• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: USA

ప్రయోజనం లేని భద్రతా మండలి తీర్మానం – గాజాలో సొరంగాల అసలు కథేంటి !

17 Friday Nov 2023

Posted by raomk in Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RUSSIA, UK, USA, WAR

≈ Leave a comment

Tags

2023 Israel–Hamas war, emmanuel macron, Gaza Tunnels, Joe Biden, Justin Trudeau, Narendra Modi Failures, UNSC Failures

ఎం కోటేశ్వరరావు


గాజాపై ఇజ్రాయెల్‌ మారణకాండ ప్రారంభమైన నలభై రోజుల తరువాత తొలిసారిగా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి మానవతా పూర్వక కోణంలో దాడులను ఆపాలని యూదు దురహంకారులను కోరుతూ 12-0 ఓట్లతో వేడుకోలు తీర్మానాన్ని ఆమోదించింది.అనేక దఫాల చర్చల అనంతరం మాల్టా ప్రతిపాదించిన ఈ తీర్మానంలో హమస్‌ను ఖండించలేదు గనుక తాము బహిష్కరించినట్లు అమెరికా, బ్రిటన్‌ ప్రకటించాయి. ఇజ్రాయెల్‌ను డిమాండ్‌ చేయకుండా వేడుకోవటం ఏమిటంటూ రష్యా నిరసనతో ఓటింగ్‌కు దూరంగా ఉంది.ప్రపంచంలో లక్షలాది మంది ప్రతి రోజూ ఏదో ఒక మూల నిరసన తెలుపుతున్నా, ఐరాస సాధారణ అసెంబ్లీ తీర్మానం చేసినా పెడచెవిన పెట్టిన ఇజ్రాయెల్‌ ఈ తీర్మానాన్ని మన్నిస్తుందా ! వెనక్కు తగ్గుతుందా ? గాజాలోని ప్రధాన ఆసుపత్రి కింద నేలమాళిగల్లో దాక్కున్న హమస్‌ తీవ్రవాదులను పట్టుకొనే పేరుతో మొత్తం ఆసుపత్రినే పనికి రాకుండా చేసిన ఇజ్రాయెల్‌ మిలిటరీ అక్కడ ఎంత మంది తీవ్రవాదులను పట్టుకున్నదీ చెప్పకుండా ఆయుధాలను కనుగొన్నామంటూ లోకాన్ని నమ్మింపచేసేందుకు కొన్ని ‘ సిత్రాలను ‘ చూపుతున్నది. ఇలాంటి ఫేక్‌ వీడియోలు ఎక్కడైనా తయారు చేయవచ్చు, తాన అంటే తందాన అనే బిబిసి లాంటి టీవీలు అవి నిజమే అంటూ ప్రపంచాన్ని నమ్మించేందుకు నానా గడ్డీ కరవవచ్చు తప్ప లోకజ్ఞానంతో ఆలోచించే వారెవరూ నమ్మరు. నివాస ప్రాంతాలు, జనాన్ని మానవ కవచాలుగా వాడుకుంటున్న ఉగ్రవాదులు అంటూ ప్రపంచాన్ని తప్పుదారి పట్టించేందుకు పెద్ద ఎత్తున ప్రచారం సాగుతున్నది.


గాజా ప్రాంతంలో సొరంగాలు ఉన్న అంశం కొత్తేమీ కాదు. వాటిపైన ఆసుపత్రులు, స్కూళ్లు, నివాసాలు, ఫ్యాక్టరీలు అన్నీ ఉన్నాయి. యూదు దురాక్రమణను ఎదిరించేందుకు పాలస్తీనా పోరాటయోధులు హమస్‌ ఆవిర్భవించక ముందు కొన్ని దశాబ్దాల క్రితమే ఏర్పాటు చేసుకున్నారు. అవి వారి పోరుబాటలో విడదీయలేనివిగా మారాయి.అక్కడేమీ అడవులు, ఎడారులు లేవు. అక్కడే నివాసాలు, అవే పోరాట కేంద్రాలు. అక్కడ పుట్టి పెరిగే ప్రతి బిడ్డా అక్షరాభ్యాసంతో పాటు పోరుబాట పాఠాలు కూడా నేర్చుకోక తప్పని స్థితిని సామ్రాజ్యావాదులు, వారి బంటుగా ఉన్న ఇజ్రాయెల్‌ కల్పించిన కఠిన సత్యాన్ని ఎవరూ విస్మరించకూడదు. నిత్యం ఎప్పుడేమౌతుందో ఇజ్రాయెల్‌ పోలీసు, మిలిటరీ, యూదు ఉగ్రవాదులు ఎప్పుడు దాడులు చేస్తారో తెలియని స్థితిలో కార్చటానికి కన్నీళ్లు కూడా లేకుండా దశాబ్దాల తరబడి పెరిగారు, అక్కడే మట్టిలో కలిశారు. ఇప్పుడు ఈజిప్టు నేతలు అమెరికా చంకనెక్కి ఇజ్రాయెల్‌తో సఖ్యంగా ఉంటున్నారు తప్ప గతంలో అధికారంలో ఉన్నవారి ప్రోత్సాహం, సాయంతోనే పాలస్తీనా వారు సొరంగాలను ఏర్పాటు చేసుకున్నారు. ఇజ్రాయెల్‌తో ఒప్పందం కుదిరిన తరువాత తమ భూభాగంలో ఉన్నవాటిని ఈజిప్టు కొన్నింటిని కూల్చివేసి, మూసివేసి, గోడలు కట్టి పాలస్తీనియన్లను రాకుండా కట్టడి చేసింది.


గాజాపై ఇజ్రాయెల్‌ దురాక్రమణ, మారణకాండ ప్రారంభించిన అక్టోబరు ఏడవ తేదీ నుంచి అక్కడ ఉన్న సొరంగాల గురించి పెద్ద ఎత్తున ప్రసారమాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారు. ఇజ్రాయెల్‌ అమలు చేసిన దిగ్బంధనాన్ని వమ్ము చేసేందుకు వాటిని తవ్వారు. ఈజిప్టు నుంచి గాజా అక్కడి నుంచి పశ్చిమగట్టుతో పాటు ఇజ్రాయెల్‌లోని కొన్ని ప్రాంతాల్లో కూడా వాటిని విస్తరించారు.ఆహారం, ఇంథనం, ఔషధాలు, నిత్యావసర వస్తువులు వేటినీ అందనివ్వకుండా గాజా నుంచి పాలస్తీనియన్లు వారంతట వారే వేరే చోట్లకు తరలిపోయేట్లు చేసేందుకు అష్టదిగ్బంధనం చేశారు.ఈజిప్టు నుంచి వాటిని తెచ్చుకొనేందుకు తవ్విన సొరంగాలను స్మగ్లింగ్‌ మార్గాలుగా ప్రచారం చేశారు. గాంధీని మోసిన రైలు గాడ్సేను కూడా తీసుకువెళ్లింది అన్నట్లుగా కొన్ని సందర్భాలలో దొంగరవాణాకు ఉపయోగించిన వారు ఉంటే ఉండవచ్చు తప్ప అందుకోసమే వాటిని తవ్వలేదు. సరకులతో పాటు పాలస్తీనా యోధులకు ఇతర దేశాలు అందచేసిన ఆయుధాలను కూడా ఆత్మరక్షణకు ఆ మార్గాలద్వారా తీసుకురాబట్టే ఇజ్రాయెలీ మూకలు కొంత మేరకు అదుపులో ఉన్నాయి.

1979లో ఈజిప్టు-ఇజ్రాయెల్‌ మధ్య మైత్రి కుదిరింది.1987 నుంచి 1993వరకు సాగిన తొలి తిరుగుబాటుకు ఇజ్రాయెల్‌ రెచ్చగొట్టుడే కారణం. గాజాలోని జబాలియా ప్రాంతంలో ఏర్పాటు చేసిన నిర్వాసిత పాలస్తీనీయన్ల శిబిరం మీదకు ఒక ట్రక్కుతో ఇజ్రాయెల్‌ మిలిటరీ చేసిన దాడిలో ముగ్గురు మరణించారు. అది ప్రమాదమని నమ్మబలికినప్పటికీ కావాలనే చేసిందనే ఆగ్రహంతో పాలస్తీనియన్లు ప్రారంభించిన నిరసన, ప్రతిఘటన ఐదేండ్లు సాగింది. ప్రధానంగా రాళ్లు, సీసాల్లో మండే ద్రావకాలను నింపి వాటికి ఫీజులు అమర్చి(మాల్టోవ్‌ బాంబు) సైనికుల మీద దాడులు చేశారు. అందుకనే దాన్ని రాళ్ల తిరుగుబాటు అని కూడా కొందరు వర్ణించారు. ఆ సందర్భంగానే సొరంగాల ద్వారానే అవసరమైన ఆయుధాలు, పేలుడు పదార్దాలను తిరుగుబాటుదారులు సమకూర్చుకున్నారు. ఓస్లో ఒప్పందాలను ముందుకు తెచ్చిన తరువాత తిరుగుబాటు ముగిసింది. దాంతో ఆ ప్రాంతంలోకి అడుగుపెట్టిన ఇజ్రాయెలీ మిలిటరీ సొరంగాలు ఉన్నట్లు 1983లో అధికారికంగా ప్రకటించింది. 2009లో కొత్త వాటిని తవ్వేందుకు, ఉన్నవాటిని వినియోగించేందుకు వీలు లేకుండా ఈజిప్టు తన ప్రాంతంలో భూగర్భ ఆటంకాలను నిర్మించింది. అనేక సొరంగాలను మూసివేసింది.భూమి మీద ఉన్న సరిహద్దుద్వారానే రాకపోకలకు అవకాశమిచ్చింది.2007లో గాజా ప్రాంతంలో హమస్‌ పట్టు సాధించి ఆ ప్రాంతంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. గాజా పౌరులు కదలకుండా మెదలకుండా ఉండేందుకు ఈజిప్టు-ఇజ్రాయెల్‌ రెండూ ఆంక్షలను మరింత కఠినతరంగావించాయి. దానిలో భాగంగానే ఈజిప్టు 2013,14 సంవత్సరాలలో పన్నెండు వందల సొరంగాలను నాశనం చేసింది.


గాజాను దిగ్బంధించిన కాలంలో అధికారికంగా అనుమతించిన వాణిజ్యం కంటే సొరంగాల ద్వారానే ఎక్కవగా జరిగినట్లు 2015 నివేదికలో ఆంక్టాడ్‌ పేర్కొన్నది.2008.09 సంవత్సరాలలో గాజాపై ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో ధ్వంసమైన ఆరువేల ఇండ్లను నిర్మించేందుకు ఇజ్రాయెల్‌ అనుమతించిన మేరకు అవసరమైన సామగ్రిని తరలించేందుకు నిర్మాణం గావించేందుకు ఎనభై సంవత్సరాలు పట్టేది. కానీ సొరంగాల ద్వారా పాలస్తీనియన్లు వాటిని సమకూర్చుకొని కేవలం ఐదు సంవత్సరాల్లోనే పూర్తి చేశారు. గాజాలో ఉన్న ఏకైక విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం నడవటానికి రోజుకు అవసరమైన పదిలక్షల లీటర్ల డీజిల్‌ను ఈజిప్టు నుంచి తెచ్చుకొనేందుకు కూడా అవే రవాణా మార్గాలు. గాజాలోని, మురుగు, ఉప్పునీటిని శుద్ధి చేసేందుకు అవసరమైన విద్యుత్‌ కోసం ఈ కేంద్రాన్ని వినియోగించారు. ఈజిప్టు తన ప్రాంతంలో ఉన్న సొరంగాలను మూసివేసిన తరువాత డీజిల్‌ దొరక్క ఆ కేంద్రం మూతపడింది. దాంతో మురుగు నీటిని సముద్రంలోకి వదలటంతో సముద్ర తీరంలో కాలుష్య సమస్య ఏర్పడింది. గాజాపై దిగ్బంధనాన్ని తొలగించి టన్నెల్‌ ఆర్ధిక వ్యవస్థకు స్వస్తి పలకాలని ఆంక్టాడ్‌ పేర్కొన్నది. నిర్మాణ సామాగ్ర రవాణాకు తాము అనుమతిస్తే వాటితో హమస్‌ మిలిటరీ అవసరాల కోసం వినియోగిస్తుందని ఇజ్రాయెల్‌ సాకులు చెప్పింది. రంజాన్‌ సందర్భంగా గాజా వెలుపలికి వెళ్లాలంటే ఈజిప్టు, ఇజ్రాయెల్‌ అనుమతించిన గేట్లద్వారానే వెళ్లాల్సి ఉండేది. సాకులు చెప్పి అనేక పరిమితులు విధించిన కారణంగా రాకపోకలకు కూడా ఆ సొరంగాలే పనికి వచ్చాయి. ఇజ్రాయెల్‌లో జనసమ్మర్ధం లేని, కాపాలా పెద్దగా లేని ప్రాంతాలకు ఈ సొరంగమార్గాలు విస్తరించి వాటి ద్వారా కూడా లావాదేవీలు నిర్వహించారు.


నెలరోజులకు పైగా టాంకులు, క్షిపణులతో ఒక్కో ఆసుపత్రిని ధ్వంస చేస్తున్న పూర్వరంగంలో ఒకవేళ నిజంగానే తీవ్రవాదులు ఎవరైనా ఆ సొరంగాల్లో ఉంటారా, ఇజ్రాయెల్‌, పశ్చిమదేశాల మీడియాలో చూపేందుకు ఆయుధాలను అక్కడే వదలి వెళతారా? 1967 యుద్దంలో ఈజిప్టు రక్షణలో ఉన్న గాజా ప్రాంతాన్ని ఇజ్రాయెల్‌ ఆక్రమించింది. ఓస్లో ఒప్పందాల్లో భాగంగా 1993లో పాలస్తీనా అధారిటీకి వాటిని అప్పగించినట్లు ప్రకటించినప్పటికీ 2005లో మాత్రమే సైన్యాన్ని, అక్కడ నివాసాలు ఏర్పాటు చేసి ప్రవేశపెట్టిన యూదు పౌరులను వెనక్కు తీసుకుంది. ఆ తరువాత కూడా ఈజిప్టు పాలకులతో చేతులు కలిపి గాజాను దిగ్బంధం చేసింది, హమస్‌ తీవ్రవాదులను అణచేపేరుతో అనేక సార్లు గాజా మీద దాడులు చేసి వేలాది మందిని బలితీసుకుంది.తాజాగా అదే సాకుతో చేస్తున్న దాడులు మరింత దుర్మార్గంగా ఉన్నాయి, ఆసుపత్రులను కూడా వదల్లేదు.భద్రతా మండలి తీర్మానం భాషలో తొలుత కాల్పుల విరమణ పాటించాలనే డిమాండ్‌ను పెట్టగా తరువాత దాన్ని తొలగించి పిలుపు అనే పదాన్ని చేర్చారంటేనే దాన్ని ఇజ్రాయెల్‌ దయాదాక్షిణ్యాలకు వదలి పెట్టారన్నది స్పష్టం. కాదని ఠలాయిస్తే మీద చర్యలు తీసుకొనేందుకు ఎలాంటి ప్రతిపాదనలూ దానిలో లేవు. గతంలో బాల్కన్‌ నుంచి సిరియా వరకు అనేక సందర్భాల్లో ఇలాంటి వాటిని ఆమోదించారు. వాటిని పట్టించుకున్నవారుగాని, ఎలాంటి ఫలితంగాని లేదు. సరిగ్గా ఈ తీర్మానం ఆమోదిస్తున్న తరుణంలోనే గాజాలో పోరు తరువాత బలమైన మిలిటరీ శక్తిని అక్కడ ఉంచుతాం అని ఇజ్రాయెల్‌ అధ్యక్షుడు ఇసాక్‌ హర్‌జోగ్‌ చెప్పాడు. ఇదే సమయంలో గాజాను ఆక్రమించటం పెద్ద తప్పిదం అవుతుందని స్పష్టం చేసినట్లు అమెరికా అధినేత జోబైడెన్‌ కొత్త పల్లవి అందుకొన్ని నాటకంలో మరో అంకానికి తెరలేపాడు.


మారణకాండను సమర్ధించటంలో ఎవరి పాత్రను వారు పోషిస్తున్నారు. పౌరులను చంపివేస్తున్నారని తక్షణమే కాల్పుల విరమణ జరగాలంటూ అక్టోబరు 26న ఐరాసా సాధారణ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానంపై మన దేశం ఓటింగ్‌లో పాల్గొనలేదు, అంటే పరోక్షంగా ఇజ్రాయెల్‌ను సమర్ధించినట్లే. పేద దేశాల రెండవ వాణి సదస్సులో శుక్రవారం నాడు ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడుతూ గాజాలో సాధారణ పౌరులను చంపివేయటాన్ని ఖండిస్తున్నట్లు చెప్పటం విశేషం. దీన్నే ఏ రోటి దగ్గర ఆ పాటపాడటం అంటారు. ఐరాసలో ఇజ్రాయెల్‌ను ఖండిస్తే అమెరికాకు ఆగ్రహం కలుగుతుంది. పేద దేశాల సమావేశంలో ఖండించకపోతే వాటికి దూరం అవుతారు.పన్నెండు వేల మంది మరణించిన పూర్వరంగంలో ప్రపంచ మద్దతు కోల్పోతున్న ఇజ్రాయెల్‌ను నిస్సిగ్గుగా సమర్ధించిన వారే మాట మార్చిన తరువాత నలభై రెండవ రోజున నరేంద్రమోడీ నోరు విప్పారు. పిల్లలను చంపటాన్ని నిలిపివేయాలని గతవారంలో కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రడెవ్‌, ఫ్రెంచి అధ్యక్షుడు మక్రాన్‌ ఇజ్రాయెల్‌ను కోరారు. వారు ప్రారంభం నుంచీ ఇజ్రాయెల్‌కు గట్టి మద్దతుదారులుగా ఉన్న సంగతి తెలిసిందే. తొలుత హమస్‌ తీవ్రవాదులను అణచివేస్తున్నామని బుకాయించిన ఇజ్రాయెల్‌ మాటలను ఎవరూ నమ్మని స్థితి వచ్చింది. పౌరుల మరణాలను తగ్గించటంలో తాము విజయవంతం కాలేదని చివరికి ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు కూడా చెప్పాల్సి వచ్చింది ప్రజాభిప్రాయానికి, ఆగ్రహానికి వారు తలొగ్గి మాట మార్చిన తరువాతే నరేంద్రమోడీ స్పందించారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఇజ్రాయెల్‌ మారణకాండలో ప్రతి పదినిమిషాలకు ఒక పసి ప్రాణం బలి, ఖండన తప్ప కార్యాచరణ లేని అరబ్‌, ఇస్లామిక్‌ దేశాల తీరు !

15 Wednesday Nov 2023

Posted by raomk in Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, Opinion, USA, WAR, Women

≈ Leave a comment

Tags

2023 Israel–Hamas war, ‘Crimes’ Against Palestinians, Iran protests, Israeli Aggression, Joe Biden, Netanyahu, Palestinian People, Riyadh Arab-Islamic summit, Saudi Arabia


ఎం కోటేశ్వరరావు


గాజాలో ఇజ్రాయెల్‌ యూదు దురహంకారులు జరుపుతున్న మారణకాండను ఖండించటంలో ముక్తకంఠంతో ఉన్న అరబ్‌, ఇస్లామిక్‌ దేశాలు దానిపై నిర్దిష్ట చర్యల అంశంపై సంశయంలో పడ్డాయి. శనివారం నాడు సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో జరిగిన అరబ్‌లీగ్‌-ఇస్లామిక్‌ దేశాల సహకార సంస్థ(ఓఐసి) అసాధారణ సంయుక్త సమావేశం జరిగింది. తక్షణమే గాజాపై జరుపుతున్న దాడులను విరమించాలని, అందుకోసం ఐరాస నిర్ణయాత్మక, కట్టుబడి ఉండేందుకు వీలైన తీర్మానం చేయాలని సమావేశం డిమాండ్‌ చేసింది. ఆచరణాత్మక చర్యలు తీసుకొనే అంశంలో ఇరాన్‌ చేసిన ప్రతిపాదనలను సమావేశం పక్కన పెట్టింది. అనేక దేశాలకు అమెరికాతో ఉన్న సంబంధాలే దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తున్నది.ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని అక్టోబరు ఏడు నుంచి ఇజ్రాయెల్‌ కారణకాండను సాగిస్తున్నది.గాజాలో ఉన్న ఆసుపత్రులను అడ్డం పెట్టుకొని హమస్‌ తీవ్రవాదులు ఆయుధాలు దాచారనే సాకుతో ప్రధాన ఆసుపత్రితో సహా అన్ని వైద్య సదుపాయాలను నాశనం చేశారు. ఇప్పటివరకు పన్నెండువేల మందికి పైగా మరణించగా వారిలో పిల్లలు, మహిళలే 70శాతం ఉన్నారు. వీరిలో ఎందరు తీవ్రవాదులు ఉన్నదీ లేదా వారి ప్రతిఘటనదాడుల్లో మరణించిన తమ సైనికుల గురించి నిర్దిష్టమైన సమాచారం ఇజ్రాయెల్‌ చెప్పటం లేదు. దాని కట్టుకథలు, పిట్టకతలను వల్లిస్తూ మానవత్వం గురించి నిత్యం ధర్మపన్నాలు వల్లింఏ పశ్చిమ దేశాలు ఆత్మరక్షణ పేరుతో సాగిస్తున్న మారణకాండను నిస్సిగ్గుగా సమర్ధిస్తున్నాయి. మరోవైపు ఈ దాడులకు ప్రపంచమంతటా తీవ్ర వ్యతిరేకత వెల్లడి అవుతున్నది. బ్రిటన్‌ చరిత్రలోనే ఎన్నడూ జరగని విధంగా మూడుల లక్షల మంది పాలస్తీనాకు మద్దతుగా ప్రదర్శన జరిపారు.


గాజాలో వంద మందికి పైగా ఐరాస సహాయక సిబ్బందితో సహా అక్టోబరు ఏడు నుంచి నవంబరు 13వ తేదీ వరకు 11,240 మంది మరణించగా వారిలో పిల్లలు 4,609 మంది ఉన్నారు. చెబుతున్నదాని కంటే మరణాలు ఎక్కువగా ఉండవచ్చని అమెరికా అధికారులు చెబుతున్నారు. గాజాలో ప్రతి పది నిమిషాలకు ఒక పసిప్రాణాన్ని ఇజ్రాయెల్‌ బలిగొంటున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ చెబ్రియోసుస్‌ భద్రతా మండలిలో చెప్పాడు. గాజాలో ఎవరూ ఎక్కడా సురక్షితంగా లేరని అన్నాడు. ది న్యూఅరబ్‌ అనే మీడియా సంస్థ నవంబరు పదవ తేదీ నాటికి ఉన్న పరిస్థితి గురించి ఒక సమీక్షను ఇచ్చింది. దాని ప్రకారం 11,078 మంది మరణించారు. పౌరులు 10,203, వారిలో 4,506 మంది పిల్లలు, 3,207 మంది మహిళలు, 190 మంది ఆరోగ్య సిబ్బంది ఉన్నారు. గాయపడిన వారు 30,220 కాగా పిల్లలు 8,663, మహిళలు 6,327 మంది. వీరు గాక శిధిలాల కింద మరో 2,551 మంది ఉన్నారు. పదహారు లక్షల మంది నెలవులు తప్పారు. 53,700 భవనాలు పూర్తిగా ధ్వంసం కాగా మరో 1,56,200 పాక్షికంగా దెబ్బతిన్నాయి.మీడియా సంస్థలు ఉన్న 111పూర్తిగా నాశనం లేదా దెబ్బతిన్నాయి,46 మంది జర్నలిస్టుల ప్రాణాలను తీశారు. పరిశ్రమలు 790, స్కూళ్లు 214,ఆరోగ్య వసతులు 113,మసీదులు 64, చర్చ్‌లు మూడు దెబ్బతిన్నాయి. ఇజ్రాయెల్‌ గాజాలోని తమ ప్రాంగణాలపై జరిపిన దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వంద మంది తమ సిబ్బందికి సంతాపసూచకంగా ఐరాస పతాకాన్ని అవనతం చేసి నివాళి అర్పించింది. ఐరాస ప్రాంగణాల్లో కూడా హమస్‌ తీవ్రవాదులు ఉన్నారని ఇజ్రాయెల్‌ బాంబులు వేసిందా ? ఏ విధంగానూ సమర్ధించుకోని విధంగా మొత్తం గాజాను నివాసానికి పనికి రాకుండా చేసేందుకు, అక్కడి ఇరవై మూడులక్షల మందిని ఎడారి ప్రాంతాలకు తరిమివేసేందుకు యూదు దురహంకారులు దమనకాండ సాగిస్తున్నారని వార్తలు వస్తున్నాయి.


