• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Economics

వ్యవసాయ ఉగ్రవాదం : వయ్యారి భామను భారత్‌పై దాడికి పంపిన వగలమారి మామ !

06 Friday Jun 2025

Posted by raomk in CHINA, Current Affairs, Economics, Environment, Farmers, Health, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Science, Uncategorized, USA, WAR

≈ 1 Comment

Tags

Agro Terrorism, Bioterrorism, China, FBI, invasive herb, parthenium seeds, US Attacked India

ఎం కోటేశ్వరరావు


అమెరికా వ్యవసాయాన్ని దెబ్బతీసేందుకు ఫుసారియమ్‌ గ్రామినియారమ్‌ అనే ఫంగన్‌ను చైనా పంపిందని, దాన్ని తీసుకువచ్చిన ఇద్దరు చైనా జాతీయులను అమెరికా ఎఫ్‌బిఐ అరెస్టు చేసినట్లు అంతర్జాతీయంగా వార్తలు వచ్చాయి. దీన్ని ఆగ్రో టెర్రరిజం(వ్యవసాయ ఉగ్రవాదం లేదా దాడి ) అని పిలుస్తున్నారు. ఆ ఫంగస్‌ను పరిశోధనలకోసం తెచ్చారన్నది ఒక కథనమైతే అమెరికా వ్యవసాయాన్ని దెబ్బతీసేందుకు తీసుకువచ్చారనేది మరొక ఆరోపణ. ఎవరినైనా కేసుల్లో ఇరికించదలిస్తే పోలీసులు లేదా క్రిమినల్‌ గాంగ్స్‌ మాదక ద్రవ్యాలను ప్రత్యర్థుల నివాసాలు లేదా కార్యాలయాల్లో పెట్టి కేసుల్లో ఇరికించటం తెలిసిందే. రెండు దేశాల మధ్య వైరుధ్యాలు ముదిరితే ఆయా దేశాల్లో ఉన్న రాయబార కార్యాలయాల సిబ్బంది గూఢచర్యానికి పాల్పడుతున్నట్లు ఆరోపించి వెళ్లగొట్టటం సాధారణమే. అమెరికా, చైనా మధ్య నడుస్తున్న వైరం పూర్వరంగంలో ఫుసారియమ్‌ ఫంగస్‌ను అమెరికా ఏజంట్లే చైనీయుల చేతిలో పెట్టి అరెస్టు చేసి ఉండవచ్చు. ఎందుకంటే అది అమెరికాలో కూడా దొరుకుతుంది. అరెస్టు చేసిన ఎఫ్‌బిఐ కథనం ప్రకారం జున్‌యోంగ్‌ లియు అనే 34 ఏండ్ల పరిశోధకుడు చైనాలో పని చేస్తున్నాడు.తన స్నేహితురాలు యంగింగ్‌ జియాన్‌ (33) అమెరికాలోని మిచిగాన్‌ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నది. ఆమెను కలిసేందుకు 2024జూలైలో అమెరికా వచ్చాడు, తనతో పాటు ఫంగస్‌ను తెచ్చాడు. జియాన్‌ పని చేస్తున్న ప్రయోగశాలలో పరిశోధన కోసం పంగస్‌ను తెచ్చినట్లు ఆరోపణ. వారి చర్యలు అమెరికా పౌరుల భద్రతకు పెను ముప్పు అంటూ కేసు నమోదు చేశారు. వారు కమ్యూనిస్టు పార్టీకి విధేయులు కావటం మరింత ముప్పని అమెరికా అటార్నీ చెప్పాడు. మన దేశంలో నక్సలైట్లను బూటకపు ఎన్‌కౌంటర్లు చేసినపుడు వారి వద్ద ఎర్ర అట్టలున్న విప్లవ సాహిత్యం దొరికినట్లు పోలీసులు చెప్పే పిట్టకతలు తెలిసినవే. అలాగే వారు చైనా కమ్యూనిస్టు పార్టీలో సభ్యులని కూడా అమెరికా పోలీసులు తెలుసుకున్నారట. తప్పుడు సమాచారం, తప్పుడు వీసాల ఆరోపణల గురించి చెప్పనవసరం లేదు. చైనా తన ఏజంట్లు, పరిశోధకులను అమెరికా సంస్థలలోకి చొప్పించి విద్రోహ చర్యలతో అమెరికా ఆహార సరఫరా వ్యవస్థను దెబ్బతీసేందుకు చైనా కమ్యూనిస్టు పార్టీ పని చేస్తోందని భారతీయ సంతతికి చెందిన ఎఫ్‌బిఐ డైరెక్టర్‌ కాష్‌ పటేల్‌ ఆరోపించాడు. ఆ కేసు ఏమౌతుంది ఏమిటి అన్నది ముందు ముందు చూద్దాం.

అసలు ఆగ్రో టెర్రరిజం గురించి అమెరికా గుండెలు బాదుకోవటాన్ని చూస్తే దొంగే దొంగని అరవటం గుర్తుకు వస్తోంది. మన దేశం గడచిన ఏడున్నర దశాబ్దాలుగా అమెరికా ఆగ్రో టెర్రరిజానికి బలి అవుతున్నది. ఇది నమ్మలేని నిజం, మన మీడియాకు కనిపించని వాస్తవం. మీరు ఎప్పుడైనా వయ్యారి భామ, కాంగ్రెస్‌ గడ్డి, పార్ధీనియమ్‌ అనే మాటలను విన్నారా ? మూడూ ఒకటే, మన రైతాంగాన్ని, మనకు తెలియకుండానే ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్న అమెరికా కలుపు మొక్క. దీని శాస్త్రీయ నామం పార్థీనియం హిస్టరోఫోరస్‌. ఇది చూడటానికి అందంగా ఉంటుంది గనుక వయ్యారి భామ అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ హయాంలో వచ్చింది కాబట్టి కాంగ్రెస్‌ గడ్డి అని పిలిచారు. అమెరికా అమ్మాయి కూడా అంటారు. ఒక మొక్క ఎంతో ఏపుగా పెరిగి చాలా త్వరగా పుష్పించి వేలాది విత్తనాలను విడుదల చేస్తుంది.చాలా చిన్నవిగా ఉండటంతో గాలిలో మూడు కిలోమీటర్ల వరకు వ్యాపించి మొలకలెత్తుతాయి. ఒక్కో మొక్క 60 కోట్ల పుప్పొడి రేణువులను వదులుతుందట. ఇవి మొలిస్తే పంటల దిగుబడి 40శాతం తగ్గుతుంది, వాటిని తాకితే, తింటే పశువులు, మనుషులకూ వ్యాధికారకాలవుతాయి.దేశంలో 35 మిలియన్ల హెక్టార్లలో ఇది వ్యాపించి ఉన్నట్లు అంచనా. ఇంకా ఎక్కువే అన్నది మరొక అభిప్రాయం. మొక్కగా ఉన్నపుడు దాన్ని నాశనం చేయకపోతే పుష్పించినపుడు రెచ్చిపోతుంది.


మనదేశం స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో తీవ్ర ఆహార కొరతను ఎదుర్కొన్నది. ఆసమయంలో అమెరికాతో ఉన్న సంబంధాలతో ప్రధాని నెహ్రూ అక్కడి నుంచి గోధుమలను దిగుమతి చేసుకుంటే వాటితో అమెరికా ఈ కలుపు మొక్కనూ కావాలనే మనకు బహుమతిగా పంపింది. అంతకు ముందు అసలు మన రైతాంగానికి దీని గురించి తెలియదు. ఇది పంటలను దెబ్బతీస్తుందని అమెరికన్లకు పూర్తిగా తెలుసు. గోధుమలతో పాటు పంపింది అంటే మన పొలాల్లో వ్యాపించి పంటలను దెబ్బతీయాలని, తద్వారా శాశ్వతంగా తమ మీద ఆహార ధాన్యాలకు ఆధారపడేట్లు చేసుకోవాలన్నది అమెరికా ఎత్తుగడ. నాడు పిఎల్‌ (పబ్లిక్‌ లా)480 పధకం కింద 1950దశకంలో కేవలం రెండు మిలియన్‌ టన్నుల గోధుమలను సాయంగా తెచ్చుకున్నందుకు ఇప్పటికీ మనం మూల్యం చెల్లిస్తూనే ఉన్నాం. అనేక మంది ఊపిరితిత్తులు, చర్మ వ్యాధుల బారిన పడుతూనే ఉన్నారు, నోరులేని పశువుల సంగతి సరేసరి. వ్యాధులతో పాటు పాలదిగుబడీ తగ్గిపోతుంది.దీన్ని అమెరికా మన ఒక్క దేశానికే కాదు 46దేశాలకు వ్యాపింప చేసిందంటే దాని కుట్ర ఎంత పెద్దదో అర్ధం చేసుకోవచ్చు, ఇది అతి పెద్ద ఆగ్రో టెర్రరిజం కాదా ! నాడు మనదేశం అలీన విధానాన్ని అనుసరిస్తున్నది, ఆహార ధాన్యాలు కావాలని కోరినపుడు తమతో కలిస్తే వెంటనే ఇస్తామని 1949లో నాటి అమెరికా అధ్యక్షుడు ట్రూమన్‌ ఒక బిస్కెట్‌ వేశాడు. నెహ్రూ అంగీకరించలేదు, ఉచితంగా వద్దు డబ్బుతీసుకోవాలని ప్రతిపాదించాడు.1955వరకు ఎటూ తేల్చలేదు, మరోవైపు దేశంలో ఆహార కొరత పెరుగుతుండటంతో అమెరికా సాయంగానే ఇస్తూ ప్రపంచంలో పది ప్రమాదకర మొక్కల్లో ఒకటైన వయ్యారి భామను మన మీదకు వదిలింది. కావాలనే వదలినట్లు ఇంత వరకు అంగీకరించకపోగా తామే పంపినట్లు ఆధారాలేమిటో చూపాలని మనలను దబాయిస్తోంది.

ప్రమాదకరమైన కలుపు మొక్కలు, విత్తనాలు ఇతర దేశాల నుంచి రాకుండా అరికట్టేందుకు అవసరమైన గట్టి చట్టాలు, నిబంధనల మనదేశంలో లేని కారణంగా అనేకం మన దేశంలో ప్రవేశించాయి. మెక్సికో, అమెరికా, లాటిన్‌ అమెరికా నుంచి వయ్యారి భామ ఇతర దేశాలకు వ్యాపించింది. మన దేశంలో దీన్ని పూర్తిగా తొలగించాలంటే పదేండ్ల పాటు ఏడాదికి 18,200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలని 2010లో శాస్త్రవేత్తలు చెప్పారు, 1955 నుంచి మనకు జరిగిన నష్టం రు. 2,06,716 కోట్లు అని ఒక అంచనా. ఇది గాక మనుషుల, పశువుల అనారోగ్య ఖర్చు అదనం. జీవ వైవిధ్యానికి జరిగిన నష్టం, పునరుద్దరణలను పరిగణనలోకి తీసుకుంటే ఇంకా ఎన్నో రెట్లు ఎక్కువ నష్టం అంటున్నారు. జమ్మూ`కాశ్మీరులో పాకిస్తాన్‌ ఉగ్రవాద సమస్య గురించి మాత్రమే మనకు తెలుసు, కార్గిల్‌ వంటి ప్రాంతాలలో వయ్యారి భామ తిష్టవేసింది, ప్రధాన భూభాగానికి కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న అండమాన్‌కు సైతం ఇది విస్తరించిందంటే దాని వేగం, ప్రమాదం ఏమిటో అర్దం చేసుకోవచ్చు. మన కళ్ల ముందు వయ్యారాలు పోతూ సవాలు చేస్తున్న ఈ ఆగ్రో ఉగ్రవాదిని అరికట్టేందుకు దేశమంతటా ఒకేసారి చర్యలు తీసుకొని ఉంటే నిరోధించి ఉండేవారు. కానీ జరగలేదు. దీని విస్తరణ ఎంత ప్రాంతంలో జరిగిందన్నది కూడా సమగ్ర అధ్యయనం లేదు. ఒక అంచనా ప్రకారం ఎక్కువగా పెరిగిన ప్రాంతం నుంచి దీన్ని తొలగించాలంటే హెక్టారుకు నలభై పనిదినాలు అవసరమని తేల్చారు. ఆయా సమయాలను బట్టి అందుకయ్యే ఖర్చును లెక్కకట్టాలి.


ఆగ్రో ఉగ్రవాది వయ్యార భామ గురించి క్లుప్తంగా చెప్పుకున్నాం, వ్యవసాయంతో అనుబంధంగా ఉండే వాటిపై మరికొన్ని దాడుల గురించి చూద్దాం. వీర, రౌద్ర,శోక,హాస్య,శృంగార తదితర రసాలతో పాటు భీభత్స రసం అంటే ఉగ్రవాదమే. ఇతిహాసాలు, పురాణాల్లో వీరులు శత్రువులకు ఈరసాన్ని చవి చూపించినట్లు చదువుకున్నాం. కానీ ఆధునిక మిలిటరీ దుర్మార్గాల్లో బయో ఉగ్రవాదం కూడా ఒక ఆయుధం.అనేక ప్రమాదకర వైరస్‌లను ప్రత్యేకంగా ఎవరో పనిగట్టుకొని వ్యాపింప చేయనవసరం లేదు. అయితే సహజంగా తలెత్తినవి ఏవో ఇతరులు ప్రయోగించినవి ఏవో తెలుసుకోవటం అవసరం, అదేమీ కష్టం కూడా కాదు. ఆఫ్రికన్‌ హార్స్‌ సిక్‌నెస్‌(ఎహెచ్‌ఎస్‌) వైరస్‌ను తొలిసారిగా 1600 సంవత్సరాల్లో ఆఫ్రికాలోని సహారా ఎడారి కనుగొన్నారు. అది క్రమంగా మనదేశానికి వ్యాపించి మిలిటరీలో ఉన్నవాటితో సహా 20లక్షల గుర్రాల మరణానికి కారణమైంది. రిఫ్ట్‌వాలీ వైరస్‌ అనేది ఒంటెల ద్వారా వ్యాపిస్తుంది, అనేక దేశాలను అది చుట్టుముట్టింది,మన దేశం సంగతి తెలియదు, ఎప్పుడైనా రావచ్చు. మన వ్యవసాయానికి అనుబంధంగా ఉండేది పశుపాలన, చేపలు, రొయ్యలు, కోళ్ల పెంపకం వంటివి. వాటికి అనేక వైరస్‌లు వ్యాపిస్తున్నాయి. సంతలు, మార్కెట్‌లు పెద్ద వ్యాపక కేంద్రాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.ఆరేండ్ల నాటి అంచనా ప్రకారం దేశంలో ఎలుకలు, పందికొక్కుల సంఖ్య 240 కోట్లు, అవి ఇప్పుడిరకా పెరిగి ఉంటాయి. ప్రతి ఆరు ఒక మనిషి ఆహారాన్ని తింటున్నాయి. ఏటా 24లక్షల నుంచి 2.6కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు వృధా అవుతున్నాయి. వాటితో వచ్చే వ్యాధులు, వాటి నివారణ ఖర్చులపై అంచనాల్లేవు. వీటన్నింటినీ ఎవరు ప్రవేశపెట్టినట్లు ? ఇప్పుడైతే కుట్ర సిద్దాంతవేత్తలు, వారిని అనుసరించే మీడియా పండితులు వెంటనే చైనా అనేస్తారు. గతంలో ప్రపంచలో కోట్లాది మంది ప్రాణాలు తీసిన ప్లేగు, స్పానిష్‌ ఫ్లూ వంటి వాటికి కూడా అదే అని చెప్పినా ఆశ్చర్యం లేదు.బ్రిటీష్‌ పాలనా కాలంలో 1943లో వచ్చిన బెంగాల్‌ కరువుకు 30లక్షల మంది మరణించారు.వారి ఆకలి బాధ తీర్చటానికి ఆ రోజు ప్రపంచంలో ఆహారం లేదా అంటే ఉంది,బ్రిటీష్‌ వారికి పట్టలేదంతే ! ఇటీవలి సంవత్సరాల్లో తెల్లదోమ ఎంతటి వినాశనాన్ని కలిగించిందో చూశాము. తెగుళ్ల నివారణకు తయారు చేసిన సింథటిక్‌ పైరిత్రాయిడ్స్‌ వినియోగంతో పర్యావరణ సమతుల్యం దెబ్బతిని కొత్త సమస్యలు తలెత్తాయి. అనేక పశ్చిమ దేశాలలో వాటిని నిషేధించినప్పటికీ మనదేశంలో వాటిని విక్రయించేందుకు ప్రభుత్వాలు అనుమతిస్తున్నాయి. బహుళజాతి గుత్త సంస్థలు చేస్తున్న ఆగ్రో ఉగ్రదాడి తప్ప మరొకటి కాదు. అసలు అమెరికా గతంలో చేసిన ఆగ్రో ఉగ్రదాడులకు బలైన దేశాలు, ఉదంతాలు గురించి మరో విశ్లేషణలో చూద్దాం !

Share this:

  • Tweet
  • More
Like Loading...

మేడిన్‌ చైనా విడిభాగాల కోసం బారులు తీరుతున్న మేకిన్‌ ఇండియా ఉత్పత్తిదారులు ! ఎటూ తేల్చుకోలేని స్థితిలో నరేంద్రమోడీ !!

03 Tuesday Jun 2025

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, RUSSIA, Uncategorized, USA

≈ Leave a comment

Tags

Anti China Media, Anti communist, BJP, China, Made in China 2025, Make In India, make in india crew line for made in china products, Narendra Modi Failures, Narendra Modi in Policy dilemma, RSS, Xi Jinping


ఎం కోటేశ్వరరావు


మన ఆటోమొబైల్‌ పరిశ్రమ చైనా నుంచి రావాల్సిన ఒక చిన్న పరికరం కారణంగా ప్రస్తుతం ఆందోళన చెందుతోందంటే ఎవరైనా నమ్ముతారా ? అదే నియోడిమియమ్‌ ఐరన్‌ బోరోన్‌ అనే మాగ్నెట్‌.కార్లలో స్టీరింగ్‌ నుంచి బ్రేకులు, వైపర్‌లు, ఆడియో పరికరాల వంటి వాటికి ఇది ఎంతో ముఖ్యం. అది లేకపోతే మొత్తం కారు సిద్దమైనా ప్రయోజనం ఉండదు. వాటి తయారీ, సరఫరాలో గుత్తాధిపత్యం ఉన్న చైనా ఏప్రిల్‌ నుంచి ఎగుమతుల మీద పలు ఆంక్షలు విధించింది. వాటిని దేనికి వినియోగిస్తారో ముందుగానే ఆయా దేశాలు హామీ పత్రాలు ఇవ్వాలన్నది వాటిలో ఒకటి. కొన్ని దేశాలు వాటిని కొని చైనాతో వైరానికి దిగిన అమెరికా, ఐరోపా దేశాలకు అమ్ముకుంటున్నాయి.దాన్ని నిరోధించేందుకే ఆ షరతు అన్నది స్పష్టం. మన దేశంలో గతంలో దిగుమతి చేసుకున్న నిల్వలు జూన్‌ మొదటి వారం వరకు వస్తాయని అందువలన త్వరగా తెచ్చుకొనేందుకు చైనాతో సంప్రదింపులు(పైరవీలు) జరపాలని ఇండియన్‌ ఆటోమొబైల్‌ మాన్యుఫాక్చరర్స్‌ సొసైటీ, ఆటోమోటివ్‌ కాంపొనెంట్స్‌ మాన్యుఫాక్చరర్స్‌ అసోసియేషన్ల ప్రతినిధులు చైనా వెళ్లేందుకు సిద్దం అవుతున్నారని బిజినెస్‌ టుడే పత్రిక 2025 మే 31వ తేదీ వార్తలో పేర్కొన్నది. 2024లో 470 టన్నుల మాగ్నెట్‌లు దిగుమతి చేసుకోగా ఈ ఏడాది 700 టన్నులకు నిర్ణయించారు. చైనా మీద ఆధారపడకుండా మనమే మాగ్నెట్‌లు తయారు చేసేందుకు ఎలాంటి ప్రోత్సాహకాలు ఇవ్వాలో నిర్ణయించేందుకు జూన్‌ 3న ఉన్నతస్థాయి కమిటీ సమావేశాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు కూడా ఆ పత్రిక రాసింది. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకోవటం అంటే ఇదే ! పదకొండు సంవత్సరాల నుంచి ఏం చేసినట్లు ? తన పెట్టుబడులను మన ప్రభుత్వం అడ్డుకున్న కారణంగానే సరఫరాకు చైనా ఆంక్షలు పెడుతోందా ? ఏమో, ఎవరి ప్రయోజనం వారిది, ఎవరి తురుపు ముక్కలు వారివి !


లోకల్‌ సర్కిల్స్‌ అనే సంస్థ 2025 ఏప్రిల్‌ 25వ తేదీన తన సర్వే నివేదికను ప్రచురించింది.దాన్లో చెప్పినదాని ప్రకారం గడచిన ఏడాది కాలంలో భారతీయుల్లో 62శాతం మంది చైనా వస్తువులను కొనుగోలు చేశారు. అంతకు ముందు ఏడాది వారు 55శాతమే ఉన్నారు, 15శాతం మంది కొత్త చైనా వస్తువులు భారతీయ కంపెనీల ద్వారా వస్తే కొనుగోలు చేయటం ఖాయమని చెప్పారు. ఈ వివరాలు సూచిస్తున్నదేమిటి ? స్వదేశీ వస్తువులనే వాడండి అని పాలకులు ఎన్ని సుభాషితాలు పలికినప్పటికీ జనం పట్టించుకోవటం లేదు. ఆధునిక జీవితం, వినియోగదారీ తత్వాన్ని పెంచుతున్న కారణంగా నాణ్యమైన, చౌకగా దొరికే చైనా వస్తువుల కోసం ప్రపంచమంతా ఎగబడుతున్నపుడు మనవారు దూరంగా ఉంటారా ! మావెనుకే జనం ఉన్నారని చెప్పుకుంటున్న పార్టీ మాటలు విని ఉంటే చైనా దిగుమతులు పడిపోయేవి. దానికి విరుద్దంగా మోడీ ఏలుబడిలో రికార్డులు బద్దలవుతున్నాయి.


