Tags
Baba Ramdev, Bogus claims, love for pseudoscience, Patanjali Ayurved, saffron brigade hypocrisy, saffron nationalists, Supreme Court of India
ఎం కోటేశ్వరరావు
వివాదం తలెత్తిన ప్రతిసారీ రు.48వేల కోట్ల మార్కెట్ విలువ కలిగిన పతంజలి ఆయుర్వేద కంపెనీ ఉత్పత్తులకు పైసా ఖర్చు లేకుండా భారీ ఎత్తున ఉచిత ప్రచారం లభిస్తున్నది.మరోసారి అదే జరిగింది. ఎవరు అంగీకరించినా లేకున్నా వాస్తవమిది. సేవించిన వారికి కంపెనీ ఉత్పత్తులు ఎంత మేర ఉత్తేజమిస్తాయో తెలియదు గానీ అధినేత రామ్దేవ్ బాబా కాషాయ వేషంతో చేసే ఉపన్యాసాలు హిందూత్వ శక్తులకు స్టెరాయిడ్లలా కిక్కునిస్తున్నాయి. అందుకే వివాదం తలెత్తినపుడల్లా సామాజిక మాధ్యమంలో వారు రెచ్చిపోతున్నారు. అడ్డగోలు వాదనలతో జాతీయోన్మాదాన్ని ముందుకు తెస్తూ జనాల బుర్రలను ఖరాబు చేస్తున్నారు. అల్లోపతి(ఇంగ్లీషు మందులుగా జనానికి తెలిసినవి) ఔషధాల గురించి జనాన్ని తప్పుదారి పట్టించే వాణిజ్య ప్రకటనలు, ఆధారం లేని అంశాలను ప్రచారంలో పెడుతున్నారన్న వివాదంలో నవంబరు 21వ తేదీన సుప్రీం కోర్టు సర్వరోగ నివారిణి అని చెప్పుకుంటున్న వాటి ప్రకటనలు వెలువడకుండా చూసేందుకు పద్దతిని కనుగొనాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. అటువంటి పనులకు పాల్పడితే పతంజలి ఉత్పత్తుల మీద జరిమానా విధించాల్సి ఉంటుందని న్యాయమూర్తులు అహసనుద్దీన్, ప్రశాంత కుమార్ వ్యాఖ్యానించారు.అలాంటి ప్రకటనల జారీ నిలిపివేయాలని, వాటి గురించి మీడియాతో మాట్లాడకూడదని, పతంజలి ఉత్పత్తుల గురించి కేంద్ర ప్రభుత్వ వైఖరిని వెల్లడించాలని పేర్కొన్నారు.దీంతో మరోసారి చర్చ, ఖండన మండనలు ప్రారంభమయ్యాయి.ఈ కేసును ఫిబ్రవరి 5కు కోర్టు వాయిదా వేసింది.
పతంజలి సంస్థ అల్లోపతి వైద్యాన్ని, వైద్యులను కించపరుస్తున్నదని, తమ ఉత్పత్తులతో వ్యాధులు నయం గావటం గురించి అవాస్తవ ప్రకటనలు చేస్తున్నదని, కరోనా గురించి పుకార్ల వ్యాప్తి, వాక్సిన్ల పట్ల వైముఖ్యతను రెచ్చగొడుతున్నదని గతేడాది ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. జీవనశైలి కారణంగా తలెత్తే సమస్యలను, ఎడతెగకుండా ఉండే అస్వస్తత, జన్యుపరమైన, చర్మ వ్యాధులు, కీళ్లనొప్పులు,ఆస్మా,వెన్నెముక కండరాల బాధల వంటి వాటన్నింటినీ తమ ఉత్పత్తి శాశ్వతంగా నివారిస్తుందనే తప్పుడు ప్రచారాన్ని పతంజలి చేస్తున్నదని ఐఎంఎ ఫిర్యాదు చేసింది. దీని మీద తాజాగా సుప్రీం కోర్టు వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే రామ్దేవ్ బాబా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి నిజాలు, అవాస్తవాలను డబ్బు నిర్ణయించకూడదని, అల్లోపతి ఆసుపత్రులు, వైద్యులు ఎక్కువగా ఉండవచ్చు, వారి గళాన్ని ఎక్కువ మంది వినవచ్చు గానీ తమకు రుషుల జ్ఞానవారసత్వం ఉందని, తాము దానిలో పేదలం కాదని చెప్పుకున్నారు.