• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: Gaza Deaths

కళ్లుండీ చూడలేని కబోదులా, రక్త పిపాసులా – గాజాపై అమెరికా ఆరవసారి వీటో !

20 Saturday Sep 2025

Posted by raomk in Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, Opinion, USA, WAR

≈ Leave a comment

Tags

Donald trump, Gaza Deaths, Global Sumud Flotilla, Israel genocide, UNSC Failures, US’s sixth veto

ఎం కోటేశ్వరరావు

2023 అక్టోబరు 7వ తేదీ నుంచి పాలస్తీనా ప్రాంతమైన గాజాలో ఇజ్రాయెల్‌ ఊచకోతలో మరణించిన వారి సంఖ్య 65వేలు దాటింది. వీరిలో 70శాతం మంది అన్నెంపున్నెం ఎరగని పిల్లలు, వారి సంరక్షణ చూస్తున్న తల్లులే ఉన్నారు. లక్షలాది మంది గాయపడ్డారు, వేలాది మంది జాడ తెలియటం లేదు. నివాస ప్రాంతాలు, ఆసుపత్రులు, పాఠశాలలు, నిర్వాసితుల గుడారాలు, మానవతా పూర్వక సాయం చేస్తున్న కేంద్రాలు ఒకటేమిటి, ఏదో ఒక సాకుతో నిత్యం ఇజ్రాయెల్‌ మిలిటరీ దాడులకు గురవుతున్నాయి. యాసిలెడ్‌ అనే ఒక సంస్థ తాజాగా విడుదల చేసిన సమాచారం ప్రకారం గాజాలో ఇజ్రాయెల్‌ చేసిన ప్రతి పదహారు హత్యలలో బలైంది 15 మంది సామాన్య పౌరులే అని తేలింది.ఈ ఏడాది మార్చినెల 18 తరువాత తాము 2,100 మంది సాయుధులను మట్టుబెట్టామని ఇజ్రాయెల్‌ చెప్పింది. తమ సమాచారం ప్రకారం 1,100 మందికి మించి లేరని సర్వే చేసిన సంస్థ పేర్కొన్నది. ఇదే కాలంలో 16వేల మంది పౌరులను చంపారు. ఇటీవలి కాలంలో నివాస ప్రాంతాల విధ్వంసం కూడా విపరీతంగా పెరిగింది. మార్చి నెలకు ముందు 15 నెలల కాలంలో భవనాల కూల్చివేతలు, దాడులు 698 జరిగితే, గడచిన ఆరునెలల్లోనే 500 ఉదంతాలు ఉన్నాయి. హమస్‌ను అదుపు చేయలేకపోయామనే ఉక్రోషంతో ఇజ్రాయెల్‌ ఎంతకు తెగిస్తున్నదో దీన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు.

తాజాగా త్రివిధ దళాలు ప్రారంభించిన భీకరదాడులతో లక్షలాది మందిని తరిమివేస్తున్నారు. దిక్కుతోచని జనం తమ ప్రాంతాల నుంచి కకావికలౌతున్నారు.పదాతి దళాలు, వారికి మద్దతుగా యుద్ధ టాంకులు, వీటితో పాటు యుద్ద విమానాలు, హెలికాప్టర్లను రంగంలోకి దించి గాజాలో ఉన్న నివాస ప్రాంతాలపై పెద్ద ఎత్తున ఇజ్రాయెల్‌ విరుచుకుపడుతున్నది. దీంతో కాలినడకన, బండ్లు, దొరికిన వాహనాలతో లక్షలాది మంది గాజా దక్షిణం, ఇతర చోట్లకు వెళుతున్నారు, ఎక్కడ సురక్షిత ప్రాంతం దొరుకుతుందా అని చూస్తున్నారు. ఎక్కడ ఆగితే అక్కడ విమానాలతో దాడులు జరుగుతున్నాయి. పాలస్తీనా మరో ప్రాంతమైన పశ్చిమగట్టులో గ్రామాలు, పౌరుల మీద కూడా ఇజ్రాయెల్‌ మిలిటరీ దాడులు జరుపుతున్నది. ఈ దారుణాన్ని తక్షణమే నిలిపివేయాలని డిమాండ్‌ చేస్తూ భద్రతా మండలిలో గురువారం నాడు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని 15కు గాను 14 సభ్యదేశాలు బలపరచగా అమెరికా వీటో చేసి అడ్డుకుంది. గాజా మారణకాండపై ప్రవేశపెట్టిన తీర్మానాలను అమెరికా వీటో హక్కుతో అడ్డుకోవటం ఇది ఆరవసారి.

గాజాలో ఇజ్రాయెల్‌ మారణకాండకు పాల్పడుతున్నట్లు తొలిసారి ఐరాస ప్రకటించింది. అయితే ఆ బృందం వాస్తవాలను పట్టించుకోలేదని, హమస్‌కు మద్దతుగా వ్యవహరించిందంటూ భద్రతా మండలిలో అమెరికా ధ్వజమెత్తింది. అంతర్జాతీయ మానవహక్కుల కమిషన్‌ ఇలాంటి తప్పుడు నివేదికలు ఇస్తున్న కారణంగానే తాము ఆ సంస్థ నుంచి తప్పుకున్నట్లు సమర్ధించుకుంది.ఐరాస మానవహక్కుల కమిషన్‌ గాజాలో మారణకాండ జరుగుతున్నదని చెప్పటం తప్పుడు ప్రచారమని అమెరికా మధ్య ప్రాచ్య ఉపరాయబారి మోర్గాన్‌ ఆర్టగస్‌ ఆరోపించింది.మానవహక్కుల కమిషన్‌ నివేదిక అంతా అవాస్తవాలతో నిండి ఉందని, హమస్‌కు లబ్ది చేకూర్చేదిగా ఉందని ఆమె ఆరోపించింది. ఎలాంటి ఆధారాలను చూపకుండా ఇలాంటి నివేదికలను రూపొందించటమంటే తన నిబంధనలను తానే ఉల్లంఘించినట్లు ఐరాసపై ఆమె ఆరోపించింది. యూదు వ్యతిరేక వేధింపులుగా వర్ణించింది.ఇజ్రాయెల్‌ ఆత్మరక్షణ హక్కును తీర్మానం గుర్తించలేదని, హమస్‌ చర్యలను ఖండించలేదని ఆరోపించింది.

