కార్టర్‌ సమాధానమిచ్చాడట. అలా వెళ్లిన లక్షలాది మంది చైనా విద్యార్ధులు అమెరికా ఆర్థిక వ్యవస్థ ఏటా 15 బిలియన్‌ డాలర్ల లబ్ది కలించారు.ఆ విధంగా అమెరికా మేథోవలసను ప్రోత్సహించి ఎంతోలబ్ది పొందింది. అక్కడి మార్కో పోలో అనే మేథో సంస్థ ప్రపంచ కృత్రిమే మేథ సర్వే చేసింది. అమెరికాలోని అగ్రశ్రేణి ఏఐ పరిశోధకుల్లో 37శాతం మంది అమెరికన్లు కాగా చైనీయులు 38శాతం ఉన్నట్లు తేలింది.చాట్‌ జిపిటి 4 ప్రాజెక్టులో కీలకమైన సేవలు అందించిన వారిలో 20శాతం మంది చైనీయులే. వీటన్నింటిని చూసిన తరువాత భయపడిన అమెరికన్లు పొమ్మనకుండా చైనీయులకు పొగ పెట్టారు. మా దేశంలో చదువుకొనేందుకు రావచ్చు గానీ స్టెమ్‌ కోర్సుల బదులు, మావవ, సామాజిక శాస్త్రాలను ఎంచుకోవాలని వత్తిడి తెస్తున్నది. ఆధునిక శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన కోర్సులో ప్రవేశాన్ని పరిమితం చేసింది. అందుకే చైనీయులు వేలాది మంది స్వదేశం బాట పట్టి అమెరికాకు పాఠం చెప్పేందుకు పూనుకున్నారు. మోడీ సర్కార్‌ మనవారికి అలాంటి అవకాశాలను కల్పిస్తుందా అన్న శేష ప్రశ్న !

Share this:

  • Tweet
  • More
Like Loading...

తొంభై రోజులు ముగిసినా 90 ఒప్పందాలు లేవు, భంగపడిన ‘‘ రారాజు ’’ డోనాల్డ్‌ ట్రంప్‌ ! బంతి అమెరికా మైదానంలో ఉందన్న భారత్‌ !!

09 Wednesday Jul 2025

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, Europe, Farmers, Germany, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, RUSSIA, UK, USA

≈ Leave a comment

Tags

BJP, Donald trump, Narendra Modi Failures, Tariff Fight, Trade agreement with US, Trade war Expanding, Trump Letters, Trump tariffs, Vladimir Putin, Xi Jinping


ఎం కోటేశ్వరరావు


తొంభై రోజుల్లో తొంభై ఒప్పందాలు ఏప్రిల్‌ రెండవ తేదీ అమెరికా విముక్తి దినం పేరుతో డోనాల్డ్‌ ట్రంప్‌ పలికిన ప్రగల్భాలలో ఒకటి. ఆ గడువు జూలై 9వ తేదీతో ముగిj. అనుకున్నది పగటికలగా మారింది. దాంతో తమతో ఒప్పందాలకు రాకపోతే అపరాధ సుంకాలు విధిస్తానని ఆగస్టు ఒకటి వరకు అవకాశం ఇస్తున్నట్లు ప్రకటించాడు. బెదిరింపులో భాగంగా పద్నాలుగు దేశాలు ఎంతెంత సుంకాన్ని ఎదుర్కోవాల్సిందీ వెల్లడిస్తూ లేఖల రూపంలో ఆదేశాలను పంపాడు. ఒప్పందాలు కుదుర్చుకోవటం లేదా సిద్దంగా ఉన్నట్లు తిరుగులేఖలు రాయకపోతే ఆగస్టు ఒకటవ తేదీ నుంచి తన సుంకాలు అమల్లోకి వస్తాయన్నాడు. చర్చలకు ఇంకా ద్వారాలు తెరిచే ఉన్నాయని కూడా చెప్పాడు. మాటి మాటికి గడువు పొడిగిస్తా అనుకుంటున్నారేమో నూటికి నూరు శాతం గట్టిగా చెబుతున్నా, వారు గనుక తనకు ఫోన్‌ చేసి వేరే పద్దతులను ఆలోచిస్తున్నట్లు చెబితే సరే, దానికి అవకాశం ఇస్తున్నా లేకపోతే ఏం చేస్తానో తెలుసుగా అన్నట్లుగా పొడిగించిన గడువుకు అయినా కట్టుబడి ఉంటారా లేదా అని అడిగిన విలేకర్లతో చెప్పాడు. ఏప్రిల్‌లో వివిధ దేశాల సరకులపై ఎంత మేరకు పన్ను విధించేది ప్రకటించిన ట్రంప్‌ ఏ దేశమూ ముందుకు రాకపోవటంతో మూడు నెలలపాటు వాయిదా వేస్తున్నట్లు, జూలై 9వ తేదీతో గడువు ముగుస్తుందన్నాడు. అయినప్పటికీ స్పందన లేకపోవటంతో ఆగస్టు వరకు పొడిగిస్తున్నట్లు వెల్లడిరచాడు. ఆలోగా ఒప్పందానికి రాకుంటే ఏప్రిల్‌ రెండవ తేదీన ప్రకటించిన విధంగా పన్నులను విధిస్తామని వాణిజ్యశాఖ మంత్రి లుటినిక్‌ చెప్పాడు. మనదేశంతో ఎనిమిదవ తేదీలోగా ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు లీకులు వదిలిన సంగతి తెలిసిందే. తాజా వార్తలను బట్టి ఆ గడువు ఆగస్టు ఒకటి వరకు పొడిగించినట్లు చెబుతున్నారు. నాటకీయంగా ఏదో కుదిరిందని మొక్కుబడి ప్రకటన చేస్తే చెప్పలేము.మేం చెప్పాల్సింది చెప్పాం, తేల్చుకోవాల్సింది ట్రంపే, బంతి అమెరికా కోర్టులో ఉంది అని మనదేశం తరఫున చర్చల్లో పాల్గొన్న ఒక అధికారి చెప్పినట్లు ఒక వార్త. ఏం జరుగుతుందో చూద్దాం !


రష్యాతో వాణిజ్యం చేస్తే భారత్‌, చైనాలపై 500శాతం పన్నులు విధిస్తానని ట్రంప్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. బ్రిక్స్‌ సమావేశాల్లో అమెరికా బెదిరింపు వైఖరిని విమర్శించిన తరువాత తమ వ్యతిరేక విధానాలను అనుసరించే బ్రిక్స్‌ దేశాలతో వాణిజ్యం జరిపే దేశాల మీద కూడా పదిశాతం పన్ను విధిస్తానని బెదిరింపులకు దిగాడు.ఏకపక్ష పన్ను ప్రకటనలు ప్రపంచ వాణిజ్యాన్ని దెబ్బతీస్తాయని బ్రిక్స్‌ పేర్కొన్నది. వివిధ దేశాలపై డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించిన పన్నుశాతాలు గతంలో ప్రకటించినవి కొన్నింటిలో మార్పులేదు, మరికొన్నింటిని సవరించాడు. ఆయా దేశాల వస్తువులపై జపాన్‌ 25,దక్షిణ కొరియా 25, థాయ్‌లాండ్‌ 36, మలేసియా 25, ఇండోనేషియా 32, దక్షిణాఫ్రికా 30,కంపూచియా 36, బంగ్లాదేశ్‌ 35,కజకస్తాన్‌ 25, ట్యునీసియా 25, సెర్బియా 35,లావోస్‌ 40, మయన్మార్‌ 40 శాతం పన్నులు ఉంటాయి. ఒక వేళ ఈ దేశాలు గనుక ప్రతి సుంకాలు పెంచినట్లయితే తాను ప్రకటించిన మొత్తాల మీద మరో అంత మొత్తం పెంచుతామని కూడా ట్రంప్‌ బెదిరించాడు. రానున్న రోజుల్లో మిగిలిన దేశాలకు కూడా ఎంత పన్ను విధించేదీ లేఖల రూపంలో తెలియచేస్తామని అధ్యక్ష భవన మీడియా అధికారిణి కారాలోని లీవిట్‌ చెప్పారు. వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకొనే వస్తువులపై పన్ను మొత్తాలను పెంచితే ఆ భారం అమెరికా వినియోగదారుల మీదనే పడుతుందన్నది తెలిసిందే.ఆర్థికవేత్తలు చెప్పినదాని ప్రకారం ఒక్కో కుటుంబం మీద 3,800 నుంచి నాలుగువేల డాలర్ల వరకు భారం పడుతుందని, అది ఒకటి నుంచి ఒకటిన్నర శాతం వరకు ద్రవ్యోల్బణాన్ని పెంచుతుంది.


జపాన్నుంచి కార్లు, ఎలక్ట్రానిక్స్‌, వైద్య పరికరాలు, దక్షిణ కొరియా నుంచి సెమీకండక్టర్లు, ఆటోవిడి భాగాలు, ఓడలు, మలేషియా నుంచి సెమికండక్టర్లు, రబ్బరు, బంగ్లాదేశ్‌ నుంచి దుస్తులు, పాదరక్షలు, కంపూచియా నుంచి తక్కువ వెలగల దుస్తులు, ఫర్నీచర్‌, ఇండోనేషియా ఓడల్లో ధరించే పాదరక్షలు, పామ్‌ఆయిల్‌, ఎలక్ట్రానిక్స్‌, దక్షిణాఫ్రికా లోహాలు, పండ్లు, ఆభరణాలు, తాజా వ్యవసాయ ఉత్పత్తులు, ఆటోవిడి భాగాలు, సెర్బియా యంత్రాలు, వ్యవసాయ ఉత్పత్తులు లావోస్‌ పాదరక్షలు, కలప వస్తువులు, మయన్మార్‌ నుంచి చౌకగా లభించే ఉత్పత్తులు, బోస్నియా కలప, లోహాలు, కజకస్తాన్‌ లోహాలు, తైలాలు, రసాయనాలు, టునీసియా ఆలివ్‌ ఆయిల్‌ వంటి వాటిని అమెరికా దిగుమతి చేసుకుంటున్నది. వాటి మీద ఎంత పన్ను విధిస్తే అంత మొత్తాన్ని వినియోగదారులు అదనంగా చెల్లించాలి, ఆమొత్తాలతో ట్రంప్‌ లోటుబడ్జెట్‌ పూడ్చుకొనేందుకు లేదా కార్పొరేట్లకు పన్ను రాయితీలు ఇచ్చేందుకు వినియోగించాలన్నది అసలు ఎత్తుగడ. జూలై తొమ్మిదవ తేదీలోగా ఒప్పందాలు చేసుకోని దేశాలకు ఆగస్టు ఒకటవ తేదీ వరకు అవకాశం ఇస్తున్నామని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్‌ బెసెంట్‌ చెప్పాడు. వచ్చే మూడు రోజులు తాము ఊపరిసలపని పనిలో ఉంటామని ఆదివారం నాడు సిఎన్‌ఎస్‌ టీవితో అన్నాడు. ఆగస్టు ఒకటవ తేదీని కొత్తగడువుగా అభివర్ణించకూడదని, పనులు వేగంగా జరగాలంటే ఏదో ఒకటి ఉండాలన్నాడు. కొత్త పన్నులు కావాలా లేదా గతంలో ప్రకటించినవే కావాలా అన్నది లేఖలు అందుకున్నదేశాలు తేల్చుకోవాలని చెప్పాడు.తాము పద్దెనిమిది ప్రధాన వాణిజ్య భాగస్వాముల మీద కేంద్రీకరిస్తున్నామని అనేక పెద్ద ఒప్పందాలు పూర్తి కావచ్చాయన్నాడు. ఏ దేశ ఉత్పత్తులపై తామెంత పన్ను విధించేది 100 చిన్న దేశాలకు లేఖల ద్వారా తెలియచేస్తామని అన్నాడు. ఇది అమెరికా దురహంకారం తప్ప మరొకటి కాదు.పూర్వం పెద్ద దేశాల రాజులు చిన్న లేదా సామంత దేశాలు తమకు ఏటా ఇంత కప్పం కట్టాలని లేకపోతే తమ తడాఖా చూపుతామని బెదిరించేవారు. అయితే బెసెంట్‌ మాటలను బట్టి ఏదీ ఖరారు కాలేదన్నది స్పష్టం. అమెరికాలో వాషింగ్టన్‌ కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నానికల్లా తన లేఖలు సంబంధిత దేశాలకు అందుతాయని ఆదివారం నాడు ట్రంప్‌ చెప్పాడు. కొన్ని దేశాలు బుధవారం లోగా కొన్ని ఒప్పందాలు కుదుర్చుకోవచ్చు లేదా లేఖలు అందించే అవకాశం ఉందన్నాడు.


