• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Monthly Archives: October 2023

అమెరికాకు భారత కోళ్ల రైతుల బలి: మన్మోహన్‌ సింగ్‌ అడ్డుకుంటే నరేంద్రమోడీ అప్పగించారు !

30 Monday Oct 2023

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, Farmers, Health, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Prices, Uncategorized, USA

≈ Leave a comment

Tags

American chicken legs, American poultry, BJP, China, Donald trump, India-US trade, Joe Biden, Narendra Modi Failures


ఎం కోటేశ్వరరావు


ఉల్లి తల్లి వంటిది అని చెబుతారు. చాలా మంది హరిదాసు-ఉల్లి కథ వినే ఉంటారు.జనానికి చెప్పే కథల సందర్భంగా ఒక హరిదాసు ఉల్లిపాయలు తినొద్దు అని హితవు చెప్పాడు. ఆ శ్రోతల్లో ఒకరిగా ఉన్న భార్య మరుసటి రోజు ఉల్లిపాయ లేకుండా కూరలు వండింది. కోపంతో చిర్రెత్తిన దాసు ఎందుకు వేయలేదు అని అరిచాడు. రాత్రి మీరే కదా తినొద్దని చెప్పారు అని నసిగింది . ఊరందరినీ తినొద్దని చెప్పాను తప్ప నీకు చెప్పానా అంటూ చిందులు వేయటంతో ఆ ఇల్లాలు నివ్వెరపోయింది. ఎందుకు ఈ కథను చెప్పాల్సి వచ్చిందంటే ఆదివారం నాడు మన ప్రధాని నరేంద్రమోడీ 106వ మన్‌కీ బాత్‌ సుభాషితాల్లో స్థానిక వస్తువులనే కొనండి అని మరోసారి పునరుద్ఘాటించారు. ఆ మాటలు విన్నతరువాత ఇతరులకు నీతులు చెప్పే హరిదాసు గుర్తుకు వచ్చారు. ప్రపంచంలో కోడి మాంసం ఎక్కువగా ఉత్పత్తి చేసే దేశాల్లో ఎఫ్‌ఏఓ సంస్థ 2021 వివరాల ప్రకారం భారత్‌ ఆరవ స్థానంలో ఉంది. అమెరికా 2,06,52,971 టన్నులతో మొదటి స్థానంలో, చైనా 1,47,00,000, బ్రెజిల్‌ 1,46,36,478, రష్యా 46,17,338, ఇండోనేషియా 38,44,346,భారత్‌ 36,70,156 టన్నులతో, తొలి పది స్థానాల్లో మన తరువాత మెక్సికో, జపాన్‌, అర్జెంటీనా,టర్కీ ఉన్నాయి.చైనా, మనదేశం జనాభాలో ఒకే విధంగా ఉన్నప్పటికీ జనాభా కొనుగోలు శక్తి ఎక్కువ గనుక చైనా ఇంకా దిగుమతి చేసుకుంటోంది.మన దగ్గర ఉత్పత్తి అవుతున్న కోడి మాంసం, గుడ్లనే పూర్తిగా వినియోగించలేని స్థితిలో ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నాం.2014-2019 సంవత్సరాల్లో తలసరి సగటు కోడి మాంస వినియోగం చైనాలో 12.1 నుంచి 14.9 కిలోలకు పెరగ్గా మన దేశంలో 2.49 నుంచి 3.17 కిలోలకు పెరిగింది.పాకిస్తాన్‌లో 5.11 నుంచి 6.8 కిలోలకు పెరిగింది. ప్రపంచంలో 2021లో బహామాస్‌ 70.2 కిలోలతో ప్రధమ స్థానంలో ఉంది.


తాజాగా నరేంద్రమోడీ సర్కార్‌ అమెరికాతో కుదుర్చుకున్న ఒప్పందాలలో భాగంగా అక్కడ తినటానికి తిరస్కరించే కోడి కాళ్లను మన దేశం దిగుమతి చేసుకొనేందుకు, భారీగా పన్ను తగ్గించేందుకు అంగీకరించింది. అమెరికా మోజులో ఉన్న నరేంద్రమోడీకి అక్కడి కోడి కాళ్లు, ఉత్పత్తిదారులు, వారి లాభాలు తప్ప భారతీయ కోడి మాంసం, దాని ఉత్పత్తి, మార్కెటింగ్‌లో భాగస్వాములయే లక్షల మంది రైతులు, కార్మికులు, చిన్న వ్యాపారులు గుర్తుకు రాలేదు. నిత్యం పారాయణం చేసే దేశభక్తి, స్వప్రయోజనాలను తుంగలో తొక్కారా లేక విశ్వగురువుగా నీరాజనాలందుకొనేందుకు అమెరికాకు దాసోహం అన్నారా ? ఏడు సంవత్సరాల క్రితం మన కోళ్ల పరిశ్రమ మార్కెట్‌ విలువ యాభైవేల కోట్లు, 2022లో రు.1,90,530 కోట్లకు పెరిగింది, 2028 నాటికి రు.3,40,780 కోట్లకు చేరుతుందని అంచనా. లక్షలాది మంది ఉపాధి పొందుతున్నారు. ఇలాంటి పరిశ్రమకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పెద్ద దెబ్బ అని భావిస్తున్నారు. అమెరికా నుంచి దిగుమతి చేసుకొనే కోడి మాంసం, ఇతర కొన్ని దిగుమతుల మీద భారీగా పన్నుల తగ్గింపును అడ్డుకొనేందుకు కొందరు సుప్రీం కోర్టుకు వెళ్లనున్నట్లు ప్రకటించారు. కోర్టులో ఎవరు ఏం వాదిస్తారో చెప్పలేము, ప్రభుత్వ విధాన నిర్ణయాలను సాధారణంగా కోర్టులు సమర్ధిస్తాయి. అమెరికాలో కోడి బ్రెస్ట్‌ తప్ప కాళ్లు, లివరు తినరు, అందువలన వారికి పనికిరాని వాటిని ఇతర దేశాలకు చౌకగా ఎగుమతి చేస్తారు. అవి ఆయా దేశాల పరిశ్రమను దెబ్బతీస్తాయి గనుక అనేక దేశాలు రక్షణ చర్యలు తీసుకుంటున్నాయి. అమెరికా కోళ్లు, బాతుల మాంసంతో పాటు యాపిల్స్‌, బాదం పప్పు, కాబూలీ(పెద్ద) సెనగలు, కాయధాన్యాలు తదితర వ్యవసాయ ఉత్పత్తులపై మనదేశం భారీగా దిగుమతి పన్ను తగ్గించనుంది. దిగుమతి చేసుకొనే ఉత్పత్తులతో గతంలో పంటలు, పర్యావరణాన్ని దెబ్బతీసే కలుపు మొక్కలు, తెగుళ్ల వంటివి మన దేశానికి వచ్చాయి.1950లో పిఎల్‌ 480 పేరుతో అమెరికా అందచేసిన నాసిరకం గోధుమలతో పాటు వయ్యారి భామ, కాంగ్రెస్‌ గడ్డి అని పిలిచే పార్థీనియం అనే విషపూరితమైన కలుపు మొక్క మన దేశానికి వచ్చింది.అదే విధంగా ప్రపంచంలోని అనేక దేశాల్లో ఇది వ్యాపించింది. దీని వలన మనుషులకు చర్మ, శ్వాస సంబంధమైన రుగ్మతలు కలుగుతాయని తేలింది.


2022లో అమెరికాలో బర్డ్‌ ఫ్లూ అనే వ్యాధితో కోట్లాది కోళ్లు మరణించాయి. వాటితో పాటు ఆ వ్యాధి మనుషులకూ వ్యాపిస్తుంది. అలాంటి అవకాశం ఉన్న చోట నుంచి కోడి, బాతు మాంస ఉత్పత్తులను దిగుమతికి నరేంద్రమోడీ సర్కార్‌ తలుపులు బార్లా తెరిచి జనాల ఆరోగ్యానికి కూడా హాని తలపెట్టినట్లు అనేక మంది భావిస్తున్నారు. రెండవది అమెరికాలో కోళ్ల దాణా పశు, పంది మాంసం, ఎముకల నుంచి తయారు చేస్తారు. అలాంటి వాటితో పెంచిన కోళ్ల మాసం తినేందుకు అనేక మంది మనోభావాలు అంగీకరించవు. మోడీ సర్కార్‌ వాటిని పట్టించుకోలేదు.ఈ దాణాతో పెంచిన కోళ్ల, బాతుల మాంసం అని వాటి ఉత్పత్తుల మీద ప్రకటిస్తారో లేదో తెలియదు. ఒక వేళ ప్రకటించినప్పటికీ వినియోగదారులకు అలా ముద్రించిన పాకెట్లలో సరఫరా చేస్తే అదొక దారి. హౌటళ్లలో వాటిని వడ్డిస్తే వినియోగదారులు కనుక్కోలేరు.దేశ కోళ్ల పరిశ్రమ రైతులకు హానికలిగించే ఈ ఏకపక్ష నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీం కోర్టుకు వెళ్లనున్నట్లు భారత కోళ్ల పరిశ్రమ ఫెడరేషన్‌ అధ్యక్షుడు రాణ్‌పాల్‌ ధండా చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అమెరికన్‌ కంపెనీల లాభాలను కాదు, దేశంలోని రైతుల ప్రయోజనాలను చూడాలని అన్నారు.ఈ నిర్ణయంతో అమెరికా ఉత్పత్తిదారులకు మరిన్ని అవకాశాలు పెరుగుతాయని, ఉత్పత్తులు మరింతగా భారత్‌లో అందుబాటులోకి వస్తాయని అమెరికా వాణిజ్య ప్రతినిధి కాథరీన్‌ తారు ప్రకటించారు.బాదం పప్పు, సెనగలు, కాయధాన్యాలు, యాపిల్స్‌ దిగుమతుల మీద పన్ను పెంచాల్సిందిపోయి తగ్గించటం నరేంద్రమోడీ సర్కార్‌ రైతుల ప్రయోజనాలను దెబ్బతీయటమే అని, ఈ ఉత్పత్తులపై అమెరికా ఇచ్చే ఎగువుతి సబ్సిడీలకు వ్యతిరేకంగా ప్రపంచ వాణిజ్య సంస్థలో మనదేశంతో కలసి పోరాడిన దేశాలను కేంద్ర ప్రభుత్వం మోసం చేయటం తప్ప మరొకటి కాదని రాష్ట్రీయ కిసాన్‌ మహాసంఫ్‌ు జాతీయ సమన్వయకర్త కెవి బిజు అన్నారు.ఈ నిర్ణయం వలన కాశ్మీర్‌, హిమచల్‌ ప్రదేశ్‌, మధ్య ప్రదేశ్‌ రైతుల ప్రయోజనాలు దెబ్బతింటాయన్నారు. అమెరికా, ప్రపంచబాంకు వత్తిడికి లొంగి ఇలాంటి నిర్ణయాలు తీసుకొనేందుకు తీసుకు వచ్చిన మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా పోరాడి వాటిని తిప్పి కొట్టేందుకు రైతాంగాన్ని కదిలించిస సంయుక్త కిసాన్‌ మోర్చా, ఇండియా కూటమి కూడా కేంద్ర నిర్ణయాన్ని ప్రశ్నించింది. భారత్‌లో టర్కీ కోడి మాంసంపై ప్రస్తుతం ఉన్న 30శాతం దిగుమతి పన్నును ఐదు శాతానికి తగ్గిస్తారని అమెరికా పార్లమెంటు సభ్యురాలు అమీ క్లోబుచర్‌ ప్రకటించారు.


తమ కోళ్ల ఉత్పత్తులను మనదేశంలో కుమ్మరించేందుకు అమెరికా చాలా కాలం నుంచి చూస్తోంది. బెదిరింపు, వత్తిడి వంటి అనేక రూపాల్లో అది ప్రయత్నించి చివరికి అనుకున్నది సాధించింది.2007లో మన్మోహన్‌ సింగ్‌ ప్రధానిగా ఉన్న నాటి యుపిఏ ప్రభుత్వం అమెరికా కోళ్ల ఉత్పత్తులపై నిషేధం విధించింది. అది చెల్లదంటూ అమెరికా ప్రపంచ వాణిజ్య సంస్థలో కేసు దాఖలు చేసింది.అమెరికా తన కోళ్ల ఉత్పత్తుల్లో 15 నుంచి 20శాతం వరకు ఎగుమతులు చేస్తున్నది.2014లో అమెరికా కేసు గెలిచింది. అధికారానికి వచ్చిన కొత్త రోజులు గనుక మోడీ సర్కార్‌ ఆ తీర్పును అమలు చేసేందుకు భయపడింది.ప్రపంచ వాణిజ్య సంస్థ ద్వారా భారత్‌ మీద ఆంక్షలను విధింపచేయిస్తామని అమెరికా బెదిరించటంతో కేంద్ర ప్రభుత్వం చికెన్‌లెగ్స్‌ దిగుమతులకు అనుమతిస్తున్నట్లు 2017లో తెలిపింది. నిజానికి మన దేశంలో ఉత్పత్తి అవుతున్న చికెన్‌ మాంసం, గుడ్లు అవసరాలకు మించి ఉండటంతో 2016-17లోనే రు.532 కోట్ల మేరకు వివిధ దేశాలకు ఎగుమతి చేశాము. నరేంద్రమోడీ రెండవ సారి విజయం సాధించిన తరువాత నాటి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఒకవైపు మోడీని పొగడ్తలు, ఆలింగనాలతో ముంచెత్తుతూనే మరోవైపు మరింత వత్తిడి పెంచాడు. అప్పటి వరకు మన దేశం నుంచి అమెరికాకు ఎగుమతి చేస్తున్న వస్తువుల మీద జిపిఎస్‌ పేరుతో 600 కోట్ల డాలర్ల మేర ఇస్తున్న దిగుమతిపన్ను రాయితీలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించాడు.దానికి ప్రతిగా మన దేశం కూడా అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్న యాపిల్స్‌ వంటి 28రకాల వస్తువులపై దిగుమతి పన్ను పెంచింది. మన మార్కెట్‌ను మరింతగా తెరవాలని డిమాండ్‌ చేస్తున్న అమెరికా ఇంతవరకు జిపిఎస్‌ను పునరుద్దరించలేదు.ట్రంప్‌ పోయి బైడెన్‌ వచ్చినా జరిగిందేమీ లేదు గానీ మనదేశం మాత్రం అమెరికా వస్తువుల మీద విధించిన పన్నులను మోడీ సర్కార్‌ తాజాగా తగ్గించింది. అమెరికా-చైనా వాణిజ్యపోరుతో మన దేశం లబ్దిపొందవచ్చని కొందరు ఆశించారు.అది కార్యరూపందాల్చలేదు. తొలి రోజుల్లో అమెరికా మీద మోడీ సర్కార్‌ చూపిన పరిమిత ప్రతిఘటన తరువాత నీరుగారింది. ఇప్పుడు పూర్తిగా లొంగిపోయింది. నిజానికి నరేంద్రమోడీ జూన్‌ నెలలో అమెరికా వెళ్లినపుడే పన్నుల తగ్గింపు నిర్ణయం తీసుకున్నారు, సెప్టెంబరులో వెల్లడించారు.


కోళ్ల పరిశ్రమలో మార్కెట్‌ను మరింత తెరిచారు. రైతాంగ స్పందన చూసిన తరువాత అమెరికా, ఐరోపా, ఇతర దేశాల నుంచి పాల ఉత్పత్తులను అనుమతించి పాడి పరిశ్రమకూ మంగళం పాడేందుకు చూస్తున్నారు. అన్నీ ఒకేసారి చేస్తే ప్రతిఘటన తీవ్రంగా ఉంటుంది గనుక దశలవారీ నిర్ణయాలు తీసుకుంటారు. మన దేశంలో పాల పదార్ధాల ధరల్లో సగానికి దిగుమతి చేసుకున్నవాటిని విక్రయిస్తారని గతంలోనే అనేక మంది చెప్పారు.2020లో మన దేశంలో పాలపొడి ధర కిలో రు.130 నుంచి 150వరకు ఉండగా 30శాతం దిగుమతి పన్నుతో సహా అమెరికా నుంచి రు.70కే దిగుమతి చేసుకోవచ్చని తేలింది. ఇప్పుడు కూడా ధరల్లో మార్పులు ఉండవచ్చు తప్ప విదేశాలు ఇచ్చే సబ్సిడీలు భారీ ఎత్తున ఉంటాయి.చైనాతో అమెరికా 2018లో ప్రారంభించిన వాణిజ్య యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. అందువలన అమెరికన్లు తమ వస్తువులకు కొత్త మార్కెట్లకోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
అమెరికా వత్తిడిని అడ్డుకొనేందుకు మనసుండాలేగానీ మార్గం దొరక్కపోదు.గతంలో మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం అమెరికాలో వ్యాపించిన బర్డ్‌ ఫ్లూను పేర్కొంటూ కోళ్ల ఉత్పత్తుల దిగుమతులను నిషేధించింది. నరేంద్రమోడీ ఆంక్షలను, దిగుమతి పన్నులను సడలిస్తున్న సమయంలో అమెరికాలోని వాణిజ్య పౌల్ట్రీ ఫారాల్లో ఫ్లూ కనిపించింది. 2022 నుంచి ఇప్పటి వరకు ఈ వ్యాధికి అక్కడ 5.88 కోట్ల కోళ్లు, టర్కీ కోళ్లు మరణించినట్లు 2023 అక్టోబరు పదవ తేదీన రాయిటర్స్‌ వార్తా సంస్థ పేర్కొన్నది. అమెరికాలో అతి పెద్ద గుడ్ల ఉత్పత్తి సంస్థ కాల్‌ మైన్‌ ఫుడ్స్‌ విక్రయించే గుడ్ల ధర గత ఏడాది కాలంలో 48శాతం పడిపోయింది. సెప్టెంబరు రెండవ తేదీనాటికి అంతకు ముందు నాలుగు నెలల్లో అమ్మకాలు 30శాతం పడిపోయినట్లు పేర్కొన్నది. బర్డ్‌ ఫ్లూ మనుషుల్లో కూడా సులభంగా వ్యాప్తి చెందవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్ధ, ప్రపంచ జంతు ఆరోగ్య సంస్థకూడా జూలైనెలలో హెచ్చరికలు జారీచేశాయి. 2022లో 67దేశాల్లో వ్యాధికారణంగా 13 కోట్ల కోళ్లను వధించటం లేదా మరణించినట్లు లెక్కలు ఉన్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు మరో 14దేశాల్లో వ్యాధి కనిపించింది. అందువలన ఈ కారణంగా కూడా అమెరికా ఉత్పత్తులను అడ్డుకోవచ్చు.


అమెరికా నుంచి దిగుమతి చేసుకొనే వాటి మీద దిగుమతి పన్ను ఐదు నుంచి పదిశాతానికి పరిమితం చేసేందుకు కేంద్రం అంగీకరించింది. అయితే ఇది ఒక్క అమెరికాకే కాదు, ప్రపంచ వాణిజ్య సంస్థలో ఉన్న అన్ని దేశాలకూ అదే రేటు వర్తిస్తుంది. గతంలో దిగుమతి చేసుకున్న కోడి కాళ్ల మీద మన ప్రభుత్వం వందశాతం పన్ను విధించేది. తరువాత దాన్ని 35 నుంచి 45శాతానికి తగ్గించింది. వచ్చే ఆరునెలల్లో ఐదు, పదిశాతాన్ని ఏ వస్తువు మీద ఎంత అనేది నిర్దిష్టంగా నిర్ణయిస్తారు. అందుకే ఈ లోగా పన్ను తగ్గింపు నిర్ణయాన్ని సుప్రీం కోర్టులో సవాలు చేసేందుకు కొందరు పూనుకున్నారు. వందశాతం పన్ను విధించినప్పటికీ భారీ మొత్తాలు సబ్సిడి ఇస్తున్న అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న చికెన్‌ లెగ్స్‌ మనదేశంలో ఉన్న ప్రస్తుతం ఉన్న ధరల కంటే తక్కువకే దొరుకుతాయని అది మన పరిశ్రమకు తీరని దెబ్బ అని సంయుక్త కిసాన్‌ మోర్చా హెచ్చరించింది.అమెరికాలో చికెన్స్‌ లెగ్స్‌ ఉత్పాదన ఖర్చు టన్నుకు 700 నుంచి 800 డాలర్లు ఉంటుందని, వందశాతం పన్ను విధిస్తే 1,500 నుంచి 1,600 డాలర్లకు దిగుమతి చేసుకోవచ్చని, మన దేశంలో టన్ను ఉత్పత్తి ఖర్చు 1,800 డాలర్లుగా ఉందని ఒక ప్రకటనలో పేర్కొన్నది. అదే ఐదు, పదిశాతం పన్ను మాత్రమే విధిస్తే ఎంత చౌకగా మన మార్కెట్‌ను ముంచెత్తుతారో ఊహించుకోవాల్సిందే.

Share this:

  • Tweet
  • More
Like Loading...

జాడలేని భారత ఉత్పత్తి, తయారీ – చైనాతో వాణిజ్యలోటుపై కొత్త డ్రామాకు తెరతీసిన మోడీ సర్కార్‌ !

27 Friday Oct 2023

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, Europe, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, Uncategorized, USA

≈ Leave a comment

Tags

BJP, Boycott of goods made in China, India Trade with China, Make In India, Narendra Modi Failures, Niti Aayog, Ten years Narendra Modi rule


ఎం కోటేశ్వరరావు


2018 ఏప్రిల్‌ నెలలో మన ప్రధాని నరేంద్రమోడీ చైనాలోని ఊహాన్‌ నగరంలో చైనా నేత షీ జింపింగ్‌తో కలసి ఊయల ఊగేందుకు వెళ్లారు. అప్పుడు నీతి ఆయోగ్‌ ఒక పత్రాన్ని ప్రధాని బృందానికి సమర్పించింది. దానిలో ఏం చెప్పిందంటే గడచిన దశాబ్దకాలంలో చైనాతో వాణిజ్యలోటు పదమూడు రెట్లు పెరిగిందనీ, పాత స్వేచ్చావాణిజ్య ఒప్పందాలను సమీక్షించాలని, నూతన ఒప్పందాల్లో ఏదైనా ఉపేక్ష ఉంటే అది మన మార్కెట్లను దెబ్బతీస్తుందని, భారత్‌ పట్ల చైనా ఔదార్యాన్ని ప్రదర్శించాల్సిన సమయం వచ్చిందని, చైనాతో మనదేశం జాగ్రత్తగా ఉండాలని సలహా ఇచ్చింది. మంచిదే, అంతకంటే కావాల్సిందేముంది ! ఇప్పటికి ఐదున్నర సంవత్సరాలు గడిచాయి. జరిగిందేమిటి ? రెండు దేశాల మధ్య కొత్త ఒప్పందాలేమీ కుదరలేదు. ఉన్నవి రద్దు కాలేదు. 2004-05నుంచి 2013-14 మధ్య కాలంలో 148 కోట్ల డాలర్లుగా ఉన్న చైనా-భారత వాణిజ్య లోటు 3,621కోట్లకు చేరిందని, అది 2,346శాతం పెరుగుదల అని అప్పటి నుంచి తమ ఏలుబడిలో 2021-22 నాటికి 7,331 కోట్లకు అంటే కేవలం వందశాతమే పెరిగిందని రాజ్యసభకు వెల్లడించిన సమాచారంలో కేంద్ర మంత్రి పియూష్‌ గోయల్‌ సమర్ధించుకున్నారు. మరుసటి ఏడాది అంది పదివేల కోట్ల డాలర్లకు చేరింది.ఈ ఏడాది తొలి ఆరునెలల్లో 5,653 కోట్ల డాలర్లు ఉంది.చైనాతో వాణిజ్య లోటును తగ్గించేందుకు అవసరమైన సూచనలు చేసేందుకు నవంబరు ఏడవ తేదీలోపు దరఖాస్తులు చేసుకోవచ్చని నీతి ఆయోగ్‌ సంస్థ తాజాగా కన్సల్టెన్సీ సంస్థలను కోరింది. రెండు రకాల అధ్యయనాలు చేస్తారట.సిఫార్సులు చేయటం, నివేదికలను రూపొందించటం తప్ప అధికారాలు లేని ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థను నరేంద్రమోడీ ప్రణాళిక సంఘాన్ని రద్దుచేసి నెలకొల్పారు.


