• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: BJP

రాహుల్‌ గాంధీవి పిల్ల చేష్టలైతే….నరేంద్రమోడీ పెద్దరికం ఎక్కడ ?

23 Wednesday Apr 2025

Posted by raomk in BJP, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

BJP, Modi attacked Congress, Modi Self-congratulation, Narendra Modi Failures, Rahul gandhi


ఎం కోటేశ్వరరావు


రామాయణంలో రాముడికి పేరు ఎలా వచ్చిందంటే ప్రధాన కారకుడు రావణ పాత్రధారి అని కొందరు అంగీకరించకపోవచ్చు. సీత గీత దాటకపోతే రామకథే లేదు అన్నవారు కూడా ఉన్నారు. అలాగే రాహుల్‌ గాంధీకి ప్రాచుర్యం కల్పించటంలో బిజెపి నేతలు, వారి కనుసన్నలలో నడిచే మీడియా పెద్ద ఎత్తున ప్రచారం కల్పిస్తున్నదంటే అతిశయోక్తి కాదు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నాటికి అంతకు ముందు లోక్‌సభ ఎన్నికలతో పోల్చితే పెద్ద సంఖ్యలో ఓట్లు పెరగటం, సాయంత్రం 5.30 నుంచి 7.30 మధ్యలో 65లక్షల ఓట్లు పోల్‌ కావటం గురించి గతంలో చేసిన విమర్శలు లేదా ఆరోపణలనే రాహుల్‌ గాంధీ మరోసారి చేశారు. అది అమెరికాలోని బోస్టన్‌ నగరంలో పునశ్చరణ చేయటాన్ని బిజెపి తప్పు పడుతూ దేశద్రోహం అన్నట్లుగా దాడికి దిగింది. మన గడ్డమీద ఎన్నయినా అనుకోవచ్చుగానీ విదేశాల్లో మన రాజ్యాంగ సంస్థలను విమర్శించటం ఏమిటి అంటూ మనోభావాలను ముందుకు తెచ్చింది. దేవుడు నైవేద్యం తినడని పూజారికి తెలిసినంతగా మరొకరికి తెలియదు. అలాగే రాజ్యాంగ వ్యవస్థల నిర్వీర్యం, వాటి మీద దాడి చేయటంలో బిజెపి తీరు అనితర సాధ్యం. ఎన్నికల కమిషనర్లు, ప్రధాన కమిషనర్‌ నియామక కమిటీలో ప్రధాని, ప్రతిపక్ష నేత, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉన్న పద్దతిని మార్చి సిజె స్థానంలో కేంద్ర మంత్రిని పెట్టారు. అంటే ముగ్గురిలో రెండు ఓట్లు అధికారంలో ఉన్నవారికి ఉంటాయి గనుక ఇష్టం వచ్చిన వారిని నియమించుకోవచ్చు, అలాంటి వారు ఎలా పని చేస్తారో వేరే చెప్పనవసరం లేదు. రాహుల్‌ గాంధీ చెప్పినట్లు అలా నియామకం పొందిన వారు రాజీపడక ఏం చేస్తారు, నియమించిన వారికి వ్యతిరేకంగా వ్యవహరించగలరా ? వారేమైనా టిఎన్‌ శేషన్‌ వంటి వారా ?

ఈ పూర్వరంగంలోనే ఎన్నికల కమిషన్‌ రాజీపడుతున్నదని, వ్యవస్థలోనే లోపం ఉన్నదని రాహుల్‌ గాంధీ బోస్టన్‌లో చేసిన వ్యాఖ్యలను బిజెపి వివాదం కావించింది.ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ, పోలింగ్‌ గురించి ఎన్నికల కమిషన్‌ గతంలోనే తన చర్యను సమర్ధించుకున్నది. మొత్తం 9.7కోట్ల మంది ఓటర్ల గురించి కేవలం 90 అప్పీళ్లు మాత్రమే వచ్చినందున జాబితా సరైనదే అని ఎన్నికల కమిషన్‌ సమర్ధించుకుంది, 30లక్షల మంది కొత్త ఓటర్లు నమోదైతే ఆ స్థాయిలో ఫిర్యాదులు రాలేదెందుకని ఎదురు ప్రశ్నించింది.రెండు గంటల సమయంలో 65లక్షల ఓట్లు వేయటం ఎలా సాధ్యమని రాహుల్‌ గాంధీ ప్రశ్న, వీడియో చిత్రాలను కూడా అడిగేందుకు వీల్లేకుండా చట్టాలను సవరించారని పేర్కొన్నారు. వీటికి సమాధానం లేదు. రిగ్గింపు ఎప్పుడు ఎలా చేస్తారో మనకు తెలియదా ! రాహుల్‌ గాంధీవి పిల్లచేష్టలని,విదేశీ గడ్డ మీద ఆధారం లేని ఆరోపణలు చేస్తున్నట్లు బిజెపి ధ్వజమెత్తింది. విదేశీ పర్యటనల్లో విమర్శలు చేయటం కొత్త కాదు, గతంలో కూడా చేశారు. ఆ మాటకు వస్తే వయసులో పెద్దమనిషి, ఒక ప్రధానిగా నరేంద్రమోడీ చేసిందేమిటి ? పెద్దలు నడిచిన బాటనే పిల్లలూ అనుసరిస్తారు. ఒక రాజకీయ నేత తన ప్రత్యర్ధి పార్టీ లేదా ప్రభుత్వం, వ్యవస్థల గురించి స్వదేశంలో విమర్శించి విదేశాల్లో పొగడాలా, ఆ పని చేస్తే సమావేశాలకు వచ్చిన వారు గడ్డి పెట్టరా లేదా నేను మాట్లాడను అని నోరుమూసుకోవాలా ? నరేంద్రమోడీ అదే చేశారా ? కాంగ్రెస్‌ను స్వదేశంలో విమర్శించినట్లే విదేశాల్లోనూ ధ్వజమెత్తారు. ఆ పార్టీనే కాదు, అవినీతిదేశం అంటూ జాతి పరువునే తీశారు.


2015లో జర్మనీ వెళ్లినపుడు కాంగ్రెస్‌ పార్టీ వదలివెళ్లిన చెత్తనంతా శుద్ధి చేయాల్సి ఉందని మోడీ చెప్పారు, భారత్‌ అంటే కుంభకోణాల దృశ్యమని, దాన్ని తాను నైపుణ్య దేశంగా మార్చనున్నట్లు కెనడాలో చెప్పారు. ఓమన్‌లో కూడా అదే చెప్పారు. కాంగ్రెస్‌ పాలనా కాలమంతా కుంభకోణాల మయమని, తప్పుడు పాలనా పద్దతులను సరిదిద్దేందుకు తాను ఎంతో కష్టపడుతున్నట్లు చెప్పుకున్నారు. గత జన్మల్లో ఏ పాపం చేశామో భారత్‌లో పుడుతున్నామని జనాలు చెప్పుకుంటున్నారని దక్షిణ కొరియా సియోల్‌లో మోడీ సెలవిచ్చారు.ఇలాంటి పరిస్థితిలో వదిలేసి వేరే చోటకు పోదామని అనుకున్నారు అలాగే వెళ్లారు.ఇప్పుడు నేను గట్టి విశ్వాసంతో చెప్పగలను, అన్ని జీవన రంగాలకు చెందిన ఆ తెలివైన వారు, ప్రముఖ శాస్త్రవేత్తలు కూడా వారు విదేశాల్లో పెద్ద మొత్తాలను సంపాదిస్తున్నప్పటికీ వారంతా తిరిగి రావటానికి, తక్కువ ఆదాయాలకు కూడా సిద్దపడి భారత్‌లో స్థిరపడటానికి రావాలని చూస్తున్నారని మోడీ చెప్పారు. చైనాలోని షాంఘై నగరంలో భారత సంతతి సమావేశంలో మాట్లాడుతూ గతంలో మీరు భారత్‌ గురించి సిగ్గుపడేవారు, ఇప్పుడు (తాను ప్రధాని అయిన తరువాత) దేశం గురించి గర్వపడుతున్నారన్నారు. ప్రతిపక్షం మీద ధ్వజం, స్వంతడబ్బా ప్రతిచోటా కనిపిస్తుంది. 2014లో ఎన్నిక తరువాత న్యూయార్క్‌ పర్యటనలో మీరు ఓట్లు వేసి ఉండకపోవచ్చుగానీ ఫలితాలు వచ్చినపుడు మీరంతా పండగ చేసుకున్నారని ప్రవాస భారతీయులతో చెప్పారు. ప్రధానిగా 70దేశాలు తిరిగారని 50చోట్ల తన ప్రత్యర్ధుల మీద రాజకీయ దాడి చేశారని పరిశీలకులు చెబుతున్నారు. అప్పుడు అది విదేశీ గడ్డా స్వదేశీ అడ్డా అన్నది గుర్తుకు రాలేదా ? కంటికి కన్ను, పంటికి పన్ను, కుక్కకాటుకు చెప్పుదెబ్బ మాదిరి రాహుల్‌ గాంధీ కూడా అదే బాటలో నడుస్తూ విమర్శలు చేస్తున్నారు. తేడా ఏమిటంటే మోడీ మాట్లాడిన వాటిని గోడీ మీడియా పెద్దగా ప్రచారంలో పెట్టలేదు, చర్చల రచ్చ చేయలేదు, అంతే ! మీరు ఎక్కడికి వెళితే అక్కడికి మా నెట్‌వర్క్‌ వస్తుందనే హచ్‌ కుక్క ప్రకటన మాదిరి నరేంద్రమోడీ ఏ విదేశ పర్యటన చేస్తే తాము కూడా ఒక సీనియర్‌ నేతను అక్కడకు పంపుతామని, అక్కడేమైనా తప్పుడు ప్రచారం, ఆరోపణలు చేస్తే అదే స్థాయిలో సమాధానం చెబుతామని, దేశాన్ని కించపరుస్తూ,ప్రతిపక్షం మీద ఆరోపణలతో మాట్లాడుతున్న ఏకైక ప్రధాని నరేంద్రమోడీ అని 2015లోనే కాంగ్రెస్‌ నేత ఆనందశర్మ విమర్శించారు.మోడీ ప్రధానిగా దేశాలు తిరుగుతున్నారు తప్ప ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారక్‌ లేదా బిజెపి ప్రతినిధిగా కాదన్నారు.
రాజ్యాంగ వ్యవస్థలను కించపరుస్తున్నారంటూ రాహుల్‌ గాంధీ మీద ధ్వజమెత్తుతున్న బిజెపి నేతలు ఏం చేస్తున్నారో దేశంతో పాటు ప్రపంచమంతా చూస్తోంది. అత్యున్నత న్యాయస్థానం తీర్పులనే వారు సవాలు చేస్తున్నారు. పార్లమెంటు సుప్రీం అంటూ ఉపరాష్ట్రపతి జగదీప్‌ థంకర్‌ మరోసారి వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి, గవర్నర్లు తమ దగ్గరకు వచ్చిన బిల్లుల మీద మూడు నెలల వ్యవధిలో నిర్ణయం తీసుకోవాలని లేకుంటే వాటిని ఆమోదించినట్లు పరిగణించాలని ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ఉపరాష్ట్రపతి విమర్శించారు. అది ప్రజాస్వామిక శక్తులపై అణుక్షిపణి వంటిదని వర్ణించారు. సుప్రీం కోర్టుకు అలాంటి అధికారం లేదన్నారు. రాజ్యాంగం ప్రకారం చట్టసభలు ఆమోదించిన బిల్లులను తిప్పి పంపే అధికారం రాష్ట్రపతి, గవర్నర్లకు ఉంది. అయితే వాటిని తిరిగి చట్టసభలు మరోసారి ఆమోదించి పంపితే చట్టాలుగా ఆమోద ముద్రవేయటం తప్ప తిరస్కరించే అధికారం లేదు. అయితే రాష్ట్రపతి, ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల గవర్నర్లు నెలల తరబడి తిప్పి పంపకుండా ప్రభుత్వాలను ఇబ్బందులు పెడుతున్న పూర్వరంగంలో తమిళనాడు కేసులో సుప్రీం కోర్టు ఆ తీర్పు ఇచ్చింది. న్యాయవ్యవస్థ సూపర్‌ పార్లమెంటుగా వ్యవహరించజాలదని జగదీప్‌ తప్పుపట్టారు. రాజ్యాంగ పరిరక్షణ బాధ్యత రాష్ట్రపతి, గవర్నర్లదైతే, రాజ్యాంగం ప్రకారం పాలన సాగుతున్నదా లేదా అన్న భాష్యం చెప్పేందుకు సుప్రీం కోర్టుకు అధికారం ఉంది.చట్టసభలు చేసిన నిర్ణయాలను కాదనే హక్కు లేదు గానీ, అవి నిబంధనల మేరకు జరుగుతున్నాయా లేదా అన్నది నిర్ణయించవచ్చు. ఇప్పుడు వక్ఫ్‌ సవరణ చట్టం గురించి సుప్రీం కోర్టు విచారిస్తున్నది. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు దాని పరిధికి మించినా లేక ప్రభుత్వానికి ఇష్టం లేకపోయినా షాబానో తీర్పు మాదిరి పార్లమెంటులో బిల్లు పెట్టి దాన్ని రద్దు చేసే దమ్ము బిజెపి కేంద్ర ప్రభుత్వానికి ఉందా అన్నది సమస్య. ఉపరాష్ట్రపతి చెప్పినట్లుగా దేశానికి పార్లమెంటు, రాష్ట్రాలకు అసెంబ్లీలు ఉన్నతం, అవి ఆమోదించిన బిల్లులను నెలల తరబడి గవర్నర్లు తొక్కిపట్టటాన్ని ఏమనాలి, తానే స్వయంగా అలాంటి పనికి పాల్పడిరది గుర్తులేదా, అప్పుడు అసెంబ్లీ సుప్రీం అన్న జ్ఞానం లేదా ?

ఉపరాష్ట్రపతి సుప్రీం కోర్టు మీద ధ్వజమెత్తటంతో కాబోయే సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్‌ గవాయ్‌ సున్నితంగా బిజెపి నేతలకు చురకలు అంటించారు. పశ్చిమ బెంగాల్‌ ముర్షిదాబాద్‌లో హింస కారణంగా అక్కడకు పారామిలిటరీని పంపాలంటూ రాష్ట్రపతికి ప్రవర్తకాది లేఖ జారీ చేయాలన్న పిటీషన్‌పై స్పందించారు. ఇప్పటికే మేము కార్యనిర్వహణ పరిధిని ఆక్రమిస్తున్నామన్న ఆరోపణలను ఎదుర్కొంటున్నాం అందువలన ఈ వినతిని తిరస్కరిస్తున్నామని ప్రకటించారు.కోర్టు పేరుతో పశ్చిమబెంగాల్లో కేంద్ర బలగాలను దించాలన్న ఎత్తుగడ పిటీషనర్‌ వినతిలో ఉంది.మమతా బెనర్జీని సమర్ధించనవసరం లేదుగానీ విష్టు శంకర్‌ జైన్‌ అనే న్యాయవాది ఈ పిటీషన్‌కు ముందు రాష్ట్రపతి పాలన విధించాలని 2021లో కూడా కేసు వేశారు. పార్లమెంటూ కాదు, కార్యనిర్వాహక వ్యవస్థా కాదు రాజ్యాంగమే ఉన్నతమైనదని జగదీప్‌ థంకర్‌ వ్యాఖ్యల మీద రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ న్యాయవాది కపిల్‌ సిబల్‌ స్పందించారు. సిబల్‌ ప్రస్తుతం సుప్రీం కోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు, గతంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. నోటి తుత్తర బిజెపి నేతల్లో నిషికాంత్‌ దూబే ఒకరు. వక్ప్‌ చట్ట సవరణ చెల్లుతుందా లేదా అన్నదాని గురించి విచారణ జరుపుతున్న సుప్రీం కోర్టు దేశంలో మత యుద్ధాలను రెచ్చగొడుతున్నదని, తన హద్దులను దాటుతున్నదని నోరుపారవేసుకున్నాడు. తరువాత ఎన్నికల కమిషన్‌ మాజీ ప్రధాన అధికారి ఎస్‌వై ఖురేషీ ముస్లిం కమిషనర్‌ తప్ప ఎన్నికల కమిషనర్‌ కాదని వదరుబోతుతనంతో మాట్లాడారు.దూబే వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని బిజెపి ప్రకటించటం ఒక నాటకం తప్ప మరొకటి కాదు. అలా ప్రకటించిన తరువాతే ఖురేషీ గురించి మాట్లాడాడు. ఎందుకంటే వక్ఫ్‌ చట్టాన్ని ఖురేషీ విమర్శించారు.తానుగా అధికారికంగా చేయలేని వ్యాఖ్యలను దూబే వంటి వారితో బిజెపి చేయించటం దానికి వెన్నతో పెట్టిన విద్య. దూబే అంతటితో ఊరుకోలేదు, దేశం హిందువులదని, గిరిజనులు, జైనులు, బౌద్దులు వారితో కలసి ఉన్నారని కూడా సెలవిచ్చారు. రెచ్చగొట్టే మాటలు మాట్లానికి దూబె పెట్టింది పేరు, అగ్రనేతల మనసులో ఉన్నదాన్ని వెల్లడిరచిన దూబే మీద ఎలాంటి చర్య ఉండదని, తప్పనిసరైతే ఏదో మమఅనిపిస్తారని ఒక ఎంపీ వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చాయి. సుప్రీం కోర్టు గురించి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను కోర్టు ధిక్కరణ నేరం కింద దూబేపై చర్యలు తీసుకోవాలని వక్ప్‌ చట్ట సవరణను వ్యతిరేకిస్తున్న వారి తరఫు లాయర్‌ అనాస్‌ తన్వీర్‌ అటార్నీ జనరల్‌ ఆర్‌ వెంకటరమణికి లేఖ రాశారు, బిజెపి చర్యతీసుకుంటుందా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఆకాశానికి, బిజెపి అవకాశవాదానికి హద్దే లేదు :నాడు తెలంగాణాలో బండి సంజయ్‌, నేడు అన్నాడిఎంకె ఓట్ల కోసం అన్నామలై బలి !

13 Sunday Apr 2025

Posted by raomk in BJP, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, TDP

≈ Leave a comment

Tags

AIADMK, BJP, BJP Appeasement, DMK, Narendra Modi, PMK, politics of iftar, SDPI, Tamilnadu Elections 2026, Tamilnadu politics


ఎం కోటేశ్వరరావు


తమిళనాడులో చరిత్ర పునరావృతమైంది. అధికారం కోసం మరోసారి అన్నాడిఎంకెతో బిజెపి ఎన్నికల ఒప్పందం చేసుకుంది.కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సమక్షంలో 2025 ఏప్రిల్‌ 11న మైత్రీ బంధాన్ని ప్రకటించారు. ఈ కూటమికి అధికారం వస్తుందో రాదో తెలియదుగానీ ఈ పరిణామంతో ఆ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు అన్నామలై పదవి మాత్రం పోయింది.అంటే అన్నారని అంటారు గానీ వీరశూర ప్రతిజ్ఞలు చేయాలని అతగాడిని ఎవరైనా కోరారా ? తెలంగాణా ఎలక్షన్‌ రెడ్డి(తూర్పు జగ్గారెడ్డి) మాదిరి గడ్డం ప్రతిజ్ఞ చేస్తే వేరు. డిఎంకె ప్రభుత్వాన్ని గద్దె దించేంతవరకు తాను చెప్పులు ధరించేది లేదంటూ 2024 డిసెంబరు 28న తన ఇంటి ముందు ఆరుసార్లు కొరడా దెబ్బలు కొట్టుకొని పెద్ద ప్రదర్శన చేశారు. అదేమీ లేకుండానే 2025 ఏప్రిల్‌ 12న చెప్పులు వేసుకున్నారు.ఎందుకంటే అన్నాడిఎంకెతో కలసి బిజెపి విజయానికి ఇప్పటికే అమిత్‌ షా బాట వేసినందున నిరసన విరమించాలంటూ కొత్త అధ్యక్షుడు నాగేంద్రన్‌,కేంద్రమంత్రి ఎల్‌ మురుగన్‌, ఇతర నేతలు కలసి ఒక కార్యక్రమంలో చెప్పులు అందచేశారు. స్వయంగా పరువు తీసుకోవటం, విధి వైపరీత్యం అంటే ఇదే కదా ! అతగాడితో కలసి పని చేయటం తమకు అంగీకారం కాదని, రాష్ట్ర బిజెపి సారధిగా మరొకరిని పెట్టాలని అన్నాడిఎంకె విధించిన షరతుకు బిజెపి తలొగ్గింది. గతంలో అన్నాడిఎంకె నేతగా ఉన్న నైనార్‌ నాగేంద్రన్ను ఎంపిక చేసింది. 2019లోక్‌సభ ఎన్నికలు, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలు కలసి పోటీ చేశాయి. తరువాత అన్నామలై బిజెపి అధ్యక్ష పదవి స్వీకరించిన తరువాత మాజీ సిఎం అన్నాదురై, జయలలిత, పళనిస్వామిని పదే పదే రెచ్చగొట్టే విధంగా విమర్శించారు. అతని వ్యాఖ్యలతో మైనారిటీల ఓట్లు పోతాయని కూడా అన్నాడిఎంకె భయపడిరది. ఆంధ్ర ప్రదేశ్‌లో వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి నాయకత్వంలోని వైసిపిని ఓడిరచేందుకు ఉప్పు నిప్పుగా ఉన్న తెలుగుదేశం, జనసేన, బిజెపి చేతులు కలిపి విజయం సాధించటంతో అదే ఫార్ములాతో తమిళనాడులో కూడా గెలవాలని రెండు పార్టీల నేతలు కొంతకాలంగా ఆలోచనలు చేస్తున్నారు. అడ్డుగా ఉన్న అన్నామలైని తప్పించారు.

