• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: BJP

నాడు రోడ్లపై మేకులు – నేడు రైతులను బందెల దొడ్లో పెట్టాలన్న కేంద్రం ! వీపులు పగలగొట్టి అడ్డుకోవాలన్న పోలీసు బాస్‌ !!

13 Tuesday Feb 2024

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, Economics, Farmers, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Prices

≈ Leave a comment

Tags

#Farmers Protest, #support farmers, 2024 Farmers Protest, BJP, Farmers in Delhi, Narendra Modi Failures


ఎం కోటేశ్వరరావు


మరోసారి రైతులు ఢిల్లీబాట పట్టారు.వారిని ఎట్టి పరిస్థితిలోనూ నగరంలో ప్రవేశించకుండా అడ్డుకొనేందుకు బిజెపి సర్కార్‌ పూనుకుంది. అనేక చోట్ల రైతుల మీద బాష్పవాయువు, లాఠీ ఛార్జీ జరిపారు, అడుగడుగునా హర్యానా బిజెపి ప్రభుత్వం ఆటంకాలు కల్పించింది. ఉత్తర ప్రదేశ్‌ నుంచి ఢిల్లీలోకి ప్రవేశించే మార్గాలలో కూడా రవాణాకు తీవ్ర అంతరాయం కలిగింది. ఈ ఆందోళనకు సంయుక్త కిసాన్‌ మోర్చా(ఎన్‌పి-రాజకీయ రహిత) పిలుపు నిచ్చింది. గతంలో ఏడాది పాటు ఆందోళన నిర్వహించిన సంయుక్త కిసాన్‌ మోర్చా(ఎస్‌కెఎం) నుంచి విడిపోయిన వారు, గత ఆందోళనకు దూరంగా ఉన్న కొని సంఘాలు తాజా ఆందోళనకు పిలుపునిచ్చాయి. గతంలో రైతులు ఢిల్లీలో ప్రవేశించి తమ డిమాండ్ల మీద నిరసన తెలుపకుండా అడ్డుకొనేందుకు రోడ్ల మీద మేకులు, కాంక్రీటు దిమ్మలను ఏర్పాటు చేసిన నరేంద్రమోడీ సర్కార్‌ తీరు తెలిసిందే.ఇప్పుడు ఢిల్లీలో ఉన్న బవనా స్టేడియంను బందెల దొడ్డిగా మార్చి రైతులను అందులో నిర్బంధించేందుకు అవకాశమివ్వాలని మంగళవారం నాడు ఢిల్లీ ప్రభుత్వాన్ని కోరింది. రైతుల ఆందోళన వలన రోడ్లు, రైలు ప్రయాణీకులకు ఇబ్బందులు కలుగుతాయి గనుక రైతుల మీద చర్యలు తీసుకొనే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలంటూ అరవింద్‌ సేత్‌ అనే లాయరు పంజాబ్‌-హర్యానా హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలు చేశారు..రైతులు న్యూసెన్సు చేస్తున్నారని ఆరోపిస్తూ వారు బలవంతంగా నగరంలోకి అడుగుపెట్టకుండా చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టు బార్‌ అసోసియేషన్‌ ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌ను కోరింది. ఇలాంటి వారు అదే రైతులకు కనీస మద్దతు ధరల కోసం వేసిన కమిటీ నివేదికను వెంటనే ఇప్పించి రైతులు ఆందోళనకు దిగకుండా చూడాలని కేంద్రం మీద ఎలాంటి వాజ్యాలు ఇంతవరకు దాఖలు చేయలేదు.నోరులేని రైతులను అడ్డుకొనేందుకు పూనుకున్నారు. రైతులు వినకుండా దురుసుగా ముందుకు వస్తే పోలీసులు చూస్తూ ఊరుకోవాల్సిన అవసరం లేదని, మనం కూడా అదే పద్దతిలో ఉండాలని లేకపోతే వారిని అపలేమని ఢిల్లీ శాంతి భద్రతల స్పెషల్‌ పోలీసు కమిషనర్‌ రవీంద్ర యాదవ్‌ ఢిల్లీ శివార్లలోని శింఘు సరిహద్దులో పోలీసులతో మైకులద్వారా ప్రకటించారు.మనం ఆత్మరక్షణలో పడనవసరం లేదు, బాష్పవాయువు వదలండి, లాఠీలను ప్రయోగించండి, ఇది ఒక రోజంతా జరగవచ్చు అని కూడా చెప్పారని మంగళవారం రాత్రి పొద్దుపోయిన తరువాత ఎకనమిక్‌ టైమ్స్‌ పత్రిక ఇచ్చిన వార్తలో పేర్కొన్నది. ఎవరైనా అలసిపోతే వారి స్థానంలో వేరొక బృందం వస్తుందని, ఎట్టి పరిస్థితిలోనూ రైతులను నగరంలోకి అనుమతించవద్దని కూడా చెప్పినట్లు తెలిపింది.


రైౖతుల డిమాండ్లు న్యాయబద్దమైనవని అందువలన స్టేడియంను జైలుగా మార్చాలన్న కేంద్ర కోరికను తాము అంగీకరించేది లేదని ఢిల్లీ ఆమ్‌ ఆద్మీ ప్రభుత్వం తిరస్కరించింది. రైతులతో చర్చించి పరిష్కరించాలని కోరింది. శాంతియుతంగా నిరసన తెలిపే రాజ్యాంగబద్దమైన హక్కు ప్రతి పౌరుడికీ ఉన్నదని అందువలన రైతులను అరెస్టు చేయటం సరైంది కాదని ఢిల్లీ హౌం మంత్రి కైలాష్‌ గెహలట్‌ చెప్పారు. ఢిల్లీ పోలీసు యంత్రాంగం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుందన్న సంగతి తెలిసిందే. తమ డిమాండ్ల మీద నిరసన తెలిపేందుకు మంగళవారం నాడు ఢిల్లీ వస్తున్న రైతులను అనేక చోట్ల పోలీసులు అడ్డుకున్నారు. పంజాబ్‌ నుంచి వస్తున్న వారి మీద హర్యానా బిజెపి ప్రభుత్వ పోలీసులు లాఠీ చార్జి చేశారు. రైతులు అన్నదాతలు, వారి పట్ల ఈ విధంగా ప్రవర్తించటం పుండు మీద కారం చల్లినట్లే, స్టేడియంను జైలుగా మార్చాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంలో భాగస్వాములం కాలేమని కైలాష్‌ గెహలట్‌ కేంద్రానికి రాసిన లేఖలో పేర్కొన్నారు.2021లో రైతుల ఆందోళన సందర్భంగా కూడా అదే స్టేడియంను జైలుగా మార్చాలని కోరిన నాటి కేంద్ర ప్రభుత్వ కోరికను అప్పుడు కూడా ఆమ్‌ ఆద్మీ సర్కార్‌ తిరస్కరించింది.


ఇటీవలనే ప్రముఖ వ్యవసాయ ఆర్థికవేత్త ఎంఎస్‌ స్వామినాధన్‌కు కేంద్ర ప్రభుత్వం భారత రత్న గౌరవ పురస్కారాన్ని ప్రకటించింది. ఆయన సూచించిన పద్దతిలో రైతాంగానికి కనీస మద్దతు ధరలు ప్రకటించేందుకు, వాటికి చట్టబద్దత కల్పించేందుకు మొరాయిస్తున్నది.కనీస మద్దతు ధరలకు చట్టబద్దత కల్పించటం మినహా రైతులు ఏమైనా కోరుకోవచ్చని ఏడాది పాటు సాగిన రైతుల ఆందోళన సందర్భంగా బిజెపి నేతలు చెప్పారు. విధిలేని పరిస్థితిలో ప్రధాని నరేంద్రమోడీ దేశానికి క్షమాపణలు చెప్పి మూడు సాగు చట్టాలను వెనక్కు తీసుకున్నట్లు ప్రకటించారు, కనీస మద్దతు ధరల గురించి సిఫార్సు చేసేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఆ మేరకు ఆరునెలల తరువాత 2022 జూలై 18న 26 మందితో కమిటీని ప్రకటించారు.దానిలో అందరూ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేవారు, మూడు సాగు చట్టాలను రూపొందించిన పెద్దలే ఉన్నందున తామా కమిటీని బహిష్కరిస్తున్నట్లు సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కెఎం) ప్రకటించింది. తరువాత ఆ కమిటీ ఏం చేస్తున్నదో, ఏం చెబుతుందో తెలియదు.
తమ ప్రభుత్వ హయాంలో 2014-15లో ఏ గ్రేడ్‌ వరి మద్దతు ధర రు.1,400 నుంచి 2023-24లో రు.2,203కు అంటే రు 803 పెంచినట్లు మోడీ సర్కార్‌ చెప్పుకున్నది.సగటున వార్షిక పెంపుదల 5.7శాతం. అంతకు ముందు కాంగ్రెస్‌ ఏలుబడిలో 2004-05 రు.590 నుంచి రు.1,400కు పెరిగింది. రు.810 పెరిగింది. దీన్ని సగటు వార్షిక పెరుగుదలలో చూస్తే 14శాతం ఉంది. పొడవు పింజ పత్తి ధర రు.1,760 నుంచి కాంగ్రెస్‌ ఏలుబడిలో రు.4,050 పెరిగింది. నిఖర పెరుగుదల రు.2,290 వార్షిక సగటు 13శాతం, అదే నరేంద్రమోడీ కాలంలో రు.4050 నుంచి రు.7,020కి పెంచారు.నిఖర పెరుగుదల రు.2,970 కాగా వార్షిక సగటు 7.3శాతమే. దీని అర్ధం కాంగ్రెస్‌ రైతులను ఏదో ఉద్దరించిందని చెప్పటం కాదు, పెరిగిన సాగు ఖర్చులతో పోలిస్తే అది కూడా తక్కువే. దానితో పోలిస్తే మంచి రోజులను తెచ్చి అమృత కాలంగా మార్చి రైతుల రాబడి రెట్టింపు చేస్తామన్న నరేంద్రమోడీ పాలనలో మరింత దిగజారింది అని చెప్పేందుకే ఈ పోలిక.ఎంఎస్‌ స్వామినాధన్‌ కమిషన్‌ చేసిన సిఫార్సులను పక్కన పెట్టి వార్షిక ద్రవ్యోల్బణ ప్రాతిపదికన నామమాత్రంగా పెంచుతున్నారు తప్ప సాగు ఖర్చులను పరిగణనలోకి తీసుకోవటం లేదు.


కేంద్రం ఏర్పాటు చేసిన ఆ కమిటీ పరిధి ఏమిటి ? ఏ అంశాలను అది పరిశీలిస్తుందో వివరించాలని రైతు ఉద్యమం నడిపిన సంయుక్త కిసాన్‌ మోర్చా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తే సమాధానం లేదు. అందువలన ఆ కమిటీలో ఉండి చేసేదేమీ లేదు గనుక ప్రతినిధుల పేర్లను ప్రతిపాదించటం లేదని స్పష్టం చేసింది. ఈ కమిటీ చైర్మన్‌ ఎవరంటే రైతులు తిరస్కరించిన మూడు సాగు చట్టాలను రచించిన వ్యవసాయశాఖ మాజీ కార్యదర్శి సంజయ అగర్వాల్‌. ఆ చట్టాలను ఎలా రూపొందించాలో సలహా ఇచ్చిన రమేష్‌ చాంద్‌ నీతిఅయోగ్‌ సభ్యులు.కనీస మద్దతు ధరలకు చట్టబద్దత కల్పించకూడదని చెప్పిన ఆర్థికవేత్తలను నిపుణుల పేరుతో చేర్చారు. ప్రభుత్వ ప్రతినిధులు సరేసరి, వీరుగాక రైతుల ఆందోళనను వ్యతిరేకించిన ఐదు సంఘపరివార్‌ సంఘాలకు చెందిన వారిని చేర్చారు. ఆందోళనకు నాయకత్వం వహించిన వారిని మూడు పేర్లు ఇవ్వాలని కోరారు. మూడు సాగు చట్టాలను అమలు జరపకుండా 2022 నాటికి రైతుల రాబడిని రెట్టింపు చేయటం కుదరదని నీతిఅయోగ్‌ సభ్యులు రమేష్‌ చాంద్‌ రైతుల ఆందోళన సమయంలో చెప్పారు.ఇటీవలి కాలంలో ఎక్కడా దాని గురించి ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడటం లేదు.


తాజాగా ఢిల్లీ చలో ఆందోళనకు పిలుపు ఇచ్చి ఎస్‌కెఎం(ఎన్‌పి), కిసాన్‌ మజ్దూర్‌ మోర్చా ముందుకు తెచ్చిన డిమాండ్లు పాతవే.ఎవరు పిలుపునిచ్చినా సమర్ధించాల్సినవే.పంజాబ్‌ నుంచి వస్తున్న రైతులు ఢిల్లీ చేరకుండా హర్యానా పోలీసులు పంజాబ్‌ సరిహద్దులోని పాటియాలా సమీపంలోని షాంభు వద్ద అడ్డుకున్నారు. రైతుల మీద బాష్పవాయు ప్రయోగం చేశారు. కనౌరీ వద్ద లాఠీ ఛార్జి చేశారు.అనేక చోట్ల రోడ్ల మీద పోలీసులు కల్పించిన ఆటంకాలను పక్కకు తొలగించి రైతులు ముందుకు వస్తున్నారని వార్తలు. చర్చలు జరపాలి తప్ప ఢిల్లీ వెళ్ల వద్దని హర్యానా హౌంమంత్రి అనిల్‌ విజి రైతులకు సలహా ఇచ్చారు.రెండుసార్లు కేంద్ర మంత్రులు ఇక్కడకు వచ్చారు. రైతులు వారితో మాట్లాడలేదంటే దీని వెనుక ఏదో దురుద్దేశ్యం ఉందని ఆరోపిస్తూ రాష్ట్రంలోకి రానిచ్చేది లేదని అన్నారు. కనీస మద్దతు ధరలకు అనేక మందితో చర్చలు జరపాల్సి ఉందని, రైతులు కూడా మాట్లాడాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్‌ ముండా చెప్పారు. మంగళవారం నాడు ఢిల్లీకి దారితీసే అనేక మార్గాలలో రవాణాకు తీవ్ర అంతరాయం కలిగింది.నగరంలో అనేక మెట్రో స్టేషన్లను మూసివేశారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఆంధ్రప్రదేశ్‌లో కంపుకొడుతున్న అవకాశవాదం – దివాలా కోరు, అసంబద్ద వాదనలు !

11 Sunday Feb 2024

Posted by raomk in AP, AP NEWS, BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, History, INDIA, Loksabha Elections, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics, Religious Intolarence, tdp, TDP, Ycp

≈ Leave a comment

Tags

Andhra Pradesh Elections 2024, ANDHRA PRADESH Politics, BJP, CHANDRABABU, jana sena party, Narendra Modi Failures, pavan kalyan, tdp, Ycp, YS jagan


ఎం కోటేశ్వరరావు


రానున్న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ప్రకటన నాటికి ఏవైనా అనూహ్య మలుపులు తిరిగితే తప్ప ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలలో తెలుగుదేశం-జనసేన-బిజెపి ఒక కూటమిగా, వైసిపి విడిగా, ఇండియా కూటమిలోని కాంగ్రెస్‌,వామపక్షాలు,ఇతర కొన్ని పార్టీలు, శక్తులు ఒక కూటమిగా పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీటి పట్ల జనం ఎలా స్పందిస్తారన్నది ఎత్తులు, పొత్తులు ఒక కొలిక్కి వచ్చిన తరువాత, ఇతర అంశాల మీద ఆధారపడి ఉంటుంది. మూడు ప్రధాన ప్రాంతీయ రాజకీయ పార్టీలు నోటాకంటే తక్కువ ఓట్లున్న బిజెపి చుట్టూ తిరగటం అనేక మందికి జీర్ణం కావటం లేదు. వైసిపి విషయానికి వస్తే తన సంక్షేమ పధకాలను చూసి ఓటేయమంటోంది. ఇప్పుడున్న వాటిని మరింత మెరుగుపరుస్తామని, కొత్త వాటిని అమలు చేస్తామని తెలుగుదేశం-జనసేన చెబుతున్నాయి. తమ కూటమి కేంద్రంలో అధికారానికి వస్తే ప్రత్యేక హౌదా అమలు చేస్తుందని కాంగ్రెస్‌ ప్రచారం చేస్తున్నది. సంక్షేమ పథకాలు అమలు చేస్తే రాష్ట్రాలు రుణ ఊబిలో కూరుకుపోతాయని చెబుతున్న బిజెపి ఏం చెబుతుందో చూడాలి. వివిధ పార్టీలు, కొన్ని శక్తులూ ముందుకు తెచ్చిన కొన్ని దివాలాకోరు, అసంబద్ద వాదనల గురించి చూద్దాం.


అధికార వైసిపిని ఓడించేందుకు బిజెపితో నిమిత్తం లేకుండానే తెలుగుదేశం-జనసేన కూటమికి తగిన మద్దతు ఉందని, బిజెపితో పొత్తును తెలుగుదేశంలోనే కొందరు వ్యతిరేకిస్తున్నారని అంటూనే విధిలేని పరిస్థితిలో బిజెపితో చేతులు కలపక తప్పదు అని చేదు మాత్రను మింగించేందుకు చూస్తున్నారు. ఎందుకటా ? వచ్చే ఎన్నికలు సజావుగా జరగాలంటే కేంద్రం, ఎన్నికల కమిషన్‌ సహకారం అవసరం గనుక బిజెపితో దోస్తీ అవసరమట.ఎన్నికలను సక్రమంగా జరపటం ఎన్నికల కమిషన్‌ విధి. దాన్ని ప్రసన్నం చేసుకోవాలంటే బిజెపిని భుజాల మీద ఎక్కించుకొని మోయాలని చెప్పటమే. గత ఐదు సంవత్సరాలలో ఎన్నికల జాబితాలో జరిగిన అక్రమాల గురించి తెలుగుదేశం, జనసేన, ా బిజెపి లేవనెత్తిన అంశాలను ఎన్నికల సంఘం పెద్దగా పట్టించుకోలేదు. తెలుగుదేశం నేత చంద్రబాబును బిజెపి పెద్దలు పిలవగానే సిద్దం సుమతీ అన్నట్లు వెళ్లారు. వెంటనే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి పొలో మంటూ ఢిల్లీ యాత్ర చేశారు. మరికొన్ని శాలువాల ఖర్చు దండగ. ఎందుకయ్యా అంటే రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి అడగటానికని వైసిపి పెద్దల వివరణ. తాటి చెట్టు ఎందుకు ఎక్కావంటే దూడగడ్డి కోసం అన్నట్లుగా ఉంది. కేంద్ర ప్రభుత్వం తన చివరి(ఓట్‌ఆన్‌ఎకౌంట్‌) బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. వైసిపి కూడా ఓట్‌ ఆన్‌ ఎకౌంట్‌తో సరిపుచ్చింది. ఇప్పుడు నిధుల గురించి అడిగితే పట్టించుకొనేదెవరు ? పక్కా రాజకీయ యాత్ర మాత్రమే. గత ఐదేండ్లుగా అన్ని సందర్భాలలో మద్దతు ఇచ్చి ఆదుకున్నట్లుగానే రానున్న రోజుల్లో కూడా విధేయులుగా ఉంటామని, తెలుగుదేశాన్ని నమ్మవద్దని చెప్పేందుకు తప్ప ఢిల్లీ పర్యటన వెనుక మరొక కారణం కనిపించటం లేదు.


నరేంద్రమోడీ ఎంతో బలంగా ఉన్నారని అందువలన కేంద్రాన్ని ఎదిరించి చేసేదేమీ లేదని పిరికిమందు నూరిపోస్తున్న వారిని ఏమనాలి. అలాంటపుడు ఆ బిజెపి మందలోనే చేరిపోవచ్చు, వేర్వేరు పార్టీల దుకాణాలు ఎందుకు ! బతికిన చేప ఎదురీదుతుంది చచ్చిన చేప వాలునబడి కొట్టుకుపోతుంది. స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో కూడా రవి అస్తమించని బ్రిటీష్‌ సామ్రాజ్యాన్ని మనం ఎదిరించలేమంటూ దాని మోచేతి నీళ్లు తాగుదామని చెప్పిన వారు ఆ రోజుల్లో కూడా ఉన్నారు. ఫలితంతో నిమిత్తం లేకుండా చేయాల్సింది చేశామా లేదా అన్నదే గీటురాయి. కేంద్రంలో ఉన్న పాలకులు రాష్ట్రాలకు అన్యాయం చేస్తుంటే, అనుచిత పద్దతులకు పాల్పడుతుంటే రాష్ట్రాల హక్కులు, ప్రజల కోసం పోరాడాలి, మెడలు వంచాలి తప్ప మోకాళ్ల మీద కూర్చుంటే కనికరిస్తారా ? ఎన్‌టి రామారావు ప్రభుత్వాన్ని అక్రమంగా కూల్చివేసినపుడు ఆ నాటి తిరుగులేని బలమైన కాంగ్రెస్‌కు తెలుగుదేశం లొంగిపోయి మీ అడుగుజాడల్లో నడుస్తామని చెప్పలేదు, జనాన్ని వీధుల్లోకి సమీకరించి ఆందోళన చేసి పునరుద్దరణ జరిపించుకున్న చరిత్రను తెలుగుదేశం మరిచినా జనం మరిచిపోతారా ?


