• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Prices

ఓ రామరాజ్యం, ఓ అపర శ్రీరామ చంద్రుడు, ఓ మణిపూర్‌, ఓ సందేశ్‌ఖాలి !

06 Wednesday Mar 2024

Posted by raomk in BJP, Communalism, Current Affairs, Economics, History, INDIA, Loksabha Elections, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, RELIGION, Women

≈ Leave a comment

Tags

Acheedin, Bilkis Bano gangrape, BJP double standards, BJP hypocrisy, Manipur files, Narendra Modi Failures, price rise in india, sandeshkhali


ఎం కోటేశ్వరరావు


ఐదు వందల సంవత్సరాల నాటి కల రామాలయ నిర్మాణం జరిగింది, ఇక రామరాజ్యమే తరువాయి అని నరేంద్రమోడీ భక్తులు జనాన్ని నమ్మించేందుకు చూస్తున్నారు. కొందరైనా నిజమే అనుకుంటున్నారు. మరోవైపు రామరాజ్యం గురించి నేతలు చెబుతున్నదేమిటి ? దేశంలో జరుగుతున్నదేమిటి ? పదేండ్ల క్రితం నరేంద్రమోడీ అచ్చేదిన్‌(మంచి రోజులు) గురించి చెప్పారు. ఇప్పుడు కొత్తగా హామీలు, గారంటీలు అనే కొత్త పల్లవి ఎత్తుకున్నారు తప్ప దాని ఊసే ఎత్తటం లేదు. ఆడిన మాట తప్పని వారసులు కదా , పాతవాటిని చెప్పరు ! రాముడి సుగుణాల గురించి చెప్పేవారు తండ్రి మాట జవదాటని ఉత్తముడు అంటారు. ఆ రాముడిని ఆదర్శంగా తీసుకున్నాం అని చెప్పుకొనే నరేంద్రమోడీ అచ్చేదిన్‌ గురించి ఎందుకు మాట్లాడటం లేదు, మంచి రోజులు వస్తే వచ్చాయని లేకపోతే ఎంతకాలం పట్టేది చెప్పాలా లేదా ? అసలు రామరాజ్యం అంటే ఏమిటి ? నరేంద్రమోడీ, బిజెపి గత పది సంవత్సరాల కాలంలో వాటిలో ఏ ఒక్కదాన్ని అయినా పాటించిందా ? గుజరాత్‌లో గోద్రా రైలు దగ్దం తరువాత జరిగిన మారణకాండ సమయంలో మోడీ రాజధర్మం పాటించాలని ఏకంగా అతల్‌ బిహారీ వాజ్‌పాయి చెప్పాల్సి వచ్చిందంటే తండ్రి మాట ప్రకారం అరణ్యవాసం వెళ్లిన రాముడి ఆదర్శాన్ని ఉల్లంఘించినట్లే కదా, ముఖ్యమంత్రిగా చేయాల్సింది చేయాలన్నారు తప్ప గద్దె దిగాలని వాజ్‌పాయి చెప్పలేదు. వాల్మీకి రామాయణం ప్రకారం రాముడి పాలనలో ఏ మహిళా వితంతువు కాలేదు, క్రూరమృగాల నుంచి ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదు. రోగాల గురించి భయం లేదు. ప్రపంచానికి బందిపోట్ల బెడదతప్పింది.తాము పనికిరాని వారమని ఎవరూ భావించలేదు.యువకులకు ముసలి వారు కర్మకాండలు చేయలేదు. అందరూ సంతోషపడ్డారు. సకల జనులూ ధర్మం మీద కేంద్రీకరించారు. అందరూ ఒక ఆదర్శపురుషుడిగా రాముడి వైపే చూశారు. ఒకరిని ఒకరు చంపుకోలేదు.అంతర్జాలం(ఇంటర్నెట్‌)లో ఉన్న సమాచారం ప్రకారం (వాల్మీకి రామాయణం, యుద్ధకాండ, సర్గ 128, 95 నుంచి 106 శ్లోకాలు) రాముడి పాలనలో జనాలు అవాస్తవాలు చెప్పకుండా ధర్మం మీదనే కేంద్రీకరించారు. అందరూ అద్భుతమైన వ్యక్తిత్వ లక్షణాలను కలిగి ఉన్నారు. అందరూ ధర్మానికి కట్టుబడి ఉన్నారు. ఆ విధంగా రాముడు వేలాది సంవత్సరాలు రామరాజ్యన్ని ఏలాడు.


అబ్బే ఇప్పుడు చెబుతున్నది అసలైన సనాతన ధర్మం కాదు అని చెప్పేవారు కొందరు. వర్తమాన భాష్యాలతో ఉన్న మనుస్మృతిని రాముడు అసలు పాటించలేదు. రాజగురువు, ప్రధాన సలహాదారైన బ్రహ్మరిషి విశ్వామిత్ర మార్గదర్శనంలో వశిష్ట ధర్మ సూత్రాలను పాటించాడు అని చెప్పేవారు కొందరు.ఇప్పుడు ఏది ఉనికిలో ఉందో, దాని సంగతి ఏమిటో, వేల సంవత్సరాలుగా అది కలిగించిన దుష్టప్రభావానికి కారణం ఏమిటో మాత్రం చెప్పరు.సనాతన ధర్మాన్ని పాటించాలి, పరిరక్షించాలి అంటున్నారు. దీని అర్ధం రాజ్యాంగాన్ని ఆ విధంగా తిరగరాయమనా ? ఇక నిత్యం రామభజన చేస్తున్నవారు, రామరాజ్యం గురించి చెబుతున్నవారేమంటున్నారు.2024 జనవరి 16వ తేదీ పత్రికల్లో వచ్చిన ఒక వార్త శీర్షిక ఇలా ఉంది.” రామరాజ్య నియమాలనే ప్రభుత్వం అనుసరిస్తున్నది, ఆదాయాన్ని సంక్షేమానికి ఖర్చు చేస్తున్నది : ప్రధాని మోడీ ”. ఆయోధ్యలో రామాలయ ప్రతిష్ట కార్యక్రమానికి ముందు పదకొండు రోజుల అనుష్ఠానంతో దేశంలో వివిధ గుళ్లు గోపురాలను సందర్శించిన సందర్భంగా నరేంద్రమోడీ రామచరిత మానసతో సహా అనేక హిందూ పురాణాలను ఉటంకిస్తూ చెప్పిన మాటలకు పెట్టిన పేరది. నిష్టలో ఉన్న మోడీ వాస్తవాలను చెప్పారా, మరొకటా ? గడచిన తొమ్మిది సంవత్సరాలలో పాతిక కోట్ల మందిని దారిద్య్రం నుంచి బయటపడవేసినట్లు,పది కోట్ల మంది నకిలీ లబ్దిదారులను ఏరివేసినట్లు కూడా చెప్పారు.( ఇంత ప్రగతి సాదించి రామరాజ్యాన్ని నెలకొల్పితే ఎనభై కోట్ల మందికి మరో ఐదు సంవత్సరాల పాటు ఉచితంగా ఆహార ధాన్యాలు ఇస్తున్నట్లు ఎందుకు ప్రకటించినట్లు ? దారిద్య్రం నుంచి బయటపడినా నెలకు ఐదు కిలోల ధాన్యం కూడా కొనుగోలు చేయలేని దుస్థితిలో జనం ఉన్నారని అర్ధమా ? రామరాజ్యంలో ఇలాగే ఉందా ? )


అతని కంటే ఘనుడు ఆచంట మల్లన అన్నట్లు రక్షణ మంత్రి రాజనాధ్‌ సింగ్‌ గారు మరొక అడుగు ముందుకు వేసి బిజెపి జాతీయ సమావేశంలో మాట్లాడుతూ రామరాజ్య భావనను ప్రధాని మోడీ ఎంతో సమర్దవంతంగా అమలు జరిపినట్లు, రామరాజ్యం సిద్ధించినట్లు ఆకాశానికి ఎత్తారు. దానికి వికసిత భారత్‌ అని ముద్దుపేరు పెట్టారు. రాముడు పదమూడు సంవత్సరాలు అరణ్యవాసం గడిపినట్లు రామాయణం చెబితే యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్‌ ఐదు వందల సంవత్సరాల తరువాత రాముడు ఆయోధ్యకు వచ్చాడని చెప్పారు. వికసిత భారత్‌ తీర్మానంలో పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలో మహిళలపై జరిగిన దారుణాలను ఖండిస్తూ ఒక మహిళ పాలనలో ఇలా జరగటం సిగ్గుచేటని బిజెపి పేర్కొన్నది. నిజమే, కానీ బిజెపి రామరాజ్య పాలనలో మణిపూర్‌లో ఇద్దరు మహిళలను వివస్త్రలను చేసి ఊరేగించటం మర్యాదా, సిగ్గుచేటా ? కనీసం అలాంటి ఉదంతం జరగటం విచారకరం అని కూడా ప్రకటించని మర్యాద పురుషోత్తములు.బిజెపి ఎంపీ బ్రిజ్‌భూషణ్‌ మహిళా రెజ్లర్స్‌ను లైంగికంగా వేధించిన సంఘటనలు దేశంలో కలిగించిన సంచలనం తెలిసిందే.ఇక గుజరాత్‌ బిల్కిస్‌ బానూ ఉదంతం తెలిసిందే. ఆమె మీద జరిగిన సామూహిక అత్యాచారం కేసులో యావజ్జీవ శిక్షలు పడిన వారు సత్‌ ప్రవర్తన కలిగిన బ్రాహ్మణులని కితాబు నిస్తూ శిక్ష పూర్తిగాక ముందే విడుదల చేసి సన్మానాలు చేసిన రామభక్తులను దేశం మరచిపోగలదా ! సుప్రీం కోర్టు ఆ నిర్ణయాన్ని రద్దు చేసి తిరిగి వారిని జైలుకు పంపిన సంగతి తెలిసిందే. ఇవన్నీ అపర శ్రీరాముడి ఏలుబడిలో జరిగినవే సుమా ? ఒక్కో ఉదంతం పట్ల ఒక్కో వైఖరి, శ్రీ రామరాజ్యంలో ఇలాగే జరిగిందా?


అయోధ్య రామరాజ్యంలో రోగాల భయం లేదని చెబుతారు. కానీ అపర శ్రీరామ చంద్రుడిగా నీరాజనాలు అందుకుంటున్న నరేంద్రమోడీ రామరాజ్యంలో ఎనిమిది సంవత్సరాల ఏలుబడి తరువాత 2022లో ప్రపంచంలో బయటపడిన టిబి కేసుల్లో భారత్‌లో నూటికి 27 ఉన్నాయి.2025 నాటికి ఆ వ్యాధిని అంతరింప చేస్తామని 2023లో మన దేశంలో జరిగిన ప్రపంచ టీబి సభలో దీక్షపూనారు. జరిగేదేనా ? దేశంలో ఆరోగ్యం మీద చేస్తున్న ఖర్చు ఏడాదికేడాది తగ్గిపోతున్నది. జనాభాలో అగ్రదేశంగా ఎదిగామని, దీనితో అద్భుతాలు సృష్టించవచ్చని చెప్పుకుంటే చాలదు.వారంతా ఆరోగ్యంగా ఉంటేనే, లేకపోతే జరిగే నష్టం ఎక్కువ.కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య ఖాతాకు 2021-22లో 3.6శాతం కేటాయించగా మరుసటి ఏడాదికి అది 2.7కు, 2023-24కు 2.4శాతానికి కోత పడింది.2022-23కేటాయింపులో సవరించిన బడ్జెట్‌లో మరో15శాతం కోత విధించారు.ఇక జిడిపి పరంగా చూస్తే 2020-21లో1.23శాతం ఉన్నది 2023 ఆర్థిక సంవత్సరంలో 1.19, మరుసటి సంవత్సరం 1.17శాతానికి తగ్గింది. ప్రపంచ ఆర్థికవేదిక, ప్రజారోగ్య హార్వర్డ్‌ స్కూలు అధ్యయనం 2014 ప్రకారం వ్యాధులు, మానసిక అనారోగ్యం కారణంగా 2012 – 2030 కాలంలో 4.58లక్షల కోట్ల డాలర్ల మేర మన దేశం నష్టపోనుందని అంచనా. దీనిలో గుండె సంబంధిత వ్యాధుల వలన 2.17లక్షల కోట్ల డాలర్లు, మానసిక రుగ్మతల కారణంగా 1.03లక్షల కోట్ల డాలర్లు నష్టమని పేర్కొన్నారు.(టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా 2023 ఏప్రిల్‌ ఏడవ తేదీ సంచికలో ఐదులక్షల కోట్లడాలర్ల జిడిపి కల మీ ఆరోగ్యం మీద ఆధారపడి ఉంది అనే శీర్షికతో ప్రచురించిన విశ్లేషణ).2019లో గాలి కాలుష్యంతో తలెత్తిన అనారోగ్యం వలన జిడిపికి 1.36శాతం నష్టం(36.8 బిలియన్‌ డాలర్లు) జరిగింది.


ఇక అచ్చేదిన్‌ తీరు తెన్నులు చూద్దాం. నాలుగు సంవత్సరాల నరేంద్రమోడీ ఏలుబడి తరువాత 2018-2023 ఆగస్టు వరకు వివిధ రాష్ట్రాలలో ఉన్న నిత్యావసర వస్తువుల ధరల గురించి కేంద్రమే ప్రకటించింది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సేకరించిన సమాచారాన్ని 2023 ఆగస్టు నాలుగవ తేదీన రాజ్యసభలో వినియోగదారుల శాఖ మంత్రి అశ్వనీకుమార్‌ చౌబే ఇచ్చిన రాతపూర్వక సమాచారం మేరకు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణాల్లో కొన్ని సరకుల ధరల పెరుగుదల తీరుతెన్నులు దిగువ విధంగా ఉన్నాయి.కిలో ఒకటికి రు.లలో, బియ్యం సాధారణ రకం. కొన్ని రాష్ట్రాలలో ధరలు ఇంకా ఎక్కువగా కూడా ఉన్నాయి. ఈ పెరుగుదలకు అనుగుణంగా వేతనాలు, కుటుంబాల ఆదాయం పెరిగిందా అన్నది ప్రశ్న.
.రాష్ట్రం×× ఏడాది × బియ్యం ×గోధుమ×కందిపప్పు×మినప××పల్లీ నూనె×సన్‌ఫ్లవర్‌×బంగాళాదుంప
తెలంగాణా 2018 ×× 28.05 ××27.61 ××75.30 ××80.85 ×× 108 ×× 86.45 ××22.17
తెలంగాణా 2023 ×× 44.79 ××37.20 ××111.70 ××111 ××169.20××149.10 ××27.15
ఆంధ్ర ప్రదేశ్‌ 2018×× 31.63 ×× 29.08××66.41 ××73.19 ××106.90 ××87.76 ××19.06
ఆంధ్రప్రదేశ్‌ 2023 ×× 51.52 ××40.96 ××122.80 ××120 ××176.20 ××140.30 ×× 30.76


అచ్చేదిన్‌ అంటే ఏటిఎంలో డబ్బు మాదిరి వెంటనే రావని అనుకుందాం. కానీ పదేండ్ల తరువాత పరిస్థితిని చూసిన తరువాత కూడా మోడీ గ్యారంటీలను నమ్మగలమా ? గడచిన పది సంవత్సరాల్లో ధరలు 62శాతం పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అవన్నీ తప్పు అనుకొనే వారిపట్ల జాలిచూపటం తప్ప ఏమీ చేయలేం, అనలేం. నెలవారీ తలసరి వినియోగ ఖర్చుకు(ఎంపిసిఇ) సంబంధించిన సమాచారం ఇటీవలనే అందుబాటులోకి వచ్చింది.దాని ప్రకారం 1999-2000 నుంచి 2022-23వరకు వినియోగ ఖర్చు గణనీయంగా పెరిగినట్లు కనిపిస్తోంది. పులిమీద పుట్ర మాదిరి 2012-13 నుంచి పది సంవత్సరాల కాలంలో గోడదెబ్బ-చెంపదెబ్బ అన్నట్లు ద్రవ్యోల్బణం పెరుగుదల, నిజవేతనాలు గిడసబారటంతో అనేక మంది జీవితాలు దిగజారి దుర్భరమయ్యాయి. ఆదాయం పెరిగిన కొద్దీ పరిస్థితి మెరుగుపడిందని చెప్పిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఉదాహరణకు నెలకు లక్షరూపాయల పైబడి రాబడి వచ్చేవారిలో 55శాతం మంది మెరుగ్గా ఉన్నట్లు చెప్పగా 25శాతం మంది దిగజారినట్లు చెప్పారు.వివరాలు దిగువ విధంగా ఉన్నాయి. దీన్ని బట్టి ఎవరికి వారు ఏ తరగతిలో ఉన్నదీ, గడచిన పది సంవత్సరాల్లో పరిస్థితి మెరుగుపడిందా, దిగజారిందా అన్నది అవలోకించుకోవచ్చు.
రాబడి××××××××× మెరుగుదల×× దిగజారుడు
లక్షకుపైగా ×××××× 55 ×× 25
50వేలు-లక్ష ××××× 47 ×× 30
25-50వేలు ××××× 38 ×× 38
10-25వేలు ××××× 32 ×× 44
5-10వేలు ××××× 28 ×× 52
5వేలలోపు ××××× 21 ×× 62


మన దేశంలో మధ్య తరగతి అంటే ఏమిటన్నదానికి నిర్దిష్టమైన నిర్వచనం లేదు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తాను మధ్య తరగతికి చెందిన మహిళను గనుక వారి ఇబ్బందులు తెలుసు అని చెప్పారు. మంత్రిగా ఆమె రాబడి స్వయంగా ఇచ్చిన వివరాల ప్రకారం 2016-17లో రు. 5,85,580 ఉండగా 2018-19లో రు. 10,62,250, మరుసటి ఏడాది 10,38లక్షలకు, 2020-21లో 8.08లక్షలని పేర్కొన్నారు. ఇక ఆమెకు ఉన్న చరాస్తులు రు.63.39లక్షలని, స్థిరాస్తులు రు.1.87 కోట్లని పేర్కొన్నారు. ప్రైస్‌ రీసర్చ్‌ అనే సంస్థ నిర్వచనం ప్రకారం ఏడాదికి రు.30లక్షలకు మించి సంపాదించే వారు ధనికులు, 5 నుంచి 30లక్షల వరకు మధ్య తరగతి, 1.5 నుంచి 5 లక్షల వారు తరువాత తరగతి, 1.25లక్షల కంటే తక్కువ వచ్చేవారు అభాగ్యులు.మాస్టర్‌ కార్డు 2021లో పేర్కొన్నదాని ప్రకారం దేశంలోని ఎగువ 20శాతం మంది ధనికులు ఏటా రు.3,94,271 సంపాదిస్తున్నారు, మధ్యతరగతి రు.1,51,651, పేదలు రు.80,529 సంపాదిస్తున్నారు.అప్లయిడ్‌ ఎకనమిక్‌ రిసర్చ్‌ జాతీయ మండలి 2010లో సేకరించిన సమాచారం ప్రకారం మధ్య తరగతి అంటే రెండు-పది లక్షల మధ్య సంపాదించేవారు, తరువాత తరగతి 90వేల నుంచి రెండులక్షలు, అభాగ్యులు తొంభైవేల కంటే తక్కువ సంపాదించే వారు అని పేర్కొన్నారు. దీన్ని బట్టి మనం రామరాజ్యంలో ఉన్నామో లేదో , ఏ తరగతిలో ఉన్నామో ఎవరికి వారు నిర్ణయించుకోవాలి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అబూదాబీలో అద్భుతం జరగనుందా ?

28 Wednesday Feb 2024

Posted by raomk in BJP, CHINA, Congress, COUNTRIES, Current Affairs, Economics, Europe, Farmers, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, USA

≈ Leave a comment

Tags

#Farmers matter, Agri subsidies, China, Narendra Modi Failures, US trade protectionism, WTO MC13, WTO reform, WTO-Agriculture


ఎం కోటేశ్వరరావు


అబూదాబీలో ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటిఓ) సభ్య దేశాల మంత్రుల పదమూడవ సమావేశం(ఎంసి13) ఫిబ్రవరి 26-29 తేదీలలో జరుగుతున్నది. ఈ సమావేశాలలో ప్రతిదేశం తన అజెండాను ముందు పెట్టి దానికి మద్దతు కూడగడుతున్నది. రాజధాని ఢిల్లీలో సమావేశమయ్యేందుకు బయలు దేరిన రైతులను ఒక వైపు పంజాబ్‌-హర్యానా సరిహద్దుల్లో ఢిల్లీకి రెండువందల కిలోమీటర్ల దూరంలో ఫిబ్రవరి 13 నుంచి హర్యానా బిజెపి ప్రభుత్వం నిలువరించింది. ఆటంకాలను అధిగమించి ముందుకు వస్తే అడ్డుకునేందుకు రోడ్ల మీద కందకాలు, శత్రుదేశం దండెత్తి వచ్చినపుడు ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన మాదిరి అన్ని చర్యలతో ఢిల్లీలో నరేంద్రమోడీ ప్రభుత్వ పోలీసులు కాచుకొని ఉన్నారు.ఐరోపాలో అనేక దేశాల్లో రైతులు తమ సమస్యల మీద ఉద్యమిస్తున్నారు. డబ్ల్యుటిఓ నిబంధనలు రైతాంగానికి నష్టదాయకంగా ఉన్నందున దాన్నుంచి తప్పుకోవాలని దేశమంతటా రైతులు వివిధ రూపాల్లో డిమాండ్‌ చేశారు.ఈ పూర్వరంగంలో అబుదాబీలో ఏం జరగనుందనేది ఆసక్తికరంగా మారనుంది.గతంలో మాదిరి మన ప్రభుత్వం లొంగిపోతుందా ? దేశ పౌరుల ప్రయోజనాలను కాపాడుతుందా ?