యోగా, ఆయుర్వేద, ప్రకృతి వైద్యం, తమ సనాతన విలువలకు వ్యతిరేకంగా కొంత మంది అల్లోపతి వైద్యుల బృందం తప్పుడు ప్రచారం చేస్తున్నదని తమ కంపెనీ ఎలాంటి అబద్దాలు చెప్పటం లేదన్నారు.తప్పుడు ప్రచారం చేస్తున్నందున తమను సుప్రీం కోర్టు మందలించినట్లు వెలువడిన ఒక వార్తా కథనం గురించి చెబుతూ తామలాంటిదేమీ చేయటం లేదని, సుప్రీం కోర్టు అంటే గౌరవం ఉందన్నారు.తప్పుచేసినట్లు తేలితే ఏ శిక్షకైనా సిద్దమే, మేము అబద్దాలకోరులమైతే వెయ్యికోట్ల రూపాయల జరిమానాకు, మరణశిక్షకూ సిద్దమని కాదని తేలిదే మా మీద ప్రచారం చేస్తున్నవారిని శిక్షించాలన్నారు. కరోనా నివారణకు తాము తయారు చేసిన కరోనిల్ పని చేస్తుందని 2020 జూన్లో పతంజలి చేసిన ప్రకటన వివాదాన్ని రేపింది. రోగనిరోధక శక్తిని పెంచుతుందనే ఏకైక కారణంతో దానికి అనుమతి ఇచ్చాం తప్ప కరోనా నిరోధం గురించి కాదని కేంద్ర ఆయుష్ మంత్రిత్వశాఖ వివరణ ఇచ్చింది. అయినప్పటికీ దాన్ని కరోనా నిరోధ ఔషధంగా ప్రచారం చేయటంతో జనాలు ఎగబడి కొనుగోలు చేశారు. దాని సామర్ధ్యం, రక్షణ గురించి ఎలాంటి వివరాలు లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర ఆందోళన వెల్లడించింది. నకిలీ ఉత్పత్తులను అమ్ముతున్న మోసకారులుగా పేర్కొంటూ బీహార్, రాజస్థాన్లలో రామ్దేవ్ బాబా, పతంజలి సంస్థ చైర్మన్ బాలకృష్ణ మీద కేసులను దాఖలు చేశారు. ఇంత జరిగిన తరువాత కరోనిల్ ఉత్పత్తులు కొనుగోలుకు దొరుకుతున్నాయి.
యోగా చేస్తే ఎయిడ్స్ నివారణ అవుతుందని, స్వలింగ సంపర్క అలవాటును మానుకుంటారని రామ్దేవ్ బాబా చెప్పినదానికి నిజమే నిజమే అని తలలూపేవారికి కొదవలేదు.తాము ఉత్పత్తి చేసిన ” దివ్య పుత్రజీవక్ సీడ్ ”ను తీసుకుంటే పుత్రులు పుడతారని 2015 నుంచి ప్రచారం చేస్తున్నారు. దీన్ని సహజ ఔషధ మొక్కల నుంచి తయారు చేశామని, సంతానలేమి చికిత్సకు ఉపయోగపడుతుందని మార్కెటింగ్ చేస్తున్నారు. బుర్రల్లో గుంజులేని జనం దాన్ని నమ్ముతూనే ఉన్నారు. మాగీ నూడిల్స్లో సీసం శాతం నెస్లే కంపెనీ చెప్పినదానికంటే వెయ్యిరెట్లు ఎక్కువ ఉందని రుజువు కావటంతో 2015లో దాని మీద నిషేధం విధించారు. వెంటనే రామ్దేవ్ బాబా తన నూడిల్స్ను మార్కెట్లో ప్రవేశపెట్టారు. ఇక్కడ అసలు కథ ఏమిటంటే కేంద్రంలో నీకది నాకిది అనే పాలకులు అధికారంలో ఉన్నందున ఎలాంటి అనుమతులు లేకుండానే భారత ఆహార భద్రత, ప్రమాణాల ఆధారిటీ(ఎఫ్ఎస్ఎస్ఏఐ) పేరుతో ఒక లేని నంబరును ఆ ఉత్పత్తి మీద ముద్రించి అమ్మి సొమ్ము చేసుకొనే అక్రమానికి పాల్పడ్డారు.దాన్ని గుర్తించిన అధారిటీ అధ్యక్షులు ఆషిష్ బహుగుణ ఆ ఉత్పత్తికి అంగీకారం, అనుమతుల్లేేవంటూ తిరస్కరించారు.