ఎం కోటేశ్వరరావు
జూలై ఒకటి నుంచి వంటగ్యాస్ సిలిండరు ధర మరో ఇరవై అయిదు రూపాయలు పెరిగింది. దీంతో హైదరాబాదులో 861.50 నుంచి రూ.886.50 అయింది. నలభై రూపాయల సబ్సిడీ పదిహేనుకు పడి పోయింది. ఈ ముష్టి కూడా త్వరలో ఎత్తివేస్తారు. కరోనా కారణంగా కుదేలైన వారికి మరో 6.29లక్షల కోట్ల పాకేజి ప్రకటించిన నిర్మలమ్మ ఘనత గురించి ఇంకా చెప్పుకుంటూ ఉండగానే గ్యాస్ ధర పెరిగింది. రోజువారీ పెట్రోలు, డీజిలు ధరలకు జనం అలవాటు పడ్డారు. ఇప్పటికే వంద రూపాయలు దాటింది, 125, 150, 175, మోడీ అభిమానులు ఎదురు చూస్తున్న 200 కూడా త్వరలోనే దాటి పోతుందేమో. కనుక దాని గురించి పదే పదే చెప్పుకున్నా, వామపక్షాలు, కాంగ్రెస్ వారు చేసే ఆందోళనవలన ప్రయోజనం లేదు. పెరుగుదల మన ఒక్కరికే కాదు కదా, పెరుగుట విరుగుట కొరకే అన్న వేదాంతంలో నమ్మకం ఉన్న వారం గనుక ఇంకా ఇంకా ఎంత పెంచుతారో అదీ చూద్దాం. త్వరలో వంట గ్యాస్ ధరలు కూడా పెట్రోలు, డీజిలు మాదిరి రోజు వారీ పెరుగుతాయా మరొక పద్దతిలోనా అన్నది చూడబోతున్నాం.
2019-20లో వంట గ్యాస్ మీద ఇచ్చిన సబ్సిడీ మొత్తం రు.34,085 కోట్లు. 2020-21లో బడ్జెట్ అంచనా 37,256 అయితే దాన్ని 36,072 కోట్లకు సవరించారు. 2021-22లో ఆ మొత్తాన్ని 14,073 కోట్లకు తగ్గించి ప్రతిపాదించారు గనుక ఇప్పుడు పాతిక రూపాయలు ధర పెంచారు. ఆ మేరకు సబ్సిడీని తగ్గించారు. వివిధ ప్రాంతాలకు ఇస్తున్న సబ్సిడీలో తేడాలున్నప్పటికీ వడ్డింపులో వివక్ష లేదు కనుక ఆ మేరకు అందరికీ వర్తిస్తుంది.
పెట్రోలు, డీజిలు ధరలతో పాటు తమ ఏలుబడిలో గ్యాస్ ధరలు కూడా తక్కువే అని బిజెపి మరుగుజ్జులు(ట్రోల్స్) ప్రచారం చేశారు, ఇప్పటికీ చేస్తున్నారు. నమ్మని వారి గురించి వదిలేద్దాం, నరేంద్రమోడీని నమ్మిన వారిని తప్పుదారి పట్టిస్తున్నారనేదే ఆవేదన. దిగువ వివరాలు చూడండి.దిగుమతి ధర డాలర్లలో, వినియోగదారుల ధర, సబ్సిడీ మన రూపాయల్లో అని గమనించాలి. దిగుమతి ధరకు రవాణా ఖర్చులు అదనంగా ఉంటాయి.
సంవత్సరం××× దిగుమతి ధర××× వినియోగదారు ధర××× సబ్సిడీ
2014 ××× 970 ××× 414 ××× 638
2021 ××× 530 ××× 886 ××× 15
ఈ వివరాలను గమనించినపుడు అంతర్జాతీయ మార్కెట్లో ధరలు గత ఏడు సంవత్సరాలలో గణనీయంగా పడిపోయినందున ప్రభుత్వం లేదా చమురు కంపెనీలు ఇచ్చే సబ్సిడీ మొత్తం కూడా ఆమేరకు తగ్గిపోతుంది. కానీ అసలు సబ్సిడీ ఎత్తివేయటమే విధానంగా పెట్టుకున్నందున ఇప్పుడు గ్యాస్ ధరలు కూడా పెట్రోలు, డీజిలు మాదిరే రోజు వారీ పెరిగినా ఆశ్చర్యం లేదు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమంటే గతేడాది చమురు ధరలు గణనీయంగా పడిపోయినందున దిగుమతి చేసుకున్న ఎల్పిజి ధర కూడా 383 డాలర్లకు పడిపోయింది. గత ఏడు సంవత్సరాలలో ఇలా తరగటం తప్ప యుపిఏ కాలం నాటి ధరలకు పెరిగలేదు. ఇటీవల అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగినందున 2018-19లో ఉన్న 526 డాలర్ల స్ధాయికి తిరిగి చేరాయి. దిగుమతి రవాణా ఖర్చు 2014లో టన్నుకు 46 డాలర్లు ఉంటే 2018 జూన్ ఒకటిన 20 డాలర్లు మాత్రమే ఉంది.