ప్రపంచ వాణిజ్య సంస్థ పేరులోనే కార్పొరేట్ల వాణిజ్య ప్రయోజనాలను కాపాడేందుకు ఏర్పడిందన్న భావం ధ్వనిస్తున్నది. ప్రతిదీ లాభనష్టాల లెక్కలు తప్ప వాటికి మరొకటి పట్టదు.అక్కడ కూడా పేద-ధనిక దేశాల పెనుగులాటే జరుగుతున్నది. తమకు అనుకూలంగా ఉంటే డబ్ల్యుటిఓ నిబంధనలను అమలు జరపాలని ధనిక దేశాలు పట్టుబడతాయి. లేదనపుడు దాన్ని పక్కన పెట్టి విడివిడిగా దేశాలతో ఒప్పందాలు చేసుకుంటున్నాయి. మొత్తంగా చూసినపుడు ధనిక దేశాలకు అనుకూలంగానే ఆ సంస్థ నిబంధనలు ఉన్నాయి. వాటిని సంస్కరించాలని పేద దేశాలు పట్టుబడుతుండగా మరింతగా తమకు అనుకూలంగా మలచుకోవాలని ధనిక దేశాలు చూస్తున్నాయి. అందుకే అనేక అంశాల మీద దశాబ్దాల తరబడి ఒప్పందాలు కుదరక ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. కతార్‌లోని దోహాలో 2001లో ప్రపంచ వాణిజ్య చర్చలు ప్రారంభమయ్యాయి. అందుకే వీటిని దోహా దఫా చర్చలు అని పిలుస్తున్నారు. అప్పటి నుంచి ఇప్పుడు అబూదాబీ వరకు పదమూడు సార్లు మంత్రులు చర్చలు జరిపారు. వ్యవసాయ సబ్సిడీలకు సంబంధించి 2008లో ఏర్పడిన ప్రతిష్ఠంభన ఇప్పటికీ కొనసాగుతోంది. ముగింపు పలకాలని 2015లో అమెరికా కోరింది. చర్చలకు కాలం చెల్లిందని, దోహా దఫా ముగిసినట్లేనని 2017లో అనేక మంది విశ్లేషకులు వ్యాఖ్యానించారు. అయితే నైరోబీలో 2015లో జరిగిన మంత్రుల పదవ సమావేశంలో సంప్రదింపులు కొనసాగించాలని సభ్యులందరూ చెప్పినందున కొనసాగుతాయని డబ్ల్యుటిఓ ప్రకటించింది. తరువాత కూడా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది.


ప్రపంచ వాణిజ్య సంస్థ రూపొందించిన నిబంధనల ప్రకారం అభివృద్ధి చెందిన దేశాలు తమ వ్యవసాయ ఉత్పత్తుల మొత్తం విలువలో ఐదు, వర్ధమాన దేశాలు పదిశాతం వరకు సబ్సిడీలు ఇవ్వవచ్చు.భారత్‌, చైనా వంటి దేశాలు అంతకు మించి ఎక్కువే ఇస్తున్నాయని, భారత్‌ 60-70శాతానికి సమంగా ఇస్తున్నట్లు ఆరోపించిన అమెరికా ఆ మేరకు డబ్ల్యుటిఓకు ఫిర్యాదు చేసింది. అదే విధంగా ప్రభుత్వం ఆహార ధాన్యాలను నిల్వచేయటాన్ని దానికోసం ఎఫ్‌సిఐ నిర్వహణ, ప్రజాపంపిణీ వ్యవస్థలను కూడా వ్యతిరేకిస్తున్నాయి.ఈ కారణంగానే అమెరికా, తదితర ధనిక దేశాలను సంతుష్టీకరించేందుకు వీటికి ఎసరు పెట్టే ఎత్తుగడలో భాగంగా మూడు సాగు చట్టాలను రాష్ట్రాలతో సంప్రదించకుండా, పార్లమెంటరీ కమిటీకి పంపకుండా హడావుడిగా 2020లో ఆమోదించిన సంగతి తెలిసిందే. వాటిని వెనక్కు తీసుకున్న తరువాత ఇప్పుడు కనీస మద్దతు ధరలకు చట్టబద్దత కల్పించటం కుదిరేది కాదని, కావాలంటే మూడు రకాల పప్పులు, పత్తి, మొక్కజొన్నలను ఐదేండ్ల పాటు కనీస మద్దతు ధరలకు కొంటామని, అది కూడా రైతులు పంటమార్పిడి పద్దతిని అనుసరిస్తేనే అనే షరతు పెట్టారు. దీనికి అంగీకరిస్తే రైతుల కొంప కొల్లేరే.


మన దేశంలో వ్యవసాయం తరువాత ఎక్కువ మందికి ఉపాధితో పాటు రాబడి కల్పిస్తున్నది పాడి పరిశ్రమ. దీనికి కూడా ధనిక దేశాలు ఎసరు పెట్టాయి. డబ్ల్యుటిఓ పేరుతో పాల ఉత్పత్తులను దిగుమతి చేసుకోవాలని వత్తిడి చేస్తున్నాయి.ఆ ప్రమాదం మెడమీద కత్తిలా వేలాడుతూనే ఉంది. స్టాటిస్టా సంస్థ సమాచారం ప్రకారం ఐరోపా యూనియన్‌లోని 27 దేశాల జనాభా 49 కోట్లు కాగా ఆక్కడ పాల ఉత్పత్తి 2023లో 14.3 కోట్ల టన్నులు, నూటనలభై కోట్ల మంది ఉన్న మన దేశంలో పది కోట్ల టన్నులు, అమెరికాలో 10.4 కోట్ల టన్నులు, చైనాలో 5 కోట్ల టన్నులు ఉంది. కేవలం 52లక్షల జనాభా ఉన్న న్యూజిలాండ్‌ రెండు కోట్ల టన్నులు ఉత్పత్తి చేస్తున్నది. ఒక్క చైనా మినహా మిగిలిన దేశాలన్నీ పెద్ద ఎత్తున పాలు, పాల ఉత్పత్తులకు సబ్సిడీలు ఇచ్చి కారుచౌకగా మన దేశంలో కుమ్మరించాలని చూస్తున్నాయి. అదే జరిగితే పాడి రైతులు కుదేలు కావటం ఖాయం. గతంలో రైతులు, పారిశ్రామిక, వాణిజ్యవేత్తల నుంచి వచ్చిన వత్తిడి, దానిలో అమెరికా భాగస్వామిగా లేనందున ఆర్‌సిఇపి ఒప్పందంలో చేరేందుకు మన దేశం తిరస్కరించింది. లేకుంటే ఇప్పటికే న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా నుంచి పాల ఉత్పత్తులు ఇబ్బడి ముబ్బడిగా వచ్చి ఉండేవి. వచ్చే20 సంవత్సరాల వరకు పాల ఉత్పత్తులను దిగుమతి చేసుకోకుండా ఉంటేనే మన పరిశ్రమ మనుగడలో ఉంటుందని ఒక నివేదిక పేర్కొన్నది. పదమూడు సంవత్సరాల పాటు అముల్‌ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా పనిచేసి 2023 చివరిలో తప్పుకున్న ఆర్‌ఎస్‌ సోధీ దిగుమతుల గురించి హెచ్చరించారు. అమెరికా, ఐరోపాయూనియన్‌, ఇతర దేశాలతో స్వేచ్చావాణిజ్య ఒప్పందాలు, వాటి ఉత్పత్తులకు అనుమతి ఇస్తే పరిస్థితిని ఊహించలేమని కేంద్ర మంత్రి పియూష్‌ గోయల్‌కు రాసిన లేఖలో స్పష్టం చేశారు.న్యూజిలాండ్‌లో స్థానిక అవసరాల కంటే 14 రెట్లు ఎక్కువ ఉత్పత్తి జరుగుతోందని వారు మనదేశం మీద కన్నువేశారని చెప్పారు. మన దేశంలో సగానికి పైగా పాడి పరిశ్రమ అసంఘటిత రంగంలో ఉన్నందున ముందు రైతులు దెబ్బతింటారు.


పాడి తరువాత మనదేశంలో కోళ్ల పరిశ్రమ ముఖ్యమైనది. ఈ రంగంలో తన ఉత్పత్తులను కుమ్మరించాలని అమెరికా చూస్తున్నది.ప్రపంచ వాణిజ్య సంస్థలో మన మీద దాఖలు చేసిన కేసులో అమెరికా గెలిచింది. ఆ సాకుతో కోళ్ల ఉత్పత్తుల దిగుమతి పన్నును భారీగా తగ్గించేందుకు నరేంద్రమోడీ సర్కార్‌ అంగీకరించింది. గతంలో యుపిఏ ప్రభుత్వం అమెరికాలో వచ్చిన బర్డ్‌ఫ్లూ కారణంగా అమెరికా నుంచి దిగుమతులపై 2007లో నిషేధం విధించింది. వ్యాధి తగ్గిన తరువాత కూడా దాన్ని ఎత్తివేయలేదంటూ అమెరికా కేసు దాఖలు చేసింది.దాని మీద 2014 అక్టోబరులో తీర్పు వచ్చింది. తొలి రోజుల్లో అమలు చేసేందుకు నరేంద్రమోడీ సర్కార్‌ అంగీకరించకపోయినా, వాణిజ్య ఆంక్షలకు పూనుకుంటామని అమెరికా బెదిరించటంతో దిగుమతులతో పాటు అప్పటి వరకు ఉన్న పన్ను మొత్తాన్ని ఐదు శాతానికి తగ్గించేందుకు 2017లో మోడీ అంగీకరించారు. మన దేశంలోని కోళ్ల పరిశ్రమ దీన్ని తీవ్రంగా వ్యతిరేకించటంతో దిగుమతులు ప్రారంభం కాలేదు. దీనికి ప్రతిగా మన దేశం నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువులపై ఇస్తున్న 600 కోట్ల డాలర్ల మేర రాయితీ పన్ను డోనాల్డ్‌ ట్రంప్‌ రద్దు చేసి మన ఎగుమతులను దెబ్బతీశాడు. దీనితో పాటు మరికొన్ని వివాదాలు కొనసాగుతుండటంతో కోళ్ల ఉత్పత్తుల దిగుమతులు అమలు కాలేదు. ఇప్పటికీ అదే పరిస్థితి. ఈలోగా మన రైతులు అమెరికా కోడి కాళ్ల దిగుమతులను అనుమతించకుండా నిరోధించాలని సుప్రీం కోర్టుకు వెళ్లారు, ఆ కేసు ఇంకా తేలలేదు.ప్రస్తుతం అమెరికా కోళ్ల ఉత్పత్తులపై దిగుమతి పన్ను వందశాతం ఉంది. అయినప్పటికీ అక్కడి నుంచి దిగుమతి చేసుకుంటే మన మార్కెట్‌ ధరల కంటే తక్కువకు విక్రయించవచ్చని చెబుతున్నారు. మన వినియోగదారులకు తక్కువ ధర కావాలి గనుక మాంసం ఎక్కడిదన్నదానితో నిమిత్తం ఉండదు. మనదేశంలో ఒక టన్ను కోడి మాంసానికి 1,800 డాలర్లు ఖర్చు అవుతుంది. అదే అమెరికాలో 700 నుంచి 800 డాలర్లు, ఈ లెక్కన వందశాతం పన్ను చెల్లించి దిగుమతి చేసుకున్నప్పటికీ 1,500-1,600 డాలర్లకే అందించవచ్చు.అమెరికా పౌరులు కోడి కాళ్లను తినరు గనుక మనకు మరింత చౌకగా దొరుకుతాయి.


వ్యవసాయంతో పాటు అన్ని రకాల సబ్సిడీలను పరిమితం చేయాలి లేదా తొలగించాలన్నది ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధన. ఆ దిశగానే పదేండ్ల మోడీ పాలన సాగింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, బడ్జెట్‌, జిడిపిలతో పోలిస్తే వాస్తవ కేటాయింపు తగ్గుతున్నది. ఉదాహరణకు ఎరువుల సబ్సిడీ తీరు తెన్నులు చూద్దాం. యుపిఏ పాలనా కాలంలో 2008-2009 నుంచి 2013-14వరకు ఆరేండ్ల కాలంలో సగటున ఏడాదికి ఎరువులకు ఇచ్చిన సబ్సిడీ రు.59వేల కోట్లు. నరేంద్రమోడీ ఏలుబడి తొలి ఆరు సంవత్సరాల సగటు 71వేల కోట్లు ఉంది. ప్రపంచ వాణిజ్య సంస్థ సబ్సిడీలకు తీసుకున్న ప్రాతిపదికతో మనదేశంతో సహా అనేక దేశాలు నష్టపోతున్నాయి.1986-1988లో ఉన్న ధరలను ప్రాతిపదికగా తీసుకొని వర్ధమాన దేశాలలో మొత్తం వ్యవసాయ ఉత్పత్తుల విలువలో పదిశాతం సబ్సిడీలుగా ఇవ్వవచ్చు. అదే ఇప్పటికీ కొనసాగుతున్నది. ఈ కాలంలో పెరిగిన ద్రవ్యోల్బణం, పెరిగిన విలువను పరిగణనలోకి తీసుకోవాలని వర్ధమాన దేశాలు కోరుతున్నాయి. నిబంధనల్లో పీస్‌ క్లాజ్‌ అని ఒకటి ఉంది. దీన్నే సంధి కాలం అని కూడా అంటున్నారు. దీని ప్రకారం ఏవైనా ప్రభుత్వాలు సేకరించిన ఆహార ధాన్యాలను ఎగుమతి చేయకూడదు. అయితే గత సంవత్సరం, ఈ ఏడాది దేశంలో ఆహార ధరలు పెరిగిన కారణంగా కేంద్ర ప్రభుత్వం బహిరంగ మార్కెట్‌లో బియ్యం, గోధుమలను విక్రయిస్తున్నది. దీన్ని ఇతర దేశాలు తప్పు పడుతున్నాయి.ఇవి అంతర్జాతీయ మార్కెట్లకు చేరుతున్నాయని, ఇది నిబంధనలను ఉల్లంఘించటమే అని అభ్యంతరాలు తెలుపుతున్నాయి.


ప్రపంచ వాణిజ్య సంస్థలో తనకున్న పలుకబడిని ఉపయోగించుకొని అమెరికా రక్షణ చర్యలకు పాల్పడుతోంది. అబుదాబీ సమావేశంలో కూడా ఈ దిశలోనే తన అజెండాను ముందుకు నెట్టవచ్చు. ఈ సంస్థ అప్పీళ్ల విచారణ కోర్టులో న్యాయమూర్తుల నియామకాన్ని అడ్డుకొంటున్న కారణంగా 2019 నుంచి ఎలాంటి విచారణలూ లేవు. ఏడాదికేడాది వివాదాలు పెరుగుతున్నాయి. అమెరికా ప్రయోజనాలకే అగ్ర పీఠం అనే పద్దతిలో ఆలోచించటం, ఆ దిశగా ముందుకు పోవటం ఇటీవలి కాలంలో పెరిగింది. దానిలో భాగంగానే మనకు ఉపయోగపడని, మన మాట చెల్లుబాటుగాని డబ్ల్యుటిఓ నుంచి వైదొలగాలని అమెరికాలోని కొందరు తమ ప్రభుత్వం మీద వత్తిడి తెస్తున్నారు. ఇతర దేశాల ఉత్పత్తుల మీద దిగుమతి సుంకాలు విధిస్తూ బస్తీమే సవాల్‌ అంటున్నారు. ప్రపంచీకరణ తెచ్చిన తిరోగమన పరిణామాలు, పర్యవసానాల పూర్వరంగంలో ప్రపంచీకరణకు వ్యతిరేకత వెల్లడవుతున్నది. ఈ కారణంగానే డబ్ల్యుటిఓలో సంస్కరణలు తేవాలన్న వాంఛకు మద్దతు పెరుగుతున్నది.తనకు దక్కని ప్రయోజనాలను అమెరికా అంగీకరిస్తుందా ? ప్రపంచ వాణిజ్య సంస్థను ఒక ఆయుధంగా మలచుకొని ఇతర దేశాలను దెబ్బతీస్తుందా ? ధనిక దేశాల కూటమిని వెనక్కు కొట్టే అద్భుతం జరుగుతుందా ? అబుదాబీలో ఏం జరుగనుందో అని అన్ని దేశాలూ ఎదురు చూస్తున్నాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

కృష్ణా గోదావరి బేసిన్లో చమురు, గ్యాస్ – కష్టాలు మాకు, సంపద మీకా?

25 Sunday Feb 2024

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Prices

≈ Leave a comment

Tags

ANDHRA PRADESH, Krishna Godavari Basin, Krishna Godavari Basin oil, Narendra Modi Failures

డాక్టర్ కొల్లా రాజమోహన్,

          కృష్ణ – గోదావరి బేసిన్ ఆంధ్ర రాష్ట్రంలోని తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా,గుంటూరు జిల్లాలలో వ్యాపించి ఉన్నది. ఇది భూఉపరితల పరంగా చూస్తే 28 వేల చదరపు కిలోమీటర్లలోను, సముద్రగర్భంలో 24 వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉంది. కేంద్ర పభ్రుత్వరంగ సంస్థ అయిన ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్(ONGC)- 14 ఆగస్టు 1956 నుండి చమురు, గ్యాస్ నిక్షేపాల కోసం పరిశోధనలు జరుపుతున్నది.1978వ సంవత్సరంలో నర్సాపురం వద్ద మొదటిబావిని తవ్వి గ్యాస్ ను కనుగొన్నా రు. ఆ బేసిన్ లోని ఇతర ప్రాంతాల్లో కూడా చమురు, గ్యాస్ నిక్షేపాలు బయటపడ్డాయి. ఓ యన్ జీ సీకి ఉన్న ఆస్తులన్నిటిలోకీ అత్యంత ఎక్కువ ఉత్పాదకత వున్న విలువైన ఆస్తుల్లో కేజీ బేసిన్ ముఖ్యమైనది. ఇలాంటి సంపద్వంతమైన కేజీ బేసిన్ నిలువలు మన ముంగిట్లో వున్నా ఆంధ్రపజ్రలకు అందుబాటులో లేకపోవడమే విషాదం.


తాజా పరిణామం…
       కాకినాడకు 30 కిలోమీటర్ల దూరాన సముద్రగర్భం నుండి 2024, జనవరి7న ముడిచమురు ఉత్పత్తి  ప్రారంభమవటమే తాజా పరిణామం. కృష్ణ – గోదావరి బేసిన్ లో సహజవాయువుతో పాటుగా చమురు ఉత్పత్తి విలువ కొన్ని లక్షల కోట్లకు మించి ఉంటుందని అంచనా. ఆంధ్రతీరంలోవున్న చమురు నిక్షేపాలు దేశ ఆర్ధిక వ్యవస్ధ స్వరూపాన్నే మార్చబోతున్నాయి. దీనివలన ఆంధ్రప్రాంత ప్రజలు సర్వతోముఖాభివృద్ధిని సాధించవచ్చు. కానీ బడా కార్పొరేట్ కంపెనీల అధిపత్యానికి కేంద్ర పాలకులు  లొంగిపోవటం వలన ఆంధ్రపజ్రలు సంపదలకు దూరమయ్యారు. ఆంధ్ర రాష్ట్రం మరింత నష్టపోతున్నది.   అన్వేషణ,వెలికితీత, ఉత్పత్తి, పంపిణీ, వినియోగం, ధర నిర్ణయ విధానాలను సరిగ్గా నిర్వహించిన చోట ప్రజలు సంపదలను అనుభవిస్తున్నారు. లేనిచోట రిలయన్స్ అంబానీ లాంటి కొద్దిమంది కార్పొరేట్ శక్తులు లక్షల కోట్లరూపాయల సంపదలకు అధిపతులై విలాసజీవితం గడుపుతున్నారు.


లీటర్ పెట్రోల్ ను రు10, గ్యాస్ సిలిండర్ను రు 100 కే ఇవ్వవచ్చు!
        కేవలం విద్యుత్ ఉత్పాదనలోనేకాక ఎరువుల తయారీలో కూడా సహజవాయువు ఎంతగానో ఉపయోగపడుతుంది. దాంతోపాటు చౌకగా లభించేగ్యాస్ ఆధారిత విద్యుత్తును అందించటం ద్వారా సిమెంట్, సెరామిక్, రసాయనిక,అల్యూమినియం, స్టీల్ ప్లాంట్, ఫ్యా బ్రికేషన్ పరిశ్రమలలో ఖరీదైన విద్యుత్ మీద ఆధారపడటం తగ్గుతుంది. విశాఖ ఉక్కు కర్మాగారానికిగ్యాస్ సరఫరా చేస్తే సంవత్సరానికి1200 కోట్ల రూపాయలకు మించి ఖర్చు తగ్గుతుందని 2010లోనేఅంచనా వేశారు. కే.జీ.బేసిన్  గ్యాస్ చాలినంతగా న్యాయమైన ధరకు లభిస్తే కాకినాడ నుండి విశాఖపట్నం వరకు కాలుష్య రహిత రసాయనిక పరిశమ్రల కారిడార్ ను నెలకొల్పవచ్చు.    కే.జీ బేసిన్ లో రోజుకి కొన్ని మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్స్ గ్యాస్ నిక్షేపాలు కనుగొన్నారు. కేవలం ఒక్క ఎం ఎం ఎస్ సిఎం డి యూనిట్ గ్యాస్, సుమారు 1000 కోట్ల విలువైన పారిశ్రామిక పెట్టుబడిని ఆకర్షించగలదని నిపుణుల అంచనా. అంటే కేజీ బేసిన్   గ్యాస్ లో సగాన్ని ఉపయోగించుకున్నా మనం లక్ష కోట్ల విలువైన పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించవచ్చు.లక్షలాదిమందికి ఉపాధిఅవకాశాలను కలిగించవచ్చు . రవాణా రంగంలో బస్సులకు, లారీలకు,కార్లకు, ఆటోలకు సిఎన్ జీ గ్యాస్ వాడకంవల్ల ఖర్చు తగ్గటమేకాకుండా కాలుష్యం నుండి పర్యావరణాన్ని కూడా రక్షించుకోవచ్చు. గృహ అవసరాలకు గ్యాస్ పైపుల ద్వారా అతి చౌకగా వంటగ్యాస్ ను అందించవచ్చు. దీని మూలంగా గ్యాస్ సిలిండర్లపై పభ్రుత్వ సబ్సిడీభారం తగ్గుతుంది. ప్రస్తుతం వెయ్యి రూపాయలకు పైగా ఖరీదవుతున్న వంట గ్యాస్ సిలిండర్ కు సమానమైన గ్యాస్ ను పైపులైన్ ద్వారా వందరూపాయలకే ఇవ్వవచ్చును. అలానే లీటర్ పెట్రోలును రు 10 కే వాహనదారులకు అందించవచ్చు.


