బంగ్లాదేశ్‌ – పాలస్తీనా విముక్తి అంశంలో బిజెపి రెండు నాలుకల ధోరణి !

Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


ప్రపంచంలో అత్యంత ప్రతిభావంతమైన గూఢచారి సంస్థలలో ఒకటైన మొసాద్‌ తమ ప్రభుత్వానికి హమస్‌ దాడుల గురించి ఎందుకు ఉప్పందించలేకపోయిందన్న ప్రశ్నకు దాడి జరిగిన రెండు వారాలకు కూడా ఇజ్రాయెల్‌ ప్రభుత్వం చెప్పలేకపోతోంది. ఇప్పుడు మేం యుద్ధంలో ఉన్నాం వాటి గురించి దర్యాప్తు జరపటం లేదని అధికారులు సమాధానమిస్తున్నారు.స్వజనం, ఇతర దేశాల నుంచి ఎదురవుతున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక తప్పుదారి పట్టించేందుకు అసలు హమస్‌కు ఆయుధాలు ఎక్కడి నుంచి వచ్చాయన్న అంశంపై అనేక కథలను ప్రచారం చేస్తున్నారు. హమస్‌ సంస్థ అధికారంలో ఉన్న గాజా ప్రాంత విస్తీర్ణం 360 చదరపు కిలోమీటర్లు, హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ ఏరియా ఎంతో తెలుసా ? 7,257చదరపు కిలోమీటర్లు. జన సాంద్రత 1,474. గాజా గడచిన పదిహేడు సంవత్సరాలుగా చుట్టూ ఆరుమీటర్ల ఎత్తున ఇనుపకంచెతో అనుమతి లేకుండా జనం బయటకు పోకుండా చేసిన ఒక బహిరంగ జైలు మాదిరి ఉంది. జనాభా ఇరవై మూడు లక్షలు.చదరపు కిలోమీటరుకు 6,507. అలాంటి జనసమ్మర్ధం ఉన్న ప్రాంతం మీద హమస్‌ తీవ్రవాదులను పట్టుకుంటామనే పేరుతో ఇజ్రాయెల్‌ విమానాలతో బాంబులు వేస్తోంది. సగం ప్రాంతాన్ని ఖాళీ చేసి వేరే వైపు వెళ్లమని జనాన్ని నెట్టేస్తోంది.తరువాత మరోసగాన్ని మరోవైపు పంపి నాశనం చేయాలన్నది దాని పథకం. ఇటు వంటి దుర్మార్గాన్ని గట్టిగా కొనసాగించమని అమెరికా అధిపతి జో బైడెన్‌, భారత అల్లుడు, బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ సలహా ఇచ్చి వెళ్లారు.మన ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా వెళ్లలేదు తప్ప ఇజ్రాయెల్‌కు మద్దతు ప్రకటించటం బైడెన్‌, సునాక్‌ అడుగుల్లో అడుగు వేయటమే !


నిజమే హమస్‌కు ఆయుధాలు ఎక్కడి నుంచి వచ్చాయి.ఈ ప్రశ్నకు సమాధానం కోరుతున్న వారు 1947కు ముందు వివిధ దేశాల నుంచి బ్రిటీష్‌ ఆక్రమణలో ఉన్న పాలస్తీనా ప్రాంతంలోకి యూదులు ఎలా వచ్చారు, వారికి ఆయుధాలు ఎలా అందుబాటులోకి వచ్చాయి, మిలిటరీ శిక్షణ ఎవరు ఇచ్చారు అన్న వాస్తవాలు తెలుసుకుంటే పాలస్తీనాకు చెందిన హమస్‌కు అస్త్రాలు ఎక్కడి నుంచి వచ్చిందీ తెలుసుకోవటం అంత కష్టం కాదు. పాలస్తీనా ప్రాంతాన్ని ఆక్రమించి ఇజ్రాయెల్‌ను ఏర్పాటు చేయాలన్న ముందస్తు పథకంతో ఉన్న బ్రిటన్‌, ఇతర సామ్రాజ్యవాదులు ఎక్కడెక్కడి నుంచో యూదులను రప్పించి ఆయుధాలు, శిక్షణ ఇచ్చారు.ఐరాస తీర్మానం చేసిన నాటి నుంచి వారు పాలస్తీనా ప్రాంతాలను ఆక్రమించుకోవటం ప్రారంభించారు. మాతృభూమి రక్షణ కోసం పోరాడుతున్న వారికి నాటి నుంచి నేటి వరకు మద్దతు ఇస్తున్న ఇరుగుపొరుగు దేశాలు ఆయుధాలు అందిస్తున్నాయి. ఇది అందరికీ తెలిసిన రహస్యం !


పాకిస్తాన్‌ పాలకుల అణచివేతకు వ్యతిరేకంగా స్వాతంత్య్రం కోసం బంగ్లాదేశ్‌ పౌరులు ఉద్యమించారు. ఆయుధాలు చేతబట్టి గెరిల్లా పోరు సాగించారు. వారికి ఆయుధాలు ఎవరు ఇచ్చారు ? తుపాకి పట్టిన ప్రతివారినీ ఉగ్రవాది అనలేం.బంగ్లా ముక్తివాహిని పేరుతో తిరుగుబాటు చేసిన వారికి మన దేశం మద్దతు ప్రకటించటమే కాదు, మన మిలిటరీని కూడా పంపి పాక్‌ సైన్యాన్ని అణచివేసింది. బంగ్లా విముక్తికి ఆయుధాలు పట్టిన వారిని నాడు జనసంఘం సమర్ధించింది. నేడు పాలస్తీనా వాసులు ఆయుధాలు పట్టినందుకు బిజెపి తప్పుపడుతోంది. నిజానికి బంగ్లా విభజనకు ఐరాస తీర్మానాలు లేవు. పాలస్తీనా ఏర్పాటుకు తీర్మానం ఉన్నప్పటికీ అడ్డుకుంటున్న ఇజ్రాయెల్‌కు నరేంద్రమోడీ, బిజెపి మద్దతు ప్రకటించటం రెండు నాలుకల వైఖరికి నిదర్శనం. బంగ్లా విముక్తికి చర్యలు తీసుకున్నందుకు అభినందిస్తూ ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేత గురూజీగా పిలుచుకున్న గోల్వాల్కర్‌ కూడా ఇందిరా గాంధీకి లేఖ రాశారు. మద్దతు పలికినందుకు గాను అతల్‌బిహారీ వాజ్‌పాయికి 2015లో బంగ్లాదేశ్‌ అత్యున్నత ” విముక్తి యుద్ధ గౌరవ ” అవార్డును బంగ్లాదేశ్‌ ప్రకటించింది.తమ దేశ ఏర్పాటుకు అడ్డుపడుతున్న ఇజ్రాయెల్‌ మీద పాలస్తీనియన్లు అనేక రకాలుగా పోరాడుతున్నారు. ఆయుధాలు పట్టిన వారిని ఉగ్రవాదులుగా చిత్రిస్తే నరేంద్రమోడీ దానికి తాన తందాన తాన అంటున్నారు. ఇజ్రాయెల్‌ దుర్మార్గాలను గుర్తించేందుకు నిరాకరించటం తప్ప మరొకటి కాదు. ఉక్రెయిన్‌ అంశంలో తటస్థవైఖరి తీసుకున్న మోడీ ఇప్పుడు ఒక పక్షం వహించటం అంటే అమెరికా కూటమి మెప్పు పొందేందుకు తహతహలాడటమే. రష్యా నుంచి ఆయుధాల అవసరం ఉంది, చౌకగా చమురు దొరుకుతుంది గనుక తటస్థం అన్నారు. పాలస్తీనా నుంచి అలాంటివేమీ ఉండవు గనుక ఒక పక్షానికి మద్దతు పలుకుతున్నారు.


హమస్‌ సాయుధులు ఆయుధాలను ఇరాన్‌ నుంచి తెచ్చుకుంటున్నారని, గాజాలోనే తయారు చేస్తున్నారంటూ సిఐఏ చెప్పిందని మీడియాలో వార్తలు వచ్చాయి. హమస్‌ కోసం ఇరాన్‌ ఆయుధాలను అక్రమంగా సేకరిస్తున్నదని, దానితో పాటు స్వంతంగా తయారు చేసుకోవటం గురించి శిక్షణ ఇస్తున్నట్లు సిఐఏ ఆరోపించింది. వాషింగ్టన్‌ ఇనిస్టిట్యూట్‌ అనే అమెరికా అనుకూల సంస్థ నిపుణుడు మైకేల్‌ నైట్స్‌ తమ దేశం ఇజ్రాయెల్‌కు పంపిన ఆయుధాలను పట్టుకొని లేదా బ్లాక్‌మార్కెట్‌లో కొనుగోలు చేస్తున్నదని చెప్పాడు. స్మగ్లింగ్‌ జరిగే మార్గాలను ఈజిప్టు కట్టుదిట్టం చేసిన తరువాత గాజాలోనే తయారు చేసుకుంటున్నారని అన్నాడు. తప్పేముంది. ఇజ్రాయెల్‌ వైపు నుంచి మిలిటరీ, సాయుధ యూదులు బాంబులు వేస్తుంటే పాలస్తీనియన్లు రసగుల్లాలు విసురుతారా ? ఇదే సంస్థ 2021లో విడుదల చేసిన ఒక నివేదికలో ఇజ్రాయెల్‌ ప్రయోగించిన వాటిలో కొన్ని పేలలేదని, పేలిన వాటి విడిభాగాలను రీసైకిలింగ్‌ చేసి హమస్‌ నిపుణులు స్వంతంగా ఆయుధాలను రూపొందిస్తున్నారని పేర్కొన్నది. హమస్‌ సాయుధుల దాడుల చిత్రాలను చూసిన అమెరికా పార్లమెంటు సభ్యులు కొందరు మాట్లాడుతూ ఉక్రెయిన్‌కు పంపినవి లేదా ఆఫ్ఘనిస్తాన్‌లో వదలి వచ్చినవి గానీ వారి చేతుల్లోకి వచ్చినట్లు చెబుతున్నారు. ఉక్రెయిన్‌కు పంపిన ఆయుధాలను అది బ్లాక్‌మార్కెట్‌లో అమ్ముకుంటున్నదని కూడా చెబుతున్నారని అందువలన ఉక్రెయిన్‌కు సాయం అందించకూడదని కూడా మైకేల్‌ నైట్స్‌ చెప్పాడు. కాదు కాదు ఇలాంటి వార్తలన్నింటినీ రష్యా పుట్టిస్తున్నది కనుక నమ్మవద్దని మరికొందరు తమ ప్రభుత్వాన్ని సమర్ధిస్తున్నారు. వియత్నాం నుంచి పారిపోతూ అమెరికన్లు వదలివేసిన ఆయుధాలు తరువాత ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో కనిపించాయని కొందరు గుర్తు చేశారు. ఉక్రెయిన్‌కు పంపుతున్న ఆయుధాలు ఇతరుల చేతుల్లో పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి 2022 అక్టోబరులో అమెరికా విదేశాంగశాఖ ఒక పత్రంలో పేర్కొన్నది. ఉక్రేనియన్లను పట్టుకున్నపుడు వారి వద్ద దొరికిన అమెరికా ఆయుధాలను రష్యా బ్లాక్‌ మార్కెట్‌కు తరలిస్తుందని కూడా హెచ్చరించింది.


అక్టోబరు ఏడవ తేదీ దాడి తరువాత ఇజ్రాయెల్‌ సేకరించిన నమూనాలను బట్టి హమస్‌ పూర్వపు సోవియట్‌ కాలం నాటి క్షిపణులతో దాడి చేసిందని ఒక కథనం. కాదు స్వంతంగా తయారు చేసిన వాటితోనే జరిపిందని ఇజ్రాయెల్‌ సైనికుడు చెప్పిన వీడియో కూడా బయటకు వచ్చింది. వారు వాడిన ఆయుధాలు చాలా చిన్నవని అమెరికా అందచేసే వాటిని గాజాలోకి చేర్చటం చాలా కష్టమని కొందరు చెప్పారు. ఎక్కడి నుంచి తెచ్చారు, ఎలా తెచ్చారు అన్నది కాదు బుల్లెట్‌ దిగిందా లేదా అన్నదే గీటురాయి ! భుజాల మీద మోస్తూ ప్రయోగించే ఉత్తర కొరియా ఆయుధాలను హమస్‌ వినియోగించిందన్నది మరొక కథ ! దానికి రుజువు ఏమిటట, వాటికి ఎర్ర రిబ్బన్లు కట్టి ఉన్నాయట. ఎవడైనా వాటి గుర్తింపు తెలియకుండా ఎర్ర రిబ్బన్లు తీసివేస్తాడు తప్ప అలంకరించి మరీ వాడతారా ? అసలు ఉత్తర కొరియా ఆయుధాలను సరఫరా చేసిందా లేదా అని కొందరు అడగవచ్చు. ఇజ్రాయెల్‌కు బ్రిటన్‌తో సహా పశ్చిమ దేశాలన్నీ అన్ని రకాల ఆయుధాలను, వందల కోట్ల డాలర్లు అందిస్తున్నాయి. అమెరికా వారు ఎఫ్‌ 16 యుద్ధ విమానాలను అందించవచ్చు, మధ్య ధరా సముద్రానికి తన విమానవాహక యుద్ధ నౌకలను పంపించి ఆ ప్రాంతదేశాల మీద దాడులు చేస్తామని బెదిరించవచ్చు.ప్రపంచానికంతటికీ ఆయుధాలను ఆమ్మవచ్చు. ఉత్తర కొరియా హమస్‌కు ఆయుధాలు నిజంగా అందించిందో లేదో తెలియదు, ఒకవేళ ఇజ్రాయెల్‌ నుంచి ఆత్మరక్షణకు అందిస్తే తప్పే ముంది ? పాలస్తీనియన్లను వారి ఖర్మకు వారిని వదలివేయాలా ? గతంలో ఉత్తర కొరియా మీద అమెరికా దాడి చేసింది, ఇంకా దాడి చేసేందుకు దక్షిణ కొరియాలో వేలాది మంది మిలిటరీతో తిష్టవేసింది. మరోసారి ఉత్తర కొరియా మీద కూడా దాడులకు దిగవచ్చు. అప్పుడు దానికి దిక్కెవరు ? ఇంతకీ ఉత్తర కొరియా ఆయుధాలను హమస్‌ వాడిందా లేదా అని ఏపి వార్తా సంస్థ అడిగితే సమాధానం చెప్పేందుకు ఇజ్రాయెల్‌ మిలిటరీ తిరస్కరించింది. ఇవన్నీ అమెరికా వ్యాపింపచేసే కట్టుకథలని ఉత్తర కొరియా పేర్కొన్నది. వెయ్యి కంటెయినర్లలో రష్యాకు ఆయుధాలు, మందుగుండు ఉత్తర కొరియా నుంచి వెళ్లినట్లు అమెరికా ఆరోపించింది. నిరంతరం ఇతర దేశాల మీద అలాంటి నిందలను ప్రచారం చేస్తూనే ఉంది.హమస్‌ గురించి మనదేశంలో పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారం చేస్తున్నారు, అందువలన వాటిని గుడ్డిగా నమ్మాల్సినపని లేదు.


హమస్‌కు ఆయుధాల సరఫరా గురించి చీకట్లో బాణం వేసినట్లుగా ఇతర దేశాల మీద ఆరోపణలు చేయటం తప్ప ఎవరిదగ్గరా నిర్దిష్ట సమాచారం లేదు.ఇక హమస్‌ ఆయుధ తయారీ గురించి కొన్ని వీడియోలు ప్రచారంలో ఉన్నాయి. అవన్నీ నిజమని నమ్మటానికి లేదు. ఇజ్రాయెల్‌ను తప్పుదారి పట్టించేందుకు లేదా తమపై దాడులు చేస్తూ తమ ప్రాంతాలను ఆక్రమిస్తున్న తమ పాలకులు మీద ఇజ్రాయెలీ పౌరులు వత్తిడి తెచ్చేందుకు కొన్ని వీడియోలను రూపొందించి ప్రచారదాడి చేస్తున్నట్లు కూడా కొందరు చెబుతారు. అలాంటి వాటిలో ఒకదానిలో తాము గాజాలో పది నుంచి 250కిలో మీటర్ల వరకు ప్రయోగించే మోర్టార్లు, వాటికి అవసరమైన షెల్స్‌ తయారు చేసేందుకు ఫ్యాక్టరీలు ఉన్నట్లు, రష్యా అనుమతితో ఎకె రకం తుపాకులు, తూటాలు కూడా తయారు చేస్తున్నట్లు హమస్‌ ప్రతినిధి చెప్పినట్లుగా ఉంది. మరోవైపు ఆయుధాలు తయారు చేసే ఫ్యాక్టరీలు గాజాలో లేవని, దుస్తులు, ఫర్నీచర్‌, ఆహార పదార్ధాలు తయారు చేసే పరిశ్రమలే ఉన్నట్లు సిఐఏ వెలువరించే ఫ్యాక్ట్‌ బుక్‌లో ఉంది. ఇతర దేశాలు తయారు చేసిన ఆయుధాలు హమస్‌ దగ్గర దొరికినంత మాత్రాన ఆయా దేశాలు దానికి సరఫరా చేసినట్లు కాదు. కాశ్మీరులో లష్కరే తోయబా, జైషే మహమ్మద్‌ తదితర ఉగ్రవాదుల దగ్గర అమెరికా తయారీ ఆయుధాలు దొరికాయి. మనకు మిత్ర దేశం అని చెబుతున్న అమెరికా దీనికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. సిరియా వంటి చోట్ల అక్కడి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా అనేక ఉగ్రవాద, కిరాయి మూకలకు అమెరికా స్వయంగా ఆయుధాలు అందచేయటం బహిరంగ రహస్యం. అమెరికాకు ఆయుధాల తయారీ, విక్రయం పెద్ద లాభసాటి వ్యాపారం. డాలర్లు చెల్లిస్తే చాలు ఎవరికైనా అమ్ముతుంది.2018-22 కాలంలో ప్రపంచ ఆయుధ ఎగుమతుల్లో అమెరికా వాటా 40శాతంగా ఉందని స్టాక్‌హౌం ఇంటర్నేషనల్‌ పీస్‌ రిసర్చ్‌ ఇనిస్టిట్యూట్‌(సిప్రి) 2023 మార్చి నెలలో ప్రకటించింది. ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి పారిపోతూ అమెరికన్లు 712 కోట్ల డాలర్ల విలువగల ఆయుధాలు, రక్షణ సామగ్రి వదలి వెళితే అవన్నీ తాలిబాన్ల వశమయ్యాయి.వాటిలో కొన్ని కాశ్మీరులో దొరికాయి. అవి తాలిబాన్ల నుంచి లేదా పాకిస్తాన్‌ నుంచి కూడా సరఫరా చేసి ఉండవచ్చు. ఇతర దేశాల నుంచి సేకరించిన అమెరికా ఆయుధాలనే హమస్‌ ఇటీవల ఇజ్రాయెల్‌ మీద ప్రయోగించినట్లు అమెరికన్‌ పార్లమెంటు సభ్యులు ప్రకటించారు.


ఇతర దేశాల్లో గూఢచర్యం కోసం ఇజ్రాయెల్‌ ప్రభుత్వం మొసాద్‌ అనే సంస్థను ఏర్పాటు చేసింది. మన దేశంలో ” రా ” అమెరికా సిఐఏ వంటిది. దేశీయంగా షిన్‌ బెట్‌ అనే గూఢచార సంస్థ ఉంది. ఇవి రెండూ కూడా హమస్‌ దాడిని పసిగట్టలేకపోయాయి.తాము విఫలం చెందినట్లు షిన్‌ బెట్‌ అధిపతి రొనెన్‌ బార్‌ అంగీకరించాడు. హమస్‌ దగ్గర ఇజ్రాయెల్‌ మిలిటరీ రహస్యాలు, వాటి మాప్‌లు ఉన్నట్లు, పది మంది గాజా సాయుధులకు కచ్చితమైన సమాచారం ఉండబట్టే వారు లోపలికి చొరబడినట్లు న్యూయార్క్‌టైమ్స్‌ పత్రిక రాసింది. డ్రోన్లతో నిఘా, సమాచార టవర్లను కూల్చివేశారని, బుల్డోజర్లు, ట్రాక్టర్లతో సరిహద్దులో ఉన్న పెద్ద కంచెను కూల్చివేసి ముందు రోజు రెండువందల మంది మరుసటి రోజు 1,800 మంది హమస్‌ సాయుధులు ఇజ్రాయెల్‌లో ప్రవేశించినట్లు అధికారులను ఉటంకిస్తూ పేర్కొన్నది.ఇంత జరుగుతున్నా ఎందుకు పసిగట్టలేకపోయారన్నదే ప్రశ్న. గాజా ప్రాంతలోని హమస్‌ను బాగా బలహీన పరిచినందున అక్కడి నుంచి దాడి జరిగే అవకాశం లేదని, లెబనాన్‌లోని హిజబుల్లా నుంచే ముప్పు ఉందనే అంచనాకు ఇజ్రాయెల్‌ గూఢచార సంస్థలు భావించిన కారణంగా అవి దృష్టి పెట్టలేదని, హమస్‌ శక్తి సామర్ధ్యాలను తక్కువ అంచనా వేసిందని కొందరి విశ్లేషణ. ఇజ్రాయెల్‌లో ఉన్న అంతర్గత కుమ్ములాటల కారణంగా తెలిసి కూడా మౌనంగా ఉన్నారన్నది మరొక కథనం.

ఇజ్రాయెల్‌ దుర్మార్గానికి 500 మంది రోగులు బలి, జో బైడెన్‌ పర్యటన తరువాత గాజాపై ముప్పేట దాడి !

Tags

, , , , , ,


ఎం కోటేశ్వరరావు


హమస్‌ సాయుధులను మట్టుపెట్టే పేరుతో ఇజ్రాయెల్‌ ప్రారంభించిన దాడుల్లో మంగళవారం నాడు ఐదు వందల మంది రోగులు మరణించారు. గాజాలోని ఒక ఆసుపత్రి మీద జరిపిన వైమానిక దాడికి వారు బలయ్యారు.మృతుల్లో అత్యధికులు మహిళలు, పిల్లలు ఉన్నట్లు వార్తలు. ఈ దుర్మార్గానికి నిరసనగా బుధవారం నాడు అమెరికా అధినేత జో బైడెన్‌, ఈజిప్టు అధ్యక్షుడు ఎల్‌ శశితో అమ్మాన్‌ నగరంలో జరగాల్సిన భేటీని రద్దు చేసినట్లు జోర్డాన్‌ ప్రకటించింది. అరబ్బు దేశాలు, ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ఇజ్రాయెల్‌ దుర్మార్గాన్ని ఖండిస్తూ జనం ప్రదర్శనలు జరుపుతున్నారు.హమస్‌ దాడుల నుంచి ఆత్మరక్షణకు పూనుకోవటం ఇజ్రాయెల్‌కు ఉన్న హక్కు, దాని బాధ్యత అని నొక్కివక్కాణించేందుకు అమెరికా అధినేత జో బైడెన్‌ బుధవారం నాడు ఇజ్రాయెల్‌ వచ్చి కొన్ని గంటల పాటు అక్కడ గడపుతాడని తాజా వార్తలు.నిరంతరం మానవహక్కుల గురించి ప్రపంచానికి బోధ చేస్తున్న అమెరికా నేత ఇజ్రాయెల్‌ గడ్డ మీద కూర్చొని ఇంకా కొట్టండి, చంపండి అని గాక ఇంకా ఏం చెబుతాడో చూద్దాం.


