ఓ రామరాజ్యం, ఓ అపర శ్రీరామ చంద్రుడు, ఓ మణిపూర్‌, ఓ సందేశ్‌ఖాలి !

Tags

, , , , , , ,


ఎం కోటేశ్వరరావు


ఐదు వందల సంవత్సరాల నాటి కల రామాలయ నిర్మాణం జరిగింది, ఇక రామరాజ్యమే తరువాయి అని నరేంద్రమోడీ భక్తులు జనాన్ని నమ్మించేందుకు చూస్తున్నారు. కొందరైనా నిజమే అనుకుంటున్నారు. మరోవైపు రామరాజ్యం గురించి నేతలు చెబుతున్నదేమిటి ? దేశంలో జరుగుతున్నదేమిటి ? పదేండ్ల క్రితం నరేంద్రమోడీ అచ్చేదిన్‌(మంచి రోజులు) గురించి చెప్పారు. ఇప్పుడు కొత్తగా హామీలు, గారంటీలు అనే కొత్త పల్లవి ఎత్తుకున్నారు తప్ప దాని ఊసే ఎత్తటం లేదు. ఆడిన మాట తప్పని వారసులు కదా , పాతవాటిని చెప్పరు ! రాముడి సుగుణాల గురించి చెప్పేవారు తండ్రి మాట జవదాటని ఉత్తముడు అంటారు. ఆ రాముడిని ఆదర్శంగా తీసుకున్నాం అని చెప్పుకొనే నరేంద్రమోడీ అచ్చేదిన్‌ గురించి ఎందుకు మాట్లాడటం లేదు, మంచి రోజులు వస్తే వచ్చాయని లేకపోతే ఎంతకాలం పట్టేది చెప్పాలా లేదా ? అసలు రామరాజ్యం అంటే ఏమిటి ? నరేంద్రమోడీ, బిజెపి గత పది సంవత్సరాల కాలంలో వాటిలో ఏ ఒక్కదాన్ని అయినా పాటించిందా ? గుజరాత్‌లో గోద్రా రైలు దగ్దం తరువాత జరిగిన మారణకాండ సమయంలో మోడీ రాజధర్మం పాటించాలని ఏకంగా అతల్‌ బిహారీ వాజ్‌పాయి చెప్పాల్సి వచ్చిందంటే తండ్రి మాట ప్రకారం అరణ్యవాసం వెళ్లిన రాముడి ఆదర్శాన్ని ఉల్లంఘించినట్లే కదా, ముఖ్యమంత్రిగా చేయాల్సింది చేయాలన్నారు తప్ప గద్దె దిగాలని వాజ్‌పాయి చెప్పలేదు. వాల్మీకి రామాయణం ప్రకారం రాముడి పాలనలో ఏ మహిళా వితంతువు కాలేదు, క్రూరమృగాల నుంచి ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదు. రోగాల గురించి భయం లేదు. ప్రపంచానికి బందిపోట్ల బెడదతప్పింది.తాము పనికిరాని వారమని ఎవరూ భావించలేదు.యువకులకు ముసలి వారు కర్మకాండలు చేయలేదు. అందరూ సంతోషపడ్డారు. సకల జనులూ ధర్మం మీద కేంద్రీకరించారు. అందరూ ఒక ఆదర్శపురుషుడిగా రాముడి వైపే చూశారు. ఒకరిని ఒకరు చంపుకోలేదు.అంతర్జాలం(ఇంటర్నెట్‌)లో ఉన్న సమాచారం ప్రకారం (వాల్మీకి రామాయణం, యుద్ధకాండ, సర్గ 128, 95 నుంచి 106 శ్లోకాలు) రాముడి పాలనలో జనాలు అవాస్తవాలు చెప్పకుండా ధర్మం మీదనే కేంద్రీకరించారు. అందరూ అద్భుతమైన వ్యక్తిత్వ లక్షణాలను కలిగి ఉన్నారు. అందరూ ధర్మానికి కట్టుబడి ఉన్నారు. ఆ విధంగా రాముడు వేలాది సంవత్సరాలు రామరాజ్యన్ని ఏలాడు.


అబ్బే ఇప్పుడు చెబుతున్నది అసలైన సనాతన ధర్మం కాదు అని చెప్పేవారు కొందరు. వర్తమాన భాష్యాలతో ఉన్న మనుస్మృతిని రాముడు అసలు పాటించలేదు. రాజగురువు, ప్రధాన సలహాదారైన బ్రహ్మరిషి విశ్వామిత్ర మార్గదర్శనంలో వశిష్ట ధర్మ సూత్రాలను పాటించాడు అని చెప్పేవారు కొందరు.ఇప్పుడు ఏది ఉనికిలో ఉందో, దాని సంగతి ఏమిటో, వేల సంవత్సరాలుగా అది కలిగించిన దుష్టప్రభావానికి కారణం ఏమిటో మాత్రం చెప్పరు.సనాతన ధర్మాన్ని పాటించాలి, పరిరక్షించాలి అంటున్నారు. దీని అర్ధం రాజ్యాంగాన్ని ఆ విధంగా తిరగరాయమనా ? ఇక నిత్యం రామభజన చేస్తున్నవారు, రామరాజ్యం గురించి చెబుతున్నవారేమంటున్నారు.2024 జనవరి 16వ తేదీ పత్రికల్లో వచ్చిన ఒక వార్త శీర్షిక ఇలా ఉంది.” రామరాజ్య నియమాలనే ప్రభుత్వం అనుసరిస్తున్నది, ఆదాయాన్ని సంక్షేమానికి ఖర్చు చేస్తున్నది : ప్రధాని మోడీ ”. ఆయోధ్యలో రామాలయ ప్రతిష్ట కార్యక్రమానికి ముందు పదకొండు రోజుల అనుష్ఠానంతో దేశంలో వివిధ గుళ్లు గోపురాలను సందర్శించిన సందర్భంగా నరేంద్రమోడీ రామచరిత మానసతో సహా అనేక హిందూ పురాణాలను ఉటంకిస్తూ చెప్పిన మాటలకు పెట్టిన పేరది. నిష్టలో ఉన్న మోడీ వాస్తవాలను చెప్పారా, మరొకటా ? గడచిన తొమ్మిది సంవత్సరాలలో పాతిక కోట్ల మందిని దారిద్య్రం నుంచి బయటపడవేసినట్లు,పది కోట్ల మంది నకిలీ లబ్దిదారులను ఏరివేసినట్లు కూడా చెప్పారు.( ఇంత ప్రగతి సాదించి రామరాజ్యాన్ని నెలకొల్పితే ఎనభై కోట్ల మందికి మరో ఐదు సంవత్సరాల పాటు ఉచితంగా ఆహార ధాన్యాలు ఇస్తున్నట్లు ఎందుకు ప్రకటించినట్లు ? దారిద్య్రం నుంచి బయటపడినా నెలకు ఐదు కిలోల ధాన్యం కూడా కొనుగోలు చేయలేని దుస్థితిలో జనం ఉన్నారని అర్ధమా ? రామరాజ్యంలో ఇలాగే ఉందా ? )


అతని కంటే ఘనుడు ఆచంట మల్లన అన్నట్లు రక్షణ మంత్రి రాజనాధ్‌ సింగ్‌ గారు మరొక అడుగు ముందుకు వేసి బిజెపి జాతీయ సమావేశంలో మాట్లాడుతూ రామరాజ్య భావనను ప్రధాని మోడీ ఎంతో సమర్దవంతంగా అమలు జరిపినట్లు, రామరాజ్యం సిద్ధించినట్లు ఆకాశానికి ఎత్తారు. దానికి వికసిత భారత్‌ అని ముద్దుపేరు పెట్టారు. రాముడు పదమూడు సంవత్సరాలు అరణ్యవాసం గడిపినట్లు రామాయణం చెబితే యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్‌ ఐదు వందల సంవత్సరాల తరువాత రాముడు ఆయోధ్యకు వచ్చాడని చెప్పారు. వికసిత భారత్‌ తీర్మానంలో పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలో మహిళలపై జరిగిన దారుణాలను ఖండిస్తూ ఒక మహిళ పాలనలో ఇలా జరగటం సిగ్గుచేటని బిజెపి పేర్కొన్నది. నిజమే, కానీ బిజెపి రామరాజ్య పాలనలో మణిపూర్‌లో ఇద్దరు మహిళలను వివస్త్రలను చేసి ఊరేగించటం మర్యాదా, సిగ్గుచేటా ? కనీసం అలాంటి ఉదంతం జరగటం విచారకరం అని కూడా ప్రకటించని మర్యాద పురుషోత్తములు.బిజెపి ఎంపీ బ్రిజ్‌భూషణ్‌ మహిళా రెజ్లర్స్‌ను లైంగికంగా వేధించిన సంఘటనలు దేశంలో కలిగించిన సంచలనం తెలిసిందే.ఇక గుజరాత్‌ బిల్కిస్‌ బానూ ఉదంతం తెలిసిందే. ఆమె మీద జరిగిన సామూహిక అత్యాచారం కేసులో యావజ్జీవ శిక్షలు పడిన వారు సత్‌ ప్రవర్తన కలిగిన బ్రాహ్మణులని కితాబు నిస్తూ శిక్ష పూర్తిగాక ముందే విడుదల చేసి సన్మానాలు చేసిన రామభక్తులను దేశం మరచిపోగలదా ! సుప్రీం కోర్టు ఆ నిర్ణయాన్ని రద్దు చేసి తిరిగి వారిని జైలుకు పంపిన సంగతి తెలిసిందే. ఇవన్నీ అపర శ్రీరాముడి ఏలుబడిలో జరిగినవే సుమా ? ఒక్కో ఉదంతం పట్ల ఒక్కో వైఖరి, శ్రీ రామరాజ్యంలో ఇలాగే జరిగిందా?


అయోధ్య రామరాజ్యంలో రోగాల భయం లేదని చెబుతారు. కానీ అపర శ్రీరామ చంద్రుడిగా నీరాజనాలు అందుకుంటున్న నరేంద్రమోడీ రామరాజ్యంలో ఎనిమిది సంవత్సరాల ఏలుబడి తరువాత 2022లో ప్రపంచంలో బయటపడిన టిబి కేసుల్లో భారత్‌లో నూటికి 27 ఉన్నాయి.2025 నాటికి ఆ వ్యాధిని అంతరింప చేస్తామని 2023లో మన దేశంలో జరిగిన ప్రపంచ టీబి సభలో దీక్షపూనారు. జరిగేదేనా ? దేశంలో ఆరోగ్యం మీద చేస్తున్న ఖర్చు ఏడాదికేడాది తగ్గిపోతున్నది. జనాభాలో అగ్రదేశంగా ఎదిగామని, దీనితో అద్భుతాలు సృష్టించవచ్చని చెప్పుకుంటే చాలదు.వారంతా ఆరోగ్యంగా ఉంటేనే, లేకపోతే జరిగే నష్టం ఎక్కువ.కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య ఖాతాకు 2021-22లో 3.6శాతం కేటాయించగా మరుసటి ఏడాదికి అది 2.7కు, 2023-24కు 2.4శాతానికి కోత పడింది.2022-23కేటాయింపులో సవరించిన బడ్జెట్‌లో మరో15శాతం కోత విధించారు.ఇక జిడిపి పరంగా చూస్తే 2020-21లో1.23శాతం ఉన్నది 2023 ఆర్థిక సంవత్సరంలో 1.19, మరుసటి సంవత్సరం 1.17శాతానికి తగ్గింది. ప్రపంచ ఆర్థికవేదిక, ప్రజారోగ్య హార్వర్డ్‌ స్కూలు అధ్యయనం 2014 ప్రకారం వ్యాధులు, మానసిక అనారోగ్యం కారణంగా 2012 – 2030 కాలంలో 4.58లక్షల కోట్ల డాలర్ల మేర మన దేశం నష్టపోనుందని అంచనా. దీనిలో గుండె సంబంధిత వ్యాధుల వలన 2.17లక్షల కోట్ల డాలర్లు, మానసిక రుగ్మతల కారణంగా 1.03లక్షల కోట్ల డాలర్లు నష్టమని పేర్కొన్నారు.(టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా 2023 ఏప్రిల్‌ ఏడవ తేదీ సంచికలో ఐదులక్షల కోట్లడాలర్ల జిడిపి కల మీ ఆరోగ్యం మీద ఆధారపడి ఉంది అనే శీర్షికతో ప్రచురించిన విశ్లేషణ).2019లో గాలి కాలుష్యంతో తలెత్తిన అనారోగ్యం వలన జిడిపికి 1.36శాతం నష్టం(36.8 బిలియన్‌ డాలర్లు) జరిగింది.


ఇక అచ్చేదిన్‌ తీరు తెన్నులు చూద్దాం. నాలుగు సంవత్సరాల నరేంద్రమోడీ ఏలుబడి తరువాత 2018-2023 ఆగస్టు వరకు వివిధ రాష్ట్రాలలో ఉన్న నిత్యావసర వస్తువుల ధరల గురించి కేంద్రమే ప్రకటించింది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సేకరించిన సమాచారాన్ని 2023 ఆగస్టు నాలుగవ తేదీన రాజ్యసభలో వినియోగదారుల శాఖ మంత్రి అశ్వనీకుమార్‌ చౌబే ఇచ్చిన రాతపూర్వక సమాచారం మేరకు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణాల్లో కొన్ని సరకుల ధరల పెరుగుదల తీరుతెన్నులు దిగువ విధంగా ఉన్నాయి.కిలో ఒకటికి రు.లలో, బియ్యం సాధారణ రకం. కొన్ని రాష్ట్రాలలో ధరలు ఇంకా ఎక్కువగా కూడా ఉన్నాయి. ఈ పెరుగుదలకు అనుగుణంగా వేతనాలు, కుటుంబాల ఆదాయం పెరిగిందా అన్నది ప్రశ్న.
.రాష్ట్రం×× ఏడాది × బియ్యం ×గోధుమ×కందిపప్పు×మినప××పల్లీ నూనె×సన్‌ఫ్లవర్‌×బంగాళాదుంప
తెలంగాణా 2018 ×× 28.05 ××27.61 ××75.30 ××80.85 ×× 108 ×× 86.45 ××22.17
తెలంగాణా 2023 ×× 44.79 ××37.20 ××111.70 ××111 ××169.20××149.10 ××27.15
ఆంధ్ర ప్రదేశ్‌ 2018×× 31.63 ×× 29.08××66.41 ××73.19 ××106.90 ××87.76 ××19.06
ఆంధ్రప్రదేశ్‌ 2023 ×× 51.52 ××40.96 ××122.80 ××120 ××176.20 ××140.30 ×× 30.76


అచ్చేదిన్‌ అంటే ఏటిఎంలో డబ్బు మాదిరి వెంటనే రావని అనుకుందాం. కానీ పదేండ్ల తరువాత పరిస్థితిని చూసిన తరువాత కూడా మోడీ గ్యారంటీలను నమ్మగలమా ? గడచిన పది సంవత్సరాల్లో ధరలు 62శాతం పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అవన్నీ తప్పు అనుకొనే వారిపట్ల జాలిచూపటం తప్ప ఏమీ చేయలేం, అనలేం. నెలవారీ తలసరి వినియోగ ఖర్చుకు(ఎంపిసిఇ) సంబంధించిన సమాచారం ఇటీవలనే అందుబాటులోకి వచ్చింది.దాని ప్రకారం 1999-2000 నుంచి 2022-23వరకు వినియోగ ఖర్చు గణనీయంగా పెరిగినట్లు కనిపిస్తోంది. పులిమీద పుట్ర మాదిరి 2012-13 నుంచి పది సంవత్సరాల కాలంలో గోడదెబ్బ-చెంపదెబ్బ అన్నట్లు ద్రవ్యోల్బణం పెరుగుదల, నిజవేతనాలు గిడసబారటంతో అనేక మంది జీవితాలు దిగజారి దుర్భరమయ్యాయి. ఆదాయం పెరిగిన కొద్దీ పరిస్థితి మెరుగుపడిందని చెప్పిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఉదాహరణకు నెలకు లక్షరూపాయల పైబడి రాబడి వచ్చేవారిలో 55శాతం మంది మెరుగ్గా ఉన్నట్లు చెప్పగా 25శాతం మంది దిగజారినట్లు చెప్పారు.వివరాలు దిగువ విధంగా ఉన్నాయి. దీన్ని బట్టి ఎవరికి వారు ఏ తరగతిలో ఉన్నదీ, గడచిన పది సంవత్సరాల్లో పరిస్థితి మెరుగుపడిందా, దిగజారిందా అన్నది అవలోకించుకోవచ్చు.
రాబడి××××××××× మెరుగుదల×× దిగజారుడు
లక్షకుపైగా ×××××× 55 ×× 25
50వేలు-లక్ష ××××× 47 ×× 30
25-50వేలు ××××× 38 ×× 38
10-25వేలు ××××× 32 ×× 44
5-10వేలు ××××× 28 ×× 52
5వేలలోపు ××××× 21 ×× 62


మన దేశంలో మధ్య తరగతి అంటే ఏమిటన్నదానికి నిర్దిష్టమైన నిర్వచనం లేదు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తాను మధ్య తరగతికి చెందిన మహిళను గనుక వారి ఇబ్బందులు తెలుసు అని చెప్పారు. మంత్రిగా ఆమె రాబడి స్వయంగా ఇచ్చిన వివరాల ప్రకారం 2016-17లో రు. 5,85,580 ఉండగా 2018-19లో రు. 10,62,250, మరుసటి ఏడాది 10,38లక్షలకు, 2020-21లో 8.08లక్షలని పేర్కొన్నారు. ఇక ఆమెకు ఉన్న చరాస్తులు రు.63.39లక్షలని, స్థిరాస్తులు రు.1.87 కోట్లని పేర్కొన్నారు. ప్రైస్‌ రీసర్చ్‌ అనే సంస్థ నిర్వచనం ప్రకారం ఏడాదికి రు.30లక్షలకు మించి సంపాదించే వారు ధనికులు, 5 నుంచి 30లక్షల వరకు మధ్య తరగతి, 1.5 నుంచి 5 లక్షల వారు తరువాత తరగతి, 1.25లక్షల కంటే తక్కువ వచ్చేవారు అభాగ్యులు.మాస్టర్‌ కార్డు 2021లో పేర్కొన్నదాని ప్రకారం దేశంలోని ఎగువ 20శాతం మంది ధనికులు ఏటా రు.3,94,271 సంపాదిస్తున్నారు, మధ్యతరగతి రు.1,51,651, పేదలు రు.80,529 సంపాదిస్తున్నారు.అప్లయిడ్‌ ఎకనమిక్‌ రిసర్చ్‌ జాతీయ మండలి 2010లో సేకరించిన సమాచారం ప్రకారం మధ్య తరగతి అంటే రెండు-పది లక్షల మధ్య సంపాదించేవారు, తరువాత తరగతి 90వేల నుంచి రెండులక్షలు, అభాగ్యులు తొంభైవేల కంటే తక్కువ సంపాదించే వారు అని పేర్కొన్నారు. దీన్ని బట్టి మనం రామరాజ్యంలో ఉన్నామో లేదో , ఏ తరగతిలో ఉన్నామో ఎవరికి వారు నిర్ణయించుకోవాలి.

అబూదాబీలో అద్భుతం జరగనుందా ?

Tags

, , , , , , ,


ఎం కోటేశ్వరరావు


అబూదాబీలో ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటిఓ) సభ్య దేశాల మంత్రుల పదమూడవ సమావేశం(ఎంసి13) ఫిబ్రవరి 26-29 తేదీలలో జరుగుతున్నది. ఈ సమావేశాలలో ప్రతిదేశం తన అజెండాను ముందు పెట్టి దానికి మద్దతు కూడగడుతున్నది. రాజధాని ఢిల్లీలో సమావేశమయ్యేందుకు బయలు దేరిన రైతులను ఒక వైపు పంజాబ్‌-హర్యానా సరిహద్దుల్లో ఢిల్లీకి రెండువందల కిలోమీటర్ల దూరంలో ఫిబ్రవరి 13 నుంచి హర్యానా బిజెపి ప్రభుత్వం నిలువరించింది. ఆటంకాలను అధిగమించి ముందుకు వస్తే అడ్డుకునేందుకు రోడ్ల మీద కందకాలు, శత్రుదేశం దండెత్తి వచ్చినపుడు ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన మాదిరి అన్ని చర్యలతో ఢిల్లీలో నరేంద్రమోడీ ప్రభుత్వ పోలీసులు కాచుకొని ఉన్నారు.ఐరోపాలో అనేక దేశాల్లో రైతులు తమ సమస్యల మీద ఉద్యమిస్తున్నారు. డబ్ల్యుటిఓ నిబంధనలు రైతాంగానికి నష్టదాయకంగా ఉన్నందున దాన్నుంచి తప్పుకోవాలని దేశమంతటా రైతులు వివిధ రూపాల్లో డిమాండ్‌ చేశారు.ఈ పూర్వరంగంలో అబుదాబీలో ఏం జరగనుందనేది ఆసక్తికరంగా మారనుంది.గతంలో మాదిరి మన ప్రభుత్వం లొంగిపోతుందా ? దేశ పౌరుల ప్రయోజనాలను కాపాడుతుందా ?