పదకొండు సంవత్సరాల ప్రచార ఆర్భాటం తరువాత పరిస్ధితి ఏమిటి ? ఏదీ ఊరికే రాదు. ఆ ఒక్కటీ అడక్కు సినిమాలో లక్కు మీద ఆధారపడిన రాజేంద్ర ప్రసాదు మాదిరి ఉంటే కుదరదు. కొంత మందికి చైనాలో కమ్యూనిస్టు నియంత్రత్వం కనిపిస్తుంది. నియంతల పాలన ఉన్నదేశాలన్నీ దాని మాదిరి ఎందుకు అభివృద్ధి చెందలేదో చెప్పాలి మరి. పరిశోధన మరియు అభివృద్ధికి గణనీయంగా ఖర్చు పెట్టిన కారణంగానే చైనా అనేక రంగాలలో దూసుకుపోతున్నది. ముందే చెప్పుకున్న మాగ్నెట్‌ల ఎగుమతిలో చైనా వాటా ప్రపంచంలో అపురూప ఖనిజాలతో తయారయ్యే వాటిలో 80శాతం వరకు ఉన్నట్లు అంచనా, మెటల్‌ మాగ్నెట్లలో 2012లో 49.6శాతం ఉండగా 2024కు అది 63.5శాతానికి పెరిగింది.నాన్‌ మెటల్‌ మాగ్నట్లలో 50.8 నుంచి 59.1శాతానికి పెరిగింది(మనీ కంట్రోల్‌ వెబ్‌ 2025 మే 29).మన నరేంద్రమోడీ తలచుకోవాలే గానీ తెల్లవారేసరికి వాటిని ఉత్పత్తి చేయగలరని గొప్పలు చెప్పేవారు మనకు కనిపిస్తారు. వాస్తవం ఏమంటే 2013లో మనకు అవసరమైన మెటల్‌ మాగ్నట్లలో చైనా నుంచి 73.5శాతం దిగుమతి చేసుకుంటే 2024లో 82.9శాతానికి పెరిగాయి. విద్యుత్‌ వాహనాల తయారీలో ఈ మాగ్నెట్‌లు కీలకం. పాకిస్తాన్‌ వందకు వంద, ఐరోపా సమాఖ్య 90, దక్షిణ కొరియా 87.4శాతం, అమెరికా దిగుమతుల్లో 75శాతం చైనా నుంచి తెచ్చుకుంటున్నాయి. ప్రపంచంలో 78 దేశాలు చైనా నుంచి దిగుమతి చేసుకుంటుండగా వాటిలో 41 చైనా మీద 60శాతంపైగా ఆధారపడి ఉన్నాయి.మన పాలకులు లేదా పరిశ్రమగానీ చైనా మీద ఆధారపడకుండా చేయటంలో విఫలమయ్యారు. డోనాల్డ్‌ ట్రంప్‌ ఏడు అపురూప ఖనిజాలు, మాగ్నెట్‌ ఉత్పత్తుల దిగుమతుల మీద ఆంక్షలు విధించాడు.ఎంకి పెళ్లి సుబ్బిచావుకు వచ్చిందన్నట్లుగా ఇది ఇతర దేశాలకు ఇబ్బందులు తెచ్చింది. మన విదేశీ వాణిజ్య డైరెక్టరేట్‌ మే నెలలో 30 సర్టిఫికెట్లు జారీ చేసి చైనా నుంచి దిగుమతుల పునరుద్దరణకు వీలు కల్పించినట్లు వార్తలు వచ్చాయి. వాటిని రక్షణ అవసరాలకు లేదా తిరిగి అమెరికాకు ఎగుమతులు చేయబోమని హామీ ఇచ్చింది.వాటిని చైనా పరిశీలించిన తరువాత దిగుమతి చేసుకోవచ్చు, ఆ ప్రక్రియను త్వరగా చేపట్టాలనే పరిశ్రమల వారు పైరవీ కోసం చైనా వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారని ముందే చెప్పుకున్నాం.

బిజెపి లేదా దానికి భజన చేసే గోడీ మీడియా పండితులు మేకిన్‌ ఇండియా గురించి గోరంతను కొండంతలుగా చిత్రించి కబుర్లు చెబుతారు. రాజకీయంగా అమెరికాతో అంటకాగేందుకు కేంద్ర పాలకులు తపించి పోతుంటారు. కాషాయ దళాలు నిత్యం చైనా, కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొడుతుంటాయి. కానీ ఆర్థిక విషయాల్లో మాత్రం చైనా కావాల్సి వస్తోంది. నరేంద్రమోడీ అధికారం స్వీకరించగానే 2014లో చెప్పిందేమిటి ? మేకిన్‌ ఇండియా పథకంతో దేశాన్ని ప్రపంచ ఉత్పత్తి కేంద్రంగా మారుస్తా, అందుకు అవసరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేస్తా అన్నారు, ఉత్పత్తితో ముడిపెట్టిన ప్రోత్సాహక పధకం(పిఎల్‌ఐ) ప్రకటించారు. జిడిపిలో ఉత్పాదక రంగ వాటాను 15 నుంచి 2025 నాటికి 25శాతానికి పెంచుతానని, కీలక రంగాల్లో చైనా మీద ఆధారపడటాన్ని తగ్గిస్తా అని చెప్పారు. అందుకు దేశమంతటా గుజరాత్‌ నమూనా అభివృద్ధి చేస్తా అన్నారు. పదేండ్లలో జరిగిందేమిటి ? కొంత మేరకు ఎలక్ట్రానిక్‌ వస్తువుల ఎగుమతుల విలువ పెరిగింది. జిడిపిలో వస్తూత్పత్తి వాటా పెరగకపోగా 14శాతానికి తగ్గింది. దీని గురించి మాట్లాడకుండా సెల్‌ ఫోన్ల ఎగుమతి చూడండి, ఆపిల్‌ కంపెనీ 20శాతం ఉత్పత్తి ఇక్కడే చేస్తున్నది అంటూ సర్వస్వం అదే అన్నట్లుగా చిత్రిస్తున్నారు. పిఎల్‌ఐ స్కీములో కేటాయించిన 1.9లక్షల కోట్ల రూపాయల సబ్సిడీ దీనికి ఒక కారణం. టెలికమ్యూనికేషన్స్‌, పివి సెల్స్‌ వంటి కొన్ని దిగుమతులు చైనా నుంచి తగ్గాయి. కానీ ఔషధ రంగానికి అవసరమైన ఏపిఐ దిగుమతులు 75 నుంచి 72శాతానికి మాత్రమే తగ్గాయి. అనేక రంగాలకు ప్రభుత్వం నిర్ణయించిన లక్ష్యాలను సాధించటంలో వైఫల్యం కనిపిస్తుంది. మొత్తంగా విజయమా వైఫల్యమా అన్నది చూడాలి. యాపిల్‌ కంపెనీని ఒక ఉదాహరణగా చూపుతున్నారు.చైనాలో ఉత్పాదక ఖర్చు పెరిగిన కారణంగా అది వియత్నాం, మనదేశానికి వచ్చింది. అమెరికాలో తడిచి మోపెడవుతుంది గనుక ఎన్ని పన్నులు వేసినా విదేశాల్లోనే తయారు చేస్తానని ట్రంప్‌కు తెగేసి చెప్పింది.షీ జింపింగ్‌, నరేంద్రమోడీ, ట్రంపా ఎల్లయ్యా పుల్లయ్యా అన్నది కాదు, దానికి కావాల్సింది లాభాలు. రేపు ఆఫ్రికా ఖండంలో ఖర్చు తక్కువగా ఉంటే పొలో మంటూ అక్కడికి పోతుంది. ఆ కంపెనీ చైనాలో విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు, విడిభాగాలు తయారు చేసే పరిశ్రమలతో సమగ్ర ఒప్పందాలు చేసుకుంది. చైనా ప్రభుత్వ సహకారంతో రెండు దశాబ్దాల కాలంలో అది జరిగింది. మనదేశంలో అలాంటివేమీ లేదు.


వాజ్‌పాయి పాలనలో దేశం వెలిగి పోయింది అని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఆ పాలన ముగిసి యుపిఏ అధికారానికి వచ్చిన రెండేళ్లకు 2006లో నేషనల్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ కాంపిటీటివ్‌ కౌన్సిల్‌ ఉత్పాదక రంగం సంక్షోభంలో ఉందని, జాతీయ ఉత్పాదక విధానాన్ని రూపొందించాలని కోరింది. దానికి అనుగుణంగా 2011లో యుపిఏ సర్కార్‌ పదేండ్లలో జిడిపిలో ఉత్పాదక రంగ వాటాను 25పెంచేందుకు ఒక విధానాన్ని ఆమోదించింది. నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత 2014లో దానికి మేకిన్‌ ఇండియా అనే పేరు తగిలించి తానే రూపొందించినట్లు ప్రచారం చేసుకున్నారు. దాన్లో భాగంగానే సబ్సిడీలకు ప్రోత్సాహకాల పేరుతో కొత్త పేరు పెట్టి 2020లో పిఎల్‌ఐ స్కీమును ఐదేండ్ల ప్రణాళికతో ప్రకటించారు. దాని గడువు ముగిసినప్పటికీ లక్ష్యాలను సాధించకపోవటంతో పొడిగించాలని నిర్ణయించారు. చిత్రం ఏమిటంటే గాల్వన్‌ లోయ ఉదంతాల తరువాత దేశభద్రతకు ముప్పు అనే పేరుతో పరోక్షంగా చైనా పెట్టుబడులను నిషేధించిన మోడీ సర్కార్‌ ఈ స్కీము కింద ఎలక్ట్రానిక్స్‌ పరిశ్రమల్లో చైనా కంపెనీలు కూడా పెట్టుబడులు పెట్టి సబ్సిడీలు పొందవచ్చని నిర్ణయించింది. అయితే దానికి మనదేశంలో ఉన్న ఏదైనా కంపెనీతో సంయుక్త భాగస్వామ్యంలో 49శాతం వాటాకు పరిమితం కావాలని, యాజమాన్యం భారతీయ కంపెనీల చేతుల్లో ఉండాలని, సాంకేతిక పరిజ్ఞాన బదిలీలు జరగాలని షరతు పెట్టింది.(ఫైనాన్సియల్‌ ఎక్స్‌ప్రెస్‌ 2025 ఏప్రిల్‌ 28). వేగంగా పని చేస్తానని చెప్పుకొనే మోడీ సర్కార్‌కు ఈ నిర్ణయం తీసుకొనేందుకు పదేండ్లు పట్టింది, చివరకు పెట్టుబడిదారుల వత్తిడి పని చేసినట్లు కనిపించి, ఏదైతే అదవుతుందని సందిగ్ధావస్ధ నుంచి బయటపడినట్లు ఉంది. చైనా, దాని కమ్యూనిస్టు పార్టీని వ్యతిరేకించే పచ్చివ్యతిరేకులు బిజెపిలో పుష్కలంగా ఉన్నారు. వారు అడుగడుగునా అడ్డుతగులుతున్నారు కనుకనే ఈ అలశ్యం. ఎందుకంటే చైనాను అనుమతిస్తే వారి సైద్దాంతిక దాడిని జనం ఏమాత్రం నమ్మరు. అన్నింటికీ మించి అమెరికా, ఐరోపా ధనికదేశాల మీద ఉన్న మోజు మామూలుగా లేదు. వేదాల్లో అన్నీ ఉన్నాయష అని చెప్పేవారు సంస్కృత గ్రంధాల్లో విమానాల తయారీతో సహా ఉందని చెబుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏమైనా వెలికితీశారా అంటే అదీ లేదు. పోనీ ఈ పదేండ్లలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం నిధులేమైనా కేటాయించిందా ? గత మూడు పారిశ్రామిక విప్లవాల బస్సులను ఎక్కలేకపోయామని నరేంద్రమోడీ చెప్పింది నిజమే, కానీ నాలుగో బస్సును ఎక్కటానికి చేసిందేమిటి అన్నది ప్రశ్న. జిడిపిలో అమెరికా 2.8, చైనా 2.1,దక్షిణ కొరియా 4.2, ఇజ్రాయెల్‌ 4.3శాతం ఖర్చు చేస్తుంటే మన ఖర్చు పదేండ్లలో 0.6 నుంచి 0.7శాతం మధ్య ఉందంటే మోడీ దేశాన్ని ఎంత వెనక్కు తీసుకుపోయారో అర్ధం అవుతోంది. ఎంతసేపూ ఆవు పేడలో, మూత్రంలో బంగారం ఉందా,ఏముంది అనే ఆత్రంతో పరిశోధనల మీద ఉన్న కేంద్రీకరణ మిగతా వాటి మీద లేదు. ఇందువల్లనే మనదంటూ చెప్పుకొనేందుకు హిందూత్వ తప్ప ఒక్క వస్తు బ్రాండైనా లేదు. చైనా నుంచి కంపెనీలు వస్తున్నాయదిగో చూడండి ఇదిగో చూడండి అంటూ ఇంట్లోకి గేటు బయటకు తిరిగి చూసినట్లు తప్ప స్వంత కంపెనీల ఏర్పాటు గురించి పట్టించుకోలేదు. ప్రైవేటు వారికి ఏం పడుతుంది, రిలయన్స్‌ , ఇతరులకు చమురు తవ్వకం ఇచ్చారు. పదేండ్ల నాటికీ ఇప్పటికీ స్వంత ఉత్పత్తి తగ్గింది తప్ప పెరగలేదు.

పదకొండేండ్ల మోడినోమిక్స్‌ తీరు తెన్నులు చూసినపుడు కొన్ని ధోరణులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎండమావుల వెంట నీళ్ల కోసం పరుగెత్తినట్లుగా ఆధునిక టెక్నాలజీ కోసం మనదేశం అమెరికా వైపు చూస్తోంది. ఇంథనం, ఆయుధాల కోసం రష్యా మీద, చౌకగా వచ్చే వస్తువుల కోసం చైనా మీద ఆధారపడినట్లు కనిపిస్తోంది. ఇలా ఎంతకాలం అన్నది ప్రశ్న. చైనా వస్తువుల మీద ఆధారపడిన అమెరికా, ఇతర ఐరోపా దేశాలు నేర్చుకున్న గుణపాఠం మనవారు నేర్చుకోవటానికి సిద్దంగా లేరు. అందుకు నిదర్శనం పరిశోధన మరియు అభివృద్ధి కేటాయింపులను నిర్లక్ష్యం చేయటమే. మనదంటూ ఒక ప్రత్యేకత లేకపోతే సమగ్ర స్వయం సమృద్ధి అనేది పగటి కలే. ఏ దేశం కూడా మరొక దేశానికి తనకు లబ్దికలిగించే పరిజ్ఞానాన్ని మరొకదేశానికి పంచుకొనే స్థితి ప్రస్తుతం లేదు. అది పాతబడిన తరువాత మాత్రమే బదలాయిస్తున్నాయి. దేశాలతో వ్యవహరించే తీరును బట్టి వాణిజ్య లావాదేవీలు జరుగుతాయి. మనం ఇతరుల మీద ఆధారపడినంతకాలం అవి చెప్పినట్లు మనం వినాలి తప్ప మన మాట చెల్లదు. ఉదాహరణకు గాల్వన్‌ లోయ ఉదంతాలు జరిగినపుడు చైనా వస్తువుల దిగుమతులు నిలిపివేసి డ్రాగన్‌ దేశాన్ని మన కాళ్ల దగ్గరకు తెచ్చుకోవాలని అనేక మంది వీధుల్లో వీరంగం వేశారు.చైనా ఎగుమతులు ఎన్ని, వాటిలో మనదేశ వాటా ఎంత అన్న కనీస సమాచారం తెలిసి ఉంటే ఆ గంతులు, ప్రకటనలు ఉండేవి కాదు. వారి మనోభావాలను మోడీ గట్టి దెబ్బతీశారు, దిగుమతులు పెంచారు. తాజాగా పాకిస్తాన్‌కు చైనా ఆయుధాలు అందించి సాయం చేస్తున్నదని ప్రచారం చేసినా చైనా వస్తువులు బహిష్కరించాలనే పిలుపులు రాలేదంటే తత్వం తలకెక్కిన బిజెపి ఈసారి ముందు జాగ్రత్త పడి తన మరుగుజ్జులను అదుపు చేయటమే, కాదంటారా !

Share this:

  • Tweet
  • More
Like Loading...

ముద్దులాట – దెబ్బలాట : అమెరికా ప్రతికూల సుంకాలపై చర్చలకు శ్రీకారం ! ఐరోపా సంతుష్టీకరణ యత్నం వృధా ప్రయాస అన్న చైనా !!

28 Wednesday May 2025

Posted by raomk in CHINA, Current Affairs, Economics, Europe, Germany, History, imperialism, International, INTERNATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

China, China advise, Donald trump, EU-China, EU-US, Tariff Fight, Trade Protectionism, Xi Jinping

ఎం కోటేశ్వరరావు

మాటల్లేవ్‌, మాట్లాడుకోవటం లేదు, ఒప్పందమూ లేదు, నేను చెప్పిందే వేదం అంటూ ట్రంప్‌ చిందులు వేశాడు. ఐరోపా సమాఖ్య దేశాల వస్తు దిగుమతులపై జూన్‌ ఒకటవ తేదీ నుంచి 50శాతం ప్రతికూల సుంకాలు విధిస్తానని బెదిరించిన ఆ పెద్దమనిషి ఒక అడుగు వెనక్కు వేసి జూలై 9వ తేదీ వరకు తన నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించాడు. సమాఖ్య అధ్యక్షురాలు ఉర్సులా వాండెర్‌ లేయన్‌ తనకు ఫోన్‌ చేసి మాట్లాడిన తరువాత గడువు పొడిగించేందుకు అంగీకరించినట్లు ట్రంప్‌ చెప్పాడు. ఫోన్‌ చేసింది నిజమే అని ఆమె కూడా నిర్ధారించారు. ఏప్రిల్‌ రెండవ తేదీన అమెరికా విముక్త దినంగా ప్రకటించిన ట్రంప్‌ అన్ని దేశాల మీద పదిశాతం చొప్పున ప్రతిసుంకాలు వేస్తాననటమే గాక కొన్ని దేశాల మీద అదనంగా కూడా వేయనున్నట్లు చెప్పాడు. ఐరోపా సమాఖ్య మీద 20శాతం అన్నాడు.ట్రంప్‌ బెదిరింపుల మీద దేశాలు చర్చలకు ముందుకు రాకపోవటంతో 90రోజుల పాటు అమలు నిలిపివేస్తున్నట్లు చెప్పాడు. ఆ గడువు జూలై 9వరకు ఉంది. చైనాతో రాజీకి వచ్చి 145ను 30శాతానికి తగ్గించాడు. ఐరోపా సమాఖ్య నుంచి ఎలాంటి స్పందన లేకపోవటంతో జూన్‌ ఒకటి నుంచి 50 శాతం పన్ను విధిస్తానని, చర్చలేమీ లేవంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించాడు. ఒప్పందం కోసం ఎదురు చూడటం లేదు, 50శాతం పన్నుల అమలే తరువాయి, అమెరికాలో వస్తువులను ఉత్పత్తి చేస్తే ఎలాంటి పన్నులు ఉండవు అన్నాడు. వాణిజ్య మిగులు ఉన్న ఐరోపా తమ నుంచి ఇంథనం, ఆయుధాలను పెద్ద మొత్తంలో కొనుగోలు చేయాలని ట్రంప్‌ వత్తిడి చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అమెరికా బెదిరింపుల పూర్వరంగంలో మరోసారి చైనాతో వాణిజ్య చర్చలు జరపాలని ఐరోపా సమాఖ్య నిర్ణయించటం ట్రంప్‌కు పరోక్ష హెచ్చరికగా కనిపిస్తున్నది.అది ట్రంప్‌తో బేరమాడేందుకు కూడా కావచ్చు,చైనా మార్కెట్‌ అవకాశాల కోసమూ చూడవచ్చు. ఐరోపాలో రెండు ధోరణులు ఉన్నాయి. ఒకటి అమెరికాను ప్రసన్నం చేసుకొని పబ్బం గడుపుకోవాలని చూసేవారు కొందరైతే, ఎంతకాలమీ ముసుగులో దెబ్బలాట అని మండిపడుతున్నవారూ ఉన్నారు. అమెరికాను సంతుష్టీకరించటం అంత తేలిక కాదని గుర్తించటం అవసరమని చైనా వ్యాఖ్యానించింది.

ట్రంప్‌ దూకుడు వ్యవహారాన్ని ఐరోపా సమాఖ్య ఇప్పటి వరకు తాపీగా ప్రతిఘటిస్తున్నది. వేగంగా చర్చలు జరపనున్నట్లు ట్రంప్‌ చెప్పాడు. దౌత్యంలో అమెరికాకు ధీటుగా ఐరోపా ధనికదేశాలు ఉన్నాయి. ఎవరి తురుపు ముక్కలను వారు ప్రయోగిస్తున్నారు.ప్రపంచంలో అతి పెద్ద వాణిజ్య కూటమిగా ఉన్నాయి. మొత్తం మీద ఐరోపా 2024లో 236 బిలియన్‌ డాలర్ల మేర మిగులులో ఉంది. ఈ పూర్వరంగంలో తమ వస్తువులను భారీగా కొనుగోలు చేయాలని, ఉన్న ఆటంకాలు, వ్యాట్‌, అమెరికన్‌ కంపెనీల మీద వివక్ష, అపరాధరుసుముల వంటి వాటిని నామమాత్రం లేదా తొలగించాలని అమెరికా వత్తిడి చేస్తున్నది. అసలు ఐరోపా సమాఖ్య ఏర్పాటే అమెరికా, జపాన్నుంచి తలెత్తిన పోటీని ఉమ్మడిగా తట్టుకొనేందుకు అన్నది తెలిసిందే. అందువల్లనే అది ఆచితూచి వ్యవహరిస్తున్నది. పూర్తిగా తెగతెంపులు చేసుకొనేందుకు, అలాగని లొంగిపోయేందుకు సిద్దం కాదు. అమెరికా అతి పెద్ద వాణిజ్య భాగస్వామిగా 2024లో ఐరోపా యూనియన్‌ 600 బిలియన్‌ డాలర్ల మేరకు సరకులు ఎగుమతి చేసి 370 బి.డాలర్ల మేర దిగుమతులు చేసుకుంది.

తాజా పరిణామాలను చూస్తుంటే అమెరికా బెదిరింపులకు పూనుకుందన్నది స్పష్టం.తమ అధ్యక్షుడి పన్నుల బెదిరింపు ఐరోపా సమాఖ్య కింద మంటపెట్టింది, ఇతరులతో పోలిస్తే మెల్లగా నడుస్తున్న సంప్రదింపులు దీంతో వేగం పుంజుకుంటాయని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్‌ బెసెంట్‌ బహిరంగంగానే చెప్పాడు. జూలై తొమ్మిది వరకు గడువు ఉంది గనుక ఏం జరుగుతుందో చూడాలి. ఇరుపక్షాలకూ ఇది ప్రతిష్టాత్మకమే. ‘‘ ఈ విషయంలో మేమంతా ఒకటిగా ఉన్నాం, మీరు మాలో ఒకరిని దూరం చేస్తే మా అందరినీ చేసుకున్నట్లే, మా వాణిజ్యం, మా కార్మికులు మొత్తం ఐరోపా వాసులకోసం ఐరోపా ఐక్యంగా ఉంటుంది. మీ చర్య ప్రపంచ ఆర్థికానికే దెబ్బ ’’ అని గతంలో స్పందించిన ఉర్సులా వాండెర్‌ యూరోపియన్లకు ఇప్పుడేమి చెబుతారన్నది ఆసక్తి కలిగించే అంశం. కొన్ని వస్తువులపై ట్రంప్‌ను దెబ్బకు దెబ్బతీయాలని ఐరోపా సమాఖ్య ఇప్పటికే తీర్మానించింది, అయితే ట్రంప్‌ 90రోజుల విరామం ప్రకటించటంతో ప్రతి చర్యలను ప్రకటించటం వాయిదా వేసుకుంది. శుక్రవారం నాడు 50శాతం పన్నుల ప్రకటన చేయగానే పరస్పర గౌరవంతో పరిష్కరించుకోవాలేగానీ బెదిరింపులతో కాదు, మా ప్రయోజనాలను రక్షించుకొనేందుకు కట్టుబడి ఉన్నామని సమాఖ్య వాణిజ్య, ఆర్థిక భద్రతా కమిషనర్‌ మారోస్‌ సెఫ్‌కోవిక్‌ గట్టిగా స్పందించాడు. సంప్రదింపులకు తాము సిద్దమే అన్నాడు. ఐరోపాకు మద్దతుగా తాము నిలుస్తామని జర్మనీ విదేశాంగ మంత్రి జాన్‌ వాడేపుల్‌ అన్నాడు. సంప్రదింపులు జరుగుతున్న తరుణంలో అదనపు పన్నుల గురించి ట్రంప్‌ ప్రకటన వాటికి దోహదం చేయదని, ఉద్రిక్తతలను తగ్గించాలని కోరుకోవటంతో పాటు దేనికైనా సిద్దమే అని ఫ్రెంచి మంత్రి సెయింట్‌ మార్టిన్‌ అన్నాడు.