ట్రంప్‌ లేఖలు అంటే ఏకపక్షంగా జారీ చేసినవి, బెదిరించే ఎత్తుగడ తప్ప మరొకటి కాదు.చైనాతో ఒప్పందం కుదిరిందని ఏకపక్షంగా ట్రంప్‌ ప్రకటించటం తప్ప వివరాలేమిటో ఇంతవరకు తెలియదు. అదే విధంగా వియత్నాంతో వచ్చినట్లు చెబుతున్న అవగాహన కూడా అదే స్థితిలో ఉంది.అంశాలు ఇంకా ఖరారు కాలేదు.మనదేశంతో ఒప్పందం గురించి కూడా రకరకాల వార్తలను ప్రచారంలో పెట్టారు. అసలు ఒకసారి కుదిరిందని ట్రంప్‌ చెప్పాడు. అంతిమ ఒప్పందం అని, తరువాత తాత్కాలిక ఒప్పందం, మరోసారి చిన్న ఒప్పందం ఇలా రకరకాలుగా వర్ణించారు. మధ్యలో అమెరికా వస్తువులపై పన్నులను తగ్గించేందుకు భారత్‌ అంగీకరించటం లేదని లీకులు వదిలారు.మంగళవారం నాడు ఇది రాసిన సమయానికి ఒప్పందం గురించి ఎలాంటి వార్తలు లేవు. రాజకీయంగా, మిలిటరీ, ఆర్థికంగా ఏ రీత్యా చూసినప్పటికీ జపాన్‌, దక్షిణ కొరియా ఇప్పటి వరకు అమెరికా కనుసన్నలలోనే వ్యవహరించాయి. అలాంటి దేశాలపై 25శాతం పన్ను విధిస్తానని ఏకపక్షంగా ప్రకటించాడు ట్రంప్‌.అమలుకు ఆగస్టు ఒకటి వరకు గడువు ఉందన్నాడు. ఇప్పటి వరకు వివిధ దేశాల వైఖరుల సారాంశం దిగువ విధంగా ఉంది.

జపాన్‌లో కూడా ఆటోపరిశ్రమ పెద్దదే. తన ప్రయోజనాలను కాపాడుకొనేందుకు, ఏ పరిస్థితి ఎదురైనా ఎదుర్కొనేందుకు, తట్టుకొనేందుకు సిద్దంగా ఉన్నట్లు ఆదివారం నాడు ప్రధాని షిగెరు షిబా ఫూజీ టీవీ కార్యక్రమంలో ఆదివారం నాడు చెప్పాడు. అమెరికా వస్తువుల మీద దిగుమతి పన్ను తగ్గిస్తామని మనదేశం సంకేతాలిచ్చినప్పటికీ దానికంటే మన పాడి,వ్యవసాయ రంగాలను అమెరికా ఉత్పత్తులకు తెరవాలని గట్టిగా పట్టుబడుతున్నట్లు వార్తలు.ఏం జరుగుతుందో తెలియదు.ఇరవై ఏడు దేశాలతో కూడిన ఐరోపా యూనియన్‌తో చర్చల్లో మంచి పురోగతి ఉందని అమెరికా చెప్పటం తప్ప అలాంటి సూచనలు కనిపించటం లేదు. సమాఖ్యదేశాల కార్లపై 50శాతం పన్ను విధిస్తానని ట్రంప్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. అసలుకే మోసం రాకుండా ఒప్పందం ఉందాలని జర్మనీ చెబుతుండగా హానికరమైన ఒప్పందానికి తాము వ్యతిరేకమని ఫ్రాన్సు పేర్కొన్నది. బ్రిటన్ను అదిరించి బెదిరించి ఒప్పందం కుదుర్చుకున్నారు.పదిశాతం కనీస పన్నులు విధిస్తారు, దానికి ప్రతిగా అమెరికా కార్లు, విమానాలకు బ్రిటన్‌ తలుపులు తెరిచింది. తాము జూలై 21లో ఒప్పందం కుదుర్చుకుంటామని కెనడా చెప్పటంతో దానికి లేఖ పంపలేదు. ఎవరైనా ఇదే మాదిరి ఒప్పందానికి దగ్గరగా ఉంటే వాటికి వ్యవధిని పెంచుతామని ట్రంప్‌ సలహాదారు కెవిన్‌ హాసెట్‌ చెప్పాడు.


చైనాతో ఒప్పందం కుదిరిందని లండన్‌ భేటీ తరువాత డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించాడు. దాని మీద చైనా అవుననిగానీ కాదని గానీ ప్రకటించలేదు. నువ్వెంత దిగివస్తే నేనంత తగ్గుతాను అన్నట్లుగా చైనా వ్యవహరిస్తున్నది.లాభం లేదని గ్రహించిన ట్రంప్‌ తొలుత ఆ దిశగా కొన్ని చర్యలు తీసుకున్నాడు.ప్రముఖ ఎలక్ట్రానిక్‌ సంస్థలు చైనాకు ఆటోమేషన్‌ సాఫ్ట్‌వేర్‌ అందించేందుకు, విమాన ఇంజన్ల ఎగుమతులకు అవకాశం కల్పించాడు. దానికి ప్రతిగా ఆంక్షలున్న ఎనిమిది వస్తువుల ఎగుమతులపై నిబంధనలను సడలించేందుకు చైనా చర్యలు తీసుకుంది. ఈ విధంగా ఇరుదేశాల వాణిజ్య యుద్ధ రాజీ ఒప్పందం ముందుకు పోతున్నదని రాయిటర్స్‌ పేర్కొన్నది.అమెరికా దిగిరావటానికి అక్కడి బహుళజాతి గుత్త సంస్థలు ట్రంప్‌ మీద తెస్తున్న వత్తిడే ప్రధాన కారణం. ఉదాహరణకు 2014లో ఇంటెల్‌ కంపెనీ మొత్తం రాబడిలో 27శాతం ఉంది. క్వాల్‌కామ్‌ ఆదాయంలో 50శాతం చైనా నుంచి ఉంది. దీనికి తోడు చైనా పారిశ్రామిక ఉత్పత్తిలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టటంతో ఆ ఉత్పత్తులున్న అమెరికన్‌ కంపెనీలకు అది పెద్ద మార్కెట్‌గా మారింది. ట్రంప్‌ రెండవసారి అధికారానికి వచ్చిన తరువాత అమెరికా అనేక పాఠాలు నేర్చుకుంది. ఇతర దేశాల మాదిరి లేఖల ఆదేశాలు పంపి గరిష్టంగా వత్తిడితో అదిరించి బెదిరిస్తే లొంగే ఘటం కాదు అన్నది ఒకటి. కలసి ఉంటే కలదు సుఖం ఘర్షణ పడితే లాభం లేదని, పరస్పరం లాభదాయకమైన అంశాల్లో రాజీపడటమే మేలని గ్రహించటం రెండవది.కృత్రిమ గోడలు కట్టి సరఫరా వ్యవస్థలను విచ్చిన్నం చేస్తే అమెరికా పొందే లాభం లేదని, తన స్వంత చట్టాలతో ఇతర దేశాలను శిక్షించినట్లుగా చైనాతో వ్యవహరిస్తే కుదరదని గ్రహించటం వంటి అంశాలు ప్రభావతం చేశాయి.అయితే ఇంకా బయోటెక్నాలజీ, సెమీకండక్టర్లు, నూతన ఇంథనం వంటి కొన్ని రంగాల్లో చైనాను కట్టడి చేసేందుకు అమెరికా చూస్తూనే ఉంది. చైనాలో పెట్టుబడులు పెట్టేవారి మీద పన్నులు విధిస్తున్నది. దానికి తగినట్లుగా చైనా కూడా తన తురుపు ముక్కలను వాడుతున్నది. ఐరోపా యూనియన్‌, ఇతర దేశాలు అమెరికా మాదిరి మడికట్టుకు కూర్చోవటం లేదు, అది ఆడమన్నట్లుగా ఆడకుండా చైనాతో తమ ప్రయోజనాలను బేరీజు వేసుకుంటున్నాయి. ఇది కూడా అమెరికా మీద ప్రభావం చూపుతున్నది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అమెరికాకు హడలు పుట్టిస్తున్న చైనా అంతరిక్ష కార్యక్రమం !

02 Wednesday Jul 2025

Posted by raomk in CHINA, Current Affairs, Europe, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, USA, WAR

≈ Leave a comment

Tags

BJP, China, China’s space tech boom, Narendra Modi Failures, Orbital arms race, Space War, Star Wars, Xi Jinping


ఎం కోటేశ్వరరావు


ఆర్థిక రంగంలోనే కాదు, అంతరిక్షంలోనూ సోషలిస్టు చైనా ప్రస్తుతం అమెరికాను హడలెత్తిస్తున్నదా ? అంటే వాషింగ్టన్‌ స్పందన చూస్తే అలాగే ఉంది, అయితే వక్రీకరణ షరా మామూలే అని చెప్పనవసరం లేదు. అమెరికా అంతరిక్ష దళాల(యుఎస్‌ఎస్‌ఎఫ్‌) జనరల్‌ కమాండర్‌ స్టీఫెన్‌ వైటింగ్‌ మనదేశంతో పాటు ప్రపంచాన్ని భయపెట్టేందుకు పూనుకున్నాడు. చైనా గురించి అనేక కుట్ర సిద్దాంతాలు ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. అందువలన ఈ పూర్వరంగంలోనే అతగాడు ఇటీవల ‘‘ బ్రేకింగ్‌ డిఫెన్స్‌ ’’ అనే వెబ్‌సైట్‌తో మాట్లాడిన అంశాలను చూడాల్సి ఉంది.ప్రపంచ వ్యాపితంగా 80దేశాలలో 750 చిన్నా, పెద్ద మిలిటరీ కేంద్రాలను నిర్వహిస్తున్న అమెరికా ఇతర దేశాల నుంచి ముప్పు ఉన్నట్లు స్వంత జనాలను నిరంతర భయపెడుతున్నది. దాని వెనుక ఉన్న అసలు రహస్యం ఏమంటే స్వంత పౌరులు భారీ మిలిటరీ బడ్జెట్‌ను ప్రశ్నించకుండా ఉండేందుకు, ఇతర దేశాలను మిలిటరీ శక్తిని చూపి భయపెట్టేందుకు, దాడులు చేసేందుకు చేసేందుకు తప్ప వేరుకాదు. ఆశ్చర్యకరమైన వేగంతో చైనా ఉపగ్రహాల ప్రయోగం ఇండోపసిఫిక్‌ ప్రాంతానికి ప్రమాదకరంగా మారటం అత్యంత ముఖ్యమైన సమస్యల్లో ఒకటని వైటింగ్‌ చెప్పాడు. దొంగే దొంగని అరచినట్లుగా 2019లో డోనాల్డ్‌ ట్రంప్‌ తొలిసారి అధ్యక్షుడిగా ఉన్నపుడు అమెరికా అంతరిక్ష దళం పేరుతో మిలిటరీ విభాగాన్ని ఏర్పాటు చేశాడు. అది మినహా మరోదేశమేదీ ఇప్పటి వరకు అలాంటి విభాగాలను ఏర్పాటు చేసినట్లు వార్తలు లేవు.

