Tags

, , , , , , , , , , , ,


ఎం కోటేశ్వరరావు


అయోధ్య రామాలయంలో విగ్రహ ప్రతిష్ట జరిగేవరకు దాని గురించి పెద్ద ఎత్తున ప్రచారంతో పాటు వివాదాలు కూడా కొనసాగేట్లున్నాయి. మతాన్ని, విశ్వాసాలను పాటించేవారు మౌనంగా ఉండగా ఓట్ల కోసం రాముడిని ముందుకు తెచ్చిన రాజకీయ కుహనా హిందూత్వవాదులదే పైచేయి కావటం ప్రత్యేకత. తెలిసిగానీ తెలియకగానీ చేసిన ప్రకటనలతో సుప్రసిద్ద గాయని చిత్ర తాజాగా సామాజిక మాధ్యమంలో తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు. జనవరి 22న విగ్రహ ప్రతిష్ట జరిగే 12.20ని సమయంలో శ్రీరామ జయరామ జయ జయ రామ అంటూ సంకీర్తన జరపాలని, జ్యోతులను వెలిగించాలని, లోకసమస్తా సుఖినోభవంతు అంటూ గాయని చిత్ర సామాజిక మాధ్యమంలో పెట్టిన పోస్టు, విడుదల చేసిన వీడియోలో కోరారు.దీని మీద అనేక మంది అనుకూలంగానూ వ్యతిరేకంగానూ స్పందించారు. బిజెపి నేతలు కేరళ ప్రభుత్వం మీద, కమ్యూనిస్టుల మీద దాడికి ఉపయోగించుకున్నారు. వామపక్ష పాలిత రాష్ట్రంలో అసహనానికి ఇది నిదర్శనమంటూ ఆరోపించారు. సామాజిక మాధ్యమం మీద కేరళ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్రానికి గానీ ఎలాంటి నియంత్రణ, అధికారం లేదు. వామపక్షాలు, పురోగామి భావాలకు వ్యతిరేకంగా సంఘపరివార్‌, బిజెపి నేతల స్పందనలు అదే సామాజిక మీడియా, సంప్రదాయ మీడియాలో చోటు చేసుకుంటున్నాయంటే అసహనం, వ్యతిరేకత ఉంటే కుదిరేదా ? తన మీద వచ్చిన విమర్శలు లేదా ప్రశంసల గురించి గానీ ఇది రాస్తున్న సమయానికి చిత్ర వైపు నుంచి ఎలాంటి స్పందన లేదు.


