• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: Canada

వాణిజ్య యుద్ధం : డోనాల్డ్‌ ట్రంప్‌కు చైనా హెచ్చరిక ! మనదేశ వైఖరేంటి !!

06 Thursday Mar 2025

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Prices, USA

≈ Leave a comment

Tags

Canada, China, Counter tariffs, Donald trump, Mexico, Narendra Modi Failures, TRADE WAR, Xi Jinping


ఎం కోటేశ్వరరావు


అమెరికా వాంఛిస్తున్న మాదిరి యుద్ధమే కోరుకుంటే అది సుంకాల పోరు, వాణిజ్య పోరు లేదా మరేదైనా యుద్ధాన్ని కోరుకుంటే కడవరకు పోరాడేందుకు తాము సిద్దం అని చైనా ప్రకటించింది. ఈ మేరకు అమెరికాలోని చైనా రాయబార కార్యాలయం ఎక్స్‌ పోస్టులో సవాలు విసిరింది. రెండవసారి అధికారానికి వచ్చిన తరువాత తొలిసారి అమెరికా పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి మంగళవారం నాడు ప్రసంగించిన ట్రంప్‌ ఏప్రిల్‌ రెండవ తేదీ నుంచి చైనా, భారత్‌లపై ప్రతి సుంకాలు అమల్లోకి వస్తాయని చెప్పాడు. తాను విధించే సుంకాలు మరోసారి అమెరికాను ధనవంతురాలిగా, గొప్పదానిగా చేస్తాయని చెప్పుకున్నాడు. మోటారు వాహనాలపై భారత్‌ వందశాతానికి మించి పన్నులు విధిస్తున్నదని, అమెరికా వేస్తున్నదాని కంటే రెట్టింపు చైనా పన్నులున్నాయని, తాము మిలిటరీ సాయం చేస్తున్నప్పటికీ దక్షిణ కొరియా నాలుగు రెట్లు ఎక్కువగా సుంకాలు విధిస్తున్నదని ట్రంప్‌ ఆరోపించాడు. దశాబ్దాల తరబడి ఇతర దేశాలు తమ మీద పన్నులు విధిస్తున్నాయని ఇప్పుడు తమ వంతు వచ్చిందన్నాడు. లేడిపిల్ల కన్నీళ్లను చూసి వేటగాడి మనసు మారుతుందా ? మారదు గనుకనే అమీతుమీ తేల్చుకొనేందుకు చైనా నిర్ణయించింది.


మరి మనదేశం. ట్రంప్‌ ప్రకటించిన మేరకు నిజంగానే సుంకాలు అమల్లోకి వస్తే ఏటా మనదేశానికి 700 బిలియన్‌ డాలర్లు నష్టమని సిటీ పరిశోధన సంస్థ విశ్లేషకులు ప్రకటించారు.2030 నాటికి ఉభయ దేశాల వాణిజ్య లావాదేవీలను 500 బిలియన్‌ డాలర్లకు పెంచాలని ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ అమెరికా పర్యటనకు వెళ్లినపుడు ఒక అవగాహనకు వచ్చారు. ఆ మేరకు అక్టోబరులో ఒప్పందం కుదరవచ్చని వార్తలు వచ్చాయి. కానీ దాన్ని దెబ్బతీసే విధంగా ట్రంప్‌ సుంకాల ప్రకటన వెలువడ నుందని ఉప్పందిందేమో మార్చి ఎనిమిదవ తేదీవరకు ఉన్న కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకొని మనవాణిజ్య మంత్రి పియూష్‌ గోయల్‌ ఆకస్మికంగా వాషింగ్టన్‌ బయలుదేరి వెళ్లారు. అక్కడి వాణిజ్య మంత్రితో మాట్లాడారు. అయినప్పటికీ ఆ తరువాతే ట్రంప్‌ ప్రకటన వెలువడిరది. వెళ్లటం తప్పని కాదు, ఉన్న కార్యక్రమాలన్నీ రద్దుచేసుకొని అంత ఆకస్మికంగా పరుగు పెట్టాల్సిన అవసరం ఏమిటన్నదే ప్రశ్న. అమెరికాలో సూపర్‌ అధ్యక్షుడిగా పేరుతెచ్చుకున్న ఎలన్‌మస్క్‌ మనదేశంలో తన కార్లను అమ్ముకోవాలంటే దిగుమతి పన్ను తగ్గించాల్సిందే అని వత్తిడి తెస్తున్నాడు. అతగాడి కోసమే ట్రంప్‌ పన్నుల ప్రకటన అన్నది స్పష్టం. తగ్గిస్తే మనదేశంలోని టాటా, ఎంజి, మహింద్రలకు కోపం, లేకపోతే ట్రంప్‌కు ఆగ్రహం. ఎవరిని వదులుకోవాలన్నది ఇప్పుడు నరేంద్రమోడీ ముందున్న ప్రశ్న. ఒకవేళ వత్తిడికి లొంగి కార్లమీద పన్ను తగ్గించిన తరువాత మిగతావాటి సంగతేమిటని మెడపట్టుకు కూర్చుంటే …..!


తమపై వాణిజ్య యుద్ధం ప్రారంభించిన అమెరికా అధినేత డోనాల్డ్‌ ట్రంప్‌ మీద తగ్గేదేలే అంటున్నాయి దేశాలు. కెనడా, మెక్సికోలపై పన్ను విధింపులో ట్రంప్‌ పునరాలోచన చేయవచ్చన్న సూచనలు అమెరికా వాణిజ్య మంత్రి నుంచి వెలువడినప్పటికీ అది జరగలేదు. పన్ను పోరు ఎటువైపు దారితీస్తుందో, దాని పర్యవసానాలు ఏమిటో చర్చగా మారాయి. చైనా, కెనడా ప్రతి పన్ను ప్రకటన చేయగా మెక్సికో ఏక్షణంలోనైనా పోరులో పాల్గొనవచ్చని వార్త. చైనా మీద రెండుసార్లుగా పదిశాతం చొప్పున పన్ను విధించగా మిగతా రెండు దేశాల మీద 25శాతం ముందుగానే ప్రకటించిన సంగతి తెలిసిందే. సంవత్సరాల తరబడి మేమంటే నవ్వులాటగా మారింది, మా తడాఖా చూపుతాం అన్నాడు ట్రంప్‌. అక్రమంగా వలస వచ్చే వారిని కెనడా, మెక్సికో నిలువరించాయని, ఫెంటానిల్‌ రవాణాను నిలిపేందుకు మరింతగా చేయాల్సి ఉందని అంతకు ముందు అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్‌ లుట్‌నిక్‌ అన్నాడు.
ట్రంప్‌ ప్రకటన వెలువడగానే ఈనెల పది నుంచి అమల్లోకి వచ్చే విధంగా మంగళవారం నాడు పలు వస్తువులపై పది నుంచి 15శాతం మేరకు చైనా అదనంగా ప్రతి పన్ను ప్రకటించింది.వాటిలో కోడి,పంది, గొడ్డు మాంసం, పలు వ్యవసాయ ఉత్పత్తులు ఉన్నాయి. తైవాన్‌కు ఆయుధాలను విక్రయించే 15సంస్థలపై ఆంక్షలను విధించింది.మరో పదింటిని నమ్మకూడని వాటి జాబితాలో చేర్చింది.కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రుడేవ్‌ కూడా ట్రంప్‌ ప్రకటన వెలువడగానే అదే రోజు అర్ధరాత్రి నుంచి 155 బిలియన్‌ డాలర్ల విలువగల అమెరికా వస్తువులపై 25శాతం ప్రతి పన్ను విధించినట్లు ప్రకటించాడు. అమెరికా వెనక్కు తగ్గేంతవరకు అవి కొనసాగుతాయన్నాడు. అమెరికాలోని 30 రాష్ట్రాలకు సరఫరా చేస్తున్న విద్యుత్‌, చమురు సరఫరాలపై కూడా ఆంక్షలు విధించే అవకాశం ఉంది. దశలవారీగా ఇతర వస్తువులు, పదికోట్ల డాలర్ల ఎలన్‌ మస్క్‌ స్టార్‌లింక్‌ ఇంటర్నెట్‌ ఒప్పందంపై ఆంక్షలు ప్రకటించే దిశగా కెనడా ఉంది.మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షెయిన్‌బామ్‌ విలేకర్లతో మాట్లాడుతూ ట్రంప్‌ పన్నులను ఎదుర్కొనేందుకు తమ దగ్గర నాలుగు పథకాలు ఉన్నాయని, సహనం పాటిస్తున్నట్లు, ఆదివారం నాడు మెక్సికో సిటీలో జరిపే ఒక బహిరంగసభలో వెల్లడిస్తామని చెప్పారు. అమెరికాతో ఎంతో అనుభవం ఉందని, వారి చర్య కొంత మేరకు యుద్ధం తప్ప మరొకటి కాదని పెట్టుబడిదారు వారెన్‌ బఫెట్‌ అన్నాడు.


తొలిసారి అధికారానికి వచ్చినపుడు ట్రంప్‌ ప్రారంభించిన వాణిజ్య యుద్ధంతో 2018 నుంచి అమెరికా దిగుమతులపై ఆధారపడటాన్ని చైనా క్రమంగా తగ్గిస్తున్నది. స్వంతంగా ఉత్పత్తి లేదా ఇతర దేశాల నుంచి తెచ్చుకుంటున్నది. అంతకు ముందుతో పోలిస్తే 2023లో 20శాతం తగ్గితే 2024లో 14శాతం తగ్గించి 29.25 బిలియన్‌ డాలర్ల మేర వ్యవసాయ ఉత్పత్తులను దిగుమతి చేసుకుంది. అయినప్పటికీ అమెరికా రైతాంగానికి చైనా అతి పెద్ద మార్కెట్‌గా ఇప్పటికీ కొనసాగుతున్నది. అక్కడ పండే సోయాలో 2016లో 40శాతం చైనాకు ఎగుమతి చేయగా గతేడాది 21శాతానికి తగ్గాయి.మొక్కజొన్నల దిగుమతి 260 కోట్ల డాలర్ల నుంచి 2024లో 56 కోట్ల డాలర్లకు పడిపోయింది. కోళ్లదానాకు ఉపయోగించే వీటిని దేశీయంగా ఉత్పత్తి పెంచటం, కొంత మేరకు బ్రెజిల్‌ నుంచి దిగుమతి చేసుకుంటున్నది. అమెరికాలో కోడి కాళ్లు, పంది చెవులు, పందితలను తినరు, వాటిని 2021లో 411 కోట్ల డాలర్ల మేర దిగుమతి చేసుకోగా గతేడాది 254 కోట్లకు తగ్గించింది.జొన్నల దిగుమతి పెరిగింది. అమెరికా 2023లో మొత్తం 3.1లక్షల కోట్ల డాలర్ల విలువగల వస్తువులు,వ్యవసాయ పంటలు ఆహారాన్ని దిగుమతి చేసుకోగా, ఇప్పుడు కూడా అంతే మొత్తం దిగుమతి చేసుకుంటే ట్రంప్‌ విధించిన పన్నుల భారం 43శాతం మీద పడనుందని అంచనా. ఆ మేరకు అమెరికా వినియోగదారులపై దాదాపు ప్రతి రోజువారీ వస్తువుపై అదనపు భారం మోపినట్లే. అమెరికాలోని ఆటో పరిశ్రమ తీవ్ర సమస్యలను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తోంది. సగానికిపైగా ఇంజన్లు, విడిభాగాలు కెనడా, మెక్సికోల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు.వాటి మీద 25శాతం పన్నులు అంటే ఒక్కో కారు ధర పన్నెండువేల డాలర్లు పెరిగే అవకాశం ఉందని అంచనా. కాస్త బాధ ఉన్నప్పటికీ అమెరికాను అగ్రభాగాన నిలిపేందుకు ఆ మాత్రం మూల్యం చెల్లించాల్సిందే అని ట్రంప్‌ అన్నాడు.


గతేడాది ఏప్రిల్‌ నుంచి ఈ ఏడాది జనవరి వరకు చూస్తే మన ఉక్కు దిగుమతులు రికార్డులను బద్దలు కొడితే ఎగుమతులు ఏడేండ్ల కనిష్టానికి పడిపోయాయి. ప్రపంచంలో ముడి ఇనుము ఉత్పత్తిలో రెండవ స్థానంలో ఉన్న మనదేశం అంతిమంగా తయారైన ఉక్కు ఉత్పత్తులను దిగుమతి చేసుకొనే దేశంగా నరేంద్రమోడీ ఏలుబడిలో మారింది. దక్షిణ కొరియా, చైనా, జపాన్‌ నుంచి దిగుమతులు గణనీయంగా పెరిగాయి.మన మొత్తం దిగుమతుల్లో 78శాతం ఈ దేశాల నుంచే జరుగుతున్నాయి. దిగుమతులు పెరగటంతో 15 నుంచి 25 శాతం వరకు దిగుమతి పన్ను విధింపు గురించి ఆలోచిస్తున్నట్లు ఉక్కుశాఖా మంత్రి కుమారస్వామి గతనెలలో చెప్పారు. మన దేశంలో తయారైన ఉక్కు ఎగుమతులు ఎక్కువగా ఇటలీ, బెల్జియం, నేపాల్‌, స్పెయిన్లకు జరుగుతుండగా గణనీయంగా పడిపోయాయి.