వాస్తవానికి చైనా నుంచి విధిగా దిగుమతులు చేసుకోవాలనే ప్రత్యేక ఒప్పందమేమీ మనదేశానికి లేదు. మనకు అవసరం ఎక్కువగా ఉంది గనుక అక్కడి నుంచి తెచ్చుకుంటున్నాం, వారికి మన నుంచి పెద్దగా దిగుమతులు అవసరం లేదు గనుక లోటు పెరుగుతోంది. అందువలన వాణిజ్య లోటు తగ్గించాలన్నా పూర్తిగా లేకుండా చేయాలన్నా చైనా నుంచి దిగుమతులను నిలిపివేస్తే సరిపోతుంది. లేదా మన ఎగుమతులు పెంచాలి. గత పదేండ్లుగా ఈ రెండూ చేతగాని స్థితిలో మోడీ దేశాన్ని ఉంచారా ? ఏం చేయాలో నీతి అయోగ్‌ సంస్థకు తెలియదా ? కొన్ని కోట్లు సమర్పించుకొని సలహలను కొనుక్కోవాలా ? లడక్‌ సరిహద్దులో జరిగిన ఘర్షణ ఉదంతాల తరువాత మన దేశంలో అనేక మంది మనం చైనా నుంచి దిగుమతులను నిలిపివేస్తే అది మన కాళ్ల దగ్గరకు వస్తుందని చెప్పారు. ఇంతకాలం రికార్డు స్థాయిలో తన రికార్డులను తానే బద్దలు కొట్టుకొని నరేంద్రమోడీ సర్కార్‌ దిగుమతులకు అనుమతులు ఇచ్చింది. స్టాటిస్టా సంస్థ వివరాల ప్రకారం 2022లో మన దేశం చేస్తున్న ఎగుమతుల్లో 18.5శాతం అమెరికాకు, 6.65శాతం యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌కు, మూడవ స్థానంలో ఉన్న చైనాకు 5.04శాతం ఉన్నాయి. ఇదే కాలంలో చైనా ఎగుమతుల్లో 16.2శాతం అమెరికాకు ఆరవ స్థానంలో ఉన్న మన దేశానికి 3.29శాతమే ఉన్నాయి. అందువలన మనం దిగుమతులు, ఎగుమతులు నిలిపివేస్తే అరిటాకు మీద ముల్లు సామెత అవుతుంది. పదేండ్లుగా చెబుతున్న మేకిన్‌ ఇండియా(భారత ఉత్పత్తి), మేడిన్‌ ఇండియా(భారత తయారీ), ఆత్మనిర్భరత పిలుపుల వలన జరిగిందేమీ లేదు. 2022-23లో మన జిడిపిలో ఉత్పాదకరంగం వాటా 14.7శాతం, మోడీ ఏలుబడి పది సంవత్సరాల్లో దీనికి అటూ ఇటూగానే ఉంది తప్ప 25శాతానికి పెంచాలన్న లక్ష్యం ఎండమావిగానే ఉంది. పన్నెండు రంగాలలో దేశాన్ని ఉత్పత్తి కేంద్రంగా మార్చేందుకు సలహాలు ఇవ్వాలని నీతి అయోగ్‌ కోరుతున్నది. చైనా నుంచి దిగుమతులను తగ్గించాలని 2018లోనే నీతి అయోగ్‌ చెప్పింది కదా ! పోనీ అప్పుడే ఎందుకు అడగలేదు ? తగ్గించకపోగా ఎందుకు పెంచినట్లు ? ఇప్పుడు జనాన్ని మభ్య పెట్టేందుకు తన వైఫల్యాలను దాచిపెట్టేందుకు నీతి అయోగ్‌ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఆడుతున్న ఒక నాటకం తప్ప ఇది మరొకటి కాదు. అమెరికా, జర్మనీ వంటి దేశాలు మేము చైనా మీద ఆధారపడకుండా ఉండలేంగానీ మీరు ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు ప్రోత్సహిస్తామని మనలను మునగచెట్టు ఎక్కిస్తున్నాయి.


వాటికే సాధ్యం కానిది మనకెలా కుదురుతుంది ! చైనా నుంచి దిగుమతి చేసుకొనే వస్తువులు ఎక్కడైనా దొరుకుతాయి. మరి ఎందుకు ఇతర దేశాల నుంచి తెచ్చుకోవటం లేదంటే చైనా మాదిరి తక్కువ ధరలకు మరొకదేశమేదీ ఇవ్వదు. అధిక ధరలకు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటే మన చేతి చమురు మరింత వదులుతుంది.ద్రవ్యోల్బణం, ధరలు పెరుగుతాయి. మన జనం కొనాలంటే జిఎస్‌టి పెంచుతారు, విదేశాలకు పద్నాలుగు రకాల వస్తువులను చౌకగా ఎగుమతి చేసేందుకు జనం సొమ్ము రెండు లక్షల కోట్ల రూపాయల మేర సబ్సిడీ ఇస్తున్నా ఎదుగూబొదుగూ లేదు. చైనాను పక్కకు నెట్టి ఆ స్థానాన్ని మనదేశం ఆక్రమిస్తుందని చెప్పటం పరిణితిలేనితనమని ఆర్‌బిఐ మాజీ గవర్నర్‌ రఘురామ రాజన్‌ గతంలో చెప్పాడు. ఐఎంఎఫ్‌ తాజా అంచనా ప్రకారం 2028నాటికి మన జిడిపి 5.94లక్షల కోట్ల డాలర్లకు చేరుతుందని, అదే చైనాలో 23.61లక్షల కోట్ల డాలర్లు ఉంటుంది. కానీ కొందరు అప్పటికి మన దేశం చైనాను అధిగమిస్తుందని చెబుతుంటే మరి కొందరు నిజమే కామోసనుకుంటున్నారు. ఎవరి నమ్మకం వారిది ? వినేవారుంటే చెప్పేవారికి కొదవ ఉండదు. చైనా వ్యతిరేక కళ్లద్దాలను పెట్టుకొని చూస్తే అలాగే కనిపిస్తుంది మరి ! గోల్డ్‌మాన్‌ శాచస్‌ సంస్థ అంచనా ప్రకారం 2075 నాటికి చైనా 57లక్షల కోట్ల డాలర్లతో ప్రధమ స్థానంలో 52.5లక్షల కోట్ల డాలర్లతో మనదేశం రెండవదిగా 51.5లక్షల కోట్ల డాలర్లతో అమెరికా మూడవ స్థానంలో ఉంటుందని చెప్పింది. ఇవన్నీ అంచనాలు తప్ప యాభై ఏండ్ల తరువాత రాజెవరో రెడ్డెవరో !


ప్రపంచం రక్షణాత్మక చర్యలు తీసుకుంటోందని, చైనా మీద ఇప్పటికే అమెరికా వాణిజ్యపోరు ప్రారంభించిందని, చైనా మీద అన్ని వైపుల నుంచి వత్తిడి పెరుగుతున్నందున దాన్ని అవకాశంగా మలుచుకోవాలని, మనదేశం చైనా వస్తువులకు మార్కెట్‌ను తెరవకూడదని నీతి అయోగ్‌ 2018 పత్రంలో స్పష్టంగా పేర్కొన్నది. చైనా వస్తువులను మన దేశంలో కుమ్మరించటం గాకుండా చైనా తమ దేశంలో తయారు చేస్తున్నవాటిని మన దేశంలో కూడా పెట్టుబడులు పెట్టి, మన కంపెనీలతో కలసి తయారు చేయించాలని నరేంద్రమోడీకి సలహా ఇచ్చింది. అలా చేస్తే దానికి బదులు ప్రపంచంలో ఇతర దేశాల రక్షణాత్మక చర్యలకు వ్యతిరేకంగా మనదేశ సహాయాన్ని చైనా కోరే అవకాశం ఉందని కూడా చెప్పింది. తెలివితేటలకు తక్కువేం లేదు. అదైనా చేశారా ? లడక్‌ సరిహద్దు ఉదంతం తరువాత చైనాను ఒక శత్రుదేశంగా పరిగణిస్తున్న సంగతి తెలిసిందే.పోనీ మనలను ఎగదోస్తున్న అమెరికా, ఇతర ఐరోపా దేశాలు మనకేమైనా సాయం చేస్తున్నాయా ? తమ దేశంలో ఒక సిక్కు ఉగ్రవాదిని భారత్‌ దేశమే హత్య చేయించిందన్న కెనడా ఆరోపణకు అమెరికా, ఐరోపా దేశాలు మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే.


ప్రతి దేశం తన ప్రయోజనాలను తాను చూసుకుంటున్నది, తన పరిస్థితిని బట్టి అభివృద్ధి వ్యూహాన్ని రూపొందించుకోవాలి తప్ప చైనా దెబ్బతింటే మనకు అవకాశం వస్తుందని చెప్పేవారి మాటలు వింటే జరిగేదేమీ ఉండదని ఇప్పటికే తేలిపోయింది. ఇతర దేశాల వైఫల్యాల కారణంగా చైనా నేడు ఈ స్థితికి రాలేదు. తన స్వంత విధానాలను రూపొందించుకుంది. కరోనా నిరోధానికి అక్కడ అమలు జరిపిన కఠిన ఆంక్షలు కొంత మేరకు వృద్ధిని దెబ్బతీశాయి తప్ప అనేక మంది ఆశించినట్లు కుప్పకూలలేదు, ఇప్పుడు అలాంటి మాటలు చెప్పేవారి నోళ్లు మూతపడ్డాయి. నాలుగు సంవత్సరాల నాడు ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పంద(ఆర్‌సిఇపి) చర్చల నుంచి మనదేశం వైదొలిగిన తరువాత మనం సాధించిందేమీ లేదు. 2022 జనవరి నుంచి ఆ ఒప్పందం అమల్లోకి వచ్చింది. దానిలో చేరాలని తాజాగా బంగ్లాదేశ్‌, శ్రీలంక దరఖాస్తు చేసుకున్నాయి. దానిలో మనం చేరితే దిగుమతి వ్యాపారం చేసే శక్తులు లాభపడతామని భావిస్తుండగా నష్టపోతామని పారిశ్రామిక రంగం వ్యతిరేకిస్తోంది. మన దేశానికి తలుపులు తెరిచే ఉంచామని ఆ కూటమి పదే పదే చెబుతోంది.


అసలు చైనాతో మనదేశం పూర్తిగా తెగతెంపులు చేసుకోగలదా ? చైనా సంస్థలను నిరోధించగలదా ? చైనా నుంచి వస్తు దిగుమతులను నిలిపివేయవచ్చు. అదే జరిగితే ఆ దిగుమతులతో లబ్ది పొందుతున్న ఫార్మా, ఇతర రంగాల కార్పొరేట్ల నుంచి ప్రతిఘటన ఎదురవుతుంది. చైనా సభ్యురాలిగా ఉన్న ఆసియన్‌ డెవలప్‌మెంట్‌ బాంక్‌(ఎడిబి), ఏఐఐబి, ప్రపంచబాంకు వంటి ఆర్థిక సంస్థలలో మనదేశం కూడా భాగస్వామి. వాటి నుంచి రుణాలు తీసుకొని మనదేశంలో అమలు జరిపే ప్రాజెక్టులలో కాంట్రాక్టులను దక్కించుకొనేందుకు చైనా సంస్థలకు హక్కు ఉంటుంది. వాటికవి దూరంగా ఉంటే లేదా నిబంధనలను ఉల్లంఘిస్తే తప్ప నిరాకరించటానికి కుదరదు. గాల్వన్‌ ఉదంతాల తరువాత ఢిల్లీ-మీరట్‌ రాపిడ్‌ రైల్‌ మార్గంలో చైనా కంపెనీల కాంటాక్టులను రద్దు చేయాలని ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ స్వదేశీ జాగరణ మంచ్‌ తదితర సంస్థలు ఆందోళన చేసినప్పటికీ కుదరలేదు.ఎందుకంటే అవసరమైన నిధులను ఏడిబి నుంచి రుణాలుగా తీసుకున్నారు. చైనా కంపెనీలు పూర్తి చేసిన మార్గాన్నే ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించారు. మన దేశంలో దాదాపు ఎనిమిది వందల చైనా కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి. స్నాప్‌డీల్‌, ఫ్లిప్‌కార్ట్‌, బైజూస్‌,స్విగ్గీ, జొమాటో,ఉడాన్‌, ఓలా,పేటియం, పేటియం మాల్‌, బిగ్‌బాస్కెట్‌,పోలసీబజార్‌,ఓయో వంటి కంపెనీలలో చైనా పెట్టుబడులు ఉన్నాయి. వాటన్నింటిని తెల్లవారేసరికి వెళ్లిపొమ్మని నరేంద్రమోడీ చెప్పవచ్చు, వాటికవి వెళ్లిపోతే సరే, లేకుంటే నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. దాన్ని ప్రభుత్వం భరిస్తుందా ? ఇష్టం లేదని ఈ రోజు చైనా కంపెనీలను వెళ్లగొడితే మనదేశాన్ని నమ్మి పెట్టుబడులు పెట్టేందుకు ఇతర దేశాల కంపెనీలు ముందుకు వస్తాయా ? పాలకులకు ఇష్టం లేకపోతే రేపు మనకూ అదే గతి అని ఆలోచించవా ? సరిహద్దు వివాదం తరువాత మనం చైనా వైపు తలుపులు మూసుకున్నాం తప్ప ఇతర దేశాల నుంచి సాధించిందీ లేదు, ఏ ఒక్క చైనా కంపెనీ కూడా వెనక్కు వెళ్లిపోలేదు.


చైనా టెక్‌ కంపెనీల ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటే తమ సమాచారాన్ని తస్కరించే అవకాశం ఉందని, రక్షణకు ముప్పని అమెరికా, ఐరోపా దేశాలు చెబుతున్నాయి.ఇప్పుడు మన దేశమూ అదే చెబుతోంది. నిజమే అనుకుందాం. ఇంటెల్‌ వంటి అమెరికా, ఐరోపా కంపెనీల ఉత్పత్తులను దశాబ్దాల తరబడి చైనా దిగుమతి చేసుకుంది.వాటితో చైనాకూ భద్రతా ముప్పు ఉన్నట్లే కదా ! పోనీ మన దేశం చైనా బదులు ఇతర దేశాల నుంచి కొనుగోలు చేస్తే వాటి నుంచి మనకు ముప్పు ఉండదా ? మన సమాచారాన్ని అవి తస్కరించవా ? జపాన్‌ నాగసాకీ నగరంలో 2023 మే నెలలో జరిగిన జి7 దేశాల సమావేశం చైనాతో ఉన్న సరఫరా గొలుసు నుంచి విడగొట్టుకుంటామని చెబుతూ మన దేశాన్ని చైనా స్థానంలోకి నెడతామని చెప్పాయి.వాటిని నమ్ముకుంటే కుక్కతోక పట్టుకొని గోదావరిని దాటేందుకు చూసినట్లే ! దశాబ్దాల తరబడి చైనా నుంచి వస్తువులను దిగుమతి చేసుకున్న పశ్చిమ దేశాలకు ఇప్పుడెందుకు జ్ఞానోదయం కలిగినట్లు ? వాటి మాటలు నమ్మి చైనా అనే కొండను ఢ కొడతామని మనం అనుకోవటం సరైందేనా ? చైనాతో తెగతెంపులు చేసుకుంటే తమ ఆర్ధిక వ్యవస్థలు మెరుగుపడతాయని పశ్చిమ దేశాలు అనుకుంటున్నాయి. అలాంటివి తమ దేశాల్లోనే పరిశ్రమలు, పెట్టుబడులు పెట్టుకుంటాయి తప్ప మనదేశం ఎందుకు వస్తాయి ? చైనా మీద ఆధారపడి చేతులు కాల్చుకున్నామని భావిస్తున్నవారు మన మీద ఆధారపడి మరోసారి అదే తప్పు చేస్తారా ? సొల్లు మాటలను కట్టిపెట్టి ముందు చైనాతో విడగొట్టుకోమనండి !

Share this:

  • Tweet
  • More
Like Loading...

కొనసాగుతున్న ఇజ్రాయెల్‌ మారణకాండ – మధ్యధరాలో చైనా యుద్ధ నౌకలు !

25 Wednesday Oct 2023

Posted by raomk in CHINA, Current Affairs, Europe, History, imperialism, INTERNATIONAL NEWS, Opinion, UK, USA, WAR, Women

≈ Leave a comment

Tags

2023 Israel–Hamas war, China, emmanuel macron, HAMAS attacks 2003, israel massacre, Joe Biden, Rishi Sunak


ఎం కోటేశ్వరరావు


అక్టోబరు ఏడవ తేదీన హమస్‌ సాయుధులు జరిపిన దాడులలో 1400 మరదికి పైగా మరణించారు. దానికి ప్రతీకారం పేరుతో ఇప్పటి వరకు ఇజ్రాయెల్‌ మిలిటరీ, యూదు దురహంకార సాయుధులు పాలస్తీనాలోని గాజా, పశ్చిమగట్టు ప్రాంతాలలో జరుపుతున్న దాడుల్లో మరణాలు, గాయపడిన వారు ఆరు, పద్దెనిమిదివేలు దాటారు. ఇజ్రాయెల్‌ దాడుల్లో మరణించిన వారికి సంతాపం తెలిపేందుకు ఎవరూ ఉండటం లేదనే శీర్షికతో అల్‌ జజీరా పత్రిక వార్త ఇచ్చింది. దానిలో పేర్కొన్నదాని ప్రకారం మంగళవారం నాటికి గాజాలో 2,360 మంది పిల్లలు, 1,119 మంది మహిళలతో సహా 5,791 మంది మరణించారు. గాయపడిన వారు 18వేలు దాటారు. పాలస్తీనాలో ఆక్రమించిన పశ్చిమ గట్టు ప్రాంతంలో ఇజ్రాయెలీ మూకలు మరో 95 మందిని చంపగా 1,650 మంది గాయ పడ్డారు. ఇక హమస్‌ జరిపిన ఒక రోజు దాడిలో1,405 మంది మరణించగా, 5,431 మంది గాయపడ్డారు.వీరు గాక పాలస్తీనాలో 720 మంది పిల్లలతో సహా1,400 మంది కనిపించటం లేదు. పశ్చిమ గట్టు ప్రాంతంలో 1,215 మందిని ఇజ్రాయెల్‌ అరెస్టు చేసింది. బందీలుగా ఉన్న ఇద్దరు ఇజ్రాయెలీ వృద్ద మహిళలను మానవతాపూర్వక వైఖరితో హమస్‌ విడుదల చేసింది. ఇజ్రాయెల్‌ ప్రతీకార ఏకపక్ష దాడులతో ఇరవై మూడులక్షల మంది గాజా పౌరులు నరకయాతన అనుభవిస్తున్నారు. రక్తదాహం తీరని యూదు దురహంకారులు పశ్చిమ దేశాలు ఇస్తున్న మద్దతుతో మరింతగా దాడులు చేసి జనాన్ని మట్టుపెట్టాలని చూస్తున్నారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని స్థితి.


దాడులు, మారణకాండ నివారణలో ఐక్యరాజ్యసమితి విఫలమైంది. ఇజ్రాయెల్‌ పూర్తి యుద్ధ సన్నాహాల్లో ఉంది. ఒక్క గాజా మీదనే గాక ఇరుగుపొరుగు అరబ్‌ దేశాలను రెచ్చగొడుతూ ఉగ్రవాదుల సాకుతో అడపదడపా దాడులు చేస్తున్నది. వాటి తీవ్రతను పెంచేందుకు సరిహద్దుల్లోని తమ గ్రామాల్లో ఉన్న జనాన్ని ఖాళీ చేయిస్తున్నది. దానికి ప్రతిగా లెబనాన్‌ కూడా తన పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నది. ఇజ్రాయెల్‌-అమెరికా కూటమి దేశాల దుండగాలను నివారించేందుకు, పాలస్తీనియన్ల తరఫున అవసరమైతే రంగంలోకి దిగేందుకు ఇరుగు పొరుగు దేశాలు కూడా సిద్దపడుతున్నాయి. మరోవైపున అమెరికా, ఐరోపాలోని అనేక పట్టణాల్లో లక్షలాది మంది జనం వీధుల్లోకి వచ్చి గాజాపై దాడులను నిరసిస్తున్నారు. యూదుల రక్షణ పేరుతో అరబ్బులపై మారణకాండకు పూనుకోవద్దని కోరుతున్న వారిలో యూదులు అనేక మంది ఈ ప్రదర్శనల్లో పాల్గొంటున్నారు. శనివారం నాడు భద్రతా మండలిలో అమెరికా ప్రతిపాదించిన ఒక తీర్మానంలో ఇజ్రాయెల్‌కు ఆత్మరక్షణ చేసుకొనే హక్కు ఉందంటూ సమర్ధనకు పూనుకుంది.దాడుల విరమణకు ఇది సమయం కాదని ప్రకటించింది.గాజాలో జరుపుతున్న కొన్ని దాడులు ఇజ్రాయెల్‌కు ఎదురుదెబ్బకావచ్చని మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా హెచ్చరించాడు.దాడులకు మద్దతు తెలిపేందుకు ఫ్రెంచి అధ్యక్షుడు మక్రాన్‌ మంగళవారం నాడు ఇజ్రాయెల్‌ రాజధాని టెల్‌ అవీవ్‌ చేరుకున్నాడు. అతని కంటే ఘనుడు అన్నట్లు బైడెన్‌, రిషి కంటే మరొక అడుగు ముందుకు వేసి అంతర్జాతీయంగా ఒక్కటై హమస్‌ను అణచివేయాలని పిలుపునిచ్చాడు. తాజా పరిణామాలను చర్చించేందుకు గురువారం నాడు ఐరాస సాధారణ అసెంబ్లీ సమావేశం జరగనుంది.


