• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: Vladimir Putin

సామ్రాజ్యవాదుల యుద్ధోన్మాదం : మిలిటరీ బడ్జెట్‌ పెంపు – పౌర సంక్షేమానికి కోత !

07 Wednesday May 2025

Posted by raomk in CHINA, Current Affairs, Europe, Germany, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, RUSSIA, UK, USA, WAR

≈ Leave a comment

Tags

American imperialism, Donald trump, Global military spending, Imperialist war, SIPRI, Vladimir Putin, Xi Jinping


ఎం కోటేశ్వరరావు


డోనాల్డ్‌ ట్రంప్‌ పిచ్చిపనులే కాదు యుద్ధోన్మాదంతో కూడా రెచ్చిపోతున్నాడు.ఒకవైపు ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ఆపుతానంటాడు, మరోవైపు గాజాలో మారణకాండకు మద్దతు, ఎమెన్‌పై ప్రత్యక్షంగా దాడులు జరిపిస్తాడు. ఇలాంటి దుర్మార్గాలకు మరింతగా పాల్పడేందుకు మిలిటరీ బడ్జెట్‌ను భారీగా పెంచేందుకు పూనుకున్నాడు.2026 సంవత్సర బడ్జెట్‌లో మిలిటరీకి 13శాతం పెంచి లక్ష కోట్ల డాలర్లకు చేర్చాలని, అందుకు గాను విద్య, వైద్యం, పర్యావరణం, ప్రజాసాయం, అదనపు పోషకాహార సాయ పధకం(మన ఉచిత బియ్యం వంటిది), బలహీన వర్గాల గృహనిర్మాణం వంటి సంక్షేమ పథకాలకు కోత పెట్టాలని ప్రతిపాదించాడు. ఈ మేరకు అధ్యక్ష భవనం ఈనెల రెండవ తేదీన ఒక ముసాయిదా బడ్జెట్‌ను ఆవిష్కరించింది.ఈ కోతలు ఇంకా పెరగవచ్చు. ప్రపంచ కుబేరుడు ఎలన్‌ మస్క్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రభుత సామర్ద్య శాఖ(డోజె) ఇప్పటికే పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించి, ఉద్యోగాలకు కోత పెట్టి పొదుపు చర్యలంటూ అనేక సంస్థలకు నిధుల కోతకు పాల్పడిరది. బడ్జెట్‌లో రెండు రకాలు ఉంటాయి.విధిగా కేటాయింపులు జరపాల్సినవి, విచక్షణతో అమలు జరపాల్సినవి. రెండో రకం పథకాల మొత్తం వచ్చే ఏడాది 1.7లక్షల కోట్ల డాలర్లు ఉంటుందని, వర్తమాన బడ్జెట్‌తో పోలిస్తే 7.6శాతం కోత విధించినట్లని చెబుతున్నారు. ఇవి ప్రధానంగా సంక్షేమ పథకాలకు చెందినవే.

అమెరికా రాజ్యాంగం ప్రకారం బడ్జెట్‌ మీద అధికారం పార్లమెంటుదే, అయితే నిబంధనల మేరకు అధ్యక్ష భవనం తన వాంఛలను తెలియచేస్తూ పార్లమెంటుకు ప్రతిపాదనలు పంపాల్సి ఉంటుంది. అయితే వాటిని పార్లమెంటు ఆమోదించవచ్చు, తిరస్కరించవచ్చు, సవరించవచ్చు. అవి అధ్యక్షుడికి నచ్చకపోతే 1974లో సవరించిన చట్ట ప్రకారం తనకున్న అధికారాల ద్వారా ఉత్తరువులు జారీ చేసి అమలు చేయవచ్చు. మిలిటరీ బడ్జెట్‌ పెంచినప్పటికీ అధికారపక్షం నుంచి విమర్శలు వచ్చాయి.అమెరికా బలం పెంచుకోవటం ద్వారా ప్రపంచంలో శాంతి సాధించాలని ఎన్నికల్లో ట్రంప్‌ ప్రచారం చేశాడని, సలహాదారులు దానికి అనుగుణంగా వ్యవహరించటంలేదని ఆరోపించారు. సాయుధ దళ సేవల సెనెట్‌ కమిటీ అధ్యక్షుడు వికర్‌ ఒక ప్రకటన చేస్తూ ఆసియాలో అమెరికాకు వ్యతిరేకంగా యుద్ధం ప్రారంభించకుండా ఉండాలన్నా, రష్యా, ఇరాన్‌ దేశాలకు హమస్‌, హౌతీల వంటి సాయుధులకు మిలిటరీ మద్దతు ఇవ్వకుండా ఉండాలంటే అమెరికా మరింతగా మిలిటరీ రీత్యా బలపడాలని పేర్కొన్నాడు. బడ్జెట్‌ ప్రతిపాదనలు మిలిటరీ సామర్ధ్యాలను దెబ్బతీస్తాయని ఆరోపించాడు. సాయుధ దళ సేవల పార్లమెంటరీ కమిటీ అధ్యక్షుడు మైక్‌ రోజర్స్‌ మరింతగా రెచ్చిపోతూ నాటో దేశాలు జిడిపిలో ఐదుశాతం రక్షణకు ఖర్చు పెట్టాలని ట్రంప్‌ చెబుతుంటే మనం చాలా తక్కువ ఖర్చు చేస్తే సత్తా ఎలా పెంచుతామంటూ రంకెలు వేశాడు.మొత్తానికి లాలూచీ విమర్శలతో నాటకాన్ని రక్తి కట్టిస్తున్నారు.


స్టాక్‌హోమ్‌ ఇంటర్నేషనల్‌ పీస్‌ రిసర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ (సిప్రి) తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం 2024లో ప్రపంచ మిలిటరీ ఖర్చు 2.7లక్షల కోట్ల డాలర్లని, దీనిలో మూడోవంతు అమెరికా ఖర్చు 997బిలియన్‌ డాలర్లు అని పేర్కొన్నది. హిట్లర్‌ వారసురాలైన జర్మనీ అంతకు ముందు సంవత్సరంతో పోల్చితే 28శాతం పెంచి 88.5బి.డాలర్లు, మరో యుద్దోన్మాది జపాన్‌ 21శాతం పెంచి 55.3 బిలియన్‌ డాలర్లు ఖర్చు చేసింది.మిలిటరీ ఖర్చులో ఏడవ స్థానంలో ఉన్న జర్మనీ నాలుగుకు ఎగబాకింది. ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యా 149 బి.డాలర్లు ఖర్చు చేస్తే ఎలాంటి దాడుల్లో ప్రత్యక్షంగా పాల్గొనని నాటో దేశాలు పది రెట్లు అదనంగా 1.5లక్షల కోట్ల డాలర్లు ఖర్చు పెట్టాయి.మొత్తం ఖర్చు 2015లో ఉన్న 1.67లక్షల కోట్ల డాలర్లతో పోలిస్తే 2024లో 2.7లక్షల కోట్ల డాలర్లకు పెరిగింది.యుద్దోన్మాదం లేదా మిలిటరీ ఖర్చు పెరుగుదల తీరు ముప్పును సూచిస్తున్నది. ఐరోపా మీద పెత్తనం చెలాయించాలని చూస్తున్న జర్మనీ యుద్ధ సన్నాహాలకు గాను అంటే మిలిటరీ అవసరాలకు సైతం ఉపయోగపడేవిధంగా రోడ్లు, వంతెనలు, ఆసుపత్రుల వంటి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసేందుకు 1.13లక్షల కోట్ల డాలర్లు ఖర్చు చేసేందుకు పూనుకుంది, ఇది మొదటి ప్రపంచ యుద్ధం తొలి ఏడాదిలో జర్మనీ చేసిన ఖర్చులో 8.6శాతం కాగా రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు సంవత్సరం చేసిన ఖర్చుకు దగ్గరలో ఉందని పోలికలు వెల్లడిస్తున్నాయి. ఈ ప్రయత్నాలన్నీ యుద్ధ పరిశ్రమలు ముఖ్యంగా అమెరికా సంస్థలకు లబ్ది చేకూర్చేందుకు దోహదం చేస్తున్నాయి. సిప్రి అంచనా ప్రకారం 2023లో ఆయుధ తయారీలో అగ్రభాగాన ఉన్న 100 కంపెనీలు 632 బిలియన్‌ డాలర్ల మేర విక్రయించగా ఒక్క అమెరికా ఉత్పత్తిదారులకే 317 బిలియన్‌ డాలర్లు దక్కాయి.


రెండవ ప్రపంచ యుద్ధంలో నాజీలకు ఆయుధాలను విక్రయించిన జర్మన్‌ కంపెనీ రెయిమెటాల్‌ ఆయుధ అమ్మకాల వృద్ధి 2024లో 36శాతం ఉండగా వర్తమాన సంవత్సరంలో 25 నుంచి 30శాతం వరకు ఉండవచ్చని అంచనా. నాటో కూటమి దేశాల మిలిటరీ ఖర్చు జిడిపిలో 3.5శాతానికి పెంచాలన్న లక్ష్యాన్ని జర్మనీ, ఫ్రాన్సు, బ్రిటన్‌ ఆమోదిస్తే 2030 నాటికి 400బిలియన్‌ యూరోల విలువ గల ఆర్డర్లు పెరుగుతాయని రెయిమెటాల్‌ చెప్పింది. వీటి కోసం అమెరికా సంస్థలతో ఐరోపా కంపెనీలు పోటీపడతాయని, ఆక్రమంలో విబేధాలు తలెత్తినా ఆశ్చర్యం ఉండదని చెప్పవచ్చు. ఈ తీరును చూసినపుడు ప్రపంచంలో తమ ఆర్థిక, భౌగోళిక రాజకీయ లక్ష్యాలను సాధించటానికి సామ్రాజ్యవాదులందరూ పూనుకున్నట్లు కనిపిస్తోంది. ఇది ఏ పరిణామాలు, ఏ పర్యవసానాలకు దారి తీస్తుందో చూడాలి.2014లో అమెరికా, జర్మనీ చేసిన కుట్రలో భాగంగా రష్యాకు అనుకూలంగా ఉన్న ఉక్రెయిన్‌ అధ్యక్షుడిని పదవీచ్యుతునిగావించి తమ అనుకూల శక్తులను రంగంలోకి తెచ్చాయి. ఆ కుట్రకు విరుగుడుగా గతంలో తన ప్రాంతంగా ఉన్న క్రిమియాను విలీనం చేసుకోవటమే గాక 2022లో మిలిటరీ చర్య ప్రారంభించి అనేక ప్రాంతాలను తన ఆధీనంలోకి తెచ్చుకుంది. ఆప్రాంతాలను రష్యాకు అప్పగించి లేదా స్వతంత్ర ప్రాంతాలుగా ఉంచి యుద్దాన్ని ముగిస్తామని డోనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ప్రకటన, వైఖరి ఐరోపాలో అసంతృప్తికి దారితీసింది, ఎత్తుగడా లేక నిజంగానే అమెరికా వైఖరిలో మార్పు వచ్చిందా అని జర్మనీ పరిస్థితిని గమనిస్తున్నది. ఉక్రెయిన్‌కు చేసిన మిలిటరీ సాయాన్ని తీర్చే స్థితిలో లేదు గనుక అక్కడి విలువైన ఖనిజాలను అమెరికాకు రాసి ఇచ్చి ఒప్పందం చేసుకుంది. ఆర్థికరంగంలో తనకు సవాలు విసురుతున్న చైనాను దెబ్బతీసేందుకు వీలైతే తైవాన్‌ సమస్య ముసుగులో దాడికి తెగబడేందుకు అమెరికా పావులు కదుపుతున్నది. ఈ పూర్వరంగంలో చైనా కూడా తన మిలిటరీ నవీకరణ, ఆయుధాలకు పెద్ద ఎత్తున ఖర్చు చేయాల్సి వస్తున్నది. జో బైడెన్‌ అధికారానికి వచ్చిన రెండు వారాల్లో జాతీయ రక్షణ వ్యూహం పేరుతో అమెరికా ఒక పత్రాన్ని విడుదల చేసింది. దాన్లో మిలిటరీ ఖర్చును భారీ మొత్తంలో పెంచాలని పేర్కొన్నది. ఎందుకటా, రానున్న దశాబ్దం నిర్ణయాత్మకమైనదని అమెరికాకు పెను సవాలుగా మారుతున్న చైనా, రష్యాలను ఓడిరచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మధ్య ప్రాచ్యంలో చమురు సంపదలున్న ప్రాంతం మీద తిరుగులేని ఆధిపత్యం సాధించాలన్న ఎత్తుగడ కారణంగానే గాజాలో ఇజ్రాయెల్‌ సాగిస్తున్న మారణకాండకు నిస్సిగ్గుగా అమెరికా మద్దతు ఇస్తున్నది, దాన్ని వ్యతిరేకిస్తున్న ఎమెన్‌పై దాడులు చేస్తున్నది. అమెరికా, జర్మనీ బిలియన్ల డాలర్ల విలువగల ఆయుధాలను ఇజ్రాయెల్‌కు సరఫరా చేస్తున్నాయి. ఇరాన్‌ మీద దాడికి అవకాశం కోసం చూస్తున్నది, దాని దగ్గర ఉన్న అణ్వాయుధాల గురించి తటపటాయిస్తున్నది.


అమెరికా తన ప్రయోజనాలకే ఎప్పుడూ పెద్ద పీటవేస్తుందని ఐరోపాకు తెలిసినప్పటికీ గతంలో తగిలిన ఎదురుదెబ్బల కారణంగా దానితో జూనియర్‌ భాగస్వామిగా కలసి ప్రయాణిస్తున్నది. స్వతంత్ర పాత్ర పోషించేందుకు ఐరోపా సమాఖ్య, ఉమ్మడి కరెన్సీని కూడా ఏర్పాటు చేసుకుంది.రెండూ దాగుడుమూతలాడుతున్నాయి, మొత్తం మీద చూసినపుడు మిత్రవైరుధ్యాలు పెరుగుతున్నాయి తప్ప తగ్గటం లేదు. కాగల కార్యం గంధర్వుడు తీర్చినట్లు తాము చేయలేని పనిని చైనా చేయటాన్ని గమనిస్తున్నాయి. అయితే దానితో చేతులు కలిపే అవకాశం లేదు గనుక దాన్ని చూపి అమెరికాతో బేరమాడుతున్నాయి. అమెరికాకే అగ్రస్థానం పేరుతో డోనాల్డ్‌ ట్రంప్‌ అజెండాను ముందు పెట్టిన తరువాత కొన్ని సందర్భాలలో ప్రతిఘటిస్తామని చెప్పటం తాజా పన్నుల యుద్దంలో చూశాము.ఈ విషయంలో ట్రంప్‌ వెనక్కు తగ్గినా అలాంటి కత్తివేలాడుతూనే ఉంటుంది గనుక ఐరోపా తన రక్షణ తానే చూసుకొనేందుకు పూనుకోవటం ఖాయం. దాన్లో భాగమే జర్మనీ పెద్ద మొత్తంలో మిలిటరీ ఖర్చుకు పూనుకోవటం.ఇరవై ఏడు దేశాల ఐరోపా సమాఖ్య 800బిలియన్‌ యూరోల మిలిటరీ ఖర్చు అదనంగా చేసేందుకు నిర్ణయించింది, ఐరోపా జనాభాలో 24శాతం మంది దారిద్య్ర రేఖకు దిగువున ఉన్నప్పటికీ ఈ ఖర్చు చేయటాన్ని గమనించాలి.ధనిక దేశాల్లోని కులీనులందరూ తమ లాభాలకు ముప్పు లేకుండా భారాలన్నింటినీ కార్మికవర్గం భరించే విధంగా విధానాలను రూపొందిస్తున్నారు. సామాజిక సంక్షేమ కోతలకు ఎలా పూనుకుంటారో ముందే చెప్పినట్లుగా దీనికి ఎదురయ్యే ప్రతిఘటనలను అణచివేసేందుకూ పూనుకుంటారు. ఉక్రెయిన్‌ విషయంలో అమెరికా, ఐరోపాల స్నేహ బండారం త్వరలోనే బయటపడుతుంది.


చైనా మిలిటరీ బడ్జెట్‌ 258 బిలియన్‌ డాలర్లని వార్తలు వచ్చాయి.తైవాన్‌కు ఆయుధాలు విక్రయించటం, దక్షిణ చైనా సముద్రంలో అమెరికా రెచ్చగొట్టుడు చర్యల కారణంగా ఇటీవలి కాలంలో దాని బడ్జెట్‌ గణనీయంగా పెరిగినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ప్రపంచంలో వంద ఆయుధాలు ఎగుమతి అవుతుంటే వాటిలో 42 అమెరికా,ఫ్రాన్సు, రష్యాల నుంచి పదకొండు చొప్పున, చైనా 5.8, జర్మనీ 5.6 ఎగుమతి చేస్తున్నాయి. ఇక దిగుమతుల్లో అగ్రస్థానంలో ఉన్న భారత్‌ 9.8, సౌదీ అరేబియా 8.4,కతార్‌ 7.6, ఉక్రెయిన్‌ 4.9, పాకిస్తాన్‌ 4.3, చైనా 2.9 చొప్పున దిగుమతి చేసుకుంటున్నాయి. సిప్రి సమాచారం ప్రకారం మొత్తం తొమ్మిది దేశాలలో 12,121అణ్వాయుధాలు ఉన్నాయి.దేశాల వారీ మోహరించినవి లేదా సురక్షిత ప్రదేశాల్లో నిల్వ ఉంచినవిగానీ దేశాల వారీ ఇలా ఉన్నాయి.బ్రాకెట్లలోని అంకెలు మోహరించినవి. రష్యా 5,580(1,710), అమెరికా 5,044(1,770), చైనా 500(24), ఫ్రాన్సు 290(280), బ్రిటన్‌ 225(120), భారత్‌ 172, పాకిస్తాన్‌ 170,ఇజ్రాయెల్‌ 90, ఉత్తర కొరియా 50 కలిగి ఉన్నాయి. మన దేశం దగ్గర అణ్వాయుధాలు ఉన్నా వాటిని ప్రయోగించే అవకాశం లేదు గనుక సాంప్రదాయ ఆయుధాలను పెద్ద ఎత్తున దిగుమతి చేసుకోవటంతో ఆయుధ ఎగుమతి దేశాలన్నీ ప్రధాని నరేంద్రమోడీని విశ్వగురువు అంటూ ఆకాశానికి ఎత్తి ఆయుధ ఆర్డర్లు పొందుతున్నాయంటే అతిశయోక్తి కాదు !

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఎర్రపూల వనం : వ్లదిమిర్‌ పుతిన్‌, అల్పజనపాలన – రష్యన్‌ కమ్యూనిస్టుల ముందున్న సవాళ్లు !

05 Monday May 2025

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, Latin America, Left politics, Opinion, RUSSIA, USA, WAR

≈ Leave a comment

Tags

Anti communist, Donald trump, Russia Communists, stalin, Vietnam, Vladimir Putin, Xi Jinping

ఎం కోటేశ్వరరావు


ప్రకృతి ఉన్నంత వరకు ఎర్ర పూలు పూస్తూనే ఉంటాయి. దోపిడీ కొనసాగినంత కాలం కమ్యూనిస్టులు ఉద్భవిస్తూనే ఉంటారు.వైపరీత్యాలు సంభవించినపుడు ఎర్రపూల చెట్లు దెబ్బతిన్నట్లే కమ్యూనిస్టులూ అంతే. ప్రపంచం నిరంతరం మారుతూ ఉంటుంది.మారిన పరిస్థితులను బట్టి కమ్యూనిస్టులూ మారాలి అంటే దానర్దం మౌలిక లక్షణాన్ని వదులుకోవాలని కాదు, ఎత్తుగడలు, వ్యూహాలను మార్చుకోవాలి.అనేక దేశాల్లో కమ్యూనిస్టులు స్థానికంగా ఉన్న పరిస్థితులను బట్టి సమస్యలను ఎదుర్కొంటున్నమాట నిజం. ఉద్యమాలు నల్లేరు మీద బండిలా సాగటం లేదు. ఉదాహరణకు రష్యన్‌ కమ్యూనిస్టులను చూద్దాం.ఒక వైపు ఉక్రెయిన్‌కు నాటో సభ్యత్వం పేరుతో సామ్రాజ్యవాదులు ముందుకు తెచ్చిన ముప్పు, మరోవైపు దానికి వ్యతిరేకంగా గట్టిగా నిలిచిన బూర్జువావర్గ ప్రతినిధి పుతిన్‌.అతగాడి నాయకత్వంలో కార్మికవర్గాన్ని దోపిడీ చేస్తున్న అల్పజనపాలన. యుద్ధంతో ముందుకు వచ్చిన ఆర్థిక సమస్యలు, జాతీయవాదం. కమ్యూనిస్టులకు ఇది కత్తిమీద సాము.

ఓల్గాగ్రాడ్‌ విమానాశ్రయానికి స్టాలిన్‌ పేరు !
కమ్యూనిస్టులకు గాక ఏ ఎండకా ఆ గొడుగు పట్టే వారికి ఎందుకు వస్తాయి కష్టాలు. హిట్లర్‌ మూకలకు గోరీ కట్టిన ఓలాగ్రాడ్‌కు నాడు సోవియట్‌ను నడిపించిన ఉక్కుమనిషి స్టాలిన్‌ స్మారకంగా స్టాలిన్‌ గ్రాడ్‌ అని పేరు పెట్టారు. సోవియట్‌ను కూల్చివేసిన తరువాత తిరిగి పూర్వనామాన్ని తెచ్చారు.ఫాసిజం, నాజీలపై విజయం సాధించి 2025 మే 9న 80వ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ఆ నగరానికి తిరిగి స్టాలిన్‌ పేరు పెట్టాలని రష్యన్‌ కమ్యూనిస్టు పార్టీ అధ్యక్షుడు అలెగ్జాండర్‌ జెమిలియానిచెంకో, అగ్రనేత గెనడీ జుగనోవ్‌ అధ్యక్షుడు వ్లదిమిర్‌ పుతిన్ను కోరారు. ఉక్రెయిన్‌ మీద యుద్ధం చేస్తున్న సైనికులకు మానవతాపూర్వక సాయంగా డ్రోన్లు, మోటారు సైకిళ్లను పంపిన సందర్భంగా జుగునోవ్‌ స్టాలిన్‌ గ్రాడ్‌లో ఉన్నాడు. తానెప్పుడూ ఆ నగరాన్ని అలాగే పిలుస్తానని, యావత్‌ దేశం అలాగే అంటున్నదని అన్నాడు. రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న వారి గౌరవార్ధం గతవారం పుతిన్‌ పర్యటన సందర్భంగా ఓల్గాగ్రాడ్‌ విమానాశ్రయానికి స్టాలిన్‌ గ్రాడ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం అని పేరును ప్రకటించాడు. అందువలన నగరం మొత్తానికి ఆ పేరు పెట్టాలని జుగనోవ్‌ అన్నాడు. గతంలో కొన్ని సంస్థలు స్టాలిన్‌ గ్రాడ్‌ అని తిరిగి పెట్టాలా లేదా అన్న సర్వే చేస్తే ఓల్గాగ్రాడ్‌ పౌరులు వ్యతిరేకించినట్లు తేలిందని చెప్పారు, నిజంగా అప్పుడు జనం అలా ఉన్నారా లేక పాలకులకు అనుగుణంగా సర్వేను చేశారా అన్నది చెప్పటం కష్టం. ఇప్పుడు పుతినే స్వయంగా విమానాశ్రయపేరు మార్చాడంటే జనాల్లో వ్యతిరేకత లేదన్నది స్పష్టం ఎందుకు అంటే ఫాసిస్టు వ్యతిరేక పోరాటానికి మారు పేరు స్టాలిన్‌, ఆ పేరును ఉచ్చరించకుండా దాని గురించి చెప్పలేరు.