అంతరిక్షంలో ఎన్ని ఉపగ్రహాలు లేదా అలాంటివి ఉన్నాయన్నది ఒక అంచనా తప్ప నిర్దిష్ట సంఖ్య చెప్పటం కష్టం. వాటిలో పనిచేసేవాటితో పాటు చేయనివీ ఉన్నాయి. గడువు మీరిన తరువాత కూడా అవి పరిభ్రమిస్తూనే ఉంటాయి. తొలి ఉపగ్రహం స్పుత్నిక్‌ నాటి సోవియట్‌ యూనియన్‌లో 1957 అక్టోబరు నాలుగున నింగిలో ప్రవేశించింది. ఈ ఏడాది మార్చి నెల నాటికి 20,985 ప్రయోగించగా భూకక్ష్యలో 14,904 ఉన్నట్లు తేల్చారు. కొన్ని భూ కక్ష్యలో ఉండగా మరికొన్ని అంతకు మించి ఎగువన ఉన్నాయి. అయితే ఇవన్నీ పనిచేస్తున్నట్లు చెప్పటానికి లేదు. కొన్ని అదుపుతప్పినవి, మరికొన్ని ఇంథనం అయిపోయి పనిచేయనివి, మరికొన్ని కాలం చెల్లినవి, ఇలా రకరకాలుగా దాదాపు నాలుగువేలు మన తలల మీద గంటకు 28వేల కిలోమీటర్ల వేగంతో తిరుగుతున్నాయి.1972లో నాటి సోవియట్‌ యూనియన్‌ ప్రయోగించిన కాస్మోస్‌ 482 ఉపగ్రహం ఈ ఏడాది భూఉపరితలంలో నాలుగు ముక్కలై హిందూమహా సముద్రంలో గుర్తు తెలియని చోట కూలిపోయింది. అందువలన ఇలాంటివి ఏదో రూపంలో తిరిగి రావటానికి ఎన్నో సంవత్సరాలు పట్టవచ్చని భావిస్తున్నారు. అమెరికా తొలిసారిగా 1958 మార్చి 17న వాన్‌గార్డ్‌ ఒకటి ఉపగ్రహాన్ని పంపింది.గడచిన ఐదు సంవత్సరాల్లో(63 నెలల్లో) 11,951 ప్రయోగించగా అంతకు ముందు 9,034 మాత్రమే ప్రయోగించారంటే ఇటీవలి కాలంలో అంతరిక్ష ప్రయోగాలు, మార్కెట్‌ ఎంతవేగంగా విస్తరించిందో అర్ధం చేసుకోవచ్చు. ఈ ఏడాది తొలి మూడు నెలల్లోనే 639 ప్రయోగాలు జరిగాయి. ఈ స్థితిలో ఫలానా దేశం ముందుందని ఏడ్చి పెడబొబ్బలు పెడుతూ సమయాన్ని వృధాచేసుకోవటంకంటే వెనుకబడి ఎందుకున్నామని ప్రతిదేశం ఆలోచించుకోవటం ఆరోగ్యకరం. తొలి స్పుత్నిక్‌ బరువు 83.4కిలోలు కాగా అతిపెద్ద ఎన్విశాట్‌ 8211 కిలోలు ఉంది. డబుల్‌ డెక్కర్‌ బస్సంత పరిమాణంలో ఉంది. 2003లో ప్రయోగించిన తొలి అతిచిన్న క్యూబ్‌ఉపగ్రహం బరువు కేవలం రెండు కిలోలు మాత్రమే.తరువాత ఒక కిలో, కొన్ని గ్రాములు మాత్రమే ఉన్నవాటిని కూడ నింగిలోకి పంపారు. ఇలాంటి వాటిని జతచేసి పంపేవి కొన్ని కాగా కేవలం ఒకటి మాత్రమే నింగిలో తిరిగేవి కూడా ఉన్నాయి. ఉదహరణకు ఎలన్‌మస్క్‌ స్టార్‌లింక్‌ ఏడువేలు ఉండగా, ప్లానెట్‌ ఇవో 150 కలిగి ఉంది. క్యూబ్‌ ఉపగ్రహాల తయారీకి చాలా తక్కువ ఖర్చు కావటంతో అనేక దేశాలు ఇతర దేశాల్లో ఉన్న కేంద్రాల నుంచి వాటిని ప్రయోగించటానికి దోహదం చేసింది. ఇది వాణిజ్యంగా మారింది. అంతే కాదు, పరస్పర అనుమానాలతో రక్షణ చర్యల్లో భాగంగా అనేక దేశాలు నింగితో పాటు ఉపగ్రహాలను కూడా మిలిటరీ అవసరాలకు వినియోగిస్తున్నాయి. ఈ పోటీలో ఎవరు వెనుకబడితే వారికి అదొక లోపంగా మారుతుంది.

ఇటీవల ఇరాన్‌పై ఇజ్రాయల్‌ జరిపినదాడుల వెనుక తాము గూఢచర్యంతో సమాచారం సేకరించామని ఎంతగా చెప్పుకున్నప్పటికీ మిలిటరీ ఉపగ్రహాల సమాచారం ఎంతో దోహదం చేసింది. ఆపరేషన్‌ సిందూర్‌ సందర్భంగా కూడా అదే జరిగినట్లు కొందరు చెప్పిన అంశం తెలిసిందే. అమెరికా, ఇతర ఐరోపా ధనిక దేశాలు ఈ రంగంలో ముందుండటమే కాదు, తన చుట్టూ కుట్రలు జరుపుతున్నపుడు చైనా దూరంగా ఉండజాలదు.తనపై కుట్ర చేస్తున్న దేశాలకు సంబంధించిన మిలిటరీ కదలికలు, స్థావరాలు,అంతరిక్షంలో మిలిటరీ ఉపగ్రహాలు వాటి కార్యకలాపాలపై నిఘావేసేందుకు తనదైన జాగ్రత్తలు తీసుకుంటున్నది. ఉపగ్రహాలను ప్రయోగిస్తున్నది.ప్రత్యర్థి కదలికలు,లక్ష్యాలను గుర్తించటం, వాటి మీద నిర్దిష్టంగా దాడులు ఎలా జరపాల్సిందీ సంబంధిత అంశాలు ఒక్క యుద్దం లేదా ఉద్రిక్తతలు తలెత్తినపుడు మాత్రమే చేసేవి కాదు. నిరంతరం జరుగుతూనే ఉంటాయి. మిలిటరీ పరిభాషలో కిల్‌ చైన్‌ అంటున్నారు. చైనా పెద్ద ఎత్తున అలాంటివాటిలో నిమగ్నమైందని అమెరికా ఆరోపిస్తోంది. ఉదాహరణకు రష్యాలో కొన్ని వందల కిలోమీటర్ల లోపలికి వెళ్లి సైనిక కేంద్రాల మీద డ్రోన్లతో ఒకరోజు దాడులు చేసేందుకు పద్దెనిమిది నెలల పాటు పని చేశామని ఉక్రెయిన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ముందుగా పథకాలు సిద్దం చేసుకుంటే అవసరమైనపుడు వాటిని అమలు చేస్తారు, లేదా మార్పులకు అనుగుణంగా సవరిస్తారు.మనదేశానికి తగినన్ని మిలిటరీ ఉపగ్రహాలు లేని కారణంగా అమెరికా, ఇతర దేశాల ప్రయివేటు ఉపగ్రహాల నిఘా సమాచారాన్ని మన మిలిటరీ తీసుకుంటున్నది.మన మీడియా కూడా వాటిని కథనాలుగా ముందుకు తెస్తున్నది. మనం ఇతరుల నుంచి తీసుకున్నట్లే పాకిస్తాన్‌ కూడా ఇటీవల అదేపని చేసి మన విమానాలను కూల్చినట్లు చెబుతున్నారు. ఇండోపసిఫిక్‌ ప్రాంతంలో ఉన్న తమ, మిత్రదేశాల మిలిటరీ కేంద్రాలను గుర్తించేందుకు, వెంబడిరచేందుకు, లక్ష్యాలుగా చేసుకొనేందుకు చైనా మెరుపువేగంతో పని చేస్తున్నదని అమెరికా అధికారి వైటింగ్‌ ఆరోపించాడు.


నిజంగా చైనా అలాంటి సాంకేతిక పరిజ్ఞానం సంపాదించిందా లేదా అన్నది నిర్ధారణ కాలేదు, అమెరికా అనుమానిస్తున్నది.తమ, మిత్రదేశాల విమానవాహక నౌకలతో సహా ఎక్కడ ఎలాంటి మిలిటరీ కార్యకలాపాలు జరుగుతున్నదీ కచ్చితత్వంతో కనిపెట్టగల సత్తాను చైనా సంపాదించిందని, దాని ఆయుధ వ్యవస్థలుసుదూరంగా ఉన్న లక్ష్యాల మధ్య అంతరం తగ్గిపోయిందని వైటింగ్‌ చెబుతున్నాడు. ఉపగ్రహ వ్యతిరేక ఆయుధాల మోహరింపు,అంటే సైబర్‌ దాడులు, ఉపగ్రహాలు, జిపిఎస్‌ పనిచేయకుండా స్థంభింపచేయటం, లేజర్‌ కిరణాల ద్వారా ధ్వంసం చేయటం వంటివి చేయగలదన్నాడు. అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానాన్ని మిలిటరీతో అనుసంధానం చేయటం కూడా అమెరికా ఊహించని పరిణామం. ఇరాన్‌పై ఆపరేషన్‌ మిడ్‌నైట్‌ హామర్‌ పేరుతో అమెరికా జరిపిన దాడిలో ఇలాంటి మిలిటరీ ఉపగ్రహాలు నిర్దేశిత లక్ష్యాలను గుర్తించటం, వాటిపై బాంబులు వేయటంలో ఎంతో కీలకపాత్ర పోషించటాన్ని చూసిన తరువాత అమెరికా అధికారి ఈ విషయాలను మీడియాతో చెప్పాడు. రానున్న రోజుల్లో చైనా తమను మించిపోతుందేమో అన్న భయం అమెరికాను వెన్నాడుతున్నదంటే అతిశయోక్తి కాదు.2008లో పని చేయని తన ఉపగ్రహాలలో ఒకదానిని భూమి మీద నుంచి ప్రయోగించిన క్షిపణితో చైనా కూల్చివేసిందని, అయినప్పటికీ అమెరికా దాన్ని పట్టించుకోలేదని కొందరు చెబుతున్నారు. మిలిటరీ ఉపగ్రహాలు అందచేసే సమాచారాన్ని త్రివిధ దళాలతో అనుసంధానించటంలో గతంలో అమెరికా, చైనాల మధ్య అంతరం ఎంతో ఎక్కువగా ఉండదని, ఇటీవల క్రమంగా తగ్గిందని అంచనా వేస్తున్నారు.చైనా ఉపగ్రహ కెమెరాలు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న వాటిని మిల్లీ మీటర్ల వరకు ఫొటోలు తీయగలవని చెబుతున్నారు. 2024లో యుఎస్‌ఎస్‌ఎఫ్‌ నివేదిక ప్రకారం చైనా మిలిటరీ అవసరాల కోసం 500 ఉపగ్రహాలను వినియోగిస్తున్నది, వాటిలో గత ఒక్క ఏడాదిలోనే 67 ప్రయోగించింది. దాదాపు ఎనిమిదివేల ఉపగ్రహాలను నిర్వహిస్తున్న అమెరికా కేవలం వెయ్యి ఉన్న చైనా గురించి ఇలాంటి భయాలను రెచ్చగొడుతున్నది. చైనా వద్ద డ్రోన్ల దిశను మార్చగల, క్షిపణులు పని చేయకుండా చేయగల, కీలకమైన మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయగల పరిజ్ఞానం ఉందని యుఎస్‌ఎస్‌ఎఫ్‌ ఇండోపసిఫిక్‌ కమాండర్‌ జనరల్‌ ఆంథోనీ మాస్టలర్‌ చెప్పాడు.