అమెరికా పన్ను విధింపునకు కట్టుబడి ఉంటే పీఠమెక్కి రెండు నెలలు కూడా గడవక ముందే తాను రాజునని ప్రకటించుకున్న డోనాల్డ్‌ ట్రంప్‌ తనకు లొంగరు అనుకున్నవారి మీద ఎడాపెడా కొరడా రaళిపిస్తున్నాడు. సుంకాలు, ప్రతి సుంకాలు విధిస్తూ బస్తీమే సవాల్‌ అంటున్నాడు. తలవంచేట్లు చేసేందుకు బెదిరింపులా, బేరమాడేందుకు వేస్తున్న పాచికలా చివరకు ఏం జరుగుతుంది, ఎలా ముగుస్తుందన్నది ఎవరూ చెప్పలేరు. ప్రతి దేశానికి బలం`బలహీనతలు ఉన్నాయి, దానికి అమెరికా మినహాయింపు కాదు గనుక ట్రంపు కూడా వెనక్కు తగ్గినా ఆశ్చర్యం లేదు. జి 7 కూటమిలో ఉండటమే గాక అమెరికా అడుగుజాడల్లో నడుస్తున్న కెనడాను 51వ రాష్ట్రంగా విలీనం చేసుకోవాలన్న సంకల్పాన్ని ట్రంప్‌ వెలిబుచ్చాడు. ప్రతి సుంకాలు విధిస్తే మరింతగా పెంచుతామంటూ సామాజిక మాధ్యమంలో పోస్టు పెట్టాడు. తోటి దేశాధినేత అని కూడా చూడకుండా సుంకాల విషయాన్ని ‘‘ కెనడా గవర్నర్‌ జస్టిన్‌ ట్రుడేవ్‌కు ’’ వివరించండని కూడా దానిలో సలహా ఇచ్చాడు. అమెరికాలో రాష్ట్రపాలకులను గవర్నర్‌ అంటారు గనుక కెనడా తమ మరొక రాష్ట్రమని చెప్పటమే అది. ట్రంప్‌ టిప్‌టాప్‌గా ఉన్నప్పటికీ అతగాడి చర్యలు పిచ్చివాడి పనిగా ఉన్నాయంటూ ఒక పత్రిక చేసిన వ్యాఖ్యను ట్రుడేవ్‌ ఉటంకించాడు. అత్యంత సన్నిహితం,భాగస్వామిగా ఉన్న కెనడా మీద వాణిజ్య యుద్దం ప్రకటించి అదే సమయంలో హంతక నియంత పుతిన్ను సంతుష్టీకరించేందుకు పూనుకోవటం మతి ఉండి చేస్తున్న పనులేనా అన్నట్లుగా విరుచుకుపడ్డాడు. నిజంగా వాణిజ్యపోరు జరిగితే చివరి వరకు కెనడా నిలుస్తుందా లేదా అన్నది వేరే అంశం.


చివరికి కెనడాలో అత్యధిక జనాభా గల ఒంటారియో రాష్ట్ర ప్రధాని డగ్‌ ఫోర్డ్‌ కూడా ట్రంప్‌ను దుయ్యబట్టాడు. మేమిచ్చే విద్యుత్‌, ఇంథనం మీద ఆధారపడుతూ మమ్మల్ని బాధిస్తారా మేం తలుచుకుంటే న్యూయార్క్‌ నగరంలో పదిహేను లక్షల మందికి విద్యుత్‌ నిలిచిపోతుంది జాగ్రత్త అన్నాడు. కమ్యూనిస్టు చైనీయుల సంగతి వదిలేద్దాం, కెనడియన్లే అలా స్పందిస్తే మన సంగతేమిటి ? తాను ప్రపంచమంతా తిరిగి పోయిన భారత ప్రతిష్టను తిరిగి తెచ్చానని ఆత్మగౌరవాన్ని నిలిపానని చెప్పిన ప్రధాని నరేంద్రమోడీ నోటి నుంచి ట్రంప్‌ సుంకాల ప్రకటన మీద ఎలాంటి స్పందన లేదు.ఆత్మగౌరవమా, లొంగుబాటా ఏమనుకోవాలి ? ఫిబ్రవరి రెండవ వారంలో మోడీ అమెరికా పర్యటన జరపటానికి ముందే నమస్కార బాణం వేసినట్లుగా కొన్ని రకాల మోటారు సైకిళ్ల మీద 50శాతం పన్నును 30కి, విస్కీ మీద 150 నుంచి 100శాతానికి, అలాగే మరికొన్నింటి మీద పన్నులు తగ్గించి ట్రంప్‌ను ప్రసన్నం చేసుకొనేందుకు చూశారు. వ్రతం చెడ్డా ఫలం దక్కలేదనుకోవాలా ? ఏదైనా నూటనలభై కోట్ల మంది జనానికి ఏదో ఒకటి చెప్పాలా వద్దా ! మౌనానికి అర్ధం ఏమిటి ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

డోనాల్డ్‌ ట్రంప్‌కు మతి చలించిందా ! సుంకాలను వ్యతిరేకించేవారంతా చైనా అదుపులో ఉన్నట్లేనట !!

04 Tuesday Feb 2025

Posted by raomk in CHINA, Current Affairs, Economics, Europe, History, imperialism, International, INTERNATIONAL NEWS, Opinion, Uncategorized, USA

≈ Leave a comment

Tags

Canada, Donald trump, Mexico wall, Trade Protectionism, TRADE WAR, Trump tariffs, US-CHINA TRADE WAR, Xi Jinping

ఎం కోటేశ్వరరావు


డోనాల్డ్‌ ట్రంప్‌ ఎన్నికల ముందునుంచీ ప్రకటించినట్లుగానే ప్రపంచ వాణిజ్య పోరుకు తెరతీశాడు. తన పన్నులను వ్యతిరేకించే విదేశమైనా లేక అమెరికాలో ఉన్న కంపెనీ అయినా సరే వారంతా చైనా అదుపులో ఉన్నట్లే అన్నాడు. ఇది రాసిన సమయంలో చెప్పిన మాటలకు, పాఠకులకు చేరే సమయానికి మార్పులు, విస్తరణ జరిగే రీతిలో ట్రంప్‌ వేగం కనిపిస్తోంది. కెనడా, మెక్సికోల మీద విధించిన పన్నుల అమలు కొంతకాలం వాయిదా వేస్తామనంటతో పాటు ఐరోపా మీద త్వరలో విధిస్తా ,వారు అమెరికా పట్ల భయంకరంగా వ్యవహరించారు, లాభాలకు ఒక అవకాశంగా తీసుకున్నారు, చైనా మీద ప్రకటించిన మొత్తాన్ని పెంచుతా అన్నాడు. స్వంత జనాలు, కంపెనీలతో పాటు ప్రపంచ వృద్ధికి నష్టం, అమెరికా పలుకుబడికీ దెబ్బ అన్న అనేక మంది ఆర్థికవేత్తల హెచ్చరికలను ఖాతరు చేయటం లేదు. కెనడా, మెక్సికోలపై 25శాతం, చైనా వస్తు దిగుమతుల మీద పదిశాతం పన్ను విధిస్తూ ఫిబ్రవరి ఒకటవ తేదీన ఉత్తరువులు జారీ చేశాడు. ఇప్పటి వరకు వెల్లడైన వైఖరులను చూస్తే అదిరించి బెదిరించి దారికి తెచ్చుకోవాలన్న ఎత్తుగడ కనిపిస్తోంది.పన్నులను వ్యతిరేకిస్తున్న వారు ఎవరైనా కుహనా వార్తల వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌, స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టే(హెడ్జ్‌ ఫండ్స్‌) వారు లేదా సంస్థలు చైనా అదుపుల్లో ఉన్నట్లే అన్నాడు. తన నిర్ణయాలకు అద్భుత స్పందన వస్తున్నదని చెప్పుకున్నాడు. ఇతర దేశాలకు రాయితీల రూపంలో అమెరికా లక్షల కోట్ల డాలర్లు నష్టపోతున్నదన్నాడు. జనాలకు ఆర్థికంగా కొంత నొప్పి కలగవచ్చుగానీ అమెరికా ప్రయోజనాలకు ఆ మాత్రం భరించక తప్పదన్నాడు. దక్షిణాఫ్రికా భూములను గుంజుకుంటున్నదని, కొన్ని సామాజిక తరగతుల పట్ల చెడుగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ, ఆ దేశానికి రానున్న రోజుల్లో నిధులు నిలిపివేస్తామని, గతంలో ఇచ్చిన వాటి మీద దర్యాప్తు చేస్తామని చెప్పాడు.


ఖండనలతో పాటు యావత్‌ ప్రపంచం అప్రమత్తమై ఎలా ఎదుర్కోవాలా అన్న శోధనలో పడిరది. అక్రమంగా దిగుమతి అవుతున్న ఫెంటానిల్‌ నిరోధానికి జాతీయ అత్యవసర పరిస్థితిని ట్రంప్‌ ప్రకటించాడు.కృత్రిమ సింథటిక్‌ మరియు నల్లమందుతో తయారు చేసే నొప్పి నివారణ, మత్తు మందును ఫెంటానిల్‌ అని పిలుస్తున్నారు. దీన్ని ఔషధంగా వినియోగించటానికి అనుమతి ఉంది. మాదక ద్రవ్యంగా కూడా వినియోగిస్తున్నారు.అక్రమంగా దిగుమతి అవుతున్న ఫెంటానిల్‌ అమెరికాలో లక్షల మంది ప్రాణాలు తీసిందని అధ్యక్ష భవన మీడియా కార్యదర్శి కారోలిన్‌ లీవిట్‌ ఆరోపించారు. డోనాల్డ్‌ ట్రంప్‌ అంటే అమెరికా, అమెరికా అంటే ట్రంప్‌ అన్నట్లుగా పరిస్థితి తయారు కావటంతో కొంత మంది ఇప్పుడు ట్రంపెరికా అని పిలుస్తున్నారు. తాము చర్చలను తప్ప ఘర్షణను కోరుకోలేదని, కానీ ప్రతికూల చర్యలకు పూనుకోక తప్పటం లేదని మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షియిన్‌బామ్‌ ఎక్స్‌ ద్వారా ప్రకటించారు. మెక్సికో ప్రయోజనాల రక్షణకు అవసరమైన చర్యలన్నింటినీ తీసుకోవాలని తమ ఆర్థిక మంత్రిని కోరినట్లు తెలిపారు. మాదక ద్రవ్యాల ముఠాలతో మెక్సికో ప్రభుత్వం కుమ్మక్కు అయినందునే తాము పన్నులు విధించాల్సి వస్తోందంటూ అధ్యక్షభవనం చెప్పిన సాకును ఆమె ఖండిరచారు. అమెరికా నుంచి దిగుమతి అయ్యే ఏఏ వస్తువులను లక్ష్యంగా చేసుకోవాలో ఇంకా వెల్లడిరచలేదు. స్వతంత్ర మెక్సికో చరిత్రలో జరిగిన అతిపెద్ద దాడులలో ఇదొకటని, అమెరికాకెనడామెక్సికో కుదుర్చుకున్న ఒప్పందానికి ఇది విరుద్దమని పాలకపార్టీ నేత రికార్డో, ఆర్థిక మంత్రి ఎబ్రార్డ్‌ ప్రకటించాడు. తాము నష్టపడతామని, వారికీ అదే జరుగుతుందన్నారు.ప్రస్తుతం అమెరికాకు ఎగుమతుల్లో చైనాతో మెక్సికో పోటీపడుతోంది. మూడోవంతు మెక్సికో జిడిపి అమెరికాకు ఎగుమతులపై ఆధారపడి ఉంది. ఎగుమతి, దిగుమతుల్లో మెక్సికో వాణిజ్య మిగుల్లో ఉంది. అమెరికా నుంచి దిగుమతి చేసుకొనే పంది మాంసం, జున్ను, వ్యవసాయ ఉత్పత్తులు, ఉక్కు, అల్యూమినియం వస్తువుల మీద ఐదు నుంచి 20శాతం వరకు పన్నులు విధించాలని ఆలోచిస్తున్నది. బీరు,వైన్‌,పండ్లు, పండ్ల రసాలతో సహా అమెరికా నుంచి వచ్చే వస్తువులపై 25శాతం పన్ను విధించనున్నట్లు కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రుడేవ్‌ ప్రకటించాడు. తొమ్మిదివేల కిలోమీటర్ల దూరం ఉన్న సరిహద్దులో ఇరు దేశాల వాణిజ్య లావాదేవీలు రోజుకు రెండున్నర బిలియన్ల డాలర్ల మేర జరుగుతున్నాయి. పన్నుల విధింపు తమ మీద ఆర్థిక యుద్ధం ప్రకటించటం, రెండు దేశాల మధ్య ఉన్న చారిత్రక బంధాన్ని ఉల్లంఘించటమే అంటూ దీన్ని తాము, కెనడియన్లతో కలసి ప్రతిఘటిస్తామని బ్రిటీష్‌ కొలంబియా ప్రధాని డేవిడ్‌ ఇబై ప్రకటించాడు. డాలర్‌కు డాలర్‌ అన్న పద్దతిలో దెబ్బతీస్తామని కెనడాలోని ఓంటారియో రాష్ట్ర నేతలు చెప్పారు. తమ మీద అడ్డగోలుగా పన్ను విధిస్తే గట్టిగా ప్రతి స్పందిస్తామని ఐరోపా యూనియన్‌ ప్రతినిధి వ్యాఖ్యానించాడు.