” హంతకుల మీద ఈ రోజు మనం నెపం నెట్టకూడదు. మన పట్ల వారి తీవ్ర ద్వేషాన్ని ఎందుకు గర్హించాలి ? ఎనిమిది సంవత్సరాలుగా గాజాలోని శరణార్ధి శిబిరాలలో వారు కూర్చున్నారు. వారు, వారి తండ్రులు నివశించిన చోట వారి భూములు, గ్రామాలను వారి కళ్ళ ముందే మన ఎస్టేట్లుగా మార్చి వేయటాన్ని వారు చూస్తున్నారు ” ఈ మాటలు చెప్పింది జనరల్‌ మోషే డయాన్‌. నూటికి నూరుపాళ్లు యూదు దురహంకారే.1948లో ఇజ్రాయెల్‌ మిలిటరీ పాలస్తీనా అరబ్బు ప్రాంతాల మీద జరిపిన దురాక్రమణ, హత్యాకాండకు నాయకత్వం వహించిన అధికారులలో ఒకడు. తరువాత మిలిటరీ ప్రధాన అధికారిగా పని చేశాడు.1956లో పాలస్తీనా గెరిల్లాలు జరిపిన దాడుల తరువాత డయాన్‌ చేసిన వ్యాఖ్యలివి. తరువాత కాలంలో పాలస్తీనియన్లతో శాంతి పరిష్కారం కోరుకున్న కారణంగా అదే యూదు దురహంకారులు అతన్ని పక్కన పెట్టారు. ఈ రోజు హమస్‌ చేసిన దాడులతో మొత్తం పాలస్తీనా వాసులను నిందిస్తున్న వారు అర్ధం చేసుకోవాల్సిన కీలక అంశం ఏమిటో డయాన్‌ చెప్పాడు.


పాలస్తీనా – ఇజ్రాయెల్‌ వివాదంలో ఒక యూదు దురంహంకారికి తెలిసిన మేరకు కూడా అర్ధం కానంత అమాయకంగా అమెరికా ఉందా ? 1948 నుంచి పాలస్తీనియన్ల ప్రాంతాలను ఆక్రమించి వారిని తరమివేయటంతో విదేశాల్లో శరణార్ధులుగా, ఇజ్రాయెలీ పాలకులు బహిరంగ జైలుగా మార్చిన పాలస్తీనా ప్రాంతాలలో బందీల మాదిరి క్షణం క్షణం ఏం జరుగుతుందో తెలియని భయం, అనిశ్చితిలో బతుకుతున్నారు. మంగళవారం నాడు అల్‌జజీరా వెల్లడించిన సమాచారం మేరకు హమస్‌ దాడుల్లో 1,400 మందికి పైగా మరణించగా దానికి ప్రతిగా ఇప్పటి వరకు గత పదకొండు రోజుల్లో ఇజ్రాయెల్‌ మిలిటరీ దాడుల్లో గాజాలోని పాలస్తీనియన్లు 2,808 మంది మరణించారు. వారిలో మూడోవంతు మంది పిల్లలు.ఆసుపత్రి మీద జరిపిన దాడిలో మరణాలతో ఈ సంఖ్య పెరిగింది. అయినా రక్తదాహం తీరలేదు. త్రివిధ దళాలతో గాజాలోని సామాన్య పౌరుల మీద దాడులకు ఇప్పటికే సన్నాహాలు పూర్తి అయ్యాయి. బైడెన్‌ తిరిగి అమెరికా వెళ్లిన తరువాత విరుచుకుపడవచ్చు. ఈ పూర్వరంగంలో మరోవైపున లెబనాన్‌-ఇజ్రాయెల్‌ సరిహద్దులో పరస్పరం దాడులకు దిగినట్లు, కొందరు మరణించినట్లు వార్తలు. రానున్న కొద్ది గంటల్లో ఇజ్రాయెల్‌ మీద ఆ ప్రాంతంలోని కొన్ని బృందాలు దాడులకు దిగవచ్చని ఇరాన్‌ విదేశాంగ మంత్రి చెప్పాడు. వివాదం మరింతగా ముదరకూడదని తాము కోరుకుంటున్నామని ఇరాన్‌ ఒక సందేశాన్ని పంపింది. అయితే గాజాలో పరిస్థితి దిగజారితే తాను జోక్యం చేసుకోవాల్సి వస్తుందని హెచ్చరించినట్లు కూడా వార్తలు. ప్రాంతీయ యుద్ధానికి దారితీస్తే పరోక్షంగా లేదా ప్రత్యక్షంగా ఇరాన్‌ భాగస్వామి అవుతుందని కొందరు చెబుతున్నారు.


పాలస్తీనా విముక్తి కోసం పలు పద్దతులలో పోరాడుతున్నవారు ఉన్నారు.హమస్‌ సాయుధపోరాట మార్గాన్ని ఎంచుకుంది. అదీ ఎప్పుడు ? ఇజ్రాయిల్‌ ఆక్రమణలకు పాల్పడి అరబ్బుల తరిమివేత, హత్యాకాండను ప్రారంభించిన ఐదు దశాబ్దాల తరువాత. పాలస్తీనా ప్రాంతాలను అక్కడి జనాలకు అప్పగించి ఇజ్రాయెల్‌ తప్పుకుంటే సమస్య ఒక్క రోజులో పరిష్కారం అవుతుంది.అంతా అమెరికా చేతిలో ఉంది. ఐక్యరాజ్య సమితి తాను చేసిన తీర్మానాన్ని ఉల్లంఘించిన వారి మీద చర్యకు ఎందుకు ఉపక్రమించటం లేదు ? భద్రతా మండలి చేసే తీర్మానాన్ని ఇజ్రాయెల్‌కు అనుకూలమైన అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌ వీటో చేస్తాయి. సాధారణ అసెంబ్లీ చేసే తీర్మానాలకు విలువ ఉండదు. నాలుగున్నర దశాబ్దాల తరువాత అమెరికా మధ్యవర్తిత్వంలో ఓస్లో ఒప్పందం కుదిరింది. ఆ మేరకు పాలస్తీనాలో పరిమిత అధికారాలున్న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి, ఇజ్రాయెల్‌ తాను ఆక్రమించిన ప్రాంతాలను క్రమంగా ఖాళీ చేసి వెళ్లిపోవాలి. ఈ ఒప్పందాన్ని పాలస్తీనా విమోచనా సంస్థ(పిఎల్‌ఓ) చేసుకుంది. దాన్ని ఇతర పార్టీలు, సంస్థలు ఆమోదించలేదు. లొంగుబాటుగా వర్ణించాయి. వాటిలో హమస్‌ ఒకటి. ఎందుకంటే దానిలో అసలు పాలస్తీనా దేశం అనే పదాలే లేవు. ఆ ఒప్పందాలు జరిగి మూడు దశాబ్దాలు గడచింది. మొత్తం మీద చూసినపుడు ఒక్క నిబంధనను కూడా అమలు జరపలేదు. ఆక్రమణల నుంచి ఇజ్రాయెల్‌ వైదొలగలేదు, పాలస్తీనాకు అప్పగించలేదు.ఆక్రమణలు ఇంకా పెరిగాయి. జెరూసలెం పట్టణాన్ని కూడా ఆక్రమించేందుకు పూనుకుంది. మధ్యవర్తిగా ఉన్న అమెరికా అమలు జరిపేందుకు వత్తిడితేవటంమాని యూదుల పక్షాన నిలబడింది.ఓస్లో ఒప్పందంపై సంతకాలు చేసి దాన్ని అమలు జరిపేందుకు పూనుకోవాలి అని చెప్పిన ఇజ్రాయెల్‌ ప్రధాని యత్జిక్‌ రబిన్‌పై తీవ్రవాదులైన యూదు దురహంకారులు కుట్ర చేసి 1995లో హత్య చేశారు. ఎవరైనా అమలుకు పూనుకుంటే వారికి ఇదే గతి అన్న హెచ్చరికే అది.


ఇక హమస్‌ తాజా దాడులకు ఎందుకు పాల్పడింది అన్న అంశం మీద ప్రచారంలో ఉన్న కుట్ర సిద్దాంతాలలో ఒకటేమిటంటే ఇజ్రాయెల్‌-సౌదీ అరేబియా మధ్య సయోధ్య కుదిర్చేందుకు అమెరికా చేస్తున్న యత్నాలను దెబ్బతీసేందుకు అన్నది ఒకటి. పాలస్తీనా అరబ్బులకు మద్దతు ఇస్తున్న దేశాలలో సౌదీ ఒకటి. అది ఇజ్రాయెల్‌తో కుదుర్చుకొనే ఒప్పందాలకు ప్రాతిపదికలు ఏమిటో బహిర్గతం కాలేదు.మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం జెరూసలెంతో సహ పశ్చిమ గట్టు, గాజా ప్రాంతంలో ఇజ్రాయెల్‌ ఆక్రమించుకున్న ప్రాంతాలను పాలస్తీనాకు బదలాయిస్తేనే రెండు దేశాల మధ్య సాధారణ సంబంధాలను నెలకొల్పుకొనేందుకు అవకాశం ఉందని సౌదీ చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఇది ఉగ్రవాదులైన ఇజ్రాయెల్‌ మంత్రులు, యంత్రాంగానికి ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఈ కారణంగానే హమస్‌ సాయుధులు క్షిపణులతో సహా గాజా కంచెను దాటి ఇజ్రాయెల్‌ ప్రాంతంలోకి ప్రవేశించి దాడులు చేసేందుకు కావాలనే అవకాశం ఇచ్చారని, దాడులను సాకుగా చూపి ఉద్రిక్తతలను రెచ్చగొట్టి ఒప్పందాన్ని అడ్డుకోవాలన్నది ఒక కుట్ర కోణం. దాడి జరిగిన ఐదు గంటల తరువాత మాత్రమే ఇజ్రాయెల్‌ భద్రతాదళాలు ఆ ప్రాంతానికి చేరుకున్నాయి.ఈ కుట్రను అర్ధం చేసుకోలేని హమస్‌ వచ్చిన అవకాశాన్ని దాడికి ఉపయోగించుకున్నట్లు కొందరు చెబుతున్నారు.


గాజాపై దాడికి ఇజ్రాయెల్‌ పూనుకున్న పూర్వరంగంలో పశ్చిమాసియాలో పర్యవసానాలు, చైనా పాత్ర గురించి కూడా విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. ఇజ్రాయెల్‌తో ఒప్పందాన్ని సౌదీ పక్కన పెట్టినట్లు, ఇరాన్‌తో సంబంధాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు వార్తలు వెలువడ్డాయి. తాజా పరిస్థితికి బాధ్యత ఇజ్రాయెల్‌దే అన్న సౌదీ, పరిణామాలను దగ్గరగా పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నది, హమస్‌ చర్యను ఖండించలేదు. గతంలో ఇజ్రాయెల్‌ను హెచ్చరించినట్లు కూడా పేర్కొన్నది. ఈ స్పందన మీద అమెరికా మండిపడింది. తమతో సాధారణ సంబంధాలను కోరుకోవాలనుకొనే వారి నుంచి రావాల్సిన సాధారణ ప్రకటన ఇలా ఉండకూడదని వ్యాఖ్యానించింది.ఉప్పు-నిప్పుగా ఉన్న సౌదీ-ఇరాన్‌లను ఒక దగ్గరకు చేర్చి సంబంధాల ఏర్పాటుకు ఈ ఏడాది ఫిబ్రవరిలో చైనా మధ్యవర్తిత్వం వహించింది.బ్రిక్స్‌ కూటమిలోకి ఈజిప్టు, సౌదీ, యుఏఇ, ఇరాన్‌లను తెచ్చేందుకు కూడా చూస్తున్నది. ఈ పూర్వరంగంలో చైనా నుంచి దూరంగా జరిగితే పౌర అణు కార్యక్రమంలో భాగంగా ఒక విద్యుత్‌ కేంద్రాన్ని నిర్మిస్తామని అమెరికా ఇటీవల సౌదీకి ఒక బిస్కెట్‌ వేసింది. గత కొన్ని దశబ్దాలుగా అమెరికా మిత్ర దేశంగా ఉన్నప్పటికీ గతంలో అలాంటి ప్రతిపాదన చేయలేదు. ఇరాన్‌తో కుదిరిన మైత్రిని దెబ్బతీసేందుకు పావులు కదుపుతోంది. మరోవైపున మధ్య ప్రాచ్యంలో తన పట్టుతగ్గలేదని, తనను ఎదిరిస్తే అంతుచూస్తానని బెదిరించేందుకు రెండు విమానవాహక యుద్ద నౌకలను, యుద్ధ ఓడలను ఆ ప్రాంతానికి పంపింది. ఉక్రెయిన్‌ సంక్షోభంలో తటస్థంగా ఉన్న మన దేశం ఇప్పుడు ఇజ్రాయెల్‌కు మద్దతు ప్రకటించింది.


చైనా వైఖరిని ఇజ్రాయెల్‌, అమెరికా, ఐరోపా పశ్చిమ దేశాలు జీర్ణించుకోకపోగా మండిపడుతున్నాయి. తటస్థం అంటే ఇజ్రాయెల్‌ వ్యతిరేక వైఖరిని తీసుకోవటంగా చిత్రిస్తున్నాయి. అరబ్‌ దేశాల్లో తనకు అనుకూలమైన స్థితిని సృష్టించుకొనేందుకు చూస్తున్నదని, తన ప్రపంచ అజండాను ముందుకు తీసుకుపోవటంలో ఇది భాగమని ఉక్రోషం వెల్లడిస్తున్నాయి.ఒకవైపున జనాలను వీధుల్లో హతమారుస్తున్నపుడు దాని గురించి మాట్లాడకుండా పాలస్తీనా ఏర్పాటు గురించి మాట్లాడటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ ఏడాది జూన్‌లో పాలస్తీనా పాలనా మండలి అధ్యక్షుడు అబ్బాస్‌ను ఒక దేశాధినేత హౌదాలో చైనా ఆహ్వానించింది. పాలస్తీనా పౌరుల న్యాయమైన జాతీయ హక్కులకు మద్దతు ప్రకటించింది. ఇదే సమయంలో ఇజ్రాయెల్‌ ప్రధానిని కూడా చైనా ఆహ్వానించింది. పాలస్తీనా పౌరులహక్కులను హరించినందుకు గాను గతంలో దౌత్య సంబంధాలు పెట్టుకొనేందుకు నిరాకరించిన చైనా ఇటీవలి కాలంలో వైఖరిని మార్చుకొని అటు పాలస్తీనా ప్రతినిధులతో పాటు ఇటు ఇజ్రాయెల్‌తో కూడా సంబంధాలను నిర్వహిస్తున్నది. మరోవైపున చైనా మీడియాలో అమెరికా పాత్రను ఎండగడుతూ విశ్లేషణలు వెలువడుతున్నాయి.ఒక వైపున అరబ్‌ దేశాలను ఇజ్రాయెల్‌కు దగ్గర చేసేందుకు, మరోవైపున యూదు దురహంకారులకు మద్దతు ఇస్తూ పాలస్తీనియన్ల మీద భరించరాని వత్తిడిని అమెరికా పెంచుతున్నదని, ఒకవైపు కొమ్ముకాస్తున్నదని పేర్కొంటున్నారు. చైనా పశ్చిమాసియా తాజా వివాదంలో తటస్థంగా ఉంది. ఉభయ పక్షాలు శాంతం వహించాలని కోరింది తప్ప హమస్‌ను ఖండించలేదు. మావో కాలం నుంచీ పాలస్తీనా పక్షమే వహిస్తున్నది. ఆత్మ రక్షణ పేరుతో తన దాడులను ఇజ్రాయెల్‌ సమర్ధించుకుంటున్నది.చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ఫైజల్‌ బిన్‌ ఫర్హాన్‌తో మాట్లాడుతూ ఆత్మ రక్షణ పరిధికి మించి ఇజ్రాయెల్‌ చర్యలు ఉన్నాయి.అది అంతర్జాతీయ పిలుపులను వినాలి, గాజా పౌరులందరినీ శిక్షించాలని చూస్తున్న చర్యలను ఐరాస ప్రధాన కార్యదర్శి నిలిపివేయించాలని, స్వతంత్ర పాలస్తీనా దేశం ఏర్పడాలని కూడా చైనా మంత్రి స్పష్టం చేశాడు. చైనా ఇస్తున్న గట్టి మద్దతు అరబ్‌ ప్రపంచంలో పాలస్తీనీయన్లకు మరింత బలాన్ని ఇస్తుందని, అరబ్‌ దేశాలు వారి వైపున నిలిచే అవకాశం ఉందని, చైనా కోరుకుంటోంది కూడా అదేనని పరిశీలకులు భావిస్తున్నారు. ఉక్రెయిన్‌ సంక్షోభంలో కూడా తటస్థత అంటూ రష్యా దాడులను ఖండించలేదని మరోవైపున దానితో సంబంధాలను మరింతగా మెరుగుపరుచుకుందని పశ్చిమదేశాల విశ్లేషకులు చైనా మీద మండిపడుతున్నారు.

హమస్‌ ఎప్పుడు ఉనికిలోకి వచ్చింది ? అవాస్తవాల ప్రచారం, నిజాలేమిటి ?

Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


టీవీలు, పత్రికల్లో ప్రస్తుతం హమస్‌ అనే సంస్థ గురించి వార్తలు వస్తున్నాయి. ఇజ్రాయెల్‌-పాలస్తీనా తాజా పరిణామాలపై ఎన్నో అవస్తవాలు, వక్రీకరణలు వెల్లువెత్తుతున్నాయి. వాటిలో కొన్నింటిని చూద్దాం. చరిత్రనంతటినీ ప్రస్తావించటం ఇక్కడ సాధ్యం కాదు గనుక క్లుప్త వివరణకే ఇది పరిమితం.


పాలస్తీనా – ఇజ్రాయెల్‌ ఉనికి !
ఈ రోజు మనం పాలస్తీనా అని చెబుతున్న ప్రాంతం లేదా చరిత్రలో ఉందని భాష్యం చెబుతున్న ఇజ్రాయెల్‌ గానీ ఎన్నడూ ఒక స్వతంత్ర దేశంగా లేవు. ఏదో ఒక సామ్రాజ్యంలో భాగాలుగా చేతులు మారుతూ వచ్చాయి. క్రీస్తు పూర్వమే ఈ రెండు పేర్లూ వాడుకలో ఉన్నట్లు చరిత్ర చెబుతోంది. పేరు ఏదైనా అవి ఏదో ఒక సామ్రాజ్యంలో భాగాలు, సామంతదేశాలే. రోమన్‌, లేదా ఒట్టోమన్‌ మాదిరి యూదుల సామ్రాజ్యం అనేది లేదు. తొలుత క్రీస్తు పూర్వం ఏడవ శతాబ్దంలో అస్సీరియన్లు యూదుల మీద దాడి చేసి జుడా రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. యూదులను తరిమివేశారు. తరువాత క్రీస్తుశకం మధ్యయుగాల్లో మత యుద్దాల్లో యూదులు అనేక ప్రాంతాలకు పారిపోయారు. చరిత్రలో పాలస్తీనా-ఇజ్రాయెల్‌ ప్రాంతం చివరిగా టర్కీ కేంద్రంగా పాలన సాగించిన ఒట్టోమన్‌ సామ్రాజ్యంలో భాగంగా ఉంది. జనాభాలో తొంభైశాతంపైగా అరబ్బులే ఉన్నారు. ప్రపంచమంతటినీ ఆక్రమించిన బ్రిటీష్‌, ఫ్రెంచి ఇతర సామ్రాజ్యవాదులకు అది స్వాధీనం కాలేదు. మొదటి ప్రపంచ యుద్దంలో దాన్ని విచ్చిన్నం చేసేందుకు బ్రిటీష్‌ పాలకులు అనేక పాచికలను వాడారు. వాటిలో ఒకటి ఒట్టోమన్‌ సామ్రాజ్యం నుంచి స్వాతంత్య్రం కోరుతున్న అరబ్బులకు పాలస్తీనాను ఏర్పాటు చేస్తామని ఒక వైపు ఆశచూపారు. మరోవైపు యూదులకు ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేస్తామని వారి మద్దతును కూడగట్టేందుకు పూనుకున్నారు. ఎందుకంటే అనేక దేశాల్లో యూదులు బాంకర్లుగా, ఇతరత్రా ధనవంతులుగా ఉన్నారు కనుక వారి అవసరం ఉన్నందున అలా చేశారు. బ్రిటీష్‌ , తరువాత వారి స్థానాన్ని ఆక్రమించిన అమెరికన్‌ సామ్రాజ్యవాదులు పెట్టిన చిచ్చే పాలస్తీనా-ఇజ్రాయెల్‌ వివాదం.


మొదటి ప్రపంచ యుద్దంలో ఒట్టోమన్‌ సామ్రాజ్యం పతనమైన తరువాత సామ్రాజ్యవాదుల పంపకాల్లో పాలస్తీనా ప్రాంతాన్ని బ్రిటీష్‌ వారు తీసుకున్నారు. అప్పటికే పశ్చిమాసియాలో చమురు నిల్వలు, ఇతర ప్రాంతాల్లో సహజ సంపదలను గమనించి ఆ ప్రాంతంలో తమకు నమ్మకమైన బంటు ఉండాలంటే ఇజ్రాయెల్‌ ఏర్పాటు ఒక సాధనంగా బ్రిటీష్‌ వారు భావించారు. అందుకు గాను అనేక దేశాల్లో దాడులకు గురైన యూదులందరినీ పాలస్తీనాకు అక్రమంగా రప్పించారు. అక్కడ వారు నివాసాలను ఏర్పాటు చేసుకొనేందుకు అవకాశం కల్పించారు. స్థానికంగా ఉన్న అరబ్బులను వారి ప్రాంతాల నుంచి గెంటివేయటం అప్పుడే ప్రారంభమైంది. బ్రిటీష్‌ వారి కుట్రను గమనించేలోగా రెండవ ప్రపంచ యుద్దం, తరువాత యూదుల వలసలు మరింత పెరిగాయి. తరువాత పాలస్తీనా ప్రాంతాన్ని మూడుగా విభజించి పాలస్తీనా, ఇజ్రాయెల్‌ దేశాలుగా ఏర్పాటు, జెరూసలెం పట్టణం, పరిసరాలను ఐరాస ఆధీనంలో ఉంచాలంటూ చేసిన ప్రతిపాదనకు ఐరాస సాధారణ అసెంబ్లీలో 1947 నవంబరు 29న మెజారిటీ ఆమోదం వచ్చేట్లు సామ్రాజ్యవాదులు చూశారు. దానిని ఆ ప్రాంత దేశాలు, అరబ్బులు అంగీకరించలేదు. ఐరాస తీర్మానం సాకుతో అప్పటికే సాయుధంగా సిద్దంగా ఉన్న యూదులు తీర్మానాన్ని పక్కన పెట్టి పాలస్తీనా ప్రాంతాలను కూడా ఆక్రమించి అరబ్బులను తరిమివేశారు.దాంతో అరబ్బులు ప్రతిఘటన ప్రారంభించారు. నాటి నుంచి నేటి వరకు పాలస్తీనా ఏర్పడలేదు. ఇజ్రాయెల్‌ ముందుగా వేసుకున్న పధకం ప్రకారం పాలస్తీనా ప్రాంతాల ఆక్రమణకు పూనుకోవటంతో పక్కనే ఉన్న ఈజిప్టు, సిరియా, జోర్డాన్‌, ఇరాక్‌ పాలస్తీనా ప్రాంతాలను దురాక్రమణ నుంచి కాపాడి కొన్నింటిని తమ అదుపులోకి తీసుకున్నాయి. ఐరాస తీర్మానాన్ని గుర్తించేందుకు ఇజ్రాయెల్‌ నిరాకరిస్తోంది. తన భద్రతకు కొన్ని పాలస్తీనా ప్రాంతాలు కావాలని చెబుతోంది. దానికి అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు మద్దతు పలుకుతున్నాయి.