అంతర్జాతీయ ఫాసిస్టు వ్యతిరేక వేదిక రెండవ సమావేశం గత నెలాఖరులో మాస్కోలో జరిగింది. ప్రపంచమంతటా ఫాసిజం తిరిగి తలెత్తుతున్న పూర్వరంగంలో దాన్ని ఎలా ఎదుర్కోవాలా అని 91దేశాల నుంచి హాజరైన 164 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాస్కో కమ్యూనిస్టు నాయకురాలు తాతిన్యా దెశియాతోవా మాట్లాడుతూ పాలకులు తమ సంపదలను పెంచుకోవటం తప్ప చేసిందేమీ లేదు. కాబట్టి ఇప్పుడు మేము గత కీర్తి కట్టడాలన్నింటినీ శుభ్రం చేస్తున్నాం, పాత సోవియట్‌ చిహ్నాలను పెడుతున్నాం, పాత పాటలను పాడుతున్నాం, గత విజయాల గురించి చెబుతున్నాం అని చెప్పింది. మూడవ తరానికి చెందిన కమ్యూనిస్టు అయిన ఆమె అమెరికా పత్రిక పీపుల్స్‌ వరల్డ్‌తో మాట్లాడినపుడు ఈ వ్యాఖ్యలు చేసింది. నిజానికి ఫాసిస్టు వ్యతిరేక వారసత్వం రష్యన్‌ పౌరులది తప్ప పుతిన్‌ లేదా అతగాడు ప్రాతినిధ్యం వహిస్తున్న పెట్టుబడిదారీ విధాన పాలకులది కాదు. బోరిస్‌ ఎల్సిన్‌ వినాశకర మరియు ప్రజల సంపద లూటీ పాలనతో పోలిస్తే పుతిన్‌ పాలనలో ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగైంది, అది ఎంతో కాలం నిలిచేట్లు కనిపించటం లేదని ఆమె చెప్పింది. యుద్ధం, సంబంధిత అంశాల్లో సోవియట్‌ పాత్ర, దాని గురించి జనంలో ఉన్న జ్ఞాపకాల గురించి పుతిన్‌ గ్రహించాడు గనుకనే గత కొద్ది సంవత్సరాలుగా వాటిలో కొన్నింటిని ఎంచుకొంటున్నాడు. విమానాశ్రయానికి స్టాలిన్‌ పేరు పెట్టటం దానిలో భాగమే. రెండవ ప్రపంచ యుద్ధ విజయం 80వ వార్షికోత్సం సందర్భంగా నాటి బ్యానర్లు, చిహ్నాలతో మాస్కోను అలంకరించారు.

సోవియట్‌ను కూల్చివేసి మూడున్నర దశాబ్దాలు కావస్తున్నది, ఆ సమయంలో తెలిసీ తెలియని వయస్సులో ఉన్నవారికీ, తరువాత పుట్టిన వారికి గతం గురించి తెలియదు. వర్తమానంలో బతుకు ఎలా సాగించాలా అన్నది తప్ప ప్రత్యామ్నాయాల గురించి ఆలోచించే తీరిక కూడా ఉండటం లేదు. పరిస్థితి ఉన్నది ఉన్నట్లుగా ఉంటే చాలన్నట్లుగా కొందరి ఆలోచన ఉంది. అయితే 2022లో ప్రారంభమైన ఉక్రెయిన్‌పై మిలిటరీ చర్య తరువాత పరిస్థితిలో మార్పు ప్రారంభమైంది. సామ్రాజ్యవాదుల కుటిల యత్నాలు,వారికి మద్దతు ఇస్తున్న పాలకులు రష్యా సరిహద్దులోని తూర్పు ఉక్రెయిన్‌ ప్రాంతాలలో రష్యన్‌ జాతి పౌరులను అణచివేస్తున్న తీరుతెన్నులను గ్రహించిన కమ్యూనిస్టు పార్టీ యుద్ధ ప్రయత్నాలకు మద్దతు ఇచ్చింది. మూడు సంవత్సరాలు గడిచింది, వేలాది మంది మరణించారు, ఆర్ధికంగా దేశం సమస్యలను ఎదుర్కొంటున్నది, మిలిటరీ చర్య ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. ఇలాంటి తరుణంలో ఏ వైఖరి తీసుకోవాలన్నది కమ్యూనిస్టులకు పెద్ద సమస్య. ఉక్రెయిన్‌ పోరులో రెండు లక్షణాలు ఉన్నాయి, ఒకటి సామ్రాజ్యవాద పోరు, రెండవది జాతీయ అంశం. నాటో కూటమి నాయకత్వంలోని సామ్రాజ్యవాదులు, రష్యాలోని పెట్టుబడిదారులకు ప్రాతినిధ్యం వహించే శక్తుల మధ్య ఈ యుద్ధం నడుస్తున్నది.అయితే ఉక్రెయిన్‌ తూర్పు ప్రాంతంలోని రష్యన్‌ జాతి పౌరులు అక్కడి నాజీల చేతిలో అణచివేతను ఎదుర్కొంటున్నారు. వారికి కమ్యూనిస్టులు, ఇతర వామపక్ష శక్తులు నాయకత్వం వహిస్తున్నాయి. రష్యన్‌ మిలిటరీ ఆప్రాంతంలోకి వెళ్లిన తరువాత పోరాడుతున్న ఆ శక్తులు ఎన్నికలలో పాల్గొనేందుకు పుతిన్‌ అనుమతించటం లేదనే వార్తలు వచ్చాయి.ఈ సమస్య ఉన్నప్పటికీ ఉక్రెయిన్ను నాజీకరణ కావించకుండా చూడటం, నాటో విస్తరణను అడ్డుకోవటం, అణచివేతకు గురవుతున్నవారిని రక్షించటం మౌలిక అంశాలుగా ఉన్నట్లు అనేక మంది భావిస్తున్నారు. అయితే కమ్యూనిస్టులకు పుతిన్‌ మీద, పాలకవర్గం మీద ఎలాంటి భ్రమలు లేవు. పాలకవర్గంలో ఉన్న విబేధాలు, వైరుధ్యాల కారణంగా గతంలో ప్రైవేటీకరించిన 10.8బిలియన్‌ డాలర్ల విలువగల కంపెనీలను గత మూడు సంవత్సరాలలో పుతిన్‌ సర్కార్‌ జాతీయం చేసింది. అయితే వాటిని ప్రజల ఆస్తిగానే ఉంచుతారా లేక తిరిగి తమకు అనుకూలమైన వారికి కట్టబెడతారా అన్న సందేహాలు ఉన్నాయి. ప్రైవేటీకరణను తీవ్రంగావిస్తామని పాలకపార్టీ నేతలు మార్చి నెలలో ప్రకటించారు. దాన్ని అడ్డుకొనేందుకు కమ్యూనిస్టులు సిద్దం అవుతున్నారు.


ప్రపంచ విప్లవ ధృతార వియత్నాం !
అమెరికా సామ్రాజ్యవాదులపై దక్షిణ వియత్నాంలో విజయం సాధించి రెండు ప్రాంతాల ఏకీకరణకు 50వసంతాలు నిండాయి, 1975 ఏప్రిల్‌ 30వ తేదీని విజయదినంగా పరిగణిస్తున్నారు. ఈ పరిణామం యావత్‌ లాటిన్‌ అమెరికా దేశాలకు, యావత్‌ ప్రపంచానికి ఇప్పటికీ ఒక ధృవతారగానే ఉందని అర్జెంటీనా కమ్యూనిస్టు పార్టీ ఈ సందర్భంగా పేర్కొన్నది. అమెరికా సామ్రాజ్యవాదంపై విజయం సాధించిన తరువాత గత ఐదు దశాబ్దాలలో వియత్నాం ఎంతో పురోగతి సాధించిందని ఉరుగ్వే కమ్యూనిస్టు పార్టీ శ్లాఘించింది. గతంలో సోషలిస్టు దేశాలైనప్పటికీ పరస్పర అనుమానాలు, ఇతర కారణాలతో చైనా, వియత్నాం మధ్య సాయుధ దాడులు జరిగాయి. అయితే తరువాత రెండు దేశాల కమ్యూనిస్టు పార్టీలు తమ వైఖరులను సవరించుకొని తిరిగి దగ్గరయ్యాయి, కొన్ని దీవుల గురించి ఇప్పటికీ కొన్ని సమస్యలున్నా .తాజాగా రెండు దేశాల మధ్య బంధం మరింత బలపడిరది. షీ జింపింగ్‌ వియత్నాం సందర్శించారు. ఒక ఏడాది కాలంలోనే గణనీయ ఫలితాలు వచ్చాయని ఏప్రిల్‌ 28న చైనా రాయబారి ప్రకటించారు. తొలిసారిగా విదేశాంగ, జాతీయ రక్షణ, ప్రజాభద్రత మంత్రుల స్థాయిలో ఇరుదేశాలు 3 ప్లస్‌ 3 పేరుతో సంప్రదింపులకు ప్రపంచంలో తొలిసారిగా నిర్ణయించిన దేశాలుగా చైనా, వియత్నాం దౌత్య చరిత్రకు ఎక్కాయి. యువకుల్లో విప్లవ చరిత్ర గురించి అవగాహన కలిగించేందుకు రెడ్‌ కల్చర్‌, రెడ్‌ జర్నీలను ప్రోత్సహించాలని నిర్ణయించారు.రెండు దేశాల వాణిజ్య లావాదేవీలు గతేడాది 260 బిలియన్‌ డాలర్లు దాటాయి.

సోషలిస్టు వ్యవస్థల కూల్చివేతలో పోప్‌ ప్రమేయం !
పోప్‌ ఫ్రాన్సిస్‌ అస్తమయం తరువాత కొత్త పోప్‌ ఎంపిక గురించి విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఈ సందర్భంగా గతంలో పనిచేసిన పోప్‌లు, అమెరికా అధ్యక్ష భవనంతో వారి సంబంధాలు, రాజకీయాలు, కుట్రలు ముఖ్యంగా కమ్యూనిజం, సోషలిస్టు సమాజాలకు వ్యతిరేకంగా జరిపిన కుట్రల గురించి కూడా ప్రస్తావనలు వెలువడ్డాయి.1989లో బెర్లిన్‌ గోడ కూల్చివేత,1991లో సోవియట్‌ కూల్చివేతకు ముందు ప్రచ్చన్న యుద్ధ సమయంలో రెండవ పోప్‌ జాన్‌ పాల్‌, అమెరికా అధ్యక్షుడు రోనాల్డ్‌ రీగన్‌ సమావేశం వైట్‌ హౌస్‌లో 1982లో జరిగింది. వారిద్దరి మీద హత్యా ప్రయత్నాలు జరిగిన ఏడాది తరువాత వారి ఏకాంత భేటీ జరిగింది.అక్కడే సోషలిస్టు సమాజాల కూల్చివేతకు కుట్రకు తెరలేపినట్లు గతంలోనే విమర్శలు వచ్చాయి.ఇద్దరూ కమ్యూనిస్టు వ్యతిరేకులే. రెండవ పోప్‌ జాన్‌ పాల్‌ జన్మస్థలమైన పోలాండ్‌లో లెచ్‌వాలేసాను ముందుకు తెచ్చి సాలిడారీ ఉద్యమం పేరుతో కుట్రకు తెరతీశారు.తమ పని గడచిన తరువాత లెచ్‌వాలేసాను చరిత్ర చెత్తబుట్టలోకి నెట్టారు. మనదేశంలో కమ్యూనిస్టులమని చెప్పుకున్న కొందరు ఆ సోషలిస్టు వ్యతిరేక సాలిడారిటీ పేరుతో ఊరేగారు. లెచ్‌వాలేసా సాలిడారిటీతో తమకు ఎలాంటి సంబంధం లేదని పోప్‌, రీగన్‌ ఇద్దరూ అప్పుడు ఠలాయించారు. అయితే వారి ప్రమేయం గురించి 2004లో ఏపి వార్తా సంస్థ వెల్లడిరచింది.1989లో పోలాండ్‌ ఎన్నికల్లో సాలిడారిటీ గెలిచింది, తూర్పు ఐరోపాలో సోషలిస్టు వ్యవస్థల కూల్చివేతకు నాంది పలికింది. సోవియట్‌ కమ్యూనిజాన్ని పతనం గావించేందుకు పోప్‌, రీగన్‌ కలసి పని చేశారని రిపబ్లికన్‌ పార్టీ మాజీ గవర్నర్‌ అయిన స్కాట్‌ వాకర్‌ 2020లో వాషింగ్టన్‌ పోస్టు పత్రికలో రాసినదానిలో పేర్కొన్నాడు. చరిత్రలో ఒక అమెరికా అధ్యక్షుడిగా ఉడ్రో విల్సన్‌ మొదటి ప్రపంచ యుద్ధం ముగిసి, తొలి సోషలిస్టు రాజ్యం ఏర్పడిన తరువాత 1919లో పదిహేనవ పోప్‌ బెనెడిక్ట్‌ను కలసి వాటికన్‌తో సంబంధాలను ఏర్పరచుకున్నాడు.1959లో అమెరికా అధ్యక్షుడు ఐసెన్‌ హోవర్‌ ఇరవై మూడవ పోప్‌ జాన్‌తో భేటీ జరిగినప్పటి నుంచి పోప్‌లు, అమెరికా అధ్యక్షుల కలయికలు క్రమంగా జరుగుతున్నాయి.ఇప్పటి వరకు 32 సమావేశాలు జరిగినట్లు ఫాక్స్‌ న్యూస్‌ పేర్కొన్నది.1979వరకు అధ్యక్షులే వాటికన్‌ వెళ్లేవారు, ఆ తరువాత నుంచి పోప్‌లు అధ్యక్ష భవనానికి వస్తున్నారు.


శ్రీలంక మేడేకు భారత, చైనా కమ్యూనిస్టులు ! తైవాన్‌లో చైనా వ్యతిరేక ప్రదర్శనలు !
శ్రీలంక రాజధాని కొలంబోలో అధికార నేషనల్‌ పీపుల్స్‌ పవర్‌(ఎన్‌పిపి), దానికి ప్రధాన చోదకశక్తిగా ఉన్న జనతా విముక్తి పెరుమన పార్టీ నిర్వహించిన మేడే ప్రదర్శనలకు భారత్‌, చైనా కమ్యూనిస్టు పార్టీల నేతలు హాజరయ్యారు. దేశ అధ్యక్షుడు అనుర కుమార దిశన్నాయకే ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. చైనా తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్‌లో కమ్యూనిస్టు వ్యతిరేకతను మరోసారి రెచ్చగొడుతున్నారు.దానిలో భాగంగా గత నెలలో ఒక యూట్యూబర్‌ పేరుతో కమ్యూనిజాన్ని అడ్డుకోవటం, తైవాన్‌ రక్షణ నినాదాలతో కెటాగలాన్‌ ప్రాంతంలో 50వేల మందితో ప్రదర్శన చేశారు. మాతృదేశంలో విలీనం కావాలని కోరుతున్న ప్రజా ప్రతినిధులను వెనక్కు పిలవాలంటూ దరఖాస్తుల దాఖలుకు పూనుకున్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఉక్రెయిన్‌ సంక్షోభం: రష్యా మూడు రోజుల కాల్పుల విరమణ !

30 Wednesday Apr 2025

Posted by raomk in Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, USA, WAR

≈ Leave a comment

Tags

72-hour ceasefire, Donald trump, Ukraine crisis, Vladimir Putin, Zelensky


ఎం కోటేశ్వరరావు


తాను అధికారానికి వచ్చిన 24 గంటల్లో ఉక్రెయిన్‌ వివాదాన్ని పరిష్కరిస్తానని డోనాల్డ్‌ ట్రంప్‌ చెప్పాడు.వందరోజులైంది, ఏం జరుగుతోందో తెలియదు. రెండు వారాలు, అంతకు లోపే ఒప్పందం కుదరవచ్చని, ఇంకా ఎక్కువ కాలమే పట్టవచ్చని తాజాగా చెప్పాడు. దానికి అనుగుణంగా కావచ్చు లేదా ఎత్తుగడగా గానీ మే నెల 8 నుంచి 10వ తేదీ వరకు కాల్పుల విరమణ పాటిస్తామని, ఉక్రెయిన్‌ కూడా అదే విధంగా వ్యవహరించాలని రష్యా అధినేత వ్లదిమిర్‌ పుతిన్‌ ప్రకటించాడు.రెండవ ప్రపంచ యుద్ధంలో సోవియట్‌ యూనియన్‌ విజయానికి 80ఏండ్లు నిండుతున్న సందర్భంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు మాస్కో పేర్కొన్నది. కాదు తక్షణమే నెల రోజుల పాటు పోరును ఆపాలని ఉక్రెయిన్‌ స్పందించింది. సంక్షోభం ప్రారంభమై 1,160 రోజులైంది. ఆ మూడు రోజుల్లో జెలెనెస్కీ సేనలు ఉల్లంఘనకు పాల్పడితే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని కూడా పుతిన్‌ హెచ్చరించాడు.‘‘ కొన్ని కారణాలతో ప్రతిఒక్కరూ మే 8వ తేదీ వరకు వేచి ఉండాలని, మాస్కోలో జరిగే కవాతు సందర్భంగా పుతిన్‌ ప్రశాంతతను కోరుకుంటున్నాడని, ఎలాంటి షరతులు లేకుండా కనీసం నెల రోజులు కాల్పుల విరమణ ఉండాలని, మేం పౌరుల ప్రాణాలకు విలువ ఇస్తాం తప్ప కవాతులకు కాదని, నిజంగా శాంతి కావాలని రష్యా కోరుకుంటే వెంటనే కాల్పుల విరమణకు పూనుకోవాలని ’’ జెలెనెస్కీ అన్నాడు. ప్రపంచ నేతల సమక్షంలో మే 9న జరిగే కవాతులో విభ్రాంతకర పరిస్థితి ఎదురుకాకుండా చూడాలన్నది పుతిన్‌ ప్రతిపాదన అర్ధం అని పరిశీలకులు కూడా వ్యాఖ్యానించారు.మన దేశంలో రిపబ్లిక్‌ దినోత్సవం రోజున జరిగే కవాతులో ఆయుధ ప్రదర్శన చేసినట్లే, గొప్ప దేశభక్త యుద్ధంగా వర్ణించిన రెండవ ప్రపంచ యుద్ధంలో సోవియట్‌ విజయం సాధించిన మే9వ తేదీన ప్రతి ఏటా కవాతులో తన ఆయుధపాటవాన్ని ప్రదర్శిస్తున్నది. ఏం జరగనుందో చూద్దాం !


అమెరికా ఆర్భాటంగా ప్రకటించిన 30రోజుల నల్ల సముద్ర శాంతి ఒప్పందం ఏమైందో తెలియదు. మా నేత శాశ్వత ఒప్పందం కుదరాలని కోరుతున్నాడు, రెండు దేశాల నేతల మీద అసహనం పెరుగుతున్నదని వైట్‌హౌస్‌ ప్రతినిధి వ్యాఖ్య. దాడులను గనుక రష్యా ఆపకపోతే తాము శాంతి చర్చల నుంచి వైదొలుగుతామని అమెరికా ప్రతినిధి వ్యాఖ్యానించాడు. క్రిమియా తమదే అని, అదే విధంగా స్వాతంత్య్రం ప్రకటించుకున్న ఉక్రెయిన్‌లోని మూడు ప్రాంతాలను అంతర్జాతీయ సమాజం గుర్తించాలన్నది తమ షరతులలో ఒకటని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావరోవ్‌ బ్రెజిలియన్‌ పత్రిక గ్లోబోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు.శాంతి ఒప్పందం రెండు వారాలు, అంతకు లోపే కుదరవచ్చన్న ట్రంప్‌ ఇంకా ఎక్కువ సమయం కూడా పట్టవచ్చని ఆదివారం నాడు చెప్పాడు.తాను పుతిన్‌తో మాట్లాడిన తరువాత కూడా దాడులు జరగటంతో ఆశాభంగం చెందానన్నాడు. మరిన్ని ఆయుధాలు కావాలని రోమ్‌లో జెలెనెస్కీ తనను కోరినట్లు వెల్లడిరచాడు.పోప్‌ ఫ్రాన్సిస్‌ అంత్యక్రియలకు వెళ్లిన సందర్భంగా వారిద్దరూ అక్కడ మాట్లాడుకున్నారు. క్రిమియాను విలీనం చేసుకొనేందుకు రష్యాను అనుమతించటం ద్వారా మాజీ అధ్యక్షుడు జోబైడెన్‌ సమస్యను మరింత సంక్లిష్టం గావించినట్లు ఆరోపించాడు. జెలెనెస్కీతో ట్రంప్‌ మాట్లాడిన తరువాత రష్యా దాడులను మరింతగా పెంచింది.


రష్యా ఉపయోగిస్తున్న పదజాలాన్ని చూస్తే ఒప్పందం గురించి కఠిన వైఖరి తీసుకొనేట్లు ఉందని పరిశీలకులు చెబుతున్నారు. నాటోలో ఉక్రెయిన్‌ చేరకుండా చూడటం, దాని మిలిటరీ శక్తిని పరిమితంగావించటం,అంతర్గత రాజకీయాల్లో తన పలుకుబడి ఉండేట్లు చూసుకొనేందుకు పుతిన్‌ చూస్తున్నాడన్నది వారి భాష్యం. అమెరికా ముందుకు తెచ్చిన 30రోజుల శాంతి ఒప్పందానికి రష్యా విధించిన షరతులను చూస్తే అది సుముఖంగా లేదన్నది స్పష్టం. తన వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల మీద, వాటి లావాదేవీలు జరిపే బ్యాంకుల మీద ఆంక్షలు విధిస్తే ఇంక ఒప్పందం ఏమిటని అది ప్రశ్నించింది. ఈస్టర్‌ సందర్భంగా ప్రకటించిన పరిమిత వ్యవధి కాల్పుల విరమణను ఉల్లంఘించినట్లు రెండు దేశాలూ పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. రష్యా మూడువేల సార్లు ఉల్లంఘించిందని, దీర్ఘశ్రేణి క్షిపణులను తప్ప డ్రోన్లు, ఇతర దాడులు చేసిందని ఉక్రెయిన్‌ విశ్లేషకులు ఆరోపించారు. ఆ సమయంలో మిలిటరీ వాహనాలు, ఆయుధాల మరమ్మతులు చేసుకోవటం, మందుపాతరలను వెలికి తీసేందుకు ఉపయోగించుకుందన్నారు. మే తొమ్మిది విజయోత్సవ కవాతు తరువాత రష్యా పెద్ద ఎత్తున దాడులకు దిగనుందని ఆరోపించారు. శుక్రవారం నాడు రోమ్‌లో ట్రంప్‌, జెలెనెస్కీ భేఠీ తరువాత పుతిన్‌ ప్రకటన వెలువడిరదంటే బంతిని అమెరికా కోర్టులో నెట్టినట్లుగా భావిస్తున్నారు.


శాంతి ఒప్పందం కుదరాలంటే రష్యా ఆధీనంలోకి వెళ్లిన ప్రాంతాలను ఉక్రెయిన్‌ వదులుకోవాల్సిందే అని మాట్లాడుతున్న ట్రంప్‌ వైఖరితో ఐరోపా దేశాలు ఆందోళన చెందుతున్నాయి. అమెరికా ప్రతిపాదనలు చైనా నేత షీ జింపింగ్‌తో సహా పుతిన్‌, ఇతర ప్రపంచ నేతలకు ప్రమాదకర సంకేతాలను పంపుతున్నట్లే అని భావిస్తున్నాయి. అక్రమ ఆక్రమణలను బహుమతిగా ఇచ్చినట్లే అంటున్నారు. ఐరోపాలోని ఒక దేశాన్ని స్వంత భూభాగాన్ని వదులుకోవాలని చెబితే, దాన్ని బలవంతం చేస్తే ఐరోపాలో లేదా ఎక్కడా ఏ దేశమూ భద్రంగా ఉన్నట్లు భావించలేవని, అది నాటో లేదా ఇతర దేశం ఏదైనా కావచ్చని ఒక దౌత్యవేత్త చెప్పినట్లు సిఎన్‌ఎన్‌ పేర్కొన్నది. అమెరికా అంగీకరించిన ప్రతిదానికీ తాము తలూపలేమన్నాడు. ఆసియాలోని అమెరికా మిత్రదేశాల్లో కూడా ఇదే ఆందోళన తలెత్తింది. ఉక్రెయిన్‌ సంక్షోభంలో తదుపరి తీసుకోవాల్సిన చర్యల గురించి తాము ఒక ఉమ్మడి వైఖరికి వచ్చేందుకు గణనీయంగా ముందుకు పోయినట్లు జర్మనీ, ఫ్రాన్సు, బ్రిటన్‌ ఒక సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి.అమెరికా ప్రతిపాదన ప్రకారం గణనీయమైన ప్రాంతాన్ని తాము వదులుకోవాల్సి వస్తే అది ఆత్మహత్య అవుతుందని, జెలెనెస్కీ ఒప్పుకున్నా తమ పార్లమెంటు అంగీకరించదని ఒక ఎంపీ చెప్పాడు.