అధికారం వస్తుందంటే బిజెపి దేనికైనా సిద్దపడుతుంది. విలువలు, వలువల గురించి కబుర్లు చెప్పే ఆ పార్టీకి ఇతరులకు తేడా లేదు. తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసేవరకు అధ్యక్షుడిగా బండి సంజయ్‌ను కొనసాగిస్తామని స్వయంగా ప్రకటించిన పార్టీ సరిగ్గా ఎన్నికలకు ముందు పదవి నుంచి తప్పించి కేంద్ర మంత్రి జి కిషన్‌ రెడ్డిని కూర్చోపెట్టింది. ఏడాదిన్నర కావస్తున్నా కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోలేకపోయింది. వ్రతం చెడ్డా ఫలందక్కలేదనట్లు బిజెపి పరిస్థితి తయారైంది. బండి సంజయ్‌ను తొలగించినా మిన్నువిరిగి మీద పడలేదు, ఇప్పుడు అన్నామలైని తొలగించినా అంతే. నోటి దురుసులో ఇద్దరూ ఇద్దరే. తమిళనాడులో ఒక ప్రాంతీయ పార్టీకి అది తోకగా తయారైంది. ఆంధ్రప్రదేశ్‌లో మాదిరి మధ్యవర్తి పవన్‌ కళ్యాణ్‌ లాంటి వారెవరూ లేకపోతే నేరుగా కేంద్ర బిజెపి నాయకత్వం బేరం కుదుర్చుకుంది. ఇటీవల ఆమోదించిన వక్ఫ్‌ చట్ట సవరణను వ్యతిరేకించిన వారిని ముస్లిం సంతుష్టీకరణ పార్టీలుగా వర్ణించింది. వాటిలో అన్నాడిఎంకె ఒకటి. శుభకార్యానికి వెళుతూ పిల్లిని చంకన పెట్టుకుపోయినట్లు ఇప్పుడు బిజెపి నేతలను చంకనెక్కించుకొని ముస్లింల ఓట్లను అర్ధించటం ఆ పార్టీకి పెద్ద పరీక్ష. సోషల్‌ డెమోక్రటిక్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (ఎస్‌డిపిఐ)ని ఉగ్రవాద పార్టీ అని బిజెపి వర్ణించింది. గత లోక్‌సభ ఎన్నికల్లో అన్నాడిఎంకె మద్దతుతో అది ఒక స్థానానికి పోటీ చేసింది. ఇప్పుడు ఎస్‌డిపిఐ కూటమిలో భాగస్వామిగా కొనసాగితే బిజెపి దాని అభ్యర్థులను ఎలా బలపరుస్తుంది, సమర్ధిస్తుందన్నది ప్రశ్న.ఎవరేమనుకుంటే మాకేటి సిగ్గు ! మమ్మల్ని విమర్శించే వారేమైనా నాలుగు ఓట్లు వేయిస్తారా, ఒకటో అరో సీటు తెప్పిస్తారా !! అనుకున్నట్లుగా ఉంది. రాష్ట్రానికి పాచిపోయిన లడ్లు ఇచ్చారంటూ ధ్వజమెత్తి వాటినే మహాప్రసాదంగా స్వీకరించిన పవన్‌ కల్యాణ్‌ మాదిరి అన్నాడిఎంకె నేత పళనిస్వామి కూడా తమిళనాడుకు బిజెపి చేసిన అన్యాయాల గురించి నిన్నటి వరకు ధ్వజమెత్తారు. ఆకస్మికంగా అదే పార్టీతో చేతులు కలిపితే తమిళ తంబీలు ప్రశ్నించకుండా ఉంటారా ? అంతకు ముందు బిజెపితో కలసి ఉన్నపుడు సంకీర్ణ ధర్మంగా సిఏఏను సమర్ధించామని విడిపోయిన తరువాత విమర్శించామని చెప్పుకున్న ఆ పెద్దమనిషిని మైనారిటీలు నమ్ముతారా ? అదే తర్కం ప్రకారం కొద్ది రోజుల క్రితం వ్యతిరేకించిన వక్ప్‌ చట్టానికి ఇప్పుడు జైకొట్టరనే హామీ ఏమిటి ?సినిమా నటుడు విజయ్‌ నాయకత్వంలోని టివికె పార్టీతో చేతులు కలపాలని తొలుత అన్నాడిఎంకె భావించి పావులు కదిపింది. విజయ్‌ అంగీకరించకపోవటంతో స్వంతంగా డిఎంకెను ఓడిరచలేమని గ్రహించి బిజెపిని కలుపుకుంది. బిజెపితో తెగతెంపులు చేసుకున్నా 2024లో మైనారిటీల ఓట్లు రాలేదని అందువలన తిరిగి ఆ పార్టీతో చేతులు కలిపినా నష్టం లేదన్నది అన్నాడిఎంకె అంతర్గత ఆలోచన అని కూడా చెబుతున్నారు.

ఐపిఎస్‌ అధికారి అన్నామలై (40) 2019లో ఉద్యోగానికి రాజీనామా చేసి 2020 బిజెపిలో చేరారు, 2021లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడయ్యారు. కేవలం ఆరు సంవత్సరాలు మాత్రమే పోలీసు అధికారిగా పనిచేశారు. బిజెపిలో చేరగానే ఇతర పార్టీల తోలువలిచి, తాటతీసే మొనగాడిగా సింహం అంటూ ప్రచారం సాగించారు.2024లోక్‌సభ ఎన్నికల్లో కోయంబత్తూరులో డిఎంకె చేతిలో ఓడిపోయారు. కొంగు ప్రాంతంలో బలమైన గౌండర్‌ సామాజిక తరగతిలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. అన్నాడిఎంకె నేత ఎడప్పాడి కె పళనిస్వామి కూడా అదే ప్రాంతం, అదే సామాజిక తరగతికి చెందిన వ్యక్తి. అన్నామలై బిజెపి అధ్యక్షుడిగా ఉంటే పొత్తు ఉండదని కరాఖండితంగా చెప్పటంతో బిజెపి అగ్రనాయకత్వం దిగిరాక తప్పలేదు. కేంద్ర పార్టీలో ఒక ప్రధాన కార్యదర్శి ఇస్తారనే ప్రచారం సాగుతోంది. ఇస్తామని అమిత్‌ షా గట్టిగా చెప్పలేదు, మా గురించి మీకెందుకు ఆందోళన అంటూ విలేకర్లను ఎదురు ప్రశ్నించారు. ఒకవేళ ఆ హోదాతో తమిళనాడులో చక్రం తిప్పాలనుకుంటే పళనిస్వామి అంగీకరిస్తారా అన్నది అనుమానమే. పార్టీ పదవి నుంచి తొలగించటాన్ని అన్నామలై అభిమానులు వ్యతిరేకిస్తున్నట్లు వార్తలు. అన్నాడిఎంకెతో పొత్తు వార్తలు వెలువడిన సమయంలో ఉద్వాసన ఖాయమని తేలటంతో విధిలేక తాను మరోసారి రాష్ట్ర అధ్యక్ష పదవికి పోటీ చేయటం లేదని ప్రకటించారు.
2024లోక్‌సభ ఎన్నికల్లో అన్నాడిఎంకె,బిజెపి విడివిడిగా పోటీ చేశాయి.ఈ రెండు కూటముల ఓట్లు కలిస్తే 13లోక్‌సభ నియోజకవర్గాలలో మెజారిటీ వచ్చిందని, వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో ముందుగానే ఒప్పందం చేసుకొని కలసి పోటీ చేస్తే అధికారం ఖాయమనే అభిప్రాయంతో అవి కలిశాయి.లోక్‌సభ ఓటింగ్‌ వివరాలను చూసినపుడు త్రిముఖ పోటీ జరిగింది. డిఎంకె నాయకత్వంలోని కూటమి మొత్తం 39 స్థానాలను గెలుచుకుంది.ఇండియా కూటమికి 46.97, అన్నాడిఎంకె కూటమి 23.05, బిజెపి కూటమి 18.28,ఎన్‌టికె అనే ప్రాంతీయ పార్టీ 8.2శాతం చొప్పున ఓట్లు పొందాయి. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీ చూస్తే మొత్తం 234కు గాను ఇండియా కూటమి 221, అన్నాడిఎంకె 10, బిజెపి కూటమి మూడు సీట్లలో మెజారిటీ తెచ్చుకున్నాయి. అయితే బిజెపికి ఒక్క సీటులోనూ మెజారిటీ రాలేదు, దానితో కలసి పోటీ చేసిన పిఎంకె మూడు చోట్ల ఆధిక్యత కనపరిచింది.లోక్‌సభ ఎన్నికలకు ముందు నరేంద్రమోడీ తమిళనాడును ఏడుసార్లు సందర్శించినా ఫలితం దక్కలేదు. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం,జనసేన, బిజెపి పరస్పరం ఎలా తిట్టుకున్నాయో 2019 ఎన్నికల్లో చూశాము. వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అనుసరించిన అప్రజాస్వామిక, కక్షపూరితమైన, బిజెపికి లంగుబాటు వైఖరిని, ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్టు చేయటం వంటి తీరును డిఎంకె నేత ఎంకె స్టాలిన్‌ అనుసరించలేదు. అన్నింటికీ మించి తమిళనాడుకు చేసిన అన్యాయం, డీలిమిటేషన్‌, హిందీని బలవంతంగా రుద్దేందుకు పూనుకున్న బిజెపిని ఎలాంటి తొట్రుపాటు లేకుండా వ్యతిరేకించి ఎండగడుతున్నారు.అందువలన ఆంధ్రప్రదేశ్‌ మాదిరి ఫలితాలను ఆశిస్తే అది అత్యాశే అవుతుంది. ప్రముఖ హీరో విజయ్‌ స్వంత దుకాణం పెట్టుకొని బిజెపి, ఇండియా కూటమి రెండిరటినీ వ్యతిరేకిస్తానని ప్రకటించాడు. అన్నాడిఎంకె నుంచి ఉద్వాసనకు గురైన పన్నీర్‌ సెల్వం,టిటివి దినకరన్‌ వంటి వారు ఏ వైఖరి తీసుకుంటారో వెల్లడి కాలేదు. డీలిమిటేషన్‌, భాషా సమస్య మీద రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో అన్నాడిఎంకె, బిజెపి మిత్రపక్షమైన పిఎంకె కూడా మద్దతు ఇచ్చాయి. ఇప్పుడు బిజెపితో కలసి ఈ పార్టీలు ఈ అంశాలపై జనానికి ఏం చెబుతాయన్నది ప్రశ్న. ఇలాంటి తలనొప్పులు ఇండియా కూటమి పార్టీలకు లేదు. ఒకే మాట, బాటలో నడుస్తున్నాయి. వీటిని వ్యతిరేకించే పార్టీలకు డిఎంకెను గద్దె దించటం తప్ప ఎలాంటి భావసారూప్యత లేదు.


ఇతర పార్టీల వారు ఇప్తార్‌ పార్టీలకు వెళితే ముస్లింలను సంతుష్టీకరించేందుకు అని బిజెపి దాడి చేస్తుంది. మరి అదే పార్టీ ఈ ఏడాది ఏకంగా ఇప్తార్‌ విందు ఏర్పాటు చేసింది, ఎందుకు అంటే తమకు అందరూ ఒకటే అని చెప్పింది. దీన్నే తాము చేస్తే సంసారం, ఎదుటివారు చేస్తే వ్యభిచారం అంటారు. అన్నాడిఎంకెతో చేతులు కలపటం గురించి చర్చలు జరుగుతున్న సమయంలోనే అన్నామలై ఏర్పాటు చేసిన ఇప్తార్‌ విందుకు బిజెపి మిత్రపక్ష నేతలైన మాజీ సిఎం పన్నీర్‌ సెల్వం, టిటివి దినకరన్‌ తదితర నేతలు హాజరయ్యారు. ఇప్తార్‌ విందు కేవలం ప్రారంభం మాత్రమే, మేమంతా కలసి కూర్చుని ఐక్యమై తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని అదే విందుకు వచ్చిన మాజీ తెలంగాణా గవర్నర్‌ తమిళశై సౌందర్‌రాజన్‌ అన్నారు.తనకు అధికారమిస్తే ఇప్తార్‌తో పాటు దీపావళి, క్రిస్మస్‌ విందులను అధికారికంగా ఇస్తానని అన్నామలై చెప్పుకున్నాడు. ఇతర బిజెపి అధ్యక్షుడు ఎవరైనా ఇప్తార్‌ ఇచ్చారా అని విలేకర్లతో గొప్పగా చెప్పుకున్నాడు. అర్‌ఎస్‌ఎస్‌ ఏర్పాటు చేసిన ముస్లిం నేషనల్‌ ఫోరమ్‌ దేశవ్యాపితంగా ఇప్తార్‌ విందులు ఇస్తామని గతంలో ప్రకటించింది.రెండు కత్తులు ఒకే వరలో ఇమడవు అన్నట్లు, ఒకే సామాజిక తరగతి, ఒకే ప్రాంతానికి చెందిన నేతలు కూడా అంతే. దీనికి తోడు అన్నామలై 2023లో మాజీ సిఎం అన్నాదురై, జయలలిత, పళనిస్వామి గురించి చేసిన వ్యాఖ్యలు అప్పుడు అన్నాడిఎంకె వేరుపడటానికి కారణమైతే ఇప్పుడు అతగాడిపదవికి ఎసరు తెచ్చినట్లు చెబుతున్నారు. అప్పుడు అన్నామలై బిజెపి నేతలకు కొత్తదేవుడిగా కనిపించటంతో అన్నాడిఎంకెను వదులుకొనేందుకు నిర్ణయించుకున్నారు. ఇప్పుడు మోజు రింది గనుక అదే పార్టీతో చేతులు కలిపేందుకు పక్కన పెట్టారు. ఈ ప్రయోగం ఎలాంటి ఫలితాలను ఇస్తుందన్నది పెద్ద ప్రశ్న !

Share this:

  • Tweet
  • More
Like Loading...

మరింత ముదిరిన వాణిజ్య పోరు : చైనా, అమెరికాల్లో ముందు ఓడేది ఎవరు ? మోడీది స్థితప్రజ్ఞతా లేక లొంగుబాటా ?

11 Friday Apr 2025

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, Europe, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Prices, USA

≈ Leave a comment

Tags

BJP, China, Donald trump, EU, Narendra Modi Failures, Retaliatory tariffs on Indian goods, Tariff Fight, Trade war Expanding, Xi Jinping


ఎం కోటేశ్వరరావు


కేసు ఓడిన వారు కోర్టులో ఏడుస్తారు, గెలిచిన వారు ఇంట్లో ఏడుస్తారనే లోకోక్తి తెలిసిందే. అంటే గొడవ పడి కోర్టుకు ఎక్కితే ఇద్దరూ నష్టపోతారని అర్ధం, అలాగే వాణిజ్య పోరులో విజేతలెవరూ ఉండరని నెత్తీ నోరూ కొట్టుకుంటున్నా ఎవరూ వినటం లేదు. డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రారంభించిన వాణిజ్యపోరు 2.0లో ముందు ఓడేది అమెరికానా లేకా చైనా వారా అన్నది కొందరి మీమాంస. మొగ్గు అమెరికావైపే కనిపిస్తున్నది, ఏమైనా జరగవచ్చు. బస్తీమే సవాల్‌ అంటూ ప్రపంచం మీద తొడగొట్టింది ట్రంప్‌. దానికి ప్రతిగా చూసుకుందాం రా అంటూ మీసం మెలివేస్తున్నది చైనానేత షీ జింపింగ్‌. అయినను పోయి రావలె హస్తినకు అన్నట్లుగా ట్రంప్‌తో రాయబారాలు, బేరాలు చేసినప్పటికీ కుదరకపోవటంతో చేసేదేముంది మనమూ గోదాలోకి దిగుదాం అని ఐరోపా సమాఖ్య ప్రకటించింది. కొంత మందికి దిక్కుతోచక నోట మాట రావటం లేదు. మన విషయానికి వస్తే దానికి స్థిత ప్రజ్ఞత అని ముద్దు పేరు పెట్టి నరేంద్రమోడీకి ఆపాదించి సామాజిక మాధ్యమంలో ఆకాశానికి ఎత్తుతున్నారు. చైనా ప్రతిసవాలును షీ జింపింగ్‌ ఆవేశంగా వర్ణిస్తున్నారు.మోడీని కొందరు గోపి అంటుంటే 56 అంగుళాల ఛాతీకీ ఏమైందని అనేక మంది విస్తుపోతున్నారు. సాధారణ సమయాల్లో పౌరుషం, వీరత్వం గురించి మీసాలు మెలేయటం, తొడగొట్టటాలు కాదు, ఓడతామా గెలుస్తామా అన్నదీ కాదు, పరీక్షా సమయం వచ్చినపుడు ఏం చేశారనేదే గీటురాయి. పృధ్వీరాజ్‌ను ఓడిరచేందుకు పరాయి పాలకులతో చేతులు కలిపి ద్రోహానికి మారుపేరుగా తయారైన జయచంద్రుడు బావుకున్నదేమీ లేదు, చివరికి వారి చేతిలోనే చచ్చినట్లు చరిత్ర చెబుతున్నది.


అనేక ఆటంకాలు, ప్రతిఘటనలు, కుట్రలు, కూహకాలను ఎదుర్కొంటూ ప్రపంచ అగ్రరాజ్యానికి పోటీగా ఎదుగుతున్నది చైనా. 2024లో అమెరికా జిడిపి 29.2లక్షల కోట్లు కాగా చైనా 18.9లక్షల కోట్లతో ఉండగా వృద్ధి రేటు 2.8, 5శాతం చొప్పున ఉన్నాయి. అంటే త్వరలో అమెరికాను అధిగమించనుంది. పిపిపి పద్దతిలో ఇప్పటికే చైనా అగ్రస్థానంలో ఉంది. ఇప్పుడు దానికి డోనాల్డ్‌ ట్రంప్‌ పెద్ద పరీక్ష పెట్టిన మాట నిజం. చైనా వస్తువుల మీద 145శాతం పన్నులు విధించిన ట్రంప్‌కు అతనికంటే ఘనడు ఆచంట మల్లన అన్నట్లు అమెరికా న్యాయమూర్తి ఒకడు 400శాతం విధించి కాళ్ల దగ్గరకు తెచ్చుకోవాలని సలహా ఇచ్చాడు.జపాన్‌ సామ్రాజ్యవాదుల ఆక్రమణకు,కొరియాలో అమెరికా సేనలకు వ్యతిరేకంగా పోరాడిన చైనా కమ్యూనిస్టు పార్టీ వారసుడు షీ జింపింగ్‌. బ్రిటీష్‌ వారికి వ్యతిరేకంగా జరిగిన పోరులో పాత్రలేకపోగా లొంగిపోయి సేవ చేసుకుంటామని లేఖలు రాసి ఇచ్చిన వారి వారసుడు నరేంద్రమోడీ. అందువలన అమెరికా సామ్రాజ్యవాదం, దానికి ప్రతినిధిగా ఉన్న ట్రంప్‌ను వ్యతిరేకించటంలో ఆ తేడా ఉండటం సహజం.
ఇది రాసిన సమయానికి చైనా వస్తువుల మీద పెంటానిల్‌ పన్ను 20శాతంతో కలిపి అమెరికా 145శాతం పన్ను విధించగా ప్రతిగా 125శాతం విధించినట్లు చైనా ప్రకటించింది. పోరు రెండు దేశాలకే పరిమితమైంది. ప్రపంచ వాణిజ్య సంస్థలో చైనా కేసును కూడా దాఖలు చేసింది. చైనాను దుష్టశక్తిగా అమెరికా చూపుతున్నది.ఈ పోరు ప్రపంచ, అమెరికా ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీస్తుందని బడా వాణిజ్య సంస్థల హెచ్చరిక, తక్షణమే చర్చలు జరపాలని అమెరికా`చైనా వాణిజ్య మండలి పిలుపు, చైనా వైపు నుంచి చర్చలకు చొరవ ఉండదని నిపుణుల అభిప్రాయం, తన అమ్ముల పొదిలోని అస్త్రాలన్నింటినీ చైనా మోహరిస్తున్నది, బీజింగ్‌ను వంటరి చేసేందుకు అనేక దేశాల మీద సుంకాలను రద్దు చేసిన ట్రంప్‌, అమెరికాను వ్యతిరేకించే శక్తులను కూడగడుతున్న చైనా. మార్కెట్లలో అనిశ్చితిని చూస్తే ఇప్పటికే నష్టం జరిగినట్లు కనిపిస్తోంది.


‘‘మీరు అమెరికాను కొడితే మా అధ్యక్షుడు ట్రంప్‌ మరింత గట్టిగా కొడతాడు ’’ అని అధ్యక్ష భవన మీడియా అధికారిణి కరోలిన్‌ లీవిట్‌ ప్రకటించారు. పెద్ద పెద్ద అరుపులకు, ఉడుత ఊపులకు భయపడే రకం కాదు మేం అంటూ తాపీగా చైనా ప్రకటన. ఆకాశం ఊడిపడదంటూ అధికార పత్రిక పీపుల్స్‌ డైలీ వ్యాఖ్య. అమెరికా మార్కెట్ల మీద ఆధారపడటాన్ని తగ్గించుకుని అంతర్గత మార్కెట్‌ను విస్తరిస్తున్నామని పేర్కొన్నది. అయితే చర్చలకు ద్వారాలు మూయలేదని కూడా తెలిపింది. తొలిసారి 2018లో ట్రంప్‌ వాణిజ్య పోరును ప్రారంభించిన నాటి నుంచి చైనా తన అస్త్రాలన్నింటినీ అవసరాల మేరకు ప్రయోగిస్తున్నది. అమెరికా నుంచి దిగుమతులను తగ్గించింది, ఎగుమతులను నియంత్రిస్తున్నది.అమెరికా కంపెనీలను నిషేధిత జాబితాలో చేరుస్తున్నది.కొన్నింటి మీద నియంత్రణలను అమలు చేస్తున్నది. విలువైన ఖనిజాలను అమెరికాకు అందకుండా చూస్తున్నది. ‘‘ అమెరికాకు వ్యతిరేకంగా బీజింగ్‌ తన అమ్ముల పొది మొత్తాన్ని ఇప్పుడు వినియోగిస్తున్నది.వారు బంకర్‌(దాడుల నుంచి తట్టుకొనే భూ గృహం) నిర్మిస్తున్నారు, నేనే గనుక షీ జింపింగ్‌ను అయితే నేడు డోనాల్డ్‌ ట్రంప్‌ కంటే మరింత సౌకర్యవంతంగా ఉన్నట్లు భావిస్తా ’’ అని అమెరికా అట్లాంటిక్‌ కౌన్సిల్‌కు చెందిన మెలాని హార్ట్‌ వ్యాఖ్యానించాడు.


మూడు నెలల పాటు తాను ప్రకటించిన పన్నుల యుద్ధాన్ని వాయిదా వేస్తున్నట్లు డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటన దేనికి సూచన అని పండితులు చర్చలు చేస్తున్నారు. చైనాకు ప్రపంచ మార్కెట్ల మీద గౌరవం,శ్రద్ద లేదని ట్రంప్‌ ఆరోపణ, బీజింగ్‌ మీద కోపం ఉంటే యావత్‌ ప్రపంచం మీద ప్రతికూల పన్నులెందుకు ప్రకటించినట్లు ? అతగాడి నిర్వాకం కారణంగా స్టాక్‌మార్కెట్లు పతనమయ్యాయన్నది తెలిసిందే. మూడు నెలల వాయిదా గురించి సామాజిక మాధ్యమంలో వచ్చిన వార్తలను కొద్ది రోజుల ముందు ట్రంప్‌ యంత్రాంగం తోసి పుచ్చింది. తమ మంత్రిత్వశాఖలు, వాణిజ్య ప్రతినిధితో 75దేశాలు సంప్రదింపులు జరిపినట్లు ట్రంప్‌ చెప్పుకున్నాడు. వారంతా ఒప్పందం చేసుకోవటానికి చచ్చిపోతున్నారన్నాడు.రిపబ్లికన్‌ పార్టీ ప్రజాప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ మనకు ఫోన్లు చేస్తున్న వారు ప్లీజ్‌ ప్లీజ్‌ సర్‌ ఒప్పందం చేసుకోండి, నేను ఏదైనా చేస్తాను అని చెబుతున్నారని, చివరకు నా….ను ముద్దు పెట్టుకుంటున్నారని నోరుపారవేసుకున్నాడు. ఎక్కువ పన్నులు విధించిన దేశాల నుంచి సరకులను దిగుమతి చేసుకొని వాటికి మన ముద్ర వేసి తిరిగి ఎగుమతి చేయవద్దని మన వాణిజ్య మంత్రి పియూష్‌ గోయల్‌ మన ఎగుమతిదార్లను హెచ్చరించారు.పిటిఐ వార్త మేరకు చైనా, ఇతర ఆసియన్‌ ఆదేశాల సరకులను మన దేశం నుంచి ఎగుమతి చేయవద్దని చెప్పారట. మన ఎగుమతిదార్లు అలాంటి పనులు చేస్తున్నట్లు గతంలో ఎన్నడూ మన ప్రభుత్వం చెప్పలేదు. ఇప్పుడు అలా మాట్లాడారంటే అమెరికా మెప్పు పొందేందుకే అన్నది స్పష్టం. ఏ దేశం నుంచి ఏ సరకు వస్తోందో తిరిగి ఎక్కడికి వెళుతోందో తెలుసుకోలేనంత అధ్వాన్నంగా మన నిఘా సంస్థలు, వాటిని నడిపిస్తున్న ప్రభుత్వం ఉందా ?