హమస్‌ ఎప్పుడు ఏర్పడింది ?
పాలస్తీనా విముక్తి కోసం పిఎల్‌ఓ ఏర్పడింది. అది శాంతియుత, సాయుధ పద్దతుల్లో పోరాడుతోంది. 1980 దశకం నాటికి అరబ్బుల్లో అసహనం పెరిగింది. పిఎల్‌ఓ సమర్దవంతంగా ఎదుర్కోవటం లేదనే అసంతృప్తి ఉంది. ఈ పూర్వరంగంలో హమస్‌ అనే సంస్థ 1987లో ఉనికిలోకి వచ్చింది. దాన్ని ఏర్పాటు చేయటంలో మత పెద్దలు కూడా ఉన్నారు.1973లో ముస్లిం బ్రదర్‌హుడ్‌ అనే సంస్థ ఈజిప్టులో ఏర్పడింది. దానిలో పాలస్తీనా ప్రాంతానికి చెందిన వారు కూడా ఉన్నారు. ఆ సంస్థలో చీలిక వచ్చి హమస్‌ ఏర్పడింది.1988ఆగస్టున హమస్‌ ప్రణాళిక పేరుతో తొలిసారిగా ఆ పేరును వెలుగులోకి తెచ్చారు. తమ ప్రభుత్వం మీద పోరాడే ప్రతివారినీ ఉగ్రవాద ముద్రవేసి ఇజ్రాయెల్‌ అణచివేస్తున్నది. అంతకు ముందు పిఎల్‌ఓ, తరువాత హమస్‌ ఇతర సంస్థలనూ అదే మాదిరి పరిగణించింది. 1994 ఫిబ్రవరిలో రంజాన్‌ ప్రార్ధనలు చేస్తున్న ముస్లింలను 29 మందిని గోల్డ్‌ స్టెయిన్‌ అనే యూదు దురహంకారి మిలిటరీ దుస్తులతో వెళ్లి పశ్చిమ గట్టు ప్రాంతంలోని హెబ్రాన్‌ నగరంలోని ఒక మసీదులో కాల్చి చంపాడు. తరువాత జరిగిన ఉదంతాలలో మరో 19 మంది పాలస్తీనియన్లను భద్రతా దళాలు చంపి వేశాయి. సామాన్య పౌరులు, మిలిటెంట్లకు తేడా చూపకుండా ఇజ్రాయెల్‌ చర్యలు ఉన్నందున తాము కూడా అదే బాట పడతామని హెబ్రాన్‌ ఉదంతం తరువాత హమస్‌ ప్రకటించింది.అప్పటి నుంచి అది ఇజ్రాయెల్‌ పోలీసులు, భద్రతా దళాల దుశ్చర్యలకు ప్రతిగా తానూ దాడులు జరుపుతోంది. అది సరైందా కాదా అంటే పౌరుల మీద ఎవరు దాడులు జరిపినా సమర్దించనవసరం లేదు. ఇజ్రాయెల్‌ యూదులు సామాన్యపౌరుల మీద బాంబులు విసురుతుంటే పాలస్తీనా అరబ్బులు రసగుల్లాలు విసురుతారా ? ఇదే సమయంలో పిఎల్‌ఓ-ఇజ్రాయెల్‌ మధ్య కుదిరిన ఓస్లో ఒప్పందాన్ని అది వ్యతిరేకించింది. దానిలో భాగంగానే 1996లో జరిగిన పాలస్తీనా ఎన్నికలను,2005లో పాలస్తీనా అధ్యక్ష ఎన్నికను బహిష్కరించింది. యాసర్‌ అరాఫత్‌ మరణించిన తరువాత 2006లో జరిగిన జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసింది. గాజా ప్రాంతంలో మెజారిటీ సీట్లు తెచ్చుకొని అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. వెస్ట్‌ బాంక్‌ ప్రాంతంలో ఫతా అధికారంలో ఉంది. మన దేశంలో రాష్ట్ర ప్రభుత్వాలకు అంతర్జాతీయ గుర్తింపు ఉండదు, అలాగే గాజాలోని హమస్‌ ప్రభుత్వానికి అంతర్జాతీయ గుర్తింపు లేదు, ఎందుకంటే అది పాలస్తీనాలోని ఒక ప్రాంత ప్రభుత్వం మాత్రమే. హమస్‌ ప్రభుత్వానికి మిలిటరీ లేదు, హమస్‌ గెరిల్లాలు మాత్రమే దాడులు చేస్తున్నారు. ఇజ్రాయెల్‌ మిలిటరీ ఆ గెరిల్లాలను అణచేపేరుతో జనావాసాలపై దాడులు చేసి పౌరులను హతమారుస్తున్నది. విమానాలతో బాంబులు వేస్తున్నది, గాజా వాసులకు మంచినీరు, విద్యుత్‌, ఆహారం, ఔషధాల సరఫరాలను నిలిపివేసిందంటే సామాన్య పౌరుల మీద దాడి తప్ప మరొకటి కాదు.గాజా ప్రాంతం నుంచి తప్పుకున్న 2006 నుంచి ఇప్పటి వరకు ఇజ్రాయెల్‌ పదిసార్లు మిలిటరీదాడులు జరిపింది.


జో బైడెన్‌ అబద్దమాడాడా !
అమెరికాలోని యూదు సంస్థల ప్రతినిధులతో సమావేశమైన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఇలాంటి దృశ్యాలను చూడాల్సి వస్తుందని తాను అనుకోలేదని చెప్పినట్లు వార్తలు వచ్చాయి. హమస్‌ సాయుధులు ఇజ్రాయెలీ పిల్లలను చంపుతున్న దృశ్యాల చిత్రాలను చూసిన తరువాత బైడెన్‌ స్పందించినట్లు మీడియా పేర్కొన్నది.ఇజ్రాయెల్‌ ప్రభుత్వం, నేతలు చెప్పిన మాటలను బట్టి అలా మాట్లాడారు తప్ప బైడెన్‌ ఎలాంటి ఫొటోలను చూడలేదని అధ్యక్ష భవనం వివరణ ఇచ్చింది. పిల్లలను హతమారుస్తున్నట్లు ఎలాంటి దాఖలాలు లేవని తరువాత వెల్లడైంది. కానీ తప్పుడు ఫొటోలను ఇజ్రాయెల్‌ , అమెరికా, ఐరోపా పత్రికలు ప్రచురించి పెద్ద ఎత్తున హమస్‌ మీద అసత్యవార్తలను జనంలో పెట్టాయి. పశ్చిమ దేశాల పాలకులు, వారి కనుసన్నలలో నడిచే మీడియా ఎలాంటి తప్పుడు వార్తలను ప్రచారంలో పెడుతుందో తెలిసిందే.1991లో ఇరాక్‌ మీద దాడి చేయదలచుకున్న అమెరికా, ఐరోపా దేశాలు అంతకు ముందు ఒక కట్టుకథను ప్రచారంలో పెట్టాయి. కువాయిట్‌ ఆసుపత్రిల్లోని ఇంక్యుబేటర్లలో ఉన్న వందలాది మంది పిల్లలను ఇరాకీ సైనికులు చంపివేశారని నమ్మించేందుకు చూశారు. అంతేకాదు నాటి ఇరాక్‌ పాలకుడు సద్దాం హుసేన్‌ మారణాయుధాలను గుట్టలుగా నిల్వ చేశాడని కూడా ప్రచారం చేసిన సంగతి, తీరా తాము చేయదలచుకున్నది చేసి సద్దాంను హత్య చేసి లక్షలాది మంది ఇరాకీల జీవితాలను నాశనం చేసిన తరువాత అబ్బే అలాంటి గుట్టల ఆయుధాలు ఎక్కడా కనిపించలేదని చెప్పిన సంగతి తెలిసిందే. ఇక జో బైడెన్‌ పెద్ద అబద్దాల కోరని గతంలోనే రుజువైంది. నెల్సన్‌ మండేలాను కలిసేందుకు వెళ్లినపుడు 1970దశకంలో తనను అరెస్టు చేశారని 2020 ఎన్నికల ప్రచారంలో పచ్చి అబద్దం చెప్పాడు.


ఇజ్రాయెల్‌ నిఘా వైఫల్యమా ! కుట్రా !!
పాలస్తీనాకు చెందిన గాజా ప్రాంతాన్ని ఇజ్రాయెల్‌ ప్రభుత్వం ఒక నిర్బంధశిబిరంగా మార్చివేసింది. దాని చుట్టూ సరిహద్దులో మనుషులు దాటటానికి వీలులేని ఆరు మీటర్ల ఎత్తున పెద్ద ఇనుప ముళ్ల కంచెను ఏర్పాటు చేసింది. దాని పొడవు 65కిలోమీటర్లు, డ్రోన్లు, రిమోట్‌ కంట్రోలు మెషిన్‌ గన్లు, కెమెరాలు దానికి అమర్చి ఉంటాయి. ఏదైనా అలజడి సమాచారం ఉంటే ఐదు నిమిషాల్లో దాడులు చేసే హెలికాప్టర్లు సిద్దంగా ఉంటాయి. బుల్డోజర్లతో తప్ప ఆ కంచెను మానవ మాత్రులు ధ్వంసం చేయలేరు. దాన్ని దాటి 400 మంది హమస్‌ గెరిల్లాలు ట్రాక్టర్ల మీద వచ్చారని చెబుతున్నారు. ఒకవైపు ఈజిప్టు, మరోవైపు మధ్యధరా సముద్రం, రెండు వైపులా ఇజ్రాయెల్‌ మిలిటరీ ఉంటుంది. గాజా వాసులు వెలుపలికి రావాలంటే ఇజ్రాయెల్‌ అనుమతి లేకుండా కుదరదు.హమస్‌ గెరిల్లాలు కంచెను దాటి కొందరు క్షిపణులు ప్రయోగించారు. కొన్ని చోట్ల కంచెలోపలి నుంచే వదిలారు. దీన్ని ఇజ్రాయెల్‌ పసిగట్టలేకపోయింది.ఏదో జరగబోతోందని ముందే తాము హెచ్చరించామని ఈజిప్టు నిఘా అధికారులు చెప్పారు. తాము కూడా మిలిటరీని హెచ్చరించామని ఇజ్రాయెలీ గూఢచారులు కూడా చెబుతున్నారు. తమకెలాంటి సమాచారమూ లేదని మిలిటరీ చెప్పింది. తెలిసినా ఇజ్రాయెల్‌ మిలిటరీ కావాలనే నిరోధించలేదని చెబుతున్నారు. ఇది ఒక రహస్యంగా మిగిలిపోయింది.


హమస్‌ను అంతం చేయటం సాధ్యమా ?
పాలస్తీనా ప్రాంతాల మీద ఇజ్రాయెల్‌ దాడులు చేయటం ఇదే ప్రధమం కాదు. గతంలో అనేకసార్లు దాడులు చేసింది. తమ వ్యతిరేకులను అణచివేసినట్లు చెప్పుకుంది. ఇప్పుడు కూడా అదే చెబుతోంది. హమస్‌ లేదా మరొక తిరుగుబాటుదార్లను అణచివేయటం నిజంగా సాధ్యమౌతుందా ? ప్రజల మీద దాడులు కొనసాగినంత కాలం ప్రతిఘటన వీరులు పుడుతూనే ఉంటారన్నది చరిత్ర చెప్పిన సత్యం. హమస్‌గాకపోతే మరొక పేరుతో మరో సంస్థ పుట్టుకువస్తుంది. హమస్‌ కంటే ముందుకు కూడా సాయుధదాడులు చేసిన వారు ఉన్నారు కదా ! పాలస్తీనాకు 1947 తీర్మానం ప్రకారం దాని ప్రాంతాలను దానికి అప్పగిస్తేనే ఇజ్రాయెల్‌ మీద తిరుగుబాటు లేదా ఆత్మరక్షణ దాడులు నిలిచిపోతాయి. లేకుంటే మరో ఏడు దశాబ్దాలు గడిచినా చరిత్ర పునరావృతం అవుతూనే ఉంటుంది. వందల సంవత్సరాల నాడు మత యుద్ధాలలో, రెండవ ప్రపంచ యుద్దానికి ముందు హిట్లర్‌ యూదులను లక్షల సంఖ్యలో హతమార్చినా వారు అంతరించలేదు. అలాంటిది పాలస్తీనియన్లు లేదా అరబ్బులను అణచివేయటం, పూర్తిగా తుడిచిపెట్టటం సాధ్యమౌతుందా ? ఈ పాఠాన్ని యూదులు, వారిని సమర్ధించేవారు మరచిపోతే ఎలా ?

ఇజ్రాయెల్‌పై హమస్‌ దాడులకు కారణం ఏమిటి ! ఆజ్యం పోస్తున్న అమెరికా కూటమి !!

Tags

, , , , , , , , ,


ఎం కోటేశ్వరరావు


పాలస్తీనా సమరయోధుల సంస్థ హమస్‌- ఇజ్రాయెల్‌ మధ్య మరోసారి చెలరేగిన పోరు ఏ పరిణామాలు, పర్యవసానాలకు దారి తీస్తుందా అని ఒకవైపు ప్రపంచం ఆందోళన చెందుతుంటే మరోవైపు అమెరికా స్టాక్‌మార్కెట్‌లో ఆయుధ ఉత్పత్తి కంపెనీల వాటాల ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఇల్లుకాలుతుంటే బొగ్గులేరుకొనేందుకు చూడటం అంటే ఇదే. గత మూడు సంవత్సరాల్లో ఎంతగా లేనంతగా సోమవారం ఒక్కరోజే ఎనిమిది శాతం ఎగువకు దూసుకుపోయాయంటే తమకు లాభాల పంట పండుతుందని మదుపుదార్లు వాటాల కొనుగోలు ఎగబడిన ఫలితమే అది. ఇజ్రాయెల్‌కు మరింతగా సాయం చేయాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించటంతో ఆయుధ కంపెనీలకు చేతినిండా పని అన్నది తెలిసిందే. తాజా పరిణామాల్లో అటూ ఇటూ పెద్ద ఎత్తున జననష్టం, ఆస్థి విధ్వంసం గురించి వివరాలు ఇంకా వెల్లడికావాల్సి ఉంది. తక్షణమే దాడులు నిలిపివేయాలన్న అభిప్రాయం వెల్లడి అవుతోంది. ఎవరు ముందు ప్రారంభించారు, ఎవరు ప్రతిఘటిస్తున్నారు అన్న విచక్షణలోకి పోతే పైకి హమస్‌ దాడులు కనిపించవచ్చుగానీ అంతకు ముందు ఇజ్రాయెల్‌ చేసిన దారుణాలు తక్కువేమీ కాదు.ఇది ప్రారంభం కాదు, అంతమూ కాదు. ఆకస్మికంగా జరిగిన ఈ పరిణామాలకు కారణాలు ఏమిటన్నది చూద్దాం. ఒకటి పాలస్తీనా ఏర్పాటును అడ్డుకోవటమే కాదు, ఐరాస దానికి కేటాయించిన ప్రాంతాలను క్రమంగా ఆక్రమించుకుంటున్న ఇజ్రాయెల్‌, దానికి మద్దతు ఇస్తున్న పశ్చిమ దేశాల వైఖరి ఒకటైతే, తక్షణ కారణాలేమిటన్నది మరొక అంశం. తాజాగా తలెత్తిన వివాదానికి అమెరికా మరింతగా ఆజ్యం పోస్తున్నది, ఇజ్రాయెల్‌కు మద్దతుగా మధ్యధరా సముద్రానికి తన సప్తమ నౌకా దళం, జెట్‌ యుద్ధ విమానాలను పంపుతున్నది. మధ్యవర్తిగా ఉన్న ఒక దేశం ఇలా ఒకపక్ష కొమ్ముకాయటం దుర్మార్గం.


పాలస్తీనా-ఇజ్రాయెల్‌ వివాదంలో జరూసలెం పట్టణం ఎవరికి చెందాలన్నది ఒక అంశం. ఇటీవలి వరకు టెల్‌ అవీవ్‌లో ఉన్న తన ఇజ్రాయెల్‌ రాయబార కార్యాలయాన్ని జెరూసలెంకు తరలించాలని అమెరికా నిర్ణయించటం ఏకపక్షం, పాలస్తీనా ప్రాంతాలను ఆక్రమిస్తున్న ఇజ్రాయెల్‌ దుర్మార్గానికి మద్దతు ఇవ్వటమే. ఇంకా అమెరికా కనుసన్నలలో నడిచే అనేక దేశాలు అదే మాదిరి తమ కార్యాలయాలను కూడా జెరూసలెంకు తరలించాలని చూడటం యూదుల ఆక్రమణలను శాశ్వతం చేసే కుట్రలో భాగమే. జెరూసలెంలోని చారిత్రాత్మక అల్‌ అక్సా మసీదును ఆక్రమించుకొనేందుకు ఇజ్రాయెల్‌ పూనుకోవటమే తాజాగా హమస్‌ను దాడులకు పురికొల్పిందని చెప్పవచ్చు. 2021 ఏప్రిల్‌లో రంజాన్‌, యూదుల పండుగ పాసోవర్‌ సందర్భంగా ఉద్రిక్తతలు తలెత్తాయి. గతంలో కుదిరిన ఒప్పందం ప్రకారం ముస్లిమేతరులు ఆ మసీదు ప్రాంగణాన్ని సందర్శించాలంటే అనుమతి తీసుకోవాలి. ఇజ్రాయెల్‌ ప్రభుత్వ ప్రోత్సాహంతో మసీదు పరిసరాలను ఆక్రమించిన యూదులు ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించి పాసోవర్‌ పండగ సందర్భంగా ప్రాంగణాన్ని దురాక్రమించి ప్రార్ధనలు జరిపారు. ఏప్రిల్‌ 14వ తేదీన ఇజ్రాయెల్‌ పోలీసులు బలవంతంగా ప్రవేశించి మసీదులో ఉన్న మైకుల వైర్లను తెంచివేశారు.ఎందుకు అంటే మసీదు పక్కనే జరుగుతున్న ఇజ్రాయెలీ అధ్యక్షుడి కార్యక్రమానికి అంతరాయం కలుగుతుందని సాకు చెప్పారు. తరువాత రెండు రోజులకు పాలస్తీనియన్లు ఇజ్రాయెల్‌ పోలీసుల ఆంక్షలను తోసిపుచ్చి వేలాది మంది చేరి ప్రార్ధన చేశారు. మరుసటి నెలలో యూదు దురాక్రమణదార్లు పాలస్తీనియన్ల మీద జరిపిన దాడుల్లో వందలాది మంది పాలస్తీనియన్లు గాయపడ్డారు. అదే ఏడాది ఇజ్రాయెల్‌ – హమస్‌ మధ్య పదకొండురోజుల పాటు దాడులు ప్రతిదాడులు జరిగాయి. గతేడాది ఏప్రిల్‌లో ఇజ్రాయెలీ దళాలు ప్రవేశించి పాలస్తీనియన్ల మీద దాడులు చేశాయి. మసీదులో తిష్టవేసిన వారు తమ మీద రాళ్లు వేసినట్లు సాకు చెప్పారు. ఈ ఏడాది ఏప్రిల్‌ ఐదున కూడా ఇజ్రాయెల్‌ దళాలు మసీదు మీద దాడి జరిపాయి. మసీదులో ఉన్నవారు రాళ్లు విసిరినట్లు పాత కథనే తిరిగి వల్లించారు. అప్పటి నుంచి ఏదో ఒక సాకుతో అల్‌ అక్సా మసీదు, పరిసరాల్లో ఉన్న పాలస్తీనా ప్రాంతాలను ఆక్రమించుకొనేందుకు ఇజ్రాయలీలు రెచ్చగొడుతుండటమే ఈనెల ఆరున హమస్‌ దాడులకు కారణంగా చెబుతున్నారు. యాభై సంవత్సరాల క్రితం 1973 అక్టోబరు ఆరున ఇజ్రాయెల్‌ ఆక్రమిత పాలస్తీనా ప్రాంతాలపై అరబ్బులు ఆకస్మికంగా దాడులు జరిపారు. నాటి ఉదంతాల గురించి ఇజ్రాయెలీ మీడియాలో గత కొద్ది రోజులుగా పాలస్తీనియన్లను రెచ్చగొడుతూ వార్తలు, విశ్లేషణలు వెలువడుతున్నాయి.దాన్లో భాగంగానే సిమ్‌చాట్‌ తోరా పేరుతో యూదులు పండుగ చేసుకుంటున్న పూర్వరంగంలో దాడులకు ఆక్టోబరు ఆరవ తేదీనే హమస్‌ కూడా ఎంచుకున్నదని, ” ఆపరేషన్‌ అల్‌ అక్సా ఫ్లడ్‌ ” పేరు పెట్టినట్లు చెబుతున్నారు. దీని గురించి ఇజ్రాయెలీ గూఢచారులు ఏ మాత్రం పసిగట్టలేకపోయారు. తాడిని ఎక్కేవాడుంటే వాడి తలదన్నేవాడుంటాడు.