భావ వ్యక్తీకరణ హక్కులో భాగంగా ఇతరుల హక్కులకు భంగం కలుగకుండా ఏమైనా చెప్పవచ్చు. ఆ రీత్యా చూసినపుడు చిత్ర తన భావాన్ని వ్యక్తం చేశారు. అయితే అదే భావ వ్యక్తీకరణలో భాగంగా ఒకరి భావాలను మరొకరు విమర్శించే హక్కు కూడా మన రాజ్యాంగం కల్పించింది. అఫ్‌కోర్సు దానికీ కొన్ని నిబంధనలు ఉన్నాయి. నూరుపూవులు పూయనివ్వండి, వేయి ఆలోచనలను వికసించనివ్వండి అన్నట్లుగా భావజాల చర్చ జరగాల్సిందే. చిత్రను సమర్ధించిన వారు కొందరైతే అలాంటి సందేశం ద్వారా రాజకీయ వైఖరులను తీసుకున్నారని మరికొందరు విమర్శించారు. ” చిత్రకు భావ ప్రకటనా స్వేచ్చ ఉంది, ఆమె నచ్చిన వైపు నిలిచే స్వేచ్చ కూడా ఉంది.ఆమె తన ఇంట్లో రామ భజన చేయవచ్చు, దీపాలను వెలిగించుకోవచ్చు. మారణకాండకు, జాత్యంహంకారానికి దారితీసే ఒక కారణాన్ని అమాయకంగా ఉత్సవంగా జరుపుకోవటంలో హానికరమైనది కనిపించకపోవచ్చుగానీ అది వాస్తవానికి అది ఎంతో బాధాకర అనుభవం అని రచయిత్రి ఇందూ మీనన్‌ ఫేస్‌బుక్‌ పోస్టులో చిత్ర తీరును విమర్శించారు. జనాల రక్తం, వలసలు, వారి బాధలు పట్టకుండా మీరు రామ భజన చేస్తున్నారు.రాముడు లేదా విష్ణువు రాబోవటం లేదు. మీరు ఐదులక్షల దీపాలను వెలిగించినప్పటికీ మీ బుర్ర వెలుగుతో నిండదు. మీ కంఠం కారణంగానే మిమ్మల్ని నైటింగేల్‌(పశ్చిమ దేశాల్లో కోకిల వంటి మధురంగా కూసే పక్షి) అని భావించారు, కానీ మీరు నకిలీ నైటింగేల్‌ అని రుజువైంది అని ఇందూ మీనన్‌ తీవ్రంగా విమర్శించారు.చరిత్రను విస్మరించి ప్రతివారూ సుఖంగా ఉండాలని చెప్పేవారి అమాయకత్వం ఇక్కడ ముఖ్యమైనదని గాయకుడు సూరజ్‌ సంతోష్‌ అన్నారు.మసీదును కూల్చివేసి దేవాలయాన్ని కట్టిన చరిత్రను చిత్ర కావాలనే మరచినట్లు విమర్శించారు. ప్రముఖ గాయకుడు జి వేణుగోపాల్‌ ఒక వైపు చిత్రకు మద్దతు ఇస్తూనే ఆమె ప్రకటనలపట్ల ఏవైనా విబేధాలుంటే విమర్శించేవారు ఆమెను క్షమించాలని వ్యాఖ్యానించారు. ఆమె కేవలం భక్తిభావంతో చెప్పారే తప్ప రాజకీయ కోణం తెలియదని అన్నారు. ఇప్పటి వరకు ఎలాంటి వివాదాల్లో చిక్కుకోలేదని, మనకోసం వేలాది పాటలు పాడిందని అన్నారు. క్షమించాల్సినంత తప్పేమి చేసిందని కొందరు వ్యాఖ్యానించారు.గాయని చిత్ర గతాన్ని చూసినపుడు ఎలాంటి వివాదాలలో చిక్కుకోలేదు. వివాదాస్పద వ్యాఖ్యలూ చేసిన చరిత్ర లేదు.ప్రతిదాన్నీ రాజకీయం గావిస్తున్న వర్తమానంలో ప్రజాజీవనంలో ఉన్న ప్రముఖులు తాము చేసే ప్రకటనల పట్ల తగిన జాగరూకత పాటించాలని ఈ ఉదంతం వెల్లడిస్తున్నది.


సుప్రీం కోర్టే ఆలయ నిర్మాణానికి అనుమతి ఇచ్చింది.విశ్వాసం ఉన్నవారు అయోధ్య రామాలయానికి వెళ్లవచ్చు, లేనివారు వెళ్లకపోవచ్చు, గాయని చిత్ర ప్రకటనను వివాదాస్పదం కావించాల్సిన అవసరం ఏముంది, తమ అభిప్రాయాలను ఎవరైనా వెల్లడించుకోవచ్చని సిపిఎం నేత, రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి సాజి చెరియన్‌ వ్యాఖ్యానించారు.కేరళ ప్రతిపక్ష కాంగ్రెస్‌ నేత విడి సతీశన్‌ మాట్లాడుతూ భౌతిక దాడులు చేయలేనపుడు సామాజిక మాధ్యమాల ద్వారా దాడి చేయటం ఫాసిజం అన్నారు. మనం చిత్ర వైఖరితో అంగీకరించకపోవచ్చు, ఆమె వైఖరిని ఆమెను వెలిబుచ్చనివ్వండి, ప్రతి ఒక్కరికీ విమర్శించే హక్కుంది, ఎవరైనా అంతకు ముందు చెప్పని వాటి గురించి మాట్లాడటాన్ని ప్రశ్నించవచ్చు అన్నారు. సనాతన ధర్మాన్ని నమ్ముతున్న కారణంగానే గాయని చిత్ర మీద విమర్శలు చేస్తున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె సురేంద్రన్‌ ఆరోపించారు. వామపక్ష-జీహాదీ వాతావరణంలో ఉన్నవారే దాడులు చేస్తున్నారన్నారు.ఈ విమర్శలు చేస్తున్నవారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. పినరయి విజయన్‌ పాలనలో హిందువులు తోటి వారితో తమ విశ్వాసాలను పంచుకొనే పరిస్థితి లేదని, కాంగ్రెస్‌ దీని మీద మౌనంగా ఉందని ఎక్స్‌లో ఆరోపించారు. కేరళకు చెందిన కేంద్ర మంత్రి వి మురళీధరన్‌ విలేకర్లతో మాట్లాడుతూ అయోధ్యను అవకాశంగా తీసుకొని హిందూ సమాజాన్ని అవమానిస్తున్నారని ఆరోపించారు. వామపక్షం, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలలో అసహనానికి ఒక ఉదాహరణ చిత్ర మీద చేస్తున్న విమర్శలని జాతీయ మహిళాకమిషన్‌ సభ్యురాలు, బిజెపి నేత కుషఉ్బ ఆరోపించారు.