నాదెండ్ల భాస్కరరావు రూపంలో తిరుగుబాటు చేయించి ఎన్‌టి రామారావు సర్కార్‌ను కూలదోయించింది కాంగ్రెస్‌ పార్టీ. నేడు బిజెపి వివిధ రాష్ట్రాలలో అంతకంటే తక్కువ చేస్తున్నదా ? రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో సయోధ్యతో ఉండాలని కాంగ్రెస్‌కు ఏనాడైనా తెలుగుదేశం మద్దతు ఇచ్చిందా ? మరి ఇప్పుడెందుకు ఆ పేరుతో బిజెపిని మోసేందుకు సాకులు వెతుకుతున్నట్లు ? తెలుగుదేశం పార్టీని దెబ్బతీసేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నించింది అని చెప్పవచ్చు, బిజెపి చేసిందేమిటి ? తెలుగుదేశం రాజ్యసభ పక్షం మొత్తాన్ని తనలోనే విలీనం చేసుకుంది కదా ! వాజ్‌పాయి సర్కారుకు తెలుగుదేశం మద్దతు ఇచ్చింది. స్పీకరు పదవి(జిఎంసి బాలయోగి)ని కూడా తీసుకుంది. నాడు రాష్ట్రానికి కేంద్రం నుంచి శాశ్వతంగా గుర్తుపెట్టుకోదగిన పెట్టుబడులు గానీ, మరొకటి గానీ ఏమీ రాలేదు. దేశం వెలిగిపోతోంది అంటూ బిజెపితో కలిసి పోటీ చేసి 2004 ఎన్నికల్లో ఓడిన తరువాత తిరిగి బిజెపితో చేతులు కలిపేది లేదని తెలుగుదేశం ప్రకటించిన అంశాన్ని మరచిపోలేము. పదేండ్ల పాటు ప్రతిపక్షంలో ఉండి 2014లో తిరిగి అదే బిజెపితో చేతులు కలిపి ఎన్నికల్లో నెగ్గారు. పోనీ అప్పుడేమైనా సాధించారా అంటే ఏమీ లేదని అందరికీ తెలిసిందే. ప్రత్యేక హౌదా లేదని నరేంద్రమోడీ అడ్డం తిరిగితే సరే అన్నారు, దాని బదులు ప్రత్యేక పాకేజీ అంటే మహాభాగ్యం జీహుజూర్‌ అంటూ తల ఊపారు. చివరికి దానికి కూడా మొండి చేయి చూపితే బిజెపితో తెగతెంపులు చేసుకున్నారు.2019 ఎన్నికల్లో ప్రత్యర్ధులుగా ఎంతటి తీవ్ర విమర్శలు చేసుకున్నారో తెలిసిందే.


ఇప్పుడు అవన్నీ విస్మరించి రాష్ట్రం కోసం జనాన్ని కూడా మరచిపొమ్మంటున్నారు. తాము నందంటే నంది పందంటే పంది అనాలని చెబుతున్నారు. పోనీ ఇప్పుడు బిజెపి పెద్దలు విభజన హామీల అమలు గురించి, రాష్ట్రానికి చేయాల్సిన వాటి గురించి మారుమనసు పుచ్చుకున్నారా అంటే దుర్భిణివేసి చూసినా కనిపించటం లేదు. రేపు బిజెపి తిరిగి కేంద్రంలో అధికారానికి వస్తుందో రాదో తెలియదు, వచ్చినా గత పది సంవత్సరాల ఆచరణను బట్టి రాష్ట్రానికి ప్రత్యేక హౌదా లేదా దానికి సమానమైన ప్రత్యేక పాకేజీ ఇచ్చే సమస్యే లేదు. విభజన హామీల్లో ఒకటైన విశాఖ రైల్వే జోన్‌ గురించి తెలుగుదేశం-బిజెపి ఉమ్మడి పాలనలో ఒక్క అడుగూ ముందుకు పడలేదు. ఎందుకో తెలుగుదేశం పెద్దలు చెప్పాలి. గత లోక్‌సభ ఎన్నికల ప్రకటనకు కొద్ది వారాల ముందు విశాఖ రైల్వే జోన్‌ ఏర్పాటు ప్రకటనను కేంద్రం వెలువరించింది. పోనీ దాన్నయినా నోటిఫికేషన్‌ ఇచ్చి ఏర్పాటు చేసిందా అంటే అదీ లేదు. మరోసారి ఎన్నికలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇవ్వలేదు అని చెబుతున్నారు. కేంద్రం ఎప్పుడైనా భూమి ఎందుకు ఇవ్వరు అని రాష్ట్ర ప్రభుత్వం మీద వత్తిడి తెచ్చిందా?ఇస్తామని చెప్పిన భూమిని స్వీకరించేందుకు ముందుకు రాకుండా వంకలు చెబుతున్నది. జోనల్‌ కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు విశాఖలో రైల్వేలకు అసలు భవనాలే దొరకవా ? రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే తప్ప అసలు భూమే లేదా ? విశాఖ డివిజన్ను రద్దు చేయాలని నిర్ణయించారు, అక్కడే కార్యాలయాన్ని ఏర్పాటు చేసి తరువాత తీరికగా భూమి తీసుకొని కొత్త భవనాలు నిర్మించుకోవచ్చు, అదీ చేయలేదు. నాటకాలాడుతున్న అలాంటి బిజెపిని బలపరిచి రాష్ట్ర ప్రయోజనాలను సాధించుకోవచ్చని చెబితే జనం మరీ అంత అమాయకంగా కనిపిస్తున్నారా ?


తోలువలవటం, తాటతీయటమే తన కార్యాచరణ అని ప్రకటించుకున్న జనసేన నేత పవన్‌ కల్యాణ్‌ విశాఖ ఉక్కును ప్రయివేటీకరించవద్దని చెబుతున్నారు, అది మంచిదే. కానీ పవన్‌ కల్యాణ్‌ ప్రకటించిన ప్రతిసారీ ఉక్కును తుక్కుకింద అమ్మివేస్తామని చెబుతూనే ఉన్నా నోటికి తాళం వేసుకున్నారు. పాచిపోయిన లడ్డూలంటూ ప్రత్యేక హౌదా గురించి మాట్లాడిన ఆ పెద్ద మనిషి తరువాత దాన్ని మరిచిపోయి తనకు అధికారం లేదు గనుక అడగటం లేదు అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. నోటికి తాళం వేసుకున్నారు. ఆ డిమాండ్‌ను వదులుకున్న తెలుగుదేశంతో చేతులు కలిపి రాష్ట్రాన్ని బాగుచేస్తామని చెబుతున్నారు. ప్రత్యేక హౌదా గురించి మరిచి పొమ్మని, ప్రభుత్వ రంగ సంస్థల విక్రయం తమ విధానమని పదే పదే చెబుతున్న బిజెపిని బలపరచి రేపు ఒక వేళ అధికారానికి వచ్చినా బిజెపి విధానాలను తెలుగుదేశం-జనసేన కూటమి మార్చగలదా ? ప్రకటించిన రైల్వేజోన్‌ గురించి కూడా అడగలేని వారు రాష్ట్ర ప్రయోజనాలను సాధిస్తామని అంటేే నమ్మేదెలా ? పన్నులలో వాటాలు, కేంద్రం అమలు జరిపే పథకాలను నుంచి కొన్ని రాష్ట్రాలను మినహాయించే అవకాశమే లేదు. కొన్ని నిధులకు సంబంధించి ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలను ఇబ్బంది పెడుతున్నమాట నిజం. అలాంటి సందర్భాలలో వత్తిడి తేవాలి, పోరాడాలి లేకుంటే కేరళ మాదిరి సుప్రీం కోర్టును ఆశ్రయించాలి తప్ప లొంగుబాటు మార్గం కాదు. అందులోనూ ఆత్మగౌరవ నినాదం ముందుకు తెచ్చిన వారికి, ప్రశ్నించటం తమ డిఎన్‌ఏలోనే ఉందని చెప్పుకొనే వారికి అసలు తగనిపని.


వైఎస్‌ జగన్మోహనరెడ్డి సర్కార్‌ ప్రశ్నించిన ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు, ఉద్యోగులు, టీచర్ల మీద అణచివేత చర్యలకు పాల్పడుతున్నది, అనేక భారాలను మోపిన మాటనిజం. ఆ ప్రభుత్వాన్ని మార్చాలన్న వాంఛను తప్పు పట్టాల్సిన పనిలేదు.రాజధాని మార్పుతో సహా అనేక అంశాలలో బిజెపి నాటకాన్ని ఇంతకాలం జనం చూశారు.వైసిపికి అండదండగా ఉన్న అంశం తెలిసిందే. ఏనాడూ దాని విధానాలను నిరసిస్తూ వీధుల్లోకి వచ్చిన ఉదంతాలు లేవు. తెలుగుదేశం పార్టీని బలహీన పరిచేందుకు వైసిపిని ప్రోత్సహించింది, తిరిగి అధికారంలోకి వస్తుందని, తనకు విధేయురాలిగా ఉంటుందని ఇంతకాలం భావించిన కారణంగానే ఎన్ని విమర్శలు వచ్చినా ఖాతరు చేయలేదు. రోడ్డుమాప్‌ ఇవ్వాలని పవన్‌ కల్యాణ్‌ కోరినా పూచికపుల్ల కింద తీసిపారవేసింది. వచ్చే ఎన్నికల్లో సీట్లు గణనీయంగా తగ్గనున్నట్లు బిజెపి పసిగట్టింది. ఆంధ్రప్రదేశ్‌లో మారుతున్న సమీకరణాల్లో వైసిపికి అవకాశాల్లేవని నిర్ధారించుకున్న తరువాత సరిగ్గా ఎన్నికల ముంగిట బిజెపి తన వైఖరి మార్చుకొని తెలుగుదేశానికి స్వాగతం పలుకుతోంది తప్ప వేరు కాదు.


బిజెపి తన మత అజెండాను ముందుకు తీసుకువస్తున్నది.సిఏఏను అమలు జరుపుతామని ఇప్పుడు ప్రకటించటం దానిలో భాగమే. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తమకు మియాల(అసోంలో ముస్లింలను అలా పిలుస్తారు) ఓట్లు అవసరం లేదన్నారు. గతేడాది కర్ణాటక ఎన్నికల సందర్భంగా బిజెపి అగ్రనేత జగదీశ్వరప్ప తమకు ముస్లింల ఓట్లు అవసరం లేదని ప్రకటించారు.అలాంటి మాటలే ఆంధ్రప్రదేశ్‌లోనూ చెప్పగలరా ? మణిపూర్‌లో గిరిజనుల మీద, వారి చర్చీల మీద దాడులు జరుగుతుంటే, మహిళలను నగంగా తిప్పితే ఇంతవరకు ప్రధాని ఆ రాష్ట్రాన్ని సందర్శించి వారికి ఎలాంటి భరోసా కల్పించలేదు. తెలుగుదేశం పార్టీ బిజెపితో సర్దుబాటు చేసుకుంటే ఈ అంశాలన్నింటికీ జవాబు చెప్పుకోవాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం-జనసేన కూటమిలో బిజెపి కలిస్తే కలిగే లాభం కంటే జరిగే నష్టమే ఎక్కువ అనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మతసామరస్యత గిట్టని సనాతన వాదులు, ఏడుసార్లు గాంధీజీపై హత్యాయత్నాలు !

07 Wednesday Feb 2024

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

'Praising' Godse, BJP, Hindu Fundamentalism, HINDU MAHASABHA, hindutva, Mahatma Gandhi, Nathuram Godse, NIT Calicut, RSS, Sanatana


ఎం కోటేశ్వరరావు


ఆమె ఒక ప్రతిష్టాత్మక జాతీయ సాంకేతిక విద్యాసంస్థ (నిట్‌), కాలికట్‌లో మెకానికల్‌ ఇంజనీరింగ్‌ విభాగ ప్రొఫెసర్‌, పేరు డాక్టర్‌ ఏ షాయిజా.” భారత్‌ను రక్షించినందుకు గాడ్సేను చూసి గర్విస్తున్నా ” అని ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టి ఇప్పుడు పోలీసు కేసులను ఎదుర్కొంటున్నారు. జనవరి 30వ తేదీన మహాత్ముడి వర్ధంతి. ఆరోజు బిజెపి ఫేస్‌బుక్‌ ఖాతాలో ఒక న్యాయవాది ” హిందూమహాసభ కార్యకర్త నాధూరామ్‌ గాడ్సే భారత్‌లో ఎందరికో ఆదర్శం( హీరో )” అని పెట్టాడు. దాని మీద ” భారత్‌ను రక్షించినందుకు గాడ్సేను చూసి గర్వపడుతున్నా ” అని డాక్టర్‌ షాయిజా స్పందించారు. దాన్ని ఫొటో తీసి కోజికోడ్‌ లోక్‌సభ కాంగ్రెస్‌ ఎంపీ ఎంకె రాఘవన్‌ ఎక్స్‌(ట్విటర్‌)లో పోస్టు చేశాడు.” మహాత్మాగాంధీకి వ్యతిరేకంగా పోస్టు పెట్టటం నాకు సిగ్గుగా ఉంది.నిట్‌లో ఒక బాధ్యతాయుతమైన పోస్టులో ఉన్న వ్యక్తి గాడ్సేను పొగిడారు. సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి ” అని ఎంపీ స్పందించారు. అది సంచలనం కావటంతో ఆమె తన పోస్టును ఫేస్‌బుక్‌ నుంచి తొలగించారు. అయినప్పటికీ డివైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ, ఎన్‌ఎస్‌యుఐ, తదితర సంస్థలకు చెందిన వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.కొట్లాటలను ప్రేరేపించేందుకు కావాలనే రెచ్చగొట్టారన్నది నేరారోపణ. ఆమె తన చర్యను సమర్ధించుకున్నారని ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ రాసింది.” నేను గాంధీని ఎందుకు చంపాను అనే గాడ్సే పుస్తకం చదివాను. గాడ్సే కూడా స్వాతంత్య్ర సమరయోధుడే. తన పుస్తకంలో ఎంతో సమాచారాన్ని వెల్లడించాడు. అది సామాన్యులకు తెలియదు. ఆ పుస్తకంలో గాడ్సే మనల్ని వివేకవంతుల్ని చేశాడు. ఈ పూర్వరంగంలో ఒక లాయర్‌ ఫేస్‌బుక్‌ పోస్టు మీద నేను స్పందించాను. జనాలు నా వ్యాఖ్యను వక్రీకరిస్తున్నారని గుర్తించిన తరువాత దాన్ని తొలగించాను” అని షాయిజా చెప్పారు. తన వ్యాఖ్య గాంధీజీ హత్యను ప్రశంసించటం కాదని కూడా ఆమె చెప్పుకున్నారు. ఆమె పోస్టు వైరల్‌ కాగానే సంజాయిషీ తీసుకోవాలని సంస్థ డైరెక్టర్‌ రిజిస్ట్రార్‌ను కోరారు.


ఆమె వయస్సు, అనుభవంలోనూ తక్కువ వారేమీ కాదు. గాడ్సే మీద మీడియాలో జరుగుతున్న అనుకూల, వ్యతిరేక చర్చలు తెలియకుండా ఉంటాయని అనుకోలేము. అన్నీ తెలిసే కావాలనే ఆమె స్పందించారన్నది స్పష్టం. దీనికి కొద్ది రోజుల క్రితం ఆమె పని చేస్తున్న సంస్థలోనే ఒక ఉదంతం జరిగింది. అయోధ్య రామాలయంలో విగ్రహ ప్రతిష్ట సందర్భంగా సంఘపరివార్‌కు చెందిన విద్యార్ధులు ఉత్సవాన్ని చేసుకున్నారు. వ్యాషక్‌ ప్రేమ్‌కుమార్‌ అనే విద్యార్ధి(దళిత సామాజిక తరగతికి చెందిన వ్యక్తి) నిరసన తెలిపాడు. నిట్‌ ప్రధాన భవనం ముందు ” ఇండియా రామ రాజ్యం కాదు ” అనే నినాదం రాసి ఉన్న ఒక ప్లకార్డును పట్టుకొని ఒక్కడే ప్రదర్శన చేశాడు. సైన్స్‌ అండ్‌ స్పిరిట్యువల్‌ క్లబ్‌ పేరుతో రామాలయ ఉత్సవాన్ని నిర్వహించిన వారు ప్రేమకుమార్‌ మీద దాడి చేశారు. జనవరి 21వ తేదీన ఉత్సవం జరిపిన వారు దేశ చిత్రపటాన్ని కాషాయ రంగులో విల్లు, బాణం ఉన్న రాముడి బొమ్మతో చిత్రించారని, జై శ్రీరామ్‌ అంటూ నినాదాలు చేశారని, ఇది భారత మాప్‌ను అగౌరవ పరచటమే అని విద్యార్ధి వ్యవహారాల మండలి(ఎస్‌ఏసి) ఒక ప్రకటనలో పేర్కొన్నది. ప్రేమకుమార్‌ చేసింది ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించటంగా, విద్యాలయ ప్రాంగణంలో అశాంతిని రేకెత్తించటంగా పరిగణించి ఏడాది పాటు సంస్థ నుంచి వెలివేశారు. జరిగిన ఉదంతాన్ని వాట్సాప్‌ గ్రూప్‌లో పోస్టు చేసిన ఎస్‌ఏసి ప్రతినిధి కైలాష్‌ను కూడా కొట్టారు. నిట్‌ సంస్థలు కేంద్ర ప్రభుత్వానికి చెందినవన్న సంగతి తెలిసిందే.
ప్రేమ్‌కుమార్‌, కైలాష్‌పై చేసిన దాడుల వెనుక శివ పాండే అనే విద్యార్ధి ఉన్నట్లు నిట్‌ విద్యార్ధులు చెప్పారు. అతను సంస్థలో భజరంగ్‌దళ్‌ను ఏర్పాటు చేశాడు, కొంత మంది విద్యార్ధుల మీద దాడులు చేశాడు. ఇన్ని జరిగినప్పటికీ అతని మీద ఎలాంటి క్రమశిక్షణా చర్యలు లేవు. ప్రేమకుమార్‌ను ఏడాది పాటు సస్పెండ్‌ చేస్తూ నిర్ణయం తీసుకున్న సమావేశంలో ఎస్‌ఏఎస్‌కు ఎలాంటి ప్రాతినిధ్యం లేదు.ప్రతినిధులుగా ఉన్న వారిని సమావేశానికి రానివ్వలేదని విద్యార్ధులు విమర్శించారు. అలాంటి వాతావరణం ఉన్న సంస్థలోనే ఫ్రొఫెసర్‌ షాయిజా పని చేస్తున్నారు.ఈ ఉదంతం జరిగిన తరువాతే ఆమె వివాదాస్ప వ్యాఖ్యలను ఫేస్‌బుక్‌లో చేశారు. ఆమెపై ఎస్‌ఎఫ్‌ఐ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగానే పోలీసులు కేసు నమోదు చేశారు. ఫ్రొఫెసర్‌ చర్యను నిరసించిన మిగతా సంస్థల వారు కూడా ఆమెను బోధనా బాధ్యతల్లో కొనసాగనివ్వరాదని డిమాండ్‌ చేశారు. ఆమె చర్య జాతిపితను అవమానించటమే అని కేరళ ఉన్నత విద్యాశాఖ మంత్రి ఆర్‌ బిందు ఖండించారు. డైరెక్టర్‌గా ఉన్న అధికారి ప్రసాద కృష్ణ కాలికట్‌ నిట్‌ను కాషాయీకరణ చేస్తున్నట్లు గతంలోనే విద్యార్దులు, సిబ్బంది విమర్శించారు.