గాజా ప్రాంతంలో చిక్కుకు పోయిన ఇజ్రాయెల్‌, ఇతర దేశాల పౌరులు రెండువందల మందికి పైగా హమస్‌ చేతుల్లో బందీలుగా ఉన్నారు. వారందరినీ విడుదల చేసిన తరువాతే కాల్పుల విరమణ గురించి మాట్లాడాలని అమెరికా అధినేత జో బైడెన్‌ చెప్పాడు. ఏదో విధంగా వారిని విడిపించుకున్న తరువాత ఇప్పటి వరకు వైమానిక దాడులు జరుపుతున్న ఇజ్రాయెల్‌ తదుపరి దశ పేరుతో భూతల దాడులకు సిద్దం అవుతున్నది. ఇదంతా హమస్‌ను నాశనం చేసే పేరుతో జరుగుతోంది.మరణించిన వారిలో 70 శాతం మంది పిల్లలు,వృద్దులు, మహిళలే ఉన్నారు. అంటే జనం మీదనే దాడి జరుగుతోందన్నది స్పష్టం. మరింతగా పెరిగితే లెబనాన్‌లోని హిజబుల్‌ వంటి సాయుధ శక్తులు ప్రతిదాడులకు సిద్దం అవుతున్నాయి. ఇజ్రాయెల్‌కు మద్దతుగా ప్రత్యక్షంగా దాడులకు దిగేందుకు అమెరికా రంగం సిద్దం చేసుకుంటున్నది. దానికిగాను తమ సైనికులపై దాడులు జరిగినట్లు కట్టుకథలను ప్రచారంలో పెట్టింది. అక్టోబరు 19,20 తేదీలలో ఎమెన్‌ నుంచి తమ మీద, ఇజ్రాయెల్‌పై ప్రయోగించిన డ్రోన్లు, క్రూయిజ్‌ క్షిపణులను కూల్చివేసినట్లు ప్రకటించింది. అదంతా రాత్రి సమయంలో సముద్ర జలాల మీద జరిగింది గనుక ఎలాంటి ఆనవాళ్లు ఉండవని అధికారులు చెప్పారు. నిజానికి ఎమెన్‌లో ఇరాన్‌ మద్దతు ఉన్న హౌతీ సాయుధుల రాడార్‌ కేంద్రాలపై అమెరికా నౌకా దళమే ఎర్ర సముద్రం నుంచి క్షిపణులతో దాడి చేసి రెచ్చగొట్టిందని వార్తలు.ఎమెన్‌ రాజధాని సనా నగరంతో సహా ఉత్తర ప్రాంతం హౌతీల ఆధీనంలో ఉంది. వారి మీద పోరాడుతున్న ఎమెన్‌ ప్రభుత్వానికి 2015 నుంచి సౌదీ అరేబియా మద్దతు ఇస్తున్నది. ఇటీవల చైనా మధ్యవర్తిత్వంలో ఇరాన్‌-సౌదీ మధ్య సయోధ్య కుదిరిన నేపధ్యంలో గతంలో మాదిరి హౌతీ దళాలు సౌదీపై క్షిపణులు ప్రయోగించే అవకాశం లేదు. అందువలన అసలు నిజంగా ప్రయోగించారా లేక ఆ పేరుతో అమెరికా నాటకం ఆడుతోందా అన్న అనుమానాలు తలెత్తాయి. అమెరికా గనుక గాజాపై దాడికి జోక్యం చేసుకుంటే తాము దాడులకు దిగుతామని, గీత దాటవద్దని హౌతీ దళాల నేత అబ్దుల్‌ మాలిక్‌ అల్‌ హౌతీ హెచ్చరించాడు.


ఇప్పటికే మధ్యధరా సముద్ర ప్రాంతంలో ఉన్న పేట్రియాట్‌ గగనతల క్షిపణి బెటాలియన్‌కు తోడు థాడ్‌ రక్షణ వ్యవస్థను కూడా పంపనున్నట్లు అమెరికా వెల్లడించింది. ఇప్పటికే రెండు విమానవాహక యుద్ధ నౌకలు, వాటికి అనుబంధ నౌకలతో పాటు రెండువేల మంది మెరైెన్లను మోహరించింది. శనివారం నాడు కైరోలో జరిగిన శాంతి సమావేశం ఎలాంటి ఫలితం లేకుండానే ముగిసింది. ఇజ్రాయెల్‌ హాజరు కాలేదు. కైరోలోని ఒక జూనియర్‌ అధికారిని అమెరికా పంపింది, అతగాడు నోరువిప్పలేదు.అరబ్‌ నేతలు గాజాపై దాడులను ఖండించారు.ఐరోపా దేశాల నుంచి వచ్చిన వారు దాడుల నుంచి పౌరులను మినహాయించాలని సూచించారు.హిజబుల్లా మీద దాడులకు పూనుకోవద్దని జో బైడెన్‌, ఇతర నేతలు ఇజ్రాయెల్‌కు సూచిస్తున్నారని, అదే జరిగితే తాము కూడా యుద్ధంలో ప్రవేశించాల్సి ఉంటుదని కొన్ని అరబ్బు దేశాలు చెప్పినట్లు వార్తలు వచ్చాయి. పూర్తి స్థాయి యుద్ధమే వస్తే ఇజ్రాయెల్‌ తన దక్షిణ, ఉత్తర భాగంలో దాడులను ఎదుర్కోవాల్సి వస్తుంది, అప్పుడు అమెరికా-ఇరాన్‌ కూడా పాల్గొనే అవకాశం ఉంది. అదే జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. మధ్యధరా సముద్రంలో అమెరికా మిలిటరీ కేంద్రీకరణ నేపధ్యంలో చైనా ఆరు యుద్ధ నౌకలను ఆ ప్రాంతానికి తరలించినట్లు వార్తలు వచ్చాయి. అయితే వీటి గురించి చైనా రక్షణ శాఖ ఒక ప్రకటన చేస్తూ మే నెల నుంచి తమ నౌకలు ఆ ప్రాంతంలో ఉన్నాయని, గత వారంలో ఓమన్‌ నౌకాదళంతో కలసి సంయుక్త విన్యాసాలు సాగించినట్లు పేర్కొన్నది. అవి పూర్తైన తరువాత అక్టోబరు 18వ తేదీన కువైట్‌ రేవు షావయాఖ్‌కు తమ నావల్‌ ఎస్కార్ట్‌ దళాలు వచ్చినట్లు తెలిపింది. వాటిలో నిర్ణీత లక్ష్యాలను ఛేదించే క్షిపణి నౌక, ఫ్రైగేట్‌, ఇతర నౌకలు ఉన్నాయి. చైనా-కువైట్‌ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదిరి ఐదు సంవత్సరాలు అవుతున్నది. పది సంవత్సరాలుగా బిఆర్‌ఐ పధకం కింద పెట్టుబడులు పెట్టింది. చైనా నౌకలు ఎందుకు వచ్చినప్పటికీ ఈ ప్రాంతంలో రాజకీయంగా వాటి ప్రభావం ఉంటుంది. అమెరికా మిలిటరీ శక్తిని చూసి ఆందోళన చెందుతున్న శక్తులకు భరోసా దొరికినట్లు అవుతుంది.


ప్రస్తుతం ఇజ్రాయెల్‌ పరిమితంగా జరుపుతున్న దాడులు, ఒకవేళ వాటి తీవ్రతను పెంచితే రాగల పరిణామాలు, పర్యవసానాల గురించి అమెరికా మదింపు వేస్తోంది. ఇరాన్‌ అందచేసిన డ్రోన్లు, ఇతర ఆయుధాలతో హమస్‌ కంటే పెద్ద శక్తిగా ఉన్న హిజబుల్లా గనుక పోరుకు దిగితే తీవ్ర పరిస్థితి ఏర్పడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.హమస్‌ దగ్గర పరిమితమైన ఆయుధాలు మాత్రమే ఉన్నాయి, శిక్షణ పొందిన హిజ్‌బుల్లా దగ్గర స్వల్ప శ్రేణి ఖండాంతర క్షిపణులు, డ్రోన్లు, మానవరహిత ప్రయోగ వ్యవస్థలు ఉన్నాయి. వాటిని రంగంలోకి దింపితే పోరు తీరే మారిపోతుంది.ప్రస్తుతం అది యుద్ధాన్ని కోరుకోవటం లేదని, అమెరికా, ఇజ్రాయెల్‌ గనుక వారిని ఆవైపుకు నెడితే రంగంలోకి దిగుతుందని పరిశీలకులు అంటున్నారు. బహుశా దానిలో భాగంగానే లెబనాన్‌ సరిహద్దులో ఉన్న హిజబుల్లా సాయుధులపై ఇజ్రాయెల్‌ దాడులు చేసి కవ్విస్తున్నది.2019లో అమెరికా మిలిటరీ గూఢచారుల సమాచారం మేరకు హిజబుల్లా వద్ద లక్షా 50వేల రాకెట్లు, ఇజ్రాయెలీ సంస్థ ఒకటి గతేడాది చెప్పినదాని ప్రకారం రెండువేల మానవరహిత ఆయుధ ప్రయోగ వాహనాలు ఉన్నాయి. వెయ్యి కిలోమీటర్ల దూరం వరకు వెళ్లే ఆయుబ్‌, షాహేద్‌ వంటి క్షిపణులు కూడా ఉన్నాయి. ఇజ్రాయెల్‌ వద్ద అధునాతన వైమానిక దళం ఉన్నప్పటికీ హిజబుల్లా వంటి సంస్థల వద్ద ఉన్న నిఘా, ఇతర పరికరాలతో గురిచూసి విమానాలను కూల్చివేసే అవకాశం ఉంది. ఐరన్‌ డ్రోమ్‌, ఐరన్‌ బీమ్‌ వంటి రక్షణ వ్యవస్థల గురించి ఇజ్రాయెల్‌ ఎప్పటి నుంచో చెబుతున్నప్పటికీ అవి ఎంతవరకు దాడులను నివారించగలవో ఇంతవరకు రుజువు కాలేదు. గడచిన ఏడు దశాబ్దాలుగా పాలస్తీనా యోధులను అణచేందుకు ఇజ్రాయెల్‌ చేయని ప్రయోగం లేదు. కానీ ఎప్పటికప్పుడు కొత్త శక్తులు, గెరిల్లా పద్దతుల్లో దాడులతో తెగబడుతూనే ఉన్నాయి. ఇప్పుడు హమస్‌ను అణచివేయటం కూడా జరిగేది కాదని చెబుతున్నారు. ఇజ్రాయెల్‌ తాను చేయదలచుకున్న విధ్వంసాన్ని నెల రోజుల్లోపల పూర్తి చేయాలని తరువాత అమెరికా అనుమతించే అవకాశం ఉండదని, భూతల దాడికి దిగితే ఇజ్రాయెల్‌ కూడా భారీ సంఖ్యలో సైనికులను కోల్పోతుందని, దాంతో పౌరుల్లో సహనం కూడా నశిస్తుందని ఒక నిపుణుడు చెప్పాడు.2006లో జరిగిన రెండవ లెబనాన్‌ పోరులో హిజబుల్లా పెద్ద సంఖ్యలో ఇజ్రాయెల్‌ సైనికులను హతమార్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అది సామర్ధ్యాన్ని మరింతగా పెంచుకుంది.ప్రస్తుతం లక్ష మంది యోధులున్నట్లు అంచనా. ఇజ్రాయెల్‌ పరిసరాలన్నీ నివురు గప్పిన నిప్పులా ఉన్నాయి. ప్రపంచ శాంతి శక్తులు కోరుతున్నట్లు యూదు దురహంకారులు వెనక్కు తగ్గుతారా అమెరికా, ఐరోపా ధనిక దేశాల అండచూసుకొని మరింతగా మారణకాండకు పాల్పడతారా అన్నది చెప్పలేము.

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనా కరెన్సీలో చమురు డబ్బు డిమాండ్‌ చేస్తున్న రష్యా – పరువు పోతుందని నరేంద్రమోడీ భావిస్తున్నారా ?

22 Sunday Oct 2023

Posted by raomk in BJP, CHINA, COUNTRIES, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, RUSSIA, USA

≈ Leave a comment

Tags

BJP, China, De Dollarisation, Narendra Modi Failures, Russian oil, U.S. Dollar, yuan

ఎం కోటేశ్వరరావు

గత పదేండ్లలో ఎన్నడూ లేని కొత్త ఇరకాటంలో నరేంద్రమోడీ సర్కార్‌ చిక్కుకుందా ? చైనా కరెన్సీలో రష్యాకు డబ్బు చెల్లించి ముడి చమురు కొనుగోలు అవమానకరంగా భావిస్తోందా ? చైనా మీద కోపంతో అధిక ధరలకు ఇతర దేశాల నుంచి కొని జనం మీద భారం మోపేందుకు సిద్దపడుతుందా ? తాజాగా తలెత్తిన పరిస్థితి నుంచి పుట్టుకువస్తున్న అనుమానాలివి. తమ ముడి చమురుకు చైనా యువాన్లు చెల్లించాలన్న రష్యా డిమాండ్‌ను భారత ప్రభుత్వం తిరస్కరించే అవకాశం ఉందని అధికారులు చెప్పినట్లుగా బ్లూమ్‌బెర్గ్‌ మీడియా పేర్కొన్నది. ఉక్రెయిన్‌ సంక్షోభం ప్రారంభమైన తరువాత పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షల కారణంగా రష్యన్లు తమ వద్ద కొనుగోలు చేసే దేశాలకు రాయితీ ధరలకు చమురును విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో గతం కంటే ఎంతో ఎక్కువగా చైనాపై ఆధారపడ్డారు. ఐరోపా యూరోలు, అమెరికా డాలర్లను మార్చుకొనేందుకు ఆంక్షలు అడ్డువస్తున్నందున తమకు చైనా యువాన్లలో చెల్లించాలని రష్యా మన దేశాన్ని కోరింది. దీనికి మనదేశం అంగీకరించే అవకాశాలు లేవని బ్లూమ్‌బెర్గ్‌ వ్యాఖ్యానించింది. అదే జరిగితే రష్యా నుంచి కొనుగోలు నిలిపివేసి డాలర్లు చెల్లించి అధిక ధరకు ఇతర మార్కెట్లో చమురు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. గతంలో ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ యువాన్లలో చెల్లించినప్పటికీ, ఇప్పుడు హిందూస్తాన్‌ పెట్రోలియం, భారత పెట్రోలియం కార్పొరేషన్‌ చెల్లింపుల అంశానికి వస్తే ప్రభుత్వం విముఖంగా ఉందని రాయిటర్స్‌ వార్తా సంస్థ కొద్ది రోజుల క్రితం పేర్కొన్నది. కొత్తగా కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన అభ్యంతరం ఏమిటో తెలియదు. గతేడాది నవంబరు నాలుగున ఒపెక్‌ దేశాల నుంచి మనం కొనుగోలు చేస్తున్న ముడి చమురు పీపా ధర 93.86 డాలర్లు ఉండగా తరువాత మే మూడవ తేదీకి 70.52 డాలర్లకు తగ్గింది.సెప్టెంబరు 29న 97.03 డాలర్లకు పెరిగి తరువాత కాస్త తగ్గి అక్టోబరు 19న 91.71 డాలర్ల వద్ద ఉంది.

చైనాతో సరిహద్దు వివాదంలో ఎలాంటి పురోగతి లేకపోవటం, అంతర్జాతీయ రాజకీయ పరిణామాల్లో చైనాకు వ్యతిరేకంగా పశ్చిమ దేశాలకు మరింత సన్నిహితం కావటం వంటి కారణాలు ఉండవచ్చు. లేదా రూపాయిని అంతర్జాతీయ మారక కరెన్సీగా మారుస్తామన్న మాటల ప్రచార బండారం సంగతేమిటని జనం అడుగుతారన్న భయం కావచ్చు. 2022-23లో రోజుకు 7.8లక్షల పీపాల రష్యా చమురు దిగుమతి చేసుకోగా 2023-24లో ఇప్పటి వరకు 17.6లక్షలకు పెరిగింది. ఈ మేరకు ఒపెక్‌(చమురు ఎగుమతి దేశాలు) నుంచి దిగుమతులు తగ్గాయి. 2022 ఏప్రిల్‌-సెప్టెంబరు కాలానికి మన మొత్తం అవసరాల్లో 63 శాతం ఒపెక్‌ నుంచి దిగుమతి చేసుకోగా ఈ ఏడాది తొలి ఆరునెలల్లో 40శాతానికి తగ్గింది. ఒపెక్‌ దేశాల నుంచి దిగుమతి చేసుకొనే చమురుతో పోలిస్తే తక్కువ ధర, రూపాయల్లో చెల్లింపుల వెసులుబాటు వంటి సానుకూల కారణాలు ఉన్న కారణంగానే మనదేశం రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్నది. మన రూపాయలతో ప్రపంచ మార్కెట్లో ముడి చమురు దొరకదు. అందుకోసం డాలర్లు ఖర్చు చేయాల్సిందే. వాటి బదులు యువాన్లలో చెల్లిస్తే మనకు పడే అదనపు భారం ఉండదు. మన వినియోగదారులకు మేలు కలుగుతున్నపుడు, ఖజానా మీద భారం పడనపుడు ఏ విదేశీ కరెన్సీలో చెల్లిస్తే ఏమిటి ? వివాదాలకు – వ్యాపారానికి సంబంధం లేదంటూ గత రికార్డులన్నింటినీ బద్దలు కొట్టి చైనా నుంచి దిగుమతులు సజావుగానే మనం చేసుకుంటున్నాం.వాటి దగ్గర లేనిది యువాన్ల దగ్గర పట్టుదల అవసరమా ?అంతర్జాతీయ మార్కెట్లో యువాన్లను కొనుగోలు చేయటం అవమానంగా భావిస్తున్నామా ?

ప్రయివేటు సంస్థలు యువాన్లలో చెల్లింపులు జరపటంపై ఎలాంటి నిషేధం లేదని మన ప్రభుత్వం ప్రకటించింది. అయితే అలాంటి లావాదేవీలను ప్రోత్సహించటం గానీ, వీలు కల్పించటం గాని చేసేది లేదని కూడా పేర్కొన్నది. తాము డాలర్లను స్వీకరించేది లేదని, యువాన్లు లేదా రూబుళ్లను చమురు లావాదేవీల్లో అంగీకరిస్తామని రష్యా కంపెనీ గాజ్‌ ప్రోమ్‌ స్పష్టం చేసింది. ప్రపంచ లావాదేవీలు యువాన్లతో జరపాలన్న ప్రతిపాదనల పట్ల మనదేశం సంతోషంగా లేదని ఆర్థికశాఖ అధికారులు చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. ఏ కరెన్సీతో లావాదేవీలు జరపాలన్న అంశం తేలకపోవటంతో రష్యాకు సెప్టెంబరు నుంచి ఏడు టాంకర్ల చెల్లింపులు నిలిచిపోయాయి.ఇప్పటికే తన దగ్గర భారీ మొత్తంలో రూపాయి నిల్వలు ఉన్నందున చమురు చెల్లింపులకు గాను తనకు యువాన్లలో చెల్లించాల్సిందేనని రష్యా పట్టుబట్టింది. తాను చైనా దిగుమతుల మీద ఆధారపడి నందున యువాన్ల అవసరం ఉందని స్పష్టం చేసింది. ఇప్పటికే ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌, ప్రయివేటు చమురుశుద్ధి సంస్థలు కొంత మేరకు చెల్లింపులు జరిపాయి. యుఏఇ దిర్‌హామ్స్‌లో కూడా రష్యాకు చెల్లించాము. కొన్ని రష్యన్‌ కంపెనీలు దిరహామ్స్‌ను కూడా అంగీకరించటం లేదు. పీపా ముడి చమురును 60 డాలర్లకు మించి రష్యా దగ్గర కొనుగోలు చేస్తే అమెరికా ఆంక్షలను అమలు జరుపుతున్న సంగతి తెలిసిందే. మన రూపాయిని అంతర్జాతీయ కరెన్సీగా మారుస్తామని చెబుతున్న తరుణం, సరిహద్దు వివాదం కారణంగా చైనా కరెన్సీలో చెల్లింపులు చేసేందుకు మోడీ సర్కార్‌ ఇబ్బంది పడుతోంది.బ్రిక్స్‌ దేశాల కూటమిలో ఉమ్మడి కరెన్సీ ప్రతిపాదన రాగా మనదేశం మాత్రమే వ్యతిరేకించింది. ఒకవేళ అంగీకరిస్తే యువాను అవుతుందన్నభయం ఉందని వార్తలు. ప్రస్తుతం రూపాయి అంతర్జాతీయ లావాదేవీల్లో పూర్తిగా మారకం కావటం లేదు. అందువలన తన దగ్గర ఉన్న వందల కోట్ల రూపాయలను ఏం చేసుకోవాలని రష్యా అడుగుతోంది. ఇప్పటి వరకు స్థానిక కరెన్సీలో లావాదేవీలు జరిపిన కారణంగా రష్యాకు యువాన్లు వస్తున్నాయి. రష్యా రాయితీల వలన చైనా 10, భారత్‌ 7 బిలియన్ల డాలర్లను పొదుపు చేసుకున్నాయి.ప్రపంచంలో పరిస్థితులు మారుతున్నాయి, వాటికిి ప్రతికూలంగా నడిచే పరిస్థితి మనకు ఉందా అన్నది సమస్య.

అమెరికా డాలరు పెత్తనానికి రోజులు దగ్గర పడుతున్నాయా ? అనేక వైపుల నుంచి వస్తున్న వార్తలు ఏదో జరగబోతోందనే సూచిస్తున్నాయి. తన బిఆర్‌ఐ పధకం కింద గతంలో ఎక్కువగా డాలర్లు ఇచ్చిన చైనా ఇప్పుడు తన కరెన్సీ యువాన్‌ ఇవ్వటం ప్రారంభించింది. అక్టోబరు మూడవ వారంలో ఈ మేరకు అనేక ఒప్పందాలను కుదుర్చుకుంది. రాయిటర్స్‌ వార్తా సంస్థ కథనం ప్రకారం చైనా అభివృద్ధి బాంకు మలేషియా, ఈజిప్టు, పెరూ కేంద్ర బాంకులతో ఒప్పందాలు చేసుకుంది.చైనా ఎగుమతి-దిగుమతి బాంకు సౌదీ నేషనల్‌ బాంకుతో, బాంక్‌ ఆఫ్‌ చైనా ఈజిప్టుకు 47.9 కోట్ల డాలర్ల విలువగల యువాన్‌ పాండా బాండ్లను జారీ చేసింది. సిల్క్‌ రోడ్‌ నిధులకు గాను 80 బిలియన్ల యువాన్లను అదనంగా చైనా పక్కన పెట్టింది. అంతర్జాతీయ లావాదేవీల్లో డాలర్ల వాటా ఎంతో ఎక్కువగా ఉంది. ఆగస్టు నెలలో 83.95శాతంగా ఉన్నది సెప్టెంబరులో 84.15కు పెరిగింది. యూరో వాటా 6.43 నుంచి 5.43శాతానికి తగ్గగా చైనా యువాన్‌ లావాదేవీలు 4.82 నుంచి 5.8శాతానికి చేరి రెండవ స్థానంలో నిలిచింది. తరువాత స్థానాలలో యూరో, జపాన్‌ ఎన్‌, సౌదీ రియాల్‌ ఉన్నాయి.యువాన్‌ వాటా తక్కువే అయినప్పటికీ క్రమంగా పెరుగుతోంది. ఇరవై భాగస్వామ్య దేశాలతో చైనా ఇప్పటి వరకు పదిహేడింటితో యువాన్‌ మార్పిడి ఒప్పందాలు కుదుర్చుకుంది. అర్జెంటీనాలో ఆరున్నర బిలియన్‌ డాలర్ల విలువగల యువాన్‌ మార్పిడి ఒప్పందం చేసుకుంది.అంతర్జాతీయ వాణిజ్యంలో 15శాతం వాటా ఉన్న చైనా కరెన్సీయే అంత తక్కువగా ఉన్నపుడు కేవలం 1.8శాతం వాణిజ్యం ఉన్న మనదేశ కరెన్సీ వాటా ఎంత ఉంటుందో చెప్పనవసరం లేదు.