అసలు పన్నుల వాయిదా నిర్ణయానికి దారితీసిందేమిటి ? మొదటి కారణంగా చెప్పుకోవాలంటే ఏప్రిల్‌ ఐదున 150 సంస్థల పిలుపు మేరకు 20లక్షల మంది జనం నిరసన ప్రదర్శనలు చేశారు. వెనక్కు తగ్గకపోతే మరింత పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. తొలుత మద్దతు ప్రకటించిన ద్రవ్య పెట్టుబడిదారులు, ఇతరులు కూడా పర్యవసానాలను చూసి వైఖరి మార్చుకుంటున్నారు. ఒక్కరంటే ఒక్క ఆర్థికవేత్త కూడా సానుకూలంగా మాట్లాడిన ఉదంతం లేదు. అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారుతుందన్న భయం పెరిగింది. ట్రంప్‌ అధికారానికి వచ్చిన తరువాత భారీగా పెరుగుతుందని ఆశించిన ఎలన్‌ మస్క్‌ సంపద ఇప్పటి వరకు 135 బిలియన్‌ డాలర్లు హరించుకుపోయింది. చైనాతో ఎవరి మీదా పన్నులు వేయవద్దని, పునరాలోచించాలని ట్రంప్‌ను మస్క్‌ గట్టిగా కోరినట్లు వాషింగ్టన్‌ పోస్టు పత్రిక రాసింది. చైనా వెనక్కు తగ్గకపోగా ఐరోపా సమాఖ్య కూడా ప్రతిఘటనకు పిలుపు ఇచ్చింది.23 బిలియన్‌ డాలర్ల పన్ను విధిస్తామన్నది. ట్రంప్‌ మాదిరి అది కూడా ప్రతికూల సుంకాలను 90 రోజులు వాయిదా వేసింది. పన్నుల విధింపులో కీలక పాత్ర పోషించిస సలహాదారు పీటర్‌ నవారో, ఎలన్‌మస్క్‌ రోడ్డెక్కి అంతా నువ్వే చేశావంటే నువ్వే చేశావని దుమ్మెత్తి పోసుకుంటున్నారు. విదేశాల నుంచి విడి భాగాలు తీసుకొచ్చి అసెంబ్లింగ్‌ చేసి ఇక్కడే కార్లను తయారు చేస్తున్నట్లు చెప్పుకోవటం ఒక గొప్పా అన్నట్లు మస్క్‌ మీద నవారో ధ్వజమెత్తాడు. స్వదేశంలో పెట్టుబడులు పెట్టి వస్తూత్పత్తి చేయాలన్న పిలుపుకు పెద్ద స్పందన కనిపించటం లేదు. ప్రభుత్వ బాండ్లను కొనుగోలు చేసిన వారు వాటిని అమ్మి సొమ్ము చేసుకొని అమెరికా వెలుపల పెట్టుబడులు పెడుతున్నారు. లొంగుబాటును ప్రదర్శించే దేశాల మీద కొన్ని ఒప్పందాలను రుద్ది దక్కిన మేరకు లబ్ది పొందే ఎత్తుగడ కూడా కనిపిస్తున్నది.


గతంలో కమ్యూనిజం బూచిని చూపి దాన్ని వ్యతిరేకించే దేశాలన్నింటినీ అమెరికా కూడగట్టింది. ఇప్పుడు ప్రపంచం తన అడుగుజాడల్లో నడవటం లేదన్న అక్కసుతో ట్రంప్‌ దేశాలన్నింటి మీద యుద్ధం ప్రకటించాడు.తనకు తానే అమెరికాను ఒంటరిపాటు చేశాడు.కొలిమిలో కాలినపుడే ఇనుమును సాగదీయాలన్న సూత్రానికి అనుగుణంగా అమెరికా దిగిరావాలంటే దాని బాధిత దేశాలన్నీ ఏకం కావటం తప్ప మరొక మార్గం లేదు.కొన్ని తొత్తు దేశాలు కలవక పోవచ్చు, విభీషణుడి పాత్ర పోషించవచ్చు. మన దేశం ఎలాంటి ప్రకటన చేయకపోయినా మాకు అందరూ కావాలి ఎవరితో కలవం అని ఆస్ట్రేలియా చెప్పుకుంది. ఉక్రెయిన్‌ సంక్షోభంలో తనతో కలసి పని చేస్తున్న ఐరోపా దేశాలను పక్కన పెట్టి రష్యాతో ఒప్పందం కుదుర్చుకున్న ట్రంప్‌ను నమ్మేదెలా అని ఆలోచిస్తున్న తరుణంలో వాటి మీద కూడా పన్నుల యుద్ధం శంఖారావం పూరించాడు. ఒంటరి పోరుకు సిద్దం అవుతూనే అలాంటి దేశాలన్నింటినీ కూడ గట్టేందుకు చైనా పూనుకుంది. ఎంత మేరకు విజయవంతమౌతుందనేది వేరే అంశం. చైనా ప్రధాని లీ క్వియాంగ్‌ ఫోన్లో ఐరోపా సమాఖ్య అధ్యక్షురాలు ఉర్సులా వాండెర్‌ లియాన్‌తో మాట్లాడాడు.తరువాత వాణిజ్య ప్రతినిధులు మాట్లాడుకున్నారు. పది ఆగ్నేయాసియా దేశాల కూటమితో కూడా చైనా సంప్రదింపుల్లో ఉంది. ఏం జరగనుందనే ఆసక్తి సర్వత్రా పెరుగుతున్నది, ముందుగా ఎవరు మునుగుతారన్నది చర్చగా మారుతున్నది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మింగుడు పడని ట్రంప్‌ మాత్ర : 20లక్షల మంది నిరసన, రక్తమోడిన స్టాక్‌ మార్కెట్లు !

08 Tuesday Apr 2025

Posted by raomk in BJP, Current Affairs, Economics, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Prices, Uncategorized, USA

≈ Leave a comment

Tags

BJP, China, Donald trump, Narendra Modi, TRADE WAR, Trump tariffs, Two Millions marched against trump tariffs


ఎం కోటేశ్వరరావు


డాక్టర్‌ డోనాల్డ్‌ ట్రంప్‌ పన్నుల మాత్ర వైకుంఠయాత్రగా మారిందా ? అది వికటించి ప్రపంచమంతా అతలాకుతలం, స్టాక్‌మార్కెట్లు రక్తమోడాయి. ఒక వైపు ధరల పెరుగుదల భయంతో అమెరికాలో వేలం వెర్రిగా కొనుగోళ్లకు పరుగులు తీసిన జనం. వారే మరోవైపు డోనాల్ట్‌ ట్రంప్‌, అతగాడి ఆత్మ ఎలన్‌ మస్క్‌ విధానాలను వ్యతిరేకిస్తూ 150 సంస్థల పిలుపు మేరకు ఏప్రిల్‌ ఐదవ తేదీన మా జోలికి రావద్ద్దు (హాండ్స్‌ ఆఫ్‌) నినాదంతో 20లక్షల మంది దేశమంతటా ప్రదర్శనలు జరిపారు.ప్రపంచ వ్యాపితంగా మూడవ రోజు సోమవారం కూడా స్టాక్‌ మార్కెట్లు పతనమై 9.5లక్షల కోట్ల డాలర్ల సంపద ఆవిరి. హంకాంగ్‌ స్టాక్‌ మార్కెట్‌ సూచీ గరిష్టంగా 13శాతం కుదేలైంది. మంగళవారం నాడు మనదేశంతో సహా ఆసియా దేశాల మార్కెట్లు కొద్దిగా తేరుకున్నాయి. నేనైతే తగ్గాలనుకోవంటం లేదు, ఏదన్నా జరిగినపుడు కొన్ని సమయాల్లో ఒక గోలీ వేసుకోకతప్పదు అని ట్రంప్‌ వ్యాఖ్యానించాడు. అమెరికన్ల హక్కులు, స్వేచ్చల మీద దాడి చేస్తూ బలవంతంగా లాక్కుంటున్నారంటూ ప్రజాస్వామ్య అనుకూల ఉద్యమకారుల పిలుపు మేరకు జనం స్పందించారు. అక్కడి 50 రాష్ట్రాల రాజధానులు, పార్లమెంటు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముందు 1,400కుపైగా చిన్నా పెద్ద ప్రదర్శనలు జరిగాయి. లండన్‌, పారిస్‌ వంటి ఇతర దేశాల నగరాల్లో కూడా నిరసన తెలిపారు. ధనవంతుల పాలన ఇంకే మాత్రం సాగదు, వారికి జన ఘోష వినిపించేట్లు చేస్తామంటూ ప్రదర్శకులు నినదించారు. నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటామని సంతకాలు చేసిన వారే దాదాపు ఆరులక్షల మంది ఉన్నారు.


వాషింగ్టన్‌ డిసిలోని జార్జి వాషింగ్టన్‌ స్మారక స్థూపం వద్ద ప్రధాన సభ జరిగింది. అమెరికా కార్మిక సంఘాల సమాఖ్య అధ్యక్షురాలు లిజ్‌ షూలెర్‌ ప్రధాన వక్త.పోరాడేవారి నోరు మూయించేందుకు ట్రంప్‌ సర్కార్‌ చూస్తున్నది కానీ ఆటలు సాగనిచ్చేది లేదని హెచ్చరించారు.కేంద్ర ప్రభుత్వంతో బేరమాడే హక్కులను యూనియన్లకు లేకుండా కాలరాస్తోందని, కార్మిక సంఘాలను దెబ్బతీస్తోందన్నారు.ప్రభుత్వ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు ఎవరెట్‌ కెలీ మాట్లాడుతూ ఉద్యోగులను సులభంగా దెబ్బతీయవచ్చని ట్రంప్‌ మరియు మస్క్‌ భావిస్తున్నారు, మాసభ్యులు మిలిటరీలో పనిచేసిన వారే అని గుర్తుంచుకోవాలని, తమను బెదిరించలేరని హెచ్చరించాడు. డెమోక్రటిక్‌ పార్టీ ఎంపీ జామీ రస్కిన్‌ మాట్లాడుతూ అమెరికాను స్థాపించిన వారు రాసిన రాజ్యాంగం మేము పౌరులం అంటూ ప్రారంభమైంది తప్ప మేము నియంతలం అని కాదన్నాడు. ఇక్కడ ప్రదర్శనకు పది వేల మంది వస్తారనుకుంటే పది రెట్లు వచ్చినట్లు నిర్వాహకులు ప్రకటించారు. వాషింగ్టన్‌ నగరంలో ప్రదర్శన చేసిన వారు కిరాయిబాపతు తప్ప మరొకటి కాదని ఎలన్‌ మస్క్‌ నోరుపారవేసుకున్నాడు. ఆ మేరకు తన ఎక్స్‌లో అనేక వీడియోలను పోస్టు చేశాడు. వారెందుకు ప్రదర్శన చేశారో కూడా వారికి తెలియదన్నాడు. నిరసనకారులు ట్రంప్‌ను ఎంతగా వ్యతిరేకిస్తున్నారో లక్షా 21వేల మంది కేంద్ర ఉద్యోగులను తొలగించిన ఎలన్‌ మస్క్‌ను కూడా అంతే నిరసిస్తున్నారు. రానున్న పది సంవత్సరాలలో ధనికులకు ఐదులక్షల కోట్ల డాలర్ల మేర పన్నుల రాయితీ ఇస్తూ ట్రంప్‌ సర్కార్‌ ఇటీవల నిర్ణయించింది. ఇదే సమయంలో వైద్యం, పెన్షన్‌ వంటి సంక్షేమ పథకాలకు పెద్ద ఎత్తున కోతలను ప్రతిపాదించింది.తమ మీద మరిన్ని భారాలను మోపే పన్నులతో పాటు ఈ విధానాలకు కూడా శనివారం నాడు నిరసన వెల్లడిరచారు. ట్రంప్‌ వెనక్కు తగ్గకపోతే రానున్న రోజుల్లో ఆందోళనలు కొనసాగే అవకాశం ఉంది.


ట్రంప్‌ బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నాడని చైనా వ్యాఖ్యానించింది. ఈనెల తొమ్మిదవ తేదీలోగా చైనా వెనక్కు తగ్గాలని లేకుంటే మరో 50శాతం వడ్డిస్తానని ట్రంప్‌ ప్రకటించాడు.ఎవరూ తగ్గకపోతే చైనా వస్తువులపై ట్రంప్‌ పన్ను 104శాతానికి చేరనుంది. అతగాడిని ప్రసన్నం చేసుకొనేందుకు మనదేశం గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, మెటా, ఎక్స్‌ తదితర కంపెనీలకు లబ్ది కలిగేలా డిజిటల్‌ సర్వీసు పన్ను రద్దు చేసింది. ఖరీదైన మోటారు సైకిళ్లు, విస్కీల మీద పెద్ద మొత్తంలో తగ్గించింది. ఇంత చేసిన తరువాత రెండు దేశాల మధ్య ఒప్పందం సంగతి తేల్చాలని మన విదేశాంగ మంత్రి జై శంకర్‌ అమెరికా మంత్రి మార్కో రూబియోకు ఫోన్లు చేస్తున్నారు. పారిశ్రామిక వస్తు ఎగుమతులు, దిగుమతుల మీద ఎలాంటి పన్ను విధించకూడదని తాము కోరుతున్నామని, వీటి మీద చర్చలకు సిద్దం, కుదరకపోతే తాము కూడా ప్రతికూల పన్నులు వేసేందుకు సన్నద్దమౌతున్నట్లు ఐరోపా సమాఖ్య అధ్యక్షురాలు ఉర్సులా వాండెర్‌ చెప్పారు. మూడు నెలల పాటు పన్నుల వసూలు వాయిదా వేయాలన్న సూచనను ట్రంప్‌ తిరస్కరించాడు. అయినప్పటికీ మంగళవారం నాడు ప్రారంభంలో ఆసియా స్టాక్‌్‌ మార్కెట్లు స్వల్పంగా కోలుకున్నాయి.


అమెరికాలో బహుళజాతి కార్పొరేట్లకు వత్తాసు పలుకుతున్న ట్రంప్‌, వారి కనుసన్నలలో పని చేసే మీడియా సంస్థలు అనేక అవాస్తవాలను ప్రచారం చేస్తున్నాయి. మెక్సికో నుంచి చైనా పెంటానిల్‌ అనే మత్తు మందును అక్రమంగా సరఫరా చేస్తోందని, అక్రమ వలసలు అమెరికాను దెబ్బతీస్తున్నాయని చేసిన ప్రచారం నిజంగా అసలు సమస్యలే కాదు. వాటిని అరికట్టేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. ఆ సాకుతో వాణిజ్యం యుద్దం చేయాల్సిన అవసరం లేదు. అధికారానికి వచ్చిన వెంటనే అక్రమవలసదారులను స్వదేశాలకు పంపేపేరుతో చేసిన హడావుడి తరువాత ఎందుకు కొనసాగించలేదు. స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలతో ధరలు తగ్గుతాయి, ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతుంది, దిగుమతులపై పన్నులు అమెరికన్ల ఉపాధిని కాపాడతాయి, ఇందుకోసం తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులను భరించకతప్పదు అనే రీతిలో జనాన్ని నమ్మించచూస్తున్నారు. వీటిలో ఏ ఒక్కటైనా కార్మికవర్గ జీవన ప్రమాణాలను పెంచేదిగానీ, ఉపయోగపడేది గానీ ఉందా, వేతనాలను అదుపు చేయటం వారి లాభాలను గరిష్టంగా పెంచుకొనే కార్పొరేట్ల ఎత్తుగడలు తప్ప మరేమైనా ఉన్నాయా అన్న చర్చ కార్మికవర్గంలో ప్రారంభమైంది. గత మూడు దశాబ్దాలుగా అమెరికా వస్తు ఉత్పాదక సంస్థలు దేశం వదలి పోతుంటే 78 ఏండ్ల ట్రంప్‌ గతంలో ఎప్పుడైనా నోరు విప్పాడా ? ఇప్పుడెందుకు గుండెలు బాదుకుంటున్నాడు ? పెట్టుబడిదారులు తమకు ఏది లాభంగా ఉంటే ఆ విధానాలను రూపొందించేవారిని పాలకులుగా గద్దెనెక్కిస్తారు.2018లో ఇదే ట్రంప్‌ చైనా మీద వాణిజ్య యుద్ధం ప్రారంభించాడు. అమెరికాలో పోయిన ఉద్యోగాలు తిరిగి వస్తాయని అప్పుడు కూడా చెప్పాడు. తరువాత ఎన్నికల్లో ఓడిపోయి చరిత్రకెక్కాడు. అక్కడి ఉక్కు, తదితర కంపెనీలకు లాభాలు తప్ప కార్మికులకు వేతనాలు పెరగలేదు.రెండవ ప్రపంచ యుద్దం తరువాత అత్యంత వినాశకరమైన ఆర్థిక విధానాన్ని ట్రంప్‌ పాటిస్తున్నట్లు అమెరికా మాజీ అర్థిక మంత్రి లారెన్స్‌ సమర్స్‌ వ్యాఖ్యానించాడు.1930దశకం తరువాత అతి పెద్ద వాణిజ్య యుద్ధాన్ని ట్రంప్‌ ప్రారంభించినట్లు చెబుతున్నారు.


సమస్య పెట్టుబడిదారీ వ్యవస్థలోనే అంతర్గతంగా ఉంది. కార్మికుల ఉద్యోగాలు పోవటానికి, వేతనాలు తగ్గటానికి కారణం చైనా, మెక్సికో, కెనడా, ఐరోపాల నుంచి వస్తున్న దిగుమతులే కారణమని ట్రంప్‌ యంత్రాంగం చిత్రిస్తున్నది. స్వదేశీ పరిశ్రమలకు ప్రోత్సాహం పేరుతో భారీ ఎత్తున్న పన్ను రాయితీలు ఇచ్చిననప్పటికీ దేశభక్త జనరల్‌ మోటార్స్‌ వంటి కంపెనీలు స్వదేశంలో ఫ్యాక్టరీలను మూసివేసి మెక్సికో, తదితర దేశాలకు తరలిపోయాయి. పన్నుల విధింపు కంపెనీలకు తప్ప కార్మికులకు మేలు చేయవని తొలిసారి అధికారంలో ఉన్నపుడు ఉక్కు దిగుమతుల వ్యవహారం వెల్లడిరచింది. కరోనా కాలం నుంచి చూస్తే కార్పొరేట్లకు లాభాలు కార్మికులకు భారాలు పెరిగాయి. ఈ నేపధ్యంలో దిగువ చర్యలు తీసుకోవాలని కార్మికవర్గండిమాండ్‌ చేస్తోంది. విదేశాల్లో ఉపాధి కల్పించి కార్యకలాపాలు నిర్వహిస్తున్న అమెరికన్‌ కార్పొరేషన్ల మీద పన్ను విధించి, ఆ మొత్తాన్ని ఇతర రంగాలలో కార్మికులను నిలుపుకొనేందుకు వినియోగించాలి. పన్నులు గనుక ఖర్చులను పెంచేట్లయితే ధరలను గట్టిగా నియంత్రించాలి. ఆహారం, ఔషధాలు, గృహ తదితరాల ధరలను స్థంభింప చేయాలి. కార్పొరేట్‌ల కోసం కార్మికులు మూల్యం చెల్లించకూడదు. కార్మిక సంఘాల హక్కులకు భంగం కలగకుండా అంతర్జాతీయ కార్మిక హక్కులను అమలు చేసి మాత్రమే వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవాలి. కీలకమైన ఉక్కు, ఆటోమొబైల్‌ వంటి పరిశ్రమలను బడా కంపెనీలకు దూరంగా ప్రజల భాగస్వామ్యంలో నిర్వహించాలి.


పెట్టుబడిదారులు వారు పారిశ్రామికవేత్తలైనా, వాణిజ్యంచేసే వారైనా లాభాలు వచ్చాయా లేదా అన్నది తప్ప ఎలాంటి విలువలు, వలువలు, సిద్దాంతాలు ఉండవు.ఎప్పటికెయ్యది లాభమో అప్పటికా విధానాలను తమ ప్రతినిధులైన పాలకుల ద్వారా రూపొందించి అమలు చేస్తారు. కమ్యూనిజం వ్యాప్తి నిరోధానికి కంకణం కట్టుకున్నట్లు చెప్పిన అమెరికా ప్రత్యర్థిగా ఉన్న బలమైన సోవియట్‌ను దెబ్బతీసేందుకు ప్రచ్చన్న యుద్దం సాగించింది. అదే కాలంలో ప్రపంచంలో పెద్ద మార్కెట్‌గా ఉన్న చైనాలో తన వస్తువులను అమ్ముకొనేందుకు, చౌకగా అక్కడ ఉత్పత్తి చేసి దిగుమతులు చేసుకొని లబ్దిపొందాలని ఎత్తువేశారు. దాంతో అప్పటి వరకు ఐరాసలో కమ్యూనిస్టు చైనాకు నిరాకరించిన భద్రతామండలి శాశ్వత సభ్యత్వాన్ని ఇచ్చేందుకు అంగీకరించింది. ఇదే సమయంలో స్వేచ్చా వాణిజ్యం పేరుతో ప్రపంచీకరణ సిద్దాంతాన్ని ముందుకు తెచ్చింది, ప్రపంచ వాణిజ్య సంస్థపేరుతో నిబంధనలు రూపొందించింది. నాలుగు దశాబ్దాల తరువాత సమీక్షించుకుంటే ఈ విధానం తమకంటే చైనా, ఇతర దేశాలకు ఎక్కువ ప్రయోజనకరంగా ఉన్నట్లు గ్రహించి ప్రపంచం మొత్తం తనకు వ్యతిరేకంగా తొండి చేస్తున్నట్లు ఇప్పుడు అమెరికా ఆరోపిస్తోంది.తమకు రక్షణ చర్యలు,మరిన్ని రాయితీలు కల్పించాలని ట్రంప్‌ ద్వారా కార్పొరేట్‌ సంస్థలు డిమాండ్‌ చేస్తున్నాయి. స్వేచ్చా వాణిజ్యానికి వీలు కల్పించాలని కోరేదీ, దానికి విరుద్దమైన రక్షణ విధానాలను కోరేదీ కూడా పెట్టుబడిదారులే. చైనా నుంచి వస్తువులను స్వేచ్చగా దిగుమతి చేసుకొనేందుకు, పెట్టుబడులను ఆనుమతించాలని మన దేశంలో కోరుతున్నదీ, చౌకగా వచ్చే వస్తువులతో తమ పరిశ్రమల మనుగడకు ముప్పు గనుక ఆంక్షలు పెట్టాలి లేదా పన్ను విధించాలని కోరుతున్నదీ పెట్టుబడిదారులే తప్ప మరొకరు కాదు. చైనా పెట్టుబడులను కేంద్రం అడ్డుకుంటే మోడీ మెడలు వంచి అనుమతించేందుకు ఒప్పించారు. అమెరికాను వ్యతిరేకిస్తున్న దేశాల మీద ప్రతీకార పన్ను ఏటా ఆరువందల బిలియన్‌ డాలర్ల మేర రాబడి వస్తుందని చెబుతున్న ట్రంప్‌ రానున్న పది సంవత్సరాల్లో ఐదులక్షల కోట్ల డాలర్ల మేరకు కార్పొరేట్లు, ధనికులకు పన్ను రాయితీలు ఇచ్చేందుకు తీర్మానం చేయించాడు. అంటే అలా వచ్చేదాన్ని ఇలా అయినవారికి వడ్డించేందుకు పూనుకున్నాడు. మరోవైపున కార్మికుల సంక్షేమ చర్యలకు కోత పెట్టేందుకు పూనుకున్నాడు.