యుద్ధ రంగంలో రోజు రోజుకూ ఎదురుదెబ్బలు తింటున్న ఉక్రెయిన్‌ ఆర్థికంగా దివాలా తీసింది. జిడిపితో లంకె ఉన్న రుణాల రీషెడ్యూలు గురించి ఒప్పందం కుదుర్చుకోవటంలో విఫలమైంది.అప్పులిచ్చిన వారి షరతులకు అంగీకరించటం లేదని పేర్కొన్నది.తదుపరి కిస్తీ మే నెలాఖరులో చెల్లించాల్సి ఉంది. ఒక వైపు అప్పుల వాళ్ల సతాయింపు మరోవైపు రష్యాతో ఒప్పందాన్ని అంగీకరించాలని, తమకు చెల్లించాల్సినదానికి ప్రతిగా విలువైన ఖనిజాలున్న ప్రాంతాన్ని తమకు అప్పగించాలని ట్రంప్‌ చేస్తున్న వత్తిడితో జెలెనెస్కీ యంత్రాంగం ఉక్కిరిబిక్కిరి అవుతున్నది. రష్యా దాడి కారణంగా తాము ఆర్థికంగా తాము 30శాతం దెబ్బతిన్నామని, తిరిగి కోలుకుంటే తప్ప షరతులను నెరవేర్చలేమని చెబుతున్నది.260 కోట్ల డాలర్ల రుణ రీషెడ్యూలుపై ఒప్పందం కుదుర్చుకోవటంలో విఫలమైనట్లు ఉక్రెయిన్‌ ప్రకటించింది, మేనెలాఖరులోగా 60 కోట్ల డాలర్ల కిస్తీపై ఏదో ఒకటి జరగకపోతే దివాలా తీసినట్లు పరిగణించాల్సి ఉంటుంది.2022కు ముందు విదేశీ, స్వదేశీ అప్పు వందబిలియన్‌ డాలర్లు ఉండగా 2024నవంబరు నాటికి అది 160బిలియన్లకు పెరిగింది. ఐరోపా సమాఖ్య, ప్రపంచబ్యాంక్‌, ఐఎంఎఫ్‌ ఇచ్చిన రుణాల వల్లనే ఇలా పెరిగింది. దీన్లో ఐరోపా సమాఖ్య రుణం ఐదు నుంచి ఏకంగా 43బి.డాలర్లకు, ప్రపంచబాంకు, ఐఎంఎఫ్‌ రుణం 47బిలియన్‌ డాలర్లకు పెరిగింది. తమ అప్పు తీర్చకపోయినా ఫరవాలేదు గానీ ప్రైవేటు రంగానికి అనుకూలంగా ఉన్న సమాఖ్య ఒప్పందాలను అంగీకరించాలని పట్టుబడుతున్నది. అదే జరిగితే పునర్‌నిర్మాణ కాంట్రాక్టులన్నీ ఆ సంస్థలకు దక్కుతాయి, వాటితో అంతకంటే ఎక్కువ మొత్తాలను ఆర్జించవచ్చన్నది వాటి ఎత్తుగడ. యుద్దంతో తమకు సంబంధం లేదని గడువు, ఒప్పందం మేరకు అప్పు తీర్చాల్సిందేనని బ్రెట్టన్‌ ఉడ్‌ కవలలు డిమాండ్‌ చేస్తున్నాయి. రష్యాకు చెల్లించాల్సిన 60 కోట్ల డాలర్లను 2015 నుంచి చెల్లించటం నిలిపివేసింది. ఉక్రెయిన్‌ బాండ్లు 70శాతం విలువను కోల్పోయాయి, సెకండరీ మార్కెట్లో 30శాతం మొత్తాలకు విక్రయిస్తున్నారు. పాత బాండ్లు ఉన్నవారు వాటి బదులు వడ్డీ ఎక్కువగా ఉన్న కొత్త బాండ్లు తీసుకొనేందుకు అంగీకరిస్తున్నారు. విదేశీ రుణ భారం మూడు సంవత్సరాల్లో 56 నుంచి 115 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. వీటి కోసం ఉక్రెయిన్‌ నయా ఉదారవాద విధానాలతో కూడిన 325 షరతులను అంగీకరించింది.దానిలో భాగంగా 531 చర్యలను అమలు చేపడతామని పేర్కొన్నది.

దాడి ప్రారంభమైన తరువాత ఐరోపాలో ఉన్న 300 బిలియన్‌ డాలర్ల రష్యా ఆస్తులను స్థంభింప చేశారు. వాటిని విక్రయిచేందుకు ధైర్యం చేయలేదు.ఐరోపా యూనియన్‌ వీటి మీద రుణాలు తీసుకొని ఉక్రెయిన్‌కు అప్పుగా ఇస్తున్నది. స్థంభింపచేసిన రష్యా అస్తులను పెట్టుబడులుగా పెట్టి ప్రతి ఏటా ఐదు బిలియన్‌ యూరోల మేరకు ఐరోపా సమాఖ్య లబ్ది పొందుతున్నది. రష్యా మీద ఆంక్షలు విధించినప్పటికీ సమాఖ్యలోని ప్రైవేటు బాంకులు రష్యాలో మామూలుగానే పని చేస్తున్నాయి, అవి రష్యాకు భారీ మొత్తాలలో పన్నులు కడుతూ లావాదేవీలలో పెద్ద ఎత్తున లాభాలు సంపాదిస్తున్నాయి, వాటి మీద ప్రభుత్వాలు ఎలాంటి చర్యలూ తీసుకోవటం లేదు. తమ ఆంక్షలను ఉల్లంఘించిన వారి మీద చర్యలు తీసుకుంటామని ప్రకటించిన అమెరికా, ఐరోపా దేశాలు ఈ బాంకులను చూసీ చూడనట్లు వదలివేశాయి. పశ్చిమ దేశాల పావుగా మారిన జెలెనెస్కీ ఎడాపెడా అప్పులు చేస్తూ వాటిని యుద్ద అవసరాలకు వినియోగిస్తున్నాడు.దేశంలో అధిక ఆదాయం గలవారిని వదలివేసి అంతర్గతంగా 16.5శాతం వడ్డీ రేటుతో వారి నుంచే రుణాలు తీసుకుంటున్నాడు. లక్షలాది మంది జనం శరణార్దులుగా ఇరుగు పొరుగు దేశాలకు వెళ్లినా జెలెనెస్కీకి పట్టలేదు.మిలిటరీలో విధిగా చేరాలన్న నిబంధనల నుంచి సమాజంలో కులీనులకు ఏదో ఒకసాకుతో మినహాయింపు ఇచ్చాడు, కష్టజీవులను బలిపశువులుగా చేస్తున్నాడు. తీసుకున్న రుణాలను విదేశాలు, స్వదేశంలోని ధనికుల జేబుల్లోకి చేరే విధంగా చూస్తున్నాడు. అమెరికా అందించిన మిలిటరీ సాయాన్ని నగదు రూపంలో తీర్చలేక బదులుగా విలువైన ఖనిజాలున్న ప్రాంతాన్ని అప్పగించేందుకు సిద్దపడ్డాడు. ఇలాంటి వారు దేశం మొత్తాన్ని తాకట్టు పెట్టటానికి కూడా సిద్దపడతారు !

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఉక్రెయిన్‌ విభజన ? యుద్ధానికి ఆ ముగ్గురే కారణం అన్న ట్రంప్‌ !

16 Wednesday Apr 2025

Posted by raomk in CHINA, Current Affairs, Europe, Germany, History, imperialism, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, UK, USA, WAR

≈ Leave a comment

Tags

Donald trump, Joe Biden, Ukraine crisis, Vladimir Putin, Zelensky

ఎం కోటేశ్వరరావు


ఉక్రెయిన్‌ పోరులో మిలియన్ల మంది మరణించారంటే దానికి ఆ ముగ్గురే కారణం, నాకేం సంబంధం లేదంటున్నాడు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ! సోమవారం నాడు ఓవల్‌ ఆఫీసులో విలేకర్లతో మాట్లాడుతూ జో బైడెన్‌, జెలెనెస్కీ సమర్ధులై ఉంటే యుద్ధానికి అవకాశం ఉండేది కాదు, పుతిన్‌ ప్రారంభించి ఉండేవాడే కాదు అన్నాడు . జెలెనెస్కీ గురించి అడగ్గా ‘‘ యుద్ధాన్ని ప్రారంభిస్తున్నావంటే నువ్వు గెలవగలవా లేదా అనేది తెలుసుకోవాలి, నీకంటే 20 రెట్లు పెద్దవారి మీద యుద్ధం ప్రారంభించకూడదు, ఆ తరువాత కొన్ని క్షిపణులు ఇస్తారని జనాల మీద ఆశ పెట్టుకోకూడదు, ఎంతసేపూ ఎప్పుడు అమెరికా క్షిపణులు అమ్ముతుందా అని ఎదురుచూస్తున్నారు, అక్కడికీ ముందు నేనే జావెలిన్‌ క్షిపణులు ఇచ్చాను. యుద్ధ కారకుల్లో పుతిన్‌ మొదటివాడు, రెండోవాడైన జో బైడెన్‌ గురించి చెప్పాలంటే ఏం చేస్తున్నాడో అతనికే తెలియదు, జెలెనెస్కీ గురించి కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు, నా వరకైతే యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తా, ఆపగలను, అదే నేను కోరుకుంటున్నా, చావులను ఆపాలని కోరుకుంటున్నా, త్వరలో మీరు మంచి ప్రతిపాదనల గురించి తెలుసుకుంటారు ’’ అన్నాడు. అసలు 2020లో జరిగిన ఎన్నికల్లో రిగ్గింగ్‌ జరిగి ఉండకపోతే తాను గెలిచి ఉంటే ఉక్రెయిన్‌ యుద్దమే వచ్చి ఉండేది కాదని తన స్వంత ట్రూత్‌ సోషల్‌ వేదికలో రాసుకున్నాడు.


ఉక్రెయిన్‌ సంక్షోభం బుధవారం నాడు 1,148వ రోజులో ప్రవేశించింది.ఏవైనా అనూహ్య నాటకీయ పరిణామాలు జరిగితే తప్ప ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఎప్పుడు ముగిసేది కనుచూపు మేరలో కనిపించటం లేదు. ఆదివారం నాడు సమీ అనే పట్టణంపై రష్యన్‌ క్షిపణులు, నియంత్రిత బాంబులతో జరిపినదాడిలో 35 మంది మరణించగా, 40 మంది ఆసుపత్రిపాలు కాగా 11మంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. దాడి ఒక చర్చ్‌ మీద జరిగిందని ఉక్రెయిన్‌, కాదు మిలిటరీ అధికారుల సమావేశం మీద అని రష్యా ప్రకటించింది. రష్యా తరఫున కిరాయి సైనికులుగా పని చేస్తున్న ఇద్దరు చైనా జాతీయులను పట్టుకున్నామని ఉక్రెయిన్‌ ప్రదర్శించగా అలాంటిదేమీ లేదని మాస్కో, బాధ్యతా రహితంగా ఆరోపణలు చేయవద్దని బీజింగ్‌ హెచ్చరించింది. చైనీయులను కిరాయి సైనికులుగా తీసుకుంటున్నట్లు జెలెనెస్కీ ఆరోపించాడు. గతంలో ఉత్తర కారియా నుంచి సైనికులను పంపినట్లు ప్రచారం చేశారు. ఇప్పుడు చైనాను కూడా వివాదంలోకి లాగే ఎత్తుగడతో ఇలాంటి ఆరోపణలు చేస్తున్నట్లు చెబుతున్నారు. ట్రంప్‌ ప్రకటించిన పన్నుల దాడికి తీవ్ర ప్రతిఘటన, దేశీయంగా వ్యతిరేకత వ్యక్తం కావటంతో మూడు నెలల పాటు సుంకాల విధింపు అమలును వాయిదా వేస్తున్నట్లు చెప్పాడు. దాన్నుంచి జనం దృష్టిని మళ్లించేందుకు లేదా మరొక ఎత్తుగడతో గానీ రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జర్మనీ విభజన మాదిరి ఉక్రెయిన్‌ విభజన గురించి అమెరికా చర్చకు తెరలేపింది. త్వరలో మంచి ప్రతిపాదనలను మీరు చూస్తారని విలేకర్లతో ట్రంప్‌ చెప్పింది దీని గురించే అన్నది స్పష్టం.


ట్రంప్‌ ప్రతినిధి కెయిత్‌ కెలోగ్‌ ఉక్రెయిన్‌ విభజన ప్రతిపాదనను వెల్లడిరచాడు. దాని మీద తీవ్ర విమర్శలు రావటంతో తన మాటలకు తప్పుడు అర్ధం చెప్పారని ఆరోపించాడు. శాంతి ఒప్పందం కుదరాలంటే కోల్పోయిన ప్రాంతాల గురించి మరిచిపోవాలని గతంలోనే ట్రంప్‌, అతగాడి యంత్రాంగం ఉక్రెయిన్‌కు చెప్పింది.ఇప్పుడు కెలోగ్‌ దాన్నే మరింత స్పష్టంగా వెల్లడిరచాడు.అమెరికా పధకం ప్రకారం ఉక్రెయిన్ను నాలుగు ముక్కలుగా చేస్తారు. మొదటి జోన్‌లో బ్రిటన్‌, ఫ్రెంచి దళాలతో పాటు ఇతర దేశాల మిలిటరీ కూడా చేరి పర్యవేక్షణ జరుపుతుంది.రెండవ జోన్‌ పూర్తిగా ఉక్రెయిన్‌ మిలిటరీ ఆధీనంలో ఉంటుంది. మూడవది ఉక్రెయిన్‌, రష్యా ఆధీనంలో ఉన్న ప్రాంతాల మధ్య 29 కిలోమీటర్ల వెడల్పున ఎవరూ ప్రవేశించకూడని ప్రాంతం, నాలుగవది క్రిమియాతో సహా, స్వాతంత్య్రం ప్రకటించుకొని రష్యా ఆధీనంలో ఉన్న ప్రాంతాలు. నాటో లేదా నాటో కూటమిలోని దేశాలకు చెందిన మిలిటరీ ఉనికిని ఉక్రెయిన్‌లో అంగీకరించేది లేదని గతంలోనే రష్యా స్పష్టం చేసింది. మొదటి జోన్‌ పేరుతో నాటో దేశాల దళాలను ఉంచాలన్న అమెరికా ఎత్తుగడ ఆరని రావణకాష్టం వంటిదే. రెండవ ప్రపంచ యుద్ధంలో విడదీసి వియత్నాం దక్షిణ ప్రాంతంలో శాశ్వతంగా తిష్టవేసేందుకు అమెరికా వేసిన ఎత్తుగడను అక్కడి జాతీయవాదులు, కమ్యూనిస్టులు ప్రతిఘటించి అమెరికా సేనలను తరిమివేశారు. కొరియాను కూడా అలాగే విభజించి ఉభయ కొరియాలు విలీనం కాకుండా అడ్డుపడుతున్నారు.తైవాన్‌ దీవి చైనా అంతర్భాగమే అని అధికారికంగా గుర్తిస్తూనే చైనా ప్రధాన భూభాగంతో విలీనానికి తగిన తరుణం అసన్నం కాలేదంటూ రెచ్చగొడుతున్నారు. తమ దేశాన్ని విభజించటానికి వీల్లేదని, అన్ని ప్రాంతాలు తమకు రావాల్సిందేనని ఉక్రెయిన్‌ నేత జెలెనెస్కీ గతంలోనే చెప్పాడు. దీనికి ఐరోపాలోని ఇతర దేశాలు కూడా అంగీకరించే అవకాశాలు లేవు. జర్మనీ విభజనకు ఉక్రెయిన్‌ సమస్యకు అసలు పోలికే లేదు. యుద్ధం కొనసాగితే రష్యన్లు జెలెనెస్కీని బందీగా పట్టుకుంటారని లేదా ఉక్రెయిన్‌ మిలిటరీలోని జాతీయవాదులు, గూఢచార ఏజన్సీ జెలెనెస్కీని పదవి నుంచి తప్పించే అవకాశాలున్నాయని కొందరు చెబుతున్నారు.నాలుగు ముక్కలుగా విభజన చేస్తే అక్కడ తమకు పనేమీ ఉండదని, ఇతర చోట్ల వ్యవహారాలను చక్కపెట్టుకోవచ్చని, పరువు దక్కించుకోవచ్చని అమెరికా భావిస్తున్నట్లు విశ్లేషణలు వెలువడుతున్నాయి. రష్యా మీద ఆంక్షలు విధించిన ఐరోపా దేశాలు అక్కడి నుంచి ముడిచమురు తప్ప చౌకగా సరఫరా అవుతున్న గ్యాస్‌ను ప్రస్తుతం కొనుగోలు చేస్తున్నాయి. దాన్ని కూడా నిలిపివేస్తే అనేక దేశాల్లో పాలక పార్టీలకు నూకలు చెల్లుతాయని భయపడుతున్నారు. అందువలన సంక్షోభం ఎక్కువ కాలం కొనసాగటం అనేక దేశాలకు ఇష్టం లేదని, పరిస్థితులకు అనుగుణంగా సర్దుకుపోవటమా, అస్తవ్యస్థ పరిస్థితులను ఎదుర్కోవటమా అనే గుంజాటనలో ఉన్నాయి. తన చమురు, గ్యాస్‌ లావాదేవీల వివరాలను బహిర్గతం పరచటం నిలిపివేసిన రష్యా వచ్చే ఏడాది ఏప్రిల్‌ వరకు అదే కొనసాగించనున్నట్లు ప్రకటించింది.
సిబిఎస్‌ టీవీ ‘‘60నిమిషాలు ’’ కార్యక్రమంలో ఆదివారం నాడు జెలెనెస్కీతో జరిపిన ముఖాముఖిని ప్రసారం చేసింది.దాని మీద ట్రంప్‌ మండిపడ్డాడు. ఉక్రెయిన్‌ పోరు గురించి తారుమారు చేసిన వాస్తవాల మీద ఆధారపడి ట్రంప్‌ యంత్రాంగం పని చేస్తున్నదని జెలెనెస్కీ ఆరోపించాడు.తాముగా యుద్ధాన్ని ప్రారంభించలేదని, చూస్తుంటే పుతిన్‌ ప్రారంభించిన యుద్ధాన్ని ఉపాధ్యక్షుడు జెడి వాన్స్‌ సమర్ధిస్తున్నట్లు కనిపిస్తున్నదన్నాడు. రష్యా దురాక్రమణదారు, తాము బాధితులమని, పోరు మధ్యలో మరొకదాని కోసం అటూ ఇటూ చూడలేమన్నాడు. అమెరికా మాట మాత్రమే మార్చలేదని, వాస్తవాన్ని కూడా తారుమారు చేసిందని అరోపించాడు. ట్రంప్‌ ఒక నిర్ణయం తీసుకొనే ముందు స్వయంగా వచ్చి పరిశీలించాలన్నాడు. ఎక్కడికైనా వెళ్లి చూడవచ్చు, దాడులు ఎలా ఉన్నాయో తెలుస్తుంది.అమెరికా మా వ్యూహాత్మక, బలమైన భాగస్వామి అయితే సందేహాలున్నాయి. అమెరికా పౌరులను నేను సందేహించను, వారు మాతోనే ఉన్నారు, కానీ దీర్ఘకాలిక యుద్ధంలో ఐరోపా నుంచి అమెరికా దూరంగా జరగవచ్చు అని ఐరోపాలో ప్రతి ఒక్కరూ భయపడుతున్నారు.అమెరికా లేకపోతే మేము భారీగా నష్టపోతాం,మానవ మరియు భూభాలను కోల్పోతాము. ఏదో విధంగా ఈ యుద్ధాన్ని ముగించాలి అని జెలెనెస్కీ చెప్పాడు.జెలెనెస్కీ వ్యాఖ్యలు ప్రతికూల ఫలితాలనిస్తాయని జెడి వాన్స్‌ కార్యాలయం హెచ్చరించింది. తమ ఉపాధ్యక్షుడి వ్యక్తిత్వాన్ని దెబ్బతీయటం కంటే వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించుకోవటంపై కేంద్రీకరించాలని పత్రికా కార్యదర్శి టేలర్‌ వాన్‌ కిర్క్‌ ప్రకటించాడు. ఈ కార్యక్రమం వక్రీకరణలతో కూడుకొని ఉన్నందున నియంత్రణ సంస్థ ఫెడరల్‌ కమ్యూనికేషన్స్‌ కమిషన్‌(ఎఫ్‌సిస)ి తీసుకొనే చర్యల్లో సిబిఎస్‌ టీవీ ప్రసార అనుమతులను రద్దుతో పాటు భారీ మొత్తంలో జరిమానా విధించాలని ట్రంప్‌ చెప్పాడు. ఇది బెదిరించటం తప్ప మరొకటి కాదు. ప్రతివారం 60నిమిషాల కార్యక్రమంలో అసభ్యకరమైన, అవమానకరంగా ట్రంప్‌ పేరు ప్రస్తావించుతున్నారు.వాటన్నింటిలో ఇది పరాకాష్ట అని ట్రంప్‌ తన ట్రూత్‌ సామాజిక వేదికలో పోస్టు పెట్టాడు. ఎన్నికలకు ముందు గతేడాది తనకు వ్యతిరేకంగా కమలా హారిస్‌కు ప్రాధాన్యత కల్పిస్తూ మోసపూరితంగా ఎడిట్‌ చేసి కార్యక్రమాన్ని ప్రసారం చేశారంటూ ట్రంప్‌ సిబిఎస్‌ ఛానల్‌ యజమాని పారామౌంట్‌ కంపెనీ మీద కేసు దాఖలు చేశాడు.తమను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆ కంపెనీ ఆరోపించింది. ట్రంప్‌ దాఖలు చేసిన 20 బిలియన్‌ డాలర్ల పరువు నష్టం కేసులో ఒక అంగీకారానికి వచ్చేందుకు ఇరు పక్షాలూ మధ్యవర్తిత్వానికి తెరతీసినట్లు గత నెలలో న్యూయార్క్‌ టైమ్స్‌ పేర్కొన్నది.