బ్లాక్‌ మార్కెట్‌ కారణంగా కరెన్సీ మారకపు విలువలో సంభవిస్తున్న హెచ్చు తగ్గుల వలన తమ దేశానికి పదిబిలియన్‌ డాలర్ల మేర నష్టం జరుగుతున్నదని ఇరాక్‌ కేంద్ర బాంకు పెట్టుబడులు, స్వీకరణల డైరెక్టర్‌ జనరల్‌ మజెన్‌ అహమ్మద్‌ చెప్పాడు.డాలరు దిగుమతుల్లో సగం అక్రమంగా జరుగుతున్నవే అన్నాడు. 2023లో స్వీకరించిన డాలరు డిపాజిట్లను వచ్చే ఏడాది ఉపసంహరిస్తామని,2024 జనవరి ఒకటి తరువాత స్వీకరించబోమన్నాడు. ఆంక్షల కారణంగా గత రెండు దశాబ్దాలుగా ఇబ్బందులు పడుతున్న ఇరాక్‌ బ్రిక్స్‌ కూటమిలో చేరాలని, డాలరుతో నిమిత్తం లేకుండా ఆర్ధిక వ్యవస్థ నిర్వహణ జరపాలని చూస్తున్నది.ఆహ్వానం వస్తే బ్రిక్స్‌లో చేరేందుకు సిద్దంగా ఉన్నామని ఇరాక్‌ ప్రధాని మహమ్మద్‌ షియా అల్‌ సుదానీ ప్రకటించాడు.తమ ఆర్థిక వ్యవస్థను వృద్ధి చేసేందుకు అవసరమైన పెట్టుబడుల ఆకర్షణకు వ్యవస్థాగతమైన సంస్కరణలు చేపడుతున్నట్లు, తద్వారా స్థానిక కరెన్సీకి ఆసరా దొరుకుతుందని మలేసియా ప్రధాని అన్వర్‌ ఇబ్రహీం చెప్పాడు. బ్రిక్స్‌ దేశాల స్ఫూర్తితో తమ కరెన్సీ రింగెట్‌ను స్థిరపరిచేందుకు చూస్తామన్నాడు. ఇండోనేషియా, చైనా, థాయిలాండ్‌తో కుదుర్చుకున్న ఒప్పందాలలో రింగెట్‌ను వినియోగిస్తామన్నాడు. డాలరు మీద పూర్తిగా ఆధారపడటం కష్టమన్నాడు.డాలరు బదులు స్థానిక కరెన్సీ బ్రిక్స్‌ దేశాలు గనుక తమతో జరిపే లావాదేవీలలో ముఖ్యంగా ఇంథనానికి తమకు స్థానిక కరెన్సీలలోనే చెల్లింపులు జరపాలని అమెరికా, ఐరోపా దేశాలను డిమాండ్‌ చేస్తే పరిస్థితి ఏమిటి అన్నది ఒక చర్చ. తమకు డాలర్లలోనే చెల్లింపులు జరపాలనేదేమీ లేదని స్థానిక కరెన్సీలను కూడా అంగీకరిస్తామని సౌదీ అరేబియా ప్రకటించింది. బ్రెజిల్‌, రష్యా, భారత్‌, చైనా, దక్షిణాఫ్రికాలతో కూడిన బ్రిక్స్‌ కూటమి న్యూ డెవలప్‌మెంట్‌ బాంక్‌ (ఎన్‌డిబి) ఏర్పాటు చేసింది. రానున్న మూడు సంవత్సరాల్లో సభ్య దేశాలు డాలరు బదులు ఆయా దేశాల కరెన్సీలలో లావాదేవీలు జరుపుకోవాలన్న లక్ష్యాన్ని ప్రకటించింది. ఇప్పటికే ఆయా దేశాల కరెన్సీలలో ఇతర దేశాలకు రుణాలు ఇవ్వాలని సూచించింది. 2026 నాటికి డాలర్‌ పెత్తనం తగ్గటం ప్రారంభమవుతుందని అంచనా.ప్రస్తుతం బ్రిక్స్‌ కూటమి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 30శాతం వాటా కలిగి ఉంది, దాన్ని మరింతగా విస్తరించాలనే యత్నాల్లో ఉన్నారు. ఈ కూటమిలో చేరాలని 40కి పైగా దేశాలు ఆసక్తి కనపరుస్తున్నాయి. సెప్టెంబరులో జరిగిన కూటమి సమావేశంలో సౌదీ అరేబియా, ఇరాన్‌, ఈజిప్టు, ఇథియోపియా,అర్జెంటీనా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ను చేర్చుకోవాలని నిర్ణయించారు. వచ్చే ఏడాది నుంచి అమల్లోకి వస్తుంది. వీటిలో అర్జెంటీనా మినహా ఐదు దేశాలూ చమురు ఎగుమతి దేశాలే అన్నది తెలిసిందే. ఇప్పటి వరకు ఉన్న పశ్చిమ దేశాల పెత్తనం క్రమంగా తూర్పు దేశాలకు వస్తుందని భావిస్తున్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

బంగ్లాదేశ్‌ – పాలస్తీనా విముక్తి అంశంలో బిజెపి రెండు నాలుకల ధోరణి !

21 Saturday Oct 2023

Posted by raomk in BJP, Communalism, COUNTRIES, Current Affairs, Europe, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Religious Intolarence, UK, USA, WAR

≈ Leave a comment

Tags

2023 Israel–Hamas war, HAMAS attacks 2003, Joe Biden, Narendra Modi Failures, Rishi Sunak


ఎం కోటేశ్వరరావు


ప్రపంచంలో అత్యంత ప్రతిభావంతమైన గూఢచారి సంస్థలలో ఒకటైన మొసాద్‌ తమ ప్రభుత్వానికి హమస్‌ దాడుల గురించి ఎందుకు ఉప్పందించలేకపోయిందన్న ప్రశ్నకు దాడి జరిగిన రెండు వారాలకు కూడా ఇజ్రాయెల్‌ ప్రభుత్వం చెప్పలేకపోతోంది. ఇప్పుడు మేం యుద్ధంలో ఉన్నాం వాటి గురించి దర్యాప్తు జరపటం లేదని అధికారులు సమాధానమిస్తున్నారు.స్వజనం, ఇతర దేశాల నుంచి ఎదురవుతున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక తప్పుదారి పట్టించేందుకు అసలు హమస్‌కు ఆయుధాలు ఎక్కడి నుంచి వచ్చాయన్న అంశంపై అనేక కథలను ప్రచారం చేస్తున్నారు. హమస్‌ సంస్థ అధికారంలో ఉన్న గాజా ప్రాంత విస్తీర్ణం 360 చదరపు కిలోమీటర్లు, హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ ఏరియా ఎంతో తెలుసా ? 7,257చదరపు కిలోమీటర్లు. జన సాంద్రత 1,474. గాజా గడచిన పదిహేడు సంవత్సరాలుగా చుట్టూ ఆరుమీటర్ల ఎత్తున ఇనుపకంచెతో అనుమతి లేకుండా జనం బయటకు పోకుండా చేసిన ఒక బహిరంగ జైలు మాదిరి ఉంది. జనాభా ఇరవై మూడు లక్షలు.చదరపు కిలోమీటరుకు 6,507. అలాంటి జనసమ్మర్ధం ఉన్న ప్రాంతం మీద హమస్‌ తీవ్రవాదులను పట్టుకుంటామనే పేరుతో ఇజ్రాయెల్‌ విమానాలతో బాంబులు వేస్తోంది. సగం ప్రాంతాన్ని ఖాళీ చేసి వేరే వైపు వెళ్లమని జనాన్ని నెట్టేస్తోంది.తరువాత మరోసగాన్ని మరోవైపు పంపి నాశనం చేయాలన్నది దాని పథకం. ఇటు వంటి దుర్మార్గాన్ని గట్టిగా కొనసాగించమని అమెరికా అధిపతి జో బైడెన్‌, భారత అల్లుడు, బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ సలహా ఇచ్చి వెళ్లారు.మన ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా వెళ్లలేదు తప్ప ఇజ్రాయెల్‌కు మద్దతు ప్రకటించటం బైడెన్‌, సునాక్‌ అడుగుల్లో అడుగు వేయటమే !


నిజమే హమస్‌కు ఆయుధాలు ఎక్కడి నుంచి వచ్చాయి.ఈ ప్రశ్నకు సమాధానం కోరుతున్న వారు 1947కు ముందు వివిధ దేశాల నుంచి బ్రిటీష్‌ ఆక్రమణలో ఉన్న పాలస్తీనా ప్రాంతంలోకి యూదులు ఎలా వచ్చారు, వారికి ఆయుధాలు ఎలా అందుబాటులోకి వచ్చాయి, మిలిటరీ శిక్షణ ఎవరు ఇచ్చారు అన్న వాస్తవాలు తెలుసుకుంటే పాలస్తీనాకు చెందిన హమస్‌కు అస్త్రాలు ఎక్కడి నుంచి వచ్చిందీ తెలుసుకోవటం అంత కష్టం కాదు. పాలస్తీనా ప్రాంతాన్ని ఆక్రమించి ఇజ్రాయెల్‌ను ఏర్పాటు చేయాలన్న ముందస్తు పథకంతో ఉన్న బ్రిటన్‌, ఇతర సామ్రాజ్యవాదులు ఎక్కడెక్కడి నుంచో యూదులను రప్పించి ఆయుధాలు, శిక్షణ ఇచ్చారు.ఐరాస తీర్మానం చేసిన నాటి నుంచి వారు పాలస్తీనా ప్రాంతాలను ఆక్రమించుకోవటం ప్రారంభించారు. మాతృభూమి రక్షణ కోసం పోరాడుతున్న వారికి నాటి నుంచి నేటి వరకు మద్దతు ఇస్తున్న ఇరుగుపొరుగు దేశాలు ఆయుధాలు అందిస్తున్నాయి. ఇది అందరికీ తెలిసిన రహస్యం !


పాకిస్తాన్‌ పాలకుల అణచివేతకు వ్యతిరేకంగా స్వాతంత్య్రం కోసం బంగ్లాదేశ్‌ పౌరులు ఉద్యమించారు. ఆయుధాలు చేతబట్టి గెరిల్లా పోరు సాగించారు. వారికి ఆయుధాలు ఎవరు ఇచ్చారు ? తుపాకి పట్టిన ప్రతివారినీ ఉగ్రవాది అనలేం.బంగ్లా ముక్తివాహిని పేరుతో తిరుగుబాటు చేసిన వారికి మన దేశం మద్దతు ప్రకటించటమే కాదు, మన మిలిటరీని కూడా పంపి పాక్‌ సైన్యాన్ని అణచివేసింది. బంగ్లా విముక్తికి ఆయుధాలు పట్టిన వారిని నాడు జనసంఘం సమర్ధించింది. నేడు పాలస్తీనా వాసులు ఆయుధాలు పట్టినందుకు బిజెపి తప్పుపడుతోంది. నిజానికి బంగ్లా విభజనకు ఐరాస తీర్మానాలు లేవు. పాలస్తీనా ఏర్పాటుకు తీర్మానం ఉన్నప్పటికీ అడ్డుకుంటున్న ఇజ్రాయెల్‌కు నరేంద్రమోడీ, బిజెపి మద్దతు ప్రకటించటం రెండు నాలుకల వైఖరికి నిదర్శనం. బంగ్లా విముక్తికి చర్యలు తీసుకున్నందుకు అభినందిస్తూ ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేత గురూజీగా పిలుచుకున్న గోల్వాల్కర్‌ కూడా ఇందిరా గాంధీకి లేఖ రాశారు. మద్దతు పలికినందుకు గాను అతల్‌బిహారీ వాజ్‌పాయికి 2015లో బంగ్లాదేశ్‌ అత్యున్నత ” విముక్తి యుద్ధ గౌరవ ” అవార్డును బంగ్లాదేశ్‌ ప్రకటించింది.తమ దేశ ఏర్పాటుకు అడ్డుపడుతున్న ఇజ్రాయెల్‌ మీద పాలస్తీనియన్లు అనేక రకాలుగా పోరాడుతున్నారు. ఆయుధాలు పట్టిన వారిని ఉగ్రవాదులుగా చిత్రిస్తే నరేంద్రమోడీ దానికి తాన తందాన తాన అంటున్నారు. ఇజ్రాయెల్‌ దుర్మార్గాలను గుర్తించేందుకు నిరాకరించటం తప్ప మరొకటి కాదు. ఉక్రెయిన్‌ అంశంలో తటస్థవైఖరి తీసుకున్న మోడీ ఇప్పుడు ఒక పక్షం వహించటం అంటే అమెరికా కూటమి మెప్పు పొందేందుకు తహతహలాడటమే. రష్యా నుంచి ఆయుధాల అవసరం ఉంది, చౌకగా చమురు దొరుకుతుంది గనుక తటస్థం అన్నారు. పాలస్తీనా నుంచి అలాంటివేమీ ఉండవు గనుక ఒక పక్షానికి మద్దతు పలుకుతున్నారు.


హమస్‌ సాయుధులు ఆయుధాలను ఇరాన్‌ నుంచి తెచ్చుకుంటున్నారని, గాజాలోనే తయారు చేస్తున్నారంటూ సిఐఏ చెప్పిందని మీడియాలో వార్తలు వచ్చాయి. హమస్‌ కోసం ఇరాన్‌ ఆయుధాలను అక్రమంగా సేకరిస్తున్నదని, దానితో పాటు స్వంతంగా తయారు చేసుకోవటం గురించి శిక్షణ ఇస్తున్నట్లు సిఐఏ ఆరోపించింది. వాషింగ్టన్‌ ఇనిస్టిట్యూట్‌ అనే అమెరికా అనుకూల సంస్థ నిపుణుడు మైకేల్‌ నైట్స్‌ తమ దేశం ఇజ్రాయెల్‌కు పంపిన ఆయుధాలను పట్టుకొని లేదా బ్లాక్‌మార్కెట్‌లో కొనుగోలు చేస్తున్నదని చెప్పాడు. స్మగ్లింగ్‌ జరిగే మార్గాలను ఈజిప్టు కట్టుదిట్టం చేసిన తరువాత గాజాలోనే తయారు చేసుకుంటున్నారని అన్నాడు. తప్పేముంది. ఇజ్రాయెల్‌ వైపు నుంచి మిలిటరీ, సాయుధ యూదులు బాంబులు వేస్తుంటే పాలస్తీనియన్లు రసగుల్లాలు విసురుతారా ? ఇదే సంస్థ 2021లో విడుదల చేసిన ఒక నివేదికలో ఇజ్రాయెల్‌ ప్రయోగించిన వాటిలో కొన్ని పేలలేదని, పేలిన వాటి విడిభాగాలను రీసైకిలింగ్‌ చేసి హమస్‌ నిపుణులు స్వంతంగా ఆయుధాలను రూపొందిస్తున్నారని పేర్కొన్నది. హమస్‌ సాయుధుల దాడుల చిత్రాలను చూసిన అమెరికా పార్లమెంటు సభ్యులు కొందరు మాట్లాడుతూ ఉక్రెయిన్‌కు పంపినవి లేదా ఆఫ్ఘనిస్తాన్‌లో వదలి వచ్చినవి గానీ వారి చేతుల్లోకి వచ్చినట్లు చెబుతున్నారు. ఉక్రెయిన్‌కు పంపిన ఆయుధాలను అది బ్లాక్‌మార్కెట్‌లో అమ్ముకుంటున్నదని కూడా చెబుతున్నారని అందువలన ఉక్రెయిన్‌కు సాయం అందించకూడదని కూడా మైకేల్‌ నైట్స్‌ చెప్పాడు. కాదు కాదు ఇలాంటి వార్తలన్నింటినీ రష్యా పుట్టిస్తున్నది కనుక నమ్మవద్దని మరికొందరు తమ ప్రభుత్వాన్ని సమర్ధిస్తున్నారు. వియత్నాం నుంచి పారిపోతూ అమెరికన్లు వదలివేసిన ఆయుధాలు తరువాత ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో కనిపించాయని కొందరు గుర్తు చేశారు. ఉక్రెయిన్‌కు పంపుతున్న ఆయుధాలు ఇతరుల చేతుల్లో పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి 2022 అక్టోబరులో అమెరికా విదేశాంగశాఖ ఒక పత్రంలో పేర్కొన్నది. ఉక్రేనియన్లను పట్టుకున్నపుడు వారి వద్ద దొరికిన అమెరికా ఆయుధాలను రష్యా బ్లాక్‌ మార్కెట్‌కు తరలిస్తుందని కూడా హెచ్చరించింది.


అక్టోబరు ఏడవ తేదీ దాడి తరువాత ఇజ్రాయెల్‌ సేకరించిన నమూనాలను బట్టి హమస్‌ పూర్వపు సోవియట్‌ కాలం నాటి క్షిపణులతో దాడి చేసిందని ఒక కథనం. కాదు స్వంతంగా తయారు చేసిన వాటితోనే జరిపిందని ఇజ్రాయెల్‌ సైనికుడు చెప్పిన వీడియో కూడా బయటకు వచ్చింది. వారు వాడిన ఆయుధాలు చాలా చిన్నవని అమెరికా అందచేసే వాటిని గాజాలోకి చేర్చటం చాలా కష్టమని కొందరు చెప్పారు. ఎక్కడి నుంచి తెచ్చారు, ఎలా తెచ్చారు అన్నది కాదు బుల్లెట్‌ దిగిందా లేదా అన్నదే గీటురాయి ! భుజాల మీద మోస్తూ ప్రయోగించే ఉత్తర కొరియా ఆయుధాలను హమస్‌ వినియోగించిందన్నది మరొక కథ ! దానికి రుజువు ఏమిటట, వాటికి ఎర్ర రిబ్బన్లు కట్టి ఉన్నాయట. ఎవడైనా వాటి గుర్తింపు తెలియకుండా ఎర్ర రిబ్బన్లు తీసివేస్తాడు తప్ప అలంకరించి మరీ వాడతారా ? అసలు ఉత్తర కొరియా ఆయుధాలను సరఫరా చేసిందా లేదా అని కొందరు అడగవచ్చు. ఇజ్రాయెల్‌కు బ్రిటన్‌తో సహా పశ్చిమ దేశాలన్నీ అన్ని రకాల ఆయుధాలను, వందల కోట్ల డాలర్లు అందిస్తున్నాయి. అమెరికా వారు ఎఫ్‌ 16 యుద్ధ విమానాలను అందించవచ్చు, మధ్య ధరా సముద్రానికి తన విమానవాహక యుద్ధ నౌకలను పంపించి ఆ ప్రాంతదేశాల మీద దాడులు చేస్తామని బెదిరించవచ్చు.ప్రపంచానికంతటికీ ఆయుధాలను ఆమ్మవచ్చు. ఉత్తర కొరియా హమస్‌కు ఆయుధాలు నిజంగా అందించిందో లేదో తెలియదు, ఒకవేళ ఇజ్రాయెల్‌ నుంచి ఆత్మరక్షణకు అందిస్తే తప్పే ముంది ? పాలస్తీనియన్లను వారి ఖర్మకు వారిని వదలివేయాలా ? గతంలో ఉత్తర కొరియా మీద అమెరికా దాడి చేసింది, ఇంకా దాడి చేసేందుకు దక్షిణ కొరియాలో వేలాది మంది మిలిటరీతో తిష్టవేసింది. మరోసారి ఉత్తర కొరియా మీద కూడా దాడులకు దిగవచ్చు. అప్పుడు దానికి దిక్కెవరు ? ఇంతకీ ఉత్తర కొరియా ఆయుధాలను హమస్‌ వాడిందా లేదా అని ఏపి వార్తా సంస్థ అడిగితే సమాధానం చెప్పేందుకు ఇజ్రాయెల్‌ మిలిటరీ తిరస్కరించింది. ఇవన్నీ అమెరికా వ్యాపింపచేసే కట్టుకథలని ఉత్తర కొరియా పేర్కొన్నది. వెయ్యి కంటెయినర్లలో రష్యాకు ఆయుధాలు, మందుగుండు ఉత్తర కొరియా నుంచి వెళ్లినట్లు అమెరికా ఆరోపించింది. నిరంతరం ఇతర దేశాల మీద అలాంటి నిందలను ప్రచారం చేస్తూనే ఉంది.హమస్‌ గురించి మనదేశంలో పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారం చేస్తున్నారు, అందువలన వాటిని గుడ్డిగా నమ్మాల్సినపని లేదు.


హమస్‌కు ఆయుధాల సరఫరా గురించి చీకట్లో బాణం వేసినట్లుగా ఇతర దేశాల మీద ఆరోపణలు చేయటం తప్ప ఎవరిదగ్గరా నిర్దిష్ట సమాచారం లేదు.ఇక హమస్‌ ఆయుధ తయారీ గురించి కొన్ని వీడియోలు ప్రచారంలో ఉన్నాయి. అవన్నీ నిజమని నమ్మటానికి లేదు. ఇజ్రాయెల్‌ను తప్పుదారి పట్టించేందుకు లేదా తమపై దాడులు చేస్తూ తమ ప్రాంతాలను ఆక్రమిస్తున్న తమ పాలకులు మీద ఇజ్రాయెలీ పౌరులు వత్తిడి తెచ్చేందుకు కొన్ని వీడియోలను రూపొందించి ప్రచారదాడి చేస్తున్నట్లు కూడా కొందరు చెబుతారు. అలాంటి వాటిలో ఒకదానిలో తాము గాజాలో పది నుంచి 250కిలో మీటర్ల వరకు ప్రయోగించే మోర్టార్లు, వాటికి అవసరమైన షెల్స్‌ తయారు చేసేందుకు ఫ్యాక్టరీలు ఉన్నట్లు, రష్యా అనుమతితో ఎకె రకం తుపాకులు, తూటాలు కూడా తయారు చేస్తున్నట్లు హమస్‌ ప్రతినిధి చెప్పినట్లుగా ఉంది. మరోవైపు ఆయుధాలు తయారు చేసే ఫ్యాక్టరీలు గాజాలో లేవని, దుస్తులు, ఫర్నీచర్‌, ఆహార పదార్ధాలు తయారు చేసే పరిశ్రమలే ఉన్నట్లు సిఐఏ వెలువరించే ఫ్యాక్ట్‌ బుక్‌లో ఉంది. ఇతర దేశాలు తయారు చేసిన ఆయుధాలు హమస్‌ దగ్గర దొరికినంత మాత్రాన ఆయా దేశాలు దానికి సరఫరా చేసినట్లు కాదు. కాశ్మీరులో లష్కరే తోయబా, జైషే మహమ్మద్‌ తదితర ఉగ్రవాదుల దగ్గర అమెరికా తయారీ ఆయుధాలు దొరికాయి. మనకు మిత్ర దేశం అని చెబుతున్న అమెరికా దీనికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. సిరియా వంటి చోట్ల అక్కడి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా అనేక ఉగ్రవాద, కిరాయి మూకలకు అమెరికా స్వయంగా ఆయుధాలు అందచేయటం బహిరంగ రహస్యం. అమెరికాకు ఆయుధాల తయారీ, విక్రయం పెద్ద లాభసాటి వ్యాపారం. డాలర్లు చెల్లిస్తే చాలు ఎవరికైనా అమ్ముతుంది.2018-22 కాలంలో ప్రపంచ ఆయుధ ఎగుమతుల్లో అమెరికా వాటా 40శాతంగా ఉందని స్టాక్‌హౌం ఇంటర్నేషనల్‌ పీస్‌ రిసర్చ్‌ ఇనిస్టిట్యూట్‌(సిప్రి) 2023 మార్చి నెలలో ప్రకటించింది. ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి పారిపోతూ అమెరికన్లు 712 కోట్ల డాలర్ల విలువగల ఆయుధాలు, రక్షణ సామగ్రి వదలి వెళితే అవన్నీ తాలిబాన్ల వశమయ్యాయి.వాటిలో కొన్ని కాశ్మీరులో దొరికాయి. అవి తాలిబాన్ల నుంచి లేదా పాకిస్తాన్‌ నుంచి కూడా సరఫరా చేసి ఉండవచ్చు. ఇతర దేశాల నుంచి సేకరించిన అమెరికా ఆయుధాలనే హమస్‌ ఇటీవల ఇజ్రాయెల్‌ మీద ప్రయోగించినట్లు అమెరికన్‌ పార్లమెంటు సభ్యులు ప్రకటించారు.