కాషాయం ధరించిన వారు ఏం చేసినా చెల్లుతుందనే భరోసా కేంద్రంలో ఉన్న పెద్దలు ఇవ్వకుండా ఇలాంటి అక్రమానికి పాల్పడతారని అనుకోగలమా ? తరువాత 2017లో ఆయుర్వేద ఉసిరికాయ రసం పేరుతో మార్కెటింగ్ ప్రారంభించారు. అది తాగేందుకు పనికిరాదని ప్రభుత్వ ప్రయోగశాల ప్రకటించటంతో కేంద్ర ప్రభుత్వం ఆ ఉత్పత్తిని పక్కన పెట్టినప్పటికీ ఇప్పుడు కూడా దాన్ని విక్రయిస్తున్నట్లు చెబుతున్నారు.తాజాగా ఒక రకపు చేప ఎముకల పొడితో కూడిన దివ్య దంత మంజన్ పేరుతో పండ్లుతోముకొనే పేస్టును మార్కెట్ చేయటంపై ఒక లాయర్ ఆ సంస్థకు నోటీసులు ఇచ్చారు. అది శాఖాహార పదార్ధాలతో తయారు చేసిందని నమ్మకం కలిగించేందుకు ఆకుపచ్చ గుర్తువేసి మరీ అమ్ముతున్నారు. వినియోగదారుల హక్కులను ఉల్లంఘించటమే అన్నది అభ్యంతరం.లాయర్ సాషా జైన్ పంపిన నోటీసులో తమ సామాజిక తరగతి, ఇతర శాఖాహారుల మీద జరిపిన దాడిగా ఆమె అభివర్ణించారు.
అల్లోపతి వైద్యులపై కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని, కరోనా మీద చేసి వ్యాఖ్యలపై తన మీద పాట్నా, రాయపూర్లలో నమోదైన కేసులను ఎత్తివేయాలని లేదా ఢిల్లీలో విచారించాలని రామదేవ్బాబా సుప్రీం కోర్టును కోరారు. అక్టోబరు నెలలో దీని మీద న్యాయమూర్తులు ఏఎస్ బోపన్న, ఎంఎ సుందరేష్లతో కూడిన బెంచ్ రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర ప్రభుత్వానికి, ఇండియన్ మెడికల్ అసోసియేషన్కు నోటీసులు జారీ చేసింది. విద్వేష పూరిత ప్రసంగం కేసులో దర్యాప్తు అధికారి ముందుకు అక్టోబరు ఐదవ తేదీన రావాలని రాజస్థాన్ హైకోర్టు సెప్టెంబరులో ఆదేశించింది. దాని మీద గతంలో ఇచ్చిన మధ్యంతర స్టే ఉత్తరువులను అక్టోబరు 16 వరకు పొడిగించింది. అప్పటి వరకు అరెస్టు చేయరాదని ఆదేశించింది. రాజస్థాన్లోని బార్మర్లో ఫిబ్రవరి రెండవ తేదీన ఒక మతపరమైన కార్యక్రమంలో రామ్దేవ్ బాబా మాట్లాడుతూ ముస్లిం వ్యతిరేక వ్యాఖ్యలు చేసినట్లు కేసు నమోదు చేశారు. ముస్లింలు ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్నారని, హిందూ మహిళలను అపహరిస్తున్నారంటూ మాట్లాడిన అంశాలతో కూడిన వీడియోను సమర్పిస్తూ పాథైఖాన్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదైంది. తమ ఆయుర్వేద ఔషధాలు సర్వరోగ నివారిణి అని ప్రచారం చేసుకుంటున్న పతంజలి కంపెనీ అధికారి బాలకృష్ణ 2019 అగస్టులో 23న తనకు తల తిరుగుతోందని, గుండెలో నొప్పి ఉందంటూ రిషికేష్లోని ఆలిండియా మెడికల్ సైన్సెస్ ఆసుపత్రిలో చేరారు.తొలుత హరిద్వార్లోని ఒక ఆసుపత్రికి తీసుకుపోగా వారు ఎయిమ్స్కు పంపారు.ఉల్లి-హరిదాసు కథ తెలిసిందే. తమదాకా వస్తే గాని అసలు సంగతి వెల్లడి కాదంటారు ఇందుకే.