ప్రపంచ వాణిజ్య సంస్థ పేరులోనే కార్పొరేట్ల వాణిజ్య ప్రయోజనాలను కాపాడేందుకు ఏర్పడిందన్న భావం ధ్వనిస్తున్నది. ప్రతిదీ లాభనష్టాల లెక్కలు తప్ప వాటికి మరొకటి పట్టదు.అక్కడ కూడా పేద-ధనిక దేశాల పెనుగులాటే జరుగుతున్నది. తమకు అనుకూలంగా ఉంటే డబ్ల్యుటిఓ నిబంధనలను అమలు జరపాలని ధనిక దేశాలు పట్టుబడతాయి. లేదనపుడు దాన్ని పక్కన పెట్టి విడివిడిగా దేశాలతో ఒప్పందాలు చేసుకుంటున్నాయి. మొత్తంగా చూసినపుడు ధనిక దేశాలకు అనుకూలంగానే ఆ సంస్థ నిబంధనలు ఉన్నాయి. వాటిని సంస్కరించాలని పేద దేశాలు పట్టుబడుతుండగా మరింతగా తమకు అనుకూలంగా మలచుకోవాలని ధనిక దేశాలు చూస్తున్నాయి. అందుకే అనేక అంశాల మీద దశాబ్దాల తరబడి ఒప్పందాలు కుదరక ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. కతార్‌లోని దోహాలో 2001లో ప్రపంచ వాణిజ్య చర్చలు ప్రారంభమయ్యాయి. అందుకే వీటిని దోహా దఫా చర్చలు అని పిలుస్తున్నారు. అప్పటి నుంచి ఇప్పుడు అబూదాబీ వరకు పదమూడు సార్లు మంత్రులు చర్చలు జరిపారు. వ్యవసాయ సబ్సిడీలకు సంబంధించి 2008లో ఏర్పడిన ప్రతిష్ఠంభన ఇప్పటికీ కొనసాగుతోంది. ముగింపు పలకాలని 2015లో అమెరికా కోరింది. చర్చలకు కాలం చెల్లిందని, దోహా దఫా ముగిసినట్లేనని 2017లో అనేక మంది విశ్లేషకులు వ్యాఖ్యానించారు. అయితే నైరోబీలో 2015లో జరిగిన మంత్రుల పదవ సమావేశంలో సంప్రదింపులు కొనసాగించాలని సభ్యులందరూ చెప్పినందున కొనసాగుతాయని డబ్ల్యుటిఓ ప్రకటించింది. తరువాత కూడా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది.


ప్రపంచ వాణిజ్య సంస్థ రూపొందించిన నిబంధనల ప్రకారం అభివృద్ధి చెందిన దేశాలు తమ వ్యవసాయ ఉత్పత్తుల మొత్తం విలువలో ఐదు, వర్ధమాన దేశాలు పదిశాతం వరకు సబ్సిడీలు ఇవ్వవచ్చు.భారత్‌, చైనా వంటి దేశాలు అంతకు మించి ఎక్కువే ఇస్తున్నాయని, భారత్‌ 60-70శాతానికి సమంగా ఇస్తున్నట్లు ఆరోపించిన అమెరికా ఆ మేరకు డబ్ల్యుటిఓకు ఫిర్యాదు చేసింది. అదే విధంగా ప్రభుత్వం ఆహార ధాన్యాలను నిల్వచేయటాన్ని దానికోసం ఎఫ్‌సిఐ నిర్వహణ, ప్రజాపంపిణీ వ్యవస్థలను కూడా వ్యతిరేకిస్తున్నాయి.ఈ కారణంగానే అమెరికా, తదితర ధనిక దేశాలను సంతుష్టీకరించేందుకు వీటికి ఎసరు పెట్టే ఎత్తుగడలో భాగంగా మూడు సాగు చట్టాలను రాష్ట్రాలతో సంప్రదించకుండా, పార్లమెంటరీ కమిటీకి పంపకుండా హడావుడిగా 2020లో ఆమోదించిన సంగతి తెలిసిందే. వాటిని వెనక్కు తీసుకున్న తరువాత ఇప్పుడు కనీస మద్దతు ధరలకు చట్టబద్దత కల్పించటం కుదిరేది కాదని, కావాలంటే మూడు రకాల పప్పులు, పత్తి, మొక్కజొన్నలను ఐదేండ్ల పాటు కనీస మద్దతు ధరలకు కొంటామని, అది కూడా రైతులు పంటమార్పిడి పద్దతిని అనుసరిస్తేనే అనే షరతు పెట్టారు. దీనికి అంగీకరిస్తే రైతుల కొంప కొల్లేరే.


మన దేశంలో వ్యవసాయం తరువాత ఎక్కువ మందికి ఉపాధితో పాటు రాబడి కల్పిస్తున్నది పాడి పరిశ్రమ. దీనికి కూడా ధనిక దేశాలు ఎసరు పెట్టాయి. డబ్ల్యుటిఓ పేరుతో పాల ఉత్పత్తులను దిగుమతి చేసుకోవాలని వత్తిడి చేస్తున్నాయి.ఆ ప్రమాదం మెడమీద కత్తిలా వేలాడుతూనే ఉంది. స్టాటిస్టా సంస్థ సమాచారం ప్రకారం ఐరోపా యూనియన్‌లోని 27 దేశాల జనాభా 49 కోట్లు కాగా ఆక్కడ పాల ఉత్పత్తి 2023లో 14.3 కోట్ల టన్నులు, నూటనలభై కోట్ల మంది ఉన్న మన దేశంలో పది కోట్ల టన్నులు, అమెరికాలో 10.4 కోట్ల టన్నులు, చైనాలో 5 కోట్ల టన్నులు ఉంది. కేవలం 52లక్షల జనాభా ఉన్న న్యూజిలాండ్‌ రెండు కోట్ల టన్నులు ఉత్పత్తి చేస్తున్నది. ఒక్క చైనా మినహా మిగిలిన దేశాలన్నీ పెద్ద ఎత్తున పాలు, పాల ఉత్పత్తులకు సబ్సిడీలు ఇచ్చి కారుచౌకగా మన దేశంలో కుమ్మరించాలని చూస్తున్నాయి. అదే జరిగితే పాడి రైతులు కుదేలు కావటం ఖాయం. గతంలో రైతులు, పారిశ్రామిక, వాణిజ్యవేత్తల నుంచి వచ్చిన వత్తిడి, దానిలో అమెరికా భాగస్వామిగా లేనందున ఆర్‌సిఇపి ఒప్పందంలో చేరేందుకు మన దేశం తిరస్కరించింది. లేకుంటే ఇప్పటికే న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా నుంచి పాల ఉత్పత్తులు ఇబ్బడి ముబ్బడిగా వచ్చి ఉండేవి. వచ్చే20 సంవత్సరాల వరకు పాల ఉత్పత్తులను దిగుమతి చేసుకోకుండా ఉంటేనే మన పరిశ్రమ మనుగడలో ఉంటుందని ఒక నివేదిక పేర్కొన్నది. పదమూడు సంవత్సరాల పాటు అముల్‌ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా పనిచేసి 2023 చివరిలో తప్పుకున్న ఆర్‌ఎస్‌ సోధీ దిగుమతుల గురించి హెచ్చరించారు. అమెరికా, ఐరోపాయూనియన్‌, ఇతర దేశాలతో స్వేచ్చావాణిజ్య ఒప్పందాలు, వాటి ఉత్పత్తులకు అనుమతి ఇస్తే పరిస్థితిని ఊహించలేమని కేంద్ర మంత్రి పియూష్‌ గోయల్‌కు రాసిన లేఖలో స్పష్టం చేశారు.న్యూజిలాండ్‌లో స్థానిక అవసరాల కంటే 14 రెట్లు ఎక్కువ ఉత్పత్తి జరుగుతోందని వారు మనదేశం మీద కన్నువేశారని చెప్పారు. మన దేశంలో సగానికి పైగా పాడి పరిశ్రమ అసంఘటిత రంగంలో ఉన్నందున ముందు రైతులు దెబ్బతింటారు.


పాడి తరువాత మనదేశంలో కోళ్ల పరిశ్రమ ముఖ్యమైనది. ఈ రంగంలో తన ఉత్పత్తులను కుమ్మరించాలని అమెరికా చూస్తున్నది.ప్రపంచ వాణిజ్య సంస్థలో మన మీద దాఖలు చేసిన కేసులో అమెరికా గెలిచింది. ఆ సాకుతో కోళ్ల ఉత్పత్తుల దిగుమతి పన్నును భారీగా తగ్గించేందుకు నరేంద్రమోడీ సర్కార్‌ అంగీకరించింది. గతంలో యుపిఏ ప్రభుత్వం అమెరికాలో వచ్చిన బర్డ్‌ఫ్లూ కారణంగా అమెరికా నుంచి దిగుమతులపై 2007లో నిషేధం విధించింది. వ్యాధి తగ్గిన తరువాత కూడా దాన్ని ఎత్తివేయలేదంటూ అమెరికా కేసు దాఖలు చేసింది.దాని మీద 2014 అక్టోబరులో తీర్పు వచ్చింది. తొలి రోజుల్లో అమలు చేసేందుకు నరేంద్రమోడీ సర్కార్‌ అంగీకరించకపోయినా, వాణిజ్య ఆంక్షలకు పూనుకుంటామని అమెరికా బెదిరించటంతో దిగుమతులతో పాటు అప్పటి వరకు ఉన్న పన్ను మొత్తాన్ని ఐదు శాతానికి తగ్గించేందుకు 2017లో మోడీ అంగీకరించారు. మన దేశంలోని కోళ్ల పరిశ్రమ దీన్ని తీవ్రంగా వ్యతిరేకించటంతో దిగుమతులు ప్రారంభం కాలేదు. దీనికి ప్రతిగా మన దేశం నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువులపై ఇస్తున్న 600 కోట్ల డాలర్ల మేర రాయితీ పన్ను డోనాల్డ్‌ ట్రంప్‌ రద్దు చేసి మన ఎగుమతులను దెబ్బతీశాడు. దీనితో పాటు మరికొన్ని వివాదాలు కొనసాగుతుండటంతో కోళ్ల ఉత్పత్తుల దిగుమతులు అమలు కాలేదు. ఇప్పటికీ అదే పరిస్థితి. ఈలోగా మన రైతులు అమెరికా కోడి కాళ్ల దిగుమతులను అనుమతించకుండా నిరోధించాలని సుప్రీం కోర్టుకు వెళ్లారు, ఆ కేసు ఇంకా తేలలేదు.ప్రస్తుతం అమెరికా కోళ్ల ఉత్పత్తులపై దిగుమతి పన్ను వందశాతం ఉంది. అయినప్పటికీ అక్కడి నుంచి దిగుమతి చేసుకుంటే మన మార్కెట్‌ ధరల కంటే తక్కువకు విక్రయించవచ్చని చెబుతున్నారు. మన వినియోగదారులకు తక్కువ ధర కావాలి గనుక మాంసం ఎక్కడిదన్నదానితో నిమిత్తం ఉండదు. మనదేశంలో ఒక టన్ను కోడి మాంసానికి 1,800 డాలర్లు ఖర్చు అవుతుంది. అదే అమెరికాలో 700 నుంచి 800 డాలర్లు, ఈ లెక్కన వందశాతం పన్ను చెల్లించి దిగుమతి చేసుకున్నప్పటికీ 1,500-1,600 డాలర్లకే అందించవచ్చు.అమెరికా పౌరులు కోడి కాళ్లను తినరు గనుక మనకు మరింత చౌకగా దొరుకుతాయి.


వ్యవసాయంతో పాటు అన్ని రకాల సబ్సిడీలను పరిమితం చేయాలి లేదా తొలగించాలన్నది ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధన. ఆ దిశగానే పదేండ్ల మోడీ పాలన సాగింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, బడ్జెట్‌, జిడిపిలతో పోలిస్తే వాస్తవ కేటాయింపు తగ్గుతున్నది. ఉదాహరణకు ఎరువుల సబ్సిడీ తీరు తెన్నులు చూద్దాం. యుపిఏ పాలనా కాలంలో 2008-2009 నుంచి 2013-14వరకు ఆరేండ్ల కాలంలో సగటున ఏడాదికి ఎరువులకు ఇచ్చిన సబ్సిడీ రు.59వేల కోట్లు. నరేంద్రమోడీ ఏలుబడి తొలి ఆరు సంవత్సరాల సగటు 71వేల కోట్లు ఉంది. ప్రపంచ వాణిజ్య సంస్థ సబ్సిడీలకు తీసుకున్న ప్రాతిపదికతో మనదేశంతో సహా అనేక దేశాలు నష్టపోతున్నాయి.1986-1988లో ఉన్న ధరలను ప్రాతిపదికగా తీసుకొని వర్ధమాన దేశాలలో మొత్తం వ్యవసాయ ఉత్పత్తుల విలువలో పదిశాతం సబ్సిడీలుగా ఇవ్వవచ్చు. అదే ఇప్పటికీ కొనసాగుతున్నది. ఈ కాలంలో పెరిగిన ద్రవ్యోల్బణం, పెరిగిన విలువను పరిగణనలోకి తీసుకోవాలని వర్ధమాన దేశాలు కోరుతున్నాయి. నిబంధనల్లో పీస్‌ క్లాజ్‌ అని ఒకటి ఉంది. దీన్నే సంధి కాలం అని కూడా అంటున్నారు. దీని ప్రకారం ఏవైనా ప్రభుత్వాలు సేకరించిన ఆహార ధాన్యాలను ఎగుమతి చేయకూడదు. అయితే గత సంవత్సరం, ఈ ఏడాది దేశంలో ఆహార ధరలు పెరిగిన కారణంగా కేంద్ర ప్రభుత్వం బహిరంగ మార్కెట్‌లో బియ్యం, గోధుమలను విక్రయిస్తున్నది. దీన్ని ఇతర దేశాలు తప్పు పడుతున్నాయి.ఇవి అంతర్జాతీయ మార్కెట్లకు చేరుతున్నాయని, ఇది నిబంధనలను ఉల్లంఘించటమే అని అభ్యంతరాలు తెలుపుతున్నాయి.


ప్రపంచ వాణిజ్య సంస్థలో తనకున్న పలుకబడిని ఉపయోగించుకొని అమెరికా రక్షణ చర్యలకు పాల్పడుతోంది. అబుదాబీ సమావేశంలో కూడా ఈ దిశలోనే తన అజెండాను ముందుకు నెట్టవచ్చు. ఈ సంస్థ అప్పీళ్ల విచారణ కోర్టులో న్యాయమూర్తుల నియామకాన్ని అడ్డుకొంటున్న కారణంగా 2019 నుంచి ఎలాంటి విచారణలూ లేవు. ఏడాదికేడాది వివాదాలు పెరుగుతున్నాయి. అమెరికా ప్రయోజనాలకే అగ్ర పీఠం అనే పద్దతిలో ఆలోచించటం, ఆ దిశగా ముందుకు పోవటం ఇటీవలి కాలంలో పెరిగింది. దానిలో భాగంగానే మనకు ఉపయోగపడని, మన మాట చెల్లుబాటుగాని డబ్ల్యుటిఓ నుంచి వైదొలగాలని అమెరికాలోని కొందరు తమ ప్రభుత్వం మీద వత్తిడి తెస్తున్నారు. ఇతర దేశాల ఉత్పత్తుల మీద దిగుమతి సుంకాలు విధిస్తూ బస్తీమే సవాల్‌ అంటున్నారు. ప్రపంచీకరణ తెచ్చిన తిరోగమన పరిణామాలు, పర్యవసానాల పూర్వరంగంలో ప్రపంచీకరణకు వ్యతిరేకత వెల్లడవుతున్నది. ఈ కారణంగానే డబ్ల్యుటిఓలో సంస్కరణలు తేవాలన్న వాంఛకు మద్దతు పెరుగుతున్నది.తనకు దక్కని ప్రయోజనాలను అమెరికా అంగీకరిస్తుందా ? ప్రపంచ వాణిజ్య సంస్థను ఒక ఆయుధంగా మలచుకొని ఇతర దేశాలను దెబ్బతీస్తుందా ? ధనిక దేశాల కూటమిని వెనక్కు కొట్టే అద్భుతం జరుగుతుందా ? అబుదాబీలో ఏం జరుగనుందో అని అన్ని దేశాలూ ఎదురు చూస్తున్నాయి.

కృష్ణా గోదావరి బేసిన్లో చమురు, గ్యాస్ – కష్టాలు మాకు, సంపద మీకా?

Tags

, , ,

డాక్టర్ కొల్లా రాజమోహన్,

          కృష్ణ – గోదావరి బేసిన్ ఆంధ్ర రాష్ట్రంలోని తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా,గుంటూరు జిల్లాలలో వ్యాపించి ఉన్నది. ఇది భూఉపరితల పరంగా చూస్తే 28 వేల చదరపు కిలోమీటర్లలోను, సముద్రగర్భంలో 24 వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉంది. కేంద్ర పభ్రుత్వరంగ సంస్థ అయిన ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్(ONGC)- 14 ఆగస్టు 1956 నుండి చమురు, గ్యాస్ నిక్షేపాల కోసం పరిశోధనలు జరుపుతున్నది.1978వ సంవత్సరంలో నర్సాపురం వద్ద మొదటిబావిని తవ్వి గ్యాస్ ను కనుగొన్నా రు. ఆ బేసిన్ లోని ఇతర ప్రాంతాల్లో కూడా చమురు, గ్యాస్ నిక్షేపాలు బయటపడ్డాయి. ఓ యన్ జీ సీకి ఉన్న ఆస్తులన్నిటిలోకీ అత్యంత ఎక్కువ ఉత్పాదకత వున్న విలువైన ఆస్తుల్లో కేజీ బేసిన్ ముఖ్యమైనది. ఇలాంటి సంపద్వంతమైన కేజీ బేసిన్ నిలువలు మన ముంగిట్లో వున్నా ఆంధ్రపజ్రలకు అందుబాటులో లేకపోవడమే విషాదం.


తాజా పరిణామం…
       కాకినాడకు 30 కిలోమీటర్ల దూరాన సముద్రగర్భం నుండి 2024, జనవరి7న ముడిచమురు ఉత్పత్తి  ప్రారంభమవటమే తాజా పరిణామం. కృష్ణ – గోదావరి బేసిన్ లో సహజవాయువుతో పాటుగా చమురు ఉత్పత్తి విలువ కొన్ని లక్షల కోట్లకు మించి ఉంటుందని అంచనా. ఆంధ్రతీరంలోవున్న చమురు నిక్షేపాలు దేశ ఆర్ధిక వ్యవస్ధ స్వరూపాన్నే మార్చబోతున్నాయి. దీనివలన ఆంధ్రప్రాంత ప్రజలు సర్వతోముఖాభివృద్ధిని సాధించవచ్చు. కానీ బడా కార్పొరేట్ కంపెనీల అధిపత్యానికి కేంద్ర పాలకులు  లొంగిపోవటం వలన ఆంధ్రపజ్రలు సంపదలకు దూరమయ్యారు. ఆంధ్ర రాష్ట్రం మరింత నష్టపోతున్నది.   అన్వేషణ,వెలికితీత, ఉత్పత్తి, పంపిణీ, వినియోగం, ధర నిర్ణయ విధానాలను సరిగ్గా నిర్వహించిన చోట ప్రజలు సంపదలను అనుభవిస్తున్నారు. లేనిచోట రిలయన్స్ అంబానీ లాంటి కొద్దిమంది కార్పొరేట్ శక్తులు లక్షల కోట్లరూపాయల సంపదలకు అధిపతులై విలాసజీవితం గడుపుతున్నారు.


