• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: billionaires

ఆక్స్‌ఫామ్‌ 2024 నివేదిక : కనీవినీ ఎరుగని అసమానతల ప్రపంచం !

25 Thursday Jan 2024

Posted by raomk in Africa, Current Affairs, Economics, Europe, History, imperialism, INTERNATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

Berni sanders, billionaires, Davos, inequality, Jeff Bezos, Oxfam 2024, wealth inequality, WEF


ఎం కోటేశ్వరరావు


”ఇక్కడ తిరుగులేని ఆర్థిక వాస్తవం ఉంది. దాన్ని మనం తప్పనిసరిగా ఎదుర్కోవాల్సిందే. ఇంత ఆదాయ, సంపద అసమానతను, సంపదల కేంద్రీకణను చరిత్ర చూడలేదు ” అమెరికా డెమోక్రటిక్‌ సోషలిస్టు బెర్నీ శాండర్స్‌ ఆక్స్‌ఫామ్‌ 2024 అసమానతల నివేదికకు రాసిన ముందు మాటలో చెప్పిన మాటలివి. దవోస్‌ ప్రపంచ ఆర్థికవేదిక 54వ వార్షిక సమావేశాల సందర్భంగా దీన్ని విడుదల చేశారు. దీనిలో పేర్కొన్న వివరాలు కొందరికి నమ్మశక్యం కానంతగా ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. అమెరికా సమాజంలో దిగువన ఉన్న సగం మంది కంటే ముగ్గురు ఎక్కువ సంపదలను కలిగి ఉన్నారు. అరవైశాతం మంది కార్మికులు చాలీచాలని వేతనాలతో జీవిస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానం కారణంగా కార్మికుల ఉత్పాదకత భారీ ఎత్తున పెరిగినప్పటికీ యాభై సంవత్సరాల నాటి కంటే అమెరికా కార్మికుల సగటు వేతనాలు నేడు తక్కువగా ఉన్నాయని శాండర్స్‌ పేర్కొన్నాడు. ఆక్స్‌ఫామ్‌ చెప్పినట్లు ఇది ఒక్క అమెరికా సమస్య మాత్రమే కాదు అన్నాడు.2020 తరువాత ఐదు వందల కోట్ల మంది జనం పేదలుగా మారితే ఐదుగురు కుబేరుల సంపద రెండు రెట్లు పెరిగింది. ఇది ప్రపంచానికి చెడువార్త అన్నాడు. రాబడి, సంపదల అసమానతల తీవ్రతకు ఒక మచ్చుతునక అమెజాన్‌ సంస్థ అధిపతి జెఫ్‌ బెజోస్‌ ఉదంతం. అతగాడు ప్రపంచ కుబేరుల్లో ఒకడు. సంపద విలువ 167.4 బిలియన్‌ డాలర్లు.దీనిలో 2020 తరువాత పెరిగిన మొత్తమే 32.7బి.డాలర్లు ఉంది.అందుకే దాన్ని ఏం చేయాలో తోచక 550 కోట్ల డాలర్లు ఖర్చుచేసి తన కంపెనీ తయారు చేసిన రాకెట్లో ఆకాశపు అంచులదాకా వెళ్లి వచ్చాడు. ఆహా ఎంత అదృష్టం అనుకున్నాం తప్ప ఆ సొమ్ముతో ఎంతో మంది పేదలకు విద్య, వైద్య సౌకర్యాలు కల్పించవచ్చని ఆలోచించలేకపోయాం. ఆర్టీసి బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ వీలు కల్పిస్తున్న ప్రభుత్వాలను విమర్శించే వారు అమెజాన్‌ అధిపతి పది నిమిషాల పది సెకండ్ల పాటు అంతరిక్షంలో విహరించటానికి అతగాడు చేసిన నలభై అయిదు వేల కోట్ల రూపాయలతో ఒక ఏడాది పాటు దేశమంతటా మహిళలకు ఆర్టీసీల్లో ఉచిత ప్రయాణం కల్పించవచ్చు. తన కంపెనీలో యూనియన్‌ ఏర్పాటు చేసుకోవటాన్ని అడుగడుగునా అడ్డుకుంటున్న ఆ ధనమదాంధుడిని ఎప్పుడైనా నిరసించారా ? తమ కంపెనీ హౌల్‌ ఫుడ్స్‌ ద్వారా విక్రయించే రొయ్యలను శుద్ది చేసే అతగాడి ఫ్యాక్టరీలో పనిచేసే మహిళలను విశ్రాంతికి, చివరికి పానీయం కూడా తాగేందుకు సమయం ఇవ్వని పెద్దమనిషని ఎంతమందికి తెలుసు ?


ఈ ప్రపంచం కొద్ది మందికి భూతల స్వర్గం అయితే అత్యధికులకు భూతాల నిలయం.2020 నాటికి ఉన్న సంపదతో పోలిస్తే బిలియనీర్లు మూడు సంవత్సరాల్లో 34శాతం లేదా 3.3లక్షల కోట్ల డాలర్ల మేర పెంచుకున్నారు. ద్రవ్యోల్బణం వీరికి మూడు రెట్ల సంపదను పెంచింది.దీన్ని మరోవిధంగా చెప్పాలంటే ఆ మేరకు సామాన్యుల జేబుల నుంచి మాయమైంది. సంపద అంతా జనాభాలో కేవలం 21శాతం మంది ఉండే ధనికదేశాల్లోనే కేంద్రీకృతమైంది.ప్రయివేటు సంపదల్లో 69శాతం, ప్రపంచ బిలియనీర్లలో 74శాతం మంది ఇక్కడే ఉన్నారు. ద్రవ్య సంబంధ ఆస్తులలో ప్రపంచంలోని ఒకశాతం మంది వద్ద 43శాతం, ఐరోపాలో 47, ఆసియాలో 50శాతం ఉన్నాయి. 1995-2015 మధ్య కాలంలో 60 ఫార్మాకంపెనీలు పదిగా మారాయి. కేవలం రెండు అంతర్జాతీయ కంపెనీలు ప్రపంచ విత్తన మార్కెట్‌లో 40శాతం వాటా కలిగి ఉన్నాయి.నాలుగు కంపెనీలు ప్రపంచ పురుగుమందుల మార్కెట్‌లో 62శాతం వాటా కలిగి ఉన్నాయి. ఆన్‌లైన్‌ ప్రకటనల్లో మూడువంతుల ఖర్చు ఫేస్‌బుక్‌, ఆల్ఫాబెట్‌, అమెజాన్‌ కంపెనీలకే పోతోంది.వెతుకులాటలో 90శాతం గూగుల్‌ ద్వారానే జరుగుతోంది. ఎకౌంటింగ్‌ మార్కెట్‌లో 74శాతం నాలుగు కంపెనీలదే. గుత్తాధిపత్యం పెరుగుతున్నదని, అది అసమానతలకు దారి తీస్తున్నదని ఐఎంఎఫ్‌ వంటి సంస్థలు అంగీకరించినా నివారణకు ఎలాంటి చర్యలూ తీసుకోవటం లేదు.ప్రపంచంలో నిజవేతనాలు తగ్గుతున్నట్లు, దీంతో అసమానతలు పెరుగుతున్నట్లు ప్రపంచ కార్మిక సంస్థ(ఐఎల్‌ఓ) పేర్కొన్నది. ద్రవ్యోల్బణానికి అనుగుణంగా వేతనాలు పెరగని కారణంగా గడచిన రెండు సంవత్సరాల్లో 79.1 కోట్ల మంది కార్మికులు 1.5లక్షల కోట్ల డాలర్లు నష్టపోయినట్లు పేర్కొన్నది. ఉమ్మడి రాష్ట్రంలో సవరించటం తప్ప తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌ రెండుగా విడివడిన పది సంవత్సరాల్లో ఒక్కసారి కూడా కనీసవేతనాలను సవరించకపోవటం లేదా ముసాయిదా పేరుతో అడ్డుకోవటం తెలిసిందే.ప్రపంచమంతటా ఇదే వైఖరి.


విద్య, వైద్యం వంటి సేవలను వస్తువులుగా మార్చి వాటిని ప్రభుత్వం రంగం నుంచి తప్పించి ప్రయివేటు కార్పొరేట్‌లు స్వంతం చేసుకొని లాభాలు దండుకోవటం కూడా అసమానతలకు దారితీస్తున్నది. కాలుష్యాల నిరోధ చర్యలు తీసుకోకుండా గతంలో లబ్ది పొందిన కార్పొరేట్లే ఇప్పుడు వాటి నివారణ పేరుతో ప్రభుత్వాల నుంచి పెద్ద ఎత్తున రాయితీలు, సబ్సిడీలు పొందుతున్నాయి.పేద, మధ్య తరగతి దేశాలు రుణభారంతో సతమతం కావటంతో పాటు తీవ్ర అసమానతలు పెరుగుతున్నాయి. ప్రపంచ మొత్తం పేదల్లో 57శాతం(240 కోట్ల) మంది పేద దేశాల్లో ఉన్నారు. జీవన పరిస్థితి దిగజారటంతో ప్రపంచమంతటా సమ్మెలు, ఆందోళనలు పెరుగుతున్నాయి. అమెజాన్‌ కంపెనీలో పని చేస్తున్నవారు 30దేశాల్లో 2022లో ఆందోళనలు చేశారు.జీవన వ్యయాల పెరుగుదలకు నిరసనగా 2023లో 122 దేశాల్లో ఆందోళనలు జరిగాయి. కరోనా తరువాత కోట్లాది మంది పౌరుల పరిస్థితి పూర్వపు స్థితికి చేరుకోలేదు. 2017-2020తో పోలిస్తే ప్రపంచ అతి పెద్ద కార్పొరేట్‌ సంస్థలు 2021,2022లో 89శాతం లాభాలను పెంచుకున్నాయి. 2023తొలి ఆరునెలల వివరాలను పరిశీలిస్తే గత రికార్డు లాభాల చరిత్రను బద్దలుకొడుతున్నట్లు కనిపిస్తున్నది. చమురు, విలాసవస్తువులు, విత్త సంబంధ కంపెనీలకు లాభాలు విపరీతంగా పెరిగాయి. ప్రపంచంలోని 0.001శాతం కార్పొరేట్లు అన్ని కార్పొరేట్ల లాభాల్లో మూడోవంతు పొందాయంటే సంపదల కేంద్రీకరణ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అమెరికా కంపెనీల్లో 89శాతం వాటాలు తెల్లవారి చేతుల్లో ఉండగా ఆఫ్రికన్లకు 1.1,హిస్పానిక్‌లకు 0.5శాతం ఉన్నాయి. పదకొండుశాతం మంది ప్రపంచ బిలియనీర్లు అధికారంలో లేదా రాజకీయ నేతలుగా ఉన్నారు.గడచిన నాలుగు దశాబ్దాలకాలంలో 30 ఐరోపా దేశాలలో మూడు వేల విధానపరమైన ప్రతిపాదనలను పరిశీలించగా ధనికులు మద్దతు ఇచ్చిన వాటినే అమలు జరిపారు తప్ప పేదల వాటిని పట్టించుకోలేదు.


అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్‌) జరిపిన పరిశోధనలో కార్పొరేట్‌ శక్తుల గుత్తాధిపత్యం పెరగటం వలన అమెరికాలోని వస్తు ఉత్పాదక రంగంలో 76శాతం మంది కార్మికుల ఆదాయాలు తగ్గాయని తేలింది. ఈ సంస్థలు, కార్మికుల వేతనాలనే కాదు మార్కెట్లను అదుపు చేస్తాయి. అవసరమైన వస్తువులు, సేవలను అందుబాటులో లేకుండా చేస్తాయి. నవకల్పనలు, కొత్త సంస్థలను ఎదగనివ్వకుండా చూస్తాయి. తమ లాభాల కోసం ప్రభుత్వ సేవలను ప్రైవేటీకరించేట్లు చూస్తాయి. తమ లాభాలకు ముప్పురాకుండా ధరలను కూడా పెంచుతాయి. వీటికి ప్రభుత్వాలు ఎల్లవేళలా మద్దతు ఇస్తాయి. అందుకే కొన్ని కార్పొరేట్లు దేశాల జిడిపి కంటే ఎక్కువ సంపదలను కలిగి ఉన్నాయి. ఉదాహరణకు యాపిల్‌ కంపెనీ విలువ మూడు లక్షల కోట్ల డాలర్లనుకుంటే 2023లో మన దేశ జిడిపి 3.7లక్షల కోట్లని అంచనా. ప్రపంచంలోని ఇలాంటి ఐదు పెద్ద కంపెనీల సంపదలు మొత్తం ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా, కరీబియన్‌ దేశాల మొత్తం జిడిపి కంటే ఎక్కువ. మొత్తం బహుళజాతి కంపెనీల లాభాల్లో 1975లో పెద్ద కంపెనీల వాటా నాలుగుశాతం కాగా 2019నాటికి పద్దెనిమిది శాతానికి పెరిగింది.