హిందూ-ముస్లిం ఐక్యతను ప్రబోధించినందుకు మతోన్మాదశక్తులు గాంధీ మహాత్ముడిని తూలనాడుతున్న సంగతి తెలిసిందే.1948 జనవరి 30న నాధూరామ్‌ గాడ్సే గాంధీని తానెందుకు చంపిందీ కోర్టులో చెప్పిన మాటలను తరువాత పుస్తకంగా వేసి పంచుతున్నవారందరూ గాడ్సే వారసులే.చివరికి గాడ్సేకు గుడి కట్టేందుకూ చూశారంటే ఉన్మాదం ఏ స్థాయికి చేరిందో అర్ధం అవుతుంది. ఒక నాటికి గాంధీ హత్యలో నిజమైన విలువ ఏమిటో తెలుస్తుందని విచారణ సందర్భంగా గాడ్సే చెప్పాడంటే కాలికట్‌ నిట్‌ ప్రొఫెసర్‌ వంటి వారు రాబోయే రోజుల్లో ఇంకా తామర తంపరగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. స్వాతంత్య్ర ఉద్యమానికి సారధ్యం వహించిన మహాత్ముడిని చంపిన ఒక హంతకుడి చర్యలో దేశరక్షణను చూస్తున్న విద్యావంతులను చూసి జాతి గర్వపడాలా గర్హించాలా ? దేశం గాంధీని గుర్తుపెట్టుకున్నంత వరకు గాడ్సేను కూడా మరచిపోకూడదు. ఎందుకంటే మత సామరస్యానికి ప్రతిక గాంధీ అయితే, విద్వేషానికి, సమాజ ఐక్యత విచ్చిన్నానికి చిహ్నం గాడ్సే. గడచిన ఏడున్నరదశాబ్దాల కాలంలో గాడ్సే వారసులు పెరిగారు, గాంధీ వారసులు తగ్గారు. అందుకే చరిత్రను తిరగరాసి అసలైన దేశభక్తుడు గాడ్సే అన్నా నిజమే అని నమ్మేదిశగా మన సమాజం ఉండటం ఆందోళన కలిగిస్తోంది.హిట్లర్‌ అసలైన దేశభక్తుడు అని జర్మన్లను నమ్మించిన గోబెల్స్‌ ప్రచారం కంటే ఎన్నోరెట్లు ఎక్కువగా ఇప్పుడు ప్రమాదకారులను, స్వాతంత్య్ర ఉద్యమంలో విద్రోహం చేసిన వారిని దేశభక్తులుగా చిత్రీకరణ జరుగుతోంది.దేశభక్తి అంటే అర్ధాన్నే మార్చివేస్తున్నారు.


” గాంధీ కారణంగానే ముస్లింలకు ప్రత్యేక దేశంగా పాకిస్థాన్‌ ఏర్పాటు జరిగింది. కాశ్మీరుపై దురాక్రమణకు పాల్పడిన తరువాత కూడా పాకిస్థాన్‌కు రు.55 కోట్లు ఇవ్వాలని నిరాహారదీక్ష చేయటం, గాంధీజీ సంతుష్టీకరణ విధానం కారణంగానే ముస్లింలు రెచ్చిపోతున్నారు.” ఇవీ మహాత్మా గాంధీ హత్యను సమర్ధించేవారు సాధారణంగా చెబుతున్నకారణాలు ? అందుకే గాడ్సే హత్య చేశాడని, తప్పేమిటని వాదిస్తారు.నిజానికి ఇది ఒక సాకు, వక్రీకరణ మాత్రమే. పాకిస్థాన్‌ ఏర్పాటుతో నిమిత్తం లేకుండానే గాంధీపై ఎన్నో సంవత్సరాల ముందే సనాతన శక్తులు హత్యాయత్నాలు జరిపాయన్న చరిత్రను మూసిపెడుతున్నారు.నిజానికి హిందూత్వ అజెండాను అమలు జరపాలని చూసిన శక్తులకు గాంధీ వైఖరి ఆటంకంగా మారింది. 1917 నుంచి 1948వరకు గాంధీ పలుసార్లు హత్యాయత్నం జరిగింది.వాటికీ దేశవిభజన,కాశ్మీరుపై దాడికి సంబంధమే లేదు. గాంధీ హత్యను సమర్ధించుకొనేందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నది వాస్తవం. రెండు జాతులు, రెండు దేశాలంటూ చెప్పిన వారిలో విడి సావర్కర్‌ ప్రముఖుడు.1937లో అహమ్మదాబాద్‌లో జరిగిన హిందూమహాసభ సమావేశంలో ఇప్పుడున్న మాదిరి దేశం ఒకటిగా ఉండబోదని చెబుతూ హిందు-ముస్లిం దేశాలుగా ఉంటాయని చెప్పాడు.(మహారాష్ట్ర ప్రాంతీయ హిందూమహాసభ, పూనే ప్రచురించిన స్వాతంత్య్ర వీర సావర్కర్‌, ఆరవ భాగం పేజీ 296).అంతేకాదు, మరో సందర్భంలో మాట్లాడుతూ రెండు దేశాల సిద్దాంతంతో జిన్నాతో నాకు పేచీ లేదు. హిందువులం స్వతహాగా మనది ఒక జాతి, హిందువులు, ముస్లింలు రెండు దేశాలన్నది చారిత్రక వాస్తవం ” అన్నాడు.


” దేవుడి దయవలన ఏడు సార్లు మరణపు కోరల నుంచి తప్పించుకున్నాను. నేను ఎవరినీ ఎన్నడూ గాయపరచలేదు, నాకు ఎవరూ శత్రువులు లేరని భావిస్తాను. ఎందుకు నాపై ఇన్నిసార్లు హత్యా ప్రయత్నాలు జరిగాయో నేను అర్ధం చేసుకోలేకపోతున్నాను. నిన్న ప్రయత్నం కూడా విఫలమైంది.నేను అంత తేలికగా మరణించను, నూట ఇరవై అయిదు సంవత్సరాలు వచ్చేదాకా జీవిస్తాను ” అని 1946 జూన్‌ 30న పూనాలో గాంధీ చెప్పారు. ఈ అంశాన్ని గాంధీ మునిమనుమడు తుషార్‌ గాంధీ రాసిన ” లెటజ్‌ కిల్‌ గాంధీ ” (గాంధీని చంపుదాం ) అనే పుస్తకంలో పేర్కొన్నారు. తొలిసారి బీహార్‌లో భూస్వాములకు వ్యతిరేకంగా 1917 ఏప్రిల్‌ 15చంపారాన్‌ సత్యాగ్రహం సందర్భంగా ఇర్విన్‌ అనే ఆంగ్లేయుడు హత్యకు ప్రయత్నించాడు. ఇంటికి పిలిచి పాలలో విషమిచ్చి చంపేందుకు చూశాడు. సహాయకుడు యజమాని ఆజ్ఞను పాటించినట్లు నటిస్తూనే గాంధీకి గ్లాసు ఇవ్వబోతూ ఒలకపోశాడు. అవి తాగిన పిల్లి మరణించిన తరువాత జరిగిన కుట్ర వెల్లడైంది. ఏడు ప్రయత్నాల్లో మూడు సార్లు హిందూమహాసభకు చెందిన నారాయణ ఆప్టే, నాధూరామ్‌ గాడ్సే ప్రయత్నించాడు.1948 జనవరి 20న బాంబుతో చంపాలని చూశారు. ఆ ఉదంతంలో మదన్‌లాల్‌ పహ్వా అనేవాడిని అరెస్టు చేశారు. భారతీయులు జరిపిన తొలి హత్యాయత్నం చారిత్రాత్మక హరిజన యాత్ర సందర్భంగా 1934 జూన్‌ 25న పూనాలో జరిగింది. టౌన్‌హాల్లో జరిగిన సభకు ముందుగా వచ్చిన కారులో గాంధీజి ఉన్నాడని భావించిన సనాతన ఉన్మాదులు బాంబు పేలుడు జరిపారు. అయితే గాంధీ కారు ఆలస్యంగా రావటంతో ప్రమాదం తప్పింది. అంటరానితనానికి వ్యతిరేకంగా ఉద్యమించటం నచ్చని సనాతనవాదులు నాడు గాంధీని వ్యతిరేకించారు. రెండవ సారి 1944 జూలైలో మహారాష్ట్రలోని పంచాగ్నిలో జరిగింది. ఒక ప్రార్ధనా సమావేశం జరుగుతుండగా నాధూరామ్‌ గాడ్సే ఒక కత్తి పట్టుకొని గాంధీ వ్యతిరేక నినాదాలు చేస్తూ దూసుకు వచ్చాడు.ప్రమాదాన్ని గ్రహించిన వారు అతన్ని పట్టుకున్నారు. గాడ్సేతో పాటు వచ్చినవారు పారిపోయారు. అతన్ని వదలివేయమని గాంధీ చెప్పాడు.తనతో ఎనిమిది రోజులు గడిపి చర్చలు జరపమని కోరగా గాడ్సే తిరస్కరించాడు. అదే ఏడాది సెప్టెంబరులో జిన్నాతో చర్చలకు గాంధీ సిద్దంగావటాన్ని హిందూమహాసభ, ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యతిరేకించాయి. అప్పుడు కూడా సేవాగ్రామ్‌లో గాడ్సే ఆయుధంతో వచ్చాడు. ఇతరులతో కలసి గాంధీ సేవాగ్రామ్‌ నుంచి బొంబాయి వెళ్లకుండా అడ్డుకోవాలని చూశాడు.అప్పుడు కూడా ఆశ్రమవాసులు పట్టుకొని నిరాయుధుడిని చేశారు.తరువాత 1946 జూన్‌ 29న గాంధీ ప్రయాణిస్తున్న ప్రత్యేక రైలును పడగొట్టి హత్య చేసేందుకు పట్టాలపై పెద్ద బండరాళ్లను ఉంచారు.డ్రైవరు అప్రమత్తంగా ఉండటంతో ప్రమాదం తప్పింది.ఐదవ సారి 1948 జనవరి 20న బిర్లా హౌస్‌లో గాంధీ ప్రార్ధన చేస్తుండగా కొద్ది మీటర్ల దూరంలో బాంబు పేలింది. చివరికి 1948 జనవరి 30న గాంధీని గాడ్సే కాల్చిచంపాడు.అందుకే ఆ రోజును మతసామరస్య దీక్షాదినంగా పాటిస్తున్నారు. మతశక్తులను సమాజం నుంచి వెలివేయటమే మహాత్ముడికి అసలైన నివాళి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

”విశ్వగురువు” కు ”పెద్దన్న” ఆదేశంబెట్టిదనిన……అమృతకాలం, ఆత్మనిర్భరత కబుర్లు కట్టిపెట్టండి !

04 Sunday Feb 2024

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, Europe, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, USA

≈ 1 Comment

Tags

Aatmanirbhar Bharat, america first, Amritkal, BJP, China, China–United States trade war, Donald trump, Eric Garcetti, Indo_US Trade, IPEF, Joe Biden, Narendra Modi Failures


ఎం కోటేశ్వరరావు


ఈ గడ్డ మీద పుట్టి ఇక్కడి తింటూ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడతారంటూ తమ రాజకీయ, సామాజిక, ఆర్థిక విధానాలను విమర్శించిన వారి మీద కాషాయ దళాలు విరుచుకుపడుతున్నది తెలిసిందే. పన్నెండు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న అమెరికాలోని వాషింగ్టన్‌ నుంచి ఢిల్లీ వచ్చి అమెరికా రాయబారిగా ఉన్న వ్యక్తి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అమృత కాలం, ఆత్మనిర్భర భారత్‌ పధకాలను పూచికపుల్ల తీసివేసినట్లుగా మాట్లాడితే ఎలాంటి స్పందనలూ లేవు. ఎవరూ నోరెత్తరు ! అమృతకాలం, ఆత్మనిర్భర (స్వావలంబన) భారత్‌ వాగాడంబరాన్ని కట్టిపెట్టండిి, మేం చెబుతున్న మార్పులు చేస్తేనే మీకూ మాకూ మంచిది ఆపైన మీ ఇష్టం అన్నట్లుగా మన దేశంలో అమెరికా రాయబారి ఎరిక్‌ గార్సెటీ నిర్మొహమాటంగా చెప్పాడు. జనవరి 30వ తేదీన ఢిల్లీలో ” అమృత కాలం, ఆత్మనిర్భర భారత్‌లో భారత-అమెరికా సంబంధాలు ” అనే అంశం గురించి ఇండో-అమెరికన్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, ఉత్తర భారత కౌన్సిల్‌ మహాసభలో గార్సెటీ ప్రసంగించాడు. దురాక్రమణదారులు వచ్చి గుంజుకు పోతారనే పాతకాలం కాదిది, స్వావలంబన అన్నది దుర్భేధ్యమైన కోటగా భావించరాదని తమ దేశం కోరుతున్నదని గార్సెటీ అన్నాడు. పెట్టుబడులు, మేథోసంపత్తి హక్కులు, ఎగుమతి-దిగుమతులు, పన్నుల వ్యవస్థలో భారత్‌ మార్పులు చేయాలి. ప్రభుత్వం స్వావలంబన వైపు మొగ్గు చూపితే వాణిజ్యం, ఆర్థిక వృద్ధి వేగం తగ్గుతుంది. ప్రస్తుతం రక్షణ, ఆధునిక సాంకేతికతలు, ముఖ్యమైన ఖనిజాలు, సెమికండక్టర్ల వంటి అంశాలలో రెండు దేశాలూ వేగంగా ముందుకు పోతున్నప్పటికీ వాణిజ్యం, పెట్టుబడుల అవకాశాలను పూర్తిగా ఉపయోగించుకోవాలంటే ఇవి చాలవు. ఎగుమతి ఆంక్షలు, విదేశీ పెట్టుబడులు, కార్పొరేట్‌ పన్ను వంటి అంశాలు పారదర్శకంగా లేవు, భారత్‌లో పెట్టుబడులు పెట్టే అమెరికా కంపెనీలకు ఆటంకాలను తొలగించాలి, వీటి గురించి మరింత నిర్మొహమాటంగా ఇద్దరం మాట్లాడుకోవాలి అన్నాడు.


చైనా నుంచి విదేశీ పెట్టుబడులు(ఎఫ్‌డిఐ) భారత్‌కు రావాలని అమెరికా కోరుకుంటున్నది, కానీ వాస్తవ అంకెలను చూస్తే రావాల్సినంత వేగంగా ఎఫ్‌డిఐ భారత్‌కు రావటం లేదు, ఆగేయాసియాలోని వియత్నాం వంటి దేశాలకు పోతున్నది. భారత్‌ స్వావలంబనతో ఉండాలని అమెరికా కూడా వాంఛిస్తున్నది, దాన్నొక దుర్భేధ్యమైన కోటగా చూడకూడదని కూడా కోరుకుంటున్నది.ఎందుకంటే భారత కంపెనీలు కూడా ప్రపంచంలో ఎక్కడైనా పెట్టుబడులు పెడుతున్నాయి, ఉద్యోగాలను సృష్టిస్తున్నాయి గనుక పాతకాలపు ఆలోచనలను వదలి పెట్టాలి. ఏ ఒక్క దేశమూ ఇంకేమాత్రమూ స్వావలంబనతో ఉండలేదు. భారత్‌ నుంచి సరఫరా గొలుసులు అమెరికాకు కీలకంగా ఉండాలని మేం కోరుకుంటున్నాం, ప్రతిదీ భారత్‌లోనే తయారు చేయాలని వాక్పటిమను ప్రదర్శిస్తే వేగం తగ్గుతుంది. ఉత్పత్తి మీద మీరు పన్నులు వేస్తే మా మీద వేసినట్లు కాదు, మార్కెట్‌ను రక్షించినట్లు కాదు, మేం పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టాలని కోరుకుంటుంటే మీరు దానికి పరిమితులు విధిస్తున్నట్లు. కార్పొరేట్ల పన్నుల్లో పారదర్శకత ఉండాలని మేం కోరుకుంటాం. ఇక్కడ ఉండాలని కోరుకుంటున్న మా కంపెనీలకు అదొక ఆటంకంగా ఉంది. ఒక అమెరికా కంపెనీ భారత్‌లో అడుగుపెట్టేందుకుగాను రెండు కోట్ల డాలర్లను పెట్టుబడిగా పెట్టింది. అదే కంపెనీ వియత్నాంలో ఇరవై కోట్ల డాలర్లు పెట్టింది, ఎందుకంటే దిగుమతి చేసుకున్న వాటి మీద అక్కడ పన్నులు లేవు అని ఉదాహరణగా గార్సెటీ చెప్పాడు. కోర్టులు తరచూ మేథోసంపత్తి హక్కుల ఉల్లంఘన జరిగిందని తీర్పులు ఇస్తాయి. తరువాత దాని కొనసాగింపేమీ ఉండదు అన్నాడు.


అమెరికా రాయబారి ప్రసంగమంతా ఇలానే కొనసాగింది. ప్రపంచీకరణ, స్వేచ్చా వాణిజ్యం అంటూ కబుర్లు చెప్పిన అమెరికా, తదితర ధనిక దేశాలు దాన్ని పక్కన పెట్టి రక్షణాత్మక చర్యలు తీసుకుంటూ దేశాలతో విడివిడిగా ఒప్పందాలు చేసుకొనేందుకు వత్తిడి తెస్తున్నాయి. ఇలాంటి ఒప్పందాలు గతంలో మనకు పెద్దగా ఒరగబెట్టిందేమీ లేదని తేలింది. తమ షరతులను మన మీద రుద్దుతున్న కారణంగా అమెరికాతో తలపెట్టిన సమగ్ర వాణిజ్య ఒప్పంద ప్రక్రియ ముందుకు పోవటం లేదు. ఎక్కడన్నా బావేగానీ వంగతోట దగ్గర కాదన్నట్లుగా అమెరికాకే అగ్రతాంబూలం అనే విధానాన్ని యాంకీలు బలంగా ముందుకు తీసుకుపోతున్నారు. దానికోసం ఎంతకైనా తెగిస్తున్నారు. డోనాల్డ్‌ ట్రంప్‌-నరేంద్రమోడీ ఇద్దరూ కావిలించుకొని, చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. పరస్పరం పొగడ్తలను గుప్పించుకున్నారు. అదే ట్రంప్‌ మన దేశం నుంచి దిగుమతి చేసుకొనే కొన్ని వస్తువులపై ఎన్నో ఏండ్లుగా ఇస్తున్న (జిఎస్‌పి ) రాయితీలను 2019లోనే రద్దు చేసిన తరువాతే ఇద్దరూ విడదీయరాని బంధంతో ఉన్నట్లు ప్రదర్శించారు.జిఎస్‌పి కింద మనదేశం 2017లో ఎలాంటి దిగుమతి పన్నులు లేకుండా అమెరికాకు ఎగుమతి చేసిన సరకులు విలువ 570 కోట్ల డాలర్లు. ఆ రాయితీని పునరుద్దరించాలని మన దేశం వినతులు మీద వినతులు చేయటమేతప్ప ఇప్పటి వరకు బైడెన్‌ సర్కార్‌ పట్టించుకున్న పాపాన పోలేదు.మనకున్న పలుకుబడికి ఇది నిదర్శనం. దీనికి బదులు చైనాను చూపి మనల్ని భయపెట్టటం, వారి ఆయుధాలను మనకు అమ్మి సొమ్ము చేసుకోవటం విపరీతంగా పెరిగింది. చిత్రం ఏమిటంటే మనతో సహా మిగతా ప్రపంచాన్ని భయపెట్టేందుకు చూస్తున్న అమెరికా తాను మాత్రం అదే చైనాతో వాణిజ్య లావాదేవీలను జరపటానికి ముందుకు సాగుతూనే ఉంది.