ఉక్రెయిన్‌లో శాంతికోసం అమెరికాతో ఒప్పందం కుదుర్చుకోవటం అంత తేలిక కాదని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావరోవ్‌ వ్యాఖ్యానించాడు.మూల కారణాల సంగతి చూడకుండా అమెరికా ప్రతిపాదనలను అంగీకరించలేమన్నాడు.అమెరికా కనీసం సమస్యలోతులోకి వెళుతున్నది, ఐరోపా వైపు నుంచి వెర్రి ఆవేశం తప్ప మరొకటి కనిపించటం లేదన్నాడు. అంతకు ముందు ట్రంప్‌ ప్రతినిధి స్టీవ్‌ విట్‌కోఫ్‌ సెంట్‌ పీటర్స్‌బర్గ్‌లో పుతిన్‌తో చర్చలు జరిపాడు.పుతిన్‌ శాశ్వత శాంతిని కోరుతున్నాడని, దాని గురించి చర్చించాల్సి ఉందన్నాడు. సంక్లిష్టమైన పరిస్థితి ఉందన్నాడు.మరోవైపున సంక్షోభాన్ని మరింత ఎగదోసేందుకు చూస్తున్నారు.ఉక్రెయిన్‌కు ఎలాంటి శషభిషలు లేని మద్దతు అందిస్తున్నట్లు నాటో అధిపతి మార్క్‌ రూటె మంగళవారం నాడు ప్రకటించాడు, ఉక్రెయిన్‌లోని ఒడెసా ప్రాంతాన్ని సందర్శించాడు. అమెరికా పార్లమెంటు దిగువ సభలో ఉక్రెయిన్‌కు మరింతగా మిలిటరీ సాయం అందించాలని, రష్యాపై ఆంక్షలను పెంచాలని తదితర అంశాలతో డెమాక్రాట్లు ఒక బిల్లును ప్రదిపాదించగా దాన్ని బహిర్గతం చేయలేదు. దీర్ఘశ్రేణి తారుస్‌ క్షిపణులను ఉక్రెయిన్‌కు అందించాలనే జర్మనీ నిర్ణయాన్ని మాస్కో తప్పు పట్టింది. పరిస్థితిని మరింత దిగజార్చేందుకు ఈ చర్య దోహదం చేస్తుందని హెచ్చరించింది. ఆయుధాల కొనుగోలుకు వంద కోట్ల డాలర్లు ఇవ్వాలని బ్రిటన్‌ నిర్ణయించింది. ఉక్రెయిన్‌లో పోరు విషయానికి వస్తే రష్యన్లు ఎత్తుగడలను మార్చి మెల్లమెల్లగా దాడులను విస్తరిస్తున్నారు. ఉక్రెయిన్‌ మిలిటరీ ప్రతిఘటించే స్థితిలో లేదు.ఐరోపా దేశాలు పరువు కోసం పాకులాడుతున్నాయి. ఉక్రెయిన్‌ పోరులో రష్యా గెలిస్తే రానున్న రోజుల్లో తమ భవిష్యత్‌ మరింతగా ఇబ్బందుల్లో పడుతుందని అవి అంతర్గతంగా భయపడుతున్నాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

పిచ్చివాడి చేతిలో రాయి – అమెరికాను ఎటు నడుపుతాడో తెలియని డోనాల్డ్‌ ట్రంప్‌ !

02 Wednesday Apr 2025

Posted by raomk in Current Affairs, Economics, History, imperialism, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RUSSIA, UK, USA, WAR

≈ Leave a comment

Tags

Donald trump, Insane Donald Trump, Iran nuclear weapon, Narendra Modi Failures, TRADE WAR, Trade war Expanding, Ukraine crisis, Vladimir Putin, Volodymyr Zelensky

ఎం కోటేశ్వరరావు

ఆ సాయంత్రం... రాక్సీలో నార్మా షేరర్‌, బ్రాడ్వేలో కాంచనమాల, ఎటుకేగుటో సమస్య తగిలిందొక విద్యార్ధికి (1939లో చెన్నయ్‌లో ఆంగ్ల, తెలుగు సినిమాలు ఆడిన సినిమాహాళ్లు) అని సంధ్యా సమస్యలు అనే కవితలో శ్రీశ్రీ మన ముందుంచినట్లుగానే ఏ అంశం గురించి రాయాలో ఈ విద్యార్థికి పరీక్ష పెట్టాడు డోనాల్డ్‌ ట్రంప్‌.ఏప్రిల్‌ రెండవ తేదీ నుంచి తనకు లొంగని, నచ్చని దేశాలన్నింటి మీద ప్రకటించిన వాణిజ్య యుద్దంలో పన్ను అస్త్రాల ప్రయోగం, అణు ఒప్పందానికి రాకపోతే అంతు చూస్తామన్న బెదరింపులపై తేల్చుకుందాం రా అంటూ ఇరాన్‌ అధినేత ఘాటు స్పందన, పుతిన్‌ మీద కోపం వస్తోందన్న ట్రంప్‌, గాజాపై సాగుతున్న మారణకాండ ఇలా అనేక సమస్యలు మన ముందున్నాయి. తాను చాలా దయతో వ్యవహరిస్తానని ట్రంప్‌ ప్రకటించాడు. పిచ్చివాడు అనేక మాటలు మాట్లాడతాడు,తన చేతిలో రాయితో అందరినీ భయపెడతాడు, ఎవరినైనా కొట్టవచ్చు, ఉన్మాదంలో తన తలను తానే పగలగొట్టుకోనూ వచ్చు.వాడి దాడి నుంచి తప్పించుకోవాటానికి ప్రతి ఒక్కరూ చూడటంతో పాటు అదుపులోకి తీసుకొని కట్టడి చేసేందుకూ చూస్తారు. ఇప్పుడు ప్రపంచంలో అదే స్థితిలో ఉందా ! ఏం జరగనుంది !!

మంగళవారం రాత్రి నుంచి అమల్లోకి రానున్న ప్రతి సుంకాల విషయంలో తాను ఎంతో దయతో వ్యహరిస్తానని సోమవారం నాడు డోనాల్డ్‌ ట్రంప్‌ చెప్పాడు. తమ నేత చైనా, కెనడా, ఐరోపా యూనియన్లను రెచ్చగొట్టి ప్రపంచ వాణిజ్య యుద్ధానికి తెరలేపుతున్నాడని కొంత మంది రిపబ్లికన్‌ పార్టీ సెనెటర్లే వ్యతిరేకతను వ్యక్తం చేసినట్లు వార్తలు. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను కలిగి ఉన్నాం గనుక ప్రతి దేశం దాన్ని ముక్కలు చేస్తున్నందున ప్రతికూల పన్నులు వేయకతప్పటం లేదని, త్వరలో అమెరికాకు విముక్తి రోజు వస్తుందని చెప్పాడు ట్రంప్‌. తమ శత్రువుల మీద పోరాడాలంటూనే కొన్ని పన్నుల మీద అధికార పార్టీ సెనెటర్లు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు, కెనడా మీద చర్యలకు వ్యతిరేకంగా ఓటు వేస్తానని సుసాన్‌ కోలిన్స్‌, థోమ్‌ టిలిస్‌ ప్రకటించారు. తెలివితేటలు ఏ ఒక్కరి సొంతం కాదు.ఎవరి జాగ్రత్తలో వారున్నారు.పరస్పర వాణిజ్యంపై చైనా, జపాన్‌, దక్షిణ కొరియా ఆదివారం నాడు ఒక అవగాహనకు వచ్చాయి. ఏ దేశాల మీద ఎంత పన్ను, ఏ వస్తువుల మీద విధించేదీ బుధవారం నాడు ప్రకటిస్తామని అధ్యక్ష భవన మీడియా కార్యదర్శి కరోలిన్‌ లీవిట్‌ విలేకర్లతో చెప్పారు. పన్నులపై అనిశ్చితి ప్రభావం స్టాక్‌ మార్కెట్లపై పడిరది. అమెరికా వాణిజ్య భాగస్వాములందరి మీద 20శాతం వరకు పన్ను విధించవచ్చని ట్రంప్‌ సలహాదారులు చెప్పినట్లు వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ పేర్కొన్నది. పన్నులతో ముందుకు పోతే రానున్న ఏడాది కాలంలో అమెరికాలో మాంద్యం వచ్చే అవకాశాలు 20 నుంచి 35శాతానికి పెరుగుతాయని గోల్డ్‌మన్‌ శాచస్‌ విశ్లేషకులు చెబుతున్నారు.కార్ల ధరలు పెరిగితే వాటిని తాను పెద్దగా పట్టించుకోనని ట్రంప్‌ అన్నాడు.

ఇప్పటివరకు చైనా, కెనడా ప్రతి సుంకాలను ప్రకటించాయి. ఐరోపా యూనియన్‌ బేరసారాలాడుతున్నందున, మరో పదిహేను రోజుల వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవచ్చు. కార్ల మీద ట్రంప్‌ ప్రకటించిన పన్నులు గురువారం నుంచి అమల్లోకి వస్తాయి. అమెరికా పన్నులు ఆతృతకు కారణమౌతున్నాయని ఐఎంఎఫ్‌ అధిపతి క్రిస్టాలినా జార్జియేవా వ్యాఖ్యానించారు. చైనా, ఐరోపా యూనియన్‌,మెక్సికో,కెనడా,వియత్నాం, జపాన్‌, దక్షిణ కొరియా, చైనీస్‌ తైవాన్‌, భారత దేశాలతో వస్తు వాణిజ్యంలో అమెరికా లోటులో ఉంది. ఈ దేశాలన్నీ కూడా వాటి లావాదేవీలను పరిమితం చేసుకొనేందుకు చూస్తున్నాయి. అమెరికా వత్తిడికి లొంగి లేదా మన ఎగుమతిదార్ల లాబీ కారణంగా మన దేశం అమెరికాకు కొన్ని రాయితీలు ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు.మన మీద పన్నుల గురించి ఇంకా స్పష్టత రాలేదు. మొత్తంగా పరిస్థితిని గమనించి అమెరికా ప్రకటించిన పన్నులను గణనీయంగా తగ్గించవచ్చు లేదా కొంత కాలం అమలు వాయిదా వేయవచ్చని కొందరు ఆశిస్తున్నారు.

తమ మీద అమెరికా, దాని అనుయాయులు దాడులకు దిగితే అణ్వాయుధాలను సమకూర్చుకోవటంతప్ప మరొక ప్రత్యామ్నాయం లేదని ఇరాన్‌ హెచ్చరించింది. దాడులు జరిగితే వారు కచ్చితంగా ప్రతిదాడులను ఎదుర్కోవాల్సి ఉంటుందని రంజాన్‌ ఉపవాసమాసం ముగింపు సందర్భంగా చేసిన ప్రసంగంలో అధినేత అయాతుల్లా అలీ ఖమేనీ హెచ్చరించాడు. ఖమేనీ సలహాదారు అలీ లార్జియానీ టీవీలో మాట్లాడుతూ తాముగా అణ్వాయుధాలను సమకూర్చుకొనే దిశలో పయనించటం లేదని, ఒకవేళ అమెరికా స్వయంగా లేదా ఇజ్రాయెల్‌ ద్వారా దాడులకు దిగితే తమ నిర్ణయం భిన్నంగా ఉంటుందని, ఆత్మరక్షణకు వాటిని ప్రయోగించకతప్పదని చెప్పాడు. తమతో అణు ఒప్పందం మీద సంతకాలు చేయకపోతే పెద్ద ఎత్తున దాడులు చేస్తామని, సుంకాలు విధిస్తామని ఆదివారం నాడు ట్రంప్‌ బెదిరించాడు. దీని గురించి సోమవారం నాడు భద్రతా మండలికి ఇరాన్‌ ఫిర్యాదు చేసింది. రాయబారి అమీర్‌ సయిద్‌ ఇర్వానీ ఒక లేఖ ద్వారా తమ మీద దురాక్రమణకు పాల్పడితే నిర్ణయాత్మకంగా వ్యహరిస్తామని, యుద్దోన్మాదం, రెచ్చగొట్టటాన్ని ఖండిస్తున్నామని పేర్కొన్నాడు. గతంలో 2015లో కుదిరిన ఒప్పందం నుంచి ఇదే ట్రంప్‌ 2018లో ఏకపక్షంగా వైదొలిగాడు. ఇరాన్‌ పరిసర ప్రాంతాల్లో అమెరికా పది మిలిటరీ కేంద్రాలను, యాభైవేల మంది సైనికులను నిర్వహిస్తున్నది. అద్దాల మేడలో ఉండి ఎవరూ ఇతరుల మీద రాళ్లు వేయకూడదని ఇరాన్‌ క్షిపణి కార్యక్రమ అధికారి, ఇస్లామిక్‌ రివల్యూలషనరీ గార్డ్స్‌ సీనియర్‌ కమాండర్‌గా ఉన్న అమిరాలీ హజిజదే హితవు పలికాడు.

గతంలో కుదిరిన ఒప్పందం ప్రకారం పశ్చిమ దేశాల ఆంక్షలు ఎత్తివేయాలంటే ప్రతిగా ఇరాన్‌ తన అణుశుద్ధి కార్యక్రమాన్ని నిలిపివేయాల్సి ఉంది. అయితే పశ్చిమ దేశాలు ఒప్పందాన్ని ఉల్లంఘించటంతో ఇరాన్‌ తన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నది.వాటిని శాంతియుత ప్రయోజనాలకు మాత్రమే అని పదే పదే చెబుతున్నది. తిరిగి అణు ఒప్పందంపై చర్చలకు అంగీకరించాలని లేకుంటే మిలిటరీ చర్యతప్పదని మార్చి ఏడవ తేదీన యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ ద్వారా ట్రంప్‌ ఒక లేఖను పంపాడు. దానికి గాను గత వారంలో ఒమన్‌ ద్వారా ఇరాన్‌ సమాధానం పంపింది. గరిష్ట వత్తిడి, మిలిటరీ చర్య బెదిరింపుల పూర్వరంగంలో తాము ప్రత్యక్ష చర్చలకు సిద్దం కాదని, పరోక్షంగా అంగీకరిస్తామని విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చీ స్పష్టం చేశాడు. ఇదే అంశాన్ని ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌ కూడా తేటతెల్లం చేశాడు. చర్చలకు తాము విముఖం కాదని, ముందుగా అమెరికా తన గత తప్పిదాలను సరిచేసుకొని విశ్వాసం కలిగించాలని చెప్పాడు. గతంలో కుదిరిన ఒప్పందం నుంచి ట్రంప్‌ వైదొలిగిన తీరును బట్టి ఇరానియన్లకు నమ్మకం లేకపోవటం సరైనదే అని వాషింగ్టన్‌లోని స్టిమ్సన్‌ కేంద్ర బార్బరా స్లావిన్‌ వ్యాఖ్యానించారు.హిందూ మహాసముద్రంలోని డిగోగార్సియాలో సైనిక కేంద్రానికి అమెరికా అదనపు యుద్ద విమానాలను తరలించిందని, మరొక విమానవాహక నౌకను తరలించటాన్ని చూస్తే ఇజ్రాయెల్‌తో కలసి ఏదో ఒక రకమైన మిలిటరీ చర్యకు సిద్దం అవుతున్నట్లు కనిపిస్తున్నదని ఆమె చెప్పారు. అణుకార్యక్రమంతో పాటు పశ్చిమాసియా ప్రాంతంలో ప్రతినిధుల ద్వారా తన పలుకుబడిని పెంచుకొనేందుకు చూస్తున్నదని పశ్చిమ దేశాలు ఇరాన్‌ మీద ఆరోపిస్తున్నాయి. ఈ ప్రాంతంలో అలాంటి ప్రతినిధి ఎవరైనా ఉంటే యూదు దురహంకార ప్రభుత్వమేనని దాన్ని తుడిచివేయాలని ఖమేనీ స్పష్టం చేశాడు. అనేక బాంబులను తయారు చేసేందుకు అవసరమైన యురేనియంను ఇరాన్‌ సమకూర్చుకుందని, అయితే ఇంకా బాంబులను తయారు చేయలేదని ఇటీవల అంతర్జాతీయ అణు ఇంథన సంస్థ పేర్కొన్నది. అవసరమైతే రెండు నెలల వ్యవధిలో బాంబులను రూపొందించి, వాటిని పరీక్షించి, విడదీసి అవసరమైన చోటికి తరలించి తిరిగి తయారు చేసేందుకు, వాటిని ప్రయోగించే క్షిపణులను కూడా సమాంతరంగా సిద్దం చేసిందనే వార్తలు వచ్చాయి. ఆ తరువాతే ట్రంప్‌ బెదిరింపులకు దిగాడు. ఈ నేపధ్యంలో తన భూగర్భ క్షిపణి ప్రయోగ కేంద్రాలన్నింటినీ ఇరాన్‌ సన్నద్దం చేస్తున్నదని ఈ మేరకు వాటికి సంబంధించి కొన్ని వీడియోలను కూడా విడుదల చేసిందని వార్తలు వచ్చాయి. శత్రుదేశాల దాడులనుంచి వాటిని కాపాడేందుకు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. రెండు దేశాల మధ్య చర్చలకు తెరతీయాలంటే విధించిన ఆంక్షలను అమెరికా సడలించాల్సి ఉంటుంది.

రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్‌ పుతిన్‌ మీద తనకు పిచ్చి కోపం వస్తున్నదని డోనాల్డ్‌ ట్రంప్‌ అన్నాడు.ఉక్రెయిన్‌పై ఒప్పందానికి ముందుకు రాకపోతే అదనంగా రష్యన్‌ చమురు మీద 50శాతం పన్నులు విధిస్తానని చెప్పాడు. నెల రోజుల పాటు నల్ల సముద్ర ప్రాంతంలో నౌకల రవాణాపై ఒప్పందానికి ఉక్రెయిన్‌రష్యా అంగీకరించినట్లు ప్రకటించినప్పటికీ అదింకా అమల్లోకి రాలేదు.దాన్లో అంగీకరించినదాని ప్రకారం ఇరు దేశాలు తమ ఇంథన మౌలికవసతులపై పరస్పరం దాడులు నిలిపివేయాలి, అయితే ఇరుపక్షాలూ పాటించటం లేదని ఆరోపించుకుంటున్నాయి. తమ ఆహార, ఎరువుల రవాణాను స్వేచ్చగా జరగనివ్వటంతో పాటు వాటి లావాదేవీలు జరిపే బ్యాంకుల మీద పశ్చిమ దేశాలు ఆంక్షలను తొలగిస్తేనే అమలు చేస్తామని రష్యా షరతులు విధించింది. గతంలో జెలెనెస్కీని బెదిరించిన ట్రంప్‌ ఇప్పుడు మాటమార్చి రష్యా మీద కేంద్రీకరించాడు.తాను ఏది అనుకుంటే అది చేయగలననే అగ్రరాజ్య అహంకారంతో ఉన్నట్లున్నాడు.


ఉక్రెయిన్‌లో మరింత సమర్దవంతమైన ప్రభుత్వం ఉండాలని, జెలెనెస్కీ పదవీకాలం ముగిసినందున ఐరాస పర్యవేక్షణలో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని పుతిన్‌ సూచించాడు. ఈ ప్రకటన ద్వారా జెలెనెస్కీని తాను గుర్తించటం లేదని స్పష్టం చేశాడు. నల్లసముద్రంలో నౌకల రవాణా గురించి కూడా అమెరికాతో తప్ప ఉక్రెయిన్‌తో రష్యాకు ఎలాంటి ఒప్పందం లేదు, అయితే అమలు జరపాల్సింది మాత్రం జెలెనెస్కీ యంత్రాంగమే. సుదూరంగా ఉన్న ఉత్తర రష్యా నగరమైన మురుమాన్స్క్‌కు జలాంతర్గామిలో ప్రయాణించిన పుతిన్‌ విలేకర్లతో మాట్లాడుతూ తాత్కాలిక ప్రభుత్వం అక్కడ ఎన్నికలు జరిపేందుకు దోహదం చేస్తుందని, ప్రజల మద్దతు ఉన్న ప్రభుత్వం ఏర్పడితే దానితో చట్టబద్దమైన పత్రాలపై సంతకాలు చేసేందుకు శాంతి చర్చలకు సిద్దమని చెప్పాడు. యుద్దం కారణంగానే గడువు ముగిసినా రాజ్యాంగం ప్రకారం జెలెనెస్కీ అధికారంలో కొనసాగుతున్నాడని, 50లక్షల మంది పౌరులు దేశం వెలుపల ఉంటున్నపుడు, లక్షలాది మంది యుద్ధ రంగంలో ఉండగా ఎన్నికలు ఎలా సాధ్యమని ఉక్రెయిన్‌ అంటున్నది. గతంలో తూర్పు తైమూరు, పూర్వపు యుగోస్లావియా తదితర దేశాల్లో ఇలాగే ఎన్నికలు జరిగినపుడు ఇక్కడెందుకు సాధ్యం కాదని పుతిన్‌ ప్రశ్నించాడు. ఉక్రెయిన్‌ సంక్షోభంలో ఎవరి రాజకీయాలు వారు చేస్తున్నారు. ఒకవైపు శాంతి చర్చలు జరుగుతుండగానే నిలిపివేసిన ఆయుధ సాయాన్ని ట్రంప్‌ పునరుద్దరించాడు. మరోవైపు ఐరోపా దేశాలు కూడా మరింతగా జెలెనెస్కీ సేనలను పటిష్టపరచటం ఎలా అని ముఖ్యంగా బ్రిటన్‌, ఫ్రాన్సు చర్చిస్తున్నాయి.తమ ప్రమేయం లేకుండా అమెరికా కుదుర్చుకున్న ఒప్పంద షరతులను తామెందుకు అమలు జరపాలని ఐరోపా సమాఖ్య పరోక్షంగా ప్రశ్నిస్తోంది.తన పరువు కాపాడుకొనేందుకు ట్రంప్‌ నానా తంటాలు పడుతున్నాడు. ఆ బలహీనతను ఉపయోగించుకొని తమపై ఆంక్షలను ఎత్తివేయించుకోవాలని, ఉక్రెయిన్‌లో తమకు ఎదురులేదని నిరూపించుకోవాలని రష్యా చూస్తోంది. ఎవరి రాజకీయం వారిది, ఈ క్రమంలో ఎవరి ఇబ్బందులు వారివి !

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఉక్రెయిన్‌ సంక్షోభంలో పుతిన్‌ తొలి విజయం : ఆంక్షల ఎత్తివేత షరతులతో అమెరికాతో ఒప్పందం !

26 Wednesday Mar 2025

Posted by raomk in Current Affairs, Europe, History, imperialism, International, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, USA, WAR

≈ Leave a comment

Tags

Black Sea deal, Donald trump, Russia-Ukraine War, Ukraine war, Vladimir Putin, Zelensky


ఎం కోటేశ్వరరావు


సోమవారం నాడు అమెరికాతో కుదిరిన ఒప్పందం మేరకు నల్ల సముద్ర ప్రాంతలో స్వేచ్చగా నౌకా సంచారానికి రష్యా అంగీకరించింది. అయితే తమ షరతులను ముందుగా అమలు జరపాలని స్పష్టం చేసింది. బంతిని అమెరికా మైదానం వైపు నెట్టింది. తమ ఆహార ఎగుమతులకు వీలుగా ద్రవ్య సంస్థల మీద విధించిన ఆంక్షలను అమెరికా ఎత్తివేసిన తరువాతే ఒప్పందం అమల్లోకి వస్తుందని చెప్పింది. మాస్కోలోని అధ్యక్ష భవనం క్రెమ్లిన్‌ విడుదల చేసిన ప్రకటన ప్రకారం ఆహార వాణిజ్యంతో సంబంధం ఉన్న రష్యన్‌ వ్యవసాయ, ఇతర బాంకుల మీద ఉన్న ఆంక్షల ఎత్తివేతతో సహా ఇతర అంశాలను కూడా అమలు జరపాలని స్పష్టం చేసింది. ప్రపంచ మార్కెట్లకు గతంలో మాదిరి ఆహారం, ఎరువుల ఎగుమతుల పునరుద్దరణ, తమ పతాకాలున్న నౌకల మీద ఆంక్షల తొలగింపు, సముద్ర ప్రయాణ బీమా ధరల తగ్గింపు, వివిధ రేవులను, ద్రవ్య లావాదేవీలు జరిపేందుకు చెల్లింపుల వ్యవస్థలను అందుబాటులోకి తేవటం వంటివి ఉన్నాయి. అమెరికా అధ్యక్ష భవనం చేసిన ప్రకటనలో కూడా పైన పేర్కొన్న అంశాల పునరుద్దరణకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నది. క్రెమ్లిన్‌ విడిగా చేసిన మరొక ప్రకటనలో మార్చి 18 నుంచి నెల రోజుల పాటు రష్యా మరియు ఉక్రెయిన్‌ ఇంథన వ్యవస్థల మీద పరస్పరం దాడులు చేసుకోకుండా ఉండేందుకు అంగీకరించినట్లు పేర్కొన్నది. ఒప్పంద వ్యవధిని పొడిగించేందుకు లేదా ఎవరు విఫలమైనా ఒప్పందం నుంచి వెనక్కు తగ్గేందుకు అవకాశం ఉందని కూడా తెలిపింది. అంతకు ముందు అమెరికా ప్రతినిధులతో సమావేశమైన తరువాత రష్యాతో కుదిరిన ఒప్పందానికి తాము అంగీకరిస్తున్నట్లు ఉక్రెయిన్‌ ప్రకటించింది. మొత్తం మీద చూసినపుడు పుతిన్‌ తొలి విజయం సాధించినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అమెరికా ఆంక్షలు, ఉక్రెయిన్‌ కారణంగానే నల్ల సముద్ర స్వేచ్చా రవాణా ఒప్పందం నుంచి రష్యా వైదొలిగింది. ఇప్పుడు బంతి అమెరికా కోర్టు వైపు వెళ్లింది. దాని చిత్తశుద్దికి పరీక్ష అని చెప్పవచ్చు.