ఆయుధాలతో అరబ్బులను బెదిరించి వారి ప్రాంతాలను ఆక్రమించి ఇజ్రాయెల్‌ను ఏర్పాటు చేయాలన్న బ్రిటీష్‌ పాలకుల చర్యలను 1938లోనే గాంధీ మహత్ముడు హరిజన్‌ పత్రికలో రాసిన ఒక వ్యాసంలో వ్యతిరేకించారు.యూదులు ఏదేశంలో ఉంటే అదే వారి మాతృదేశం అవుతుందని పేర్కొన్నారు. సామ్రాజ్యవాదుల కుట్రలో భాగంగా 1948లో పాలస్తీనాలో కొన్ని ప్రాంతాలను గుర్తించి ఇజ్రాయెల్‌ను ఏర్పాటు చేశారు. తరువాతే అసలు కుట్ర బయటపడింది. పాలస్తీనా ప్రాంతాలను ఆక్రమించి తన రక్షణకు అవి అవసరమంటూ నాటి నుంచి నేటి వరకు అసలు పాలస్తీనా ఉనికినే లేకుండా చేసింది ఇజ్రాయెల్‌. అంతకు ముందు ఎక్కడెక్కడో ఉన్న యూదులందరినీ సమీకరించి బ్రిటీష్‌ పాలకులు అక్రమంగా పాలస్తీనాలో ప్రవేశపెట్టారు. వారికి ఆయుధాలతో శిక్షణ, నిధులు అందచేశారు.ఐరాస చేసిన విభజన తీర్మానాన్ని పాలస్తీనా అంగీకరించలేదు. ఇతర దేశాల్లోని యూదులను చేర్చటంతో అప్పటి వరకు పాలస్తీనాలో 90శాతంగా ఉన్న అరబ్బులు 67శాతానికి తగ్గారు. సారవంతమైన ప్రాంతాలతో సహా పాలస్తీనాలో 55శాతాన్ని యూదులకు కేటాయిస్తూ విభజన పధకంలో చేర్చారు. అరబ్బులకు 42శాతం, మూడుశాతం విస్తీర్ణంలో ఉన్న జెరూసలేం ప్రాంతాన్ని అంతర్జాతీయ పర్యవేక్షణలో ఉంచేందుకు నిర్ణయించారు.ప్రస్తుతం పశ్చిమ గట్టు, గాజా పాలస్తీనా పాలిత ప్రాంతాలుగా పేరుకు 23శాతం విస్తీర్ణంలో ఉన్నప్పటికీ వాటిలో కూడా ఇజ్రాయెల్‌ ఆక్రమణలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. పాలస్తీనాను విభజించినపుడు ఏడున్నరలక్షల మంది అరబ్బులు నిర్వాసితులై విదేశాలకు శరణార్ధులుగా వెళ్లారు. గడచిన 75 సంవత్సరాల్లో వారి వారసుల సంఖ్య అరవైలక్షలకు పెరిగింది. వారంతా పాలస్తీనాలోని కొన్ని శిబిరాలు, ఈజిప్టు, లెబనాన్‌, జోర్డాన్‌, సిరియాల్లో తలదాచుకుంటున్నారు.
తాజాగా హమస్‌ దాడుల గురించి పశ్చిమ దేశాల వార్తా సంస్థలు ఇచ్చిన వార్తల్లో వారి ఆధీనంలో ఉన్న గాజా ప్రాంతంలో వంద మంది ఐరోపావాసులు బందీలుగా ఉన్నట్లు పెద్ద ఎత్తున కథనాలు ఇచ్చాయి. ఇజ్రాయెల్‌ జైళ్లలో ఉన్న వేలాది మంది తమవారిని విడిచిపెడితే వారిని తాము కూడా స్వదేశాలకు పంపుతామని హమస్‌ చెప్పినట్లు వార్తలు వచ్చాయి.పశ్చిమ దేశాలు, అక్కడి మీడియాను అనుసరించే మన దేశంలోని కొందరు హమస్‌ను ఉగ్రవాదులుగానూ, ఇజ్రాయెల్‌ను ప్రజాస్వామిక శక్తిగా చిత్రిస్తున్నారు. ఇజ్రాయెల్‌ ఆక్రమించుకున్న తమ దేశాన్ని విముక్తి కావించేందుకు అనేక శక్తులు అనేక పద్దతుల్లో పోరాడుతున్నాయి. పాలస్తీనా విమోచనా సంస్థ యాసర్‌ అరాఫత్‌నే ఉగ్రవాదిగా చిత్రించిన వారు హమస్‌ను మరొక విధంగా పేర్కొంటారని అనుకోలేము.హమస్‌ గాజా ప్రాంతంలో అధికారంలో ఉంది.అది సాయుధపోరాటాన్ని ఒక మార్గంగా ఎంచుకుంది. పశ్చిమ దేశాల మద్దతు, బలమైన మిలిటరీ ఉన్న ఇజ్రాయెల్‌ను ఎదుర్కొనేందుకు కొన్ని సందర్భాల్లో గెరిల్లా పద్దతిలో దాడులు జరుపుతుంది. మన దేశ చరిత్రలో శివాజీ కూడా ఔరంగజేబు సేనల మీద, అల్లూరి సీతారామ రాజు బ్రిటీష్‌ వారి పాలకుల మీద గెరిల్లా పద్దతిలో దాడులు జరిపిన సంగతి తెలిసిందే. వారిని ఉగ్రవాదులందామా ? బ్రిటీష్‌ వారు భగత్‌ సింగ్‌నే ఉగ్రవాది అని నిందించిన సంగతి తెలిసిందే.


చరిత్రలో హిట్లర్‌ మూకలు యూదులను నిర్బంధ శిబిరాల్లో చిత్రహింసలు పెట్టి చంపిన దారుణ మారణకాండను ప్రపంచం చూసింది. గాజా ప్రాంతంలో ఇరవైలక్షల మందికి పైగా అరబ్బులు నివశిస్తున్నారు. ప్రపంచంలో అదొక పెద్ద జైలు అంటే అతిశయోక్తి కాదు. అక్కడి జనం బయటకు రావాలన్నా, పరిసరాల్లో పనిపాటలు చేసుకోవాలన్నా ఇజ్రాయెల్‌ మిలిటరీ అనుమతి తీసుకోవాల్సిందే. తనిఖీ లేందే జనాలను కదలనివ్వరు.హమస్‌ దాడులకు ముందే ఇజ్రాయెల్‌ పోలీసులు 5,250 మంది పాలస్తీనియన్లను బందీలుగా ఉంచుకున్నారు, వారిలో 170 మంది పిల్లలు కూడా ఉన్నారు. వీరి గురించి మీడియా, పశ్చిమ దేశాల మానవతావాదులు పట్టించుకోరు. ఉగ్రవాదం మీద దాడులు చేయండి తప్ప పాలస్తీనియన్ల మీద కాదంటూ కొందరు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఏడున్నర దశాబ్దాలుగా దాడులు చేస్తున్నది సామాన్యజనం మీదనే అన్న వాస్తవాన్ని దాచేందుకే ఈ పదజాలం.పాలస్తీనా వాసులు పోరులోనే పుట్టి ,పోరులోనే పెరిగి ,పోరులోనే మరణిస్తున్నారు. అంతకంటే వారికి పోయేదేమీ లేదు. వారి మాతృదేశ కాంక్ష మరింతగా పెరుగుతుందే తప్ప నిర్భంధంతో అణిగేది కాదు. జెరూసలెంతో సహా అరబ్బులకు నిర్దేశించిన ప్రాంతాలను పూర్తిగా తిరిగి వారికి అప్పగించకుండా, వారి ప్రాంతాలలో యూదుల నివాసాలను ఖాళీ చేయించకుండా సమస్య పరిష్కారం కాదు. పాలస్తీనియన్ల మాతృదేశ కాంక్ష తీరదు.


ఇప్పటికే మాతృగడ్డమీద దశబ్దాల తరబడి బందీలుగా మారిన పాలస్తీయన్ల భవితవ్యం గురించి ఒకవైపు ప్రపంచం ఆలోచిస్తుంటే మరోవైపు వారిని మరింతగా అణచివేసేందుకు అవసరమైన ఆయుధాలను అమ్ముకొనేందుకు అమెరికా పూనుకుంది. ఇజ్రాయెల్‌ మీద దాడి చేసినందుకు ప్రతీకారంగా పాలస్తీనాకు అందచేస్తున్న సాయాన్ని సమీక్షించే నెపంతో ఐరోపా నిలిపివేసింది. అదే పాలస్తీనా మీద యుద్ద విమానాలతో దాడులు చేస్తున్న ఇజ్రాయెల్‌కు అమెరికా సాయాన్ని పెంచాలని నిర్ణయించింది. యూదుల అణచివేతను ఆయుధంగా చేసుకొని హిట్లర్‌ మారణకాండకు పాల్పడ్డాడు. అదే యూదులకు మాతృదేశాన్ని ఏర్పాటు చేయాలనే సాకుతో పశ్చిమాసియాలో ఉన్న చమురు, ఇతర సహజ సంపదలను ఆక్రమించాలని చూసిన బ్రిటన్‌, అమెరికా తదితర పశ్చిమ దేశాలు అందుకోసం తమ తొత్తుగా పనిచేసే ఇజ్రాయెల్‌ను ఏర్పాటు చేయాలన్న ఎత్తుగడలను ప్రపంచం చూసింది.ఉక్రెయిన్‌ వివాదంలో తటస్థవిధానాన్ని అనుసరించిన మనదేశం పశ్చిమాసియాలోనే కాదు, ప్రపంచ శాంతికి విఘాతం కలిగించే ఇజ్రాయెల్‌ దుశ్చర్యలను ఖండించాల్సిందిపోయి ఇప్పుడు ఇజ్రాయెల్‌కు మద్దతు ప్రకటించింది. ఇది గడచిన ఏడుదశాబ్దాలుగా అనుసరిస్తున్న మన విదేశాంగ విధానానికే విరుద్దం. నరేంద్రమోడీ సర్కార్‌ వైఖరి బిజెపితో సహా సంఘపరివార్‌ సంస్థల ముస్లిం వ్యతిరేకతకు ప్రతిబింబం తప్ప మరొకటి కాదు. ఇలాంటి వైఖరితో తలెత్తే పర్యవసానాల గురించి ఎవరెన్ని హెచ్చరికలు చేసినా, సుద్దులు చెప్పినా పట్టించుకోకపోవటం విచారకరమే కాదు గర్హనీయం.స్వాతంత్య్రపోరాటంలో భాగస్వామ్యం లేకపోవటమే కాదు దానికి వ్యతిరేకంగా పని చేసిన శక్తుల వారసులు పాలస్తీనియన్ల మాతృదేశ విముక్తి వాంఛ, దురాక్రమణ వ్యతిరేక పోరాటాన్ని అర్ధం చేసుకొంటారని భావించటం అత్యాశే అవుతుంది. ఇజ్రాయెల్‌ను సమర్ధిస్తున్న అమెరికా తదితర దేశాల వైఖరిని యావత్‌ శాంతి శక్తులు ఎలుగెత్తి ఖండించాలి, పాలస్తీనా విముక్తికి పోరాడుతున్న వారికి సంఘీభావం ప్రకటించాలి.

భూసంస్కరణలపై స్వామినాధన్ సిఫారసుల విస్మరణ

Tags

, , ,

డాక్టర్ కొల్లా రాజమోహన్

ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ యం. యస్. స్వామినాథన్ గారి మరణం భారత దేశ రైతాంగానికి తీవ్రమైన విషాదం కలిగించింది. అధిక దిగుబడినిచ్చే గోధుమ, వరి విత్తనాలను అభివృద్ధిచేసి వ్యాప్తి చేయడంలో కీలక పాత్ర వహించిన డాక్టర్ స్వామినాధన్, భారత దేశం గర్వించ దగ్గ వ్యవసాయ శాస్త్రవేత్త. ఇంటర్నేషనల్ బోర్డ్ ఫర్ జెనిటిక్ రీసెర్చ్, ఇక్రిసాట్ రూపకల్పన, యం. యస్. స్వామినాధన్ రీసెర్చ్ ఫౌండేషన్ లను స్థాపించారు. ఫిలిప్పీన్స్ లో అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్ధ ను రాక్ ఫెల్లర్, ఫోర్డ్ ఫౌండేషన్ల సహాయంతోస్ధాపించి, అధిక దిగుబడి వరి వంగడాలను కనుగొన్నారు. ప్రపంచంలోనే అత్యున్నత పురస్కారమైన వరల్డ్ ఫుడ్ ప్రైజ్ 1987 లోనే ప్రప్రధమంగా అందుకున్నారు. ఆ ప్రైజ్ మనీ 2 లక్షల డాలర్లను భావితరాల పరిశోధనకు యం.యస్.స్వామినాధన్ రీసర్చి ఫౌండేషన్ కి ఇచ్చారు. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్, రామన్ మెగసెసే అవార్డ్, ఆల్బర్ట్ ఐన్ స్టీన్ ప్రపంచ సైన్స్ అవార్డ్, ఇందిరాగాంధీ శాంతి బహుమతి, ఇందిరా గాంధీ సమైక్యతా పురస్కారాలను అందుకున్నారు.

వరి, గోధుమ పంటలపై ఆయన చేసిన పరిశోధనల మూలంగా భారత దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. హరిత విప్లవంగా పిలిచే గ్రీన్ రివల్యూషన్ సృష్టికర్త స్వామినాధన్. అమెరికా షరతులను ఒప్పుకుని, పీ యల్ 480 నిధులద్వారా గోధుమలను దిగుమతి చేసుకున్న భారతదేశాన్ని, ఆహారాన్ని ఎగుమతి చేసే దేశంగా తీర్చిదిద్దారు.జాతీయ రైతు కమిషన్ అధ్యక్షులుగా, భారత వ్యవసాయాన్ని పరిశోధించి 5 సంపుటాలను భారత జాతికి అంకితమిచ్చారు. రైతు అభివృధికి కొన్ని ఫార్ములాలు రూపొందించి సిఫార్సులను చేశారు. అందులో మొట్టమొదటిది భూసంస్కరణలు.  తర్వాత ప్రాధాన్యత నీరు.  రైతు శ్రమ, రైతు పెట్టుబడి, భూమికౌలు, సమగ్ర వ్యవసాయ ఖర్చులు అన్నీ కలిపి దానికి 50 శాతం చేర్చి, కనీస మద్దతు ధర వుండాలని C2+50 ఫార్ములా రూపొందించారు. దీనిని అన్ని రాజకీయపార్టీలు, రైతుసంఘాలు ఆహ్వానించాయి. దీనికై ఢిల్లీ సరిహద్దలలో సంవత్సరం పైగా చారిత్రాత్మకంగా ఆందోళనలు చేశారు . కానీ ఇప్పటికీ కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించనందున రైతాంగ పోరాటం కొనసాగుతోంది.

వ్యవసాయం లో ఉత్పత్తిని పెంచుకుంటూ, వాతావరణాన్నికాపాడుకుంటూ, వ్యవసాయ విప్లవం నిరంతరం సాగాలన్నారు. దానికి “ ఎవర్ గ్రీన్ రివల్యూషన్ ” అని పేరుపెట్టారు. వ్యవసాయ టెక్నాలజీని రైతులకు అందించి ఆకలిని దూరంచేయటమే కాకుండా రైతుల స్ధితిగతులను అభివృద్ధిచేయాలన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా రైతుల ఆదాయాలు పెరగాలన్నారు. చిన్న ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనం కన్నా రైతుల ఆదాయం తక్కువగావున్న విషయాన్ని నిరసించారు. బ్రిటిష్ ప్రభుత్వ వలస విధాన ఒత్తిడి వలన ఆహార పంటలకు బదులుగా నీలి మందు, తేయాకు, పొగాకు లాంటి వ్యాపారపంటలను రైతులు బలవంతంగా సాగు చేశారు. వలసపాలన వలన పండించిన పంటలకు సరైన ధర లేదు. పెరుగుతున్న భారత దేశ జనాభాకు అనుగుణంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరగలేదు. స్వాతంత్ర్యం వచ్చే సమయానికి మన దేశంలో ఏటా 60 లక్షల టన్నుల గోధుమలు మాత్రమే పండేవి. 1960 లో గోధుమల ఉత్పత్తి కోటి టన్నులు మాత్రమే. 1965, 66 రెండు సంవత్సరాలు వరసగా వర్షాభావం వలన సంభవించిన కరువు కారణంగా కోటి టన్నుల గోధుమలను అమెరికా షరతులకు లోబడి దిగుమతి చేసుకోవలసి వచ్చింది. “షిప్ టు మౌత్” అంటే ఓడ లో ఆహారధాన్యాలు వస్తేనే మన నోట్లోకి ముద్ద దిగని పరిస్ధితి. 1960 కి ముందు హెక్టారుకు 2 టన్నులున్న వరి దిగుబడి స్వామినాధన్ గారి నూతన విత్తనాల వలన రెట్టింపయింది. 21 వ శతాబ్దం నాటికి 300 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేసి ఎగుమతి చేయగలుగుతున్నాము.

మన దేశం క్లిష్ట సమయంలో వుండటానికి ప్రధాన కారణం వ్యవసాయ సంక్షోభం అని నమ్మిన మేధావులలో స్వామినాధన్ గారు ముఖ్యులు. వ్యవసాయంలో ఆయన శాస్త్రజ్ఞుడిగా అపారమైన కృషి చేసి ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయంసమృద్ధిని సాధించి దేశానికి ఆహార భధ్రత కల్పించారు.

జాతీయ రైతు కమిషన్ (National commission on Farmers) 

భారత ప్రభుత్వం నవంబరు 18, 2004 న నియమించిన జాతీయ రైతు కమిషన్ (NCF) ప్రొఫెసర్ MS స్వామినాథన్ అధ్యక్షతన ఏర్పాటైంది. కమిటీ లో రైతు నాయకులు అతుల్ కుమార్ అంజన్ తో సహా 8 మంది సభ్యులున్నారు. NCF వరుసగా డిసెంబర్ 2004, ఆగస్టు 2005, డిసెంబర్ 2005 మరియు ఏప్రిల్ 2006లో నాలుగు నివేదికలను సమర్పించింది. సిఫారుసులతో కూడిన 5 వ రిపోర్టును అక్టోబర్ 4 2006 న సమర్పించింది.

జాతీయ రైతు కమిషన్ (NCF) అధ్యయనానికి ప్రభుత్వం చేసిన సూచనలు.

1. ప్రధాన వ్యవసాయ పంటల ఉత్పాదకత, లాభదాయకత పెంపొందించడం; 2. ఆహార భద్రత, పోషకాహార భద్రత  వ్యూహం; 3.  రైతుల ఋణాలను పెంచడానికి విధాన సంస్కరణలు; 4.  ట్ట ప్రాంతాలు, నిస్సార భూములు, పోడు భూములు, కొండ, తీర ప్రాంతాల్లోని రైతులకు  వ్యవసాయం కోసం ప్రత్యేక కార్యక్రమాలు; 5. వ్యవసాయ వస్తువుల నాణ్యత పెంచి, ధరలలో పోటీతత్వాన్ని పెంపొందించి , తద్వారా వాటిని ప్రపంచవ్యాప్త పోటీగా మార్చడం; 6.  అంతర్జాతీయ ధరలు బాగా పడిపోయినప్పుడు దిగుమతుల నుండి రైతులను రక్షించడం; 7. స్థిరమైన వ్యవసాయం కోసం, పర్యావరణ పరిరక్షణకు, ఎన్నికైన స్థానిక సంస్థలకు అధికారం ఇవ్వడం;

జాతీయ రైతు కమిషన్ (NCF) అభిప్రాయాలు మరియు కీలక సిఫార్సులు.

రైతుల కష్టాలు – ఆత్మహత్యలకు కారణాలు

జాతీయ రైతు వ్యవసాయ కమీషన్ ( NCF ) కు స్వామినాధన్ గారే ఛైర్మన్. రైతుల కష్టాలకు, ఆత్మహత్యల పెరుగుదలకు కారణాలపై దృష్టి సారించి పరిష్కారాలను సూచించారు. వాటిలో మొదటిది భూ సంస్కరణల అసంపూర్తి కార్యక్రమం. తరువాత నీటిపారుదల అసౌకర్యాలు, అందుబాటు లో లేని వ్యవసాయ సాంకేతికత, సరైన సమయంలో అందని  సంస్థాగత ఋణాలు,  ప్రతికూల వాతావరణం, ప్రకృతి వైపరీత్యాలు.  భీమా, సాంకేతిక పరిజ్ఞానం. మార్కెట్‌లతో సహా ప్రాథమిక వనరులపై రైతులకు భరోసా, నియంత్రణ ఉండాలన్నారు. రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితాలో “వ్యవసాయం” చేర్చాలని NCF సిఫార్సు చేసింది.

భూమి గురించి 1) దేశంలోని మొత్తం భూయాజమాన్యంలో దిగువన వున్న 50 శాతం గ్రామీణ కుటుంబాల వాటా కేవలం 3 శాతం మాత్రమే అని,  ఎగువన వున్న 10 శాతం మంది చేతిలో54 శాతం భూమి వున్నదన్న గణాంకాలను రిపోర్టులో ఎత్తి చూపించారు. వ్యవసాయ సంక్షోభ పరిష్కారానికి భూసంస్కరణలే కీలకమన్నారు. మిగులు భూముల, బంజరు భూముల పంపిణీనే పరిష్కార మన్నారు. 2) ప్రధాన వ్యవసాయ భూములను, అటవీ భూములను కార్పొరేట్ రంగానికి మళ్ళించటాన్ని నిరోధించాలన్నారు. 3) అడవి లో వున్న గిరిజనుల అటవీ హక్కులను రక్షించాలన్నారు. 4) భూమిని , వాతావరణాన్ని రక్షించటానికి జాతీయ భూమి వినియోగ కమిషన్ ను ఏర్పరచమన్నారు.  భూమి, నీరు, జీవన వనరులు, రైతుల ఆదాయం మరియు భీమా, సాంకేతిక విజ్ఞాన నిర్వహణ, మార్కెట్ తో సహా ప్రాధమిక వనరులపై జాతీయ భూమి వినియోగ కమిషన్ కు నియంత్రణ వుండాలన్నారు. 5) వ్యవసాయ భూమి పరిమాణం, వినియోగం, కొనుగోలుదారుల వర్గాన్ని బట్టి భూమి విక్రయం నియంత్రించాలన్నారు.

డా.స్వామినాదన్  చేసిన ప్రధాన సిఫారసు అయిన భూసంస్కరణల సంగతి ఎత్తిన వారే లేకపోవటం, వ్యవసాయ భూములను కార్పొరేట్ సంస్ధలకు కట్టపెట్టటాన్ని ఎదుర్కోలేక పోవటం దేశ దౌర్భాగ్యానికి పట్టిన దుర్గతికి తార్కాణం. భూమి గురించి వ్యవసాయ కమీషన్ చేసిన సిఫారసులను రైతు సంఘాలు, జాతీయ పార్టీలు విస్మరించాయి. వ్యవసాయ రంగం అభివృధి చెందటానికి కీలకం భూసంస్కరణలు అని స్వామినాధన్ కమీషన్ రిపోర్టు మొదటి రికమండేషన్ గా పేర్కొంది. తెలిసి చేసినా తెలియక చేసినా, భూసంస్కరణల ఎజెండాను పక్కన పెట్టడం తీవ్రమైన పొరపాటు. పాలక వర్గ పార్టీల అవినీతి వ్యవహారాలన్నీ భూమి చుట్టూ తిరుగుతున్న విషయాన్ని గ్రహించాలి. భూసంస్కరణలకు భూమి ఎక్కడుందంటూనే వేల ఎకరాలను కార్పోరేట్లకు అప్పగిస్తున్నారు.

