• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Prices

ఏం కొనేటట్టు లేదు ఏం తినేటట్టు లేదు : అడ్డగోలు వాదనలు తప్ప అచ్చేదిన్‌ జాడ ఎక్కడ మోడీ జీ !

14 Thursday Nov 2024

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, Farmers, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, Uncategorized

≈ 1 Comment

Tags

Acche Din, Acche Din Modi, BJP, Double-Digit Food Inflation, Inflation in India, price index, price rise in india

ఎం కోటేశ్వరరావు


చిల్లర ద్రవ్యోల్బణం పద్నాలుగు నెలల గరిష్టం 2024 అక్టోబరు నెలలో 6.21శాతానికి చేరింది. ఆహార ద్రవ్యోల్బణం అంతకు మించి 15నెలల గరిష్టం 10.87శాతానికి చేరింది.ఏడాది క్రితం అక్టోబరు నెలలో 6.61శాతమే ఉంది. ఈ అంకెలను మోడీని వ్యతిరేకులు చెప్పలేదు, కేంద్ర ప్రభుత్వ జాతీయ గణాంక సంస్థ(ఎన్‌ఎస్‌ఓ) వెల్లడిరచినవే. ప్రతినెల 12వ తేదీన ధరలు, ద్రవ్యోల్బణం సంబంధిత అంశాలను ఎన్‌ఎస్‌ఓ విడుదల చేస్తుంది. గతంలో మోడీ మంత్రదండపు విజయగాధలను గానం చేసిన వారు ఇప్పుడు మాట్లాడటం లేదు. దేవునిబిడ్డ అతీంద్రియ శక్తులు ఏమైనాయో తెలియటం లేదు. వాటిని జనం నమ్మటం లేదని తాజా లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెల్లడిరచాయి. సావిత్రీ నీ పతిప్రాణంబు తప్ప వేరే కోరికలు కోరుకొమ్మని యమధర్మరాజు చెప్పాడన్న కథ మాదిరి నరేంద్రమోడీ గతంలో చెప్పిన వాటిని తప్ప కొత్త్త అంశాలను మాత్రమే చెబుతున్నారు. మాటల మాంత్రికుడు మరి. పదేండ్ల క్రితం ధరల పెరుగుదలతో జనాలకు చచ్చే రోజులు దాపురించటాన్ని నరేంద్రమోడీ చక్కగా వినియోగించుకున్నారు. తనకు అధికారమిస్తే అచ్చేదిన్‌ తెస్తానని చెప్పారు. ఇప్పుడా మాట కలలో కూడా ప్రస్తావించటం లేదు.


తమ మోడీ హయాంలో ద్రవ్యోల్బణం లేదా ధరల పెరుగుదల రేటు తగ్గిందని, అది ఆయన గొప్పతనమే అని భక్తులు పారవశ్యంతో ఊగిపోతారు.2014 మార్చి నెలలో వినియోగదారుల(వస్తువుల) సాధారణ సూచిక 138.1 ఉంటే 2024 అక్టోబరు నెల అంచనా 196.8గా ఉంది. దీన్ని సులభంగా చెప్పుకోవాలంటే నిత్యావస వస్తువుల ఒక కిట్‌ ధర పదేండ్లలో రు.138.10 నుంచి రు 196.80కి పెరిగింది.విడివిడిగా అంటే కేవలం ఆహార వస్తువులనే తీసుకుంటే రు.140.70 నుంచి రు.209.40కి చేరింది. అచ్చేదిన్‌ అని నరేంద్రమోడీ చెప్పినపుడు అంతకు ముందున్న ధరలను తగ్గిస్తారని జనం అనుకున్నారు. అబ్బే తగ్గింపు అంటే ధరలు కాదు పెరుగుదల రేటు అని ఇప్పుడు టీకా తాత్పర్యాలను చెబుతున్నారు. గతంలో పది పెరిగితే ఇప్పుడు ఏడు మాత్రమే పెంచుతున్నాం అంటున్నారు. ఇది వాస్తవమా ? మోడీ తొలిసారి అధికారానికి వచ్చిన సమయంలో మనం దిగుమతి చేసుకొనే ముడి చమురుధరలు ఆకాశాన్ని అంటాయి. వెంటనే అంతర్జాతీయ మార్కెట్లో పతనంతో దిగుమతి బిల్లు తగ్గి ద్రవ్యోల్బణం గణనీయంగా తగ్గింది. దీన్ని తన విజయంగా చెప్పుకున్నారు. 2014 జనవరి నుంచి 2019 జనవరి వరకు చూస్తే 22 నిత్యావసర వస్తువుల్లో పదింటి ధరలు పదిశాతం పెరిగాయి. పెసరపప్పు, బంగాళాదుంపలు, ఉల్లి ధరలు అంతకు ముందు ఉన్నవాటి కంటే కాస్త తగ్గాయి. తొమ్మిది వస్తువుల ధరలు పది నుంచి 40శాతం వరకు పెరిగాయి. సెనగపప్పు, పాల ధరలు 33,21శాతం చొప్పున పెరిగాయి. అదే 2019 జనవరి నుంచి 2024 జనవరి వరకు అన్ని వస్తువుల ధరలు 15శాతం పైగా పెరిగాయి తప్ప తగ్గలేదు. పన్నెండు సరకుల ధర 40శాతంపైన, ఏడిరటి ధర 50శాతం పైగా పెరిగింది.కందిపప్పు 110, ఉల్లి 107శాతం పెరిగింది. పప్పుధాన్యాల ధరల సూచిక 2014 మార్చి నెలలో 120.1 ఉంటే ఈ ఏడాది అక్టోబరులో 216.8గా ఉంది. జనం పప్పు తినటం మరచిపోయారు. ఇదంతా అచ్చేదిన్‌ కాలపు నిర్వాకం. ధరల పెరుగుదల యూపిఏ పాలన చివరి సంవత్సరాల నాటి స్థాయికి చేరే బాటలో ఉంది.గ్రామీణ ప్రాంతాలలో సాధారణ ద్రవ్యోల్బణం రేటు ఎక్కువగా ఉంది. అక్టోబరులో ఆహార వస్తువుల ధరల సూచిక ప్రకారం పట్టణాల్లో 10.69శాతం ఉంటే పట్టణాల్లో 11.09శాతం ఉంది.ఆహార ధరల పెరుగుదల ఇలా ఉన్న కారణంగానే జనం అవసరమైన మేరకు పోషకాహారం తీసుకోలేకపోతున్నారు.అలాంటి జనాలు రోగాల పాలు కావటం దాని మీద ఖర్చు మరొక భారం.మొత్తంగా ధరల పెరుగుదల కారణంగా వస్తువుల మీద విధిస్తున్న జిఎస్‌టి ఏడాది కేడాది పెరుగుతున్నది. తమ ప్రభుత్వం సాధించిన అభివృద్దే దీనికి నిదర్శనం అంటూ పాలకులు తప్పుదారి పట్టిస్తున్నారు.


మనదేశంలో అత్యధికులు తమ ఆదాయాల్లో సగం మొత్తాన్ని ఆహారం కోసమే ఖర్చు చేయాల్సి వస్తోంది. ఆహార వస్తువుల ధరల పెరుగుదల పతనంలో ప్రకృతిలో వచ్చే మార్పుల ప్రభావం ఒక వాస్తవం. కానీ పెరిగినపుడల్లా తమకేం సంబంధం లేదు అంతా ప్రకృతి, దేవుడే చేశాడన్నట్లుగా చెప్పటం, తగ్గినపుడు అదంతా తమ ఘనతే అని జబ్బలు చరుచుకోవటం తెలిసిందే. ప్రభుత్వాలు, అవి రూపొందించే విధానాల వైఫల్యాల గురించి కావాలని దాచివేస్తున్నారు. నూనె గింజల ఉత్పత్తికి అవసరమైన అధికదిగుబడి వంగడాలను రూపొందించటంలో అధికారంలో ఎవరున్నా అన్ని పార్టీలు విఫలమయ్యాయి. ఇటీవలనే కేంద్ర ప్రభుత్వం దిగుమతి చేసుకొనే వంటనూనెలపై గరిష్టంగా 30శాతం వరకు దిగుమతి పన్ను విధించింది. ఆ మేరకు దిగుమతి చేసుకొనేవాటితో పాటు స్థానికంగా తయారయ్యే వాటి ధరలు కూడా పెరిగాయి. కొన్ని ఔషధాల ధరలను కేంద్ర ప్రభుత్వం 50శాతం పెంచింది, ఎందుకు అంటే జనానికి అవసరమైన వాటిని ఉత్పత్తి చేయాలంటే కంపెనీలకు గిట్టుబాటు కావటం లేదు, పెంచకపోతే ఉత్పత్తి మానివేస్తే జనానికే నష్టం అని చెబుతున్నారు. ఆహార ధాన్యాలు కూడా జనానికి అవసరమే. వ్యవసాయ ఉత్పత్తి పట్ల కూడా అదే విధంగా వ్యవహరిస్తున్నదా ? 2014లో క్వింటాలు సాధారణ రకం ధాన్య కనీస మద్దతు ధర రు.1,310 కాగా ఇప్పుడు రు.2,183కు పెంచారు. మరోవైపు ధాన్య ఉత్పత్తి ఖర్చు ఇదే కాలంలో రు.644 నుంచి రు.1,911కు పెరిగిందని వ్యవసాయ పంటల ధరల,ఖర్చుల కమిషన్‌ చెప్పింది. ఈ ఖర్చుతో పోల్చుకుంటే మద్దతు ధరల పెరుగుదల ఎంత తక్కువో చెప్పనవసరం లేదు. ఆహారం లేకుండా ఔషధాలతోనే జన జీవితాలు గడుస్తాయా ? నరేంద్రమోడీ తన అద్భుత శక్తులతో అలాంటి మందు గోలీలను తయారు చేస్తే మంచిదే మరి !


యుపిఏ పాలనా కాలంలో ధరల పెరుగుదలను బిజెపి రాజకీయంగా సొమ్ము చేసుకుంది. తమకు అధికారమిస్తే ధరలను తగ్గిస్తామని నమ్మబలికింది.గుజరాత్‌ ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీ 2012 మే 23,24 తేదీలలో మూడు ట్వీట్లు చేశారు. పార్లమెంటు సమావేశాలు ముగిసిన తరువాత పెట్రోలు ధరల పెంపు ప్రకటన పార్లమెంటు గౌరవాన్ని భంగపరచటమే అన్నారు.(తన ఏలుబడిలో పార్లమెంటుతో నిమిత్తం లేకుండానే పెట్రోలు ధరలు, పన్ను మొత్తాలను నిర్ణయిస్తున్న అపర ప్రజాస్వామికవాది) పెద్ద మొత్తంలో ధరల పెంపుదల యుపిఏ ప్రభుత్వ వైఫల్యం, గుజరాత్‌ మీద వందల కోట్ల భారం పడుతుందన్నారు. కాంగ్రెస్‌, దాని మిత్ర పక్షాలు పాలిస్తున్న రాష్ట్రాలలో కంటే గుజరాత్‌లో పెట్రోలియం ఉత్పత్తుల మీద విధిస్తున్న వ్యాట్‌ తక్కువ అన్నారు. యుపిఏ పాలనలో గ్యాస్‌ ధర పెరగ్గానే సిలిండర్‌ పట్టుకొని మీడియా ముందుకు పరుగుపరుగున వచ్చిన బిజెపి నాయకురాలు స్మృతి ఇరానీ గురించి చెప్పనవసరం లేదు. ‘‘ గ్యాస్‌ ధర యాభై రూపాయలు పెంచి కూడా తమది పేదల సర్కార్‌ అని చెప్పుకుంటున్నారు సిగ్గులేదు,యుపిఏ పాలనలో జిడిపి అంటే గ్రాస్‌ డొమెస్టిక్‌ ప్రోడక్ట్‌ కాదు గ్యాస్‌, డీజిల్‌, పెట్రోలు ధరలు, ఆరోసారి పెట్రోలు ధరలు పెంచారు, ఇదేమాత్రం సమర్ధనీయం కాదు, దీని వలన ద్రవ్యోల్బణం పెరుగుతుంది. యుపిఏ ప్రభుత్వ తప్పుడు విధానాల ఫలితంగానే పెట్రోలు ధరలు, గృహరుణాల వడ్డీ పెరుగుతున్నదని, కంపెనీల కోసమే పెట్రోలు ధరలు పెంచుతున్నారని , చైనా చొరబాట్లు, పెట్రోలు ధరలు పెరుగుతున్నాయని, రూపాయి విలువ పడిపోయిందని, 60శాతం దేశపౌరులు ఆహారం కోసం ఇబ్బందులు పడుతుంటే లౌకిక వాదం గురించి మాట్లాడుతున్నారంటూ ’’ 2010`13 సంవత్సరాలలో ట్వీట్లు చేశారు.


అదే బిజెపి పెద్దలు ఇప్పుడు గద్దె మీద ఉన్నారు. స్మృతి ఇరానీ లేదా ఆమె చేతిలో సిలిండర్‌గానీ ఎక్కడా కనిపించటం లేదు. గ్యాస్‌ ధర ఎంతో అందరికీ తెలిసిందే. ప్రతిపక్షంలో ఉండగా చెప్పిందేమిటి ఇప్పుడు చేస్తున్నదేమిటి ?ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చమురు ధరల పెరుగుదలను సమర్ధించుకొనేందుకు జవహర్‌లాల్‌ నెహ్రూ పేరును ఉపయోగించుకున్నారు.కొరియా యుద్ధం భారత ద్రవ్యోల్బణం మీద ప్రభావం చూపుతుందని 1951లోనే పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ చెప్పారు. ప్రపంచమంతా ఒకటిగా ఉన్న ఇప్పుడు ఉక్రెయిన్‌ యుద్దం ప్రభావితం చేస్తున్నదని మేం చెబుతున్నాం, దాన్ని అంగీకరించరా ? చమురు కంపెనీలు అధిక ధరలకు చమురు దిగుమతి చేసుకుంటే దాన్ని మనం భరించాల్సిందే అని లోక్‌సభలో సమర్దించుకున్నారు. పోనీ ఈ తర్కానికైనా కట్టుబడి ఉన్నారా ? జనం పట్ల, ద్రవ్యోల్బణం తగ్గింపు పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉందా అన్నదే ప్రశ్న. అంతర్జాతీయ మార్కెట్లను బట్టి చమురు ధరలు నిర్ణయిస్తామని ప్రకటించి అమలు జరిపిన పెద్దలు రెండున్నర సంవత్సరాలుగా ఎందుకు నిలిపివేసిందీ నరేంద్రమోడీ ఎప్పుడైనా చెప్పారా ? 2022 ఏప్రిల్‌ నుంచి ఒకే ధరలను వసూలు చేస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు ముడి చమురు ధర 20శాతం తగ్గింది. ఆ మేరకు చూసుకుంటే పెట్రోలు, డీజిలు ధరలు కనీసం దానిలో సగం కూడా ఎందుకు తగ్గించలేదు. జనం జేబులు కొల్లగొట్టి ప్రభుత్వం కార్పొరేట్లకు రాయితీల రూపంలో కట్టబెడుతున్నది.చమురుపై పెంచిన సెస్సుల పేరుతో మోడీ సర్కార్‌ ఇప్పటి వరకు రు.26.74లక్షల కోట్ల రూపాయలను వినియోగదారుల నుంచి వసూలు చేసింది. ఈ భారం రవాణా రంగం, ఇతర వాటి మీద పడి అనేక వస్తువుల ధరలు పెరగటానికి దారి తీసింది. అందువలన ధరల పెరుగుదలకు ప్రకృతి మీదో మరొకదాని మీదో నెపం మోపితే కుదరదు.ద్రవ్యోల్బణాన్ని నాలుగుశాతానికి పరిమితం చేస్తామని ఆర్‌బిఐ పదే పదే చెప్పటం తప్ప ఆచరణలో అమలు జరగలేదు. జనం ఇబ్బందులు పడుతుంటే లౌకికవాదం గురించి కబుర్లు చెప్పారని విమర్శించిన బిజెపి పెద్దలు రోజూ మాట్లాడుతున్నదేమిటి ? హిందూమతానికి ప్రమాదం వచ్చింది, హిందూత్వను, సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవాలంటూ ఊదరగొడుతున్నారు ! కనీసం హిందువులు, సనాతన వాదులమని ప్రకటించుకున్న బిజెపి, జనసేన వారికైనా హిందూమతం ధరలను తగ్గిస్తుందా ? జనాల కడుపు నింపుతుందా ?
చమురు మీద పెంచిన పన్నులను అడ్డగోలుగా సమర్ధించుకున్నారు. ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకు తిరుగుతున్నారు. నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన 2014 మే నెలలో ముడిచమురు పీపా ధర 113 డాలర్లు ఉంది, తరువాత 2015 జనవరిలో 50, 2016 జనవరిలో 29 డాలర్లకు పడిపోయినపుడు ధరలు తగ్గించకపోగా పెద్ద మొత్తాలలో సెస్‌ విధించారు. తరువాత ధరలు పెరిగినప్పటికీ సెస్‌ రద్దు చేయలేదు. ఇప్పుడు 70 డాలర్లకు అటూ ఇటూగా ఉంటోంది.సెస్‌ ఎందుకు విధించారయ్యా అంటే కరోనా వాక్సిన్‌ ఉచితంగా కావాలంటారు దానికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అని పెట్రోలియం శాఖా మంత్రిగా పనిచేసిన రామేశ్వర్‌ తేలీ వాదించారు. తరువాత ఎత్తివేశారా అంటే లేదు, దేశ రక్షణకు అయ్యే ఖర్చుకు డబ్బు ఎక్కడి నుంచి తేవాలని మరొకవాదన చేశారు. సెస్‌ ఎత్తివేత సంగతి తరువాత గత ఆరునెలల్లో తగ్గిన మేరకైనా ధర ఎందుకు తగ్గించటం లేదంటే నోరు విప్పటం లేదు. దీని సంగతేమిటో ప్రశ్నించాలా వద్దా ! లేక జేబులను కొల్లగొడుతుంటే గుడ్లప్పగించి చూస్తూ ఉండిపోవాలా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

కావమ్మ మొగుడి కథ పునరావృతం అవుతోందా ? నరేంద్రమోడీ అద్భుత శక్తులెక్కడ ! ప్రశ్నిస్తున్న ప్రపంచ మీడియా !!

13 Sunday Oct 2024

Posted by raomk in BJP, CHINA, COUNTRIES, Current Affairs, Economics, Farmers, History, INDIA, Loksabha Elections, NATIONAL NEWS, Opinion, Political Parties, Politics, Prices, USA

≈ Leave a comment

Tags

#Indian Economy, agriculture in india, BJP, Narendra Modi Failures, RSS


ఎం కోటేశ్వరరావు


నరేంద్రమోడీగారి మాటలను చూస్తే దేశం వెలిగిపోతోంది. భజన బృందాన్ని చూస్తే మోడీ విశ్వగురువు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించే లెక్కలను చూస్తే దేశ ఆర్థిక వ్యవస్థ మందగిస్తున్నది. ఎవరి మాటలను నమ్మాలి ? తమ అనుభవంలోకి వచ్చిన విషయాలను బట్టి జనమే తేల్చుకోవాలి. దేశంలో మాకు తిరుగులేదు అని బిజెపి చెబుతుంది. దాన్ని గుడ్డిగా నమ్మేవారున్నారు, చేసేదేముంది ! ఆ గోమాతే కనువిప్పు కలిగించాలి. వారికి వివరాలు తెలియకనా ? 2014లో బిజెపికి స్వంతంగా వచ్చిన ఓట్లు 31శాతం, ఎన్‌డిఏ కూటమి మొత్తానికి 38.5శాతం, 2019లో బిజెపికి 37.36శాతం, కూటమికి 45.3శాతం, 2024లో బిజెపికి 36.56శాతం కాగా కూటమికి 42.5శాతం వచ్చాయి. గత ఎన్నికల తరువాత తెలుగుదేశం, జనసేన ఓట్లు కొత్తగా కలిసినా బిజెపికి, మొత్తంగా కూటమి ఓట్లశాతం తగ్గింది. దీన్ని చూస్తేమోడీ ప్రభావం పెరుగుతున్నట్లా తరుగుతున్నట్లా ? ఇవి సాధారణ అంకెలు, ఆల్జిబ్రాకాదు గనుక అర్ధంగాకపోతే ఎవరినైనా అడిగి తెలుసుకోవచ్చు. లేకపోతే వేద గణికులను సంప్రదించవచ్చు.


ఇక్కడ ఒక పొట్టి పిట్టకత చెప్పాలి. ఊరంతా ఎప్పుడో వెళ్లిపోయిన కావమ్మ మొగుడులా ఉన్నావంటే కామోసు కామోసనుకొని కాపురం చేశాను, ఇప్పుడు కాదంటున్నారు గనుక నా కర్రా బుర్ర ఇస్తే నాదారిన నేపోతా అన్నాడట సన్యాసివేషంలో వచ్చిన ఒక పెద్దమనిషి. ప్రధాని నరేంద్రమోడీ దగ్గర అద్భుత శక్తులు ఉన్నట్లు ఇంతకాలం నమ్మిన ఊరూవాడా ఇప్పుడు అనుమానంగా చూస్తోంది.‘‘ నరేంద్రమోడీ తన అద్భుత శక్తి కోల్పోయారా ?’’ అంటూ ప్రశ్నార్ధక శీర్షికతో అంతర్జాతీయ పత్రిక ‘‘ఎకానమిస్టు ’’ 2024అక్టోబరు పదవ తేదీ సంచికలో ఒక విశ్లేషణను ప్రచురించింది. ప్రపంచ ఆర్థిక అంశాలను ప్రచురించే ఆ పత్రికే అనుమానాన్ని వ్యక్తం చేసిన తరువాత అంతర్జాతీయ పెట్టుబడిదారులు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారని వేరే చెప్పనవసరం లేదు. తరువాత కథ ఎలా ఉంటుంందో తెలియదు. గుజరాత్‌ ముఖ్యమంత్రి నుంచి దేశ ప్రధాని వరకు ఏండ్ల తరబడి జరిగిన ప్రచారాన్ని చూసిన నరేంద్రమోడీ నిజంగా తాను దేవదూతననే నమ్మారు. నమ్మటం ఏమిటి ! చరిత్రలో అనేక మంది మాదిరి స్వయంగా ప్రకటించుకున్నారు. 2024 మే పదవ తేదీన వారణాసి పర్యటన సందర్భంగా న్యూస్‌ 18 అనే టీవీ ఛానల్‌తో మోడీ మాట్లాడారు. దాన్లో ఏం చెప్పారు ‘‘ నా మాతృమూర్తి బతికి ఉన్నపుడు నేను దేహసంబంధంగానే(సాధారణ మానవుల్లా) పుట్టానని అనుకొనేవాడిని. ఆమె మరణించిన తరువాత నా అనుభవాలన్నింటినీ అవలోకించుకుంటే దేవుడు తనను పంపాడని నిర్ధారణకు వచ్చాను. కేవలం నా భౌతికదేహం నుంచైతే ఈ శక్తి వెలువడదు, దేవుడు నాకు ప్రసాదించాడు.నేను ఎప్పుడే పనిచేసినా దేవుడే నన్ను అలా నడిపిస్తున్నాడని నమ్ముతున్నాను.’’ అని చెప్పారు. ఇదంతా లోక్‌సభ ఎన్నికలకు ముందు, తరువాత అనేక మందిలో మోడీ అద్భుత శక్తుల గురించి అనుమానాలు తలెత్తుతున్నాయి.


