• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: USA

చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !

17 Wednesday Dec 2025

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, UK, USA

≈ Leave a comment

Tags

Chip war 2.0, Chip war 2.0 against China, Elon Musk, Nvidia's H200, Pax Silica, US and China Chip War

ఎం కోటేశ్వరరావు

సాంకేతిక రంగంలో ముందుకు పోకుండా చైనాను అడ్డుకొనేందుకు ఇప్పటి వరకు ఒంటరిగా ప్రయత్నించిన అమెరికా తాజాగా తనకు తోడుగా మరికొన్ని దేశాలను కూడగట్టుకొని గోదాలోకి దిగింది. బహుశా అందుకే కృత్రిమ మేథ(ఏఐ) రంగంలో పూర్తిస్థాయి యుద్ధ ముప్పు ఉందని ప్రపంచ ధనికుడు ఎలన్‌ మస్క్‌ వ్యాఖ్యానించాడు. అమెరికా దిగ్గజ సంస్థ ఎన్‌విడియా తదుపరి తరం హార్డ్‌వేర్‌ బ్లాక్‌వెల్‌ చిప్‌తో అది ప్రారంభం అయినట్లే అన్నాడు. వచ్చే ఏడాది మార్కెట్‌లోకి అది రానుందనే వార్తల పూర్వరంగంలో జరుగుతున్న పరిణామాలపై తాజాగా మస్క్‌ స్పందించాడు. ఈ చర్యతో పోటీదారులు వేగం,ఖర్చు,విస్తృతి అంశాల్లో తమ సత్తా చూపేందుకు పూనుకుంటారన్నాడు. ద్రవ్యపెట్టుబడిదారు గవిన్‌ బేకర్‌ మాట్లాడిన అంశాల మీద మస్క్‌ స్పందించాడు. బ్లాక్‌వెల్‌ చిప్స్‌ తయారీలో అనేక సవాళ్లు ఉన్నట్లు బెకర్‌ చెప్పాడు. అందుకే అది ఆలస్యం అవుతున్నదని అన్నాడు.ఏది ఏమైనప్పటికీ ఈ రంగంలో ఉన్న గూగుల్‌, ఎలన్‌మస్క్‌ ఎక్స్‌ఏఐ, మేటా (ఫేస్‌బుక్‌ ) వంటి కంపెనీలన్నీ పోటీపడతాయని వేరే చెప్పనవసరం లేదు. మరోవైపు పశ్చిమ దేశాల సంస్థలకు చైనా పెద్ద సవాలు విసురుతున్నది. గత పదిహేను సంవత్సరాలుగా సాంకేతిక రంగంలో బీజింగ్‌ ఎదగకుండా చూసేందుకు అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు చేయని యత్నం లేదు. వాణిజ్యపోరుతో పాటు చిప్స్‌ పోరును కూడా ప్రారంభించాయి. తాజా పరిణామాలను బట్టి ఈ యుద్ధంలో అమెరికాకు ఊహించని దెబ్బ తగిలిందని చెప్పవచ్చు.అందుకే అది కొత్త ఎతుత్తగడలతో పోరును కొనసాగించేందుకు పాక్స్‌ సిలికా పేరుతో కొత్త కూటమిని రంగంలోకి తెచ్చింది.

చిప్‌ యుద్ధంలో చైనా ఒక్కటే ఒకవైపు ,అనేక దేశాలు మరోవైపు ఉన్నాయి. జోబైడెన్‌ సర్కార్‌ 2022 అక్టోబరు నుంచి ా చైనాకు అధునాతన చిప్స్‌ ఎగుమతులపై ఆంక్షలు విధించింది. ఇటీవలనే ట్రంప్‌ ఏలుబడి ఎన్‌విడియా కంపెనీకి అనుమతి ఇచ్చింది. అయితే అధికారికంగా ఎలాంటి సమాచారం లేనప్పటికీ ఆ చిప్స్‌ తమకు అవసరం లేదన్నట్లుగా చైనా తీరు ఉందని, తిరస్కరించినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఈ పూర్వరంగంలో చిప్‌ యుద్దంలో తన బలం ఒక్కటే చాలదని భావించిన అమెరికా డిసెంబరు 12న తొలిసారిగా పాక్స్‌ సిలికా పేరుతో ఒక కూటమికి శ్రీకారం చుట్టింది. పాక్స్‌ అంటే లాటిన్‌ భాషలో శాంతి, స్థిరత్వం, సిలికా అంటే ఇసుకతో సహా వివిధ రూపాల్లో ఉండే ఖనిజం. దాన్నుంచి కంప్యూటర్లకు అవసరమైన చిప్స్‌ తయారు చేస్తారు,అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఐటి, సాంకేతిక పరిజ్ఞానం కేంద్రాలు కేంద్రీకృతమైన ప్రాంతాన్ని సిలికాన్‌ వ్యాలీ అని పిలుస్తున్న సంగతి తెలిసిందే. పాక్స్‌ సిలికా లక్ష్యం ఏమిటంటే విలువైన ఖనిజాల సరఫరా, సాంకేతిక పరిజ్ఞాన సహకారంతో ఆ కూటమిలోని దేశాలు బలపడటం, చైనా ఆధిపత్యాన్ని ఉమ్మడిగా సవాలు చేయటం. అమెరికా వైపు నుంచి ఇలాంటి చొరవ చూపటం అంటే కమ్యూనిస్టు చైనా ముందు ఒక విధంగా తన ఓటమిని అంగీకరించటమే.చిత్రం ఏమిటంటే ఈ బృందం నుంచి భారత్‌ను మినహాయించారు.దీని అర్ధం మనలను చేర్చుకున్నందున తమకు ఉపయోగం లేదని భావించినట్లేనా ? లేక తమకు అనుకూలమైన షరతులతో వాణిజ్య ఒప్పందానికి ఒప్పించటానికి మరోవిధంగా వత్తిడి చేయటమా ?

ప్రస్తుతం ప్రపంచంలో విలువైన ఖనిజాలు, వాటి ఉత్పత్తుల విషయంలో 70శాతంతో చైనా అగ్రభాగాన ఉంది. వాటి ఎగుమతుల నిలిపివేతతో ఇటీవల ప్రపంచంలోని అనేక దేశాలు గిజగిజలాడిన సంగతి తెలిసిందే.ఈ ఖనిజాలతో పాటు కృత్రిమ మేథ(ఏఐ), చిప్స్‌ తయారీ వంటి కీలక రంగాలలో పరస్పరం సహకరించుకొనేందుకు అమెరికా,దక్షిణ కొరియా, సింగపూర్‌, జపాన్‌, ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్‌, నెదర్లాండ్స్‌, బ్రిటన్‌, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ స్థాపక సభ్యులుగా పాక్స్‌ సిలికా ఏర్పడింది. ఆర్థిక కూటములు తప్ప సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించి ఏర్పడటం ఇదే ప్రధమం.దీన్ని అమెరికా కృత్రిమ మేథ దౌత్యంగా వర్ణించారు. ఈ కూటమికి సహకరించేందుకు లేదా అతిధులుగా తైవాన్‌, ఐరోపా యూనియన్‌, కెనడా,ఓయిసిడి ఉంటాయి. ఈ సంస్థలకు చెందిన దేశాలు తమవంతు సహకారాన్ని అందిస్తాయి. అమెరికా ఆర్థిక వ్యవహారాల సహాయమంత్రి జాకబ్‌ హెల్‌బర్గ్‌ ఈ చొరవను ” నూతన స్వర్ణ యుగం ” అని వర్ణించాడు. దీని గురించి చైనా ఇంతవరకు అధికారికంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. ఇతరులపై ఆధారపడకుండా చైనా స్వయంశక్తితో ఎదిగేందుకు దీర్ఘకాలిక పథకాలను రూపొందించింది.దాన్లో భాగంగానే అక్కడి ప్రభుత్వం పెద్ద మొత్తాలలో పరిశోధన, అభివృద్ధికి ఖర్చు చేస్తున్నది.స్వయంగా ఉత్పత్తులను చేస్తున్నది. ఇప్పుడు పాక్స్‌ సిలికాను కూడా సవాలుగా తీసుకొని మరింతగా తన సంస్థలను ప్రోత్సహిస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదు. గతంలో అమెరికా, పశ్చిమ దేశాలు ఎంతగా ఒంటరిపాటు చేయాలని చూస్తే ఎలాంటి ఆర్భాటం లేకుండా అంతగా నూతన విజయాలతో ముందుకు వచ్చి సమాధానం చెప్పింది.

చైనా గురించి అనేక అబద్దాలను ప్రచారం చేశారు. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. ఎన్‌విడియా కంపెనీ తయారు చేసిన చిప్స్‌ను చైనాకు ఎగుమతి చేయరాదని అమెరికా ప్రభుత్వం నిషేధం విధించింది. అయితే వాటిని అక్రమ పద్దతుల్లో సేకరించి డీప్‌సీక్‌లో వినియోగిస్తున్నట్లు వార్తలు రాశారు. అయితే అలాంటిదేమీ లేదని ఎన్‌విడియా ప్రకటించి వాటిగాలి తీసింది. సదరు ఆరోపణకు ఎలాంటి ఆధారాలు లేవని, తాము అమెరికా నిబంధనలకు అనుగుణంగానే పని చేస్తున్నట్లు పేర్కొన్నది. అత్యంత తక్కువ ఖర్చుతో స్వల్పకాలంలోనే ఏఐ డీప్‌సీక్‌ను తయారు చేసి 2025లో ప్రపంచాన్ని కుదిపివేసింది. చాట్‌ జిపిటి వంటి ఏఐ వ్యవస్థలను తయారు చేసేందుకు భారీ మొత్తాలలో ఖర్చు చేసిన సంస్థలు తలలు పట్టుకున్నాయి. కంపెనీల వాటాల ధరలు పతనమయ్యాయి. ఆధునికమైన చిప్స్‌తో పనిలేకుండానే తక్కువ ఖర్చుతో ఏఐ వ్యవస్థలను తయారు చేయవచ్చని ఇప్పుడు అనేక మంది భావిస్తున్నారు. సాంకేతిక రంగంలో కొన్నింటిలో ఇప్పటికీ ముందున్నప్పటికీ మొత్తంగా చూసినపుడు గతంలో మాదిరి అమెరికా ఒక నిర్ణయాత్మక శక్తిగా లేదు. ఎన్‌విడియా హెచ్‌200 రకం చిప్‌లను చైనాకు ఎగుమతి చేయవచ్చని ట్రంప్‌ అనుమతించాడు.చైనా మార్కెట్‌లో ప్రవేశించటం ఒకటైతే, వాటిని కొనుగోలు చేసిన చైనా తనపరిశోధనలను పక్కన పెట్టి వాటిపైనే ఆధారపడుతుందనే అంచనాతో ఈ చర్య తీసుకున్నాడు. అయితే అలా జరుగుతుందని చెప్పలేమని అధ్యక్ష భవనంలో ఏఐ జార్‌గా పరిగణించే డేవిడ్‌ శాక్స్‌ చెప్పాడు. ఎగుమతులపై నిషేధం పెట్టిన అమెరికా తానే ఏకపక్షంగా ఎత్తివేసింది. ఆట నిబంధనలను తానే రూపొందించి తానే మార్చినట్లయింది.

కొన్ని దశాబ్దాల పాటు తన నిబంధనలతో అమెరికా ప్రపంచాన్ని ఏలింది. ఇతర దేశాల తలరాతలను రాసేందుకు ప్రయత్నించింది. మనతో సహా అలీన దేశాలకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తే అది సోవియట్‌, ఇతర సోషలిస్టు దేశాలకు, పెట్టుబడిదారీ దేశాల్లోనే తమ ప్రత్యర్ధులకు చేరుతుందనే భయంతో అనేక చర్యలు తీసుకుంది. పోటీదారులు తలెత్త కుండా చూసుకుంది, సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా తన రాజకీయ అవసరాల కోసం ఒక ఆయుధంగా వాడుకుంది. మన దేశానికి అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం అందకుండా అన్ని విధాలుగా అడ్డుకుంది. సోవియట్‌ యూనియన్‌, తరువాత రష్యా అండతో దాన్ని అధిగమించాం. అణుపరీక్షలు జరిపితే ఆంక్షలు విధించింది. ఆహార ధాన్యాలు కావాలంటే మాకేంటని బేరం పెట్టింది. ఇలా అనేక అంశాలను చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు కుదరదు, పరిస్థితులు మారాయి. అది చేసిన చారిత్రక తప్పిదం వలన ఇతర దేశాల మీద ఆధారపడక తప్పని స్థితి. వస్తు ఉత్పాదక పరిశ్రమలన్నింటినీ మూసివేసింది, లేదా ఇతర దేశాలకు తరలించింది. ఇప్పుడు టాయిలెట్లలో తుడుచుకొనేందుకు అవసరమైన కాగితాన్ని కూడా అది ఏదో ఒక దేశం నుంచి దిగుమతి చేసుకోవాల్సిందే. కోట్లకు వేసుకొనే టై దగ్గర నుంచి కాళ్లకు వేసుకొనే బూట్ల వరకు ఇతర దేశాల నుంచి తెచ్చుకుంటే తప్ప గడవదు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సంపాదించిన సొమ్ముతో వాటన్నింటినీ ఎక్కడో అక్కడ నుంచి తెచ్చుకుంది. ఇప్పుడు అలాంటి అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. ఉదాహరణకు ఎన్‌విడియా చిప్స్‌ను చైనాకు ఎగుమతి చేసి రాబడిలో 25శాతం ఖజానాకు జమచేస్తానని ట్రంప్‌ చెప్పాడు. ఎలా అంటే 25శాతం ఎగుమతి పన్ను విధించి అన్నాడు. ఆ కంపెనీ ఏటా పది బిలియన్‌ డాలర్ల వరకు హెచ్‌ 200 రకం చిప్స్‌ను ఎగుమతి చేస్తే దాని మీద 25శాతం పన్నుతో రెండున్నర బిలియన్‌ డాలర్ల మేర రాబడి వస్తుందని ట్రంప్‌ లెక్కలు వేసుకున్నాడు. తీరా ఏమైంది. అమెరికా చిప్సా అసలు మనకు వాటి అవసరం ఉందో లేదో సమీక్షించాలని, ప్రభుత్వ రంగంలో వాటిని వాడవద్దని తన అధికారులు, సంస్థలను చైనా ప్రభుత్వం ఆదేశించినట్లు మీడియాలో వచ్చింది. మన చిప్స్‌ను చైనా తిరస్కరిస్తున్నది అని అధ్యక్ష భవన అధికారి డేవిడ్‌ శాక్స్‌ బ్లూమ్‌బెర్గ్‌ వార్తా సంస్థతో చెప్పాడు. అదే నిజమైతే ట్రంప్‌ వ్రతం చెడ్డా ఫలం దక్కలేదని చెప్పాల్సి ఉంటుంది. 2023 నుంచి నిషేధం అమలు చేసినందున మూడు సంవత్సరాల్లో ఎంతో నష్టపోయినట్లు ఎన్‌విడియా కంపెనీ వాపోయింది. అమెరికా భద్రత పేరుతో ఈ నిషేధం కారణంగా ఎవరిమీదో ఎందుకు ఆధారపడటం మీరే తయారు చేయండని స్థానిక కంపెనీలకు 70 బిలియన్‌ డాలర్ల ప్రోత్సాహక పాకేజ్‌ను చైనా ప్రకటించింది. అంతే శక్తివంతమైన ప్రత్నామ్నాయాలను రూపొందించింది కనుకనే అమెరికా చిప్స్‌తో పనిలేదన్నట్లుగా ఉంది. భద్రత సాకును వదలివేసి లాభాలే పరమావధిగా ఎగుమతులకు అమెరికా అనుమతి ఇచ్చింది.

ముందే చెప్పుకున్నట్లు చైనా పరిశోధనా రంగంలో చేస్తున్న ఖర్చుకు ఫలితాలు కనిపిస్తున్నాయి.2025 డిసెంబరు ఒకటవ తేదీన ఆస్ట్రేలియన్‌ స్ట్రాటజిక్‌ పాలసీ ఇనిస్టిట్యూట్‌ విడుదల చేసిన సమాచారం ప్రకారం అది విశ్లేషించిన 74 కీలక రంగాలకు గాను 66లో చైనా పరిశోధనలు ముందున్నాయి.అమెరికా కేవలం ఎనిమిదింటిలో మాత్రమే ఉంది. 2000 దశకంలో అమెరికా అగ్రస్థానంలో ఉంది, ఇప్పుడు తిరగబడింది. అయితే చైనా ఆ తరువాత అల్లా ఉద్దీన్‌ అద్బుతదీపాన్ని సంపాదించిందా ? లేదు, ఒక దీర్ఘకాలిక ప్రణాళిక ప్రకారం ప్రాధాన్యత రంగాలను ఎంచుకొని సాగించిన కృషికి ఫలితమిది.అమెరికా ఎప్పుడైతే అడ్డుకోవాలని చూసిందో అప్పటి నుంచి మరింత పట్టుదల పెరిగింది.అనేక రంగాలలో విదేశాల కోసం ఎదురుచూడాల్సిన అవసరం ఇప్పుడు లేదు. అలా అని తలుపులు మూసుకోలేదు, అవసరమైన వాటికోసం వెంపర్లాడటం లేదు. చిప్స్‌ కొనటం లేదని అమెరికా అధికారి వాపోవటానికి కారణం చైనా కాదు, అమెరికా అనుసరించిన ఎత్తుగడలే అన్నది స్పష్టం. అవసరం అయినపుడు అమ్మకుండా తీరిన తరువాత ఇస్తామంటే ఎవరైనా కొనుగోలు చేస్తారా ? చైనా కొన్ని అంశాలలో తన విధానాలను ఇతర దేశాలను చూసి నిర్ణయించుకోవాల్సిన స్థితిలో లేదు. చైనాతో సహా వర్ధమానదేశాలన్నింటినీ తమ గుప్పిటలోకి తెచ్చుకోవాలని అమెరికా శ్వేత సౌధంలో రిపబ్లికన్లు, డెమోక్రాట్లు ఎవరు ఉన్నా అనుసరించిన విధానం ఒక్కటే.అక్కడి అధికారం కోసం వారిలో వారు పోట్లాడుకుంటారు తప్ప ఇతర దేశాలను దోచుకోవటంలో, తంపులు పెట్టి ఆయుధాలు అమ్ముకోవటంలో ఎవరికెవరూ తీసిపోలేదు. ట్రంప్‌ రెండవసారి అధికారానికి వచ్చిన తరువాత చైనాపై చిప్‌ యుద్ధం 2.0 ప్రారంభించాడు, ఇది ఏ పరిణామాలు, పర్యవసానాలకు దారితీస్తుందో చూద్దాం !

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !

10 Wednesday Dec 2025

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, Japan, Opinion, USA, WAR

≈ Leave a comment

Tags

China, Donald trump, Japan pacifist constitution, PLA Liaoning, PLA warships, Sanae Takaichi, Taiwan Matters, Xi Jinping

ఎం కోటేశ్వరరావు

నిత్యం ఎక్కడో ఒక దగ్గర ఉద్రిక్తతలను రెచ్చగొట్టి ఆయుధాలను అమ్ముకొని సొమ్ము చేసుకుంటే తప్ప అమెరికాకు రోజుగడవదు. దాన్లో భాగంగానే దక్షిణ చైనా సముద్రంలో ఉద్రిక్తతలను రెచ్చగొడుతున్నది. ఇటీవల రెండు సార్లు తమ విమానాల రాడార్లపై చైనా ఆయుధాలను గురిపెట్టిందని జపాన్‌ ఆరోపించింది. మిలిటరీ పరిభాషలో లాక్‌ ఆన్‌ అంటే ఒక దేశానికి చెందిన మిలిటరీ విమానాలు మరోదేశానికి చెందిన విమానాలపై రాడార్ల ద్వారా నిఘావేసి సంకేతాలు పంపటమే. ఇదికొన్ని సందర్భాలలో కూల్చివేతలకు కూడా దారి తీయవచ్చు. నిఘా అవసరాలకూ వినియోగించవచ్చు. దేనికి అలా చేశారన్నది ఆయా దేశాలు చెప్పే భాష్యాలు వివాదం అవుతున్నాయి. దొంగే దొంగ అని అరచినట్లుగా జపాన్‌ నిఘావిమానాలను తమపై కేంద్రీకరించి తామేదో చేసినట్లు గుండెలు బాదుకుంటూ ప్రపంచాన్ని నమ్మింపచూస్తున్నదని చైనా విమర్శించింది. అయితే ఎటు వైపు నుంచి ఎలాంటి అవాంఛనీయ ఉదంతాలు చోటు చేసుకోలేదు గానీ గత దశాబ్దికాలంలో ఎన్నడూ లేని విధంగా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలకు దారితీసింది. లాక్‌ ఆన్‌ ప్రచారం జపాన్‌ ప్రారంభించిన ఆయుధీకరణకు ఒక ముసుగు మాత్రమే. జపాన్‌ ఆరోపణలకు మంగళవారం నాడు అమెరికా మద్దతు పలికింది.చైనా చర్యలు ఆ ప్రాంతంలో శాంతియుత వాతావరణానికి దోహద పడటం లేదన్నది. అమెరికా ప్రకటన తమ రెండు దేశాల మధ్య ఉన్న బంధం ఎంతగట్టిదో వెల్లడించిందని జపాన్‌ స్పందించింది. రెండవ ప్రపంచ యుద్దంలో కేవలం ఆత్మరక్షణకు అవసరమైన మిలిటరీ మాత్రమే జపాన్‌కు ఉండాలని ఒప్పందం కుదిరింది. అయితే 2015 ప్రభుత్వం కొత్త చట్టం తీసుకువచ్చి తమకే గాక మిత్రదేశాలకు ఆపద వచ్చినపుడు కూడా జోక్యం చేసుకోవచ్చని కొత్త నిబంధన చేర్చారు.నిజానికి తైవాన్‌ ఒక దేశం అని ఐరాస గుర్తించలేదు, అక్టోబరులో బాధ్యతలు స్వీకరించిన ప్రధాని సానాయి టకాయిచి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఆమె ఇటీవల మాట్లాడుతూ బలవంతంగా తైవాన్‌ ప్రాంతాన్ని చైనా స్వాధీనం చేసుకుంటే తమ దేశభద్రతకు ముప్పు వచ్చినట్లే అని దాన్ని తాము అంగీకరించేది లేదని ప్రకటించారు.

చైనాలో అంతర్భాగమైన తైవాన్‌ ప్రస్తుతం ఒక తిరుగుబాటు రాష్ట్రంగా ఉంది.శాంతియుత పద్దతుల్లో తిరిగి ప్రధాన భూభాగంతో అనుసంధానం చేసేందుకు చూస్తామని,అవసరమైతే మిలిటరీచర్యతో అయినా ఆ పని చేస్తామని చైనా పదే పదే ప్రకటించింది. హాంకాంగ్‌, మకావో దీవుల విలీనం మాదిరి ఒక దేశం రెండు వ్యవస్థల విధానం కింది తైవాన్‌లో ఉన్న వ్యవస్థను 2049 వరకు ఎలాంటి మార్పులు చేయబోమని కూడా స్పష్టం చేసింది, అంటే అప్పటి వరకు స్వయం పాలనకు అవకాశమివ్వటమేగాక అక్కడ ఉన్న పెట్టుబడులకు రక్షణ కల్పించటమే. అయితే ఒక వైపు తైవాన్‌ ప్రాంతం చైనా అంతర్భాగమే అని అంగీకరిస్తూనే అమెరికా, జపాన్‌ ఇతర పశ్చిమ దేశాలు బలవంతంగా స్వాధీనం చేసుకోవటాన్ని తాము అంగీకరించేది లేదని వితండ వాదనకు దిగుతున్నాయి. స్వాతంత్య్రం ప్రకటించుకున్న తైవాన్‌లోని వేర్పాటువాద శక్తులకు అన్ని రకాలుగా మద్దతు ఇస్తున్నాయి. ఒక దేశం మాదిరి అక్కడ మిలిటరీని ఏర్పాటు చేసేందుకు, వాటికి యుద్ధ విమానాలతో సహా అన్ని రకాల ఆయుధాలను అందచేస్తున్నాయి. అమెరికా కవ్వింపులను గమనించిన చైనా ఆచితూచి వ్యవహరిస్తున్నది, ఎప్పటికప్పుడు తన అధికారాన్ని అది పునరుద్ఘాటిస్తున్నది. తెగేదాకా లాగితే ఏం జరుగుతుందో చూడండి అంటూ తరచు తైవాన్‌ చుట్టూ మిలిటరీ విన్యాసాలను కూడా నిర్వహిస్తున్నది. వాటిని చూపి ఇంకేముంది చైనా బలప్రయోగానికి పూనుకుందంటూ అమెరికా కూటమి దేశాలు నానా యాగీ చేస్తున్నాయి.