ఉక్రెయిన్‌ సంక్షోభం గురించి అమెరికా, రష్యా ప్రతినిధి వర్గాల మధ్య సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో సోమవారం నాడు చర్చలు జరిగాయి.వాటి తీరుతెన్నుల గురించి ప్రతినిధులు తమ దేశ నేతలకు వివరించిన తరువాత అవగాహన గురించి మంగళవారం రాత్రి ఎవరికి వారు విడిగా ప్రకటనలు చేశారు. పది గంటల పాటు జరిగిన సంప్రదింపులలో మూడు సార్లు విరామం ఇచ్చారు. చర్చల తరువాత అమెరికా ప్రతినిధులు ఉక్రెయిన్‌ అధికారులతో చర్చలు జరిపారు. ఒకవైపు చర్చలు సాగుతున్నప్పటికీ రెండు పక్షాలూ దాడులు కొనసాగించాయి. తాము 30 మంది రష్యన్‌ సైనికులను చంపివేసినట్లు ఉక్రెయిన్‌ ప్రకటించుకుంది. తాము ట్రంప్‌ ప్రతిపాదించిన నెల రోజుల కాల్పుల విరమణను అంగీకరించలేదని, ఇంథన మౌలిక సదుపాయాలపై దాడులను వాయిదా వేసేందుకు మాత్రమే అంగీకరించినట్లు రష్యా ప్రతినిధులు అంతకు ముందు చెప్పారు.


నల్ల సముద్రంలో రేవుల నుంచి ఎగుమతి అయ్యే ధాన్యం,నూనెలు,ఎరువుల తనిఖీ గురించి గతంలో కుదిరిన ఒప్పందం నుంచి రష్యా వైదొలిగింది. దానిలో తమ ఎగుమతుల మీద ఉన్న ఆంక్షల భాగాన్ని అమలు జరపలేదని గతంలో పేర్కొన్నది. ఇతర అంశాలపై సైనిక చర్యనాటి నుంచి రష్యా చేస్తున్న డిమాండ్లలో ఇంతవరకు ఎలాంటి మార్పు లేదు. నాటోలో చేరాలన్న ప్రతిపాదనను అధికారికంగా జెలెనెస్కీ ఉపసంహరించుకోవాలి,ఉక్రెయిన్‌ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి స్వాతంత్య్రాన్ని ప్రకటించుకున్న, స్వతంత్ర దేశాలుగా రష్యా గుర్తించిన నాలుగు ప్రాంతాల నుంచి ఉక్రెయిన్‌ సేనలను ఉపసంహరించుకోవాలి. సోవియట్‌ కాలంలో ఉక్రెయిన్‌ పాలనా పరిధిలోకి వచ్చిన క్రిమియా ద్వీపకల్పాన్ని 2014లో రష్యా తిరిగి తనలో విలీనం చేసుకున్నది. దానితో సహా, రష్యా మద్దతు ఉన్న తిరుగుబాటు ప్రాంతాలన్నింటినీ వెనక్కు అప్పగించాలని ఉక్రెయిన్‌ కోరుతున్నది. అలాంటి ఆశలు పెట్టుకోవద్దని జెలెనెస్కీకి అమెరికా స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఒక వేళ ఒప్పందం కుదిరి మిలిటరీ చర్యను ఉపసంహరించుకున్న తరువాత శాంతి సేనలనో మరొక పేరుతోనో తమను వ్యతిరేకించే దేశాల మిలిటరీని సరిహద్దుల్లో అంగీకరించేది లేదని కూడా రష్యా స్పష్టం చేసింది.


ఒక వైపు చర్చలకు తేదీ, స్థలం నిర్ణయించిన తరువాత జెలెనెస్కీ టైమ్‌ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పుతిన్‌పై ఆరోపణలు చేశాడు. సౌదీలో చర్చల రోజే వాటిని ఆ పత్రిక ప్రచురించింది. రష్యన్లు చేస్తున్న తప్పుడు ప్రచారాలు అమెరికా అధ్యక్ష భవనంలో పని చేస్తున్న కొంత మంది మీద ప్రభావం చూపుతున్నాయని జెలెనెస్కీ ఆరోపించాడు. వారు స్వంత గూఢచారుల సమాచారం కంటే పుతిన్‌ మీదనే ఎక్కువగా విశ్వాసం ఉంచుతున్నట్లు చెప్పాడు. యుద్దం ముగియాలని ఉక్రేనియన్లు కోరుకోవటం లేదని అందువలన వారిని దారికి తెచ్చేందుకు ఏదో ఒకటి చేయకతప్పదన్న సూచన అమెరికన్లకు వెళ్లిందని అన్నాడు. రష్యాలోని కురుస్కు ప్రాంతంలో ఉన్న తమ సేనలను రష్యా చక్రబంధం చేసిందన్న ట్రంప్‌ వ్యాఖ్యలు కూడా తప్పుడు సమాచార ప్రభావమే అన్నాడు. పుతిన్ను సంతుష్టీకరించేందుకు, జెలెనెస్కీని అంకెకు రప్పించేందుకు గానీ అందచేస్తున్న మిలిటరీ సాయం, గూఢచార సమాచార అందచేత నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన ట్రంప్‌ యంత్రాంగం ఐరోపా నుంచి వత్తిడితో తరువాత వాటిని పునరుద్దరించింది. విలువైన ఖనిజాల ఒప్పందంపై సంతకాలు చేసేందుకు వాషింగ్టన్‌ వచ్చిన జెలెనెస్కీ ఓవల్‌ కార్యాలయంలో డోనాల్డ్‌ ట్రంప్‌, ఉపాధ్యక్షుడు జెడి వాన్స్‌తో గొడవపడి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. పాక్షిక ఒప్పందానికి సుముఖత తెలిపిన తరువాత కూడా రష్యా ప్రతిరోజూ దాడులు చేస్తున్నదని, వాటిని నివారించాలంటే పుతిన్‌ మీద మరింత వత్తిడి తేవాలని జెలెనెస్కీ తన మద్దతుదార్లను కోరుతున్నాడు. గత ఒక్క వారంలోనే నియంత్రిత బాంబుదాడులు 1,580, 1,100డ్రోన్‌ దాడులు, వివిధ రకాల 15 క్షిపణులతో దాడులు చేసినట్లు చెప్పాడు. వాటిలో 1,02,000 వరకు విదేశీ విడిభాగాలు ఉన్నాయని, దీని అర్ధం ఇప్పటి వరకు రష్యా మీద విధించిన ఆంక్షలు ఫలించలేదని తేలింది గనుక ఆంక్షల నిబంధనలలో ఉన్న లోపాలను సవరించి కఠినంగా అమలు జరపాలన్నాడు. అందుకోసం కొత్త నిర్ణయాలు, కొత్తగా వత్తిడి అవసరమన్నాడు.


క్రిమియా,డాన్‌బాస్‌, రష్యా అదుపులో ఉన్న మరో రెండు ప్రాంతాలు ఉక్రెయిన్‌ సంక్షోభంలో కీలక అంశాలని అమెరికా ప్రత్యేక ప్రతినిధి స్టీవ్‌ విట్‌కోఫ్‌ రియాద్‌ చర్చలకు రెండు రోజుల ముందు చెప్పాడు.రష్యా పాలనకు మద్దతు ఇచ్చిన ప్రజాభిప్రాయ సేకరణ ప్రకారం వాటిని రష్యా ప్రాంతాలుగా ప్రపంచ దేశాలు అంగీకరిస్తాయా అన్నది ముఖ్యమన్నాడు. వాటి మీద అంగీకారం కుదిరితే సమస్య పరిష్కారం అవుతుందన్నాడు. ఈ నాలుగు ప్రాంతాల్లో మెజారిటీ జనం రష్యన్‌ భాష మాట్లాడతారని, రష్యా పాలనకు ఆమోదం తెలిపారన్నాడు. వీటిని ఆమోదిస్తే జెలెనెస్కీ రాజకీయంగా బతుకుతాడా అన్నది కూడా కీలకాంశమన్నాడు. వాటిని రష్యన్‌ ప్రాంతాలుగా గుర్తించేది లేదని జెలెనెస్కీ గతంలో స్పష్టం చేశాడు. ఐరోపా ప్రమేయం లేని సౌదీ చర్చల్లో ముందుకు వచ్చిన ఇతర అంశాలేమిటి? ఐరోపా యూనియన్‌, ఇతర నాటో దేశాలు ఎలా స్పందిస్తాయన్నది, తదుపరి ముందుకు పోవటం ఎలా అన్నది ముందు ముందు చూడాల్సి ఉంది.


ఇజ్రాయెల్‌లో నిరసన ప్రదర్శనలు !
ఒక పరిణామం ఆందోళన, ఆగ్రహాలకు దారి తీస్తున్నది. మరొక సంక్షోభ తాత్కాలిక పరిష్కారం గురించి సానుకూల సంకేతాలు. బందీల విముక్తి దానికి ప్రతిగా ఖైదీల విడుదలకు సంబంధించి గాజాలోని హమస్‌తో కుదిరిన శాంతి ఒప్పందాన్ని ఇజ్రాయెల్‌ ఉల్లంఘించింది. మరోమారు గాజాలో మారణకాండను ప్రారంభించింది.దీని మీద ప్రపంచంలో వెల్లడైన నిరసన అంతా ఒక ఎత్తయితే ఏకంగా ఇజ్రాయెల్‌లోనే లక్షలాది మంది ప్రధాని నెతన్యాహు రక్తదాహాన్ని నిరసిస్తూ ప్రదర్శనలు జరపటం గమనించాల్సిన పరిణామం. బందీలను తమ వద్ద ఉంచుకొని వేలాది మంది ప్రాణాలను తీసేందుకు, లక్షలాది భవనాలను నేలమట్టం గావించటాన్ని ఇంకా ఎంతకాలం కొనసాగిస్తారనే వత్తిడి పాలస్తీనియన్ల నుంచి వచ్చిన కారణంగానే హమస్‌ శాంతి ఒప్పందానికి అంగీకరించింది. దీని అర్ధం గాజన్లు హమస్‌ను వ్యతిరేకిస్తున్నారని కాదు. అలాగే బందీల గురించి పట్టించుకోకుండా అరబ్బుల ఊచకోత, పాలస్తీనా ప్రాంతాలపై దాడులతో సాధించేదేమిటని ఇజ్రాయెలీ పౌరులు కూడా పెద్ద ఎత్తున వత్తిడి చేసిన కారణంగానే నెతన్యాహ ఒక అడుగు వెనక్కు వేయాల్సి వచ్చింది. యూదులు మారుమనసు పుచ్చుకొని తమ ప్రభుత్వంపై ఆగ్రహిస్తున్నారని అనుకున్నా పొరపాటే. నిజానికి అలాంటి ధోరణే ఉంటే ఏడాదిన్నర కాలంగా మారణకాండను సహించి ఉండేవారే కాదు. అలా అని మొత్తం యూదులందరూ ఉన్మాదులే అనుకున్నా తప్పే.గాజా ప్రాంతాన్ని శాశ్వతంగా ఆక్రమించేందుకు ఇజ్రాయెల్‌ పథకవేయనున్నట్లు, దానికి గాను అనేక సాకులు చెబుతున్నదని పరిశీలకులు భావిస్తున్నారు. మార్చి ఒకటవ తేదీన కాల్పుల విరమణ తొలి దశ ముగిసింది. హమస్‌ వద్ద ఇంకా 59 మంది బందీలు ఉన్నట్లు చెబుతుండగా వారిలో 35 మంది మరణించి ఉండవచ్చని కూడా అంటున్నారు..


గత వారంలో మారణకాండను తిరిగి ప్రారంభించిన ఇజ్రాయెల్‌ ఈసారి గాజాను శాశ్వతంగా ఆక్రమించుకోవాలని కొందరు బహిరంగంగానే పిలుపు ఇస్తున్నారు. అమెరికా సంగతి సరేసరి. దాన్ని తాము స్వాధీనం చేసుకొని విహార కేంద్రంగా మారుస్తామని, అక్కడ ఉన్న జనాలను జోర్డాన్‌, ఈజిప్టు తదితర దేశాలకు తరలించి పునరావాసం కల్పిస్తామని ట్రంప్‌తో సహా అక్కడి దుర్మార్గులు మాట్లాడుతున్నది తెలిసిందే.2023 అక్టోబరు ఏడు నుంచి గాజా మీద దాడులు జరుపుతున్నా, దాన్ని అష్టదిగ్బంధనం కావించినప్పటికీ ఇజ్రాయెల్‌ మిలిటరీ బందీల జాడ కనుక్కోలేకపోవటమే గాక ఒక్కరంటే ఒక్కరిని కూడా విడుదల చేయించలేకపోయింది. దాని దాడుల్లో కొంత మంది బందీలు మరణించినట్లు హమస్‌ గతంలో పేర్కొన్నది. బందీల ప్రాణాలను ఫణంగా పెట్టి పాలస్తీనియన్లను సాధిస్తారా అని ఆలోచించే వారి సంఖ్య టెల్‌అవీవ్‌లో పెరుగుతున్నది. అందుకే గతంలో జరిగిన ప్రదర్శనలతో పోలిస్తే భారీ సంఖ్యలో జనం పెరిగినట్లు వార్తలు వచ్చాయి. ప్రధాని నెతన్యాహు నివాసం వద్దకూడా నిరసన వెల్లడిరచారు. రాజధాని టెల్‌అవీవ్‌లో లక్ష మంది పాల్గొన్నారు. అంతర్గత గూఢచార సంస్థ అధిపతి, అటార్నీ జనరల్‌ను తొలగించాలనే ఆలోచనకు వ్యతిరేకత కూడా వ్యక్తమైంది. తిరిగి డాడులు కొనసాగిస్తే బతికి ఉన్న బందీలకు ప్రాణహాని కలుగుతుందని, ముందు వారు విడుదల కావాలని నిరసనకారులు డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా ఇజ్రాయెలీ జాతీయ పతాకాలతో పాటు ప్రతిపక్ష పార్టీల జెండాలు, బానర్లు కూడా ప్రదర్శించారు. నియంత్రత్వ ఉన్మాదానికి స్వస్తి పలకాలనే పెద్ద బ్యానర్‌ను ఏర్పాటు చేశారు.


గత వారం రోజులుగా గాజా ప్రాంతంపై ఇజ్రాయెల్‌ మారణకాండ కొనసాగుతూనే ఉంది. ఒక ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న, ఒక గుడారంలో సేదతీరుతున్న హమస్‌ అగ్రనేతలు ఇద్దరు ఈ దాడుల్లో మరణించారు. అల్‌ జజీరా విలేకరి ఒకరు కూడా మృతుల్లో ఉన్నారు. గాజాతో పాటు పశ్చిమగట్టు ప్రాంతాలపై కూడా ఇజ్రాయెల్‌ మిలిటరీ దాడులు జరుపుతూ అనేక మందిని అరెస్టు చేస్తున్నది. ఇప్పటి వరకు గాజా ప్రాంతంలో 50,144 మందిని చంపివేసినట్లు,1,13,704 మంది గాయపడ్డారని, 61,700 మంది కనిపించటం లేదని గాజా ఆరోగ్యమంత్రిత్వశాఖ వెల్లడిరచింది. పాలస్తీనియన్లకు మద్దతు తెలుపుతున్న ఎమెన్‌పై దాడుల పథకం వివరాలను పొరపాటున ఒక జర్నలిస్టుకు పంపిన మాట నిజమే అని అమెరికా ప్రభుత్వం పేర్కొన్నది. మరోవైపు దాడులను కొనసాగిస్తూనే ఉంది. రెండు నెలల కాల్పుల విరమణ తరువాత మరోసారి ఇజ్రాయెల్‌ దాడులు ప్రారంభించిన పూర్వరంగంలో ఈజిప్టు రెండవ దశ కాల్పుల విరమణకు కొత్త ప్రతిపాదన ముందుకు తెచ్చింది. వారానికి ఐదుగురు బందీల చొప్పున హమస్‌ విడుదల చేయాలని దానికి అనుగుణంగా దాడుల విరమణ జరగాలని, దీనికి హమస్‌, అమెరికా అంగీకరించినట్లు ఇజ్రాయెల్‌ వైపు నుంచి స్పందన లేదని వార్తలు వచ్చాయి. గాజాలో అదనపు ప్రాంతాలను ఆక్రమించాలని రక్షణ మంత్రి ఇజ్రాయెల్‌ కాట్జ్‌ తమ దళాలను ఆదేశించినందున రాజీ ప్రతిపాదనలకు సిద్దంగా లేదని స్పష్టం అవుతున్నది. ఇస్లామిక్‌ జీహాద్‌ అనే సంస్థ తాజాగా ఇజ్రాయెల్‌పై రాకెట్లదాడి జరిపింది. దాంతో తమపై దాడులు మరింతగా పెరిగాయంటూ బెల్ట్‌ లహియా ప్రాంతంలో పాలస్తీనియన్లు నిరసన ప్రదర్శన జరిపారని, ముసుగులు ధరించిన హమస్‌ సాయుధులు వారిని చెదరగొట్టినట్లు బిబిసి ఒక వార్తను ఇచ్చింది. అది వాస్తవమైతే మిలిటెంట్ల రెచ్చగొట్టుడు చర్యలను పాలస్తీనియన్లు సహించకపోవచ్చని చెప్పవచ్చు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ట్రంప్‌ 50 రోజుల పాలన : నెల రోజుల కాల్పుల విరమణకు ఉక్రెయిన్‌ ఓకె, పట్టుబిగిస్తున్న పుతిన్‌ !!

12 Wednesday Mar 2025

Posted by raomk in Current Affairs, Economics, History, imperialism, International, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, UK, USA, WAR

≈ Leave a comment

Tags

30-day ceasefire, Donald trump, Jeddah, Ukraine crisis, Vladimir Putin, Zelensky

ఎం కోటేశ్వరరావు


అమెరికా సూచించిన నెల రోజుల పాటు కాల్పుల విరమణ ప్రతిపాదనకు ఉక్రెయిన్‌ అంగీకరించింది. సంక్షోభ ముగింపుకోసం రెండుదేశాల ప్రతినిధులు మంగళవారం నాడు సౌదీ అరేబియా నగరం జెడ్డాలో సమావేశం జరిపారు. ఈ వర్తమానాన్ని రష్యాకు పంపుతామని ప్రకటించారు.ఉక్రెయిన్‌ సంసిద్దత వ్యక్తం చేసిందని చెబుతూ నిలిపివేసిన మిలిటరీ సాయం, గూఢచార సమాచార అందచేతను వెంటనే పునరుద్దరించనున్నట్లు అమెరికా ప్రకటించింది. బుధవారం ఉదయం వరకు దీని మీద రష్యా స్పందన వెలువడలేదు.కాల్పుల విరమణ తరువాత ఖనిజాల ఒప్పందం చేసుకోనేందుకు ఏకీభావం కుదిరినట్లు సమాచారం. మరోవైపు పుతిన్‌, జెలెనెస్కీ సేనలు దాడుల తీవ్రతను పెంచాయి. ఉక్రెయిన్‌ ఆక్రమించిన కురుస్కు ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకొనేందుకు రష్యా సేనలు కేంద్రీకరించాయి. సంప్రదింపులకు తాను పూర్తిగా కట్టుబడి ఉన్నట్లు సోమవారం నాడే అక్కడకు చేరుకున్న జెలెనెస్కీ ప్రకటించాడు. యుద్ధం ప్రారంభమైన మరుసటి రోజునుంచే తాము శాంతిని కోరుతున్నామని, కొనసాగటానికి రష్యాయే కారణమని సామాజిక మాధ్యమంలో ఆరోపించాడు. ఒకవైపు మిలిటరీ సాయం, గూఢచార సమాచార అందచేత నిలిపివేసి ఉక్రెయిన్‌ మీద, దారికి రాకపోతే మరిన్ని ఆంక్షలు విధిస్తానని రష్యాను ట్రంప్‌ బెదిరించాడు.తాము ఇరుపక్షాల పట్ల సమవైఖరితో ఉన్నట్లు కనిపించేందుకు ఒక ఎత్తుగడగా ఇలా చేసినట్లు కొందరు చెబుతున్నారు. కురుస్కు ప్రాంతంలో తిష్టవేసిన జెలెనెస్కీ సేనలను అదుపులోకి తెచ్చుకొనేందుకు రష్యా ఏడువైపుల నుంచి చక్రబంధాన్ని బిగిస్తున్నట్లు వార్తలు. దీన్ని బ్రిటన్‌ మిలిటరీ గూఢచారులు కూడా ధృవీకరించారు. ఉక్రెయిన్‌ వైపు నుంచి కురుస్కు వచ్చే రోడ్లను మూసివేసినట్లు చెబుతుండగా తమకు ఎలాంటి ముప్పు లేదని జెలెనెస్కీ మిలిటరీ ప్రకటించింది. కొద్ది నెలల క్రితం ఉక్రెయిన్‌ సేనలు ఈ ప్రాంతంలో పదమూడువేల చదరపు కిలోమీటర్ల మేర రష్యా ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాయి. దానిని తిరిగి స్వాధీనం చేసుకోవటం కంటే రష్యా ఉక్రెయిన్‌ మీద దాడులు కేంద్రీకరించింది. రష్యాతో జరిపే చర్చల్లో తాను ఆక్రమించుకున్న ప్రాంతాన్ని తురుపుముక్కగా వినియోగించుకోవాలని జెలెనెస్కీ చూశాడు. అయితే దాని గురించి పుతిన్‌ ఎలాంటి ప్రస్తావన తేవటం లేదు. ఫిబ్రవరి నాటికి 800 చదరపు కిలోమీటర్ల మేర స్వాధీనం చేసుకున్నట్లు ఇప్పుడు మిగిలిన ప్రాంత విముక్తికి కేంద్రీకరించినట్లు వార్తలు. రష్యన్ల మాదిరే క్లిష్టమైన నిర్ణయాలు చేసేందుకు జెలెనెస్కీ సిద్దం గావాలని జెడ్డాకు వస్తూ అమెరికా విదేశాంగ మంత్రి మారియో రూబియో విమానంలో విలేకర్లతో చెప్పాడు.