తొలిసారి అధికారానికి వచ్చినపుడు నరేంద్రమోడీ క్షణం తీరిక లేకుండా విదేశాలన్నీ తిరిగారు.ఎక్కువ సమయం విమానాల్లోనే గడిపారు. ఎందుకంటే యుపిఏ హయాంలో ప్రపంచంలో కోల్పోయిన భారత ప్రతిష్టను తిరిగి తీసుకురావటంతో పాటు పెట్టుబడులను ఆకర్షించేందుకు అని చెప్పారు. జనం నిజమే కామోసనుకున్నారు. కానీ వాస్తవాలను చూస్తే వర్తమాన ఆర్థిక సంవత్సరం తొలి ఆరునెలల్లో వచ్చిన విదేశీ పెట్టుబడులు 16 సంవత్సరాల కనిష్టానికి తగ్గిపోయాయి. పెట్టుబడులకు సానుకూల వాతావరణం ఏమైంది, విదేశాల్లో పెరిగిన ప్రతిష్ట ఎందుకు తగ్గినట్లు, విశ్వగురువుగా భుజకీర్తులు తప్ప పెట్టుబడులు ఎందుకు రావటం లేదు. వెనుదిరిగి చూస్తే జరిగిన ప్రచారం అంతా మాయ, కనికట్ట్లు అనిపిస్తోంది. విదేశీ పెట్టుబడులు ఎందుకు తగ్గుతున్నాయంటే మన దేశానికే కాదు, ప్రపంచమంతా తగ్గటం లేదా అని దబాయించారు. ఇది నిజమా ? ఒక దగ్గర తగ్గితే మరో దగ్గర పెరుగుతున్నాయి. డబ్బునెవరూ మురగపెట్టుకోవటం లేదు. ఐరాస విడుదల చేసిన 2024 ప్రపంచ పెట్టుబడుల నివేదిక ఏం చెబుతోంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులలో 2022లో ఎనిమిదవ స్థానంలో ఉన్న మనదేశం 2023లో ఒక్కసారిగా 15వ స్థానానికి దిగజారింది. స్వల్పంగా తగ్గినప్పటికీ అమెరికా, చైనా మొదటి రెండు స్థానాలను కొనసాగించాయి. అమెరికాకు వచ్చిన పెట్టుడులు 332 నుంచి 311 బిలియన్‌ డాలర్లకు(6.32శాతం) తగ్గగా చైనాకు వచ్చినవి 189 నుంచి 163కు(13.75శాతం) తగ్గాయి, కానీ మనదేశానికి 49 నుంచి 28 బిలియన్‌ డాలర్లకు(42.85శాతం) తగ్గాయి. ఎఫ్‌డిఐల రాకపోకలు వివిధ పరిస్థితుల మీద ఆధారపడి ఉంటాయి. ఎక్కడ లాభం ఎక్కువగా ఉంటే అక్కడకు పోతాయి.ద్రవ్య పెట్టుబడికి ఒక ప్రాంతమంటూ ఉండదు. లాభం ఉందా లేదా అని చూసుకొని ఉదయం ఆస్ట్రేలియాలో ఉంటే మధ్యాహ్నం భారత్‌, సాయంత్రానికి అమెరికా వెళ్లిపోతుంది. పరిశ్రమలకు అలా కుదరదు.


గాల్వన్‌లోయ సరిహద్దు ఉదంతం తరువాత చైనా నుంచి పరిశ్రమలు, పెట్టుబడులన్నీ భారత్‌కు మూకుమ్మడిగా తరలి వస్తున్నాయని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. మీడియాలో కతలు కతలుగా కబుర్లు చెప్పారు. ఆమేరకు మన ఎఫ్‌డిఐలు పెరిగిన దాఖలాలు లేవు.‘‘ చైనా, భారత్‌ల నుంచి బయటకు వెళుతున్న పెట్టుబడులతో ఇతర దేశాలు లబ్దిపొందుతున్నాయని కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ మాజీ కార్యదర్శి సుభాస్‌ చంద్ర గార్గ్‌ (డెక్కన్‌ హెరాల్డ్‌ 2024,ఏప్రిల్‌ 23) రాశారు. అంతే కాదు, చైనా వద్ద ఆపార సాంకేతిక సత్తా, అరుదైన మెటీరియల్‌, పారిశ్రామిక పునాది ఉన్నదని, దానికి ఎఫ్‌డిఐలు నిలిచిపోవచ్చు కూడా, అక్కడి నుంచే భారీ మొత్తాలలో పెట్టుబడులు బయటకు వెళుతున్నాయి,దానికి ఎఫ్‌డిఐ అవసరం లేకపోవచ్చు, భవిష్యత్‌ ఉన్న పరిశ్రమలను స్వంతంగా నిర్మించుకోగలదని కూడా రాశారు. మనదేశంలో నైపుణ్యం తప్ప సాంకేతిక పరిజ్ఞానం, పెట్టుబడి, ఉత్పాదక వ్యవస్థలు లేవని, మన దగ్గర నుంచి పెట్టుబడులు బయటకు వెళితే ఎక్కువ నష్టం మనకే ’’ అని కూడా గార్గ్‌ పేర్కొన్నారు. ఆయనేమీ మోడీ వ్యతిరేకి కాదు.


చైనా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే దశలో ఉందని సోషల్‌ మీడియాలో సంచలనాత్మక శీర్షికలతో కతలు చెప్పేవారు మనకు కొల్లలుగా ఉన్నారు. అఫ్‌కోర్సు గుడ్డిగా వాటిని నమ్మేవారు ఉండబట్టే పదే పదే అలా చెబుతున్నారు. మన ఆర్థిక వ్యవస్థ గురించి ఇష్టం లేకపోయినా ప్రభుత్వం సమాచారం వెల్లడిరచకతప్పటం లేదు. సమాచారం కొత్తగా ఉన్నప్పటికీ మోడీ అభిమానులను ఇబ్బంది పెట్టే పాత సమస్యలనే అది జనం ముందుంచుతున్నది. వాటికి ఇంకే మాత్రం నెహ్రూ, ఇందిరా గాంధీ, మన్మోహన్‌ సింగ్‌లే కారణం అనటానికి అవకాశం లేదు. జనం గడ్డిపెడతారు. ఇది చైనా కాదు భారత యుగం అని భజన చేసేందుకు కుదరదు. రానున్న రోజుల్లో ఇబ్బందులకు ఆరంభ లక్షణాలు కనిపిస్తున్నాయని ఆర్థిక మంత్రిత్వశాఖ కూడా చెప్పక తప్పలేదు. ఈ కారణంగానే వడ్డీరేట్ల తగ్గింపు మీద ఆర్‌బిఐ ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతోంది.అయితే ఎన్ని ఇబ్బందులున్నా వర్తమాన సంవత్సర వృద్ధి రేటు 7.2శాతం ఉంటుందని చెబుతోంది. కరోనా తరువాత గొప్పగా ముందుకు పోతోందన్న వృద్ధి రేటు వడిదుడుకులకు లోనవుతున్నది. జనవరిమార్చి నెలల్లో వృద్ధి రేటు 7.8శాతం ఉండగా ఏప్రిల్‌జూన్‌లో 6.7కు పడిపోయింది. బొగ్గు,ముడిచమురు, విద్యుత్‌ వంటి ఎనిమిది కీలక రంగాల తీరును చూస్తే మూడు సంవత్సరాల్లో మొదటి సారిగా ఆగస్టులో దిగజారింది. పారిశ్రామిక, సేవారంగాలలో ఎదుగుదల లేని కారణంగా ఉపాధి కోసం జనాలు తిరిగి వ్యవసాయం వైపు మరలు తున్నారు. మోడీ గుజరాత్‌ తరహా పారిశ్రామిక వృద్ది అన్నది ఎండమావి అన్నది ఈ పరిణామం తెలుపుతోంది. ప్రభుత్వం విడుదల చేసిన సమాచారం ప్రకారం 201819లో వ్యవసాయ రంగంలో ఉపాధి పొందుతున్నవారు శ్రామికశక్తిలో 43శాతం ఉండగా అది 202324నాటికి 46శాతానికి పెరిగింది. ఇదే కాలంలో పారిశ్రామిక ఉత్పత్తి వాటా జిడిపిలో 12 నుంచి 11శాతానికి తగ్గింది. సెప్టెంబరు నెలలో నిరుద్యోగుల శాతం 7.8గా సిఎంఐఇ పేర్కొన్నది. ఏటా రెండు కోట్ల కొత్త ఉద్యోగాల కల్పన గురించి మోడీ చెప్పిన కబుర్లన్నీ వంచన తప్ప మరొకటి కాదు.ఉన్న ఉపాధి కోల్పోయి 6.8కోట్ల మంది వ్యవసాయ రంగానికి మరలినట్లే. పరిశ్రమలు, సేవారంగాల్లో యాంత్రీకరణతో పాటు వ్యవసాయంలో కూడా రోజు రోజుకూ యంత్రాల వినియోగం పెరుగుతున్నది. ఉదాహరణకు గతంలో పురుగు మందులను మనుషులే చల్లేవారు, ఇప్పుడు డ్రోన్లు ఆపని చేస్తున్నాయి. వాటిని ఇతర అవసరాల కోసం కూడా వినియోగిస్తున్నారు. డ్రోన్‌ దీదీ తదితర పథకాల పేరుతో డ్రోన్ల కొనుగోలుకు ప్రభుత్వం 75శాతం సబ్సిడీ ఇస్తున్నది, అవింకా పెరిగితే ఉపాధి ఇంకా తగ్గుతుంది. డ్రోన్‌ పరిశ్రమలు పెరిగితే ఐదు లక్షల మందికి కొత్తగా ఉపాధి దొరుకుతుందని చెబుతున్నారు తప్ప అంతకంటే ఎన్నో రెట్లు వ్యవసాయ కూలీలకు తగ్గే పని రోజులు, ఆదాయం గురించి మాత్రం మాట్లాడరు. మరోవైపు పారిశ్రామిక రంగంలో ఇస్తున్న సబ్సీడీల్లో ఎక్కువ భాగం పెట్టుబడులు భారీ మొత్తాలలో ఉండే పరిశ్రమలకు తప్ప ఉపాధి ఎక్కువగా దొరికే వాటికి వెళ్లటం లేదని అభివృద్ధి అధ్యయనాల మద్రాస్‌ ఇనిస్టిట్యూట్‌ ఆర్థికవేత్త అభిషేక్‌ ఆనంద్‌ చెప్పారు.


ముడిచమురు ధరలు పీపాకు పది డాలర్లు పెరిగితే జిడిపిలో 0.4శాతం తగ్గిపోతుంది. అదే తగ్గితే అంతే మేరకు పెరుగుతుంది. చమురు ధరలు పెరిగితే సబ్సిడీల మొత్తం కూడా దానికి అనుగుణంగా పెరుగుతుంది. గత రెండు సంవత్సరాలుగా చమురు ధరలు తగ్గటం, రష్యా నుంచి రాయితీ ధరలకు కొనుగోలు చేస్తుండటంతో జిడిపి పెరిగినట్లు కనిపిస్తున్నది. అది తాత్కాలికమే అని వేరే చెప్పనవసరం లేదు. మూలధన పెట్టుబడి ఏ ఆర్ధిక వ్యవస్థకైనా ఎంతో ముఖ్యం. గతేడాదితో పోలిస్తే ఆగస్టు నెలలో 30శాతం మూలధన పెట్టుబడి ఖర్చు తగ్గిందని, అదే ఏప్రిల్‌ఆగస్టు నెలలకు 19.5శాతం తగ్గినట్లు అధికారికంగా ప్రకటించారు. ఆగస్టు నెలలో ఉత్పత్తి అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 1.8శాతం తగ్గింది, ఇది గత 42నెలల్లో అధ్వాన్నపని తీరు. జిఎస్‌టి వసూళ్లు పెరుగుతున్నాయి, అవి కూడా సెప్టెంబరులో 6.5శాతమే, 2021 తరువాత ఇంత తక్కువ పెరుగుదల లేదట.ఉత్పత్తి, సేవారంగాల పిఎంఐ పరిస్థితి కూడా ఇంతే. గతేడాది సెప్టెంబరుతో పోల్చితే ఈ ఏడాది అదే నెలలో 9.3శాతం మేరకు వాహనాల అమ్మకాలు తగ్గినట్లు ఆటోమొబైల్‌ డీలర్స్‌ ఫెడరేషన్‌ వెల్లడిరచింది.వీటిని వినిమయానికి ఒక సూచికగా పరిగణిస్తారు. వాణిజ్య వాహనాల అమ్మకాలు గత నాలుగు నెలలుగా పడిపోతూనే ఉన్నాయి, 43నెలల్లో అధ్వాన్నంగా తేలింది. కార్ల నిల్వలు పెరిగిపోవటంతో వాటిని వదిలించుకొనేందుకు కంపెనీలు పెద్ద ఎత్తున రాయితీలను ప్రకటించటం రోజూ పత్రికల్లో కనిపిస్తున్నదే.పండుగల తరుణంలో పరిస్థితి మెరుగుపడుతుందనే ప్రకటనలు ప్రతి ఏటా తెలిసిందే.

ప్రపంచ మీడియా నరేంద్రమోడీ అద్భుత శక్తుల గురించి ఎందుకు ప్రశ్నిస్తోంది ? ఎన్నికల్లో మోడీ ఆకర్ష ఆకర్ష మంత్ర ప్రభావం, గొప్పగా ప్రచారం చేసుకున్న ఎఫ్‌డిఐ, దేశ ఆర్థిక రంగం ఎలా ఉందోపైన చెప్పుకున్న విషయాలన్నీ మన గోడీ మీడియా చర్చలు పెట్టకపోతే, విశ్లేషణలు రాయనంత మాత్రాన, నా కోడి కూయకపోతే ఎలా తెల్లవారుతుందో చూస్తా అన్న ముసలమ్మ మాదిరి ఉంటే సూర్యోదయంఅస్తమయం ఆగుతుందా ? హర్యానా ఎన్నికల్లో బిజెపికాంగ్రెస్‌ మధ్య ఓట్లతేడా ఒకశాతం లోపే. ఒక స్థానంలో పోటీ చేసిన సిపిఎం, 89 చోట్ల బరిలో దిగిన కాంగ్రెస్‌కు కలిపి వచ్చిన ఓట్లు 39.34శాతం కాగా, బిజెపికి 39.94 ఆమ్‌ ఆద్మీ పార్టీని కాంగ్రెస్‌ కలుపుకొని వెళ్లి ఉంటే దానికి వచ్చిన 1.79శాతం ఓట్లు తోడైతే అక్కడా బిజెపి బొక్కబోర్లా పడి ఉండేదే. ఈ చిన్న మతలబు ప్రపంచానికి తెలియకుండా ఉంటుందా ?హర్యానా, జమ్మూకాశ్మీరు ఎన్నికల అనుభవాలను చూసిన తరువాత రాబోయే మహారాష్ట్ర,ఢల్లీి, రaార్కండ్‌, బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలు బిజెపికి పెద్ద సవాలుగా మారబోతున్నాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

నరేంద్రమోడీ తీరు ఇలాగే ఉంటే …… మనదగ్గరా శ్రీలంక, బంగ్లాదేశ్‌ పరిణామాలు పునరావృతం !

15 Sunday Sep 2024

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, Europe, History, INDIA, INTERNATIONAL NEWS, Loksabha Elections, NATIONAL NEWS, Opinion, Political Parties, Politics, Prices, USA

≈ Leave a comment

Tags

BJP, China, edible oil import tax, farm crisis, Farmers, Fuel prices freezing, Narendra Modi Failures


ఎం కోటేశ్వరరావు


ఇటీవల బంగ్లాదేశ్‌లో జరిగిన సైనికచర్య, ప్రధాని షేక్‌ హసీనా ప్రభుత్వ కూల్చివేత వంటి పరిణామాలు ,కుట్రలు సంభవిస్తాయంటూ నరేంద్రమోడీని బలపరిచే శక్తులు కొన్ని సామాజిక మాధ్యమంలో ప్రచారం చేసిన సంగతి తెలిసిందే వాటి నేపధ్యం వేరే కావచ్చుగానీ జనంపై మోపుతున్న భారాలు అన్ని రంగాలలో వెల్లడౌతున్న వైఫల్యాన్ని చూస్తే మన దేశంలో కూడా శ్రీలంక, బంగ్లాదేశ్‌లో జరిగిన పరిణామాలు పునరావృతం అవుతాయా అని ఆలోచించాల్సి వస్తోంది. దానికి వేరే దేశాలు కుట్రలే చేయనవసరం లేదు. హసీనా స్వయంకృతాన్ని ఆమెను వ్యతిరేకించే అమెరికా, బంగ్లా ప్రతిపక్షాలు ఉపయోగించుకున్నాయి. అయితే చరిత్ర పునరావృతం కావచ్చుగానీ ఒకే విధంగా ఉండదు. ఎవరూ ఊహించలేరు.


తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకొనేందుకు, ఓట్ల కోసం ఎంతకైనా కొన్ని రాజకీయ పార్టీలు తెగిస్తున్న రోజులివి.2024 సెప్టెంబరు 14 నుంచి అమల్లోకి వచ్చేలా మనం దిగుమతి చేసుకుంటున్న ఖాద్య తైలాలపై కేంద్ర ప్రభుత్వం భారీ ఎత్తున దిగుమతి సుంకాలను విధించింది.ముడి(శుద్ధి చేయని) పామ్‌, సోయా,సన్‌ఫ్లవర్‌ దిగుమతి ధరలపై ఇప్పుడున్న 5.5శాతం పన్ను మొత్తాన్ని 27.5శాతానికి పెంచింది. వీటికి ఇప్పటికే ఉన్న సెస్‌లు అదనంగా పెరుగుతాయి. ఇది సగటు ధర, అదే శుద్ధి చేసిన పొద్దుతిరుగుడు పువ్వు ఆయిల్‌ దిగుమతి చేసుకుంటే ఇప్పుడున్న 13.75 నుంచి 35.75కు పెరుగుతుంది. ఉదాహరణకు ఒక లీటరు వంద రూపాయలకు దిగుమతి చేసుకుంటే ఇప్పుడు రు.113.75 చెల్లిస్తున్నాము. పెంచిన పన్నుతో అది రు.135.75కు అవుతుంది. ఇది మొత్తంగా ధరల పెరుగుదలకు దారి తీస్తుందని వేరే చెప్పనవరం లేదు. మనదేశం ఖాద్యతైలాల దిగుమతిలో మొదటి స్థానంలో ఉంది. ప్రపంచ దేశాలన్నీ ఏటా వంద కిలోలు దిగుమతి చేసుకుంటే మన వాటా 20కిలోలకు పైగా ఉంది. ఈ కారణంగానే మన ప్రభుత్వం అనుసరించే వైఖరి ఒక విధంగా ప్రపంచ మార్కెట్‌ను ప్రభావితం చేస్తున్నది. దిగుమతి సుంకం పెంచగానే చికాగో మార్కెట్‌లో సోయా ధర రెండుశాతం పతనమైంది.లోక్‌సభ ఎన్నికలకు ముందు ఓట్ల కోసం వినియోగదారులను ఉద్దరించేందుకు దిగుమతి సుంకాలు తగ్గించినట్లు చెప్పిన మోడీ సర్కార్‌ ఇప్పుడు కొన్ని రాష్ట్రాలలో రైతుల ఓట్ల కోసం అవే సుంకాలను పెంచుతూ నిర్ణయించింది.ఏది చేసినా ఓట్లకోసమే అంటే కొందరు తమ మనోభావాలను గాయపరుచుకోవచ్చుగానీ వాస్తవం.


హర్యానాలో బాస్మతి రకం వరిని సాగు చేస్తారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ధర పతనం అక్కడి రైతుల మీద కూడా పడిరది. బాస్మతి బియ్యాన్ని టన్నుకు 1200 డాలర్లకు తగ్గకుండా ఎగుమతి చేయాలని నిర్ణయించారు. తరువాత దాన్ని 950డాలర్లకు తగ్గించారు. పక్కనే ఉన్న పాకిస్తాన్‌ అంతకంటే తక్కువ ధరకే ఎగుమతి చేస్తున్నందున మన బియ్యాన్ని కొనేవారు లేకుండా పోవటంతో మార్కెట్‌లో ధరలు పతనమయ్యాయి. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో హర్యానాలోని పది స్థానాల్లో బిజెపి ఐదింటిని పోగొట్టుకుంది. రైతులు ఆగ్రహంతో ఉన్నట్లు తేలటంతో ఇప్పుడు కనీస ఎగుమతి ధరల విధానాన్ని ఎత్తివేసింది. పోయిన ఖాతాదారులు తిరిగి వస్తారా, ఇది రైతులకు మేలు చేస్తుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.అదే విధంగా మహారాష్ట్రలో కూడా బిజెపి చావుదెబ్బతిన్నది, దానికి ఉల్లిరైతుల ఆగ్రహం అని తేలింది.లోక్‌సభ ఎన్నికలకు ముందు వినియోగదారులకు కన్నీరు తెప్పించిన ఉల్లిధరలను తగ్గించేందుకు ఎగుమతులపై ఆంక్షలు, కనీస ఎగుమతి ధర టన్నుకు 550 డాలర్లు ఉండాలని నిర్ణయించింది. ఇప్పుడు వాటిని రద్దు చేసింది. దీని ప్రభావం ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది. మహారాష్ట్రలో సోయా సాగు కూడా ఎక్కువే. దానికి కేంద్రం నిర్ణయించిన క్వింటాలు కనీస మద్దతు ధర రు.4,892 కంటే మార్కెట్‌లో రు.4,500 నుంచి 600 వరకు మాత్రమే పలుకుతోంది.దీంతో రైతుల్లో తలెత్తిన అసంతృప్తి అసెంబ్లీ ఎన్నికల మీద పడకుండా మోడీ సర్కార్‌ సోయా మీద దిగుమతి పన్ను పెంచి కొంతమేరకైనా మార్కెట్లో ధరలు పెరుగుతాయనే ఆశతో ఈ చర్య తీసుకుంది.