గత చరిత్రను చూసినపుడు ట్రంప్‌తో ఐరోపా సమాఖ్య సంబంధాలు సజావుగా లేవు. తొలిసారి అధికారానికి వచ్చినపుడు ఐరోపా, మెక్సికో, కెనడా నుంచి దిగుమతి చేసుకొనే ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తులపై 2018లో పన్నులు విధించాడు. ఐరోపా సమాఖ్య అంత అధ్వాన్నంగా మరొకరెవరూ అమెరికా పట్ల వ్యవహరించలేదని అప్పుడు ఆరోపించాడు. అసలు అమెరికా నుంచి లబ్ది పొందేందుకే కూటమి ఏర్పడిరదన్నాడు. సమాఖ్య నుంచి విడిపోయిన బ్రిటన్‌తో అమెరికా సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. మే ఎనిమిదిన కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం అమెరికా వస్తువులపై దిగుమతి పన్ను 5.1 నుంచి 1.8శాతానికి తగ్గిస్తుంది. దీని వలన ఐదు బిలియన్‌ డాలర్ల విలువగల వస్తువుల ఎగుమతికి వీలు కలుగుతుందని అధ్యక్ష భవనం తెలిపింది. ఇదే మాదిరి ఇతర ఐరోపా దేశాల్లోకి తన వస్తువులను కుమ్మరించాలని చూస్తున్నది. ఈ నేపధ్యంలో బ్రిటన్‌ పట్ల బహిరంగంగా ప్రకటించనప్పటికీ సమాఖ్య గుర్రుగా ఉంది. ఆ ఒప్పందాన్ని చూపి ట్రంప్‌ బెదిరింపులకు దిగాడు. పదిశాతం పన్నులైతే సరే అంతకు మించి ఉంటే ఒప్పందం కుదరకపోవచ్చని చెబుతున్నారు. ఇరవై లేదా 30శాతమైతే తాము కూడా ప్రతి చర్యలు తీసుకోకతప్పదని ఇప్పటికే కొంత మంది సంకేతాలిచ్చారు. ఒక టవల్‌ను సీటు మీద ఆ సీటు నాదే అన్నంత మాత్రాన భయపడే ప్రాంతం ఐరోపా సమాఖ్య కాదని వ్యాఖ్యలు వెలువడ్డాయి. ఏకపక్షంగా తాను చెప్పిందానికి అంగీకరించాల్సిందే అంటున్న ట్రంప్‌ ఐరోపాను లొంగదీసుకోగలడా ? చైనా మాదిరి సమాఖ్య గట్టిగా వ్యవహరించగలదా ! అంతర్గతంగా ఆర్థిక వ్యవస్థ మీద పెరుగుతున్న వత్తిడి ట్రంప్‌కు ఊపిరి సలపనీయటం లేదు. పన్నులు లేకపోతే తమ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుందని గృహస్తులలో 56శాతం మంది పెద్దలు భావిస్తున్నట్లు బ్లూమ్‌బెర్గ్‌ సర్వే పేర్కొన్నది. కలుగుతుందని చెబుతున్న ప్రయోజనం కంటే తమపై పడే భారమే ఎక్కువ అని 52శాతం చెప్పారట.కేవలం 37శాతం మంది మాత్రమే ట్రంప్‌ పన్నుల విధానాన్ని సమర్ధించినట్లు మరొక సర్వే పేర్కొన్నది. అంతర్జాతీయంగా రోజు గడిచే కొద్దీ ఎవరు ఎలా బిగదీసుకుంటారో అన్న అనుమానంతో అదిరించి బెదిరించి ఒప్పందాలు కుదుర్చుకోవాలని ట్రంప్‌ చూస్తున్నాడు.

అమెరికా ప్రకటించిన పదిశాతం పన్నులు అలాగే ఉండగా బ్రిటన్‌ పన్నులు తగ్గించటం ఏమిటని మిగతా ఐరోపా దేశాలు మండిపడుతున్నాయి. అంతర్జాతీయ రాజకీయాల్లో బ్రిటన్‌ నేడు అమెరికాకు జూనియర్‌ భాగస్వామిగా ఉన్నందున దానితో కుదుర్చుకున్న ఒప్పందం మాదిరి ఐరోపా సమాఖ్య కుదుర్చుకొనేందుకు సిద్దపడే అవకాశాలు లేవు. ఒకవేళ లొంగిపోతే ఆయాదేశాల్లో తలెత్తే సమస్యలు నాయకత్వానికి మరింత తలనొప్పిగా మారతాయి. అమెరికా లేదా ఐరోపా ధనికదేశాల్లో వస్తూత్పత్తి ఖర్చు ఎక్కువ అందువలన పరస్పరం పన్నులు విధించుకుంటే వాటికే నష్టం అని గత అనుభవం వెల్లడిరచింది.ట్రంప్‌ 50శాతం పన్ను నిర్ణయం ప్రకటించగానే రెండు చోట్లా స్టాక్‌మార్కెట్‌ పతనమైంది. చౌకగా వస్తువులను సరఫరా చేసే చైనా, తూర్పు ఆసియా, భారత్‌ వంటి చోట్ల నుంచి దిగుమతులు చౌకగా మారితే రెండూ నష్టపోతాయి. ఐరోపా నుంచి జరిగే మొత్తం ఎగుమతుల్లో అమెరికా వాటా 2024లో 20.6శాతం ఉంది.ప్రతికూల పన్నులు విధింపు, వాణిజ్య విధానాలు ప్రపంచ ఆర్థిక భవిష్యత్‌ను బలహీనం చేశాయని ఐరాస పేర్కొన్నది, ప్రపంచానికి ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు బహుముఖ సవాళ్లు విసురుతున్నాయని కూడా తెలిపింది.

త్వరలో చైనాఐరోపా సమాఖ్య వాణిజ్య ప్రతినిధుల చర్చలు పారిస్‌లో జరగనున్నాయి. సహకారం పెంచుకోవాలని ఉభయపక్షాలూ ఇటీవలి కాలంలో పదే పదే సంప్రదింపులు జరుపుతున్నాయి. ప్రపంచ వాణిజ్య సంస్థ దేశాల మంత్రుల సమావేశాలు జూన్‌ మొదటి వారంలో పారిస్‌లో జరగనున్నాయి. ఆ సందర్భంగా చైనాతో ఐరోపా సమాఖ్య ప్రతినిధులు భేటీ కానున్నారు. ట్రంప్‌ విధించిన గడువు జూలై తొమ్మిది వరకు ఉండటంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడిరది. ఐరోపా యూనియన్‌కు అమెరికాతో సమస్యలున్నట్లే చైనాతో కూడా కొన్ని ఉన్నాయి. అయినప్పటికీ ఆర్థిక సహకారానికి సంబంధించి మే 13, 14వ తేదీలలో బ్రసెల్స్‌లో ఉభయ పక్షాలు సమావేశమయ్యాయి, మరుసటి రోజు ఫ్రాన్స్‌ ప్రతినిధులు చైనాతో చర్చించారు. చైనా ప్రతినిధివర్గ నేత వాంగ్‌, ఐరోపా నేత సెఫ్‌కోవిక్‌ మధ్య ఈ ఏడాది ఇప్పటికే రెండుసార్లు కీలక చర్చలు జరిగాయి. పారిస్‌లో మూడవది జరగనుంది.సెఫ్‌కోవిక్‌ మార్చి 28న చైనా సందర్శించాడు, ఏప్రిల్‌ 18న వీడియో కాన్ఫరెన్సులో విద్యుత్‌ వాహనాల ధరలు, పెట్టుబడులు, ఆటో రంగంలో సహకారం గురించి ఉభయపక్షాలు చర్చలను ప్రారంభించాలని నిర్ణయించారు. పరస్పర లాభదాయకమైన సహకారం,కృత్రిమ మేథ, నూతన ఇంథన రంగాలు ఇతర అంశాలు ఉన్నాయి.ఈ పరిణామాల పట్ల అమెరికా గుర్రుగా ఉంది. చైనా వస్తువుల మీద తమ మాదిరి ఐరోపా సమాఖ్య కూడా ప్రతికూల పన్నులు విధించాలని అది డిమాండ్‌ చేస్తున్నది, అయితే ఐరోపా నుంచి ఇంతవరకు ఎలాంటి హామీ రాలేదని అమెరికా అధికారి ఒకరు చెప్పినట్లు వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ పత్రిక రాసింది. అమెరికా తరువాత చైనా అతి పెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. తమ మీద అమెరికా పన్నులను రద్దు చేస్తే ఉమ్మడిగా చైనా నుంచి ఇద్దరికీ ముప్పు ఉందని ప్రకటించేందుకు సిద్దంగా ఉన్నట్లు ఐరోపా పార్లమెంటు వాణిజ్య కమిటీ అధ్యక్షుడు బెర్నెడ్‌ లాంగే ప్రకటించటం గమనించాల్సిన అంశం.ఇవన్నీ చూసినపుడు నిజంగా అమెరికాకు వ్యతిరేకంగా కలసి వస్తే ఐరోపా, చైనా బలపడతాయి, లేకుంటే చైనాకు కొత్తగా పోయేదేమీ లేదు !

Share this:

  • Tweet
  • More
Like Loading...

బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిలో 4వ స్థానం మోడీ గొప్పతనం – తలసరిలో 136 స్థానం నరేంద్రమోడీ ఘోరవైఫల్యం !

26 Monday May 2025

Posted by raomk in BJP, CHINA, Congress, Current Affairs, Economics, Germany, History, INDIA, International, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, USA

≈ 1 Comment

Tags

China, Donald trump, India GDP, India per capita GDP, Narendra Modi, Narendra Modi Failures, Xi Jinping

ఎం కోటేశ్వరరావు

జపాన్ను వెనక్కు నెట్టేసి మనదేశం ప్రపంచ జిడిపిలో నాలుగో స్థానానికి చేరిందని, రెండున్నర లేదా మూడు సంవత్సరాల్లో జర్మనీని కూడా పక్కనపెట్టి మూడవ స్థానానికి వెళతామని నీతిఅయోగ్‌ సిఇవో బివిఆర్‌ సుబ్రమణ్యం చేసిన ప్రకటనకు మీడియాలో పెద్ద స్పందనే వచ్చింది. అనేక మంది సంతోషిస్తున్నారు. ఇదొక గొప్పా అని పెదవి విరిచేవారు కూడా ఉన్నారు.నూటనలభై కోట్ల జనాభాలో ఈలెక్కల ఆల్జిబ్రా ఎంతమందికి అర్ధం అవుతుంది ? ‘‘ నేను చెప్పినట్లుగా మనది నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, నాలుగు లక్షల కోట్ల ఆర్థికం, ఇది నేను చెబుతున్న సమాచారం కాదు. ఐఎంఎఫ్‌ చెబుతున్నది, జపాన్‌ కంటే పెద్ద ఆర్థిక వ్యవస్థ ’’ అని సుబ్రమణ్యం నీతి అయోగ్‌ పాలకమండలి పదవ సమావేశంలో ప్రకటించారు. మనం రూపొందించిన పథకం ప్రకారం జరిగితే రెండు, రెండున్నర, మూడు సంవత్సరాల్లో మనది మూడవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుంది అన్నారు. ఐఎంఎఫ్‌ ఏప్రిల్‌ 22 సమాచారం ప్రకారం వర్తమాన ధరల్లో సాధారణ(నామినల్‌) జిడిపి అమెరికా 30.51లక్షల కోట్ల డాలర్లు, చైనా 19.23, జర్మనీ 4.74,భారత్‌ 4.19, జపాన్‌ 4.19, బ్రిటన్‌ 3.84,ఫ్రాన్సు 3.21, ఇటలీ 2.42, కెనడా 2.23, బ్రెజిల్‌ 2.13 లక్షల కోట్లతో మొదటి పది స్థానాల్లో ఉన్నాయి. 202526 నాటికి మన జిడిపి 4.187.017,జపాన్‌లో 4.186.431 బిలియన్‌ డాలర్లుగా అంచనా. వేసింది. బొమ్మను పాలకులు ఎలాగూ చూపించారు, వారు మూసిపెట్టే బొరుసు ఎలా ఉందో చూడాలి కదా !


నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత 2015లో 2.1లక్షల కోట్ల డాలర్ల నుంచి 2025లో దేశ జిడిపి 4.3లక్షల కోట్ల డాలర్లకు చేరినట్లు, ఇది 105శాతం పెరుగుదల అని ఐఎంఎఫ్‌ కొద్ది నెలల క్రితం చెప్పింది.అదే సంస్థ తాజాగా విడుదల చేసిన అంచనాలో ఆ మొత్తాన్ని 4.187 లక్షల కోట్లకు తగ్గించింది. జపాన్‌ మొత్తం 4.186 గనుక దాన్ని పక్కన పెట్టి మనకు నాలుగో స్థానాన్ని ఇచ్చింది. తేడా ఎంత 0.001 లక్షల కోట్లు. చెవులప్పగించేవారుంటే కాకమ్మ కతలు చెప్పేవారికి కొదవ ఏముంది. బిజెపి పెద్దలు 2025 నాటికి ఐదు లక్షల కోట్ల డాలర్లకు పెంచుతామని గొప్పలు చెప్పుకున్న అంశం ఇక్కడ గుర్తుకు తెచ్చుకోవాలి. స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఇంతటి అభివృద్ధిని ఏ ప్రభుత్వమూ సాధించలేదని కూడా బిజెపి ఐటి సెల్‌ మాలవీయ చెప్పారు.అలా ప్రచారం చేయటమే కదా ఆ పెద్దమనిషి ఉద్యోగం. వాస్తవం ఏమిటి, 2004లో మన్మోహన్‌ సింగ్‌ అధికారానికి వచ్చినపుడు జిడిపి 709 బిలియన్‌ డాలర్లు కాగా 2014 నాటికి అది 2030 బిలియన్లకు పెరిగింది. యుపిఏ పాలనా కాలంలో పెరుగుదల రేటు 186 శాతమని, 105కంటే ఎక్కువని కాస్త నిజాయితీ ఉన్నవారు కూడా చెబుతారు.


గతంలో ప్రధాని చెప్పిన కొన్ని అతిశయోక్తుల గురించి చెప్పుకుందాం. ‘‘ గత పదేండ్లలో జిడిపిని రెట్టింపు చేయటం అంకెలు కాదు, 25 కోట్ల మందిని దారిద్య్రరేఖ దాటించి నూతన మధ్యతరగతిని సృష్టించాం. వారు కొత్త జీవితాన్ని ప్రారంభించారు, సచేతనంగా ఆర్థికవృద్ధికి తోడ్పడుతున్నారు ’’. ప్రధాని నోటి నుంచి జాలువారిన ఈ మాటలను చూసి నవ్వాలా ఏడవాలో తెలియటం లేదు. ఇరవై ఐదు కోట్ల మందిని దారిద్య్రరేఖ నుంచి ఎగువకు లాగాం అంటూనే కనీసం ఆహార ధాన్యాలు కొనుగోలు చేయలేని స్థితిలో ఉన్న 140కిగాను 80 కోట్ల మందికి ఉచితంగా ఆహార భద్రతా పధకం కింద గోధుమలు, బియ్యం ఇస్తున్నామని, మరికొన్నేండ్లు ఇస్తామని ఒక ఘనతగా చెప్పుకుంటారు. ప్రపంచ ఆకలి సూచికలో తాజాగా 127లో 105వ దేశంగా ఉన్నాం. ఆకలి లేని(9.9), స్వల్ప (10 నుంచి 19.9), తీవ్రం(20 నుంచి 34.9), ఆందోళనకరం(35నుంచి 49.9) , అత్యంత ఆందోళనకరం(50పైన) అనే ఐదు తరగతులుగా దేశాలను విభజిస్తే మన దేశం తీవ్ర తరగతిలో అంతకు ముందు, గత పదేండ్లుగా కూడా ఉంది. పదేండ్లలో జిడిపి రెట్టింపు అని ఇతర గొప్పలు కానీ పది సంవత్సరాల్లో 2014 నుంచి 2014వరకు మన ఆకలి సూచిక స్కోరు 28.2 నుంచి 27.3కు మాత్రమే తగ్గింది,దీనిలో అంత అభివృద్ధి ఎందుకు రాలేదు ? ఇదే కాలంలో పాకిస్తాన్‌ స్కోరు 29.6 నుంచి 27.9కి తగ్గింది, దీని గురించి చెబితే ఈ దేశంలో పుట్టీ, ఈ దేశంలో పెరిగీ, అన్నం తింటూ పక్కదేశాన్ని పొగుడుతున్నట్లు ఎదురు దాడి చేస్తారు. పాక్‌ రాంకు మన తరువాత 109, ఆకలిని ఎవరు ఎక్కువగా తగ్గించినట్లు ? గత పదేండ్లలో చైనా స్కోరు ఐదు కంటే తక్కువే ఉందన్న వాస్తవాన్ని చెబితే నానా యాగీ చేస్తారు. మోడీ సాధించిన విజయాలు మీకు పట్టవా అంటారు కొందరు. నిజమే 188 దేశాల జిడిపిలో మనలను నాలుగవ స్థానంలోకి తీసుకు వెళ్లినందుకు మోడీ ఘనత ఖాతాలో వేద్దాం. అదే తలసరి జిడిపిలో 136వ స్థానంలో ఉంచిన ఘనుడని కూడా కీర్తించాలా ! తలసరి జిడిపి కూడా నిజానికి ఒక మైండ్‌గేమ్‌ తప్ప మరొకటి కాదు. కొందరి దగ్గర సంపదలు పోగుపడటం అంటే ఆర్థిక అసమానతలు పెరుగుతున్నట్లే, మోడీ ఏలుబడిలో పెరిగినట్లు స్పష్టంగా తేలింది. సర్‌ గోచిపాతరాయుడు సంపద ఒక రూపాయి, 50,49 చొప్పున అంబానీ, అదానీల సంపదలు ఒక దగ్గర చేర్చి మూడుతో భాగిస్తే వచ్చే 33 గోచిపాతరాయుడి సంపద అంటే నవ్విపోతారు. అంబానీ ఇంట వివాహానికి విమానాలు,హెలికాప్టర్లు వేసుకొని వచ్చిన అతిధులు గోచిపాతరాయుడి ఇంటికి వస్తారా !


అసలు జిడిపి చర్చలోకి వెళితే బుర్ర బద్దలవుతుందంటే అతిశయోక్తి కాదు. దీన్ని సాధారణ(నామినల్‌), పిపిపి(పవర్‌ పర్చేజింగ్‌ పారిటీ) పద్దతుల్లో లెక్కిస్తున్నారు. రెండవదే వాస్తవానికి దగ్గరగా ఉంటుందన్నది కొందరి సమర్ధన. దాని ప్రకారం చూస్తే నరేంద్రమోడీ అధికారానికి వచ్చే నాటికే మన దేశం సాధారణంలో పది, రెండవ లెక్కలో మూడవ స్థానంలో ఉంది. మోడీ గణం రెండవ లెక్కలను ఎందుకు చెప్పటం లేదు. ఎందుకంటే దేశాన్ని ఇప్పటికీ అదే స్థానంలోనే మోడీ ఉంచారు గనుక. ఐఎంఎఫ్‌ 2025 పిపిపి అంచనా ప్రకారం చైనా 42.72, అమెరికా 30.51, భారత్‌ 17.65 లక్షల కోట్ల డాలర్లతో మూడవదిగా, రష్యా నాలుగు, జపాన్‌ ఐదవదిగా ఉంది. 2027 తొలి ఆరునెలల్లోనే సాధారణంలో 4.9లక్షల కోట్ల డాలర్లతో జర్మనీని కూడా దాటించేస్తారని ఊదరగొడుతున్నారు.అవన్నీ గిడసబారిన దేశాలుగా మారుతున్నాయి. దున్నబోతే దూడల్లో మెయ్యబోతే ఆంబోతుల్లో అన్నట్లుగా చెప్పుకుంటే కుదరదు. మనం పోల్చుకోవాల్సింది చైనాతో కదా ! మన వృద్ధి రేటు చైనా, అమెరికా, జర్మనీ కంటే ఎక్కువగా ఉందని, గడచిన పదేండ్లలో భారత్‌ 105శాతం పెరుగుదల సాధించగా చైనా 76, అమెరికా 66, జర్మనీ 44, ఫ్రాన్సు 38, బ్రిటన్‌ 28శాతం పెరుగుదల సాధించిందని ఐఎంఎఫ్‌ చెప్పింది. లక్ష కోట్ల డాలర్ల కిలోమీటర్‌(మైలు) రాయిని దేశం 2007లో దాటింది.తదుపరి 2014లో రెండు లక్షల కోట్లు, 2025లో నాలుగు లక్షల కోట్లు దాటింది. 2032నాటికి పదిలక్షల కోట్ల డాలర్ల జిడిపి కలిగిన దేశంగా మారుతుందని కొందరు ఆర్థికవేత్తలు జోశ్యం చెప్పారు. వారి తర్కం ఏమిటి ? 2021లో మూడు లక్షల కోట్లకు విస్తరించింది. కేవలం నాలుగు సంవత్సరాల్లోనే 4.3లక్షల కోట్ల డాలర్లకు చేరింది. ప్రతి 18నెలలకు ప్రస్తుత వేగంలో ఒక లక్ష కోట్ల డాలర్లు పెరుగుతున్నది. ఇదే కొనసాగితే 2032 నాటికి 10లక్షల కోట్ల డాలర్లకు చేరుతుంది.