లీటర్ పెట్రోల్ ను రు10, గ్యాస్ సిలిండర్ను రు 100 కే ఇవ్వవచ్చు!
        కేవలం విద్యుత్ ఉత్పాదనలోనేకాక ఎరువుల తయారీలో కూడా సహజవాయువు ఎంతగానో ఉపయోగపడుతుంది. దాంతోపాటు చౌకగా లభించేగ్యాస్ ఆధారిత విద్యుత్తును అందించటం ద్వారా సిమెంట్, సెరామిక్, రసాయనిక,అల్యూమినియం, స్టీల్ ప్లాంట్, ఫ్యా బ్రికేషన్ పరిశ్రమలలో ఖరీదైన విద్యుత్ మీద ఆధారపడటం తగ్గుతుంది. విశాఖ ఉక్కు కర్మాగారానికిగ్యాస్ సరఫరా చేస్తే సంవత్సరానికి1200 కోట్ల రూపాయలకు మించి ఖర్చు తగ్గుతుందని 2010లోనేఅంచనా వేశారు. కే.జీ.బేసిన్  గ్యాస్ చాలినంతగా న్యాయమైన ధరకు లభిస్తే కాకినాడ నుండి విశాఖపట్నం వరకు కాలుష్య రహిత రసాయనిక పరిశమ్రల కారిడార్ ను నెలకొల్పవచ్చు.    కే.జీ బేసిన్ లో రోజుకి కొన్ని మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్స్ గ్యాస్ నిక్షేపాలు కనుగొన్నారు. కేవలం ఒక్క ఎం ఎం ఎస్ సిఎం డి యూనిట్ గ్యాస్, సుమారు 1000 కోట్ల విలువైన పారిశ్రామిక పెట్టుబడిని ఆకర్షించగలదని నిపుణుల అంచనా. అంటే కేజీ బేసిన్   గ్యాస్ లో సగాన్ని ఉపయోగించుకున్నా మనం లక్ష కోట్ల విలువైన పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించవచ్చు.లక్షలాదిమందికి ఉపాధిఅవకాశాలను కలిగించవచ్చు . రవాణా రంగంలో బస్సులకు, లారీలకు,కార్లకు, ఆటోలకు సిఎన్ జీ గ్యాస్ వాడకంవల్ల ఖర్చు తగ్గటమేకాకుండా కాలుష్యం నుండి పర్యావరణాన్ని కూడా రక్షించుకోవచ్చు. గృహ అవసరాలకు గ్యాస్ పైపుల ద్వారా అతి చౌకగా వంటగ్యాస్ ను అందించవచ్చు. దీని మూలంగా గ్యాస్ సిలిండర్లపై పభ్రుత్వ సబ్సిడీభారం తగ్గుతుంది. ప్రస్తుతం వెయ్యి రూపాయలకు పైగా ఖరీదవుతున్న వంట గ్యాస్ సిలిండర్ కు సమానమైన గ్యాస్ ను పైపులైన్ ద్వారా వందరూపాయలకే ఇవ్వవచ్చును. అలానే లీటర్ పెట్రోలును రు 10 కే వాహనదారులకు అందించవచ్చు.


నూతన పాలసీతో కార్పొరేట్ సంస్థల అధిపత్యం!
      
       1991లో పీవీ నరసింహారావు పభ్రుత్వం నూతన ఆర్థిక విధానాలను చేపట్టింది. దేశం ఎదుర్కొంటున్న సర్వసమస్య లకు ఏకైక పరిష్కారంగా ప్రైవేటైజేషన్ ను ముందుకు  తెచ్చారు. అందులో భాగంగా చమురు సహజవాయువు ప్రాంతాల వేలంకు దేశ విదేశీ పెట్టుబడులను ఆహ్వానించారు. దేశీయకంపెనీ అయిన రిలయన్స్, విదేశీ సంస్ద అయిన కెయిర్న్ లాంటి కార్పోరేట్ సంస్థలు ముందుకు వచ్చాయి. ఇవి ప్రభుత్వ సంస్థలను రద్దు చేయకుండానే వాటిపునాదిని ఉపయోగించుకుని విపరీతమైన లాభాలను గడించాయి.    ప్రపంచీకరణ విధానాలలో భాగంగా చమురు గ్యాస్ నిక్షేపాలను దేశ విదేశీ కార్పోరేట్ వ్యాపార సంస్థలకు భాగస్వామ్యం కల్పించే ఉద్దేశంతో కేంద్రం 1997లో నూతన అన్వేషణ లైసెన్సింగ్ పాలసీ( నెల్ప్-NELP) ని పవ్రేశ పెట్టింది. నూతన విధానానికి రెండు లక్ష్యాలను పభ్రుత్వం పక్రటించింది. సముద్ర గర్భంలోనూ,భూ ఉపరితలంలోనూ నూతన గ్యాస్ నిక్షేపాల కోసం అన్వేషణను ప్రోత్సహించి,
పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా స్వదేశీ గ్యాస్, చమురు ఉత్పత్తిని పెంచి, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించటం. రెండవది, ఈ పథకం కింద పభ్రుత్వం వేలంపాట ద్వారా కొన్ని నిర్దిష్టప్రాంతాలలో నిక్షేపాల అన్వేషణకు ప్రైవేటు కార్పొరేట్ సంస్థలకు అవకాశాన్ని కల్పించింది. ఈ పథకం పక్రారం తాము పెట్టిన పెట్టుబడిని లాభాలతో సహా త్వరగా రాబట్టుకోవడానికి వీలుగా ప్రభుత్వంతో సంప్రదించి ధర నిర్ణయించే అవకాశాన్ని పభ్రుత్వం ఈ నూతన అన్వేషణ దారులకు కల్పించింది. ఈ నూతన విధానం పక్రారం  కృష్ణా- గోదావరి బేసిన్ లో సముద్రగర్భంలోని బావులలో అత్యధిక నిల్వలున్న గ్యాస్,చమురు నిక్షేపాలను రిలయన్స్ కంపెనీ కైవసం చేసుకుంది. ఈ కంపెనీ తన సామ్రాజ్యాన్ని అనేక
రంగాల్లోకి విస్తరించుకున్నది. 


అంగట్లో అన్నీ ఉన్నా…


       సహజవాయువు, చమురునిక్షేపాలు మన ముంగిట్లో అంటే కే.జీ.బేసిన్ లో పుష్కలంగా ఉన్నా ఆ వనరులను ఉపయోగించుకోలేని దుస్థితిలో మనం ఉన్నాం. దీనికి ప్రధాన కారణం కే.జీ.బేసిన్ గ్యాస్ సంపద రాష్ట్రసరిహద్దులు దాటి తరలిపోవడం. సహజ న్యాయసూత్రాల పక్రారం కే.జీ.బేసిన్ లో లభ్యమయ్యే సహజవాయువు మన రాష్ట్రఅవసరాలు తీరిన తర్వాతనే మనసరిహద్దులు దాటిపోవాలి. సహజ వనరుల యాజమాన్యం, నియంత్రణ ఆ ప్రాంత ప్రజలందరి ప్రయోజనాలను న్యాయమైనరీతిలో కాపాడేటట్లుగా రాజ్యవ్యవస్థ వ్యవహరించాలని భారత రాజ్యాంగం ఆదేశిక సూత్రాలు చెప్తున్నాయి.    సహజ న్యాయానికి, రాజ్యాంగస్ఫూర్తికి విరుద్ధంగా  బేసిన్ లో లభ్యమవుతున్న సహజవాయువు మన సరిహద్దులు దాటి 1500 కిలోమీటర్లదూరంలో ఉన్న గుజరాత్, మహారాష్ట్రలకు తరలిపోతున్నది. 45.50% గ్యాస్ ను గుజరాత్ కు తరలిస్తున్నారు. 24% మహారాష్టలోని పరిశమ్రలకు ఇచ్చేస్తున్నారు. మిగిలిన దాన్ని ఉత్తరపద్రేశ్ కు తరలిస్తున్నారు.  ఆంధప్రద్రేశ్ రాష్ట్ర అవసరాలకు 1.2 శాతాన్ని మాతమే కేటాయిస్తున్నారు. కేంద్రపభ్రుత్వ కార్పోరేట్ అనుకూల విధానాలు, రాష్ట్రపభ్రుత్వాల నిష్క్రియాపరత్వం, పటిష్టమైన ప్రజా పోరాటాలు సాగని ఫలితంగా  మన సహజసంపద తరలిపోతున్నది.


ప్రహసనంగా మారిన ధరల నిర్ణయం ధర!


       కేజీ బేసిన్ లో సహజవాయువు ధరను నిర్ణయించటం ఒక ప్రహసనంగా మారింది. రిలయన్స్ కంపెనీ ప్రవేశించేవరకూ గెయిల్ సంస్థ ల్యాంకో పరిశమ్రకు యూనిట్ ఒకటికి 1.97 డాలర్లకు సరఫరా చేస్తున్నది. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ కు కేజీ బేసిన్ నుండి ఒక యూనిట్ గ్యాస్ ను 2.97 డాలర్లకు సరఫరా చేస్తానని రిలయన్స్ కంపెనీ అగ్రిమెంట్ కుదుర్చుకున్నది. తదనంతరం ప్లేట్ ఫిరాయించి 4.3 డాలర్లకైతేనే గ్యాస్ ఇస్తామన్నది. ఇంత ఎక్కువ ధరలు నిర్ణయించటానికి శాస్త్రీయ ఆధారాలు లేవని, ఆ ధరకు గ్యాస్ కొనుగోలు చేస్తే ఎరువులు, విద్యుత్ ఉత్పత్తి, తదితర పరిశమ్రలకు భారం అధికమవుతుందన్న ఆనాటి కేంద్ర పెట్రోలియం శాఖామంత్రి జైపాల్ రెడ్డిని ఆ శాఖ నుండి తప్పించేశారు. ధర పెంచటం అన్యాయమన్న కేంద్రకార్యదర్శుల కమిటీనిర్ణయాన్ని ఆమోదించలేదు. రంగరాజన్ అధ్యక్షతనగల పధ్రాన ఆర్థిక సలహా మండలి నిర్ణయాన్ని ఒప్పు కోలేదు. పణ్రబ్ ముఖర్జీ అధ్యక్షతన కేంద్రపభ్రుత్వం ఒక మంత్రుల కమిటీని నియమించింది. ఆ కమిటీ ఏదోఘనకార్యం చేసినట్లుగా నటించి రిలయన్స్ కోరిన 4.33 డాలర్ల ధరను 4.2 డాలర్లకు తగ్గించింది. కొండను తవ్వి ఎలుకను పట్టటం అంటే ఇదే! 


ఆనాటి రాష్ట్రపభ్రుత్వ ఆందోళన


       అలస్యంగానైనా మేల్కొన్న ఆనాటి ఆంధర్రాష్ట్ర పభ్రుత్వం కేజీ బేసిన్ లోని సహజ సంపదలో మన రాష్ట్రానికి న్యాయసమ్మతమైన వాటా లభించాలని కేంద్రపభ్రుత్వాన్ని కోరితే రిలయన్స్ కంపెనీతో మాట్లాడుకోమంది. ఉన్న నిల్వలు మాకే సరిపోవు కాబట్టి  కొత్తగా ఆంధప్రద్రేశ్ రాష్ట్రానికి ఒక్క యూనిట్ సహజవాయువును కూడా సరఫరా చేయలేను అని తేల్చి చెప్పింది. దీని ఫలితంగా మన రాష్ట్రంలో అప్పటికే ప్రైవేట్  రంగంలో నెలకొల్పన గ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పాదన కేంద్రాలకు గ్యాస్ సరఫరా అసాధ్యమైంది. ఈ పరిస్థితులలో ఆనాటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిగారు కేంద్రానికి కొన్ని సూచనలు చేస్తూ 29 లేఖలు రాశారు. న్యాయబద్ధమైన సూచనలలో ఏ ఒక్కదానిని కూడా కేంద్రపభ్రుత్వ మంత్రుల కమిటీ పరిగణనలోకి తీసుకొననేలేదు. ఈ విధానం హక్కులను నిరాకరించటమే గాక అణిచివేయటం కాదా!    12వ ఆర్థిక సంఘం కూడా ఏ ప్రాంతంలో దొరికేసహజ వనరులపైన ఆ ప్రాంతానికి వినియోగ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది. పార్లమెంటు స్టాండింగ్ కమిటీ అక్టోబర్, 2013 రిపోర్టులో, సహజ వనరులు ఉత్పత్తి అవుతున్న రాష్ట్రానికి కనీసం 50 శాతం గ్యాస్ తో పాటు రాయల్టీనీ కూడా ఇవ్వాలని రికమెండ్ చేసింది. సముద్ర అంతర్భాగం నుండి గ్యాస్ తీసినా, భూమినుండి తీసినా రాష్ట్రానికి వాటా వుండాల్సిందేనని పార్లమెంటు కమిటీ తేల్చిచెప్పింది. మన రాష్ట్రంలో లభ్యమయ్యే సహజ వనరులలో కొంత భాగాన్ని మాత్రమే మన రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికోసం డిమాండ్ చేస్తున్న అత్యంత హేతుబద్ధమైన, న్యాయమైన ఈ డిమాండ్ ను కూడా కేంద్రపభ్రుత్వం నిరాకరించటం అంటే ఫెడరలిజాన్ని నిరాకరించటమే, కార్పోరేట్ కంపెనీలకు పత్ర్యక్షంగా వత్తాసు పలకటమే!


కష్టాలు మాకు-సంపద మీకా?


       భూమిలోపల కొన్ని లక్షల సంవత్సరాల పరిణామాల ఫలితంగా సహజవాయువు, చమురుఏర్పడుతుంది. ప్రజలు సముద్రపు ఆటుపోట్లను, అల్పపీడనాలను, వాయుగుండాలను,ఉప్పెనలను, సునామీలు, పంట పొలాలలో గ్యాస్ బ్లో అవుట్లు లాంటి కష్టాలను ఎదుర్కొంటూ జీవిస్తున్నారు. మన గ్రామాల నుండి మన పొలాల నుండి గ్యాస్ ను పైపులద్వారా గుజరాత్ కు తీసుకొని వెళ్తూ మనకు ఒక్క కేజీ గ్యాస్ కూడా ఇవ్వరట. మన రాష్ట్రంలో లభించేసహజ వనరులను దోచుకుని రిలయన్స్ వంటి బడా కార్పోరేట్ సంస్థలు ఇబ్బడి
ముబ్బడిగా తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవటాన్ని, మన ప్రజల ప్రయోజనాల దృష్ట్యా మనం వ్యతిరేకించాలి. లేనిపక్షంలో మనం భవిష్యత్ తరాల ముందు దోషులుగా నిలబడవలసి వస్తుంది. నిజానికి ఇది పభ్రుత్వ, ప్రజా ప్రతినిధుల బాధ్యత. అయితే ఇప్పటివరకు మన ప్రజా ప్రతినిధులు స్పందించాల్సిన రీతిలో స్పందించని ఫలితంగా ప్రజాఉద్యమాన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా రాజీలేని సమైక్య ఉద్యమాన్నినిర్వహించవలసిన అవసరం నేడు ఏర్పడింది. కేజీ బేసిన్లో లభించే సహజ వనరులపై మన ప్రాథమిక హక్కును సాధించుకోవటానికి పోరాట దీక్షతో కలసికట్టుగా ముందడుగులు వేద్దాం!

  డాక్టర్ కొల్లా రాజమోహన్,   కృష్ణా గోదావరి బేసిన్ చమురు గ్యాస్ సాధన సమితి.

వాట్సాప్‌ కట్టుకథలు, పిట్టకతలు : గిల్గిట్‌ – బాల్టిస్థాన్‌ గురించి నరేంద్రమోడీ పాకిస్థాన్‌కు నోటీసు పంపారా ?

Tags

, , , , , , , ,


ఎం కోటేశ్వరరావు


” బాల్టిస్థాన్‌, మనదేశంలో ఉన్న ఈ ప్రాంతం పేరు ఎప్పుడైనా విన్నామా అసలు ? ఇప్పుడు మన ప్రధాని మోడీ గారి వల్ల ఈ ప్రాంతం మన స్వంతం కాబోతోంది. దీనికి ప్రతి భారతీయుడు మద్దతు తెలపాలి ” అంటూ ఒక పోస్టును ” వాట్సాప్‌ పండితులు ” ప్రచారం చేస్తున్నారు. అసలు ఇలాంటి వార్తను ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా అసలు విన్నారా, చదివారా, చూశారా ? కేవలం వాట్సాప్‌ పండితులకే ఇలాంటివి ఎలా తెలుస్తాయి. ఎందుకు ఇలా ప్రచారం చేస్తున్నారు. బాల్టిస్థాన్‌ మనదేశంలో అంతర్భాగం, ప్రస్తుతం పాకిస్థాన్‌ ఆక్రమణలో ఉంది. ఎప్పటికైనా మనకు రావాల్సిందే అన్నది వాస్తవం. ఒక నోటీసు ఇవ్వగానే అన్యాక్రాంతమైన ప్రాంతం వెంటనే వస్తుందా? మోడీ నోటీసు ఇవ్వటం ఏమిటి ? అద్డెకున్నవారినే అంతతేలికగా ఖాళీ చేయించలేమే అలాంటిది ఏడు దశాబ్దాలుగా పాక్‌ ఆక్రమణలో ఉన్నదాని స్వాధీనం వెంటనే జరుగుతుందా ? ఉత్తర-దక్షిణ కొరియాలను విలీనం చేయాలని రెండవ ప్రపంచ యుద్దం తరువాత నిర్ణయించినా ఇంతవరకు జరగలేదు. వియత్నాం విలీనం కోసం రెండవ ప్రపంచ యుద్దం తరువాత 1975వరకు ఆక్రమణదారులు, వారితో చేతులు కలిపిన వారి మీద పోరాడి లక్షల మంది ప్రాణాలను ఫణంగా పెట్టిన తరువాతే సాధ్యమైంది.తైవాన్‌ దీవి చైనాలో అంతర్భాగమే అని ఐరాస గుర్తించి తీర్మానించినా ఇంతవరకు చైనా స్వాధీనం చేసుకోలేకపోయింది. ఆక్రమిత కాశ్మీరు గురించి ఐరాసలో ఎలాంటి విలీన తీర్మానం చేయలేదు. శాంతియుత పద్దతుల్లో భారత్‌-పాక్‌ పరిష్కారం చేసుకోవాలి. అసలు గిల్గిట్‌ – బాల్టిస్థాన్‌ గురించి ప్రత్యేకంగా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తోంది ?


పాకిస్థాన్‌ ఆక్రమణలో ఉన్న గిల్గిట్‌-బాల్టిస్థాన్‌తో సహా కాశ్మీరు ప్రాంతం మొత్తం, లడక్‌లో భాగంగా ప్రస్తుతం చైనా ఏలుబడిలో ఉన్న ఆక్సారుచిన్‌ ప్రాంతం కూడా మనదే అన్నది స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి మనదేశం ప్రకటిస్తున్నది. మనదేశ పటాల్లో అదే చూపుతున్నది.మన కాశ్మీరు రాష్ట్ర అసెంబ్లీలో పాక్‌ ఆక్రమిత ప్రాంతానికి 24 సీట్లు కేటాయించటం తప్ప చైనా ఆధీనంలోని ప్రాంతానికి గతంలో కూడా ఎలాంటి సీట్లు కేటాయించలేదు. ఇప్పుడు లడక్‌ కేంద్ర పాలిత ప్రాంతం, ప్రస్తుతం దానికి అసెంబ్లీ ఏర్పాటు లేదు. గిల్గిట్‌-బాల్టిస్తాన్‌ కూడా కాశ్మీరులో భాగమే అయినప్పటికీ అది మినహా మిగిలిన ఆక్రమిత ప్రాంతం పట్ల పాకిస్తాన్‌ వేర్వేరు వైఖరులను తీసుకున్నది. గిల్గిట్‌ ప్రాంత వాసులు తమతో విలీనం కావాలని కోరుకున్నందున అది తమ ప్రాంతమే అని ప్రకటించుకుంది. తమ ఆక్రమణలోని మిగతా ప్రాంతాన్ని ” విముక్త (ఆజాద్‌) కాశ్మీరు” అని ప్రకటించి ప్రత్యేక పాలిత ప్రాంతంగా ఉంచింది. ఎప్పటికైనా మొత్తం కాశ్మీరు స్వతంత్ర దేశంగా ఏర్పాటు కానుందని చెబుతున్నది. పాక్‌ పార్లమెంటులో దానికి ఎలాంటి ప్రాతినిధ్యం కల్పించలేదు. ఆ ప్రాంతానికి విడిగా ఎన్నికలు జరుపుతూ ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తున్నది. చైనాతో కుదిరిన ఒప్పందం మేరకు 1963లో గిల్గిట్‌లోని షాక్స్‌గమ్‌ ప్రాంతాన్ని చైనాకు అప్పగించింది. దాని గుండా చైనా కారకోరం రహదారి నిర్మించటంతో ఆ ప్రాంతానికి ఉన్న ప్రాధాన్యత వెల్లడైంది.అనేక తర్జన భర్జనల తరువాత పాకిస్తాన్‌ గిల్గిట్‌-బాల్టిస్తాన్‌ ప్రాంతాన్ని 2020లో పాక్‌ ఐదవ తాత్కాలిక రాష్ట్రంగా ప్రకటించుకుంది. ఆక్రమిత కాశ్మీరులోని పౌరులు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించగా గిల్గిట్‌ వాసులు విలీనాన్ని కోరుకున్నట్లు పాక్‌ చెబుతున్నది. ఆక్రమిత కాశ్మీరులో మాదిరి గిల్గిట్‌లో కూడా ఎన్నికలు జరుపుతున్నది.