ఇటు రైతులుఅటు వినియోగదారుల ప్రయోజనాలను కాపాడాలనటంలో మరోమాట లేదు. అందుకు తీసుకొనే చర్యలను సమర్దించవచ్చు. కానీ గత పది సంవత్సరాల్లో ఇలాంటి జిమ్మిక్కులు ఎన్ని చేసినా ఎవరికీ ఎలాంటి ప్రయోజనం చేకూరలేదు.మధ్యలో మార్కెటింగ్‌ రంగంలో ఉన్న వాణిజ్యవేత్తలకే లబ్ది చేకూరింది.మన దేశ అవసరాలలో మూడిరట రెండువంతుల ఖాద్యతైలాలను దిగుమతుల ద్వారానే సమకూర్చుకుంటున్నాం. నూనెగింజలను ఉత్పత్తి చేసే రైతాంగానికి అవసరమైన గిట్టుబాటు ధర ఉండటం లేదు. అనేక దేశాల్లో కూడా ఈ సమస్య ఉన్నప్పటికీ అధికదిగుబడి వంగడాలను రూపొందించి ఉత్పత్తిని గణనీయంగా పెంచారు. అది అటు రైతాంగానికి ఇటు వినియోగదారులకూ మేలు. నరేంద్రమోడీ 2001 నుంచి 2014వరకు గుజరాత్‌ సిఎంగా ఉన్నపుడు అక్కడ గణనీయంగా సాగుచేసే వేరుశనగ దిగుబడి పెంచేందుకు అవసరమైన వంగడాలను రూపొందించలేదు, పదేండ్లు ప్రధానిగా ఉన్నా చేసిందేమీ లేదు. 2022 గణాకాల(అవర్‌ వరల్డ్‌ ఇన్‌ డాటా వెబ్‌సైట్‌ ) మేరకు అమెరికాలో హెక్టారుకు వేరుశనగ నాలుగున్నరటన్నుల దిగుబడి ఉండగా, చైనాలో 4.13టన్నులు, అదే మనదేశంలో 1.78 టన్నులు మాత్రమే. మొత్తంగా నూనె గింజల దిగుబడి కూడా ఇదే మాదిరి ఉంది గడచిన పదకొండు సంవత్సరాల సగటు 1.22 టన్నులు మాత్రమే. ఎందుకీ దుస్థితి, దీనికి బాధ్యులెవరు ? జవహర్‌లాల్‌ నెహ్రూయే కారణం అంటారా ? నూనె గింజల సాగు గిట్టుబాటు కాని కారణంగానే రైతులు అటువైపు మొగ్గు చూపటం లేదు. పదేండ్లలో మన కరెన్సీ రూపాయి విలువ పతనం కారణంగా అధిక మొత్తాలను చెల్లించి దిగుమతి చేసుకోవటంతో వినియోగదారులకు ధరలు మండుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ వినియోగదారుల వ్యవహారాల శాఖ సమాచారం ప్రకారం 201314లో దేశ అవసరాల్లో 48.1శాతంగా ఉన్న దేశీయ ఉత్పత్తి 202223 నాటికి 42.92శాతానికి పడిపోయినట్లు అంచనా. దీనికి కారకులెవరు ? మెజారిటీ రాష్ట్రాలలో అధికారం మాదే, అభివృద్ధికి రెండిరజన్ల పాలన కావాలని చెబుతున్న బిజెపి ఏం చెబుతుంది? ఎంతకాలమీ పరిస్థితి, ఈ వైఫల్యాన్ని సహించాల్సిందేనా ? 2047నాటికి వికసిత భారత్‌ అనే కబుర్లతో కడుపు నిండుతుందా ? మన దేశంలో కొంత మంది వైద్యులు, వైద్యుల కంటే తమకే ఎక్కువ తెలుసు అన్నట్లుగా కబుర్లు చెప్పేవారు తయారై వంటల్లో నూనెలను తగ్గించండి వీలైతే పూర్తిగా మానుకోండి అని చెప్పటం తెలిసిందే. ఇటీవల యూట్యూబర్లు ఇలాంటి సలహాలు ఇవ్వటంలో అందరినీ మించిపోయారు. ఆరోగ్యపరంగా సమస్యలున్నవారికి అలాంటి సలహాలు ఇవ్వటాన్ని అర్ధం చేసుకోవచ్చు. ప్రపంచంలో కొన్ని దేశాల్లో తలసరి వంటనూనెల కిలోల వాడకాన్ని చూద్దాం. జనాభా రీత్యా మొత్తం వాడకంలో మనదేశం చైనా తరువాత రెండవ స్ధానంలో ఉండవచ్చుగానీ తలసరిలో ఎక్కడో ఉన్నాం.

దేశం——–2010-2012–2022-22---2032 ప్రపంచం- --14.36 ---16.00 --16.60 పేదదేశాలు---07.13---06.97---07.79 భారత్‌----- 09.85---09.87---10.95 ఇండోనేషియా-05.55---10.32---12.24 లాటిన్‌అమెరికా06.95---17.61---18.18 ఐరోపా----- 18.55---24.10---21.73 చైనా------ 20.37---26.02---27.24 అమెరికా----36.63---40.26---36.76

మన దేశంలో కరోనాకు ముందు ఉన్న స్థాయికి వంట నూనెల డిమాండ్‌ పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి.అనేక దేశాలతో పోల్చితే మన వినియోగం తక్కువగా ఉన్నపుడే పరిస్థితి కొనబోతే కొరివి అమ్మబోతే అడవిగా ఉంది. అన్నింటికీ పోల్చుతున్న చైనా స్థాయికి చేరితే దిగుమతి చేసుకొనేందుకు మన దగ్గర అవసరమైన డాలర్లు ఉంటాయా ? మూడు దశాబ్దాల కాలంలో వినియోగంలో పెద్ద మార్పు ఉండదనేది గత,వర్తమాన, భవిష్యత్‌ అంచనాలు తెలుపుతున్నాయి. ఇండోనేషియా తన అవసరాలను గమనంలో ఉంచుకొని పామ్‌ ఆయిల్‌ ఎగుమతులపై గతంలోనే కొన్ని ఆంక్షలు విధించింది. రానున్న సంవత్సరాల్లో దాని వినియోగం పెరగనుందనే అంచనాలు వాస్తవ రూపం దాల్చితే మన దిగుమతులు మరింత భారంగా మారే అవకాశం కనిపిస్తోంది. పోటీతో పాటు మన దిగుమతి అవకాశాలు తగ్గితే సోయా ఆయిల్‌ ఎగుమతి దేశాలు కూడా ధరలు పెంచే అవకాశాలు లేకపోలేదు. మన మొత్తం దిగుమతుల్లో పామాయిల్‌ వాటా 60శాతం.

దిగుమతి చేసుకొనే ఖాద్య తైలాల మీద పన్నులు పెంచితే రైతాంగాన్ని ఆదుకోవచ్చని చెప్పటం వంచన తప్ప మరొకటి కాదు. ఇప్పటి వరకు అది వాస్తవ రూపం దాల్చలేదు, సాగు పెద్దగా పెరగలేదు. నిజంగా మేలు చేయాలంటే ఇతర మార్గాలను ఆలోచించాలి. మార్చినెలతో ముగిసిన 2024 ఆర్థిక సంవత్సరంలో రు.2.37లక్షల కోట్ల మేర జిఎస్‌టిని ఎగవేసినట్లు అధికార యంత్రాంగం తేల్చింది.అంతకు ముందు సంవత్సరంతో పోల్చితే ఇది రెట్టింపు. మొత్తమే కాదు కేసులు కూడా పెరిగాయి.ముంబై, పూనే, గురుగ్రామ్‌, ఢల్లీి, హైదరాబాద్‌ కేంద్రాలుగా ఈ ఎగవేతను కనుగొన్నారు. మూడోవంతు రు.71వేల కోట్లు ఒక్క ముంబైలోనే ఉంది. అక్కడ రెండిరజన్ల పాలనే సాగుతోంది.లావాదేవీలేమీ లేకుండానే ఇన్‌పుట్‌ టాక్సు క్రెడిట్‌ పేరుతో కొట్టేసిన మొత్తం 20శాతం ఉంది. పన్ను ఎగవేతలను అరికట్టే పేరుతో 2017లో జిఎస్‌టిని తీసుకువచ్చారు.అంతకు ముందు ఎగవేత రు.7,879 కోట్లు కాగా తరువాత ఇంతింతై వటుడిరతై అన్నట్లుగా తాజాగా రు.2.37లక్షల కోట్లకు చేరుకుంది. ప్రతిపక్ష పార్టీల నేతలు, తమను వ్యతిరేకించేవారి మీద సిబిఐ,ఐటి,ఇడి దాడులను సాగిస్తున్న ప్రభుత్వం ఇంత మొత్తం ఎగవేస్తుంటే ఏ గుడ్డి గుర్రాలకు పండ్లుతోముతున్నట్లు ? దీన్ని అరికడితే రైతాంగానికి అదనంగా చెల్లించవచ్చు, ఖాద్య తైలాల మీద దిగుమతి సుంకం విధించకపోతే వినియోగదారులనూ ఆదుకున్నట్లు అవుతుందా లేదా ? ఖాద్య తైలాల సంవత్సరం నవంబరు నుంచి అక్టోబరు వరకు ఉంటుంది.భారత సాల్వెంట్‌ ఎక్స్‌ట్రాక్టర్స్‌ అసోసియేషన్‌ సమాచారం ప్రకారం 201314 నుంచి 202223తో పోల్చితే పదేండ్లలో నూనెల దిగుమతులు 116 లక్షల టన్నుల నుంచి 165లక్షల టన్నులకు పెరిగితే మోడీ ప్రభుత్వ నిర్వాకంతో రూపాయి విలువ తగ్గి, అంతర్జాతీయ మార్కెట్లో ధరల పెరుగుదల కారణంగా ఖర్చు రు.60,750 కోట్ల నుంచి రు.1,38,424 కోట్లకు పెరిగింది. దీనికి తగ్గట్లుగా వినియోగదారుల రాబడి పెరిగిందా ? పోనీ సాగు విస్తీర్ణం పెరిగిందా అంటే లేదు.201112లో 263లక్షల హెక్టార్లలో సాగు చేయగా 202223లో 301లక్షలకు మాత్రమే చేరింది.మన అవసరాలకు ఇదేమాత్రం చాలదు.

గత రెండు సంవత్సరాలుగా పెట్రోలు, డీజిలు ధరలు పెంచలేదు చూడండి అంటూ బిజెపి నేతలు గొప్పలు చెప్పుకుంటారు. కానీ అసలు సంగతేమిటి ? గతంలో ప్రకటించి అమలు జరిపిన విధానం ప్రకారం గణనీయంగా ధరలను తగ్గించాల్సి ఉండగా పాతవాటినే కొనసాగించి మన జేబులను కొల్లగొడుతున్నారు. 202223 ఆర్థిక సంవత్సరం మొత్తంగా చూసినపుడు మనదేశం దిగుమతి చేసుకున్న ముడిచమురు పీపా ధర 93.15 డాలర్లు కాగా 202324లో అది 82.58కి తగ్గింది. వర్తమాన ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌ నుంచి సెప్టెంబరు 15వరకు సగటు ధర81.92 డాలర్లు ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో తగ్గిన మేరకు ఎందుకు ధరలు తగ్గించటం లేదంటే అన్నింటికీ జవాబుదారీ అని చెప్పుకుంటున్న నరేంద్రమోడీ ఎన్నడైనా దేశ పౌరులకు తన మన్‌కీ బాత్‌లో చెప్పారా ? ఎందుకు నోరు విప్పటం లేదో ఎవరైనా చెబుతారా ? వంటనూనెల వ్యాపారంలో అదానీ, పెట్రోలియం ఉత్పత్తులలో అంబానీ వంటి కంపెనీలు ఉండగా వాటికి లబ్ది చేకూరేవిధంగా మన ఎగుమతిదిగుమతి విధానాలు ఉన్నాయి తప్ప రైతులు, వినియోగదారులు పట్టలేదు. 1970దశకం ప్రారంభంలో ముంబైలో చిన్నగా ప్రారంభమైన ధరల పెరుగుదల వ్యతిరేక ఆందోళన క్రమంగా గుజరాత్‌, బీహార్‌ తదితర ప్రాంతాలకు విస్తరించటం, జయప్రకాష్‌ నారాయణ్‌ రంగ ప్రవేశం, ఇందిరాగాంధీ ఎన్నికల కేసులో ఓటమి, అత్యవసరపరిస్థితి విధింపు, ఆ సమయంలోనే జనతా పార్టీ ఏర్పాటు, ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమి వంటి పరిణామాలు తెలిసినవే.గతంలో లాటిన్‌ అమెరికా, ఇటీవల శ్రీలంక, బంగ్లాదేశ్‌ వంటి చోట్ల ఏండ్ల తరబడి హృదయ సామ్రాట్టులుగా అభిమానం చూరగొన్న నాయకులనే జనం చివరికి తరిమికొట్టటాన్ని చూశాము. భారాలు పెరిగి జీవనం దుర్భరమైతే ఎక్కడైనా అలాంటి పరిణామాలు జరగవచ్చు. దానికి మనదేశం అతీతమేమీ కాదు. అయితే చరిత్ర ఏ రూపంలో ఎలా పునరావృతం అవుతుందో ఎవరూ ఊహించి చెప్పలేరు. అన్నీ అనూహ్యంగా జరిగినవే.

Share this:

  • Tweet
  • More
Like Loading...

చివరికి గొడుగులు కూడా చైనా నుంచి దిగుమతా ! హతవిధీ పదేండ్లలో నరేంద్ర మోడీ ప్రగతి ఇదా !!

02 Monday Sep 2024

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices

≈ Leave a comment

Tags

Anti China Media, Anti communist, BJP, China imports to India, Indian manufacturers, Narendra Modi Failures, RSS, Tata EV, Ten years Narendra Modi rule


ఎం కోటేశ్వరరావు


మన దేశంలో అగ్రశ్రేణి ఆటోమొబైల్‌ కంపెనీ టాటా మోటార్స్‌ తన విద్యుత్‌ కార్లకు చైనా బ్యాటరీలను కొనాలని నిర్ణయించింది. మేకిన్‌ ఇండియా పథకం కింద విద్యుత్‌ బాటరీలను తయారు చేస్తున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన తరువాత ఈ పరిణామం చోటు చేసుకుంది. ఇదే సమయంలో గతంలో విధించిన నిషేధాలను తొలగించి ఇబ్బందిలేని ఎలక్ట్రానిక్స్‌ వంటి రంగాలలో చైనా పెట్టుబడులను అనుమతించాలని కూడా నిర్ణయించారు. 2030నాటికి దేశంలో 30శాతం వాహనాలు విద్యుత్‌ బాటరీలో నడిచే అవకాశం ఉన్నందున వాటి ఉత్పత్తిని ఇబ్బడి ముబ్బడిగా పెంచాల్సి ఉంది. ఈ క్రమంలో చైనా పెట్టుబడుల అవసరం మనదేశానికి ఉందా లేదా అని మోడీ గారి బిజెపిలో ‘‘ అంతర్గత పోరు ’’ ఉన్నట్లు 2024 ఆగస్టు ఒకటవ తేదీన అమెరికాభారత సంయుక్త యాజమాన్యంతో నడుపుతున్న సిఎన్‌బిసి టీవీ ఛానల్‌ ఒక వార్తను ప్రసారం చేసింది. ఇటీవల కొద్ది నెలలుగా జరుగుతున్న పరిణామాలను చూసినపుడు చైనా లేదా అమెరికా,రష్యా దేశం ఏదైతేనేం వాటి నుంచి వచ్చే పెట్టుబడులు లేదా సంబంధాలను నిర్ణయించేది, నడిపేది మన పాలకులా కార్పొరేట్లా అన్న సందేహం కలుగుతున్నది. గతంలో సరిహద్దు వివాదం ఉన్నప్పటికీ చైనాతో సంబంధాలు సజావుగా ఉన్నాయి. గాల్వన్‌ ఉదంతాల సందర్భంగా చైనా మన భూభాగాన్ని ఆక్రమించలేదని స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ చెప్పిన సంగతి తెలిసిందే. సంఘపరివార్‌ చైనా, కమ్యూనిస్టు వ్యతిరేకత గురించి తెలిసినప్పటికీ గత పదేండ్లలో వాణిజ్య,పారిశ్రామికవేత్తలు ఇబ్బడి ముబ్బడిగా చైనా నుంచి దిగుమతులు చేసుకుంటుండగా లేనిది దాని పెట్టుబడుల అంశంలో ఎందుకు మడిగట్టుకోవాలనే ధోరణి ఇటీవలి కాలంలో పెరిగింది.

గాల్వన్‌ లోయలో జరిగిన ఉదంతాల తరువాత దేశంలో పెద్ద ఎత్తున చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టారు. ఆ దేశ యాప్‌లను నిషేధించారు.పెట్టుబడులు రాకుండా ఆంక్షలు పెట్టారు.కాషాయ దళాలు, మీడియాలో కొంత భాగం చైనా వస్తు దిగుమతులను నిలిపివేస్తే అది మన కాళ్ల దగ్గరకు వస్తుందనే ప్రచారం చేశారు.తీరా చూస్తే మన ఉక్కు మంత్రిత్వశాఖ తాజా నివేదిక ప్రకారం మన దేశం దిగుమతి చేసుకుంటున్న ప్రతి నాలుగు ఉక్కు వస్తువులలో మూడు చైనా నుంచే ఉన్నట్లు ఆగస్టు 29వ తేదీ హిందూ బిజినెస్‌లైన్‌ పత్రిక వార్త పేర్కొన్నది.గతేడాది ఏప్రిల్‌జూలై నెలలతో పోల్చితే మన దిగుతులు అక్కడి నుంచి 30శాతం పెరిగాయి.ఏడాది క్రితం మన ఎగుమతులు ఎక్కువగా ఉండేవి కాస్తా ఇపుడు పరిస్థితి తారుమారైంది.ఇతర దేశాలకూ మన ఎగుమతులు పడిపోయాయి.విచారకరమైన అంశం ఏమంటే చివరికి గొడుగులు, బొమ్మలను కూడా చైనా నుంచి దిగుమతి పెరగటం వలన మన ఎంఎస్‌ఎంఇ సంస్థలు దెబ్బతింటున్నాయని గ్లోబల్‌ ట్రేడ్‌ రిసర్చ్‌ ఇనీషియేటివ్‌(జిటిఆర్‌ఐ) స్థాపకుడు అజయ్‌ శ్రీవాత్సవ చెప్పారు(2024సెప్టెంబరు ఒకటవ తేదీ పిటిఐ వార్త).ఈ ఏడాది జనవరి నుంచి జూన్‌ వరకు మనం చైనాకు 850కోట్ల డాలర్ల విలువగల వస్తువులను ఎగుమతి చేయగా అక్కడి నుంచి 5,040 కోట్ల డాలర్ల మేర దిగుమతి చేసుకున్నామని జిటిఆర్‌ఐ నివేదిక వెల్లడిరచింది.చైనాతో పోటీ పడి గొడుగులను కూడా ఉత్పత్తి చేయలేని దుస్థితికి గత పదేండ్లలో మన దేశాన్ని నరేంద్రమోడీ నెట్టారా ? చిన్నప్పటి పాఠాల్లో భార్య ఎండకు తాళలేక ఆపసోపాలు పడుతుంటే ఒక రుషి ఆగ్రహ శాపానికి భయపడి సూర్యుడు దిగివచ్చి చెప్పులు, గొడుగు ఇచ్చినట్లు చదువుకున్నాం. ఇప్పుడు చైనా వారు ఇస్తున్నారు. ఆ రుషులేమయ్యారు, ఆ సూర్యుడు ఎందుకు కరుణించటం లేదు ! చైనాతో పోటీ పడి నాణ్యంగా, చౌకగా గొడుగులు తయారు చేసేందుకు మన వేదాల్లో నిగూఢమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని వెలికితీసే నిపుణులు, దేశం కోసంధర్మం కోసం పని చేసే వారే లేరా ?

ఇటీవలన మన దేశ వార్షిక ఆర్థిక సర్వే విడుదల చేశారు. దాని వివరాల ప్రకారం చైనా నుంచి ఎఫ్‌డిఐని ఆహ్వానించాలని ప్రధాన ఆర్థిక సలహాదారు వి.అనంత నాగేశ్వరన్‌ చెప్పారు.రెండు దేశాల మధ్య వాణిజ్య లావాదేవీలను పెంచుకోవటం కంటే చైనా నుంచి పెట్టుబడులను ఆహ్వానించటం మెరుగని ఆర్థిక మంత్రికి నివేదించారు. గాల్వన్‌ ఉదంతాల తరువాత వైఖరిలో వచ్చిన మార్పుకు సూచిక ఇది.అమెరికా, ఐరోపాలు చైనా నుంచి సేకరణకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నందున మనం చైనా నుంచి దిగుమతులు చేసుకోవటం, వాటికి కొంత విలువను జోడిరచి తిరిగి ఎగుమతి చేయటం కంటే చైనా కంపెనీల పెట్టుబడులతో మనదేశంలో వస్తువులను ఉత్పత్తి చేసి విదేశీ మార్కెట్లకు ఎగుమతి చేయటం మరింత ప్రభావం చూపుతుందని ఆ నివేదికలో పేర్కొన్నారు. దీనికి నిర్మలా సీతారామన్‌ కూడా విలేకర్ల సమావేశంలో మద్దతు తెలిపారు. అయితే ప్రస్తుతానికి అలాంటి పునరాలోచన లేదని వాణిజ్య మంత్రి పియూష్‌ గోయల్‌ చెప్పినట్లు రాయిటర్స్‌ పేర్కొన్నది.‘‘ బిజెపి ప్రతిష్టను దెబ్బతీసే పర్యవసానాలకు దారితీసే దీన్ని ఎవరూ కోరుకోవటం లేదు. ఈ విధానాన్ని భారతీయులు మెచ్చరు, కానీ అది అవసరమని మోడీ ఆయన ఆర్థిక మంత్రిత్వశాఖ గుర్తించింది ’’ అని నాటిక్సిస్‌లోని ఆసియా పసిఫిక్‌ ఎకానమిస్ట్‌ అల్సియా గార్సియా హెరారో చెప్పినట్లు సిఎన్‌బిసి వార్త పేర్కొన్నది. రానున్న ఐదు సంవత్సరాల్లో ఏటా వంద బిలియన్‌ డాలర్ల మేర ఎఫ్‌డిఐలను ఆకర్షించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.గత ఆర్థిక సంవత్సరంలో 71బిలియన్‌ డాలర్లు వచ్చాయి. సోలార్‌ పలకలు,విద్యుత్‌ బాటరీల తయారీ రంగాలలో చైనా పెట్టుబడులను అనుమతించేందుకు నిబంధనలను సులభతరం చేయనున్నారు.‘‘ భారత ఉత్పత్తి రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు అమెరికా,ఐరోపా వారు విముఖంగా ఉన్నారు. అత్యధిక విదేశీ పెట్టుబడులు ఐసిటి(ఇన్ఫర్మేషన్‌, కమ్యూనికేషన్‌ టెక్నాలజీస్‌) డిజిటల్‌ సర్వీసెస్‌ వంటి రంగంలోకి వెళ్లాయి’’ అని హెరారో చెప్పాడు. ఆసియా ఉత్పత్తి కేంద్రంగా మారాలని భారత్‌ కోరుకుంటే చైనా సరఫరా గొలుసులతో సంబంధాలు పెట్టుకోవాలని ఢల్లీి కేంద్రంగా పని చేస్తున్న అబ్జర్వర్‌ రిసర్చ్‌ ఫౌండేషన్‌లోని విదేశీ విధాన అధ్యయన విభాగ ఉపాధ్యక్షుడు హర్ష వి పంత్‌ చెప్పారు.