డోనాల్డ్‌ ట్రంప్‌ గురించి చెప్పాలంటే అతగాడు ఒకసారి వేడెక్కుతాడు, మరోసారి చల్లబడతాడు, ఒకసారి అవునంటాడు, అదే నోటితో కాదంటాడు, ఒకసారి వస్తానంటాడు, మరోసారి వెళతానంటాడు, ఒకసారి పైకి ఎక్కుతాడు అంతలోనే కిందికి దిగుతాడు. పిచ్చివాడిలా ప్రవర్తిస్తాడు.కానీ తనవారికి చేయాల్సింది చేస్తున్నాడు, అందుకే కొందరు పిచ్చితనం ప్రదర్శన నటన అంటున్నారు. మిత్రులు, శత్రువులు అని చూడకుండా అందరి మీద బస్తీమే సవాల్‌ అనటం పిచ్చిగాక తెలివా అని కొందరు ప్రశ్నిస్తున్నారు.తమ దేశాలకు చెందిన సంస్థల వస్తువులను అమ్ముకొనేందుకు అవసరమైన మార్కెట్ల వేటలో భాగంగానే ప్రపంచాన్ని వలసలుగా మార్చుకొనేందుకు తలెత్తిన పోటీలో రెండు ప్రపంచ యుద్ధాలు జరిగాయి. భౌతిక వలసలలో బ్రిటన్‌ది పైచేయి కాగా ఇప్పుడు అది సాధ్యం కాదు గనుక మార్కెట్లను కబళించే క్రమంలో అమెరికా ముందుకు వచ్చింది. దానికి ప్రతిఘటన ఫలితమే వాణిజ్యపోరు !

Share this:

  • Tweet
  • More
Like Loading...

వినదగునెవ్వరు చెప్పిన…..: ప్రశ్నించమన్నాడు స్వామి వివేకానంద, సందేహించమన్నాడు కారల్‌ మార్క్స్‌ – అది మోడీ, రాహుల్‌ మరెవరైనా సరే !

01 Tuesday Apr 2025

Posted by raomk in BJP, CHINA, Congress, CPI(M), Current Affairs, Economics, INDIA, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

anti china, BJP, CHANDRABABU, India arms imports, India GDP, India index, Narendra Modi Failures, RSS

ఎం కోటేశ్వరరావు


చచ్చిన చేపలు ఏటి వాలున కొట్టుకుపోతాయి. అదే బతికున్నవి ఎదురీదుతాయి. మనుషుల్లో తరతరాలుగా ఈ రెండు రకాలూ ఉంటూనే ఉన్నారు. స్వామి వివేకానందుడితో సహా అనేక మంది మనకు ప్రశ్నించటం నేర్పారు.ప్రశ్న లేకపోతే అసలు కిక్కుండదు. యువకుడిగా ఉన్నపుడు వివేకానందుడు రామకృష్ణ పరమమహంస దగ్గరకు వెళ్లి మీరు దేవుడిని చూశారా అని ప్రశ్నించాడు. దానికి అవును చూశాను అని సమాధానం వచ్చింది, అయితే నాకు దర్శన భాగ్యం కల్పిస్తారా అని అడిగితే, నీకా ధైర్యం ఉందా అని రామకృష్ణుడు ప్రశ్నించాడు. తరువాత వివేకానందుడు దేవుడ్ని చూశాడా, ఏం చేశాడన్నది ఆసక్తి కలిగిన వారు చదువుకోవచ్చు. ఇక్కడ సమస్య ప్రశ్నించటం అనే మహత్తర లక్షణం గురించే. సమాజంలో ఎందరికి ఉంది ? ప్రశ్నించేతత్వం ఉంటే రాజకీయ నేతలు జనాలకు ఇన్ని కబుర్లు చెప్పేవారా, ఆచరించని వాగ్దానాలను వర్షంలా కురిపించేవారా !


పదేండ్లలో జిడిపిని రెట్టింపు చేశామని ప్రధాని నరేంద్రమోడీతో సహా అనేక మంది ఊదరగొడుతున్నారు.దేశాభివృద్ధి అంటే జిడిపి ఒక సూచిక తప్ప అదే సర్వస్వం కాదు, సమగ్రతను సూచించదు. పిల్లో, పిల్లాడో పుట్టిన తరువాత లావు, పొడవు పెరుగుతారు. అవి వయస్సుకు తగ్గట్లు ఉన్నాయా, ఆరోగ్యంతో ఉన్నారా లేదా అన్నది గీటురాయి తప్ప చిన్నప్పటికంటే ఎంతో పెరిగారు కదా అంటే కుదరదు. దేశం, మానవాభివృద్ధి అన్నా అలాంటిదే. జిడిపి గురించి పదే పదే చెబుతున్నవారు మిగతా సూచికల గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించాలా వద్దా ? వాటి పట్ల నిర్లక్ష్యం వహించారా లేక విఫలమయ్యారా ? ప్రపంచ పారిశ్రామిక ఉత్పత్తిలో మన వాటా 2014లో 2.6శాతం, మోడీ అండ్‌ కో చెబుతున్నదాని ప్రకారం జిడిపి మాదిరి అది కనీసం 5.2శాతానికి పెరగాలి, కానీ 2024లో 2.9 మాత్రమే నమోదైంది. అంతేనా జిడిపిలో వాటా 15.02 నుంచి 12.84శాతానికి(2023) తగ్గింది.2024 వస్తూత్పత్తి విలువ జోడిరపులో ప్రపంచ బాంకు సమాచారం మేరకు తొలి స్థానంలో చైనా 5.04 లక్షల కోట్ల డాలర్లతో ఉండగా అమెరికా 2.6లక్షల కోట్లతో రెండవ, భారత్‌ 0.45లక్షల కోట్లతో ఆరవ స్థానంలో ఉంది. తలసరి ఉత్పత్తిని చూస్తే 10,704 డాలర్లతో జర్మనీ, 9,685తో దక్షిణ కొరియా,8,791తో జపాన్‌ మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి.చైనా 3,569 డాలర్లు, మనదేశం కేవలం 318 డాలర్లు మాత్రమే కలిగి ఉంది. గుజరాత్‌ నమూనాను అమలు జరుపుతానని చెప్పిన తమ నేత మోడీ నాయకత్వంలో ఈ రంగంలో ఇంత తక్కువ ఎందుకు ఉందో బిజెపి నేతలు, ఆ పార్టీ సమర్ధకులు ఎవరైనా చెప్పగలరా ?


త్వరలో మనం చైనాను అధిగమించబోతున్నాం, మరికొందరైతే డ్రాగన్ను మన కాళ్ల వద్దకు రప్పించుకోబోతున్నాం అన్నట్లుగా మాట్లాడుతుంటారు. కోతలు కోసే స్వేచ్చ ఉంది కాదనలేం. దేని ప్రాతిపదికన అలా చెబుతున్నారో మనలో మనమైనా తర్కించుకోవాలి కదా ! ఐరాస గణాంక విభాగం నుంచి తీసుకొని ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన తాజా సమాచారం 2024 ఆగస్టులో వెల్లడిరచిన దాని ప్రకారం మీడియా సంస్థలు పారిశ్రామిక ఉత్పత్తి చేస్తున్న పది దేశాల గురించి సమీక్షించాయి. ప్రతి వంద వస్తువులు లేదా వంద కిలోల ఉత్పతిలో చైనా 31.6, అమెరికా 15.9, జపాన్‌ 6.5, జర్మనీ 4.8, భారత్‌ 2.9, దక్షిణ కొరియా 2.7, రష్యా 1.8, ఇటలీ 1.8, మెక్సికో 1.7,ఫ్రాన్సు 1.6 శాతం చొప్పున వాటాలు కలిగి ఉన్నాయి. మన దేశంలోని రాష్ట్రాలంత ఉన్న దేశాలు మనతో పోటీ పడుతున్నట్లు కనిపిస్తుంటే దేశాన్ని ఎక్కడికో తీసుకుపోతున్నామని కబుర్లు చెప్పేవారిని పగటి వేషగాళ్లు, తుపాకి వీరులు అంటే తప్పేముంది ! నరేంద్రమోడీ అధికారానికి వచ్చినపుడు ఆయనకున్న అనుభవం తక్కువేమీ కాదు, అందుకే తనకు ఇతరుల మాదిరి హానీమూన్‌ అవసరం లేదన్నారు. గుజరాత్‌ మాదిరి పారిశ్రామికంగా మార్చుతానంటే జనం నిజమే అని నమ్మి ఒకటికి మూడుసార్లు దేశాన్ని అప్పగించారు.కాని జరిగిందేమిటి ? ఇదే కాలంలో చైనా ఉత్పాదకత 20 నుంచి 31.6శాతానికి పెరిగితే, మన దగ్గర 2.6 నుంచి ముక్కుతూ మూలుగుతూ 2.9శాతానికి చేరింది. మన ఉత్పత్తుల విలువ 450 బిలియన్‌ డాలర్లు కాగా చైనా 5.04లక్షల కోట్లు, అమెరికా 2.6లక్షల కోట్ల డాలర్లతో ఉన్నాయి. పెంచకుండా నరేంద్రమోడీని ఎవరు అడ్డుకున్నారు ?

అంతా మీరే చేశారంటూ కాంగ్రెస్‌ పాలకుల మీద ఎన్ని రోజులు దుమ్మెత్తి పోస్తారు. ఆటంకాలు మనకే కాదు, చైనా, అమెరికాలకు ఎదురు కాలేదా ? నిజానికి కరోనా ఆంక్షల పేరుతో మరీ కఠినంగా వ్యవహరించి చైనా స్వయంగా ఉత్పత్తిని దెబ్బతీసుకుందని అనేక మంది సంబరపడ్డారు. దాని ప్రతికూలతను సానుకూలంగా మార్చుకోవాలని ఎందరో చెప్పారు.సర్వేజనా సుఖినో భవంతు అని కోరుకునే మనం చైనాను అధిగమించాలనే ఆధిపత్య ధోరణి కంటే దానితో పాటు మనమూ ఎదగాలని ఆశించటం వాంఛనీయం. మన దేశంలో పారిశ్రామిక ఉత్పత్తి గతంతో పోల్చుకుంటే విలువలో చూస్తే పరిమితంగా పెరిగింది.తలసరి ఉత్పత్తిలో అగాధంలో ఉన్నాం. చిత్రం ఏమిటంటే పదేండ్లుగా నరేంద్రమోడీ కార్మికుల నైపుణ్యాలను పెంచినట్లు చెబితే, చంద్రబాబు నాయుడికి వారెంత మంది ఉన్నారో తెలియక లెక్కలు తీస్తున్నట్లు చెబుతున్నారు. కాలయాపన, కాలక్షేప కబుర్లు తప్పితే ఇంజనీరింగ్‌ పట్టాలు, పాలిటెక్నిక్‌ డిప్లోమాలు, ఫార్మసీ పట్టాలు ఎందరికి ఉన్నాయో లెక్కలు తెలియనంత దుస్థితిలో దేశం ఉందా ? దేశం మొత్తం పారిశ్రామిక ఉత్పత్తిలో 54శాతం కేవలం మహారాష్ట్ర, తమిళనాడు,గుజరాత్‌,కర్ణాటక, ఉత్తర ప్రదేశ్‌ నుంచే జరుగుతోంది.కొత్తగా వచ్చే పరిశ్రమలు కూడా ఈ రాష్ట్రాలవైపే చూస్తుంటాయి.


ఒక పరిశ్రమ రావాలంటే ఏటిఎం యంత్రంలో కార్డు పెట్టగానే డబ్బులు వచ్చినంత సులభంగా రావని తల మీద మెడ ఉన్నవారందరికీ తెలుసు. పదేండ్లు తక్కువేమీ కాదు, ప్రగతి జాడ ఎక్కడ, రెండిరజన్ల పాలన ప్రభావం ఏమిటి ? చైనాతో పోల్చుకుంటే వేతనాలు మన దగ్గర తక్కువ, అయినప్పటికీ విదేశీ కంపెనీలు ఇక్కడికి ఎందుకు రావటం లేదో పెద్దలు చెప్పాలి. మీడియాలో వెలువడుతున్న అభిప్రాయాల ప్రకారం చైనా మాదిరి తక్కువ ధరలకు ఇక్కడ కూడా ఉత్పత్తి చేయవచ్చు. కానీ జరగటం లేదు. చైనాలో విధానాలను రూపొందించేది అమలు జరిపేదీ అక్కడి కమ్యూనిస్టు పార్టీ.ఇక్కడ పార్టీలు మారుతుంటాయి కనుక సాధ్యం కావటం లేదన్నది వెంటనే చెప్పే సమాధానం. ఇది తర్కానికి నిలిచేది కాదు. అమెరికా, ఐరోపా, జపాన్‌, దక్షిణ కొరియాలో కూడా పార్టీలు, పాలకులు మారుతూనే ఉన్నారు. మరి అక్కడ సాధ్యమైంది ఇక్కడెందుకు జరగటం లేదు. అక్కడ ఎవరు అధికారంలో ఉన్నా విధానాలు ఒక్కటే. 1990 నుంచి మన దేశంలో జరుగుతున్నది కూడా అదేగా ! ఎవరు అధికారంలో ఉన్నా నూతన సంస్కరణలను ముందుకు తీసుకుపోవటమేగా. ప్రభుత్వ రంగంలో పెట్టుబడులు పెట్టవద్దన్నారు, ప్రభుత్వ రంగ సంస్థల మూసివేత లేక తెగనమ్మాలన్నారు. వాజ్‌పాయి, మన్మోహన్‌ సింగ్‌, నరేంద్రమోడీ ఎవరున్నా చేస్తున్నది అదేగా. మరింత వేగంగా, సమర్దవంతంగా అమలు చేస్తానని మోడీ చెప్పారు, అయినా ఎందుకు ముందుకు పోవటం లేదు ?


ఎంత సేపూ ఐదు లక్షల కోట్ల జిడిపి, కొద్ది వారాలుగా పదేండ్లలో రెట్టింపు కబుర్లు చెబుతున్నారు.మిగతా సూచికల్లో మనం ఎక్కడున్నాం. వాటన్నింటి సమాహారమే దేశం ఎక్కడుందో,ఎలా ఉందో తెలియ చేస్తుంది. 2024, అంతకు ముందు ప్రకటించిన కొన్ని సూచికల్లో భారత స్థానం గురించి చూద్దాం. ఇవన్నీ అంతర్జాతీయ సంస్థలు వెల్లడిరచేవే. మన్మోహన్‌ సింగ్‌ ఉన్నపుడూ ఇప్పుడూ అవే ఉన్నాయి తప్ప నరేంద్రమోడీ సర్కార్‌ను బదనాం చేసేందుకు కొత్తగా పుట్టుకురాలేదు.చిత్రాతి చిత్రం ఏమిటంటే తమకు ప్రతికూలంగా ఉన్న వాటిని మేం అంగీకరించం అంటారు. ఫేక్‌ వార్తలు, ఫేక్‌ నివేదికలను పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారు.అంతర్జాతీయ సంస్థలు మన దేశం ప్రకటించిన సమాచారం నుంచే వివరాలు తీసుకుంటాయి తప్ప మరొకటి కాదు. ప్రారంభంలో సరిగా మదింపు లేదన్నారు, పదేండ్ల తరువాత పరిస్థితి ఏమిటి ? అమెరికా ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రకటించిన 55 దేశాల అంతర్జాతీయ మేథోసంపత్తి సూచికలో మనం 42లో ఉన్నాం. ప్రపంచ నవకల్పన సూచికలో 113 దేశాల్లో చైనా పదకొండు, భారత్‌ 39వదిగా ఉంది. ఐరాస మానవాభివృద్ధి సూచికలో 193 దేశాల్లో 134, గడచిన పదేండ్లలో దేశ ప్రతిష్టను మోడీ పెంచారని చెప్పిన తరువాత వీసాలు లేకుండా మన పౌరులను అనుమతించే దేశాలను సూచించే హానెల్‌ పాస్‌పోర్టు సూచికలో 80వ స్థానం, ఐరాస లింగసమానత్వంలో 193కు గాను 108,ప్రపంచ సంతోష సూచిక 126, మోడీ సర్కార్‌ 80 కోట్ల మందికి ఉచితంగా ఆహార ధాన్యాలు ఇస్తున్నట్లు కరోనా సమయం నుంచి చెప్పుకుంటున్నప్పటికీ 2024లో ఆకలి సూచికలో 126దేశాలకు గాను 105గా ఉన్నాం. ప్రపంచ శాంతి సూచికలో 163కు గాను 116వ స్థానం, అవినీతికి తమ పాలనలో తావు లేదు, మోడీ మీద ఒక్క కుంభకోణమన్నా ఉందేమో చూడండని బిజెపి పెద్దలు సవాళ్లు విసురుతుంటారు. అధికారాంతమందు చూడవలె ఆ ఆయ్య సాభాగ్యముల్‌ అన్నాడు ఒక కవి. దేశం మొత్తంగా అవినీతి గురించి ట్రాన్సఫరెన్సీ ఇంటర్నేషనల్‌ సూచికలో 2022లో 85వదిగా ఉంటే 2024లో 96వ స్థానానికి దిగజారింది. ప్రపంచ పత్రికా స్వేచ్చలో 180 దేశాల్లో 159వ స్థానం, పాయింట్ల వారీ చూస్తే అంతకు ముందు సంవత్సరంలో 36.62 కాగా 2024లో 31.28కి పడిపోయాయి. చట్టబద్ద పాలన సూచికలో 142దేశాల్లో 79వ స్థానం. మంచి జీవనానికి అనువైన నగరాలేమిటని 173 నగరాలను ఎంచుకోగా వాటిలో న్యూఢల్లీి, ముంబై నగరాలకు 141వ స్థానం రాగా ఆ తరువాత చెన్నయ్‌,అహమ్మదాబాద్‌, బెంగలూరు చోటు దక్కించుకున్నాయి. యుపిఏ పాలనా కాలంలో ప్రపంచ జీడిపిలో 11వదిగా ఉన్న మన దేశాన్ని ఐదవ స్థానానికి తెచ్చామని చెప్పుకుంటున్నవారు పైన పేర్కొన్న సూచికల్లో ఎందుకు విఫలమైనట్లు ?


వైఫల్యాల గురించేచెబుతారా మోడీ సాధించిందేమీ లేదా అని ఎవరైనా అడగవచ్చు. స్టాక్‌హోం ఇంటర్నేషనల్‌ పీస్‌ రిసర్చ్‌ ఇనిస్టిట్యూట్‌(సిప్రి) సమాచారం ప్రకారం 2020 నుంచి 2024వరకు ప్రపంచంలో అత్యధికంగా ఆయుధాలు దిగుమతి చేసుకున్న దేశం ఉక్రెయిన్‌, తరువాత మనదే. రష్యాతో మూడేండ్లుగా యుద్ధం చేస్తోంది గనుక ఉక్రెయిన్‌ ఆ పని చేసింది, మనం ఎవరితో యుద్దంలో ఉన్నాం, ఎవరి మేలుకోసం ఆయుధాలను పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నట్లు ? వాస్తవం ఇలా ఉంటే మన దేశం కూడా ఆయుధాలను ఎగుమతి చేస్తోందన్న ప్రచారం బిజెపి చేస్తోంది. నిజమే ! గ్లోబల్‌ ఎకానమీ డాట్‌ కాం 2022 సమాచారం మేరకు 48దేశాల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న అమెరికా 14,515 మిలియన్ల డాలర్ల మేరకు ఎగుమతి చేయగా, నాలుగవ స్థానంలో ఉన్న చైనా 2,017 మిలియన్‌ డాలర్లు, 40 స్థానంలో ఉన్న భారత్‌ 11 మిలియన్‌ డాలర్లు అని పేర్కొన్నది. వెనుకటికెవడో మాది 101 అరకల వ్యవసాయం అని వేరే ఊరిలో గొప్పలు చెప్పాడట, మాది అంటున్నావ్‌ ఎవరెవరు ఏమిటి అని అడిగితే మా అయ్యగారివి వంద, నాది ఒకటి అన్నాడట. అందుకే,
వినదగునెవ్వరు చెప్పిన
వినినంతనే వేగపడక వివరింపదగున్‌
గనికల్ల నిజము తెలిసిన
మనుజుడేపో నీతిపరుడు మహిలో సుమతీ
దీని అర్ధం బిజెపి, కాంగ్రెస్‌, కమ్యూనిస్టులు, ప్రాంతీయ పార్టీ ఏం చెప్పినా వెంటనే తొందరపడకూడదు, నిజానిజాలేమిటో బాగా పరిశీలించాలి.అది తెలుసుకున్న మనిషే భూమి మీద నిజాయితీ పరుడు. మనలో ఎందరం దీన్ని పాటిస్తున్నామో ఎవరికి వారే ఆలోచించుకోవాలి,ఎలా ఉండాలో నిర్ణయించుకోవాలి.దేన్నీ గుడ్డిగా నమ్మకు అని పెద్దలు చెబితే ప్రతిదాన్నీ ప్రశ్నించు అని వివేకానందుడు చెబితే అన్నింటినీ సందేహించు అని మార్క్సిస్టు మహోపాధ్యాయుడు కారల్‌ మార్క్స్‌ చెప్పాడు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

భారత జిడిపి వృద్ధి స్వంత డబ్బా, అతిశయోక్తులు : నరేంద్రమోడీ సుభాషితాలు, చేదునిజాలు !

29 Saturday Mar 2025

Posted by raomk in BJP, CHINA, Congress, Current Affairs, Economics, Farmers, History, INDIA, INTERNATIONAL NEWS, Loksabha Elections, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

BJP, BJP hypocrisy, China, China vs India GDP, Hypersonic missile, India GDP, Narendra Modi Failures, RSS, Xi Jinping


ఎం కోటేశ్వరరావు


నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత 2015లో 2.1లక్షల కోట్ల డాలర్ల నుంచి 2025లో దేశ జిడిపి 4.3లక్షల కోట్ల డాలర్లకు చేరినట్లు, ఇది 105శాతం పెరుగుదల అని ఐఎంఎఫ్‌ చెప్పింది.అయితే ప్రపంచంలో ఏ పెద్ద దేశమూ ఇంతటి అభివృద్ధి సాధించలేదని బిజెపి ఐటి సెల్‌ అధినేత అమిత్‌ మాలవీయ ఎక్స్‌ పోస్టులో పేర్కొన్నారు. జాతీయ, ప్రాంతీయ పత్రికలు కూడా ఈ వార్తకు పెద్ద ఎత్తున ప్రాచుర్యమిచ్చాయి. భజనపరుల సంగతి చెప్పేదేముంది, కీర్తి గీతాలు పాడుతున్నారు. బుర్రకు పని చెప్పకుండా చెవులప్పగించేవారుంటే కాకమ్మ కతలు చెప్పేవారికి కొదవ ఏముంది. బిజెపి పెద్దలు 2025 నాటికి ఐదు లక్షల కోట్ల డాలర్లకు పెంచుతామని గొప్పలు చెప్పుకున్న అంశం ఇక్కడ గుర్తుకు తెచ్చుకోవాలి. స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఇంతటి అభివృద్ధిని ఏ ప్రభుత్వమూ సాధించలేదని కూడా మాలవీయ చెప్పారు.అలా ప్రచారం చేయటమే కదా ఆ పెద్దమనిషి ఉద్యోగం. వాస్తవం ఏమిటి, 2004లో మన్మోహన్‌ సింగ్‌ అధికారానికి వచ్చినపుడు జిడిపి 709 బిలియన్‌ డాలర్లు కాగా 2014 నాటికి అది 2030 బిలియన్లకు పెరిగింది. ఏ ఎలిమెంటరీ స్కూలు విద్యార్ధిని అడిగినా యుపిఏ పాలనా కాలంలో పెరుగుదల రేటు 186 శాతమని, 105కంటే ఎక్కువని చెబుతారు. లేదు మా వేదగణితం, మోడీ లెక్కల ప్రకారం 105శాతమే ఎక్కువ అంటే అంతేగా అంతేగా మరి అనటం తప్ప చేసేదేముంది ! ఎవరన్నా గట్టిగా కాదు అంటే మున్సిపల్‌ అధికారులు వచ్చి నిబంధనలన్నీ సక్రమంగానే పాటించినా వారి ఇళ్ల గోడల నిర్మాణంలో ఇసుక, సిమెంటు పాళ్లలో తేడా కనిపిస్తోందని,హానికారక రంగులు వేశారంటూ వెంటనే బుల్డోజర్లతో కూల్చివేసే రోజులివి. వ్యంగ్యాన్ని భరించలేక ముంబైలో కునాల్‌ కమ్రా ప్రదర్శన జరిగిన హాలును ఎలా కూల్చివేశారో చూశాంగా !