రానున్న కొద్ది సంవత్సరాల్లో మూడవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతున్నందుకు ఇప్పటి నుంచి సంబరాలు జరుపుకుంటున్న వారిని చూసి ఆర్థిక నిపుణుడు డి ముత్తుకృష్ణన్‌ ఉత్సవాలు జరుపుకోవాల్సినంత ఘనత ఏమి సాధించామని 2024లోనే ప్రశ్నించారు. జిడిపిలో ఏ స్థానంలో ఉన్నామన్నది కాదు తలసరి రాబడిలో ప్రపంచంలో మనం 140వ స్థానంలో ఉన్నామని, మనకంటే 139దేశాలు ముందున్నాయని గుర్తించాలని చెప్పారు.(తాజాగా 136 గనుక 135 ముందున్నాయి) పిపిపి ప్రకారం చూసినా మన స్థానం 119 అని చెప్పారు. పదేండ్లలో మన జిడిపి 105శాతం పెరిగిందని ఏ ఐఎంఎఫ్‌ చెప్పిందో అదే సంస్థ 2025 తలసరి జిడిపిలో 141వ స్థానం అని కూడా జోశ్యం చెప్పింది. దివాలా తీసిందని చెప్పిన శ్రీలంక 133, బంగ్లాదేశ్‌ 143, పాకిస్తాన్‌ 159, షీ జింపింగ్‌ ఏలుబడిలో కుప్పకూలిపోయిందని కొంత మంది చెప్పే చైనా 71వ స్థానంలో (తాజాగా 70) ఉందని కూడా ఐఎంఎఫ్‌ చెప్పింది. మన తలసరి రాబడి పదివేల డాలర్లకు చేరాలంటే కనీసం 30 సంవత్సరాలు కష్టపడి పని చేయాలని, దానికి అనుకూలమైన ఆర్థిక పరిస్థితులు ఉండాలని ముత్తు కృష్ణన్‌ చెప్పారు. చైనా తలసరి జిడిపి 2025లో 13,873 డాలర్లు, ఇప్పుడున్న మన 2,937 డాలర్ల నుంచి ఎదిగి ప్రధమ స్థానంలో ఉన్న మొనాకో 2,56,581( 2023 ప్రపంచ బ్యాంకు సమాచారం) లేదా డాలర్‌ దేవుడున్న అమెరికా 89,678(2025 ఐఎంఎఫ్‌) స్థాయికి, చివరికి పడకకుర్చీ మేథావులు చెబుతున్నట్లుగా అధిగమించే దూరం ఎంతో లేని చైనాను అయినా కనీసం అధిగమించాలంటే ఎంత సమయం పడుతుందో వేరే చెప్పనవసరం లేదు.


ప్రపంచ సవాళ్లు ఉన్నప్పటికీ నరేంద్రమోడీ నాయకత్వం కారణంగా ప్రపంచ వెలుగు దివ్వెగా భారత్‌ ముందుకు వచ్చిందని బిజెపినేత ప్రదీప్‌ బండారీ చెప్పిన మాటలు భజనరాయుళ్ల గళం తప్ప మరొకటి కాదు. పదకొండు సంవత్సరాలుగా వేసిన పునాదులే కారణమన్నారు. ఐరోపా దేశాలు, జపాన్‌ ఆర్థిక వ్యవస్థలు పెరుగుదల లేక గిడసబారిపోయాయి. రెండవ ప్రపంచయుద్ధానికి ముందు ఉన్న వలసలను కోల్పోయిన బ్రిటన్‌, ఫ్రాన్స్‌ మాజీ రాజుల వలే ఉన్నాయి. మిలిటరీలను నిషేధించిన కారణంగా అందుకు వెచ్చించే సొమ్మును పరిశోధనలకు మళ్లించి జర్మనీ, జపాన్‌, అమెరికా ఇచ్చిన దన్నుతో దక్షిణ కొరియా వేగంగా వృద్ధి చెందాయి. ఇప్పుడు వాటికి పరిమితి ఏర్పడిరది కనుకనే మనం ముందుకు వస్తున్నాం. ఒక నాడు మనకంటే వెనుకబడి ఉన్న చైనాతో తప్ప వాటితో పోల్చుకుంటే అవ్వతో వసంతమాడినట్లే ! అదేమంటే చైనా కమ్యూనిస్టు దేశమంటారు, మనది ప్రజాస్వామ్యం, స్వేచ్చ ఎక్కువ గనుక దాని కంటే ఎంతో ముందు ఎందుకు లేదు అంటే సమాధానం ఉండదు. ఒక ఐదు సంవత్సరాల పాటు ఐదులక్షల కోట్ల డాలర్ల గురించి ఊదరగొట్టారు. ఇప్పుడు పదిలక్షల కోట్ల గురించి చెప్పబోతున్నారు. 1950లో మన దేశంలో 20 కోట్ల మంది జనం ఉపాధి కోసం వ్యవసాయంపై ఆధారపడ్డారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సాగు భూమి ఎంత పెరిగింది, ఎంత తగ్గింది అన్న లెక్కలను పక్కన పెట్టి స్థిరంగా ఉందనుకున్నప్పటికీ అదే భూమి మీద 2023`24లో జనాభాలో 46.1శాతం మంది ఆధారపడుతున్నట్లు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే తెలిపింది. ఆరు సంవత్సరాల క్రితంతో పోల్చితే రెండు శాతం పెరిగారు. అంటే ఇప్పుడు 67 కోట్ల మంది పని చేస్తున్నారు.చైనాలో 24.1 శాతం లేదా 17.66 కోట్ల మంది(2023) పని చేస్తున్నారు. భూమి మీద ఆధారపడే వారు తగ్గటం అభివృద్ధి చెందిన దేశాల లక్షణం. వెనుకటికి ఒకడు మాది నూటొక్క అరకల వ్యవసాయం అని గొప్పలు చెప్పాడట. మీది అంటున్నావు ఎవరెవరికి ఎన్ని అంటే నాది ఒకటి మా అయ్యగారివి వంద అన్నాడట. జిడిపి కూడా అంతే !

Share this:

  • Tweet
  • More
Like Loading...

అమెరికా – చైనా ఒప్పందం : ఇరకాటంలో విశ్వగురువు, కల్లలైన భారత పారిశ్రామికవేత్తల కలలు !

25 Sunday May 2025

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Politics, USA

≈ Leave a comment

Tags

BJP, China, Donald trump, India-US trade, India’s manufacturing hopes, Narendra Modi Failures, US-China Tariff deal, Xi Jinping

ఎం కోటేశ్వరరావు

పరస్పరం లబ్ది పొందే విధంగా భారత్‌ మరియు అమెరికా మధ్య నిర్మాణాత్మకంగా వాణిజ్య చర్చలు జరుగుతున్నట్లు మన వాణిజ్యశాఖ మంత్రి పియూష్‌ గోయల్‌ నాలుగు రోజుల అమెరికా పర్యటన తరువాత శుక్రవారం నాడు ఎక్స్‌ పోస్టులో పేర్కొన్నారు. వెంటనే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఆపిల్‌ కంపెనీ భారత్‌లో గనుక ఉత్పత్తి కొనసాగిస్తే వాటి మీద 25శాతం పన్ను విధిస్తామని ప్రకటించాడు. ఒక రోజు ఆగి శామ్‌సంగ్‌ మీద కూడా అన్నాడు. అయినా సరే ఆ కంపెనీలు మనదేశంలో ఫోన్లు తయారీ చేస్తాయని చెబుతున్నారు. వెయ్యి డాలర్లకు యాపిల్‌ ఫోన్‌ తయారు చేస్తే 25శాతం చొప్పున 250 పన్ను చెల్లింపు, మరో 30డాలర్లు అసెంబ్లింగ్‌ ఖర్చు పోయినా అమెరికాలో తయారు చేసేదాని కంటే ఇంకా 280 డాలర్ల మేర లాభం ఉంటుంది గనుక ట్రంప్‌ను ఖాతరు చేయదని అంటున్నారు.మనం వాడుతున్న ఫోన్లలో ఒక్కో భాగం ఒక్కో దేశంలో తయారై వాటిని ఒక చోట చేర్చి మనం వాడే ఫోన్లుగా తయారు చేస్తారు. ఇది ఎక్కడ చౌక అయితే అక్కడికి ఏ కంపెనీ అయినా తరలిపోతుంది. అంటే ఆయా దేశాలు విడి భాగాలు నాణ్యం, చౌకగా తయారు చేయటాన్ని బట్టి వాటికి మార్కెట్‌ ఉంటుంది. అన్నీ ఒక దగ్గరకు చేర్చే ప్రక్రియసాధనాన్ని సరఫరా గొలుసు అంటున్నారు. పియూష్‌ గోయల్‌ అమెరికా వెళ్లటంతో ఆ పర్యటన మన దేశానికి శక్తినిస్తుందా ముప్పు తెస్తుందా అన్న సందేహాలు తలెత్తాయంటేనే అనుమానబీజం పడినట్లు. ఏం సాధిస్తారో చూద్దాం !

అమెరికా,చైనా నేతలు పన్నుపోరుకు తెరతీసినపుడు మనదేశంలోని పారిశ్రామిక, వాణిజ్యవేత్తలు గాలివాటు లాభాలే లాభాలు అని సంబరపడ్డారు. చైనా సరఫరా గొలుసు బద్దలవుతుందని, దాని స్థానంలో తాముంటామని అమెరికాతో వాణిజ్యంలో మరింత లబ్ది పొందుతామని కలలు కన్నారు. అయితే ఆ రెండు దేశాలు జెనీవా ఒప్పందం కుదుర్చుకోవటంతో కుదేలయ్యారు.దేశమంతా పహల్గాం దారుణం, తదనంతర పరిణామాలతో నిమగ్నం కావటంతో దీని గురించి మీడియా పెద్దగా పట్టించుకోలేదు. ఆశలు కల్పించటంలో అది కూడా తక్కువ తినలేదు గనుక తేలుకుట్టిన దొంగలా ఉంది. జెనీవా ఒప్పందం జనాల నిత్యజీవితంపై వెంటనే ప్రభావం చూపేది కానందున మన జనాలకూ పట్టలేదు. వాణిజ్యంలో మనదేశం అమెరికాకు ఎక్కువ ఎగుమతి చేస్తూ తక్కువ దిగుమతి చేసుకుంటోంది. రెండు దేశాలూ పరస్పరం పన్నులు లేకుండా ఒప్పందం చేసుకుంటాయనే ప్రచారం జరిగింది. దాని వలన అమెరికాకు ఎక్కువ లాభం తప్ప మనకు కాదు. దిగుమతుల ముప్పు లేకుండా అనేక వస్తువుల మీద పెద్ద మొత్తంలో పన్నులు వేస్తూ మన వాణిజ్య, పారిశ్రామిక సంస్థలకు ఒక రక్షణ గోడ కట్టాం. దాన్ని బద్దలు చేయాలని ట్రంప్‌ కోరుతున్నాడు. నరేంద్రమోడీ అందుకు అంగీకరించినా, నామమాత్రపు పన్నులు వేసినా మన కోళ్ల, పాడి పరిశ్రమలు, వ్యవసాయం వంటివి కుదేలు అవుతాయి. అక్టోబరులో అనుకున్నది జూలై రెండవ వారంలో ఒప్పందం కుదురుతుందనే వార్తలు వచ్చాయి గనుక అప్పటి వరకు వేచి చూద్దాం. రెండు ఆర్థిక అగ్రరాజ్యాలు ఒప్పందం కుదుర్చుకున్న తరువాత వస్త్రాలు,ఔషధ, ఎలక్ట్రానిక్స్‌ రంగాలలో మనదేశానికి ఉన్నట్లు భావిస్తున్న అవకాశాలు కుచించుకుపోయినందున వ్యూహాత్మక పునరాలోచన చేయాల్సి ఉందని పోలిసీ సర్కిల్స్‌ అనే మీడియా ‘‘ అమెరికాచైనా పన్నుల ఒప్పందం భారత ఉత్పత్తిదారుల ఆశలను కల్లలు చేసింది ’’ అనే పేరుతో చేసిన ఒక విశ్లేషణలో పేర్కొన్నారు.దాని సారాంశం ఇలా ఉంది. కొద్ది వారాలకు ముందు భారత ఎగుమతిదారులు ఉత్సాహంతో ఎగిరి గంతులు వేశారు, ఇప్పుడు నీరుగారిపోయారు. అమెరికా వస్తువుల మీద పది, చైనా వస్తువుల మీద 30శాతం పన్నుల విధింపుకు రెండు దేశాలు అంగీకరించాయి. దీంతో మన ఎగుమతిదార్ల లెక్కలు తారుమారయ్యాయి. అయితే మన వస్తువుల మీద విధిస్తున్న పదిశాతంతో పోలిస్తే చైనా సరకుల మీద 30శాతం ఉన్నందున మన ఎగుమతి అవకాశాలు ఇప్పటికీ సజీవంగానే ఉన్నాయని కూడా కొందరు భావిస్తున్నారు. మన దేశం నుంచి ఎగుమతి చేస్తే 20శాతం పన్నులు తక్కువగా ఉంటాయి గనుక వైద్య పరికరాలను తయారు చేసే పరిశ్రమలు భారత్‌కు రావచ్చని భావిస్తున్నారు. అయితే ఇది అమెరికాతో మనదేశం జరుపుతున్న చర్చల ఫలితాలను బట్టి ఆధారపడి ఉంటుంది. ఐఫోన్లను భారత్‌లో తయారు చేసి అమెరికాకు ఎగుమతి చేస్తే 25శాతం పన్ను విధిస్తామని ట్రంప్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.


చైనా ప్లస్‌ ఒకటి అనే విధానం కింద అనుసరించిన తీరు కూడా మిశ్రమ ఫలితాలే ఇచ్చాయి.వియత్నాం,థాయ్‌లాండ్‌, కంపూచియా వంటి దేశాలు ఎక్కువగా సంస్థలను ఆకర్షించటానికి కారణం అక్కడ మనకంటే ఖర్చులు తక్కువగా ఉండటం, సులభమైన విధానాలతో స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలే కారణం. ఆపిల్‌ ఫోన్ల తయారీలో తప్ప ఇతర రంగాలలో మనం పెద్దగా రాణించలేదు. జెనీవా ఒప్పందం తాత్కాలిక స్వభావం భవిష్యత్‌ అనిశ్చితిని ముందుకు తెచ్చింది.ఆఫ్రికా మార్కెట్‌లోకి ఇటీవల మన ఎగుమతిదార్లు చొచ్చుకుపోయారు, అయితే ఈ ఒప్పందం చైనాకు అనుకూలతను పునరుద్దరించింది. ఒప్పందంలో లేని అంశాలు భారత్‌కు అనుకూలమే అయినా అమెరికాతో కుదిరే వాణిజ్య ఒప్పందం మీద ఆధారపడి ఉంటుంది. ప్రపంచ ఉత్పత్తిదారుగా మారాలన్న లక్ష్యం అంత తేలిక కాదు. ఏప్రిల్‌ 25న ఇదే పొలిసీ సర్కిల్స్‌ చేసిన విశ్లేషణలో ఎంతో ఆశాభావం, అపరిమిత లాభాల గురించి చర్చించారు. చైనాపై ట్రంప్‌ ప్రకటించిన 145, 245శాతాల పన్నులు అమలు జరుగుతాయని అనేక మంది భావించారు.కౌంటర్‌ పాయింట్‌ రిసర్చ్‌ వేసిన అంచనా ప్రకారం 2026 నాటికి ప్రపంచ స్మార్ట్‌ ఫోన్ల తయారీలో చైనా వాటా 64 నుంచి 55కు, భారత్‌ 18 నుంచి 25లేదా 28శాతానికి పెంచుకుంటుందని పేర్కొన్నారు.ఆపిల్‌ కంపెనీ భారత్‌లో తన ఉత్పత్తి వాటాను 202627 నాటికి 20 నుంచి 35శాతానికి పెంచుకోనుందని కూడా పేర్కొన్నారు.(దీనికి పిఎల్‌ఐ స్కీము కింద ఇచ్చే రాయితీలు ప్రధాన కారణం, ఆ సొమ్ము అయిపోయిన తరువాత సంగతేమిటి ?) కానాలిస్‌ సమాచారం ప్రకారం 2024లో 79శాతం డెల్‌ లాప్‌టాప్‌లు చైనాలో ఉత్పత్తి కాగా వచ్చే ఏడాది నాటికి సగం ఉత్పత్తిని వియత్నాం నుంచి చేయాలని ఆ కంపెనీ, అదే విధంగా చైనాలో 85శాతం ఉన్న ఉత్పత్తిని హెచ్‌పి కంపెనీ తైవాన్‌, మెక్సికోలకు గణనీయంగా తరలించాలని చూస్తోంది.

చైనా ప్లస్‌ ఒకటి అనే విధానంలో వియత్నాం,థాయ్‌లాండ్‌, కంపూచియా, మలేసియాలతో పోలిస్తే మన దేశం పరిమితమైన విజయాన్ని సాధించిందని నీతి అయోగ్‌ పేర్కొన్నది. ఇనుము, ఉక్కు రంగంలో 2025 ఆర్థిక సంవత్సరం తొలి మూడు మాసాల్లో మన ఎగుమతులు 33శాతం తగ్గాయి, దీనికి చైనా సరఫరా ఎక్కువగా ఉండటంతో పాటు దిగుమతులు చేసుకొనే దేశాల్లో గిరాకీ కూడా తగ్గింది. చైనా వస్తువులపై 60శాతం పన్నులు ఉంటే భారత్‌ పోటీ పడే వీలు కలుగుతుందని కూడా నీతి అయోగ్‌ పేర్కొన్నది. కానీ ఇప్పుడు 30శాతం ఉన్నాయి, రానున్న రోజుల్లో తమ మీద భారం ఎక్కువ అనుకుంటే ట్రంప్‌ తగ్గించినా ఆశ్చర్యం లేదు. మన పరిస్థితి ఏమిటన్నది సమస్య.చైనా ఇప్పుడు మరింత లాభదాయకమైన వస్తు ఉత్పత్తి మీద కేంద్రీకరించింది. శ్రమశక్తి ఎక్కువగా ఉండే వాటిని క్రమంగా తగ్గిస్తున్నది. అయినా అలాంటి వాటిని అందిపుచ్చుకోవటంలో మనం వెనుకబడి ఉన్నాం. అప్పనంగా రావాలంటే ఏదీ మన దగ్గరకు రాదు. విషాదం ఏమిటంటే జిడిపిలో నాలుగో స్థానం, త్వరలో అమెరికా, చైనాలను అధిగమిస్తాం అన్న పోసుకోలు కబుర్లు చెబుతున్నారు. పదకొండు సంవత్సరాల మోడీ పాలన తరువాత అదీ నైపుణ్య వృద్ధి పేరుతో వేల కోట్లు ఖర్చు చేసిన తరువాత ప్రపంచంలో నైపుణ్య కార్మిక శక్తిలో 25వ స్థానంలో ఉన్నాం. అంటే అవకాశం వచ్చినా దాన్ని సద్వినియోగం చేసుకోలేని దుస్థితి. ఆపిల్‌ ఫోన్ల ఎగుమతి గురించి కేంద్ర పాలకులు పెద్దగా ప్రచారం చేస్తున్నారు. అమెరికాచైనా ఒప్పందం మన ఆశల మీద నీళ్లు చల్లిందని బిబిసి వ్యాఖ్య పేర్కొన్నది. ఇప్పుడు చైనా వస్తువుల మీద 30శాతం, మన వస్తువుల మీద 27 శాతం అమెరికా పన్ను విధిస్తున్నది. దీంతో చైనా నుంచి మన దేశానికి వస్తాయని చెప్పిన పరిశ్రమలు, కంపెనీలు, పెట్టుబడులు ఇప్పుడు వస్తాయా ? గత పదకొండు సంవత్సరాల నుంచి చెబుతున్న కబుర్లు ఆచరణలో కనిపించటం లేదు. చైనాకు ప్రత్యామ్నాయంగా ఎదిగే అవకాశాలున్నాయని చెప్పేవారు కొనసాగిస్తూనే ఉన్నారు. వాటిని పాలకులు మన జనాలకు రంగుల కలగా చూపుతున్నారు. మోడీ విధానాలు దీర్ఘకాలంలో ఫలితాలు ఇస్తాయంటున్నారు. పదకొండు సంవత్సరాలలో మన పారిశ్రామిక ఉత్పత్తి జిడిపిలో 15శాతం చుట్టూ తిరుగుతున్నది తప్ప పెరగటం లేదు, పిఎల్‌ఐ పధకం పరిమితంగానే ప్రయోజనం కలిగించింది. నిజానికి యుపిఏ హయాంలో ఎక్కువగా ఉంది. కుండలో కూడు కదలకూడదు పిల్లోడు మాత్రం దుడ్డులా మారాలి అన్నట్లుగా మన వ్యవహారం ఉంది. ఇది నేను అంటున్నది కాదు. ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గోయంకా చెప్పిందే. పరిశోధన మరియు అభివృద్ధి రంగానికి జిడిపిలో మనదేశం 0.64శాతం ఖర్చు చేస్తుంటే చైనా 2.68, అమెరికా 3.5 శాతం చివరికి చైనాలోని ఒక్క హువెయి సంస్థ చేస్తున్న మొత్తం భారత్‌లో ప్రభుత్వ, ప్రైవేటు రంగ ఖర్చు కంటే ఎక్కువ అన్నారు. పరిస్థితి ఇలా ఉంటే సాంకేతికంగా మనం వెనుకబడక ఎక్కడ ఉంటాం అని ప్రశ్నించారు.


రాజకీయంగా నరేంద్రమోడీ తన ప్రధాని పదవీ కాలంలో ఇంతటి విపత్కర పరిస్థితిని ఎప్పుడూ ఎదుర్కోలేదంటే అతిశయోక్తి కాదు. ఇంటా బయటా ఉన్న వంది మాగధుల కారణంగా విశ్వగురువుగా వర్ణితమైనందున ఇప్పుడు అదే ఇరకాటాన్ని తెచ్చింది. ఉదాహరణకు భారత్‌`పాకిస్తాన్‌ మధ్య తానే మధ్యవర్తిగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదిర్చానని ట్రంప్‌ ప్రకటించటాన్ని అంగీకరిస్తే గురు పీఠాన్ని స్వయంగా తక్కువ చేసుకున్నట్లు అవుతుంది. దాంతో పాకిస్తాన్‌ వైపు నుంచి వచ్చిన ప్రతిపాదనను అంగీకరించామని ప్రధమగణాలతో చెప్పించారు. అయినా ట్రంప్‌ పదే పదే అదే చెప్పాడు. చివరకు విధిలేక పాకిస్తాన్‌తో తలెత్తిన మిలిటరీ పరిస్థితి గురించి అమెరికా నేతలతో ఒప్పందానికి ముందు మాట్లాడినట్లు మన విదేశాంగశాఖ మెల్లగా అంగీకరించింది. పాక్‌పై మనదేపైచేయిగా ఉన్నపుడు ఏం సాధించి అంగీకరించారన్న ప్రశ్న మోడీని మరింత ఇరకాటంలో పెట్టింది. దుర్మార్గానికి పాల్పడిన వాడు ప్రాణభీతితో రాజీ అనగానే అంగీకరించాలా ? పాకిస్తాన్‌ ఉగ్రవాదులను అప్పగించలేదు, పట్టిస్తామని చెప్పలేదు, అసలు మద్దతు ఇచ్చినట్లు అంగకరించలేదు. ఈ విషయాలన్నీ అడుగుతారని పార్లమెంటు సమావేశం జరపటానికే నిరాకరించారు అపర ప్రజాస్వామికవాది. ప్రజాస్వామ్య దేవాలయం అని స్వయంగా వర్ణించి మొక్కిన పార్లమెంటులో మాట్లాడేందుకు భయపడుతున్నారని జనం అనుకుంటున్నారు. ఎంతటి విపత్కర స్థితి !

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనా అస్త్రాల గురించి ఎవరేమంటున్నారు, ఆయుధాల దిగుమతిలో భారత్‌ అగ్రస్థానం,రాఫేల్‌ మార్కెట్‌కు ముప్పు !