సాధారణంగా భద్రతామండలి సమావేశాల్లో ఆయాదేశాల ప్రతినిధులు మాట్లాడిన తరువాత సమావేశాలు ముగుస్తాయి. కానీ గురువారం నాడు ఒకసారి మాట్లాడిన తరువాత సభ్యులు ఆగ్రహంతో రెండోసారి ప్రసంగించటం చోటు చేసుకుంది. ఇజ్రాయెల్‌ దుర్మార్గంపై వెల్లడైన ఆగ్రహం, రెండు శిబిరాలుగా దేశాలు చీలిపోవటాన్ని ఇది సూచించింది.గాజాలో మారణకాండను నిలిపివేయాలని కోరుతూ తీర్మానాన్ని ప్రతిపాదించిన పది దేశాల్లో అల్జీరియా ఒక్కటే అరబ్బు దేశం. గాజాలో జరుపుతున్న దుర్మార్గాలను ఖండించటంతో పాటు, దాడులను ఆపాలని, అక్కడ కరువు విలయతాండవం చేస్తున్నదని, దాడులను మరింతగా విస్తరించేందుకు ఇజ్రాయెల్‌ పూనుకున్నదని తీర్మానంలో పేర్కొన్నారు.ఇజ్రాయెల్‌ ప్రతినిధి మాట్లాడిన తరువాత తిరిగి తనకు అవకాశం ఇవ్వాలని ఆ దేశప్రతినిధితో పాటు డెన్మార్క్‌ ప్రతినిధి కూడా కోరగా ఇజ్రాయెల్‌ వక్త కూడా అదే చేశారు. అల్జీరియాకు అంత ఆగ్రహం ఎందుకని ఎదురుదాడికి దిగాడు. ఇజ్రాయెల్‌ జైళ్లలో నిర్బంధించిన పదివేల మంది పాలస్తీనియన్లను చిత్రహింసలు పెడుతున్నట్లు వార్తలు వెలువడ్డాయి.ఏ అంతర్జాతీయ సంస్థనూ పరిశీలించేందుకు అనుమతించటం లేదు. వారిని ఏ ఆరోపణలతో నిర్బంధించిందీ కూడా చెప్పటం లేదు.భద్రతా మండలిలో అమెరికా తమకు నైతికంగా మద్దతు ఇచ్చినందుకు ఇజ్రాయెల్‌ కృతజ్ఞతలు తెలిపింది. భద్రతా మండలి సభ్యులు అల్జీరియా, హమస్‌ ప్రభావానికి లోనైనట్లు రాయబారి డానన్‌ ఆరోపించాడు. గాజాలో ఉన్న తమ బందీలను విడిపించుకొనేందుకు, హమస్‌ను దెబ్బతీసేందుకే దాడులు చేస్తున్నామని చెప్పుకున్నాడు.. అమెరికా చర్యతో పాలస్తీనియన్లు తీవ్ర ఆశాభంగం చెందారని ఐరాస రాయబారి రియాద్‌ మన్సూర్‌ పేర్కొన్నాడు. గాజా నుంచి వెలువడుతున్న దృశ్యాలను చూస్తుంటే కడుపు తరుక్కు పోతున్నదని ప్రతివారినీ కదిలిస్తున్నాయని చెప్పాడు. పసిపిల్లలు ఆకలితో మరణిస్తున్నారు, ఇజ్రాయెల్‌ మిలిటరీ భవనాల మీద నుంచి పౌరుల తలల మీద కాల్పులు జరుపుతున్నది. సామూహికంగా హత్యలు చేస్తున్నారని చెప్పాడు.

భద్రతా మండలి తీర్మానంపై ఓటింగ్‌ జరుగుతున్న సమయంలోనే గతంలో చేసుకున్న ఒప్పందాలను ఉల్లంఘించి లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులు చేసింది.సాయుధ సంస్థ హిజబుల్లానేతలు, మిలిటియాను మట్టుపెట్టేందుకే ఈ దుర్మార్గం అన్నది తెలిసిందే. గతేడాది నవంబరు నుంచి ఇప్పటి వరకు ఇజ్రాయెల్‌ మిలిటరీ 4,500 సార్లు ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు లెబనాన్‌ మిలిటరీ ప్రకటించింది. గతేడాది నవంబరులో కుదిరిన ఒప్పందం ప్రకారం హిజబుల్లా సాయుధుల నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకోవాలని, అక్కడ పాతిన మందుపాతరలను తొలగించేందుకు కంపూచియా, చైనా నిపుణులను అనుమతించాల్సి ఉంది. అయితే ఇజ్రాయెల్‌ పదే పదే ఆ ఒప్పందాన్ని ఉల్లంఘస్తున్నది. అందువలన ఆ రెండు చర్యలూ అమలు జరగటం లేదు. ఒప్పందంలో మధ్యవర్తులుగా ఉన్న అమెరికా, ఫ్రెంచి నేతలు తమ మిత్రదేశాన్ని అంకెకు తెచ్చి ఒప్పందం అమలుకు పూనుకోవాలని లెబనాన్‌ ప్రధాని నవాఫ్‌ సలామ్‌ డిమాండ్‌ చేశాడు.ఒక్క దక్షిణ లెబనాన్‌ మీదనేగాక యావత్‌ దేశం మీద దాడులు జరగకుండా చూస్తామని హామీ ఇచ్చిన అమెరికా ఎక్కడా కనిపించటం లేదు. అసలు లెబనాన్‌లో ప్రభుత్వమే లేదని అందువలన ఆ పేరుతో తాము ఆయుధాలను విసర్జించేది లేదని హిజబుల్లా చెబుతున్నది, ఇజ్రాయెల్‌ జరుపుతున్నదాడులు తమ వైఖరి సరైనదే అని నిర్ధారిస్తున్నట్లు కూడా అది పేర్కొన్నది. దోహా మీద ఇజ్రాయెల్‌ దాడులు జరిపిన తరువాత తన అనుయాయి అయిన కతార్‌ మీద దాడులను అమెరికా నివారించలేకపోయిందని అలాంటిది లెబనాన్ను ఎలా రక్షిస్తుందని హిజబులా ప్రశ్నించింది. భద్రతా మండలిలో అమెరికా వీటో చేయటాన్ని హమస్‌ తీవ్రంగా ఖండించింది.మారణకాండపట్ల తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నట్లు పేర్కొన్నది. తీర్మానం ప్రవేశపెట్టిన పదిదేశాలను ప్రశంసించింది.

