• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Readers News Service

బిసి రిజర్వేషన్ల అమలు తీరుతెన్నులు : కాంగ్రెస్‌ బాటలో బిజెపి ! మండల్‌ కంటే రోహిణీ కమిషన్‌ మరింత జాప్యం !!

14 Thursday Aug 2025

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, History, INDIA, Loksabha Elections, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

BJP, Justice Rohini panel, Mandal commission, Narendra Modi Failures, OBC sub-categorisation, Rohini Commission, RSS


ఎం కోటేశ్వరరావు


తెలంగాణా ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలలో వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లను 42శాతానికి చట్టబద్దంగా పెంచకుండానే ఎన్నికలు జరుపుతుందా ? పెంచేందుకు రాష్ట్రపతికి పంపిన బిల్లుకు ఆమోదం లేదా తిరస్కారం చేస్తున్నట్లు చెప్పలేదు. ఆర్డినెన్స్‌ ద్వారా అమలు చేద్దామని చూస్తే గవర్నర్‌ దాన్ని కేంద్రానికి సలహా కోసం పంపటంతో దాని పరిస్థితీ అంతే. దీని వెనుక బిజెపి రాజకీయం పక్కాగా కనిపిస్తున్నది. ముస్లింలకు రిజర్వేషన్లు ఉన్నందున అంగీకరించే సమస్యే లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ చెబుతారు. రాజ్యాంగబద్ధంగా అలాంటి అవకాశం ఉంటే కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్రపతి కూడా తిరస్కరించవచ్చు. రాష్ట్రాన్ని వివరణ అడగవచ్చు. అదేమీ చేయకుండా తొక్కి పెట్టారు. తెలంగాణా స్థానిక సంస్థల అంశాన్ని పక్కన పెడితే అసలు నరేంద్రమోడీ, బిజెపికి బిసి రిజర్వేషన్ల మీద ఉన్న చిత్తశుద్ధి ఎంత అన్నది ప్రశ్న. పద్నాలుగుసార్లు గడువు పొడిగించిన తరువాత 2023 జూలై 31న ఒబిసి రిజర్వేషన్ల వర్గీకరణ అంశంపై జస్టిస్‌ రోహిణీ కమిషన్‌ నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అందచేశారు. రెండు సంవత్సరాలు దాటింది. అసలు ఆ నివేదిక వెలుగు చూస్తుందా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. 2017 అక్టోబరు రెండవ తేదీన ఢల్లీి హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జి రోహిణీ ఆధ్వర్యంలో కమిషన్‌ ఏర్పడిరది.


రామనాధ్‌ కోవింద్‌ హయాంలో ఏర్పాటు చేసిన ఈ కమిషన్‌ కేవలం మూడు మాసాల్లో నివేదిక ఇవ్వాలని నిర్దేశించగా ఆరేండ్లు పట్టించారు. ఈ నివేదిక ఇంకా తమకు ఇంకా అందలేదని కేంద్ర ప్రభుత్వ సామాజిక న్యాయశాఖ 2025 మార్చి 26న లోక్‌సభకు తెలియచేసింది. ఈ ఏడాది ఆగస్టు ఐదవ తేదీన అడిగిన ప్రశ్నకు అదే సమాధానాన్ని పార్లమెంటుకు తెలిపింది. అనేక రాష్ట్రాలలో బిసి కుల సర్వేలు జరిగిన పూర్వరంగంలో నివేదికలోని అంశాలతో దేశ సామాజిక, రాజకీయ రంగాలపై భూకంప ప్రభావం పడుతుందని భావిస్తున్నారు. పార్లమెంటు ఉభయ సభలకు సమర్పించకుండా నివేదికను వెల్లడిరచటానికి కుదరదని 2024 మే మొదటి వారంలో అలహాబాద్‌ హైకోర్టు ప్రజాప్రయోజనవాజ్యం మీద తీర్పునిచ్చింది. అందువలన కోర్టుల ద్వారా కూడా అది వెలుగు చూసే అవకాశం లేదన్నది తేలిపోయింది. దీనికి ముందు జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్‌ 2015లోనే అత్యంత వెనుకబడిన, బాగా వెనుకబడిన, వెనుకబడిన తరగతులుగా మూడుగా విభజించి రిజర్వేషన్లు అమలు జరపాలని చేసిన సిఫార్సును మోడీ సర్కార్‌ పట్టించుకోలేదు. జాప్యం చేసే ఎత్తుగడతో రెండు సంవత్సరాల తరువాత రోహిణీ కమిషన్‌ ఏర్పాటు చేశారు. మండల్‌ కమిషన్‌ 1979లో ఏర్పాటు కాగా 1980లో నివేదిక ఇచ్చింది. పదేండ్లకు అది అమల్లోకి వచ్చింది. రోహిణీ కమిషన్‌ 2017లో ప్రారంభం కాగా 2023లో నివేదిక సమర్పించింది.2019లోనే ముసాయిదా నివేదిక సిద్దంగా ఉన్నట్లు కమిషన్‌ కేంద్ర ప్రభుత్వానికి రాసినా గడువు పొడిగించటం గమనించాలి.2015 నుంచి తీరుతెన్నులను చూస్తే ఇప్పటికే పదేండ్లు దాటింది, ఓబిసి వర్గీకరణ మొత్తంగా 15 సంవత్సరాల తరువాతైనా జరుగుతుందా అన్నది అనుమానమే.


వెయ్యి పేజీలకు పైగా ఉన్న రోహిణీ కమిషన్‌ నివేదిక రెండు భాగాలుగా ఉంది. మొదటి భాగంలో వర్గీకరణ ఎలా జరపాలి అని పేర్కొనగా, రెండవ భాగంలో దేశమంతటా గుర్తించిన 2,633 కులాల జాబితా ఉన్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. 2015 నుంచి 2018 వరకు కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థలలో లక్ష ప్రవేశాలు, లక్షా 30వేల ఉద్యోగాలను ఎలా ఇచ్చారన్నది కమిషన్‌ పరిశీలించినట్లు చెబుతున్నారు. నాలుగో వంతు వాటాను కేవలం పది ఓబిసి కులాల వారే దక్కించుకున్నారని, మరో నాలుగోవంతును 38 కులాల వారు, మరో నాలుగోవంతు 102కులాలు దక్కించుకున్నాయని, మరో 22.3శాతం 506 కులాలు పొందినట్లు, 994 కులాలకు కేవలం 2.68శాతం దక్కగా 983 కులాలకు అసలు ఎలాంటి లబ్ది దక్కలేదని తేలినట్లు వెల్లడైంది. విద్యా, ఉద్యోగ రంగాల వనరుల పంపిణీలో రిజర్వేషన్లు ఉన్నప్పటికీ కొందరు మాత్రమే ఏ విధంగా వాటిని దక్కించుకుంటున్నారో ఈ వివరాలు వెల్లడిస్తున్నాయి. దళితుల వర్గీకరణతో కొంత మేరకు పరిష్కారం కుదిరినా ఇంకా అమల్లోకి రాలేదు. బిసి, గిరిజనుల్లో ఇంకా అలాంటి అంతరాలు ఎక్కువగా ఉన్నాయి. రోహిణీ కమిషన్‌ బిసిలను నాలుగు తరగతులుగా వర్గీకరించాలని సిఫార్సు చేసినట్లు వార్తలు వచ్చాయి.


దేశవ్యాపితంగా బిసి జనాభా సంఖ్య అంచనాకు సర్వేచేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించాలని రోహిణీ కమిషన్‌ కేంద్రానికి రాసినా పట్టించుకోలేదు.2018లో నాటి హోమ్‌ మంత్రి రాజనాధ్‌ సింగ్‌ 2021 జనగణనలో ఓబిసి వివరాలు ఉంటాయని చెప్పారు తప్ప కులగణన చేస్తామని నిర్దిష్టంగా ప్రకటించలేదు. వెనుకబడిన తరగతుల కులగణన జరగాలన్న డిమాండ్‌కు ఇటీవలి సంవత్సరాలలో మద్దతు పెరుగుతున్నది. రాష్ట్రాలకు గణన చేసే అధికారం లేదు గనుక సర్వేల పేరుతో వారెంత మంది ఉన్నారో సుమారుగా లెక్కించేందుకు కొన్ని రాష్ట్రాలు చర్యలు తీసుకున్నాయి. వాయిదాపడిన 2021జనగణనలో కులగణన చేయాలన్న డిమాండ్‌ను బిజెపి, కేంద్ర ప్రభుత్వం మొండిగా తిరస్కరించాయి. రాష్ట్రాల మీద నెట్టాలని చూశాయి. మెజారిటీ రాష్ట్రాలలో తామే ఉన్నామని చెప్పుకొనే బిజెపి తమ పాలిత రాష్ట్రం ఒక్కదానిలో అయినా సర్వే చేసిందా అంటే లేదు. హిందువుల్లో చీలిక వస్తుందని మతాన్ని ముందుకు తెచ్చింది. లోక్‌సభ ఎన్నికలో ఇండియా కూటమి కులగణన అంశాన్ని, రిజర్వేషన్లపై 50శాత పరిమితి ఎత్తివేయాలన్న నినాదాన్ని ముందుకు తెచ్చింది. జనాల నుంచి వస్తున్న వత్తిడి, బీహార్‌ ఎన్నికల కారణంతో 2027లో చేపట్టే జనగణనలో కులగణన చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించాల్సి వచ్చింది. అప్పటి నుంచి బిజెపి నేతలు కొత్త పల్లవి అందుకున్నారు. ఎలాగూ జనగణనలో కులాల వివరాలు వస్తాయి గనుక ఆ తరువాతే చర్యలు తీసుకోవచ్చు కదా అని చెబుతున్నారు. 2011 ఫిబ్రవరిలో గణన జరిగితే 2013 ఏప్రిల్‌లో అంతిమంగా దాన్ని ఖరారు చేశారు. ఇప్పుడు డిజిటల్‌ అంటున్నారు గనుక ఆ లెక్కన చూసినా 2028 వరకు ప్రతిపాదిత జనాభా గణన ఖరాయ్యే అవకాశం లేదు. అప్పటి వరకు రోహిణీ కమిషన్‌ నివేదిక వెలువడదా లేక వత్తిడికి తట్టుకోలేక వెల్లడిరచినా దాని మేరకు చర్యలు తీసుకొనే అవకాశం లేదా అన్నది ప్రశ్న.ఈ లోగా 2029 పార్లమెంటు ఎన్నికలు వస్తాయి. ఇప్పుడు తొమ్మిది దశాబ్దాల నాటి (1931) కులగణన ఆధారంగా బిసిలు ఇంత మంది ఉండవచ్చని అంచనాగా చెబుతున్నారు. తరువాత జరిగిన సామాజిక మార్పులలో అనేక తరగతుల్లో జనాభావృద్ధిలో వచ్చిన హెచ్చు తగ్గులను పరిగణనలోకి తీసుకొనేందుకు సమాచారం లేదు.


2027 జనాభా లెక్కల్లో ఎవరెంత శాతం అన్నది తేలుతుంది తప్ప కులాల సంఖ్య, వాటిలో ఉన్న జనాభా స్థితిగతులు మారే అవకాశమే లేదు. అందువలన సదరు నివేదికను విడుదల చేసి పార్లమెంటు, అసెంబ్లీలు, ప్రజావేదికల మీద చర్చ చేస్తే తదుపరి తీసుకోవాల్సిన చర్యల గురించి ఎవరేమనుకుంటున్నదీ వెల్లడి అవుతుంది. స్వాతంత్య్రం వచ్చిన తరువాత 1953లో నాటి నెహ్రూ ప్రభుత్వం తొలిసారిగా కాకా కలేల్‌కర్‌ (దత్తాత్రేయ బాలకృష్ణ కలేల్‌కర్‌) వెనుకబడిన తరగతుల కమిషన్‌ ఏర్పాటు చేసింది. అది 2,399 కులాలను ఓబిసిలుగా గుర్తించింది, 70శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని, 1961లో కులగణన చేయాలని సిఫార్సు చేసింది. ఆ నివేదికను గోడవున్లో భద్ర పరిచారు. తరువాత జనతా పార్టీ హయాంలో బిపి మండల్‌ ఆధ్వర్యాన 1979లో రెండవ కమిషన్‌ ఏర్పాటు చేశారు. 1980లో ఆ నివేదిక వచ్చే సరికి ఇందిరా గాంధీ తిరిగి అధికారానికి వచ్చారు. దాన్ని కూడా గోడవున్‌కు పంపారు. నేషనల్‌ ఫ్రంట్‌ నాయకత్వాన ఏర్పాడిన ప్రభుత్వం 1990 ఆగస్టులో నాటి ప్రధాని విపి సింగ్‌ ఆ నివేదికను వెలికి తీయించి అమల్లో భాగంగా 27 శాతం రిజర్వేషన్లను ప్రకటించారు. బిల్లు ఆమోదం పొందినప్పటికీ అది కోర్టు వివాదాలకు దారితీసింది. న్యాయవాది ఇంద్రా సహానే ప్రభుత్వ ఉత్తరువులను సవాలు చేశారు. దాని మీద విచారణ జరిపిన సుప్రీం కోర్టు 1992 నవంబరు 16న ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు చెప్పింది. తొమ్మిది మంది సభ్యులున్న ధర్మాసనంలో ఆరుగురు అనుకూలంగా, ముగ్గురు వ్యతిరేకంగా మెజారిటీ తీర్పు వచ్చింది. సరిగ్గా ఈ సమయంలోనే దేశంలో నూతన ఆర్థిక విధానాల పేరుతో నయా ఉదారవాద విధానాలకు తెరలేచింది.ఈ నేపధ్యంలోనే ఉద్యోగాల రిజర్వేషన్లు 50శాతానికి మించకూడదని అవి కూడా ప్రభుత్వరంగంలో మాత్రమేనని, ప్రయివేటు రంగానికి వర్తించవని పేర్కొన్నది. ఆ తీర్పు ఇప్పటికీ అమల్లో ఉంది. తరువాత 2007లో రిజర్వేషన్లను విద్యా సంస్థలకూ వర్తింప చేశారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు 2019లో నరేంద్రమోడీ సర్కార్‌ ఆర్థికంగా వెనుకబడిన తరగతుల వారికి పదిశాతం రిజర్వేషన్లు కల్పిస్తూ 103వ రాజ్యాంగ సవరణ చేసింది. దాన్ని కోర్టులో సవాలు చేయగా 2022 నవంబరు ఏడున 3:2 మెజారిటీతో సుప్రీం కోర్టు ఆమోదం తెలిపింది.


రిజర్వేషన్లు ఉన్నప్పటికీ ఉన్నత పోస్టులలో తగిన సామాజిక న్యాయం జరుగుతున్నదా, ఆ మేరకు ఆయా తరగతుల వారు లబ్ది పొందుతున్నారా అన్నది ప్రశ్నార్ధకంగా మారిన పూర్వరంగంలో 2017లో రోహిణీ కమిషన్ను ఏర్పాటు చేశారు. గత కాంగ్రెస్‌ ప్రభుత్వాల మాదిరిగానే మోడీ సర్కార్‌ ఇప్పటి వ్యవహరించింది తప్ప భిన్నంగా లేదు. పద్నాలుగుసార్లు నివేదిక పొడిగింపుతో వ్యవధి పెంచటం, నివేదిక సమర్పించి రెండు సంవత్సరాలు గడుస్తున్నా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవటం దాన్నే సూచిస్తున్నది. అది అమల్లోకి వస్తే తాను ఎంతో కాలంగా సాగిస్తున్న సోషల్‌ ఇంజనీరింగ్‌ పేకమేడలా కూలిపోతుందని బిజెపికి తెలుసు కనుక జాగు చేస్తున్నది. ఆర్థికంగా వెనుకబడిన వారి (ఇడబ్ల్యుఎస్‌) రిజర్వేషన్లను ఎన్నికల కోసం ఎంతో వేగంగా తీసుకువచ్చిన పెద్దలు ఓబిసి వర్గీకరణ విషయంలో ఎందుకు జాగుచేస్తున్నట్లు ? బిసి కులగణన చేస్తే హిందూ సమాజంలో చీలికలు వస్తాయని గతంలో చెప్పిన మాటలను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలి. మొత్తంగా చూసినపుడు ఓబిసి, షెడ్యూలు కులాలు, తరగతులు దేశంలో అణచివేత, దోపిడీకి గురవుతున్న సామాజిక తరగతులే. అయితే ఇతర కులాల్లో పేదలు ఉన్నట్లే ఈ సామాజిక తరగతుల్లో కూడా ధనికులు, ముందున్న తరగతులు లేకపోలేదు. అందుకే రిజర్వేషన్ల ఫలాలను కొందరే ఎక్కువగా అనుభవిస్తున్నారు. రోహిణీ కమిషన్‌ నివేదిక దాన్నే నిర్ధారించినట్లు తెలుస్తున్నది. కమిషన్‌ అడిగిన కీలక సమాచారాన్ని ప్రభుత్వ శాఖలు ఇవ్వలేదనే ఒక విమర్శ మీడియాలో వచ్చింది.ఐఐటి, ఐఐఎం, ఐఐఎస్‌ వంటి అగ్రశ్రేణి విద్యా సంస్థలలో ఓబిసి రిజర్వేషన్లు సక్రమంగా అమలు జరగటం లేదనే విమర్శలు ఉన్నాయి.అదే గనుక నిజమైతే ఆ నివేదిక వెల్లడైన తరువాత దాన్ని వివాదాస్పదంగా మార్చే అవకాశం లేకపోలేదు. కోర్టుల్లో సవాలు చేయటం సరేసరి.


బిజెపిని వ్యతిరేకించే పార్టీలు సామాజిక న్యాయ నినాదాన్ని తీసుకున్నాయి. దాన్ని ఎదుర్కొనేందుకు నరేంద్రమోడీ తన మంత్రివర్గంలో, వివిధ రాష్ట్రాల బిజెపి మంత్రివర్గాల్లో ఓబిసిలకు గణనీయ ప్రాతినిధ్యం కల్పించి దాన్ని ఒక ఆయుధంగా వాడుతున్నారు. ఇది మిశ్రమ ఫలితాలను ఇచ్చినట్లు చెప్పవచ్చు. వెనుకబడిన తరగతుల్లో వర్గీకరణ ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో అమలు జరుగుతున్నది. రోహిణీ కమిషన్‌ నివేదికలో లోపాల గురించి చెప్పాల్సి వస్తే 2018 తరువాత జరిగిన నియామకాలకు సంబంధించి ఎలాంటి పరిశీలన కమిషన్‌ చేయలేదు. వెల్లడి తరువాత కొన్ని సవాళ్లు కూడా ఎదురుకానున్నాయి.ఉత్తర ప్రదేశ్‌లో చేనేత, దూదేకటం వంటి కొన్ని వృత్తులు చేసే ముస్లింలు, బీహార్‌లో దర్జీలు ఓబిసి జాబితాలో ఉండగా హిందువులు లేరని రోహిణీ కమిషన్‌ గుర్తించినట్లు నిర్దారణగాని వార్త. వివిధ రాష్ట్రాలలో ఇలాంటి సమస్యలు, బిజెపి మత అజెండాకు దీనికి ఘర్షణ తలెత్తవచ్చు. అందుకే వెల్లడిరచటానికి జాగు చేస్తున్నట్లా ? నాడు అధికారంలో లేదు గనుక మండల్‌కు వ్యతిరేకంగా కమండలాన్ని ముందుకు తెచ్చిందని విమర్శలు ఎదుర్కొన్న బిజెపి ఇప్పుడు తానే అధికారంలో ఉందిగనుక ఏం చేస్తుందో చూద్దాం !

Share this:

  • Tweet
  • More
Like Loading...

ప్రపంచమా గాజాను మరచిపోవద్దు : ఇజ్రాయెల్‌ దాడిలో ప్రాణాలు వదలిన ఓ జర్నలిస్టు ఆఖరి కోరిక !!

13 Wednesday Aug 2025

Posted by raomk in Current Affairs, History, imperialism, International, INTERNATIONAL NEWS, Opinion, USA, WAR

≈ Leave a comment

Tags

Donald trump, Don’t forget Gaza, Gaza Deaths, Israel genocide, Netanyahu, Palestine Journalist Anas al-Sharif, Palestinian People


ఎం కోటేశ్వరరావు


2023 అక్టోబరు ఏడున గాజాలో ఇజ్రాయెల్‌ ప్రారంభించిన మారణకాండ మరోదశలో ప్రవేశించే సూచనలు కనిపిస్తున్నాయి. హమస్‌ను అంతమొందించేందుకు గాజా స్వాధీనం తప్పదని ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు ప్రకటించాడు. ఇప్పటి వరకు 75వేల మంది వరకు నిరాయుధులైన పాలస్తీనియన్లను ఇజ్రాయెల్‌ మిలిటరీ చంపివేసింది. వీరిలో సగానికి పైగా పిల్లలు, మహిళలు ఉన్నారు. దాదాపు రెండు లక్షల మందిని గాయపరిచారు, లక్షలాది ఇండ్లు, ఆసుపత్రులు, విద్యాసంస్థలను నేలమట్టం గావించారు. అయినప్పటికీ హమస్‌, ఇతర సాయుధ బృందాలను పట్టుకోవటంలో విఫలమైంది. వారిని పట్టుకోవాలంటే గాజాను పూర్తిగా తన స్వాధీనంలో తెచ్చుకోవాలని ఇజ్రాయెల్‌ చెబుతోంది. నిజానికి ఒక విధంగా గాజా ప్రస్తుతం ఇజ్రాయెల్‌ ఆక్రమణలోనే ఉంది. ఆకలితో మాడుతున్న పసిపిల్లలకు అవసరమైన ఆహారసాయాన్ని కూడా రాకుండా మిలిటరీ అడ్డుకుంటున్నది, సహాయ శిబిరాల వద్దకు వచ్చిన వారిని కూడా చంపివేస్తున్నది. ప్రపంచంలో అనేక యుద్ధాలు, ఉద్రిక్తతల సమయంలో వార్తలను సేకరించే జర్నలిస్టులకు రక్షణ ఉంటుంది, ప్రమాదవశాత్తూ గాయపడటం, మరణించటం వేరు. కానీ గాజాలో ఇప్పటి వరకు 242 మంది జర్నలిస్టులను ఇజ్రాయెల్‌ బలగాలు చంపివేశాయి. తాజాగా అల్‌ జజీరా టీవీ, పత్రికలకు వార్తలు సేకరిస్తున్న జర్నలిస్టులను హతమార్చారు, ఏమిటంటే వారంతా హమస్‌ సాయుధులతో కలసి ఉన్నారంటూ పచ్చి అబద్దాలను ప్రచారం చేస్తున్నారు. అనాస్‌ అల్‌ షరీఫ్‌ అనే ఆల్‌ జజీరా విలేకరి తన కుటుంబం, ప్రపంచానికి ఎక్స్‌ ద్వారా ఒక చివరి సందేశం పంపాడు.‘‘ ఇది చివరి వర్తమానం, మీకు అందే సమయానికి ఇజ్రాయెల్‌ నన్ను చంపివేస్తుంది, నా గళాన్ని అణచివేస్తుంది, ప్రపంచం గాజాను మరచిపోవద్దు ’’ అని దానిలో ఉంది. ఆదివారం రాత్రి అది నిజమైంది. గాజాలోని ఆల్‌ షిఫా ఆసుపత్రి సమీపంలో జర్నలిస్టులు ఉన్నారనే చిహ్నాలు ఉన్న గుడారాన్ని లక్ష్యంగా చేసుకొని జరిపిన వైమానిక దాడిలో అల్‌ షరీఫ్‌తో పాటు తమ జర్నలిస్టులు మరో నలుగురితో సహా ఏడుగురిని చంపినట్లు అల్‌ జజీరా తెలిపింది.