భూమి వ్యాపార వస్తువై ధనవంతుల స్పెక్యులేషన్ లో ఆటవస్తువైపోతున్నది. వ్యవసాయం చేసేవారి చేతిలో భూమి లేదు. అమెరికాలోనో, హైదరాబాద్ లోనో వున్న వారికే  గ్రామాలలో భూములు ఎక్కువగా వుంటున్నాయి.  భూమి కోసం పోరాటాలు చేయలేమని, పోరాటాలు చేసినా పాలక వర్గాలు అంగీకరించవని, ప్రజలు రావటం లేదని, ప్రస్తుత ఉద్యమ కారుల వాదన. సోవియట్ పతనం తరువాత కమ్యూనిస్టు పార్టీ చీలికలయినా  ఉద్యమకారులలో ఆశయాలపట్ల ఆరాధన తగ్గలేదు. కానీ ఆచరణ గణనీయంగా తగ్గింది.

ఎరువులు-పురుగు మందులు-కలుపు మందులు

భూ సారాన్ని గమనించకుండా, భూమిని తీవ్రంగా సాగు చేయటంవలన భూమి ఎడారిగా మారుతుందన్నారు. ఎరువులు, పురుగు మందులు, కలుపు మందులు విచక్షణారహితంగా వాడటంవలన ఆహార పదార్ధాలలో వాటి అవశేషాలు కేన్సర్ జబ్బులకు కారణమౌతాయన్నారు. భూగర్భ జలాలను అశాస్త్రీయంగా ట్యాపింగ్ చేయటం వలన అద్భుతమైన భూజల వనరు అంతమౌతుందన్నారు.ఇరిగేషన్, డ్రైనేజ్ కు పెట్టుబడిని గణనీయంగా పెంచాలని కమిషన్ చెప్పింది. సాయిల్ టెస్టింగ్, భూమి లో  సూక్ష్మపోషకాల పరీక్షకు ప్రయోగశాలలు ఏర్పాటు చేయాలన్నారు.

ఋణం , భీమా . ప్రాధమిక అవసరాలకు సరైన సమయంలో సరిపోను ఋణాలను 4శాతం సాధారణ వడ్డీకి ప్రభుత్వం అందించాలన్నారు. ప్రకృతి వైపరీత్యాలలో, రైతులు నష్టాలలో వున్నపుడు తాత్కాలికంగా రైతుల పరిస్ధితి మెరుగయ్యేంతవరకూ ప్రభుత్వ మరియు ప్రభుత్వేతర సంస్ధల అప్పు వసూళ్ళను నిలిపివేయాలన్నారు. ప్రకృతి వైపరీత్యాల నష్టాన్ని తట్టుకోవటానికి ఒక నిధిని ప్రభుత్వం ఏర్పరచాలన్నారు. రైతుల ఆరోగ్యానికి, అప్పులకు, పంటకు, పశువులకు, ఒకటే భీమా ప్యాకేజీ ని ఏర్పాటు చేయాలన్నారు. స్వయం సహకార సంఘాలను ఏర్పాటు చేసి మానవ వనరులను అభివృధి చేసి ఆర్ధిక సేవలు, మౌలిక సదుపాయాలు, మార్కెటింగ్ అందరికి అందించాలన్నారు.

ఆహార భద్రత. 2400 కేలరీల కన్నా తక్కువ ఆహారం తీసుకునే పేదలు గ్రామీణ ప్రాంతాలలో 77 శాతం మంది వున్నారన్నారు. పేదరికం, సరైన ఆహారం లేకపోవటం గ్రామీణ ప్రాంతాలలో ముఖ్యంగా వర్షాధార వ్యవసాయ ప్రాంతాలలో  కేంద్రీకృతమై వుందన్నారు. సార్వత్రిక పంపిణీవ్యవస్ధను అమలు చేసి, జాతీయ ఆహార పధకాలను అమలుపరచుటకు జీడీపీ లో 1 శాతం నిధులు సరిపోతాయన్నారు. పనికి ఆహార పధకం వలన పేదలకు ఉపాధి, ఆహారం లభిస్తాయన్నారు.

ఎక్కువ రిస్క్ తో కూడిన బీ టీ కాటన్ లాంటి పంటలకు దూరంగా వుంటూ తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి, ఆదాయం వచ్చే పంటలను సాగుచేయాలన్నారు.దిగుమతి సుంకాలను విధించి ఇతర దేశాల దిగుమతుల పోటీ నుండి రైతులను రక్షించాలన్నారు. రైతులకు వినియోగదారులకు మధ్య అనుసంధాన్ని పెంచి దళారులులేని మార్కెట్ ను ఏర్పాటుచేయాలన్నారు.

కనీస మద్దతు ధర

వ్యవసాయ ఖర్చులకు 50 శాతం కలిపి కనీస మద్దతు ధరను నిర్ణయించాలన్నారు. C2+50 ఫార్ములా ను రూపొందించారు. C2 అంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కు (సమగ్ర వ్యవసాయ ఖర్చులకు) 50 శాతం కలపాలన్నారు.వరి, గోధుమ లతోపాటు జొన్న, పప్పుధాన్యాలు లాంటి పంటలన్నిటికీ కనీస మద్దతు ధర నిర్ణయించి ఆ ధరకు కొనేటట్లు గా చట్టం చేయాలన్నారు.రైతుల నికర ఆదాయం ప్రభుత్వ ఉద్యోగుల ఆదాయంతో పోల్చదగినదిగా వుండాలన్నారు.రైతు పండించిన పంటకు మద్దతు ధర C2+50 అమలుపరచటమే కీలక సమస్యగా రైతు సంఘాలు  ముందుకు తెచ్చాయి. కనీస మద్దతు ధర పై చట్టం చేయటమే ముఖ్య డిమాండ్ గా రైతుల ఐక్యత ను సాధించి, ప్రశంసనీయమైన చారిత్రాత్మక మహోద్యమాన్ని నడిపారు. భారత రాజకీయ ఎజెండాలో కనీసమద్దతు ధర పై చట్టం చేయాలని డిమాండ్ చేశారు. కానీ అమలు కానందున ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు.

డాక్టర్ స్వామినాధన్ చేసిన రికమండేషన్లు అన్నిటినీ అమలు చేసినపుడే వారి కృషికి సార్ధకత చేకూరుతుంది. రైతుకు భద్రత- దేశానికి ఆహార భద్రత లభిస్తుంది. భూసంస్కరణలు, నీటి వనరులు, కనీసమద్దతు ధరకు చట్టబధతతో సహా అన్ని సిఫారసులను అమలు చేయటమే వారికి సరైన నివాళి. రైతు కమీషన్ సిఫారసులన్నిటినీ అమలు చేయాలని రైతులు పోరాడాలి.

డాక్టర్ కొల్లా రాజమోహన్, నల్లమడ రైతు సంఘం, ఫోన్ నెం. 9000657799.

పతకాలు తెచ్చిన భారత ఆసియాడ్‌ క్రీడాకారులకు అభినందనలు – ఆటలను పట్టించుకోని పాలకులకు అక్షింతలు !

Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


చైనాలోని హాంగ్‌ఝౌలో శనివారం నాడు ముగిసిన పందొమ్మిదవ ఆసియాడ్‌లో మన క్రీడాకారులు కొత్త చరిత్ర సృష్టించారు. పతకాల వేటలో గత 70 రికార్డును అధిగమించి వంద పతకాలను సాధిస్తామన్న ఆత్మవిశ్వాసంతో వెళ్లి 107 పతకాలతో తిరిగి వచ్చినందుకు యావత్‌ దేశం వారిని అభినందిస్తోంది. రానున్న రోజుల్లో మరిన్ని పతకాలను తెచ్చి దేశ కీర్తిపతాకను సమున్నతంగా ఎగురవేయాలని ఆశిస్తోంది.నాలుగేండ్లకు ఒకసారి జరుగుతున్న ఆసియా క్రీడలు చైనాలో కరోనా నిరోధ చర్యల కారణంగా 2022లో జరగాల్సినవి ఈ ఏడాది నిర్వహించారు. 2026లో జపాన్‌లోని ఇచి, నాగోయా నగరాల్లో జరగనున్నాయి. మన క్రీడాకారులు 28 బంగారు,38 రజిత, 41 కాంస్య పతకాలను సాధించారు. వీటిలో కొన్ని అనూహ్య పతకాలు ఉన్నాయి. చైనా, జపాన్‌, దక్షిణ కొరియా తరువాత నాలుగవ స్థానంలో మన దేశం ఉంది.జనాభాతో, ఆర్థికంగా చైనాతో పోటీపడుతున్న మనం క్రీడల్లో ఎందుకు పోటీలో లేము అని ఎవరైనా అనుకోవచ్చు.దానికి ఏడున్నర దశాబ్దాలుగా దేశాన్ని పాలిస్తున్న పార్టీలు, వాటి నేతలు తప్ప క్రీడాకారులు కాదు. అధికారం నిలుపుకోవటం మీద ఉన్న యావ యువతలో ఉన్న నైపుణ్యాలను వెలికి తీయాలన్నదాని మీద ఏ మాత్రం లేదు. పోటీలకు ముందు రెజ్లర్స్‌ ఫెడరేషన్‌ బ్రిజ్‌ భూషన్‌ శరణ్‌ సింగ్‌ (బిజెపి ఎంపీ ) నిర్వాకం, క్రీడాకారుల ఆందోళన గురించి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం తన ఎంపీని కాపాడుకొనేందుకు ఇచ్చిన ప్రాధాన్యత పోటీల్లో పాల్గొనేవారి పట్ల చూపలేదు. అందుకే చివరికి ఫెడరేషన్‌ లేదు, జాతీయ శిక్షణా శిబిరాలు లేవు, అంతర్జాతీయ శిక్షకులు లేరు, అయినప్పటికీ తాజా క్రీడల్లో వారు ఒక వెండి, నాలుగు కాంస్య పతకాలను సాధించారు.మరికొన్ని క్రీడలకు సంబంధించిన వివాదాల కారణంగా చివరి వరకు ఎంపికలు జరగలేదంటే మన యాజమాన్య నిర్వహణ ఎంత అసమర్ధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఉదాహరణకు ఈక్వెస్ట్రియన్‌ పోటీలో పాల్గొనాలంటే క్రీడాకారులతో పాటు గుర్రాలను కూడా తీసుకుపోవాల్సి ఉంటుంది. క్వారంటైన్‌ నిబంధనల కారణంగా భారత గుర్రాలను చైనా అనుమతించటం లేదనే కీలక అంశాన్ని తన దగ్గర దాచారని క్రీడాకారుడు గౌరవ్‌ పుందిర్‌ చెప్పాడు. తీరా తెలుసుకున్న తరువాత ఐరోపా, మరోచోట తగిన గుర్రాల కోసం వెళ్లేందుకు, శిక్షణ పొందేందుకు తనకు అవకాశం లేకుండా పోయిందని, ఎంపిక విధానాన్ని కూడా మార్చారని వాపోయాడు. పోటీలకు వెళ్లకుండా తనను అడ్డుకోవటమే ఫెడరేషన్‌ అధికారుల ఎత్తుగడగా కనిపించిందని ఆరోపించాడు. పతకాలు వచ్చిన వారికి బహుమతులు ఇచ్చి గొప్పలు చెప్పుకోవటం కాదు కావాల్సింది. ప్రతిభను గుర్తించి అవసరమైన శిక్షణ సౌకర్యాలు, క్రీడలనే ఆలంబనగా చేసుకున్న వారు జీవితంలో స్థిరపడేందుకు ఇచ్చే చేయూతను బట్టే యువతరం ముందుకు వస్తుంది. ఇప్పుడు వచ్చిన పతకాల కీర్తి కూడా క్రీడాకారుల తపనకు, వారిని ప్రోత్సహించిన తలిదండ్రులకు తప్ప మరొకరికి దక్కదు. ఈ క్రీడల్లో కొన్ని అనూహ్య పతకాలను మన దేశానికి సాధించటం సంచలనం కలిగించింది.


1951లో మనదేశమే తొలి ఆసియాడ్‌కు ఆతిధ్యమిచ్చింది.నాడు 17 దేశాల వారు 489 మంది పాల్గొంటే ఇప్పుడు 41కి, పోటీలు 57 నుంచి 481 అంశాలకు పెరిగాయి. చైనా 1962 నుంచి మాత్రమే పాల్గొంటున్నది.ఇప్పటి వరకు వివిధ దేశాలు సాధించిన బంగారు పతకాల సంఖ్య ఇలా ఉంది. బ్రాకెట్లలో ఉన్నవి మొత్తం పతకాల సంఖ్య) చైనా 1,674 ( 3,570, జపాన్‌ 1,084( 3,240), దక్షిణ కొరియా 787 (2,425), ఇరాన్‌ 193 (611), భారత్‌ 183( 779).తొలి ఆసియన్‌ గేమ్స్‌ జరిగిన తీరు చూస్తే అసలు నిర్వాహకులు ఎంత ఇబ్బంది పడింది, అధికారంలో ఉన్నవారికి క్రీడల పట్ల శ్రద్దలేమి స్పష్టంగా కనిపించింది. నాటి నుంచి నేటి వరకు ఉత్సాహవంతులైన వారి చొరవే ప్రధానంగా కనిపించింది. తొలి క్రీడల్లో జపాన్‌ 24 బంగారు పతకాలతో మొత్తం 58 పొందగా రెండవ స్థానంలో మన దేశం 15 స్వర్ణాలతో 51 పతకాలు సాధించింది. తరువాత 1962లో జపాన్‌ 73 స్వర్ణాలతో ముందుండగా పదింటితో రెండవ స్థానంలో మన దేశం ఉండటం తప్ప అప్పటి నుంచి ఇప్పటి వరకు మన దేశం రెండవ స్థానానికి ఎదగలేదు. టెహరాన్‌ 1974 క్రీడలలో చైనా 32 స్వర్ణాలతో రెండవ స్థానంలోకి వచ్చింది. తరువాత 1982లో న్యూఢిల్లీలో జరిగిన ఆసియాడ్‌లో తొలిసారిగా 61 పతకాలతో జపాన్ను వెనక్కు నెట్టి మొదటి స్థానానికి వచ్చిన చైనా అప్పటి నుంచి వెనక్కు తిరిగి చూడలేదు.1990లో తొలిసారిగా చైనాలో ఆసియా క్రీడలు జరిగాయి.183 బంగారు, మొత్తం 341 పతకాలతో చైనా క్రీడాకారులు అదరగొట్టారు. తాజా పోటీలలో 200 స్వర్ణ, 111 రజత, 71 కాంస్యాలతో మొత్తం 382 పతకాలను సాధించింది.


1896 నుంచి 2020 వరకు జరిగిన ఒలింపిక్స్‌లో మనదేశం నిరాశాజనక ప్రతిభనే కనపరిచింది.2024లో జరిగే పారిస్‌ ఒలింపిక్స్‌లో మంచి ప్రతిభ కనపరచాలని కోరుకుందాం. 2020లో జరగాల్సిన టోకియో ఒలింపిక్స్‌ మరుసటి ఏడాది జరిగాయి. వాటిలో 39 స్వర్ణాలు, మొత్తం 113 పతకాలతో అమెరికా, 38 స్వర్ణాలు, మొత్తం 89తో చైనా, 26 స్వర్ణాలు, మొత్తం 57 పతకాలతో జపాన్‌ తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. మన దేశం ఒక స్వర్ణం, మొత్తం ఏడు పతకాలతో 48వ స్థానంలో ఉంది. ఇప్పటి వరకు జరిగిన 32 పోటీల్లో ఐదు స్థానాలో అధిక పతకాలు తెచ్చుకున్న తొలి దేశాల వివరాలు ఇలా ఉన్నాయి. సోవియట్‌ యూనియన్‌కు వెయ్యికిపైగా పతకాలు వచ్చినప్పటికీ అది ఉనికిలో లేనందున దాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. చైనా ఆలశ్యంగా ఒలింపిక్స్‌లో అడుగుపెట్టిందన్న అంశాన్ని గమనలో ఉంచుకోవాలి.1984 లాస్‌ ఏంజల్స్‌ పోటీల నుంచి పాల్గొంటున్నది.
దేశం×××× స్వర్ణం ××రజతం×× కాంస్య××× మొత్తం
అమెరికా × 1,061×× 830 ×× 738××× 2,629
బ్రిటన్‌ ××× 284 ×× 318 ×× 314 ××× 916
ఫ్రాన్స్‌×××× 223 ×× 251×× 277 ××× 751
జర్మనీ×××× 201 ×× 207 ×× 247 ××× 655
చైనా ×××× 263 ×× 199 ×× 174 ××× 636
ఇటలీ ×××× 217 ×× 188 ×× 213 ××× 618
భారత్‌ ×××× 10 ×× 9 ×× 16 ××× 35


క్రీడలకు రాజకీయాలు ఉండవు. రాజకీయ కారణాలతో కొన్ని దేశాలు కొన్ని పోటీలను బహిష్కరించిన ఉదంతాలు ఉన్నాయి. చైనాతో జనాభాను అధిగమించిన మనం క్రీడల్లో ఎందుకు దూసుకుపోలేకపోతున్నాం అన్నది ప్రశ్న. మన దేశంలో పిల్లలతో ఆటలాడించేందుకు స్థలాల్లేకుండానే పాఠశాలలకు అనుమతులిస్తున్నారు. ఎన్ని స్కూళ్లలో క్రీడోపాధ్యాయులు ఉన్నారు. ఎన్ని చోట్ల ఆటలాడిస్తున్నారు, అవసరమైన కనీస పరికరాలు ఎన్ని చోట్ల ఉన్నాయి అన్నది రోజు మనం చూస్తున్నదే.కేంద్రమైనా, రాష్ట్రాలైనా ఒకే విధంగా ఉన్నాయి. పిండికొద్దీ రొట్టె అన్నారు. క్రీడల మీద మనం చేస్తున్న ఖర్చు ఎంత ? మాజీ అధ్లెట్‌, 2018లో కేంద్ర మంత్రిగా ఉన్న రాజ్యవర్ధన్‌ సింగ్‌ రాధోడ్‌ పార్లమెంటులో ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ 2017-18లో కేంద్ర క్రీడల బడ్జెట్‌ రు.1,329 కోట్లని, 2011 జనాభా లెక్కల ప్రకారం రోజుకు తలకు ఒక్కరి మీద మూడు పైసలు క్రీడలకు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు.ఆ వార్తను ప్రచురించిన స్పోర్ట్స్‌ క్రీడా డాట్‌ కామ్‌ చైనా డైలీలో వచ్చిన సమాచారం ప్రకారం చైనా ప్రభుత్వం ఏటా 316.5బిలియన్‌ యువాన్లు ఖర్చు చేస్తున్నదని దాన్ని రూపాయల్లో మారిస్తే మూడులక్షల కోట్లని(2018 జనవరి 9) పేర్కొన్నది. ఈ ఏడాది మార్చి 28వ తేదీన టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాలో వచ్చిన వార్త ప్రకారం 2007-08లో మన కేంద్ర బడ్జెట్‌లో రు.708 కోట్లు కేటాయించారని తరువాత కామన్‌వెల్త్‌ క్రీడలు ఉన్నందున 2009-10లో రు.3,760, మరుసటి ఏడాది రు.2,841కోట్లుగా ఉందని 2015-16లో రు.1,121 కోట్లకు తగ్గింది. ఖేలో ఇండియా కార్యక్రమం ప్రకటించిన తరువాత 2019-20లో రు.2,636 కోట్లు కేటాయించారు. కరోనాలో రు.1,800 కోట్లకు తగ్గించారు.2023-24 బడ్జెట్‌లో రు.3.397 కోట్లు కేటాయించగా దానిలో ఖేలో ఇండియాకు వెయ్యికోట్లు పక్కన పెట్టారు.ఈ మొత్తం 140 కోట్ల జనాభాకు తలకు ఏటా రు.24 అవుతుంది. బ్రిటన్‌లో 2022-23లో తలకు రు.4,898, ఆస్ట్రేలియాలో రు.976 ఖర్చు చేస్తున్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఏటా కేటాయిస్తున్న మొత్తాలు రూపాయలలో పెరుగుతున్నట్లు కనిపిస్తాయి. కానీ ఎంత పెరిగినప్పటికీ మొత్తం బడ్జెట్‌లో వాటా 0.6 నుంచి 0.8శాతం మధ్యనే ఉంటోంది. మన దేశంలో ఇంత తక్కువ ఖర్చు పెడితే క్రీడాకారులు ఎలా తయారవుతారు, పతకాలు ఎలా వస్తాయి ? పోనీ ప్రతిభ గలవారికి కొరత ఉందా ?

చిన్న దేశం మాల్దీవుల ఎన్నికలు – చైనాకు అనుకూలమా ? భారత్‌ ఎదురు దెబ్బా !

Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


మాల్దీవులు,ప్రపంచంలోని అతి చిన్న దేశాలలో ఒకటి. ఆసియాలో రెండవది. కేవలం ఐదు లక్షల 21వేల జనాభా మాత్రమే కలిగిన ఈ దేశం ఇప్పుడు ప్రపంచ మీడియాలో పెద్ద స్థానాన్ని ఆక్రమించింది.కారణం గతనెల 30న అక్కడ జరిగిన అధ్యక్ష ఎన్నికల ఫలితాలు. వాటి మీద ప్రపంచ మీడియాలో వచ్చిన కొన్ని శీర్షికలు ఇలా ఉన్నాయి.” మాల్దీవుల ఎన్నికల్లో మహమ్మద్‌ ముయిజ్జు గెలుపు చైనా అనుకూల శిబిరానికి విజయం ” భారత్‌కు మాల్దీవుల నూతన అధ్యక్షుడు ఒక దౌత్యసవాలుకు ప్రతినిధి ” ” చైనా చెవులకు సంగీత విందు ” ” భారత్‌ వెళ్లిపోవాలంటున్న మాల్దీవుల చైనా అనుకూల నూతన అధ్యక్షుడు ” ఇలా పదజాలాల్లో మార్పు ఉన్నప్పటికీ స్పందన స్వభావమిది.హిందూ మహా సముద్రంలో మనదేశం, శ్రీలంకకు 750 కిలోమీటర్ల దూరంలో ఈ దేశం ఉంది. నామమాత్రంగా క్రైస్తవులు తప్పు నూటికి నూరుశాతం ముస్లింలు ఉన్న 1,200 చిన్నా పెద్ద దీవుల దేశానికి ఎవరితోనూ సరిహద్దు తగాదాలు లేవు. దేశ రాజధాని మాలె దీవిలో దేశంలోని సగం జనాభా ఉంది. చైనా నుంచి విమాన మార్గం 4,900 కిలోమీటర్ల దూరం ఉంది. సముద్ర మార్గంలో 4,682 నాటికల్‌ మైళ్లు లేదా 8,670 కిలోమీటర్ల దూరంలో ఉంది.ప్రపంచంలో ఏ దేశమూ మరొక దేశాన్ని విశ్వసించక పరస్పరం అనుమానంతో చూస్తున్న అంశం తెలిసిందే. ప్రాంతీయ, ప్రపంచ యుద్దాలు తలెత్తితే సముద్రాల్లోని ఒక చిన్న దీవి, దాని మీద పెత్తనం లేదా ఎవరి ప్రభావంలో ఉంది అన్న అంశం కూడా ఎంతో కీలకమైనదే. అందువల్లనే ఆయా దేశాల మిలిటరీ వ్యూహకర్తలు రూపొందించిన ప్రణాళికలు, ఎత్తుగడల ప్రకారం ఇరుగు పొరుగు, దూరంగా ఉన్న దేశాలు కూడా సంబంధాలను నిర్వహిస్తుంటాయి. అలాంటి కీలక ప్రాంతాలలో ఒకటిగా మాల్దీవులు ఉన్న కారణంగానే అక్కడ జరిగే ప్రతి పరిణామాన్ని ప్రపంచం జాగ్రత్తగా గమనిస్తుంది.