భావ ప్రకటనా స్వేచ్చ గురించి గొప్పలు చెప్పే బ్రిటన్‌ పాలకులు గాజాలో జరుగుతున్న మారణకాండ గురించి అక్కడి పౌరులు, పాలస్తీనా మద్దతుదారులు వాట్సాప్‌లో సమాచారం, సందేశాలు పంపిన వారి మీద కూడా ప్రభుత్వం దాడులు చేస్తున్నదని విమర్శలు వచ్చాయి. గాజాలో జరుపుతున్న దుర్మార్గాలకు నిరసనగా ఇజ్రాయెల్‌ జాతీయ ఫుట్‌బాల్‌ జట్టు, ఇజ్రాయెలీ క్లబ్‌ సభ్యులు పాల్గొనే క్రీడలను బహిష్కరించాలని ఐరోపా వ్యాపితంగా ఉన్న ఫుట్‌బాల్‌ ఫెడరేషన్లు, మాజీ ఆటగాండ్లు, ఇతరులు కూడా పెద్ద ఎత్తున ప్రచారాన్ని ప్రారంభించారు.ఇజ్రాయెల్‌కు ఆయుధాలు సరఫరా చేయటాన్ని ఇటలీ రేవు కార్మికులు వ్యతిరేకిస్తున్నారు. ఈక్రమంలో రావెన్న రేవుకు వచ్చిన రెండు ట్రక్కులను కార్మికులతో పాటు ఇతరులు అడ్డుకున్నారు. తన వినతి మేరకు ఆయుధాలతో ఉన్న లారీలను అంగీకరించేందుకు రేవు అధికారులు తిరస్కరించినట్లు నగర మేయర్‌ ప్రకటించాడు. ఇలాంటి ప్రతిఘటనే ఫ్రాన్సు, స్వీడన్‌, గ్రీస్‌ కార్మికులు కూడా చేపట్టారు. అయితే ఇటలీ రేవుకు వచ్చిన ఆయుధాలు ఎక్కడి నుంచి తరలించిందీ తెలియలేదు. ఇజ్రాయెల్‌తో అన్ని రకాల వాణిజ్య, ఇతర సంబంధాలను నిలిపివేయాలని కోరుతూ ప్రధాని జార్జియా మెలోనీపై వత్తిడి తెచ్చేందుకు ఇటలీలో అతి పెద్ద కార్మిక సంఘమైన సిజిఐఎల్‌ సెప్టెంబరు 22న సగం రోజు సమ్మె చేసేందుకు పిలుపునిచ్చింది. ఇతర కార్మిక సంఘాలు కూడా మద్దతు తెలిపాయి. పాలస్తీనియన్లపై సాగిస్తున్న మారణకాండకు నిరసనగా ఎమెన్‌లోని హౌతీ సాయుధులు ఇజ్రాయెల్‌పై బలమైన క్షిపణిదాడి చేసి రాజధాని టెలిఅవీవ్‌లోని మిలిటరీ లక్ష్యాలను దెబ్బతీసినట్లు ప్రకటించారు. అయితే డ్రోన్లను తాము అడ్డుకున్నట్లు ఇజ్రాయెల్‌ చెప్పుకుంది.ఇజ్రాయెల్‌ మీద ఆంక్షల విధింపు అంశాన్ని పరిశీలిస్తున్నామని అయితే గాజాలో జరుగుతున్నదానిని మారణకాండగా తాము పిలిచేది లేదని జర్మనీ ప్రకటించింది. అక్టోబరులో జరిగే ఐరోపా సమాఖ్యలో ఆంక్షల విషయాన్ని పరిశీలిస్తామని ఛాన్సలర్‌ ఫ్రెడరిక్‌ మెర్జ్‌ చెప్పాడు. అయితే తాను సాధించుకున్న లక్ష్యాల దామాషాలో దాని చర్యలు ఎక్కువగా ఉన్నట్లు చెప్పాడు. వాటిని మారణకాండగా వర్ణించలేమన్నాడు. అక్కడ జరుగుతున్నది మారణకాండ అని ఐరాస కమిషన్‌ వ్యాఖ్యానించిన తరువాత జర్మనీ స్పందన ఇది.పాలస్తీనాకు రాజ్యహౌదా అన్నది ఇప్పుడు చర్చ కాదన్నాడు.