ఓ జర్నలిస్టు చివరి సందేశం
అనాస్‌ అల్‌ షరీఫ్‌ చివరి సారిగా ఎక్స్‌లో పంపిన వర్తమానం ఇలా ఉంది.‘‘ ఇది నా వాంఛ మరియు చివరి వర్తమానం. ఇది మీకు చేరేలోపు ఇజ్రాయెల్‌ నన్ను చంపటంలో జయప్రదం అవుతుంది, నా గళం మూగపోయేట్లు చేస్తుంది. మొదటిది మీకు శాంతి చేకూరాలి, అల్లా దయ మరియు దీవెనలు మీకు కలగాలి. జబాలియా శరణార్ధి శిబిరంలో నేను జన్మించి కళ్లు తెరిచినప్పటి నుంచి అక్కడి వీధులు, సందుల్లో తిరుగాడుతూ నా జనం కోసం గళం విప్పి మద్దతు ఇచ్చిన ప్రతి అంశం గురించి అల్లాకు తెలుసు. మా స్వంత పట్టణమైన ఆక్రమిత అస్కలాన్‌( అల్‌ మజదాల్‌)కు తిరిగి వచ్చేందుకు అల్లా నా జీవితాన్ని పొడిగిస్తాడని ఆశిస్తున్నాను, అందువలన నేను నాకుటుంబం, ప్రేమించేవారిని కలుసుకొనేందుకు తిరిగివస్తాను. అయితే అల్లా వాంఛ ముందు మరియు ఆయన ఆదేశమే అంతిమం.
నేను బాధల మధ్యనే జీవించాను, అనేక నష్టాలు, ఇబ్బందులను చవిచూశాను. అయినప్పటికీ ఎలాంటి వక్రీకరణలు, తప్పుడు సమాచారం లేకుండా ఉన్నది ఉన్నట్లుగా నిజాన్ని చేరవేసేందుకు ఒక్కసారి కూడా నేను వెనుకాడలేదు.ఏడాదిన్నరకు పైగా మన జనాలు ఎదుర్కొంటున్న ఊచకోతను ఆపేందుకు ఏమీ చేయని వారిని, మన పిల్లలు, మహిళల శరీరాలు ఛిద్రమైనా చలించని హృదయాలు కలవారిని, మౌనంగా దూరంగా ఉన్నవారిని, మన హత్యలను ఆమోదించిన వారిని, మన శ్వాసను ఆడనివ్వని వారిని అందరినీ అల్లా చూస్తున్నాడు.
ముస్లిం సమాజ కిరీటంలో మణి, ఈ ప్రపంచంలోని ప్రతి స్వేచ్చా జీవి గుండె చప్పుడు వంటి పాలస్తీనాను మీకు అప్పగిస్తున్నాను. దాని జనాన్ని, తప్పు చేసిన వారినీ, రక్షణ, శాంతిలేకుండా జీవించేందుకు లేదా కలలు కనేందుకు కూడా ఎన్నడూ సమయంలేని అమాయకులైన పిల్లలతో పాటు మీకు అప్పగిస్తున్నాను. వేలాది టన్నుల ఇజ్రాయెలీ బాంబులు, క్షిపణులతో నిర్మలమైన వారి శరీరాలు నలిగిపోయాయి, ఛిద్రమైన వారి భాగాలు అంతటా పడ్డాయి. బంధనాలు మిమ్మల్ని మౌనంగా ఉంచలేవు, సరిహద్దులు ఏమీ చేయలేవు. అపహరించిన మన మాతృభూమిలో స్వేచ్చ, హుందాతనపు సూర్యుడు ఉదయించే వరకు మన భూమి, పౌరుల విముక్తి కోసం మీరు వారధులుగా మారండి.
నా కుటుంబ మంచిచెడ్డలను మీకు అప్పగిస్తున్నాను. నేను కలలు కన్నవిధంగా నా కుమార్తె షామ్‌ ఎదగటాన్ని చూసే అవకాశం నాకు రాలేదు. నాకళ్ల వెలుగైన ఆమెను మీకు అప్పగిస్తున్నాను. నా భారం మోసేంతవరకు మరియు నా లక్ష్యాన్ని సాధించేవరకు అతని పెరుగుదలకు నా ప్రియమైన కుమారుడు సాలాప్‌ాను కూడా మీకు అప్పగిస్తున్నాను. నేను ప్రేమించే నా మాతృామూర్తిని కూడా మీకు అప్పగిస్తున్నాను.నేను ఇలా ఉండటానికి ఆమె చేసిన ప్రార్ధనలే కారణం. అవేనాకు పెట్టని కోట, ఆమె ఇచ్చిన వెలుగు బాట నాది. ఆమెకు శక్తిని ప్రసాదించాలని, శుభం కలగాలని నా తరఫున అల్లాను ప్రార్ధిస్తున్నాను.
నా జీవితకాల సహచరి, భార్య ఉమ్‌ సాలాప్‌ా(బయాన్‌) బాధ్యతను కూడా మీకు అప్పగిస్తున్నాను. యుద్ధం మమ్మల్ని రోజులు, నెలల తరబడి విడదీసింది. వంగని ఆలివ్‌ చెట్టు కొమ్మలా ధీటుగా ఆమె నిలిచింది, బంధానికి కట్టుబడి ఉంది, సహనంతో ఆల్లా మీద విశ్వాసంతో ఉంది. నా పరోక్షంలో ఆమె బాధ్యతలను నిర్వహించేందుకు ఆమె తన యావత్‌ శక్తి, విశ్వాసాన్ని వినియోగిస్తున్నది. వారందరికీ మీరు అండగా నిలవాలని కోరుతున్నాను, అల్లా తరువాత మీరే వారికి మద్దతు ఇవ్వాలి.
నేను గనుక మరణిస్తే, నా సిద్దాంతాలకు గట్టిగా నిలిచి నేను మరణించేందుకు సిద్దం. నేను అల్లా ఆదేశాలకు అనుగుణంగా నడుస్తానని ప్రమాణం చేశాను, నేను ఆయన్ను తప్పకుండా కలుసుకుంటాను. ఆయనతో ఎప్పటికీ నిలిచి ఉంటానని హామీ ఇస్తున్నాను. ఓ అల్లా అమరజీవుల్లో నన్ను ఒకరిగా స్వీకరించు, నా గత, భవిష్యత్‌ పాపాలను క్షమించు. నాజనం, నా కుటుంబం స్వేచ్చా బాటలో నడిచేందుకు అవసరమైన వెలుగునిచ్చేందుకు నా రక్తం తోడ్పడేట్లు చేయి. ఆకాంక్షలకు అనుగుణంగా నేను లేనట్లయితే నన్ను క్షమించు.
నా వాగ్దానాన్ని నిలుపుకొనేందుకు దాన్ని ఎన్నడూ మార్చుకోకుండా, ద్రోహం చేయకుండా ఉండేందుకు దయతో నాకోసం ప్రార్ధించండి. గాజాను మరచిపోవద్దు. క్షమ మరియు మీలో ఒకడిగా అంగీకరించేందుకు మీరు చిత్తశుద్దితో చేసే ప్రార్ధనల్లో నన్ను మరవకండి.’’


హృదయాలను కదలించే చివరి సందేశం పంపిన అనాస్‌ అల్‌ షరీఫ్‌ 28 సంవత్సరాల యువకుడు, జర్నలిస్టు, వీడియో గ్రాఫర్‌. అతని స్వస్థలం ప్రస్తుతం ఇజ్రాయెల్‌ ఆక్రమణలో ఉంది.పాలస్తీనా విముక్తి పోరులో ప్రాణాలకు తెగించి వార్తలను అందిస్తున్నవారిలో ఒకడు. అతనికి హమస్‌ తీవ్రవాది ముద్రవేసిన ఇజ్రాయెల్‌ మిలిటరీ గత రెండు సంవత్సరాలుగా చంపివేస్తామని అనేక సార్లు బెదిరించింది. అది చంపదలుకున్నవారందరికీ ఏదో ఒక ముద్రవేస్తున్నది. ఇజ్రాయెల్‌ ఆరోపణను ఐరాస తిరస్కరించింది. గాజా మారణకాండకు సంబంధించి అతను తీసిన ఫొటోకు 2024లో పులిట్జర్‌ బహుమతి ఇచ్చారు. రెండు సంవత్సరాలుగా అల్‌ జజీరాలో పనిచేస్తున్నాడు. గత నెలలో ఆకలితో చంపుతున్న ఇజ్రాయెల్‌ దుశ్చర్యను వెలుగులోకి తెచ్చాడు. అప్పటి నుంచి అతని కోసం ఇజ్రాయెల్‌ మిలిటరీ వేట ప్రారంభించి చివరకు ఆగస్టు పది రాత్రి విమానాలతో దాడి చేసి హతమార్చింది.


అల్‌ షరీఫ్‌ వంటి ఎందరో పాలస్తీనియన్లు శరణార్ధి శిబిరాల్లోనే పుట్టి అక్కడే పెరిగి చివరికి అదే ఇజ్రాయెల్‌ దుర్మార్గాలకు అక్కడే మరణిస్తున్నారు. గత ఎనిమిది దశాబ్దాలుగా సాగుతున్న మారణకాండ, పోరు అలాంటి ఎందరినో మాతృభూమి కోసం ప్రాణాలు అర్పించేందుకు సిద్దం చేస్తున్నది తప్ప పిరికిబారేట్లు చేయటం లేదు. 2023 అక్టోబరు ఏడు నుంచి ఇప్పటి వరకు 242 మంది జర్నలిస్టులను చంపినట్లు ఐరాస పేర్కొన్నది. రెండు ప్రపంచ యుద్దాలు, వియత్నాం, ఇరాక్‌, ఆఫ్ఘనిస్తాన్‌ దురాక్రమణ వంటి అనేక యుద్ధాలన్నింటిలో కూడా ఇంత మంది ప్రాణాలు కోల్పోలేదని విశ్లేషకులు పేర్కొన్నారు.ఇటీవలి సంవత్సరాలలో జర్నలిస్టులకు ప్రాణాంతక, అత్యంత ప్రమాదకరంగా ఉన్న ఉదంతం ఈ మారణకాండ. తనకు అనుకూలంగా వార్తలు ఇచ్చే వారిని తప్ప అంతర్జాతీయ జర్నలిస్టులను గాజాలో ప్రవేశించకుండా ఇజ్రాయెల్‌ అడ్డుకుంటున్నది. ఈ నేపధ్యంలో స్థానిక పాలస్తీనియన్లే విలేకర్లుగా మారి ఆల్‌ జజీరా వంటి మీడియా సంస్థలకు వార్తలను అందిస్తున్నారు. అది కూడా లేనట్లయితే అసలు గాజాలో ఏం జరుగుతున్నదో బయటి ప్రపంచానికి తెలిసే అవకాశమే ఉండేది కాదంటే అతిశయోక్తి కాదు.


గాజాలో తాజా పరిణామాల విషయానికి వస్తే హమస్‌ ఆయుధాలు విసర్జింతవరకు దాడులు చేయటం తప్ప మరొకమార్గం లేదని ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు ప్రకటించాడు. ప్రస్తుతం 70నుంచి75శాతం వరకు తమ ఆధీనంలో ఉందని చెప్పాడు.హమస్‌కు రెండు గట్టి స్థావరాలు ఉన్నాయని పూర్తిగా తుదముట్టించాలంటే గాజా స్వాధీనం చేసుకోవాల్సిందే అన్నాడు. ఈ వైఖరిని అనివార్యమై కొన్ని పశ్చిమదేశాలు బహిరంగంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ అమెరికా అండతో ఈ దుర్మార్గానికి పూనుకున్నాడు. గాజాలో దాడులకు ఉపయోగించే ఆయుధాలను ఇజ్రాయెల్‌కు నిరవధికంగా నిలిపివేస్తున్నట్లు జర్మనీ ప్రకటించింది. అయితే నిజంగా అమలు చేస్తుందా లేక వేరే మార్గాల ద్వారా సరఫరా చేస్తుందా అన్నది చెప్పలేము.హమస్‌కు వ్యతిరేకంగా ఆత్మరక్షణ చేసుకొనే హక్కు ఇజ్రాయెల్‌కు ఉన్నదని జర్మనీ ఇదే సందర్భంగా పేర్కొన్నది. పాలస్తీనా ప్రాంతాలను ఆక్రమించిన ఇజ్రాయెల్‌ గత ఏడు దశాబ్దాల నుంచి చెబుతున్న ఆత్మరక్షణ కతలను పశ్చిమదేశాలు సమర్ధిస్తున్న సంగతి తెలిసిందే. ఆ పేరుతో పాలస్తీనాను అడ్డుకోవటం అడ్డగోలు వ్యవహారం తప్ప మరొకటి కాదు.జర్మనీ గతంలో సరఫరా చేసిన ఫ్రైగేట్స్‌తోనే గాజాపై ఇజ్రాయెల్‌ నౌకాదళం తొలి దాడులు జరిపింది.


గాజా ఆక్రమణను అడ్డుకొనేందుకు ముస్లిం దేశాలన్నీ ఐక్యం కావాలని టర్కీ, ఈజిప్టు పిలుపునిచ్చాయి. ఈజిప్టుతో చర్చలు జరిపిన తరువాత విదేశాంగశాఖ మంత్రి బదర్‌ అబ్దెలెటీతో కలసి టర్కీ విదేశాంగ మంత్రి హకన్‌ ఫిదాన్‌ శనివారం నాడు విలేకర్ల సమావేశంలో ఈ పిలుపునిచ్చారు. రెండు దేశాలూ ఇజ్రాయెల్‌ చర్యను ఖండిరచాయి.తక్షణమే ఇస్లామిక్‌ దేశాల సంస్ధ సమావేశం జరపాలని కోరారు. ఇజ్రాయెల్‌ చర్య ఒక్క పాలస్తీనాకే గాక ఇరుగుపొరుగు దేశాలన్నింటికీ ప్రమాదమే అని పేర్కొన్నారు. ఇస్లామిక్‌ దేశాల సంస్థ విదేశాంగ మంత్రుల కమిటీ కూడా ఖండిరచింది. భద్రతా మండలి, ప్రపంచ అగ్రరాజ్యాలు జోక్యం చేసుకోవాలని కోరింది. లక్షలాది మంది ఇజ్రాయెల్‌ పౌరులు రాజధాని టెల్‌ అవీవ్‌, ఇతర నగరాల్లో గాజా దురాక్రమణ ప్రతిపాదనను ఖండిస్తూ పెద్ద ఎత్తున ప్రదర్శనలు చేశారు. ప్రభుత్వ చర్యకు సైనికులు మద్దతు ఇవ్వరాదని నినదించారు. హమస్‌ వద్ద బందీలుగా ఉన్నవారిని విడిపించేందుకు అవసరమైతే నెతన్యాహు ప్రభుత్వ వైఖరిని నిరసనగా సాధారణ సమ్మె జరపాలని బందీల కుటుంబ సభ్యులు పిలుపునిచ్చారు. స్వజనంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఇజ్రాయెల్‌ చర్యలకు నానాటికీ వ్యతిరేకత వెల్లడవుతున్నప్పటికీ డోనాల్డ్‌ ట్రంప్‌ వైఖరిలో ఎలాంటి మార్పు లేదు, నిస్సిగ్గుగా మద్దతు ప్రకటిస్తున్నాడు. మరింత పెద్ద ఎత్తున నిరసనోద్యమం జరిగితే తప్ప ఇజ్రాయెల్‌ వెనుకడుగువేసే అవకాశం లేదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

జలాంతర్గాముల మోహరింపు : రష్యాను కవ్విస్తున్న డోనాల్డ్‌ ట్రంప్‌ !

06 Wednesday Aug 2025

Posted by raomk in Current Affairs, Europe, History, imperialism, International, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, USA, WAR

≈ Leave a comment

Tags

American Nuclear Submarines, Donald trump, submarines war, Vladimir Putin

ఎం కోటేశ్వరరావు


ఉక్రెయిన్‌పై రష్యా మిలిటరీ చర్య 1,259వ రోజులో ప్రవేశించింది. ఆగస్టు ఎనిమిదిలోగా శాంతి ఒప్పందానికి రానట్లయితే ఆంక్షలను మరింత తీవ్రం గావిస్తామని డోనాల్డ్‌ ట్రంప్‌ బెదిరించాడు. ఈ పూర్వరంగంలో రెండు దేశాలూ పరస్పరం అణ్వాయుధాలున్న జలాంతర్గాములను మోహరించేందుకు నిర్ణయించాయి. రష్యా చమురు కొనుగోలు వ్యవహారంలో చైనాతో భారత్‌ చేతులు కలిపిందని, ఈ లావాదేవీలతో రష్యాకు ఆర్థికంగా తోడ్పడుతున్నట్లు వైట్‌హౌస్‌ సిబ్బంది ఉప అధికారి స్టెఫాన్‌ మిలర్‌ ఆరోపించాడు. ఈతీరు అధ్యక్షుడు ట్రంప్‌కు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ఈ లావాదేవీల వ్యవహారాన్ని చూస్తే జనాలు దిగ్భ్రాంతి చెందుతారని ఆదివారంనాడు ఫాక్స్‌ న్యూస్‌తో చెప్పాడు.తన ప్రత్యేక దూత స్టీవ్‌ విట్‌కోఫ్‌ బుధ లేదా గురువారాల్లో మాస్కో సందర్శించనున్నట్లు ట్రంప్‌ ఆదివారం నాడు చెప్పాడు. వారంతా జిత్తుల మారి మనుషులు, వారికి ఆంక్షలను తప్పించుకోవటం తెలుసు, ఏం జరుగుతుందో చూద్దాం అన్నాడు. చైనా, రష్యా నౌకాదళాలు జపాన్‌ సముద్రంలో నిర్ణీత కార్యక్రమం మేరకు విన్యాసాలు జరుపుతున్నాయి. అవసరమైన చోట రెండు అణుజలాంతర్గాములను మోహరించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించిన తరువాత రెండు రోజుల పాటు ఇవి జరుగుతున్నాయి. ఎంతో ముందుగానే ఈ విన్యాసాల తేదీలను ప్రకటించినందున తాము అవసరమైతే సన్నద్దగా ఉన్నట్లు బెదిరించేందుకు ట్రంప్‌ ఈ ప్రకటన చేసినట్లు కనిపిస్తోంది.


తాము అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందానికి(ఎన్‌పిటి) పూర్తిగా కట్టుబడి ఉన్నామని, వాటి గురించి మాట్లాడే ముందు అమెరికా సంయమనం పాటించాలని రష్యా ప్రతినిధి దిమిత్రి పెష్కోవ్‌ సోమవారం నాడు హితవు పలికాడు. తమ నాయకత్వం మొత్తాన్ని అంతం చేసినప్పటికీ సోవియట్‌ కాలం నుంచి కొనసాగుతున్న విధానం ప్రకారం చివరి యత్నంగా అణ్వస్త్రాలను ప్రయోగించకతప్పదని రష్యా మాజీ అధ్యక్షుడు మెద్వెదేవ్‌ గురువారం నాడు హెచ్చరించాడు. దాన్ని అవకాశంగా తీసుకున్న ట్రంప్‌ రెండు జలాంతర్గాములను మోహరించాలని ఆదేశాలు జారీ చేసినట్లు శుక్రవారం నాడు చెప్పాడు. అవి ‘‘ తగిన ప్రాంతాలలోనే ’’ ఉన్నాయని ఆదివారం నాడు మరో ప్రకటన చేశాడు. అయితే ఇదేమీ కొత్త కాదని, నిర్ణీత కార్యకలాపాల్లో భాగంగా అవి ఎప్పుడూ మోహరించే ఉంటాయని పెష్కోవ్‌ చెప్పాడు. తాజా పరిణామాలపై అధ్యక్షుడు వ్లదిమిర్‌ పుతిన్‌ బహిరంగంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అణు యుద్ధంలో విజేతలంటూ ఉండరని, అయితే సమరమే తలెత్తితే తాము పూర్తి సన్నద్దంగా ఉన్నామని పెష్కోవ్‌ చెప్పాడు.


అమెరికా దగ్గర మూడు రకాల జలాంతర్గాములున్నాయి.వాటిలో 14 ఓహియో తరగతికి చెందిన ఖండాంతర క్షిపణులను ప్రయోగించేవి, అణ్వాయుధాలను నియంత్రిత మార్గంలో వేగంగా ప్రయోగిస్తాయి.ప్రతి జలాంతర్గామి అనేక అణుబాంబులను మోసుకుపోయే 20 ట్రైడెంట్‌ క్షిపణులను కలిగి ఉంటుంది. అవి ఏడున్నరవేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను దెబ్బతీస్తాయి. అందువలన వాటిని రష్యా సమీపంలోనే మోహరించనవసరం లేదు. ఈ జలాంతర్గామి పొడవు 170 మీటర్లు, బరువు 19వేల టన్నులు,159 మంది సిబ్బంది, గంటకు 36 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.1990దశకం తరువాత కొత్త జలాంతర్గాములు అవసరం లేదని, ఉన్నవాటిలో కొన్నింటిలో మార్పులు చేసి నియంత్రిత ప్రయోగవాహకాలుగా మార్చారు, అలా తయారు చేసిన నాలుగు జలాంతర్గాములు 154 తోమహాక్‌ క్షిపణులను, వెయ్యి పౌండ్ల బరువుగల పేలుడు పదార్దంతో 1,600కిలోమీటర్ల దూరంలో భూమి మీద ఉన్న లక్ష్యాలను ధ్వంసం చేయగలవు. సముద్రగర్భంలో ఇతర దేశాల జలాంతర్గాములు, నౌకల మీద కూడా దాడి చేయగలిగినవి ఉన్నాయి. 2025 జూలై ఒకటవ తేదీ నాటికి వేగంగా దాడులు చేసేందుకుగాను 23అధునాతన వర్జీనియా రకం జలాంతార్గాములను వినియోగంలోకి తెచ్చారు, అవి 377 నుంచి 461 అడుగుల పొడవు, 10,200టన్నుల బరువు ఉంటాయి, ఒక్కోదానిలో 145 మంది సిబ్బంది పని చేస్తారు.పాతవాటిలో లాస్‌ ఏంజల్స్‌రకరం మరో 23 పని చేస్తున్నాయి.ఒక్కొక్కదాని ధర మూడు వందల కోట్ల డాలర్లు.


రష్యా భద్రత, సార్వభౌమత్వాన్ని కాపాడుకొనేందుకు అణు జలాంతర్గాములను విస్తరించాలని పుతిన్‌ పిలుపునిచ్చినట్లు గతనెలాఖరులోనే వార్తలు వచ్చాయి.ఆధునిక తరంతో నౌకాదళాన్ని మరింత పటిష్టం కావిస్తామని చెప్పినట్లు టాస్‌ వార్తా సంస్థ పేర్కొన్నది.ప్రస్తుతం 192 క్షిపణులను ప్రయోగించే పన్నెండు వినియోగంలో ఉన్నాయి. అమెరికాకు చెందిన లాస్‌ ఏంజల్స్‌ రకం జలాంతర్గామి జూలై తొమ్మిదిన నిర్వహణ పనుల పేరుతో తొలిసారిగా ఐస్‌లాండ్‌ రేవులో లంగరువేసింది.తామున్నామని తన మిత్రదేశాలకు అమెరికా పంపిన సందేశం కూడా దీనిలో ఇమిడి ఉంది. 2023 నుంచి ఇప్పటి వరకు ఎనిమిది వాహనాలు ఈ జలాల్లో సంచరించాయి.గ్రీన్‌లాండ్‌, ఐస్‌లాండ్‌, బ్రిటన్‌ కారిడార్‌(జిఐయుకె)లో ఈ ప్రాంతం ఉంది.2019 నుంచి అమెరికా తన బి2 బాంబర్లకోసం ఈ ప్రాంతాన్ని వినియోగిస్తున్నది. ఈ పూర్వరంగంలో రష్యా ఉత్తర నౌకాదళానికి చెందిన అధునాతన యాసెన్‌ తరగతి జలాంతర్గాములు ఈ ప్రాంతంలో ప్రయాణించాయి.అమెరికా, రష్యా, చైనా జలాంతర్గాములు ప్రత్యర్ధుల కదలికలను పసిగట్టటం, పర్యవేక్షించే పనిలో నిరంతరం ఉంటాయి, ఏ దేశం కూడా ఈ వివరాలను బహిరంగంగా వెల్లడిరచదు. ఖనిజ సంపద ఎంతో ఉన్న ఈ ప్రాంతం ఆర్థికంగానే గాక, మిలిటరీ పరంగా కూడా ఇటీవల ప్రాధాన్యత సంతరించుకుంది. ఆర్కిటిక్‌ ప్రాంతంలో ఐదోవంతు రష్యా భూభాగం, సముద్రతీరం సగం ఉన్నదున అది దానికి ఎంతో కీలకం. అమెరికా రాడార్లకు అందకుండా ప్రయాణించే హైపర్‌సోనిక్‌ క్షిపణులను రష్యా పరీక్షిస్తున్నది. రెండు సంవత్సరాల క్రితం చైనాతో కలసి అలాస్కా వద్ద తనిఖీ నిర్వహించింది. పోలార్‌ సిల్క్‌ మార్గం పేరుతో 2018లో చైనా ఆర్కిటిక్‌ వ్యూహాన్ని ప్రకటించింది. నాటో కూటమిలో ఫిన్లండ్‌, స్వీడన్‌ చేరిన తరువాత రష్యా తన మిలిటరీని ఈ ప్రాంతంలో నవీకరిస్తున్నది. సోవియట్‌ కాలం నాటి వైమానిక కేంద్రాల ఉన్నతీకరణ, కార్యకలాపాల పునరుద్దరణ చేపట్టింది. ఆర్కిటిక్‌ ప్రాంతంలో రష్యాకు ఎక్కువ మిలిటరీ కేంద్రాలు ఉండటం అమెరికాను కలవర పెడుతున్నది. రష్యా కంటే మిలిటరీ రీత్యా పశ్చిమ దేశాలు పదేండ్లు వెనుకబడి ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.అంతర్జాతీయ ఒప్పందం ప్రకారం నాటో దేశమైన నార్వేలో రష్యన్‌ పౌరులు వీసాతో నిమిత్తం లేకుండా నివసించవచ్చు. గ్రీన్‌లాండ్‌ను తమకు ఇవ్వాలని అమెరికా డిమాండ్‌ చేయటం వెనుక ఈ అంశం కూడా ఉంది. యుద్ధమంటూ వస్తే ఈ ప్రాంతంలో అమెరికా నౌకలను అడ్డుకొనేందుకు రష్యాకు అనేక అవకాశాలు ఉన్నాయి.