ట్రంప్‌ చర్యను ఖండిస్తూ చర్చలకు ద్వారాలను తెరిచే ఉంచామని చైనా వాణిజ్య, ఆర్థిక మంత్రిత్వశాఖలు ప్రకటించాయి. ప్రపంచ వాణిజ్య సంస్థలో పన్నుల విధింపును సవాలు చేస్తామని ప్రకటించాయి. ఫెంటానిల్‌ అమెరికా సమస్య. దాని మీద ఏ చర్య తీసుకున్నా తాము మద్దతు ఇస్తామని చైనా స్పష్టం చేసింది. తాము ఇప్పటికే అమెరికాకు సహకరిస్తున్నామని, గణనీయమైన ఫలితాలు కూడా వచ్చాయన్నారు. ట్రంపు పన్నులు చైనా ఆర్థిక వ్యవస్థకు పెద్ద దెబ్బ కాదని వాణిజ్య రంగ నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ ఆర్థిక రంగం మీద అమెరికా పన్నులు ఎలాంటి ప్రభావితం కలిగిస్తాయో అన్న ఆందోళన చెందుతున్నట్లు జపాన్‌ ఆర్థిక మంత్రి కాటో చెప్పాడు.తమ మీద ప్రభావం ఎలా ఉంటుందో చూసి తగిన చర్యలు తీసుకుంటామన్నాడు. మెక్సికోలో ఉత్పత్తి కేంద్రాలున్న దక్షిణ కొరియా కంపెనీల మీద ఎలాంటి ప్రభావం పడుతుందో సన్నిహితంగా గమనించాలని ఆ దేశ తాత్కాలిక అధ్యక్షుడు చోయ్‌ శాంగ్‌ మోక్‌ ప్రభుత్వ సంస్థలను ఆదేశించాడు. కొన్ని కంపెనీలు అమెరికాలో ఉత్పత్తి జరపాలని ఆలోచిస్తున్నాయి. పీజా, కార్ల ధరలు పెరుగుతాయి సిద్దంగా ఉండండి అంటూ అమెరికా సెనెట్‌లో ప్రతిపక్ష డెమోక్రటిక్‌ పార్టీ సెనెటర్‌ చార్లెస్‌ ష్కమర్‌ హెచ్చరించాడు. కార్ల విడి భాగాల దిగుమతులపై పన్ను విధించి ధరలు పెరిగేందుకు దోహదం చేయవద్దని అమెరికన్‌ ఆటోమోటివ్‌ పాలసీ మండలి అధ్యక్షుడు మాట్‌ బ్లంట్‌ కోరాడు. పరిణామాలు, పర్యవసానాలను ఎదుర్కొనేందుకు భారత్‌తో సహా వర్ధమాన దేశాలన్నీ సిద్దం కావాలని కోటక్‌ మహీంద్ర బ్యాంక్‌ స్థాపకుడు ఉదయ్‌ కోటక్‌ కోరారు. తమకు నష్టం చేసే దేశాలన్నింటి మీద పన్నులు వేస్తానని ట్రంప్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. అమెరికా వస్తువులను అన్యాయంగా భారత్‌ అడ్డుకుంటున్నదని ఆరోపించాడు.

ట్రంప్‌ పన్నులతో జరిగేదేమిటి అన్న చర్చ ఎన్నికలకు ముందే ప్రారంభమైంది. బస్తీమే సవాల్‌ అంటూ అన్ని దేశాల మీద తొడగొట్టిన కారణంగా మిగతా దేశాలన్నింటికీ కలిపి ఎంత నష్టం జరుగుతుందో ఒక్క అమెరికాకు అంత ఉంటుంది. ఏ ఏ వస్తువుల మీద పన్నులు విధిస్తారు, చేసిన ప్రకటనలు, ఇచ్చిన ఆదేశాలకు ట్రంప్‌ కట్టుబడి ఉంటాడా అన్నది కూడా చూడాల్సి ఉంది. బెదిరించటం వెనక్కు తగ్గటం అతని చరిత్ర. తొలిసారి అధికారానికి వచ్చినపుడు అక్రమ వలసలను నివారింటచంలో విఫలమైనందున మెక్సికో వస్తువులపై ఐదు నుంచి 25శాతం పన్నులు విధిస్తానని ప్రకటించాడు. తరువాత వెనక్కు తగ్గాడు. నిఘంటువులో దేవుడు, ప్రేమ, మతం తరువాత అందమైన పదం పన్నులు అని ట్రంప్‌ వర్ణించాడు. అమెరికా చరిత్రలో 1890దశకంలో 25వ అధ్యక్షుడు విలియమ్‌ మెకన్లీ ఎడా పెడా పన్నులు విధించిన నేతగా నమోదయ్యాడు. ఇప్పుడు ట్రంప్‌ అదే బాటలో నడుస్తున్నట్లు వర్ణిస్తున్నారు.ఇప్పటికే పెద్ద ఎత్తున లోటుబడ్జెట్‌తో ఉండగా పన్నులు తగ్గించాలని ట్రంప్‌ తలపెట్టాడు, తద్వారా వచ్చిన నష్టాన్ని విదేశీ దిగుమతులపై పన్ను విధింపుతో పూడ్చాలని చూస్తున్నాడు. అయితే దానికి దేశకార్మికవర్గాన్ని ఫణంగా పెట్టాలని చూస్తున్నాడు. దిగుమతి పన్నులు వేల కోట్ల డాలర్లు బహుశా లక్షల కోట్లు కూడా తమ ఖజానాలోకి వచ్చిపడవచ్చని ప్రపంచ ఆర్థికవేదిక సమావేశాల్లో ట్రంప్‌ చెప్పాడు.
అమెరికా విధించే పన్నులు ఎలా ఉండబోతున్నాయి, సామాన్యుల మీద ఎంత భారం పడుతుందన్నది ఇప్పుడు పెద్ద చర్చగా ఉంది. టాక్స్‌ ఫౌండేషన్‌ సంస్థ చెబుతున్నదానిని బట్టి కెనడా, మెక్సికోల మీద పన్ను కారణంగా అమెరికా జిడిపి 0.8శాతం దిగజారుతుంది, 1.3 ఎగుమతులు, 2.8శాతాల చొప్పున దిగుమతులు తగ్గుతాయి.లక్షా 84వేల ఉద్యోగాలు పోతాయి. ఎంత భారం పడుతుందనే లెక్కలు అన్నీ ఒకే విధంగా లేవు. పన్ను మొత్తం 272 బిలియన్‌ డాలర్లు ఉంటే కుటుంబానికి ఏటా 2,600 డాలర్లు అదనపు భారం అని కార్పే క్రాస్‌ బోర్డర్‌ సొల్యూషన్స్‌ పేర్కొన్నది. కెనడా, మెక్సికో దిగుమతుల మీద 25శాతం చొప్పున అమలు చేస్తే 232.5 బి.డాలర్లు, చైనా వస్తువులపై 43.2 మొత్తం 275.7బి.డాలర్లని దీని ప్రకారం 33 కోట్ల జనాభాలో తలకు 835 డాలర్ల చొప్పున నలుగురున్న ప్రతి కుటుంబం మీద 3,342 డాలర్లని మరో లెక్క.చైనా వస్తువులపై 60శాతం, మిగతా వాటిపై 20శాతం విధిస్తే ఏటా కుటుంబం మీద 2,600 డాలర్ల భారమని పీటర్సన్‌ ఇనిస్టిట్యూట్‌, మొత్తం మీద పదిశాతం విధిస్తే 2,045 డాలర్లని టాక్స్‌ ఫౌండేషన్‌, నేషనల్‌ రిటెయిల్‌ ఫెడరేషన్‌ అంచనా ప్రకారం 7,600 డాలర్లు ఉంటుంది. ఈ పన్నులతో కంపెనీలు, వినియోగదారుల నుంచి ప్రతిఘటన ఎదురు కావచ్చని కూడా చెబుతున్నారు. తొలిసారి అధికారానికి వచ్చినపుడు ట్రంప్‌ విధించిన పన్నులకు ప్రతిగా ఐరోపా యూనియన్‌, చైనా చర్యలు తీసుకున్నాయి.వ్యవసాయ రంగంలో ట్రంప్‌ మద్దతుదార్లు, ఇతరులూ నష్టపోయారు. జూరిచ్‌ విశ్వవిద్యాలయం,మచాసుచెట్స్‌, హార్వర్డ్‌, ప్రపంచ బ్యాంకు చేసిన అధ్యయనాల ప్రకారం ట్రంప్‌ విధించిన పన్నులు అమెరికాలో ఉపాధిని పునరుద్దరించలేదని అలాగని ఉపాధిని తగ్గించలేదని కూడా తేలింది. అందువలన ఇప్పుడు ట్రంప్‌ చెబుతున్న మాటలు, చేతల ప్రభావం, పరిణామాలు, పర్యవసానాలు వెంటనే వెల్లడయ్యే అవకాశాలు లేవు.భారత్‌తో సహా వివిధ దేశాలలో స్టాక్‌మార్కెట్లు, కరెన్సీ విలువల్లో ఒడుదుడుకులు మాత్రం కనిపిస్తున్నాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

పనామా కాలువే కాదు…సప్త సముద్రాలూ, యావత్‌ భూమండలం కావాలంటాడు – డోనాల్డ్‌ ట్రంప్‌కు ఇచ్చేద్దామా !

23 Thursday Jan 2025

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, imperialism, International, INTERNATIONAL NEWS, Latin America, Opinion, RUSSIA, USA

≈ Leave a comment

Tags

Canada, Donald trump, Green Land, Gulf of Mexico, panama canal

ఎం కోటేశ్వరరావు

వెనుకటికి ఎవడో మీకు భయంగా ఉంటే అందరూ నా చుట్టూ ఉండండి అన్నాడట. డోనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా భద్రతకు ప్రపంచమంతా తనకు కావాలంటున్నాడు. ఇప్పటికే అన్ని ఖండాలలోని 80దేశాల్లో అమెరికాకు 800కు పైగా చిన్నా పెద్దా సైనిక స్థావరాలు, కేంద్రాలూ ఉన్నాయి, అవి చాలవట. ఏది కావాలంటే దాన్ని ఇచ్చేద్దామా ? అధికార స్వీకరణకు ముందు చెప్పిన మాటలను చూసి అనేక మంది డోనాల్డ్‌ ట్రంప్‌ పిచ్చివాగుడులే గద్దె నెక్కిన తరువాత బుద్ధిగా ఉంటాడు అనుకున్నారు. కానీ తరువాత వెలువడిన తొలి పలుకుల నుంచీ ఏదో తేడా కొడుతోంది అనుకుంటున్నారు. తమ కాలువ గురించి చేసిన వ్యాఖ్యలతో ఉలిక్కి పడిన పనామా దాన్ని బలవంతగా ఆక్రమించుకొనేందుకు అమెరికా చూస్తోందంటూ ఐక్యరాజ్య సమితికి ఫిర్యాదు చేసింది. ప్రపంచ పరిణామాల్లో అమెరికా నానాటికీ ఒంటరి అవుతోంది. దానికి అనేక ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇంకేమాత్రం ప్రజాస్వామిక పద్దతుల్లో వ్యవహరిస్తే లాభం లేదని భావిస్తోందా ? తన రక్షణ మరొక పేరుతో ఏది కావాలని అమెరికా కోరుకుంటే దాన్ని ప్రపంచం ఇచ్చివేయాలా ? తమ నౌకలు సప్త సముద్రాల్లో తిరుగుతాయి, వాటి మధ్యన దేశాలు ఉంటాయి గనుక అవన్నీ తమ ఆధీనంలోకి రావాలంటే పుచ్చుకోబాబూ అంటూ సమర్పించుకోవాలా ? ప్రమాణ స్వీకారానికి ముందు కెనడా తమ దేశంలో 51వ రాష్ట్రంగా విలీనం కావాలన్నాడు, పనామా కాలువను తిరిగి తీసుకుంటా, డెన్మార్క్‌లోని స్వయం పాలిత ప్రాంతం గ్రీన్‌ లాండ్‌ కూడా కావాల్సిందే అన్నాడు. అసలు ట్రంప్‌ ఇలా ఎందుకు మాట్లాడుతున్నాడు. అధ్యక్ష ప్రసంగంలో పనామా గురించి మాత్రమే ప్రస్తావించాడు. గతంలో తమ నేతలు తెలివి తక్కువగా దాన్ని అప్పగించారని అన్నాడు. దాన్ని తిరిగి తీసుకోకుండా ప్రశాంతంగా ఒక అధ్యక్షుడు ఎలా ఉండగలడన్నాడు. అందువలన పనామా కాలువ గురించి చూద్దాం.