ఇజ్రాయెల్‌ దాడులు పెరగటంతో నగర జీవ నాడులు కుప్పకూలుతున్నాయని ఐరాస మావతాపూర్వక సహాయ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది.గడచిన ఐదు రోజుల్లో పదకొండువేల మంది తలదాచుకుంటున్న గృహాలను కూల్చివేశారని, ఇప్పటి వరకు మొత్తం పదిలక్షల మంది నెలవులు తప్పినట్లు ఆదివారం నాటి నుంచే 56వేల మంది నిరాశ్రయులైనట్లు తెలిపింది.ప్రతి రోజూ సహాయ సంస్థలు 5.6లక్షల ఆహార పొట్లాలను అందిస్తున్నాయని, ఇజ్రాయెల్‌ ఒక పథకం ప్రకారం ఈ ఏర్పాట్లను దెబ్బతీస్తున్నదని కొన్ని ఆహార పదార్దాలతో పాటు కొన్ని ప్రాంతాలకు సరఫరాను అడ్డుకుంటున్నదని పేర్కొన్నది. గాజా దిగ్బంధనాన్ని నిరసిస్తూ అక్కడ చిక్కుకు పోయిన పౌరులకు సాయం అందించేందుకు 44 దేశాలకు చెందిన యాభైకి పైగా చిన్న చిన్న పడవలతో గ్లోబల్‌ సముద్‌ ఫ్లోటిలా పేరుతో ఒక సమూహం గాజావైపు ప్రయాణిస్తున్నది. దానిలో వైద్యులు, సాంకేతిక నిపుణులు, సంఘసేవకులు ఉన్నారు. దాన్ని అడ్డుకొనేందుకు ఇజ్రాయెల్‌ పూనుకుంది. ఉగ్రవాదులకు సాయపడేందుకు అనేక మంది ఆ పడవల్లో వస్తున్నట్లు ఆరోపించింది, ఆ ముసుగులో గతంలో మాదిరి దాడి చేసి నిర్భందించేందుకు పూనుకుంది.ఇలాంటి పడవల్లో వెళ్లి సాయం అందించటం పెద్ద విషయం గాకపోయినా ఇజ్రాయెల్‌ దుర్మార్గాన్ని లోకానికి వెల్లడించేందుకు, వత్తిడి తెచ్చేందుకు 2010 నుంచి సాగుతున్నది. గతంలో హండాలా, మాడలీన్‌ నౌకలతో వెళ్లినపుడు ఇజ్రాయెల్‌ డ్రోన్లతో దాడి చేసింది.నౌకలలో ఉన్నవారిని నిర్బంధించింది.వారిపై దాడి చేయటంతో పాటు, ఫోన్లను స్వాధీనం చేసుకున్నది, వేరే ప్రాంతాలకు బలవంతంగా తరలించింది.ఈ సారి ఎలాంటి దుర్మార్గాలకు పాల్పడనుందో తెలియదు, యావత్‌ సభ్య సమాజం ఇజ్రాయెల్‌, దానికి నిస్సిగ్గుగా మద్దతు ఇస్తున్న అమెరికా దుర్మార్గాన్ని ఖండించాల్సి, ఎదిరించాల్సిన అవసరం ఉంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ప్రపంచమా గాజాను మరచిపోవద్దు : ఇజ్రాయెల్‌ దాడిలో ప్రాణాలు వదలిన ఓ జర్నలిస్టు ఆఖరి కోరిక !!

13 Wednesday Aug 2025

Posted by raomk in Current Affairs, History, imperialism, International, INTERNATIONAL NEWS, Opinion, USA, WAR

≈ Leave a comment

Tags

Donald trump, Don’t forget Gaza, Gaza Deaths, Israel genocide, Netanyahu, Palestine Journalist Anas al-Sharif, Palestinian People


ఎం కోటేశ్వరరావు


2023 అక్టోబరు ఏడున గాజాలో ఇజ్రాయెల్‌ ప్రారంభించిన మారణకాండ మరోదశలో ప్రవేశించే సూచనలు కనిపిస్తున్నాయి. హమస్‌ను అంతమొందించేందుకు గాజా స్వాధీనం తప్పదని ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు ప్రకటించాడు. ఇప్పటి వరకు 75వేల మంది వరకు నిరాయుధులైన పాలస్తీనియన్లను ఇజ్రాయెల్‌ మిలిటరీ చంపివేసింది. వీరిలో సగానికి పైగా పిల్లలు, మహిళలు ఉన్నారు. దాదాపు రెండు లక్షల మందిని గాయపరిచారు, లక్షలాది ఇండ్లు, ఆసుపత్రులు, విద్యాసంస్థలను నేలమట్టం గావించారు. అయినప్పటికీ హమస్‌, ఇతర సాయుధ బృందాలను పట్టుకోవటంలో విఫలమైంది. వారిని పట్టుకోవాలంటే గాజాను పూర్తిగా తన స్వాధీనంలో తెచ్చుకోవాలని ఇజ్రాయెల్‌ చెబుతోంది. నిజానికి ఒక విధంగా గాజా ప్రస్తుతం ఇజ్రాయెల్‌ ఆక్రమణలోనే ఉంది. ఆకలితో మాడుతున్న పసిపిల్లలకు అవసరమైన ఆహారసాయాన్ని కూడా రాకుండా మిలిటరీ అడ్డుకుంటున్నది, సహాయ శిబిరాల వద్దకు వచ్చిన వారిని కూడా చంపివేస్తున్నది. ప్రపంచంలో అనేక యుద్ధాలు, ఉద్రిక్తతల సమయంలో వార్తలను సేకరించే జర్నలిస్టులకు రక్షణ ఉంటుంది, ప్రమాదవశాత్తూ గాయపడటం, మరణించటం వేరు. కానీ గాజాలో ఇప్పటి వరకు 242 మంది జర్నలిస్టులను ఇజ్రాయెల్‌ బలగాలు చంపివేశాయి. తాజాగా అల్‌ జజీరా టీవీ, పత్రికలకు వార్తలు సేకరిస్తున్న జర్నలిస్టులను హతమార్చారు, ఏమిటంటే వారంతా హమస్‌ సాయుధులతో కలసి ఉన్నారంటూ పచ్చి అబద్దాలను ప్రచారం చేస్తున్నారు. అనాస్‌ అల్‌ షరీఫ్‌ అనే ఆల్‌ జజీరా విలేకరి తన కుటుంబం, ప్రపంచానికి ఎక్స్‌ ద్వారా ఒక చివరి సందేశం పంపాడు.‘‘ ఇది చివరి వర్తమానం, మీకు అందే సమయానికి ఇజ్రాయెల్‌ నన్ను చంపివేస్తుంది, నా గళాన్ని అణచివేస్తుంది, ప్రపంచం గాజాను మరచిపోవద్దు ’’ అని దానిలో ఉంది. ఆదివారం రాత్రి అది నిజమైంది. గాజాలోని ఆల్‌ షిఫా ఆసుపత్రి సమీపంలో జర్నలిస్టులు ఉన్నారనే చిహ్నాలు ఉన్న గుడారాన్ని లక్ష్యంగా చేసుకొని జరిపిన వైమానిక దాడిలో అల్‌ షరీఫ్‌తో పాటు తమ జర్నలిస్టులు మరో నలుగురితో సహా ఏడుగురిని చంపినట్లు అల్‌ జజీరా తెలిపింది.