ఇప్పుడు ప్రపంచాన్ని ఏలుతున్నది ద్రవ్య పెట్టుబడి అన్న సంగతి తెలిసిందే.2009 నుంచి ఈ రంగంలో ఉన్న కొన్ని కంపెనీలు ప్రస్తుతం 5.8లక్షల కోట్ల డాలర్ల ప్రైవేటు పెట్టుబడిదారుల ఆస్తులను నిర్వహిస్తున్నాయి. ఇవిగాక బ్లాక్‌ రాక్‌, స్టేట్‌స్ట్రీట్‌, వాన్‌గార్డ్‌ అనే ఫండ్స్‌ సంస్థలు 20లక్షల కోట్ల డాలర్ల మేర ద్రవ్య ఆస్తులను నిర్వహిస్తున్నాయి. ఇంత పెద్ద సంస్థలు ప్రభుత్వ విధానాలను, దేశాధినేతలను శాసించటంలో ఆశ్చర్యం ఏముంది. గుత్త సంస్థలు ప్రపంచానికి కొత్త కాదు. ఇంగ్లీష్‌ ఈస్టిండియా కంపెనీ ప్రారంభమైన 1,600 సంవత్సరం నుంచి ఎన్నిదేశాలను ఆక్రమించుకొని దోచుకున్నదీ ఎరిగిందే.వర్తమానంలో రాక్‌ఫెల్లర్‌ కంపెనీ ప్రపంచ చమురు సామ్రాజ్యం, సిసిల్‌ రోడెస్‌ ప్రపంచ వజ్రాల మార్కెట్‌ను శాసిస్తున్న సంగతీ తెలిసిందే. ఒక దశను దాటిన తరువాత ప్రజాస్వామిక రాజ్యం కంటే ప్రైవేట్‌ అధికారం పెరిగితే స్వేచ్చకు హామీ ఉండదని అమెరికా మాజీ అధ్యక్షుడు ఫ్రాంక్లిన్‌ డి రూజ్‌వెల్ట్‌ చెప్పాడు. గుత్త సంస్థలను అడ్డుకున్నందుకే అవి కుట్రచేసి మిలిటరీ తిరుగుబాటుద్వారా చిలీ కమ్యూనిస్టు నేత సాల్వెడార్‌ అలెండీని అధికారం నుంచి కూల్చివేసిన సంగతి తెలిసిందే. పదహారు వందల బడాకంపెనీల మీద ఒక సర్వే నిర్వహించగా కేవలం 0.4శాతం మాత్రమే కార్మికులకు జీవన వ్యయ వేతనం ఇస్తున్నట్లు అంగీకరించాయి.కార్మిక సంఘాలను ఏర్పాటు కానివ్వకుండా అడ్డుకోవటం, అణచివేతల కారణంగా యూనియన్లలో చేరుతున్నవారి సంఖ్య తగ్గుతోంది.ఓయిసిడి దేశాలలో 1985లో 30శాతం మంది చేరగా 2017నాటికి 17శాతానికి పడిపోయింది.


మహిళలకు జరుగుతున్న అన్యాయం, వేతనాల చెల్లింపు కూడా దారుణంగా ఉంది. మధ్య ప్రాచ్యం,ఉత్తర ఆఫ్రికాలో ఒక పురుషుడు ఎలాంటి చెల్లింపులు లేని సంరక్షణ పనిలో వారానికి ఒకటి నుంచి ఐదు గంటల వరకు ఉంటుండగా అదే మహిళలు 17 నుంచి 34గంటలు పని చేస్తున్నారు. ప్రపంచమంతటా వీరి పని విలువను నగదు రూపంలో లెక్కిస్తే ఏటా 10.8లక్షల కోట్ల డాలర్లుగా తేలింది. అధికవేతనాలు ఉన్నాయని అనుకుంటున్న ప్రపంచ టెక్నాలజీ కంపెనీల్లో చెల్లిస్తున్నదాని కంటే ఇది మూడు రెట్లు ఎక్కువ.ఐరోపా సూపర్‌ మార్కెట్లకు సరఫరా చేసే పండ్లు, ద్రాక్ష క్షేత్రాల్లో పని చేసే కోస్టారికా, దక్షిణాఫ్రికా మహిళలకు ఒక సీసా వైన్‌ విక్రయించే ధరలో కేవలం 1.2శాతమే వేతనాల రూపంలో లభిస్తుండగా సూపర్‌ మార్కెట్లకు 50శాతం పైగా దక్కుతున్నది. సంపదలు కార్పొరేట్ల వద్ద పేరుకు పోవటానికి, అసమానతలు పెరగటానికి పన్నుల తగ్గింపు కూడా ఒక ప్రధాన కారణం.ఓయిసిడి దేశాలలో 1980లో కార్పొరేట్‌ ఆదాయపన్ను 48శాతం ఉండగా 2022నాటికి 23.1శాతానికి తగ్గింది. ప్రపంచవ్యాపితంగా ఇదే ధోరణి.నూటనలభై ఒక్క దేశాలలో 111 చోట్ల 2020-2023 కాలంలో తగ్గాయి. ప్రపంచమంతటినీ చూస్తే 23 నుంచి 17శాతానికి పడిపోయాయి. విదేశాల్లో పొందిన లాభాల్లో 35శాతం ఎలాంటి పన్నులు లేని ప్రాంతాలకు చేరాయి. పన్ను విధానాలపై కార్పొరేట్ల ప్రభావానికి ఇది నిదర్శనం. ఈ మేరకు ప్రభుత్వాలకు రాబడి తగ్గటంతో సంక్షేమ కార్యక్రమాలకు కోత విధిస్తున్న కారణంగా ప్రపంచమంతటా అశాంతి పెరుగుతున్నది..

Share this:

  • Tweet
  • More
Like Loading...

అంబానీ, అదానీలకు సంపదలు- అభాగ్యులకు అప్పుల తిప్పలు !

18 Monday Oct 2021

Posted by raomk in Current Affairs, Economics, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Uncategorized

≈ Leave a comment

Tags

Ambani and Adani, billionaires, India extreme inequality, Richest Indians


ఎం కోటేశ్వరరావు


ముకేష్‌ అంబానీ తరువాత అత్యంత సంపన్నుడైన గౌతమ్‌ అదానీ త్వరలో అంబానీ స్ధానాన్ని ఆక్రమించనున్నారా ? పేదలు,మధ్యతరగతి మరింతగా దిగజారనున్నారా ? తీరు తెన్నులు ఎలా ఉన్నాయి ? ప్రస్తుతం అంబానీ రోజువారీ సంపాదన 163 కోట్లు కాగా అదానీ రాబడి 1002 కోట్లు మరి. అంబానీ ఆస్తి 7,18,000 కోట్లు కాగా అదానీ దగ్గర 5,05,000 కోట్లు. గత ఏడాదితో పోలిస్తే అంబానీ సంపద పెరుగుదల తొమ్మిది శాతం కాగా అదానీకి 261శాతం అంటే నోరెళ్లపెట్టకండి. ఇదే సమయంలో ట్రేడింగ్‌ ఎకనమిక్స్‌.కాం అనే వెబ్‌సైట్‌ సమాచారం ప్రకారం దేశంలో కనీసవేతనం గత ఐదు సంవత్సరాలుగా పెరగలేదు. మన్మోహన్‌ సింగ్‌ దుర్దినాలలో 2011-13లో రోజుకు రు. 115 కాగా మోడీ గారీ అచ్చేదిన్‌ ప్రారంభంలో 2014లో రు.137, తరువాత రెండు సంవత్సరాలు రు.160, గత ఐదు సంవత్సరాలుగా రు.176 ఉంది. ఈ ఏడాది చివరి నాటికి సగటు రోజు వారీ వేతనం రు.372.33కు, 2022లో రు.397, 2023నాటికి రు.419కి పెరగవచ్చని ఎకనోమెట్రిక్‌ పద్దతిలో అంచనా వేసింది. అంబానీ, అదానీల ఒకేడాది పెరుగుదలకు, అభాగ్యుల ఎనిమిదేండ్ల పెరుగుదలకు ఎంత తేడా ? అచ్చేదిన్‌ ఎవరికి చచ్చేరోజులు ఎవరికి ?


పురుషులందు పుణ్య పురుషులు వేరు (మహిళలకూ ఇదే వర్తిస్తుంది) అన్నట్లుగా పరిశోధకులందు జనపరిశోధకులు ధనశోధకులు వేరు అని నోబెల్‌ బహుమతుల ప్రకటన వెల్లడించింది. ఎందుకంటే ఆ రాణీ ప్రేమపురాణం, ఈ కైఫీయత్‌కైన ఖర్చుల గురించి గాక కార్మికుల కనీసవేతనాలు, ఉపాధి గురించి పరిశోధన గురించి ఈ రోజుల్లో ఎవరుంటారు ! ఆ అంశాన్ని ఎంచుకున్న ముగ్గురు ఉత్తమ పరిశోధకులకు నోబెల్‌ బహుమతి రావటం చిన్న విషయం కాదు కదా ! గుయిడో ఇంబెన్స్‌, జాషువా ఆగెస్‌, డేవిడ్‌ కార్డ్‌ ముగ్గురికీ కలిపి బహుమతి ఇచ్చారు. కార్మిక మార్కెట్‌ మీద కనీసవేతనాలు, విద్య, వలసల ప్రభావం ఎలా ఉంటుందనే అంశపై పరిశోధన జరిపారు.కనీసవేతనాలు పెంచితే కుర్ర కార్మికులు, నైపుణ్యం లేని వారికి ఉపాధి అవకాశాలు తగ్గిపోతాయని చేసిన సూత్రీకరణలు తప్పని నిరూపించారు.వేతనాలు పెంచితే కార్మిక లభ్యత పెరుగుతుందని కూడా తేల్చారు. అన్నింటికీ మించి వేతనాలు పెంచితే కంపెనీ లాభాలు తగ్గుతాయన్నది వాస్తవం కాదని ఆమేరకు వస్తు ధరలు పెంచుతారని వెల్లడించారు. మరి కేంద్ర ప్రభుత్వం లేదా మెజారిటీ రాష్ట్రాలలో అధికారంలో ఉన్న బిజెపి పాలకులు ఎవరికోసం కనీసవేతనాలను సంవత్సరాల తరబడి పెంచకుండా ఉన్నట్లు ? సంపద పంపిణీలో అసమానతలను పెంచే చర్య కాదా ఇది.


గౌతమ్‌ అదానీ సంపద ఒక్క ఏడాదిలో రు.1.04 నుంచి ఏకంగా రు.5.05లక్షల కోట్లకు ఎదిగింది. ఇదంతా కష్టపడితే పెరిగిందేనా ? సాధారణ కార్మికుడి కంటే అదనంగా రోజుకు ఎన్ని గంటలు శ్రమపడి ఉంటారు ? ఇక్కడ కొంత మందికి సంపద పెరిగిందని ఏడవటం కాదు, ఎందరికో ఎందుకు పెరగటం లేదు అన్న ఆవేదనతో ఈ ప్రశ్న.కరోనా కాలంలో కొందరి సంపదలు పెరిగితే ఎందరో దిగజారారు ఎందుకని ? ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌ హరూన్‌ ఇండియా రిచ్‌ లిస్ట్‌ 2021 వెల్లడించిన వివరాల మేరకు ఏడాది కాలంలో కేవలం అదానీ మాత్రమే ఒక లక్ష విలువగల కంపెనీలు ఐదింటిని ఏర్పాటు చేశారు. సోదరుడు వినోద్‌ శాంతిలాల్‌ అదానీ కూడా లక్ష కోట్ల సంపదదాటిని పది మందిలో ఎనిమిదవ స్దానంలో ఉన్నారు. అతగాడి రోజు వారీ సంపాదన రు.245 కోట్లు. ఏడాది కాలంలో ఏకంగా పన్నెండు స్ధానాలు ఎగబాకి రు.1.31లక్షల కోట్లకు అధిపతి అయ్యారు. ఏడాది కాలంలో ఎవరెవరి సంపాదన ఎలా పెరిగిందో పట్టికలో చూడవచ్చు.


కరోనా కాటుకు బలై ప్రాణాలు కోల్పోయిన వారెందరో అయితే బతికి ఆస్తులు అమ్ముకొని అప్పులపాలైన వారు అంతకంటే కొన్ని రెట్లు ఎక్కువగా ఉన్నారు. ఈ సమయంలోనే 58 మంది బిలియనీర్లు పెరిగి 237కు చేరారు. ధనవంతుల జాబితాలో 179 మంది చేరి 1,007కు పెరిగారు, 894 మంది సంపదలు పెరిగితే 113 మందికి తగ్గాయట. పాపం కదా ! ఇక ధనికులు విపరీతంగా పెరిగిన రంగాలను చూస్తే ఫార్మాలో 130 మంది, పెట్రోకెమికల్స్‌లో 98 మంది ఉన్నారు. మహమ్మారులు సామాన్య జనం ప్రాణాలు తీస్తే ఔషధ కంపెనీలకు లాభాలను సమకూర్చుతాయని కరోనా నిరూపించింది. ఈ కంపెనీలకు గతేడాది రు.3,45,900 కోట్లు అదనంగా వచ్చిందట.ఇండియా రేటింగ్‌ సంస్ధ విశ్లేషణ ప్రకారం రెండువేల ఆర్ధికేతర కార్పొరేట్‌లలో వేతనాల గురించి విశ్లేషించగా 60శాతం కంపెనీల్లో గతేడాది సెప్టెంబరు, డిసెంబరు త్రైమాసికాల్లో అంతకు ముందు ఏడాదితో పోలిస్తే సిబ్బంది ఖర్చు తగ్గించారు. అంటే కుటుంబాలకు ఉపాధి, ఆదాయం తగ్గింది.పోయినవి తిరిగి వచ్చే అవకాశం లేదని ఆ సంస్ద పేర్కొన్నది. అసలే తక్కువ ఆదాయం ఆపై కరోనా కాటుతో అనేక కుటుంబాలు అంతకు ముందు చేసుకున్న పొదుపు మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. జనం బికారులు కావటానికి అదానీ, అంబానీల సంపద మరింత పెరగటానికి కారణాలను కూడా రేటింగ్‌ సంస్ద పేర్కొన్నది. పరోక్ష పన్నులు జనం మీద పెరగ్గా కార్పొరేట్లకు పన్ను తగ్గింది. 2010లో గృహస్తుల మీద పన్ను 60శాతం ఉంటే ఇప్పుడు అది 75కు పెరిగింది. ఇదే కాలంలో కార్పొరేట్‌ పన్ను తగ్గింది. అంతకు ముందు పెంచినదిగాక 2020 మార్చి-మే మాసాల మధ్య పెట్రోలు మీద రు.13, డీజిలుపై రు.16లను కేంద్రం పెంచింది. ఈ కాలంలో పీపాధర 28 డాలర్లు ఉండగా జనానికి తగ్గిందేమీ లేదు, పెరిగిన తరువాత ఆమేరకు జనం నుంచి వసూలు చేస్తున్నారు. ప్రతి రోజూ కొత్త రికార్డు నెలకొంటోంది. ఇది కుటుంబాల జేబులను గుల్ల చేస్తోంది. పోనీ అంతకు ముందు నిజవేతనాలు పెరిగాయా అంటే….ఐఎల్‌ఓ నివేదిక ప్రకారం 2015లో 2.8, 2016లో 2.6, 2017, 18లో 2.5శాతాల చొప్పున పెరిగాయి.తరువాత తగ్గాయి.కనీసవేతనం రు.176 కాగా వివిధ రాష్ట్రాల వేతనాలను విశ్లేషించినపుడు మధ్యగత వేతనం రు.269 ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది మార్చినెలలో పార్లమెంట్‌లో తెలిపింది. వేతన కోడ్‌ 2019 ప్రకారం ఐదేండ్లలోపు కనీసవేతనాలను సవరించాలని నిర్దేశించటమే గొప్పఅన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు.