వలస వచ్చిన ఐరోపా శ్వేతజాతీయులు అమెరికా ఖండమంతటా విస్తరించటానికి దేవుడు తమకు ఆదేశమిచ్చాడంటూ స్థానికంగా ఉన్న రెడ్‌ ఇండయన్లను ఊచకోత కోసి ఆక్రమించుకున్నారు. తరువాత మరో రూపంలో ప్రపంచాధిపత్యం కోసం అమెరికా పూనుకుంది. డోనాల్డ్‌ ట్రంప్‌ అజెండా దాని కొనసాగింపే. దక్షిణ అమెరికాను ఆక్రమించుకున్న స్పానిష్‌ పాలకులు తమ దేశం నుంచి పెరూ చేరుకోవాలంటే నౌకల రవాణా కోసం అట్లాంటిక్‌పసిఫిక్‌ సముద్రాలను కలుపుతూ ఒక కాలువ తవ్వాలనే ఆలోచనను పదహారవ శతాబ్ది ప్రారంభంలోనే చేశారు. ఎందుకంటే పదకొండువేల కిలోమీటర్ల మేర సముద్రంలో ప్రయాణించి చేరటం దూరా భారం కనుక వారికి ఆ ఆలోచన వచ్చింది. అమెరికన్లు తొలుత నికరాగువా ద్వారా అనుసంధానం చేయాలనే ఆలోచన చేశారు, తరువాత పనామాను ఎంచుకున్నారు. దాని కంటే ముందు ఈజిప్టులో సూయజ్‌ కాలువ తవ్వారు. ఐరోపా నుంచి ఆసియాకు నౌకలు రావాలంటే ఆఫ్రికా ఖండాన్ని చుట్టి వచ్చేవి. సమయం, ఖర్చు తగ్గించేందుకుగాను మధ్య ధ సముద్రంఎర్ర సముద్రం మధ్య ఒక కాలువ తవ్వితే అరేబియా, హిందూ మహాసముద్రాల్లోకి సులభంగా ప్రవేశించవచ్చని ఫ్రెంచి ఇంజనీర్లు ఆలోచనచేసి 185969 మధ్య కాలువ తవ్వి రవాణాకు వీలు కల్పించారు. దానిని చూసిన తరువాత పనామా కాలువను అదే ఫ్రెంచి ఇంజనీర్లు 188089 మధ్య కొంత మేరకు తవ్వి అనేక అవాంతరాలు రావటంతో నిలిపివేశారు. తరువాత అమెరికన్లు ఆ కాలువను స్వాధీనం చేసుకొని మిగతా భాగాన్ని పూర్తి చేసి 1914 నాటికి సిద్దం చేశారు. అప్పటికే మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభం కావటంతో ఎలాంటి ప్రారంభోత్సవాలు లేకుండా నౌకలను అనుమతించారు. ఆ యుద్దంలో అమెరికా మిలిటరీకి అది ఎంతో ఉపయోగపడిరది.1977 వరకు అమెరికా ఆధీనంలోనే ఉన్న ఆ కాలువను అనివార్య స్థితిలో పనామాకు అప్పగించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. దాన్ని ఒక పట్టాన వదులుకొనేందుకు సిద్దపడకుండా 1999 వరకు సాగదీసింది.తరువాత దాన్ని పనామా నవీకరించి పెద్ద ఓడలకు వీలుగా విస్తరించింది.

పనామాకు ఇచ్చింది మేం గనుక తిరిగి మాకు కావాలని ఇప్పుడు ట్రంప్‌ చెబుతున్నాడు. అదే గనుక అయితే ముందు ప్రారంభించినందున మా సంగతేమిటని ఫ్రాన్సు అడిగితే....? ఎవరైనా ఎవడబ్బ సొమ్మని అడుగుతారు ! ట్రంప్‌ చెబుతున్న కారణం ఏమిటి ? అప్పగింత ఒప్పందాన్ని ఉల్లంఘించి పనామా ఆ కాలువను చైనాకు అప్పగించినట్లు ఆరోపించాడు.సర్వసత్తాక దేశమైన తమకు తమ కాలువ నిర్వహణను ఎవరికైనా అప్పగించే హక్కుందని పనామా అధ్యక్షుడు జోస్‌ రావుల్‌ ములినో వెంటనే స్పందించాడు. కాలువను తమకు ఏదో అప్పనంగా ఇచ్చినట్లు చెప్పటాన్ని ఖండిరచాడు. ఈ మార్గంలో అమెరికా చమురు, కంటెయినర్‌ ఓడల్లో 40శాతం ప్రయాణిస్తాయంటే అదెంత కీలకమో అర్ధం అవుతోంది. తమనుంచి ఎక్కువ మొత్తంలో టోల్‌ వసూలు చేస్తున్నట్లు ట్రంప్‌ ఆరోపించాడు. ఈ కాలువ రెండు వైపులా ఉన్న రేవులను 1997 ఒప్పందం ప్రకారం హాంకాంగ్‌ కేంద్రంగా ఉన్న అంతర్జాతీయ కంపెనీ సికె హచిసన్‌ నిర్వహిస్తున్నది. తరువాత రెండు సంవత్సరాలకు చైనాలో ప్రత్యేక ప్రాంతంగా అనుసంధానమైంది. ఆ కంపెనీలో జపాన్‌ మిత్సుబిషి, అమెరికా కంపెనీ బీచ్‌టెల్‌ కూడా భాగస్వాములే. 2049వరకు హంకాంగ్‌ చైనాలో విలీనం కాదని, అప్పటి వరకు ఆ కంపెనీతో సహా అన్నీ కూడా లావాదేవీలు జరిపేందుకు చైనా అనుమతించింది, అప్పటి వరకు ప్రత్యేక ప్రాంతంగానే ఉంటుంది.అమెరికన్లు కాలువను పూర్తిగా 1999 డిసెంబరు 31న పనామాకు అప్పగించారు. ట్రంప్‌ అసలు ఏడుపు ఏమంటే ఇటీవలి కాలంలో పనామాచైనా సంబంధాలు విస్తరించాయి.2017వరకు అమెరికా కనుసన్నలలో నడిచిన పనామా తైవాన్ను తప్ప చైనాను అసలు గుర్తించలేదు. తరువాత చైనాను గుర్తించటమే గాక బిఆర్‌ఐలో భాగస్వామిగా మారింది. పనామా కాలువకు సమాంతరంగా చమురు, గ్యాస్‌ పైప్‌ లైన్‌ ఏర్పాటు ద్వారా అదనపు రాబడి పొందవచ్చని పనామా ఆలోచిస్తున్నది. అది జరిగితే అమెరికా ఇంథనం కూడా దాని ద్వారానే సరఫరా చేయాల్సి ఉంటుంది. అంతే కాదు ప్రపంచ వాణిజ్యంలో ఆరుశాతం ఈ కాలువ ద్వారా జరుగుతున్నది, దీని వలన పనామాకు 2024లో ఐదు బిలియన్‌ డాలర్ల మేర లాభం వచ్చింది, ప్రతి డాలరును లెక్కవేసుకొనే అమెరికా కార్పొరేట్లు ఇంత మొత్తాన్ని వదులుకుంటారా ! ఈ కారణంగా కూడా ట్రంప్‌ ఆ కాలువను స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నాడు. మెక్సికో గల్ఫ్‌గా వ్యవహరిస్తున్నదానిని అమెరికా గల్ఫ్‌గా పేరు మారుస్తూ ట్రంప్‌ ఆదేశాలు జారీ చేశాడు. అయితే అమెరికా మాప్‌లో మాత్రమే ఆ పేరుతో ఉంటుంది, మిగతా దేశాలు తమ పటాల్లో పేరు మార్చాల్సిన అవసరం లేదు.తన చేతిలో పని గనుక పేరు మార్చాడు, పనామా కాలువను కలం పోటుతో స్వాధీనం చేసుకోగలడా ?

పనామాతో కుదురిన ఒప్పందం ప్రకారం అ కాలువ నిర్వహణలో తటస్థంగా ఉంటూ అన్ని దేశాలకు చెందిన నౌకలను అనుమతించాలని మాత్రమే ఉంది తప్ప తిరిగి అమెరికా తీసుకోవటానికి ఎలాంటి నిబంధన లేదు. హంకాంగ్‌ కంపెనీకి నిర్వహణను అప్పగించటాన్ని తటస్థ నిబంధన ఉల్లంఘన, చైనాకు అప్పగింతగా ట్రంప్‌ చిత్రించాడు. 2024 జూలైలో పనామా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ములినో ఒక మితవాది. తమ దేశంలో చైనా పెట్టుబడులు ఎక్కువగా ఉన్నాయని, అమెరికా పెట్టుబడులను ఆహ్వానిస్తున్నట్లు గతంలో చెప్పాడు.దాన్ని అవకాశంగా తీసుకోవాలని ట్రంప్‌ చూస్తున్నట్లు ఉంది. ఒక వేళ అతగాడు లొంగిపోయినా జనం అంగీకరించరు. అందుకే వ్యతిరేకిస్తూ ప్రకటన చేయాల్సి వచ్చింది.ఈ కాలువను చైనా తన మిలిటరీ అవసరాల కోసం వినియోగించుకోవచ్చని అమెరికా ఆరోపిస్తున్నది.గత పదేండ్లలో ఒక్క చైనా మిలిటరీ నౌక కూడా ఆ కాలువలో ప్రయాణించలేదు. సరకు రవాణాలో కూడా చైనా వాటా చాలా తక్కువ. ఇక పనామాలో పెట్టుబడుల విషయానికి వస్తే అమెరికా నుంచి 13 బిలియన్‌ డాలర్లు ఉంటే చైనా 51.5కోట్ల డాలర్లు మాత్రమే. అందువలన ఏ విధంగా చూసినా అమెరికాకు పోటీ కాదు, ముప్పు కూడా కాదు. పనామా కాలువను మిలిటరీ లేదా ఆర్థికపరమైన బెదిరింపుల ద్వారా అదుపులోకి తీసుకోవటం గురించి ట్రంప్‌ ఆలోచన కూడా చేయవద్దని రష్యా హెచ్చరించింది. పనామాను మరోసారి దురాక్రమణ చేస్తే తప్ప కాలువను స్వాధీనం చేసుకొనే అవకాశం లేదు. ఆ కాలువ ఐదువందల చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో ఉంది. దేశ జనాభా 45 లక్షలు. దాన్ని స్వాధీనం చేసుకోవాలంటే 90వేల మంది సైనికుల అవసరం ఉంటుందని మిలిటరీ అధికారులు అంచనావేశారు. దీన్ని బట్టి ఎక్కడ ఎలా దాడి చేయాలో ఎంత మంది సైనికులు అవసరమో అన్నీ సిద్దం చేసుకున్నదనుకోవాలా ? అలాంటి దుండగానికి పాల్పడితే దక్షిణ అమెరికా దేశాలన్నీ మౌనంగా ఉంటాయా ! ఫ్రెంచి కంపెనీ పనామా కాలువ తవ్వకం ప్రారంభించిన సమయంలో పనామా ప్రాంతం కొలంబియాలో ఉంది. ఆ కాలువను అమెరికా తీసుకోవాలని నిర్ణయించిన తరువాత కొలంబియా అంగీకరించకపోవటంతో పనామాకు స్వాతంత్య్రం ఇవ్వాలంటూ అమెరికా తన మిలిటరీని పంపింది. తరువాత కాలువ పరిసరాలను ఆక్రమించి పనామాను రెండుగా మార్చింది. కాలువ కోసం తరువాత పనామాలో అనేక ఉద్యమాలు జరిగాయి. దాంతో అమెరికా వైదొలగక తప్పలేదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

భారత – కెనడా కలహంపై పశ్చిమ దేశాల్లో ఆందోళన ఎందుకు, చైనా ఏమంటోంది !