దౌత్యం, వాణిజ్యాలను ఆయుధాలు మార్చుకోవటం రోజు రోజుకూ పెరుగుతున్నది. తన మిత్రదేశమైన పాకిస్తాన్‌ మీద భారత్‌ నిర్వహించిన ఆపరేషన్‌ సిందూర్‌ను నిలిపివేయించేందుకు వాణిజ్యాన్ని చూపి బెదిరించిట్లు స్వయంగా ట్రంప్‌ చెప్పిన సంగతి తెలిసిందే. పరువు పోతుందని భావించి నరేంద్రమోడీ ఈ విషయాన్ని బహిరంగంగా అంగీకరించేందుకు సిద్దం కావటం లేదన్నది వేరే సంగతి.మిలిటరీ ఖర్చును భారీగా పెంచేందుకు నాటో కూటమి నిర్ణయించింది. ఉక్రెయిన్‌ పోరును సంప్రదింపుల ద్వారా ముగించేందుకు అది సిద్దంగా లేదు. పోరును దీర్ఘకాలం పొడిగించి రష్యాను కొన్ని సంవత్సరాల్లో దివాలా తీయించాలన్నట్లుగా వ్యవహరిస్తున్నది. ఐరోపా సమాఖ్య జనాభా 49 కోట్లు, జిడిపి 20లక్షల కోట్లు ఉండగా కేవలం 15కోట్ల జనాభా, రెండు లక్షల కోట్ల డాలర్ల జిడిపి మాత్రమే ఉన్న రష్యాను ఓడిరచలేమా అనే ప్రమాదకర ధోరణి కనిపిస్తున్నది. రష్యా తన వద్ద ఉన్న అణ్వస్త్రాలను చూపి భయపెడుతున్నది. అమెరికా కూడా భయపడుతున్నది ఈ కారణంగానే అన్నది తెలిసిందే. ఐరోపాలో బలమైన జర్మనీ మరోసారి పదాతిదళాలను పెంచుతున్నది. మూడువేల బాక్సర్‌ సాయుధ శకటాలు, మూడున్నరవేల పాట్రియా ఇన్‌ఫాంట్రీ యుద్ధ వాహనాలను కొనుగోలు చేస్తున్నది, ఇవిగా యూరోజెట్‌ ఫైటర్లను సమీకరిస్తున్నది. ఐరోపాలో బలమైన సాంప్రదాయ మిలిటరీని సాయుధంకావించేందుకు తాను లక్ష కోట్ల యూరోలను ఖర్చు చేయనున్నట్లు జర్మన్‌ ఛాన్సలర్‌ ఫెడరిక్‌ మెర్జ్‌ ఇటీవల ప్రకటించిన అంశాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. ఇతర ధనిక ఐరోపా దేశాలేమీ తక్కువ తినటం లేదు.ఫ్రాన్సు, ఇటలీ, పోలాండ్‌ పెద్ద సంఖ్యలో టాంక్‌లు, సాయుధశకటాలను కొనుగోలు చేసేందుకు నిర్ణయించాయి. అవసరమైతే ఫ్రెంచ్‌ లేదా ఐరోపా యూనియన్‌ దేశాలు ఉక్రెయిన్‌లో పోరాడేందుకు కాల్బలాలను కూడా పంపేందుకు సిద్దం కావాలని ఫ్రెంచి అధ్యక్షుడు మక్రాన్‌ గతేడాది చేసిన ప్రతిపాదనను అందరూ వ్యతిరేకించారు.పశ్చిమ ఐరోపాలో 89శాతం మంది వ్యతిరేకించినట్లు సర్వేలు వెల్లడిరచాయి.


రష్యా మాజీ అధ్యక్షుడు మెద్వెదేవ్‌ చేసిన వ్యాఖ్యలను ఆసరా చేసుకొని డోనాల్డ్‌ ట్రంప్‌ తన అక్కసును జలాంతర్గాముల మోహరింపు రూపంలో వ్యక్తం చేశాడని స్పష్టంగా కనిపిస్తోంది.రెచ్చగొట్టటంలో ఎవరూ తక్కువ తినలేదు. ట్రంప్‌ పన్నుల విధింపు పేరుతో బెదిరింపు ఆటకు దిగాడని మెద్వెదేవ్‌ వర్ణించాడు ‘‘ రష్యా అంటే ఇజ్రాయెల్‌ లేదా కనీసం ఇరాన్‌ కూడా కాదు, ప్రతి కొత్త బెదిరింపు యుద్ధంవైపు మరోఅడుగువేసినట్లే, అయితే ఉక్రెయిన్‌ మరియు రష్యా మధ్య కాదు, అతగాడి స్వంతదేశంతోనే, అది ఎలా ఉంటుందో ఒక టీవీలో వస్తున్న ది వాకింగ్‌ డెడ్‌ అనే సీరియల్‌ చూడవచ్చు ’’ అన్నాడు. తీవ్రంగా రెచ్చగొట్టిన మెద్వెదేవ్‌ కారణంగానే తాను రెండు అణుజలాంతర్గాములను మోహరించాలని ఆదేశించినట్లు ట్రంప్‌ చెప్పుకున్నాడు. వీటన్నింటిని చూస్తుంటే ప్రధాన దేశాల మధ్య వాణిజ్య , మిలిటరీ విబేధాలు అదుపుతప్పి దిగజారుతున్నట్లు కనిపిస్తున్నది.అన్ని దేశాలను అదుపులోకి తెస్తానని చెప్పిన ట్రంప్‌ స్వజనంలో పలుచనయ్యాడు, పుతిన్నుదారికి తెచ్చి ఉక్రెయిన్‌ పోరును 24 గంటలలో ఆపివేస్తానని ప్రగల్భాలు పలికి ఐరోపాలో పరువు పోగొట్టుకున్నాడు.గత కొద్ది రోజులుగా ట్రంప్‌తో పాటు అతగాడి యంత్రాంగంలో ముఖ్యులు నిరాశాపూరితంగా మాట్లాడుతున్నారు. ఆంక్షలు రష్యాను నిలువరించేట్లు కనిపించటం లేదన్నట్లుగా వ్యాఖ్యానిస్తున్నారు. ట్రంప్‌ బెదిరింపులను ఖాతరు చేయకుండా రష్యా నుంచి భారత్‌, చైనా చమురుకొనుగోళ్లను నిలిపివేసే సూచనలు కనిపించటం లేదు. భారత్‌ నిలిపివేస్తే నరేంద్రమోడీకి, కొనుగోలు కొనసాగిస్తే ట్రంప్‌కు ఇరకాటం తప్పదు. అమెరికా ఆధిపత్యాన్ని సవాలు చేయటంలో అత్యంత కీలక భాగస్వామి పుతిన్ను చైనా నేత షి జింపింగ్‌ మధ్యలో వదలివేస్తారని ఊహించటం కష్టమని న్యూయార్క్‌టైమ్స్‌ పత్రిక గురువారం నాడు వ్యాఖ్యానించింది. ఐరోపా యూనియన్‌ కూడా ఆంక్షలను ప్రకటించినప్పటికీ వాటిని ఖాతరు చేయకుండా టర్కీ, ఫ్రాన్సు,హంగరీ, బెల్జియం,స్లోవేకియా, ఇటలీ జెకియా గ్యాస్‌, చమురు కొనుగోలు చేస్తున్నాయి. భారత్‌ చౌకగా రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకొని బహిరంగ మార్కెట్‌లో అధికధరలకు అమ్ముకుంటున్నదని, అందువలన తాను భారీగా పన్నులు వేస్తానని సోమవారం నాడు ట్రంప్‌ పునరుద్ఘాటించాడు. ఒక్క ఈ అంశమే కాదు, పెట్టుబడిదారీ వర్గం తన లాభాలకు దెబ్బ తగలకుండా మరోవైపున కార్మికవర్గం మీద కూడా దాడులను ప్రారంభించింది. అనేక దేశాల్లో రకరకాల సాకులతో సంక్షేమ, సామాజిక భద్రతా పథకాలకు కోత పెడుతున్నారు. ఇలాంటి పోకడలను ఎదిరించి అడ్డుకట్టవేయాలంటే అమెరికా, ఐరోపాల్లోని కార్మికవర్గం వీధుల్లోకి వస్తే తప్ప పాలకవర్గాలు వెనకడుగువేసేట్లు కనిపించటం లేదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

సోవియట్‌ నాటి చరిత్ర పునరావృతం అవుతుందా : బులబాటం తీర్చిన డోనాల్డ్‌ ట్రంప్‌ – నరేంద్రమోడీ ఆరాటానికి ముందున్నది అసలు పరీక్ష !

01 Friday Aug 2025

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RUSSIA, Uncategorized, USA

≈ Leave a comment

Tags

BJP, China, Donald trump, Donald Trump Tariffs, Narendra Modi Failures, Tariff War, Trade agreement with US, Xi Jinping

ఎం కోటేశ్వరరావు

నాటకీయ పరిణామాలు జరగకపోతే అమెరికాతో వాణిజ్య ఒప్పందాల కోసం వెంపర్లాడిన నరేంద్రమోడీ బృందానికి ప్రస్తుతానికి డోనాల్డ్‌ ట్రంప్‌ తగిన పాఠమే చెప్పాడు. మనదేశం నుంచి తాము దిగుమతి చేసుకొనే వస్తువులపై 25శాతం పన్నులు, రష్యా నుంచి మనం ముడిచమురు, ఆయుధాలు, ఇతర వస్తువులను దిగుమతి చేసుకొంటున్న కారణంగా అదనంగా జరిమానా విధిస్తున్నట్లు బుధవారం నాడు ప్రకటించాడు. మనసార్వభౌమత్వాన్నే కించపరిచాడు. పుండు మీద కారం చల్లినట్లుగా పాకిస్తాన్‌తో ఒప్పందం కుదుర్చుకొని అక్కడ నిల్వచేసే చమురును భారత్‌కు అమ్మిస్తానని కూడా చెప్పాడు. ఇది మరీ అవమానం. రష్యా, భారత్‌ రెండూ మృత ఆర్థిక వ్యవస్థలు, కలసి ఏం చేస్తాయో చేసుకోండి అంటూ ఎద్దేవా చేశాడు.ట్రంప్‌ ప్రకటించిన మేరకు ఆగస్టు ఒకటి నుంచి మన దేశం నుంచి ఎగుమతి అవుతున్న వివిధ సరకులపై కనిష్టంగా 25 గరిష్టంగా 193శాతం పన్నులు విధిస్తారు. వీటికి జరిమానా అదనం. ఇవి ఇలానే ఉండేట్లయితే ఏ రంగం ఎలా ప్రభావితం అవుతుందో ఆచరణలో తెలుస్తుంది.ఔషధాలు, సెల్‌ఫోన్లు వంటి వాటిని ప్రస్తుతానికి మినహాయించారు. అవి పేకాటలో తురుపు ముక్కల వంటివి, మనదేశాన్ని బ్లాక్‌మెయిల్‌ చేసే ఎత్తుగడలో భాగం తప్ప మరొకటి కాదు. జాతీయ ప్రయోజనాలను పరిరక్షించేందుకు తగిన చర్యలు తీసుకుంటామంటూ కేంద్ర ప్రభుత్వం ఒక సాదాసీదా ప్రకటన విడుదల చేసింది. మహా వ్యూహవేత్త అంటున్నారు గనుక మామూలుగానే ప్రధాని నరేంద్రమోడీ, ఇతర మంత్రులు నోరు విప్పలేదు, సమాచార శాఖ(పిఐబి) ద్వారా మొక్కుబడిగా ఒక ప్రకటన విడుదల చేశారు.పరిస్థితిని అన్ని విధాలుగా మదింపు చేయనున్నట్లు పేర్కొన్నారు.

అమెరికా చర్యలకు ప్రతిగా చైనా మాదిరి మన ప్రభుత్వం కూడా ప్రతి సుంకాలు విధిస్తుందా లేదా అన్నది ఇంకా స్పష్టం కాలేదు. అమెరికాతో ఇప్పుడున్న 130 బిలియన్‌ డాలర్ల లావాదేవీలను మరో ఐదు సంవత్సరాల్లో 500 బిలియన్‌ డాలర్ల స్థాయికి పెంచుతామని రంగుల కలను జనం ముందించిన నేతలు ఇప్పుడేం చేస్తారో చూడాల్సి ఉంది. ఈ నెల 25వరకు భారత్‌తో వాణిజ్య ఒప్పందంపై చర్చలు సాగుతాయని, తమ ప్రతినిధి వర్గం ఢల్లీి సందర్శించనున్నదని అమెరికా అధికారులు చెప్పినదాన్ని బట్టి ఇప్పటికీ మన మీద వత్తిడి తెచ్చే యత్నాలను ట్రంప్‌ మానుకోలేదని, సుంకాల ప్రకటన బెదిరింపుల్లో భాగమే అని చెప్పవచ్చు. మోడీ లొంగుతారా లేదా అన్నది చూడాల్సి ఉంది. ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తయితే అసలు అగ్ని పరీక్ష ముందుంది. ఫిబ్రవరి నుంచి జరుగుతున్న చర్చల గురించి రకరకాల లీకుల కథనాలు, ట్రంప్‌ ప్రకటనల నేపధ్యంలో ఎలక్ట్రానిక్‌ రంగంలో పెద్ద మొత్తంలో చైనా పెట్టుబడులను ఆకర్షించేందుకు మనదేశం సానుకూల సంకేతాలను పంపిందంటూ తాజాగా ఒక వార్త. ఇలాంటి పరోక్ష సందేశాలతో చైనాను చూపి అమెరికా నుంచి రాయితీలు రాబట్టుకొనే ఎత్తుగడగా కూడా దీన్ని చెప్పవచ్చు. గతంలో అమెరికాను చూపి సోవియట్‌, దాన్ని చూపి వాషింగ్టన్‌తో బేరసారాలాడిన మన పాలకవర్గం ఇలాంటి వాటిలో ఆరితేరింది. ఇప్పటి వరకు ఈ ఎత్తుగడ ఫలించినట్లు లేదు. నిజంగానే మనదేశం చైనా ఎలక్ట్రానిక్‌ కంపెనీలు, వాటి పెట్టుబడులను అనుమతిస్తే అమెరికా మరింత శత్రుపూరితంగా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయి. జిగినీ దోస్తుతో సంబంధాలను నరేంద్రమోడీ అంత తేలికగా వదులు కుంటారా అన్నది చూడాల్సి ఉంది.

మన జిడిపి పదిలక్షల కోట్ల డాలర్లకు చేరాలంటే చైనాతో సయోధ్య తప్పనిసరని కొందరి సూచన, డ్రాగన్‌తో పెట్టుకుంటే మృత్యుఘంటికలే అని కొందరి హెచ్చరిక. ఏది సత్యం ! ఏదసత్యం ఓ మహాత్మా, ఓ మహర్షీ !! గాల్వన్‌ లోయ ఘర్షణ సందర్భంగా ఇంక చైనాతో మాటల్లేవ్‌, మాట్లాడుకోవటం లేదు, పోరేశరణ్యం అంటూ ఊగిపోయిన దృశ్యాలు మన కళ్ల ముందే ఉన్నాయి.చైనా కమ్యూనిస్టు పార్టీతో ఒప్పందం, రాయబారి నుంచి పాఠాలు నేర్చుకున్నట్లు రాహుల్‌ గాంధీని ఎద్దేవా చేసిన వారు తమ కింది నలుపు చూసుకుంటున్నలేదు. రాహుల్‌ ఒప్పందానికి ముందే 2001లోనే జాన కృష్ణమూర్తి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో బిజెపి చైనా కమ్యూనిస్టు పార్టీతో సంబంధాలు పెట్టుకుంది. గాల్వన్‌ ఉదంతాలు జరిగి ఐదేండ్లు గడచిన తరువాత చూస్తే మూసిన తలుపులను మనమే తెరుస్తున్నాం. చైనా తలపులతో మునిగిపోతున్నాం. ఆశ్చర్యంగా ఉంది కదూ ! అప్పుడెందుకు మూశారు, ఇప్పుడెందుకు తెరిచారు, ఇన్నేండ్లు ఎందుకు ఆలశ్యం చేశారు అని ఎవరైనా అడిగారో దేశద్రోహ ముద్రవేస్తారు జాగ్రత్త. బిజెపి నందంటే నంది పందంటే పంది అంతే ! త్వరలో షాంఘై సహకార సంస్థ సమావేశాలకు గాను ప్రధాని నరేంద్రమోడీ బీజింగ్‌ సందర్శనకు వెళతారని అంటున్నారు.అన్నీ సక్రమంగా ఉంటే షీ జింపింగ్‌ కూడా ఢల్లీి రావచ్చు. ఏదీ అసాధ్యం కాదు, షీ జింపింగ్‌ రమ్మనాలే గానీ వెళ్లటానికి అన్నీ సర్దుకొని ఉన్నా అన్నట్లుగా ట్రంప్‌ ఉన్నాడు.ఎవరి ఎత్తుగడలు వారివి, ఎవరి ప్రయోజనాలు వారికి ముఖ్యం.

త్వరలో చైనాను అధిగమించేందుకు ముందుకు పోతున్నామని కొందరు చెబుతుంటారు. ఆ చైనీయులేమో అమెరికాను దాటేస్తాం చూడండి అన్నట్లుగా సందడి లేకుండా తమపని తాము చేసుకుపోతున్నారు.మన సంకల్పం మంచిదే, ఆరోగ్యకరమైన పోటీ ప్రతిదేశంతోనూ ఉండాల్సిందే. మధ్యలో చైనా ఎందుకు ఏకంగా అమెరికాతోనే పోటీ పడాలి.ఆశ, ఆకాంక్షల్లో కూడా పిసిరానితనం అవసరమా ! అయితే పేచీ ఎక్కడ అంటే ఎవరికి వారు మేమే ముందుండాలి, అగ్రస్థానం మాకే దక్కాలి అనుకుంటే ఫలితం, పర్యవసానాలు ప్రతికూలంగానే ఉంటాయి.ఎవరి సంగతివారే చూసుకోవాలి అనుకున్నపుడు మన అభివృద్ధిని మరొకరు ఓర్వలేకుండా ఉన్నారని ఏడిస్తే ప్రయోజనం లేదు.1970 దశకం వరకు కమ్యూనిస్టు చైనాకు ఐరాసలో, 2001వరకు ప్రపంచ వాణిజ్యసంస్థలో సభ్యత్వమే లేదు.అడ్డుకున్నది ఎవరంటే అమెరికా, దాని కనుసన్నలలో నడిచే దేశాలే అన్నది తెలిసిందే. చిత్రం ఏమిటంటే అదే అమెరికా తరువాత కాలంలో తన కంపెనీల పెట్టుబడులను చైనాలో అనుమతించింది, తన అవసరం కోసం పరిమితంగా, ఫరవాలేదు పాతబడిరదే కదా అనుకున్న సాంకేతిక పరిజ్ఞాన బదిలీని అనుమతించింది. లాటిన్‌ అమెరికా దేశాల మాదిరి వస్తు ఎగుమతి ఆధారిత దేశంగా ఉంటూ తనకు లాభాలను అందిస్తుంది అనుకున్న ఆశలను చైనా వమ్ము చేసింది. లాటిన్‌ అమెరికా దేశాలు పెట్టుబడిదారీ, చైనా కమ్యూనిస్టుల నాయకత్వంలో ఉందనే వాస్తవాన్ని పశ్చిమదేశాల వారు అర్ధం చేసుకోలేకపోయారు. చేయి అందిస్తే ఏకంగా అల్లుకు పోతుందని అమెరికా కార్పొరేట్‌ మేథావులు నాలుగుదశాబ్దాల క్రితం గుర్తించలేకపోయారు. చైనా నేడు అనేక రంగాలలో సవాలు చేస్తున్నది. అడ్డుకొనేందుకు అడుగడుగునా అమెరికా కూటమి చూస్తున్నది.ఆధునిక చిప్స్‌ అందుబాటులో లేకుండా చేయాలని ఆంక్షలు పెట్టిన సంగతి తెలిసిందే.తన కోడి కూయకపోతే చైనాలో తెల్లవారదని అది భావిస్తున్నది.

ఇలాంటి ఆటంకాలు మనకు లేవు. నిజంగానే ‘‘ కమ్యూనిస్టు నియంతృత్వ’’ చైనా మనకు అడ్డుపడుతున్నది అనుకుంటే మనవారు కీర్తించే ‘‘ ప్రజాస్వామ్య ’’ అమెరికా, ఇతర పశ్చిమదేశాలు మిత్రులు, భాగస్వాములే, అయినా సాయం చేసేందుకు ఎందుకు ముందుకు రావటం లేదు. బీజింగ్‌కు పోటీగా మనలను ఎందుకు నిలపటం లేదు ? మనదేశంలోని కొందరు మేథావులు చైనా మాత్రమే మనలను అడ్డుకుంటున్నదని తమ దాడిని ఎందుకు ఎక్కుపెడుతున్నట్లు ? జనం ఆలోచించాలి ! అమెరికాతో మనదేశ వాణిజ్య ఒప్పంద గడువు జూలై తొమ్మిది, ఆగస్టు ఒకటి రెండూ మురిగిపోయాయి. చైనాతో వాణిజ్యం మీద లేని ఒప్పందం అమెరికాతో ఎందుకు అన్నది సామాన్యులకు అర్ధం కావటం లేదు. చైనాతో1954లో కుదిరిన ఒక సాధారణ ఒప్పందం మాత్రమే అమల్లో ఉంది.పరిస్థితులకు అనుగుణ్యంగా దాన్ని నవీకరించటం లేదా నూతన ఒప్పందాన్ని కుదుర్చుకోవటానికి ఎలాంటి చొరవా రెండువైపుల నుంచి లేదు. కానీ భారీ మొత్తంలో వాణిజ్య లావాదేవీలు జరుగుతున్నాయి.

అసలు వాణిజ్య ఒప్పందాలు ఎందుకు ? వివాదాలు లేకుండా ఒక పద్దతిగా నడుద్దామని రెండవ ప్రపంచ యుద్ధం తరువాత 23దేశాల మధ్య (భారత్‌, చైనాలతో సహా) వాణిజ్యం, పన్నులపై సాధారణ ఒప్పందం( జనరల్‌ అగ్రిమెంట్‌ ఆన్‌ ట్రేడ్‌ అండ్‌ టారిఫ్‌గాట్‌) 1947లో కుదిరింది, దీన్నే జెనీవా ఒప్పందం అని కూడా అంటారు.తరువాత అది 1995 జనవరి ఒకటి నుంచి ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యుటిఓ)గా మారింది. గాట్‌ దేశాల్లో చైనా ఉన్నప్పటికీ అది కమ్యూనిస్టుల ఏలుబడిలోకి వచ్చిన తరువాత తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్‌ పేరుతో ఉన్న చైనానే గుర్తించారు తప్ప మిగతా దేశాల మాదిరి సభ్యత్వం ఇవ్వలేదు. అనివార్యమైన స్థితిలో 2001లో చైనాను చేర్చుకున్నారు. ప్రపంచీకరణను ముందుకు తెచ్చిన దేశాలే నేడు దానికి భిన్నంగా డబ్ల్యుటివోను పక్కన పెట్టి విడివిడిగా ఒప్పందాలు చేసుకోవటం తెలిసిందే.