ఇతర దేశాల్లో గూఢచర్యం కోసం ఇజ్రాయెల్‌ ప్రభుత్వం మొసాద్‌ అనే సంస్థను ఏర్పాటు చేసింది. మన దేశంలో ” రా ” అమెరికా సిఐఏ వంటిది. దేశీయంగా షిన్‌ బెట్‌ అనే గూఢచార సంస్థ ఉంది. ఇవి రెండూ కూడా హమస్‌ దాడిని పసిగట్టలేకపోయాయి.తాము విఫలం చెందినట్లు షిన్‌ బెట్‌ అధిపతి రొనెన్‌ బార్‌ అంగీకరించాడు. హమస్‌ దగ్గర ఇజ్రాయెల్‌ మిలిటరీ రహస్యాలు, వాటి మాప్‌లు ఉన్నట్లు, పది మంది గాజా సాయుధులకు కచ్చితమైన సమాచారం ఉండబట్టే వారు లోపలికి చొరబడినట్లు న్యూయార్క్‌టైమ్స్‌ పత్రిక రాసింది. డ్రోన్లతో నిఘా, సమాచార టవర్లను కూల్చివేశారని, బుల్డోజర్లు, ట్రాక్టర్లతో సరిహద్దులో ఉన్న పెద్ద కంచెను కూల్చివేసి ముందు రోజు రెండువందల మంది మరుసటి రోజు 1,800 మంది హమస్‌ సాయుధులు ఇజ్రాయెల్‌లో ప్రవేశించినట్లు అధికారులను ఉటంకిస్తూ పేర్కొన్నది.ఇంత జరుగుతున్నా ఎందుకు పసిగట్టలేకపోయారన్నదే ప్రశ్న. గాజా ప్రాంతలోని హమస్‌ను బాగా బలహీన పరిచినందున అక్కడి నుంచి దాడి జరిగే అవకాశం లేదని, లెబనాన్‌లోని హిజబుల్లా నుంచే ముప్పు ఉందనే అంచనాకు ఇజ్రాయెల్‌ గూఢచార సంస్థలు భావించిన కారణంగా అవి దృష్టి పెట్టలేదని, హమస్‌ శక్తి సామర్ధ్యాలను తక్కువ అంచనా వేసిందని కొందరి విశ్లేషణ. ఇజ్రాయెల్‌లో ఉన్న అంతర్గత కుమ్ములాటల కారణంగా తెలిసి కూడా మౌనంగా ఉన్నారన్నది మరొక కథనం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఇజ్రాయెల్‌ దుర్మార్గానికి 500 మంది రోగులు బలి, జో బైడెన్‌ పర్యటన తరువాత గాజాపై ముప్పేట దాడి !

18 Wednesday Oct 2023

Posted by raomk in CHINA, Current Affairs, Europe, History, imperialism, International, INTERNATIONAL NEWS, Opinion, USA, WAR, Women

≈ 1 Comment

Tags

2023 Israel–Hamas war, China, HAMAS attacks 2003, Iran protests, israel massacre, Joe Biden, Narendra Modi Failures


ఎం కోటేశ్వరరావు


హమస్‌ సాయుధులను మట్టుపెట్టే పేరుతో ఇజ్రాయెల్‌ ప్రారంభించిన దాడుల్లో మంగళవారం నాడు ఐదు వందల మంది రోగులు మరణించారు. గాజాలోని ఒక ఆసుపత్రి మీద జరిపిన వైమానిక దాడికి వారు బలయ్యారు.మృతుల్లో అత్యధికులు మహిళలు, పిల్లలు ఉన్నట్లు వార్తలు. ఈ దుర్మార్గానికి నిరసనగా బుధవారం నాడు అమెరికా అధినేత జో బైడెన్‌, ఈజిప్టు అధ్యక్షుడు ఎల్‌ శశితో అమ్మాన్‌ నగరంలో జరగాల్సిన భేటీని రద్దు చేసినట్లు జోర్డాన్‌ ప్రకటించింది. అరబ్బు దేశాలు, ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ఇజ్రాయెల్‌ దుర్మార్గాన్ని ఖండిస్తూ జనం ప్రదర్శనలు జరుపుతున్నారు.హమస్‌ దాడుల నుంచి ఆత్మరక్షణకు పూనుకోవటం ఇజ్రాయెల్‌కు ఉన్న హక్కు, దాని బాధ్యత అని నొక్కివక్కాణించేందుకు అమెరికా అధినేత జో బైడెన్‌ బుధవారం నాడు ఇజ్రాయెల్‌ వచ్చి కొన్ని గంటల పాటు అక్కడ గడపుతాడని తాజా వార్తలు.నిరంతరం మానవహక్కుల గురించి ప్రపంచానికి బోధ చేస్తున్న అమెరికా నేత ఇజ్రాయెల్‌ గడ్డ మీద కూర్చొని ఇంకా కొట్టండి, చంపండి అని గాక ఇంకా ఏం చెబుతాడో చూద్దాం.


” హంతకుల మీద ఈ రోజు మనం నెపం నెట్టకూడదు. మన పట్ల వారి తీవ్ర ద్వేషాన్ని ఎందుకు గర్హించాలి ? ఎనిమిది సంవత్సరాలుగా గాజాలోని శరణార్ధి శిబిరాలలో వారు కూర్చున్నారు. వారు, వారి తండ్రులు నివశించిన చోట వారి భూములు, గ్రామాలను వారి కళ్ళ ముందే మన ఎస్టేట్లుగా మార్చి వేయటాన్ని వారు చూస్తున్నారు ” ఈ మాటలు చెప్పింది జనరల్‌ మోషే డయాన్‌. నూటికి నూరుపాళ్లు యూదు దురహంకారే.1948లో ఇజ్రాయెల్‌ మిలిటరీ పాలస్తీనా అరబ్బు ప్రాంతాల మీద జరిపిన దురాక్రమణ, హత్యాకాండకు నాయకత్వం వహించిన అధికారులలో ఒకడు. తరువాత మిలిటరీ ప్రధాన అధికారిగా పని చేశాడు.1956లో పాలస్తీనా గెరిల్లాలు జరిపిన దాడుల తరువాత డయాన్‌ చేసిన వ్యాఖ్యలివి. తరువాత కాలంలో పాలస్తీనియన్లతో శాంతి పరిష్కారం కోరుకున్న కారణంగా అదే యూదు దురహంకారులు అతన్ని పక్కన పెట్టారు. ఈ రోజు హమస్‌ చేసిన దాడులతో మొత్తం పాలస్తీనా వాసులను నిందిస్తున్న వారు అర్ధం చేసుకోవాల్సిన కీలక అంశం ఏమిటో డయాన్‌ చెప్పాడు.


పాలస్తీనా – ఇజ్రాయెల్‌ వివాదంలో ఒక యూదు దురంహంకారికి తెలిసిన మేరకు కూడా అర్ధం కానంత అమాయకంగా అమెరికా ఉందా ? 1948 నుంచి పాలస్తీనియన్ల ప్రాంతాలను ఆక్రమించి వారిని తరమివేయటంతో విదేశాల్లో శరణార్ధులుగా, ఇజ్రాయెలీ పాలకులు బహిరంగ జైలుగా మార్చిన పాలస్తీనా ప్రాంతాలలో బందీల మాదిరి క్షణం క్షణం ఏం జరుగుతుందో తెలియని భయం, అనిశ్చితిలో బతుకుతున్నారు. మంగళవారం నాడు అల్‌జజీరా వెల్లడించిన సమాచారం మేరకు హమస్‌ దాడుల్లో 1,400 మందికి పైగా మరణించగా దానికి ప్రతిగా ఇప్పటి వరకు గత పదకొండు రోజుల్లో ఇజ్రాయెల్‌ మిలిటరీ దాడుల్లో గాజాలోని పాలస్తీనియన్లు 2,808 మంది మరణించారు. వారిలో మూడోవంతు మంది పిల్లలు.ఆసుపత్రి మీద జరిపిన దాడిలో మరణాలతో ఈ సంఖ్య పెరిగింది. అయినా రక్తదాహం తీరలేదు. త్రివిధ దళాలతో గాజాలోని సామాన్య పౌరుల మీద దాడులకు ఇప్పటికే సన్నాహాలు పూర్తి అయ్యాయి. బైడెన్‌ తిరిగి అమెరికా వెళ్లిన తరువాత విరుచుకుపడవచ్చు. ఈ పూర్వరంగంలో మరోవైపున లెబనాన్‌-ఇజ్రాయెల్‌ సరిహద్దులో పరస్పరం దాడులకు దిగినట్లు, కొందరు మరణించినట్లు వార్తలు. రానున్న కొద్ది గంటల్లో ఇజ్రాయెల్‌ మీద ఆ ప్రాంతంలోని కొన్ని బృందాలు దాడులకు దిగవచ్చని ఇరాన్‌ విదేశాంగ మంత్రి చెప్పాడు. వివాదం మరింతగా ముదరకూడదని తాము కోరుకుంటున్నామని ఇరాన్‌ ఒక సందేశాన్ని పంపింది. అయితే గాజాలో పరిస్థితి దిగజారితే తాను జోక్యం చేసుకోవాల్సి వస్తుందని హెచ్చరించినట్లు కూడా వార్తలు. ప్రాంతీయ యుద్ధానికి దారితీస్తే పరోక్షంగా లేదా ప్రత్యక్షంగా ఇరాన్‌ భాగస్వామి అవుతుందని కొందరు చెబుతున్నారు.


పాలస్తీనా విముక్తి కోసం పలు పద్దతులలో పోరాడుతున్నవారు ఉన్నారు.హమస్‌ సాయుధపోరాట మార్గాన్ని ఎంచుకుంది. అదీ ఎప్పుడు ? ఇజ్రాయిల్‌ ఆక్రమణలకు పాల్పడి అరబ్బుల తరిమివేత, హత్యాకాండను ప్రారంభించిన ఐదు దశాబ్దాల తరువాత. పాలస్తీనా ప్రాంతాలను అక్కడి జనాలకు అప్పగించి ఇజ్రాయెల్‌ తప్పుకుంటే సమస్య ఒక్క రోజులో పరిష్కారం అవుతుంది.అంతా అమెరికా చేతిలో ఉంది. ఐక్యరాజ్య సమితి తాను చేసిన తీర్మానాన్ని ఉల్లంఘించిన వారి మీద చర్యకు ఎందుకు ఉపక్రమించటం లేదు ? భద్రతా మండలి చేసే తీర్మానాన్ని ఇజ్రాయెల్‌కు అనుకూలమైన అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌ వీటో చేస్తాయి. సాధారణ అసెంబ్లీ చేసే తీర్మానాలకు విలువ ఉండదు. నాలుగున్నర దశాబ్దాల తరువాత అమెరికా మధ్యవర్తిత్వంలో ఓస్లో ఒప్పందం కుదిరింది. ఆ మేరకు పాలస్తీనాలో పరిమిత అధికారాలున్న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి, ఇజ్రాయెల్‌ తాను ఆక్రమించిన ప్రాంతాలను క్రమంగా ఖాళీ చేసి వెళ్లిపోవాలి. ఈ ఒప్పందాన్ని పాలస్తీనా విమోచనా సంస్థ(పిఎల్‌ఓ) చేసుకుంది. దాన్ని ఇతర పార్టీలు, సంస్థలు ఆమోదించలేదు. లొంగుబాటుగా వర్ణించాయి. వాటిలో హమస్‌ ఒకటి. ఎందుకంటే దానిలో అసలు పాలస్తీనా దేశం అనే పదాలే లేవు. ఆ ఒప్పందాలు జరిగి మూడు దశాబ్దాలు గడచింది. మొత్తం మీద చూసినపుడు ఒక్క నిబంధనను కూడా అమలు జరపలేదు. ఆక్రమణల నుంచి ఇజ్రాయెల్‌ వైదొలగలేదు, పాలస్తీనాకు అప్పగించలేదు.ఆక్రమణలు ఇంకా పెరిగాయి. జెరూసలెం పట్టణాన్ని కూడా ఆక్రమించేందుకు పూనుకుంది. మధ్యవర్తిగా ఉన్న అమెరికా అమలు జరిపేందుకు వత్తిడితేవటంమాని యూదుల పక్షాన నిలబడింది.ఓస్లో ఒప్పందంపై సంతకాలు చేసి దాన్ని అమలు జరిపేందుకు పూనుకోవాలి అని చెప్పిన ఇజ్రాయెల్‌ ప్రధాని యత్జిక్‌ రబిన్‌పై తీవ్రవాదులైన యూదు దురహంకారులు కుట్ర చేసి 1995లో హత్య చేశారు. ఎవరైనా అమలుకు పూనుకుంటే వారికి ఇదే గతి అన్న హెచ్చరికే అది.


ఇక హమస్‌ తాజా దాడులకు ఎందుకు పాల్పడింది అన్న అంశం మీద ప్రచారంలో ఉన్న కుట్ర సిద్దాంతాలలో ఒకటేమిటంటే ఇజ్రాయెల్‌-సౌదీ అరేబియా మధ్య సయోధ్య కుదిర్చేందుకు అమెరికా చేస్తున్న యత్నాలను దెబ్బతీసేందుకు అన్నది ఒకటి. పాలస్తీనా అరబ్బులకు మద్దతు ఇస్తున్న దేశాలలో సౌదీ ఒకటి. అది ఇజ్రాయెల్‌తో కుదుర్చుకొనే ఒప్పందాలకు ప్రాతిపదికలు ఏమిటో బహిర్గతం కాలేదు.మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం జెరూసలెంతో సహ పశ్చిమ గట్టు, గాజా ప్రాంతంలో ఇజ్రాయెల్‌ ఆక్రమించుకున్న ప్రాంతాలను పాలస్తీనాకు బదలాయిస్తేనే రెండు దేశాల మధ్య సాధారణ సంబంధాలను నెలకొల్పుకొనేందుకు అవకాశం ఉందని సౌదీ చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఇది ఉగ్రవాదులైన ఇజ్రాయెల్‌ మంత్రులు, యంత్రాంగానికి ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఈ కారణంగానే హమస్‌ సాయుధులు క్షిపణులతో సహా గాజా కంచెను దాటి ఇజ్రాయెల్‌ ప్రాంతంలోకి ప్రవేశించి దాడులు చేసేందుకు కావాలనే అవకాశం ఇచ్చారని, దాడులను సాకుగా చూపి ఉద్రిక్తతలను రెచ్చగొట్టి ఒప్పందాన్ని అడ్డుకోవాలన్నది ఒక కుట్ర కోణం. దాడి జరిగిన ఐదు గంటల తరువాత మాత్రమే ఇజ్రాయెల్‌ భద్రతాదళాలు ఆ ప్రాంతానికి చేరుకున్నాయి.ఈ కుట్రను అర్ధం చేసుకోలేని హమస్‌ వచ్చిన అవకాశాన్ని దాడికి ఉపయోగించుకున్నట్లు కొందరు చెబుతున్నారు.


గాజాపై దాడికి ఇజ్రాయెల్‌ పూనుకున్న పూర్వరంగంలో పశ్చిమాసియాలో పర్యవసానాలు, చైనా పాత్ర గురించి కూడా విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. ఇజ్రాయెల్‌తో ఒప్పందాన్ని సౌదీ పక్కన పెట్టినట్లు, ఇరాన్‌తో సంబంధాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు వార్తలు వెలువడ్డాయి. తాజా పరిస్థితికి బాధ్యత ఇజ్రాయెల్‌దే అన్న సౌదీ, పరిణామాలను దగ్గరగా పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నది, హమస్‌ చర్యను ఖండించలేదు. గతంలో ఇజ్రాయెల్‌ను హెచ్చరించినట్లు కూడా పేర్కొన్నది. ఈ స్పందన మీద అమెరికా మండిపడింది. తమతో సాధారణ సంబంధాలను కోరుకోవాలనుకొనే వారి నుంచి రావాల్సిన సాధారణ ప్రకటన ఇలా ఉండకూడదని వ్యాఖ్యానించింది.ఉప్పు-నిప్పుగా ఉన్న సౌదీ-ఇరాన్‌లను ఒక దగ్గరకు చేర్చి సంబంధాల ఏర్పాటుకు ఈ ఏడాది ఫిబ్రవరిలో చైనా మధ్యవర్తిత్వం వహించింది.బ్రిక్స్‌ కూటమిలోకి ఈజిప్టు, సౌదీ, యుఏఇ, ఇరాన్‌లను తెచ్చేందుకు కూడా చూస్తున్నది. ఈ పూర్వరంగంలో చైనా నుంచి దూరంగా జరిగితే పౌర అణు కార్యక్రమంలో భాగంగా ఒక విద్యుత్‌ కేంద్రాన్ని నిర్మిస్తామని అమెరికా ఇటీవల సౌదీకి ఒక బిస్కెట్‌ వేసింది. గత కొన్ని దశబ్దాలుగా అమెరికా మిత్ర దేశంగా ఉన్నప్పటికీ గతంలో అలాంటి ప్రతిపాదన చేయలేదు. ఇరాన్‌తో కుదిరిన మైత్రిని దెబ్బతీసేందుకు పావులు కదుపుతోంది. మరోవైపున మధ్య ప్రాచ్యంలో తన పట్టుతగ్గలేదని, తనను ఎదిరిస్తే అంతుచూస్తానని బెదిరించేందుకు రెండు విమానవాహక యుద్ద నౌకలను, యుద్ధ ఓడలను ఆ ప్రాంతానికి పంపింది. ఉక్రెయిన్‌ సంక్షోభంలో తటస్థంగా ఉన్న మన దేశం ఇప్పుడు ఇజ్రాయెల్‌కు మద్దతు ప్రకటించింది.


చైనా వైఖరిని ఇజ్రాయెల్‌, అమెరికా, ఐరోపా పశ్చిమ దేశాలు జీర్ణించుకోకపోగా మండిపడుతున్నాయి. తటస్థం అంటే ఇజ్రాయెల్‌ వ్యతిరేక వైఖరిని తీసుకోవటంగా చిత్రిస్తున్నాయి. అరబ్‌ దేశాల్లో తనకు అనుకూలమైన స్థితిని సృష్టించుకొనేందుకు చూస్తున్నదని, తన ప్రపంచ అజండాను ముందుకు తీసుకుపోవటంలో ఇది భాగమని ఉక్రోషం వెల్లడిస్తున్నాయి.ఒకవైపున జనాలను వీధుల్లో హతమారుస్తున్నపుడు దాని గురించి మాట్లాడకుండా పాలస్తీనా ఏర్పాటు గురించి మాట్లాడటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ ఏడాది జూన్‌లో పాలస్తీనా పాలనా మండలి అధ్యక్షుడు అబ్బాస్‌ను ఒక దేశాధినేత హౌదాలో చైనా ఆహ్వానించింది. పాలస్తీనా పౌరుల న్యాయమైన జాతీయ హక్కులకు మద్దతు ప్రకటించింది. ఇదే సమయంలో ఇజ్రాయెల్‌ ప్రధానిని కూడా చైనా ఆహ్వానించింది. పాలస్తీనా పౌరులహక్కులను హరించినందుకు గాను గతంలో దౌత్య సంబంధాలు పెట్టుకొనేందుకు నిరాకరించిన చైనా ఇటీవలి కాలంలో వైఖరిని మార్చుకొని అటు పాలస్తీనా ప్రతినిధులతో పాటు ఇటు ఇజ్రాయెల్‌తో కూడా సంబంధాలను నిర్వహిస్తున్నది. మరోవైపున చైనా మీడియాలో అమెరికా పాత్రను ఎండగడుతూ విశ్లేషణలు వెలువడుతున్నాయి.ఒక వైపున అరబ్‌ దేశాలను ఇజ్రాయెల్‌కు దగ్గర చేసేందుకు, మరోవైపున యూదు దురహంకారులకు మద్దతు ఇస్తూ పాలస్తీనియన్ల మీద భరించరాని వత్తిడిని అమెరికా పెంచుతున్నదని, ఒకవైపు కొమ్ముకాస్తున్నదని పేర్కొంటున్నారు. చైనా పశ్చిమాసియా తాజా వివాదంలో తటస్థంగా ఉంది. ఉభయ పక్షాలు శాంతం వహించాలని కోరింది తప్ప హమస్‌ను ఖండించలేదు. మావో కాలం నుంచీ పాలస్తీనా పక్షమే వహిస్తున్నది. ఆత్మ రక్షణ పేరుతో తన దాడులను ఇజ్రాయెల్‌ సమర్ధించుకుంటున్నది.చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ఫైజల్‌ బిన్‌ ఫర్హాన్‌తో మాట్లాడుతూ ఆత్మ రక్షణ పరిధికి మించి ఇజ్రాయెల్‌ చర్యలు ఉన్నాయి.అది అంతర్జాతీయ పిలుపులను వినాలి, గాజా పౌరులందరినీ శిక్షించాలని చూస్తున్న చర్యలను ఐరాస ప్రధాన కార్యదర్శి నిలిపివేయించాలని, స్వతంత్ర పాలస్తీనా దేశం ఏర్పడాలని కూడా చైనా మంత్రి స్పష్టం చేశాడు. చైనా ఇస్తున్న గట్టి మద్దతు అరబ్‌ ప్రపంచంలో పాలస్తీనీయన్లకు మరింత బలాన్ని ఇస్తుందని, అరబ్‌ దేశాలు వారి వైపున నిలిచే అవకాశం ఉందని, చైనా కోరుకుంటోంది కూడా అదేనని పరిశీలకులు భావిస్తున్నారు. ఉక్రెయిన్‌ సంక్షోభంలో కూడా తటస్థత అంటూ రష్యా దాడులను ఖండించలేదని మరోవైపున దానితో సంబంధాలను మరింతగా మెరుగుపరుచుకుందని పశ్చిమదేశాల విశ్లేషకులు చైనా మీద మండిపడుతున్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

హమస్‌ ఎప్పుడు ఉనికిలోకి వచ్చింది ? అవాస్తవాల ప్రచారం, నిజాలేమిటి ?

14 Saturday Oct 2023

Posted by raomk in Current Affairs, Europe, Germany, History, imperialism, INTERNATIONAL NEWS, Opinion, UK, USA, WAR

≈ Leave a comment

Tags

Gaza Deaths, Hamas, HAMAS attacks 2003, israel massacre, Joe Biden, Palestinian People


ఎం కోటేశ్వరరావు


టీవీలు, పత్రికల్లో ప్రస్తుతం హమస్‌ అనే సంస్థ గురించి వార్తలు వస్తున్నాయి. ఇజ్రాయెల్‌-పాలస్తీనా తాజా పరిణామాలపై ఎన్నో అవస్తవాలు, వక్రీకరణలు వెల్లువెత్తుతున్నాయి. వాటిలో కొన్నింటిని చూద్దాం. చరిత్రనంతటినీ ప్రస్తావించటం ఇక్కడ సాధ్యం కాదు గనుక క్లుప్త వివరణకే ఇది పరిమితం.