ప్రధాన ఉపాధి వనరుగా ఉన్న వ్యవసాయ రంగంలో గత ఏడు సంవత్సరాల్లో ఆదాయాలు పెరిగాయా తరిగాయా అంటే పెరిగినట్లు చిత్రిస్తున్నారు.నిజం ఏమిటి ? లెక్కలతో తికమక చేస్తున్నారు. నిఖర ఆదాయం బదులు చెల్లించిన మొత్తాలనే పరిగణనలోకి తీసుకున్నారనే విమర్శ ఉంది. రికార్డు స్ధాయిలో పంటలు పండితే అది రైతాంగానికి ఆదాయం లేదా సంపద అన్నట్లు చిత్రిస్తున్నారు, గందరగోళపరుస్తున్నారు.పరిస్ధితి మదింపు సర్వే ప్రకారం 2018-19 సంవత్సరంలోసేకరించిన వివరాల ప్రకారం 2012-13 నుంచి 2018-19 కాలంలో కుటుంబంలో ఒకరు ఏడాది పాటు పొలంలో పని చేస్తే పంటల ద్వారా రు.4000కు మించి ఆదాయం వస్తే వ్యవసాయ కుటుంబంగా పరిగణిస్తారని ఎన్‌ఎస్‌ఎస్‌ పేర్కొన్నది.నాబార్డు సర్వే 2016-17లో ఆ మొత్త రు.5,000లుగా చెప్పారు. దేన్ని ప్రమాణంగా తీసుకోవాలి ? అది తేలేది కాదు వదిలేద్దాం. ప్రభుత్వలెక్కల ప్రకారం పైన పేర్కొన్న సంవత్సరాలలో వచ్చిన ఆదాయాల మార్పు తీరుతెన్నులను చూద్దాం.ఆదాయం రూపాయలు.


వనరు×××××××× 2012-13××××2018-19××××× తేడా శాతం××××35.3శాతం ద్రవ్యోల్బణంతో తేడా
వేతన ఆదాయం××× 2,071 ××× 4,063 ××××× 96.2 ×××× 60.9
పంట ఆదాయం××× 3,081 ××× 3,798 ××××× 23.3 ×××× -12
పశుపోషణఆదాయం× 763 ××× 1,582 ××××× 107.3 ×××× 72
ఇతర ఆదాయం××× 512 ××× 641 ××××× 25.2 ×××× -10.1
మొత్తం ఆదాయం××× 6,427 ××× 10,084 ××××× 56.9 ×××× 21.6
రైతు కుటుంబానికి పంట నిజ ఆదాయం ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకున్నపుడు తగ్గింది. మిగతా పశు, ఇతరంగా లేకుండా కేవలం పంటల మీదనే ఆధారపడితే నష్టం తప్ప లాభం లేదు. మొత్తంగా తీసుకున్నప్పటికీ పెరుగుదల పెద్దగా లేదన్నది స్పష్టం.గ్రామీణ సంక్షోభంలో ఇదొక ప్రధాన అంశం. ఆదాయం మాత్రమే పరిగణనలోకి తీసుకొని ఖర్చుల పెరుగుదలను విస్మరిస్తే కుదరదు కదా, అందువలన నిఖర ఆదాయం ఎంతో తేలితే అసలు బండారం బయట పడుతుంది. సర్వే జరిగిన సంవత్సరం పంటల పరిస్ధితి మెరుగ్గా ఉండవచ్చు లేదా దిగజారి కూడా ఉండవచ్చు. అందువలన ఒక ఏడాది ప్రమాణం సరైన నిర్ధారణ ఇవ్వదు.


కరోనా కల్లోలంలో ఉపాధికి దెబ్బ చెప్పుకోలేనిది, సమగ్ర సమాచారం లేదు. అసలు వలస కార్మికులెంత మందో తెలియని వాస్తవాన్ని కరోనా బయట పెట్టింది. ఉపాధి నష్టం అంచనాలు తప్ప నిర్దిష్టత లేదు.2020-21లో ఆర్ధిక వృద్ది 7.3శాతం లోటు అన్న లెక్కలను కూడా అనేక మంది అంగీకరించటం లేదు. అంతకంటే ఎక్కువ ఉండవచ్చన్నది అభిప్రాయం. అమెరికాలోని పూ పరిశోధనా సంస్ధ అంచనామేరకు 3.2కోట్ల మంది మధ్యతరగతి జనాలు ఆ వర్గీకరణ నుంచి దిగజారిపోయారు.ప్రపంచంలో వంద మంది పరిస్ధితి అలా దిగజారిందని అనుకుంటే మన వాటా 60 అని చెప్పిందంటే పరిస్ధితి ఎంతదారుణంగా ఉందో అర్ధం అవుతుంది. అయితే అసలు మధ్య తరగతి ఎందరనేది మౌలిక ప్రశ్న.మన దేశంలో పేదరికానికి తప్ప దీనికి నిర్ధిష్ట ప్రమాణం లేదు. బ్రూకింగ్‌ సంస్ధకు చెందిన హౌమీ ఖరాస్‌ నిర్వచనం ప్రకారం 2011లో 11-110 డాలర్ల మధ్య (రు. 171-1714)ఆదాయం ఉన్న 38 కోట్ల మంది 2015-22లో మధ్యతరగతిలోకి ప్రవేశిస్తారని 2019లో చెప్పాడు. ఎన్‌సిఏఆర్‌ చెప్పిందాని ప్రకారం రెండు నుంచి పదిలక్షల వార్షిక ఆదాయం ఉన్న వారు మధ్యతరగతి అని అలాంటి వారు 2010లో 15.3 కోట్ల మందని చెప్పింది.2012లో అమెరికా సంస్ద గ్లోబల్‌ డెవలప్‌మెంట్‌ పదికోట్లని చెప్పింది.2009-10లో జరిగిన ఎన్‌ఎస్‌ఎస్‌ సర్వే ప్రకారం పది కోట్లు, గత దశాబ్దిలో వివిధ సర్వేల ప్రకారం ఏడు నుంచి 60 కోట్ల మంది మధ్య ఉన్నట్లు అంచనా వేశారు.కొన్ని సర్వేలు వినిమయాన్ని బట్టి అంచనా వేశాయి. అధికారికంగా వెల్లడించని, అనధికారికంగా బయటకు వచ్చిన ఎన్‌ఎస్‌ఓ వివరాల ప్రకారం తగినంత ఉపాధి లేక గడచిన నాలుగుదశాబ్దాలలో తొలిసారిగా 2017-18లో వినిమయం తగ్గిపోయింది.2015 నుంచి పట్టణ మధ్య తరగతి తగ్గిపోగా గ్రామీణ మధ్యతరగతి గిడసబారిపోయింది. కొందరి విశ్లేషణ ప్రకారం మన దేశ మధ్యతరగతి స్దితి ధనికులకంటే పేదలకు దగ్గరగా ఉంటుంది. కరోనా కాలంలో 23 కోట్ల మంది కనీసవేతన పరిధిలోకి దిగజారినట్లు అజీమ్‌ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయ పరిశోధకులు చెప్పారు.


అలాంటి వారి పొదుపు మొత్తాలు, బ్యాంకు డిపాజిట్లు కరోనా సమయంలో ఆవిరయ్యాయి.2020 జూలై ాసెప్టెంబరుమధ్య గృహస్తుల బ్యాంకు డిపాజిట్లు జిడిపిలో 7.7శాతం ఉండగా అక్టోబరు-డిసెంబరు నాటికి మూడు శాతానికి తగ్గాయని ఆర్‌బిఐ నివేదిక చెప్పింది. కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బిఐ తీసుకున్న చర్యలు సంపద అసమానతలను మరింతగా పెంచేందుకు దోహదం చేశాయని చెబుతున్నారు. ప్రభుత్వ బాండ్లు, రుణ పత్రాల కొనుగోలు, 5.3లక్షల కోట్ల నగదును ద్రవ్య వ్యవస్దలోకి విడుదల చేశారు. ఈ మొత్తం నిజమైన ఆర్ధికరంగం బదులు స్టాక్‌మార్కెట్‌కు ఎక్కువ భాగం వెళ్లినట్లు అంచనా వేస్తున్నారు. ఆర్ధిక రంగం తిరోగమించినా, పునరుద్దరణతో నిమిత్తం లేకుండా స్టాక్‌ మార్కెట్‌ సూచీలు రికార్డులను బద్దలు కొట్టటమే దానికి నిదర్శనం. దీని గురించి ఆర్‌బిఐ ఆందోళన కూడా తెలిపింది. గృహస్తుల సంపద కరిగిపోగా కంపెనీల ఆస్తులు పెరిగాయి. ప్రభుత్వం ఇచ్చిన చౌకవడ్డీ రుణాలతో అంతకు ముందు అధికవడ్డీలకు తెచ్చిన రుణాలను తీర్చాయి తప్ప కొత్తగా పెట్టుబడులు పెట్టలేదని చెబుతున్నారు. మరోవైపు ద్రవ్యోల్బణం పెరిగింది.


దేశంలో పదిశాతంగా ఉన్న ధనికుల కొనుగోలు శక్తి పెరిగితే స్టాక్‌మార్కెట్‌, విలాసవస్తువుల మార్కెట్‌, బంగారం, వజ్రాల దిగుమతి మరింతగా పెరుగుతుంది తప్ప ఉపాధి పెరగదు.మధ్య తరగతి మరింతగా తగ్గిపోతుంది, పేదరికం, దారిద్య్రం పెరుగుతుంది. అదే 90శాతంగా ఉన్నవారి శక్తి పెరిగితే నిత్యావసర వస్తు గిరాకీ పెరిగి పరిశ్రమలు, వాణిజ్యంతో ఉద్యోగాలు పెరుగుతాయి.సంస్కరణలు ప్రారంభమైన మూడు దశాబ్దాలలో అసమానతలు మన దేశంలో మరింతగా పెరిగాయి.కరోనా వాటిని మరింత పెంచింది. ఒకశాతంగా ఉన్న ధనికుల సంపద 1990లో జాతీయ ఆదాయంలో 11శాతం ఉంటే 2019నాటికి 21కి పెరిగింది.ప్రపంచంలో 64దేశాల తీరుతెన్నులను పరిశీలించగా కరోనా కాలంలో ధనికుల ఆదాయాలు మరింతగా పెరగ్గా ఇతరులవి తగ్గాయి. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ఆదాయాలు తగ్గినట్లు వేరే చెప్పనవసరం లేదు. ఏడునెలల తరువాత 2020 అక్టోబరులో లాక్‌డౌన్‌కు ముందు ఫిబ్రవరిలో ఉన్న ఆదాయాలు కంటే 15-20శాతం తక్కువగా ఉన్నాయి. ప్రభుత్వం చెప్పే సమాచారం అసమగ్రంగా ఉండటంతో పాటు ఇటీవలి కాలంలో విస్వసనీయత కోల్పోయింది. సిఎంఐఇ 2020మే నెల అంచనా ప్రకారం అంతకు ముందు నెలలో 12.2కోట్ల ఉద్యోగాలు పోయాయి. అధికారిక అంచనాల ప్రకారం పదిహేనేండ్ల వయసుపైబడిన ఉద్యోగార్ధులు 2020 జనవరి-మార్చినెలల్లో దేశంలో 18.2కోట్ల మంది ఉన్నారు. లాక్‌డౌన్‌ కాలంలో 7కోట్ల మంది కార్మికశక్తి నుంచి తగ్గారు.ఉద్యోగార్ధులలో మహిళలు 4కోట్ల మందే ఉన్నా, ఉపాధి నుంచి తగ్గిన ఏడు కోట్లలో మూడు కోట్లు ఉన్నారంటే వారి మీద ప్రభావం ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. మరికొన్ని గణాంకాల ప్రకారం 2020 జనవరి-మార్చి నెలల్లో 16.6 కోట్ల మంది పని చేస్తుండగా తరువాత మూడు నెలల్లో వారి సంఖ్య 2.6కోట్లకు తగ్గింది. రోజువారీ కార్మికులు ఎక్కువగా ప్రభావితమయ్యారు.కోటీ 90లక్షల మందిలో 90లక్షల మందికి ఉపాధి పోయింది. నెలవారీ వేతనం ఉన్నవారు కోటి మంది తగ్గితే స్వయ ఉపాధి కలిగిన వారు 60లక్షల మందికి ఉపాధి పోయింది.

కరోనా ప్రభావం గురించి అజీమ్‌ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయం చేసిన అధ్యయనం ప్రకారం ఆదాయాల కంటే అప్పులు ఆరు రెట్లు ఎక్కువ చేశారని తేలింది. దిగువ 25శాతం జనాభాలో పేద కుటుంబాల అప్పులు నాలుగు రెట్లు, ధనికుల అప్పు 1.4రెట్లు మాత్రమే పెరిగాయి. రానున్న రోజుల్లో అసమానతలను పెంచేందుకు ఇది తోడ్పడుతుందని చెబుతున్నారు.సిఎంఐఇ విశ్లేషణ ప్రకారం 2020చివరి నాటికి ఉపాధి కరోనా ముందు స్దాయికి చేరినా ఆదాయాలు పెరగలేదు.కోటీ 50లక్షల మంది కార్మికులు పనికి దూరంగా ఉన్నారు. కరోనా రెండవ తరం ప్రభావాల గురించి ఇప్పటికీ సరైన అంచనాలు లేవు.ఎవరి పద్దతిలో వారు వేసిన అంచనాలన్నింటినీ తలకు ఎక్కించుకుంటే బుర్రలు తిరుగుతాయి. మొత్తం మీద నడుస్తున్న చరిత్రను చూస్తే రానున్న రోజుల్లో ఆదాయ, సంపదల అసమానతలు పెరుగుతాయి. పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి.