టీవీ9 నిర్వహించిన సమావేశంలో ప్రధాని చెప్పిన కొన్ని అతిశయోక్తుల గురించి చూద్దాం. ‘‘ నేడు ప్రపంచ కళ్లన్నీ భారత్‌ మీదే ’’. 2014 మే 26న ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన మరుసటి రోజు నుంచీ పదాలు మార్పు ఉండవచ్చు తప్ప ఇదే పాట. ఏ ఒక్క అంతర్జాతీయ సమస్యలో అయినా లేదా వివాద పరిష్కారంలోనైనా భారత పాత్రను కోరిన దేశాలు గానీ, మోడీ ప్రమేయంగానీ ఉన్న ఉదంతం ఒక్కటంటే ఒక్కటి ఉందా ? కానీ మోడీ చెప్పిందాన్ని మరోవైపు నుంచి చూస్తే నూటికి నూరుపాళ్లూ వాస్తవం. ఏమిటంటే మన మార్కెట్‌లో తమ వస్తువులను అమ్ముకోవటానికి, తమకు అవసరం లేని వాటిని మనకు అంటగట్టటానికి (ప్రపంచంలో నిషేధించిన అనేక పురుగుమందులు, రసాయనాలు, ఔషధాలు మన దగ్గర పుష్కలంగా దొరుకుతున్నాయి), ఇక్కడి కార్పొరేట్లకు మోడీ సర్కార్‌ ఇస్తున్న రాయితీల కారణంగా స్టాక్‌మార్కెట్లో పెట్టుబడులు పెట్టి లాభాలు తరలించుకుపోవటానికి మనవైపు చూస్తున్న మాట వాస్తవం.


‘‘ గత పదేండ్లలో జిడిపిని రెట్టింపు చేయటం అంకెలు కాదు, 25 కోట్ల మందిని దారిద్య్రరేఖ దాటించి నూతన మధ్యతరగతిని సృష్టించాం. వారు కొత్త జీవితాన్ని ప్రారంభించారు, సచేతనంగా ఆర్థికవృద్ధికి తోడ్పడుతున్నారు ’’. ప్రధాని ఈ మాటలను చూసి నవ్వాలా ఏడవాలో తెలియటం లేదు. ఇరవై ఐదు కోట్ల మందిని దారిద్య్రరేఖ నుంచి ఎగువకు లాగాం అంటూనే కనీసం ఆహార ధాన్యాలు కొనుగోలు చేయలేని స్థితిలో ఉన్న 80 కోట్ల మందికి ఉచితంగా ఆహార భద్రతా పధకం కింద గోధుమలు, బియ్యం ఇస్తున్నామని అదే నోటితో చెప్పటం విన్నాం. ప్రపంచ ఆకలి సూచికలో తాజాగా 127లో 105వ దేశంగా ఉన్నాం. ఆకలి లేని(9.9), స్వల్ప (10 నుంచి 19.9), తీవ్రం(20 నుంచి 34.9), ఆందోళనకరం(35నుంచి 49.9) , అత్యంత ఆందోళనకరం(50పైన) అనే ఐదు తరగతులుగా దేశాలను విభజిస్తే మన దేశం తీవ్ర తరగతిలో అంతకు ముందు గత పదేండ్లుగా కూడా ఉంది. అనూహ్య అద్భుతాలు లేదా నరేంద్రమోడీకి కొత్తగా దైవిక శక్తులు వస్తే తప్ప దాన్నుంచి సమీప భవిష్యత్‌లో బయటపడే దరిదాపుల్లో కూడా లేదు. పదేండ్లలో జిడిపి రెట్టింపు అని ఇతర గొప్పలు చెప్పుకుంటూ తమ భుజాలను తామే చరుచుకుంటూ శభాష్‌ అని చెప్పుకుంటున్నాం. అ పది సంవత్సరాల్లో 2014 నుంచి 2014వరకు మన ఆకలి సూచిక స్కోరు 28.2 నుంచి 27.3కు మాత్రమే తగ్గింది,దీనిలో అంత అభివృద్ధి ఎందుకు రాలేదు ? దీనికే పొంగిపోతున్నాం. ఇదే కాలంలో పాకిస్తాన్‌ స్కోరు 29.6 నుంచి 27.9కి తగ్గింది, మనకంటే మెరుగైన అభివృద్ధి అంటే పాకిస్తాన్‌ ఏజంట్లని ఎదురు దాడి చేస్తారు. పాక్‌ రాంకు మన తరువాత 109, ఆకలిని ఎవరు ఎక్కువగా తగ్గించినట్లు ? గత పదేండ్లలో చైనా స్కోరు ఐదు కంటే తక్కువే ఉందన్న వాస్తవాన్ని చెబితే నానా యాగీ చేస్తారు. అన్నం ఉడికిందా లేదా అని చూడటానికి ఒక మెతుకు పట్టుకు చూస్తే చాలు అన్నట్లుగా నరేంద్రమోడీ అతిశయోక్తుల గురించి చెప్పుకోవటానికి ఈ ఒక్కటి చాలు.


ఆర్థిక విస్తరణలో జి7, జి20, బ్రిక్స్‌ దేశాలన్నింటి కంటే అసాధారణ వృద్ధి సాధించినట్లు వాణిజ్యశాఖ మంత్రి పియూష్‌ గోయల్‌ వర్ణించారు. త్వరలో జిడిపిలో భారత్‌ మూడవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారనుందని బిజెపి పెద్దలు, వారి సమర్ధకులు నిత్యం ఊదరగొడుతుంటారు. ఇదొక మైండ్‌ గేమ్‌. ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున ఉంటుందా ? ప్రస్తుతం జపాన్ను అధిగమించేందుకు మోడీ చూస్తున్నారని, 2027 తొలి ఆరునెలల్లోనే 4.9లక్షల కోట్ల డాలర్లతో జర్మనీని కూడా దాటించేస్తారని ఊదరగొడుతున్నారు.అవన్నీ గిడసబారిన దేశాలుగా మారుతున్నాయి, మన పోల్చుకోవాల్సింది చైనాతో కదా ! మన వృద్ధి రేటు చైనా, అమెరికా, జర్మనీ కంటే ఎక్కువగా ఉందని, గడచిన పదేండ్లలో భారత్‌ 105శాతం పెరుగుదల సాధించగా చైనా 76, అమెరికా 66, జర్మనీ 44, ఫ్రాన్సు 38, బ్రిటన్‌ 28శాతం పెరుగుదల సాధించిందని ఐఎంఎఫ్‌ చెప్పింది. లక్ష కోట్ల డాలర్ల కిలోమీటర్‌(మైలు) రాయిని దేశం 2007లో దాటింది.తదుపరి 2014లో రెండు లక్షల కోట్లు దాటింది. 2032నాటికి పదిలక్షల కోట్ల డాలర్ల జిడిపి కలిగిన దేశంగా మారుతుందని కొందరు ఆర్థికవేత్తలు జోశ్యం చెప్పారు. వారి తర్కం ఏమిటి ? 2021లో మూడు లక్షల కోట్లకు విస్తరించింది. కేవలం నాలుగు సంవత్సరాల్లోనే 4.3లక్షల కోట్ల డాలర్లకు చేరింది. ప్రతి 1.5 సంవత్సరాలకు (18నెలలకు) ప్రస్తుత వేగంలో ఒక లక్ష కోట్ల డాలర్లు పెరుగుతున్నది. ఇదే కొనసాగితే 2032 నాటికి 10లక్షల కోట్ల డాలర్లకు చేరుతుంది.


కొంత మందికి అంకెలతో ఆడుకోవటం వెన్నతో పెట్టిన విద్య. అంతా అద్భుతంగా ఉందని చెబుతూనే 2025 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 6.5శాతం ఉంటుందని సన్నాయి నొక్కులు. రానున్న కొద్ది సంవత్సరాల్లో మూడవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతున్నందుకు ఇప్పటి నుంచి సంబరాలు జరుపుకుంటున్నారు కొందరు. చెన్నయ్‌ కేంద్రంగా పని చేస్తున్న ఆర్థిక నిపుణుడు డి ముత్తుకృష్ణన్‌ ఉత్సవాలు జరుపుకోవాల్సినంత ఘనత ఏమి సాధించామని ప్రశ్నించారు. జిడిపిలో ఏ స్థానంలో ఉన్నామన్నది కాదు తలసరి రాబడిలో ప్రపంచంలో మనం 140వ స్థానంలో ఉన్నామని, మనకంటే 139దేశాలు ముందున్నాయని గుర్తించాలని చెప్పారు. పర్చేజింగ్‌ పవర్‌ పారిటీ(పిపిపి) పద్దతి జీవన ప్రమాణాలను మెరుగ్గా వెల్లడిస్తుందని కొందరు చెబుతారు, దాని ప్రకారం చూసినా మన స్థానం 119 అని చెప్పారు. పదేండ్లలో మన జిడిపి 105శాతం పెరిగిందని ఏ ఐఎంఎఫ్‌ చెప్పిందో అదే సంస్థ 2025 తలసరి జిడిపిలో 141వ స్థానం అని కూడా చెప్పింది. మనకంటే పేద దేశమైన కంపూచియా పైన ఉంది, దివాలా తీసిందని చెప్పిన శ్రీలంక 133, బంగ్లాదేశ్‌ 143, పాకిస్తాన్‌ 159, షీ జింపింగ్‌ ఏలుబడిలో కుప్పకూలిపోయిందని కొంత మంది చెప్పే చైనా 71వ స్థానంలో ఉందని కూడా ఐఎంఎఫ్‌ చెప్పింది. మన తలసరి రాబడి పదివేల డాలర్లకు చేరాలంటే కనీసం 30 సంవత్సరాలు కష్టపడి పని చేయాలని, దానికి అనుకూలమైన ఆర్థిక పరిస్థితులు ఉండాలని ముత్తు కృష్ణన్‌ చెప్పారు. చైనా తలసరి జిడిపి 2025లో 13,873 డాలర్లు, ఇప్పుడున్న మన 2,937 డాలర్ల నుంచి ఎదిగి ప్రధమ స్థానంలో ఉన్న మొనాకో 2,56,581( 2023 ప్రపంచ బ్యాంకు సమాచారం) లేదా డాలర్‌ దేవుడున్న అమెరికా 89,678(2025 ఐఎంఎఫ్‌) స్థాయికి, చివరికి పడకకుర్చీ మేథావులు త్వరలో అధిగమించే దూరం ఎంతో దూరం లేదని నమ్మించేందుకు చూస్తున్న చైనాను అయినా కనీసం అధిగమించాలంటే ఎంత సమయం పడుతుందో ఆల్జిబ్రా లేదా వేద గణితం ఏదో ఒక అడ్డగోలు పద్దతిలో లెక్క వేసుకోవాల్సిందే.

పదకొండు సంవత్సరాల విశ్వగురువు మోడినోమిక్స్‌ సమర్ధ పాలన తరువాత పరిస్థితి గురించి కమ్యూనిస్టులో ఇతర పురోగామి వాదులో చెబుతున్న మాటలను కాసేపు పక్కన పెడదాం, ఎందుకంటే ఎండమావుల వెంట పరిగెడుతున్న జనం వారి మాటలను తలకు ఎక్కించుకొనే స్థితిలో లేరు. బిజినెస్‌ టుడే పత్రిక 2025 మార్చి 21వ తేదీ సంచికలో వైట్‌ కాలర్‌ భారత్‌లో 500 డాలర్ల ఉద్యోగాలింకేమాత్రం లేవు అంటూ ఒక వార్త వచ్చింది.విజ్‌డమ్‌ హాచ్‌ అనే సంస్థ స్థాపకుడు అక్షత్‌ శ్రీవాత్సవ చెప్పిన అంశాలను దానిలో చర్చించారు. శ్రీవాస్తవ చెప్పిన అంశాలు, వార్తలోని వ్యాఖ్యల సారం ఇలా ఉంది.సాంప్రదాయకంగా ఉపాధి కల్పించే రంగాలు, వృద్ధి పడిపోతున్నది, యువత ఎలా ముందుకు పోవాలో ఎంచుకోవటం కష్టంగా మారుతున్నది. దేశ అభివృద్ధి నమూనా గతం మీద ఇంకేమాత్రం ఆధారపడలేదు. భారత ఐటి మార్కెట్‌ నిర్ణయాత్మక మార్పుకు లోనవుతున్నది, అది మంచిదారిలో కాదు. ఐటిలో మంచి ఉద్యోగాలు అంతరిస్తున్నాయి, అవి వెనక్కు తిరిగి రావు. ‘‘ ఒక తెల్లవాడికి వెయ్యి డాలర్లు ఇచ్చే బదులు భారతీయులకు 500 డాలర్లు ఇచ్చారు. ఆ సొమ్ముతో మనం సంతోష పడ్డాం. ఎందుకంటే ఇప్పటికీ అది గొప్ప ఉద్యోగమే.అది మన జీవన ప్రమాణాలను పెంచింది. కానీ అది ఆ కాలం కనుమరుగుతున్నది.’’ అని శ్రీవాత్సవ పేర్కొన్నారు.‘‘ ప్రభుత్వం ఒక పరిష్కారం చూపుతుందేమోనని ఆశించటం అర్ధలేనిది, ఆ మార్పు రావాలంటే దశాబ్దాలు పడుతుంది, అప్పటికి మీరు వృద్ధులు కావచ్చు ’’ అని కూడా చెప్పారు.

పదకొండు సంవత్సరాల క్రితం 2014లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్రమోడీ ఒక బిజెపి నేత, గుజరాత్‌ సిఎంగా చెప్పిందేమిటి ? మిగతా అంశాలను పక్కన పెడదాం. గుజరాత్‌ నమూనా అభివృద్ధిని దేశమంతటా విస్తరిస్తాం అన్నారు. అంటే పారిశ్రామికంగా వృద్ధి చేస్తామన్నారు. ప్రధాని పదవిలోకి రాగానే విదేశాలకు ఎందుకు పదే పదే వెళుతున్నారంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల కోసం అన్నారు. కానీ జరిగిందేమిటి ? తరువాత ఎప్పుడైనా గుజరాత్‌ నమూనా గురించి ఎక్కడైనా మాట్లాడారా ? 1950లో మన దేశంలో 20 కోట్ల మంది జనం ఉపాధి కోసం వ్యవసాయంపై ఆధారపడ్డారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కొత్తగా కొంత భూమి సాగులోకి వచ్చింది, కొంత వ్యవసాయేతర అవసరాలకు మళ్లింది. ఎంత పెరిగింది, ఎంత తగ్గింది అన్న లెక్కలను పక్కన పెడితే స్థిరంగా ఉందనుకున్నప్పటికీ అదే భూమి మీద నాడు 20 కోట్ల మంది బతికితే ఇప్పుడు 2023`24లో జనాభాలో 46.1శాతం మంది ఆధారపడుతున్నట్లు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే తెలిపింది. ఆరు సంవత్సరాల క్రితంతో పోల్చితే రెండు శాతం పెరిగారు. అంటే ఇప్పుడు 67 కోట్ల మంది పని చేస్తున్నారు.చైనాలో 24.1 శాతం లేదా 17.66 కోట్ల మంది(2023) పని చేస్తున్నారు. ఇలాంటి స్థితిలో ఏటా రెండు కోట్ల మేరకు పారిశ్రామిక, వాణిజ్య రంగాల్లో ఉపాధి కల్పిస్తామని చెప్పిన మాటలేమైనట్లు ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

విదూషకుడు కునాల్‌ కమ్రా హాస్య వీడియో వివాదం : గూండాయిజం, బుల్డోజర్లతో భావ ప్రకటనా స్వేచ్చ హరించే యత్నం !

27 Thursday Mar 2025

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

Amit Shah, BJP, comedy controversy, Eknath Shinde, freedom of expression, Kangana ranaut, Kunal Kamra, Narendra Modi Failures, nirmala sita raman, parody, Siva Sena, vandalism


ఎం కోటేశ్వరరావు


దేశంలో ఏం జరుగుతోంది ? చిన్న పాటి వ్యంగ్యం, జోక్‌, విమర్శలను కూడా సహించని శక్తులు రెచ్చిపోతున్నాయి. అధికార యంత్రాంగం అలాంటి వారి చేతుల్లో పనిముట్టుగా మారుతోంది. విదూషకుడు కునాల్‌ కమ్రా వంటి వారు, మిమిక్రి కళాకారులు,చతురోక్తులతో విమర్శలు చేసే వారు, కార్టూనిస్టులు, సినిమా వారు ఎవరైనా కావచ్చు, అధికారంలో ఉన్న రాజకీయ నేతల తీరుతెన్నులను హాస్య భరితంగా జనం ముందు ఎండగట్టారో వారికి మూడిరదే. వెంటనే గూండాలు రంగంలోకి దిగి విధ్వంసం సృష్టిస్తారు. వీధుల్లో తిరగనీయం, ప్రాణాలు తీస్తామని బెదిరిస్తారు. సంబంధిత వ్యక్తులు, సంస్థల భవన నిర్మాణాల్లో ఉల్లంఘనలు స్థానిక సంస్థల సిబ్బందికి అప్పుడే గుర్తుకు వస్తాయి, వెంటనే బుల్డోజర్లతో ఆఘమేఘాల మీద కూల్చివేస్తారు. ఎక్కడబడితే అక్కడ వివిధ పోలీసు స్టేషన్లలో కేసులు నమోదు చేస్తారు. సినిమాల్లో మాదిరి అంతా అయిపోయాక రావటం గాక పోలీసులు సిద్దం సుమతీ అన్నట్లు ఉంటారు. ఇక మద్దతు ఇచ్చే రాజకీయ నేతలు, అవే రంగాలకు చెందిన తోటి వారు సైతం రంగంలోకి దిగి దాడులు మొదలు పెడతారు, సుభాషితాలు వల్లిస్తారు.ఈ గూండాయిజాన్ని సిపిఎం, ఉద్దావ్‌ ధాకరే శివసేన ఖండిరచాయి.


చట్ట ప్రకారం తప్పు చేసిన వారిని ఎవరూ సమర్ధించరు. భావప్రకటనా స్వేచ్చ హద్దులేమిటో చట్టాల్లోనే ఉన్నాయి. వాటిని ఉల్లంఘిస్తే వాటి ప్రకారం ఎంత పెద్దవారినైనా విచారించి శిక్షలు వేయవచ్చు. కానీ కొంత మంది చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు. వారిని చూసీ చూడనట్లు వదలివేయటంతో కొత్త వారికి ప్రోత్సాహం వస్తోంది. గతంలో ఇటలీ, జర్మనీ వంటి చోట్ల ఫాసిస్టులు, నాజీలు, కమ్యూనిస్టు వ్యతిరేకులు అదేపని చేశారు. తమ మీద విమర్శలు చేసిన వారిని తమకు నచ్చనివారిని వెంటాడారు, వేధించారు.నాగరికులమని చెప్పుకున్న, భావించిన వారిలో అనేక మంది మౌనంగా ఉన్నారు. నేటి మాదిరి అడ్డగోలు చర్యలను సమర్ధించిన మేథావులూ, కళాకారులూ నాడున్నారు, జరిగిందేమిటి ? అలాంటి వారిని చరిత్ర చెత్తబుట్టలోకి నెట్టింది.1940,50 దశకాల్లో తెలంగాణా సాయుధ పోరాటం జరిగిన సమయంలో సాయుధ పోలీసులు గ్రామాల మీద దాడులు జరిపారు. కోస్తా ప్రాంతంలో గ్రామాలలో గాంధీ విగ్రహాలు నెలకొల్పిన కూడళ్లలో జనాన్ని మందవేసి మీలో కమ్యూనిస్టులెవరో, కాని వారెవరో స్వచ్చందంగా చెప్పండి అని ఆదేశించేవారు. కమ్యూనిస్టులు నిజాయితీగా ముందుకు వస్తే కాని వారు మేం యాంటీ కమ్యూనిస్టులం అని కొన్ని చోట్ల గొప్పగా చెప్పుకున్నారట. ఉన్న కమ్యూనిస్టులతోనే వేగలేక చస్తుంటే వారికి తోడు మరొకరు యాంటీ కమ్యూనిస్టులా అంటూ వారిని కూడా చావబాదినట్లు, బట్టలిప్పించి గాంధీ విగ్రహాల చుట్టూ తిప్పించినట్లు పెద్దలు చెప్పారు. నాటి బ్రిటీష్‌, నిజాం, నెహ్రూ సైన్యం, రిజర్వు పోలీసులకు ఆ రోజుల్లో కమ్యూనిస్టు అన్న పదం వినిపిస్తే అలా ఉండేది మరి. ఆ గుణపాఠాలను మనం తీసుకోవాలా వద్దా, మనకెందుకులే అని తప్పించుకు తిరగాలా ? అన్యాయం, అధర్మాన్ని వ్యతిరేకించకుండా మౌనంగా ఉంటే వాటికి పాల్పడేవారు సహిస్తారని భావిస్తే పొరపాటు. సమర్ధించకుండా మౌనం అంటే మమ్మల్ని వ్యతిరేకించటమే అని మౌనమునుల సంగతి కూడా చూస్తారు. దేశంలో ఇదే జరగనుంది !


ఇటీవల ముంబై హాబిటాట్‌ హాస్య కేంద్రంలో ప్రదర్శించిన కునాల్‌ కమ్రా ప్రదర్శనలో విసిరిన ఒక చతురోక్తి తమ నేత ఏకనాధ్‌ షిండేను ఉద్దేశించే అని అతగాడి నాయకత్వంలోని శివసేన మద్దతుదారులు ఆ కేంద్రంపై దాడి చేసి విధ్వంసం సృష్టించారు. అక్కడ ఉన్న స్టూడియో నిబంధనలకు విరుద్దంగా ఉందంటూ మునిసిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు వెంటనే కొంత భాగాన్ని కూల్చివేశారు. నాగపూర్‌లో ఇటీవల జరిగిన అల్లర్లకు సూత్రధారి అంటూ కొందరిని పోలీసులు ఆరోపించటం, వెంటనే వారిలో ఒకరి ఇల్లు నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ మునిసిపల్‌ అధికారులు కూల్చివేయటాన్ని చూస్తే పోతులూరి వీరబ్రహ్మంగారు చెప్పిన విపరీతాలు గుర్తుకు వస్తున్నాయి. ఆయా ఉదంతాలు జరిగే వరకు సదరు మున్సిపల్‌ అధికారులు ఏ గుడ్డి గుర్రాలకు పండ్లు తోముతుంటారో ఎవరి సేవలో తరిస్తుంటారో తెలియదు. బిజెపి, దాని మద్దతుదారులు అధికారంలో ఉన్నచోట చిన్న నొప్పి అనిపిస్తే చాలు వెంటనే వారికి క్షణాల మీద అతిక్రమణలు ఎలా గుర్తుకు వస్తున్నాయో ఆఘమేఘాల మీద ఎలా కూల్చివేస్తున్నారో అంతుబట్టటం లేదు.