నూతన పాలసీతో కార్పొరేట్ సంస్థల అధిపత్యం!
      
       1991లో పీవీ నరసింహారావు పభ్రుత్వం నూతన ఆర్థిక విధానాలను చేపట్టింది. దేశం ఎదుర్కొంటున్న సర్వసమస్య లకు ఏకైక పరిష్కారంగా ప్రైవేటైజేషన్ ను ముందుకు  తెచ్చారు. అందులో భాగంగా చమురు సహజవాయువు ప్రాంతాల వేలంకు దేశ విదేశీ పెట్టుబడులను ఆహ్వానించారు. దేశీయకంపెనీ అయిన రిలయన్స్, విదేశీ సంస్ద అయిన కెయిర్న్ లాంటి కార్పోరేట్ సంస్థలు ముందుకు వచ్చాయి. ఇవి ప్రభుత్వ సంస్థలను రద్దు చేయకుండానే వాటిపునాదిని ఉపయోగించుకుని విపరీతమైన లాభాలను గడించాయి.    ప్రపంచీకరణ విధానాలలో భాగంగా చమురు గ్యాస్ నిక్షేపాలను దేశ విదేశీ కార్పోరేట్ వ్యాపార సంస్థలకు భాగస్వామ్యం కల్పించే ఉద్దేశంతో కేంద్రం 1997లో నూతన అన్వేషణ లైసెన్సింగ్ పాలసీ( నెల్ప్-NELP) ని పవ్రేశ పెట్టింది. నూతన విధానానికి రెండు లక్ష్యాలను పభ్రుత్వం పక్రటించింది. సముద్ర గర్భంలోనూ,భూ ఉపరితలంలోనూ నూతన గ్యాస్ నిక్షేపాల కోసం అన్వేషణను ప్రోత్సహించి,
పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా స్వదేశీ గ్యాస్, చమురు ఉత్పత్తిని పెంచి, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించటం. రెండవది, ఈ పథకం కింద పభ్రుత్వం వేలంపాట ద్వారా కొన్ని నిర్దిష్టప్రాంతాలలో నిక్షేపాల అన్వేషణకు ప్రైవేటు కార్పొరేట్ సంస్థలకు అవకాశాన్ని కల్పించింది. ఈ పథకం పక్రారం తాము పెట్టిన పెట్టుబడిని లాభాలతో సహా త్వరగా రాబట్టుకోవడానికి వీలుగా ప్రభుత్వంతో సంప్రదించి ధర నిర్ణయించే అవకాశాన్ని పభ్రుత్వం ఈ నూతన అన్వేషణ దారులకు కల్పించింది. ఈ నూతన విధానం పక్రారం  కృష్ణా- గోదావరి బేసిన్ లో సముద్రగర్భంలోని బావులలో అత్యధిక నిల్వలున్న గ్యాస్,చమురు నిక్షేపాలను రిలయన్స్ కంపెనీ కైవసం చేసుకుంది. ఈ కంపెనీ తన సామ్రాజ్యాన్ని అనేక
రంగాల్లోకి విస్తరించుకున్నది. 


అంగట్లో అన్నీ ఉన్నా…


       సహజవాయువు, చమురునిక్షేపాలు మన ముంగిట్లో అంటే కే.జీ.బేసిన్ లో పుష్కలంగా ఉన్నా ఆ వనరులను ఉపయోగించుకోలేని దుస్థితిలో మనం ఉన్నాం. దీనికి ప్రధాన కారణం కే.జీ.బేసిన్ గ్యాస్ సంపద రాష్ట్రసరిహద్దులు దాటి తరలిపోవడం. సహజ న్యాయసూత్రాల పక్రారం కే.జీ.బేసిన్ లో లభ్యమయ్యే సహజవాయువు మన రాష్ట్రఅవసరాలు తీరిన తర్వాతనే మనసరిహద్దులు దాటిపోవాలి. సహజ వనరుల యాజమాన్యం, నియంత్రణ ఆ ప్రాంత ప్రజలందరి ప్రయోజనాలను న్యాయమైనరీతిలో కాపాడేటట్లుగా రాజ్యవ్యవస్థ వ్యవహరించాలని భారత రాజ్యాంగం ఆదేశిక సూత్రాలు చెప్తున్నాయి.    సహజ న్యాయానికి, రాజ్యాంగస్ఫూర్తికి విరుద్ధంగా  బేసిన్ లో లభ్యమవుతున్న సహజవాయువు మన సరిహద్దులు దాటి 1500 కిలోమీటర్లదూరంలో ఉన్న గుజరాత్, మహారాష్ట్రలకు తరలిపోతున్నది. 45.50% గ్యాస్ ను గుజరాత్ కు తరలిస్తున్నారు. 24% మహారాష్టలోని పరిశమ్రలకు ఇచ్చేస్తున్నారు. మిగిలిన దాన్ని ఉత్తరపద్రేశ్ కు తరలిస్తున్నారు.  ఆంధప్రద్రేశ్ రాష్ట్ర అవసరాలకు 1.2 శాతాన్ని మాతమే కేటాయిస్తున్నారు. కేంద్రపభ్రుత్వ కార్పోరేట్ అనుకూల విధానాలు, రాష్ట్రపభ్రుత్వాల నిష్క్రియాపరత్వం, పటిష్టమైన ప్రజా పోరాటాలు సాగని ఫలితంగా  మన సహజసంపద తరలిపోతున్నది.


ప్రహసనంగా మారిన ధరల నిర్ణయం ధర!


       కేజీ బేసిన్ లో సహజవాయువు ధరను నిర్ణయించటం ఒక ప్రహసనంగా మారింది. రిలయన్స్ కంపెనీ ప్రవేశించేవరకూ గెయిల్ సంస్థ ల్యాంకో పరిశమ్రకు యూనిట్ ఒకటికి 1.97 డాలర్లకు సరఫరా చేస్తున్నది. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ కు కేజీ బేసిన్ నుండి ఒక యూనిట్ గ్యాస్ ను 2.97 డాలర్లకు సరఫరా చేస్తానని రిలయన్స్ కంపెనీ అగ్రిమెంట్ కుదుర్చుకున్నది. తదనంతరం ప్లేట్ ఫిరాయించి 4.3 డాలర్లకైతేనే గ్యాస్ ఇస్తామన్నది. ఇంత ఎక్కువ ధరలు నిర్ణయించటానికి శాస్త్రీయ ఆధారాలు లేవని, ఆ ధరకు గ్యాస్ కొనుగోలు చేస్తే ఎరువులు, విద్యుత్ ఉత్పత్తి, తదితర పరిశమ్రలకు భారం అధికమవుతుందన్న ఆనాటి కేంద్ర పెట్రోలియం శాఖామంత్రి జైపాల్ రెడ్డిని ఆ శాఖ నుండి తప్పించేశారు. ధర పెంచటం అన్యాయమన్న కేంద్రకార్యదర్శుల కమిటీనిర్ణయాన్ని ఆమోదించలేదు. రంగరాజన్ అధ్యక్షతనగల పధ్రాన ఆర్థిక సలహా మండలి నిర్ణయాన్ని ఒప్పు కోలేదు. పణ్రబ్ ముఖర్జీ అధ్యక్షతన కేంద్రపభ్రుత్వం ఒక మంత్రుల కమిటీని నియమించింది. ఆ కమిటీ ఏదోఘనకార్యం చేసినట్లుగా నటించి రిలయన్స్ కోరిన 4.33 డాలర్ల ధరను 4.2 డాలర్లకు తగ్గించింది. కొండను తవ్వి ఎలుకను పట్టటం అంటే ఇదే! 


ఆనాటి రాష్ట్రపభ్రుత్వ ఆందోళన


       అలస్యంగానైనా మేల్కొన్న ఆనాటి ఆంధర్రాష్ట్ర పభ్రుత్వం కేజీ బేసిన్ లోని సహజ సంపదలో మన రాష్ట్రానికి న్యాయసమ్మతమైన వాటా లభించాలని కేంద్రపభ్రుత్వాన్ని కోరితే రిలయన్స్ కంపెనీతో మాట్లాడుకోమంది. ఉన్న నిల్వలు మాకే సరిపోవు కాబట్టి  కొత్తగా ఆంధప్రద్రేశ్ రాష్ట్రానికి ఒక్క యూనిట్ సహజవాయువును కూడా సరఫరా చేయలేను అని తేల్చి చెప్పింది. దీని ఫలితంగా మన రాష్ట్రంలో అప్పటికే ప్రైవేట్  రంగంలో నెలకొల్పన గ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పాదన కేంద్రాలకు గ్యాస్ సరఫరా అసాధ్యమైంది. ఈ పరిస్థితులలో ఆనాటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిగారు కేంద్రానికి కొన్ని సూచనలు చేస్తూ 29 లేఖలు రాశారు. న్యాయబద్ధమైన సూచనలలో ఏ ఒక్కదానిని కూడా కేంద్రపభ్రుత్వ మంత్రుల కమిటీ పరిగణనలోకి తీసుకొననేలేదు. ఈ విధానం హక్కులను నిరాకరించటమే గాక అణిచివేయటం కాదా!    12వ ఆర్థిక సంఘం కూడా ఏ ప్రాంతంలో దొరికేసహజ వనరులపైన ఆ ప్రాంతానికి వినియోగ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది. పార్లమెంటు స్టాండింగ్ కమిటీ అక్టోబర్, 2013 రిపోర్టులో, సహజ వనరులు ఉత్పత్తి అవుతున్న రాష్ట్రానికి కనీసం 50 శాతం గ్యాస్ తో పాటు రాయల్టీనీ కూడా ఇవ్వాలని రికమెండ్ చేసింది. సముద్ర అంతర్భాగం నుండి గ్యాస్ తీసినా, భూమినుండి తీసినా రాష్ట్రానికి వాటా వుండాల్సిందేనని పార్లమెంటు కమిటీ తేల్చిచెప్పింది. మన రాష్ట్రంలో లభ్యమయ్యే సహజ వనరులలో కొంత భాగాన్ని మాత్రమే మన రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికోసం డిమాండ్ చేస్తున్న అత్యంత హేతుబద్ధమైన, న్యాయమైన ఈ డిమాండ్ ను కూడా కేంద్రపభ్రుత్వం నిరాకరించటం అంటే ఫెడరలిజాన్ని నిరాకరించటమే, కార్పోరేట్ కంపెనీలకు పత్ర్యక్షంగా వత్తాసు పలకటమే!


కష్టాలు మాకు-సంపద మీకా?


       భూమిలోపల కొన్ని లక్షల సంవత్సరాల పరిణామాల ఫలితంగా సహజవాయువు, చమురుఏర్పడుతుంది. ప్రజలు సముద్రపు ఆటుపోట్లను, అల్పపీడనాలను, వాయుగుండాలను,ఉప్పెనలను, సునామీలు, పంట పొలాలలో గ్యాస్ బ్లో అవుట్లు లాంటి కష్టాలను ఎదుర్కొంటూ జీవిస్తున్నారు. మన గ్రామాల నుండి మన పొలాల నుండి గ్యాస్ ను పైపులద్వారా గుజరాత్ కు తీసుకొని వెళ్తూ మనకు ఒక్క కేజీ గ్యాస్ కూడా ఇవ్వరట. మన రాష్ట్రంలో లభించేసహజ వనరులను దోచుకుని రిలయన్స్ వంటి బడా కార్పోరేట్ సంస్థలు ఇబ్బడి
ముబ్బడిగా తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవటాన్ని, మన ప్రజల ప్రయోజనాల దృష్ట్యా మనం వ్యతిరేకించాలి. లేనిపక్షంలో మనం భవిష్యత్ తరాల ముందు దోషులుగా నిలబడవలసి వస్తుంది. నిజానికి ఇది పభ్రుత్వ, ప్రజా ప్రతినిధుల బాధ్యత. అయితే ఇప్పటివరకు మన ప్రజా ప్రతినిధులు స్పందించాల్సిన రీతిలో స్పందించని ఫలితంగా ప్రజాఉద్యమాన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా రాజీలేని సమైక్య ఉద్యమాన్నినిర్వహించవలసిన అవసరం నేడు ఏర్పడింది. కేజీ బేసిన్లో లభించే సహజ వనరులపై మన ప్రాథమిక హక్కును సాధించుకోవటానికి పోరాట దీక్షతో కలసికట్టుగా ముందడుగులు వేద్దాం!

  డాక్టర్ కొల్లా రాజమోహన్,   కృష్ణా గోదావరి బేసిన్ చమురు గ్యాస్ సాధన సమితి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఏడాదిలోపు రెండుసార్లు చెరకు ధర ప్రకటన ! రైతుల ఓట్లు కొల్లగొట్టేందుకు మోడీ ఎత్తుగడ !!

23 Friday Feb 2024

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, Farmers, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Prices

≈ Leave a comment

Tags

BJP, Fair and Remunerative Price, GannaKisan, MSP demand, Narendra Modi Failures, sugarcane, sugarcane farmers

ఎం కోటేశ్వరరావు


కేంద్రా ప్రభుత్వం తాజాగా క్వింటాలు చెరకు ధరను రు.25 పెంచింది. దీంతో 2024-25 సీజన్‌కు రు.340కి చేరిందని, రైతులకిచ్చిన ఈ బ హుమతితో పండగ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. మన దేశంలో సీజన్‌ అంటే ఆర్థిక సంవత్సరానికి చెప్పే నిర్వచనం వేరు, పంటలకు వేరు. ఏప్రిల్‌ నుంచి మార్చి నెలవరకు ఆర్థిక సంవత్సరం. అదే పత్తి, చెరకు సంవత్సరాలు అక్టోబరు నుంచి సెప్టెంబరు వరకు లెక్కిస్తారు.దీని ప్రకారం 2024-25 సీజన్‌ అంటే ఈ ఏడాది అక్టోబరు నుంచి వచ్చే ఏడాది సెప్టెంబరు వరకు. కనుక ప్రకటించిన పెంపుదల వర్తమాన సంవత్సరానికి కాదు. ఈ ఏడాది ధరను సీజనుకు ముందుగా గతేడాది జూన్‌లోనే ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల తరువాత జూన్‌లో చేయాల్సిన ప్రకటనను రైతుల ఓట్ల కోసం నాలుగు నెలల ముందే ప్రకటించారు. అందుకే నిజంగా రైతులు దీంతో సంతోషిస్తారా ? పంజాబ్‌ రైతులు చలో ఢిల్లీ పేరుతో రావటాన్ని పంజాబ్‌-హర్యానా సరిహద్దులో బిజెపి ప్రభుత్వం అడ్డుకుంది. ఫిబ్రవరి 13 నుంచి ఢిల్లీకి రెండు వందల కిలోమీటర్ల దూరంలో వారు రెండు చోట్ల తిష్టవేశారు.వివిధ రూపాల్లో ఆందోళనకు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. పోలీసుల దాష్టీకానికి ఒక రైతు మృతి చెందాడు. త్వరలో లోక్‌సభ ఎన్నికల నోటిపతిికేషన్‌ వెలువడనున్న పూర్వరంగంలో నాటకీయ పద్దతిలో కేంద్ర మంత్రివర్గం ఫిబ్రవరి 21 సమావేశం, దానిలో చెరకు ధర పెంపు నిర్ణయాన్ని నరేంద్రమోడీ వెల్లడించారు.


న్యాయమైన మరియు గిట్టుబాటు ధర(ఎంఆర్‌పి) పేరుతో చేస్తున్న జిమ్మిక్కుతో రైతులకు ఒరిగేదేమిటి ? షరతులు వర్తిస్తాయి అన్నట్లుగా క్వింటాలుకు 10.25శాతం పంచదార దిగుబడి వస్తేనే ఈ ధర దక్కుతుంది. ప్రస్తుత సీజన్‌లో 2023-24కు రు.315గా 2023జూన్‌లో కేంద్రం ప్రకటించింది. వచ్చే ఏడాది నిర్ణీత ప్రామాణిక శాతానికి మించి ఎక్కడైనా పంచదార దిగుబడి పెరిగితే 0.1శాతానికి రు.3.32 అదనంగా చెల్లిస్తారు. అదే మాదిరి తగ్గితే తగ్గుతుంది. తమ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తరువాత 2014-15 నుంచి ఈ మాదిరి పెరుగుదల లేదు అని కేంద్ర ప్రభుత్వం చెప్పుకున్నది నిజమే. పదేండ్ల వివరాలను చూసినపుడు చెరకు ధరను రు.220 నుంచి రు.315కు పెంచారు. అంటే పదేండ్లలో పెరిగింది కేవలం రు.95 మాత్రమే. ఏడాదికి సగటు పెంపు రు.9.50 మాత్రమే. అలాంటిది ఏకంగా రు.25 పెంచారంటే ఎన్నికల కోసమే అంటే తప్పేముంది. పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌ రైతాంగంలో పలుకుబడి కలిగిన ఆర్‌ఎల్‌డి పార్టీ బిజెపితో చేతులు కలిపింది, చెరకు పండేది కూడా అక్కడే ఎక్కువ, ఆర్‌ఎల్‌డి మద్దతుదార్లు ఈ రాజకీయ అవకాశవాదాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని, నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నట్లు వార్తలు వచ్చిన పూర్వరంగంలో వారిని మచ్చిక చేసుకొనేందుకు మోడీ పూనుకున్నారు. దానిలో భాగంగా చెరకు ధర పెంపుతో పాటు మాజీ ప్రధాని చరణ్‌సింగ్‌కు భారత రత్న ప్రకటన వెనుక కూడా చెరకు రైతుల మద్దతు కోసమే అన్నది స్పష్టం. గతంలో సాగిన రైతు ఉద్యమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న జాట్‌ రైతాంగాన్ని ఈ సారి ఆందోళనకు దూరంగా ఉంచాలన్న ఎత్తుగడ కూడా ఉంది. మహారాష్ట్రలో బిజెపిని వ్యతిరేకిస్తున్న శరద్‌ పవార్‌ నాయకత్వంలోని పార్టీకి చెరకు రైతులే ప్రధాన మద్దతుదార్లు, వారిని ఆకర్షించటం కూడా దీని వెనుక ఉంది. గడచిన పదేండ్లలో నాలుగు సంవత్సరాలు అసలు పెంచలేదు. ఒకేడాది ఐదు, మూడు సార్లు పది వంతున, ఒకసారి 15, మరొకసారి రు.20 పెంచారు.2019 ఎన్నికలకు ముందు రు.20పెంచారు. అదీ ఎన్నికల కోసమే అనివేరే చెప్పనవసరం లేదాు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న మోడీ హామీలో భాగమే తాజా పెంపుదల అని ప్రచారం చేస్తున్నారు. ఆ లెక్కన ధర రు.440కి పెరగాలి. అందుకే జుమ్లా అని రైతులు వర్ణిస్తున్నారు. యుపిఏ హయాంలో 2009-10లో ఉన్న ధర రు.129 నుంచి 2013-14 నాటికి రు.210కి అంటే ఐదు సంవత్సరాల్లో రు.81 పెరిగింది. పదేండ్ల మోడీ ప్రభుత్వం పెంచింది కేవలం రు.95 మాత్రమే. ఏ ఎలిమెంటరీ విద్యార్ధిని అడిగినా మోడీ ఏలుబడిలో తక్కువే అని చెబుతారు.