తొలుత శని, ఆదివారాల్లో అరబ్‌ లీగ్‌, ఇస్లామిక్‌ దేశాల సహకార సంస్థ సమావేశాలను విడివిడిగా జరపాలని సౌదీ అరేబియా ఏర్పాట్లు చేసింది. అయితే ఇజ్రాయెల్‌ దాడుల తీవ్రత పెరగటంతో శనివారం నాడే రెండు సంస్థల సమావేశం జరిపారు.యాభై ఏడు దేశాల అధినేతలు, ప్రతినిధులు పాల్గొన్నారు.పదేండ్లకు పైగా ఉప్పు-నిప్పుగా ఉన్న ఇరాన్‌-సౌదీ అరేబియా మధ్య ఈ ఏడాది మార్చి నెలలో చైనా కుదిర్చిన సయోధ్య కారణంగా దశాబ్దం తరువాత తొలిసారిగా ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసి సౌదీలో అడుగుపెట్టాడు. అదే విధంగా అరబ్‌ లీగ్‌లో పున:ప్రవేశానికి అంగీకరించటంతో సిరియా నేత అసాద్‌ కూడా రియాద్‌ సమావేశంలో భాగస్వామి అయ్యాడు. ఇజ్రాయెల్‌ దాడులను ఖండించటమే గాక దాని మీద ఆర్థిక, రాజకీయ ఆంక్షలను అమలు జరపాలని ఇరాన్‌ చేసిన ప్రతిపాదనకు కొన్ని దేశాలు వ్యతిరేకత వెల్లడించటంతో ఖండన వరకే తీర్మానంలో పొందుపరిచారు. అయినప్పటికీ ఐక్యత పెరగటం ఒక ముఖ్యపరిణామం. ఇది ఇజ్రాయెల్‌ మీద వత్తిడిని మరింత పెంచుతుంది. అడ్డగోలుగా దాన్ని సమర్దించే దేశాలు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొనేట్లు చేసింది. పాలస్తీనా విముక్తికోసం పోరాడుతున్న హమస్‌ సంస్థకు అన్ని విధాలుగా ఇరాన్‌ మద్దతు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇజ్రాయెల్‌తో సాధారణ సంబంధాలను ఏర్పాటు చేసుకొనేందుకు ఇటీవలి కాలంలో అమెరికా అనేక దేశాలను అదిరించి బెదిరించి లొంగదీస్తున్నది, ఒప్పందాలు చేయిస్తున్నది.


గాజాపై ఇజ్రాయెల్‌ మారణకాండ ప్రారంభానికి కొద్ది వారాల ముందు సౌదీ అరేబియా రాజు కూడా ఇజ్రాయెల్‌తో సానుకూల సంబంధాలకు చర్చలు జరుగుతున్నట్లు ప్రకటించాడు. గత కొద్ది సంవత్సరాలుగా అరబ్బు, ఇస్లామిక్‌ దేశాలతో సంబంధాల ఏర్పాటు సాగుతున్నది. యూదులు, ముస్లింలు అబ్రహాంను దేవదూతగా పరిగణిస్తారు గనుక అవి కుదుర్చుకుంటున్న ఒప్పందాలను అబ్రహాం పేరుతో పిలుస్తున్నారు. 2020 తరువాత యునైటెట్‌ అరబ్‌ ఎమిరేట్స్‌,బహరెయిన్‌, మొరాకో, అంతకు చాలా సంవత్సరాల ముందు ఈజిప్టు, జోర్డాన్‌ ఒప్పందాలు చేసుకున్నాయి.వీటన్నింటి వెనుక అమెరికా ఉంది. ఈ ఒప్పందాలు చేసుకున్న దేశాల మధ్య వాణిజ్యం, యాత్రీకుల రాకపోకలు పెరగటం తప్ప అంతకు మించి పురోగతి లేదు. దానికి ప్రధాన కారణంగా పాలస్తీనా రాజ్య ఏర్పాటును ఇజ్రాయెల్‌, అమెరికా అడ్డుకోవటమే. తాజా పరిణామాలు దేనికి దారితీసేది చూడాల్సి ఉంది.హమస్‌కు ఇరాన్‌ మద్దతు బహిరంగ రహస్యమే. మధ్యధరా సముద్రంలో పెద్ద ఎత్తున అమెరికా నౌకాదళాన్ని మోహరించినప్పటికీ ఇటీవలి కాలంలో ఇరాక్‌, సిరియా, ఎమెన్లలో ఇరాన్‌ మద్దతు ఉన్న సాయుధశక్తులు 40 డ్రోన్‌, రాకెట్ల దాడులు చేశాయి.


ఇజ్రాయెల్‌కు ఆయుధాల విక్రయాన్ని నిలిపివేయాలని, పశ్చిమగట్టుతో గాజా సంబంధాన్ని తెంచివేయాలనే యత్నాలను అంగీకరించేది లేదని రియాద్‌ సభ స్పష్టం చేసింది. ఈ సమావేశంలో విబేధాలు కూడా వెల్లడయ్యాయి. ఇజ్రాయెల్‌ మిలిటరీని ఉగ్రవాద సంస్థగా పరిగణించాలని, అసలు ఇజ్రాయెల్‌ ఉనికినే గుర్తించరాదని, ఆర్థిక, రాజకీయ ఆంక్షలు విధించాలన్న ఇరాన్‌ ప్రతిపాదనను అంగీకరించలేదు. 1967జూన్‌ 4వ తేదీ నాటి సరిహద్దులు, ప్రాంతాలతో జరూసలెం రాజధానిగా పాలస్తీనా ఏర్పాటు జరగాలని అరబ్బుదేశాలు కోరాయి.రియాద్‌ సభ ఆమోదించిన తీర్మానం పట్ల తమకు కొన్ని మినహాయింపులున్నాయని ఇరాన్‌ అధ్యక్షుడు వెంటనే ప్రకటించాడు. ఆ మేరకు వాటి గురించి జడ్డాలోని అరబ్‌లీగ్‌ కార్యాలయానికి అధికారికంగా తెలియచేశారు.అరబ్‌-ముస్లిం దేశాలు తీసుకున్న వైఖరిని తాము ఆమోదించటం లేదని గాజాలో ఉన్న ఇస్లామిక్‌ జీహాద్‌ సంస్థ ప్రకటించింది. అవి తమ బాధ్యతను విస్మరించినట్లు అది పేర్కొన్నది. ఇజ్రాయెల్‌తో అన్ని రకాల సంబంధాలను తెగతెంపులు చేసుకోవాలని అల్జీరియా ప్రతిపాదించింది.
రియాద్‌ సమావేశంలో పాలస్తీనా అధ్యక్షుడు అబ్బాస్‌ ప్రతిపాదనల సారం ఇలా ఉంది. దురాక్రమణలు, దాడులను నివారించాల్సిన బాధ్యత కలిగిన భద్రతా మండలి దానికి కట్టుబడి ఉండాలి, వైద్య, ఆహార సరఫరాలను అనుమతించాలి, బలవంతంగా నిర్వాసితులను కావించటాన్ని అడ్డుకోవాలి.రెండు దేశాలను ఏర్పాటు చేయాలన్న తీర్మానాన్ని ఉల్లంఘించి పాలస్తీనా ప్రాంతాలను దురాక్రమించటం, యూదుల నివాసాలను పెంచటాన్ని నివారించేందుకు గతంలో చేసిన అన్ని ప్రయత్నాలు విఫలం చెందాయి, ఇప్పుడు మారణకాండకు పూనుకున్నారు, ఈ కారణంగా మిలిటరీ, భద్రతా పరిష్కారాలను అంగీకరించేందుకు అంగీకరించం.గాజా ప్రాంతం పాలస్తీనాలో భాగంగానే ఉండాలి, గాజా, పశ్చిమగట్టుతో సహా పాలస్తీనా ప్రాంతాలన్నీ ఉండే విధంగా ఒక సమగ్ర రాజకీయ పరిష్కారం కావాలి.2007 నుంచి గాజాలో పాలస్తీనా అధారిటీ 20బిలియన్‌ డాలర్లు ఖర్చు చేసింది, తమ పౌరుల పట్ల అధారిటీ బాధ్యత అది. పాలస్తీనా రాజ్యం, పౌరులకు భద్రతా మండలి రక్షణ కల్పించాలి. సర్వసత్తాక రాజ్యాన్ని సాధించేందుకు ఆచరణాత్మకమైన పరిష్కారం కావాలి. క్వుద్స్‌ (అరబ్బీలో జెరూసలెం పేరు) రాజధానిగా పాలస్తీనా రాజ్యాన్ని ఏర్పాటు చేయాలి, ఐరాస 149వ తీర్మానాన్ని అనుసరించి అది జరగాలి.అంతిమంగా రాజ్య స్థిరత్వానికి గాజా పునర్‌నిర్మాణంతో సహా ప్రభుత్వానికి అవసరమైన ఆర్థిక సాయానికి అంతర్జాతీయ మద్దతు అవసరం. అని అబ్బాస్‌ స్పష్టం చేశారు.


రియాద్‌ సమావేశం ఒక విధంగా మధ్యప్రాచ్యంలో అమెరికా వ్యూహానికి ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. ఇజ్రాయెల్‌-సౌదీ, ఇతర దేశాల మధ్య సాన్నిహిత్యాన్ని కుదర్చాలని చూస్తున్న యత్నాలకు తాత్కాలికంగా విఘాతం కలిగినట్లే.ఇజ్రాయెల్‌ను అమెరికా అదుపు చేయకుండా సమర్ధించటం, గాజా పరిణామాలతో అరబ్‌ దేశాలు ఆశాభంగం చెందాయి.రియాద్‌ సభకు ముందు నవంబరు తొమ్మిదిన ఉజ్బెకిస్తాన్‌ రాజధాని తాష్కెంట్‌లో ఆర్థిక సహకార సంస్థ(ఇసిఓ) పదహారవ సమావేశం జరిగింది. దీన్లో ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రెయిసీ, టర్కీ అధినేత రిసెప్‌ తయిప్‌ ఎర్డోగన్‌ వంటి వారు పాల్గొన్నారు.1980దశకం నుంచి పశ్చిమాసియాలోని పాలకవర్గాలపై అమెరికా పట్టు బిగిస్తున్నది.సోవియట్‌ను కూల్చివేసిన తరువాత అది మరింత వేగం పుంజుకుంది. తన మిలిటరీ, ఆర్థికశక్తితో పూర్తి ఆధిపత్యాన్ని సాధించేందుకు పూనుకుంది.ఇరాన్‌, సిరియా కొరకరాని కొయ్యలుగా ఉన్నాయి. ఆంక్షలతో వాటిని సాధించేందుకు చూస్తున్నది. మిగిలిన దేశాలన్నీ చేతులెత్తేసిన కారణంగానే తరువాత కాలంలో విస్మరించిన ఓస్లో ఒప్పందాలను 1993, 95లో పాలస్తీనా విమోచనా సంస్థతో బలవంతంగా ఒప్పించారు. అంగీకరించకపోతే మద్దతు వెనక్కు తీసుకుంటామని కొన్ని దేశాలు బెదిరించాయి.దీంతో ఇజ్రాయెల్‌ మరింతగా రెచ్చిపోతున్నది. ఈ పూర్వరంగంలోనే హమస్‌ రంగంలోకి వచ్చింది. గాజాపై దాడులతో ఆ ప్రాంతంలోని దేశాలన్నీ తమ వైఖరులను సవరించుకోవాల్సి వచ్చింది. గాజాతో సరిహద్దును కలిగిన ఈజిప్టు రాఫా వద్ద గేట్లను తెరవాలని ఇజ్రాయెల్‌, అమెరికా చేసిన వినతిని ఈజిప్టు తిరస్కరించింది. అదే జరిగితే లక్షల మంది పాలస్తీనియన్లను ఈజిప్టులోకి తరమాలన్నది వాటి ఎత్తుగడ. కావాలంటే ఖాళీ చేయించిన పాలస్తీనియన్లను నెగెవ్‌ ఎడారిలోకి పంపండని కూడా అధ్యక్షుడు అబ్దుల్‌ ఫతా ఎల్‌ సిసి ఉచిత సలహా ఇచ్చాడు. అయితే అదే పెద్ద మనిషి ఇజ్రాయెల్‌ దుర్మార్గాలకు వ్యతిరేకంగా జనంలో వస్తున్న స్పందన చివరికి తన కుర్చీకే ఎసరు తెస్తుందని భావించి నిరసన ప్రదర్శనలు జరిపేందుకు అనుమతించాల్సి వచ్చింది.2013లో ఈజిప్టులో సంభవించిన మిలిటరీ తిరుగుబాటు తరువాత ఇలా వీధుల్లోకి జనాన్ని అనుమతించటం ఇదే ప్రధమం అంటున్నారు. ఇజ్రాయెల్‌కు నిరసన తెలుపుతూ టర్కీ తన రాయబారిని వెనక్కు పిలిచింది.జో బైడన్‌ జోర్డాన్‌ వచ్చి మంతనాలు జరిపినప్పటికీ జోర్డాన్‌ ఇజ్రాయెల్‌ దాడులను ఖండించకతప్పలేదు. చివరికి అది కూడా రాయబారిని వెనక్కు పిలిచింది. బహెరెయిన్‌ ఇజ్రాయెల్‌ రాయబారులను బహిష్కరించింది. ఒక్క ఇజ్రాయెల్‌కే కాదు, సౌదీ అరేబియాకూ ఇరాన్‌ నుంచి ముప్పు ఉందని అమెరికా చెప్పినప్పటికీ తోసి పుచ్చి సౌదీ గాజా అంశంలో ఇరాన్‌తో కలసి నడుస్తోంది. వీటన్నింటినీ చూస్తే తెల్లవారే సరికి అరబ్‌-ఇస్లామిక్‌ దేశాలన్నీ ఇజ్రాయెల్‌ను ఏదో చేస్తాయని చెప్పలేము గాని మధ్య ప్రాచ్యం, పశ్చిమాసియా భౌగోళిక-రాజకీయ చిత్రంలో మార్పులు కనిపిస్తున్నాయి. ఇది అమెరికా ఆధిపత్యాన్ని ధిక్కరించటంలో ఒక ముందడుగే !

Share this:

  • Tweet
  • More
Like Loading...

గాజాలో ఇజ్రాయెల్‌ శాశ్వత తిష్ట -తెరపైకి రష్యా, ఉక్రెయిన్‌ శాంతి చర్చలు !

08 Wednesday Nov 2023

Posted by raomk in Current Affairs, Europe, History, imperialism, INTERNATIONAL NEWS, Latin America, Opinion, RUSSIA, USA, WAR

≈ Leave a comment

Tags

2023 Israel–Hamas war, Donald trump, Joe Biden, NATO allies, Ukraine crisis, Vladimir Putin, Volodymyr Zelensky


ఎం కోటేశ్వరరావు


హమస్‌ను అణచే సాకుతో పశ్చిమ దేశాల మద్దతు ఉన్న ఇజ్రాయెల్‌ గాజాలోని పాలస్తీనియన్ల మీద ప్రారంభించిన మారణకాండకు నెలదాటింది. అవే పశ్చిమ దేశాల అండచూసుకొని రష్యాను దెబ్బతీస్తామని బీరాలు పలికిన ఉక్రెయిన్‌ సంక్షోభం ప్రారంభమై 622 రోజులు అవుతున్నది. ఇంతకాలం గడచినా సాధించలేనిది ముందు రోజుల్లో రష్యాను వెనక్కు కొడతారంటే ఎలా నమ్మాలనే సందేహాలు మొదలయ్యాయి. మరోసారి శాంతి చర్చలను తెరమీదకు తెచ్చారు. హమస్‌ సాయుధులను అణచివేసేందుకు నిరవధికంగా గాజా రక్షణ బాధ్యత తీసుకుంటామని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు ప్రకటించాడు.” మేము అక్కడ లేకపోతే ఏమి జరిగిందో చూశారు. హమస్‌ తీవ్రవాదం ఇంత పెద్ద ఎత్తున ఉంటుందని మేము ఊహించలేదు. నిరవధికంగా గాజా రక్షణ బాధ్యత తీసుకోవాలని అనుకుంటున్నాము ” అన్నాడు.ఇజ్రాయెల్‌ మారణకాండలో మంగళవారం ఉదయానికి అందిన సమాచారం మేరకు గాజాలో 4,100 మంది పిల్లలతో సహా 10,022 మంది మరణించగా 25,408 మంది గాయపడ్డారు. పశ్చిమగట్టు ప్రాంతంలో మరణించిన వారు 163 కాగా 2,100 మంది గాయపడ్డారు. గాజాలో ఉన్న 35 ఆసుపత్రులలో పదహారింటిని పనికిరాకుండాచేశారు. అదే విధంగా ప్రాధమిక ఆరోగ్యకేంద్రాలు 72కు గాను 51మూత పడ్డాయి. ఇజ్రాయెల్‌ మిలిటరీ బాంబులు, క్షిపణులతో దాడులు జరుపుతూ గాజా జనాభా 23లక్షలకు గాను 16.1లక్షల మందిని నివాసాల నుంచి తరిమివేశారు. మరణించిన వారిలో 88 మంది ఐరాస సహాయ సిబ్బంది ఉన్నారంటే హమస్‌ తీవ్రవాదుల స్థావరాల మీద దాడుఉ చేస్తున్నట్లు చేస్తున్న ప్రచార బండారం ఏమిటో అర్ధం అవుతున్నది. ఇంతవరకు ఏ ఒక్క దేశంలో ఒక ఉదంతంలో ఇంత మంది మరణించిన దాఖలా లేదు. మారణకాండను నిరసిస్తూ బహరెయిన్‌, ఛాద్‌, చిలీ, కొలంబియా, హొండురాస్‌, జోర్డాన్‌, దక్షిణాఫ్రికా, టర్కీ ఇజ్రాయెల్‌లోని తమ దౌత్యవేత్తలను వెనక్కు రప్పించాయి. బొలీవియా అన్ని రకాల సంబంధాలను తెగతెంపులు చేసుకున్నది. వందల కోట్ల డాలర్ల విలువగల మారణాయుధాలను అందిస్తున్న అమెరికా గతంలో ఎర్ర సముద్ర ప్రాంతానికి రెండు విమానవాహక యుద్ధ నౌకలు, క్షిపణి ప్రయోగ యుద్ధ నౌకలను పంపగా ఇప్పుడు ఒక జలాంతర్గామిని ఆ ప్రాంతానికి పంపి ఆ ప్రాంత దేశాలను బెదిరిస్తున్నది. .


తాము అంచనా వేసిన విధంగా రష్యా సేనలను ఎదుర్కోవటంలో ఉక్రెయిన్‌ విఫలం కావటంతో పశ్చిమ దేశాలు పునరాలోచనలో పడటమే గాక, ఏదో విధంగా రాజీచేసుకోవాలంటూ వత్తిడికి శ్రీకారం చుట్టినట్లు వార్తలు వచ్చాయి. రష్యా సైనిక చర్య ప్రారంభమై ఇరవై నెలలు దాటింది. తమ ప్రాంతాల్లోకి చొచ్చుకు వచ్చిన పుతిన్‌ సేనలను వెనక్కు కొట్టేందుకు ప్రతిదాడులను ప్రారంభించినట్లు ప్రకటించి ఐదు నెలలు గడుస్తున్నప్పటికీ రష్యా సేనలు ఖాళీ చేసిన ఒకటి రెండు గ్రామాలు, ప్రాంతాలు తప్ప చెప్పుకోదగిన పరిణామాలేవీ లేవు. రష్యా మందుపాతరలను ఏర్పాటు చేసినందున వాటిని తొలగించేందుకు చాలా సమయం పడుతున్నదని ఉక్రెయిన్‌ చెప్పుకుంటున్నది. నిజానికి అదే వాస్తవమైతే ప్రతిదాడులతో ఆ ప్రాంతాలన్నింటినీ స్వాధీనం చేసుకోవటమే తరువాయి అన్నట్లుగా మే, జూన్‌ మాసాలలో మీడియాలో కథనాలను ప్రచురించారు. పశ్చిమ దేశాలన్నీ మధ్యప్రాచ్యం, ఇజ్రాయెల్‌ మీద కేంద్రీకరించటం, భవిష్యత్‌లో సాయం కొనసాగదేమో అన్న సందేహాలు తలెత్తటం, మరోవైపు రష్యా వైమానిక దాడులు నిరంతరం కొనసాగుతుండటం, చలికాలం ముందుంటంతో ఉక్రెయిన్‌ మిలిటరీ, పాలకులకు దిక్కుతోచటం లేదు.నవంబరు ఐదవ తేదీన ఉక్రెయిన్‌ మిలిటరీ అవార్డుల సభమీద జరిగిన దాడిలో కనీసం 20 మంది సైనికులు మరణించటంతో జెలెనెస్కీ కలవర పడ్డాడు.యుద్ధం సాగుతున్నపుడు ఆ ప్రాంతంలో అలాంటి కార్యక్రమం నిర్వహించటం ఏమిటని సామాజిక మాధ్యమంలో జనాలు ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు చేస్తున్నారు.


రష్యాతో చర్చలకు ఉక్రెయిన్ను ఒప్పించేందుకు పశ్చిమ దేశాలు పూనుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇన్ని నెలల తరువాత రాజీపడితే అసలు ఇంతకాలం ఎందుకు ఆపని చేయలేదనే ప్రశ్నలు తలెత్తుతాయి. ముందు మీరు రాజీకి అంగీకరిస్తే గౌరవ ప్రదంగా బయటపడటం గురించి మార్గాన్ని చూద్దామని నాటో కూటమి దేశాల ప్రతినిధులు అంటున్నారు. అందువలన అమెరికా కూటమి ముందుగా ఒక స్పష్టమైన వైఖరికి వస్తేనే చర్చలకు దారి ఏర్పడుతుంది.గత నెలలో జరిగిన ఒక సర్వేలో శాంతి కోసం కొంత భూభాగాన్ని వదులు కోవచ్చా అన్న ప్రశ్నకు ససేమిరా అంగీకరించం అని 74శాతం మంది చెప్పినట్లు తేలింది. వచ్చే ఏడాది ఉక్రెయిన్‌లో ఎన్నికలు జరగాల్సి ఉంది, అవి జరుగుతాయా లేదా అన్నది ఒకటైతే ఒకవేళ రాజీపడితే జెలెనెస్కీ ఇంటిదారి పట్టాల్సిందే.బహుశా అందుకనే యుద్ధంలో ఉన్నందున అసలు వచ్చే ఏడాదైనా ఎన్నికలేంటి అనేపల్లవిని ఎత్తుకున్నాడు. ఇప్పటికిప్పుడు కాకున్నా కొన్ని నెలల తరువాతైనా జెలెనెస్కీ చర్చలకు దిగిరాక తప్పదనే భావం రోజు రోజుకూ పెరుగుతున్నది. జెలెనెస్కీ ముందుకు తెచ్చిన పది అంశాల శాంతి పధకం గురించి మాల్టాలో జరిగిన సమావేశానికి చైనా హాజరుకాలేదు. ఈ పరిణామం ఉక్రెయిన్‌ కోరుకున్న శాంతి ప్రతిపాదనకు పెద్ద ఎదురుదెబ్బ.