మన ప్రధాన వాణిజ్య భాగస్వామిగా ఉన్న దేశాలలో అమెరికా, చైనా ఒకటి రెండు స్థానాలలో ఉంటున్నాయి. ప్రతిదేశం తన దగ్గర మిగులుగా ఉన్న సరకులను అమ్ముకొనేందుకు గతంలో ఏకంగా బలహీన దేశాలను ఆక్రమించుకోవటం, అందుకోసం యుద్ధాలకు దిగటం తెలిసిందే. ఆ రోజులు గతించాయి గనుక వాటి స్థానంలో మార్కెట్ల ఆక్రమణకు ఒప్పందాలు వచ్చాయి. పన్నులు ఎలా వేయాలో, ఎగుమతి, దిగుమతులు ఎలా జరగాలో ప్రపంచ వాణిజ్య సంస్థ ఒక విధానాన్ని రూపొందించింది. అది ఉండగా విడివిడిగా ఒప్పందాల కోసం ప్రయత్నించటం చూస్తున్నాం. ఐక్యరాజ్య సమితి(ఐరాస) మాదిరి డబ్ల్యుటిఓ కూడా విఫలమైందా ? అలాగే కనిపిస్తున్నది, దాని నిబంధనలను పక్కన పెట్టి కొన్ని దేశాలు కొన్ని వస్తువుల మీద ఎక్కువ పన్నులు విధిస్తున్నాయి. ప్రతి చర్యలతో వివాదాలు. వాటిని పరిష్కరించే ట్రిబ్యునల్‌కు న్యాయమూర్తుల నియామకం జరగకుండా అమెరికా అడ్డుకుంటున్నది, పోటీ పడలేక వాణిజ్య దందాకు దిగి చైనా మీద కత్తి గట్టింది. దాని వైఖరిని మిగతా దేశాలు అప్పుడే ప్రతిఘటించి ఉంటే ఇప్పుడు అన్నిదేశాల మీద దాడికి దిగేది కాదు.నష్టపోయేది చైనాయే గదా అని భావించిన దేశాలకు ఇప్పుడు తెలిసి వస్తోంది.

వాణిజ్య మిగులు ఉన్న దేశాలతో లోటు ఉన్నవి సమానం చేసేందుకు చూస్తాయి. మనదేశ లావాదేవీలను చూసినపుడు 151దేశాలతో వాణిజ్య మిగులుతో ఉన్నాం, 75దేశాలతో లోటులో ఉన్నాం. మన ఎగుమతుల గురించి ఎన్ని కబుర్లు చెప్పినప్పటికీ మొత్తం మీద ఏటేటా లోటు పెరగటం తప్ప తగ్గటం లేదు. పదేండ్ల మన్మోహన్‌ సింగ్‌ ఏలుబడిలో మనదేశ మొత్తం వాణిజ్య లోటు (వికీపీడియా సమాచారం) 942.23 బిలియన్‌ డాలర్లు. ఇదే 2014 నుంచి 2024వరకు నరేంద్రమోడీ పాలనలో 1,506.22 బిలియన్‌ డాలర్లకు చేరింది. ఈ కాలంలో మన ఎగుమతులు 201314లో 466.22 బిలియన్‌ డాలర్లు కాగా 20232024లో 778.21 బి.డాలర్లకు పెరిగాయి. మేకిన్‌, మేడిన్‌ ఇండియా పథకాలు జయప్రదమై ఉంటే మనకీ దుస్థితి ఉండేది కాదు. పదేండ్లలో మోడీ సర్కార్‌ నిర్వాకం కారణంగా మన విలువైన విదేశీమారకద్రవ్యం 614 బిలియన్‌ డాలర్లను చైనాకు పువ్వుల్లో పెట్టి ఇచ్చాం.అయినప్పటికీ మనం దిగుమతులు నిలిపివేసి డ్రాగన్‌కు చుక్కలు చూపించాలని కాషాయ దళాలు నిత్యం చెబుతూనే ఉంటాయి. నిజమే కామోసని గుడ్డిగా నమ్మేవారు ఉన్నారు. ఇంత తేడా ఉన్నప్పటికీ ప్రస్తుతం అమెరికాతో వాణిజ్య ఒప్పందం కోసం పడుతున్న ఆరాటం చైనాతో జరగటం లేదన్నది తెలిసిందే. ఇదే సమయంలో అమెరికాతో ఉన్న వాణిజ్య మిగులును తగ్గించి తమ వస్తువులను మనమీద రుద్దేందుకు పూనుకున్న ట్రంప్‌తో మాత్రం ఒప్పందం కోసం ఇప్పటికీ అర్రులు చాస్తున్నది.


ప్రపంచ ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తిలో 60శాతం చైనాలోనే జరుగుతోంది. మనదేశంలో కూడా ఉత్పత్తిని పెంచాలంటే చైనా పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానం అవసరం అని ఈ పూర్వరంగంలో చైనాను విస్మరించలేమని మన విధాన నిర్ణేతలకు అవగతమైనట్లు కనిపిస్తోంది.జిడిపిలో పదిలక్షల కోట్ల మైలురాయిని దాటాలంటే చైనాతో ఎంతో అవసరం ఉందని అబ్జర్వర్‌ రీసర్చ్‌ ఫౌండేషన్‌(ఓఆర్‌ఎఫ్‌) అధ్యక్షుడు సమీర్‌ శరణ్‌ అభిప్రాయపడ్డారు. చాలా సంవత్సరాల తరువాత చైనాతో ఆర్థిక సంబంధాల పునరుద్దరణకు ఎంతో అవకాశం ఉందని, అయితే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఇటీవలనే చెప్పారు. చైనా తనసరకులను అమ్ముకొనేందుకు మనదేశాన్ని పెద్ద మార్కెట్‌గా చూస్తోందని, అందునా శత్రుదేశంగా ఉందంటూ కొందరు వ్యతిరేకిస్తున్నారు. చైనా పర్యాటకులకు వీసాలు ఇవ్వాలని మనదేశం ఇటీవల నిర్ణయించిన సంగతి తెలిసిందే. భద్రతాపరమైన తనిఖీలతో నిమిత్తం లేకుండా చైనా కంపెనీలను 24శాతం వాటాలతో భారత కంపెనీల్లో పెట్టుబడులను అనుమతించవచ్చని నీతి ఆయోగ్‌ ఇటీవల ప్రతిపాదించింది. కేంద్ర ప్రభుత్వం, అధికార బిజెపిలో ఒక వర్గం చైనా పెట్టుబడులను వ్యతిరేకిస్తుండగా మరొకటి సానుకూలంగా ఉంది. నీతి ఆయోగ్‌ చెప్పటం అంటే మన బడాకొర్పొరేట్ల ప్రయోజనాలు, వాటి పరిరక్షణకు మోడీ మనసెరిగి నివేదించటం తప్ప మరొకటి కాదు. నిజంగా అదే జరిగితే ముందే చెప్పుకున్నట్లు డోనాల్డ్‌ ట్రంప్‌ మరింత రెచ్చిపోతాడు, వియోగమే అనివార్యమైతే మన నరేంద్రమోడీ, కాషాయ దళాలు తట్టుకుంటాయా ! దేశ రాజకీయాల్లో పెను మార్పులకు నాంది పలుకుతుందా ? గతంలో అంటే సోవియట్‌ యూనియన్‌తో ఉన్న మిత్ర సంబంధాలు వేరు, ఇప్పుడు చైనాతో అవసరమైతప్ప సంబంధాల్లో మిత్రత్వం ఎంత అన్నది అనుమానమే, అటువంటి చైనా కోసం అమెరికాను దూరంగా పెడతారా, ఏమో భారత పాలకవర్గం తనకు ఏది లాభం అనుకుంటే దానికే పెద్ద పీటవేస్తుందని సోవియట్‌ నాటి చరిత్ర చెబుతోంది ! పిల్లి నల్లదా తెల్లదా అని కాదు అది ఎలుకలను పడుతుందా లేదా అన్నది ముఖ్యం అన్నట్లుగా కమ్యూనిస్టు చైనా లేదా పెట్టుబడిదారీ అమెరికా అన్నది ముఖ్యం కాదు, తమకు లాభాలు దేనితో ఉంటాయన్నదే మన కార్పొరేట్లకు గీటురాయి !

Share this:

  • Tweet
  • More
Like Loading...

రైతాంగానికి పొంచి ఉన్న ముప్పు : ఇండోనేషియా మాదిరే భారత వాణిజ్య ఒప్పందం అన్న ట్రంప్‌, రఘురామ రాజన్‌ హితవచనం తలకెక్కుతుందా!

19 Saturday Jul 2025

Posted by raomk in BJP, Current Affairs, Economics, Environment, Farmers, Health, History, INDIA, NATIONAL NEWS, Opinion, Prices, USA

≈ Leave a comment

Tags

Agri subsidies, BJP, Donald trump, Handling US Tariffs, India’s Poultry Industry, Indian Dairy Farmers, indian farmers, Indian poultry farmers, Narendra Modi Failures, Raghu ram rajan

ఎం కోటేశ్వరరావు


అమెరికా అధినేత డోనాల్డ్‌ ట్రంప్‌ విధించిన వాణిజ్య ఒప్పంద బెదిరింపు గడువు ఆగస్టు ఒకటవ తేదీ దగ్గరపడుతున్నది. ఏం చేస్తే దేశీయంగా ఏ పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందో అన్న ఆందోళనలో ప్రధాని నరేంద్రమోడీ ఉన్నారు. జూలై 21వ తేదీ నుంచి పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి. ఆపరేషన్‌ సిందూర్‌తో పాటు వాణిజ్య ఒప్పందం గురించి ప్రతిపక్షాలు నిలదీసే అవకాశం ఉంది. ఇరుదేశాల లావాదేవీలలో పైచేయిగా ఉన్నా ఒకటికి పదిసార్లు మనవారు ట్రంప్‌ గడప తొక్కటమే ఒక బలహీన సూచన. ఇండోనేషియాతో కుదుర్చుకున్న ఒప్పందం మాదిరే భారత్‌తోనూ ఉండబోతోందని ట్రంప్‌ ఇప్పటికే ఒక లీకు వదిలాడు.వాణిజ్య చర్చల్లో డోనాల్ట్‌ ట్రంప్‌తో జాగ్రత్తగా ఉండండి, ముఖ్యంగా విదేశీ సబ్సిడీలు ఎక్కువగా ఉండే వ్యవసాయరంగంలో కుదుర్చుకొనే ఒప్పందాలు దేశంలోని చిన్న రైతులకు హానికరంగా ఉంటాయని రిజర్వుబ్యాంకు మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ హెచ్చరించారు. పిటిఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ ఎలాంటి ఆటంకాలు లేని వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులు హానికలిగిస్తాయన్నారు. బహుశా ఇండోనేషియా ఒప్పందం గురించి ఉప్పంది ఉంటుంది.మన దేశంలోకి బయటి నుంచి మరిన్ని పాల ఉత్పత్తులను స్వాగతించటం కంటే ఆ రంగంలో విలువ ఆధారిత ఉత్పత్తుల పెంపుదలకు ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానించాలని రాజన్‌ చెప్పారు. అమెరికా పన్నులతో ఆరు నుంచి ఏడు శాతం మధ్య ఉన్న మన జిడిపి వర్తమాన వృద్ధి రేటు స్వల్పంగా తగ్గుతుందని, చైనా వస్తువులపై పన్నులు ఎక్కువగా ఉన్నందున ప్రత్నామ్నాయంగా మన ఎగుమతులు పెరగవచ్చని అన్నారు.


లోకం దృష్టిలో ఎంతటి సమర్ధులైనా ఏదో ఒక సమయంలో ఏదో ఒక సమస్యతో అల్లాడిపోకతప్పదు. ఇప్పుడు ప్రధాని నరేంద్రమోడీ స్థితి అదేనా ? కరవ మంటే కప్పకు, విడవ మంటే పాముకు కోపం తెలిసిందేగదా ! ఇక్కడ భారతీయులు కప్పలు, అమెరికా కార్పొరేట్లు పాములు. సుత్తిలేకుండా సూటిగా చెప్పాలంటే మన మార్కెట్‌ను తెరవాలని ట్రంప్‌ వత్తిడి తెస్తుంటే మన జనాలు ఎలా స్పందిస్తారో అని మోడీ ఎటూతేల్చుకోలేకపోతున్నారు. జూలై తొమ్మిదవ తేదీలోగా ఒప్పందంపై సంతకాలు జరగాల్సిందే అని వత్తిడి చేసిన డోనాల్డ్‌ ట్రంప్‌ ఆగస్టు ఒకటవ తేదీ వరకు గడువు పొడిగించాడు. ఒప్పందం కుదిరిందన్నట్లుగా ఎప్పటి నుంచో పదేపదే చెబుతున్నప్పటికీ మన పాలకులు మౌనం తప్ప మాటలేదు. మీడియాలో రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి.అయినా స్పందన లేదు. పోనీ ప్రతిపక్షాలను పిలిచి సమస్యలు, సవాళ్ల గురించి ఏదైనా సలహాలు తీసుకున్నారా అంటే అదీ లేదు, అంతా గుంభనం.
భారత్‌తో కుదిరే ఒప్పందం ఇండోనేషియాతో కుదిరిన దానికి ప్రతిబింబంగా ఉంటుందని ట్రంప్‌ సూచన ప్రాయంగా చెప్పాడు. ఆగస్టు ఒకటవ తేదీలో ఒప్పందానికి రాకుంటే ఇండోనేషియా ఉత్పత్తులపై 32శాతం దిగుమతి పన్ను విధిస్తామని లేఖా బెదిరింపులో పేర్కొన్నాడు. పద్దెనిమిది బిలియన్ల డాలర్ల మేర వాణిజ్య మిగులుతో ఉన్న ఇండోనేషియాతో కుదిరిన ఒప్పందం ప్రకారం 32కు బదులు 19శాతం పన్ను విధిస్తారు. అయితే అమెరికా వస్తువులపై ఇండోనేషియాలో ఎలాంటి పన్నులు ఉండవని ట్రంప్‌ చెప్పాడు. పశుపెంపకదారులు, రైతులు, మత్స్యకారుల ఉత్పత్తులను సులభంగా ఇండోనేషియాలో అమ్ముకోవచ్చని అన్నాడు. అయితే ఒప్పంద వివరాలు ఇంకా వెల్లడి కాలేదు గానీ, నామ మాత్ర పన్నులు ఉండవచ్చని భావిస్తున్నారు. ఇది ఇండోనేషియాకు నష్టదాయకమని నిపుణులు వ్యాఖ్యానించారు. అమెరికా వస్తువులకు పూర్తి మార్కెట్‌ను తెరుస్తారు. బోయింగ్‌ 777 రకం 50విమానాలను, 15బిలియన్‌ డాలర్ల ఇంథనం, 4.5 బిలియన్‌ డాలర్ల వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు ఇండోనేషియా అంగీకరించింది. వారు విమానాలను ఆమ్ముకోవాలి, మాకు వాటి అవసరం ఉందని అధ్యక్షుడు ప్రభువు సుబియాంతో చెప్పాడు. ఎలాంటి పన్నులు లేకుండా అమెరికా వస్తువులను దిగుమతి చేసుకుంటున్నారా అన్న ప్రశ్నకు సూటిగా చెప్పకుండా ప్రతిదాన్నీ సంప్రదిస్తున్నామని మాత్రమే అన్నాడు. పాదరక్షలు, దుస్తులు, పామాయిల్‌ను ఇండోనేషియా ఎగుమతి చేస్తున్నది.


పరస్పర లబ్ది చేకూర్చే నూతన యుగం అని ఒప్పందం గురించి ఇండోనేషియ నేత ప్రభువు వర్ణించగా కొత్త పన్నుల విధానంతో గణనీయ మొత్తంలో పెట్టుబడులను ఆకర్షిస్తామని, ఎగుమతులు పెరుగుతాయని వాణిజ్య మంత్రి బుడి సంతోసో అన్నాడు. ఒప్పందం ప్రతికూలంగా ఉంటుందని ఒక ఇండోనేషియా అధ్యయన సంస్థ డైరెక్టర్‌ భీమా యుధిష్టిర చెప్పాడు.(ఇండోనేషియాలో ముస్లింల పేర్లు మహాభారత, రామాయణ,పురాణాల్లోవే ఎక్కువగా ఉంటాయి). ఎగుమతులు పెరిగినా అమెరికా నుంచి దిగుమతులు ఇబ్బడిముబ్బడి అవుతాయన్నాడు. వియత్నాం పోటీ సామర్ధ్యం ఎక్కువ, రెండు దేశాలకు పన్నుల్లో ఇండోనేషియాకు ఒకశాతమే తక్కువ గనుక పోటీలో నష్టపోతామని చెప్పాడు. అమెరికా నుంచి దిగుమతి చేసుకొనే వస్తువులు స్థానికంగా ఉత్పత్తి చేసేవే అయితేగనుక దేశీయ పరిశ్రమలకు దెబ్బ అని ప్రొఫెసర్‌ విశాంతి చెప్పారు. స్థానిక వస్తువుల బదులు విదేశీ వస్తువులతో మార్కెట్‌ను నింపితే ప్రతికూలమే అని అమె అన్నారు.

గూగుల్‌తల్లిని అడిగితే కృత్రిమ మేథ రూపంలో అందించిన సమాచారం ప్రకారం అమెరికాలో కోడి మాంసం ధరలు అన్ని చోట్లా ఒకే విధంగా లేవు.ఉదాహరణకు సెలీనా వాముసీ వివరాల మేరకు పౌండు(450గ్రాములు) ధర 1.6 నుంచి 2.97 డాలర్ల వరకు ఉంది. అదే గ్రేజ్‌కార్ట్‌ వివరాల ప్రకారం డజను కోళ్ల ధర 428 డాలర్లు, ఒక్కొక్కదాని ధర 35.67 డాలర్లు, ఒక్కో కోడి సగటున 4.2 పౌండ్లు, అంటే రెండు కిలోలకు వంద గ్రాములు తక్కువ.హడ్సన్‌ వాలీ కోళ్ల ఫారంలో 4 పౌండ్ల బరువు ఉండే ఒక మొత్తం కోడి ధర 18 డాలర్లు. చికెన్‌ బ్రెస్ట్‌ ధర పౌను 8.5 నుంచి 12 డాలర్ల వరకు, కోడి డ్రమ్‌స్టిక్స్‌ వెల 4.99, కాళ్ల ధర 5.36 డాలర్ల వరకు ఉంది. అమెరికాలో కోడి కాళ్లు తినరు. అందుకే బ్రెస్ట్‌, కాళ్ల ధరలో అంత తేడా ఉంది. ఎప్పటి నుంచో అమెరికన్లు తమ దగ్గర గుట్టలుగా పడిఉన్న కోడి కాళ్లను మన దేశానికి ఎగుమతి చేయాలని చూస్తున్నారు. అమెరికాతో పోలిస్తే మనదేశంలో కోడి మాంసం ధర తక్కువ. అందువలన అంతకు మించి ఎక్కువ ఉంటే దిగుమతి చేసుకున్న సరకును కొనుగోలు చేసే అవకాశం లేదు. కనుక మన ధరలకు సమానంగా ఉండేట్లు చూస్తారు. అందుకు గాను అమెరికా ప్రభుత్వం పెద్ద మొత్తంలో సబ్సిడీ ఇస్తుంది, మన ప్రభుత్వం దిగుమతులపై సుంకాన్ని గణనీయంగా తగ్గించాల్సి ఉంటుంది. అదే జరిగితే మన కోళ్ల పరిశ్రమ కుదేలే.

తమ కోడి మాంస ఉత్పత్తులకు మార్కెట్‌ తెరవాలని, దిగుమతి పన్ను తగ్గించాలని అమెరికా పదేండ్ల క్రితమే మోడీ సర్కార్‌ మీద వత్తిడి తెచ్చింది. దాన్ని మన యావత్‌ పరిశ్రమ వర్గాలు వ్యతిరేకించాయి.వెనక్కు తగ్గిన కేంద్రం తరువాత ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనల పేరుతో టర్కీ, బాతు మాంసంపై ఉన్న 30శాతం పన్నును ఐదుశాతానికి తగ్గించింది. కోళ్ల ఉత్పత్తులపై వందశాతం పన్ను అమలు చేస్తున్నారు.చిన్నా, పెద్ద రైతులు, వారి మీద ఆధారపడిన వారు కోళ్ల పెంపకంలో 30లక్షల మంది ఉన్నారు. అమెరికా తెస్తున్న వత్తిడిలో జన్యుమార్పిడి మొక్కజొన్నల దిగుమతి కూడా ఒకటి. ఇది కూడా మన రైతాంగాన్ని దెబ్బతీసేదే. మొక్క జొన్నల దిగుమతి అనుమతించాలని కోళ్ల పరిశ్రమవారు, కూడదని సాగు రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. ఇది మిత్ర వైరుధ్యం.ఎవరి లాబీ బలంగా ఉంటే వారి ప్రయోజనం నెరవేరే అవకాశం ఉంది, అయితే దానికి ప్రతికూల ఫలితాలను కూడా పాలక పార్టీ అనుభవించాల్సి ఉంటుంది. శ్రీలంకలో కోడి మాంస ఉత్పత్తుల దిగుమతులను అనుమతించటంతో అక్కడి పరిశ్రమ దెబ్బతిన్నది. ఇప్పుడు మొక్కజొన్నల దిగుమతి కోసం పరిశ్రమ, వద్దంటూ రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.దిగుమతి చేసుకున్న సరకు కిలో ధర 0.43 నుంచి 0.46 డాలర్లు గిడుతున్నది, తమకు 0.56 డాలర్లు వస్తే తప్ప గిట్టుబాటు కాదు గనుక దిగుమతులు వద్దని, దిగుమతి సుంకం పెంచాలని రైతులు అంటున్నారు. కోళ్ల పరిశ్రమ దీన్ని వ్యతిరేకిస్తున్నది ప్రస్తుతం కిలోకు 0.08 డాలర్లు దిగుమతి పన్ను ఉందని, ఇంకా పెంచితే కోడి మాంసం, గుడ్ల ధరలు పెరుగుతాయని, తమకు గిట్టుబాటు కాదని వారంటున్నారు.

అమెరికా పాడి ఉత్పత్తులకు మనం ద్వారాలు తెరిస్తే సగటున 15శాతం మేరకు పాల ధరలు పతనమై ఏటా రు.1.8లక్షల కోట్లు నష్టం వస్తుందని, దానిలో రైతులు రు.1.03లక్షల కోట్లు నష్టపోతారని స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా( ఎస్‌బిఐ) అధ్యయనం హెచ్చరించింది. భారీ మొత్తంలో దిగుమతులు పెరిగి కోట్లాది మంది రైతుల జీవితాలు దెబ్బతింటాయని పేర్కొన్నది.(పాడి పరిశ్రమపై ఎనిమిది కోట్ల మంది ఆధారపడి ఉన్నారని ఒక అంచనా) పాల ధరలు తగ్గితే గిరాకీ 1.4 కోట్ల టన్నులు పెరుగుతుందని, అదే సమయంలో 1.1 కోట్ల టన్నుల సరఫరా తగ్గుతుందని, రెండిరటి మధ్య తేడా 2.5 కోట్ల టన్నులను దిగుమతుల ద్వారా పూడ్చుకోవాల్సి ఉంటుందని, చిన్న డైరీలు, రైతులు తీవ్రంగా దెబ్బతింటారని కూడా ఎస్‌బిఐ హెచ్చరించింది. అమెరికా జన్యుమార్పిడి ఉత్పత్తులతో ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయని పేర్కొన్నది. వాణిజ్య ఒప్పందం కుదిరితే జపాన్‌, మలేసియా, దక్షిణ కొరియాల నుంచి అమెరికాకు రసాయనాల ఎగుమతులు తగ్గి మన ఎగుమతులు మరొక శాతం పెరుగుతాయని జిడిపి0.1శాతం పెరుగుతుందని, దుస్తుల ఎగుమతులు ఆరు నుంచి 11శాతానికి పెరుగుతాయని చెప్పింది. జనరిక్‌ ఔషధాలతో పాటు ఆర్గానిక్‌ వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు ప్రస్తుతం ఉన్న ఒక బిలియన్‌ నుంచి మూడు బిలియన్‌ డాలర్ల వరకు పెరుగుతాయని పేర్కొన్నది.ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందం రెండంచుల పదును గల కత్తి వంటిదని కూడా హెచ్చరించింది. అమెరికా పాడి ఆవులకు ఇచ్చే మేతలో జంతు సంబంధిత అంశాలు లేవని నిర్ధారిస్తూ హామీ ఇవ్వాలని భారత్‌ గతంలో పేర్కొన్నది. ఇప్పుడు దానికి కట్టుబడి ఉందా లేదా అన్నది ఒక చర్చ సాగుతున్నది. అలాంటి పాలను మాంసాహారంగా పరిగణించే 30శాతం మందిగా ఉన్న శాఖాహారులు వాటి ఉత్పత్తులైన జున్ను, వెన్న, పాలను భుజించేందుకు అంగీకరించరు. మొత్తం మీద వ్యవసాయం, అనుబంధ పాడి, కోళ్ల పెంపకం వంటి మీద ఏం జరుగుతుందో అన్న అనుమానం, భయం రైతాంగంలో ఉన్నాయి. ట్రంప్‌ చెప్పినట్లు ఇండోనేషియా మాదిరి మనతో ఒప్పందం ఉంటే అది కచ్చితంగా ముప్పే. మోడీ దేవుడు అని నమ్ముతున్నవారికి ఒప్పందం పీక్కుతినే దెయ్యంగా మారుతుందా ఏం జరుగుతుందో చూడాల్సిందే !