ప్రస్తుతం అధికారంలో ఉన్న ఇబ్రహీం మహమ్మద్‌ సాలి 2018లో అధికారానికి వచ్చాడు. అంతకు ముందు అధ్యక్షుడిగా ఉన్న అబ్దుల్లా యామీన్‌ మీద అవినీతి ఆరోపణల కేసులు పెట్టి పదకొండు సంవత్సరాల పాటు జైలు శిక్ష వేయించాడని ఆరోపణ ఉంది. సదరు యామీన్‌ ప్రభుత్వంలో మంత్రి, రాజకీయ వారసుడే నూతన అధ్యక్షుడు ముయిజ్జు.అక్కడి విధానం ప్రకారం ఐదు సంవత్సరాలకు ఒకసారి అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి. ఎందరైనా పోటీ పడవచ్చు. పోలైన ఓట్లలో 50శాతం పైగా ఓట్లు తెచ్చుకున్న అభ్యర్ధిని విజేతగా ప్రకటిస్తారు. ఒక వేళ అలా తెచ్చుకోని పక్షంలో అధిక ఓట్లు తెచ్చుకొని మొదటి రెండు స్థానాల్లో ఉన్న వారి మధ్య 21వ రోజున తిరిగి పోటీ నిర్వహిస్తారు. సెప్టెంబరు 9న జరిగిన ఎన్నికల్లో మొత్తం ఎనిమిది మంది పోటీ చేశారు. వారిలో పీపుల్స్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ తరఫున 45 ఏండ్ల మహమ్మద్‌ ముయిజ్జు 46.06శాతం ఓట్లు తెచ్చుకోగా రెండవ స్థానంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న ఇబ్రహీం మహమ్మద్‌ సాలి 39.05 తెచ్చుకున్నాడు. సాలి నాయకత్వంలోని మాల్దీవియన్‌ డెమోక్రటిక్‌ పార్టీలో ఎన్నికల ముందు చీలిక వచ్చింది. విడిపోయిన వారు డెమోక్రాట్స్‌ పేరుతో పోటీ చేసి 7.18శాతం తెచ్చుకున్నారు. సెప్టెంబరు 30న రెండవసారి ఎన్నిక జరిగింది. ముయిజ్జు 54.04శాతం తెచ్చుకున్నాడు.నవంబరు 17న అధికారాన్ని స్వీకరిస్తాడు, ప్రస్తుతం రాజధాని మాలె నగర మేయర్‌గా పని చేస్తున్నాడు. ఈ ఎన్నికల నిర్వహణ గురించి ఎలాంటి ఫిర్యాదులు లేవు. మాల్దీవుల ట్రాన్సఫరెన్సీ అనే సంస్థ ఎన్నికల హింసాకాండ ఉదంతాలు కొన్ని జరిగినట్లు చెప్పటం తప్ప వివరాలను వెల్లడించలేదు. అర్హులైన రెండు లక్షల 82వేల మంది ఓటర్లలో తొలి దఫా 79.85, తుది విడత 87.31 శాతం ఓట్లు వేశారు.


ఈ ఎన్నిక ఒక విధంగా చెప్పాలంటే చైనా – భారత్‌ మధ్య పోటీగా జరిగిందంటే అతిశయోక్తి కాదు. బహుశా ఎక్కడా ఇంత బాహాటంగా రాజకీయ పార్టీలు పోటీ చేసి ఉండవు. ఈ ఎన్నికలు తమ పౌరుల దేశ భక్తికి ఒక ప్రతిబింబమని, మా ఇరుగు పొరుగు వారు, భాగస్వాములు తమ స్వాతంత్య్రం, సర్వసత్తాకతను పూర్తిగా గౌరవించాలని ఇచ్చిన ఒక పిలుపు అని పీపుల్స్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ కూటమి ప్రతినిధి వ్యాఖ్యానించాడు. చైనా బిఆర్‌ఐ పధకం కింద పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసిన గత ప్రభుత్వంలో గృహశాఖ మంత్రిగా ముయిజ్జు పని చేశాడు. తాను అధికారానికి వస్తే రెండు దేశాల మధ్య మరో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతానని గతేడాదే ప్రకటించాడు. 2018లో అధికారానికి వచ్చిన సాలి తన పాలనా కాలంలో విచక్షణా రహితంగా భారత ప్రవేశానికి అవకాశమిచ్చినట్లు విమర్శలు చేశాడు. చివరికి భారత మిలిటరీని కూడా దేశంలో అనుమతించాడని, తాను అధికారానికి వస్తే దళాలను వెనక్కు పంపటమే గాక ప్రస్తుతం భారత్‌కు అనుకూలంగా వాణిజ్య సంబంధాలను సమతూకంలో ఉండేట్లు చూస్తానని వాగ్దానం చేశాడు. రెండు దేశాల మధ్య కుదిరిన ఒక ఒప్పందం మేరకు ఒక డాక్‌యార్డ్‌ నిర్మాణ పర్యవేక్షణకు మాత్రమే భారత సైనికులు ఉన్నారని సాలి సమర్ధించుకున్నాడు. కొత్త ప్రభుత్వం భారత్‌-చైనాల పట్ల ఎలాంటి వైఖరిని అనుసరిస్తుందనే అంశంపై విమర్శకులు భిన్న అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. చైనాకు ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ భారత్‌ను తక్కువ చేయదన్నది వాటిలో ఒకటి.


రద్దీగా ఉండే తూర్పు-పశ్చిమ దేశాల నౌకా రవాణా మార్గంలో మాల్దీవులు కీలకమైన ప్రాంతంలో ఉంది. అమెరికా విశాల మిలిటరీ వ్యూహంలో హిందూ మహాసముద్రం ఎంతో ముఖ్యమైనది. ఈ కారణంగానే బ్రిటీష్‌ ఆక్రమించిన మారిషస్‌కు చెందిన డిగోగార్సియా దీవులను అమెరికా తన ఆధీనంలోకి తెచ్చుకొని ఖాళీ చేసేందుకు మొరాయిస్తున్నది. అక్కడ ఒక సైనిక స్థావరాన్ని కూడా నిర్మించింది. మనదేశంలోని కన్యాకుమారికి ఆ దీవులు 1,796కిలో మీటర్ల దూరంలో ఉన్నాయి. అది మనదేశంతో పాటు పరిసరాల్లోని అన్ని దేశాలకూ ఆందోళన కలిగించే అంశమే. బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం, అరేబియా సముద్ర ప్రాంతంలోని కొన్ని దేశాలు అమెరికా పట్టునుంచి విడివడటం, అవి క్రమంగా చైనాకు సన్నిహితం కావటం అమెరికా, ఇతర పశ్చిమ దేశాలకు ఆందోళన కలిగిస్తోంది. ఆ వరుసలో మాల్దీవులు కూడా చేరితే ఏమిటన్నదే వారి ఆందోళన. ఈ పరిణామం భారత భద్రతకు ముప్పు అని మన దేశానికి అవి చెబుతున్నాయి. ఆ ప్రాంతానికి ఉన్న ప్రాధాన్యత కారణంగా 1965లో బ్రిటన్‌ ఆక్రమణ నుంచి స్వాతంత్య్రం పొందిన తరువాత మన దేశం అన్ని రంగాలలో దగ్గరయ్యేందుకు చూసింది. అనేక విధాలుగా సాయం చేసింది. 1988లో దాదాపు రెండు వందల మంది తమిళ ఉగ్రవాదులు మాల్దీవులకు వెళ్లి నాటి అధ్యక్షుడు అబ్దుల్‌ గయూమ్‌ మీద తిరుగుబాటు చేసి కీలకమైన ప్రాంతాలన్నింటినీ పట్టుకున్నారు. తమను అదుకోవాలని అనేక దేశాలను గయూమ్‌ కోరినా ఎవరూ ముందుకు రాలేదు. భారత్‌ స్పందించింది, ఆపరేషన్‌ కాక్టస్‌ పేరుతో ఆగ్రా వైమానిక దళ కేంద్రం నుంచి ఐదు వందల మంది పారా ట్రూపర్లను ఎక్కడా ఆపకుండా నేరుగా మాల్దీవుల్లో దించి కుట్రను విఫలం గావించింది. అనేక మంది కుట్రదారులను కాల్చి చంపి, కొందరిని బందీలుగా పట్టుకుంది. అప్పటి నుంచి సంబంధాలు మరింతగా బలపడ్డాయి.


తరువాత జరిగిన పరిణామాల్లో దీవుల ఆర్థిక సమస్యలను, పౌరుల జీవితాలను మెరుగుపరచటంలో పాలకుల వైఫల్యం కారణంగా జనంలో అసంతృప్తి తలెత్తింది. సరిగ్గా అదే సమయంలో చైనా తన బిఆర్‌ఐ పధకాన్ని ముందుకు తెచ్చింది. ఐఎంఎఫ్‌, ప్రపంచబాంక్‌, అమెరికా, ఇతర పశ్చిమదేశాల మాదిరి కఠినమైనవి కాకుండా సాధారణ షరతులతో ప్రాజెక్టులకు చైనా రుణాలు ఇచ్చింది. దాంతో 2013లో అధికారానికి వచ్చిన అబ్దుల్లా యామిన్‌ చైనాతో సంబంధాలను పెంచుకున్నాడు.2018లో గెలిచిన ఇబ్రహీం సాలి భారత్‌కు పెద్ద పీట అనే విధానంతో మన దేశానికి సన్నిహితంగా భాగస్వామ్య ఒప్పందాలను చేసుకున్నాడు. అది తాజా ఎన్నికల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది.2020లో ప్రతిపక్షాలుగా ఉన్న మాల్దీవుల ప్రోగ్రెసివ్‌ పార్టీ, పీపుల్స్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ ఒక కూటమిగా ఏర్పడి ” భారత్‌ను బయటకు పంపాలి( భారత్‌ అవుట్‌) ” అనే నినాదంతో ప్రచారాన్ని ప్రారంభించాయి. జనంలో ఉన్న భారత వ్యతిరేక మనోభావాలు కూడా దీనికి దోహదం చేశాయి. 1978లో అధ్యక్షుడిగా నియమితుడైన అబ్దుల్‌ గయూమ్‌ ప్రజాస్వామిక స్వేచ్చకు తిలోదకాలిచ్చి 2008లో ఓడిపోయే వరకు పదవిలో కొనసాగాడు. అతడి మీద జరిగిన కుట్రను భారత్‌ అడ్డుకొని అధికారంలో కొనసాగేందుకు దోహదం చేసింది.2013లో పోటీ చేసిన యామిన్‌ ఈ గయూమ్‌కు సవతి సోదరుడు. ఆ ఎన్నికల్లో గయూమ్‌ అతనికి మద్దతు ఇచ్చాడు. తరువాత ఇద్దరి మధ్య తలెత్తిన విబేధాలతో గయూమ్‌ పార్టీని చీల్చి ప్రతిపక్షంతో చేతులు కలిపాడు. తరువాత ప్రభుత్వాన్ని కూలదోసేందుకు కుట్రచేశాడనే ఆరోపణతో 2018లో అతన్ని అరెస్టు చేశారు. తరువాత బెయిలు మీద విడుదల చేశారు. మనదేశానికి చెందిన జిఎంఆర్‌ కంపెనీ మాలెలోని విమానాశ్రయ అభివృద్ధి నిర్వహణ బాధ్యతలు తీసుకుంది.విదేశీ ప్రయాణీకులతో పాటు మాల్దీవుల పౌరుల మీద అభివృద్ధి పన్ను విధించటంతో అక్కడ వ్యతిరేకత వెల్లడైంది. దాని వెనుక అధ్యక్షుడు నషీద్‌ మద్దతు కూడా ఉందని చెబుతారు. అదే పెద్ద మనిషి మీద అవినీతి అక్రమాల ఆరోపణలు వెల్లువెత్తటంతో జనంలో నిరసన తలెత్తి చివరకు 2012లో రాజీనామా చేసి పదవి నుంచి తప్పుకున్నాడు. జనం ఛీకొట్టిన నషీద్‌ మనదేశంతో తనకున్న సంబంధాలను ఉపయోగించుకొని అరెస్టు కాకుండా తప్పించుకొనేందుకు భారత రాయబార కార్యాలయంలో ఆశ్రయం పొందాడు. అది కూడా జనంలో మనదేశం మీద వ్యతిరేకత పెరిగేందుకు దోహదం చేసింది.దాన్ని ప్రతిపక్షాలు ఉపయోగించుకున్నాయి.


2013లో అధికారానికి వచ్చిన యామీన్‌ మరుసటి ఏడాది చైనా అధినేత షీ జింపింగ్‌ను పర్యటనకు ఆహ్వానించాడు. అధికారికంగా భారత్‌కు అగ్రస్థానం అనే విధానం నుంచి వైదొలగనప్పటికీ చైనాతో స్వేచ్చా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నాడు. మౌలిక సదుపాయాల పధకాలకు ఒప్పందం చేసుకున్నాడు.చైనాతో కలసి సాగర పరిశీలన కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు చర్చలు జరిపాడు.చైనాతో బంధం బలపడిన తరువాత 2018లో అప్పటి వరకు మాల్దీవుల్లో నిర్వహిస్తున్న భారత హెలికాప్టర్లు, నిర్వహణ సిబ్బంది తమ దేశానికి వ్యతిరేకంగా పని చేస్తున్నట్లు, గూఢచర్యం జరుపుతున్నట్లు ఆరోపించి వెంటనే వెనక్కు తీసుకోవాలని మనదేశాన్ని కోరాడు. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో ఓడిపోయాడు. అధికారానికి వచ్చిన ఇబ్రహీం సాలి చైనా రుణ పధకాలనుంచి దేశాన్ని కాపాడినట్లు చెప్పుకున్నాడు.జనం విశ్వసించలేదు. ప్రపంచ బాంకు, ఐఎంఎఫ్‌ మాదిరి విధానపరమైన షరతులను ఎవరి మీద చైనా రుద్దలేదు. చైనా రుణాలు పుచ్చుకున్న దేశాలు, అందుకు చొరవ చూపిన అక్కడి పాలకులు అనుసరించిన విధానాల్లో ఏవైనా లోపాలు, అక్రమాలు, అవినీతి ఉంటే అవి ఆ దేశాల అంతర్గత అంశాలు. వాటి మంచి చెడ్డలను జనం చూసుకుంటారు. కానీ చైనా వ్యతిరేక పశ్చిమ దేశాలు, వాటికి వంతపాడే ఇతర దేశాల పాలకులు, మీడియా అనేక కట్టుకధలను వ్యాపింప చేస్తోంది. మాల్దీవుల్లో కూడా అదే జరిగింది. 2018లో యామీన్‌ పదవి నుంచి దిగిపోయేనాటికి ఉన్న పరిస్థితిని తిరిగి కొనసాగిస్తామని ముయిజ్జు ఎన్నికలకు ముందే స్పష్టం చేశాడు. అందువలన ఆ విధానాలకు అనుకూలంగా జనం ఇచ్చిన తీర్పుగా దీన్ని పరిగణించాలి తప్ప, భారత్‌కు ఎదురుదెబ్బ అనో మరో విధంగానో చిత్రించటం మన ప్రయోజనాలను కాపాడుకోవాలనే సరైన ఆలోచనలో భాగం కాదు. మాల్దీవులే కాదు మరేదేశానికైనా మన దేశం కూడా అభివృద్ధికి తోడ్పడి మనకు మిత్రదేశాలుగా ఉండేట్లు చూసుకోవాలి తప్ప అమెరికా రాజకీయంలో భాగంగా వ్యవహరించకూడదు.

పదేండ్ల నరేంద్రమోడీ పాలన : పెరిగిన అప్పులు – తగ్గిన మానవాభివృద్ధి, పన్నుబాదుడులో ఔరంగజేబే ఆదర్శం !

Tags

, , , , , ,


ఎం కోటేశ్వరరావు


వెలిగిపోతున్న పాలన సాగిస్తున్నామని చెబుతున్న నరేంద్రమోడీ సర్కార్‌ సెప్టెంబరు చివరి వారంలో జనానికి రెండు ” శుభవార్తలు ” చెప్పింది. ఒకటి వర్తమాన ఆర్థిక సంవత్సరం తొలి ఐదు మాసాల్లో ద్రవ్యలోటు రు.6.43లక్షల కోట్లకు పెరిగింది. బడ్జెట్‌లో సూచించిన మొత్తం కంటే ఎక్కువగా రిజర్వుబాంకు మిగులు నుంచి రు.87,420 కోట్లు బదలాయించిన తరువాత కూడా ఇలా జరిగింది. గతేదాది ఈ మొత్తం రు.5.42లక్షల కోట్లు. దీన్ని సులభంగా చెప్పుకోవాలంటే తెలుగింటి కోడలు నిర్మలమ్మ ఆర్థికశాఖ మంత్రిగా 2023-24 బడ్జెట్‌ను ప్రవేశపెట్టినపుడు వచ్చే పన్నెండు నెలల్లో ఒక వంద రూపాయలు కొత్తగా ద్రవ్యలోటు ఉంటుందని ప్రతిపాదించారని అనుకుందాం. అది ఐదు నెలలకే 36 రూపాయలకు చేరింది, అదే కాలానికి గత ఏడాది రు.32.60 మాత్రమే ఉంది.మరింత వివరణ ఏమంటే గతేడాది మొత్తం లోటు రు.16.61లక్షల కోట్లని చెప్పగా వర్తమాన సంవత్సరంలో రు.17.86లక్షలుగా ప్రతిపాదించారు. మొత్తం పెరుగుదల లక్షా 25వేల కోట్లు, ఇప్పటికే లక్ష కోట్లు పోగా ఇంకా మిగిలింది 25వేల కోట్లు మాత్రమే. వచ్చే ఏడు నెలల్లో ఏ పధకానికి కోత పెడతారు, కొత్త అప్పులు తెస్తారా, కొత్త నోట్లను ముద్రిస్తారా ఏం చేస్తారన్నది చూడాలి. నరేంద్రమోడీకి సర్వాధికారాలు ఉన్నాయి కదా ! ఏం చేసినా అడిగేవారు లేరు. నోట్ల ముద్రణ జరిగితే ధరలు మరింతగా పెరుగుతాయి, రూపాయి విలువ పతనం అవుతుంది.


ఇక రెండవ మంచి వార్త ఏమంటే మన విదేశీ రుణ భారం 2023 జూన్‌నాటికి 629.1 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. తమ విశ్వగురువు విదేశీ రుణాల మీద ఆధారపడరని, తగ్గిస్తారని భక్త జనులు అధికారానికి వచ్చిన తొలి రోజుల్లో ప్రచారం చేశారు. 2014లో మోడీ అధికారానికి వచ్చినపుడు 2013 డిసెంబరు నాటికి ఉన్న విదేశీ రుణం 409.4 బిలియన్‌ డాలర్లు మాత్రమే. దానిలో తీర్చింది తీర్చగా ఆ మొత్తం అలాగే ఉందనుకుంటే అదనంగా 220 బిలియన్‌ డాలర్లు కొత్త అప్పులు చేశారు. ఇది ప్రతి మూడు నెలలకు పెరుగుతున్నది తప్ప తగ్గటం లేదు.ఈ ఏడాది మార్చి నాటికి 624.3 బిలియన్‌ డాలర్లకు అదనంగా 470 కోట్ల డాలర్లు తోడైంది. దీన్ని మోడీ సర్కార్‌ వైఫల్యంగా చెబుతారా, ఘనత అంటారా ? గతంలో వాజ్‌పాయి ఏలుబడిలో, యుపిఏ కాలంలో కూడా అప్పులు గణనీయంగా తీసుకున్నారు. విదేశీ రుణాలన్నీ డాలర్లలో ఉండవు.1991లో మన విదేశీ రుణం 83.8 బిలియన్‌ డాలర్లు కాగా దానిలో రాయితీలతో కూడిన మొత్తం 45.9శాతం ఉండేది. అది తరువాత క్రమంగా తగ్గుతూ 2013నాటికి 11.1కి 2022 డిసెంబరు నాటికి 8.1శాతానికి తగ్గింది.