రష్యాను కొద్ది వారాల్లో వెనక్కు నెట్టవచ్చన్న పశ్చిమ దేశాల అంచనాలు తలకిందులయ్యాయి.అక్కడ విజయం సాధించారు, ఇక్కడ ముందుకు పోయారు అంటూ పశ్చిమ దేశాల మీడియా చూపిన దృశ్యాలు, ఇచ్చిన వార్తలు వాస్తవం కాదని తేలిపోయింది.ఇప్పటికీ మద్దతు ఇస్తామని చెబుతున్నప్పటికీ కొనసాగుతుందన్న హామీ లేదు. 2022 మే నెలలో 400 కోట్ల డాలర్ల సాయం అందించాలన్న అమెరికా నిర్ణయానికి పార్లమెంటులో 368 అనుకూల, 57 వ్యతిరేక ఓట్లు వచ్చాయి. ఈ సెప్టెంబరులో జరిగిన 30కోట్ల డాలర్ల బిల్లు ఆమోదం పొందినప్పటికీ వ్యతిరేకించిన వారు 117 మంది ఉన్నారు.ప్రస్తుతం ప్రతిపక్ష రిపబ్లికన్లు పార్లమెంటులో మెజారిటీ ఉన్నారు. వచ్చే ఏడాది ఎన్నికల్లో జో బైడెన్ను ఓడించాలని చూస్తున్న వారు ప్రతి ప్రతిపాదనను అడ్డుకొనేందుకు, ఎన్నికల్లో లబ్ది పొందేందుకు చూస్తారు.జాతీయ భద్రతా సహాయ నిధి పేరుతో అమెరికా పక్కన పెట్టిన 105 బిలియన్‌ డాలర్లలో ఉక్రెయిన్‌ ఒక్కదానికే 60బి.డాలర్లు ఇస్తామని చెప్పారు. అంత మొత్తం ఇచ్చేందుకు రిపబ్లికన్‌ పార్టీ సిద్దంగా లేదు. ఆ పార్టీ పార్లమెంటులో మెజారిటీగా ఉన్నందున వారి మద్దతు లేకుండా ఒక్క డాలరు కూడా జో బైడెన్‌ విడుదల చేయలేడు. అది లేకుండా ఉక్రెయిన్‌ ఎంతకాలం నిలబడుతుందన్నది సమస్య. ఇప్పుడు ఇజ్రాయెల్‌-పామస్‌ పోరు ముందుకు రావటంతో అమెరికా దృష్టి అటువైపు మళ్లింది,భారీ ఎత్తున ఇజ్రాయెల్‌కు నిధులు, ఆయుధాలు సమకూరుస్తోంది. ఇది కూడా ఉక్రెయిన్‌కు ఎదురు దెబ్బే. పశ్చిమ దేశాల మీడియా అంతటా నెల రోజుల క్రితం వరకు ఉక్రెయిన్‌ విజయగాధలతో ఉండేవి. ఇప్పుడు వాటి స్థానాన్ని ఇజ్రాయెల్‌ హమస్‌ దాడులు, మధ్యప్రాచ్య పరిణామాలు ఆక్రమించాయి. ఐరోపా యూనియన్‌ అక్టోబరు నెలలో వచ్చే నాలుగు సంవత్సరాల బడ్జెట్‌ గురించి బ్రసెల్స్‌లో జరిపిన సంప్రదింపులలో ఉక్రెయిన్‌కు మరింత సాయం చేయకూడదంటూ పోలాండ్‌, హంగరీ, స్లోవేకియా అడ్డం తిరిగాయి.ఉక్రెయిన్‌ తక్కువ ధరలకు ఆహార ధాన్యాల ఎగుమతి తమ రైతాంగానికి నష్టం కలిగిస్తున్నదంటూ పోలాండ్‌ అభ్యంతరం తెలుపుతున్నది. వచ్చే ఏడాది ఎన్నికలు జరుగుతున్నందున పోలాండ్‌ ప్రధాని మోరావిక్కీ తన గెలుపు గురించి ఆందోళన చెందుతున్నాడు, ధాన్య ధరలు తన పతనానికి కారణం అవుతాయోమనని భయపడుతున్నాడు.


పశ్చిమ దేశాలు ఇప్పటికే తమ వద్ద ఉన్న ఆధునిక విమానాలు తప్ప అన్ని రకాల ఆయుధాలను ఉక్రెయిన్‌కు అందచేశాయి. వాటినే ఇంకా సరఫరా చేయటం తప్ప అంతకు మించి మరో అడుగువేయలేని స్థితి. జెలెనెస్కీని ముందుకు నెట్టటం తప్ప నేరుగా నాటో కూటమి దేశాలు రంగంలోకి దిగే అవకాశాలు ప్రస్తుతానికి కనిపించటం లేదు. ప్రస్తుతం ఎలాంటి స్థంభన లేదంటూ బింకాలు పలుకుతున్నప్పటికీ ఎంతకాలం అన్న ప్రశ్న ముందుకు వస్తున్నది.రష్యాతో శాంతి చర్చలకు ఉన్న అవకాశాలేమిటి అంటూ అమెరికా, ఐరోపా సమాఖ్య ప్రతినిధులు ఉక్రెయిన్‌ అధికారులను అడిగినట్లు అమెరికా ఎన్‌బిసి టీవి పేర్కొన్నది. ఉక్రెయిన్‌కు మద్దతునిస్తున్న 50కిపైగా దేశాల ప్రతినిధులతో అక్టోబరు నెలలో బ్రసెల్స్‌లో జరిగిన సమావేశం సందర్భంగా ఈ మేరకు కదిలించి చూసినట్లు అది వెల్లడించింది. దీని గురించి జెలెనెస్కీ స్పందిస్తూ చర్చలకు ఇది తరుణం కాదని, అందుకోసం పశ్చిమ దేశాల నేతలెవరూ తనను వత్తిడి చేయటం లేదని చెప్పుకున్నాడు. రష్యాతో తమ పోరు కదలిక లేని, ఘర్షణపూర్వక బలహీన స్థితి ఉండే దశలోకి ప్రవేశిస్తున్నదని, ఇలాంటి పరిస్థితి రష్యా తనమిలిటరీ శక్తిని తిరిగి సమకూర్చుకొనేందుకు వీలు కల్పిస్తుందని ఉక్రెయిన్‌ దళాధిపతి జనరల్‌ వాలెరీ జలుఝని ఎకానమిస్ట్‌ పత్రికలో రాసిన వ్యాసంలో పేర్కొన్నాడు. ఆ తరువాతే ఎన్‌బిసి వార్త, దాని మీద జలెనెస్కీ స్పందన వెలువడింది. ” కాలం గడిచింది జనాలు అలసిపోయారు, కానీ ఇది ప్రతిష్ఠంభన కాదు ” అని కూడా అన్నాడు. 2014లో రష్యా విలీనం చేసుకున్న క్రిమియా ద్వీపంతో పాటు గత ఏడాది నుంచి ఉక్రెయిన్లో స్వాధీనం చేసుకున్న ప్రాంతాలన్నింటినీ తిరిగి స్వాధీనం చేసుకుంటామని ఉక్రెయిన్‌ చెబుతున్నది. ప్రస్తుతం ఉక్రెయిన్లో స్వాతంత్య్రం ప్రకటించుకున్న రెండు రిపబ్లిక్‌లను రష్యా గుర్తించింది. వాటితో సహా అంతర్జాతీయంగా గుర్తించిన ఉక్రెయిన్లో 17.5శాతం ప్రాంతం రష్యా దళాల అదుపులో ఉంది. ఉక్రెయిన్‌ నాటోలో చేరబోనని, పశ్చిమ దేశాలతో కలసి తమ భద్రతకు ముపు కలిగించబోమని హామీ ఇస్తే క్రిమియా మినహా తమ స్వాధీనంలో ఉన్న వాటిని వెంటనే అప్పగిస్తామని పుతిన్‌ మొదటి నుంచీ చెబుతున్నాడు. పశ్చిమ దేశాలు దాన్ని పడనివ్వకుండా అడ్డుపడటమే కాదు, ఫిన్లండ్‌, స్వీడన్‌లను నాటోలో చేర్చుకొని మరోవైపు నుంచి రష్యాను దెబ్బతీసేందుకు పూనుకున్నాయి.


ప్రస్తుతానికి పశ్చిమ దేశాల సాయం నిలిచిపోతుందని చెప్పలేము గానీ వచ్చే ఏడాది నుంచి జరగవచ్చని ఐరోపా విశ్లేషకులు చెబుతున్నారు. రానున్న పద్దెనిమిది నెలలు ప్రస్తుత పోరులో కీలకంగా మారనున్నాయని, 2025 వసంత రుతువుకు ముందు రష్యన్లు విజయవంతమైన ఎదురుదాడి చేయలేరని, వచ్చే ఏడాది ఉక్రెయిన్‌ పెద్ద ముందడుగు వేయవచ్చని కొందరు అంచనా వేస్తున్నారు. తాము కోల్పోయిన ప్రాంతాలన్నింటినీ తిరిగి ఇస్తే తప్ప చర్చలు లేవని ఉక్రెయిన్‌ చెబుతుండగా, తమ ఆధీనంలోకి వచ్చిన ప్రాంతాలను వదిలేదని రష్యా చెబుతున్నందున రెండు దేశాల మధ్య చర్చలకు ప్రస్తుతం ప్రాతిపదిక లేదనే పద్దతిలో విశ్లేషణలు సాగుతున్నాయి. రష్యా మమ్మల్నందరినీ చంపిన తరువాత వారు నాటో దేశాల మీద దాడి చేస్తారు, అప్పుడు గాని మీ కొడుకులూ, కుమార్తెలను పోరాటానికి పంపరా అని జెలెనెస్కీ ఒక అమెరికా టీవీ ఎన్‌బిసి ఇంటర్వ్యూలో నాటో కూటమి మీద అసహనాన్ని వెళ్లగక్కాడు. ఒకసారి డోనాల్డ్‌ ట్రంప్‌ తమ దేశానికి వస్తే కేవలం 24 నిమిషాల్లో అంతా వివరిస్తానని గెలిస్తే 24 గంటల్లో యుద్ధాన్ని అంతం చేస్తాడని అన్నాడు. మొత్తం మీద ఉక్రెయిన్‌ సంక్షోభం మరో మలుపు తిరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఐరాస ఘోర వైఫల్యం – వీటోలతో ఇజ్రాయెల్‌ మారణకాండకు అమెరికా దన్ను !

04 Saturday Nov 2023

Posted by raomk in CHINA, COUNTRIES, Current Affairs, Europe, History, imperialism, INTERNATIONAL NEWS, Opinion, USA, WAR, Women

≈ Leave a comment

Tags

Gaza, HAMAS attacks 2003, Israel Attack 2023, Israel genocide, Joe Biden, Netanyahu, UNSC, UNSC Failures, veto power


ఎం కోటేశ్వరరావు


ప్రపంచంలో శాంతి, దేశాల భద్రత కాపాడేందుకు, మారణకాండలను నివారించేందుకు ఏర్పాటు చేసుకున్న ఐక్యరాజ్యసమితి వైఫల్యం మరోసారి వెల్లడైంది. ఇజ్రాయెల్‌ జరుపుతున్న మారణకాండ నివారణలో భాగంగా గాజాలో దాడులు నిలిపివేయాలని కోరే తీర్మానాలను భద్రతా మండలిలో అమెరికా అడ్డుకుంది. ఇజ్రాయెల్‌కు ఆత్మరక్షణ హక్కు ఉందని, అందువలన అది చేస్తున్న దాడులు సమర్ధినీయమే అంటూ అమెరికా తెచ్చిన తీర్మానాన్ని చైనా, రష్యా వీటో చేశాయి. దాడులను నిరసిస్తూ మెజారిటీ ఆమోదించిన ఐరాస సాధారణ అసెంబ్లీ తీర్మానం దేనికీ కొరగాకుండా పోయింది. 1948లో ఐరాస చరిత్రలో ఐరాస సాధించిన విజయం ఇది అని చెప్పుకొనేందుకు ఒక్కటంటే ఒక్కటి లేదంటే అతిశయోక్తి కాదు. ఇదే సందర్భంలో శాంతి పరిరక్షక దళాల మాటున హైతీలో కలరా బాక్టీరియాను విస్తరింపచేసిన దుర్మార్గానికి అది పాల్పడటాన్ని చరిత్ర మరచిపోదు. ఉద్రిక్తతలు తలెత్తిన ప్రాంతాల్లో శాంతి పరిరక్షక దళాల ఏర్పాటును విజయంగా కొందరు వర్ణిస్తారు. అంతిమంగా సాధించింది ఏమిటన్నదే గీటురాయి. ఇప్పటి వరకు గడచిన ఏడున్నర దశాబ్దాలలో వివిధ ప్రాంతాలు, దేశాల్లో ఇరవైలక్షల మంది శాంతి దళాలను ఏర్పాడు చేశారు. వివిధ దేశాల్లో జరిగిన దాడులు, ప్రతిదాడుల ఉదంతాల్లో 4,200మందికి పైగా ఈ దళాల్లోని సైనికులు ప్రాణాలు కోల్పోయారు.ఇజ్రాయెల్‌-అరబ్‌ కాల్పుల విరమణ ఒప్పందాల అమలును పరిరక్షించేందుకు 1948లో భద్రతా మండలి అక్కడకి శాంతి పరిరక్షక దళాలను పంపాలని నిర్ణయించింది. అవి చేసిందేమీ లేకపోగా తరువాత యూదు దురహంకారులు ఇరుగు పొరుగుదేశాల మీద, పాలస్తీనా ప్రాంతాల మీద దాడులు చేసి వాటిని అక్రమించుకుంటూనే ఉన్నారు. సాధారణ జనాన్ని అణచివేస్తున్నా గుడ్లప్పగించి చూడటం తప్ప ఐరాస చేసిందేమీ లేదు.


ప్రచ్చన్న యుద్ధం వలన ప్రపంచంలో శాంతి కొరవడిందని అనేక మంది చెబుతారు, దానికి సోవియట్‌ యూనియనే అని కూడా నిందించేవారు లేకపోలేదు.దాన్ని 1990 దశకంలో విచ్చిన్నం చేశారు.అప్పటికి వివిధ ప్రాంతాల్లో పదకొండు వేల మంది శాంతిపరిరక్షణ దళాలు ఉన్నాయి. పదహారు చోట్ల 2014నాటికి లక్షా 30వేలకు పెరిగారు. దీనికి అమెరికా దాని మిత్రదేశాలే కారణం.ఆఫ్రికా, ఆసియా, ఐరోపా, మధ్యప్రాచ్య ప్రాంతంలో పన్నెండు సమస్యాత్మక ప్రాంతాల్లో 87వేల మంది పని చేస్తున్నారు.ఘోరమైన వైఫల్యాలుగా చెప్పుకోవాల్సి వస్తే 1994లో ఆఫ్రికా దేశమైన ర్వాండాలో టుట్సీ-హుటు తెగల మధ్య తలెత్తిన హింసాకాండను నివారించటంలో చేతులెత్తేసింది. ఫలితంగా ఎనిమిది లక్షల మంది ప్రాణాలు పోయాయి.ఐరోపాలో 1995లో జరిగిన బోస్నియా దాడుల్లో ఎనిమిదివేల మంది ముస్లింలను చంపివేసినా చేసిందేమీ లేదు. 1950దశకంలో ఉత్తర కొరియా మీద జరిపిన దాడుల్లో పదిహేను లక్షల మందికి పైగా మరణించగా ప్రతిదాడుల్లో దాదాపు పది లక్షల మంది దక్షిణ కొరియన్లు చనిపోయారు. దీనికి ఐరాస చేసిన నిర్ణయమే కారణం. కమ్యూనిస్టుల పాలనలో ఉన్న చైనాకు బదులు కొద్ది మంది తిరుగుబాటుదార్లతో తైవాన్‌లో తిష్టవేసిన ప్రభుత్వానికి బదులు ప్రధాన భూభాగంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాన్నే గుర్తించాలని కోరుతూ సోవియట్‌ యూనియన్‌ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని భద్రతా మండలి తిరస్కరించింది. దాంతో తాము 1950జనవరి 13నుంచి ఐరాసను బహిష్కరిస్తున్నట్లు సోవియట్‌ ప్రకటించింది. సరిగ్గా ఆ సమయంలో ఉత్తర కొరియా దురాక్రమణకు పాల్పడిందనే సాకుతో అమెరికా, దాని మిత్రదేశాలు ప్రవేశపెట్టిన తీర్మానం ఆమోదం పొందటంతో ఉత్తర కొరియా మీద దాడి జరిగింది.దాంతో సోవియట్‌, చైనా రెండూ ఉత్తర కొరియా రక్షణకు రంగంలోకి దిగాయి.1953లో కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే కొనసాగుతోంది తప్ప సాంకేతికంగా యుద్ధ విరమణ జరగలేదు. ఉభయ కొరియాల విలీనానికి ఇంకా తగిన తరుణం రాలేదనే పేరుతో అమెరికా ఇతర దేశాలు అడ్డుపడుతున్నాయి. చైనాలో తైవాన్‌ ఒక రాష్ట్రం తప్ప దేశం కాదంటూ ఐరాస గుర్తించి అంతకు ముందు దానికి ఉన్న గుర్తింపును రద్దు చేసి కమ్యూనిస్టు చైనాను గుర్తించి నాలుగు దశాబ్దాలు దాటినా తైవాన్‌ విలీనం బలవంతంగా జరగకూడదు అంటూ దానికీ అడ్డుపడుతున్నారు. ఒక దేశంగా పరిగణించి ఆయుధాలు పెద్ద ఎత్తున అందచేస్తూ చైనా మీద తిరుగుబాటుకు మద్దతు ఇస్తున్నారు. ఇలా తాను చేసిన తీర్మానాలను అమలు జరిపేందుకు తరువాత తానే వెనక్కు తగ్గటం లేదా అసమర్ధంగా ఉండటం, ఇతర అనేక అంశాల పరిష్కారంలో ఐరాస విఫలమైంది. వర్తమాన అంశం పాలస్తీనాలో జరుగుతున్నది కూడా అదే.


ఆత్మరక్షణ పేరుతో గాజాలో సాధారణ పౌరుల మీద వైమానిక, టాంకులతో ఇజ్రాయెల్‌ సాగిస్తున్న హత్యాకాండ నివారణను అడఐర్డుకొనే వారే లేరా అన్న ప్రశ్నకు సమాధానం లేదు. ప్రతి రోజూ పిల్లలు, మహిళలతో సహా వందలాది మందిని చంపివేయటాన్ని ఆపాలని భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానాలను అమెరికా ఇప్పటికే వీటో చేసి మరోసారి తానేమిటో ప్రపంచానికి వెల్లడించింది. శనివారం ఉదయానికి అందిన సమాచారం మేరకు గాజాలో 3,826 మంది పిల్లలు, 2,405 మంది మహిళలతో సహా మొత్తం 9,227 మందిని ఇజ్రాయెల్‌ చంపింది. దీనికి పశ్చిమగట్టులో చేసిన హత్యలు అదనం. ఒక నిర్వాసిత శిబిరం, ఒక ఆసుపత్రి అని లేదు, జనం ఎక్కడ ఉంటే అక్కడ బాంబులు వేస్తూ మారణకాండ సాగిస్తున్నది. దానికి అమెరికా కూడా ప్రత్యక్షంగా పాల్గొని సాయం చేస్తున్నది. గాజా ప్రాంతం మీద దాడులు చేస్తున్న ఇజ్రాయెల్‌ మిలిటరీకి అవసరమైన సమాచారం అందించేందుకు గాజా ప్రాంతం మీద మానవరహిత డ్రోన్లను అమెరికా ఎగురవేస్తున్నది. హమస్‌ వద్ద బందీలుగా ఉన్న వారి కోసమే అలా చేస్తున్నట్లు అమెరికా రక్షణశాఖ పెంటగన్‌ నిర్ధారించింది. మానవతా పూర్వక చర్యగా కాల్పులను విరమించాలన్న తీర్మానాన్ని వీటో చేసిన అమెరికా ఏ అధికారంతో ఈ పని చేస్తున్నది. దానికి భద్రతా మండలి తీర్మానం లేదా మరొకటి లేదు. ఇది అడ్డగోలు వ్యవహారం తప్ప మరొకటి కాదు. బందీలను విడుదల చేయించాల్సిన బాధ్యతను తీసుకోవాల్సింది ఐరాస. రోజూ వందల మందిని హతమారుస్తుంటే అది తీసుకున్న చర్యలేమీ లేవు. బందీల ప్రాణాలెంత విలువైనవో పాలస్తీనా అమాయక పౌరుల ప్రాణాలు కూడా అంతే విలువైనవి కాదా ! డ్రోన్లతో ఇజ్రాయెల్‌కు మద్దతు ఇస్తే పరిస్థితి మరింత విషమిస్తుంది తప్ప మెరుగుపడుతుందా ?


ఐరాస చేసిన తీర్మానం మేరకు ఏర్పడాల్సిన పాలస్తీనాను అడ్డుకోవటమే గడచిన ఏడున్నర దశాబ్దాలుగా అక్కడ సాగుతున్న అణచివేత-ప్రతిఘటనకు మూలం. దీనిపై భద్రతా మండలి ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు శాంతి నెలకొనేందుకు, ఇజ్రాయెల్‌ను ఖండిస్తూ, పాలస్తీనాకు మద్దతుగా ప్రవేశపెట్టిన 42 తీర్మానాలను పాఅమెరికా వీటో చేసింది. ఇప్పటి వరకు భద్రతా మండలి చరిత్రలో అమెరికా చేసిన మొత్తం వీటోలే 83 కాగా సగానికి పైగా ఇజ్రాయెల్‌ను కాపాడేందుకు ప్రయోగించిందంటే అమెరికా దుర్మార్గం ఎలాంటిదో అర్దం చేసుకోవచ్చు. యూదు దురహంకారులను సమర్ధిస్తూ ప్రవేశపెట్టిన మరో రెండింటిని రష్యా, చైనా అడ్డుకున్నాయి.లెబనాన్‌పై దాడి, సిరియా గోలన్‌ గుట్టలను ఆక్రమించుకోవటంతో సహా ఇజ్రాయెల్‌ ప్రమేయం ఉన్న మొత్తం 46 తీర్మానాలను అమెరికా అడ్డుకున్నది. దుర్మార్గం ఏమంటే జరూసలెం నగరాన్ని తటస్థంగా ఉంచుతూ ఐరాస చేసిన నిర్ణయాన్ని ఉల్లంఘించి ఆక్రమించుకొని తమ రాజధాని అని ఇజ్రాయెల్‌ ప్రకటించుకుంది. దాన్ని అమెరికా 2017లో గుర్తించింది.ఐరాస తీర్మానాలకు అనుగుణంగా దాని భవిష్యత్‌ నిర్ణయం జరగాలని భద్రతా మండలిలో 14దేశాలు ఓటు వేస్తే అమెరికా వీటో చేసింది.1991 నుంచి 2011 కాలంలో అమెరికా 24 వీటోలు చేయగా వాటిలో 15 ఇజ్రాయెల్‌కు కాపు కాసేందుకే. పాలస్తీనా ప్రాంతాల్లో మారణకాండకు పాల్పడుతున్నది ఇజ్రాయెల్‌ మిలిటరీ, ఉగ్రవాదులు అయినప్పటికీ వారిని వెనుక ఉండి నడిపిస్తున్నది అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు గనుక అక్కడ చిందే ప్రతి రక్తపు బొట్టుకూ బాధ్యతనుంచి తప్పించుకోలేవు.


