• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: UK

డోనాల్డ్‌ ట్రంప్‌రుద్దిన వాణిజ్య పోరు : చైనా గెలిస్తే అమెరికా పరిస్థితి ఏమిటి ?

23 Wednesday Apr 2025

Posted by raomk in Asia, BJP, CHINA, Current Affairs, Economics, Europe, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, UK, Uncategorized, USA

≈ Leave a comment

Tags

China, Donald trump, Narendra Modi Failures, Trade talks, TRADE WAR, Xi Jinping

ఎం కోటేశ్వరరావు

ప్రపంచం మీద తాను రుద్దిన వాణిజ్య పోరు డోనాల్డ్‌ ట్రంప్‌ పదవికి గండం తేనుందా ? దాన్ని వ్యతిరేకిస్తున్న అమెరికన్లు సహిస్తారా ? ఈ పోరులో చైనా గెలిస్తే అమెరికా పరిస్థితి ఏమిటి ? ఇలా పరిపరి ఆలోచనలు ప్రారంభమయ్యాయి. రెండు దిగ్గజాల మధ్య కేంద్రీకృతమైన వివాదాన్ని ఆసరా చేసుకొని లబ్దిపొందాలని కొన్ని దేశాలు చూస్తున్నాయి. తమ ప్రయోజనాలను ఫణంగా పెట్టి ఒప్పందాలు కుదుర్చుకుంటే అలాంటి దేశాలపై తాము గట్టి ప్రతి చర్యలు తీసుకుంటామని సోమవారం నాడు చైనా హెచ్చరించింది. వాణిజ్య పోరులో విజేతలు ఉండరన్నది సాధారణ అభిప్రాయం, అది నిజమేనా ? ఇప్పుడున్న పరిస్థితి ఏమిటి ? మన దేశం బ్రిటీష్‌ వలస పాలనలోకి వెళ్లక ముందు చేనేత వస్త్రాలకు ఎంతో ప్రసిద్ధి. బ్రిటన్‌తో సహా అనేక దేశాలకు అవి ఎగుమతి అయ్యేవి. అలాంటి వాటిని బ్రిటన్‌ పారిశ్రామిక విప్లవం మింగేసింది. ఇప్పుడు ట్రంప్‌ దిగుమతి పన్ను విధించినట్లుగా మన చేనేత వస్త్రాల మీద నాటి బ్రిటన్‌ కూడా పన్ను విధించి అడ్డుకుంది, చౌకగా తయారయ్యే తన మిల్లు వస్త్రాలను మనదేశంలో కుమ్మరించింది. మన మార్కెట్‌ను ఆక్రమించింది. పత్తి ఎగుమతి దేశంగా మార్చింది. నాడు భారత్‌ పరాధీన దేశం, వ్యతిరేకించిన వారు లేరు. ఇప్పుడు అమెరికా పన్నులతో చైనా వస్తువులను అడ్డుకోవాలని చూస్తోంది. చైనా సర్వసత్తాక స్వతంత్ర దేశం, అమెరికాను ఢీ అంటే ఢీ అనే స్థితిలో ఉంది, ఆట కట్టించాలని చూస్తోంది.చిత్రం ఏమిటంటే అసలైన దేశభక్తులం అని చెప్పుకుంటున్న మన పాలకులు మా ఆయుధాలు, వస్తువులు కొంటారా లేదా అని అమెరికా కొరడా రaళిపిస్తే కంటి చూపులేదు, నోట మాట లేదు.ఏం జరుగుతోంది మహాత్మా ఓ మహాత్మా !


డోనాల్డ్‌ ట్రంప్‌ను సంతుష్టీకరించేందుకు తమ ప్రయోజనాలను ఫణంగా పెట్టి ఒప్పందాలు చేసుకొనే దేశాల మీద చర్యలు తప్పవని చైనా తీవ్ర హెచ్చరిక చేసింది.తమతో వాణిజ్యం చేసే దేశాలు చైనా మీద ఆంక్షలు విధించాలని, దానికి ప్రతిగా అలాంటి వాటికి పన్నులను మినహాయిస్తామని అమెరికా చెబుతున్నదని, సంతుష్టీకరణ శాంతిని, రాజీ గౌరవాన్ని తీసుకురాదని చైనా పేర్కొన్నది.అమెరికా చర్యలు చర్మం ఇమ్మని పులిని కోరటంగా వర్ణించింది. ప్రస్తుతం జపాన్‌, దక్షిణ కొరియా, భారత్‌ మరికొన్ని దేశాలు ట్రంప్‌ యంత్రాంగంతో చర్చలు జరుపుతున్నాయి. ఉపాధ్యక్షుడు జెడి వాన్స్‌ ప్రస్తుతం ఢల్లీి పర్యటనలో ఉన్నాడు. చైనా వస్తువులపై 145శాతంగా విధించిన పన్ను, కొన్ని వస్తువులపై 245శాతం వరకు పెంచుతామని అమెరికా బెదిరించింది. తమ మీద విధించిన పన్నుల కారణంగా తీసుకోలేమంటూ అమెరికా కంపెనీ బోయింగ్‌ జెట్‌ను చైనా తిప్పి పంపింది. అమెరికాతో కలసి చైనాను దెబ్బతీయాలని మనదేశంలో కొందరు యాంకీల ఏజంట్లు నూరిపోస్తున్నారు.చైనా సరఫరా గొలుసులో మనం చేరి దాని స్థానాన్ని ఆక్రమించాలని కొందరు చెబుతున్నారు. నిజానికి స్వంత సత్తాతో ఆస్థాయికి చేరాలని ఎవరైనా కోరుకోవటం తప్పు కాదు. కుక్కతోక పట్టుకొని గోదావరిని ఈదలేరు, అలాగే అమెరికా వెంట నడచిన ఏ దేశమూ చరిత్రలో బాగుపడిన దాఖలా లేదు. కాసేపు దీని గురించి పక్కన పెట్టి వాణిజ్య పోరు గురించి జరుగుతున్న మధనం ఎలా ఉందో చూద్దాం. అమెరికా తాను చేస్తున్న ప్రతిదీ సరైనదే అనుకుటుంది కానీ సమస్య ఏమిటంటే ట్రంప్‌ ప్రతినిర్ణయం తప్పుగా తేలుతోంది.ఏప్రిల్‌ ఐదున జనం 20లక్షల మంది వీధుల్లోకి రాగా 19వ తేదీన మరోసారి పెద్ద ఎత్తున రాజరికం లేదు, రాజులేడు అంటూ నినదించారు. రెండువందల యాభై సంవత్సరాల క్రితం 1775 ఏప్రిల్‌ 19న బ్రిటన్‌ రాజరికానికి వ్యతిరేకంగా అమెరికన్లు పోరు ప్రారంభించిన రోజది. చైనా కమ్యూనిస్టులను అణచివేయాలని చూసింది అమెరికా. అయితే లాభాల కోసం అదే చైనా మార్కెట్‌ను ఉపయోగించుకోవాలనే ఎత్తుగడతో కమ్యూనిస్టు చైనాను భద్రతా మండలిలో శాశ్వత దేశంగా ఆమోదించింది.తరువాత కూడా ఒక వైపు లాభాలు పొందుతూనే మరోవైపు చైనా ఎదగకుండా కేవలం తనమీదే ఆధారపడే ఒక ఎగుమతిదేశంగా పరిమితం కావాలని చూసింది. తియన్మెస్‌ మైదానంలో విద్యార్ధుల ప్రదర్శనలు, హాంకాంగ్‌లో స్వాంత్య్రం పేరుతో జరిగిన ప్రదర్శనలు, తైవాన్‌ వేర్పాటు వాదం వెనుక దాని హస్తం గురించి తెలిసిందే. మొత్తంగా చెప్పాలంటే గత ఐదు దశాబ్దాలలో అమెరికా అనుసరించిన ప్రతిప్రతికూల విధానమూ చైనాను మరింతగా పటిష్టపరిచాయి తప్ప బలహీనపరచలేదు, దీని అర్ధం కొన్ని తాత్కాలిక సమస్యలూ, ఎదురుదెబ్బలూ లేవని కాదు. డోనాల్డ్‌ ట్రంప్‌ చర్యలతో భౌగోళిక రాజనీతిలో చైనా స్థాయి మరింత బలపడుతుందని అమెరికాను ఆర్థికంగానూ, రాజకీయంగా దాటిపోతుందని కమ్యూనిస్టు వ్యతిరేకులు వాపోతున్నారంటే అతిశయోక్తి కాదు.


చిత్రం ఏమిటంటే అమెరికన్లు, వారి చెప్పుల్లో కాళ్లు పెట్టి నడవాలని చూసే కాషాయ తాలిబాన్ల ఆలోచన ఒకే విధంగా ఉంది. గాల్వన్‌ ఉదంతం జరిగినపుడు మనం గనుక చైనా నుంచి దిగుమతులను నిలిపివేస్తే డ్రాగన్‌ మన కాళ్ల దగ్గరకు వస్తుందని చెప్పినట్లే ఇప్పుడు ట్రంప్‌ గాంగ్‌ అంటోంది. చైనా మనకు చేసే ఎగుమతులతో పోల్చితే మనం చైనాకు ఐదోవంతు మాత్రమే ఎగుమతి చేస్తున్నాం, అందువలన మన దిగుమతులు ఆగిపోతే నష్టం వారికే అని అమెరికా విత్తమంత్రి స్కాట్‌ బెసెంట్‌ చెప్పాడు. అమెరికా దిగుమతులు దాని పెద్ద బలహీనత తప్ప బలం కాదు.2018లో ఇదే ట్రంప్‌ చైనా మీద వాణిజ్య యుద్ధం ప్రారంభించాడు.వారి వస్తువుల మీద ఆధారపడటం నిలిపివేయాలన్నాడు. జరిగిందేమిటి ? గత ఏడు సంవత్సరాల్లో అమెరికాకు చైనా ఎగుమతులు 19.2 నుంచి 14.7శాతానికి మాత్రమే తగ్గాయి.పూర్తిగా నిలిపివేయాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు.జి 7 దేశాలకు చైనా ఎగుమతులు 2000 సంవత్సరంలో 48శాతం జరగ్గా 2024లో 30శాతానికి తగ్గాయి. ఇంత జరిగినా గత పదేండ్లలో ప్రపంచ ఎగుమతుల్లో చైనా వాటా 13 నుంచి 14శాతానికి పెరిగింది. దీని అర్ధం ఏమిటి ? చైనా తన సరకులకు ఎప్పటి నుంచో ప్రత్నామ్నాయ మార్కెట్లను వెతుక్కుంటోంది.చైనా అనే చెరువు మీద అమెరికా అలిగితే ఎండిపోయేది అమెరికన్లకే.ఎందుకంటే ప్రస్తుతం అది దిగుమతి చేసుకుంటున్న వస్తువులను తయారు చేసుకోవాలంటే దశాబ్దాలుగాకపోయినా సంవత్సరాలు పడుతుందని చెబుతున్నారు. అప్పటిదాకా చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న టాయిలెట్‌ పేపర్‌ వంటి వాటి దిగుమతి ఆపివేస్తారా ? ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాలంటే సరఫరా చేసే స్థితిలో ఎన్ని ఉన్నాయి ? అమెరికా బోయింగ్‌ జెట్‌ విమానాలు గాకపోతే చైనా ఐరోపా ఎయిర్‌బస్‌లను దిగుమతి చేసుకుంటుంది, లేదూ స్వయంగా తానే పూర్తిగా సమకూర్చుకొనేందుకు ఇప్పటికే ప్రారంభించిన కార్యక్రమాన్ని మరింతవేగవంతం చేస్తుంది. ఇతర వస్తువులను వేరే దేశాల నుంచి తెచ్చుకుంటుంది. మిషిగాన్‌ స్టేట్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ జాసన్‌ మిలెర్‌ పోగుచేసిన సమాచారం ప్రకారం ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే లిథియమ్‌ బ్యాటరీలు, ఎయిర్‌ కండీషనర్లు, వంటపాత్రల్లో 70, స్మార్ట్‌ ఫోన్లు, వంటగది పరికరాలు, బొమ్మల్లో 80, సూర్యరశ్మి పలకల్లో 90శాతాల చొప్పున చైనా తయారు చేస్తున్నది. కార్లు, ఫోన్లు, అనేక మిలిటరీ పరికరాలకు కీలకంగా అవసరమైన అపురూప ఖనిజాలు, లోహాలు కూడా చైనా దగ్గర గణనీయంగా ఉన్నాయి.

సకల దేశాలూ తన వస్తువులనే కొనాలని చైనా ఎవరినీ దేబిరించే స్థితిలో లేదు. విదేశాలకు అవసరమైన వాటిని కావాలనుకున్నవారికి ఉత్పత్తి చేస్తున్నది, మార్కెట్‌లేకపోతే నిలిపివేస్తుంది, నూటనలభై కోట్ల తనజనాభాకు అవసరమైన వాటి మీద కేంద్రీకరిస్తుంది.ఇప్పటికే ఆప్రక్రియ ప్రారంభమైంది. ఏండ్ల తరబడి సంపాదించిన వాణిజ్య మిగులులో కొంత భాగం సబ్సీడీగా ఇస్తే అంతర్గత మార్కెట్‌ ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుంది. అమెరికా నుంచి దిగుమతి చేసుకొనే సోయా,జొన్నలు, మొక్క జొన్నలను ఎక్కడి నుంచైనా దిగుమతి చేసుకోవచ్చు.పశ్చిమ దేశాల మీద ఆధారపడే రంగాలను గుర్తించి స్వయం పోషకత్వం సాధించేందుకు బీజింగ్‌ పూనుకుంది. దాన్లో భాగంగానే హరిత ఇంథనం, వ్యవసాయం, సాంకేతిక పరిజ్ఞానం, సెమీకండక్టర్ల రంగాలలో భారీ మొత్తాలను ఖర్చు చేస్తున్నది. విపరీత పరిస్థితులలో కూడా జాతీయ ఆర్థిక రంగం సాధారణ కార్యకలాపాలను సాగించే విధంగా చూడాలని అధ్యక్షుడు షీ జింపింగ్‌ విధాన నిర్ణేతలను కోరాడు. యుద్ధం అన్న తరువాత ఓడిన వారికే కాదు విజేతలకూ దెబ్బలు తగులుతాయి, నష్టాలు సంభవిస్తాయి, వాణిజ్య యుద్ధమూ అంతే.


ఎదురుదాడిలో భాగంగా అమెరికాకు ఎగుమతి అవుతున్న అపురూప ఖనిజాల ఎగుమతులను చైనా నిషేధించింది. అవి జలాంతర్గాములు, ఫైటర్‌ జెట్ల తయారీలో కీలకంగా ఉంటాయి.తన అంబుల పొదిలో ఉన్న అస్త్రాలను అవసరాన్ని బట్టి బయటకు తీస్తున్నది.ఇప్పటికే బోయింగ్‌ విమానాల కొనుగోలు నిలిపివేసింది, కొన్ని కంపెనీలను నిషేధిత జాబితాలో చేర్చింది.యాపిల్‌,గూగుల్‌, డ్యూపాంట్‌్‌, టెస్లా వంటి కంపెనీలు తరువాత వరుసలో ఉన్నాయి.జపాన్‌ తరువాత భారీ మొత్తంలో డాలర్ల నిల్వలున్న దేశం చైనా. వాటి నుంచి అమెరికాకు 760 బిలియన్‌ డాలర్ల మేర అప్పులిచ్చింది. ట్రంప్‌ పిచ్చిపనులు కొనసాగిస్తే ఆ బాండ్లను ఒక్కసారిగా విక్రయిస్తే అమెరికాలో వడ్డీ రేట్ల పెరుగుదల, ద్రవ్య సంక్షోభానికి దారి తీస్తుందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇంకా ఇలాంటి ఆర్థిక పరమైన దెబ్బతీసే పద్దతులను చైనా పరిశీలిస్తున్నది.అమెరికా దగ్గర కూడా కొన్ని ఆయుధాలు లేకపోలేదు. ఐరోపా, ఆసియాలో తన మిత్రదేశాలను చైనాపైకి ఉసిగొల్పేందుకు పూనుకుంది. అయితే ప్రతికూల పన్నుల విధింపులో ఏ దేశాన్నీ వదలని కారణంగా అవన్నీ జతకట్టటం సందేహమే. తమ కోసం అన్ని దేశాలూ కాస్త నొప్పి భరించాల్సిందే అంటున్నాడు ట్రంప్‌. ఎవరి సంగతి వారు చూసుకోవాలనే రక్షణాత్మక వైఖరులు పెరుగుతున్న తరుణంలో ఎంత మేరకు ఇతర దేశాలు అంగీకరిస్తాయో తెలియదు. అయినప్పటికీ ముందే చెప్పుకున్నట్లు ఇతర దేశాలను చైనా సోమవారం నాడు ముందస్తుగా హెచ్చరించింది. మారిన పరిస్థితులను ట్రంప్‌ గమనిస్తున్నట్లు లేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిపిన సర్వేల్లో మెక్సికో, కెనడా, ఐరోపా దేశాల మీద పన్నులు విధించటాన్ని వ్యతిరేకించినప్పటికీ చైనా మీద దాడిని 56శాతం మంది సమర్ధించినట్లు సిబిఎస్‌ తెలిపింది.కమ్యూనిస్టు వ్యతిరేకతను ఎక్కించుకున్న వారు సహజంగానే చైనా మీద దాడిని అంగీకరిస్తారు. కానీ అదే ట్రంప్‌ ఎన్నికల్లో చేసిన వాగ్దానాలేమిటి ?ద్రవ్యోల్బణం, ధరలను, పన్నుల భారం తగ్గిస్తానని చెప్పాడు. గద్దె నెక్కగానే విముక్తి పేరుతో ఎడాపెడా పన్నులు విధింపు ప్రకటన చేయగానే అమల్లోకి రాక ముందే ధరలు పెరిగి జనం కొనుగోళ్లకు ఎగబడ్డారా లేదా ? కొత్తగా అన్న వస్త్రాలు వస్తాయనుకుంటే ఉన్న వస్త్రాలను ఊడగొట్టినట్లుగా భరించలేని భారాలను మోపితే జనం సహిస్తారా ? ఇప్పటికే రెండుసార్లు లక్షలాది మంది వీధుల్లో ప్రదర్శనలు చేశారు. అందుకే తేడా వచ్చేట్లు ఉందని ఆలోచించుకోవటానికి మూడు నెలల పాటు పన్నుల పెంపుదల పదిశాతానికే పరిమితం చేసి మిగతా వాటిని వాయిదా వేయాల్సి వచ్చింది. గతంలో మాదిరి ధరలు, నిరుద్యోగం పెరుగుదల సంభవించవచ్చనే హెచ్చరికలు వెలువడ్డాయి.ట్రంప్‌ మొరటుగా ముందుకు పోతాడా తెలివి తెచ్చుకొని వెనక్కు తగ్గుతాడా అన్నది చూద్దాం !

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఉక్రెయిన్‌ విభజన ? యుద్ధానికి ఆ ముగ్గురే కారణం అన్న ట్రంప్‌ !

16 Wednesday Apr 2025

Posted by raomk in CHINA, Current Affairs, Europe, Germany, History, imperialism, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, UK, USA, WAR

≈ Leave a comment

Tags

Donald trump, Joe Biden, Ukraine crisis, Vladimir Putin, Zelensky

ఎం కోటేశ్వరరావు


ఉక్రెయిన్‌ పోరులో మిలియన్ల మంది మరణించారంటే దానికి ఆ ముగ్గురే కారణం, నాకేం సంబంధం లేదంటున్నాడు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ! సోమవారం నాడు ఓవల్‌ ఆఫీసులో విలేకర్లతో మాట్లాడుతూ జో బైడెన్‌, జెలెనెస్కీ సమర్ధులై ఉంటే యుద్ధానికి అవకాశం ఉండేది కాదు, పుతిన్‌ ప్రారంభించి ఉండేవాడే కాదు అన్నాడు . జెలెనెస్కీ గురించి అడగ్గా ‘‘ యుద్ధాన్ని ప్రారంభిస్తున్నావంటే నువ్వు గెలవగలవా లేదా అనేది తెలుసుకోవాలి, నీకంటే 20 రెట్లు పెద్దవారి మీద యుద్ధం ప్రారంభించకూడదు, ఆ తరువాత కొన్ని క్షిపణులు ఇస్తారని జనాల మీద ఆశ పెట్టుకోకూడదు, ఎంతసేపూ ఎప్పుడు అమెరికా క్షిపణులు అమ్ముతుందా అని ఎదురుచూస్తున్నారు, అక్కడికీ ముందు నేనే జావెలిన్‌ క్షిపణులు ఇచ్చాను. యుద్ధ కారకుల్లో పుతిన్‌ మొదటివాడు, రెండోవాడైన జో బైడెన్‌ గురించి చెప్పాలంటే ఏం చేస్తున్నాడో అతనికే తెలియదు, జెలెనెస్కీ గురించి కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు, నా వరకైతే యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తా, ఆపగలను, అదే నేను కోరుకుంటున్నా, చావులను ఆపాలని కోరుకుంటున్నా, త్వరలో మీరు మంచి ప్రతిపాదనల గురించి తెలుసుకుంటారు ’’ అన్నాడు. అసలు 2020లో జరిగిన ఎన్నికల్లో రిగ్గింగ్‌ జరిగి ఉండకపోతే తాను గెలిచి ఉంటే ఉక్రెయిన్‌ యుద్దమే వచ్చి ఉండేది కాదని తన స్వంత ట్రూత్‌ సోషల్‌ వేదికలో రాసుకున్నాడు.


ఉక్రెయిన్‌ సంక్షోభం బుధవారం నాడు 1,148వ రోజులో ప్రవేశించింది.ఏవైనా అనూహ్య నాటకీయ పరిణామాలు జరిగితే తప్ప ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఎప్పుడు ముగిసేది కనుచూపు మేరలో కనిపించటం లేదు. ఆదివారం నాడు సమీ అనే పట్టణంపై రష్యన్‌ క్షిపణులు, నియంత్రిత బాంబులతో జరిపినదాడిలో 35 మంది మరణించగా, 40 మంది ఆసుపత్రిపాలు కాగా 11మంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. దాడి ఒక చర్చ్‌ మీద జరిగిందని ఉక్రెయిన్‌, కాదు మిలిటరీ అధికారుల సమావేశం మీద అని రష్యా ప్రకటించింది. రష్యా తరఫున కిరాయి సైనికులుగా పని చేస్తున్న ఇద్దరు చైనా జాతీయులను పట్టుకున్నామని ఉక్రెయిన్‌ ప్రదర్శించగా అలాంటిదేమీ లేదని మాస్కో, బాధ్యతా రహితంగా ఆరోపణలు చేయవద్దని బీజింగ్‌ హెచ్చరించింది. చైనీయులను కిరాయి సైనికులుగా తీసుకుంటున్నట్లు జెలెనెస్కీ ఆరోపించాడు. గతంలో ఉత్తర కారియా నుంచి సైనికులను పంపినట్లు ప్రచారం చేశారు. ఇప్పుడు చైనాను కూడా వివాదంలోకి లాగే ఎత్తుగడతో ఇలాంటి ఆరోపణలు చేస్తున్నట్లు చెబుతున్నారు. ట్రంప్‌ ప్రకటించిన పన్నుల దాడికి తీవ్ర ప్రతిఘటన, దేశీయంగా వ్యతిరేకత వ్యక్తం కావటంతో మూడు నెలల పాటు సుంకాల విధింపు అమలును వాయిదా వేస్తున్నట్లు చెప్పాడు. దాన్నుంచి జనం దృష్టిని మళ్లించేందుకు లేదా మరొక ఎత్తుగడతో గానీ రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జర్మనీ విభజన మాదిరి ఉక్రెయిన్‌ విభజన గురించి అమెరికా చర్చకు తెరలేపింది. త్వరలో మంచి ప్రతిపాదనలను మీరు చూస్తారని విలేకర్లతో ట్రంప్‌ చెప్పింది దీని గురించే అన్నది స్పష్టం.