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఉక్రెయిన్‌ పోరుకు 50 రోజుల గడువు : తగ్గేదేలే అన్న పుతిన్‌, మాటమార్చిన ట్రంప్‌!

16 Wednesday Jul 2025

Posted by raomk in Current Affairs, Economics, Europe, Germany, History, imperialism, International, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, USA, WAR

≈ Leave a comment

Tags

Donald trump, Trump 50 days ultimatum, Ukraine crisis, US Patriot to Ukraine via Europe, Vladimir Putin, Volodymyr Zelensky

ఎం కోటేశ్వరరావు


రానున్న యాభై రోజుల్లో ఉక్రెయిన్‌పై దాడులను ఆపకపోతే తీవ్రమైన ఆంక్షలు విధిస్తానని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ తాజాగా గడువు ప్రకటించాడు.దీనితో పాటు ఉక్రెయిన్‌కు పేట్రియాట్‌ క్షిపణులు అందిస్తానని కూడా వెల్లడిరచాడు. ఈ బెదిరింపు, ఆయుధ సరఫరాను చూసి భయపడేదేలేదని, పోరు కొనసాగింపుకే వ్లదిమిర్‌ పుతిన్‌ ముందుకు పోవాలనే వైఖరితో ఉన్నట్లు మాస్కో వర్గాలు చెప్పినట్లు రాయిటర్‌ వార్త పేర్కొన్నది. ఇదిలా ఉండగా మాస్కోపై ఎలాంటి దాడులు చేయవద్దని ఉక్రెయిన్‌ నేత జెలెనెస్కీని ట్రంప్‌ ఆదేశించాడు, బెదిరించిన ఒక రోజులోనే ట్రంప్‌ మాట మార్చాడు. ఉక్రెయిన్‌ సంక్షోభం బుధవారం నాటికి 1,238వ రోజులో ప్రవేశించింది. పరస్పరదాడులు సాగుతున్నాయి, కొత్త ప్రాంతాలను రష్యా ఆధీనంలోకి తెచ్చుకుంటూనే ఉంది. అధికారం స్వీకరించిన 24గంటల్లో పోరును ఆపివేస్తానని ప్రకటించిన ట్రంప్‌ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని మాటలు మార్చాడో, ప్రగల్భాలు పలికాడో తెలిసిందే. పోరును గనుక ఆపకపోతే రష్యా నుంచి దిగుమతులు చేసుకొనే దేశాలపై 100 శాతం సుంకాలు విధిస్తానని తాజాగా బెదిరించాడు, కొద్ది రోజుల క్రితం 500శాతం అని చెప్పిన సంగతి తెలిసిందే. జూన్‌ నెల సమాచారం ప్రకారం మనదేశం రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్న ముడి చమురు రోజుకు 20.8లక్షల పీపాలకు చేరి పదకొండు నెలల గరిష్ట రికార్డును సృష్టించింది. తాజా సమాచారం ప్రకారం రష్యా నుంచి తమ అవసరాల్లో చైనా 47, భారత్‌ 38, ఐరోపా యూనియన్‌, టర్కీ ఆరేసి శాతాల చొప్పున దిగుమతి చేసుకుంటున్నాయి. మన దేశం ఇతర దేశాల నుంచి చూస్తే ఇరాక్‌ 18.2, సౌదీ అరేబియా 12.1, యుఏయి 10.2, అమెరికా నుంచి 6.3శాతాల చొప్పున దిగుమతి చేసుకుంటున్నాము.

సోమవారం నాడు ప్రగల్భాలు పలికిన ట్రంప్‌ మంగళవారం నాడు మాట మార్చాడు.దీర్ఘశ్రేణి క్షిపణులను ఉక్రెయిన్‌కు ఇచ్చే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు లేదు, ఆలాంటి ఆలోచన చేయటం లేదని చెప్పాడు. జూలై నాలుగవ తేదీన మాస్కో, సెంట్‌పీటర్స్‌బర్గ్‌లపై దాడి చేయగలరా అంటూ ఫోన్లో జెలెనెస్కీని ట్రంప్‌ అడగ్గా కచ్చితంగా మీరు గనుక మాకు ఆయుధాలిస్తే కొడతాం, రష్యా పట్టణాల మీద దాడి చేసి వారికి నొప్పితెలిసేట్లు చేయండని ట్రంప్‌ వ్యాఖ్యానించినట్లు ఫైనాన్సియల్‌ టైమ్స్‌ రాసింది. హత్యలను ఆపాలని కోరుతున్న తాను, పోరు ఆపాలని, మానవత్వంవైపు తప్ప ఎవరి పక్షమూ కాదని మంగళవారం నాడు అధ్యక్ష భవనంలో ట్రంప్‌ విలేకర్లతో చెప్పాడు. అధ్యక్షుడు కేవలం ప్రశ్నలను అడిగాడు తప్ప హింసాకాండను ప్రోత్సహించేందుకు కాదని ట్రంప్‌ ప్రతినిధి చెప్పాడు. సైనిక చర్య ముగింపు గడువు విధింపు, ఆధునిక ఆయుధాలు అందచేయాలన్న ట్రంప్‌ ప్రకటనను రష్యా నేత పుతిన్‌ ఖాతరు చేయలేదని రాయిటర్స్‌ పేర్కొన్నది. మిలిటరీ చర్యను ముగించే ఆలోచనలో కూడా లేదని, లక్ష్యాన్ని సాధించేవరకు కొనసాగుతుందని క్రెమ్లిన్‌ వర్గాలు తెలిపినట్లు వెల్లడిరచింది. ట్రంప్‌, పశ్చిమదేశాల బెదిరింపులకు భయపడటం లేదని యుద్ధం కొనసాగించటానికి వీలుగా తమ ఆర్థిక పరిస్థితి ఉందని అన్నట్లు కూడా రాసింది.


గత కొద్ది నెలలుగా ముఖ్యంగా ట్రంప్‌ గెలిచిన తరువాత ఉక్రెయిన్‌కు ఆయుధ సరఫరాల గురించి అమెరికా, ఇతర నాటో కూటమి దేశాలు తర్జన భర్జనలో ఉన్నాయి. ట్రంప్‌ ఓవల్‌ ఆఫీసులో సోమవారం నాడు నాటో ప్రధాన కార్యదర్శి మార్క్‌ రూటే భేటీ జరిపినపుడు ట్రంప్‌ తమ నిర్ణయాన్ని వెల్లడిరచాడు. యాభై రోజుల్లో గనుక పోరు విరమణ ఒప్పందం కుదరకపోతే వందశాతం పన్నులు విధిస్తాం, దాని అర్ధం మీకు తెలిసిందే, అనేక అంశాలపై వాణిజ్యాన్ని వినియోగిస్తాను, అవి యుద్ధాల పరిష్కారాలకు ఎంతో దోహదం చేస్తాయి అన్నాడు. ఆపరేషన్‌ సిందూర్‌ నిలిపివేసి పాకిస్తాన్‌తో రాజీకి వచ్చే విధంగా భారత్‌ను రప్పించేందుకు వాణిజ్య ఆయుధాన్ని వినియోగించినట్లు చెప్పిన అంశాన్ని ఇక్కడ గుర్తుకు తెచ్చుకోవటం అవసరం. తమ అధ్యక్షుడు చెప్పిన పన్నుల విధింపు అంటే రష్యాతో వాణిజ్యం చేసే ఇతర దేశాల మీద అని అధికారవర్గాలు వివరించాయి. రష్యాతో అమెరికా వాణిజ్యం పెద్దగా ఏమీ లేదు గనుక దాని మీద అపరాధ సుంకాలు విధించేదేమీ ఉండదు. వాస్తవానికి రష్యా మీద ఆంక్షలేమీ ఉండవని, దాని దగ్గర నుంచి చమురు కొనుగోలు చేసేవారి మీద విధించే పన్నుల గురించి ట్రంప్‌ చెప్పినట్లు నాటోలో అమెరికా రాయబారి వైట్‌కర్‌ మాట్‌ చెప్పాడు.ఈ చర్యతో రష్యాపై నాటకీయంగా ప్రతికూల ప్రభావాలు ఉంటాయని అన్నాడు. అయితే అమెరికా బెదిరింపులను గతంలోనే అమెరికా, భారత్‌ ఖాతరు చేయని సంగతి తెలిసిందే. రష్యా కూడా లెక్క చేయలేదు.


గత ఆరునెలలుగా పుతిన్‌తో సంప్రదింపుల గురించి చెబుతున్నప్పటికీ ఉక్రెయిన్‌పై దాడులు పెరుగుతున్నాయే తప్ప తగ్గలేదని రష్యాతో వాణిజ్యం చేసే దేశాలపై 500శాతం పన్ను విధించాలనే తీర్మానాన్ని పార్లమెంటులో ప్రవేశపెడతానని చెప్పిన సెనెటర్‌ లిండ్సే గ్రాహమ్‌ చెప్పాడు. గొప్పలు చెప్పుకున్న ట్రంప్‌ అది జరగకపోవటంతో అవమానభారంతో ఏం
మాట్లాడుతున్నాడో, ఏం చేస్తాడో తెలియని స్థితిలో ఉన్నాడంటే అతిశయోక్తి కాదు. పుతిన్‌ సేనలు, రష్యాపై దాడులు చేసేందుకు పేట్రియాట్‌ క్షిపణులు ఇస్తామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించి సంక్షోభాన్ని మరోమలుపు తిప్పాడు. పరిష్కరించాలనే చిత్తశుద్ది అమెరికాకు లేదన్నది స్పష్టం. ఈ క్షిపణి విధ్వంసక వ్యవస్థ ధర ఒక్కొక్కటి 40లక్షల డాలర్లు ఉంటుంది. ఉక్రెయిన్‌కు సరఫరా చేసే ఆయుధాలను ఐరోపాకు విక్రయించి అక్కడి నుంచి ఉక్రెయిన్‌కు తరలించే విధంగా అమెరికా నిర్ణయించింది. కీలక ఆయుధ సరఫరా నిలిపివేస్తున్నట్లు ప్రకటించి రష్యాను బుట్టలో వేసుకోవాలని ట్రంప్‌ చూశాడు. ఆ పప్పులు ఉడకలేదు, దాంతో ఆయుధాల సరఫరా పునరుద్దరించనున్నట్లు అమెరికా అధికారులు వెల్లడిరచారు. మరోవైపున శాంతి చర్చలకు చొరవ చూపేందుకు పోప్‌ లియో సుముఖంగా ఉన్నారని ఆయనను కలిసిన తరువాత జెలెనెస్కీ ప్రకటించాడు. దాని గురించి ఎటూ తేలక ముందే సరికొత్త ఆంక్షల గురించి ట్రంప్‌ ప్రకటించాడు. పుతిన్‌ గురించి నోరుపారవేసుకున్న ట్రంప్‌ తీరును తాము పట్టించుకోవటం లేదని గతవారంలో రష్యా స్పందించింది.ఆయుధ ఒప్పందం ఆటతీరునే మార్చి వేస్తుందని రూటే వర్ణించాడు.జర్మనీతో సహా ఫిన్లాండ్‌, డెన్మార్క్‌, స్వీడన్‌, నార్వే వంటివి అమెరికా నుంచి తీసుకొని నూతన ఆయుధాలను సరఫరా చేస్తాయని చెప్పాడు. తాను ముందుగా ఐరోపా దేశాలు ఇలాంటి చొరవ తీసుకుంటాయని అనుకోలేదని కానీ అవి చేశాయని ట్రంప్‌ అభినందించాడు.త్వరలో మరికొన్ని క్షిపణులను కూడా అందించేందుకు అమెరికా పూనుకుంది. రష్యా క్షిపణులను అడ్డుకొనేందుకు పేట్రియాట్‌ వ్యవస్థలను వినియోగిస్తామని, అయితే ఎదురుదాడి చేసే ఆయుధాలను కూడా ఇచ్చే అవకాశం ఉందని నాటోలో అమెరికా రాయబారి చెప్పాడు. నేరుగా ఉక్రెయిన్‌కు ఆయుధాలు విక్రయిస్తే వచ్చే విమర్శల నుంచి తప్పుకొనేందుకు, తన చేతికి మట్టి అంటకుండా, ఖజానా మీద భారం మోపకుండా ఐరోపా దేశాలకు ఆయుధాలను విక్రయించి అటు నుంచి తరలించేందుకు ట్రంప్‌ వేసిన ఎత్తుగడ ఇది.


అధికారానికి వచ్చిన తరువాత ఆర్భాటంగా పుతిన్‌తో నేరుగా మాట్లాడాడు. రష్యాకు రాయితీలు ఇవ్వాల్సిందే, కొన్ని ప్రాంతాలు వదులుకోవాల్సిందే, మేం 350 బిలియన్‌ డాలర్లు ఇచ్చినా యుద్దంలో గెలిచేది లేదు చచ్చేది లేదని జెలెనెస్కీతో చెప్పాడు. అతగాడిని మంచి హాస్యనటుడు అంటూనే ఎన్నికలు జరపని నియంత అన్నాడు.ఫిబ్రవరి 28న అధ్యక్ష భవనంలో బహిరంగంగా ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెనెస్కీని అవమానించి ఐరోపా భాగస్వాములను నిర్ఘాంతపరిచాడు. రష్యాను ఖండిస్తూ ఐరాసలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని వ్యతిరేకించాడు.ఐరోపా దేశాలన్నీ ఈ తీరును చూసి నిజంగానే ట్రంప్‌ తమను వదలి పుతిన్‌తో చేతులు కలిపి ఉక్రెయిన్ను అప్పగిస్తాడా అన్నంతగా భయపడ్డాయి. చివరికి భద్రతా మండలిలో రష్యామీద ఎలాంటి విమర్శలు లేని తీర్మానానికి మద్దతు ఇచ్చాయి. ఈలోగా ఉక్రెయిన్‌లోని విలువైన ఖనిజాలున్న ప్రాంతాన్ని తమకు అప్పగించాలని అమెరికా రాయించుకొని ఒప్పందం చేసుకుంది. ఎత్తుగడ ఏమిటో తెలియదు గానీ పదేండ్ల క్రితమే పుతిన్‌ గురించి ట్రంప్‌ పొగడ్తలు ప్రారంభించాడు. గత వారంలో చెప్పిన అంశాల సారాంశం ఇలా ఉంది. పుతిన్‌ పైకి కనిపించేంత మంచి వాడు కాదు, నేను ఎంతో ఆశాభంగం చెందాను, అతన్ని హంతకుడు అని చెప్పాలనుకోవటం లేదు కానీ గట్టి పిండం అని ఎన్నో సంవత్సరాలుగా రుజువైంది. బిల్‌క్లింటన్‌, బుష్‌,ఒబామా,జో బైడెన్‌ అందరినీ వెర్రి వెంగళప్పలను గావించాడు గానీ నన్ను చేయలేకపోయాడు.. ఒక రోజు ఇంటికి వెళ్లి నా సతీమణితో మాట్లాడుతూ నేను ఈ రోజు పుతిన్‌తో మాట్లాడాను, అద్భుతతమైన సంభాషణ చేశాను తెలుసా అని చెప్పాను. ఆమె తాపీగా అవునా నిజమేనా అంటూ మరో(ఉక్రెయిన్‌) పట్టణంపై దాడి జరిగింది అని చెప్పింది అన్నాడు. ఎవరైనా నేతలు అతగాడితో ఫోన్లో మాట్లాడుతుండగానే ఉక్రెయిన్‌పై దాడులు చేయిస్తుంటాడు అని ట్రంప్‌ చెప్పాడు.


గత గురువారం నాడు రోమ్‌ నగరంలో ఉక్రెయిన్‌ స్వస్థత సమావేశం జరగటానికి ముందు జెలెనెస్కీ ఇటలీలో ట్రంప్‌ ప్రతినిధి కెయిత్‌ కెలోగ్‌తో సమావేశం సందర్భంగా రష్యా దాడులను తీవ్రం కావించింది. పోప్‌ లియోను రెండు నెలల్లోనే జెలెనెస్కీ రెండుసార్లు కలిశాడు. పోరు ఇంకా కొనసాగుతుండగానే ఉక్రెయిన్‌ పునరుద్దరణ పథకాలు దానికి అవసరమైన పెట్టుబడులు, దానిలో పాలుపంచుకొనే దేశాలు, నిర్మాణ సంస్థల గురించి పశ్చిమదేశాలు వాణిజ్య చర్చలు జరిపాయి. ఇప్పటికే ఐరోపాలో ఉన్న పేట్రియాట్‌ క్షిపణులను వెంటనే ఉక్రెయిన్‌కు తరలించి మిగతావాటిని అమెరికా ఫ్యాక్టరీల్లో తయారు చేసి అందచేస్తారు. మీరు గనుక ఉక్రెయిన్‌ మీద దాడి చేస్తే నేను మాస్కో మీద బాంబులు వేయిస్తానని పుతిన్‌తో మాట్లాడినపుడు ట్రంప్‌ బెదిరించాడన్న వార్త గుప్పుమన్నది. అయితే వారి మధ్య ఆ సంభాషణ ఎప్పుడు జరిగిందో, అది నిజమో కాదో నిర్ధారణ కాలేదు గానీ, ఆధునిక ఆయుధాలను ఇస్తాన్న ట్రంప్‌ మాటలు దాన్ని నిర్ధారిస్తున్నాయి.కొద్ది వారాల క్రితం రష్యా భూభాగంలో ప్రవేశించి అనేక చోట్ల ఉక్రెయిన్‌ జరిపిన దాడుల వెనుక అమెరికా హస్తం లేదని ఎవరూ చెప్పలేరు.


రష్యా ఆధీనంలోని జపోర్‌రిaయా ప్రాంతంలో ఉన్న అణువిద్యుత్‌ కేంద్రంపై వందలాది రౌండ్ల కాల్పులు జరిపినట్లు అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ చెప్పింది. అక్కడ అణు ప్రమాదం జరిగితే దానికి రష్యాను బాధ్యురాలిగా చేసి వత్తిడి తేవాలన్న కుట్ర దీనిలో కనిపిస్తోంది. దీని వెనుక పశ్చిమ దేశాల హస్తం ఉందని వేరే చెప్పనవసరం లేదు. పేట్రియాట్స్‌తో సహా ఆధునిక ఆయుధాలను అందచేయాలన్న నిర్ణయం నాటకీయంగా జరగలేదు. గత కొద్ది వారాలుగా మల్లగుల్లాలు పడుతున్నారు. వీటితో పుతిన్‌ దారికి వస్తాడని భావిస్తున్నట్లుగా కనిపిస్తున్నది. జూన్‌ లో జరిగిన నాటో సమావేశాల్లో ఒక కొలిక్కి వచ్చిన ఈ ఆలోచనపై అంతకు ముందే విధి విధానాల గురించి చర్చ మొదలైంది.నాటో నేరుగా ఆయుధాలు పంపితే అది రష్యాకు ఒక అస్త్రంగా మారుతుంది, అన్నింటికీ మించి నాటో కూడా యుద్ధంలో పాల్గ్గొన్నట్లే, అందుకే కొన్ని దేశాలను ఎంపిక చేసి వాటి ద్వారా కథనడిపిస్తున్నారు. ఒకవేళ అమెరికా తప్పుకుంటే తామే ఉక్రెయిన్‌కు బాసటగా నిలవాలని ఐరోపా దేశాలు స్థూలంగా ఒక అభిప్రాయానికి వచ్చిన తరువాత అయితే మా దగ్గర ఆయుధాలు కొని మీరే జెలెనెస్కీకి ఇవ్వండని అమెరికన్లు వారిని కట్టుబడేట్లు చేసినట్లు కూడా చెప్పవచ్చు. మీరు ఆధునిక ఆయుధాలు ఇస్తారు, అవి రష్యా క్షిపణులను అడ్డుకుంటాయి సరే, మా కుటుంబాల ప్రాణాలను కాపాడతాయో లేదో చెప్పండని ఉక్రేనియన్‌ సైనికులు కొందరు సిఎన్‌ఎన్‌తో మాట్లాడిన మాటలు ఒక్క మిలిటరీలోనే కాదు, యావత్తు ఉక్రేనియన్లలో ఉంటాయని వేరే చెప్పనవసరం లేదు. అందుకే జెలెనెస్కీ అవమానాలు భరించి కూడా ఆయుధాల కోసం విలువైన ఖనిజాలున్న ప్రాంతాలను అమెరికాకు రాసి ఇచ్చిన తరువాత దేశం మొత్తాన్ని నాటో కూటమికి తాకట్టు పెట్టినా ఆశ్చర్యం లేదు. ఏం జరుగుతుందో చూద్దాం !

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఎడారిలో ఇసుక అమ్మకం – ఎలన్‌ మస్క్‌ అమెరికా పార్టీ !

12 Saturday Jul 2025

Posted by raomk in Current Affairs, Economics, History, imperialism, INTERNATIONAL NEWS, Opinion, Uncategorized, USA

≈ Leave a comment

Tags

America Party, BILLIONAIRE RAJ, Democratic party, Donald trump, Elon Musk, MAGA Republicans, Republican party

ఎం కోటేశ్వరరావు


ప్రపంచ ధనికుడు ఎలన్‌ మస్క్‌ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ మీద ఆగ్రహంతో ‘‘ అమెరికా పార్టీ ’’ పేరుతో రాజకీయ సంస్థను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించేశాడు. దాని మీద రాజకీయ పండితులు చర్చలు చేస్తున్నారు. తమకు ప్రయోజనం కలిగించని లేదా వ్యతిరేకించిన పాలకుల మీద ఆగ్రహించిన వాణిజ్య, పారిశ్రామికవేత్తలు డబ్బుమదంతో తెల్లవారేసరికి పార్టీ పెట్టి తడాఖా చూపుతామంటూ హడావుడి చేయటం అన్ని దేశాలలో జరిగేదే. అమెరికాలో కూడా అదే జరిగింది. ఇప్పుడున్న స్థితిలో అతగాడి ప్రయత్నం ఎడారిలో ఇసుక అమ్మటమే అవుతుందన్నది ఒక వ్యాఖ్య. ట్రంప్‌తో ప్రేమాయణానికి కటీఫ్‌ చెప్పిన తరువాత తన ఫ్యాక్టరీలు, వ్యాపారాలను చూసుకుంటానని చెప్పిన పెద్దమనిషి బిగ్‌, బ్యూటీఫుల్‌( పెద్దది, అందమైన) బిల్లుగా వర్ణించినదానిని పార్లమెంటు గనుక ఆమోదిస్తే తాను రాజకీయ పార్టీని పెడతానని ప్రకటించాడు.ఆమోదం పొందటం, రాజకీయ పార్టీ ప్రకటన వెంటనే జరిగాయి.మఖలో పుట్టి పుబ్బలో అంతరించే పార్టీలు ప్రపంచమంతటా ఉన్నాయి. ఇది కూడా అలాంటిదే అవుతుందా, 24.7బిలియన్‌ డాలర్ల వ్యక్తిగత సంపదతో ప్రపంచ ధనికుడిగా ఉన్న మస్క్‌ డబ్బును వెదజల్లి అమెరికా రాజకీయాలను మలుపుతిప్పుతాడా, అక్కడ ఇప్పటికే తిష్టవేసిన రిపబ్లిన్‌, డెమోక్రటిక్‌ పార్టీలకు ప్రత్యామ్నాయంగా నిలుపుతాడా ? ఇలా పరిపరి విధాలుగా ప్రపంచ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. నిన్నటి వరకు ముద్దులాడుకున్న వారు నేడు దెబ్బలాడుకుంటున్నారు. రేపేం చేస్తారో తెలియదు, రాజకీయాలు, వ్యాపారాల్లో ఏదైనా జరగవచ్చు.