తెలుగు ప్రాంతాల్లో కొన్ని పదాలు ‘‘ కో పైలట్‌, జామాతా దశమ గ్రహం, వెన్నుపోటు,వైస్‌రాయ్‌ హోటల్‌ బ్యాచి, తోలు తీసేవారు, తాటవలిచే వారు, పాచిపోయిన లడ్డూలు, మాట తప్పను మడమతిప్పను, మీట నొక్కుడు, వాట్‌ అయామ్‌ సేయింగ్‌, అలా ముందుకు పోతున్నాం, ఆ రెండు పత్రికలు, సన్నాసులు, ఫాంహౌస్‌, పొట్టోడు, ట్విటర్‌ పిట్ట, గడకర్ర, భాయియోం` బహినోం, సూపర్‌ సిక్స్‌ ’’ వంటి పదాలు చలోక్తులు విసిరేందుకు,రచనలు చేసేందుకు వస్తువుగా మారుతున్నాయి. వాటితో పాటు ఇంకా అనేక పదాలను పేరు పెట్టకుండా ఎవరు ఉచ్చరించినా ఎవరిని ఉద్దేశించి అనేది అందరికీ ఎరుకే. తమ నేతలనే అంటున్నారని మద్దతుదారులు కత్తులు, కటార్లు పట్టుకొని వీధులోకి వస్తే కుదురుతుందా ! మహారాష్ట్రలో అలాంటి పదాలలో ‘‘ ద్రోహి, గౌహతి ప్రయాణం,ఆటోవాలా ’’ అనేవి ఎంతో ప్రాచుర్యం పొందాయి. కునాల్‌ కమ్రా అలాంటి పదాలతో ఎవరి పేరూ ప్రస్తావించకుండా చతురోక్తులు విసిరాడు. మా నాయకుడినే అంటూ ప్రస్తుతం మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్న మాజీ సిఎం ఏకనాథ్‌ షిండే శివసేనకు చెందిన వారు హాబిటేట్‌ స్టూడియోలో విధ్వంసకాండ సృష్టించారు.కునాల్‌ కమ్రాను నరికి వేస్తామంటూ వీరంగం వేస్తున్నారు. అమెరికా, లాటిన్‌ అమెరికా, ఐరోపా దేశాల్లో అనేక మంది దేశాధినేతలు, డోనాల్డ్‌ ట్రంప్‌ వంటి వారిని మీడియాలో, ఇతరంగా అనేక మంది ఫాసిస్టు, నాజీలని నేరుగానే సంబోధించి విమర్శిస్తున్నారు.నోరుబట్టని బూతులను కూడా వినియోగిస్తున్నారు.మామ తిట్టినందుకు కాదు తోడల్లుడు కిసుక్కున నవ్వినందుకు అన్నట్లుగా రాజకీయ పార్టీల నేతలు ఇలాంటి పదాలను ఎలాంటి సంకోచం లేకుండా పరస్పరం వాడేస్తుంటారు. కానీ అదే కళాకారులు వాటిని వ్యంగ్యాస్త్రాలుగా వాడితే మాత్రం సహించరు. మేం మేం వందనుకుంటాం మీరెవరు అన్నట్లుగా స్పందిస్తారు.


తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని కోర్టు ఆదేశిస్తే అందుకు సిద్దమే అని కునాల్‌ కమ్రా చెప్పాడు. చట్టానికి కట్టుబడి ఉంటానని చెప్పటమే అది. అంతే కాదు గూండా గుంపులను ఉద్దేశించి మరో పేరడీ పాటతో రెండో వీడియోను కూడా విడుదల చేశాడు. తమ దగ్గర కేసు నమోదైంది గనుక వివరణ ఇవ్వాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు, తనకు వారం రోజుల సమయం కావాలని కునాల్‌ చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఆ మేరకు వివరణ ఇవ్వకపోతే చట్టం తనపని తాను చేసుకుపోవాలి. కానీ అతను ప్రదర్శన నిర్వహించిన క్లబ్బు మీద దాడి, అతిక్రమణలంటూ కూల్చివేతలు ఏమిటి ? వచ్చిన జనాల మీద కూడా దాడిచేస్తారా ? అంటే ఎవరూ కునాల్‌ వంటి విమర్శకులు, చతురోక్తులు విసిరే వారికి వేదికలను ఎవరైనా ఇస్తే వాటన్నింటికీ ఇదే గతి పడుతుందని చెప్పటమే కదా ! ఎంతకాలం ఇలా బెదిరిస్తారు, ఎందరి నోరు మూయిస్తారు, ఇదా అసలైన ప్రజాస్వామ్యం అంటే ? దేశం, ఇతర దేశాల నుంచి కునాల్‌కు మద్దతు వెల్లువెత్తుతున్నది, చట్టపరంగా ఎదుర్కొనేందుకు, ధ్వంసమైన స్టూడియోకు చెల్లించేందుకు అనేక మంది లక్షలాది రూపాయలను విరాళంగా కూడా పంపినట్లు వార్తలు వచ్చాయి. రాజకీయ పార్టీల నేతలు, వారిద్రోహాలు, అధికార దాహాల గురించి జనంలో ఉన్న అసంతృప్తి, ఆగ్రహాలకు ఇది నిదర్శనం, గళమెత్తాలని కోరటం తప్ప మరొకటి కాదు. ఏకనాధ్‌ షిండే అనుచరులుగా ఉన్నవారు విధ్వంసకాండకు పాల్పడ్డారు తప్ప, మానేతను అంటారా అని సామాన్య జనం వీధులకు ఎక్కినట్లు ఎక్కడా వార్తలు రాలేదు. కునాల్‌ పరోక్షంగా చతురోక్తులు వేసిన వారిలో ఏకంగా దేశ ప్రధాని నరేంద్రమోడీ, అంతకంటే శక్తివంతుడిగా పేరున్న అమిత్‌ షా కూడా ఉన్నారు. బాద్‌షా బాద్‌షా అనే సినిమా పాటను అనుకరించి హాస్యం పండిరచాడు. మిస్టర్‌ ఇండియా సినిమాలోని హవా హవాయి పాటకు పేరడీతో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ మీద కూడా సెటైర్లు వేస్తూ వీడియోను తాజాగా విడుదల చేశాడు.సినిమా హాళ్లలో అమ్మే పాప్‌ కార్న్‌( మొక్క జొన్న పేలాలు) మీద వివిధ రకాల జిఎస్‌టిలను విధిస్తూ నిర్ణయించిన సంగతి తెలిసిందే. కుమ్రా బాంకు ఖాతాలు, వాటి లావాదేవీల గురించి తనిఖీలు, విచారణలు తప్ప వారి అభిమానులు గూండాయిజానికి పాల్పడిన ఉదంతాలేవీ ఇంతవరకు నమోదు కాలేదు.


గతంలో కొందరు రాజకీయ నేతల రూపలావణ్యాలతో చిత్రించిన పాత్రలతో సినిమాలు వచ్చాయి. అంతెందుకు కునాల్‌ కమ్రాను విమర్శించిన బిజెపి ఎంపీ కంగన రనౌత్‌ నిర్మించి స్వయంగా నటించిన ఎమర్జన్సీ సినిమా ఇందిరా గాంధీని విమర్శించటానికి తప్ప మరొకందుకు కాదు. కానీ ఆమె కునాల్‌ కమ్రాకు నీతులు చెబుతున్నారు. ఎమర్జన్సీ సినిమాలో తమ సామాజిక తరగతిని కించపరిచారు, చరిత్రను వక్రీకరించారంటూ సిక్కులు సినిమా థియేటర్ల ముందు ప్రజాస్వామిక పద్దతుల్లో నిరసన తెలిపారు తప్ప వాటి మీద, లేదా సినిమా నిర్మించిన స్టూడియోల మీద దాడులు చేయలేదు. కానీ పద్మావత్‌ సినిమా విడుదల సమయంలో అలాంటి దాడులు జరిగాయి. సినిమాల ద్వారా సెటైర్లు వేయటం కొత్త కాదు. ప్రఖ్యాత చార్లీ చాప్లిన్‌ గ్రేట్‌ డిక్టేటర్‌ పేరుతో హిట్లర్‌ మీద తీసిన సినిమా గురించి తెలిసిందే. పూర్వపు సోవియట్‌ కెజిబి ఏజంట్లను వెర్రి వెంగళప్పలుగా, సిఐఏ వారిని ఎంతో తెలివితేటలు కలిగిన వారిగా చిత్రించిన సినిమాలు అనేకం, అలాగే కమ్యూనిస్టులను దుర్మార్గులుగా రూపొందించినవీ తెలిసిందే. తెలుగులో రాజకీయ కారణాలతో అలాంటి సినిమాలు రాలేదా ! కానీ తమకు నచ్చని భావజాలం, వార్తలు, కార్టూన్లు, కామెడీ, సినిమాల మీద దాడి చేయటం దుర్మార్గం.


తమకు నచ్చని రచనలు చేసినందుకు, విధానాలను వ్యతిరేకించిన వారిని దేశద్రోహులుగా చిత్రిస్తున్న రోజులివి. కేసులు కూడా పెడుతున్నారు. పార్టీ ఫిరాయించిన వారందరికీ పెడుతున్న ముద్దు పేరు ద్రోహి అనే కదా ! నైజాం నవాబును వ్యతిరేకించిన జర్నలిస్టు షోయబుల్లా ఖాన్ను నైజాం గూండాలు కాల్చిచంపి, కసి తీరక రచనలు చేసే కుడిచేతిని నరికిన దుర్మార్గం చరిత్రలో చెరిగి పోదు. అత్యవసర పరిస్థితిని వ్యతిరేకించిన కన్నడ నటి, నిర్మాత స్నేహలతా రెడ్డిని నాటి కాంగ్రెస్‌ పాలకుల బరోడా డైనమెట్‌ అనే తప్పుడు కేసులో ఇరికించి జైల్లో చిత్రహింసలు పెట్టారు, దాంతో ఆమె ఆరోగ్యం దెబ్బతినటంతో విడుదల చేసిన ఐదు రోజులకే ఆమె కన్నుమూశారు.హేతువాదులు, వామపక్ష పవాదులుగా ఉన్న నరేంద్ర దబోల్కర్‌, గోవింద పన్సారే, జర్నలిస్టుగా ఉన్న గౌరీ లంకేష్‌, మేథావి, రచయిత కులుబుర్గిని మతోన్మాదులు మన కళ్ల ముందే బలితీసుకున్నారు. ఇలాంటి వాతావరణంలో ప్రాణాలకు ముప్పు ఉందని తెలిసినా పిరికిబారకుండా తాను నమ్మిన, తగినవి అనుకున్న ఇతివృత్తాలతో కునాల్‌ కమ్రా తన హాస్య కార్యక్రమాలతో అనేక మందితోపాటు, ధోరణులను చీల్చి చెండాడుతున్నారు.తగ్గేదేలే అన్నట్లుగా ఉన్నారు. ఇలాంటి మూకలను చూసి భయపడి మంచాల కింద దాక్కొనే వాణ్ణి కాదని చెప్పారు. ప్రఖ్యాత కార్టూనిస్టు శంకర్‌ తన కుంచెతో మహాత్మా గాంధీని, జిన్నా, జవహర్‌లాల్‌ నెహ్రూతో సహా ఎవరినీ వదల్లేదు. హిందూస్థాన్‌ టైమ్స్‌ పత్రికలో ఉద్యోగాన్ని వదులుకున్నాడు తప్ప కుంచెపదును తగ్గించుకోలేదు. నన్ను కూడా వదలకుండా కార్టూన్లు వేయి శంకర్‌ అన్న నెహ్రూ వంటి నేతలు పుట్టిన దేశంలో చిన్న పాటి వ్యంగ్యాన్ని కూడా సహించని వారు నేడు రాజకీయాల్లో పెత్తనం చేస్తున్నారు.తన మీద విసిరిన వ్యంగోక్తిని ఏకనాధ్‌ షిండే వదలివేసి ఉంటే కునాల్‌ వీడియో చూసే వారికి మాత్రమే అది పరిమితమై ఉండేది.అనుచరులతో చేయించిన రచ్చతో ఆ ఉదంతానికి ఎంత ప్రాచుర్యం వచ్చిందో చూస్తే మహారాష్ట్ర రాజకీయాల్లో షిండే పాత్ర మరింతగా బహిర్గతమైంది. తనకు తానే పరువును బజారుకు ఈడ్చుకున్నట్లు లేదూ !

Share this:

  • Tweet
  • More
Like Loading...

అంతన్నాడిoతన్నాడే మోడీ తాత : ఘోరంగా విఫలమమైన ‘‘ చైనా ఫ్యాక్టరీల ’’ ఆకర్షక ‘‘ ఆత్మ నిర్భర ’’ పధకం !

23 Sunday Mar 2025

Posted by raomk in BJP, CHINA, Congress, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

Aatmanirbhar Bharat, anti china, BJP, china+1, Made in India, Make In India, Narendra Modi Failures


ఎం కోటేశ్వరరావు

చైనా నుంచి బయటకు వచ్చే ఫ్యాక్టరీలు, వాణిజ్య సంస్థలను ఆకర్షించేందుకు, మేకిన్‌, మేడిన్‌ ఇండియా పధకాలను కొనసాగింపుగా అత్మనిర్భరత పధకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. దానిలో భాగంగా ఉత్పాదకతతో ముడిపడిన నగదు ప్రోత్సాహక పధకాన్ని (పిఎల్‌ఐ) ప్రధాని నరేంద్రమోడీ ఎంతో అట్టహాసంగా ప్రారంభించారు. అది ఆశించిన లక్ష్యాలకు సుదూరంగా ఉండటంతో నిలిపివేయాలని నిర్ణయించినట్లు రాయిటర్‌ వార్తా సంస్థ పేర్కొన్నది. జాతీయ పత్రికలన్నీ ప్రముఖంగా ఈ వార్తను ఇచ్చాయి. దీంతో రంగంలోకి దిగిన కేంద్ర ప్రభుత్వం శనివారం నాడు పిఐబి ద్వారా ఒక ప్రకటనను విడుదల చేసింది. దాన్ని కొనసాగిస్తున్నట్లు లేదా నిలిపివేస్తున్నట్లుగానీ చెప్పకుండా ఆ పధకం ద్వారా జరిగిందాని గురించి పెద్ద వివరణ ఇచ్చింది. పిఎల్‌ఐ పధకం కింద రు.1.97లక్షల కోట్ల రూపాయలను(డాలర్లలో 23 బిలియన్లు) కేంద్ర ప్రభుత్వం నగదు ప్రోత్సాహం ఇచ్చేందుకు పక్కన పెట్టింది. ఈ మొత్తాన్ని 2019`20 ఆర్థిక సంవత్సరంతో ప్రారంభించి నాలుగు లేదా ఆరు సంవత్సరాలలో ఉత్పత్తి, ఎగుమతులు చేసే సంస్థలకు ఇవ్వాలని నిర్ణయించారు. దీన్ని అమలు జరిపితే జిడిపిలో పారిశ్రామిక ఉత్పత్తి వాటా 25శాతానికి పెరుగుతుందని చెప్పారు. ఈ పధకాన్ని గతంలో ప్రకటించిన 14పైలట్‌ రంగాలు, నిర్దేశించిన గడువును పొడిగించకూడదని నిర్ణయించినట్లు వార్త. వాణిజ్య మంత్రిత్వశాఖ ఈ పధకాన్ని సమీక్షించి ఈ మేరకు నిర్ణయించిందని, తనకు అందిన ఆ నివేదిక వెల్లడిరచిందని రాయిటర్స్‌ పేర్కొన్నది. ఈ పధక వైఫల్యం గురించి వ్యాఖ్యానించాలని కోరగా ప్రధాని కార్యాలయం, వాణిజ్య మంత్రిత్వశాఖ స్పందించలేదని వార్తా సంస్థ పేర్కొన్నది. ఈ పధకాన్ని నిలిపివేసినంత మాత్రాన ఉత్పాదక లక్ష్య్యాలను వదలివేసినట్లు కాదని, ప్రత్యామ్నాయాలను రూపొందిస్తారని ఇద్దరు అధికారులు చెప్పినట్లు కూడా పేర్కొన్నది.కేంద్ర ప్రభుత్వ ప్రకటనలో పేర్కొన్న వివరాలు కూడా పిఎల్‌ఐ పథక వైఫల్యాలను నిర్ధారించాయి.


రాయిటర్స్‌ వార్త సారాంశం దిగువ విధంగా ఉంది. యాపిల్‌ ఫోన్లను సరఫరా చేసే ఫాక్స్‌కాన్‌, రిలయన్స్‌తో సహా 750 కంపెనీలు ఈ పధకం కింద రాయితీ పొందేందుకు దరఖాస్తు చేసుకున్నాయి. పథకం గడువును పెంచాలని అనేక సంస్థలు కోరినప్పటికీ అంగీకరించకూడదని అధికారులు తమ అభిప్రాయాలను సమీక్షలో నమోదు చేశారు. అనేక సంస్థలు ఉత్పత్తిని ప్రారంభించలేదు. దారిలో ఉన్నవారు కూడా నత్తనడక నడుస్తున్నట్లు తేలింది. 2024 అక్టోబరు నాటికి కొన్ని సంస్థలు 151.93 బిలియన్‌ డాలర్ల విలువగల వస్తూత్పత్తి చేశాయని, ఇది నిర్దేశిత లక్ష్యంలో 37శాతమే అని తేలింది. ప్రోత్సాహకం కింద పక్కన పెట్టిన 2,300 కోట్ల డాలర్లకు గాను ఇప్పటివరకు సంస్థలకు చెల్లించింది కేవలం 173 కోట్ల డాలర్లు లేదా ఎనిమిది శాతం మాత్రమేనని కూడా తేలింది. ఈ పధకం ప్రారంభించినపుడు ఆర్థిక వ్యవస్థలో పారిశ్రామిక ఉత్పాదకత వాటా 15.4శాతం ఉండగా ప్రస్తుతం 14.3శాతానికి పడిపోయింది. పిఎల్‌ఐ పధకం వలన ఔషధ, సెల్‌ఫోన్ల ఉత్పత్తి విపరీతంగా పెరిగినట్లు గతేడాది ప్రభుత్వం సమర్ధించుకుంది. కనీస వృద్ధి లక్ష్యాలను చేరుకోని కారణంగా కొన్ని నమోదైన సంస్థలకు ప్రోత్సాహకాలు ఇవ్వలేదని సమీక్ష నివేదికలో పేర్కొన్నారు. సోలార్‌ రంగంలో పన్నెండు కంపెనీల నమోదు కాగా వాటిలో రిలయన్స్‌, అదానీ, జెఎస్‌డబ్ల్యుతో సహా ఎనిమిది లక్ష్యాలకు చేరే అవకాశం లేదని 2024 డిసెంబరు సమీక్షలో తేలింది. 2027 నాటికి ఉత్పత్తి లక్ష్యంగా నిర్ణయించినదానిలో రిలయన్స్‌ కంపెనీ కూడా 50శాతానికి మించే అవకాశం లేదని వెల్లడైంది. అప్పటికి పధకం గడువు ముగిసిపోతుంది. అదానీ కంపెనీ తయారీకి అవసరమైన పరికరాలనే కొనుగోలు చేయలేదు. పథకం గడువు 2027 తరువాత పొడిగించాలని పునరుత్పాదక ఇంథన మంత్రిత్వశాఖ చేసిన వినతిని వాణిజ్యశాఖ తిరస్కరించింది. అసలు పనిచేయని వారికి లబ్ది చేకూర్చటం తగనిపని అని పేర్కొన్నది. ఉక్కు రంగంలో నమోదైన 58 కంపెనీలలో ఎలాంటి పురోగతి లేని 14ను జాబితా నుంచి తొలగించారు.


రాయిటర్స్‌ వార్త తరువాత శనివారం నాడు పిఐబి విడుదల చేసిన ప్రకటనలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. పిఎల్‌ఐ పధకంతో స్థానిక ఉత్పత్తి పెరిగింది, కొత్త ఉపాధి వచ్చింది, ఎగుమతులకు ప్రోత్సాహం వచ్చింది.2024 నవంబరు నాటికి ప్రోత్సాహక మొత్తం కారణంగా రు.1.61లక్షల కోట్ల పెట్టుబడి రాగా, 14లక్షల కోట్ల మేర ఉత్పత్తి జరిగింది,రు.5.31లక్షల కోట్ల మేర ఎగుమతులు జరిగాయి, 11.5లక్షల ప్రత్యక్ష , పరోక్ష ఉద్యోగాలు వచ్చాయి. పద్నాలుగు రంగాలలో 764 దరఖాస్తులను ఆమోదించగా వాటిలో 176ఎంఎస్‌ఎంఇ సంస్థలున్నాయి. పది రంగాల పరిశ్రమలకు ప్రోత్సాహక మొత్తం రు.14,020 కోట్లు విడుదల చేశారు. అనేక పరిశ్రమలు అమలు దశలో ఉన్నాయి, తరువాత అవి ప్రోత్సాహకాలకు దరఖాస్తులు చేస్తాయి. ఉక్కు రంగంలో రు.27,106 కోట్ల మేరకు పెట్టుబడులు పెడతామని చెప్పిన కంపెనీలు రు.20వేల కోట్లు పెట్టాయని, తొమ్మిది వేల మందికి ఉపాధి దొరికిందని, ఇప్పటి వరకు 48 కోట్లు ప్రోత్సాహకం ఇచ్చినట్లు, 58 ప్రాజెక్టులకు గాను 14 వెనక్కు తగ్గినట్లు, పిఎల్‌ఐ రెండవ దశలో ఇరవై అయిదు వేల కోట్ల పెట్టుబడులతో 35 కంపెనీలు ఆసక్తి చూపినట్లు పేర్కొన్నది. కేంద్ర ప్రభుత్వం ఏమి చెప్పినప్పటికీ నాలుగు సంవత్సరాల తరువాత రు.1.97లక్షల కోట్ల సబ్సిడీ మొత్తంలో విడుదల చేసింది రు.14,100 కోట్లే అని స్వయంగా చెప్పిందంటే ఏడుశాతం మొత్తం కూడా ఖర్చు కాలేదు, రాయిటర్స్‌ కథనం వాస్తవమే అని తేలింది. మేకిన్‌, మేడిన్‌ ఇండియా, ఆత్మనిర్భరత పేర్లతో పదేండ్లుగా కాలక్షేపం చేసినా ఫలితం దక్కలేదు గనుక మరొక పేరుతో ప్రయోగాలు చేస్తారేమో చూడాల్సి ఉంది.


అంతా వారే చేశారని గోబెల్స్‌ను పూజిస్తూ కాంగ్రెస్‌ మీద పదే పదే ప్రచారం చేయటం తప్ప పదేండ్లలో మోడీ ఏం చేశారన్నది ప్రశ్న. సమావేశాల మీద సమావేశాలు, ముసాయిదా విధానాల పేరుతో భారత్‌ కాలక్షేపం చేస్తుండగా చైనా ఎలాంటి ఆర్భాటాలు లేకుండా, ఒక్క గుండుకూడా పేల్చకుండా, చేయాల్సింది చేస్తోందని బిజినెస్‌ టుడే పత్రిక 2025 మార్చి 22న ఒక కథనాన్ని ప్రచురించింది. వివేక్‌ ఖత్రి అనే చార్టడ్‌ ఎకౌంటెంట్‌, ఇన్ఫ్లుయెన్సర్‌ చేసిన ఎక్స్‌ పోస్టును, అభిప్రాయాలను ఉటంకించింది. ప్రపంచ పారిశ్రామిక ఉత్పత్తి క్రీడలో ఎలాంటి శబ్దం, పతాకశీర్షికలు లేకుండా మౌనంగా భారత్‌ను పక్కకు నెట్టే వ్యూహాన్ని చైనా అనుసరించిందని అతను ఆరోపించాడు. చైనా లక్షకోట్ల డాలర్ల వాణిజ్య మిగులు అంటే కేవలం ఆర్థిక గణాంకం కాదని భూ భౌతిక రాజకీయ అస్త్రమన్నాడు. ప్రపంచ కంపెనీలు చైనా ప్లస్‌ ఒన్‌ అనే వ్యూహంతో బీజింగ్‌ను వెనక్కు నెట్టకుండా హంగరీ, మెక్సికో, మొరాకో, వియత్నాం, ఇండోనేషియా వంటి దేశాలు చక్కగా చైనాతో చేతులు కలుపుతున్నాయని, చైనాతో పోటీ లేని ఉత్పాదక వాతావరణంలో ఉదారంతో విదేశీ పెట్టుబడులను పొందుతున్నాయని వివేక్‌ ఖత్రి పేర్కొన్నాడు.