18 Sunday May 2025

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, Europe, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Prices, RUSSIA, USA, WAR

≈ Leave a comment

Tags

BJP, Chinese weapons capability matters, India-Pak conflict, India’s Rafale ordeal, Military Matters, Narendra Modi Failures, SIPRI


ఎం కోటేశ్వరరావు


పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా మన మిలిటరీ జరిపిన ఆపరేషన్‌ సిందూర్‌లో ఉపయోగించిన ఆయుధాలు, పాకిస్తాన్‌ ప్రయోగించిన వాటి గురించి దేశంలో, ప్రపంచ వ్యాపితంగా చర్చ జరుగుతోంది. ఉద్రిక్తతల సమయాల్లో వెలువడే అభిప్రాయాలు పూర్తిగా నిజమే లేదా పూర్తిగా అవాస్తమే అని భావించినా పప్పులో కాలేసినట్లే. ఆయుధదాడులు కొన్ని ప్రాంతాలకే పరిమితం అయితే దానికంటే ప్రమాదకరమైన తప్పుడు వార్తల ప్రచారదాడి ఎక్కువగా జరుగుతోంది. అందువలన వినదగునెవ్వరు చెప్పిన…. అన్నట్లుగా వేగపడకుండా నిదానంగా వాస్తవాలు తెలుసుకోవాలి.ఈ క్రమంలో సంక్షిప్తంగా కొన్ని అభిప్రాయాలను చూద్దాం.వాటితో ఎవరైనా విబేధించవచ్చు, ఏకీభవించవచ్చు. క్షిపణుల తయారీ మన శాస్త్రవేత్తల ఘనత తప్ప రాజకీయనేతలది కాదు. మన దేశం ఆయుధాల ఎగుమతి గురించి గోరంతలను కొండంతలు చేస్తూ నరేంద్రమోడీ భజన చేస్తున్నారు. ఇదీ ప్రచారదాడే !


చైనా బజార్ల పేరుతో అమ్మిన ఢల్లీి నకిలీ సరుకునంతా చైనాకు అంటగట్టి తూలనాడిన రోజులున్నాయి. కొన్ని వస్తువుల నాణ్యత ప్రశ్నార్దకంగా ఉండవచ్చు.వాటిని కొనాలని చైనా ఎవరినీ బలవంతం చేయలేదు. ఇప్పుడు దాని ఆయుధాల నాణ్యత గురించి చర్చ జరుగుతోంది. చైనా తయారీ నూతన ఆయుధాలను ఏ యుద్ధం లేదా ఘర్షణల్లో ప్రత్యక్షంగా వాడని మాట వాస్తవం. అమెరికా తన ఆయుధాలకు ఇరాన్‌, ఇరాక్‌, ఇతర యుద్ధాలను ప్రయోగశాలలుగా చేసుకున్నది. అందుకని అనేక మందికి చైనా వాటి సామర్ధ్యం మీద అనుమానాలు ఉండటం సహజం. పాకిస్తాన్‌ వాటిని మనదేశం మీద ప్రయోగించిన తరువాత అనుకూలంగా వ్యతిరేకంగా విశ్లేషణలు వెలువడుతున్నాయి.తాజాగా కొత్త పల్లవి అందుకున్నారు. చైనా ఆయుధాల వెల తక్కువేగానీ, వాటి నిర్వహణ, మరమ్మతులు ఖర్చు ఎక్కువ అంటూ కొందరు అమెరికా, ఐరోపా ధనికదేశాల ఆయుధాల నిపుణులు చాణక్యనీతిని ప్రయోగిస్తున్నారు.

పాకిస్తాన్‌ ఉపయోగించిన చైనా ఆయుధాలను చూసిన తరువాత వాటి సామర్ధ్యంపై నెలకొన్న ఆందోళనకు ముగింపు పలికినట్లు కనిపిస్తోందని అకడమిక్‌ గులాం అలీ పేర్కొన్నారు.‘‘ రాఫేల్‌ కూల్చివేత : ప్రపంచ వేదికపై చైనా ఆయుధాలకు ఒక మలుపు ? ’’ అని సింగపూర్‌ ప్రెస్‌ హోల్డింగ్స్‌ అనే సింగపూర్‌ కంపెనీ నిర్వహిస్తున్న ‘‘ థింక్‌చైనా ’’ అనే పత్రిక(వెబ్‌) 2025 మే 16వ తేదీన ప్రచురించిన విశ్లేషణలో ఉంది.కొన్ని అంశాల సారం ఇలా ఉంది. పశ్చిమ దేశాలు అమ్మే అయుధాలకు షరతులు ఉంటాయి, చైనా ఎలాంటి ఆంక్షలు పెట్టదు. ఎలా కావాలంటే అలా ఉపయోగించుకోవచ్చు. వెల తక్కువ, పశ్చిమదేశాల వాటితో పోలిస్తే నాణ్యత తక్కువని భావించటానికి ప్రధాన కారణాలలో ఇది ఒకటి.1979 తరువాత నేరుగా చైనా ఆయుధాలను ఉపయోగించిన దాఖలా లేదు గనుక నాణ్యత గురించి అనుమానం. అందుకే అమెరికా, ఇతర పశ్చిమ దేశాల ఆయుధాలకు ప్రాధాన్యత ఇస్తారు.మేనెల ఏడవ తేదీ చైనా జెట్‌ విమానాలకు అమర్చిన చైనా క్షిపణులతో పాకిస్తాన్‌ ఐదు భారత జెట్‌లను కూల్చివేసింది గనుక ఈ ఉదంతం చైనా ఆయుధాల గురించి ఉన్న అభిప్రాయాన్ని గణనీయంగా దెబ్బతీసింది.దీంతో మార్కెట్లో చైనా వాటా పెరిగింది. రంగంలో ఒక రాఫెల్‌ జెట్‌ను కూల్చివేయటం దాని చరిత్రలో ఇదే తొలిసారి, అదే విధంగా చైనా జె10, పిఎల్‌15క్షిపణికి కూడా ఇదే ప్రధమం. మూడు రాఫెల్‌ జెట్‌లను కూల్చివేసినట్లు పాకిస్తాన్‌ ప్రకటించగానే వాటి తయారీ సంస్థ దసాల్ట్‌ వాటాల ధర ఆరుశాతం తగ్గింది, మరోఐదుశాతం తగ్గవచ్చని భావిస్తున్నారు. చైనా జెట్‌ల తయారీ కంపెనీ ఎవిఐసి ధర ఒక్కరోజే 17.05శాతం, మరోకంపెనీ 6శాతం, మొత్తంగా చైనా ఆయుధ కంపెనీల వాటాలు 1.6శాతం పెరిగాయి. ఈ పరిణామం అనేక ప్రాంతాల్లో చైనా పలుకుబడి, విశ్వసనీయత పెరగటానికి తోడ్పడుతుంది.


స్విడ్జర్లాండ్‌ వెబ్‌ పోర్టల్‌ ఎన్‌జెడ్‌జెడ్‌.సిహెచ్‌ మే 16వ తేదీన ప్రచురించిన విశ్లేషణకు ‘‘ పాకిస్తాన్‌పై భారత్‌ దాడి సమయంలో ఫ్రెంచి రాఫేల్‌ కూల్చివేత పశ్చిమదేశాలకు పాఠం చెబుతుంది ’’ అని పెట్టారు.పాకిస్తాన్‌, దాని ఆక్రమణలో ఉన్న కాశ్మీరుపై భారత్‌ జరిపినదాడి సందర్భంగా చైనా నిర్మిత జెట్‌తో భారత్‌ కనీసం ఫ్రాన్సు నిర్మించిన ఒక ఆధునిక జెట్‌ను కోల్పోయింది. ఈ నష్టం తన స్వంత మిలిటరీ వ్యూహాలను పరిశీలించుకొనేందుకు ఐరోపాకు ఒక మేల్కొలుపు. ఈ ఉదంతం పశ్చిమదేశాల మిలిటరీ సాంకేతికతల సామర్ధ్యం గురించి ఆందోళన కలిగించింది.ఐరోపా వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి రాఫేల్‌ మీద చాలా ఎక్కువగా ఆధారపడి ఉంది. పశ్చిమదేశాల వైమానిక దళాలు చైనా, రష్యా రక్షణ వ్యవస్థలకు వ్యతిరేకంగా తమ సన్నద్దతను మెరుగుపరచుకోవాలి.పరిస్థితికి తగిన జాగరూకత లేకపోతే ఆధునిక పరిజ్ఞానం మీదే ఆధారపడితే కుదరదు.అమెరికా, ఇజ్రాయెల్‌ మాదిరి ఎలాంటి నష్టం లేకుండా చూసుకొనేందుకు ముందస్తు సూచన లేకుండా భారత్‌ కూడా చేసింది, భారత వైమానికులు తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొన్నారు. సాంకేతికంగా ఉన్నతంగా ఉన్నామనే భావన మీద ఆధారపడి పాకిస్తాన్‌ సామర్ధ్యాలను భారత్‌ తక్కువ అంచనా వేసింది. మరోవైపు చైనా జె10 జెట్‌ మరియు పిఎల్‌15 క్షిపణి సామర్ధ్యం గురించి వైమానిక దళం తక్కువ అంచనా వేసింది.


డిఫెన్స్‌ ఇండస్ట్రీ యూరోప్‌ అనే వెబ్‌సైట్‌ ‘‘ కాశ్మీరు వివాదంలో భారత రాఫేల్‌ ఫైటర్‌ జెట్‌ కూల్చివేత ’’ అనే శీర్షికతో విశ్లేషణ చేసింది. భారత్‌ ఒక రాఫెల్‌ జెట్‌ను కోల్పోయినట్లు పేర్కొన్నది. అనధికారికంగా ఫ్రెంచి అధికారులు నిర్ధారించారు, అమెరికా వర్గాలు కూడా చెప్పాయని తెలిపింది. డిఫెన్స్‌ సెక్యూరిటీ ఆసియా అనే వెబ్‌సైట్‌ మే 15వ తేదీన వెల్లడిరచిన విశ్లేషణకు ‘‘ రాఫేల్‌ కూల్చివేత ? బిలియన్ల డాలర్ల ఒప్పందంపై ఇండోనేషియా పున:సమీక్షలో పడటంతో ఫ్రెంచి జెట్‌ పరువుపై దాడి ’’ అని పేరు పెట్టింది.మూడు భారత రాఫేల్‌ విమానాలను కూల్చినట్లు పాకిస్తాన్‌ ప్రకటించటంతో ఇండోనేషియా ఉన్నత స్థాయి రక్షణ అధికారులు రాఫేల్‌ యుద్ధ సామర్ధ్యం గురించి సమీక్ష చేస్తున్నట్లు తెలిసింది. ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి వెలువడిన ప్రకటనల ఆధారంగా నిర్దారణలకు రాకూడదని నిపుణులు హెచ్చరించినట్లు కూడా దానిలో ఉటంకించారు.ఎంతో అనుభవం ఉన్న అమెరికా తయారీ ఎఫ్‌16,18,22 రకాలను కూడా కూల్చివేశారని కూడా గుర్తు చేశారు. ఇటీవల జరిపిన పత్రికా గోష్టిలో భారత ఎయిర్‌ మార్షల్‌ ఎకె భారతి ఒక ప్రశ్నకు సమాధానంగా ‘‘ మేం యుద్ధ తరహా పరిస్థితిలో ఉన్నాం పోరులో నష్టాలు భాగంగా ఉంటాయి ’’ అన్న మాటలు పరోక్షంగా విమానాలను కోల్పోయినట్లుగా అంగీకరించినట్లే అని కొందరు విశ్లేషించారు. విమర్శలు వచ్చినప్పటికీ రాఫెల్‌ ప్రపంచంలో ఇప్పుడున్న వాటిలో మంచి వాటిలో ఒకటి అని కొందరు మద్దతు ఇచ్చినట్లు కూడా ఈ విశ్లేషణలో పేర్కొన్నారు. ఇండోనేషియా సామాజిక మాధ్యమంలో వస్తున్న వ్యాఖ్యలను కూడా ప్రస్తావించింది. ‘‘ జె10జెట్లతో దాన్ని ఎదుర్కోవచ్చని, అదెంతో చౌకని తెలుసుకొని ఒక ఇండోనేషియన్‌గా రాఫేల్‌ జెట్లను కొనుగోలు చేస్తున్నందుకు విచారపడుతున్నాను. మా అధ్యక్షుడు కొన్ని జె10 జెట్లు, ఇతర చైనా మిలిటరీ పరికరాలను కొనుగోలు చేస్తారని భావిస్తున్నాను.’’ అన్న ఎక్స్‌ పోస్టును మచ్చుకు ఉటంకించింది. ‘‘ భారత్‌ మరియు పాకిస్తాన్‌ వివాదం తరువాత చైనా ఆయుధాలకు పెరిగిన విశ్వసనీయత ’’ అనే శీర్షికతో మే 13వ తేదీన బ్లూమ్‌బెర్గ్‌ మీడియా ఒక విశ్లేషణ వెలువరించింది.ఇదేమీ చైనా అనుకూల సంస్థ కాదు. చైనాలో తయారయ్యే ఆయుధాలు నాశిరకం అనే అభిప్రాయం ఉన్నవారు మరోసారి మదింపు చేసుకోవాలని పేర్కొన్నది. తైవాన్‌ ఏర్పాటు చేసిన మేథోసంస్థ పరిశోధకుడు షు హసియావో హువాంగ్‌ మాట్లాడుతూ ‘‘ పిఎల్‌ఏ(చైనా మిలిటరీ) యుద్ధ సామర్ధ్యాల గురించి మరోసారి మదింపు చేసుకోవాల్సి ఉంది. తూర్పు ఆసియాలో అమెరికా మోహరించిన వైమానిక శక్తికి చైనా దగ్గరగా వస్తుండవచ్చు లేదా అధిగమించనూ వచ్చు ’’ అన్నట్లు బ్లూమ్‌బెర్గ్‌ పేర్కొన్నది. పాకిస్తాన్‌కు అందచేసిన తరువాత దాడుల్లో తొలిసారిగా వినియోగించిన చైనా జె10సి విమానం సత్తాను రుజువు చేసుకుంది, ఇప్పటి వరకు వాటిని తైవాన్‌ జలసంధిలో పహారాకు మాత్రమే మోహరించారు. పేద దేశాలకు చైనా ఆయుధాలు ఆకర్షణగా ఉంటాయని సింగపూర్‌లోని రాజారత్నం అంతర్జాతీయ అధ్యయనాల సంస్థ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ జేమ్స్‌ చెప్పటాన్ని విశ్లేషణలో ఉటంకించారు. చైనా ప్రభుత్వ సంస్థలు ఆయుధ ఎగుమతులకు సంబంధించి వివరాలను వెల్లడిరచనప్పటికీ స్టాక్‌హోంలోని సిప్రి సంస్థ అంచనా ప్రకారం గడచిన ఐదు సంవత్సరాల్లో చైనా ఎగుమతులు మూడిరతలకు పైగా పెరిగాయని బ్లూమ్‌బెర్గ్‌ పేర్కొన్నది.


చైనా ఆయుధాలు నాణ్యమైనవి కాదనే వారు కొన్ని ప్రశ్నలకు జవాబులు చెప్పాల్సివుంది. గడచిన మూడు దశాబ్దాల్లో చైనా ఆయుధ దిగుమతులను తగ్గించుకొని తానే స్వంతంగా తయారు చేసుకుంటున్నది. అత్యంత ఆధునిక ఆయుధాలను తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్‌కు అమెరికా విక్రయిస్తున్నది, పక్కనే ఉన్న జపాన్‌, దక్షిణ కొరియాలలో సైనిక స్థావరాలను ఏర్పాటు చేసుకొన్న అమెరికా అత్యాధునిక ఆయుధాలను చైనాకు వ్యతిరేకంగా మోహరించింది, దక్షిణ చైనా సముద్ర ప్రాంతాన్ని వివాదం గావిస్తూ తనకు అనుకూలమైన దేశాలను సమీకరిస్తున్నపుడు సత్తా ఏమిటో రుజువుకాని తన ఆయుధాల మీద ఆధారపడేంత అమాయకంగా చైనా ఉంటుందా అన్నది ప్రశ్న. 2014లో దిగుమతుల్లో మనదేశం, సౌదీ అరేబియా తరువాత చైనా 5.1శాతంతో ఉంది. ఇప్పుడు 1.8శాతానికి తగ్గిపోయాయి, మొదటి పది దేశాల్లో దాని పేరు కనిపించదు.


ప్రపంచంలో ఆయుధాల దిగుమతుల్లో మూడు సంవత్సరాలుగా యుద్ధంలో ఉన్న కారణంగా ఉక్రెయిన్‌ ప్రధమ స్థానంలో ఉంది. ఏటా మనదేశం వేలాది కోట్ల ధనాన్ని వేరేదేశాలకు సమర్పించుకోవటం కంటే స్వయంగా రూపొందించుకోవటం ఆర్థికంతో పాటు ఆయుధాలకోసం ఇతరుల మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు. నరేంద్రమోడీ నాయకత్వంలో మనదేశం ఆయుధాల ఎగుమతుల రంగంలో ప్రవేశించిందని కొంత మంది ఆహా ఓహో అంటున్నారు.కొన్ని ఆయుధాలను తయారు చేస్తున్నమాట నిజం, దిగుమతులు, ఎగుమతుల్లో ఎక్కడున్నామో అతిశయోక్తులు లేకుండా చెప్పాల్సి ఉంది. ఆయుధాలను దిగుమతి చేసుకొనే పది అగ్రశ్రేణి దేశాల జాబితా నుంచి 199094 తరువాత తొలిసారిగా 2024లో చైనా పేరు తొలగించారు.అంతగా స్వంత తయారీలో ఉంది. గత ఐదు సంవత్సరాలుగా ప్రపంచ ఆయుధాల ఎగుమతుల్లో 5.9శాతంతో చైనా నాలుగవ స్థానంలో ఉంది. మూడవ స్థానానికి చేరవచ్చని చెబుతున్నారు. మనం మాత్రం పదేండ్ల నుంచి దిగుమతుల్లో మొదటి స్థానంలోనే కొనసాగుతున్నాం. మన మేకిన్‌ ఇండియా కార్యక్రమం తీరిది. గతేడాది అంటే 202425లో మన దేశం ఎగుమతి చేసిన రక్షణ ఉత్పత్తుల విలువ రు.23,622 కోట్లని(2.76బిలియన్‌ డాలర్లు) రక్షణశాఖ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు, దీనిలో పదిహేనువేల కోట్లు ప్రయివేటు రంగం నుంచే ఉన్నాయి. 2029 నాటికి రు.50వేల కోట్ల లక్ష్యాన్ని నిర్ణయించారు. మనదేశం నుంచి ఆయుధాలు కొనుగోలు చేసే దేశాలకు రుణాలు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇది ఎవరికి ఎక్కువగా ఉపయోగపడుతుందో చెప్పనవసరం లేదు. మన మిలిటరీ ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్న దేశాలలో ఆర్మీనియా, అమెరికా, ఫ్రాన్సు అగ్రస్థానంలో ఉన్నాయి.ప్రపంచమంతటికీ ఆయుధాలను అమ్మే అమెరికా మనదగ్గర కొనేవాటిని తయారు చేసుకోలేని స్థితిలో ఉందా, కానే కాదు, వాటిని చౌకగా ఉత్పత్తి చేస్తున్నాం గనుక దానికి లాభం. హైటెక్‌ ఉత్పత్తులను అది అధికలాభాలకు మనవంటి దేశాలకు అమ్ముతున్నది.మనం ఆ స్థాయికి చేరటానికి ఇంకా చాలా సమయం పడుతుంది. పదేండ్లలో ఆయుధ దిగుమతుల్లో మన వాటా 9.5 నుంచి 8.3శాతానికి మాత్రమే తగ్గింది. వినియోగవస్తువుల ఉత్పత్తిలో చైనాను పక్కకు నెట్టి ప్రపంచ ఫ్యాక్టరీగా మారతామని చెప్పారు. అది జరగలేదు. రక్షణ ఉత్పత్తుల్లో స్వయం సమృద్ధి సాధిస్తే ఇతర దేశాల వత్తిళ్లకు గురికావాల్సిన అవసరం ఉండదు. పోనీ ఈ విషయంలోనైనా ముందడుగు పడిరదా అంటే ఇంకా చేయాల్సింది చాలా ఉందని అంకెలు చెబుతున్నాయి.పాకిస్తాన్‌ మీద జరిగిన దాడుల తరువాత తన ప్రతిష్టను పెంచుకోవటం మీదే ఎక్కువ శ్రద్ద పెడుతున్నట్లు కనిపిస్తోంది !

Share this:

  • Tweet
  • More
Like Loading...

పాకిస్తాన్‌కు ఐఎంఎఫ్‌ రుణం : ఒక్కరూ మనవెనుక రాలే, దేశ పరువు తీశారు, అన్నీ తెలిసి నరేంద్రమోడీ జనాన్ని మభ్యపెట్టారా ?

11 Sunday May 2025

Posted by raomk in BJP, Current Affairs, Economics, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, WAR

≈ Leave a comment

Tags

IMF, IMF loan, IMF Loan to Pakistan, India Protest to IMF, Narendra Modi Failures

ఎం కోటేశ్వరరావు


పాకిస్తాన్‌కు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్‌) రెండు ఖాతాలలో 350 కోట్ల డాలర్లు ఇచ్చేందుకు అంగీకరించింది. దీన్లో తక్షణమే వందకోట్ల డాలర్లు ఇస్తారు. వాషింగ్టన్‌ డిసిలో శుక్రవారం నాడు జరిగిన బోర్డు సమావేశం ఆమోదం తెలిపింది. ఈ మంజూరును అడ్డుకొనేందుకు సర్వ ప్రయత్నాలు చేస్తామని ఎన్ని కబుర్లు చెప్పినా వాటిని ఖాతరు చేయకుండా రుణం ఖరారైంది. మనకు మద్దతుగా ఒక్కరంటే ఒక్క ఇతర డైరెక్టర్లు రాలేదు. ప్రపంచంలో మన పలుకుబడికి ఇది నిదర్శనమా ? పహల్గాం ఉగ్రదాడి, తదనంతర పరిణామాలు, పర్యవసానాల్లో పాక్‌ను అష్టదిగ్బంధనం చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వాటిలో ఒకటిగా ఐఎంఎఫ్‌ నిధులు అందకుండా అడ్డుకుంటామన్న ప్రచారం తెలిసిందే. ఐఎంఎఫ్‌, దాని పని తీరు గురించి తెలిసిన వారు దేశంలో నెలకొన్న పరిస్థితులలో ప్రభుత్వం వృధా ప్రయాసకు లోనవుతున్నదని చెబితే మీ సొమ్మేం పోయింది, ఏదో ప్రయత్నం చేస్తున్నారుగా తప్పేముంది అనే వారు కొందరైతే మరి కొందరు దేశద్రోహులుగా చూసే తీరు ఉండటంతో ఎవరూ నోరు మెదపలేదని చెప్పవచ్చు. చిత్రం ఏమిటంటే పెద్ద మీడియా విశ్లేషకులు, సంపాదకులు కూడా పాఠకులను తప్పుదారి పట్టించే కథనాలను అల్లారు. సరే నరేంద్రమోడీ అండ్‌కో వచ్చిన ప్రతి అవకాశాన్నీ తమ ప్రతిష్టకు, ఓట్లు దండుకొనేందుకు ఎంత మేరకు ఉపయోగపడుతుందనే కోణంలో చూడటం కొత్తేమీ కాదు. ఇప్పుడూ జనాన్ని మభ్యపెట్టి అదే ప్రయత్నం చేశారు, భంగపడ్డారు. ఒక తర్కం ఎలా ఉందంటే కాల్పుల విరమణ షరతుల్లో భాగంగా వంద కోట్ల డాలర్ల రుణాన్ని పాకిస్తాన్‌కు ఐఎంఎఫ్‌ ఇచ్చిందా అంటూ ఒక మీడియా వార్తకు శీర్షిక పెట్టారు. భారత్‌ దాడుల్లో తమ మిలిటరీ ఆస్తులు ధ్వంసమయ్యాయి గనుక తమకు రుణం ఇస్తే కాల్పుల విరమణ పాటిస్తామని పాకిస్తాన్‌ షరతు పెట్టి ఉండవచ్చని, అదే షరతుతో రుణం ఇచ్చి ఉండవచ్చన్నది ఒక భాష్యం. రుణానికి లంకె పెట్టి పాకిస్తాన్‌ మీద అమెరికా వత్తిడి తెచ్చిందని కూడా సెలవిచ్చారు. ఇది జరిగినదానికి విరుద్దం.