అమెరికా తన గగనతల రక్షణతో పాటు ఇజ్రాయెల్‌, మరికొన్ని చోట్ల క్షిపణులను అడ్డుకోగల రక్షణ వ్యవస్థలను డోమ్‌ పేరుతో ఏర్పాటు చేసింది.చైనా, ఉత్తర కొరియా, రష్యా నుంచి ఎదురవుతున్న సవాళ్ల పూర్వరంగంలో డోనాల్డ్‌ ట్రంప్‌ గతంలోనే ముందుకు తెచ్చిన గోల్డెన్‌ డోమ్‌(అంతరిక్షంలో ఆయుధాలు) పధకాన్ని ఇప్పటికే అమలు జరపాల్సిందని విమర్శకులు తప్పుపడుతున్నారు. అలాంటి పథకాలతో అంతరిక్షం పోరుకేంద్రంగా మారుతుందని చైనా గతంలోనే హెచ్చరించింది. సాయుధ సంఘర్షణకు అంతరిక్షాన్ని కేంద్రంగా మారుస్తున్నట్లు చైనా, రష్యా కొద్ది వారాల క్రితం అమెరికాను విమర్శించాయి. తమ నుంచి ముప్పు ఉందనే ప్రచారాన్ని అమెరికా చేస్తున్నదని తమ ఉపగ్రహాలు వాతావరణ మార్పుల పరిశీలన, తదితర ప్రజోపయోగ అవసరాలకు మాత్రమే పని చేస్తున్నాయని చైనా పదే పదే చెబుతున్నది. స్టాటిస్టా సంస్థ సేకరించి విశ్లేషించిన సమాచారం మేరకు అనేక దేశాలు గగనతల కార్యక్రమాలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నాయి, ఏటేటా బడ్జెట్‌లను పెంచుతున్నాయి. ఈ విషయంలో అమెరికా మిగతా దేశాలకు ఎంతో ఎత్తున ఉంది. 2021 నుంచి 2024 మధ్య 51బిలియన్‌ డాలర్ల నుంచి 80కి పెంచగా ఇదే కాలంలో చైనా పది నుంచి 20, జపాన్‌ 4నుంచి ఏడు బిలియన్‌ డాలర్లకు పెంచాయి. తరువాత స్థానాలలో ఉన్న రష్యా, ఫ్రాన్స్‌, ఐరోపా యూనియన్‌, జర్మనీ, ఇటలీ బడ్జెట్‌లలో స్వల్ప మార్పులు తప్ప భారీ పెరుగుదల లేదు. తొమ్మిదవ స్థానంలో ఉన్న మనదేశం 1.96 నుంచి 1.89 బిలియన్‌ డాలర్లకు తగ్గించింది.మన తరువాత స్థానంలో ఉన్న బ్రిటన్‌ కేటాయింపులో పెద్ద మార్పులేదు. చైనా తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్‌ ప్రధాన భూభాగంలో విలీనం కాకుండా చూసేందుకు అమెరికా చేయని యత్నం లేదు. ఒక వేళ మిలిటరీ చర్య ద్వారా అందుకు పూనుకుంటే తైవాన్‌లో ఉన్న ఆధునిక చిప్స్‌ తయారీ కేంద్రాలను పేల్చివేస్తామని గతంలో అమెరికా బెదిరించింది. ఏటేటా తైవాన్‌ ప్రభుత్వానికి ఆధునిక ఆయుధాలను అందచేస్తున్నది. విలీనాన్ని వ్యతిరేకించే శక్తులకు మద్దతు ఇస్తూ ఎన్నికలలో జోక్యం చేసుకుంటున్నది. తైవాన్‌ పేరుతో తూర్పు ఆసియాలో అవసరమైతే మరో యుద్ద రంగాన్ని తెరిచేందుకు పావులు కదుపుతున్నది, ఆ దిశగా కొత్త కూటములను ఏర్పాటు చేస్తున్నది. ఈ నేపధ్యంలో తన రక్షణకు తగిన చర్యలు తీసుకోవటంలో చైనా తప్పు కనిపించటం లేదు, అదే స్థానంలో మనదేశం ఉన్నప్పటికీ చేసేది అదే కదా !

Share this:

  • Tweet
  • More
Like Loading...

వ్యవసాయ ఉగ్రవాదం : చైనా మీద ఆరోపణ మాత్రమే, అమెరికా అధ్యక్షుడు కెనడీ, బ్రిటన్‌ దుర్మార్గం గురించి తెలుసా !

08 Sunday Jun 2025

Posted by raomk in CHINA, Current Affairs, Economics, Environment, Farmers, Germany, Health, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, Japan, Opinion, Science, UK, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

Agro Terrorism, Amarican Virus, Biological weapons, Bioterrorism, chemical weapons


ఎం కోటేశ్వరరావు


వ్యవసాయ ఉగ్రవాదం ప్రపంచమంతటా పురాతన కాలం నుంచి ఉన్నదే. క్రీస్తుపూర్వం ఆరవ శతాబ్దంలోనే అస్సీరియన్లు తమ శత్రువుల ప్రాంతాలలోని బావులలో విషాన్ని కలిపేవారు. మొదటి ప్రపంచ యుద్ద కాలంలో ఫ్రాన్సుకు రవాణా అయ్యే గుర్రాలు, పశువులకు అమెరికాలో జర్మన్‌ ఏజంట్లు విషం ఇచ్చేవారు. కత్తి, బాకు, బల్లెం వంటి వాటిని కనుగొన్న తొలి మానవుడు వాటిని ప్రమాదకర జంతువుల నుంచి రక్షణకు, ఆహారం కోసం ఉపయోగించాడు. తరువాత అవే యుద్దాల్లో ఆయుధాలుగా మారాయి. శాస్త్రవేత్త చార్లెస్‌ డార్విన్‌ 1880దశకంలో చేసిన పరిశోధనలు పంటల్లో కలుపు మొక్కల నివారణకోసం రసాయనాలను కనిపెట్టేందుకు దారితీశాయి. తరువాత కాలంలో బ్రిటన్‌, అమెరికా, తదితర సామ్రాజ్యవాదులు, నియంతలు ఏకంగా పంటలు, అడవులనే నాశనం చేసేందుకు, లక్షలాది మంది మానవులు, జంతుజాలాన్ని అంతమొందించేందుకు వినియోగించిన చరిత్ర తెలుసా ? శాస్త్రవిజ్ఞానాన్ని మానవ, ప్రకృతి వినాశనానికి వినియోగించింది మానవ కల్యాణానికి బదులు వినాశనాన్ని కోరుకున్న దుర్మార్గులే అన్నది చరిత్ర చెప్పిన సత్యం. ప్రమాదకరమైన ఫంగస్‌ను అమెరికా వ్యవసాయక్షేత్రాల్లో ప్రవేశపెట్టి దాని ఆహార వనరును దెబ్బతీయాలని చైనా కుట్రపన్నింది, దానిలో భాగంగా ఇద్దరు చైనా జాతీయులు ఆ ఫంగస్‌ను అక్రమంగా తెస్తూ ఎఫ్‌బిఐకి దొరికి పోయారు. ఇదీ వార్త, ఒక ఆరోపణ, సదరు ఫంగస్‌ను ఎక్కడా ప్రయోగించలేదు. పరిశోధనల కోసం తెచ్చారన్నది ఒక అభిప్రాయం. అమెరికా మనదేశంలోకి వయ్యారి భామ అనే వినాశకారి అయిన కలుపు మొక్కను ఎలా ప్రవేశ పెట్టిందీ వేరే విశ్లేషణలో చూశాము. గుండెలు బాదుకుంటున్న అమెరికా కొన్ని దశాబ్దాల నాడే ఆ దుర్మార్గానికి పాల్పడిరది అనే అంశం ఎక్కడా మీడియాలో చర్చకు రావటం లేదు.పురాతన, ఆధునిక యుద్ధాలలో ఆహార ఉత్పత్తి వ్యవస్థలను దెబ్బతీయటం ఒక ఆయుధం. అందుకే చరిత్రను చదివినపుడు శత్రుదేశాలు కోటలను చుట్టుముట్టినపుడు నెలల తరబడి తట్టుకొనేందుకు ఆహారం, నీటిని నిల్వచేసుకొనే ఏర్పాట్లు చేసుకున్నట్లు అనేక దుర్గాలు, కోటల చరిత్రలు వెల్లడిరచాయి. ఆధునిక కాలంలో అందుకు జీవ, రసాయనాలను అమెరికా అస్త్రంగా వాడుకున్నది. అదెలా జరిగిందో చూద్దాం !


1953లో కొరియా యుద్ధంలో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరే నెల రోజుల ముందు ఉత్తర కొరియా ప్రాంతంలో అమెరికా వైమానిక దళం చేసిన దాడుల్లో 75శాతం వరి ఉత్పత్తికి నీటిని అందించే ప్రాజెక్టులను నాశనం చేసింది. ఇది తరువాత కాలంలో అక్కడ కరవుకు దారి తీసింది. కమ్యూనిస్టుల పాలనలో జనాన్ని ఆకలితో మాడ్చి చంపారని ప్రచారం చేసే మానవతావాదులకు ఈ విషయం పట్టలేదు. వియత్నాంపై దాడిచేసిన అమెరికా మొక్కలను నాశనం చేసే ఏజంట్‌ ఆరెంజ్‌ అనే రసాయనాన్ని ఆపరేషన్‌ రాంచ్‌ హాండ్‌ పేరుతో 1962 నుంచి 1971వరకు వెదజల్లింది. దీనికి ఆదర్శం ఎవరు అంటే మలయా యుద్ధంలో ప్రయోగించిన బ్రిటీష్‌ దుర్మార్గులు. అమెరికాలో రైలు మార్గాలు, విద్యుత్‌ లైన్లు వేసే ప్రాంతాలలో పిచ్చి మొక్కలు పెరగకుండా చూసేందుకు 1940దశకంలో దీన్ని తయారు చేశారు. మనందరికీ తెలిసిన మానశాంటో సహా తొమ్మిది కంపెనీల నుంచి వియత్నాంలో చల్లేందుకు అమెరికన్‌ మిలిటరీ 7.6 కోట్ల లీటర్లు కొనుగోలు చేసింది. దాన్ని చల్లిన చోట 40లక్షల మంది మీద ప్రతికూల ప్రభావాలను చూపింది,30లక్షల మంది అనారోగ్యం పాలయ్యారు. రెడ్‌ క్రాస్‌ సంస్థ అంచనా ప్రకారం పది లక్షల మంది వికలాంగులయ్యారు. ఈ దుర్మార్గ ప్రక్రియలో భాగస్వాములైన అమెరికా మిలిటరీలో అనేక మందికూడా దీని ప్రభావంతో కాన్సర్‌, లింఫోమా వంటి వ్యాధులకు గురైనట్లు తేలింది. వారికి పుట్టిన పిల్లలకు జన్యు సంబంధమైన వ్యాధులు వచ్చాయి, వారి దుర్మార్గానికి పిల్లలు బలయ్యారు. వియత్నాంలో పర్యావరణానికి కలిగిన హాని గురించి చెప్పనవసరం లేదు, 77లక్షల ఎకరాల్లో పంటలు పండలేదు, అడవుల్లో మొక్కలు పెరగలేదు. అనేక జంతువులకు హాని కలిగింది.మానవ మారణకాండను జనోసైడ్‌ అని వర్ణిస్తే పర్యావరణానికి చేసిన హానిని ఎకోసైడ్‌ అని వర్ణించారు. అమెరికా దురాక్రమణను వ్యతిరేకించిన వియత్నాం వీరులు అడవుల్లో ఉండటంతో వియత్నాం సరిహద్దుల్లో ఉన్న లావోస్‌, కంపూచియా అడవులను కూడా అమెరికా దుర్మార్గులు వదల్లేదు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటన్‌, అమెరికా, జర్మనీ వంటి దేశాలు రసాయన, జీవ ఆయుధాలను తయారు చేశాయి. ఆ సమయంలో అనేక ప్రాంతాల్లో వాటిని పరీక్షించి చూశారు. జపాన్‌పై అణుబాంబును వేసిన అమెరికా యుద్దం గనుక కొనసాగితే 1946లో జపాన్‌పై ఏజంట్‌ ఆరెంజ్‌ను ప్రయోగించాలని పథకం వేసింది. బ్రిటీష్‌ పాలనలో ఉన్న మనదేశం, ఆస్ట్రేలియాలతో సహా మొత్తం 1,100 కేంద్రాల్లో దాని పనితీరును పరీక్షించారు. అమెరికాను కూడా వదల్లేదు. ఉష్ణప్రదేశాల్లో ఎలా పని చేస్తుందో చూసేందుకు కెన్యాలో కూడా చల్లారు. మలయా ప్రాంత దేశాల్లో రబ్బరు తోటల్లో పెరిగే కలుపు మొక్కలను నివారించేందుకు తయారు చేసిన రసాయనాన్ని తమ మీద తిరుగుబాటు చేసిన మలయన్లు ఉన్న అడవుల్లో 1960వరకు బ్రిటీష్‌ మిలిటరీ ప్రయోగించింది. దాన్ని ఆదర్శంగా తీసుకొని అమెరికా తరువాత ఇండోచైనా ప్రాంతంలో అమలు చేసింది.ముఖ్యంగా దక్షిణ వియత్నాం బలైంది. అనేక మంది గొప్పగా పొగిడే నాటి అమెరికా అధ్యక్షుడు కెనడీ ఈ దుర్మార్గానికి అనుమతి ఇచ్చాడు. ఈ దుర్మార్గం గురించి తెలుసుకున్న తరువాత అమెరికాలో వియత్నాం యుద్ధవ్యతిరేక ఉద్యమం ప్రారంభమైంది.తప్పుడు వాదనలతో ఐరాసలో ప్రవేశపెట్టిన తీర్మానాలను అమెరికా, బ్రిటన్‌ వ్యతిరేకించాయి.