భారత్‌ను ఎదగనీయకుండా చైనా చూస్తున్నదని వివేక్‌ వంటి వారు చెప్పటం ఆడలేక మద్దెల ఓడు అనటం తప్ప మరొకటి కాదు. భారత పరిశ్రమలకు అవసరమైన కీలక విద్యుత్‌ వాహనాల విడిభాగాలు, సోలార్‌ మాడ్యూల్స్‌, ఎలక్ట్రానిక్స్‌ ఉత్పతికి అవసరమైన పరికరాలను చైనా అడ్డుకుంటున్నదని, భారత సరఫరా గొలుసు సామర్ద్యాన్ని నిర్మించకుండా తన కార్పొరేట్లను నిరోధిస్తూ ఫాక్స్‌కాన్‌,బివైడి కంపెనీల విస్తరణను నిరుత్సాహపరుస్తున్నదని వివేక్‌ ఖత్రి ఆరోపించారు. ప్రపంచ ఐఫోన్‌ ఉత్పత్తిలో నాలుగో వంతు భారత్‌లో చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ 15శాతమే జరుగుతున్నన్నారు. భారత్‌ 26 బిలియన్‌ డాలర్ల విలువగల ఎలక్ట్రానిక్స్‌ ఎగుమతి చేస్తుండగా వియత్నాం 126 బిలియన్‌ డాలర్లు చేస్తున్నదని , తైవాన్‌, జపాన్‌ సంస్థలు వెనక్కు పోతున్నట్లు చెప్పారు. జపాన్‌కు చెందిన పదింటిలో ఒక కంపెనీ మాత్రమే భారత్‌లో పెట్టుబులు పెట్టేందుకు చూస్తున్నదని అది కూడా నియంత్రణల సంక్లిష్టత, రెడ్‌టేప్‌, అమలు జరపగలమా లేదా అన్న అనిశ్చితి ఉన్నట్లు చెప్పిందని వెల్లడిరచారు. తక్కువ విలువగల పారిశ్రామిక ఉత్పత్తుల ఎగుమతులను భాగస్వామ్య దేశాలకు అప్పగిస్తూ కీలకమైన, మేథోసంపత్తి హక్కులున్నవాటిని చైనా అట్టిపెట్టుకుంటున్నదని, దీర్ఘకాలిక ప్రాతిపదిక మీద మొరాకో నుంచి మెక్సికో వరకు పారిశ్రామిక నడవాలను నిర్మిస్తున్నదని, తన అవసరాలకు అనుగుణంగా ప్రపంచీకరణను మలుచుకుంటున్నదని ఖత్రి విమర్శించారు.


భారత్‌ ముందుకు పోతుంటే అడ్డుకుంటున్నదని చైనాను నిందించేవారు నిత్యం కనిపిస్తారు. గతంలో చైనాను చక్రబంధం చేస్తే దాన్నుంచి బయటపడేందుకు అది అనుసరించిన విధానాలు తప్ప ప్రత్యేకించి ఎవరూ చేయూతనిచ్చి పైకి లేపలేదు. ధనిక దేశాలు తమ వద్ద మూలుగుతున్న పెట్టుబడులను అలాగే ఉంచుకుంటే వడ్డీ కూడా రాని స్థితిలో చైనాలో పెట్టుబడులు పెట్టాయి తప్ప కమ్యూనిస్టుల మీద ప్రేమతో కాదు.జపాన్‌లో ఎవరన్నా డబ్బుదాచుకోవాలంటే బ్యాంకులకు ఎదురు చెల్లించాలి తప్ప ఎలాంటి వడ్డీ ఉండదు.ధనిక దేశాల్లో శ్రామికులకు ఎక్కువ మొత్తాలు వేతనాలు చెల్లించాలి, చైనాలో జనాభా ఎక్కువ గనుక చౌకగా పనిచేయించుకొని ఉత్పత్తి ఖర్చులు తగ్గించుకోవాలని అవే ధనికదేశాలు చూశాయి. తమ జనానికి పని చూపాలి, అభివృద్ధికి అవసరమైన పెట్టుబడులు కావాలి గనుక చైనా సంస్కరణల బాట పట్టి నేటి స్థితికి ఎదిగింది, దానికి అది అనుసరించిన స్థిరమైన, విశ్వసనీయమైన విధానాలే కారణం. ఆత్మనిర్భరత పేరుతో రెండు లక్షల కోట్ల నగదు ప్రోత్సాహం ఇస్తామన్నా కంపెనీలు ఎందుకు రాలేదో, వచ్చినవి ఎందుకు ఉత్పత్తిచేయలేదో ఆలోచించాల్సిందిపోయి, చైనా అడ్డుకున్నదని చెబితే కుదురుతుందా !


ఇప్పటికీ చైనా గురించి అనేక అతిశయోక్తులు, అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారు. చౌకరకం వస్తువులను మాత్రమే ఉత్పత్తి చేస్తుందన్నది వాటిలో ఒకటి. అలాంటి వస్తువులను దిగుమతి చేసుకోవటంలో నరేంద్రమోడీ రికార్డులను బద్దలు కొట్టారు, అమెరికా, ఐరోపా దేశాలకు అవి లేకపోతే రోజు గడవదు. ఎందుకు దిగుమతి చేసుకుంటున్నట్లు ? మరోవైపు చైనా మీద పడి ఎందుకు ఏడుస్తున్నట్లు ? చైనా ఆర్థిక వ్యవస్థ దివాలా తీసిందని, అక్కడి నుంచి విదేశీ పరిశ్రమలు, కంపెనీలు బయటకు వెళుతున్నాయని, అవి హిమాలయాలను దాటి భారత్‌ వస్తున్నట్లుగా అనేక మంది చిత్రించారు. కరోనా తరువాత అతిశయోక్తులు ఎన్నో. ఏ ఒక్కటీ నిజం కాలేదు. నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత 2015లో 2.1లక్షల కోట్ల డాలర్ల నుంచి 2025లో దేశ జిడిపి 4.3లక్షల కోట్ల డాలర్లకు చేరినట్లు, ఇది 105శాతం పెరుగుదల అని ప్రపంచంలో ఏ పెద్ద దేశమూ ఇంతటి అభివృద్ధి సాధించలేదని బిజెపి ఐటి సెల్‌ అధినేత అమిత్‌ మాలవీయ ఎక్స్‌ పోస్టులో పేర్కొన్నారు. 2025 నాటికి ఐదు లక్షల కోట్ల డాలర్లకు పెంచుతామని గొప్పలు చెప్పుకున్న అంశం ఇక్కడ గుర్తుకు తెచ్చుకోవాలి. స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఇంతటి అభివృద్ధిని ఏ ప్రభుత్వమూ సాధించలేదని కూడా చెప్పారు. 2004మన్మోహన్‌ సింగ్‌ అధికారానికి వచ్చినపుడు జిడిపి 709 బిలియన్‌ డాలర్లు కాగా 2014 నాటికి అది 2030 బిలియన్లకు పెరిగింది. ఏ ఎలిమెంటరీ స్కూలు విద్యార్ధిని అడిగినా యుపిఏ పాలనా కాలంలో పెరుగుదల రేటు ఎక్కువని చెబుతారు. అబద్దాలలో పుట్టి అబద్దాలలో పెరుగుతున్నవారు తప్ప ఇలాంటి తప్పుడు ప్రకటనలు మరొకరు చేయరు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

తప్పుడు సెక్షన్లతో అణచివేతలో నరేంద్రమోడీ – డోనాల్డ్‌ ట్రంప్‌ ఇద్దరూ ఇద్దరే : ఇక్కడ ఎస్‌ఎఫ్‌ఐ శివానందన్‌ – అక్కడ మహమ్మద్‌ ఖలీల్‌ !

19 Wednesday Mar 2025

Posted by raomk in Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

anti BJP, Anti communist, ANTI NATIONAL, Anti War, BJP, Donald trump, JD Vance, Mahmoud Khalil, Narendra Modi Failures, Ramadas Prini Sivanandan, sfi, US Green Card


ఎం కోటేశ్వరరావు


ఇప్పటివరకైతే భారత్‌, అమెరికా రెండూ పెద్ద ప్రజాస్వామిక దేశాలే ఎవరూ కాదనటం లేదు. కానీ ఆచరణ చూస్తే నిరంకుశత్వానికి దారితీస్తున్నట్లుగా వ్యవహరించటం ఆందోళన కలిగిస్తోంది.వ్యవస్థలను దిగజారుస్తున్నారు, కొత్త అర్ధాలు చెబుతున్నారు, పాలకులను విమర్శించటాన్ని దేశద్రోహంగా చిత్రిస్తూ బ్రిటీష్‌ వలస పాలకులను గుర్తుకు తెస్తున్నారు. మన గతం గురించి మరచిపోయిన వారికి దాన్ని గుర్తు చేయటం కూడా ఒకందుకు మంచిదేనేమో ? ఏదీ ఊరికే రాదు అన్నట్లుగా మన స్వేచ్చ, స్వాతంత్య్రాలు ఊరికే రాలేదు అని కొందరైనా తెలుసుకుంటారు.రెండు చోట్లా చట్టాలు, నిబంధనలకు వక్రభాష్యాలు చెప్పి భావ ప్రకటన, నిరసన తెలిపే హక్కును హరించే ఉదంతాల గురించి చెప్పుకోవటం దేశ వ్యతిరేకతగా పరిగణించినా ఆశ్చర్యం లేదు, రోజులిలా ఉన్నాయి, ఏం జరిగినా ఎదుర్కోక తప్పదు మరి. గత ఏడాది ఏప్రిల్‌ నెలలో ముంబైలోని టాటా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌(టిస్‌) అభివృద్ధి అధ్యయనాల విభాగంలో పిహెచ్‌డి చేస్తున్న రామదాస్‌ ప్రిని శివానందన్‌ అనే పరిశోధకుడిని సంస్థ సస్పెండ్‌ చేసింది. ఎందుకటా ! న్యూఢల్లీిలో విద్యార్ధులు భారత్‌ను రక్షించండి`బిజెపిని తిరస్కరించండి అనే నినాదంతో పార్లమెంట్‌వద్దకు ప్రదర్శన నిర్వహించారని, దానిలో భాగస్వామి కావటం జాతి వ్యతిరేకతకిందకు వస్తుందని కారణం చెప్పింది.కేరళలో దళిత సామాజిక తరగతికి చెందిన ఈ యువకుడు ముంబైలో చదువుతూ మహారాష్ట్ర ఎస్‌ఎఫ్‌ఐ సంయుక్త కార్యదర్శిగా పని చేశాడు.


టిస్‌ చెప్పిన సాకులు లేదా కారణాలను చూస్తే ఎవరూ కూడా ప్రభుత్వాల విధానాల మీద నిరసనలు, అసమ్మతి తెలపటానికి వీల్లేదు. ఎందుకంటే ఏదో ఒక ప్రభుత్వ పథకం కింద ఆర్థికంగానో, సేవాపరంగానో ప్రతివారూ లబ్దిదారులే, అలాంటపుడు ఎవరూ ఏ ప్రభుత్వాన్నీ విమర్శించకూడదు, భజన మాత్రమే చేయాలి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యావిధానాన్ని ఢల్లీిలో జరిగిన ప్రదర్శనలో విమర్శించారు, దాన్లో పాల్గొన్నందున శివానందన్‌ జాతి వ్యతిరేకి అనటమే కాదు అతని మీద చర్యలు తీసుకొనేందుకు దర్యాప్తు సంస్థలు ముందుకు రావాలని కూడా టిస్‌ కోరింది. న్యాయవ్యవస్థ ఇంకా ఉనికిలో ఉంది గనుక తన సస్పెన్షన్‌ చెల్లదని ప్రకటించాలని కోరుతూ అతను బోంబే హైకోర్టుకు వెళ్లాడు. ఎంఎం సత్తాయి, ఎఎస్‌ చందూర్కర్‌ డివిజన్‌ బెంచ్‌ అతని పిటీషన్ను కొట్టివేస్తూ టిస్‌కు అనుకూలంగా తీర్పు చెప్పింది. ఈ తీర్పును సుప్రీం కోర్టులో సవాలు చేయనున్నట్లు శివానందన్‌ చెప్పాడు. ఇది వ్యక్తిగత సమస్య కాదని మొత్తం విద్యార్ధి సమాజం మీద ప్రభావితం చూపనున్నందని అన్నాడు.కేంద్ర ప్రభుత్వం నుంచి ఫెలోషిప్‌ పొందుతున్న కారణంగా రాజకీయ పరమైన కార్యకలాపాల్లో పాల్గ్గొంటే చర్యలు తప్పవని, సంస్థలో ఉన్నపుడు రాజకీయ అభిప్రాయాలకు దూరంగా ఉండాలని కోర్టు పేర్కొన్నది. ఒక టెలికాం ఉద్యోగి యువకుడిగా ఉన్నపుడు ఒక యువజన సంఘ సమావేశంలో పాల్గొన్నందున ఉద్యోగం నుంచి తొలగించితే ఆ కేసు సుప్రీం కోర్టు వరకు వెళ్లింది. అతను పాల్గొన్నది నిషేధిత సంస్థ కాదు, యువకులు యువజన సంఘాల సమావేశాల్లో గాక మరిదేనిలో పాలుపంచుకోవాలని ప్రశ్నిస్తూ ఉద్యోగం నుంచి తొలగించటాన్ని తప్పు పడుతూ జస్టిస్‌ ఓ చిన్నపరెడ్డి చారిత్రాత్మక తీర్పు ఇచ్చారు. తరువాత ఉద్యోగిగా ఆ యువకుడు ఉద్యోగ విరమణ చేసేవరకు టెలికాం ఉద్యోగుల యూనియన్లో కూడా చురుకుగా పని చేశారు.


కోర్టు పేర్కొన్న అంశాలు సరైనవి కాదని, ఒక విద్యార్ధి అర్హత పరీక్షలో పాసైనపుడు ఫెలోషిప్‌ ఒక హక్కు తప్ప దయాధర్మం కాదని, పరిశోధక విద్యార్థికి ఫెలోషిప్‌ ఇవ్వటం తనంతటతాను బతకటానికి అవసరమైన ఉద్యోగ సంపాదన కోసం కాదని, జాతి నిర్మాణ క్రమంలో తోడ్పడేందుకు ఇచ్చే మొత్తమని శివానందన్‌ చెప్పాడు. ఏ విద్యా సంస్థ అయినా జారీచేసే సర్క్యులర్‌ కంటే రాజ్యాంగం ఎంతో ముఖ్యమైనదని తాను భావిస్తున్నానని, రాజ్యాంగ హక్కును వినియోగించుకున్నందుకు తనను శిక్షించారని అన్నాడు. టిస్‌ లేదా ఏ విశ్వవిద్యాలయం జారీచేసే నిబంధనలు, సర్క్యులర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ రాజ్యాంగాన్ని ఉల్లంఘించకూడదని, విద్యా సంస్థలు నిష్పాక్షికంగా ఉండాలని, ఒక తరహా రాజకీయాలకు ఒక విశ్వవిద్యాలయం తనను తాను ఎలా అనుంబంధించుకుంటుదని ప్రశ్నించాడు.


పార్లమెంట్‌కు ప్రదర్శన బానర్‌ కింద భారత్‌ను రక్షించండి, బిజెపిని తిరస్కరించండి అనే నినాదంతో తాను ప్రదర్శనలో పాల్గొంటే తాను పట్టుకున్న ప్లకార్డు మీద టిస్‌ పేరు ఉన్నట్లు అధికారులు ఆరోపించారచెప్పాడు. ప్రోగ్రెసివ్‌ స్టూడెంట్స్‌ ఫోరమ్‌(పిఎస్‌ఎఫ్‌) ప్రధాన కార్యదర్శిగా ప్రదర్శనలో పాల్గొన్నాను తప్ప టిస్‌ ప్రతినిధిగా కాదని అన్నాడు. తనను సస్పెండ్‌ చేసిన టిస్‌ కమిటీ, హైకోర్టు ముందు కూడా తాను ఇదే చెప్పానన్నాడు. శివానందన్‌ 2015లో టిస్‌ పోస్టు గ్రాడ్యుయేట్‌గా చేరి తరువాత అక్కడే ఎంఫిల్‌ పూర్తి చేసి పరిశోధక విద్యార్థిగా నమోదయ్యాడు. టిస్‌ గతంలో ఒక ప్రజాస్వామిక సంస్థగా కనీసం నటించేదని ఇటీవలి సంవత్సరాలలో విద్యార్ధులు చేపట్టే ఎలాంటి కార్యక్రమాలకు అనుమతించటం లేదని చెప్పాడు. అయోధ్యలో రామాలయ ప్రారంభాన్ని ఒక జాతీయ కార్యక్రమంగా చేపట్టినపుడు జాతీయ అవార్డు పొందిన ఆనంద పట్వర్ధన్‌ డాక్యుమెంటరీ ‘‘ రామ్‌ కె నామ్‌ (రాముడి పేరుతో ) ’’ ను అనేక విశ్వవిద్యాలయాల్లో ప్రదర్శించారని తాను ఆ సమయంలో ప్రమాదంలో గాయపడి ప్రదర్శనకు రాలేకపోయానని, అయితే బాబరీ మసీదు విధ్వంసం సందర్భంగా జరిగిన దుర్మార్గమైన వాస్తవాలను తెలుసుకొనేందుకు అందరూ చూడాలని కోరుతూ తన అభిప్రాయాలను సామాజిక మాధ్యమంలో వెల్లడిరచగా దాన్ని కూడా దేశ వ్యతిరేక చర్యగా టిస్‌ తన మీదకు మళ్లించిందని పేర్కొన్నాడు. కేంద్రం నుంచి 50శాతం పైగా నిధులు పొందుతున్న సంస్థలన్నింటిని కేంద్రం తన ఆధీనంలోకి తెచ్చుకున్న తరువాత టిస్‌లో అనేక పెను మార్పులు చోటు చేసుకున్నాయి. ఎక్కడ పది మంది విద్యార్దులు కూర్చుంటే, చివరకు తమ గ్రూపు ప్రాజెక్టుల గురించి చర్చించేందుకు ఒక చోట చేరినా సంస్థను అస్థిరపరిచేందుకు చూస్తున్నారంటూ చెదరగొట్టటం జరుగుతోందన్నాడు.శివానందాన్ని హెచ్చరిస్తూ అనేక సార్లు తప్పుడు నోటీసులు జారీ చేసింది. భగత్‌ సింగ్‌ స్మారక ఉపన్యాసం చేసేందుకు పిలిచిన అతిధులను వివాదాస్పద ప్రసంగీకులు అనే సాకుతో వారి పేర్లు లేకుండా ఇచ్చిన నోటీసు అలాంటి వాటిలో ఒకటి. సదరు వివాదాస్పద అతిధులు ఎవరంటే మెగసెసే అవార్డు గ్రహీత బెజవాడ విల్సన్‌, ప్రముఖ జర్నలిస్టు పి శాయినాధ్‌, జెఎన్‌యు మాజీ ప్రొఫెసర్‌, ఎకనమిక్‌ అండ్‌ పొలిటికల్‌ వీక్లీ మాజీ సంపాదకుడు గోపాల్‌ గురు. గతేడాది టిస్‌ విద్యార్ధి సంఘ ఎన్నికలను రద్దు చేసింది, ప్రోగ్రెసివ్‌ స్టూడెంట్స్‌ ఫోరమ్‌ను నిషేధించింది. విద్యార్థులు ఆందోళన చేయటంతో వెనక్కు తీసుకుంది. ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటే టిస్‌కు ఎలాంటి అభ్యంతరం ఉండదు, కేంద్ర ప్రభుత్వ ఫెలోషిప్‌ తీసుకొనే వారు బిజెపి రాజకీయాలను విమర్శించకూడదంటే నేను అంగీకరించను, దేశంలో ఉండాలంటే ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా బిజెపి సభ్యత్వం తీసుకోవటానికి లేదా సానుభూతిపరునిగా ఉండటానికి నన్ను బలవంతం చేయలేరని శివానందన్‌ చెప్పాడు.

అమెరికాలో ఏం జరుగుతోంది !
మహమ్మద్‌ ఖలీల్‌ అమెరికా పౌరసత్వం కలిగిన సిరియా దేశస్థుడు. అతని మీద చట్ట ఉల్లంఘనకు పాల్పడిన కేసులేవీ లేవు. అతన్ని బలవంతంగా సిరియా పంపేందుకు ట్రంప్‌ యంత్రాంగం చూస్తోంది. ఖలీల్‌ చేసిన నేరం ఏమిటో తెలుసా ? గాజాలో పాలస్తీనియన్లపై మారణకాండకు పాల్పడుతున్న ఇజ్రాయెల్‌ దుశ్చర్యలను ఖండిస్తూ కొలంబియా విశ్వవిద్యాలయంలో జరిగిన విద్యార్ధుల నిరసనకు నాయకత్వం వహించటమే. వాక్‌, సభా స్వాతంత్య్రాలు విలసిల్లుతుంటాయని భావించే దేశంలో ఇది జరిగింది. అతని భార్య ఎనిమిది నెలల గర్భవతి, అరెస్టు చేసిన ఖలీల్‌ గ్రీన్‌కార్డును రద్దు చేసినట్లు ప్రకటించిన ప్రభుత్వం అతనుండే న్యూయార్క్‌ రాష్ట్రం నుంచి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న లూసియానాలోని ఒక నిర్బంధ శిబిరానికి తరలించి తన మానవత్వ ముఖాన్ని ప్రదర్శించుకుంది. ఈ ఉదంతం తరువాత గ్రీన్‌ కార్డు ఉన్నంత మాత్రాన ఎవరూ అమెరికాలో శాశ్వతంగా ఉండే హక్కు ఉన్నట్లు కాదని ఉపాధ్యక్షుడు జెడివాన్స్‌ ప్రకటించాడు. అంటే ప్రభుత్వం తలచుకుంటే ఎప్పుడైనా రద్దు చేయవచ్చనే బెదిరింపు దీని వెనుక ఉంది. పాలస్తీనియన్లకు మద్దతుగా విద్యార్ధులు ఆందోళనకు దిగినపుడు స్థానికులా, వలస వచ్చినవారా అనే తేడా లేకుండా అందరూ నిరసనల్లో పాల్గొన్నారు. దీన్ని నాటి బైడెన్‌ సర్కార్‌ నేటి ట్రంప్‌ జమానా కూడా సహించటం లేదు. గాజాలో మారణకాండకు పాల్పడుతున్న ఇజ్రాయెల్‌కు అమెరికాలో ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ నిస్సిగ్గుగా మద్దతు ఇస్తూ మానవహక్కుల పరిరక్షణ గురించి ప్రపంచానికి సూక్తులు వల్లిస్తారు.