క్లుప్తంగా తైవాన్‌ సమస్య గురించి చూద్దాం.చైనా స్వాతంత్య్రం కోసం కొమింటాంగ్‌ పార్టీ ఏర్పడింది.సన్‌ యెట్‌ సేన్‌ నాయకత్వంలో 1912లో చైనా స్వాతంత్రం ప్రకటించుకొని రిపబ్లిక్‌గా అవతరించింది. తరువాత జరిగిన కొన్ని పరిణామాలలో అధికారానికి దూరమైన సన్‌ తరువాత మరోసారి అధికారానికి వచ్చి కమ్యూనిస్టులతో కలసి తొలి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. ఆయన మరణం తరువాత 1925లో అధికారానికి వచ్చిన ఛాంగ్‌కై షేక్‌ కొమింటాంగ్‌ పార్టీలో కమ్యూనిస్టులతో సయోధ్యను కోరుకొనే వారిని పక్కన పెట్టి కమ్యూనిస్టు వ్యతిరేకిగా మారాడు. మావో నాయకత్వాన కమ్యూనిస్టులు 1949లో అధికారానికి వచ్చిన సమయంలో భారీ సంఖ్యలో మిలిటరీ, ఆయుధాలను తీసుకొని చాంగ్‌కై షేక్‌ తైవాన్‌ దీవికి పారిపోయి అక్కడి నుంచి కమ్యూనిస్టులను ప్రతిఘటించాడు. ప్రధాన భూభాగంలో అధికారాన్ని సుస్థిరం చేసుకోవటం ముఖ్యమని భావించిన కమ్యూనిస్టులు దాని మీద కేంద్రీకరించారు. రెండవ ప్రపంచ యుద్దం తరువాత ఏర్పడిన ఐరాసలో అప్పుడు అధికారంలో ఉన్న చాంగ్‌కై షేక్‌ నియమించిన ప్రతినిధులనే గుర్తించారు. కమ్యూనిస్టులు అధికారానికి వచ్చిన తరువాత చైనా అంటే తైవాన్‌లో తిష్టవేసిన కొఇమింటాంగ్‌ పార్టీయే చైనా ప్రతినిధి అని 1970దశకం వరకు పరిగణించారు.ఎట్టకేలకు కమ్యూనిస్టు చైనాను గుర్తించకతప్పని పరిస్థితి ఏర్పడింది. 1971 అక్టోబరులో జరిగిన 26వ సమావేశంలో 2,758 తీర్మానం ద్వారా కమ్యూనిస్టుల నాయకత్వంలో ప్రధాన భూభాగంలో ఉన్న జనచైనా(పిఆర్‌సి) అసలైన ప్రతినిధి అని గుర్తించారు. నాటి నుంచి తైవాన్‌లో ఉన్న పాలకులు నియమించిన వారికి గుర్తింపు రద్దు చేశారు. చైనాలో తైవాన్‌ అంతర్భాగమని అందరూ అంగీకరించారు. అయితే అప్పుడు జరిగిన చర్చలో దీర్ఘకాలం విడిగా ఉన్నందున బలవంతపు విలీనం జరగకూడదని పలుదేశాలు చెప్పిన అభిప్రాయాన్ని చైనా నాయకత్వం కూడా అంగీకరించింది. నాటి చర్చను సాకుగా తీసుకొని తరువాత ఎప్పుడు విలీన యత్నం చేసినా తగిన పరిస్థితి ఏర్పడలేదని పశ్చిమ దేశాలు పాటపాడుతున్నాయి. ఇప్పటికీ అదే సాకు చెబుతూ విలీనాన్ని అడ్డుకుంటున్నాయి. తన పౌరులపై బలప్రయోగం అంటే రక్తపాతమే గనుక చైనా అందుకు పూనుకోవటం లేదు, దాని సహనాన్ని పదే పదే రెచ్చగొడుతున్నారు. దానిలో భాగమే తైవాన్‌ విలీనం తమ దేశానికి ముప్పు అని జపాన్‌ చెబుతున్న కుంటిసాకు. ప్రస్తుతం తైవాన్‌ వేరుగా ఉన్నందున చైనాకు వచ్చిన ముప్పేమీ లేదు గనుక ఉపేక్షిస్తున్నది. అది చెబుతున్న 2049 గడువులోగా దారికి వస్తే సరే, రాకుంటే అప్పుడేం జరుగుతుందో ఇప్పుడు ఊహించి చెప్పలేము. ఒక్కటి మాత్రం స్పష్టం. తైవాన్‌ వ్యవహారాల్లో మరోదేశం జోక్యం చేసుకోవటం, భిన్నంగా మాట్లాడటం అంటే తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటం, తమ సార్వభౌమత్వం, రాజ్యాంగం, అంతర్జాతీయ న్యాయసూత్రాలను ఉల్లంఘించటమే అని చైనా చెబుతున్నది. ఇదే అంశాన్ని సోమవారం నాడు జర్మనీ విదేశాంగ మంత్రితో మాట్లాడిన చైనా విదేశాంగ మంత్రి, కమ్యూనిస్టు పార్టీ పొలిట్‌బ్యూర్‌ సభ్యుడు వాంగ్‌ ఇ స్పష్టం చేశారు. తైవాన్‌ గురించి అనేక అంశాలను వివరించాడు. ఈ ప్రాంతాన్ని జపాన్‌ అర్ధశతాబ్దం పాటు ఆక్రమించుకొని వలసగా చేసుకున్నదని, తమ పౌరుల మీద లెక్కలేనని అత్యాచారాలు చేసిందని కూడా చెప్పాడు.

చైనా బూచిని చూపుతూ జపనీయులను రెచ్చగొడుతున్న అక్కడి పాలకులు మిలటరీ బడ్జెట్‌ను పెంచేందుకు సాకులు వెతుకుతున్నారు.ఇదంతా అమెరికా ఆడిస్తున్న క్రీడ తప్ప మరొకటి కాదు. తాను నేరుగా దిగితే చైనాతో సమస్యలు వస్తాయని తెలుసుగనుక ట్రంప్‌ యంత్రాంగం జపాన్ను ఎగదోస్తున్నది. తైవాన్‌ దీవికి 110 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన చివరి దీవుల సముదాయం,( ఇది చైనాకూ అంతే దూరం) జనాభా పెద్దగా లేని యంగునీ దీవుల సముదాయంలో దీర్ఘశ్రేణి క్షిపణులను మోహరించేందుకు పూనుకుంది. అక్కడ రాడార్‌ కేంద్రాలు, మందుగుండు గిడ్డంగులు, అమెరికా అందచేసిన ఎఫ్‌-35 విమానాల మోహరింపు, ఇతర మిలిటరీ నిర్మాణాలకు పూనుకుంది. ఇప్పటికే సిబ్బంది నివాసాలకు కొన్ని భవనాల నిర్మాణం పూర్తి చేసింది. కొద్ది రోజుల క్రితం ఆ దీవుల్లో ఉన్న పౌరులు కొంత మందితో సమావేశం జరిపి చైనాపై నిఘా, దాని ఎలక్ట్రానిక్‌ పరికరాలనుంచి వెలువడే అయస్కాంత తరంగాలను స్థంభింప చేసేందుకు మిలిటరీ నిర్మాణాలు అవసరమని తేల్చి చెప్పారు. ఇది చైనాను కవ్వించటం తప్ప మరొకటి కాదు. ఒక వేళ రెండు దేశాల మధ్య యుద్దం అంటూ వస్తే అది జపాన్‌ వైపు నుంచే మొదలు కావాలి తప్ప చైనా నుంచి జరగదు. ఒక వేళ జరిగితే అమెరికా తమను ఆదుకొనే పరిస్థితి లేదని గతంలో ప్రభుత్వ విశ్లేషకురాలిగా ఉండి, ప్రస్తుతం నిగాటా విశ్వవిద్యాలయంలో పని చేస్తున్న ఒక మహిళా ప్రొఫెసర్‌ చెప్పారు. ప్రభుత్వ మిలిటరీ, క్షిపణుల మోహరింపు గురించి అక్కడి కమ్యూనిస్టు పార్టీ పార్లమెంటరీచర్చలో వ్యతిరేకతను వెల్లడించింది. ఇతర దేశాల మాదిరే జపాన్‌ కూడా చేస్తున్నదని రక్షణ మంత్రి సమర్ధించాడు.

గత వారంలో విమర్శలకు దారితీసిన ఉదంతం జపాన్‌లో అమెరికా మిలిటరీ కేంద్రం ఉన్న ఒకినావా దీవి సమీపంలో జరిగింది. చైనా తమ విమానాలను లక్ష్యంగా చేసుకున్నదని తప్ప గగనతలాన్ని అతిక్రమించినట్లు జపాన్‌ ఇంతవరకు చెప్పలేదు.ముందుగా అంతర్జాతీయ జలాల్లో ఉన్న తమ విమానవాహక యుద్ధ నౌక సమీపానికి ప్రమాదకరంగా జపాన్‌ యుద్ధ విమానాలే వచ్చాయని, తమవైపు నుంచి అనివార్యమైన ప్రతిస్పందన ఉందని బీజింగ్‌ చెబుతున్నది.చైనా విమానవాహక యుద్ద నౌక లియావోనింగ్‌ వైపు జపాన్‌ యుద్ధ విమానాలు సమీపంలోకి వచ్చినపుడు చైనా విమానాలు అడ్డుకొని హద్దు మీరితే అంతే సంగతులని హెచ్చరించినట్లు, అవి పూర్తిగా సమర్దనీయమే అని చైనా నిపుణులు చెబుతున్నారు. జపాన్‌ సమీపంలో చైనా విమానవాహక నౌక కార్యకలాపాలు నిర్వహించటం ఇదే మొదటిసారి అని జపాన్‌ వార్తా సంస్థ కొయోడో పేర్కొన్నది. తూర్పు ఆసియా సముద్రంలో చైనా నౌకాదళానికి చెందిన వివిధ రకాల వంద నౌకలు పాల్గ్గొన్నట్లు రాయిటర్స్‌ వార్త ఆరోపించింది. తమ నౌకలు పశ్చిమ పసిఫిక్‌ ప్రాంతంలో ఇలాంటి విన్యాసాలు జరపటం సాధారణమని అయితే ప్రతిసారీ జపాన్‌ తమకు చైనా నుంచి ముప్పు ఉందని చెప్పేందుకు, తన మిలిటరీ శక్తిని పెంచుకొనేందుకు వాటిని బూతద్దంలో చూపుతున్నదని, అంతర్జాతీయ సూత్రాలకు అనుగుణంగానే తాము జరుపుతున్నట్లు, జపాన్‌ ఆత్మరక్షణ రాజ్యాంగం నుంచి పక్కకు జరుగుతున్నదని చైనా నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.వాటి మీద అతిగా స్పందించటం, విపరీత భాష్యాలు ఎవరూ చెప్పకూడదని చైనా విదేశాంగశాఖ ప్రతినిధి లిన్‌జియాన్‌ చెప్పాడు.అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా జరుపుతున్న తమ విన్యాసాల గురించి గుండెలు బాదుకుంటున్న జపాన్‌ అదే పని అమెరికా చేస్తుంటే ఎందుకు మౌనంగా ఉంటున్నదని చైనా ప్రశ్నిస్తోంది.

తైవాన్‌ సమస్యపై రెచ్చగొడుతున్న జపాన్‌ తీరును చూస్తే అమెరికా పన్నిన వ్యూహంగా కనిపిస్తోంది. ఈ వివాదం చెలరేగిన సమయంలోనే తైవాన్‌ సమస్యపై తక్షణమే చైనాతో యుద్ధం రాకుండా చూసుకోవాలని ఒక పథకం రూపొందించినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. ముందుగా అమెరికా, దాని మిత్రదేశాలు మిలిటరీ బలాన్నిపెంచుకోవాలని, చైనా వైపునుంచి తైవాన్‌, జపాన్‌ మీద వత్తిడి పెరుగుతున్నదని డిసెంబరు ఐదున ప్రచురించిన ఒక పత్రంలో అమెరికా జాతీయ వ్యూహకర్తలు పేర్కొన్నారు.2017లో ప్రచురించిన పత్రంలో ఒక వాక్యంలో మూడుసార్లు తైవాన్‌ ప్రస్తావన చేయగా తాజా పత్రంలో మూడు పేరాల్లో ఎనిమిదిసార్లు ఉన్నట్లు రాయిటర్స్‌ తెలిపింది. వాణిజ్య యుద్దాలు జరుగుతున్న, సెమికండక్టర్ల ఉత్పత్తిలో ఆధిపత్యం వహిస్తున్న ప్రాంతంలో తైవాన్‌ గురించి సరిగానే కేంద్రీకరించినట్లు, జపాన్‌ నుంచి ఆగేయాసియా వరకు ఏ దీవి మీద కూడా ఎక్కడా దురాక్రమణ జరగకుండా అమెరికా మిలిటరీ సామర్ధ్యాన్ని పెంచుకోవాలని ఆ పత్రం పేర్కొన్నది. ఇదే సమయంలో అమెరికా ఒక్కటే చేయలేదని, చేయకూడదని, మిత్రదేశాలు మిలిటరీ ఖర్చు పెంచుకోవాలని, ఉమ్మడిగా రక్షణకు పని చేయాలని హితవు పలికింది.ఈ బలం తైవాన్‌ ఆక్రమణ యత్నాలు మానుకొనే స్థాయికి పెరగాలని కోరింది. ఈ వ్యూహం, ఎత్తుగడల్లో భాగంగానే ఆత్మరక్షణ యుద్ధం నుంచి ఎదురుదాడులు చేసే విధంగా ఆయుధాలను పెంచుకోవాలని జపాన్‌ చూస్తున్నది, దానికి సాకుగా చైనా బూచిని చూపుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తున్నది !

Share this:

  • Tweet
  • More
Like Loading...

యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !

03 Wednesday Dec 2025

Posted by raomk in Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, Latin America, Opinion, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

Donald trump, Nicolás Maduro Moros, US military action on Venezuela, Venezuela

ఎం కోటేశ్వరరావు

మేక పిల్లను మింగేయాలనుకున్న తోడేలు కథ తెలిసిందే ! ప్రపంచంలో ఏదో ఒక మూల ఘర్షణ లేదా యుద్ధం లేకుండా అమెరికాకు నిదురపట్టదు. అందుకే మాదక ద్రవ్యాల రవాణా సాకుతో వెనెజులాపై ఏ క్షణమైనా దాడి చేసేందుకు అవసరమైన సన్నాహాలన్నీ పెంటగన్‌ పూర్తి చేసింది. మిలిటరీ ద్వారా మదురోను తొలగించేందుకు పూనుకోవద్దని, సంప్రదింపుల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని పోప్‌ లియో మంగళవారం నాడు డోనాల్డ్‌ ట్రంప్‌కు హితవు చెప్పాడు. అక్కడ మార్పులు కావాలని అనుకుంటే ఆర్థిక ఆంక్షల ద్వారా చేయవచ్చని సలహా కూడా ఇచ్చాడు. ప్రపంచంలో అతి పెద్దది, అధునాతనమైనదిగా పరిగణిస్తున్న యుఎస్‌ఎస్‌ గెరాల్డ్‌ ఫోర్డ్‌ విమానవాహక యుద్ధ నౌకతో సహా అనేక ఇతర నౌకలు, వేలాది మంది సైనికులను కరీబియన్‌ సముద్ర ప్రాంతానికి తరలించింది.దేశం నుంచి వెళ్లిపోవాలని డోనాల్డ్‌ ట్రంప్‌ వెనెజులా అధ్యక్షుడు నికోలస్‌ మదురోను బెదిరించిన ట్రంప్‌ శుక్రవారం నాటితో గడువు ముగిసిందంటూ వెనెజులా గగనతలాన్ని మూసివేసినట్లు ప్రకటించాడు. ఆ ప్రకటన చేసినప్పటికీ సోమ, మంగళవారాల్లో అమెరికా నుంచి వెనెజులా పౌరులను అనేక మందిని విమానాల ద్వారా తరలించారు, వారానికి రెండు రోజుల్లో తరలించవచ్చని గతంలో మదురో సర్కార్‌ అనుమతించింది. అద్దె విమానాలను నడిపే సంస్థ తమకు అనుమతులు ఇవ్వాలని సోమవారం నాడు దరఖాస్తు చేసింది. గత కొద్ది నెలలుగా వెనెజులా నుంచి మాదక ద్రవ్యాలతో నిండిన పడవలు వస్తున్నాయంటూ వాటిపై దాడులు చేసి అనేక మందిని అమెరికా హత్య చేసింది. అమెరికా దుర్మార్గాన్ని వదలిపెట్టి వెనెజులా మిలిటరీ సామర్ధ్యం ఎంత, దాడులను తట్టుకోగలదా లేదా అంటూ అసలు విషయాన్ని పక్కదారి పట్టించే కథనాలను మీడియా ముందుకు తెస్తున్నది. గ్లోబల్‌ ఫైర్‌ పవర్‌ డాట్‌కామ్‌ 2025 మిలిటరీ సూచిక ప్రకారం అమెరికా మొదటి స్థానంలో ఉండగా వెనెజులా 50వదిగా ఉంది. అయినప్పటికీ తమ దేశాన్ని కాపాడు కొనేందుకు చివరి రక్తపు బొట్టువరకు చిందిస్తామని మదురో గతంలో ప్రకటించాడు. ఏ దేశానికైనా అంతకు మించి మరో మార్గం ఉండదు.సోమవారం నాడు విదేశాంగ, రక్షణ మంత్రులు, ఉన్నతాధికారులతో ట్రంప్‌ సమావేశమైన దాడి సన్నాహాల గురించి చర్చించినట్లు వార్తలు.అమెరికా అధికార పీఠంపై ఎవరు ఉన్నప్పటికీ వెనెజులాలో వామపక్షల హ్యూగో ఛావెజ్‌ రాజకీయ వారసుడిగా వచ్చిన మదురో వరకు వారి కుట్రలు ఆపటం లేదు. అక్కడి ప్రతిపక్ష నేతలకు మద్దతు ఇచ్చి కుట్రలకు తెరలేపిన సంగతి తెలిసిందే.

తప్పుడు ప్రచారం, అసత్యాలతో ఇతర దేశాలపై దాడులు చేయటం అమెరికాకు కొత్తేమీ కాదు. తనకు లొంగని, నచ్చని దేశాధినేతలను పదవుల నుంచి తొలగించేందుకు చేసిన కుట్రల గురించి తెలిసిందే. వాటి వలన ప్రయోజనం లేదని చరిత్ర చెబుతున్నా పదే పదే ప్రయత్నాలు చేస్తున్నది.వలసవాదానికి వ్యతిరేకంగా లాటిన్‌ అమెరికా గతంలో పోరాడింది. దాన్ని తన పెరటితోటగా మార్చుకొనేందుకు అమెరికా నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంది.ఈ ప్రాంతంలో సామ్రాజ్యవాదుల దుర్మార్గాలు ఇన్నిన్నికాదు. నవంబరు 29న లాటిన్‌ అమెరికాలో జోంగ్‌ మారణ కాండకు 244 సంవత్సరాలు నిండాయి.లాటిన్‌ అమెరికాలోని చెరకు తోటల్లో పని చేసేందుకు జోంగ్‌ అనే పడవలో 1781లో ఆఫ్రికా నుంచి బానిసలను తరలించారు. ఒక్కో బానిసను 36 పౌండ్లకు విక్రయించారు. పడవ సామర్ధ్యానికి రెండు రెట్లు అంటే 442మందిని ఎక్కించారు.ఘనా నుంచి జమైకాకు ప్రయాణించే ఆ పడవ నావికులు చేసిన తప్పిదాల వలన ఆలస్యమై మంచినీరు చాలకపోవటం, ఇతరత్రా కారణాలతో అనేక మంది మరణించారు. ఓడ యజమానులు ఒక్కొక్క బానిస మీద 30 పౌండ్ల చొప్పున బీమా సొమ్ము పొందే అవకాశం ఉంది. దుర్మార్గం ఏమంటే అందుకోసం నీరసించిపోయిన వారిలో 54 మంది మహిళలు, పిల్లలను మరణించినవారితో పాటు నవంబరు 29న కరీబియన్‌ సముద్రంలోకి నెట్టి చంపివేశారు.ఈ ఉదంతం సామ్రాజ్యవాదంపై ప్రతిఘటన, బానిసత్వ రద్దు చట్టాలకు నాంది పలికింది. దీన్ని ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందంటే బానిసవ్యాపారులు బీమా సొమ్ముకోసం బతికి ఉన్నవారిని సముద్రంలోకి తోసివేసినట్లే వెనెజులాపై దాడికి అమాయకులైన వారు ప్రయాణిస్తున్న పడవలపై దాడులు చేసి వారిని చంపివేసిన అమెరికా మిలిటరీ దాన్ని మాదకద్రవ్యాల నిరోధానికి తీసుకున్న చర్యగా ప్రపంచాన్ని నమ్మించేందుకు చూసింది. అసలు అమెరికాకు అలాంటి అధికారం ఎవరిచ్చారు, అదేమీ అమెరికా గడ్డకాదు, సముద్రజలాలు వారివి కాదు. తాము పేల్చివేసిన ప్రతిపడవతో 25వేల మంది అమెరికన్ల ప్రాణాలను రక్షించామని డోనాల్డ్‌ ట్రంప్‌ చెప్పుకున్నాడు.ప్రతి ఏటా వేలాది మందిని అమెరికాలో తుపాకులతో కాల్చిచంపుతుంటే, మాదక ద్రవ్యాలతో నింపుతుంటే వారిని నిరోధించటం చేతగాని దద్దమ్మలు ఎక్కడో మాదక ద్రవ్యాలు రవాణా అవుతున్నాయంటూ యుద్ధ నౌకలు, మిలిటరీని తరలిస్తుంటే నమ్మటానికి జనాలు చెవుల్లో పూలు పెట్టుకొని లేరు. ఛావెజ్‌ నాయకత్వంలో వెనెజులాలో ప్రారంభమైన వామపక్ష పాలనకు 26 సంవత్సరాలు నిండాయి. ఆ ప్రాంతంలో అమెరికాకు కొరకరాని కొయ్యగా తయారైంది.అసలు దుగ్ద అది, అందుకే మదురోను తొలగించి తన తొత్తులను అక్కడ అధికారంలో కూర్చోపెట్టేందుకే ఈ దుర్మార్గానికి ట్రంప్‌ తెరతీశాడు.

అమెరికా ఆంక్షలను ఖాతరు చేయకుండా వెనెజులా ప్రస్తుతం క్యూబా, చైనా తదితర దేశాలకు చమురు ఎగుమతులు చేస్తున్నది. ప్రపంచంలో 303 బిలియన్‌ పీపాల చమురు నిల్వలతో వెనెజులా మొదటి దేశంగా ఉంది.వాటిని చేజిక్కించుకొని అమెరికా కంపెనీలకు అప్పగించాలని అక్కడి రిపబ్లికన్లు, డెమోక్రాట్లూ ప్రయత్నిస్తున్నారు.దానికి గాను సాకులు చెబుతున్నారు.2007లో ఛావెజ్‌ ప్రభుత్వం అమెరికా కంపెనీల చేతుల్లో ఉన్న చమురు సంస్థలను జాతీయం చేసినప్పటి నుంచి కుట్రలు మొదలయ్యాయి. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల సరఫరాలో వెనెజులా కీలక పాత్ర పోషిస్తున్నట్లు నిరంతరం ప్రచారం చేస్తున్నారు. మాదకద్రవ్యాలు, నేరాలకు సంబంధించిన ఐరాస సంస్థ, చివరికి అమెరికా డ్రగ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజన్సీ కూడా వాటిని తిరస్కరించింది. వార్షిక నివేదికల్లో మాదకద్రవ్యాలను వెనెజులా ఉత్పత్తి చేయటం లేదని, సరఫరా గురించి ఆధారాలు లేవని పేర్కొన్నాయి.అమెరికా చేరుతున్న కొకెయిన్‌లో 90శాతం పసిఫిక్‌ సముద్రమార్గాల ద్వారా దక్షిణ అమెరికా మిత్రదేశాల నుంచి నుంచి చేరుతున్నదని, ప్రమాదకరమైన ఫెంటానిల్‌ అమెరికా దక్షిణ సరిహద్దుల నుంచి ఎక్కువగా అమెరికా పౌరులే స్మగ్లింగ్‌ చేస్తున్నారని అనేక నివేదికలు ఉన్నాయి.వాటిని విస్మరించి మదురో మాదక ద్రవ్యాల సరఫరా మాఫియా నాయకుడని ఆరోపించటం తప్పుడు ప్రచారం తప్ప మరొకటి కాదు. అమెరికా చెబుతున్న మాదకద్రవ్యాల ముఠా జాడ అక్కడ ఉందని ఏ అంతర్జాతీయ సంస్థా చెప్పలేదు. మాదకద్రవ్యాల రవాణా మీద పోరాడుతున్నట్లు అమెరికా చెప్పుకోవటం హాస్యాస్పదం, బూటకం. లాటిన్‌ అమెరికాలోని హొండురాస్‌ మాజీ అధ్యక్షుడు జువాన్‌ ఓర్లాండో హెర్నాండెజ్‌ మాదక ద్రవ్యాల రవాణా కేసులో 2024లో అమెరికా కోర్టు 45 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అలాంటి నేరగాడికి క్షమాభిక్ష ప్రసాదిస్తానని డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించాడు.

యుద్ధాల ప్రారంభానికి సామ్రాజ్యవాదులు, యుద్దోన్మాదులు అబద్దాలు చెప్పటం కొత్త కాదు.నిజానికి అది పురాతన ఎత్తుగడ. యుద్దంలో ముందుగా హతమయ్యేది నిజం.మొదటి ప్రపంచ యుద్దంలో న్యూయార్క్‌ నుంచి బ్రిటన్‌లోని లివర్‌పూల్‌ బయలుదేరిన ఆర్‌ఎంఎస్‌ లుస్టియానా అనే నౌకను ఐర్లండు వద్ద జర్మన్లు పేల్చివేశారని ప్రచారం చేశారు.జున్ను, వెన్న రవాణా పేరుతో పేలుడు పదార్దాలను కూడా దానిలో రవాణా చేస్తుండగా అవి పేలటంతో 139 మంది అమెరికన్లలో 128 మంది మరణించారు. ఇది వాస్తవం కాగా జర్మనీ మీద నెపం మోపి అమెరికన్లను యుద్దానికి సిద్ధంచేసేందుకు తప్పుడు ప్రచారం చేశారు. ఇదే ఎత్తుగడతో రెండవ ప్రపంచ యుద్దంలో చేరేందుకు కుట్ర చేశారు.దాన్ని అర్ధంచేసుకోని జపాన్‌ 1941 డిసెంబరులో పెరల్‌హార్బర్‌పై చేసినదాడిలో 2,400 మంది అమెరికన్‌ మిలిటరీ, పౌరులు మరణించారు. ఆ దాడి గురించి నాటి అధ్యక్షుడు రూజ్‌వెల్ట్‌, అధికార యంత్రాంగానికి ముందే తెలుసునని, వారం ముందే దాడి జరగనున్నదని రూజ్‌వెల్ట్‌ తనకు చెప్పినట్లు నాటి అమెరికా యుద్ధ మంత్రి హెన్రీ టిమ్సన్‌ తన డైరీలో రాశాడు. ప్రభుత్వానికి అందిన హెచ్చరికలను కూడా కావాలనే పక్కన పెట్టారని తరువాత వెల్లడైంది.ఈ దాడిని ఆసరా చేసుకొని జపాన్‌పై అమెరికా యుద్ధం ప్రకటించటం, అణుబాంబులను వినియోగించటం తెలిసిందే. దీనికి పది సంవత్సరాల ముందు చైనాలోని మంచూరియాను ఆక్రమించుకొనేందుకు జపాన్‌ సామ్రాజ్యవాదులు కూడా ఇదే ఎత్తుగడను అనుసరించారు. తమ నిర్వహణలోని రైల్వే ట్రాక్‌ను తామే పేల్చుకొని చైనా మీద నెపం మోపి దురాక్రమణకు పూనుకున్నారు. రెండవ ప్రపంచ యుద్దం తరువాత ఉత్తర కొరియా దురాక్రమణ నుంచి దక్షిణ కొరియాను రక్షించేపేరుతో కొరియా యుద్దం జరిగింది. అది కూడా తప్పుడు ప్రచారమే.అసలు అలాంటి ప్రయత్నమే జరగలేదు. ఉత్తర కొరియా కమ్యూనిస్టుల ఆధీనంలో ఉండటమే అసలు కారణం. ఐరాస పేరుతో అమెరికా జరిపిన దాడి, ప్రతిఘటనలో 30లక్షల మంది పౌరులు మరణించారు.

