• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: USA

భిన్న వైఖరులు : నాడు దలైలామా – నేడు షేక్‌ హసీనా, కొన్ని వాదనలు, కుట్ర సిద్దాంతాలు ! అమెరికాను చూసి నరేంద్రమోడీ భయపడుతున్నారా !!

11 Sunday Aug 2024

Posted by raomk in BJP, CHINA, Current Affairs, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, USA, Women

≈ Leave a comment

Tags

Bangladesh liberation struggle, BJP, BNP, China, cia, coup against Sheikh Hasina, Narendra Modi Failures, pakistan, RSS


ఎం కోటేశ్వరరావు


జవహర్‌లాల్‌ నెహ్రూ చేసిన తప్పిదాలు అన్నిన్ని కావు అన్నీ అతనే చేశాడు అంటూ బొమ్మరిల్లు డైలాగులతో బిజెపి నేతలు, కాషాయదళాల నిత్యపారాయణంలో దలైలామాకు రాజకీయ ఆశ్రయం ఇచ్చిన అంశం ఎక్కడా వినిపించదు, రాతల్లో కనిపించదు. మిగతా అన్ని విషయాల్లో తప్పు చేసి నెహ్రూ ఒక్క దీనిలోనే మంచి చేశారా ?చేస్తే ఆ విషయం ఎందుకు చెప్పరు అని ఎవరైనా ఎప్పుడైనా ఆలోచించారా ? షేక్‌ హసీనా ! బంగ్లా ప్రధానిగా ఆమె పదవీ కాలంలో మనదేశానికి ఇబ్బందులు కలిగించినట్లు ఎవరూ చెప్పలేరు. ఆమె ప్రత్యర్థి బంగ్లానేషనలిస్టు పార్టీ(బిఎన్‌పి), దానికి వెన్నుదన్నుగా జమాతే ఇస్లామీ అనే మతోన్మాద సంస్థ మన దేశానికి వ్యతిరేకమని ప్రత్యేకంగా వివరించనవసరం లేదు. అఫ్‌కోర్స్‌, వారు అసలు బంగ్లాదేశ్‌ విముక్తికే వ్యతిరేకులు, అమెరికా సప్తమనౌకా దళాన్ని బంగాళాఖాతంలోకి రప్పించి విముక్తి పోరాటాన్ని అణచేందుకు, దానికి వెన్నుదన్నుగా ఉన్న భారత్‌ను బెదిరించేందుకు చూసిన చరిత్ర జగమెరిగినదే. టిబెట్‌ను స్వతంత్ర దేశంగా ప్రకటించి చైనా మీద తిరుగుబాటు చేసిన దలైలామాకు రాజకీయ ఆశ్రయం కల్పించటమే గాక హిమచల్‌ ప్రదేశ్‌లోని ధర్మశాలలో ప్రవాస ప్రభుత్వ ఏర్పాటుకు నాటి ప్రధాని నెహ్రూ ఎంతగానో సహకరించారు.మిలిటరీ కుట్ర కారణంగా షేక్‌ హసీనా 2024 ఆగస్టు ఐదవ తేదీన మనదేశానికి వచ్చి ఆశ్రయం పొందారు. ఢిల్లీ సమీపంలోని ఘజియాబాద్‌ వద్ద ఉన్న వైమానిక స్థావరంలో ఆమె ఉన్నారు. ఇది రాస్తున్న సమయానికి ఆమె శరణార్ధిగా లేదా రాజకీయ ఆశ్రయం పొందిన వ్యక్తిగా గానీ లేరు. కేవలం వీసా మీద వచ్చిన ఒక సాధారణ బంగ్లా పౌరురాలిగా మాత్రమే ఉన్నారు. అలా ఎన్ని రోజులు ఉంటారు ? వీసా గడువును పొడిగిస్తారా ? నరేంద్రమోడీ ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. బంగ్లాదేశ్‌ పరిణామాల గురించి మీడియా, సామాజిక మాధ్యమంలో అనేక అంశాలు చక్కర్లు కొడుతున్నాయి.కుట్ర సిద్దాంతాలను వండి వారుస్తున్నారు. వాట్సాప్‌ విశ్వవిద్యాలయం సరేసరి. పక్కనే ఉన్న దేశంలో జరిగే పరిణామాలు మన మీద అనుకూలంగానో ప్రతికూలంగానో ప్రభావం చూపుతాయి. అందునా ఇరుగు పొరుగుదేశాలన్నీ మనకు దూరంగా జరుగుతున్న తీరు తెలిసి కూడా మన జేమ్స్‌బాండ్‌ అజిత్‌ దోవల్‌ ఏం చేస్తున్నట్లు అన్న ప్రశ్న తలెత్తుతోంది. పసిగట్టి హసీనాను హెచ్చరించినట్లు, లేదని గానీ వార్తలు రాలేదు. ఎందుకు అంటే మన నేతలందరూ ఎన్నికల్లో నిమగమైనట్లు కొందరు వారి తరఫున సంజాయిషీ ఇస్తున్నారు. అంటే ఎన్నికల్లో బిజెపి లబ్దికోసం చూడటం తప్ప దేశం ఇరుగుపొరుగున ఏం జరిగినా పట్టదా ? ఎవరి పని వారు చేయాలి. ఎక్కడో మన ”రా” ఏజంట్లు మన వ్యతిరేకులను లేపేశారంటే ఎంత గొప్పో అని పొగిడేవారు, ఇప్పుడా ఏజంట్లు బంగ్లాదేశ్‌లో ఇంత జరుగుతుంటే ఏం చేస్తున్నారని ఎవరైనా అడిగారా ?దేశం సురక్షితమైన నరేంద్రమోడీ చేతుల్లో ఉందని, అమెరికాను సైతం మెడలు వంచగల విశ్వగురువుగా భావించేవారు, పొగిడేవారు గానీ ఇప్పుడేం చెబుతారు ?


టిబెట్‌ చరిత్రను చూసినపుడు అది చైనాలో భాగంగా ఉన్న సామంత రాజ్యంగా(మన దేశంలో నిజాం హైదరాబాదు సంస్థానం మాదిరి) ఉంది తప్ప స్వతంత్రదేశంగా ఎన్నడూ లేదు. చైనాలో ఒక స్వయం పాలిత ప్రాంతం. బౌద్దంలో లామా అంటే గురువు లేదా బోధకుడు. కేంద్రంగా ఉండే దలైలామా చైనా ప్రభుత్వం మీద తిరుగుబాటు చేశాడు. చైనాలో కమ్యూనిస్టులు అధికారానికి రాక ముందు టిబెట్‌లో లామాల మార్గదర్శనంతో పాలనా వ్యవహారాలు సాగేవి. తరువాత ఆ పాలన స్థానంలో పౌరపాలనా వ్యవస్థ ఏర్పాటుకు 14వ దలైలామాతో సంప్రదించి 1951లో 17 అంశాలతో కూడిన ఒప్పందానికి చైనా కేంద్ర ప్రభుత్వం వచ్చింది. ఆ క్రమం పూర్తిగాక ముందే 1959లో 14వ దలైలామా తిరుగుబాటు ప్రకటించటం, దాన్ని చైనా ప్రభుత్వం అణచివేయటం అదే ఏడాది ఏప్రిల్‌ 18న అమెరికా సిఐఏ పర్యవేక్షణ, భారత ప్రభుత్వ సహకారంతో నేటి అసోంలోని తేజ్‌పూర్‌ దగ్గర మనదేశంలోకి వచ్చాడు. అమెరికా,బ్రిటన్‌ ఏజంట్లు ఒక పధకం ప్రకారం వ.ునదేశానికి చేర్చారు. రాజకీయ ఆశ్రయం ఇప్పించారు. 1956లోనే దలైలామా మన బుద్ద జయంతి కార్యక్రమం పేరుతో మనదేశం వచ్చి ఒకవేళ కోరితే తనకు రాజకీయ ఆశ్రయం ఇస్తారా అని నెహ్రూను అడగ్గా చైనాతో ఉన్న సంబంధాల రీత్యా అది కుదరదని సున్నితంగా తిరస్కరించారు. అయితే మూడు సంవత్సరాల తరువాత అదే నెహ్రూ ఎందుకు అంగీకరించారంటే సిఐఏ తెచ్చిన వత్తిడికి లొంగారన్నది స్పష్టం. అతనేమీ దేశాధినేత కాదు, మనదేశంతో రాజకీయంగా, అధికారికంగా ఎలాంటి సంబంధాలు లేవు.షేక్‌ హసీనా వచ్చిన నేపధ్యం భిన్నం. విద్యార్థుల ఆందోళన ముసుగులో అక్కడి మిలిటరీ దేశం వదలి వెళ్లాలని ఆదేశించటం, వారే ఒక హెలికాప్టర్‌ను ఏర్పాటు చేసి మన దేశానికి పంపించారు.(గతంలో లాటిన్‌ అమెరికాలోని హొండూరాస్‌లో అధ్యక్షుడు జెలయా మీద తిరుగుబాటు చేసిన మిలిటరీ జెలయాతో పాటు నిద్ర మంచాల మీద ఉన్న భార్యను కూడా బలవంతంగా తీసుకువెళ్లి పక్కనే ఉన్న కోస్టారికా అనేదేశంలో వదలి వచ్చారు)మానవహక్కులు, ప్రజాస్వామ్యం పేరుతో నాడు దలైలామాకు ఆశ్రయం ఇవ్వటాన్ని సమర్ధించే బిజెపి ఇప్పుడు మనదేశానికి మిత్రురాలిగా ఉన్న హసీనాకు అలాంటి ఏర్పాటుకు ఎందుకు తటపటాయిస్తున్నట్లు ?


హసీనా ప్రజాస్వామ్యాన్ని అణచి ప్రతిపక్షాలను వేధించారని ఆలాంటి వ్యక్తికి ఆశ్రయం ఎందుకు ఇవ్వాలని కొందరు వాదిస్తున్నారు. నిజమే, అది వారి అంతర్గత వ్యవహారం.మన దేశం ఎవరికీ రాజకీయ ఆశ్రయం కల్పించలేదా ? జోక్యం చేసుకోలేదా ? 1971లో బంగ్లాదేశ్‌ విముక్తికి మన మిలిటరీని నడిపాము. 1988లో దాదాపు రెండు వందల మంది తమిళ ఉగ్రవాదులు మాల్దీవులకు వెళ్లి నాటి అధ్యక్షుడు అబ్దుల్‌ గయూమ్‌ మీద తిరుగుబాటు చేసి కీలకమైన ప్రాంతాలన్నింటినీ పట్టుకున్నారు. గయూమ్‌ కోరిక మేరకు ఆపరేషన్‌ కాక్టస్‌ పేరుతో ఆగ్రా వైమానిక దళ కేంద్రం నుంచి ఐదు వందల మంది పారా ట్రూపర్లను నేరుగా మాల్దీవుల్లో దించి మనదేశం కుట్రను విఫలం గావించింది. అనేక మంది కుట్రదారులను కాల్చి చంపి, కొందరిని బందీలుగా పట్టుకుంది. అబ్దుల్‌ గయూమ్‌ ప్రజాస్వామిక స్వేచ్చకు తిలోదకాలిచ్చి 2008లో ఓడిపోయే వరకు పదవిలో కొనసాగాడు. అతడి మీద జరిగిన కుట్రను భారత్‌ అడ్డుకొని అధికారంలో కొనసాగించింది. తరువాత అధ్యక్షుడు నషీద్‌ మీద అవినీతి అక్రమాల ఆరోపణలు వెల్లువెత్తటంతో జనంలో నిరసన తలెత్తి చివరకు 2012లో రాజీనామా చేసి పదవి నుంచి తప్పుకున్నాడు. జనం ఛీకొట్టిన నషీద్‌ మనదేశంతో తనకున్న సంబంధాలను ఉపయోగించుకొని అరెస్టు కాకుండా తప్పించుకొనేందుకు భారత రాయబార కార్యాలయంలో ఆశ్రయం పొందాడు. దీన్ని ఎలా చూడాలి ? దలైలామా పాలనలో ఫ్యూడల్‌ శక్తులు టిబెటన్లను అణచివేసిన తీరు ప్రపంచానికి, మనదేశానికి తెలియదా ? ఏ దలైలామా ఏలుబడిలోనైనా అక్కడసలు ఎన్నికలు, ప్రజాస్వామిక పౌరపాలన ఉందా ? లేనపుడు దలైలామాకు ఆశ్రయం ఇవ్వటాన్ని బిజెపి ఇతర శక్తులు ఎలా సమర్థిస్తున్నట్లు ? అందువలన ఆ కారణం తర్కానికి నిలవదు. దలైలామా కమ్యూనిస్టులను ఎదిరించాడు గనుక మనదేశంలో ఉన్న కొన్ని శక్తులకు కమ్యూనిజం, చైనా అంటే వ్యతిరేకత గనుక మన శత్రువు శత్రువు మనకు మిత్రుడన్నట్లుగా దలైలామాకు ఆశ్రయం ఇచ్చారని చెబుతారా ? ఆ చర్యతో చైనాతో అదనపు తగాదా కొని తెచ్చుకోవటం తప్ప మనదేశానికి ఒరిగిందేమైనా ఉందా ? ఇప్పుడు బంగ్లాదేశ్‌లో అధికారాన్ని చేజిక్కించుకున్న శక్తులు మనదేశానికి మిత్రులా ? వారిని మన ప్రభుత్వం సమర్థిస్తున్నదా ? అక్కడ మతశక్తులు రెచ్చిపోయి మైనారిటీలుగా ఉన్న హిందువుల మీద దాడులు చేస్తున్నారని, దేవాలయాలను కూల్చివేస్తున్నారని బిజెపి అనుకూల శక్తులు ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. అవి చేసింది ఎవరు ? హసీనాను వ్యతిరేకించే, మనదేశాన్ని శత్రువుగా చూసే శక్తులే ? హసీనా ఏలుబడిలో అలాంటి ఉదంతాలేమీ లేవు గనుక ఆమెకు మద్దతు ఇచ్చి ఒక మంచి సందేశాన్ని మోడీ ఎందుకు పంపలేకపోతున్నారు ?


బంగ్లాదేశ్‌లో పాలకులను మార్చి భారత పలుకుబడిని తగ్గించాలని పాకిస్తాన్‌, చైనా చూస్తున్నదని దానిలో భాగంగా హసీనాకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళన వెనుక వాటి హస్తం ఉందని, బంగ్లాదేశ్‌ నేషనలిస్టు పార్టీ, జమాతే ఇస్లామీ విద్యార్థి విభాగంతో చేతులు కలిపియాన్నది ఒక కథనం. వాటికి నిర్దిష్ట ఆధారాలు లేకపోయినా నడుస్తున్న భూ భౌతిక రాజకీయాలను చూసినపుడు ఈ కోణాన్ని చూడాలని చెబుతున్నారు. వాస్తవం ఏమిటి ? తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనల వెనుక పాక్‌ హస్తం ఉందని తరచూ హసీనా గతంలో బహిరంగంగానే ప్రకటించించారు గాని చైనా గురించి అలాంటివేమీ లేవు. చైనా వైపు మొగ్గుచూపుతున్న కారణంగా ఆమె ప్రభుత్వాన్ని కూల్చివేశారని మరొక విశ్లేషణ. తొలిసారిగా బంగ్లాదేశ్‌తో కలసి చైనా మిలిటరీ విన్యాసాలు జరపాలని నిర్ణయించటం భారత్‌, అమెరికాలకు ఆందోళన కలిగించిందన్నది ఒక అంశం.(2009 నుంచి 2023వరకు హసీనా ఏలుబడిలో భారత్‌-బంగ్లాదేశ్‌ మిలిటరీ సంయుక్త విన్యాసాలు పదకొండుసార్లు జరిగాయి. వీటిని చైనా తనకు వ్యతిరేకం అని భావించి ఉంటే బంగ్లాదేశ్‌లో భారీమొత్తాలను పెట్టుబడులుగా పెడుతుందా ?) అంతే కాదు కాక్స్‌బజార్‌ ప్రాంతంలోని పెకూ వద్ద ఒక జలాంతర్గామి కేంద్రాన్ని నిర్మించేందుకు హసీనా సర్కార్‌ చైనాకు అనుమతివ్వటం,మింగ్‌ తరగతికి చెందిన రెండు జలాంతర్గాములను బంగ్లాదేశ్‌ కొనుగోలు చేయటం మీద కూడా అమెరికా ప్రతికూలంగా స్పందించింది. దీనికి తోడు చైనా నుంచి ఇతర మిలిటరీ పరికరాలు, ఆయుధాలు కొనుగోలు చేయటం వంటి అంశాలను చైనా వైపు మొగ్గుచూపటంగా విశ్లేషకులు పేర్కొన్నారు. మరి అది నిజమైతే తాజా పరిణామాల వెనుక పాకిస్తాన్‌ హస్తం లేదా అమెరికా కుట్ర వుండవచ్చు తప్ప చైనా ఎందుకు ఉంటుంది ? రెండు దేశాల మధ్య 40బిలియన్‌ డాలర్ల విలువగల ఒప్పందాలు జరిగాయి, వాటిలో సగానికి పైగా పథకాలు నిర్మాణంలో ఉన్నపుడు హసీనాను కూలదోసి మరొకరిని గద్దెమీద కూర్చోపెట్టాల్సిన అవసరం చైనాకు ఉంటుందా ? చైనా తన భాగస్వామిని కోల్పోయిందని వాయిస్‌ ఆఫ్‌ అమెరికా పేర్కొన్నది తప్ప భారత మిత్ర ప్రభుత్వాన్ని పోగొట్టుకుంది అనలేదు.


జూన్‌ నెలలో ధర్మశాలలో ఉన్న దలైలామాను అమెరికా పార్లమెంటు ప్రజాప్రతినిధుల సభ ప్రతినిధులు కలిశారు. ఇది చైనాకు ఆగ్రహం కలిగించినప్పటికీ మోడీ సర్కార్‌ ఖాతరు చేయలేదు.అధికారికంగా టిబెట్‌ను చైనా అంతర్భాగంగా గుర్తిస్తూనే దలైలామాకు మద్దతు ఇవ్వటం మనదేశం అనుసరిస్తున్న వైఖరి. ఇది అమెరికాను సంతుష్టీకరించటం తప్ప మరొకటి కాదు. ఇది నెహ్రూ నాటి నుంచి మోడీ వరకు కొనసాగుతూనే ఉంది. మతనేతగా ఆశ్రయం కల్పించామని చెబుతున్నప్పటికీ దలైలామా, అతగాడితో టిబెట్‌ నుంచి వచ్చిన వారు చేస్తున్నదంతా రాజకీయం, చైనా వ్యతిరేక కార్యకలాపాలు తప్ప వారు వచ్చి మనదేశంలో చేసే మత కార్యక్రమాలేమిటి ? వారు రాక ముందు మనదేశంలో బౌద్ద మత భిక్షువులు లేరా ? ఆరామాలు లేవా ? బంగ్లా పరిణామాల వెనుక నిజంగా పాక్‌ హస్తం ఉంటే హసీనాకు ఆశ్రయం కల్పించటానికి తటపటాయించాల్సిన అవసరం ఏమిటి ? పాకిస్తాన్‌ వైపు నుంచి వ్యతిరేక స్పందనను తట్టుకోలేమని భావిస్తున్నారా ? లేదూ చైనా హస్తమే ఉందని నమ్మితే దలైలామా ప్రవాస ప్రభుత్వాన్నే అనుమతించిన మనదేశం హసీనాకు కనీసం రాజకీయ ఆశ్రయమైనా ఎందుకు వెంటనే ప్రకటించలేదు ? అనేక మంది అనుమానిస్తున్నట్లు లేదా తాజాగా తన పతనం వెనుక అమెరికా హస్తం ఉందని ఆమె మన దేశంలో ఒక ప్రకటన ద్వారా గళం విప్పారు. అంటే ఇవన్నీ తెలిసే 56 అంగుళాల ఛాతీ ఉన్న నరేంద్రమోడీ అమెరికాకు భయపడుతున్నారా ? ఇలా ఆలోచించటం లేదా చర్చించటం, సందేహాన్ని వెలిబుచ్చటం దేశద్రోహమేమీ కాదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

బంగ్లాదేశ్‌లో హసీనా పతనానికి ముందు ఏం జరిగింది : అమెరికా మానసపుత్రుడు మహమ్మద్‌ యూనిస్‌ !

09 Friday Aug 2024

Posted by raomk in Asia, Communalism, Current Affairs, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, RELIGION, USA

≈ Leave a comment

Tags

cia, coup against Sheikh Hasina, Hillary Clinton, Muhammad Yunus, Narendra Modi, Sheikh Hasina, Sheikh Hasina's ouster



ఎం కోటేశ్వరరావు


బంగ్లాదేశ్‌లో జరిగిన అనూహ్య పరిణామాల పూర్వరంగలో మైక్రో ఫైనాన్స్‌ ద్వారా ప్రపంచ వ్యాపితంగా గుర్తింపు పొందిన నోబెల్‌ బహుమతి గ్రహీత మహమ్మద్‌ యూనిస్‌(84)ను అధికారాన్ని హస్తగతం చేసుకున్న మిలిటరీ ప్రభుత్వ సారధిగా నియమించింది. గురువారం రాత్రి ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా ప్రమాణ స్వీకారం చేశాడు.ఎంతకాలం ఈ ఏర్పాటు అమల్లో ఉంటుంది ? ఎప్పుడు ఎన్నికలు నిర్వహించి కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశమిస్తారు ? ఎన్నికల నిర్వహణకు ”తగిన పరిస్థితులు” లేవని తాత్కాలిక ప్రభుత్వాన్నే కొనసాగిస్తారా ? ఇలా ఎన్నో ప్రశ్నలు, సందేహాలు ఉన్నాయి. మరోవైపున మనదేశంలో ఆశ్రయం పొందిన మాజీ ప్రధాని షేక్‌ హసీనా ఇక్కడే ఉండేందుకు నరేంద్రమోడీ సర్కార్‌ అంగీకరిస్తుందా ? లేకపోతే ఆమె ఎక్కడకు వెళతారు ? ఇలాంటి అంశాల మీద కూడా ఇది రాసిన సమయానికి స్పష్టత లేదు. ఎవరీ యూనస్‌ అనే శోధన అంతర్జాలంలో జరుగుతున్నక్రమంలో సూదికోసం సోదికి పోతే పాత బాగోతాలన్నీ బయట పడినట్లుగా అనేక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. అవన్నీ నాటి పరిణామాల పూర్వరంగంలో వెలువడిన వార్తలు, విశ్లేషణలు, బయటపడిన అంశాలే. అవన్నీ కూడా అతగాడు అమెరికా మనిషి అని చూపుతున్నాయి. తోలుమ్మలాటలో తెర వెనుక ఉన్నవారు బొమ్మలను ఎలా ఆడించేదీ, వాటిపేరిట పలికే మాటలూ తెలిసిందే. బంగ్లాదేశ్‌లో ఇప్పుడు అదే క్రీడకు తెరలేచినట్లు చెప్పవచ్చు.