ట్రంప్‌ ప్రతినిధి కెయిత్‌ కెలోగ్‌ ఉక్రెయిన్‌ విభజన ప్రతిపాదనను వెల్లడిరచాడు. దాని మీద తీవ్ర విమర్శలు రావటంతో తన మాటలకు తప్పుడు అర్ధం చెప్పారని ఆరోపించాడు. శాంతి ఒప్పందం కుదరాలంటే కోల్పోయిన ప్రాంతాల గురించి మరిచిపోవాలని గతంలోనే ట్రంప్‌, అతగాడి యంత్రాంగం ఉక్రెయిన్‌కు చెప్పింది.ఇప్పుడు కెలోగ్‌ దాన్నే మరింత స్పష్టంగా వెల్లడిరచాడు.అమెరికా పధకం ప్రకారం ఉక్రెయిన్ను నాలుగు ముక్కలుగా చేస్తారు. మొదటి జోన్‌లో బ్రిటన్‌, ఫ్రెంచి దళాలతో పాటు ఇతర దేశాల మిలిటరీ కూడా చేరి పర్యవేక్షణ జరుపుతుంది.రెండవ జోన్‌ పూర్తిగా ఉక్రెయిన్‌ మిలిటరీ ఆధీనంలో ఉంటుంది. మూడవది ఉక్రెయిన్‌, రష్యా ఆధీనంలో ఉన్న ప్రాంతాల మధ్య 29 కిలోమీటర్ల వెడల్పున ఎవరూ ప్రవేశించకూడని ప్రాంతం, నాలుగవది క్రిమియాతో సహా, స్వాతంత్య్రం ప్రకటించుకొని రష్యా ఆధీనంలో ఉన్న ప్రాంతాలు. నాటో లేదా నాటో కూటమిలోని దేశాలకు చెందిన మిలిటరీ ఉనికిని ఉక్రెయిన్‌లో అంగీకరించేది లేదని గతంలోనే రష్యా స్పష్టం చేసింది. మొదటి జోన్‌ పేరుతో నాటో దేశాల దళాలను ఉంచాలన్న అమెరికా ఎత్తుగడ ఆరని రావణకాష్టం వంటిదే. రెండవ ప్రపంచ యుద్ధంలో విడదీసి వియత్నాం దక్షిణ ప్రాంతంలో శాశ్వతంగా తిష్టవేసేందుకు అమెరికా వేసిన ఎత్తుగడను అక్కడి జాతీయవాదులు, కమ్యూనిస్టులు ప్రతిఘటించి అమెరికా సేనలను తరిమివేశారు. కొరియాను కూడా అలాగే విభజించి ఉభయ కొరియాలు విలీనం కాకుండా అడ్డుపడుతున్నారు.తైవాన్‌ దీవి చైనా అంతర్భాగమే అని అధికారికంగా గుర్తిస్తూనే చైనా ప్రధాన భూభాగంతో విలీనానికి తగిన తరుణం అసన్నం కాలేదంటూ రెచ్చగొడుతున్నారు. తమ దేశాన్ని విభజించటానికి వీల్లేదని, అన్ని ప్రాంతాలు తమకు రావాల్సిందేనని ఉక్రెయిన్‌ నేత జెలెనెస్కీ గతంలోనే చెప్పాడు. దీనికి ఐరోపాలోని ఇతర దేశాలు కూడా అంగీకరించే అవకాశాలు లేవు. జర్మనీ విభజనకు ఉక్రెయిన్‌ సమస్యకు అసలు పోలికే లేదు. యుద్ధం కొనసాగితే రష్యన్లు జెలెనెస్కీని బందీగా పట్టుకుంటారని లేదా ఉక్రెయిన్‌ మిలిటరీలోని జాతీయవాదులు, గూఢచార ఏజన్సీ జెలెనెస్కీని పదవి నుంచి తప్పించే అవకాశాలున్నాయని కొందరు చెబుతున్నారు.నాలుగు ముక్కలుగా విభజన చేస్తే అక్కడ తమకు పనేమీ ఉండదని, ఇతర చోట్ల వ్యవహారాలను చక్కపెట్టుకోవచ్చని, పరువు దక్కించుకోవచ్చని అమెరికా భావిస్తున్నట్లు విశ్లేషణలు వెలువడుతున్నాయి. రష్యా మీద ఆంక్షలు విధించిన ఐరోపా దేశాలు అక్కడి నుంచి ముడిచమురు తప్ప చౌకగా సరఫరా అవుతున్న గ్యాస్‌ను ప్రస్తుతం కొనుగోలు చేస్తున్నాయి. దాన్ని కూడా నిలిపివేస్తే అనేక దేశాల్లో పాలక పార్టీలకు నూకలు చెల్లుతాయని భయపడుతున్నారు. అందువలన సంక్షోభం ఎక్కువ కాలం కొనసాగటం అనేక దేశాలకు ఇష్టం లేదని, పరిస్థితులకు అనుగుణంగా సర్దుకుపోవటమా, అస్తవ్యస్థ పరిస్థితులను ఎదుర్కోవటమా అనే గుంజాటనలో ఉన్నాయి. తన చమురు, గ్యాస్‌ లావాదేవీల వివరాలను బహిర్గతం పరచటం నిలిపివేసిన రష్యా వచ్చే ఏడాది ఏప్రిల్‌ వరకు అదే కొనసాగించనున్నట్లు ప్రకటించింది.
సిబిఎస్‌ టీవీ ‘‘60నిమిషాలు ’’ కార్యక్రమంలో ఆదివారం నాడు జెలెనెస్కీతో జరిపిన ముఖాముఖిని ప్రసారం చేసింది.దాని మీద ట్రంప్‌ మండిపడ్డాడు. ఉక్రెయిన్‌ పోరు గురించి తారుమారు చేసిన వాస్తవాల మీద ఆధారపడి ట్రంప్‌ యంత్రాంగం పని చేస్తున్నదని జెలెనెస్కీ ఆరోపించాడు.తాముగా యుద్ధాన్ని ప్రారంభించలేదని, చూస్తుంటే పుతిన్‌ ప్రారంభించిన యుద్ధాన్ని ఉపాధ్యక్షుడు జెడి వాన్స్‌ సమర్ధిస్తున్నట్లు కనిపిస్తున్నదన్నాడు. రష్యా దురాక్రమణదారు, తాము బాధితులమని, పోరు మధ్యలో మరొకదాని కోసం అటూ ఇటూ చూడలేమన్నాడు. అమెరికా మాట మాత్రమే మార్చలేదని, వాస్తవాన్ని కూడా తారుమారు చేసిందని అరోపించాడు. ట్రంప్‌ ఒక నిర్ణయం తీసుకొనే ముందు స్వయంగా వచ్చి పరిశీలించాలన్నాడు. ఎక్కడికైనా వెళ్లి చూడవచ్చు, దాడులు ఎలా ఉన్నాయో తెలుస్తుంది.అమెరికా మా వ్యూహాత్మక, బలమైన భాగస్వామి అయితే సందేహాలున్నాయి. అమెరికా పౌరులను నేను సందేహించను, వారు మాతోనే ఉన్నారు, కానీ దీర్ఘకాలిక యుద్ధంలో ఐరోపా నుంచి అమెరికా దూరంగా జరగవచ్చు అని ఐరోపాలో ప్రతి ఒక్కరూ భయపడుతున్నారు.అమెరికా లేకపోతే మేము భారీగా నష్టపోతాం,మానవ మరియు భూభాలను కోల్పోతాము. ఏదో విధంగా ఈ యుద్ధాన్ని ముగించాలి అని జెలెనెస్కీ చెప్పాడు.జెలెనెస్కీ వ్యాఖ్యలు ప్రతికూల ఫలితాలనిస్తాయని జెడి వాన్స్‌ కార్యాలయం హెచ్చరించింది. తమ ఉపాధ్యక్షుడి వ్యక్తిత్వాన్ని దెబ్బతీయటం కంటే వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించుకోవటంపై కేంద్రీకరించాలని పత్రికా కార్యదర్శి టేలర్‌ వాన్‌ కిర్క్‌ ప్రకటించాడు. ఈ కార్యక్రమం వక్రీకరణలతో కూడుకొని ఉన్నందున నియంత్రణ సంస్థ ఫెడరల్‌ కమ్యూనికేషన్స్‌ కమిషన్‌(ఎఫ్‌సిస)ి తీసుకొనే చర్యల్లో సిబిఎస్‌ టీవీ ప్రసార అనుమతులను రద్దుతో పాటు భారీ మొత్తంలో జరిమానా విధించాలని ట్రంప్‌ చెప్పాడు. ఇది బెదిరించటం తప్ప మరొకటి కాదు. ప్రతివారం 60నిమిషాల కార్యక్రమంలో అసభ్యకరమైన, అవమానకరంగా ట్రంప్‌ పేరు ప్రస్తావించుతున్నారు.వాటన్నింటిలో ఇది పరాకాష్ట అని ట్రంప్‌ తన ట్రూత్‌ సామాజిక వేదికలో పోస్టు పెట్టాడు. ఎన్నికలకు ముందు గతేడాది తనకు వ్యతిరేకంగా కమలా హారిస్‌కు ప్రాధాన్యత కల్పిస్తూ మోసపూరితంగా ఎడిట్‌ చేసి కార్యక్రమాన్ని ప్రసారం చేశారంటూ ట్రంప్‌ సిబిఎస్‌ ఛానల్‌ యజమాని పారామౌంట్‌ కంపెనీ మీద కేసు దాఖలు చేశాడు.తమను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆ కంపెనీ ఆరోపించింది. ట్రంప్‌ దాఖలు చేసిన 20 బిలియన్‌ డాలర్ల పరువు నష్టం కేసులో ఒక అంగీకారానికి వచ్చేందుకు ఇరు పక్షాలూ మధ్యవర్తిత్వానికి తెరతీసినట్లు గత నెలలో న్యూయార్క్‌ టైమ్స్‌ పేర్కొన్నది.


ఉక్రెయిన్‌లో శాంతికోసం అమెరికాతో ఒప్పందం కుదుర్చుకోవటం అంత తేలిక కాదని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావరోవ్‌ వ్యాఖ్యానించాడు.మూల కారణాల సంగతి చూడకుండా అమెరికా ప్రతిపాదనలను అంగీకరించలేమన్నాడు.అమెరికా కనీసం సమస్యలోతులోకి వెళుతున్నది, ఐరోపా వైపు నుంచి వెర్రి ఆవేశం తప్ప మరొకటి కనిపించటం లేదన్నాడు. అంతకు ముందు ట్రంప్‌ ప్రతినిధి స్టీవ్‌ విట్‌కోఫ్‌ సెంట్‌ పీటర్స్‌బర్గ్‌లో పుతిన్‌తో చర్చలు జరిపాడు.పుతిన్‌ శాశ్వత శాంతిని కోరుతున్నాడని, దాని గురించి చర్చించాల్సి ఉందన్నాడు. సంక్లిష్టమైన పరిస్థితి ఉందన్నాడు.మరోవైపున సంక్షోభాన్ని మరింత ఎగదోసేందుకు చూస్తున్నారు.ఉక్రెయిన్‌కు ఎలాంటి శషభిషలు లేని మద్దతు అందిస్తున్నట్లు నాటో అధిపతి మార్క్‌ రూటె మంగళవారం నాడు ప్రకటించాడు, ఉక్రెయిన్‌లోని ఒడెసా ప్రాంతాన్ని సందర్శించాడు. అమెరికా పార్లమెంటు దిగువ సభలో ఉక్రెయిన్‌కు మరింతగా మిలిటరీ సాయం అందించాలని, రష్యాపై ఆంక్షలను పెంచాలని తదితర అంశాలతో డెమాక్రాట్లు ఒక బిల్లును ప్రదిపాదించగా దాన్ని బహిర్గతం చేయలేదు. దీర్ఘశ్రేణి తారుస్‌ క్షిపణులను ఉక్రెయిన్‌కు అందించాలనే జర్మనీ నిర్ణయాన్ని మాస్కో తప్పు పట్టింది. పరిస్థితిని మరింత దిగజార్చేందుకు ఈ చర్య దోహదం చేస్తుందని హెచ్చరించింది. ఆయుధాల కొనుగోలుకు వంద కోట్ల డాలర్లు ఇవ్వాలని బ్రిటన్‌ నిర్ణయించింది. ఉక్రెయిన్‌లో పోరు విషయానికి వస్తే రష్యన్లు ఎత్తుగడలను మార్చి మెల్లమెల్లగా దాడులను విస్తరిస్తున్నారు. ఉక్రెయిన్‌ మిలిటరీ ప్రతిఘటించే స్థితిలో లేదు.ఐరోపా దేశాలు పరువు కోసం పాకులాడుతున్నాయి. ఉక్రెయిన్‌ పోరులో రష్యా గెలిస్తే రానున్న రోజుల్లో తమ భవిష్యత్‌ మరింతగా ఇబ్బందుల్లో పడుతుందని అవి అంతర్గతంగా భయపడుతున్నాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

పిచ్చివాడి చేతిలో రాయి – అమెరికాను ఎటు నడుపుతాడో తెలియని డోనాల్డ్‌ ట్రంప్‌ !

02 Wednesday Apr 2025

Posted by raomk in Current Affairs, Economics, History, imperialism, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RUSSIA, UK, USA, WAR

≈ Leave a comment

Tags

Donald trump, Insane Donald Trump, Iran nuclear weapon, Narendra Modi Failures, TRADE WAR, Trade war Expanding, Ukraine crisis, Vladimir Putin, Volodymyr Zelensky

ఎం కోటేశ్వరరావు

ఆ సాయంత్రం... రాక్సీలో నార్మా షేరర్‌, బ్రాడ్వేలో కాంచనమాల, ఎటుకేగుటో సమస్య తగిలిందొక విద్యార్ధికి (1939లో చెన్నయ్‌లో ఆంగ్ల, తెలుగు సినిమాలు ఆడిన సినిమాహాళ్లు) అని సంధ్యా సమస్యలు అనే కవితలో శ్రీశ్రీ మన ముందుంచినట్లుగానే ఏ అంశం గురించి రాయాలో ఈ విద్యార్థికి పరీక్ష పెట్టాడు డోనాల్డ్‌ ట్రంప్‌.ఏప్రిల్‌ రెండవ తేదీ నుంచి తనకు లొంగని, నచ్చని దేశాలన్నింటి మీద ప్రకటించిన వాణిజ్య యుద్దంలో పన్ను అస్త్రాల ప్రయోగం, అణు ఒప్పందానికి రాకపోతే అంతు చూస్తామన్న బెదరింపులపై తేల్చుకుందాం రా అంటూ ఇరాన్‌ అధినేత ఘాటు స్పందన, పుతిన్‌ మీద కోపం వస్తోందన్న ట్రంప్‌, గాజాపై సాగుతున్న మారణకాండ ఇలా అనేక సమస్యలు మన ముందున్నాయి. తాను చాలా దయతో వ్యవహరిస్తానని ట్రంప్‌ ప్రకటించాడు. పిచ్చివాడు అనేక మాటలు మాట్లాడతాడు,తన చేతిలో రాయితో అందరినీ భయపెడతాడు, ఎవరినైనా కొట్టవచ్చు, ఉన్మాదంలో తన తలను తానే పగలగొట్టుకోనూ వచ్చు.వాడి దాడి నుంచి తప్పించుకోవాటానికి ప్రతి ఒక్కరూ చూడటంతో పాటు అదుపులోకి తీసుకొని కట్టడి చేసేందుకూ చూస్తారు. ఇప్పుడు ప్రపంచంలో అదే స్థితిలో ఉందా ! ఏం జరగనుంది !!

మంగళవారం రాత్రి నుంచి అమల్లోకి రానున్న ప్రతి సుంకాల విషయంలో తాను ఎంతో దయతో వ్యహరిస్తానని సోమవారం నాడు డోనాల్డ్‌ ట్రంప్‌ చెప్పాడు. తమ నేత చైనా, కెనడా, ఐరోపా యూనియన్లను రెచ్చగొట్టి ప్రపంచ వాణిజ్య యుద్ధానికి తెరలేపుతున్నాడని కొంత మంది రిపబ్లికన్‌ పార్టీ సెనెటర్లే వ్యతిరేకతను వ్యక్తం చేసినట్లు వార్తలు. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను కలిగి ఉన్నాం గనుక ప్రతి దేశం దాన్ని ముక్కలు చేస్తున్నందున ప్రతికూల పన్నులు వేయకతప్పటం లేదని, త్వరలో అమెరికాకు విముక్తి రోజు వస్తుందని చెప్పాడు ట్రంప్‌. తమ శత్రువుల మీద పోరాడాలంటూనే కొన్ని పన్నుల మీద అధికార పార్టీ సెనెటర్లు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు, కెనడా మీద చర్యలకు వ్యతిరేకంగా ఓటు వేస్తానని సుసాన్‌ కోలిన్స్‌, థోమ్‌ టిలిస్‌ ప్రకటించారు. తెలివితేటలు ఏ ఒక్కరి సొంతం కాదు.ఎవరి జాగ్రత్తలో వారున్నారు.పరస్పర వాణిజ్యంపై చైనా, జపాన్‌, దక్షిణ కొరియా ఆదివారం నాడు ఒక అవగాహనకు వచ్చాయి. ఏ దేశాల మీద ఎంత పన్ను, ఏ వస్తువుల మీద విధించేదీ బుధవారం నాడు ప్రకటిస్తామని అధ్యక్ష భవన మీడియా కార్యదర్శి కరోలిన్‌ లీవిట్‌ విలేకర్లతో చెప్పారు. పన్నులపై అనిశ్చితి ప్రభావం స్టాక్‌ మార్కెట్లపై పడిరది. అమెరికా వాణిజ్య భాగస్వాములందరి మీద 20శాతం వరకు పన్ను విధించవచ్చని ట్రంప్‌ సలహాదారులు చెప్పినట్లు వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ పేర్కొన్నది. పన్నులతో ముందుకు పోతే రానున్న ఏడాది కాలంలో అమెరికాలో మాంద్యం వచ్చే అవకాశాలు 20 నుంచి 35శాతానికి పెరుగుతాయని గోల్డ్‌మన్‌ శాచస్‌ విశ్లేషకులు చెబుతున్నారు.కార్ల ధరలు పెరిగితే వాటిని తాను పెద్దగా పట్టించుకోనని ట్రంప్‌ అన్నాడు.

ఇప్పటివరకు చైనా, కెనడా ప్రతి సుంకాలను ప్రకటించాయి. ఐరోపా యూనియన్‌ బేరసారాలాడుతున్నందున, మరో పదిహేను రోజుల వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవచ్చు. కార్ల మీద ట్రంప్‌ ప్రకటించిన పన్నులు గురువారం నుంచి అమల్లోకి వస్తాయి. అమెరికా పన్నులు ఆతృతకు కారణమౌతున్నాయని ఐఎంఎఫ్‌ అధిపతి క్రిస్టాలినా జార్జియేవా వ్యాఖ్యానించారు. చైనా, ఐరోపా యూనియన్‌,మెక్సికో,కెనడా,వియత్నాం, జపాన్‌, దక్షిణ కొరియా, చైనీస్‌ తైవాన్‌, భారత దేశాలతో వస్తు వాణిజ్యంలో అమెరికా లోటులో ఉంది. ఈ దేశాలన్నీ కూడా వాటి లావాదేవీలను పరిమితం చేసుకొనేందుకు చూస్తున్నాయి. అమెరికా వత్తిడికి లొంగి లేదా మన ఎగుమతిదార్ల లాబీ కారణంగా మన దేశం అమెరికాకు కొన్ని రాయితీలు ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు.మన మీద పన్నుల గురించి ఇంకా స్పష్టత రాలేదు. మొత్తంగా పరిస్థితిని గమనించి అమెరికా ప్రకటించిన పన్నులను గణనీయంగా తగ్గించవచ్చు లేదా కొంత కాలం అమలు వాయిదా వేయవచ్చని కొందరు ఆశిస్తున్నారు.

తమ మీద అమెరికా, దాని అనుయాయులు దాడులకు దిగితే అణ్వాయుధాలను సమకూర్చుకోవటంతప్ప మరొక ప్రత్యామ్నాయం లేదని ఇరాన్‌ హెచ్చరించింది. దాడులు జరిగితే వారు కచ్చితంగా ప్రతిదాడులను ఎదుర్కోవాల్సి ఉంటుందని రంజాన్‌ ఉపవాసమాసం ముగింపు సందర్భంగా చేసిన ప్రసంగంలో అధినేత అయాతుల్లా అలీ ఖమేనీ హెచ్చరించాడు. ఖమేనీ సలహాదారు అలీ లార్జియానీ టీవీలో మాట్లాడుతూ తాముగా అణ్వాయుధాలను సమకూర్చుకొనే దిశలో పయనించటం లేదని, ఒకవేళ అమెరికా స్వయంగా లేదా ఇజ్రాయెల్‌ ద్వారా దాడులకు దిగితే తమ నిర్ణయం భిన్నంగా ఉంటుందని, ఆత్మరక్షణకు వాటిని ప్రయోగించకతప్పదని చెప్పాడు. తమతో అణు ఒప్పందం మీద సంతకాలు చేయకపోతే పెద్ద ఎత్తున దాడులు చేస్తామని, సుంకాలు విధిస్తామని ఆదివారం నాడు ట్రంప్‌ బెదిరించాడు. దీని గురించి సోమవారం నాడు భద్రతా మండలికి ఇరాన్‌ ఫిర్యాదు చేసింది. రాయబారి అమీర్‌ సయిద్‌ ఇర్వానీ ఒక లేఖ ద్వారా తమ మీద దురాక్రమణకు పాల్పడితే నిర్ణయాత్మకంగా వ్యహరిస్తామని, యుద్దోన్మాదం, రెచ్చగొట్టటాన్ని ఖండిస్తున్నామని పేర్కొన్నాడు. గతంలో 2015లో కుదిరిన ఒప్పందం నుంచి ఇదే ట్రంప్‌ 2018లో ఏకపక్షంగా వైదొలిగాడు. ఇరాన్‌ పరిసర ప్రాంతాల్లో అమెరికా పది మిలిటరీ కేంద్రాలను, యాభైవేల మంది సైనికులను నిర్వహిస్తున్నది. అద్దాల మేడలో ఉండి ఎవరూ ఇతరుల మీద రాళ్లు వేయకూడదని ఇరాన్‌ క్షిపణి కార్యక్రమ అధికారి, ఇస్లామిక్‌ రివల్యూలషనరీ గార్డ్స్‌ సీనియర్‌ కమాండర్‌గా ఉన్న అమిరాలీ హజిజదే హితవు పలికాడు.