ఇలాంటి వివాదాస్పద వ్యక్తులు, శాస్త్రీయత లేని వారి ఉత్పత్తుల గురించి సామాజిక మాధ్యమాల్లో కొందరు కుహనా దేశభక్తులు రెచ్చిపోతున్నారు. అదానీ కంపెనీ అక్రమాలపై హిండెన్ బర్గ్ చేసిన ఆరోపణల సందర్భంగా కూడా ఇదే జరిగింది. దేశభక్తుడైన వాణిజ్య, పారిశ్రామికవేత్త మీద దేశద్రోహులు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఇది దేశం మీద జరుగుతున్నదాడే అన్నారు. పతంజలి వివాదం గురించి వారు చేస్తున్న కొన్ని వాదనల తీరు తెన్నులు చూద్దాం.
” 100 సంవత్సరాలుగా సినిమా యాక్టర్స్ను చూపించి లక్స్ వాడితే తెల్లబడతాం అంటే ఏం ప్రశ్నించకుండా ఎగబడి కొన్నది మనమే కదా? ”
భావజాలం, మతం, సనాతనం, ఆచారం పేరు ఏది పెట్టినా తరతరాలుగా అసలు మన జనాన్ని ప్రశ్నించకుండా, మెదళ్లను ఎదగకుండా పనికిరాకుండా చేసిన ప్రబుద్దుల గురించి ముందుగా ఆలోచించాలి. ఎందుకు అని ఎవరూ ప్రశ్నించకూడదు. నేర్పకున్నా చూసి నేర్చుకోవటం కూడా అపరాధమే. అర్జునుడి కంటే గొప్ప విలుకాడిగా తయారైన గిరిజన ఏకలవ్యుడి కుడిచేతి బొటనవేలిని ద్రోణుడు గురుదక్షిణగా అడిగి అసలు విల్లుపట్టకుండానే చేశాడు కదా ! నిజమే, లక్స్ గురించి అడగలేదు అని ఎద్దేవా చేస్తున్నవారు పతంజలి ” సౌందర్య ” బ్రాండ్ సబ్బు కూడా అలాంటిదే అని ఎందుకు చెప్పటం లేదు. గుడ్డిగా కొనేవారున్నారు గనుకనే సొమ్ము చేసుకుంటున్నారు.లక్స్ వంటి వాటిని చూసే కదా రామ్దేవ్ సంపాదనకు దిగింది.
” కాంప్లాన్ తాగండి జిరాఫీ అంత పొడుగు అవ్వండీ అంటే ఏనాడూ ప్రశ్నించని మనం మన ఆయుర్వేదిక్ ఉత్పత్తులపై మాత్రం నానా యాగీ చేస్తాం. కోర్టులూ అంతే. ”
ప్రశ్నించవద్దని ఎవరు వద్దన్నారు. స్వదేశీ జాగరణ మంచ్ కార్యకర్తలు, ఈ ప్రశ్నలు వేసేవారు ఏ గుడ్డి గుర్రాలకు పండ్లుతోముతున్నట్లు ? కోర్టులూ అంతే అంటే ఎవరైనా కోర్టుకు వెళితేనే కదా అవి తమ పరిధి మేరకు జోక్యం చేసుకొనేది.తప్పుడు సమాచారం ఇచ్చి వినియోగదారులను మోసం చేస్తున్న కంపెనీలు ఏవైనా ప్రశ్నించాల్సిందే, కోర్టులకు లాగాల్సిందే. ఆయుర్వేదంతో సహా పొడవును పెంచే ఉత్పత్తులేవీ ప్రపంచంలో లేవు.