ఈ పెద్ద మనిషి గతంలోనే రాజకీయాల్లోకి రావాలని కోరుకున్నట్లు , ప్రధాని పదవికోసం ప్రయత్నించినట్లు వెల్లడైంది. 2007 ఫిబ్రవరి 13న కొల్‌కతాలోని అమెరికా కాన్సులేట్‌ జనరల్‌ తమ ప్రభుత్వానికి పంపిన ఒక వర్తమానం వికీలీక్స్‌ వెల్లడించిన పత్రాల్లో ఉంది. దానిలో ఉన్న సమాచార సారం ఇలా ఉంది. యూనస్‌ రాజకీయాల్లోకి రావాలని దానికి గాను తన పథకాల గురించి అమెరికా అధికారికి వెల్లడించాడు. రాజకీయాల్లోకి వస్తే తలెత్తే ముప్పు గురించి కూడా చెప్పాడు. అక్కడ అంతర్యుద్ధం చెలరేగ కుండా ఉండేందుకు మిలిటరీ మద్దతు ఉన్న తాత్కాలిక ప్రభుత్వం అత్యవసర పరిస్థితి విధించటాన్ని సమర్ధించాడు. దేశంలో అవినీతి, హింసాకాండ నుంచి కాపాడేందుకు ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు, ప్రజలు తనకు మద్దతు ఇవ్వాలని ఫిబ్రవరి 11న ఒక బహిరంగ లేఖ రాశాడు.(పరిస్థితి తనకు అనుకూలంగా లేదని గ్రహించి రెండు నెలల తరువాత సదరు ఆలోచన విరమించుకున్నాడు) హసీనా-ఖలీదా జియా మధ్య అధికార క్రీడలో నలుగుతున్న ప్రజాస్వామ్య క్రమంలో గొప్ప నైతిక వ్యక్తిత్వం మరియు బలమైన సంస్థాగత నైపుణ్యాలు ఉన్న యూనస్‌ అభ్యర్థిత్వం ప్రత్యామ్నాయాన్ని చూపగలదు అని అమెరికా అధికారి తమ ప్రభుత్వానికి నివేదించాడు. ఢాకాలోని అమెరికా రాయబార కార్యాలయం ఆ లేఖను ధృవీకరించి స్వదేశానికి పంపింది.


ఇన్నేండ్ల తరువాత యూనస్‌ను గద్దె నెక్కించటానికి అమెరికాకు అవకాశం దొరికింది. అతని మీద వందకు పైగా కేసులు నమోదయ్యాయి. అవన్నీ రాజకీయ ప్రేరేపితమని అతను కొట్టిపారవేశాడు.మైక్రో ఫైనాన్స్‌ పేరుతో పేదల రక్తం తాగే మనిషి అని ఒక సందర్భంగా షేక్‌ హసీనా వర్ణించింది.ఇతగాడు అమెరికా మానసపుత్రుడు.ప్రతి దేశంలో తనకు అవసరమైన వారికోసం అమెరికా సిఐఏ గాలం వేస్తుంది.ఒకసారి చిక్కిన తరువాత తనకు అనుకూలంగా మార్చుకుంటుంది. వర్ధమాన దేశాల వారిని ఆకర్షించేందుకు వేసే ఎరల్లో విద్య, సాంస్కృతిక సంబంధాలను పెంపొందించే పేరుతో అమెరికా ప్రభుత్వం ఎన్నో ఎత్తులు వేసింది, వాటిలో ఫుల్‌బ్రైట్‌ స్కాలర్‌షిప్‌ ఒకటి.యూనస్‌ను దానికి ఎంపిక చేశారు.సిఐఏ నేరుగా ఎంపిక చేయదు గాని ఎంపిక తరువాత అది రంగ ప్రవేశం చేస్తుంది.ఈ స్కాలర్‌ షిప్‌ను 1965లో యూనస్‌ పొందాడు. అర్ధశాస్త్రంలో పిహెచ్‌డి కూడా అమెరికాలోనే చేశాడు.1983లో గ్రామీణ బ్యాంకును ప్రారంభించి మైక్రోఫైనాన్స్‌ ద్వారా దారిద్య్రాన్ని తొలగించవచ్చనే చిట్కాను ముందుకు తెచ్చాడు. దానికి గాను 2006లో మరొకరితో కలసి నోబెల్‌ బహుమతి పొందాడు. ఆ బహుమతి కోసం అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన బిల్‌క్లింటన్‌ లాబీయింగ్‌ చేశాడు.మైక్రోఫైనాన్స్‌ పధకాన్ని అమలు చేసిన బంగ్లాదేశ్‌లో పేదరికం గణనీయంగానే ఉంది. ఇప్పుడు రోజుకు 6.85డాలర్ల దారిద్య్రరేఖలో(ప్రపంచబాంక్‌ 2022) 74.1శాతం మంది ఉన్నారు. (అఫ్‌ కోర్స్‌ మనదేశంలో కూడా మైక్రోఫైనాన్స్‌ తారక మంత్రంగా చంద్రబాబు నాయుడు వంటి వారు ఊదరగొట్టారు, అమలు చేశారు.ప్రైవేటు కంపెనీలు జనాల రక్తాన్ని పీల్చాయి, అనేక మంది ఆత్మహత్యలు చేసుకోవటంతో తరువాత సదరు కంపెనీలన్నీ జెండా ఎత్తేశాయి.) అయితే పైన చెప్పుకున్న అదే ప్రమాణం ప్రకారం భారత్‌లో 81.8శాతం ఉన్నారు.పాకిస్తాన్‌లో 84శాతంపైగా ఉన్నారు గనుక బిజెపి వారు తరచూ దానితో పోల్చి చూడండి మా మోడీ ఘనత అంటారన్నది తెలిసిందే.పేదరికం, దారిద్య్రం, నిరుద్యోగానికి తోడు ప్రతిపక్షాల అణచివేత షేక్‌ హసీనా మీద జనంలో వ్యతిరేకత పెరగటానికి, దాన్ని అవకాశంగా తీసుకొని అమెరికా కుట్రలో భాగంగా ప్రభుత్వ కూల్చివేత జరిగింది. తమ మానసపుత్రుడు గనుక యూనస్‌కు అమెరికా అనేక అవార్డులు ఇచ్చి స్థాయిని పెంచింది. ఇక షేక్‌ హసీనా విషయానికి వస్తే యూనస్‌ కార్యకలాపాలపై దర్యాప్తును ప్రారంభించి రుణాల వసూలుకు బలప్రయోగ పద్దతులను ప్రయోగించినట్లు వెల్లడించించారు. పదవీ విరమణ నిబంధనలను ఉల్లంఘించారనే కారణంతో 2011లో అతగాడిని బాంకు బాధ్యతల నుంచి తొలగించింది. సుప్రీం కోర్టు ఆ చర్యను సమర్ధించింది. ప్రభుత్వ అనుమతి లేకుండా నోబెల్‌ బహుమతి సొమ్ముతో సహా పుస్తకాల మీద సొమ్మును స్వీకరిస్తున్నారంటూ 2013లో కేసు నమోదు చేశారు. యూనస్‌ స్థాపించిన గ్రామీణ టెలికాం కంపెనీలో కూడా అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించారు.2023లో సదరు కంపెనీ సిబ్బంది తమ సొమ్మును స్వాహా చేసినట్లు ఒక కేసును దాఖలు చేశారు. ఈ ఏడాది ప్రారంభంలో ఆ కేసులో శిక్ష పడి ప్రస్తుతం బెయిలు మీద ఉన్నాడు. సిఐఏ ఏర్పాటు చేసినట్లు భావిస్తున్న ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ ఆ తీర్పును తప్పుపట్టింది.


అంతర్జాలంలో వెల్లడైన సమాచారం ప్రకారం అమెరికాలో డెమోక్రటిక్‌ పార్టీ మాజీ అధ్యక్షుడు బిల్‌క్లింటన్‌కు యూనస్‌ అత్యంత సన్నిహితుడు. ఆర్కాన్సాస్‌ గవర్నరుగా ఉన్నప్పటి నుంచి సంబంధాలు ఉన్నాయి. బిల్‌ క్లింటన్‌ సతి హిల్లరీ క్లింటన్‌ పేరుతో ఉన్న ఫౌండేషన్‌కు భారీ మొత్తంలో నిధులు ఇచ్చాడు. వాటి వివరాలను ఫౌండేషన్‌ వెబ్‌సైట్‌ నుంచి తరువాత తొలగించారు. దీర్ఘకాలం పాటు సన్నిహిత సంబంధాలను కలిగి ఉన్నాడు. ఇప్పుడు కూడా అదే డెమోక్రటిక్‌ పార్టీ అధికారంలో ఉంది. ఏడుదేశాల మీద దాడులు జరిపించి మానవహక్కులను హరించిన మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామాకు శాంతిదూతగా నోబెల్‌ బహుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే.అదే పెద్ద మనిషి చేతుల మీదుగా యూనస్‌ అనేక అవార్డులు అందుకున్నాడు.ఒబామా నుంచి అమెరికా అధ్యక్షుడి పేరుతో ఉన్న స్వేచ్చా పతకాన్ని, అమెరికా పార్లమెంటు బంగారు పతకం, సిఐఏతో సంబంధమున్న రాక్‌ఫెల్లర్‌ సోదరులు, ఫోర్డు ఫౌండేషన్‌ సంస్థలు ఏర్పాటు చేసిన రామన్‌ మెగాసెసే అవార్డు వాటిలో ఉన్నాయి. విదేశాంగ మంత్రిగా హిల్లరీ క్లింటన్‌ పనిచేసిన సమయంలో పద్దెనిమిది రకాల లావాదేవీలతో యుఎస్‌ ఎయిడ్‌ అనే సంస్థ యూనస్‌కు గ్రాంటులు, రుణాలు, కాంట్రాక్టుల రూపంలో కోటీ 30లక్షల డాలర్ల మేర లబ్దిచేకూర్చినట్లు తరువాత వెల్లడైంది. గ్రామీన్‌ అమెరికా పేరుతో హిల్లరీ క్లింటన్‌ పలుకుబడితో అమెరికా ఆర్థికశాఖ ఆరు లక్షల డాలర్ల గ్రాంటు ఇచ్చింది.యూనస్‌ మీద బంగ్లా ప్రభుత్వం జరుపుతున్న విచారణను విరమించుకోవాలని ఆమె వత్తిడి తెచ్చినట్లు అమెరికా పార్లమెంటరీ డాక్యుమెంట్లు స్పష్టం చేశాయి.హిల్లరీ ఫౌండేషన్‌ అంతర్జాతీయ విధాన డైరెక్టర్‌గా ఉన్న అమితాబ్‌ దేశారు ద్వారా ఆమె బంగ్లాదేశ్‌ ప్రభుత్వం మీద వత్తిడి తెచ్చారు.2012 జూన్‌ 11వ తేదీన అతగాడు పంపిన ఒక ఇమెయిల్‌ వర్తమానంలో ” ఒకవేళ మీరు ఇప్పటికే దాన్ని చూసి ఉండనట్లయితే వెంటనే చూడాలని డబ్లుజెసి(బిల్‌క్లింటన్‌), హెచ్‌ఆర్‌సి( హిల్లరీ క్లింటన్‌) కోరారు.” అని పేర్కొన్నారు.ప్రపంచబాంకులోని ఇద్దరు కీలక అధికారులను ఎఫ్‌బిఐ, సిఐదే ద్వారా బ్లాక్‌మెయిల్‌ కూడా చేయించారు. ఆ కారణంగానే పద్మానదిపై వంతెన నిర్మాణానికి మంజూరు చేసిన 120 కోట్ల డాలర్ల రుణాన్ని నిలిపివేసింది, దాని నిర్మాణంలో అవినీతి జరిగినట్లు సాకు చూపింది.(అవమానానికి గురైన హసీనా తరువాత అదే వంతెనకు చైనా నిధులు తెచ్చి పూర్తి చేసింది, దాంతో చైనాకు దగ్గరైనట్లు చెబుతారు) అంతే కాదు హసీనా మీద కక్ష కట్టిన అమెరికా సర్కార్‌ న్యూయార్క్‌లో ఉంటున్న ఆమె కుమారుడు సాజీబ్‌ వాజెద్‌ జారు (ఇప్పుడు బంగ్లాదేశ్‌లోనే ఉన్నట్లు వార్తలు) కంపెనీ మీద దాడులు జరపాలని 2017లో నాటి అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ రిపబ్లికన్‌ పార్టీ సెనెటర్‌ చుక్‌ గ్రాసీ వత్తిడి తెచ్చినట్లు కూడా వెల్లడైంది.మైనస్‌ టూ ఫార్ములా ( షేక్‌ హసీనా, ఖలీదా జియా ) ప్రకారం వారిద్దరికీ రిటైర్మెంట్‌ ఇచ్చి ప్రవాసం పంపి మహమ్మద్‌ యూనస్‌ను నూతన నేతగా చేసే అవకాశాన్ని పరిశీలించాలని బంగ్లా కీలక అధికారులతో హిల్లరీ క్లింటన్‌ 2007లో విశ్వప్రయత్నాలు చేసినట్లు వెల్లడైంది. ఈ నేపధ్యంలోనే నూతన నేతగా మహమ్మద్‌ యూనస్‌ను మిలిటరీ ముందుకు తేవచ్చునని 2007 ఏప్రిల్‌ ఏడున బిబిసి ఒక వార్తను ప్రసారం చేసింది. అదే ఏడాది ఫిబ్రవరిలో అమెరికాకాన్సులేట్‌ జనరల్‌ సానుకూలత వ్యక్తం చేస్తూ పంపిన వర్తమానం గురించి ముందే చెప్పుకున్నాం.


హసీనాకు ఉద్వాసన మహమ్మద్‌ యూనస్‌కు పట్టం గట్టటం వెనుక ఉన్న సంబంధం ఏమిటో ఇప్పటికే అర్ధమై ఉంటుంది.యూనస్‌ పట్ల 2009లో అధికారానికి వచ్చిన హసీనా కఠిన వైఖరి ఎందుకు తీసుకున్నారో విశ్లేషిస్తూ మనదేశంలోని స్టేట్స్‌మన్‌ పత్రికలో 2019 ఏప్రిల్‌ ఐదున అమెరికాకు చెందిన జర్నలిస్టు బిజడ్‌ ఖుస్రూ రాశాడు. మిలిటరీతో చేతులు కలిపి తనను, ఖలీదాను ప్రవాసం పంపేందుకు యూనస్‌ కుట్ర చేశాడని, రాజకీయాల్లోకి రావాలని స్వయంగా సిద్దపడినట్లు ఆమె భావించారు. దశాబ్దాలపాటు సాగిన గిరిజన తిరుగుబాట్లకు స్వస్తిపలికిన తనకు నోబెల్‌ బహుమతి ఇవ్వకుండా యూనస్‌కు ఇచ్చారని ఆమె అసూయ చెందినట్లు ఖుస్రూ పేర్కొన్నారు. రాసిన అంశాల సారం ఇలా ఉంది.హసీనా 2009లో అధికారానికి రాక ముందు తాత్కాలిక ప్రభుత్వానికి ముఖ్య సలహాదారుగా తనను నియమిస్తే సంతోషిస్తానని యూనస్‌ ఢాకాలో ఒక సభలో ప్రకటించాడు. ఆ మరుసటి రోజు అవామీ లీగ్‌ ప్రధాన కార్యదర్శి అబ్దుల్‌ జలీల్‌ ఆ ప్రతిపాదనను తిరస్కరించాడు. దానికి ఐదు నెలల ముందు రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నట్లు యూనస్‌ చెప్పాడని, అంతేగాక పాలన పట్ల అతని అభిప్రాయాలతో తాము విబేధిస్తున్నట్లు కూడా జలీల్‌ చెప్పాడు. ఈ వైఖరి తీసుకోవటానికి హసీనాకు ఢిల్లీ నుంచి అందిన సమాచారం కూడా ఒక కారణం. అదేమంటే హసీనా స్థానంలో యూనస్‌ను ఉంచాలని అమెరికా కోరుకుంటున్నదని దాని పట్ల భారత్‌ కూడా ఆందోళన చెందుతున్నట్లు తెలిసింది. అంతే కాదు, మతవాద జమాతే ఇస్లామీకి రాజకీయ రంగంలో చోటు కల్పించకూడదన్నది భారత వైఖరి కాగా జమాతే మీద చర్య తీసుకుంటే దాన్ని అజ్ఞాతవాసంలోకి నెట్టడమే అవుతుందని అమెరికా చెప్పిందట. జమాతే ప్రధాన రాజకీయ స్రవంతిలో ప్రవేశిస్తే అది మతవాదాన్ని తగ్గించుకుంటుందన్న తమ వైఖరిని భారత్‌ అర్ధం చేసుకోవటం లేదని అమెరికా చెప్పింది. తన పట్ల ఉన్న వైఖరిని మార్చుకోవాల్సిందిగా హసీనాను కోరాలని అమెరికా రాయబారిని కోరగా, తాను ఆపని చేస్తానని ఆమెతో ఒక మంచిమాట చెప్పిస్తానని హామీ ఇచ్చాడని అయితే హసీనా అందుకు అంగీకరించకపోగా యూనస్‌ను బాంకు పదవి నుంచి తప్పించారు.


హసీనా ప్రభుత్వాన్ని కూల్చివేసిన మిలిటరీ అధికారులు కేవలం 45 నిమిషాల సమయమిచ్చి ఆమెను బలవంతంగా భారత్‌కు పంపిన సంగతి తెలిసిందే. డెయిలీ స్టార్‌ అనే పత్రిక వెల్లడించిన సమాచారం ప్రకారం ఫ్రాన్సులో ఉన్న యూనస్‌ స్వదేశానికి తిరిగి వచ్చి బాధ్యతలు స్వీకరించాలని విద్యార్థులు కోరారు. తాను పూర్తి చేయాల్సిన పనులెన్నో ఉన్నందున రాలేనని యూనస్‌ తొలుత చెప్పాడు.విద్యార్థులు పదే పదే కోరటంతో అంగీకరించాడు. దేశంలో ఆరాచకాన్ని తొలగించే క్రమంలో హసీనాను గద్దెదించటం పట్ల సంతోషం వెలిబుచ్చాడు. విద్యార్థులు, దేశ పౌరులు ఎన్నో త్యాగాలు చేసినపుడు నాకు సైతం కొంత బాధ్యత ఉంది, అందుకే అంగీకరించాను అన్నాడట.హసీనాను గద్దె దించిన రోజును రెండవ విముక్తి దినంగా యూనస్‌ వర్ణించినట్లు ఒక జర్నలిస్టు చెప్పాడు. ఇలాంటి వ్యక్తి సారధ్యంలో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం స్వేచ్చగా ఎన్నికలు నిర్వహిస్తుందా అన్ని పార్టీలకు అవకాశం కల్పిస్తుందా ? ఏదో ఒక ముసుగులో అమెరికా అనుకూల బిఎన్‌పి-జమాతే మతశక్తులకు అధికారం కట్టబెడుతుందా ? బంగ్లాదేశ్‌లో అమెరికా మిలిటరీ స్థావరాన్ని ఏర్పాటు చేసి అటు చైనా ఇటు భారత్‌కూ ముప్పు తెస్తుందా ? ఇలా ఎన్నో ప్రశ్నలు, సందేహాలు తలెత్తుతున్నాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

హసీనా పతనం వెనుక అమెరికా ….. తాత్కాలిక సారధిగా నోబెల్‌ గ్రహీత యూనిస్‌ !

07 Wednesday Aug 2024

Posted by raomk in Asia, CHINA, Current Affairs, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RUSSIA, UK, Uncategorized, USA

≈ Leave a comment

Tags

Bangladesh Elections 2024, China, cia, Coup In Bangladesh, Joe Biden, Sheikh Hasina


ఎం కోటేశ్వరరావు


ఆకస్మిక, అనూహ్య, నాటకీయ పరిణామాల మధ్య సోమవారం నాడు బంగ్లాదేశ్‌లో రాజకీయ అనిశ్చితికి తెరలేచింది. రాజీనామా కోరుతూ పెద్ద సంఖ్యలో జనం ప్రధాని షేక్‌ హసీనా నివాసం మీదకు దండెత్తటం,తరువాత పార్లమెంటుపై దాడి, దేశం విడిచిపోవాల్సిందిగా మిలిటరీ ఆదేశించటం, పదవికి రాజీనామా చేసి ఆమె మిలిటరీ హెలికాప్టర్‌లోనే సోదరితో కలసి ఢిల్లీ రావటం, మిలిటరీ చీఫ్‌ జనరల్‌ వాకర్‌ ఉజ్‌ జమాన్‌ తానే అధికారాన్ని చేపడుతున్నట్లు ప్రకటించటం అంతా కొద్ది గంటల్లోనే జరిగిపోయాయి. డెబ్బయ్యారు సంవత్సరాల షేక్‌ హసీనా వరుసగా జనవరిలోనే నాలుగవ సారి అధికారానికి వచ్చారు. ఏడాది కూడా గడవక ముందే దేశం విడిచి వెళ్లాల్సి వచ్చింది. పార్లమెంటును రద్దు చేసిన దేశాధ్యక్షుడు మహమ్మద్‌ షహబుద్దీన్‌ త్వరలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించాడు.ప్రతిపక్ష నాయకురాలు బేగం ఖలీదా జియాను జైలు నుంచి విడుదల చేశారు. అవినీతి కేసులో 17 సంవత్సరాల జైలు శిక్షను అనుభవిస్తున్న 78 ఏండ్ల మాజీ ప్రధాని ఖలీదా అనారోగ్యంతో ప్రస్తుతం జైలు ఆసుపత్రిలో ఉన్నారు. హసీనా రాజీనామా తరువాత కూడా నిరసనలు కొనసాగాయి. ఇది రాసిన సమయానికి హసీనాకు ఏ దేశం రాజకీయ ఆశ్రయం ఇచ్చేది స్పష్టం కాలేదు.గతంలో జారీ చేసిన వీసాను అమెరికా రద్దు చేసింది. నిబంధనల సాకుతో బ్రిటన్‌ కూడా నిరాకరించినట్లు వార్తలు. తాత్కాలిక ప్రభుత్వ సారధిగా గ్రామీణ బాంకుతో దారిద్య్ర నిర్మూలనకు స్వల్ప మొత్తంలో రుణాలు ఇచ్చే మైక్రోక్రెడిట్‌ పథకంతో ముందుకు వచ్చి ప్రాముఖ్యత పొందిన మహమ్మద్‌ యూనిస్‌ను తాత్కాలిక ప్రభుత్వ సారధిగా నియమించారు.ప్రస్తుతం 83 ఏండ్ల వయస్సులో అదే యూనిస్‌, మరో 13మందిని రెండు నెలల క్రితం అవినీతి కేసులో దోషులుగా తేల్చి ఆరునెలల జైలు శిక్ష వేశారు,బెయిలు మీద ఉన్నాడు.తన టెలికాం కంపెనీ సిబ్బంది సంక్షేమ నిధులలో రెండు కోట్ల డాలర్లమేరకు విదేశాలకు తరలింపు, దుర్వినియోగం చేసినట్లు ఆరోపణ. అయితే తన మీద తప్పుడు కేసులు పెట్టినట్లు అంటున్నాడు.అతని మీద ఇంకా వందకేసులు ఉన్నాయి.తాజా పరిణామాల వెనుక ఏం జరిగిందనేది వెల్లడి కావాల్సి ఉంది.అమెరికా హస్తం ఉన్నట్లు చెబుతున్నారు.