అమెరికాలో ఎవరిని కదలించినా చైనా నుంచి మనకు ముప్పు ఉందని చెప్పేవారే, ఎందుకంటే అది వారికి లాభసాటిగా ఉంది. రిపబ్లికన్‌ పార్టీలో పలుకుబడి కలిగిన కాలిఫోర్నియా ఎంపీ డారెల్‌ ఇసా జనవరి 30 అమెరికాలోని హడ్సన్‌ సంస్థలో పరిశోధకురాలిగా ఉన్న అపర్ణా పాండేతో మాట్లాడుతూ చైనా నుంచి తలెత్తిన ముప్పు కారణంగా పద్దతైన స్వేచ్చావాణిజ్య ఒప్పందంతో సహా అనేక ఒప్పందాలను అమెరికా-భారత్‌ కుదుర్చుకోవాల్సి ఉందన్నాడు.ప్రస్తుతం రెండు దేశాల మధ్య ఉన్న సంబంధాలపై చైనా ముప్పు ప్రభావం చూపతున్నదన్నాడు.చైనాలో తయారు చేస్తున్న వస్తువులనే అదే ధరలకు భారత్‌లో కూడా తయారు చేయవచ్చు, కానీ దానికిగాను బలమైన ఒప్పందాలు కావాలి అన్నాడు. అమెరికాలో ఇది ఎన్నికల సంవత్సరం రెండు పార్టీలూ ఓటర్లను ఆకర్షించేందుకు నానా గడ్డీ కరుస్తున్నాయి.తాను గనుక మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికైతే పన్నుల యుద్ధాన్ని ప్రారంభిస్తానని, తద్వారా అమెరికా ప్రయోజనాలను కాపాడతానని, విదేశాలకు తరలిన ఆటోమొబైల్‌ పరిశ్రమను తిరిగి వెనక్కు తీసుకువస్తానని రిపబ్లికన్‌ పార్టీ ఎన్నికల ప్రచారంలో డోనాల్డ్‌ ట్రంప్‌ చెబుతున్నాడు. గతేడాది జూన్‌లో ఒక సందర్భంగా మాట్లాడుతూ ” అమెరికా తయారీ వస్తువులపై భారత్‌, చైనా లేదా మరో ఏదేశమైనా వంద లేదా రెండువందల శాతం దిగుమతి పన్నులు విధిస్తే మేం కూడా అదే విధంగా బదులు తీర్చుకుంటాం.మరో మాటలో చెప్పాలంటే వందశాతమంటే వందశాతమే. వారు గనుక అమెరికా మీద విధిస్తే మనం కూడా విధిస్తాము.కంటికి కన్ను, పన్నుకు పన్ను, ఎంతైతే అంత ” అన్నాడు. అమెరికన్లనే శాసించుతున్నారని చెప్పుకుంటున్న విశ్వగురువుకు ఎలాంటి మినహాయింపులు లేవన్నది స్పష్టం.” ఇప్పటికే 55శాతం ఆటోమొబైల్‌ పరిశ్రమ అమెరికా నుంచి వెళ్లిపోయింది.నేను గనుక అధ్యక్షుడిగా ఎన్నిక కాకుంటే మిగిలింది కూడా అదే దారిలో ఉంటుంది. చైనా లేదా ఇతర దేశాలన్నీ అమెరికాలో అమ్ముకోవాలంటే ఇక్కడే తయారు చేయాలి, మా కార్మికులతోనే పని చేయించాలి. ఇప్పుడు వారు మెక్సికోలో పెద్ద కర్మాగారాలను నిర్మిస్తున్నారు, పన్నులు లేకుండా అమెరికాలో కార్లు అమ్ముకుంటున్నారు.” అని ట్రంప్‌ పేర్కొన్నాడు. తాను గనుక ఎన్నికైతే అమెరికా దిగుమతి చేసుకుంటున్న మూడులక్షల కోట్ల డాలర్ల విలువగల వస్తువులపై పదిశాతం, చైనా వస్తువులపై 60శాతం పన్ను విధించే అవకాశాలను పరిశీలించాలని తన సలహాదారులను కోరినట్లు వాషింగ్టన్‌ పోస్టు పత్రిక రాసింది.


డోనాల్డ్‌ ట్రంప్‌ ఏలుబడిలో చైనా వస్తువులపై విధించిన పన్నులు ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలకు విరుద్దం. అది చివరికి అమెరికాకే నష్టమని తేలటంతో ట్రంప్‌ ఇంటిదారి పట్టాల్సి వచ్చింది. ఇప్పుడు అంతకంటే ఎక్కువ పన్నులు విధిస్తానని చెబుతున్నాడు అంటే జనం, కార్పొరేట్స్‌ ఎలా స్పందిస్తాయో చూడాల్సి ఉంది. అమెరికా ప్రారంభించిన క్రీడలో భాగస్వాములయ్యేందుకు ఐరోపా యూనియన్‌ దేశాలు సిద్దంగా లేవు. అందుకే ఫిబ్రవరి మొదటి వారంలో బ్రసెల్స్‌లో జరిగిన మూడవ ఇండో-పసిఫిక్‌ వేదిక సమావేశానికి అమెరికా, చైనా రెండు దేశాలనూ ఆహ్వానించలేదు. గతేడాది అమెరికా పొల్గొన్నది. అసలు ఏ సమావేశానికీ చైనాను ఆహ్వానించలేదు. దీని అర్ధం ఏమిటంటే ఈ రెండింటిలో ఏదో ఒక దేశం వెనుక చేరటం గాకుండా ఎవరి ప్రయోజనాల మేరకు వారు వ్యవహరించాలని చెప్పటమే అని విశ్లేషకులు భాష్యం చెప్పారు. రెండింటి నుంచి వీలైన మేరకు ఎక్కువ రాయితీలు పొందే ఎత్తుగడ కూడా కావచ్చు. దీన్నుంచి మన దేశం పాఠాలు నేర్చుకుంటుందా ? పెరుగుతున్న చైనా పలుకుబడిని అడ్డుకునేందుకు అమెరికా ముందుకు తెచ్చిన ఐపిఇఎఫ్‌ (ఇండో-పసిఫిక్‌ ఎకనమిక్‌ ఫ్రేమ్‌వర్క్‌ ) పట్ల అమెరికా నేతలే ఆసక్తి చూపటం లేదని తాజాగా విశ్లేషణలు వెలువడ్డాయి.ఈ కూటమిలో అమెరికా, జపాన్‌, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, బ్రూనే,భారత్‌, ఇండోనేషియా, మలేసియా, ఫిజీ, న్యూజిలాండ్‌, ఫిలిప్పీన్స్‌, సింగపూర్‌, థారులాండ్‌, వియత్నాం ఉన్నాయి. వాణిజ్యం మీద ఒప్పందం కుదుర్చుకోవాలని గతేడాది నవంబరులో జరిగిన సమావేశంలో చూసినప్పటికీ అమెరికాలోని పలువురు ఎంపీలు లేవనెత్తిన అభ్యంతరాల కారణంగా కుదరలేదు. ఇది ఆలస్యం కాదు, పూర్తిగా వెనక్కుపోయినట్లే అని బ్రౌన్‌ అనే ఎంపీ మీడియాతో చెప్పాడు.చైనాను దెబ్బతీసేందుకు పన్నెండు పసిఫిక్‌ ప్రాంత దేశాలతో కూడిన టిపిపి కూటమిని అమెరికా ముందుకు తెచ్చింది. అయితే దాన్నుంచి తాము వైదొలుగుతున్నట్లు ప్రకటించిన అమెరికా ఐపిఇఎఫ్‌ను ముందుకు తెచ్చింది. దీన్లో కూడా తమకు పెద్దగా ప్రయోజనం లేదనే భావనతో అమెరికా ఉంది. ఈ ఒప్పందానికి ట్రంప్‌ పెద్దగా ఆసక్తి చూపటం లేదు. విదేశాల నుంచి వస్తున్న దిగుమతులతో అమెరికా పారిశ్రామిక ఉత్పత్తి పడిపోయింది, కార్మికులకు ఉపాధి పోయింది. జనంలో ఉన్న అసంతృప్తిని సొమ్ము చేసుకొనేందుకు మరోసారి అమెరికాను గొప్పగా తయారు చేయాలనే పిలుపుతో డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రచారంతో ముందుకు పోతున్నాడు. ఒక వేళ జో బైడెన్‌ గెలిచినప్పటికీ ఐపిఇఎఫ్‌లో వాణిజ్యం అనే నాలుగువ స్థంభాన్ని నిర్మించటం సాధ్యం కాదని జపాన్‌-ఆసియా ట్రేడ్‌ నిపుణుడు డేవిడ్‌ బోలింగ్‌ చెప్పాడు.ఈ పూర్వరంగంలో మన మార్కెట్లో తన వస్తువులను గుమ్మరించటానికి, పెట్టుబడులకు రాయితీలు పొందటానికి అమెరికా తెస్తున్న వత్తిడికి రాయబారి ప్రసంగం తీరు నిదర్శనం. తమ ప్రయోజనాలను ఫణంగా పెట్టి విదేశీ సంస్థలకు పెద్ద పీట వేస్తామంటే మన కార్పొరేట్‌ సంస్థలు అంగీకరిస్తాయా ? వీలైతే వాటితో చేతులు కలిపి లబ్ది పొందుతాయి లేకుంటే ప్రతిఘటిస్తాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

లక్షాధికారి అక్కలంటూ మునగ చెట్టెక్కించిన నరేంద్రమోడీ !

02 Friday Feb 2024

Posted by raomk in AP, BJP, CHINA, Current Affairs, Economics, employees, INDIA, INTERNATIONAL NEWS, Loksabha Elections, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, Women, Women

≈ Leave a comment

Tags

BJP, lakhpati Didi, Narendra Modi Failures, Nari Shakti, Nirmala Sitharaman, women labour force


ఎం కోటేశ్వరరావు


ఏదీ ఊరికే రాదు అన్న ఒక ఆభరణాల వాణిజ్య ప్రకటన గురించి అందరికీ తెలిసిందే. అటువంటపుడు ప్రధాని నరేంద్రమోడీ మహిళల గురించి ఊరికే మాట్లాడతారా ? సమస్యేలేదు. అందునా ఎన్నికలు, ఓట్ల కోసం మహిళలను ఎందుకు వదలిపెడతారు. పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా మీడియాను ఉద్దేశించి(పత్రికా గోష్టి కాదు) మాట్లాడుతూ ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌ బ్రహ్మాండమైన నారీశక్తి (మహిళా సాధికారత) అవుతుందని చెప్పారు. ఆమె ప్రవేశపెట్టింది ఓట్‌ ఆన్‌ ఎకౌంట్‌ తప్ప దాన్ని బడ్జెట్‌గా పరిగణించరు. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రసంగం, నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ” మహిళా సాధికారత పండగ ” అని కూడా వర్ణించారు.నూతన పార్లమెంటు భవనంలో జరిగిన తొలి సమావేశంలో నారీశక్తి అభియాన్‌కు ఆమోదాన్ని చూశారని, జనవరి 26న కర్తవ్యపథ్‌లో మహిళాశక్తిని చూశారని అన్నారు. రామ్‌ రామ్‌ అంటూ మీడియాతో మాటలు ప్రారంభించిన ప్రధాని అలవాటుగా అల్లరి చేసే, ప్రజాస్వామిక విలువలను నిలువునా కాలరాసే ప్రతిపక్షాలు ఆత్మశోధన చేసుకోవాలని కూడా సలహా ఇచ్చారు. చివరిలో కూడా రామ్‌ రామ్‌ అంటూ ముగించారు. ఎనభై మూడు లక్షల స్వయం సహాయక బృందాలలో తొమ్మిది కోట్ల మంది ఉన్నారని, వారిలో కోటి మంది ఎంతో మందికి స్పూర్తినిస్తూ చిన్న చిన్న వ్యాపారాలతో లక్షాధికారి అక్కలు(లక్‌పతి దీదీ)గా మారినట్లు మూడు కోట్ల మందిని లక్‌పతి దీదీలుగా మార్చనున్నట్లు తాత్కాలిక బడ్జెట్‌ ప్రసంగంలో నిర్మలా సీతారామన్‌ చెప్పారు. దీనికి పండగ చేసుకోవాలని ప్రధాని మోడీ గారు ముక్తాయింపు ఇస్తున్నారు.


గతంలో బేటీ బచావో, బేటీ పఢావో అని పిలుపు ఇచ్చారు.ఇప్పుడు మరో కొత్త నినాదంతో ఆకర్షించేందుకు పూనుకున్నారు. దేశంలో మహిళల సంఖ్య ఎక్కువ అన్నది తెలిసిందే. ఏ దేశంలోనైనా ఎందరు మహిళలు శ్రామికశక్తిలో ఉన్నారన్నది ఒక గీటురాయిగా చూస్తారు. ప్రతిదాన్నీ డబ్బుతో, లాభ నష్టాలతో కొలుస్తున్నారు గనుక శ్రామిక శక్తిలో మహిళలు ఎందరు అంటే లెక్కలతో ఆడుకుంటున్నారు. ఏటా రెండు కోట్ల మందికి ఉపాధి కల్పన ఎంతవరకు వచ్చిందని గతంలో ప్రధాని నరేంద్రమోడీని అడిగితే పకోడీ బండివారికి కూడా ఉపాధి కల్పించినట్లే లెక్కవేసుకోవాలని చెప్పిన సంగతి తెలిసిందే. అఫ్‌కోర్సు పకోడీ బండి వేసుకోవటమేమీ తప్పు కాదు. అసలు పకోడీలు కొని తినే శక్తి ఎంత మందికి ఉందన్నది ప్రశ్న. ఏ దేశమైనా సేవారంగంలో కాకుండా ఉత్పాదక రంగంలో ఎంత మందికి ఉపాధి కల్పించారు, ఎంత ఉత్పత్తి చేస్తున్నారన్నదే ప్రధాన అంశంగా చూస్తారు. దేశంలో 2022-23లో నియమిత కాల కార్మిక శక్తి సర్వే ప్రకారం మహిళలు అంతకు ముందుతో పోలిస్తే 4.2శాతం పెరిగి యూజువల్‌ స్టేటస్‌ లెక్కింపు అవగాహన ప్రకారం 37శాతానికి చేరినట్లు కేంద్ర ప్రభుత్వం గతేడాది అక్టోబరు తొమ్మిదిన ప్రకటించింది. ఈ పదానికి అర్ధం ఏమిటి ? ఉదాహరణకు సర్వే చేసినపుడు ఒక వ్యక్తి అతడు లేదా ఆమె సదరు ఏడాదిలో తాను ఏడు నెలల పాటు పని చేసినట్లు లేదా పనికోసం అందుబాటులో ఉన్నట్లు గానీ, పని కావాలని కోరినట్లయితే శ్రామికశక్తిలో ఉన్నట్లు లెక్కవేస్తారు. అందుకే ఇది అంకెల గారడీ అని చెప్పాల్సి వస్తోంది. ఒక్కసారిగా ఇంత పెరుగుదల ఎలా సాధ్యమైంది అంటే నరేంద్రమోడీ అమలు జరుపుతున్న నైపుణ్యవృద్ధి, మహిళా అనుకూల విధానాలు, మహిళల నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి ఫలితం అని ఠకీమని చెబుతారు. ఒక పదార్ధాన్ని కొలవగలం గానీ గాలిని పట్టుకోలేం, చూడలేం !


ప్రభుత్వం ప్రకటించిన సమాచారాన్ని విశ్లేషించిన పరిశోధకులు చెబుతున్న అంకెలకు వీటికి పొంతన కుదరటం లేదు. అందుకే అమిత్‌ షా మాటల్లో ప్రభుత్వ ప్రకటనలను జుమ్లా (అవసరానికి ఏదో చెబుతుంటాం) అనాల్సి వస్తోంది. ఇండియా టుడే వెబ్‌సైట్‌ 2023 జూన్‌ పదకొండున రోషిణీ చక్రవర్తి రాసిన విశ్లేషణకు ” భారత్‌లో తగ్గుతున్న మహిళా శ్రామికులు, ఎందుకు పని చేయటం లేదు ” అనే శీర్షిక పెట్టింది. భారత్‌లో వేతనాలు చెల్లించే ఉపాధిలో మహిళలు ఇరవైశాతానికి లోపుగానే ఉన్నట్లు ప్రపంచ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) నివేదికను దానిలో ఉటంకించారు. ఐఎల్‌ఓ నివేదిక ప్రకారం ఉపాధిలో కేవలం 19.2శాతం మంది మాత్రమే మహిళలు ఉండగా పురుషుల్లో 70.1శాతం ఉన్నారు. ప్రపంచ ఆర్థిక వేదిక లింగ అసమానతల నివేదిక 2022 ప్రకారం 146 దేశాల జాబితాలో 135వ స్థానంలో భారత్‌ ఉంది.ప్రపంచ శ్రామిక శక్తిలో లింగ సమానత్వం రావాలంటే 132 సంవత్సరాలు పడుతుందని ఆ నివేదిక పేర్కొన్నది. అట్టడుగున్న ఉన్న మన దేశానికి ఇంకా ఎక్కువ వ్యవధి పడుతుందని వేరే చెప్పనవసరం లేదు. మహిళల భాగస్వామ్యం పెరిగితే 2025 నాటికి జిడిపిలో 70వేల కోట్ల డాలర్లు పెరుగుతుందన్నది ఒక అంచనా. ఐఎల్‌ఓ నివేదిక ప్రకారం భారత్‌లో 52శాతం మంది మహిళలు వేతన ఉపాధి లేదా లేదా కుటుంబ సంరక్షణలో రెండింటిలో ఉంటామని చెప్పారు. కానీ 2005లో 32శాతంగా ఉన్న మహిళా శ్రామిక శక్తి 2021నాటికి 19.2శాతానికి తగ్గింది.


అరబ్బు, ఇస్లామిక్‌ దేశాల్లో ప్రముఖ మీడియా సంస్థ అల్‌ జజీరా. అది 2023 ఏప్రిల్‌ పదిన ఒక విశ్లేషణ ప్రచురించింది.” జనాభాలో భారత్‌ దూసుకుపోతున్నా శ్రామిక శక్తిలో తగ్గుతున్న మహిళలు ” అని పేరు పెట్టింది.ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్ధిక వ్యవస్థ ఉన్న భారత్‌ మహిళా శ్రామిక శక్తిలో ప్రపంచంలోని అతితక్కువ 20దేశాల్లో ఒకటిగా ఉందని, గత కొద్ది సంవత్సరాలుగా తగ్గుతున్నట్లు పేర్కొన్నది. పెరుగుతున్న జనాభాకు ప్రత్యేకించి మహిళలకు ఉపాధిని చూపటంలో విఫలమైతే భారత్‌కు అది గుదిబండగా మారుతుంది. అధికారిక సమాచారాన్ని విశ్లేషించినపుడు 2004లో గరిష్టంగా 35శాతం మంది మహిళలు ఉపాధి పొందగా 2022 నాటికి అది 25శాతానికి తగ్గినట్లు అజీమ్‌ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయానికి చెందిన ఆర్థికవేత్త రోజా అబ్రహాం చెప్పిన అంశాన్ని అల్‌ జజీరా ఉటంకించింది. సిఎంఐయి ఉపాధి నిర్వచనం ప్రకారం 2022లో పని చేసే వయస్సులో ఉన్నవారిలో కేవలం పదిశాతం మంది మాత్రమే అంటే 3.9 కోట్ల మంది మహిళలు మాత్రమే పని చేస్తూ ఉండటం లేదా పని కోసం ఎదురు చూస్తున్నవారున్నారని , అదే పురుషుల విషయానికి వస్తే 36.1కోట్ల మంది ఉన్నట్లు పేర్కొన్నది. పని చేయగలిగిన వయస్సు వారి పెరుగుదలకు అనుగుణంగా ఉపాధి పెరగటం లేదని, గత దశాబ్దిలో మంచి ఉద్యోగాలు గణనీయంగా తగ్గినట్లు, మహిళలు తక్కువ వేతనాలతో పని చేయటం కంటే ఇంటి దగ్గర ఉండి ఇల్లు, పిల్లలను చూసుకోవటం మరింత లాభదాయకమని వారి కుటుంబాలు భావిస్తున్నాయని సిఎంఐఇ డైరెక్టర్‌ మహేష్‌ వ్యాస్‌ చెప్పిన మాటలను ఉటంకించింది.శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యం పదిశాతం పెరిగితే జిడిపి 552 బిలియన్‌ డాలర్ల మేరకు అదనంగా పెరుగుతుందని 2018లో మెకెన్సీ నివేదిక పేర్కొన్నది. క్వాల్‌ట్రిక్స్‌ డాట్‌కామ్‌ సమాచారం ప్రకారం 2022లో ప్రపంచంలోని 180దేశాలలో శ్రామిక శక్తిలో 52.7శాతం మహిళలతో ఆర్మేనియా మొదటి స్థానంలో ఉంది.ప్రపంచ సగటు 39.49శాతం.మన దేశం 23.54శాతంతో 166వ స్థానంలో ఉంది.మనకంటే ఎగువన 147లో నేపాల్‌, 153, 156 స్థానాలలో శ్రీలంక, బంగ్లాదేశ్‌, దిగువున 168వ స్థానంలో పాకిస్తాన్‌ ఉంది. మనతో జనాభాలో పోటీ పడుతున్న చైనా 45.17శాతంతో 89వ దేశంగా ఉంది.