అసలు వారెందుకు విడిపోయారు ? తాను తయారు చేసే టెస్లా విద్యుత్‌ కార్లతో అమెరికాను ప్రపంచాన్ని నింపాలని ఎలన్‌ మస్క్‌ ఆశపడ్డాడు. అందుకు అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ ఉంటే తన ఆటలు సాగించుకోవచ్చనుకున్నాడు. ట్రంప్‌ పలుకుబడితోనే నరేంద్రమోడీపై వత్తిడి తెచ్చి మనదేశంలో స్టార్‌లింక్‌ను సాధించిన సంగతి తెలిసిందే, టెస్లా కార్లను కూడా మార్కెటింగ్‌ చేస్తానని ప్రకటించాడు.మస్క్‌ కంపెనీకి స్థానిక మార్కెట్‌ మొత్తాన్ని అప్పగిస్తే అమెరికాలో పెట్రోలు, డీజిలు, గ్యాస్‌ వ్యాపారం చేసేవారు, వాటితో నడిచే కార్లు తయారు చేసేవారు చేతులు ముడుకు కూర్చుంటారా ? రంగంలోకి దిగి ట్రంప్‌కు వార్నింగ్‌ ఇవ్వటంతో అతగాడు వెనక్కు తగ్గాడు.అక్కడే మొదలైంది రచ్చ. దాన్ని బయటకు చెప్పుకోలేడు గనుక ట్రంప్‌ యంత్రాంగం రూపొందించిన పొదుపు బిల్లు ఆమోదం పొందితే అమెరికా సర్వనాశనం అవుతుందంటూ ధ్వజమెత్తాడు. ట్రంప్‌ ఊరుకుంటాడా ఇలాగే వాగితే నీ కార్లకు ఇస్తున్న సబ్సిడీల మొత్తాన్ని ఎత్తివేస్తా ఆలోచించుకో అన్నాడు. కాస్త మెత్తబడినప్పటికీ ఆవిరైన ప్రేమ తిరిగి చిగురించలేదు, ఛీ పో అంటే ఛా పో అనుకున్నారు. ఇప్పుడేం జరుగుతుందన్నది ఆసక్తి కలిగించే అంశం.


అమెరికాను మరోసారి గొప్పదాన్ని చేయాలనే పిలుపును సమర్ధించిన వారందరికీ మస్క్‌ నిర్ణయం రుచించలేదు.ట్రంప్‌ ద్వారా గరిష్టంగా లబ్దిపొందాలని చూసిన బడాబాబులకు అమెరికా పార్టీ గురించి భయం లేదుగానీ మస్క్‌ తెస్తున్న వత్తిడి గురించి ఎక్కువగా ఆందోళన చెందుతున్నారు. పార్లమెంటు ఆమోదించి ట్రంప్‌ సంతకం అయిన పొదుపు చట్టం అమలు జరిగితే కార్మికవర్గ సంక్షేమ కార్యక్రమాల మీద తొలివేటు పడుతుందనే భయంతో ఇప్పటికే జనం భారీ ఎత్తున రెండుసార్లు నిరసన ప్రదర్శనలు చేశారు.ప్రాధమిక వార్తల ప్రకారం ఇది అమల్లోకి వస్తే కోటీ 30లక్షల మందికి ఆరోగ్యబీమా గల్లంతు లేదా ఉన్నప్పటికీ నిరుపయోగంగా మారుతుందనే విశ్లేషణలు వచ్చాయి.జనాల నుంచి ఎదురయ్యే నిరసనలను ఎలా అణచివేయాలా అని చూస్తుంటే మధ్యలో మస్క్‌ గొడవేంటని ఇతర కార్పొరేట్‌ శక్తులు చిరాకు పడుతున్నాయి. ట్రంప్‌ చట్టంతో ఇప్పటికే ఉన్న దేశ రుణానికి మరో నాలుగున్నరలక్షల కోట్ల డాలర్లు తోడవుతుందని మస్క్‌ ధ్వజమెత్తాడు. ఇప్పటికే జిడిపిలో 122శాతం 36.2లక్షల కోట్ల డాలర్ల అప్పు ఉంది. దాన్ని మరో నాలుగులక్షల కోట్ల డాలర్లు పెంచుకొనేందుకు మే నెలలో అనుమతి ఇచ్చారు, ఇప్పుడు మరో ఐదు లక్షల కోట్లడాలర్ల వరకు పెంచాల్సి ఉంటుంది. దక్షిణాఫ్రికాలో జన్మించి 2002లో అమెరికా పౌరసత్వం పొందిన మస్క్‌కు కెనడా పౌరసత్వం కూడా ఉంది. నిబంధనల ప్రకారం అమెరికా గడ్డమీద పుట్టిన వారు మాత్రమే అధ్యక్షపదవికి అర్హులు. ప్రస్తుతం రెండు పార్టీలు పోటాపోటీగా పార్లమెంటు ఉభయ సభల్లో సీట్లు తెచ్చుకుంటున్న పూర్వరంగంలో తనకున్న ధనబలంతో సెనెట్‌లో రెండు మూడు, ప్రజాప్రతినిధుల సభలో 8 నుంచి 10 తెచ్చుకుంటే చక్రం తిప్పవచ్చన్నది మస్క్‌ ఎత్తుగడ.తాజాగా మస్క్‌ వ్యతిరేకించిన ట్రంప్‌ ముందుకు తెచ్చిన బిగ్‌, బ్యూటీఫుల్‌ బిల్లు పార్లమెంటులో చావుతప్పి లొట్టపోయినట్లుగా నెగ్గింది. వంద మంది ఉన్న సెనెట్‌లో వ్యతిరేక, అనుకూల ఓట్లు 50 చొప్పున రాగా ఉపాధ్యక్షుడిగా ఉన్న జెడి వాన్స్‌ తన నిర్ణయాత్మక ఓటుతో బిల్లును గట్టెక్కించాడు. ప్రజాప్రతినిధుల సభలో రిపబ్లికన్లకు 220 ఓట్లు ఉన్నప్పటికీ బిల్లుకు అనుకూలంగా 218 మాత్రమే రాగా 212 ఉన్న డెమోక్రాట్లతో మరో ఇద్దరు అధికారపక్ష సభ్యులు చేతులు కలపటంతో వ్యతిరేకంగా 214 వచ్చాయి. ఇలాంటి సమయాల్లో మూడో పక్షానికి ఎంపీలు ఉంటే కింగ్‌ మేకర్‌లుగా మారతారు. ఎలన్‌ మస్క్‌ ఆకాంక్ష, యత్నం అదే. రెండు పార్టీల విధానాలకు ప్రత్యామ్నాయం గురించి కాదు. గతంలో డెమోక్రటిక్‌ పార్టీకి, గత ఎన్నికల్లో రిపబ్లికన్‌ ట్రంప్‌కు మద్దతు ఇచ్చాడు. ఎవరికి బాసటగా ఉన్న తన లాభమే పరమావధి.

రెండు పార్టీలకు పరిష్కారం తన పక్షమే అని, అమెరికన్లు కోల్పోయిన స్వాతంత్య్రాన్ని తిరిగి ఇస్తానని మస్క్‌ చెప్పాడు. మూడిరట రెండు వంతుల మంది కొత్త పార్టీ కావాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు. ట్రంప్‌ ఏలుబడిలో ప్రభుత్వ సిబ్బంది సామర్ధ్యం పెంచే పేరుతో ఎలన్‌ మస్క్‌ చేపట్టిన డోజ్‌ ఉద్యోగులను తొలగించేందుకు పని చేసింది తప్ప మరొకటి కాదు. ట్రంప్‌ తెచ్చిన చట్టం కార్పొరేట్లకు పన్నుల తగ్గింపు, సామాన్యుల సంక్షేమం కుదింపుకు ఉద్దేశించింది. ప్రస్తుతం 7.1 కోట్ల మంది ఆరోగ్యబీమాపై ఆధారపడి ఉన్నారు. రానున్న పది సంవత్సరాల్లో కోటీ 70లక్షల మంది ఈ పథకానికి దూరం అవుతారు. మనదేశంలో ఆహార భద్రతా పథకం కింద 80 కోట్ల మందికి ఉచిత బియ్యం, గోధుమలు ఇస్తున్నట్లుగానే అమెరికాలో అదనపు పోషకాహారం పేరుతో 4 కోట్ల మంది ఆహార కూపన్లు ఇస్తున్నారు. వీరిలో 47 లక్షల మంది వాటిని కోల్పోతారు. కొత్త చట్టం అమలుచేస్తే సంక్షేమ పథకాలకు లక్ష కోట్లడాలర్లు కోతపడుతుందని అధ్యక్ష భవనం రూపొందించిన పత్రమే చెప్పింది. ఈ సొమ్మును దేనికి ఖర్చు చేస్తారో తెలుసా ! అక్రమంగా సరిహద్దు దాటకుండా ఉండేందుకు మెక్సికో సరిహద్దులో ఏర్పాటు చేసిన ఇనుప గోడకు 46బిలియన్‌ డాలర్లు, వలస వచ్చిన వారికి నిర్బంధ శిబిరాల్లో పడకలకు 45బి.డాలర్లు, వలస వచ్చిన వారిని గుర్తించి 2029 నాటికి దేశం నుంచి తరిమివేసేందుకు అవసరమైన మరో పదివేల మంది సిబ్బంది నియామకానికి ఇలా మొత్తం 350 బిలియన్‌ డాలర్లు ఖర్చు చేయనున్నారు. కొత్త లేదా పాత విద్యుత్‌ కార్లు కొనుగోలు చేసే వారికి ఇస్తున్న పన్ను రాయితీలు సెప్టెంబరు 30తో ముగుస్తాయి, వాటిని 2032వరకు పొడిగిస్తారు. పార్లమెంటు అనుమతి లేకుండా ప్రభుత్వం అప్పులు చేయటానికి లేదు, ఒక పరిమితి ఉంటుంది. అయితే 1960 నుంచి ఇప్పటికి 78 సార్లు నిబంధనలను సవరించారు. ట్రంప్‌ తొలిసారి పాలనా కాలంలో 8లక్షల కోట్ల మేర కొత్త అప్పు చేసేందుకు నిబంధనలు సడలించారు. ఇలాంటి సవరణలకు రెండు పార్టీలూ సై అంటాయి.


అమెరికా రాజకీయాల్లో బ్లాక్‌మెయిల్‌ చేయటం కూడా మామూలే, పెరోట్‌ కుమార్తె గురించి బుష్‌ తప్పుడు ప్రచారం చేయటం, అదివాస్తవం కాదని నిరూపించుకోలేని స్థితిలో 1992 ఎన్నికల్లో తొలుత పోటీ నుంచి వెనక్కు తగ్గాడు, తరువాత తిరిగి రంగంలోకి వచ్చాడు. బుష్‌ కుటుంబం మీద ఉన్న ఆగ్రహంతో రాస్‌ పెరోట్‌ అనే బిలియనీర్‌ 1992 అధ్యక్ష ఎన్నికలలో రిఫామ్‌ పార్టీ పేరుతో పోటీ చేశాడు. బిల్‌ క్లింటన్‌ డెమోక్రటిక్‌ పార్టీ (43) జార్జి బుష్‌ రిపబ్లికన్‌ పార్టీ 37.5 శాతం ఓట్లు తెచ్చుకోగా పెరోట్‌కు 18.9శాతం ఓట్లు వచ్చాయి. అయితే అధ్యక్ష ఎన్నికకు కావాల్సిన ఎలక్టరల్‌ కాలేజీలో ఒక్క ఓటూ రాలేదు. ఎలన్‌ మస్క్‌ కూడా బ్లాక్‌మెయిలింగ్‌లో తక్కువ తినలేదు. ఎప్‌్‌స్టెయిన్‌ అనేవాడు బడాబాబులకు పిల్లల్ని తార్చి డబ్బుగడిరచటంలో పేరు మోశాడు. అతగాడి జాబితాలో డోనాల్డ్‌ ట్రంప్‌ కూడా ఉన్నట్లు విమర్శలు వచ్చాయి. అనుమానాస్పద స్థితిలో వాడు జైల్లో చచ్చాడు. దాంతో ఎప్‌స్టెయిన్స్‌ ఫైల్స్‌ గురించి దర్యాప్తును మూసివేసి పెద్దలను కాపాడారని గుప్పు మంది. అందే అంశాన్ని ట్రంప్‌తో చెడిన తరువాత మస్క్‌ ముందుకు తెచ్చాడు. ఆ విషయాలు అతగాడికి ఎప్పుడో తెలిసినప్పటికీ గత ఎన్నికల్లో ట్రంప్‌కు మద్దతుగా సర్వశక్తులూ వడ్డాడు, తన సామాజిక మాధ్యమం ఎక్స్‌ను ఉపయోగించాడు, పెద్ద మొత్తంలో స్వంతంగా సొమ్ము ఖర్చు చేశాడు. అందువలన పార్టీ పెట్టి తమను దెబ్బతీస్తాడనుకుంటున్నటున్న మస్క్‌ను వేరే రూపంలో దెబ్బతీసే అవకాశాలు లేకపోలేదు.

పార్టీలను ఏర్పాటు చేయటంలోనూ, రాజకీయాల్లో బిలియనీర్లు పాల్గొనటం ఎలన్‌ మస్క్‌తో ప్రారంభం కాలేదు. రెండు సంవత్సరాల క్రితం జరిగిన ఒక అధ్యయనంలో ఫోర్బ్స్‌ రూపొందించిన జాబితా ప్రకారం ప్రపంచంలోని 2072 మంది బిలియనీర్లలో 11శాతం మంది రాజకీయాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అధికారాన్ని చేజిక్కించుకొనేందుకు, తమ ప్రభావాన్ని చూపేందుకు ధనికులు ముందుకు వస్తున్నారనటానికి ఇదొక సూచిక. వారు ఎలాంటి విధానాలకు మద్దతు ఇస్తారో కూడా వేరే చెప్పనవసరం లేదు. వారికి ప్రపంచంలో బలమైన సంబంధాలు ఉన్నప్పటికీ సైద్ధాంతికంగా పెద్దగా తెలియదని తేలింది. ప్రపంచ ధనికుల కేంద్రం అమెరికా అయినప్పటికీ ఇక్కడి బిలియనీర్లు ప్రపంచ సగటు కంటే తక్కువగా కేవలం 3.7శాతమే రాజకీయాల్లో ఉన్నారు. రెండు ప్రధాన పార్టీల్లో వీరు తమను అధ్యక్షపదవి అభ్యర్థులుగా ఎన్నుకోవాలని భారీ మొత్తాల్లో నిధులు ఖర్చు చేశారు.లాస్‌ ఏంజల్స్‌ నగర మేయర్‌ పదవి కోసమే రెండుసార్లు జెబి ప్రిట్జ్‌కర్‌ 35 కోట్ల డాలర్లు ఖర్చు చేశాడంటే అధ్యక్ష పదవికి స్వయంగా లేదా మద్దతు ఇచ్చేవారు ఎంత మొత్తాలు ఖర్చు చేస్తారో అర్ధం చేసుకోవచ్చు. 2022 మధ్యంతర పార్లమెంటు ఎన్నికల్లో రెండు ప్రధాన పార్టీలకు బిలియనీర్లు ఇచ్చిన విరాళాల మొత్తం 88 కోట్ల డాలర్లు. అగ్రస్థానంలో ఉన్న ఇరవై మందిలో 14గురు రిపబ్లికన్‌ పార్టీకి ఇచ్చినట్లు తేలింది. వివిధ దేశాల ప్రభుత్వాలలో కొలువుదీరిన వారు 242 మంది కాగా సగటున 2.5 పదవులు చేపట్టారు. మనకు మిరేజ్‌, రాఫేల్‌ యుద్ద విమానాలు అమ్మిన కంపెనీ యజమాని సెర్గీ దసాల్ట్‌ ఫ్రాన్సులో ఏకంగా 16 పదవుల్లో పని చేశాడు. తన భార్య రాఫేల్‌ పేరునే విమానానికి పెట్టాడు. బిలియనీర్లు నిరంకుశ, నియంత పాలనలోనే ఎక్కువగా పదవుల్లో రాణించారట. అమెరికా బిలియనీర్లలో డెమోక్రాట్ల కంటే రిపబ్లికన్లను సమర్ధించిన వారు రెండున్నరరెట్లు ఎక్కువ, ఐరోపాలో అత్యధికులు మితవాద శక్తుల మద్దతుదార్లు. ఎలన్‌ మస్క్‌ కార్మికవర్గానికి వ్యతిరేకి. వచ్చే ఏడాది జరిగే ఎన్నికలలో అతగాడి పార్టీ గెలుస్తుందో లేదో చెప్పలేము గానీ ఓట్లను చీల్చితే రిపబ్లికన్‌ పార్టీ బలం తగ్గి డెమోక్రాట్లు లాభపడితే ట్రంప్‌కు అడుగుడుగునా ప్రతిఘటన తప్పదు !
 

Share this:

  • Tweet
  • More
Like Loading...

తొంభై రోజులు ముగిసినా 90 ఒప్పందాలు లేవు, భంగపడిన ‘‘ రారాజు ’’ డోనాల్డ్‌ ట్రంప్‌ ! బంతి అమెరికా మైదానంలో ఉందన్న భారత్‌ !!

09 Wednesday Jul 2025

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, Europe, Farmers, Germany, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, RUSSIA, UK, USA

≈ Leave a comment

Tags

BJP, Donald trump, Narendra Modi Failures, Tariff Fight, Trade agreement with US, Trade war Expanding, Trump Letters, Trump tariffs, Vladimir Putin, Xi Jinping


ఎం కోటేశ్వరరావు


తొంభై రోజుల్లో తొంభై ఒప్పందాలు ఏప్రిల్‌ రెండవ తేదీ అమెరికా విముక్తి దినం పేరుతో డోనాల్డ్‌ ట్రంప్‌ పలికిన ప్రగల్భాలలో ఒకటి. ఆ గడువు జూలై 9వ తేదీతో ముగిj. అనుకున్నది పగటికలగా మారింది. దాంతో తమతో ఒప్పందాలకు రాకపోతే అపరాధ సుంకాలు విధిస్తానని ఆగస్టు ఒకటి వరకు అవకాశం ఇస్తున్నట్లు ప్రకటించాడు. బెదిరింపులో భాగంగా పద్నాలుగు దేశాలు ఎంతెంత సుంకాన్ని ఎదుర్కోవాల్సిందీ వెల్లడిస్తూ లేఖల రూపంలో ఆదేశాలను పంపాడు. ఒప్పందాలు కుదుర్చుకోవటం లేదా సిద్దంగా ఉన్నట్లు తిరుగులేఖలు రాయకపోతే ఆగస్టు ఒకటవ తేదీ నుంచి తన సుంకాలు అమల్లోకి వస్తాయన్నాడు. చర్చలకు ఇంకా ద్వారాలు తెరిచే ఉన్నాయని కూడా చెప్పాడు. మాటి మాటికి గడువు పొడిగిస్తా అనుకుంటున్నారేమో నూటికి నూరు శాతం గట్టిగా చెబుతున్నా, వారు గనుక తనకు ఫోన్‌ చేసి వేరే పద్దతులను ఆలోచిస్తున్నట్లు చెబితే సరే, దానికి అవకాశం ఇస్తున్నా లేకపోతే ఏం చేస్తానో తెలుసుగా అన్నట్లుగా పొడిగించిన గడువుకు అయినా కట్టుబడి ఉంటారా లేదా అని అడిగిన విలేకర్లతో చెప్పాడు. ఏప్రిల్‌లో వివిధ దేశాల సరకులపై ఎంత మేరకు పన్ను విధించేది ప్రకటించిన ట్రంప్‌ ఏ దేశమూ ముందుకు రాకపోవటంతో మూడు నెలలపాటు వాయిదా వేస్తున్నట్లు, జూలై 9వ తేదీతో గడువు ముగుస్తుందన్నాడు. అయినప్పటికీ స్పందన లేకపోవటంతో ఆగస్టు వరకు పొడిగిస్తున్నట్లు వెల్లడిరచాడు. ఆలోగా ఒప్పందానికి రాకుంటే ఏప్రిల్‌ రెండవ తేదీన ప్రకటించిన విధంగా పన్నులను విధిస్తామని వాణిజ్యశాఖ మంత్రి లుటినిక్‌ చెప్పాడు. మనదేశంతో ఎనిమిదవ తేదీలోగా ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు లీకులు వదిలిన సంగతి తెలిసిందే. తాజా వార్తలను బట్టి ఆ గడువు ఆగస్టు ఒకటి వరకు పొడిగించినట్లు చెబుతున్నారు. నాటకీయంగా ఏదో కుదిరిందని మొక్కుబడి ప్రకటన చేస్తే చెప్పలేము.మేం చెప్పాల్సింది చెప్పాం, తేల్చుకోవాల్సింది ట్రంపే, బంతి అమెరికా కోర్టులో ఉంది అని మనదేశం తరఫున చర్చల్లో పాల్గొన్న ఒక అధికారి చెప్పినట్లు ఒక వార్త. ఏం జరుగుతుందో చూద్దాం !


రష్యాతో వాణిజ్యం చేస్తే భారత్‌, చైనాలపై 500శాతం పన్నులు విధిస్తానని ట్రంప్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. బ్రిక్స్‌ సమావేశాల్లో అమెరికా బెదిరింపు వైఖరిని విమర్శించిన తరువాత తమ వ్యతిరేక విధానాలను అనుసరించే బ్రిక్స్‌ దేశాలతో వాణిజ్యం జరిపే దేశాల మీద కూడా పదిశాతం పన్ను విధిస్తానని బెదిరింపులకు దిగాడు.ఏకపక్ష పన్ను ప్రకటనలు ప్రపంచ వాణిజ్యాన్ని దెబ్బతీస్తాయని బ్రిక్స్‌ పేర్కొన్నది. వివిధ దేశాలపై డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించిన పన్నుశాతాలు గతంలో ప్రకటించినవి కొన్నింటిలో మార్పులేదు, మరికొన్నింటిని సవరించాడు. ఆయా దేశాల వస్తువులపై జపాన్‌ 25,దక్షిణ కొరియా 25, థాయ్‌లాండ్‌ 36, మలేసియా 25, ఇండోనేషియా 32, దక్షిణాఫ్రికా 30,కంపూచియా 36, బంగ్లాదేశ్‌ 35,కజకస్తాన్‌ 25, ట్యునీసియా 25, సెర్బియా 35,లావోస్‌ 40, మయన్మార్‌ 40 శాతం పన్నులు ఉంటాయి. ఒక వేళ ఈ దేశాలు గనుక ప్రతి సుంకాలు పెంచినట్లయితే తాను ప్రకటించిన మొత్తాల మీద మరో అంత మొత్తం పెంచుతామని కూడా ట్రంప్‌ బెదిరించాడు. రానున్న రోజుల్లో మిగిలిన దేశాలకు కూడా ఎంత పన్ను విధించేదీ లేఖల రూపంలో తెలియచేస్తామని అధ్యక్ష భవన మీడియా అధికారిణి కారాలోని లీవిట్‌ చెప్పారు. వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకొనే వస్తువులపై పన్ను మొత్తాలను పెంచితే ఆ భారం అమెరికా వినియోగదారుల మీదనే పడుతుందన్నది తెలిసిందే.ఆర్థికవేత్తలు చెప్పినదాని ప్రకారం ఒక్కో కుటుంబం మీద 3,800 నుంచి నాలుగువేల డాలర్ల వరకు భారం పడుతుందని, అది ఒకటి నుంచి ఒకటిన్నర శాతం వరకు ద్రవ్యోల్బణాన్ని పెంచుతుంది.