తమకు రుణం ఇవ్వకుండా చూసేందుకు భారత్‌ ప్రయత్నించినప్పటికీ ఐఎంఎఫ్‌ అంగీకరించటం పట్ల పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ సంతృప్తి వెల్లడిరచినట్లు పిటిఐ వార్తా సంస్థ పేర్కొన్నది. మన ప్రధాని నరేంద్రమోడీ నుంచి ఎలాంటి ప్రకటనా రాలేదు. అయితే ఆర్థికశాఖ ఒక ప్రకటన చేస్తూ ఉగ్రవాదానికి ఊతమిస్తున్నందుకు రుణాన్ని బహుమతిగా ఇచ్చారని, ప్రపంచ మానవాళికి ప్రమాదకర సంకేతాన్ని పంపారని, నిధులు ఇచ్చే సంస్థలు, దాతలకు గౌరవాలకు భంగకరమని, ప్రపంచ విలువలను తక్కువగా చూసిందని విమర్శించింది.పాకిస్తాన్‌కు రుణమిస్తే ఆ మొత్తాన్ని సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేందుకు ఉపయోగిస్తుందని, గతంలో ఇచ్చిన రుణాలను దుర్వినియోగం చేసిందని మన ప్రభుత్వం గట్టి అభ్యంతరాలను వ్యక్తం చేసింది.ఓటింగ్‌ సందర్భంగా మన నిరసన నమోదు చేసి ఓటింగ్‌ను బహిష్కరించింది.


పాక్‌ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న మాట వాస్తవం.దేశ విదేశీ రుణ భారం 2024 నాటికి 130 బిలియన్‌ డాలర్లకు చేరింది. ప్రపంచ బ్యాంకు 48 బిలియన్‌ డాలర్లు ఇచ్చింది, 2025 మార్చి నెలాఖరుకు ఐఎంఎఫ్‌ ఇచ్చిన రుణాలు 6.2బిలియన్‌ డాలర్లు ఉన్నాయి. అనేక దేశాల నుంచి చేబదులు మాదిరి సాయం పొందుతున్నది. తిరిగి కోలుకొనేందుకు, నిర్వహణకు అవసరమైన నిధి(ఆర్‌ఎస్‌ఎఫ్‌) పేరుతో 140 కోట్ల డాలర్లు, మరోఖాతా కింద 210 కోట్ల డాలర్లను ఇచ్చేందుకు సూత్రప్రాయంగా 2024 సెప్టెంబరు 25న ఐఎంఎఫ్‌ ఆమోదించింది.మార్చి నెల 25న అధికారుల స్థాయిలో ఐఎంఎఫ్‌, పాకిస్తాన్‌ రుణం గురించి ఒప్పందానికి వచ్చాయి. ఏడువందల కోట్ల డాలర్లను వంతుల వారీగా ఇస్తారు. 2025 మే నెల తొమ్మిదిన వాటి గురించి సమీక్షించి రానున్న 37నెలలో వాటిని విడుదల చేసేందుకు అంగీకరించింది. మొత్తం 700 కోట్ల డాలర్ల రుణం కావాలని పాకిస్తాన్‌ కోరింది.గతేడాది ఆగస్టు నాటికి 9.4బిలియన్‌ డాలర్లు ఉన్న విదేశీమారక ద్రవ్య నిల్వలు ఏప్రిల్‌ చివరి నాటికి 10.3బి.డాలర్లకు పెరిగాయి, వాటిని జూన్‌ నాటికి 13.9 బిలియన్లకు పెంచాలన్నది లక్ష్యం.ఆర్‌ఎస్‌ఎఫ్‌ నిధులతో ప్రకృతి వైపరీత్యాలు తలెత్తినపుడు పునరుద్దరణ, చార్జీల వసూలుతో సహా నీటిని మరింత పొదుపుగా వాడేందుకు చర్యలు, కేంద్రం, రాష్ట్రాల మధ్య సమన్వయం, సమాచార వ్యవస్థల మెరుగుదల వంటి అంశాలు చేపట్టాల్సి ఉంది. సవాళ్ల వాతావరణం ఉన్నప్పటికీ స్థూల అర్థిక స్దిరత్వం పునరుద్దరణ జరుగుతున్నదని ఐఎంఎఫ్‌ పేర్కొన్నది. వ్యవసాయ ఆదాయంపై పన్ను విధింపుతో సహా అనేక సంస్కరణలను చేపట్టినట్లు తెలిపింది.సకాలంలో విద్యుత్‌ ఛార్జీల సవరణ ద్వారా రుణభారం తగ్గిందని, పాకిస్తాన్‌ రిజర్వుబాంకు గట్టి చర్యల కారణంగా రికార్డు స్థాయికి ద్రవ్యోల్బణం తగ్గిందని, వ్యవస్థాగత సంస్కరణలు చేయాలని పేర్కొన్నది. నక్షత్రకుడి మాదిరి జనానికి వ్యతిరేకమైన షరతులతో పాకిస్తాన్‌ రుణాలు తీసుకున్నది. మనదేశంలో మాదిరి ప్రభుత్వ రంగ సంస్థలలో పెట్టుబడుల నిలిపివేత, మూసివేత, తెగనమ్మటం, వినియోగదారుల నుంచి సేవలకు ఛార్జీలు, విద్యుత్‌ ఇతర రంగాలలో సంస్కరణల వంటివి వాటిలో ఉన్నాయి.


ఐఎంఎఫ్‌ నిబంధనల ప్రకారం ప్రతి దేశానికి ఓటింగ్‌ సంఖ్య ఉంటుంది. ఆ మేరకు ఇతర సందర్భాలలో ఓటు వేయవచ్చు. రుణాల మంజూరు విషయంలో ఏకాభిప్రాయమేగాని ఓటింగ్‌ ఉండదు. అంగీకారం లేని దేశం దూరంగా ఉండటం తప్ప వ్యతిరేక ఓటు వేసేందుకు అవకాశం లేదు. తాజాగా మనదేశం అదే చేసింది. ఐఎంఎఫ్‌లో ఓటింగ్‌ బలాబలాల విషయాన్ని చూద్దాం. అమెరికా 16.49, జపాన్‌ 6.14, చైనా 6.08. మొత్తం 25 మంది డైరెక్టర్లలో ఈ మూడు దేశాలకు ఒక్కొక్క డైరెక్టర్‌ నిరంతరం ఉంటారు. మిగిలిన 22 మందిని దేశాలతో కూడిన 22 బృందాలు వంతుల వారీ ఎన్నుకుంటాయి. ఉదాహరణకు బంగ్లాదేశ్‌,భూటాన్‌,శ్రీలంక, భారత్‌ కలసి ఒక బృందం. ఈ దేశాల నుంచి ఎవరో ఒక మాత్రమే ఉంటారు.వీటన్నింటి ఓటింగ్‌ బలం 3.05 మాత్రమే. మొత్తం ఓట్లు 49,91,063 కాగా చైనాకు 3,06,281 కాగా మన బృంద దేశాలన్నింటికీ కలిపి ఉన్నది 1,53,610 కాగా మన దేశానికి 1,32,596, బంగ్లాదేశ్‌ 12,118, శ్రీలంక 7,240, భూటాన్‌ 1,656 ఉన్నాయి. వేరే గ్రూపులో ఉన్న పాకిస్తాన్‌కు 21,762 ఉన్నాయి. ప్రస్తుతం మన దేశం నుంచి పరమేశ్వరన్‌ అయ్యర్‌ తాత్కాలిక డైరెక్టర్‌గా ఉన్నారు.


పాక్‌పై గతంలోనే ఒక అంచనాకు వచ్చిన ఐఎంఎఫ్‌ రుణం ఇవ్వకుండా ఉంటుందని ఎవరైనా అనుకుంటే పొరపాటే. ఉగ్రవాదులకు మద్దతు, శిక్షణ ఇవ్వటం, ఇతర దేశాల మీదకు వదలటం ఇస్లామాబాద్‌కు కొత్త కాదు. తాము శిక్షణ ఇచ్చినట్లు ఆ దేశ మంత్రే స్వయంగా చెప్పాడు. అయినప్పటికీ దశాబ్దాలుగా ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌ రుణాలు, గ్రాంట్లు ఇస్తూనే ఉన్నాయి. ఉగ్రవాదానికి వాటికి లంకె పెట్టలేదు.ఒక్క పాకిస్తానే కాదు, ఏ దేశానికీ అలాంటి షరతులేదు. అలాంటి అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలనే నిబంధన ఉండి ఉంటే అసలు ఏ దేశానికీ రుణం పొందే అర్హత, అవకాశం ఉండదు. ఏదో ఒక ఉల్లంఘనకు పాల్పడినట్లు ఆరోపణ లేదా విమర్శలకు గురికాని దేశం ఒక్కటంటే ఒక్కటి లేదు. పహల్గాం ఉగ్రదాడితో నిమిత్తం లేకుండానే ముందే చెప్పినట్లు నెల రోజుల ముందే అధికారుల మధ్య కుదిరిన ఒప్పందానికి లాంఛన ప్రాయంగా ఆమోద ముద్రవేయటం తప్ప మే తొమ్మిది సమావేశానికి మరొక అజెండా లేదు. ఈ విషయాలన్నీ మన విధాన నిర్ణేతలు, పరిశీలకులకు తెలియవా ? తెలిసి కూడా జనంలో ఉన్న మనోభావాలను సొమ్ము చేసుకొనేందుకు, వ్యతిరేకిస్తున్నట్లు నాటకం ఆడారా ? ఉగ్రవాదానికి ఊతమిస్తున్న దాయాదిని ఒంటరి పాటు చేసే క్రమంలో మిగిలిన దేశాలు కలసి వచ్చినపుడు ఒకటి రానపుడు వేరే ఎత్తుగడలను అనుసరించాల్సి ఉంటుంది. అందుకోసం తెరవెనుక ప్రయత్నాలు చేశారా ?2019లో పుల్వామా దాడికి ప్రతిగా మనం బాలాకోట్‌పై మెరుపుదాడి చేశాము. అప్పటి నుంచి లేదా అంతకు ముందు జరిగిన దాడుల నాటి నుంచి ఐఎంఎఫ్‌ లేదా ప్రపంచ బ్యాంకు, ఇతర అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు ఇస్లామాబాద్‌కు రుణాలు ఇస్తే వాటిని ఉగ్రవాదులకు మళ్లిస్తారని మన దేశం చేసిన ప్రయత్నాలు ఏమైనా ఉన్నాయా అంటే మీడియాలో అలాంటి ఛాయలు లేవు. అంతర్గతంగా వత్తిడి తెచ్చారేమో మనకు తెలియదు కదా అని అమాయకంగా చెప్పేవారు ఉండవచ్చు. ఆ ప్రకారం చూసినా నిజమే అనుకుంటే ఒక్కదేశం కూడా మన మాటకు గౌరవమిచ్చి మనతో పాటు కలసి రాలేదు. మన నిరసన తెలిపేందుకు బహిష్కరించామని ఇప్పుడు కొంత మంది చెబుతున్నారు. దానికి ముందు అడ్డుకుంటామని, మరేదో చేస్తామనే ప్రచార ఆర్భాటం ఎందుకు, ఆ మాటలు నమ్మి అనేక మంది నరేంద్రమోడీకి ప్రపంచంలో నిజంగానే అంత పలుకుబడి ఉందని అనుకున్నారు. ఎందుకంటే కొద్ది రోజుల పాటు ఉక్రెయిన్‌ యుద్దాన్ని ఆపారని, చైనా, అమెరికాలను మన చుట్టూ తిరిగేట్లు చేశారనే ప్రచారాలు, భజనలూ తెలిసిందే. మన అభిప్రాయాలను ఖాతరు చేయని ఐఎంఎఫ్‌ నుంచి మన దేశం నిరసనగా తప్పుకుంటుందా ? అవమానాన్ని దిగమింగి కొనసాగుతుందా ? ఖ్యాతి అయినా అపఖ్యాతి అయినా నరేంద్రమోడీ ఖాతాలోనే పడతాయి మరి !

Share this:

  • Tweet
  • More
Like Loading...

డోనాల్డ్‌ ట్రంప్‌రుద్దిన వాణిజ్య పోరు : చైనా గెలిస్తే అమెరికా పరిస్థితి ఏమిటి ?

23 Wednesday Apr 2025

Posted by raomk in Asia, BJP, CHINA, Current Affairs, Economics, Europe, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, UK, Uncategorized, USA

≈ Leave a comment

Tags

China, Donald trump, Narendra Modi Failures, Trade talks, TRADE WAR, Xi Jinping

ఎం కోటేశ్వరరావు

ప్రపంచం మీద తాను రుద్దిన వాణిజ్య పోరు డోనాల్డ్‌ ట్రంప్‌ పదవికి గండం తేనుందా ? దాన్ని వ్యతిరేకిస్తున్న అమెరికన్లు సహిస్తారా ? ఈ పోరులో చైనా గెలిస్తే అమెరికా పరిస్థితి ఏమిటి ? ఇలా పరిపరి ఆలోచనలు ప్రారంభమయ్యాయి. రెండు దిగ్గజాల మధ్య కేంద్రీకృతమైన వివాదాన్ని ఆసరా చేసుకొని లబ్దిపొందాలని కొన్ని దేశాలు చూస్తున్నాయి. తమ ప్రయోజనాలను ఫణంగా పెట్టి ఒప్పందాలు కుదుర్చుకుంటే అలాంటి దేశాలపై తాము గట్టి ప్రతి చర్యలు తీసుకుంటామని సోమవారం నాడు చైనా హెచ్చరించింది. వాణిజ్య పోరులో విజేతలు ఉండరన్నది సాధారణ అభిప్రాయం, అది నిజమేనా ? ఇప్పుడున్న పరిస్థితి ఏమిటి ? మన దేశం బ్రిటీష్‌ వలస పాలనలోకి వెళ్లక ముందు చేనేత వస్త్రాలకు ఎంతో ప్రసిద్ధి. బ్రిటన్‌తో సహా అనేక దేశాలకు అవి ఎగుమతి అయ్యేవి. అలాంటి వాటిని బ్రిటన్‌ పారిశ్రామిక విప్లవం మింగేసింది. ఇప్పుడు ట్రంప్‌ దిగుమతి పన్ను విధించినట్లుగా మన చేనేత వస్త్రాల మీద నాటి బ్రిటన్‌ కూడా పన్ను విధించి అడ్డుకుంది, చౌకగా తయారయ్యే తన మిల్లు వస్త్రాలను మనదేశంలో కుమ్మరించింది. మన మార్కెట్‌ను ఆక్రమించింది. పత్తి ఎగుమతి దేశంగా మార్చింది. నాడు భారత్‌ పరాధీన దేశం, వ్యతిరేకించిన వారు లేరు. ఇప్పుడు అమెరికా పన్నులతో చైనా వస్తువులను అడ్డుకోవాలని చూస్తోంది. చైనా సర్వసత్తాక స్వతంత్ర దేశం, అమెరికాను ఢీ అంటే ఢీ అనే స్థితిలో ఉంది, ఆట కట్టించాలని చూస్తోంది.చిత్రం ఏమిటంటే అసలైన దేశభక్తులం అని చెప్పుకుంటున్న మన పాలకులు మా ఆయుధాలు, వస్తువులు కొంటారా లేదా అని అమెరికా కొరడా రaళిపిస్తే కంటి చూపులేదు, నోట మాట లేదు.ఏం జరుగుతోంది మహాత్మా ఓ మహాత్మా !


డోనాల్డ్‌ ట్రంప్‌ను సంతుష్టీకరించేందుకు తమ ప్రయోజనాలను ఫణంగా పెట్టి ఒప్పందాలు చేసుకొనే దేశాల మీద చర్యలు తప్పవని చైనా తీవ్ర హెచ్చరిక చేసింది.తమతో వాణిజ్యం చేసే దేశాలు చైనా మీద ఆంక్షలు విధించాలని, దానికి ప్రతిగా అలాంటి వాటికి పన్నులను మినహాయిస్తామని అమెరికా చెబుతున్నదని, సంతుష్టీకరణ శాంతిని, రాజీ గౌరవాన్ని తీసుకురాదని చైనా పేర్కొన్నది.అమెరికా చర్యలు చర్మం ఇమ్మని పులిని కోరటంగా వర్ణించింది. ప్రస్తుతం జపాన్‌, దక్షిణ కొరియా, భారత్‌ మరికొన్ని దేశాలు ట్రంప్‌ యంత్రాంగంతో చర్చలు జరుపుతున్నాయి. ఉపాధ్యక్షుడు జెడి వాన్స్‌ ప్రస్తుతం ఢల్లీి పర్యటనలో ఉన్నాడు. చైనా వస్తువులపై 145శాతంగా విధించిన పన్ను, కొన్ని వస్తువులపై 245శాతం వరకు పెంచుతామని అమెరికా బెదిరించింది. తమ మీద విధించిన పన్నుల కారణంగా తీసుకోలేమంటూ అమెరికా కంపెనీ బోయింగ్‌ జెట్‌ను చైనా తిప్పి పంపింది. అమెరికాతో కలసి చైనాను దెబ్బతీయాలని మనదేశంలో కొందరు యాంకీల ఏజంట్లు నూరిపోస్తున్నారు.చైనా సరఫరా గొలుసులో మనం చేరి దాని స్థానాన్ని ఆక్రమించాలని కొందరు చెబుతున్నారు. నిజానికి స్వంత సత్తాతో ఆస్థాయికి చేరాలని ఎవరైనా కోరుకోవటం తప్పు కాదు. కుక్కతోక పట్టుకొని గోదావరిని ఈదలేరు, అలాగే అమెరికా వెంట నడచిన ఏ దేశమూ చరిత్రలో బాగుపడిన దాఖలా లేదు. కాసేపు దీని గురించి పక్కన పెట్టి వాణిజ్య పోరు గురించి జరుగుతున్న మధనం ఎలా ఉందో చూద్దాం. అమెరికా తాను చేస్తున్న ప్రతిదీ సరైనదే అనుకుటుంది కానీ సమస్య ఏమిటంటే ట్రంప్‌ ప్రతినిర్ణయం తప్పుగా తేలుతోంది.ఏప్రిల్‌ ఐదున జనం 20లక్షల మంది వీధుల్లోకి రాగా 19వ తేదీన మరోసారి పెద్ద ఎత్తున రాజరికం లేదు, రాజులేడు అంటూ నినదించారు. రెండువందల యాభై సంవత్సరాల క్రితం 1775 ఏప్రిల్‌ 19న బ్రిటన్‌ రాజరికానికి వ్యతిరేకంగా అమెరికన్లు పోరు ప్రారంభించిన రోజది. చైనా కమ్యూనిస్టులను అణచివేయాలని చూసింది అమెరికా. అయితే లాభాల కోసం అదే చైనా మార్కెట్‌ను ఉపయోగించుకోవాలనే ఎత్తుగడతో కమ్యూనిస్టు చైనాను భద్రతా మండలిలో శాశ్వత దేశంగా ఆమోదించింది.తరువాత కూడా ఒక వైపు లాభాలు పొందుతూనే మరోవైపు చైనా ఎదగకుండా కేవలం తనమీదే ఆధారపడే ఒక ఎగుమతిదేశంగా పరిమితం కావాలని చూసింది. తియన్మెస్‌ మైదానంలో విద్యార్ధుల ప్రదర్శనలు, హాంకాంగ్‌లో స్వాంత్య్రం పేరుతో జరిగిన ప్రదర్శనలు, తైవాన్‌ వేర్పాటు వాదం వెనుక దాని హస్తం గురించి తెలిసిందే. మొత్తంగా చెప్పాలంటే గత ఐదు దశాబ్దాలలో అమెరికా అనుసరించిన ప్రతిప్రతికూల విధానమూ చైనాను మరింతగా పటిష్టపరిచాయి తప్ప బలహీనపరచలేదు, దీని అర్ధం కొన్ని తాత్కాలిక సమస్యలూ, ఎదురుదెబ్బలూ లేవని కాదు. డోనాల్డ్‌ ట్రంప్‌ చర్యలతో భౌగోళిక రాజనీతిలో చైనా స్థాయి మరింత బలపడుతుందని అమెరికాను ఆర్థికంగానూ, రాజకీయంగా దాటిపోతుందని కమ్యూనిస్టు వ్యతిరేకులు వాపోతున్నారంటే అతిశయోక్తి కాదు.