గతంలో కుదిరిన ఒప్పందం ప్రకారం పశ్చిమ దేశాల ఆంక్షలు ఎత్తివేయాలంటే ప్రతిగా ఇరాన్‌ తన అణుశుద్ధి కార్యక్రమాన్ని నిలిపివేయాల్సి ఉంది. అయితే పశ్చిమ దేశాలు ఒప్పందాన్ని ఉల్లంఘించటంతో ఇరాన్‌ తన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నది.వాటిని శాంతియుత ప్రయోజనాలకు మాత్రమే అని పదే పదే చెబుతున్నది. తిరిగి అణు ఒప్పందంపై చర్చలకు అంగీకరించాలని లేకుంటే మిలిటరీ చర్యతప్పదని మార్చి ఏడవ తేదీన యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ ద్వారా ట్రంప్‌ ఒక లేఖను పంపాడు. దానికి గాను గత వారంలో ఒమన్‌ ద్వారా ఇరాన్‌ సమాధానం పంపింది. గరిష్ట వత్తిడి, మిలిటరీ చర్య బెదిరింపుల పూర్వరంగంలో తాము ప్రత్యక్ష చర్చలకు సిద్దం కాదని, పరోక్షంగా అంగీకరిస్తామని విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చీ స్పష్టం చేశాడు. ఇదే అంశాన్ని ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌ కూడా తేటతెల్లం చేశాడు. చర్చలకు తాము విముఖం కాదని, ముందుగా అమెరికా తన గత తప్పిదాలను సరిచేసుకొని విశ్వాసం కలిగించాలని చెప్పాడు. గతంలో కుదిరిన ఒప్పందం నుంచి ట్రంప్‌ వైదొలిగిన తీరును బట్టి ఇరానియన్లకు నమ్మకం లేకపోవటం సరైనదే అని వాషింగ్టన్‌లోని స్టిమ్సన్‌ కేంద్ర బార్బరా స్లావిన్‌ వ్యాఖ్యానించారు.హిందూ మహాసముద్రంలోని డిగోగార్సియాలో సైనిక కేంద్రానికి అమెరికా అదనపు యుద్ద విమానాలను తరలించిందని, మరొక విమానవాహక నౌకను తరలించటాన్ని చూస్తే ఇజ్రాయెల్‌తో కలసి ఏదో ఒక రకమైన మిలిటరీ చర్యకు సిద్దం అవుతున్నట్లు కనిపిస్తున్నదని ఆమె చెప్పారు. అణుకార్యక్రమంతో పాటు పశ్చిమాసియా ప్రాంతంలో ప్రతినిధుల ద్వారా తన పలుకుబడిని పెంచుకొనేందుకు చూస్తున్నదని పశ్చిమ దేశాలు ఇరాన్‌ మీద ఆరోపిస్తున్నాయి. ఈ ప్రాంతంలో అలాంటి ప్రతినిధి ఎవరైనా ఉంటే యూదు దురహంకార ప్రభుత్వమేనని దాన్ని తుడిచివేయాలని ఖమేనీ స్పష్టం చేశాడు. అనేక బాంబులను తయారు చేసేందుకు అవసరమైన యురేనియంను ఇరాన్‌ సమకూర్చుకుందని, అయితే ఇంకా బాంబులను తయారు చేయలేదని ఇటీవల అంతర్జాతీయ అణు ఇంథన సంస్థ పేర్కొన్నది. అవసరమైతే రెండు నెలల వ్యవధిలో బాంబులను రూపొందించి, వాటిని పరీక్షించి, విడదీసి అవసరమైన చోటికి తరలించి తిరిగి తయారు చేసేందుకు, వాటిని ప్రయోగించే క్షిపణులను కూడా సమాంతరంగా సిద్దం చేసిందనే వార్తలు వచ్చాయి. ఆ తరువాతే ట్రంప్‌ బెదిరింపులకు దిగాడు. ఈ నేపధ్యంలో తన భూగర్భ క్షిపణి ప్రయోగ కేంద్రాలన్నింటినీ ఇరాన్‌ సన్నద్దం చేస్తున్నదని ఈ మేరకు వాటికి సంబంధించి కొన్ని వీడియోలను కూడా విడుదల చేసిందని వార్తలు వచ్చాయి. శత్రుదేశాల దాడులనుంచి వాటిని కాపాడేందుకు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. రెండు దేశాల మధ్య చర్చలకు తెరతీయాలంటే విధించిన ఆంక్షలను అమెరికా సడలించాల్సి ఉంటుంది.

రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్‌ పుతిన్‌ మీద తనకు పిచ్చి కోపం వస్తున్నదని డోనాల్డ్‌ ట్రంప్‌ అన్నాడు.ఉక్రెయిన్‌పై ఒప్పందానికి ముందుకు రాకపోతే అదనంగా రష్యన్‌ చమురు మీద 50శాతం పన్నులు విధిస్తానని చెప్పాడు. నెల రోజుల పాటు నల్ల సముద్ర ప్రాంతంలో నౌకల రవాణాపై ఒప్పందానికి ఉక్రెయిన్‌రష్యా అంగీకరించినట్లు ప్రకటించినప్పటికీ అదింకా అమల్లోకి రాలేదు.దాన్లో అంగీకరించినదాని ప్రకారం ఇరు దేశాలు తమ ఇంథన మౌలికవసతులపై పరస్పరం దాడులు నిలిపివేయాలి, అయితే ఇరుపక్షాలూ పాటించటం లేదని ఆరోపించుకుంటున్నాయి. తమ ఆహార, ఎరువుల రవాణాను స్వేచ్చగా జరగనివ్వటంతో పాటు వాటి లావాదేవీలు జరిపే బ్యాంకుల మీద పశ్చిమ దేశాలు ఆంక్షలను తొలగిస్తేనే అమలు చేస్తామని రష్యా షరతులు విధించింది. గతంలో జెలెనెస్కీని బెదిరించిన ట్రంప్‌ ఇప్పుడు మాటమార్చి రష్యా మీద కేంద్రీకరించాడు.తాను ఏది అనుకుంటే అది చేయగలననే అగ్రరాజ్య అహంకారంతో ఉన్నట్లున్నాడు.


ఉక్రెయిన్‌లో మరింత సమర్దవంతమైన ప్రభుత్వం ఉండాలని, జెలెనెస్కీ పదవీకాలం ముగిసినందున ఐరాస పర్యవేక్షణలో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని పుతిన్‌ సూచించాడు. ఈ ప్రకటన ద్వారా జెలెనెస్కీని తాను గుర్తించటం లేదని స్పష్టం చేశాడు. నల్లసముద్రంలో నౌకల రవాణా గురించి కూడా అమెరికాతో తప్ప ఉక్రెయిన్‌తో రష్యాకు ఎలాంటి ఒప్పందం లేదు, అయితే అమలు జరపాల్సింది మాత్రం జెలెనెస్కీ యంత్రాంగమే. సుదూరంగా ఉన్న ఉత్తర రష్యా నగరమైన మురుమాన్స్క్‌కు జలాంతర్గామిలో ప్రయాణించిన పుతిన్‌ విలేకర్లతో మాట్లాడుతూ తాత్కాలిక ప్రభుత్వం అక్కడ ఎన్నికలు జరిపేందుకు దోహదం చేస్తుందని, ప్రజల మద్దతు ఉన్న ప్రభుత్వం ఏర్పడితే దానితో చట్టబద్దమైన పత్రాలపై సంతకాలు చేసేందుకు శాంతి చర్చలకు సిద్దమని చెప్పాడు. యుద్దం కారణంగానే గడువు ముగిసినా రాజ్యాంగం ప్రకారం జెలెనెస్కీ అధికారంలో కొనసాగుతున్నాడని, 50లక్షల మంది పౌరులు దేశం వెలుపల ఉంటున్నపుడు, లక్షలాది మంది యుద్ధ రంగంలో ఉండగా ఎన్నికలు ఎలా సాధ్యమని ఉక్రెయిన్‌ అంటున్నది. గతంలో తూర్పు తైమూరు, పూర్వపు యుగోస్లావియా తదితర దేశాల్లో ఇలాగే ఎన్నికలు జరిగినపుడు ఇక్కడెందుకు సాధ్యం కాదని పుతిన్‌ ప్రశ్నించాడు. ఉక్రెయిన్‌ సంక్షోభంలో ఎవరి రాజకీయాలు వారు చేస్తున్నారు. ఒకవైపు శాంతి చర్చలు జరుగుతుండగానే నిలిపివేసిన ఆయుధ సాయాన్ని ట్రంప్‌ పునరుద్దరించాడు. మరోవైపు ఐరోపా దేశాలు కూడా మరింతగా జెలెనెస్కీ సేనలను పటిష్టపరచటం ఎలా అని ముఖ్యంగా బ్రిటన్‌, ఫ్రాన్సు చర్చిస్తున్నాయి.తమ ప్రమేయం లేకుండా అమెరికా కుదుర్చుకున్న ఒప్పంద షరతులను తామెందుకు అమలు జరపాలని ఐరోపా సమాఖ్య పరోక్షంగా ప్రశ్నిస్తోంది.తన పరువు కాపాడుకొనేందుకు ట్రంప్‌ నానా తంటాలు పడుతున్నాడు. ఆ బలహీనతను ఉపయోగించుకొని తమపై ఆంక్షలను ఎత్తివేయించుకోవాలని, ఉక్రెయిన్‌లో తమకు ఎదురులేదని నిరూపించుకోవాలని రష్యా చూస్తోంది. ఎవరి రాజకీయం వారిది, ఈ క్రమంలో ఎవరి ఇబ్బందులు వారివి !

Share this:

  • Tweet
  • More
Like Loading...

ట్రంప్‌ 50 రోజుల పాలన : నెల రోజుల కాల్పుల విరమణకు ఉక్రెయిన్‌ ఓకె, పట్టుబిగిస్తున్న పుతిన్‌ !!

12 Wednesday Mar 2025

Posted by raomk in Current Affairs, Economics, History, imperialism, International, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, UK, USA, WAR

≈ Leave a comment

Tags

30-day ceasefire, Donald trump, Jeddah, Ukraine crisis, Vladimir Putin, Zelensky

ఎం కోటేశ్వరరావు


అమెరికా సూచించిన నెల రోజుల పాటు కాల్పుల విరమణ ప్రతిపాదనకు ఉక్రెయిన్‌ అంగీకరించింది. సంక్షోభ ముగింపుకోసం రెండుదేశాల ప్రతినిధులు మంగళవారం నాడు సౌదీ అరేబియా నగరం జెడ్డాలో సమావేశం జరిపారు. ఈ వర్తమానాన్ని రష్యాకు పంపుతామని ప్రకటించారు.ఉక్రెయిన్‌ సంసిద్దత వ్యక్తం చేసిందని చెబుతూ నిలిపివేసిన మిలిటరీ సాయం, గూఢచార సమాచార అందచేతను వెంటనే పునరుద్దరించనున్నట్లు అమెరికా ప్రకటించింది. బుధవారం ఉదయం వరకు దీని మీద రష్యా స్పందన వెలువడలేదు.కాల్పుల విరమణ తరువాత ఖనిజాల ఒప్పందం చేసుకోనేందుకు ఏకీభావం కుదిరినట్లు సమాచారం. మరోవైపు పుతిన్‌, జెలెనెస్కీ సేనలు దాడుల తీవ్రతను పెంచాయి. ఉక్రెయిన్‌ ఆక్రమించిన కురుస్కు ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకొనేందుకు రష్యా సేనలు కేంద్రీకరించాయి. సంప్రదింపులకు తాను పూర్తిగా కట్టుబడి ఉన్నట్లు సోమవారం నాడే అక్కడకు చేరుకున్న జెలెనెస్కీ ప్రకటించాడు. యుద్ధం ప్రారంభమైన మరుసటి రోజునుంచే తాము శాంతిని కోరుతున్నామని, కొనసాగటానికి రష్యాయే కారణమని సామాజిక మాధ్యమంలో ఆరోపించాడు. ఒకవైపు మిలిటరీ సాయం, గూఢచార సమాచార అందచేత నిలిపివేసి ఉక్రెయిన్‌ మీద, దారికి రాకపోతే మరిన్ని ఆంక్షలు విధిస్తానని రష్యాను ట్రంప్‌ బెదిరించాడు.తాము ఇరుపక్షాల పట్ల సమవైఖరితో ఉన్నట్లు కనిపించేందుకు ఒక ఎత్తుగడగా ఇలా చేసినట్లు కొందరు చెబుతున్నారు. కురుస్కు ప్రాంతంలో తిష్టవేసిన జెలెనెస్కీ సేనలను అదుపులోకి తెచ్చుకొనేందుకు రష్యా ఏడువైపుల నుంచి చక్రబంధాన్ని బిగిస్తున్నట్లు వార్తలు. దీన్ని బ్రిటన్‌ మిలిటరీ గూఢచారులు కూడా ధృవీకరించారు. ఉక్రెయిన్‌ వైపు నుంచి కురుస్కు వచ్చే రోడ్లను మూసివేసినట్లు చెబుతుండగా తమకు ఎలాంటి ముప్పు లేదని జెలెనెస్కీ మిలిటరీ ప్రకటించింది. కొద్ది నెలల క్రితం ఉక్రెయిన్‌ సేనలు ఈ ప్రాంతంలో పదమూడువేల చదరపు కిలోమీటర్ల మేర రష్యా ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాయి. దానిని తిరిగి స్వాధీనం చేసుకోవటం కంటే రష్యా ఉక్రెయిన్‌ మీద దాడులు కేంద్రీకరించింది. రష్యాతో జరిపే చర్చల్లో తాను ఆక్రమించుకున్న ప్రాంతాన్ని తురుపుముక్కగా వినియోగించుకోవాలని జెలెనెస్కీ చూశాడు. అయితే దాని గురించి పుతిన్‌ ఎలాంటి ప్రస్తావన తేవటం లేదు. ఫిబ్రవరి నాటికి 800 చదరపు కిలోమీటర్ల మేర స్వాధీనం చేసుకున్నట్లు ఇప్పుడు మిగిలిన ప్రాంత విముక్తికి కేంద్రీకరించినట్లు వార్తలు. రష్యన్ల మాదిరే క్లిష్టమైన నిర్ణయాలు చేసేందుకు జెలెనెస్కీ సిద్దం గావాలని జెడ్డాకు వస్తూ అమెరికా విదేశాంగ మంత్రి మారియో రూబియో విమానంలో విలేకర్లతో చెప్పాడు.


ఏం జరుగుతుందో చూద్దామన్నట్లుగా ఉన్న ఐరోపా యూనియన్‌ మంగళవారం నాడే పారిస్‌లో భేటీ అయింది. ముప్పై దేశాలకు చెందిన మిలిటరీ అధిపతులు, రాజకీయవేత్తలు పాల్గొన్నారు.ఈ సమావేశాల్లో ఉక్రెయిన్‌ భద్రత, సాయం గురించి చర్చించినట్లు తప్ప వివరాలు వెల్లడి కాలేదు. శనివారం నాడు బ్రిటన్‌ ప్రధాని కెయిర్‌ స్టార్మర్‌ ప్రపంచ నేతలతో అంతర్జాలంలో మాట్లాడేందుకు నిర్ణయించారు. కలసి వచ్చే వారితో ఒక కూటమి ఏర్పాటు చేస్తామని గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అమెరికాతో తాము దగ్గర కావటం తమ ప్రయోజనాలకు భంగకరమని బ్రిటన్‌ భావిస్తున్నదని రష్యన్‌ విదేశీ గూఢచార సంస్థ ఒకటి పేర్కొన్నది.గూఢచర్య ఆరోపణలతో ఇద్దరు తమ దౌత్యవేత్తలను బహిష్కరిస్తూ రష్యా తప్పుడు ఆరోపణలు చేసిందని బ్రిటన్‌ ఆరోపించింది. ఇదే తొలిసారి కాదని గతంలో కూడా ఇలాగే చేసిందని పేర్కొన్నది. గతేడాది ఏడుగురు బ్రిటీష్‌ దౌత్య సిబ్బందిని రష్యా ఇదే ఆరోపణలతో బహిష్కరించింది. తాజా బహిష్కరణకు ముందు లండన్‌లోని రష్యా దౌత్యసిబ్బందిలో ఒకరి నియామకాన్ని రద్దు చేసింది, కార్యాలయ వ్యవహారాలను పరిమితం కావించింది.దీనికి ప్రతిగా రష్యా బ్రిటీష్‌ దౌత్యవేత్తలను బహిష్కరించింది.వారు తప్పుడు సమాచారంతో రష్యాలో ప్రవేశించినట్లు తెలిపింది. తొలి రోజుల్లో ఉక్రెయిన్‌ శాంతి ఒప్పందానికి ముందుకు వచ్చినప్పటికీ బ్రిటన్‌ అడ్డుపడినట్లు గతంలో వార్తలు వచ్చాయి, అప్పటి నుంచి రెండు దేశాల మధ్య సంబంధాలు సజావుగా లేవు.తాజాగా ఉక్రెయిన్‌కు మద్దతుగా అనేక దేశాలను బ్రిటన్‌ సమీకరిస్తున్నది. ఉక్రెయిన్‌కు శాంతి పరిరక్షణ పేరుతో మిలిటరీని పంపితే తీవ్ర పర్యవసానాలు ఉంటాయని ఆస్ట్రేలియాను అక్కడి రష్యా రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో హెచ్చరించింది. పశ్చిమ దేశాల బూట్ల చప్పుళ్లను చూస్తూ ఊరుకోబోమని పేర్కొన్నది. తమ గడ్డ నుంచి రిమోట్‌ ద్వారా ప్రయోగించే 45లక్షల డ్రోన్లను తయారు చేయనున్నట్లు ఉక్రెయిన్‌ ప్రకటించింది. వాటిలో బాంబులను పెట్టి సరిహద్దులో లేదా రష్యా ఆధీనంలోని ప్రాంతాల మీద దాడులకు వీటిని వినియోగిస్తారు.


అనూహ్యమైన రాజకీయ పరిణామాల పూర్వరంగంలో చైనా మధ్యవర్తిత్వంతో ఉప్పు నిప్పుగా ఉన్న సౌదీ అరేబియా, ఇరాన్‌ రాజీకి వచ్చి సాధారణ సంబంధాలు నెలకొల్పుకుంటున్నాయి. రాజు మహమ్మద్‌బిన్‌ సల్మాన్‌ అధికారానికి వచ్చాక అమెరికాకు దూరం జరుగుతూ అంతర్జాతీయ సమావేశాలకు తటస్థ వేదికగా తయారవుతున్నారు. అరబ్‌లీగ్‌ సమావేశాలు అక్కడే జరిగాయి, ఉక్రెయిన్‌పై చర్చలకు సైతం తెరతీశారు. మధ్య ప్రాచ్యంలో తిరుగులేని శక్తిగా కనిపించేందుకు చూస్తున్నారు. అందరూ ఎదురుచూస్తున్న శాంతి కావాలో లేదో ఉక్రెయిన్‌ తేల్చుకోవాలని సౌదీ చర్చలపై రష్యా స్పందించింది. సముద్ర, వాయుదాడుల నిలిపివేతకు ఒప్పందం కుదుర్చుకోవాలని ఉక్రెయిన్‌ ప్రతిపాదించే అవకాశం ఉందని, మరోసారి దాడులు రష్యా దాడులు జరగకుండా రక్షణ కోసం పట్టుబట్టవచ్చని వార్తలు, గతంలో ఐరోపా యూనియన్‌ కూడా దీన్నే ప్రతిపాదించింది. వీటిని మాత్రమే సులభంగా పర్యవేక్షించవచ్చని చెబుతున్నారు. ఈ వారంలో అమెరికాతో చర్చలు జరిగే అవకాశం లేదని, ఆవైపు నుంచి ఎలాంటి వర్తమానం రాలేదని రష్యా విదేశాంగశాఖ ప్రకటించింది. వారితో సంబంధాల పునరుద్దరణ గురించి సంప్రదింపులు ప్రాధమికదశలో ఉన్నాయని రష్యా ప్రతినిధి దిమిత్రి పెట్కోవ్‌ చెప్పాడు. మార్గం ఎంతో క్లిష్టంగా, సుదీర్ఘంగా ఉందని అయినప్పటికీ రెండు దేశాల నేతలు రాజకీయ సంకల్పాన్ని ప్రకటించారని అన్నాడు.ఉక్రెయిన్‌కు తన స్టార్‌లింక్‌ ఉపగ్రహ ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేసిన ఎలన్‌ మస్క్‌ ప్రశ్నించిన వారిని మీరెంత, మీ బతుకెంత నోరు మూసుకోండి అంటూ విరుచుకుపడుతున్నాడు.తన సేవలు నిలిపివేస్తే జెలెనెస్కీ సేనలు కుప్పకూలిపోతాయని కూడా అన్నాడు. ఉక్రెయిన్‌ తరఫున స్టార్‌లింక్‌కు రుసుము చెల్లిస్తున్న పోలాండ్‌ దీని మీద స్పందిస్తూ తాము ప్రత్నామ్నాయ కంపెనీ సేవలను ఎంచుకుంటామన్నది.మస్క్‌కు అంత అహంకారం పనికి రాదని పేర్కొన్నది. స్టార్‌లింక్‌ లేకపోతే ఉక్రెయిన్‌ ఎప్పుడో ఓడిపోయి ఉండేదని అమెరికా మంత్రి రూబియో వ్యాఖ్యానించాడు. ఈ పరిణామం తరువాత ఫ్రాంకోబ్రిటీష్‌ యూటెల్‌సాట్‌ కంపెనీ వాటాల ధరలు 650శాతం పెరిగాయి.

సౌదీలో మంగళవారం నాటి చర్చలతో వెంటనే తేలేదేమీ ఉండదని వాషింగ్టన్‌మాస్కో సంప్రదింపులకు తెరతీస్తాయని, ఈ లోగా రష్యా తాను చేయదలచుకున్నది చేస్తుందని పశ్చిమ దేశాలు భావిస్తున్నాయి.దానికి నిదర్శనంగా గత కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి. ఈ పూర్వరంగంలోనే ట్రంప్‌ ఒక ప్రకటన చేస్తూ అవసరమైతే రష్యా మీద కొత్త ఆంక్షలు, సుంకాలు విధిస్తామని ప్రకటించాడు. పుతిన్‌తో కంటే జెలెనెస్కీతో వ్యవహరించటం ఎంతో క్లిష్టంగా ఉందని కూడా అన్నాడు. ట్రంప్‌ ప్రకటనను రష్యా ఖాతరు చేయలేదు. తరువాత దాడులను మరింతగా పెంచింది. సరిహద్దుల నుంచి రష్యా రేపే వెళ్లిపోతుందని తాము అనుకోవటం లేదని, కాల్పుల విరమణ కొన్ని నెలలు, సంవత్సరాలు ఉన్నప్పటికీ తమ తరువాత భద్రత గురించి ఉక్రెయిన్‌ ఆలోచిస్తున్నది. కొద్ది రోజుల క్రితం సౌదీలో జరిగిన చర్చలలో తాత్కాలిక కాల్పుల విరమణకు షరతులతో రష్యా సుముఖత చూపింది. అంతిమంగా కుదరాల్సిన శాంతి ఒప్పందంలో ఉండాల్సిన అంశాల గురించి ముందే వెల్లడిరచాలని, ఏ ఏ దేశాలు భాగస్వాములౌతాయి, శాంతి పరిరక్షణ ఎలా జరుగుతుంది అన్నది స్పష్టం కావాలని షరతులు పెట్టింది. ఉక్రెయిన్‌ గడ్డపై నాటో దళాల ఏర్పాటును వ్యతిరేకించింది. ఆ తరువాతే శాంతి పరిరక్షణకు సముఖంగా ఉండే దేశాలతో కూటమి ఏర్పడాలని ఐరోపా యూనియన్‌ ఒక ప్రతిపాదనను ముందుకు తెచ్చింది.చైనా, భారత్‌ వంటి దేశాలతో కూడినది తమకు అనువుగా ఉంటుందనే సంకేతాలను రష్యా పంపింది.


అమెరికాతో సహా ప్రపంచం మొత్తాన్ని వ్లదిమిర్‌ పుతిన్‌ వంగదీశాడని, విజయం సాధించాడని మీడియా పండితులు వాపోయారు. నాలుగో ఏట ప్రవేశించిన ఉక్రెయిన్‌ సంక్షోభంలో ఎటువైపు ఎందరు మరణించారన్నది ఇప్పటికీ వెల్లడికాలేదు. పశ్చిమ దేశాలు లక్షా యాభైవేల నుంచి రెండులక్షల మంది రష్యా సైనికులు మరణించినట్లు చెబుతుండగా ఇంతవరకు 5,937 మంది మరణించినట్లు రష్యా రక్షణమంత్రిత్వశాఖ చెప్పింది.ఉక్రెయిన్‌ అధికారికంగా చెప్పినదాని ప్రకారం 45,100 మంది మరణించగా 3.9లక్షల మంది గాయపడ్డారు. మొత్తం 80లక్షల మంది పౌరులు విదేశాలకు శరణార్దులుగా వెళ్లటం గానీ తమ నెలవులు తప్పినట్లు చెబుతున్నారు. ఊహించని మలుపులు తిరుగుతున్న ఈ సంక్షోభంలో ఇంతకాలం రష్యాను దురాక్రమణదారుగా వర్ణించిన అమెరికా భద్రతా మండలిలో గతనెలలో ప్రవేశపెట్టిన అలాంటి తీర్మానాన్ని వీటో చేయటం విశేషం. నాటో కూటమిలో ఒక్క ఐరోపా దేశాలు మాత్రమే రష్యాను వ్యతిరేకిస్తున్నాయి. తమ రక్షణకు హామీ ఇవ్వకపోతే ఖనిజాల ఒప్పందం మీద సంతకం చేసేది లేదంటూ ట్రంప్‌ సమక్షంలో అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్‌తో పదినిమిషాల పాటు జెలెనెస్కీ వాదులాటకు దిగి వెళ్లిపోయాడు. తరువాత మెత్తబడి మరోసారి అమెరికాతో చర్చలకు వచ్చాడు. రష్యా వైఖరిలో ఎలాంటి మార్పులు లేవు. తమ స్వాధీనంలోకి వచ్చిన ఉక్రెయిన్‌ ప్రాంతాలను తిరిగి అప్పగించేది లేదని, వాటిని స్వతంత్ర దేశాలుగా గుర్తించాలని పుతిన్‌ పట్టుబడుతున్నాడు. వాటి మీద ఆశలు వదులుకోవాలని ట్రంప్‌ కూడా జెలెనెస్కీకి చెప్పాడు. ఈ పూర్వరంగంలో సౌదీ చర్చలు ఏ పరిణామాలు, పర్యవసానాలకు దారితీసేది ఎవరూ చెప్పలేని స్థితి నెలకొన్నది.


అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ అధికారానికి వచ్చి 50రోజులు దాటింది.రోజుకొక మాట, ఎప్పుడేం చేస్తాడో తెలియని అనిశ్చితి ప్రపంచాన్నే కాదు, అమెరికాను సైతం ఆవరించింది. ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు చెప్పలేను, ఇప్పుడు సంధికాలంలో ఉన్నాం అన్న ట్రంప్‌ వ్యాఖ్యతో సోమవారం నాడు అమెరికా స్టాక్‌ మార్కెట్‌ భారీగా పతనమైంది. నాలుగు లక్షల కోట్ల డాలర్ల మేర సంపద విలువ పడిపోయింది. ఈ ప్రభావంతో చైనా, హాంకాగ్‌ స్టాక్‌ మార్కెట్లు కూడా మంగవారం నాడు పతనమైనా తిరిగి కోలుకున్నట్లు వార్తలు. గత ఏడాది కాలంగా కొంత మంది మాంద్య భయాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే ట్రంప్‌ గెలిస్తే నివారిస్తాడని అనేక మంది ఆర్థికవేత్తలు ఆశలు పెట్టుకున్నారు.వర్తమాన పరిణామాలను బట్టి సందేహమే అని పెదవివిరుస్తున్నారు.‘‘ జోశ్యాలను నేను అసహ్యించుకుంటాను. మనం చాలా పెద్ద కసరత్తు చేస్తున్నాం గనుక సంధికాలం ఉంటుంది.అమెరికాకు సందపదలను తిరిగి తీసుకువస్తున్నాం, అదే పెద్ద విషయం. అది కొంత సమయం తీసుకోవచ్చు గానీ మనకు ఎంతో గొప్పది. ’’ అని ఆదివారం నాడు ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. చైనాపై సుంకాల గురించి మాట మార్చలేదు గానీ మెక్సికో, కెనడాల మీద అమలు జరుపుతానని ఒక మాట నెల రోజుల వాయిదా అని మరో మాట, అంతలోనే అబ్బే అదేం లేదంటూ చేస్తున్న ప్రకటనలు కొంత గందరగోళానికి దోహదం చేస్తున్నాయి. రానున్న పన్నెండు నెలల కాలంలో మాంద్య అవకాశాలు 15 నుంచి 20శాతానికి పెరిగినట్లుశుక్రవారం నాడు గోల్డ్‌మన్‌ శాచస్‌ ప్రకటించింది. ట్రంప్‌ ప్రకటించిన సుంకాలు అమల్లోకి వస్తే ధరలు,ద్రవ్యోల్బణ పెరుగుదలతో వృద్ధి రేటు దెబ్బతిని మాంద్యంలోకి పోవచ్చని స్టాక్‌మార్కెట్లో మదుపుదార్లు భయపడుతున్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ప్రపంచాన్ని కుదిపేసిన పది నిమిషాల రచ్చ – ఉక్రెయిన్‌కు మిలిటరీ సాయం నిలిపిన ట్రంప్‌ !

05 Wednesday Mar 2025

Posted by raomk in CHINA, Current Affairs, Europe, History, imperialism, International, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, UK, USA, WAR

≈ Leave a comment

Tags

2019 NATO Summit, Donald trump, EU, JD Vance, Joe Biden, NATO, The 10 minutes, Ukraine crisis, Zelensky

ఎం కోటేశ్వరరావు

‘‘ ప్రపంచాన్ని కుదిపివేసిన పది రోజులు ’’ అనే మహత్తర గ్రంధంలో 1917లో రష్యాలో జరిగిన బోల్షివిక్‌ విప్లవం ఎలా జరిగిందో వివరించారు. ప్రపంచంలో తొలిసారిగా కమ్యూనిస్టులు అధికారానికి వచ్చిన ఉదంతాల ప్రత్యక్ష సాక్షిగా ఉన్న అమెరికన్‌ రచయిత జాన్‌రీడ్‌ రాశాడు. ఫిబ్రవరి 28 శుక్రవారం నాడు అమెరికా అధినేత డోనాల్డ్‌ ట్రంప్‌ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లదిమిర్‌ జెలెనెస్కీ మధ్య పదినిమిషాల పాటు వైట్‌హౌస్‌లోని అధ్యక్షుడి కార్యాలయం ఓవల్‌ హౌస్‌లో సాగిన తీవ్ర వాగ్వివాదం యావత్‌ ప్రపంచాన్ని కుదిపివేసింది. రష్యన్‌ విప్లవం అనేక పరిణామాలు, పర్యవసానాలకు దారితీసింది. ఈ పదినిమిషాల వాగ్వివాదం దేనికి దారితీస్తుంది ? రష్యన్‌ విప్లవానికి దీనికి పోలిక లేదు గానీ అనేక పర్యవసానాలకు నాంది అన్నది స్పష్టం. రెండవసారి అధికారానికి వచ్చిన వందరోజులు కూడా గడవక ముందే అనేక వివాదాస్పద నిర్ణయాలు, తనకు లొంగని దేశాల వస్తు దిగుమతులపై సుంకాలు విధింపు ప్రకటనలు తెలిసిందే. పదవిని స్వీకరించిన 24 గంటల్లోనే ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని పరిష్కరిస్తానని ప్రకటించాడు.సుంకాల సమస్య వెంటనే అందరికీ కనిపించే ప్రభావం చూపలేదు గానీ జోశ్యం చెప్పేబల్లి కుడితి తొట్టిలో పడినట్లు పరిష్కరిస్తానన్న పెద్ద మనిషి తానే ఒక పెద్ద వివాదంలో ఇరుక్కుపోవటం నిజంగా అనూహ్యపరిణామమే. ఆ ఉక్రోషంతో ఉక్రెయిన్‌కు తాత్కాలికంగా మిలిటరీ సాయాన్ని నిలిపివేస్తున్నట్లు సోమవారం నాడు ప్రకటించాడు. ఇది వంద కోట్ల డాలర్ల వరకు ఉంటుందని, జెలెనెస్కీ ఒప్పందానికి వచ్చేంత వరకు నిలిపివేస్తున్నట్లు అధికారులు వెల్లడిరచారు. అంతకు ముందు ఆదివారం నాడు లండన్‌లో సమావేశం జరిపిన ఐరోపా పెద్దలు నాలుగు అంశాల శాంతి ప్రతిపాదన గురించి చర్చించారు. తరువాత బ్రిటన్‌, ఫ్రాన్సునేతలు నెల రోజుల కాల్పుల విరమణకు రష్యా ముందు ఒక ప్రతిపాదన పెట్టారు. మొత్తం మీద జెలెనెస్కీ బుర్రలో ఏముందో సిఐఏ పసిగట్టలేకపోయిందా ? అమెరికా బలవంతంగా ఖనిజాల ఒప్పందాలను రుద్దాలనుకుందా, అహంకారంతో తానే ఊబిలో దిగిందా ? అసలేం జరిగింది ?


ఓవల్‌ ఆఫీసులో అధ్యక్షుడు ట్రంప్‌, ఉపాధ్యక్షుడు జెడి వాన్స్‌, జెలెనెస్కీ ఆసీనులయ్యారు.‘‘ శాంతికి దారి మరియు సంపద్వంతం కావటానికి మార్గం బహుశా దౌత్యంలో పాల్గ్గొనటంద్వారా సాధ్యం కావచ్చు, దాన్నే అధ్యక్షుడు ట్రంప్‌ చేస్తున్నారు ’’ అని జెడి వాన్స్‌ అన్నాడు. దాంతో జెలెనెస్కీ అందుకొని ‘‘ ఎలాంటి దౌత్యం, జెడీ మీరు దేని గురించి మాట్లాడుతున్నారు, దాని భావమేమిటి ’’ అన్నాడు. దీంతో మాటా మాటా పెరిగింది. మంచీ మర్యాదా లేకుండా అమెరికా మీడియా ముందు వివాదాన్ని సృష్టిస్తున్నారని వాన్స్‌ అన్నాడు. మిలిటరీతో సమస్యలను ఎదుర్కొంటున్నారని కూడా అన్నాడు. యుద్ద సమయంలో ప్రతి ఒక్కరికీ సమస్యలుంటాయి, మీకంటే చాలా ఉంది, ఇప్పుడు మీకు అవగతం కాదు, కానీ భవిష్యత్‌లో తెలుస్తుందని జెలెనెస్కీ అనటంతో ట్రంప్‌కు మండిపోయింది. మాకేం జరుగుతుందో నువ్వు మాకు చెప్పవద్దంటూ రంకెలు వేశాడు. జూదం ఆడటానికి నీ దగ్గర తురుపు ముక్కలేమీ లేవని, లక్షలాది మంది ప్రాణాలతో చెలగాటమాడుతున్నావని అన్నాడు. ఇలాంటి సందర్భాలలో మంచి కోటు వేసుకొని రావాలని తెలీదా, అసలు కోటు ఉందా అని అమెరికన్లు అవమానించారు. అమెరికన్‌ విలేకరి జెలెనెస్కీని కోటు గురించి అడగ్గానే జెడి వాన్స్‌ నవ్వాడు.యుద్దం ముగియగానే నేను ధరిస్తాను, బహుశా అది మీరు వేసుకున్నటువంటిది లేదా అంతకంటే మెరుగైంది వేసుకుంటాను అని జెలెనెస్కీ సమాధానమిచ్చాడు. వాగ్వాదం తరువాత చివరికి జెలెనెస్కీ లేచి వెళ్లిపోయాడు. ముగ్గురిలో పెద్ద వాడు ట్రంప్‌. జెలెనెస్కీజెడివాన్స్‌ మధ్య గొడవ ప్రారంభం కాగానే ఉపశమింపచేయాల్సింది పోయి తానే తగాదాకు ఉపక్రమించటం గమనించాల్సిన అంశం. ఉక్రెయిన్‌ విఫలమైందంటే దాని అర్ధం పుతిన్‌ విజయం సాధించినట్లు కాదు, అది ఐరోపాకు , అమెరికాకూ వైఫల్యమే అని తరువాత జెలెనెస్కీ అన్నాడు.మొత్తం మీద అమెరికన్లు అతి తెలివి ప్రదర్శించినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. రచ్చకు కొద్ది గంటల ముందే ఎక్కువగా మాట్లాడవద్దని అమెరికా జెలెనెస్కీకి స్పష్టం చేసిందా అంటే అవుననే వెల్లడైంది. బహుశా అదే జెలెనెస్కీని ప్రేరేపించి ఉన్నట్లు కనిపిస్తోంది. ఓవల్‌ ఆఫీసుకు రాగానే రిపబ్లికన్‌ పార్టీ దక్షిణ కరోలినా రాష్ట్ర రిపబ్లికన్‌ పార్టీ సెనెటర్‌ లిండ్సే గ్రాహమ్‌ జెలెనెస్కీతో మాట్లాడుతూ రక్షణ ఒప్పందాల గురించి వాదోపవాదాలకు దిగవద్దని హెచ్చరించినట్లు న్యూయార్క్‌టైమ్స్‌ పత్రిక పేర్కొన్నది. గ్రాహమ్‌ స్వయంగా ఆ పత్రికతో ఈ విషయాన్ని చెప్పాడు.

జోర్డాన్‌ రాజు అబ్దుల్లా ఇటీవల అమెరికా పర్యటన జరిపి ట్రంపుతో భేటీ అయ్యాడు.ఇద్దరూ కలసి పత్రికా గోష్టి నిర్వహించారు. గాజాలోని పాలస్తీనియన్లకు జోర్డాన్‌లో నివాసం కల్పించేందుకు రాజు అబ్దుల్లా అంగీకరించాడంటూ డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించేశాడు. అక్కడే అది అవాస్తవం అంటే పరువు పోతుందని అనుకన్నాడేమో తమాయించుకొని ట్రంప్‌ పరువు కాపాడేందుకు అబ్దులా మౌనంగా ఉన్నాడు. తరువాత అలాంటిదేం లేదని, తమకు అంగీకారం కాదని కూడా ప్రకటించాడు. అలాగే జెలెనెస్కీని ఇరికించాలన్న దుష్టాలోచనతో ట్రంప్‌ అదే మాదిరి పత్రికా గోష్టి ఏర్పాటు చేశాడు. అయితే అనుకున్నదొకటి అయ్యింది ఒకటి. జెలెనెస్కీ ప్రశ్నించకపోతే తాను ఇబ్బందుల్లో పడతాడు. తమ దేశ రక్షణ హామీ సంగతి ఏమిటని ప్రశ్నిస్తాడని అమెరికన్లు ఊహించలేకపోయారు. దౌత్య మర్యాదలు, సంస్కారాన్ని పక్కనపెట్టి అవమానించటంతో జెలెనెస్కీ ఖనిజాల ఒప్పందంపై సంతకాలు చేయకుండానే లేచివెళ్లిపోయాడు. శాంతి ఒప్పందానికి అంగీకరిస్తేనే తిరిగి రా అని ట్రంప్‌ ప్రకటిస్తే, మీరు పిలిస్తేనే వస్తా, భద్రతకు హామీ ఇస్తే ఖనిజాల ఒప్పందమీద సంతకం చేస్తానంటూ బంతిని జలెనెస్కీ అవతలివైపు నెట్టాడు. సోమవారం నాడు లండన్లో కెనడాతో సహా పద్దెనిమిది ఐరోపా దేశాల నేతలు సమావేశమై పరిస్థితిని సమీక్షించి పాము చావకుండా కర్ర విరగకుండా అన్నట్లు అమెరికాకు మరింత ఆగ్రహం కలగకుండా, నట్టేటవదిలేదని ఉక్రెయిన్‌కు ఊరట పలుకుతూ ఒక ప్రకటన చేశారు. అవ్వా, బువ్వా రెండూ కావాలంటే కుదరదు అన్నట్లుగా పరిస్థితి ఉంది, ఏం జరగనుందన్నది యావత్‌ ప్రపంచంలో తలెత్తిన ఆసక్తి. ఎందుకిలా జరిగింది, పరిణామాలు, పర్యవసానాలేమిటి ?

ఉక్రెయిన్‌ శాంతికి హామీ ఇచ్చేందుకు సుముఖంగా ఉన్న కూటమి నాలుగు అంశాలతో ప్రతిపాదన రూపొందించినట్లు బ్రిటన్‌ ప్రధాని కెయిర్‌ స్టార్మర్‌ లండన్‌ సమావేశం తరువాత ప్రకటించాడు. ఈ క్రమంలో అమెరికా భాగస్వామి కావాలని కోరుతున్నట్లు, ఈ మేరకు ప్రయత్నాలను ముమ్మరం చేస్తామని కూడా చెప్పాడు.‘‘ఈ రోజు మేమ చరిత్ర కూడలిలో ఉన్నాము.దీర్ఘకాలం తరువాత ఐరోపా ఐక్యత ఇంత ఉన్నత స్థాయిలో ఉండటం చూడలేదు ’’అన్నాడు. నిజమైన శాంతి, హామీతో కూడిన భద్రతకు అమెరికా సహకారం కోసం ఐరోపాలో మేమంతా ఒక ప్రాతిపదికను కనుగొనేందుకు పని చేస్తున్నామని జెలెనెస్కీ చెప్పాడు. నాలుగు అంశాలు ఏవంటే, ఉక్రెయిన్‌కు సహాయం కొనసాగింపురష్యా మీద ఆర్థికవత్తిడి పెంపు, శాంతి ఒప్పందం కుదిరితే అది ఉక్రెయిన్‌ భద్రత, సార్వభౌమత్వాన్ని కాపాడేదిగా ఉండేట్లు చూడాలిశాంతి చర్చల్లో ఉక్రెయిన్‌కు భాగస్వామ్యం విధిగా ఉండాలి.శాంతి ఒప్పందం కుదిరితే అది భవిష్యత్‌లో ఏదైనా దురాక్రమణను ఎదుర్కొనే విధంగా రక్షణ సామర్ద్యాలను పెంచాలి. ఉక్రెయిన్‌ ఒప్పందాన్ని బలపరిచేందుకు, తరువాత శాంతికి హామీగా ఉండేందుకు కలసి వచ్చే వారితో ఒక కూటమిని అభివృద్ధి చేయాలి. స్థంభింప చేసిన రష్యా ఆస్తుల నుంచి వచ్చే వడ్డీ మొత్తం నుంచి 2.4 బిలియన్‌ డాలర్లను ఉక్రెయిన్‌ మిలిటరీ అవసరాల కోసం ఇవ్వాలని, ఇది గాక తాము మరో రెండు బిలియన్‌ డాలర్ల మొత్తాన్ని ఐదువేల గగనతల రక్షణ క్షిపణుల కొనుగోలు రుణం ఇవ్వాలని నిర్ణయించినట్లు బ్రిటన్‌ ప్రధాని చెప్పాడు. గతం నుంచి తాము పాఠాలు నేర్చుకున్నామని, రష్యా సులభంగా ఉల్లంఘించేందుకు అవకాశమిచ్చే బలహీన ఒప్పందాన్ని తాము అంగీకరించబోమన్నాడు. ప్రతిపాదిత ఐరోపా కూటమిలో ఏఏ దేశాలు ఉన్నదీ చెప్పలేదు. ఒప్పందం కుదరాలన్న ట్రంప్‌తో ఏకీభవిస్తున్నామని, దాన్ని అందరం కలసి చేయాలన్నాడు. గత శుక్రవారం నాడు జరిగిందాన్ని చూడాలని ఎవరూ కోరుకోలేదని, అమెరికా నమ్మదగిన దేశం కాదంటే తాను అంగీకరించనని కెయిర్‌ చెప్పాడు. ఐరోపాను తిరిగి సాయుధం కావించటం తక్షణ అవసరమని ఐరోపా కమిషన్‌ అధ్యక్షురాలు ఉర్సులా వాండెర్‌ లియాన్‌ చెప్పగా, ఉక్రెయిన్‌ ఎంత కాలం ప్రతిఘటిస్తే అంతకాలం మద్దతు ఇవ్వాలని భావించినట్లు నాటో ప్రధాన కార్యదర్శి మార్క్‌ రూటే చెప్పాడు. సముద్ర, గగనతల దాడులు, మౌలిక సదుపాయాల ధ్వంస దాడులు నెల రోజులు ఆపాలని బ్రిటన్‌,ఫ్రాన్సు ప్రతిపాదించాయి. అయితే భూతల దాడుల విరమణ అంశం లేదు.

ఈ పూర్వరంగంలో పరిణామాలు, పర్యవసానాల గురించి రకరకాల చర్చలు మొదలయ్యాయి. జెలెనెస్కీ దిగి వచ్చేంత వరకు మిలిటరీ సాయాన్ని నిలిపివేసినట్లు ప్రకటించిన పూర్వరంగంలో ఐరోపా ఆ మేరకు భర్తీ చేస్తుందా ? పరిమితంగానే అయినప్పటికీ ట్రంప్‌ వైఖరిని నిరసిస్తూ అమెరికాలో కొన్ని చోట్ల ప్రదర్శనలు జరిగాయి.అధికార రిపబ్లికన్‌, ప్రతిపక్ష డెమోక్రటిక్‌ పార్టీలోనూ భిన్నాభిప్రాయాలు వెల్లడయ్యాయి. ట్రంప్‌ గద్దె దిగేంత వరకు అమెరికా మిలిటరీ నౌకలకు ఒక్క లీటరు కూడా విక్రయించేది లేదని నార్వే చమురు కంపెనీ హాల్ట్‌బాక్‌ బంకర్స్‌ యజమాని ప్రకటించాడు.2024లో ఈ కంపెనీ మూడు మిలియన్‌ లీటర్లు విక్రయించింది.అయితే అమెరికాతో తమ సంబంధాలకు ఎలాంటి ఇబ్బంది లేదని నార్వే ప్రభుత్వం ప్రకటించింది. లండన్‌లో సమావేశమైన దేశాలు ఉక్రెయిన్‌కు మద్దతు ఇవ్వాలని సంకల్పం చెప్పుకున్నప్పటికీ అమెరికాతో ఘర్షణకు సిద్దంగా లేవు. కొందరి విశ్లేషణ ప్రకారం అమెరికాఐరోపా మధ్య విబేధం పెరిగిందని, ట్రంప్‌ వైఖరి యూరోపియన్లను చైనా వైపు మొగ్గుచూపేందుకు దోహదం చేసేదిగా ఉందని గాభరాపడుతున్నారు. కమ్యూనిస్టు సోవియట్‌ యూనియన్‌కు వ్యతిరేకంగా అమెరికాతో చేతులు కలిపిన ఐరోపా ఇప్పుడు అంతకంటే బలమైన కమ్యూనిస్టు చైనాతో చేతులు కలుపుతుందా ! గాజాలో శాంతి ఒప్పందాన్ని ఏ క్షణంలోనైనా ఉల్లంఘించేందుకు చూస్తున్న ఇజ్రాయెల్‌కు అన్ని రకాలుగా ట్రంప్‌ మద్దతు తెలుపుతున్నాడు. మధ్య ప్రాచ్యం, పశ్చిమాసియాలో తిష్టవేయటం అమెరికా లక్ష్యం. దానికి పావుగా ఇజ్రాయెల్‌ ఉంది. ఐరోపాలో పరిస్థితి వేరు. మిత్ర వైరుధ్యం ఉన్నప్పటికీ యావత్‌ ఐరోపా అమెరికా ప్రభావంలో ఉంది, కొత్తగా అమెరికా కాలూనాల్సిన అవసరం లేదు. నాటో విస్తరణ పేరుతో రష్యా ముంగిట ఆయుధాలతో తిష్టవేయాలని చూసిన అమెరికాకు అనూహ్యంగా ఎదురుదెబ్బతగిలింది. ఎన్ని ఆయుధాలు, ఎంత డబ్బు అందించినా పుతిన్‌ సేనలపై ఉక్రెయిన్‌ గెలిచే అవకాశాలు లేవని స్పష్టమైంది. రష్యా కమ్యూనిస్టు లేదా వామపక్ష శక్తుల పాలనలో లేదు.కమ్యూనిస్టుల పరిభాషలో చెప్పాలంటే అది ఒక బూర్జువాదేశం. అందువలన చైనాకు వ్యతిరేకంగా దాన్ని దగ్గరకు తీసుకోవాలని, చైనాతో ప్రచ్చన్న యుద్దం కొనసాగించాలన్నది అమెరికన్ల తాజా ఎత్తుగడగా కనిపిస్తున్నది. అమెరికా, ఐరోపాల నుంచి ముప్పు ఉంది గనుకనే రష్యా ఒక ప్రత్యర్ధిగా ఉంది, అది తొలిగితే వాటితో చేతులు కలపటానికి ఎలాంటి అభ్యంతరమూ ఉండదు. గతంలో జి7 కూటమిని విస్తరించి జి8గా మార్చేందుకు అవకాశమిచ్చినపుడు చేరిన సంగతి, 2006 సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లో కూటమి సమావేశాలను కూడా నిర్వహించిన సంగతి తెలిసిందే. తిరిగి అంతలోనే కుట్రల కారణంగా రష్యా ఆ కూటమికి ప్రత్యర్ధిగా మారింది. చేతులు కలపాలంటే తేలాల్సిన లెక్కలు చాలా ఉన్నందున, చైనాకు వ్యతిరేకంగా వెంటనే మారుతుందని చెప్పలేము. అయితే ప్రతిదేశం తన ప్రయోజనాలకు పెద్ద పీటవేస్తున్నపుడు అనూహ్యపరిణామాలు జరిగితే, ఏం జరుగుతుందో ఎలా చెప్పగలం !

Share this:

  • Tweet
  • More
Like Loading...

విమానాల వీడియోతో అమెరికా కూటమికి దడపుట్టించిన చైనా ! ఫైటర్‌ జెట్స్‌లో మనమెక్కడ !!

