Tags
B.Y. Vijayendra, BJP, BJP Dynastic Politics, BS Yediyurappa, Karnataka BJP, Narendra Modi, Narendra Modi Failures, RSS
ఎం కోటేశ్వరరావు
దేశంలో ఎక్కడైనా ప్రధాని నరేంద్రమోడీ హవా నడుస్తుందేమో గానీ కన్నడ సీమలో చెల్లదని అధికార రాజకీయాల్లో తలపండిన కర్ణాటక మాజీ సిఎం బిఎస్ ఎడియూరప్ప తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు. ఎదుటి వారికి చెప్పేటందుకే నీతులు తప్ప మాకుటుంబానికి వర్తించవు, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడిగా తన కుమారుడి నియామకంలో నరేంద్రమోడీయే అంతిమ నిర్ణయం తీసుకున్నారని కుండబద్దలు కొట్టారు. బిజెపి విలువల వలువలను నడిబజారులో విప్పేశారు. వారసత్వ రాజకీయం అని ఎవరైనా అంటే అనుకోనివ్వండి లెక్క చేయను అన్నారు. కుటుంబ,వారసత్వ రాజకీయాలు, ఒకే కుటుంబానికి పలు పదవులకు వ్యతిరేకం అని సుభాషితాలు చెప్పిన ప్రధాని నరేంద్రమోడీ తన మాటలను తానే దిగమింగాల్సిన దుస్థితి ఏర్పడింది. ఎడియూరప్పవేసిన తాళంతో బహుశా ఇంక ఎక్కడా వారసత్వ రాజకీయాల గురించి ఇతర పార్టీల మీద ఎక్కక పోవచ్చు. ఎడియూరప్ప కుమారుడు, తొలిసారి ఎంఎల్ఏగా గెలిచిన బివై విజయేంద్రను కర్ణాటక పార్టీ అధ్యక్షుడిగా బిజెపి అధిష్టానం నియమించింది.ఎడియూరప్ప పార్టీ పార్లమెంటరీ బోర్డు పదవిలో ఉన్నారు. మరో కుమారుడు రాఘవేంద్ర లోక్సభ ఎంపీగా ఉన్నారు. కర్ణాటక రాజకీయాల గురించి తెలిసిన వారికి ఎడియూరప్ప కుటుంబం ఒక రాజకీయ సైనిక పటాలం వంటిది. ముగ్గురు కుమార్తెలు, వారి కుటుంబాలు, ఇద్దరు కుమారులు వారి కుటుంబాలు ఎవరు చక్కపెట్టాల్సినవాటిని వారు చేస్తారు. ఇప్పటి వరకు వారి మధ్య ఎలాంటి పేచీలు రాలేదు. గతంలో ఎడియూరప్ప కాబినెట్ మంత్రి కెఎస్ ఈశ్వరప్ప పదవిలో ఉండగానే గవర్నర్కు ఐదు పేజీల లేఖ రాసి సిఎం కుటుంబం ఎలా జోక్యం చేసుకుంటున్నదో వివరించారు. అనేక మంది విధిలేక మౌనంగా ఉన్నారు. ఇవన్నీ అధిష్టానానికి, ప్రత్యేకించి నరేంద్రమోడికి తెలియదు అనుకుంటే అంతకంటే అమాయకత్వం మరొకటి ఉండదు. మనం చేస్తే సంసారం మరొక చేస్తే మరొకటి !
తన కుమారుడిని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రకటించటం గురించి ఎడియూరప్ప నాటకాన్ని రక్తి కట్టించారు. బెంగలూరులో శనివారం నాడు విలేకర్లతో మాట్లాడుతూ మీరు నమ్మండి నమ్మకపోండి, ఈ నియామకం గురించి మేమెవరం ఊహించలేదు. ఒక్కసారి కూడా ఢిల్లీలో ఈ విషయమై ఏ నాయకుడినీ అడగలేదు. కావాలంటే మీరు ఎవరినైనా అడగండి అని ఒక విలేకరి ప్రశ్నకు చెప్పారు.” అంతిమ నిర్ణయం ప్రధాని నరేంద్రమోడీ, అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జెపి నడ్డా తీసుకున్నారు, నాకేమీ సంబంధం లేదు.” అన్నారు. వారు తగిన సమయంలో తగిన నిర్ణయం తీసుకున్నారు. విజయేంద్రను అధ్యక్షుడిగా నియమించినందుకు రాష్ట్రమంతటా ఉత్సవాలు జరుపుకుంటున్నారని ఎడియూరప్ప చెప్పారు. బిజెపిలో వారసత్వ రాజకీయాలకు ఈ నియామకం రుజువు అని కాంగ్రెస్ చేసిన వ్యాఖ్య గురించి మాట్లాడుతూ వారు అలాంటి ఆరోపణ చేయనివ్వండి పట్టించుకోను అన్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో 28గాను 25 చోట్ల గెలిచేందుకు తాను, విజయేంద్ర విడివిడిగా రాష్ట్రంలో పర్యటిస్తామని చెప్పారు. తన కుమారుడి నియామకం పట్ల పార్టీలో నేతలెవరూ అసంతృప్తిని వెల్లడించలేదని, అందరూ ఐక్యంగా స్వాగతించారని, ఎవరూ పార్టీని వీడకుండా తాము చూస్తామని, గతంలో వెళ్లిన వారిని కూడా వెనక్కు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తామని ఎడియూరప్ప చెప్పారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని ఎదురుదెబ్బ తిన్న బిజెపి ఆరునెలలుగా దిక్కుతోచని స్థితిలో