అమెరికా ముందుగా ఎవరి మీద జీవ, రసాయన ఆయుధాలను ప్రయోగించదని, అయితే శత్రుదేశం ఏదైనా వినియోగిస్తే మాత్రం రసాయన ఆయుధాలను వదులుతామని అధ్యక్షుడు రూజ్‌వెల్ట్‌ గొప్పగా చెప్పాడు, ఏ దేశమూ వినియోగించకుండానే అణుబాంబుతో సహా ఆ దుండగాలకు అమెరికా పాల్పడిరది. జపాన్‌లో వరి పొలాలను నాశనం చేసేందుకు అమెరికా వినియోగించింది.వియత్నాంలో ఏజంట్‌ ఆరంజ్‌ చల్లిన ప్రాంతాల్లో గత ఐదు దశాబ్దాలుగా చెట్లలో సాధారణ పెరుగుదల లేదు, మామూలు స్థితికి రావాలంటే చాలాకాలం పడుతుందని చెబుతున్నారు.వియత్నాం దురాక్రమణ, దాడుల్లో పాల్గొన్న అమెరికా సైనికులు ఏజంట్‌ ఆరంజ్‌ తదితర విషపూరిత రసాయనాలను వెదజల్లుతున్నపుడు వారికి కూడా వాటి ప్రభావం సోకిన కారణంగా 1984లో కోర్టు వెలుపల రసాయన కంపెనీలు 18 కోట్ల డాలర్లు పరిహారంగా చెల్లించేందుకు ఒప్పందం చేసుకున్నాయి. ఇజ్రాయెల్‌ ఆక్రమించిన పాలస్తీనా ప్రాంతాల్లోకి సముద్రపు నీరు, తమ నివాసాల నుంచి వెలువడే మురుగునీటిని పాలస్తీనియన్ల నివాసాలు, వ్యవసాయ భూముల్లోకి వదలి పనికి రాకుండా చేయటం నిత్యకృత్యం. ఇది కూడా ఒక రకంగా వ్యవసాయ ఉగ్రవాదమే. పంటలు పండకుండా అరబ్బులను మాడ్చే ఎత్తుగడ.

నీవు నేర్పియే నీరజాక్షా అని తమ వ్యవసాయం మీద చైనా దాడి చేయనుందని అమెరికా గగ్గోలు పెడుతోంది. దానికి ఇదేమీ కొత్త కాదు. ప్రతి దేశం మీద కుట్ర సిద్దాంతాలను ప్రచారంలో పెట్టటం తెలిసిందే. తద్వారా తాను చేసే దుర్మార్గాలను స్వంత జనం ప్రశ్నించకుండా సమర్ధించేందుకు అది ఎంచుకున్న ఎత్తుగడ.తాను పెంచి పోషించిన ఉగ్రవాదానికి అదే బలికావటం కూడా వాస్తవం న్యూయార్క్‌ ప్రపంచ వాణిజ్య కేంద్రంపై వైమానికదాడి అదే. తాను పెంచిన తాలిబన్లే దానికి పాల్పడ్డారు.అమెరికా జిడిపిలో వ్యవసాయం తక్కువే అయినప్పటికీ గణనీయ మొత్తం ఎగుమతులకు ఉపయోగపడుతున్నది. ఆల్‌ఖైదాతో చెడిన తరువాత తూర్పు ఆఫ్ఘనిస్తాన్‌లోని అనేక కేంద్రాలపై దాడులు చేసినపుడు దొరికిన పత్రాలలో అమెరికా వ్యవసాయ వివరాలున్న పత్రాలు దొరికాయి. వ్యవసాయాన్ని ఎలా దెబ్బతీయాలా అన్నది ఆల్‌ఖైదా శిక్షణలో భాగంగా బయటపడిరది.అమెరికాకు నాలుగు తరగతుల నుంచి వ్యవసాయ ఉగ్రవాద ప్రమాదం ఉందని 2012లో ఎఫ్‌బిఐ వెబ్‌సైట్‌లో ప్రచురితమైన ఒక విశ్లేషణలో పేర్కొన్నారు. ఒకటి ఆల్‌ఖైదా వంటి ఉగ్రవాద సంస్థలు, రెండవది మార్కెట్లను తిమ్మినిబమ్మిని చేసి లబ్దిపొందాలని చూసే ఆర్థిక నేరగాండ్లు లేదా అవకాశవాదుల నుంచి ప్రధానంగా ముప్పు ఉన్నట్లుపేర్కొన్నారు. పశువుల్లో గాలికుంటు వ్యాధి(ఎఫ్‌ఎండి అంటే ఫుట్‌ అండ్‌ మౌత్‌ డిసీజ్‌)ని వ్యాపింప చేస్తే మార్కెట్ల మీద తీవ్ర ప్రభావం పడుతుందన్నది తెలిసిందే. మూడవ తరగతి అసంతృప్తి చెందిన ప్రభుత్వ ఉద్యోగులు, ఇతరులు తమ కసి తీర్చుకొనేందుకు చేసే ఉగ్రవాద చర్యలు, నాలుగవ తరగతిగా జంతుహక్కుల రక్షకులు, పర్యావరణ ప్రేమికులు అని పేర్కొన్నారు. న్యూయార్క్‌ ప్రపంచ వాణిజ్య కేంద్రాన్ని పేల్చివేసిన తరువాత అమెరికాలో ఆగ్రో టెర్రరిజం ఆకర్షణీయంగ ఉన్నట్లు కనిపించిందట.


అమెరికా ప్రపంచ మిలిటరీ శక్తిగా ప్రపంచానికి కనిపించకుండా చేయాలంటే దాని ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలని ఒసామా బిన్‌లాడెన్‌ పదే పదే వాదించేవాడట.2004 అమెరికా ఎన్నికల సమయంలో ఒక వీడియోలో పదేండ్ల పాటు రష్యా రక్తమోడిరది, అమెరికా కూడా దివాలా తీసేంతవరకు అదే విధానాన్ని అనుసరించాలని చెప్పాడట. 2011 సెప్టెంబరులో అమెరికా ప్రపంచ వాణిజ్య కేంద్రంపై దాడికి ఆల్‌ఖైదాకు అయిన ఖర్చు కేవలం ఐదు లక్షల డాలర్లేనని , అమెరికాకు కలిగిన నష్టం 500బిలియన్‌ డాలర్లని ఒసామా చెప్పాడు. ఉగ్రవాద సంస్థలు నిజంగా అలా ఆలోచిస్తున్నాయో, పథకాలు వేస్తున్నాయో తెలియదు గానీ అమెరికా విశ్లేషకులు మాత్రం ఏం చేస్తే ఎలా,ఎంతటి నష్టం జరుగుతుందో వారికి విడమరచి చెబుతున్నారు. ఆహార ధాన్యాలు విషపూరితం అయితే వాటి ఎగుమతులు ఆగిపోతాయి లేదా నిల్వలు పేరుకు పోతాయి. పశువుల్లో వ్యాధులను వ్యాపింప చేస్తే వాటిని హతమార్చాల్సి ఉంటుంది. పరోక్షంగా రైతాంగానికి భారీ మొత్తాలను పరిహారంగా చెల్లించాల్సి ఉంటుంది.పరిశ్రమలకూ పరిహారంతో పాటు అంతర్జాతీయ వాణిజ్య సంబంధాలు దెబ్బతింటాయి, ఖర్చులూ పెరుగుతాయి. పశువుల్లో గాలికుంటు వ్యాధిని అమెరికాలో 1929లోనే నిర్మూలించారు. ఇతర ప్రాంతాల్లో ఉంది. ఇది మసూచి కంటే 20 రెట్లు వేగంగా వ్యాపిస్తుంది. ఈ వైరస్‌ కేవలం నలభై ఎనిమిది గంటల్లో వంద కిలోమీటర్ల వరకు వ్యాప్తి చెందగలదు. ఏదైనా వస్త్రానికి అంటుకుంటే నెల రోజుల పాటు బతికి ఉంటుంది. దీని గురించి తెలుసుకొనే లోపే అమెరికాలోని 25 రాష్ట్రాలకు కేవలం ఐదు రోజుల్లో వ్యాపింపగలదని అంచనా. అమెరికాకు పక్కనే దక్షిణ అమెరికాలో ఈ వ్యాధి ఉంది. అమెరికాలో ఒక్కో రైతు 1,500 నుంచి పదివేల వరకు ఆవులను పెంచుతాడు. ఒక దగ్గర ఈ వైరస్‌ను ప్రవేశపెడితే జరిగే నష్టాన్ని ఊహించుకోవచ్చు.2001లో బ్రిటన్‌లో ఈ వ్యాధి వ్యాపించటంతో 40లక్షల పశువులను వధించాల్సి వచ్చింది. అదే అమెరికాలో సంభవిస్తే 60 బిలియన్‌ డాలర్ల నష్టం(2012అంచనా) అని పరిశోధకులు పేర్కొన్నారు.ఇలాంటి దుర్మార్గాలకు తాము పాల్పడిన ఉదంతాలు అమెరికా అధికార యంత్రాంగానికి తెలుసుగనుక వారు నిరంతరం భయపడుతూనే ఉంటారు, ఎందుకు అంటే అమెరికాను ప్రతి ఒక్కరూ ద్వేషిస్తున్నారు గనుక. ఎప్పుడు ఏమైనా జరగవచ్చు, అది అమెరికా నుంచి కూడా కావచ్చు !

Share this:

  • Tweet
  • More
Like Loading...

బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిలో 4వ స్థానం మోడీ గొప్పతనం – తలసరిలో 136 స్థానం నరేంద్రమోడీ ఘోరవైఫల్యం !