వియత్నాం దురాక్రమణ కూడా అసత్యాలతోనే ప్రారంభమైంది. టోంకిన్‌ గల్ఫ్‌(దక్షిణ చైనా సముద్రంలో వియత్నాం తీరంలోని జలసంధి) లో తమ నౌకపై ఉత్తర వియత్నాం 1964 ఆగస్టులో రెండుసార్లు దాడి చేసిందని ఆరోపిస్తూ అమెరికా దాడికి దిగింది. దక్షిణ వియత్నాంలోని కమ్యూనిస్టు వ్యతిరేకపాలకులకు మద్దతుగా వచ్చిన అమెరికా నౌక ముందుగా చేసిన దాడిని ఉత్తర వియత్నాం ప్రతిఘటించింది. అసలు రెండవదాడి ఉదంతమే జరగలేదని తరువాత వెల్లడైంది. 1967లో అమెరికా మద్దతుతో ఈజిప్టు,జోర్డాన్‌, సిరియాపై ఇజ్రాయెల్‌ జరిపినదాడి కూడా అబద్దాలతోనే జరిగింది.ఈజిప్టు తొలుత తమపై దాడి చేసినట్లు దానికి ప్రతిదాడికి దిగినట్లు ఆరోపించింది. దానికి ఎలాంటి ఆధారాలు లేకపోవటంతో ఈజిప్టు ఇతర అరబ్బుదేశాలు తమపై దాడికి సన్నద్దం అవుతుండటంతో ఆత్మరక్షణ కోసం దాడి చేసినట్లు ఇజ్రాయెల్‌ సమర్ధించుకుంది. అమెరికాను ప్రత్యక్షంగా రంగంలోకి దించేందుకు పధకం ప్రకారం ఈజిప్టు సమీపంలో ఉన్న అమెరికా నౌక యుఎస్‌ఎస్‌ లిబర్టీపై ఇజ్రాయెల్‌ దాడి చేసింది. నెపాన్ని ఈజిప్టుమీద నెట్టేందుకు చూసింది.ఇదంతా పథకం ప్రకారమే జరిగిందని తరువాత వెల్లడైంది.1990దశకంలో జరిగిన గల్ఫ్‌దాడులను కూడా అమెరికా అబద్దాలతోనే మొదలు పెట్టింది.ఇరాకీలు కువాయిట్‌పై దాడి చేసినపుడు ఆసుపత్రిలో ఉన్న పిల్లలను చంపివేశారని కాకమ్మ కథలను అమెరికా చెప్పించింది. తరువాత 2003లో ఇరాక్‌ అధినేత సద్దామ్‌ హుస్సేన్‌ మారణాయుధాలను గుట్టలుగా పోసినట్లు ప్రచారం చేసి దాడి చేయటమేగాక సద్దామ్‌ను ఉరితీసిన సంగతి తెలిసిందే. తరువాత అలాంటి ఆయుధాలేమీ లేవని అమెరికన్లే అంగీకరించారు. సిఐఏ చెప్పిన కట్టుకథలను అమెరికాతో సహా యావత్‌ ప్రపంచ మీడియా ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. లిబియాలో మానవహక్కులకు భంగం కలిగిందని, వాటిని పునరుద్దరించేపేరుతో జోక్యం చేసుకోవటమే గాక అధినేత గడాఫీని అంతం చేసేందుకు నాటో దళాలను దించిన సంగతి తెలిసిందే.గడాఫీ వ్యతిరేక తిరుగుబాటుదార్ల పేర్లతో నాటకమాడి 2011లో గడాఫీని హత్య చేశారు.

అనేక దేశాలలో పాలకులు, పార్టీలను మార్చి తనకు అనుకూలశక్తులను గద్దెల మీద కూర్చోపెట్టేందుకు రెండవ ప్రపంచ యుద్ధం తరువాత అమెరికా చేసిన యత్నాలన్నీ విఫలం కావటమేగాక చేతులు కాల్చుకున్నది.నియంతలు, పచ్చిమితవాదులకు ఆశ్రయమిచ్చి రక్తపాతానికి కారకురాలైంది.అయినా సరే ఎప్పటికాలిట్టిట్టే అన్నట్లుగా అమెరికాలో ఏ పార్టీ అధికారానికి వచ్చినా అదే వైఖరి.ఇప్పుడు వెనెజులాలో కూడా అదే జరుగుతోంది.అధ్యక్షుడు నికోలస్‌ మదురో దేశం విడిచిపోవాలని ట్రంప్‌ బెదిరించాడు. ఒక విమానవాహక యుద్ధ నౌక, పది ఇతర మిలిటరీ నౌకలు, పదిహేనువేల మంది మిలిటరీ, వందలాది యుద్ధ విమానాలతో వెనెజులాను చుట్టుముట్టారు. మదురో కూడా గతకొద్ది నెలలుగా తనకున్న మిలిటరీ, గెరిల్లా దళాలను సన్నద్దం చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి.ఏం జరగనుందో అని యావత్‌ ప్రపంచం ఆందోళనతో చూస్తున్నది.నేడు వెనెజులా పతనమైతే రేపు ఏ దేశం మీదనైనా ఏదో ఒకసాకుతో అమెరికా దాడికి దిగితే పరిస్థితి ఏమిటో ప్రతివారూ ఆలోచించుకోవాల్సిన అవసరం వచ్చింది !

Share this:

  • Tweet
  • More
Like Loading...

అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

30 Sunday Nov 2025

Posted by raomk in BJP, CHINA, Congress, Current Affairs, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Political Parties, USA, WAR

≈ Leave a comment

Tags

14th Dalai Lama, 1962 India–China war, Anti China Media, Arunachal Pradesh Dispute, CIA on Tibet, CPI, CPI(M), Jawaharlal Nehru, Mao Zedong, Narendra Modi, USSR

ఎం కోటేశ్వరరావు

ఇటీవల చైనాతో సంబంధం ఉన్న రెండు వార్తలు, విశ్లేషణలు మీడియాలో వచ్చాయి.ఒకటి, 1962లో చైనాతో వచ్చిన యుద్ధం సరిహద్దు సమస్యల మీద కాదు, రెండవది అరుణాచల్‌ ప్రదేశ్‌కు చెందిన మన పౌరురాలి పాస్‌పోర్టు, వీసా చెల్లదు అని చైనా విమానాశ్రయంలో ఇబ్బంది పెట్టారు అన్నది రెండవది. మొదటి అంశాన్ని మన మీడియా పెద్దగా పట్టించుకోలేదు, రెండవదాని మీద పెద్ద ఎత్తున స్పందించింది, ఎందుకు ?చైనాతో వచ్చిన యుద్దం గురించి వచ్చిన విశ్లేషణ మీద కేంద్ర ప్రభుత్వం మౌనంగా ఉంది, దాని మనసెరిగి, కనుసన్నలలో నడుస్తున్న మీడియా కావాలనే విస్మరించింది. రెండవ ఉదంతం మీద దానికి భిన్నంగా జరిగింది. చరిత్ర దాస్తే దాగేది కాదు, చెరిపితే పోయేది కాదు.రెండు దేశాల మధ్య యుద్ధం ప్రాధమికంగా సరిహద్దులపై ఏకాభిప్రాయం లేకపోవటం లేదా దౌత్యపరమైన వైఫల్యాల వలన జరగలేదని, పథకం ప్రకారం 1950 మరియు 60దశకాల్లో అమెరికా అనుసరించిన వ్యూహంలో భాగంగా చోటు చేసుకుందని సిఐఏ, దౌత్యకార్యాలయాల పత్రాలు, ప్రచ్చన్న యుద్ద అంతర్జాతీయ చరిత్ర ప్రాజెక్టు పత్రాలు వెల్లడించాయి. కొన్ని ప్రధాన మంత్రి మ్యూజియం మరియు లైబ్రరీలో కూడా ఉన్నట్లు పేర్కొన్నారు.

చైనాతో ఉన్న సరిహద్దు వివాదాన్ని సంప్రదింపులతో పరిష్కరించుకోవాలన్న వైఖరిని వెల్లడించినందుకు తరువాత సిపిఐ(ఎం)గా ఏర్పడిన నాయకులను యుద్ధ సమయంలో ప్రభుత్వం, నాడు జనసంఘం రూపంలో ఉన్న నేటి బిజెపి నేతలు, ఆర్‌ఎస్‌ఎస్‌, ఇతర పార్టీలు, సంస్థలు దేశద్రోహులుగా చిత్రించాయి. ప్రభుత్వం జైల్లో పెట్టింది. యుద్దాన్ని సమర్ధించి నాటి కేంద్ర ప్రభుత్వానికి మద్దతు తెలిపిన సిపిఐతో ఇతరులను దేశభక్తులుగా చిత్రించారు, జనం కూడా అత్యధికులు నిజమే అని నమ్మారు. అది జరిగి ఆరు దశాబ్దాలు దాటింది. ఇప్పుడు వెలువడిన నిజానిజాలేమిటి ? యుద్ధానికి కారణం సరిహద్దు సమస్య కాదని, టిబెట్‌ కేంద్రంగా అమెరికా జరిపిన కుట్రలో భాగంగా జరిగిందని ఇటీవల బహిర్గత పరచిన నాటి రహస్య పత్రాలను అధ్యయం చేసిన వారు చెప్పిన మాట ఇది. వారెవరూ కమ్యూనిస్టులు కాదు. ఆ పత్రాలన్నీ అందరికీ అందుబాటులో ఉన్నాయి గనుక దీనికి భిన్నమైన విశ్లేషణను ఎవరైనా జనం ముందు పెట్టవచ్చు. అప్పటి వరకు కమ్యూనిస్టుల మీద నిందవేయటం తప్పని దాన్ని వెనక్కు తీసుకుంటామని ఎవరైనా నిజాయితీతో అంగీకరిస్తారా ?

” 1962 చైనా-భారత్‌ సంఘర్షణ భౌగోళిక రాజకీయ పరిణామాల వెల్లడి : చైనాా-భారత్‌ విభజనను అమెరికా ఎలా మలచింది ? ” అనే శీర్షికతో అమెరికాలోని పబ్లిక్‌ ఎఫైర్స్‌ జర్నల్‌ ఏప్రిల్‌ 2025 సంచికలో వెల్లడించారు. దాని రచయిత జిందాల్‌ స్కూల్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ ఎఫైర్స్‌లో పని చేస్తున్న డాక్టర్‌ లక్ష్మణ కుమార్‌. ది హిందూ బిజినెస్‌లైన్‌ పత్రికతో ఆయన సంభాషించిన అంశాలను ఆ పత్రిక ప్రచురించింది. సోషలిస్టు దేశాలపై అమెరికా ప్రారంభించిన ప్రచ్చన్న యుద్దం, సోవియట్‌ యూనియన్‌-చైనా మధ్య తలెత్తిన సైద్ధాంతిక వివాదాలను ఆసరా చేసుకొని టిబెట్‌ అంశాన్ని ముందుకు తెచ్చి భారత్‌-చైనా మధ్య వివాదాన్ని రగిలించేందుకు అమెరికా రూపొందించిన దీర్ఘకాలిక కుట్రకు రెండు దేశాలూ గురయ్యాయి. నాటి నుంచి నేటి వరకు తరువాత కాలంలో సాధారణ సంబంధాలు ఏర్పడినప్పటికీ పరస్పరం నమ్మకంలేకుండా గడుపుతున్నాయంటే అతిశయోక్తి కాదు. అమెరికా ఎత్తుగడ నిజానికి టిబెట్‌ తిరుగుబాటుదార్లకు ఏదో చేద్దామని కాదు, వారికి సాయపడే ముసుగులో భారత్‌-,చైౖనా మధ్య వైరం పెంచటమే అసలు లక్ష్యంగా రహస్య పత్రాల్లో వెల్లడైంది.

1962 అక్టోబరు 20న చైనా దాడి ప్రారంభించి నవంబరు 20న ఏకపక్షంగా కాల్పుల విరమణ ప్రకటించి అరుణాచల్‌ ప్రదేశ్‌లో తన ఆధీనంలోకి తెచ్చుకున్న ప్రాంతాల నుంచి సేనలను ఉపసంహరించుకొని వాస్తవాధీన రేఖకు పరిమితమైంది. అవి తన ప్రాంతాలని అంతకు ముందునుంచి చెబుతున్నప్పటికీ చైనా వెనక్కు తగ్గింది. టిబెట్‌లో జరిగిన కుట్రల క్రమ సారాంశం ఇలా ఉంది.1956లో అక్కడ దలైలామా పలుకుబడిలో ఉన్న ప్రభుత్వ మద్దతుతో తిరుగుబాటుకు నాందిపలికారు. సిఐఏ దాన్ని అవకాశంగా తీసుకొని ముందే చెప్పుకున్నట్లు 1957 నుంచి 1961వరకు వారికి శిక్షణ, ఆయుధాలు,రేడియోలు, ఇతర పరికరాలను ఇచ్చింది.విమానాల ద్వారా 250టన్నుల మిలిటరీ సరఫరాలు చేసింది.నిఘావిమానాల ద్వారా సమాచారాన్ని అందచేసింది. చైనా మిలిటరీ తిరుగుబాటును అణచివేయటంతో 1959లో దలైలామాను టిబెట్‌ నుంచి తప్పించి అరుణాచల్‌ ప్రదేశ్‌ ద్వారా భారత్‌కు చేర్చారు.దీనికి నాటి నెహ్రూ సర్కార్‌ పూర్తి మద్దతు ఇచ్చింది, అధికారులను పంపి మరీ స్వాగత ఏర్పాట్లు చేసిందంటే అమెరికా సిఐఏతో సమన్వయం చేసుకోకుండా జరిగేది కాదు. అంతేనా మన దేశంలో ఆశ్రయం కల్పించటమే గాక తిరుగుబాటు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశమిచ్చింది. దీన్ని రెచ్చగొట్టటం, తమ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటంగా చైనా పరిగణించింది.1961లో ఉత్తర నేపాల్లోని ముస్టాంగ్‌కు సిఐఏ తన కార్యకలాపాలను విస్తరించింది. దలైలామా పరారీ తరువాత అరుణాచల్‌ప్రదేశ్‌లో చైనా మిలిటరీ మన సైనికుల మధ్య చిన్నపాటి ఘర్షణ జరిగింది.చైనాను నిలువరించాలని ప్రధాని నెహ్రూ నాటి సోవియట్‌ నేతలను కోరారు. అయితే తాము తటస్థంగా ఉంటామనే సందేశాన్ని వార్తల ద్వారా సోవియట్‌ పంపింది. తరువాత దాని నేత కృశ్చెవ్‌ 1959 అక్టోబరు రెండున బీజింగ్‌ పర్యటనలో నెహ్రూ మంచివాడని, భారత్‌తో వైరం వద్దని మావోకు సూచించటంతో ఈ వైఖరి చైనా-సోవియట్‌ మధ్య విబేధాలను పెంచింది. సరిహద్దు సమస్యలను పరిష్కరించుకుంటామని అది పెద్ద సమస్య కాదని, అసలు అంశం టిబెట్‌ అని ఈ విషయంలో భారత్‌తో రాజీపడేది లేదని మావో చెప్పినట్లు కథనాలు వచ్చాయి. దాని పర్యవసానాలు మనదేశంలో కూడా ప్రతిబింబించాయి. అవిభక్త కమ్యూనిస్టు పార్టీలోని ఒక వర్గం సోవియట్‌ వైఖరికి అనుగుణంగా నెహ్రూ అనుకూల, చైనా వ్యతిరేక వైఖరిని తీసుకుంది.దానికి భిన్నంగా సరిహద్దు వివాదాలను చర్చల ద్వారా సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలనే వైఖరిని మరో వర్గం తీసుకుంది. అందుకు వారిని జైలుపాలు చేశారు. తరువాత వారే సిపిఐ(ఎం)గా ఏర్పడ్డారు. నాటి నుంచి నేటి వరకు జరిగిన పరిణామాలు సిపిఐ(ఎం) వైఖరే సరైనదని రుజువు చేశాయి.సరిహద్దు వివాదం ఉన్నప్పటికీ కాంగ్రెస్‌, బిజెపి ఎవరు అధికారంలో ఉన్నా వాటి మీద ఎవరి వైఖరికి వారు కట్టుబడి ఉంటూనే చైనాతో సంబంధాలను కొనసాగించారు. ఏ ప్రధానీ కలవనన్ని సార్లు చైనా నేతలతో భేటీ అయి నరేంద్రమోడీ ఒక రికార్డు సృష్టించారు.చైనా నుంచి చేసుకుంటున్న దిగుమతులలో మోడీ తన రికార్డును తానే బద్దలు కొట్టుకున్నారు.

అసలు రెండు దేశాల మధ్య యుద్దానికి దారితీసిన పరిస్థితి ఏమిటి ? తెరవెనుక అమెరికా సృష్టించిన టిబెట్‌ చిచ్చుకాగా బయటికి సరిహద్దు వివాదంగా ముందుకు వచ్చింది.1954లో చైనా-భారత్‌ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదు. అయితే అప్పటికే అమెరికా కుట్ర మొదలైంది. దాన్లో భాగంగా బుద్ద జయంతిని జరుపుకొనే పేరుతో 14వ దలైలామా భారత్‌ వచ్చాడు. ఆ సందర్భంగా అంగీకరిస్తే భారత్‌లో ఆశ్రయం పొందుతానని చేసిన వినతిని నెహ్రూ తిరస్కరించారు. కానీ అదే నెహ్రూ సిఐఏ పధకం ప్రకారం టిబెట్‌ నుంచి పారిపోయి 1959 ఏప్రిల్‌ 18న అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తేజ్‌పూర్‌ చేరుకున్న దలైలామాకు మానవతాపూర్వక కారణాల సాకుతో ఆశ్రయం ఇవ్వటమేగాక ప్రవాస ప్రభుత్వ ఏర్పాటుకూ అనుమతించించారు. వేలాది మంది టిబెట్‌ నుంచి వచ్చిన వారికీ ప్రభుత్వం ఆశ్రయం కల్పించింది. కాలనీలను ఏర్పాటు చేసింది. ఇప్పటికీ అదే కొనసాగుతోంది.సరిహద్దులో మన ప్రభుత్వం 1961 కొన్ని పోస్టులను కొత్తగా ఏర్పాటు చేసి ఆ ప్రాంతం తమ అదుపులోనే ఉందని ఉద్ఘాటించింది. అప్పటికే దలైలామా ప్రవాస ప్రభుత్వం చైనా వ్యతిరేక కార్యకలాపాలను సాగిస్తోంది.దీనికి తోడు సరిహద్దుల్లో కొత్తగా పోస్టులను ఏర్పాటు చేయటాన్ని అవకాశంగా తీసుకొని చైనా వాటిని తొలగించేందుకు పూనుకోవటం, మన మిలిటరీ ప్రతిఘటించటంతో అది తరువాత నెల రోజుల యుద్ధంగా మారింది.

అరుణాచల్‌ ప్రదేశ్‌ మహిళ ప్రేమా వాంగ్‌జోమ్‌ థోంగ్‌డాక్‌ దగ్గర ఉన్న పాస్‌పోర్టు చెల్లదంటూ షాంఘై పుడోంగ్‌ విమానాశ్రయ అధికారులు కొన్ని గంటల పాటు నిలిపివేశారంటూ వచ్చిన వార్తలకు మన మీడియా పెద్ద ఎత్తున ప్రచారమిచ్చిన సంగతి తెలిసిందే.మనదేశం, చైనాల మధ్య సరిహద్దులంటూ మాపులపై బ్రిటీష్‌ అధికారులు గీచిన రేఖలు రెండు దేశాల మధ్య వివాదాన్ని సృష్టించాయి. వివిధ సందర్భాలలో ప్రచురించిన మాప్‌ల ప్రకారం ప్రస్తుతం మన దేశంలో అంతర్భాగంగా ఉన్న అరుణాచల్‌ ప్రదేశ్‌ చైనాకు చెందినది, చైనా ఆధీనంలో ఉన్న లడఖ్‌ సమీపంలోని ఆక్సారుచిన్‌ ప్రాంతం మనదిగా చూపాయి. అందువలన రెండుదేశాలూ అవి తమ ప్రాంతాలని మాపుల్లో చూపుతున్నాయి. అరుణాచల్‌ తమ టిబెట్‌లోని దక్షిణ ప్రాంతమైన జాంగ్‌నాన్‌ అని చెబుతుండగా ఆక్సారు చిన్‌ మా లే (లడఖ్‌) జిల్లాలో భాగమని అంటున్నాము. దలైలామా 2023లో తవాంగ్‌ పర్యటన చేస్తామని ప్రకటించగా అనుమతించకూడదంటూ నాడు చైనా అభ్యంతరం చెప్పింది.అంతకు ముందు కూడా అభ్యంతరాల మధ్య పర్యటించినా చివరిసారిగా గాల్వన్‌ ఉదంతాల తరువాత ఏర్పడిన పరిస్థితుల నేపధ్యంలో పర్యటనను రద్దు చేసుకున్నాడు. అరుణాచల్‌ ప్రదేశ్‌-భారత్‌ పేరుతో ఉన్న పాస్‌పోర్టు, వీసాలను చైనా తిరస్కరించటం ఇదే మొదటిసారి కాదు. పాస్‌పోర్టు మీద స్టాంప్‌ వేయటానికి నిరాకరించి ఒక తెల్లకాగితం మీద అనుమతి పత్రాన్ని జారీ చేస్తామని చైనా చెప్పింది. దానికి నిరాకరించిన మనదేశం చైనాలో జరిగిన ఆసియా క్రీడలకు మన క్రీడాకారులను పంపలేదు. తాజాగా ప్రేమ అనే మహిళ విషయంలో కూడా అదే జరిగింది, మీరు భారతీయురాలు కాదు, చైనీస్‌ అందువలన వీసా కోసం దరఖాస్తు చేసుకోండి అని చైనా అధికారులు చెప్పినట్లు వార్తలు వచ్చాయి.

చిత్రం ఏమిటంటే మన దేశంలో ఆశ్రయం పొంది,ప్రవాస టిబెట్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 1959 నుంచి అన్ని సౌకరాలను అనుభవిస్తున్న 14వ దలైలామా 2003లో మాట్లాడుతూ అరుణాచల్‌ ప్రదేశ్‌ టిబెట్‌లో అంతర్భాగం అన్నాడు తప్ప మనదేశంలో భాగం అని గుర్తించలేదు. అయినప్పటికీ అతగాడికి సౌకర్యాలు కల్పించటం రాజకీయం తప్ప వేరు కాదు. మనదేశం తెచ్చిన వత్తిడి, విధిలేని పరిస్థితిలో 2008లో తన వైఖరిని మార్చుకున్నాడు. 1914లో బ్రిటీష్‌ వారు గీచిన మక్‌మోహన్‌ రేఖను భారత్‌-టిబెట్‌ సరిహద్దుగా నిర్ణయిస్తూ బ్రిటీష్‌ ఇండియా పాలకులు టిబెట్‌ పాలకులతో సిమ్లాలో ఒప్పందం చేసుకున్నారు.బ్రిటీష్‌ వారి పాలనకు చరమగీతం పాడారు, దాంతో ఉక్రోషం పట్టలేని బ్రిటన్‌ కుట్రకు తెరలేపింది. అప్పుడే స్వాతంత్య్రం పొందిన చైనాకు టిబెట్‌ మీద హక్కులేదని చెప్పేందుకు బ్రిటీష్‌ పాలకులు పన్నిన కుట్రలో భాగం సిమ్లా ఒప్పందమంటూ నాటి, నేటి చైనా ప్రభుత్వం అంగీకరించలేదు. టిబెట్‌ తమ సామంత దేశమని అంతర్జాతీయ ఒప్పందాలు చేసుకొనేందుకు దాని పాలకులకు హక్కు లేదు, చెల్లదని చైనా చెబుతున్నది. ఉదాహరణకు, బ్రిటీష్‌ పాలనలో సామంత రాజ్యాలుగా ఉన్న కాశ్మీరు, నిజాం సంస్థానాలు స్వాతంత్య్రం ప్రకటించుకోవటాన్ని నాడు మన కేంద్ర ప్రభుత్వం అంగీకరించలేదు. ఈ పూర్వరంగంలో సరిహద్దు వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవటం తప్ప దగ్గరదారి లేదు. అప్పటి వరకు యథాతధ స్థితి కొనసాగించాల్సి ఉంది. రెండు దేశాలూ ఎవరి వైఖరికి వారు కట్టుబడి ఉన్నప్పటికీ సాధారణ సంబంధాలకు ఢోకా ఉండదు. వివాదాన్ని కాలమే పరిష్కరించాల్సి ఉంది. యుద్ధాల ద్వారా ప్రాంతాలను స్వాధీనం చేసుకోవటం కుదిరే అంశం కాదు. ఆక్రమిత కాశ్మీరుపై మనకు తిరుగులేని హక్కు ఉంది, ఎలాంటి వివాదం లేకున్నా బలప్రయోగంతో స్వాధీనం చేసుకొనేందుకు పూనుకోలేదు. చైనా గురించి న్యూయార్క్‌ టైమ్స్‌ వంటి అమెరికా బడా పత్రికలు అనేక తప్పుడు వార్తలు ఇచ్చాయి. మీడియాలో వచ్చే వార్తలు, వ్యాఖ్యలు లేదా అధికారంలో లేని సంస్థలు, వ్యక్తులు చేసే వ్యాఖ్యలు, రెచ్చగొట్టే అంశాలకు రెండు దేశాలకు చెందిన పౌరులు భావోద్వేగాలకు గురైతే బుర్రలు ఖరాబు చేసుకోవటం తప్ప జరిగేదేమీ ఉండదు. వివాదాలు పభుత్వాలు తేల్చాల్సిన, తేల్చుకోవాల్సిన అంశాలని గ్రహించాలి !

Share this:

  • Tweet
  • More
Like Loading...

అమెరికాకు చెంపపెట్టు – 2025 జి20 సభ !

26 Wednesday Nov 2025

Posted by raomk in Africa, CHINA, Current Affairs, Europe, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

2025 G20 Summit, Donald trump, G20 Johannesburg meet, Narendra Modi

ఎం కోటేశ్వరరావు

అమెరికా జి20 సదస్సును బహిష్కరించటమంటే ప్రపంచ ఆర్థిక ఆకర్షణ శక్తి వేరేవైపు మరలుతున్నదనేందుకు సూచిక అని కెనడా ప్రధాని మార్క్‌ కార్నే చెప్పాడు. ప్రపంచ రాజకీయాలలో కెనడా అమెరికా అనుయాయిగా ఉంటున్నది, కొన్ని సందర్భాలలో విబేధిస్తున్నది. నవంబరు 22,23వ తేదీలలో దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన 2025 సంవత్సర జి20 శిఖరాగ్ర సమావేశంలో కార్నే చేసిన ప్రసంగంలో ఈ వ్యాఖ్య చేశాడు. దీన్నే మరోవిధంగా చెప్పాలంటే అమెరికా కోడి కూయనంత మాత్రాన తెల్లవారకుండా ఉండదన్నాడు..” సంఘీభావం, సమానత్వం, సుస్థిరత ” అనే ఇతివృత్తంతో ఈ సమావేశం జరిగింది. ఐరాస నిర్దేశించిన 2030 నాటికి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు ఇంకా కేవలం ఐదు సంవత్సరాలు మాత్రమే వ్యవధి ఉన్న తరుణంలో ఈ సమావేశం జరిగింది. ఈ సదస్సును డోనాల్డ్‌ ట్రంప్‌ బహిష్కరించటమేగాక సమావేశ ప్రకటనను ఆమోదించవద్దంటూ ముందే అధ్యక్ష స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికాను బెదిరించాడు. వచ్చే ఏడాది జరిగే సదస్సుకు ఆతిధ్యం ఇచ్చే సభ్యదేశంగా, అధ్యక్ష స్థానాన్ని స్వీకరించాల్సి ఉండి కూడా ఒక చిన్న అధికారిని పరిశీలకుడిగా పంపాడు. బాధ్యతలను స్వీకరించే సాంప్రదాయ కార్యక్రమానికి కూడా రాకుండా దక్షిణాఫ్రికాను అవమానించాడు. ఈ ఏడాది మే నెలలో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రమాఫోసాను అమెరికా అధ్యక్ష భవనంలో మీడియా ముందే ట్రంప్‌ అవమానించాడు. తెల్లజాతీయుల ఆధీనంలోని భూములను స్వాధీనం చేసుకుంటున్న ఆఫ్రికన్ల వీడియోను చూపి ఇది శ్వేతజాతీయుల మారణకాండ అంటూ ట్రంప్‌ రచ్చ చేశాడు. అప్పటి నుంచి కక్షకట్టినట్లుగా ప్రవర్తిస్తున్నాడు. వారి విధానాలు తనకు నచ్చటం లేదని అందువలన అక్కడ జరిగే జి20సమావేశాలకు వెళ్లటం లేదని జూలైలోనే ప్రకటించాడు. దక్షిణాఫ్రికా వస్తువులపై గరిష్టంగా 30శాతం పన్నులను విధిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దౌత్యమర్యాదలను తుంగలో తొక్కిన డోనాల్డ్‌ ట్రంప్‌ చర్య పర్యవసానాల గురించి అనేక విశ్లేషణలు వెలువడుతున్నాయి.