పడింది. ఎంతగా మైండ్బ్లాక్ (మెదడు పని చేయకపోవటం) లేదా బ్లాంక్ (మెదడు ఖాళీ కావటం) అయిందంటే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని, శాసనసభా పక్ష నేతను కూడా ఎన్నుకోలేకపోయింది. ప్రతిపక్ష నేత లేకుండానే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. మరో ఆరు నెలల్లో జరగనున్న లోక్సభ ఎన్నికలలో ఎలాగైనా గెలవాలన్న ఏకైక లక్ష్యంతో బిజెపి ఉంది. కుటుంబ పార్టీ అంటూ గతంలో తెలుగుదేశాన్ని, తెలంగాణాలో బిఆర్ఎస్ను విమర్శిస్తున్న ఆ పార్టీ కర్ణాటకలో కుటుంబ పార్టీగా ఉన్న జెడిఎస్ను తన మిత్రపక్షంగా చేర్చుకుంది. కాంగ్రెస్ను కుటుంబవారసత్వ పార్టీ అని ధ్వజమెత్తుతున్న అదే పార్టీ ఎదుటివారికి చెప్పేటందుకే నీతులు అన్నట్లుగా ఎడియూరప్ప కుమారుడిని పదవికి ఎంపిక చేసింది. కర్ణాటక శాఖను ఒక కుటుంబ పార్టీగా మార్చివేసింది. ఎడియూరప్ప గాలి తీసి పక్కన పెట్టాం గనుక లింగాయత్ సామాజిక తరగతి దూరం కావటంతో గత అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవం జరిగిందన్న వాదనను పార్టీ గుర్తించినట్లుంది. తిరిగి వారి మద్దతు పొందాలంటే మరోదారి లేదని భావించి ఆ పెద్దమనిషి కుటుంబ వారసుడినే అధ్యక్షుడిగా నియమించింది. ఎంతవారలైనా అధికార కాంతదాసులే, నరేంద్రమోడీ ఆ కోవకు చెందిన వ్యక్తే గనుక చేసేదేముంది, సరే అనక తప్పలేదు. దీంతో పార్టీలో ఇప్పుడు ఎడియూరప్ప వ్యతిరేకులు ఏం చేస్తారన్నది ఆసక్తికరం.కాళ్లబేరానికి వస్తారా ? తిరుగుబాటు చేస్తారా ? తన కుమారుడి నియామకానికి నరేంద్రమోడీ అంతిమ నిర్ణయం తీసుకున్నారని ఎడియూరప్ప చెప్పిన తరువాత దాన్ని ధిక్కరించే సాహసం బిజెపిలో ఎవరికైనా ఉందా అంటే సందేహమే. అవమానాలను దిగమింగి లోలోపల కుములుతూ పార్టీలోనే ఉండాలి లేదా వెళ్లిపోవాలి. పార్టీ పదవి పంచాయతీ తేలింది, ఓట్ల రాజకీయం గనుక వెంటనే శాసనసభా పక్ష నేతను కూడా ఎన్నుకుంటారు, లింగాయత్ కాని వారే అవుతారు.
కర్ణాటక రాజకీయాల్లో అధికారం కోసం ఎవరితోనైనా చేతులు కలిపే పక్కా అవకాశవాద పార్టీగా జెడిఎస్ పేరు తెచ్చుకుంది.గతంలో దాని మద్దతుదారులుగా ఉన్న అనేక మంది కాంగ్రెస్వైపు మొగ్గటంతో 2023 మే నెలలో జరిగిన ఎన్నికల్లో చావుదెబ్బ తిన్నది. కాంగ్రెస్తో చేతులు కలిపేందుకు దారులు మూసుకుపోవటంతో మరోసారి బిజెపి తలుపుతట్టింది.రాష్ట్రంలో గెలుపు ఓటములను ప్రభావితం చేసే లింగాయత్, ఒక్కళిగ సామాజిక తరగతులు కలిస్తే తిరుగుండదు, వచ్చే లోక్సభ ఎన్నికల్లో గెలుస్తామనే బిజెపి అంచనా దీని వెనుక ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో లింగాయత్ల ప్రభావం ఉందని చెబుతున్న 69చోట్ల బిజెపి 20, కాంగ్రెస్ 40 గెలుచుకుంది. ఒక్కళిగలు ప్రభావం చూపే 64 చోట్ల ఆ సామాజిక తరగతి పార్టీగా ఉన్న జెడిఎస్ 14స్థానాలతో సరిపెట్టుకుంది. జెడిఎస్ను సంతుష్టీకరించేందుకు మాండ్య లోక్సభ నియోజకవర్గంలో బిజెపి మద్దతుతో స్వతంత్రురాలిగా గెలిచిన సినీనటి సుమలతను అక్కడి నుంచి తప్పుకోవాలని, కావాలంటే ప్రస్తుత సభ్యుడు డివి సదానంద గౌడ ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించారు గనుక బెంగలూరు ఉత్తరం నుంచి అవకాశం కల్పిస్తామని బిజెపి చెప్పినట్లు వార్తలు. స్వచ్చందంగా లేదా ఇతర కారణాలతో పోటీకి దూరంగా ఉన్నామని ప్రకటనలు చేయించటం ప్రారంభమైంది. వచ్చే ఎన్నికల్లో మరో ఎనిమిది నుంచి పదమూడు మంది ఎంపీలను కూడా ఇంటికి పంపాలని నిర్ణయించినట్లు లీకులు వదిలారు.ఇలా చేస్తే బిజెపి గెలుస్తుందా అంటే చెప్పలేము. అసెంబ్లీ ఎన్నికల్లో 75 మంది కొత్తవారికి సీట్లిస్తే 14 మందే గెలిచారు. ఇరవై నాలుగు మంది ఎంఎల్ఏలను పక్కన పెడితే పది స్థానాల్లో మాత్రమే పార్టీ గెలిచింది.