10 Friday Jan 2025

Posted by raomk in CHINA, Current Affairs, Europe, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, RUSSIA, UK, USA, WAR

≈ Leave a comment

Tags

China tests sixth-gen jet, IAF, Narendra Modi Failures, sixth-gen stealth jets, Tejas

ఎం కోటేశ్వరరావు


2024 డిసెంబరు చివరి వారంలో చైనా ఎగురవేసిన రెండు విమానాల వీడియోను చూసి అమెరికా, దాని అనుంగు దేశాలకు దడమొదలైందా ? మీడియాలో వస్తున్న విశ్లేషణలు, వివరాలను చూస్తుంటే అలాగే అనిపిస్తున్నది. చైనా కమ్యూనిస్టు విప్లవ సారధి మావో జెడాంగ్‌ 131వ జన్మదినం డిసెంబరు 26వ తేదీన రెండు తయారీ కేంద్రాల నుంచి ఆకాశంలో విహరించిన రెండు విమానాల గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. ప్రతి దేశం స్వంత విమానాలను అవి పౌర లేదా యుద్ధ అవసరాల కోసం తయారు చేసుకోవటం కొత్తేమీ కాదు గానీ చైనా గురించి ఎందుకింత ఆందోళన.స్టెల్త్‌ బాంబర్ల తరగతికి చెందినవి చెబుతున్న ఆధునిక విమానాలు ఏ దేశం దగ్గర ఎన్ని ఉన్నాయన్నది రహస్యమే.ఐదు, ఆరు తరాలకు చెందిన వాటిని స్టెల్త్‌ బాంబర్లు అని పిలుస్తున్నారు. ఇవి ఇతర దేశాలకు రాడార్లకు దొరక్కుండా( రెండో కంటికి తెలియకుండా) ఎగిరి శత్రువును దెబ్బతీసేంత వేగం, సామర్ధ్యం కలిగినవి. ఫోర్బ్స్‌ వెబ్‌సైట్‌ నాలుగు సంవత్సరాల క్రితం వివిధ వనరుల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం 2020 డిసెంబరు నాటికి ఏరకం విమానాలు ఏ దేశం దగ్గర ఎన్ని ఉనాయో పేర్కొంటూ ఒక జాబితాను ఇచ్చింది. దాని ప్రకారం అమెరికా 540, చైనా 41,నార్వే 22, ఇజ్రాయెల్‌ 18, ఆస్ట్రేలియా 16, బ్రిటన్‌ 15, జపాన్‌ 12, ఇటలీ 11, దక్షిణ కొరియా 11, రష్యా వద్ద పది చొప్పున ఉన్నాయి.రాడార్లను తప్పించుకొని ప్రయాణించే నాలుగు రకాలను చైనా రూపొందిస్తున్నదని కూడా ఆ వార్త పేర్కొన్నది. ఈ నాలుగేండ్లలో వాటి సంఖ్య కచ్చితంగా పెరిగి ఉంటుంది. మిలిటరీలో అమెరికా ఇప్పటికీ ఎదురులేని శక్తి అన్నది నిస్సందేహం. ఆ బలాన్ని చూపి ప్రపంచాన్ని తన అదుపులో పెట్టుకోవాలని చూస్తున్న మాట కూడా తెలిసిందే. ఇంతకీ చైనాను చూసి ఎందుకు కంగారు పడుతున్నట్లు ? ప్రపంచంలో ఇప్పటి వరకు ఐదవ తరం యుద్ధ విమానాలే ఉన్నాయి. అమెరికా తయారు చేసిన ఆరవ తరం విమానం 2020లో గగనతలంలో ఎగిరినప్పటికీ దాని గురించి వివరాలు ఇంతవరకు వెల్లడి కాలేదు. తాజాగా చైనాలోని చెంగడు, షెన్‌యాంగ్‌ విమాన తయారీ కేంద్రాల నుంచి రెండు కొత్త విమానాలు ఆకాశంలో కనిపించగా వాటికి రక్షణగా ఐదవ తరం జె20 ఫైటర్‌ విమానం తిరిగింది. ఆ దృశ్యాలు తప్ప అంతకు మించి వివరాలేమీ ప్రపంచానికి వెల్లడి కాలేదు. ఆయితే ఆ రంగంలో నిపుణులైన వారు ఆ విమానాలను చూస్తే ఆరవతరానికి చెందిన లక్షణాలను కలిగి ఉన్నాయని చెప్పారు.

2024 చివరిలో ఫ్లైట్‌ గ్లోబల్‌ సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం 161 దేశాలకు చెందిన సాయుధ దళాల్లో 52,642 విమానాలు ఉన్నాయి. ఇవి అంతకు ముందు సంవత్సరంతో పోల్చితే 759 తక్కువ. ఆఫ్రికా ఖండంలో 4,230, మధ్య ప్రాచ్యంలో 4,595, రష్యా కామన్‌వెల్త్‌ దేశాల్లో 5,124, ఆసియాపసిఫిక్‌ ప్రాంతంలో 14,583, ఉత్తర అమెరికాలో 13,339,ఐరోపాలో 7,760, లాటిన్‌ అమెరికాలో 2,956 ఉన్నాయి.దేశాల వారీ చూస్తే అమెరికాలో 13,043(ప్రపంచంలో25శాతం), రష్యా 4,292(8శాతం), చైనా 3,309(6),భారత్‌ 2,229(4), దక్షిణ కొరియా 1,592(3), జపాన్‌ 1,443(3),పాకిస్థాన్‌ 1,399(3) కలిగి ఉన్నాయి. అమెరికాతో పోలిస్తే చైనా దగ్గర ఉన్న మిలిటరీ విమానాలు ఎక్కడా సరితూగవు. చిత్రం ఏమిటంటే అమెరికాతో సహా నాటో దేశాలు ఇస్తున్న మద్దతు చూసి కేవలం 324 మిలిటరీ విమానాలు మాత్రమే కలిగి ఉన్న ఉక్రెయిన్‌ నాలుగువేలకు పైగా ఉన్న రష్యాను ఓడిస్తామని ప్రపంచాన్ని నమ్మింప చూస్తున్నది. రష్యాను చూసి నాటోలోని 23దేశాలు తమ రక్షణ బడ్జెట్‌ను జిడిపిలో రెండుశాతం అంతకు మించి ఖర్చు చేసేందుకు పూనుకున్నాయి.


చైనా ప్రదర్శించిన రెండు విమానాలు పరీక్ష కోసం ఉద్దేశించినవిగా చెబుతున్నారు. దానిలో తేలే ఫలితాలను బట్టి ప్రమాణాలను నిర్ధారించిన తరువాత మార్పులు చేర్పులతో రంగంలోకి దించుతారు. ఇది అన్ని దేశాలలో జరిగే ప్రక్రియే. అమెరికా ఐదవతరం ఎఫ్‌22, ఎఫ్‌35 రకాలకు ధీటుగా చైనా ఉన్నదని అందరూ అంగీకరిస్తున్నారు.మనదేశం అడ్వాన్స్‌డ్‌ మీడియం కంబాట్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌(ఎఎంసిఏ) రూపకల్పన దశలో ఉంది.ఎగుమతుల కోసం చైనా తయారు చేసిన జె35 రకం 40 స్టెల్త్‌ బాంబర్లను కొనుగోలు చేసేందుకు పాకిస్తాన్‌ నిర్ణయించింది.చైనాలో ఐదవతరం చెంగుడు జె20 రకం పని చేస్తుండగా షెన్‌యాంగ్‌ ఎఫ్‌సి31 రకం త్వరలో సేనలో చేరనుంది. ఈ సమాచార పూర్వరంగంలోనే ఆరవ తరం విమానాన్ని చైనా పరీక్షించినట్లు భావిస్తున్నారు.దాన్లో మూడు ఇంజన్లు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఆధునిక విమానాల్లో అలాంటి ఏర్పాటు లేని కారణంగా ప్రత్యేకత సంతరించుకుంది.ఇప్పటికిప్పుడు దాన్ని నిర్ధారించుకొనే అవకాశం లేదు.రెండో విమానం పైలట్లతో పని చేస్తుందా లేక మానవరహితంగా లక్ష్యాన్ని చేరేవిధంగా రూపొందించారా అన్న చర్చ కూడా జరుగుతోంది.

అమెరికా 2020 సెప్టెంబరు 14న తాను ఆరవ తరం యుద్ధ విమానాన్ని రూపొందించినట్లు ప్రకటించటమే గాక ఒక విమానాన్ని ఎగురవేసింది. దాని వివరాలు ఇప్పటికీ రహస్యమే. 2022లో అమెరికా వైమానిక దళ విశ్రాంత జనరల్‌ మార్క్‌ డి కెలీ చైనా ఆరవతరం విమానాల గురించి హెచ్చరించాడు. సాంకేతికపరమైన తేడాను వేగంగా తగ్గిస్తున్నదంటూ ఆందోళన వెల్లడిరచాడు.1997లో అమెరికా ఐదవతరం స్టెల్త్‌ ఫైటర్‌ ఎఫ్‌22 రాప్టర్‌ను తొలిసారిగా ఆవిష్కరించారు. దానికి ధీటైన చైనా జె20 పద్నాలుగు సంవత్సరాల తరువాత 2011లో ఉనికిలోకి వచ్చింది.దీనితో పోల్చుకుంటే అమెరికా 2020లో ఆరవతరాన్ని ఆవిష్కరించిన నాలుగు సంవత్సరాలకే 2024లో చైనా తన విమానాలను ప్రదర్శించింది. దీన్ని బట్టి చైనా సాంకేతిక పరిజ్ఞానం ఇంత వేగంగా ఉందా అని ప్రపంచం ఆశ్చర్యపోతున్నది. గతంలో చైనా సాధించినట్లు ప్రకటించిన అనేక విజయాలను తొలుత అంతా ప్రచారం తప్ప నిజం కాదని కొట్టిపడవేసిన వారు తరువాత వాస్తవమే అని తెలిసి అవాక్కయ్యారు. ఇప్పుడు ఆరవతరం విమానాల గురించి కూడా అదే డోలాయమానంలో ఉన్నారు.దీని గురించి చైనా అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. నూతన సంవత్సరాది సందర్భంగా చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ తూర్పు కమాండ్‌ ఒక సంగీత వీడియోను విడుదల చేసింది. దానిలో నూతన జెట్‌ బొమ్మలను చేర్చి అనధికారికంగా వాస్తవమే అని సంకేతమిచ్చినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.వివిధ దేశాలకు చెందిన విశ్లేషకులు భిన్న వ్యాఖ్యానాలు చేస్తున్నారు. దీర్ఘశ్రేణి, అత్యంత వేగంగా ప్రయాణించగల, శత్రు విమానాలను అడ్డుకోగలిగిన రష్యా మిగ్‌31 మాదిరి ఉన్నాయని, దానికంటే 45 టన్నుల బరువును మించి మోయగలవని, 400కిలో మీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను దెబ్బతీయగలవని, ధ్వని కంటే నాలుగురెట్లు వేగంగా ప్రయాణిస్తాయని ఇలా రకరకాలుగా చెబుతున్నారు. ప్రపంచంలో పరిణామాలు ఇలా ఉంటే మన దేశ పరిస్థితి ఏమిటి ?


పెట్రోలు, డీజిలు మీద విపరీతమైన సెస్సుల భారం మోపి ఏటా లక్షల కోట్ల రూపాయలను వసూలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఎందుకు అంటే గతం కంటే మోడీ సర్కార్‌ మిలిటరీ ఖర్చు ఎక్కువగా చేస్తున్నది, దానికి అవసరమైన మొత్తాలు ఎక్కడి నుంచి వస్తాయని ప్రశ్నించిన రోజులను గుర్తుకు తెచ్చుకోవాలి. సెస్‌ అంటే ఏ అవసరాల కోసం విధిస్తే దానికి మాత్రమే ఖర్చు చేయాలి, కానీ మోడీ సర్కార్‌ విధించిన వాటిలో రక్షణ లేదు. కాంగ్రెస్‌ దేశ రక్షణను నిర్లక్ష్యం చేసిందని ఇప్పటికీ ఆరోపిస్తుంటారు. మన వైమానిక దళ అధిపతి ఏపి సింగ్‌ సుబ్రతో ముఖర్జీ 21వ సెమినార్‌లో మాట్లాడుతూ చెప్పిన మాటలు గమనించదగినవి.2010లో తేజ రకం యుద్ధ విమానాల ఒప్పందం ప్రకారం ఇప్పటికీ వాటిని పూర్తిగా సరఫరా చేయలేదని, మరోవైపున చైనా ఆరవతరం జెట్‌ను పరీక్షించిందని, చైనా నుంచి పాకిస్థాన్‌ ఐదవ తరం యుద్ధ విమానాలను రానున్న రెండు సంవత్సరాలలో కొనుగోలు చేయనున్నదని చెప్పారు. తేలిక రకం 40 తేజ విమానాలు కావాలని 200910లో ఆర్డరు పెడితే ఇంతవరకు పూర్తిగా రాలేదన్నారు. 1984లో విమానానికి రూపకల్పన జరిగిందని పదిహేడేండ్ల తరువాత మొదటి తేజా 2001లో ఎగిరిందని పదిహేను సంవత్సరాల తరువాత 2016లో మిలిటరీలో ప్రవేశపెట్టినట్లు, ఇది 2024, ఇంతవరకు తొలి 40 విమానాలను అందచేయలేదని, ఇదీ మన ఉత్పాదక సామర్ధ్యమని సింగ్‌ చెప్పారు. చైనాను గమనిస్తే ఎన్ని విమానాలను అది తయారు చేసిందని కాదు, ఎంతో వేగంగా సాంకేతికంగా ముందుకు పోతున్నదని నూతన తరం యుద్ధ విమానాలను బయటకు తీసుకురావటాన్ని ఇటీవల చూశామని ఎయిర్‌ ఛీఫ్‌ మార్షల్‌ అన్నారు. పాతబడిన మిగ్‌ 21 విమానాల స్థానంలో తేలిక రకం(ఎల్‌సిఏ) విమానాలను స్వంతంగా రూపొందించేందుకు 1980దశకంలో నిర్ణయించారు. ఒక ఇంజను కలిగిన నాలుగవ తరం తేజ విమానాలను స్వంతంగా తయారు చేస్తున్నాము. వాటిని మెరుగుపరచి తేజా ఎంకె1, తేజా ఎంకె1ఏ రకాలను రూపొందించాము. ఈ రంగంలో పురోగతిని వేగవంతం చేసేందుకు పదేండ్లలో మోడీ సర్కార్‌ చేసిందేమిటన్నది ప్రశ్న.

అమెరికా, చైనాలు ఆరవతరంలో ప్రవేశిస్తే మన దేశం వద్ద ఫ్రాన్సు నుంచి దిగుమతి చేసుకున్న దసాల్ట్‌ రాఫెల్‌ విమానమే ఆధునికమైనది, అది 4.5వ తరానికి చెందినదిగా పరిగణిస్తున్నారు. చురుకుగా పనిచేసే వైమానిక యూనిట్లు 42 ఉండాలని నిర్ణయించగా ప్రస్తుతం 31 మాత్రమే ఉన్నాయని పార్లమెంటరీ కమిటీ నివేదికలో వెల్లడిరచారు. ఒక్కొక్క యూనిట్‌లో రెండు అంతకు మించి యుద్ధ విమానాలు ఉంటాయి. ప్రస్తుతం 83 తేలిక రకం తేజా విమానాల కోసం వాయుసేన ఒప్పందాలు చేసుకుంది, మరో 97కొనుగోలుకు ప్రతిపాదనలు సిద్దం చేసింది.వచ్చే దశాబ్దిలో ఐదవ తరం తేజా ఎంకె2 విమానాలు సిద్దం అవుతాయని భావిస్తున్నారు.ప్రస్తుతం ఉన్న మిరేజ్‌ 2000, మిగ్‌29, జాగ్వార్‌ విమానాలున్నాయి, ఐదవతరం తేజా వస్తే మరింత ఆధునికం అవుతుంది. వీటిని అభివృద్ధి చేసేందుకు గత ఏడాది మార్చి నెలలో మాత్రమే కేంద్రం అనుమతించిందనే వార్తలను చూస్తే కబుర్లు చెప్పినంతగా ఆచరణ గడపదాటటం లేదన్నది వాస్తవం.పరస్పరం విశ్వాసం లేమి, మిత్రులుగా పైకి కనిపించే వారే కుట్రలు జరుపుతున్న పూర్వరంగంలో ప్రతిదేశం తన జాగ్రత్తలను తాను తీసుకుంటున్నది. ఈపూర్వరంగంలో మన రక్షణ రంగాన్ని నిర్లక్ష్యం చేయకూడదు,ప్రచారానికే పరిమితం కాకుండా నిర్థిష్ట కార్యాచరణను రూపొందించాలి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

సాకు ఎమెన్‌ హౌతీలు అసలు లక్ష్యం ఇరాన్‌పై దాడి ?

25 Wednesday Dec 2024

Posted by raomk in COUNTRIES, Current Affairs, History, imperialism, International, INTERNATIONAL NEWS, Opinion, UK, USA, WAR

≈ Leave a comment

Tags

Donald trump, iran, Israel, Joe Biden, Netanyahu, US Attack on Yemen, Yemen Houthis

ఎం కోటేశ్వరరావు

ఆదివారం నాడు మధ్య ప్రాచ్యంలోని ఎర్ర సముద్రంలో అమెరికా నౌకాదళ యుద్ధ విమానం ఒకటి కూలిపోయింది. పొరపాటున దాన్ని తమ దళాలే కూల్చివేసినట్లు అమెరికా ప్రకటించగా, తామే కూల్చివేసినట్లు రాజధాని సనా నగరంతో సహా కీలకమైన ప్రాంతాలను అదుపులో ఉంచుకున్న హౌతీ సాయుధ దళం ప్రకటించింది. మరోవైపు హౌతీలు ప్రయోగించిన క్షిపణులను తమ రాడార్లు పసిగట్టలేకపోయాయని, ఫలితంగా కొద్ది మంది తమ పౌరులు గాయపడినట్లు ఇజ్రాయెల్‌ ప్రకటించింది. ఈ రెండు పరిణామాలు అమెరికా, ఇజ్రాయెల్‌ బలహీనతలను వెల్లడిరచాయి. గత కొద్ది రోజులుగా అమెరికా, ఇజ్రాయెల్‌ దళాలు ఎమెన్‌పై వైమానిక దాడులు జరుపుతున్నాయి. సిరియాలో బాత్‌ పార్టీ నేత అసద్‌ సర్కార్‌ కూలిపోయిన తరువాత ఈ పరిణామం చోటు చేసుకుంది.హౌతీలకు బదులు వారి వెనుక ఉన్న ఇరాన్‌ సంగతే చూడాలంటూ ఇజ్రాయెల్‌ గూఢచార సంస్థ మొసాద్‌ అధిపతి డేవిడ్‌ బర్నెయా తమ నేతలకు సూచించాడు. దీన్ని బట్టి ఇరాన్‌పై దాడికి పూనుకున్నట్లు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. గత ఏడాది కాలంగా ఎమెన్‌ కేంద్రంగా పని చేస్తున్న హౌతీలు జరుపుతున్న దాడుల తీరుతెన్నులను చూస్తే వారిని అణచివేయటం అంతతేలిక కాదని నిపుణలు చెబుతున్నారు.వారు ఇజ్రాయెల్‌ రాజధాని టెల్‌అవీవ్‌ మీద ప్రయోగించిన క్షిపణులు రెండు వేల కిలోమీటర్లు ప్రయాణించి భారీ నష్టం కలిగించాయి. లెబనాన్‌ కేంద్రంగా పని చేస్తున్న హిజబుల్లా కంటే వీరు శక్తివంతులని తేలింది. ఈ పూర్వరంగంలో ఒకేసారి ఇరాన్‌ఎమెన్‌ మీద దాడులకు దిగితే రాగల పరిణామాలు, పర్యవసానాల గురించి అమెరికా కూటమి మల్లగుల్లాలు పడుతున్నట్లు చెప్పవచ్చు. మధ్యప్రాచ్య పరిణామాలు ఏ మలుపు తిరిగేదీ ఇంకా స్పష్టంగా తెలియటం లేదు.

ఎర్ర సముద్ర తీరం ఒకవైపు, మరోవైపు అరేబియా సముద్రం సరిహద్దులుగా కీలక ప్రాంతంలో ఉన్న పశ్చిమాసియాలోని ఎమెన్‌ తొలుత బ్రిటన్‌ తరువాత అమెరికా సామ్రాజ్యవాదుల కుట్రకు బలైంది. అంతర్యుద్ధం తరువాత ఉత్తర, దక్షిణ ఎమెన్‌లు 1990లో విలీనమైన తరువాత తిరిగి అంతర్యుద్ధం ప్రారంభమైంది.ప్రస్తుతం వివిధ దేశాల మద్దతు ఉన్న పక్షాల ఆధీనంలో ఎమెన్‌ ఉంది. ప్రభుత్వ ఆధీనంలో మెజారిటీ ప్రాంతం ఉన్నప్పటికీ దానిలో ఎక్కువ భాగం ఎడారి, తరువాత ఇరాన్‌ మద్దతు ఉన్న హౌతీలు, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ మద్దతున్న సాయుధులు, పరిమిత ప్రాంతంలో ఆల్‌ఖైదా, మరో రెండు సాయుధ శక్తుల ఆధీనంలో రెండు ప్రాంతాలు ఉన్నాయి. మధ్యధరా సముద్రం నుంచి సూయజ్‌ కాలువ ద్వారా ఎర్ర సముద్రం ఏడెన్‌ సంధి దగ్గర అరేబియా సముద్రం కలుస్తాయి. నౌకా రవాణాకు కీలకమైన ఈ ప్రాంతాన్ని ఆనుకొని ఎమెన్‌ రాజధాని సనాతో సహా కీలకమైన ప్రాంతాలు హౌతీల చేతుల్లో ఉన్నాయి. ఇటీవలి వరకు వీరిని వ్యతిరేకించే ప్రభుత్వ దళాలకు సౌదీ అరేబియా మద్దతు ఇచ్చింది. గతంలో దక్షిణ ఎమెన్‌ ప్రాంతానికి సౌదీ రక్షితదారుగా ఉంది. తరువాత చైనా మధ్యవర్తిత్వంలో ఇరాన్‌సౌదీ అరేబియా ఒక ఒప్పందానికి వచ్చిన తరువాత సౌదీ అరేబియా జోక్యం నిలిచిపోయింది. పాలస్తీనాకు గట్టి మద్దతుదారుగా ఉన్న హౌతీల ఆధీనంలోని ఎమెన్‌ ఇటీవలి కాలంలో ఇజ్రాయెల్‌ దుశ్చర్యలను అడ్డుకుంటున్నది. ఎర్ర సముద్ర ప్రాంతంలో పాలస్తీనాకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్‌కు వచ్చే, మద్దతు ఇచ్చే దేశాల నౌకలను అడ్డుకోవటం ద్వారా వత్తిడి తెస్తున్నది. ఈ కారణంగానే సూయజ్‌ కాలువ లేకముందు మన దేశానికి వచ్చే నౌకలు ఆఫ్రికా ఖండంలోని గుడ్‌హోప్‌ ఆగ్రాన్ని చుట్టి వచ్చినట్లుగా ఇప్పుడు కూడా అనేక దేశాల నౌకలు చుట్టుతిరిగి వస్తున్నాయి.ఈ కారణంగానే మధ్య ధరా, ఎర్ర సముద్రాల్లో తిష్టవేసిన అమెరికా మిలిటరీ ఎమెన్‌పై దాడులకు పాల్పడుతున్నది.తమపై జరుపుతున్న క్షిపణి దాడులకు ప్రతిగా ఇజ్రాయెల్‌ కూడా దాడులకు దిగింది.తొలిసారిగా రాజధాని సనా నగరం మీద బాంబులు కురిపించింది.