దేశంలో చెరకు ధరకు రెండు పద్ధతులను అనుసరిస్తున్నారు.ఒకటి కేంద్రం ప్రకటించే ఎఫ్‌ఆర్‌పి కాగా రెండవది కొన్ని రాష్ట్రాలు ప్రకటిస్తున్న రాష్ట్ర సలహా ధర(ఎస్‌ఏపి) సహజంగా కేంద్రం కంటే ఎక్కువగా ఉంటుంది.ఉదాహరణకు పంజాబ్‌లో రు.391, ఉత్తర ప్రదేశ్‌లో రు.370 ఉంది. అందువలన కేంద్ర ప్రకటించిన ధరతో ఎవరికి ప్రయోజనం?ప్రస్తుతం ఉన్న రు.315 ధర పంచదార దిగుబడి 9.5శాతం అన్న అంచనాతో నిర్ణయించారు. అందువలన దిగుబడి పెరిగితేనే రైతుకు ఉపయోగం లేకపోతే నష్టమే.దిగుబడి రైతు చేతిలో ఉండదు. ప్రైవేటు రంగంలో ఉన్న ఏ ఒక్క పంచదార ఫ్యాక్టరీ దిగుబడి గురించి వాస్తవ సమాచారాన్ని వెల్లడించదు. అందువలన దిగుబడితో నిమిత్తం లేకుండా ధర చెల్లించాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. కేంద్రమైనా, రాష్ట్రాలు ప్రకటించే ధరలైనా వాస్తవ ఖర్చులను పరిగణనలోకి తీసుకోవటం లేదని, పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లో సాగు ఖర్చు టన్నుకు రు.440 అవుతుందని రైతులు చెబుతున్నారు. అందుక పెంపుదలను ముష్టి విదిల్చినట్లుగా భావిస్తున్నారు. మిల్లు యజమానులు పంచదార, తదితర ఉత్పత్తులను అమ్మిన తరువాతే రైతులకు డబ్బు చెల్లిస్తున్నారు. అంటే రైతుల పెట్టుబడితో మిల్లులు నడుస్తున్నాయి.ఒక టన్ను చెరకు నుంచి వంద కిలోల పంచదార, నలభై కిలోల మొలాసిస్‌ వస్తుంది.దీన్నుంచి పది లీటర్ల మేర ఇథనాల్‌ వస్తుంది. ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదలకు అనుగుణంగా కేంద్రం లేదా రాష్ట్రాలు చెరకు ధర పెంచటం లేదు. గడచిన మూడు సంవత్సరాల్లో చెరకు ధర 5.7శాతం పెరిగితే కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు 19 శాతం కరవు భత్యం పెంచిందని రైతులు గుర్తు చేస్తున్నారు. ఉత్తర ప్రదేశ్‌లో సమాజవాదీ పార్టీ పాలన 2012 నుంచి 2017వరకు 26శాతం చెరకు ధర పెంచితే నరేంద్రమోడీ అచ్చేదిన్‌, యోగి బుల్డోజర్‌ పాలన ఏడు సంవత్సరాల్లో పెంచింది 17.46శాతమే.


స్వామినాధాన్‌కు భారతరత్న ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి ఆయన సూచించిన పద్దతి ప్రకారం మద్దతు ధరలను నిర్ణయించేందుకు మొరాయిస్తున్నది. ఉదాహరణకు చెరకు సంగతే చూద్దాం. 2023లో కేంద్రం ప్రకటించిన ఎఫ్‌ఆర్‌పి రు.315(దానికి తాజాగా వచ్చే ఏడాదికి మరో 25 పెంచింది), వివిధ రాష్ట్రాలలో ప్రకటించిన సలహాధరలు, స్వామినాధన్‌ పద్దతిలో ఉండాల్సిన ధర, ఒక క్వింటాలకు (రు.315 ఎఫ్‌ఆర్‌పి ప్రకారం) రైతులు నష్టపోతున్న మొత్తాల గురించి ఆలిండియా కిసాన్‌ సభ రూపొందించిన వివరాలు దిగువ విధంగా ఉన్నాయి.
రాష్ట్రం×××××× రాష్ట్ర ధర×××× స్వామినాధన్‌××××రైతుల నష్టం

ఆంధ్రప్రదేశ్‌ ×× 357 ×××× 535.50 ×××× 220.50

బీహార్‌ ×× 241 ×××× 361.50 ×××× 46.50

గుజరాత్‌ ×× 289 ×××× 433.50 ×××× 118.50

హర్యానా ×× 327 ×××× 490.50 ×××× 175.50

కర్ణాటక ×× 258 ×××× 387.00 ×××× 72.00

మహరాష్ట్ర ×× 214 ×××× 321.00 ×××× 6

పంజాబ్‌్‌ ×× 298 ×××× 447.00 ×××× 132

తమిళనాడు ×× 299 ×××× 448.50 ×××× 133.50

తెలంగాణా ×× 332 ×××× 498.00 ×××× 183

ఉత్తరప్రదేశ్‌ ×× 310 ×××× 465.00 ×××× 150

ఆలిండియా ×× 292 ×××× 438.75 ×××× 123.50

ఈ పూర్వరంగంలో క్వింటాలకు రు.500 ధర నిర్ణయించాలని అఖిలభారత కిసాన్‌ సభ డిమాండ్‌ చేసింది. సహకార, ప్రభుత్వ రంగంలో ఉన్న పంచదార మిల్లులను జాతీయం చేయరాదని, ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయాలని కూడా కోరింది. వర్తమాన సంవత్సరంలో రు.315 అంటే దిగుబడిలో 10.25 శాతం దాటిన తరువాత పెరిగే ప్రతి 0.1శాతానికి అదనంగా రు.3.07 చెల్లిస్తారు, తగ్గితే ఆ మేరకు కోత పెడతారు. సగటు దిగుబడి 9.5శాతమే ఉన్నందున క్వింటాలు ధర రు.315గా చెప్పినా రైతుకు దక్కేది రు.292 మాత్రమే. చెరకు ఉత్పత్తి ఖర్చుకు వందశాతానికి మించి గిట్టుబాటు ధర చెల్లిస్తున్నట్లు ప్రభుత్వం నమ్మబలుకుతోంది.అసలు కిటుకు అక్కడే ఉంది. క్వింటాలుకు సాగు ఖర్చును కేవలం రు.157 మాత్రమే 2023-24 సంవత్సరానికి లెక్కగట్టి రు. 315 ప్రకటించామంటే రెట్టింపే కదా అని చెబుతున్నారు. రైతులు మరీ అంత అమాయకంగా కనిపిస్తున్నారా ? ప్రభుత్వం చెబుతున్నది వ్యవసాయ పంటల ధరల నిర్ణాయక సంస్థ సూచించిన మొత్తం. అది వాస్తవ సాగు ఖర్చును పరిగణనలోకి తీసుకోవటం లేదని ప్రారంభం నుంచి విమర్శలు వస్తూనే ఉన్నాయి. అందుకే స్వామినాధన్‌ కమిషన్‌ పద్దతి ప్రకారం సాగు ఖర్చును, మద్దతు ధరలను నిర్ణయించాలని, వాటికి చట్టబద్దత కల్పించాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. గతంలో ఏడాది పాటు చేసిన ఉద్యమం, తాజాగా జరుగుతున్న ఆందోళనకు నాయకత్వం వహిస్తున్నవారు కూడా కోరుతున్నది అదే.

Share this:

  • Tweet
  • More
Like Loading...

యువరైతును బలితీసుకున్న బిజెపి సర్కార్‌ – రైతు ఉద్యమ భవిష్యత్‌ ఏమిటి !

21 Wednesday Feb 2024

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, Economics, Farmers, History, INDIA, Loksabha Elections, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices

≈ Leave a comment

Tags

#Farmers matter, #Farmers Protest, BJP, Haryana polic, Narendra Modi Failures, SKM


ఎం కోటేశ్వరరావు


ఫిబ్రవరి 13న ప్రారంభమైన రైతు ఉద్యమంలో బుధవారం నాడు 24ఏండ్ల సుభకరణ్‌ సింగ్‌ ప్రాణాలర్పించాడు. హర్యానా పోలీసులు రైతుల మీద జరిపిన దమనకాండలో అనేక మంది గాయపడ్డారు.కనౌరీ ప్రాంతం నుంచి తమ ఆసుపత్రికి వచ్చిన ముగ్గురిలో ఒకరు మరణించినట్లు పాటియాలలోని రాజీంద్ర ఆసుపత్రి సూపరింటెండెంట్‌ హెచ్‌ఎస్‌ రేఖీ విలేకర్లతో చెప్పారు. తమ దగ్గర అలాంటి సమాచారం లేదని పోలీసులు బుకాయించారు. పోలీసుల దమనకాండ నేపధ్యంలో రెండు రోజుల పాటు ఢిల్లీ చలో ప్రదర్శన నిలిపివేసినట్లు రైతు సంఘాల ప్రతినిధి సర్వన్‌ సింగ్‌ పాంధెర్‌ ప్రకటించారు. తదుపరి కార్యాచరణను శుక్రవారం నాడు వెల్లడిస్తామని తెలిపారు. బుధవారం నాడు పంజాబ్‌-హర్యాన సరిహద్దులోని రెండు ప్రాంతాలలో ప్రదర్శకుల మీద పోలీసులు విరుచుకుపడ్డారు. ఆ సందర్భంగా జరిగిన ఘర్షణలో కొందరు గాయపడటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మిర్చి కలిపిన ఎండుగడ్డిని తగులబెట్టి దానితో రైతులు తమ మీద దాడి చేసినట్లు పోలీసులు ఆరోపించారు. ఉత్తరాఖండ్‌లో కొన్ని చోట్ల ట్రాక్టర్లతో ప్రదర్శనలు జరిపారు.


అంతకు ముందు జరిగిన పరిణామాలలో మూడు పప్పుధాన్యాలు, మొక్కజొన్న, పత్తి పంటలను ఐదేండ్ల పాటు కొనుగోలు చేస్తామని, మిగతా వాటి కనీస మద్దతు ధర గురించి ఎలాంటి హామీ ఇవ్వలేమని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఈ ప్రతిపాదన తమకు ఆమోదం కాదని ఉద్యమాన్ని కొనసాగిస్తామని, ఢిల్లీకి ప్రదర్శనగా వెళతామని ఆందోళనకు నాయకత్వం వహిస్తున్న సంయుక్త కిసాన్‌ మోర్చా( రాజకీయ రహితం-ఎస్‌కెఎం-ఎన్‌పి) నేతలు ప్రకటించారు. పంజాబ్‌-హర్యానా సరిహద్దుల్లో దాదాపు పద్నాలుగువేల మంది రైతులు గత కొద్ది రోజులుగా తిష్టవేశారు.పన్నెండు వందల ట్రాక్టర్లు-ట్రాలీలు, పది మినీ బస్సులు, ఇతర వాహనాలతో రైతులు పదమూడవ తేదీ నుంచి అక్కడే ఉన్నారు వారిని 200కిలోమీటర్ల దూరంలో ఉన్న ఢిల్లీ చేరుకునేందుకు ముందుకు సాగనివ్వకుండా హర్యానా బిజెపి ప్రభుత్వ పోలీసులు అడ్డుకుంటున్నారు. చర్చలు విఫలమైనందున బుధవారం నుంచి ఢిల్లీ చలో పిలుపుతో ముందుకు సాగుతామని ఎస్‌కెఎం-ఎన్‌పి నేతలు ప్రకటించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులను రాజధానిలోకి రానివ్వకూడదని కేంద్ర హౌం మంత్రి అమిత్‌ షా ఢిల్లీ పోలీసులకు గట్టి ఆదేశాలను జారీ చేశారు. మరోవైపున ఉత్తర ప్రదేశ్‌లో ఉన్న బిజెపి సర్కార్‌ కూడా రోడ్లను మూసివేసి అన్నదాతలను అడ్డుకొనేందుకు పూనుకుంది. తాము ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించేందుకు రైతులు భారీ యంత్రాలతో వస్తున్నట్లు, ఇది నేరపూరితమని హర్యానా పోలీసులు ఆరోపించారు.ఢిల్లీ వైపు వచ్చేందుకు పూనుకున్న రైతుల మీద హర్యానా పోలీసులు డ్రోన్లతో బాష్పవాయు గోళాలను విసిరారు. దీంతో షంభు సరిహద్దు ఉద్రిక్తంగా మారింది. జెసిబిలు, క్రేన్లు, పొక్లెయిన్లను రైతులకు సరఫరా చేయవద్దని యజమానులను హెచ్చరించారు. ఈ నేపధ్యంలో రైతుల ఉద్యమం ఏమౌతుంది, రానున్న ఎన్నికలలో బిజెపి, దాని మిత్ర పక్షాల మీద ఆందోళన ప్రభావం ఎలా ఉంటుంది అన్న చర్చ మొదలైంది.


గతంలో ఏడాది పాటు ఆందోళన నిర్వహించిన సంయుక్త కిసాన్‌ మోర్చా(ఎస్‌కెఎం) ప్రభుత్వ తాజా చర్చలలో భాగస్వామి కాదు. అయినప్పటికీ ప్రభుత్వ ప్రతిపాదనలను తాము వ్యతిరేకిస్తున్నామని, రైతులు కొనసాగిస్తున్న ఆందోళనకు మద్దతు ఇస్తున్నట్లు, ఎన్‌డిఏ ఎంపీల ఇండ్ల ముందు నిరసన తెలపాలన్న తమ పిలుపుతో ముందుకు పోతామని ప్రకటించింది. గతంలో అనేక రాష్ట్రాలలో రాజకీయాలతో నిమిత్తం లేని రైతు సంఘాల పేరుతో అనేక మంది సంస్థలను ఏర్పాటు చేసి రైతులను సమీకరించేందుకు ప్రయత్నించారు. ఇప్పుడు కూడా ఉన్నారు. దాని కొనసాగింపుగానే 2020-21లో ఆందోళనలో భాగస్వాములుగా ఉన్న కొందరు ఎస్‌కెం నుంచి విడగొట్టుకొని తాజా ఆందోళనకు పిలుపు ఇచ్చారు. గత ఆందోళనకు దూరంగా ఉన్న కొన్ని సంస్థలు కూడా ఇప్పుడు వారితో కలిశాయి. కేంద్ర ప్రభుత్వం ఒక వైపు దేశ శత్రువులను ఎదుర్కొనే పద్దతిలో రైతులను అడ్డుకొనేందుకు సన్నద్దం అవుతున్నది, మరోవైపు చర్చల పేరుతో లోక్‌సభ ఎన్నికల ప్రకటన జరిగే వరకు కాలయాపన ఎత్తుగడలకు పూనుకుంది. రైతుల మీద తప్పుడు ప్రచారం సరేసరి.


మూడు రకాల పప్పుధాన్యాలు, మొక్కజొన్న, పత్తిని రానున్న ఐదు సంవత్సరాల పాటు కనీస మద్దతు ధరలకు కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రతిపాదించింది.దీనిని రైతు సంఘాలు తిరస్కరించాయి.ఢిల్లీ చలో కార్యక్రమాన్ని కొనసాగిస్తామని ప్రకటించాయి.ఎస్‌కెఎం-ఎన్‌పి నేత జగజిత్‌ సింగ్‌ దలేవాల్‌ సోమవారం నాడు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రు.1.75లక్షల కోట్లతో పామాయిల్‌ దిగుమతి చేసుకుంటున్నదని, ఈ మొత్తాన్ని చమురు గింజల సాగుదార్లకు ఇస్తే వారికి ప్రయోజనం ఉంటుందన్నారు.ప్రభుత్వం చేసిన ప్రతిపాదన పంటల మార్పిడి చేసే రైతులకు మాత్రమే లబ్ది చేకూర్చుతుందన్నారు. తమ డిమాండ్లను ఆమోదించటం లేదా ఢిల్లీలో శాంతియుతంగా నిరసన తెలిపేందుకు అంగీకరించాలని డిమాండ్‌ చేశారు. పోలీసుల దమనకాండలో పంజాబ్‌-హర్యానా సరిహద్దుల్లో 400 మంది రైతులు గాయపడ్డారని దలేవాల్‌ చెప్పారు. సుప్రీం కోర్టు దీని మీద స్వయంగా చర్య తీసుకోవాలని కోరారు. ఆదివారం రాత్రి నుంచి సోమవారం తెల్లవారు ఝామువరకు జరిగిన చర్చలలో రైతులు అంగీకారం తెలిపిన అంశాల మీద మరుసటి రోజు మాట మార్చినట్లు చర్చలలో భాగస్వాములైన వర్గాలు చెప్పినట్లు టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా ఒక సమీక్షలో పేర్కొన్నది.ఇప్పుడు ఆందోళనకు పిలుపుఇచ్చిన వారు నిజంగా అంగీకరించారా లేక వారి మీద చేస్తున్న తప్పుడు ప్రచారంలో భాగంగా ఇలాంటి వార్తలను వ్యాపింపచేస్తున్నారా అన్నది చూడాల్సి ఉంది.

ప్రభుత్వం జరుపుతున్న చర్చల తీరు గురించి గతంలో ఆందోళనకు నాయకత్వం వహించిన వారిలో ఒకరైన హన్నన్‌ మొల్లా ఆదివారం నాడు మాట్లాడుతూ ప్రస్తుతం ఢిల్లీ సరిహద్దులో జరుపుతున్న ఆందోళన తమ పిలుపు మేరకు జరుగుతున్నది కాదని గతంలో తమ నుంచి వేరుపడిన కొన్ని సంస్థలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వారు కూడా తమ పేరునే ఉపయోగిస్తున్నారని చెప్పారు. ఆదివారం రాత్రి జరిగిన నాలుగవ విడత చర్చల గురించి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గత ఆందోళన సందర్భంగా పదకొండుసార్లు చర్చలు జరిపినప్పటికీ పరిష్కారం లేదన్నారు.ఈ పదకొండు దఫాల చర్చలకు 42 మందిని కేంద్రం పిలిచిందని, వారిలో ఇద్దరిని విడదీసిందని, ఇప్పుడు ఆ ఇద్దరితో మాట్లాడుతూ 40 మందిని విస్మరించిందని చెప్పారు. దీన్ని బట్టి ప్రభుత్వం ఏదో ఒక లక్ష్యంతో వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తున్నదని అన్నారు. అయితే దీని అర్ధం ఇప్పుడు రైతు సంఘాలు ముందుకు తెచ్చిన డిమాండ్లను తాము వ్యతిరేకించటం లేదని, వాటిని వెంటనే అమలు జరపాలని హన్నన్‌ మొల్లా చెప్పారు. కనీస మద్దతు ధరలు, వరి, గోధుమ గడ్డి తగులబెట్టటం గురించి చర్చించేందుకు కేంద్రం సిద్దంగా ఉందని కేంద్ర మంత్రి అర్జున్‌ ముండా బుధవారం నాడు చెప్పారు. రైతులను అణచేందుకు చూడవద్దని రైతు నేత సర్వన్‌ సింగ్‌ పాంధెర్‌ బుధవారం నాడు ప్రధాని నరేంద్రమోడీకి విజ్ఞప్తి చేశారు. రైతులే మోడీని ప్రధానిని చేశారని, వారిని విస్మరిస్తే కేంద్ర ప్రభుత్వాన్ని రైతులు క్షమించరని అన్నారు. మీరు మమ్మల్ని చంపవచ్చు కానీ రైతులను అణచవద్దని ప్రభుత్వానికి చెప్పామని, కనీస మద్దతు ధరలకు చట్టబద్దత కల్పిస్తూ ప్రధాని ఒక ప్రకటన చేసి ఆందోళనకు తెరదించాలని అన్నారు.హర్యానా గ్రామాలలో పారా మిలిటరీని దించారని, తామేం నేరం చేశామని ప్రశ్నించారు. భద్రతా దళాలు తమను ఇలా అణచివేస్తాయని కలలో కూడా ఊహించలేదన్నారు. రాజ్యాంగాన్ని రక్షించి శాంతియుతంగా ఢిల్లీ చేరేందుకు తమను అనుమతించాలన్నారు. ఇది తమహక్కు అని స్పష్టం చేశారు. తమ ఉద్దేశ్యం గొడవలు సృష్టించటం కాదని, నవంబరు ఏడవ తేదీ నుంచి ఢిల్లీ వచ్చేందుకు కార్యక్రమాన్ని రూపొందించామని ప్రభుత్వానికి తగిన సమయం లేదని అనటం నిర్లక్ష్యం చేసేందుకు చూడటమే అని జగజిత్‌ సింగ్‌ దలేవాల్‌ అన్నారు. బారికేడ్లతో తమను ఆపటం సరైంది కాదన్నారు.


ఎవరైనా డిమాండ్లను నీరుగార్చినా, ఏదో ఒకసాకుతో వెనక్కు తగ్గినా రైతుల ఆగ్రహాన్ని చవి చూడాల్సి వస్తుంది. ఎన్నికల్లో ఈ అంశంపై చర్చ జరగటం అనివార్యం.రైతులకు రాజకీయాలు వద్దనటం, ఆందోళన వెనుక రాజకీయ పార్టీలు ఉన్నాయని ప్రచారం చేయటమే ఒక రాజకీయం, వారిని తప్పుదారి పట్టించే ఎత్తుగడతప్ప మరొకటి కాదు. ఏ రైతు సంఘం ముందుకు తెస్తున్న డిమాండ్లైనా వ్యవసాయానికి సంబంధించినవే తప్ప వేరు కాదు. వ్యవసాయంతో సహా అన్ని అంశాల మీద విధానాలను రూపొందించేది పార్టీల తరఫున ఎన్నికైన ప్రజాప్రతినిధులతో కూడిన చట్టసభలే. ప్రతి పార్టీకి చెందిన వారు ఏదో ఒక రైతు సంఘంలో పని చేయటం తెలిసిందే. అందువలన తమకు మేలు చేసే వారెవరో కీడు చేసే వారెవరూ రైతులు ఆలోచించాల్సిన అవసరం ఉందా లేదా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

ముగ్గురు రైతుల కళ్లు పోగొట్టిన పోలీసులు : మరో కమిటీ నాటకం, తన సిఫార్సుల అమలుకు తానే మొరాయిస్తున్న మోడీ ?