పాలస్తీనా – ఇజ్రాయెల్‌ ఉనికి !
ఈ రోజు మనం పాలస్తీనా అని చెబుతున్న ప్రాంతం లేదా చరిత్రలో ఉందని భాష్యం చెబుతున్న ఇజ్రాయెల్‌ గానీ ఎన్నడూ ఒక స్వతంత్ర దేశంగా లేవు. ఏదో ఒక సామ్రాజ్యంలో భాగాలుగా చేతులు మారుతూ వచ్చాయి. క్రీస్తు పూర్వమే ఈ రెండు పేర్లూ వాడుకలో ఉన్నట్లు చరిత్ర చెబుతోంది. పేరు ఏదైనా అవి ఏదో ఒక సామ్రాజ్యంలో భాగాలు, సామంతదేశాలే. రోమన్‌, లేదా ఒట్టోమన్‌ మాదిరి యూదుల సామ్రాజ్యం అనేది లేదు. తొలుత క్రీస్తు పూర్వం ఏడవ శతాబ్దంలో అస్సీరియన్లు యూదుల మీద దాడి చేసి జుడా రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. యూదులను తరిమివేశారు. తరువాత క్రీస్తుశకం మధ్యయుగాల్లో మత యుద్దాల్లో యూదులు అనేక ప్రాంతాలకు పారిపోయారు. చరిత్రలో పాలస్తీనా-ఇజ్రాయెల్‌ ప్రాంతం చివరిగా టర్కీ కేంద్రంగా పాలన సాగించిన ఒట్టోమన్‌ సామ్రాజ్యంలో భాగంగా ఉంది. జనాభాలో తొంభైశాతంపైగా అరబ్బులే ఉన్నారు. ప్రపంచమంతటినీ ఆక్రమించిన బ్రిటీష్‌, ఫ్రెంచి ఇతర సామ్రాజ్యవాదులకు అది స్వాధీనం కాలేదు. మొదటి ప్రపంచ యుద్దంలో దాన్ని విచ్చిన్నం చేసేందుకు బ్రిటీష్‌ పాలకులు అనేక పాచికలను వాడారు. వాటిలో ఒకటి ఒట్టోమన్‌ సామ్రాజ్యం నుంచి స్వాతంత్య్రం కోరుతున్న అరబ్బులకు పాలస్తీనాను ఏర్పాటు చేస్తామని ఒక వైపు ఆశచూపారు. మరోవైపు యూదులకు ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేస్తామని వారి మద్దతును కూడగట్టేందుకు పూనుకున్నారు. ఎందుకంటే అనేక దేశాల్లో యూదులు బాంకర్లుగా, ఇతరత్రా ధనవంతులుగా ఉన్నారు కనుక వారి అవసరం ఉన్నందున అలా చేశారు. బ్రిటీష్‌ , తరువాత వారి స్థానాన్ని ఆక్రమించిన అమెరికన్‌ సామ్రాజ్యవాదులు పెట్టిన చిచ్చే పాలస్తీనా-ఇజ్రాయెల్‌ వివాదం.


మొదటి ప్రపంచ యుద్దంలో ఒట్టోమన్‌ సామ్రాజ్యం పతనమైన తరువాత సామ్రాజ్యవాదుల పంపకాల్లో పాలస్తీనా ప్రాంతాన్ని బ్రిటీష్‌ వారు తీసుకున్నారు. అప్పటికే పశ్చిమాసియాలో చమురు నిల్వలు, ఇతర ప్రాంతాల్లో సహజ సంపదలను గమనించి ఆ ప్రాంతంలో తమకు నమ్మకమైన బంటు ఉండాలంటే ఇజ్రాయెల్‌ ఏర్పాటు ఒక సాధనంగా బ్రిటీష్‌ వారు భావించారు. అందుకు గాను అనేక దేశాల్లో దాడులకు గురైన యూదులందరినీ పాలస్తీనాకు అక్రమంగా రప్పించారు. అక్కడ వారు నివాసాలను ఏర్పాటు చేసుకొనేందుకు అవకాశం కల్పించారు. స్థానికంగా ఉన్న అరబ్బులను వారి ప్రాంతాల నుంచి గెంటివేయటం అప్పుడే ప్రారంభమైంది. బ్రిటీష్‌ వారి కుట్రను గమనించేలోగా రెండవ ప్రపంచ యుద్దం, తరువాత యూదుల వలసలు మరింత పెరిగాయి. తరువాత పాలస్తీనా ప్రాంతాన్ని మూడుగా విభజించి పాలస్తీనా, ఇజ్రాయెల్‌ దేశాలుగా ఏర్పాటు, జెరూసలెం పట్టణం, పరిసరాలను ఐరాస ఆధీనంలో ఉంచాలంటూ చేసిన ప్రతిపాదనకు ఐరాస సాధారణ అసెంబ్లీలో 1947 నవంబరు 29న మెజారిటీ ఆమోదం వచ్చేట్లు సామ్రాజ్యవాదులు చూశారు. దానిని ఆ ప్రాంత దేశాలు, అరబ్బులు అంగీకరించలేదు. ఐరాస తీర్మానం సాకుతో అప్పటికే సాయుధంగా సిద్దంగా ఉన్న యూదులు తీర్మానాన్ని పక్కన పెట్టి పాలస్తీనా ప్రాంతాలను కూడా ఆక్రమించి అరబ్బులను తరిమివేశారు.దాంతో అరబ్బులు ప్రతిఘటన ప్రారంభించారు. నాటి నుంచి నేటి వరకు పాలస్తీనా ఏర్పడలేదు. ఇజ్రాయెల్‌ ముందుగా వేసుకున్న పధకం ప్రకారం పాలస్తీనా ప్రాంతాల ఆక్రమణకు పూనుకోవటంతో పక్కనే ఉన్న ఈజిప్టు, సిరియా, జోర్డాన్‌, ఇరాక్‌ పాలస్తీనా ప్రాంతాలను దురాక్రమణ నుంచి కాపాడి కొన్నింటిని తమ అదుపులోకి తీసుకున్నాయి. ఐరాస తీర్మానాన్ని గుర్తించేందుకు ఇజ్రాయెల్‌ నిరాకరిస్తోంది. తన భద్రతకు కొన్ని పాలస్తీనా ప్రాంతాలు కావాలని చెబుతోంది. దానికి అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు మద్దతు పలుకుతున్నాయి.


హమస్‌ ఎప్పుడు ఏర్పడింది ?
పాలస్తీనా విముక్తి కోసం పిఎల్‌ఓ ఏర్పడింది. అది శాంతియుత, సాయుధ పద్దతుల్లో పోరాడుతోంది. 1980 దశకం నాటికి అరబ్బుల్లో అసహనం పెరిగింది. పిఎల్‌ఓ సమర్దవంతంగా ఎదుర్కోవటం లేదనే అసంతృప్తి ఉంది. ఈ పూర్వరంగంలో హమస్‌ అనే సంస్థ 1987లో ఉనికిలోకి వచ్చింది. దాన్ని ఏర్పాటు చేయటంలో మత పెద్దలు కూడా ఉన్నారు.1973లో ముస్లిం బ్రదర్‌హుడ్‌ అనే సంస్థ ఈజిప్టులో ఏర్పడింది. దానిలో పాలస్తీనా ప్రాంతానికి చెందిన వారు కూడా ఉన్నారు. ఆ సంస్థలో చీలిక వచ్చి హమస్‌ ఏర్పడింది.1988ఆగస్టున హమస్‌ ప్రణాళిక పేరుతో తొలిసారిగా ఆ పేరును వెలుగులోకి తెచ్చారు. తమ ప్రభుత్వం మీద పోరాడే ప్రతివారినీ ఉగ్రవాద ముద్రవేసి ఇజ్రాయెల్‌ అణచివేస్తున్నది. అంతకు ముందు పిఎల్‌ఓ, తరువాత హమస్‌ ఇతర సంస్థలనూ అదే మాదిరి పరిగణించింది. 1994 ఫిబ్రవరిలో రంజాన్‌ ప్రార్ధనలు చేస్తున్న ముస్లింలను 29 మందిని గోల్డ్‌ స్టెయిన్‌ అనే యూదు దురహంకారి మిలిటరీ దుస్తులతో వెళ్లి పశ్చిమ గట్టు ప్రాంతంలోని హెబ్రాన్‌ నగరంలోని ఒక మసీదులో కాల్చి చంపాడు. తరువాత జరిగిన ఉదంతాలలో మరో 19 మంది పాలస్తీనియన్లను భద్రతా దళాలు చంపి వేశాయి. సామాన్య పౌరులు, మిలిటెంట్లకు తేడా చూపకుండా ఇజ్రాయెల్‌ చర్యలు ఉన్నందున తాము కూడా అదే బాట పడతామని హెబ్రాన్‌ ఉదంతం తరువాత హమస్‌ ప్రకటించింది.అప్పటి నుంచి అది ఇజ్రాయెల్‌ పోలీసులు, భద్రతా దళాల దుశ్చర్యలకు ప్రతిగా తానూ దాడులు జరుపుతోంది. అది సరైందా కాదా అంటే పౌరుల మీద ఎవరు దాడులు జరిపినా సమర్దించనవసరం లేదు. ఇజ్రాయెల్‌ యూదులు సామాన్యపౌరుల మీద బాంబులు విసురుతుంటే పాలస్తీనా అరబ్బులు రసగుల్లాలు విసురుతారా ? ఇదే సమయంలో పిఎల్‌ఓ-ఇజ్రాయెల్‌ మధ్య కుదిరిన ఓస్లో ఒప్పందాన్ని అది వ్యతిరేకించింది. దానిలో భాగంగానే 1996లో జరిగిన పాలస్తీనా ఎన్నికలను,2005లో పాలస్తీనా అధ్యక్ష ఎన్నికను బహిష్కరించింది. యాసర్‌ అరాఫత్‌ మరణించిన తరువాత 2006లో జరిగిన జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసింది. గాజా ప్రాంతంలో మెజారిటీ సీట్లు తెచ్చుకొని అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. వెస్ట్‌ బాంక్‌ ప్రాంతంలో ఫతా అధికారంలో ఉంది. మన దేశంలో రాష్ట్ర ప్రభుత్వాలకు అంతర్జాతీయ గుర్తింపు ఉండదు, అలాగే గాజాలోని హమస్‌ ప్రభుత్వానికి అంతర్జాతీయ గుర్తింపు లేదు, ఎందుకంటే అది పాలస్తీనాలోని ఒక ప్రాంత ప్రభుత్వం మాత్రమే. హమస్‌ ప్రభుత్వానికి మిలిటరీ లేదు, హమస్‌ గెరిల్లాలు మాత్రమే దాడులు చేస్తున్నారు. ఇజ్రాయెల్‌ మిలిటరీ ఆ గెరిల్లాలను అణచేపేరుతో జనావాసాలపై దాడులు చేసి పౌరులను హతమారుస్తున్నది. విమానాలతో బాంబులు వేస్తున్నది, గాజా వాసులకు మంచినీరు, విద్యుత్‌, ఆహారం, ఔషధాల సరఫరాలను నిలిపివేసిందంటే సామాన్య పౌరుల మీద దాడి తప్ప మరొకటి కాదు.గాజా ప్రాంతం నుంచి తప్పుకున్న 2006 నుంచి ఇప్పటి వరకు ఇజ్రాయెల్‌ పదిసార్లు మిలిటరీదాడులు జరిపింది.


జో బైడెన్‌ అబద్దమాడాడా !
అమెరికాలోని యూదు సంస్థల ప్రతినిధులతో సమావేశమైన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఇలాంటి దృశ్యాలను చూడాల్సి వస్తుందని తాను అనుకోలేదని చెప్పినట్లు వార్తలు వచ్చాయి. హమస్‌ సాయుధులు ఇజ్రాయెలీ పిల్లలను చంపుతున్న దృశ్యాల చిత్రాలను చూసిన తరువాత బైడెన్‌ స్పందించినట్లు మీడియా పేర్కొన్నది.ఇజ్రాయెల్‌ ప్రభుత్వం, నేతలు చెప్పిన మాటలను బట్టి అలా మాట్లాడారు తప్ప బైడెన్‌ ఎలాంటి ఫొటోలను చూడలేదని అధ్యక్ష భవనం వివరణ ఇచ్చింది. పిల్లలను హతమారుస్తున్నట్లు ఎలాంటి దాఖలాలు లేవని తరువాత వెల్లడైంది. కానీ తప్పుడు ఫొటోలను ఇజ్రాయెల్‌ , అమెరికా, ఐరోపా పత్రికలు ప్రచురించి పెద్ద ఎత్తున హమస్‌ మీద అసత్యవార్తలను జనంలో పెట్టాయి. పశ్చిమ దేశాల పాలకులు, వారి కనుసన్నలలో నడిచే మీడియా ఎలాంటి తప్పుడు వార్తలను ప్రచారంలో పెడుతుందో తెలిసిందే.1991లో ఇరాక్‌ మీద దాడి చేయదలచుకున్న అమెరికా, ఐరోపా దేశాలు అంతకు ముందు ఒక కట్టుకథను ప్రచారంలో పెట్టాయి. కువాయిట్‌ ఆసుపత్రిల్లోని ఇంక్యుబేటర్లలో ఉన్న వందలాది మంది పిల్లలను ఇరాకీ సైనికులు చంపివేశారని నమ్మించేందుకు చూశారు. అంతేకాదు నాటి ఇరాక్‌ పాలకుడు సద్దాం హుసేన్‌ మారణాయుధాలను గుట్టలుగా నిల్వ చేశాడని కూడా ప్రచారం చేసిన సంగతి, తీరా తాము చేయదలచుకున్నది చేసి సద్దాంను హత్య చేసి లక్షలాది మంది ఇరాకీల జీవితాలను నాశనం చేసిన తరువాత అబ్బే అలాంటి గుట్టల ఆయుధాలు ఎక్కడా కనిపించలేదని చెప్పిన సంగతి తెలిసిందే. ఇక జో బైడెన్‌ పెద్ద అబద్దాల కోరని గతంలోనే రుజువైంది. నెల్సన్‌ మండేలాను కలిసేందుకు వెళ్లినపుడు 1970దశకంలో తనను అరెస్టు చేశారని 2020 ఎన్నికల ప్రచారంలో పచ్చి అబద్దం చెప్పాడు.


ఇజ్రాయెల్‌ నిఘా వైఫల్యమా ! కుట్రా !!
పాలస్తీనాకు చెందిన గాజా ప్రాంతాన్ని ఇజ్రాయెల్‌ ప్రభుత్వం ఒక నిర్బంధశిబిరంగా మార్చివేసింది. దాని చుట్టూ సరిహద్దులో మనుషులు దాటటానికి వీలులేని ఆరు మీటర్ల ఎత్తున పెద్ద ఇనుప ముళ్ల కంచెను ఏర్పాటు చేసింది. దాని పొడవు 65కిలోమీటర్లు, డ్రోన్లు, రిమోట్‌ కంట్రోలు మెషిన్‌ గన్లు, కెమెరాలు దానికి అమర్చి ఉంటాయి. ఏదైనా అలజడి సమాచారం ఉంటే ఐదు నిమిషాల్లో దాడులు చేసే హెలికాప్టర్లు సిద్దంగా ఉంటాయి. బుల్డోజర్లతో తప్ప ఆ కంచెను మానవ మాత్రులు ధ్వంసం చేయలేరు. దాన్ని దాటి 400 మంది హమస్‌ గెరిల్లాలు ట్రాక్టర్ల మీద వచ్చారని చెబుతున్నారు. ఒకవైపు ఈజిప్టు, మరోవైపు మధ్యధరా సముద్రం, రెండు వైపులా ఇజ్రాయెల్‌ మిలిటరీ ఉంటుంది. గాజా వాసులు వెలుపలికి రావాలంటే ఇజ్రాయెల్‌ అనుమతి లేకుండా కుదరదు.హమస్‌ గెరిల్లాలు కంచెను దాటి కొందరు క్షిపణులు ప్రయోగించారు. కొన్ని చోట్ల కంచెలోపలి నుంచే వదిలారు. దీన్ని ఇజ్రాయెల్‌ పసిగట్టలేకపోయింది.ఏదో జరగబోతోందని ముందే తాము హెచ్చరించామని ఈజిప్టు నిఘా అధికారులు చెప్పారు. తాము కూడా మిలిటరీని హెచ్చరించామని ఇజ్రాయెలీ గూఢచారులు కూడా చెబుతున్నారు. తమకెలాంటి సమాచారమూ లేదని మిలిటరీ చెప్పింది. తెలిసినా ఇజ్రాయెల్‌ మిలిటరీ కావాలనే నిరోధించలేదని చెబుతున్నారు. ఇది ఒక రహస్యంగా మిగిలిపోయింది.


హమస్‌ను అంతం చేయటం సాధ్యమా ?
పాలస్తీనా ప్రాంతాల మీద ఇజ్రాయెల్‌ దాడులు చేయటం ఇదే ప్రధమం కాదు. గతంలో అనేకసార్లు దాడులు చేసింది. తమ వ్యతిరేకులను అణచివేసినట్లు చెప్పుకుంది. ఇప్పుడు కూడా అదే చెబుతోంది. హమస్‌ లేదా మరొక తిరుగుబాటుదార్లను అణచివేయటం నిజంగా సాధ్యమౌతుందా ? ప్రజల మీద దాడులు కొనసాగినంత కాలం ప్రతిఘటన వీరులు పుడుతూనే ఉంటారన్నది చరిత్ర చెప్పిన సత్యం. హమస్‌గాకపోతే మరొక పేరుతో మరో సంస్థ పుట్టుకువస్తుంది. హమస్‌ కంటే ముందుకు కూడా సాయుధదాడులు చేసిన వారు ఉన్నారు కదా ! పాలస్తీనాకు 1947 తీర్మానం ప్రకారం దాని ప్రాంతాలను దానికి అప్పగిస్తేనే ఇజ్రాయెల్‌ మీద తిరుగుబాటు లేదా ఆత్మరక్షణ దాడులు నిలిచిపోతాయి. లేకుంటే మరో ఏడు దశాబ్దాలు గడిచినా చరిత్ర పునరావృతం అవుతూనే ఉంటుంది. వందల సంవత్సరాల నాడు మత యుద్ధాలలో, రెండవ ప్రపంచ యుద్దానికి ముందు హిట్లర్‌ యూదులను లక్షల సంఖ్యలో హతమార్చినా వారు అంతరించలేదు. అలాంటిది పాలస్తీనియన్లు లేదా అరబ్బులను అణచివేయటం, పూర్తిగా తుడిచిపెట్టటం సాధ్యమౌతుందా ? ఈ పాఠాన్ని యూదులు, వారిని సమర్ధించేవారు మరచిపోతే ఎలా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఇజ్రాయెల్‌పై హమస్‌ దాడులకు కారణం ఏమిటి ! ఆజ్యం పోస్తున్న అమెరికా కూటమి !!

11 Wednesday Oct 2023

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Europe, Germany, History, imperialism, International, NATIONAL NEWS, Opinion, UK, USA, WAR

≈ 1 Comment

Tags

BJP, China, Gaza, Hamas, Israel, Joe Biden, Narendra Modi Failures, Palestinian People, RSS, USS Gerald R Ford


ఎం కోటేశ్వరరావు


పాలస్తీనా సమరయోధుల సంస్థ హమస్‌- ఇజ్రాయెల్‌ మధ్య మరోసారి చెలరేగిన పోరు ఏ పరిణామాలు, పర్యవసానాలకు దారి తీస్తుందా అని ఒకవైపు ప్రపంచం ఆందోళన చెందుతుంటే మరోవైపు అమెరికా స్టాక్‌మార్కెట్‌లో ఆయుధ ఉత్పత్తి కంపెనీల వాటాల ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఇల్లుకాలుతుంటే బొగ్గులేరుకొనేందుకు చూడటం అంటే ఇదే. గత మూడు సంవత్సరాల్లో ఎంతగా లేనంతగా సోమవారం ఒక్కరోజే ఎనిమిది శాతం ఎగువకు దూసుకుపోయాయంటే తమకు లాభాల పంట పండుతుందని మదుపుదార్లు వాటాల కొనుగోలు ఎగబడిన ఫలితమే అది. ఇజ్రాయెల్‌కు మరింతగా సాయం చేయాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించటంతో ఆయుధ కంపెనీలకు చేతినిండా పని అన్నది తెలిసిందే. తాజా పరిణామాల్లో అటూ ఇటూ పెద్ద ఎత్తున జననష్టం, ఆస్థి విధ్వంసం గురించి వివరాలు ఇంకా వెల్లడికావాల్సి ఉంది. తక్షణమే దాడులు నిలిపివేయాలన్న అభిప్రాయం వెల్లడి అవుతోంది. ఎవరు ముందు ప్రారంభించారు, ఎవరు ప్రతిఘటిస్తున్నారు అన్న విచక్షణలోకి పోతే పైకి హమస్‌ దాడులు కనిపించవచ్చుగానీ అంతకు ముందు ఇజ్రాయెల్‌ చేసిన దారుణాలు తక్కువేమీ కాదు.ఇది ప్రారంభం కాదు, అంతమూ కాదు. ఆకస్మికంగా జరిగిన ఈ పరిణామాలకు కారణాలు ఏమిటన్నది చూద్దాం. ఒకటి పాలస్తీనా ఏర్పాటును అడ్డుకోవటమే కాదు, ఐరాస దానికి కేటాయించిన ప్రాంతాలను క్రమంగా ఆక్రమించుకుంటున్న ఇజ్రాయెల్‌, దానికి మద్దతు ఇస్తున్న పశ్చిమ దేశాల వైఖరి ఒకటైతే, తక్షణ కారణాలేమిటన్నది మరొక అంశం. తాజాగా తలెత్తిన వివాదానికి అమెరికా మరింతగా ఆజ్యం పోస్తున్నది, ఇజ్రాయెల్‌కు మద్దతుగా మధ్యధరా సముద్రానికి తన సప్తమ నౌకా దళం, జెట్‌ యుద్ధ విమానాలను పంపుతున్నది. మధ్యవర్తిగా ఉన్న ఒక దేశం ఇలా ఒకపక్ష కొమ్ముకాయటం దుర్మార్గం.


పాలస్తీనా-ఇజ్రాయెల్‌ వివాదంలో జరూసలెం పట్టణం ఎవరికి చెందాలన్నది ఒక అంశం. ఇటీవలి వరకు టెల్‌ అవీవ్‌లో ఉన్న తన ఇజ్రాయెల్‌ రాయబార కార్యాలయాన్ని జెరూసలెంకు తరలించాలని అమెరికా నిర్ణయించటం ఏకపక్షం, పాలస్తీనా ప్రాంతాలను ఆక్రమిస్తున్న ఇజ్రాయెల్‌ దుర్మార్గానికి మద్దతు ఇవ్వటమే. ఇంకా అమెరికా కనుసన్నలలో నడిచే అనేక దేశాలు అదే మాదిరి తమ కార్యాలయాలను కూడా జెరూసలెంకు తరలించాలని చూడటం యూదుల ఆక్రమణలను శాశ్వతం చేసే కుట్రలో భాగమే. జెరూసలెంలోని చారిత్రాత్మక అల్‌ అక్సా మసీదును ఆక్రమించుకొనేందుకు ఇజ్రాయెల్‌ పూనుకోవటమే తాజాగా హమస్‌ను దాడులకు పురికొల్పిందని చెప్పవచ్చు. 2021 ఏప్రిల్‌లో రంజాన్‌, యూదుల పండుగ పాసోవర్‌ సందర్భంగా ఉద్రిక్తతలు తలెత్తాయి. గతంలో కుదిరిన ఒప్పందం ప్రకారం ముస్లిమేతరులు ఆ మసీదు ప్రాంగణాన్ని సందర్శించాలంటే అనుమతి తీసుకోవాలి. ఇజ్రాయెల్‌ ప్రభుత్వ ప్రోత్సాహంతో మసీదు పరిసరాలను ఆక్రమించిన యూదులు ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించి పాసోవర్‌ పండగ సందర్భంగా ప్రాంగణాన్ని దురాక్రమించి ప్రార్ధనలు జరిపారు. ఏప్రిల్‌ 14వ తేదీన ఇజ్రాయెల్‌ పోలీసులు బలవంతంగా ప్రవేశించి మసీదులో ఉన్న మైకుల వైర్లను తెంచివేశారు.ఎందుకు అంటే మసీదు పక్కనే జరుగుతున్న ఇజ్రాయెలీ అధ్యక్షుడి కార్యక్రమానికి అంతరాయం కలుగుతుందని సాకు చెప్పారు. తరువాత రెండు రోజులకు పాలస్తీనియన్లు ఇజ్రాయెల్‌ పోలీసుల ఆంక్షలను తోసిపుచ్చి వేలాది మంది చేరి ప్రార్ధన చేశారు. మరుసటి నెలలో యూదు దురాక్రమణదార్లు పాలస్తీనియన్ల మీద జరిపిన దాడుల్లో వందలాది మంది పాలస్తీనియన్లు గాయపడ్డారు. అదే ఏడాది ఇజ్రాయెల్‌ – హమస్‌ మధ్య పదకొండురోజుల పాటు దాడులు ప్రతిదాడులు జరిగాయి. గతేడాది ఏప్రిల్‌లో ఇజ్రాయెలీ దళాలు ప్రవేశించి పాలస్తీనియన్ల మీద దాడులు చేశాయి. మసీదులో తిష్టవేసిన వారు తమ మీద రాళ్లు వేసినట్లు సాకు చెప్పారు. ఈ ఏడాది ఏప్రిల్‌ ఐదున కూడా ఇజ్రాయెల్‌ దళాలు మసీదు మీద దాడి జరిపాయి. మసీదులో ఉన్నవారు రాళ్లు విసిరినట్లు పాత కథనే తిరిగి వల్లించారు. అప్పటి నుంచి ఏదో ఒక సాకుతో అల్‌ అక్సా మసీదు, పరిసరాల్లో ఉన్న పాలస్తీనా ప్రాంతాలను ఆక్రమించుకొనేందుకు ఇజ్రాయలీలు రెచ్చగొడుతుండటమే ఈనెల ఆరున హమస్‌ దాడులకు కారణంగా చెబుతున్నారు. యాభై సంవత్సరాల క్రితం 1973 అక్టోబరు ఆరున ఇజ్రాయెల్‌ ఆక్రమిత పాలస్తీనా ప్రాంతాలపై అరబ్బులు ఆకస్మికంగా దాడులు జరిపారు. నాటి ఉదంతాల గురించి ఇజ్రాయెలీ మీడియాలో గత కొద్ది రోజులుగా పాలస్తీనియన్లను రెచ్చగొడుతూ వార్తలు, విశ్లేషణలు వెలువడుతున్నాయి.దాన్లో భాగంగానే సిమ్‌చాట్‌ తోరా పేరుతో యూదులు పండుగ చేసుకుంటున్న పూర్వరంగంలో దాడులకు ఆక్టోబరు ఆరవ తేదీనే హమస్‌ కూడా ఎంచుకున్నదని, ” ఆపరేషన్‌ అల్‌ అక్సా ఫ్లడ్‌ ” పేరు పెట్టినట్లు చెబుతున్నారు. దీని గురించి ఇజ్రాయెలీ గూఢచారులు ఏ మాత్రం పసిగట్టలేకపోయారు. తాడిని ఎక్కేవాడుంటే వాడి తలదన్నేవాడుంటాడు.