ఒక సభ్యదేశమై ఉండి నిజంగా ప్రాతినిధ్యం వహించాలని అనుకుంటే సరైన స్ధాయి ఉన్న ఎవరినైనా పంపవచ్చు, ఇది అధినేతల సమావేశం, సరైన స్థాయి అంటే తన ప్రతినిధిగా ప్రత్యేకంగా ఆయా దేశాల అధ్యక్షులు, ప్రధానులు పంపవచ్చు గాని అమెరికా చేసింది ఏమాత్రం సమర్ధనీయం కాదని దక్షిణాఫ్రికా విదేశాంగ మంత్రి రోనాల్డ్‌ లామోలా విమర్శించాడు. శతాబ్దాల తరబడి మైనారిటీ శ్వేతజాతీయులు దక్షిణాఫ్రికాలో సాగించిన జాత్యహంకార పాలన, ఆఫ్రికన్ల అణచివేత, బంటూస్థాన్‌(మన దళితవాడల వంటివి)లకే వారిని పరిమితం చేయటం వంటి దుర్మార్గం గురించి తెలిసిందే.1994లో ఆ పాలన అంతమైన తరువాత ఇన్నేండ్లకు అక్కడి శ్వేతజాతి రైతులను ప్రభుత్వం అణచివేస్తున్నదంటూ ట్రంప్‌ ఈ సమావేశాలను బహిష్కరించటం ఒక సాకు తప్ప మరొకటి కాదు.శ్వేత జాతీయుల మారణకాండ అని కూడా వర్ణించాడు. బహిష్కరించటమేగాక అమెరికా ఎదురుదాడికి దిగింది. అధ్యక్ష భవనపు మీడియా కార్యదర్శి కరోలిన్‌ లీవిట్‌ మాట్లాడుతూ దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్‌ రమాఫోసా తమ దేశ అధ్యక్షుడిపై నోరుపారవేసుకుంటున్నట్లు ఆరోపించింది.వాతావరణ మార్పు, ప్రపంచ సంపద అసమానతల వంటివాటిపై దక్షిణాఫ్రికా కేంద్రీకరించి సదస్సు ప్రకటనలో వాటిని ప్రస్తావించటాన్ని అమెరికా తట్టుకోలేకపోయినట్లు వార్తలు వచ్చాయి.తాము సమావేశాన్ని బహిష్కరించటమేగాక సదస్సు ప్రకటన వెలువడకుండా అడ్డుకుంటామని అమెరికా బెదిరించింది.తమ అంగీకారం లేకుండా ప్రకటన ఎలా చేస్తారని ప్రశ్నించింది. అమెరికా వైఖరిని ఒక్క అర్జెంటీనా తప్ప ఐరోపా, ఇతర ఖండాల దేశాలేవీ ఆమోదించలేదు. అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్‌ మిలి డోనాల్డ్‌ ట్రంప్‌ అనుయాయి, అతగాడు కూడా ప్రకటనను వ్యతిరేకించి సదస్సును బహిష్కరించాడు. దక్షిణాఫ్రికా అమెరికా ప్రయోజనాలకు వ్యతిరేకంగా పని చేస్తున్నదని, అక్రమవాణిజ్య పద్దతులను అనుసరిస్తున్నదని పాలస్తీనా మీద గట్టి వైఖరి తీసుకోవటమే గాక చైనా, రష్యాలతో కలుస్తున్నదని కూడా అమెరికా దాడి చేస్తున్నది. ఆర్థిక అసమానతల గురించి తక్షణమే చర్చించాల్సిన అవసరం ఉందని ప్రపంచ నేతలు గుర్తించిన తొలి సమావేశం ఇదని ఆక్స్‌ఫాం సంస్థ ప్రతినిధి మాక్స్‌ లాసన్‌ వ్యాఖ్యానించాడు.

ప్రపంచంలో అనేక కూటములు ఉన్నాయి. అవి సమావేశాలు జరపటం, సంకల్పాలు చెప్పుకోవటం, తీర్మానాలు ఆమోదించటం తప్ప సభ్య దేశాలకు వాటిని పాటించాల్సిన విధి లేదు. అలాంటి వాటిలో ఒకటి జి20. దీనిలో అర్జెంటీనా,ఆస్ట్రేలియ,బ్రెజిల్‌, కెనడా, చైనా,ఫ్రాన్సు, జర్మనీ, భారత్‌, ఇండోనేషియా, ఇటలీ, జపాన్‌, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, దక్షిణ కొరియా, టర్కీ, బ్రిటన్‌, అమెరికా దేశాలతో పాటు ఐరోపా యూనియన్‌, ఆఫ్రికా యూనియన్‌ సభ్యులుగా ఉన్నాయి. ఆహ్వానితులుగా నెదర్లాండ్స్‌, స్పెయిన్‌, ఐరాస, ప్రపంచ బ్యాంకు, ఆసియన్‌ కూటమి ఉంది. ఆఫ్రికా ఖండం నుంచి దక్షిణాఫ్రికా ఒక్కటే ఈ కూటమిలో ఉంది. తొలిసారిగా ఆఫ్రికా గడ్డమీద సదస్సు జరిగింది. జి20లోని సభ్య దేశాలు (ఐరోపా, ఆఫ్రికా యూనియన్లు మినహా) ప్రపంచ జిడిపిలో 85,అంతర్జాతీయ వాణిజ్యంలో 75, జనాభాలో 56, భూమిలో 60శాతం కలిగి ఉన్నాయి. అందువలన పరోక్షంగా ఈ దేశాల మీద ప్రభావం చూపేందుకు పెద్ద దేశాలన్నీ ప్రయత్నిస్తాయని వేరే చెప్పనవసరం లేదు. జోహన్నెస్‌ సభకు మన ప్రధాని నరేంద్రమోడీ హాజరై అన్ని ముఖ్య సమావేశాల్లో పాల్గ్గొన్నారు. పలుదేశాల నేతలతో జరిపిన చర్చలు ఫలితాలను ఇచ్చేవిగా ఉన్నాయని చెప్పారు. చైనా ప్రతినిధిగా ఆ దేశ ప్రధాని లీ క్వియాంగ్‌ పాల్గొన్నాడు.

జి7 ధనిక దేశాలే కాలక్షేపపు కబుర్లకు పరిమితం అవుతున్నపుడు భిన్న ధృవాలుగా ఉన్న జి20 అంతకు మించి ఫలవంతమైన చర్చల వేదికగా మారుతుందన్న భ్రమలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆర్థిక అంశాల కంటే రాజకీయ పరమైనవాటికే జోహన్నెస్‌బర్గ్‌ సమావేశాల వేదిక నాంది పలికింది. సదస్సు తీర్మానం గురించి సంతకాలు చేయవద్దని ట్రంప్‌ చేసిన విన్నపాల రూపంలో ఉన్న ఆదేశాలను ఎవరూ ఖాతరు చేయలేదు. ఇది దక్షిణాఫ్రికా విజయాల్లో ఒకటి. ముప్పై పేజీలు, 122 పేరాల అంతిమ ప్రకటనలో అనేక అంశాలు ఉన్నాయి. అది సాధారణ ప్రకటనగానే చూసే వారికి అనిపిస్తుంది, నిజం కూడా. అసమానతలు, రుణభారం, కీలకమైన ఖనిజాలు, ఇంథనం, సమానత్వం, నిరంతర అభివృద్ధి, పర్యావరణం ఇలా లేని అంశం లేదు. ముందే చెప్పుకున్నట్లు వాటిని అమలు జరపాల్సిన విధి సభ్యదేశాలకు లేదు గానీ వాటిని విస్మరిస్తే కుదరదు అనే సందేశాన్ని ఈ సమావేశం ఇచ్చింది.అసమానతల గురించి సదస్సు ఆమోదించిన పత్రంలో అరవై కోట్ల మంది ఆఫ్రికన్లకు విద్యుత్‌ అందుబాటులో లేదని పేర్కొన్నారు.2030 నాటికి పునరుత్పత్తి ఇంథనాన్ని మూడు రెట్లు, ఇంథన సామర్ధ్యాన్ని రెండు రెట్లు పెంచాలని పేర్కొన్నారు. ఆఫ్రికా దేశాలకు సంబంధించిన అభివృద్ధి రుణాలు, రుణ భారం తదితర అంశాల గురించి పరస్పరం సమాచార మార్పిడి,రుణాలు ఇచ్చే దేశాలు, సంస్థల పట్ల ఎలా వ్యవహరించాలి అనే అంశాలను పరిశీలించేందుకు ఒక నిపుణుల కమిటీ నియామకం ఈ సందర్భంగా జరిగింది. ఆఫ్రికాలో అభివృద్ధికి దక్షిణాఫ్రికా చొరవ, కృషికి ఒక గుర్తింపు దక్కింది. రెండు రోజుల పాటు 130 వర్కింగ్‌ గ్రూప్‌ల సమావేశాలను సమర్ధవంతంగా నిర్వహించటంలో అక్కడి ప్రభుత్వ సామర్ధ్యం వెల్లడైంది.

జోహన్నెస్‌బర్గ్‌ సమావేశానికి ట్రంప్‌ గైరుహాజరు కావటంతో నాయకత్వ స్థానంలోకి వచ్చేందుకు చైనాకు అవకాశం వచ్చిందంటూ కొందరు విశ్లేషణలు చేస్తున్నారు. అమెరికా పలుకుబడి కోల్పోతున్నదనే ఉక్రోషం దీనిలో ఎక్కువగా కనిపిస్తున్నది.అమెరికా ఏకపక్ష వైఖరి, పెత్తందారీతనం కారణంగా అనేక ఆఫ్రికా దేశాలు ఇప్పటికే చైనా వైపు చూస్తున్నాయి. ట్రంప్‌ తాజా వైఖరులతో అది వేగం పుంజుకొనే అవకాశాలు ఉన్నాయి. ప్రభావం పెంచుకొనేందుకు అమెరికాయే చైనాకు అవకాశం ఇస్తున్నదని దానితో పాటు ఐరోపా సమాఖ్య కూడా అవకాశాన్ని వినియోగించుకోవచ్చని బక్‌నెల్‌ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌ ఝీక్విన్‌ ఝ చెప్పాడు. అమెరికా బహిష్కరించిన వెంటనే దాని స్థానంలో చైనా చేరే అవకాశం ఉండదని అయితే మరింత నమ్మకమైన భాగస్వామిగా తనను తాను ప్రదర్శించుకొనేందుకు దోహదం చేస్తుందని బ్రిటన్‌ ఆర్థికవేత్త జింగ్‌ గు చెప్పారు.అంతర్జాతీయ సంస్థలు, పశ్చిమ దేశాలు విధించే కఠినమైన షరతులు లేకుండా ఇప్పటికే అనేక దేశాల్లో వివిధ ప్రాజక్టులకు చైనా సాయం చేసింది. ఆఫ్రికా ఇంథన అవసరాలలో భాగంగా ఇటీవలి కాలంలో చైనా నుంచి 60శాతం సౌరపలకలను దిగుమతి చేసుకున్నారు. బహిష్కరణ రాజకీయాలు, బెదిరింపులు చెల్లవని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రమాఫోసా అమెరికాను నేరుగానే హెచ్చరించాడు. ఈ ఏడాది ఇప్పటివరకు జి20తో పాటు దక్షిణ కొరియాలో జరిగిన ఆసియా-పసిఫిక్‌ ఆర్థిక సహకార సంస్థ(ఎపెక్‌), బ్రెజిల్లో జరిగిన ఐరాస వావావరణ మార్పు సమావేశాన్ని అమెరికా బహిష్కరించింది. ఇలాంటపుడు ఇతర దేశాలు చైనా వైపు చూడటం సహజం.అంతే కాదు డోనాల్డ్‌ ట్రంప్‌ ఏకపక్షంగా విధించిన దిగుమతి సుంకాలు కూడా దేశాలను ఆలోచింపచేస్తున్నాయి. ఆఫ్రికాలోని 22 దేశాల దిగుమతులపై ఇప్పటి వరకు ఎలాంటి పన్నులు లేకపోగా ట్రంప్‌ ఇప్పుడు 15 నుంచి 30శాతం విధించాడు. తమతో దౌత్య సంబంధాలు కలిగిన అన్ని ఆఫ్రికా దేశాల సరకులపై ఎలాంటి పన్ను విధించబోమని ఎపెక్‌ సమావేశంలో చైనా నేత షీ జింపింగ్‌ ప్రకటించాడు. చైనా ప్రధాని లీ ఐరాస 80వ వార్షిక సమావేశాల్లో మాట్లాడుతూ వాతావరణ మార్పులను ఉమ్మడిగా ఎదుర్కోవాలని పిలుపు ఇవ్వగా డోనాల్డ్‌ ట్రంప్‌ పునరుత్పత్తి ఇంథనం గురించి అపహాస్యంగా మాట్లాడాడు. వచ్చే ఏడాది డిసెంబరులో జి20 సమావేశాలు అమెరికా ఫ్లోరిడా రాష్ట్రంలోని మియామీలో జరగనున్నాయి. ఈ మేరకు డోనాల్డ్‌ట్రంప్‌ గతంలోనే ప్రకటించాడు. ఇరవై సంవత్సరాల చరిత్రలో అమెరికాలో జరగటం ఇదే తొలిసారి. జోహన్నెస్‌ సమావేశాల సందర్భంగా అమెరికా అనుసరించిన వైఖరి వచ్చే ఏడాది సమావేశాలపై ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది. ప్రపంచ రాజకీయాలు అనూహ్య మలుపులు తిరుగుతున్న పూర్వరంగంలో అనేక దేశాలు దాన్ని బహిష్కరించినా ఆశ్చర్యం లేదు !

Share this:

  • Tweet
  • More
Like Loading...

పతన దిశగా ఉక్రెయిన్‌, లొంగిపోతున్న మిలిటరీ – పరారీ క్రమంలో జెలెనెస్కీ !

19 Wednesday Nov 2025

Posted by raomk in Current Affairs, History, imperialism, International, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, UK, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

#Ukraine Crisis, Donald trump, Ukraine, Ukrainian Troops Abandoning Front, Vladimir Putin, Zelensky

ఎం కోటేశ్వరరావు

నిజమే ! గతవారం రోజులుగా ఉక్రెయిన్‌ పోరులో చోటు చేసుకుంటున్న పరిణామాలు, పశ్చిమదేశాల నుంచి వస్తున్న వార్తలను చూస్తుంటే భయంకరమైన చలికాలం ముగిసేలోగా ఉక్రెయిన్‌ పతనం అవుతుందా ? చలికి తట్టుకోలేక ఉక్రెయిన్‌ సైన్యం తెల్లజెండా ఎత్తుతుందా ? ఉక్రెయిన్‌ మీద రష్యా ప్రారంభించిన మిలిటరీ చర్య మంగళవారం నాడు 1,363వ రోజులో ప్రవేశించింది. వేలాది మంది ఉక్రెయిన్‌ సైనికులు లొంగిపోతున్నట్లు వార్తలు, అధ్యక్షుడు వ్లదిమిర్‌ జెలెనెస్కీ విదేశాలకు పారిపోనున్నాడా అంటే మిన్నువిరిగి మీద పడే అనూహ్య పరిణామాలు జరిగితే తప్ప అందుకు అవకాశాలు లేకపోలేదని అనిపిస్తున్నది. గత కొద్ది వారాలుగా అనేక కీలక ప్రాంతాలను చక్రబంధంలో బిగించిన రష్యా ఒక్కో గ్రామం, ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకుంటున్నది. పోకరోవస్క్‌ అనే పట్టణంలోకి పుతిన్‌ సేనలు చొరబడ్డాయని ఏక్షణంలోనైనా స్వాధీనం చేసుకోవచ్చని వార్తలు. గత ఏడాదిన్నర కాలంగా ఆ పట్టణాన్ని పట్టుకొనేందుకు తీవ్ర ప్రయత్నం జరుగుతున్నది. అక్కడ ఉన్న దాదాపు ఐదువేల మంది ఉక్రెయిన్‌ మిలిటరీ కదలకుండా బందీ అయిందని, తెల్లజెండా ఊపిందని, పోరు సాగుతున్నదని భిన్నవార్తలు వచ్చాయి. వెలుపలి నుంచి వస్తున్న రష్యన్‌ సేనలను ప్రతిఘటిస్తున్నట్లు కనిపించటం లేదని, అయితే ఇండ్లు, బంకర్లలో ఉన్నవారి కారణంగా ఒక్కో ప్రాంతాన్ని జల్లెడ పట్టి ముందుకు పోతున్నారని, కొన్ని వారాల్లో పట్టణాన్ని స్వాధీనం చేసుకోవచ్చని చెబుతున్నారు.అది స్వాధీనమైతే అనేక కొత్త ప్రాంతాలను సులభంగా పట్టుకొనేందుకు వీలుకలుగుతుందని, సైనిక చర్య మరో మలుపు తిరుగుతుందని మిలిటరీ నిపుణులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో జరిపే పెద్ద దాడులకు సన్నాహాలలో భాగంగా ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో ఉన్న పోలాండ్‌లోని రైల్వేట్రాక్‌ను ధ్వంసం చేసినట్లు రష్యా మీద ఆరోపణలు వచ్చాయి. సోమవారం నాడు పోలాండ్‌ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ ఐరోపా దేశాల మీడియా రష్యా కారణమని చెబుతున్నది. ఇదే సమయంలో తాము ఒక పెద్ద సవాలును ఎదుర్కొంటున్నట్లు శుక్రవారం నాడు జెలెనెస్కీ కూడా అంగీకరించాడు. నాటో కూటమి దేశాలు ఇప్పటికీ పెద్ద మొత్తంలో సాయం అందిస్తున్నప్పటికీ అది వృధా అనే అభిప్రాయంతో నేతలు ఉన్నారు. ఉక్రెయిన్‌ ఇజ్‌మెయిల్‌ రేవు పట్టణం వద్ద ఉన్న టర్కీ ఎల్‌పిజి టాంకర్‌ షిప్‌పై జరిగినదాడిలో అది దగ్దమైంది.దాడి ఎవరు జరిపిందీ తేలనప్పటికీ రష్యా చేసిందని ఆరోపించారు. దాంతో పక్కనే ఉన్న రుమేనియాతన పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నది. పత్యక్షంగా పాల్గ్గొనేందుకు నాటో నేతలు విముఖత చూపుతున్నారు. గతంలో తగిలిన దెబ్బలతో తలబొప్పి కట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ నుంచి ఉక్రెయిన్‌ సమస్యపై ప్రస్తుతం కంటి చూపుతున్న నోటమాట లేదు.జెలెనెస్కీ పరిస్థితి ఎక్కే గుమ్మం దిగే గుమ్మంలా ఉంది.

దక్షిణ ఉక్రెయిన్‌లోని జపోరిఝఝియాలో మరికొన్ని ప్రాంతాలు రష్యా ఆధీనంలోకి వెళ్లాయి.ఈ ప్రాంతంలో పోరు దిగజారుతున్నదని జెలెనెస్కీ మిలిటరీ అధికారులే అంగీకరించారు.వ్యూహాత్మకంగా తమసేనలను వెనక్కు రప్పిస్తున్నట్లు చెప్పుకున్నారు.హంగరీ ప్రధాని విక్టర్‌ ఒర్బాన్‌ మాట్లాడుతూ ఉక్రెయిన్‌ గెలిచే అవకాశం లేదని, ఐరోపా ఆర్థికసాయం పిచ్చితనం తప్ప మరొకటి కాదన్నాడు. ఇప్పటికే 185బిలియన్‌ యూరోలు తగలేశామని, ఇంకా అంతకంటే ఎక్కువే తగేలేయాలని చూస్తున్నామని, ఎంత చేసినా గెలిచే అవకాశం లేదని జర్మన్‌ మీడియా గ్రూపు అక్సెల్‌ స్ప్రింగర్‌ సిఇఓతో మాట్లాడుతూ చెప్పాడు. యుద్ధ విమానాలు, గగనతల రక్షణ వ్యవస్థలు, క్షిపణుల కోసం జెలెనెస్కీ ప్రస్తుతం ఫ్రాన్సు పర్యటనలో ఉన్నాడు, రానున్న పది సంవత్సరాలలో 100 రాఫేల్‌ విమానాలను కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు వార్తలు వచ్చాయి. తరువాత స్పెయిన్‌ వెళతాడని వార్తలు.సరస్సులోని చేపలు పైకి వస్తే మింగివేసేందుకు సిద్దంగా ఉండే కొంగల మాదిరి క్రామాటోరస్క్‌ వంటి చోట్ల రష్యన్‌ లాన్సెట్‌ డ్రోన్లు దాడులకు సిద్దంగా ఉన్నాయని ఉక్రెయిన్‌ నిఘావర్గాలు హెచ్చరించాయి. ప్రతి రోజూ రష్యన్ల చేతిలో నరకం చూస్తున్నట్లు చెబుతున్నారు. సమీప భవిష్యత్‌లో రష్యాతో శాంతి చర్చలు, కాల్పుల విరమణ జరిగే అవకాశం లేదని మాస్కోతో 1,350 కిలోమీటర్ల సరిహద్దు ఉన్న ఫిన్లండ్‌ అధ్యక్షుడు అలెగ్జాండర్‌ స్టబ్‌ చెప్పాడు. సరిహద్దుల్లో ఉన్న పరిస్థితి గురించి తాను ట్రంప్‌తో మాట్లాడతానని, పది అంశాల్లో ఏ ఒక్కదానికి పుతిన్‌ అంగీకరించినా మంచిదే అన్నాడు. ఇటీవలనే ఫిన్లాండ్‌ నాటో కూటమిలో చేరిన సంగతి తెలిసిందే. రష్యా ఎత్తుగడలు ఏమిటో తమకు బాగా తెలుసని స్టబ్‌ చెప్పాడు.

ఉక్రెయిన్‌ సేనలు యుద్ద రంగం నుంచి పారిపోతున్న వార్తలు గతంలోనే వచ్చినప్పటికీ ఇటీవలి కాలంలో ఎక్కువగా ఉన్నాయి. వివాదం ప్రారంభమైన 2022 ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు చూస్తే పశ్చిమ దేశాల మీడియా వార్తల ప్రకారం అక్టోబరు నెలలో 21వేల మంది పారిపోయారు. రష్యాపై తాము విజయం సాధించబోతున్నామని జెలెనెస్కీ ఎన్ని కబుర్లు చెప్పినా, ఇతర దేశాలు ఇచ్చిన కొన్ని ఆధునిక ఆయుధాలు, సమాచారం ఆధారంగా రష్యాలోని కొన్ని ప్రాంతాలపై దాడులు చేసిన తరువాత ఇలా జరగటం, అదీ పశ్చిమ దేశాల మీడియా వెల్లడించట గమనించాల్సిన అంశం. నిజానికి ఈ సంఖ్య ఇంకా ఎక్కువ ఉండవచ్చని ఇటీవలి వరకు ఉక్రెయిన్‌ మిలిటరీలో పనిచేసిన ఇగోర్‌ లుస్టెంకో చెబుతున్నాడు. మిలిటరీ ఇలాంటి అంశాలను బయటకు రాకుండా చూస్తుందని వేరే చెప్పనవసరం లేదు.అధికారిక సమాచారం ప్రకారమే అక్టోబరులో 21,602 మంది పారిపోయారు, వాస్తవంలో ఎక్కువ మంది ఉంటారని లుస్టెంకో చెప్పినట్లు మీడియా పేర్కొన్నది. ఇటీవలి కాలంలో రష్యన్‌ సేనలు మరిన్ని ప్రాంతాలను తమ ఆధీనంలోకి తెచ్చుకోవటానికి ఇది కూడా ఒక కారణంగా చెబుతుండగా, తాము గెలిచే అవకాశం లేదని ఉక్రెనియన్లు భావించటంతో పోరాడటం, ప్రాణాలు పోగొట్టుకోవటంలో అర్దం లేదని అనేక మంది భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.

ఇటీవల ఒక బ్రిటీష్‌ పత్రిక చేసిన విశ్లేషణ ప్రకారం ఆరున్నర లక్షల మంది మిలిటరీలో చేరి పోరాడగలిగిన వయస్సున్నవారు ఉక్రెయిన్‌ వదలి పారిపోయారు. ఆ దేశ పార్లమెంటు సభ్యుడొకరు నాలుగు లక్షలని చెప్పాడు.మిలిటరీ నుంచి పారిపోతున్నవారి గురించి 2024 డిసెంబరులో ఫైనాన్సియల్‌ టైమ్స్‌ ఇచ్చిన సమాచారం ప్రకారం అంతకు ముందు రెండు సంవత్సరాలతో పోలిస్తే ఆ ఏడాది రెండింతలున్నారు.బ్రిటీష్‌ పత్రిక టెలిగ్రాఫ్‌ ఇటీవల ఇచ్చిన విశ్లేషణ ప్రకారం ప్రతి నెల పారిపోతున్న లేదా విధులకు చెప్పకుండా గైరుహాజరవుతున్నవారి సంఖ్య ఇరవైవేలు ఉంటున్నది. పారి పోయిన వారి మీద 2.9లక్షల కేసులను ప్రభుత్వం నమోదు చేసింది.ఇప్పుడు కనీసం రెండు లక్షల మంది కొరత వున్నట్లు అంచనా. అనేక మంది మాజీ, ప్రస్తుత అధికారులను ఉటంకిస్తూ ఆ పత్రిక ఈ విషయాలను రాసింది. పోరు జరుగుతున్న ప్రాంతాలలో ఉన్నవారిలో కేవలం 30శాతం మందే యుద్ద సన్నద్దతతో ఉన్నారు. సెప్టెంబరు నెలలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ మాట్లాడుతూ ఉక్రెయిన్‌ సేనలలో కేవలం 47-48శాతానికి మించి లేరని చెప్పాడు. సైనికుల కొరత ఉన్నవారి మీద వత్తిడిని కూడా పెంచుతున్నది.వారినే ఒక రంగం నుంచి మరో రంగానికి పదే పదే మారుస్తున్నారు. నిరంతర దాడులను తట్టుకొనే శక్తి తగ్గుతున్నదని ఉక్రెయిన్‌ మిలిటరీ అధికారులు వాపోతున్నారు. కొత్తగా సైన్యంలోకి తీసుకున్నవారికి కూడా తగిన శిక్షణ ఇవ్వకుండా యుద్ద రంగానికి తరలిస్తున్నారు.గ్రామాల నుంచి మిలిటరీలోకి తీసుకున్నవారిలో కొందరికి కేవలం రెండు రోజులు మాత్రమే శిక్షణ ఇచ్చి యుద్ధ రంగానికి పంపుతున్నట్లు వాషింగ్టన్‌ పోస్టు పేర్కొన్నది. యుద్ధం జరిగిన సమయాల్లో ఏ పక్షమైనా తమకు జరిగిన నష్టాన్ని మూసిపెడుతుంది.వర్తమాన పోరులో రష్యా, ఉక్రెయిన్‌ గురించి కూడా అలాంటి వార్తలే వచ్చాయి. ఈ ఏడాది ఆగస్టులో వెల్లడైనట్లు చెబుతున్న ఒక పత్రం ప్రకారం 17లక్షల మంది ఉక్రేనియన్‌ సైనికులు మరణించారన్నది అతిశయోక్తితో కూడినదిగా ఉన్నప్పటికీ పెద్ద సంఖ్యలో ఉంటారన్నది వాస్తవం. మిలిటరీ నుంచి పారిపోవటం పెరగటానికి ఇవి కూడా కారణం.