గతం, వర్తమాన పరిణామాలను చూస్తున్నపుడు ఐరాసను ఒక ప్రజాస్వామిక సంస్థగా మార్చేందుకు సమగ్ర సంస్కరణలు అవసరమన్నది స్పష్టం.లక్ష మంది జనాభా ఉన్న కరీబియన్‌ ప్రాంత దేశమైన సెయింట్‌ విన్సెంట్‌, నూటనలభై కోట్ల జనాభా ఉన్న భారత, చైనాలు ఐరాస సాధారణ అసెంబ్లీలో ఒక్కో ఓటును మాత్రమే కలిగి ఉంటాయి. అది ప్రజాస్వామ్య బద్దమే అయినప్పటికీ అక్కడ చేసే తీర్మానాలకు ఎలాంటి విలువా ఉండదు. పదిహేను మంది ప్రతినిధులు ఉండే భద్రతా మండలిలో ఏదైనా ఒక తీర్మానాన్ని 14 మంది ఆమోదించినా ఐదు శాశ్వత సభ్య దేశాలలో ఏ ఒక్కటి కాదన్నా దానికీ అదే గతి పట్టటం పెద్ద లోపం. ఇజ్రాయెల్‌ దుర్మార్గం, క్యూబాపై అమెరికా అమలు జరుపుతున్న అష్టదిగ్బంధనాన్ని ఖండిస్తూ ప్రతి సంవత్సరం అత్యధిక మెజారిటీ దేశాలు తీర్మానాలు చేస్తున్నా జరుగుతున్నదేమీ లేదు. గాజాలో జరుపుతున్న దాడులను మానవతా పూర్వకంగా నిలిపివేయాలని సాధారణ అసెంబ్లీలో 121 దేశాలు అనుకూలంగా, 14 వ్యతిరేకంగా ఓటు చేయగా మనతో సహా 44 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి.భద్రతా మండలిలో ప్రవేశ పెట్టిన నాలుగు తీర్మానాలను అమెరికా వీటో చేసింది. ఇజ్రాయెల్‌కు ఆత్మరక్షణ దాడులు చేసే హక్కుందని అమెరికా తెచ్చిన తీర్మానాన్ని రష్యా, చైనా అడ్డుకున్నాయి.


మొదటి ప్రపంచ యుద్దం ముగిసిన తరువాత ఏర్పడిన నానాజాతి సమితిలో భద్రతా మండలి మాదిరి వ్యవస్థలో ఉన్న 15 సభ్యదేశాలకూ వీటో హక్కు ఉండటంతో ఏ ఒక్క సమస్యనూ పరిష్కరించలేక అది ఘోరంగా విఫలం కావటమే కాదు, రెండవ ప్రపంచ యుద్ధాన్ని కూడా అడ్డుకోలేకపోయింది.రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత విజేతలుగా ఉన్న దేశాల ప్రమేయంతో ఏర్పడిందే ఐరాస. 1945లో అది ఉనికిలోకి వచ్చినపుడు అమెరికా, సోవియట్‌యూనియన్‌,చైనా, బ్రిటన్‌, ఫ్రాన్సులకు వీటో హక్కు కల్పించారు. తొలి రోజుల్లో ఐరాస సాధారణ అసెంబ్లీ, భద్రతా మండలిలో అమెరికా, పశ్చిమ దేశాల అనుకూలురే ఎక్కువ.దాంతో వారికి అనుకూలమైన తీర్మానాలను సోవియట్‌ అడ్డుకుంది. 2022 మే నెల వరకు సోవియట్‌ , తరువాత దాని వారసురాలిగా ఉన్న రష్యా 121సార్లు, అమెరికా 83, బ్రిటన్‌ 29, చైనా 17, ఫ్రాన్సు 16సార్లు వీటోను ప్రయోగించాయి. వీటో హక్కు ప్రజాస్వామ్య బద్దం కాదన్నది నిజమే అయినప్పటికీ అది లేకపోతే తొలి రోజుల్లో తమ కూటమికి ఉన్న బలంతో మొత్తం ప్రపంచాన్ని అమెరికా తనపెత్తనం కిందకు తెచ్చుకొని ఉండేది. ఇప్పుడు మెజారిటీ దేశాలు దాన్ని వ్యతిరేకిస్తున్నందున ప్రజాస్వామిక అభిప్రాయాన్ని అడ్డుకొనేందుకు వీటోను ఆయుధంగా చేసుకుంటోంది. అందుకే పైకి ఏమి చెప్పినప్పటికీ ఆచరణలో ఐరాస సంస్కరణలకూ అది ససేమిరా అంటున్నది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఇజ్రాయెల్‌ మారణకాండలో ఎక్కువగా పిల్లలు, మహిళలే బలి ! ఏకపక్ష దాడి తప్ప పోరు అబద్దం !!

01 Wednesday Nov 2023

Posted by raomk in Africa, CHINA, Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, Opinion, USA, WAR, Women

≈ Leave a comment

Tags

2023 Israel–Hamas war, Gaza Deaths, Israel genocide, israel massacre, Joe Biden, Netanyahu, US strikes in Syria


ఎం కోటేశ్వరరావు


గాజా ప్రాంతంలో అమాయక పౌరులపై కొనసాగుతున్న ఇజ్రాయెల్‌ మారణకాండ. నెతన్యాహును ఎవరూ నమ్మటం లేదు, ఇజ్రాయెల్‌ యుద్ధ మంత్రివర్గంలో విబేధాలు.వివాద విస్తరణకు సిరియాపై అమెరికా దాడులు. లెబనాన్‌ సరిహద్దులో హిజబుల్లా – ఇజ్రాయెల్‌ మిలటరీ పరస్పరదాడులు, దాడులను ఆపేది లేదన్న యూదు దురహంకారులు. ఈ వార్తల తీరు తెన్నులు చూసినపుడు మధ్య ప్రాచ్యంలో మంటలు రేపేందుకు పశ్చిమ దేశాలు పూనుకున్నాయా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. గాజాలో భీకర పోరు జరుగుతున్నట్లు కొన్ని పత్రికల్లో తప్పుడు వార్తలను ప్రచురిస్తున్నారు. అక్టోబరు ఏడు నుంచి నవంబరు ఒకటి ఉదయం వరకు వచ్చిన వార్తల ప్రకారం గాజాలో 8,525 మంది మరణించారు. వారిలో 3,542 మంది పిల్లలు, 2,187 మంది మహిళలు. వీరుగాక పశ్చిమ గట్టు ప్రాంతంలో మరో 120 మందిని ఇజ్రాయెల్‌ మూకలు బలితీసుకున్నాయి. గాజాలో ఇంతవరకు తొమ్మిది మంది తమ సైనికులు మరణించినట్లు ఇజ్రాయెల్‌ చెప్పటం తప్ప నిర్దిష్ట సమాచారాన్ని వెల్లడించలేదు.అక్కడ జరుగుతున్నది ఏకపక్ష మారణహౌమం తప్ప మరొకటి కాదు. రోజుకు మరణిస్తున్న లేదా గాయపడుతున్న పిల్లల సంఖ్య రోజుకు 420గా ఉంది. గడచిన నాలుగు సంవత్సరాల్లో 24 దేశాల్లో జరిగిన దాడులు, ఘర్షణల్లో ఏ ఒక్క సంవత్సరంలో కూడా ఇంత మంది పిల్లలు చనిపోలేదు. పిల్లల్ని రక్షించండి(సేవ్‌ చిల్డ్రన్‌) అనే సంస్థ ఆదివారం నాడు వెల్లడించిన సమాచారం ప్రకారం 2020లో ఇరవై రెండు దేశాల్లో 2,674 మంది,ఇరవైనాలుగు దేశాల్లో 2021లో 2,515 మంది, 2022లో 2,985 మంది మరణించారు. ఈ ఏడాది కేవలం అక్టోబరు ఏడు నుంచి 31వ తేదీ వరకు ఒక్క గాజాలో 3,542, పశ్చిమగట్టులో 36 మంది మరణించారు. తాము చంపుతున్నది హమస్‌ తీవ్రవాదులను అని చెబుతున్న ఇజ్రాయెల్‌ ప్రకటనలను నిస్సిగ్గుగా సమర్ధిస్తున్న అపర మానవతావాదులు ఈ వివరాల గురించి ఏమంటారో !


ఇజ్రాయెల్‌ పాలక యంత్రాంగంలో ఉన్న విబేధాలు, కుమ్ములాటలు బయటికి వచ్చాయి. అక్టోబరు ఏడవ తేదీన జరిగిన హమస్‌దాడి గురించి తనకు ముందుగా ఎవరూ ఎలాంటి సమాచారం అందించలేదని ఆదివారం తెల్లవారు ఝామున ప్రధాని నెతన్యాహు ఒక ట్వీట్‌లో పేర్కొన్నాడు. హమస్‌ భయపడిందని, ఒక పరిష్కారానికి సిద్దంగా ఉందనే విశ్లేషణను మిలిటరీ, గూఢచార అధిపతులు అందించారని ఆరోపించాడు. దాంతో తీవ్ర ఆగ్రహం, ఆందోళన వెల్లడి కావటంతో వెంటనే తన ట్వీట్‌ను వెనక్కు తీసుకోవటమేగాక తాను ఉపయోగించిన పదజాలం తప్పని క్షమించాలని కోరాడు. పాలకుల్లో ఉన్న విబేధాలకు ఇది నిదర్శనమని విశ్లేషకులు పేర్కొన్నారు. మిలిటరీ ఎంతో కష్టమైన దాడులను కొనసాగిస్తున్నపుడు ప్రధానిగా ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడటం ఏమిటని ప్రశ్నించారు. దేశ భద్రత, బందీలుగా ఉన్నవారి గురించి గాక కేవలం రాజకీయాలు చేస్తున్నాడని ధ్వజమెత్తారు. నెతన్యాహు తొలుత 1996లో అధికారానికి వచ్చాడు, మధ్యలో విరామం వచ్చింది, ఇప్పటివరకు మొత్తం పదమూడు సంవత్సరాలు పదవిలో ఉన్నాడు.


ఇజ్రాయెల్‌ ఇరుగుపొరుగున ఉన్న దేశాలను కూడా యుద్ధంలోకి లాగేందుకు అమెరికా పూనుకుంది. అంతా చేస్తున్నది ఇరాన్‌ అంటూ రెచ్చగొడుతున్నది. వివిధ దేశాల్లో ఉన్న సాయుధ సంస్థలకు వెన్నుదన్నుగా ఉన్నట్లు ప్రచారం చేస్తున్నది. సిరియాలోని అలెప్పో నగర పరిసరాల శరణార్ధి శిబిరాల్లో ఇరాన్‌ మద్దతుదారులైన సాయుధులు ఇరాక్‌, సిరియాల్లోని తమ స్థావరాల మీద దాడులు చేశారని, తాము ఆత్మరక్షణ ప్రతిదాడులు చేసినట్లు అమెరికా అమెరికా రక్షణ మంత్రి లాయడ్‌ ఆస్టిన్‌ ప్రకటించాడు. గత కొద్ది రోజుల్లో పదమూడు సార్లు దాడులు జరిగినట్లు ఆరోపించాడు. ఈ ప్రాంతంలో పరిస్ధితులు దిగజారాలని తాము కోరుకోవటం లేదని తెర వెనుక నుంచి ఇరాన్‌ దాడులు చేయిస్తున్నట్లు ఆరోపించాడు. తమ మీద దాడి చేస్తే తాము వారిని వదలబోమన్నాడు. గాజాలో హమస్‌, లెబనాన్‌లో హిజబుల్లా, ఎమెన్‌లో హౌతీలు, ఇరాక్‌, సిరియాల్లోని వివిధ సాయుధ బృందాలకు ఇరాన్‌ ఆయుధాలు, నిధులు అందుతున్నాయన్నాడు. మరోవైపున లెబనాన్‌లో ఉన్న హిజబుల్లా సాయుధ బృందాలపై అక్టోబరు ఏడు నుంచి ఇజ్రాయెల్‌ రెచ్చగొట్టే దాడులు జరుపుతోంది. ఇంతవరకు హిజబుల్లా రంగంలోకి దిగలేదు. రెచ్చగొట్టే సాయుధ కవ్వింపులతో పాటు మీడియా ద్వారా పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారదాడి ముఖ్యంగా ఇరాన్‌పై సాగిస్తున్నారు.


గతంలో 1890దశకంలో అమెరికాలో న్యూయార్క్‌ వరల్డ్‌, న్యూయార్క్‌ జర్నల్‌ అనే రెండు పత్రికల మధ్య పోటీ తలెత్తి సంచలనాత్మక, వక్రీకరణ, కుహనా వార్తలను పెద్దక్షరాలతో ప్రచురించి పాఠకులను పెంచుకొనేందుకు చూశాయి.దీన్ని ఎల్లో జర్నలిజం అని పిలిచారు. ఆ క్రమంలోనే స్పెయిన్‌ ఆధీనంలో ఉన్న వలసలను ఆక్రమించేందుకు అమెరికా ప్రభుత్వం వాటికి మద్దతు కూడా ఇచ్చింది. స్పానిష్‌-అమెరికా యుద్ధానికి మద్దతుగా మైనే అనే అమెరికా నౌకను స్పెయిన్‌ ముంచివేసిందనే తప్పుడు వార్తను న్యూయార్క్‌ జర్నల్‌ ప్రచురించింది. ఆ పోరులో గెలిచిన అమెరికన్లు క్యూబా, ఫిలిప్పీన్లను తమ స్వాధీనంలోకి తెచ్చుకున్నారు. నాటి నుంచి నేటి వరకు సామ్రాజ్యవాదులు జరిపే దాడులకు జనాన్ని తప్పుదారి పట్టించేందుకు అలాంటి తప్పుడు వార్తలను మీడియాలో ప్రవేశపెడుతూనే ఉన్నారు. హమస్‌, ఇరాన్‌, చైనా, రష్యా ఇలా సంస్థలు, దేశాల మీద ఎన్నో కట్టుకథలను రాయిస్తున్నారు. అనేక వారాల ముందే ఇజ్రాయెల్‌ మీద అక్టోబరు ఏడున జరిగిన దాడి కుట్రకు ఇరాన్‌ సాయం చేసిందని వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ మరుసటి రోజే కథ అల్లింది. తరువాత రోజు మరో పిట్టకత చెప్పింది. ఇరాన్‌-సౌదీ అరేబియా మధ్య సయోధ్య కుదిర్చేందుకు చైనా ప్రయత్నిస్తున్నపుడే ఏప్రిల్‌ నుంచి హమస్‌ తదితర సంస్థలకు ఇరాన్‌ శిక్షణ ఇవ్వటం ప్రారంభించిందని కూడా రాశారు. ఆ ముక్క ఇజ్రాయెల్‌కు లేదా అమెరికా పాలకులకు సదరు పత్రిక ఎందుకువెల్లడించలేదు ? ఇరాన్‌ మీద చమురు ఆంక్షలను అమలు జరపటంలో బైడెన్‌ విఫలమైన కారణంగా వచ్చిన చమురు సొమ్ముతో హమస్‌ సంస్థకు ఇరాన్‌ సాయం చేసిందని కూడా కధ అల్లింది. మరోవైపు అమెరికా మంత్రి ఆంటోని బ్లింకెన్‌ ఇరాన్‌ పాత్ర గురించి ఆధారాలు లేవు అని చెబుతాడు. ఇజ్రాయెల్‌ వేగులు కూడా దాన్ని పసిగట్టలేదని ఒక వైపు వారు నెత్తీనోరు కొట్టుకుంటుండగా కొద్ది వారాల ముందే కుట్ర జరిగిందని సదరు పత్రిక రాసింది. ఇలాంటి అమెరికా కట్టుకథల ఉదాహరణలను అనేకం చెప్పవచ్చు. న్యూయార్క్‌టైమ్స్‌ పత్రిక విలేకరి ఒకడు 2002లో ఇరాక్‌ తన అణ్వాయుధ కార్యక్రమాలకు అవసరమైన అల్యూమినియం గొట్టాలను సేకరించేందుకు పూనుకుందని రాశాడు. బాంబులు తయారు చేయగలిగిన వారు గొట్టాలను రూపొందించలేరా ? పాలస్తీనా ఏర్పాటుకు కేటాయించిన ప్రాంతాలను ఇజ్రాయెల్‌ దురాక్రమించటం గతం, తాజా పరిణామాలకు కారణం అన్నది తెలిసిందే. వారి ప్రాంతాల నుంచి వైదొలిగితే ఎవరి బతుకు వారు బతుకుతారు.దాన్ని దాచి పెట్టి అమెరికా ఒక వాణిజ్య మార్గాన్ని ఏర్పాటు చేయదలచిందని, దానికి ఈజిప్టులోని సూయజ్‌ కాలువ, ఇరాన్‌-ఎమెన్‌లను కలిపే హార్ముజ్‌ జలసంధి, ఎమెన్‌-జిబౌటీ మధ్య ఉన్న ఎర్ర సముద్రం-అరేబియా సముద్రాన్ని కలిపే బాబ్‌ అల్‌ మండే జలసంధులు కీలకమని, ఈ వాణిజ్య మార్గాన్ని అడ్డుకొనేందుకు హమస్‌ దాడులు చేసినట్లు కథలను వ్యాపింపచేశారు.


మధ్యప్రాచ్యంలో ప్రాంతీయ యుద్ధం చెలరేగితే తమకు ఇబ్బడి ముబ్బడిగా లాభాలు వస్తాయని అమెరికా ఆయుధ వ్యాపారులు, ఉత్పత్తిదారులు కోరుకుంటున్న సంగతి తెలిసిందే. అదే జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందనే చర్చ ఇప్పుడు మొదలైంది.పొరుగున ఉన్న ఈజిప్టు, సిరియా, లెబనాన్‌, జోర్డాన్‌, ఆ ప్రాంత దేశాలైన ఇరాన్‌, కతార్‌ తదితర దేశాల పాత్ర ఉండే అవకాశం ఉంది. ప్రస్తుత ఈజిప్టు అధ్యక్షుడు అబ్దుల్‌ ఫతా ఎల్‌ సిశి 2013 నుంచి అధికారంలో ఉన్నాడు. అంతకు ముందు ముస్లిం బ్రదర్‌హుడ్‌ అధికారంలో ఉంది. హమస్‌సంస్థకు చెందిన వారు దాని నుంచి విడగొట్టుకున్నవారే. తాజా పరిణామాలతో జనంలో ఇజ్రాయెల్‌ మీద ఉన్న వ్యతిరేకత, పాలస్తీనియన్లకు మద్దతు కారణంగా అనేక ఆంక్షల మధ్య పరిమితంగా కైరో, ఇతర చోట్ల నిరసన ప్రదర్శనలకు ఎల్‌ సిశి ప్రభుత్వం అవకాశం కల్పించింది తప్ప ఇష్టం ఉండి కాదు. స్వేచ్చగా అనుమతిస్తే ఆ ప్రదర్శనల పేరుతో ప్రతిపక్షం తనకు వ్యతిరేకంగా జనాన్ని సమీకరించే అవకాశం ఉందనే భయం కూడా ఉంది. అందువలన ప్రాంతీయ యుద్ధం వస్తే ఈజిప్టు పాల్గొనే అవకాశాలు లేవన్నది కొందరి భావన. గాజా నుంచి నిర్వాసితులు వస్తే తనకు సమస్యలు వస్తాయని కూడా భయపడుతున్నాడు.అందుకే గాజాతో ఉన్న సరిహద్దు తెరిచేందుకు సిద్దంగా లేడు.


లెబనాన్‌ ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యల కారణంగా జనంలో అసంతృప్తి ఉంది. ఈ దశలో ఇజ్రాయెల్‌తో యుద్దాన్ని అది కోరుకోవటం లేదు. అక్కడ ఉన్న షియా ముస్లిం సామాజిక తరగతికి చెందిన హిజబుల్లా మిలిటెంట్‌ సంస్థ సరిహద్దులో ఇజ్రాయెల్‌తో ఇప్పటికే అడపాతడపా పోరాడుతోంది. యుద్ధం జరిగితే 2006 నుంచి రెండు దేశాల మధ్య నెలకొన్న శాంతి దెబ్బ తింటుంది. దానికి తోడు క్రైస్తవ-ఇస్లామిక్‌ వర్గాల మధ్య గతంలో జరిగిన మాదిరి అంతర్యుద్ధం పునరావృతమైనా ఆశ్చర్యం లేదు. అయితే హిజబుల్లా సంస్థ లెబనాన్‌ ప్రభుత్వంలో పాతుకుపోయింది. లక్ష మంది సాయుధులున్న దాన్ని విస్మరించటం ప్రభుత్వానికి సాధ్యం కాదు. అక్కడి మిలిటరీ కంటే ఇదే శక్తివంతమైనది, అందువలన ప్రభుత్వం కూడా దాన్ని అనుసరించటం మినహా మరొక మార్గం లేదు. ఈ సంస్థకు ఇరాన్‌ నుంచి సాయం అందుతోంది. అందువలన ఇరాన్‌ అనుమతి మీదనే హిబబుల్‌ నిర్ణయం ఉంటుందని చెబుతున్నారు. ఇజ్రాయెల్‌తో ఉన్న సరిహద్దులోని అనేక గ్రామాల్లో ఉన్న జనాన్ని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇటీవలి వారాల్లో జరిగిన చిన్న చిన్న ఘర్షణల్లో తమ మిలిటెంట్లు 50 మంది మరణించినట్లు హిజబుల్లా ప్రకటించింది. గాజాలో భారీ ఎత్తున హత్యాకాండ కొనసాగితే హిజబుల్‌ జోక్యానికి మద్దతు ఇస్తామని జనం చెబుతున్నట్లు వార్తలు వచ్చాయి. లెబనాన్‌లో కూడా పాలస్తీనియన్ల హమస్‌, ఇతర సాయుధ బృందాలు ఉన్నాయి.వారు లెబనాన్‌ ప్రాంతం నుంచి కొన్ని రాకెట్లను ఇజ్రాయెల్‌ మీద ప్రయోగించారు. సిరియాలో 2011 నుంచి అంతర్యుద్ధం జరుగుతోంది. అధ్యక్షుడు బషెర్‌ అల్‌ అసాద్‌కు ఇరాన్‌, రష్యా మిలిటరీ మద్దతు ఉంది. ఆ కారణంగానే ,ఇజ్రాయెల్‌ అమెరికా, ఇతర పశ్చిమ దేశాలూ కిరాయి మూకలు, ఉగ్రవాద సంస్థలకు ఎంతగా సాయపడినా అది నిలదొక్కుకుంటున్నది. అక్టోబరు ఏడు తరువాత రాజధాని డమాస్కస్‌, అలెప్పో నగరాలపై ఇజ్రాయెల్‌, అమెరికా జరిపిన దాడుల్లో ఎనిమిది మంది సిరియా సైనికులు మరణించారు. ఇక్కడ కూడా ఇరాన్‌ మద్దతు ఉన్న సాయుధశక్తి ఉంది. మరోదేశం కతార్‌కు ముస్లిం బ్రదర్‌హుడ్‌ సంస్థతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. హమస్‌ రాజకీయ కార్యాలయం కతార్‌లోని దోహాలో ఉంది. ఆర్థికంగా కూడా పెద్ద ఎత్తున తోడ్పడుతోంది. ఇటీవల హమస్‌ వద్ద ఉన్న బందీలలో నలుగురిని విడిపించటంలో కతార్‌ కీలక పాత్ర పోషించింది.ఈ ప్రాంతంలో తన పలుకుబడిని పెంచుకోవాలని చూస్తున్న కతార్‌కు ఇజ్రాయెల్‌తో దౌత్య సంబంధాలు లేవు, ఎలాంటి పాత్ర పోషించేది ఇంకా స్పష్టం కాలేదు. మొత్తం మీద చూసినపుడు ఇరాన్‌ కీలకంగా ఉన్నందున దాన్ని కవ్వించేందుకు అమెరికా పూనుకుంది.ఏం జరిగేదీ ఎవరూ ఊహించలేకపోతున్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అమెరికాకు భారత కోళ్ల రైతుల బలి: మన్మోహన్‌ సింగ్‌ అడ్డుకుంటే నరేంద్రమోడీ అప్పగించారు !