అమెరికా సిఐఏ కుట్ర గురించి మీడియాలో వెలువడిన సమాచారం ప్రకారం పరిణామ క్రమం ఇలా ఉంది. బంగ్లాదేశ్‌లో తమ వైమానిక స్థావరాన్ని ఏర్పాటు చేసుకొనేందుకు అనుమతిస్తే తన ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా ఉండదని ఒక తెల్లవాడు తెచ్చిన ప్రతిపాదనను తిరస్కరించినట్లు హసీనా చెప్పిన అంశం మే 23న మీడియాలో వచ్చింది. తూర్పు తైమూరు మాదిరి చిట్టగాంగ్‌, మయన్మార్‌లో కొన్ని ప్రాంతాలతో కలిపి క్రైస్తవ దేశం ఏర్పాటుకు కుట్రలు జరుగుతున్నట్లు కూడా ఆమె చెప్పారు. తన తండ్రి మాదిరి తనను కూడా హతమార్చేందుకు కుట్ర జరుగుతున్నట్లు చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్లను రద్దు చేస్తూ 2018లో హసీనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేస్తూ జూన్‌ ఐదున హైకోర్టు తీర్పు చెప్పింది.రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జూలై ఒకటిన విద్యార్థులు ఆందోళనకు దిగారు.జూలై 16 ఆందోళన హింసాత్మక రూపం తీసుకుంది.హసీనా ప్రభుత్వం ప్రకటించిన 30శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తూ ఐదుశాతానికి కుదించి సుప్రీం కోర్టు 21వ తేదీన తీర్పు చెప్పింది.దాంతో పరిస్థితి సాధారణ స్థితికి వచ్చింది.అయితే ఆగస్టు నాలుగున మాజీ మిలిటరీ ప్రధాన అధికారి ఇక్బాల్‌ కరీమ్‌ భుయాన్‌ అంతకు ముందు నిరసనకారుల మీద జరిపిన అణచివేతను ఖండించాడు.మిలిటరీని వెనక్కు పిలిపించాలని కోరాడు.నూతన మిలిటరీ అధికారి వాకర్‌ ఉజ్‌ జమాన్‌ నిరసనకారులకు మద్దతు ప్రకటిస్తూ మిలిటరీ తటస్థంగా ఉండాలని చెప్పాడు.హసీనా రాజీనామా కోరుతూ ఐదవ తేదీన నిరసకారులు ఢాకా ప్రదర్శనకు పిలుపునిచ్చారు. అదే రోజు హసీనా రాజీనామా చేయాలని జమాన్‌ 45 నిమిషాల గడువు ఇచ్చాడు.దేశం వదలి వెళ్లేందుకు హెలికాప్టర్‌ను కూడా ఏర్పాటు చేశాడు. తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించాడు. దాన్ని అమెరికా స్వాగతించింది.
అనేక దేశాలలో సిఐఏ చేసిన కుట్రలో భాగంగా పరిణామాలన్నీ దాదాపు ఒకే విధంగా ఉన్నాయి. ఏదో ఒక కరాణంతో నిరసన ప్రారంభం, అది కూడా విద్యార్థులతో చేయించటం. దానికి ముందు సిఐఏతో చేతులు కలిపిన మీడియా నిరసనకు అవసరమైన నేపధ్యాన్ని తప్పుడు ప్రచారం ద్వారా ఏర్పాటు చేయటం. తరువాత భద్రతా దళాలపై దాడి చేసి రెచ్చగొట్టి వాటిని రంగంలో దిగేట్లు చేయటం, బలప్రయోగం చేశారంటూ న్యాయవ్యవస్థ ద్వారా చెప్పించటం,ప్రజలకు సేవ పేరుతో తరువాత మిలిటరీ నిరసనలకు మద్దతు ప్రకటించటం, ప్రధాని లేదా అధ్యక్ష భవనాలు, పార్లమెంట్ల ముట్టడికి నిరసనకారులను అనుమతించటం. ఇదే పద్దతి శ్రీలంకలో అనుసరించారు. బంగ్లాదేశ్‌లో అదే జరిగింది. నిజానికి మన స్వాతంత్య్రానికి ముందే ఈశాన్య ప్రాంతంలో కుట్రద్వారా కొన్ని దేశాల ఏర్పాటుకు బ్రిటన్‌, సిఐఏ కుట్రలు చేసింది. ఇటీవలి సంవత్సరాలలో మన ఇరుగు పొరుగుదేశాలలో తన అనుకూల ప్రభుత్వాల ఏర్పాటుకు అమెరికా అనేక కుట్రలు చేసింది.


రద్దయిన పార్లమెంటులో 350కి గాను అవామీ లీగ్‌కు 306 స్థానాలున్నాయి. ప్రధాన ప్రతిపక్షమైన బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ(బిఎన్‌పి), పరిమితమైన బలం కలిగిన కమ్యూనిస్టు, ఇతర వామపక్షాలతో కూడిన కూటమి, ఇతర చిన్న పార్టీలు ఈ ఎన్నికలను బహిష్కరించాయి. ఎన్నికలను తటస్థ ప్రభుత్వ ఆధ్వర్యంలో జరపాలని, ప్రతిపక్షాల అణచివేతకు నిరసనగా తాము పోటీ చేయటం లేదని అవి ప్రకటించాయి.2018లో జరిగిన ఎన్నికల్లో 80.2, అంతకు ముందు 61.29శాతం ఓట్లు పోలుకాగా ఈ ఏడాది 41.8శాతమే నమోదైంది.జనం అసంతృప్తి వెల్లడైంది. పాకిస్థాన్‌ నుంచి స్వాతంత్య్రం కోసం సాగించిన పోరు ఫలించి 1971లో స్వతంత్ర బంగ్లాదేశ్‌ ఏర్పడింది. ఆ విముక్తి పోరాటానికి నాయకత్వం వహించి బంగ బంధుగా పేరు తెచ్చుకున్న తొలి ప్రధాని షేక్‌ ముజిబుర్‌ రహమాన్‌ కుమార్తె షేక్‌ హసీనా. 1975లో జరిగిన మిలిటరీ తిరుగుబాటులో ముజిబుర్‌ రహమాన్‌తో పాటు కుటుంబ సభ్యులందరినీ చంపివేశారు. ఆ సమయంలో విదేశాల్లో ఉన్న హసీనా, ఆమె సోదరి రెహనా, హసీనా భర్త ఎంఎ వాజెద్‌ మియా ఢిల్లీలో అణుశాస్త్రవేత్తగా పని చేస్తుండటతో అతను, వారి పిల్లలు కూడా హత్యా కాండ నుంచి తప్పించుకున్నారు. తొలుత వారు జర్మనీలో, తరువాత మనదేశంలో ఆశ్రయం పొందారు. ఆమె ప్రవాసంలో ఉండగానే 1981లో అవామీ లీగ్‌ నేతగా ఎన్నికయ్యారు. ప్రతిపక్ష నేతగా ఆ తరువాత 1996 నుంచి 2001వరకు తొలిసారి ప్రధానిగా పని చేశారు.రెండవ సారి 2009లో బాధ్యతలు చేపట్టి సోమవారం నాడు రాజీనామా చేసేవరకు అదే పదవిలో కొనసాగారు. మొత్తం మీద ఇప్పటి వరకు ఆమె మీద పందొమ్మిది సార్లు హత్యా ప్రయత్నాలు జరిగినట్లు చెబుతారు. మత తీవ్రవాదులను అణచివేసిన నేతగా పేరుతెచ్చుకున్నారు. ముజిబుర్‌ రహమాన్‌ హత్య తరువాత మిలిటరీ నియంత జియావుర్‌ రహమాన్‌ అధ్యక్షుడిగా అధికారానికి వచ్చాడు. 1978లో బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీని ఏర్పాటు చేశాడు.1981లో మిలిటరీ తిరుగుబాటులో హతమయ్యాడు. తరువాత ఆ పార్టీకి భార్య ఖలీదా జియా నేతృత్వం వహించటమే కాదు, రెండుసార్లు ప్రధానిగా పని చేశారు.తాజా ఎన్నికలను బహిష్కరించారు. జియావుర్‌ రహమాన్‌ అధికారంలో ఉండగా ముస్లిం ఛాందసవాదులను ప్రోత్సహించి ఇస్లామిక్‌ దేశంగా మార్చేందుకు చూశాడు. బిఎన్‌పి మితవాద పార్టీ, దానికి జమాయతే ఇస్లామీ పార్టీ మద్దతు ఇస్తున్నది. మరో మిలిటరీ నియంత ఎర్షాద్‌ అధికారాన్ని చేజిక్కించుకోవటంతో అతగాడిని గద్దె దించేందుకు షేక్‌ హసీనా-ఖలీదా జియా ఇద్దరు చేతులు కలిపి ఆందోళనలు నిర్వహించారు. ఎర్షాద్‌ పదవి నుంచి దిగిన తరువాత ఇద్దరూ ప్రత్యర్దులుగా మారారు.


షేక్‌ హసీనా పదవీ కాలంలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు.కరోనా ముందు వరకు మెరుగ్గా కనిపించిన ఆర్థిక స్థితి తరువాత ఇప్పటి వరకు కోలుకోలేదు.దాంతో 470 కోట్ల డాలర్ల రుణం కోసం ఐఎంఎఫ్‌ను ఆశ్రయించాల్సి వచ్చింది. ధరలు ప్రత్యేకించి ఆహారద్రవ్యోల్బణం చాలా ఎక్కువగా ఉంది.కరెన్సీ విలువను తగ్గించటంతో జనజీవితాలు అతలాకుతలమయ్యాయి. బంగ్లాదేశ్‌లో ఉన్న ఏకైక అణువిద్యుత్‌ కేంద్రాన్ని నిర్మించిన రష్యా రానున్న రోజుల్లో మరింతగా సహకరిస్తామని ప్రకటించింది. చైనా ఇస్తున్న అప్పులతో అది మరొక శ్రీలంకగా మారుతుందని ప్రచారం చేశారు. ఇటీవలి కాలంలో రెండు దేశాలు మరింతగా సన్నిహితం కావటమే దీనికి ప్రధాన కారణం. గంగోత్రి నుంచి ప్రారంభమైన గంగానదిని బంగ్లాదేశ్‌లో పద్మ అంటారు. దాని మీద కట్టిన పెద్ద వంతెన నిర్మాణంలో అధికారులు అక్రమాలకు పాల్పడ్డారంటూ ప్రపంచబాంకు బహిరంగంగా ప్రకటించి నిధులు నిలిపివేసింది. బంగ్లా ప్రభుత్వం చైనాను సంప్రదించగా 2012లో 360 కోట్ల డాలర్లు ఇచ్చి దాన్ని పూర్తి చేయించింది. రాజధాని ఢాకాతో 21 జిల్లాలను అది అనుసంధానం గావించింది. బిఆర్‌ఐ పధకంలో చేరి విద్యుత్‌ కేంద్రాలు, రైల్వే లైన్లు,రోడ్లు, రేవులు, సొరంగాల వంటి పదిహేడు ప్రాజెక్టులకు రుణాలు పొందింది. అంతే కాదు, తనకు అవసరమైన ఆయుధాల్లో 74శాతం చైనా నుంచి పొందుతున్నది. పశ్చిమ దేశాలతో ప్రత్యేకించి అమెరికా పోల్చుకుంటే ఎంతో లాభసాటిగా ఉండటమే చైనా పెట్టుబడుల వైపు మొగ్గుకు కారణం.


తన దారికి రాని దేశాల మీద మానవహక్కుల ఉల్లంఘన పేరుతో అమెరికా దాడి చేస్తున్న సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్‌ మీద కూడా అదే అస్త్రాన్ని ప్రయోగించింది. ఈ కారణంగా కూడా హసీనా సర్కార్‌ చైనాకు మరింత చేరువైంది.2021లో అమెరికా నిర్వహించిన ప్రజాస్వామ్య సదస్సుకు బంగ్లాదేశ్‌ను ఆహ్వానించలేదు. అప్పుడు చైనా రాయబారి బంగ్లాకు మద్దతుగా నిలిచారు.తన ఇండో-పసిఫిక్‌ వ్యూహం(క్వాడ్‌)లో చైనాకు వ్యతిరేకంగా కలసి రావాలని జోబైడెన్‌ తెచ్చిన వత్తిడిని బంగ్లా తిరస్కరించింది. అలీన విధానంతో స్వతంత్ర వైఖరిని అనుసరిస్తామని ప్రకటించింది. కొల్‌కతాకు 212 నాటికల్‌ మైళ్ల దూరంలో బంగాళఖాత తీరంలోని కాక్స్‌బజార్‌ రేవు ప్రాంతంలో నిర్మించిన జలాంతర్గామి కేంద్రానికి చైనా 120 కోట్ల డాలర్ల సాయంచేసినంత మాత్రాన భారత్‌ రక్షణకు ఎలాంటి ముప్పు లేదని బంగ్లాదేశ్‌ ప్రకటించింది. చైనా తమకు ఆర్థిక భాగస్వామి తప్ప రక్షణకు కాదని స్పష్టం చేసింది. బంగ్లాదేశ్‌లో చైనా నిర్మిస్తున్న మౌలిక సదుపాయాలతో భారత్‌ కూడా లబ్దిపొందుతుందని ఈశాన్య భారతానికి వేగంగా భూ, జలమార్గాల ద్వారా సరకు రవాణా చేయవచ్చని కొందరు నిపుణులు చెప్పారు. చైనా పెట్టుబడులతో బంగ్లాదేశ్‌కు ఎలాటి ముప్పు లేదని వాటి మీద పెట్టుబడి కంటే లాభాలు ఎక్కువ అని జహంగీర్‌ నగర్‌ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌ సాహెబా నామ్‌ ఖాన్‌ చెప్పాడు. బంగ్లాదేశ్‌ మీద అమెరికా తెస్తున్న వత్తిడి, సృష్టించిన పరిస్థితిని చైనా తనకు అనుకూలంగా మార్చుకుంటున్నదని మన నరేంద్రమోడీ సర్కార్‌ అమెరికాకు నివేదించినట్లు 2023 ఆగస్టు 28వ తేదీ హిందూస్తాన్‌ టైమ్స్‌ పత్రిక రియాజుల్‌ హెచ్‌ లస్కర్‌ పేరుతో రాసిన ఒక సమీక్ష పేర్కొన్నది.


బంగ్లా పరిణామాలు మరోసారి అమెరికాకు అనుకూలంగా మారితే అది చైనాను దెబ్బతీయాలని కోరుకొనే శక్తులకు సంతోషం కలిగిస్తుందని వేరే చెప్పనవసరం లేదు. అయితే అదే సమయంలో మనకూ ఇబ్బందే. ఉక్రెయిన్‌ సంక్షోభంలో తటస్థంగా ఉన్నందుకు మనమీద కసి ఉన్నా, ఇతర అంశాలలో మద్దతు ఇస్తున్న కారణంగా మింగా కక్కలేకుండా ఉంది. ప్రతిపక్ష బిఎన్‌పికి మతోన్మాద జమాతే ఇస్లామీ మద్దతు , దానికి పాకిస్థాన్‌తో సంబంధాలు ఉన్నందున షేక్‌ హసీనా గెలవటం మన దేశానికి ఊరట కలిగించే అంశంగా భావించారు. ఇప్పుడు అమెరికా అనుకూల మిలిటరీ లేదవ బిఎన్‌పి అధికారానికి వస్తే మనకు తలనొప్పి వ్యవహారమే. మన మీద వత్తిడి తెచ్చేందుకు, ఇరకాటంలో పెట్టేందుకు అమెరికా చూస్తుంది. బంగ్లా పరిణామాల గురించి వివరించేందుకు ప్రధాని నరేంద్రమోడీ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు.ప్రతిపక్షాలు ఏకాభిప్రాయం వ్యక్తం చేసినట్లు విదేశాంగ మంత్రి జై శంకర్‌ ప్రకటించారు. మిలిటరీ అధికారాన్ని స్వాధీనం చేసుకోవటాన్ని అమెరికా స్వాగతించింది. అనధికారిక చొరబాట్లను నిరోధించేందుకు మన ప్రభుత్వం సరిహద్దు భద్రతా దళాలను అప్రమత్తం చేసింది. బంగ్లాదేశ్‌లో జరిగిన అనేక పరిణామాల వెనుక గతంలో అమెరికా హస్తం ఉన్నందున ఇప్పుడు కూడా ఆ కోణాన్ని తోసిపుచ్చలేము. హసీనా ప్రభుత్వ వైఫల్యాలతో నిరుద్యోగం, దారిద్య్రం పెరిగిన కారణంగా అసంతృప్తి తలెత్తింది.ఈ స్థితిలో బంగ్లా విముక్తి పోరులో పాల్గొన్న వారి వారసులకు 30శాతం రిజర్వేషన్లు ప్రకటించటం ప్రభుత్వ వ్యతిరేకులకు కలసి వచ్చింది. సుప్రీం కోర్టు దాన్ని ఐదు శాతానికి, మొత్తంగా రిజర్వేషన్లను ఏడు శాతానికి పరిమితం చేయటంతో యువత ఆందోళన సద్దుమణిగింది. అయితే అనూహ్యంగా హసీనా రాజీనామా డిమాండ్‌తో మరోసారి వీధులకు ఎక్కారు. వారిని అధికార అవామీలీగ్‌ మద్దతుదారులు ఎదుర్కోవటంతో మరోసారి నెత్తురోడింది. అప్పటి వరకు ప్రభుత్వ ఆదేశాలను అమలు జరిపిన మిలిటరీ ఆది, సోమవారాల్లో జరిగిన పరిణామాల్లో వ్యతిరేకంగా మారింది.హసీనా జాతి నుద్దేశించి టీవీలో మాట్లాడకూడదని ఆదేశించటంతో పాటు రాజీనామా చేసి 45నిమిషాల్లో దేశం వదలి పోవాలని అల్టిమేటం జారీచేసినట్లు వార్తలు వచ్చాయి. కేవలం నెలన్నర క్రితమే మిలిటరీ నూతన అధికారిగా బాధ్యతలు చేపట్టిన వాకర్‌ ఉజ్‌ జమాన్‌ తన స్థానాన్ని పటిష్టపరుచుకొనేందుకు ఇన్ని వారాలు చూసినట్లు కనిపిస్తోంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

వికసిత భారత్‌ 2047 : కనుచూపు మేరలో లేదు ! నరేంద్రమోడీ గాలి తీసిన ప్రపంచ బ్యాంకు !! కాదనే దమ్ము, ధైర్యం ఉందా !!!

04 Sunday Aug 2024

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, Loksabha Elections, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

BJP, IMF, Narendra Modi Failures, RSS, Viksit Bharat 2047, Vision India@2047, World Bank, World Development Report 2024


ఎం కోటేశ్వరరావు


త్వరలో మరో తిరంగా జెండా పండగ జరుపుకోబోతున్నాం. చరిత్రను చూస్తే పరాయి పాలనలో ఆ జెండాను ఎగుర వేస్తే దేశ ద్రోహం, ప్రాణాలకు తెగించి ఆవిష్కరించటమే దేశభక్తి. నేటి పాలకులు అదే జెండాను ఎగురవేస్తూ చెప్పే కబుర్లలో నిజాయితీని ప్రశ్నించటమే దేశద్రోహంగా పరిగణించబడుతున్నది. ఒక్క ముక్కలో చెప్పాలంటే దేశ అభివృద్ధి గురించి కబుర్లు చెప్పేవారు అపర దేశ భక్తులు, వారి విధానాల బండారాన్ని ప్రశ్నించేవారు క్షమించరాని దేశద్రోహులు.నేడు దేశంలో జరుగుతున్న ప్రచారదాడిలో నలుగుతున్న అంశమిది. ఎప్పటికెయ్యది అప్పటికామాటలాడి ఓట్లేయించుకొని తప్పించుకు తిరుగువారు మనకు గల్లీ నుంచి ఢిల్లీ వరకు కనిపిస్తున్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు చెప్పిన అభివృద్ధి కబుర్లలో వెయ్యోవంతు ఆచరించినా దేశం ఈ స్థితిలో ఉండేది కాదు. స్వాతంత్య్రం మాకేమిచ్చిందనే ప్రశ్న ఉత్పన్నమయ్యేది కాదు. 2047వరకు ఒకటే లక్ష్యంగా అదే వికసిత్‌ భారత్‌గా ఉండాలని ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించారు.దాని అమలు గురించి ఎవరైనా ప్రశ్నిస్తే మీరు ఈ దేశంలో ఉండటం లేదా ? ఇక్కడి గాలి పీల్చటం లేదా ఇక్కడి తిండి తినటం లేదా అని ఎదురుదాడి చేస్తున్నారు. అసలు వికసిత భారత్‌ అంటే ఏమిటి ?


రెండు సంవత్సరాలకు పైగా నీతి ఆయోగ్‌ నిర్దేశం మేరకు అధికారులు మధనం చేసి తీసుకువచ్చిందే వికసిత భారత్‌ 2047 ప్రణాళిక. అంటే అప్పటికి స్వాతంత్య్రం వచ్చి వంద సంవత్సరాలు నిండుతాయి గనుక ఆనాటికి దేశాన్ని అభివృద్ధి చెందిన వాటి జాబితాలో చేర్చే విధంగా పని చేస్తామన్నారు. దాని ప్రకారం దేశ జిడిపి 30లక్షల కోట్ల డాలర్లకు, తలసరి సంపద 18 నుంచి 20వేల డాలర్లకు పెరుగుతుంది.నవకల్పన, సాంకేతికంగా ప్రపంచ నేతగా ఎదుగుతుంది, మానవాభివృద్ధి, సామాజిక సంక్షేమంలో ఆదర్శవంతంగా తయారవుతుంది, పర్యావరణాన్ని కాపాడే ఒక మొనగాడుగా నిలుస్తుంది. సరిగ్గా దీన్ని లోక్‌సభ ఎన్నికలకు ముందు 2023 డిసెంబరు 11న ప్రధాని నరేంద్రమోడీ ”వికసిత్‌ భారత్‌ 2047: యువ గళం ” పేరుతో విడుదల చేశారు. ఈ ప్రకటన చేసేందుకే మోడీకి పదేండ్లు పట్టింది. మనకంటే ఎంతో ముందంజలో ఉన్న చైనా 2012లోనే 2049 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారే లక్ష్యాన్ని ప్రకటించింది. దీన్ని చూసి ఎవరైనా చైనా కంటే మనమే ముందుంటాం అని టాంటాం వేసుకుంటే చేయగలిగిందేమీ లేదు, నిజంగా అభివృద్దిలో పోటీ పడాలని కోరుకుందాం.


కొన్ని వాదనలు, తర్కాన్ని చూద్దాం. చైనాను పక్కకు నెట్టి ప్రపంచ ఫ్యాక్టరీగా, సరకుల ఎగుమతి దేశంగా మనదేశాన్ని మారుస్తామని మోడీ(సంఘ) పరివారం చెబుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చైనా ఎగుమతుల్లో ప్రపంచంలో అగ్రస్థానంలో ఉంది. మనవారేం చెప్పారు, 2030 నాటికి మన ఎగుమతుల విలువ 1.58లక్షల కోట్లు కాగా దిగుమతులు 1.88 ఉంటాయని, 2047 నాటికి మన ఎగుమతుల విలువ 8.67లక్షల కోట్ల డాలర్లుగా, దిగుమతులు 12.12లక్షల కోట్ల డాలర్లుగా ఉంటాయని జోశ్యం. దీని అర్ధం, భాష్యాన్ని సంస్కృత, వేదపండితులే చెప్పాలి. తేడా తగ్గాలి లేదా ఎగుమతులు పెరగాలి, దానికి విరుద్దంగా ఉంటుందని చెబుతున్నారు.ఇక ఇప్పుడు మన ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువగా ఎందుకున్నాయంటే మనదేశంలో వృద్ది పెరిగి ఎక్కువ మంది వస్తు వినియోగం చేస్తున్నారు గనుక ఇది నరేంద్రమోడీ సాధించిన ఘనత అన్నారు. అదే అయితే ఇబ్బడి ముబ్బడిగా దిగుమతులు చేసుకోక చైనా నుంచి విదేశీ కంపెనీలు మనదేశానికి వస్తున్నాయి, మేడిన్‌ ఇండియా, మేకిన్‌ ఇండియా, అన్నీ ఇక్కడి నుంచే అందరికీ ఎగుమతి చేస్తాం అన్న కబుర్లు ఎందుకు ? ఇప్పుడు చైనా దిగుమతులు తక్కువగా ఎగుమతులు ఎక్కువగా ఉన్నాయి గనుక డ్రాగన్‌ కంటే మనమే మెరుగ్గా ఉన్నట్లా ? దున్నబోతే దూడల్లో మెయ్యబోతే ఎద్దుల్లో అంటే ఇదే. కాంగ్రెస్‌ 50 సంవత్సరాల్లో చేసిందాన్ని తాను కేవలం తొలి ఐదేండ్లలోనే చేసి చూపించానన్నారు మోడీ. పదేండ్ల తరువాత ఏం చెప్పారు. ఇప్పటి వరకు చూపింది ట్రైలరే అసలైన సినిమా ముందు ఉంటుంది అన్నారు. వికసిత భారత్‌లో దిగుమతులే ఎక్కువ అంటే మన సొమ్మును విదేశాలకు పంపిస్తామని, విదేశాల్లో ఉన్న కార్మికులకు ఉపాధి చూపుతామని చెప్పటమే! నిజమేలే, ఎందుకంటే మోడీ విశ్వగురువు గనుక ప్రపంచమంతటి మంచి చెడ్డలు చూసుకోవాలి మరి !