అనేక చోట్ల ఉక్రెయిన్‌ సేనల లొంగుబాటు, రష్యా ఆధీనంలోకి పలు ప్రాంతాలు పోతున్నట్లు వచ్చిన వార్తల నేపధ్యంలో జెలెస్కీ బ్రిటన్‌ పారిపోయేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు, ఉక్రెయిన్‌ గగనతలంపై విమానాలు ఎగరటం ప్రమాదకరంగా ఉండటంతో పక్కనే పోలాండ్‌లో విమానాన్ని సిద్దంగా ఉంచుకున్నట్లు వార్తలు వచ్చాయి. జెలెనెస్కీ ఏ ఐరోపా దేశానికి వెళుతున్నా కూడా చివరి నిమిషం వరకు గోప్యంగా ఉంచుతున్నారు. భద్రతా కారణాల రీత్యా తమదేశ పర్యటన గురించి వివరాలను వెల్లడించలేమని స్పెయిన్‌ ప్రధాని కార్యాలయం పేర్కొన్నట్లు రేడియో వెల్లడించింది. అయితే జెలెనెస్కీ సోమవారం నాడు ఫ్రాన్సు వెళ్లాడు. మరో వైపున అతగాడి స్థానంలో ఎవరిని గద్దెనెక్కించాలా అని ఆరునెలలుగా డోనాల్డ్‌ ట్రంప్‌ కసరత్తు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. దానిలో భాగంగానే ఇంథన ఒప్పందాలలో జెలెనెస్కీకి పది కోట్ల డాలర్ల లంచం ముట్టినట్లు, దాని గురించి దర్యాప్తు జరుగుతున్నదనే వార్తలు వచ్చాయి. అనేక దేశాల్లో ఎవరినైనా సాగనంపాలనుకున్నపుడు ఇలాంటి వాటిని ముందుకు తెచ్చి రంగం సిద్దం చేసే సంగతి తెలిసిందే. జెలెనెస్కీ పారిపోయేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు రష్యన్‌ వర్గాలు కూడా చెబుతున్నాయి. బ్రిటన్‌ ఆశ్రయం ఇచ్చేందుకుసిద్దంగా ఉన్నప్పటికీ అక్కడ ఎంతకాలం ఉంటారన్న విశ్లేషణ కూడా సాగుతున్నది. ఇప్పటికే బ్రిటన్‌లో భవనాలను కొనుగోలు చేశాడని, రాజు చార్లెస్‌తో సంబంధాలలో ఉన్నట్లు చెబుతున్నారు. వచ్చే ఏడాది నవంబరులో జరిగే అమెరికా పార్లమెంటు మధ్యంతర ఎన్నికల నాటికి డెమోక్రటిక్‌ పార్టీ నేతలను ఇబ్బందులకు గురి చేసేందుకు గాను దాఖలు చేసే కేసులలో జెలెనెస్కీని సాక్షిగా చేసేందుకు చూస్తున్నట్లు, దానికి గాను పారిపోతే బ్రిటన్‌ నుంచి రప్పిస్తారని కూడా చెబుతున్నారు.మరొక దేశం ఇజ్రాయెల్‌ వెళ్లినా అదే జరుగుతుంది. కీలకమైన పోకరోవస్క్‌ పట్టణం పతనమైన తరువాత ఇలాంటి పరిణామం జరుగవచ్చని భావిస్తున్నారు. జెలెనెస్కీ పర్సుగా పరిగణిస్తున్న ఒక టీవీ కార్యక్రమాల స్టూడియో యజమాని తైముర్‌ మిండిచ్‌ మీద ఇప్పుడు జాతీయ అవినీతి నిరోధకశాఖ దర్యాప్తు జరుపుతున్నది. మాజీ ఉప ప్రధాని, ప్రస్తుతం జాతీయ ఐక్యత శాఖ మంత్రిగా ఉన్న ఒలెక్సీ గురించి కూడా దర్యాప్తు జరుగుతున్నది. జెలెనెస్కీ పదవీ కాలం ముగిసింది. పోరు సాగుతున్నదనే పేరుతో పదవిలో కొనసాగుతున్నాడు, ఉక్రెయిన్‌కు తగులుతున్న ఎదురుదెబ్బల పూర్వరంగంలో అతగాడిని బలిపశువుగా చేసి కొత్త బొమ్మను గద్దె నెక్కించి కాలం గడిపేందుకు అమెరికా, ఇతర నాటో దేశాలు చూస్తున్నట్లు కనిపిస్తున్నది. అక్కడ ఎవరు గద్దె నెక్కినా రష్యాకు వ్యతిరేకంగా నాటో దేశాల కుట్రలకు తెరపడితే తప్ప ప్రయోజనం ఉండదు !

Share this:

  • Tweet
  • More
Like Loading...

ప్రభుత్వ మూత సామాన్యులకే సంకటం : తన రికార్డును తానే బద్దలు కొట్టుకున్న ట్రంప్‌ !

12 Wednesday Nov 2025

Posted by raomk in Current Affairs, Economics, History, INTERNATIONAL NEWS, USA

≈ Leave a comment

Tags

Donald trump, Donald Trump Failuer, US Shutdown 2025

ఎం కోటేశ్వరరావు

అక్టోబరు ఒకటవ తేదీ నుంచి అమెరికాలో కొనసాగుతున్న ఫెడరల్‌ ప్రభుత్వ మూత (షట్‌డౌన్‌)ను ఎత్తివేసేందుకు ఆదివారం నాడు నాంది పలికారు.మూత 41వ రోజు సోమవారం నాడు ఎనిమిది అంశాలపై పార్లమెంటు ఎగువ సభ సెనెట్‌లో తీర్మానాలు ఆమోదం పొందాయి.బుధవారం నాడు ప్రజాప్రతినిధుల సభ కాంగ్రెస్‌ ముందుకు వచ్చిన తరువాత చేసే తీర్మానంతో అధికారికంగా ప్రభుత్వ మూతకు తెరపడుతుందని భావిస్తున్నారు. గతంలో తొలిసారి అధికారానికి వచ్చినపుడు 2019లో 35 రోజుల పాటు మూత తరువాత తన రికార్డును ట్రంప్‌ బద్దలు కొట్టాడు. రారాజునంటూ దిగిరానని బెట్టు చేసిన డోనాల్డ్‌ ట్రంప్‌ మెట్టుదిగటంతో జనవరి 31వరకు ప్రభుత్వానికి అవసరమైన నిధులను పొందేందుకు వీలుగా సెనెట్‌ 60-40 ఓట్లతో ఆదివారం నాడు ఒక తీర్మానాన్ని ఆమోదించింది. జనవరి ఒకటవ తేదీతో ముగియనున్న ఆరోగ్య సంరక్షణ సబ్సిడీ పథకాన్ని కొనసాగించేందుకు ట్రంప్‌ అంగీకరించటంతో ప్రతిపక్ష డెమోక్రాటిక్‌ పార్టీకి చెందిన ఎనిమిది మంది సెనెట్‌ సభ్యులు మద్దతు ఇవ్వటంతో సర్కార్‌ గట్టెక్కింది.కుదిరిన ఒప్పందానికి తాను కట్టుబడి ఉంటానని ట్రంప్‌ ప్రకటించాడు. ఈ సమస్య ప్రతిపక్ష డెమొక్రటిక్‌ పార్టీలో టీకప్పులో తుపాను వంటి చిచ్చు రేపింది. ఎనిమిది మంది సభ్యులను డోనాల్డ్‌ ట్రంప్‌ ” ఆకర్షించి ” మూత ఎత్తివేతకు మద్దతు పలికించినట్లు చెప్పవచ్చు. అసలు ఈ ప్రభుత్వ మూత అంటే ఏమిటి ? దాని పర్యవసానాలేమిటో చూద్దాం. మూత కారణంగా రోజుకు 17 బిలియన్‌ డాలర్ల చొప్పున అప్పు పెరుగుతున్నదని, వారానికి 14 బిలియన్‌ డాలర్ల మేర నష్టమని అంచనాలు వెలువడ్డాయి. అయితే ఈ అంచనాలు లెక్కించే పద్దతి, పరిగణనలోకి తీసుకొనే అంశాలు ఒకటే కాకపోవటంతో భిన్నమైన అంకెలు మీడియాలో వచ్చాయి. వాటిని చూసి గందరగోళపడాల్సిన అవసరం లేదు, నష్టమైతే వాస్తవం.

ప్రతిదేశంలో బడ్జెట్లకు పార్లమెంట్ల ఆమోద ముద్ర పడితేనే నిధుల విడుదలకు అవకాశం ఏర్పడుతుంది. మనదేశంలో ఏప్రిల్‌ నుంచి మార్చి నెల వరకు ఆర్థిక సంవత్సరం,అత్యధిక దేశాల్లో జనవరి నుంచి డిసెంబరు వరకు ఉంటుంది. మార్చి 31వ తేదీలోగా ద్రవ్యబిల్లుకు ఆమోదం తెలపకపోతే ఏప్రిల్‌ ఒకటి నుంచి ఖజానా నుంచి నిధుల విడుదల ఆగిపోతుంది. అమెరికాలో అది జనవరి ఒకటి నుంచి జరుగుతుంది. అయితే ఇది పౌరకార్యకలాపాలకు తప్ప మిలిటరీ వంటి అత్యవసర సేవలకు వర్తించదు.1980దశకం నుంచి కొన్ని శాఖలకు తగినన్ని నిధులు కేటాయించటంలో తలెత్తిన సమస్యల కారణంగా ఇప్పటి వరకు 21సార్లు ప్రభుత్వ మూతలకు దారితీశాయి. ప్రారంభంలో కొద్ది గంటలతో మొదలై ఇప్పుడు వారాల తరబడి కొనసాగుతున్నది.ప్రారంభంలో ఈ మూతల కాలంలో ప్రభుత్వ ఉద్యోగులపై ఎలాంటి చర్యలు ఉండేవి కాదు, ఇటీవలి 11 మూతల సమయంలో వారిపై వేటు పడటం సాధారణంగా మారింది.సామాన్యులకు ఇబ్బందులు కలుగుతున్నాయి.అమెరికా-మెక్సికో సరిహద్దులో ఇనుప గోడ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలన్న డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రతిపాదనకు వ్యతిరేకత వ్యక్తం కావటంతో 2018-19లో 35 రోజులు, అంతకు ముందు వివిధ సంక్షేమ పధకాలకు కోతలను ప్రతిపాదించటంతో బిల్‌క్లింటన్‌ ఏలుబడిలో 21, ఆరోగ్య సంక్షేమానికి సబ్సిడీలను పెంచాలన్న బరాక్‌ ఒబామా ప్రతిపాదనలకు వ్యతిరేకంగా 16 రోజుల పాటు ప్రభుత్వం మూతపడింది. ఇప్పుడు అదే ఒబామా అమలు చేసిన ఆరోగ్య పథకానికి జనవరి ఒకటి నుంచి నిధులు నిలిపివేయాలనే ప్రతిపాదనకు వ్యతిరేకంగా రికార్డు సృష్టించిన మూత ప్రారంభమైంది.2013లో మూత కారణంగా 24 బిలియన్‌ డాలర్లు ఆర్థిక వ్యవస్థకు దూరమైనట్లు, ఆ ఏడాది నాలుగవ త్రైమాస కాలంలో జిడిపి 0.6శాతం నష్టపోయినట్లు అంచనా వేశారు. తాజా ఉదంతంతో నష్టం ఎంతో తెలియాల్సి ఉంది.

తెగేదాకా లాగితే రాజకీయంగా మరింత నష్టమన్న భయమే ట్రంప్‌ను దిగివచ్చేట్లు చేసింది. ప్రతిష్టాత్మకమైన న్యూయార్క్‌ మేయర్‌, రెండు రాష్ట్రాల గవర్నర్‌ ఎన్నికల్లో అధికార పార్టీ మట్టికరవటం, వచ్చే ఏడాది పార్లమెంటు మధ్యంతర ఎన్నికలు ఉండటంతో రిపబ్లికన్‌ పార్టీ మీద తీవ్ర వత్తిడి వచ్చిన ఫలితమే తాజా పరిణామం అని చెప్పవచ్చు. మూత చివరి రోజులలో రెండువేల విమానాలు రద్దు కావటం, ఏడువేల సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది, ప్రయాణీకుల నుంచి వచ్చిన నిరసన కూడా దోహదం చేసి ఉండవచ్చు. రానున్న సెనెట్‌ ఎన్నికలలో ప్రతిపక్ష డెమోక్రాట్లు మెజారిటీ సాధించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కోట్లాది మంది పేదలు, యువత ఇబ్బందులు పడిన తీరు రానున్న రోజుల్లో ట్రంప్‌ మీద వ్యతిరేకత పెంచేదే తప్ప మరొకటి కాదు. ఇవన్నీ తెలిసినప్పటికీ ఆ పెద్దమనిషి ఎందుకు ఇలాంటి చర్యకు పాల్పడినట్లు ? పాలకవర్గాల సేవలో తరించేవారికి సామాన్య జనం పట్టరు. మాగా (మేక్‌ అమెరికా గ్రేట్‌ ఎగైన్‌-అమెరికాను మరోసారి గొప్పదానిగా చేద్దాం) రాజకీయాలు చెల్లవని న్యూయార్క్‌, న్యూ జెర్సీ, వర్జీనియా రాష్ట్రాల ఎన్నికలు స్పష్టం చేశాయి.లక్షలాది కుటుంబాలకు వచ్చే స్వల్ప ఆదాయానికి అంతరాయం కలగటంతో పెన్షన్‌ ఖాతాల నుంచి కుటుంబ అవసరాలకోసం డబ్బు తీసుకొనేందుకు సైతం సంకోచించారు, అప్పులు తీసుకుంటే రానున్న రోజుల్లో తీర్చలేమోననే భయంతో అనేక మంది సర్దుకున్నారు.

నలభై రోజులపైగా మూతతో అమెరికా ఏమైనా స్థంభించిందా అంటే లేదు. అంతకు ముందు నుంచి కొనసాగిస్తున్న అన్ని దుర్మార్గాలకు ప్రభుత్వం మద్దతు కొనసాగిస్తూనే ఉంది.మన దేశంలో పేదరికాన్ని నిర్మూలించామని చెబుతూనే ఆకలితో ఉన్న వారికి నరేంద్రమోడీ సర్కార్‌ 80 కోట్ల మందికి ఉచిత బియ్యం, గోధుమలను అందిస్తున్నది.ప్రపంచంలో అత్యంత ధనికదేశం అమెరికా, అక్కడి జనాభా 34 కోట్లు, వారిలో నాలుగున్నర కోట్ల మంది ప్రభుత్వం నుంచి ఆహార సాయం అందుకుంటున్నారు. ప్రభుత్వ మూత అంటే కుదరదు వారందరికీ ఆహార సహాయం చేయాలంటూ కోర్టు జారీ చేసిన ఆదేశాన్ని ట్రంప్‌ ఉల్లంఘించాడు. మరోవైపు తన కార్యాలయంలో ఉన్నదాన్ని పడగొట్టించి విలాసవంతమైన బాల్‌రూమ్‌ డాన్సు మందిరాన్ని నిర్మించాడు.అర్జెంటీనాలోని పచ్చి మితవాద ప్రభుత్వాన్ని ఆదుకొనేందుకు 80బిలియన్‌ డాలర్ల మేర సాయం అందించాడు. ఇవి మచ్చుకు కొన్ని అంశాలు మాత్రమే.ట్రంప్‌ వంటి వారి ప్రాధాన్యతలు ఎలాంటివో లోకానికి స్పష్టమైంది. వేలాది విమానాలు నిలిచిపోవటంతో ప్రయాణాలు రద్దయి లక్షల మంది ఇబ్బందులు పడుతుంటే మూత కారణంగా విమానరాకపోకల నియంత్రణ సిబ్బంది వత్తిడి నుంచి ఉపశమనం పొందుతారంటూ ట్రంప్‌ యంత్రాంగం ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు ఇచ్చే విందులు, వినోదాలు చాలా ఖర్చుతో కూడినవి, పిల్లలకు రెండు బదులు ఒక బొమ్మ కొనిపెట్టండని తలిదండ్రులకు మూత సమయంలో ట్రంప్‌ సలహాయిచ్చాడు.

మూతకు తెరపడినప్పటికీ అది ముందుకు తెచ్చిన సమస్యలకు ఇంకా పరిష్కారం దొరకాల్సి ఉంది. ఫెడరల్‌ ఉద్యోగులు 9లక్షల మంది, ఇతరులు 20లక్షల మందికి మూత సమయంలో ఎలాంటి వేతనాలు ఉండవని అధికార యంత్రాంగం పేర్కొన్నది.దాన్ని ఉద్యోగులు అంగీకరించే అవకాశం లేదు, ఎందుకంటే మూతకు వారి విధులకు ఎలాంటి సంబంధం లేదు. ఆరోగ్య సంరక్షణ సబ్సిడీ బీమా పథకం పొడిగింపుకు ట్రంప్‌ దిగివచ్చినా కొనసాగిస్తాడనే హామీ లేదని ఏపి వార్తా సంస్థ పేర్కొన్నది. అన్నింటికీ మించి ఫెడరల్‌ ప్రభుత్వ ఉద్యోగులను భారీగా తగ్గించాలన్న ట్రంప్‌ యంత్రాంగ అజెండాకు పెద్ద పరీక్ష ఎదురుకానుంది. మూత ఎత్తివేతకు కుదిరిన రాజీ ప్రకారం తొలగించిన ఉద్యోగులను తిరిగి తీసుకొనేందుకు, వేతనాలు చెల్లించేందుకు అంగీకరించినట్లు వార్తలు వచ్చాయి. ఈ ఒప్పందం జనవరి మాసం వరకు మాత్రమే గనుక వచ్చే ఏడాది బడ్జెట్‌ కేటాయింపుల్లో ట్రంప్‌కు అసలైన పరీక్ష ఎదురుకానుంది. ఆదివారం నాటి రాజీ రెండు పార్టీల్లో ఉన్న విబేధాలను వెల్లడించింది. న్యూయార్క్‌ డెమోక్రటిక్‌ పార్టీ సెనెటర్‌ ష్కన్నర్‌ వ్యతిరేకంగా ఓటు వేశాడు. ట్రంప్‌తో జరుపుతున్న పోరాటాన్ని వదలివేయటం భయంకరమైన తప్పిదమని డెమోక్రటిక్‌ సోషలిస్టు పార్టీ స్వతంత్ర సెనెటర్‌ బెర్నీ శాండర్స్‌ వర్ణించాడు. రాజీకి అంగీకరించిన ఎనిమిది మంది డెమోక్రటిక్‌ సెనెటర్లు తమచర్యను సమర్ధించుకున్నారు. మరికొన్ని వారాలు మూత కొనసాగినా ఇంతకంటే మంచి ఒప్పందం కుదిరి ఉండేది కాదని త్వరలో పదవీకాలం ముగియనున్న సెనెటర్‌ షాహీన్‌ చెప్పింది. ఇల్లలకగానే పండగ కాదన్నట్లుగా మూత ముగిసినా వివిధ శాఖలకు కేటాయింపులకు అనేక అంశాల మీద ఓటింగ్‌ జరగాల్సి ఉంది. ఎక్కడైనా తేడా వస్తే మద్దతు ఇచ్చిన వారు వ్యతిరేకించే అవకాశం ఉంది. ఆదివారం నాడు వ్యతిరేకంగా ఓటు చేసిన డెమోక్రాట్లు ట్రంప్‌ సర్కార్‌ మీద పోరాడిల్సిందే అంటున్నారు.

మూత కారణాలను గనుక చూస్తే రిపబ్లికన్లు ఇంకా దిగిరావాల్సి ఉంటుందన్నది స్పష్టం.2026 సంవత్సర బడ్జెట్‌ కేటాయింపులపై తలెత్తిన విబేధం 40 రోజులకు పైగా మూతకు దారితీసింది. జనవరి ఒకటి నుంచి ఆరోగ్యబీమా సబ్సిడీలను ఎత్తివేస్తానని ట్రంప్‌ ప్రకటించాడు, దాన్ని డెమోక్రాట్లు తిరస్కరించారు. ప్రధానమైన ఈ అంశంతో పాటు వృద్ధుల సంరక్షణ, ఇతర సేవలకు కేటాయింపులు కూడా వివాదాస్పాదం కావించాడు. కోట్లాది మంది కార్మికుల ఆరోగ్యాలతో ముడిపడి ఉన్న ఈ సమస్యను ఝటిలం చేయటానికి ట్రంప్‌దే బాధ్యత. గతంలో కూడా అనేకసార్లు మూత ఉదంతాలు జరిగాయి. కానీ ఈ సారి దానితో తనకేమీ సంబంధం లేదన్నట్లుగా వ్యవహరించాడు.దేన్నీ మానుకోలేదు. ప్రయాణాలు మానుకోలేదు, గోల్ఫ్‌ ఆడటం ఆపలేదు, మెక్‌డొనాల్డ్‌ నుంచి గాక వేరే సంస్థ నుంచి హామ్‌బర్గర్లు(పందిమాంసంతో చేసినవి) తెప్పించుకు తినటం తగ్గించలేదు. గతంలో ఇలాంటి సమయాల్లో అధ్యక్షులందరూ కనీసం జనానికి సానుభూతి చూపుతున్నట్లు కనిపించేందుకైనా తమ కార్యక్రమాలను తగ్గించుకున్నారు.ట్రంప్‌ అలాంటివేమీ లేకుండా నిస్సిగ్గుగా వ్యవహరించాడు. నలభై రోజులూ తన కార్యక్రమాలను ఎలాంటి ఆటంకం లేకుండా నిర్వహించాడు. ఉపాధ్యక్షుడు జెడి వాన్స్‌, మంత్రులు, ఇతర ఉన్నతాధికారులదీ అదే వరుస. సామాన్యులు తప్ప అసామాన్యులెవరూ ఇబ్బంది పడలేదు.గతంలో అధ్యక్ష భవనంలో పనిచేసే సిబ్బందిలో 61 నుంచి 70శాతం మంది విధులకు హాజరుకాలేదు, ఈ సారి 32శాతమే రాలేదు.అంటే ఏ సేవకూ అంతరాయం కలగలేదు.చివరి నిమిషంలో ప్రజాప్రతినిధుల సభలో ఆరోగ్య సబ్సిడీలకు ప్రభుత్వం అడ్డం తిరగవచ్చా అంటే స్పీకర్‌ మైక్‌ జాన్సన్‌ చెప్పిన సమాధానం కొన్ని సందేహాలకు తావిస్తున్నది. తానెలాంటి హామీ ఇవ్వలేనని, సభ్యుల మధ్య ఏకాభిప్రాయ సాధన రావాల్సి ఉందన్నాడు.అయితే ఇప్పటికే ఇంటా బయటా అభాసుపాలైన డోనాల్డ్‌ ట్రంప్‌ పౌరుల ఆరోగ్యం విషయంలో మొరటుగా వ్యవహరిస్తే మరింతగా జనాలకు దూరం కావటం ఖాయం !

Share this:

  • Tweet
  • More
Like Loading...

న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు జోహ్రాన్‌ మమ్దానీ విజయ దుందుభి ! డోనాల్డ్‌ ట్రంప్‌కు చెప్పుకోరానిచోట తగిలిన దెబ్బ !!

05 Wednesday Nov 2025

Posted by raomk in Current Affairs, History, International, INTERNATIONAL NEWS, Opinion, USA

≈ 1 Comment

Tags

democratic socialist, Donald trump, Kangana ranaut, Leftist Zohran Mamdani, Narendra Modi, New York mayor Election

ఎం కోటేశ్వరరావు

జూన్‌ 24న డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్ధిగా ఎంపికైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సర్వేలో ప్రత్యర్ధుల కంటే ముందున్న జోహ్రాన్‌ మమ్దానీ నవంబరు నాలుగవ తేదీన జరిగిన ఎన్నికలలో ఘనవిజయం సాధించాడు. ఓట్ల లెక్కింపు 91శాతం పూర్తయిన సమయానికి 50.4శాతంతో ముందుండి విజయాన్ని ఖరారు చేసుకున్నాడు. ప్రత్యర్ధిగా డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్ధిత్వం కోసం పోటీ పడి పరాజయం పాలై పార్టీ మీద తిరుగుబాటు చేసి స్వతంత్ర అభ్యర్థిగా నిలిచిన న్యూయార్క్‌ రాష్ట్ర మాజీ గవర్నర్‌ ఆండ్రూ కుమోకు 41.6, డోనాల్డ్‌ ట్రంప్‌ ఆదేశాలను ధిక్కరించి పోటీలో నిలిచిన రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్ధి కర్టిస్‌ సిల్వాకు 7.1, డెమోక్రటిక్‌ పార్టీ మరో తిరుగుబాటు అభ్యర్ది, మధ్యలో పోటీ నుంచి కుమోకు అనుకూలంగా తప్పుకున్న ప్రస్తుత మేయర్‌ ఎరిక్‌ ఆడమ్స్‌కు 0.3 శాతం ఓట్లు వచ్చాయి.న్యూజెర్సీ, వర్జీనియా గవర్నర్లుగా, వర్జీనియా లెప్టినెంట్‌ గవర్నర్‌గా డెమోక్రటిక్‌ పార్టీకి చెందిన అభ్యర్ధులు మైక్‌ షెరిల్‌, అబిగెయిల్‌ స్పాన్‌బెర్గర్‌, గజాలా హష్మీ మంచి మెజారిటీలతో ఎన్నికయ్యారు. గజాలా హష్మి 1964లో హైదరాబాద్‌లో జన్మించి నాలుగేండ్ల వయస్సులో అమెరికాలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న తండ్రి జియా హష్మివద్దకు వెళ్లింది, ఆమె చదువు సంధ్యలన్నీ అమెరికాలో సాగాయి. రిపబ్లికన్‌ పార్టీ, ఇతర జాత్యహంకారులైన పచ్చి మితవాదులు ముస్లిం వ్యతిరేకతను రెచ్చగొట్టినప్పటికీ న్యూయార్క్‌ నగర మేయర్‌గా, వర్జీనియా రాష్ట్ర లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా ఆ సామాజిక తరగతికి చెందిన వారికే పట్టం గట్టటం ఓటర్ల పరిణితికి నిదర్శనం. నేతలు మతకళ్లద్దాలను తగిలించుకున్నప్పటికీ సామాన్య జనం ముఖ్యంగా కార్మికవర్గం అలా లేదు. మమ్దానీ విజయంతో కంగుతిన్న ట్రంప్‌ తన ఉక్రోషాన్ని యూదుల మీద వెళ్లగక్కాడు. వారు కూడా మమ్దానీకి ఓటు వేశారని వ్యాఖ్యానించాడు. మనదేశంలో ఉన్న హిందువులలో కొందరు కాషాయ తాలిబాన్లుగా మతోన్మాదులుగా మారినప్పటికీ సామాన్యులు అలా లేరు. అలాగే యూదులలో కొందరు దురహంకారులు ఉన్నప్పటికీ అందరూ అలాంటి వారు కాదని న్యూయార్క్‌ ఎన్నికలలో రుజువైంది. ప్రాధమికంగా వెల్లడైన విశ్లేషణ ప్రకారం 44ఏండ్ల లోపు యూదులలో 67శాతం మంది మమ్దానీకి ఓటు వేశారని తేలింది. ఇటీవలి గాజా మారణకాండలో పాలస్తీనియన్లను ఊచకోత కోసిన ఇజ్రాయెల్‌ చర్యలను ఖండించటంలో మమ్దానీ ముందున్నవారిలో ఒకడు. అతనికి ఓటు వేశారంటే సామాన్య యూదులు కూడా ఇజ్రాయెల్‌ చర్యలను సమర్ధించటం లేదన్నది స్పష్టం.