చిత్రం ఏమిటంటే అమెరికన్లు, వారి చెప్పుల్లో కాళ్లు పెట్టి నడవాలని చూసే కాషాయ తాలిబాన్ల ఆలోచన ఒకే విధంగా ఉంది. గాల్వన్‌ ఉదంతం జరిగినపుడు మనం గనుక చైనా నుంచి దిగుమతులను నిలిపివేస్తే డ్రాగన్‌ మన కాళ్ల దగ్గరకు వస్తుందని చెప్పినట్లే ఇప్పుడు ట్రంప్‌ గాంగ్‌ అంటోంది. చైనా మనకు చేసే ఎగుమతులతో పోల్చితే మనం చైనాకు ఐదోవంతు మాత్రమే ఎగుమతి చేస్తున్నాం, అందువలన మన దిగుమతులు ఆగిపోతే నష్టం వారికే అని అమెరికా విత్తమంత్రి స్కాట్‌ బెసెంట్‌ చెప్పాడు. అమెరికా దిగుమతులు దాని పెద్ద బలహీనత తప్ప బలం కాదు.2018లో ఇదే ట్రంప్‌ చైనా మీద వాణిజ్య యుద్ధం ప్రారంభించాడు.వారి వస్తువుల మీద ఆధారపడటం నిలిపివేయాలన్నాడు. జరిగిందేమిటి ? గత ఏడు సంవత్సరాల్లో అమెరికాకు చైనా ఎగుమతులు 19.2 నుంచి 14.7శాతానికి మాత్రమే తగ్గాయి.పూర్తిగా నిలిపివేయాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు.జి 7 దేశాలకు చైనా ఎగుమతులు 2000 సంవత్సరంలో 48శాతం జరగ్గా 2024లో 30శాతానికి తగ్గాయి. ఇంత జరిగినా గత పదేండ్లలో ప్రపంచ ఎగుమతుల్లో చైనా వాటా 13 నుంచి 14శాతానికి పెరిగింది. దీని అర్ధం ఏమిటి ? చైనా తన సరకులకు ఎప్పటి నుంచో ప్రత్నామ్నాయ మార్కెట్లను వెతుక్కుంటోంది.చైనా అనే చెరువు మీద అమెరికా అలిగితే ఎండిపోయేది అమెరికన్లకే.ఎందుకంటే ప్రస్తుతం అది దిగుమతి చేసుకుంటున్న వస్తువులను తయారు చేసుకోవాలంటే దశాబ్దాలుగాకపోయినా సంవత్సరాలు పడుతుందని చెబుతున్నారు. అప్పటిదాకా చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న టాయిలెట్‌ పేపర్‌ వంటి వాటి దిగుమతి ఆపివేస్తారా ? ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాలంటే సరఫరా చేసే స్థితిలో ఎన్ని ఉన్నాయి ? అమెరికా బోయింగ్‌ జెట్‌ విమానాలు గాకపోతే చైనా ఐరోపా ఎయిర్‌బస్‌లను దిగుమతి చేసుకుంటుంది, లేదూ స్వయంగా తానే పూర్తిగా సమకూర్చుకొనేందుకు ఇప్పటికే ప్రారంభించిన కార్యక్రమాన్ని మరింతవేగవంతం చేస్తుంది. ఇతర వస్తువులను వేరే దేశాల నుంచి తెచ్చుకుంటుంది. మిషిగాన్‌ స్టేట్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ జాసన్‌ మిలెర్‌ పోగుచేసిన సమాచారం ప్రకారం ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే లిథియమ్‌ బ్యాటరీలు, ఎయిర్‌ కండీషనర్లు, వంటపాత్రల్లో 70, స్మార్ట్‌ ఫోన్లు, వంటగది పరికరాలు, బొమ్మల్లో 80, సూర్యరశ్మి పలకల్లో 90శాతాల చొప్పున చైనా తయారు చేస్తున్నది. కార్లు, ఫోన్లు, అనేక మిలిటరీ పరికరాలకు కీలకంగా అవసరమైన అపురూప ఖనిజాలు, లోహాలు కూడా చైనా దగ్గర గణనీయంగా ఉన్నాయి.

సకల దేశాలూ తన వస్తువులనే కొనాలని చైనా ఎవరినీ దేబిరించే స్థితిలో లేదు. విదేశాలకు అవసరమైన వాటిని కావాలనుకున్నవారికి ఉత్పత్తి చేస్తున్నది, మార్కెట్‌లేకపోతే నిలిపివేస్తుంది, నూటనలభై కోట్ల తనజనాభాకు అవసరమైన వాటి మీద కేంద్రీకరిస్తుంది.ఇప్పటికే ఆప్రక్రియ ప్రారంభమైంది. ఏండ్ల తరబడి సంపాదించిన వాణిజ్య మిగులులో కొంత భాగం సబ్సీడీగా ఇస్తే అంతర్గత మార్కెట్‌ ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుంది. అమెరికా నుంచి దిగుమతి చేసుకొనే సోయా,జొన్నలు, మొక్క జొన్నలను ఎక్కడి నుంచైనా దిగుమతి చేసుకోవచ్చు.పశ్చిమ దేశాల మీద ఆధారపడే రంగాలను గుర్తించి స్వయం పోషకత్వం సాధించేందుకు బీజింగ్‌ పూనుకుంది. దాన్లో భాగంగానే హరిత ఇంథనం, వ్యవసాయం, సాంకేతిక పరిజ్ఞానం, సెమీకండక్టర్ల రంగాలలో భారీ మొత్తాలను ఖర్చు చేస్తున్నది. విపరీత పరిస్థితులలో కూడా జాతీయ ఆర్థిక రంగం సాధారణ కార్యకలాపాలను సాగించే విధంగా చూడాలని అధ్యక్షుడు షీ జింపింగ్‌ విధాన నిర్ణేతలను కోరాడు. యుద్ధం అన్న తరువాత ఓడిన వారికే కాదు విజేతలకూ దెబ్బలు తగులుతాయి, నష్టాలు సంభవిస్తాయి, వాణిజ్య యుద్ధమూ అంతే.


ఎదురుదాడిలో భాగంగా అమెరికాకు ఎగుమతి అవుతున్న అపురూప ఖనిజాల ఎగుమతులను చైనా నిషేధించింది. అవి జలాంతర్గాములు, ఫైటర్‌ జెట్ల తయారీలో కీలకంగా ఉంటాయి.తన అంబుల పొదిలో ఉన్న అస్త్రాలను అవసరాన్ని బట్టి బయటకు తీస్తున్నది.ఇప్పటికే బోయింగ్‌ విమానాల కొనుగోలు నిలిపివేసింది, కొన్ని కంపెనీలను నిషేధిత జాబితాలో చేర్చింది.యాపిల్‌,గూగుల్‌, డ్యూపాంట్‌్‌, టెస్లా వంటి కంపెనీలు తరువాత వరుసలో ఉన్నాయి.జపాన్‌ తరువాత భారీ మొత్తంలో డాలర్ల నిల్వలున్న దేశం చైనా. వాటి నుంచి అమెరికాకు 760 బిలియన్‌ డాలర్ల మేర అప్పులిచ్చింది. ట్రంప్‌ పిచ్చిపనులు కొనసాగిస్తే ఆ బాండ్లను ఒక్కసారిగా విక్రయిస్తే అమెరికాలో వడ్డీ రేట్ల పెరుగుదల, ద్రవ్య సంక్షోభానికి దారి తీస్తుందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇంకా ఇలాంటి ఆర్థిక పరమైన దెబ్బతీసే పద్దతులను చైనా పరిశీలిస్తున్నది.అమెరికా దగ్గర కూడా కొన్ని ఆయుధాలు లేకపోలేదు. ఐరోపా, ఆసియాలో తన మిత్రదేశాలను చైనాపైకి ఉసిగొల్పేందుకు పూనుకుంది. అయితే ప్రతికూల పన్నుల విధింపులో ఏ దేశాన్నీ వదలని కారణంగా అవన్నీ జతకట్టటం సందేహమే. తమ కోసం అన్ని దేశాలూ కాస్త నొప్పి భరించాల్సిందే అంటున్నాడు ట్రంప్‌. ఎవరి సంగతి వారు చూసుకోవాలనే రక్షణాత్మక వైఖరులు పెరుగుతున్న తరుణంలో ఎంత మేరకు ఇతర దేశాలు అంగీకరిస్తాయో తెలియదు. అయినప్పటికీ ముందే చెప్పుకున్నట్లు ఇతర దేశాలను చైనా సోమవారం నాడు ముందస్తుగా హెచ్చరించింది. మారిన పరిస్థితులను ట్రంప్‌ గమనిస్తున్నట్లు లేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిపిన సర్వేల్లో మెక్సికో, కెనడా, ఐరోపా దేశాల మీద పన్నులు విధించటాన్ని వ్యతిరేకించినప్పటికీ చైనా మీద దాడిని 56శాతం మంది సమర్ధించినట్లు సిబిఎస్‌ తెలిపింది.కమ్యూనిస్టు వ్యతిరేకతను ఎక్కించుకున్న వారు సహజంగానే చైనా మీద దాడిని అంగీకరిస్తారు. కానీ అదే ట్రంప్‌ ఎన్నికల్లో చేసిన వాగ్దానాలేమిటి ?ద్రవ్యోల్బణం, ధరలను, పన్నుల భారం తగ్గిస్తానని చెప్పాడు. గద్దె నెక్కగానే విముక్తి పేరుతో ఎడాపెడా పన్నులు విధింపు ప్రకటన చేయగానే అమల్లోకి రాక ముందే ధరలు పెరిగి జనం కొనుగోళ్లకు ఎగబడ్డారా లేదా ? కొత్తగా అన్న వస్త్రాలు వస్తాయనుకుంటే ఉన్న వస్త్రాలను ఊడగొట్టినట్లుగా భరించలేని భారాలను మోపితే జనం సహిస్తారా ? ఇప్పటికే రెండుసార్లు లక్షలాది మంది వీధుల్లో ప్రదర్శనలు చేశారు. అందుకే తేడా వచ్చేట్లు ఉందని ఆలోచించుకోవటానికి మూడు నెలల పాటు పన్నుల పెంపుదల పదిశాతానికే పరిమితం చేసి మిగతా వాటిని వాయిదా వేయాల్సి వచ్చింది. గతంలో మాదిరి ధరలు, నిరుద్యోగం పెరుగుదల సంభవించవచ్చనే హెచ్చరికలు వెలువడ్డాయి.ట్రంప్‌ మొరటుగా ముందుకు పోతాడా తెలివి తెచ్చుకొని వెనక్కు తగ్గుతాడా అన్నది చూద్దాం !

Share this:

  • Tweet
  • More
Like Loading...

మరింత ముదిరిన వాణిజ్య పోరు : చైనా, అమెరికాల్లో ముందు ఓడేది ఎవరు ? మోడీది స్థితప్రజ్ఞతా లేక లొంగుబాటా ?

11 Friday Apr 2025

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, Europe, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Prices, USA

≈ Leave a comment

Tags

BJP, China, Donald trump, EU, Narendra Modi Failures, Retaliatory tariffs on Indian goods, Tariff Fight, Trade war Expanding, Xi Jinping


ఎం కోటేశ్వరరావు


కేసు ఓడిన వారు కోర్టులో ఏడుస్తారు, గెలిచిన వారు ఇంట్లో ఏడుస్తారనే లోకోక్తి తెలిసిందే. అంటే గొడవ పడి కోర్టుకు ఎక్కితే ఇద్దరూ నష్టపోతారని అర్ధం, అలాగే వాణిజ్య పోరులో విజేతలెవరూ ఉండరని నెత్తీ నోరూ కొట్టుకుంటున్నా ఎవరూ వినటం లేదు. డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రారంభించిన వాణిజ్యపోరు 2.0లో ముందు ఓడేది అమెరికానా లేకా చైనా వారా అన్నది కొందరి మీమాంస. మొగ్గు అమెరికావైపే కనిపిస్తున్నది, ఏమైనా జరగవచ్చు. బస్తీమే సవాల్‌ అంటూ ప్రపంచం మీద తొడగొట్టింది ట్రంప్‌. దానికి ప్రతిగా చూసుకుందాం రా అంటూ మీసం మెలివేస్తున్నది చైనానేత షీ జింపింగ్‌. అయినను పోయి రావలె హస్తినకు అన్నట్లుగా ట్రంప్‌తో రాయబారాలు, బేరాలు చేసినప్పటికీ కుదరకపోవటంతో చేసేదేముంది మనమూ గోదాలోకి దిగుదాం అని ఐరోపా సమాఖ్య ప్రకటించింది. కొంత మందికి దిక్కుతోచక నోట మాట రావటం లేదు. మన విషయానికి వస్తే దానికి స్థిత ప్రజ్ఞత అని ముద్దు పేరు పెట్టి నరేంద్రమోడీకి ఆపాదించి సామాజిక మాధ్యమంలో ఆకాశానికి ఎత్తుతున్నారు. చైనా ప్రతిసవాలును షీ జింపింగ్‌ ఆవేశంగా వర్ణిస్తున్నారు.మోడీని కొందరు గోపి అంటుంటే 56 అంగుళాల ఛాతీకీ ఏమైందని అనేక మంది విస్తుపోతున్నారు. సాధారణ సమయాల్లో పౌరుషం, వీరత్వం గురించి మీసాలు మెలేయటం, తొడగొట్టటాలు కాదు, ఓడతామా గెలుస్తామా అన్నదీ కాదు, పరీక్షా సమయం వచ్చినపుడు ఏం చేశారనేదే గీటురాయి. పృధ్వీరాజ్‌ను ఓడిరచేందుకు పరాయి పాలకులతో చేతులు కలిపి ద్రోహానికి మారుపేరుగా తయారైన జయచంద్రుడు బావుకున్నదేమీ లేదు, చివరికి వారి చేతిలోనే చచ్చినట్లు చరిత్ర చెబుతున్నది.


అనేక ఆటంకాలు, ప్రతిఘటనలు, కుట్రలు, కూహకాలను ఎదుర్కొంటూ ప్రపంచ అగ్రరాజ్యానికి పోటీగా ఎదుగుతున్నది చైనా. 2024లో అమెరికా జిడిపి 29.2లక్షల కోట్లు కాగా చైనా 18.9లక్షల కోట్లతో ఉండగా వృద్ధి రేటు 2.8, 5శాతం చొప్పున ఉన్నాయి. అంటే త్వరలో అమెరికాను అధిగమించనుంది. పిపిపి పద్దతిలో ఇప్పటికే చైనా అగ్రస్థానంలో ఉంది. ఇప్పుడు దానికి డోనాల్డ్‌ ట్రంప్‌ పెద్ద పరీక్ష పెట్టిన మాట నిజం. చైనా వస్తువుల మీద 145శాతం పన్నులు విధించిన ట్రంప్‌కు అతనికంటే ఘనడు ఆచంట మల్లన అన్నట్లు అమెరికా న్యాయమూర్తి ఒకడు 400శాతం విధించి కాళ్ల దగ్గరకు తెచ్చుకోవాలని సలహా ఇచ్చాడు.జపాన్‌ సామ్రాజ్యవాదుల ఆక్రమణకు,కొరియాలో అమెరికా సేనలకు వ్యతిరేకంగా పోరాడిన చైనా కమ్యూనిస్టు పార్టీ వారసుడు షీ జింపింగ్‌. బ్రిటీష్‌ వారికి వ్యతిరేకంగా జరిగిన పోరులో పాత్రలేకపోగా లొంగిపోయి సేవ చేసుకుంటామని లేఖలు రాసి ఇచ్చిన వారి వారసుడు నరేంద్రమోడీ. అందువలన అమెరికా సామ్రాజ్యవాదం, దానికి ప్రతినిధిగా ఉన్న ట్రంప్‌ను వ్యతిరేకించటంలో ఆ తేడా ఉండటం సహజం.
ఇది రాసిన సమయానికి చైనా వస్తువుల మీద పెంటానిల్‌ పన్ను 20శాతంతో కలిపి అమెరికా 145శాతం పన్ను విధించగా ప్రతిగా 125శాతం విధించినట్లు చైనా ప్రకటించింది. పోరు రెండు దేశాలకే పరిమితమైంది. ప్రపంచ వాణిజ్య సంస్థలో చైనా కేసును కూడా దాఖలు చేసింది. చైనాను దుష్టశక్తిగా అమెరికా చూపుతున్నది.ఈ పోరు ప్రపంచ, అమెరికా ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీస్తుందని బడా వాణిజ్య సంస్థల హెచ్చరిక, తక్షణమే చర్చలు జరపాలని అమెరికా`చైనా వాణిజ్య మండలి పిలుపు, చైనా వైపు నుంచి చర్చలకు చొరవ ఉండదని నిపుణుల అభిప్రాయం, తన అమ్ముల పొదిలోని అస్త్రాలన్నింటినీ చైనా మోహరిస్తున్నది, బీజింగ్‌ను వంటరి చేసేందుకు అనేక దేశాల మీద సుంకాలను రద్దు చేసిన ట్రంప్‌, అమెరికాను వ్యతిరేకించే శక్తులను కూడగడుతున్న చైనా. మార్కెట్లలో అనిశ్చితిని చూస్తే ఇప్పటికే నష్టం జరిగినట్లు కనిపిస్తోంది.


‘‘మీరు అమెరికాను కొడితే మా అధ్యక్షుడు ట్రంప్‌ మరింత గట్టిగా కొడతాడు ’’ అని అధ్యక్ష భవన మీడియా అధికారిణి కరోలిన్‌ లీవిట్‌ ప్రకటించారు. పెద్ద పెద్ద అరుపులకు, ఉడుత ఊపులకు భయపడే రకం కాదు మేం అంటూ తాపీగా చైనా ప్రకటన. ఆకాశం ఊడిపడదంటూ అధికార పత్రిక పీపుల్స్‌ డైలీ వ్యాఖ్య. అమెరికా మార్కెట్ల మీద ఆధారపడటాన్ని తగ్గించుకుని అంతర్గత మార్కెట్‌ను విస్తరిస్తున్నామని పేర్కొన్నది. అయితే చర్చలకు ద్వారాలు మూయలేదని కూడా తెలిపింది. తొలిసారి 2018లో ట్రంప్‌ వాణిజ్య పోరును ప్రారంభించిన నాటి నుంచి చైనా తన అస్త్రాలన్నింటినీ అవసరాల మేరకు ప్రయోగిస్తున్నది. అమెరికా నుంచి దిగుమతులను తగ్గించింది, ఎగుమతులను నియంత్రిస్తున్నది.అమెరికా కంపెనీలను నిషేధిత జాబితాలో చేరుస్తున్నది.కొన్నింటి మీద నియంత్రణలను అమలు చేస్తున్నది. విలువైన ఖనిజాలను అమెరికాకు అందకుండా చూస్తున్నది. ‘‘ అమెరికాకు వ్యతిరేకంగా బీజింగ్‌ తన అమ్ముల పొది మొత్తాన్ని ఇప్పుడు వినియోగిస్తున్నది.వారు బంకర్‌(దాడుల నుంచి తట్టుకొనే భూ గృహం) నిర్మిస్తున్నారు, నేనే గనుక షీ జింపింగ్‌ను అయితే నేడు డోనాల్డ్‌ ట్రంప్‌ కంటే మరింత సౌకర్యవంతంగా ఉన్నట్లు భావిస్తా ’’ అని అమెరికా అట్లాంటిక్‌ కౌన్సిల్‌కు చెందిన మెలాని హార్ట్‌ వ్యాఖ్యానించాడు.


మూడు నెలల పాటు తాను ప్రకటించిన పన్నుల యుద్ధాన్ని వాయిదా వేస్తున్నట్లు డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటన దేనికి సూచన అని పండితులు చర్చలు చేస్తున్నారు. చైనాకు ప్రపంచ మార్కెట్ల మీద గౌరవం,శ్రద్ద లేదని ట్రంప్‌ ఆరోపణ, బీజింగ్‌ మీద కోపం ఉంటే యావత్‌ ప్రపంచం మీద ప్రతికూల పన్నులెందుకు ప్రకటించినట్లు ? అతగాడి నిర్వాకం కారణంగా స్టాక్‌మార్కెట్లు పతనమయ్యాయన్నది తెలిసిందే. మూడు నెలల వాయిదా గురించి సామాజిక మాధ్యమంలో వచ్చిన వార్తలను కొద్ది రోజుల ముందు ట్రంప్‌ యంత్రాంగం తోసి పుచ్చింది. తమ మంత్రిత్వశాఖలు, వాణిజ్య ప్రతినిధితో 75దేశాలు సంప్రదింపులు జరిపినట్లు ట్రంప్‌ చెప్పుకున్నాడు. వారంతా ఒప్పందం చేసుకోవటానికి చచ్చిపోతున్నారన్నాడు.రిపబ్లికన్‌ పార్టీ ప్రజాప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ మనకు ఫోన్లు చేస్తున్న వారు ప్లీజ్‌ ప్లీజ్‌ సర్‌ ఒప్పందం చేసుకోండి, నేను ఏదైనా చేస్తాను అని చెబుతున్నారని, చివరకు నా….ను ముద్దు పెట్టుకుంటున్నారని నోరుపారవేసుకున్నాడు. ఎక్కువ పన్నులు విధించిన దేశాల నుంచి సరకులను దిగుమతి చేసుకొని వాటికి మన ముద్ర వేసి తిరిగి ఎగుమతి చేయవద్దని మన వాణిజ్య మంత్రి పియూష్‌ గోయల్‌ మన ఎగుమతిదార్లను హెచ్చరించారు.పిటిఐ వార్త మేరకు చైనా, ఇతర ఆసియన్‌ ఆదేశాల సరకులను మన దేశం నుంచి ఎగుమతి చేయవద్దని చెప్పారట. మన ఎగుమతిదార్లు అలాంటి పనులు చేస్తున్నట్లు గతంలో ఎన్నడూ మన ప్రభుత్వం చెప్పలేదు. ఇప్పుడు అలా మాట్లాడారంటే అమెరికా మెప్పు పొందేందుకే అన్నది స్పష్టం. ఏ దేశం నుంచి ఏ సరకు వస్తోందో తిరిగి ఎక్కడికి వెళుతోందో తెలుసుకోలేనంత అధ్వాన్నంగా మన నిఘా సంస్థలు, వాటిని నడిపిస్తున్న ప్రభుత్వం ఉందా ?

అసలు పన్నుల వాయిదా నిర్ణయానికి దారితీసిందేమిటి ? మొదటి కారణంగా చెప్పుకోవాలంటే ఏప్రిల్‌ ఐదున 150 సంస్థల పిలుపు మేరకు 20లక్షల మంది జనం నిరసన ప్రదర్శనలు చేశారు. వెనక్కు తగ్గకపోతే మరింత పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. తొలుత మద్దతు ప్రకటించిన ద్రవ్య పెట్టుబడిదారులు, ఇతరులు కూడా పర్యవసానాలను చూసి వైఖరి మార్చుకుంటున్నారు. ఒక్కరంటే ఒక్క ఆర్థికవేత్త కూడా సానుకూలంగా మాట్లాడిన ఉదంతం లేదు. అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారుతుందన్న భయం పెరిగింది. ట్రంప్‌ అధికారానికి వచ్చిన తరువాత భారీగా పెరుగుతుందని ఆశించిన ఎలన్‌ మస్క్‌ సంపద ఇప్పటి వరకు 135 బిలియన్‌ డాలర్లు హరించుకుపోయింది. చైనాతో ఎవరి మీదా పన్నులు వేయవద్దని, పునరాలోచించాలని ట్రంప్‌ను మస్క్‌ గట్టిగా కోరినట్లు వాషింగ్టన్‌ పోస్టు పత్రిక రాసింది. చైనా వెనక్కు తగ్గకపోగా ఐరోపా సమాఖ్య కూడా ప్రతిఘటనకు పిలుపు ఇచ్చింది.23 బిలియన్‌ డాలర్ల పన్ను విధిస్తామన్నది. ట్రంప్‌ మాదిరి అది కూడా ప్రతికూల సుంకాలను 90 రోజులు వాయిదా వేసింది. పన్నుల విధింపులో కీలక పాత్ర పోషించిస సలహాదారు పీటర్‌ నవారో, ఎలన్‌మస్క్‌ రోడ్డెక్కి అంతా నువ్వే చేశావంటే నువ్వే చేశావని దుమ్మెత్తి పోసుకుంటున్నారు. విదేశాల నుంచి విడి భాగాలు తీసుకొచ్చి అసెంబ్లింగ్‌ చేసి ఇక్కడే కార్లను తయారు చేస్తున్నట్లు చెప్పుకోవటం ఒక గొప్పా అన్నట్లు మస్క్‌ మీద నవారో ధ్వజమెత్తాడు. స్వదేశంలో పెట్టుబడులు పెట్టి వస్తూత్పత్తి చేయాలన్న పిలుపుకు పెద్ద స్పందన కనిపించటం లేదు. ప్రభుత్వ బాండ్లను కొనుగోలు చేసిన వారు వాటిని అమ్మి సొమ్ము చేసుకొని అమెరికా వెలుపల పెట్టుబడులు పెడుతున్నారు. లొంగుబాటును ప్రదర్శించే దేశాల మీద కొన్ని ఒప్పందాలను రుద్ది దక్కిన మేరకు లబ్ది పొందే ఎత్తుగడ కూడా కనిపిస్తున్నది.