అభివృద్ధి చెందిన దేశాల సరసన చేరాలనుకుంటే సంకల్పం చెప్పుకుంటే చాలదు. తాజాగా ప్రపంచ బ్యాంకు వెలువరించిన 2024 ప్రపంచ అభివృద్ధి నివేదిక మోడీ అండ్‌ కో ప్రచార గాలి తీసింది. అధికాదాయ స్థాయికి చేరేందుకు ప్రస్తుతం భారత్‌, చైనాలతో సహా 108దేశాలు తీవ్రమైన ఆటంకాలను ఎదుర్కొంటున్నాయని ఆ నివేదికలో పేర్కొన్నది. ఐఎంఎఫ్‌ 2024 అంచనా ప్రకారం అమెరికా తలసరి ఆదాయం 85,373, ప్రపంచ బ్యాంకు 2022 అంచనా మేరకు 76,330, ఐరాస 2021 లెక్కల ప్రకారం 69,185 డాలర్లు ఉంది. వీటిలో నాలుగో వంతు స్థాయికి అంటే ప్రపంచ బ్యాంకు మొత్తాన్నే తీసుకుంటే 19,082 డాలర్లకు చేరటానికి భారత్‌కు 75, ఇండోనేషియాకు 70, చైనాకు పది సంవత్సరాలు పడుతుందని ప్రపంచ బ్యాంకు పేర్కొన్నది.అదే ప్రపంచ బ్యాంకు తాజా అంచనాను పరిగణనలోకి తీసుకుంటే 21,343 డాలర్లు, కానీ వికసిత భారత్‌ 2047 నాటికి అంటే మరో 23 సంవత్సరాల్లోనే 18 నుంచి 20వేల డాలర్లకు చేర్చుతామన్నారు మోడీ. మన ప్రభుత్వం,నీతి ఆయోగ్‌ ఇచ్చిన లెక్కలు, సమాచారాన్నే ఆధారం చేసుకొని 75 సంవత్సరాలు పడుతుందని ప్రపంచ బ్యాంకు చెప్పింది. ఎక్కడన్నా పోలిక ఉందా ? తాను మానవ మాత్రుడిని కాదని తన పుట్టుక గురించిచెప్పిన మోడీ ఏదో శక్తి నడిపిస్తున్నదని కూడా అన్నారు. ప్రపంచ బ్యాంకు చెప్పినదాని ప్రకారం మోడీ మరో 75 సంవత్సరాలు ఇలాగే ఉండాలి. చూద్దాం, ఆ మాటలను నమ్మేవారి మనోభావాలను ఎందుకు గాయపరచాలి. త్వరలో చైనాను కూడా అధిగమిస్తామని రంగుల కలను చూపుతున్నారు. ప్రపంచ బ్యాంకు చెప్పినదాని ప్రకారం మన దేశం ఆరున్నర దశాబ్దాలు చైనా కంటే వెనుక ఉంటుంది.మనదేశం గురించి అనేక అంతర్జాతీయ సంస్థలు ఆకలితో సహా ఇచ్చిన సూచికలు వాస్తవ పరిస్థితిని ప్రతిబింబించటం లేదని కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. ప్రపంచబ్యాంకు జోశ్యం మీద ఎందుకు స్పందించలేదు ? మన నీతి ఆయోగ్‌ మన పాలకులు చెప్పినట్లు నివేదికలు రాస్తుంది, వాటినే నమ్మాలని జనానికి చెబుతుంది ? ప్రపంచబ్యాంకు మన విశ్వగురువు కనుసన్నలలో నడవదు, దాని విశ్లేషణను తిరస్కరిస్తే అదిచ్చే అప్పులు మనకు రావు. దాన్నుంచి అప్పులు తీసుకోవటం మానుకున్నారని, అది మోడీ ఘనత అని చెప్పారు. కానీ మన సర్కార్‌ తాజాగా హరిత ఇంథన అభివృద్ధి కోసం 150 కోట్ల డాలర్లు ఇప్పటికే అప్పు తీసుకుంది, అమరావతి నగరం కోసం15వేల కోట్ల రూపాయలకు సమానమైన మరో 180 కోట్ల డాలర్లకు హామీగా ఉండి ఆంధ్ర ప్రదేశ్‌కు అప్పు ఇప్పిస్తామని ఇటీవలనే ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రపంచ బ్యాంకును తప్పుపడితే అవేవీ రావు.


ప్రపంచ బాంకు చెప్పినదానికి ప్రాతిపదిక ఏమిటి ? గత ఐదు దశాబ్దాలలో జరిగినదాన్నుంచి తీసుకున్న పాఠాలే.2023 చివరి నాటికి ఉన్న స్థితి ప్రకారం 108దేశాలను మధ్య తరహా ఆదాయ తరగతిలో చేర్చారు.ఈ దేశాల్లో ప్రపంచ జనాభాలో నూటికి 75శాతం(ఆరువందల కోట్లు లేదా ప్రతి ముగ్గురిలో ఇద్దరు ) ఉన్నారు. వీరి తలసరి జిడిపి 1,136నుంచి 13,845 అమెరికన్‌ డాలర్ల వరకు ఉంది.అంతకంటే ఎక్కువ ఉన్న దేశాలు అరవై ఆరు ఉన్నాయి. మలేసియా 13,315 డాలర్లతో 67, చైనా 13,136 డాలర్లతో 68వదిగా ఉంది. మన దేశం మొత్తం 191దేశాలలో 2,71 డాలర్లతో 136వ స్థానంలో ఉంది. మంచి మాటలు చెబుతుంటే సానుకూలంగా (బి పాజిటివ్‌) ఉండాల్సింది పోయి, మన దేశంలో జరుగుతున్నదాన్ని ప్రశ్నించటం ఏమిటనే వారు రెండు రకాలు. ఏదో చెబుతున్నారుగా వ్యతిరేకంగా మాట్లాడటం ఎందుకు అనేవారు ఒకరు, అసలు ప్రశ్నించకూడదు అనే దుష్టాలోచన బుర్రలో పెట్టుకున్న వారు మరొకరు. దేన్నయినా ప్రశ్నించటం, సందేహం వెలిబుచ్చటం మానవనైజం. అదే జంతువుల నుంచి వేరే చేసింది. అందువలన ప్రశ్నించేవారు చెప్పేదాన్లో ఏముందో ఆలోచించాలా వద్దా ? స్వామివారు చెప్పింది వేదవాక్కు దాన్ని ప్రశ్నించకూడదు, ఇది తరతరాల భారత సంస్కృతి అనే పరిరక్షకుల కారణంగానే మన సమాజంలో ఎందుకు అనే జిజ్ఞాస పుచ్చి చచ్చిపోయింది. ఎండిపోయిన నదులను తిరిగి నీటితో నింపుతున్నారు, నిలిచిపోయిన జలలో తిరిగి నీరు వచ్చేట్లు చేస్తున్నారు. అలాంటపుడు చెవుల్లో సీసం పోసుకున్నవారిని ఎవరూ ఏమీ చేయలేముగానీ ఇతరుల్లో ఆలోచనను కలిగించలేమా ? ఎవరూ మనోభావాలను గాయపరచుకోనవసరం లేదు. ఎవడబ్బ సొమ్మని అంటూ భక్త రామదాసు రాముడినే ప్రశ్నించినపుడు ఏమిటీ వంచన అని పాలకులను ప్రశ్నించకూడదా ? బోధించు, సంఘటితపరుచు, పోరాడు అన్న అంబేద్కర్‌ను ఎవరైనా మరచిపోగలరా ! ఏ పదజాలం వెనుక ఏ ప్రయోజనం దాగున్నదో తెలుసుకోలేనంత కాలం జనం మోసపోతూనే ఉంటారు అన్న కమ్యూనిస్టు మహాశయుడు లెనిన్‌ బోధను విస్మరించగలమా ?


ప్రపంచ బ్యాంకు గ్రూప్‌ ప్రధాన ఆర్థికవేత్త, డెవలప్‌మెంట్‌ ఎకనమిక్స్‌ సంస్థ సీనియర్‌ ఉపాధ్యక్షుడు ఇందర్‌మిత్‌ గిల్‌ ప్రపంచ అభివృద్ధి నివేదిక 2024లో చెప్పిన అంశాలను ఎవరూ విస్మరించకూడదు. ” ప్రపంచ ఆర్థిక ఐశ్వర్యం కోసం జరిగిన పోరులో మధ్య తరహా ఆదాయ దేశాలు ఎక్కువగా విజయం సాధించటం లేదా ఓడిపోయాయి. అయితే అభివృద్ది చెందిన ఆర్థిక వ్యవస్థలుగా మారేందుకు వీటిలో చాలా ఎక్కువ దేశాలు కాలం చెల్లిన వ్యూహాలను అనుసరించాయి. అవి కేవలం భారీ పెట్టుబడుల మీద లేదా పరిణితి చెందకుండా నవకల్పనల మీద ఆధారపడ్డాయి. నూతన దృక్పధం అవసరం. ముందుగా పెట్టుబడుల మీద కేంద్రీకరించాలి తరువాత విదేశాల నుంచి నూతన సాంకేతికతలను చొప్పించాలి. తరువాత మూడు రకాల వ్యూహాన్ని అనుసరించాలి.ఒకటి సమతుల్యమైన పెట్టుబడులు, నూతన సాంకేతికతల చొప్పింపు,నవకల్పనలుగా అది ఉండాలి. పెరుగుతున్న జనాభా, పర్యావరణ, భౌగోళిక రాజనీతి సంబంధమైన వత్తిడులుంటాయి గనుక తప్పు చేసేందుకు ఆస్కారమివ్వకూడదు. గంగలో మునిగితే కరోనా సోకదు, గోవధ కారణంగానే వయనాడులో ప్రకృతి ప్రళయం సంభవించిందని చెప్పే ప్రబుద్దులు, వేదాల్లోనే అన్నీ ఉన్నాయష అంటూ అమానుష మనుధర్మాన్ని తిరిగి ప్రవేశపెట్టాలని చూస్తున్న శక్తులు చెలరేగుతున్నవేళ ఇలాంటి హితోక్తులను పట్టించుకుంటారా ? దేశాన్ని ముందుకు తీసుకుపోతారా ? ఇలాంటి వారి మార్గదర్శనంలో 75 కాదు, మరో 75 సంవత్సరాలు గడిచినా అమెరికాలో నాలుగోవంతు సంవపదల స్థాయికి చేరగలమా ? ఇప్పుడు కావాల్సింది పుట్టుకతో వృద్దులు, తాతగారి నాన్నగారి భావాలకు దాసులు కాదు.పావన నవ జీవన బృందావన నిర్మాతలు, కాదంటారా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన చైనా : పధ్నాలుగు పాలస్తీనా విముక్తి సంస్థల ఒప్పందం !

01 Thursday Aug 2024

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, International, INTERNATIONAL NEWS, Left politics, Opinion, USA, WAR

≈ Leave a comment

Tags

Fatah, Hamas and Fatah agreement, Hamas Israel, Israel genocide, Palestine Solidarity Day, Xi Jinping


ఎం కోటేశ్వరరావు


మధ్యప్రాచ్య చరిత్రలో మరో చారిత్మాత్మక ఘట్టానికి తెరలేచింది.పాలస్తీనా విముక్తికోసం పోరాడుతున్న పధ్నాలుగు ప్రజా సంస్థలు, పార్టీలు తమ విబేధాలకు స్వస్తిపలుకుతూ ఐక్యతను పటిష్ట పరిచేందుకు 2024జూలై చివరి వారంలో చైనా మధ్యవర్తిత్వంలో ఒక ఒప్పందానికి వచ్చాయి. వీటిలో ఉప్పు-నిప్పుగా ఉన్న ఫతా – హమస్‌ కూడా ఉండటం విశేషం.ఈ ఒప్పందం పధ్నాలుగు సంస్థల ఐక్యత, అవి సమాధానపరుచుకోవటానికి అంకితమని చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యి ప్రకటించాడు. గతేడాది అక్టోబరు ఏడు నుంచి ఇజ్రాయెల్‌ మిలిటరీ పాలస్తీనాలోని గాజా ప్రాంతంలో సాగిస్తున్న మారణకాండ, పశ్చిమగట్టు ప్రాంతంలో సాగిస్తున్నదాడులు, అరబ్బు ప్రాంతాల ఆక్రమణలు కొనసాగిస్తున్న పూర్వరంగంలో ఈ ఒప్పందం కుదిరింది. పాలస్తీనా పౌరులందరికీ ఏకైక అధీకృత ప్రతినిధిగా పాలస్తీనా విముక్తి సంస్థ(పిఎల్‌ఓ)ను గుర్తించటం దీనిలో కీలకమైన అంశం.ప్రస్తుతం కొనసాగుతున్న గాజా మారణకాండ అనంతర పాలనతో పాటు తాత్కాలిక జాతీయ ప్రభుత్వ ఏర్పాటుకు కూడా అంగీకారం కుదిరింది.పశ్చిమాసియాలో చిచ్చుపెట్టి తన ఆధిపత్యాన్ని నెలకొల్పుకొనేందుకు అమెరికా కుట్రలు పన్నుతుండగా వాటిని వమ్ముచేసే క్రమంలో ఐక్యతను సాధించేందుకు చైనా తన పలుకుబడి, అనుభవాన్ని వినియోగిస్తున్నది. ఈ క్రమంలో ఇది రెండవ ఉదంతం. ఇరాన్‌-సౌదీ అరేబియా మధ్య సయోధ్యను కుదిర్చిన సంగతి తెలిసిందే. ఈ ఒప్పందంలో నాలుగు ప్రధాన అంశాలున్నాయి. తాత్కాలిక జాతీయ ఐక్యతా ప్రభుత్వం ఏర్పాటు,భవిష్యత్‌ ఎన్నికలకు ముందు ఐక్య నాయకత్వ పొందిక, నూతన పాలస్తీనా జాతీయ మండలికి స్వేచ్చగా ఎన్నికలు, ఇజ్రాయెల్‌ దాడుల పూర్వరంగంలో ఐక్యతా ప్రకటన. తాము చారిత్రాత్మక కూడలిలో ఉన్నామని, తమ పోరాటాలకు జనం స్పందిస్తున్నందున ఇంతకు మించి మరొక మార్గం లేదని చర్చలలో పాల్గన్న సంస్థల ప్రతినిధులు చెప్పారు.గాజాలో జరుగుతున్న మారణకాండే ఈ ఐక్యత వెనుక ప్రధాన కారణం అని వేరే చెప్పనవసరం లేదు. ఐక్యతా ఒప్పందం పాలస్తీనా పార్టీల అంతర్గత వ్యవహారం, అయితే అంతర్జాతీయ సమాజ మద్దతు లేకుండా సాధించలేరని చైనా ప్రతినిధి లిన్‌ జియాన్‌ చెప్పాడు. ఈ ఒప్పందాన్ని వమ్ము చేసేందుకు అమెరికా, ఇజ్రాయెల్‌ సకల యత్నాలూ చేస్తాయి.ముఖ్యంగా ఫతా సంస్థను రెచ్చగొట్టేందుకు, వత్తిడి పెంచేందుకు ఇప్పటికే రంగంలోకి దిగాయి.


పాలస్తీనా విముక్తి సంస్థ అనేక పార్టీలు, సంస్థలతో కూడిన ఒక ఉమ్మడి వేదిక. యాసర్‌ అరాఫత్‌ దీని నేతగా ఉన్న సంగతి తెలిసిందే.1993లో ఇజ్రాయెల్‌తో ఓస్లో ఒప్పందం చేసుకుంది. దాని ప్రకారం ఇజ్రాయెల్‌ ఆక్రమిత గాజా-పశ్చిమ గట్టు ప్రాంతంలో పాలస్తీనా సాధికార సంస్థ(పిఏ) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దీనిలో, అదే విధంగా పిఎల్‌ఓలో కూడా ఫతా అనే పార్టీ ప్రధాన పాత్రధారిగా ఉంది.ఈజిప్టు కేంద్రంగా పని చేస్తున్న ముస్లిం సోదరత్వం అనే సంస్థ ప్రభావం పక్కనే ఉన్న గాజా ప్రాంతంపై ఉంది. దానితో సంబంధం ఉన్న శక్తులు 1987లో హమస్‌గా ఉనికిలోకి వచ్చాయి. పిఎల్‌ఓ, దానిలో ఉన్న భాగస్వామ్య పక్షాలతో దానికి ఏకీభావం లేదు. ఓస్లో ఒప్పందాలలో భాగస్వామి కాదు. ఇజ్రాయెల్‌ ఉనికిని అది గుర్తించలేదు. పాలస్తీనా సాధనకు సాయుధ పోరాటాన్ని మార్గంగా ఎంచుకుంది. ఆ తరువాత జరిగిన పరిణామాల్లో గాజాలో తిరుగులేని రాజకీయ,మత,సాయుధ శక్తిగా ఎదగటమే కాదు, ఎన్నికల్లో తన సత్తాను చూపి అధికారానికి కూడా వచ్చింది.పశ్చిమగట్టు ప్రాంతంలో ఫతా పార్టీ అధికారంలో ఉంది.పాలస్తీనా విముక్తి కోసం అనేక సంస్థలు తమవైన పద్దతుల్లో పోరాడుతున్నాయి.కొన్ని అంశాలు, పద్దతులపై వాటి మధ్య ఏకీభావం లేని మాటవాస్తవం. దీన్ని అవకాశంగా తీసుకొని సామ్రాజ్యవాదుల మద్దతుతో ఇజ్రాయెల్‌ అణచివేతకు, తాజాగా గాజాలో మారణకాండకు పూనుకుంది.ఇజ్రాయెల్‌ను అధికారికంగా హమస్‌ గుర్తించకపోయినా 1967నాటి సరిహద్దుల ప్రాతిపదికన పాలస్తీనా ఏర్పాటు జరగాలని 2017లో అది చేసిన ప్రతిపాదనకు అర్ధం పరోక్షంగా అంగీకరించినట్లే.


పాలస్తీనా నేషనల్‌ ఇనీషియేటివ్‌ సంస్థ అధ్యక్షుడు ముస్తఫా బర్గౌటీ తాజా ఒప్పందం గురించి మాట్లాడుతూ అన్ని పక్షాలూ పిఎల్‌ఓలో చేరేందుకు అంగీకరించాయని అదొక్కటే పాలస్తీనియన్ల నిజమైన ప్రతినిధి అన్నాడు. రెండు భిన్న పార్టీల పాలనలో ఉన్న పాలస్తీనాలోని గాజా-పశ్చిమ గట్టు ప్రాంతాలను ఒకే పాలనా వ్యవస్థ కిందకు తెచ్చేందుకు 2017లో హమస్‌-ఫతా మధ్య కుదిరిన ఒప్పందం అమలు కాలేదు.2007వరకు గాజా కూడా ఫతా నాయకత్వంలోని ప్రభుత్వ ఆధీనంలోనే ఉంది. అదే ఏడాది అధికారానికి వచ్చిన హమస్‌ యంత్రాంగం ఫతాను అక్కడి నుంచి బహిష్కరించింది. కొన్ని అరబ్‌ దేశాలూ, ఈజిప్టు తెచ్చిన ఒత్తిడి మేరకు పదేండ్ల వైరాన్ని విరమించుకొనేందుకు చేసుకున్న ఒప్పందం విఫలమైంది. పాలస్తీనా అధారిటీ ప్రధాన మంత్రి రామీ హమదల్లా 2018లో గాజా సందర్శనకు వచ్చినపుడు హత్యాయత్నం జరిగింది. దానికి హమసే కారణమని ఫతా ఆరోపించింది. గతం కంటే నిర్దిష్టంగా కొన్ని చర్యలు తీసుకొనేందుకు తాజా ఒప్పందంలో అంగీకరించినట్లు ముస్తఫా చెప్పారు. మొత్తంగా పాలస్తీనాను అంతం చేసేందుకు ఇజ్రాయెల్‌ పూనుకున్నందున దానికి వ్యతిరేకంగా ఐక్యమౌతున్నట్లు చెప్పారు. ఏకాభిప్రాయ సాధనతో ఉమ్మడి ప్రభుత్వం ఎప్పుడు ఏర్పడుతుందనే అంశంపై కూడా ఒప్పంద పక్షాల్లో స్పష్టత ఉన్నట్లు కనిపిస్తోంది. ఒక వైపు అమెరికా ఇతర దేశాల అండచూసుకొని ఇజ్రాయెల్‌ మారణకాండను కొనసాగిస్తూనే ఉంది. అది ముగిసిన తరువాత ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడుతుందా ? బీజింగ్‌ ఐక్యతా చర్చల్లో పాల్గొన్న హమస్‌ ప్రతినిధి హసమ్‌ బద్రన్‌ మాట్లాడుతూ ధ్వంసమైన ప్రాంతాల పునర్‌నిర్మాణం, తగిన సమయంలో ఎన్నికలు జరపాలన్న నిర్ణయం జరిగిందని, అయితే దాడులు కొనసాగుతున్నప్పటికీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడవచ్చని, అది కాల్పుల విరమణకు దోహదం చేయవచ్చన్నాడు. ఈ ఏడాది ఏప్రిల్‌లో బీజింగ్‌లో హమస్‌-ఫతా ప్రతినిధుల మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి.తరువాత చైనా నేత షీ జింపింగ్‌ మధ్య ప్రాచ్య దేశాలకు ప్రత్యేక రాయబారిని పంపి అంతర్జాతీయ శాంతి సభ జరపటానికి గల అవకాశాలను పరిశీలించారు. ఈప్రక్రియకు ముందు ఇరాన్‌-సౌదీ అరేబియా మధ్య చెలిమి అసాధ్యం అనుకున్న దాన్ని చైనా సుసాధ్యం గావించింది.మధ్య ప్రాచ్యం, పశ్చిమాసియాలో అమెరికాతో పోలిస్తే చైనా పాత్ర పరిమితమే. అయినప్పటికీ తంపులు పెట్టే అమెరికాతో పోలిస్తే దానికి భిన్నమైన వైఖరితో ఉన్నందున బీజింగ్‌ పట్ల విశ్వసనీయత పెరుగుతోంది.