ఇక లక్షాధికారి అక్క (లక్‌పతి దీదీ ) పధకం గురించి చూద్దాం. రెండు కోట్ల మంది లక్షాధికారులైనట్లు నిర్మలమ్మ చెప్పారు. ఈ పథకాన్ని పర్యవేక్షిస్తున్న గ్రామీణాభివృద్ది మంత్రిత్వశాఖ వెబ్‌సైట్‌లో ఫిబ్రవరి రెండవ తేదీన ఉన్న సమాచారం ప్రకారం స్వయం సహాయక బృందాలలో ఉన్న మహిళలు 9 కోట్ల 17లక్షల రెండువేల 245 మంది.వీరిలో ఏడాదికి పాతికవేల కంటే తక్కువ ఆదాయం వచ్చిన వారు 44,72,431(ఐదుశాతం) మంది, ఇరవై అయిదు నుంచి 60వేలకు వరకు వచ్చిన వారు 3,99,16,213(48శాతం) మంది, అరవై ఒకటి నుంచి లక్ష వరకు రాబడి వచ్చిన వారు 2,43,09,855(29శాతం) మంది, లక్షకు పైగా వచ్చిన లక్షాధికారి అక్కల సంఖ్య 1,42,53,969(17శాతం)గా పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 2023 ఏప్రిల్‌ ఒకటి నుంచి అమల్లో ఉన్నాయని చెబుతున్న కనీసవేతనాల ప్రకారం నైపుణ్యం లేని వారికి నెలకు రు.12,344, నైపుణ్యం కలిగిన వారికి రు.13,844, అధిక నైపుణ్యం కలిగిన వారికి రు.14,844 కంటే తక్కువ చెల్లించటానికి లేదు. వీరిలో స్వయం సహాయక బృందాల మహిళలను ఏ తరగతిలో చేరిస్తే ఆ మేరకు ఏడాదికి వారికి రావాల్సిన కనీసవేతనాల రాబడి వరుసగా రు.1,48,128, రు.1,66,128, రు.1,78,128గా ఉంటుంది. ఇక బంగారు తెలంగాణా గురించి చెప్పుకుంటే రాష్ట్ర విభజనకు ముందు ఉన్న వేతనాలు తప్ప ఇంతవరకు సవరించలేదు గనుక చెప్పుకోకపోవటమే మంచిది. ఆంధ్రప్రదేశ్‌లో లక్షాధికారి అక్కల పరిస్థితి చూస్తే 89,56,262 మందిలో ఏడాదికి రు. పాతికవేల కంటే తక్కువ వచ్చే వారు ఎనిమిది శాతం, పాతిక నుంచి అరవైవేల మధ్య వారు 39, అరవై నుంచి లక్ష వచ్చే వారు 37, అంతకు మించి వస్తున్నట్లు చెబుతున్నవారు 17శాతం(దేశ సగటుతో సమానం) ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అంగన్‌ వాడీలను జగన్‌ సర్కార్‌ అధిక నైపుణ్యం కలిగిన వారిగా పరిగణించి, తాము ప్రకటించిన కనీసవేతనాలు అమలు జరిపి ఉంటే నలభై రోజులకు పైగా వారు సమ్మె చేసి ఉండే వారు కాదు, లక్షలాది మంది పిల్లలు, పోషకాహారం అందాల్సిన మహిళలను ఇబ్బంది పెట్టి ఉండేవారు కాదు. అంగన్‌వాడీలకు నైపుణ్యం లేకపోతే ఆ బాధ్యతల్లో నియమించరు.

ఆంధ్రప్రదేశ్‌లో సర్వేచేసిన యాంకర్‌ పరిశోధన సంస్థ 2022 డిసెంబరులో నివేదించిన ప్రకారం ప్రకాశం జిల్లా గ్రామీణ ప్రాంతాలలో గౌరవ ప్రదమైన జీవనంలో ఒక భోజనానికి అయ్యే ఖర్చును రు.81.89గా లెక్కించింది. కుటుంబంలో నలుగురు ఉంటే స్కూల్లో ఉన్న పిల్లలకు ఉచిత భోజనం ఉన్నందున ఆ మేరకు తగ్గిస్తే రు.79.16కు తగ్గుతుంది.ఈ లెక్కన ఒక మనిషికి నెలకు రు.2,408, కుటుంబానికి రు.9,632 అవుతుంది. ఇవిగాక బట్టలు, ఇతర అవసరాలను లెక్కిస్తే అవి అదనం. ఆ సంస్థ వేసిన అంచనా ప్రకారం ప్రకాశం జిల్లాలో ఒక కుటుంబానికి గౌరవ ప్రదమైన జీవన రాబడి నెలకు రు.25,269 ఉండాలని, జీవన వేతనం రు.16,077 ఉండాలని పేర్కొన్నది. పైన పేర్కొన్న వివరాల ప్రకారం లక్షాధికారి అక్కతో పాటు కుటుంబంలో మరొక సంపాదన వ్యక్తి ఉన్నప్పటికీ వచ్చే రాబడి సరిపోతుందా ? గౌరవ ప్రదమైన జీవనానికి అవసరమైన రాబడి లేదు గనుకనే పోషకాహార లోపంతో పిల్లలు, మహిళలు ఉన్నారు.దానికి పక్కా నిదర్శనం రక్తహీనత ముక్త భారత్‌గా రూపొందించాలని కేంద్ర ప్రభుత్వం పిలుపు ఇవ్వటమే. జాతీయ ఆరోగ్య సర్వే 2019-21లో సేకరించిన సమాచారంతో అంతకు ముందు సర్వే వివరాలతో పోలిస్తే దేశంలో ఆరేండ్లలోపు పిల్లలు, 15-49 సంవత్సరాల మధ్య ఉన్న గర్భిణులు, మొత్తం మహిళల్లో రక్తహీనత పెరిగింది. ఆంధ్రప్రదేశ్‌ పిల్లల్లో 58.6 నుంచి 63.2 శాతానికి పెరగ్గా మహిళల్లో స్వల్పంగా మాత్రమే తగ్గింది. తెలంగాణాలో పెరిగింది. రెండు రాష్ట్రాలు సంక్షేమ పధకాలను అమలు జరుపుతున్నప్పటికీ మిగతావాటితో పోల్చినపుడు పరిస్థితి పెద్దగా తేడాలేదు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా మాదిరి సంక్షేమ పధకాలు లేని కేరళలో రక్తహీనత సమస్య ఉన్నప్పటికీ తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే చాలా తక్కువగా ఉంది. ఓట్ల కోసం మహిళలను మునగ చెట్టు ఎక్కించటానికి చూస్తారు. స్వయం సహాయక బృందాల ద్వారా లక్షాధికారి అక్కలు తయారైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం ఏలుబడిలోనే మొత్తం పరిస్థితి మారిపోయి ఉండేది. అందువలన తుపాకి రాముడి మాటలను నమ్మితే మరోసారి మోసపోవటమే !

Share this:

  • Tweet
  • More
Like Loading...

కేరళకు అవమానం, పదవికి అగౌరవం :75 సెకండ్లలో ప్రసంగం పూర్తి చేసిన గవర్నర్‌ సరికొత్త రికార్డు !

25 Thursday Jan 2024

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion

≈ 1 Comment

Tags

#Kerala CPI(M), #Pinarayi Vijayan, Arif Mohammed Khan, kerala Assembly, Kerala Governor


ఎం కోటేశ్వరరావు


పురుషులందు పుణ్య పురుషులు వేరయా అన్నట్లుగా గవర్నర్లలో కాషాయ గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ తీరే వేరుగా ఉంది. అనితర సాధ్యమైన కొత్త చరిత్రను జనవరి 25 గురువారం నాడు సృష్టించారు. సరిగ్గా గణతంత్ర దినానికి ఒక రోజు ముందు రాజ్యాంగాన్ని, వ్యవస్థలను అపహాస్యం చేశారనే విమర్శలకు తావిచ్చారు. కేరళ బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం సందర్భంగా సాంప్రదాయబద్దంగా గవర్నర్‌ చేయాల్సిన ప్రసంగాన్ని కేవలం 75 సెకండ్లలో ముగించి వెళ్లిపోయారు. 1982 జనవరి 29న నాటి గవర్నర్‌ జ్యోతి వెంకటాచలం కేవలం ఆరు నిమిషాల్లో ప్రసంగాన్ని ముగించిన రికార్డును ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ బద్దలు కొట్టారు. స్పీకర్‌ ఎఎన్‌ షంషీర్‌, ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ గవర్నర్‌కు వీడ్కోలు కూడా రెండు నిమిషాల్లో ముగిసింది.అసెంబ్లీకి వచ్చిన గవర్నర్‌కు సిఎం పుష్పగుచ్చం అందచేసి స్వాగతం పలికినపుడు ముఖం పక్కకు పెట్టుకొని దాన్ని అందుకున్నారు. తరువాత ప్రసంగం ప్రారంభానికి ముందు సభ్యులను ఉద్దేశించి సంబోధించే మర్యాదను కూడా పాటించకుండా 62పేజీలు, 136 పేరాల ప్రసంగంలో చివరి పేరాను చదివి ముగించినట్లు మళయాల మనోరమ పేర్కొన్నది. నా ప్రభుత్వం అనే పదాలను ఉచ్చరించకుండా దాటవేసేందుకు ఇలా చేసినట్లు పేర్కొన్నది. బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా గవర్నర్లు చేసే ప్రసంగాలను ఆయా ప్రభుత్వాల విధాన పత్రాలుగా పరిగణిస్తారన్నది తెలిసిందే. వాటిలో సాధించిన వాటితో పాటు రానున్న రోజుల్లో కేంద్రీకరించే అంశాలను కూడా వెల్లడిస్తారు. మంత్రివర్గం పంపిన ప్రసంగ పాఠం మీద ఎలాంటి అభ్యంతరాలు వెల్లడించకుండా వెంటనే ఆమోదం తెలపటం అనేక మందికి ఆశ్చర్యం కలిగించింది. వివాదాలకు తెరదించేందుకు సానుకూల సూచికగా ఇలా చేశారేమో అనుకున్నారు. అయితే ప్రసంగించిన తీరును ఎవరూ ఊహించలేదు.


ఉదయం తొమ్మిది గంటలకు అసెంబ్లీకి వచ్చిన గవర్నర్‌ 9.02కి ప్రసంగం ముగించి 9.04కల్లా అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారు. సభను ఉద్దేశించి ప్రసంగించటం తనకు సంతోషంగా ఉందనే ముక్కతో ప్రారంభించి చివరి పేరాను చదువుతున్నట్లు ప్రకటించి వెంటనే ముగించి వెళ్లిపోయారు.వెలుపల వేచి ఉన్న మీడియాకు ఒక నమస్కారం చేసి కారెక్కారు. అసెంబ్లీకి రావటం, ప్రసంగం చదవటం, జాతీయ గీతాలాపాన, వెళ్లిపోవటం అంతా నాలుగు ఐదు నిమిషాల్లోపే పూర్తయింది. గవర్నర్‌ చదివిన చివరి పేరాలో ఇలా ఉంది.” మన గొప్ప వారసత్వం భవనాలు లేదా కీర్తి స్థంభాలలో కాదు, విలువకట్టలేని భారత రాజ్యాంగం, కాలంతో నిమిత్తం లేని ప్రజాస్వామ్య విలువలు,లౌకికవాదం, సమాఖ్యవాదం,సామాజిక న్యాయం పట్ల మనం చూపే గౌరవం, మర్యాదలలో ఉంది. సహకార సమాఖ్యవాద సారమే ఇంతకాలం భారత్‌ను ఐక్యంగా, బలంగా ఉంచింది.దీన్ని దిగజారకుండా చూడటమే మన మహత్తర కర్తవ్యం. సుందరమైన, భిన్నత్వం కలిగిన దేశంలో భాగస్వాములుగా మనం కలసి కట్టుగా సమగ్ర అభివృద్ధి, సమున్నతంగా ముందుకు తీసుకుపోయే విధంగా దేశ చిత్రాన్ని రూపొందించాల్సి ఉంది. మన దారిలో ఎదురయ్యే అన్ని సవాళ్లను అధిగమించాలి ” ఈ పేరాలో ఎక్కడా నా ప్రభుత్వం అనే పదం లేదు. అందుకే గవర్నర్‌ ఈ మాత్రమైనా చదివి ఉంటారన్నది స్పష్టం. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం. సమాఖ్యవాదం పట్ల గౌరవ, మర్యాదలను చూపాలని చెప్పిన గవర్నర్‌ వ్యవహరించిన తీరు అందుకు అనుగుణంగా ఉందా లేదా అన్నది ఎవరికి వారు నిర్ధారణకు రావచ్చు. క్లుప్తంగా ముగించటం ద్వారా గవర్నర్‌ తన అసంతృప్తిని వెల్లడించారని రాష్ట్ర బిజెపి వ్యాఖ్యానించింది. రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌ను తీవ్రంగా అవమానించినట్లు ఆరోపించింది. గవర్నర్‌ చర్యతో రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలినట్లు వర్ణించింది.


గవర్నర్‌ వ్యవహరించిన తీరు రాష్ట్రాన్ని అవమానించటమే అని ప్రతిపక్ష యుడిఎఫ్‌ నేత వి సతీశన్‌ విమర్శించారు. ప్రతిపక్ష ఉపనాయకుడు, ముస్లింలీగ్‌ నేత కున్హాలికుట్టి మాట్లాడుతూ తాము గవర్నర్‌ రావటాన్ని రాకెట్‌ మాదిరి వెళ్లిపోవటాన్ని చూసి ఆశ్చర్యపోయామని, కనీసం ప్రతిపక్ష సభ్యులవైపు కూడా చూడలేదని, ఇది అసెంబ్లీని అవమానించటమే అన్నారు. గవర్నర్‌ చర్యను పట్టించుకోవద్దని, నిరసనల వంటివి తెలపవద్దని అసెంబ్లీ ముగిసిన తరువాత ఎల్‌డిఎఫ్‌ ఎంఎల్‌ఏల సమావేశంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ చెప్పినట్లు వార్తలు వచ్చాయి. సమావేశం తరువాత రాష్ట్ర న్యాయ, పరిశ్రమల శాఖ మంత్రి పి రాజీవ్‌ మాట్లాడుతూ గవర్నర్‌ ” రాజ్యాంగబద్ద విధి ” నిర్వహించారని చెప్పారు. మంత్రివర్గం రూపొందించిన ప్రసంగ పాఠాన్ని గవర్నర్‌ ఆమోదించారు. మొదటి చివరి పేరాలను చదివినప్పటికీ మొత్తం చదివినట్లే పరిగణించబడుతుంది, అసెంబ్లీ రికార్డుల్లో అదే నమోదౌతుంది. గవర్నర్‌ పూర్తి పాఠాన్ని ఎందుకు చదవలేదో తెలియదు, చదవలేకపోయారా ఇంకేమైనా కారణాలున్నదీ తెలియదని రాజీవ్‌ చెప్పారు. గవర్నర్‌ ఇలా ముగించారంటే బహుశా ఆయనకు ఏదైనా ఆరోగ్య సమస్య ఉందేమోనని రాష్ట్ర మంత్రి సాజీ చెరియన్‌ వ్యాఖ్యానించారు. రాష్ట్ర గవర్నర్‌గా ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ వచ్చినప్పటి నుంచి నిత్యం ఏదో ఒక వివాదంతో మీడియాకు ఎక్కుతూనే ఉన్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వం మీద విమర్శలు చేసిన భాగాన్ని అసెంబ్లీలో చదివేందుకు తిరస్కరించి వివాదం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇటీవల విద్యార్థులను తూలనాడి వారి నుంచి తీవ్ర నిరసన ఎదుర్కొన్నారు. బహుశా ఆ ఉక్రోషాన్ని ఈ రూపంలో తీర్చుకొని ఉంటారని భావిస్తున్నారు. ముఖ్యమంత్రి తన మీద దాడికి ఎస్‌ఎఫ్‌ఐ గూండాలను, డబ్బిచ్చి నేరగాండ్లను ఉసిగొల్పినట్లు ఆరోపించిన సంగతి తెలిసిందే. గవర్నర్‌ తీరుకు నిరసనగా ఎక్కడ పర్యటనకు వెళితే అక్కడ విద్యార్ధులు నిరసన తెలుపుతున్నారు. గవర్నరు ప్రసంగాన్ని అసెంబ్లీ మీడియాకు విడుదల చేసింది. రాష్ట్ర ప్రధాన ఆదాయవనరుగా లాటరీలు, మద్యం వుండటం సిగ్గుగా ఉందని గతంలో గవర్నర్‌ ఆరోపించారు. గురువారం నాటి గవర్నర్‌ ప్రసంగంలో దాని గురించి వివరణ ఉంది. రాష్ట్ర పన్ను రాబడిలో మద్యం ద్వారా వస్తున్న మొత్తం కేవలం 3.7శాతమేనని, కొన్ని రాష్ట్రాలలో గరిష్టంగా 22శాతం వరకు ఉన్నట్లు పేర్కొన్నారు. ధాన్య రైతులకు దేశంలో ఎక్కడా లేని విధంగా క్వింటాలుకు రు.2,820 కనీస మద్దతు ధర చెల్లిస్తున్నట్లు తెలిపింది.


గవర్నర్‌గా ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ స్వతంత్రంగా వ్యవహరించటం లేదని సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి రోహింటన్‌ నారిమన్‌ చేసిన వ్యాఖ్య మీద గవర్నర్‌ విరుచుకుపడ్డారు. డిసెంబరు నెలలో ముంబైలో జరిగిన ఒక సభలో రోహింటన్‌ మాట్లాడుతూ గవర్నర్లుగా స్వతంత్రంగా వ్యవహరించే వారిని మాత్రమే పదవుల్లో నియమించాలని సుప్రీం కోర్టు చెప్పే రోజుకోసం తాను వేచి చూస్తున్నట్లు చెప్పారు.” ఈ రోజు మనకు కనిపిస్తున్నటు వంటి వారిని నియమించకూడదు,ఉదాహరణకు ఈ రోజు కేరళలో ఉన్నటువంటి వారిని ” అన్నారు. బుధవారం నాడు చెన్నరులో జరిగిన ఒక సభలో గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ మాట్లాడుతూ రోహింటన్‌ స్వలాభంతోనే అలాంటి వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు.రోహింటన్‌ తండ్రి సీనియర్‌ న్యాయవాది పాలీ ఎస్‌ నారిమన్‌, ఆయన సహాయకులు కేవలం సలహా చెప్పినందుకే కేరళ ప్రభుత్వం నుంచి రు.40లక్షలు తీసుకున్నారని ఆరోపించారు. ఇతర రాష్ట్రాల గవర్నర్ల మీద ఎలాంటి వ్యాఖ్య చేయకుండా తననే ఎంచుకోవటానికి తండ్రి నుంచి సలహాలు తీసుకోవటాన్ని అంగీకరించకపోవటమే అని చెప్పుకున్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

బాల రామాలయం ఓకే, కాలయాపన కమిటీలు, కోట్లాది రైతుల సంగతేమిటి మోడీ గారూ !

24 Wednesday Jan 2024

Posted by raomk in BJP, Communalism, Current Affairs, Farmers, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Politics, RELIGION, Uncategorized

≈ 1 Comment

Tags

#Balk Ram, BJP, Farm Bills, MSP demand, Narendra Modi Failures, National Turmeric Board, Railway Zone in Vizag, Ram Temple politics, RSS, SC Sub-Categorisation, South Coast Railway Zone


ఎం కోటేశ్వరరావు


ఎట్టకేలకు అయోధ్య బాలక్‌ రామాలయ ప్రాణ ప్రతిష్ట జరిగింది. జనవరి 22న ఆ కార్యక్రమ కోసం ప్రధాని నరేంద్రమోడీ దేశం నలుమూలలా ఎంతలా తిరిగిందీ, ఎన్ని పొర్లుదండాలు, ఎక్కడ ఎన్ని మొక్కులు మొక్కిందీ చూశాము. భక్తి శివుడి మీద చిత్తం చెప్పుల మీద అన్నట్లుగా లోక్‌సభ ఎన్నికలు కనిపిస్తున్నందున ఈ తాపత్రయాన్ని అర్ధం చేసుకోవటం కష్టం కాదు. పోయిన దేశ ప్రతిష్టను, దానితో పాటు విదేశీ పెట్టుబడులను తీసుకువచ్చే పేరుతో అధికారానికి వచ్చిన కొత్తలో విదేశాలు తిరిగిన తీరు, చేసిన హడావుడి చూశాము.సరే ఎవరెన్ని విమర్శలు చేసినా ఖాతరు చేయని చరిత్రకెక్కిన పాలకుల సరసన చేరిన నరేంద్రమోడీ రామాలయ ప్రారంభాన్ని ప్రభుత్వ-సంఘపరివార్‌ కార్యక్రమంగా మార్చివేశారు. మతానికి ప్రభుత్వానికి ఉన్న గీతను చెరిపివేశారనే విమర్శలను ఎదుర్కొన్నారు. ఎన్ని దేశాలు తిరిగినా, మనదేశ ప్రతిష్టను పెంచినట్లు ప్రచారం చేసుకున్నా చెప్పినంతగా పెట్టుబడులు రాలేదు.పలుకుబడి పెరుగుదలకు రుజువూ లేదు. మేడిన్‌, మేకిన్‌ ఇండియా, ఆత్మనిర్భరత సాకారం కాలేదు. ఇప్పుడు రామాలయం కోసం తిరిగినదానికి వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఓట్లు వస్తాయా ? ఏం జరిగిందీ, ఎందుకు జరిగిందీ దేశమంతా చూసింది. ఏం జరగనుందో చూద్దాం !