గతంలో కమ్యూనిజం బూచిని చూపి దాన్ని వ్యతిరేకించే దేశాలన్నింటినీ అమెరికా కూడగట్టింది. ఇప్పుడు ప్రపంచం తన అడుగుజాడల్లో నడవటం లేదన్న అక్కసుతో ట్రంప్‌ దేశాలన్నింటి మీద యుద్ధం ప్రకటించాడు.తనకు తానే అమెరికాను ఒంటరిపాటు చేశాడు.కొలిమిలో కాలినపుడే ఇనుమును సాగదీయాలన్న సూత్రానికి అనుగుణంగా అమెరికా దిగిరావాలంటే దాని బాధిత దేశాలన్నీ ఏకం కావటం తప్ప మరొక మార్గం లేదు.కొన్ని తొత్తు దేశాలు కలవక పోవచ్చు, విభీషణుడి పాత్ర పోషించవచ్చు. మన దేశం ఎలాంటి ప్రకటన చేయకపోయినా మాకు అందరూ కావాలి ఎవరితో కలవం అని ఆస్ట్రేలియా చెప్పుకుంది. ఉక్రెయిన్‌ సంక్షోభంలో తనతో కలసి పని చేస్తున్న ఐరోపా దేశాలను పక్కన పెట్టి రష్యాతో ఒప్పందం కుదుర్చుకున్న ట్రంప్‌ను నమ్మేదెలా అని ఆలోచిస్తున్న తరుణంలో వాటి మీద కూడా పన్నుల యుద్ధం శంఖారావం పూరించాడు. ఒంటరి పోరుకు సిద్దం అవుతూనే అలాంటి దేశాలన్నింటినీ కూడ గట్టేందుకు చైనా పూనుకుంది. ఎంత మేరకు విజయవంతమౌతుందనేది వేరే అంశం. చైనా ప్రధాని లీ క్వియాంగ్‌ ఫోన్లో ఐరోపా సమాఖ్య అధ్యక్షురాలు ఉర్సులా వాండెర్‌ లియాన్‌తో మాట్లాడాడు.తరువాత వాణిజ్య ప్రతినిధులు మాట్లాడుకున్నారు. పది ఆగ్నేయాసియా దేశాల కూటమితో కూడా చైనా సంప్రదింపుల్లో ఉంది. ఏం జరగనుందనే ఆసక్తి సర్వత్రా పెరుగుతున్నది, ముందుగా ఎవరు మునుగుతారన్నది చర్చగా మారుతున్నది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మింగుడు పడని ట్రంప్‌ మాత్ర : 20లక్షల మంది నిరసన, రక్తమోడిన స్టాక్‌ మార్కెట్లు !

08 Tuesday Apr 2025

Posted by raomk in BJP, Current Affairs, Economics, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Prices, Uncategorized, USA

≈ Leave a comment

Tags

BJP, China, Donald trump, Narendra Modi, TRADE WAR, Trump tariffs, Two Millions marched against trump tariffs


ఎం కోటేశ్వరరావు


డాక్టర్‌ డోనాల్డ్‌ ట్రంప్‌ పన్నుల మాత్ర వైకుంఠయాత్రగా మారిందా ? అది వికటించి ప్రపంచమంతా అతలాకుతలం, స్టాక్‌మార్కెట్లు రక్తమోడాయి. ఒక వైపు ధరల పెరుగుదల భయంతో అమెరికాలో వేలం వెర్రిగా కొనుగోళ్లకు పరుగులు తీసిన జనం. వారే మరోవైపు డోనాల్ట్‌ ట్రంప్‌, అతగాడి ఆత్మ ఎలన్‌ మస్క్‌ విధానాలను వ్యతిరేకిస్తూ 150 సంస్థల పిలుపు మేరకు ఏప్రిల్‌ ఐదవ తేదీన మా జోలికి రావద్ద్దు (హాండ్స్‌ ఆఫ్‌) నినాదంతో 20లక్షల మంది దేశమంతటా ప్రదర్శనలు జరిపారు.ప్రపంచ వ్యాపితంగా మూడవ రోజు సోమవారం కూడా స్టాక్‌ మార్కెట్లు పతనమై 9.5లక్షల కోట్ల డాలర్ల సంపద ఆవిరి. హంకాంగ్‌ స్టాక్‌ మార్కెట్‌ సూచీ గరిష్టంగా 13శాతం కుదేలైంది. మంగళవారం నాడు మనదేశంతో సహా ఆసియా దేశాల మార్కెట్లు కొద్దిగా తేరుకున్నాయి. నేనైతే తగ్గాలనుకోవంటం లేదు, ఏదన్నా జరిగినపుడు కొన్ని సమయాల్లో ఒక గోలీ వేసుకోకతప్పదు అని ట్రంప్‌ వ్యాఖ్యానించాడు. అమెరికన్ల హక్కులు, స్వేచ్చల మీద దాడి చేస్తూ బలవంతంగా లాక్కుంటున్నారంటూ ప్రజాస్వామ్య అనుకూల ఉద్యమకారుల పిలుపు మేరకు జనం స్పందించారు. అక్కడి 50 రాష్ట్రాల రాజధానులు, పార్లమెంటు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముందు 1,400కుపైగా చిన్నా పెద్ద ప్రదర్శనలు జరిగాయి. లండన్‌, పారిస్‌ వంటి ఇతర దేశాల నగరాల్లో కూడా నిరసన తెలిపారు. ధనవంతుల పాలన ఇంకే మాత్రం సాగదు, వారికి జన ఘోష వినిపించేట్లు చేస్తామంటూ ప్రదర్శకులు నినదించారు. నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటామని సంతకాలు చేసిన వారే దాదాపు ఆరులక్షల మంది ఉన్నారు.


వాషింగ్టన్‌ డిసిలోని జార్జి వాషింగ్టన్‌ స్మారక స్థూపం వద్ద ప్రధాన సభ జరిగింది. అమెరికా కార్మిక సంఘాల సమాఖ్య అధ్యక్షురాలు లిజ్‌ షూలెర్‌ ప్రధాన వక్త.పోరాడేవారి నోరు మూయించేందుకు ట్రంప్‌ సర్కార్‌ చూస్తున్నది కానీ ఆటలు సాగనిచ్చేది లేదని హెచ్చరించారు.కేంద్ర ప్రభుత్వంతో బేరమాడే హక్కులను యూనియన్లకు లేకుండా కాలరాస్తోందని, కార్మిక సంఘాలను దెబ్బతీస్తోందన్నారు.ప్రభుత్వ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు ఎవరెట్‌ కెలీ మాట్లాడుతూ ఉద్యోగులను సులభంగా దెబ్బతీయవచ్చని ట్రంప్‌ మరియు మస్క్‌ భావిస్తున్నారు, మాసభ్యులు మిలిటరీలో పనిచేసిన వారే అని గుర్తుంచుకోవాలని, తమను బెదిరించలేరని హెచ్చరించాడు. డెమోక్రటిక్‌ పార్టీ ఎంపీ జామీ రస్కిన్‌ మాట్లాడుతూ అమెరికాను స్థాపించిన వారు రాసిన రాజ్యాంగం మేము పౌరులం అంటూ ప్రారంభమైంది తప్ప మేము నియంతలం అని కాదన్నాడు. ఇక్కడ ప్రదర్శనకు పది వేల మంది వస్తారనుకుంటే పది రెట్లు వచ్చినట్లు నిర్వాహకులు ప్రకటించారు. వాషింగ్టన్‌ నగరంలో ప్రదర్శన చేసిన వారు కిరాయిబాపతు తప్ప మరొకటి కాదని ఎలన్‌ మస్క్‌ నోరుపారవేసుకున్నాడు. ఆ మేరకు తన ఎక్స్‌లో అనేక వీడియోలను పోస్టు చేశాడు. వారెందుకు ప్రదర్శన చేశారో కూడా వారికి తెలియదన్నాడు. నిరసనకారులు ట్రంప్‌ను ఎంతగా వ్యతిరేకిస్తున్నారో లక్షా 21వేల మంది కేంద్ర ఉద్యోగులను తొలగించిన ఎలన్‌ మస్క్‌ను కూడా అంతే నిరసిస్తున్నారు. రానున్న పది సంవత్సరాలలో ధనికులకు ఐదులక్షల కోట్ల డాలర్ల మేర పన్నుల రాయితీ ఇస్తూ ట్రంప్‌ సర్కార్‌ ఇటీవల నిర్ణయించింది. ఇదే సమయంలో వైద్యం, పెన్షన్‌ వంటి సంక్షేమ పథకాలకు పెద్ద ఎత్తున కోతలను ప్రతిపాదించింది.తమ మీద మరిన్ని భారాలను మోపే పన్నులతో పాటు ఈ విధానాలకు కూడా శనివారం నాడు నిరసన వెల్లడిరచారు. ట్రంప్‌ వెనక్కు తగ్గకపోతే రానున్న రోజుల్లో ఆందోళనలు కొనసాగే అవకాశం ఉంది.


ట్రంప్‌ బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నాడని చైనా వ్యాఖ్యానించింది. ఈనెల తొమ్మిదవ తేదీలోగా చైనా వెనక్కు తగ్గాలని లేకుంటే మరో 50శాతం వడ్డిస్తానని ట్రంప్‌ ప్రకటించాడు.ఎవరూ తగ్గకపోతే చైనా వస్తువులపై ట్రంప్‌ పన్ను 104శాతానికి చేరనుంది. అతగాడిని ప్రసన్నం చేసుకొనేందుకు మనదేశం గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, మెటా, ఎక్స్‌ తదితర కంపెనీలకు లబ్ది కలిగేలా డిజిటల్‌ సర్వీసు పన్ను రద్దు చేసింది. ఖరీదైన మోటారు సైకిళ్లు, విస్కీల మీద పెద్ద మొత్తంలో తగ్గించింది. ఇంత చేసిన తరువాత రెండు దేశాల మధ్య ఒప్పందం సంగతి తేల్చాలని మన విదేశాంగ మంత్రి జై శంకర్‌ అమెరికా మంత్రి మార్కో రూబియోకు ఫోన్లు చేస్తున్నారు. పారిశ్రామిక వస్తు ఎగుమతులు, దిగుమతుల మీద ఎలాంటి పన్ను విధించకూడదని తాము కోరుతున్నామని, వీటి మీద చర్చలకు సిద్దం, కుదరకపోతే తాము కూడా ప్రతికూల పన్నులు వేసేందుకు సన్నద్దమౌతున్నట్లు ఐరోపా సమాఖ్య అధ్యక్షురాలు ఉర్సులా వాండెర్‌ చెప్పారు. మూడు నెలల పాటు పన్నుల వసూలు వాయిదా వేయాలన్న సూచనను ట్రంప్‌ తిరస్కరించాడు. అయినప్పటికీ మంగళవారం నాడు ప్రారంభంలో ఆసియా స్టాక్‌్‌ మార్కెట్లు స్వల్పంగా కోలుకున్నాయి.


అమెరికాలో బహుళజాతి కార్పొరేట్లకు వత్తాసు పలుకుతున్న ట్రంప్‌, వారి కనుసన్నలలో పని చేసే మీడియా సంస్థలు అనేక అవాస్తవాలను ప్రచారం చేస్తున్నాయి. మెక్సికో నుంచి చైనా పెంటానిల్‌ అనే మత్తు మందును అక్రమంగా సరఫరా చేస్తోందని, అక్రమ వలసలు అమెరికాను దెబ్బతీస్తున్నాయని చేసిన ప్రచారం నిజంగా అసలు సమస్యలే కాదు. వాటిని అరికట్టేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. ఆ సాకుతో వాణిజ్యం యుద్దం చేయాల్సిన అవసరం లేదు. అధికారానికి వచ్చిన వెంటనే అక్రమవలసదారులను స్వదేశాలకు పంపేపేరుతో చేసిన హడావుడి తరువాత ఎందుకు కొనసాగించలేదు. స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలతో ధరలు తగ్గుతాయి, ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతుంది, దిగుమతులపై పన్నులు అమెరికన్ల ఉపాధిని కాపాడతాయి, ఇందుకోసం తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులను భరించకతప్పదు అనే రీతిలో జనాన్ని నమ్మించచూస్తున్నారు. వీటిలో ఏ ఒక్కటైనా కార్మికవర్గ జీవన ప్రమాణాలను పెంచేదిగానీ, ఉపయోగపడేది గానీ ఉందా, వేతనాలను అదుపు చేయటం వారి లాభాలను గరిష్టంగా పెంచుకొనే కార్పొరేట్ల ఎత్తుగడలు తప్ప మరేమైనా ఉన్నాయా అన్న చర్చ కార్మికవర్గంలో ప్రారంభమైంది. గత మూడు దశాబ్దాలుగా అమెరికా వస్తు ఉత్పాదక సంస్థలు దేశం వదలి పోతుంటే 78 ఏండ్ల ట్రంప్‌ గతంలో ఎప్పుడైనా నోరు విప్పాడా ? ఇప్పుడెందుకు గుండెలు బాదుకుంటున్నాడు ? పెట్టుబడిదారులు తమకు ఏది లాభంగా ఉంటే ఆ విధానాలను రూపొందించేవారిని పాలకులుగా గద్దెనెక్కిస్తారు.2018లో ఇదే ట్రంప్‌ చైనా మీద వాణిజ్య యుద్ధం ప్రారంభించాడు. అమెరికాలో పోయిన ఉద్యోగాలు తిరిగి వస్తాయని అప్పుడు కూడా చెప్పాడు. తరువాత ఎన్నికల్లో ఓడిపోయి చరిత్రకెక్కాడు. అక్కడి ఉక్కు, తదితర కంపెనీలకు లాభాలు తప్ప కార్మికులకు వేతనాలు పెరగలేదు.రెండవ ప్రపంచ యుద్దం తరువాత అత్యంత వినాశకరమైన ఆర్థిక విధానాన్ని ట్రంప్‌ పాటిస్తున్నట్లు అమెరికా మాజీ అర్థిక మంత్రి లారెన్స్‌ సమర్స్‌ వ్యాఖ్యానించాడు.1930దశకం తరువాత అతి పెద్ద వాణిజ్య యుద్ధాన్ని ట్రంప్‌ ప్రారంభించినట్లు చెబుతున్నారు.


సమస్య పెట్టుబడిదారీ వ్యవస్థలోనే అంతర్గతంగా ఉంది. కార్మికుల ఉద్యోగాలు పోవటానికి, వేతనాలు తగ్గటానికి కారణం చైనా, మెక్సికో, కెనడా, ఐరోపాల నుంచి వస్తున్న దిగుమతులే కారణమని ట్రంప్‌ యంత్రాంగం చిత్రిస్తున్నది. స్వదేశీ పరిశ్రమలకు ప్రోత్సాహం పేరుతో భారీ ఎత్తున్న పన్ను రాయితీలు ఇచ్చిననప్పటికీ దేశభక్త జనరల్‌ మోటార్స్‌ వంటి కంపెనీలు స్వదేశంలో ఫ్యాక్టరీలను మూసివేసి మెక్సికో, తదితర దేశాలకు తరలిపోయాయి. పన్నుల విధింపు కంపెనీలకు తప్ప కార్మికులకు మేలు చేయవని తొలిసారి అధికారంలో ఉన్నపుడు ఉక్కు దిగుమతుల వ్యవహారం వెల్లడిరచింది. కరోనా కాలం నుంచి చూస్తే కార్పొరేట్లకు లాభాలు కార్మికులకు భారాలు పెరిగాయి. ఈ నేపధ్యంలో దిగువ చర్యలు తీసుకోవాలని కార్మికవర్గండిమాండ్‌ చేస్తోంది. విదేశాల్లో ఉపాధి కల్పించి కార్యకలాపాలు నిర్వహిస్తున్న అమెరికన్‌ కార్పొరేషన్ల మీద పన్ను విధించి, ఆ మొత్తాన్ని ఇతర రంగాలలో కార్మికులను నిలుపుకొనేందుకు వినియోగించాలి. పన్నులు గనుక ఖర్చులను పెంచేట్లయితే ధరలను గట్టిగా నియంత్రించాలి. ఆహారం, ఔషధాలు, గృహ తదితరాల ధరలను స్థంభింప చేయాలి. కార్పొరేట్‌ల కోసం కార్మికులు మూల్యం చెల్లించకూడదు. కార్మిక సంఘాల హక్కులకు భంగం కలగకుండా అంతర్జాతీయ కార్మిక హక్కులను అమలు చేసి మాత్రమే వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవాలి. కీలకమైన ఉక్కు, ఆటోమొబైల్‌ వంటి పరిశ్రమలను బడా కంపెనీలకు దూరంగా ప్రజల భాగస్వామ్యంలో నిర్వహించాలి.


పెట్టుబడిదారులు వారు పారిశ్రామికవేత్తలైనా, వాణిజ్యంచేసే వారైనా లాభాలు వచ్చాయా లేదా అన్నది తప్ప ఎలాంటి విలువలు, వలువలు, సిద్దాంతాలు ఉండవు.ఎప్పటికెయ్యది లాభమో అప్పటికా విధానాలను తమ ప్రతినిధులైన పాలకుల ద్వారా రూపొందించి అమలు చేస్తారు. కమ్యూనిజం వ్యాప్తి నిరోధానికి కంకణం కట్టుకున్నట్లు చెప్పిన అమెరికా ప్రత్యర్థిగా ఉన్న బలమైన సోవియట్‌ను దెబ్బతీసేందుకు ప్రచ్చన్న యుద్దం సాగించింది. అదే కాలంలో ప్రపంచంలో పెద్ద మార్కెట్‌గా ఉన్న చైనాలో తన వస్తువులను అమ్ముకొనేందుకు, చౌకగా అక్కడ ఉత్పత్తి చేసి దిగుమతులు చేసుకొని లబ్దిపొందాలని ఎత్తువేశారు. దాంతో అప్పటి వరకు ఐరాసలో కమ్యూనిస్టు చైనాకు నిరాకరించిన భద్రతామండలి శాశ్వత సభ్యత్వాన్ని ఇచ్చేందుకు అంగీకరించింది. ఇదే సమయంలో స్వేచ్చా వాణిజ్యం పేరుతో ప్రపంచీకరణ సిద్దాంతాన్ని ముందుకు తెచ్చింది, ప్రపంచ వాణిజ్య సంస్థపేరుతో నిబంధనలు రూపొందించింది. నాలుగు దశాబ్దాల తరువాత సమీక్షించుకుంటే ఈ విధానం తమకంటే చైనా, ఇతర దేశాలకు ఎక్కువ ప్రయోజనకరంగా ఉన్నట్లు గ్రహించి ప్రపంచం మొత్తం తనకు వ్యతిరేకంగా తొండి చేస్తున్నట్లు ఇప్పుడు అమెరికా ఆరోపిస్తోంది.తమకు రక్షణ చర్యలు,మరిన్ని రాయితీలు కల్పించాలని ట్రంప్‌ ద్వారా కార్పొరేట్‌ సంస్థలు డిమాండ్‌ చేస్తున్నాయి. స్వేచ్చా వాణిజ్యానికి వీలు కల్పించాలని కోరేదీ, దానికి విరుద్దమైన రక్షణ విధానాలను కోరేదీ కూడా పెట్టుబడిదారులే. చైనా నుంచి వస్తువులను స్వేచ్చగా దిగుమతి చేసుకొనేందుకు, పెట్టుబడులను ఆనుమతించాలని మన దేశంలో కోరుతున్నదీ, చౌకగా వచ్చే వస్తువులతో తమ పరిశ్రమల మనుగడకు ముప్పు గనుక ఆంక్షలు పెట్టాలి లేదా పన్ను విధించాలని కోరుతున్నదీ పెట్టుబడిదారులే తప్ప మరొకరు కాదు. చైనా పెట్టుబడులను కేంద్రం అడ్డుకుంటే మోడీ మెడలు వంచి అనుమతించేందుకు ఒప్పించారు. అమెరికాను వ్యతిరేకిస్తున్న దేశాల మీద ప్రతీకార పన్ను ఏటా ఆరువందల బిలియన్‌ డాలర్ల మేర రాబడి వస్తుందని చెబుతున్న ట్రంప్‌ రానున్న పది సంవత్సరాల్లో ఐదులక్షల కోట్ల డాలర్ల మేరకు కార్పొరేట్లు, ధనికులకు పన్ను రాయితీలు ఇచ్చేందుకు తీర్మానం చేయించాడు. అంటే అలా వచ్చేదాన్ని ఇలా అయినవారికి వడ్డించేందుకు పూనుకున్నాడు. మరోవైపున కార్మికుల సంక్షేమ చర్యలకు కోత పెట్టేందుకు పూనుకున్నాడు.


డోనాల్డ్‌ ట్రంప్‌ గురించి చెప్పాలంటే అతగాడు ఒకసారి వేడెక్కుతాడు, మరోసారి చల్లబడతాడు, ఒకసారి అవునంటాడు, అదే నోటితో కాదంటాడు, ఒకసారి వస్తానంటాడు, మరోసారి వెళతానంటాడు, ఒకసారి పైకి ఎక్కుతాడు అంతలోనే కిందికి దిగుతాడు. పిచ్చివాడిలా ప్రవర్తిస్తాడు.కానీ తనవారికి చేయాల్సింది చేస్తున్నాడు, అందుకే కొందరు పిచ్చితనం ప్రదర్శన నటన అంటున్నారు. మిత్రులు, శత్రువులు అని చూడకుండా అందరి మీద బస్తీమే సవాల్‌ అనటం పిచ్చిగాక తెలివా అని కొందరు ప్రశ్నిస్తున్నారు.తమ దేశాలకు చెందిన సంస్థల వస్తువులను అమ్ముకొనేందుకు అవసరమైన మార్కెట్ల వేటలో భాగంగానే ప్రపంచాన్ని వలసలుగా మార్చుకొనేందుకు తలెత్తిన పోటీలో రెండు ప్రపంచ యుద్ధాలు జరిగాయి. భౌతిక వలసలలో బ్రిటన్‌ది పైచేయి కాగా ఇప్పుడు అది సాధ్యం కాదు గనుక మార్కెట్లను కబళించే క్రమంలో అమెరికా ముందుకు వచ్చింది. దానికి ప్రతిఘటన ఫలితమే వాణిజ్యపోరు !

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !
  • ఆ గట్టునుంటావా ఈ గట్టుకొస్తావా : నరేంద్రమోడీకి విషమ పరీక్ష పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • జర్మన్‌ హిట్లర్‌ బాటలో శాస్త్రవేత్తలను బయటకు పంపుతున్న ట్రంప్‌ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !
  • ఆ గట్టునుంటావా ఈ గట్టుకొస్తావా : నరేంద్రమోడీకి విషమ పరీక్ష పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • జర్మన్‌ హిట్లర్‌ బాటలో శాస్త్రవేత్తలను బయటకు పంపుతున్న ట్రంప్‌ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !
  • ఆ గట్టునుంటావా ఈ గట్టుకొస్తావా : నరేంద్రమోడీకి విషమ పరీక్ష పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • జర్మన్‌ హిట్లర్‌ బాటలో శాస్త్రవేత్తలను బయటకు పంపుతున్న ట్రంప్‌ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d