ఇరాన్‌పై ఎంత బలమైన దాడులు జరిపామో అదే విధంగా ఎమెన్‌పై కూడా చేసి తీరుతామని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు ఆదివారం నాడు ప్రకటించాడు.హౌతీలు ప్రయోగించిన క్షిపణులతో ఇజ్రాయెల్‌ పౌరులు వణికిపోయారు. ఎందుకంటే చీమ చిటుక్కుమన్నా తమపైకి వచ్చే ప్రతి క్షిపణిని మధ్యలోనే కూల్చివేసే సామర్ధ్యం తమకుందని చెబుతున్న వారు శనివారం రాత్రి రాజధాని టెల్‌అవీవ్‌పై జరిగిన దాడిని పసిగట్టలేకపోయినట్లు స్వయంగా అంగీకరించారు. కేవలం పదహారు మంది గాయపడ్డారని మాత్రమే చెబుతున్నప్పటికీ అంతకంటే ఎక్కువే నష్టం జరిగినట్లు వార్తలు వచ్చాయి. గురువారం నాడు కూడా క్షిపణి దాడిని సూచిస్తూ దేశంలోని అనేక ప్రాంతాల్లో సైరన్లు మోగించారు. జరిగిన నష్టాన్ని యంత్రాంగం మూసిపెడుతున్నది. టెహరాన్‌ మద్దతుదారులపై ఎందుకు ఏకంగా ఇరాన్‌పైనే దాడులకు దిగాలని ఇజ్రాయెల్‌ యుద్ధ దురహంకారులు రంకెలు వేస్తున్నారు. యుద్ధ కాబినెట్‌ సమావేశం తరువాత నెతన్యాహు మాట్లాడుతూ హౌతీలపై దాడుల్లో తాము ఒంటరి కాదని, గత ఏడాదిగా అమెరికా, బ్రిటన్‌ దళాలు కూడా ఉన్నాయని చెప్పాడు. కాస్త సమయం తీసుకున్నప్పటికీ గాజాలోని హమస్‌, లెబనాన్‌లోని హిజబుల్లా మాదిరి దెబ్బతీస్తామని అన్నాడు. 2023 అక్టోబరు ఏడున గాజాలో మారణకాండ ప్రారంభమైన నాటి నుంచి హౌతీలు దాడులు చేస్తున్నారు. ఇప్పటి వరకు 200 క్షిపణులు, 170డ్రోన్లు ప్రయోగించినట్లు చెబుతున్నారు.ఎర్ర సముద్రంలోకి రాకుండా వంద వాణిజ్య నౌకల మీద కూడా దాడులు చేశారు. ఇదిలా ఉండగా ఇరాన్‌ మీద కొనసాగిస్తున్న తప్పుడు ప్రచారంలో భాగంగా ఆ దేశం అణ్వాయుధాల తయారీకి పూనుకున్నదని మరోసారి అమెరికా ఆరోపించింది. తాము శాంతియుత ప్రయోజనాల కోసం అణుకార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని, అయితే గతంలో ట్రంప్‌ అధికారంలో ఉన్నపుడు అంతకు ముందు కుదిరిన ఒప్పందాల నుంచి ఏకపక్షంగా వైదొలగి, తమ మీద విధించిన ఆంక్షల కారణంగా యురేనియం శుద్దికి పూనుకున్నట్లు ఇరాన్‌ అంటోంది.

ఆదివారం నాడు అమెరికాకు చెందిన ఎఫ్‌18 యుద్ధ విమానాన్ని కూల్చివేశామని, ఎమెన్‌పై అమెరికా, బ్రిటన్‌ దాడులను అడ్డుకున్నామని హౌతీ మిలిటరీ ప్రతినిధి యాహ్యా శారీ ప్రకటించాడు. అమెరికా విమానవాహక నౌక హారీ ఎస్‌ ట్రూమన్‌, ఇతర అనేక అనుబంధ నౌకలు శనివారం నుంచి దాడులు ప్రారంభించినట్లు పేర్కొన్నాడు. విమానాన్ని కూల్చివేసేందుకు తాము ఎనిమిది క్షిపణులు, 17 డ్రోన్లను వినియోగించినట్లు వెల్లడిరచాడు. అయితే తమ విమానాన్ని తామే కూల్చివేసినట్లు అమెరికా చెప్పుకుంది. అయితే అది ఎలా జరిగిందన్నది మాత్రం వెల్లడిరచలేదు.శనివారం నాడు ఎమెన్‌లోని క్షిపణి కేంద్రాల మీద దాడులు చేసినట్లు చెప్పుకుంది.తమ, ప్రాంతీయ భాగస్వాముల, అంతర్జాతీయ నౌకల ప్రయోజనాల రక్షణకే దాడులు చేస్తున్నట్లు పేర్కొన్నది. ఎర్ర సముద్ర ప్రాంతంలో హౌతీలు దాడులను ముమ్మరం చేయటంతో అమెరికా తీవ్ర వత్తిడికి లోనైన కారణంగానే తమ స్వంత విమానాన్ని కూడా గుర్తించలేని ఆత్రత కారణంగా స్వయంగా కూల్చివేసినట్లు నిపుణులు చెబుతున్నారు.ఈ పరిస్థితి కారణంగా రానున్న రోజుల్లో దాని దాడుల సామర్ధ్యం తగ్గే అవకాశం ఉందంటున్నారు. ముఖ్యంగా ప్రత్యర్ధుల వైపు నుంచి మానవరహిత ఆయుధాల ప్రయోగ సమయంలో ఇలాంటి తప్పిదాలు మరింత ఎక్కువగా జరిగే అవకాశం ఉంది.అమెరికా సూపర్‌ హార్నెట్‌ విమానాన్ని యుఎస్‌ఎస్‌ హారీ ఎస్‌ ట్రూమన్‌ నౌక నుంచి ప్రయోగించగా ఆ నౌకకు కాపలాగా అనుసరించే గెటీఎస్‌బర్గ్‌ అనే మరో నౌక రాత్రి మూడు గంటల సమయంలో నియంత్రిత క్షిపణి ద్వారా కూల్చివేసింది. అయితే ఇద్దరు పైలట్లు సురక్షితంగా ఉన్నట్లు ప్రకటించింది. ఈ అసాధారణ ఉదంతం హౌతీల నుంచి ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లను ఎదుర్కొనే క్రమంలో జరిగింది.తమవైపు వస్తున్నది శత్రువులదా లేక మిత్రులదా అన్నది గుర్తించటంలో అమెరికా మిలిటరీ విఫలమైంది.హౌతీల దాడులు తగ్గకపోవటంతో గత గురువారం నాడు ఎమెన్‌ రిజర్వుబాంకు, మరికొన్ని కంపెనీల మీద అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సరికొత్త ఆంక్షలు ప్రకటించాడు.


సిరియాలో తాము మద్దతు ఇస్తున్న అసద్‌ ప్రభుత్వం కూలిపోయినప్పటికీ ప్రతిఘటన కొనసాగించాల్సిందేనని ఇరాన్‌ భావిస్తున్నది. ప్రతిఘటించే దేశాల కూటమి కుప్పకూలిపోయినట్లు ఎవరైనా భావిస్తే పొరపాటని అధినేత అయాతుల్లా అలీ ఖమేనీ చెప్పాడు. లెబనాన్‌లో హిజబుల్లా సాయుధ సంస్థ మీద ఇజ్రాయెల్‌ దాడులు చేస్తున్నప్పటికీ ఇప్పటికీ సజీవంగానే ఉందన్నాడు.ఇజ్రాయెల్‌ను వ్యతిరేకించే సిరియాలో ప్రభుత్వం పతనమై నూతన శక్తులు అధికారానికి వచ్చాయి. వాటి వైఖరి, ఆచరణ ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది. ఈ లోగా కొంత మంది పశ్చిమదేశాల వారు చైనాఇరాన్‌ సంబంధాల గురించి మాట్లాడుతున్నారు.ఇరాన్‌ బలహీన పడినందున ఇప్పటి మాదిరి చైనా దానికి మద్దతుగా ఉండకపోవచ్చని, పశ్చిమదేశాల మార్కెట్‌ను వదులు కొనేందుకు సిద్ధపడదంటూ కొందరు, ఇరాన్‌తో సంబంధాలను చూపి పశ్చిమదేశాలతో ఒప్పందాలు చేసుకోవచ్చన్న విపరీత వ్యాఖ్యానాలు కూడా చేశారు. రెండు దేశాలూ అమెరికా, ఇతర పశ్చిమ దేశాల సామ్రాజ్యవాదుల దాడులు, ఆర్థిక ఆంక్షలకు గురవుతున్నాయి, వాణిజ్య పోరును ఎదుర్కొంటున్నాయి. సామ్రాజ్యవాద వ్యతిరేకత అన్న అంశమే వారి మధ్య బంధం పెరగటానికి కారణం. పాతిక సంవత్సరాల సహకార ఒప్పందం రెండు దేశాల మధ్య 2021లో కుదిరింది. ఉప్పు నిప్పుగా ఉన్న ఇరాన్‌సౌదీ మధ్య సయోధ్య కుదిర్చి ప్రపంచాన్ని ఆశ్చర్యపరచింది. తాత్కాలికంగా మధ్య ప్రాచ్యంలో ఇరాన్‌ బలహీనపడినంత మాత్రాన దాన్ని వదలివేసే అవకాశాలు లేవని చైనా తీరుతెన్నులను చూసినపుడు అర్ధం అవుతుంది. మరింత పటిష్టపరుచుకోవటం, ఆ ప్రాంతంలో అమెరికా, దాని తొత్తు దేశాలను ఎదుర్కోవటం ఎలా అన్న అంశం రానున్న రోజుల్లో కచ్చితంగా ప్రాధాన్యత సంతరించుకుంటుంది. దీనిలో భాగంగానే బ్రిక్స్‌, షాంఘై సహకార సంస్థలోకి ఇరాన్‌కు షీ జింపింగ్‌ ఆహ్వానం పలికాడు.


సిరియాలో అసద్‌ ప్రభుత్వం కూలిపోయినంత మాత్రాన అక్కడ అధికారానికి వచ్చిన శక్తులు అమెరికా ఒళ్లో వాలిపోతాయని, ఇజ్రాయెల్‌కు దాసోహమంటాయని చెప్పలేము. తొలుత అక్కడ ఒక స్థిరమైన ప్రభుత్వం ఏర్పడాలి. ఆ తరువాతే దాని బాట ఎటు అన్నది స్పష్టం అవుతుంది. అమెరికా అనుకూల దేశంగా ఉన్న సౌదీ అరేబియా నాటకీయ పరిణామాల మధ్య దాన్ని ధిక్కరించి రష్యాకు దగ్గరైంది.చైనా అధినేత షీ జింపింగ్‌ను ఆహ్వానించి తాము అమెరికాతో అంటకాగేది లేదన్న సందేశమిచ్చింది. చైనా చొరవతో చిరకాల ప్రత్యర్థిగా ఉన్న ఇరాన్‌తో సయోధ్య కుదుర్చుకుంది. ఇది మధ్య ప్రాచ్యంలో చైనా చొరవలో ఒక మైలు రాయి, అమెరికాకు ప్రత్యక్షంగా కనిపిస్తున్న ఎదురుదెబ్బ. అమెరికా ఆర్థిక ఆంక్షలు, రాజకీయ వంటరితనం నుంచి ఇరాన్‌ కొంత మేర బయటపడిరది. చైనాను దెబ్బతీసేందుకు అమెరికా నాయకత్వంలోని పశ్చిమదేశాలు నిరంతరం ప్రయత్నిస్తున్న పూర్వరంగంలో ప్రతి ప్రాంతంలోనూ వాటిని ప్రతిఘటించే శక్తిగా చైనా ముందుకు వస్తోందని ఇటీవలి అనేక పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. డోనాల్డ్‌ ట్రంప్‌ రెచ్చగొట్టే చర్యలతో చైనాఇరాన్‌రష్యా మరింత దగ్గరవుతాయి. ట్రంప్‌ తన యంత్రాంగంలోకి ఎంచుకున్న వ్యక్తుల తీరుతెన్నులను చూసినపుడు అసలే కోతి ఆపైన కల్లుతాగింది అన్నట్లుగా వారి చర్యలుంటాయని వేరే చెప్పనవసరం లేదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఎన్నికలకు ముందే కెనడా ప్రధానికి ఉద్వాసన ? విశ్వగురువు ఇప్పటికైనా కళ్లు తెరిచేనా !

25 Friday Oct 2024

Posted by raomk in Asia, CHINA, Current Affairs, Europe, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RUSSIA, UK, USA, WAR

≈ Leave a comment

Tags

anti india, Donald trump, Joe Biden, Justin Trudeau, khalistan, Narendra Modi, war on terrorism

ఎం కోటేశ్వరరావు


అక్టోబరు నెల మధ్య నుంచి జరుగుతున్న పరిణామాలతో భారత్‌కెనడా సంబంధాలు తీవ్ర వత్తిడికి గురవుతున్నాయి. అమెరికా, దాన్ని అనుసరించే దేశాలన్నీ మన మీద కత్తిగట్టినట్లుగా వ్యవహరిస్తున్నాయి. ఇదే సమయంలో కెనడా పాలకపక్షంలో కొందరు ఎంపీలు ప్రధాని జస్టిన్‌ ట్రుడెవ్‌ 2024 అక్టోబరు 28లోగా పదవి నుంచి తప్పు కోవాలని, మరోసారి ఎన్నికల గోదాలో దిగవద్దని 153 మంది పాలక పార్టీ ఎంపీల్లో 24 మంది డిమాండ్‌ చేసినట్లు కెనడా బ్రాడ్‌కాస్ట్‌ కార్పొరేషన్‌ వార్తను ప్రసారం చేసింది. ఇది ఏ రూపం తీసుకుంటుందో తెలియదు. అంతకు ముందు పరస్పరం కొందరు దౌత్యవేత్తల బహిష్కరణ మిగిలిన సిబ్బందిపై నిఘావంటి ప్రకటనలతో ఇరుదేశాల మధ్య దౌత్య యుద్దం, ప్రచారదాడి జరుగుతోంది. ఇది రాసిన సమయానికి 270కిపైగా భారత విమానయాన సంస్థలు నిర్వహిస్తున్న సర్వీసులకు బాంబు బెదిరింపులు రావటం ఆందోళన కలిగించే పరిణామం. గురువారం ఒక్కరోజే 95 విమానాలకు బెదిరింపులు వచ్చాయి. గతంలో ఇలాంటి పరిస్థితిని మనం ఎప్పుడూ ఎదుర్కోలేదు. ఏ విమానం ఎక్కితే బాంబు ఉన్నట్లు సమాచారం వస్తుందో తెలియని డోలాయమానంలోకి ప్రయాణీకులను నెట్టి భయాన్ని సృష్టించమే ఈ ఉదంతాల వెనుక ఉన్న శక్తుల ఎత్తుగడగా కనిపిస్తోంది. వాటిని పరిగణనలోకి తీసుకోకుండా నడిపితే, ఏదైనా విమానంలో నిజంగా బాంబుపెడితే జరిగే ఘోరాన్ని తలచుకోవాలంటేనే వణుకుపుడుతోంది. దేశం 1980 దశకం నాటి ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే పరిస్థితులకు వెళుతోందా అనే సందేహాలు వెల్లడవుతున్నాయి. ఉగ్రవాదాన్ని శాంతి భద్రతల సమస్యగా మాత్రమే చూడకూడదు. అలా పరిగణిస్తే దాన్ని నివారించే బాధ్యత, పోలీసు, ఇతర భద్రతా వ్యవస్థలపై పడుతుంది. అలాంటి సంస్థలు ప్రపంచ వ్యాపితంగా అనుసరించిన దగ్గరి దారి ఏమంటే జనం మీద దాడికి దిగటం. కిరాయికి లేదా ప్రత్యేక ముఠాలను రూపొందించి ఉగ్రవాదులు, ఇతర దేశవ్యతిరేకులను మట్టుబెట్టించటం. ఇది ఒక విధంగా అధికారిక ఉగ్రదళం వంటిదే. ఉగ్రవాదులు తలెత్తకుండా ఉండాలంటే ఉగ్రవాదాన్ని నిర్మూలించాలి, అవాంఛనీయ చర్యలకు పాల్పడినపుడు అవసరమైతే ఆయుధ ప్రయోగం చేయవచ్చు.మన కళ్ల ముందే పాలస్తీనా దేశాన్ని విభజించి యూదుల మాతృభూమి పేరుతో ఇజ్రాయెల్‌ ఏర్పాటు జరిగింది.ఉనికిలో ఉన్న పాలస్తీనా అదృశ్యమైంది. దాని పునరుద్దరణకు ఏడు దశాబ్దాలుగా పోరాటం సాగుతున్నది.యావత్‌ పాలస్తీనియన్లు దానిలో పాల్గొంటున్నారు.వారిని కూడా ఉగ్రవాదులుగా అమెరికా చిత్రిస్తున్నది. ప్రపంచంలో వేర్వేరు కారణాలతో అనేక చోట్ల ఆందోళనలు సాగుతున్నాయి. ఈ పూర్వరంగంలో ఖలిస్తాన్‌ ఏర్పాటు అన్న భావనను మెజారిటీ సిక్కులు వ్యతిరేకిస్తున్నారు. వ్యక్తిగత స్థాయిలో సమర్ధించిన వారందరూ ఉగ్రవాదులు కాదు, దానికోసం ఆయుధాలు చేపట్టి, అవాంఛనీయ చర్యలకు పాల్పడిన వారు మాత్రమే తీవ్రవాదులు.

మనదేశంలో నాగాలాండ్‌, మిజోరాం, కాశ్మీరు, పంజాబ్‌ వేర్పాటు వాదం తలెత్తింది. ఆయుధాలు రంగంలోకి వచ్చాయి. వాటన్నింటికీ అమెరికా, కెనడా,బ్రిటన్‌, వంటి పశ్చిమదేశాలు మద్దతు ఇస్తున్నాయి, ఆ శక్తులకు ఆశ్రయం కల్పిస్తున్నాయి. ఒక్క మనదేశమే కాదు శ్రీలంక వేర్పాటు వాదుల వెనుక, అనేక దేశాల్లో రకరకాల పేర్లతో ఉన్న శక్తులకు మద్దతు ఇస్తున్నదీ ఈ దేశాలే. దాని వెనుక తమను వ్యతిరేకించేదేశాలను అస్తిరపరచటం లేదా విచ్చిన్నం చేసే సామ్రాజ్యవాదులు ఎత్తుగడ ఉంది, దానికి ఉగ్రవాదం ఒక ఆయుధం. కొన్ని సందర్భాలలో ఉగ్రవాద చర్యలు నిలిచిపోయాయంటే దాని అర్ధం తెరవెనుక పశ్చిమదేశాలకు అనుకూలమైన పరిణామాలు జరిగినట్లే లెక్క. తిరిగి ప్రారంభమయ్యాయంటే పూర్తిగా తమకు లొంగలేదని అవి కథనడిపిస్తున్నట్లే. లేకుంటే ఆకస్మికంగా గత పదిరోజులుగా మాత్రమే మన విమానాలకు బాంబుల బెదిరింపులు ఎందుకు వస్తున్నాయి ? అవి ఐరోపా ఖండ దేశాల నుంచే ఎలా వస్తున్నట్లు . ప్రపంచ ఉగ్రవాదుల అణచివేతకు తాయత్తు కట్టుకొని బరిలోకి దిగామని చెబుతున్న అమెరికా, కెనడా వంటి దేశాలు ఖలిస్తాన్‌ ఉగ్రవాదులకు ఆశ్రయం ఎందుకు కల్పిస్తున్నట్లు, వారికి పౌరసత్వం ఎందుకు ఇస్తున్నాయి. పంజాబీలందరూ ఖలీస్తానీవాదులు కాదు, ఉగ్రవాదులూ కాదు. మనదేశాన్ని లొంగతీసుకోవాలని కోరుకొనే పశ్చిమదేశాలకు మేకపిల్లతోడేలు కథ మాదిరి ఏదో ఒకసాకుతో ఉగ్రశక్తులను రెచ్చగొట్టేందుకు అవకాశాలున్నాయనేది కెనడా ఉదంతం వెల్లడిస్తోంది.


అమెరికాకెనడా రెండు దేశాల్లోనూ పౌరసత్వం ఉన్న మనదేశానికి చెందిన గురుపత్వంత్‌ సింగ్‌ పన్ను అనే ఖలిస్తానీ ఉగ్రవాదిని హత్య చేసేందుకు చేసిన కుట్రలో మన గూఢచారి వికాస్‌ యాదవ్‌ ఉన్నట్లు అమెరికా కోర్టు ప్రకటించించింది. దాంతో యాదవ్‌ మీద అరెస్టు వారంట్‌ జారీచేసి ఎఫ్‌బిఐ జాబితాలో అత్యంత కీలక వాంఛనీయ వ్యక్తిగా బహిరంగంగా ప్రకటించారు. ఇలా మన పౌరుడి గురించి ప్రకటించటం ఇదే మొదటిసారి. అమెరికా మనకు అత్యంత కీలక భాగస్వామిగా ఉన్నదని నరేంద్రమోడీ గతంలో అనేకసార్లు గొప్పగా చెప్పారు. తమ అవసరాల రీత్యా డోనాల్డ్‌ ట్రంప్‌ పలు సందర్భాలలో నరేంద్రమోడీని పొగడ్తల వర్షంతో ముంచెతారు. చెట్టపట్టాలు వేసుకు తిరిగాడు, భారత దేశ పిత అంటూ కితాబులిచ్చాడు. జో బైడెన్‌ తక్కువ తిన్నాడా ‘‘ మోడీజీ మీరు నాకు పెద్ద సమస్య తెచ్చిపెట్టారు. నా కంటే మా దేశంలో మీ పలుకుబడి ఎక్కువగా ఉంది. మీతో కలసి భోంచేసేందుకు దేశమంతటి నుంచి ఎందరో ఎదురు చూస్తున్నారు. ఉన్న సీట్లన్నీ అయిపోయాయి. నేనేదో మిమ్మల్ని ఆటపట్టిస్తున్నా అనుకోవద్దు, ఇది నిజం, కావాలంటే నా బృందాన్ని అడగండి, రోజూఎన్నో ఫోన్లు వస్తున్నాయి నాకు.’’ గతేడాది మే నెలలో చైనాకు వ్యతిరేకంగా జరిగిన క్వాడ్‌(చతుష్టయ) సమావేశానికి ముందు మోడీని మునగ చెట్టు ఎక్కిస్తూ జోబైడెన్‌ పలుకులివి. వీటితో అనేక మంది అమెరికా అధినేతలనే మనకాళ్ల వద్దకు తెచ్చిన మొనగాడిగా నరేంద్రమోడీని పొగిడారు. రాముడు సీతను కోరినట్లుగా ఇప్పుడు దర్యాప్తుకు సహకరించి ఎలాంటి నేరం చేయలేదని నిరూపించుకోండి అంటూ నరేంద్రమోడీని అగ్నిపరీక్షకు పూనుకోవాలంటున్నా పశ్చిమదేశాలు.మరో ఖలిస్తానీ ఉగ్రవాది హరదీప్‌ నిజ్జర్‌ను 2023లో కెనడాలో హత్య చేశారు. దానిలో కూడా భారత అధికారుల హస్తం ఉందని కెనడా ఆరోపిస్తోంది. నిర్దిష్ట చట్టబద్ద ఆధారాలు లేవంటూనే తమ దగ్గర ‘‘ ఐదు కళ్ల ’’ నిఘా సమాచారం ఉందని చెబుతోంది. దాన్ని నిర్వహిస్తున్న దేశాలు కూడా దర్యాప్తుకు సహకరించాలని అమెరికా, కెనడా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ గతేడాది కాలంగా వత్తిడి తెస్తున్నాయి. అమెరికా ఎలా కావాలంటే అలా నివేదికలు తయారు చేస్తే మిగిలిన దేశాలన్నీ సంతకాలు చేస్తాయన్నది తెలిసిందే. నిజానికి వాటి వద్ద ఎలాంటి సమాచారమూ లేదని వార్తలు.