ఓ జర్నలిస్టు చివరి సందేశం
అనాస్‌ అల్‌ షరీఫ్‌ చివరి సారిగా ఎక్స్‌లో పంపిన వర్తమానం ఇలా ఉంది.‘‘ ఇది నా వాంఛ మరియు చివరి వర్తమానం. ఇది మీకు చేరేలోపు ఇజ్రాయెల్‌ నన్ను చంపటంలో జయప్రదం అవుతుంది, నా గళం మూగపోయేట్లు చేస్తుంది. మొదటిది మీకు శాంతి చేకూరాలి, అల్లా దయ మరియు దీవెనలు మీకు కలగాలి. జబాలియా శరణార్ధి శిబిరంలో నేను జన్మించి కళ్లు తెరిచినప్పటి నుంచి అక్కడి వీధులు, సందుల్లో తిరుగాడుతూ నా జనం కోసం గళం విప్పి మద్దతు ఇచ్చిన ప్రతి అంశం గురించి అల్లాకు తెలుసు. మా స్వంత పట్టణమైన ఆక్రమిత అస్కలాన్‌( అల్‌ మజదాల్‌)కు తిరిగి వచ్చేందుకు అల్లా నా జీవితాన్ని పొడిగిస్తాడని ఆశిస్తున్నాను, అందువలన నేను నాకుటుంబం, ప్రేమించేవారిని కలుసుకొనేందుకు తిరిగివస్తాను. అయితే అల్లా వాంఛ ముందు మరియు ఆయన ఆదేశమే అంతిమం.
నేను బాధల మధ్యనే జీవించాను, అనేక నష్టాలు, ఇబ్బందులను చవిచూశాను. అయినప్పటికీ ఎలాంటి వక్రీకరణలు, తప్పుడు సమాచారం లేకుండా ఉన్నది ఉన్నట్లుగా నిజాన్ని చేరవేసేందుకు ఒక్కసారి కూడా నేను వెనుకాడలేదు.ఏడాదిన్నరకు పైగా మన జనాలు ఎదుర్కొంటున్న ఊచకోతను ఆపేందుకు ఏమీ చేయని వారిని, మన పిల్లలు, మహిళల శరీరాలు ఛిద్రమైనా చలించని హృదయాలు కలవారిని, మౌనంగా దూరంగా ఉన్నవారిని, మన హత్యలను ఆమోదించిన వారిని, మన శ్వాసను ఆడనివ్వని వారిని అందరినీ అల్లా చూస్తున్నాడు.
ముస్లిం సమాజ కిరీటంలో మణి, ఈ ప్రపంచంలోని ప్రతి స్వేచ్చా జీవి గుండె చప్పుడు వంటి పాలస్తీనాను మీకు అప్పగిస్తున్నాను. దాని జనాన్ని, తప్పు చేసిన వారినీ, రక్షణ, శాంతిలేకుండా జీవించేందుకు లేదా కలలు కనేందుకు కూడా ఎన్నడూ సమయంలేని అమాయకులైన పిల్లలతో పాటు మీకు అప్పగిస్తున్నాను. వేలాది టన్నుల ఇజ్రాయెలీ బాంబులు, క్షిపణులతో నిర్మలమైన వారి శరీరాలు నలిగిపోయాయి, ఛిద్రమైన వారి భాగాలు అంతటా పడ్డాయి. బంధనాలు మిమ్మల్ని మౌనంగా ఉంచలేవు, సరిహద్దులు ఏమీ చేయలేవు. అపహరించిన మన మాతృభూమిలో స్వేచ్చ, హుందాతనపు సూర్యుడు ఉదయించే వరకు మన భూమి, పౌరుల విముక్తి కోసం మీరు వారధులుగా మారండి.
నా కుటుంబ మంచిచెడ్డలను మీకు అప్పగిస్తున్నాను. నేను కలలు కన్నవిధంగా నా కుమార్తె షామ్‌ ఎదగటాన్ని చూసే అవకాశం నాకు రాలేదు. నాకళ్ల వెలుగైన ఆమెను మీకు అప్పగిస్తున్నాను. నా భారం మోసేంతవరకు మరియు నా లక్ష్యాన్ని సాధించేవరకు అతని పెరుగుదలకు నా ప్రియమైన కుమారుడు సాలాప్‌ాను కూడా మీకు అప్పగిస్తున్నాను. నేను ప్రేమించే నా మాతృామూర్తిని కూడా మీకు అప్పగిస్తున్నాను.నేను ఇలా ఉండటానికి ఆమె చేసిన ప్రార్ధనలే కారణం. అవేనాకు పెట్టని కోట, ఆమె ఇచ్చిన వెలుగు బాట నాది. ఆమెకు శక్తిని ప్రసాదించాలని, శుభం కలగాలని నా తరఫున అల్లాను ప్రార్ధిస్తున్నాను.
నా జీవితకాల సహచరి, భార్య ఉమ్‌ సాలాప్‌ా(బయాన్‌) బాధ్యతను కూడా మీకు అప్పగిస్తున్నాను. యుద్ధం మమ్మల్ని రోజులు, నెలల తరబడి విడదీసింది. వంగని ఆలివ్‌ చెట్టు కొమ్మలా ధీటుగా ఆమె నిలిచింది, బంధానికి కట్టుబడి ఉంది, సహనంతో ఆల్లా మీద విశ్వాసంతో ఉంది. నా పరోక్షంలో ఆమె బాధ్యతలను నిర్వహించేందుకు ఆమె తన యావత్‌ శక్తి, విశ్వాసాన్ని వినియోగిస్తున్నది. వారందరికీ మీరు అండగా నిలవాలని కోరుతున్నాను, అల్లా తరువాత మీరే వారికి మద్దతు ఇవ్వాలి.
నేను గనుక మరణిస్తే, నా సిద్దాంతాలకు గట్టిగా నిలిచి నేను మరణించేందుకు సిద్దం. నేను అల్లా ఆదేశాలకు అనుగుణంగా నడుస్తానని ప్రమాణం చేశాను, నేను ఆయన్ను తప్పకుండా కలుసుకుంటాను. ఆయనతో ఎప్పటికీ నిలిచి ఉంటానని హామీ ఇస్తున్నాను. ఓ అల్లా అమరజీవుల్లో నన్ను ఒకరిగా స్వీకరించు, నా గత, భవిష్యత్‌ పాపాలను క్షమించు. నాజనం, నా కుటుంబం స్వేచ్చా బాటలో నడిచేందుకు అవసరమైన వెలుగునిచ్చేందుకు నా రక్తం తోడ్పడేట్లు చేయి. ఆకాంక్షలకు అనుగుణంగా నేను లేనట్లయితే నన్ను క్షమించు.
నా వాగ్దానాన్ని నిలుపుకొనేందుకు దాన్ని ఎన్నడూ మార్చుకోకుండా, ద్రోహం చేయకుండా ఉండేందుకు దయతో నాకోసం ప్రార్ధించండి. గాజాను మరచిపోవద్దు. క్షమ మరియు మీలో ఒకడిగా అంగీకరించేందుకు మీరు చిత్తశుద్దితో చేసే ప్రార్ధనల్లో నన్ను మరవకండి.’’