ఏం జరుగుతుందో చూద్దామన్నట్లుగా ఉన్న ఐరోపా యూనియన్‌ మంగళవారం నాడే పారిస్‌లో భేటీ అయింది. ముప్పై దేశాలకు చెందిన మిలిటరీ అధిపతులు, రాజకీయవేత్తలు పాల్గొన్నారు.ఈ సమావేశాల్లో ఉక్రెయిన్‌ భద్రత, సాయం గురించి చర్చించినట్లు తప్ప వివరాలు వెల్లడి కాలేదు. శనివారం నాడు బ్రిటన్‌ ప్రధాని కెయిర్‌ స్టార్మర్‌ ప్రపంచ నేతలతో అంతర్జాలంలో మాట్లాడేందుకు నిర్ణయించారు. కలసి వచ్చే వారితో ఒక కూటమి ఏర్పాటు చేస్తామని గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అమెరికాతో తాము దగ్గర కావటం తమ ప్రయోజనాలకు భంగకరమని బ్రిటన్‌ భావిస్తున్నదని రష్యన్‌ విదేశీ గూఢచార సంస్థ ఒకటి పేర్కొన్నది.గూఢచర్య ఆరోపణలతో ఇద్దరు తమ దౌత్యవేత్తలను బహిష్కరిస్తూ రష్యా తప్పుడు ఆరోపణలు చేసిందని బ్రిటన్‌ ఆరోపించింది. ఇదే తొలిసారి కాదని గతంలో కూడా ఇలాగే చేసిందని పేర్కొన్నది. గతేడాది ఏడుగురు బ్రిటీష్‌ దౌత్య సిబ్బందిని రష్యా ఇదే ఆరోపణలతో బహిష్కరించింది. తాజా బహిష్కరణకు ముందు లండన్‌లోని రష్యా దౌత్యసిబ్బందిలో ఒకరి నియామకాన్ని రద్దు చేసింది, కార్యాలయ వ్యవహారాలను పరిమితం కావించింది.దీనికి ప్రతిగా రష్యా బ్రిటీష్‌ దౌత్యవేత్తలను బహిష్కరించింది.వారు తప్పుడు సమాచారంతో రష్యాలో ప్రవేశించినట్లు తెలిపింది. తొలి రోజుల్లో ఉక్రెయిన్‌ శాంతి ఒప్పందానికి ముందుకు వచ్చినప్పటికీ బ్రిటన్‌ అడ్డుపడినట్లు గతంలో వార్తలు వచ్చాయి, అప్పటి నుంచి రెండు దేశాల మధ్య సంబంధాలు సజావుగా లేవు.తాజాగా ఉక్రెయిన్‌కు మద్దతుగా అనేక దేశాలను బ్రిటన్‌ సమీకరిస్తున్నది. ఉక్రెయిన్‌కు శాంతి పరిరక్షణ పేరుతో మిలిటరీని పంపితే తీవ్ర పర్యవసానాలు ఉంటాయని ఆస్ట్రేలియాను అక్కడి రష్యా రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో హెచ్చరించింది. పశ్చిమ దేశాల బూట్ల చప్పుళ్లను చూస్తూ ఊరుకోబోమని పేర్కొన్నది. తమ గడ్డ నుంచి రిమోట్‌ ద్వారా ప్రయోగించే 45లక్షల డ్రోన్లను తయారు చేయనున్నట్లు ఉక్రెయిన్‌ ప్రకటించింది. వాటిలో బాంబులను పెట్టి సరిహద్దులో లేదా రష్యా ఆధీనంలోని ప్రాంతాల మీద దాడులకు వీటిని వినియోగిస్తారు.


అనూహ్యమైన రాజకీయ పరిణామాల పూర్వరంగంలో చైనా మధ్యవర్తిత్వంతో ఉప్పు నిప్పుగా ఉన్న సౌదీ అరేబియా, ఇరాన్‌ రాజీకి వచ్చి సాధారణ సంబంధాలు నెలకొల్పుకుంటున్నాయి. రాజు మహమ్మద్‌బిన్‌ సల్మాన్‌ అధికారానికి వచ్చాక అమెరికాకు దూరం జరుగుతూ అంతర్జాతీయ సమావేశాలకు తటస్థ వేదికగా తయారవుతున్నారు. అరబ్‌లీగ్‌ సమావేశాలు అక్కడే జరిగాయి, ఉక్రెయిన్‌పై చర్చలకు సైతం తెరతీశారు. మధ్య ప్రాచ్యంలో తిరుగులేని శక్తిగా కనిపించేందుకు చూస్తున్నారు. అందరూ ఎదురుచూస్తున్న శాంతి కావాలో లేదో ఉక్రెయిన్‌ తేల్చుకోవాలని సౌదీ చర్చలపై రష్యా స్పందించింది. సముద్ర, వాయుదాడుల నిలిపివేతకు ఒప్పందం కుదుర్చుకోవాలని ఉక్రెయిన్‌ ప్రతిపాదించే అవకాశం ఉందని, మరోసారి దాడులు రష్యా దాడులు జరగకుండా రక్షణ కోసం పట్టుబట్టవచ్చని వార్తలు, గతంలో ఐరోపా యూనియన్‌ కూడా దీన్నే ప్రతిపాదించింది. వీటిని మాత్రమే సులభంగా పర్యవేక్షించవచ్చని చెబుతున్నారు. ఈ వారంలో అమెరికాతో చర్చలు జరిగే అవకాశం లేదని, ఆవైపు నుంచి ఎలాంటి వర్తమానం రాలేదని రష్యా విదేశాంగశాఖ ప్రకటించింది. వారితో సంబంధాల పునరుద్దరణ గురించి సంప్రదింపులు ప్రాధమికదశలో ఉన్నాయని రష్యా ప్రతినిధి దిమిత్రి పెట్కోవ్‌ చెప్పాడు. మార్గం ఎంతో క్లిష్టంగా, సుదీర్ఘంగా ఉందని అయినప్పటికీ రెండు దేశాల నేతలు రాజకీయ సంకల్పాన్ని ప్రకటించారని అన్నాడు.ఉక్రెయిన్‌కు తన స్టార్‌లింక్‌ ఉపగ్రహ ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేసిన ఎలన్‌ మస్క్‌ ప్రశ్నించిన వారిని మీరెంత, మీ బతుకెంత నోరు మూసుకోండి అంటూ విరుచుకుపడుతున్నాడు.తన సేవలు నిలిపివేస్తే జెలెనెస్కీ సేనలు కుప్పకూలిపోతాయని కూడా అన్నాడు. ఉక్రెయిన్‌ తరఫున స్టార్‌లింక్‌కు రుసుము చెల్లిస్తున్న పోలాండ్‌ దీని మీద స్పందిస్తూ తాము ప్రత్నామ్నాయ కంపెనీ సేవలను ఎంచుకుంటామన్నది.మస్క్‌కు అంత అహంకారం పనికి రాదని పేర్కొన్నది. స్టార్‌లింక్‌ లేకపోతే ఉక్రెయిన్‌ ఎప్పుడో ఓడిపోయి ఉండేదని అమెరికా మంత్రి రూబియో వ్యాఖ్యానించాడు. ఈ పరిణామం తరువాత ఫ్రాంకోబ్రిటీష్‌ యూటెల్‌సాట్‌ కంపెనీ వాటాల ధరలు 650శాతం పెరిగాయి.

సౌదీలో మంగళవారం నాటి చర్చలతో వెంటనే తేలేదేమీ ఉండదని వాషింగ్టన్‌మాస్కో సంప్రదింపులకు తెరతీస్తాయని, ఈ లోగా రష్యా తాను చేయదలచుకున్నది చేస్తుందని పశ్చిమ దేశాలు భావిస్తున్నాయి.దానికి నిదర్శనంగా గత కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి. ఈ పూర్వరంగంలోనే ట్రంప్‌ ఒక ప్రకటన చేస్తూ అవసరమైతే రష్యా మీద కొత్త ఆంక్షలు, సుంకాలు విధిస్తామని ప్రకటించాడు. పుతిన్‌తో కంటే జెలెనెస్కీతో వ్యవహరించటం ఎంతో క్లిష్టంగా ఉందని కూడా అన్నాడు. ట్రంప్‌ ప్రకటనను రష్యా ఖాతరు చేయలేదు. తరువాత దాడులను మరింతగా పెంచింది. సరిహద్దుల నుంచి రష్యా రేపే వెళ్లిపోతుందని తాము అనుకోవటం లేదని, కాల్పుల విరమణ కొన్ని నెలలు, సంవత్సరాలు ఉన్నప్పటికీ తమ తరువాత భద్రత గురించి ఉక్రెయిన్‌ ఆలోచిస్తున్నది. కొద్ది రోజుల క్రితం సౌదీలో జరిగిన చర్చలలో తాత్కాలిక కాల్పుల విరమణకు షరతులతో రష్యా సుముఖత చూపింది. అంతిమంగా కుదరాల్సిన శాంతి ఒప్పందంలో ఉండాల్సిన అంశాల గురించి ముందే వెల్లడిరచాలని, ఏ ఏ దేశాలు భాగస్వాములౌతాయి, శాంతి పరిరక్షణ ఎలా జరుగుతుంది అన్నది స్పష్టం కావాలని షరతులు పెట్టింది. ఉక్రెయిన్‌ గడ్డపై నాటో దళాల ఏర్పాటును వ్యతిరేకించింది. ఆ తరువాతే శాంతి పరిరక్షణకు సముఖంగా ఉండే దేశాలతో కూటమి ఏర్పడాలని ఐరోపా యూనియన్‌ ఒక ప్రతిపాదనను ముందుకు తెచ్చింది.చైనా, భారత్‌ వంటి దేశాలతో కూడినది తమకు అనువుగా ఉంటుందనే సంకేతాలను రష్యా పంపింది.


అమెరికాతో సహా ప్రపంచం మొత్తాన్ని వ్లదిమిర్‌ పుతిన్‌ వంగదీశాడని, విజయం సాధించాడని మీడియా పండితులు వాపోయారు. నాలుగో ఏట ప్రవేశించిన ఉక్రెయిన్‌ సంక్షోభంలో ఎటువైపు ఎందరు మరణించారన్నది ఇప్పటికీ వెల్లడికాలేదు. పశ్చిమ దేశాలు లక్షా యాభైవేల నుంచి రెండులక్షల మంది రష్యా సైనికులు మరణించినట్లు చెబుతుండగా ఇంతవరకు 5,937 మంది మరణించినట్లు రష్యా రక్షణమంత్రిత్వశాఖ చెప్పింది.ఉక్రెయిన్‌ అధికారికంగా చెప్పినదాని ప్రకారం 45,100 మంది మరణించగా 3.9లక్షల మంది గాయపడ్డారు. మొత్తం 80లక్షల మంది పౌరులు విదేశాలకు శరణార్దులుగా వెళ్లటం గానీ తమ నెలవులు తప్పినట్లు చెబుతున్నారు. ఊహించని మలుపులు తిరుగుతున్న ఈ సంక్షోభంలో ఇంతకాలం రష్యాను దురాక్రమణదారుగా వర్ణించిన అమెరికా భద్రతా మండలిలో గతనెలలో ప్రవేశపెట్టిన అలాంటి తీర్మానాన్ని వీటో చేయటం విశేషం. నాటో కూటమిలో ఒక్క ఐరోపా దేశాలు మాత్రమే రష్యాను వ్యతిరేకిస్తున్నాయి. తమ రక్షణకు హామీ ఇవ్వకపోతే ఖనిజాల ఒప్పందం మీద సంతకం చేసేది లేదంటూ ట్రంప్‌ సమక్షంలో అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్‌తో పదినిమిషాల పాటు జెలెనెస్కీ వాదులాటకు దిగి వెళ్లిపోయాడు. తరువాత మెత్తబడి మరోసారి అమెరికాతో చర్చలకు వచ్చాడు. రష్యా వైఖరిలో ఎలాంటి మార్పులు లేవు. తమ స్వాధీనంలోకి వచ్చిన ఉక్రెయిన్‌ ప్రాంతాలను తిరిగి అప్పగించేది లేదని, వాటిని స్వతంత్ర దేశాలుగా గుర్తించాలని పుతిన్‌ పట్టుబడుతున్నాడు. వాటి మీద ఆశలు వదులుకోవాలని ట్రంప్‌ కూడా జెలెనెస్కీకి చెప్పాడు. ఈ పూర్వరంగంలో సౌదీ చర్చలు ఏ పరిణామాలు, పర్యవసానాలకు దారితీసేది ఎవరూ చెప్పలేని స్థితి నెలకొన్నది.


అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ అధికారానికి వచ్చి 50రోజులు దాటింది.రోజుకొక మాట, ఎప్పుడేం చేస్తాడో తెలియని అనిశ్చితి ప్రపంచాన్నే కాదు, అమెరికాను సైతం ఆవరించింది. ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు చెప్పలేను, ఇప్పుడు సంధికాలంలో ఉన్నాం అన్న ట్రంప్‌ వ్యాఖ్యతో సోమవారం నాడు అమెరికా స్టాక్‌ మార్కెట్‌ భారీగా పతనమైంది. నాలుగు లక్షల కోట్ల డాలర్ల మేర సంపద విలువ పడిపోయింది. ఈ ప్రభావంతో చైనా, హాంకాగ్‌ స్టాక్‌ మార్కెట్లు కూడా మంగవారం నాడు పతనమైనా తిరిగి కోలుకున్నట్లు వార్తలు. గత ఏడాది కాలంగా కొంత మంది మాంద్య భయాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే ట్రంప్‌ గెలిస్తే నివారిస్తాడని అనేక మంది ఆర్థికవేత్తలు ఆశలు పెట్టుకున్నారు.వర్తమాన పరిణామాలను బట్టి సందేహమే అని పెదవివిరుస్తున్నారు.‘‘ జోశ్యాలను నేను అసహ్యించుకుంటాను. మనం చాలా పెద్ద కసరత్తు చేస్తున్నాం గనుక సంధికాలం ఉంటుంది.అమెరికాకు సందపదలను తిరిగి తీసుకువస్తున్నాం, అదే పెద్ద విషయం. అది కొంత సమయం తీసుకోవచ్చు గానీ మనకు ఎంతో గొప్పది. ’’ అని ఆదివారం నాడు ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. చైనాపై సుంకాల గురించి మాట మార్చలేదు గానీ మెక్సికో, కెనడాల మీద అమలు జరుపుతానని ఒక మాట నెల రోజుల వాయిదా అని మరో మాట, అంతలోనే అబ్బే అదేం లేదంటూ చేస్తున్న ప్రకటనలు కొంత గందరగోళానికి దోహదం చేస్తున్నాయి. రానున్న పన్నెండు నెలల కాలంలో మాంద్య అవకాశాలు 15 నుంచి 20శాతానికి పెరిగినట్లుశుక్రవారం నాడు గోల్డ్‌మన్‌ శాచస్‌ ప్రకటించింది. ట్రంప్‌ ప్రకటించిన సుంకాలు అమల్లోకి వస్తే ధరలు,ద్రవ్యోల్బణ పెరుగుదలతో వృద్ధి రేటు దెబ్బతిని మాంద్యంలోకి పోవచ్చని స్టాక్‌మార్కెట్లో మదుపుదార్లు భయపడుతున్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఐరాసలో ఉక్రెయిన్‌ తీర్మానాలు : జెలెనెస్కీ వాషింగ్టన్‌ పర్యటన- ` డోనాల్డ్‌ ట్రంప్‌ మడమ తిప్పుతాడా !

26 Wednesday Feb 2025

Posted by raomk in CHINA, Current Affairs, Europe, History, imperialism, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, USA, WAR

≈ Leave a comment

Tags

Donald trump, Russia- Ukraine peace plan, Ukraine crisis, Vladimir Putin, Volodymyr Zelensky, Xi Jinping

ఎం కోటేశ్వరరావు

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ తన రెండవ పదవీ కాలం తొలి నెల రోజుల్లో చేసిన ప్రకటనలు, తీసుకున్న నిర్ణయాల పరిణామాలు, పర్యవసానాల గురించి పరిపరి కథనాలు వెలువడుతున్నాయి. నిజంగా ఏం జరిగేది ఎవరూ చెప్పలేని స్థితి. రష్యాను దగ్గరకు తీసుకొని చైనాకు వ్యతిరేకంగా నిలపాలనే ఎత్తుగడతో అమెరికా ఉందని చెబుతున్నారు.సోమవారం నాడు ఐరాసలో జరిగిన పరిణామాలు ఆసక్తి కలిగిస్తున్నాయి.తమపై నాలుగో ఏడాదిలో ప్రవేశించిన రష్యా సైనిక చర్యలను ఖండిస్తూ దాడులు నిలిపివేయాలని ఐరాస సాధారణ అసెంబ్లీలో ఉక్రెయిన్‌ సోమవారం నాడు ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. దానికి అనుకూలంగా 93, వ్యతిరేకంగా 18 దేశాలు ఓటు చేయగా, భారత్‌, చైనాతో సహా 65 దేశాలు తటస్థంగా ఉన్నాయి. గతంలో 140దేశాలు రష్యా చర్యను ఖండిరచే తీర్మానానికి మద్దతు ఇవ్వగా ఈసారి 93కు తగ్గాయి. ఉక్రెయిన్‌ తన తీర్మానాన్ని వెనక్కు తీసుకొని ‘‘ త్వరగా సంక్షోభాన్ని ముగించాలని ’’ తాను ప్రతిపాదించిన దానికి మద్దతు ఇవ్వాలని అమెరికా వత్తిడి చేసింది. మరోవైపున రష్యా మీద ఎలాంటి విమర్శ చేయకుండా సంక్షోభాన్ని ముగించాలని కోరుతూ భద్రతా మండలిలో అమెరికా ప్రవేశపెట్టిన తీర్మానానికి మద్దతుగా పది ఓట్లు రాగా ఐదుదేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. వాటిలో వీటో హక్కు కలిగిన బ్రిటన్‌, ఫ్రాన్సు కూడా ఉండటం విశేషం.ఈ పరిణామాల తరువాత శుక్రవారం నాడు జెలెనెస్కీ వాషింగ్టన్‌ వెళుతున్నాడని, విలువైన ఖనిజాల మీద ట్రంప్‌తో ఒక ఒప్పందం కుదుర్చుకోవచ్చని బుధవారం నాడు వార్తలు వచ్చాయి. ఇదే జరిగితే ట్రంప్‌ ఇప్పటి వరకు చెప్పినదానికి పూర్తి విరుద్దంగా వ్యవహించినా ఆశ్చర్యం లేదు. విలువైన ఖనిజాల కోసం ఉక్రెయిన్ను ట్రంప్‌ బెదిరిస్తున్నాడని గతంలో కొన్ని వార్తలు వచ్చాయి.

తమకు నాటో సభ్యత్వమిస్తే పదవి నుంచి వైదొలగటానికి కూడా సిద్దమే అని, తమ ప్రాంతాలను ఆక్రమించిన పుతిన్‌ అక్కడే తిష్టవేయటాన్ని అంగీకరించేది లేదని జెలెనెస్కీ అంతకు ముందు చెప్పాడు. తాము చేసిన ప్రతి డాలరు మిలిటరీ సాయానికి రెండు డాలర్లు చెల్లించాలని అమెరికా డిమాండ్‌ చేస్తోందన్నాడు. ఐదువందల బిలియన్‌ డాలర్ల ఖనిజాలను అప్పగించాలన్న వాషింగ్టన్‌ వత్తిడికి లొంగేది లేదని కూడా చెప్పాడు, అవసరమైతే వచ్చే పదితరాల వారు తమ రుణాలను తీర్చుకుంటారని అన్నాడు. విలువైన ఉక్రెయిన్‌ ఖనిజాల్లో 350 బిలియన్‌ డాలర్ల విలువ గలవి రష్యా అధీన ప్రాంతాల్లోనే ఉన్నాయని ఉపప్రధాని యులియా చెప్పాడు. ఉక్రెయిన్‌కు మద్దతు తెలిపేందుకు సోమవారం నాడు అనేక మంది ఐరోపా నేతలు కీవ్‌ చేరుకున్నారు. ఉక్రెయిన్‌పై ఒక నిర్ణయం తీసుకొనేందుకు, ఐరోపా రక్షణ గురించి చర్చించేందుకు మార్చినెల ఆరవ తేదీన సమావేశం కానున్నారు. రానున్న రెండు వారాల్లో రెండవ సారి సమావేశమయ్యేందుకు అమెరికా, రష్యా ప్రతినిధులు సన్నద్దమవుతున్నారు. తప్పుడు సమాచార బుడగలో ట్రంప్‌ ఇరుక్కు పోయాడని అన్న జెలెనెస్కీని నియంత అని ట్రంప్‌ వర్ణించటాన్ని అర్ధం చేసుకోదగినదే అని రష్యా సమర్ధించింది.

రష్యాను దగ్గరకు తీసుకొని చైనాకు వ్యతిరేకంగా నిలపాలని నిజంగా ట్రంప్‌ భావిస్తే అది ఇప్పటికైతే ఊహాజనితమే. ఒకవేళ అదే జరిగితే ఇప్పటికే మరోవైపు ఉన్న భారత్‌, మూడో వైపు ఉన్న జపాన్‌తో కథ నడిపించి చైనాను దెబ్బతీయాలన్న వ్యూహం ఉందన్నది ఒక దృశ్యం. ఇది కార్యరూపం దాలిస్తే ఐరోపాలో అమెరికా ప్రాబల్యం తగ్గి చైనా పలుకుబడి పెరుగుతుందని మరికొందరి హెచ్చరిక. ఉక్రెయిన్ను ఫణంగా పెట్టి రష్యాతో ఒప్పందం కుదుర్చుకుంటే ప్రపంచంలో అమెరికాను నమ్మే పరిస్థితి ఉంటుందా ? ట్రంప్‌ను నమ్మి రష్యా ముందుకు పోతుందా అన్నది ప్రశ్న. గతంలో ఇదే అమెరికన్లు జి7 కూటమిని జి8గా మార్చి రష్యాను చేర్చుకొనేందుకు చూశారు. అది బెడిసికొట్టటంతో రష్యాను వ్యతిరేకించటమే గాదు, దానికి ముప్పు తెచ్చేందుకు చూశారు. ఉక్రెయిన్‌ సంక్షోభానికి కారణం అదే కదా ! గడచిన మూడు సంవత్సరాలుగా ఆంక్షలతో ఆర్థికంగా దెబ్బతీసేందుకు చూసిన తీరు, ఉక్రెయిన్‌ పోరులో సంభవించినట్లు చెబుతున్న ప్రాణ, ఆర్థిక నష్టాలను మరచి రష్యన్లు కొత్త బాటలో నడుస్తారా ? కష్ట సమయంలో ఆదుకున్న చైనాకు వ్యతిరేకంగా జట్టుకడుతుందా ? పుతిన్‌ లేదా పాలకవర్గం లొంగిపోయినా జనం సమ్మతిస్తారా ? అమెరికాయే చేతగాక బేరసారాలకు దిగుతుంటే రష్యన్లు చైనాను కట్టడి చేయగలరా ? ఇలాంటి అనేక ఊహాజనిత దృశ్యాలను కొందరు ఆవిష్కరిస్తున్నారు.

చరిత్రను చూస్తే నాటి సోవియట్‌చైనా కమ్యూనిస్టు పార్టీల మధ్య తలెత్తిన సైద్దాంతిక వివాదాలు, దేశాల మధ్య విబేధాలకు దారి తీశాయి.1969లో ఆరు నెలలకు పైగా సరిహద్దులో ఇరు సైన్యాలను మోహరించటమే గాదు, స్వల్ప ఘర్షణలు కూడా చోటుచేసుకున్నాయి. దాన్ని వినియోగించుకొని సోవియట్‌ను దెబ్బతీసేందుకు అమెరికన్లు ప్రజా చైనాను గుర్తించి భద్రతా మండలిలో ప్రాతినిధ్యానికి అంగీకరించారన్నది ఒక అభిప్రాయం. తమ సమస్యల నుంచి బయటపడేందుకు విదేశాలకు మార్కెట్‌ను తెరిచే సంస్కరణలు అవసరమని చైనా కమ్యూనిస్టు పార్టీ నిర్ణయించింది. ఈ అవకాశాన్ని అక్కడ ఉన్న విస్తారమైన శ్రమశక్తిని కారుచౌకగా పొందేందుకు, మార్కెట్లో ప్రవేశించేందుకు అమెరికా వినియోగించుకుందన్నది మరొక సూత్రీకరణ. అంతిమంగా నాలుగు దశాబ్దాల అనుభవంలో ఎవరు ఎవరిని వినియోగించుకున్నారని బేరీజు వేస్తే ఎగుమతులతో చైనా దిగుమతులతో అమెరికా, ఐరోపా లబ్దిపొందాయి. కొన్ని లాటిన్‌ అమెరికా దేశాలు ఎగుమతి ఆధారిత వ్యవస్థలతో కొనసాగిన మాదిరి చైనా కూడా అలాగే ఉంటుందని భావించిన అమెరికా ఘోరంగా దెబ్బతిన్నది. అన్ని రంగాలలో తననే సవాలు చేసే విధంగా మారుతుందని అది అంచనా వేయలేకపోయింది, గుర్తించేసరికే తమ చేతులు దాటిపోయినట్లు గమనించింది. దాని పర్యవసానమే డోనాల్డ్‌ ట్రంప్‌ తొలి పాలనా కాలంలో ప్రారంభించిన వాణిజ్య యుద్ధం. ఇప్పుడు దాని కొనసాగింపుతో మరోసారి ముందుకు పోనున్నట్లు సూచనలు.