18 Sunday Feb 2024

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, Farmers, History, INDIA, Loksabha Elections, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices

≈ Leave a comment

Tags

#Farmers matter, #Farmers Protest, #i stand with farmers, 2024 Farmers Protest, BJP, MSP demand, Narendra Modi Failures


ఎం కోటేశ్వరరావు


పంజాబ్‌-హర్యానా సరిహద్దులో హర్యానా పోలీసులు, భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో పిల్లెట్లు తగిలి ముగ్గురు రైతులు కళ్లు కోల్పోయినట్లు పంజాబ్‌ ఆరోగ్య మంత్రి డాక్టర్‌ బల్బీర్‌ సింగ్‌ చెప్పారు. కాలం చెల్లిన, ప్రైవేటు కంపెనీల మందుగుండును రైతుల మీద ఉపయోగిస్తున్నారని, అవి లెక్కల్లో చూపరని రైతు నేత సర్వాన్‌ సింగ్‌ పాంధెర్‌ చెప్పారు. కనీస మద్దతు ధరల మీద మరోకమిటీ వేసేందుకు ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అదే నిజమైతే అది కాలయాపన తప్ప మరొకటి కాదు. ఇప్పటికే ఒక కమిటీ ఉంది, అదేమి చేస్తున్నదో తెలియదు. వచ్చే ఎన్నికల్లో తాము 400 సీట్లు సాధించబోతున్నామని, అవి రైతుల సమస్యల పరిష్కారానికే గనుక రాజకీయం చేయవద్దని బిజెపి నేత అశోక్‌ తన్వర్‌ చెప్పారు. ” ఈ సమస్య రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అంశం కూడా,దీనికి పరిష్కారం కనుగొనాలంటే వ్యవధి అవసరం. ” మరోసారి ప్రారంభమైన రైతు ఉద్యమం ముందుకు తెచ్చిన డిమాండ్ల మీద కేంద్ర మంత్రి అర్జున్‌ ముండా ఫిబ్రవరి పదమూడున చెప్పిన మాట. పదిహేనవ తేదీ రాత్రి రైతు ప్రతినిధులతో జరిపిన చర్చలు ఎలాంటి ఫలితాలు లేకుండా ముగిశాయి. పద్దెనిమిదవ తేదీ సాయంత్రం మరోసారి చర్చలు జరుపుతామని కేంద్ర మంత్రి ప్రకటించారు. పరిష్కారం తేలేవరకు ఆందోళన కానసాగుతుందని రైతు సంఘాలు వెల్లడించాయి. ఢిల్లీ చలో అన్న నినాదంతో సాగిన ఉద్యమానికి ఇచ్చిన పిలుపుకు మూడు సంవత్సరాలు నిండిన సందర్భంగా 2023 నవంబరు 26 నుంచి 28వరకు చండీఘర్‌లో నిరసన తెలపాలని పంజాబ్‌ రైతులు పిలుపు నిచ్చారు. దాని కొనసాగింపే తాజా ఢిల్లీ చలో నిరసన. అప్పటి నుంచి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఏమి చేస్తున్నట్లు ? మంత్రి మాటలను బట్టి ఏదో విధంగా కాలయాపన చేసి ఆందోళనను అణచివేసేందుకు లేదా మరో విధంగా ముగించేందుకు కేంద్రం చూస్తున్నట్లు కనిపిస్తోంది.


రైతులు ముందుకు తెచ్చిన సమస్య మీద గానీ, తానే ప్రకటించిన కమిటీ నివేదికను సత్వరం తెప్పించటం గురించిగానీ కేంద్రానికి చిత్తశుద్ధి ఉందా ? రాష్ట్రాలతో చర్చించాలని కనీస మద్దతు ధరల కమిటీ ప్రకటించిన 20నెలల తరువాత(2022జూలై) మంత్రి మాట్లాడుతున్నారు. గతంలో ఉద్యమం సందర్భంగా జరిగిన పరిణామాలను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలి. వ్యవసాయం ఉమ్మడి జాబితాలో ఉన్నప్పటికీ ప్రధానంగా అమలు జరిపేది రాష్ట్రాలే. మూడు సాగు చట్టాలను తెచ్చినపుడు కేంద్రం రాష్ట్రాలతో సంప్రదించకుండానే ఏకపక్షంగా తెచ్చింది. వెనక్కు తీసుకొనేటపుడు కూడా చర్చలు జరపలేదు. ఆ సందర్భంగా ఎంఎస్‌పి కమిటీ ఏర్పాటు ముందు కూడా రాష్ట్రాల వైఖరిని తెలుసుకోలేదు. ఇప్పుడు రాష్ట్రాలతో చర్చించాలని చెప్పటం వంచన తప్ప మరొకటి కాదు. చర్చలు జరపకుండా ఇంతకాలం ఎవరు అడ్డుపడ్డారు ? కేంద్ర ప్రభుత్వం ఎందుకింత మొండితనంతో వ్యవహరిస్తున్నది ? అడిగేవాటికి సమాధానం రావటం లేదు. 1991లో ప్రారంభించిన ఆర్ధిక సంస్కరణల సమయంలో కేంద్ర ప్రభుత్వం ప్రపంచ బ్యాంకుతో కుదుర్చుకున్న ఒప్పందాలు లేదా బ్యాంకు నిర్దేశించిన షరతులు ఏమిటో, ఆ తరువాత గత ప్రభుత్వాలు నియమించిన కమిటీలు ఏమి చెప్పాయో తెలుసుకుంటే తప్ప మోడీ సర్కార్‌ ఆచరణను అర్ధం చేసుకోలేము.


2004 డిసెంబరు 13న నం. 164తో లోక్‌సభలో ఒక ప్రశ్న అడిగారు. భారత ఆహార సంస్దను పునర్వ్యస్ధీకరించేందుకు మెకెన్సీ కంపెనీని నియమించిందా ? అభిజిత్‌ సేన్‌ కమిటీ, హైదరాబాద్‌ అడ్మినిస్ట్రేటివ్‌ కాలేజీ(ఆస్కి) నివేదికలు ఉన్నాయా ? వాటి ప్రధాన సిఫార్సులేమిటి అన్నది దాని సారాంశం. దానిలో ఈ నియామకాలన్నీ బిజెపి నేత అతల్‌ బిహారీ వాజ్‌పేయి ఏలుబడిలో జరిగాయి. ఆస్కీ నివేదికలో చేసిన ముఖ్యమైన సిఫార్సులు ఇలా ఉన్నాయి. లెవీ పద్దతిలోనే ఎఫ్‌సిఐ ధాన్యం కొనుగోళ్లు చేయాలి.నాణ్యతా ప్రమాణాలను సడలించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకూడదు, వివిధ పధకాలకు, ఆపద్దర్మ నిల్వలకు అవసరమయ్యే ఆహార ధాన్యాల మొత్తాలను మాత్రమే కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలి. రాష్ట్రాలు తమ స్వంత సేకరణ పద్దతులను అభివృద్ది చేసుకోవాలి, విత్త సంబంధ మద్దతు కోసమే కేంద్రంపై ఆధారపడాలి. ఆహార ధాన్యాలను ఆరుబయట నిల్వచేయటాన్ని నిలిపివేయాలి. గ్రామీణ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం నిధులకు బదులు ఆహారధాన్యాలను కేటాయించాలి. ఆపద్దర్మ నిల్వలకు కేంద్ర ప్రభుత్వం గ్రాంటులు ఇవ్వాలి తప్ప బ్యాంకుల నుంచి రుణాలు తీసుకో కూడదు.కనీస మద్దతు ధరలకు కొనుగోలు, కేంద్ర జారీ ధరలు, ఎంత మొత్తం సేకరించాలనే అంశాలపై ఎఫ్‌సిఐ కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. ధాన్య సేకరణ, నిల్వ, పంపిణీలను వేరు చేయాలి. జాతీయ ఆపద్దర్మ నిల్వలను వ్యూహాత్మక ప్రాంతాలలో మాత్రమే ఎఫ్‌సిఐ నిర్వహించాలి.మార్కెట్లలో ఏజంట్ల కమిషన్‌ నిలిపివేయాలి. ధాన్య సేకరణకు, స్వంత సేకరణ ధరల నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వాలను ప్రోత్సహించాలి. వ్యవసాయాన్ని వివిధీకరించేందుకు ప్రత్యేకించి పంజాబ్‌, హర్యానాలలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ఆహారధాన్యాల మార్కెట్లో ప్రయివేటు రంగం మరియు బహుళజాతి కార్పొరేషన్లను ప్రోత్సహించాలి.


దీర్ఘకాలిక ధాన్య విధాన రూపకల్పనకు సిఫార్సులు చేసేందుకు ఏర్పాటు చేసిన ఫ్రొఫెసర్‌ అభిజిత్‌ సేన్‌ కమిటీ చేసిన ముఖ్య సిఫార్సులేమిటో చూద్దాం. కనీస మద్దతు ధరలను అత్యంత సమర్ధవంతమైన ప్రాంతాలలో సి2 ఖర్చు ప్రాతిపదికన (అంటే కుటుంబసభ్యుల శ్రమ, స్వంత పెట్టుబడి, భూమి కౌలు) నిర్ణయించాలి. కనీస మద్దతు ధరల కింద కొనుగోలు చేసే వాటి మీద కేంద్ర ప్రభుత్వం గరిష్టంగా నాలుగుశాతం పన్నులు మరియు లెవీలు చెల్లించాలి. పంజాబ్‌, హర్యానా వంటి రాష్ట్రాల నుంచి ధాన్య సేకరణ నుంచి ఎఫ్‌సిఐ ఉపసంహరించుకొని తన మానవనరులను తూర్పు, మధ్య భారత్‌లో నియమించాలి. రాష్ట్రాలకు మరింత ఆకర్షణీయంగా, వికేంద్రీకరణ సేకరణను మెరుగుపరచాలి. ఎఫ్‌సిఐ ధాన్య సేకరణలో మెరుగైన సగటు ప్రమాణాలను పాటించాలి. రైస్‌ మిల్లరు లెవీ ఇచ్చే విధానాన్ని రద్దు చేయాలి.సి2 స్ధాయికి కనీస మద్దతు ధరలను నిర్ణయించటంతో పాటు రాష్ట్రాలకు పరిహార పాకేజ్‌లను అమలు జరపాలి.వాటితో పంటల వివిధీకరణను ప్రోత్సహించాలి. వేగంగా వాణిజ్య ప్రాతిపదికన నిర్ణయం తీసుకొనే విధంగా ఎఫ్‌సిఐ మారాల్సిన అవసరం ఉంది. ఆహారధాన్యాల ఎగుమతి పూర్తిగా ప్రయివేటుకే అప్పగించాలి. ఎగుమతులకు మాత్రమే సబ్సిడీలు ఇవ్వాలి. కనీస మద్దతు ధరలకు చట్టబద్దత కల్పించాలి, వాటిని సిఫార్సు చేసే సిఏసిపిని సాధికార చట్టబద్దమైన సంస్దగా మార్చాలి.


2020డిసెంబరు 18వ తేదీన ప్రధాని నరేంద్రమోడీ మధ్యప్రదేశ్‌ రైతులతో వీడియో కాన్పరెన్సుద్వారా మాట్లాడారు. ఇప్పుడు తీసుకున్న చర్యలు 25-30 సంవత్సరాల క్రితమే అమలు జరపాల్సినవి. తెల్లవారేసరికి ఇవి రాలేదు. ప్రతి ప్రభుత్వమూ వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో గత 20-22 సంవత్సరాలుగా విస్తృతంగా చర్చించినవే అని ప్రధాని చెప్పారు.పైన పేర్కొన్న అభిజిత్‌ సేన్‌, ఆస్కీ సిఫార్సులు ఇరవై సంవత్సరాల నాటి వాజ్‌పేయి సర్కార్‌ హయాంలోనివే.వాటిలో కొన్నింటిని ప్రభుత్వాలు అమలు జరిపాయి. ప్రధాని చెప్పిన 25-30 సంవత్సరాల విషయానికి వస్తే అంతకు ముందుకు అంటే 30 సంవత్సరాల నాటి ప్రపంచ బాంకు షరతులు ఏమిటో తెలుసుకుంటే ఆ మాటలకు అర్ధం తెలుస్తుంది. మూడు వ్యవసాయ చట్టాల బండారం మరింతగా బయటపడుతుంది. ప్రపంచబ్యాంకు మన కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి, సమాచారం తీసుకొని పద్దెనిమిది నెలల సమయం తీసుకొని ఒక నివేదికను రూపొందించింది. ఇండియా 1991 కంట్రీ ఎకమిక్‌ మెమోరాండం( రిపోర్ట్‌ నం.9412 ఇండియా) పేరుతో 1991 ఆగస్టు 23న రెండు సంపుటాలుగా తయారు చేశారు. దాన్ని రెండు దశాబ్దాలు రహస్యంగా ఉంచి 2010 జూన్‌ 12న బహిర్గతం చేశారు. వీటిలో ముఖ్యమైన సిఫార్సులను చూద్దాం. వాటి నేపధ్యంలోనే గత మూడు దశాబ్దాలలో కేంద్రంలో, రాష్ట్రాలలో ఏ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా అనేక చర్యలు అమలు జరిపి ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌ను సంతృప్తి పరచారు. ఇప్పుడు నరేంద్రమోడీ గారు అదే సంతుష్టీకరణపనిలో ఉన్నారు. కరోనా కనుక ఎవరూ వ్యతిరేకంగా ఆందోళన చేసేందుకు ముందుకు రారనే అంచనాతో జూన్‌లో ఆర్డినెన్స్‌, సెప్టెంబరులో పార్లమెంట్‌లో చర్చలేకుండా బిల్లులు, వెంటనే రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయించి చూశారా నేను ఎంత వేగంగా పని చేస్తానో అని దేశ-విదేశీ కార్పొరేట్ల ముందు రొమ్ము విరుచుకున్నారు. వ్యవసాయ రంగాన్ని ఇప్పటికే కొంత మేరకు విదేశీ-స్వదేశీ కార్పొరేట్లకు తెరిచారు. ఒకప్పుడు నూతన విత్తనాలను రూపొందించటం, ఉత్పత్తి ప్రభుత్వరంగ సంస్ధలే చేసేవి. ఇప్పుడు ఎక్కడా వాటి ఊసేలేకుండా చేశారు. మూడు వ్యవసాయ చట్టాలతో మార్కెట్‌ను మరింతగా తెరిచేందుకు, ప్రభుత్వం బాధ్యతల నుంచి తప్పుకొనేందుకు ప్రాతిపాదిక వేశారు. రైతుల ఆందోళనతో వెనక్కు తగ్గారు.


ఇంతకీ ప్రపంచబ్యాంకు వ్యవసాయరంగం గురించి ఆదేశించిన లేదా సూచించిన సిఫార్సులేమిటి ? అవి మూడు రకాలు. తక్షణం చేపట్టవలసినవి, మధ్యంతర, దీర్ఘకాలిక చర్యలుగా సూచించారు.1ఏ). వ్యవసాయానికి ఉన్న – ఎరువులు, నీటి, విద్యుత్‌, బ్యాంకురుణాల సబ్సిడీలన్నింటినీ రద్దు చేయాలి. విదేశీవాణిజ్యానికి వ్యవసాయ మార్కెట్‌ను తెరవాలి. నాలుగు సంవత్సరాల వ్యవధిలో ఎరువుల సబ్సిడీలను ఎత్తివేయాలి. బి) ప్రాధాన్యతా రంగానికి నిర్ణీత శాతాలలో రుణాలు ఇవ్వాలనే నిబంధన కింద వ్యవసాయానికి ఇచ్చే కోటాను ఎత్తివేయాలి. సబ్సిడీలను ఎత్తివేసి వడ్డీ రేటు పెంచాలి.సి) సాగు నీరు, పశువైద్యం వంటి విస్తరణ సేవలకు వసూలు చేస్తున్న చార్జీల మొత్తాలను పెంచాలి. వీటిలో ప్రయివేటు రంగానికి పెద్దపీట వేయాలి, పెట్టుబడులకు అవకాశం ఇవ్వాలి.డి) వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులకు సంబంధించి ఉన్న రక్షణలన్నింటినీ తొలగించాలి. తొలిచర్యగా ఖాద్యతైలాల గింజలను అనుమతించాలి. వ్యవసాయ ఎగుమతులపై ఉన్న ఆంక్షలను తొలగించాలి.ఇ) ప్రయివేటు పరిశోధనా సంస్ధల విత్తనాలను ప్రోత్సహించాలి, ప్రయివేటు మార్కెటింగ్‌పై నిబంధనలను తొలగించాలి, విత్తన సబ్సిడీలను ఎత్తివేయాలి.ఎఫ్‌) వ్యవసాయేతర చార్జీల స్ధాయికి వ్యవసాయ విద్యుత్‌ ఛార్జీలను కూడా పెంచాలి.


2. మొత్తం ఆహార సేకరణ మరియు ప్రజాపంపిణీ వ్యవస్ధను రద్దు చేయాలి.ఏ) భారత ఆహార సంస్ద ప్రత్యక్ష పాత్రను తగ్గించాలి. కొనుగోలు, రవాణా, ధాన్య నిల్వ వంటి పనులన్నీ లైసన్సు ఉన్న ప్రయివేటు వారి ద్వారా చేపట్టాలి. రైతులు నిల్వ చేస్తే ప్రోత్సాహకాలు ఇవ్వాలి.బి)ఆపద్దర్మ నిల్వలను కొద్దిగా నిర్వహించాలి. కొరత వచ్చినపుడు ప్రపంచ మార్కెట్లవైపు చూడాలి. విదేశీమారక ద్రవ్యం ఎంత ఉందో చూసుకొని కొరత ఉన్న సంవత్సరాలలో బయటి నుంచి కొనుగోలు చేయాలి.సి) మద్దతు ధరల కార్యక్రమాలను ప్రభుత్వం సేకరణకు అమలు చేయకూడదు. డి) అధికారయుతంగా పేదలుగా గుర్తించిన వారికి మాత్రమే ఆహార సబ్సిడీలు ఇవ్వాలి. ప్రయివేటు రంగం ద్వారా పంపిణీ పద్దతిని కూడా వినియోగించాలి. పైన పేర్కొన్నవి మూడు దశాబ్దాల నాటి ప్రపంచ బ్యాంకు ఆదేశాలు. అధికారంలో ఎవరున్నా వాటిని అమలు జరపటం తప్ప వెనక్కు పోవటం లేదు. ఆ తరువాత ఎన్ని కమిటీలు వేసినా కొన్ని సిఫార్సులు అదనంగా చేయటం తప్ప ప్రపంచ బ్యాంకు అజెండా పరిధిలోనే ఉన్నాయి. యుపిఏ హయాంలో అన్ని సంస్కరణలూ చేయలేదనే కోపంతో కార్పొరేట్‌ శక్తులు నరేంద్ర మోడీ వెనుక సమీకృతం అయ్యాయి. ఇప్పుడు ఆచరణ చూస్తున్నాము.
కనీస మద్దతు ధరలు, వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ వ్యవస్ధలను ప్రభావితం చేసే (రద్దుచేసిన) మూడు సాగు చట్టాలలో ఎక్కడా కనీసం మద్దతు ధరల ప్రస్తావన లేదు. కనుకనే రైతాంగం కనీస మద్దతు ధరలను చట్టబద్దం చేయమంటోంది. 2011లో గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నరేంద్రమోడీ నాయకత్వంలోని ముఖ్యమంత్రుల కమిటీ కనీస మద్దతు ధరలకు చట్టబద్దత కల్పించాలని ఆషామాషీగా కేంద్రానికి సిఫార్సు చేసిందా ? ఈ కమిటీలో నాటి మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు ముఖ్యమంత్రులు ఇతర సభ్యులు. సిఎంగా ఉన్న మోడీ చేసిన సిఫార్సును పిఎం మోడీ ఎందుకు పక్కన పడేశారు? ఇప్పుడు రాష్ట్రాలను సంప్రదించాలని ఎందుకు కబుర్లు చెబుతున్నారు. ఇంతకీ 2011 నివేదికలో మోడీ కమిటీ చేసిన సిఫార్సు ఏమిటి ? నివేదికలోని క్లాజ్‌ బి.3లో ఇలా ఉంది.” చట్టబద్దంగా ఎంఎస్‌పి అమలు : మార్కెట్‌ పని చేయటంలో మధ్యవర్తులు కీలకమైన పాత్ర పోషిస్తున్నారు మరియు ఆ సమయంలో వారు ముందుగానే రైతులతో ఒప్పందం చేసుకుంటున్నారు. అన్ని నిత్యావసర వస్తువులకు సంబంధించి చట్టబద్దమైన అంశాలతో శాసనం ద్వారా రైతుల ప్రయోజనాలను కాపాడాలి. అదేమంటే రైతు-వ్యాపారి లావాదేవీల్లో ఎక్కడా నిర్ణీత కనీస మద్దతు ధరలకు తగ్గకూడదు.” దీని అర్ధం ఏమిటి ? చట్టబద్దత కల్పించాలనే కదా ! మరి ఇప్పుడు సాకులతో ఎందుకు మొరాయిస్తున్నట్లు ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

రైతులపై మోడీ సర్కార్‌ యుద్ధం : పాక్‌, చైనా సరిహద్దుల్లో కూడా ఇలాంటి ఏర్పాట్లు లేవేమో !

17 Saturday Feb 2024

Posted by raomk in BJP, Current Affairs, Economics, Farmers, History, INDIA, NATIONAL NEWS, Opinion, Prices

≈ Leave a comment

Tags

#Farmers matter, #i stand with farmers, 2024 Farmers Protest, Anti Farmers, BJP, Delhi farmers agitation, Delhi Police, MSP, Narendra Modi Failures, RSS


ఎం కోటేశ్వరరావు


సరిహద్దు భద్రతా దళాల నుంచి 30వేల బాష్పవాయు గోళాలను రప్పించారు.
వాటిని ప్రయోగించేందుకు డ్రోన్లను సన్నద్దం చేశారు.
ఒళ్లు మంటలు పుట్టేందుకు రసాయనాలు కలిపిన నీటిని చిమ్మే ఫిరంగుల దుమ్ముదులిపారు.
చెవులు చిల్లులు పడే శబ్దాలు చేసి వినికిడి శక్తిని పోగొట్టే సోనిక్‌ ఆయుధాలను సిద్దం చేశారు.
ఎవరైనా గుర్రాల మీద వస్తే అవి జారి పడే విధంగా గ్రీజు వంటి వాటిని వెదజల్లేందుకు డ్రమ్ములతో సిద్దంగా ఉన్నారు.
రోడ్ల మీద పెద్ద గోతులు తవ్వారు. ఎక్కడబడితే అక్కడ ఇనుప మేకులు కొట్టారు.
ముళ్ల కంచెలు, వాటిని దాటుకొని వస్తే నిరోధించటానికి పెద్ద కంటెయినర్లలో మట్టి, రాళ్లు, ఇటుకలతో నింపారు.
సిమెంటు దిమ్మెల వరుసలు ఏర్పాటు చేశారు. రోడ్ల పక్కనే నిర్బంధ శిబిరాలను తయారు చేశారు.
ఇవన్నీ ఎందుకనుకుంటున్నారు ?
సరిహద్దుల్లో పాకిస్థాన్‌ లేదా చైనా, మరొక దేశం దాడి చేస్తుందనో వాటిని ఎదుర్కొందామనో కాదు.
వివిధ రాష్ట్రాల నుంచి రాజధాని ఢిల్లీకి వచ్చే రోడ్ల మీద ఈ ఏర్పాట్లు ? ఎందుకనుకుంటున్నారు ?