27 Wednesday Sep 2023

Posted by raomk in CHINA, COUNTRIES, Current Affairs, Europe, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, UK, USA

≈ Leave a comment

Tags

Canada, Canada-India row, China, Hardeep Singh Nijjar, Joe Biden, Justin Trudeau, Narendra Modi, Narendra Modi Failures


ఎం కోటేశ్వరరావు


హరదీప్‌ సింగ్‌ నిజ్జర్‌ అనే పంజాబ్‌ వేర్పాటువాద, ఉగ్రవాది హత్య ప్రస్తుతం భారత్‌-కెనడా మధ్య సంబంధాలు దిగజారటానికి దారి తీసింది. నిజ్జర్‌ హత్యలో భారత్‌ ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రుడేవ్‌ సెప్టెంబరు 18న పార్లమెంటులో చేసిన ఆరోపణను మనదేశం తిరస్కరించింది. దానికి ఎలాంటి ఆధారాలు లేవంది. అప్పటి నుంచి జరుగుతున్న పరిణామాలు అక్కడ విద్యాభ్యాసం, ఉపాధికోసం వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు ఈ వివాదం తమ చైనా వ్యతిరేక ఎత్తుగడలు, సమీకరణలకు ఎక్కడ దెబ్బతగులుతుందో అన్న భయం అమెరికా కూటమి దేశాల్లో వెల్లడి అవుతోంది. భౌగోళిక రాజకీయాల మీద చూపే ప్రభావమే కాదు, భారత్‌కు ఆగ్రహం కలిగిస్తే దాని మార్కెట్‌లో ప్రవేశించేందుకు అవకాశాలు తగ్గుతాయన్న ఆందోళన కూడా వాటిలో ఉంది. చైనా మీద ఆధారపడకుండా భారత్‌ను ప్రత్యామ్నాయ వస్తు ఎగుమతి దేశంగా మార్చేందుకు సాయం చేస్తామని, వాణిజ్య సంబంధాలు మెరుగుపరచుకుంటామని చేస్తున్న ప్రకటనలు తెలిసినవే. చేసిన ఆరోపణను కెనడా వెనక్కు తీసుకోవాలని మనదేశం డిమాండ్‌ చేస్తోంది. ఉగ్రవాదులకు కెనడా సురక్షిత స్వర్గంగా ఉందని వర్ణించింది. మూడునెలల పరిశోధన తరువాత భారత హస్తం ఉందని నిర్ధారించుకున్నామని కెనడా అంటోంది. ఈ ఆరోపణను ఉపసంహరించుకుంటే తప్ప మనదేశం వెనక్కు తగ్గదు, అదే జరిగితే కెనడా అభాసుపాలవుతుంది కనుక వెనక్కు తగ్గే అవకాశాలు తక్కువ. ఇది చినికి చినికి గాలివానగా మారితే జరిగే పర్యవసానాల గురించి ఆందోళన చెందుతున్న జి 7 కూటమిలో పెద్దన్న అమెరికా, ఇతర దేశాలు ఇప్పటి వరకు ఆచితూచి వ్యవహరించాయి.


ఈ ఏడాది జూన్‌ 18న కెనడా వాంకోవర్‌ సమీపంలోని సురే అనే చోట ఒక గురుద్వారా వెలుపల హత్యకు గురైన నిజ్జర్‌ 1977లో పంజాబ్‌లోని జలంధర్‌ సమీపంలోని ఒక గ్రామంలో జన్మించాడు.పంజాబ్‌లో తీవ్రవాదులపై 1995లో చర్యలను ముమ్మరం చేయటంతో 1997లో నిజ్జర్‌ నకిలీ పాస్‌పోర్టుతో కెనడా పారిపోయాడు. అక్కడ తప్పుడు సమాచారం వెల్లడికావటంతో కేసులు, వివాదాల తరువాత 2007లో కెనడా పౌరసత్వం ఇచ్చారు. ఖలిస్తాన్‌ టైగర్‌ ఫోర్స్‌ అనే ఉగ్రవాద సంస్థతో అతనికి సంబంధాలు ఉన్నాయని, ఒక వేర్పాటువాది, నేరగాడు అని అతన్ని అరెస్టు చేసి అప్పగించాలని గతంలో మనదేశం కెనడాను కోరింది. దాన్ని అది ఖాతరు చేయలేదు. స్వేచ్చగా తిరగనిస్తున్నది. అతడు ఒక మానవహక్కుల కార్యకర్త, శాంతియుత పద్దతుల్లో సిక్కు దేశం ఏర్పాటుకు మద్దతు ఇచ్చినట్లు అతని మద్దతుదార్లు వాదిస్తారు. తమ దేశంలో భావ ప్రకటన స్వేచ్చ ఉందని అందువలన అతను మాట్లాడేదానితో తమకు సంబంధం లేదని కెనడా వాదించింది. అతను 2019లో సురే గురుద్వారా నేతగా మారాడు.2020లో ఖలిస్తాన్‌ ప్రజాభిప్రాయ సేకరణలో, వేర్పాటువాదాన్ని సమర్ధిస్తూ పేరు తెచ్చుకున్నాడు. అతని హత్యకేసులో ఇంతవరకు ఎవరినీ అరెస్టు చేయలేదు.


నిజ్జర్‌కు ఖలిస్తాన్‌ టైగర్‌ ఫోర్స్‌ అనే మిలిటెంట్‌ గ్రూపుతో సంబంధాలు ఉన్నాయని భారత్‌ చేసిన వినతి మేరకు 2014లో ఇంటర్‌ పోల్‌ అరెస్టు వారంటు జారీ చేసింది. అతడు 2013-14లో పాకిస్తాన్‌ వెళ్లాడని అక్కడ పాక్‌ ఐఎస్‌ఐ చేర్చుకున్న బబ్బర్‌ ఖాల్సా అనే సంస్థకు చెందిన జగతార్‌ సింగ్‌ తారాను కలిశాడని మన ప్రభుత్వం పేర్కొన్నది. అతని మీద నిఘా పెట్టాలని 2015లో కేంద్ర ప్రభుత్వం కోరింది. తరువాత రెండోసారి కూడా రెడ్‌ కార్నర్‌ నోటీసు జారీ చేసింది.తన మీద భారత ప్రభుత్వం చేసిన ఆరోపణలు వాస్తవం కాదని, రాజకీయపరమైనవని నిజ్జర్‌ 2016లో కెనడా ప్రధానికి లేఖ రాశాడు. అతగాడు అనేక హత్యలకు కారకుడని, తమకు కావాల్సిన ముఖ్యులలో ఒకడని 2018లో కేంద్రం కెనడాకు తెలిపింది. పంజాబ్‌ను విముక్తి చేసి ఖలిస్తాన్‌ ఏర్పాటు చేయాలన్న ప్రచారానికి నిజ్జర్‌ మద్దతు తెలిపాడు.2020లో మన ప్రభుత్వం అతడిని ఉగ్రవాదిగా ప్రకటించింది. ఆ ఏడాది మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన రైతుల ఉద్యమం వెనుక అతడు ఉన్నాడని ఆరోపించి కేసులు కూడా దాఖలు చేసింది. పంజాబ్‌లోని ఒక హిందూ పూజారిని హత్య చేసేందుకు కుట్ర పన్ని లక్ష రూపాయల బహుమతి ప్రకటించాడని 2022లో ఎన్‌ఐఏ పేర్కొన్నది.


కెనడా రాజకీయాల్లో సిక్కులు ఒక ప్రభావిత శక్తిగా ఉన్నారు. పంజాబ్‌ తరువాత ప్రపంచంలో సిక్కు సామాజిక తరగతి ఎక్కువగా ఉన్నది కెనడాలోనే, అక్కడ జనాభాలో 2.1శాతం ఉన్నారు. ముప్పై మందితో కూడిన జస్టిన్‌ ట్రుడేవ్‌ మంత్రివర్గంలో నలుగురు సిక్కులు మంత్రులుగా ఉన్నారు. ఈ కారణంగా నిజ్జర్‌ మరణానికి బాధ్యులను తేల్చాలన్న డిమాండ్‌ సహజంగానే అక్కడ ముందుకు వచ్చింది. అందువలన మరొకదారి లేని పరిస్థితిలో అంతర్జాతీయ కర్తవ్యం సంగతి తరువాత ముందు తన ప్రభుత్వం గురించి చూసుకోవాలని హత్య గురించి ట్రుడేవ్‌ పార్లమెంటులో మాట్లాడాల్సి వచ్చింది. జూన్‌ మొదటి వారంలో మన విదేశాంగ మంత్రి జై శంకర్‌ విలేకర్లతో మాట్లాడుతూ ఖలిస్తాన్‌ వేర్పాటువాదులకు కెనడా మద్దతు ఇవ్వటం రెండు దేశాల సంబంధాలకు మంచిది కాదని విమర్శించారు. ఆ తరువాత నిజ్జర్‌ హత్య జరిగింది. ఢిల్లీలో జరిగిన జి 20 కూటమి సమావేశాలకు జస్టిన్‌ ట్రుడేవ్‌ వచ్చినప్పటికీ ఇతర దేశాధినేతలతో మాదిరి ఫ్రధాని నరేంద్రమోడీ ప్రత్యేక చర్చలు జరపలేదు. అంతే కాదు కెనడాలో ఉగ్రవాదులు భారత వ్యతిరేక కార్యకలాపాలను కొనసాగిస్తున్నారని ఇటీవలి కాలంలో జరిగిన ఉదంతాల గురించి మోడీ కెనడా దృష్టికి తేగా, ప్రతిగా కెనడా కూడా మనదేశం మీద ఆరోపణలు చేసిందని వెల్లడైంది. తిరుగు ప్రయాణంలో ట్రుడేవ్‌ విమానంలో సాంకేతిక లోపం ఏర్పడగా ప్రత్యామ్నాయంగా విమానం ఏర్పాటు చేస్తామని మన దేశం ప్రతిపాదించినా రెండు రోజులు వేచి ఉండి తన విమానంలోనే వెళ్లిన సంగతి తెలిసిందే. రెండు దేశాల మధ్య సంబంధాలు సజావుగా లేవని ఈ ఉదంతం వెల్లడించింది. ఆ తరువాతే పార్లమెంటులో మన దేశం మీద ఆరోపణ చేశాడు. ఈ అంశాన్ని తాము భారత్‌కు ఎంతో ముందుగానే తెలిపామని ట్రడేవ్‌ చెబుతుండగా ఎలాంటి సమాచారం లేదని మన అధికారులు అంటున్నారు.


ఈ వివాదంలో పశ్చిమ దేశాల వైఖరిని చూస్తే మన దేశాన్ని ఖండించ లేదుగానీ విచారణ జరగాలి అని మాట్లాడుతున్నాయి. మీడియాలో వచ్చిన వార్తలను బట్టి కెనడా ప్రధాని బహిరంగంగా మన దేశం మీద ఆరోపణ చేయటానికి ముందే ” ఐదు కళ్ల గూఢచార యంత్రాంగం ” లో భాగస్వాములుగా ఉన్న అమెరికా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ అధికారులకు కెనడా నిజ్జర్‌ హత్యలో మన దేశ ప్రమేయం గురించి వెల్లడించటమే గాక ఒక సంయుక్త ప్రకటనలో ఖండించాలని ప్రతిపాదించగా మిగిలిన దేశాలు నష్టదాయకమంటూ తిరస్కరించినట్లు వెల్లడైంది. తమకు ముందుగానే చెప్పినట్లు కెనడాలోని అమెరికా రాయబారి డేవిడ్‌ కోహెన్‌ నిర్ధారించాడు. విదేశాల్లో హత్యలను సహించరాదని, తాము కెనడాను కేవలం సంప్రదించటం లేదని దర్యాప్తులో భాగస్వాములవుతున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ చెప్పాడు. భారత్‌కూడా దర్యాప్తులో భాగస్వామి కావాలని అమెరికా కోరింది. ఆరోపణలు ఆందోళనకరమైనవని, తాను భారత దేశం వద్ద ఈ అంశాన్ని లేవనెత్తినట్లు ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రిణి పెనీ వాంగ్‌ చెప్పింది. ఆరోపణలు తీవ్రమైనవని బ్రిటన్‌ విదేశాంగ మంత్రి జేమ్స్‌ క్లవర్లీ, వస్తున్న వార్తులు నిజమే అయితే తీవ్ర ఆందోళన కలిగించే అంశమని తమ భాగస్వాములతో సన్నిహితంగా పర్యవేక్షిస్తున్నట్లు న్యూజిలాండ్‌ విదేశాంగ మంత్రి నానియా మహుతా అన్న వ్యాఖ్యలు కెనడాకు అనుకూలంగా చేసినట్లు స్పష్టమౌతున్నాయి.