గమనిక : ఈ వ్యాసం అక్టోబరు 17 ఆదివారం నవతెలంగాణా దినపత్రిక అనుబంధం సోపతి ముఖచిత్ర కథనంగా ప్రచురితమైనది

Share this:

  • Tweet
  • More
Like Loading...

ధర్మం కంటే కాలుష్య అధర్మం నుంచి గేట్స్‌కు లాభాలు ఎక్కువ

07 Monday Dec 2015

Posted by raomk in Current Affairs, Economics, Environment, INTERNATIONAL NEWS

≈ Leave a comment

Tags

BILL GATES, billionaires, philanthropy-facts

ధర్మకర్తృత్వం-దాతల బండారం-5

ఎం కోటేశ్వరరావు

బలి ఇస్తే లంకెబిందెలు దొరుకుతాయని మోసగాళ్లు చెప్పిన మాట విని జంతువులనే కాదు ఏకంగా పిల్లలనే బలి ఇచ్చేవారిని చూస్తున్నాము. దాన ధర్మాలు చేస్తే పుణ్యం వస్తుందని నమ్మేవారు ఆ మార్గంలో పుణ్యం పొందాలంటే ఏం చేయాలి పర్మనెంటుగా తమ ముందు చేయిచాచే వారిని తయారు చేసుకుంటూ వుండాలి. మెక్సికోకు చెందిన కార్లోస్‌ సిమ్‌ ఇప్పుడు ప్రపంచంలో అందరికంటే ఎక్కువ ధనవంతుడు. అమెరికన్‌ బిల్‌గేట్స్‌ను మించిపోయాడు. అతగాడు దాతృత్వాన్ని ఒక పండ్ల చెట్లతో పోల్చాడు. మీరు పండ్ల చెట్లను దగ్గర వుంచుకొని పండ్లు మాత్రమే దానం చేయాలి తప్ప చెట్లను కాదు అన్నాడు. ఇతనితో సహా ధనవంతులు మరింత ధనవంతులు కావటాన్ని పేదలు మరింత పేదలుగా సంపదల పంపిణీలో అసమానతలను చూపే ప్రస్తుత వ్యవస్ధ తప్ప మరొకటి కాదు. అందుకే థామస్‌ పికెట్టి అనే ఫ్రెంచి ఆర్ధిక వేత్త ప్రపంచ ధనికులను హెచ్చరించాడు. ఇటీవలి కాలంలో ఎన్నడూ లేని విధంగా ఆర్ధిక అసమానతలు పెరిగాయి, ఇది సామాజిక అశాంతికి దారితీస్తుందని ముందస్తు హెచ్చరిక చేశాడు. అసమానతలు పెరిగాయని అంగీకరిస్తే దానికి కారణాలేమిటో చెప్పమని జనం నిలదీస్తారు. అప్పుడు విధానాల గురించి, పెట్టుబడిదారీ విధానమా, కమ్యూనిజమా ఏది కారణం అన్న చర్చ వస్తుంది. నూటికి 99 వేళ్లు పెట్టుబడిదారీ విధానంవైపే చూపుతాయి. అందువలన అనేక మంది పెట్టుబడిదారులు పికెట్టి మరీ ఎక్కువ చెప్పాడని తప్పించుకుంటున్నారు తప్ప చర్చలోకి దిగటం లేదు. లేదు అంటే వర్తమాన ఆర్ధిక సంక్షోభాలు ఏమిటి? దానికి కారణాలు ఏమిటని నిలదీస్తారు.అప్పుడూ అదే చర్చ జరపాలి. అందువలన ఈ త్రైమాసికం చూడూ ఈ త్రైమాసికం చూడు నీకు అభివృద్ది కనిపిస్తుంది అని గత ఏడు సంవత్సరాలుగా చెబుతూనే వున్నారు. బ్రిటీష్‌ విక్టోరియా రాణి కాలం 1837-1901 మధ్య కాలానికి నేటికి ఆదాయ అసమానతలు ఎలా వున్నాయో కొందరు చెబుతున్నారు. ఆ కాలంలో కేవలం 46 సంవత్సరాలు మాత్రమే బతికి ప్రఖ్యాత రచయిత ఆస్కార్‌ వైల్డ్‌ తన కాలంలోని దాతృత్వ తీరుతెన్నులను వర్ణించాడు.నాటి ధనవంతులు కూడా సమాజంలో ఇంత దారిద్య్రం వుందా, పేదలకు ఇన్ని కష్టాలు వున్నాయా అని మన బిల్‌గేట్స్‌, వారెన్‌బఫెట్‌, మార్క్‌ జుకెర్‌ బర్గ్‌ మాదిరిగానే పీపాల కొద్దీ కన్నీళ్లు కార్చారు. వైల్డ్‌ ఏమన్నారంటే నాటి ధనవంతులు సూచించిన పరిష్కార మార్గాలు సమాజంలోని జబ్బును నయం చేయలేదు, మరికొంత కాలం పొడిగించాయి. తగిన లక్ష్యం లేకపోతే దారిద్య్రాన్ని నిర్మూలించటం అసాధ్యం అన్నాడు.

సైన్స్‌ ఇన్‌ సొసైటీ సంస్ధ డైరెక్టర్‌ , జెనిటిస్ట్‌, బయోఫిజిస్ట్‌ అయిన డాక్టర్‌ మాయే వాన్‌ హో ఏ చెప్పారంటే ఏ సమస్యలనైతే తాను పరిష్కరిస్తానని బయలు దేరిందో ఆ పెద్ద ధార్మిక సంస్ధ వాటికి కారణమైన కంపెనీలలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టి లాభాలు సంపాదిస్తోందని అన్నారు. ఆ సంస్ధ మంజూరు చేసే గ్రాంట్ల వలన ప్రపంచ ఆరోగ్యం, వ్యవసాయ వ్యవస్ధకు హానితప్ప మేలు జరగటం లేదు, జాతీయ, ప్రపంచ ప్రాధాన్యతలను వక్రీకరిస్తున్నది. గేట్స్‌ ఫౌండేషన్‌ 2000 సంవత్సరంలో 2006లో రెట్టింపైంది. వారెన్‌బఫెట్‌ చేరిక దీనికి కారణం. మంచి పనులకు వీరు భారీ మొత్తంలో నిధులు ఇవ్వటంలో పేరు పొందారు. అయితే అదే సందర్భంలో మంచి పనుల కంటే దాని పెట్టుబడులపై భారీ మొత్తాలలో లాభాలు సంపాదిస్తున్నదని 2007 అమెరికాకు చెందిన లాస్‌ ఏంజల్స్‌ టైమ్స్‌ వెల్లడించింది. ఇచ్చిన గ్రాంట్లకంటే చమురు కంపెనీలలో దాని పెట్టుబడులు ఎక్కువ. నైజీరియాలోని పిల్లలు టీకాలతో లబ్దపొందినప్పటికీ గేట్స్‌ ఫౌండేషన్‌, ఇతర ధార్మిక సంస్ధలు పెట్టుబడులు పెట్టిన చమురు బావుల నుంచి వెలువడే వాయువుల కారణంగా తీవ్రమైన శ్వాసకోశ సంబంధ వ్యాధుల బారిన పడ్డారు. నైగర్‌ డెల్టాలో చమురు బావుల నుంచి వెలువడిన మంటల కారణంగా పెద్ద వారిలో బ్రాంకోటైస్‌ పిల్లలలో ఆస్త్మా, కంటి చూపు సరిగా కనిపించకపోవటం వంటి సమస్యలు తలెత్తాయని ఎనోచా ప్రాంతంలోని ఒక వైద్యుడు చెప్పారు. అంతేకాదు ఈ ప్రాంతంలోని గ్యాస్‌ బావుల నుంచి రోజూ దాదాపు వంద కోట్ల ఘనపుటడుగుల గ్యాస్‌ను మండిస్తారు. దాని అమ్మకంద్వారా కలిగే ప్రయోజనం ఎంతో తెలియదు గానీ ప్రపంచ వాతావరణం వేడెక్కటానికి ఇవి దోహదం చేస్తున్నాయి. గేట్స్‌ ఫౌండేషన్‌ పోలియో, ఇతర టీకాలకు, పరిశోధనలకు ప్రపంచవ్యాపితంగా 218 మిలియన్‌ డాలర్లు దానం చేస్తే నైజీరియాలోని ఎని, రాయల్‌ డచ్‌, షెల్‌, ఎక్సాస్‌ మోబిల్‌ కార్పొరేషన్‌ , చెవరాన్‌, టోటల్‌ వంటివాటిలో 423 మిలియన్‌ డాలర్లు పెట్టుబడులుగా పెట్టిందని లాస్‌ఏంజల్స్‌ టైమ్స్‌ తెలిపింది. అమెరికా, ఐరోపాలలో అనుమతించిన దానికంటే ఎక్కువగా కాలుష్యం వెదజల్లేందుకు ఈ కంపెనీలకు అక్కడ అనుమతి ఇచ్చారు.

గేట్స్‌ ఫౌండేషన్‌ తాను ఎయిడ్స్‌ సమస్యపై పోరాడుతున్నానని చెప్పుకుంటోందో అది పెట్టుబడి పెట్టిన నైజీరియాలోని ఆయిల్‌ కంపెనీల కార్యకలాపాల కారణంగా తమ ప్రాంతంలో వ్యభిచారం తీవ్రంగా పెరిగిందని, దాని కారణంగా ఎయిడ్స్‌, తరుణవయస్సు యువతులు గర్భందాల్చటం వంటి సమస్యలు పెరిగాయని స్ధానికులు పేర్కొన్నారు. దారిద్య్రం, వ్యాధుల నిర్మూలన గురించి గేట్స్‌ ఫౌండేషన్‌ చెబుతుంటుంది. అది పెట్టుబడులు పెట్టిన చమురు కంపెనీలు తవ్విన చమురు బోర్ల గుంతలలో నిల్వవుండే నీరు నింపుతారు. దాంతో దోమలు తామరతంపరగా వృద్ధి చెంది మలేరియా పెరిగిపోతోంది. రివర్స్‌ స్టేట్‌లోని ఆరోగ్య కమిషనర్‌ దర్యాప్తు చేయించగా నదులలో చమురు తెట్టుల కారణంగా కలరా వస్తున్నట్లు తేలింది. విషపదార్ధాల నుంచి వెలువడే బెంజైన్‌, మెర్క్యురీ, క్రోమియం వంటివి పిల్లలలో వ్యాధినిరోధక శక్తిని తగ్గించి మరింతగా పోలియో, మీజిల్స్‌ వంటివి సోకటానికి దోహదం చేస్తున్నాయి.

గేట్స్‌ ఫౌండేషన్‌ పెట్టుబడులు పెట్టిన బిపి షేర్లు 83, రాయల్‌డచ్‌ 77, ఆంగ్లో-అమెరికన్‌ కంపెనీల వాటాల ధరలు 255 శాతం పెరిగాయి.మసాచుచెట్స్‌ విశ్వవిద్యాలయం రూపొందించిన జాబితా ప్రకారం అమెరికాలోని అత్యంత కాలుష్యకారక పరిశ్రమలు వంద, కెనడాలోని 50లో 330 కోట్ల డాలర్ల మేరకు గేట్స్‌ పెట్టుబడులు వున్నాయి. అంటే కాలుష్యం నుంచి కూడా ధర్మాత్ముడు గేట్స్‌ లాభాలు పిండుకుంటున్నాడన్నమాట.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అసలు బిలియనీర్లను పెంచటమెందుకు ? వారిని విరాళాల కోసం అడుక్కోవటం ఎందుకు ?

06 Sunday Dec 2015

Posted by raomk in Current Affairs, INTERNATIONAL NEWS, Opinion, Uncategorized

≈ Leave a comment

Tags

billionaires, Face book, philanthropy-facts

ధర్మకర్తృత్వం-దాతల బండారం-4

ఎం కోటేశ్వరరావు

వ్యాపారులు ఎక్కువగా దాన ధర్మాలు చేయాలా ? దాన ధర్మాల పేరుతో ఎక్కువ వ్యాపారం చేయాలా అన్న ప్రశ్న ఎదురైనపుడు గతంలో ఏం జరిగిందో చూస్తే ఫేస్‌బుక్‌ సిఇఓ మార్క్‌ జుకెర్‌బర్గ్‌ ధర్మ వ్యాపారం ఎలా చేయబోతున్నాడో ముందు ముందుగానీ తెలియదు. లాన్‌సెట్‌ అనే వైద్య పత్రిక 2009లో జరిపిన అధ్యయనంలో గేట్స్‌ ఫౌండేషన్‌ 1998-2007 మధ్య ఇచ్చిన గ్రాంట్లలో కేవలం 1.4శాతమే ప్రభుత్వ రంగ సంస్ధలలకు వెళ్లగా మిగతా మొత్తం 659 ప్రభుత్వేతర సంస్ధలు పొందాయి, వాటిలో 37శాతమే మధ్య లేదా అల్పాదాయ దేశాలలో ప్రధాన కార్యాలయాలను కలిగి వున్నాయి. బడా కార్పొరేట్లు ధర్మ ఫౌండేషన్లను ఏర్పాటు చేసిన కాలాన్ని కూడా మనం గమనంలోకి తీసుకోవాలి. ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్దలు వ్యవస్తాగత సర్దుబాట్ల పేరుతో మెజారిటీ ప్రపంచ దేశాలకు ప్రయివేటీకరణ, విద్య, వైద్యం వంటి సేవారంగాల బాధ్యతల నుంచి ప్రభుత్వాలు తప్పుకోవాలని షరతులు విధించి అమలు జరిపిస్తున్న కాలంలో ధనికుల ఫౌండేషన్లు వునికిలోకి వచ్చాయి. ప్రజలు, ప్రభుత్వాల మధ్య ఏర్పడిన ఖాళీలో ప్రభుత్వ ఏతర(ఎన్‌జివో)లను ప్రవేశపెట్టారు. అంతే కాదు ప్రభుత్వాలు తమ జాతీయ ప్రాధాన్యతలను నిర్ణయించుకోవటంలోనూ, ప్రపంచ బ్యాంకు ఆదేశాల మేరకు ఎన్‌జిఓలతో సమన్వయ పరుచుకోవటంలోనూ పొంతన కుదరక ఎద్దు-దున్న దున్నకం మాదిరి తయారైంది. ఎండ పెరిగే కొద్ది ఎద్దు నీడలోకి లాగ నీడ తగ్గేకొద్దీ దున్న ఎండలోకి లాగ అన్నట్లుగా తయారై వ్యవసాయం మూలనబడినట్లుగా అంతిమంగా జనం నష్టపోయారు. జాతీయ ప్రాధాన్యతలు వెనుక్కుపోయాయి. ఎయిడ్స్‌ హెచ్‌ఐవి సమాచారం మరియు నివారణ సంస్ధ ఐ బేస్‌ ప్రతినిధి పోలీ క్లేడన్‌ దీన్ని గురించి మాట్లాడుతూ మీకు హెచ్‌ఐవి వుండి వేరే వారు ప్రయోగదశలోవున్న ఔషధాలకు నిధులు చెల్లిస్తుంటే మీ సంరక్షణ సరిగా జరగకపోవచ్చు, వారికి ఈ ఏడాది ఈ ఆలోచన వచ్చి వచ్చే ఏడాది మరొకదానిమీదకు మళ్లితే మీ సంగతేమిటి అని ప్రశ్నించారు. ప్రభుత్వాలు అలా చీటికి మాటికి ఏడాదికొక ప్రాధాన్యతలను మార్చుకోవు. దాతృత్వ సంస్ధల జోక్యం వలన ప్రజారోగ్య కార్యక్రమాలు అడ్డదిడ్డంగా తయారవుతాయి. కొన్ని సందర్భాలలో ఆయాదేశాల పౌరులకు అంతగా ప్రాధాన్యం కాని వాటికి ధనికులు నిధులు అందచేస్తారని ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకురాలు దేవీ శ్రీధర్‌ హెచ్చరించారు.