ఇటీవలి కాలంలో విదేశాల్లో మనకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఉగ్రవాదులు, మరికొందరు వ్యక్తులు హత్యలకు గురవుతున్నారు. మనకు వ్యతిరేకంగా ఎవడైనా పని చేస్తూ వారికి ఇదే గతి, చూడండి మన తడాఖా, ఎలా లేపేస్తున్నామో అంటూ సోషల్‌ మీడియాలో పోస్టులు దర్శనమిస్తున్న సంగతి, ఆ ఘనతను ఎవరికి ఆపాదిస్తున్నదీ తెలిసిందే.మన సీనియర్‌ అధికారులు ఇచ్చిన ఆదేశాల మేరకు నెలకు ఇద్దరు ముగ్గురు చొప్పున ఖలిస్తానీ ఉగ్రవాదులను లేపేసేందుకు యాదవ్‌ అనే అతన్ని కేంద్ర కాబినెట్‌ సచివాలయం కింద నేరుగా కిరాయికి పని చేసేందుకు ‘‘రా’’ నియమించిందని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు యాదవ్‌ ప్రభుత్వానికి పనిచేయటం లేదని విదేశాంగశాఖ ప్రకటించటం ద్వారా నియామకం వాస్తవమే అని అంగీకరించినట్లయింది. ఇప్పుడు వచ్చిన ఆరోపణలపై మన ప్రభుత్వమే విచారణ జరుపుతుందా లేక అమెరికా దర్యాప్తు సంస్థలకు అతన్ని అప్పగిస్తుందా అన్నది తెలియదు. ఏది జరిగినా పరిణామాలు, పర్యవసానాలు ఎలా ఉండేది ఊహించలేము. విదేశాలలో ఉన్న తమ వ్యతిరేకశక్తులను మట్టుపెట్టేందుకు సిఐఏ,మొసాద్‌, ఐఎస్‌ఐల కిందపనిచేసే హంతక దళాలను ఆయా ప్రభుత్వాలు నియమించటం, వాటి దుర్మార్గాల గురించి మనకు తెలిసిందే. అయితే గతంలో ఎన్నడూ మన ప్రభుత్వం వినియోగించిన దాఖలాలు లేవు.ఇదొక ప్రమాదకరమైన క్రీడ.

కెనడాను మనం ఎంతగా కౌగిలించుకున్నా గతంలో ఎన్నడూ అది మిత్రదేశంగా చూడలేదు. దాన్ని కాదని మనల్ని ఎన్నడూ అమెరికా విశ్వాసంలోకి తీసుకోలేదు.ప్రస్తుతం కెనడా ప్రధానిగా ఉన్న జస్టిన్‌ ట్రుడేవ్‌ తండ్రి కూడా గతంలో ప్రధానిగా పనిచేశాడు. రెండు దేశాల మధ్య తాజా వివాదానికి 2018లో జరిగిన ఉదంతం నాంది అని చెప్పవచ్చు. కెనడాలో ఏడు లక్షల 70వేల మంది సిక్కులు ఉన్నారు. జనాభాలో వారి 2.1శాతమే అయినప్పటికీ అక్కడి రాజకీయాల్లో ఎంతో పలుకుబడి కలిగిన వారు. 2018లో ప్రధాని ట్రుడేవ్‌ మనదేశానికి రానున్న సందర్భంగా అతగాడి కార్యాలయం మనదేశానికి చెందిన వారితో సహా 423 మంది పేర్లతో ఒక అతిధుల జాబితాను రూపొందించి వారిని ఆహ్వానించాలని ఆదేశించింది. వారిలో జస్పాల్‌ సింగ్‌ అత్వాల్‌ అనే నేరగాడు ఒకడు.1986లో పంజాబ్‌ మంత్రిగా ఉన్న అకాలీ నేత మల్కాయిత్‌ సింగ్‌ సిద్దు మీద కెనడాలో హత్యాయత్నం జరిగింది. శిక్షపడిన వారిలో అత్వాల్‌ ఒకడు.ట్రుడేవ్‌ సతీమణి సోఫీతో ముంబైలో ఫొటోకూడా దిగాడు. దాంతో వివాదం చెలరేగి తదుపరి ఢల్లీి కార్యక్రమానికి ఆహ్వానాన్ని రద్దు చేశారు.2023 జూన్‌ 18 కెనడా నగరం వాంకోవర్‌ శివారు సురే గురుద్వారా దగ్గర హరదీప్‌ సింగ్‌ నిజ్జర్‌ అనే కెనడా పౌరుడిని గుర్తు తెలియని దుండగులు కాల్చిచంపారు. మన గూఢచారులే ఆ పని చేసినట్లు అప్పటి నుంచి కెనడా ఆరోపిస్తోంది.తరువాత మనదేశంలో వాణిజ్య చర్చలను వాయిదా వేసుకున్నట్లు ప్రకటించింది. గతేడాది సెప్టెంబరు నుంచి మనపౌరులకు వీసాల నిలిపివేత, దౌత్యవేత్తల బహిష్కరణ వంటి పనులు చేస్తున్నది.మనదేశం కూడా ప్రతి చర్యలు తీసుకుంది.తాజాగా అది మరింత ముదిరింది.

తాజా పరిణామాలపై మీడియాలో అనేక భాష్యాలు వెలువడుతున్నాయి. వాటిలో ఒకటేమంటే అమిత్‌ షా,అజిత్‌ దోవల్‌ను కెనడా లక్ష్యం చేసుకున్నదట.దీని అర్ధం నరేంద్రమోడీని, అన్నింటికంటే మించి దేశాన్ని సహిస్తున్నట్లా ? అమెరికా, కెనడా వాటిని అనుసరించే ధనికదేశాలన్నీ మొత్తంగా మన దేశాన్నే లక్ష్యంగా చేసుకున్నాయి.దానిలో భాగంగా పెద్ద గేమ్‌ ఆడుతున్నాయి. కెనడా కేంద్రంగా పనిచేస్తున్న భారత వ్యతిరేక ఖలిస్తానీ శక్తుల కార్యకలాపాలు తీవ్ర ఆందోళనకరమేగాక దేశ భద్రత మీద ప్రత్యక్ష ప్రభావం చూపుతాయని సిపిఐ(ఎం) వ్యాఖ్యానించింది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి అన్ని రాజకీయ పార్టీల మద్దతు ఉంటుందని ప్రకటించింది.ప్రతిపక్షాలను విశ్వాసంలోకి తీసుకొని లారెన్స్‌ విష్ణోయ్‌ ముఠా పాత్రతో సహా అన్ని అంశాల మీద ప్రభుత్వం వ్యవహరించాలని కోరింది. మనదేశం పశ్చిమదేశాలతో ప్రస్తుతం ముద్దులాటదెబ్బలాటలాడుతున్నదని చెప్పవచ్చు. ఉక్రెయిన్‌ వివాదంలో పశ్చిమదేశాలకు లొంగటం లేదు, చైనా విషయంలో కొన్ని సార్లు అనుకూలంగా మరికొన్ని సార్లు వాటి వాంఛలకు భిన్నంగా వెళుతున్నది. మొత్తంగా చూసినపుడు తమకు తాన తందాన అనటం లేదనే ఉక్రోషం పశ్చిమదేశాల్లో నానాటికీ పెరిగిపోతోంది. ప్రధాని నరేంద్రమోడీ ఇప్పటికైనా కళ్లు తెరిచి గతంలో మాదిరి అలీన విధానాన్ని అనుసరించి దేశస్వతంత్ర వైఖరిని ప్రదర్శించాలి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

గాజాలో మారణకాండకు ఏడాది : ఆయుధాలతో ఇజ్రాయెల్‌,తప్పుడు వార్తలతో మీడియా దాడి !

09 Wednesday Oct 2024

Posted by raomk in Asia, COUNTRIES, Current Affairs, Europe, Germany, History, imperialism, INTERNATIONAL NEWS, Opinion, UK, USA, WAR

≈ Leave a comment

Tags

fake news, Hamas Israel, Israel genocide, Joe Biden, media bias, media credibility, Netanyahu, Palestinians, Propaganda War, Western media propaganda


ఎం కోటేశ్వరరావు


తమ్ముడు తనవాడైనా ధర్మాన్ని ధర్మంగా చెప్పాలన్న లోకోక్తి తెలిసిందే. వర్తమాన ప్రపంచంలో అలా జరుగుతోందా ? నూటికి నూరుశాతం లేదు. పక్షపాత తీర్పులు, వైఖరులే వెల్లడౌతున్నాయి. గాజాపై ఇజ్రాయెల్‌ మారణకాండ ప్రారంభమై అక్టోబరు ఏడవ తేదీతో ఏడాది గడిచింది. ప్రపంచ ప్రధాన స్రవంతి మీడియా ఇజ్రాయెల్‌ మీద హమస్‌ ఉగ్రవాదులు జరిపిన దాడికి సంవత్సరం నిండిరది అంటోంది. హమస్‌దాడిని ఎవరూ సమర్ధించటం లేదు. ఐక్యరాజ్య సమితి 1948లో ఇజ్రాయెల్‌ను ఏర్పాటు చేసిన తరువాత అప్పటి వరకు ఉన్న పాలస్తీనా ఉనికిలో లేకుండా పోయింది. ఏదో ఒకసాకుతో దానికి కేటాయించిన ప్రాంతాలన్నింటినీ ఆక్రమించుకోవటంతో పాటు వేలాది మందిని చంపి, లక్షల మందికి నిలువనీడ లేకుండా చేస్తూ పాలస్తీనా దేశం ఏర్పడకుండా ఇజ్రాయెల్‌కు మద్దతుగా అమెరికాతో సహా పశ్చిమదేశాలన్నీ మద్దతు ఇస్తున్నాయి. దానికి వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేస్తున్న బృందాలలో హమస్‌ ఒకటి. దాని దాడులు గత ఏడాదే ప్రారంభం కాలేదు. కానీ అది చేసిన దాడి సాకుతో గాజాలో ఏడాది కాలంగా మారణకాండ సాగిస్తున్నారు. ఇప్పటి వరకు 42వేల మందిని చంపారు.పదివేల మంది జాడ తెలియటం లేదు, లక్ష మంది వరకు గాయపడ్డారు.లక్షలాది ఇండ్లను నేలమట్టం గావించారు. గాజాలోని 23లక్షల మందిని ఇండ్ల నుంచి వీధుల్లోకి నెట్టారు. మారణకాండ ఇంకా కొనసాగుతోంది. వెస్ట్‌బాంక్‌ ప్రాంతానికి విస్తరించారు. ఇదంతా ఎందుకు అంటే హమస్‌ జరిపిన దాడిలో 815 మంది సాధారణ పౌరులతో సహా 1,195 మంది ఇజ్రాయెలీలు మరణించారు, ఆ సందర్భంగా కొందరు విదేశీయులతో సహా 251 మందిని బందీలుగా పట్టుకున్నారు, వారిలో కొందరిని విడుదల చేశారు, మరికొందరు మరణించగా మరో 95 మంది హమస్‌ వద్ద బందీలుగా ఉన్నారు. దీనికి ప్రతీకారం అని చెబుతున్నారు. ఏ రీత్యా చూసినా ఇజ్రాయెల్‌ చర్య గర్హనీయం, అంతర్జాతీయ న్యాయస్థానంలో యుద్ధ నేరాల కింద దీనికి బాధ్యులైన వారిని శిక్షించాలి.


ఈ దారుణకాండ గురించి ప్రపంచ మీడియా వార్తలు ఇస్తున్న తీరు కూడా సభ్యసమాజం ఆమోదించేదిగా లేదు. అంతర్జాతీయ వార్తా సంస్థలన్నీ పశ్చిమ దేశాలకే చెందినవి కావటంతో అవి అందచేసిన తప్పుడు సమాచారాన్నే వాస్తవాలుగా చెబుతున్నారు. అయితే తప్పుడు, వక్రీకరణ, కుహనా వార్తలను ఇవ్వటం కొత్తగా జరుగుతున్నది కాదు. ప్రపంచం మీద ప్రచారదాడి జరుగుతున్నది. గాజాలో తలెత్తిన మానవ సంక్షోభ తీవ్రత అక్కడి నుంచి వార్తలు పంపుతున్న పశ్చిమదేశాల విలేకర్లలో ఎక్కడా కానరాదు. ప్రపంచానికి వారు అందచేస్తున్నవి తప్ప ప్రత్యామ్నాయ సంస్థలు లేవు. గాజాలో మరణించిన, గాయపడిన వారిలో నూటికి 80శాతం మంది నిరాయధులైన మహిళలు, పిల్లలే ఎందుకు ఉన్నారో ఏ మీడియా అయినా చెబుతోందా? హమస్‌ ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తోందో చూడండి అంటూ అందచేస్తున్న వీడియోలలో ఒక శాతమైనా ఇజ్రాయెల్‌ దుర్మార్గాలకు సంబంధించి లేవంటే అతిశయోక్తి కాదు. వైమానికదాడులు, టాంకుల ఫిరంగి గుళ్లకు 128 మంది జర్నలిస్టులు మరణించగా వారిలో 123 మంది పాలస్తీనియన్లు, ఇద్దరు ఇజ్రాయెలీలు, ముగ్గురు లెబనీస్‌ ఉన్నారు. మరో 35 మంది గాయపడ్డారు. ఏకపక్షంగా జరుగుతున్న మారణకాండకు ఇది ఒక నిదర్శనం.ఎక్కడో ఏసి గదుల్లో కూర్చొని కంప్యూటర్‌ గ్రాఫిక్‌లు సృష్టిస్తున్నదెవరో, యుద్ధరంగంలో ప్రాణాలకు తెగించి వాస్తవాలను నివేదించేందుకు పని చేస్తున్నదెవరో అర్ధం అవుతోంది. మేము సైతం అన్నట్లుగా సాధారణ పౌరులతో పాటు పాలస్తీనా జర్నలిస్టులు పని చేస్తున్నారు, ప్రాణాలర్పిస్తున్నారు.


ఇజ్రాయెల్‌ మిలిటరీ, ప్రభుత్వ పెద్దలు అందిస్తున్న సమాచారాన్ని స్వయంగా చూసినట్లు పశ్చిమదేశాల విలేకర్లు, సంస్థలు చిత్రిస్తున్నాయి. ఐరోపాలో అతి పెద్ద మీడియా సంస్థ జర్మన్‌ యాక్సెల్‌ స్ప్రింగర్‌ అప్‌డే అనే ఒక యాప్‌ను రూపొందించింది. ఇజ్రాయెల్‌ ప్రతినిధులు చెప్పే కథనాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, పాలస్తీనీయుల మరణాలను తగ్గించి చూపాలని తన సిబ్బందికి ఆదేశాలిచ్చినట్లు దాని అంతర్గత పత్రాల ద్వారా వెల్లడైందని ఇంటర్‌సెప్ట్‌ అనే పత్రిక పేర్కొన్నది. అంతేకాదు మరీ తప్పనిసరైతే తప్ప పాలస్తీనియన్ల గురించి ప్రస్తావించవద్దని అమెరికా న్యూయార్క్‌టైమ్స్‌ పత్రిక కూడా తన సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది. యజమానులే అలాంటి వైఖరి తీసుకున్నతరువాత నిజం రాసినా, చూపినా అవి పాఠకులు, వీక్షకుల వద్దకు చేరుకోవు అన్నది మీడియాలో పని చేసేవారందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. అందుకే హమస్‌ను ఒక రాక్షసిగా, దాన్ని మట్టుపెట్టేందుకు పూనుకున్న అపరశక్తిగా, బాధిత దేశంగా ఇజ్రాయెల్‌ను చిత్రించారు. సెంటర్‌ ఫర్‌ మీడియా మోనిటరింగ్‌ ( మీడియా పరిశీలక కేంద్రం) అనే సంస్థ అంతర్జాతీయ మీడియా ఛానల్స్‌ ప్రసారం చేసిన లక్షా 80వేల వీడియోలు,బ్రిటీష్‌ మీడియా సంస్థలు రాసిన 26వేల వ్యాసాలను వడగట్టి తేల్చింది కూడా ఇదే. అక్టోబరు ఏడు నుంచి జరుగుతున్నదాడులకు ముందు కూడా మీడియా తీరు ఇలాగే ఉంది, పాలస్తీనా కోసం పోరాడుతున్నవారిని ఉగ్రవాదులుగా చిత్రించించటం తెలిసిందే. ఇటలీ మీడియా 2019`21 సంవత్సరాల తీరుతెన్నులను ఐరోపా సమాఖ్య నిధులతో ఒక పరిశోధన చేశారు. మూడు పత్రికలను పరిశీలించగా అంతర్జాతీయ వార్తలలో 32శాతం ఇజ్రాయెల్‌ ప్రధాని, నరహంతకుడు నెతన్యాహు చుట్టూ తిరిగాయని తేలింది. గతేడాది కాలంగా సాగిస్తున్న మారణకాండ ఇటాలియన్‌ మీడియాకు పట్టలేదు. ‘‘ గాజా నుంచి రాకెట్ల ప్రయోగం, గాజా నుంచి 430 రాకెట్లతో దాడి, ఇజ్రాయెల్‌కు ఆత్మరక్షణ హక్కు ఉంది ’’ ఇలాంటి శీర్షికలతో జనాన్ని తప్పుదారి పట్టించారు. దాని దుర్మార్గాలను సమర్ధించారు.


హమస్‌ దాడిచేసి 40 మంది పసిపిల్లల గొంతు కోసిందంటూ ఇజ్రాయెల్‌ అల్లిన అవాస్తవ కథనాన్ని యావత్‌ ప్రపంచ మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. చివరకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కూడా ఖండిస్తూ మాట్లాడాడు. ఇలాంటి ప్రకటనలు చేసే ముందు నిర్ధారణ చేసుకుంటే మంచిది లేకుంటే పరువు పోతుంది ముసలోడా అంటూ అతగాడి సిబ్బంది తరువాత జాగ్రత్త చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పటికీ ఈ కట్టుకథ సామాజిక మాధ్యమాల్లో తిరుగుతూనే ఉంది, ముస్లిం వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు దాన్ని ఉదహరిస్తూనే ఉన్నారు. ముస్లింలు జీహాద్‌ ప్రకటించారు, ప్రపంచ మొత్తాన్ని కబళించేందుకు పూనుకున్నారు, తమ జనాభా సంఖ్యను పెంచుతున్నారు అంటూ సాగిస్తున్న అనేక కుట్ర కథనాలతో దశాబ్దాల తరబడి జరుపుతున్న గోబెల్స్‌ ప్రచారాన్ని బుర్రలకు ఎక్కించుకున్నవారిని ఇలాంటివి వెంటనే ఆకర్షిస్తాయి. అదేగనుక వాస్తవమైతే ఇజ్రాయెల్‌ చుట్టూ ఉన్నది ముస్లిం దేశాలే, అవన్నీ ఒక్కసారిగా దండెత్తి ఉంటే ఈ పాటికి అది అదృశ్యమై ఉండేది, పాలస్తీనియన్లు ఏడున్నర దశాబ్దాలుగా అష్టకష్టాలు పడి ఉండేవారు కాదు. కానీ అలా జరగలేదే ! అలాంటిది ముస్లింలు ప్రపంచం మొత్తాన్ని ఆక్రమిస్తారంటే నమ్మేవారికి బుర్రల్లో పదార్ధం లేదన్నది స్పష్టం.ఇరాక్‌లో సద్దాం హుస్సేన్‌ మారణాయుధాలను గుట్టలుగా పోసి ప్రపంచానికి ప్రమాదం తెచ్చిపెట్టాడన్న నాటి జార్జి డబ్లు బుష్‌, మీడియా ప్రచారాన్ని అమెరికాతో పాటు అనేక దేశాల్లో జనం నమ్మారు. తరువాత అది వాస్తవం కాదని అదే అమెరికా అంగీకరించాల్సి వచ్చింది. పాలకులతో పాటు మీడియా కూడా విశ్వసనీయతను కోల్పోయింది.


అన్నెం పున్నెం ఎరుగని పసిపిల్లలను నిజంగా ఒక్కరిని చంపినా ఖండిరచాల్సిందే. ఆగస్టు 15నాటికి గాజాలో 42వేల మందిని ఇజ్రాయెల్‌ చంపితే వారిలో 17వేల మందికి పైగా పిల్లలు, పదకొండువేల మంది మహిళలు ఉన్నారు. ఏ పశ్చిమదేశాల మీడియా సంస్థలైనా దీన్ని గురించి ఎన్ని వార్తలను ఇచ్చాయి. ఇంతటి దుర్మార్గానికి పాల్పడిన తరువాత కూడా ఇంకా హమస్‌ గురించే అవి చెబుతున్నాయి.నలభై రెండువేల మందిని చంపి దాదాపు ఒక లక్ష మందిని గాయపరచి, పదివేల మందిని అదృశ్యం కావించిన యూదు దురహంకారులు పాలస్తీనియన్లను తిప్పికొట్టేందుకు చేసిన పనిగా అందమైన మాటలతో పచ్చి దుర్మార్గాన్ని పశ్చిమదేశాలు వర్ణిస్తున్నాయి. బిబిసి తీరును పరిశీలిస్తే గతేడాది అక్టోబరు 10 నుంచి డిసెంబరు రెండవ తేదీ వరకు 23సార్లు హమస్‌ సాయుధులు ఇజ్రాయెలీలపై మారణకాండ జరిపారని వర్ణిస్తే ఒక్కసారే పాలస్తీనియన్ల మీద మారణకాండ పద ప్రయోగం జరిగిందని తేలింది. అంటే దొంగే దొంగని అరచినట్లుగా బిబిసి తీరు ఉంది. ఈ తీరుకు నిరసనగా 2023 అక్టోబరులోనే ఇద్దరు ఆ సంస్థ జర్నలిస్టులు రాజీనామా చేశారు. గాజాపై దాడిని ఖండిస్తూ వెయ్యి మంది అమెరికా జర్నలిస్టులతో పాటు సంతకం చేసిన న్యూయార్క్‌ టైమ్స్‌ మాగజైన్‌ ఎడిటర్‌ జాజ్‌ హగ్స్‌ మీద యాజమాన్యం వత్తిడి తేవటంతో రాజీనామా చేసి తప్పుకోవాల్సి వచ్చింది. ఆ జాబితానుంచి పేరు తొలగించాలని అసోసియేటెడ్‌ ప్రెస్‌ విలేకరిని యాజమాన్యం ఆదేశించింది. ఇలా లాస్‌ ఏంజల్స్‌ టైమ్స్‌ వంటి అనేక పత్రికలు, మాగజైన్లు కూడా ఇజ్రాయెల్‌కు అనుకూలంగా వత్తిడి చేసి అనేక మంది జర్నలిస్టులను తొలగించటం, నోరు మూయించటం వంటి దుర్మార్గాలకు పాల్పడ్డాయి. పాలస్తీనియన్ల మీద తప్పుడు వార్తలు ఒక ఎత్తయితే వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ అనే ప్రముఖ అమెరికా పత్రిక రాసిన ఒక ఆధారం లేని వార్త కారణంగా గాజాలో నిరాశ్రయులకు అందాల్సిన 45 కోట్ల డాలర్ల సాయం నిలిచిపోయింది. గాజాలో ఐరాస నిర్వహిస్తున్న శిబిరంలో పనిచేస్తున్న పన్నెండు మంది సిబ్బందికి హమస్‌తో సంబంధాలు ఉన్నాయని, వారంతా దాడుల్లో పాల్గ్గొన్నారని ఆ పత్రిక కేవలం ఇజ్రాయెల్‌ కట్టుకథనే తనదిగా రాసింది.నిజానికి దానికి ఎలాంటి ఆధారాలు లేవు.అమెరికా సిఎన్‌ఎన్‌, బ్రిటన్‌ బిబిసిలో పని చేస్తూ గాజా పరిణామాలపై వార్తలు ఇచ్చిన పది మంది విలేకర్లు ఇజ్రాయెల్‌ అనుకూల వైఖరితో పనిచేసినట్లు వెల్లడిరచారు.న్యూస్‌ రూముల్లో ఉన్న సీనియర్లు జోక్యం చేసుకొని ఇజ్రాయెల్‌ చేసిన దుర్మార్గాలను తక్కువ చేసి చూపాలని వత్తిడి చేసినట్లు వెల్లడిరచారు.ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చిన చిత్రం ద్వారా బిబిసి భాషలో పాలస్తీనీయన్ల మీద వ్యతిరేకతను ఎలా రెచ్చగొట్టారో జరిపిన ఒక పరిశీలన వచ్చింది. అదే మంటే మారణకాండకు గురైనట్లు 23సార్లు ఇజ్రాయెల్‌ గురించి చెప్పగా ఒక్కసారి మాత్రమే పాలస్తీనా పేరును ప్రస్తావించారు. ఊచకోతకు గురైనట్లు ఇరవైసార్లు ఇజ్రాయెల్‌ గురించి చెప్పగా ఒక్కసారి కూడా పాలస్తీనా పేరు రాలేదు.