ఆక్రమిత కాశ్మీరును తిరిగి మన దేశంలో విలీనం చేసేందుకు పదేండ్లలో చేసిందేమీ లేకపోగా తన గొప్పతనాన్ని ప్రదర్శించుకొనేందుకు నరేంద్రమోడీ పదే పదే పాకిస్తాన్ను రెచ్చగొడుతున్నారనే అభిప్రాయం ఉంది.దానిలో భాగంగానే 2016 స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో మానవహక్కులు లేవంటూ ఆక్రమిత కాశ్మీరు, గిల్గిట్‌ అంశాన్ని మోడీ ప్రస్తావించారు. 1948 నుంచి గిల్గిట్‌ను వేరుగా ఉంచిన పాకిస్థాన్‌ 2019లో ఆర్టికల్‌ 370, కాశ్మీరు రాష్ట్రాన్ని రద్దు చేసిన తరువాత 2020లో తన ఐదవ రాష్ట్రంగా తాత్కాలిక గుర్తింపుగా ప్రకటించింది. అయితే అంత మాత్రాన ఒరిగేదేమీలేదు. కాశ్మీరు సమస్య తేలేవరకు అది తాత్కాలిక రాష్ట్రంగా మాత్రమే ఉంటుంది. దేశంలో అంతర్భాగం కాదు. పాక్‌ సుప్రీం కోర్టు పరిధి దానికి వర్తించదు. ఒక వేళ ఆ ప్రాంతం తమ దేశంలో భాగమే అని గనుక ప్రకటిస్తే ఐరాసలో కాశ్మీరు ఒక ప్రత్యేక దేశమంటున్న పాక్‌ వాదన వీగిపోతుంది. దాన్నుంచి ఖాళీ చేయాల్సి ఉంటుంది.అందుకే పార్లమెంటులో ఆక్రమిత ప్రాంతాలకు ప్రాతినిధ్యం కూడా కల్పించటం లేదు. తమ రక్షిత ప్రాంతాలుగానే చెబుతున్నది. అనేక అంశాల గురించి తప్పుడు ప్రచారం చేయటంలో గత పది సంవత్సరాలలో విపరీతంగా పెరిగింది. తప్పుడు వార్తలలో మన దేశం ముందున్నదని ఇటీవలనే ప్రపంచ ఆర్థికవేదిక సమావేశాల్లో ప్రకటించిన సంగతి తెలిసిందే. గిల్గిట్‌ను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించటాన్ని భద్రతా మండలిలో వీటో చేస్తామని, అది భారత్‌లో భాగంగా ఉండాలని తాను కోరుతున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్‌ పుతిన్‌ చెప్పాడంటూ ఒక వీడియోను 2022లో వైరల్‌ చేశారు. అసలు ఈ అంశం భద్రతా మండలి చర్చలోనే లేదు. తమ ఆర్థిక రంగం గురించి పుతిన్‌ రష్యన్‌ భాషలో మాట్లాడిన వీడియోకు గిల్గిట్‌ గురించి చెప్పినట్లు ఆంగ్లంలో సబ్‌టైటిల్స్‌ను జోడించి నరేంద్రమోడీ గొప్పతనాన్ని పెంచేందుకు చూశారు. అన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు అదే వీడియోను చూపుతూ పశ్చిమ దేశాలు విధించిన ఆర్థిక ఆంక్షల పర్యవసానాల గురించి పుతిన్‌ చర్చించినట్లు పేర్కొన్నాయి.


బిజెపి నేతలు ఇదిగో రేపో ఎల్లుండో ఆక్రమిత కాశ్మీరును తిరిగి వెనక్కు తీసుకువస్తాం అన్నట్లుగా పదే పదే చెబుతుంటారు. తాము మాత్రమే స్వాధీనం చేసుకోగలమని చెప్పుకుంటారు. ఎవరు అధికారంలో ఉన్నా మనదేశం ఎన్నడూ కాశ్మీరు గురించి రాజీపడలేదు. జమ్మూ-కాశ్మీరు ఎప్పుడు విలీనమైందో పాక్‌ ఆక్రమిత కాశ్మీరు-గిల్గిట్‌ బాల్టిస్థాన్‌ కూడా మన అంతర్భాగాలే అని, వాటిని తిరిగి స్వాధీనం చేసుకోవాలని 1994లో పివి నరసింహారావు ప్రధాన మంత్రిగా ఉండగా లోక్‌సభలో తీర్మానం ఆమోదించారు. పాకిస్థాన్‌ వెంటనే ఖాళీ చేయాలని, భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే తగిన విధంగా స్పందిస్తామని కూడా పేర్కొన్నారు. అందువలన నరేంద్రమోడీ చెప్పిన తరువాతే గిల్గిట్‌ అనేది ఒకటుందని మనకు తెలిసిందని చెప్పటం అతిశయోక్తి, తప్పుడు ప్రచారం తప్ప మరొకటి కాదు.2001లో నాటి ప్రధాని అతల్‌ బిహారీ వాజ్‌పాయి కూడా ఒక సందర్భంలో చెప్పారు.2019లో ఆర్టికల్‌ 370తో పాటు కాశ్మీరు రాష్ట్రాన్ని రద్దు చేసి రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చినపుడు కూడా దీని గురించి కేంద్ర ప్రభుత్వం ప్రస్తావించింది. గిల్గిట్‌ ప్రాంతంలోని షాక్స్‌గమ్‌ లోయ ప్రాంతాన్ని పాకిస్థాన్‌ గతంలో చైనాకు అప్పగించిందని పైనే చెప్పుకున్నాము.దాని ద్వారానే కారకోరం రహదారిని చైనా నిర్మించింది. పాకిస్తాన్‌-చైనా భూ భాగాన్ని కలిపే ఏకైక మార్గమిది.చైనా-పాకిస్థాన్‌ ఆర్థిక నడవాకు ఇది కీలకం.


స్వాతంత్య్రానికి పూర్వం జమ్మూ-కాశ్మీరు సంస్థానంలో ఉత్తర ప్రాంతాలు అని పిలిచిన వాటిలో గిల్గిట్‌ ఏజన్సీ, బాల్టిస్థాన్‌ జిల్లాగా ఉండేవి.పాకిస్థాన్‌ ఆక్రమించిన కాశ్మీరుకు ఇది విస్తీర్ణంలో ఆరురెట్లు ఎక్కువ.ఈ ప్రాంతంలో జనాభా ప్రస్తుతం18 లక్షలకు పైగా ఉంది.2009లో గిల్గిట్‌-బాల్టిస్థాన్‌ అని పేరు పెట్టారు. ఇది స్వయం పాలిత ప్రాంతం. గిల్గిట్‌ పట్టణం రాజధాని. కాశ్మీరులో అంతర్భాగమే అయినప్పటికీ తాము కాశ్మీరీలకంటే భిన్నమైన వారమని ఆ ప్రాంతవాసులు భావిస్తారు.కాశ్మీరులో సాగిన డోగ్రా (రాజరిక) పాలన మీద వారు తిరుగుబాటు చేశారు. తాము అటు భారత్‌లోనూ ఇటు పాకిస్థాన్లో కూడా విలీనానికి అంగీకరించం అని చెప్పారు. తరువాత మారిన పరిస్థితిలో అది పాక్‌ ఆక్రమణకు గురైంది. విముక్త కాశ్మీరుగా(మనం ఆక్రమిత ప్రాంతం అంటున్నాం) పాకిస్థాన్‌ ప్రకటించిన ప్రాంతాలకు, గిల్గిట్‌ ప్రాంతాలకు వేర్వేరు పాలనా యంత్రాంగాలను ఏర్పాటు చేశారు.1994 నుంచి గిల్గిట్‌లో పార్టీ ప్రాతిపదికన ఎన్నికలు నిర్వహిస్తున్నారు.


గిల్గిట్‌-బాల్టిస్థాన్‌ ప్రాంతం గురించి జై శ్రీరామ్‌ పేరుతో పెట్టిన ఊరూ పేరులేని పోస్టులు వాట్సాప్‌లో తిరుగుతున్నాయి. వీటిని ఎవరు వ్యాపిస్తున్నారో అందరికీ తెలుసు. తప్పుడు సమాచారంతో జనాల బుర్రలను ఖరాబు చేస్తున్నారు. ఇలాంటి వాటిని ఎవరు పంపినా గుడ్డిగా ఇతరులకు పంచటం గాకుండా వాటి విశ్వసనీయత గురించి పంపిన వారిని ప్రశ్నిస్తే అసలు సంగతి తేలుతుంది. దానిలో ” నిన్న గిల్గిట్‌ బాల్టిస్ధాన్ను ఖాళీ చేయమని మోడీ పాకిస్ధాన్‌కు నోటీసు ఇచ్చే వరకు మనలో చాలా మందికి అది మన(భారత్‌) భూభాగం అనే తెలియదు ” అని కూడా సెలవిచ్చారు. మోడీ ప్రతిష్టను పెంచేందుకు భక్తులు చేస్తున్న తప్పుడు ప్రచారాల్లో ఇదొకటి. ఇక్కడ ఆ పోస్టు మొత్తంలో నిన్న అంటే ఏ తేదీ, ఏ నెల, ఏ సంవత్సరంలో అలాంటి నోటీసు పంపారో రాసి ఉంటే దాని బండారం బయటపడేది. గోడమీద రాసే అప్పు రేపు అన్నట్లుగా దీన్ని వాట్సాప్‌లో కొత్తగా చదివేవారికి అంతకు ముందు రోజే నోటీసు ఇచ్చినట్లుగా అనిపిస్తుంది. అది నిజమా కాదా అని సరిచూసుకొనే ఆసక్తి మన జనాలకు ఉండదు అనే ధీమాతో ఇలాంటి ప్రచారాన్ని చేస్తున్నారు. అదే నరేంద్రమోడీ గిల్గిట్‌ గురించి పాకిస్థాన్‌కు నోటీసు ఇస్తే మరి ఆక్సారుచిన్‌ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని చైనాకు ఎందుకు నోటీసు ఇవ్వలేదు ? మొత్తం ఆక్రమిత కాశ్మీరులో గిల్గిట్‌ కూడా ఒకటి, గిల్గిట్‌ను మాత్రమే ఖాళీ చేయాలని నోటీసు ఇచ్చిన నరేంద్రమోడీ మిగతా కాశ్మీరు ప్రాంతం గురించి ఎందుకు ఇవ్వలేదు ? అందుకే ఇది తప్పుడు ప్రచారం అన్నది స్పష్టం. ఎవరైనా ఆధారాలు ఉంటే చూపవచ్చు. కొస మెరుపు ఏమంటే 2016లో నరేంద్రమోడీ ఎర్ర కోటలో గిల్గిట్‌-బాల్టిస్థాన్‌ ప్రస్తావనతో చేసిన ప్రసంగ అంశం మీద ఆంగ్ల మీడియాలో పెట్టిన శీర్షికల్లో ఒక దానికి ” రెడ్‌ ఫోర్టు నోటీసు – విల్‌ మోడీస్‌ న్యూ పాకిస్థాన్‌ పాలసీ గో బియాండ్‌ రిహొటరిక్‌ ? ”(స్క్రోల్‌ ఆగస్టు 29,2016) అని పెట్టారు. దీని అర్ధం పాకిస్థాన్‌కు ప్రధాని నోటీసు ఇచ్చారనా ? కానే కాదు, వట్టి మాటలేనా చేతలేమైనా ఉంటాయా అని అర్ధం. ” ఎర్రకోట ప్రకటన- పాకిస్థాన్‌ నూతన విధానంతో మోడీ వాక్పటిమ కంటే ముందుకు పోతారా ” అన్నది తెలుగు అర్ధం.

ఏడాదిలోపు రెండుసార్లు చెరకు ధర ప్రకటన ! రైతుల ఓట్లు కొల్లగొట్టేందుకు మోడీ ఎత్తుగడ !!

Tags

, , , , , ,

ఎం కోటేశ్వరరావు


కేంద్రా ప్రభుత్వం తాజాగా క్వింటాలు చెరకు ధరను రు.25 పెంచింది. దీంతో 2024-25 సీజన్‌కు రు.340కి చేరిందని, రైతులకిచ్చిన ఈ బ హుమతితో పండగ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. మన దేశంలో సీజన్‌ అంటే ఆర్థిక సంవత్సరానికి చెప్పే నిర్వచనం వేరు, పంటలకు వేరు. ఏప్రిల్‌ నుంచి మార్చి నెలవరకు ఆర్థిక సంవత్సరం. అదే పత్తి, చెరకు సంవత్సరాలు అక్టోబరు నుంచి సెప్టెంబరు వరకు లెక్కిస్తారు.దీని ప్రకారం 2024-25 సీజన్‌ అంటే ఈ ఏడాది అక్టోబరు నుంచి వచ్చే ఏడాది సెప్టెంబరు వరకు. కనుక ప్రకటించిన పెంపుదల వర్తమాన సంవత్సరానికి కాదు. ఈ ఏడాది ధరను సీజనుకు ముందుగా గతేడాది జూన్‌లోనే ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల తరువాత జూన్‌లో చేయాల్సిన ప్రకటనను రైతుల ఓట్ల కోసం నాలుగు నెలల ముందే ప్రకటించారు. అందుకే నిజంగా రైతులు దీంతో సంతోషిస్తారా ? పంజాబ్‌ రైతులు చలో ఢిల్లీ పేరుతో రావటాన్ని పంజాబ్‌-హర్యానా సరిహద్దులో బిజెపి ప్రభుత్వం అడ్డుకుంది. ఫిబ్రవరి 13 నుంచి ఢిల్లీకి రెండు వందల కిలోమీటర్ల దూరంలో వారు రెండు చోట్ల తిష్టవేశారు.వివిధ రూపాల్లో ఆందోళనకు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. పోలీసుల దాష్టీకానికి ఒక రైతు మృతి చెందాడు. త్వరలో లోక్‌సభ ఎన్నికల నోటిపతిికేషన్‌ వెలువడనున్న పూర్వరంగంలో నాటకీయ పద్దతిలో కేంద్ర మంత్రివర్గం ఫిబ్రవరి 21 సమావేశం, దానిలో చెరకు ధర పెంపు నిర్ణయాన్ని నరేంద్రమోడీ వెల్లడించారు.


న్యాయమైన మరియు గిట్టుబాటు ధర(ఎంఆర్‌పి) పేరుతో చేస్తున్న జిమ్మిక్కుతో రైతులకు ఒరిగేదేమిటి ? షరతులు వర్తిస్తాయి అన్నట్లుగా క్వింటాలుకు 10.25శాతం పంచదార దిగుబడి వస్తేనే ఈ ధర దక్కుతుంది. ప్రస్తుత సీజన్‌లో 2023-24కు రు.315గా 2023జూన్‌లో కేంద్రం ప్రకటించింది. వచ్చే ఏడాది నిర్ణీత ప్రామాణిక శాతానికి మించి ఎక్కడైనా పంచదార దిగుబడి పెరిగితే 0.1శాతానికి రు.3.32 అదనంగా చెల్లిస్తారు. అదే మాదిరి తగ్గితే తగ్గుతుంది. తమ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తరువాత 2014-15 నుంచి ఈ మాదిరి పెరుగుదల లేదు అని కేంద్ర ప్రభుత్వం చెప్పుకున్నది నిజమే. పదేండ్ల వివరాలను చూసినపుడు చెరకు ధరను రు.220 నుంచి రు.315కు పెంచారు. అంటే పదేండ్లలో పెరిగింది కేవలం రు.95 మాత్రమే. ఏడాదికి సగటు పెంపు రు.9.50 మాత్రమే. అలాంటిది ఏకంగా రు.25 పెంచారంటే ఎన్నికల కోసమే అంటే తప్పేముంది. పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌ రైతాంగంలో పలుకుబడి కలిగిన ఆర్‌ఎల్‌డి పార్టీ బిజెపితో చేతులు కలిపింది, చెరకు పండేది కూడా అక్కడే ఎక్కువ, ఆర్‌ఎల్‌డి మద్దతుదార్లు ఈ రాజకీయ అవకాశవాదాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని, నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నట్లు వార్తలు వచ్చిన పూర్వరంగంలో వారిని మచ్చిక చేసుకొనేందుకు మోడీ పూనుకున్నారు. దానిలో భాగంగా చెరకు ధర పెంపుతో పాటు మాజీ ప్రధాని చరణ్‌సింగ్‌కు భారత రత్న ప్రకటన వెనుక కూడా చెరకు రైతుల మద్దతు కోసమే అన్నది స్పష్టం. గతంలో సాగిన రైతు ఉద్యమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న జాట్‌ రైతాంగాన్ని ఈ సారి ఆందోళనకు దూరంగా ఉంచాలన్న ఎత్తుగడ కూడా ఉంది. మహారాష్ట్రలో బిజెపిని వ్యతిరేకిస్తున్న శరద్‌ పవార్‌ నాయకత్వంలోని పార్టీకి చెరకు రైతులే ప్రధాన మద్దతుదార్లు, వారిని ఆకర్షించటం కూడా దీని వెనుక ఉంది. గడచిన పదేండ్లలో నాలుగు సంవత్సరాలు అసలు పెంచలేదు. ఒకేడాది ఐదు, మూడు సార్లు పది వంతున, ఒకసారి 15, మరొకసారి రు.20 పెంచారు.2019 ఎన్నికలకు ముందు రు.20పెంచారు. అదీ ఎన్నికల కోసమే అనివేరే చెప్పనవసరం లేదాు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న మోడీ హామీలో భాగమే తాజా పెంపుదల అని ప్రచారం చేస్తున్నారు. ఆ లెక్కన ధర రు.440కి పెరగాలి. అందుకే జుమ్లా అని రైతులు వర్ణిస్తున్నారు. యుపిఏ హయాంలో 2009-10లో ఉన్న ధర రు.129 నుంచి 2013-14 నాటికి రు.210కి అంటే ఐదు సంవత్సరాల్లో రు.81 పెరిగింది. పదేండ్ల మోడీ ప్రభుత్వం పెంచింది కేవలం రు.95 మాత్రమే. ఏ ఎలిమెంటరీ విద్యార్ధిని అడిగినా మోడీ ఏలుబడిలో తక్కువే అని చెబుతారు.


దేశంలో చెరకు ధరకు రెండు పద్ధతులను అనుసరిస్తున్నారు.ఒకటి కేంద్రం ప్రకటించే ఎఫ్‌ఆర్‌పి కాగా రెండవది కొన్ని రాష్ట్రాలు ప్రకటిస్తున్న రాష్ట్ర సలహా ధర(ఎస్‌ఏపి) సహజంగా కేంద్రం కంటే ఎక్కువగా ఉంటుంది.ఉదాహరణకు పంజాబ్‌లో రు.391, ఉత్తర ప్రదేశ్‌లో రు.370 ఉంది. అందువలన కేంద్ర ప్రకటించిన ధరతో ఎవరికి ప్రయోజనం?ప్రస్తుతం ఉన్న రు.315 ధర పంచదార దిగుబడి 9.5శాతం అన్న అంచనాతో నిర్ణయించారు. అందువలన దిగుబడి పెరిగితేనే రైతుకు ఉపయోగం లేకపోతే నష్టమే.దిగుబడి రైతు చేతిలో ఉండదు. ప్రైవేటు రంగంలో ఉన్న ఏ ఒక్క పంచదార ఫ్యాక్టరీ దిగుబడి గురించి వాస్తవ సమాచారాన్ని వెల్లడించదు. అందువలన దిగుబడితో నిమిత్తం లేకుండా ధర చెల్లించాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. కేంద్రమైనా, రాష్ట్రాలు ప్రకటించే ధరలైనా వాస్తవ ఖర్చులను పరిగణనలోకి తీసుకోవటం లేదని, పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లో సాగు ఖర్చు టన్నుకు రు.440 అవుతుందని రైతులు చెబుతున్నారు. అందుక పెంపుదలను ముష్టి విదిల్చినట్లుగా భావిస్తున్నారు. మిల్లు యజమానులు పంచదార, తదితర ఉత్పత్తులను అమ్మిన తరువాతే రైతులకు డబ్బు చెల్లిస్తున్నారు. అంటే రైతుల పెట్టుబడితో మిల్లులు నడుస్తున్నాయి.ఒక టన్ను చెరకు నుంచి వంద కిలోల పంచదార, నలభై కిలోల మొలాసిస్‌ వస్తుంది.దీన్నుంచి పది లీటర్ల మేర ఇథనాల్‌ వస్తుంది. ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదలకు అనుగుణంగా కేంద్రం లేదా రాష్ట్రాలు చెరకు ధర పెంచటం లేదు. గడచిన మూడు సంవత్సరాల్లో చెరకు ధర 5.7శాతం పెరిగితే కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు 19 శాతం కరవు భత్యం పెంచిందని రైతులు గుర్తు చేస్తున్నారు. ఉత్తర ప్రదేశ్‌లో సమాజవాదీ పార్టీ పాలన 2012 నుంచి 2017వరకు 26శాతం చెరకు ధర పెంచితే నరేంద్రమోడీ అచ్చేదిన్‌, యోగి బుల్డోజర్‌ పాలన ఏడు సంవత్సరాల్లో పెంచింది 17.46శాతమే.