ముందే చెప్పుకున్నట్లుగా చైనా వ్యతిరేకతను పెద్ద ఎత్తున రెచ్చగొట్టిన కారణంగా వ్యతిరేకులను సంతుష్టీకరించేందుకు , రాజకీయంగా పరువు నిలుపుకొనేందుకు గత కొద్ది నెలలుగా చైనా పెట్టుబడులను అందరితో అంగీకరింపచేయించేందుకు ఢల్లీి పెద్దలు కసరత్తుచేస్తున్నారు.‘‘ ఆర్థిక కోణంలో చూస్తే కొన్ని రంగాలలో చైనా పెట్టుబడులు మనకు అవసరమే అని చక్కటి తర్కంతో చెప్పవచ్చు. కానీ ఆక్రమంలో దేశ భద్రత,అంతర్జాతీయ రాజకీయ కోణాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది, ప్రస్తుతం చైనాతో సంబంధాలు అంత మంచిగా,సాధారణంగా లేవు ’’ అని విదేశాంగ మంత్రి జై శంకర్‌ ఇటీవల చెప్పారు. 2070నాటికి పూర్తి కాలుష్య రహిత లక్ష్యాన్ని చేరుకోవాలని మనదేశం లక్ష్యంగా పెట్టుకుంది.దానిలో భాగంగా 2030 నాటికి 50శాతం విద్యుత్‌ను పునరుత్పత్తి ఇంథన వనరుల నుంచి తయారు చేయాల్సి ఉంది.చైనా ఆ రంగంలో ఎంతో ముందుంది,తక్కువ ఖర్చుతో, సమర్ధవంతంగా ఉత్పత్తి చేస్తున్నది. ప్రస్తుతం అది 584 టెరావాట్‌ అవర్స్‌ సామర్ధ్యం కలిగి ఉండగా మనది కేవలం 113టెరావాట్‌ అవర్స్‌ మాత్రమే.చైనా కమ్యూనిస్టుదేశం, మనది ప్రజాస్వామ్యం అక్కడి నుంచి పెట్టుబడులు ఎలా తీసుకుంటాం అని మడిగట్టుకు కూర్చొనేందుకు మనదేశంలోని కార్పొరేట్‌ కంపెనీలు సిద్దంగా లేవు.అక్కడి నుంచి దిగుమతులు చేసుకొనే బదులు పెట్టుబడులు తీసుకొని మనదేశంలోనే సంస్థలను ఏర్పాటు చేస్తే ఇక్కడ ఉపాధిని కూడా కల్పించవచ్చు. ప్రస్తుతం మన దేశం తప్ప ప్రపంచంలో మరేదేశమూ చైనా పెట్టుబడులపై పూర్తి నిషేధం విధించలేదు.దాన్నుంచి పూర్తిగా విడగొట్టుకునేందుకు ఏ దేశమూ సిద్దంగా లేదు.తోటి సోషలిస్టు దేశమైనా చైనావియత్నాం మధ్య కొన్ని సరిహద్దు విబేధాలున్నాయి, అయినా చైనా నుంచి పెట్టుబడులను తీసుకుంటున్నది.


టాటా కంపెనీ అనేక దేశాల అనుభవాలను చూసిన తరువాతనే చైనా నుంచి బ్యాటరీలను కొనాలని నిర్ణయించింది.సరఫరా, సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిగణనలోకి తీసుకుంది.మన దేశ విద్యుత్‌ వాహన మార్కెట్‌లో దాని వాటా 60శాతం. ఇంతకు ముందుదాని ఉత్తత్తుల్లో బాటరీల నుంచి ఎదురైన సమస్యలతో పాటు మార్కెట్లో పోటీని కూడా అది గమనంలోకి తీసుకుంది.చైనాతో ఉన్న సరిహద్దు, రాజకీయ విధానాలను అది పక్కన పెట్టింది. ఇప్పటికే చైనా బివైడి కంపెనీ మన దేశంలోని సంస్థలతో భాగస్వామిగా లేదా విడి భాగాలను ఎగుమతి చేసేదిగా ఉంది. విద్యుత్‌ వాహనాలలో బ్యాటరీ ధర, సామర్ధ్యమే కీలకం.చైనాతో అమెరికా ప్రభుత్వానికి ఉన్న రాజకీయ విబేధాల కారణంగా అమెరికా దిగ్జజ కంపెనీ ఫోర్డ్‌ చైనా కంపెనీతో కలసి అమెరికాలో ఒక ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు ఒప్పందం చేసుకొని కూడా అనేక ఆటంకాలను ఎదుర్కొని విరమించుకుంది. అది చేసిన తప్పిదాన్ని టాటా చేయదలచలేదని పరిశీలకులు పేర్కొన్నారు.తొలుత కొన్ని రంగాలలో ఆటంకాలను తొలగిస్తే క్రమంగా ఇతర రంగాలకు విస్తరిస్తారు. మన దేశంలో ఇప్పటి వరకు కేంద్రంలో ఎవరు అధికారంలో ఏ పార్టీ లేదా కూటమిఉన్నప్పటికీ కార్పొరేట్లకు అనుకూలమైన విధానాలనే అనుసరించింది. ఇప్పుడు కూడా అదే జరుగుతున్నది.వాటి అడుగులకు మడుగులొత్తితేనే ఎవరైనా అధికారంలో ఉంటారు !

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఎగుమతులు డీలా,దిగుమతులు భళా -రైౖతులను గాలికొదిలేసిన నరేంద్రమోడీ !

25 Sunday Aug 2024

Posted by raomk in BJP, Current Affairs, Economics, Farmers, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices

≈ Leave a comment

Tags

#Indian Farmers, BJP, farm crisis, India export and import policy, Narendra Modi Failures, Rice export Ban


ఎం కోటేశ్వరరావు


బాస్మతి బియ్యం ధర 28శాతం పతనం, టమాటా ధర 70 శాతం దిగజారుడు, పదేండ్ల కనిష్టానికి సోయా ధర. బియ్యం ఎగుమతుల పతనం. గత వారంలో వచ్చిన కొన్ని వార్తల సారాంశమిది. కొన్ని చోట్ల తగినన్ని వర్షాలు పడలేదని, మరికొన్ని చోట్ల అధికంగా ఉన్నట్లు కూడా చెబుతున్నారు.సెప్టెంబరు ఆఖరు వరకు ఖరీఫ్‌ పంటల సాగు చేయవచ్చు, ఇప్పటి వరకు అందిన వార్తల మేరకు గతేడాది కంటే సాగు పెరిగింది. పంటలు పెరిగి రైతాంగానికి తగిన ధరలు వస్తే అంతకంటే కావాల్సిందేముంది ! ఆగస్టు మూడవ వారానికి అందిన వివరాల మేరకు దేశం మొత్తంగా 2024-25 ఖరీఫ్‌ సాధారణ సాగులో 94.13శాతం అంటే 10.316 కోట్ల హెక్టార్లలో పంటలు వేశారు. దీనికి మంచి వర్షాలే కారణమని వ్యవసాయశాఖ పేర్కొన్నది. కీలకమైన ధాన్యం, పప్పుధాన్యాలు,నూనె గింజలు, చెరకు, పత్తి సాధారణం కంటే 2.08శాతం పెరిగితే, ఒక్క వరి సాగే గతేడాదితో పోల్చితే 19.57శాతం పెరిగి 3.69 కోట్ల హెక్టార్లకు(ఒక హెక్టారు రెండున్నర ఎకరాలకు సమానం) చేరింది.చిరుధాన్యాల సాగు పెరిగింది. నూనె గింజల సాగు సాధారణం కంటే తగ్గింది. ఇటీవలి కాలంలో ఆహార ధరల ద్రవ్యోల్బణం పెరుగుదల నరేంద్రమోడీ సర్కార్‌కు చెమటలు పట్టించింది.ఖరీఫ్‌ సాగు పెరుగుదల కారణంగా వినియోగదారులకు ధరలు తగ్గవచ్చనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇది మంచిదే కానీ రైతుల గిట్టుబాటు మాటేమిటి ? ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను మొత్తంగా చూసినపుడు ఒక్క కార్పొరేట్‌ వాణిజ్య సంస్థలకు తప్ప ఎవరికీ అలాంటి మేలు చేసిన దాఖలా లేదు. రానున్న రోజుల్లో మేలు చేస్తాయా, కీడు కలిగిస్తాయా అన్నదే అనూహ్యం. ఒక విధంగా చెప్పాలంటే పిచ్చోడి చేతిలో రాయిలా పరిస్థితి ఉంది.
ఉత్తరాది రాష్ట్రాలైన పంజాబ్‌, హర్యానా, ఉత్తర ప్రదేశ్‌, ఉత్తరా ఖండ్‌ మరికొన్ని ప్రాంతాల్లో కోటీ 50లక్షల హెక్టార్లలో సాగు చేసే బాస్మతి రకం బియ్యం కొత్త పంట ఇంకా మార్కెట్‌కు రాక ముందే గతేడాది కంటే మూడోవంతు ధర పతనమైంది. క్వింటాలు గతేడాది ఇదే రోజుల్లో రు.3,200 నుంచి 3,500 వరకు ఉంటే ఇప్పుడు రెండున్నర వేలకు తగ్గింది. దీంతో స్వయంగా బిర్యానీ వండుకు తినేవారికి కాస్త కలసి వచ్చిందిగానీ, ఏ హౌటల్లోనూ ధరలు తగ్గించకపోగా పెంచారు. గతేడాది అక్టోబరు, నవంబరు నెలల్లో నాలుగు వేల నుంచి 4,800వరకు పెరిగాయి. ధరల పతనానికిి ప్రధాన కారణం ప్రభుత్వ ఎగుమతి విధానమే అంటున్నారు. ఒక టన్ను బియ్యం కనీస ఎగుమతి ధర(ఎంఇపి) 950 డాలర్లకు తగ్గకూడదని కేంద్రం నిర్ణయించింది. గతేడాది ఉత్పత్తి నాలుగో వంతు పెరిగింది, ఈ ఏడాది వర్షాలు బాగున్న కారణంగా మరో 15శాతం పెరిగవచ్చని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. గతేడాది ఉత్పత్తి నిల్వలు గణనీయంగా ఉన్నాయి. ఇలా పలు కారణాలు ధరల పతనానికి దారితీసింది. ప్రస్తుత సీజన్‌లో ఏ గ్రేడ్‌ రకం వరి మద్దతు ధర రు.2,320గా నిర్ణయించారు. బాస్మతి ధరలు కూడా దానికి దగ్గరగా ఉన్నాయి. కనీస ఎగుమతి ధర 950డాలర్లుగా ఉండటమే ధరల పతనానికి ప్రధాన కారణమని బియ్యం ఎగుమతిదార్ల అసోసియేషన్‌ మాజీ అధ్యక్షుడు విజరు సేటియా చెప్పారు. ఇంత ధరతో అంతర్జాతీయ మార్కెట్‌లో ఎగుమతికి పోటీ పడలేమని అన్నారు. అది రైతాంగానికి చెల్లించే ధర తగ్గటానికి కూడా దోహదం చేస్తున్నదన్నారు. పాకిస్తాన్‌ ప్రభుత్వం ఎగుమతి ధర 700 డాలర్లుగా మాత్రమే ఉందని, అందువలన వారికి ఎక్కువ అవకాశాలుంటాయిని హర్యానా బియ్యం ఎగుమతిదార్ల అధ్యక్షుడు సుశీల్‌ జైన్‌ చెప్పారు.
బాస్మతేతర బియ్యం ఎగుమతుల మీద నిషేధం ఉంది, కొన్ని మినహాయింపులతో ఎగుమతులు చేయాలన్నా థారులాండ్‌, వియత్నాం ధరలతో పోటీపడలేక ఎగుమతులు పతనమయ్యాయి. గతంలో ఈ రెండు దేశాల ధరల కంటే మన బియ్యం ధర తక్కువ ఉంది. ఉదాహరణకు ఐదుశాతం ముక్కలైన పార్‌బాయిల్డ్‌ బియ్యం థారులాండ్‌ టన్ను 565 డాలర్లకు ఇస్తే మనదేశం ఇచ్చే ధర 540 నుంచి 545కు పెరిగింది. దీనికి పన్ను అదనం. ఇలా తేడా తగ్గుతున్న కారణంగా మన ఎగుమతుల మీద ప్రతికూల ప్రభావం పడుతున్నది. మనకంటే ధర ఎక్కువగా ఉన్నప్పటికీ వియత్నాం ఎగుమతులు ఇటీవలి కాలంలో పెరిగాయి. బాస్మతేతర రకాల బియ్యం, గోధుమ ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఎన్నికలకు ముందు ధరలు పెరిగితే తమ విజయావకాశాల మీద ప్రతికూల ప్రభావం పడుతుందనే ముందు చూపుతోనే ఈ పని చేశారన్నది స్పష్టం.దాన్లో భాగంగానే భారత బియ్యం, గోధుమల పేరుతో కొన్ని అమ్మకాలను ప్రారంభించారు.ఎగుమతులపై నిషేధం వలన జరిగిందేమిటి ? మనం రంగంలో లేకపోవటంతో ప్రపంచ మార్కెట్‌లో ధరలు పెరిగాయి.థారు బియ్యం ధర 20శాతం పెరిగింది, ఆ మేరకు రైతాంగానికి కొంత మేలు జరిగింది. మన నుంచి కొనుగోలు చేసే ఖాతాదారులు ఇతర దేశాల వారితో ఖాతాలు కుదుర్చుకున్నారు. ఎన్నికలు ముగిసిన తరువాత కూడా ఎగుమతి ఆంక్షలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అందువలన ఒక నిర్ణయం తీసుకొనే వరకు అనిశ్చితి కొనసాగుతూనే ఉంటుంది. రైతుల పంట చేతికి రాక ముందే ఏదో ఒకటి తేల్చాలి. తీరా అయినకాడికి తెగనమ్ముకున్న తరువాత ఎగుమతి ఆంక్షలు ఎత్తివేస్తే అది బడా వ్యాపారులకే లాభం. వర్తమాన ఆర్థిక సంవత్సరం తొలి మూడు మాసాల్లో గతంతో పోల్చితే మామూలు బియ్యం ఎగుమతులు 34శాతం తగ్గాయి.
రెండింజన్ల పాలనతో నేరుగా స్వర్గానికి తీసుకుపోతామని బిజెపి చెబుతోంది. అలాంటి స్వర్గదారిలో ఉన్న మధ్య ప్రదేశ్‌లో సోయా గింజల ధరలు క్వింటాలు ధర రు.3,500 నుంచి రు.4,000 పడిపోయిందని ఇది కనీస మద్దతు ధర రు.4,850 కంటే తక్కువే కాదు, పదేండ్ల కనిష్టం అని వార్త. కొత్త పంట చేతికి రాక ముందే ఇలా ఉంటే వచ్చిన తరువాత పరిస్థితి ఏమిటని రైతాంగం ఆందోళన చెందుతోంది. అక్కడ బిజెపి అధికారంలో ఉంది.కేంద్ర సిఏసిపి చెప్పినదాని ప్రకారం ఒక క్వింటాలు ఉత్పత్తి ఖర్చు రు.3,261గా ఉంది. సోయాబీన్‌ ప్రోసెసర్స్‌ అసోసియేషన్‌ సమాచారం ప్రకారం 2013-14లో సగటు మార్కెట్‌ ధర రు.3,823 ఉంది. గతేడాది ఐదువేల వరకు రైతులు పొందారు.దేశంలో మధ్యప్రదేశ్‌లో ఎక్కువగా సోయా సాగు చేస్తారు.ధరల పతనానికి కారణం ఏమిటి ? వంట నూనెల ధరలు విపరీతంగా పెరిగిన పూర్వరంగంలో ఓటర్ల నుంచి వ్యతిరేకత రాకుండా చూసుకొనేందుకు దిగుమతి చేసుకొనే సోయా నూనె మీద ఉన్న 32శాతం దిగుమతి పన్నును నరేంద్రమోడీ సర్కార్‌ 12.5శాతానికి తగ్గించింది. దీంతో చౌకగా అర్జెంటీనా, బ్రెజిల్‌, అమెరికా నుంచి దిగుమతులు పెరిగాయి.ప్రపంచ ఉత్పత్తిలో ఈ మూడింటి వాటా 95శాతం ఉంది. మన వాటా 2.5 నుంచి మూడుశాతం మధ్య ఉంటోంది. గతేడాది ఆ దేశాల్లో ఉత్పత్తి తగ్గటంతో ధరలు స్థిరంగా ఉన్నాయి. ఈ ఏడాది మంచి పంట ఉంటుందనే అంచనాలు వెలువడటంతో మనదగ్గర ధరలు పతనమయ్యాయి.కొద్ది వారాల క్రితం 25కిలోల టమాటాల ధర రు.900 నుంచి వెయ్యి రూపాయల వరకు ఉన్నది కాస్తా ఇప్పుడు దేశంలో అనేక చోట్ల రు.300కు పడిపోయింది.పప్పు ధాన్యాల ఉత్పత్తి పెంచాలని చెప్పటమే తప్ప రైతాంగానికి తగిన ప్రోత్సాహం, ఇబ్బందులు లేని పరిస్థితిని కల్పించటం లేదు. మధ్య ప్రదేశ్‌లో పెసర రైతులు పంటను అమ్ముకొనేందుకు నిరసన తెలపాల్సి వచ్చింది, అమ్ముకున్న తరువాత రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో డబ్బు చెల్లించని స్థితి. కొనుగోలు తరువాత ఏడు రోజుల్లో ఇస్తామన్నది ఆరువారాలు గడచినా ఖాతాలలో పడటం లేదని వార్తలు. అంతకు ముందు ప్రతి రైతు నుంచి ఎకరానికి ఇన్ని క్వింటాళ్లే అనే నిర్ణీత పరిమాణానికి మించి కొనుగోలు చేసేది లేదని, అది కూడా నిర్ణీత సమయానికి తెస్తేనే అని నిబంధనలు పెట్టటంతో రైతులు ఆందోళన చేయాల్సి వచ్చింది.
ఎన్నికల కోసం తప్ప రైతాంగ ప్రయోజనాలను కాపాడేందుకు ఒక జవాబుదారీతనంతో కూడిన విధానం కేంద్రం వద్ద లేదు. ఉదాహరణకు గతంతో పోల్చితే ఎరువుల సబ్సిడీని ఈ ఏడాది తగ్గించింది.మరోవైపు ధరల పెరుగుదల నియంత్రణలో భాగంగా దిగుమతులు చేసుకొనే ముడి పామ్‌, సోయా,పొద్దుతిరుగుడు నూనెల మీద ఉన్న డ్యూటీని పూర్తిగా రద్దు చేసింది.వీటి మీద ఉన్న సెస్‌ను 20 నుంచి ఐదు శాతానికి తగ్గించింది.శుద్ధి చేసిన సోయా, పామ్‌,పొద్దుతిరుగుడు ఆయిల్‌ మీద దిగుమతి పన్ను గణనీయంగా తగ్గించింది. పప్పు ధాన్యాల దిగుమతుల మీద పన్ను పూర్తిగా రద్దుచేసింది. వీటి ప్రభావం రైతుల మీద ప్రతికూలంగా పడే అంశాన్ని విస్మరించింది.దేశంలో పప్పు, చమురు గింజల దిగుబడిని పెంచితేనే రైతు వాటి సాగు పట్ల ఆసక్తి చూపుతాడు. అందుకు ప్రభుత్వాలే అవసరమైన పరిశోధనలు, నూతన వంగడాలను రూపొందించాల్సి ఉంటుంది.అదేమీ పెద్దగా కనిపించదు. ధరల స్థిరీకరణ నిధి(పిఎస్‌ఎఫ్‌) గురించి పెద్ద పెద్ద మాటలు చెప్పటం తప్ప బడ్జెట్‌ కేటాయింపులు – ఖర్చు చేసిందీ నామమాత్రమే.2023లో 1500 కోట్లు కేటాయించి అసలు ఖర్చేమీ చేయలదని, మరుసటి సంవత్సరం బడ్జెట్‌లో ఖాతా మూతపడకుండా కేవలం ఒక లక్ష రూపాయలు మాత్రమే కేటాయించినట్లు వార్తలు వచ్చాయి.
వర్తమాన ఆర్థిక సంవత్సరంలో తొమ్మిది ప్రాధాన్యతలతో బడ్జెట్‌ ప్రవేశపెట్టినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. ప్రతి బడ్జెట్‌లో ఇలాంటి కబుర్లనే చెబుతున్నారు. పాతవాటిని మరచిపోతున్నారు. అన్నింటికంటే కేటాయింపులు ప్రకటిత లక్ష్యాల సాధనకు పనికి వస్తాయా ? గత అనుభవం ఏమిటన్న సమీక్ష ఎప్పుడైనా చేశారా అన్న అనుమానం కలుగుతోంది. ద్రవ్యోల్బణ పెరుగుదల రేటులోనైనా నిధులు కేటాయిస్తే అదొకదారి లేకపోతే నిజనిధులు తగ్గినట్లే.లాబ్‌ టు లాండ్‌ అంటే పరిశోధన నుంచి పంటపొలాలకు అనే మాటలు ఎప్పటి నుంచో వింటున్నాము.ఉత్పాదకత పెంపుదల, వాతావరణానికి అనుగుణమైన విత్తనాలు, ఖర్చుల తగ్గింపు, చీడపీడల నివారణ తదితర రంగాల్లో పరిశోధనలు జరిపి వాటిని అభివృద్ధి చేయకుండా రైతాంగానికి ఎలాంటి మేలు చేయలేము. మొత్తం వ్యవసాయ పరిశోధనను సమీక్షిస్తామని నిర్మలమ్మ చెప్పారు. గతేడాది వ్యవసాయ విద్య, పరిశోధనలకు కేటాయించిన మొత్తం రు.9,876 కోట్లు, దీనిలో ఖర్చు పెట్టినదెంతో కోత పెట్టిందెంతో తెలియదు గానీ ఈ ఏడాది కేటాయింపు రు.9,941 కోట్లు కేవలం 65 కోట్ల పెంపుదలతో మొత్తం కార్యకలాపాలను ఎలా పెంచుతారు ? సేంద్రీయ సాగు గురించి ఎన్నో కబుర్లు చెబుతారు.దీనికి గాను గతేడాది రు.459 కోట్లు కేటాయించి ఖర్చు చేసింది కేవలం వంద కోట్లు మాత్రమే. రానున్న రెండు సంవత్సరాల్లో రెండు కోట్ల మంది రైతులతో ఈ సాగు చేయిస్తామని కేటాయించిన మొత్తం 365 కోట్లు మాత్రమే. ప్రతి బడ్జెట్‌లో ఇలాంటి కబుర్లే చెబుతున్నారు. ఇలా కాలక్షేప సాగుతో నరేంద్రమోడీ పదేండ్లుగా గడుపుతున్నారు. అందుకే వ్యవసాయ రంగంలో పరిస్థితి దిగజారుతోంది. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో రైతాంగం ఇచ్చిన ప్రతికూల తీర్పును చూసైనా నేర్చుకుంటారా అంటే కనిపించటం లేదు. పోగాలము దాపురించినపుడు ఎవరూ ఏమి చేయలేరు !