గాజాలో మారణకాండ పూర్వరంగంలో అంతర్జాతీయ సమాజ అభిప్రాయం ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా మారుతున్నది. గత 57 సంవత్సరాలుగా తూర్పు జెరూసలెం, గాజా, పశ్చిమ గట్టు ప్రాంతాలను ఆక్రమించటం చట్టవిరుద్దమని అంతర్జాతీయ న్యాయ స్థానం(ఐసిజె) వ్యాఖ్యానించింది. ఓస్లో ఒప్పందం ప్రకారం పశ్చిమ గట్టు ప్రాంతంలలో పాలస్తీనా అధారిటీ పాలన కొనసాగుతున్నప్పటికీ యూదుల నివాసాల ముసుగులో ఇజ్రాయెల్‌ దురాక్రమణలు కొనసాగుతూనే ఉన్నందున ఫతా సంస్థ వైఖరిలో మార్పురాక తప్పలేదు. ఈ ఏడాది ఇప్పటి వరకు 23.7చదరపు కిలోమీటర్ల మేర ఇజ్రాయెల్‌ ఆక్రమించిందని పీస్‌ నౌ అనే స్వచ్చంద సంస్థ పేర్కొన్నది.గత రెండు దశాబ్దాల్లో ఆక్రమించినదానికంటే ఇది ఎక్కువ. అమెరికా మధ్యవర్తిత్వలో 1993లో కుదిరిన ఓస్లో ఒప్పందం ప్రకారం పశ్చిమ గట్టును ఏబిసి ప్రాంతాలుగా విభజించారు. ఏ తరగతి పాలస్తీనా అధారిటీ ఏలుబడిలో, బి ప్రాంతాలు ఇజ్రాయెల్‌-పాలస్తీనా ఉమ్మడి పాలన, సి ప్రాంతాలు ఇజ్రాయెల్‌ ఆధీనంలో ఉంటాయి. మూడవ ప్రాంతంలో యూదుల నివాసాల ఏర్పాటుతో పాటు అరబ్బు రైతాంగాన్ని ఇజ్రాయెల్‌ క్రమంగా తొలగిస్తున్నది.పాలస్తీనా పశ్చిమ గట్టు ప్రాంతంలో 1990దశకంలో ఇజ్రాయెల్‌ తీసుకువచ్చిన యూదుల సంఖ్య రెండున్నర లక్షలు కాగా ప్రస్తుతం ఏడు లక్షలకు పెరిగారు. పాలస్తీనా రాజధానిగా ఉండే తూర్పు జెరూసలెంలో అలాంటి వారిని 800 నుంచి మూడు వేలకు పెంచారు. గాజాలో మారణకాండ ప్రారంభించిన ఇజ్రాయెల్‌ పశ్చిమ గట్టు ప్రాంతంలో కూడా దాడులకు పూనుకుంది. ఇప్పటి వరకు 513 మంది పాలస్తీనియన్లను మిలిటరీ చంపివేసింది.వందలాది మందిని గాయపరచింది.ప్రతి ఏటా ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతూనే ఉంది.


ఒప్పందాన్ని తామింకా సమీక్షించలేదంటూ గాజాలో హమస్‌ పాత్రను తాము సమర్ధించే ప్రసక్తే లేదని అమెరికా ప్రకటించింది. ఒక ఉగ్రవాద సంస్థకు ప్రభుత్వంలో పాత్ర ఉండకూడదని ప్రతినిధి మిల్లర్‌ చెప్పాడు.ప్రస్తుత యుద్ధం ముగిసిన తరువాత రెండు ప్రాంతాల్లో ఒకే ప్రభుత్వం ఉండాలని తాము కోరుకుంటున్నట్లు చెప్పాడు. పాలస్తీనా ఐక్యతా ఒప్పందం అమలు జరుగుతుందా ? భాగస్వామ్య పక్షాలు కట్టుబడి ఉంటాయా, భవిష్యత్‌లో హమస్‌ పాత్ర ఏమిటి అంటూ మీడియా, ప్రభుత్వాలలో చర్చలు జరుగుతున్నాయి. ఐక్యతను దెబ్బతీసేందుకు చాణక్య నీతిని ప్రయోగించేందుకు అమెరికా, ఇతర పశ్చిమదేశాలు చూస్తున్నాయి. సందేహాలు లేవనెత్తుతున్నవారందరినీ ఒకేగాటన కట్టలేము గానీ కొన్ని ఆచరణాత్మక సమస్యలు ముందుకు వచ్చినప్పటికీ మొత్తానికే ఎసరు పెడుతున్న సామ్రాజ్యవాదుల కుట్ర, చర్యల కారణంగా వాటిని పరిష్కరించుకొనే పరిణితిని పాలస్తీనా సంస్థలు ప్రదర్శిస్తాయి.దానిలో పెద్ద ముందడుగే తాజా ఒప్పందం.ఒప్పందమైతే జరిగింది గానీ దాని అమలు గురించి అనేక మందికి సందేహాలున్నా అవసరాలు వివిధ పక్షాల వైఖరుల్లో మార్పులకు దోహదం చేస్తున్నాయి.అనేక పరిణామాలను చూసినపుడు ప్రతి పాలస్తీనా సంస్థ అనేక గుణపాఠాలు నేర్చుకుంది. ఐక్యత కోసం రాజీలకు, సర్దుబాట్లకు సిద్దంగాక తప్పని స్థితిలో పడ్డాయి. మొదటికే మోసం తెస్తున్న ఇజ్రాయెల్‌ను నిలువరించటం ప్రధమ కర్తవ్యంగా భావించాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

వెనెజులా ఎన్నికల్లో ఫాసిస్టులకు శృంగభంగం : మూడోసారి సోషలిస్టు మదురో విజయం !

31 Wednesday Jul 2024

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, Latin America, Left politics, Opinion, RUSSIA, USA

≈ Leave a comment

Tags

Chavez, Nicolás Maduro Moros, Venezuela election 2024, venezuelan chavista


ఎం కోటేశ్వరరావు


జూలై 28న జరిగిన వెనెజులా ఎన్నికల్లో అమెరికా మద్దతు ఉన్న మితవాద,ఫాసిస్టు శక్తులు చావు దెబ్బతిన్నాయి. సోషలిస్టు పార్టీ నేత నికోలస్‌ మదురో మూడవ సారి ఎన్నికయ్యాడు.పదవీ కాలం ఆరు సంవత్సరాలు(2031వరకు) పదవిలో ఉంటాడు. ఈ ఎన్నికల్లో మదురోను ఓడించేందుకు అమెరికా నాయకత్వంలోని వామపక్ష వ్యతిరేకశక్తులన్నీ తీవ్రంగా ప్రయత్నించాయి.ఎన్నికల ఫలితాల తరువాత కూడా అక్రమాలు జరిగాయని, గుర్తించబోమని నానా యాగీ చేస్తున్నాయి.మరోవైపు దేశమంతటా నిరసన ప్రదర్శనలకు పిలుపునిచ్చాయి. మదురోకు మద్దతుగా కూడా అనేక చోట్ల జనం వీధుల్లోకి వస్తున్నట్లు వార్తలు. ఎన్నికల కమిషన్‌ ప్రకటించిన వివరాల మేరకు మదురోకు 53.67శాతం ఓట్లు రాగా ప్రత్యర్థి ఎడ్మండో గోన్‌సాల్వెజ్‌కు 46.33శాతం వచ్చాయి. మరోవైపున ఇతగాడిని సమర్ధించిన డెమోక్రటిక్‌ యూనిటీ ఫ్లాట్‌ ఫాం(డియుపి) గోన్‌సాల్వెజ్‌కు 69.46శాతం రాగా మదురోకు 30.54శాతం వచ్చినట్లు పోటీగా ఫలితాలను ప్రకటించింది. ఇది అమెరికా కనుసన్నలలో పనిచేసే ప్రతిపక్ష పార్టీలు, శక్తుల కూటమి. మదురోకు వ్యతిరేకంగా ప్రదర్శలకు దిగిన శక్తుల మద్దతుదార్లు అనేక చోట్ల దివంగత మాజీ అధ్యక్షుడు హ్యూగో ఛావెజ్‌ విగ్రహాలు, చిహ్నాలను ధ్వంసం చేస్తున్నారు. చావెజ్‌ రాజకీయ వారసుడిగా మదురో రంగంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. మంగళవారం నాడు ఇది రాసిన సమయానికి కొందరు ప్రదర్శకులు అధ్యక్ష భవనంపై దాడికి వెళుతున్నట్లు, దేశమంతటా రోడ్ల దిగ్బంధనానికి పూనుకున్నట్లు వార్తలు వచ్చాయి. ప్రభుత్వాన్ని కూల్చివేస్తామని నినాదాలు చేస్తున్నారు. ముందే ఇలాంటి పరిణామాలను ఊహించిన కారణంగా రాజధాని కారకాస్‌ నగరంతో సహా దేశమంతటా పోలీసు,జాతీయ భద్రతా దళాలను పెద్ద ఎత్తున మోహరించారు. ఎన్నికలకు ముందు ప్రతిపక్ష గోన్‌సాల్వెజ్‌కు పరిస్థితి అనుకూలంగా ఉన్నట్లు సర్వేలు పేర్కొన్నాయని, ఫలితాలు వాటిని ప్రతిబింబించలేదని అమెరికా వ్యాఖ్యానించింది.ప్రజల ఆకాంక్షను ఫలితాలు ప్రతిబింబించలేదని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ వ్యాఖ్యానించాడు. చైనా, రష్యా, క్యూబా మరికొన్ని దేశాలు మదురోను అభినందించాయి. 2018 ఎన్నికల్లో కూడా సర్వేలన్నీ మదురోకు వ్యతిరేకంగా, ప్రతిపక్ష అభ్యర్థి ముందంజలో ఉన్నట్లే చెప్పాయి. అవన్నీ మదురోను వ్యతిరేకించే శక్తులు వండి వార్చిన కతలు తప్ప మరొకటి కాదు. తన ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కూల్చివేసేందుకు కుట్ర జరిగిందని అధ్యక్షుడు మదురో టీవీ ప్రసంగంలో దేశ పౌరులకు చెప్పాడు. దీని గురించి ముందే తెలుసని అయితే చట్టాన్ని గౌరవిస్తామని, తన మద్దతుదార్లు ప్రశాంతంగా ఉండాలని కోరాడు.”నేను నికోలస్‌ మదురో మోరోస్‌ వెనెజులా బొలివేరియన్‌ రిపబ్లిక్‌ అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికయ్యాను. మన ప్రజాస్వామ్యం, చట్టం, పౌరులను కాపాడతాను ” అని ఎన్నికల ఫలితాలు వెల్లడి కాగానే మదురో ప్రకటించాడు.


2013లో ఛావెజ్‌ మరణించిన తరువాత అధికారానికి వచ్చిన నికోలస్‌ మదురో అనేక సవాళ్లు, కుట్రలను ఎదుర్కొంటున్నాడు. ప్రధాన రాబడి వనరైన చమురు అమ్మకాలు, రవాణాపై అనేక ఆంక్షలు, దిగ్బంధనాలతో అమెరికా, లాటిన్‌ అమెరికాలోని దాని మిత్రదేశాలు, ఐరోపా యూనియన్‌ దేశాలూ ఇబ్బందులు పెట్టేందుకు, జనాన్ని రెచ్చగొట్టేందుకు చూస్తున్నాయి. ఎన్నికల ఫలితాలపై ప్రపంచ దేశాల స్పందన వెలువడింది. లాటిన్‌ అమెరికాలో వామపక్ష వాదులను సమర్ధించేదేశాలు మదురోకు శుభాకాంక్షలు పలకగా వ్యతిరేక దేశాలు ప్రతికూలంగా స్పందించాయి. వెనెజులా కమ్యూనిస్టు పార్టీతో సహా చిలీలోని వామపక్ష ప్రభుత్వం ఎన్నికలు సక్రమంగా జరిగినట్లు వివరాలను వెల్లడించాలని ప్రకటించటం గమనించాల్సిన అంశం. సకాలంలో ఫలితాలతో పాటు పోలింగ్‌ కేంద్రాల వారీ ఓటింగ్‌ వివరాలను వెంటనే ప్రకటించాలని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ కోరినట్లు ప్రతినిధి ప్రకటించాడు. మదురోను వ్యతిరేకించేదేశాలు రంగంలోకి దిగాయి. అమెరికా దేశాల సంస్థ (ఓఏఎస్‌) అత్యవసర సమావేశం జరిపి ఫలితాలను సమీక్షించాలని కోరుతున్నాయి. వాస్తవాలు తేలేవరకు వెనెజులాతో దౌత్య సంబంధాలను స్ధంభింపచేస్తున్నట్లు పనామా ప్రకటించింది. పూర్తి సమీక్ష జరిపే వరకు కారకాస్‌లో ఉన్న తమ దౌత్య సిబ్బందిని వెనక్కు పిలిపిస్తున్నట్లు పేర్కొన్నది. ఫలితాలను అంగీకరించని, వ్యతిరేకించిన పనామా, పెరు, అర్జెంటీనా, చిలీతో సహా ఏడు దేశాల నుంచి తాను కూడా దౌత్య సిబ్బందిని ఉపసంహరిస్తున్నట్లు మదురో ప్రకటించాడు. ఎన్నికల పరిశీలకులను పంపిన కార్టర్‌ సెంటర్‌ కూడా పోలింగ్‌ కేంద్రాల వారీ ఫలితాలను ప్రకటించాలని కోరింది.ఈ సారి ఎలాగైనా మదురో, వామపక్ష శక్తులను దెబ్బతీస్తామని కలలు గన్న తిరోగామి శక్తులు ఆశాభంగం చెందినట్లు స్పందనలు వెల్లడించాయి. ఫలితాలను ఆలశ్యం చేసేందుకు, లెక్కింపు ప్రక్రియను దెబ్బతీసేందుకు జరిగిన ప్రయత్నాలపై దర్యాప్తు జరుపుతున్నట్లు అటార్నీ జనరల్‌ తారెక్‌ సాబ్‌ ప్రకటించాడు. తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకొంటున్న లిమా విదేశీ శక్తుల బృందాన్ని ఖండిస్తున్నట్లు విదేశాంగ మంత్రి యవన్‌ గిల్‌ ప్రకటించాడు. తొత్తు ప్రభుత్వాన్ని రుద్దేందుకు ఇప్పుడే కాదు 2019లో కూడా ప్రయత్నించారని అన్నాడు.వెనెజులా చట్టం ప్రకారం స్వతంత్ర పరిశీలకు ప్రతి పోలింగ్‌ బూత్‌లో లెక్కింపు జరిగి ఫలితాలను సరి చూసేందుకు, రాతపూర్వంగా ఫలితాలను పొందేందుకు అవకాశం ఉంది. ఫలితాలు వెలువడి మదురో గెలిచినట్లు ప్రకటించిన తరువాత అంతర్జాతీయ పరిశీలకు తనిఖీకి అనుమతించాలని ప్రతిపక్షాలు కొత్త పల్లవి అందుకున్నాయి.


గత పాతిక సంవత్సరాలుగా వెనెజులాలో వామపక్ష ఉద్యమం, ప్రభుత్వాలను కూల్చివేసేందుకు దేశంలోని తిరోగామి శక్తులు, వాటికి మద్దతు ఇస్తున్న అమెరికా చేయని కుట్ర లేదు. ఫాసిస్టు శక్తులు ఎప్పటికప్పుడు ఊసరవెల్లి మాదిరి రూపాన్ని మార్చుకొని ముందుకు వస్తున్నాయి.జనంలో వాటికి ఆదరణ లేకపోవటంతో జాతీయవాదంతో ఆకర్షించాలని చూస్తున్నాయి. అమెరికా తొత్తులుగా పనిచేస్తున్నాయి. ఎన్నికుట్రలు చేసినా, ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు కలిగించినా అధికారానికి వచ్చిన వామపక్షశక్తులు ఉన్నంతలో కార్మికవర్గాన్ని కాపాడేందుకు చిత్తశుద్దితో చేస్తున్న ప్రయత్నాల కారణంగా వాటి ఆటలు సాగటం లేదు. దీని అర్ధం వెనెజులాకు వాటితో ముప్పు లేదని కాదు.మదురో అనుసరిస్తున్న విధానాలన్నీ సరైనవే అని కాదు. వెనెజులా ఎన్నికల్లో పాల్గొనేవారి శాతం క్రమంగా తగ్గుతున్నది. మదురో విధానాలను కాపాడుకోవాలని జనాల్లో కోరిక బలంగా ఉంటే ఎన్నికల్లో పాల్గొనేవారి శాతం పెరగాల్సి ఉంది. కానీ 2013లో 79.65శాతం మంది పాల్గొంటే 2018లో 45.73శాతానికి పడిపోయింది. ఈ సారి 44.85శాతానికి తగ్గింది. 2018 ఎన్నికల్లో మదురోకు 67.85శాతం ఓట్లు రాగా ఇప్పుడు 53.67శాతమే వచ్చాయంటే కొన్ని తరగతుల్లో అసంతృప్తి ఉందన్నది స్పష్టం. పోయిన సారి మదురో మీద పోటీచేసిన ప్రత్యర్ధులలో ఇద్దరికి 20.93-10.75 శాతాల చొప్పున వచ్చాయి. ఈ సారి ఒకే అభ్యర్ధి రంగంలో ఉన్నాడు. ఛావెజ్‌ అనుసరించిన సామ్రాజ్యవాద వ్యతిరేక విధానాలను మదురో కూడా కొనసాగిస్తున్నప్పటికీ అంతర్గత విధానాల మీద వెనెజులా కమ్యూనిస్టు పార్టీ(పిసివి) ఇతర కొన్ని వామపక్ష పార్టీలు విమర్శనాత్మక వైఖరితో ఉన్నాయి.లాటిన్‌ అమెరికాలో అధికారానికి వచ్చిన ఇతర వామపక్ష నేతల మాదిరిగానే మదురో కూడా పెట్టుబడిదారీ విధాన పునాదులను ముట్టుకోకుండా సంస్కరణలతో, సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నారు. ఈ క్రమాన్ని విబేధించిన వామపక్ష శక్తులను సహించటం లేదని కమ్యూనిస్టు పార్టీ విమర్శించింది.


గతంలో ఛావెజ్‌, మదురో ప్రభుత్వానికి వెలుపలి నుంచి మద్దతు ఇచ్చిన కమ్యూనిస్టు పార్టీ ఇటీవలి సంవత్సరాలలో మదురో విధానాలతో విబేధిస్తున్నది. తన విధానాలను విమర్శించిన వామపక్ష శక్తులను ప్రతి పక్షపార్టీల ఏజంట్లుగా మదురో దాడి చేశాడు. ఛావెజ్‌ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చూస్తే ఏ కమ్యూనిస్టు లేదా వామపక్ష పార్టీగానీ ప్రతిపక్ష మితవాద శక్తులను సమర్దించిన దాఖలా లేదు. విమర్శనాత్మకంగా ఉంటూనే సోషలిస్టు ప్రభుత్వాలకు మద్దతు ఇచ్చాయి. ప్రస్తుతం కమ్యూనిస్టు పార్టీకి పార్లమెంటులో ఒక స్థానం, ఎనిమిది మంది మేయర్లు ఉన్నారు. తమ పార్టీ నేతల మీద విచారణకు ఆదేశించిన ప్రభుత్వ చర్యను వెనెజులా కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి ఆస్కార్‌ ఫిగుయెరా గోన్‌సాల్వెజ్‌ ఖండించాడు.పార్టీ నిబంధనావళి ప్రకారం ఎన్నికైన నేతల స్థానే వేరే వారిని ఎంచుకోవాలని కోర్టు చెప్పటం అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోవటమే అని పార్టీ విమర్శించింది. కోర్టు సూచించిన ఏడుగురు పార్టీ సభ్యులు కూడా కాదని అందువలన అది చట్టవిరుద్దమని కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్లీనరీ సమావేశం పేర్కొన్నది. వారితో పోటీ పార్టీ సమావేశాలను కూడా ఏర్పాటు చేయించారు. ఛావెజ్‌ హయాంలో ప్రారంభించిన అనేక సంక్షేమ కార్యక్రమాలను మదురో రద్దుచేశారని, పౌరసేవలు దిగజారినట్లు కూడా పేర్కొన్నది.కార్మికుల ఆదాయాలు, హక్కులకు కోత పెట్టిందని, సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు వేతనాల పెంపుదల, ప్రైవేటు గుత్త సంస్థల రద్దు వంటి విప్లవాత్మక చర్యలు చేపట్టటానికి బదులు ఉదారవాద సంస్కరణలకే పరిమితం అయ్యారని పేర్కొన్నది. అమెరికా డాలర్ల చలామణిని స్వేచ్చగా అనుమతించటాన్ని, మారకపు విలువపై అదుపును వదలివేశారని, దిగుమతులపై పన్ను రద్దు చేయటాన్ని అనేక మంది ఆర్థికవేత్తలు తప్పు పట్టారు.మదురో ఆచరణాత్మక విధానాలను అనుసరిస్తున్నారని కొందరు సమర్దిస్తే నయా ఉదారవాద విధానాలు తప్ప మరొకటి కాదని కమ్యూనిస్టు పార్టీ స్పష్టం చేసింది. అంతే కాదు, తనతో పాటు కలసివచ్చే వామపక్ష పార్టీలను కలుపుకొని ప్రజా విప్లవ ప్రత్యామ్నాయం పేరుతో ఒక కూటమని ఏర్పాటు చేసింది.ఈ కూటమిలో కమ్యూనిస్టు పార్టీతో సహా మరో నాలుగు పార్టీల నాయకత్వాన్ని మార్చాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కార్యాలయం మీద పోలీసులు దాడి చేశారు. ఇటీవలి కాలంలో అనేక రంగాలలో కార్మికులు జరుపుతున్న పోరాటాలకు కమ్యూనిస్టు పార్టీ మద్దతు ప్రకటించింది, దీంతో కొంత మందిని పోలీసులు అరెస్టు చేశారు. గతేడాది కార్మికుల పోరాటాలు అంతకు ముందు ఏడాడి కంటే వెయ్యి రెట్లు ఎక్కువ పెరిగాయి.కమ్యూనిస్టు పార్టీ లేదా మరొక పార్టీలో అంతర్గత సమస్యలేవైనా ఉంటే వారు తేల్చుకుంటారు తప్ప కోర్టులు నాయకత్వాన్ని సూచించటం అప్రజాస్వామికం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

రెండుగా చీలిన అమెరికా సమాజం : డోనాల్డ్‌ ట్రంప్‌ గెలుపు-ఓటమిపై సమీకరణ ! కమలా హారిస్‌ వైపు మొగ్గు !!

24 Wednesday Jul 2024

Posted by raomk in Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, Opinion, Politics, USA

≈ Leave a comment

Tags

#US Elections 2024, Donald trump, Joe Biden, Kamala Harris


ఎం కోటేశ్వరరావు


అమెరికా అధ్యక్షుడు, రెండవసారి పోటీచేసేందుకు ప్రయత్నించిన డెమోక్రటిక్‌ పార్టీ నేత జో బైడెన్‌ తాను పోటీ పరుగు నుంచి తప్పుకుంటున్నట్లు ఆదివారం నాడు ప్రకటించటమే కాదు, అధ్యక్షపదవి అభ్యర్థిగా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ను బలపరుస్తున్నట్లు వెల్లడించారు. అమెరికా చరిత్రలో అధికారంలో ఉండి పోటీ నుంచి తప్పుకున్న తొలి వ్యక్తిగా చరిత్రకెక్కాడు. ముదిమితో మతి తప్పి మాట్లాడుతున్న 81ఏండ్ల బైడెన్‌ పోటీ నుంచి వైదొలగి వేరొకరికి అవకాశం ఇవ్వాలన్న వత్తిడి గత కొద్ది వారాలుగా వచ్చింది. అయినప్పటికీ పోటీలో ఉంటానని చెప్పిన పెద్దమనిషి ఆకస్మికంగా ప్రకటించటంతో డెమోక్రాట్లు కొత్త అభ్యర్థికోసం హడావుడి పడుతున్నారు. ఆగస్టు 19-22వ తేదీలలో పార్టీ ప్రతినిధుల సమావేశంలో ఎన్నిక జరుగుతుంది. మరి కొంత మంది కూడా పోటీలో ఉన్నట్లు వార్తలు వచ్చినా బైడెన్‌ ప్రకటన తరువాత జరిగిన పరిణామాలను బట్టి చూస్తే అనూహ్యపరిణామాలు జరిగే తప్ప డోనాల్డ్‌ ట్రంప్‌ను ఢకొీనబోయేది కమలాహారిస్‌ అని చెప్పవచ్చు. డోనాల్డ్‌ ట్రంప్‌ పలుకుబడి దిగజారినట్లు,హత్యాయత్నం జరిగిన తరువాత ట్రంప్‌ విజయావకాశాలు మరింత పెరిగినట్లు వార్తలు వచ్చిన పూర్వరంగం జో బైడెన్‌ నిర్ణయాన్ని వేగిరం కావించింది. అయితే పోటీ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించిన తరువాత కమలా హారిస్‌ రెండు పాయింట్ల స్వల్ప ఆధిక్యంతో 44 -42తో ట్రంప్‌పై పైచేయి సాధించినట్లు సోమ, మంగళవారాల్లో రాయిటర్స్‌ జరిపిన ఎన్నికల సర్వేలో వెల్లడైంది. ఇదే ధోరణి ముందుకూడా కొనసాగితే సంకుల సమరం సాగే సూచనలు కనిపిస్తున్నాయి. ఫ్రాన్స్‌లో ఫాసిస్టులను ఇంటికి పంపిన మాదిరి మితవాది ట్రంప్‌ను ఓడించే అవకాశాలనూ తోసి పుచ్చలేము.