” తప్పు ఏం ఉంది ఆయన మార్కెటింగ్ చేసుకుని సంపాదించింది దేశంలోనే ఉంటోంది కదా లీవర్ కంపనీ నెస్లే కంపెనీల వాళ్ళ లాగా విదేశాలకు పట్టుకుపోవడం లేదు కదా? ”
ఈ ప్రశ్న వేసేవారు విదేశాలకు పట్టుకుపోయే కంపెనీల మీద చర్యలు తీసుకోవటానికి అడ్డుపడుతున్నదెవరో చెప్పాలి. పతంజలి సంపాదించిందంతా దేశంలోనే ఉంటే ఒరిగేదేమిటి ? జన సంక్షేమానికేమీ ఖర్చు పెట్టటం లేదుగా ! దేశభక్త అదానీ అని చెప్పిన వారు విదేశాల్లో అతని సూట్కేసు కంపెనీల గురించి ఎందుకు చెప్పరు. ఇక్కడ సంపాదించిన సొమ్మును అడ్డంగా తరలించి ఆ సొమ్మునే తిరిగి విదేశీ పెట్టుబడుల పేరుతో తీసుకువచ్చి రాయితీలు భారీగా పొందుతున్న పెద్దల సంగతి తెలియందెవరికి ? గతంలో ఉన్న కాంగ్రెస్ పాలకులు, దేశం కోసం, ధర్మం కోసమే అంతా అంటున్న ప్రస్తుత కేంద్ర ప్రభుత్వమే విదేశాలకు తరలింపుకు అవకాశం కలిగిస్తోంది.
”అన్ని మందుల కంపెనీలు, అన్ని కాస్మెటిక్ కంపెనీలు అబద్ద ప్రకటనలతోనే, డాక్టర్లకు కోట్లలో మూడుపులు ఇస్తూ వంద సంవత్సరాలుగా వ్యాపారం చేస్తున్నాయి కదా? ”
నేను తినను ఇతరులను తిననివ్వను అని చెప్పిన నరేంద్రమోడీకీ ఈ విషయాలు తెలిసినా ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు. అలాంటి పనులు ఎవరు చేసినా అక్రమమే. వాటి సరసన పతంజలి కూడా చేరింది. తన ఉత్పత్తుల మార్కెటింగ్కు పతంజలి ఏమీ ఇవ్వకుండానే వ్యాపారులు అమ్మిపెడుతున్నారా ? అల్లోపతి వైద్యులే డబ్బుతీసుకుంటున్నారా, ఆయుర్వేద వైద్యులకు డబ్బు చేదా ! మనవాడని చెప్పి సుత్తితో కొట్టించుకుంటే తలపగలదా ! మెదడు చితకదా !! చితికితే ఆయుర్వేదంతో కుట్లు వేస్తారా ?
”వాడితే తెల్లగా అయిపోతారు అనే ఫెయిర్ అండ్ లవ్లీ ని ప్రశ్నించం. వాడి మార్కెటింగ్ మోసాన్ని హాయిగా ఎంజారు చేస్తాం.”
గర్భ సంస్కారం పేరుతో బలశాలులైన పక్కాహిందూ పిల్లల్ని పుట్టిస్తామని చెబుతున్న బాపతు గురించి లొట్టలేసుకుంటూ చెప్పుకుంటాం. తమ ” దివ్యపుత్రజీవక్ సీడ్ ”తో మగపిల్లలను పుట్టిస్తామంటే ఎలా అని రామ్దేవ్బాబాను ప్రశ్నించం ! పతంజలి ” సౌందర్య స్వర్ణ క్రాంతి క్రీమ్” కు ఫెయిర్ అండ్ లవ్లీ క్రీమ్కు తేడా ఏమిటన్న ప్రశ్నే మన మెదళ్లకు తట్టదు. ప్రతి వాడి మోసాన్ని, వేషాన్ని ప్రశ్నిద్దాం !
” మరి ఒక్క దేశీయ కంపెనీలపై మాత్రమే ఈ దాడి దేనికి? ”
ఏ కంపెనీ అయినా మోసానికి, జనాన్ని తప్పుదారి పట్టిస్తే ఎవరైనా ప్రశ్నిస్తారు. ప్రశ్నించటాన్నే దాడి అని వర్ణించటం ప్రమాదకరపోకడ. ఇప్పుడు దేశంలో కేంద్ర ప్రభుత్వ విధానాలను ప్రశ్నించిన వారిని ఎదిరించిన వారిని దేశద్రోహులుగా చిత్రిస్తున్న పూర్వరంగంలో పతంజలిని కాషాయ భక్తులు వెనకేసుకురావటం విశేషమేమీ కాదు.