పోలింగ్‌కు కొద్ది గంటల ముందు వెల్లడైన సర్వేలన్నీ డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్ధి సోషలిస్టును అని సగర్వంగా ప్రకటించుకున్న జోహ్రాన్‌ మమ్దానీ గెలుపు బాటలో ఉన్నట్లు ప్రకటించాయి. ఎమర్సన్‌ కాలేజి చివరి సర్వేలో జోహ్రాన్‌కు 50శాతం, సమీప ప్రత్యర్ధి ఆండ్రూ కుమోకు 25,రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్ధి కర్టిస్‌ సిల్వాకు 21శాతం మద్దతు ఉన్నట్లు పేర్కొన్నారు. అమెరికాలో ఉన్న నిబంధనల ప్రకారం ప్రకటిత సమయానికి ముందే 7,35,000 మంది ఓట హక్కు వినియోగించుకున్నారు. వీరిలో యువత ఎక్కువగా ఉన్నట్లు, అత్యధికులు జోహ్రాన్‌కే ఓటు వేసినట్లు మీడియా పేర్కొన్నది. యాభై సంవత్సరాల లోపు వయస్సున్న ఓటర్లలో 69శాతం మద్దతు ఇస్తున్నట్లు, ఆఫ్రో-అమెరికన్‌ ఓటర్ల మొగ్గు కూడా పెరిగినట్లు వార్తలు వచ్చాయి. గత ఎన్నికల కంటే ఇవి నాలుగు రెట్లు ఎక్కువని, దీన్ని బట్టి ఓటర్లు ఎంత ఆసక్తిగా ఉన్నారో వెల్లడైందని విశ్లేషకులు పేర్కొన్నారు.ఇప్పుటికే ఓటు వేసిన వారిలో 58శాతం మమ్దానీకి వేసినట్లు, వేయాల్సివారిలో 45శాతం మొగ్గు చూపుతున్నట్లు సర్వేలు వెల్లడించాయి. ఏ రీత్యా చూసినా మమ్దానీ విజయం ఖాయం అని నిర్ణయించుకున్న తరువాత చివరి నిమిషంలో ే స్వంత పార్టీని పక్కన పెట్టి ట్రంప్‌ స్వతంత్ర అభ్యర్ధి ముసుగులో ఉన్న డెమోక్రటిక్‌ పార్టీ తిరుగుబాటుదారుకు మద్దతు ప్రకటించాడని ఆ మేరకు కొన్ని ఓట్లు కుమోకు మళ్లినట్లు ఫలితాలు వెల్లడించాయి.మొత్తం నగరంలో నమోదైన ఓటర్ల సంఖ్య 47లక్షలు. డెమోక్రటిక్‌ పార్టీకి చెందిన ప్రస్తుత మేయర్‌ ఎరిక్‌ ఆడమ్స్‌ పోటీ నుంచి మధ్యలో తప్పుకొని అదే పార్టీకి చెందిన తిరుగుబాటు అభ్యర్థి ఆండ్రూ కుమోకు మద్దతు ప్రకటించాడు.

మానవాళి చరిత్రలో ఇంతవరకు ఎన్నడూ, ఎక్కడా విప్లవాలు చెప్పిరాలేదు, వాటికి ముహూర్తాలు, వాస్తు వంటివి కూడా లేవు. అనివార్యమని చరిత్రగమనాన్ని బట్టి గట్టిగా విశ్వసించటం తప్ప ఎక్కడ, ఎప్పుడు, ఎలా వస్తుందో కూడా తెలియదు.అన్నింటినీ మిమించి అంతిమంగా అడ్డుకోవటం ఎవరివల్లా కాదు. 2025 జూన్‌ 24వ తేదీ బుధవారం నాడు ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థ రాజధాని న్యూయార్క్‌ నగరంలో పిడుగుపాటు. విప్లవం అని వర్ణించటం అతిశయోక్తి అవుతుందిగానీ పెట్టుబడిదారులకు దడపుట్టించే పరిణామం జరిగింది. నగర మేయర్‌ ఎన్నికలో డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థిగా జోహ్రాన్‌ మమ్‌దానీ(33) ఎన్నిక యావత్‌ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. పెద్ద ఎత్తున మీడియాలో చర్చ జరిగింది. డెమోక్రటిక్‌ పార్టీ తరఫున అభ్యర్థిత్వాన్ని కోరుతూ 11 మంది పోటీపడ్డారు.తొలి రెండు దఫాలలో మమ్దానీ మొదటి స్థానంలో ఉన్నప్పటికీ 50శాతంపైగా ఓట్లు రాకపోవటంతో తొలి రెండు స్థానాల్లో ఉన్న ఇద్దర మధ్య మూడో రౌండులో న్యూయార్క్‌ రాష్ట్ర ఎంఎల్‌ఏ జహ్రాన్‌కు 56.39, రెండవ స్థానంలో ఉన్న న్యూయార్క్‌ మాజీ గవర్నర్‌, ఒక కార్పొరేట్‌ సంస్థకు అధిపతి అయిన అండ్రూ కుమోకు 43.61శాతం ఓట్లు వచ్చాయి. గత 36 సంవత్సరాలలో పెద్ద ఎత్తున డెమోక్రటిక్‌ పార్టీలో ఓటర్లు పాల్గనటం ఇదే ప్రధమం.

జోహ్రాన్‌ గెలిస్తే ఆర్థిక, సామాజిక విపత్తు సంభవిస్తుందని, అతను గెలిస్తే తాను నిబంధనలమేరకు తప్ప అదనపు నిధులు విడుదల చేసేది లేదని, తన మద్దతు డెమోక్రటిక్‌ పార్టీ తిరుగుబాటు అభ్యర్థి మాజీ గవర్నర్‌ఆండ్రూ కుమోకు ఇస్తున్నట్లు సోమవారం రాత్రి డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించాడు. కమ్యూనిస్టు జోహ్రాన్‌, చెడ్డ అభ్యర్థి కుమోలలో ఎవరో ఒకరిని ఎంచుకోవాలి గనుక తాను కుమోనే ఎందుకున్నట్లు చెప్పాడు.వ్యక్తిగతంగా అతనంటే అభిమానం ఉందా లేదా అని కాదు, మరొక మార్గం లేదు గనుక కుమోను బలపరచాలి. మమ్దానీని ఓడించగలిగింది అతనే అని ట్రంప్‌ పేర్కొన్నాడు. ఒక అధ్యక్షుడిగా అదనంగా నిధులు ఇవ్వటం కష్టం, ఎందుకంటే మీరు గనుక కమ్యూనిస్టును ఎన్నుకుంటే నగరానికి ఇచ్చే నిధులన్నింటినీ మీరు వృధా చేసినట్లే అని ఒక టివీలో ట్రంప్‌ చెప్పాడు. వేయి సంవత్సరాలుగా విఫలమైన కమ్యూనిస్టు సిద్దాంతాన్ని మమ్దానీ అనుసరిస్తున్నాడని అన్నాడు.జోహ్రాన్‌ అభ్యర్ధిగా ఎన్నికైనప్పటి నుంచి అతను కమ్యూనిస్టు అని పదే పదే ట్రంప్‌ ఓటర్లను ఆకర్షించేందుకు, ఆ ముద్రతో కమ్యూనిస్టు వ్యతిరేేకతను రెచ్చగొట్టాలని చూశాడు.అతగాడికి కొమ్ము కాసే మీడియా యాజమాన్యాలు, వాటిలో పని చేసే యాంకర్లు రాజును మించిన రాజభక్తిపరులుగా మారారు.ఫాక్స్‌ న్యూస్‌ టీవీ యాంకర్‌ ఊగిపోతూ జోహ్రాన్‌ మమ్‌దానీ, అతని అనుచరులు కమ్యూనిస్టులు, తీవ్రవాదులు వారిని దెబ్బతీసేందుకు గతంలో కమ్యూనిస్టులపై విషం చిమ్మటంలో పేరు మోసిన జో మెకార్ధీని తిరిగి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నాడు. కొంత మంది తీవ్రవాదులను న్యూయార్క్‌ వంటి గొప్పనగరంలో ఎన్నిక కావటానికి అనుమతించకూడదని, నగరాన్ని నాశనం కానివ్వకూడదంటూ జోహ్రాన్‌ మీద విరుచుకుపడ్డాడు.కమ్యూనిస్టును కాదని ప్రజాస్వామిక సోషలిస్టును అని చెప్పుకుంటున్నాడు, అది ఏ తరహా ప్రజాస్వామ్యం అతను ఎన్నిక కావటాన్ని సహించకూడదని, ఏదో విధంగా అడ్డుకోవాలన్నాడు.జోహ్రాన్‌ గడ్డం ఉన్న కమలాహారిస్‌ అని నోరుపారవేసుకున్నాడు. ప్రచ్చన్న యుద్ధంలో అమెరికా గెలిచినప్పటికీ మార్క్సిజం బతికిందని దాంతో విశ్వవిద్యాలయాల్లోని టీచర్లకు ధైర్యం వచ్చిందన్నాడు. అందువలన వలస వచ్చేవారిని, సోషలిస్టు సిద్దాంతాలను ఎక్కించటాన్ని అడ్డుకోవాలి, కమ్యూనిస్టుకు ఓటువేయాలని, నగరనాశనాన్ని కోరుకొనే వారిని బయటకు నెట్టాలి. అందరం కూర్చుని కమ్యూనిస్టు ఎన్నికకాకుండా చూడాలి, అధికారికంగా నమోదు కాని, పౌరులు కాని వారు కూడా ఓట్లు వేస్తున్నారని ఆరోపించాడు.ఇది మచ్చుకు ఒక ఉదాహరణ మాత్రమే. అమెరికా తిరోగామి మీడియాలో ఇలాంటి వారు కోకొల్లలు.

డెమోక్రటిక్‌ పార్టీ కూడా కార్పొరేట్లకు అనుకూలమే కదా అలాంటి పార్టీలో జోహ్రాన్‌ వంటి పురోగామి వాదులు ఎలా ఉన్నారు అనే సందేహం రావటం సహజం. ఒక విధంగా అది మనదేశంలో కాంగ్రెస్‌ వంటిది. మన స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో కాంగ్రెస్‌ సంస్థలో నాయకత్వ విధానాలను వ్యతిరేకించే వారు తమ పురోగామి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయేందుకు కాంగ్రెస్‌ సోషలిస్టు పార్టీని ఏర్పాటు చేశారు. దాని నేతలుగా ఉన్న ఇంఎంఎస్‌ నంబూద్రిపాద్‌, పుచ్చలపల్లి సుందరయ్య వంటి అనేక మంది తరువాత కమ్యూనిస్టులుగా మారారు. అదే మాదిరి అమెరికా డెమోక్రటిక్‌ పార్టీలో పురోగామి విధానాలను ముందుకు తెచ్చేవారు డెమోక్రటిక్‌ సోషలిస్టు పార్టీని ఏర్పాటు చేశారు. వారిలో ప్రముఖుడు సెనెటర్‌ బెర్నీశాండర్స్‌ బహిరంగంగా తనను సోషలిస్టుగా ప్రకటించుకున్నాడు. అదే బాటలో జోహ్రాన్‌ మమ్‌దానీ వంటి యువకులు పెద్ద సంఖ్యలో సోషలిస్టులుగా ప్రకటించుకొన్నారు. వీరందరినీ కమ్యూనిస్టులుగా అక్కడి మీడియా, రిపబ్లికన్‌, డెమోక్రటిక్‌ పార్టీలోని మితవాదులు ముద్రవేస్తున్నారు. అభ్యర్థిగా ఎన్నికైన తరువాత జోహ్రాన్‌ ఒక కమ్యూనిస్టు పిచ్చోడని డోనాల్డ్‌ ట్రంప్‌ నోరుపారవేసుకున్నాడు.అమెరికా సమాజంలో ఒక మధనం జరుగుతున్నది. లక్షలాది మంది ఇటీవలి కాలంలో సోషలిస్టులం అని సగర్వంగా ప్రకటించుకుంటున్నారు. వారిని కమ్యూనిస్టులని ప్రచారం చేసినా ఎన్నికల్లో గెలిపిస్తున్నారు. అక్కడి కార్మికవర్గం మార్పును కోరుకుంటున్నారని, వామపక్షం వైపు మొగ్గేందుకు సిద్దంగా ఉన్నట్లు, ఒక సామాజిక సంక్షోభానికి ఒక సూచికగా చెప్పవచ్చు. దీని అర్ధం తెల్లవారేసరికల్లా అధికారానికి రాబోతున్నారని కాదు.

జోహ్రాన్‌ అభ్యర్థిగా ఎన్నికైనట్లు ఫలితాల తీరు వెల్లడించగానే జరిగిన పరిణామాలు మనదేశంలో జరిగిందాన్ని గుర్తుకు తెచ్చాయి. కొన్ని పార్టీల వారు గతంలో సిపిఎం నేత జ్యోతిబసును ప్రధాని పదవికి సూచించగానే బాంబేక్లబ్‌గా పిలిచే బడాకార్పొరేట్‌ ప్రతినిధులందరూ సమావేశమై ఎట్టి పరిస్థితిలోనూ కానివ్వరాదని తీర్మానించారు. న్యూయార్క్‌ నగరానికి ఒక వామపక్షవాది మేయర్‌ కాగానే అక్కడి పెట్టుబడిదారీ వ్యవస్థను కూలదోసే అవకాశం లేదు. అయినప్పటికీ డెమోక్రటిక్‌ పార్టీకి చెందిన ప్రస్తుత మేయర్‌ ఎరిక్‌ ఆడమ్స్‌ లేదా జోహ్రాన్‌తో పోటీ పడిన కుమోను స్వతంత్ర అభ్యర్ధిగా నిలపాలని, రిపబ్లికన్‌ పార్టీ పోటీ చేయకుండా మద్దతు ఇవ్వాలంటూ విజ్ఞాపనలతో పాటు 20 మిలియన్ల డాలర్లను వసూలు చేయాలని పిలుపు ఇచ్చారు. అభ్యర్ధి ఎన్నికలో జోహ్రాన్‌ ముందంజ గురించి తెలియగానే స్టాక్‌మార్కెట్లో కొన్ని కంపెనీల వాటాల ధరలు పడిపోయాయంటే ఎలాంటి కుదుపో చెప్పనవరం లేదు. మమ్దానీ ఇజ్రాయెల్‌ను గట్టిగా వ్యతిరేకించటమే కాదు, ఎన్ని విమర్శలు వచ్చినా పాలస్తీనా మద్దతుదారుగా ఉన్నాడు. ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు న్యూయార్క్‌ వస్తే అరెస్టు చేయించేందుకు వెనుకాడనని కూడా చెప్పాడు. అందుకనే ప్రత్యర్ధులు అతనికి యూదు వ్యతిరేకి అని ముద్రవేశారు. అయినప్పటికీ న్యూయార్క్‌లోని యూదులు పెద్ద సంఖ్యలో అతని అభ్యర్థిత్వానికి మద్దతుగా ఓటు చేశారని వార్తలు వచ్చాయి. మంగళవారం నాటి ఓటింగ్‌లో ముందే చెప్పుకున్నట్లు యూదులలో యువతరానికి చెందిన వారు 67శాతం మంది జోహ్రాన్‌కు ఓటు వేశారు. ట్రంప్‌ ఉక్రోషం గురించి చూశాం. నరేంద్రమోడీ న్యూయార్క్‌ వస్తే భేటీ అవుతారా అని విలేకర్లు ప్రచారం సందర్భంగా అడగ్గా డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్ధులందరూ లేదని అని ముక్తకంఠంతో చెప్పారు. బెంజమిన్‌ నెతన్యాహు మాదిరి నరేంద్రమోడీ కూడా గుజరాత్‌లో మారణకాండకు బాధ్యుడైన ఒక యుద్ద నేరగాడని జోహ్రాన్‌ కారణం చెప్పాడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు మేయర్‌ అయ్యాడంటే మనదేశంలోని కాషాయ దళాలు ఏ విధంగా స్పందిస్తాయో చెప్పనవసరం లేదు.చరిత్ర గతిని ఎవరూ ఆపలేరు.

కుమో పోటీకి దిగాలని నిర్ణయించినపుడే అతగాడు డోనాల్డ్‌ ట్రంప్‌తో సంబంధాల్లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. తాను ట్రంప్‌ నుంచి ఎలాంటి సహాయం పొందటం లేదని అలాంటి ఆలోచన కూడా లేదని, పోటీ గురించి ట్రంప్‌తో మాట్లాడినట్లు న్యూయార్క్‌ టైమ్స్‌లో వచ్చిన వార్తలను తోసిపుచ్చాడు. ప్రముఖ మీడియా యజమాని జిమీ ఫింక్లెస్టయిన్‌ ఇంట్లో సమావేశమైన ట్రంప్‌ మద్దతుదార్లు చర్చించి కుమో ఎలా పోటీ ఇవ్వగలడో ట్రంప్‌కు నివేదించినట్లు కూడా న్యూయార్క్‌టైమ్స్‌ రాసింది. ట్రంప్‌తో నేరుగా మాట్లాడితే ఫలితం ఉంటుందేమో అని ఒక మద్దతుదారు కుమోను అడగ్గా ట్రంప్‌కు అన్నీ తెలుసు తనకు మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని అన్నాడు. మమ్దానీ వ్యతిరేక ఓట్లు చీలకుండా ఉండాలంటే తనకు మద్దతు ఇవ్వాలని మరోపోటీదారు, ప్రస్తుత డెమోక్రటిక్‌ పార్టీ మేయర్‌ ఎరిక్‌ ఆడమ్స్‌ను కుమో కోరినట్లు వార్తలు. తరువాత అదే జరిగింది. కుమోను ట్రంప్‌ బలపరుస్తున్నాడని, ఎన్నికల్లో రిగ్గింగ్‌ జరిపేందుకు కుట్ర చేస్తున్నారని మమ్దానీ ప్రతినిధి డోరా పెకీ కొద్ది నెలల ముందే ఒక ప్రకటనలో హెచ్చరించారు.లక్షలాది మంది వలంటీర్లు అలాంటి ప్రయత్నాల మీద కన్నేసి ఉంచాలని మమ్దానీ మద్దతుదార్లు తగిన జాగ్రత్తలు తీసుకున్న కారణంగా అలాంటి దుస్సాహసానికి ట్రంప్‌ పూనుకోలేదు.

ట్రంప్‌ ప్రకటన తరువాత స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేస్తున్న డెమోక్రటిక్‌ పార్టీ నేత ఆండ్రూ కుమో స్పందిస్తూ రిపబ్లికన్‌ ఓటర్లు అధ్యక్షుడి మాట వింటారని భావిస్తున్నానని, ట్రంప్‌కు వ్యతిరేకంగా నిలిచే మేయర్‌ మనకు కావాలని, న్యూయార్క్‌ నగరానికి నేషనల్‌ గార్డ్స్‌(మిలిటరీ) పంపే ముప్పు ఉన్నందున తాను సరైన అభ్యర్ధినని, మమ్దాని గనుక గెలిస్తే వెన్నలో వేడికత్తిని దింపినట్లు ట్రంప్‌ వ్యవహరిస్తాడని ఫాక్స్‌ న్యూస్‌తో చెప్పాడు.ట్రంప్‌ ప్రకటన తరువాత కొందరు రిపబ్లికన్‌ ఓటర్లు స్వంత అభ్యర్ధిని కాదని కుమోకు వేసినకారణంగానే సర్వేలకు భిన్నంగా అతనికి ఓట్లు పెరిగాయన్నది స్పష్టం. ఒక కమ్యూనిస్టును గాక న్యూయార్క్‌ ఒక చెడు డెమాక్రాట్‌ను ఎన్నుకోవాలని చెప్పటం సరైంది కాదని, తాను చెడ్డవాడిని కాదు, జోహ్రాన్‌ కమ్యూనిస్టు కాదని, ఒక సోషలిస్టు మాత్రమే అని అయితే నగరానికి సోషలిస్టు పనికి రాడని కుమో చెప్పుకున్నాడు. ప్రపంచ ధనికుల్లో ముందున్న ఎలన్‌ మస్క్‌ కూడా కుమో వైపు నిలిచినట్లు వెల్లడించాడు. అయితే ట్రంప్‌ నాయకత్వంలోని రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి కర్టిస్‌ సిల్వా తాను పోటీ నుంచి తప్పుకోవటం లేదని ప్రకటించాడు. ఈ ఎన్నికల ప్రచారంలో అన్ని రకాల కమ్యూనిస్టు, సోషలిస్టు వ్యతిరేక ప్రచారంతో పాటు ముస్లిం, పాలస్తీనా వ్యతిరేకతను కూడా రెచ్చగొట్టేందుకు ప్రత్యర్ధులు, మీడియా శతవిధాలా ప్రయత్నించాయి. ఇన్ని చేసినా ఓటింగ్‌కు కొద్ది గంటల ముందు ప్రతిపక్ష అభ్యర్ధుల కంటే ఎక్కువ మంది మద్దతు జోహ్రాన్‌కు ఎక్కువగా ఉన్నట్లు సర్వేలు తెలిపాయి. ఓటర్ల పరిణితిని ఎన్నికలు ప్రతిబింబించాయి. అక్టోబరు ఒకటవ తేదీ నుంచి కొనసాగుతున్న ఫెడరల్‌ ప్రభుత్వ స్థంభన కారణంగా పేదలు, సబ్సిడీ ఆహారం మీద ఆధారపడిన వారందరూ ఆకలితో మాడుతున్నట్లు వచ్చిన వార్తలను చూసిన తరువాత వారందరూ కూడా జోహ్రాన్‌కు మద్దతు ప్రకటించారని కనిపిస్తున్నది.

జోహ్రాన్‌ పక్కా కమ్యూనిస్టు అని ప్రకటించి అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ కుట్రచేసి ఫలితాలను ప్రభావితం చేసేందుకు చూసినా ఓటర్లు అయితే మాకేంటి అన్నట్లుగా ఓటువేశారు. ప్రపంచ పెట్టుబడిదారుల కుంభస్థలం మీద తొలిసారిగా ఒక సోషలిస్టు గద్దెనెక్కాడు, 1892తరువాత ఒక యువమేయర్‌గా కూడా జోహ్రాన్‌ చరిత్రకెక్కాడు. మతకళ్లద్దాలతో చూసిన వారు తొలి ముస్లిం మేయర్‌ అవుతారంటూ చెప్పారు.ఒక పురోగామివాదిగా జోహ్రాన్‌ అసలు డెమోక్రటిక్‌ అభ్యర్ధిగా ఎన్నిక అవకుండా మొగ్గలోనే తుంచేందుకు ఆ పార్టీలోని మితవాద, పురోగామివాద వ్యతిరేకశక్తులు అన్ని విధాలుగా ప్రయత్నించాయి. డెమోక్రటిక్‌ పార్టీలోని మితవాదులతో సహా ప్రతిపక్షం అంతా ఒక్కటి, జోహ్రాన్‌ ఒక్కడిగా రంగంలో ఉన్నాడు.ట్రంప్‌ చివరికి ఎంతగా దిగజారాడంటే తమ పార్టీ అభ్యర్ధి కర్టిస్‌ సిల్వాకు వేసే ఓటు జోహ్రాన్‌కు వేసినట్లుగానే పరిగణించాలన్నాడు. కొన్ని సమయాలలో కొందరు అన్నట్లుగా ఒక సోషలిస్టు విసిరిన సవాలును ఎదుర్కొనేందుకు మిగతా సమయాలలో దెబ్బలాడుకొనే రిపబ్లికన్లు, డెమాక్రాట్లు ఎప్పుడైనా తమకే ఎసరు వస్తుందని భావిస్తే ఇద్దరు కలసిపోతారనేందుకు తాజా పరిణామం తార్కాణం.ఈ అంశం అనేక మందిలో భ్రమలను పోగొట్టి తామెటో నిర్ణయించుకొనేందుకు పనికి వస్తుందని, రానున్న రోజుల్లో డెమోక్రటిక్‌ పార్టీలోని మితవాద శక్తులకు ఎదురుదెబ్బలు తగలటం అనివార్యమని చెప్పవచ్చు.ఆఫ్రికాలో జన్మించిన 34 ఏండ్ల జోహ్రాన్‌ గెలిస్తే ఒక దక్షిణాసియా సంతతి, ముస్లిం సామాజిక తరగతికి చెందటమే గాక తొలి సోషలిస్టు మేయర్‌గా చరిత్రకెక్కాడు. ప్రచారంలో డెమోక్రటిక్‌ సోషలిస్టును అని చెప్పుకున్నాడు తప్ప ఇతర అంశాలకు చెందిన మనోభావాలను ముందుకు తెచ్చేందుకు ప్రయతించకుండా ఎంతో హుందాగా వ్యవహరించాడని చెప్పవచ్చు. అతన్ని సోషలిస్టుగా వర్ణించినా తమకు ఎలాంటి వ్యతిరేకత లేదని అనేక మంది చెప్పటం అమెరికా సమాజంలో వస్తున్న మార్పుకు నిదర్శనం.

జోహ్రాన్‌ తండ్రి మహమ్మద్‌ మమ్దానీ అమెరికాలో స్థిరపడిన గుజరాతీ మూలాలు ఉన్న ఉగాండా జాతీయుడు కాగా తల్లి ఒడిషాలో జన్మించిన పంజాబ్‌ హిందూ కుటుంబానికి చెందిన మీరా నాయర్‌(నయ్యర్‌ ) పద్మవిభూషణ్‌ అవార్డు గ్రహీత, ప్రముఖ సినిమా దర్శకురాలు, నిర్మాత. ఇజ్రాయెల్‌ హైఫా అంతర్జాతీయ చలనచిత్రోత్సవానికి గౌరవ అతిధిగా వచ్చిన ఆహ్వానాన్ని 2013లో ఆమె తిరస్కరించారు. పాలస్తీనా ఆక్రమణనుంచి వైదొలిగినపుడు, జాత్యంహంకారాన్ని వీడినపుడు మాత్రమే ఇజ్రాయెల్‌ గడ్డమీద అడుగుపెడతానని చెప్పారు. జోహ్రాన్‌ వాగ్దానాల విషయానికి వస్తే తనను ఎన్నుకుంటే న్యూయార్క్‌ నగరంలో అద్దెలను స్థంభింప చేస్తానని, పేదలకు ఇండ్లు నిర్మిస్తానని, లాభనష్టాలు లేని ప్రాతిపదిక నగరపాలక సంస్థ సూపర్‌మార్కెట్లను ఏర్పాటు చేస్తానని, 2030 నాటికి గంటకు 30 డాలర్ల కనీసవేతన అమలు జరిగేట్లు చూస్తానని, అందరికీ అందుబాటులో ఉండే శిశు సంరక్షణా కేంద్రాల ఏర్పాటు వంటి తన వాగ్దానాల అమలుకు అవసరమైన పదిబిలియన్‌ డాలర్ల సొమ్మును ధనికుల మీద అదనంగా పన్నులు వేసి సమీకరిస్తానని చెప్పాడు.వలసవచ్చిన కుటుంబాల వారికి రక్షణ కల్పిస్తానని వాగ్దానం చేశాడు. ఇతగాడిని డెమోక్రటిక్‌ పార్టీలోని కార్పొరేట్‌ అనుకూల శక్తులు ఏదో ఒక సంస్కరణవాది అని సరిపెట్టుకోలేదు, వర్గపోరాటాన్ని ప్రోత్సహించే విప్లవవాదిగా చూశారు. ఆ పార్టీలో చేయి తిరిగిన పెద్దలు, మితవాదులు, కార్మిక, కార్పొరేట్‌ శక్తులు ఏకమై అనేక తప్పుడు ప్రచారాలు చేశారు.