జపాన్నుంచి కార్లు, ఎలక్ట్రానిక్స్‌, వైద్య పరికరాలు, దక్షిణ కొరియా నుంచి సెమీకండక్టర్లు, ఆటోవిడి భాగాలు, ఓడలు, మలేషియా నుంచి సెమికండక్టర్లు, రబ్బరు, బంగ్లాదేశ్‌ నుంచి దుస్తులు, పాదరక్షలు, కంపూచియా నుంచి తక్కువ వెలగల దుస్తులు, ఫర్నీచర్‌, ఇండోనేషియా ఓడల్లో ధరించే పాదరక్షలు, పామ్‌ఆయిల్‌, ఎలక్ట్రానిక్స్‌, దక్షిణాఫ్రికా లోహాలు, పండ్లు, ఆభరణాలు, తాజా వ్యవసాయ ఉత్పత్తులు, ఆటోవిడి భాగాలు, సెర్బియా యంత్రాలు, వ్యవసాయ ఉత్పత్తులు లావోస్‌ పాదరక్షలు, కలప వస్తువులు, మయన్మార్‌ నుంచి చౌకగా లభించే ఉత్పత్తులు, బోస్నియా కలప, లోహాలు, కజకస్తాన్‌ లోహాలు, తైలాలు, రసాయనాలు, టునీసియా ఆలివ్‌ ఆయిల్‌ వంటి వాటిని అమెరికా దిగుమతి చేసుకుంటున్నది. వాటి మీద ఎంత పన్ను విధిస్తే అంత మొత్తాన్ని వినియోగదారులు అదనంగా చెల్లించాలి, ఆమొత్తాలతో ట్రంప్‌ లోటుబడ్జెట్‌ పూడ్చుకొనేందుకు లేదా కార్పొరేట్లకు పన్ను రాయితీలు ఇచ్చేందుకు వినియోగించాలన్నది అసలు ఎత్తుగడ. జూలై తొమ్మిదవ తేదీలోగా ఒప్పందాలు చేసుకోని దేశాలకు ఆగస్టు ఒకటవ తేదీ వరకు అవకాశం ఇస్తున్నామని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్‌ బెసెంట్‌ చెప్పాడు. వచ్చే మూడు రోజులు తాము ఊపరిసలపని పనిలో ఉంటామని ఆదివారం నాడు సిఎన్‌ఎస్‌ టీవితో అన్నాడు. ఆగస్టు ఒకటవ తేదీని కొత్తగడువుగా అభివర్ణించకూడదని, పనులు వేగంగా జరగాలంటే ఏదో ఒకటి ఉండాలన్నాడు. కొత్త పన్నులు కావాలా లేదా గతంలో ప్రకటించినవే కావాలా అన్నది లేఖలు అందుకున్నదేశాలు తేల్చుకోవాలని చెప్పాడు.తాము పద్దెనిమిది ప్రధాన వాణిజ్య భాగస్వాముల మీద కేంద్రీకరిస్తున్నామని అనేక పెద్ద ఒప్పందాలు పూర్తి కావచ్చాయన్నాడు. ఏ దేశ ఉత్పత్తులపై తామెంత పన్ను విధించేది 100 చిన్న దేశాలకు లేఖల ద్వారా తెలియచేస్తామని అన్నాడు. ఇది అమెరికా దురహంకారం తప్ప మరొకటి కాదు.పూర్వం పెద్ద దేశాల రాజులు చిన్న లేదా సామంత దేశాలు తమకు ఏటా ఇంత కప్పం కట్టాలని లేకపోతే తమ తడాఖా చూపుతామని బెదిరించేవారు. అయితే బెసెంట్‌ మాటలను బట్టి ఏదీ ఖరారు కాలేదన్నది స్పష్టం. అమెరికాలో వాషింగ్టన్‌ కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నానికల్లా తన లేఖలు సంబంధిత దేశాలకు అందుతాయని ఆదివారం నాడు ట్రంప్‌ చెప్పాడు. కొన్ని దేశాలు బుధవారం లోగా కొన్ని ఒప్పందాలు కుదుర్చుకోవచ్చు లేదా లేఖలు అందించే అవకాశం ఉందన్నాడు.


ట్రంప్‌ లేఖలు అంటే ఏకపక్షంగా జారీ చేసినవి, బెదిరించే ఎత్తుగడ తప్ప మరొకటి కాదు.చైనాతో ఒప్పందం కుదిరిందని ఏకపక్షంగా ట్రంప్‌ ప్రకటించటం తప్ప వివరాలేమిటో ఇంతవరకు తెలియదు. అదే విధంగా వియత్నాంతో వచ్చినట్లు చెబుతున్న అవగాహన కూడా అదే స్థితిలో ఉంది.అంశాలు ఇంకా ఖరారు కాలేదు.మనదేశంతో ఒప్పందం గురించి కూడా రకరకాల వార్తలను ప్రచారంలో పెట్టారు. అసలు ఒకసారి కుదిరిందని ట్రంప్‌ చెప్పాడు. అంతిమ ఒప్పందం అని, తరువాత తాత్కాలిక ఒప్పందం, మరోసారి చిన్న ఒప్పందం ఇలా రకరకాలుగా వర్ణించారు. మధ్యలో అమెరికా వస్తువులపై పన్నులను తగ్గించేందుకు భారత్‌ అంగీకరించటం లేదని లీకులు వదిలారు.మంగళవారం నాడు ఇది రాసిన సమయానికి ఒప్పందం గురించి ఎలాంటి వార్తలు లేవు. రాజకీయంగా, మిలిటరీ, ఆర్థికంగా ఏ రీత్యా చూసినప్పటికీ జపాన్‌, దక్షిణ కొరియా ఇప్పటి వరకు అమెరికా కనుసన్నలలోనే వ్యవహరించాయి. అలాంటి దేశాలపై 25శాతం పన్ను విధిస్తానని ఏకపక్షంగా ప్రకటించాడు ట్రంప్‌.అమలుకు ఆగస్టు ఒకటి వరకు గడువు ఉందన్నాడు. ఇప్పటి వరకు వివిధ దేశాల వైఖరుల సారాంశం దిగువ విధంగా ఉంది.

జపాన్‌లో కూడా ఆటోపరిశ్రమ పెద్దదే. తన ప్రయోజనాలను కాపాడుకొనేందుకు, ఏ పరిస్థితి ఎదురైనా ఎదుర్కొనేందుకు, తట్టుకొనేందుకు సిద్దంగా ఉన్నట్లు ఆదివారం నాడు ప్రధాని షిగెరు షిబా ఫూజీ టీవీ కార్యక్రమంలో ఆదివారం నాడు చెప్పాడు. అమెరికా వస్తువుల మీద దిగుమతి పన్ను తగ్గిస్తామని మనదేశం సంకేతాలిచ్చినప్పటికీ దానికంటే మన పాడి,వ్యవసాయ రంగాలను అమెరికా ఉత్పత్తులకు తెరవాలని గట్టిగా పట్టుబడుతున్నట్లు వార్తలు.ఏం జరుగుతుందో తెలియదు.ఇరవై ఏడు దేశాలతో కూడిన ఐరోపా యూనియన్‌తో చర్చల్లో మంచి పురోగతి ఉందని అమెరికా చెప్పటం తప్ప అలాంటి సూచనలు కనిపించటం లేదు. సమాఖ్యదేశాల కార్లపై 50శాతం పన్ను విధిస్తానని ట్రంప్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. అసలుకే మోసం రాకుండా ఒప్పందం ఉందాలని జర్మనీ చెబుతుండగా హానికరమైన ఒప్పందానికి తాము వ్యతిరేకమని ఫ్రాన్సు పేర్కొన్నది. బ్రిటన్ను అదిరించి బెదిరించి ఒప్పందం కుదుర్చుకున్నారు.పదిశాతం కనీస పన్నులు విధిస్తారు, దానికి ప్రతిగా అమెరికా కార్లు, విమానాలకు బ్రిటన్‌ తలుపులు తెరిచింది. తాము జూలై 21లో ఒప్పందం కుదుర్చుకుంటామని కెనడా చెప్పటంతో దానికి లేఖ పంపలేదు. ఎవరైనా ఇదే మాదిరి ఒప్పందానికి దగ్గరగా ఉంటే వాటికి వ్యవధిని పెంచుతామని ట్రంప్‌ సలహాదారు కెవిన్‌ హాసెట్‌ చెప్పాడు.


చైనాతో ఒప్పందం కుదిరిందని లండన్‌ భేటీ తరువాత డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించాడు. దాని మీద చైనా అవుననిగానీ కాదని గానీ ప్రకటించలేదు. నువ్వెంత దిగివస్తే నేనంత తగ్గుతాను అన్నట్లుగా చైనా వ్యవహరిస్తున్నది.లాభం లేదని గ్రహించిన ట్రంప్‌ తొలుత ఆ దిశగా కొన్ని చర్యలు తీసుకున్నాడు.ప్రముఖ ఎలక్ట్రానిక్‌ సంస్థలు చైనాకు ఆటోమేషన్‌ సాఫ్ట్‌వేర్‌ అందించేందుకు, విమాన ఇంజన్ల ఎగుమతులకు అవకాశం కల్పించాడు. దానికి ప్రతిగా ఆంక్షలున్న ఎనిమిది వస్తువుల ఎగుమతులపై నిబంధనలను సడలించేందుకు చైనా చర్యలు తీసుకుంది. ఈ విధంగా ఇరుదేశాల వాణిజ్య యుద్ధ రాజీ ఒప్పందం ముందుకు పోతున్నదని రాయిటర్స్‌ పేర్కొన్నది.అమెరికా దిగిరావటానికి అక్కడి బహుళజాతి గుత్త సంస్థలు ట్రంప్‌ మీద తెస్తున్న వత్తిడే ప్రధాన కారణం. ఉదాహరణకు 2014లో ఇంటెల్‌ కంపెనీ మొత్తం రాబడిలో 27శాతం ఉంది. క్వాల్‌కామ్‌ ఆదాయంలో 50శాతం చైనా నుంచి ఉంది. దీనికి తోడు చైనా పారిశ్రామిక ఉత్పత్తిలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టటంతో ఆ ఉత్పత్తులున్న అమెరికన్‌ కంపెనీలకు అది పెద్ద మార్కెట్‌గా మారింది. ట్రంప్‌ రెండవసారి అధికారానికి వచ్చిన తరువాత అమెరికా అనేక పాఠాలు నేర్చుకుంది. ఇతర దేశాల మాదిరి లేఖల ఆదేశాలు పంపి గరిష్టంగా వత్తిడితో అదిరించి బెదిరిస్తే లొంగే ఘటం కాదు అన్నది ఒకటి. కలసి ఉంటే కలదు సుఖం ఘర్షణ పడితే లాభం లేదని, పరస్పరం లాభదాయకమైన అంశాల్లో రాజీపడటమే మేలని గ్రహించటం రెండవది.కృత్రిమ గోడలు కట్టి సరఫరా వ్యవస్థలను విచ్చిన్నం చేస్తే అమెరికా పొందే లాభం లేదని, తన స్వంత చట్టాలతో ఇతర దేశాలను శిక్షించినట్లుగా చైనాతో వ్యవహరిస్తే కుదరదని గ్రహించటం వంటి అంశాలు ప్రభావతం చేశాయి.అయితే ఇంకా బయోటెక్నాలజీ, సెమీకండక్టర్లు, నూతన ఇంథనం వంటి కొన్ని రంగాల్లో చైనాను కట్టడి చేసేందుకు అమెరికా చూస్తూనే ఉంది. చైనాలో పెట్టుబడులు పెట్టేవారి మీద పన్నులు విధిస్తున్నది. దానికి తగినట్లుగా చైనా కూడా తన తురుపు ముక్కలను వాడుతున్నది. ఐరోపా యూనియన్‌, ఇతర దేశాలు అమెరికా మాదిరి మడికట్టుకు కూర్చోవటం లేదు, అది ఆడమన్నట్లుగా ఆడకుండా చైనాతో తమ ప్రయోజనాలను బేరీజు వేసుకుంటున్నాయి. ఇది కూడా అమెరికా మీద ప్రభావం చూపుతున్నది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

దలైలామా వారసుడు : అడుసుతొక్కనేల కాలుకడగనేల ! చైనా అంతర్గత వ్యవహారాల్లో వేలుపెట్టటం అవసరమా, దేశానికి ఒరిగేదేమిటి ?

06 Sunday Jul 2025

Posted by raomk in BJP, CHINA, Congress, Current Affairs, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, UK, USA

≈ Leave a comment

Tags

anti china, China, Dalai Lama, Dalai Lama succession row, Kiren Rejiju, Narendra Modi Failures, Xi Jinping

ఎం కోటేశ్వరరావు


పద్నాలుగవ దలైలామా 90వ జన్మదినోత్సవం హిమచల్‌ ప్రదేశ్‌ ధర్మశాలలో లిటిల్‌ లాసాగా పిలిచే మెక్‌లియోడగంజ్‌లో జూలై ఆరవతేదీ ఆదివారం జరిగింది. కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులుగా మంత్రులు కిరణ్‌ రిజుజు, లాలన్‌ సింగ్‌ హాజరయ్యారు.ఒక భక్తుడిగా దలైలామా నిర్ణయమే తనకు శిరోధార్యమని, మద్దతు ఇస్తామని ఈ సందర్భంగా కిరణ్‌ రిజుజు పునరుద్ఘాటించారు. దలైలామా వారసుడి గురించి కొద్ది రోజులుగా పెద్ద రచ్చే జరిగింది.పరిణామాలు, పర్యవసానాల గురించి భయపడిన టిబెట్‌ బౌద్ద దలైలామా టెంజిన్‌ జియాట్సో ఆ వివాదానికి తాత్కాలికంగా తెరదించారు. సుగలాగ్‌ఖాంగ్‌ ప్రధాన బౌద్ద ఆలయంలో దీర్ఘకాలం ఆయన జీవించాలని కోరుతూ జరిపిన ప్రార్ధనల సందర్భంగా మాట్లాడుతూ తాను మరో 30 నుంచి 40 సంవత్సరాలు జీవిస్తానని ప్రకటించారు. ‘‘ అనేక జోశ్యాలను చూసినపుడు అవలోకితేశ్వర ఆశీస్సులు ఉన్నట్లు భావించాను. ఇప్పటి వరకు చేయగలిగిందంతా చేశాను. ఇంకా 30`40 సంవత్సరాలు జీవించగలనని అనుకుంటున్నాను , ఇప్పటి వరకు మీ ప్రార్ధనలు ఫలించాయి. మనం దేశాన్ని కోల్పోయినప్పటికీ భారత్‌లో ప్రవాసం ఉంటున్నాము. ఇక్కడ నేను ఎన్నో పొందాను, ధర్మశాలలో నివసిస్తున్న వారంతా కూడా అలాగే లబ్దిపొందాలని, నేను చేయగలిగిన సేవ చేయాలని కోరుకుంటున్నా’’ అన్నారు. అంతకు ముందు తనవారసుడు చైనా వెలుపలే జన్మిస్తాడని చేసిన ప్రకటన వివాదాన్ని రేపింది.


దలైలామా తరువాత ఏం మాట్లాడతారో, ఏం చేస్తారో తెలియదు గానీ మనదేశం చైనా అంతర్గత వ్యవహారమైన వారసుడి విషయంలో అనవసరంగా వేలుబెట్టి చైనాతో చెప్పించుకొని, సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇది గౌరవప్రదమా, అసలు అవసరమా ! ఐదు సంవత్సరాల తరువాత రెండు దేశాల మధ్య సాధారణ సంబంధాలు నెలకొంటున్న తరుణంలో చైనాను రెచ్చగొట్టటం ద్వారా మనదేశానికి ఒరిగేదేమిటని ప్రతివారూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. వారసుడి విషయంలో దలైలామా ఆకాంక్షలను అనుసరించాలని మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి, బౌద్దుడైన కిరెన్‌ రిజుజు చేసిన వ్యాఖ్య వివాదాస్పదమైంది.చైనా తీవ్ర అభ్యంతరం తెలిపిన తరువాత మతవ్యవహారాల్లో ప్రభుత్వం ఎలాంటి వ్యాఖ్య చేయలేదని మనవిదేశాంగశాఖ ప్రతినిధి రణధీర్‌ జైస్వాల్‌ వివరణ ఇచ్చారు. తన తదనంతరం దలైలామా వ్యవస్థ కొనసాగుతుందని, 2011లో తాను ఏర్పాటు చేసిన గాడెన్‌ ఫోడ్రాంగ్‌ ట్రస్టు తన వారసుడిని నిర్ణయిస్తుందని కొద్ది రోజుల క్రితం దలైలామా చేసిన ప్రకటనతో రచ్చ మొదలైంది. గతంలో చేసిన ప్రకటననే పునరుద్ఘాటించారు. గాడెన్‌ ఫోడ్రాంగ్‌ అనేది టిబెట్‌లోని లాసాలో ఉన్న 17వ శతాబ్దం నాటి డ్రెపంగ్‌ సంఘారామంలో ఉన్న దలైలామా నివాసం పేరు. ఆ ట్రస్టుకు దలైలామా చైర్మన్‌, ఆయన సన్నిహితులుగా ఉన్నవారు సభ్యులు, దలైలామా కార్యాలయమే దాని వ్యవహారాలను చూస్తున్నది.పదిహేనవ దలైలామా, తదుపరి పరంపరను నిర్ణయించాల్సింది ఆ ట్రస్టు మాత్రమే అని ప్రభుత్వంతో సహా మరొకరికి అధికారం లేదని దలైలామా ప్రకటించారు. ఈ ట్రస్టుతో పాటు న్యూఢల్లీి, జూరిచ్‌ నగరాల్లో కూడా ట్రస్టులను ఏర్పాటు చేశారు. మతానికి చెందిన లామాలు, ఇతర పెద్దలు వారసుడిని గుర్తించి ప్రతిపాదిస్తే అంతిమంగా ఈ ట్రస్టు ఆమోదిస్తేనే వారసత్వం ఖరారు అవుతుందని ట్రస్టు నిబంధనావళి పేర్కొన్నది.


ఇక్కడే అసలు సమస్య ఉంది. గతంలో ఎంపిక చేసిన వారసుల పేర్లను ఒక బంగరు కలశంలో వేసి లాటరీ పద్దతిద్వారా ఎంపిక చేస్తారు, ఆ పేరును చైనా కేంద్రప్రభుత్వం ఆమోదిస్తేనే అమల్లోకి వస్తుందని, గతంలో ఇలాగే జరిగిందని బీజింగ్‌ ప్రకటించింది.తన ఎంపిక అలాగే జరిగిందని తెలిసినప్పటికీ ఈ విధానాన్ని 14వ దలైలామా అంగీకరించటం లేదు. అతగాడి ప్రకటనపై తాము ఎలాంటి వ్యాఖ్య చేయబోమని, మత వ్యవహారాలపై ఎలాంటి వైఖరిని తీసుకొనేది లేదని మన కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దలైలామా ప్రకటన సంబంధిత వార్తలను చూశామని, మతాలకు సంబంధించిన విశ్వాసాలు, వ్యవహారాలకు సంబంధించి ఎలాంటి జోక్యం చేసుకోవటం లేదని. మత స్వేచ్చకు కట్టుబడి ఉన్నామని విదేశాంగశాఖ పేర్కొన్నది. క్వింగ్‌ రాజరిక పాలన నాటి నుంచి బంగారు కలశంలో ఉంచిన పేర్లతో లాటరీ తీసి ఎంపిక చేసిన దానిని చైనా ప్రభుత్వ ఆమోదిస్తే దలైలామా, పెంచన్‌ లామాలను ఖరారు చేస్తారని, ఆ మేరకు ప్రభుత్వ అధికారం కొనసాగుతున్నదని, దానికి తిరుగులేదని చైనా విదేశాంగశాఖ ప్రతినిధి మావో నింగ్‌ స్పష్టం చేశారు.ప్రస్తుత దలైలామాను కూడా అదే పద్దతిలో ఎంపిక చేయగా నాటి ప్రభుత్వం ఆమోదించిందని చెప్పారు. తమ అంతర్గత వ్యవహారాల గురించి జాగ్రత్తగా వ్యాఖ్యానించాలని ఆమె మన కేంద్ర మంత్రి కిరణ్‌ రిజుజు చేసిన ప్రకటన గురించి పేర్కొన్నారు. టిబెట్‌పై ప్రకటించిన వైఖరికి భారత్‌ కట్టుబడి ఉండాలని, టిబెట్‌ సంబంధిత వ్యవహారాలపై చేసే వ్యాఖ్యలు ఇరుదేశాల సంబంధాల మెరుగుదల, అభివృద్ధికి విఘాతం కలిగించకూడదని హితవు చెప్పారు. దలైలామా ప్రకటనను చైనా ఖండిరచిన తరువాత అతగాడికి మద్దతుగా కేంద్ర మంత్రి కిరణ్‌ రిజుజు మాట్లాడటంతో చైనా స్పందించింది. దలైలామా వైఖరిని పునరుద్ఘాటిస్తూ వారసుడి నిర్ణయంలో మరొకరి పాత్ర లేదని మంత్రి మాట్లాడారు. గాల్వన్‌ ఉదంతం తరువాత రెండు దేశాల సంబంధాలు స్థంభించిన సంగతి తెలిసిందే. గతేడాది రష్యాలోని కజాన్‌లో జరిగిన బ్రిక్స్‌ సమావేశాల సందర్భంగా ప్రధాని మోడీ, చైనా అధ్యక్షుడు షీ జింపింగ్‌ భేటీ తరువాత ఏడాది కాలంలో సంబంధాలు తిరిగి సాధారణ స్థితికి వచ్చాయి. కైలాష్‌,మానస సరోవర్‌ యాత్రలను పునరుద్దరించారు.


టిబెట్‌ బౌద్ధ మతానికి ఉన్నత మతాధికారి దలైలామా. మన దేశంలో పీఠాధిపతులకు చాంతాడంత పేర్లు ఉన్నట్లే ప్రస్తుత దలైలామా మతపరమైన పేరు జెస్టన్‌ జాంఫెల్‌ గవాంగ్‌ లొబసాంగ్‌ యెషే టెంజిన్‌ గియాస్టో. పొట్టిగా టెంజిన్‌ గియాస్టో అని పిలుస్తారు. పుట్టినపుడు పెట్టిన పేరు లామో తోండప్‌. ఇతగాడు వివాదాస్పదమైన మతగురువు, 1935 జూలై ఆరున జన్మించారు. దలైలామాలను జీవించి ఉన్న బుద్ధుడు లేక బోధిసత్వుడు అని నమ్ముతారు. మరణానంతరం వారసులను ఎన్నుకుంటారు. దలై అంటే సముద్రం, ఇది మంగోలియన్‌ భాషా పదం.పదమూడవ దలైలామా మరణించిన నాలుగు సంవత్సరాల తరువాత 1937లో అతడి వారసుడిగా టెంజిన్ను ఎంపిక చేశారు, 1939లో దలైలామాగా ప్రకటించారు. మరుసటి ఏడాది ఫిబ్రవరి 22న చైనా ప్రభుత్వం ఆమోదముద్రవేసింది. అమెరికా, బ్రిటన్‌ కుట్రలో భాగంగా కమ్యూనిస్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా 1959లో టిబెట్‌లో తిరుగుబాటు పేరుతో సాయుధులను రంగంలోకి దించారు. వారిని చైనా ప్రభుత్వం అణచివేసింది, తిరుగుబాటు కేంద్రంగా దలైలామా కార్యక్షేత్రాన్ని గుర్తించారు.దాంతో 1959 ఏప్రిల్‌ 29న సిఐఏ పథకం ప్రకారం దలైలామాను నేపాల్‌ ద్వారా దాటించి అసోంలోని బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఉన్న తేజ్‌పూర్‌ పట్టణంలో ప్రవేశపెట్టి ఆశ్రయం కల్పించారు.ఉత్తర ప్రదేశ్‌లోని ముస్సోరీలో దలైలామాతో ప్రవాస ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించారు, మరుసటి ఏడాది హిమచల్‌ ప్రదేశ్‌లోని ధర్మశాలకు రప్పించారు.చైనాపై సిఐఏ రూపొందించిన కుట్ర సిద్దాంతాన్ని నమ్మిలేదా అమెరికా వత్తిడికి లొంగి నాటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ దలైలామాకు ఆశ్రయం కల్పించారు. మూడవ ప్రపంచ యుద్ధంలో టిబెట్‌ నుంచి చైనా భారత్‌ ఇతర దేశాల మీద దాడి చేసేందుకు పథకం రూపొందించిందన్నది సిఐఏ కట్టుకథ. అమెరికా, బ్రిటన్‌ కుట్రల కారణంగా కమ్యూనిస్టు చైనా ప్రభుత్వం తొలి పది సంవత్సరాలలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నది. వాటిలో టిబెట్‌లో తిరుగుబాటు కుట్ర ఒకటి. దలైలామా అన్న గయలో తోండుప్‌ సిఐఏ ఏజంట్‌గా మారాడు. తెరవనుక ఉండి కథంతా నడిపించింది అతనే (97 సంవత్సరాల వయస్సులో ఈ ఏడాది ఫిబ్రవరి 8న పశ్చిమబెంగాల్లోని కలింపాంగ్‌లో మరణించాడు) అని, కుట్ర గురించి పూర్తిగా దలైలామాకు తెలియదని కూడా చెబుతారు. ఏమైనప్పటికీ తరువాత కాలంలో తెలిసినా అదే అమెరికా ప్రాపకంలో నాటి నుంచి నేటి వరకు చైనాకు వ్యతిరేకంగా పనిచేస్తూనే ఉన్నాడు.2011వరకు టిబెట్‌ ప్రవాస ప్రభుత్వ అధినేతగా చలామణి అయ్యాడు. తరువాత వేరేవారికి బాధ్యతలను అప్పగించాడు.