మహారాష్ట్రకు చెందిన కేంద్ర మంత్రి నారాయణ రాణే శంకరాచార్యల మీద ధ్వజమెత్తటాన్ని కుషఉ్బ వంటి వారు ఎలా వర్ణిస్తారు.నాస్తికులు, హేతువాదులు, కమ్యూనిస్టులు, ఇతర మతాల వారిని పక్కన పెడితే హిందూమతాన్ని నమ్మేవారు, పాటించేవారికి నలుగురు శంకరాచార్యలు పూజనీయులు ! ప్రధాని నరేంద్రమోడీతో సహా బిజెపి నేతలందరూ ఏదో ఒక సమయంలో వారి పాదాలవద్ద చేరి ఆశీస్సులు పొందిన వారే. రామాలయ ప్రతిష్ట మీద వారు మాట్లాడినదాన్ని ఇప్పుడు ఎందుకు సవాలు చేస్తున్నట్లు ? హిందూ ధర్మానికి మీరేమి చేశారని గతంలో ఎవరూ ఎందుకు ప్రశ్నించలేదన్నది కీలక అంశం. శంకరాచార్యులను అవమానించినందుకు గాను కేంద్ర మంత్రి రాణేను పదవి, పార్టీ నుంచి తొలగించాలని శివసేన నేత ఉద్దావ్‌ థాకరే డిమాండ్‌ చేశారు. బిజెపి బహిరంగ క్షమాపణ చెప్పాలని కూడా కోరారు. రాణేకు వ్యతిరేకంగా ఆదివారం నాడు నిరసన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. అంతకు ముందు మహారాష్ట్రలోని పాల్ఘర్‌లో మంత్రి రాణే విలేకర్లతో మాట్లాడుతూ శంకరాచార్యలు ప్రధాని నరేంద్రమోడీ,బిజెపిని రాజకీయ కోణం నుంచి చూస్తున్నారని ఆరోపించారు. ఇంతవరకు ఏ ఒక్కరూ ఏమీ చేయలేదని, ప్రధాని మోడీ, బిజెపి బాధ్యతను తీసుకొని రామాలయాన్ని నిర్మించిందని, దాన్ని వారు ఆశీర్వదించాలా లేక విమర్శించాలా ? ఆలయాన్ని రాజకీయాలకోసం కాదు మతం కోసం నిర్మించాము, రాముడు మా దేవుడు.హిందూమతం కోసం తామేమీ చేసిందీ శంకరాచార్యలు చెప్పాలని రాణే డిమాండ్‌ చేశారు. శంకరాచార్యలు రాకపోవటానికి ప్రధాని నరేంద్రమోడీ కూడా కారకులే అని శివసేన విమర్శించింది. వారు రాకపోతేనే మీ బొమ్మలు కనిపిస్తాయి, వస్తే వారి చిత్రాలనే పెట్టాల్సి ఉంటుందని పేర్కొన్నది.రామాలయాన్ని కూల్చి బాబరీ మసీదును కట్టారని ఇంతకాలం సంఘపరివారం ఆరోపించింది.కానీ పూర్తికాని రామాలయాన్ని ఎన్నికల కోసం ముందే ప్రారంభించారన్న విమర్శలు ఇప్పుడు చరిత్రకెక్కాయి. ఇది వాస్తవం.