తమ సమస్యలను పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వ పెద్దలను అడిగేందుకు వస్తున్న అన్నదాతలను అడ్డుకొనేందుకు !
ఇన్ని ఏర్పాట్లు చేసిన పోలీసుల బాస్‌ ఏం చెప్పారో తెలుసా ? ఒక వేళ వీటన్నింటినీ దాటుకొని రైతులు గనుక వస్తే మీరేమీ వెనుకా ముందు చూడనవసరం లేదు, ఆత్మరక్షణ గురించి ఆలోచించవద్దు అన్నారు. దీని అర్ధం వేరే చెప్పాలా ? ప్రస్తుతం అనేక ఐరోపా దేశాల్లో వేలాది మంది రైతులు రాజధానులు, ఇతర ప్రధాన పట్టణాలకు ట్రాక్టర్లు, ఇతర వ్యవసాయ వాహనాల మీద ఎలాంటి ఆటంకాలు లేకుండా వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. పోలీసులు కాపలాకాసేందుకు ఉన్నారు తప్ప అడ్డుకున్నది గానీ చేయి చేసుకున్న ఉదంతంగానీ ఒక్కటంటే ఒక్కచోట కూడా జరగలేదు. కానీ ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లు అని చెప్పుకుంటున్న చోట రైతులను శత్రువులుగా చూస్తున్న అపర ప్రజాస్వామిక పాలకుల తీరిది.


ఇంతకూ రైతులు చేసిన పాపం ఏమిటి ?
2011లోనే నరేంద్రమోడీ ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రుల కమిటీ చేసిన సిఫార్సులో ఒకటైన కనీస మద్దతుధరలకు చట్టబద్దత కల్పించమని కోరటం. క్షమాపణలు చెప్పి మరీ మూడు సాగు చట్టాలను వెనక్కు తీసుకంటూ కనీస మద్దతు ధరలకు చట్టబద్దతతో పాటు ఇతర సమస్యలను పరిశీలించేందుకు 2022 జూలైలో నరేంద్రమోడీ సర్కార్‌ ఏర్పాటు చేసిన కమిటీ ఏ గుడ్డి గుర్రానికి పళ్లు తోముతున్నది, ఎప్పుడు నివేదిక ఇస్తారు, స్వామినాధన్‌ కమిటీ చేసిస సిఫార్సులతో సహా ఇచ్చిన హామీలను ఎప్పుడు అమలు చేస్తారు అని నిలదీయటమే అన్నదాతల అపరాధం. ఇప్పటికే పంజాబ్‌-హర్యానా సరిహద్దులో రైతుల వీపులు పగలగొట్టారు, జర్నలిస్టులతో సహా అనేక మంది గాయపడ్డారు. గురువారం నాడు చర్చల ప్రహసనం చోటు చేసుకుంది. ఆదివారం నాడు మరోసారి మాట్లాడతామని చెప్పారు. ఈలోగా కుట్ర సిద్దాంతాలు. వాట్సాప్‌ యూనివర్సిటీలో నరేంద్రమోడీ సర్కార్‌ను కూలదోసేందుకు అంటూ ఊదరగొట్టటం ప్రారంభించారు.హర్యానాలోని అనేక ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ నిలిపివేశారు. ఢిల్లీలో 144వ సెక్షన్‌ విధించారు. సభలు, ప్రదర్శనలకు అనుమతి లేదు.


2020-21లో సాగిన చారిత్రాత్మక రైతు ఉద్యమం తరువాత 2022 జూలై 18న కేంద్ర ప్రభుత్వం ఎంఎస్‌పి ఇతర అంశాల గురించి పరిశీలనకు ఒక కమిటీని వేసింది. ఇప్పటి వరకు అదేమి చేస్తున్నదో తెలియటం లేదు గనుక మరోసారి రైతులు ఢిల్లీ చలో పిలుపు ఇచ్చారు. సాధారణంగా సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం పని చేస్తుందని అనేక మంది అనుకున్నారు. అదేమిటో తెలియదు గానీ మరోసారి రైతులు ఆందోళన చేస్తే అణచి వేసేందుకు పోలీసులకు కొత్త పద్దతులను నేర్పించారు.దేశ రాజధాని వద్ద చేసిన ఏర్పాట్లు బహుశా చైనా సరిహద్దులో కూడా చేసి ఉండరేమో అని కాంగ్రెస్‌ ఎంపీ శశిధరూర్‌ వ్యాఖ్యానించారు. ” ఈ సమస్య రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అంశం కూడా,దీనికి పరిష్కారం కనుగొనాలంటే వ్యవధి అవసరం. ” మరోసారి ప్రారంభమైన రైతు ఉద్యమం ముందుకు తెచ్చిన డిమాండ్ల మీద కేంద్ర మంత్రి అర్జున్‌ ముండా ఫిబ్రవరి పదమూడున చెప్పిన మాట. గురువారం రాత్రి రైతు ప్రతినిధులతో జరిపిన చర్చలు ఎలాంటి ఫలితాలు లేకుండా ముగిశాయి. ఆదివారం సాయంత్రం మరోసారి చర్చలు జరుపుతామని కేంద్ర మంత్రి ప్రకటించారు. స్వామినాధన్‌కు భారత రత్న అవార్డు ఇచ్చిన పెద్దలు ఆయన చేసిన సిఫార్సుల అమలు మాత్రం కుదరదంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎంఎస్‌పి కమిటీలో సభ్యులుగా ఎలాంటి వారిని నియమించిందో తెలిస్తే జరిగేదేమిటో ఊహించుకోవచ్చు.


రైతుల నిరసన రాజకీయపరమైదని, హింసాకాండ వ్యాప్తి చేస్తారేమో అనే ఆందోళన కలుగుతోందని, అందుకే తాము భాగస్వాములం కావటం లేదని ప్రధాని మోడీ ఏర్పాటు చేసిన ఎంఎస్‌పి కమిటీ సభ్యుడు ప్రమోద్‌ చౌదరి ఆరోపించారు.ఈ పెద్ద మనిషి ఆర్‌ఎస్‌ఎస్‌ ఏర్పాటు చేసిన భారతీయ కిసాన్‌ సంఫ్‌ు నేత గనుక ఇంతకంటే ఏం మాట్లాడతారు ! మరో కమిటీ సభ్యుడి పేరు వినోద్‌ ఆనంద్‌. ఆందోళన చేస్తున్న వారిని గూండా రైతులని వర్ణించిన ఘనుడు.వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌ (ప్రపంచ సహకార ఆర్థికవేదిక ) కార్యనిర్వాహక అధ్యక్షుడు. అసలు ఈ సంస్థ గురించి రైతులు ఎప్పుడైనా విన్నారా ? ” దేశ ఆర్థిక పురోగతికి, రైతుల సంక్షేమానికి కనీస మద్దతుధరలకు చట్టబద్దత కల్పించటమే ఏకైక పరిష్కారం అయితే ఆ పని చేసేందుకు చేయాల్సిందంతా చేస్తాము. ఎంఎస్‌పికి గతంలో ఎప్పుడు చట్టబద్దత ఉంది. దాని గురించి ప్రధాని ఎన్నడూ చెప్పలేదు.వీరంతా గూండా రైతులు, రాజకీయంగా ఉత్తేజం పొందిన కొద్ది మంది…ఒక రాష్ట్రానికి చెందిన వారు తమ రాజకీయ ప్రత్యర్ధుల మీదకు రైతులను ఈ విధంగా ఉపయోగిస్తున్నారు.కనీస మద్దతు ధరలకు చట్టబద్దత గురించి ఎన్నడూ చెప్పలేదు. 2075వరకు పనికి వచ్చే విధంగా ఉండే వ్యవసాయ విధానాలను మనం రూపొందించుకోవాల్సి ఉంది, తద్వారా ఆర్థిక అసమానతలు తగ్గుతాయి. కనీస మద్దతు ధర ఒక సంక్లిష్టమైన అంశం.వారు(రైతులు) ముందుకు వచ్చి మాతో కూర్చొని చర్చించాలి.వారి ప్రశ్నలన్నింటికీ నేను సమాధానం చెప్పలేకపోతే కమిటీ నుంచి రాజీనామా చేస్తానని హామీ ఇస్తున్నాను. ఇదంతా ఒక నాటకం, పక్కదారి పట్టించేందుకు, దేశాన్ని విచ్చిన్నం చేసేందుకు చేస్తున్న వ్యవహారం ” అని వినోద్‌ ఆనంద్‌ అన్నట్లు ఎఎన్‌ఐ వార్తా సంస్థ పేర్కొన్నది.


ఉత్తరాది రాష్ట్రాల శ్వాస నిలిపివేసేందుకు రైతులు ప్రయత్నిస్తున్నారని, తమ రాష్ట్రంలో భయ వాతావరణం ఏర్పడిందని హర్యానా ప్రభుత్వం హైకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్‌లో పేర్కొన్నది. పరిష్కారం తేలేవరకు ఆందోళన కానసాగుతుందని రైతు సంఘాలు వెల్లడించాయి. నరేంద్రమోడీ సర్కార్‌ను దించేందుకే రైతులు మరోసారి వీధుల్లోకి వచ్చారని ఆరోపిస్తున్నారు. అంటే మోడీ సర్కార్‌ మీద తిరుగుబాటు చేస్తున్నట్లు చిత్రించటమే. అదే రైతుల అజెండా అయితే నిరాయుధులుగా ఎందుకు వస్తారు.తాము ప్రయాణిస్తున్న ట్రాక్టర్లలో గతంలోగానీ ఇప్పుడు గానీ ఆహార పదార్దాలు తప్ప ఎలాంటి మారణాయుధాలు లేవే. ఢిల్లీ చలో అన్న నినాదంతో గతంలో సాగిన ఉద్యమానికి ఇచ్చిన పిలుపుకు మూడు సంవత్సరాలు నిండిన సందర్భంగా 2023 నవంబరు 26 నుంచి 28వరకు చండీఘర్‌లో నిరసన తెలపాలని పంజాబ్‌ రైతులు పిలుపు నిచ్చారు. దాని కొనసాగింపే తాజా ఢిల్లీ చలో నిరసన. అప్పటి నుంచి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఏమి చేస్తున్నట్లు ? మంత్రి మాటలను బట్టి ఏదో విధంగా కాలయాపన చేసి ఆందోళనను అణచివేసేందుకు లేదా మరో విధంగా ముగించేందుకు కేంద్రం చూస్తున్నట్లు కనిపిస్తోంది. నవంబరులోనే కేంద్రం ఎందుకు చర్చలు జరపలేదు ?

పంజాబ్‌, హర్యానా, ఉత్తర ప్రదేశ్‌లోని రైతులే ఎందుకు ఆందోళన చేస్తున్నారంటూ కొందరు ఉద్యమాన్ని తప్పుదారి పట్టించేందుకు చూస్తున్నారు. నిద్రపోతున్నవారిని లేపగలం గానీ నటిస్తున్నవారిని లేపటం కష్టం. దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి అన్ని రాష్ట్రాలలో ఒకే విధంగా లేదు. పండిన పంటలో స్థానిక వినియోగం పోను మిగిలిన దాన్ని మార్కెట్‌ మిగులుగా పరిగణిస్తారు.2005లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఒక నివేదిక ప్రకారం దేశవ్యాపిత సగటు 55.46శాతం మార్కెట్‌ మిగులు ఉంది. ఇది ఎక్కువగా ఉన్న రాష్ట్రాలలో పంజాబ్‌ 94.43,హర్యానా 90,11,రాజస్థాన్‌లో 90శాతం ఉంది. ఉత్తర ప్రదేశ్‌ మొత్తంగా చూసినపుడు 49.18శాతమే ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాలు పంజాబ్‌, హర్యానా మాదిరిగా ఉంటాయి. స్వల్ప మార్పులు తప్ప ఇప్పటికీ అదే పరిస్థితి. అందుకే మార్కెటింగ్‌, గిట్టుబాటు ధర సమస్య వచ్చినపుడల్లా ఈ ప్రాంతాల రైతులే వెంటనే స్పందించటం ఈ రోజు కొత్తగా వచ్చింది కాదు. అందుకే గతంలోనూ, ఇప్పుడూ ఈ ప్రాంతాల వారే ముందుకు వస్తున్నారు. ఆ సమస్య పెద్దగా లేని రాష్ట్రాల రైతుల్లో పెద్దగా స్పందన ఉండదు. హిమచల్‌ ప్రదేశ్‌, కాశ్మీరులో ఆపిల్‌ రైతులు, కొబ్బరి ధర పడిపోతే కేరళ, ఇతర కొన్ని రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతాల రైతులే స్పందిస్తారు. వర్జీనియా పొగాకు ధర పడిపోతే ఆంధ్రప్రదేశ్‌లో దాన్ని సాగు చేసే ప్రాంతాల్లో రైతులే రోడ్ల మీదకు వస్తారు, మిగతా రైతులు ఎందుకు రాలేదని ప్రశ్నిస్తే అర్ధం లేదు.


ఇంతకీ రైతులు కోరుతున్నదేమిటి ? స్వామినాధన్‌ కమిటీ సిఫార్సుల మేరకు కనీస మద్దతు ధరలకు చట్టబద్దత కల్పించాలి. రైతుల రుణాలను పూర్తిగా రద్దు చేయాలి.రైతులు, వ్యవసాయ కార్మికులకు పెన్షన్‌ పధకాన్ని వర్తింప చేయాలి.విద్యుత్‌ సవరణ బిల్లు 2020ని రద్దు చేయాలి.భూసేకరణ చట్టం 2013ను తిరిగి తేవాలి. దాని ప్రకారం భూసేకరణకు రైతుల ఆమోదం తీసుకోవాలి, జిల్లా కలెక్టర్‌ నిర్ణయించిన ధరకు నాలుగు రెట్ల పరిహారం ఇవ్వాలి.ఉత్తర ప్రదేశ్‌ లఖింపూర్‌ ఖేరీలో హత్యకు గురైన రైతులకు న్యాయం జరగాలి.దోషులను శిక్షించాలి. గ్రామీణ ఉపాధి హామీ చట్టం ప్రకారం ఏడాదికి రెండువందల రోజులు పని కల్పించాలి, వ్యవసాయానికి అనుబంధం చేయాలి.2021 ఉద్యమం సందర్భంగా మరణించిన కుటుంబాల వారికి పరిహారంతో పాటు కుటుంబ సభ్యులకు ఒకరికి ఉద్యోగం కల్పించాలి. ఇవి కేవలం పంజాబ్‌, హర్యానా రైతుల డిమాండ్లేనా, మిగతా ప్రాంతాల రైతులు కోరటం లేదా ? ఆందోళనను పక్కదారి పట్టించి నిందలు వేస్తున్నవారిని ఎక్కడికక్కడ రైతాంగం నిలదీసే రోజులు రానున్నాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

నరేంద్రమోడీ దశాబ్ది పాలన : రాజస్థాన్‌లో సముద్రం, హిమాలయాల్లో వేడి కబుర్లు !

14 Wednesday Feb 2024

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, History, INDIA, Loksabha Elections, NATIONAL NEWS, Opinion, Politics, Prices

≈ Leave a comment

Tags

BJP, modinomics, Narendra Modi Failures, Ten years Narendra Modi rule, White Paper


ఎం కోటేశ్వరరావు


మనం బుర్రను పక్కన పెట్టి చెవులప్పగిస్తే ఎదుటి వారు రాజస్థాన్‌లో సముద్రం, హిమాలయాల్లో భరించలేని వేడి, ఎండిపోయిన బంగాళాఖాతం అంటూ ఎన్నికబుర్లైనా చెబుతారు. ఈ మధ్యనే ప్రపంచ ఆర్థిక వేదిక మీద 34 ముప్పుల్లో తప్పుడు సమాచారంలో భారత్‌ మొదటి స్థానంలో ఉందని ప్రపంచవ్యాపితంగా1,490 వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను సర్వే చేసినపుడు వెల్లడైన నిష్టుర సత్యం. విశ్వగురువుగా నరేంద్రమోడీకి ప్రపంచం నీరాజనాలు అర్పిస్తున్నదని చెబుతున్నవారు దీని గురించి ఏం చెబుతారో తెలియదు. అలాంటి ముప్పులో భాగమే ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి మీద విడుదల చేసిన శ్వేత పత్రంలోని అంశాలు. పదేండ్ల క్రితం తాము అధికారంలోకి వచ్చినపుడు దేశం సంక్షోభ స్థితిలో ఉందని, దాని గురించి చెబితే పెట్టుబడులు పెట్టేవారు ప్రతికూలంగా ఆలోచిస్తారని, అందుకే అప్పుడే శ్వేత పత్రం ప్రకటించకుండా ఇపుడు పరిస్థితి బాగుపడినందున విడుదల చేస్తున్నట్లు మొదటి పేరాలోనే జనాన్ని తప్పుదారి పట్టించారు.నిజంగా ఇప్పుడు పరిస్థితి బాగుపడిందా, దాని అర్ధం ఏమిటి ?


ఏటా రెండు కోట్ల ఉపాధిని పెంచుతామని 2014లో చెప్పారు. వాస్తవ పరిస్థితి ఏమిటి ? బిజెపి అధికారానికి రాకముందు ఉన్న సమాచారం ప్రకారం 2012లో నిరుద్యోగం 2.1శాతం అది 2018లో నేషనల్‌ సర్వే సంస్థ సమాచారం ప్రకారం 6.1శాతానికి చేరింది. దేశ కార్మికశక్తి సర్వేల ప్రకారం అంతకు ముందు 45 సంవత్సరాలతో పోలిస్తే అది అధికం. పదిహేను నుంచి 24 సంవత్సరాల యువతలో నిరుద్యోగం ఎంత అన్నది ప్రధానంగా చూడాలి. స్టాటిస్టా సంస్థ విశ్లేషణ ప్రకారం 2014లో మోడీ అధికారానికి వచ్చినపుడు 22.4శాతం మందికి ఉపాధి లేదు. తరువాత 2022లో 23.22 శాతం, తొమ్మిది సంవత్సరాల సగటు 24.74శాతం ఉంది. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలను కల్పించి ఉంటే ఈ పెరుగుదల ఎలా సంభవించింది? మాక్రోట్రెండ్స్‌ సమాచారం ప్రకారం 15-24 ఏండ్ల వయస్సులోని యువత కార్మిక శక్తిలో 2014లో 31.64శాతం ఉండగా మోడీ ఏలుబడిలో 2022లో 28.04శాతానికి తగ్గింది. విద్య పెరిగిన కొద్దీ యువతలో నిరుద్యోగశాతం కూడా పెరుగుతున్నదనే అంశాన్ని ఎందుకు మూసిపెడుతున్నట్లు ? నరేంద్రమోడీ గొప్పగా చెప్పుకొనే నైపుణ్యం తీరు ఎలా ఉంది. 2021 భారత నైపుణ్య నివేదిక ప్రకారం దాదాపు సగం మంది డిగ్రీ కలిగిన వారు నిరుద్యోగులు. ప్రైవేటు కాలేజీలు పెరిగినందున నైపుణ్యాలు లేని పట్టాదారులు తామర తంపరగా పెరిగారన్నది మింగుడు పడని వాస్తవం. అందుకే ప్రభుత్వం 2015లో జాతీయ నైపుణ్య విధానాన్ని ప్రకటించింది.కార్మిక శక్తిలో 40 కోట్ల మందికి 2022 నాటికి నైపుణ్యాలను పెంచుతామని చెప్పారు. జరిగిందేమిటి ? 2012లో కార్మికశక్తిలో వృత్తి విద్యావంతులు లేదా శిక్షణ పొందిన వారు 2.3శాతం కాగా మోడీ గారి శిక్షణ తరువాత 2.4శాతానికి మాత్రమే పెరిగారు. కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన సమాచారం ప్రకారం పిఎంకెవివై (నైపుణ్య శిక్షణ) మూడు రకాలుగా శిక్షణ పొందిన వారు 18-45-4 లక్షల మంది చొప్పున ఉన్నారు.వారిలో 14-43-7శాతాల చొప్పున ఉపాధి పొందినట్లు పేర్కొన్నారు.ఈ శిక్షణ తీరుతెన్నుల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. సాంకేతిక విద్య అభ్యసించిన ఇంజనీరింగ్‌,పాలిటెక్నిక్‌ పూర్తి చేసిన వారిలో నిరుద్యోగం గత పది సంవత్సరాల్లో రెట్టింపైంది. మన దేశంలో 2030 వరకు ఉపాధిని కోరుకొనే వారి సంఖ్య ఏటేటా గణనీయంగా పెరగనుందని వర్తమాన ధోరణి వెల్లడిస్తోంది. అంటే నిరుద్యోగమూ పెరగనుంది.