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఐఎంఎఫ్‌ భారాలకు కెన్యాలో ప్రతిఘటన !

04 Thursday Jul 2024

Posted by raomk in Africa, COUNTRIES, Current Affairs, Economics, History, imperialism, INTERNATIONAL NEWS, Opinion, Prices, UK, USA

≈ Leave a comment

Tags

IMF, imperialism, Kenya -IMF, Kenya Protests, Kenya's President William Ruto


ఎం కోటేశ్వరరావు


జనంపై భారాలు మోపుతూ పార్లమెంటు ఆమోదించిన విత్త బిల్లుకు వ్యతిరేకంగా జూన్‌ 25న కెన్యాలో నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఈ సందర్భంగా 26 మంది కాల్పుల్లో మరణించగా అనేక మంది గాయపడినట్లు దేశ మానవహక్కుల కమిషన్‌ ప్రకటించింది.మృతుల సంఖ్య 30దాటినట్లు వార్తలు వచ్చాయి.దేశ పార్లమెంటు భవనానికి నిరసనకారులు నిప్పు పెట్టటంతో సహా అనేక చోట్ల లూటీలు, దహనకాండకు పాల్పడినట్లు వార్తలు వచ్చాయి. దీంతో బిల్లుపై తాను సంతకం పెట్టటం లేదంటూ అధ్యక్షుడు విలియమ్స్‌ రూటో ప్రకటించాడు. అయినప్పటికీ నమ్మకం లేక రాజీనామా చేయాలని కోరుతూ జూలై రెండున తిరిగి ప్రదర్శనలకు పిలుపు ఇచ్చారు. రాజధాని నైరోబీలో పెద్ద ఎత్తున భద్రతా బలగాలను మోహరించారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్‌), ప్రపంచ బ్యాంకులను బ్రెట్టన్‌ ఉడ్‌ కవలలు అంటారు. అక్కడ జరిగిన సమావేశాల్లో అవి పుట్టాయిగనుక ఆ పేరు వచ్చింది.ప్రజాకంటకుల పుట్టుక కూడా మామూలుగానే జరిగినప్పటికీ వారు పెరిగి పెద్దవారైన తరువాత మాత్రమే సమాజానికి ముప్పుగా చివరకు జనం చేతిలో తుప్పుగా మారతారు.కానీ ఈ కవలలు అలాంటివి కాదు. పుట్టుకతోనే వాటి దగ్గరకు వెళ్లిన దేశాలకు స్పాట్‌ పెడుతున్నాయి.ప్రపంచ బ్యాంకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను తమ విధానాలకు ముఖ్యంగా విద్యుత్‌ సంస్కరణలకు ఒక ప్రయోగశాలగా మార్చిన సంగతి తెలిసిందే. వాటికి వ్యతిరేకంగా సాగిన ఉద్యమం, పర్యవసానంగా చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో పరాజయం పాలైన విషయాన్నీ వేరే చెప్పనవసం లేదు.


ఆఫ్రికా ఖండంలోని తూర్పు ప్రాంతంలో ఉన్న ఒక దేశం కెన్యా. హిందూ మహాసముద్ర తీరంలో ఉన్న ఈ దేశ జనాభా 5.22 కోట్లు. రాజధాని నైరోబీ. ఐరోపా సామ్రాజ్యవాదుల వలసగా ఉంది. బ్రిటీష్‌ పాలకులు తొలుత తమ రక్షక ప్రాంతంగా, తరువాత వలసగా మార్చారు.1952 నుంచి ప్రారంభమైన మౌమౌ విప్లవంగా పిలిచిన ఉద్యమం కారణంగా 1963లో స్వతంత్రదేశంగా ఆవిర్భవించింది.ఆఫ్రికాలో ఆర్థికంగా అభివృద్ధి, ప్రజాస్వామిక వ్యవస్థతో స్థిరంగా ఉన్న దేశంగా చెబుతారు.అలాంటిది గతంలో ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కింది. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చిన జనాలపై భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో 30 మందికి పైగా మరణించారని, నేరస్థ ముఠాల చేతుల్లో గితురాయి అనే చోట250 మంది మరణించినట్లు, వారి మృత దేహాలను కూడా లభ్యం కావటం లేదని, అనేక మంది అపహరణలకు గురైనట్లు వార్తలు వచ్చాయి.పౌరులపై భారాలను మోపే ఆర్థిక బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపిన వెంటనే ఆందోళన తలెత్తింది. దాంతో బిల్లును నిలిపివేస్తున్నట్లు అధ్యక్షుడు విలియం రూటో ప్రకటించినప్పటికీ నివురుగప్పిన నిప్పులా పరిస్థితి ఉంది. అతగాడి మాటల మీద తమకు నమ్మకం లేదంటూ రూటో రాజీనామా చేసి గద్దె దిగాల్సిందేనంటూ యువత అనేక పట్టణాల్లో ప్రదర్శనలు జరిపింది. మిలిటరీ కవాతులతో భయపెట్టాలని చూసినా బెదరటం లేదు. మరో శ్రీలంకగా మారినా ఆశ్చర్యం లేదు.


ఎందుకీ పరిస్థితి వచ్చింది ? దేశం అప్పులపాలైంది. దేశ, విదేశీ అప్పు 80 బిలియన్‌ డాలర్లు దాటింది. వాటిని గడువులోపల తీర్చే పరిస్థితి కనిపించటం లేదు.దివాలా ప్రకటిస్తే పరిస్థితి మరింత దిగజారుతుంది. దాంతో ఐఎంఎఫ్‌, ప్రపంచ బ్యాంకు దగ్గరకు వెళ్లింది. మేం చెప్పిన షరతులకు అంగీకారం తెలిపితే ఇబ్బందుల నుంచి బయటపడవేస్తామని అవి చెప్పాయి. ఆ మేరకు ప్రభుత్వం 2021లో ఒప్పందం చేసుకుంది. బ్రెట్టన్‌ఉడ్‌ కవలలు, ఇతర అంతర్జాతీయ సంస్థలన్నీ ముందుగా అప్పెలా తీరుస్తారో చెప్పమంటాయి. వెంటనే, మీరేమీ చెప్పలేరుగానీ మేం చెప్పినట్లు చేయండి, వాటికి మీ పేరు పెట్టుకోండి అంటాయి. ఇదిగో అలాంటి ఒప్పందంలో భాగంగానే కెన్యా పార్లమెంటు ఆమోదించిన 2024 విత్త బిల్లు.దాని ప్రకారం నిత్యావసర వస్తువులు, పిల్లలకు మార్చే డైపర్లతో సహా అనేక వస్తువులపై ఎడాపెడా పన్నులను పెంచాలని ప్రతిపాదించారు. ఇప్పటికే పెరిగిన నిరుద్యోగం, ధరల పెరుగుదలతో అతలాకుతలంగా ఉన్న పరిస్థితి మరింత దిగజారనుందనే భయంతో జనం నిరసనలకు దిగారు. ఆగ్రహం ఎలా ఉందంటే పార్లమెంటు భవనానికి నిప్పు పెట్టారు.ఎంపీలందరూ బతుకు జీవుడా అంటూ పారిపోయారు.అయినా తగ్గేదే లే అన్నట్లుగా అధ్యక్షుడి వైఖరి ఉండటంతో ఆందోళన విస్తరించింది.దాంతో బిల్లు మీద సంతకం చేయటం లేదని ప్రకటించాడు. ఇదంతా ఒక నాటకమని, వ్యవధి తీసుకొనేందుకు వేసిన పాచిక అని చెబుతున్నారు.నిజానికి జనంలో ఆగ్రహం ఇప్పటికిప్పుడు పెరిగింది కాదు. కరోనాకు ముందు పరిస్థితి దిగజారటం ప్రారంభమైంది, కరోనా మరింత దెబ్బతీసింది. అనేక మంది యువతకు ఉపాధిపోయింది. గతేడాది వేసవిలోనే పన్నుల వ్యతిరేక నిరసనలు జరిగాయి. ఉపాధి, పరిశ్రమలు పెద్దగా పెరగకపోయినా అనేక దేశాల్లో విదేశీ సంస్థలు ఇచ్చే రుణాలు, వాటితో పాటు దొరకే ముడుపులకు ఆశపడి ఆర్థిక వ్యవస్థ అవసరాలతో నిమిత్తం లేకుండా పెద్ద ఎత్తున రోడ్ల వంటి మౌలిక సదుపాయాలకు గాను దొరికిన మేర అప్పులు చేసిన దేశాలలో కెన్యా ఒకటి.రెండువేల సంవత్సరాల ప్రారంభంలో విదేశాల నుంచి తీసుకున్న భారీ మొత్తాలను ఆర్థిక వృద్దికి ఖర్చు పెట్టలేదు.దానికి తోడు వరదలు, కరోనా జతకలిశాయి.


దివాలా కోరు ఆర్థిక విధానాలను అనుసరిస్తున్న అన్ని వర్ధమాన దేశాల మాదిరే కెన్యా కూడా ఉంది.ప్రపంచంలో మూడు వందల కోట్ల మంది జనాభా ఉన్న దేశాలు ప్రజారోగ్యం, వైద్యం వంటి వాటికి చేస్తున్న ఖర్చు కంటే రుణాల అసలు, వడ్డీలు తీర్చటానికి ఎక్కువ మొత్తాలను ఖర్చు చేస్తున్నట్లు ఓపెన్‌ సొసైటీ ఫౌండేషన్‌ అధ్యక్షుడు బినాయిఫెర్‌ నౌరోజీ చెప్పాడు. వలసవాద అవశేషాలు, అవినీతి, ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం, విత్త దుర్వినియోగం. పెరిగిన ఆర్థిక, తెగల మధ్య అసమానతల వంటి అంశాలు కెన్యాను పట్టిపీడిస్తున్నాయి. వీటన్నింటినీ తొలగించి మంచి రోజులను తెస్తానంటూ అనేక సంవత్సరాలు మంత్రిగా, ఐదేండ్ల పాటు ఉపాధ్యక్షుడిగా పని చేసిన విలియం రూటో 2022 ఎన్నికల్లో అధ్యక్షుడయ్యాడు. రెండు సంవత్సరాల్లోనే తన నిజస్వరూపాన్ని ప్రదర్శించి ప్రజా వ్యతిరేకిగా రుజువు చేసుకున్నాడు. తాజా విత్త బిల్లును ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకొనేందుకు ఉద్దేశించారు. దానికి గాను పొదుపు అని ముద్దు పేరు పెట్టారు. చూడండి నా కార్యాలయ ఖర్చుకే కోతపెడుతున్నా అంటూ రూటో ప్రకటించాడు. ఇదంతా జనం మీద మోపే భారాలకు నాంది. ప్రపంచంలో పొదుపు చర్యలు ఎక్కడ తీసుకున్నప్పటికీ తొలుత కోతల వేటు పడేది సామాన్యులు, వారికి ప్రభుత్వం చేసే ఖర్చుల మీదే.అన్నింటికీ ఒక్కసారే కోతపెడితే జనం సహించరు. చేదు మాత్రను మింగించటం అలవాటు చేసినట్లుగా దశల వారీ మొదలు పెడతారు. కెన్యా రాబడిలో 60శాతం రుణాలు తీర్చేందుకే పోతోంది. అందువలన నేరుగా చేసే నగదు బదిలీల మొత్తాల కోత, చివరకు బడి పిల్లల మధ్యాహ్న భోజనఖర్చునూ తగ్గించనున్నారు.


పశ్చిమ దేశాలకు, ప్రత్యేకించి అమెరికా తొత్తుగా అధ్యక్షుడు విలియమ్‌ రూటో వ్యవహరిస్తున్నాడడని కెన్యా కమ్యూనిస్టు పార్టీ విమర్శించింది. గద్దె దిగేవరకూ ఆందోళన చేస్తామని ప్రకటించింది. రాజీనామా మినహా మరొకదాన్ని అంగీకరించేది లేదంది. గాజాలో మారణకాండ జరుపుతున్న యూదు దురహంకార ఇజ్రాయెల్‌ పాలకులకు, ఉక్రెయిన్‌ వివాదంలో నాటోకు మద్దతు ఇచ్చాడు. ఇటీవల కెన్యాను నాటో ఏతర భాగస్వామిగా ప్రకటించారు. సిఐఏ అల్లుతున్న కతలన్నింటినీ వల్లిస్తున్నాడు. అమెరికా మిలిటరీ కార్యకలాపాలకు మండా అనే దీవిని అప్పగించాడు. దేశీయంగా ఐఎంఎఫ్‌, ప్రపంచ బ్యాంకు విధానాలను అమలు జరుపుతున్నట్లు కమ్యూనిస్టు పార్టీ పేర్కొన్నది. ఒకసారి పార్లమెంటు ఆమోదించిన బిల్లును వెనక్కు తీసుకోవటానికి రాజ్యాంగం అనుమతించదని, ఒక వేళ అధ్యక్షుడు వెనక్కు పంపితే మూడింట రెండువంతుల మెజారిటీతో ప్రతిపాదనను ఆమోదిస్తే అది చట్టమై కూర్చుంటుందని చెప్పింది. పార్లమెంటు బిల్లును ఆమోదించిన తరువాత 14రోజుల్లో అధ్యక్షుడు ఆమోదం తెలపాల్సి ఉంటుంది, లేదా సవరణలు చేయాలంటూ వెనక్కు పంపాలి.


రొట్టెలపై 16,వంటనూనెలపై 25శాతం పన్ను ప్రతిపాదించారు.ఆర్థిక లావాదేవీలపై దశలవారీ పన్ను పెంపుదల, మోటారు వాహనాల ధరలో రెండున్నరశాతం ప్రతి ఏటా పన్ను కొత్తగా విధింపు, పర్యావరణానికి హాని కలిగించే వృధా ఉత్పత్తులపై పన్ను ప్రతిపాదించారు. దీనిలోనే దిగుమతి చేసుకొనే ఎలక్ట్రానిక్‌ వస్తువులు, శానిటరీ పాడ్‌ల మీద పన్ను ప్రతిపాదించారు. జిఎస్‌టి 16శాతం, ఆసుపత్రుల్లో వాడే పరికరాలు, నిర్మాణ సామగ్రి మీద కూడా పన్ను ప్రతిపాదించారు.ఉద్యోగుల వేతనాలపై గరిష్ట పన్ను మొత్తాన్ని 30 నుంచి 35శాతానికి పెంచగా, కొత్తగా 1.5శాతం ఇంటి పన్ను, వైద్య బీమా పేరుతో 2.75శాతం, ఇంథనంపై ఎనిమిదిశాతంగా ఉన్న పన్నును 16శాతానికి పెంచుతూ ప్రతిపాదించారు. పన్నుల పెంపుదల బాధాకరమే అయినప్పటికీ మన స్వాతంత్య్ర సమర యోధులు గర్వపడాలంటే జనం త్యాగాలు చేయాల్సి ఉంటుందని అధ్యక్షుడు సమర్ధించుకున్నాడు. తనకు గత ప్రభుత్వం నుంచి 65 బిలియన్‌ డాలర్ల అప్పు వారసత్వంగా వచ్చిందన్నాడు. రానున్న కాలంలో పన్ను వసూలు రోజులను కూడా పాటించాల్సి ఉంటుందేమో అంటూ జోకులు వేశాడు. ఏడాది కాలంలో 40సార్లు విదేశీ పర్యటనలు జరిపిన రూటో అట్టహాసంగా ఎంతో ఖర్చు చేశాడు. ఎందుకీ పర్యటనలు అంటే పెట్టుబడుల సాధన, ఉద్యోగఅవకాశాలను వెతికేందుకు అని సమర్ధించుకున్నాడు.ఇదే సమయంలో అనేక సంస్థలు మూతబడి వేలాది మందికి ఉపాధి పోయింది.రానున్న రోజుల్లో ఇంకా కార్యకలాపాలను కుదించవచ్చని కెన్యా యజమానుల సంఘం పేర్కొన్నది.జనం దగ్గర డబ్బులేక రోజుకు ఏడువందల గ్యాస్‌ సిలిండర్లు అమ్మేతాను ప్రస్తుతం రెండువందలకు పడిపోయినట్లు, తన దగ్గర ఉన్న సిబ్బందిని ఆ మేరకు తగ్గించినట్లు ఒక సంస్థ యజమాని చెప్పాడు. ప్రభుత్వ సిబ్బంది పన్ను వసూలు పేరుతో వ్యాపారులను వేధిస్తున్నట్లు చెప్పాడు. గత పాలకుల హయాంలో జరిగిన అవినీతి, ఆశ్రిత పక్షపాతం, జనాన్ని పట్టించుకోకపోవటం వంటి అంశాలను తీసుకొని తాము వస్తే మంచి రోజులు తెస్తామని చెప్పి, అంతకంటే ఎక్కువ భారాలు మోపిన వారిని చరిత్రలో ఎందరో ఉన్నారు. శ్రీలంకలో తాము అభిమానించిన దేశాధ్యక్షుడినే జనం చివరకు తరిమి కొట్టిన తీరును చూశాము. కెన్యాలో ప్రతిపాదించిన భారాలను రద్దు చేస్తే సరే లేకుంటే ఏం జరుగుతుందో చెప్పలేము.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అధికారం కోసం దేశం-ధర్మం పేరుతో అమాయక రైతులకు కాషాయ గుంపు అన్యాయం !

23 Sunday Jun 2024

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, Economics, Farmers, History, INDIA, Loksabha Elections, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices

≈ 1 Comment

Tags

#Farmers matter, #Farmers Protest, Anti Farmers, BJP, Minimum Support Prices, MSP demand, Narendra Modi Failures, RSS


ఎం కోటేశ్వరరావు


మూడవ సారి నరేంద్రమోడీ ప్రధాని పదవి చేపట్టారు. ఎంతో వేగంగా పని చేస్తారనే ప్రచారం పెద్ద ఎత్తున చేశారు. దానికి పక్కా నిదర్శనం జమ్మూ-కాశ్మీరుకు రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్‌ 370ని ఎంత వేగంగా రద్దు చేశారో దేశం చూసింది. 2019 జూలై చివరి వారంలో అసాధారణ రీతిలో కాశ్మీరులో భద్రతా దళాలను మోహరించారు.ఆగస్టు రెండవ తేదీ శుక్రవారం నాడు అమరనాధ్‌ యాత్రీకులకు ముప్పు ఉందంటూ యాత్ర నిలిపివేయాలని భద్రతా హెచ్చరిక కాశ్మీరు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది.ఆదివారం నాడు రాష్ట్ర మంతటా 144సెక్షన్‌ ప్రకటించారు, ఇంటర్నెట్‌ నిలిపివేశారు. సోమవారం నాడు ఆర్టికల్‌ 370ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దానికి ముందు అదేరోజు రాష్ట్రపతి ఉత్తరువు వెలువడింది. వెంటనే మంత్రివర్గ సమావేశం, అనంతరం అదే రోజు దాని మీద రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టారు.సభ్యులకు దాని కాపీలు ఇవ్వలేదు. ఉదయం పదకొండు గంటలకు సభ సమావేశమైతే గంటన్నరలో అంటే 12.30లోగా 57పేజీల పత్రం మీద కావాలంటే సవరణలు ప్రవేశపెట్టవచ్చంటూ చెప్పారు. వాటిని చదివేందుకు కూడా ఆ సమయం చాలదు. అదే రోజు సభలో ఆమోదం కూడా పొందారు.మరుసటి ఏడాది కరోనాను అవకాశంగా తీసుకొని మూడు సాగు చట్టాలనూ అంతే వేగంగా ఆమోదించి అమలు చేసేందుకు పూనుకున్నారు.వేగంగా పనిచేసే నాయకత్వ ఘనత గురించి నరేంద్రమోడీ భక్తులు, గోడీ మీడియా పండితులను అడిగితే కొండవీటి చాంతాడంత జాబితాను మన ముందుంచుతారు. రైతుల మహత్తర ఉద్యమం కారణంగా స్వాతంత్య్రానంతరం దేశంలో తొలిసారిగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాలను క్షమాపణ చెప్పి మరీ 2021లో వెనక్కు తీసుకోవటం కూడా వేగంగా జరిగినట్లే !