30 Monday Oct 2023

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, Farmers, Health, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Prices, Uncategorized, USA

≈ Leave a comment

Tags

American chicken legs, American poultry, BJP, China, Donald trump, India-US trade, Joe Biden, Narendra Modi Failures


ఎం కోటేశ్వరరావు


ఉల్లి తల్లి వంటిది అని చెబుతారు. చాలా మంది హరిదాసు-ఉల్లి కథ వినే ఉంటారు.జనానికి చెప్పే కథల సందర్భంగా ఒక హరిదాసు ఉల్లిపాయలు తినొద్దు అని హితవు చెప్పాడు. ఆ శ్రోతల్లో ఒకరిగా ఉన్న భార్య మరుసటి రోజు ఉల్లిపాయ లేకుండా కూరలు వండింది. కోపంతో చిర్రెత్తిన దాసు ఎందుకు వేయలేదు అని అరిచాడు. రాత్రి మీరే కదా తినొద్దని చెప్పారు అని నసిగింది . ఊరందరినీ తినొద్దని చెప్పాను తప్ప నీకు చెప్పానా అంటూ చిందులు వేయటంతో ఆ ఇల్లాలు నివ్వెరపోయింది. ఎందుకు ఈ కథను చెప్పాల్సి వచ్చిందంటే ఆదివారం నాడు మన ప్రధాని నరేంద్రమోడీ 106వ మన్‌కీ బాత్‌ సుభాషితాల్లో స్థానిక వస్తువులనే కొనండి అని మరోసారి పునరుద్ఘాటించారు. ఆ మాటలు విన్నతరువాత ఇతరులకు నీతులు చెప్పే హరిదాసు గుర్తుకు వచ్చారు. ప్రపంచంలో కోడి మాంసం ఎక్కువగా ఉత్పత్తి చేసే దేశాల్లో ఎఫ్‌ఏఓ సంస్థ 2021 వివరాల ప్రకారం భారత్‌ ఆరవ స్థానంలో ఉంది. అమెరికా 2,06,52,971 టన్నులతో మొదటి స్థానంలో, చైనా 1,47,00,000, బ్రెజిల్‌ 1,46,36,478, రష్యా 46,17,338, ఇండోనేషియా 38,44,346,భారత్‌ 36,70,156 టన్నులతో, తొలి పది స్థానాల్లో మన తరువాత మెక్సికో, జపాన్‌, అర్జెంటీనా,టర్కీ ఉన్నాయి.చైనా, మనదేశం జనాభాలో ఒకే విధంగా ఉన్నప్పటికీ జనాభా కొనుగోలు శక్తి ఎక్కువ గనుక చైనా ఇంకా దిగుమతి చేసుకుంటోంది.మన దగ్గర ఉత్పత్తి అవుతున్న కోడి మాంసం, గుడ్లనే పూర్తిగా వినియోగించలేని స్థితిలో ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నాం.2014-2019 సంవత్సరాల్లో తలసరి సగటు కోడి మాంస వినియోగం చైనాలో 12.1 నుంచి 14.9 కిలోలకు పెరగ్గా మన దేశంలో 2.49 నుంచి 3.17 కిలోలకు పెరిగింది.పాకిస్తాన్‌లో 5.11 నుంచి 6.8 కిలోలకు పెరిగింది. ప్రపంచంలో 2021లో బహామాస్‌ 70.2 కిలోలతో ప్రధమ స్థానంలో ఉంది.


తాజాగా నరేంద్రమోడీ సర్కార్‌ అమెరికాతో కుదుర్చుకున్న ఒప్పందాలలో భాగంగా అక్కడ తినటానికి తిరస్కరించే కోడి కాళ్లను మన దేశం దిగుమతి చేసుకొనేందుకు, భారీగా పన్ను తగ్గించేందుకు అంగీకరించింది. అమెరికా మోజులో ఉన్న నరేంద్రమోడీకి అక్కడి కోడి కాళ్లు, ఉత్పత్తిదారులు, వారి లాభాలు తప్ప భారతీయ కోడి మాంసం, దాని ఉత్పత్తి, మార్కెటింగ్‌లో భాగస్వాములయే లక్షల మంది రైతులు, కార్మికులు, చిన్న వ్యాపారులు గుర్తుకు రాలేదు. నిత్యం పారాయణం చేసే దేశభక్తి, స్వప్రయోజనాలను తుంగలో తొక్కారా లేక విశ్వగురువుగా నీరాజనాలందుకొనేందుకు అమెరికాకు దాసోహం అన్నారా ? ఏడు సంవత్సరాల క్రితం మన కోళ్ల పరిశ్రమ మార్కెట్‌ విలువ యాభైవేల కోట్లు, 2022లో రు.1,90,530 కోట్లకు పెరిగింది, 2028 నాటికి రు.3,40,780 కోట్లకు చేరుతుందని అంచనా. లక్షలాది మంది ఉపాధి పొందుతున్నారు. ఇలాంటి పరిశ్రమకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పెద్ద దెబ్బ అని భావిస్తున్నారు. అమెరికా నుంచి దిగుమతి చేసుకొనే కోడి మాంసం, ఇతర కొన్ని దిగుమతుల మీద భారీగా పన్నుల తగ్గింపును అడ్డుకొనేందుకు కొందరు సుప్రీం కోర్టుకు వెళ్లనున్నట్లు ప్రకటించారు. కోర్టులో ఎవరు ఏం వాదిస్తారో చెప్పలేము, ప్రభుత్వ విధాన నిర్ణయాలను సాధారణంగా కోర్టులు సమర్ధిస్తాయి. అమెరికాలో కోడి బ్రెస్ట్‌ తప్ప కాళ్లు, లివరు తినరు, అందువలన వారికి పనికిరాని వాటిని ఇతర దేశాలకు చౌకగా ఎగుమతి చేస్తారు. అవి ఆయా దేశాల పరిశ్రమను దెబ్బతీస్తాయి గనుక అనేక దేశాలు రక్షణ చర్యలు తీసుకుంటున్నాయి. అమెరికా కోళ్లు, బాతుల మాంసంతో పాటు యాపిల్స్‌, బాదం పప్పు, కాబూలీ(పెద్ద) సెనగలు, కాయధాన్యాలు తదితర వ్యవసాయ ఉత్పత్తులపై మనదేశం భారీగా దిగుమతి పన్ను తగ్గించనుంది. దిగుమతి చేసుకొనే ఉత్పత్తులతో గతంలో పంటలు, పర్యావరణాన్ని దెబ్బతీసే కలుపు మొక్కలు, తెగుళ్ల వంటివి మన దేశానికి వచ్చాయి.1950లో పిఎల్‌ 480 పేరుతో అమెరికా అందచేసిన నాసిరకం గోధుమలతో పాటు వయ్యారి భామ, కాంగ్రెస్‌ గడ్డి అని పిలిచే పార్థీనియం అనే విషపూరితమైన కలుపు మొక్క మన దేశానికి వచ్చింది.అదే విధంగా ప్రపంచంలోని అనేక దేశాల్లో ఇది వ్యాపించింది. దీని వలన మనుషులకు చర్మ, శ్వాస సంబంధమైన రుగ్మతలు కలుగుతాయని తేలింది.


2022లో అమెరికాలో బర్డ్‌ ఫ్లూ అనే వ్యాధితో కోట్లాది కోళ్లు మరణించాయి. వాటితో పాటు ఆ వ్యాధి మనుషులకూ వ్యాపిస్తుంది. అలాంటి అవకాశం ఉన్న చోట నుంచి కోడి, బాతు మాంస ఉత్పత్తులను దిగుమతికి నరేంద్రమోడీ సర్కార్‌ తలుపులు బార్లా తెరిచి జనాల ఆరోగ్యానికి కూడా హాని తలపెట్టినట్లు అనేక మంది భావిస్తున్నారు. రెండవది అమెరికాలో కోళ్ల దాణా పశు, పంది మాంసం, ఎముకల నుంచి తయారు చేస్తారు. అలాంటి వాటితో పెంచిన కోళ్ల మాసం తినేందుకు అనేక మంది మనోభావాలు అంగీకరించవు. మోడీ సర్కార్‌ వాటిని పట్టించుకోలేదు.ఈ దాణాతో పెంచిన కోళ్ల, బాతుల మాంసం అని వాటి ఉత్పత్తుల మీద ప్రకటిస్తారో లేదో తెలియదు. ఒక వేళ ప్రకటించినప్పటికీ వినియోగదారులకు అలా ముద్రించిన పాకెట్లలో సరఫరా చేస్తే అదొక దారి. హౌటళ్లలో వాటిని వడ్డిస్తే వినియోగదారులు కనుక్కోలేరు.దేశ కోళ్ల పరిశ్రమ రైతులకు హానికలిగించే ఈ ఏకపక్ష నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీం కోర్టుకు వెళ్లనున్నట్లు భారత కోళ్ల పరిశ్రమ ఫెడరేషన్‌ అధ్యక్షుడు రాణ్‌పాల్‌ ధండా చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అమెరికన్‌ కంపెనీల లాభాలను కాదు, దేశంలోని రైతుల ప్రయోజనాలను చూడాలని అన్నారు.ఈ నిర్ణయంతో అమెరికా ఉత్పత్తిదారులకు మరిన్ని అవకాశాలు పెరుగుతాయని, ఉత్పత్తులు మరింతగా భారత్‌లో అందుబాటులోకి వస్తాయని అమెరికా వాణిజ్య ప్రతినిధి కాథరీన్‌ తారు ప్రకటించారు.బాదం పప్పు, సెనగలు, కాయధాన్యాలు, యాపిల్స్‌ దిగుమతుల మీద పన్ను పెంచాల్సిందిపోయి తగ్గించటం నరేంద్రమోడీ సర్కార్‌ రైతుల ప్రయోజనాలను దెబ్బతీయటమే అని, ఈ ఉత్పత్తులపై అమెరికా ఇచ్చే ఎగువుతి సబ్సిడీలకు వ్యతిరేకంగా ప్రపంచ వాణిజ్య సంస్థలో మనదేశంతో కలసి పోరాడిన దేశాలను కేంద్ర ప్రభుత్వం మోసం చేయటం తప్ప మరొకటి కాదని రాష్ట్రీయ కిసాన్‌ మహాసంఫ్‌ు జాతీయ సమన్వయకర్త కెవి బిజు అన్నారు.ఈ నిర్ణయం వలన కాశ్మీర్‌, హిమచల్‌ ప్రదేశ్‌, మధ్య ప్రదేశ్‌ రైతుల ప్రయోజనాలు దెబ్బతింటాయన్నారు. అమెరికా, ప్రపంచబాంకు వత్తిడికి లొంగి ఇలాంటి నిర్ణయాలు తీసుకొనేందుకు తీసుకు వచ్చిన మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా పోరాడి వాటిని తిప్పి కొట్టేందుకు రైతాంగాన్ని కదిలించిస సంయుక్త కిసాన్‌ మోర్చా, ఇండియా కూటమి కూడా కేంద్ర నిర్ణయాన్ని ప్రశ్నించింది. భారత్‌లో టర్కీ కోడి మాంసంపై ప్రస్తుతం ఉన్న 30శాతం దిగుమతి పన్నును ఐదు శాతానికి తగ్గిస్తారని అమెరికా పార్లమెంటు సభ్యురాలు అమీ క్లోబుచర్‌ ప్రకటించారు.


తమ కోళ్ల ఉత్పత్తులను మనదేశంలో కుమ్మరించేందుకు అమెరికా చాలా కాలం నుంచి చూస్తోంది. బెదిరింపు, వత్తిడి వంటి అనేక రూపాల్లో అది ప్రయత్నించి చివరికి అనుకున్నది సాధించింది.2007లో మన్మోహన్‌ సింగ్‌ ప్రధానిగా ఉన్న నాటి యుపిఏ ప్రభుత్వం అమెరికా కోళ్ల ఉత్పత్తులపై నిషేధం విధించింది. అది చెల్లదంటూ అమెరికా ప్రపంచ వాణిజ్య సంస్థలో కేసు దాఖలు చేసింది.అమెరికా తన కోళ్ల ఉత్పత్తుల్లో 15 నుంచి 20శాతం వరకు ఎగుమతులు చేస్తున్నది.2014లో అమెరికా కేసు గెలిచింది. అధికారానికి వచ్చిన కొత్త రోజులు గనుక మోడీ సర్కార్‌ ఆ తీర్పును అమలు చేసేందుకు భయపడింది.ప్రపంచ వాణిజ్య సంస్థ ద్వారా భారత్‌ మీద ఆంక్షలను విధింపచేయిస్తామని అమెరికా బెదిరించటంతో కేంద్ర ప్రభుత్వం చికెన్‌లెగ్స్‌ దిగుమతులకు అనుమతిస్తున్నట్లు 2017లో తెలిపింది. నిజానికి మన దేశంలో ఉత్పత్తి అవుతున్న చికెన్‌ మాంసం, గుడ్లు అవసరాలకు మించి ఉండటంతో 2016-17లోనే రు.532 కోట్ల మేరకు వివిధ దేశాలకు ఎగుమతి చేశాము. నరేంద్రమోడీ రెండవ సారి విజయం సాధించిన తరువాత నాటి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఒకవైపు మోడీని పొగడ్తలు, ఆలింగనాలతో ముంచెత్తుతూనే మరోవైపు మరింత వత్తిడి పెంచాడు. అప్పటి వరకు మన దేశం నుంచి అమెరికాకు ఎగుమతి చేస్తున్న వస్తువుల మీద జిపిఎస్‌ పేరుతో 600 కోట్ల డాలర్ల మేర ఇస్తున్న దిగుమతిపన్ను రాయితీలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించాడు.దానికి ప్రతిగా మన దేశం కూడా అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్న యాపిల్స్‌ వంటి 28రకాల వస్తువులపై దిగుమతి పన్ను పెంచింది. మన మార్కెట్‌ను మరింతగా తెరవాలని డిమాండ్‌ చేస్తున్న అమెరికా ఇంతవరకు జిపిఎస్‌ను పునరుద్దరించలేదు.ట్రంప్‌ పోయి బైడెన్‌ వచ్చినా జరిగిందేమీ లేదు గానీ మనదేశం మాత్రం అమెరికా వస్తువుల మీద విధించిన పన్నులను మోడీ సర్కార్‌ తాజాగా తగ్గించింది. అమెరికా-చైనా వాణిజ్యపోరుతో మన దేశం లబ్దిపొందవచ్చని కొందరు ఆశించారు.అది కార్యరూపందాల్చలేదు. తొలి రోజుల్లో అమెరికా మీద మోడీ సర్కార్‌ చూపిన పరిమిత ప్రతిఘటన తరువాత నీరుగారింది. ఇప్పుడు పూర్తిగా లొంగిపోయింది. నిజానికి నరేంద్రమోడీ జూన్‌ నెలలో అమెరికా వెళ్లినపుడే పన్నుల తగ్గింపు నిర్ణయం తీసుకున్నారు, సెప్టెంబరులో వెల్లడించారు.


కోళ్ల పరిశ్రమలో మార్కెట్‌ను మరింత తెరిచారు. రైతాంగ స్పందన చూసిన తరువాత అమెరికా, ఐరోపా, ఇతర దేశాల నుంచి పాల ఉత్పత్తులను అనుమతించి పాడి పరిశ్రమకూ మంగళం పాడేందుకు చూస్తున్నారు. అన్నీ ఒకేసారి చేస్తే ప్రతిఘటన తీవ్రంగా ఉంటుంది గనుక దశలవారీ నిర్ణయాలు తీసుకుంటారు. మన దేశంలో పాల పదార్ధాల ధరల్లో సగానికి దిగుమతి చేసుకున్నవాటిని విక్రయిస్తారని గతంలోనే అనేక మంది చెప్పారు.2020లో మన దేశంలో పాలపొడి ధర కిలో రు.130 నుంచి 150వరకు ఉండగా 30శాతం దిగుమతి పన్నుతో సహా అమెరికా నుంచి రు.70కే దిగుమతి చేసుకోవచ్చని తేలింది. ఇప్పుడు కూడా ధరల్లో మార్పులు ఉండవచ్చు తప్ప విదేశాలు ఇచ్చే సబ్సిడీలు భారీ ఎత్తున ఉంటాయి.చైనాతో అమెరికా 2018లో ప్రారంభించిన వాణిజ్య యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. అందువలన అమెరికన్లు తమ వస్తువులకు కొత్త మార్కెట్లకోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
అమెరికా వత్తిడిని అడ్డుకొనేందుకు మనసుండాలేగానీ మార్గం దొరక్కపోదు.గతంలో మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం అమెరికాలో వ్యాపించిన బర్డ్‌ ఫ్లూను పేర్కొంటూ కోళ్ల ఉత్పత్తుల దిగుమతులను నిషేధించింది. నరేంద్రమోడీ ఆంక్షలను, దిగుమతి పన్నులను సడలిస్తున్న సమయంలో అమెరికాలోని వాణిజ్య పౌల్ట్రీ ఫారాల్లో ఫ్లూ కనిపించింది. 2022 నుంచి ఇప్పటి వరకు ఈ వ్యాధికి అక్కడ 5.88 కోట్ల కోళ్లు, టర్కీ కోళ్లు మరణించినట్లు 2023 అక్టోబరు పదవ తేదీన రాయిటర్స్‌ వార్తా సంస్థ పేర్కొన్నది. అమెరికాలో అతి పెద్ద గుడ్ల ఉత్పత్తి సంస్థ కాల్‌ మైన్‌ ఫుడ్స్‌ విక్రయించే గుడ్ల ధర గత ఏడాది కాలంలో 48శాతం పడిపోయింది. సెప్టెంబరు రెండవ తేదీనాటికి అంతకు ముందు నాలుగు నెలల్లో అమ్మకాలు 30శాతం పడిపోయినట్లు పేర్కొన్నది. బర్డ్‌ ఫ్లూ మనుషుల్లో కూడా సులభంగా వ్యాప్తి చెందవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్ధ, ప్రపంచ జంతు ఆరోగ్య సంస్థకూడా జూలైనెలలో హెచ్చరికలు జారీచేశాయి. 2022లో 67దేశాల్లో వ్యాధికారణంగా 13 కోట్ల కోళ్లను వధించటం లేదా మరణించినట్లు లెక్కలు ఉన్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు మరో 14దేశాల్లో వ్యాధి కనిపించింది. అందువలన ఈ కారణంగా కూడా అమెరికా ఉత్పత్తులను అడ్డుకోవచ్చు.


అమెరికా నుంచి దిగుమతి చేసుకొనే వాటి మీద దిగుమతి పన్ను ఐదు నుంచి పదిశాతానికి పరిమితం చేసేందుకు కేంద్రం అంగీకరించింది. అయితే ఇది ఒక్క అమెరికాకే కాదు, ప్రపంచ వాణిజ్య సంస్థలో ఉన్న అన్ని దేశాలకూ అదే రేటు వర్తిస్తుంది. గతంలో దిగుమతి చేసుకున్న కోడి కాళ్ల మీద మన ప్రభుత్వం వందశాతం పన్ను విధించేది. తరువాత దాన్ని 35 నుంచి 45శాతానికి తగ్గించింది. వచ్చే ఆరునెలల్లో ఐదు, పదిశాతాన్ని ఏ వస్తువు మీద ఎంత అనేది నిర్దిష్టంగా నిర్ణయిస్తారు. అందుకే ఈ లోగా పన్ను తగ్గింపు నిర్ణయాన్ని సుప్రీం కోర్టులో సవాలు చేసేందుకు కొందరు పూనుకున్నారు. వందశాతం పన్ను విధించినప్పటికీ భారీ మొత్తాలు సబ్సిడి ఇస్తున్న అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న చికెన్‌ లెగ్స్‌ మనదేశంలో ఉన్న ప్రస్తుతం ఉన్న ధరల కంటే తక్కువకే దొరుకుతాయని అది మన పరిశ్రమకు తీరని దెబ్బ అని సంయుక్త కిసాన్‌ మోర్చా హెచ్చరించింది.అమెరికాలో చికెన్స్‌ లెగ్స్‌ ఉత్పాదన ఖర్చు టన్నుకు 700 నుంచి 800 డాలర్లు ఉంటుందని, వందశాతం పన్ను విధిస్తే 1,500 నుంచి 1,600 డాలర్లకు దిగుమతి చేసుకోవచ్చని, మన దేశంలో టన్ను ఉత్పత్తి ఖర్చు 1,800 డాలర్లుగా ఉందని ఒక ప్రకటనలో పేర్కొన్నది. అదే ఐదు, పదిశాతం పన్ను మాత్రమే విధిస్తే ఎంత చౌకగా మన మార్కెట్‌ను ముంచెత్తుతారో ఊహించుకోవాల్సిందే.

Share this:

  • Tweet
  • More
Like Loading...

జాడలేని భారత ఉత్పత్తి, తయారీ – చైనాతో వాణిజ్యలోటుపై కొత్త డ్రామాకు తెరతీసిన మోడీ సర్కార్‌ !

27 Friday Oct 2023

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, Europe, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, Uncategorized, USA

≈ Leave a comment

Tags

BJP, Boycott of goods made in China, India Trade with China, Make In India, Narendra Modi Failures, Niti Aayog, Ten years Narendra Modi rule


ఎం కోటేశ్వరరావు


2018 ఏప్రిల్‌ నెలలో మన ప్రధాని నరేంద్రమోడీ చైనాలోని ఊహాన్‌ నగరంలో చైనా నేత షీ జింపింగ్‌తో కలసి ఊయల ఊగేందుకు వెళ్లారు. అప్పుడు నీతి ఆయోగ్‌ ఒక పత్రాన్ని ప్రధాని బృందానికి సమర్పించింది. దానిలో ఏం చెప్పిందంటే గడచిన దశాబ్దకాలంలో చైనాతో వాణిజ్యలోటు పదమూడు రెట్లు పెరిగిందనీ, పాత స్వేచ్చావాణిజ్య ఒప్పందాలను సమీక్షించాలని, నూతన ఒప్పందాల్లో ఏదైనా ఉపేక్ష ఉంటే అది మన మార్కెట్లను దెబ్బతీస్తుందని, భారత్‌ పట్ల చైనా ఔదార్యాన్ని ప్రదర్శించాల్సిన సమయం వచ్చిందని, చైనాతో మనదేశం జాగ్రత్తగా ఉండాలని సలహా ఇచ్చింది. మంచిదే, అంతకంటే కావాల్సిందేముంది ! ఇప్పటికి ఐదున్నర సంవత్సరాలు గడిచాయి. జరిగిందేమిటి ? రెండు దేశాల మధ్య కొత్త ఒప్పందాలేమీ కుదరలేదు. ఉన్నవి రద్దు కాలేదు. 2004-05నుంచి 2013-14 మధ్య కాలంలో 148 కోట్ల డాలర్లుగా ఉన్న చైనా-భారత వాణిజ్య లోటు 3,621కోట్లకు చేరిందని, అది 2,346శాతం పెరుగుదల అని అప్పటి నుంచి తమ ఏలుబడిలో 2021-22 నాటికి 7,331 కోట్లకు అంటే కేవలం వందశాతమే పెరిగిందని రాజ్యసభకు వెల్లడించిన సమాచారంలో కేంద్ర మంత్రి పియూష్‌ గోయల్‌ సమర్ధించుకున్నారు. మరుసటి ఏడాది అంది పదివేల కోట్ల డాలర్లకు చేరింది.ఈ ఏడాది తొలి ఆరునెలల్లో 5,653 కోట్ల డాలర్లు ఉంది.చైనాతో వాణిజ్య లోటును తగ్గించేందుకు అవసరమైన సూచనలు చేసేందుకు నవంబరు ఏడవ తేదీలోపు దరఖాస్తులు చేసుకోవచ్చని నీతి ఆయోగ్‌ సంస్థ తాజాగా కన్సల్టెన్సీ సంస్థలను కోరింది. రెండు రకాల అధ్యయనాలు చేస్తారట.సిఫార్సులు చేయటం, నివేదికలను రూపొందించటం తప్ప అధికారాలు లేని ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థను నరేంద్రమోడీ ప్రణాళిక సంఘాన్ని రద్దుచేసి నెలకొల్పారు.