తమ పత్రికలు ఎన్ని తప్పుడు కథనాలు, అవాస్తవాలు రాసినా అమెరికా యువత ముఖ్యంగా విద్యార్థులు పాలస్తీనా అనుకూల వైఖరి తీసుకోవటం గమనించాల్సిన అంశం. వారు మీడియా కతలను నమ్మటం లేదన్నది వాస్తవం. ఇజ్రాయెల్‌ మారణకాండకు పాల్పడుతున్నదని నమ్మిన కారణంగానే ఈ పరిణామం. ఇది అక్కడి పాలకవర్గాలకు ఆందోళన కలిగించే అంశం. ప్రచారదాడి ఎదురు తిరిగితే వారి పునాదులను కదలించే కదన శక్తిగా యువత మారుతుంది.ప్రపంచ ప్రఖ్యాతిగాంచి పర్యావరణ ఉద్యమ కార్యకర్త 21 సంవత్సరాల స్వీడిష్‌ యువతి గ్రేటా థన్‌బెర్గ్‌ పాలస్తీనా అనుకూల ప్రదర్శనలో పాల్గొన్నందుకు కోపెన్‌హాగన్‌ నగరంలో అరెస్టు చేశారు. మీడియా కూడా ఆమె మీద పెద్ద ఎత్తున విమర్శలకు దిగింది.యువతలో వచ్చిన ఈ మార్పును కూడా మూసిపెట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఒకసారి నీవు బాధితుడవైనందుకు గాను ఇతరుల మీద నిరంతరం దాడి కొనసాగిస్తానంటే కుదరదు, దేనికైనా ఒక హద్దు ఉంటుంది. దాన్ని మీరి గాజాలో పాలస్తీనియన్ల మీద ఇజ్రాయెల్‌ దుర్మార్గాలకు పాల్పడుతున్నది. పశ్చిమ దేశాల మీడియా దానికి మద్దతు ఇస్తున్నది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

హసీనా పతనం వెనుక అమెరికా ….. తాత్కాలిక సారధిగా నోబెల్‌ గ్రహీత యూనిస్‌ !

07 Wednesday Aug 2024

Posted by raomk in Asia, CHINA, Current Affairs, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RUSSIA, UK, Uncategorized, USA

≈ Leave a comment

Tags

Bangladesh Elections 2024, China, cia, Coup In Bangladesh, Joe Biden, Sheikh Hasina


ఎం కోటేశ్వరరావు


ఆకస్మిక, అనూహ్య, నాటకీయ పరిణామాల మధ్య సోమవారం నాడు బంగ్లాదేశ్‌లో రాజకీయ అనిశ్చితికి తెరలేచింది. రాజీనామా కోరుతూ పెద్ద సంఖ్యలో జనం ప్రధాని షేక్‌ హసీనా నివాసం మీదకు దండెత్తటం,తరువాత పార్లమెంటుపై దాడి, దేశం విడిచిపోవాల్సిందిగా మిలిటరీ ఆదేశించటం, పదవికి రాజీనామా చేసి ఆమె మిలిటరీ హెలికాప్టర్‌లోనే సోదరితో కలసి ఢిల్లీ రావటం, మిలిటరీ చీఫ్‌ జనరల్‌ వాకర్‌ ఉజ్‌ జమాన్‌ తానే అధికారాన్ని చేపడుతున్నట్లు ప్రకటించటం అంతా కొద్ది గంటల్లోనే జరిగిపోయాయి. డెబ్బయ్యారు సంవత్సరాల షేక్‌ హసీనా వరుసగా జనవరిలోనే నాలుగవ సారి అధికారానికి వచ్చారు. ఏడాది కూడా గడవక ముందే దేశం విడిచి వెళ్లాల్సి వచ్చింది. పార్లమెంటును రద్దు చేసిన దేశాధ్యక్షుడు మహమ్మద్‌ షహబుద్దీన్‌ త్వరలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించాడు.ప్రతిపక్ష నాయకురాలు బేగం ఖలీదా జియాను జైలు నుంచి విడుదల చేశారు. అవినీతి కేసులో 17 సంవత్సరాల జైలు శిక్షను అనుభవిస్తున్న 78 ఏండ్ల మాజీ ప్రధాని ఖలీదా అనారోగ్యంతో ప్రస్తుతం జైలు ఆసుపత్రిలో ఉన్నారు. హసీనా రాజీనామా తరువాత కూడా నిరసనలు కొనసాగాయి. ఇది రాసిన సమయానికి హసీనాకు ఏ దేశం రాజకీయ ఆశ్రయం ఇచ్చేది స్పష్టం కాలేదు.గతంలో జారీ చేసిన వీసాను అమెరికా రద్దు చేసింది. నిబంధనల సాకుతో బ్రిటన్‌ కూడా నిరాకరించినట్లు వార్తలు. తాత్కాలిక ప్రభుత్వ సారధిగా గ్రామీణ బాంకుతో దారిద్య్ర నిర్మూలనకు స్వల్ప మొత్తంలో రుణాలు ఇచ్చే మైక్రోక్రెడిట్‌ పథకంతో ముందుకు వచ్చి ప్రాముఖ్యత పొందిన మహమ్మద్‌ యూనిస్‌ను తాత్కాలిక ప్రభుత్వ సారధిగా నియమించారు.ప్రస్తుతం 83 ఏండ్ల వయస్సులో అదే యూనిస్‌, మరో 13మందిని రెండు నెలల క్రితం అవినీతి కేసులో దోషులుగా తేల్చి ఆరునెలల జైలు శిక్ష వేశారు,బెయిలు మీద ఉన్నాడు.తన టెలికాం కంపెనీ సిబ్బంది సంక్షేమ నిధులలో రెండు కోట్ల డాలర్లమేరకు విదేశాలకు తరలింపు, దుర్వినియోగం చేసినట్లు ఆరోపణ. అయితే తన మీద తప్పుడు కేసులు పెట్టినట్లు అంటున్నాడు.అతని మీద ఇంకా వందకేసులు ఉన్నాయి.తాజా పరిణామాల వెనుక ఏం జరిగిందనేది వెల్లడి కావాల్సి ఉంది.అమెరికా హస్తం ఉన్నట్లు చెబుతున్నారు.


అమెరికా సిఐఏ కుట్ర గురించి మీడియాలో వెలువడిన సమాచారం ప్రకారం పరిణామ క్రమం ఇలా ఉంది. బంగ్లాదేశ్‌లో తమ వైమానిక స్థావరాన్ని ఏర్పాటు చేసుకొనేందుకు అనుమతిస్తే తన ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా ఉండదని ఒక తెల్లవాడు తెచ్చిన ప్రతిపాదనను తిరస్కరించినట్లు హసీనా చెప్పిన అంశం మే 23న మీడియాలో వచ్చింది. తూర్పు తైమూరు మాదిరి చిట్టగాంగ్‌, మయన్మార్‌లో కొన్ని ప్రాంతాలతో కలిపి క్రైస్తవ దేశం ఏర్పాటుకు కుట్రలు జరుగుతున్నట్లు కూడా ఆమె చెప్పారు. తన తండ్రి మాదిరి తనను కూడా హతమార్చేందుకు కుట్ర జరుగుతున్నట్లు చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్లను రద్దు చేస్తూ 2018లో హసీనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేస్తూ జూన్‌ ఐదున హైకోర్టు తీర్పు చెప్పింది.రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జూలై ఒకటిన విద్యార్థులు ఆందోళనకు దిగారు.జూలై 16 ఆందోళన హింసాత్మక రూపం తీసుకుంది.హసీనా ప్రభుత్వం ప్రకటించిన 30శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తూ ఐదుశాతానికి కుదించి సుప్రీం కోర్టు 21వ తేదీన తీర్పు చెప్పింది.దాంతో పరిస్థితి సాధారణ స్థితికి వచ్చింది.అయితే ఆగస్టు నాలుగున మాజీ మిలిటరీ ప్రధాన అధికారి ఇక్బాల్‌ కరీమ్‌ భుయాన్‌ అంతకు ముందు నిరసనకారుల మీద జరిపిన అణచివేతను ఖండించాడు.మిలిటరీని వెనక్కు పిలిపించాలని కోరాడు.నూతన మిలిటరీ అధికారి వాకర్‌ ఉజ్‌ జమాన్‌ నిరసనకారులకు మద్దతు ప్రకటిస్తూ మిలిటరీ తటస్థంగా ఉండాలని చెప్పాడు.హసీనా రాజీనామా కోరుతూ ఐదవ తేదీన నిరసకారులు ఢాకా ప్రదర్శనకు పిలుపునిచ్చారు. అదే రోజు హసీనా రాజీనామా చేయాలని జమాన్‌ 45 నిమిషాల గడువు ఇచ్చాడు.దేశం వదలి వెళ్లేందుకు హెలికాప్టర్‌ను కూడా ఏర్పాటు చేశాడు. తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించాడు. దాన్ని అమెరికా స్వాగతించింది.
అనేక దేశాలలో సిఐఏ చేసిన కుట్రలో భాగంగా పరిణామాలన్నీ దాదాపు ఒకే విధంగా ఉన్నాయి. ఏదో ఒక కరాణంతో నిరసన ప్రారంభం, అది కూడా విద్యార్థులతో చేయించటం. దానికి ముందు సిఐఏతో చేతులు కలిపిన మీడియా నిరసనకు అవసరమైన నేపధ్యాన్ని తప్పుడు ప్రచారం ద్వారా ఏర్పాటు చేయటం. తరువాత భద్రతా దళాలపై దాడి చేసి రెచ్చగొట్టి వాటిని రంగంలో దిగేట్లు చేయటం, బలప్రయోగం చేశారంటూ న్యాయవ్యవస్థ ద్వారా చెప్పించటం,ప్రజలకు సేవ పేరుతో తరువాత మిలిటరీ నిరసనలకు మద్దతు ప్రకటించటం, ప్రధాని లేదా అధ్యక్ష భవనాలు, పార్లమెంట్ల ముట్టడికి నిరసనకారులను అనుమతించటం. ఇదే పద్దతి శ్రీలంకలో అనుసరించారు. బంగ్లాదేశ్‌లో అదే జరిగింది. నిజానికి మన స్వాతంత్య్రానికి ముందే ఈశాన్య ప్రాంతంలో కుట్రద్వారా కొన్ని దేశాల ఏర్పాటుకు బ్రిటన్‌, సిఐఏ కుట్రలు చేసింది. ఇటీవలి సంవత్సరాలలో మన ఇరుగు పొరుగుదేశాలలో తన అనుకూల ప్రభుత్వాల ఏర్పాటుకు అమెరికా అనేక కుట్రలు చేసింది.


రద్దయిన పార్లమెంటులో 350కి గాను అవామీ లీగ్‌కు 306 స్థానాలున్నాయి. ప్రధాన ప్రతిపక్షమైన బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ(బిఎన్‌పి), పరిమితమైన బలం కలిగిన కమ్యూనిస్టు, ఇతర వామపక్షాలతో కూడిన కూటమి, ఇతర చిన్న పార్టీలు ఈ ఎన్నికలను బహిష్కరించాయి. ఎన్నికలను తటస్థ ప్రభుత్వ ఆధ్వర్యంలో జరపాలని, ప్రతిపక్షాల అణచివేతకు నిరసనగా తాము పోటీ చేయటం లేదని అవి ప్రకటించాయి.2018లో జరిగిన ఎన్నికల్లో 80.2, అంతకు ముందు 61.29శాతం ఓట్లు పోలుకాగా ఈ ఏడాది 41.8శాతమే నమోదైంది.జనం అసంతృప్తి వెల్లడైంది. పాకిస్థాన్‌ నుంచి స్వాతంత్య్రం కోసం సాగించిన పోరు ఫలించి 1971లో స్వతంత్ర బంగ్లాదేశ్‌ ఏర్పడింది. ఆ విముక్తి పోరాటానికి నాయకత్వం వహించి బంగ బంధుగా పేరు తెచ్చుకున్న తొలి ప్రధాని షేక్‌ ముజిబుర్‌ రహమాన్‌ కుమార్తె షేక్‌ హసీనా. 1975లో జరిగిన మిలిటరీ తిరుగుబాటులో ముజిబుర్‌ రహమాన్‌తో పాటు కుటుంబ సభ్యులందరినీ చంపివేశారు. ఆ సమయంలో విదేశాల్లో ఉన్న హసీనా, ఆమె సోదరి రెహనా, హసీనా భర్త ఎంఎ వాజెద్‌ మియా ఢిల్లీలో అణుశాస్త్రవేత్తగా పని చేస్తుండటతో అతను, వారి పిల్లలు కూడా హత్యా కాండ నుంచి తప్పించుకున్నారు. తొలుత వారు జర్మనీలో, తరువాత మనదేశంలో ఆశ్రయం పొందారు. ఆమె ప్రవాసంలో ఉండగానే 1981లో అవామీ లీగ్‌ నేతగా ఎన్నికయ్యారు. ప్రతిపక్ష నేతగా ఆ తరువాత 1996 నుంచి 2001వరకు తొలిసారి ప్రధానిగా పని చేశారు.రెండవ సారి 2009లో బాధ్యతలు చేపట్టి సోమవారం నాడు రాజీనామా చేసేవరకు అదే పదవిలో కొనసాగారు. మొత్తం మీద ఇప్పటి వరకు ఆమె మీద పందొమ్మిది సార్లు హత్యా ప్రయత్నాలు జరిగినట్లు చెబుతారు. మత తీవ్రవాదులను అణచివేసిన నేతగా పేరుతెచ్చుకున్నారు. ముజిబుర్‌ రహమాన్‌ హత్య తరువాత మిలిటరీ నియంత జియావుర్‌ రహమాన్‌ అధ్యక్షుడిగా అధికారానికి వచ్చాడు. 1978లో బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీని ఏర్పాటు చేశాడు.1981లో మిలిటరీ తిరుగుబాటులో హతమయ్యాడు. తరువాత ఆ పార్టీకి భార్య ఖలీదా జియా నేతృత్వం వహించటమే కాదు, రెండుసార్లు ప్రధానిగా పని చేశారు.తాజా ఎన్నికలను బహిష్కరించారు. జియావుర్‌ రహమాన్‌ అధికారంలో ఉండగా ముస్లిం ఛాందసవాదులను ప్రోత్సహించి ఇస్లామిక్‌ దేశంగా మార్చేందుకు చూశాడు. బిఎన్‌పి మితవాద పార్టీ, దానికి జమాయతే ఇస్లామీ పార్టీ మద్దతు ఇస్తున్నది. మరో మిలిటరీ నియంత ఎర్షాద్‌ అధికారాన్ని చేజిక్కించుకోవటంతో అతగాడిని గద్దె దించేందుకు షేక్‌ హసీనా-ఖలీదా జియా ఇద్దరు చేతులు కలిపి ఆందోళనలు నిర్వహించారు. ఎర్షాద్‌ పదవి నుంచి దిగిన తరువాత ఇద్దరూ ప్రత్యర్దులుగా మారారు.


షేక్‌ హసీనా పదవీ కాలంలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు.కరోనా ముందు వరకు మెరుగ్గా కనిపించిన ఆర్థిక స్థితి తరువాత ఇప్పటి వరకు కోలుకోలేదు.దాంతో 470 కోట్ల డాలర్ల రుణం కోసం ఐఎంఎఫ్‌ను ఆశ్రయించాల్సి వచ్చింది. ధరలు ప్రత్యేకించి ఆహారద్రవ్యోల్బణం చాలా ఎక్కువగా ఉంది.కరెన్సీ విలువను తగ్గించటంతో జనజీవితాలు అతలాకుతలమయ్యాయి. బంగ్లాదేశ్‌లో ఉన్న ఏకైక అణువిద్యుత్‌ కేంద్రాన్ని నిర్మించిన రష్యా రానున్న రోజుల్లో మరింతగా సహకరిస్తామని ప్రకటించింది. చైనా ఇస్తున్న అప్పులతో అది మరొక శ్రీలంకగా మారుతుందని ప్రచారం చేశారు. ఇటీవలి కాలంలో రెండు దేశాలు మరింతగా సన్నిహితం కావటమే దీనికి ప్రధాన కారణం. గంగోత్రి నుంచి ప్రారంభమైన గంగానదిని బంగ్లాదేశ్‌లో పద్మ అంటారు. దాని మీద కట్టిన పెద్ద వంతెన నిర్మాణంలో అధికారులు అక్రమాలకు పాల్పడ్డారంటూ ప్రపంచబాంకు బహిరంగంగా ప్రకటించి నిధులు నిలిపివేసింది. బంగ్లా ప్రభుత్వం చైనాను సంప్రదించగా 2012లో 360 కోట్ల డాలర్లు ఇచ్చి దాన్ని పూర్తి చేయించింది. రాజధాని ఢాకాతో 21 జిల్లాలను అది అనుసంధానం గావించింది. బిఆర్‌ఐ పధకంలో చేరి విద్యుత్‌ కేంద్రాలు, రైల్వే లైన్లు,రోడ్లు, రేవులు, సొరంగాల వంటి పదిహేడు ప్రాజెక్టులకు రుణాలు పొందింది. అంతే కాదు, తనకు అవసరమైన ఆయుధాల్లో 74శాతం చైనా నుంచి పొందుతున్నది. పశ్చిమ దేశాలతో ప్రత్యేకించి అమెరికా పోల్చుకుంటే ఎంతో లాభసాటిగా ఉండటమే చైనా పెట్టుబడుల వైపు మొగ్గుకు కారణం.


తన దారికి రాని దేశాల మీద మానవహక్కుల ఉల్లంఘన పేరుతో అమెరికా దాడి చేస్తున్న సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్‌ మీద కూడా అదే అస్త్రాన్ని ప్రయోగించింది. ఈ కారణంగా కూడా హసీనా సర్కార్‌ చైనాకు మరింత చేరువైంది.2021లో అమెరికా నిర్వహించిన ప్రజాస్వామ్య సదస్సుకు బంగ్లాదేశ్‌ను ఆహ్వానించలేదు. అప్పుడు చైనా రాయబారి బంగ్లాకు మద్దతుగా నిలిచారు.తన ఇండో-పసిఫిక్‌ వ్యూహం(క్వాడ్‌)లో చైనాకు వ్యతిరేకంగా కలసి రావాలని జోబైడెన్‌ తెచ్చిన వత్తిడిని బంగ్లా తిరస్కరించింది. అలీన విధానంతో స్వతంత్ర వైఖరిని అనుసరిస్తామని ప్రకటించింది. కొల్‌కతాకు 212 నాటికల్‌ మైళ్ల దూరంలో బంగాళఖాత తీరంలోని కాక్స్‌బజార్‌ రేవు ప్రాంతంలో నిర్మించిన జలాంతర్గామి కేంద్రానికి చైనా 120 కోట్ల డాలర్ల సాయంచేసినంత మాత్రాన భారత్‌ రక్షణకు ఎలాంటి ముప్పు లేదని బంగ్లాదేశ్‌ ప్రకటించింది. చైనా తమకు ఆర్థిక భాగస్వామి తప్ప రక్షణకు కాదని స్పష్టం చేసింది. బంగ్లాదేశ్‌లో చైనా నిర్మిస్తున్న మౌలిక సదుపాయాలతో భారత్‌ కూడా లబ్దిపొందుతుందని ఈశాన్య భారతానికి వేగంగా భూ, జలమార్గాల ద్వారా సరకు రవాణా చేయవచ్చని కొందరు నిపుణులు చెప్పారు. చైనా పెట్టుబడులతో బంగ్లాదేశ్‌కు ఎలాటి ముప్పు లేదని వాటి మీద పెట్టుబడి కంటే లాభాలు ఎక్కువ అని జహంగీర్‌ నగర్‌ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌ సాహెబా నామ్‌ ఖాన్‌ చెప్పాడు. బంగ్లాదేశ్‌ మీద అమెరికా తెస్తున్న వత్తిడి, సృష్టించిన పరిస్థితిని చైనా తనకు అనుకూలంగా మార్చుకుంటున్నదని మన నరేంద్రమోడీ సర్కార్‌ అమెరికాకు నివేదించినట్లు 2023 ఆగస్టు 28వ తేదీ హిందూస్తాన్‌ టైమ్స్‌ పత్రిక రియాజుల్‌ హెచ్‌ లస్కర్‌ పేరుతో రాసిన ఒక సమీక్ష పేర్కొన్నది.


బంగ్లా పరిణామాలు మరోసారి అమెరికాకు అనుకూలంగా మారితే అది చైనాను దెబ్బతీయాలని కోరుకొనే శక్తులకు సంతోషం కలిగిస్తుందని వేరే చెప్పనవసరం లేదు. అయితే అదే సమయంలో మనకూ ఇబ్బందే. ఉక్రెయిన్‌ సంక్షోభంలో తటస్థంగా ఉన్నందుకు మనమీద కసి ఉన్నా, ఇతర అంశాలలో మద్దతు ఇస్తున్న కారణంగా మింగా కక్కలేకుండా ఉంది. ప్రతిపక్ష బిఎన్‌పికి మతోన్మాద జమాతే ఇస్లామీ మద్దతు , దానికి పాకిస్థాన్‌తో సంబంధాలు ఉన్నందున షేక్‌ హసీనా గెలవటం మన దేశానికి ఊరట కలిగించే అంశంగా భావించారు. ఇప్పుడు అమెరికా అనుకూల మిలిటరీ లేదవ బిఎన్‌పి అధికారానికి వస్తే మనకు తలనొప్పి వ్యవహారమే. మన మీద వత్తిడి తెచ్చేందుకు, ఇరకాటంలో పెట్టేందుకు అమెరికా చూస్తుంది. బంగ్లా పరిణామాల గురించి వివరించేందుకు ప్రధాని నరేంద్రమోడీ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు.ప్రతిపక్షాలు ఏకాభిప్రాయం వ్యక్తం చేసినట్లు విదేశాంగ మంత్రి జై శంకర్‌ ప్రకటించారు. మిలిటరీ అధికారాన్ని స్వాధీనం చేసుకోవటాన్ని అమెరికా స్వాగతించింది. అనధికారిక చొరబాట్లను నిరోధించేందుకు మన ప్రభుత్వం సరిహద్దు భద్రతా దళాలను అప్రమత్తం చేసింది. బంగ్లాదేశ్‌లో జరిగిన అనేక పరిణామాల వెనుక గతంలో అమెరికా హస్తం ఉన్నందున ఇప్పుడు కూడా ఆ కోణాన్ని తోసిపుచ్చలేము. హసీనా ప్రభుత్వ వైఫల్యాలతో నిరుద్యోగం, దారిద్య్రం పెరిగిన కారణంగా అసంతృప్తి తలెత్తింది.ఈ స్థితిలో బంగ్లా విముక్తి పోరులో పాల్గొన్న వారి వారసులకు 30శాతం రిజర్వేషన్లు ప్రకటించటం ప్రభుత్వ వ్యతిరేకులకు కలసి వచ్చింది. సుప్రీం కోర్టు దాన్ని ఐదు శాతానికి, మొత్తంగా రిజర్వేషన్లను ఏడు శాతానికి పరిమితం చేయటంతో యువత ఆందోళన సద్దుమణిగింది. అయితే అనూహ్యంగా హసీనా రాజీనామా డిమాండ్‌తో మరోసారి వీధులకు ఎక్కారు. వారిని అధికార అవామీలీగ్‌ మద్దతుదారులు ఎదుర్కోవటంతో మరోసారి నెత్తురోడింది. అప్పటి వరకు ప్రభుత్వ ఆదేశాలను అమలు జరిపిన మిలిటరీ ఆది, సోమవారాల్లో జరిగిన పరిణామాల్లో వ్యతిరేకంగా మారింది.హసీనా జాతి నుద్దేశించి టీవీలో మాట్లాడకూడదని ఆదేశించటంతో పాటు రాజీనామా చేసి 45నిమిషాల్లో దేశం వదలి పోవాలని అల్టిమేటం జారీచేసినట్లు వార్తలు వచ్చాయి. కేవలం నెలన్నర క్రితమే మిలిటరీ నూతన అధికారిగా బాధ్యతలు చేపట్టిన వాకర్‌ ఉజ్‌ జమాన్‌ తన స్థానాన్ని పటిష్టపరుచుకొనేందుకు ఇన్ని వారాలు చూసినట్లు కనిపిస్తోంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d