ఈ వేగం కోట్లాది మంది కోట్లాది మంది రైతులు కోరుతున్న, గతంలో నరేంద్రమోడీ కూడా డిమాండ్‌ చేసిన కనీస మద్దతు ధరలకు చట్టబద్దత కల్పించేందుకు ఎందుకు లేదు ? రెండు సంవత్సరాల క్రితం ఎంఎస్‌పితో సహా రైతాంగ సమస్యలపై నియమించిన కమిటీ నుంచి ఇంతవరకు తాత్కాలిక నివేదికను కూడా ఎందుకు తెప్పించుకోలేదు ? ఇష్టంలేని పెళ్లికి తలంబ్రాలు పోసినట్లుగా ప్రభుత్వ తీరు ఉంది. మూడు సాగు చట్టాలను 2021నవంబరులో రద్దుచేసినపుడు వెంటనే ఒక కమిటీని వేస్తామన్నారు. వెంటనే అంటే ఎనిమిది నెలలు, 2022 జూలై 12న కమిటీని వేశారు. ఆలస్యం ఎందుకంటే కొన్ని రాష్ట్రాలలో ఎన్నికల కారణంగా ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వలేదని, సంయుక్త కిసాన్‌ మోర్చా(ఎస్‌కెఎం) నుంచి స్పందన కోసం ఎదురుచూడాల్సి రావటం అని వ్యవసాయ మంత్రి సాకులు చెప్పారు. ఆ కమిటీకి నివేదించిన అంశాలు, కమిటీలో ప్రతిపాదించిన వ్యక్తుల పట్ల అభ్యంతరాలు తెలుపుతూ మోర్చా తన ప్రతినిధులను పంపేందుకు తిరస్కరించింది. కేంద్ర ప్రభుత్వం-ఎన్నికల కమిషన్‌ మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలను అందించాలని సమాచార హక్కు కింద కోరగా అలాంటి రికార్డులు లేవని సమాధానం ఇవ్వటాన్ని బట్టి అసలు బండారం వెల్లడైంది.అంతే కాదు రైతు సంఘాలతో సంప్రదింపుల సమాచారం కూడా లేదని 2023 డిసెంబరు నాలుగవ తేదీన మరో సమాచార హక్కు ప్రశ్నకు సమాధానం వచ్చింది. ఇక ప్రభుత్వం నియమించిన కమిటీ తీరుతెన్నులను చూస్తే ఎస్‌కెఎం ఎందుకు బహిష్కరించిందో వివరణ అవసరం లేదు. మొత్తం 29 మంది సభ్యులలో ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ సంస్థలు, కాలేజీల్లో పనిచేసే వారే 18 మంది ఉన్నారు. మిగిలిన పదకొండు మంది అధికారేతర సభ్యులలో ఎస్‌కెఎం నుంచి ముగ్గురిని నియమిస్తామని ప్రభుత్వం ప్రతిపాదించింది. మరో ఎనిమిది మంది అధికారపార్టీ కనుసన్నలలో వ్యవహరించే రైతు ప్రతినిధులే ఉన్నారు. ఈ కమిటీకి అధ్యక్షుడు సంజరు అగర్వాల్‌. వివాదాస్పద మూడు సాగు చట్టాలను ప్రతిపాదించినపుడు వ్యవసాయశాఖ కార్యదర్శి. మరో సభ్యుడు ఇఫ్‌కో చైర్మన్‌ దిలీప్‌, ఇతగాడు గుజరాత్‌ బిజెపి మాజీ ఎంపీ. మరొకరు ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ బికెఎస్‌ జాతీయ కార్యవర్గ సభ్యుడైన ప్రమోద్‌ చౌదరి, ఐదవ సభ్యుడు సయ్యద్‌ పాషా పటేల్‌ మహారాష్ట్ర బిజెపి మాజీ ఎంఎల్‌సి, ఇలా అందరూ గత సాగు చట్టాలను అడ్డంగా సమర్దించిన వారితోనే నింపిన తరువాత ఎస్‌కెఎం గళానికి అవకాశం ఎక్కడ ఉంటుంది.


ఇక ఈ కమిటీ తొలి పద్దెనిమిది నెలల కాలంలో 35 సమావేశాలు జరిపినట్లు, ఎప్పుడు నివేదిక సమర్పిస్తుందో చెప్పకుండా పార్లమెంటుకు ప్రభుత్వం జవాబిచ్చింది.ఫిబ్రవరి తరువాత మరో రెండు సార్లు సమావేశమైనట్లు వార్తలు.ఈ కమిటీ అనేక ఉపసంఘాలను ఏర్పాటు చేసింది. వాటి నివేదికలు ఇవ్వాలని కోరినా అందుబాటులో లేవన్నదే ప్రభుత్వ సమాధానం. గతంలో స్వామినాధన్‌ కమిషన్‌, తరువాత నరేంద్రమోడీ ఏర్పాటు చేసిన 2016కమిటీ కూడా అనేక అంశాలను చర్చించింది. అందువలన కొత్త కమిటీ చర్చల పేరుతో కాలయాపన తప్ప మరొకటి కాదు. వాటి సిఫార్సులకు వ్యతిరేకంగా మూడు సాగు చట్టాల్లోని అంశాలు ఉన్నాయి. అయినా మోడీ వాటిని రద్దు చేస్తూ 2021లో చేసిన ప్రసంగంలో రైతులకు కొత్త ఆశలను రేకెత్తించారు.2014 ఎన్నికల సమయంలో బిజెపి చేసిన వాగ్దానానికి వ్యతిరేకంగా మోడీ సర్కార్‌ సుప్రీం కోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. దేశ 75వ స్వాతంత్య్రదినోత్సవం (2022) నాటికి రైతుల ఆదాయాలను రెట్టింపు చేస్తామని 2016 ఫిబ్రవరి 28 బడ్జెట్‌ సందర్బంగా మోడీ చెప్పారు. అదే ఏడాది ఏర్పాటు చేసిన అశోక్‌ దలవాయి కమిటీ 2012-13 ఎన్‌ఎస్‌ఎస్‌ఓ అంచనా ప్రాతిపదికన 2015-2016లో ఒక రైతు రాబడి ఏడాదికి రు.96,703, నెలకు రు.8,058 ఉంటుందని అంచనా వేసి 2022-23నాటికి అది రు.2,71,378- రు.22,610 ఉండాలని, దాన్ని సాధించాలంటే ఏటా 10.4శాతం పెరుగుదల ఉండాలని చెప్పింది. ఇప్పుడు ఎంత ఉందో ఎక్కడా ప్రభుత్వం ప్రకటించలేదు. అయితే 2018-19లో 77వ రైతు కుటుంబాల పరిస్థితి అంచనా సర్వే ప్రకారం రాబడుల మొత్తాలు రు.1,22,616-రు.10,218 ఉన్నట్లు తేలింది. ఈ నివేదికను 2021లో విడుదల చేశారు. దీని ప్రకారం చూస్తే వార్షిక పెరుగుదల కేవలం 2.8శాతమే ఉంది. పదేండ్ల యూపిఏ పాలన సగటు మూడు శాతం కంటే తక్కువ. అయితే ఏ ప్రాతిపదిక లెక్కించారో చెప్పకుండా కొన్ని పంటలకు 2022 ఆర్థిక సంవత్సరంలో రాబడి రెట్టింపు ఉన్నట్లు ఎస్‌బిఐ పరిశోధనా విభాగం చెప్పిన అంకెలను బిజెపి పెద్దలు ఊరూవాడా ప్రచారం చేశారు. గోడీ మీడియా దాన్ని ఇంకా ఎక్కువ చేసింది. నిజంగా అంత పెరిగి ఉంటే రైతాంగం ఈ ఎన్నికల్లో అనేక చోట్ల బిజెపి, దాని మిత్రపక్షాలను ఎందుకు మట్టికరిపించినట్లు ? అనేక చోట్ల రైతులు కనీస మద్దతు ధరలకంటే తక్కువకే అమ్ముకుంటున్నారు. రైతుల రాబడి రెట్టింపు ఎంతవరకు వచ్చిందన్న ప్రశ్నకు 2023 డిసెంబరులో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ స్పందిస్తూ వ్యవసాయం రాష్ట్రాల అంశం గనుక అవి చూసుకుంటాయని దాట వేశారు. మూడు సాగు చట్టాలను రాష్ట్రాలతో సంప్రదించకుండా వాటి ఆమోదం లేకుండా అమలుకు పూనుకున్నపుడు ఈ అంశం గుర్తులేదా ? రైతుల్లో పెరుగుతున్న అసంతృప్తిని గమనించి గత ఎన్నికలకు ముందు కొంత మంది రైతులకు నెలకు రు.500 ఏడాదికి ఆరువేల చొప్పున పిఎం కిసాన్‌ నిధిపేరుతో ఇస్తున్నారు. ఐదేండ్లలో పెరిగిన వ్యవసాయ ఖర్చులతో పోల్చితే ఇది ఏమూలకూ రాదు. ఈ మొత్తాన్ని ఎనిమిది వేలకు పెంచనుందనే లీకులను వదిలి రైతాంగాన్ని మభ్యపెట్టేందుకు చూసింది. ఇప్పుడు దాని గురించి మాట్లాడటం లేదు.


తాజాగా వర్తమాన ఖరీఫ్‌ పంటలకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరలను ప్రకటించింది. ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని గతేడాది ఏడుశాతం పెంచగా ఇప్పుడు ఓట్లతో నిమిత్తం లేదు గనుక 5.4శాతం మాత్రమే పెంచారు. తాజా ఎన్నికల్లో 159 గ్రామీణ నియోజకవర్గాలలో ఓడిపోయిన బిజెపి దాన్నుంచి ఎలాంటి పాఠం నేర్చుకోలేదన్న సంయుక్త కిసాన్‌ మోర్చా వ్యాఖ్యను గమనించాలి.ఈ సందర్భంగా పదేండ్ల యుపిఏ పాలనలో పెరిగింది ఎంత, రాబడిని రెట్టింపు చేస్తామన్న నరేంద్రమోడీ ఎంత పెంచారు అన్నది మీడియాలో చర్చకు వచ్చింది. దీన్ని గోడీ మీడియా మూసిపెట్టేందుకు చూసింది.ప్రభుత్వ సమాచారం ప్రకారమే మచ్చుకు సోయాబీన్‌కు గత పాలకులు, 175, పత్తికి 115శాతం పెంచగా మోడీ పదేండ్లలో 80,79శాతాల చొప్పునే పెంచారు. అనేక పంటల ధరల పెరుగుదల శాతాల తీరు తెన్నులు దిగువ విధంగా ఉన్నాయి. దీనికి ఆధారం కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ వద్ద ఉన్న సమాచారం.ఈ కనీస మద్దతు ధరలు కూడా రైతాంగంలో కేవలం పద్నాలుగుశాతం మాత్రమే పొందుతున్నారన్నది అంచనా.


పంట××××× యుపిఏ ×× మోడీ ఏలుబడి

వరి ముతక×× 138.2 ×× 66.7
గోధుమ ×× 122.2 ×× 62.5
చెరకు ×× 187.7 ×× 50.0
ఆవాలు ×× 90.6 ×× 85.3
పత్తి ××114.5 ×× 78.9
మొక్క జొన్న ××1594 ×× 59.5
శనగలు ×× 121.4×× 75.5
కందులు ×× 216.2×× 62.8
నరేంద్రమోడీ సర్కార్‌ రైతులకు చేసిన మేలు ఇలా ఉంది గనుకనే అనేక చోట్ల బిజెపి ఎదురుదెబ్బలు తిన్నది, గత ఎన్నికల కంటే సీట్లు, ఓట్ల శాతాన్ని కూడా కోల్పోయింది. దేశాన్ని ఊపివేస్తున్న నీట్‌ పరీక్షా పత్రాల కుంభకోణం ఎన్నికలకు ముందే వెలువడి ఉంటే దాని పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోవచ్చు. దేశం కోసం-ధర్మం కోసమంటూ కబుర్లు చెప్పిన కాషాయదళం తీరుతెన్నులు వచ్చే ఐదు సంవత్సరాలూ వ్యవసాయ రంగంలో ఇదే విధంగా ఉండకూడని అనేక మంది కోరుతున్నారు.పెడచెవిన పెడితే రైతాంగ ఉద్యమాలు వెల్లువెత్తుతాయి. జిడిపిలో వ్యవసాయ రంగం వాటా 15-16శాతమే ఉన్నప్పటికీ జనాభాలో 45శాతం మందికి ఉపాధి చూపుతున్నది. ఇది కూడా కుదేలైతే గ్రామీణా ప్రాంతాలలో అలజడి రేగుతుంది. జూలై పదవ తేదీన సంయుక్త కిసాన్‌మోర్చా జనరల్‌ బాడీ సమావేశం ఎన్నికల అనంతర పరిస్థితి గురించి సమీక్ష, కార్యాచరణ గురించి చర్చించనుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

నరేంద్రమోడీ రెండు ముఖాలు : రైౖతుల మద్దతు కోసం పాకులాట – ఉద్యమ సంఘాలపై పగసాధింపు !

22 Saturday Jun 2024

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, Farmers, History, INDIA, Loksabha Elections, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices

≈ Leave a comment

Tags

#Failed Narendra Modi, #Farmers matter, AIKS, BJP, Minimum Support Prices, MSP demand, Narendra Modi Failures, PM Kisan Nidhi, Samyukta Kisan Morcha, SKM


ఎం కోటేశ్వరరావు


ఐదు సంవత్సరాల క్రితం ప్రారంభించిన కిసాన్‌ సమ్మాన్‌ యోజన పదిహేడవ విడత నిధులను మూడోసారి అధికారానికి వచ్చిన తరువాత పెద్ద ఆర్భాటంతో ప్రధాని నరేంద్రమోడీ విడుదల చేశారు.(ఆంధ్రప్రదేశ్‌ మాజీ సిఎం వైఎస్‌ జగన్‌ మీట నొక్కుడును గుర్తుకు తెచ్చింది) అంతకు ముందు తొలిసంతకం దాని మీదే చేసినట్లు కూడా ప్రచారం జరిగింది.వెంటనే తాను ఎన్నికైన లోక్‌సభ స్థానం వారణాసి వెళ్లి రైతులతో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. ఎగుమతుల ద్వారా భారత ఆహార వస్తువులను ప్రపంచంలో ప్రతి ఒక్కరి కంచంలో చూడాలని ఉందన్నారు. గతంలో ఎన్నడూ పిఎం కిసాన్‌ యోజన నిధుల విడుదలకు ఇంత హంగామా చేయలేదు. నిజానికి ఈ సొమ్ము ఏ కార్పొరేట్ల నుంచో ధనికుల నుంచో వసూలు చేసి ఇవ్వటం లేదు. మనం కొనుగోలు చేసే పెట్రోలు మీద లీటరుకు రు.2.50, డీజిలు మీద రు.4.00 సెస్‌ల పేరుతో కేంద్రం వసూలు చేసి దాన్నుంచి ఇస్తున్నది. ఇదే కాదు మొత్తం 29 వస్తువులపై ఈ పేరుతో పన్ను మీద 15శాతం సెస్‌ల రూపంలో వినియోగదారుల జేబుల నుంచి కొట్టివేసి దాన్నుంచే కొన్ని పథకాలను అమలు చేస్తున్నది. ఎప్పుడూ లేనిది కిసాన్‌ సమ్మాన్‌ నిధి విడుదలను ప్రచారానికి ఎందుకు వినియోగించుకున్నట్లు ? అదేమీ అర్ధంగాని తత్వం లేదా బ్రహ్మ పదార్ధం కాదు.తాజా లోక్‌సభ ఎన్నికల్లో రైతుల నుంచి వెల్లడైన వ్యతిరేకత అనేక ప్రాంతాల్లో ఓటమిలో వారి పాత్రను చూశారు. తత్వం తలకెక్కి రాబోయే రాష్ట్రాల అసెంబ్లీ ముఖ్యంగా హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో దగ్గరయ్యే ఎత్తుగడతో వారికోసం తాను తపిస్తున్నట్లు కనిపించేందుకు చేసిన యత్నం తప్ప మరొకటి కాదు.కొందరి విశ్లేషణ ప్రకారం గత లోక్‌సభలో 543 స్థానాలకు గాను బిజెపి 201గ్రామీణ నియోజకవర్గాలలో విజయం సాధించగా తాజా ఎన్నికల్లో 126 చోట్ల మాత్రమే గెలిచింది.వ్యవసాయదారులను నిర్లక్ష్యం చేసిన కారణంగా 159 చోట్ల బిజెపి ఓడిపోయిందని, రైతుల ప్రతినిధులను బడ్జెట్‌ చర్చల ప్రక్రియలో భాగస్వాములను చేయకుండా అహంకారాన్ని ప్రదర్శిస్తే, రైతాంగాన్ని నిర్లక్ష్యం చేస్తే దేశవ్యాపితంగా ఆందోళన తప్ప మరొక మార్గం లేదని ఆలిండియా కిసాన్‌ సభ (ఏఐకెఎస్‌) స్పష్టం చేసింది.


నిజంగా వ్యవసాయం, దాని మీద ఆధారపడిన రైతులు, కూలీల గురించి కేంద్ర ప్రభుత్వానికి అంతశ్రద్ద ఉందా ? పదేండ్ల ఆచరణ చూస్తే అలా కనిపించదు. ఉమ్మడి జాబితాలో ఉన్న వ్యవసాయ రంగంలో రాష్ట్రాలలో చర్చ, ఆమోదంతో నిమిత్తం లేకుండా కరోనా సమయంలో అమల్లోకి తెచ్చిన మూడు రైతు వ్యతిరేక సాగు చట్టాలు, వాటికి వ్యతిరేకంగా ఏడాది పాటు సాగిన రైతు ఉద్యమం తెలిసిందే.విధి లేని స్థితిలో క్షమాపణలు చెప్పిమరీ మోడీ వాటిని వెనక్కు తీసుకున్నారు. ఆ మహత్తర ఉద్యమానికి నాయకత్వం వహించింది అనేక రైతు సంఘాలతో కూడిన సంయుక్త కిసాన్‌ మోర్చా(ఎస్‌కెఎం). ఆ వేదికలో కీలక పాత్రపోషించిన ఆలిండియా కిసాన్‌ సభ(ఎఐకెఎస్‌) దేశంలో అతి పెద్ద రైతు ఉద్యమ సంస్థ, తొలి వరుసలో ఉంది. మూడు సాగు చట్టాల రద్దు కొనసాగింపుగా కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరలు, ఇతర అంశాల గురించి 2022 జూలైలో ఒక కమిటీని వేసింది. అది ఏం చేస్తున్నదో నివేదిక ఎప్పుడు సమర్పిస్తుందో తెలియదు. బడ్జెట్‌ రూపకల్పన సందర్భంగా వివిధ తరగతులు ఏ కోరుకుంటున్నారో తెలుసుకొనేందుకు ప్రభుత్వం సంస్థలు, వ్యక్తులను కూడా పిలిచి ప్రతి ఏడాది సంప్రదింపులు జరుపుతుంది. లోక్‌సభ ఎన్నికల కారణంగా ఆమోదం పొందిన తాత్కాలిక(ఓట్‌ ఆన్‌ ఎకౌంట్‌) స్థానంలో పూర్తి బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు కేంద్రం ఇప్పుడు ఆ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఈ చర్చలకు ఎస్‌కెఎం, ఏఐకెఎస్‌లను దూరంగా పెట్టింది. ఇది రైతులను అవమానించటం, కక్ష సాధింపు అనేందుకు పక్కానిదర్శనం.ఈ వైఖరిని ఆలిండియా కిసాన్‌ సభ ఒక ప్రకటనలో తీవ్రంగా నిరసించింది. కనీస మద్దతు ధరలను సిఫార్సు చేసే వ్యవసాయ ఖర్చులు, ధరల కమిషన్‌(సిఏసిపి) ప్రతి ఏటా ఎఐకెఎస్‌ను ఆహ్వానించి అభిప్రాయాలను తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఎస్‌కెఎం నాయకులను కూడా చర్చల నుంచి మినహాయించటాన్ని కూడా ఎఐకెఎస్‌ ఖండించింది.


మూడవసారి అధికారానికి వచ్చిన నరేంద్రమోడీ వ్యవసాయం గురించి సరికొత్తగా ఆలోచించి కార్యాచరణ చేపట్టాలని అనేక మంది చెబుతున్నారు. మోడీ సర్కార్‌ పారిశ్రామిక వస్తు ఎగుమతుల్లో విఫలమైంది. సముద్ర ఉత్పత్తులను వ్యవసాయ ఉత్పత్తులు, ఆహార ఉత్పత్తులకు జతచేసిి మొత్తం వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతిగా చూపుతున్నారు.2014-15 సంవత్సరంలో మొత్తం ఎగుమతులు 36.18బిలియన్‌ డాలర్లుండగా 2020-21నాటికి 38.32 బి.డాలర్లకు పెరిగినట్లు ఏటా పెరుగుదల శాతం 0.96శాతంగా ఉన్నట్లు ఆహార తయారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపినట్లు బిజినెస్‌ టుడే పత్రిక 2021 డిసెంబరు 10న ప్రచురించిన వార్తలో పేర్కొన్నది.సముద్ర, తోటల ఉత్పత్తులను మినహాయించి కేవలం వ్యవసాయ ఉత్పత్తుల విలువ 2020-21లో 29.81 బిలియన్‌ డాలర్లు ఉన్నట్లు మంత్రిత్వశాఖ పేర్కొన్నది. చిత్రం ఏమిటంటే మోడీ అధికారానికి రాకముందు 2013-14 సంవత్సరంలో మొత్తం వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల విలువ 37.292బి.డాలర్లు. ఈ అంశాన్ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ వెల్లడించినట్లు పిఐబి 2014జూలై తొమ్మిదిన తెలిపింది.దీంతో పోల్చుకున్నా, ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే వాస్తవ విలువ తిరోగమనంలోనే ఉంటుంది. జనాన్ని మభ్యపరిచేందుకు పాలకుల కనుసన్నలలో పనిచేసే అధికార యంత్రాంగం ఎన్నితిప్పలు పడుతుందో పిఐబి 2024 ఫిబ్రవరి 17న వెల్లడించిన మరో సమాచారాన్ని చూస్తే తెలుస్తుంది. మోడీ అధికారానికి వచ్చిన పదేండ్లలో సాధించిన విజయాల గురించి కీర్తించటం తెలిసిందే. దానిలో భాగంగానే 1987-88లో అపెడా( వ్యవసాయ మరియు ఆహార ఉత్పత్తుల అభివృద్ధి సంస్థ) ఎగుమతులు కేవలం 0.6బిలియన్‌ డాలర్లేనని అలాంటిది 2022-23నాటికి 26.7బి.డాలర్లకు పెరిగినట్లు , ఇది మోడీ గొప్పతనం అన్నట్లు చిత్రించింది. ఈ ఏడాదిలో వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల విలువ 53.1బి.డాలర్లని కూడా తెలిపింది. ఈ లెక్కన చూసుకున్నా పదేండ్లలో పెరిగింది 53.1-37.29=15.81 బి.డాలర్లు మాత్రమే. తాను వచ్చిన తరువాత భారత ప్రతిష్టను, విదేశాల్లో తిరిగి మార్కెట్లను పెంచానని, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు చేశామని చెప్పుకున్న నరేంద్రమోడీ ప్రచారానికి ధీటుగా ఈ పెరుగుదల లేదు. యాహూ న్యూస్‌ 2024 మార్చి 21వ తేదీ విశ్లేషణ ప్రకారం 2022లో వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేసే 20 అగ్రదేశాలలో మనది 11వ స్థానం, చైనా ఆరవదిగా ఉంది.