ప్రయివేటు ఫౌండేషన్లు, ఎన్‌జీవోల భాగస్వామ్యం పెరగటంతో మరోవైపున ఐక్యరాజ్యసమితి ద్వారా ప్రపంచ ఆరోగ్యానికి అందచేసే నిధులు 1990-2008 మధ్య 32 నుంచి 14శాతానికి తగ్గాయి. దీనివలన జరిగేదేమిటి? మూడు లోంచి ఒకటి తీసి వేసి మిగిలిన దానికి ఒకటి కలిపితే ఏమౌతుందో ప్రపంచ ఆరోగ్యానికి అదే జరిగింది. అవి కూడా పైన చెప్పుకున్నట్లు ఒక పద్దతి ప్రకారం కాకుండా అస్తవ్యస్తం అయ్యాయి. గేట్స్‌ఫౌండేషన్‌ ప్రపంచ ఆరోగ్య సభ సిఫార్సు చేసిన వాటికి గాక ముందుగా తాను అనుకున్న పధకాలకే ప్రపంచ ఆరోగ్య సంస్ధకు నిధులు అందచేస్తున్నది. ప్రపంచ బ్యాంకు సంస్కరణలలో భాగంగా ప్రభుత్వాలు వైద్య సేవరంగం నుంచి వైదొలగాలన్నది ఒక షరతు. దానిని అమలు జరపటానికి తెల్లవారే సరికి ఆసుపత్రులను మూసివేస్తే రాజకీయంగా అధికారంలో వున్న పార్టీలు, ప్రభుత్వాలకు ఇబ్బందులు వస్తాయి. అందువలన పొమ్మనకుండా పొగ పెట్టినట్లు మొదటి దశలో ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకు తగిన వైద్యులు, సిబ్బంది, పరికరాలు లేకుండా వాటిని పడకేయించారు. మిగిలిన ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లటం కంటే నేరుగా నరకానికి పోవటం మంచిది అనుకొనే విధంగా ఆసుపత్రులను తయారు చేశారా లేదా ? పర్యవసానం ఏమైంది? కార్పొరేట్‌ ఆసుపత్రులు మహానగరాల నుంచి మామూలు పట్టణాలకు చేరాయి. రైతులు, వ్యవసాయ కార్మికులు రుణగ్రస్తులెందుకు అవుతున్నారంటే ఆసుపత్రులకు వెళ్లేందుకు చేస్తున్న అప్పులు కూడా తోడు అవుతున్నాయన్నది అనేక పరిశోధనల్లో తేలింది. కార్పొరేట్‌ ఆసుపత్రిలో చేరి బీమా లేకుండా అప్పులు పాలు కాకుండా బయటకు వచ్చిన సామాన్యులెవరైనా వుంటే గుండెమీద చేయి వేసుకొని చెప్పమనండి. ఇప్పుడు ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలతో మొదలు పెట్టి క్రమంగా ఆసుపత్రులను ప్రయివేటు వైద్యులకు , ఎన్‌జిఓలకు అప్పగించేందుకు ముందుకు పోతున్నారు.

ఒక ధనవంతుడికి జనమంతా తన మాదిరి చేపలు తింటే మంచిది కదా అన్న ఆలోచన వచ్చిందట. రాగానే ఒక లారీలో చేపలు తీసుకు వెళ్లి దగ్గరుండి మరీ పంపిణీ చేయించాడట. అందరూ ఎగబడి తీసుకుంటుంటే అక్కడున్న జనంలోని ఒక యువకుడు అలాగే నిలబడి పోవటం ఆ ధనికుడికి ఆశ్చర్యం కలిగించింది. ఏం నీకు చేపలు అవసరం లేదా తీసుకోవటం లేదు. అనగానే నీవంటి దాతలు నాకు దయా ధర్మంగా ఇచ్చే చేపలను తినటానికి నాకు సిగ్గుగా వుంది. నాకు జాలితో మీరిచ్చే చేపలు కాదు ప్రభుత్వం ఇచ్చే వల కావాలి అన్నాడట. పిచ్చివాడా వెంటనే తినేందుకు అవసరమైన చేపలు ఇస్తుంటే వల అడుగుతావేమిటి అని ధనవంతుడు అడిగాడు. మీకు ఈ రోజు బుద్ది పుట్టింది గనుక చేపలు ఇచ్చారు. రేపు మనస్సు మారినా మీ దగ్గర లేకపోయినా మా పరిస్ధితి ఏమిటి అని ప్రశ్నించిన యువకుడు తానే సమాధానం చెబుతూ మీరు వుండొచ్చు లేకపోవచ్చు, శాశ్వతంగా వుండే ప్రభుత్వం వలలను సమకూర్చితే జీవితాంతం మేము చేపలు పట్టుకొని నాలుగు డబ్బులు సంపాదించుకుంటాము, మేము తింటాము అందుకే వల అడిగాను అన్నాడట.

అంతిమంగా ఆరోగ్య సమస్యలను జవాబుదారీగలిగిన ప్రభుత్వాలే పరిష్కరించాలి తప్ప స్వచ్చంద సంస్ధలు పరిష్కరించలేవు. ప్రభుత్వ ఆసుపత్రులను నిర్వీర్యం చేసిన ప్రభుత్వాలు ప్రజారోగ్యాన్ని గాలికి వదలి వేసి కార్పొరేట్‌ ఆసుపత్రులకు ఏటా వందల కోట్ల రూపాయలను ఎలా కట్టబెడుతున్నాయో చూస్తున్నాము. ఆరోగ్యశ్రీ వలన పేదలకు వుపయోగం జరుగుతోందా లేదా అంటే జరుగుతోంది. అందుకయ్యే ఖర్చులో సగం సొమ్ముతో ప్రభుత్వ ఆసుపత్రులలో అదే రకం వైద్యం చేయవచ్చు. మిగిలిన మొత్తాన్ని మరొక ప్రజా సంక్షేమానికి ఖర్చు చేయాలి తప్ప కార్పొరేట్ల పరంచేయటం ఏమిటి. ఈ కార్పొరేట్‌ ఆసుపత్రులన్నింటా అంతర్జాతీయ జలగల పెట్టుబడులు ప్రవహిస్తున్నాయి. ధనికులు మరింతగా ముందుకు వచ్చి దానధర్మాలు చేయాలని, వారికి అలాంటి మంచి మనస్సు కలిగేలా చూడాలని కొందరు ప్రార్ధనలు జరుపుతున్నారు. దీని అర్ధం ఏమిటి? కార్పొరేట్లు మరింతగా పెరగాలని, వారు చేసే ధర్మాలు కూడా పెరగాలనే కదా? దీన్నే మరోవిధంగా చెప్పాలంటే ఇప్పుడున్న దోపిడీ ఇలాగే కొనసాగాలి, కావాలంటే పేదలకు ఎంతో కొంత సొమ్ముదానంగా ఇస్తాం అని చెప్పటమే. ప్రపంచ ప్రజల ఆరోగ్య సమస్యల పరిష్కారానికి ఇది అసలు పరిష్కారమే కాదు అంటున్నారు ఎందరో. అన్నింటికీ మించి అటువంటి బిలియనీర్లను పెంచే వ్యవస్ధను కొనసాగనివ్వటం ఎందుకు ? విరాళాలు ఇమ్మని అడగటం ఎందుకు ? ఇది సమస్యను పక్కదారి పట్టించటమే కదా !

Share this:

  • Tweet
  • More
Like Loading...

వ్యాపారులు ఎక్కువగా దాన ధర్మాలు చేయాలా ? దాన ధర్మాల పేరుతో ఎక్కువ వ్యాపారం చేయాలా ?

05 Saturday Dec 2015

Posted by raomk in Current Affairs, Economics, INTERNATIONAL NEWS

≈ Leave a comment

Tags

billionaires, education, Face book, philanthropy-facts

ధర్మకర్తృత్వం-దాతల బండారం-3

ఎం కోటేశ్వరరావు

లాభం లేనిదే వ్యాపారి వరదన పోడు అన్న సామెత తెలిసిందే. ఇప్పటి వరకు ప్రపంచ మంతా బిల్‌గేట్స్‌, వారెన్‌ బఫెట్‌ ధర్మాల గురించి పాత రోజుల్లో పల్లె టూళ్లలో గుంపులుగా కూడి సినిమా కధలు చెప్పుకున్నట్లుగా చెప్పుకున్నారు. చంద్రబాబు నాయుడి వంటి వారి గురించి ఇక చెప్పనవసరం లేదనుకోండి. ఫేస్‌బుక్‌ సిఇఓ మార్క్‌ జుకెర్‌బర్గ్‌ దాతృత్వం గురించి గొప్పగా పొగిడారు( మరి ఆయనకు తాతగా ప్రమోషన్‌ వచ్చిన సందర్బంగా హెరిటేజ్‌ ఇతర కంపెనీల్లో వున్న వాటాలను కూడా అలాగే ధర్మం చేయవచ్చు కదా అని ఎవరూ అడగకండి). మనకున్న జబ్బు అని అనకూడదు గానీ ఏ అంశమైనా కొనసాగింపు,పర్యవసానాలు ఏమిటి అని చూడటం తక్కువగా వుంది.మూసి పెట్టటం తప్ప మీడియా దాని గురించి అసలు పట్టించుకోదు.ఒక అవినీతి గురించి సంచలన వార్త ప్రసారం లేదా ప్రచారం, ప్రచురణ తరువాత చివరకు ఏమైంది? కాకపోతే ఎందుకు కాలేదు అన్న సమాచారం వుండదు. కలికాలం కాకపోతే ధనవంతులకు ఆకస్మికంగా ధర్మాలు చెయ్యాలన్న బుద్ది పుట్టటమేమిటి? ఈ విషయం బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారో లేదో నేను వినలేదు) నిజంగా వారు తమ సంపదలను ఇచ్చారా? ఇస్తే ఏం జరిగింది అన్నది తెలుసుకోకపోవాలన్న ఆసక్తి జనానికి వుండకూడదనే ధనికులు కోరుకుంటారు.ఒక్క ఇచ్చినపుడు ప్రచారం తప్ప.

బిల్‌గేట్స్‌ తన సంపదలను దానం చేశాడు, ఓకే, దాని వలన లాభపడింది ఎందరు? అసలు సమాజంలో ఒకరు ఇచ్చేవారు, ఒకరు పుచ్చుకొనే నిస్సహాయత ఎందుకు వుండాలి. పుచ్చుకొనేవారి కష్టానికి తగిన ప్రతిఫలం లేదా గౌరవ ప్రదమైన శ్రమకు తగ్గ విలువను చెల్లిస్తే వేరొకరి ముందు చేయి చాచాల్సిన అగత్యం ఎందుకు అని ఆలోచించనవసరం లేదా ? అంటే పెట్టుబడిదారులు తమది ఎల్లపడు పైచేయిగా వుండే పరిస్ధితులు శాశ్వతం కావాలని కోరుకుంటున్నారా ?

బిల్‌ గేట్స్‌ దాన ధర్మాల గురించి ఆండ్రూ బౌమన్‌ అనే పరిశోధకుడు కొన్ని మింగలేని విషయాలను వెల్లడించారు. హఫింగ్టన్‌ పోస్ట్‌ అనే పత్రికకు కొద్ది సంవత్సరాల క్రితం అసలు తానెందుకు సంపదను దానం చేయాలనుకున్నదీ గేట్స్‌ వివరించాడు. 1993లో గేట్స్‌ ఆఫ్రికా వెళ్లినపుడు అక్కడి పరిస్ధితులను చూసి చలించిపోయాడన్నది సారాంశం. అమెరికాలో ఎవరైనా తమ సంపదలో ఏడాదికి ఐదు శాతం దాన ధర్మాలకు అందచేస్తే వారికి పన్ను రాయితీలు దక్కుతాయి. గేట్స్‌ ఆఫ్రికాను చూసి చలించి పోయిన తరువాత ఆయన మిత్రుడు వారెన్‌ బఫెట్‌లో కూడా చలనం వచ్చింది. గేట్స్‌తో కలసి తన కుటుంబం 30 బిలియన్‌ డాలర్లను దాన ధర్మాలకు ఇస్తామని ప్రకటించారు. 2010నాటికి వారు 26 బిలియన్‌ డాలర్లు ఎక్కువగా ప్రపంచ ఆరోగ్య అవసరాలకు ఇచ్చారు. అమెరికాలో అంతకు ముందు ధనికుడిగా వున్న రాకఫెల్లర్‌ కుటుంబం 1914నుంచి ఇచ్చిన మొత్తం 14 బిలియన్‌ డాలర్లు మాత్రమే. గేట్స్‌ ఏర్పాటు చేసిన ఫౌండేషన్‌ టీకాల ద్వారా అరవైలక్షల మంది పిల్లలను బతికించినట్లు చెప్పుకున్నారు. ఎయిడ్స్‌, టీబీల నుంచి ఏడాదికి లక్షమందిని రక్షించటం లక్ష్యంగా గేట్స్‌ ప్రకటించారు. గేట్స్‌ చొరవ అనేక మంది ధనికులను ప్రపంచ ఆరోగ్యంవైపు దృష్టి సారింప చేయించిందని అనేక మంది పొగిడారు.