26 Monday May 2025

Posted by raomk in BJP, CHINA, Congress, Current Affairs, Economics, Germany, History, INDIA, International, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, USA

≈ 1 Comment

Tags

China, Donald trump, India GDP, India per capita GDP, Narendra Modi, Narendra Modi Failures, Xi Jinping

ఎం కోటేశ్వరరావు

జపాన్ను వెనక్కు నెట్టేసి మనదేశం ప్రపంచ జిడిపిలో నాలుగో స్థానానికి చేరిందని, రెండున్నర లేదా మూడు సంవత్సరాల్లో జర్మనీని కూడా పక్కనపెట్టి మూడవ స్థానానికి వెళతామని నీతిఅయోగ్‌ సిఇవో బివిఆర్‌ సుబ్రమణ్యం చేసిన ప్రకటనకు మీడియాలో పెద్ద స్పందనే వచ్చింది. అనేక మంది సంతోషిస్తున్నారు. ఇదొక గొప్పా అని పెదవి విరిచేవారు కూడా ఉన్నారు.నూటనలభై కోట్ల జనాభాలో ఈలెక్కల ఆల్జిబ్రా ఎంతమందికి అర్ధం అవుతుంది ? ‘‘ నేను చెప్పినట్లుగా మనది నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, నాలుగు లక్షల కోట్ల ఆర్థికం, ఇది నేను చెబుతున్న సమాచారం కాదు. ఐఎంఎఫ్‌ చెబుతున్నది, జపాన్‌ కంటే పెద్ద ఆర్థిక వ్యవస్థ ’’ అని సుబ్రమణ్యం నీతి అయోగ్‌ పాలకమండలి పదవ సమావేశంలో ప్రకటించారు. మనం రూపొందించిన పథకం ప్రకారం జరిగితే రెండు, రెండున్నర, మూడు సంవత్సరాల్లో మనది మూడవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుంది అన్నారు. ఐఎంఎఫ్‌ ఏప్రిల్‌ 22 సమాచారం ప్రకారం వర్తమాన ధరల్లో సాధారణ(నామినల్‌) జిడిపి అమెరికా 30.51లక్షల కోట్ల డాలర్లు, చైనా 19.23, జర్మనీ 4.74,భారత్‌ 4.19, జపాన్‌ 4.19, బ్రిటన్‌ 3.84,ఫ్రాన్సు 3.21, ఇటలీ 2.42, కెనడా 2.23, బ్రెజిల్‌ 2.13 లక్షల కోట్లతో మొదటి పది స్థానాల్లో ఉన్నాయి. 202526 నాటికి మన జిడిపి 4.187.017,జపాన్‌లో 4.186.431 బిలియన్‌ డాలర్లుగా అంచనా. వేసింది. బొమ్మను పాలకులు ఎలాగూ చూపించారు, వారు మూసిపెట్టే బొరుసు ఎలా ఉందో చూడాలి కదా !


నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత 2015లో 2.1లక్షల కోట్ల డాలర్ల నుంచి 2025లో దేశ జిడిపి 4.3లక్షల కోట్ల డాలర్లకు చేరినట్లు, ఇది 105శాతం పెరుగుదల అని ఐఎంఎఫ్‌ కొద్ది నెలల క్రితం చెప్పింది.అదే సంస్థ తాజాగా విడుదల చేసిన అంచనాలో ఆ మొత్తాన్ని 4.187 లక్షల కోట్లకు తగ్గించింది. జపాన్‌ మొత్తం 4.186 గనుక దాన్ని పక్కన పెట్టి మనకు నాలుగో స్థానాన్ని ఇచ్చింది. తేడా ఎంత 0.001 లక్షల కోట్లు. చెవులప్పగించేవారుంటే కాకమ్మ కతలు చెప్పేవారికి కొదవ ఏముంది. బిజెపి పెద్దలు 2025 నాటికి ఐదు లక్షల కోట్ల డాలర్లకు పెంచుతామని గొప్పలు చెప్పుకున్న అంశం ఇక్కడ గుర్తుకు తెచ్చుకోవాలి. స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఇంతటి అభివృద్ధిని ఏ ప్రభుత్వమూ సాధించలేదని కూడా బిజెపి ఐటి సెల్‌ మాలవీయ చెప్పారు.అలా ప్రచారం చేయటమే కదా ఆ పెద్దమనిషి ఉద్యోగం. వాస్తవం ఏమిటి, 2004లో మన్మోహన్‌ సింగ్‌ అధికారానికి వచ్చినపుడు జిడిపి 709 బిలియన్‌ డాలర్లు కాగా 2014 నాటికి అది 2030 బిలియన్లకు పెరిగింది. యుపిఏ పాలనా కాలంలో పెరుగుదల రేటు 186 శాతమని, 105కంటే ఎక్కువని కాస్త నిజాయితీ ఉన్నవారు కూడా చెబుతారు.


గతంలో ప్రధాని చెప్పిన కొన్ని అతిశయోక్తుల గురించి చెప్పుకుందాం. ‘‘ గత పదేండ్లలో జిడిపిని రెట్టింపు చేయటం అంకెలు కాదు, 25 కోట్ల మందిని దారిద్య్రరేఖ దాటించి నూతన మధ్యతరగతిని సృష్టించాం. వారు కొత్త జీవితాన్ని ప్రారంభించారు, సచేతనంగా ఆర్థికవృద్ధికి తోడ్పడుతున్నారు ’’. ప్రధాని నోటి నుంచి జాలువారిన ఈ మాటలను చూసి నవ్వాలా ఏడవాలో తెలియటం లేదు. ఇరవై ఐదు కోట్ల మందిని దారిద్య్రరేఖ నుంచి ఎగువకు లాగాం అంటూనే కనీసం ఆహార ధాన్యాలు కొనుగోలు చేయలేని స్థితిలో ఉన్న 140కిగాను 80 కోట్ల మందికి ఉచితంగా ఆహార భద్రతా పధకం కింద గోధుమలు, బియ్యం ఇస్తున్నామని, మరికొన్నేండ్లు ఇస్తామని ఒక ఘనతగా చెప్పుకుంటారు. ప్రపంచ ఆకలి సూచికలో తాజాగా 127లో 105వ దేశంగా ఉన్నాం. ఆకలి లేని(9.9), స్వల్ప (10 నుంచి 19.9), తీవ్రం(20 నుంచి 34.9), ఆందోళనకరం(35నుంచి 49.9) , అత్యంత ఆందోళనకరం(50పైన) అనే ఐదు తరగతులుగా దేశాలను విభజిస్తే మన దేశం తీవ్ర తరగతిలో అంతకు ముందు, గత పదేండ్లుగా కూడా ఉంది. పదేండ్లలో జిడిపి రెట్టింపు అని ఇతర గొప్పలు కానీ పది సంవత్సరాల్లో 2014 నుంచి 2014వరకు మన ఆకలి సూచిక స్కోరు 28.2 నుంచి 27.3కు మాత్రమే తగ్గింది,దీనిలో అంత అభివృద్ధి ఎందుకు రాలేదు ? ఇదే కాలంలో పాకిస్తాన్‌ స్కోరు 29.6 నుంచి 27.9కి తగ్గింది, దీని గురించి చెబితే ఈ దేశంలో పుట్టీ, ఈ దేశంలో పెరిగీ, అన్నం తింటూ పక్కదేశాన్ని పొగుడుతున్నట్లు ఎదురు దాడి చేస్తారు. పాక్‌ రాంకు మన తరువాత 109, ఆకలిని ఎవరు ఎక్కువగా తగ్గించినట్లు ? గత పదేండ్లలో చైనా స్కోరు ఐదు కంటే తక్కువే ఉందన్న వాస్తవాన్ని చెబితే నానా యాగీ చేస్తారు. మోడీ సాధించిన విజయాలు మీకు పట్టవా అంటారు కొందరు. నిజమే 188 దేశాల జిడిపిలో మనలను నాలుగవ స్థానంలోకి తీసుకు వెళ్లినందుకు మోడీ ఘనత ఖాతాలో వేద్దాం. అదే తలసరి జిడిపిలో 136వ స్థానంలో ఉంచిన ఘనుడని కూడా కీర్తించాలా ! తలసరి జిడిపి కూడా నిజానికి ఒక మైండ్‌గేమ్‌ తప్ప మరొకటి కాదు. కొందరి దగ్గర సంపదలు పోగుపడటం అంటే ఆర్థిక అసమానతలు పెరుగుతున్నట్లే, మోడీ ఏలుబడిలో పెరిగినట్లు స్పష్టంగా తేలింది. సర్‌ గోచిపాతరాయుడు సంపద ఒక రూపాయి, 50,49 చొప్పున అంబానీ, అదానీల సంపదలు ఒక దగ్గర చేర్చి మూడుతో భాగిస్తే వచ్చే 33 గోచిపాతరాయుడి సంపద అంటే నవ్విపోతారు. అంబానీ ఇంట వివాహానికి విమానాలు,హెలికాప్టర్లు వేసుకొని వచ్చిన అతిధులు గోచిపాతరాయుడి ఇంటికి వస్తారా !


అసలు జిడిపి చర్చలోకి వెళితే బుర్ర బద్దలవుతుందంటే అతిశయోక్తి కాదు. దీన్ని సాధారణ(నామినల్‌), పిపిపి(పవర్‌ పర్చేజింగ్‌ పారిటీ) పద్దతుల్లో లెక్కిస్తున్నారు. రెండవదే వాస్తవానికి దగ్గరగా ఉంటుందన్నది కొందరి సమర్ధన. దాని ప్రకారం చూస్తే నరేంద్రమోడీ అధికారానికి వచ్చే నాటికే మన దేశం సాధారణంలో పది, రెండవ లెక్కలో మూడవ స్థానంలో ఉంది. మోడీ గణం రెండవ లెక్కలను ఎందుకు చెప్పటం లేదు. ఎందుకంటే దేశాన్ని ఇప్పటికీ అదే స్థానంలోనే మోడీ ఉంచారు గనుక. ఐఎంఎఫ్‌ 2025 పిపిపి అంచనా ప్రకారం చైనా 42.72, అమెరికా 30.51, భారత్‌ 17.65 లక్షల కోట్ల డాలర్లతో మూడవదిగా, రష్యా నాలుగు, జపాన్‌ ఐదవదిగా ఉంది. 2027 తొలి ఆరునెలల్లోనే సాధారణంలో 4.9లక్షల కోట్ల డాలర్లతో జర్మనీని కూడా దాటించేస్తారని ఊదరగొడుతున్నారు.అవన్నీ గిడసబారిన దేశాలుగా మారుతున్నాయి. దున్నబోతే దూడల్లో మెయ్యబోతే ఆంబోతుల్లో అన్నట్లుగా చెప్పుకుంటే కుదరదు. మనం పోల్చుకోవాల్సింది చైనాతో కదా ! మన వృద్ధి రేటు చైనా, అమెరికా, జర్మనీ కంటే ఎక్కువగా ఉందని, గడచిన పదేండ్లలో భారత్‌ 105శాతం పెరుగుదల సాధించగా చైనా 76, అమెరికా 66, జర్మనీ 44, ఫ్రాన్సు 38, బ్రిటన్‌ 28శాతం పెరుగుదల సాధించిందని ఐఎంఎఫ్‌ చెప్పింది. లక్ష కోట్ల డాలర్ల కిలోమీటర్‌(మైలు) రాయిని దేశం 2007లో దాటింది.తదుపరి 2014లో రెండు లక్షల కోట్లు, 2025లో నాలుగు లక్షల కోట్లు దాటింది. 2032నాటికి పదిలక్షల కోట్ల డాలర్ల జిడిపి కలిగిన దేశంగా మారుతుందని కొందరు ఆర్థికవేత్తలు జోశ్యం చెప్పారు. వారి తర్కం ఏమిటి ? 2021లో మూడు లక్షల కోట్లకు విస్తరించింది. కేవలం నాలుగు సంవత్సరాల్లోనే 4.3లక్షల కోట్ల డాలర్లకు చేరింది. ప్రతి 18నెలలకు ప్రస్తుత వేగంలో ఒక లక్ష కోట్ల డాలర్లు పెరుగుతున్నది. ఇదే కొనసాగితే 2032 నాటికి 10లక్షల కోట్ల డాలర్లకు చేరుతుంది.