చైనా గురించి మరోసారి అమెరికా అంచనాలు తప్పనున్నాయా ? అట్లాంటిక్‌ పత్రిక వ్యాఖ్యాత కథనం చైనాకు ప్రపంచాన్ని అప్పగించనున్న ట్రంప్‌ అంటూ సాగింది. ఇది సామ్రాజ్యవాదుల కోణంలో ఆలోచిస్తున్నవారి బుర్రలో పుట్టిన బుద్ది అని చెప్పవచ్చు.‘‘ అమెరికా ప్రపంచ నాయకత్వం ముగుస్తున్నది. ఇది అమెరికా దిగజారి లేదా బహుధృవ ప్రపంచం ఉనికిలోకి వచ్చి కాదు లేదా అమెరికా ప్రత్యర్ధుల చర్యలతో జరుగుతున్నది కాదు. నాయకత్వ ముగింపు ఎందుకంటే అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ దానికి ముగింపు పలకాలని కోరుకుంటున్నాడు గనుక. ఇంటా బయటా ట్రంప్‌ విధానాలు అత్యంత వేగంగా అమెరికా అధికార పునాదులను నాశనం చేస్తున్నాయి. ప్రపంచ అగ్రశక్తిగా ప్రస్తుతం అమెరికాను పక్కకు నెట్టి దాని స్థానాన్ని ఆక్రమించాలని చూస్తున్న చైనా నేత షీ జంపింగ్‌ ప్రధాన లబ్దిదారు అవుతాడు. ప్రపంచాన్ని హ్రస్వదృష్టితో చూస్తున్న ట్రంప్‌కు తానేం చేస్తున్నదీ తెలియటం లేదు, అతడి చర్యలు అంతర్జాతీయ భద్రతకు ముప్పు తెస్తున్నాయని, అమెరికా భవిష్యత్‌ కూడా దానితోనే ముడిపడి ఉందని తెలుసుకోలేకపోతున్నాడు, అమెరికా వదలిన ఖాళీలో చైనా ప్రవేశాన్ని ఇతర ధనిక దేశాలు అడ్డుకోవలేవంటూ ఆ పత్రిక విశ్లేషణ కొనసాగింది.


వాణిజ్య యుద్దం గురించి అమెరికా గతంలో వేసుకున్న అంచనాలు తప్పాయి. 2024లో అమెరికా వాణిజ్య లోటు లక్ష కోట్ల డాలర్లుగా ఉంటే చైనా వాణిజ్య మిగులు కూడా అంతే ఉంది. అమెరికా, ఐరోపాలో కోల్పోయిన మార్కెట్లను మరోచోట పొందేందుకు చైనా ముందుకు పోతున్నది.ట్రంప్‌ ప్రకటించినట్లుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ వంటి వాటి నుంచి అమెరికా వైదొలిగినా, యూఎస్‌ఎయిడ్‌ ఆకస్మికంగా నిలిపివేసినా ఆ స్థానాన్ని చైనా ఆక్రమిస్తుందని కొందరు ఇప్పటికే హెచ్చరించారు. ఇప్పటి వరకు ఉద్దరించే పేరుతో సాయం బిస్కెట్లతో పలు దేశాల్లో పాగా వేయాలని చూసిన అగ్రదేశపు అమెరికా ఎత్తుగడ ఫలించలేదు. అలాంటిది అంతశక్తిలేని చైనా వల్ల అవుతుందా ? నిజానికి చైనా నేరుగా అప్పులిస్తున్నది తప్ప అమెరికా, జపాన్‌, మరొక ధనిక దేశం మాదిరి సాయం పేరుతో షరతులతో కూడిన నిధులు ఇవ్వటం లేదు, అలాంటి ఏర్పాట్లు కూడా లేవు. అమెరికా సాయం పొంది బాగుపడిన దేశాలేమిటంటే ఎవరూ చెప్పలేరు, కానీ అనేక దేశాలలో మౌలిక సదుపాయాలలో చైనా పెట్టుబడుల ఫలితాలు కనిపిస్తున్నాయి. చరిత్రలో మార్కెట్ల కోసం ఏకంగా దేశాలనే ఆక్రమించుకోవటం తెలిసిందే. తొలి వాణిజ్య యుద్దం చైనా`బ్రిటన్‌ మధ్య నల్లమందు దిగుమతుల మీద జరిగింది.రెండవది కూడా అదే సమస్య మీద బ్రిటన్‌, ఫ్రాన్స్‌ కలసి చేశాయి. తొలి యుద్దంలో నల్లమందును ధ్వంసం చేసినందుకు చైనా నష్టపరిహారం చెల్లించటంతో పాటు హాంకాంగ్‌ దీవులను బ్రిటన్‌కు 99 సంవత్సరాల పాటు కౌలుకు ఇచ్చేందుకు ఒప్పందం జరిగింది. రెండవ యుద్దంలో నల్లమందు విక్రయాలను చట్టపరంచేసేందుకు ఒప్పందాన్ని రుద్దారు. వర్తమాన వాణిజ్య యుద్దాన్ని చైనా మీద అమెరికా 2018లో ప్రారంభించింది.ట్రంప్‌ దిగిపోయినా బైడెన్‌ కొనసాగించాడు, తిరిగి ట్రంప్‌ వచ్చాడు. అప్పటికీ ఇప్పటికీ తేడా ఏమిటంటే అప్పుడూ చైనా కుంగిపోలేదు, ఇప్పుడు మరింత సమర్ధవంతంగా ఎదుర్కొనే బలాన్ని కలిగి ఉంది.వాణిజ్యపోరు కరెన్సీ పోరుకు విస్తరించింది.

కెనడా, మెక్సికోల మీద 25శాతం పన్ను విధిస్తానన్న ట్రంప్‌ చైనా దగ్గరకు వచ్చేసరికి పదిశాతమే అన్నాడు.నిజానికి 2024లో జో బైడెన్‌ చైనా నుంచి దిగుమతి చేసుకొనే విద్యుత్‌ వాహనాలపై 100, సోలార్‌ సెల్స్‌, సెమీ కండక్టర్ల మీద 50, లిథియం అయాన్‌ బాటరీలపై 25శాతం చొప్పున దిగుమతి సుంకాలు విధించాడు. తాజాగా ట్రంప్‌ చేసిన ప్రకటనను అసలు చైనా పట్టించుకోలేదనే చెప్పాలి. కొన్ని నామమాత్ర చర్యలు తీసుకుంది. అవి అమెరికా నుంచి దిగుమతయ్యే వాటిలో పదో వంతు వస్తువుల మీదనే అని వార్తలు.పెద్ద మొత్తంలో సుంకాలు విధిస్తే ఎక్కువగా నష్టపోయేది అమెరికాయే గనుక ఎంతవరకు ముందుకు పోతుందో చూద్దాం అన్నట్లుగా చైనా ఉంది. ఎనిమిదేండ్ల నాటితో పోలిస్తే తాజా బెదిరింపు లెక్కలోది కాదని భావిస్తోంది. అందుకే ట్రంప్‌ ప్రకటనలను అది ఖాతరు చేయటం లేదు.దీని అర్ధం అసలేమీ ప్రతికూల ప్రభావాలు ఉండవని కాదు.


ట్రంప్‌ తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదం అవుతున్న పూర్వరంగంలో అమెరికా పాలకవర్గం చూస్తూ ఊరుకుంటుందా ? శత్రువుగా పరిగణించే చైనాతో పాటు తన కనుసన్నలలో నడిచే కెనడా, మెక్సికో, ఐరోపా దేశాలు, చేతులు కలిపేందుకు తహతహలాడుతున్న భారత్‌ మీద కూడా బస్తీమే సవాల్‌ అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. ఆయా దేశాలతో బేరమాడేందుకు అయితే సరే, మొదటికే మోసం వస్తే పాలకవర్గం సహించే సమస్యే లేదు. దాని డిఎన్‌ఏలో ఎలాంటి మార్పులు ఉండవు. ఎన్నికల్లో ఓటర్లు ఎక్కువగా పాల్గ్గొనేందుకు ప్రోత్సహించటానికి మనమెందుకు డబ్బు ఇవ్వాలంటూ ట్రంప్‌ చేసిన ప్రకటన అమెరికా సామాన్యులను ఆకట్టుకుంటుందనటంలో ఎలాంటి సందేహం లేదు. కానీ సాయం పేరుతో జరుపుతున్న కార్యకలాపాలు వేరు. ఇప్పటి వరకు జరిపిన వాటితో ఫలితం లేకపోతే సమీక్షల తరువాత కొత్త రూపాలతో అమెరికా రంగంలోకి దిగుతుంది తప్ప వెనక్కు తగ్గే అవకాశం లేదు !ఉక్రెయిన్‌ విషయంలో ట్రంప్‌ ఎన్ని మాటలు చెప్పినప్పటికీ వైఖరిని మార్చుకోవటానికి ఇప్పటికీ సమయం మించిపోలేదని, రష్యన్ల ఊబిలో చిక్కుకోవద్దని అమెరికా మేథోమధనంలో నిమగ్నమైన వారు సూచిస్తున్నారు.అమెరికాను ప్రధమ శత్రువుగా పరిగణిస్తున్న రష్యాను దగ్గరకు తీసుకోవాలను కోవటం జరిగేది కాదని, కనిపిస్తున్నదానికి భిన్నంగా ఉక్రెయిన్‌ ఇంకా ఓడిపోలేదని లేదా అమెరికాతో సంబంధాలు తెగలేదని, తన చర్యలు స్వయం ఓటమికి దారితీస్తాయని గ్రహిస్తే ట్రంప్‌ యంత్రాంగం ప్రకటించినదానికి పూర్తి విరుద్దమైన వైఖరిని తీసుకోవటానికి విముఖత చూపకపోవచ్చని ఛాతమ్‌ హౌస్‌ విశ్లేషణలో పేర్కొనటం గమనించదగిన అంశం. సామ్రాజ్యవాదులు ఏది లబ్ది అనుకుంటే దానికి మొగ్గుచూపుతారనటంలో ఎలాంటి సందేహం లేదు. అయితే వారు కూడా పప్పులో కాలేసిన చరిత్రను కూడా మరచిపోరాదు. ఎవరి మీదా భ్రమలు పెట్టుకోనవసరం లేదు. ఏం జరుగుతుందో చూద్దాం !

Share this:

  • Tweet
  • More
Like Loading...

అసలేం జరుగుతోంది ! ఉక్రెయిన్‌పై క్షణక్షణానికి మారుతున్న మాటలు !

19 Wednesday Feb 2025

Posted by raomk in Current Affairs, Europe, Germany, History, imperialism, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, USA, WAR

≈ Leave a comment

Tags

Donald trump, Joe Biden, Ukraine crisis, Vladimir Putin

ఎం కోటేశ్వరరావు


అమెరికా అధినేత డోనాల్డ్‌ ట్రంప్‌ రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఫిబ్రవరి 12న జరిపిన ఫోన్‌ సంభాషణ ప్రపంచంలో ఎంతో ఆసక్తి రేపింది. ఉక్రెయిన్‌ సమస్య పరిష్కారానికి చర్చలు జరపనున్నట్లు ప్రకటించాడు. పరస్పర విరుద్ద వార్తలు, వ్యాఖ్యానాలు, విశ్లేషణలు, ఉక్రెయిన్‌ సంక్షోభం ముగింపు గురించి నేతలు చేస్తున్న ప్రకటనలు చూస్తుంటే అసలేం జరుగుతోంది అని సామాన్యుడు ఎటూ తేల్చుకోలేని స్థితి. ఒక ప్రకటన, పరిణామం వాస్తవం అనుకుంటే తలెత్తే సందేహాలు ఎన్నో. మంగళవారం నాడు సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో అమెరికారష్యా ఉన్నత ప్రతినిధి వర్గాలు భేటీ అయ్యాయి. చర్చలను కొనసాగించాలని నిర్ణయించారు. డోనాల్డ్‌ ట్రంప్‌వ్లదిమిర్‌ పుతిన్‌ కూడా అక్కడి చేరుకోవచ్చని వార్తలు వాస్తవం కాదని, ఇంకా ఎలాంటి నిర్ణయం జరగలేదని ప్రకటించారు. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెనెస్కీ బుధవారం నాడు అక్కడికి చేరుకోనున్నట్లు వార్త. ఐరోపాకు చర్చల్లో ఎలాంటి ప్రమేయం ఉండదనే ఊహాగానాల పూర్వరంగంలో సోమవారం నాడు పారిస్‌లో కొన్ని దేశాల నేతలు సమావేశం జరిపి పరిస్థితిని సమీక్షించారు. ఉక్రెయిన్‌పై 2022 ఫిబ్రవరి 24న రష్యా సైనిక చర్య ప్రారంభమైంది. వేగంగా మారుతున్న పరిణామాలను చూస్తే నాలుగో ఏడాదిలో ప్రవేశించక ముందే దానికి ముగింపు పలుకుతారా ? ఈ సమస్యను ఇంత సులభంగా పరిష్కరించే అవకాశం ఉంటే మూడు సంవత్సరాలు ఎందుకు కొనసాగించినట్లు ? కోట్లాది మంది జనాలను, అనేక దేశాలను ఎందుకు ఇబ్బందులు పెట్టినట్లు ? దీనికి ఎవరిది బాధ్యత ? ఎంతో సంక్లిష్టమైన ఈ వివాదం ఒక్క భేటీతో నాటకీయంగా ముగుస్తుందా ? చర్చల పేరుతో కొత్త ఎత్తుగడలకు ప్రాతిపదిక వేస్తున్నారా?


జెలెనెస్కీ, ఐరోపా సమాఖ్యతో నిమిత్తం లేకుండానే చర్చలు జరిపి ఒక ముగింపు పలుకుతామని అమెరికన్లు చెప్పారు. తమతో నిమిత్తం లేకుండా జరిగే చర్చలను అంగీకరించేది లేదని జెలెనెస్కీ ప్రకటించాడు. పుతిన్‌ అబద్దాల కోరు, అసలు తమకు చర్చల గురించి సమాచారమే లేదన్నాడు. ముసాయిదా ప్రతిపాదనల్లో తమ భద్రతకు ఎలాంటి హామీ లేదన్నాడు. తమకూ అంగీకారం కాదని ఐరోపా దేశాలు స్పష్టం చేశాయి. మరి జెలెనెస్కీ సతీసమేతంగా రియాద్‌ ఎందుకు వస్తున్నారంటే ‘‘ అది ఎప్పుడో నిర్ణయించిన పర్యటన ’’ అని అతగాడి ప్రతినిధి వివరణ ఇచ్చాడు. రష్యాఉక్రెయిన్‌ ఖైదీల మార్పిడి గురించి చర్చలు జరిపేందుకు జెలెనెస్కీ ఆదివారం నాడు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ చేరుకున్నాడు. సౌదీ పర్యటన గురించి గతంలో ఎలాంటి వార్తా లేదు. ఎవరి ప్రమేయం లేకుండా చర్చలు జరుగుతాయని ట్రంప్‌ సలహాదారులు స్పష్టంగా చెప్పారు. దానికి పూర్తి విరుద్దంగా శాంతి చర్చల్లో జెలెనెస్కీ పాల్గొంటారని ఆదివారం నాడు డోనాల్డ్‌ ట్రంప్‌ చెప్పినట్లు రాయిటర్స్‌ వార్త పేర్కొన్నది. ఐరోపా నుంచి వ్యతిరేక స్పందన వెలువడటంతో అమెరికా మాట మార్చింది.సౌదీలో చర్చలకు అమెరికా ప్రతినిధివర్గ నేత మార్క్‌ రూబియో సిబిఎస్‌ టీవీతో మాట్లాడుతూ అసలు పుతిన్‌ నిజంగా చిత్తశుద్దితో ఉన్నాడా లేదా అన్నది పరీక్షించేందుకు చర్చలను ముందుకు తెచ్చామని, నిజమైన సంప్రదింపుల్లో ఉక్రెయిన్‌, ఐరోపాకు భాగస్వామ్యం ఉంటుందని చెప్పాడు. ఎందుకంటే రష్యాపై ఆంక్షల్లో ఐరోపా కూడా ఉందన్నాడు. పైకి ఏమి చెప్పినప్పటికీ అమెరికా అధికారులు ప్రయివేటు సంభాషణల్లో ఐరోపా వారితో మీ అంగీకారం లేకుండా ఏదీ జరగదని చెబుతున్నట్లు మీడియా పేర్కొన్నది. ఏ రోటి దగ్గర ఆ పాట పాడినట్లు వ్యవహరిస్తున్నారా ? దీన్ని చూస్తుంటే పరిణామాలు ఏ మలుపు తిరిగేదీ ఊహించలేము.

ట్రంప్‌ ఫోన్‌ సంభాషణకు ముందు జరిగిన పరిణామాలను సింహావలోకనం చేసుకోవాల్సి ఉంది. ఉక్రెయిన్‌ పోరులో తాము చేసిన సాయం లేదా చేసిన ఖర్చును తిరిగి చెల్లించే స్థితిలో లేనందున ప్రతిగా టిటానియం,యురేనియం, లిథియం వంటి 500 బిలియన్ల విలువగల ఖనిజ సంపదలున్న ప్రాంతాల్లో సగం తమకు అప్పగించాలని అమెరికా బేరం పెట్టింది. దాని కోసం తన ఆర్థిక మంత్రి స్కాట్‌ బిసెంట్‌ను కీవ్‌ పంపిన సంగతి తెలిసిందే ప్రస్తుతం రష్యా, దాని అనుకూల శక్తుల ఆధీనంలో ఉన్న నాలుగో వంతు భూ భాగంలో ఈ ఖనిజాలు ఉన్నాయి. సంక్షోభానికి ముందు ఉన్న ప్రాంతాలు తిరిగి కావాలని కోరుకోవద్దని కూడా ట్రంప్‌ యంత్రాంగం జెలెనెస్కీకి సూచించింది. అలాంటపుడు ఖనిజాల గురించి ఎందుకు బేరం పెట్టినట్లు? రష్యాను అడ్డుకొనేందుకు ఐరోపా దేశాలు కూడా పెద్ద మొత్తంలో ఖర్చు చేశాయి. ఖనిజాలతో అమెరికా తన ఖర్చుతాను రాబట్టుకుంటే తమ సంగతేమిటని అవి ప్రశ్నిస్తాయి. అయితే సంక్షోభం ప్రారంభమైన తరువాత ఐరోపా దేశాలు 300 బిలియన్‌ డాలర్ల విలువగల రష్యన్‌ ఆస్తులను స్థంభింప చేశాయి. వాటిని స్వాధీనం చేసుకోవటం గురించి కొందరు ఆలోచనలు చేస్తున్నారు. దీనికి రష్యా అంగీకరించే సమస్యే ఉత్పన్నం కాదు.2014లో రష్యా స్వాధీనం చేసుకున్న క్రిమియా ద్వీపకల్పంతో సహా ఆక్రమిత ప్రాంతాలన్నింటినీ తమకు అప్పగించాలని జెలెనెస్కీ డిమాండ్‌ చేశాడు. ఒక వైపు చర్చల గురించి సిద్దం అవుతూనే రష్యా తన దాడులను కొనసాగిస్తూనే ఉంది. ఉక్రెయిన్‌ ప్రతిఘటన కూడా సాగుతోంది.

నువ్కొకందుకు పోస్తే నేనొకందుకు తాగాను అన్నట్లుగా పుతిన్‌ చాలా జాగ్రత్తగా స్పందిస్తున్నాడు. ఎవరూ ఎవరిని నమ్మే స్థితిలో లేరు. అమెరికాఐరోపా యూనియన్‌ మధ్య ఉన్న మిత్ర వైరుధ్యం ప్రస్తుతానికి శత్రు వైరుధ్యంగా మారుతుందని చెప్పలేము గానీ ట్రంప్‌ పుతిన్‌ ఫోన్‌ చర్చల తరువాత తేడా మరింత పెరిగింది. అలా అయితే ఏం చేయాలి ఇలాజరిగితే ఏం చేద్దామనే సంప్రదింపులు ఐరోపాలో ప్రాధమికంగా ప్రారంభమయ్యాయి. ఇప్పుడు ఐరోపా దేశాలన్నింటికీ కలిపి ఎంత మిలిటరీ ఉందో అంతకంటే ఎక్కువగా రష్యా కలిగి ఉంది. అందువలన ఆచితూచి అడుగేస్తున్నాయి. అది వాటి బలహీనత అయితే దాన్ని సొమ్ముచేసుకోవాలని చూడటం అమెరికా బలం. అమెరికాకు అగ్రపీఠం అనే తన అవగాహనను ట్రంప్‌ మరింత ముందుకు తీసుకుపోయేట్లయితే ఐరోపాకు దానితో ఘర్షణ పడటం లేదా లొంగిపోవటం తప్ప మరొక మార్గం లేదు. అమెరికా బలహీనతలు కూడా తెలిసినందున ఐరోపా ధనిక దేశాలు అంత తేలికగా సాగిలపడతాయని చెప్పలేము. ప్రపంచ బలాబలాల్లో కొత్త సమీకరణకు తెరలేచే అవకాశాలు కూడా ఉన్నాయి. అదే జరిగితే అమెరికా ఏకాకి అవుతుంది, దానికి సిద్దపడుతుందా ? అలాంటి అవకాశమే లేదని చెప్పవచ్చు.