పంజాబ్‌, కాశ్మీర్‌, ఈశాన్య రాష్ట్రాలలో వేర్పాటు, తీవ్రవాద దుశ్చర్యలకు పాల్పడిన అనేక మందికి అమెరికా, కెనడా, ఐరోపా ధనిక దేశాలు ఆశ్రయం ఇచ్చిన సంగతి తెలిసిందే. పక్కనే ఉన్న శ్రీలంకలో ఉగ్రవాదులు సైతం పశ్చిమ దేశాల్లోనే స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు. పాకిస్తాన్‌ ఉగ్రవాదుల అడ్డా, శిక్షణా కేంద్రం అన్నది వేరే చెప్పనవసరం లేదు. ఇదంతా అమెరికా, ఇతర ఐరోపా దేశాల కుట్రలో భాగంగానే జరిగింది. కెనడా ప్రధాని ఏమి చెప్పినప్పటికీ ఖలిస్తాన్‌ త్రీవ్రవాదుల అడ్డాగా ఆ దేశం మారింది. ప్రపంచంలో ఇతర దేశాల మీద దాడులు చేసేందుకు ఉగ్రవాదుల ఏరివేత అని సాకులు చెప్పే పశ్చిమ దేశాలు తమ సంరక్షణలో ఉన్నవారి గురించి పల్లెత్తు మాట మాట్లాడవు. ఇప్పుడు పశ్చిమ దేశాల ఆందోళన అంతా కెనడాలో ఆశ్రయం పొంది మన దేశానికి వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న తీవ్రవాదుల ఏరివేత, అదుపు గురించి కాదు. కెనడా – భారత్‌ మధ్య వివాదం ముదిరితే చైనాకు వ్యతిరేకంగా భారత్‌ను నిలపాలన్న తమ ఎత్తుగడ ఎక్కడ విఫలమౌతుందో అన్న భయమే ఎక్కువ కనిపిస్తోంది. పశ్చిమ దేశాల నుంచి వెలువడుతున్న అన్ని వ్యాఖ్యానాల్లో బహిరంగంగానే దీని గురించి ప్రస్తావిస్తున్నారు. పశ్చిమ దేశాల ఇండో-పసిఫిక్‌ ఎత్తుగడలో కెనడా కూడా ఒక ప్రధాన భాగస్వామే. మన దేశంలో నిరంకుశ పోకడలు, మానవహక్కులకు భంగం కలుగుతున్నదంటూ అమెరికాలోని అనేక సంస్థలు ఒకవైపు నిరంతరం ప్రచారం చేస్తూ ప్రభుత్వం మీద వత్తిడి పెంచుతున్నాయి. ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ అమెరికా పర్యటనకు వెళ్లినపుడు 75 మంది ఎంపీలు మోడీ ప్రసంగాన్ని బహిష్కరించారు. అధ్యక్షుడు జో బైడెన్‌ వారి ప్రచారాన్ని అనుమతించి చోద్యం చూశాడు. మౌనంగా ఉన్నాడు. చైనాకు వ్యతిరేకంగా మన దేశాన్ని నిలబెట్టాలన్న ఎత్తుగడలో భాగమే అది. అదే ఎంపీలు చైనా గురించి చేసిన ఆరోపణల మీద అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు ఎలా స్పందిస్తున్నదీ చూస్తున్నాము.


పశ్చిమ దేశాలు కట్టగట్టుకొని మౌనం పాటిస్తున్నాయని, ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నట్లు భారత్‌-కెనడా వివాదం గురించి చైనా మీడియా స్పందించింది. తమ వ్యూహాత్మక భాగస్వామిగా భారత్‌ను తీసుకుపోవాలని చూస్తున్నాయి గనుక కెనడా మిత్ర దేశాలు మౌనంగా ఉన్నాయి తప్ప తమ మిత్రులు కాకుంటే వెంటనే ఖండనలకు దిగేవని గ్లోబల్‌ టైమ్స్‌ పేర్కొన్నది. తమ ప్రయోజనాలు లేకపోతే పశ్చిమ దేశాలు నీతి సూత్రాలు, నిబంధనలు వల్లించి ఉండేవని, భారత మానవహక్కుల సమస్యల గురించి కళ్లు మూసుకున్నట్లు పేర్కొన్నది. మనదేశం చైనాను ఎలా చూస్తున్నదో చైనా కూడా మనలను అలాగే చూస్తుంది, మరోవైపు కెనడాతో దాని సంబంధాలు సజావుగా లేవు. ఇప్పుడు తలెత్తిన వివాదాన్ని వారెలా చూస్తున్నారన్నది సహజంగానే ఆసక్తి కలిగిస్తుంది. చైనా అధికారికంగా మాట్లాడకపోయినప్పటికీ అధికారిక పత్రికల్లో వస్తున్న వ్యాఖ్యల ద్వారా వైఖరిని అర్ధం చేసుకోవచ్చు. ఈ వివాదంతో తమ వ్యూహం నుంచి భారత్‌ ఎక్కడ వైదొలుగుతుందో అన్న భయం పశ్చిమ దేశాల్లో ఉంటే, పశ్చిమ దేశాలు – భారత్‌ మధ్య దూరం పెరగాలని సహజంగానే చైనా కోరుకుంటుంది. కెనడా ఒక దేశంగా ఉన్నప్పటికీ అది అమెరికాలో 51వ రాష్ట్రం మాదిరి ఉంటుందని చైనా భావిస్తున్నది. అందుకే భారత్‌ పట్ల అమెరికా మోసకారి తనం, ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తున్నదని, వివాదం మరింత ముదిరితే గందరగోళానికి గురికానుందని చైనా గ్లోబల్‌ టైమ్స్‌లో ప్రచురితమైన విశ్లేషణలు చెబుతున్నాయి. పశ్చిమ దేశాల వలసవాద వైఖరి భారత్‌ను సమాన స్థాయిలో చూస్తూ సహకరించేందుకు ముందుకు రావటం అసాధ్యమని బీజింగ్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ అన్నాడు. అమెరికా అడుగులకు మడుగులొత్తుతూ ప్రవర్తించే కెనడా గతంలో చైనా మీద కాలు దువ్విందని ఇప్పుడు అమెరికా ప్రేరేపణతో భారత్‌ను రెచ్చగొడుతున్నదని చైనా వెబ్‌సైట్‌ ఒక విశ్లేషణలో రాసింది. మరికొందరు విశ్లేషకులు భారత్‌ పెద్ద ఇబ్బందుల్లో పడిందని పేర్కొన్నారు.


అమెరికా జాతీయ భద్రతా మండలి ప్రతినిధి జాన్‌ కిర్బీ మాట్లాడుతూ తమకు భారత్‌ ఎంతో కీలకమైన దేశంగానే ఉంటుందని, అది ఒక్క దక్షిణాసియా ప్రాంతానికే కాదు, ఇండో-పసిఫిక్‌ ప్రాంతానికి కూడా అని చెప్పాడు. అమెరికాకు ఇది కలవరం కలిగించేదే, దానికి విశాల ప్రయోజనాలు ఉన్నాయి, ట్రుడేవ్‌ ఆరోపణలు గనుక నిజమే అయితే నరేంద్రమోడీ సర్కార్‌ ప్రజాస్వామ్యానికి కట్టుబడి లేదన్నది అర్ధం, ఇదే విధానాన్ని పుతిన్‌ కూడా అనుసరించాడు అని కెనడాలోని టొరొంటో విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌ రాబర్ట్‌ బోత్‌వెల్‌ అన్నాడు. తన శత్రువులను రష్యాలోపల, వెలుపల బ్రిటన్‌తో సహా ఇతర దేశాల్లో పుతిన్‌ చంపించాడని అన్నాడు. కరవ మంటే కప్పకు కోపం- విడవ మంటే పాముకు ఆగ్రహం అన్నట్లుగా ప్రస్తుతం పశ్చిమ దేశాల పరిస్థితి ఉంది.చివరకు ఈ వివాదాన్ని ఎలా ముగిస్తారో చూడాల్సి ఉంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అమెరికా ఆరాధకులూ, గుడ్డి భక్తులూ జర జాగ్రత్త !

26 Sunday Sep 2021

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, RUSSIA, UK, Uncategorized, USA

≈ Leave a comment

Tags

anti china, AUKUS, Canada, Huawei Technologies, Meng Wanzhou, Quad


ఎం కోటేశ్వరరావు


చైనా మీద ఉక్రోషంతో అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ హువెయి కంపెనీ అధికారిని కిడ్నాప్‌ చేయించాడు.దాని పర్యవసానాలను తట్టుకోలేని ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ దిగివచ్చి రాజీ చేసుకున్నాడు. బాధితురాలు చైనాకు చెందిన వాంగ్‌ వాన్‌ఝౌ స్వదేశం చేరుకొనే సమయంలోనే చతుష్టయ దేశాధినేతల తొలి సమావేశం వాషింగ్టన్‌లో జరిగింది. చతుష్టయ సమావేశం ముందుగా నిర్ణయించుకున్నదే, మరి మొదటి ఉదంతం ? యాదృచ్ఛికమా ? కానేకాదు ! ఈ చర్య అమెరికా-చైనాల మధ్య సంబంధాలను మెరుగుపరచేందుకు దోహదం చేయనుందనే వ్యాఖ్యానాలు వెలువడుతున్నాయి.మరోవైపు చైనాను రెచ్చగొట్టే చర్యలకు ” అకుస్‌” ఒప్పందం చేసుకున్నారు. చతుష్టయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ నేపధ్యంలో నాటకీయంగా సుఖాంతమైన కిడ్నాప్‌ ఉదంతం, దీని ద్వారా భారత్‌ సహా మిత్రదేశాలకు అమెరికా ఇచ్చిన సందేశం ఏమిటి ?


చైనాతో వాణిజ్య యుద్దాన్ని ప్రారంభించిన డోనాల్డ్‌ ట్రంప్‌ చైనా టెలికాం కంపెనీ హువెయి సిఎఫ్‌ఓ, కంపెనీ స్ధాపకుడి కుమార్తె మెంగ్‌ వాన్‌ఝౌను 2018డిసెంబరు ఒకటవ తేదీన కెనడాలో ” రాజకీయ కిడ్నాప్‌ ” చేయించాడు. మెంగ్‌ చైనా నుంచి మెక్సికో వెళుతూ విమానం మారేందుకు కెనడాలోని వాంకోవర్‌ విమానాశ్రయంలో దిగింది. అమెరికా వత్తిడికి లొంగిన కెనడా సర్కార్‌ ఆమెను కిడ్నాప్‌ చేసి నిర్బంధించింది. ఇదే సమయంలో గూఢచర్యానికి పాల్పడుతూ దొరికిపోయిన ఇద్దరు కెనడీయులను చైనా అరెస్టు చేయటమే కాదు, విచారణ జరిపి శిక్షలు కూడా విధించింది. ఈ పరిణామాలతో అమెరికా-చైనా సంబంధాలు గత నాలుగుదశాబ్దాల్లో ఎన్నడూ లేని విధంగా దిగజారటమే కాదు, కెనడా ఇరుక్కుపోయి చైనాతో వైరాన్ని కొని తెచ్చుకుంది.


ఇంతకీ వాంగ్‌ మీద మోపిన నేరం ఏమిటి ? ఇరాన్‌ మీద అమెరికా విధించిన ఆంక్షలను వమ్ము చేసేందుకు హుబెయి కంపెనీ కుట్ర చేసిందట, దానికి గాను సిఎఫ్‌ఓను అరెస్టు చేసి తమకు అప్పగించాల్సిందిగా కెనడాను కోరింది. కెనడా అరెస్టయితే చేసింది గానీ చైనాతో వచ్చే ముప్పును గ్రహించి వాంగ్‌ను అమెరికాకు అప్పగించలేదు. ఒకవైపు అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియా, భారత్‌తో కూడిన చతుష్టయ (క్వాడ్‌) తొలి సమావేశం వాషింగ్టన్‌లో జరుపుతున్న సమయంలోనే నాటకీయ పరిణామాల మధ్య వాంగ్‌ విడుదలకు చైనాతో అమెరికా ఒప్పందం కుదుర్చుకుంది. వాంగ్‌ శనివారం నాడు ప్రత్యేక విమానంలో చైనా చేరుకుంది. ఒప్పంద వివరాలు పూర్తిగా తెలియదు. ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి వైదొలిగే విషయం ఇతర భాగస్వామ్య పక్షాలతో చెప్పకుండానే నిర్ణయం తీసుకున్న అమెరికా ఇప్పుడు ఈ పరిణామంతో చతుష్టయంలోని మిగిలిన దేశాలను కూడా ఇబ్బందుల్లోకి నెట్టినట్లయింది.