అంకెలతో జనాన్ని తిమ్మిని బమ్మిని చేయవచ్చు. దానిలో భాగంగానే విదేశీ అప్పు మొత్తం పెరిగిందని ఒకవైపు అంగీకరిస్తూనే మార్చినెలతో ముగిసిన దానితో పోలిస్తే జూన్‌ నాటికి జిడిపిలో అప్పు శాతం 18.8 నుంచి 18.6 శాతానికి తగ్గినట్లు ఆర్‌బిఐ చెబుతోంది.ప్రభుత్వ అప్పు తగ్గింది, ప్రభుత్వేతర అప్పు పెరిగిందని కూడా పేర్కొన్నది. గతంలో కూడా ప్రభుత్వ అప్పు తగ్గింది తప్ప పెరగలేదు, కానీ బిజెపి నేతలు దాని గురించి ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి అన్నట్లు కాంగ్రెస్‌ పాలన గురించి నానా యాగీ చేశారు. మొత్తంగా పెరిగిందా లేదా అన్నది గీటురాయి. ఇతర దేశాలతో పోలిస్తే మన అప్పు తక్కువ అని మరోసన్నాయి నొక్కు. ప్రతిదానికి చైనాతో పోలుస్తున్నారు, దాని విదేశీ అప్పు జిడిపిలో 13.6శాతం ఉంది, దాని కంటే మన అప్పు ఆరుశాతం ఎక్కువ. ఇంటా బయటా అప్పులు చేసి లేదా ప్రయివేటు అప్పులకు హామీ ఇచ్చి సాధించింది ఏమిటి ? కాంగ్రెస్‌ యాభై సంవత్సరాలలో చేయలేని వాటిని తన తొలి ఐదు సంవత్సరాల పాలనలోనే సాధించినట్లు నరేంద్రమోడీ చెప్పుకున్నారు. అందువలన పదేండ్ల కాలం తక్కువేమీ కాదు. కేంద్రంలో, మెజారిటీ రాష్ట్రాలలో బిజెపి అధికారంలో ఉంది. విధానాలను అమలు జరపటానికి వచ్చిన ఇబ్బంది లేదు.ఒక దేశ అభివృద్ధికి ఒక కొలమానం మానవాభివృద్ధి సూచిక. ఐరాస అభివృద్ధి ప్రమాణాల(హెచ్‌డిఐ) ప్రకారం 0.550 కంటే తక్కువ పాయింట్లు వచ్చిన దేశాలు తక్కువ, 0.550 -0.699 మధ్య ఉన్నవి మధ్యరకం, 0.699 నుంచి 0.799 పాయింట్లు వస్తే ఉన్నత, 0.800 కంటే మించితే అత్యున్నత వృద్ధి సాధించిన దేశాలుగా పరిగణిస్తున్నారు. ఈ ఏడాది ప్రకటించిన 2022 నివేదిక ప్రకారం 0.633 పాయింట్లతో మనదేశం 188 దేశాల జాబితాలో 132వదిగా ఉంది.నరేంద్రమోడీ అధికారానికి వచ్చినపుడు ఉన్న 130 నుంచి రెండు స్థానాలు దిగజారింది. మన దేశం ఇచ్చిన సమాచారం ప్రకారమే విశ్లేషించి సూచికలను రూపొందిస్తారని తెలిసిందే. ఎందుకీ దిగజారుడు ? ఇష్టం ఉన్నా లేకున్నా చైనాతో పోలుస్తున్నారు గనుక అదెక్కడ ఉందో చూద్దాం. తాజా సూచిక ప్రకారం 0.768 పాయింట్లతో 79వ స్థానంలో ఉంది. ఈ సూచికలకు ఇచ్చే పాయింట్లు ఆయా దేశాల్లో జరిగే వృద్ధిని బట్టి ఏటా మారుతూ ఉంటాయి. లింగ సమానత్వం, ఆరోగ్యం, విద్య, ఆదాయం, అసమానతల వంటి 13 అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. గడచిన నాలుగున్నర దశాబ్దాలుగా కొన్ని దేశాల మానవాభివృద్ధి సూచికలలో వచ్చిన మార్పులు దిగువ విధంగా ఉన్నాయి. బ్రాకెట్లలో ఉన్న అంకెలు సదరు ఏడాది పరిగణనలోకి తీసుకున్న దేశాల సంఖ్యగా గమనించాలి.
హెచ్‌డిఐ ××× 1980 ×× 1990 ×××× 2000 ×××× 2010 ×× 2014 ×××× 2022
చైనా ×××××0.423 ×× 0.501 ×× 0.588 ××0.699 ××0.727 ×× 0.768
చైనారాంక్‌ ×××92(124) ××103(143) ××108(166) ××102(188)××90(188) ××79(191)
భారత్‌ ×××0.369 ×× 0.428 ××0.496 ××0.586 ×××× 0.609 ×× 0.633
భారతరాంక్‌×××100(124) ××114(143) ××120(166) ××136(188)××130(188) ××132(191)
అమెరికా ×××0.825 ×× 0.859 ××××0.883 ××××0.909 ××××0.915 ×××× 0.921
అమెరికారాంక్‌×× 2(124) ×× 2 (143) ×× 5 (166) ×× 5 (188)×× 8 (188) ×× 21(191)


తన పాలనలో జిడిపి గణనీయంగా పెరిగిందని, త్వరలో ఐదు లక్షల కోట్ల డాలర్లకు చేర్చుతామని, 2047 నాటికి చైనాను కూడా అధిగమిస్తామని బిజెపి నమ్మింప చూస్తున్నది. రాష్ట్రాలు రుణాలు తీసుకోవద్దని, సంక్షేమ పధకాలకు అనవసరంగా ఖర్చు చేయవద్దని ప్రధాని నరేంద్రమోడీ పదే పదే చెబుతున్నారు.కానీ ఆ పెద్ద మనిషి ఏలుబడిలో జరిగిందేమిటి ? 2013-14 సంవత్సరంతో పోల్చితే 2022-23నాటికి స్వదేశీ అప్పు 174శాతం, విదేశీ అప్పు వందశాతం పెరిగింది.కాగ్‌ ఖరారు చేసిన గణాంకాల ప్రకారం 2014 మార్చి 31నాటికి కేంద్ర ప్రభుత్వ విదేశీ, స్వదేశీ అప్పు మొత్తం రు.50,68,235 కోట్లు. వర్తమాన సంవత్సర బడ్జెట్‌ ప్రతిపాదనల్లో అప్పుల గురించి నిర్మలమ్మ పార్లమెంటుకు సమర్పించిన పత్రం ప్రకారం 2023 మార్చి నెల ఆఖరుకు రు. 152,61,122.12 కోట్లుగా ఉన్నది 2024 మార్చి ఆఖరుకు రు.169,46,466.85 కోట్లకు చేరుతుంది. ఎన్నికల సంవత్సరం గనుక ఇంకా పెరగటమే తప్ప తగ్గే అవకాశం లేదు. దీనిలో స్వదేశీ అప్పు రు.147,77,724.43 కోట్ల నుంచి రు.164, 23,983.04కు, విదేశీ రుణం రు.4,83,397.69 నుంచి రు.5,22,683.81 కోట్లకు పెరుగుతుందని చెప్పారు. ఇంత అప్పు చేసినా మానవాభివృద్ధి సూచికలు దిగజారాయంటే ఆ సొమ్మును జనానికి గాకుండా కార్పొరేట్లకే కట్టపెట్టారన్నది స్పష్టం. పెంచిన పన్ను భారాలు, అప్పుల గురించి అడిగితే జాతీయ రహదారులు, రైల్వేలను అభివృద్ధి చేశామంటారు. నిజమే, వాటిని వినియోగించుకున్నవారి నుంచి వసూలు చేస్తున్న టోలు టాక్సు, ఎంత ? సామాన్యులు ఎక్కే పాసింజరు రైళ్లను రద్దు చేసి వాటిని ఎక్స్‌ ప్రెస్‌ల పేరుతో జనాన్ని బాదుతున్నారు. వృద్దులకు ఇచ్చే రాయితీలను రద్దు చేశారు.రిజర్వేషన్ల రద్దుకు ఎంత వసూలు కోత పెడుతున్నారో తెలిసిందే. స్టాటిస్టా సంస్థ వెల్లడించిన సమాచారం ప్రకారం 2017 ఆర్థిక సంవత్సరం నుంచి 2023 వరకు టోల్‌టాక్సు రు.17,942 కోట్ల నుంచి 48,028 కోట్లకు పెరిగింది. దీనిలో సరకు, ప్రయాణీకుల రవాణా వాహనాల నుంచి వసూలు చేసేదే ఎక్కువ అన్నది తెలిసిందే, అంటే ఆ మేరకు జనం మీద భారం మోపుతున్నారు.


ఆరోగ్య పరిస్థితిని చూస్తే ఆందోళనకరంగా ఉంది. తగినన్ని ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయని కారణంగా దేశంలో అన్ని వయసుల వారిలో రక్త హీనత (అనీమియా)పెద్ద సమస్యగా ఉంది. కుటుంబ జాతీయ ఆరోగ్య సర్వే 5 (2019-21) ప్రకారం ఆరు నెలల నుంచి ఐదేండ్ల మధ్య వయస్సు పిల్లల్లో 67శాతం, 15-19 సంవత్సరాల బాలికల్లో 59, బాలురలో 31,పిల్లల్ని కనేవయస్సున్న మహిళల్లో 57, గర్భిణుల్లో 52, గర్భిణులు కాని మహిళల్లో 57 మంది రక్త హీనతో ఉన్నారు. అంతకు ముందు చేసిన సర్వే 4 వివరాలతో పోలిస్తే పైన చెప్పుకున్న అన్ని తరగతుల వారిలో ఈ సమస్య తీవ్రత పెరిగింది. దేశానికి గుజరాత్‌ తరహా అభివృద్ధిని అమలు చేస్తానని నరేంద్రమోడీ చెప్పారు, ఆ గుజరాత్‌ పిల్లల్లో తీవ్రత 62.6 నుంచి 79.7శాతానికి పెరిగింది. ఈసురో మని మనుషులుంటే దేశమేగతి బాగుపడునోరు అని మహాకవి గురజాడ చెప్పింది ఇలాంటి వారి గురించే.2018లో అనీమియా ముక్త భారత్‌ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని ప్రకటించింది. అది ఏమేరకు ఫలితాలు ఇచ్చిందో ఇంకా ఏమి చేయాలో తెలియాలంటే సర్వేలు తప్ప మరొక మార్గం లేదు కానీ, ఆరవ విడత నిర్వహించదలచిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో ఆ సమాచారాన్ని రాబట్టే ప్రశ్నలనే కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. ఎందుకంటే తీవ్రత తగ్గకపోతే మోడీ సర్కార్‌ వైఫల్యం వెల్లడౌతుంది. అంతకు మించి మరొక కారణం కనిపించటం లేదు. దీని మీద తీవ్ర విమర్శలు రావటంతో డైట్‌ మరియు బయోమేకర్స్‌ సర్వే(డాబ్స్‌-1) ఆ సమాచారాన్ని సేకరిస్తుందని కేంద్ర ప్రకటిచింది. మన దేశంలో తృణధాన్యాల వినియోగం గురించి ఐరాస ఆహార, వ్యవసాయ సంస్థ 2019 సంవత్సర వివరాలను వెల్లడించింది.ప్రపంచ వ్యాపితంగా తలసరి ఆహారం,దాణాగా 304కిలోలు వినియోగిస్తున్నారు. మన దేశంలో 171 కిలోలు, ఆఫ్రికాలో 190, బాగా వెనుక బడిన దేశాల్లో 205, బ్రెజిల్‌, చైనాలో 360, రష్యాలో 407,ఐరోపా పారిశ్రామిక దేశాల్లో 494, అమెరికాలో 590 కిలోలు ఉంది. దీన్ని బట్టి 121 దేశాల్లో మన దేశం ఆకలి సూచికలో 107వదిగా ఎందుకు ఉందో అర్ధం చేసుకోవటం కష్టం కాదేమో ? రాష్ట్రాలకు చెందాల్సిన న్యాయమైన వాటాను రాకుండా ఎగవేసేందుకు కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న కొన్ని భారాలను చూస్తే స్వచ్చ భారత్‌, విద్య, ఆరోగ్యం,రోడ్డు , నాణ్యమైన ఇంథనం, వ్యవసాయం పేరుతో విధిస్తున్న సెస్‌ల గురించి జనానికి తెలిసిందే తక్కువే. రాబడి కోసం ఔరంగజేబు ముస్లిమేతరుల మీద విధించిన జిజియా పన్ను గురించి చరిత్ర పాఠాల్లో చదువుకున్నాం.ఇప్పుడు జరుగుతున్నదేమిటి ?

భారత – కెనడా కలహంపై పశ్చిమ దేశాల్లో ఆందోళన ఎందుకు, చైనా ఏమంటోంది !

Tags

, , , , , , ,


ఎం కోటేశ్వరరావు


హరదీప్‌ సింగ్‌ నిజ్జర్‌ అనే పంజాబ్‌ వేర్పాటువాద, ఉగ్రవాది హత్య ప్రస్తుతం భారత్‌-కెనడా మధ్య సంబంధాలు దిగజారటానికి దారి తీసింది. నిజ్జర్‌ హత్యలో భారత్‌ ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రుడేవ్‌ సెప్టెంబరు 18న పార్లమెంటులో చేసిన ఆరోపణను మనదేశం తిరస్కరించింది. దానికి ఎలాంటి ఆధారాలు లేవంది. అప్పటి నుంచి జరుగుతున్న పరిణామాలు అక్కడ విద్యాభ్యాసం, ఉపాధికోసం వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు ఈ వివాదం తమ చైనా వ్యతిరేక ఎత్తుగడలు, సమీకరణలకు ఎక్కడ దెబ్బతగులుతుందో అన్న భయం అమెరికా కూటమి దేశాల్లో వెల్లడి అవుతోంది. భౌగోళిక రాజకీయాల మీద చూపే ప్రభావమే కాదు, భారత్‌కు ఆగ్రహం కలిగిస్తే దాని మార్కెట్‌లో ప్రవేశించేందుకు అవకాశాలు తగ్గుతాయన్న ఆందోళన కూడా వాటిలో ఉంది. చైనా మీద ఆధారపడకుండా భారత్‌ను ప్రత్యామ్నాయ వస్తు ఎగుమతి దేశంగా మార్చేందుకు సాయం చేస్తామని, వాణిజ్య సంబంధాలు మెరుగుపరచుకుంటామని చేస్తున్న ప్రకటనలు తెలిసినవే. చేసిన ఆరోపణను కెనడా వెనక్కు తీసుకోవాలని మనదేశం డిమాండ్‌ చేస్తోంది. ఉగ్రవాదులకు కెనడా సురక్షిత స్వర్గంగా ఉందని వర్ణించింది. మూడునెలల పరిశోధన తరువాత భారత హస్తం ఉందని నిర్ధారించుకున్నామని కెనడా అంటోంది. ఈ ఆరోపణను ఉపసంహరించుకుంటే తప్ప మనదేశం వెనక్కు తగ్గదు, అదే జరిగితే కెనడా అభాసుపాలవుతుంది కనుక వెనక్కు తగ్గే అవకాశాలు తక్కువ. ఇది చినికి చినికి గాలివానగా మారితే జరిగే పర్యవసానాల గురించి ఆందోళన చెందుతున్న జి 7 కూటమిలో పెద్దన్న అమెరికా, ఇతర దేశాలు ఇప్పటి వరకు ఆచితూచి వ్యవహరించాయి.


ఈ ఏడాది జూన్‌ 18న కెనడా వాంకోవర్‌ సమీపంలోని సురే అనే చోట ఒక గురుద్వారా వెలుపల హత్యకు గురైన నిజ్జర్‌ 1977లో పంజాబ్‌లోని జలంధర్‌ సమీపంలోని ఒక గ్రామంలో జన్మించాడు.పంజాబ్‌లో తీవ్రవాదులపై 1995లో చర్యలను ముమ్మరం చేయటంతో 1997లో నిజ్జర్‌ నకిలీ పాస్‌పోర్టుతో కెనడా పారిపోయాడు. అక్కడ తప్పుడు సమాచారం వెల్లడికావటంతో కేసులు, వివాదాల తరువాత 2007లో కెనడా పౌరసత్వం ఇచ్చారు. ఖలిస్తాన్‌ టైగర్‌ ఫోర్స్‌ అనే ఉగ్రవాద సంస్థతో అతనికి సంబంధాలు ఉన్నాయని, ఒక వేర్పాటువాది, నేరగాడు అని అతన్ని అరెస్టు చేసి అప్పగించాలని గతంలో మనదేశం కెనడాను కోరింది. దాన్ని అది ఖాతరు చేయలేదు. స్వేచ్చగా తిరగనిస్తున్నది. అతడు ఒక మానవహక్కుల కార్యకర్త, శాంతియుత పద్దతుల్లో సిక్కు దేశం ఏర్పాటుకు మద్దతు ఇచ్చినట్లు అతని మద్దతుదార్లు వాదిస్తారు. తమ దేశంలో భావ ప్రకటన స్వేచ్చ ఉందని అందువలన అతను మాట్లాడేదానితో తమకు సంబంధం లేదని కెనడా వాదించింది. అతను 2019లో సురే గురుద్వారా నేతగా మారాడు.2020లో ఖలిస్తాన్‌ ప్రజాభిప్రాయ సేకరణలో, వేర్పాటువాదాన్ని సమర్ధిస్తూ పేరు తెచ్చుకున్నాడు. అతని హత్యకేసులో ఇంతవరకు ఎవరినీ అరెస్టు చేయలేదు.


నిజ్జర్‌కు ఖలిస్తాన్‌ టైగర్‌ ఫోర్స్‌ అనే మిలిటెంట్‌ గ్రూపుతో సంబంధాలు ఉన్నాయని భారత్‌ చేసిన వినతి మేరకు 2014లో ఇంటర్‌ పోల్‌ అరెస్టు వారంటు జారీ చేసింది. అతడు 2013-14లో పాకిస్తాన్‌ వెళ్లాడని అక్కడ పాక్‌ ఐఎస్‌ఐ చేర్చుకున్న బబ్బర్‌ ఖాల్సా అనే సంస్థకు చెందిన జగతార్‌ సింగ్‌ తారాను కలిశాడని మన ప్రభుత్వం పేర్కొన్నది. అతని మీద నిఘా పెట్టాలని 2015లో కేంద్ర ప్రభుత్వం కోరింది. తరువాత రెండోసారి కూడా రెడ్‌ కార్నర్‌ నోటీసు జారీ చేసింది.తన మీద భారత ప్రభుత్వం చేసిన ఆరోపణలు వాస్తవం కాదని, రాజకీయపరమైనవని నిజ్జర్‌ 2016లో కెనడా ప్రధానికి లేఖ రాశాడు. అతగాడు అనేక హత్యలకు కారకుడని, తమకు కావాల్సిన ముఖ్యులలో ఒకడని 2018లో కేంద్రం కెనడాకు తెలిపింది. పంజాబ్‌ను విముక్తి చేసి ఖలిస్తాన్‌ ఏర్పాటు చేయాలన్న ప్రచారానికి నిజ్జర్‌ మద్దతు తెలిపాడు.2020లో మన ప్రభుత్వం అతడిని ఉగ్రవాదిగా ప్రకటించింది. ఆ ఏడాది మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన రైతుల ఉద్యమం వెనుక అతడు ఉన్నాడని ఆరోపించి కేసులు కూడా దాఖలు చేసింది. పంజాబ్‌లోని ఒక హిందూ పూజారిని హత్య చేసేందుకు కుట్ర పన్ని లక్ష రూపాయల బహుమతి ప్రకటించాడని 2022లో ఎన్‌ఐఏ పేర్కొన్నది.


కెనడా రాజకీయాల్లో సిక్కులు ఒక ప్రభావిత శక్తిగా ఉన్నారు. పంజాబ్‌ తరువాత ప్రపంచంలో సిక్కు సామాజిక తరగతి ఎక్కువగా ఉన్నది కెనడాలోనే, అక్కడ జనాభాలో 2.1శాతం ఉన్నారు. ముప్పై మందితో కూడిన జస్టిన్‌ ట్రుడేవ్‌ మంత్రివర్గంలో నలుగురు సిక్కులు మంత్రులుగా ఉన్నారు. ఈ కారణంగా నిజ్జర్‌ మరణానికి బాధ్యులను తేల్చాలన్న డిమాండ్‌ సహజంగానే అక్కడ ముందుకు వచ్చింది. అందువలన మరొకదారి లేని పరిస్థితిలో అంతర్జాతీయ కర్తవ్యం సంగతి తరువాత ముందు తన ప్రభుత్వం గురించి చూసుకోవాలని హత్య గురించి ట్రుడేవ్‌ పార్లమెంటులో మాట్లాడాల్సి వచ్చింది. జూన్‌ మొదటి వారంలో మన విదేశాంగ మంత్రి జై శంకర్‌ విలేకర్లతో మాట్లాడుతూ ఖలిస్తాన్‌ వేర్పాటువాదులకు కెనడా మద్దతు ఇవ్వటం రెండు దేశాల సంబంధాలకు మంచిది కాదని విమర్శించారు. ఆ తరువాత నిజ్జర్‌ హత్య జరిగింది. ఢిల్లీలో జరిగిన జి 20 కూటమి సమావేశాలకు జస్టిన్‌ ట్రుడేవ్‌ వచ్చినప్పటికీ ఇతర దేశాధినేతలతో మాదిరి ఫ్రధాని నరేంద్రమోడీ ప్రత్యేక చర్చలు జరపలేదు. అంతే కాదు కెనడాలో ఉగ్రవాదులు భారత వ్యతిరేక కార్యకలాపాలను కొనసాగిస్తున్నారని ఇటీవలి కాలంలో జరిగిన ఉదంతాల గురించి మోడీ కెనడా దృష్టికి తేగా, ప్రతిగా కెనడా కూడా మనదేశం మీద ఆరోపణలు చేసిందని వెల్లడైంది. తిరుగు ప్రయాణంలో ట్రుడేవ్‌ విమానంలో సాంకేతిక లోపం ఏర్పడగా ప్రత్యామ్నాయంగా విమానం ఏర్పాటు చేస్తామని మన దేశం ప్రతిపాదించినా రెండు రోజులు వేచి ఉండి తన విమానంలోనే వెళ్లిన సంగతి తెలిసిందే. రెండు దేశాల మధ్య సంబంధాలు సజావుగా లేవని ఈ ఉదంతం వెల్లడించింది. ఆ తరువాతే పార్లమెంటులో మన దేశం మీద ఆరోపణ చేశాడు. ఈ అంశాన్ని తాము భారత్‌కు ఎంతో ముందుగానే తెలిపామని ట్రడేవ్‌ చెబుతుండగా ఎలాంటి సమాచారం లేదని మన అధికారులు అంటున్నారు.


ఈ వివాదంలో పశ్చిమ దేశాల వైఖరిని చూస్తే మన దేశాన్ని ఖండించ లేదుగానీ విచారణ జరగాలి అని మాట్లాడుతున్నాయి. మీడియాలో వచ్చిన వార్తలను బట్టి కెనడా ప్రధాని బహిరంగంగా మన దేశం మీద ఆరోపణ చేయటానికి ముందే ” ఐదు కళ్ల గూఢచార యంత్రాంగం ” లో భాగస్వాములుగా ఉన్న అమెరికా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ అధికారులకు కెనడా నిజ్జర్‌ హత్యలో మన దేశ ప్రమేయం గురించి వెల్లడించటమే గాక ఒక సంయుక్త ప్రకటనలో ఖండించాలని ప్రతిపాదించగా మిగిలిన దేశాలు నష్టదాయకమంటూ తిరస్కరించినట్లు వెల్లడైంది. తమకు ముందుగానే చెప్పినట్లు కెనడాలోని అమెరికా రాయబారి డేవిడ్‌ కోహెన్‌ నిర్ధారించాడు. విదేశాల్లో హత్యలను సహించరాదని, తాము కెనడాను కేవలం సంప్రదించటం లేదని దర్యాప్తులో భాగస్వాములవుతున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ చెప్పాడు. భారత్‌కూడా దర్యాప్తులో భాగస్వామి కావాలని అమెరికా కోరింది. ఆరోపణలు ఆందోళనకరమైనవని, తాను భారత దేశం వద్ద ఈ అంశాన్ని లేవనెత్తినట్లు ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రిణి పెనీ వాంగ్‌ చెప్పింది. ఆరోపణలు తీవ్రమైనవని బ్రిటన్‌ విదేశాంగ మంత్రి జేమ్స్‌ క్లవర్లీ, వస్తున్న వార్తులు నిజమే అయితే తీవ్ర ఆందోళన కలిగించే అంశమని తమ భాగస్వాములతో సన్నిహితంగా పర్యవేక్షిస్తున్నట్లు న్యూజిలాండ్‌ విదేశాంగ మంత్రి నానియా మహుతా అన్న వ్యాఖ్యలు కెనడాకు అనుకూలంగా చేసినట్లు స్పష్టమౌతున్నాయి.