మన రైతులు నేరుగా ఏ దేశానికైనా ఎగుమతులు చేసుకొనేందుకు, దేశంలో ఎక్కడైనా అమ్ముకొనేందుకు వీలుగా మూడు సాగు చట్టాలను తీసుకొచ్చినట్లు నరేంద్రమోడీ సర్కార్‌ చెప్పుకున్న సంగతి తెలిసిందే.కానీ అదే ప్రభుత్వం లోక్‌సభ ఎన్నికలకు ముందు గోధుమలు, బియ్యం, పంచదార, ఉల్లిపాయల ఎగుమతులపై ఆంక్షలు, నిషేధం ఈ జాబితాలో ఉన్నాయి. ఇవి పండే ప్రాంతాలలో ఎక్కువ చోట్ల బిజెపి లోక్‌సభ ఎన్నికల్లో చావుదెబ్బతిన్నది. ఆంక్షల వలన 2023 ఏప్రిల్‌-అక్టోబరు మాసాల మధ్య బాస్మతి బియ్యం ఎగుమతులు 16శాతం పెరిగినా ఇతర ఉత్పత్తుల్లో నాలుగు బిలియన్‌ డాలర్ల మేర ఎగుమతులు జరగలేదు. తొమ్మిదిశాతం ఎగుమతులు తన పరిధిలో తగ్గినట్లు అపెడా పేర్కొన్నది. వ్రతం చెడ్డా ఫలం దక్కలేదు అన్నట్లుగా బిజెపి రైతుల ఆగ్రహాన్ని చూడాల్సి వచ్చింది. ఉల్లి ఎగుమతులపై నిషేధం కారణంగా నేపాల్‌, ఇతర దేశాలు మన బదులు పాకిస్తాన్‌, చైనాల నుంచి కొనుగోలుకు పూనుకున్నాయి. అంటే ఎగుమతి అవకాశాన్ని తన ఎన్నికల లబ్దికోసం మోడీ అనిశ్చితిలో పడేశారు. పోనీ మనదేశంలో ఉల్లి దిగుబడిని పెంచేందుకు ఏమైనా చర్యలు తీసుకున్నారా అంటే అదీ కనపడదు. చైనాలో హెక్టారుకు 21.85 టన్నుల దిగుబడి ఉండగా మనదేశంలో 16.12 టన్నులు మాత్రమే ఉంది. ప్రపంచ ఉత్పత్తిలో రెండు దేశాలూ ఒకటి రెండు స్థానాల్లో ఉంటున్నాయి.


వ్యవసాయ రంగంలో నెలకొన్న సంక్షోభాన్ని పరిష్కరించేందుకు అవసరమైన చర్యలకు బదులు రైతాంగాన్ని కార్పొరేట్లకు అప్పగించేందుకు మూడు సాగు చట్టాల పేరుతో చేసిన యత్నం బెడిసి కొట్టింది. తరువాత కూడా అదే వైఖరి. కనీస మద్దతు ధరల(ఎంఎస్‌పి) విధానాన్ని ఎత్తివేయాలన్న ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌ ఆదేశాల అమలుకు చూస్తున్నారు. ఆ కారణంగానే ఎంఎస్‌పికి చట్టబద్దత కల్పించేందుకు మొరాయిస్తున్నారు. మరో ఐదు సంవత్సరాల వరకు పార్లమెంటు ఎన్నికలు లేవు గనుక ఎగుమతి వ్యాపారంలో ఉన్న బడా సంస్థల కోసం వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులపై ఆంక్షలను త్వరలో ఎత్తివేసి అవి రైతులకోసమే అని చెప్పినా ఆశ్చర్యం లేదు. మూడు సాగు చట్టాల తరువాత వేసిన కమిటీతో మరో రూపంలో ఆ చట్టాల్లోని అంశాలనే చెప్పించి కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పించటానికి సాకుల కోసం చూస్తున్నారు. ఆ పేరుతో ప్రపంచవాణిజ్య సంస్థ, ఐఎంఎఫ్‌, ప్రపంచ బాంకులను సంతుష్టీకరించేందుకు పూనుకోవచ్చు.మన వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులపై ఆంక్షలు విధించిన నరేంద్రమోడీ మరోవైపు పప్పుధాన్యాలు, ఖాద్యతైలాల దిగుమతులపై పన్నులు తగ్గించారు. దీంతో మనదేశంలో వీటిని సాగుచేసే రైతాంగం తీవ్రంగా నష్టపోతోంది. ద్రవ్యోల్బణ అదుపు చర్యలంటూ ఎగుమతులపై ఆంక్షలు, దిగుమతులపై పన్నుల తగ్గింపు కారణంగా అంతిమంగా నష్టపోయింది రైతులు మాత్రమే. ఎన్నికలు జరుగుతున్నపుడు కిలో ఇరవై రూపాయలున్న ఉల్లి ఫలితాలు వచ్చిన వెంటనే యాభై రూపాయలకు పెరిగింది. దీంతో రైతులెంత లబ్దిపొందుతారో తెలియదు గానీ వినియోగదారుల జేబులకు చిల్లి పడింది.

తొలిసారి నరేంద్రమోడీ అధికారానికి రావటానికి, కాంగ్రెస్‌ ఘోరంగా ఓడిపోవటానికి కారణాల్లో ద్రవ్యోల్బణం-ధరల పెరుగుదల కూడా ఒకటి.అందుకే తాజా ఎన్నికలకు ముందు దాన్ని కృత్రిమంగా అదుపులో ఉంచేందుకు పైన పేర్కొన్న చర్యలను తీసుకున్నారు.అయినప్పటికీ ఆహార ద్రవ్యోల్బణం 2023 నవంబరు నుంచి ఎనిమిదిశాతానికి అటూ ఇటూగా ఉంది. ఆ మేరకు పప్పులు, నూనెలు, ఇతర ఆహార వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. బిజెపిని దెబ్బతీసిన అంశాలలో ఇది కూడా ఒకటి. ఈ నేపధ్యంలో బడ్జెట్‌లో రైతులు ఏం కోరుతున్నారో తెలుసుకోవాలంటే వారి సమస్యలపట్ల నిత్యం పని చేస్తున్న సంయుక్త కిసాన్‌ మోర్చా, ఆలిండియా కిసాన్‌ సభ వంటి సంస్థలను, రైతాంగ సమస్యలపై అధ్యయనం చేస్తున్న మేధావులను సంప్రదించకుండా కుదిరేది కాదు. ఆ దిశగా కేంద్ర తీరు లేదంటే దాని అర్ధం ఏమిటి ? చర్చలకు పిలిస్తే ఎవరేం కోరుతున్నారో రైతులకు స్పష్టత వస్తుంది, వాటిని అమలు జరపకపోతే పాలకుల మీద వత్తిడి పెరుగుతుంది. అందుకే దూరంగా పెట్టారు.తన కోడి కూయకపోతే ఎలా తెల్లవారుతుందో చూస్తానని ఒక ముసలమ్మ అనుకుందట.అలాగే ప్రభుత్వం అవకాశం కల్పించనంత మాత్రాన ఉద్యమ సంస్థల వాణి రైతులకు చేరకుండా ఉంటుందా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఏమి రాజకీయాల్రా బాబూ : చైనాపై అమెరికా పెద్దన్న ధ్వజం – విశ్వగురువు నరేంద్రమోడీ లొంగుబాటు !!

16 Thursday May 2024

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, Europe, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Prices, USA, WAR

≈ Leave a comment

Tags

Anti China Propaganda, Anti communist, BJP, China, CHINA TRADE, Donald trump, Import duty on EVs, Joe Biden, Narendra Modi Failures, RSS, TRADE WAR, Xi Jinping


ఎం కోటేశ్వరరావు


ఒకవైపు బెదిరించి లొంగదీసుకోవాలన్న ఎత్తుగడ. మరోవైపు జనం ముందు శత్రువు అంటూనే చైనా సంతుష్టీకరణ.ఎందుకిలా జరుగుతోంది ? ” ఉక్రెయిన్‌ యుద్ధాన్ని నరేంద్రమోడీ ఆపివేయగలిగారు. అమెరికా, రష్యా అధినేతలను సైతం శాసించగలిగిన పలుకుబడి కలిగిన విశ్వగురువుగా ఎదిగారు, ప్రపంచ నేతల్లో పలుకుబడి ఎక్కువ కలిగిన నేతగా ఉన్నారు.” మోడీ గురించి ఇలాంటి ఎన్నో అంశాలను ప్రచారం చేస్తున్నారు. జనం కూడా నిజమే కదా అని వింటున్నారు, మేము సైతం తక్కువ తిన్నామా అన్నట్లుగా వాటిని ఇతరులకు ఉచితంగా పంచుతున్నారు. వాట్సాప్‌ విశ్వవిద్యాలయం నుంచి ఎలాంటి కష్టం లేకుండానే పట్టాలు పొందుతున్నారు.ఇక తాజా విషయానికి వస్తే చైనా నుంచి దిగుమతి అవుతున్న విద్యుత్‌ వాహనాలు,కంప్యూటర్‌ చిప్స్‌, వైద్య ఉత్పత్తులపై అమెరికా సర్కార్‌ వందశాతం వరకు దిగుమతి సుంకాన్ని విధించి వాణిజ్య యుద్దాన్ని కొనసాగిస్తున్నాం కాసుకోండి అంటూ ఒక సవాల్‌ విసిరింది. మరి అదే అమెరికా మెడలు వంచారని, దారిలోకి తెచ్చుకున్నారని చెబుతున్న నరేంద్రమోడీ ఏం చేశారు ? ఇప్పటి వరకు మనదేశం విదేశీ విద్యుత్‌ వాహనాలపై రకాన్ని బట్టి 70 నుంచి 100శాతం వరకు విధిస్తున్న దిగుమతి సుంకాన్ని పదిహేను శాతానికి తగ్గించారు. అయితే చైనా కంపెనీలతో సహా ఎవరైనా 50 కోట్ల డాలర్ల మేరకు ఆ వాహనరంగంలో మనదేశంలో పెట్టుబడులు పెట్టాలి, ఉత్పత్తి ప్రారంభించేంత వరకు ఐదు సంవత్సరాల పాటు ఏటా ఎనిమిది నుంచి 40వేల వరకు వాహనాలను ప్రతి కంపెనీ నేరుగా దిగుమతులు చేసుకోవచ్చు. వాహనాల తయారీలో దేశీయంగా ఉత్పత్తి చేస్తున్న విడిభాగాల వినియోగం ప్రస్తుతం 30 నుంచి 40శాతం వరకు ఉందని, నూతన విధానం వలన మరింత పెరుగుతుందని ప్రభుత్వం చెబుతుండగా రానున్న రోజుల్లో చైనా వాహనాలతో భారత మార్కెట్‌ నిండిపోతుందని ఆ రంగ నిపుణులు హెచ్చరిక, ఆందోళన వెల్లడించారు. అమెరికా మెడలే వంచగలిగిన నరేంద్రమోడీ చైనా విషయంలో ఇప్పుడున్న పన్నును కొనసాగించకుండా ఇలా ఎందుకు లొంగిపోయినట్లు ? అమెరికా పెద్దన్న బెదిరించి లొంగదీసుకోవాలని చూస్తుంటే, విశ్వగురువు తనకు నచ్చని మాట సంతుష్టీకరణకు ఎందుకు పూనుకున్నట్లు ?


నవంబరు నెలలో జరగనున్న ఎన్నికల్లో జో బైడెన్‌కు ప్రత్యర్ధి డోనాల్డ్‌ ట్రంప్‌ చుక్కలు చూపిస్తున్నాడు.చైనా నుంచి దిగుమతులు అంటే అమెరికన్లకు ఉపాధి తగ్గటమే. అందుకే ఓటర్లను ప్రసన్నం చేసుకొనేందుకు బైడెన్‌ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఎందుకంటే అమెరికాలో విద్యుత్‌ వాహనాలను తయారు చేసే కంపెనీలు ఉన్నాయి గనుక అక్కడి వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మనదేశంలో పదేండ్లలో మోడీ అలాంటి కార్ల తయారీని ప్రోత్సహించటం, పరిశోధనా, అభివృద్ధి రంగాలను పట్టించుకోలేదు. ఈ కారణంగా మనదేశంలోని కార్పొరేట్‌ సంస్థలు చైనా కంపెనీలతో సంయుక్త భాగస్వామ్యం, దిగుమతులకు మోడీ సర్కార్‌ మీద వత్తిడి తెచ్చాయి. ఎన్నికలలో వాటి నుంచి నిధులు కావాలి గనుక ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడక ముందే వాటిని సంతుష్టీకరించేందుకు విద్యుత్‌ వాహనాల దిగుమతి, తయారీ విధానంలో వారికి అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. కొన్ని కంపెనీలు ఎన్నికల బాండ్ల రూపంలో అంతకు ముందే బిజెపికి గణనీయమొత్తాలను సమర్పించుకున్నాయి. సుప్రీం కోర్టు తీర్పు తరువాత బహుశా టెంపోలలో నోట్లను రవాణా చేసి ఉంటాయి. దిగుమతుల కారణంగా ఉపాధి తగ్గినా లేక నిరుద్యోగం ప్రాప్తించినా అమెరికా సమాజం సహించదు. మనదేశంలో అలాంటి పరిస్థితి లేదు, మతం, కులం, ప్రాంతం, విద్వేషం, తప్పుడు సమాచారం తదితర అనేక మత్తుమందులను ప్రయోగిస్తూ అసలు సమస్యల నుంచి జనాన్ని తప్పుదారి పట్టించటంలో ఎవరు అధికారంలో ఉన్నా సర్వసాధారణమైంది. జనం కూడా అలవాటు పడ్డారు.గుళ్లు, మసీదు, చర్చీలు ఇతర ప్రార్ధనామందిరాలకు వెళ్లి రోజంతా వేడుకోవటానికి కానుకల సమర్పణ, కొబ్బరి కాయలు కొట్టేందుకు సిద్దపడుతున్నారు గానీ ప్రభుత్వ విధానాలను ప్రశ్నించటానికి ఆసక్తి చూపటం లేదు.


అమెరికా పెంచిన పన్నులను రద్దు చేయాలని లేదా తాము కూడా ప్రతిచర్య తీసుకుంటామని చైనా స్పందించింది.చైనా నుంచి దిగుమతి చేసుకొనే విద్యుత్‌ వాహనాలు,అల్యూమినియం, సెమీకండక్టర్లు,బ్యాటరీలు, కొన్ని రకాల ఖనిజాలు, సోలార్‌ సెల్స్‌,క్రేన్ల వంటి వాటి మీద దిగుమతి పన్ను పెంపు కారణంగా కనీసం 1,800కోట్ల డాలర్ల మేర అమెరికా వినియోగదారుల మీద భారం పెరుగుతుంది. ఆ కారణంగా దిగుమతులు నిలిపివేస్తే ప్రత్యామ్నాయం చూపే పరిస్థితిలో అమెరికా లేదు. వాటినే ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సివస్తే భారం ఇంకా పెరుగుతుంది. గత ఏడాది చైనా నుంచి 427 బిలియన్‌ డాలర్ల విలువగల వస్తువులను దిగుమతి చేసుకున్న అమెరికా 148బి.డాలర్ల విలువగల వస్తువులను ఎగుమతి చేసింది.గతంలో చైనా కూడా ప్రతిచర్యల్లో భాగంగా పన్నులు పెంచింది. చైనా వస్తువుల మీద ఆధారపడకుండా స్వంతంగా తయారు చేసుకోవాలని, తద్వారా చైనాను ఆర్థికంగా దెబ్బతీయాలని, తమ కాళ్ల దగ్గరకు తెచ్చుకోవాలనే సంకల్పం చెప్పుకున్న అమెరికా, ఐరోపా దేశాల సరసన మనదేశం కూడా ఉంది.
అనేక దేశాలతో మనదేశం స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలు(ఎఫ్‌టిఏ) చేసుకుంది. ప్రపంచ వాణిజ్య సంస్థ ఉన్నప్పటికీ దాన్ని పక్కన పెట్టి పరస్పరం లబ్ది పొందేందుకు వీటిని చేసుకుంటున్నారు. విదేశాలు తిరిగి మనవస్తువులకు మార్కెట్‌ అవకాశాలను పెంచానని, దానితో పాటు పలుకుబడి కూడా పెరిగిందని నరేంద్రమోడీ పదే పదే చెబుతారు. కానీ గత ఐదు సంవత్సరాల వివరాలను చూసినపుడు ఎగుమతుల అంశంలో మన పలుకుబడి పప్పులు ఉడకలేదు. 2019-2024 ఆర్థిక సంవత్సరాలలో ఎఫ్‌టిఏలు ఉన్న దేశాలకు మనం ఎగుమతి చేసిన వస్తువుల విలువ 107.2 నుంచి 122.72 బిలియన్‌ డాలర్లకు(14.48శాతం) పెరిగితే, దిగుమతులు 136.2 నుంచి 187.92 బిలియన్‌ డాలర్లకు ( 37.97శాతం) పెరిగినట్లు జిటిఆర్‌ఐ నివేదిక వెల్లడించింది. ఎగుమతులపై మోడీ ప్రచార బండారాన్ని బయట పెట్టింది. మొత్తంగా చూసుకున్నపుడు ప్రపంచ వాణిజ్య ఎగుమతుల్లో 1.8శాతంతో మనదేశం 17వదిగా ఉండగా దిగుమతుల్లో 2.8శాతం వాటాతో ఎనిమిదవ స్థానంలో ఉంది. అంతా బాగుంది అని చెప్పిన 2023-24లో మన వస్తు ఎగుమతులు అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 3.11శాతం తగ్గి 437.1బిలియన్‌ డాలర్ల వద్ద ఉన్నాయి. దిగుమతి చేసుకున్న వస్తువులను కొనుగోలు చేయటం తగ్గటంతో గతేడాది 5.4శాతం తగ్గి 677.2బి.డాలర్లుగా ఉన్నాయి.


ట్రంప్‌ మాదిరి చైనా పట్ల కఠినంగా ఉండాలని జో బైడెన్‌ కూడా జనానికి కనిపించేందుకు తాజా చర్యకు పూనుకున్నాడు. గతనెలలో రాయిటర్స్‌ జరిపిన ఒక సర్వేలో ట్రంప్‌ కంటే బైడెన్‌ ఏడుపాయింట్లు వెనుకబడి ఉన్నాడు. అయితే 2020లో చైనాతో ట్రంప్‌ కుదుర్చుకున్న ఒప్పందంతో ఎలాంటి ఫలితమూ రాలేదు. పరస్పరం సహకారం పెంచుకోవాలని చెబుతూనే దిగుమతి పన్నుల పెంపుదలకు సాకుగా తాము అవసరాలకు మించి హరిత ఉత్పత్తులు చేస్తున్నామని లేనిపోని మాటలు చెబుతున్నదని చైనా విమర్శించింది. ఇది రక్షణాత్మక చర్యలకు పూనుకొనేందుకు చేస్తున్న ప్రచారమని, తనను తాను దెబ్బతీసుకోవటమేనని, గతంలో వచ్చిన అవగాహనకు భిన్నమని, రెండు దేశాల మార్గంలో గుంతలు తవ్వవద్దని హితవు చెప్పింది. బైడెన్‌ ఎన్నికల కోసం రాజకీయంగా తీసుకున్న చర్య తప్ప తమ మీద పెద్దగా ప్రభావం పడదని కూడా వ్యాఖ్యానించింది.2023 నుంచి ఈ ఏడాది మార్చినెల వరకు అమెరికా సమాచారాన్ని చూస్తే జర్మనీ నుంచి 689 కోట్ల డాలర్లు, దక్షిణ కొరియా నుంచి 622 కోట్ల డాలర్ల విలువగల విద్యుత్‌ బాటరీల వాహనాలను కొనుగోలు చేసిన అమెరికా చైనా నుంచి దిగుమతి చేసుకున్నది కేవలం 38 కోట్ల డాలర్ల విలువగలవే అని ఒక పత్రిక పేర్కొన్నది. బైడెన్‌ నిర్ణయం ప్రకారం విద్యుత్‌ వాహనాలపై పన్ను 25 నుంచి 102.5శాతానికి పెరిగింది. బాటరీలు, వాటి విడి భాగాలపై 7.5శాతం నుంచి 50శాతం వరకు పెంచారు.నౌకల నుంచి సరకులను తీరానికి చేర్చే క్రేన్లపై ఇప్పటి వరకు పన్నులేదు, వాటి మీద 25శాతం, సిరంజ్‌లు, సూదులపై 50శాతం, రక్షణకు ఉపయోగించే వైద్య కిట్లపై 25శాతం విధించారు. రానున్న సంవత్సరాల్లో ఈ పన్నులు ఇంకా పెరుగుతాయి.ఈ పెరుగుదల అంతా అమెరికా వినియోగదారుల మీదనే భారం మోపుతుంది.చైనా అనుచిత వ్యాపారాన్ని అడ్డుకొనేందుకే ఈ చర్యలని అమెరికా సమర్ధించుకుంటున్నది. ద్రవ్యోల్బణాన్ని అరికట్టే సాకుతో దేశీయంగా తయారైన వాహనాల కొనుగోలుదార్లకు అమెరికా ప్రభుత్వం ఏడున్నరవేల డాలర్లు రాయితీ ఇస్తుంది. అయితే ఇటీవల అలాంటి వాహనాల్లో చైనా విడిభాగాలు ఏవైనా ఉంటే ఆ రాయితీ వర్తించదని ప్రకటించారు.