ఈ ఒప్పందానికి జో బైడెన్‌ యంత్రాంగాన్ని ప్రేరేపించిన అంశాలేమిటి ? చైనా వైపు నుంచి కొత్తగా పొందిన రాయితీలేమీ లేవు. ఒక వైపు అక్కడి గుత్త సంస్ధలపై అనేక చర్యలను జింపింగ్‌ సర్కార్‌ ప్రకటిస్తున్నది. ఇతర దేశాలపై ఆధారపడకుండా స్వంత పరిజ్ఞానం, వనరులతో అభివృద్ధి వ్యూహాన్ని కొనసాగించాలని నిర్ణయించారు. జనవరిలో అధికారాన్ని స్వీకరించిన బైడెన్‌ వాణిజ్య ప్రతినిధిగా కాథరీన్‌ తాయి నియామకం జరపటంతో వాణిజ్యవేత్తలు తమ సమస్యలను పట్టించుకుంటారనే ఆశాభావం వెలిబుచ్చారు. అయితే నెలలు గడుస్తున్నా వ్యూహాత్మక ఓపిక పేరుతో కాలం గడుపుతున్న బైడెన్‌ వైపు నుంచి ఎలాంటి సూచనలు రాకపోవటంతో కొంత మందిలో ఓపిక స్దానంలో ఆగ్రహం వ్యక్తమౌతోంది. వెంటనే చైనాతో చర్చలు జరిపి సాధారణ సంబంధాలతో తమ ప్రయోజనాలను కాపాడతారా లేదా అనే వత్తిడి తెస్తున్నారు.

డోనాల్డ్‌ ట్రంప్‌ హయాంలో చైనాతో కుదుర్చుకున్నట్లు ప్రకటించిన తొలి దశ వాణిజ్యం ఒప్పందం ఏమేరకు అమలు జరిగిందో స్పష్టత లేదు. కరోనా వైరస్‌ను చైనాయే తయారు చేసి వదలిందని నోరు పారవేసుకున్న ట్రంప్‌ చైనాతో వైరాన్ని మరింత పెంచాడు. ఒప్పందంలో ఏమి చెప్పినప్పటికీ అమెరికాకు ఆగ్రహం కలిగినా, దాంతో చైనాకు చిర్రెత్తినా నష్టపోయేది అమెరికాయే గనుక అక్కడి వాణిజ్యవేత్తలు బైడెన్‌ వైఖరి పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆగస్టు తొలివారంలో అమెరికాలోని అతి పెద్ద వాణిజ్య సంస్ధల సంఘాలు సమావేశమై చైనాతో సర్దుబాటు చేసుకొని వాణిజ్య అవకాశాలను పెంచుతారా లేదా అని బైడెన్‌కు ఒక విధంగా హెచ్చరికను జారీ చేశాయి. కొన్ని ఉత్పత్తుల తయారీకి అవసరమైన ఉత్పాదకాలు చైనాలో మాత్రమే దొరుకుతాయి, ఇతర దేశాల్లో పరిమితంగా లభ్యమైనా అధికధరలకు వాటిని కొనుగోలు చేసి మార్కెట్లో తమ వస్తువులను అమ్ముకోలేకపోతున్నామని, అందువలన చైనా సరఫరాదార్ల మీద ఆంక్షలను ఎత్తివేయాలని డిమాండ్‌ చేశాయి. అమెరికా ఆర్ధిక వ్యవస్ధ, కార్మికులు, అమెరికా పోటీతత్వాన్ని కాపాడాలంటే చైనాతో రాజీకి రావాలని స్పష్టం చేశాయి.


అమెరికా కంపెనీలను చైనీయులు ఎలా ప్రభావితం చేస్తున్నారో మచ్చుకు విమానాలను తయారు చేసే బోయింగ్‌ కంపెనీ ఉదంతాన్ని చూద్దాం. అసలే ఆ కంపెనీ కష్టాల్లో ఉంది, అది తయారు చేసే విమానాల్లో ఐదోవంతు కొనుగోలు చేసే చైనా నుంచి 2017 తరువాత ఆర్డర్లు లేవు. లాభాలు తెస్తుంది అనుకుంటున్న బోయింగ్‌ 737 మాక్స్‌ రకం తన గగన తలంపై ఎగిరేందుకు చైనా అనుమతించ లేదు. దాంతో ఇతర దేశాలు అనుమతి ఇచ్చినా, విమానాలు కొనుగోలు చేసినా పెద్దగా ఫలితం ఉండదు. ఇదంతా ట్రంపు చేసిన కంపు అని అది మండిపడుతోంది. రాబోయే పది సంవత్సరాల్లో ప్రపంచం వంద విమానాలు కొనుగోలు చేస్తుందనుకుంటే వాటిలో 25 చైనా వాటా.ఈ కారణంగా బోయింగ్‌ వాటాదారులు ఇటీవల కంపెనీ మీద ధ్వజమెత్తారు. ఎన్ని అడ్డుంకులను అధిగమించినా చైనాతో సాధ్యం కావటం లేదు, చైనాతో సర్దుబాటు చేసుకోకపోయినా, ఆలస్యం అయినా మన కంపెనీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని సిఇఓ దవే కాలహన్‌ వాపోయాడు. మే నెలలో కొత్తగా 73 విమానాలకు అర్డర్లు వస్తే అదే నెలలో 53 ఆర్డర్లు రద్దయ్యాయి. కనుక ఇలాంటి కార్పొరేట్లకు ఆగ్రహం కలిగినా, మద్దతు లేకపోయినా అమెరికాలో ట్రంపూ, బైడెన్‌ ఎవరూ తెరమీద కనిపించరు.


బోయింగ్‌ వంటి కంపెనీలు ఎందుకు ఆందోళన చెందుతున్నాయి ? రానున్న రెండు దశాబ్దాలలో చైనాకు 8,700 విమానాలు అవసరమన్నది ప్రస్తుత అంచనా. చైనా వృద్ధి రేటు, పౌరుల ఆదాయాలు పెరిగితే ఇంకా ఎక్కువ అవసరం కావచ్చు. మరోవైపు 2025నాటికి స్వంత విమానాలను ఎగురవేయాలని చైనా ముమ్మరంగా పరీక్షలు జరుపుతోంది.2008లో ఏర్పాటు చేసిన కంపెనీ రెండు రకాల విమానాలను అభివృద్ది చేస్తోంది. ఎక్కడా ఆగకుండా 5,555 కిలోమీటర్ల దూరం 156 నుంచి 168 మంది, పన్నెండు వేల కిలోమీటర్లు ఆగకుండా 250 నుంచి 320 మంది ప్రయాణీకులను చేరవేయగలిగే విమానాలను తయారు చేస్తున్నారు. వెయ్యి చిన్న విమానాలను ఈ ఏడాది చివరి నాటికి వాణిజ్య అవసరాలకు ప్రవేశపెడతారని, 2025నాటికి పెద్ద విమానం సిద్దమౌతుందని భావిస్తున్నారు. అవి రంగంలోకి వస్తే ఐరోపా ఎయిర్‌బస్‌, అమెరికా బోయింగ్‌లకు పెద్ద పోటీ ఇస్తుందని భావిస్తున్నారు. అందుకే ఈ లోగా వీలైనన్ని విమానాలను అమ్ముకోవాలని ఆ రెండు కంపెనీలు తొందరపడుతున్నాయి. తమ ప్రభుత్వాల మీద వత్తిడి చేస్తున్నాయి.


వచ్చే ఏడాది నవంబరులో అమెరికా పార్లమెంట్‌ మధ్యంతర ఎన్నికల జరగాల్సి ఉంది. చైనాతో ఒప్పందం చేసుకుంటే లొంగిపోయినట్లుగా ట్రంప్‌ గ్యాంగ్‌ ఓటర్లను రెచ్చగొట్టవచ్చని డెమోక్రటిక్‌ పార్టీ భయపడుతోంది. లేకపోతే కార్పొరేట్లు గుర్రుమంటున్నాయి.మరోవైపు ఎవరి మీదా ఆధారపడకుండా ఆర్ధిక వ్యవస్దను నడపాలనే వైఖరితో ముందుకు పోతున్న చైనా నాయకత్వ వైఖరి కూడా పెట్టుబడిదారులకు ఆందోళన కలిగిస్తోందంటే అతిశయోక్తి కాదు. ఒక వైపు చతుష్టయంలోని భారత్‌, ఆస్ట్రేలియా, జపాన్‌ దేశాలను చైనాకు వ్యతిరేకంగా అమెరికా రెచ్చగొడుతూ దూరం పెంచుతోంది. మరోవైపు తన వ్యాపారాన్ని తాను చక్కపెట్టుకొంటోంది.2021 తొలి ఎనిమిది నెలల్లో అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 36.6శాతం పెరిగి చైనా-అమెరికా వాణిజ్యం రెండు వైపులా రికార్డులను బద్దలు కొట్టి 470బిలియన్‌ డాలర్లకు చేరింది. అమెరికా నుంచి 48శాతం ఎగుమతులు(111బి.డాలర్లు) పెరిగితే చైనా నుంచి 33.3శాతం(354 బి.డాలర్లు) పెరిగాయి. ఏడాది మొత్తం మీద రెండు దేశాల మధ్య 700 బిలియన్‌ డాలర్ల వాణిజ్యం జరుగుతుందని అంచనా. ఇది వాణిజ్య యుద్దానికి ముందున్న స్ధాయిని దాటి కొత్త రికార్డు నెలకొల్పుతుందని చెబుతున్నారు.


చైనా నుంచి కంపెనీలు మన దేశం వస్తున్నాయన్న ప్రచారం తెలిసిందే. కరోనా సమయంలో(2020) చైనాలోని తమ అసోసియేషన్‌లోని 95శాతం మంది చైనా మార్కెట్లో లబ్దిపొందారని అమెరికా-చైనా వాణిజ్య మండలి(యుఎస్‌సిబిసి) ఒక శ్వేతపత్రంలో వెల్లడించింది. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను చూస్తే ట్రంప్‌ వైఖరినే బైడెన్‌ కొనసాగిస్తారనే భయం అమెరికన్‌ కార్పొరేట్లలో ఉంది, అందుకే వత్తిడి పెంచారు.అదే జరిగితే చైనా ప్రతిదాడికి దిగితే వాణిజ్యంతో పాటు సామాన్య అమెరికన్లు కూడా ఇబ్బంది పడతారనే భయం వ్యక్తమౌతోంది. అంతర్గతంగా రాయితీలు ఇవ్వటాన్ని ప్రపంచ వాణిజ్య సంస్ధ కూడా అడ్డుకోలేదు.ఆధునిక పరికరాలు, సాంకేతిక పరిజ్ఞాన అభివృద్దితో 2025 నాటికి ఒక మైలురాయిని దాటాలని చైనా పెద్ద ఎత్తున సబ్సిడీలు ఇస్తూ స్ధానిక పరిశోధన, అభివృద్దిని ప్రోత్సహిస్తోంది. ఇది కూడా అమెరికన్లకు ఆందోళనకరంగా మారింది. ట్రంప్‌ మార్గంలో పయనిస్తే మరోదారీ, తెన్నూ లేని చోటికి పయనిస్తామని, కనుక వెంటనే ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా చర్చలు జరపాలని కార్పొరేట్లు డిమాండ్‌ చేస్తున్నాయి.ఈ నేపధ్యంలోనే సెప్టెంబరు పదిన జో బైడెన్‌-గ్జీ జింపింగ్‌ మధ్య అనేక అంశాలపై ఫోను ద్వారా సంభాషణలు జరిగాయి. పదిహేను రోజుల్లోనేే హుబెయి సిఎఫ్‌ఓ వాంగ్‌ఝౌ విడుదల ఆఘమేఘాల మీద జరిగింది.