పంజాబ్‌, కాశ్మీర్‌, ఈశాన్య రాష్ట్రాలలో వేర్పాటు, తీవ్రవాద దుశ్చర్యలకు పాల్పడిన అనేక మందికి అమెరికా, కెనడా, ఐరోపా ధనిక దేశాలు ఆశ్రయం ఇచ్చిన సంగతి తెలిసిందే. పక్కనే ఉన్న శ్రీలంకలో ఉగ్రవాదులు సైతం పశ్చిమ దేశాల్లోనే స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు. పాకిస్తాన్‌ ఉగ్రవాదుల అడ్డా, శిక్షణా కేంద్రం అన్నది వేరే చెప్పనవసరం లేదు. ఇదంతా అమెరికా, ఇతర ఐరోపా దేశాల కుట్రలో భాగంగానే జరిగింది. కెనడా ప్రధాని ఏమి చెప్పినప్పటికీ ఖలిస్తాన్‌ త్రీవ్రవాదుల అడ్డాగా ఆ దేశం మారింది. ప్రపంచంలో ఇతర దేశాల మీద దాడులు చేసేందుకు ఉగ్రవాదుల ఏరివేత అని సాకులు చెప్పే పశ్చిమ దేశాలు తమ సంరక్షణలో ఉన్నవారి గురించి పల్లెత్తు మాట మాట్లాడవు. ఇప్పుడు పశ్చిమ దేశాల ఆందోళన అంతా కెనడాలో ఆశ్రయం పొంది మన దేశానికి వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న తీవ్రవాదుల ఏరివేత, అదుపు గురించి కాదు. కెనడా – భారత్‌ మధ్య వివాదం ముదిరితే చైనాకు వ్యతిరేకంగా భారత్‌ను నిలపాలన్న తమ ఎత్తుగడ ఎక్కడ విఫలమౌతుందో అన్న భయమే ఎక్కువ కనిపిస్తోంది. పశ్చిమ దేశాల నుంచి వెలువడుతున్న అన్ని వ్యాఖ్యానాల్లో బహిరంగంగానే దీని గురించి ప్రస్తావిస్తున్నారు. పశ్చిమ దేశాల ఇండో-పసిఫిక్‌ ఎత్తుగడలో కెనడా కూడా ఒక ప్రధాన భాగస్వామే. మన దేశంలో నిరంకుశ పోకడలు, మానవహక్కులకు భంగం కలుగుతున్నదంటూ అమెరికాలోని అనేక సంస్థలు ఒకవైపు నిరంతరం ప్రచారం చేస్తూ ప్రభుత్వం మీద వత్తిడి పెంచుతున్నాయి. ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ అమెరికా పర్యటనకు వెళ్లినపుడు 75 మంది ఎంపీలు మోడీ ప్రసంగాన్ని బహిష్కరించారు. అధ్యక్షుడు జో బైడెన్‌ వారి ప్రచారాన్ని అనుమతించి చోద్యం చూశాడు. మౌనంగా ఉన్నాడు. చైనాకు వ్యతిరేకంగా మన దేశాన్ని నిలబెట్టాలన్న ఎత్తుగడలో భాగమే అది. అదే ఎంపీలు చైనా గురించి చేసిన ఆరోపణల మీద అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు ఎలా స్పందిస్తున్నదీ చూస్తున్నాము.


పశ్చిమ దేశాలు కట్టగట్టుకొని మౌనం పాటిస్తున్నాయని, ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నట్లు భారత్‌-కెనడా వివాదం గురించి చైనా మీడియా స్పందించింది. తమ వ్యూహాత్మక భాగస్వామిగా భారత్‌ను తీసుకుపోవాలని చూస్తున్నాయి గనుక కెనడా మిత్ర దేశాలు మౌనంగా ఉన్నాయి తప్ప తమ మిత్రులు కాకుంటే వెంటనే ఖండనలకు దిగేవని గ్లోబల్‌ టైమ్స్‌ పేర్కొన్నది. తమ ప్రయోజనాలు లేకపోతే పశ్చిమ దేశాలు నీతి సూత్రాలు, నిబంధనలు వల్లించి ఉండేవని, భారత మానవహక్కుల సమస్యల గురించి కళ్లు మూసుకున్నట్లు పేర్కొన్నది. మనదేశం చైనాను ఎలా చూస్తున్నదో చైనా కూడా మనలను అలాగే చూస్తుంది, మరోవైపు కెనడాతో దాని సంబంధాలు సజావుగా లేవు. ఇప్పుడు తలెత్తిన వివాదాన్ని వారెలా చూస్తున్నారన్నది సహజంగానే ఆసక్తి కలిగిస్తుంది. చైనా అధికారికంగా మాట్లాడకపోయినప్పటికీ అధికారిక పత్రికల్లో వస్తున్న వ్యాఖ్యల ద్వారా వైఖరిని అర్ధం చేసుకోవచ్చు. ఈ వివాదంతో తమ వ్యూహం నుంచి భారత్‌ ఎక్కడ వైదొలుగుతుందో అన్న భయం పశ్చిమ దేశాల్లో ఉంటే, పశ్చిమ దేశాలు – భారత్‌ మధ్య దూరం పెరగాలని సహజంగానే చైనా కోరుకుంటుంది. కెనడా ఒక దేశంగా ఉన్నప్పటికీ అది అమెరికాలో 51వ రాష్ట్రం మాదిరి ఉంటుందని చైనా భావిస్తున్నది. అందుకే భారత్‌ పట్ల అమెరికా మోసకారి తనం, ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తున్నదని, వివాదం మరింత ముదిరితే గందరగోళానికి గురికానుందని చైనా గ్లోబల్‌ టైమ్స్‌లో ప్రచురితమైన విశ్లేషణలు చెబుతున్నాయి. పశ్చిమ దేశాల వలసవాద వైఖరి భారత్‌ను సమాన స్థాయిలో చూస్తూ సహకరించేందుకు ముందుకు రావటం అసాధ్యమని బీజింగ్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ అన్నాడు. అమెరికా అడుగులకు మడుగులొత్తుతూ ప్రవర్తించే కెనడా గతంలో చైనా మీద కాలు దువ్విందని ఇప్పుడు అమెరికా ప్రేరేపణతో భారత్‌ను రెచ్చగొడుతున్నదని చైనా వెబ్‌సైట్‌ ఒక విశ్లేషణలో రాసింది. మరికొందరు విశ్లేషకులు భారత్‌ పెద్ద ఇబ్బందుల్లో పడిందని పేర్కొన్నారు.


అమెరికా జాతీయ భద్రతా మండలి ప్రతినిధి జాన్‌ కిర్బీ మాట్లాడుతూ తమకు భారత్‌ ఎంతో కీలకమైన దేశంగానే ఉంటుందని, అది ఒక్క దక్షిణాసియా ప్రాంతానికే కాదు, ఇండో-పసిఫిక్‌ ప్రాంతానికి కూడా అని చెప్పాడు. అమెరికాకు ఇది కలవరం కలిగించేదే, దానికి విశాల ప్రయోజనాలు ఉన్నాయి, ట్రుడేవ్‌ ఆరోపణలు గనుక నిజమే అయితే నరేంద్రమోడీ సర్కార్‌ ప్రజాస్వామ్యానికి కట్టుబడి లేదన్నది అర్ధం, ఇదే విధానాన్ని పుతిన్‌ కూడా అనుసరించాడు అని కెనడాలోని టొరొంటో విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌ రాబర్ట్‌ బోత్‌వెల్‌ అన్నాడు. తన శత్రువులను రష్యాలోపల, వెలుపల బ్రిటన్‌తో సహా ఇతర దేశాల్లో పుతిన్‌ చంపించాడని అన్నాడు. కరవ మంటే కప్పకు కోపం- విడవ మంటే పాముకు ఆగ్రహం అన్నట్లుగా ప్రస్తుతం పశ్చిమ దేశాల పరిస్థితి ఉంది.చివరకు ఈ వివాదాన్ని ఎలా ముగిస్తారో చూడాల్సి ఉంది.

మహిళా రిజర్వేషన్లపై నరేంద్రమోడీ టక్కు టమారాలు : పదేండ్లు పట్టించుకోలేదు, 2034 తరువాతే అమలు !

Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


నాటకీయ పరిణామాల మధ్య నరేంద్రమోడీ సర్కార్‌ పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో చట్ట సభల్లో 33శాతం మహిళా బిల్లు ప్రవేశపెట్టి ఆమోదం పొందింది.అది చట్టం కావటం లాంఛనమే. సగం రాష్ట్రాలు ఆమోదిస్తే దాని అమలుకు బాటపడుతుంది. ఏ అసెంబ్లీ, లోక్‌సభ సెగ్మెంట్లలోని ఓటర్లలో పురుషులు ఎందరు, మహిళలు ఎందరు అనే వివరాలు ఇప్పటికే ఉన్నాయి గనుక కొందరు ఆ స్థానాలను ఉటంకిస్తూ అవన్నీ మహిళలకు రిజర్వు చేయబోతున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు. అసలు ఈ రిజర్వేషన్లు ఎప్పుడు అమల్లోకి వస్తాయంటే 2029 నాటికి అని మరికొందరు 2034 లేదా ఆ తరువాతే అని భాష్యం చెబుతున్నారు. ఇదే సమయంలో నియోజకవర్గాల పునర్విభజనలో ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు పెరిగేదీ, ఎక్కడ ఎన్ని సీట్లు తగ్గేది కూడా కొన్ని అంకెలను కూడా ఉటంకిస్తున్నారు. తాజాగా ఆమోదం పొందిన బిల్లు ప్రకారం రిజర్వేషన్లు పదిహేను సంవత్సరాల పాటు అమల్లో ఉంటాయి. షెడ్యూలు కులాలు, తరగతులకు నిర్ధేశించిన సీట్లలో కూడా మూడోవంతు సీట్లను మహిళలకు కేటాయిస్తారు. వెనుబడిన తరగతుల మహిళకు రిజర్వేషన్లు ఉండాలన్న డిమాండ్‌ను బిజెపి ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇక ఆమోదించిన బిల్లు చట్టమై ఎప్పటికి అమల్లోకి వస్తుంది, అసలు ఏం జరగబోతోంది ?


రాజ్యసభలో 2010లోనే ఆమోదం పొందిన రిజర్వేషన్‌ బిల్లు లోక్‌సభ ఆమోదం పొందితే సరిపోతుంది. యుపిఏ ఏలుబడిలో ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న కొన్ని పార్టీల వ్యతిరేకత లేదా అభ్యంతరాల కారణంగా అది లోక్‌సభలోకి రాలేదు. తమకు పూర్తి మెజారిటీ వస్తే దాన్ని తక్షణమే ఆమోదిస్తామని బిజెపి వాగ్దానం చేసింది. 2014లో, 2019లో అవసరమైన మెజారిటీ, సగానికంటే ఎక్కువ రాష్ట్రాలలో బిజెపి ప్రభుత్వాలే ఉన్నందున ఆ బిల్లు ఆమోదానికి ఆటంకం లేదు, అయినప్పటికీ తొమ్మిదేండ్లుగా దాని ప్రస్తావన, అసలు చొరవే చూపలేదు. నిజానికి అధికారానికి వచ్చిన వెంటనే ఆమోదం పొంది తక్షణమే అమల్లోకి వచ్చే విధంగా 2011 జనాభా ప్రాతిపదికన ఉన్న సీట్లలోనే మహిళల కోటా అమలు జరిపేందుకు పునర్విభజనతో నిమిత్తం లేకుండా అవసరమైన రాజ్యాంగ సవరణ చేసి ఉంటే అమల్లోకి వచ్చి ఉండేది. చిత్తశుద్ది ముఖ్యం, అది లేదు కనుకనే విమర్శలు. కారణాలు, ఉద్దేశ్యాలు ఏమైనప్పటికీ ముందు రోజు కాబినెట్‌లో ఆమోదించి మరుసటి రోజు లోక్‌సభలో, తరువాత రాజ్యసభలో ఆమోదానికి పెట్టారు.లోక్‌సభలో ఇద్దరున్న మజ్లిస్‌ మినహా మిగిలిన పార్టీలేవీ వ్యతిరేకంగా ఓటు వేయలేదు, రాజ్యసభలో ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. రానున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, తరువాత లోక్‌సభ, ఇతర రాష్ట్రాల ఎన్నికల్లో బిజెపి ఈ పరిణామాన్ని ఎలా ఉపయోగించుకుంటుందో, జనానికి ఏం చెబుతుందో, ఓటర్లు ఎలా స్వీకరిస్తారో చూద్దాం.


ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది ? పదేండ్లకు ఒకసారి జరిగే జన గణన తరువాత లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరగాలన్నది స్వాతంత్య్రం వచ్చిన తరువాత జరిగిన నిర్ణయం. దీన్ని అమలు చేసేందుకు ఏర్పాటు చేసే కమిషన్‌కు ఒక విశ్రాంత సుప్రీం కోర్టు న్యాయమూర్తి అధ్యక్షత వహిస్తారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి, రాష్ట్రాల ఎన్నికల అధికారులు ఉంటారు. దాని నిర్ణయాన్ని ఆమోదించటం తప్ప ఏ కోర్టులోనూ సవాలు చేసే అవకాశం లేదు. ఆ మేరకు 1952, 1963, 1973లో జరిగాయి.1973 తరువాత పాతికేండ్ల పాటు ఆ ప్రక్రియను స్థంభింప చేస్తూ పార్లమెంటులో రాజ్యాంగ సవరణ చేశారు. ఆ మేరకు 2002లో మరో పునర్విభజన ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. తరువాత మరో పాతికేండ్లపాటు 2026వరకు అదే సంఖ్యను కొనసాగించాలని కూడా నిర్ణయించారు. తొలి లోక్‌సభలో 494 నియోజకవర్గాలుండగా, తరువాత పది సంవత్సరాలకు 522కు పెంచారు. మరో పది సంవత్సరాల తరువాత 542కు పెంచారు. ఆప్రక్రియ తరువాత సిక్కిం మనదేశంలో విలీనం కావటంతో మరొక స్థానాన్ని దానికి కేటాయించటంతో 543 అయ్యాయి. వీటిలో పదమూడు కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి ఉన్నాయి. అప్పటి నుంచి 2026వరకు ఆ సంఖ్యలో ఎలాంటి మార్పు ఉండదు. మధ్యలో అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాలలో కొన్ని ప్రాంతాలూ, అసెంబ్లీ సెగ్మెంట్లు అటూ ఇటూ అయ్యాయి. కొన్ని నియోజవర్గాలు రద్దు, కొన్ని కొత్తవి వచ్చాయి. తెలంగాణాలో జనాభా పెరగటంతో ఆంధ్రప్రాంతంలో సీట్లు తగ్గాయి. ఉమ్మడి రాష్ట్రాన్ని విభజించిన తరువాత ఎక్కడ ఉన్న సీట్లు అక్కడే ఉన్నాయి.రాష్ట్ర పునర్విభజన చట్టంలో తెలంగాణా సీట్లను 119 నుంచి 153కు, ఆంధ్ర ప్రదేశ్‌లో 175ను 225కు పెంచుతామని వాగ్దానం చేసినందున 2026 తరువాత జరిగే పునర్విభజన ప్రక్రియలో భాగంగా అవి అమల్లోకి వస్తాయి.


2021లో జరగాల్సిన జనగణన వాయిదా పడింది. అది ఎప్పుడు జరుగుతుందో తెలియదు. గడువు ప్రకారం వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగాల్సి వుంది. అందువలన జనగణన జరుగుతుందా, మరుసటి ఏడాదికి వాయిదా పడుతుందా అన్నది ప్రస్తుతానికి ఊహాగానమే. 2026లోపు జనగణన జరుగుతుందనే భావనతో తరువాత జరిగే పునర్విభజన ప్రకారం 2029లోక్‌ సభ ఎన్నికలు, గడువు ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు 33శాతం కేటాయించాల్సి ఉంటుందని అందువలన 2029లో అమలు జరుగుతాయని కొందరు భాష్యం చెబుతున్నారు. ఇక పార్లమెంటు ఆమోదించిన 84వ రాజ్యాంగ సవరణ ప్రకారం 2026 తరువాత జరిగే పునర్విభజన ప్రక్రియకు ఆ తరువాత జరిగే అంటే 2031లో జరిగే జనగణన ప్రాతిపదికన జరగాల్సి ఉంటుంది. 2021లో జరగాల్సిన జనగణన 2024 లేదా 2025లో జరిగితే పదేండ్లు గడవకుండానే మరోగణన 2031లో జరుపుతారా లేక పదేండ్లు అంటే 2034 లేదా 2035లో జరుపుతారా అన్నది తెలియదు. ఒక వేళ అదే జరిగితే ఆ తరువాతే రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయి. అందుకే కపిల్‌ సిబల్‌ వంటి న్యాయకోవిదులు 2034కు ముందు అమల్లోకి వచ్చే అవకాశం లేదని చెప్పారు. రెండవది పునర్విభజన ప్రక్రియకు నిర్ణీత కాలవ్యవధి లేదు.


అనేక రాష్ట్రాలు కుటుంబ నియంత్రణ విధానాలను సక్రమంగా అమలు జరపకపోవటం, జనాభా ప్రాతిపదికన లోక్‌సభ సీట్లను కేటాయిస్తున్నందున ఎక్కువ సీట్లు పొందేందుకు జనాభా అదుపును పట్టించుకోవటం లేదనే అభిప్రాయం ఉంది. ఆ విషయాన్ని సూటిగా చెప్పకుండా 1976లో నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా 2000 సంవత్సరం వరకు నియోజకవర్గాలలో ఎలాంటి మార్పులు చేయకూడని నిబంధనను సవరించారు. తరువాత జనాభా స్థిరీకరణ అవుతుందనే అంచనాతో మరోసారి 84వ రాజ్యాంగసవరణ ద్వారా 2026వరకు సీట్ల సంఖ్యలో మార్పులేకుండా నిర్ణయించారు. 2002లో ఏర్పాటు చేసిన కమిషన్‌ 1991 జనాభా ప్రాతిపదికన పునర్వ్యవస్ధీకరణ చేపట్టాలని నిర్ణయించారు.కమిషన్‌ పని చేపట్టిన తరువాత 2003లో 87వ రాజ్యాంగసవరణ ద్వారా 2001జనాభా ప్రాతిపదికను నిర్ణయించటంతో తిరిగి నూతన ప్రక్రియను చేపట్టాల్సి వచ్చింది, 2008వరకు పూర్తి కాలేదు. జమ్మూ-కాశ్మీర్‌లో జనగణన జరగలేదు గనుక దీన్నుంచి మినహాయించారు, అసోం, అరుణాచల్‌ ప్రదేశ్‌, నాగాలాండ్‌ జనాభా లెక్కల్లో తేడాలు ఉన్నందున కోర్టు వివాదాల కారణంగా అక్కడ జరగలేదు. 2009 సాధారణ ఎన్నికల నాటికి 543కు గాను 499చోట్ల పునర్వ్యస్థీకరణ జరిగింది. పన్ను ఆదాయ పంపిణీకి పదిహేనవ ఆర్థిక సంఘం ఎంచుకున్న జనాభా ప్రాతిపదికతో ఎక్కువ మొత్తాలను జమ చేస్తున్న దక్షిణాది రాష్ట్రాలు తక్కువ మొత్తాలను పొందుతూ వివక్షకు గురవుతున్నాయి.అంతకు ముందు 1971 జనాభా ప్రాతికగా ఉన్న కేటాయింపులను 2011కు మార్చటంతో పెద్ద తేడా వచ్చింది. దేశ జనాభాలో 18శాతం ఉన్న రాష్ట్రాలు జిడిపిలో 35శాతం సమకూర్చుతున్నాయి. రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించే వారు రాష్ట్రాలకు ప్రతినిధులుగా ఉండాలన్నది రాజ్యాంగ స్ఫూర్తి. కానీ 2003లో చేసిన సవరణతో ఎవరు ఎక్కడి నుంచైనా ప్రాతినిధ్యం వహించవచ్చు. అలాంటి వారు ఆ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తారా ? అక్కడి సమస్యలను పట్టించుకుంటారా ? వచ్చే పునర్విభజనలో పాత జనాభా పద్దతినే ఆమోదిస్తే దక్షిణాది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం తగ్గటం ఖాయం.

పాత విధానాన్ని అనుసరిస్తే పునర్యవస్థీకరణ తరువాత ఇప్పుడున్న 543 సీట్లు( ఇద్దరు ఆంగ్లోఇండియన్‌ల నామినేషన్‌ రద్దు చేశారు గనుక 541 ఉంటాయి) 848కి పెరుగుతాయని కొందరి జోశ్యం. మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ సూచించినట్లుగా గతంలో నిర్ణయించిన దాని కంటే జనాభా రెట్టింపైనందున సీట్ల పెరుగుదల వెయ్యి ఉండవచ్చనేది ఒక వాదన.మరో అంచనా ప్రకారం 753 ఉంటాయి. తదుపరి పునర్యవస్థీకరణ సంవత్సరాన్ని ముందే ఖరారు చేసినందున ఏ ప్రాతిపదికన జరిగేదీ కమిషన్‌ నియామక సమయంలోనే తెలుస్తుంది. దాన్ని బట్టే ఎన్ని సీట్లు అన్నది ఖరారు అవుతుంది. అప్పటి వరకు వెలువడే సంఖ్యలన్నీ ఊహాగానాలే. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 81 ప్రకారం జనాభా ప్రాతిపదికన ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు అన్నది ఖరారు కావాలి. కానీ కొన్ని రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల, కొన్ని చోట్ల తగ్గుదల కారణంగా ఆ సూత్రాన్ని ప్రాతిపదికగా తీసుకుంటే దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గుతుంది. రాజ్యాంగం ప్రారంభంలో లోక్‌సభ సీట్లు 500గా ఖరారు చేసింది. తరువాత రాష్ట్రాల పునర్విభజన, ప్రతి రాష్ట్రానికి ప్రాతినిధ్యం కల్పించాలనే ప్రాతిపదికన సీట్లను పెంచారు.1971 జనాభా ప్రాతిపదికనే ఇప్పటికీ సీట్ల సంఖ్య కొనసాగటం సహేతుకం కాదని పెరిగిన జనాభాకు అనుగుణంగా రాష్ట్రాలకు సీట్లు కేటాయించాలన్నది ఒక అభిప్రాయం.ఉదాహరణకు దాని ప్రకారం 2001 జనాభా ప్రాతిపదికన ఉత్తర ప్రదేశ్‌కు ఏడు సీట్లు పెంచాలి, తమిళనాడుకు ఏడు తగ్గించాలి, అదే 2011లెక్కల ప్రకారం ఉత్తర ప్రదేశ్‌, బీహార్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లకు 22 అదనంగా కేటాయించాలి, అదే ఆంధ్ర ప్రదేశ్‌, తెలంగాణా, కేరళ, తమిళనాడుకు 17 సీట్లు తగ్గించాలి.2021(ఎప్పుడు జరిగితే అప్పుడు) జనాభా లెక్కల ప్రకారం దక్షిణాది రాష్ట్రాల సీట్లు ఇంకా తగ్గవచ్చు.2019లో జచేసిన ఒక విశ్లేషణ ప్రకారం ఉత్తర భారత్‌కు 32 సీట్లు పెరుగుతాయి, దక్షిణ భారత్‌కు 24 తగ్గుతాయి. కుటుంబ నియంత్రణ పద్దతులను జయప్రదంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం అన్నది వినిపిస్తున్నమాట.కార్నెగీ సంస్థ విశ్లేషణ మేరకు 2031 జనాభా ప్రకారమైతే ఉత్తర ప్రదేశ్‌, బీహార్‌ రెండు రాష్ట్రాలకే 21 సీట్లు అదనంగా పెరిగితే, తమిళనాడు, కేరళకు కలిపి 16 తగ్గుతాయి. మొత్తం సీట్లు 848కి పెరిగితే ఒక్క ఉత్తర ప్రదేశ్‌కే 143, కేరళకు 20 ఉంటాయి.