మధ్యలో ఒకటి రెండు సంవత్సరాలు మనదేశంతో వాణిజ్య లావాదేవీల్లో అమెరికా మొదటి స్థానంలోకి వచ్చింది. దాంతో మీడియాలో కొందరు ఇంకేముంది చైనాతో మనకు పనేముంది, సరఫరా గొలుసు నుంచి బయటపడ్డాం అన్నట్లుగా సంబరాన్ని ప్రకటించారు. కానీ తిరిగి చైనా మొదటి స్థానానికి వచ్చినట్లు తాజా సమాచారం వెల్లడించింది. ఇదంతా సరిహద్దు వివాదంలో చైనా సంగతి తేలుస్తాం, బుద్దిచెబుతాం అనే పటాటోపం మధ్యనే జరిగింది.2023-24 సంవత్సరంలో రెండు దేశాల వాణిజ్యం 11,840 కోట్లు కాగా అమెరికాతో 11,380 కోట్ల డాలర్లు ఉంది.కౌంటర్‌పాయింట్‌ అధ్యయనం ప్రకారం ఉత్పాదకతతో ముడిపెట్టిన ప్రోత్సాహకం(పిఎల్‌ఐ) పధకం ఉన్నప్పటికీ మనదేశంలో చైనా బ్రాండు ఫోన్లు గణనీయమార్కెట్‌ వాటాను కలిగి ఉన్నాయి.ఈ పధకం వలన ఆపిల్‌, శాంసంగ్‌ వంటి కంపెనీలు లబ్దిపొందినప్పటికీ మార్కెట్లో వాటి వాటా దానికి తగినట్లుగా పెరగలేదని హిందూ బిజినెస్‌లైన్‌ పత్రిక రాసింది. ఇతర బ్రాండ్లతో ఉత్పత్తి కాంట్రాక్టులు కుదుర్చుకోవటం, ఎగుమతులు తప్ప భారతీయ బ్రాండ్లకు రూపకల్పన, అభివృద్ధి జరగలేదు.ఫార్మారంగంలో కొన్నింటిని పిఎల్‌ఐ కారణంగా మనదేశంలోనే తయారు చేస్తున్నప్పటికీ ఇప్పటికీ మన పరిశ్రమలు చైనా మీదనే ఎక్కువగా ఆధారపడుతున్నాయి. దిగుమతుల నిరోధానికి ఈ పధక చికిత్స పనిచేయలేదు. గతేడాది మనదేశం చేసుకున్న ఎలక్ట్రానిక్స్‌ దిగుమతుల్లో చైనా నుంచి 43.9శాతం ఉన్నాయి. కుండలో కూడు అలాగే ఉండాలి పిల్లాడు దుడ్డులా ఎదగాలి అంటే కుదరదన్న సామెత తెలిసిందే. గడచిన పది సంవత్సరాల్లో అన్నీ వేదాల్లోనే ఉన్నాయష బాపతు పెరిగింది తప్ప ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కోసం ప్రభుత్వం ఖర్చు చేయాలన్న జ్ఞానం పాలకులకు రాలేదు.గతమెంతో ఘనం అనే పిచ్చిలోనే కొట్టుకుంటున్నారు. జనాన్ని ముంచుతున్నారు. జిడిపిలో మనకంటే చైనా ఐదు రెట్లు పెద్దది. మనం 0.75శాతం పరిశోధనలకు ఖర్చు చేస్తుంటే అక్కడ 3.5శాతం ఉంది. దీని అర్ధం మనకంటే చైనాలో 25రెట్లు ఎక్కువ ఖర్చు చేస్తున్నారని ప్రొఫెసర్‌ అరుణకుమార్‌ వ్యాఖ్యానించారు.మన విశ్వవిద్యాలయాల్లో రాజకీయ, అధికార జోక్యం ఎక్కువగా ఉంది తప్ప పరిశోధన వాతావరణాన్ని సృష్టించలేదన్నారు. ఏవైనా నిధులు ఉంటే గోమూత్రం, పేడలో బంగారం, ఇతరంగా ఏమున్నాయో పరిశోధనలు చేయిస్తున్నారు.చైనా ఉత్పత్తులపై అమెరికా దిగుమతి సుంకం పెంపు పర్యవసానాలు మనదేశం మీద ఎలా ఉంటాయన్న చర్చ మొదలైంది. చైనా ఉత్పత్తులు కుప్పలు తెప్పలుగా మనదగ్గరకు వచ్చిపడతాయని, మన ఎగుమతి అవకాశాలు పెరగవన్నది ఒక అభిప్రాయం. అమెరికా, ఐరోపా యూనియన్‌ దిగుమతి పన్నులు పెంచటం, దిగుమతులను తగ్గిస్తున్న కారణంగా చైనా తన వాహనాలకు భారత్‌ ఇతర దేశాల మీద ఆధారపడుతుందని కొందరి అంచనా. ఈ అంశాలను ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నప్పటికీ నరేంద్రమోడీ చైనా నుంచి పెట్టుబడులు, దిగుమతులను పెంచేందుకు వీలుగా దిగుమతి పన్ను ఎందుకు తగ్గించారన్నది వారి ప్రశ్న. కార్పొరేట్ల లాభాల కోసం సంతుష్టీకరణ తప్ప మరొకటి కనిపించటం లేదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

భారత్‌ను ముంచెత్తనున్న విద్యుత్‌ వాహనాలు – చైనా మీద మోడీ సర్కార్‌కు ఎక్కడలేని ప్రేమ ఎందుకబ్బా !

04 Thursday Apr 2024

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, History, INDIA, International, INTERNATIONAL NEWS, Loksabha Elections, NATIONAL NEWS, Opinion, Political Parties, Politics, Prices

≈ Leave a comment

Tags

BJP, China, China imports to India, Chinese E vehicles, Chinese investment, Narendra Modi Failures, RSS


ఎం కోటేశ్వరరావు


సరిహద్దు సమస్యల గురించి మాతో రహస్యంగా భారత్‌ లోతైన చర్చలు జరుపుతున్నదని, మరోవైపు విదేశాంగ మంత్రి రాజీపడేది లేదని ప్రకటిస్తారని, ఇదంతా నెపం మా మీద నెట్టేందుకు, బేరమాడేందుకు చేస్తున్న ట్రిక్కు అని చైనా విదేశాంగశాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నది. గత నెలలో బీజింగ్‌లో రెండు దేశాల ప్రతినిధులు సరిహద్దు వివాదాల గురించి 29వ దఫా చర్చలు జరిపారు. రెండు దేశాల మధ్య సాధారణ సంబంధాలు నెలకొనాలంటే సరిహద్దులో సాంప్రదాయ పద్దతిలో బలగాలను మోహరించితేనే సాధ్యమని చర్చల అనంతరం మలేషియా భారతజాతీయుల సమావేశంలో జై శంకర్‌ చెప్పారు. సరిహద్దు సమస్యపై రాజీపడేది లేదన్నారు. భారత్‌లో జరగనున్న ఎన్నికల్లో లబ్దిపొందేందుకే జైశంకర్‌ ఇంత గట్టిగా మాడ్లాడారని చైనా విశ్లేషకులు పేర్కొన్నారు. సరిహద్దు వివాదానికి బాధ్యత చైనాదే అని ప్రపంచానికి చెప్పే యత్నం కూడా దీనిలో ఉందన్నారు. అరుణాచల్‌ ప్రదేశ్‌ను భారత్‌ అంతర్భాగంగా తాము ఎన్నడూ గుర్తించలేదని, మరోసారి దాన్ని గురించి ప్రస్తావించటం కూడా ఎన్నికల కోసమే అని విమర్శించారు. అరుణాచల్‌ ప్రదేశ్‌ను చైనా జాంగ్‌నాన్‌ అని పిలుస్తున్నది, పురాతన కాలం నుంచి అది చైనా ప్రాంతమే అని వాదిస్తున్నది. స్వాతంత్య్రం వచ్చిన సమయానికి అది మనదేశ అంతర్భాగంగా ఉంది.అదే విధంగా మనదని చెబుతున్న ఆక్సారుచిన్‌ ప్రాంతం చైనా ఆధీనంలో ఉంది. ఇది రెండు దేశాల మధ్య తెగని సరిహద్దు వివాదంగా కొనసాగుతున్నది. పరస్పరం చొరబడకుండా వాస్తవాధీన రేఖకు అటూ రెండు దేశాలూ కాపలా కాస్తుంటాయి.ఉద్రిక్తతలు తలెత్తినపుడు మిలిటరీని మోహరిస్తున్నాయి. లడక్‌ ప్రాంతంలోని గాల్వన్‌ లోయ 2020 ఉదంతం తరువాత మోహరించిన మిలిటరీలు కొనసాగుతున్నాయి. వాటి ఉపసంహరణ గురించి చర్చలు జరుగుతున్నా కొత్త వివాదం తలెత్తలేదు తప్ప పూర్వపు స్థితి నెలకొనలేదు.


ఒక వైపు మనదేశంలోని సంఘపరివార్‌, ఇతర కొన్ని శక్తులు చైనా వ్యతిరేకతను నిరంతరం రెచ్చగొడుతూ ప్రచారం చేస్తుంటాయి. మరోవైపు అదే చైనా నుంచి మన దేశం రికార్డు స్థాయిలో దిగుమతులు చేసుకుంటున్నది. గత రికార్డులను నరేంద్రమోడీ బద్దలు కొట్టారు.ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి మాసాల్లో గతేడాది అదే నెలలతో పోలిస్తే 15.8శాతం తమతో వాణిజ్యం పెరిగిందని చైనా కస్టమ్స్‌ శాఖ ప్రకటించింది. తూర్పు చైనాలో ప్రధాన వాణిజ్య కేంద్రంగా ఉన్న షియాంగ్‌సు రాష్ట్రం నుంచి బ్రెజిల్‌,భారత్‌,రష్యా, దక్షిణాఫ్రికా దేశాలతో గతేడాదితో పోలిస్తే 2024జనవరి, ఫిబ్రవరి మాసాల్లో 36శాతం పెరిగి 14.4బిలియన్‌ డాలర్లకు చేరిందని వెల్లడించారు.షియాంగ్‌షు రాష్ట్రం నుంచి ప్రధానంగా విద్యుత్‌ వాహనాలు, వాటిలో వినియోగించే లిథియమ్‌ అయాన్‌ బాటరీలు, ఫొటోవోల్టాయిక్‌ ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి.పైన పేర్కొన్న నాలుగుదేశాలతో పాటు చైనాను కలిపి బ్రిక్స్‌ అని పిలుస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరి నుంచి దీనిలో సౌదీ అరేబియా, ఈజిప్టు,ఇరాన్‌, యుఏయి. ఇథియోపియా కూడా చేరటంతో దీన్ని బ్రిక్స్‌ ప్లస్‌ అని పిలుస్తున్నారు. ఒక వైపు చైనా మీద ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని, మనదగ్గర నుంచే మేకిన్‌ ఇండియా, మేడిన్‌ ఇండియాలో భాగంగా ఇతర దేశాలకు వస్తువులను ఎగుమతి చేసే అవకాశం వచ్చిందని మీడియా ఊదరగొడుతున్నది. మరోవైపు మనదేశం చైనా, ఐరోపా సమాఖ్య మీద ఆధారపడటం పెరుగుతున్నదని తాజాగా ఐరాస సంస్థ ” అంక్టాడ్‌ ” ప్రకటించింది.
మనదేశం అందించిన వివరాలను విశ్లేషించిన ఆ సంస్థ కరోనా తరువాత, రష్యా-ఉక్రెయిన్‌ వివాదం ప్రారంభమైనప్పటి నుంచి చైనా, ఐరోపా సమాఖ్యపై భారత్‌ ఆధారపడటం 1.2శాతం పెరిగిందని, సౌదీ అరేబియాపై 0.6శాతం తగ్గిందని పేర్కొన్నది. భారత్‌లో ఉత్పాదకతతో ముడిపడిన ప్రోత్సాహక పథకం(పిఎల్‌ఐ) అమలు, చైనా నుంచి వస్తున్న దిగుమతులపై నాణ్యతా ప్రమాణాల ఉత్తరువుల పేరుతో పరిమితులను విధించిన తరువాత కూడా భారత్‌ ఆధారపడటం పెరిగింది. గడచిన రెండు సంవత్సరాలుగా అంతర్జాతీయ వాణిజ్యం స్థిరంగా ఉండటం, రాజకీయాల ప్రాతిపదికన వాణిజ్యం పెరిగినప్పటికీ చైనా మీద ఆధారపడటం ఎక్కువైంది. చైనాపై ఆధారపడటాన్ని 2023లో అమెరికా 1.2శాతం తగ్గించుకుంటే మనదేశం పెంచుకుంది. ఈ కాలంలోనే చైనాపై ఆధారపడిన రష్యా వాణిజ్యం 7.1శాతం పెరగ్గా, ఐరోపా మీద 5.3శాతం తగ్గింది.2022 నుంచి ప్రపంచ వస్తు వ్యాపారం క్రమంగా తగ్గుతున్నది, సేవల లావాదేవీలు పెరుగుతున్నాయి. పొద్దున లేస్తే చైనా వ్యతిరేకతను రెచ్చగొడుతున్న కారణంగా చైనాతో పెంచుకుంటున్న వాణిజ్య లావాదేవీల గురించి చెప్పుకొనేందుకు మన మీడియా సిగ్గుపడుతున్నదని చెప్పవచ్చు. మన ఆర్థిక సంవత్సరపు లెక్కలను మన అధికారులు వెల్లడిస్తే చైనా జనవరి నుంచి డిసెంబరు ప్రాతిపదిక వార్షిక లెక్కలు ప్రకటిస్తుంది. అందువలన రెండుదేశాల లెక్కల్లో తేడాలు కనిపిస్తాయి.చైనా నుంచి జనవరిలో వస్తువులు ఎగుమతి జరిగి అవి మనదేశానికి వచ్చే సరికి ఒకటి రెండు నెలలు పడుతుంది. ఇది లెక్కల్లో తేడాలకు ఒక కారణం.


మనదేశ వాణిజ్య శాఖ సమాచారం ప్రకారం 2021-22 నుంచి 2023-24వరకు మూడు సంవత్సరాలలో 95.266 నుంచి 99.389 బిలియన్‌ డాలర్లకు చైనాతో వాణిజ్యం పెరిగింది. ఇదే సమయంలో చైనా వెల్లడించిన సమాచారం ప్రకారం 110.361 నుంచి 116.953 బిలియన్‌ డాలర్లకు చేరింది. చైనా లెక్కలు తప్పు మనం అంతగా దిగుమతులు చేసుకోలేదు అని కొందరు వాదించవచ్చు. అంకెల్లో తేడాలున్నా చైనా నుంచి దిగుమతులు పెరిగాయన్నది స్పష్టం.లేకపోతే కొంత మంది చెబుతున్నట్లు దిగుమతి చేసుకున్న వస్తువుల విలువను తగ్గించి లేదా పెంచి చూపుతున్నట్లు వార్తలు. దాన్ని నిర్ధారించుకోవటం కష్టమేమీ కాదు. కొన్ని వస్తువులు చైనా బదులు హాంకాంగ్‌ నుంచి వచ్చినట్లుగా మనదేశం నమోదు చేస్తే చైనా నుంచి తక్కువ మొత్తాలు కనిపించవచ్చు. మనదేశం చైనాతో పోటీ పడాల్సిన అవసరం ఉందని, కానీ నిర్లక్ష్యం చేశారని, నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత ప్రాధాన్యత ఇచ్చినట్లు విదేశాంగ మంత్రి జై శంకర్‌ సూరత్‌లో చెప్పినట్లు వార్తలు వచ్చాయి. మేకిన్‌, మేడిన్‌ ఇండియా అని పిలుపులు ఎన్ని ఇచ్చినా పారిశ్రామిక వస్తుఉత్పత్తి పెద్దగా పెరగటం లేదు.2010 నుంచి 2022వరకు ఉన్న వివరాల ప్రకారం వార్షిక సగటు జిడిపిలో పారిశ్రామిక రంగం వాటా 14.92శాతం ఉంది.స్టాటిస్టా అందించిన వివరాల ప్రకారం 2010లో 17శాతం ఉన్నది 2022నాటికి 13కు తగ్గింది. చైనాలో 2013 నుంచి 2023వరకు వార్షిక సగటు 40శాతం కాగా, 2013లో 44.2 నుంచి 2023లో 38.3శాతానికి తగ్గింది. దీన్ని బట్టి ప్రపంచ ఫ్యాక్టరీగా చైనాను వెనక్కునెట్టటం మరో పదేండ్లు పదవిలో ఉన్నా నరేంద్రమోడీ వల్లకాదని అనుభవం తేల్చింది. అందువలన జైశంకర్‌ చెబుతున్న మాటలు మోడీని మునగచెట్టు ఎక్కించటానికి మాత్రమే పనికివస్తాయి.


చైనా నుంచి వచ్చే పెట్టుబడులను నిరుత్సాహపరచాలని గతంలో తీసుకున్న నిర్నయాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కు తీసుకుంది. విద్యుత్‌ వాహనాల తయారీలో మనదేశంలో 50 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టి స్థానికంగా ఉత్పత్తి చేస్తే చైనాతో సహా ఏ కంపెనీలనైనా అనుమతిస్తామని మన అధికారులు వెల్లడించారు. అలాంటి కంపెనీలు ఉత్పత్తిని ప్రారంభించే వరకు దిగుమతి చేసుకొనే వాహనాలపై ఇప్పుడున్న 70-100శాతం పన్ను మొత్తాన్ని 15శాతానికి తగ్గిస్తున్నట్లు కూడా ప్రకటించింది. టిక్‌టాక్‌ యాప్‌తో మన సమాచారం అంతా చైనా సంగ్రహిస్తుందని నిషేధించిన పెద్దలు ఇప్పుడు చైనా పెట్టుబడితో ఫ్యాక్టరీలు పెట్టటాన్ని ఎలా అనుమతిస్తున్నట్లు ? చైనా మీద ప్రేమతో లేదా నరేంద్రమోడీ మారుమనసు పొంది కాదు. కార్పొరేట్ల వత్తిడే కారణం ! 2022-23లో మన దేశం 20.3బిలియన్‌ డాలర్ల మేరకు ఆటో విడిభాగాలను దిగుమతి చేసుకుంటే వాటిలో 30శాతం చైనా నుంచే ఉన్నాయి. రానున్నది విద్యుత్‌ వాహనాల యుగం. ప్రస్తుతం చైనా ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది. స్థానికంగా వాటిని తయారు చేసే కంపెనీలకు చైనా విడిభాగాలు అవసరం. తమ పెట్టుబడులను అడ్డుకుంటామంటే చైనా ఊరుకుంటుందా ? ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కుతుంది. విద్యుత్‌ వాహనాలకు అవసరమైన బ్యాటరీల ఉత్పత్తిలో 75శాతంతో చైనా ముందుంది.వాహనతయారీ ఖర్చులో 40శాతం బ్యాటరీలదే. ప్రస్తుతం ప్రపంచ విద్యుత్‌ వాహనాల ఉత్పత్తి, ఎగుమతుల్లో చైనా 50శాతం వాటా కలిగి ఉంది. రానున్న కొద్ది సంవత్సరాల్లో భారత రోడ్లపై తిరిగే ప్రయాణ,వాణిజ్య విద్యుత్‌ వాహనాల్లో ప్రతి మూడింటిలో ఒకటి చైనా సంస్థలు లేదా వాటితో భాగస్వామ్యం కలిగినవే ఉత్పత్తి చేయనున్నాయని ఆ రంగ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే కొన్ని కంపెనీలు ఆమేరకు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. అందువలన అనివార్యమై కేంద్ర ప్రభుత్వం చైనా పెట్టుబడులు, వాహనాలకు అనుమతి ఇచ్చింది.వాటిలో ఒకటైన బ్రిటన్‌కు చెందిన ఎంజి మోటార్స్‌ ఇండియా ఈ ఏడాది సెప్టెంబరు నుంచి ఉత్పత్తి ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. అనేక చైనా కంపెనీలు రంగ ప్రవేశం చేయనున్నాయి.దీంతో చైనా నుంచి విడిభాగాల దిగుమతులు కూడా ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతాయి.టెస్లా, విన్‌ఫాస్ట్‌ వంటి ఇతర దేశాల కంపెనీలు కూడా చైనా వాహనాలతో పోటీ పడేందుకు చూస్తున్నాయి. దీని వలన మన వినియోగదారులకు మేలు జరుగుతుందని వేరే చెప్పనవసరం లేదు.


గాల్వన్‌ ఉదంతం తరువాత 2020 జూన్‌లో కేంద్ర ప్రభుత్వం షీ ఇన్‌తో పాటు చైనాకు చెందిన 58 యాప్‌లను నిషేధించింది. వీటి ద్వారా దేశ సార్వభౌమత్వం, సమగ్రత,రక్షణ, భద్రతలకు ముప్పు తలెత్తినట్లు కారణంగా చెప్పారు. తరువాత జాబితాను 270కి పెంచారు. షీ ఇన్‌ ప్రపంచంలో అతి పెద్ద ఆన్‌లైన్‌ ఫాషన్‌ దుస్తుల విక్రయాల కంపెనీ. 2022 ఏప్రిల్‌ నాటికి 150 దేశాల్లో దాని లావాదేవీల విలువ 100బిలియన్‌ డాలర్లు. కంపెనీ ప్రధాన కార్యాలయం ఇప్పుడు సింగపూర్‌లో ఉంది కనుక గతంలో మన ప్రభుత్వం దానిపై విధించిన నిషేధం ఇప్పుడు వర్తించదని రిలయన్స్‌ దానితో ఒప్పందం చేసుకోవచ్చని, మన ప్రభుత్వం తిరిగి అనుమతించనున్నదని పత్రికలు రాశాయి. అసలు సంగతి ఏమంటే మరింతగా విస్తరించేందుకు, పన్నుల భారాన్ని తగ్గించుకొనేందుకు గాను తన ప్రధాన కార్యాలయాన్ని 2019లోనే చైనా నుంచి సింగపూర్‌కు మార్చుకుంది. 2020లో నిషేధం విధించేటపుడు అది చైనా కంపెనీ అని చూశారు తప్ప దాని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందని కాదు. ఇప్పటికీ అది చైనా కంపెనీనే కదా ! రిలయన్స్‌ దానితో ఒప్పందం చేసుకోనుంది గనుక దాని వత్తిడి మేరకు సింగపూర్‌ పేరును ముందుకు తెచ్చారు. ఇప్పుడు విద్యుత్‌ వాహనాలు,పెట్టుబడులకు గేట్లు తెరిచారు.కార్పొరేట్లు రంగంలోకి దిగితే నరేంద్రమోడీ తనమాటలను తానే దిగమింగుతారు. కాషాయమార్కు దేశభక్తి మరి !

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!
  • శనగ రైతుల సంక్షోభం

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!
  • శనగ రైతుల సంక్షోభం

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!
  • శనగ రైతుల సంక్షోభం

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 246 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d