పాలస్తీనియన్లకు మద్దతు పలికిన మహమ్మద్‌ ఖలీల్‌ మీద 1952 నాటి కమ్యూనిస్టు వ్యతిరేక చట్టంలోని సెక్షన్లను మోపటాన్ని బట్టి ట్రంప్‌ అసలు రూపం వెల్లడైంది. వలస వచ్చే వారు కమ్యూనిస్టు పార్టీ సభ్యుడైనా లేదా అనుంబంధం ఉన్నప్పటికీ వీసాలను తిరస్కరించటానికి లేదా అనర్హులుగా ప్రకటింటానికి ఆ చట్టం వీలు కల్పిస్తుంది. ఒకవేళ అమెరికా వచ్చినప్పటికీ తిరిగి పంపే అధికారం ప్రభుత్వానికి ఉంది. కమ్యూనిజానికి సంబంధించిన సాహిత్యాన్ని రాసినా, ముద్రించినా, తెలిసి కూడా పంపిణీ చేసినప్పటికీ తిప్పి పంపే అధికారం ఉంది. ఏ రాష్ట్రంలోనైనా, ఏ దేశంలోనైనా కమ్యూనిస్టు పార్టీ సభ్యుడిగా ఉన్నప్పటికీ అలాంటి చర్యలు తీసుకోవచ్చు. ఉదారవాదులనే పేరున్న ప్రతిపక్ష డెమోక్రాట్లలో కొందరు ఖలీల్‌ అరెస్టు, గ్రీన్‌కార్డు రద్దును మాట మాత్రంగా ఖండిరచినప్పటికీ తమ పాలిత న్యూయార్క్‌ రాష్ట్రవాసి అరెస్టు గురించి నిరసన వ్యక్తం చేయలేదు. అమెరికాలో గాడిద పార్టీ, ఏనుగు పార్టీ ఏదైనా ఒక్కటే అనేందుకు ఇలాంటి ఉదాహరణలు ఎన్నో చెప్పుకోవచ్చు.కమ్యూనిస్టు వ్యతిరేకత, అమెరికా విదేశాంగ విధానాలపై విమర్శను రెండు పార్టీలూ సహించవు.


2023లో డోనాల్డ్‌ ట్రంప్‌ ఒక ప్రతిజ్ఞ చేశాడు. అదేమంటే అమెరికా విధానాలను విమర్శించే విదేశీయులు, క్రైస్తవులను ద్వేషించే కమ్యూనిస్టులు, మార్క్సిస్టులు, సోషలిస్టులు ఎవరినీ అమెరికాలోకి అడుగుపెట్టనివ్వం దీనికి గాను 1952 నాటి చట్టాన్ని వినియోగిస్తాం,దేశీయంగా పెరిగన కమ్యూనిస్టులు, మార్క్సిస్టులను అదుపు చేసేందుకు కొత్త చట్టాన్ని తీసుకురావాలని చెప్పాడు. ట్రంప్‌ తొలిసారి అధికారానికి వచ్చినపుడు అమెరికాను సోషలిస్టు దేశంగా మారనిచ్చే సమస్యేలేదని ప్రకటించటాన్ని అత్యధిక డెమోక్రాట్లు హర్షించారు. అయితే చరిత్రను చూస్తే కమ్యూనిస్టుల రాకను నిషేధించే చట్టం ఉన్నప్పటికీ పూర్తిగా నిరోధించటం గానీ, అమెరికాలో సోషలిస్టు, కమ్యూనిస్టు భావజాల వ్యాప్తిని అడ్డుకోవటం గానీ చేయలేకపోయారన్నది వాస్తవం. మన దేశానికి చెందిన కష్మా సావంత్‌ వంటి వారు అనేక మంది అమెరికా వెళ్లి వామపక్ష వాదులుగా మారిన సంగతి తెలిసిందే. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని అపేందుకు చూసిన ప్రబుద్దుల సంగతి తెలిసిందే, భావజాలమూ అంతే, ఎవరూ ఆపలేరు, ఎంతగా అడ్డుకుంటే అంతే వేగంతో విస్తరిస్తుందన్నది చరిత్ర చెప్పిన సత్యం !

Share this:

  • Tweet
  • More
Like Loading...

పైసామే పరమాత్మ : ఎలన్‌ మస్క్‌తో చేతులు కలిపిన ‘‘ దేశభక్త ’’ జియో, ఎయిర్‌టెల్‌ ! దేశ రక్షణ సంగతేమిటి !!

14 Friday Mar 2025

Posted by raomk in BJP, CHINA, Congress, CPI(M), Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, USA

≈ Leave a comment

Tags

Air Tel, BJP, CPI(M), Donald trump, Elon Musk, Jio, Mukesh Ambani, Narendra Modi Failures


ఎం కోటేశ్వరరావు


ప్రపంచ నేతలను మన చుట్టూ తిప్పుకోగల విశ్వగురువుగా నరేంద్రమోడీని కొంత మంది గతంలో వర్ణించారు, అది ఒక కోణంలో నిజమే, బహుళజాతి గుత్త సంస్థలన్నీ మన మార్కెట్‌లో ప్రవేశించేందుకు మోడీ చుట్టూ తిరుగుతున్నారు. రెండోవైపు చూస్తే ప్రపంచ పెట్టుబడిదారుల నేతలను ప్రసన్నం కావించుకొనేందుకు సంతుష్టీకరించేందుకు మోడీ వారి చుట్టూ తిరుగుతున్నారు. తెరవెనుక జరిగే దీని గురించి కోటి మంది గొంతెత్తినా నమ్మని వారి కళ్లు తెరిపించేందుకు ఒక్క దృష్టాంతం చాలు. ఇప్పుడు అదే జరిగింది, అయినా మేం నమ్మం అనేవారిని ఎవరేం చేయలేరు.అంబానీ చెప్పినట్లు నరేంద్రమోడీ వినటం పదేండ్లుగా జరుగుతున్న సాధారణ విషయం. అదే మోడీ డోనాల్డ్‌ ట్రంప్‌ చెప్పినట్లు నడుచుకోవటమే అసలైన వార్త. అదేమిటంటారా ? ఎలన్‌మస్క్‌ స్పేస్‌ఎక్స్‌ కంపెనీ స్టార్‌లింక్‌ ఉపగ్రహ అంతర్జాల సేవలకు ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. కానీ ఆ కంపెనీ సేవలను తమ ఖాతాదార్లకు అందించటానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు జియో అధినేత ముకేష్‌ అంబానీ, ఎయిర్‌టెల్‌ అధినేత సునీల్‌ మిట్టల్‌ వెల్లడిరచారు. వారికలా ముందే తెలిసిపోతాయి మరి. దీన్ని బట్టి నేర్చుకోవాల్సిందేమిటంటే ఆలూలేదూ చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అన్న సామెతను తిరిగి రాసుకోవాలి. ఆలూచూలూ లేకుండానే కొడుకును కనొచ్చు, పేరుపెట్టవచ్చు. స్టార్‌లింక్‌ను మన దేశంలో ప్రవేశపెట్టేందుకు 2021 నుంచి ఎలన్‌మస్క్‌ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటికింకా అనుమతి ఇవ్వలేదు. ఒకవేళ ఇస్తే గిస్తే అనే పేరుతో ఒప్పందం చేసుకోవటం విశేషం. దీన్ని బట్టి కేంద్ర ప్రభుత్వ ఆమోద ముద్ర లాంఛనమే అన్నది తేలిపోయింది. మన దేశ దిగ్గజాలను ఒప్పించేందుకు మెప్పించేందుకు ఇంతకాలం స్టార్‌లింక్‌కు అనుమతి ఇవ్వలేదని, ఒక అవగాహనకు వచ్చిన తరువాత పచ్చజెండా ఊపేందుకు నిర్ణయించినట్లు స్పష్టమైంది.


కొంత మంది దృష్టిలో స్వదేశీ కార్పొరేట్‌ శక్తులు దేశభక్తులు, ఎప్పటి వరకు అంటే కారణాలు ఏమైనప్పటికీ వారు విదేశీ కార్పొరేట్లతో పోరాడినంతవరకు, తరువాత ? స్వాతంత్య్రానికి ముందు మహాత్మాగాంధీకి నాటి ప్రముఖ పారిశ్రామిక, వాణిజ్యవేత్త బిర్లా కుటుంబం ఎంతో మద్దతు ఇచ్చింది. అంతకు ముందు దాదాభాయ్‌ నౌరోజీ బరోడా రాజు దగ్గర దివాన్‌(మంత్రి)గా పనిచేశారు, బ్రిటన్‌ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు, మూడుసార్లు కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా పనిచేశారు, రెండవ సోషలిస్టు ఇంటర్నేషనల్లో సభ్యుడిగా కూడా స్వల్పకాలం పని చేశారు. మనదేశ సంపదను బ్రిటన్‌ ఎలా పీల్చివేస్తున్నదో తెలియచెప్పారు.వారే కాదు, అనేక మంది స్వదేశీ వాణిజ్య, పారిశ్రామికవేత్తలు స్వాతంత్య్ర ఉద్యమ కాలంలో బ్రిటీష్‌ వారిని వ్యతిరేకించారు. ఎవడి గోలవాడిది, ఎవరి కారణం వారిది.చాలా మందికి భూ సంస్కరణలు అంటే భూమికోసం, భుక్తికోసం పోరాటాలు జరిపిన కమ్యూనిస్టుల కారణంగానే మనదేశంలో వాటిని ప్రవేశపెట్టారని అనుకుంటారు. అది వాస్తవం కాదు, అసలు కమ్యూనిస్టు పార్టీలు ఏర్పడక ముందే వాటికి నాంది పలికారు. నూతన వ్యవస్థ రూపుదిద్దుకుంటున్నపుడు దానికి పాతవ్యవస్థ ఆటంకంగా ఉంటే బద్దలు కొట్టి మరీ అవతరిస్తుంది. కోడి గుడ్డులో పిల్ల ఏర్పడగానే అది బయటకు వచ్చేందుకు అంతకు ముందు రక్షణగా ఉన్న పెంకెను బద్దలు కొట్టుకొని బయటకు వస్తుంది తప్ప అయ్యో ఒకనాడు నాకు రక్షణగా ఉందే అని జాలిపడదు. పెట్టుబడిదారీ వ్యవస్థ పురోగమనానికి ఆటంకంగా ఉన్న ఫ్యూడల్‌ వ్యవస్థను బద్దలు కొట్టటమే ఫ్రెంచి విప్లవ సారం. అది భూసంస్కరణలకు తెరలేపింది. మన దేశంలో స్వదేశీ పెట్టుబడిదారులు ఎదిగేందుకు వలస పాలన, విదేశీ కంపెనీలు ఆటంకంగా ఉన్నాయి. అందుకే బిర్లావంటి పారిశ్రామికవేత్తలు, దాదాభాయ్‌ నౌరోజీ వంటి వాణిజ్యవేత్తలు కూడా వలస పాలనను వ్యతిరేకించారు. ఇది దోపిడీ వర్గ మిత్రవైరుధ్యం, ప్రతి వలస దేశంలోనూ కనిపిస్తుంది. స్వాతంత్య్రం తరువాత బిర్లా వంటి వారు ఏం చేశారన్నది చూస్తే మరింతగా అర్ధం అవుతుంది.


బడా పరిశ్రమల ఏర్పాటుకు తమ వద్ద తగినంత పెట్టుబడిలేని కారణంగా మిశ్రమ ఆర్థిక వ్యవస్థ పేరుతో ప్రభుత్వరంగాన్ని ఆమోదించారు. తగిన బలం పుంజుకున్న తరువాత నూతన ఆర్ధిక విధానాల పేరుతో ఒక్క రక్షణ సంబంధిత రంగాలలో తప్ప మిగతా వాటిలో ప్రభుత్వ పెట్టుబడులు పెట్టకుండా చేయటంలో విజయం సాధించారు. విదేశీ కంపెనీలకు ద్వారాలు తెరవటంతో వాటితో పోటీ పడలేక చేతులు కలిపి సంయుక్త సంస్థల ఏర్పాటుతో లాభాలను పంచుకొనేందుకు చూశారు. ఇవి ముఖ్యంగా ఆటోమొబైల్‌, బీమా తదితర రంగాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. స్వరాజ్‌మజ్డా, మారుతీసుజుకీ, ఇండోసుజుకీ, హీరోహోండా, టాటాడైల్మర్‌,మహింద్రరేనాల్ట్‌, భారతీఆక్సా ఇలా ఎన్నో చెప్పుకోవచ్చు. సర్దుకుపోదారం రండి అనటానికి ఇవి ఉదాహరణలు. పోటీబడి దెబ్బలాడుకున్న ఉదంతాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు రిలయన్స్‌అమెజాన్‌ ఉదంతం.దేశంలో రిటైల్‌ రంగంలో తమకు పోటీ లేకుండా చూసుకోవాలని చూసిన రిలయన్స్‌ను దెబ్బతీసేందుకు ఫ్యూచర్‌ గ్రూపు దుకాణాలను కొనుగోలు చేయాలని అమెజాన్‌ చూసింది. దాన్ని పడనీయకుండా రిలయన్స్‌ రంగంలోకి దిగింది. చివరికి ఫలితం ఏమంటే 2022 నుంచి ఫ్యూచర్‌ గ్రూపు మూతపడిరది. ముకేష్‌ అంబానీ నేడు ఎలన్‌ మస్క్‌తో రాజీకి వచ్చినట్లే అమెజాన్‌తో కూడా చేతులు కలిపి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. నాడు రిలయన్స్‌కు ప్రధాని మోడీ అండగా ఉన్నారు గనుకనే అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌ మూడు రోజుల పాటు ఢల్లీిలో మకాం వేసినా మోడీ దర్శన భాగ్యం కలగక వెనక్కు తిరిగి వెళ్లిపోయినట్లు అప్పుడు వార్తలు వచ్చాయి. ఇప్పుడు రిలయన్స్‌, ఎయిర్‌టెల్‌ కంటే బలమైన స్టార్‌లింక్‌కు సాక్షాత్తూ డోనాల్డ్‌ట్రంపే మద్దతు ఇస్తున్నందున దాన్ని అడ్డుకోవటానికి మోడీకి 56 అంగుళాల ఛాతీ సరిపోయినట్లు కనిపించటం లేదు. సముద్రపు భారీ అలలకు వెన్ను వంచి తప్పించుకోవటం తప్ప ఎదురునిలిచినవారెవరూ బతికి బట్టకట్టలేరు, జియో, ఎయిర్‌టెల్‌ అదే చేశాయి. అడ్డుకొనేందుకు చూసి పోటీ పడలేక తెల్లజెండా ఎత్తి చేతులు కలిపాయి. ఫిబ్రవరి రెండవ వారంలో అమెరికా పర్యటనలో నరేంద్రమోడీతో ఎలన్‌మస్క్‌ భేటీలోనే ఆ కంపెనీలకు ఉప్పంది ఉంటుంది. ఈ మూడూ కలసి వినియోగదారులకు లబ్దిచేకూరుస్తాయా, ఒక్కటిగా చేరి పీక్కు తింటాయా చూడాల్సి ఉంది.


ప్రపంచ కుబేరుడు ఎలన్‌ మస్క్‌ వ్యాపారాల్లో ఉపగ్రహ ఆధారిత స్టార్‌లింక్‌ అంతర్జాలం అది పెద్దది, 125దేశాల్లో సేవలను అందిస్తున్నది.అనేక సంస్థలను మింగేసింది. మనదేశంలో జియో, ఎయిర్‌టెల్‌ కూడా అలాంటివే. స్టార్‌లింక్‌ను మనదేశంలో ప్రవేశపెట్టాలని ఎలన్‌మస్క్‌ గత నాలుగు సంవత్సరాలుగా ఎంతగా ప్రయత్నిస్తున్నాడో ఈ రెండు కంపెనీల యజమానులు తమ పలుకుబడిని ఉపయోగించి అంతే గట్టిగా ఇప్పటివరకు అడ్డుకున్నాయి. చివరకు ట్రంప్‌ వత్తిడిని మోడీ అడ్డుకోలేరని గ్రహించి తామే లొంగి ఎంత దక్కితే అంతే ప్రాప్తం అన్నట్లుగా రాజీపడ్డాయి. మన దేశ కార్పొరేట్ల తీరుతెన్నులకు ఇది మరొక నిదర్శనం.2023 డిసెంబరులో చేసిన టెలికాం చట్ట ప్రకారం భూ సంబంధ స్పెక్ట్రమ్‌ వేలం ద్వారా, ఉపగ్రహ స్పెక్ట్రమ్‌ను అధికారయంత్రాంగం ద్వారా ఒక ఫీజు నిర్ణయించి కేటాయించేట్లు నిర్ణయించారు. ఎలన్‌ మస్క్‌ మన మార్కెట్‌ మీద ఎప్పటి నుంచో కన్నేసి ఉన్నకారణంగా అందుకు అనుగుణంగా మోడీ సర్కార్‌ పావులు కదిపిందని వేరే చెప్పనవసరం లేదు. మస్క్‌ కంపెనీ స్టార్‌లింక్‌ దరఖాస్తు కేంద్రం ముందు ఉంది. న్యాయమైన పోటీ విధానాన్ని ఎందుకు అనుసరించరని దిగ్గజ కంపెనీలైన అంబానీ రిలయన్స్‌ జియో, ఎయిర్‌టెల్‌ కేంద్రాన్ని అడిగాయి. ప్రభుత్వ విధానం మార్కెట్‌లో అసమాన పోటీకి దారి తీస్తుందని స్పష్టం చేశాయి. రక్షణ, సముద్రయానం,ప్రకృతి విపత్తుల అవసరాల వంటి వ్యవస్థలకు ప్రభుత్వాలు కేటాయింపులు జరపవచ్చని, వాణిజ్య అవసరాలకు మాత్రమే వేలం వేయాల్సిందేనని అవి పేర్కొన్నాయి.చివరకు రాజీ పడ్డాయి.


స్టార్‌లింక్‌ వలన ఏమిటీ ఉపయోగం అంటే ఇంటర్నెట్‌ మరింత వేగం పెరుగుతుంది అని చెబుతున్నారు. అంటే స్టార్‌లింక్‌ కనెక్షన్‌ ఉన్నవారు ఇలా నొక్కగానే అలా సినిమాలు, ఇతర సమాచారం వారి ముందు వాలుతుంది. మారు మూల ప్రాంతాలకూ ఆ సౌకర్యం ఉంటుంది. వీడియో కాల్స్‌లో మన ముందుఉన్నట్లే బొమ్మలు కనిపిస్తాయి,వినిపిస్తాయి. సినిమాలో ఆకర్షణీయ దృశ్యాలను ముందుగా చూపి వీక్షకులను ఆకర్షించేందుకు చూసినట్లుగానే ఇవన్నీ చూపుతున్నారు, చెబుతున్నారు.ఈ సౌకర్యం లేదా సేవలు పొందేవారు ఎంత మూల్యం చెల్లించాలో ఇంకా తెలియదు.మనదేశంతో భూ సరిహద్దు ఉన్న దేశాల నుంచి పెట్టుబడులతో, అదే విధంగా చైనా యాప్‌లతో దేశరక్షణకు ముప్పు ఉంటుందని పెద్ద ఎత్తున హడావుడి చేసిన రోజులను గుర్తుకు తెచ్చుకోవాలి.పెట్టుబడుల మీద ఆంక్షలు, యాప్‌లను నిషేధించారు. ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్‌తో కూడా దేశరక్షణకు సంబంధించిన ఆందోళనను అనేక మంది వ్యక్తం చేస్తున్నారు. సిపిఐ(ఎం), కాంగ్రెస్‌ పార్టీ కూడా ఈ మేరకు ప్రకటనలు చేశాయి. స్టార్‌లింక్‌ కనెక్షన్లు తీసుకున్న సంస్థల ద్వారా దేశభద్రత, విలువైన కీలక సమాచారం సరిహద్దులు దాటిపోయేందుకు అవకాశాలున్నాయని చెబుతున్నారు.టిక్‌టాక్‌ను, ఇతర యాప్‌లను అదే కారణంతో కదా నిషేధించారు, మరి దీన్నుంచి అలాంటి ముప్పులేదా ? రెండిరజన్ల పాలన నడుస్తున్న మణిపూర్‌లో ఇంటర్నెట్‌ సేవలు నిలిపివేసిన సమయాల్లో ఉగ్రవాదులు, ఇతరులు స్టార్‌నెట్‌ సేవలను పొంది సమాచారాన్ని చేరవేసినట్లు డిసెంబరు, జనవరి నెలల్లో గార్డియన్‌ పత్రిక వెల్లడిరచిన సంగతి తెలిసిందే. భద్రతా దళాలు చేసిన సోదాలలో స్టార్‌లింక్‌ యాంటెన్నా, ఇతర పరికరాలను పట్టుకున్నారు. అయితే వినియోగించారని చెబితే పరువుపోతుంది గనుక అవి పని చేయటం లేదని లీకులు వదిలారు. ఏదో ఒకసాకుతో 2024లో ఇంటర్నెట్‌ సేవల నిలిపివేతలో ‘‘నిరంకుశ ’’ పాలన సాగుతున్న మయన్మార్‌లో 85 సార్లు జరిగితే ‘‘ ప్రజాస్వామిక ’’ భారత్‌లో 84 దఫాలు మూసివేసినట్లు సమాచారం. తరువాత 21సార్లతో బిజెపి నిత్యం భక్తి, అనురక్తితో తలుచుకుంటూ పారాయణం చేసే పాకిస్థాన్‌ ఉంది. ప్రజాస్వామిక దేశాలలో మనదే అగ్రస్థానం. ఇలాంటపుడు ఇంకా అధికారికంగా స్టార్‌లింక్‌ అనుమతులు లేనపుడే ఇలా ఉంటే ఇచ్చిన తరువాత దాని మీద నియంత్రణ, పర్యవేక్షణ ప్రశ్నార్ధకమే.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • యోగులు-స్వాముల కొట్లాట : సిఎం ఆదిత్యనాధ్‌ను నకిలీ హిందువుగా ప్రకటిస్తా , శంకరాచార్య అవిముక్తేశ్వరానంద !
  • ప్రపంచ మిలిటరీ శక్తిలో భారత్‌-చైనా ఎవరెక్కడ !
  • రాష్ట్రాలు మరోసారి సుప్రీం కోర్టు తలుపు తట్టక తప్పదా :బిజెపి ఏజంట్లుగా గవర్నర్లు,అసెంబ్లీల నుంచి వాకౌట్‌ !
  • ఇరకాటంలో ఐరోపా : గ్రీన్‌లాండ్‌ కోసం ఎంతకు తెగిస్తామో చూపుతా అన్న ట్రంప్‌ !
  • విపరీతంగా పెరుగుతున్న అసమానతలు : మంచిరోజులకు బదులు పేదలను ముంచుతున్న నరేంద్రమోడీ విధానాలు !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • యోగులు-స్వాముల కొట్లాట : సిఎం ఆదిత్యనాధ్‌ను నకిలీ హిందువుగా ప్రకటిస్తా , శంకరాచార్య అవిముక్తేశ్వరానంద !
  • ప్రపంచ మిలిటరీ శక్తిలో భారత్‌-చైనా ఎవరెక్కడ !
  • రాష్ట్రాలు మరోసారి సుప్రీం కోర్టు తలుపు తట్టక తప్పదా :బిజెపి ఏజంట్లుగా గవర్నర్లు,అసెంబ్లీల నుంచి వాకౌట్‌ !
  • ఇరకాటంలో ఐరోపా : గ్రీన్‌లాండ్‌ కోసం ఎంతకు తెగిస్తామో చూపుతా అన్న ట్రంప్‌ !
  • విపరీతంగా పెరుగుతున్న అసమానతలు : మంచిరోజులకు బదులు పేదలను ముంచుతున్న నరేంద్రమోడీ విధానాలు !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • యోగులు-స్వాముల కొట్లాట : సిఎం ఆదిత్యనాధ్‌ను నకిలీ హిందువుగా ప్రకటిస్తా , శంకరాచార్య అవిముక్తేశ్వరానంద !
  • ప్రపంచ మిలిటరీ శక్తిలో భారత్‌-చైనా ఎవరెక్కడ !
  • రాష్ట్రాలు మరోసారి సుప్రీం కోర్టు తలుపు తట్టక తప్పదా :బిజెపి ఏజంట్లుగా గవర్నర్లు,అసెంబ్లీల నుంచి వాకౌట్‌ !
  • ఇరకాటంలో ఐరోపా : గ్రీన్‌లాండ్‌ కోసం ఎంతకు తెగిస్తామో చూపుతా అన్న ట్రంప్‌ !
  • విపరీతంగా పెరుగుతున్న అసమానతలు : మంచిరోజులకు బదులు పేదలను ముంచుతున్న నరేంద్రమోడీ విధానాలు !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 246 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d