హృదయాలను కదలించే చివరి సందేశం పంపిన అనాస్‌ అల్‌ షరీఫ్‌ 28 సంవత్సరాల యువకుడు, జర్నలిస్టు, వీడియో గ్రాఫర్‌. అతని స్వస్థలం ప్రస్తుతం ఇజ్రాయెల్‌ ఆక్రమణలో ఉంది.పాలస్తీనా విముక్తి పోరులో ప్రాణాలకు తెగించి వార్తలను అందిస్తున్నవారిలో ఒకడు. అతనికి హమస్‌ తీవ్రవాది ముద్రవేసిన ఇజ్రాయెల్‌ మిలిటరీ గత రెండు సంవత్సరాలుగా చంపివేస్తామని అనేక సార్లు బెదిరించింది. అది చంపదలుకున్నవారందరికీ ఏదో ఒక ముద్రవేస్తున్నది. ఇజ్రాయెల్‌ ఆరోపణను ఐరాస తిరస్కరించింది. గాజా మారణకాండకు సంబంధించి అతను తీసిన ఫొటోకు 2024లో పులిట్జర్‌ బహుమతి ఇచ్చారు. రెండు సంవత్సరాలుగా అల్‌ జజీరాలో పనిచేస్తున్నాడు. గత నెలలో ఆకలితో చంపుతున్న ఇజ్రాయెల్‌ దుశ్చర్యను వెలుగులోకి తెచ్చాడు. అప్పటి నుంచి అతని కోసం ఇజ్రాయెల్‌ మిలిటరీ వేట ప్రారంభించి చివరకు ఆగస్టు పది రాత్రి విమానాలతో దాడి చేసి హతమార్చింది.


అల్‌ షరీఫ్‌ వంటి ఎందరో పాలస్తీనియన్లు శరణార్ధి శిబిరాల్లోనే పుట్టి అక్కడే పెరిగి చివరికి అదే ఇజ్రాయెల్‌ దుర్మార్గాలకు అక్కడే మరణిస్తున్నారు. గత ఎనిమిది దశాబ్దాలుగా సాగుతున్న మారణకాండ, పోరు అలాంటి ఎందరినో మాతృభూమి కోసం ప్రాణాలు అర్పించేందుకు సిద్దం చేస్తున్నది తప్ప పిరికిబారేట్లు చేయటం లేదు. 2023 అక్టోబరు ఏడు నుంచి ఇప్పటి వరకు 242 మంది జర్నలిస్టులను చంపినట్లు ఐరాస పేర్కొన్నది. రెండు ప్రపంచ యుద్దాలు, వియత్నాం, ఇరాక్‌, ఆఫ్ఘనిస్తాన్‌ దురాక్రమణ వంటి అనేక యుద్ధాలన్నింటిలో కూడా ఇంత మంది ప్రాణాలు కోల్పోలేదని విశ్లేషకులు పేర్కొన్నారు.ఇటీవలి సంవత్సరాలలో జర్నలిస్టులకు ప్రాణాంతక, అత్యంత ప్రమాదకరంగా ఉన్న ఉదంతం ఈ మారణకాండ. తనకు అనుకూలంగా వార్తలు ఇచ్చే వారిని తప్ప అంతర్జాతీయ జర్నలిస్టులను గాజాలో ప్రవేశించకుండా ఇజ్రాయెల్‌ అడ్డుకుంటున్నది. ఈ నేపధ్యంలో స్థానిక పాలస్తీనియన్లే విలేకర్లుగా మారి ఆల్‌ జజీరా వంటి మీడియా సంస్థలకు వార్తలను అందిస్తున్నారు. అది కూడా లేనట్లయితే అసలు గాజాలో ఏం జరుగుతున్నదో బయటి ప్రపంచానికి తెలిసే అవకాశమే ఉండేది కాదంటే అతిశయోక్తి కాదు.