స్వామినాధాన్‌కు భారతరత్న ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి ఆయన సూచించిన పద్దతి ప్రకారం మద్దతు ధరలను నిర్ణయించేందుకు మొరాయిస్తున్నది. ఉదాహరణకు చెరకు సంగతే చూద్దాం. 2023లో కేంద్రం ప్రకటించిన ఎఫ్‌ఆర్‌పి రు.315(దానికి తాజాగా వచ్చే ఏడాదికి మరో 25 పెంచింది), వివిధ రాష్ట్రాలలో ప్రకటించిన సలహాధరలు, స్వామినాధన్‌ పద్దతిలో ఉండాల్సిన ధర, ఒక క్వింటాలకు (రు.315 ఎఫ్‌ఆర్‌పి ప్రకారం) రైతులు నష్టపోతున్న మొత్తాల గురించి ఆలిండియా కిసాన్‌ సభ రూపొందించిన వివరాలు దిగువ విధంగా ఉన్నాయి.
రాష్ట్రం×××××× రాష్ట్ర ధర×××× స్వామినాధన్‌××××రైతుల నష్టం

ఆంధ్రప్రదేశ్‌ ×× 357 ×××× 535.50 ×××× 220.50

బీహార్‌ ×× 241 ×××× 361.50 ×××× 46.50

గుజరాత్‌ ×× 289 ×××× 433.50 ×××× 118.50

హర్యానా ×× 327 ×××× 490.50 ×××× 175.50

కర్ణాటక ×× 258 ×××× 387.00 ×××× 72.00

మహరాష్ట్ర ×× 214 ×××× 321.00 ×××× 6

పంజాబ్‌్‌ ×× 298 ×××× 447.00 ×××× 132

తమిళనాడు ×× 299 ×××× 448.50 ×××× 133.50

తెలంగాణా ×× 332 ×××× 498.00 ×××× 183

ఉత్తరప్రదేశ్‌ ×× 310 ×××× 465.00 ×××× 150

ఆలిండియా ×× 292 ×××× 438.75 ×××× 123.50

ఈ పూర్వరంగంలో క్వింటాలకు రు.500 ధర నిర్ణయించాలని అఖిలభారత కిసాన్‌ సభ డిమాండ్‌ చేసింది. సహకార, ప్రభుత్వ రంగంలో ఉన్న పంచదార మిల్లులను జాతీయం చేయరాదని, ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయాలని కూడా కోరింది. వర్తమాన సంవత్సరంలో రు.315 అంటే దిగుబడిలో 10.25 శాతం దాటిన తరువాత పెరిగే ప్రతి 0.1శాతానికి అదనంగా రు.3.07 చెల్లిస్తారు, తగ్గితే ఆ మేరకు కోత పెడతారు. సగటు దిగుబడి 9.5శాతమే ఉన్నందున క్వింటాలు ధర రు.315గా చెప్పినా రైతుకు దక్కేది రు.292 మాత్రమే. చెరకు ఉత్పత్తి ఖర్చుకు వందశాతానికి మించి గిట్టుబాటు ధర చెల్లిస్తున్నట్లు ప్రభుత్వం నమ్మబలుకుతోంది.అసలు కిటుకు అక్కడే ఉంది. క్వింటాలుకు సాగు ఖర్చును కేవలం రు.157 మాత్రమే 2023-24 సంవత్సరానికి లెక్కగట్టి రు. 315 ప్రకటించామంటే రెట్టింపే కదా అని చెబుతున్నారు. రైతులు మరీ అంత అమాయకంగా కనిపిస్తున్నారా ? ప్రభుత్వం చెబుతున్నది వ్యవసాయ పంటల ధరల నిర్ణాయక సంస్థ సూచించిన మొత్తం. అది వాస్తవ సాగు ఖర్చును పరిగణనలోకి తీసుకోవటం లేదని ప్రారంభం నుంచి విమర్శలు వస్తూనే ఉన్నాయి. అందుకే స్వామినాధన్‌ కమిషన్‌ పద్దతి ప్రకారం సాగు ఖర్చును, మద్దతు ధరలను నిర్ణయించాలని, వాటికి చట్టబద్దత కల్పించాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. గతంలో ఏడాది పాటు చేసిన ఉద్యమం, తాజాగా జరుగుతున్న ఆందోళనకు నాయకత్వం వహిస్తున్నవారు కూడా కోరుతున్నది అదే.

యువరైతును బలితీసుకున్న బిజెపి సర్కార్‌ – రైతు ఉద్యమ భవిష్యత్‌ ఏమిటి !

Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


ఫిబ్రవరి 13న ప్రారంభమైన రైతు ఉద్యమంలో బుధవారం నాడు 24ఏండ్ల సుభకరణ్‌ సింగ్‌ ప్రాణాలర్పించాడు. హర్యానా పోలీసులు రైతుల మీద జరిపిన దమనకాండలో అనేక మంది గాయపడ్డారు.కనౌరీ ప్రాంతం నుంచి తమ ఆసుపత్రికి వచ్చిన ముగ్గురిలో ఒకరు మరణించినట్లు పాటియాలలోని రాజీంద్ర ఆసుపత్రి సూపరింటెండెంట్‌ హెచ్‌ఎస్‌ రేఖీ విలేకర్లతో చెప్పారు. తమ దగ్గర అలాంటి సమాచారం లేదని పోలీసులు బుకాయించారు. పోలీసుల దమనకాండ నేపధ్యంలో రెండు రోజుల పాటు ఢిల్లీ చలో ప్రదర్శన నిలిపివేసినట్లు రైతు సంఘాల ప్రతినిధి సర్వన్‌ సింగ్‌ పాంధెర్‌ ప్రకటించారు. తదుపరి కార్యాచరణను శుక్రవారం నాడు వెల్లడిస్తామని తెలిపారు. బుధవారం నాడు పంజాబ్‌-హర్యాన సరిహద్దులోని రెండు ప్రాంతాలలో ప్రదర్శకుల మీద పోలీసులు విరుచుకుపడ్డారు. ఆ సందర్భంగా జరిగిన ఘర్షణలో కొందరు గాయపడటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మిర్చి కలిపిన ఎండుగడ్డిని తగులబెట్టి దానితో రైతులు తమ మీద దాడి చేసినట్లు పోలీసులు ఆరోపించారు. ఉత్తరాఖండ్‌లో కొన్ని చోట్ల ట్రాక్టర్లతో ప్రదర్శనలు జరిపారు.


అంతకు ముందు జరిగిన పరిణామాలలో మూడు పప్పుధాన్యాలు, మొక్కజొన్న, పత్తి పంటలను ఐదేండ్ల పాటు కొనుగోలు చేస్తామని, మిగతా వాటి కనీస మద్దతు ధర గురించి ఎలాంటి హామీ ఇవ్వలేమని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఈ ప్రతిపాదన తమకు ఆమోదం కాదని ఉద్యమాన్ని కొనసాగిస్తామని, ఢిల్లీకి ప్రదర్శనగా వెళతామని ఆందోళనకు నాయకత్వం వహిస్తున్న సంయుక్త కిసాన్‌ మోర్చా( రాజకీయ రహితం-ఎస్‌కెఎం-ఎన్‌పి) నేతలు ప్రకటించారు. పంజాబ్‌-హర్యానా సరిహద్దుల్లో దాదాపు పద్నాలుగువేల మంది రైతులు గత కొద్ది రోజులుగా తిష్టవేశారు.పన్నెండు వందల ట్రాక్టర్లు-ట్రాలీలు, పది మినీ బస్సులు, ఇతర వాహనాలతో రైతులు పదమూడవ తేదీ నుంచి అక్కడే ఉన్నారు వారిని 200కిలోమీటర్ల దూరంలో ఉన్న ఢిల్లీ చేరుకునేందుకు ముందుకు సాగనివ్వకుండా హర్యానా బిజెపి ప్రభుత్వ పోలీసులు అడ్డుకుంటున్నారు. చర్చలు విఫలమైనందున బుధవారం నుంచి ఢిల్లీ చలో పిలుపుతో ముందుకు సాగుతామని ఎస్‌కెఎం-ఎన్‌పి నేతలు ప్రకటించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులను రాజధానిలోకి రానివ్వకూడదని కేంద్ర హౌం మంత్రి అమిత్‌ షా ఢిల్లీ పోలీసులకు గట్టి ఆదేశాలను జారీ చేశారు. మరోవైపున ఉత్తర ప్రదేశ్‌లో ఉన్న బిజెపి సర్కార్‌ కూడా రోడ్లను మూసివేసి అన్నదాతలను అడ్డుకొనేందుకు పూనుకుంది. తాము ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించేందుకు రైతులు భారీ యంత్రాలతో వస్తున్నట్లు, ఇది నేరపూరితమని హర్యానా పోలీసులు ఆరోపించారు.ఢిల్లీ వైపు వచ్చేందుకు పూనుకున్న రైతుల మీద హర్యానా పోలీసులు డ్రోన్లతో బాష్పవాయు గోళాలను విసిరారు. దీంతో షంభు సరిహద్దు ఉద్రిక్తంగా మారింది. జెసిబిలు, క్రేన్లు, పొక్లెయిన్లను రైతులకు సరఫరా చేయవద్దని యజమానులను హెచ్చరించారు. ఈ నేపధ్యంలో రైతుల ఉద్యమం ఏమౌతుంది, రానున్న ఎన్నికలలో బిజెపి, దాని మిత్ర పక్షాల మీద ఆందోళన ప్రభావం ఎలా ఉంటుంది అన్న చర్చ మొదలైంది.


గతంలో ఏడాది పాటు ఆందోళన నిర్వహించిన సంయుక్త కిసాన్‌ మోర్చా(ఎస్‌కెఎం) ప్రభుత్వ తాజా చర్చలలో భాగస్వామి కాదు. అయినప్పటికీ ప్రభుత్వ ప్రతిపాదనలను తాము వ్యతిరేకిస్తున్నామని, రైతులు కొనసాగిస్తున్న ఆందోళనకు మద్దతు ఇస్తున్నట్లు, ఎన్‌డిఏ ఎంపీల ఇండ్ల ముందు నిరసన తెలపాలన్న తమ పిలుపుతో ముందుకు పోతామని ప్రకటించింది. గతంలో అనేక రాష్ట్రాలలో రాజకీయాలతో నిమిత్తం లేని రైతు సంఘాల పేరుతో అనేక మంది సంస్థలను ఏర్పాటు చేసి రైతులను సమీకరించేందుకు ప్రయత్నించారు. ఇప్పుడు కూడా ఉన్నారు. దాని కొనసాగింపుగానే 2020-21లో ఆందోళనలో భాగస్వాములుగా ఉన్న కొందరు ఎస్‌కెం నుంచి విడగొట్టుకొని తాజా ఆందోళనకు పిలుపు ఇచ్చారు. గత ఆందోళనకు దూరంగా ఉన్న కొన్ని సంస్థలు కూడా ఇప్పుడు వారితో కలిశాయి. కేంద్ర ప్రభుత్వం ఒక వైపు దేశ శత్రువులను ఎదుర్కొనే పద్దతిలో రైతులను అడ్డుకొనేందుకు సన్నద్దం అవుతున్నది, మరోవైపు చర్చల పేరుతో లోక్‌సభ ఎన్నికల ప్రకటన జరిగే వరకు కాలయాపన ఎత్తుగడలకు పూనుకుంది. రైతుల మీద తప్పుడు ప్రచారం సరేసరి.


మూడు రకాల పప్పుధాన్యాలు, మొక్కజొన్న, పత్తిని రానున్న ఐదు సంవత్సరాల పాటు కనీస మద్దతు ధరలకు కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రతిపాదించింది.దీనిని రైతు సంఘాలు తిరస్కరించాయి.ఢిల్లీ చలో కార్యక్రమాన్ని కొనసాగిస్తామని ప్రకటించాయి.ఎస్‌కెఎం-ఎన్‌పి నేత జగజిత్‌ సింగ్‌ దలేవాల్‌ సోమవారం నాడు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రు.1.75లక్షల కోట్లతో పామాయిల్‌ దిగుమతి చేసుకుంటున్నదని, ఈ మొత్తాన్ని చమురు గింజల సాగుదార్లకు ఇస్తే వారికి ప్రయోజనం ఉంటుందన్నారు.ప్రభుత్వం చేసిన ప్రతిపాదన పంటల మార్పిడి చేసే రైతులకు మాత్రమే లబ్ది చేకూర్చుతుందన్నారు. తమ డిమాండ్లను ఆమోదించటం లేదా ఢిల్లీలో శాంతియుతంగా నిరసన తెలిపేందుకు అంగీకరించాలని డిమాండ్‌ చేశారు. పోలీసుల దమనకాండలో పంజాబ్‌-హర్యానా సరిహద్దుల్లో 400 మంది రైతులు గాయపడ్డారని దలేవాల్‌ చెప్పారు. సుప్రీం కోర్టు దీని మీద స్వయంగా చర్య తీసుకోవాలని కోరారు. ఆదివారం రాత్రి నుంచి సోమవారం తెల్లవారు ఝామువరకు జరిగిన చర్చలలో రైతులు అంగీకారం తెలిపిన అంశాల మీద మరుసటి రోజు మాట మార్చినట్లు చర్చలలో భాగస్వాములైన వర్గాలు చెప్పినట్లు టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా ఒక సమీక్షలో పేర్కొన్నది.ఇప్పుడు ఆందోళనకు పిలుపుఇచ్చిన వారు నిజంగా అంగీకరించారా లేక వారి మీద చేస్తున్న తప్పుడు ప్రచారంలో భాగంగా ఇలాంటి వార్తలను వ్యాపింపచేస్తున్నారా అన్నది చూడాల్సి ఉంది.

ప్రభుత్వం జరుపుతున్న చర్చల తీరు గురించి గతంలో ఆందోళనకు నాయకత్వం వహించిన వారిలో ఒకరైన హన్నన్‌ మొల్లా ఆదివారం నాడు మాట్లాడుతూ ప్రస్తుతం ఢిల్లీ సరిహద్దులో జరుపుతున్న ఆందోళన తమ పిలుపు మేరకు జరుగుతున్నది కాదని గతంలో తమ నుంచి వేరుపడిన కొన్ని సంస్థలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వారు కూడా తమ పేరునే ఉపయోగిస్తున్నారని చెప్పారు. ఆదివారం రాత్రి జరిగిన నాలుగవ విడత చర్చల గురించి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గత ఆందోళన సందర్భంగా పదకొండుసార్లు చర్చలు జరిపినప్పటికీ పరిష్కారం లేదన్నారు.ఈ పదకొండు దఫాల చర్చలకు 42 మందిని కేంద్రం పిలిచిందని, వారిలో ఇద్దరిని విడదీసిందని, ఇప్పుడు ఆ ఇద్దరితో మాట్లాడుతూ 40 మందిని విస్మరించిందని చెప్పారు. దీన్ని బట్టి ప్రభుత్వం ఏదో ఒక లక్ష్యంతో వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తున్నదని అన్నారు. అయితే దీని అర్ధం ఇప్పుడు రైతు సంఘాలు ముందుకు తెచ్చిన డిమాండ్లను తాము వ్యతిరేకించటం లేదని, వాటిని వెంటనే అమలు జరపాలని హన్నన్‌ మొల్లా చెప్పారు. కనీస మద్దతు ధరలు, వరి, గోధుమ గడ్డి తగులబెట్టటం గురించి చర్చించేందుకు కేంద్రం సిద్దంగా ఉందని కేంద్ర మంత్రి అర్జున్‌ ముండా బుధవారం నాడు చెప్పారు. రైతులను అణచేందుకు చూడవద్దని రైతు నేత సర్వన్‌ సింగ్‌ పాంధెర్‌ బుధవారం నాడు ప్రధాని నరేంద్రమోడీకి విజ్ఞప్తి చేశారు. రైతులే మోడీని ప్రధానిని చేశారని, వారిని విస్మరిస్తే కేంద్ర ప్రభుత్వాన్ని రైతులు క్షమించరని అన్నారు. మీరు మమ్మల్ని చంపవచ్చు కానీ రైతులను అణచవద్దని ప్రభుత్వానికి చెప్పామని, కనీస మద్దతు ధరలకు చట్టబద్దత కల్పిస్తూ ప్రధాని ఒక ప్రకటన చేసి ఆందోళనకు తెరదించాలని అన్నారు.హర్యానా గ్రామాలలో పారా మిలిటరీని దించారని, తామేం నేరం చేశామని ప్రశ్నించారు. భద్రతా దళాలు తమను ఇలా అణచివేస్తాయని కలలో కూడా ఊహించలేదన్నారు. రాజ్యాంగాన్ని రక్షించి శాంతియుతంగా ఢిల్లీ చేరేందుకు తమను అనుమతించాలన్నారు. ఇది తమహక్కు అని స్పష్టం చేశారు. తమ ఉద్దేశ్యం గొడవలు సృష్టించటం కాదని, నవంబరు ఏడవ తేదీ నుంచి ఢిల్లీ వచ్చేందుకు కార్యక్రమాన్ని రూపొందించామని ప్రభుత్వానికి తగిన సమయం లేదని అనటం నిర్లక్ష్యం చేసేందుకు చూడటమే అని జగజిత్‌ సింగ్‌ దలేవాల్‌ అన్నారు. బారికేడ్లతో తమను ఆపటం సరైంది కాదన్నారు.


ఎవరైనా డిమాండ్లను నీరుగార్చినా, ఏదో ఒకసాకుతో వెనక్కు తగ్గినా రైతుల ఆగ్రహాన్ని చవి చూడాల్సి వస్తుంది. ఎన్నికల్లో ఈ అంశంపై చర్చ జరగటం అనివార్యం.రైతులకు రాజకీయాలు వద్దనటం, ఆందోళన వెనుక రాజకీయ పార్టీలు ఉన్నాయని ప్రచారం చేయటమే ఒక రాజకీయం, వారిని తప్పుదారి పట్టించే ఎత్తుగడతప్ప మరొకటి కాదు. ఏ రైతు సంఘం ముందుకు తెస్తున్న డిమాండ్లైనా వ్యవసాయానికి సంబంధించినవే తప్ప వేరు కాదు. వ్యవసాయంతో సహా అన్ని అంశాల మీద విధానాలను రూపొందించేది పార్టీల తరఫున ఎన్నికైన ప్రజాప్రతినిధులతో కూడిన చట్టసభలే. ప్రతి పార్టీకి చెందిన వారు ఏదో ఒక రైతు సంఘంలో పని చేయటం తెలిసిందే. అందువలన తమకు మేలు చేసే వారెవరో కీడు చేసే వారెవరూ రైతులు ఆలోచించాల్సిన అవసరం ఉందా లేదా ?

మూడవ ఏడాదిలో ఉక్రెయిన్‌ సంక్షోభం ! రష్యా పట్టు మరింత బిగిసింది !!

Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


ఉక్రెయిన్‌పై రష్యా ప్రారంభించిన సైనిక చర్య మూడవ ఏడాదిలో ప్రవేశించింది.2022 ఫిబ్రవరి 24న దాడులు ప్రారంభమైనప్పటికీ 21వ తేదీనే వ్లదిమిర్‌ పుతిన్‌ అధికారికంగా ఆదేశాలు జారీ చేశాడు. ఉక్రెయిన్‌ సరిహద్దుల వైపు రష్యా దళాల అసాధారణ కదలిక ఉన్నట్లు 2021నవంబరు పదవ తేదీన అమెరికా వెల్లడించింది. ఒకవేళ దాడికి దిగితే బలమైన ఆర్థిక, ఇతర చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని డిసెంబరు ఏడున అమెరికా అధినేత జో బైడెన్‌ బెదిరించాడు. నాటో కూటమిలో ఉక్రెయిన్‌ చేరకుండా నిషేధం విధించాలని పుతిన్‌ డిసెంబరు 17న ప్రతిపాదించాడు.దాన్ని జెలెనెస్కీ తిరస్కరించాడు. జనవరి 17న తన మిత్రదేశమైన బెలారస్‌తో సైనిక విన్యాసాలు జరిపేందుకు రష్యా ఆరువేల మంది సైనికులు, 60 జెట్‌ విమానాలను పంపింది. తన దళాలను సన్నద్దం చేసినట్లు జనవరి 24న నాటో ప్రకటించింది. ఫిబ్రవరి 10న పది రోజుల పాటు సాగే మిలిటరీ విన్యాసాలు 2014లో రష్యా స్వాధీనం చేసుకున్న క్రిమియా, ఉక్రెయిన్‌ సరిహద్దులో ప్రారంభమయ్యాయి. స్వాతంత్య్రం ప్రకటించుకున్న రెండు తూర్పు ప్రాంతాలపై ఫిబ్రవరి 17న ఉక్రెయిన్‌ మిలిటరీ విరుచుకుపడింది. అదే నెల 21న పుతిన్‌ సైనిక చర్యకు ఉత్తరులు ఇవ్వటంతో పాటు రెండు ఉక్రెయిన్‌ తిరుగుబాటు ప్రాంతాలు డాటెస్క్‌, లుహాన్స్క్‌లకు స్వతంత్ర దేశాలుగా గుర్తింపు ఇస్తున్నట్లు కూడా ప్రకటించాడు, 24వ తేదీన దాడులు ప్రారంభమయ్యాయి.