చైనాను అస్థిరపరచటం సాధ్యం కాదని గ్రహించిన అమెరికా విస్తారమైన దాని మార్కెట్‌లో ప్రవేశించేందుకు పూనుకొని ఐరాసలో కమ్యూనిస్టు ప్రభుత్వమే అసలైన చైనా ప్రతినిధిగా గుర్తించటంతో పాటు సాధారణ సంబంధాలను ఏర్పరుచుకుంది. దాంతో టిబెట్‌ తిరుగుబాటుదార్లకు అందచేస్తున్న సాయాన్ని 1972 నుంచి తగ్గించింది తప్ప ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉంది.దలైలామాకు 1989లో నోబెల్‌ శాంతి బహుమతిని కూడా ఇప్పించింది.మనదేశంలో ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ సకల వసతులు కల్పిస్తూ చైనా వ్యతిరేక ప్రచారానికి అన్ని రకాలుగా తోడ్పడుతున్నారు. దలైలామా తరువాత స్వతంత్రుడైౖన పెంచెన్‌ లామా బౌద్దులకు ముఖ్యుడు. అతగాడే పదమూడవ దలైలామా వారసుడిగా గుర్తించిన ముగ్గురిలో ఒకడు లామో ధోండప్‌ తరువాత 14వ దలైలామా అయ్యాడు.క్రీస్తుశకం 1642 నుంచి కమ్యూనిస్టులు అధికారానికి వచ్చిన 1949వరకు చైనా ప్రభుత్వానికి లోబడి పరిమిత అధికారాలతో టిబెట్‌ ప్రాంతంపై దలైలామాలు లేదా అతగాడి ప్రతినిధులు రాజకీయ అధికారాన్ని కూడా చెలాయించేవారు. దీన్నే టిబెట్‌ స్వతంత్రదేశమని వక్రీకరించారు.1912లో చైనాలో తలెత్తిన తిరుగుబాటుతో క్వింగ్‌ రాజరికం పతనమై స్వతంత్రదేశంగా అవతరించింది, ఆ సమయంలో బ్రిటీష్‌ వారి కుట్రలో భాగంగా టిబెట్‌ స్వాతంత్య్రాన్ని పదమూడవదలైలామా ప్రకటించాడు. అయితే సన్‌యేట్‌ సేన్‌ నాయకత్వంలోని జాతీయ ప్రభుత్వం గుర్తించలేదు, టిబెట్‌ ప్రాంతం చైనాలో అంతర్భాగమే అని స్పష్టం చేసింది. కమ్యూనిస్టులు అధికారానికి వచ్చిన తరువాత కూడా అదే విధంగా కొనసాగింది. రెండవ ప్రపంచ యుద్ద సమయంలో కొందరు టిబెటన్లు జపాన్‌కు అనుకూలంగా వ్యవహరించటంతో వారిని అణచివేసేందుకు నాటి పాలకుడు చాంగ్‌కై షేక్‌ మిలిటరీని పంపి అణచివేశాడు. తరువాత జరిగిన పరిణామాల్లో ఖామ్‌ అనే యుద్ద ప్రభువు ఆధీనంలో ఉన్న టిబెట్‌ ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకొనేందుకు కమ్యూనిస్టు ప్రభుత్వం 1950 అక్టోబరులో ప్రజాసైన్యాన్ని పంపి స్వాధీనం చేసుకుంది. అదే ఏడాది పదిహేనేండ్ల వయస్సులో 14వ దలైలామాను టిబెట్‌ పాలకుడిగా ప్రకటించినప్పటికీ కమ్యూనిస్టు ప్రభుత్వం అంగీకరించలేదు.1951లో చైనా ప్రభుత్వానికి లోబడి స్వయంపాలిత ప్రాంతంగా టిబెట్‌ ఉండేందుకు దలైలామా ఒక ఒప్పందాన్ని చేసుకున్నాడు.1954లో మావోతో భేటీ అయ్యాడు, చైనా పార్లమెంటు స్టాండిరగ్‌ కమిటీ ఉపాధ్యక్షుడిగా నియమితుడయ్యాడు. మావో తనను ఒక కొడుకు మాదిరి చూశాడని దలైలామా తన ఆత్మకథలో చెప్పాడు.

1954 తరువాత సిఐఏ తనకుట్రను అమలు ప్రారంభించింది.1956లో దలైలామా భారత్‌ను సందర్శించినపుడు ఒకవేళ తాను రాజకీయ ఆశ్రయం కోరితే అంగీకరిస్తారా అని ప్రధాని నెహ్రూను కోరాడు.చైనా ప్రభుత్వంతో అప్పటికే ఒప్పందం ఉన్నందున అలాంటి పని చేస్తే అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటం, రెచ్చగొట్టినట్లు అవుతుందని నెహ్రూ సున్నితంగా తిరస్కరించారు. ఆ తరువాత అమెరికా వత్తిడికి లొంగిన నెహ్రూ ఆశ్రయమే కాదు, తిరుగుబాటు ప్రభుత్వ ఏర్పాటుకు కూడా సహకరించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ అంశం రెండు దేశాల మధ్య ఒక ప్రధాన సమస్యగానే ఉంటోంది. మన ప్రభుత్వం టిబెట్‌ను చైనాలో అంతర్భాగంగా గుర్తిస్తూనే వేర్పాటు వాదులకు అనధికారిక మద్దతు కొనసాగిస్తున్నది.మనదేశంలో కాలు పెట్టిన తరువాత 1967లో తొలిసారిగా దలైలామా విదేశీ పర్యటనకు జపాన్‌ వెళ్లారు. ఆయనకు వీసా ఇచ్చిన ప్రభుత్వం తమ గడ్డమీద ఉన్నంత వరకు చైనా వ్యతిరేక మాటలు మాట్లాడవద్దని షరతు విధించింది.కానీ మనపాలకులు మాత్రం పూర్తి స్వేచ్చ ఇచ్చారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మూడువందల మంది చైనా ఇంజనీర్లు వెనక్కు- దీని వెనుక కుట్ర ఉందా , మోడీ సర్కార్‌ నిర్వాకం సంగతేంటి !

04 Friday Jul 2025

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, Europe, History, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Science, UK, USA

≈ Leave a comment

Tags

#Anti China, anti china, Apple iPhones, BJP, Narendra Modi Failures, Narendra Modi skill development failure

ఎం కోటేశ్వరరావు

గాల్వన్‌లోయ ఉదంతాల తరువాత రెండు దేశాలూ సాధారణ సంబంధాలను ఏర్పాటు చేసుకున్నాయి. సరిహద్దు సమస్యను శాశ్వతంగా పరిష్కరించుకోవాలని తాజాగా మన రక్షణ మంత్రి రాజనాధ్‌ సింగ్‌ ఆకాంక్ష వెలిబుచ్చారు. ఐదేండ్ల పాటు నిషేధించిన చైనా పెట్టుబడులను అనుమతించేందుకు మోడీ సర్కార్‌ దిగివచ్చింది. రెండు దేశాల మధ్య విమానరాకపోకలకు, వీసాల జారీకి అంగీకారం కుదిరింది. అంతా బాగుందని అందరూ భావిస్తున్న తరుణంలో మనదేశంలో యాపిల్‌ కంపెనీ తయారు చేస్తున్న ఫోన్ల ఫ్యాక్టరీల నుంచి 300 మంది చైనా ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు గత రెండు నెలల్లో స్వదేశానికి వెళ్లినట్లు, చైనా ప్రభుత్వమే తిరిగి రావాలని ఆదేశించినట్లు వార్తలు వచ్చాయి.వారితో పోటీపడి ఫోన్లు తయారు చేస్తున్నామన్న దుగ్దతో మనదేశం మీద జరిగిన కుట్రగా ఈ పరిణామాన్ని వర్ణించారు. అయితే మన కేంద్ర ప్రభుత్వం గానీ, యాపిల్‌ కంపెనీగానీ నోరెత్తలేదు. మన వాహన పరిశ్రమలకు అవసరమైన మాగ్నెట్లను ఎగుమతికి అనుమతించకుండా చైనా ఆంక్షలు విధించి ఆ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టేందుకు చూసిందని కూడా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.మాగ్నట్ల సరఫరా నిలిచిపోయిన ప్రతికూల ప్రభావం తొలుత అంచనావేసినదాని కంటే ఎక్కువగా ఉందని భారత పరిశ్రమల సమాఖ్య(సిఐఐ) అధ్యక్షుడు రాజీవ్‌ మెమానీ గురువారం నాడు మీడియాతో చెప్పారు. పంటల దిగుబడిని గణనీయంగా పెంచే ఎరువులను కూడా మనకు రాకుండా తగ్గిస్తున్నదని, ఈ ఏడాది నిషేధం లేకపోయినా పూర్తిగా నిలిపివేసిందని సొల్యుబుల్‌ ఫర్జిలైజర్‌ ఇండస్ట్రీ అసోసియేషన్‌ అధ్యక్షుడు రజివ్‌ చక్రవర్తి చెప్పారు. ఐదు సంవత్సరాల క్రితం గాల్వన్‌ ఉదంతాల తరువాత చైనా యాప్‌లు, విమానాలు, పెట్టుబడులు, టెలికాం పరికరాల కొనుగోలుపై మనదేశం నిషేధం విధించింది. మాగ్నట్‌లు, ఎరువులు నిలిచిపోయింది ఈ ఏడాదే అని చెబుతున్నారు తప్ప ఐదేండ్లుగా సజావుగానే వచ్చాయి. మన ఔషధ పరిశ్రమలకు అవసరమైన ఎపిఐ వంటి కీలక ముడిసరకుల వంటి వాటిని మనకు అందకుండా చైనా ఎలాంటి నిషేధాలు పెట్టలేదు. ఇలాంటి వాటిని ఐదేండ్లుగా అడ్డుకొని ఉంటే మన పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోవాల్సిందే.చైనాగాక పోతే మరొకచోట నుంచి తెచ్చుకొనేవారం అనవచ్చు, ఆ పని ఇప్పుడూ చేయవచ్చు కదా, తర్కానికి నిలవని కుట్ర కతలెందుకు ?

బిజెపి నేతలు, మోడీ సమర్ధకులు మనదేశం కూడా ఆయుధాలను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నదని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఇటీవల దుబాయిలో జరిగిన రక్షణ ఉత్పత్తుల ప్రదర్శన సందర్భంగా బ్రహ్మోస్‌ క్షిపణిని మాకు విక్రయిస్తారా అని పాకిస్తాన్‌ మిలిటరీ అధికారి ఒకరు దాని రూపకర్త డాక్టర్‌ అపతుకాంత శివథాను పిళ్లేను అడిగారట. ఏమి సమాధానం చెప్పిఉంటారో ఊహించుకోండి ! మన క్షిపణులను అమ్మి వాటినే మనమీద వేయించుకుంటామా ! ఎవరైనా అంతే కదా !! డోనాల్డ్‌ ట్రంప్‌తో మన మోడీ ఎంత రాసుకుపూసుకు తిరిగినా అమెరికా వద్ద ఉన్న అత్యాధునిక మిలిటరీ పరికరాలను మనకు ఇచ్చారా ? వారు ఇవ్వకపోగా రష్యా నుంచి ఎస్‌ 400 క్షిపణి వ్యవస్థలను కొనుగోలు చేయరాదని మన మీద వత్తిడి తెచ్చిన దుశ్చర్యను మనం మరచిపోగలమా ! రామాయణంలో రావణుడు సవతిసోదరుడు కుబేరుడిని ఓడిరచి అతగాడి దగ్గర ఉన్న పుష్పక విమానాన్ని స్వాధీనం చేసుకున్నాడని చెబుతారు. కాసేపు నిజమే అనుకుందాం. సీతను రక్షించేందుకు రాముడికి కూడా నిర్మాణ కంపెనీ పుష్పక విమానం ఇచ్చి ఉన్నా లేదా సాంకేతిక పరిజ్ఞాన బదిలీ చేసినా లంకకు వెళ్లేందుకు వారధితో అవసరం లేకపోయేది, రాముడు ఇలా వెళ్లి అలా సీతను ఎక్కించుకు వచ్చేవాడు కదా ! ఎందుకు విమానం కొనుగోలు చేయలేదు ? విధి అలా రాసి ఉంది అంటారు, అదే అయితే ఇప్పుడు కూడా అదే అని సరిపెట్టుకోకుండా చైనా కుట్ర అంటున్నారెందుకు ?

జూన్‌ 30 నుంచి జూలై రెండవ తేదీ వరకు అమెరికా రాజధాని వాషింగ్టన్‌ డిసిలో క్వాడ్‌ విదేశాంగ మంత్రుల సమావేశం జరిగింది. అమెరికా, భారత్‌, జపాన్‌, ఆస్ట్రేలియాలతో కూడిన కూటమి నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత 2017 నుంచి క్రమం తప్పకుండా సమావేశాలు జరిపి, ప్రకటనలు చేస్తున్నది.చైనాను దెబ్బతీసేందుకు ఏర్పడిన ఈ కూటమి ఏడవ అధినాయక సమావేశం ఈడాది చివరిలో మనదేశంలో జరగనుంది.దీనికి సన్నాహంగానే కూటమి విదేశాంగ మంత్రుల సమావేశం వాషింగ్టన్‌డిసిలో జరిగింది. చైనాను ఉద్దేశించి ఆర్ధికబలవంతం, ధరల తిమ్మినిబమ్మిని,సరఫరా వ్యవస్థల విచ్చిన్నం, అక్రమ మార్కెట్‌ పద్దతులు, కీలకమైన ఖనిజాల ఉత్పత్తి మీద కేంద్రీకరణ వంటి చర్యలకు పాల్పడుతున్న దేశాలంటూ ధ్వజమెత్తుతూ ఒక తీర్మానం చేశారు. దక్షిణ చైనా సముద్రంలో నౌకల స్వేచ్చారవాణాకు ఆటంకం కలిగించకూడదంటూ చర్చలు చేశారు. ఈ పరిణామాలకు ఏదైనా కార్యాకారణ సంబంధం ఉందా ?

నిజంగా చైనా నుంచి మనదేశానికి ముప్పు ఉందని భావిస్తే లేదా కుట్ర జరుగుతోందని అనుకుంటే జరుగుతున్న పరిణామాలకు, అనుమానాలకు పొంతన కుదరటం లేదు. లావాదేవీలు తగ్గించుకోకపోగా ఇంకా పెంచుకొనేందుకు మన ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నది. గాల్వన్‌ ఉదంతాల తరువాత చైనాను మనకాళ్ల దగ్గరకు తెచ్చుకోవాలంటే దిగుమతులు నిలిపివేసి డ్రాగన్‌ పీకనొక్కాలంటూ కాషాయ అలగా జనం వీధుల్లో వేసిన వీరంగం తెలిసిందే.మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఐదు సంవత్సరాల పాటు నిలిపివేసిన చైనా పెట్టుబడులకు ఎర్రతివాచీ పరచి స్వాగతం పలుకుతున్నది. ఐదేండ్ల క్రితం నిలిపివేసిన విమానాలు, వీసాల జారీని పునరుద్దరించేందుకు నిర్ణయించారు. వస్తు దిగుమతుల్లో మోడీ తన రికార్డులను తానే బద్దలు కొట్టుకున్నారు. చైనా ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసి పారిపోయి వచ్చిన దలైలామాకు మనదేశం ఆశ్రయం ఇచ్చింది. అనేక మంది చైనా వ్యతిరేక టిబెటన్లు దేశంలో ఉన్నారు.వారిలో కొందరితో ప్రత్యేక మిలిటరీ దళాలను తయారు చేసి సరిహద్దుల్లో నియమించారు.దలైలామా తరచూ చైనా వ్యతిరేక వ్యాఖ్యలతో కార్యకలాపాలు చేస్తుంటే అనుమతిస్తున్నారు. వారసుడిని నిర్ణయించే అధికారం దలైలామాకే ఉందని కేంద్ర మంత్రి కిరణ్‌ రిజు స్వంత అభిప్రాయాన్ని బహిరంగంగా చెప్పారు. ఇది చైనా వ్యవహారాల్లో జోక్యం తప్ప మరొకటి కాదు. ఉన్న సరిహద్దు వివాదాన్ని శాశ్వతంగా పరిష్కరించుకోవాలని రక్షణ మంత్రి బీజింగ్‌లో ప్రతిపాదిస్తారు, చైనా నుంచి మన రక్షణకు ముప్పు ఉందంటూ పరోక్షంగా వాషింగ్టన్‌లో విదేశాంగమంత్రి ప్రకటనలు చేస్తారు.

తమదేశాన్ని మరోసారి అగ్రస్థానంలో నిలపాలనే నినాదంతో ముందుకు పోతున్న అమెరికా నేతలు మనతో సహా ఇతరదేశాలు తమకంటే ముందుకు పోవటానికి అనుమతిస్తారా ? జాతీయవాదం ప్రబలి ప్రతిదేశమూ రక్షణాత్మక చర్యలకు పాల్పడుతున్న తరుణమిది. దానికి విరుగుడు ఏమిటో కనుక్కోవాలి. అలాంటి ప్రయత్నం మనదేశంలో జరుగుతున్నదా ? అవసరమైన నిపుణులను తయారు చేసుకోవటంలో వైఫల్యమే దానికి నిదర్శనం.బొమ్మరిల్లు సినిమాలో అన్నీ మీరే చేశారని అన్నట్లుగా ఎప్పుడో కాలం చేసిన గాంధీ, నెహ్రూలను ఆడిపోసుకోవటం తప్ప బిజెపి వారు చేసిందేమిటి ? ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం గురించి శాస్త్రవేత్తలకే పాఠాలు చెప్పగలిగిన చంద్రబాబు నాయుడి వంటి ముందుచూపు కలిగిన మిత్రులు ఉన్నప్పటికీ అడుగుముందుకు కదలటం లేదు.

యాపిల్‌ కంపెనీ 2017 నుంచి మనదేశంలో ఫోన్లు ఉత్పత్తి చేస్తున్నది. దాన్నుంచి మూడువందల మంది చైనా నిపుణులు స్వదేశానికి వెళ్లిపోతే కుట్ర అని గుండెలుబాదుకుంటున్నవారు కనీసం ప్రత్నామ్నాయంగా అంతమందిని అందించలేని దుస్థితి దేశంలో ఎందుకు ఉన్నది, ఎనిమిది సంవత్సరాలు గడచినా మనం ఎందుకు తయారు చేసుకోలేకపోయామని మన పాలకులను, రాయితీలు, కార్పొరేట్‌ పన్ను తగ్గింపుతో లక్షల కోట్ల మేర లబ్దిపొందుతున్న పరిశ్రమల వారిని ఎందుకు ప్రశ్నించరు. సదరు యాపిల్‌ కంపెనీ ఎగుమతులతో లాభాలు పోగేసుకోవటం తప్ప తనకు అవసరమైన స్థానిక నిపుణులను ఎందుకు తయారుచేయలేకపోయింది ? మన ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్నామా ? వేతన అసమానతలు మనదేశంలో 25శాతం ఉంటే చైనాలో 5 నుంచి 12శాతం మధ్య ఉన్నాయి. వేతనాల్లేకుండా కష్టపడి, నైపుణ్యంతో పని చేయాల్సిన అవసరం ఏముందన్న భావన అసమానత ఎక్కువగా ఉన్న చోట ఉంటుంది. చైనాలో విద్యకు ప్రాధాన్యత ఇచ్చారు.హైస్కూలు, ఆపై స్థాయి విద్యగలవారు 25శాతం మంది వృత్తి విద్యా శిక్షణలో చేరితే మనదేశంలో కేవలం రెండుశాతమే ఉన్నారు.

రోజు రోజుకూ సాంకేతికరంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. ఆవు పేడ, మూత్రం నుంచి బంగారాన్ని ఎలా తయారు చేయాలా అన్న దగ్గరదారి మీద మీద పెట్టిన శ్రద్ధ ఉత్పాదకరంగంపై లేదు ! మిగతా అన్నింటిలో ప్రావీణ్యం సంపాదించిన తరువాత జనాలను ఖాళీగా ఉంచకుండా ప్రతి ఇంటికి ఒక గోవును ఇచ్చి పేడ, మూత్రంతో పరిశోధనలు చేయించటాన్ని ఎవరూ తప్పుపట్టరు. దేశంలో పరిశోధనలకు చేసే ఖర్చు జిడిపిలో 0.7శాతానికి లోపుగానే ఉంది. అదే చైనాలో రెండున్నర శాతం దాటింది. నరేంద్రమోడీ వచ్చిన తరువాత పెరిగిందేమీ లేదు.కుండలో కూడు అలాగే ఉండాలి బిడ్డ దుడ్డుగా పెరగాలంటే కుదురుతుందా ! 2015 నుంచి రకరకాల నైపుణ్యాలను వృద్ధి చేసే పేరుతో పలు పథకాలను ప్రకటించారు పద్దెనిమిది రకాల చేతివృత్తుల వారికి ప్రధాని విశ్వకర్మ పధకం ఒకటి.2024 ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానం చెప్పింది. దాని ప్రకారం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో దీని కింద నమోదు చేసుకున్నవారు 2,30,47,956 కాగా శిక్షణకు వచ్చిన వారు కేవలం 14,43,129 మాత్రమే. బిజెపి పాలిత ఉత్తర ప్రదేశ్‌లో 28.68లక్షలకు 39వేలు, మధ్య ప్రదేశ్‌లో 29లక్షలకు 82వేలు, బీహార్‌లో 15.6లక్షలకు గాను 32వేలు మాత్రమే అని పేర్కొన్నారు, తమిళనాడులో 8.4లక్షలు, పశ్చిమబెంగాల్లో 7.74లక్షలకు ఒక్కొక్కరు మాత్రమే హాజరైనట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 2015 నుంచి ప్రధానమంత్రి కౌశల్‌ వికాస్‌ యోజన(పిఎంకెవివై) కింద కోటీ 40లక్షల మందికి శిక్షణ ఇచ్చినట్లు 2023 డిసెంబరు 26న పిఐబి జారీ చేసిన వివరాల్లో పేర్కొన్నారు. అంతమందిలో యాపిల్‌ కంపెనీలో పనిచేసేందుకు 300 మంది ప్రత్యామ్నాయ నిపుణులు లేరా ? చైనా కుట్ర అని మాట్లాడటమే దేశభక్తి అనుకుంటున్నారా ? ఈ రాతలు, మాటలు చైనా దృష్టిలో పడవా, రాగద్వేషాలకు వారు అతీతంగా ఉంటారా ? జనాలు ఇలాంటి వాటన్నింటినీ ఆలోచించాలి.

మన దేశం నుంచి ప్రతి ఏటా పెద్ద మొత్తంలో డాలర్లను పొందుతున్న చైనా మనకు వ్యతిరేకంగా కుట్ర చేయటం ఏమిటంటూ కొందరు ఉడుక్కుంటున్నారు. బీజింగ్‌లోని మన రాయబార కార్యాలయం వెబ్‌సైట్‌లో ఉన్న సమాచారం ప్రకారం 201415 నుంచి 2024`25 వరకు చైనాతో మనం జరిపిన వాణిజ్య లావాదేవీల్లో చైనా మిగులు 702.05 బిలియన్‌ డాలర్లు అంటే అంతమొత్తం నరేంద్రమోడీ సమర్పించినట్లే, మేకిన్‌ ఇండియా విఫలం కాబట్టే కదా ఇదంతా ! చైనా నుంచి స్వచ్చందంగానే దిగుమతి చేసుకున్నాం. అమెరికా మాదిరి పరస్పరం ప్రతికూల సుంకాలను విధించుకోలేదు. చైనా మీద ప్రతిదానికీ మనం ఆధారపడకూడదని కొందరు పదే పదే చెబుతుంటారు. నిజమే, ఎవరు వద్దన్నారు ? అమెరికాకు పోటీగా చైనా ఎదిగితే ఎవరైనా అడ్డుకోగలిగారా ?కొందరు చెబుతున్నట్లు నిజంగా చైనా మనల్ని అడ్డుకుంటే మనం భాగస్వామ్య, మిత్రదేశాలుగా పరిగణిస్తున్న అమెరికా, ఐరోపా ధనికదేశాలు మనకు ఎందుకు సాయంగా రాలేదు ? దేవుడి మీద భారం వేసి కూర్చుంటే లాభం లేదు మానవ ప్రయత్నం కూడా చేయాలని అంటారు కదా, అలాంటపుడు చైనా నుంచి కంపెనీలు వస్తాయని, నిపుణులు కూడా అక్కడి నుంచే వస్తారు, మనకు వస్తువులను ఉత్పత్తి చేస్తారని ఆశపెట్టుకోవటం ఏమిటి ? మన ప్రయత్నం మనం ఎందుకు చేయటం లేదు ?

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • చైనాతో వాణిజ్యంపై ఆందోళన – నిజా నిజాలేమిటి !
  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!

Recent Comments

pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • చైనాతో వాణిజ్యంపై ఆందోళన – నిజా నిజాలేమిటి !
  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!

Recent Comments

pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • చైనాతో వాణిజ్యంపై ఆందోళన – నిజా నిజాలేమిటి !
  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!

Recent Comments

pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 246 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d