కార్మిక శక్తిలో మొత్తంగా, ప్రత్యేకించి మహిళల శాతం పెరగటం లేదన్నది అందరికీ తెలిసిందే. ఎందుకు అన్నది సమస్య. అధికారానికి వచ్చిన తొలి రోజుల్లో విదేశాలు తిరిగి పెద్ద మొత్తంలో విదేశీ పెట్టుబడులు తెచ్చినట్లు నరేంద్రమోడీ చెప్పారు. పది సంవత్సరాల తరువాత జనానికి అందిన వాటి ఫలితాలేమిటో చెప్పరు. తమ వికసిత భారత్‌ నినాదంతో త్వరలో చైనా, అమెరికాలను మించిపోతామని చెబుతున్నారు. ఎంతగా చెట్టపట్టాలేసుకొని తిరుగుతున్నప్పటికీ మన దేశంలో పెట్టుబడి వాతావరణం వ్యాపారం చేసేందుకు పెద్ద సవాలుగా ఉందని 2022 నివేదికలో అమెరికా చెప్పింది. రక్షణాత్మక చర్యలు, భారతీయ ప్రమాణాల నుంచి అంతర్జాతీయ స్థాయికి చేరలేకపోవటం వంటి కారణాలను దానిలో పేర్కొన్నారు. అంతేకాదు ప్రపంచ ఆర్థిక స్వేచ్చ సూచిక 2023 నివేదిక ప్రకారం 131వ స్థానంలో మనదేశం ఉంది. ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలోని 39దేశాల్లో 27వదిగా ఉంది. దేశ ప్రతిష్టను, పలుకుబడిని పెంచానని, భారీ మొత్తంలో పెట్టుబడులను ఆకర్షిస్తున్నట్లు చెప్పుకోవటమే తప్ప కనిపించటం లేదు, విదేశీ పెట్టుబడుల ఆకర్షణలో 2022లో తొలి పది దేశాల్లో మనం పదవ స్థానంలో ఉన్నాం.మొదటి స్థానంలో ఉన్న అమెరికాకు 388, రెండవదిగా ఉన్న చైనాకు 180 బిలియన్‌ డాలర్లు వస్తే మన దేశానికి వచ్చింది 50బి.డాలర్లు. విదేశీ పెట్టుబడుల సంగతి అలా ఉంటే చైనా జిడిపిలో 50శాతం పెట్టుబడులు పెడుతుంటే మనదేశంలో 30శాతమే ఉంది. చైనా ఉత్పాదకరంగం జిడిపికి 30శాతం సమకూర్చుతుంటే మనదగ్గర 20శాతమే ఉంది. యుపిఏ పాలనలో ఎన్నివేల కిలోమీటర్ల రోడ్లు వేశారు, మా పాలనలో ఎలా వేశామో చూడండి అని బిజెపి అడ్డుసవాళ్లు విసురుతుంది. మౌలిక సదుపాయాలకు గాను 2013-14లో జిడిపిలో 1.7శాతం ఉన్న మొత్తాన్ని 2022-23లో 2.9శాతానికి పెంచాం చూడండి అని చెబుతారు. పదేండ్ల సగటు 1.93శాతం. ఇక్కడ సమస్య పెట్టుబడి వ్యయాన్ని పెంచాల్సిందేఅది అవసరాలకు తగినట్లుగా ఉండాలి. పారిశ్రామిక ఉత్పత్తి లేకుండా ఎన్ని రోడ్లు, రైలు మార్గాలువేసినా, ఓడరేవులను అభివృద్ధి చేసినా ప్రయోజనం ఏముంటుంది.


పెట్రోలు, డీజిలు మీద విపరీతంగా సెస్‌లను పెంచారు. ఎందుకు అంటే దేశ రక్షణకు డబ్బు ఎక్కడ నుంచి తేవాలనే మనోభావాన్ని ముందుకు తెచ్చారు. ఇది నిజమా ? కేంద్ర ప్రభుత్వ 2022-23 ఆర్థిక సర్వే60వ పేజీలో ఇచ్చిన సమాచారం ప్రకారం 2013-14లో జిడిపిలో 1.1శాతం కేటాయిస్తే 2022-23లో 0.9శాతంగా ప్రతిపాదించారు.పదేండ్ల సగటు 1.04శాతం. ఈ కాలంలో చేసిన అప్పులు 4.5 నుంచి 6.4శాతానికి చేరాయి. పదేండ్ల సగటు 4.99శాతం.దీనికి అనుగుణంగానే వడ్డీ చెల్లింపులు 3.3 నుంచి 3.6శాతానికి పెరిగాయి. అచ్చేదిన్‌ గురించి కబుర్లు చెప్పిన పెద్దలు సబ్సిడీ మొత్తాన్ని 2.3 నుంచి 1.2శాతానికి దిగ్గోశారు. పదేండ్ల సగటు 1.74శాతం. ముందే చెప్పినట్లుగా అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాల ఖర్చు పెరగాలి. దాని కోసం సంక్షేమ కార్యక్రమాల ఖర్చు తగ్గింపు సమర్దనీయమా ? పారిశ్రామిక ఉత్పత్తి విలువ తమ ఏలుబడిలో ఎంత పెరిగిందో చూడమని మోడీ భక్తులు చెబుతారు. ఆ మేరకు ఉపాధి ఎందుకు పెరగలేదో చెప్పలేరు. మరోవైపు జిడిపిని ఎంత పెంచామో చూడండి అంటారు. ప్రపంచబాంకు విశ్లేషించినదాని ప్రకారం 2014లో మన పారిశ్రామిక ఉత్పత్తి విలువ 307బిలియన్‌ డాలర్లు, అది 2022 నాటికి 450 బి.డాలర్లకు పెరిగింది. ఇదే కాలంలో జిడిపిలో దాని వాటా 15 నుంచి 13.32శాతానికి దిగజారింది. కార్మిక శక్తిలో 15-24 సంవత్సరాల వయస్సు వారు ఎందరున్నారు అంటే 2014లో 31.64శాతం ఉంటే 2022 నాటికి 28.04కు పడిపోయింది. దీని అర్ధం ఏమిటి ఉపాధి రహిత వృద్ధి జరుగుతున్నది. దీని వలన కార్పొరేట్ల సంపద పెరుగుతుంది తప్ప జనానికి దక్కేదేముంది.


ఏ దేశమైనా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నపుడు డిమాండ్‌ను పెంచేందుకు ప్రభుత్వాలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడతాయి. దాని వలన వివిధ రంగాలు కొంత మేరకు సానుకూలంగా స్పందిస్తాయి. ఉదాహరణకు రోడ్ల నిర్మాణం జరిపితే సిమెంటు, ఉక్కు, చమురు, రోడ్డు నిర్మాణ వాహనాలు తదితర ఉత్పత్తులకు గిరాకీ పెరుగుతుంది. ఈ కారణంగానే 2020-21లో మూలధన వ్యయం కేంద్ర బడ్జెట్‌లో రు.4.26లక్షల కోట్లుండగా 2023-24లో రు.10లక్షల కోట్లకు పెంచారు.(ఎన్నికల సంవత్సరం కదా !) ఒక్కసారిగా ఇంత పెరుగుదల ఎప్పుడూ లేదు. రైల్వే, రోడ్లు,రక్షణ రంగం వాటా 66శాతం ఉంది. రాష్ట్రాలలో మౌలిక సదుపాయాలకు ఇచ్చే 50 ఏండ్ల వడ్డీ లేని రుణ మొత్తం అంతకు ముందు ఉన్న రు.76వేల కోట్లను 130వేల కోట్లకు పెంచారు. ఇదే సమయంలో కొన్ని రంగాలకు ఎలా కోతలు పెట్టారో చూద్దాం. 2009 తరువాత తొలిసారిగా సామాజిక సంక్షేమ ఖర్చు 18శాతానికి తగ్గింది.2023-24 బడ్జెట్‌లో రు.8.28లక్షల కోట్లుగా ప్రతిపాదించారు. అంతకు ముందు సంవత్సరం కంటే 56వేల కోట్లు తక్కువ. విద్యారంగానికి కేటాయింపులు 2009-2021 మధ్య 20 నుంచి 9శాతానికి తగ్గాయి. 2023-24లో 14శాతం ఉన్నప్పటికీ తక్కువే కదా ! గ్రామీణాభివృద్ధి కేటాయింపులు 28 నుంచి 19శాతానికి తగ్గాయి. ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఆరోగ్యం, విద్య, పోషకాహారం వంటి వాటికి తగ్గటం లేదా గిడసబారి ఉన్నాయి. పదకొండు సాంఘిక సంక్షేమ రంగాలలో కరోనాకు ముందు 2019-20లో ఉన్న కేటాయింపుల కంటే 2023-24లో ఐదింటిలో తగ్గాయి. అవి స్వచ్చ భారత్‌, సమగ్ర విద్యా శిక్షణ, గ్రామీణ ఉపాధి హామీ పధకం, జాతీయ ఆరోగ్య కార్యక్రమం. రాష్ట్రాలు తమ వాటాను చెల్లించని కారణంగా కొన్ని పధకాలకు నిధులు పెంచలేదని కేంద్ర అధికారులు చెప్పారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కొన్ని రంగాలకు పెంచారు.మొత్తంగా చూసినపుడు కార్పొరేట్లకు లబ్ది చేకూర్చే మౌలిక సదుపాయాలకు ఖర్చు పెంపుదల కోసం కోట్లాది మంది సంక్షేమానికి చేసే ఖర్చును కోత పెడుతున్నారు లేదా మంచం చాలకపోతే కాళ్లు ముడుచుకొని సర్దుకోమని చెప్పినట్లుగా చేస్తున్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

నాడు రోడ్లపై మేకులు – నేడు రైతులను బందెల దొడ్లో పెట్టాలన్న కేంద్రం ! వీపులు పగలగొట్టి అడ్డుకోవాలన్న పోలీసు బాస్‌ !!

13 Tuesday Feb 2024

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, Economics, Farmers, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Prices

≈ Leave a comment

Tags

#Farmers Protest, #support farmers, 2024 Farmers Protest, BJP, Farmers in Delhi, Narendra Modi Failures


ఎం కోటేశ్వరరావు


మరోసారి రైతులు ఢిల్లీబాట పట్టారు.వారిని ఎట్టి పరిస్థితిలోనూ నగరంలో ప్రవేశించకుండా అడ్డుకొనేందుకు బిజెపి సర్కార్‌ పూనుకుంది. అనేక చోట్ల రైతుల మీద బాష్పవాయువు, లాఠీ ఛార్జీ జరిపారు, అడుగడుగునా హర్యానా బిజెపి ప్రభుత్వం ఆటంకాలు కల్పించింది. ఉత్తర ప్రదేశ్‌ నుంచి ఢిల్లీలోకి ప్రవేశించే మార్గాలలో కూడా రవాణాకు తీవ్ర అంతరాయం కలిగింది. ఈ ఆందోళనకు సంయుక్త కిసాన్‌ మోర్చా(ఎన్‌పి-రాజకీయ రహిత) పిలుపు నిచ్చింది. గతంలో ఏడాది పాటు ఆందోళన నిర్వహించిన సంయుక్త కిసాన్‌ మోర్చా(ఎస్‌కెఎం) నుంచి విడిపోయిన వారు, గత ఆందోళనకు దూరంగా ఉన్న కొని సంఘాలు తాజా ఆందోళనకు పిలుపునిచ్చాయి. గతంలో రైతులు ఢిల్లీలో ప్రవేశించి తమ డిమాండ్ల మీద నిరసన తెలుపకుండా అడ్డుకొనేందుకు రోడ్ల మీద మేకులు, కాంక్రీటు దిమ్మలను ఏర్పాటు చేసిన నరేంద్రమోడీ సర్కార్‌ తీరు తెలిసిందే.ఇప్పుడు ఢిల్లీలో ఉన్న బవనా స్టేడియంను బందెల దొడ్డిగా మార్చి రైతులను అందులో నిర్బంధించేందుకు అవకాశమివ్వాలని మంగళవారం నాడు ఢిల్లీ ప్రభుత్వాన్ని కోరింది. రైతుల ఆందోళన వలన రోడ్లు, రైలు ప్రయాణీకులకు ఇబ్బందులు కలుగుతాయి గనుక రైతుల మీద చర్యలు తీసుకొనే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలంటూ అరవింద్‌ సేత్‌ అనే లాయరు పంజాబ్‌-హర్యానా హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలు చేశారు..రైతులు న్యూసెన్సు చేస్తున్నారని ఆరోపిస్తూ వారు బలవంతంగా నగరంలోకి అడుగుపెట్టకుండా చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టు బార్‌ అసోసియేషన్‌ ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌ను కోరింది. ఇలాంటి వారు అదే రైతులకు కనీస మద్దతు ధరల కోసం వేసిన కమిటీ నివేదికను వెంటనే ఇప్పించి రైతులు ఆందోళనకు దిగకుండా చూడాలని కేంద్రం మీద ఎలాంటి వాజ్యాలు ఇంతవరకు దాఖలు చేయలేదు.నోరులేని రైతులను అడ్డుకొనేందుకు పూనుకున్నారు. రైతులు వినకుండా దురుసుగా ముందుకు వస్తే పోలీసులు చూస్తూ ఊరుకోవాల్సిన అవసరం లేదని, మనం కూడా అదే పద్దతిలో ఉండాలని లేకపోతే వారిని అపలేమని ఢిల్లీ శాంతి భద్రతల స్పెషల్‌ పోలీసు కమిషనర్‌ రవీంద్ర యాదవ్‌ ఢిల్లీ శివార్లలోని శింఘు సరిహద్దులో పోలీసులతో మైకులద్వారా ప్రకటించారు.మనం ఆత్మరక్షణలో పడనవసరం లేదు, బాష్పవాయువు వదలండి, లాఠీలను ప్రయోగించండి, ఇది ఒక రోజంతా జరగవచ్చు అని కూడా చెప్పారని మంగళవారం రాత్రి పొద్దుపోయిన తరువాత ఎకనమిక్‌ టైమ్స్‌ పత్రిక ఇచ్చిన వార్తలో పేర్కొన్నది. ఎవరైనా అలసిపోతే వారి స్థానంలో వేరొక బృందం వస్తుందని, ఎట్టి పరిస్థితిలోనూ రైతులను నగరంలోకి అనుమతించవద్దని కూడా చెప్పినట్లు తెలిపింది.


రైౖతుల డిమాండ్లు న్యాయబద్దమైనవని అందువలన స్టేడియంను జైలుగా మార్చాలన్న కేంద్ర కోరికను తాము అంగీకరించేది లేదని ఢిల్లీ ఆమ్‌ ఆద్మీ ప్రభుత్వం తిరస్కరించింది. రైతులతో చర్చించి పరిష్కరించాలని కోరింది. శాంతియుతంగా నిరసన తెలిపే రాజ్యాంగబద్దమైన హక్కు ప్రతి పౌరుడికీ ఉన్నదని అందువలన రైతులను అరెస్టు చేయటం సరైంది కాదని ఢిల్లీ హౌం మంత్రి కైలాష్‌ గెహలట్‌ చెప్పారు. ఢిల్లీ పోలీసు యంత్రాంగం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుందన్న సంగతి తెలిసిందే. తమ డిమాండ్ల మీద నిరసన తెలిపేందుకు మంగళవారం నాడు ఢిల్లీ వస్తున్న రైతులను అనేక చోట్ల పోలీసులు అడ్డుకున్నారు. పంజాబ్‌ నుంచి వస్తున్న వారి మీద హర్యానా బిజెపి ప్రభుత్వ పోలీసులు లాఠీ చార్జి చేశారు. రైతులు అన్నదాతలు, వారి పట్ల ఈ విధంగా ప్రవర్తించటం పుండు మీద కారం చల్లినట్లే, స్టేడియంను జైలుగా మార్చాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంలో భాగస్వాములం కాలేమని కైలాష్‌ గెహలట్‌ కేంద్రానికి రాసిన లేఖలో పేర్కొన్నారు.2021లో రైతుల ఆందోళన సందర్భంగా కూడా అదే స్టేడియంను జైలుగా మార్చాలని కోరిన నాటి కేంద్ర ప్రభుత్వ కోరికను అప్పుడు కూడా ఆమ్‌ ఆద్మీ సర్కార్‌ తిరస్కరించింది.


ఇటీవలనే ప్రముఖ వ్యవసాయ ఆర్థికవేత్త ఎంఎస్‌ స్వామినాధన్‌కు కేంద్ర ప్రభుత్వం భారత రత్న గౌరవ పురస్కారాన్ని ప్రకటించింది. ఆయన సూచించిన పద్దతిలో రైతాంగానికి కనీస మద్దతు ధరలు ప్రకటించేందుకు, వాటికి చట్టబద్దత కల్పించేందుకు మొరాయిస్తున్నది.కనీస మద్దతు ధరలకు చట్టబద్దత కల్పించటం మినహా రైతులు ఏమైనా కోరుకోవచ్చని ఏడాది పాటు సాగిన రైతుల ఆందోళన సందర్భంగా బిజెపి నేతలు చెప్పారు. విధిలేని పరిస్థితిలో ప్రధాని నరేంద్రమోడీ దేశానికి క్షమాపణలు చెప్పి మూడు సాగు చట్టాలను వెనక్కు తీసుకున్నట్లు ప్రకటించారు, కనీస మద్దతు ధరల గురించి సిఫార్సు చేసేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఆ మేరకు ఆరునెలల తరువాత 2022 జూలై 18న 26 మందితో కమిటీని ప్రకటించారు.దానిలో అందరూ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేవారు, మూడు సాగు చట్టాలను రూపొందించిన పెద్దలే ఉన్నందున తామా కమిటీని బహిష్కరిస్తున్నట్లు సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కెఎం) ప్రకటించింది. తరువాత ఆ కమిటీ ఏం చేస్తున్నదో, ఏం చెబుతుందో తెలియదు.
తమ ప్రభుత్వ హయాంలో 2014-15లో ఏ గ్రేడ్‌ వరి మద్దతు ధర రు.1,400 నుంచి 2023-24లో రు.2,203కు అంటే రు 803 పెంచినట్లు మోడీ సర్కార్‌ చెప్పుకున్నది.సగటున వార్షిక పెంపుదల 5.7శాతం. అంతకు ముందు కాంగ్రెస్‌ ఏలుబడిలో 2004-05 రు.590 నుంచి రు.1,400కు పెరిగింది. రు.810 పెరిగింది. దీన్ని సగటు వార్షిక పెరుగుదలలో చూస్తే 14శాతం ఉంది. పొడవు పింజ పత్తి ధర రు.1,760 నుంచి కాంగ్రెస్‌ ఏలుబడిలో రు.4,050 పెరిగింది. నిఖర పెరుగుదల రు.2,290 వార్షిక సగటు 13శాతం, అదే నరేంద్రమోడీ కాలంలో రు.4050 నుంచి రు.7,020కి పెంచారు.నిఖర పెరుగుదల రు.2,970 కాగా వార్షిక సగటు 7.3శాతమే. దీని అర్ధం కాంగ్రెస్‌ రైతులను ఏదో ఉద్దరించిందని చెప్పటం కాదు, పెరిగిన సాగు ఖర్చులతో పోలిస్తే అది కూడా తక్కువే. దానితో పోలిస్తే మంచి రోజులను తెచ్చి అమృత కాలంగా మార్చి రైతుల రాబడి రెట్టింపు చేస్తామన్న నరేంద్రమోడీ పాలనలో మరింత దిగజారింది అని చెప్పేందుకే ఈ పోలిక.ఎంఎస్‌ స్వామినాధన్‌ కమిషన్‌ చేసిన సిఫార్సులను పక్కన పెట్టి వార్షిక ద్రవ్యోల్బణ ప్రాతిపదికన నామమాత్రంగా పెంచుతున్నారు తప్ప సాగు ఖర్చులను పరిగణనలోకి తీసుకోవటం లేదు.


కేంద్రం ఏర్పాటు చేసిన ఆ కమిటీ పరిధి ఏమిటి ? ఏ అంశాలను అది పరిశీలిస్తుందో వివరించాలని రైతు ఉద్యమం నడిపిన సంయుక్త కిసాన్‌ మోర్చా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తే సమాధానం లేదు. అందువలన ఆ కమిటీలో ఉండి చేసేదేమీ లేదు గనుక ప్రతినిధుల పేర్లను ప్రతిపాదించటం లేదని స్పష్టం చేసింది. ఈ కమిటీ చైర్మన్‌ ఎవరంటే రైతులు తిరస్కరించిన మూడు సాగు చట్టాలను రచించిన వ్యవసాయశాఖ మాజీ కార్యదర్శి సంజయ అగర్వాల్‌. ఆ చట్టాలను ఎలా రూపొందించాలో సలహా ఇచ్చిన రమేష్‌ చాంద్‌ నీతిఅయోగ్‌ సభ్యులు.కనీస మద్దతు ధరలకు చట్టబద్దత కల్పించకూడదని చెప్పిన ఆర్థికవేత్తలను నిపుణుల పేరుతో చేర్చారు. ప్రభుత్వ ప్రతినిధులు సరేసరి, వీరుగాక రైతుల ఆందోళనను వ్యతిరేకించిన ఐదు సంఘపరివార్‌ సంఘాలకు చెందిన వారిని చేర్చారు. ఆందోళనకు నాయకత్వం వహించిన వారిని మూడు పేర్లు ఇవ్వాలని కోరారు. మూడు సాగు చట్టాలను అమలు జరపకుండా 2022 నాటికి రైతుల రాబడిని రెట్టింపు చేయటం కుదరదని నీతిఅయోగ్‌ సభ్యులు రమేష్‌ చాంద్‌ రైతుల ఆందోళన సమయంలో చెప్పారు.ఇటీవలి కాలంలో ఎక్కడా దాని గురించి ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడటం లేదు.