ఆయుధాలతో అరబ్బులను బెదిరించి వారి ప్రాంతాలను ఆక్రమించి ఇజ్రాయెల్‌ను ఏర్పాటు చేయాలన్న బ్రిటీష్‌ పాలకుల చర్యలను 1938లోనే గాంధీ మహత్ముడు హరిజన్‌ పత్రికలో రాసిన ఒక వ్యాసంలో వ్యతిరేకించారు.యూదులు ఏదేశంలో ఉంటే అదే వారి మాతృదేశం అవుతుందని పేర్కొన్నారు. సామ్రాజ్యవాదుల కుట్రలో భాగంగా 1948లో పాలస్తీనాలో కొన్ని ప్రాంతాలను గుర్తించి ఇజ్రాయెల్‌ను ఏర్పాటు చేశారు. తరువాతే అసలు కుట్ర బయటపడింది. పాలస్తీనా ప్రాంతాలను ఆక్రమించి తన రక్షణకు అవి అవసరమంటూ నాటి నుంచి నేటి వరకు అసలు పాలస్తీనా ఉనికినే లేకుండా చేసింది ఇజ్రాయెల్‌. అంతకు ముందు ఎక్కడెక్కడో ఉన్న యూదులందరినీ సమీకరించి బ్రిటీష్‌ పాలకులు అక్రమంగా పాలస్తీనాలో ప్రవేశపెట్టారు. వారికి ఆయుధాలతో శిక్షణ, నిధులు అందచేశారు.ఐరాస చేసిన విభజన తీర్మానాన్ని పాలస్తీనా అంగీకరించలేదు. ఇతర దేశాల్లోని యూదులను చేర్చటంతో అప్పటి వరకు పాలస్తీనాలో 90శాతంగా ఉన్న అరబ్బులు 67శాతానికి తగ్గారు. సారవంతమైన ప్రాంతాలతో సహా పాలస్తీనాలో 55శాతాన్ని యూదులకు కేటాయిస్తూ విభజన పధకంలో చేర్చారు. అరబ్బులకు 42శాతం, మూడుశాతం విస్తీర్ణంలో ఉన్న జెరూసలేం ప్రాంతాన్ని అంతర్జాతీయ పర్యవేక్షణలో ఉంచేందుకు నిర్ణయించారు.ప్రస్తుతం పశ్చిమ గట్టు, గాజా పాలస్తీనా పాలిత ప్రాంతాలుగా పేరుకు 23శాతం విస్తీర్ణంలో ఉన్నప్పటికీ వాటిలో కూడా ఇజ్రాయెల్‌ ఆక్రమణలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. పాలస్తీనాను విభజించినపుడు ఏడున్నరలక్షల మంది అరబ్బులు నిర్వాసితులై విదేశాలకు శరణార్ధులుగా వెళ్లారు. గడచిన 75 సంవత్సరాల్లో వారి వారసుల సంఖ్య అరవైలక్షలకు పెరిగింది. వారంతా పాలస్తీనాలోని కొన్ని శిబిరాలు, ఈజిప్టు, లెబనాన్‌, జోర్డాన్‌, సిరియాల్లో తలదాచుకుంటున్నారు.
తాజాగా హమస్‌ దాడుల గురించి పశ్చిమ దేశాల వార్తా సంస్థలు ఇచ్చిన వార్తల్లో వారి ఆధీనంలో ఉన్న గాజా ప్రాంతంలో వంద మంది ఐరోపావాసులు బందీలుగా ఉన్నట్లు పెద్ద ఎత్తున కథనాలు ఇచ్చాయి. ఇజ్రాయెల్‌ జైళ్లలో ఉన్న వేలాది మంది తమవారిని విడిచిపెడితే వారిని తాము కూడా స్వదేశాలకు పంపుతామని హమస్‌ చెప్పినట్లు వార్తలు వచ్చాయి.పశ్చిమ దేశాలు, అక్కడి మీడియాను అనుసరించే మన దేశంలోని కొందరు హమస్‌ను ఉగ్రవాదులుగానూ, ఇజ్రాయెల్‌ను ప్రజాస్వామిక శక్తిగా చిత్రిస్తున్నారు. ఇజ్రాయెల్‌ ఆక్రమించుకున్న తమ దేశాన్ని విముక్తి కావించేందుకు అనేక శక్తులు అనేక పద్దతుల్లో పోరాడుతున్నాయి. పాలస్తీనా విమోచనా సంస్థ యాసర్‌ అరాఫత్‌నే ఉగ్రవాదిగా చిత్రించిన వారు హమస్‌ను మరొక విధంగా పేర్కొంటారని అనుకోలేము.హమస్‌ గాజా ప్రాంతంలో అధికారంలో ఉంది.అది సాయుధపోరాటాన్ని ఒక మార్గంగా ఎంచుకుంది. పశ్చిమ దేశాల మద్దతు, బలమైన మిలిటరీ ఉన్న ఇజ్రాయెల్‌ను ఎదుర్కొనేందుకు కొన్ని సందర్భాల్లో గెరిల్లా పద్దతిలో దాడులు జరుపుతుంది. మన దేశ చరిత్రలో శివాజీ కూడా ఔరంగజేబు సేనల మీద, అల్లూరి సీతారామ రాజు బ్రిటీష్‌ వారి పాలకుల మీద గెరిల్లా పద్దతిలో దాడులు జరిపిన సంగతి తెలిసిందే. వారిని ఉగ్రవాదులందామా ? బ్రిటీష్‌ వారు భగత్‌ సింగ్‌నే ఉగ్రవాది అని నిందించిన సంగతి తెలిసిందే.


చరిత్రలో హిట్లర్‌ మూకలు యూదులను నిర్బంధ శిబిరాల్లో చిత్రహింసలు పెట్టి చంపిన దారుణ మారణకాండను ప్రపంచం చూసింది. గాజా ప్రాంతంలో ఇరవైలక్షల మందికి పైగా అరబ్బులు నివశిస్తున్నారు. ప్రపంచంలో అదొక పెద్ద జైలు అంటే అతిశయోక్తి కాదు. అక్కడి జనం బయటకు రావాలన్నా, పరిసరాల్లో పనిపాటలు చేసుకోవాలన్నా ఇజ్రాయెల్‌ మిలిటరీ అనుమతి తీసుకోవాల్సిందే. తనిఖీ లేందే జనాలను కదలనివ్వరు.హమస్‌ దాడులకు ముందే ఇజ్రాయెల్‌ పోలీసులు 5,250 మంది పాలస్తీనియన్లను బందీలుగా ఉంచుకున్నారు, వారిలో 170 మంది పిల్లలు కూడా ఉన్నారు. వీరి గురించి మీడియా, పశ్చిమ దేశాల మానవతావాదులు పట్టించుకోరు. ఉగ్రవాదం మీద దాడులు చేయండి తప్ప పాలస్తీనియన్ల మీద కాదంటూ కొందరు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఏడున్నర దశాబ్దాలుగా దాడులు చేస్తున్నది సామాన్యజనం మీదనే అన్న వాస్తవాన్ని దాచేందుకే ఈ పదజాలం.పాలస్తీనా వాసులు పోరులోనే పుట్టి ,పోరులోనే పెరిగి ,పోరులోనే మరణిస్తున్నారు. అంతకంటే వారికి పోయేదేమీ లేదు. వారి మాతృదేశ కాంక్ష మరింతగా పెరుగుతుందే తప్ప నిర్భంధంతో అణిగేది కాదు. జెరూసలెంతో సహా అరబ్బులకు నిర్దేశించిన ప్రాంతాలను పూర్తిగా తిరిగి వారికి అప్పగించకుండా, వారి ప్రాంతాలలో యూదుల నివాసాలను ఖాళీ చేయించకుండా సమస్య పరిష్కారం కాదు. పాలస్తీనియన్ల మాతృదేశ కాంక్ష తీరదు.


ఇప్పటికే మాతృగడ్డమీద దశబ్దాల తరబడి బందీలుగా మారిన పాలస్తీయన్ల భవితవ్యం గురించి ఒకవైపు ప్రపంచం ఆలోచిస్తుంటే మరోవైపు వారిని మరింతగా అణచివేసేందుకు అవసరమైన ఆయుధాలను అమ్ముకొనేందుకు అమెరికా పూనుకుంది. ఇజ్రాయెల్‌ మీద దాడి చేసినందుకు ప్రతీకారంగా పాలస్తీనాకు అందచేస్తున్న సాయాన్ని సమీక్షించే నెపంతో ఐరోపా నిలిపివేసింది. అదే పాలస్తీనా మీద యుద్ద విమానాలతో దాడులు చేస్తున్న ఇజ్రాయెల్‌కు అమెరికా సాయాన్ని పెంచాలని నిర్ణయించింది. యూదుల అణచివేతను ఆయుధంగా చేసుకొని హిట్లర్‌ మారణకాండకు పాల్పడ్డాడు. అదే యూదులకు మాతృదేశాన్ని ఏర్పాటు చేయాలనే సాకుతో పశ్చిమాసియాలో ఉన్న చమురు, ఇతర సహజ సంపదలను ఆక్రమించాలని చూసిన బ్రిటన్‌, అమెరికా తదితర పశ్చిమ దేశాలు అందుకోసం తమ తొత్తుగా పనిచేసే ఇజ్రాయెల్‌ను ఏర్పాటు చేయాలన్న ఎత్తుగడలను ప్రపంచం చూసింది.ఉక్రెయిన్‌ వివాదంలో తటస్థవిధానాన్ని అనుసరించిన మనదేశం పశ్చిమాసియాలోనే కాదు, ప్రపంచ శాంతికి విఘాతం కలిగించే ఇజ్రాయెల్‌ దుశ్చర్యలను ఖండించాల్సిందిపోయి ఇప్పుడు ఇజ్రాయెల్‌కు మద్దతు ప్రకటించింది. ఇది గడచిన ఏడుదశాబ్దాలుగా అనుసరిస్తున్న మన విదేశాంగ విధానానికే విరుద్దం. నరేంద్రమోడీ సర్కార్‌ వైఖరి బిజెపితో సహా సంఘపరివార్‌ సంస్థల ముస్లిం వ్యతిరేకతకు ప్రతిబింబం తప్ప మరొకటి కాదు. ఇలాంటి వైఖరితో తలెత్తే పర్యవసానాల గురించి ఎవరెన్ని హెచ్చరికలు చేసినా, సుద్దులు చెప్పినా పట్టించుకోకపోవటం విచారకరమే కాదు గర్హనీయం.స్వాతంత్య్రపోరాటంలో భాగస్వామ్యం లేకపోవటమే కాదు దానికి వ్యతిరేకంగా పని చేసిన శక్తుల వారసులు పాలస్తీనియన్ల మాతృదేశ విముక్తి వాంఛ, దురాక్రమణ వ్యతిరేక పోరాటాన్ని అర్ధం చేసుకొంటారని భావించటం అత్యాశే అవుతుంది. ఇజ్రాయెల్‌ను సమర్ధిస్తున్న అమెరికా తదితర దేశాల వైఖరిని యావత్‌ శాంతి శక్తులు ఎలుగెత్తి ఖండించాలి, పాలస్తీనా విముక్తికి పోరాడుతున్న వారికి సంఘీభావం ప్రకటించాలి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

భూసంస్కరణలపై స్వామినాధన్ సిఫారసుల విస్మరణ

08 Sunday Oct 2023

Posted by raomk in Current Affairs, Economics, Farmers, History, INDIA, NATIONAL NEWS, Opinion, Prices, Science

≈ Leave a comment

Tags

Father of the Green revolution, Green Revolution, land reforms importance in india, ms swaminathan

డాక్టర్ కొల్లా రాజమోహన్

ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ యం. యస్. స్వామినాథన్ గారి మరణం భారత దేశ రైతాంగానికి తీవ్రమైన విషాదం కలిగించింది. అధిక దిగుబడినిచ్చే గోధుమ, వరి విత్తనాలను అభివృద్ధిచేసి వ్యాప్తి చేయడంలో కీలక పాత్ర వహించిన డాక్టర్ స్వామినాధన్, భారత దేశం గర్వించ దగ్గ వ్యవసాయ శాస్త్రవేత్త. ఇంటర్నేషనల్ బోర్డ్ ఫర్ జెనిటిక్ రీసెర్చ్, ఇక్రిసాట్ రూపకల్పన, యం. యస్. స్వామినాధన్ రీసెర్చ్ ఫౌండేషన్ లను స్థాపించారు. ఫిలిప్పీన్స్ లో అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్ధ ను రాక్ ఫెల్లర్, ఫోర్డ్ ఫౌండేషన్ల సహాయంతోస్ధాపించి, అధిక దిగుబడి వరి వంగడాలను కనుగొన్నారు. ప్రపంచంలోనే అత్యున్నత పురస్కారమైన వరల్డ్ ఫుడ్ ప్రైజ్ 1987 లోనే ప్రప్రధమంగా అందుకున్నారు. ఆ ప్రైజ్ మనీ 2 లక్షల డాలర్లను భావితరాల పరిశోధనకు యం.యస్.స్వామినాధన్ రీసర్చి ఫౌండేషన్ కి ఇచ్చారు. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్, రామన్ మెగసెసే అవార్డ్, ఆల్బర్ట్ ఐన్ స్టీన్ ప్రపంచ సైన్స్ అవార్డ్, ఇందిరాగాంధీ శాంతి బహుమతి, ఇందిరా గాంధీ సమైక్యతా పురస్కారాలను అందుకున్నారు.

వరి, గోధుమ పంటలపై ఆయన చేసిన పరిశోధనల మూలంగా భారత దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. హరిత విప్లవంగా పిలిచే గ్రీన్ రివల్యూషన్ సృష్టికర్త స్వామినాధన్. అమెరికా షరతులను ఒప్పుకుని, పీ యల్ 480 నిధులద్వారా గోధుమలను దిగుమతి చేసుకున్న భారతదేశాన్ని, ఆహారాన్ని ఎగుమతి చేసే దేశంగా తీర్చిదిద్దారు.జాతీయ రైతు కమిషన్ అధ్యక్షులుగా, భారత వ్యవసాయాన్ని పరిశోధించి 5 సంపుటాలను భారత జాతికి అంకితమిచ్చారు. రైతు అభివృధికి కొన్ని ఫార్ములాలు రూపొందించి సిఫార్సులను చేశారు. అందులో మొట్టమొదటిది భూసంస్కరణలు.  తర్వాత ప్రాధాన్యత నీరు.  రైతు శ్రమ, రైతు పెట్టుబడి, భూమికౌలు, సమగ్ర వ్యవసాయ ఖర్చులు అన్నీ కలిపి దానికి 50 శాతం చేర్చి, కనీస మద్దతు ధర వుండాలని C2+50 ఫార్ములా రూపొందించారు. దీనిని అన్ని రాజకీయపార్టీలు, రైతుసంఘాలు ఆహ్వానించాయి. దీనికై ఢిల్లీ సరిహద్దలలో సంవత్సరం పైగా చారిత్రాత్మకంగా ఆందోళనలు చేశారు . కానీ ఇప్పటికీ కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించనందున రైతాంగ పోరాటం కొనసాగుతోంది.

వ్యవసాయం లో ఉత్పత్తిని పెంచుకుంటూ, వాతావరణాన్నికాపాడుకుంటూ, వ్యవసాయ విప్లవం నిరంతరం సాగాలన్నారు. దానికి “ ఎవర్ గ్రీన్ రివల్యూషన్ ” అని పేరుపెట్టారు. వ్యవసాయ టెక్నాలజీని రైతులకు అందించి ఆకలిని దూరంచేయటమే కాకుండా రైతుల స్ధితిగతులను అభివృద్ధిచేయాలన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా రైతుల ఆదాయాలు పెరగాలన్నారు. చిన్న ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనం కన్నా రైతుల ఆదాయం తక్కువగావున్న విషయాన్ని నిరసించారు. బ్రిటిష్ ప్రభుత్వ వలస విధాన ఒత్తిడి వలన ఆహార పంటలకు బదులుగా నీలి మందు, తేయాకు, పొగాకు లాంటి వ్యాపారపంటలను రైతులు బలవంతంగా సాగు చేశారు. వలసపాలన వలన పండించిన పంటలకు సరైన ధర లేదు. పెరుగుతున్న భారత దేశ జనాభాకు అనుగుణంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరగలేదు. స్వాతంత్ర్యం వచ్చే సమయానికి మన దేశంలో ఏటా 60 లక్షల టన్నుల గోధుమలు మాత్రమే పండేవి. 1960 లో గోధుమల ఉత్పత్తి కోటి టన్నులు మాత్రమే. 1965, 66 రెండు సంవత్సరాలు వరసగా వర్షాభావం వలన సంభవించిన కరువు కారణంగా కోటి టన్నుల గోధుమలను అమెరికా షరతులకు లోబడి దిగుమతి చేసుకోవలసి వచ్చింది. “షిప్ టు మౌత్” అంటే ఓడ లో ఆహారధాన్యాలు వస్తేనే మన నోట్లోకి ముద్ద దిగని పరిస్ధితి. 1960 కి ముందు హెక్టారుకు 2 టన్నులున్న వరి దిగుబడి స్వామినాధన్ గారి నూతన విత్తనాల వలన రెట్టింపయింది. 21 వ శతాబ్దం నాటికి 300 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేసి ఎగుమతి చేయగలుగుతున్నాము.

మన దేశం క్లిష్ట సమయంలో వుండటానికి ప్రధాన కారణం వ్యవసాయ సంక్షోభం అని నమ్మిన మేధావులలో స్వామినాధన్ గారు ముఖ్యులు. వ్యవసాయంలో ఆయన శాస్త్రజ్ఞుడిగా అపారమైన కృషి చేసి ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయంసమృద్ధిని సాధించి దేశానికి ఆహార భధ్రత కల్పించారు.

జాతీయ రైతు కమిషన్ (National commission on Farmers) 

భారత ప్రభుత్వం నవంబరు 18, 2004 న నియమించిన జాతీయ రైతు కమిషన్ (NCF) ప్రొఫెసర్ MS స్వామినాథన్ అధ్యక్షతన ఏర్పాటైంది. కమిటీ లో రైతు నాయకులు అతుల్ కుమార్ అంజన్ తో సహా 8 మంది సభ్యులున్నారు. NCF వరుసగా డిసెంబర్ 2004, ఆగస్టు 2005, డిసెంబర్ 2005 మరియు ఏప్రిల్ 2006లో నాలుగు నివేదికలను సమర్పించింది. సిఫారుసులతో కూడిన 5 వ రిపోర్టును అక్టోబర్ 4 2006 న సమర్పించింది.

జాతీయ రైతు కమిషన్ (NCF) అధ్యయనానికి ప్రభుత్వం చేసిన సూచనలు.

1. ప్రధాన వ్యవసాయ పంటల ఉత్పాదకత, లాభదాయకత పెంపొందించడం; 2. ఆహార భద్రత, పోషకాహార భద్రత  వ్యూహం; 3.  రైతుల ఋణాలను పెంచడానికి విధాన సంస్కరణలు; 4.  ట్ట ప్రాంతాలు, నిస్సార భూములు, పోడు భూములు, కొండ, తీర ప్రాంతాల్లోని రైతులకు  వ్యవసాయం కోసం ప్రత్యేక కార్యక్రమాలు; 5. వ్యవసాయ వస్తువుల నాణ్యత పెంచి, ధరలలో పోటీతత్వాన్ని పెంపొందించి , తద్వారా వాటిని ప్రపంచవ్యాప్త పోటీగా మార్చడం; 6.  అంతర్జాతీయ ధరలు బాగా పడిపోయినప్పుడు దిగుమతుల నుండి రైతులను రక్షించడం; 7. స్థిరమైన వ్యవసాయం కోసం, పర్యావరణ పరిరక్షణకు, ఎన్నికైన స్థానిక సంస్థలకు అధికారం ఇవ్వడం;

జాతీయ రైతు కమిషన్ (NCF) అభిప్రాయాలు మరియు కీలక సిఫార్సులు.

రైతుల కష్టాలు – ఆత్మహత్యలకు కారణాలు

జాతీయ రైతు వ్యవసాయ కమీషన్ ( NCF ) కు స్వామినాధన్ గారే ఛైర్మన్. రైతుల కష్టాలకు, ఆత్మహత్యల పెరుగుదలకు కారణాలపై దృష్టి సారించి పరిష్కారాలను సూచించారు. వాటిలో మొదటిది భూ సంస్కరణల అసంపూర్తి కార్యక్రమం. తరువాత నీటిపారుదల అసౌకర్యాలు, అందుబాటు లో లేని వ్యవసాయ సాంకేతికత, సరైన సమయంలో అందని  సంస్థాగత ఋణాలు,  ప్రతికూల వాతావరణం, ప్రకృతి వైపరీత్యాలు.  భీమా, సాంకేతిక పరిజ్ఞానం. మార్కెట్‌లతో సహా ప్రాథమిక వనరులపై రైతులకు భరోసా, నియంత్రణ ఉండాలన్నారు. రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితాలో “వ్యవసాయం” చేర్చాలని NCF సిఫార్సు చేసింది.