గాజాలో తాజా పరిణామాల విషయానికి వస్తే హమస్‌ ఆయుధాలు విసర్జింతవరకు దాడులు చేయటం తప్ప మరొకమార్గం లేదని ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు ప్రకటించాడు. ప్రస్తుతం 70నుంచి75శాతం వరకు తమ ఆధీనంలో ఉందని చెప్పాడు.హమస్‌కు రెండు గట్టి స్థావరాలు ఉన్నాయని పూర్తిగా తుదముట్టించాలంటే గాజా స్వాధీనం చేసుకోవాల్సిందే అన్నాడు. ఈ వైఖరిని అనివార్యమై కొన్ని పశ్చిమదేశాలు బహిరంగంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ అమెరికా అండతో ఈ దుర్మార్గానికి పూనుకున్నాడు. గాజాలో దాడులకు ఉపయోగించే ఆయుధాలను ఇజ్రాయెల్‌కు నిరవధికంగా నిలిపివేస్తున్నట్లు జర్మనీ ప్రకటించింది. అయితే నిజంగా అమలు చేస్తుందా లేక వేరే మార్గాల ద్వారా సరఫరా చేస్తుందా అన్నది చెప్పలేము.హమస్‌కు వ్యతిరేకంగా ఆత్మరక్షణ చేసుకొనే హక్కు ఇజ్రాయెల్‌కు ఉన్నదని జర్మనీ ఇదే సందర్భంగా పేర్కొన్నది. పాలస్తీనా ప్రాంతాలను ఆక్రమించిన ఇజ్రాయెల్‌ గత ఏడు దశాబ్దాల నుంచి చెబుతున్న ఆత్మరక్షణ కతలను పశ్చిమదేశాలు సమర్ధిస్తున్న సంగతి తెలిసిందే. ఆ పేరుతో పాలస్తీనాను అడ్డుకోవటం అడ్డగోలు వ్యవహారం తప్ప మరొకటి కాదు.జర్మనీ గతంలో సరఫరా చేసిన ఫ్రైగేట్స్‌తోనే గాజాపై ఇజ్రాయెల్‌ నౌకాదళం తొలి దాడులు జరిపింది.


గాజా ఆక్రమణను అడ్డుకొనేందుకు ముస్లిం దేశాలన్నీ ఐక్యం కావాలని టర్కీ, ఈజిప్టు పిలుపునిచ్చాయి. ఈజిప్టుతో చర్చలు జరిపిన తరువాత విదేశాంగశాఖ మంత్రి బదర్‌ అబ్దెలెటీతో కలసి టర్కీ విదేశాంగ మంత్రి హకన్‌ ఫిదాన్‌ శనివారం నాడు విలేకర్ల సమావేశంలో ఈ పిలుపునిచ్చారు. రెండు దేశాలూ ఇజ్రాయెల్‌ చర్యను ఖండిరచాయి.తక్షణమే ఇస్లామిక్‌ దేశాల సంస్ధ సమావేశం జరపాలని కోరారు. ఇజ్రాయెల్‌ చర్య ఒక్క పాలస్తీనాకే గాక ఇరుగుపొరుగు దేశాలన్నింటికీ ప్రమాదమే అని పేర్కొన్నారు. ఇస్లామిక్‌ దేశాల సంస్థ విదేశాంగ మంత్రుల కమిటీ కూడా ఖండిరచింది. భద్రతా మండలి, ప్రపంచ అగ్రరాజ్యాలు జోక్యం చేసుకోవాలని కోరింది. లక్షలాది మంది ఇజ్రాయెల్‌ పౌరులు రాజధాని టెల్‌ అవీవ్‌, ఇతర నగరాల్లో గాజా దురాక్రమణ ప్రతిపాదనను ఖండిస్తూ పెద్ద ఎత్తున ప్రదర్శనలు చేశారు. ప్రభుత్వ చర్యకు సైనికులు మద్దతు ఇవ్వరాదని నినదించారు. హమస్‌ వద్ద బందీలుగా ఉన్నవారిని విడిపించేందుకు అవసరమైతే నెతన్యాహు ప్రభుత్వ వైఖరిని నిరసనగా సాధారణ సమ్మె జరపాలని బందీల కుటుంబ సభ్యులు పిలుపునిచ్చారు. స్వజనంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఇజ్రాయెల్‌ చర్యలకు నానాటికీ వ్యతిరేకత వెల్లడవుతున్నప్పటికీ డోనాల్డ్‌ ట్రంప్‌ వైఖరిలో ఎలాంటి మార్పు లేదు, నిస్సిగ్గుగా మద్దతు ప్రకటిస్తున్నాడు. మరింత పెద్ద ఎత్తున నిరసనోద్యమం జరిగితే తప్ప ఇజ్రాయెల్‌ వెనుకడుగువేసే అవకాశం లేదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

బాంబే హైకోర్టు సుభాషితాల ప్రకారం ‘‘దుమ్ము రేపుతున్న’’ నరేంద్రమోడీ దేశభక్తుడా, కాదా !