రామాలయం మీద చూపిన శ్రద్ద ప్రజల సమస్యల మీద నరేంద్రమోడీ చూపారా ? తమది పనిచేసే ప్రభుత్వమని మోడీ, బిజెపి కూడా చెప్పుకుంటుంది.పదేండ్లలో అలాంటిదేమీ కనిపించలేదు.అచ్చేదిన్‌లో ఆకలో రామచంద్రా అన్న పరిస్థితిని అంగీకరిస్తూ సబ్సిడీతో కూడా జనాలు కొనుక్కోలేని స్థితిలో (లేకుంటే ఉచితంగా ఇవ్వాల్సిన పనేముంది) ఉన్నారన్న వాస్తవాన్ని గ్రహించి ఉచిత ఆహార ధాన్యాల అందచేత పథకాన్ని పొడిగించారు. కొన్ని అంశాల్లో మోడీ సర్కార్‌ ఎక్కడలేని వేగాన్ని కనపరిచిన మాట వాస్తవం.బహుశా కనపడని శక్తి ఏదో నెడుతూ ఉండాలి. ఉదాహరణకు మూడు సాగు చట్టాలనే తీసుకుందాం.2020 సెప్టెంబరులో 17న లోక్‌సభ, 20తేదీన రాజ్యసభ ఆమోదం, 27న రాష్ట్రపతి అంగీకారం, పది రోజుల్లో అంతా జరిగింది. వ్యవసాయం ఉమ్మడి జాబితాలో ఉన్నప్పటికీ రాష్ట్రాలను సంప్రదించలేదు. ఎంత వేగంగా చట్టాలను రుద్దారో ప్రతిఘటన కూడా అంతే తీవ్రంగా ఎదురైంది. రాష్ట్రపతి ఆమోదం పొందక ముందే సెప్టెంబరు 25న భారత బంద్‌కు పిలుపు ఇచ్చారు.వివిధ ప్రాంతాల్లో ఆందోళనలు జరిగాయి. రైతులను రాజధానిలో ప్రవేశంచకుండా అడ్డుకోవటంతో నవంబరు 26 నుంచి రైతులు ఢిల్లీ శివార్లలో తిష్టవేశారు.చట్టాల అమలు మీద 2021 జనవరి 12 సుప్రీం కోర్టు స్టే విధించి, రైతుల చెబుతున్నదానిని వినాలంటూ ఒక కమిటీని వేసింది. అయినా రైతులు తగ్గలేదు.చివరకు నరేంద్రమోడీ దిగివచ్చి క్షమాపణలు చెప్పి మూడు చట్టాలను వెనక్కు తీసుకుంటున్నట్లు నవంబరులో ప్రకటించారు. డిసెంబరు ఒకటిన పార్లమెంటులో రద్దు బిల్లుతో ఉపసంహరించుకున్నారు.


రైతులు ముందుకు తెచ్చిన కనీస మద్దతు ధరలకు చట్టబద్దత అంశంతో సహా కనీస మద్దతు ధరలు, సేంద్రీయ సాగు గురించి సిఫార్సులు చేసేందుకు 2022 జూలై 18న కేంద్ర ప్రభుత్వం 26 మందితో ఒక కమిటీని వేసింది. కమిటీలో అత్యధికులు తాన తందాన వారే ఉన్నందున దానిలో చేరేందుకు రైతుల ఆందోళనకు నాయకత్వం వహించిన సంయుక్త కిసాన్‌ మోర్చా తిరస్కరించింది. ఆ కమిటీలో వివిధ అంశాల మీద సిఫార్సులు చేసేందుకు మరో ఐదు ఉపకమిటీలు ఏర్పాటు చేశారు. ఇక్కడే అసలు కథ ప్రారంభం. చిత్రం ఏమిటంటే ఈ కమిటీ నివేదికకు నిర్దిష్ట కాలపరిమితి విధించలేదు.ఇంతవరకు అదేమి చేసిందో మనకు తెలియదు. గతేడాది జూన్‌లో ఉప కమిటీలు నివేదికలు సమర్పిస్తాయని చెప్పారు. తరువాత ఎలాంటి సమాచారమూ లేదు. సాగు చట్టాలను వేగంగా తెచ్చిన ప్రభుత్వం దీని నివేదిక పట్ల ఎందుకు అంత శ్రద్ద చూపటం లేదు ? గతంలో సుప్రీం కోర్టు కమిటీ వేసిన నివేదిక, ఆ సాగు చట్టాలను వెనక్కు తీసుకున్న తరువాత నాలుగు నెలలకు బహిర్గతమైంది. దానిలోని అంశాలు అంతకు ముందు ప్రభుత్వం చేసిన వాదనలు తప్ప మరొకటి కాదు. అందుకే రైతు సంఘాలు తిరస్కరించాయి. ప్రభుత్వం వేసిన కనీస మద్దతు ధరల కమిటీ నివేదిక లోక్‌సభ ఎన్నికలకు ముందే వస్తే అది రైతుల్లో చర్చకు దారి తీస్తుందన్న భయంతోనే కాలపరిమితి నిర్దేశించలేదు. కనీసం ముసాయిదా నివేదికలు కూడా సమర్పించలేదు. అది ఎప్పుడు వస్తుందో, ఏమి సిఫార్సు చేస్తుందో అయోధ్య బాల రాముడికే ఎరుక.
రామాలయ నిర్మాణం పూర్తిగాక ముందే ప్రారంభోత్సవం జరపటం గురించి శంకరాచార్యులు అభ్యంతరం తెలిపారు.మనం కొత్త ఇల్లు కట్టుకున్నపుడు పూర్తిగాక ముందే ప్రవేశ పూజలు చేసి తరువాత మిగతా పనులు చూసుకోవటంలేదా అని అనేక మంది సమర్ధించారు. నిజమే, ఇదే పద్దతి ఇతర వాటికి ఎందుకు వర్తింప చేయటం లేదు ?

తెలంగాణా అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్రమోడీ నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని వాగ్దానం చేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామని చెప్పుకొనేందుకు అక్టోబరు నాలుగవ తేదీన కేంద్ర ప్రభుత్వం బోర్డు ఏర్పాటుకు నోటిఫికేషన్‌ కూడా ఇచ్చింది. ఇంతవరకు బోర్డును ఏర్పాటు చేయలేదు, ఆఫీసు ఏర్పాటు లేదు.దీని ఏర్పాటుకు వివాదాలేమీ లేవు. వేల కోట్ల ఖర్చూ కాదు. ఎందుకు తదుపరి చర్యలు లేవు. ముందు బోర్డును ఏర్పాటు చేస్తే దానికి నిర్దేశించిన కార్యకలాపాలు ప్రారంభమౌతాయి. పరిశోధనలకు అవసరమైన భూమి కేటాయించకపోతే రాష్ట్ర ప్రభుత్వం మీద వత్తిడి తేవటానికి వీలుంటుంది. చిత్రం ఏమిటంటే కనీస మద్దతు ధరల పంటల జాబితాలో పసుపు లేదు. పసుపు బోర్డు ఎప్పుడు ఏర్పడుతుంది, అది రైతులకు ఎలా మేలు చేస్తుంది ? రాబోయే కాలానికే వదలివేద్దాం. అంతకు ముందు పసుపు రైతులకు బాండ్లు రాసిచ్చిన బిజెపి నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌ సుగంధ ద్రవ్యాల బోర్డు విస్తరణ కార్యాలయాన్ని ఏర్పాటు చేయించి పసుపు బోర్డు కంటే ఇదే గొప్పది అని చెప్పుకున్నారు. అది రైతుల్లో పేలకపోవటంతో పసుపు బోర్డు గురించి మరో అంకాన్ని ప్రారంభించారు.


ప్రకటనలు చేయటం మీద ఉన్న శ్రద్ద అమలులో లేదని పదేండ్ల అనుభవం నిరూపించింది. రాష్ట్ర విభజన 2014చట్టంలో ఆంధ్రప్రదేశ్‌కు నూతన రైల్వే జోన్‌ ఏర్పాటును పరిశీలించాలని ఉంది. ప్రత్యేక హౌదా వాగ్దానంపై మడమ తిప్పిన ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర ప్రభుత్వం దానికి బదులు ప్రత్యేక పాకేజి ఇస్తామంటూ కొత్త ప్రతిపాదనను ముందుకు తెచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఈ పరిణామం బిజెపి మీద తీవ్ర వ్యతిరేకతను పెంచింది. దాంతో 2019 ఫిబ్రవరి 27న లోక్‌సభ ఎన్నికలకు ముందు కేంద్ర మంత్రి పియూష్‌ గోయల్‌ విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌ ప్రకటన చేశారు. అంతకు ముందు బిజెపి రాష్ట్ర నేతలు కేంద్రానికి ఒక వినతి పత్రం ఇచ్చినట్లు, దాని మీద స్పందించినట్లు ప్రచారం చేశారు.వారు ఐదేండ్లు ఏ గుడ్డి గుర్రాలకు పండ్లుతోమారో తెలియదు. మరోసారి లోక్‌సభ ఎన్నికలు రాబోతున్నాయి. ఇంతవరకు రైల్వే జోన్‌ ఏర్పడలేదు. అసలు నోటిఫికేషనే ఇవ్వలేదు. అదుగో ఇదిగో అంటూ చెప్పటమే తప్ప అడుగు ముందుకు పడలేదు. రాష్ట్ర ప్రభుత్వం కార్యాలయాల ఏర్పాటుకు స్థలం ఇవ్వలేదన్నారు. ఫలాన చోట ఇస్తామని చెప్పిన తరువాత దాని మీద నిర్ణయం తీసుకోలేదంటూ కాలంగడుపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్థలం ఇవ్వకపోతే జోన్‌ ఏర్పాటు చేసి యంత్రాంగాన్ని ఉంచేందుకు విశాఖలో అద్దె భవనాలే దొరకవా ? ఇచ్చిన స్థలంలో భవనాలు నిర్మించిన తరువాతే జోన్‌ ఏర్పాటు చేస్తారా ? రాజకీయం గాకపోతే మరొకటేమైనా ఉందా ?


విశాఖ ముడసర్లోవలో ప్రతిపాదిత రైల్వేజోన్‌ ప్రధాన కేంద్రానికి 52.2ఎకరాలు ఇస్తామని రాష్ట్రం ప్రతిపాదించింది. ఇంకా భూమిని గుర్తించాల్సి ఉందని, దాన్ని ఆమోదించాలని, ప్రాజెక్టు నివేదిక సిద్దంగా ఉందని 107 కోట్ల రూపాయలను మంజూరు చేశామని డిసెంబరులో కేంద్ర రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ లోక్‌సభలో తెలుగుదేశం ఎంపీ కె రామమోహన్నాయుడి ప్రశ్నకు సమాధానంలో చెప్పారు.2023-24 బడ్జెట్‌లో పది కోట్లు కేటాయించి ప్రాజెక్టు రిపోర్టు తయారు చేయాలని కోరినట్లు మంత్రి వెల్లడించారు. జోన్‌ ఎప్పుడు ప్రారంభమౌతుంది, నిర్మాణాలు ఎప్పటికి పూర్తవుతాయన్న ప్రశ్నలకు సమాధానం లేదు. బిజెపి రాజ్యసభ సభ్యుడు జివిఎల్‌ నరసింహారావు నెల రోజుల క్రితం మాట్లాడుతూ ముడసర్లోవ భూములను అధికారులు ఖరారు చేశారని, నిర్మాణ జాప్యం ఎందుకో అర్దం కావటం లేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం భూమి ఖరారులో చాలా ఆలశ్యం చేసిందన్నారు.విశాఖ జోన్‌ ప్రత్యేకత ఏమిటంటే ప్రధాన కార్యాలయం ఉన్న విశాఖ డివిజన్ను రద్దు చేసి మూడు ముక్కలుగా విడగొట్టి ఒక ముక్కను రాయఘఢలో మరో ముక్కను ఖుర్దా, మూడో భాగాన్ని విజయవాడ డివిజన్‌లో విలీనం చేస్తారు. ఈ జోన్‌లో విజయవాడ, గుంటూరు, గుంతకల్‌ డివిజన్లు ఉంటాయి. ప్రధాన కేంద్రంలో డివిజన్‌లేని జోన్‌గా ఇది చరిత్రలో నిలుస్తుంది.


బిజెపి ఓట్ల రాజకీయంలో భాగంగా తెలంగాణా ఎన్నికలకు ముందు షెడ్యూలు కులాల ఉపవర్గీకరణ గురించి వాగ్దానం చేసింది. కానీ దానికి ఎలాంటి ఫలితమూ దక్కలేదు.అయిననూ ప్రయత్నించి చూడవలె అన్నట్లుగా ఈ అంశం మీద కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం వర్గీకరణ అంశం సుప్రీం కోర్టులో ఏడుగురు సభ్యులున్న బెంచ్‌ విచారణలో ఉంది. లోక్‌సభ ఎన్నికల కోసం తప్ప ఈ కమిటీ ఏం చేస్తుందన్నది అనేక మందిలో ఉన్న సందేహం.ఎప్పటి నుంచో నడుస్తున్న ఈ సమస్య మీద దశాబ్దం క్రితం అధికారానికి వచ్చిన బిజెపి చేసిందేమిటి? అన్నది సమాధానం లేని ప్రశ్న.ఉభయ సభల్లో పూర్తి మెజారిటీ ఉన్నందున నిజానికి చిత్తశుద్ధి ఉంటే రాజ్యాంగ సవరణ చేసి అమలు చేసేందుకు పూనుకోవచ్చు.ఆ పని చేయలేదు. కాబినెట్‌ కార్యదర్శి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కమిటీ అధికార యంత్రాంగం తీసుకోవాల్సిన చర్యలను పరిశీలిస్తుందని చెబుతున్నారు. సుప్రీం కోర్టు తీర్పుకు కేంద్రం కట్టుబడి ఉంటుందా ?ఉండేట్లయితే కమిటీ చేసే పనేమిటి ? కోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తే ఏం చేస్తారు ? అందుకే దీన్ని ఓట్ల ఆకర్షణ కమిటీ అంటున్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఇంటా బయటా కులవివక్ష : ఉడిపి పెజావర్‌ మఠ స్వామి, టీవీ యాంకర్‌పై ఫిర్యాదు !

20 Saturday Jan 2024

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RELIGION, Religious Intolarence, UK, USA, Women

≈ Leave a comment

Tags

BJP, caste discrimination, caste system, caste-based exclusion, Gangster Chota Rajan, Hindu Council UK, Hinduism, KVPS, RSS, Social Justice, Udupi Pejawar math seer


ఎం కోటేశ్వరరావు


కుల వివక్ష మహమ్మారి కొంతకాలం క్రితం వరకు మన దేశానికే సొంతం, ప్రత్యేకం. ఇప్పుడు ”విద్యావంతులు” దాన్ని అంతర్జాతీయం గావించారు. దాన్ని పాటించేవారు ఎక్కడ అడుగుపెడితే అక్కడ పిచ్చి తుమ్మలా విస్తరిస్తోంది. దాన్ని నిరసించే వారు ఎక్కడ తలెత్తితే అక్కడ ప్రతిఘటన, బెదిరింపులు ఎదురవుతున్నాయి. డిసెంబరు 27న కర్ణాటకలోని సువర్ణ కన్నడ టీవీ కార్యక్రమంలో అయోధ్యలోని రామాలయంలోపల దళితులు పూజలు నిర్వహించవచ్చా అనే చర్చ జరిపారు. జనవరి పన్నెండున బెంగలూరులో ” బిఆర్‌ అంబేద్కర్‌ దండు(సేన) ” అనే సంస్థ దానిలో పాల్గన్న శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టీ, ఉడిపి పెజావర్‌ మఠ స్వామీజీ విశ్వప్రసన్న తీర్ధ, టీవీ యాంకర్‌ అజిత్‌ హనుమక్కనావర్‌ మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాని మీద ఎఫ్‌ఐఆర్‌ దాఖలైందీ లేనిదీ తెలియదు. సువర్ణ టీవీ చర్చలో నాగరాజ్‌ అనే ఒక దళిత సంస్థ ప్రతినిధి అయోధ్య రామాలయం పూజల్లో దళితులను చేర్చలేదని ఆందోళన వెలిబుచ్చారు. దాని మీద స్వామి స్పందిస్తూ ఒక్క కాశీ ఆలయంలో తప్ప ఒక దేవాలయంలో పూజకోసం నియమించిన ఒక్కరు మాత్రమే చేస్తారని ప్రతి ఒక్కరూ చేయరని అన్నారు. ఒక్క దేవాలయమే కాదు, ఉదాహరణకు ఏ కార్యాలయం లేదా సంస్థలో నిర్దేశిత స్థానంలో ఒక్కరే ఉంటారు తప్ప ప్రతి ఒక్కరూ కూర్చోరని, నియమిత వ్యక్తులను మాత్రమే అనుమతిస్తారని చెప్పారు. అయోధ్యలో వంతుల వారీ పూజలు ఎందుకు చేయకూడదని నాగరాజు ప్రశ్నించారు.” ఇప్పటి వరకు పూజలు నిర్వహిస్తున్న సామాజిక తరగతి మాత్రమే భవిష్యత్‌లో కూడా చేస్తుందని, ఇతరులు చేయకూడదని అన్నారు. సంప్రదాయాలను మార్చకూడదా అన్న దానికి ఈ ప్రశ్న దేవాలయాలు, ధార్మిక సంస్థల గురించి మాత్రమే ఎందుకు అడుగుతున్నారని స్వామి ఎదురు ప్రశ్నించారు.
లౌకిక నిబంధనలు మతప్రదేశాలకు వర్తించరాదని, రెండింటినీ కలగా పులగం చేయరాదని టీవీ యాంకర్‌ అజిత్‌ వాదించారు.” మీరు శబరిమల ఆలయానికి వెళ్లాలంటే కొన్ని నిబంధనలు పాటించాలి, వాటిని పాటించకుండా వెళ్లాలంటే ఎలా ? కొన్ని ఇళ్లలో మీరు బూట్లు వేసుకోవచ్చు, కొన్ని చోట్ల బయట వదలి రావాలన్న నిబంధనలు ఉంటాయి. మీ వంట ఇంట్లో బూట్లు ధరించినట్లుగా ఇతరుల ఇండ్లలో కూడా ధరిస్తామని అంటే అప్పుడు మీరు తర్కబద్దంగా మాట్లాడేవ్యక్తి కానట్లే ” అన్నారు. చర్చలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ప్రతినిధి ” దళితులు పూజ చేయాలని కోరుకుంటే వారు మంత్రాలు నేర్చుకోవాలి, అఖండ పాండిత్యాన్ని సంపాదించాలి, తరువాత పూజలు చేయాలి ” అన్నారు. అప్పుడు పెజావర్‌ స్వామి మాట్లాడుతూ హిందూయిజంలో దళితులు ప్రత్యేక బృందంగా విడిగా ఉండాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. దళిత సంఘ ప్రతినిధి నాగరాజు మాట్లాడుతూ దళితులకు ఎక్కడా అవకాశాలు లేవని చెప్పారు. దాని మీద స్వామి మాట్లాడుతూ ” ఒక దళిత సంస్థ నేతగా మీరు ఒక బ్రాహ్మణుడిని అంగీకరిస్తారా ” అని ప్రశ్నించగా అదెలా కుదురుతుందని నాగరాజు అన్నారు.


దళిత సంస్థ అంటే కుల సంస్థ కాదు. దళిత సామాజిక తరగతిలో అనేక కులాలు ఉన్నాయి. అవి వేటికవి తమ కులం గురించి ఏర్పాటు చేసుకున్న సంఘాలకు వేరే కులం వారిని అనుమతించరు. కులవివక్షను ఎదుర్కొంటున్న వారిలో గిరిజనులు, వెనుకబడిన తరగతుల వారు కూడా ఉన్నారు. తీవ్ర వివక్షను దళితులు ఎదుర్కొంటున్నారు. దేశంలో ఉన్న దళిత సంస్థలు ఆ సామాజిక తరగతికి చెందిన వారు మొత్తంగా ఎదుర్కొంటున్న కులవివక్ష, అవమానాలకు, ఉద్యోగ, రిజర్వేషన్లలో చేస్తున్న అన్యాయాలకు వ్యతిరేకంగా గళం విప్పుతున్నవి. తమ డిమాండ్లను బలపరిచే ఎవరినైనా తమ నేతలలో ఒకరిగా అంగీకరివచ్చు. ఉదాహరణకు రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘాలకు(కెవిపిఎస్‌) నాయకత్వం వహిస్తున్నవారిలో దళితులు కాని వారు కూడా ఉన్నారు. అందువలన పెజావర్‌ స్వామి వేసిన ప్రశ్న సరైందికాదు లేదా తప్పుదారి పట్టించేది కాగా, దానికి సమాధానం చెప్పిన నాగరాజు అవగాహనలో గందరగోళం ఉన్నది. ఇక బిఆర్‌ అంబేద్కర్‌ దండు చేసిన ఫిర్యాదును చూద్దాం. మత ప్రదేశాల్లో మత నిబంధనలను పాటించాలని చెప్పటం ద్వారా దేవాలయాల్లో పూజలు చేసేందుకు దళితులను అనుమతించరని పెజావర్‌ స్వామి, టీవీ యాంకర్‌ చెప్పినట్లయిందని, తద్వారా వారు అంటరానితనాన్ని పాటించాలని చెప్పటమేనని, అలాంటి ప్రకటనలు రాజ్యాంగంలో పేర్కొన్న సమానత్వ, లౌకికత్వానికి విరుద్దమని, సంప్రదాయం అనే పదాన్ని ఉపయోగించటం దళితులను అణచివేయటం, ఈ చెడు సంప్రదాయాన్ని ప్రశ్నించకుండా అనుసరించాలని చెప్పటమే కనుక చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో కోరారు. బెంగలూరు హై గ్రౌండ్స్‌ పోలీసులు తమ ఫిర్యాదు అందినట్లు రసీదు ఇచ్చారని ఇంతవరకు(జనవరి 15) ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేయలేదని దండు సలహాదారు ఆదర్శ ఆర్‌ ఆయ్యర్‌ చెప్పారు.