తాజాగా ఢిల్లీ చలో ఆందోళనకు పిలుపు ఇచ్చి ఎస్‌కెఎం(ఎన్‌పి), కిసాన్‌ మజ్దూర్‌ మోర్చా ముందుకు తెచ్చిన డిమాండ్లు పాతవే.ఎవరు పిలుపునిచ్చినా సమర్ధించాల్సినవే.పంజాబ్‌ నుంచి వస్తున్న రైతులు ఢిల్లీ చేరకుండా హర్యానా పోలీసులు పంజాబ్‌ సరిహద్దులోని పాటియాలా సమీపంలోని షాంభు వద్ద అడ్డుకున్నారు. రైతుల మీద బాష్పవాయు ప్రయోగం చేశారు. కనౌరీ వద్ద లాఠీ ఛార్జి చేశారు.అనేక చోట్ల రోడ్ల మీద పోలీసులు కల్పించిన ఆటంకాలను పక్కకు తొలగించి రైతులు ముందుకు వస్తున్నారని వార్తలు. చర్చలు జరపాలి తప్ప ఢిల్లీ వెళ్ల వద్దని హర్యానా హౌంమంత్రి అనిల్‌ విజి రైతులకు సలహా ఇచ్చారు.రెండుసార్లు కేంద్ర మంత్రులు ఇక్కడకు వచ్చారు. రైతులు వారితో మాట్లాడలేదంటే దీని వెనుక ఏదో దురుద్దేశ్యం ఉందని ఆరోపిస్తూ రాష్ట్రంలోకి రానిచ్చేది లేదని అన్నారు. కనీస మద్దతు ధరలకు అనేక మందితో చర్చలు జరపాల్సి ఉందని, రైతులు కూడా మాట్లాడాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్‌ ముండా చెప్పారు. మంగళవారం నాడు ఢిల్లీకి దారితీసే అనేక మార్గాలలో రవాణాకు తీవ్ర అంతరాయం కలిగింది.నగరంలో అనేక మెట్రో స్టేషన్లను మూసివేశారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

లక్షాధికారి అక్కలంటూ మునగ చెట్టెక్కించిన నరేంద్రమోడీ !

02 Friday Feb 2024

Posted by raomk in AP, BJP, CHINA, Current Affairs, Economics, employees, INDIA, INTERNATIONAL NEWS, Loksabha Elections, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, Women, Women

≈ Leave a comment

Tags

BJP, lakhpati Didi, Narendra Modi Failures, Nari Shakti, Nirmala Sitharaman, women labour force


ఎం కోటేశ్వరరావు


ఏదీ ఊరికే రాదు అన్న ఒక ఆభరణాల వాణిజ్య ప్రకటన గురించి అందరికీ తెలిసిందే. అటువంటపుడు ప్రధాని నరేంద్రమోడీ మహిళల గురించి ఊరికే మాట్లాడతారా ? సమస్యేలేదు. అందునా ఎన్నికలు, ఓట్ల కోసం మహిళలను ఎందుకు వదలిపెడతారు. పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా మీడియాను ఉద్దేశించి(పత్రికా గోష్టి కాదు) మాట్లాడుతూ ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌ బ్రహ్మాండమైన నారీశక్తి (మహిళా సాధికారత) అవుతుందని చెప్పారు. ఆమె ప్రవేశపెట్టింది ఓట్‌ ఆన్‌ ఎకౌంట్‌ తప్ప దాన్ని బడ్జెట్‌గా పరిగణించరు. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రసంగం, నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ” మహిళా సాధికారత పండగ ” అని కూడా వర్ణించారు.నూతన పార్లమెంటు భవనంలో జరిగిన తొలి సమావేశంలో నారీశక్తి అభియాన్‌కు ఆమోదాన్ని చూశారని, జనవరి 26న కర్తవ్యపథ్‌లో మహిళాశక్తిని చూశారని అన్నారు. రామ్‌ రామ్‌ అంటూ మీడియాతో మాటలు ప్రారంభించిన ప్రధాని అలవాటుగా అల్లరి చేసే, ప్రజాస్వామిక విలువలను నిలువునా కాలరాసే ప్రతిపక్షాలు ఆత్మశోధన చేసుకోవాలని కూడా సలహా ఇచ్చారు. చివరిలో కూడా రామ్‌ రామ్‌ అంటూ ముగించారు. ఎనభై మూడు లక్షల స్వయం సహాయక బృందాలలో తొమ్మిది కోట్ల మంది ఉన్నారని, వారిలో కోటి మంది ఎంతో మందికి స్పూర్తినిస్తూ చిన్న చిన్న వ్యాపారాలతో లక్షాధికారి అక్కలు(లక్‌పతి దీదీ)గా మారినట్లు మూడు కోట్ల మందిని లక్‌పతి దీదీలుగా మార్చనున్నట్లు తాత్కాలిక బడ్జెట్‌ ప్రసంగంలో నిర్మలా సీతారామన్‌ చెప్పారు. దీనికి పండగ చేసుకోవాలని ప్రధాని మోడీ గారు ముక్తాయింపు ఇస్తున్నారు.


గతంలో బేటీ బచావో, బేటీ పఢావో అని పిలుపు ఇచ్చారు.ఇప్పుడు మరో కొత్త నినాదంతో ఆకర్షించేందుకు పూనుకున్నారు. దేశంలో మహిళల సంఖ్య ఎక్కువ అన్నది తెలిసిందే. ఏ దేశంలోనైనా ఎందరు మహిళలు శ్రామికశక్తిలో ఉన్నారన్నది ఒక గీటురాయిగా చూస్తారు. ప్రతిదాన్నీ డబ్బుతో, లాభ నష్టాలతో కొలుస్తున్నారు గనుక శ్రామిక శక్తిలో మహిళలు ఎందరు అంటే లెక్కలతో ఆడుకుంటున్నారు. ఏటా రెండు కోట్ల మందికి ఉపాధి కల్పన ఎంతవరకు వచ్చిందని గతంలో ప్రధాని నరేంద్రమోడీని అడిగితే పకోడీ బండివారికి కూడా ఉపాధి కల్పించినట్లే లెక్కవేసుకోవాలని చెప్పిన సంగతి తెలిసిందే. అఫ్‌కోర్సు పకోడీ బండి వేసుకోవటమేమీ తప్పు కాదు. అసలు పకోడీలు కొని తినే శక్తి ఎంత మందికి ఉందన్నది ప్రశ్న. ఏ దేశమైనా సేవారంగంలో కాకుండా ఉత్పాదక రంగంలో ఎంత మందికి ఉపాధి కల్పించారు, ఎంత ఉత్పత్తి చేస్తున్నారన్నదే ప్రధాన అంశంగా చూస్తారు. దేశంలో 2022-23లో నియమిత కాల కార్మిక శక్తి సర్వే ప్రకారం మహిళలు అంతకు ముందుతో పోలిస్తే 4.2శాతం పెరిగి యూజువల్‌ స్టేటస్‌ లెక్కింపు అవగాహన ప్రకారం 37శాతానికి చేరినట్లు కేంద్ర ప్రభుత్వం గతేడాది అక్టోబరు తొమ్మిదిన ప్రకటించింది. ఈ పదానికి అర్ధం ఏమిటి ? ఉదాహరణకు సర్వే చేసినపుడు ఒక వ్యక్తి అతడు లేదా ఆమె సదరు ఏడాదిలో తాను ఏడు నెలల పాటు పని చేసినట్లు లేదా పనికోసం అందుబాటులో ఉన్నట్లు గానీ, పని కావాలని కోరినట్లయితే శ్రామికశక్తిలో ఉన్నట్లు లెక్కవేస్తారు. అందుకే ఇది అంకెల గారడీ అని చెప్పాల్సి వస్తోంది. ఒక్కసారిగా ఇంత పెరుగుదల ఎలా సాధ్యమైంది అంటే నరేంద్రమోడీ అమలు జరుపుతున్న నైపుణ్యవృద్ధి, మహిళా అనుకూల విధానాలు, మహిళల నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి ఫలితం అని ఠకీమని చెబుతారు. ఒక పదార్ధాన్ని కొలవగలం గానీ గాలిని పట్టుకోలేం, చూడలేం !


ప్రభుత్వం ప్రకటించిన సమాచారాన్ని విశ్లేషించిన పరిశోధకులు చెబుతున్న అంకెలకు వీటికి పొంతన కుదరటం లేదు. అందుకే అమిత్‌ షా మాటల్లో ప్రభుత్వ ప్రకటనలను జుమ్లా (అవసరానికి ఏదో చెబుతుంటాం) అనాల్సి వస్తోంది. ఇండియా టుడే వెబ్‌సైట్‌ 2023 జూన్‌ పదకొండున రోషిణీ చక్రవర్తి రాసిన విశ్లేషణకు ” భారత్‌లో తగ్గుతున్న మహిళా శ్రామికులు, ఎందుకు పని చేయటం లేదు ” అనే శీర్షిక పెట్టింది. భారత్‌లో వేతనాలు చెల్లించే ఉపాధిలో మహిళలు ఇరవైశాతానికి లోపుగానే ఉన్నట్లు ప్రపంచ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) నివేదికను దానిలో ఉటంకించారు. ఐఎల్‌ఓ నివేదిక ప్రకారం ఉపాధిలో కేవలం 19.2శాతం మంది మాత్రమే మహిళలు ఉండగా పురుషుల్లో 70.1శాతం ఉన్నారు. ప్రపంచ ఆర్థిక వేదిక లింగ అసమానతల నివేదిక 2022 ప్రకారం 146 దేశాల జాబితాలో 135వ స్థానంలో భారత్‌ ఉంది.ప్రపంచ శ్రామిక శక్తిలో లింగ సమానత్వం రావాలంటే 132 సంవత్సరాలు పడుతుందని ఆ నివేదిక పేర్కొన్నది. అట్టడుగున్న ఉన్న మన దేశానికి ఇంకా ఎక్కువ వ్యవధి పడుతుందని వేరే చెప్పనవసరం లేదు. మహిళల భాగస్వామ్యం పెరిగితే 2025 నాటికి జిడిపిలో 70వేల కోట్ల డాలర్లు పెరుగుతుందన్నది ఒక అంచనా. ఐఎల్‌ఓ నివేదిక ప్రకారం భారత్‌లో 52శాతం మంది మహిళలు వేతన ఉపాధి లేదా లేదా కుటుంబ సంరక్షణలో రెండింటిలో ఉంటామని చెప్పారు. కానీ 2005లో 32శాతంగా ఉన్న మహిళా శ్రామిక శక్తి 2021నాటికి 19.2శాతానికి తగ్గింది.


అరబ్బు, ఇస్లామిక్‌ దేశాల్లో ప్రముఖ మీడియా సంస్థ అల్‌ జజీరా. అది 2023 ఏప్రిల్‌ పదిన ఒక విశ్లేషణ ప్రచురించింది.” జనాభాలో భారత్‌ దూసుకుపోతున్నా శ్రామిక శక్తిలో తగ్గుతున్న మహిళలు ” అని పేరు పెట్టింది.ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్ధిక వ్యవస్థ ఉన్న భారత్‌ మహిళా శ్రామిక శక్తిలో ప్రపంచంలోని అతితక్కువ 20దేశాల్లో ఒకటిగా ఉందని, గత కొద్ది సంవత్సరాలుగా తగ్గుతున్నట్లు పేర్కొన్నది. పెరుగుతున్న జనాభాకు ప్రత్యేకించి మహిళలకు ఉపాధిని చూపటంలో విఫలమైతే భారత్‌కు అది గుదిబండగా మారుతుంది. అధికారిక సమాచారాన్ని విశ్లేషించినపుడు 2004లో గరిష్టంగా 35శాతం మంది మహిళలు ఉపాధి పొందగా 2022 నాటికి అది 25శాతానికి తగ్గినట్లు అజీమ్‌ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయానికి చెందిన ఆర్థికవేత్త రోజా అబ్రహాం చెప్పిన అంశాన్ని అల్‌ జజీరా ఉటంకించింది. సిఎంఐయి ఉపాధి నిర్వచనం ప్రకారం 2022లో పని చేసే వయస్సులో ఉన్నవారిలో కేవలం పదిశాతం మంది మాత్రమే అంటే 3.9 కోట్ల మంది మహిళలు మాత్రమే పని చేస్తూ ఉండటం లేదా పని కోసం ఎదురు చూస్తున్నవారున్నారని , అదే పురుషుల విషయానికి వస్తే 36.1కోట్ల మంది ఉన్నట్లు పేర్కొన్నది. పని చేయగలిగిన వయస్సు వారి పెరుగుదలకు అనుగుణంగా ఉపాధి పెరగటం లేదని, గత దశాబ్దిలో మంచి ఉద్యోగాలు గణనీయంగా తగ్గినట్లు, మహిళలు తక్కువ వేతనాలతో పని చేయటం కంటే ఇంటి దగ్గర ఉండి ఇల్లు, పిల్లలను చూసుకోవటం మరింత లాభదాయకమని వారి కుటుంబాలు భావిస్తున్నాయని సిఎంఐఇ డైరెక్టర్‌ మహేష్‌ వ్యాస్‌ చెప్పిన మాటలను ఉటంకించింది.శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యం పదిశాతం పెరిగితే జిడిపి 552 బిలియన్‌ డాలర్ల మేరకు అదనంగా పెరుగుతుందని 2018లో మెకెన్సీ నివేదిక పేర్కొన్నది. క్వాల్‌ట్రిక్స్‌ డాట్‌కామ్‌ సమాచారం ప్రకారం 2022లో ప్రపంచంలోని 180దేశాలలో శ్రామిక శక్తిలో 52.7శాతం మహిళలతో ఆర్మేనియా మొదటి స్థానంలో ఉంది.ప్రపంచ సగటు 39.49శాతం.మన దేశం 23.54శాతంతో 166వ స్థానంలో ఉంది.మనకంటే ఎగువన 147లో నేపాల్‌, 153, 156 స్థానాలలో శ్రీలంక, బంగ్లాదేశ్‌, దిగువున 168వ స్థానంలో పాకిస్తాన్‌ ఉంది. మనతో జనాభాలో పోటీ పడుతున్న చైనా 45.17శాతంతో 89వ దేశంగా ఉంది.


ఇక లక్షాధికారి అక్క (లక్‌పతి దీదీ ) పధకం గురించి చూద్దాం. రెండు కోట్ల మంది లక్షాధికారులైనట్లు నిర్మలమ్మ చెప్పారు. ఈ పథకాన్ని పర్యవేక్షిస్తున్న గ్రామీణాభివృద్ది మంత్రిత్వశాఖ వెబ్‌సైట్‌లో ఫిబ్రవరి రెండవ తేదీన ఉన్న సమాచారం ప్రకారం స్వయం సహాయక బృందాలలో ఉన్న మహిళలు 9 కోట్ల 17లక్షల రెండువేల 245 మంది.వీరిలో ఏడాదికి పాతికవేల కంటే తక్కువ ఆదాయం వచ్చిన వారు 44,72,431(ఐదుశాతం) మంది, ఇరవై అయిదు నుంచి 60వేలకు వరకు వచ్చిన వారు 3,99,16,213(48శాతం) మంది, అరవై ఒకటి నుంచి లక్ష వరకు రాబడి వచ్చిన వారు 2,43,09,855(29శాతం) మంది, లక్షకు పైగా వచ్చిన లక్షాధికారి అక్కల సంఖ్య 1,42,53,969(17శాతం)గా పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 2023 ఏప్రిల్‌ ఒకటి నుంచి అమల్లో ఉన్నాయని చెబుతున్న కనీసవేతనాల ప్రకారం నైపుణ్యం లేని వారికి నెలకు రు.12,344, నైపుణ్యం కలిగిన వారికి రు.13,844, అధిక నైపుణ్యం కలిగిన వారికి రు.14,844 కంటే తక్కువ చెల్లించటానికి లేదు. వీరిలో స్వయం సహాయక బృందాల మహిళలను ఏ తరగతిలో చేరిస్తే ఆ మేరకు ఏడాదికి వారికి రావాల్సిన కనీసవేతనాల రాబడి వరుసగా రు.1,48,128, రు.1,66,128, రు.1,78,128గా ఉంటుంది. ఇక బంగారు తెలంగాణా గురించి చెప్పుకుంటే రాష్ట్ర విభజనకు ముందు ఉన్న వేతనాలు తప్ప ఇంతవరకు సవరించలేదు గనుక చెప్పుకోకపోవటమే మంచిది. ఆంధ్రప్రదేశ్‌లో లక్షాధికారి అక్కల పరిస్థితి చూస్తే 89,56,262 మందిలో ఏడాదికి రు. పాతికవేల కంటే తక్కువ వచ్చే వారు ఎనిమిది శాతం, పాతిక నుంచి అరవైవేల మధ్య వారు 39, అరవై నుంచి లక్ష వచ్చే వారు 37, అంతకు మించి వస్తున్నట్లు చెబుతున్నవారు 17శాతం(దేశ సగటుతో సమానం) ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అంగన్‌ వాడీలను జగన్‌ సర్కార్‌ అధిక నైపుణ్యం కలిగిన వారిగా పరిగణించి, తాము ప్రకటించిన కనీసవేతనాలు అమలు జరిపి ఉంటే నలభై రోజులకు పైగా వారు సమ్మె చేసి ఉండే వారు కాదు, లక్షలాది మంది పిల్లలు, పోషకాహారం అందాల్సిన మహిళలను ఇబ్బంది పెట్టి ఉండేవారు కాదు. అంగన్‌వాడీలకు నైపుణ్యం లేకపోతే ఆ బాధ్యతల్లో నియమించరు.

ఆంధ్రప్రదేశ్‌లో సర్వేచేసిన యాంకర్‌ పరిశోధన సంస్థ 2022 డిసెంబరులో నివేదించిన ప్రకారం ప్రకాశం జిల్లా గ్రామీణ ప్రాంతాలలో గౌరవ ప్రదమైన జీవనంలో ఒక భోజనానికి అయ్యే ఖర్చును రు.81.89గా లెక్కించింది. కుటుంబంలో నలుగురు ఉంటే స్కూల్లో ఉన్న పిల్లలకు ఉచిత భోజనం ఉన్నందున ఆ మేరకు తగ్గిస్తే రు.79.16కు తగ్గుతుంది.ఈ లెక్కన ఒక మనిషికి నెలకు రు.2,408, కుటుంబానికి రు.9,632 అవుతుంది. ఇవిగాక బట్టలు, ఇతర అవసరాలను లెక్కిస్తే అవి అదనం. ఆ సంస్థ వేసిన అంచనా ప్రకారం ప్రకాశం జిల్లాలో ఒక కుటుంబానికి గౌరవ ప్రదమైన జీవన రాబడి నెలకు రు.25,269 ఉండాలని, జీవన వేతనం రు.16,077 ఉండాలని పేర్కొన్నది. పైన పేర్కొన్న వివరాల ప్రకారం లక్షాధికారి అక్కతో పాటు కుటుంబంలో మరొక సంపాదన వ్యక్తి ఉన్నప్పటికీ వచ్చే రాబడి సరిపోతుందా ? గౌరవ ప్రదమైన జీవనానికి అవసరమైన రాబడి లేదు గనుకనే పోషకాహార లోపంతో పిల్లలు, మహిళలు ఉన్నారు.దానికి పక్కా నిదర్శనం రక్తహీనత ముక్త భారత్‌గా రూపొందించాలని కేంద్ర ప్రభుత్వం పిలుపు ఇవ్వటమే. జాతీయ ఆరోగ్య సర్వే 2019-21లో సేకరించిన సమాచారంతో అంతకు ముందు సర్వే వివరాలతో పోలిస్తే దేశంలో ఆరేండ్లలోపు పిల్లలు, 15-49 సంవత్సరాల మధ్య ఉన్న గర్భిణులు, మొత్తం మహిళల్లో రక్తహీనత పెరిగింది. ఆంధ్రప్రదేశ్‌ పిల్లల్లో 58.6 నుంచి 63.2 శాతానికి పెరగ్గా మహిళల్లో స్వల్పంగా మాత్రమే తగ్గింది. తెలంగాణాలో పెరిగింది. రెండు రాష్ట్రాలు సంక్షేమ పధకాలను అమలు జరుపుతున్నప్పటికీ మిగతావాటితో పోల్చినపుడు పరిస్థితి పెద్దగా తేడాలేదు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా మాదిరి సంక్షేమ పధకాలు లేని కేరళలో రక్తహీనత సమస్య ఉన్నప్పటికీ తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే చాలా తక్కువగా ఉంది. ఓట్ల కోసం మహిళలను మునగ చెట్టు ఎక్కించటానికి చూస్తారు. స్వయం సహాయక బృందాల ద్వారా లక్షాధికారి అక్కలు తయారైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం ఏలుబడిలోనే మొత్తం పరిస్థితి మారిపోయి ఉండేది. అందువలన తుపాకి రాముడి మాటలను నమ్మితే మరోసారి మోసపోవటమే !

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !
  • ఆ గట్టునుంటావా ఈ గట్టుకొస్తావా : నరేంద్రమోడీకి విషమ పరీక్ష పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • జర్మన్‌ హిట్లర్‌ బాటలో శాస్త్రవేత్తలను బయటకు పంపుతున్న ట్రంప్‌ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !
  • ఆ గట్టునుంటావా ఈ గట్టుకొస్తావా : నరేంద్రమోడీకి విషమ పరీక్ష పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • జర్మన్‌ హిట్లర్‌ బాటలో శాస్త్రవేత్తలను బయటకు పంపుతున్న ట్రంప్‌ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !
  • ఆ గట్టునుంటావా ఈ గట్టుకొస్తావా : నరేంద్రమోడీకి విషమ పరీక్ష పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • జర్మన్‌ హిట్లర్‌ బాటలో శాస్త్రవేత్తలను బయటకు పంపుతున్న ట్రంప్‌ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d