జొహ్రాన్‌ పూర్తి పేరు జొహ్రాన్‌ క్వామే మమ్దానీ. తండ్రి మహమ్మద్‌ మమ్దానీ ఒక గుజరాతీ ముస్లిం కుటుంబంలో 1946లో ముంబైలో జన్మించాడు. తరువాత ఆఫ్రికాలోని ఉగాండాకు ఆ కుటుంబం వలస వెళ్లింది. ఉగాండాలో ఉండగా 1963లో అమెరికాలో విద్య స్కాలర్‌షిప్‌ రావటంతో అక్కడ చదువుకున్నాడు. తరువాత ఉగండా వెళ్లి అక్కడ బోధనావృత్తిలో చేరాడు. సినిమా దర్శకురాలు మీరా నయర్‌ తన సినిమా ” మిస్సిసిపీ మసాలా ” కోసం ఉగాండాలో పరిశోధనకు వెళ్లినపుడు 1988లో అక్కడ పరిచయమైన మహమ్మద్‌ హిమ్దానీని ఆమె రెండవ వివాహంచేసుకున్నారు. వారికి అక్కడే 1991లో జోహ్రాన్‌ జన్మించాడు.ఘనా తొలి అధ్యక్షుడు క్వామే అంటే అపరిమిత అభిమానంతో తమ కుమారుడి పేరులో క్వామే చేర్చారు. ఆ కుటుంబం తరువాత కొంత కాలం దక్షిణాఫ్రికాలో కూడా ఉంది, తరువాత అమెరికా వచ్చింది.2018లో జోహ్రాన్‌కు అమెరికా పౌరసత్వం వచ్చింది.రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఎన్నికలలో 2020లో తొలిసారిగా న్యూయార్క్‌ రాష్ట్ర అసెంబ్లీ సభ్యుడిగా ఎన్నికయ్యాడు,2024లో మూడవసారి ఎన్నికై ప్రజాప్రతినిధిగా కొనసాగుతున్నాడు. ఆచరణ సాధ్యంగాని వాగ్దానాలు చేసినట్లుగా జహ్రాన్‌ అభ్యర్ధిత్వాన్నే జీర్జించుకోలేని అదే పార్టీకి చెందిన ప్రస్తుత న్యూయార్క్‌ మేయర్‌ ఎరిక్‌ ఆడమ్స్‌ ఉక్రోషం వెలిబుచ్చాడు. చివరికి అనుకున్నదంతా జరిగింది, ఇప్పుడు తలెక్కడ పెట్టుకుంటాడో తెలియదు. జహ్రాన్‌ మమ్దానీ వందశాతం కమ్యూనిస్టు పిచ్చోడు, మేయర్‌ అయ్యేదారిలో ఉన్నాడు అని ట్రంప్‌ తన సామాజిక మాధ్యమంలో గతంలోనే పోస్టు పెట్టాడు. జోహ్రాన్‌ ఎన్నికను అడ్డుకొనేందుకు కొందరు 1954నాటికి కమ్యూనిస్టు వ్యతిరేక చట్టానికి దుమ్ముదులిపి జోహ్రాన్‌ పౌరసత్వాన్ని రద్దు చేసి ఉగాండాకు పంపే అవకాశాలను పరిశీలించాలని వత్తిడి తెచ్చారు. ఈ మేరకు మీడియాలో విశ్లేషణలు చేశారు. వీలుగాక ఊరుకున్నారు.

న్యూయార్క్‌ మేయర్‌ ఎన్నిక అమెరికా చరిత్రలో ఒక ప్రత్యేక పేజీకి నాంది పలికింది. ఇటీవలి కాలంలో ఫాసిస్టు ధోరణులు పెరుగుతున్న పూర్వరంగంలో కార్మికవర్గం వామపక్ష అభ్యర్ధివైపు మొగ్గటం యావత్‌ పురోగామిశక్తులకు ఉత్సాహం ఇచ్చే పరిణామం. అమెరికాలో నిజమైన సోషలిస్టు శక్తుల పెరుగుదలకు తోడ్పడే పరిస్ధితి కనిపిస్తున్నది. డెమోక్రటిక్‌ సోషలిస్టులు ముందుకు తెస్తున్న సంస్కరణలనే మీడియా, శత్రువులు సోషలిజం, కమ్యూనిజం అని చిత్రిస్తున్నారు. వాటికి ఉండే పరిమితులను కార్మికవర్గం అర్ధం చేసుకున్న తరువాత శాస్త్రీయ సోషలిజం కోసం మరింత ముందుకు పోవటం తప్ప మరొక మార్గం లేదు. డెమోక్రటిక్‌ పార్టీ భవిష్యత్‌ను నిర్ణయించేది ఇప్పుడున్న నాయకత్వం కాదని దేశ కార్మికవర్గమేనని డెమోక్రటిక్‌ సోషలిస్టు సెనెటర్‌ బెర్నీశాండర్స్‌ వ్యాఖ్యానించాడు.భారత్‌ మూలాలున్న జోహ్రాన్‌ భారతీయుడి కంటే పాకిస్తానీగా ఎక్కువ హడావుడి చేస్తున్నాడని బిజెపి ఎంపీ కంగనా రనౌత్‌ నోరుపారవేసుకున్నారు. అతని హిందూ గుర్తింపు లేదా రక్తం సంగతి పక్కన పెడితే హిందూయిజాన్ని లేపేసేందుకు అతను ఇప్పుడు సిద్దంగా ఉన్నట్లు ఆరోపించారు. అసలు ఉక్రోషం ఏమిటంటే నరేంద్రమోడీని యుద్ధ నేరస్తుడని వర్ణించటమే అనివేరే చెప్పనవసరం లేదు. కొసమెరుపు ఏమంటే ప్రపంచంలోనే పిన్నవయస్కురాలైన మేయర్‌గా తిరువనంతపురంలో ఎన్నికైన సిపిఎం నాయకురాలు 21ఏండ్ల ఆర్య రాజేంద్రన్‌ను గతంలో అభినందిస్తూ జోహ్రాన్‌ చేసిన ట్వీట్‌ను ఉటంకిస్తూ ఒక కమ్యూనిస్టును అభినందించిన ఇతగాడు కూడా కమ్యూనిస్టే అంటూ విద్వేషాన్ని వెళ్లగక్కారు. డోనాల్డ్‌ ట్రంప్‌ జనవరి 20న పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత ఇంటా బయటా అనేక సమస్యలను ఎదుర్కొన్నాడు. వాటిలో ఒక ప్రధాన అంశంగా న్యూయార్క్‌ నగర మేయర్‌గా జోహ్రాన్‌ మమ్దానీ ఎన్నికను అడ్డుకోవటం కూడా ఉంది. బహుశా అమెరికా అధ్యక్షుల చరిత్రలో గడచిన శతాబ్ది కాలంలో మరొకరెవరికీ ఇలాంటి పరిస్థితి ఉత్పన్నం కాలేదని చెప్పవచ్చు. ఈ ఎన్నికల ఫలితం, పర్యవసానాలు వచ్చే ఏడాది జరిగే పార్లమెంటు మధ్యంతర ఎన్నికల మీద కూడా ప్రభావం చూపవచ్చు అని చెబుతున్నారు. ఆ కారణంగానే ట్రంప్‌ స్వంత పార్టీ అభ్యర్థిని పక్కన పెట్టటమే కాదు, అతగాడికి ఓటేస్తే జోహ్రాన్‌కు ఓటేసినట్లే అని చెప్పేంతవరకు వెళ్లాడు.చిత్రం ఏమిటంటే ట్రంప్‌ను వ్యతిరేకించిన ఎలన్‌ మస్క్‌ కూడా ఇదే చెప్పాడు. మహాభారతంలో అభిమన్యుడిని అంతం చేసేందుకు చూసినట్లు జోహ్రాన్‌ ఓటమికి అన్ని రకాల శక్తులు ఏకమైనా సర్వేలు అతనికి అనుకూలంగా చెప్పాయి.ఈ అభిమన్యుడు కుట్రలను వమ్ము చేసి పద్మవ్యూహం నుంచి జయప్రదంగా బయటపడి విజయదుందుభి మోగించాడు. అమెరికాలో సరికొత్త రాజకీయాలకు నాంది పలికాడని చెప్పవచ్చు. డెమోక్రటిక్‌ పార్టీలో ఉన్న పురోగామి శక్తులు మరింతగా తమ స్థానాన్ని పటిష్టపరుచుకొనేందుకు ఈ విజయం ఎంతగానో తోడ్పడుతుంది. ఆ క్రమం కొద్ది సంవత్సరాల క్రితం ప్రారంభమైంది.పార్టీలోని కార్పొరేట్ల ప్రతినిధులతో ఘర్షణ పడుతున్నారు. అలాంటి వారికి ఈ పరిణామం ఎంతో ఊపునిస్తుంది, సమీకరణ వేగం పుంజుకుంటుంది. ఏ పరిణామాలకు ఇది నాంది పలికిందో ముందు ముందు చూస్తాం !

Share this:

  • Tweet
  • More
Like Loading...

తగ్గేదే లేదని క్షిపణి ప్రయోగంతో జవాబిచ్చిన ఉత్తర కొరియా – వాణిజ్య ఒప్పందాలతో సాగిన ట్రంప్‌ ఆసియా పర్యటన !

29 Wednesday Oct 2025

Posted by raomk in CHINA, Current Affairs, imperialism, INTERNATIONAL NEWS, Japan, Opinion, USA, WAR

≈ Leave a comment

Tags

APEC, asean summit, Donald trump, Kim Jong-un, Trump business tour, Xi Jinping

ఎం కోటేశ్వరరావు

ఉత్తర కొరియా నేత కిమ్‌ జోంగ్‌ అన్‌కు అంగీకారమైతే తాను అతనితో కూడా భేటీ అవుతానని తన ఆసియా పర్యటనలో విలేకర్ల ప్రశ్నకు ట్రంప్‌ బదులిచ్చాడు. ఉత్తర కొరియాను అణ్వస్త్ర రహితం కావిస్తే పెద్ద బహుమతి( ఆంక్షల ఎత్తివేత) పొందుతారంటూ ట్రంప్‌ బిస్కెట్‌ వేసేందుకు చూశాడు. అయితే నా స్పందన ఇది అంటూ మంగళవారం నాడు సముద్రం మీద నుంచి ఉపరితలానికి క్రూయిజ్‌ క్షిపణిని ప్రయోగించి కిమ్‌ బదులిచ్చాడు. శత్రువుతో మాటలు కాదు చేతలే అని చెప్పినట్లయింది. అది జరిగేందుకు ఆస్కారం లేదనే చెప్పవచ్చు ! జపాన్‌ నుంచి బుధవారం నాడు దక్షిణ కొరియాకు వెళ్లే ముందు ఈ ప్రయోగం జరిపారు. తమ వద్ద ఉన్న అణ్వాయుధాల గురించి శత్రువులకు గుర్తు చేయటమే ఇదని ఉత్తర కొరియా అధికారిక మీడియా వర్ణించింది. ఈ ప్రయోగం భద్రతా మండలి విధించిన నిషేధాన్ని ఉల్లంఘించినట్లు కాదని, తమ అణ్వాయుధాల గురించి చర్చించటానికి తాము సిద్దం కాదనే సందేశం ఇచ్చినట్లని బిబిసి వర్ణించింది. దక్షిణ కొరియాలో జరిగే అపెక్‌ సమావేశానికి ఉత్తర కొరియా నేత కిమ్‌ హాజరు కావటం లేదు. వియత్నాంలో 2019లో ట్రంప్‌ ఆహ్వానం మేరకు కిమ్‌తో భేటీ జరిగింది. అయితే ఆ చర్చలు విఫలం కావటంతో తరువాత వారి మధ్య ఎలాంటి సమావేశమూ జరగలేదు. కిమ్‌కు అంగీకారమైతే తాను ఒక రోజు దక్షిణ కొరియాలో అదనంగా ఉంటానని ట్రంప్‌ విలేకర్లతో చెప్పాడు. దానికి కిమ్‌ నుంచి ఇంతవరకు ఎలాంటి జవాబు రాలేదు. అణు పరీక్షలు జరుపుతున్నందున ఉత్తర కొరియా మీద అమెరికా అనేక ఆంక్షలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. రష్యా మీద మరిన్ని ఆంక్షలు ప్రకటించిన తరువాత ఉత్తర కొరియా విదేశాంగ మంత్రి చోయి సన్‌ హుయి గత వారంలో మాస్కో వెళ్లి చర్చలు జరిపాడు. ట్రంప్‌ ఆసియా పర్యటన సందర్భంగా క్షిపణి పరీక్షలు నిర్వహించటం విశేషం.

మంగళవారం నాడు అమెరికా, జపాన్‌ మధ్య వాణిజ్య, విలువైన ఖనిజాల ఒప్పందం కుదిరింది.అధ్యక్షుడు ట్రంప్‌, జపాన్‌ ప్రధమ మహిళా ప్రధాని తకాయిచి టోక్యోలో సంతకాలు చేశారు.వివరాలు పూర్తిగా వెల్లడి కాలేదు. అమెరికాలో 550 బిలియన్‌ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు జపాన్‌ అంగీకరించగా ప్రతిగా దాని వస్తువులపై 15శాతం దిగుమతి పన్ను విధించేందుకు అమెరికా అంగీకరించింది. ట్రంప్‌కు కావాల్సినన్ని పొగడ్తలు తప్ప అమెరికాకు పెద్దగా ఒరిగిందేమీ లేదని డెమోక్రటిక్‌ పార్టీ మద్దతుదారైన న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక వ్యాఖ్యానించింది. ఈ ఒప్పందాలను రెండు దేశాల మధ్య సంబంధాలలో ” నూతన స్వర్ణయుగం ” అని వర్ణించారు.అదిరింపులు బెదిరింపుల మధ్య జూలై నెలలోనే పెట్టుబడులు, పన్నుల గురించి ఒక అవగాహన కుదిరినట్లు డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించాడు. అయితే మంగళవారం నాడు సంతకాలు జరగటానికి ముందు చివరి క్షణం వరకు అనేక అనుమానాలు షికారు చేశాయి. పశ్చిమాసియాలో శాంతి, థారులాండ్‌-కంపూచియా మధ్య వివాదాన్ని పరిష్కరించటంలో ట్రంప్‌ పాత్రను తకాయిచి ఆకాశానికి ఎత్తారు. అసాధారణ చారిత్రక విజయాలుగా ఆమె వర్ణించారు. వారి చర్చల తరువాతే టోక్యోలోని అక్సాకా పాలెస్‌లో జరిగిన స్వాగత కార్యక్రమానికి ట్రంప్‌ హాజరయ్యాడు. ఈ ఒప్పందం గురించి ప్రశంసలు, విమర్శలు గతంలోనే వెల్లడయ్యాయి.

జపాన్‌ నుంచి అమెరికా ఇప్పటివరకు లక్ష కోట్ల డాలర్ల మేర రుణాలుగా తీసుకుంది. అమెరికా డాలర్లకోసం ప్రతిదేశాన్నీ బెదిరిస్తున్నది. అయితే తాజాగా కుదిరిన ఒప్పందం గురించి గతంలోనే ట్రంప్‌ మీద విమర్శలు వచ్చాయి. ఆ ఒప్పందంలో తరువాత ఎలాంటి మార్పులూ చేసినట్లు ఎవరూ ప్రకటించలేదు గనుక గత విమర్శలేమిటో ఒకసారి చూద్దాం. ఐదువందల యాభై బిలియన్‌ డాలర్ల మొత్తాన్ని ప్రభుత్వానికి ఇస్తే తమ ఇష్టం వచ్చినట్లు వినియోగించుకుంటామని, దాని మీద వచ్చే లాభాలలో 90శాతం తమకే అని ట్రంప్‌ వత్తిడి చేశాడు. అయితే ఆ మొత్తంలో కేవలం రెండు శాతం మాత్రమే పెట్టుబడిగా ఉంటుందని, మిగిలిన మొత్తం రుణాలు, రుణ హామీల వంటి ఇతర రూపాల్లో ఉంటుందని జపాన్‌ ప్రతినిధి వర్గనేత రోయెసీ అకజావా టీవీలో బహిరంగంగా చెప్పాడు. కొంత మంది అమెరికన్లకు జపాన్ను విక్రయించారని విమర్శిస్తున్నారని, లాభాల్లో 90శాతానికి అంగీకరించినందున నష్టం పెద్దగా ఉండదని దీనికి ప్రతిగా అమెరికా తగ్గించే పన్నుల వలన 68 బిలియన్‌ డాలర్ల మేర జపాన్‌కు లబ్ది కలుగుతుందని కూడా చెప్పాడు. బహుశా ఈ కారణంతోనే మంగళవారం నాడు ఒప్పందంపై సంతకాల తరువాత న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక ప్రతికూలంగా వ్యాఖ్యానించిందని చెప్పవచ్చు. తమ దేశంలో పెట్టుబడులకు, పన్నులు విధింపుకు లంకెపెట్టటం ఒక జపాన్‌ విషయంలోనే కాదు. ఇప్పటికే ఐరోపా యూనియన్‌తో 600బిలియన్‌ డాలర్లు పెట్టుబడులు పెడితేనే 15శాతం పన్నులు విధిస్తామని లేకుంటే ఎక్కువ అని ట్రంప్‌ బెదిరించాడు.

వాణిజ్యం చేయటం, లాభాలు పిండుకోవటంలో అమెరికా, జపాన్‌ ఎవరికి ఎవరూ తీసిపోరు గనుక పరస్పర లబ్ది లేకుండా అంగీకరించే అవకాశం ఉండదని చెప్పవచ్చు. ముందే చెప్పుకున్నట్లు ఒక లక్షకోట్ల డాలర్లు అమెరికాకు అప్పు ఇవ్వటమేగాక మరో రెండులక్షల కోట్ల డాలర్ల మేర ఇప్పటికే జపాన్‌ పెట్టుబడులు పెట్టింది. జపాన్‌లో డాలర్లు గుట్టలుగా పడి ఉన్నాయి. ఎవరైనా అక్కడి బాంకుల్లో డబ్బుదాచుకుంటే వారే బ్యాంకులకు ఎదురు ఇవ్వాల్సి ఉంటుంది. తమ దేశంలో ఉన్న వడ్డీ రేట్లతో పోలిస్తే అమెరికాకు అప్పులు ఇవ్వటం జపాన్‌కు ఎంతో లాభం కలుగుతుంది. జపాన్‌లో తక్కువ వడ్డీ చెల్లించి జనాల నుంచి బాంకులు రుణాలు తీసుకుంటాయి, వాటిని ఎక్కువ వడ్డీ రేట్లకు అమెరికా, ఇతర దేశాలలో పెట్టుబడులుగా పెట్టి లాభాలు ఆర్జిస్తాయి, ఈ క్రమంలోనే అమెరికాకు అత్యధికంగా జపాన్‌ లక్ష కోట్ల డాలర్ల మేర రుణబాండ్లలో పెట్టుబడులు పెట్టింది. ఈ విషయంలో బ్రిటన్‌ రెండవ స్థానంలో ఉంటే చైనా మూడవదిగా ఉంది. అమెరికాలో ఉన్న జపాన్‌ కంపెనీలైన సోనీ,టొయోటా వంటి బహుళజాతి కంపెనీలు, ద్రవ్యపెట్టుబడి సంస్థలు అక్కడ పెట్టుబడులు పెట్టి లాభాలు సంపాదిస్తున్నాయి, వచ్చిన లాభాలను తిరిగి అక్కడే పెట్టుబడులుగా పెడుతున్నాయి. తాజా ఒప్పందంలో అమెరికా కార్లకు ద్వారాలు తెరిచేందుకు జపాన్‌ అంగీకరించినట్లు చెబుతున్నారు. గాలికిపోయే పేలపిండి కృష్ణార్పణం అన్నట్లు డీజిలు, పెట్రోలు తాగే అమెరికన్‌ కార్లను జపాన్‌లో కొనుగోలు చేసేదెవరు ? లేదూ అమెరికన్లు అమ్ముకోవాలనుకుంటే జపనీయుల అవసరం, అభిరుచులకు అనుగుణంగా సరసమైన ధరలకు అందచేస్తే ఇబ్బంది ఉండదు. అక్కడ అమెరికా కార్లకు డిమాండ్‌ కూడా తక్కువే గనుక వాటి దిగుమతులకు అనుమతించినా జపాన్‌ కార్ల మార్కెట్‌కు పెద్దనష్టమేమీ ఉండదు. జపాన్‌లో తలెత్తిన ఆర్థిక మాంద్యం కారణంగా జనాలు ప్రజా రవాణా వ్యవస్థ పట్ల మొగ్గుచూపుతున్నారు. నిర్వహణ ఖర్చు ఎక్కువగా ఉండే అమెరికన్‌ కార్లను పట్టించుకుంటారా ? గతంలో కార్లంటే అమెరికా, ఇప్పుడు జపాన్‌ ఆ స్థానాన్ని ఆక్రమించింది, జర్మనీ, దక్షిణ కొరియా వంటి దేశాలూ తక్కువ తినలేదు, విద్యుత్‌ కార్ల రంగంలో చైనా సవాలు విసురుతోంది. అందువలన ట్రంప్‌ విధించే పదిహేనుశాతం దిగుమతి పన్నుతో అమెరికా కంపెనీల యజమానులు కొంత కాలం పాటు ఊరట పొందవచ్చు తప్ప తరువాత పోటీకి అనుగుణంగా తయారుగాకపోతే అంతే సంగతులు.

ట్రంప్‌ ఆసియా పర్యటనలో వివిధ దేశాలతో ఒప్పందాలను కుదుర్చుకొనేందుకు కొన్ని షరతులను రుద్దినట్లుగా కనిపిస్తోంది. చిన్న చిన్న దేశాలలో ఎంత దొరికితే అంత అన్నట్లుగా విలువైన ఖనిజాల గురించి ఒప్పందాలు చేసుకున్నాడు. మలేషియా వస్తువుల మీద 19శాతం పన్నుల విధింపు అమల్లో ఉందని చెబుతూనే కొన్నిమినహాయింపులు ఇచ్చాడు.దీనికి ప్రతిగా అమెరికా వస్తువులు, గ్యాస్‌, వ్యవసాయ ఉత్పత్తులను మలేషియా కొనుగోలు చేయనుంది. అమెరికా కంపెనీ బోయింగ్‌ నుంచి 30 విమానాలను కొనుగోలు చేస్తామని, మరో 30 గురించి ఆలోచిస్తామని చెప్పింది. ఇవిగాక అమెరికాలో 70 బిలియన్‌ డాలర్లు పెట్టుబడులుగా పెట్టేందుకు అంగీకరించింది. అయితే కీలకమైన సెమీ కండక్టర్ల ఉత్పత్తి చేస్తున్న మలేషియా అమెరికా షరతులకు తలొగ్గలేదు. కంపూచియాతో కుదిరిన ఒప్పందం ప్రకారం అమెరికా వస్తువుల దిగుమతిపై ఎలాంటి పన్ను ఉండదు. విలువైన ఖనిజాల శుద్ధి వంటి ప్రక్రియకు అమెరికా పెట్టుబడులను అనుమతిస్తుంది. వియత్నాంపై విధించిన 46శాతం పన్నులను 20శాతానికి తగ్గించేందుకు అమెరికా దిగివచ్చింది. దీనికి ప్రతిగా ఎనిమిది బిలియన్‌ డాలర్లతో 50 బోయింగ్‌ విమానాలను కొనుగోలు చేస్తుంది. వీటితో పాటు అమెరికా వ్యవసాయ ఉత్పత్తులను కూడా దిగుమతి చేసుకుంటుంది.చైనా నుంచి దిగుమతి చేసుకున్న విడిభాగాలతో తయారు చేసి అమెరికాకు ఎగుమతి చేసే వస్తువులపై పన్ను వివాదం కొనసాగుతూనే ఉంది. ఒక నిర్దిష్ట నిర్వచనం లేదు. థారులాండ్‌ వస్తువులపై 19శాతం పన్నుల నుంచి అనేక వస్తువులకు మినహాయింపు ఇస్తారు. ఎనభై విమానాలను థారు కొనుగోలు చేస్తుంది. దక్షిణ కొరియా వస్తువుల మీద పన్ను 15శాతానికి పరిమితం చేయాలంటే తమ దేశంలో 350 బిలియన్‌ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టాల్సిందే అని అమెరికా వత్తిడి చేస్తున్నది.అది దక్షిణ కొరియా జిడిపిలో 6.5శాతానికి సమానం. అంత పెట్టుబడి పెడుతుందా అన్నది ప్రశ్న.