రానున్న కొద్ది సంవత్సరాల్లో మూడవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతున్నందుకు ఇప్పటి నుంచి సంబరాలు జరుపుకుంటున్న వారిని చూసి ఆర్థిక నిపుణుడు డి ముత్తుకృష్ణన్‌ ఉత్సవాలు జరుపుకోవాల్సినంత ఘనత ఏమి సాధించామని 2024లోనే ప్రశ్నించారు. జిడిపిలో ఏ స్థానంలో ఉన్నామన్నది కాదు తలసరి రాబడిలో ప్రపంచంలో మనం 140వ స్థానంలో ఉన్నామని, మనకంటే 139దేశాలు ముందున్నాయని గుర్తించాలని చెప్పారు.(తాజాగా 136 గనుక 135 ముందున్నాయి) పిపిపి ప్రకారం చూసినా మన స్థానం 119 అని చెప్పారు. పదేండ్లలో మన జిడిపి 105శాతం పెరిగిందని ఏ ఐఎంఎఫ్‌ చెప్పిందో అదే సంస్థ 2025 తలసరి జిడిపిలో 141వ స్థానం అని కూడా జోశ్యం చెప్పింది. దివాలా తీసిందని చెప్పిన శ్రీలంక 133, బంగ్లాదేశ్‌ 143, పాకిస్తాన్‌ 159, షీ జింపింగ్‌ ఏలుబడిలో కుప్పకూలిపోయిందని కొంత మంది చెప్పే చైనా 71వ స్థానంలో (తాజాగా 70) ఉందని కూడా ఐఎంఎఫ్‌ చెప్పింది. మన తలసరి రాబడి పదివేల డాలర్లకు చేరాలంటే కనీసం 30 సంవత్సరాలు కష్టపడి పని చేయాలని, దానికి అనుకూలమైన ఆర్థిక పరిస్థితులు ఉండాలని ముత్తు కృష్ణన్‌ చెప్పారు. చైనా తలసరి జిడిపి 2025లో 13,873 డాలర్లు, ఇప్పుడున్న మన 2,937 డాలర్ల నుంచి ఎదిగి ప్రధమ స్థానంలో ఉన్న మొనాకో 2,56,581( 2023 ప్రపంచ బ్యాంకు సమాచారం) లేదా డాలర్‌ దేవుడున్న అమెరికా 89,678(2025 ఐఎంఎఫ్‌) స్థాయికి, చివరికి పడకకుర్చీ మేథావులు చెబుతున్నట్లుగా అధిగమించే దూరం ఎంతో లేని చైనాను అయినా కనీసం అధిగమించాలంటే ఎంత సమయం పడుతుందో వేరే చెప్పనవసరం లేదు.


ప్రపంచ సవాళ్లు ఉన్నప్పటికీ నరేంద్రమోడీ నాయకత్వం కారణంగా ప్రపంచ వెలుగు దివ్వెగా భారత్‌ ముందుకు వచ్చిందని బిజెపినేత ప్రదీప్‌ బండారీ చెప్పిన మాటలు భజనరాయుళ్ల గళం తప్ప మరొకటి కాదు. పదకొండు సంవత్సరాలుగా వేసిన పునాదులే కారణమన్నారు. ఐరోపా దేశాలు, జపాన్‌ ఆర్థిక వ్యవస్థలు పెరుగుదల లేక గిడసబారిపోయాయి. రెండవ ప్రపంచయుద్ధానికి ముందు ఉన్న వలసలను కోల్పోయిన బ్రిటన్‌, ఫ్రాన్స్‌ మాజీ రాజుల వలే ఉన్నాయి. మిలిటరీలను నిషేధించిన కారణంగా అందుకు వెచ్చించే సొమ్మును పరిశోధనలకు మళ్లించి జర్మనీ, జపాన్‌, అమెరికా ఇచ్చిన దన్నుతో దక్షిణ కొరియా వేగంగా వృద్ధి చెందాయి. ఇప్పుడు వాటికి పరిమితి ఏర్పడిరది కనుకనే మనం ముందుకు వస్తున్నాం. ఒక నాడు మనకంటే వెనుకబడి ఉన్న చైనాతో తప్ప వాటితో పోల్చుకుంటే అవ్వతో వసంతమాడినట్లే ! అదేమంటే చైనా కమ్యూనిస్టు దేశమంటారు, మనది ప్రజాస్వామ్యం, స్వేచ్చ ఎక్కువ గనుక దాని కంటే ఎంతో ముందు ఎందుకు లేదు అంటే సమాధానం ఉండదు. ఒక ఐదు సంవత్సరాల పాటు ఐదులక్షల కోట్ల డాలర్ల గురించి ఊదరగొట్టారు. ఇప్పుడు పదిలక్షల కోట్ల గురించి చెప్పబోతున్నారు. 1950లో మన దేశంలో 20 కోట్ల మంది జనం ఉపాధి కోసం వ్యవసాయంపై ఆధారపడ్డారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సాగు భూమి ఎంత పెరిగింది, ఎంత తగ్గింది అన్న లెక్కలను పక్కన పెట్టి స్థిరంగా ఉందనుకున్నప్పటికీ అదే భూమి మీద 2023`24లో జనాభాలో 46.1శాతం మంది ఆధారపడుతున్నట్లు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే తెలిపింది. ఆరు సంవత్సరాల క్రితంతో పోల్చితే రెండు శాతం పెరిగారు. అంటే ఇప్పుడు 67 కోట్ల మంది పని చేస్తున్నారు.చైనాలో 24.1 శాతం లేదా 17.66 కోట్ల మంది(2023) పని చేస్తున్నారు. భూమి మీద ఆధారపడే వారు తగ్గటం అభివృద్ధి చెందిన దేశాల లక్షణం. వెనుకటికి ఒకడు మాది నూటొక్క అరకల వ్యవసాయం అని గొప్పలు చెప్పాడట. మీది అంటున్నావు ఎవరెవరికి ఎన్ని అంటే నాది ఒకటి మా అయ్యగారివి వంద అన్నాడట. జిడిపి కూడా అంతే !

Share this:

  • Tweet
  • More
Like Loading...

సామ్రాజ్యవాదుల యుద్ధోన్మాదం : మిలిటరీ బడ్జెట్‌ పెంపు – పౌర సంక్షేమానికి కోత !

07 Wednesday May 2025

Posted by raomk in CHINA, Current Affairs, Europe, Germany, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, RUSSIA, UK, USA, WAR

≈ Leave a comment

Tags

American imperialism, Donald trump, Global military spending, Imperialist war, SIPRI, Vladimir Putin, Xi Jinping


ఎం కోటేశ్వరరావు


డోనాల్డ్‌ ట్రంప్‌ పిచ్చిపనులే కాదు యుద్ధోన్మాదంతో కూడా రెచ్చిపోతున్నాడు.ఒకవైపు ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ఆపుతానంటాడు, మరోవైపు గాజాలో మారణకాండకు మద్దతు, ఎమెన్‌పై ప్రత్యక్షంగా దాడులు జరిపిస్తాడు. ఇలాంటి దుర్మార్గాలకు మరింతగా పాల్పడేందుకు మిలిటరీ బడ్జెట్‌ను భారీగా పెంచేందుకు పూనుకున్నాడు.2026 సంవత్సర బడ్జెట్‌లో మిలిటరీకి 13శాతం పెంచి లక్ష కోట్ల డాలర్లకు చేర్చాలని, అందుకు గాను విద్య, వైద్యం, పర్యావరణం, ప్రజాసాయం, అదనపు పోషకాహార సాయ పధకం(మన ఉచిత బియ్యం వంటిది), బలహీన వర్గాల గృహనిర్మాణం వంటి సంక్షేమ పథకాలకు కోత పెట్టాలని ప్రతిపాదించాడు. ఈ మేరకు అధ్యక్ష భవనం ఈనెల రెండవ తేదీన ఒక ముసాయిదా బడ్జెట్‌ను ఆవిష్కరించింది.ఈ కోతలు ఇంకా పెరగవచ్చు. ప్రపంచ కుబేరుడు ఎలన్‌ మస్క్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రభుత సామర్ద్య శాఖ(డోజె) ఇప్పటికే పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించి, ఉద్యోగాలకు కోత పెట్టి పొదుపు చర్యలంటూ అనేక సంస్థలకు నిధుల కోతకు పాల్పడిరది. బడ్జెట్‌లో రెండు రకాలు ఉంటాయి.విధిగా కేటాయింపులు జరపాల్సినవి, విచక్షణతో అమలు జరపాల్సినవి. రెండో రకం పథకాల మొత్తం వచ్చే ఏడాది 1.7లక్షల కోట్ల డాలర్లు ఉంటుందని, వర్తమాన బడ్జెట్‌తో పోలిస్తే 7.6శాతం కోత విధించినట్లని చెబుతున్నారు. ఇవి ప్రధానంగా సంక్షేమ పథకాలకు చెందినవే.

అమెరికా రాజ్యాంగం ప్రకారం బడ్జెట్‌ మీద అధికారం పార్లమెంటుదే, అయితే నిబంధనల మేరకు అధ్యక్ష భవనం తన వాంఛలను తెలియచేస్తూ పార్లమెంటుకు ప్రతిపాదనలు పంపాల్సి ఉంటుంది. అయితే వాటిని పార్లమెంటు ఆమోదించవచ్చు, తిరస్కరించవచ్చు, సవరించవచ్చు. అవి అధ్యక్షుడికి నచ్చకపోతే 1974లో సవరించిన చట్ట ప్రకారం తనకున్న అధికారాల ద్వారా ఉత్తరువులు జారీ చేసి అమలు చేయవచ్చు. మిలిటరీ బడ్జెట్‌ పెంచినప్పటికీ అధికారపక్షం నుంచి విమర్శలు వచ్చాయి.అమెరికా బలం పెంచుకోవటం ద్వారా ప్రపంచంలో శాంతి సాధించాలని ఎన్నికల్లో ట్రంప్‌ ప్రచారం చేశాడని, సలహాదారులు దానికి అనుగుణంగా వ్యవహరించటంలేదని ఆరోపించారు. సాయుధ దళ సేవల సెనెట్‌ కమిటీ అధ్యక్షుడు వికర్‌ ఒక ప్రకటన చేస్తూ ఆసియాలో అమెరికాకు వ్యతిరేకంగా యుద్ధం ప్రారంభించకుండా ఉండాలన్నా, రష్యా, ఇరాన్‌ దేశాలకు హమస్‌, హౌతీల వంటి సాయుధులకు మిలిటరీ మద్దతు ఇవ్వకుండా ఉండాలంటే అమెరికా మరింతగా మిలిటరీ రీత్యా బలపడాలని పేర్కొన్నాడు. బడ్జెట్‌ ప్రతిపాదనలు మిలిటరీ సామర్ధ్యాలను దెబ్బతీస్తాయని ఆరోపించాడు. సాయుధ దళ సేవల పార్లమెంటరీ కమిటీ అధ్యక్షుడు మైక్‌ రోజర్స్‌ మరింతగా రెచ్చిపోతూ నాటో దేశాలు జిడిపిలో ఐదుశాతం రక్షణకు ఖర్చు పెట్టాలని ట్రంప్‌ చెబుతుంటే మనం చాలా తక్కువ ఖర్చు చేస్తే సత్తా ఎలా పెంచుతామంటూ రంకెలు వేశాడు.మొత్తానికి లాలూచీ విమర్శలతో నాటకాన్ని రక్తి కట్టిస్తున్నారు.