ఐరోపా మీద డోనాల్డ్‌ ట్రంప్‌ దాడి అంటూ ఎకనమిస్టు పత్రిక ఒక వ్యాఖ్యా విశ్లేషణ చేసింది. ఉక్రెయిన్‌ మీద ఒక ఒప్పందం చేసుకొనేందుకు పుతిన్‌కు ట్రంప్‌ పంపిన ఆహ్వానం నాటో కూటమిని గందరగోళంలోకి నెట్టిందని పేర్కొన్నది. ఐరోపా భద్రతకు తామింకే మాత్రం ప్రాధమిక హామీదారుగా ఉండేది లేదంటూ ముందుగా అమెరికా రక్షణ మంత్రి పేట్‌ హెగ్‌సేత్‌ చేసిన ప్రకటన షాకిచ్చింది. కొద్ది గంటల తరువాత పుతిన్‌తో సంప్రదింపుల గురించి ట్రంప్‌ ప్రకటించాడు. ఆ తరువాత వార్షిక మ్యూనిచ్‌ భద్రతా సమావేశంలో ఉపాధ్యక్షుడు జెడి వాన్స్‌ నొప్పించే రీతిలో ఐరోపా మీద దాడి చేశాడు.ఉక్రెయిన్‌ గురించి మాట్లాడాల్సిన వాన్స్‌ తన ప్రసంగమంతా ఐరోపా మీద కేంద్రీకరించాడు.ఐరోపాకు ఉందని చెబుతున్న ముప్పు రష్యా నుంచి కాదు, అంతర్గతంగానే ఉందన్నాడు. దాని అర్ధం వలసల సమస్య. పుండు మీద కారం చల్లినట్లుగా ఉక్రెయిన్‌లో అమెరికా రాయబారి కెయిత్‌ కెలోగ్‌ కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడాడు. సంప్రదింపుల్లో ఐరోపాకు స్థానం ఉంటుందా అన్న ప్రశ్నకు అది జరుగుతుందని అనుకోవటం లేదన్నాడు. దీంతో ఐరోపా భద్రత తమ కళ్ల ముందే కుప్పకూలుతుందా అన్నట్లుగా అనేక మంది నేతలు, అధికారులు భావించినట్లు ఎకనమిస్టు వర్ణించింది. ట్రంప్‌ ప్రతిపాదించిన చర్చలు ఎవరి అజెండా మేరకు జరుగుతాయన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్న. వస్తున్న వార్తలన్నీ పుతిన్‌ డిమాండ్లకే అమెరికా అంగీకరించవచ్చని సూచిస్తున్నాయి.ఒక వేళ నిజంగా అదే జరిగితే రానున్న రోజుల్లో ఏ ఒక్కదేశం కూడా అమెరికా మాటలు, హామీల మీద ఆధారపడి వ్యవహరించే అవకాశాలు మరింతగా కుచించుకుపోతాయి. ఇంతవరకు దాన్ని నమ్మిబాగుపడిన దేశం లేదనే అభిప్రాయాన్ని మరింతగా బలపరిచినట్లు అవుతుంది. ప్రపంచాన్ని తమ గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తున్న అమెరికా సామ్రాజ్యవాదులు ఆత్మహత్యకు పాల్పడతారా ? సోమవారం నాడు ఫ్రెంచి అధ్యక్షుడు మక్రాన్‌ ఎంపిక చేసిన కొన్ని దేశాలతో పారిస్‌లో సంప్రదింపులు జరిపాడు. వాటి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

మూడు సంవత్సరాలుగా ఉక్రెయిన్‌ శాంతి చర్చలను సాగనివ్వని అమెరికన్లు ఆకస్మికంగా ఎందుకు రష్యాతో సంప్రదింపులకు సిద్దపడుతున్నారు ? ఒకటి ఐరోపాలోని నాటో కూటమి దేశాలు అవసరమైతే రంగంలోకి దిగుతామని కబుర్లు చెబుతున్నప్పటికీ నేరుగా ఉక్రెయిన్‌ తరఫున యుద్దంలో పాల్గొనే అవకాశాలు లేవు. వేల కిలోమీటర్ల దూరం నుంచి అమెరికా సేనలు వచ్చి రష్యాతో తలపడేందుకు సిద్దం కాదు. ఆఫ్ఘనిస్తాన్‌ తాలిబాన్లకే సలాంగొట్టి కాళ్లు గడ్డాలు పట్టుకొని ప్రాణాలు అరచేత పట్టుకొని వెళ్లిన వారు అణుశక్తి రష్యాతో తలపడగలరా ? రష్యా తొలి నుంచీ కోరుతున్నదేమిటి ? గతంలో తమకు హామీ ఇచ్చినట్లుగా ఉక్రెయిన్‌కు సభ్యత్వమిచ్చి నాటో కూటమి ఆయుధాలను తమ ముంగిట్లో ఉంచకూడదు. సంక్షోభానికి ముందు ఉన్న సరిహద్దులు, ప్రాంతాల గురించి ఉక్రెయిన్‌ మరచిపోవాలి.శాంతి పరిరక్షణ, మరొక పేరుతో నాటో కూటమి దళాలు తమ సరిహద్దులో తిష్టవేయకూడదు. ఉక్రెయిన్‌ మిలిటరీపై పరిమితులు పెట్టాలి.స్వాతంత్య్రం ప్రకటించుకున్న ఉక్రెయిన్‌లోని ప్రాంతాలకు అంతర్జాతీయ గుర్తింపు ఇవ్వాలి. ఏ విషయంలోనూ రాజీ పడేందుకు పుతిన్‌ సిద్దంగా లేడని ఐరోపా గూఢచారులు నివేదించినట్లు వార్తలు. పుతిన్‌ షరతుల మేర ఒప్పందం కుదుర్చుకుంటే అమెరికాకు వచ్చేదేముంది ? వారు మరీ అంత అమాయకులా ?

కొద్ది నెలలు, వారాల క్రితం వరకు కూడా రష్యాను నిలువరించేందుకు ఏం చేయాలి ? ఎలాంటి ఆయుధాలను ఉక్రెయిన్‌కు అందించాలి అని తర్జన భర్జనలు పడిన ఐరోపా నేతలు, వ్యూహకర్తలు ఇప్పుడు ట్రంప్‌ తెచ్చిపెట్టిన పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలా అని మల్లగుల్లాలు పడుతున్నారు. తాము విధించిన ఆంక్షలతో బలహీనపడిన పుతిన్‌ నాయకత్వాన్ని మరింతగా ఎలా వంటరిపాటు చేయాలా అని చూశారు.ట్రంప్‌ చర్యతో పుతిన్‌ ఆ స్థితి నుంచి తాత్కాలికంగా అయినా బయటపడ్డారు. దీని అర్ధం ఎవరిదారి వారు చూసుకోవటం అని కాదు.ఇప్పుడున్న పరిస్థితిలో అమెరికాఐరోపాలకు పరస్పర సహకారం అవసరం. మమ్మల్ని, మా భద్రతను అర్దంతరంగా ఎలా వదలి వెళతారని అడిగితే ఐరోపా మరింత చులకన అవుతుంది. అమెరికా పట్టుమరింతగా దాని మీద బిగుస్తుంది. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన సమయంలో మాదిరి పశ్చిమ ఐరోపా ఆర్థికంగా బలహీనంగా లేదు. గడచిన ఏడు దశాబ్దాల్లో మొత్తంగా పెట్టుబడిదారీ వ్యవస్థలన్నీ సమస్యలను ఎదుర్కొంటున్నప్పటికీ పశ్చిమ ఐరోపా పరిస్థితి మెరుగుపడిరది. అందుకే ఫ్రాన్సు, జర్మనీ పాలకవర్గాలు స్వంతంగానే భద్రతను చూసుకోగలమనే సంకేతాలను పంపుతున్నప్పటికీ మొత్తంగా ఐరోపాను ఆదుకొనేంత ఆర్థిక శక్తి వాటికి లేదు.. మొత్తం మీద ప్రపంచ రాజకీయాల గురించి మీడియాలో గతంలో ఎన్నడూ లేని చర్చ జరుగుతోంది. సౌదీలో ఏం జరగనుంది ? తురుపు ముక్కలను ఎవరు ఎలా ప్రయోగిస్తారు. చూద్దాం !

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఉక్రెయిన్‌ సంక్షోభం : మాటతప్పే, మడమతిప్పే బాటలో డోనాల్డ్‌ ట్రంప్‌ !

16 Thursday Jan 2025

Posted by raomk in Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, USA, WAR

≈ Leave a comment

Tags

Donald trump, Donald Trump u turn, Joe Biden, Ukraine crisis, Vladimir Putin, Volodymyr Zelensky


ఎం కోటేశ్వరరావు


నాటో కూటమిలో చేరి తమ భద్రతకు ముప్పు తెచ్చేందుకు పూనుకున్న ఉక్రెయిన్‌కు గుణపాఠం చెప్పేందుకు 2022 ఫిబ్రవరి 24న ప్రారంభించిన సైనిక చర్య గురువారం నాటికి 1,057 రోజులో ప్రవేశించింది. ఏ మలుపులు తిరుగుతుందో ఎలా ముగుస్తుందో అంతుబట్టటం లేదు.ఉక్రెయిన్‌కు మద్దతు ఇస్తున్న పశ్చిమ దేశాలకు, బుద్ది చెప్పేందుకు పూనుకున్న రష్యాకు ప్రతిష్టాత్మంగా మారింది. తాను అధికారాన్ని స్వీకరించిన 24 గంటల్లోనే యుద్ధాన్ని ఆపుతానని ఈనెల 20న పదవీ బాధ్యతలు స్వీకరించనున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ చెప్పాడు. అంతేనా వీలైతే అంతకు ముందే ఆపుతానని కూడా చెప్పాడు. ఒక రోజులో కాదు గానీ కనీసం వందరోజులు పడుతుందన్నాడు ఉక్రెయిన్‌ రాయబారిగా ట్రంప్‌ ఎంచుకున్న కెయిత్‌ కెలోగ్‌. అంత తేలిగ్గా ఎలా కుదురుతుంది కొన్ని నెలలు, అంతకంటే ఎక్కువ కాలమే పట్టవచ్చునని ట్రంప్‌ సలహాదారులు చెప్పినట్లు రాయిటర్స్‌ తాజా కథనం.శ్వేత సౌధంలో ప్రవేశించే గడవు దగ్గర పడుతున్నకొద్దీ ట్రంప్‌ నోట దానీ ఊసేలేదు. మరోవైపు దిగిపోతున్న జో బైడెన్‌ యంత్రాంగం రష్యాపై మరిన్ని ఆంక్షలను విధించి సంక్షోభాన్ని ఎలా పరిష్కరిస్తాడో చూస్తాం అన్నట్లుగా ట్రంప్‌కు సవాలు విసిరింది. ఆ పెద్ద మనిషి ఏం చేస్తాడో ఏం జరగనుందో తెలియదు గానీ అగ్రరాజ్య రాజకీయాలు మనవంటి దేశాలకు సంకటాన్ని తెచ్చిపెడుతోంది. అమెరికా రక్షణ శాఖ గతవారంలో తమ దేశ భద్రతకు ముప్పు అంటూ రెండు చైనా చమురు సంస్థలపై కూడా ఆంక్షలు విధించింది. జనం చెల్లించిన పన్నుల నుంచి బిలియన్ల డాలర్లను ఉక్రెయిన్‌లో తగలేయటం ఎందుకనే రీతిలో ట్రంప్‌ మాట్లాడాడు. అయితే అవి నిజాయితీతో కూడినవి కాదు. అమెరికా ప్రయోజనాల వ్యూహంలో భాగంగానే ప్రతి పరిణామం జరుగుతోంది. నిజానికి ఉక్రెయిన్‌ పోరు కూడా దానిలో భాగమే. అది తెలియనంత అమాయకుడు కాదు ట్రంప్‌. రాజకీయనేతలు ఊరికే ఏమాటలూ చెప్పరు. అందుకే ఎన్నికల్లో లబ్దికోసం ట్రంప్‌ మాట్లాడాడా లేక మరొకవిధంగానా అన్న అనుమానాలు ఉండనే ఉన్నాయి. మరోవైపు ఉక్రెయిన్‌ పోరులో పశ్చిమ దేశాల మిలిటరీని వినియోగించే అంశం గురించి ఫ్రెంచి అధ్యక్షుడు మక్రాన్‌తో జెలెనెస్కీ సంప్రదింపులు జరిపాడు. అమెరికా తాజా ఆంక్షలతో రాయితీ ధరలతో ఇప్పటి వరకు రష్యా నుంచి కొనుగోలు చేస్తున్న ముడిచమురు దిగుమతిని మనదేశం నిలిపివేసింది. మరోవైపున అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగాయి.పులి మీద పుట్రలా మన రూపాయి రికార్డు స్థాయిలో పతనం మరింత భారం మోపనుంది.

త్వరలో నాలుగో ఏడాదిలో ప్రవేశించనున్న ఉక్రెయిన్‌ రష్యా సంక్షోభం పరిష్కారం కావాలని అందరూ కోరుకుంటున్నారు. దీనికి మూలం అమెరికా నాయకత్వంలోని నాటో కూటమిలోకి ఉక్రెయిన్‌కు స్థానం కల్పిస్తామని చెప్పటమే. తద్వారా రష్యా ముంగిటికి విస్తరించి ముప్పు తలపెట్టేందుకే అన్నది తెలిసిందే. అమెరికా అనుకున్నది ఒకటి అయింది ఒకటి. రష్యాను ఆర్థికంగా దెబ్బతీయాలన్నది కొంత మేరకు జరిగింది. అయితే ప్రచ్చన్న యుద్ధం ముగిసిన తరువాత తొలిసారిగా పశ్చిమ దేశాలకు వ్యతిరేకంగా రష్యాచైనా సంబంధాలు బలపడతాయని నాటో కూటమి ఊహించలేదనే చెప్పాలి. మూడు సంవత్సరాలుగా రష్యా ఆర్థికంగా నిలదొక్కుకోవటానికి ఇదొక ప్రధాన కారణం. యుద్ధం కొనసాగిన కొద్దీ ప్రజల సొమ్ము ఖర్చు చేయాల్సి వస్తోందనే మనోభావాలను ట్రంప్‌ రెచ్చగొట్టవచ్చు, దాని వలలో కొందరు పడవచ్చు గానీ సంక్షోభం ఎంత దీర్ఘకాలం కొనసాగితే అమెరికాకు అంతలాభం. అక్కడి ఆయుధ పరిశ్రమలకు లాభాలు, కొంత మందికి ఉపాధి, అదే విధంగా ధరల పెరుగుదలతో పాటు రష్యా ఇంథన మార్కెట్‌ను అమెరికా కంపెనీలు ఆక్రమించి లాభాలు పిండుకుంటాయి. అందుకనే ఏదో ఒకసాకు చూపి ట్రంప్‌ కూడా జో బైడెన్‌ బూట్లలో కాళ్లు దూర్చి నడిచేందుకే చూస్తాడు. ఐరోపాలోని అగ్రరాజ్యాలైన ఫ్రాన్సు, జర్మనీ, బాల్టిక్‌ దేశాలు, పోలెండు వంటివి కూడా అదే కోరుకుంటున్నాయి. ఎందుకంటే రష్యా బలహీనం కావటం వాటికి అవసరం. అందుకే ఈ సంక్షోభం ఇప్పట్లో ముగిసేది కాదని భావిస్తున్నారు. నాటో కూటమి దేశాల ఉద్దేశ్యాలను గ్రహించి కావచ్చు, తొలి రోజుల మాదిరి రష్యా ఇప్పుడు దూకుడుగా ముందుకు పోవటం లేదు, నిదానంగా అడుగులు వేస్తున్నది.


కొందరు పరిశీలకులు మరొక కోణాన్ని కూడా చూస్తున్నారు. ప్రపంచానికి శాంతిదూతగా కనిపించేందుకు, నోబెల్‌ బహుమతి పొందాలనే తపనతో ట్రంప్‌ ఉన్నాడు గనుక ఒక శాంతి ప్రతిపాదన చేయవచ్చని ఆశాభావంతో ఉన్నారు. అదేమిటో వెల్లడి కాలేదు గానీ లీకులుఊహాగానాలు వెలువడ్డాయి. వాటి ప్రకారం రెండు దశాబ్దాల పాటు ఉక్రెయిన్‌కు నాటో సభ్యత్వం ఇవ్వరు. దానికి ప్రతిగా రష్యా మిలిటరీ చర్యను ఆపివేయాలి.ప్రస్తుతం రష్యా ఆక్రమణలో ఉన్న ప్రాంతాలను ఉక్రెయిన్‌ వదులుకోవాలి. రెండు దేశాల మధ్య ఉన్న 1,290 కిలోమీటర్ల సరిహద్దులో మిలిటరీ రహిత ప్రాంతాన్ని ఏర్పాటు చేసి దాని పర్యవేక్షణ బాధ్యతను ఐరోపా దేశాలు చూసుకోవాలి. శాంతి చర్చలలో గనుక పాల్గొంటే రష్యా మీద విధించిన కొన్ని ఆంక్షలను వెంటనే తొలగిస్తారు. గతంలో నాటోను తమ వైపు విస్తరించబోము అన్న హామీని ఆ కూటమి దేశాలు విస్మరించినందున రష్యా అంత తేలికగా అంగీకరించకపోవచ్చు లేదా కొంత ఉపశమనం దొరుకుతుంది గనుక తరువాత చూసుకోవచ్చు లెమ్మని అంగీకరించవచ్చు. ఇప్పటికే క్రిమియాను కోల్పోయిన ఉక్రెయిన్‌ మరికొన్ని ప్రాంతాలను కోల్పోయేందుకు అంగీకరిస్తుందా అన్నది పెద్ద ప్రశ్న. తొలుత కుదరదని చెప్పినప్పటికీ తరువాత మెత్తబడినట్లు నిర్ధారణగాని వార్తలు. ట్రంప్‌ ప్రతిపాదనలు తమ దృష్టికి వచ్చినపుడు రష్యా కొట్టిపారవేసింది. దాని అభిప్రాయం ప్రకారం ఉక్రెయిన్‌ శాశ్వతంగా తటస్థ దేశంగా ఉండాలి లేదా రష్యా ప్రభావంలోకి రావాలి, సరిహద్దులో నిస్సైనిక ప్రాంతం ఏర్పాటు, పర్యవేక్షణ బాధ్యతను ఐరోపా యూనియన్‌కు అప్పగించటాన్ని పుతిన్‌ అంగీకరించే అవకాశాలు లేవని వార్తలు వచ్చాయి. తన మిలిటరీ సామర్ధ్యాన్ని రష్యా పెంచుకుంటున్నదని కూడా చెబుతున్నందున ప్రస్తుత దశలో ఏం జరిగేదీ చెప్పలేము. ఇక రష్యాఉక్రెయిన్‌ యుద్ధ రంగాన్ని చూద్దాం.ఇప్పటికే రష్యా నుంచి తమ భూభాగం మీదుగా నడుస్తున్న ఇంథన సరఫరా వ్యవస్థను ఉక్రెయిన్‌ నిలిపివేసింది. రష్యా నుంచి టర్కీ ద్వారా ఐరోపా యూనియన్‌ దేశాలకు ఉన్న గ్యాస్‌ పైప్‌లైన్‌ ఒక్కటే పని చేస్తున్నది. దాన్ని ధ్వంసం చేసేందుకు అమెరికా, ఉక్రెయిన్‌ కుట్రపన్నాయని, దానిలో భాగంగానే ఉక్రెయిన్‌ దాడులు జరిపినట్లు, తొమ్మిది డ్రోన్లను తాము కూల్చివేసినట్లు రష్యా ప్రకటించింది. ఇలాంటి పనులు చేస్తే ఉక్రెయిన్‌కు ఐరోపాయూనియన్‌ మద్దతు ఉండదని స్లోవేకియాహెచ్చరించింది. మంగళవారం నాడు వందలాది డ్రోన్లు, క్షిపణులతో మూడు రష్యా పట్టణాలపై ఉక్రెయిన్‌ దాడులు చేసినట్లు వార్తలు వచ్చాయి. రెండువందల డ్రోన్లు, ఐదు అమెరికా తయారీ ఖండాంతర క్షిపణులను రష్యా కూల్చివేసినట్లు టెలిగ్రామ్‌ ఛానల్‌ షాట్‌ తెలిపింది. తాము కూడా రష్యా వైపు నుంచి వచ్చిన 80డ్రోన్లలో 58ని కూల్చివేసినట్లు ఉక్రెయిన్‌ చెప్పింది. ఈ పరిణామాలను చూస్తుంటే ట్రంప్‌ గద్దెనెక్కే నాటికి పరస్పరదాడులు మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయి.తాజాగా రష్యా జరిపిన దాడులతో ఉక్రెయిన్‌ గ్యాస్‌, విద్యుత్‌ వ్యవస్థ దెబ్బతిని సరఫరాకు అంతరాయం కలిగింది.


రష్యా ఇంథన రంగం, చైనా సంస్థలపై ఆంక్షలను మరింత తీవ్రతరంగావిస్తూ జోబైడెన్‌ జనవరి పదిన నిర్ణయించాడు.ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా రష్యాను దెబ్బతీయటంతో పాటు తమ ఎల్‌ఎన్‌జి మార్కెట్‌ను పెంచుకోవటం అమెరికా లక్ష్యంగా ఉంది. రష్యాలోని రెండు అతి పెద్ద చమురు ఉత్పత్తి సంస్థలు, రవాణా చేసే 183 ఓడలు, ఎల్‌ఎన్‌జిని ఎగుమతి చేసే 80 కంపెనీలు,బీమా సంస్థలు, వ్యక్తులపై ఆంక్షలను కొత్తగా ప్రకటించారు. బ్రిటన్‌ కూడా అమెరికాతో జతకలిసి ఉక్రెయిన్‌లో శాంతి కోసం అంటూ ఆంక్షలను ప్రకటించింది. ఈ ప్రకటనతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరిగాయి. బుధవారం నాడు ప్రామాణిక బ్రెంట్‌ రకం ధర 80డాలర్లకు అటూ ఇటూగా ఉంది. తాజాగా ఆంక్షలకు గురైన వాటితో సహా ఇప్పటి వరకు 270 టాంకర్లకు చేరాయి. ఈ టాంకర్లతో సముద్ర మార్గాలలో రష్యా ఎగుమతుల్లో 42శాతం జరుగుతున్నది. ఎగుమతి అయ్యే చమురులో 61శాతం చైనాకు,మిగిలింది మనదేశం దిగుమతి చేసుకుంటున్నది. పశ్చిమ దేశాల ఆంక్షలను ముందుగా ఊహించి ప్రత్నామ్నాయ వనరులను చూసుకుంటున్నట్లు వార్తలు. గతేడాది ఈ టాంకర్ల ద్వారా చైనాకు రోజుకు తొమ్మిది లక్షల పీపాలు ఎగుమతి అయ్యాయి.మార్కెట్‌ విషయానికి వస్తే మార్చి నెలలో సరఫరా చేయాల్సిన చమురు ధర బ్రెంట్‌ రకం 81డాలర్లు దాటింది.గతేడాది ఆగస్టు తరువాత ఇంతగా పెరగటం ఇదే మొదటిసారి. ఆంక్షలకు ముందు ఖరారు చేసుకున్న ఒప్పందం ప్రకారం ఆ జాబితాలో ఉన్న టాంకర్లను మార్చి నెలవరకు అనుమతిస్తామని తరువాత వచ్చే వాటిని వెనక్కి తిప్పి పంపుతున్నట్లు భారత్‌ ప్రకటించిందని వార్తలు వచ్చాయి. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 2024 నవంబరు నెలలోనే రష్యా నుంచి 55శాతం దిగుమతులు పడిపోయాయి. గత ఏడాది మొత్తం 430 టాంకర్ల ద్వారా రష్యా చమురు ఎగుమతులు చేసింది.


ట్రంప్‌ పదవీ బాధ్యతలు స్వీకరించే గడువు దగ్గరపడుతున్న కొద్దీ ఐరోపా నేతలు పరిణామాలు, పర్యవసానాల గురించి సంప్రదింపులు జరుపుతున్నారు. ఉక్రెయిన్‌ పోరు నాలుగో ఏడాదిలో ప్రవేశించనుండగా శాంతికోసం పశ్చిమదేశాల మిలిటరీని తమ గడ్డ మీద మోహరించాలని జెలెనెస్కీ కోరుతున్నాడు.వార్సాలో ఫ్రాన్సు, బ్రిటన్‌, జర్మనీ, ఇటలీ, పోలాండ్‌ నేతలు సోమవారం నాడు భేటీ జరిపారు.ఉక్రెయిన్‌ పోరుకు తామెందుకు భారీ మొత్తాలను ఖర్చు చేయాలని ట్రంప్‌ గతంలో ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఈ భారాన్ని ఐరోపా మరింత ఎక్కువగా భరించాలని చెబుతున్నాడు. ఈ నేపధ్యంలో ఐదు ఐరోపా అగ్రరాజ్యాల భేటీ జరిగింది.పశ్చిమ దేశాల మిలిటరీని ఉక్రెయిన్‌లో మోహరించాలని ఏడాది క్రితం తాను సూచన చేసినపుడు తనను ఒంటరిని చేశారని మక్రాన్‌ భావిస్తున్నాడు.అయితే ఈ అంశం గురించి వార్సాలో చర్చించలేదని జర్మనీ రక్షణ మంత్రి బోరిస్‌ పిస్టోరియస్‌ చెప్పాడు. ఒక వేళ నిజంగానే ఆ పనిచేస్తే ఆ చర్య ప్రపంచ గతిని మరో మలుపు తిప్పటం అనివార్యం. ఒకవేళ నాటో దళాలు రంగంలోకి దిగితే తమపై యుద్ధ ప్రకటనగానే పరిగణించి స్పందిస్తామని ఎప్పటి నుంచో రష్యా చెబుతున్నది. అందుకు సన్నాహాలు కూడా చేస్తున్నది, అవసరమైతే అణ్వాయుధాలను రంగంలోకి దింపుతామని హెచ్చరించింది.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d