వాస్తవానికి చైనా నుంచి విధిగా దిగుమతులు చేసుకోవాలనే ప్రత్యేక ఒప్పందమేమీ మనదేశానికి లేదు. మనకు అవసరం ఎక్కువగా ఉంది గనుక అక్కడి నుంచి తెచ్చుకుంటున్నాం, వారికి మన నుంచి పెద్దగా దిగుమతులు అవసరం లేదు గనుక లోటు పెరుగుతోంది. అందువలన వాణిజ్య లోటు తగ్గించాలన్నా పూర్తిగా లేకుండా చేయాలన్నా చైనా నుంచి దిగుమతులను నిలిపివేస్తే సరిపోతుంది. లేదా మన ఎగుమతులు పెంచాలి. గత పదేండ్లుగా ఈ రెండూ చేతగాని స్థితిలో మోడీ దేశాన్ని ఉంచారా ? ఏం చేయాలో నీతి అయోగ్‌ సంస్థకు తెలియదా ? కొన్ని కోట్లు సమర్పించుకొని సలహలను కొనుక్కోవాలా ? లడక్‌ సరిహద్దులో జరిగిన ఘర్షణ ఉదంతాల తరువాత మన దేశంలో అనేక మంది మనం చైనా నుంచి దిగుమతులను నిలిపివేస్తే అది మన కాళ్ల దగ్గరకు వస్తుందని చెప్పారు. ఇంతకాలం రికార్డు స్థాయిలో తన రికార్డులను తానే బద్దలు కొట్టుకొని నరేంద్రమోడీ సర్కార్‌ దిగుమతులకు అనుమతులు ఇచ్చింది. స్టాటిస్టా సంస్థ వివరాల ప్రకారం 2022లో మన దేశం చేస్తున్న ఎగుమతుల్లో 18.5శాతం అమెరికాకు, 6.65శాతం యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌కు, మూడవ స్థానంలో ఉన్న చైనాకు 5.04శాతం ఉన్నాయి. ఇదే కాలంలో చైనా ఎగుమతుల్లో 16.2శాతం అమెరికాకు ఆరవ స్థానంలో ఉన్న మన దేశానికి 3.29శాతమే ఉన్నాయి. అందువలన మనం దిగుమతులు, ఎగుమతులు నిలిపివేస్తే అరిటాకు మీద ముల్లు సామెత అవుతుంది. పదేండ్లుగా చెబుతున్న మేకిన్‌ ఇండియా(భారత ఉత్పత్తి), మేడిన్‌ ఇండియా(భారత తయారీ), ఆత్మనిర్భరత పిలుపుల వలన జరిగిందేమీ లేదు. 2022-23లో మన జిడిపిలో ఉత్పాదకరంగం వాటా 14.7శాతం, మోడీ ఏలుబడి పది సంవత్సరాల్లో దీనికి అటూ ఇటూగానే ఉంది తప్ప 25శాతానికి పెంచాలన్న లక్ష్యం ఎండమావిగానే ఉంది. పన్నెండు రంగాలలో దేశాన్ని ఉత్పత్తి కేంద్రంగా మార్చేందుకు సలహాలు ఇవ్వాలని నీతి అయోగ్‌ కోరుతున్నది. చైనా నుంచి దిగుమతులను తగ్గించాలని 2018లోనే నీతి అయోగ్‌ చెప్పింది కదా ! పోనీ అప్పుడే ఎందుకు అడగలేదు ? తగ్గించకపోగా ఎందుకు పెంచినట్లు ? ఇప్పుడు జనాన్ని మభ్య పెట్టేందుకు తన వైఫల్యాలను దాచిపెట్టేందుకు నీతి అయోగ్‌ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఆడుతున్న ఒక నాటకం తప్ప ఇది మరొకటి కాదు. అమెరికా, జర్మనీ వంటి దేశాలు మేము చైనా మీద ఆధారపడకుండా ఉండలేంగానీ మీరు ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు ప్రోత్సహిస్తామని మనలను మునగచెట్టు ఎక్కిస్తున్నాయి.


వాటికే సాధ్యం కానిది మనకెలా కుదురుతుంది ! చైనా నుంచి దిగుమతి చేసుకొనే వస్తువులు ఎక్కడైనా దొరుకుతాయి. మరి ఎందుకు ఇతర దేశాల నుంచి తెచ్చుకోవటం లేదంటే చైనా మాదిరి తక్కువ ధరలకు మరొకదేశమేదీ ఇవ్వదు. అధిక ధరలకు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటే మన చేతి చమురు మరింత వదులుతుంది.ద్రవ్యోల్బణం, ధరలు పెరుగుతాయి. మన జనం కొనాలంటే జిఎస్‌టి పెంచుతారు, విదేశాలకు పద్నాలుగు రకాల వస్తువులను చౌకగా ఎగుమతి చేసేందుకు జనం సొమ్ము రెండు లక్షల కోట్ల రూపాయల మేర సబ్సిడీ ఇస్తున్నా ఎదుగూబొదుగూ లేదు. చైనాను పక్కకు నెట్టి ఆ స్థానాన్ని మనదేశం ఆక్రమిస్తుందని చెప్పటం పరిణితిలేనితనమని ఆర్‌బిఐ మాజీ గవర్నర్‌ రఘురామ రాజన్‌ గతంలో చెప్పాడు. ఐఎంఎఫ్‌ తాజా అంచనా ప్రకారం 2028నాటికి మన జిడిపి 5.94లక్షల కోట్ల డాలర్లకు చేరుతుందని, అదే చైనాలో 23.61లక్షల కోట్ల డాలర్లు ఉంటుంది. కానీ కొందరు అప్పటికి మన దేశం చైనాను అధిగమిస్తుందని చెబుతుంటే మరి కొందరు నిజమే కామోసనుకుంటున్నారు. ఎవరి నమ్మకం వారిది ? వినేవారుంటే చెప్పేవారికి కొదవ ఉండదు. చైనా వ్యతిరేక కళ్లద్దాలను పెట్టుకొని చూస్తే అలాగే కనిపిస్తుంది మరి ! గోల్డ్‌మాన్‌ శాచస్‌ సంస్థ అంచనా ప్రకారం 2075 నాటికి చైనా 57లక్షల కోట్ల డాలర్లతో ప్రధమ స్థానంలో 52.5లక్షల కోట్ల డాలర్లతో మనదేశం రెండవదిగా 51.5లక్షల కోట్ల డాలర్లతో అమెరికా మూడవ స్థానంలో ఉంటుందని చెప్పింది. ఇవన్నీ అంచనాలు తప్ప యాభై ఏండ్ల తరువాత రాజెవరో రెడ్డెవరో !


ప్రపంచం రక్షణాత్మక చర్యలు తీసుకుంటోందని, చైనా మీద ఇప్పటికే అమెరికా వాణిజ్యపోరు ప్రారంభించిందని, చైనా మీద అన్ని వైపుల నుంచి వత్తిడి పెరుగుతున్నందున దాన్ని అవకాశంగా మలుచుకోవాలని, మనదేశం చైనా వస్తువులకు మార్కెట్‌ను తెరవకూడదని నీతి అయోగ్‌ 2018 పత్రంలో స్పష్టంగా పేర్కొన్నది. చైనా వస్తువులను మన దేశంలో కుమ్మరించటం గాకుండా చైనా తమ దేశంలో తయారు చేస్తున్నవాటిని మన దేశంలో కూడా పెట్టుబడులు పెట్టి, మన కంపెనీలతో కలసి తయారు చేయించాలని నరేంద్రమోడీకి సలహా ఇచ్చింది. అలా చేస్తే దానికి బదులు ప్రపంచంలో ఇతర దేశాల రక్షణాత్మక చర్యలకు వ్యతిరేకంగా మనదేశ సహాయాన్ని చైనా కోరే అవకాశం ఉందని కూడా చెప్పింది. తెలివితేటలకు తక్కువేం లేదు. అదైనా చేశారా ? లడక్‌ సరిహద్దు ఉదంతం తరువాత చైనాను ఒక శత్రుదేశంగా పరిగణిస్తున్న సంగతి తెలిసిందే.పోనీ మనలను ఎగదోస్తున్న అమెరికా, ఇతర ఐరోపా దేశాలు మనకేమైనా సాయం చేస్తున్నాయా ? తమ దేశంలో ఒక సిక్కు ఉగ్రవాదిని భారత్‌ దేశమే హత్య చేయించిందన్న కెనడా ఆరోపణకు అమెరికా, ఐరోపా దేశాలు మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే.


ప్రతి దేశం తన ప్రయోజనాలను తాను చూసుకుంటున్నది, తన పరిస్థితిని బట్టి అభివృద్ధి వ్యూహాన్ని రూపొందించుకోవాలి తప్ప చైనా దెబ్బతింటే మనకు అవకాశం వస్తుందని చెప్పేవారి మాటలు వింటే జరిగేదేమీ ఉండదని ఇప్పటికే తేలిపోయింది. ఇతర దేశాల వైఫల్యాల కారణంగా చైనా నేడు ఈ స్థితికి రాలేదు. తన స్వంత విధానాలను రూపొందించుకుంది. కరోనా నిరోధానికి అక్కడ అమలు జరిపిన కఠిన ఆంక్షలు కొంత మేరకు వృద్ధిని దెబ్బతీశాయి తప్ప అనేక మంది ఆశించినట్లు కుప్పకూలలేదు, ఇప్పుడు అలాంటి మాటలు చెప్పేవారి నోళ్లు మూతపడ్డాయి. నాలుగు సంవత్సరాల నాడు ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పంద(ఆర్‌సిఇపి) చర్చల నుంచి మనదేశం వైదొలిగిన తరువాత మనం సాధించిందేమీ లేదు. 2022 జనవరి నుంచి ఆ ఒప్పందం అమల్లోకి వచ్చింది. దానిలో చేరాలని తాజాగా బంగ్లాదేశ్‌, శ్రీలంక దరఖాస్తు చేసుకున్నాయి. దానిలో మనం చేరితే దిగుమతి వ్యాపారం చేసే శక్తులు లాభపడతామని భావిస్తుండగా నష్టపోతామని పారిశ్రామిక రంగం వ్యతిరేకిస్తోంది. మన దేశానికి తలుపులు తెరిచే ఉంచామని ఆ కూటమి పదే పదే చెబుతోంది.


అసలు చైనాతో మనదేశం పూర్తిగా తెగతెంపులు చేసుకోగలదా ? చైనా సంస్థలను నిరోధించగలదా ? చైనా నుంచి వస్తు దిగుమతులను నిలిపివేయవచ్చు. అదే జరిగితే ఆ దిగుమతులతో లబ్ది పొందుతున్న ఫార్మా, ఇతర రంగాల కార్పొరేట్ల నుంచి ప్రతిఘటన ఎదురవుతుంది. చైనా సభ్యురాలిగా ఉన్న ఆసియన్‌ డెవలప్‌మెంట్‌ బాంక్‌(ఎడిబి), ఏఐఐబి, ప్రపంచబాంకు వంటి ఆర్థిక సంస్థలలో మనదేశం కూడా భాగస్వామి. వాటి నుంచి రుణాలు తీసుకొని మనదేశంలో అమలు జరిపే ప్రాజెక్టులలో కాంట్రాక్టులను దక్కించుకొనేందుకు చైనా సంస్థలకు హక్కు ఉంటుంది. వాటికవి దూరంగా ఉంటే లేదా నిబంధనలను ఉల్లంఘిస్తే తప్ప నిరాకరించటానికి కుదరదు. గాల్వన్‌ ఉదంతాల తరువాత ఢిల్లీ-మీరట్‌ రాపిడ్‌ రైల్‌ మార్గంలో చైనా కంపెనీల కాంటాక్టులను రద్దు చేయాలని ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ స్వదేశీ జాగరణ మంచ్‌ తదితర సంస్థలు ఆందోళన చేసినప్పటికీ కుదరలేదు.ఎందుకంటే అవసరమైన నిధులను ఏడిబి నుంచి రుణాలుగా తీసుకున్నారు. చైనా కంపెనీలు పూర్తి చేసిన మార్గాన్నే ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించారు. మన దేశంలో దాదాపు ఎనిమిది వందల చైనా కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి. స్నాప్‌డీల్‌, ఫ్లిప్‌కార్ట్‌, బైజూస్‌,స్విగ్గీ, జొమాటో,ఉడాన్‌, ఓలా,పేటియం, పేటియం మాల్‌, బిగ్‌బాస్కెట్‌,పోలసీబజార్‌,ఓయో వంటి కంపెనీలలో చైనా పెట్టుబడులు ఉన్నాయి. వాటన్నింటిని తెల్లవారేసరికి వెళ్లిపొమ్మని నరేంద్రమోడీ చెప్పవచ్చు, వాటికవి వెళ్లిపోతే సరే, లేకుంటే నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. దాన్ని ప్రభుత్వం భరిస్తుందా ? ఇష్టం లేదని ఈ రోజు చైనా కంపెనీలను వెళ్లగొడితే మనదేశాన్ని నమ్మి పెట్టుబడులు పెట్టేందుకు ఇతర దేశాల కంపెనీలు ముందుకు వస్తాయా ? పాలకులకు ఇష్టం లేకపోతే రేపు మనకూ అదే గతి అని ఆలోచించవా ? సరిహద్దు వివాదం తరువాత మనం చైనా వైపు తలుపులు మూసుకున్నాం తప్ప ఇతర దేశాల నుంచి సాధించిందీ లేదు, ఏ ఒక్క చైనా కంపెనీ కూడా వెనక్కు వెళ్లిపోలేదు.


చైనా టెక్‌ కంపెనీల ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటే తమ సమాచారాన్ని తస్కరించే అవకాశం ఉందని, రక్షణకు ముప్పని అమెరికా, ఐరోపా దేశాలు చెబుతున్నాయి.ఇప్పుడు మన దేశమూ అదే చెబుతోంది. నిజమే అనుకుందాం. ఇంటెల్‌ వంటి అమెరికా, ఐరోపా కంపెనీల ఉత్పత్తులను దశాబ్దాల తరబడి చైనా దిగుమతి చేసుకుంది.వాటితో చైనాకూ భద్రతా ముప్పు ఉన్నట్లే కదా ! పోనీ మన దేశం చైనా బదులు ఇతర దేశాల నుంచి కొనుగోలు చేస్తే వాటి నుంచి మనకు ముప్పు ఉండదా ? మన సమాచారాన్ని అవి తస్కరించవా ? జపాన్‌ నాగసాకీ నగరంలో 2023 మే నెలలో జరిగిన జి7 దేశాల సమావేశం చైనాతో ఉన్న సరఫరా గొలుసు నుంచి విడగొట్టుకుంటామని చెబుతూ మన దేశాన్ని చైనా స్థానంలోకి నెడతామని చెప్పాయి.వాటిని నమ్ముకుంటే కుక్కతోక పట్టుకొని గోదావరిని దాటేందుకు చూసినట్లే ! దశాబ్దాల తరబడి చైనా నుంచి వస్తువులను దిగుమతి చేసుకున్న పశ్చిమ దేశాలకు ఇప్పుడెందుకు జ్ఞానోదయం కలిగినట్లు ? వాటి మాటలు నమ్మి చైనా అనే కొండను ఢ కొడతామని మనం అనుకోవటం సరైందేనా ? చైనాతో తెగతెంపులు చేసుకుంటే తమ ఆర్ధిక వ్యవస్థలు మెరుగుపడతాయని పశ్చిమ దేశాలు అనుకుంటున్నాయి. అలాంటివి తమ దేశాల్లోనే పరిశ్రమలు, పెట్టుబడులు పెట్టుకుంటాయి తప్ప మనదేశం ఎందుకు వస్తాయి ? చైనా మీద ఆధారపడి చేతులు కాల్చుకున్నామని భావిస్తున్నవారు మన మీద ఆధారపడి మరోసారి అదే తప్పు చేస్తారా ? సొల్లు మాటలను కట్టిపెట్టి ముందు చైనాతో విడగొట్టుకోమనండి !

Share this:

  • Tweet
  • More
Like Loading...

కొనసాగుతున్న ఇజ్రాయెల్‌ మారణకాండ – మధ్యధరాలో చైనా యుద్ధ నౌకలు !

25 Wednesday Oct 2023

Posted by raomk in CHINA, Current Affairs, Europe, History, imperialism, INTERNATIONAL NEWS, Opinion, UK, USA, WAR, Women

≈ Leave a comment

Tags

2023 Israel–Hamas war, China, emmanuel macron, HAMAS attacks 2003, israel massacre, Joe Biden, Rishi Sunak


ఎం కోటేశ్వరరావు


అక్టోబరు ఏడవ తేదీన హమస్‌ సాయుధులు జరిపిన దాడులలో 1400 మరదికి పైగా మరణించారు. దానికి ప్రతీకారం పేరుతో ఇప్పటి వరకు ఇజ్రాయెల్‌ మిలిటరీ, యూదు దురహంకార సాయుధులు పాలస్తీనాలోని గాజా, పశ్చిమగట్టు ప్రాంతాలలో జరుపుతున్న దాడుల్లో మరణాలు, గాయపడిన వారు ఆరు, పద్దెనిమిదివేలు దాటారు. ఇజ్రాయెల్‌ దాడుల్లో మరణించిన వారికి సంతాపం తెలిపేందుకు ఎవరూ ఉండటం లేదనే శీర్షికతో అల్‌ జజీరా పత్రిక వార్త ఇచ్చింది. దానిలో పేర్కొన్నదాని ప్రకారం మంగళవారం నాటికి గాజాలో 2,360 మంది పిల్లలు, 1,119 మంది మహిళలతో సహా 5,791 మంది మరణించారు. గాయపడిన వారు 18వేలు దాటారు. పాలస్తీనాలో ఆక్రమించిన పశ్చిమ గట్టు ప్రాంతంలో ఇజ్రాయెలీ మూకలు మరో 95 మందిని చంపగా 1,650 మంది గాయ పడ్డారు. ఇక హమస్‌ జరిపిన ఒక రోజు దాడిలో1,405 మంది మరణించగా, 5,431 మంది గాయపడ్డారు.వీరు గాక పాలస్తీనాలో 720 మంది పిల్లలతో సహా1,400 మంది కనిపించటం లేదు. పశ్చిమ గట్టు ప్రాంతంలో 1,215 మందిని ఇజ్రాయెల్‌ అరెస్టు చేసింది. బందీలుగా ఉన్న ఇద్దరు ఇజ్రాయెలీ వృద్ద మహిళలను మానవతాపూర్వక వైఖరితో హమస్‌ విడుదల చేసింది. ఇజ్రాయెల్‌ ప్రతీకార ఏకపక్ష దాడులతో ఇరవై మూడులక్షల మంది గాజా పౌరులు నరకయాతన అనుభవిస్తున్నారు. రక్తదాహం తీరని యూదు దురహంకారులు పశ్చిమ దేశాలు ఇస్తున్న మద్దతుతో మరింతగా దాడులు చేసి జనాన్ని మట్టుపెట్టాలని చూస్తున్నారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని స్థితి.


దాడులు, మారణకాండ నివారణలో ఐక్యరాజ్యసమితి విఫలమైంది. ఇజ్రాయెల్‌ పూర్తి యుద్ధ సన్నాహాల్లో ఉంది. ఒక్క గాజా మీదనే గాక ఇరుగుపొరుగు అరబ్‌ దేశాలను రెచ్చగొడుతూ ఉగ్రవాదుల సాకుతో అడపదడపా దాడులు చేస్తున్నది. వాటి తీవ్రతను పెంచేందుకు సరిహద్దుల్లోని తమ గ్రామాల్లో ఉన్న జనాన్ని ఖాళీ చేయిస్తున్నది. దానికి ప్రతిగా లెబనాన్‌ కూడా తన పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నది. ఇజ్రాయెల్‌-అమెరికా కూటమి దేశాల దుండగాలను నివారించేందుకు, పాలస్తీనియన్ల తరఫున అవసరమైతే రంగంలోకి దిగేందుకు ఇరుగు పొరుగు దేశాలు కూడా సిద్దపడుతున్నాయి. మరోవైపున అమెరికా, ఐరోపాలోని అనేక పట్టణాల్లో లక్షలాది మంది జనం వీధుల్లోకి వచ్చి గాజాపై దాడులను నిరసిస్తున్నారు. యూదుల రక్షణ పేరుతో అరబ్బులపై మారణకాండకు పూనుకోవద్దని కోరుతున్న వారిలో యూదులు అనేక మంది ఈ ప్రదర్శనల్లో పాల్గొంటున్నారు. శనివారం నాడు భద్రతా మండలిలో అమెరికా ప్రతిపాదించిన ఒక తీర్మానంలో ఇజ్రాయెల్‌కు ఆత్మరక్షణ చేసుకొనే హక్కు ఉందంటూ సమర్ధనకు పూనుకుంది.దాడుల విరమణకు ఇది సమయం కాదని ప్రకటించింది.గాజాలో జరుపుతున్న కొన్ని దాడులు ఇజ్రాయెల్‌కు ఎదురుదెబ్బకావచ్చని మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా హెచ్చరించాడు.దాడులకు మద్దతు తెలిపేందుకు ఫ్రెంచి అధ్యక్షుడు మక్రాన్‌ మంగళవారం నాడు ఇజ్రాయెల్‌ రాజధాని టెల్‌ అవీవ్‌ చేరుకున్నాడు. అతని కంటే ఘనుడు అన్నట్లు బైడెన్‌, రిషి కంటే మరొక అడుగు ముందుకు వేసి అంతర్జాతీయంగా ఒక్కటై హమస్‌ను అణచివేయాలని పిలుపునిచ్చాడు. తాజా పరిణామాలను చర్చించేందుకు గురువారం నాడు ఐరాస సాధారణ అసెంబ్లీ సమావేశం జరగనుంది.


గాజా ప్రాంతంలో చిక్కుకు పోయిన ఇజ్రాయెల్‌, ఇతర దేశాల పౌరులు రెండువందల మందికి పైగా హమస్‌ చేతుల్లో బందీలుగా ఉన్నారు. వారందరినీ విడుదల చేసిన తరువాతే కాల్పుల విరమణ గురించి మాట్లాడాలని అమెరికా అధినేత జో బైడెన్‌ చెప్పాడు. ఏదో విధంగా వారిని విడిపించుకున్న తరువాత ఇప్పటి వరకు వైమానిక దాడులు జరుపుతున్న ఇజ్రాయెల్‌ తదుపరి దశ పేరుతో భూతల దాడులకు సిద్దం అవుతున్నది. ఇదంతా హమస్‌ను నాశనం చేసే పేరుతో జరుగుతోంది.మరణించిన వారిలో 70 శాతం మంది పిల్లలు,వృద్దులు, మహిళలే ఉన్నారు. అంటే జనం మీదనే దాడి జరుగుతోందన్నది స్పష్టం. మరింతగా పెరిగితే లెబనాన్‌లోని హిజబుల్‌ వంటి సాయుధ శక్తులు ప్రతిదాడులకు సిద్దం అవుతున్నాయి. ఇజ్రాయెల్‌కు మద్దతుగా ప్రత్యక్షంగా దాడులకు దిగేందుకు అమెరికా రంగం సిద్దం చేసుకుంటున్నది. దానికిగాను తమ సైనికులపై దాడులు జరిగినట్లు కట్టుకథలను ప్రచారంలో పెట్టింది. అక్టోబరు 19,20 తేదీలలో ఎమెన్‌ నుంచి తమ మీద, ఇజ్రాయెల్‌పై ప్రయోగించిన డ్రోన్లు, క్రూయిజ్‌ క్షిపణులను కూల్చివేసినట్లు ప్రకటించింది. అదంతా రాత్రి సమయంలో సముద్ర జలాల మీద జరిగింది గనుక ఎలాంటి ఆనవాళ్లు ఉండవని అధికారులు చెప్పారు. నిజానికి ఎమెన్‌లో ఇరాన్‌ మద్దతు ఉన్న హౌతీ సాయుధుల రాడార్‌ కేంద్రాలపై అమెరికా నౌకా దళమే ఎర్ర సముద్రం నుంచి క్షిపణులతో దాడి చేసి రెచ్చగొట్టిందని వార్తలు.ఎమెన్‌ రాజధాని సనా నగరంతో సహా ఉత్తర ప్రాంతం హౌతీల ఆధీనంలో ఉంది. వారి మీద పోరాడుతున్న ఎమెన్‌ ప్రభుత్వానికి 2015 నుంచి సౌదీ అరేబియా మద్దతు ఇస్తున్నది. ఇటీవల చైనా మధ్యవర్తిత్వంలో ఇరాన్‌-సౌదీ మధ్య సయోధ్య కుదిరిన నేపధ్యంలో గతంలో మాదిరి హౌతీ దళాలు సౌదీపై క్షిపణులు ప్రయోగించే అవకాశం లేదు. అందువలన అసలు నిజంగా ప్రయోగించారా లేక ఆ పేరుతో అమెరికా నాటకం ఆడుతోందా అన్న అనుమానాలు తలెత్తాయి. అమెరికా గనుక గాజాపై దాడికి జోక్యం చేసుకుంటే తాము దాడులకు దిగుతామని, గీత దాటవద్దని హౌతీ దళాల నేత అబ్దుల్‌ మాలిక్‌ అల్‌ హౌతీ హెచ్చరించాడు.