రెండు సంవత్సరాల ఈ సంక్షోభాన్ని స్థూలంగా చూసినపుడు ఉక్రెయిన్‌పై రష్యా పట్టు మరింత బిగిసింది. భారీ ఎత్తున ఆయుధాలు ఇచ్చిన పశ్చిమ దేశాలు ప్రచారం చేసిన మాదిరి ఉక్రెయిన్‌ ఎదురుదాడులు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేదు. రెండు వైపులా ఎందరు మరణించిందీ ఇంతవరకు విశ్వసనీయమైన ఆధారాలు లేవు.లక్షల్లో ప్రాణ నష్టం ఉంటుందని భావిస్తున్నారు. రష్యా మీద ప్రకటించిన ఆర్థిక, ఇతర ఆంక్షలు దేనికీ కొరగాకుండా పోయాయి.ఈ సంక్షోభం ఇంకా ఎంతకాలం కొనసాగుతుందో తెలియదు.ఉక్రెయిన్‌ ఎక్కువ కాలం ప్రతిఘటన సాగించలేదని, పశ్చిమ దేశాల్లో వైరుధ్యాల గురించి పుతిన్‌, రష్యా గురించి పశ్చిమ దేశాలు వేసుకున్న తొలి అంచనాలు తప్పాయి. పశ్చిమ దేశాలకు ధీటుగా రష్యా కూడా ప్రచారదాడులతో జవాబిచ్చింది. దీంతో జనాల బుర్రలు ఖరాబు అయ్యాయి. తమ నేతలు చెప్పిన అంశాలు, పలికిన ప్రగల్భాల గురించి పశ్చిమ దేశాల జనాల్లో అనుమానాలు, సందేహాలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. అటు అమెరికా, ఇటు రష్యాలోనూ ఎన్నికల్లో ఇది ఒక ప్రధాన అంశంగా మారనుంది. దీంతో రెండింటికీ ఈ సంక్షోభం ప్రతిష్టాత్మకంగా మారింది. రానున్న రోజుల్లో అనూహ్య పరిణామాలు సంభవిస్తే తప్ప అమెరికా నాయకత్వంలోని నాటో కూటమి మరింతగా ఆయుధాలు, ఆర్థిక సాయం అందించటం తప్ప దళాలను ప్రత్యక్షంగా దించే అవకాశాలు కనిపించటం లేదు. ఇవేవీ ఇంతవరకు రష్యాను వెనుకడుగు వేయించలేకపోయాయి. ఈ సంక్షోభానికి ఎప్పుడు,ఎలా తెరపడుతుంది అన్న చర్చ జరుగుతున్నది.


తాజా పరిణామాలను చూద్దాం. తూర్పు ఉక్రెయిన్‌లోని అడీవికా ప్రాంతాన్ని రష్యన్‌ దళాలు స్వాధీనం చేసుకున్నాయి. జన నష్టాన్ని నివారించేందుకు తామే ఖాళీ చేసినట్లు ఉక్రెయిన్‌ ప్రకటించుకుంది. గత ఏడాది మేనెల తరువాత రష్యన్లకు ఇది పెద్ద విజయంగా చెబుతున్నారు. తగిన సంఖ్యలో మిలిటరీ, ఉన్నవారి దగ్గర మందుగుండు లేకనే ఇది జరిగిందని వార్తలు.అడీవికా పతనం కాగానే తమ వద్ద ఉన్న శతఘ్నులను మొత్తం ఇస్తామని డెన్మార్క్‌ ప్రకటించింది. మీరు ఇచ్చినా వాటిని వెంటనే వినియోగించే స్థితిలో లేమని ఉక్రెయిన్‌ చేతులెత్తేసింది. గత రెండు రోజులుగా రష్యా మరిన్ని దాడులకు పూనుకుంది. మ్యూనిచ్‌ నగరంలో జరుగుతున్న భద్రతా సమావేశంలో జెలెనెస్కీ మాట్లాడుతూ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందని దయచేసి మమ్మల్ని అడగకండి, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, పుతిన్‌ ఇప్పటికీ కొనసాగించటానికి ఎలా వీలవుతున్నదో చూడండి అని ఐరోపా సమాఖ్యతో అన్నాడు. ఈ సంక్షోభంలో తాము తటస్థంగా ఉన్నామని చైనా మరోసారి స్పష్టం చేసింది. అన్ని స్థాయిల్లో చైనాతో సంబంధాలు కొనసాగుతున్నాయని ఉక్రెయిన్‌ ప్రకటించింది. ఐరోపాకు రష్యా ముప్పుకొనసాగుతూనే ఉందని, అది కొన్ని నెలలు, సంవత్సరాలు, ఒక తరం వరకు ఉండవచ్చని బ్రిటన్‌ లేబర్‌ పార్టీ నేత డేవిడ్‌ లామీ అన్నాడు. ఉక్రెయిన్‌ ఇప్పుడు జీవన్మరణ స్థితిలో ఉందని, దాని విధిని నిర్ణయించేది తామేనని పుతిన్‌ ప్రకటించాడు.తాము మద్దతు ఇస్తున్నప్పటికీ ఉక్రెయిన్‌తో ఆహార ధాన్యాలు, ట్రక్కుల రవాణా సమస్యలు ఉన్నట్లు పోలాండ్‌ మంత్రి సికోరిస్కీ చెప్పాడు. ఉక్రెయిన్‌కు భద్రత ఉండాలంటే తమ సభ్యత్వం ఇవ్వాలని ఐరోపా యూనియన్‌ ప్రతినిధి జోసెఫ్‌ బోరెల్‌ అన్నాడు. మరో పద్దెనిమిది నెలల పాటు ఉక్రెయిన్‌ పౌరులకు వీసాలను పొడిగిస్తున్నట్లు బ్రిటన్‌ తెలిపింది.దీన్ని బట్టి పశ్చిమ దేశాలకు ఈ సమస్య పరిష్కారం పట్ల ఆసక్తి లేదన్నది స్పష్టమౌతోంది.


రెండు సంవత్సరాల తరువాత రష్యాను శత్రుదేశంగా చూస్తున్నప్పటికీ ఐరోపాలో యుద్ధ ఆయాసం కనిపిస్తోంది. ఉక్రెయిన్‌కు రానున్న రోజుల్లో విజయాలు సంభవిస్తే ఫరవాలేదు లేకుంటే మరింత నీరసం, దాన్నుంచి ఎందుకీ తలనొప్పి అనే భావం కూడా తలెత్తవచ్చు. మొత్తం మీద ఎన్ని మల్లగుల్లాలు పడినా నాటో కూటమి ఐక్యంగానే ఉంది. ఫిన్లండ్‌ కొత్తగా చేరగా స్వీడెన్‌ ఆ బాటలో ఉంది. ఉక్రెయిన్‌లో రష్యా గెలిస్తే అంతర్జాతీయ రాజకీయ వ్యవస్థ వైపు తిరిగే మలుపు పశ్చిమ దేశాల ప్రయోజనాల ఫణంగా జరుగుతుందని భావిస్తున్నారు. బాల్టిక్‌ దేశాలు ఉక్రెయిన్‌కు గట్టి మద్దతు ఇవ్వాలని కోరుతుండగా నాటోలోని హంగరీ, స్లోవేకియా పెదవి విరుస్తున్నాయి.నెదర్లాండ్స్‌,స్లోవేకియాలో గతేడాది జరిగిన ఎన్నికలు నాటో ఐక్యత మీద ప్రశ్నలను ముందుకు తెచ్చాయి. జెలెనెస్కీకి మిలిటరీ మద్దతులో కోత పెట్టాలనే నినాదంతో పోటీ చేసిన పచ్చిమితవాద ఫ్రీడమ్‌ పార్టీ నెదర్లాండ్స్‌లో గెలిచింది.రష్యాకు అనుకూలంగా ఉండాలన్న వైఖరితో ఉన్న స్లోవాక్‌ సోషల్‌ డెమోక్రసీ పార్టీ 22.9శాతం ఓట్లతో పెద్ద పార్టీగా అవతరించింది. అయితే ఈ రెండు చోట్లా ఈ పార్టీలకు సంపూర్ణ మెజారిటీ లేదు. ఉక్రెయిన్‌కు యాభై నాలుగు బిలియన్‌ డాలర్ల అదనపు సాయం అందించాలన్న ప్రతిపాదనను అడ్డుకొనేందుకు హంగరీ ప్రయత్నించింది. ఇప్పటి వరకు చూస్తే జెలెనెస్కీ దళాలకు తాము ఇచ్చిన ఆధునిక ఆయుధాలను ఉపయోగించటంలో నాటో దేశాలు శిక్షణ ఇస్తున్నాయి తప్ప ముందే చెప్పినట్లు ప్రత్యక్షంగా పాల్గొనటం లేదు. అంతర్జాతీయ వేదికల మీద రాజకీయ మద్దతు, రష్యాను ఒంటరి చేసేందుకు చేయాల్సిందంతా చేస్తున్నాయి.


డోనాల్డ్‌ ట్రంప్‌ గతంలో అధికారంలో ఉన్నపుడు మా నుంచి రక్షణ పొందేది మీరు, దానికయ్యే ఖర్చును కూడా మేమే భరించాలా ? కుదరదు మీ కేటాయింపులు పెంచాలని తెగేసి చెప్పాడు. ఇప్పుడు అమెరికా ఎన్నికల్లో ఇది కూడా ఒక సమస్యగా ముందుకు వచ్చింది. ఐక్యతకే ముప్పు తెచ్చేదిగా ఉందని కొరదరు చెబుతున్నారు. అవసరాలకు అనుగుణ్యంగా నిధులు కేటాయించని దేశాలకు రక్షణ ఇవ్వాలనుకోవటం లేదని ఇటీవల ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌ చెప్పాడు.ఈ అంశంలో బైడెన్‌-ట్రంప్‌ వైఖరిలో చాలా తేడా ఉంది. అది కేవలం ఎన్నికల్లో ఓట్ల కోసమే అనే వారు కూడా లేకపోలేదు. ఎవరేం మాట్లాడినా అంతిమంగా అమెరికా ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తారు. నాటో దేశాలు పైకి బింకంగా కనిపిస్తున్నప్పటికీ ఉక్రెయిన్‌ సంక్షోభం నుంచి ఎలా బయటపడాలో వాటికి తోచటం లేదు.నష్టదాయకమైన షరతులతో రష్యాతో రాజీకి అంగీకరించటమా లేక పోరును పొడిగించి ఓటమిని మూటగట్టుకోవటమో ఏదో ఒకటి జరుగుతుందని అనేక మంది నమ్ముతున్నారు.ఏది జరిగినా ప్రపంచ రాజకీయాల్లో అమెరికా, దాని మిత్ర దేశాలకు ప్రతికూలత మరింత పెరుగుతుంది.


కొందరు కొరియా నమూనాలో పోరు ముగియవచ్చు అని చెబుతున్నారు. 1950దశకంలో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరి ఒకే దేశంగా ఉండాల్సిన కొరియా రెండు భూభాగాలుగా ఉంది తప్ప సాంకేతికంగా యుద్ధ విరమణ ఒప్పందం ఇప్పటికీ లేదు.దక్షిణ కొరియా రక్షణకు హమీ ఉన్నట్లుగా ఉక్రెయిన్‌కు నాటో రక్షణ హామీని రష్యా ఎట్టి పరిస్థితిలో అంగీకరించదు గనుక అది కూడా జరగకపోవచ్చన్నది మరొక వాదన. ఉక్రెయిన్‌ సంక్షోభం మొదలైన తరువాత చైనా -రష్యా సంబంధాలు మరింత బలపడటమే గాక రెండూ దగ్గరయ్యాయి. అంటే ప్రచ్చన్న యుద్ధకాలంలో మాదిరి రెండు శిబిరాలుగా ప్రపంచం చీలిందని సూత్రీకరించేవారు కూడా లేకపోలేదు. తటస్థంగా ఉన్నా, ఆయుధాలను సరఫరా చేయకున్నా, పశ్చిమ దేశాల ఆంక్షల ప్రభావం నుంచి తప్పించేందుకు చైనా ఇటీవలి కాలంలో రష్యా నుంచి తన దిగుమతులను పెంచుకొన్నది.ఈ పరిణామంతో అట్లాంటిక్‌ ప్రాంత దేశాలు వీటికి వ్యతిరేకంగా దగ్గర అవుతున్నాయి.రక్షణ బడ్జెట్లను, మిలిటరీని పెంచుతున్నాయి.గత ప్రచ్చన్న యుద్ధానికి ఇప్పటిదానికి చాలా తేడా ఉన్నది. సోవియట్‌-చైనా బంధం కంటే ఇప్పుడు చైనా-రష్యా బంధం ఎంతో ప్రాధాన్యత కలిగింది.నాడు చైనా ఆర్థికంగా మిలిటరీ రీత్యా నేటి మాదిరి బలం కలిగి లేదు. గతంలో సోవియట్‌-చైనా మధ్య ఉన్న విబేధాలను అమెరికా వినియోగించుకుంది, ఇప్పుడు అలాంటి అవకాశం లేదు.
ప్రస్తుత పరిస్థితిని చూస్తుంటే ఏ పక్షమూ గెలిచే లేదా ఓడిపోయే స్థితి లేదని మరికొంతకాలం కొనసాగుతుదంటున్నవారు కొందరు. గత ఏడాది ఆర్భాటం చేసి ప్రారంభించిన ఎదురుదాడిలో మొత్తంగా చూసినపుడు ఉక్రెయిన్‌కు మరిన్ని నష్టాలు, కొత్త ప్రాంతాలను కోల్పోవటం, ఆత్మరక్షణలో భారీ సంఖ్యలో ప్రాణాలను బలిపెడుతున్నది. మరోవైపు రష్యా కూడా ప్రాణాలను పెద్ద సంఖ్యలో కోల్పోవటంతో పాటు యుద్ధ సామగ్రిని కూడా భారీగా నష్టపోతున్నది. రానున్న ఎన్నికల కారణంగా పెద్ద సంఖ్యలో మిలిటరీ రిక్రూట్‌మెంట్లు కూడా చేసే పరిస్థితి లేదు. జనాభా రీత్యా తక్కువ సంఖ్య ఉన్న ఉక్రెయిన్‌కు ఇంకా కష్టం. పశ్చిమ దేశాలు ఊహించినదానికి భిన్నంగా పుతిన్‌ తనకు కావాల్సిన ఫిరంగి గుండ్లు ఇతర వాటిని ఇరాన్‌, ఉత్తర కొరియా నుంచి పొందుతున్నాడు.ఉక్రెయిన్‌కు నాటో సరఫరాలు సరేసరి. ఉక్రెయిన్‌ లొంగుబాటు తప్ప మరే చర్చలు లేవని పుతిన్‌ తెగేసి చెప్పాడు.పదేండ్ల నాడు కోల్పోయిన క్రిమియాతో సహా అన్ని ప్రాంతాలను తిరిగి తమకు అప్పగిస్తే తప్ప రాజీ లేదని జెలెనెస్కీ చెప్పటం, ఈ ఏడాది నవంబరులో అమెరికా ఎన్నికల ఉన్నందున ఏడాది పొడవునా పోరు కొనసాగవచ్చు.

చండీఘర్‌ మేయర్‌ పదవి కక్కుర్తి, విలువలు, వలువలు విప్పేసిన బిజెపి ! సుప్రీం కోర్టు చెంపదెబ్బ !!

Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


పదేండ్లుగా దేశంలో ఎదురులేని అధికారాన్ని, మెజారిటీ రాష్ట్రాలలో పాలన సాగిస్తున్న బిజెపి అధికార కక్కుర్తి ఎలా ఉందో కేంద్ర పాలిత ప్రాంతమైన చండీఘర్‌ మేయర్‌ ఎన్నిక రుజువు చేసింది. లోక్‌సభ ఎన్నికల ముందు దేశ ఉన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు బిజెపి చెంప చెళ్లుమనే తీర్పు ఇచ్చింది. మరోసారి ఎన్నిక జరపాల్సిన అవసరం లేదని జనవరి 30న జరిగిన అక్రమాన్ని సరిదిద్ది ఆమ్‌ ఆద్మీ పార్టీ అభ్యర్ధి కులదీప్‌ కుమార్‌ గెలిచినట్లు ప్రకటించింది. రిటర్నింగ్‌ అధికారిగా వ్యవహరించిన బిజెపి నేత అనిల్‌ మాసి మీద చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌ నేత్రత్వంలోని ముగ్గురు సభ్యుల బెంచ్‌ ఇచ్చిన తీర్పు నిజంగా బిజెపికి చెప్పుకోలేని చోట తగిలిన దెబ్బగా మారింది. జనవరి 30న జరిగిన ఎన్నికలో ఆప్‌ అభ్యర్ధికి పడిన ఎనిమిది ఓట్లు చెల్లనివిగా పరిగణించి బిజెపి అభ్యర్ధి గెలిచినట్లు రిటర్నింగ్‌ అధికారి ప్రకటించారు. ఎనిమిది ఓట్లను చెల్లకుండా చూసేందుకు అనిల్‌ మాసి కావాలనే ప్రయత్నించినట్లు కోర్టు పేర్కొన్నది. సోమవారం నాడు కోర్టులో సాక్ష్యం చెప్పిన ఈ పెద్దమనిషి ఎనిమిది బాలట్‌ పత్రాలు చెడిపోయినట్లు ప్రకటించారు.రికార్డుల్లో అలాంటిదేమీ లేదని కోర్టులో తప్పుడు ప్రకటన చేసినట్లు సుప్రీం కోర్టు పేర్కొన్నది. కోర్టు ధిక్కరణ నోటీసు జారీ చేసింది.అనిల్‌ మాసి ఎనిమిది బాలట్‌ పత్రాలపై టిక్కులు పెట్టినట్లు సిసిటీవీలో రికార్డైంది. సంతలో పశువులను కొన్నట్లు మేయర్‌ ఎన్నిక జరిగిందని కోర్టు పేర్కొన్నది. అంతకు ముందు పంజాబ్‌-హర్యానా హైకోర్టులో ఎన్నికను సవాలు చేయగా ఫలితాన్ని నిలిపివేసేందుకు తిరస్కరించింది. సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించిన తేదీకి ఒక రోజు ముందు ఆదివారం నాడు గతంలో ఎన్నికైనట్లు ప్రకటించిన మనోజ్‌ సోంకర్‌ మేయర్‌ పదవికి రాజీనామా చేశారు. అదే రోజు రాత్రి ఆమ్‌ ఆద్మీకి చెందిన ముగ్గురు కౌన్సిలర్లను ఢిల్లీలో బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్‌ తాడే పార్టీలో చేర్చుకున్నారు. ప్రధాని నరేంద్రమోడీ పని తీరును చూసి ఉత్తేజం పొందామని, తమ వార్డుల అభివృద్ది కోసం బిజెపిలో చేరినట్లు వారు ప్రకటించారు. 2026లో తిరిగి కార్పొరేషన్‌ ఎన్నికలు జరుగుతాయి.


పది లక్షలకు పైగా జనాభా, ఆరులక్షల 30వేల మంది ఓటర్లున్న చండీఘర్‌లో 35 కౌన్సిలర్ల స్థానాలు ఉన్నాయి. వీరు గాక వివిధ రంగాలకు చెందిన పది మందిని ఓటింగ్‌ హక్కులేని కౌన్సిలర్లుగా నియమిస్తారు. వారిలో ఒకరు మేయర్‌ ఎన్నికలో రిటర్నింగ్‌ అధికారిగా ఉంటారు. అనిల్‌ మాసి బిజెపి మైనారిటీ మోర్చానేతగా ఎప్పటి నుంచో ఉన్నారు.2021 డిసెంబరు 24న 35 స్థానాలకు కార్పొరేషన్‌ ఎన్నికలు జరిగాయి. ఏడాదికి ఒక సారి మేయర్‌ ఎన్నిక జరుగుతుంది. ఐదేండ్ల పదవీ కాలంలో తొలి, నాలుగవ సంవత్సరం మేయర్‌ పదవిని మహిళలకు రిజర్వు చేశారు. తొలిసారిగా పోటీ చేసిన ఆమ్‌ ఆద్మీ 14 సీట్లతో పెద్దపార్టీగా ఉంది.బిజెపికి పన్నెండు, కాంగ్రెస్‌కు ఎనిమిది, అకాలీదళ్‌కు ఒకటి చొప్పున వచ్చాయి. తొలి మేయర్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌, అకాలీదళ్‌ పాల్గొనలేదు.ఒక కాంగ్రెస్‌ కౌన్సిలర్‌ ఫిరాయించి బిజెపిలో చేరాడు. ఎంపీ ఓటుతో కలిపి బిజెపికి 14 రాగా, ఆమ్‌ ఆద్మీకి 14 రాగా ఆమ్‌ ఆద్మీకి వచ్చిన ఒక ఓటు మీద టిక్కు పెట్టి అది చెల్లదంటూ బిజెపి గెలిచినట్లు ప్రకటించారు. బిజెపికి వచ్చిన ఓట్లలో ఒకటి చినిగినప్పటికీ దాన్ని ఆమోదించారు. ఆ ఎన్నికను సవాలు చేస్తూ అప్పుడు కూడా కోర్టుకు వెళ్లినా ఫలితం లేకపోయింది.ఈఎన్నికల్లో పార్టీల వారీగా కాంగ్రెస్‌కు 29.79, బిజెపికి 29.30, ఆమ్‌ ఆద్మీకి 27.08శాతం చొప్పున ఓట్లు వచ్చాయి.తాజాగా జరిగిన మేయర్‌ ఎన్నికలో ఆమ్‌ ఆద్మీ పార్టీకి కాంగ్రెస్‌ మద్దతు ఇచ్చింది. దీంతో బిజెపి ఓటమి ఖాయంగా మారటంతో రిటర్నింగ్‌ అధికారి అక్రమానికి తెరతీశారు. అనిల్‌ మాసి 2015 నుంచి బిజెపిలో చురుకుగా పని చేస్తున్నారు.2022లో కౌన్సిలర్‌గా నామినేట్‌ అయ్యారు. అంతకు ముందు మైనారిటీ మోర్చా ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. ఇతగాడు వివాదాలకు కొత్త కాదు. ఒక కమిటీ సమావేశంలో విశ్వాసానికి వ్యతిరేకంగా మాట్లాటమే గాక నోరుపారవేసుకోవటంతో రెండు సంవత్సరాల పాటు చర్చ్‌ కార్యకలాపాల్లో పొల్గొనకుండా చర్చ్‌ ఆఫ్‌ నార్త్‌ ఇండియా(సిఎన్‌ఐ) 2018లో ఆంక్షలు విధించింది. రెండు సంవత్సరాల తరువాత వాటిని ఎత్తివేశారు. ఎక్కడా కుదురుగా పని చేయని అనిల్‌ రాజకీయాల్లో పూర్తిగా నిమగమయ్యారు.