అయితే ఈ ఫౌండేషన్‌ పెట్టే ఖర్చు, దానిప్రభావం ఎంత , అసలది ఎవరికి జవాబుదారీ అన్న సమస్యలు ముందుకు వచ్చాయి. దాన ధర్మాలకు ఇచ్చిన సొమ్ములో ఏటా ఐదు శాతం మొత్తం తమ వైపు తిప్పుకొనేందుకు యత్నించే(లాబీయింగ్‌) వ్యవహారాలకు, సలహాలకు ఖర్చు చేస్తామని ఫౌండేషన్‌ చెప్పుకుంటుంది. వాటిలో అమెరికా విశ్వవిద్యాలయాల మొదలు ఎన్‌జీవోల వరకు అనేక సంస్ధలున్నాయి. ముందే చెప్పుకున్నట్లు ఫౌండేషన్‌ చేసే ఖర్చులో సింహభాగం ప్రపంచ ఆరోగ్య భాగస్వామ్యం కోసమే కేటాయించారు.అంటే ఆరోగ్య విధానాల రూపకల్పనలో తమ ముద్ర , ప్రాధాన్యతలు వుండే విధంగా లాబీయింగ్‌ చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్ధ, ఇతర ఏజన్సీలు వున్నప్పటికీ గేట్స్‌ ఫౌండేషన్‌ ఆరోగ్య సంరక్షణ వ్యూహాలపై సమీక్షా సమయాలలో గేట్స్‌ కంపెనీ సిఇఓ కుర్చీవేసుకు కూర్చుంటాడు. వూరికే కూర్చోవటానికి వారేమన్నా పనిలేని వారా ? దానాలలో కూడా లాభాలు ఎలా పిండుకోవచ్చో కనిపెట్టిన వారు వూరికే వుండరు కదా ! విధానాలపై ప్రభావం చూపేందుకు జోక్యం చేసుకుంటారు. మందులు మా బావమరిది షాపులోనే కొనాలనే షరతులు విధించకుండానే కొనిపించే డాక్టర్ల మాదిరి చేయాల్సింది చేసుకుంటారు.డాక్టర్‌ డేవిడ్‌ మెకాయ్‌ అనే ప్రజారోగ్య వైద్యుడు లండన్‌ విశ్వవిద్యాలయ కళాశాలలో పరిశోధకుడు, ్క ప్రజారోగ్య వుద్యమానికి ఒక సలహాదారు. ఆయనేమన్నారంటే ‘ఫౌండేషన్‌ అంటే నిధుల వసూలు , పధకాల అమలుకు మించి దాని లక్ష్యాలు వుంటాయి అన్నారు. అకడమీషియన్లుగా వుండే వ్యక్తులు, ప్రభుత్వేతర సంస్ధలు, వాణిజ్య రంగాలతో అంతర్గత సంబంధాలు కలిగి వుంటాయి. అంతర్జాతీయ ఆరోగ్య సమస్యపై ఒక బృంద ఆలోచనగా ప్రభావం చూపుతాయి.శాస్త్రీయ అభిప్రాయాలలోని భిన్నత్వాన్ని గేట్స్‌ ఫౌండేషన్‌ అణచివేస్తున్నదని, అది తనకు తాను తప్ప ఇతరులెవరికీ జవాబుదారీ కాదని ప్రపంచ ఆరోగ్య సంస్ధలోని మలేరియా విభాగ పరిశోధన అధిపతి ఆరాటా కోచి 2008లో విమర్శించారు.

గేట్స్‌ వంటి ఫౌండేషన్లు ప్రపంచ ఆరోగ్య విధానాన్ని ఏవైపుకు నెడుతున్నాయి ?

తాను పెట్టుబడులు పెట్టటానికి ఒకేసారి ఏడడుగులు ఎగిరేందుకు ప్రయత్నించటం గాక ఒక అడుగుతో దాటిపోయేయి ఏవి వుంటాయా అని పరికించిచూస్తాను అని వారెన్‌బఫెట్‌ అన్నాడు.అయితే బిల్‌గేట్స్‌ దీనికి విరుద్ధంగా కుండలో కూడు కుండలోనే వుండాలి పిల్లాడు మాత్రం తెల్లవారేసరికి దుడ్డులా తయారు కావాలి అన్నట్లు తాను ఇచ్చే దాన సొమ్ముతో ఒకేసారి ఏడడుగులు గెంతాలి అన్నాడు. పసితనంలో రెండుమూడు డోసులు వేసే టీకాలతో జీవితకాలంపాటు రాని వ్యాధుల మాదిరి ఎయిడ్స్‌, టీబీ వంటి వ్యాధులను ఒక్క మాత్ర లేదా టీకాతో నయం చేసే అద్భుతాలు జరగకపోతే ఆధునిక పరిజ్ఞానం ఎందుకన్నట్లు మాట్లాడటమే కాదు తన దానపు సొమ్ములో1998-2007 మధ్య 36.5శాతం ప్రభుత్వ-ప్రయివేటురంగ భాగస్వామ్యంతో నడిచే ‘గావి అలయన్స్‌’ పరిశోధనలకే కేటాయించాడు. అది హెపటైటిస్‌ బి, హెచ్‌ఐబి బాక్టీరియా నిర్మూలనకు వాక్సిన్‌ల తయారీకీ పనిచేసింది. ప్రస్తుతం న్యూమోనియో, డయేరియా వంటి వ్యాధుల కారక బాక్టీరియాను నిర్మూలించే వ్యాక్సిన్ల పరిశోధనలో నిమగ్నమై వుంది. మరి ఈ వాక్సిన్లు మానవాళికి వుపయోగమా కాదా అంటే వుపయోగమే.

సమస్య ఎక్కడ వుందంటే ఇప్పటి వరకు సాగించిన శాస్త్ర పరిశోధనలు, నూతన ఆవిష్కరణలు అన్నీ సమాజానికి చెందినవే తప్ప వ్యక్తులకు చెందినవి కాదు. ఒక శాస్త్రవేత్త ఒక ఔషధాన్ని కనిపెట్టాడు, లేదా ఒక ప్రమాదకర బాక్టీరియాను జాడ పట్టాడు అంటే దాని వెనుక అతని ప్రతిభ లేదని కాదు. పరిశోధన రిలే పరుగు పందెం వంటిది అనుకుంటే విజయసూచికగా రిబ్బన్ను తాకేది చివరి రన్నర్‌ కావచ్చుగాని అంతకు ముందు వారు లేకుండా, వారు సరిగా పరుగుతీయకుండా చివరి వ్యక్తికి విజయం సాధ్యం కాదు. అలాగే తన ముందు తరాల వారు వాటిపై సాగించిన అధ్యయనాల కొనసాగింపుగా ఎవరైనా నూతన అంశాన్ని కనుగొన్నారు, వున్నవాటిని మెరుగుపరిచారు తప్ప స్వంతంగా తామే కనుగొనలేదు.ఎవరైనా అలా చెప్పుకుంటే అది వారి సంస్కారానికి సంబంధించిన అంశం. రైట్‌ బ్రదర్స్‌కు ముందు విమానాలపై జరిగిన పరిశోధనలు, వైఫల్యాల నుంచి వారు తీసుకున్న గుణపాఠంతో విమానం ఎగరటంపై పైలట్స్‌కు ఎలా అదుపు వుండాలో కనుగొన్నారు. అది ఒక విప్లవాన్ని తెచ్చింది.వారి పరిశోధన బృందంలో సైకిల్‌ షాపు మెకానిక్‌ చార్లీ టేలర్‌ కూడా ఒక ముఖ్యుడన్న విషయం మనలో చాలా మందికి తెలియదు. ప్రింటింగ్‌ ప్రెస్‌లు,మోటార్లు, సైకిల్‌షాపులు అన్నింటిని ఆ బృందం పరిశీలించి, వాటిలో పనిచేసి విమానం ఎగిరే యంత్రాన్ని కనిపెట్టారు. కానీ పేటెంట్‌ మాత్రం రైట్‌ బ్రదర్స్‌ పొందారు.నిజానికి ఆది సమష్టి కృషి.దానిని సమాజానికి వుపయోగించినపుడు ఫలాలు అందరూ అనుభవిస్తారు, వ్యక్తులు లేదా కొన్ని కంపెనీలకు పరిమితం చేసినపుడు వారు మాత్రమే లబ్దిపొందుతారు. ఈ దిశగా ఆధునిక పెట్టుబడిదారులు తమ లాభాలను కాపాడుకొనేందుకు, పెంచుకొనేందుకు నూతన పద్దతులను, ఆర్ధిక వుత్పత్తులను కనిపెడుతున్నారు.

వుదాహరణకు కామెర్ల రోగానికి మందులను ఇంతకు ముందే కనిపెట్టకపోలేదు. అయితే వాటికి నిర్ణయించిన ధరలలో వుపయోగించాలంటే సామాన్యుల వల్లకాదు. పెద్ద మొత్తంలో తయారు చేస్తే ఖర్చులు తగ్గుతాయి. అందుకు పద్దతులు కనుగొనాలి, దాన్ని మార్కెటింగ్‌ చేయాలి. అప్పుడే అందరికీ అందుబాటులోకి వస్తుంది. ‘గావీ’ సంస్ధద్వారా బిల్‌గేట్స్‌ ఫౌండేషన్‌ ఆపని చేసింది. హెపటైటిస్‌ బి వ్యాక్సిన్‌ ధరను 68శాతం మేరకు తాము తగ్గించగలిగామని గావి చెప్పింది. దీని తరువాత న్యూమోనియా టీకాల పరిశోధనకు 150 కోట్ల డాలర్ల ధర్మ నిధిని కేటాయించారు. కామెర్ల వ్యాధి అందరికీ వస్తుందా, దాని నివారణకు వ్యాక్సిన్‌ ముందే తీసుకోవటం అవసరమా? కంపెనీలు తయారు చేశాయి,అవి అమ్ముడు పోవాలి, లేదా యంత్రాలు ఖాళీగా వుండకుండా ఏదో ఒకటి తయారు చేయాలి, నుక వాటికోసం టీకాలు తీసుకోవాలా అన్నది మరొక చర్చ. ముందస్తు నివారణ కోసం అవసరం వున్నా లేకపోయినా మందుల కంపెనీలు తమ వుత్పత్తులను అంటగడుతున్నాయన్న చర్చ జరుగుతోందా లేదా ? వ్యాక్సిన్లపై అమెరికాలో పెద్ద ఎత్తున వ్యతిరేకం వ్యక్తం అవుతోందా లేదా ?చౌకగా వ్యాక్సిన్లు అందుబాటులోకి తేవటం మంచిదే కదా, దాని వలన ఏదైనా ఒక కంపెనీ లాభం పొందితే ఏమిటట, ఏడుపు తప్ప అనేవారు లేకపోలేదు.

పెట్టుబడిదారుల పత్రిక ఫైనాన్సియల్‌ టైమ్స్‌ దీని గురించి రాస్తూ చౌక ధరలతో, వేగంగా అటు పేదలకు ఔషధాలు దొరకటం, ఇటు వుత్పత్తుల మార్కెటింగ్‌ జరిగి కంపెనీలకు సమాన ప్రయోజనం కలిగిందని పేర్కొన్నది. సరిహద్దులకు అతీతంగా ఔషధాలు దొరకాలనే ప్రచారం చేస్తున్న సంస్ధ డైరెక్టర్‌ టిడోవాన్‌ సచోయన్‌ అంగ్‌రెర్‌ ఏమంటారంటే ప్రపంచ ఆరోగ్యరంగంలో ప్రయివేటు రంగ పాత్ర ఎక్కువగా వుండాలని గేట్స్‌ ఫౌండేషన్‌ కోరుతున్నది, ప్రభుత్వంతో ప్రయివేటు రంగ భాగస్వామ్యం కోరుతున్నది, దాన్నొక విధానంగా రూపాందింపచేసేందుకు ఈ సంస్ధలు ప్రయత్నిస్తున్నాయి.దీని వెనుక వాటికి భారీ ప్రయోజనాలు దాగున్నాయి. ఒక ఆట నిబంధనలను రూపొందించే పాత్రలో కంపెనీలు వుండకూడదు. ప్రపంచ ఆరోగ్య సంస్ధకు భారీ మొత్తంలో నిధులు ఇస్తున్న గేట్స్‌ ఫౌండేషన్‌ ఆ సంస్ధ విధాన నిర్ణయాల రూపకల్పనలో ప్రాధాన్యతలను నిర్ణయిస్తున్నది.అది బడా ఫార్మా కంపెనీల మాజీ వుద్యోగులను పెద్ద ఎత్తున తన సిబ్బందిగా తీసుకోవటంతో కంపెనీలకు అనుగుణ్యంగా నిర్ణయాలు జరుగుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తాయి.