ఇప్పటికే మధ్యధరా సముద్ర ప్రాంతంలో ఉన్న పేట్రియాట్‌ గగనతల క్షిపణి బెటాలియన్‌కు తోడు థాడ్‌ రక్షణ వ్యవస్థను కూడా పంపనున్నట్లు అమెరికా వెల్లడించింది. ఇప్పటికే రెండు విమానవాహక యుద్ధ నౌకలు, వాటికి అనుబంధ నౌకలతో పాటు రెండువేల మంది మెరైెన్లను మోహరించింది. శనివారం నాడు కైరోలో జరిగిన శాంతి సమావేశం ఎలాంటి ఫలితం లేకుండానే ముగిసింది. ఇజ్రాయెల్‌ హాజరు కాలేదు. కైరోలోని ఒక జూనియర్‌ అధికారిని అమెరికా పంపింది, అతగాడు నోరువిప్పలేదు.అరబ్‌ నేతలు గాజాపై దాడులను ఖండించారు.ఐరోపా దేశాల నుంచి వచ్చిన వారు దాడుల నుంచి పౌరులను మినహాయించాలని సూచించారు.హిజబుల్లా మీద దాడులకు పూనుకోవద్దని జో బైడెన్‌, ఇతర నేతలు ఇజ్రాయెల్‌కు సూచిస్తున్నారని, అదే జరిగితే తాము కూడా యుద్ధంలో ప్రవేశించాల్సి ఉంటుదని కొన్ని అరబ్బు దేశాలు చెప్పినట్లు వార్తలు వచ్చాయి. పూర్తి స్థాయి యుద్ధమే వస్తే ఇజ్రాయెల్‌ తన దక్షిణ, ఉత్తర భాగంలో దాడులను ఎదుర్కోవాల్సి వస్తుంది, అప్పుడు అమెరికా-ఇరాన్‌ కూడా పాల్గొనే అవకాశం ఉంది. అదే జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. మధ్యధరా సముద్రంలో అమెరికా మిలిటరీ కేంద్రీకరణ నేపధ్యంలో చైనా ఆరు యుద్ధ నౌకలను ఆ ప్రాంతానికి తరలించినట్లు వార్తలు వచ్చాయి. అయితే వీటి గురించి చైనా రక్షణ శాఖ ఒక ప్రకటన చేస్తూ మే నెల నుంచి తమ నౌకలు ఆ ప్రాంతంలో ఉన్నాయని, గత వారంలో ఓమన్‌ నౌకాదళంతో కలసి సంయుక్త విన్యాసాలు సాగించినట్లు పేర్కొన్నది. అవి పూర్తైన తరువాత అక్టోబరు 18వ తేదీన కువైట్‌ రేవు షావయాఖ్‌కు తమ నావల్‌ ఎస్కార్ట్‌ దళాలు వచ్చినట్లు తెలిపింది. వాటిలో నిర్ణీత లక్ష్యాలను ఛేదించే క్షిపణి నౌక, ఫ్రైగేట్‌, ఇతర నౌకలు ఉన్నాయి. చైనా-కువైట్‌ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదిరి ఐదు సంవత్సరాలు అవుతున్నది. పది సంవత్సరాలుగా బిఆర్‌ఐ పధకం కింద పెట్టుబడులు పెట్టింది. చైనా నౌకలు ఎందుకు వచ్చినప్పటికీ ఈ ప్రాంతంలో రాజకీయంగా వాటి ప్రభావం ఉంటుంది. అమెరికా మిలిటరీ శక్తిని చూసి ఆందోళన చెందుతున్న శక్తులకు భరోసా దొరికినట్లు అవుతుంది.


ప్రస్తుతం ఇజ్రాయెల్‌ పరిమితంగా జరుపుతున్న దాడులు, ఒకవేళ వాటి తీవ్రతను పెంచితే రాగల పరిణామాలు, పర్యవసానాల గురించి అమెరికా మదింపు వేస్తోంది. ఇరాన్‌ అందచేసిన డ్రోన్లు, ఇతర ఆయుధాలతో హమస్‌ కంటే పెద్ద శక్తిగా ఉన్న హిజబుల్లా గనుక పోరుకు దిగితే తీవ్ర పరిస్థితి ఏర్పడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.హమస్‌ దగ్గర పరిమితమైన ఆయుధాలు మాత్రమే ఉన్నాయి, శిక్షణ పొందిన హిజ్‌బుల్లా దగ్గర స్వల్ప శ్రేణి ఖండాంతర క్షిపణులు, డ్రోన్లు, మానవరహిత ప్రయోగ వ్యవస్థలు ఉన్నాయి. వాటిని రంగంలోకి దింపితే పోరు తీరే మారిపోతుంది.ప్రస్తుతం అది యుద్ధాన్ని కోరుకోవటం లేదని, అమెరికా, ఇజ్రాయెల్‌ గనుక వారిని ఆవైపుకు నెడితే రంగంలోకి దిగుతుందని పరిశీలకులు అంటున్నారు. బహుశా దానిలో భాగంగానే లెబనాన్‌ సరిహద్దులో ఉన్న హిజబుల్లా సాయుధులపై ఇజ్రాయెల్‌ దాడులు చేసి కవ్విస్తున్నది.2019లో అమెరికా మిలిటరీ గూఢచారుల సమాచారం మేరకు హిజబుల్లా వద్ద లక్షా 50వేల రాకెట్లు, ఇజ్రాయెలీ సంస్థ ఒకటి గతేడాది చెప్పినదాని ప్రకారం రెండువేల మానవరహిత ఆయుధ ప్రయోగ వాహనాలు ఉన్నాయి. వెయ్యి కిలోమీటర్ల దూరం వరకు వెళ్లే ఆయుబ్‌, షాహేద్‌ వంటి క్షిపణులు కూడా ఉన్నాయి. ఇజ్రాయెల్‌ వద్ద అధునాతన వైమానిక దళం ఉన్నప్పటికీ హిజబుల్లా వంటి సంస్థల వద్ద ఉన్న నిఘా, ఇతర పరికరాలతో గురిచూసి విమానాలను కూల్చివేసే అవకాశం ఉంది. ఐరన్‌ డ్రోమ్‌, ఐరన్‌ బీమ్‌ వంటి రక్షణ వ్యవస్థల గురించి ఇజ్రాయెల్‌ ఎప్పటి నుంచో చెబుతున్నప్పటికీ అవి ఎంతవరకు దాడులను నివారించగలవో ఇంతవరకు రుజువు కాలేదు. గడచిన ఏడు దశాబ్దాలుగా పాలస్తీనా యోధులను అణచేందుకు ఇజ్రాయెల్‌ చేయని ప్రయోగం లేదు. కానీ ఎప్పటికప్పుడు కొత్త శక్తులు, గెరిల్లా పద్దతుల్లో దాడులతో తెగబడుతూనే ఉన్నాయి. ఇప్పుడు హమస్‌ను అణచివేయటం కూడా జరిగేది కాదని చెబుతున్నారు. ఇజ్రాయెల్‌ తాను చేయదలచుకున్న విధ్వంసాన్ని నెల రోజుల్లోపల పూర్తి చేయాలని తరువాత అమెరికా అనుమతించే అవకాశం ఉండదని, భూతల దాడికి దిగితే ఇజ్రాయెల్‌ కూడా భారీ సంఖ్యలో సైనికులను కోల్పోతుందని, దాంతో పౌరుల్లో సహనం కూడా నశిస్తుందని ఒక నిపుణుడు చెప్పాడు.2006లో జరిగిన రెండవ లెబనాన్‌ పోరులో హిజబుల్లా పెద్ద సంఖ్యలో ఇజ్రాయెల్‌ సైనికులను హతమార్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అది సామర్ధ్యాన్ని మరింతగా పెంచుకుంది.ప్రస్తుతం లక్ష మంది యోధులున్నట్లు అంచనా. ఇజ్రాయెల్‌ పరిసరాలన్నీ నివురు గప్పిన నిప్పులా ఉన్నాయి. ప్రపంచ శాంతి శక్తులు కోరుతున్నట్లు యూదు దురహంకారులు వెనక్కు తగ్గుతారా అమెరికా, ఐరోపా ధనిక దేశాల అండచూసుకొని మరింతగా మారణకాండకు పాల్పడతారా అన్నది చెప్పలేము.

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనా కరెన్సీలో చమురు డబ్బు డిమాండ్‌ చేస్తున్న రష్యా – పరువు పోతుందని నరేంద్రమోడీ భావిస్తున్నారా ?

22 Sunday Oct 2023

Posted by raomk in BJP, CHINA, COUNTRIES, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, RUSSIA, USA

≈ Leave a comment

Tags

BJP, China, De Dollarisation, Narendra Modi Failures, Russian oil, U.S. Dollar, yuan

ఎం కోటేశ్వరరావు

గత పదేండ్లలో ఎన్నడూ లేని కొత్త ఇరకాటంలో నరేంద్రమోడీ సర్కార్‌ చిక్కుకుందా ? చైనా కరెన్సీలో రష్యాకు డబ్బు చెల్లించి ముడి చమురు కొనుగోలు అవమానకరంగా భావిస్తోందా ? చైనా మీద కోపంతో అధిక ధరలకు ఇతర దేశాల నుంచి కొని జనం మీద భారం మోపేందుకు సిద్దపడుతుందా ? తాజాగా తలెత్తిన పరిస్థితి నుంచి పుట్టుకువస్తున్న అనుమానాలివి. తమ ముడి చమురుకు చైనా యువాన్లు చెల్లించాలన్న రష్యా డిమాండ్‌ను భారత ప్రభుత్వం తిరస్కరించే అవకాశం ఉందని అధికారులు చెప్పినట్లుగా బ్లూమ్‌బెర్గ్‌ మీడియా పేర్కొన్నది. ఉక్రెయిన్‌ సంక్షోభం ప్రారంభమైన తరువాత పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షల కారణంగా రష్యన్లు తమ వద్ద కొనుగోలు చేసే దేశాలకు రాయితీ ధరలకు చమురును విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో గతం కంటే ఎంతో ఎక్కువగా చైనాపై ఆధారపడ్డారు. ఐరోపా యూరోలు, అమెరికా డాలర్లను మార్చుకొనేందుకు ఆంక్షలు అడ్డువస్తున్నందున తమకు చైనా యువాన్లలో చెల్లించాలని రష్యా మన దేశాన్ని కోరింది. దీనికి మనదేశం అంగీకరించే అవకాశాలు లేవని బ్లూమ్‌బెర్గ్‌ వ్యాఖ్యానించింది. అదే జరిగితే రష్యా నుంచి కొనుగోలు నిలిపివేసి డాలర్లు చెల్లించి అధిక ధరకు ఇతర మార్కెట్లో చమురు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. గతంలో ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ యువాన్లలో చెల్లించినప్పటికీ, ఇప్పుడు హిందూస్తాన్‌ పెట్రోలియం, భారత పెట్రోలియం కార్పొరేషన్‌ చెల్లింపుల అంశానికి వస్తే ప్రభుత్వం విముఖంగా ఉందని రాయిటర్స్‌ వార్తా సంస్థ కొద్ది రోజుల క్రితం పేర్కొన్నది. కొత్తగా కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన అభ్యంతరం ఏమిటో తెలియదు. గతేడాది నవంబరు నాలుగున ఒపెక్‌ దేశాల నుంచి మనం కొనుగోలు చేస్తున్న ముడి చమురు పీపా ధర 93.86 డాలర్లు ఉండగా తరువాత మే మూడవ తేదీకి 70.52 డాలర్లకు తగ్గింది.సెప్టెంబరు 29న 97.03 డాలర్లకు పెరిగి తరువాత కాస్త తగ్గి అక్టోబరు 19న 91.71 డాలర్ల వద్ద ఉంది.

చైనాతో సరిహద్దు వివాదంలో ఎలాంటి పురోగతి లేకపోవటం, అంతర్జాతీయ రాజకీయ పరిణామాల్లో చైనాకు వ్యతిరేకంగా పశ్చిమ దేశాలకు మరింత సన్నిహితం కావటం వంటి కారణాలు ఉండవచ్చు. లేదా రూపాయిని అంతర్జాతీయ మారక కరెన్సీగా మారుస్తామన్న మాటల ప్రచార బండారం సంగతేమిటని జనం అడుగుతారన్న భయం కావచ్చు. 2022-23లో రోజుకు 7.8లక్షల పీపాల రష్యా చమురు దిగుమతి చేసుకోగా 2023-24లో ఇప్పటి వరకు 17.6లక్షలకు పెరిగింది. ఈ మేరకు ఒపెక్‌(చమురు ఎగుమతి దేశాలు) నుంచి దిగుమతులు తగ్గాయి. 2022 ఏప్రిల్‌-సెప్టెంబరు కాలానికి మన మొత్తం అవసరాల్లో 63 శాతం ఒపెక్‌ నుంచి దిగుమతి చేసుకోగా ఈ ఏడాది తొలి ఆరునెలల్లో 40శాతానికి తగ్గింది. ఒపెక్‌ దేశాల నుంచి దిగుమతి చేసుకొనే చమురుతో పోలిస్తే తక్కువ ధర, రూపాయల్లో చెల్లింపుల వెసులుబాటు వంటి సానుకూల కారణాలు ఉన్న కారణంగానే మనదేశం రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్నది. మన రూపాయలతో ప్రపంచ మార్కెట్లో ముడి చమురు దొరకదు. అందుకోసం డాలర్లు ఖర్చు చేయాల్సిందే. వాటి బదులు యువాన్లలో చెల్లిస్తే మనకు పడే అదనపు భారం ఉండదు. మన వినియోగదారులకు మేలు కలుగుతున్నపుడు, ఖజానా మీద భారం పడనపుడు ఏ విదేశీ కరెన్సీలో చెల్లిస్తే ఏమిటి ? వివాదాలకు – వ్యాపారానికి సంబంధం లేదంటూ గత రికార్డులన్నింటినీ బద్దలు కొట్టి చైనా నుంచి దిగుమతులు సజావుగానే మనం చేసుకుంటున్నాం.వాటి దగ్గర లేనిది యువాన్ల దగ్గర పట్టుదల అవసరమా ?అంతర్జాతీయ మార్కెట్లో యువాన్లను కొనుగోలు చేయటం అవమానంగా భావిస్తున్నామా ?

ప్రయివేటు సంస్థలు యువాన్లలో చెల్లింపులు జరపటంపై ఎలాంటి నిషేధం లేదని మన ప్రభుత్వం ప్రకటించింది. అయితే అలాంటి లావాదేవీలను ప్రోత్సహించటం గానీ, వీలు కల్పించటం గాని చేసేది లేదని కూడా పేర్కొన్నది. తాము డాలర్లను స్వీకరించేది లేదని, యువాన్లు లేదా రూబుళ్లను చమురు లావాదేవీల్లో అంగీకరిస్తామని రష్యా కంపెనీ గాజ్‌ ప్రోమ్‌ స్పష్టం చేసింది. ప్రపంచ లావాదేవీలు యువాన్లతో జరపాలన్న ప్రతిపాదనల పట్ల మనదేశం సంతోషంగా లేదని ఆర్థికశాఖ అధికారులు చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. ఏ కరెన్సీతో లావాదేవీలు జరపాలన్న అంశం తేలకపోవటంతో రష్యాకు సెప్టెంబరు నుంచి ఏడు టాంకర్ల చెల్లింపులు నిలిచిపోయాయి.ఇప్పటికే తన దగ్గర భారీ మొత్తంలో రూపాయి నిల్వలు ఉన్నందున చమురు చెల్లింపులకు గాను తనకు యువాన్లలో చెల్లించాల్సిందేనని రష్యా పట్టుబట్టింది. తాను చైనా దిగుమతుల మీద ఆధారపడి నందున యువాన్ల అవసరం ఉందని స్పష్టం చేసింది. ఇప్పటికే ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌, ప్రయివేటు చమురుశుద్ధి సంస్థలు కొంత మేరకు చెల్లింపులు జరిపాయి. యుఏఇ దిర్‌హామ్స్‌లో కూడా రష్యాకు చెల్లించాము. కొన్ని రష్యన్‌ కంపెనీలు దిరహామ్స్‌ను కూడా అంగీకరించటం లేదు. పీపా ముడి చమురును 60 డాలర్లకు మించి రష్యా దగ్గర కొనుగోలు చేస్తే అమెరికా ఆంక్షలను అమలు జరుపుతున్న సంగతి తెలిసిందే. మన రూపాయిని అంతర్జాతీయ కరెన్సీగా మారుస్తామని చెబుతున్న తరుణం, సరిహద్దు వివాదం కారణంగా చైనా కరెన్సీలో చెల్లింపులు చేసేందుకు మోడీ సర్కార్‌ ఇబ్బంది పడుతోంది.బ్రిక్స్‌ దేశాల కూటమిలో ఉమ్మడి కరెన్సీ ప్రతిపాదన రాగా మనదేశం మాత్రమే వ్యతిరేకించింది. ఒకవేళ అంగీకరిస్తే యువాను అవుతుందన్నభయం ఉందని వార్తలు. ప్రస్తుతం రూపాయి అంతర్జాతీయ లావాదేవీల్లో పూర్తిగా మారకం కావటం లేదు. అందువలన తన దగ్గర ఉన్న వందల కోట్ల రూపాయలను ఏం చేసుకోవాలని రష్యా అడుగుతోంది. ఇప్పటి వరకు స్థానిక కరెన్సీలో లావాదేవీలు జరిపిన కారణంగా రష్యాకు యువాన్లు వస్తున్నాయి. రష్యా రాయితీల వలన చైనా 10, భారత్‌ 7 బిలియన్ల డాలర్లను పొదుపు చేసుకున్నాయి.ప్రపంచంలో పరిస్థితులు మారుతున్నాయి, వాటికిి ప్రతికూలంగా నడిచే పరిస్థితి మనకు ఉందా అన్నది సమస్య.

అమెరికా డాలరు పెత్తనానికి రోజులు దగ్గర పడుతున్నాయా ? అనేక వైపుల నుంచి వస్తున్న వార్తలు ఏదో జరగబోతోందనే సూచిస్తున్నాయి. తన బిఆర్‌ఐ పధకం కింద గతంలో ఎక్కువగా డాలర్లు ఇచ్చిన చైనా ఇప్పుడు తన కరెన్సీ యువాన్‌ ఇవ్వటం ప్రారంభించింది. అక్టోబరు మూడవ వారంలో ఈ మేరకు అనేక ఒప్పందాలను కుదుర్చుకుంది. రాయిటర్స్‌ వార్తా సంస్థ కథనం ప్రకారం చైనా అభివృద్ధి బాంకు మలేషియా, ఈజిప్టు, పెరూ కేంద్ర బాంకులతో ఒప్పందాలు చేసుకుంది.చైనా ఎగుమతి-దిగుమతి బాంకు సౌదీ నేషనల్‌ బాంకుతో, బాంక్‌ ఆఫ్‌ చైనా ఈజిప్టుకు 47.9 కోట్ల డాలర్ల విలువగల యువాన్‌ పాండా బాండ్లను జారీ చేసింది. సిల్క్‌ రోడ్‌ నిధులకు గాను 80 బిలియన్ల యువాన్లను అదనంగా చైనా పక్కన పెట్టింది. అంతర్జాతీయ లావాదేవీల్లో డాలర్ల వాటా ఎంతో ఎక్కువగా ఉంది. ఆగస్టు నెలలో 83.95శాతంగా ఉన్నది సెప్టెంబరులో 84.15కు పెరిగింది. యూరో వాటా 6.43 నుంచి 5.43శాతానికి తగ్గగా చైనా యువాన్‌ లావాదేవీలు 4.82 నుంచి 5.8శాతానికి చేరి రెండవ స్థానంలో నిలిచింది. తరువాత స్థానాలలో యూరో, జపాన్‌ ఎన్‌, సౌదీ రియాల్‌ ఉన్నాయి.యువాన్‌ వాటా తక్కువే అయినప్పటికీ క్రమంగా పెరుగుతోంది. ఇరవై భాగస్వామ్య దేశాలతో చైనా ఇప్పటి వరకు పదిహేడింటితో యువాన్‌ మార్పిడి ఒప్పందాలు కుదుర్చుకుంది. అర్జెంటీనాలో ఆరున్నర బిలియన్‌ డాలర్ల విలువగల యువాన్‌ మార్పిడి ఒప్పందం చేసుకుంది.అంతర్జాతీయ వాణిజ్యంలో 15శాతం వాటా ఉన్న చైనా కరెన్సీయే అంత తక్కువగా ఉన్నపుడు కేవలం 1.8శాతం వాణిజ్యం ఉన్న మనదేశ కరెన్సీ వాటా ఎంత ఉంటుందో చెప్పనవసరం లేదు.

బ్లాక్‌ మార్కెట్‌ కారణంగా కరెన్సీ మారకపు విలువలో సంభవిస్తున్న హెచ్చు తగ్గుల వలన తమ దేశానికి పదిబిలియన్‌ డాలర్ల మేర నష్టం జరుగుతున్నదని ఇరాక్‌ కేంద్ర బాంకు పెట్టుబడులు, స్వీకరణల డైరెక్టర్‌ జనరల్‌ మజెన్‌ అహమ్మద్‌ చెప్పాడు.డాలరు దిగుమతుల్లో సగం అక్రమంగా జరుగుతున్నవే అన్నాడు. 2023లో స్వీకరించిన డాలరు డిపాజిట్లను వచ్చే ఏడాది ఉపసంహరిస్తామని,2024 జనవరి ఒకటి తరువాత స్వీకరించబోమన్నాడు. ఆంక్షల కారణంగా గత రెండు దశాబ్దాలుగా ఇబ్బందులు పడుతున్న ఇరాక్‌ బ్రిక్స్‌ కూటమిలో చేరాలని, డాలరుతో నిమిత్తం లేకుండా ఆర్ధిక వ్యవస్థ నిర్వహణ జరపాలని చూస్తున్నది.ఆహ్వానం వస్తే బ్రిక్స్‌లో చేరేందుకు సిద్దంగా ఉన్నామని ఇరాక్‌ ప్రధాని మహమ్మద్‌ షియా అల్‌ సుదానీ ప్రకటించాడు.తమ ఆర్థిక వ్యవస్థను వృద్ధి చేసేందుకు అవసరమైన పెట్టుబడుల ఆకర్షణకు వ్యవస్థాగతమైన సంస్కరణలు చేపడుతున్నట్లు, తద్వారా స్థానిక కరెన్సీకి ఆసరా దొరుకుతుందని మలేసియా ప్రధాని అన్వర్‌ ఇబ్రహీం చెప్పాడు. బ్రిక్స్‌ దేశాల స్ఫూర్తితో తమ కరెన్సీ రింగెట్‌ను స్థిరపరిచేందుకు చూస్తామన్నాడు. ఇండోనేషియా, చైనా, థాయిలాండ్‌తో కుదుర్చుకున్న ఒప్పందాలలో రింగెట్‌ను వినియోగిస్తామన్నాడు. డాలరు మీద పూర్తిగా ఆధారపడటం కష్టమన్నాడు.డాలరు బదులు స్థానిక కరెన్సీ బ్రిక్స్‌ దేశాలు గనుక తమతో జరిపే లావాదేవీలలో ముఖ్యంగా ఇంథనానికి తమకు స్థానిక కరెన్సీలలోనే చెల్లింపులు జరపాలని అమెరికా, ఐరోపా దేశాలను డిమాండ్‌ చేస్తే పరిస్థితి ఏమిటి అన్నది ఒక చర్చ. తమకు డాలర్లలోనే చెల్లింపులు జరపాలనేదేమీ లేదని స్థానిక కరెన్సీలను కూడా అంగీకరిస్తామని సౌదీ అరేబియా ప్రకటించింది. బ్రెజిల్‌, రష్యా, భారత్‌, చైనా, దక్షిణాఫ్రికాలతో కూడిన బ్రిక్స్‌ కూటమి న్యూ డెవలప్‌మెంట్‌ బాంక్‌ (ఎన్‌డిబి) ఏర్పాటు చేసింది. రానున్న మూడు సంవత్సరాల్లో సభ్య దేశాలు డాలరు బదులు ఆయా దేశాల కరెన్సీలలో లావాదేవీలు జరుపుకోవాలన్న లక్ష్యాన్ని ప్రకటించింది. ఇప్పటికే ఆయా దేశాల కరెన్సీలలో ఇతర దేశాలకు రుణాలు ఇవ్వాలని సూచించింది. 2026 నాటికి డాలర్‌ పెత్తనం తగ్గటం ప్రారంభమవుతుందని అంచనా.ప్రస్తుతం బ్రిక్స్‌ కూటమి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 30శాతం వాటా కలిగి ఉంది, దాన్ని మరింతగా విస్తరించాలనే యత్నాల్లో ఉన్నారు. ఈ కూటమిలో చేరాలని 40కి పైగా దేశాలు ఆసక్తి కనపరుస్తున్నాయి. సెప్టెంబరులో జరిగిన కూటమి సమావేశంలో సౌదీ అరేబియా, ఇరాన్‌, ఈజిప్టు, ఇథియోపియా,అర్జెంటీనా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ను చేర్చుకోవాలని నిర్ణయించారు. వచ్చే ఏడాది నుంచి అమల్లోకి వస్తుంది. వీటిలో అర్జెంటీనా మినహా ఐదు దేశాలూ చమురు ఎగుమతి దేశాలే అన్నది తెలిసిందే. ఇప్పటి వరకు ఉన్న పశ్చిమ దేశాల పెత్తనం క్రమంగా తూర్పు దేశాలకు వస్తుందని భావిస్తున్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

బంగ్లాదేశ్‌ – పాలస్తీనా విముక్తి అంశంలో బిజెపి రెండు నాలుకల ధోరణి !