గాంగస్టర్‌ చోటా రాజన్‌ కుమార్తె అమెరికా విశ్వవిద్యాలయంలో లోపాలతో ఉన్న కులసర్వే నిర్వహించారని, జార్జి సోరస్‌తో సంబంధమున్న సంస్థలకు డబ్బు విరాళంగా ఇస్తామని పేర్కొన్నట్లు కాషాయ దళం నిర్వహించే ఓపిఇండియా పోర్టల్‌ ఒక కథనాన్ని ప్రచురించింది. గంధపు చెక్కల స్మగ్లర్‌, ఎన్నో హత్యలు చేసిన వీరప్పన్‌ కుమార్తె దివ్యకు తమిళనాడు బిజెపి యువమోర్చా ఉపాధ్యక్షురాలిగా కాషాయ కండువా కప్పారు. తండ్రి నేరాలు అందుకు అడ్డురాలేదు. గాంగస్టర్‌ చోటా రాజన్‌ ప్రస్తుతం ఒక హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తూ ముంబై జైల్లో ఉన్నాడు. రాజన్‌ కుమార్తె అంకిత నికాలజి ప్రస్తుతం అమెరికాలోని విస్కాన్సిన్‌ మిల్‌వాకీ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు.ఆమె నిర్వహించిన సర్వే వార్త రాసేటపుడు తండ్రి గురించి ప్రస్తావించటం, సర్వేలో పాల్గొన్నవారికి ప్రతి ఒక్కరికి మూడు డాలర్ల వంతున ఇచ్చే సొమ్మును వివాదాస్పాద పాలస్తీనా హక్కుల కోసం, పాలస్తీనా పిలల్ల నిధి, ఇంటర్నేషనల్‌ దళిత్‌ సాలిడారిటీ సంస్థకు(ఐడిఎస్‌ఎన్‌) ఇస్తామని చెప్పారని, ఐడిఎస్‌ఎన్‌కు జార్జి సోరస్‌కు చెందిన ఓపెన్‌ సొసైటీ ఫౌండేషన్‌ నిధులు అందిస్తున్నదని, సోరస్‌ భారత్‌లో రంగుల విప్లవం పేరుతో తిరుగుబాటు రెచ్చగొట్టేందుకు చూస్తున్నట్లు ఓపి ఇండియా ఆరోపించింది. ఇది బురదజల్లే వ్యవహారం తప్ప మరొకటి కాదు. అమెరికాలో కులపరమైన వివక్షను ఎదుర్కొన్నవారి అభిప్రాయాలను ఆ సర్వేలో సేకరించేందుకు అవసరమైన ప్రశ్నలను రూపొందించారు. కులవివక్ష ఉందని అంగీకరించేందుకు ఇష్టపడని కాషాయ దళాలకు మింగుడుపడలేదు.


హిందూమతం లేదా హిందూయిజానికి సంబంధించి ప్రసంగాన్ని అడ్డుకొనేందుకు బ్రిటన్‌లోని లండన్‌ కేంద్రంగా పని చేస్తున్న హిందూ కౌన్సిల్‌ యుకె(హెచ్‌సియుకె) అనే సంస్థ బెదిరింపులకు దిగింది. డిసెంబరు నెలలో లిసెస్టర్‌ సెక్యులర్‌ సొసైటీ(ఎల్‌ఎస్‌ఎస్‌) ” హిందూయిజం : అనైతిక తుచ్చ ఆవరణము ” అనే పేరుతో ఒక ప్రసంగాన్ని ఏర్పాటు చేసింది.హిందూయిజ వైఫల్యాలను విమర్శనాత్మక దృష్టితో పరిశీలించే అంశమిది. అసలు పేరులోనే హిందువుల పట్ల ద్వేషాన్ని రెచ్చగొట్టే అంశం ఉందని, దీని గురించి స్థానిక హిందువులు, అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేస్తామని హెసియుకె సంస్థ ఒక ఇమెయిల్‌ ద్వారా నిర్వాహకులను బెదిరించింది. మతం గురించి లోతుగా, స్వేచ్చగా చర్చించేందుకు తాము కట్టుబడి ఉన్నామని, వివక్ష పద్దతులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఎల్‌ఎస్‌ఎస్‌ అధ్యక్షుడు నెడ్‌ న్యూయిట్‌ ప్రతి లేఖలో స్పష్టం చేశాడు.కుల వ్యవస్థలో వివక్ష అంతర్లీనంగా ఉందని, మతం-వివక్షకు ఉన్న సంబంధాలను తెలుసుకొనేందుకు ఆసక్తితో ఉన్నామని పేర్కొన్నాడు. బ్రిటన్‌లో యాభై నుంచి రెండు లక్షల మంది వరకు తక్కువ కులాలుగా పరిగణించబడేవారు ఉన్నారని, వారంతా వివక్ష, వేధింపులకు గురౌతున్నట్లు ఎల్‌ఎస్‌ఎస్‌ పేర్కొన్నది. 2017లో బ్రిటన్‌ ఆమోదించిన సమానత్వ చట్టంలో కులపరమైన వివక్ష వ్యతిరేక అంశాలున్నాయి. దీన్ని హిందూ కౌన్సిల్‌ తీవ్రంగా వ్యతిరేకించింది.దీని వలన దళితులు ఉన్నత కులాల వారి మీద ప్రతీకారం కోరే అవకాశం ఉందని వాదించింది. డిసెంబరు ఆరవ తేదీన ఆ ప్రసంగ కార్యక్రమం జరిగింది. దానికి నిరసన తెలిపేందుకు ఎవరూ రాలేదు. ప్రశాంతంగా ముగిసింది.


హిందూమతం, దాన్ని అనుసరించే సమాజంలో కొంత మంది పాటించే అంటరానితనానికి దూరంగా ఉండేందుకు అనేక మంది ఇస్లాం, క్రైస్తవ, బౌద్ద మతం పుచ్చుకున్న చరిత్ర తెలిసిందే. తెలుగు ప్రాంతాల్లో క్రైస్తవ మతం పుచ్చుకున్నవారిలో దళితులు, కమ్మ, రెడ్డి, కాపు, బ్రాహ్మణ తదితర కులాల వారు ఉన్నారు. మతం ఒక్కటే అయినా సామాజిక వివక్ష కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఏ కులంవారు ఆ కులంలోనే సంబంధాలు కలుపుకుంటారు తప్ప మరొక విధంగా లేరు. తమిళనాడులోని క్రైస్తవులలో కూడా వివక్ష కొనసాగుతున్నట్లు జనవరి రెండ వారంలో ఒక పుస్తక విడుదల సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వక్తలు పేర్కొన్నారు. నివేదిత లూయీస్‌ అనే రచయిత క్రీస్తువతిల్‌ జాతి( క్రైస్తవంలో కులం) అనే పుస్తక విడుదల కార్యక్రమంలో విసికె పార్టీ ఎంపీ తిరుమవలన్‌ మాట్లాడుతూ భారత్‌లో క్రైస్తవం కుల వేళ్లను పెంచి పోషించింది తప్ప క్రైస్తవ విలువలను కాదని విమర్శించారు. క్రైస్తవులుగా మారినా తమ కుల గుర్తింపును వదులుకొనేందుకు సిద్దంగా లేరని అందుకే క్రైస్తవ నాడార్లు, ముదలియార్లు, రెడ్డియార్లు,యాదవులు కనిపిస్తున్నారని అన్నారు.చర్చి వ్యవస్థలో కూడా దళితులు, ఇతర కులాల వారి మధ్య తేడాలు ఉన్నాయన్నారు. సామాజిక న్యాయ గడ్డగా పిలుస్తున్న తమిళనాడులో కులపరమైన దాడుల పట్ల ప్రభుత్వ స్పందన ఉపేక్షతో కూడి ఉందని, పౌరసమాజం మౌనంగా ఉందని జనవరి ఆరవ తేదీన చెన్నరులో జరిగిన ఒక సభలో వక్తలు పేర్కొన్నారు.దళిత్‌ ఇంటెలెక్చ్యువల్‌ కలక్టెవ్‌(డిఐసి) పేరుతో ఒక రోజు పాటు సాగిన వర్క్‌షాప్‌లో రాష్ట్రంతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన ఆ సామాజిక తరగతికి చెందిన పలువురు పాల్గొన్నారు.అనేక పత్రాలను సమర్పించారు. పద్దెనిమిది డిమాండ్లను రూపొందించి రాష్ట్ర ప్రభుత్వానికి, అన్ని పార్టీలకు అందచేయాలని నిర్ణయించారు. దళితుల మీద జరిగిన దాడుల మీద తీసుకున్న చర్యలతో శ్వేత పత్రం విడుదల చేయాలని, అన్ని పార్టీలతో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు, పేర్లకు ముందు,వెనుక కుల గుర్తింపు లేకుండా చూడాలని, అన్ని స్థాయిల్లో ఉన్న అధికార యంత్రాంగానికి వివక్షకు దూరంగా ఉండాల్సిన పద్దతుల గురించి వివరించాలని, కేరళలో మాదిరి కులాంత వివాహాలు చేసుకున్న వారి పిల్లలకు రిజర్వేషన్లు కల్పించాలని తదితర అంశాలు వాటిలో ఉన్నాయి.


జైళ్లలో ఖైదీల పట్ల కులవివక్ష పాటించటం గురించి దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌, జెబి పార్థీవాలా, మనోజ్‌ మిశ్రాలతో కూడిన ధర్మాసనం కేంద్ర ప్రభుత్వం అనేక రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. జైళ్ల నిబంధనల్లోనే వివక్ష ఉందని, బలవంతంగా చాకిరీ చేయిస్తున్నారని పిటీషనర్‌ జర్నలిస్టు సుకన్య శాంత పేర్కొన్నారు. తమిళనాడులోని పాలయం కొట్టారు సెంట్రల్‌ జైలులో థేవర్లు, నాడార్లు, పాలార్లకు ప్రత్యేక బ్లాకులు ఉన్నాయని, పశ్చిమ బెంగాల్లో అగ్ర కులాలకు చెందిన ఖైదీలు వంట విధులకు, పారిశుధ్యం వంటి వాటికి ఫలానా కులం వారనే నిబంధనలు ఉన్నాయని, అదే విధంగా వివిధ రాష్ట్రాలలో ఉన్న లోపాలు, వివక్ష గురించి కూడా పిటీషన్‌లో పేర్కొన్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

తిరిగి చైనా పెట్టుబడులు : తొలి సంకేతాలు పంపిన భారత్‌ !

19 Friday Jan 2024

Posted by raomk in BJP, CHINA, Congress, COUNTRIES, Current Affairs, Economics, History, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

BJP, China, Chinese army, chinese investments, Indian army, Ladakh border clash, Narendra Modi Failures, RSS, Xi Jinping


ఎం కోటేశ్వరరావు


ఒక వార్త, రెండు రకాల స్పందనలు. భారత్‌-చైనా సరిహద్దులు శాంతియుతంగా ఉండేట్లయితే చైనా పెట్టుబడులపై అమలు చేస్తున్న తనిఖీలను భారత్‌ సులభతరం చేయవచ్చని మన పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య అభివృద్ధి (డిపిఐఐటి) కేంద్రశాఖ కార్యదర్శి రాజేష్‌ కుమార్‌ సింగ్‌ చెప్పినట్లు, నాలుగేండ్లనాటి అంక్షల ఎత్తివేతకు ఇది సూచిక అని జనవరి పద్దెనిమిదవ తేదీన రాయిటర్స్‌ ఇచ్చిన వార్తకు అంతర్జాతీయ, జాతీయ మీడియా ఎంతో ప్రాధాన్యతనిచ్చింది.దవోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థికవేదిక 54వ వార్షిక సమావేశాల్లో పాల్గొనేందుకు రాజేష్‌ కుమార్‌ సింగ్‌ వెళ్లారు. అక్కడ రాయిటర్స్‌ ప్రతినిధులతో మాట్లాడారు. ఈ వార్త చైనాతో సత్సంబంధాలు కోరుకొనే పౌరులు, లబ్దిపొందాలని చూస్తున్న పారిశ్రామిక, వాణిజ్యవేత్తలకు ఆశలు రేకెత్తించేదైతే , కమ్యూనిస్టు, చైనా వ్యతిరేకులకు మింగుడుపడనిదే. అయితే వెంటనే ఏదో అయిపోతుందని అనుకోనవసరం లేదు గానీ నరేంద్రమోడీ సర్కార్‌ మీద దేశీయ కార్పొరేట్‌ శక్తుల నుంచి వస్తున్న వత్తిడికి కూడా ఇది సూచికే. దిగుమతులను అనుమతించుతున్నట్లుగానే పెట్టుబడులను కూడా అంగీకరించకతప్పనట్లు కనిపిస్తోంది.


2020లో జరిగిన గాల్వన్‌లోయ వివాదాల తరువాత మన సరిహద్దులలో ఉన్న దేశాల పెట్టుబడులను తనిఖీ చేయకుండా అనుమతించరాదంటూ కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఇవి పరోక్షంగా చైనా పెట్టుబడులను అడ్డుకొనేందుకే అన్నది స్పష్టం.ఎందుకంటే మన నుంచి తీసుకొనేవే తప్ప మరొక సరిహద్దు దేశమేదీ మనకు పెట్టుబడులు పెట్టే స్థితిలో లేదు. అనేక మంది నోటితుత్తర జనాలు చైనా వస్తువులను బహిష్కరించాలని పిలుపులు ఇచ్చినప్పటికీ మన దిగుమతిదారులు వాటిని ఖాతరు చేయకుండా రికార్డులను బద్దలు కొట్టి మరీ దిగుమతులు చేసుకున్నారు. దానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి కూడా ఇచ్చింది. సరిహద్దు ఉదంతాల తరువాత రెండు దేశాల వాణిజ్యం 32శాతం పెరిగింది. నాలుగేండ్లుగా చైనా పెట్టుబడులు, అంతకు ముందు ప్రతిపాదనలు ఏ మాత్రం ముందుకు సాగలేదు.” ఒకసారి మా సంబంధాలు, సరిహద్దు సమస్యలు స్థిరపడితే మార్పు రావచ్చు. పరిణామాలు సక్రమంగా ముందుకు పోతే పెట్టుబడుల అంశంలో కూడా సాధారణ లావాదేవీలను పునరుద్దరించవచ్చని నేను చెప్పగలను. సరిహద్దులను ఎవరైనా కొద్ది కొద్దిగా అక్రమించుకుంటూ ఉంటే మనమేమీ చేయలేం, అటువైపు నుంచి పెట్టుబడులకు ఎర్రతివాచీ మర్యాదలు జరపలేము ” అని రాజేష్‌ కుమార్‌ చెప్పారు. ఇటీవలి సంవత్సరాలలో విదేశీ పెట్టుబడుల విషయంలో ఒక అడుగు వెనక్కు వేసి ఆటంకాలను తగ్గించినట్లు చెప్పారు. ” గతేడాది కాలంగా ఎలాంటి ఉదంతాలు లేవు గనుక సాధారణ ఆశ కనిపిస్తోంది, పరిణామాలు స్థిరపడతాయి, మెరుగుపడతాయి అనుకుంటున్నాను. అమెరికా, ఆస్ట్రేలియాల్లో మాదిరి అన్ని దేశాలకు సంబంధించిన విదేశీ పెట్టుబడుల సమీక్షకు ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తున్నాం, పెట్టుబడులకు స్వాగతం పలకాలనే పరిస్థితిని కొనసాగించాలని భారత్‌ కోరుకుంటున్నదని రాజేష్‌ కుమార్‌ చెప్పారు.


2020లో గాల్వన్‌ లోయలో జరిగిన పరిణామాల తరువాత చర్చల మీద చర్చలు కొనసాగుతున్నాయి. 2022లో రెండు సార్లు స్వల్ప ఘర్షణలు తప్ప ఎలాంటి అవాంఛనీయ పరిణామాలు జరగలేదు.చర్చలతో ఒక అవగాహనా కుదరలేదు. ఎవరి వైఖరికి వారు కట్టుబడి ఉన్నారు. ఎవరి జాగ్రత్తలు వారు తీసుకుంటున్నారు. మనవైపున 50వేల మంది సైనికులు మోహరించి ఉన్నారు. వాస్తవాధీన రేఖ ఉల్లంఘనల గురించి పరస్పర ఆరోపణలు కూడా చేసుకున్నారు. రెండువైపులా సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల నిర్మాణం, అభివృద్దీ జరుగుతున్నది. గాల్వన్‌ ఉదంతాలకు ముందు కూడా వివాదాస్పద సరిహద్దు ప్రాంతాలలో చైనా సైనికులు మన వైపు చొచ్చుకు రావటం, మనవారు అటువైపు వెళ్లటం జరిగినప్పటికీ చేతులతో నెట్టుకోవటం తప్ప ఆయుధాలను ఉపయోగించలేదు. సగటున ఏడాదికి ఐదు వందల సార్లు చైనీయులు అతిక్రమిస్తున్నట్లు మన అధికారులు గతంలో వెల్లడించారు. ప్రతి ఉదంతమూ మీడియాలో రాదు. 2015లో చైనా వైపు నుంచి 428సార్లు అతిక్రమణలు జరగ్గా అవి 2019నాటికి 663కు పెరిగాయి. మనవైపు నుంచి జరిగేవి చైనా వారు చెబుతారు తప్పమనం చెప్పుకోం.


నరేంద్రమోడీ తొలిసారి ప్రధానిగా పదవి చేపట్టిన తరువాత, షీ జింపింగ్‌ మన దేశాన్ని తొలిసారి సందర్శించనున్న తరుణంలో 2014లో సెప్టెంబరు 16న లడఖ్‌ తూర్పు ప్రాంతంలోని చుమార్‌ గ్రామ సమీపంలో చైనా ఒక రోడ్డు నిర్మిస్తుండగా అది తమ ప్రాంతమంటూ మన సైనికులు అడ్డుకొన్నారు. ప్రతిగా దానికి సమీపంలోని డెమ్‌చోక్‌ వద్ద నిర్మిస్తున్న కాలువ పనులను చైనా మిలిటరీ అడ్డుకుంది. ఇలా రెండు దేశాల దళాలు 16 రోజుల పాటు మోహరించి తిష్టవేశాయి. చివరికి ఉన్నత స్థాయి చర్చల తరువాత ఉభయపక్షాలూ వెనక్కు తగ్గాయి. రోడ్డు నిర్మాణాన్ని చైనా విరమించుకుంటే దానికి ప్రతిగా మనదేశం పరిశీలక కేంద్రాన్ని కూల్చివేసేందుకు, బంకర్ల నిర్మాణాన్ని నిలిపివేసేందుకు అంగీకరించింది. తరువాత 2015లో లడఖ్‌ ఉత్తర ప్రాంతంలోని బర్టసే అనే గ్రామం వద్ద చైనా మిలిటరీ నిర్మించిన ఒక పరిశీలన కేంద్రాన్ని ఇండో టిబెటన్‌ సరిహద్దు పోలీసులు కూల్చివేశారు. దాంతో చైనా మిలిటరీ రాగా పోటీగా మన సైనికులు కూడా వెళ్లటంతో వారం రోజుల వివాదం తరువాత ఇరుదేశాల స్థానిక మిలిటరీ అధికారులు సర్దుబాటు చేశారు.తరువాత రెండు దేశాల మిలిటరీల మధ్య పరస్పర విశ్వాసాన్ని పాదుకొల్పేందుకు పన్నెండు రోజుల పాటు సంయుక్త మిలిటరీ విన్యాసాలు జరిపారు. చైనా-భూటాన్‌ మధ్య సరిహద్దు సమస్యలున్నాయి. వాటిలో డోక్లాం ఒకటి. ఆ ప్రాంతం మన దేశంలోని సిలిగురి కారిడార్‌కు దగ్గరగా ఉంటుంది. డోక్లాంలో చైనా మిలిటరీ రోడ్లు, తదితర నిర్మాణాలను చేపట్టడంతో అంతకు ముందు భూటాన్‌ చేసుకున్న ఒప్పందానికి అనుగుణంగా మన దేశం జోక్యం చేసుకొని చైనాను నిలువరించింది.2017లో 73 రోజుల పాటు ఆ వివాదం కొనసాగింది. తరువాత సద్దుమణిగింది. ఇలాంటివి జరుగుతున్నప్పటికీ వాటితో నిమిత్తం లేకుండా మన ప్రధాని నరేంద్రమోడీ ఊహాన్‌ నగరానికి వెళ్లినట్లే చైనా అధ్యక్షుడు షీ జింపింగ్‌ మహాబలిపురం వచ్చారు. రెండు దేశాల మధ్య ఎగుమతి దిగుమతులు కూడా ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయి.