భూమి గురించి 1) దేశంలోని మొత్తం భూయాజమాన్యంలో దిగువన వున్న 50 శాతం గ్రామీణ కుటుంబాల వాటా కేవలం 3 శాతం మాత్రమే అని,  ఎగువన వున్న 10 శాతం మంది చేతిలో54 శాతం భూమి వున్నదన్న గణాంకాలను రిపోర్టులో ఎత్తి చూపించారు. వ్యవసాయ సంక్షోభ పరిష్కారానికి భూసంస్కరణలే కీలకమన్నారు. మిగులు భూముల, బంజరు భూముల పంపిణీనే పరిష్కార మన్నారు. 2) ప్రధాన వ్యవసాయ భూములను, అటవీ భూములను కార్పొరేట్ రంగానికి మళ్ళించటాన్ని నిరోధించాలన్నారు. 3) అడవి లో వున్న గిరిజనుల అటవీ హక్కులను రక్షించాలన్నారు. 4) భూమిని , వాతావరణాన్ని రక్షించటానికి జాతీయ భూమి వినియోగ కమిషన్ ను ఏర్పరచమన్నారు.  భూమి, నీరు, జీవన వనరులు, రైతుల ఆదాయం మరియు భీమా, సాంకేతిక విజ్ఞాన నిర్వహణ, మార్కెట్ తో సహా ప్రాధమిక వనరులపై జాతీయ భూమి వినియోగ కమిషన్ కు నియంత్రణ వుండాలన్నారు. 5) వ్యవసాయ భూమి పరిమాణం, వినియోగం, కొనుగోలుదారుల వర్గాన్ని బట్టి భూమి విక్రయం నియంత్రించాలన్నారు.

డా.స్వామినాదన్  చేసిన ప్రధాన సిఫారసు అయిన భూసంస్కరణల సంగతి ఎత్తిన వారే లేకపోవటం, వ్యవసాయ భూములను కార్పొరేట్ సంస్ధలకు కట్టపెట్టటాన్ని ఎదుర్కోలేక పోవటం దేశ దౌర్భాగ్యానికి పట్టిన దుర్గతికి తార్కాణం. భూమి గురించి వ్యవసాయ కమీషన్ చేసిన సిఫారసులను రైతు సంఘాలు, జాతీయ పార్టీలు విస్మరించాయి. వ్యవసాయ రంగం అభివృధి చెందటానికి కీలకం భూసంస్కరణలు అని స్వామినాధన్ కమీషన్ రిపోర్టు మొదటి రికమండేషన్ గా పేర్కొంది. తెలిసి చేసినా తెలియక చేసినా, భూసంస్కరణల ఎజెండాను పక్కన పెట్టడం తీవ్రమైన పొరపాటు. పాలక వర్గ పార్టీల అవినీతి వ్యవహారాలన్నీ భూమి చుట్టూ తిరుగుతున్న విషయాన్ని గ్రహించాలి. భూసంస్కరణలకు భూమి ఎక్కడుందంటూనే వేల ఎకరాలను కార్పోరేట్లకు అప్పగిస్తున్నారు.

భూమి వ్యాపార వస్తువై ధనవంతుల స్పెక్యులేషన్ లో ఆటవస్తువైపోతున్నది. వ్యవసాయం చేసేవారి చేతిలో భూమి లేదు. అమెరికాలోనో, హైదరాబాద్ లోనో వున్న వారికే  గ్రామాలలో భూములు ఎక్కువగా వుంటున్నాయి.  భూమి కోసం పోరాటాలు చేయలేమని, పోరాటాలు చేసినా పాలక వర్గాలు అంగీకరించవని, ప్రజలు రావటం లేదని, ప్రస్తుత ఉద్యమ కారుల వాదన. సోవియట్ పతనం తరువాత కమ్యూనిస్టు పార్టీ చీలికలయినా  ఉద్యమకారులలో ఆశయాలపట్ల ఆరాధన తగ్గలేదు. కానీ ఆచరణ గణనీయంగా తగ్గింది.

ఎరువులు-పురుగు మందులు-కలుపు మందులు

భూ సారాన్ని గమనించకుండా, భూమిని తీవ్రంగా సాగు చేయటంవలన భూమి ఎడారిగా మారుతుందన్నారు. ఎరువులు, పురుగు మందులు, కలుపు మందులు విచక్షణారహితంగా వాడటంవలన ఆహార పదార్ధాలలో వాటి అవశేషాలు కేన్సర్ జబ్బులకు కారణమౌతాయన్నారు. భూగర్భ జలాలను అశాస్త్రీయంగా ట్యాపింగ్ చేయటం వలన అద్భుతమైన భూజల వనరు అంతమౌతుందన్నారు.ఇరిగేషన్, డ్రైనేజ్ కు పెట్టుబడిని గణనీయంగా పెంచాలని కమిషన్ చెప్పింది. సాయిల్ టెస్టింగ్, భూమి లో  సూక్ష్మపోషకాల పరీక్షకు ప్రయోగశాలలు ఏర్పాటు చేయాలన్నారు.

ఋణం , భీమా . ప్రాధమిక అవసరాలకు సరైన సమయంలో సరిపోను ఋణాలను 4శాతం సాధారణ వడ్డీకి ప్రభుత్వం అందించాలన్నారు. ప్రకృతి వైపరీత్యాలలో, రైతులు నష్టాలలో వున్నపుడు తాత్కాలికంగా రైతుల పరిస్ధితి మెరుగయ్యేంతవరకూ ప్రభుత్వ మరియు ప్రభుత్వేతర సంస్ధల అప్పు వసూళ్ళను నిలిపివేయాలన్నారు. ప్రకృతి వైపరీత్యాల నష్టాన్ని తట్టుకోవటానికి ఒక నిధిని ప్రభుత్వం ఏర్పరచాలన్నారు. రైతుల ఆరోగ్యానికి, అప్పులకు, పంటకు, పశువులకు, ఒకటే భీమా ప్యాకేజీ ని ఏర్పాటు చేయాలన్నారు. స్వయం సహకార సంఘాలను ఏర్పాటు చేసి మానవ వనరులను అభివృధి చేసి ఆర్ధిక సేవలు, మౌలిక సదుపాయాలు, మార్కెటింగ్ అందరికి అందించాలన్నారు.

ఆహార భద్రత. 2400 కేలరీల కన్నా తక్కువ ఆహారం తీసుకునే పేదలు గ్రామీణ ప్రాంతాలలో 77 శాతం మంది వున్నారన్నారు. పేదరికం, సరైన ఆహారం లేకపోవటం గ్రామీణ ప్రాంతాలలో ముఖ్యంగా వర్షాధార వ్యవసాయ ప్రాంతాలలో  కేంద్రీకృతమై వుందన్నారు. సార్వత్రిక పంపిణీవ్యవస్ధను అమలు చేసి, జాతీయ ఆహార పధకాలను అమలుపరచుటకు జీడీపీ లో 1 శాతం నిధులు సరిపోతాయన్నారు. పనికి ఆహార పధకం వలన పేదలకు ఉపాధి, ఆహారం లభిస్తాయన్నారు.

ఎక్కువ రిస్క్ తో కూడిన బీ టీ కాటన్ లాంటి పంటలకు దూరంగా వుంటూ తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి, ఆదాయం వచ్చే పంటలను సాగుచేయాలన్నారు.దిగుమతి సుంకాలను విధించి ఇతర దేశాల దిగుమతుల పోటీ నుండి రైతులను రక్షించాలన్నారు. రైతులకు వినియోగదారులకు మధ్య అనుసంధాన్ని పెంచి దళారులులేని మార్కెట్ ను ఏర్పాటుచేయాలన్నారు.

కనీస మద్దతు ధర

వ్యవసాయ ఖర్చులకు 50 శాతం కలిపి కనీస మద్దతు ధరను నిర్ణయించాలన్నారు. C2+50 ఫార్ములా ను రూపొందించారు. C2 అంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కు (సమగ్ర వ్యవసాయ ఖర్చులకు) 50 శాతం కలపాలన్నారు.వరి, గోధుమ లతోపాటు జొన్న, పప్పుధాన్యాలు లాంటి పంటలన్నిటికీ కనీస మద్దతు ధర నిర్ణయించి ఆ ధరకు కొనేటట్లు గా చట్టం చేయాలన్నారు.రైతుల నికర ఆదాయం ప్రభుత్వ ఉద్యోగుల ఆదాయంతో పోల్చదగినదిగా వుండాలన్నారు.రైతు పండించిన పంటకు మద్దతు ధర C2+50 అమలుపరచటమే కీలక సమస్యగా రైతు సంఘాలు  ముందుకు తెచ్చాయి. కనీస మద్దతు ధర పై చట్టం చేయటమే ముఖ్య డిమాండ్ గా రైతుల ఐక్యత ను సాధించి, ప్రశంసనీయమైన చారిత్రాత్మక మహోద్యమాన్ని నడిపారు. భారత రాజకీయ ఎజెండాలో కనీసమద్దతు ధర పై చట్టం చేయాలని డిమాండ్ చేశారు. కానీ అమలు కానందున ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు.

డాక్టర్ స్వామినాధన్ చేసిన రికమండేషన్లు అన్నిటినీ అమలు చేసినపుడే వారి కృషికి సార్ధకత చేకూరుతుంది. రైతుకు భద్రత- దేశానికి ఆహార భద్రత లభిస్తుంది. భూసంస్కరణలు, నీటి వనరులు, కనీసమద్దతు ధరకు చట్టబధతతో సహా అన్ని సిఫారసులను అమలు చేయటమే వారికి సరైన నివాళి. రైతు కమీషన్ సిఫారసులన్నిటినీ అమలు చేయాలని రైతులు పోరాడాలి.

డాక్టర్ కొల్లా రాజమోహన్, నల్లమడ రైతు సంఘం, ఫోన్ నెం. 9000657799.

Share this:

  • Tweet
  • More
Like Loading...

పతకాలు తెచ్చిన భారత ఆసియాడ్‌ క్రీడాకారులకు అభినందనలు – ఆటలను పట్టించుకోని పాలకులకు అక్షింతలు !

08 Sunday Oct 2023

Posted by raomk in CHINA, COUNTRIES, Current Affairs, INDIA, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, Sports

≈ Leave a comment

Tags

Asian Games 2023, BJP, China, First Asian Games, Hangzhou Asian Games, Narendra Modi Failures


ఎం కోటేశ్వరరావు


చైనాలోని హాంగ్‌ఝౌలో శనివారం నాడు ముగిసిన పందొమ్మిదవ ఆసియాడ్‌లో మన క్రీడాకారులు కొత్త చరిత్ర సృష్టించారు. పతకాల వేటలో గత 70 రికార్డును అధిగమించి వంద పతకాలను సాధిస్తామన్న ఆత్మవిశ్వాసంతో వెళ్లి 107 పతకాలతో తిరిగి వచ్చినందుకు యావత్‌ దేశం వారిని అభినందిస్తోంది. రానున్న రోజుల్లో మరిన్ని పతకాలను తెచ్చి దేశ కీర్తిపతాకను సమున్నతంగా ఎగురవేయాలని ఆశిస్తోంది.నాలుగేండ్లకు ఒకసారి జరుగుతున్న ఆసియా క్రీడలు చైనాలో కరోనా నిరోధ చర్యల కారణంగా 2022లో జరగాల్సినవి ఈ ఏడాది నిర్వహించారు. 2026లో జపాన్‌లోని ఇచి, నాగోయా నగరాల్లో జరగనున్నాయి. మన క్రీడాకారులు 28 బంగారు,38 రజిత, 41 కాంస్య పతకాలను సాధించారు. వీటిలో కొన్ని అనూహ్య పతకాలు ఉన్నాయి. చైనా, జపాన్‌, దక్షిణ కొరియా తరువాత నాలుగవ స్థానంలో మన దేశం ఉంది.జనాభాతో, ఆర్థికంగా చైనాతో పోటీపడుతున్న మనం క్రీడల్లో ఎందుకు పోటీలో లేము అని ఎవరైనా అనుకోవచ్చు.దానికి ఏడున్నర దశాబ్దాలుగా దేశాన్ని పాలిస్తున్న పార్టీలు, వాటి నేతలు తప్ప క్రీడాకారులు కాదు. అధికారం నిలుపుకోవటం మీద ఉన్న యావ యువతలో ఉన్న నైపుణ్యాలను వెలికి తీయాలన్నదాని మీద ఏ మాత్రం లేదు. పోటీలకు ముందు రెజ్లర్స్‌ ఫెడరేషన్‌ బ్రిజ్‌ భూషన్‌ శరణ్‌ సింగ్‌ (బిజెపి ఎంపీ ) నిర్వాకం, క్రీడాకారుల ఆందోళన గురించి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం తన ఎంపీని కాపాడుకొనేందుకు ఇచ్చిన ప్రాధాన్యత పోటీల్లో పాల్గొనేవారి పట్ల చూపలేదు. అందుకే చివరికి ఫెడరేషన్‌ లేదు, జాతీయ శిక్షణా శిబిరాలు లేవు, అంతర్జాతీయ శిక్షకులు లేరు, అయినప్పటికీ తాజా క్రీడల్లో వారు ఒక వెండి, నాలుగు కాంస్య పతకాలను సాధించారు.మరికొన్ని క్రీడలకు సంబంధించిన వివాదాల కారణంగా చివరి వరకు ఎంపికలు జరగలేదంటే మన యాజమాన్య నిర్వహణ ఎంత అసమర్ధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఉదాహరణకు ఈక్వెస్ట్రియన్‌ పోటీలో పాల్గొనాలంటే క్రీడాకారులతో పాటు గుర్రాలను కూడా తీసుకుపోవాల్సి ఉంటుంది. క్వారంటైన్‌ నిబంధనల కారణంగా భారత గుర్రాలను చైనా అనుమతించటం లేదనే కీలక అంశాన్ని తన దగ్గర దాచారని క్రీడాకారుడు గౌరవ్‌ పుందిర్‌ చెప్పాడు. తీరా తెలుసుకున్న తరువాత ఐరోపా, మరోచోట తగిన గుర్రాల కోసం వెళ్లేందుకు, శిక్షణ పొందేందుకు తనకు అవకాశం లేకుండా పోయిందని, ఎంపిక విధానాన్ని కూడా మార్చారని వాపోయాడు. పోటీలకు వెళ్లకుండా తనను అడ్డుకోవటమే ఫెడరేషన్‌ అధికారుల ఎత్తుగడగా కనిపించిందని ఆరోపించాడు. పతకాలు వచ్చిన వారికి బహుమతులు ఇచ్చి గొప్పలు చెప్పుకోవటం కాదు కావాల్సింది. ప్రతిభను గుర్తించి అవసరమైన శిక్షణ సౌకర్యాలు, క్రీడలనే ఆలంబనగా చేసుకున్న వారు జీవితంలో స్థిరపడేందుకు ఇచ్చే చేయూతను బట్టే యువతరం ముందుకు వస్తుంది. ఇప్పుడు వచ్చిన పతకాల కీర్తి కూడా క్రీడాకారుల తపనకు, వారిని ప్రోత్సహించిన తలిదండ్రులకు తప్ప మరొకరికి దక్కదు. ఈ క్రీడల్లో కొన్ని అనూహ్య పతకాలను మన దేశానికి సాధించటం సంచలనం కలిగించింది.


1951లో మనదేశమే తొలి ఆసియాడ్‌కు ఆతిధ్యమిచ్చింది.నాడు 17 దేశాల వారు 489 మంది పాల్గొంటే ఇప్పుడు 41కి, పోటీలు 57 నుంచి 481 అంశాలకు పెరిగాయి. చైనా 1962 నుంచి మాత్రమే పాల్గొంటున్నది.ఇప్పటి వరకు వివిధ దేశాలు సాధించిన బంగారు పతకాల సంఖ్య ఇలా ఉంది. బ్రాకెట్లలో ఉన్నవి మొత్తం పతకాల సంఖ్య) చైనా 1,674 ( 3,570, జపాన్‌ 1,084( 3,240), దక్షిణ కొరియా 787 (2,425), ఇరాన్‌ 193 (611), భారత్‌ 183( 779).తొలి ఆసియన్‌ గేమ్స్‌ జరిగిన తీరు చూస్తే అసలు నిర్వాహకులు ఎంత ఇబ్బంది పడింది, అధికారంలో ఉన్నవారికి క్రీడల పట్ల శ్రద్దలేమి స్పష్టంగా కనిపించింది. నాటి నుంచి నేటి వరకు ఉత్సాహవంతులైన వారి చొరవే ప్రధానంగా కనిపించింది. తొలి క్రీడల్లో జపాన్‌ 24 బంగారు పతకాలతో మొత్తం 58 పొందగా రెండవ స్థానంలో మన దేశం 15 స్వర్ణాలతో 51 పతకాలు సాధించింది. తరువాత 1962లో జపాన్‌ 73 స్వర్ణాలతో ముందుండగా పదింటితో రెండవ స్థానంలో మన దేశం ఉండటం తప్ప అప్పటి నుంచి ఇప్పటి వరకు మన దేశం రెండవ స్థానానికి ఎదగలేదు. టెహరాన్‌ 1974 క్రీడలలో చైనా 32 స్వర్ణాలతో రెండవ స్థానంలోకి వచ్చింది. తరువాత 1982లో న్యూఢిల్లీలో జరిగిన ఆసియాడ్‌లో తొలిసారిగా 61 పతకాలతో జపాన్ను వెనక్కు నెట్టి మొదటి స్థానానికి వచ్చిన చైనా అప్పటి నుంచి వెనక్కు తిరిగి చూడలేదు.1990లో తొలిసారిగా చైనాలో ఆసియా క్రీడలు జరిగాయి.183 బంగారు, మొత్తం 341 పతకాలతో చైనా క్రీడాకారులు అదరగొట్టారు. తాజా పోటీలలో 200 స్వర్ణ, 111 రజత, 71 కాంస్యాలతో మొత్తం 382 పతకాలను సాధించింది.


1896 నుంచి 2020 వరకు జరిగిన ఒలింపిక్స్‌లో మనదేశం నిరాశాజనక ప్రతిభనే కనపరిచింది.2024లో జరిగే పారిస్‌ ఒలింపిక్స్‌లో మంచి ప్రతిభ కనపరచాలని కోరుకుందాం. 2020లో జరగాల్సిన టోకియో ఒలింపిక్స్‌ మరుసటి ఏడాది జరిగాయి. వాటిలో 39 స్వర్ణాలు, మొత్తం 113 పతకాలతో అమెరికా, 38 స్వర్ణాలు, మొత్తం 89తో చైనా, 26 స్వర్ణాలు, మొత్తం 57 పతకాలతో జపాన్‌ తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. మన దేశం ఒక స్వర్ణం, మొత్తం ఏడు పతకాలతో 48వ స్థానంలో ఉంది. ఇప్పటి వరకు జరిగిన 32 పోటీల్లో ఐదు స్థానాలో అధిక పతకాలు తెచ్చుకున్న తొలి దేశాల వివరాలు ఇలా ఉన్నాయి. సోవియట్‌ యూనియన్‌కు వెయ్యికిపైగా పతకాలు వచ్చినప్పటికీ అది ఉనికిలో లేనందున దాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. చైనా ఆలశ్యంగా ఒలింపిక్స్‌లో అడుగుపెట్టిందన్న అంశాన్ని గమనలో ఉంచుకోవాలి.1984 లాస్‌ ఏంజల్స్‌ పోటీల నుంచి పాల్గొంటున్నది.
దేశం×××× స్వర్ణం ××రజతం×× కాంస్య××× మొత్తం
అమెరికా × 1,061×× 830 ×× 738××× 2,629
బ్రిటన్‌ ××× 284 ×× 318 ×× 314 ××× 916
ఫ్రాన్స్‌×××× 223 ×× 251×× 277 ××× 751
జర్మనీ×××× 201 ×× 207 ×× 247 ××× 655
చైనా ×××× 263 ×× 199 ×× 174 ××× 636
ఇటలీ ×××× 217 ×× 188 ×× 213 ××× 618
భారత్‌ ×××× 10 ×× 9 ×× 16 ××× 35


క్రీడలకు రాజకీయాలు ఉండవు. రాజకీయ కారణాలతో కొన్ని దేశాలు కొన్ని పోటీలను బహిష్కరించిన ఉదంతాలు ఉన్నాయి. చైనాతో జనాభాను అధిగమించిన మనం క్రీడల్లో ఎందుకు దూసుకుపోలేకపోతున్నాం అన్నది ప్రశ్న. మన దేశంలో పిల్లలతో ఆటలాడించేందుకు స్థలాల్లేకుండానే పాఠశాలలకు అనుమతులిస్తున్నారు. ఎన్ని స్కూళ్లలో క్రీడోపాధ్యాయులు ఉన్నారు. ఎన్ని చోట్ల ఆటలాడిస్తున్నారు, అవసరమైన కనీస పరికరాలు ఎన్ని చోట్ల ఉన్నాయి అన్నది రోజు మనం చూస్తున్నదే.కేంద్రమైనా, రాష్ట్రాలైనా ఒకే విధంగా ఉన్నాయి. పిండికొద్దీ రొట్టె అన్నారు. క్రీడల మీద మనం చేస్తున్న ఖర్చు ఎంత ? మాజీ అధ్లెట్‌, 2018లో కేంద్ర మంత్రిగా ఉన్న రాజ్యవర్ధన్‌ సింగ్‌ రాధోడ్‌ పార్లమెంటులో ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ 2017-18లో కేంద్ర క్రీడల బడ్జెట్‌ రు.1,329 కోట్లని, 2011 జనాభా లెక్కల ప్రకారం రోజుకు తలకు ఒక్కరి మీద మూడు పైసలు క్రీడలకు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు.ఆ వార్తను ప్రచురించిన స్పోర్ట్స్‌ క్రీడా డాట్‌ కామ్‌ చైనా డైలీలో వచ్చిన సమాచారం ప్రకారం చైనా ప్రభుత్వం ఏటా 316.5బిలియన్‌ యువాన్లు ఖర్చు చేస్తున్నదని దాన్ని రూపాయల్లో మారిస్తే మూడులక్షల కోట్లని(2018 జనవరి 9) పేర్కొన్నది. ఈ ఏడాది మార్చి 28వ తేదీన టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాలో వచ్చిన వార్త ప్రకారం 2007-08లో మన కేంద్ర బడ్జెట్‌లో రు.708 కోట్లు కేటాయించారని తరువాత కామన్‌వెల్త్‌ క్రీడలు ఉన్నందున 2009-10లో రు.3,760, మరుసటి ఏడాది రు.2,841కోట్లుగా ఉందని 2015-16లో రు.1,121 కోట్లకు తగ్గింది. ఖేలో ఇండియా కార్యక్రమం ప్రకటించిన తరువాత 2019-20లో రు.2,636 కోట్లు కేటాయించారు. కరోనాలో రు.1,800 కోట్లకు తగ్గించారు.2023-24 బడ్జెట్‌లో రు.3.397 కోట్లు కేటాయించగా దానిలో ఖేలో ఇండియాకు వెయ్యికోట్లు పక్కన పెట్టారు.ఈ మొత్తం 140 కోట్ల జనాభాకు తలకు ఏటా రు.24 అవుతుంది. బ్రిటన్‌లో 2022-23లో తలకు రు.4,898, ఆస్ట్రేలియాలో రు.976 ఖర్చు చేస్తున్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఏటా కేటాయిస్తున్న మొత్తాలు రూపాయలలో పెరుగుతున్నట్లు కనిపిస్తాయి. కానీ ఎంత పెరిగినప్పటికీ మొత్తం బడ్జెట్‌లో వాటా 0.6 నుంచి 0.8శాతం మధ్యనే ఉంటోంది. మన దేశంలో ఇంత తక్కువ ఖర్చు పెడితే క్రీడాకారులు ఎలా తయారవుతారు, పతకాలు ఎలా వస్తాయి ? పోనీ ప్రతిభ గలవారికి కొరత ఉందా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d