తమ వారు ఎలాంటి అధికార దుర్వినియోగానికి పాల్పడరని, సాదా సీదాగా గడుపుతారని బిజెపి చెప్పుకోవటం తెలిసిందే.అక్రమంగా గెలిచిన మహిళా బిజెపి మేయర్‌ సర్వజిత్‌ కౌర్‌ కూడా అలాంటి కబుర్లే చెప్పారు. తరువాత ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ సంపాదించిన రికార్డుల్లో ఉన్న వివరాల ప్రకారం ఆమె ఏడాది పదవీ కాలం చివరిలో పది రోజుల ముందుగా రు.1,50,306 విలువగల ఆపిల్‌ ఐ ఫోన్‌, రు.75వేల విలువ గల ఆపిల్‌ మాక్‌బుక్‌ను స్వంతానికి కొనుగోలు చేశారు. అక్కడి నిబంధనల ప్రకారం ఎంత మొత్తం అనేదానితో నిమిత్తం లేకుండా మేయర్లుగా ఉన్నవారు ఫోన్‌, లాప్‌టాప్‌ కొనుక్కోవచ్చు. అదే కౌన్సిలర్లకు గరిష్ట పరిమితి నలభై వేలు మాత్రమే ఉంది. పదవీ కాలం చివరిలో కొనుగోలు గురించి అడగ్గా మేయర్‌ భర్త జగతార్‌ జగ్గా సమాధానమిస్తూ కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంది, ఒక వేళ తీసుకోకపోతే ఎందుకు తీసుకోలేదు అని అందరూ అడుగుతారు, అందుకని తామూ తీసుకున్నామని చెప్పారు.గతంలో కొందరు మేయర్‌గానూ, కౌన్సిలర్‌గా రెండు ఫోన్లు తీసుకున్నవారున్నారని, తన భార్య ఒకటే తీసుకున్నట్లు సమర్దించుకున్నారు.అంతకు ముందు కౌన్సిలర్‌గా ఉన్న అతను కూడా 2017లో ఒక ఐఫోన్‌ తీసుకున్నారు. 2016 ఎన్నికల్లో బిజెపి మెజారిటీ కౌన్సిలర్లు ఉన్నారు. అప్పుడు మేయర్లుగా పని చేసిన వారందరూ ఇలా ప్రజల సొమ్ముతో ఖరీదైన సెల్‌ ఫోన్లు కొన్నారు. పదవి నుంచి దిగిపోయే ముందు ఏడాదికి 20శాతం చొప్పున వెలలో తగ్గించి మిగతా సొమ్మును కార్పొరేషన్‌కు చెల్లించాల్సి ఉంది.

ముగ్గురు రైతుల కళ్లు పోగొట్టిన పోలీసులు : మరో కమిటీ నాటకం, తన సిఫార్సుల అమలుకు తానే మొరాయిస్తున్న మోడీ ?

Tags

, , , , , ,


ఎం కోటేశ్వరరావు


పంజాబ్‌-హర్యానా సరిహద్దులో హర్యానా పోలీసులు, భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో పిల్లెట్లు తగిలి ముగ్గురు రైతులు కళ్లు కోల్పోయినట్లు పంజాబ్‌ ఆరోగ్య మంత్రి డాక్టర్‌ బల్బీర్‌ సింగ్‌ చెప్పారు. కాలం చెల్లిన, ప్రైవేటు కంపెనీల మందుగుండును రైతుల మీద ఉపయోగిస్తున్నారని, అవి లెక్కల్లో చూపరని రైతు నేత సర్వాన్‌ సింగ్‌ పాంధెర్‌ చెప్పారు. కనీస మద్దతు ధరల మీద మరోకమిటీ వేసేందుకు ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అదే నిజమైతే అది కాలయాపన తప్ప మరొకటి కాదు. ఇప్పటికే ఒక కమిటీ ఉంది, అదేమి చేస్తున్నదో తెలియదు. వచ్చే ఎన్నికల్లో తాము 400 సీట్లు సాధించబోతున్నామని, అవి రైతుల సమస్యల పరిష్కారానికే గనుక రాజకీయం చేయవద్దని బిజెపి నేత అశోక్‌ తన్వర్‌ చెప్పారు. ” ఈ సమస్య రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అంశం కూడా,దీనికి పరిష్కారం కనుగొనాలంటే వ్యవధి అవసరం. ” మరోసారి ప్రారంభమైన రైతు ఉద్యమం ముందుకు తెచ్చిన డిమాండ్ల మీద కేంద్ర మంత్రి అర్జున్‌ ముండా ఫిబ్రవరి పదమూడున చెప్పిన మాట. పదిహేనవ తేదీ రాత్రి రైతు ప్రతినిధులతో జరిపిన చర్చలు ఎలాంటి ఫలితాలు లేకుండా ముగిశాయి. పద్దెనిమిదవ తేదీ సాయంత్రం మరోసారి చర్చలు జరుపుతామని కేంద్ర మంత్రి ప్రకటించారు. పరిష్కారం తేలేవరకు ఆందోళన కానసాగుతుందని రైతు సంఘాలు వెల్లడించాయి. ఢిల్లీ చలో అన్న నినాదంతో సాగిన ఉద్యమానికి ఇచ్చిన పిలుపుకు మూడు సంవత్సరాలు నిండిన సందర్భంగా 2023 నవంబరు 26 నుంచి 28వరకు చండీఘర్‌లో నిరసన తెలపాలని పంజాబ్‌ రైతులు పిలుపు నిచ్చారు. దాని కొనసాగింపే తాజా ఢిల్లీ చలో నిరసన. అప్పటి నుంచి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఏమి చేస్తున్నట్లు ? మంత్రి మాటలను బట్టి ఏదో విధంగా కాలయాపన చేసి ఆందోళనను అణచివేసేందుకు లేదా మరో విధంగా ముగించేందుకు కేంద్రం చూస్తున్నట్లు కనిపిస్తోంది.


రైతులు ముందుకు తెచ్చిన సమస్య మీద గానీ, తానే ప్రకటించిన కమిటీ నివేదికను సత్వరం తెప్పించటం గురించిగానీ కేంద్రానికి చిత్తశుద్ధి ఉందా ? రాష్ట్రాలతో చర్చించాలని కనీస మద్దతు ధరల కమిటీ ప్రకటించిన 20నెలల తరువాత(2022జూలై) మంత్రి మాట్లాడుతున్నారు. గతంలో ఉద్యమం సందర్భంగా జరిగిన పరిణామాలను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలి. వ్యవసాయం ఉమ్మడి జాబితాలో ఉన్నప్పటికీ ప్రధానంగా అమలు జరిపేది రాష్ట్రాలే. మూడు సాగు చట్టాలను తెచ్చినపుడు కేంద్రం రాష్ట్రాలతో సంప్రదించకుండానే ఏకపక్షంగా తెచ్చింది. వెనక్కు తీసుకొనేటపుడు కూడా చర్చలు జరపలేదు. ఆ సందర్భంగా ఎంఎస్‌పి కమిటీ ఏర్పాటు ముందు కూడా రాష్ట్రాల వైఖరిని తెలుసుకోలేదు. ఇప్పుడు రాష్ట్రాలతో చర్చించాలని చెప్పటం వంచన తప్ప మరొకటి కాదు. చర్చలు జరపకుండా ఇంతకాలం ఎవరు అడ్డుపడ్డారు ? కేంద్ర ప్రభుత్వం ఎందుకింత మొండితనంతో వ్యవహరిస్తున్నది ? అడిగేవాటికి సమాధానం రావటం లేదు. 1991లో ప్రారంభించిన ఆర్ధిక సంస్కరణల సమయంలో కేంద్ర ప్రభుత్వం ప్రపంచ బ్యాంకుతో కుదుర్చుకున్న ఒప్పందాలు లేదా బ్యాంకు నిర్దేశించిన షరతులు ఏమిటో, ఆ తరువాత గత ప్రభుత్వాలు నియమించిన కమిటీలు ఏమి చెప్పాయో తెలుసుకుంటే తప్ప మోడీ సర్కార్‌ ఆచరణను అర్ధం చేసుకోలేము.


2004 డిసెంబరు 13న నం. 164తో లోక్‌సభలో ఒక ప్రశ్న అడిగారు. భారత ఆహార సంస్దను పునర్వ్యస్ధీకరించేందుకు మెకెన్సీ కంపెనీని నియమించిందా ? అభిజిత్‌ సేన్‌ కమిటీ, హైదరాబాద్‌ అడ్మినిస్ట్రేటివ్‌ కాలేజీ(ఆస్కి) నివేదికలు ఉన్నాయా ? వాటి ప్రధాన సిఫార్సులేమిటి అన్నది దాని సారాంశం. దానిలో ఈ నియామకాలన్నీ బిజెపి నేత అతల్‌ బిహారీ వాజ్‌పేయి ఏలుబడిలో జరిగాయి. ఆస్కీ నివేదికలో చేసిన ముఖ్యమైన సిఫార్సులు ఇలా ఉన్నాయి. లెవీ పద్దతిలోనే ఎఫ్‌సిఐ ధాన్యం కొనుగోళ్లు చేయాలి.నాణ్యతా ప్రమాణాలను సడలించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకూడదు, వివిధ పధకాలకు, ఆపద్దర్మ నిల్వలకు అవసరమయ్యే ఆహార ధాన్యాల మొత్తాలను మాత్రమే కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలి. రాష్ట్రాలు తమ స్వంత సేకరణ పద్దతులను అభివృద్ది చేసుకోవాలి, విత్త సంబంధ మద్దతు కోసమే కేంద్రంపై ఆధారపడాలి. ఆహార ధాన్యాలను ఆరుబయట నిల్వచేయటాన్ని నిలిపివేయాలి. గ్రామీణ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం నిధులకు బదులు ఆహారధాన్యాలను కేటాయించాలి. ఆపద్దర్మ నిల్వలకు కేంద్ర ప్రభుత్వం గ్రాంటులు ఇవ్వాలి తప్ప బ్యాంకుల నుంచి రుణాలు తీసుకో కూడదు.కనీస మద్దతు ధరలకు కొనుగోలు, కేంద్ర జారీ ధరలు, ఎంత మొత్తం సేకరించాలనే అంశాలపై ఎఫ్‌సిఐ కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. ధాన్య సేకరణ, నిల్వ, పంపిణీలను వేరు చేయాలి. జాతీయ ఆపద్దర్మ నిల్వలను వ్యూహాత్మక ప్రాంతాలలో మాత్రమే ఎఫ్‌సిఐ నిర్వహించాలి.మార్కెట్లలో ఏజంట్ల కమిషన్‌ నిలిపివేయాలి. ధాన్య సేకరణకు, స్వంత సేకరణ ధరల నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వాలను ప్రోత్సహించాలి. వ్యవసాయాన్ని వివిధీకరించేందుకు ప్రత్యేకించి పంజాబ్‌, హర్యానాలలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ఆహారధాన్యాల మార్కెట్లో ప్రయివేటు రంగం మరియు బహుళజాతి కార్పొరేషన్లను ప్రోత్సహించాలి.


దీర్ఘకాలిక ధాన్య విధాన రూపకల్పనకు సిఫార్సులు చేసేందుకు ఏర్పాటు చేసిన ఫ్రొఫెసర్‌ అభిజిత్‌ సేన్‌ కమిటీ చేసిన ముఖ్య సిఫార్సులేమిటో చూద్దాం. కనీస మద్దతు ధరలను అత్యంత సమర్ధవంతమైన ప్రాంతాలలో సి2 ఖర్చు ప్రాతిపదికన (అంటే కుటుంబసభ్యుల శ్రమ, స్వంత పెట్టుబడి, భూమి కౌలు) నిర్ణయించాలి. కనీస మద్దతు ధరల కింద కొనుగోలు చేసే వాటి మీద కేంద్ర ప్రభుత్వం గరిష్టంగా నాలుగుశాతం పన్నులు మరియు లెవీలు చెల్లించాలి. పంజాబ్‌, హర్యానా వంటి రాష్ట్రాల నుంచి ధాన్య సేకరణ నుంచి ఎఫ్‌సిఐ ఉపసంహరించుకొని తన మానవనరులను తూర్పు, మధ్య భారత్‌లో నియమించాలి. రాష్ట్రాలకు మరింత ఆకర్షణీయంగా, వికేంద్రీకరణ సేకరణను మెరుగుపరచాలి. ఎఫ్‌సిఐ ధాన్య సేకరణలో మెరుగైన సగటు ప్రమాణాలను పాటించాలి. రైస్‌ మిల్లరు లెవీ ఇచ్చే విధానాన్ని రద్దు చేయాలి.సి2 స్ధాయికి కనీస మద్దతు ధరలను నిర్ణయించటంతో పాటు రాష్ట్రాలకు పరిహార పాకేజ్‌లను అమలు జరపాలి.వాటితో పంటల వివిధీకరణను ప్రోత్సహించాలి. వేగంగా వాణిజ్య ప్రాతిపదికన నిర్ణయం తీసుకొనే విధంగా ఎఫ్‌సిఐ మారాల్సిన అవసరం ఉంది. ఆహారధాన్యాల ఎగుమతి పూర్తిగా ప్రయివేటుకే అప్పగించాలి. ఎగుమతులకు మాత్రమే సబ్సిడీలు ఇవ్వాలి. కనీస మద్దతు ధరలకు చట్టబద్దత కల్పించాలి, వాటిని సిఫార్సు చేసే సిఏసిపిని సాధికార చట్టబద్దమైన సంస్దగా మార్చాలి.


2020డిసెంబరు 18వ తేదీన ప్రధాని నరేంద్రమోడీ మధ్యప్రదేశ్‌ రైతులతో వీడియో కాన్పరెన్సుద్వారా మాట్లాడారు. ఇప్పుడు తీసుకున్న చర్యలు 25-30 సంవత్సరాల క్రితమే అమలు జరపాల్సినవి. తెల్లవారేసరికి ఇవి రాలేదు. ప్రతి ప్రభుత్వమూ వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో గత 20-22 సంవత్సరాలుగా విస్తృతంగా చర్చించినవే అని ప్రధాని చెప్పారు.పైన పేర్కొన్న అభిజిత్‌ సేన్‌, ఆస్కీ సిఫార్సులు ఇరవై సంవత్సరాల నాటి వాజ్‌పేయి సర్కార్‌ హయాంలోనివే.వాటిలో కొన్నింటిని ప్రభుత్వాలు అమలు జరిపాయి. ప్రధాని చెప్పిన 25-30 సంవత్సరాల విషయానికి వస్తే అంతకు ముందుకు అంటే 30 సంవత్సరాల నాటి ప్రపంచ బాంకు షరతులు ఏమిటో తెలుసుకుంటే ఆ మాటలకు అర్ధం తెలుస్తుంది. మూడు వ్యవసాయ చట్టాల బండారం మరింతగా బయటపడుతుంది. ప్రపంచబ్యాంకు మన కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి, సమాచారం తీసుకొని పద్దెనిమిది నెలల సమయం తీసుకొని ఒక నివేదికను రూపొందించింది. ఇండియా 1991 కంట్రీ ఎకమిక్‌ మెమోరాండం( రిపోర్ట్‌ నం.9412 ఇండియా) పేరుతో 1991 ఆగస్టు 23న రెండు సంపుటాలుగా తయారు చేశారు. దాన్ని రెండు దశాబ్దాలు రహస్యంగా ఉంచి 2010 జూన్‌ 12న బహిర్గతం చేశారు. వీటిలో ముఖ్యమైన సిఫార్సులను చూద్దాం. వాటి నేపధ్యంలోనే గత మూడు దశాబ్దాలలో కేంద్రంలో, రాష్ట్రాలలో ఏ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా అనేక చర్యలు అమలు జరిపి ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌ను సంతృప్తి పరచారు. ఇప్పుడు నరేంద్రమోడీ గారు అదే సంతుష్టీకరణపనిలో ఉన్నారు. కరోనా కనుక ఎవరూ వ్యతిరేకంగా ఆందోళన చేసేందుకు ముందుకు రారనే అంచనాతో జూన్‌లో ఆర్డినెన్స్‌, సెప్టెంబరులో పార్లమెంట్‌లో చర్చలేకుండా బిల్లులు, వెంటనే రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయించి చూశారా నేను ఎంత వేగంగా పని చేస్తానో అని దేశ-విదేశీ కార్పొరేట్ల ముందు రొమ్ము విరుచుకున్నారు. వ్యవసాయ రంగాన్ని ఇప్పటికే కొంత మేరకు విదేశీ-స్వదేశీ కార్పొరేట్లకు తెరిచారు. ఒకప్పుడు నూతన విత్తనాలను రూపొందించటం, ఉత్పత్తి ప్రభుత్వరంగ సంస్ధలే చేసేవి. ఇప్పుడు ఎక్కడా వాటి ఊసేలేకుండా చేశారు. మూడు వ్యవసాయ చట్టాలతో మార్కెట్‌ను మరింతగా తెరిచేందుకు, ప్రభుత్వం బాధ్యతల నుంచి తప్పుకొనేందుకు ప్రాతిపాదిక వేశారు. రైతుల ఆందోళనతో వెనక్కు తగ్గారు.


ఇంతకీ ప్రపంచబ్యాంకు వ్యవసాయరంగం గురించి ఆదేశించిన లేదా సూచించిన సిఫార్సులేమిటి ? అవి మూడు రకాలు. తక్షణం చేపట్టవలసినవి, మధ్యంతర, దీర్ఘకాలిక చర్యలుగా సూచించారు.1ఏ). వ్యవసాయానికి ఉన్న – ఎరువులు, నీటి, విద్యుత్‌, బ్యాంకురుణాల సబ్సిడీలన్నింటినీ రద్దు చేయాలి. విదేశీవాణిజ్యానికి వ్యవసాయ మార్కెట్‌ను తెరవాలి. నాలుగు సంవత్సరాల వ్యవధిలో ఎరువుల సబ్సిడీలను ఎత్తివేయాలి. బి) ప్రాధాన్యతా రంగానికి నిర్ణీత శాతాలలో రుణాలు ఇవ్వాలనే నిబంధన కింద వ్యవసాయానికి ఇచ్చే కోటాను ఎత్తివేయాలి. సబ్సిడీలను ఎత్తివేసి వడ్డీ రేటు పెంచాలి.సి) సాగు నీరు, పశువైద్యం వంటి విస్తరణ సేవలకు వసూలు చేస్తున్న చార్జీల మొత్తాలను పెంచాలి. వీటిలో ప్రయివేటు రంగానికి పెద్దపీట వేయాలి, పెట్టుబడులకు అవకాశం ఇవ్వాలి.డి) వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులకు సంబంధించి ఉన్న రక్షణలన్నింటినీ తొలగించాలి. తొలిచర్యగా ఖాద్యతైలాల గింజలను అనుమతించాలి. వ్యవసాయ ఎగుమతులపై ఉన్న ఆంక్షలను తొలగించాలి.ఇ) ప్రయివేటు పరిశోధనా సంస్ధల విత్తనాలను ప్రోత్సహించాలి, ప్రయివేటు మార్కెటింగ్‌పై నిబంధనలను తొలగించాలి, విత్తన సబ్సిడీలను ఎత్తివేయాలి.ఎఫ్‌) వ్యవసాయేతర చార్జీల స్ధాయికి వ్యవసాయ విద్యుత్‌ ఛార్జీలను కూడా పెంచాలి.