21 Saturday Oct 2023

Posted by raomk in BJP, Communalism, COUNTRIES, Current Affairs, Europe, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Religious Intolarence, UK, USA, WAR

≈ Leave a comment

Tags

2023 Israel–Hamas war, HAMAS attacks 2003, Joe Biden, Narendra Modi Failures, Rishi Sunak


ఎం కోటేశ్వరరావు


ప్రపంచంలో అత్యంత ప్రతిభావంతమైన గూఢచారి సంస్థలలో ఒకటైన మొసాద్‌ తమ ప్రభుత్వానికి హమస్‌ దాడుల గురించి ఎందుకు ఉప్పందించలేకపోయిందన్న ప్రశ్నకు దాడి జరిగిన రెండు వారాలకు కూడా ఇజ్రాయెల్‌ ప్రభుత్వం చెప్పలేకపోతోంది. ఇప్పుడు మేం యుద్ధంలో ఉన్నాం వాటి గురించి దర్యాప్తు జరపటం లేదని అధికారులు సమాధానమిస్తున్నారు.స్వజనం, ఇతర దేశాల నుంచి ఎదురవుతున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక తప్పుదారి పట్టించేందుకు అసలు హమస్‌కు ఆయుధాలు ఎక్కడి నుంచి వచ్చాయన్న అంశంపై అనేక కథలను ప్రచారం చేస్తున్నారు. హమస్‌ సంస్థ అధికారంలో ఉన్న గాజా ప్రాంత విస్తీర్ణం 360 చదరపు కిలోమీటర్లు, హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ ఏరియా ఎంతో తెలుసా ? 7,257చదరపు కిలోమీటర్లు. జన సాంద్రత 1,474. గాజా గడచిన పదిహేడు సంవత్సరాలుగా చుట్టూ ఆరుమీటర్ల ఎత్తున ఇనుపకంచెతో అనుమతి లేకుండా జనం బయటకు పోకుండా చేసిన ఒక బహిరంగ జైలు మాదిరి ఉంది. జనాభా ఇరవై మూడు లక్షలు.చదరపు కిలోమీటరుకు 6,507. అలాంటి జనసమ్మర్ధం ఉన్న ప్రాంతం మీద హమస్‌ తీవ్రవాదులను పట్టుకుంటామనే పేరుతో ఇజ్రాయెల్‌ విమానాలతో బాంబులు వేస్తోంది. సగం ప్రాంతాన్ని ఖాళీ చేసి వేరే వైపు వెళ్లమని జనాన్ని నెట్టేస్తోంది.తరువాత మరోసగాన్ని మరోవైపు పంపి నాశనం చేయాలన్నది దాని పథకం. ఇటు వంటి దుర్మార్గాన్ని గట్టిగా కొనసాగించమని అమెరికా అధిపతి జో బైడెన్‌, భారత అల్లుడు, బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ సలహా ఇచ్చి వెళ్లారు.మన ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా వెళ్లలేదు తప్ప ఇజ్రాయెల్‌కు మద్దతు ప్రకటించటం బైడెన్‌, సునాక్‌ అడుగుల్లో అడుగు వేయటమే !


నిజమే హమస్‌కు ఆయుధాలు ఎక్కడి నుంచి వచ్చాయి.ఈ ప్రశ్నకు సమాధానం కోరుతున్న వారు 1947కు ముందు వివిధ దేశాల నుంచి బ్రిటీష్‌ ఆక్రమణలో ఉన్న పాలస్తీనా ప్రాంతంలోకి యూదులు ఎలా వచ్చారు, వారికి ఆయుధాలు ఎలా అందుబాటులోకి వచ్చాయి, మిలిటరీ శిక్షణ ఎవరు ఇచ్చారు అన్న వాస్తవాలు తెలుసుకుంటే పాలస్తీనాకు చెందిన హమస్‌కు అస్త్రాలు ఎక్కడి నుంచి వచ్చిందీ తెలుసుకోవటం అంత కష్టం కాదు. పాలస్తీనా ప్రాంతాన్ని ఆక్రమించి ఇజ్రాయెల్‌ను ఏర్పాటు చేయాలన్న ముందస్తు పథకంతో ఉన్న బ్రిటన్‌, ఇతర సామ్రాజ్యవాదులు ఎక్కడెక్కడి నుంచో యూదులను రప్పించి ఆయుధాలు, శిక్షణ ఇచ్చారు.ఐరాస తీర్మానం చేసిన నాటి నుంచి వారు పాలస్తీనా ప్రాంతాలను ఆక్రమించుకోవటం ప్రారంభించారు. మాతృభూమి రక్షణ కోసం పోరాడుతున్న వారికి నాటి నుంచి నేటి వరకు మద్దతు ఇస్తున్న ఇరుగుపొరుగు దేశాలు ఆయుధాలు అందిస్తున్నాయి. ఇది అందరికీ తెలిసిన రహస్యం !


పాకిస్తాన్‌ పాలకుల అణచివేతకు వ్యతిరేకంగా స్వాతంత్య్రం కోసం బంగ్లాదేశ్‌ పౌరులు ఉద్యమించారు. ఆయుధాలు చేతబట్టి గెరిల్లా పోరు సాగించారు. వారికి ఆయుధాలు ఎవరు ఇచ్చారు ? తుపాకి పట్టిన ప్రతివారినీ ఉగ్రవాది అనలేం.బంగ్లా ముక్తివాహిని పేరుతో తిరుగుబాటు చేసిన వారికి మన దేశం మద్దతు ప్రకటించటమే కాదు, మన మిలిటరీని కూడా పంపి పాక్‌ సైన్యాన్ని అణచివేసింది. బంగ్లా విముక్తికి ఆయుధాలు పట్టిన వారిని నాడు జనసంఘం సమర్ధించింది. నేడు పాలస్తీనా వాసులు ఆయుధాలు పట్టినందుకు బిజెపి తప్పుపడుతోంది. నిజానికి బంగ్లా విభజనకు ఐరాస తీర్మానాలు లేవు. పాలస్తీనా ఏర్పాటుకు తీర్మానం ఉన్నప్పటికీ అడ్డుకుంటున్న ఇజ్రాయెల్‌కు నరేంద్రమోడీ, బిజెపి మద్దతు ప్రకటించటం రెండు నాలుకల వైఖరికి నిదర్శనం. బంగ్లా విముక్తికి చర్యలు తీసుకున్నందుకు అభినందిస్తూ ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేత గురూజీగా పిలుచుకున్న గోల్వాల్కర్‌ కూడా ఇందిరా గాంధీకి లేఖ రాశారు. మద్దతు పలికినందుకు గాను అతల్‌బిహారీ వాజ్‌పాయికి 2015లో బంగ్లాదేశ్‌ అత్యున్నత ” విముక్తి యుద్ధ గౌరవ ” అవార్డును బంగ్లాదేశ్‌ ప్రకటించింది.తమ దేశ ఏర్పాటుకు అడ్డుపడుతున్న ఇజ్రాయెల్‌ మీద పాలస్తీనియన్లు అనేక రకాలుగా పోరాడుతున్నారు. ఆయుధాలు పట్టిన వారిని ఉగ్రవాదులుగా చిత్రిస్తే నరేంద్రమోడీ దానికి తాన తందాన తాన అంటున్నారు. ఇజ్రాయెల్‌ దుర్మార్గాలను గుర్తించేందుకు నిరాకరించటం తప్ప మరొకటి కాదు. ఉక్రెయిన్‌ అంశంలో తటస్థవైఖరి తీసుకున్న మోడీ ఇప్పుడు ఒక పక్షం వహించటం అంటే అమెరికా కూటమి మెప్పు పొందేందుకు తహతహలాడటమే. రష్యా నుంచి ఆయుధాల అవసరం ఉంది, చౌకగా చమురు దొరుకుతుంది గనుక తటస్థం అన్నారు. పాలస్తీనా నుంచి అలాంటివేమీ ఉండవు గనుక ఒక పక్షానికి మద్దతు పలుకుతున్నారు.


హమస్‌ సాయుధులు ఆయుధాలను ఇరాన్‌ నుంచి తెచ్చుకుంటున్నారని, గాజాలోనే తయారు చేస్తున్నారంటూ సిఐఏ చెప్పిందని మీడియాలో వార్తలు వచ్చాయి. హమస్‌ కోసం ఇరాన్‌ ఆయుధాలను అక్రమంగా సేకరిస్తున్నదని, దానితో పాటు స్వంతంగా తయారు చేసుకోవటం గురించి శిక్షణ ఇస్తున్నట్లు సిఐఏ ఆరోపించింది. వాషింగ్టన్‌ ఇనిస్టిట్యూట్‌ అనే అమెరికా అనుకూల సంస్థ నిపుణుడు మైకేల్‌ నైట్స్‌ తమ దేశం ఇజ్రాయెల్‌కు పంపిన ఆయుధాలను పట్టుకొని లేదా బ్లాక్‌మార్కెట్‌లో కొనుగోలు చేస్తున్నదని చెప్పాడు. స్మగ్లింగ్‌ జరిగే మార్గాలను ఈజిప్టు కట్టుదిట్టం చేసిన తరువాత గాజాలోనే తయారు చేసుకుంటున్నారని అన్నాడు. తప్పేముంది. ఇజ్రాయెల్‌ వైపు నుంచి మిలిటరీ, సాయుధ యూదులు బాంబులు వేస్తుంటే పాలస్తీనియన్లు రసగుల్లాలు విసురుతారా ? ఇదే సంస్థ 2021లో విడుదల చేసిన ఒక నివేదికలో ఇజ్రాయెల్‌ ప్రయోగించిన వాటిలో కొన్ని పేలలేదని, పేలిన వాటి విడిభాగాలను రీసైకిలింగ్‌ చేసి హమస్‌ నిపుణులు స్వంతంగా ఆయుధాలను రూపొందిస్తున్నారని పేర్కొన్నది. హమస్‌ సాయుధుల దాడుల చిత్రాలను చూసిన అమెరికా పార్లమెంటు సభ్యులు కొందరు మాట్లాడుతూ ఉక్రెయిన్‌కు పంపినవి లేదా ఆఫ్ఘనిస్తాన్‌లో వదలి వచ్చినవి గానీ వారి చేతుల్లోకి వచ్చినట్లు చెబుతున్నారు. ఉక్రెయిన్‌కు పంపిన ఆయుధాలను అది బ్లాక్‌మార్కెట్‌లో అమ్ముకుంటున్నదని కూడా చెబుతున్నారని అందువలన ఉక్రెయిన్‌కు సాయం అందించకూడదని కూడా మైకేల్‌ నైట్స్‌ చెప్పాడు. కాదు కాదు ఇలాంటి వార్తలన్నింటినీ రష్యా పుట్టిస్తున్నది కనుక నమ్మవద్దని మరికొందరు తమ ప్రభుత్వాన్ని సమర్ధిస్తున్నారు. వియత్నాం నుంచి పారిపోతూ అమెరికన్లు వదలివేసిన ఆయుధాలు తరువాత ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో కనిపించాయని కొందరు గుర్తు చేశారు. ఉక్రెయిన్‌కు పంపుతున్న ఆయుధాలు ఇతరుల చేతుల్లో పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి 2022 అక్టోబరులో అమెరికా విదేశాంగశాఖ ఒక పత్రంలో పేర్కొన్నది. ఉక్రేనియన్లను పట్టుకున్నపుడు వారి వద్ద దొరికిన అమెరికా ఆయుధాలను రష్యా బ్లాక్‌ మార్కెట్‌కు తరలిస్తుందని కూడా హెచ్చరించింది.


అక్టోబరు ఏడవ తేదీ దాడి తరువాత ఇజ్రాయెల్‌ సేకరించిన నమూనాలను బట్టి హమస్‌ పూర్వపు సోవియట్‌ కాలం నాటి క్షిపణులతో దాడి చేసిందని ఒక కథనం. కాదు స్వంతంగా తయారు చేసిన వాటితోనే జరిపిందని ఇజ్రాయెల్‌ సైనికుడు చెప్పిన వీడియో కూడా బయటకు వచ్చింది. వారు వాడిన ఆయుధాలు చాలా చిన్నవని అమెరికా అందచేసే వాటిని గాజాలోకి చేర్చటం చాలా కష్టమని కొందరు చెప్పారు. ఎక్కడి నుంచి తెచ్చారు, ఎలా తెచ్చారు అన్నది కాదు బుల్లెట్‌ దిగిందా లేదా అన్నదే గీటురాయి ! భుజాల మీద మోస్తూ ప్రయోగించే ఉత్తర కొరియా ఆయుధాలను హమస్‌ వినియోగించిందన్నది మరొక కథ ! దానికి రుజువు ఏమిటట, వాటికి ఎర్ర రిబ్బన్లు కట్టి ఉన్నాయట. ఎవడైనా వాటి గుర్తింపు తెలియకుండా ఎర్ర రిబ్బన్లు తీసివేస్తాడు తప్ప అలంకరించి మరీ వాడతారా ? అసలు ఉత్తర కొరియా ఆయుధాలను సరఫరా చేసిందా లేదా అని కొందరు అడగవచ్చు. ఇజ్రాయెల్‌కు బ్రిటన్‌తో సహా పశ్చిమ దేశాలన్నీ అన్ని రకాల ఆయుధాలను, వందల కోట్ల డాలర్లు అందిస్తున్నాయి. అమెరికా వారు ఎఫ్‌ 16 యుద్ధ విమానాలను అందించవచ్చు, మధ్య ధరా సముద్రానికి తన విమానవాహక యుద్ధ నౌకలను పంపించి ఆ ప్రాంతదేశాల మీద దాడులు చేస్తామని బెదిరించవచ్చు.ప్రపంచానికంతటికీ ఆయుధాలను ఆమ్మవచ్చు. ఉత్తర కొరియా హమస్‌కు ఆయుధాలు నిజంగా అందించిందో లేదో తెలియదు, ఒకవేళ ఇజ్రాయెల్‌ నుంచి ఆత్మరక్షణకు అందిస్తే తప్పే ముంది ? పాలస్తీనియన్లను వారి ఖర్మకు వారిని వదలివేయాలా ? గతంలో ఉత్తర కొరియా మీద అమెరికా దాడి చేసింది, ఇంకా దాడి చేసేందుకు దక్షిణ కొరియాలో వేలాది మంది మిలిటరీతో తిష్టవేసింది. మరోసారి ఉత్తర కొరియా మీద కూడా దాడులకు దిగవచ్చు. అప్పుడు దానికి దిక్కెవరు ? ఇంతకీ ఉత్తర కొరియా ఆయుధాలను హమస్‌ వాడిందా లేదా అని ఏపి వార్తా సంస్థ అడిగితే సమాధానం చెప్పేందుకు ఇజ్రాయెల్‌ మిలిటరీ తిరస్కరించింది. ఇవన్నీ అమెరికా వ్యాపింపచేసే కట్టుకథలని ఉత్తర కొరియా పేర్కొన్నది. వెయ్యి కంటెయినర్లలో రష్యాకు ఆయుధాలు, మందుగుండు ఉత్తర కొరియా నుంచి వెళ్లినట్లు అమెరికా ఆరోపించింది. నిరంతరం ఇతర దేశాల మీద అలాంటి నిందలను ప్రచారం చేస్తూనే ఉంది.హమస్‌ గురించి మనదేశంలో పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారం చేస్తున్నారు, అందువలన వాటిని గుడ్డిగా నమ్మాల్సినపని లేదు.


హమస్‌కు ఆయుధాల సరఫరా గురించి చీకట్లో బాణం వేసినట్లుగా ఇతర దేశాల మీద ఆరోపణలు చేయటం తప్ప ఎవరిదగ్గరా నిర్దిష్ట సమాచారం లేదు.ఇక హమస్‌ ఆయుధ తయారీ గురించి కొన్ని వీడియోలు ప్రచారంలో ఉన్నాయి. అవన్నీ నిజమని నమ్మటానికి లేదు. ఇజ్రాయెల్‌ను తప్పుదారి పట్టించేందుకు లేదా తమపై దాడులు చేస్తూ తమ ప్రాంతాలను ఆక్రమిస్తున్న తమ పాలకులు మీద ఇజ్రాయెలీ పౌరులు వత్తిడి తెచ్చేందుకు కొన్ని వీడియోలను రూపొందించి ప్రచారదాడి చేస్తున్నట్లు కూడా కొందరు చెబుతారు. అలాంటి వాటిలో ఒకదానిలో తాము గాజాలో పది నుంచి 250కిలో మీటర్ల వరకు ప్రయోగించే మోర్టార్లు, వాటికి అవసరమైన షెల్స్‌ తయారు చేసేందుకు ఫ్యాక్టరీలు ఉన్నట్లు, రష్యా అనుమతితో ఎకె రకం తుపాకులు, తూటాలు కూడా తయారు చేస్తున్నట్లు హమస్‌ ప్రతినిధి చెప్పినట్లుగా ఉంది. మరోవైపు ఆయుధాలు తయారు చేసే ఫ్యాక్టరీలు గాజాలో లేవని, దుస్తులు, ఫర్నీచర్‌, ఆహార పదార్ధాలు తయారు చేసే పరిశ్రమలే ఉన్నట్లు సిఐఏ వెలువరించే ఫ్యాక్ట్‌ బుక్‌లో ఉంది. ఇతర దేశాలు తయారు చేసిన ఆయుధాలు హమస్‌ దగ్గర దొరికినంత మాత్రాన ఆయా దేశాలు దానికి సరఫరా చేసినట్లు కాదు. కాశ్మీరులో లష్కరే తోయబా, జైషే మహమ్మద్‌ తదితర ఉగ్రవాదుల దగ్గర అమెరికా తయారీ ఆయుధాలు దొరికాయి. మనకు మిత్ర దేశం అని చెబుతున్న అమెరికా దీనికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. సిరియా వంటి చోట్ల అక్కడి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా అనేక ఉగ్రవాద, కిరాయి మూకలకు అమెరికా స్వయంగా ఆయుధాలు అందచేయటం బహిరంగ రహస్యం. అమెరికాకు ఆయుధాల తయారీ, విక్రయం పెద్ద లాభసాటి వ్యాపారం. డాలర్లు చెల్లిస్తే చాలు ఎవరికైనా అమ్ముతుంది.2018-22 కాలంలో ప్రపంచ ఆయుధ ఎగుమతుల్లో అమెరికా వాటా 40శాతంగా ఉందని స్టాక్‌హౌం ఇంటర్నేషనల్‌ పీస్‌ రిసర్చ్‌ ఇనిస్టిట్యూట్‌(సిప్రి) 2023 మార్చి నెలలో ప్రకటించింది. ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి పారిపోతూ అమెరికన్లు 712 కోట్ల డాలర్ల విలువగల ఆయుధాలు, రక్షణ సామగ్రి వదలి వెళితే అవన్నీ తాలిబాన్ల వశమయ్యాయి.వాటిలో కొన్ని కాశ్మీరులో దొరికాయి. అవి తాలిబాన్ల నుంచి లేదా పాకిస్తాన్‌ నుంచి కూడా సరఫరా చేసి ఉండవచ్చు. ఇతర దేశాల నుంచి సేకరించిన అమెరికా ఆయుధాలనే హమస్‌ ఇటీవల ఇజ్రాయెల్‌ మీద ప్రయోగించినట్లు అమెరికన్‌ పార్లమెంటు సభ్యులు ప్రకటించారు.


ఇతర దేశాల్లో గూఢచర్యం కోసం ఇజ్రాయెల్‌ ప్రభుత్వం మొసాద్‌ అనే సంస్థను ఏర్పాటు చేసింది. మన దేశంలో ” రా ” అమెరికా సిఐఏ వంటిది. దేశీయంగా షిన్‌ బెట్‌ అనే గూఢచార సంస్థ ఉంది. ఇవి రెండూ కూడా హమస్‌ దాడిని పసిగట్టలేకపోయాయి.తాము విఫలం చెందినట్లు షిన్‌ బెట్‌ అధిపతి రొనెన్‌ బార్‌ అంగీకరించాడు. హమస్‌ దగ్గర ఇజ్రాయెల్‌ మిలిటరీ రహస్యాలు, వాటి మాప్‌లు ఉన్నట్లు, పది మంది గాజా సాయుధులకు కచ్చితమైన సమాచారం ఉండబట్టే వారు లోపలికి చొరబడినట్లు న్యూయార్క్‌టైమ్స్‌ పత్రిక రాసింది. డ్రోన్లతో నిఘా, సమాచార టవర్లను కూల్చివేశారని, బుల్డోజర్లు, ట్రాక్టర్లతో సరిహద్దులో ఉన్న పెద్ద కంచెను కూల్చివేసి ముందు రోజు రెండువందల మంది మరుసటి రోజు 1,800 మంది హమస్‌ సాయుధులు ఇజ్రాయెల్‌లో ప్రవేశించినట్లు అధికారులను ఉటంకిస్తూ పేర్కొన్నది.ఇంత జరుగుతున్నా ఎందుకు పసిగట్టలేకపోయారన్నదే ప్రశ్న. గాజా ప్రాంతలోని హమస్‌ను బాగా బలహీన పరిచినందున అక్కడి నుంచి దాడి జరిగే అవకాశం లేదని, లెబనాన్‌లోని హిజబుల్లా నుంచే ముప్పు ఉందనే అంచనాకు ఇజ్రాయెల్‌ గూఢచార సంస్థలు భావించిన కారణంగా అవి దృష్టి పెట్టలేదని, హమస్‌ శక్తి సామర్ధ్యాలను తక్కువ అంచనా వేసిందని కొందరి విశ్లేషణ. ఇజ్రాయెల్‌లో ఉన్న అంతర్గత కుమ్ములాటల కారణంగా తెలిసి కూడా మౌనంగా ఉన్నారన్నది మరొక కథనం.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!
  • గుజరాత్‌ రైతుల మీదే మోడీకి శ్రద్ద లేదు, ఇక దేశం గురించి పట్టించుకుంటారా ! భారత్‌పై వేలాడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కత్తి !!
  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!
  • గుజరాత్‌ రైతుల మీదే మోడీకి శ్రద్ద లేదు, ఇక దేశం గురించి పట్టించుకుంటారా ! భారత్‌పై వేలాడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కత్తి !!
  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!
  • గుజరాత్‌ రైతుల మీదే మోడీకి శ్రద్ద లేదు, ఇక దేశం గురించి పట్టించుకుంటారా ! భారత్‌పై వేలాడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కత్తి !!
  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d