అమెరికన్‌ కార్పొరేట్లు బైడెన్‌ సర్కారు మీద మరోవత్తిడిని కూడా ప్రారంభించాయి. ఆర్ధికంగా చిక్కుల్లో ఉన్న వ్యవస్ధను గట్టెక్కించేందుకు ప్రభుత్వం 3.5లక్షల కోట్ల డాలర్లను వివిధ పధకాల మీద ఖర్చు చేయాలని ప్రతిపాదించింది. అందుకు గాను వాణిజ్య, పారిశ్రామిక సంస్దల నుంచి వసూలు చేసే పన్ను మొత్తాల పెంపుదల, ఇతర చర్యల ద్వారా నిధుల సేకరణ జరపాలన్న ప్రతిపాదనలున్నాయి.ఇదే చేస్తే దేశ ఆర్ధిక వ్యవస్ధ ఉనికే ప్రశ్నార్దకం అవుతుందని అమెరికా వాణిజ్య మండలి ధ్వజమెత్తింది.దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున టీవీల్లో ప్రకటనలు జారీ చేసి ప్రచారం చేస్తోంది. ఈ మొత్తం దేశంలోని 50 రాష్ట్రాల బడ్జెట్లకు రెండు రెట్ల కంటే ఎక్కువని, దీని వలన ఫలితం లేకపోగా మొదటికే ముప్పు వస్తుందని వాణిజ్య మండలి సిఇఓ సుజానే క్లార్క్‌ విమర్శించాడు.ఈ ప్రతిపాదనలను ఆమోదించవద్దని, మద్దతు ఇస్తే ఏ సభ్యుడికీ తమ మద్దతు ఉండదని హెచ్చరిస్తూ పార్లమెంట్‌ సభ్యులకు ఒక లేఖను కూడా మండలి రాసింది. ఇదే సమయంలో ఎట్టి పరిస్ధితుల్లో ఈ ప్రతిపాదనను ఆమోదించాల్సిందే అని కొంత మంది ఎంపీలు బహిరంగంగా ప్రకటించారు.


ప్రపంచీకరణ పేరుతో ప్రపంచమార్కెట్లను ఆక్రమించేందుకు అమెరికా ప్రయత్నిస్తే అనుకున్నదొకటీ అయింది మరొకటి. ప్రపంచీకరణ శ్రమశక్తి ఖర్చును తగ్గించింది. అది అమెరికా కార్పొరేట్లకు వరంగానూ, కార్మికవర్గానికి శాపంగానూ మారింది. స్ధానిక మార్కెట్ల ద్వారా వృద్ధి సాధించే అవకాశాలు తగ్గిపోయాయి. అమెరికా వస్తువుల కంటే ఇతర దేశాల నుంచి వస్తువులు దిగుమతి చేసుకోవటం లాభదాయయకంగా మారింది. 2001లో ప్రపంచ వాణిజ్య సంస్ధలో చైనా చేరినప్పటి నుంచీ అంతకు ముందు యాభై సంవత్సరాలతో పోల్చితే అమెరికన్‌ కార్పొరేట్ల లాభాలు 22శాతం పెరిగాయి.చైనాలో పెట్టుబడి పెట్టిన వారు కూడా ఇదే విధంగా లబ్ది పొందారు. దశాబ్దాల తరబడి క్యూబా, ఉత్తర కొరియా,రష్యా,సిరియా, తదితర దేశాల మీద అమెరికా విధించిన ఆంక్షలు పరిస్ధితిని మరింతగా దిగజారాయి తప్ప ప్రయోజనం లేకపోయింది. అవన్నీ ఇబ్బందులను భరించాయి తప్ప అమెరికాకు లొంగలేదు. అమెరికా విధించిన ఆంక్షల వలన ఆయా దేశాలు బోయింగ్‌ బదులు ఎయిర్‌బస్‌ విమానాలను కొనుగోలు చేస్తున్నాయి. ఇదే ఇతర అంశాల్లోనూ జరుగుతోంది. క్రమంగా చైనా పెట్టుబడిదారీ వ్యవస్ధకు మారుతుందని పశ్చిమదేశాలు వేసిన అంచనాలన్నీ తలకిందులవుతున్నాయి. ఇప్పుడు అక్కడ బడా సంస్దల మీద నియంత్రణ, ఉమ్మడి సౌభాగ్యం పేరుతో తీసుకుంటున్న చర్యల గురించి అర్ధంగాక జుట్టుపీక్కుంటున్నాయి.


గత దశాబ్దకాలంలో చైనా సంస్దలు అమెరికా నుంచి 76బిలియన్‌ డాలర్లను సేకరిస్తే ఈ ఏడాది ఇప్పటి వరకు 13బిలియన్‌ డాలర్లను పొందాయి.2016 నుంచి అమెరికాలోని స్టాక్‌మార్కెట్‌లో వాటాలను విక్రయిస్తున్న చైనా కంపెనీలు రెట్టింపై 400కు చేరాయి. వాటి లావాదేవీల మొత్తం 400 బిలియన్‌ డాలర్ల నుంచి 1.7లక్షల కోట్ల డాలర్లకు చేరింది. అమెరికా విదేశాంగ విధానంలో ఆర్ధిక అంశాలు చిన్నచిన్న దేశాలను కూడా ప్రభావితం చేయలేకపోయాయి. మిలటరీ చర్యలు కూడా ఎలా పరువు తీశాయో ఆప్ఘనిస్తాన్‌ స్పష్టం చేసింది. మిత్రదేశమైన మెక్సికో సరిహద్దులో వలస కార్మికులను అడ్డుకొనేందుకు ఏకంగా ట్రంప్‌ సర్కార్‌ గోడనే కట్టించిన విషయం తెలిసిందే. చైనా మీద విధించిన ఆంక్షలను ఐరోపాలోని జర్మనీ వంటి దేశాలే ఖాతరు చేయటం లేదు. హువెయి కంపెనీ టెలికాం ఉత్పత్తుల దిగుమతిని వ్యతిరేకించిన జర్మనీ ఇప్పుడు పునరాలోచనలో పడి ఐరోపా యూనియన్‌ మీదనే ఆంక్షలకు వ్యతిరేకంగా వత్తిడి తెస్తోంది. చైనాతో ఒప్పందాలు చేసుకుంటోంది. గతేడాది చైనాతో దాని వాణిజ్యం 243 బిలియన్‌ డాలర్లు. ఆర్ధిక ఆంక్షల కొరడాను అమెరికా ప్రయోగిస్తుంటే అదే ఎత్తుగడను చైనా అనుసరిస్తోంది. ఆస్ట్రేలియా, జపాన్‌, కెనడా, దక్షిణ కొరియా వంటి అమెరికా అనుకూల దేశాలకు నీవు నేర్పిన విద్యయే అంటూ జవాబిస్తోంది.


మాఫియా ముఠాలు తమ సామ్రాజ్యాన్ని విస్తరించుకొనేందుకు ఎరలు వేసి యువతను ఆకర్షించి వారి చేత తప్పులు చేయించి తమ చక్రబంధంలో ఇరికించుకొని మరిన్ని తప్పులు చేయిస్తాయి.ఆ విషవలయం నుంచి ఎవరైనా బయటపడాలన్నా తమ మీద ఆధారపడటం తప్ప తప్పుకోలేని స్ధితికి నెడతారు. సరిగ్గా అమెరికా కూడా అదే పద్దతులను అనుసరిస్తోంది. పేకాటలో గెలిచేందుకు వేసే ఎత్తుగడల్లో భాగంగా, ఎదుటివారిని మభ్యపెట్టేందుకు కొన్ని పేకలను పడవేయటాన్ని తురుపు ముక్కలు అంటారు. వాటిని చూసి ఎదుటి వారు ఆడితే తప్పుదారి పట్టినట్లే.్ల అమెరికా తన క్రీడలో కూడా అలాంటి తరుపుముక్కలను ఉంచుకుంటుంది. మన దేశం విషాయనికి వస్తే స్వతంత్ర లేదా అలీన విధానాన్ని అనుసరించినపుడు మనకు ఉన్న మిత్రదేశాలెన్ని ఇప్పుడు దూరమయ్యాయో ప్రతి ఒక్కరూ తెలుసుకోవటం పెద్ద కష్టం కాదు. ఆసియాలో మన చుట్టూ ఉన్న అనేక దేశాలు మన నుంచి దూరం జరిగి చైనాకు సన్నిహితం అవుతున్నాయి.అయినప్పటికీ ప్రస్తుత మనపాలకుల వైఖరిలో ఎలాంటి మార్పు లేదు. చైనా, లేదా మరొకదేశానికి లొంగిపోవాలని లేదా దాని అనుయాయిగా మారాలని ఎవరూ చెప్పటం లేదు. మన రక్షణ, ప్రయోజనాలూ ముఖ్యం. అమెరికా చెప్పుడు మాటలు విని దాని కోసం మనం ఇరుగు పొరుగు వారితో విబేధాలను కొనితెచ్చుకోవటం సరైన వైఖరికాదు. సరిహద్దు సమస్యను ఉభయ దేశాలు పరిష్కరించుకోవాలి తప్ప అమెరికా ఆర్చేది కాదు తీర్చేది కాదు.


ఐరోపా యూనియన్‌కు మోటారు వంటి జర్మనీలో ఇటీవల ఒక నివేదిక వెలువడింది. మన అపర దేశభక్తులు దాని గురించి ఒక్కసారి చూడటం మంచిదేమో ఆలోచించండి. బిట్స్‌ అండ్‌ చిప్స్‌ అనే వెబ్‌సైట్‌లో సెప్టెంబరు ఒకటవ తేదీన ఒక వార్త వచ్చింది. దానికి పెట్టిన శీర్షిక ” చైనా విషయంలో మనం అమెరికా అజండాను గుడ్డిగా అనుసరించకూడదు ”. జర్మన్‌ ఎకనమిక్‌ ఇనిస్టిట్యూట్‌ వెల్లడించిన ఒక నివేదిక మీద సమీక్ష మాదిరి రాశారు. ఐరోపా ఎగుమతి వస్తాదుగా ఉన్న జర్మనీ ఇటీవలి కాలంలో చైనాతో ఓడిపోతోంది అని పేర్కొన్నారు. ఇదే వెబ్‌సైట్‌లో అంతకు ముందు విశ్లేషణ రాసిన సానే వాన్‌డెర్‌ లగట్‌ ఇలా చెప్పారు.” గావుసియన్‌ అనే చైనా కంపెనీ శుభ్రం చేసే రోబోట్లను ఉన్నతమైన నాణ్యతతో అందచేస్తున్నది. వాటన్నింటి కంటే నేను ఒక ప్రధాన పెద్ద భ్రమ గురించి హెచ్చరిక చేయదలచాను.సాంకేతికంగా ఆసియా దేశాల కంటే ముందున్నామని ఇంకా అనుకుంటున్నాము. దాన్ని మనం కాపాడుకోవాలంటే అపహరించకుండా, కొనుగోలు, కాపీ చేయకుండా చూడాలని అనుకుంటున్నాము. మనం ఒక అంశానికి సిద్దపడటం లేదు, అదేమంటే ఉదారవాద మార్కెట్‌లో మన స్వంత చట్టాల ప్రకారమే మన మాదిరే అనేక కంపెనీలు మరింత ఆధునిక ఉత్పత్తులతో ముందుకు వస్తున్నాయి.”


ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి వైదొలిగితే జరిగే పర్యవసానాల గురించి భాగస్వామ్య దేశమని పొగడ్తలు కురిపించిన మనతో లేదా అక్కడికి సైన్యాన్ని పంపిన నాటో కూటమి దేశాలతో కూడా అమెరికా మాట మాత్రం చెప్పకుండా తనదారి తాను చూసుకుంది. మనం బహిరంగంగా తప్పు పట్టకపోగా తాలిబాన్లతో ప్రయివేటు ఒప్పందాన్ని హర్షించాము. చతుష్టయం పేరుతో మన దేశం, జపాన్‌, ఆస్ట్రేలియాలను ముగ్గులోకి దించి చైనాకు వ్యతిరేకంగా నిలబెడుతోంది. జపాన్‌, మనదేశంతో చెప్పకుండానే మిత్రదేశమైన ఫ్రాన్స్‌ ప్రయోజనాలను కూడా దెబ్బతీసి ఆస్ట్రేలియాకు తమ అణుశక్తి జలాంతర్గాములను అమ్ముకొనేందుకు బ్రిటన్‌తో కలసి కొత్త కూటమి అకుస్‌ను ఏర్పాటు చేసింది. మూడు సంవత్సరాలుగా హుబెయి సిఎఫ్‌ఓను కెనడాలో నిర్బంధించిన అమెరికా నాటకీయ రీతిలో కేసులు ఎత్తివేసింది. దాని మాట నమ్మి అరెస్టు చేసిన కెనడా, ఆ చర్యను సమర్ధించిన దేశాలన్నీ ఇప్పుడు తలెత్తుకోలేని స్ధితిలో పడ్డాయి. ఇదంతా ఎందుకు అంటే చైనాతో తన వాణిజ్యాన్ని పెంచుకొనేందుకే అన్నది స్పష్టం. అందుకోసం అమెరికన్లు దేనికైనా సిద్దపడతారు. మనం ఇప్పటికే చాలా దూరం ప్రయయాణించాం. ఎక్కడకు పోతామో తెలియదు. అందువలన మన దేశంలోని అమెరికా గుడ్డి అరాధకులు, భక్తులు ఇప్పటికైనా దాని తోకను వదలి పెట్టటం గురించి ఆలోచించాలి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d