” మన కళ్లను మనమే ఎలా పొడిపించుకోవచ్చో ఎంఎన్సిలకు ఉగ్గుతో అబ్బిన విద్య.తెల్ల తొక్క వాడు ఏది చెప్పినా అది మనకు వేదమే. వెధవ దేశీయ నల్లవాడు ఏది చెప్పినా ఎలా ఎదిగినా తప్పే. ”
ఏ రంగువాడు చెప్పాడన్నది కాడు, ఏం చెప్పాడన్నది, ఎవడు ఏం చేశాడన్నది ముఖ్యం. మన వారిలోనే తెల్లవాడిని ఎదిరించే క్రమంలో ప్రాణార్పించిన దేశభక్తులను చూశాం. అండమాన్ జైల్లో పెట్టగానే పిరికిబారి బయటపడేస్తే సేవ చేసుకుంటా అని ప్రేమలేఖలు రాసి తనను తానే ”వీర ” అని రాసుకున్న దొంగదేశభక్తుడి గురించీ తెలిసిందే. చిన చేపను పెద చేప మింగినట్లుగా దేశం మారకుండా చూసేందుకు 1969లో గుత్త సంస్థల పరిమిత వాణిజ్య చట్టాన్ని(ఎంఆర్టిపి) తెచ్చారు. దాన్ని2002 ఎన్డిఏ పాలకులు పోటీ చట్టం తెచ్చి చెత్తబుట్టలో పడేశారు. పోటీ పెరిగినందున జనానికి జరిగిన మేలేమిటి ? ప్రతిదీ దేశీయమే అని చెప్పేవారు అదే తెల్ల విదేశీ కంపెనీలు, పెట్టుబడుల కోసం ఎందుకు వెంపర్లాడుతున్నట్లు ?
” ప్రపంచ సంస్ధ లతో పోటీ పడే పెద్ద ఎంఎన్సిలు దేశంలో 70 సం. లుగా ఎందుకు తయారు కాలేదు అంటే మన ఈ మనస్తత్వమే.. ఆలోచన విధానమే కారణం.”
ప్రపంచ ఎంఎన్సిలు ఇతర దేశాల జనాన్ని కొల్లగొట్టి బలిశాయి. అందుకు ఆ దేశాల పాలకులు ప్రపంచమంతటినీ వలసలుగా చేసుకున్నారు. ఇప్పుడు అలాంటి అవకాశం లేదు గనుక మనవంటి దేశాల మార్కెట్లను ఆక్రమిస్తున్నాయి. మనం కూడా ఇతర దేశాలను ఆక్రమించి ఉంటే ఎంఎన్సిలు వచ్చి ఉండేవి. మనం తక్కువ తినటం లేదు. అదానీని మరింత పెద్ద శక్తిగా మార్చటానికి శ్రీలంకలో విద్యుత్ కేంద్రాన్ని అప్పగించమని నరేంద్రమోడీ స్వయంగా వత్తిడి చేసినట్లు వెల్లడైన సంగతి తెలిసిందే. అంబానీ రిలయన్స్ను మరింత బలపరచటానికే కదా అమెజాన్ కంపెనీని మోడీ అడ్డుకుంటున్నది.
”స్వతంత్ర పోరాటం చేశాం, దేశభక్తి అని చెప్పి గత 75 సం. లలో ఎంత మంది కాంగ్రెస్ నేతలు వేల కోట్లకు అధిపతులు అయ్యారు?”
అవును, ఆ పేరుతో కొంత మంది సంపాదించుకున్నారు, ప్రభుత్వ రంగాన్ని కూడా ఏర్పాటు చేశారు. మేమే అసలైన దేశభక్తులం అని చెబుతున్నవారు దేశం కోసం-ధర్మం కోసం అనే పేరుతో కొత్త పెట్టుబడులేవీ పెట్టకుండా గతంలో సమకూర్చిన ప్రభుత్వ రంగ ఆస్తులన్నింటినీ అయినకాడికి తెగనమ్మేస్తున్నారు. కావాలని ఎగవేసిన వారికి లక్షల కోట్ల బాంకు రుణాలను రద్దు చేశారు. వారికి 75 ఏండ్లు అవకాశం ఇచ్చాం, వీరికీ మరో 75 ఏండ్లు అవకాశమిద్దామా ? ఎలాంటి శషభిషలు లేకుండా మన కళ్ల ముందే దేశాన్నే తెగనమ్మేస్తారు !!