పార్టీ శాసనసభా పక్ష నేతను ఎన్నుకోకపోతే బెలగావిలో జరిగే శీతాకాల అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తామని బిజెపి ఎంఎల్ఏలు కేంద్ర నాయకత్వానికి ఈనెల మొదటి వారంలో అల్టిమేటం జారీ చేశారు. ఏ పార్టీకైనా ఇంతకంటే అవమానం మరొకటి ఉండదు.అధికారపక్షం కాంగ్రెస్ చేసే విమర్శలతో మొహాలు ఎక్కడ పెట్టుకోవాలో అర్ధం కావటం లేదని వాపోయారు. ఆరునెలలకు పైగా శాసనసభా పక్ష నేతను ఎన్నుకోలేని స్థితి గతంలో ఎన్నడూ లేదని కాంగ్రెస్ నేత గుండూరావు అన్నారు. మే పదవ తేదీన జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్కు 135, బిజెపికి 66, జెడిఎస్కు 19 సీట్లు వచ్చాయి.వచ్చే శుక్రవారం నాడు శాసనసభా పక్ష నేతను నియమిస్తామని బివై విజయేంద్ర విలేకర్లతో చెప్పారు. జెడిఎస్తో కూటమి గురించి కేంద్ర నాయకత్వం రాష్ట్ర నేతలతో సంప్రదించలేదని సదానంద గౌడ బహిరంగంగా చెప్పారు. ఆ తరువాత గౌడను ఢిల్లీ రావాల్సిందిగా ఆదేశించారు. ఆ తరువాతే వచ్చే లోక్సభ ఎన్నికలలో తాను పోటీ చేయటం లేదని ప్రకటించటం గమనార్హం. రాష్ట్రంలో కరవు పరిస్థితి గురించి అధ్యయన కమిటి హసన్ పట్టణానికి వచ్చింది. ఆ సందర్భంగా హడావుడిగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో గౌడ అసందర్భంగా పోటీలో ఉండనని ప్రకటించారు. అంతకు ముందు అక్టోబరు ఏడవ తేదీన విలేకర్లతో మాట్లాడుతూ శాసనసభా పక్ష నేతను ఎన్నుకోలేకపోవటం పార్టీలో సంకటస్థితిని సృష్టించిందని,జెడిఎస్తో పొత్తు పట్ల తాను సంతోషంగా లేనని, రాష్ట్రనేతలతో నిమిత్తం లేకుండా చేశారని, తాము దీని గురించి కనీసంగా చర్చించలేదన్నారు. పార్టీ జాతీయ ప్రయోజనాలను గమనంలో ఉంచుకొని, కాంగ్రెస్ను వ్యతిరేకించేందుకు చేసి ఉండవచ్చు అన్నారు. ఆ తరువాత అక్టోబరు 25వ తేదీన ఢిల్లీ వచ్చి అలా ఎందుకు మాట్లాడారో సంజాయిషీ ఇవ్వాలని అధిష్టానం కోరింది. బిజెపిలో జరిగిన పరిణామాల గురించి మాజీ సిఎం, అసెంబ్లీ ఎన్నికలకు ముందు బిజెపి నుంచి కాంగ్రెస్లో చేరిన లింగాయత్ నేత జగదీష్ షెట్టార్ మాట్లాడుతూ పర్యవసానాలను త్వరలోనే చూస్తారు అంటూ వ్యాఖ్యానించారు. ఆరునెలల పాటు పార్టీ, శాసనసభా పక్ష నేతలను ఎంపిక చేయలేకపోవటంతో ఎప్పుడు చేస్తారని బిజెపి కార్యకర్తలందరూ ప్రశ్నించారు, ఎట్టకేలకు నేతను ఎంపిక చేశారు, ఆగండి పర్యవసానాలను త్వరలోనే చూస్తారు అని షెట్టార్ అన్నారు.