దేశం ఇప్పుడు రెండుగా చీలి పోయింది. నరేంద్రమోడీ ప్రభుత్వ విధానాలను విమర్శించేవారిని దేశద్రోహుల దొడ్లో వేస్తున్నారు. మిగిలిన వారంతా దేశభక్తులే. ” దేశ ద్రోహుల ” గురించి వదలివేద్దాం. వారి నుంచి ఎంత వీలైతే అంత పెట్రోలు,డీజిలు, వంట గ్యాస్ నుంచి పిండమనండి ఇబ్బంది లేదు. కొత్త దేవుడైన నరేంద్రమోడీని విమర్శించినందుకు వారికి ఆ శాస్తి జరగాల్సిందే. గడ్డాలు, దుస్తులను చూసి ఎవరు ఏమతం వారు అన్నది గుర్తించి మరీ దాడి చేస్తున్నారు. అయితే ఇటీవలి కాలంలో అన్ని మతాల వారూ ఒకే మాదిరి గడ్డం పెంచటం ఒక సరదా అయింది కనుక పొరపాటు పడే అవకాశం కూడా ఉంది. నాజీ జర్మనీలో యూదులను గుర్తించేందుకు హిట్లర్ వారికి పసుపు పచ్చ రంగు గుర్తు(బ్యాడ్జి) వేయించాడు. అలాగే మోడీ వ్యతిరేకులందరికీ ఏదో ఒక రంగు గుర్తు వేస్తే గుర్తించటం సులభం అవుతుంది.
దేశద్రోహులు ప్రతి అంశం మీద ఎప్పటి కప్పుడు వాస్తవాలు చెబుతున్నారు. ఇక దేశభక్తులైన మోడీ అభిమానులైన వారిని తోటి వారే మోసం చేయటమే ఆవేదన కలిగించే అంశం. మోడీ కంటే ముందు సంవత్సరాలలోనే గ్యాస్ ధరలు ఎక్కువ అంటూ ప్రచారం చేశారు. వారు పేర్కొన్న అంకెలు సబ్సిడీతో నిమిత్తం లేకుండా దిగుమతి, ఇతర ఖర్చులు, డీలరు కమిషన్ వంటి వాటిని కలిపి లెక్కిస్తే నిర్ణీత సిలిండరు ధర ఎంత పడుతుంది అన్న అంశాన్ని అవి వెల్లడిస్తాయి. అవి ఒక వైపు ఉన్న బొమ్మ లాంటివి. మరోవైపు ఉండే బొరుసును కూడా చూపితేనే స్పష్టత వస్తుంది. ఉదాహరణకు యుపిఏ పాలనలో 2014 మార్చి ఒకటవ తేదీ నాడు లెక్కించిన మేరకు సిలిండరు ఒకదానికి వసూలు చేయాల్సిన మొత్తం రు.1001.78. అయితే వినియోగదారు నుంచి వసూలు చేసింది రు. 414 మాత్రమే. మోడీ సర్కార్ పార్లమెంటులో స్వయంగా చెప్పినదాని ప్రకారం 2018జూన్ ఒకటవ తేదీన వసూలు చేయాల్సిన మొత్తం రూ.698 అయితే వినియోగదారుల నుంచి వసూలు చేసింది రూ.493. ఇచ్చిన సబ్సిడీ 205, 2014తో పోల్చితే అంతర్జాతీయంగా ధరలు తగ్గి ప్రభుత్వానికి ఏకంగా సిలిండరుకు మూడు వందల రూపాయలు మిగిలాయి.
దేశంలో మెజారిటీ రాష్ట్రాలలో బిజెపియే అధికారంలో ఉంది. అది లేని రాష్ట్రాలలో కూడా మద్దతుదారులు ఉన్నారు.ఎవరు అవునన్నా కాదన్నా అది పెద్ద పార్టీగా ఉంది. దీన్ని చూసి ఇంక మోడీ శాశ్వతం అని కొందరు చెబుతుంటే ఇప్పట్లో దిగిపోయే అవకాశం లేదని మరి కొందరు అంటున్నారు. ఎవరెంత కాలం ఉంటారో ఎవరూ చెప్పలేరు గనుక దాన్ని పక్కన పెడదాం. మోడీ భక్తులుగా మీ నుంచి ఈ ప్రభుత్వం ఎంత పిండుతున్నదో అభిమానులు తెలుసుకోవాలి. మోడీ విధానాలను వ్యతిరేకిస్తారా లేదా అనేది వేరే అంశం. మోడీ మీద మాకు అభిమానం ఉంది, పెట్రోలు రెండు వందలు, గ్యాస్ బండ రెండువేలు అయినా మాకేమీ ఇబ్బంది లేదు, అంటారా మీ ఇష్టం అని తప్ప ఇంకేమి చెప్పగలం !