డోనాల్డ్‌ ట్రంప్‌ కౌలాలంపూర్‌లో జరుగుతున్న ఆసియన్‌ ప్లస్‌ 3 (ఏపిటి) సమావేశాలకు, తరువాత దక్షిణ కొరియాలో జరిగే మరోసభలో పాల్గ్గొనేందుకు వస్తూ అనేక దేశాలతో విలువైన లోహాలు, ఇతర ఒప్పందాలు కుదుర్చుకొనేందుకు డోనాల్డ్‌ ట్రంప్‌ వచ్చాడు. పది ఆగేయాసియా దేశాలతో కూడిన ఆసియన్‌ కూటమిలో తాజాగా తైమూర్‌-లెస్తే చేరింది. ఇవిగాక చైనా, జపాన్‌, దక్షిణ కొరియా అనుబంధంగా ఉన్న కారణంగా ఆసియన్‌ ప్లస్‌ మూడు అని పిలుస్తున్నారు. ధనిక దేశాలు అనుసరిస్తున్న రక్షణాత్మక విధానాల నుంచి తట్టుకోవాలంటే ఈ కూటమి దేశాల మధ్య సహకారాన్ని విస్తరించుకోవాలని చైనా ప్రధాని లీ క్వియాంగ్‌ కోరాడు. గత కొద్ది సంవత్సరాలుగా తూర్పు ఆసియా వేగంగా వృద్ది చెందుతున్నది. ఇదే సమయంలో కొన్ని సమస్యలను కూడా ఎదుర్కొంటున్నది. ఈ సమావేశాలకు తమ మంత్రిద్వారా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభూ సుబియాంతో ఒక సందేశం పంపాడు. ఆర్‌సిఇపితో సమన్వయం చేసుకొని దాన్నొక వేదికగా ఆసియన్‌ దేశాలు వినియోగించుకోవాలని కోరాడు.ఏకపక్ష వైఖరితో వ్యవహరిస్తున్న దేశాలను ఐక్యంగా ఎదుర్కొవాలని దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జేయి మయుంగ్‌ కోరాడు. రక్షణాత్మక చర్యలతో పాటు సరఫరా గొలుసుల సమస్యలను కూడా ఎదుర్కొంటున్నట్లు చెప్పాడు. పెరుగుతున్న రక్షణాత్మక ధోరణులు, సరఫరా వ్యవస్థల్లో వస్తున్న మార్పులు ఆసియన్‌ దేశాలకు హెచ్చరికలు పంపుతున్నాయని, వాటిని చూసి నిర్ఘాంతపోయి అచేతనంగా ఉండరాదని మలేసియా ప్రధాని అన్వర్‌ చెప్పాడు. ఇప్పుడున్న భాగస్వామ్యాన్ని మరింతగా మెరుగుపరుస్తూ కొత్త భాగస్వామ్యాల కోసం ధైర్యంగా వ్యవహరించాలన్నాడు. వర్తమాన సంవత్సరంలో జనవరి నుంచి సెప్టెంబరు వరకు తొమ్మిది నెలల కాలంలో చైనా మరియు ఆసియన్‌ దేశాల మధ్య వాణిజ్య లావాదేవీలు 782 బిలియన్‌ డాలర్ల మేర జరిగాయి. అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే 9.6శాతం ఎక్కువ. కౌలాలంపూర్‌ సమావేశంలో చైనా-ఆసియన్‌ దేశాల స్వేచ్చావాణిజ్య ప్రాంతం 3.0 ఒప్పందం కుదిరింది. అమెరికా పన్నులకు అందరం బాధితులమే అని దాని రక్షణాత్మక వైఖరిని వ్యతిరేకించాలని ఆసియన్‌ దేశాలన్నింటా ఏకీ భావం కనిపించింది. అయితే వివిధ కారణాలతో అనేక దేశాలు అమెరికాతో నేరుగా ఒప్పందాలు చేసుకుంటున్నప్పటికీ ఒక్కటిగా ఉండకపోతే నష్టమనే భావన ఏర్పడింది.

గత ఏడాది లావోస్‌లో జరిగిన 27వ సమావేశం పెరుగుతున్న ప్రాంతీయ సహకారం గురించి చర్చించింది, దాన్ని మరింతగా ముందుకు తీసుకుపోయేందుకు కౌలాలంపూర్‌ సమావేశం దృష్టి సారించింది, ఇది అనివార్యమైన పరిణామం. అన్ని దేశాల మీద ట్రంప్‌ పన్నుల దాడి మొదలు పెట్టిన పూర్వరంగంలో దానికి గురయ్యే దేశాలకు ఇంతకు మించి మరొక మార్గం లేదు.ఈ కూటమి లేదా వ్యవస్థ 1997లో ఉనికిలోకి వచ్చింది. ఆసియన్‌ కూటమిలో బ్రూనీ, కంపూచియా, ఇండోనేషియా, లావోస్‌, మలేషియా, మయన్మార్‌, ఫిలిప్పీన్స్‌, సింగపూర్‌, థారులాండ్‌, వియత్నాం సభ్యులుగా ఉండగా పదకొండవ దేశంగా తైమూర్‌-లెస్తే చేరింది. ఇప్పుడు ప్రపంచ దృష్టి అంతా దక్షిణ కొరియాలో జరిగే ఆసియా -పసిఫిక్‌ ఆర్థిక సహకార వేదిక (ఎపిఇసి) సమావేశాల మీద ఉంది. అక్కడ 30వ తేదీన చైనా అధినేత షీ జింపింగ్‌తో ట్రంప్‌ భేటీ కానున్నాడు. విలువైన ఖనిజాల ఉత్పత్తులపై చైనా ఆంక్షలు విధించిన తరువాత కొద్ది రోజుల క్రితం ఒక ఒప్పందం జరిగినట్లు వార్తలు వచ్చాయి. తుది ఒప్పందం మీద ఇరు దేశాల నేతలు సంతకాలు చేయవచ్చని చెబుతున్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

సముద్రంలో చైనా డేటా సెంటర్‌ : నిజంగా నరేంద్ర మోడీ, చంద్రబాబు భవిష్యత్‌ దార్శనికులా !

27 Monday Oct 2025

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, Education, employees, Environment, Europe, Germany, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Science, USA

≈ Leave a comment

Tags

# China underwater data center, BJP, CHANDRABABU, China, Data Centers, Data centers Employment, Narendra Modi Failures, Vizag Google Data Center, Xi Jinping, YS jagan

ఎం కోటేశ్వరరావు

సముద్రంలో చైనా నిర్మించిన పదమూడు వందల టన్నుల బరువుగల డేటా సెంటర్‌ ఆదివారం నాడు(2025 అక్టోబరు26న) ప్రారంభమైంది. ఇది గాలి మరలతో ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను వినియోగించనుంది. హై క్లౌడ్‌ అనే కంపెనీ మొదటి దశలో భాగంగా 24మెగావాట్ల కేంద్రాన్ని షాంఘై తీరంలో నెలకొల్పింది. న్యూస్‌ అట్లాస్‌ వెల్లడించిన సమాచారం ప్రకారం సముద్రపు ఒడ్డున నిర్మించిన గాలి మరల విద్యుత్‌ కేంద్రం నుంచి 95శాతం విద్యుత్‌ను ఈ కేంద్రానికి సరఫరా చేస్తారు, సముద్రపు నీటిని చల్లబరిచేందుకు వినియోగిస్తారు. మొత్తం 22.6 కోట్ల డాలర్ల ఖర్చుతో నిర్మించిన ఈ కేంద్రంలో సాంప్రదాయపు డేటా సెంటర్ల కంటే 23శాతం విద్యుత్‌ వినియోగం తగ్గుతుంది. సముద్రంలో 114 అడుగుల అడుగున ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలోని ఒక్కో గదిలో 4 నుంచి ఐదు వందల సర్వర్లు ఉంటాయి. సముద్రంలో ఏర్పాటు చేసిన టెలికాం కేబుళ్ల ద్వారా ఈస్ట్రన్‌ డేటా, వెస్ట్రన్‌ కంప్యూటింగ్‌ వ్యూహం ప్రకారం ప్రధాన భూభాగంలోని కేంద్రానికి అనుసంధానం చేశారు. రానున్న రోజుల్లో ఇలాంటివే మరో వందగదులను నిర్మించి విస్తరిస్తారు. మైక్రోసాఫ్ట్‌ కంపెనీ చైనాలో 2015లో పైలట్‌ ప్రాజక్టుగా సముద్రంలో ఒక డాటా కేంద్రాన్ని నిర్మించింది. ప్రాజెక్ట్‌ నాటిక్‌ పేరుతో చేసిన ఈ ప్రయోగానికి స్వస్తి పలికి 2024జూన్‌లో దాన్ని సముద్రంలో ముంచివేసింది. ఆదివారం నాడు సముద్రంలో తొలి వాణిజ్య డాటా కేంద్రాన్ని నిర్మించి ప్రారంభించిన తొలి దేశంగా చైనా చరిత్రకెక్కింది. ఇలాంటివే మరో రెండు నిర్మాణంలో ఉన్నాయి. ఈ కేంద్రం చైనాలో అతి పెద్ద తొలి స్వేచ్చా వాణిజ్య కేంద్రం ఉన్న హైనాన్‌ సమీపంలో ఉంది. పూర్తిగా విదేశీ పెట్టుబడులతో నిర్మించారు.

విశాఖలో అదానీ, ఎయిర్‌టెల్‌ కంపెనీలతో కలసి గూగుల్‌ నిర్మించనున్న డేటా కేంద్రం ఎంత మందికి ఉపాధి కల్పిస్తుందన్నది చర్చ. లింక్‌డ్‌ఇన్‌లో వచ్చిన ఒక విశ్లేషణ జర్మనీలోని బిఎఎస్‌ఎఫ్‌ రసాయన కంపెనీతో డేటా సెంటర్ల ఉపాధిని పోల్చింది. సదరు జర్మనీ సంస్థ 684మెగావాట్ల విద్యుత్‌ను వినియోగిస్తుంది, 50వేల మందికి పూర్తి స్థాయి ఉపాధిని కల్పిస్తున్నది. అదే జర్మనీలో డాటా కేంద్రం 2,283మెగా వాట్ల విద్యుత్‌ను వినియోగించే చోట పూర్తి కాలపు ఉపాధి 6,849 నుంచి 13,699 మందికి చూపుతుంది. రసాయన ఫ్యాక్టరీ ఒక మెగావాట్‌కు 73 మందికి ఉద్యోగ కల్పన చేస్తుంటే డేటా సెంటర్‌ ఒక మెగావాట్‌కు 3 నుంచి ఆరు ఉద్యోగాలను ఇస్తున్నది. గూగుల్‌ ఆధునిక సాంకేతిక ప్రక్రియలను వినియోగిస్తుంది గనుక ఇంకా తగ్గవచ్చు. ఆ లెక్కన చూసినా విశాఖలో నిర్మించే ఒక గిగావాట్‌(వెయ్యి మెగావాట్లు) కేంద్రం మూడు నుంచి ఆరువేల మందికి పర్మనెంటు ఉద్యోగాలను కల్పిస్తుంది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ చెప్పిన అంకెలు దీనికి దగ్గరగా ఉన్నాయి. దానికి భిన్నంగా రాష్ట్ర మంత్రి లోకేష్‌ చెప్పారు. ఇద్దరికి సమాచార వనరు ఏమిటి ? ఈ విషయాన్ని చెప్పటానికి బిడియపడాల్సిందేముంది. అదే గూగుల్‌ను అడిగితే అందించిన ఇతర విశ్లేషణలు కూడా దీనికి దగ్గరగానే ఉన్నాయి. ప్రైవేటు కంపెనీలన్నీ సాధ్యమైనమేరకు తక్కువ మందితో పని చేయించుకొనేందుకు చూస్తాయి. కన్సిడర్‌ మైక్రోసాఫ్ట్‌ ఏర్పాటు చేసిన సిడ్నీలోని డాటా కేంద్రం 2023లో అకస్మాత్తుగా ఆగిపోయింది. తగినంత మంది సిబ్బంది లేని కారణంగా జరిగిన ఆ అంతరాయం 46 గంటల పాటు సేవల నిలిపివేతకు దారితీసింది. అప్‌టైమ్‌ ఇనిస్టిట్యూట్‌ అనే సంస్థ సిబ్బంది కొరత గురించి పేర్కొన్నది. ప్రపంచ డాటా సెంట్లర్లలో 2019లో ఇరవైలక్షల మంది పూర్తి కాలపు ఉద్యోగులు ఉంటే 2025 నాటికి కేంద్రాలు పెరిగినా 23లక్షల మంది మాత్రమే ఉన్నారు. ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగులా అన్నది వివరణ లేదు. ప్రపంచంలో ఇప్పుడున్న 122 గిగావాట్ల సామర్థ్యంలో సగటు తీసుకుంటే ఒక్కో గిగావాట్‌కు 18,700 ఉన్నట్లు కనిపిస్తున్నది. విశాఖ గూగుల్‌ సెంటర్‌కు అందరూ కలసి 20 నుంచి 30వేల మంది ఉంటారని కూడా పెమ్మసాని చంద్రశేఖర్‌ చెప్పారు. డాటా కంపెనీలు సిబ్బందిని చేర్చుకోవటం, నిలుపుకోవటంలో తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నాయి. చిన్న కేంద్రాలు(ఒకటి నుంచి ఐదు మెగావాట్లు) 8 నుంచి 15 మంది, ఐదు నుంచి ఇరవై మెగావాట్ల కేంద్రాలు 15 నుంచి 35 మంది, ఇరవై అంతకు మించిన సామర్ధ్యం కలిగినవి 35 మందికి పైగా, 40 మెగావాట్ల సంస్థలు 45 మందిని, వంద మెగావాట్లు అంతకు మించి సామర్ధ్యం కలిగినవి కొద్దిమందితోనే నిర్వహిస్తున్నాయి, ఎందుకంటే యాంత్రీకరణ మరియు నిర్ణీత ప్రమాణాలతో ఉండే వ్యవస్థలు అందుకు దోహదం చేస్తున్నాయి. నియమించుకుంటున్నాయి. డేటా సెంటర్లలో మొత్తం 230 రకాల సిబ్బంది అవసరం అని చెబుతున్నారు. అయితే చిన్న సంస్థలు అంతమందిని నియమించవు, అవి అవసరమైనపుడు పొరుగు సేవలను ఉపయోగించుకుంటాయి. సగం డేటా సెంటర్లు అవసరమైన నిపుణులు దొరక్క ఇబ్బందులు పడుతున్నాయి.

రెండును రెండుతో కలిపినా, హెచ్చవేసినా ఫలితం నాలుగే. ఇది చెప్పటానికి గణితమేథావులతో పనిలేదు. డేటా సెంటర్లతో కలిగే పర్యావరణహాని, విషపూరితమైన వ్యర్ధాల వంటి ఇతర దుష్ఫలితాల గురించి వైఎస్‌ జగన్మోహనరెడ్డి చెప్పినా(అఫ్‌ కోర్స్‌ అధికారంలో ఉన్నపుడు ఈ పెద్దమనిషి వీటి గురించి చెప్పలేదు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా నోరు విప్పరు) ఆ రంగం గురించి అధ్యయనం చేసినవారు చెప్పినా విషయం ఒకటే. ఎవరైనా రాజకీయాలతో నిమిత్తం లేని వారు చెబితే చూశారా రాష్ట్ర అభివృద్దిని వ్యతిరేకించేవారు జగన్‌తో చేతులు కలిపి అవే వాదనలు చేస్తున్నారంటూ ప్రచారదాడికి దిగుతున్నారు. అంటే నోరు మూయించేందుకు ఇదొక రకం నియంతృత్వపోకడతప్ప మరొకటి కాదు. తేమ కారణంగా యంత్రాలు పనికి రాకుండా పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున అమెరికాలోని డేటా కేంద్రాలన్నీ పొడివాతావరణం ఉండే ప్రాంతాల్లోనే ఏర్పాటు చేశారని చెబుతున్నారు.పెట్టుబడిలో నాలుగో వంతు సబ్సిడీలు, సంవత్సరాల తరబడి రాయితీ ధరలకు నీరు, విద్యుత్‌ అందచేస్తున్న తరువాత ఏ పెట్టుబడిదారుడు మాత్రం చంద్రబాబు నాయుడి దరిచేరడు ! డాటా సెంటర్‌ మాప్‌ డాట్‌ కామ్‌ సమాచారం ప్రకారం గూగుల్‌కు ప్రపంచంలో 113 డాటా సెంటర్లు ఉండగా వాటిలో 68 పని చేస్తున్నాయి, మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. వీటిలో ఎందరు ఉద్యోగులు పని చేస్తున్నారని అడిగితే సమాచారం లేదని బదులు వచ్చింది. ప్రపంచంలో గూగుల్‌ సంస్థలో లక్షా 83వేల మంది పనిచేస్తున్నారనే సమాచారం ఉంది తప్ప ఏ విభాగంలో ఎందరు అన్నది లభ్యం కావటం లేదు. ఎవరికైనా దొరికితే ఈ విశ్లేషణకు జత చేస్తాను. మానవహక్కుల ఫోరం(హెచ్‌ఆర్‌ఎఫ్‌) సమాచారం ప్రకారం అమెరికాలోని అష్‌బర్న్‌ మరియు లీస్‌బర్గ్‌ డాటా సెంటర్లు రెండిలోనూ కలిపి ప్రత్యక్షంగా 400 మందికి పరోక్షంగా 3,100 మంది ఉపాధి దొరుకుతున్నట్లు పేర్కొన్నది.లోకేష్‌ చెప్పినట్లు లక్షా 88వేల ఉద్యోగాల్లో 88వేలు పర్మనెంటు అనుకుంటే మొత్తం గూగుల్‌ ఉద్యోగులు విశాఖలోనే ఉంటారన్నట్లుగా భావించాలి, అది జరిగేదేనా !

ఇంటర్నెట్‌ వెతుకులాటలో డాటా సెంటర్ల ఉపాధి గురించి ఎవరెటు తిప్పి చెప్పినా పెట్టుబడులు, స్థలాల విస్తీర్ణం ఎక్కువ, ప్రత్యక్ష ఉపాధి తక్కువ, పరోక్ష ఉపాధి గురించి మాత్రమే వెల్లడవుతున్నది. పరోక్షం అంటే భవనాల నిర్మాణ సమయంలో దొరికే ఉపాధి, వాటి చుట్టూ ఉండే నివాసాలతో కలిగే లబ్ది గురించి మాత్రమే ప్రస్తావన ఉంటున్నది. ఆ లెక్కన బడా పరిశ్రమలు అంతకంటే ఎక్కువ కల్పిస్తున్నాయి. వస్తూత్పత్తిలో చైనాను పక్కకు నెట్టే ప్రపంచ ఉత్పాదక కేంద్రంగా దేశాన్ని మారుస్తామన్న మాటలు ఇప్పుడు ఎకువగా వినిపించటం లేదు. డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థ గురించి కబుర్లు పెరిగాయి.ఒకదానికి ఒకటి పోటీ కాదు, పరస్పరం సాయం చేసుకొనేవే.పెట్టుబడులు ఎక్కువ ఉపాధి తక్కువ ఉండే టెక్‌ కంపెనీల కోసం మోడీ, చంద్రబాబు వంటి వారు వెంపర్లాడుతున్నారు. ఒకసారి భవనాల నిర్మాణాలు పూర్తయిన తరువాత తాత్కాలిక కార్మికులకు పని ఉండదు. ఆటోమేషన్‌ ప్రధాన ప్రక్రియగా నడిచే ఈ కేంద్రాలలో కీలకమైన సిబ్బంది ఎవరంటే సెంటర్ల మేనేజర్లు, నెట్‌వర్క్‌ మరియు వ్యవస్థల అడ్మినిస్ట్రేటర్లు, సెక్యూరిటీ నిపుణులు, సాంకేతిక నిపుణులు, వారికి సహాయ సిబ్బంది.

ఆర్థిక ప్రయోజనాల విషయానికి వస్తే ఏటా పదివేల కోట్ల మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి రాబడి వస్తుందని తెలుగుదేశం పార్టీ నేతలు చెబుతున్నారు. డేటా సెంటర్లు అవసరమే, అయితే అవి కొత్త సమస్యలను సృష్టించకూడదు. మనదేశంలో అనేక చోట్ల ఏర్పాటు చేస్తున్న పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్యం గురించి తెలిసిందే. పాలకులు పరిశ్రమలకు అనుమతులు ఇచ్చారంటే ఉత్పత్తులకు తప్ప కాలుష్యానికి కాదు, దాన్ని నివారించేందుకు పరిశ్రమలే చర్యలు తీసుకోవాలన్న నిబంధనలు ఉంటాయి. వాటిని అమలు చేస్తే తమ లాభాలు తగ్గుతాయని తిలోదకాలు ఇస్తున్నాయి. ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదు. ఉదాహరణకు పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ ప్రాంతంలో ఫార్మా, ఇతర సంస్థల నుంచి వెలువడుతున్న కాలుష్యం సమీపంలోని సముద్రంలో కలుస్తున్నది. దాంతో మత్స్యకారుల ఉపాధికి దెబ్బతగులుతున్నది. పరిష్కరించండి మహానుభావా అని ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ను అడిగితే ఈ మధ్యే మాట్లాడుతూ పరిశ్రమలకు అనుమతి ఇచ్చింది తాము కాదని, వంద రోజుల గడువులో పరిష్కరిస్తానని చెప్పారు. అధికారానికి వచ్చి 15నెలల తరువాత ఈ మాటలు చెప్పిన పెద్ద మనిషి ఇంతకాలం ఏం చేస్తున్నట్లు ?

డేటా అనేక విధాలుగా కీలక పాత్ర పోషిస్తున్న పూర్వరంగంలో మనదేశం కూడా వెనుకపడకూడదు. కానీ నరేంద్రమోడీ లేదా రెండింజన్ల పాలనలో ఉన్న ప్రభుత్వాలు గానీ ఎంతో నిర్లక్ష్యం చేశాయన్నది అంకెలే చెబుతున్నాయి.2019లో 350 మెగావాట్ల సామర్ధ్యం ఉండగా 2025 నాటికి 1,350 మెగావాట్లకు చేరుతుందని చెబుతున్నారు. ఈ రంగంలో మిగిలిన దేశాలు ఎంతో ముందున్నాయి.దీనికి కూడా నెహ్రూయే కారణం అని చెబుతారేమో తెలియదు. ముందు చూపు లేకపోవటం తప్ప మరొకటి కాదు.చైనాలో గూగుల్‌, ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లు లేవు, మైక్రోసాఫ్ట్‌ కొన్ని ప్రయివేటు రంగ సంస్థల్లో తప్ప ప్రభుత్వం వినియోగించటం లేదు.కృత్రిమ మేథ, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌లో చైనా వెనుకబడిందని శత్రువులు కూడా చెప్పలేరు.తాజా సమాచారం ప్రకారం 2024నాటికి చైనాలో డేటా వాణిజ్య విలువ 47.23 బిలియన్‌ డాలర్లు కాగా 2030 నాటికి అది 97.30బి.డాలర్లకు పెరుగుతుందని రిసర్చ్‌ అండ్‌ మార్కెట్స్‌ సంస్థ పేర్కొన్నది. స్టాటిస్టా సంస్థ విశ్లేషణ మరోవిధంగా ఉంది.అమెరికాలో 2025 నాటికి డాటా సెంటర్ల ఆదాయం 171.9 బిలియన్‌ డాలర్లు, కాగా చైనాలో 103.19 బిలియన్‌ డాలర్లని 2030 నాటికి 142.64 బి.డాలర్లకు పెరుగుతుందని అంచనా. మరో సమాచారం ప్రకారం ప్రపంచ డేటా సెంటర్ల సామర్ధ్యం 2024నాటికి 122.2 గిగావాట్లు. దీనిలో అమెరికా 53.7(44శాతం) కలిగి ఉండగా చైనా 31.9 గిగావాట్లు కలిగి ఉంది. మూడో స్థానంలో ఒక కూటమిగా ఐరోపా యూనియన్‌ 11.9 గిగావాట్లు, మనదేశం 3.6గా ఉంది.చైనాలో ఇటీవల జత చేసిన సామర్ధ్యాన్ని పని చేయించటం లేదని వార్తలు వచ్చాయి. దీన్ని బట్టి అర్ధం అవుతున్నదేమిటి ? దేశం వ్యవసాయ, పారిశ్రామిక, సేవారంగాలన్నింటా వృద్ది చెందితేనే డేటా కేంద్రాలకు చేతినిండా పని ఉంటుంది. గడచిన పదకొండు సంవత్సరాలుగా కబుర్లు తప్ప అభివృద్ధి లేని కారణంగా డేటా సెంటర్ల సామర్ధ్యం కూడా పెరగలేదన్నది స్పష్టం.విశ్లేషణలను కొనుగోలు చేసేవారు లేకపోతే రేపు విశాఖ గూగుల్‌ సెంటర్‌ అయినా ఈగలు తోలుకుంటూ కూర్చోవాల్సిందే.

దేశాన్ని, రాష్ట్రాన్ని వికసిత్‌ భారత్‌లో ఎక్కడికో తీసుకుపోతామని ప్రధాని నరేంద్రమోడీ, ఆయన అడుగుజాడల్లో లేదా అడుగులకు మడుగులద్దుతున్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక మంది దృష్టిలో దేశంలో అతి పెద్ద దార్శనికులు, ఇతరులకు తట్టనివి అనేకం వారికి కనిపిస్తాయని చెబుతారు. ఆ ప్రచారం వలన దేశానికి ఎంత లాభమో తెలియదు గానీ నష్టం కలిగిస్తున్నారంటే ఎవరూ నొచ్చుకోవాల్సిన అవసరం లేదు. పరిశోధన మరియు అభివృద్ధి(ఆర్‌ అండ్‌ డి) నేడు ప్రపంచాన్ని ఎలా నడిపిస్తున్నాయో చెప్పనవసరం లేదు.తన పాలనలో జిడిపిని పదకొండవ స్థానం నుంచి నాలుగవ స్థానానికి తెచ్చిన ఘనత నాదే అంటారు మోడీ. కాసేపు అంగీకరిద్దాం, ఆ పురోగతి ఇతర రంగాల్లో ఉందా ? వాటిలో కీలకమైన పరిశోధనకు కేటాయింపుల సంగతేమిటి ? 1995-96 నుంచి 2014-15వరకు రెండు దశాబ్దాల వార్షిక సగటు జిడిపిలో 0.73 శాతం ఉంది. యుపిఏ పాలనలో 2008-09లో జిడిపిలో 0.8శాతం నిధులు కేటాయిస్తే మోడీ ఏలుబడిలో 2017-18లో 0.7, ఇప్పుడు 0.64శాతానికి తగ్గించారు. దీనికైతే జవహర్‌లాల్‌ నెహ్రూ కారణం కచ్చితంగా కాదు. అన్నీ వేదాల్లో ఉన్నాయష అనే భావజాలంతో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వ పెద్దల ఈ నిర్వాకాన్ని చంద్రబాబు నాయుడు సమర్ధిస్తారా ? 2013 నాటి సైన్స్‌ మరియు టెక్నాలజీ విధానంలో, 2017-18 ఆర్థిక సర్వేలో కూడా కనీసం రెండు శాతం కేటాయించాలని చెప్పిన అంశం ఎవరికీ తెలియదా ? ఇద్దరు నేతలు దేశ దేశాలు తిరుగుతున్నారు కదా ఎక్కడ ఎంత మొత్తం ఖర్చు చేస్తున్నారో తెలుసుకోరా ? ఎందుకీ నిర్లక్ష్యం ? మన అభివృద్ధి మీద గణనీయమైన ప్రభావం చూపాలంటే 2047నాటి వరకు కనీసం ఒక శాతం, ఆదర్శవంతంగా(ఐడియల్‌) ఉండాలంటే మూడుశాతం చొప్పున ఖర్చు చేయాలని నిపుణులు చెబుతున్నారు. పిండికొద్దీ రొట్టె, పరిశోధనా రంగంలో మనం ప్రపంచ బస్‌ను అందుకోకుండా చేసింది ఎవరంటే ఎవరిని చూపాలి ? పరిశోధనలకు మనం తక్కువ కేటాయిస్తున్నా, పరిశోధనా పత్రాలు గణనీయంగానే మనవారు సమర్పిస్తున్నారుగా అని సమర్ధించుకొనే వారిని చూసి నవ్వాలో ఏడవాలో అర్ధం కావటం లేదు ! ఎలాంటి పాలకులను మోస్తున్నాంరా బాబూ అని తల పట్టుకోవాలి !!

సంబంధిత మరో విశ్లేషణ దిగువ లింక్‌లో చదవవచ్చు ;

మేథోమధనం : డేటా సెంటర్లంటే గోడౌన్లా ! ఉత్పత్తి కేంద్రాలా !! జగన్‌, చంద్రబాబు చెబుతున్నదానిలో నిజానిజాలేమిటి ?
https://vedikaa.com/2025/10/25/are-data-centers-godowns-or-production-houses-what-is-the-truth-about-ycp-and-tdp-claims-on-employment/

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d