బైడెన్‌ నిర్ణయం అమెరికా లోపలా వెలుపలా, శత్రువులూ, మిత్రుల మధ్య చర్చనీయాంశమైంది. మిత్రదేశాల నేతలందరూ సానుకూలంగా మాట్లాడారు.” ఇటీవలి సంవత్సరాలలో అమెరికాలో జరుగుతున్న పరిణామాలు మాకు ఒక అంశాన్ని నేర్పాయి, అదేమిటంటే దేని గురించి మేము ఆశ్చర్యపడాల్సిందేమీ ఉండదు అని, ఈ అంశం అమెరికా ఓటర్లకు సంబంధించింది తప్ప మాది కాదు, భవిష్యత్‌లో రెండు దేశాల మధ్య సంబంధాలు ఎలా ఉంటాయన్నదే మాకు చాలా ముఖ్యం, ఇప్పుడవి చరిత్రలో అత్యంత దిగజారిన స్థితిలో ఉన్నాయి ” అని రష్యా ప్రతినిధి స్పందించారు. ఇది వారి అంతర్గత అంశమని చైనా పేర్కొన్నది.అయితే అక్కడి మీడియా, సామాజిక మాధ్యమంలో పెద్ద స్పందన వెలువడింది.నలభైకోట్ల మంది ఈ వార్తను చూసినట్లు లక్షలది మంది వ్యాఖ్యలు చేసినట్లు వాయిస్‌ ఆఫ్‌ అమెరికా పేర్కొన్నది. అధ్యక్ష పీఠంపై ఎవరు ఉన్నా అమెరికా పెద్దన్నకే అగ్రతాంబూలం అన్నట్లుగా వ్యవహరిస్తారన్నది తెలిసిందే. ఈ కారణంగానే ఎన్నికలు వారి అంతర్గత అంశమైనప్పటికీ అనేక దేశాల నేతలు స్పందించారు. అంతర్గతంగా కమలా హారిస్‌ గెలుస్తారా, ఆమె బలం,బలహీనతలు ఏమిటి అన్న చర్చ మొదలైంది. బైడెన్‌ ప్రకటన వెలువడగానే ఆమె స్పందించారు.” పార్టీని ఐక్యంగా ఉంచేందుకు చేయాల్సిందంతా చేస్తాను. డోనాల్డ్‌ ట్రంప్‌ను, ప్రమాదకరమైన అతగాడి ప్రాజెక్టు 2025 అజెండాను ఓడించేందుకు గాను దేశాన్ని ఐక్యం చేసేందుకు పూనుకుంటానని ” పేర్కొన్నారు.


ప్రపంచంలో దిగజారుతున్న ఆర్థిక పరిస్థితులను పరిష్కరించటంలో పెట్టుబడిదారీ వ్యవస్థ వైఫల్యం చెందింది.జనం దగ్గర దారిలో పరిష్కారాల కోసం చూస్తున్నారు. పెట్టుబడిదారీ విధానానికి ప్రత్యామ్నాయం సోషలిస్టు వ్యవస్థతప్ప ఇప్పటికి మరొకటి లేదు. అయితే సోవియట్‌ యూనియన్‌, ఇతర దేశాల్లో జరిగిన ప్రయోగాలు, వాటి గురించి సోషలిజం అనుకూలశక్తులలోనే తలెత్తిన విబేధాలు, వ్యతిరేకులు చేసిన ఎదురుదాడి నేపధ్యంలో జనం గందరగోళంలో ఉన్నారు. దీన్ని అవకాశంగా తీసుకొని పెట్టుబడిదారీ విధానాన్ని సమర్థించేందుకు, కాపాడేందుకు అవసరమైతే నిర్బంధకాండకు సైతం సిద్దపడే పచ్చిమితవాద, ఫాసిస్టు శక్తులు రంగంలోకి వస్తున్నాయి.ఐరోపాలో ఈ పరిణామం స్పష్టంగా కనిపిస్తోంది.అమెరికా కూడా దీనికి మినహాయింపు కాదు. ప్రాజెక్టు 2025ను రూపొందించిన హెరిటేజ్‌ ఫౌండేషన్‌ మితవాద,నిరంకుశుల అజెండా. ట్రంప్‌ అధికారానికి వస్తే అమలు జరుపుతారనే ప్రచారం ఉంది. దీన్ని జనంలోకి తీసుకువెళితే జో బైడెన్‌ మరోసారి ఎన్నికౌతారని డెమోక్రాట్లు భావించారు. ఇప్పుడు రంగం నుంచి తప్పుకున్నప్పటికీ ట్రంప్‌ను దెబ్బకొట్టగలిగే అస్త్రం ఇదే అని వారు ఇప్పటికీ భావిస్తున్నారు.కమలా హారిస్‌ మాటల భావమిదే. అసలేమిటిది ?


పచ్చి మితవాద భావజాల సంస్థ హెరిటేజ్‌ ఫౌండేషన్‌ 1973లో ఉనికిలోకి వచ్చింది. వందకు పైగా అలాంటి బృందాల సలహాలతో 922 పేజీల విశ్లేషణ, సిఫార్సులే ప్రాజెక్టు 2025. దీని వెనకాల ఉన్నది ఎవరో నాకు తెలియదు.వారితో నాకెలాంటి సంబంధమూ లేదు అని ఇటీవల ట్రంప్‌ చెప్పుకున్నాడు.ఎన్నికలు ముగిసేవరకు ట్రంప్‌ ఇదే నాటకాన్ని కొనసాగిస్తాడన్నది తెలిసిందే. అయితే బుకాయించినా గతంలో అతని దగ్గర పనిచేసిన వారూ, మద్దతుదారులందరూ దాని రూపకల్పనలో భాగస్వాములే కనుక, దాన్నే అమలు జరుపుతారని వేరే చెప్పనవసరం లేదు. మన దేశంలో ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌, ప్రపంచ వాణిజ్య సంస్థ చేసిన సిఫార్సులు, ఆదేశాలను అమలు జరుపుతున్న పార్టీలేవీ ఎక్కడా బహిరంగంగా వాటి గురించి చెప్పరు. అవన్నీ తమ విధానాలే అని జనాన్ని నమ్మించేందుకు చూస్తాయి.తమ ముద్రవేసుకుంటాయి. ఈ విషయంలో కాంగ్రెస్‌, బిజెపి, తెలుగుదేశం, బిఆర్‌ఎస్‌ ఇలా ఏ పార్టీని చూసినా అదే కనిపిస్తుంది. అందుకే ఈ పార్టీల మధ్య అధికారం కోసం కుమ్ములాటలుంటాయి తప్ప విధానపరంగా ఎలాంటి ఘర్షణ ఉండదు. ఫాసిస్టు శక్తులు అధికారంలోకి రాకుండా అడ్డుకొనేందుకు వాటిని వ్యతిరేకించే మితవాద, వామపక్ష శక్తులందరూ ఇటీవలి ఫ్రెంచి పార్లమెంటు ఎన్నికల్లో చేతులు కలిపి ప్రస్తుతానికి ఆ ముప్పును తప్పించిన సంగతి తెలిసిందే. అమెరికాలో కూడా ట్రంప్‌కు వ్యతిరేకంగా అదే జరగనుందా ?


అధ్యక్ష స్థానానికి ఎన్నికయ్యేవారు, నియమిత అధికార యంత్రాంగానికి ఇప్పుడున్న వాటి కంటే అధికారాలను మరింతగా కట్టబెట్టటం, మరింత కేంద్రీకరించటం ప్రాజెక్టు 2025లక్ష్యాలలో ఒకటి.అధికార దుర్వినియోగానికి ఇది బాటవేస్తుందని భావిస్తున్నారు. సంక్షేమ పధకాలకు కోతపెట్టాలని, నియంత్రణలను నామమాత్రం చేయాలని కార్పొరేట్‌, మితవాద శక్తులు ఎప్పటి నుంచో డిమాండ్‌ చేస్తున్నాయి, అందువలన వీటి సాధన రెండవది.సామాజిక, మతపరమైన అంశాలలో రిపబ్లికన్లు, డెమోక్రాట్ల మధ్య వ్యత్యాసం ఉంది.అబార్షన్లను నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వ అధికారాలను వినియోగించాలని, గర్భనిరోధ పద్దతులను పరిమితం చేయాలని, బూతుపై నిషేధం, ఆ ఇతివృత్తంతో తీసే సినిమాలు, సీరియళ్లు, ఇతర ఉత్పత్తులను సృష్టించేవారు, వాటిని పంపిణీ చేసే వారి మీద నిషేధం పెట్టాలని, శిక్షించాలన్న అజండా కూడా దీనిలో ఉంది. ఇవన్నీ నిరంకుశ, తిరోగామి ప్రతిపాదనలని వేరే చెప్పనవసరం లేదు. నిజానికి ఇవి కొత్త ఆలోచనలు, ప్రతిపాదనలూ కావు.వీటిని అమలు జరిపేందుకు తగిన వాడు ట్రంప్‌ అని భావించటమే తాజాదనం. తన ఓటమిని అంగీకరించకుండా, జో బైడెన్‌ ఎన్నికను అధికారికంగా ప్రకటించకుండా అడ్డుకొనేందుకు అమెరికా అధికార కేంద్రం మీద దాడి చేయించిన ట్రంప్‌కే ఈ అజెండాను అమలు చేసే దమ్ముఉంటుదని అనేక మంది గట్టిగా భావిస్తున్నారు. ఇదే మితవాదులను వ్యతిరేకించేవారిలో ఇటీవల ఆందోళనను పెంచుతోంది. లక్షలాది మంది పౌర ఉద్యోగులను తొలగించి తన మద్దతుదార్లను నియమించేందుకు 2020లో ట్రంప్‌ నిర్ణయించాడు. అయితే అమలు జరిపే సమయానికి ఎన్నికల్లో ఓడి పదవి నుంచి దిగిపోయాడు. ఆ నిర్ణయాన్ని బైడెన్‌ రద్దు చేశాడు. ఇప్పుడు ట్రంప్‌ గెలిస్తే తన అజెండాను అమలు జరపవచ్చని భావిస్తున్నారు.విద్యా శాఖను రద్దు చేసి అమ్మవడి-తల్లికి వందనం పేరుతో అమ్మలకు ఇస్తున్న నగదు మాదిరే ప్రయివేటు స్కూళ్లకు పంపే తలిదండ్రులకు నగదు ఇవ్వాలని మితవాదులు కోరుతున్నారు. తక్కువ రాబడి వచ్చే స్కూళ్లకు నిధుల నిలిపివేత, మధ్యాహ్నభోజన పధకాల రద్దు, విద్యారుణాలను విధిగా వసూలు చేయాలనే చర్యలు చేపట్టవచ్చు. పర్యావరణ హాని నివారణ చర్యలను నిలిపివేయాలని, హరిత ఇంథన సబ్సిడీలను ఎత్తివేయాలని, చమురు, గ్యాస్‌ వెలికితీతపై పర్యావరణ ఆంక్షలను రద్దు చేయాలని కూడా డిమాండ్‌ చేస్తున్నారు. అక్రమంగా వచ్చిన వారికి విద్యా రుణాలు ఇవ్వకూడదని,ప్రభుత్వ సహాయం పొందే గృహాల్లో వారికి అవకాశం కల్పించరాదని, అక్రమ ప్రవేశాల నిరోధానికి సరిహద్దుల్లో అశ్వికదళాలను తిరిగి నియమించటమే గాక విస్తరించాలని కోరుతున్నారు.

ఇలాంటి ప్రతిపాదనలతో ఉన్నదే ప్రాజెక్టు 2025. దీని రూపకల్పనలో భాగస్వాములు, వాటితో ఏకీభవించేవారిని యంత్రాంగంలో నియమించి వారి పేరుతో అమలు జరిపించేందుకు ట్రంప్‌ చూస్తున్నారని పురోగామివాదులు అనేక మంది హెచ్చరిస్తున్నారు.
హెరిటేజ్‌ ఫౌండేషన్‌కు నిధుల కొరత లేదు. అధ్యక్షుడిగా ఎవరు ఎన్నిక కావాలనేదానికంటే ప్రభుత్వాన్ని ప్రభావితం చేసే రీతిలో తన మనుషులను యంత్రాంగంలోకి పంపేందుకే ఇది ప్రాధాన్యత ఇస్తుంది. ఇరవైవేల మంది సుశిక్షుతులైన కార్యకర్తలు, ఇరవైలక్షల మంది స్వచ్చందకార్యకర్తలు దీనికి ఉన్నట్లు అంచనా.దాని అజెండాను అమలు జరిపేందుకు, ప్రజాప్రతినిధులను ప్రభావితం చేసేందుకు, సామాజిక మాధ్యమంలో జనాన్ని సమీకరించేందుకు వారంతా రంగంలోకి దిగుతారు. అనేక మందిని పార్లమెంటరీ కార్యాలయాల్లోకి ఇప్పటికే చొప్పించింది.ట్రంప్‌ యంత్రాంగంలో 2017నాటికి 70 మంది ఈ సంస్థతో సంబంధం ఉన్నవారున్నారు.వారిలో నలుగురు మంత్రులు. ఈ సంస్థ ఉనికిలోకి వచ్చినప్పటి నుంచి రిపబ్లికన్లు మరింత మితవాదం వైపు మొగ్గేందుకు చేయాల్సిందంతా చేస్తోంది.1981లో రోనాల్డ్‌ రీగన్‌ అధికారంలోకి వచ్చినపుడు దీని అజెండాలో 60శాతం అమలు జరిపాడు. ట్రంప్‌ తొలిసారి అధికారంలో ఉన్నపుడు దీని సిఫార్సుల్లో 64శాతం అమలు చేశాడంటే దీని సత్తా ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. రిచర్డ్‌ నిక్సన్‌ హయాంలో 1973లో ఉనికిలోకి వచ్చిన ఈ సంస్థ నిర్వాహకులు తాము కమ్యూనిజానికి వ్యతిరేకమని, కార్పొరేట్లకు అనుకూలమని, క్రైస్తవ మత భావజాలానికి అనుగుణంగా పనిచేస్తామని చెప్పుకున్నారు. తాజా విషయానికి వస్తే ట్రంపిజాన్ని వ్యవస్థీకృతం కావించేందుకు తాము పనిచేస్తామని ఫౌండేషన్‌ అధ్యక్షుడు కెవిన్‌ డి రాబర్ట్స్‌ న్యూయార్క్‌టైమ్స్‌ పత్రికతో చెప్పాడు. అమెరికా ఇప్పుడు రెండవ విప్లవ క్రమంలో ఉందని, అది రక్తపాత రహితంగా ఉంటుందని కూడా ఒక టీవీ చర్చలో చెప్పాడు. ఈ ఎన్నికల్లో డెమోక్రాట్లు ఈ అంశాలను జనంలోకి తీసుకువెళ్ల గలిగితే నల్లేరు మీద బండిలా సాగుతుందనుకుంటున్న ట్రంప్‌ ఎన్నిక తిరగబడినా ఆశ్చర్యం లేదు.


అయితే అది అంత తేలిక కాదు. ఇప్పటికే జో బైడెన్‌ ప్రతిష్ట దిగజారింది. దాని ప్రభావం కమలాహారిస్‌ మీద కూడ పడుతుంది.వ్యక్తిగా బైడెన్‌ కంటే అతగాడి విధానాల ఫలితంగానే పలుకుబడి తగ్గటమే దీనికి కారణం. రెండవది ఊపు మీద ఉన్న ట్రంప్‌ మద్దతుదార్లు ఆమె మీద పెద్ద ఎత్తున ప్రచారదాడికి దిగే అవకాశం ఉంది. గార్డియన్‌ పత్రిక పేర్కొన్న సమాచారం ప్రకారం పోటాపోటీగా ఉన్న పెన్సిల్వేనియా, జార్జియా, అరిజోనా వంటి రాష్ట్రాలలో టీవీ ప్రకటనల కోసం 50లక్షల డాలర్లను కుమ్మరించేందుకు సిద్దంగా ఉన్నారు. అదే విధంగా అబార్షన్ల వంటి అంశాలపై ఆమె అభిప్రాయాల మీద రెచ్చగొట్టే అవకాశం ఉంది.కమలా హారిస్‌ తల్లి భారతీయ మూలాలున్న మహిళ, తండ్రి ఆఫ్రికన్‌. అందువలన మనదేశంలోని వారు మనమ్మాయి అన్నట్లుగా ప్రచారం చేసుకున్నా అమెరికాలో ఆమెను ఒక ఆఫ్రికన్‌గానే చూస్తారు. శ్వేతజాతి అహంకారం ఉన్న అమెరికాలో దాన్ని కూడా ముందుకు తీసుకురావచ్చు.ఆమె అభ్యర్థిత్వం ఖరారైన తరువాత తలెత్తే పరిణామాల గురించి మరోసారి చూద్దాం !

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనా ది గ్రేట్‌ : మైక్రోసాఫ్ట్‌ దెబ్బనుంచి తప్పించుకున్న ఒకే ఒక్క దేశం !

21 Sunday Jul 2024

Posted by raomk in CHINA, COUNTRIES, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

China the Great, CrowdStrike, Global technological havoc, Microsoft outage


ఎం కోటేశ్వరరావు


వర్తమాన సమాజం సాంకేతిక పరిజ్ఞాన మీద ఎంతగా ఆధారపడి ఉందో, దానికి చిన్నపాటి అంతరాయం కలిగినా ఎన్ని ఇబ్బందులు, ఎంత నష్టం జరుగుతుందో 2024 జూలై 19న తలెత్తిన ఒక చిన్న సాంకేతిక సమస్య లేదా జరిగిన తప్పిదం ప్రపంచానికి వెల్లడించింది. ఆకస్మికంగా ఐదువేలకుపైగా విమానాల రద్దు ప్రకటన, ఎందుకో, ఎప్పుడు పునరుద్దరణ అవుతాయో చెప్పే నాధుడు లేడు. ప్రయాణీకుల్లో గందరగోళం. ఆసుపత్రులలో ఆపరేషన్లు నిలిపివేశారు.బ్యాంకు ఖాతాలు పనిచేయలేదు. రైలు టికెట్లు జారీ కాలేదు.వ్యాపారులు దుకాణాలను మూసివేశారు. ఇదంతా క్రౌడ్‌ స్ట్రయిక్‌ అనే సైబర్‌ భద్రతా సంస్థ వైరస్‌లను కనుగొనేందుకు అందచేసిన ఒక లోపభూయిష్టమైన సాఫ్ట్‌వేర్‌ను మైక్రోసాఫ్ట్‌ సర్వర్లు, కంప్యూటర్లకు అందచేసిన ఫలితమే. నిత్య జీవితంలో ఎంత ఎక్కువగా ఇంటర్నెట్‌ను, కంప్యూటర్లను వినియోగిస్తారో, ప్రత్యేకించి మైక్రోసాఫ్ట్‌ విండోస్‌ పరికరాలను వినియోగిస్తారో అక్కడల్లా ప్రపంచమంతటా కొన్ని గంటల పాటు ఇవే దృశ్యాలు.( ఆపిల్‌ మాక్‌ కంప్యూటర్లకు ఎలాంటి అంతరాయం కలగలేదు.) నీలి రంగు తెరతో దర్మనమిచ్చిన కంప్యూటర్లు పదే పదే వాటంతట అవే మూతబడ్డాయి, అదే మాదిరి తెరుచుకున్నాయి, తప్పపనిచేయలేదు. దీన్నే నీలిరంగు తెర మృత్యువు అన్నారు గానీ నిజానికి అది చావు బతుకుల మధ్యకొట్టుకోవటం. ఆపరేటర్లకు ఎందుకలా జరిగిందో అర్ధం కాదు, ఏం చేయాలో అసలే తెలియలేదు.ఎలాగైతేనేం పరిస్థితి చక్కబడింది. ఇప్పుడు తీరికగా జరిగిన నష్టం ఎంత అనే లెక్కల్లో మునిగారు. కొన్ని కంపెనీల గుత్తాధిపత్యం ఉంటే ఇదే జరుగుతుందనే హెచ్చరికలు వెలువడ్డాయి. కొందరు ఇదే మంచి తరుణం మించిపోవును మీ కంప్యూటర్‌ వ్యవస్థలకు బీమా చేయించండి అంటూ సలహాలిస్తుంటే ఇదొక ఆముదమా అంటూ యజమానులు పెదవి విరుస్తున్నారు. కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్‌లను కనిపెట్టినవారే వాటిని దెబ్బతీసే వైరస్‌లను సృష్టిస్తారు, వాటిని నిరోధించే లేదా సంహరించే భద్రత అంటూ మరొక సాఫ్ట్‌వేర్లను అంటగట్టటం తెలిసిందే. తమ కంప్యూటర్లలో తాము సూచించిన సాఫ్ట్‌వేర్లనే వాడాలనే నిబంధనల గురించి తెలిసిందే.మూడింట రెండు వంతుల క్లౌడ్‌ సదుపాయాల వ్యవస్థలను మైక్రోసాఫ్ట్‌, అమెజాన్‌, గూగుల్‌ సంస్థలే సమకూర్చుతున్నాయి. ఏదీ ఊరికే రాదు, ప్రతిదీ లాభం కోసమే కదా ! గుత్తాధిపత్యానికి వ్యతిరేకంగా వచ్చిన ప్రతిపాదనలను గతంలో మైక్రోసాఫ్ట్‌ వమ్ముచేసిందనే విమర్శలు ఉన్నాయి.


ఎనభైమూడు బిలియన్‌ డాలర్ల విలువగల క్రౌడ్‌ స్ట్రయిక్‌ అనే సైబర్‌ భద్రతా ఉత్పత్తుల సంస్థకు ప్రపంచవ్యాపితంగా ఇరవై వేల మంది ఖాతాదారులున్నారు,మైక్రోసాఫ్ట్‌, అమెజాన్‌ వాటిలో ఉన్నాయి. విండోస్‌కు అందచేసిన తమ ఉత్పత్తి ఫాల్కన్‌ సెన్సర్‌ సాఫ్ట్‌వేర్‌లో ఉన్న లోపం కారణంగా మైక్రోసాఫ్ట్‌ వినియోగదారులందరూ ఇబ్బంది పడినట్లు అది ఒక ప్రకటనలో పేర్కొన్నది. ఈ అప్రదిష్ట కారణంగా ఈ కంపెనీ వాటాల ధరలు పదకొడుశాతం పడిపోయాయి. సైబర్‌ దాడి జరిగితే వేరు, తాజా ఉదంతం బాధ్యతా రహితంగా వ్యవహరించిన తీరుతో జరిగింది. ముందస్తు పరీక్షలు జరపకుండా, సరి చూసుకోకుండా నేరుగా ప్రయోగించిన లోప భూయిష్టమైన సాఫ్ట్‌వేర్‌ దెబ్బకు ఒక్క దేశం, చైనా తప్ప ప్రపంచం మొత్తం విలవిల్లాడింది. ప్రపంచ వ్యాపితంగా అంతరాయం కలిగినప్పటికీ ఒక్క చైనా దాన్నుంచి తప్పించుకున్నట్లు హాంకాంగ్‌ నుంచి వెలువడే సౌత్‌ చైనా మోర్నింగ్‌ పోస్ట్‌ అనే పత్రిక పేర్కొన్నది.రాజధాని బీజింగ్‌, ఆర్థిక కేంద్రం షాంఘై వంటి చోట్ల ఉన్న విమానాశ్రయాలు సాధారణంగా నడుస్తున్నట్లు తెలిపింది. తరువాత ఇతర దేశాల మీడియా కూడా అవే కథనాలను ఇచ్చాయి. చైనా పౌరులు మైక్రోసాఫ్ట్‌ గురించి సామాజిక మాధ్యమం వెయిబోలో జోకులే జోకులు పేల్చారు.తమకు ఒక పూట సెలవు ఇచ్చినట్లు కొందరు చెప్పగా మా కంపెనీ వెంటనే మరోకంప్యూటర్‌కు మారినందున మాకు అది కూడా దక్కలేదని కొందరు చమత్కరించారు.