స్టాక్‌హోమ్‌ ఇంటర్నేషనల్‌ పీస్‌ రిసర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ (సిప్రి) తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం 2024లో ప్రపంచ మిలిటరీ ఖర్చు 2.7లక్షల కోట్ల డాలర్లని, దీనిలో మూడోవంతు అమెరికా ఖర్చు 997బిలియన్‌ డాలర్లు అని పేర్కొన్నది. హిట్లర్‌ వారసురాలైన జర్మనీ అంతకు ముందు సంవత్సరంతో పోల్చితే 28శాతం పెంచి 88.5బి.డాలర్లు, మరో యుద్దోన్మాది జపాన్‌ 21శాతం పెంచి 55.3 బిలియన్‌ డాలర్లు ఖర్చు చేసింది.మిలిటరీ ఖర్చులో ఏడవ స్థానంలో ఉన్న జర్మనీ నాలుగుకు ఎగబాకింది. ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యా 149 బి.డాలర్లు ఖర్చు చేస్తే ఎలాంటి దాడుల్లో ప్రత్యక్షంగా పాల్గొనని నాటో దేశాలు పది రెట్లు అదనంగా 1.5లక్షల కోట్ల డాలర్లు ఖర్చు పెట్టాయి.మొత్తం ఖర్చు 2015లో ఉన్న 1.67లక్షల కోట్ల డాలర్లతో పోలిస్తే 2024లో 2.7లక్షల కోట్ల డాలర్లకు పెరిగింది.యుద్దోన్మాదం లేదా మిలిటరీ ఖర్చు పెరుగుదల తీరు ముప్పును సూచిస్తున్నది. ఐరోపా మీద పెత్తనం చెలాయించాలని చూస్తున్న జర్మనీ యుద్ధ సన్నాహాలకు గాను అంటే మిలిటరీ అవసరాలకు సైతం ఉపయోగపడేవిధంగా రోడ్లు, వంతెనలు, ఆసుపత్రుల వంటి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసేందుకు 1.13లక్షల కోట్ల డాలర్లు ఖర్చు చేసేందుకు పూనుకుంది, ఇది మొదటి ప్రపంచ యుద్ధం తొలి ఏడాదిలో జర్మనీ చేసిన ఖర్చులో 8.6శాతం కాగా రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు సంవత్సరం చేసిన ఖర్చుకు దగ్గరలో ఉందని పోలికలు వెల్లడిస్తున్నాయి. ఈ ప్రయత్నాలన్నీ యుద్ధ పరిశ్రమలు ముఖ్యంగా అమెరికా సంస్థలకు లబ్ది చేకూర్చేందుకు దోహదం చేస్తున్నాయి. సిప్రి అంచనా ప్రకారం 2023లో ఆయుధ తయారీలో అగ్రభాగాన ఉన్న 100 కంపెనీలు 632 బిలియన్‌ డాలర్ల మేర విక్రయించగా ఒక్క అమెరికా ఉత్పత్తిదారులకే 317 బిలియన్‌ డాలర్లు దక్కాయి.


రెండవ ప్రపంచ యుద్ధంలో నాజీలకు ఆయుధాలను విక్రయించిన జర్మన్‌ కంపెనీ రెయిమెటాల్‌ ఆయుధ అమ్మకాల వృద్ధి 2024లో 36శాతం ఉండగా వర్తమాన సంవత్సరంలో 25 నుంచి 30శాతం వరకు ఉండవచ్చని అంచనా. నాటో కూటమి దేశాల మిలిటరీ ఖర్చు జిడిపిలో 3.5శాతానికి పెంచాలన్న లక్ష్యాన్ని జర్మనీ, ఫ్రాన్సు, బ్రిటన్‌ ఆమోదిస్తే 2030 నాటికి 400బిలియన్‌ యూరోల విలువ గల ఆర్డర్లు పెరుగుతాయని రెయిమెటాల్‌ చెప్పింది. వీటి కోసం అమెరికా సంస్థలతో ఐరోపా కంపెనీలు పోటీపడతాయని, ఆక్రమంలో విబేధాలు తలెత్తినా ఆశ్చర్యం ఉండదని చెప్పవచ్చు. ఈ తీరును చూసినపుడు ప్రపంచంలో తమ ఆర్థిక, భౌగోళిక రాజకీయ లక్ష్యాలను సాధించటానికి సామ్రాజ్యవాదులందరూ పూనుకున్నట్లు కనిపిస్తోంది. ఇది ఏ పరిణామాలు, ఏ పర్యవసానాలకు దారి తీస్తుందో చూడాలి.2014లో అమెరికా, జర్మనీ చేసిన కుట్రలో భాగంగా రష్యాకు అనుకూలంగా ఉన్న ఉక్రెయిన్‌ అధ్యక్షుడిని పదవీచ్యుతునిగావించి తమ అనుకూల శక్తులను రంగంలోకి తెచ్చాయి. ఆ కుట్రకు విరుగుడుగా గతంలో తన ప్రాంతంగా ఉన్న క్రిమియాను విలీనం చేసుకోవటమే గాక 2022లో మిలిటరీ చర్య ప్రారంభించి అనేక ప్రాంతాలను తన ఆధీనంలోకి తెచ్చుకుంది. ఆప్రాంతాలను రష్యాకు అప్పగించి లేదా స్వతంత్ర ప్రాంతాలుగా ఉంచి యుద్దాన్ని ముగిస్తామని డోనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ప్రకటన, వైఖరి ఐరోపాలో అసంతృప్తికి దారితీసింది, ఎత్తుగడా లేక నిజంగానే అమెరికా వైఖరిలో మార్పు వచ్చిందా అని జర్మనీ పరిస్థితిని గమనిస్తున్నది. ఉక్రెయిన్‌కు చేసిన మిలిటరీ సాయాన్ని తీర్చే స్థితిలో లేదు గనుక అక్కడి విలువైన ఖనిజాలను అమెరికాకు రాసి ఇచ్చి ఒప్పందం చేసుకుంది. ఆర్థికరంగంలో తనకు సవాలు విసురుతున్న చైనాను దెబ్బతీసేందుకు వీలైతే తైవాన్‌ సమస్య ముసుగులో దాడికి తెగబడేందుకు అమెరికా పావులు కదుపుతున్నది. ఈ పూర్వరంగంలో చైనా కూడా తన మిలిటరీ నవీకరణ, ఆయుధాలకు పెద్ద ఎత్తున ఖర్చు చేయాల్సి వస్తున్నది. జో బైడెన్‌ అధికారానికి వచ్చిన రెండు వారాల్లో జాతీయ రక్షణ వ్యూహం పేరుతో అమెరికా ఒక పత్రాన్ని విడుదల చేసింది. దాన్లో మిలిటరీ ఖర్చును భారీ మొత్తంలో పెంచాలని పేర్కొన్నది. ఎందుకటా, రానున్న దశాబ్దం నిర్ణయాత్మకమైనదని అమెరికాకు పెను సవాలుగా మారుతున్న చైనా, రష్యాలను ఓడిరచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మధ్య ప్రాచ్యంలో చమురు సంపదలున్న ప్రాంతం మీద తిరుగులేని ఆధిపత్యం సాధించాలన్న ఎత్తుగడ కారణంగానే గాజాలో ఇజ్రాయెల్‌ సాగిస్తున్న మారణకాండకు నిస్సిగ్గుగా అమెరికా మద్దతు ఇస్తున్నది, దాన్ని వ్యతిరేకిస్తున్న ఎమెన్‌పై దాడులు చేస్తున్నది. అమెరికా, జర్మనీ బిలియన్ల డాలర్ల విలువగల ఆయుధాలను ఇజ్రాయెల్‌కు సరఫరా చేస్తున్నాయి. ఇరాన్‌ మీద దాడికి అవకాశం కోసం చూస్తున్నది, దాని దగ్గర ఉన్న అణ్వాయుధాల గురించి తటపటాయిస్తున్నది.


అమెరికా తన ప్రయోజనాలకే ఎప్పుడూ పెద్ద పీటవేస్తుందని ఐరోపాకు తెలిసినప్పటికీ గతంలో తగిలిన ఎదురుదెబ్బల కారణంగా దానితో జూనియర్‌ భాగస్వామిగా కలసి ప్రయాణిస్తున్నది. స్వతంత్ర పాత్ర పోషించేందుకు ఐరోపా సమాఖ్య, ఉమ్మడి కరెన్సీని కూడా ఏర్పాటు చేసుకుంది.రెండూ దాగుడుమూతలాడుతున్నాయి, మొత్తం మీద చూసినపుడు మిత్రవైరుధ్యాలు పెరుగుతున్నాయి తప్ప తగ్గటం లేదు. కాగల కార్యం గంధర్వుడు తీర్చినట్లు తాము చేయలేని పనిని చైనా చేయటాన్ని గమనిస్తున్నాయి. అయితే దానితో చేతులు కలిపే అవకాశం లేదు గనుక దాన్ని చూపి అమెరికాతో బేరమాడుతున్నాయి. అమెరికాకే అగ్రస్థానం పేరుతో డోనాల్డ్‌ ట్రంప్‌ అజెండాను ముందు పెట్టిన తరువాత కొన్ని సందర్భాలలో ప్రతిఘటిస్తామని చెప్పటం తాజా పన్నుల యుద్దంలో చూశాము.ఈ విషయంలో ట్రంప్‌ వెనక్కు తగ్గినా అలాంటి కత్తివేలాడుతూనే ఉంటుంది గనుక ఐరోపా తన రక్షణ తానే చూసుకొనేందుకు పూనుకోవటం ఖాయం. దాన్లో భాగమే జర్మనీ పెద్ద మొత్తంలో మిలిటరీ ఖర్చుకు పూనుకోవటం.ఇరవై ఏడు దేశాల ఐరోపా సమాఖ్య 800బిలియన్‌ యూరోల మిలిటరీ ఖర్చు అదనంగా చేసేందుకు నిర్ణయించింది, ఐరోపా జనాభాలో 24శాతం మంది దారిద్య్ర రేఖకు దిగువున ఉన్నప్పటికీ ఈ ఖర్చు చేయటాన్ని గమనించాలి.ధనిక దేశాల్లోని కులీనులందరూ తమ లాభాలకు ముప్పు లేకుండా భారాలన్నింటినీ కార్మికవర్గం భరించే విధంగా విధానాలను రూపొందిస్తున్నారు. సామాజిక సంక్షేమ కోతలకు ఎలా పూనుకుంటారో ముందే చెప్పినట్లుగా దీనికి ఎదురయ్యే ప్రతిఘటనలను అణచివేసేందుకూ పూనుకుంటారు. ఉక్రెయిన్‌ విషయంలో అమెరికా, ఐరోపాల స్నేహ బండారం త్వరలోనే బయటపడుతుంది.


చైనా మిలిటరీ బడ్జెట్‌ 258 బిలియన్‌ డాలర్లని వార్తలు వచ్చాయి.తైవాన్‌కు ఆయుధాలు విక్రయించటం, దక్షిణ చైనా సముద్రంలో అమెరికా రెచ్చగొట్టుడు చర్యల కారణంగా ఇటీవలి కాలంలో దాని బడ్జెట్‌ గణనీయంగా పెరిగినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ప్రపంచంలో వంద ఆయుధాలు ఎగుమతి అవుతుంటే వాటిలో 42 అమెరికా,ఫ్రాన్సు, రష్యాల నుంచి పదకొండు చొప్పున, చైనా 5.8, జర్మనీ 5.6 ఎగుమతి చేస్తున్నాయి. ఇక దిగుమతుల్లో అగ్రస్థానంలో ఉన్న భారత్‌ 9.8, సౌదీ అరేబియా 8.4,కతార్‌ 7.6, ఉక్రెయిన్‌ 4.9, పాకిస్తాన్‌ 4.3, చైనా 2.9 చొప్పున దిగుమతి చేసుకుంటున్నాయి. సిప్రి సమాచారం ప్రకారం మొత్తం తొమ్మిది దేశాలలో 12,121అణ్వాయుధాలు ఉన్నాయి.దేశాల వారీ మోహరించినవి లేదా సురక్షిత ప్రదేశాల్లో నిల్వ ఉంచినవిగానీ దేశాల వారీ ఇలా ఉన్నాయి.బ్రాకెట్లలోని అంకెలు మోహరించినవి. రష్యా 5,580(1,710), అమెరికా 5,044(1,770), చైనా 500(24), ఫ్రాన్సు 290(280), బ్రిటన్‌ 225(120), భారత్‌ 172, పాకిస్తాన్‌ 170,ఇజ్రాయెల్‌ 90, ఉత్తర కొరియా 50 కలిగి ఉన్నాయి. మన దేశం దగ్గర అణ్వాయుధాలు ఉన్నా వాటిని ప్రయోగించే అవకాశం లేదు గనుక సాంప్రదాయ ఆయుధాలను పెద్ద ఎత్తున దిగుమతి చేసుకోవటంతో ఆయుధ ఎగుమతి దేశాలన్నీ ప్రధాని నరేంద్రమోడీని విశ్వగురువు అంటూ ఆకాశానికి ఎత్తి ఆయుధ ఆర్డర్లు పొందుతున్నాయంటే అతిశయోక్తి కాదు !

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d