మన కేంద్ర ప్రభుత్వం ప్రజారోగ్యవుద్యమ కార్యకర్తల వత్తిడికి తలొగ్గి లేదా మన ఫార్మా పరిశ్రమ అభివృద్దికి లేదా తన బడ్జెట్‌ ఖర్చు తగ్గించుకొనేందుకు గానీ జీవనధార (జనరిక్‌)ఔషధాలను ప్రోత్సహించాలని నిర్ణయించింది. పేటెంట్‌ హక్కులున్న ఔషధాలు ఎంతో ఖరీదైనవి. వాటికి అడ్డదారులు కనుగొనటంలో మనదేశం, చైనా ఫార్మాకంపెనీలు ఆరితేరాయి. జీవన ధార ఔషధాల తయారీ వలన వాటిని రూపొందించిన కంపెనీలకు ఎలాంటి ఆర్ధిక ప్రయోజనం కలగదు. అందువలన అవి పేటెంట్‌ హక్కులను మరింత కఠినతరం చేసేందుకు పెద్ద ఎత్తున లాబీయింగ్‌ చేస్తున్నాయి.ఈ మందులను తయారు చేసే కంపెనీలకు ఏదో ఒక సాకుతో ఆటంకాలు కలిగిస్తున్నాయి. మన దే శంలోని అనేక జనరిక్‌ మందుల తయారీ కంపెనీలకు ఏ రోజున, ఎటువైపు సుంచి ఏం ముప్పు ముంచుకువస్తుందో తెలియదు.ఈ మందుల తయారీ పోటీ లేనట్లయితే ఎందరో రోగులు మందులు కొనుగోలు చేయలేక మరణించి వుండేవారు. పేదలకు వుపయోగపడని ఆధునిక పరిజ్ఞానం ఒక పరిజ్ఞానమా అని కబుర్లు చెప్పే బిల్‌గేట్స్‌ మరోవైపున కష్టపడి పేటెంట్‌ పొందిన కంపెనీల మేధోపరమైన హక్కులకు గట్టి రక్షణ లేకపోతే ఎలా అని ‘ట్రిప్స్‌’ ఒప్పంద చర్చ సందర్భంగా ప్రపంచ వాణిజ్య సంస్ధలో, జి 8 దేశాల బృందంలో మైక్రోసాప్ట్‌ కంపెనీ ద్వారా వత్తిడి చేయించాడు.ఈ వైఖరి అభివృద్ధి చెందుతున్నదేశాలలో ఆరోగ్య సంక్షోభాన్ని మరింత పెంచుతుందని ఆక్స్‌పామ్‌ సంస్ధ పేర్కొన్నది. వాణిజ్య, పారిశ్రామికవేత్తలు మరిన్ని దాన ధర్మాలు చేయాలా ? లేక దాన ధర్మాల పేరుతో మరింత వ్యాపారం చేయాలా అన్నది ఇక్కడ సమస్య?

Share this:

  • Tweet
  • More
Like Loading...

గాలికిపోయే పేలపిండి కృష్ణార్పణం

04 Friday Dec 2015

Posted by raomk in Current Affairs, Economics, INTERNATIONAL NEWS

≈ Leave a comment

Tags

billionaires, Face book, philanthropy

ధర్మకర్తృత్వం-దాతల బండారం-2

ఎం కోటేశ్వరరావు

మార్క్‌ జుకెర్‌బర్గ్‌, వారెన్‌ బఫెట్‌, బిల్‌గేట్స్‌ వంటి వారు చేస్తున్న దాన ధర్మాలు ఎవరికీ వుపయోగపడవా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. నిస్సందేహంగా కొందరికి వుపయోగపడతాయి. ఫలానావారి తాతగారి ముత్తాత జ్ఞాపకార్ధం ఫలానా వారి కుమారుడు, వారి మనవడు అయిన ఫలానా వారు చేసిన ధర్మం అన్న అక్షరాలతో నిండి వుండే చొక్కాలు వేసుకొని సంచార ప్రచార వాహనాల మాదిరి తిరిగేవారు మనకు తరచూ కనిపిస్తుంటారు. దానిలో దానం కంటే ప్రచారమే ఎక్కువగా కనిపిస్తుంది. గోచీ కూడా లేని వారికి అది ఇవ్వటమే పెద్ద లోకోపకారం కదా !.ఇక్కడ సమస్య దానం అంటే ఒక చేత్తో ఇచ్చి మరోచేత్తో పుచ్చుకోవటమా ?

ప్రపంచంలో అమెరికాయే ధనిక దేశం, దానిలో వారెన్‌బఫెట్‌, బిల్‌గేట్స్‌ పెద్ద ధనికులు. వారు 2010లో తాము ఎంత దానం చేస్తున్నదీ ప్రకటిస్తూ ప్రతి ధనికుడూ తమ సంపదలో సగం దాన ధర్మాలకు వినియోగించాలని పిలుపునిచ్చారు.తమ వంటి బిలియనీర్లు 187 మందితో ఇప్పటివరకు ఎంతో కొంత దానం చేయిస్తామని వాగ్దానం చేయించారు. రెండో కంటికి తెలియకుండా దానం చేసిన వారు గొప్పవారని ఇప్పటివరకు చెప్పుకుంటున్నాం. ఎవరెంతదానం చేస్తున్నారో లోకానికి తెలిస్తే మిగతావారు కూడా వుత్సాహపడి తాము కూడా ముందుకు వస్తారు కనుక దాన ధర్మాలకు ప్రచారం కావాలని కొత్త సూత్రీకరణ చేశారు.అందుకే కాబోలు చేసిన దానం కన్నా దాని ప్రచారానికి ఎక్కువ ఖర్చు చేస్తున్నారు చాలా మంది. అంతేకాదు ఎంత డబ్బు దానం కింద వచ్చిందో తెలిస్తే అది ఎక్కడకు వెళుతుందో, అందరూ ఒకదానికే కాకుండా దేనికి ఎంత ఖర్చుచేయాలో కూడా తెలుసుకోవచ్చని కూడా చెబుతున్నారు. దాతృత్వ నిపుణులు( ఫిలాంత్రపీ ఎక్స్‌పర్ట్‌ ) అనే సంస్ద సిఇవో మెలైనీ వులే కార్పొరేట్‌ దానాల గురించి చెబుతూ వ్యక్తిగతమైన ప్రయోజనమో లేక వారి వారసుల జేబులు నింపటమో గాక మొత్తం మానవాళి ఆరోగ్యం, జీవనానికి ఇలాంటి దానాలను ఖర్చు చేసేందుకు ప్రాధాన్యత ఇవ్వాలంటారు. దేన్నీ కాదనలేం మరి.

అమెరికాలో 501(సి)(3) అనే ఒక చట్ట సెక్షన్‌ ప్రకారం ఎవరైనా దానం చేసిన వాటి మీద వారికి ఎలాంటి హక్కు వుండదు. దానం చేసిన వారి పాత్ర అంతటితో ముగుస్తుంది.వాటిని స్వీకరించిన సంస్ధకు దానిపై సర్వహక్కులు వుంటాయి. కానీ జుకెర్‌బర్గ్‌ వంటి బిలియనీర్లు చేసే దానాలు అలాంటివి కావు. వాటికి బదులుగా పరిమిత జవాబుదారీ కంపెనీ(లిమిటెడ్‌ లయబులిటీ కంపెనీ(ఎల్‌ఎల్‌సి)ని ఏర్పాటు చేసి దానికి బదలాయిస్తారు. ప్రయివేటు ట్రస్టులంటే బాగా అర్ధం అవుతుంది.జుకర్‌ బెర్గ్‌కు ముందు దానాలు చేసినవారందరూ ఇలాంటి దారులే ఏర్పాటు చేసుకున్నారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్ను కట్టకుండా బహిరంగంగా తమ ఆస్తులను వీటిలో దాచుకుంటారు. పబ్లిక్‌ ట్రస్టులంటే నియంత్రణలు ఎక్కువ వుంటాయి. ఈ ఎల్‌ఎల్‌సీలకు అలాంటి బాదర బందీ వుండదు. లాభాలు వస్తాయనుకుంటే వేటిలో అయినా ఈ ట్రస్టులలోని సొమ్మును ఎప్పుడు కావాలంటే అక్కడ పెట్టుబడులుగా పెట్టవచ్చు, రాజకీయ పార్టీలకు విరాళాలుగా ఇవ్వవచ్చు. దీని గురించి న్యూయార్క్‌ నగరంలోని న్యూ స్కూల్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఎరికి కోల్‌ ఎరియన్స్‌ ఏమంటారంటే ‘ మరో మాటలో చెప్పాలంటే దాతృత్వ పెట్టుబడులను సొమ్ము చేసుకోవలనుకోటంలో వారెంతో(జుకర్‌బెర్గ్‌ వంటివారు) పారదర్శకంగా వున్నారు, వారిలో ఎక్కువ మంది ఇలా చేస్తూనే మరోవైపున వారు ఎవరికైతే సేవ చేయాలనుకుంటున్నారో వారికి మరిన్ని సమస్యలు తెచ్చే వర్తమాన పెట్టుబడిదారీ వ్యవస్ధను కూడా ముందుకు తీసుకుపోతున్నారు. ఇది, ఎల్లవేళలా దాతృత్వ విరుద్ధ స్వభావం ఇలానే వుంటుంది. ఒకవైపు అసమానతలను సృష్టించే విధానాలను కొనసాగిస్తూనే మరోవైపు ఎవరైనా దారిద్య్రం, అ సమానత, పర్యావరణ, కార్మిక హక్కులను దుర్వినియోగాన్ని అరిక్టగలరా ? ఈ సమస్యలను పరిష్కరించటానికి సామాజిక దృక్పధంతో వుంటేవాటికి ట్రస్టులు నిధులు సమకూర్చవచ్చు, కార్మికవర్గం నిర్వహించే వాటికి పెట్టుబడి మిగులును సాయంగా అందించగలరా అన్న ప్రశ్న తలెత్తున్నది’ అని ఆమె అన్నారు.

ఈ వారంలో నే ఇలాంటివారందరినీ ఒక దగ్గరకు చేర్చుతున్న బిల్‌గేట్స్‌ తదితరులు ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. దాని పేరు ఇంధన విజయ కూటమి (బ్రేక్‌త్రూ ఎనర్జీ కోయలిషన్‌). అంటే నాణ్యమైన లేదా క్లీన్‌ ఎనర్జీపై పరిశోధన చేసేందుకు వారు ‘దాన ధర్మాలు’ చేస్తారు. ఇదొక కొత్త తరం ధార్మికత, వీరొక ప్రత్యేక ధార్మికులు. గాలికిపోయే పేలపిండి కృష్ణార్పణం అంటే ఇదే. ఖర్చేమీ వుండదు, పుణ్యానికి పుణ్యం. నాణ్యమైన ఇంధనంతో పర్యావరణాన్ని కాపాడేందుకు తామీ ధర్మం చేస్తున్నామని చెప్పు కోవచ్చు. పనిలో పనిగా అందుకు ఇచ్చే సొమ్ముపై పన్ను రాయితీలు, ధర్మపరులుగా మరికొన్ని రాయితీలు పొందవచ్చు. ఒక్కొక్క రంగంలో ఎవరికి వారు ప్రత్యేకంగా పరిశోధన జరిపితే ఖర్చు తడిచి మోపెడంత అవుతుంది. అలాగాక ‘సహకార కూటమి పద్దతి’లో చేస్తే తలా కాస్త, అది కూడా పన్నురాయితీలతో తమకు ఎలాంటి భారం పడకుండా తమకు అవసరమైన పరిశోధన చేయించుకుంటారు. దాని వలన వచ్చిన ఫలితాలను పొందేది ఎవరంటే తిరిగి ఈ కార్పొరేట్లే. పగలంతా సంపాదించిన దానిని ముఠాకార్మికులు రాత్రికి కలసి పంచుకున్నట్లుగా ప్రాజెక్టులలో భాగస్వామ్యం ద్వారా పరిశోధన ఫలాలను అందరూ కలసి పంచుకుంటారు. పేరుకు పేరు సొమ్ముకు సొమ్ము. వీరు చేసే దానాలను స్వీకరించేందుకు వీరందరూ కలసి తమ చెప్పుచేతల్లో వుండే ట్రస్టులను ఏర్పాటు చేస్తారు. అందులో తమ వారినే వుద్యోగులుగా నియమిస్తారు. వారికి జీతాలను ఆ ట్రస్టుల నుంచే ఇస్తారు. కన్సల్టెంట్స్‌గా కూడా తమవారినే పెట్టుకుంటారు. క్లీన్‌ ఎనర్జీ ప్రాజెక్టులకు రూపకల్పన చేయిస్తారు. మన వంటి పేద దేశాలు వాటిని కావాలని వెళితే మనకు ఆ పధకాలు ఇవ్వటే కాదు, అందుకు అవసరమైన అప్పులను కూడా వేరే ఏజన్సీ ద్వారా ఇప్పిస్తారు. అప్పు డబ్బు రూపంలో ఇస్తే దారి మధ్యలో ఎవరైనా కొట్టివేయకుండా మాకు తెలిసిన కంపెనీలలో వున్న యంత్రాలను కొనుగోలు చేయండి, వాటిని బిగించాలన్నా, సరిగా పనిచేయాలన్నా వాటి ఇంజనీర్లు మాత్రమే వుండాలి, ఇలా షరతులు వర్తిస్తాయి అన్నట్లుగా సవాలక్ష నక్షత్రాలను వుంచి మనకు ఇస్తారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ప్రైవేటు ఆసుపత్రులు, వైద్యులు, పరీక్షా కేంద్రాలు, మందులు, మెడికల్‌ షాపులు, రోగులు అన్నమాట. అవసరమా లేదా అని ప్రశ్నించకుండా వైద్యులు రాసిన పరీక్షలన్నీ చేయించుకోవాలి, అదీ వారు పేర్కొన్న పరీక్షా కేంద్రాలలోనే మిగతా చోట్లకు వెళితే రిపోర్టులు సరిగా రావంటారు. వారు రాసిన మందులే కొనాలి. మిగతా మందులు సరిగా పనిచేయవు మీ ఇష్టం అంటారు. వారు చెప్పిన షాపులోనే కొనాలి, అవి అక్కడ తప్ప మరొక చోట దొరకవంటారు. కౌపీన సంరక్షణార్ధం చివరకు ఒక సన్యాసి సంసార జంఝాటంలో చిక్కుకున్నట్లుగా దాతృత్వం గురించి చెబుతానంటూ ఈ విషయాలన్నీ ఏమిటి అనుకుంటున్నారా ? కార్పొరేట్‌ దానాలకు అదే కార్పొరేట్‌ కంపెనీల ప్రయోజనాలకు వున్న సంబంధాన్ని ఈ లావాదేవీలలో మనం చూడటం కష్టం, ఎలాగంటే ఎక్కడో స్విచ్‌ వేస్తే మరెక్కడో లైటు వెలుగుతుంది. ఇది చదివిన తరువాత కూడా సంబంధం లేని విషయాలుగా మీకు అనిపిస్తే చెప్పటంలో లోపం నాదే. మన దేశాన్ని బ్రిటీష్‌వారు దోచుకుంటున్నారు, వారిని తరిమివేస్తే తప్ప మనకు మంచి జరగదు అని మన జనాన్ని ఒప్పించటానికి ఎన్ని వందల సంవత్సరాలు పట్టింది, ఎన్ని విధాలుగా చెప్పాల్సి వచ్చిందో తెలుసు కదా !