2. మొత్తం ఆహార సేకరణ మరియు ప్రజాపంపిణీ వ్యవస్ధను రద్దు చేయాలి.ఏ) భారత ఆహార సంస్ద ప్రత్యక్ష పాత్రను తగ్గించాలి. కొనుగోలు, రవాణా, ధాన్య నిల్వ వంటి పనులన్నీ లైసన్సు ఉన్న ప్రయివేటు వారి ద్వారా చేపట్టాలి. రైతులు నిల్వ చేస్తే ప్రోత్సాహకాలు ఇవ్వాలి.బి)ఆపద్దర్మ నిల్వలను కొద్దిగా నిర్వహించాలి. కొరత వచ్చినపుడు ప్రపంచ మార్కెట్లవైపు చూడాలి. విదేశీమారక ద్రవ్యం ఎంత ఉందో చూసుకొని కొరత ఉన్న సంవత్సరాలలో బయటి నుంచి కొనుగోలు చేయాలి.సి) మద్దతు ధరల కార్యక్రమాలను ప్రభుత్వం సేకరణకు అమలు చేయకూడదు. డి) అధికారయుతంగా పేదలుగా గుర్తించిన వారికి మాత్రమే ఆహార సబ్సిడీలు ఇవ్వాలి. ప్రయివేటు రంగం ద్వారా పంపిణీ పద్దతిని కూడా వినియోగించాలి. పైన పేర్కొన్నవి మూడు దశాబ్దాల నాటి ప్రపంచ బ్యాంకు ఆదేశాలు. అధికారంలో ఎవరున్నా వాటిని అమలు జరపటం తప్ప వెనక్కు పోవటం లేదు. ఆ తరువాత ఎన్ని కమిటీలు వేసినా కొన్ని సిఫార్సులు అదనంగా చేయటం తప్ప ప్రపంచ బ్యాంకు అజెండా పరిధిలోనే ఉన్నాయి. యుపిఏ హయాంలో అన్ని సంస్కరణలూ చేయలేదనే కోపంతో కార్పొరేట్‌ శక్తులు నరేంద్ర మోడీ వెనుక సమీకృతం అయ్యాయి. ఇప్పుడు ఆచరణ చూస్తున్నాము.
కనీస మద్దతు ధరలు, వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ వ్యవస్ధలను ప్రభావితం చేసే (రద్దుచేసిన) మూడు సాగు చట్టాలలో ఎక్కడా కనీసం మద్దతు ధరల ప్రస్తావన లేదు. కనుకనే రైతాంగం కనీస మద్దతు ధరలను చట్టబద్దం చేయమంటోంది. 2011లో గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నరేంద్రమోడీ నాయకత్వంలోని ముఖ్యమంత్రుల కమిటీ కనీస మద్దతు ధరలకు చట్టబద్దత కల్పించాలని ఆషామాషీగా కేంద్రానికి సిఫార్సు చేసిందా ? ఈ కమిటీలో నాటి మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు ముఖ్యమంత్రులు ఇతర సభ్యులు. సిఎంగా ఉన్న మోడీ చేసిన సిఫార్సును పిఎం మోడీ ఎందుకు పక్కన పడేశారు? ఇప్పుడు రాష్ట్రాలను సంప్రదించాలని ఎందుకు కబుర్లు చెబుతున్నారు. ఇంతకీ 2011 నివేదికలో మోడీ కమిటీ చేసిన సిఫార్సు ఏమిటి ? నివేదికలోని క్లాజ్‌ బి.3లో ఇలా ఉంది.” చట్టబద్దంగా ఎంఎస్‌పి అమలు : మార్కెట్‌ పని చేయటంలో మధ్యవర్తులు కీలకమైన పాత్ర పోషిస్తున్నారు మరియు ఆ సమయంలో వారు ముందుగానే రైతులతో ఒప్పందం చేసుకుంటున్నారు. అన్ని నిత్యావసర వస్తువులకు సంబంధించి చట్టబద్దమైన అంశాలతో శాసనం ద్వారా రైతుల ప్రయోజనాలను కాపాడాలి. అదేమంటే రైతు-వ్యాపారి లావాదేవీల్లో ఎక్కడా నిర్ణీత కనీస మద్దతు ధరలకు తగ్గకూడదు.” దీని అర్ధం ఏమిటి ? చట్టబద్దత కల్పించాలనే కదా ! మరి ఇప్పుడు సాకులతో ఎందుకు మొరాయిస్తున్నట్లు ?

రైతులపై మోడీ సర్కార్‌ యుద్ధం : పాక్‌, చైనా సరిహద్దుల్లో కూడా ఇలాంటి ఏర్పాట్లు లేవేమో !

Tags

, , , , , , , , ,


ఎం కోటేశ్వరరావు


సరిహద్దు భద్రతా దళాల నుంచి 30వేల బాష్పవాయు గోళాలను రప్పించారు.
వాటిని ప్రయోగించేందుకు డ్రోన్లను సన్నద్దం చేశారు.
ఒళ్లు మంటలు పుట్టేందుకు రసాయనాలు కలిపిన నీటిని చిమ్మే ఫిరంగుల దుమ్ముదులిపారు.
చెవులు చిల్లులు పడే శబ్దాలు చేసి వినికిడి శక్తిని పోగొట్టే సోనిక్‌ ఆయుధాలను సిద్దం చేశారు.
ఎవరైనా గుర్రాల మీద వస్తే అవి జారి పడే విధంగా గ్రీజు వంటి వాటిని వెదజల్లేందుకు డ్రమ్ములతో సిద్దంగా ఉన్నారు.
రోడ్ల మీద పెద్ద గోతులు తవ్వారు. ఎక్కడబడితే అక్కడ ఇనుప మేకులు కొట్టారు.
ముళ్ల కంచెలు, వాటిని దాటుకొని వస్తే నిరోధించటానికి పెద్ద కంటెయినర్లలో మట్టి, రాళ్లు, ఇటుకలతో నింపారు.
సిమెంటు దిమ్మెల వరుసలు ఏర్పాటు చేశారు. రోడ్ల పక్కనే నిర్బంధ శిబిరాలను తయారు చేశారు.
ఇవన్నీ ఎందుకనుకుంటున్నారు ?
సరిహద్దుల్లో పాకిస్థాన్‌ లేదా చైనా, మరొక దేశం దాడి చేస్తుందనో వాటిని ఎదుర్కొందామనో కాదు.
వివిధ రాష్ట్రాల నుంచి రాజధాని ఢిల్లీకి వచ్చే రోడ్ల మీద ఈ ఏర్పాట్లు ? ఎందుకనుకుంటున్నారు ?


తమ సమస్యలను పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వ పెద్దలను అడిగేందుకు వస్తున్న అన్నదాతలను అడ్డుకొనేందుకు !
ఇన్ని ఏర్పాట్లు చేసిన పోలీసుల బాస్‌ ఏం చెప్పారో తెలుసా ? ఒక వేళ వీటన్నింటినీ దాటుకొని రైతులు గనుక వస్తే మీరేమీ వెనుకా ముందు చూడనవసరం లేదు, ఆత్మరక్షణ గురించి ఆలోచించవద్దు అన్నారు. దీని అర్ధం వేరే చెప్పాలా ? ప్రస్తుతం అనేక ఐరోపా దేశాల్లో వేలాది మంది రైతులు రాజధానులు, ఇతర ప్రధాన పట్టణాలకు ట్రాక్టర్లు, ఇతర వ్యవసాయ వాహనాల మీద ఎలాంటి ఆటంకాలు లేకుండా వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. పోలీసులు కాపలాకాసేందుకు ఉన్నారు తప్ప అడ్డుకున్నది గానీ చేయి చేసుకున్న ఉదంతంగానీ ఒక్కటంటే ఒక్కచోట కూడా జరగలేదు. కానీ ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లు అని చెప్పుకుంటున్న చోట రైతులను శత్రువులుగా చూస్తున్న అపర ప్రజాస్వామిక పాలకుల తీరిది.


ఇంతకూ రైతులు చేసిన పాపం ఏమిటి ?
2011లోనే నరేంద్రమోడీ ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రుల కమిటీ చేసిన సిఫార్సులో ఒకటైన కనీస మద్దతుధరలకు చట్టబద్దత కల్పించమని కోరటం. క్షమాపణలు చెప్పి మరీ మూడు సాగు చట్టాలను వెనక్కు తీసుకంటూ కనీస మద్దతు ధరలకు చట్టబద్దతతో పాటు ఇతర సమస్యలను పరిశీలించేందుకు 2022 జూలైలో నరేంద్రమోడీ సర్కార్‌ ఏర్పాటు చేసిన కమిటీ ఏ గుడ్డి గుర్రానికి పళ్లు తోముతున్నది, ఎప్పుడు నివేదిక ఇస్తారు, స్వామినాధన్‌ కమిటీ చేసిస సిఫార్సులతో సహా ఇచ్చిన హామీలను ఎప్పుడు అమలు చేస్తారు అని నిలదీయటమే అన్నదాతల అపరాధం. ఇప్పటికే పంజాబ్‌-హర్యానా సరిహద్దులో రైతుల వీపులు పగలగొట్టారు, జర్నలిస్టులతో సహా అనేక మంది గాయపడ్డారు. గురువారం నాడు చర్చల ప్రహసనం చోటు చేసుకుంది. ఆదివారం నాడు మరోసారి మాట్లాడతామని చెప్పారు. ఈలోగా కుట్ర సిద్దాంతాలు. వాట్సాప్‌ యూనివర్సిటీలో నరేంద్రమోడీ సర్కార్‌ను కూలదోసేందుకు అంటూ ఊదరగొట్టటం ప్రారంభించారు.హర్యానాలోని అనేక ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ నిలిపివేశారు. ఢిల్లీలో 144వ సెక్షన్‌ విధించారు. సభలు, ప్రదర్శనలకు అనుమతి లేదు.


2020-21లో సాగిన చారిత్రాత్మక రైతు ఉద్యమం తరువాత 2022 జూలై 18న కేంద్ర ప్రభుత్వం ఎంఎస్‌పి ఇతర అంశాల గురించి పరిశీలనకు ఒక కమిటీని వేసింది. ఇప్పటి వరకు అదేమి చేస్తున్నదో తెలియటం లేదు గనుక మరోసారి రైతులు ఢిల్లీ చలో పిలుపు ఇచ్చారు. సాధారణంగా సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం పని చేస్తుందని అనేక మంది అనుకున్నారు. అదేమిటో తెలియదు గానీ మరోసారి రైతులు ఆందోళన చేస్తే అణచి వేసేందుకు పోలీసులకు కొత్త పద్దతులను నేర్పించారు.దేశ రాజధాని వద్ద చేసిన ఏర్పాట్లు బహుశా చైనా సరిహద్దులో కూడా చేసి ఉండరేమో అని కాంగ్రెస్‌ ఎంపీ శశిధరూర్‌ వ్యాఖ్యానించారు. ” ఈ సమస్య రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అంశం కూడా,దీనికి పరిష్కారం కనుగొనాలంటే వ్యవధి అవసరం. ” మరోసారి ప్రారంభమైన రైతు ఉద్యమం ముందుకు తెచ్చిన డిమాండ్ల మీద కేంద్ర మంత్రి అర్జున్‌ ముండా ఫిబ్రవరి పదమూడున చెప్పిన మాట. గురువారం రాత్రి రైతు ప్రతినిధులతో జరిపిన చర్చలు ఎలాంటి ఫలితాలు లేకుండా ముగిశాయి. ఆదివారం సాయంత్రం మరోసారి చర్చలు జరుపుతామని కేంద్ర మంత్రి ప్రకటించారు. స్వామినాధన్‌కు భారత రత్న అవార్డు ఇచ్చిన పెద్దలు ఆయన చేసిన సిఫార్సుల అమలు మాత్రం కుదరదంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎంఎస్‌పి కమిటీలో సభ్యులుగా ఎలాంటి వారిని నియమించిందో తెలిస్తే జరిగేదేమిటో ఊహించుకోవచ్చు.


రైతుల నిరసన రాజకీయపరమైదని, హింసాకాండ వ్యాప్తి చేస్తారేమో అనే ఆందోళన కలుగుతోందని, అందుకే తాము భాగస్వాములం కావటం లేదని ప్రధాని మోడీ ఏర్పాటు చేసిన ఎంఎస్‌పి కమిటీ సభ్యుడు ప్రమోద్‌ చౌదరి ఆరోపించారు.ఈ పెద్ద మనిషి ఆర్‌ఎస్‌ఎస్‌ ఏర్పాటు చేసిన భారతీయ కిసాన్‌ సంఫ్‌ు నేత గనుక ఇంతకంటే ఏం మాట్లాడతారు ! మరో కమిటీ సభ్యుడి పేరు వినోద్‌ ఆనంద్‌. ఆందోళన చేస్తున్న వారిని గూండా రైతులని వర్ణించిన ఘనుడు.వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌ (ప్రపంచ సహకార ఆర్థికవేదిక ) కార్యనిర్వాహక అధ్యక్షుడు. అసలు ఈ సంస్థ గురించి రైతులు ఎప్పుడైనా విన్నారా ? ” దేశ ఆర్థిక పురోగతికి, రైతుల సంక్షేమానికి కనీస మద్దతుధరలకు చట్టబద్దత కల్పించటమే ఏకైక పరిష్కారం అయితే ఆ పని చేసేందుకు చేయాల్సిందంతా చేస్తాము. ఎంఎస్‌పికి గతంలో ఎప్పుడు చట్టబద్దత ఉంది. దాని గురించి ప్రధాని ఎన్నడూ చెప్పలేదు.వీరంతా గూండా రైతులు, రాజకీయంగా ఉత్తేజం పొందిన కొద్ది మంది…ఒక రాష్ట్రానికి చెందిన వారు తమ రాజకీయ ప్రత్యర్ధుల మీదకు రైతులను ఈ విధంగా ఉపయోగిస్తున్నారు.కనీస మద్దతు ధరలకు చట్టబద్దత గురించి ఎన్నడూ చెప్పలేదు. 2075వరకు పనికి వచ్చే విధంగా ఉండే వ్యవసాయ విధానాలను మనం రూపొందించుకోవాల్సి ఉంది, తద్వారా ఆర్థిక అసమానతలు తగ్గుతాయి. కనీస మద్దతు ధర ఒక సంక్లిష్టమైన అంశం.వారు(రైతులు) ముందుకు వచ్చి మాతో కూర్చొని చర్చించాలి.వారి ప్రశ్నలన్నింటికీ నేను సమాధానం చెప్పలేకపోతే కమిటీ నుంచి రాజీనామా చేస్తానని హామీ ఇస్తున్నాను. ఇదంతా ఒక నాటకం, పక్కదారి పట్టించేందుకు, దేశాన్ని విచ్చిన్నం చేసేందుకు చేస్తున్న వ్యవహారం ” అని వినోద్‌ ఆనంద్‌ అన్నట్లు ఎఎన్‌ఐ వార్తా సంస్థ పేర్కొన్నది.


ఉత్తరాది రాష్ట్రాల శ్వాస నిలిపివేసేందుకు రైతులు ప్రయత్నిస్తున్నారని, తమ రాష్ట్రంలో భయ వాతావరణం ఏర్పడిందని హర్యానా ప్రభుత్వం హైకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్‌లో పేర్కొన్నది. పరిష్కారం తేలేవరకు ఆందోళన కానసాగుతుందని రైతు సంఘాలు వెల్లడించాయి. నరేంద్రమోడీ సర్కార్‌ను దించేందుకే రైతులు మరోసారి వీధుల్లోకి వచ్చారని ఆరోపిస్తున్నారు. అంటే మోడీ సర్కార్‌ మీద తిరుగుబాటు చేస్తున్నట్లు చిత్రించటమే. అదే రైతుల అజెండా అయితే నిరాయుధులుగా ఎందుకు వస్తారు.తాము ప్రయాణిస్తున్న ట్రాక్టర్లలో గతంలోగానీ ఇప్పుడు గానీ ఆహార పదార్దాలు తప్ప ఎలాంటి మారణాయుధాలు లేవే. ఢిల్లీ చలో అన్న నినాదంతో గతంలో సాగిన ఉద్యమానికి ఇచ్చిన పిలుపుకు మూడు సంవత్సరాలు నిండిన సందర్భంగా 2023 నవంబరు 26 నుంచి 28వరకు చండీఘర్‌లో నిరసన తెలపాలని పంజాబ్‌ రైతులు పిలుపు నిచ్చారు. దాని కొనసాగింపే తాజా ఢిల్లీ చలో నిరసన. అప్పటి నుంచి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఏమి చేస్తున్నట్లు ? మంత్రి మాటలను బట్టి ఏదో విధంగా కాలయాపన చేసి ఆందోళనను అణచివేసేందుకు లేదా మరో విధంగా ముగించేందుకు కేంద్రం చూస్తున్నట్లు కనిపిస్తోంది. నవంబరులోనే కేంద్రం ఎందుకు చర్చలు జరపలేదు ?

పంజాబ్‌, హర్యానా, ఉత్తర ప్రదేశ్‌లోని రైతులే ఎందుకు ఆందోళన చేస్తున్నారంటూ కొందరు ఉద్యమాన్ని తప్పుదారి పట్టించేందుకు చూస్తున్నారు. నిద్రపోతున్నవారిని లేపగలం గానీ నటిస్తున్నవారిని లేపటం కష్టం. దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి అన్ని రాష్ట్రాలలో ఒకే విధంగా లేదు. పండిన పంటలో స్థానిక వినియోగం పోను మిగిలిన దాన్ని మార్కెట్‌ మిగులుగా పరిగణిస్తారు.2005లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఒక నివేదిక ప్రకారం దేశవ్యాపిత సగటు 55.46శాతం మార్కెట్‌ మిగులు ఉంది. ఇది ఎక్కువగా ఉన్న రాష్ట్రాలలో పంజాబ్‌ 94.43,హర్యానా 90,11,రాజస్థాన్‌లో 90శాతం ఉంది. ఉత్తర ప్రదేశ్‌ మొత్తంగా చూసినపుడు 49.18శాతమే ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాలు పంజాబ్‌, హర్యానా మాదిరిగా ఉంటాయి. స్వల్ప మార్పులు తప్ప ఇప్పటికీ అదే పరిస్థితి. అందుకే మార్కెటింగ్‌, గిట్టుబాటు ధర సమస్య వచ్చినపుడల్లా ఈ ప్రాంతాల రైతులే వెంటనే స్పందించటం ఈ రోజు కొత్తగా వచ్చింది కాదు. అందుకే గతంలోనూ, ఇప్పుడూ ఈ ప్రాంతాల వారే ముందుకు వస్తున్నారు. ఆ సమస్య పెద్దగా లేని రాష్ట్రాల రైతుల్లో పెద్దగా స్పందన ఉండదు. హిమచల్‌ ప్రదేశ్‌, కాశ్మీరులో ఆపిల్‌ రైతులు, కొబ్బరి ధర పడిపోతే కేరళ, ఇతర కొన్ని రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతాల రైతులే స్పందిస్తారు. వర్జీనియా పొగాకు ధర పడిపోతే ఆంధ్రప్రదేశ్‌లో దాన్ని సాగు చేసే ప్రాంతాల్లో రైతులే రోడ్ల మీదకు వస్తారు, మిగతా రైతులు ఎందుకు రాలేదని ప్రశ్నిస్తే అర్ధం లేదు.


ఇంతకీ రైతులు కోరుతున్నదేమిటి ? స్వామినాధన్‌ కమిటీ సిఫార్సుల మేరకు కనీస మద్దతు ధరలకు చట్టబద్దత కల్పించాలి. రైతుల రుణాలను పూర్తిగా రద్దు చేయాలి.రైతులు, వ్యవసాయ కార్మికులకు పెన్షన్‌ పధకాన్ని వర్తింప చేయాలి.విద్యుత్‌ సవరణ బిల్లు 2020ని రద్దు చేయాలి.భూసేకరణ చట్టం 2013ను తిరిగి తేవాలి. దాని ప్రకారం భూసేకరణకు రైతుల ఆమోదం తీసుకోవాలి, జిల్లా కలెక్టర్‌ నిర్ణయించిన ధరకు నాలుగు రెట్ల పరిహారం ఇవ్వాలి.ఉత్తర ప్రదేశ్‌ లఖింపూర్‌ ఖేరీలో హత్యకు గురైన రైతులకు న్యాయం జరగాలి.దోషులను శిక్షించాలి. గ్రామీణ ఉపాధి హామీ చట్టం ప్రకారం ఏడాదికి రెండువందల రోజులు పని కల్పించాలి, వ్యవసాయానికి అనుబంధం చేయాలి.2021 ఉద్యమం సందర్భంగా మరణించిన కుటుంబాల వారికి పరిహారంతో పాటు కుటుంబ సభ్యులకు ఒకరికి ఉద్యోగం కల్పించాలి. ఇవి కేవలం పంజాబ్‌, హర్యానా రైతుల డిమాండ్లేనా, మిగతా ప్రాంతాల రైతులు కోరటం లేదా ? ఆందోళనను పక్కదారి పట్టించి నిందలు వేస్తున్నవారిని ఎక్కడికక్కడ రైతాంగం నిలదీసే రోజులు రానున్నాయి.