ఇప్పటికీ నల్లమందు భాయీలంటూ నిందించేవారు, చౌకరకం వస్తువులను తయారు చేయటం తప్ప ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వారి దగ్గర లేదంటూ చైనాను వర్ణించేవారికి ఒక్కసారిగా బుర్రలు పనిచేయటం నిలిచిపోయాయి. మైక్రోసాఫ్ట్‌ దెబ్బకు జరిగిన నష్టం విలువ ఎంతో ఇంకా తేలలేదు, దాన్నుంచి బయటపడేందుకు ఎంత సమయం తీసుకుంటుందో తెలియదని చెబుతున్నారు. ఇక చైనాను చూసి పనిచేయటం ఆగిపోయిన వారి బుర్రలు ఎప్పటికీ సాధారణ స్థితికి వస్తాయో తెలియదు.అఫ్‌ కోర్స్‌ , చైనా వ్యతిరేక వైరస్‌ సోకిన వారికి చికిత్సలేదనుకోండి. అయితే చైనాలో అసలేమీ ప్రభావితం కాలేదా ? అక్కడ మైక్రోసాఫ్ట్‌ సేవలు లేవా ? ఉన్నాయి, కొన్ని ప్రభావితమయ్యాయి. మైక్రోసాఫ్ట్‌తో పనిచేసే అక్కడి విదేశీ సంస్థలు తప్ప చైనా స్వంత విమానాశ్రయాలు, ఇతర మౌలిక సదుపాయాలు మామూలుగానే పనిచేశాయి. బహుశా ప్రపంచంలో సాంకేతిక అంతరాయం ఇంత పెద్ద ఎత్తున ఏర్పడటం ఇదే ప్రధమం. తిరుగులేని సంస్థగా పేరున్న మైక్రోసాఫ్ట్‌కూ ఇది కోలుకోలేని దెబ్బ. దాని మీద ఆధారపడిన విమానాశ్రయాలు, సంస్థలు, బాంకులు, మీడియా సంస్థల కార్యకలాపాలకూ అంతరాయం కలిగింది. రక్షణ సాఫ్ట్‌వేర్‌ దెబ్బకు దాన్ని తయారు చేసిన కంపెనీతో పాటు మైక్రోసాఫ్ట్‌ కూడా పేరుతో పాటు ఆర్థికంగా కూడా నష్టపోయాయి.వాటి ఖాతాదారులకు జరిగిన నష్టం గురించి అంచనాలు వేస్తున్నారు. ఇవి 24వందల కోట్ల నుంచి లక్షల కోట్ల డాలర్ల వరకు ఉంటుందని, కొన్ని వారాల వరకు అంతరాయ పర్యవసానాలు ఉంటాయని చెబుతున్నారు. అమెరికాలో ప్రొవైడెన్స్‌ హెల్త్‌ అనే సంస్థకు ఏడు రాష్ట్రాలలో 52 ఆసుపత్రులున్నాయి.నలభైవేల సర్వర్లకు గాను పదిహేను వేలు, లక్షా 50వేల కంప్యూటర్లు పనిచేయలేదు. ఇది ఒక ఉదాహరణ మాత్రమే.ప్రపంచ వ్యాపితంగా ఉన్న కంప్యూటర్లలో ఒకశాతానికి అటూ ఇటుగా అంటే 85లక్షల విండోస్‌ కంప్యూటర్లు ప్రభావితమయ్యాయి.2017లో వాన్నాక్రై సైబర్‌దాడిలో 150దేశాల్లో మూడులక్షల కంప్యూటర్లు దెబ్బతిన్నాయి.ఇలాంటి పెద్ద దాడులేగాక చిన్న చిన్నవి నిరంతరం జరుగుతూనే ఉంటాయి. కానీ శుక్రవారం నాటి అంతరాయం చారిత్రాత్మకమైనదిగా నమోదైంది. ఈ ఉదంతం తరువాత జాగ్రత్తగా ఉండాలనే హెచ్చరికలు జారీ అయ్యాయి.నకిలీ ఇమెయిల్స్‌,ఫోన్లలో పిలుపులు, నకిలీ వెబ్‌సైట్లు వస్తాయని, వాటిని తెరవ కూడదని చెప్పారు.


ఇంతకూ చైనా ఎందుకు ప్రభావితం కాలేదు.కమ్యూనిస్టు చైనా ఉద్బవించినప్పటి నుంచి దాన్ని నాశనం చేసేందుకు అమెరికా, బ్రిటన్‌ వంటి దేశాలు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నాయి. అందువలన ప్రతి దశలో అక్కడి కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలను తీసుకొంటూ ఆ కుట్రలను వమ్ము చేస్తున్నది. సంస్కరణల్లో భాగంగా విదేశీ పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరించినప్పటికీ సమాంతరంగా తన స్వంత పరి శోధనలను కొనసాగిస్తున్నది. దీని గురించి తెలిసినా తెలియనట్లు, అబ్బే అదంతా ఉత్తిదే అనే ప్రచారం జరుగుతోంది. దాన్ని పట్టించుకోని చైనీయులు తమపని తాము చేసుకుపోతున్నారు. పూర్తిగా విదేశీ కంపెనీలు, దేశాలకు తమ జుట్టు అందించకుండా షరతులతో జాగ్రత్త పడ్డారు. అదే దాని బహిరంగ రహస్యం.చైనాలో మైక్రోసాఫ్ట్‌ క్లౌడ్‌ సర్వీసులు అందించే కంపెనీలు సదరు సంస్థ ప్రపంచ మౌలిక వ్యవస్థతో నిమిత్తం లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నది ప్రభుత్వ షరతు. దీన్నినా గట్టిగా అమలు చేస్తున్న కారణంగా చైనాలో మైక్ట్రోసాఫ్ట్‌ సేవలు, వాటికి రక్షణ ఇతర దేశాలకు భిన్నంగా ఉంటుంది.స్వంత హార్డ్‌వేర్‌, 360 వంటి భద్రతా సాప్ట్‌వేర్‌లతో అవి పని చేస్తాయి.మిగతా ప్రపంచం మాదిరి చైనా సంస్థలు మైక్రోసాఫ్ట్‌కు బదులు తమ స్వంత అలీబాబా, టెన్సెంట్‌,హువెరు వంటి సంస్థల సేవలనే వినియోగించుకుంటున్నాయి. మైక్రోసాఫ్ట్‌తో పనిచేసే అంతర్జాతీయ గ్రూపు హౌటళ్లను నిర్వహిస్తున్న షెరటన్‌, మారియట్‌, హయత్‌ వంటి సంస్థల నుంచి వివరాలు తెలుసుకొనేందుకు చూస్తే వీలు కాలేదని చైనా నెటిజన్లు చెప్పారు.ఇటీవలి కాలంలో చైనాలో విదేశీ ఐటి వ్యవస్థలను వదిలించుకొని దేశీయ నెట్‌వర్క్‌లను వినియోగించుకోవటం పెరుగుతోంది.సమాంతర వ్యవస్థలను కూడా ఏర్పాటు చేసుకున్నారు. అమెరికా ఉత్పత్తుల మీద ఆధారపడటం లేదు. క్రౌడ్‌ స్ట్రయిక్‌ ఉత్పత్తులను అక్కడ వాడటం లేదు గనుక తప్పించుకుంది. ఇలా అనేక కారణాలు ఉన్నాయి. ఇతర దేశాలన్నీ అమెరికా కంపెనీల మీద ఆధారపడిన కారణంగా దెబ్బతిన్నాయి. ఒక వేళ వాటి ఉత్పత్తుల కారణంగా నష్టం జరిగితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలన్నది తాజా ఉదంతం నేర్పిన పాఠం. ఇటీవలఅమెరికాతో సహా కొన్ని దేశాలు సైబర్‌దాడులకు సిద్దం అవుతున్నాయి. తాడిని తన్నేవాడుంటే వాడి తలతన్నేవాడు వస్తాడని వేరే చెప్పనవసరం లేదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

హత్యాయత్నం ట్రంప్‌కు కలసివచ్చింది : అమెరికా ప్రజాస్వామ్యానికి ముప్పు ఎవరి నుంచి ?

17 Wednesday Jul 2024

Posted by raomk in COUNTRIES, Current Affairs, Economics, History, imperialism, INTERNATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

#US Elections 2024, Donald trump, JD Vance, Joe Biden, Profits from Terror, Republican party, Threat to democracy



ఎం కోటేశ్వరరావు


” అమెరికా మీద దాడి జరుగుతోంది, ముట్టడిలో ఉంది, ప్రజాస్వామ్యాన్ని హతమార్చేందుకు చూస్తున్నారు.చీకటి అధ్యాయానికి నాంది ” మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ హత్యాయత్నంపై వెలువడిన తక్షణ వ్యాఖ్యలివి.అతగాడు ప్రాణాపాయం నుంచి కొద్దిలో తప్పించుకున్నాడు.శనివారం నాడు అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రం బట్లర్‌ అనే పట్టణంలో ఎన్నికల సభలో ప్రసంగిస్తుండగా ఒక దుండగుడు జరిపిన కాల్పులో ట్రంప్‌కు కుడి చెవి దగ్గర బుల్లెట్‌ గాయం తగిలింది.దుండగుడి కాల్పుల్లో సభికుల్లో ఒకరు మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. హంతకుడిని వెంటనే భద్రతా దళాలు కాల్చి చంపాయి. సభ సమీపంలోని ఒక భవనంపై మాటువేసి కాల్పులు జరిపినట్లు వెల్లడైంది. ఈ ఉదంతం తరువాత అమెరికా రాజకీయాలు, ఎన్నికల్లో ఏం జరగనుందనే చర్చ మొదలైంది.దీనికి ముందు డెమోక్రటిక్‌ అభ్యర్ధి జోబైడెన్‌ వృద్దాప్యం గురించి, పోటీ నుంచి తప్పుకొని ఉపాధ్యక్షురాలు కమలాహారిస్‌ లేదా మరొకరికి అవకాశం ఇవ్వాలనే చర్చ జరుగుతోంది. హత్యాయత్నంతో సానుభూతి తలెత్తి ట్రంప్‌ విజయావకాశాలు మెరుగుపడినట్లు సర్వేలు పేర్కొంటున్నాయి. ప్రజాస్వామ్యంలో పార్టీల నేతలు, ఎన్నికల్లో అభ్యర్థులపై ౖ జరిగేదాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలి. ఎన్నికల్లో ప్రత్యర్థి జో బైడెన్‌ వెంటనే ఖండించాడు. ట్రంప్‌పై దాడిని వివిధ దేశాల నేతలు ఖండించారు. దుండగుడు ఇరవై ఏండ్ల థామస్‌ మాథ్యూ క్రూక్స్‌ రిపబ్లికన్‌ పార్టీ మద్దతుదారుగా నమోదై ఉన్నాడు. గతంలో డెమోక్రటిక్‌ పార్టీకి విరాళం ఇచ్చిన దాఖలా కూడా వెల్లడైంది. ఎందుకు కాల్పులు జరిపాడో వెంటనే తెలియలేదు. క్రూక్స్‌కు తొలిసారిగా ఓటు హక్కు వచ్చింది. తాను ట్రంప్‌ను, రిపబ్లికన్‌ పార్టీని కూడా వ్యతిరేకిస్తున్నట్లు అతడు చెప్పాడన్న వార్తలు కూడా వచ్చాయి. కేవలం ఈ మాత్రానికే దాడికి పాల్పడతాడా ? దీని వెనుక డెమోక్రటిక్‌ పార్టీ,ట్రంప్‌ మరోసారి అధికారానికి రాకూడదని కోరుకుంటున్న ప్రభుత్వంలోని వారు, రష్యా, చైనా, ఇరాన్‌, ఉత్తర కొరియా దేశాల హస్తం ఉండవచ్చా అనే సందేహాలను కూడా కొందరు లేవనెత్తినట్లు చెబుతున్నారు. దుండగుడికి ఎలాంటి నేర చరిత్ర లేదని న్యూయార్క్‌ టైమ్స్‌ పేర్కొన్నది.ఉగ్రవాదం నుంచి కూడా పెట్టుబడిదారులు ఎలా లాభాలు పొందుతారో ట్రంప్‌పై కాల్పుల ఉదంతం వెల్లడించింది. ఈ ఉదంతం తరువాత ట్రంప్‌ మీడియా మరియు టెక్నాలజీ గ్రూపు కంపెనీల వాటాల ధరలు సోమవారం నాడు 55శాతం పెరిగాయి, ఒక దశలో 71శాతాన్ని తాకాయి. ఈ కారణంగా ట్రంప్‌ సంపద విలువ ఒక్క రోజులోనే రెండు బిలియన్‌ డాలర్లు పెరిగింది. ఈ కంపెనీ ట్రంప్‌ సామాజిక మాధ్యమ ప్రచారాన్ని నిర్వహించే ట్రూత్‌ సోషల్‌ వేదికను కూడా నిర్వహిస్తున్నది. అనేక కంపెనీల వాటాల ధరలు కూడా పెరిగాయి. దీని అర్దం ఏమిటి ? ట్రంప్‌ ఎన్నిక అవకాశాలు పెరిగినట్లు పెట్టుబడిదారులు భావించటమే దీనికి కారణం. ట్రూత్‌ సోషల్‌ను అనుసరించే వారు కూడా గణనీయంగా పెరగటంతో నష్టాల్లో ఉన్న ఈ కంపెనీ రానున్న రోజుల్లో లాభాల బాట పట్టినట్లే. తుపాకులు, తూటాలు తయారు చేసే కంపెనీల వాటాల ధరలు కూడా పెరిగాయి. రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్ధిగా డోనాల్డ్‌ ట్రంప్‌, ఉపాధ్యక్ష అభ్యర్థిగా ” ఆంధ్రా అల్లుడు ” జెడి వాన్స్‌(39) ఎంపికయ్యారు.(ఎగువ చిత్రంలో ట్రంప్‌తో కలసి ఉన్నవ్యక్తి) వాన్స్‌ ఆంధ్రప్రదేశ్‌ మూలాలున్న ప్రవాస భారత కుటుంబానికి చెందిన న్యాయవాది ఉషా చిలుకూరిని వివాహం చేసుకున్నాడు.


ట్రంప్‌పై దాడి గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్న వారిలో కొందరు మూడు సంవత్సరాల క్రితం 2021జనవరి ఆరవ తేదీన అమెరికా అధికార కేంద్రంపై దాడికి తన మద్దతుదార్లను పంపిన డోనాల్డ్‌ ట్రంప్‌ నిర్వాకాన్ని విస్మరించారు. ట్రంప్‌పై దాడి వ్యక్తిగతం, కానీ అతగాడి మద్దతుదార్ల చర్య మొత్తం అమెరికా అధికార, ప్రజాస్వామిక వ్యవస్థనే అపహాస్యం పాలు చేసిందనే అంశాన్ని మరిచిపోరాదు. అమెరికా, దాని ప్రజాస్వామ్యం మీద అసలైన దాడి అది.అమెరికాలో నలుగురు అధ్యక్షులను తుపాకి తూటాలు బలితీసుకున్నాయి. కొంత మంది అధ్యక్షులు తృటిలో తప్పించుకున్నారు, ఇటీవలి కాలంలో రాజకీయపరమైన దాడులు మరింతగా పెరుగుతున్నాయి. కానీ దేశ అధికార కేంద్రంపై ట్రంప్‌ నాయకత్వంలో జరిగిన దాడి చరిత్రలో అదే మొదటిది. తాను ఓడిపోతే ఫలితాలను అంగీకరించేది లేదని ముందుగానే అపర ప్రజాస్వామికవాది ట్రంప్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఓడిపోయిన తరువాత విజేతను అధికారికంగా ప్రకటించేందుకు ఏర్పాటు చేసిన పార్లమెంటు ఉభయ సభల సమావేశాన్ని జరగకుండా చూసేందుకు, జో బైడెన్‌ గద్దెనెక్కకుండా చేసేందుకు ట్రంప్‌ చేసిన కుట్రలో భాగమది. అంతే కాదు దేశీయ ఉగ్రవాదం అనే కోణంలో ఎఫ్‌బిఐ, ఇతర చట్టాన్ని అమలు జరిపే సంస్థలు చూశాయి. దాడికి ముందు అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌కు కొద్ది దూరంలో తన మద్దతుదారులతో సమావేశం జరిపిన ట్రంప్‌ కాపిటోల్‌ను ఆక్రమించాలని, ఎన్నిక నిర్దారించే పత్రాన్ని ఇవ్వకుండా అడ్డుకోవాలని రెచ్చగొట్టి పంపించాడు.ఈ కేసులో కొంత మందికి శిక్షలు పడినప్పటికీ డోనాల్డ్‌ ట్రంప్‌పై విచారణ కొనసాగుతూనే ఉంది. ఎన్నికలలోపు పూర్తయ్యే అవకాశం లేదు, ఒకవేళ ట్రంపు గెలిస్తే అసలు విచారణే ఉండకపోవచ్చు, ఓడితే వచ్చే ఏడాది జరగవచ్చు.


ట్రంప్‌పై దాడి ప్రపంచానికి చూపుతున్నదేమిటి ? అమెరికాలో రాజకీయ విభజన కారణంగా రాజకీయ హింస కూడా పెరుగుతున్నది. దాడి వెనుక మూడు కారణాలున్నట్లు ఒక అభిప్రాయం. ఒకటి, ట్రంప్‌ గెలవ కూడదని కోరుకుంటున్న ప్రభుత్వంలోని వారి హస్తం, ట్రంప్‌ వంటి పచ్చిమితవాది అధికారానికి రాకూడదని కోరుకుంటున్న వామపక్ష తీవ్రవాద శక్తులు, ఎవరితో ప్రమేయం లేకుండా ట్రంప్‌ మీద తలెత్తిన వ్యక్తిగత ఆగ్రహం కారణంగా కాల్పులు జరిపి వుండవచ్చని చెబుతున్నారు. ఈ కారణాలతో రానున్న రోజుల్లో మరిన్ని ప్రయత్నాలు జరగవచ్చన్న హెచ్చరికలు వెలువడ్డాయి. అమెరికా చరిత్రలో రాజకీయ హింసాకాండ నేతలపై దాడి జరగడం ఇదే మొదటిసారి కాదు. తొలి అమెరికా అధ్యక్షుడు అబ్రహం లింకన్‌. 1865 ఏప్రిల్‌ 14న జాన్‌ విల్కెస్‌ బూత్‌ కాల్చి చంపాడు. నల్ల జాతీయుల హక్కులకు మద్దతు ఇవ్వడమే లింకన్‌ హత్యకు కారణం.బాధ్యతలు స్వీకరించిన ఆరు నెలలకే అమెరికా 20వ అధ్యక్షుడైన అమెస్‌ గార్‌ఫీల్డ్‌ను హత్య చేశారు. 1881 జూలై 2న వాషింగ్టన్‌ రైల్వే స్టేషన్‌లో నడుస్తుండగా ఛార్లెస్‌ గిటౌ అనే వ్యక్తి కాల్పులు జరిపాడు. ప్రజలతో కరచాలనం చేస్తుండగా అమెరికా 25వ అధ్యక్షుడైన విలియం మెకిన్లే 1901 సెప్టెంబర్‌ 1న న్యూయార్క్‌లోని బఫెలోలో హత్యకు గురయ్యారు. 28 సంవత్సరాల నిరుద్యోగ వైద్యుడు కాల్పులు జరిపాడు. 1965 నవంబర్‌లో 35వ అధ్యక్షుడైన జాన్‌ ఎఫ్‌ కెన్నడీ తన సతీమణి జాక్వెలిన్‌తో కలిసి డల్లాస్‌లో పర్యటిస్తుండగా హంతకుడు లీ ఆర్వీ ఆస్వాయిడ్‌ తుపాకీతో కాల్చి చంపాడు. ఈ హత్య గురించి తలెత్తిన అనుమానాలు ఇంతవరకు తీరలేదు, అదొక రహస్యంగా ఉండిపోయింది.
రెండుసార్లు దేశాధ్యక్షుడిగా పనిచేసి, మూడోసారి పోటీకి దిగిన థియొడోర్‌ రూజ్‌వెల్ట్‌పై ప్రచార సందర్భంగా 1912లో మిల్వాకీలో కాల్పులు జరిగాయి. అయితే ఆయనకు తీవ్రమైన గాయాలేవీ కాలేదు. అమెరికా 32వ అధ్యక్షుడు ఫ్రాంక్లిన్‌ రూజ్‌వెల్ట్‌ 1933 ఫిబ్రవరిలో మియామీలో ప్రసంగిస్తుండగా కాల్పులు జరిగాయి. ఈ ఘటన నుండి రూజ్‌వెల్ట్‌ తప్పించుకున్నప్పటికీ చికాగో మేయర్‌ ఆంటన్‌ సెర్మాక్‌ చనిపోయాడు. 1950లో 33వ అధ్యక్షుడు హారీ ఎస్‌. ట్రూమన్‌ నివసిస్తున్న బ్లార్‌ హౌస్‌లోకి ఇద్దరు సాయుధులు ప్రవేశించి కాల్పులు జరిపారు. ట్రూమన్‌ తప్పించుకున్నప్పటికీ ఎదురు కాల్పుల్లో అధ్యక్ష భవనం పోలీసు, ఒక దుండగుడు చనిపోయాడు.డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన రాబర్ట్‌ కెన్నడీని లాస్‌ ఏంజెల్స్‌ హౌటల్‌లో హత్య చేశారు. 1972లో డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీపడిన జార్జ్‌ వాలస్‌పై కాల్పులు జరిగాయి. 1975లో 38వ అధ్యక్షుడైన ఫోర్డ్‌ కొన్ని వారాల వ్యవధిలోనే రెండు హత్యాయత్నాల నుండి తప్పించుకున్నారు. 40వ అధ్యక్షుడైన రోనాల్డ్‌ రీగన్‌ 1981 మార్చిలో వాషింగ్టన్‌ డీసీలో జనంలో ఉన్న జాన్‌ హింక్లీ జూనియర్‌ కాల్పులు జరిపాడు. ఆయన కోలుకున్నప్పటికీ ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అమెరికాకు 43వ అధ్యక్షుడిగా పనిచేసిన జార్జ్‌ బుష్‌ 2005లో జార్జియా అధ్యక్షుడు మిఖాయిల్‌ సాకష్వీతో కలిసి ఓ ర్యాలీకి హాజరు కాగా ఆయనపై చేతి గ్రెనేడ్‌ విసిరారు.అయితే అది పేలకపోవడంతో ఎవరూ గాయపడలేదు.