Share this:

  • Tweet
  • More
Like Loading...

ధర్మకర్తృత్వం-దాతల బండారం-1

03 Thursday Dec 2015

Posted by raomk in Current Affairs, Economics, INTERNATIONAL NEWS

≈ Leave a comment

Tags

billionaires, philanthropy, Zuckerberg

ఎం కోటేశ్వరరావు

తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు, కుందేటి కొమ్ము సాధించవచ్చు గాని మూర్ఖుని మనస్సును రంజింప చేయలేమన్న పెద్దల అనుభవసారాన్ని ఇంతకాలం పాఠాలలో చదువుకున్నాం. దీనికి తోడుగా వుదారులైన మంచి భూస్వాములు, దొరలు, కార్మికుల శ్రమశక్తిని జలగల్లా పీల్చని అతి మంచి పెట్టుబడుదారులను కనలేమని కూడా చెప్పుకోవచ్చేమో ?

ఈ మాట చదవగానే డిసెంబరు రెండవ తేదీ పత్రికలు చూసిన వారంతా నా మీద ఇంతెత్తున మండి పడతారు. వూరంతటిది ఒకదారి ఇలాంటి వులిపికట్టెలది ఒకదారి, వీరు జన్మలో మారరు, ఇతరుల మంచిని, దయా గుణాన్ని చూడరు అంటూ ఫేస్‌బుక్‌ సిఇఓ మార్క్‌ జుకెర్‌బెర్గ్‌ దంపతులు తమకు కుమార్తె పుట్టిన సంతోషంలో మూడు లక్షల కోట్ల రూపాయల విరాళం ఇచ్చిన వార్తలను చూపించిన టీవీలను కదలించరు గానీ ప్రచురించిన పత్రికలను నా ముఖాన కొడతారని తెలుసు. జుకెర్‌బర్గ్‌ ఎవరనుకుంటున్నారు. మన యజమాని, మనం అంటే ఫేస్‌బుక్‌లో ఖాతాలున్నవారందరం. జీతాలు అడగకుండా స్వచ్ఛందంగా పనిచేస్తున్న కార్మికులం.మనం రోజూ లోడింగ్‌, అన్‌లోడింగ్‌ చేసే ప్రతిదీ, ఫేస్‌బుక్‌లో మనం వుత్పత్తి చేసేవన్నీ మనకు తెలియకుండానే జుకెర్‌బెర్గ్‌ ఆస్తిగా మారిపోతాయి. వాటిని మార్కెటింగ్‌ చేసుకొని విపరీత లాభాలు సంపాదిస్తున్నాడు. ఇలాంటి కార్మికులు,దోపిడీ గురించి మార్క్స్‌-ఎంగెల్స్‌లు ఊహించి వుండరు. ఫ్యాక్టరీ లేదు, మౌలిక వసతులైన కంప్యూటర్లు, సెల్‌ఫోన్లు అవినడిచేందుకు అవసరమైన ,బ్యాటరీలు, విద్యుత్‌ అన్నీ మనం స్వంతంగా డబ్బు పెట్టి మరీ సమకూర్చుకుంటున్నాం, పెట్టుబడులు పెడుతున్నాం, జీతాలు తీసుకోకుండా రోజుకు 50 కోట్ల మందిమి పనిచేస్తున్నాము. మన కేవలం వీడియోలు చూస్తే చాలు,పోస్టింగులు పెడితే చాలు, లైకులు,షేర్లు కొడితే చాలు డబ్బే డబ్బు. ఎనిమిది బిలియన్ల వీడియోలు చూస్తున్నాం, ఇది పని కాదేటి? దీనికి శ్రమపడనవసరం లేదా? దీని ద్వారా వచ్చే జబ్బులు, దురలవాట్లు , అవలక్షణాలు తప్ప మనకు లాభాల్లో వాటా లేదే !త్వరలో మన సంఖ్య 153 కోట్లకు చేరుతుందని, వీరిలో 136 కోట్ల మందిమి సెల్‌ఫోన్ల మీద పనచేసే వారం తయారవుతామట. మూడవ త్రైమాసిక ఆదాయం 480 కోట్ల డాలర్లని తాజా సమాచారం. ఖర్చు మూడు వందల కోట్ల డాలర్లట. రానున్న రోజుల్లో ఇది ఇంకా పెరుగుతుందని ఇంత ఖర్చయినా ఫరవాలేదని మదుపుదార్లు ధీమాగా వున్నారు.

నిజమే ఏ మాటకామాటే చెప్పుకోవాలి కదా ! అయినా ఎందుకో నా హార్ట్‌వేర్‌లో అది సూట్‌కావటం లేదు. నా చిన్న తనంలో మా పక్కింటి వారు ఎప్పుడూ దెబ్బలాడుకుంటూ వుండేవారు. ఒకరి పొలం గట్టును మరొకరు కొద్ది కొద్దిగా ఎవరూ లేనపుడు నరికి తమ పొలంలో కలుపుకుంటున్నారన్నది తగాదాకు హేతువు. ఎంతవరకు పోయిందంటే కర్రల నుంచి గొడ్డళ్ల వరకు. ఇపుడు రిలయన్స్‌ కంపెనీ తనకిచ్చిన బావుల పక్కనే వున్న కృష్ణా-గోదావరి బేసిన్‌లోని ప్రభుత్వరంగ ఓఎన్‌జిసి బావుల నుంచి లోలోపలే తొమ్మిది వందల కోట్ల ఘనపు మీటర్ల సహజవాయువును కరిమింగిన వెలగపండులా లాగించేయటం నిజమేనని, దాని విలువ పదకొండువేల కోట్ల రూపాయలని తెలిసినపుడు మా పక్కింటి రైతులు కొద్ది గజాల గట్టుకోసం గొడ్డళ్ల వరకు పోవటం నిజంగా నవ్వు తెప్పిస్తోంది. రిలయన్స్‌ వంటి మహానుభావులైన కంపెనీలు ఇలాంటి సొమ్ముతో ఎన్ని విరాళాలైనా ఇస్తాయి, మన వంటి రాష్ట్రాలలోని పత్రికలు, టీవీ ఛానల్స్‌లో పెట్టుబడులుగా పెట్టి అలాంటి వార్తలు, విశ్లేషణలను తొక్కిపెడతాయంటే ఆ కంపెనీ భక్తులు నా వంటి వారి మీద గొడ్డళ్లు ఎత్తకపోతేనే ఆశ్చర్యం. కంపెనీలన్న తరువాత అక్రమాలకు పాల్పడకుండా వుంటాయా, రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వకుండా వుంటాయా, కేసులను మాఫీ చేయించుకోకుండా వుంటాయా అంటే భగవంతుడా వీరికి ఇలాంటి సాఫ్ట్‌వేర్‌లోడ్‌ చేశావేమయ్యా అని అనుకోవటం తప్ప చేసేదేముంది.

నిద్రపోయే ముందు ఎంత మంది అద్దాలలో తమ ముఖం చూసుకుంటారో లేదో తెలియదు గానీ ంప్యూటర్లలో ముఖపుస్తకం చూసి మాత్రమే నిద్రపోతారని, పొద్దున్నేలేచి అద్దంలో ముఖం సంగతేమోగాని ముఖపుస్తకం చూస్తారని తెలుసు. అలాంటి వరాన్ని మనకు ప్రసాదించిన దేవుడు మార్క్‌ జుకెరబర్గ్‌ .తమ జీవిత కాలంలో ఫేస్‌బుక్‌ కంపెనీలో తమకు వున్న వాటాలలో 99శాతం విరాళంగా ఇచ్చి చిన్నారుల సంక్షేమానికి ఖర్చు చేస్తానని ప్రకటించి కోట్లాది మంది నీరాజనాలు అందుకుంటున్నాడు.మన దేశానికి అందునా అతగాడిని నమ్మే మతంలో కూడా విశ్వాసం వున్న వారికి మాత్రమే పేటెంట్‌ హక్కువున్న కలియుగ దేవుడి కంటే ఎలాంటి హద్దులు, సరిహద్దులు, ఆంక్షలు లేని దేవతలుగా జుకర్‌బెర్గ్‌ దంపతులని చెపితే మా మనోభావాలు దెబ్బతీశారని ఎవరైనా దాడి చేసి చంపేస్తారేమో ?

హైస్కూలు పుస్తకాలలో ధర్మకర్తృత్వ సిద్దాంతం కూడా ఒకటి వుందని చదువుకున్నాం. దాని ప్రకారం భూస్వాములు తమ భూములలో పనిచేసేవారు, ఫ్యాక్టరీ యజమానులు తమ కార్మికుల పట్ల ఎంతో దయతో తమ బిడ్డలుగా చూసుకుంటారు, ధర్మకర్తలుగా వుంటారు తప్ప యజమానులు-పనివారలనే భావం వుండదన్నది దాని సారం. ఇటీవలి కాలంలో ప్రపంచంలో ధర్మకర్తృత్వ పెట్టుబడిదారీ విధానం అనే పదం వినిపిస్తున్నది. అంటే పెట్టుబడిదారులు తాము సంపాదించిన దానిలో భారీ మొత్తాలను దాన ధర్మాలకు కేటాయించటం.

కాశీ మజిలీ కధలన్నింటా మనకు అంతర్లీనంగా రంగు రంగుల పూసల్లో దారంలా కన్పించే సందేశం ఏమంటే రాజులందరూ తమ పౌరులను కన్నబిడ్డలుగా చూసుకొనేవారు, కరువు కాటకాలు లేకుండా దేశం సుభిక్షంగా వుండేది. దాని కొనసాగింపుగా రాజులు, రాజరికాలు పోయినా వాటి స్దానంలో జమిందార్లు, భూస్వాములు, దొరలు వచ్చినా, వారు పెట్టుబడిదారులుగా మారినా తమ వద్ద పనిచేసేవారిని కన్నబిడ్డలుగా చూసుకుంటారనే సందేశం మాత్రం ఏదో రూపంలో వస్తూనే వుంది. అదే సమయంలో అంతరాలు గతం కంటే తీవ్రంగా పెరుగుతున్నాయి. డిజిటల్‌ యుగంలో కూడా దాతృత్వాన్ని చూపి దోపిడీని మరుగుపరచాలని చూసే యత్నంలో భాగంగానే ఇప్పుడు కూడా బలంగా ధర్మకర్తృత్వ పెట్టుబడిదారీ సిద్ధాంతాన్ని కొత్త పద్దతుల్లో ముందుకు తెస్తున్నారు. వద్దంటే డబ్బు అన్నట్లుగా అది కూడా వారికి లాభాలనుె తెచ్చి పెట్టే విధంగా రూపొందించారంటే నిజమా అని ముక్కున వేలేసుకోవాల్సిందే.

మార్క్‌ జుకెరబెర్క్‌ దంపతులు ఫేస్‌బుక్‌ కంపెనీలోని తమ వాటాలలో 99శాతం ధర్మానికి ఇచ్చివేసినా కంపెనీలో వారి పెత్తనానికి ఢోకా వుండదట. అదే అసలు మతలబు. ఇదేం పితలాటకం అనుకోకండి.ప్రపంచంలో 2015లో బిలియనీర్లు 1826 మంది వున్నారని, వారిలో 290 మంది కొత్తగా ఈ ఏడాది చేరినట్లు ధనవంతుల సంపదల గురించి రాసే పత్రిక ఫోర్బ్స్‌ పేర్కొన్నది. అంటే ఇన్ని సంవత్సరాల కాలంలో బిలియనీర్లుగా ఎదిగింది కేవలం 1536 మందే అయితే ఏడాదిలో 290 మంది పెరిగారంటే కొద్ది మంది దగ్గర నడమంత్రపు సంపదలు ఎంత వేగంగా చేరుతున్నాయో అర్ధం చేసుకోవచ్చు. సామాన్య రైతులు ఎంత మట్టి పిసికితే అంత అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకోవటం తప్ప బిలియనీర్‌ సంగతి దేవుడెరుగు మిలియనీరు కూడా కాలేడు.

ధర్మకర్తృత్వ పెట్టుబడిదారులలో ఇంతకు ముందు వారెన్‌ బఫెట్‌, బిల్‌గేట్స్‌, ఫోర్డ్‌, బ్లూమ్‌బెర్గ్‌ వంటివారు నెలకొల్పిన రికార్డులన్నింటినీ జుకర్‌బెర్గ్‌ బద్దలు కొట్టాడని, వారంతా పెద్దవారైన తరువాత ధర్మబుద్ది పొందితే ఇతగాడు 31 సంవత్సరాలకే దాన్ని పొందాడని కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. అత్యంత క్లిష్టమైన సామాజిక సమస్యలకు కొత్త పద్దతుల్లో పరిష్కారం చూపేందుకు ధనికులు తమ సంపదలను,సామర్ద్యాన్ని ఒక దగ్గరకు చేరుస్తున్నారని కొంత మంది వ్యాఖ్యానించటం కూడా ప్రారంభించారు.వీటిని చూస్తుంటే ప్రపంచ ధనికులందరూ తమ ఆస్తులను ధాన ధర్మాలకు ఇచ్చి జనాన్ని ఈతిబాధల నుంచి రక్షించి సోషలిజం సాధిస్తారని, ఇంక కమ్యూనిస్టులతో పని లేదని ఎవరైనా చెప్పినా ఆశ్చర్యం లేదు. (ఇంకా వుంది. అంతం కాది ఆరంభం)

Share this:

  • Tweet
  • More
Like Loading...

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d