1962లో రెండు దేశాల మధ్య యుద్ధం జరిగినప్పటికీ తరువాత కాలంలో సంబంధాలను మెరుగుపరుచుకొనేందుకు సరిహద్దు వివాదం, చిన్న చిన్న ఘర్షణలు అడ్డం రాలేదు. కొంతకాలం ఎడముఖం పెడముఖంగా ఉన్నప్పటికీ సాధారణ సంబంధాలు ఏర్పడ్డాయి.గాల్వన్‌ ఉదంతం నిస్సందేహంగా మరోసారి సంబంధాలను దెబ్బతీసింది. తరువాత పెద్ద ఉదంతాలేమీ జరగలేదు గనుక సీనియర్‌ అధికారి రాజేష్‌ కుమార్‌ సింగ్‌ చేసిన వ్యాఖ్యల వెనుక ప్రభుత్వ ఆలోచనాధోరణి కనిపిస్తున్నది. చైనా తన వస్తువులను తక్కువ ధరలకు మనదేశంతో సహా ప్రపంచంలో కుమ్మరిస్తున్నదని కొంత మంది నిరంతరం ఆరోపిస్తుంటారు. అలాంటి వివాదాలను, సమస్యలను పరిష్కరించటానికి ప్రపంచ వాణిజ్య సంస్థ ఉంది.చైనా మీద ఆధారపడకుండా ప్రత్యామ్నాయాలు చూసుకోవాలని అనేక దేశాలు అనుకుంటున్నట్లుగానే మనదేశంలో కూడా కొందరు సూచిస్తున్నారు. తప్పేమీ లేదు. చైనా బదులు ప్రపంచం మన మీదే ఆధారపడే విధంగా చేస్తానని ప్రధాని నరేంద్రమోడీ మేకిన్‌ ఇండియా, మేడిన్‌ ఇండియా, ఆత్మనిర్భర పిలుపులు ఇచ్చారు. మంచిదే, ఎవరూ కాదనటం లేదు.కానీ కొంత కాలానికి మనదేశం మీద ఆధారపడకూడదని ఇతర దేశాలు అనుకోవన్న గ్యారంటీ ఏమిటి? అసలు సమస్య అది కాదు. ఏ దేశానికి ఆదేశం అన్ని రంగాల్లో స్వయం సమృద్దమయ్యే పరిస్థితి వచ్చేంత వరకు పరస్పరం ఆధారపడక తప్పదన్నది వాస్తవం.


అనుభవమైతే గానీ తత్వం తలకెక్కదంటారు పెద్దలు. గాల్వన్‌ ఉదంతం తరువాత దేశంలో పెద్ద ఎత్తున చైనా వ్యతిరేక ప్రచారం, వస్తు బహిష్కరణ పిలుపుల సంగతి, చైనాతో విడగొట్టుకోవాలన్న స్థానిక, అంతర్జాతీయ పెద్దల సలహాలు ఎరిగినవే. అయినప్పటికీ చైనా నుంచి దిగుమతులలో ఏడాదికేడాది స్వల్పతేడాలుండవచ్చుగానీ పెరుగుతున్నాయి తప్ప తగ్గటం లేదు. చైనాకు మన ఎగుమతులు పెరగటం లేదు.చైనా కంటే ముందు గతంలో జపాన్‌, దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్‌,మోటారు వాహనాలు, సెల్‌ఫోన్లు మన మార్కెట్‌ను ముంచెత్తాయి.ఇప్పటికీ గణనీయంగానే ఉన్నాయి. అవి కూడా పెద్ద ఎత్తున సబ్సిడీలు ఇచ్చి ఎగుమతులు చేశాయన్నది తెలిసిందే. మన వాణిజ్య, పారిశ్రామికవేత్తలకు వాటిని ఇక్కడే తయారు చేస్తే అనే ఆలోచన రాలేదనుకుంటే పొరపాటు. అందుకు అనువైన పరిస్థితి మనదేశంలో అప్పుడూ ఇప్పుడూ లేదు. గతంలో ఉన్న కాంగ్రెస్‌ పాలకులకూ, ఇప్పుడున్న నరేంద్రమోడీకి అది పట్టలేదు.చౌకగా వస్తూత్పత్తికి అవసరమైన పరిశోధన-అభివృద్ధికి భారీ మొత్తంలో ప్రభుత్వాలు ఖర్చు చేయకుండా వీలుకాదు. అందుకే ఉత్పత్తి కంటే దిగుమతి చేసుకుంటే వచ్చే లాభాలే ఎక్కువని అప్పుడూ ఇప్పుడూ మన కార్పొరేట్‌ శక్తులు భావిస్తున్నాయి. జపాన్‌ కంపెనీలు తమ మార్కెట్‌కోసం మన దేశంలోని స్థానిక కార్పొరేట్లతో సంయుక్త భాగస్వామ్య కంపెనీలను ఏర్పాటు చేశాయి గనుకనే మారుతీ సుజుకీ, హీరో హౌండా,స్వరాజ్‌ మజడా, వంటి కంపెనీలు రంగంలోకి వచ్చాయి. ఇప్పుడు ఎలక్ట్రిక్‌ మోటారు వాహన రంగంలో చైనా ముందుంది.దానితో సంయుక్త భాగస్వామ్యానికి మన పాలకులు అంగీకరిస్తే జపాన్‌ మారుతీ కార్ల మాదిరి చైనా ఎలక్ట్రిక్‌ వాహనాలు, ఇతర ఉత్పత్తులు మన మార్కెట్‌ను ముంచెత్తుతాయి.ఇప్పటికిప్పుడు ఆ రంగంలో మనం పోటీపడలేం గనుక ఆ లాభాల కోసం మన కార్పొరేట్లు చైనా పెట్టుబడులను అనుమతించాలని వత్తిడి చేస్తున్నాయా ? ప్రభుత్వం అంగీకరిస్తుందా? దానికి సూచికగానే మన ఉన్నత అధికారి రాజేష్‌ కుమార్‌ సింగ్‌ దవోస్‌లో మాట్లాడారా ? చూద్దాం ఏం జరుగుతుందో !

Share this:

  • Tweet
  • More
Like Loading...

అయోధ్య రామాలయ వివాదం : ఎరక్కపోయి ఇరుక్కున్న గాయని చిత్ర ! శంకరాచార్యలపై కేంద్ర మంత్రి ధ్వజం !!

17 Wednesday Jan 2024

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

#ks Chithra, #Pinarayi Vijayan, BJP, Kerala CPI(M), Narayan Rane, Narendra Modi, Ram temple, Ram Temple politics, RSS, Sanatan Hindu Dharma, sankaracharya, shiva sena, Singer Chitra


ఎం కోటేశ్వరరావు


అయోధ్య రామాలయంలో విగ్రహ ప్రతిష్ట జరిగేవరకు దాని గురించి పెద్ద ఎత్తున ప్రచారంతో పాటు వివాదాలు కూడా కొనసాగేట్లున్నాయి. మతాన్ని, విశ్వాసాలను పాటించేవారు మౌనంగా ఉండగా ఓట్ల కోసం రాముడిని ముందుకు తెచ్చిన రాజకీయ కుహనా హిందూత్వవాదులదే పైచేయి కావటం ప్రత్యేకత. తెలిసిగానీ తెలియకగానీ చేసిన ప్రకటనలతో సుప్రసిద్ద గాయని చిత్ర తాజాగా సామాజిక మాధ్యమంలో తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు. జనవరి 22న విగ్రహ ప్రతిష్ట జరిగే 12.20ని సమయంలో శ్రీరామ జయరామ జయ జయ రామ అంటూ సంకీర్తన జరపాలని, జ్యోతులను వెలిగించాలని, లోకసమస్తా సుఖినోభవంతు అంటూ గాయని చిత్ర సామాజిక మాధ్యమంలో పెట్టిన పోస్టు, విడుదల చేసిన వీడియోలో కోరారు.దీని మీద అనేక మంది అనుకూలంగానూ వ్యతిరేకంగానూ స్పందించారు. బిజెపి నేతలు కేరళ ప్రభుత్వం మీద, కమ్యూనిస్టుల మీద దాడికి ఉపయోగించుకున్నారు. వామపక్ష పాలిత రాష్ట్రంలో అసహనానికి ఇది నిదర్శనమంటూ ఆరోపించారు. సామాజిక మాధ్యమం మీద కేరళ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్రానికి గానీ ఎలాంటి నియంత్రణ, అధికారం లేదు. వామపక్షాలు, పురోగామి భావాలకు వ్యతిరేకంగా సంఘపరివార్‌, బిజెపి నేతల స్పందనలు అదే సామాజిక మీడియా, సంప్రదాయ మీడియాలో చోటు చేసుకుంటున్నాయంటే అసహనం, వ్యతిరేకత ఉంటే కుదిరేదా ? తన మీద వచ్చిన విమర్శలు లేదా ప్రశంసల గురించి గానీ ఇది రాస్తున్న సమయానికి చిత్ర వైపు నుంచి ఎలాంటి స్పందన లేదు.


భావ వ్యక్తీకరణ హక్కులో భాగంగా ఇతరుల హక్కులకు భంగం కలుగకుండా ఏమైనా చెప్పవచ్చు. ఆ రీత్యా చూసినపుడు చిత్ర తన భావాన్ని వ్యక్తం చేశారు. అయితే అదే భావ వ్యక్తీకరణలో భాగంగా ఒకరి భావాలను మరొకరు విమర్శించే హక్కు కూడా మన రాజ్యాంగం కల్పించింది. అఫ్‌కోర్సు దానికీ కొన్ని నిబంధనలు ఉన్నాయి. నూరుపూవులు పూయనివ్వండి, వేయి ఆలోచనలను వికసించనివ్వండి అన్నట్లుగా భావజాల చర్చ జరగాల్సిందే. చిత్రను సమర్ధించిన వారు కొందరైతే అలాంటి సందేశం ద్వారా రాజకీయ వైఖరులను తీసుకున్నారని మరికొందరు విమర్శించారు. ” చిత్రకు భావ ప్రకటనా స్వేచ్చ ఉంది, ఆమె నచ్చిన వైపు నిలిచే స్వేచ్చ కూడా ఉంది.ఆమె తన ఇంట్లో రామ భజన చేయవచ్చు, దీపాలను వెలిగించుకోవచ్చు. మారణకాండకు, జాత్యంహంకారానికి దారితీసే ఒక కారణాన్ని అమాయకంగా ఉత్సవంగా జరుపుకోవటంలో హానికరమైనది కనిపించకపోవచ్చుగానీ అది వాస్తవానికి అది ఎంతో బాధాకర అనుభవం అని రచయిత్రి ఇందూ మీనన్‌ ఫేస్‌బుక్‌ పోస్టులో చిత్ర తీరును విమర్శించారు. జనాల రక్తం, వలసలు, వారి బాధలు పట్టకుండా మీరు రామ భజన చేస్తున్నారు.రాముడు లేదా విష్ణువు రాబోవటం లేదు. మీరు ఐదులక్షల దీపాలను వెలిగించినప్పటికీ మీ బుర్ర వెలుగుతో నిండదు. మీ కంఠం కారణంగానే మిమ్మల్ని నైటింగేల్‌(పశ్చిమ దేశాల్లో కోకిల వంటి మధురంగా కూసే పక్షి) అని భావించారు, కానీ మీరు నకిలీ నైటింగేల్‌ అని రుజువైంది అని ఇందూ మీనన్‌ తీవ్రంగా విమర్శించారు.చరిత్రను విస్మరించి ప్రతివారూ సుఖంగా ఉండాలని చెప్పేవారి అమాయకత్వం ఇక్కడ ముఖ్యమైనదని గాయకుడు సూరజ్‌ సంతోష్‌ అన్నారు.మసీదును కూల్చివేసి దేవాలయాన్ని కట్టిన చరిత్రను చిత్ర కావాలనే మరచినట్లు విమర్శించారు. ప్రముఖ గాయకుడు జి వేణుగోపాల్‌ ఒక వైపు చిత్రకు మద్దతు ఇస్తూనే ఆమె ప్రకటనలపట్ల ఏవైనా విబేధాలుంటే విమర్శించేవారు ఆమెను క్షమించాలని వ్యాఖ్యానించారు. ఆమె కేవలం భక్తిభావంతో చెప్పారే తప్ప రాజకీయ కోణం తెలియదని అన్నారు. ఇప్పటి వరకు ఎలాంటి వివాదాల్లో చిక్కుకోలేదని, మనకోసం వేలాది పాటలు పాడిందని అన్నారు. క్షమించాల్సినంత తప్పేమి చేసిందని కొందరు వ్యాఖ్యానించారు.గాయని చిత్ర గతాన్ని చూసినపుడు ఎలాంటి వివాదాలలో చిక్కుకోలేదు. వివాదాస్పద వ్యాఖ్యలూ చేసిన చరిత్ర లేదు.ప్రతిదాన్నీ రాజకీయం గావిస్తున్న వర్తమానంలో ప్రజాజీవనంలో ఉన్న ప్రముఖులు తాము చేసే ప్రకటనల పట్ల తగిన జాగరూకత పాటించాలని ఈ ఉదంతం వెల్లడిస్తున్నది.


సుప్రీం కోర్టే ఆలయ నిర్మాణానికి అనుమతి ఇచ్చింది.విశ్వాసం ఉన్నవారు అయోధ్య రామాలయానికి వెళ్లవచ్చు, లేనివారు వెళ్లకపోవచ్చు, గాయని చిత్ర ప్రకటనను వివాదాస్పదం కావించాల్సిన అవసరం ఏముంది, తమ అభిప్రాయాలను ఎవరైనా వెల్లడించుకోవచ్చని సిపిఎం నేత, రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి సాజి చెరియన్‌ వ్యాఖ్యానించారు.కేరళ ప్రతిపక్ష కాంగ్రెస్‌ నేత విడి సతీశన్‌ మాట్లాడుతూ భౌతిక దాడులు చేయలేనపుడు సామాజిక మాధ్యమాల ద్వారా దాడి చేయటం ఫాసిజం అన్నారు. మనం చిత్ర వైఖరితో అంగీకరించకపోవచ్చు, ఆమె వైఖరిని ఆమెను వెలిబుచ్చనివ్వండి, ప్రతి ఒక్కరికీ విమర్శించే హక్కుంది, ఎవరైనా అంతకు ముందు చెప్పని వాటి గురించి మాట్లాడటాన్ని ప్రశ్నించవచ్చు అన్నారు. సనాతన ధర్మాన్ని నమ్ముతున్న కారణంగానే గాయని చిత్ర మీద విమర్శలు చేస్తున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె సురేంద్రన్‌ ఆరోపించారు. వామపక్ష-జీహాదీ వాతావరణంలో ఉన్నవారే దాడులు చేస్తున్నారన్నారు.ఈ విమర్శలు చేస్తున్నవారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. పినరయి విజయన్‌ పాలనలో హిందువులు తోటి వారితో తమ విశ్వాసాలను పంచుకొనే పరిస్థితి లేదని, కాంగ్రెస్‌ దీని మీద మౌనంగా ఉందని ఎక్స్‌లో ఆరోపించారు. కేరళకు చెందిన కేంద్ర మంత్రి వి మురళీధరన్‌ విలేకర్లతో మాట్లాడుతూ అయోధ్యను అవకాశంగా తీసుకొని హిందూ సమాజాన్ని అవమానిస్తున్నారని ఆరోపించారు. వామపక్షం, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలలో అసహనానికి ఒక ఉదాహరణ చిత్ర మీద చేస్తున్న విమర్శలని జాతీయ మహిళాకమిషన్‌ సభ్యురాలు, బిజెపి నేత కుషఉ్బ ఆరోపించారు.


మహారాష్ట్రకు చెందిన కేంద్ర మంత్రి నారాయణ రాణే శంకరాచార్యల మీద ధ్వజమెత్తటాన్ని కుషఉ్బ వంటి వారు ఎలా వర్ణిస్తారు.నాస్తికులు, హేతువాదులు, కమ్యూనిస్టులు, ఇతర మతాల వారిని పక్కన పెడితే హిందూమతాన్ని నమ్మేవారు, పాటించేవారికి నలుగురు శంకరాచార్యలు పూజనీయులు ! ప్రధాని నరేంద్రమోడీతో సహా బిజెపి నేతలందరూ ఏదో ఒక సమయంలో వారి పాదాలవద్ద చేరి ఆశీస్సులు పొందిన వారే. రామాలయ ప్రతిష్ట మీద వారు మాట్లాడినదాన్ని ఇప్పుడు ఎందుకు సవాలు చేస్తున్నట్లు ? హిందూ ధర్మానికి మీరేమి చేశారని గతంలో ఎవరూ ఎందుకు ప్రశ్నించలేదన్నది కీలక అంశం. శంకరాచార్యులను అవమానించినందుకు గాను కేంద్ర మంత్రి రాణేను పదవి, పార్టీ నుంచి తొలగించాలని శివసేన నేత ఉద్దావ్‌ థాకరే డిమాండ్‌ చేశారు. బిజెపి బహిరంగ క్షమాపణ చెప్పాలని కూడా కోరారు. రాణేకు వ్యతిరేకంగా ఆదివారం నాడు నిరసన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. అంతకు ముందు మహారాష్ట్రలోని పాల్ఘర్‌లో మంత్రి రాణే విలేకర్లతో మాట్లాడుతూ శంకరాచార్యలు ప్రధాని నరేంద్రమోడీ,బిజెపిని రాజకీయ కోణం నుంచి చూస్తున్నారని ఆరోపించారు. ఇంతవరకు ఏ ఒక్కరూ ఏమీ చేయలేదని, ప్రధాని మోడీ, బిజెపి బాధ్యతను తీసుకొని రామాలయాన్ని నిర్మించిందని, దాన్ని వారు ఆశీర్వదించాలా లేక విమర్శించాలా ? ఆలయాన్ని రాజకీయాలకోసం కాదు మతం కోసం నిర్మించాము, రాముడు మా దేవుడు.హిందూమతం కోసం తామేమీ చేసిందీ శంకరాచార్యలు చెప్పాలని రాణే డిమాండ్‌ చేశారు. శంకరాచార్యలు రాకపోవటానికి ప్రధాని నరేంద్రమోడీ కూడా కారకులే అని శివసేన విమర్శించింది. వారు రాకపోతేనే మీ బొమ్మలు కనిపిస్తాయి, వస్తే వారి చిత్రాలనే పెట్టాల్సి ఉంటుందని పేర్కొన్నది.రామాలయాన్ని కూల్చి బాబరీ మసీదును కట్టారని ఇంతకాలం సంఘపరివారం ఆరోపించింది.కానీ పూర్తికాని రామాలయాన్ని ఎన్నికల కోసం ముందే ప్రారంభించారన్న విమర్శలు ఇప్పుడు చరిత్రకెక్కాయి. ఇది వాస్తవం.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !
  • ఆ గట్టునుంటావా ఈ గట్టుకొస్తావా : నరేంద్రమోడీకి విషమ పరీక్ష పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • జర్మన్‌ హిట్లర్‌ బాటలో శాస్త్రవేత్తలను బయటకు పంపుతున్న ట్రంప్‌ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !
  • ఆ గట్టునుంటావా ఈ గట్టుకొస్తావా : నరేంద్రమోడీకి విషమ పరీక్ష పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • జర్మన్‌ హిట్లర్‌ బాటలో శాస్త్రవేత్తలను బయటకు పంపుతున్న ట్రంప్‌ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !
  • ఆ గట్టునుంటావా ఈ గట్టుకొస్తావా : నరేంద్రమోడీకి విషమ పరీక్ష పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • జర్మన్‌ హిట్లర్‌ బాటలో శాస్త్రవేత్తలను బయటకు పంపుతున్న ట్రంప్‌ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d