అమెరికా రాజకీయ ముఖచిత్రాన్ని చూసినట్లయితే కొన్ని అంశాలలో తేడాలున్నప్పటికీ డెమోక్రటిక్‌, రిపబ్లికన్‌ పార్టీలు రెండూ అక్కడి కార్పొరేట్ల ప్రయోజనాల కోసం పాటుపడేవే. ఇటీవలి కాలంలో రెండు పార్టీల వైఫల్యాలు గతం కంటే ఎక్కువగా జనం నోళ్లలో నానుతున్నాయి. ప్రపంచంలో అమెరికా పెత్తనాన్ని సాగించేందుకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి, పరువు పోతున్నది. ఎన్నికల సమయంలో వ్యక్తిగత బలహీనతలు, అవినీతి అక్రమాలను బయటపెట్టుకోవటం ఇటీవలి కాలంలో పెరుగుతున్నది. విధానపరమైన వైఫల్యాలు రెండు పార్టీల్లో ఉండటమే దీనికి కారణం. ఈ పూర్వరంగంలోనే మూడవ అభ్యర్థికి మద్దతు ఇవ్వటం గురించి అమెరికా సమాజంలో చర్చ ప్రారంభమైంది.కాల్పులు జరిగిన వెంటనే రక్తం కారుతున్న ట్రంప్‌ను భద్రతా సిబ్బంది తీసుకువెళుతుండగా ట్రంప్‌ చేయెత్తి తనకేమీ కాలేదన్న సంకేతం ఇచ్చిన ఫొటోను చూపి కొందరు ట్రంప్‌ అభిమానులు తమనేత దేశం కోసం ఒక హీరో మాదిరి నిలబడిన తీరును చూపుతున్నదని ప్రచారం చేస్తున్నారు. ఎన్నికలు మరో నాలుగునెలల్లో జరగనున్నందున ప్రచారం మరింత తీవ్రం కానుంది. గురువారం నాడు జరిగే ఒక సమావేశంలో ట్రంప్‌ అభ్యర్థిత్వాన్ని లాంఛనంగా పార్టీ ప్రకటించనుంది. ప్రతిదాన్నీ సొమ్ము చేసుకొనేందుకు ఎదురు చూసే కొందరు గాయపడిన ట్రంప్‌ బమ్మను ముద్రించిన టీ షర్టులను అందుబాటులోకి తెచ్చారు.


ట్రంప్‌ ప్రాజెక్టు 2015పేరుతో ముందుకు తెస్తున్న అజెండా కార్మికవర్గం మీద దాడికి ఉద్దేశించిందని పురోగామి రాజకీయ బృందం హెచ్చరించింది. పౌరహక్కులకు ముప్పు ఏర్పడిందని ఆఫ్రో-అమెరికన్ల కార్మిక సంఘాలు హెచ్చరించాయి. ట్రంప్‌ కోరిక మేరకు మితవాద హెరిటేజ్‌ ఫౌండేషన్‌ దీన్ని రూపొందించింది. దీన్ని అమలు జరిపేందుకు ట్రంప్‌ నియంతగా మారే అవకాశం ఉందని కూడా పేర్కొన్నది. తాను తిరిగి అధికారానికి వస్తే రాజ్యాంగంలోని కొన్నిసెక్షన్లను తొలగిస్తానని ఏడాది క్రితమే ట్రంప్‌ చెప్పిన అంశాన్ని గుర్తు చేసింది. తొమ్మిది దశాబ్దాల క్రితం చేసిన జాతీయ కార్మిక సంబంధాల చట్టాన్ని వెనక్కు తీసుకుంటామని ట్రంప్‌ తొలిసారి అధికారంలో ఉన్నపుడు నియమించిన బోర్టులో అత్యధికులు కార్మిక వ్యతిరేకులు ఉన్నారు.సోషలిజం విఫలమైందని గతంలో అమెరికా చెప్పింది. కానీ అదే అమెరికాలో ఇప్పుడు పెట్టుబడిదారీ విధానం విఫలమైందనే భావం విస్తరిస్తోంది.చైనా, వియత్నాం వంటి సోషలిస్టు దేశాలతో పోల్చి వేస్తున్న ప్రశ్నలకు సమాధానం లేదు. అక్కడ ధనిక-పేద వ్యత్యాసం పెరిగిపోతోంది. మధ్యతరగతి వర్గం కనుమరుగు అవుతోంది. ఆర్థిక, వలసకార్మికులను అనుమతించే విధానాలపై అసంతృప్తి పెరుగుతున్నది. ఈ పూర్వరంగంలోనే సామాజిక వైరుధ్యాలు పెరుగుతున్నాయి. ఎవరు ఎవరిని ఎప్పుడు ఎందుకు కాల్చిచంపుతారో తెలియదు. తుపాకి లేకుండా జనాలు బయటకు వెళ్లే పరిస్థితి లేదు. తుపాకి సంస్కృతిని పెంపొందించటం, వాటిని తయారు చేసే కార్పొరేట్లకు లాభాలు సమకూర్చటంలో డెమోక్రాట్లు, రిపబ్లికన్లు ఎవరూ తక్కువ తినలేదు. పామును పాలుపోసి పెంచిన చేతినే అది కాటువేస్తుంది. అందువలన ఆ తుపాకులకు ఎప్పుడు ఎవరు బలౌతారో చెప్పలేని అయోమయ స్థితి నేడు అమెరికాలో ఉంది. ఒక దుండగుడు కాదు, అలాంటి వారిని తయారు చేసిన వ్యవస్థ, దాన్ని కాపాడుతున్నవారే ప్రజాస్వామ్యానికి అసలైన ముప్పు. 2021జనవరి ఆరున తన గుంపును అమెరికా అధికార కేంద్రం మీద దాడికి ఉసిగొల్పిన ట్రంప్‌ నుంచే అసలైన ముప్పుకు నాంది. ఇలాంటి ట్రంపు, అతగాడి ఇతర వెర్రి వేషాలను కూడా అక్కడి మీడియా జనానికి చెప్పటం లేదు. ఇది కూడా అమెరికాకు ముప్పు తెచ్చేదే !

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఐఎంఎఫ్‌ భారాలకు కెన్యాలో ప్రతిఘటన !

04 Thursday Jul 2024

Posted by raomk in Africa, COUNTRIES, Current Affairs, Economics, History, imperialism, INTERNATIONAL NEWS, Opinion, Prices, UK, USA

≈ Leave a comment

Tags

IMF, imperialism, Kenya -IMF, Kenya Protests, Kenya's President William Ruto


ఎం కోటేశ్వరరావు


జనంపై భారాలు మోపుతూ పార్లమెంటు ఆమోదించిన విత్త బిల్లుకు వ్యతిరేకంగా జూన్‌ 25న కెన్యాలో నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఈ సందర్భంగా 26 మంది కాల్పుల్లో మరణించగా అనేక మంది గాయపడినట్లు దేశ మానవహక్కుల కమిషన్‌ ప్రకటించింది.మృతుల సంఖ్య 30దాటినట్లు వార్తలు వచ్చాయి.దేశ పార్లమెంటు భవనానికి నిరసనకారులు నిప్పు పెట్టటంతో సహా అనేక చోట్ల లూటీలు, దహనకాండకు పాల్పడినట్లు వార్తలు వచ్చాయి. దీంతో బిల్లుపై తాను సంతకం పెట్టటం లేదంటూ అధ్యక్షుడు విలియమ్స్‌ రూటో ప్రకటించాడు. అయినప్పటికీ నమ్మకం లేక రాజీనామా చేయాలని కోరుతూ జూలై రెండున తిరిగి ప్రదర్శనలకు పిలుపు ఇచ్చారు. రాజధాని నైరోబీలో పెద్ద ఎత్తున భద్రతా బలగాలను మోహరించారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్‌), ప్రపంచ బ్యాంకులను బ్రెట్టన్‌ ఉడ్‌ కవలలు అంటారు. అక్కడ జరిగిన సమావేశాల్లో అవి పుట్టాయిగనుక ఆ పేరు వచ్చింది.ప్రజాకంటకుల పుట్టుక కూడా మామూలుగానే జరిగినప్పటికీ వారు పెరిగి పెద్దవారైన తరువాత మాత్రమే సమాజానికి ముప్పుగా చివరకు జనం చేతిలో తుప్పుగా మారతారు.కానీ ఈ కవలలు అలాంటివి కాదు. పుట్టుకతోనే వాటి దగ్గరకు వెళ్లిన దేశాలకు స్పాట్‌ పెడుతున్నాయి.ప్రపంచ బ్యాంకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను తమ విధానాలకు ముఖ్యంగా విద్యుత్‌ సంస్కరణలకు ఒక ప్రయోగశాలగా మార్చిన సంగతి తెలిసిందే. వాటికి వ్యతిరేకంగా సాగిన ఉద్యమం, పర్యవసానంగా చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో పరాజయం పాలైన విషయాన్నీ వేరే చెప్పనవసం లేదు.


ఆఫ్రికా ఖండంలోని తూర్పు ప్రాంతంలో ఉన్న ఒక దేశం కెన్యా. హిందూ మహాసముద్ర తీరంలో ఉన్న ఈ దేశ జనాభా 5.22 కోట్లు. రాజధాని నైరోబీ. ఐరోపా సామ్రాజ్యవాదుల వలసగా ఉంది. బ్రిటీష్‌ పాలకులు తొలుత తమ రక్షక ప్రాంతంగా, తరువాత వలసగా మార్చారు.1952 నుంచి ప్రారంభమైన మౌమౌ విప్లవంగా పిలిచిన ఉద్యమం కారణంగా 1963లో స్వతంత్రదేశంగా ఆవిర్భవించింది.ఆఫ్రికాలో ఆర్థికంగా అభివృద్ధి, ప్రజాస్వామిక వ్యవస్థతో స్థిరంగా ఉన్న దేశంగా చెబుతారు.అలాంటిది గతంలో ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కింది. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చిన జనాలపై భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో 30 మందికి పైగా మరణించారని, నేరస్థ ముఠాల చేతుల్లో గితురాయి అనే చోట250 మంది మరణించినట్లు, వారి మృత దేహాలను కూడా లభ్యం కావటం లేదని, అనేక మంది అపహరణలకు గురైనట్లు వార్తలు వచ్చాయి.పౌరులపై భారాలను మోపే ఆర్థిక బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపిన వెంటనే ఆందోళన తలెత్తింది. దాంతో బిల్లును నిలిపివేస్తున్నట్లు అధ్యక్షుడు విలియం రూటో ప్రకటించినప్పటికీ నివురుగప్పిన నిప్పులా పరిస్థితి ఉంది. అతగాడి మాటల మీద తమకు నమ్మకం లేదంటూ రూటో రాజీనామా చేసి గద్దె దిగాల్సిందేనంటూ యువత అనేక పట్టణాల్లో ప్రదర్శనలు జరిపింది. మిలిటరీ కవాతులతో భయపెట్టాలని చూసినా బెదరటం లేదు. మరో శ్రీలంకగా మారినా ఆశ్చర్యం లేదు.


ఎందుకీ పరిస్థితి వచ్చింది ? దేశం అప్పులపాలైంది. దేశ, విదేశీ అప్పు 80 బిలియన్‌ డాలర్లు దాటింది. వాటిని గడువులోపల తీర్చే పరిస్థితి కనిపించటం లేదు.దివాలా ప్రకటిస్తే పరిస్థితి మరింత దిగజారుతుంది. దాంతో ఐఎంఎఫ్‌, ప్రపంచ బ్యాంకు దగ్గరకు వెళ్లింది. మేం చెప్పిన షరతులకు అంగీకారం తెలిపితే ఇబ్బందుల నుంచి బయటపడవేస్తామని అవి చెప్పాయి. ఆ మేరకు ప్రభుత్వం 2021లో ఒప్పందం చేసుకుంది. బ్రెట్టన్‌ఉడ్‌ కవలలు, ఇతర అంతర్జాతీయ సంస్థలన్నీ ముందుగా అప్పెలా తీరుస్తారో చెప్పమంటాయి. వెంటనే, మీరేమీ చెప్పలేరుగానీ మేం చెప్పినట్లు చేయండి, వాటికి మీ పేరు పెట్టుకోండి అంటాయి. ఇదిగో అలాంటి ఒప్పందంలో భాగంగానే కెన్యా పార్లమెంటు ఆమోదించిన 2024 విత్త బిల్లు.దాని ప్రకారం నిత్యావసర వస్తువులు, పిల్లలకు మార్చే డైపర్లతో సహా అనేక వస్తువులపై ఎడాపెడా పన్నులను పెంచాలని ప్రతిపాదించారు. ఇప్పటికే పెరిగిన నిరుద్యోగం, ధరల పెరుగుదలతో అతలాకుతలంగా ఉన్న పరిస్థితి మరింత దిగజారనుందనే భయంతో జనం నిరసనలకు దిగారు. ఆగ్రహం ఎలా ఉందంటే పార్లమెంటు భవనానికి నిప్పు పెట్టారు.ఎంపీలందరూ బతుకు జీవుడా అంటూ పారిపోయారు.అయినా తగ్గేదే లే అన్నట్లుగా అధ్యక్షుడి వైఖరి ఉండటంతో ఆందోళన విస్తరించింది.దాంతో బిల్లు మీద సంతకం చేయటం లేదని ప్రకటించాడు. ఇదంతా ఒక నాటకమని, వ్యవధి తీసుకొనేందుకు వేసిన పాచిక అని చెబుతున్నారు.నిజానికి జనంలో ఆగ్రహం ఇప్పటికిప్పుడు పెరిగింది కాదు. కరోనాకు ముందు పరిస్థితి దిగజారటం ప్రారంభమైంది, కరోనా మరింత దెబ్బతీసింది. అనేక మంది యువతకు ఉపాధిపోయింది. గతేడాది వేసవిలోనే పన్నుల వ్యతిరేక నిరసనలు జరిగాయి. ఉపాధి, పరిశ్రమలు పెద్దగా పెరగకపోయినా అనేక దేశాల్లో విదేశీ సంస్థలు ఇచ్చే రుణాలు, వాటితో పాటు దొరకే ముడుపులకు ఆశపడి ఆర్థిక వ్యవస్థ అవసరాలతో నిమిత్తం లేకుండా పెద్ద ఎత్తున రోడ్ల వంటి మౌలిక సదుపాయాలకు గాను దొరికిన మేర అప్పులు చేసిన దేశాలలో కెన్యా ఒకటి.రెండువేల సంవత్సరాల ప్రారంభంలో విదేశాల నుంచి తీసుకున్న భారీ మొత్తాలను ఆర్థిక వృద్దికి ఖర్చు పెట్టలేదు.దానికి తోడు వరదలు, కరోనా జతకలిశాయి.


దివాలా కోరు ఆర్థిక విధానాలను అనుసరిస్తున్న అన్ని వర్ధమాన దేశాల మాదిరే కెన్యా కూడా ఉంది.ప్రపంచంలో మూడు వందల కోట్ల మంది జనాభా ఉన్న దేశాలు ప్రజారోగ్యం, వైద్యం వంటి వాటికి చేస్తున్న ఖర్చు కంటే రుణాల అసలు, వడ్డీలు తీర్చటానికి ఎక్కువ మొత్తాలను ఖర్చు చేస్తున్నట్లు ఓపెన్‌ సొసైటీ ఫౌండేషన్‌ అధ్యక్షుడు బినాయిఫెర్‌ నౌరోజీ చెప్పాడు. వలసవాద అవశేషాలు, అవినీతి, ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం, విత్త దుర్వినియోగం. పెరిగిన ఆర్థిక, తెగల మధ్య అసమానతల వంటి అంశాలు కెన్యాను పట్టిపీడిస్తున్నాయి. వీటన్నింటినీ తొలగించి మంచి రోజులను తెస్తానంటూ అనేక సంవత్సరాలు మంత్రిగా, ఐదేండ్ల పాటు ఉపాధ్యక్షుడిగా పని చేసిన విలియం రూటో 2022 ఎన్నికల్లో అధ్యక్షుడయ్యాడు. రెండు సంవత్సరాల్లోనే తన నిజస్వరూపాన్ని ప్రదర్శించి ప్రజా వ్యతిరేకిగా రుజువు చేసుకున్నాడు. తాజా విత్త బిల్లును ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకొనేందుకు ఉద్దేశించారు. దానికి గాను పొదుపు అని ముద్దు పేరు పెట్టారు. చూడండి నా కార్యాలయ ఖర్చుకే కోతపెడుతున్నా అంటూ రూటో ప్రకటించాడు. ఇదంతా జనం మీద మోపే భారాలకు నాంది. ప్రపంచంలో పొదుపు చర్యలు ఎక్కడ తీసుకున్నప్పటికీ తొలుత కోతల వేటు పడేది సామాన్యులు, వారికి ప్రభుత్వం చేసే ఖర్చుల మీదే.అన్నింటికీ ఒక్కసారే కోతపెడితే జనం సహించరు. చేదు మాత్రను మింగించటం అలవాటు చేసినట్లుగా దశల వారీ మొదలు పెడతారు. కెన్యా రాబడిలో 60శాతం రుణాలు తీర్చేందుకే పోతోంది. అందువలన నేరుగా చేసే నగదు బదిలీల మొత్తాల కోత, చివరకు బడి పిల్లల మధ్యాహ్న భోజనఖర్చునూ తగ్గించనున్నారు.


పశ్చిమ దేశాలకు, ప్రత్యేకించి అమెరికా తొత్తుగా అధ్యక్షుడు విలియమ్‌ రూటో వ్యవహరిస్తున్నాడడని కెన్యా కమ్యూనిస్టు పార్టీ విమర్శించింది. గద్దె దిగేవరకూ ఆందోళన చేస్తామని ప్రకటించింది. రాజీనామా మినహా మరొకదాన్ని అంగీకరించేది లేదంది. గాజాలో మారణకాండ జరుపుతున్న యూదు దురహంకార ఇజ్రాయెల్‌ పాలకులకు, ఉక్రెయిన్‌ వివాదంలో నాటోకు మద్దతు ఇచ్చాడు. ఇటీవల కెన్యాను నాటో ఏతర భాగస్వామిగా ప్రకటించారు. సిఐఏ అల్లుతున్న కతలన్నింటినీ వల్లిస్తున్నాడు. అమెరికా మిలిటరీ కార్యకలాపాలకు మండా అనే దీవిని అప్పగించాడు. దేశీయంగా ఐఎంఎఫ్‌, ప్రపంచ బ్యాంకు విధానాలను అమలు జరుపుతున్నట్లు కమ్యూనిస్టు పార్టీ పేర్కొన్నది. ఒకసారి పార్లమెంటు ఆమోదించిన బిల్లును వెనక్కు తీసుకోవటానికి రాజ్యాంగం అనుమతించదని, ఒక వేళ అధ్యక్షుడు వెనక్కు పంపితే మూడింట రెండువంతుల మెజారిటీతో ప్రతిపాదనను ఆమోదిస్తే అది చట్టమై కూర్చుంటుందని చెప్పింది. పార్లమెంటు బిల్లును ఆమోదించిన తరువాత 14రోజుల్లో అధ్యక్షుడు ఆమోదం తెలపాల్సి ఉంటుంది, లేదా సవరణలు చేయాలంటూ వెనక్కు పంపాలి.


రొట్టెలపై 16,వంటనూనెలపై 25శాతం పన్ను ప్రతిపాదించారు.ఆర్థిక లావాదేవీలపై దశలవారీ పన్ను పెంపుదల, మోటారు వాహనాల ధరలో రెండున్నరశాతం ప్రతి ఏటా పన్ను కొత్తగా విధింపు, పర్యావరణానికి హాని కలిగించే వృధా ఉత్పత్తులపై పన్ను ప్రతిపాదించారు. దీనిలోనే దిగుమతి చేసుకొనే ఎలక్ట్రానిక్‌ వస్తువులు, శానిటరీ పాడ్‌ల మీద పన్ను ప్రతిపాదించారు. జిఎస్‌టి 16శాతం, ఆసుపత్రుల్లో వాడే పరికరాలు, నిర్మాణ సామగ్రి మీద కూడా పన్ను ప్రతిపాదించారు.ఉద్యోగుల వేతనాలపై గరిష్ట పన్ను మొత్తాన్ని 30 నుంచి 35శాతానికి పెంచగా, కొత్తగా 1.5శాతం ఇంటి పన్ను, వైద్య బీమా పేరుతో 2.75శాతం, ఇంథనంపై ఎనిమిదిశాతంగా ఉన్న పన్నును 16శాతానికి పెంచుతూ ప్రతిపాదించారు. పన్నుల పెంపుదల బాధాకరమే అయినప్పటికీ మన స్వాతంత్య్ర సమర యోధులు గర్వపడాలంటే జనం త్యాగాలు చేయాల్సి ఉంటుందని అధ్యక్షుడు సమర్ధించుకున్నాడు. తనకు గత ప్రభుత్వం నుంచి 65 బిలియన్‌ డాలర్ల అప్పు వారసత్వంగా వచ్చిందన్నాడు. రానున్న కాలంలో పన్ను వసూలు రోజులను కూడా పాటించాల్సి ఉంటుందేమో అంటూ జోకులు వేశాడు. ఏడాది కాలంలో 40సార్లు విదేశీ పర్యటనలు జరిపిన రూటో అట్టహాసంగా ఎంతో ఖర్చు చేశాడు. ఎందుకీ పర్యటనలు అంటే పెట్టుబడుల సాధన, ఉద్యోగఅవకాశాలను వెతికేందుకు అని సమర్ధించుకున్నాడు.ఇదే సమయంలో అనేక సంస్థలు మూతబడి వేలాది మందికి ఉపాధి పోయింది.రానున్న రోజుల్లో ఇంకా కార్యకలాపాలను కుదించవచ్చని కెన్యా యజమానుల సంఘం పేర్కొన్నది.జనం దగ్గర డబ్బులేక రోజుకు ఏడువందల గ్యాస్‌ సిలిండర్లు అమ్మేతాను ప్రస్తుతం రెండువందలకు పడిపోయినట్లు, తన దగ్గర ఉన్న సిబ్బందిని ఆ మేరకు తగ్గించినట్లు ఒక సంస్థ యజమాని చెప్పాడు. ప్రభుత్వ సిబ్బంది పన్ను వసూలు పేరుతో వ్యాపారులను వేధిస్తున్నట్లు చెప్పాడు. గత పాలకుల హయాంలో జరిగిన అవినీతి, ఆశ్రిత పక్షపాతం, జనాన్ని పట్టించుకోకపోవటం వంటి అంశాలను తీసుకొని తాము వస్తే మంచి రోజులు తెస్తామని చెప్పి, అంతకంటే ఎక్కువ భారాలు మోపిన వారిని చరిత్రలో ఎందరో ఉన్నారు. శ్రీలంకలో తాము అభిమానించిన దేశాధ్యక్షుడినే జనం చివరకు తరిమి కొట్టిన తీరును చూశాము. కెన్యాలో ప్రతిపాదించిన భారాలను రద్దు చేస్తే సరే లేకుంటే ఏం జరుగుతుందో చెప్పలేము.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!
  • గుజరాత్‌ రైతుల మీదే మోడీకి శ్రద్ద లేదు, ఇక దేశం గురించి పట్టించుకుంటారా ! భారత్‌పై వేలాడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కత్తి !!
  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!
  • గుజరాత్‌ రైతుల మీదే మోడీకి శ్రద్ద లేదు, ఇక దేశం గురించి పట్టించుకుంటారా ! భారత్‌పై వేలాడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కత్తి !!
  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!
  • గుజరాత్‌ రైతుల మీదే మోడీకి శ్రద్ద లేదు, ఇక దేశం గురించి పట్టించుకుంటారా ! భారత్‌పై వేలాడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కత్తి !!
  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d