10 Sunday Aug 2025

Posted by raomk in CPI(M), Current Affairs, Left politics, NATIONAL NEWS, Opinion, Political Parties, Uncategorized

≈ Leave a comment

Tags

BJP, Bombay high court cpi(M) case, Gaza Deaths, Israel genocide, Narendra Modi, RSS

ఎం కోటేశ్వరరావు


‘‘ దేశభక్తులుగా ఉండండి, దేశంలో ఉన్న సమస్యలను చేపట్టండి :బాంబే హైకోర్టు ’’ మీడియా వార్తల్లో వచ్చిన ఒక శీర్షిక ఇది. గాజాలో ఇజ్రాయెల్‌ మారణకాండకు నిరసనగా అజాద్‌ మైదానంలో తలపెట్టిన ప్రదర్శనకు ముంబై పోలీసులు అనుమతి నిరాకరించారు. ఆ చర్యకు వ్యతిరేకంగా సిపిఐ(ఎం) దాఖలు చేసిన పిటీషన్ను కొట్టివేస్తూ బాంబే హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ తీర్పు ఇచ్చింది.సిపిఎం తరఫున మానవ, పౌరహక్కుల సీనియర్‌ న్యాయవాది మిహిర్‌ దేశాయ్‌ వాదించారు. కోర్టు నిర్ణయం సరైనదా కాదా అన్నది ఒక అంశమైతే ఈ సందర్భంగా డివిజన్‌ బెంచ్‌లోని న్యాయమూర్తులు రవీంద్ర ఘాగే, గౌతమ్‌ అఖద్‌ చేసిన వ్యాఖ్యలు ఆలోచింపచేసేవిగా, ఆందోళన కలిగించేవిగా ఉన్నాయి. అవి రాజ్యాంగ వ్యతిరేకమైనవని సిపిఐ(ఎం) పొలిట్‌బ్యూరో ఒక ప్రకటనలో విమర్శించింది. ఎస్‌ఎం గోరవాద్‌కర్‌ అనే సీనియర్‌ న్యాయవాది సిపిఎం ప్రకటన నేరపూరితంగా ఉందని, న్యాయమూర్తులకు దురుద్దేశ్యాలను ఆపాదించేదిగా ఉన్నందున కోర్టే స్వయంగా చర్య తీసుకోవాలని ఆగస్టు నాలుగవ తేదీన ఒక పిటీషన్‌ దాఖలు చేశారు. ఎలాంటి చర్యలు అవసరం లేదంటూ కోర్టు దాన్ని కొట్టివేసింది.


ఇటీవలి కాలంలో కోర్టులు ఇస్తున్న తీర్పులు, ఆదేశాలు అనేకం వివాదాస్పదం అవుతున్నాయి. విచారణల సందర్భంగా న్యాయమూర్తులు చేసే వ్యాఖ్యలు కూడా విమర్శలకు దారితీస్తున్నాయి. తాజా ఉదంతానికి వస్తే అలహాబాద్‌ హైకోర్టు న్యాయమూర్తి ప్రశాంతకుమార్‌ క్రిమినల్‌ కేసులను విచారించకూడదంటూ సుప్రీం కోర్టు డివిజన్‌ బెంచి ఇచ్చిన ఆదేశం వివాదాస్పదమైంది. ఈ ఆదేశాన్ని అమలు జరపకుండా చూసేందుకు కోర్టు మొత్తాన్ని సమావేశపరచాలని పదమూడు మంది అలహాబాద్‌ హైకోర్టు న్యాయమూర్తులు హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ అరుణ్‌ భన్సాలీకి లేఖ రాశారు. దీంతో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి బి ఆర్‌ గవాయ్‌ జోక్యం చేసుకోవటంతో గతంలో ఇచ్చిన ఉత్తరువును కోర్టు వెనక్కు తీసుకుంది. అసలు అలాంటి పరిస్థితి ఎందుకు తలెత్తిందన్నది కీలకమైన అంశం.మణిపూర్‌ హైకోర్టు తన పరిధిలో లేని గిరిజనేతరులను గిరిజనులుగా మార్చే రిజర్వేషన్ల అంశంపై జారీ చేసిన ఆదేశాలతో ఆ రాష్ట్రంలో వ్యతిరేకులు, అనుకూల సామాజిక తరగతుల మధ్య తలెత్తిన ఘర్షణలు, దాడులతో 2023 మే మూడవ తేదీ నుంచి రాష్ట్రంలో అల్లకల్లోలం తలెత్తింది, ప్రస్తుతం రాష్ట్రపతి పాలనలో ఉంది, ఎప్పుడు సాధారణ పరిస్థితి నెలకొంటుందో తెలియని స్థితి. దీనికి మూలం కోర్టు ఆదేశాలే. న్యాయమూర్తులందరూ పత్తిత్తులు కాదని గతంలో కొందరు, తాజాగా హైకోర్టు జస్టిస్‌ యశ్వంతవర్మ ఉదంతం వెల్లడిరచింది. జ్యుడిషియల్‌ యాక్టివిజమ్‌(న్యాయమూర్తుల ఆచరణతత్వం) రెండంచుల పదనుగల కత్తి వంటిది. చట్టంలో దీనికి అవకాశం ఉందా లేదా పరిధి ఏమిటి అన్నది ఒక చర్చ. ఈ యాక్టివిజమ్‌లో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు కొన్ని విమర్శలకు, మరికొన్ని ప్రశంసలకు అర్హమైనవి. బాంబే హైకోర్టు న్యాయమూర్తుల వ్యాఖ్యలు మొదటి కోవకు చెందినవని చెప్పవచ్చు. తీర్పులను విమర్శించే స్వేచ్చ మనకు రాజ్యాంగం కల్పిస్తున్నది గానీ న్యాయమూర్తులకు దురుద్దేశ్యాలను ఆపాదించకూడదు. ఇంతకూ సిపిఎం తన ప్రకటనలో చేసిన వ్యాఖ్యలేమిటి ? దాని పూర్తి పాఠం దిగువ విధంగా ఉంది.


‘‘ రాజ్యాంగ వ్యతిరేకమైన బాంబే హైకోర్టు వ్యాఖ్యలకు ఖండన
గాజాలో కొనసాగుతున్న ఇజ్రాయెల్‌ మారణకాండకు వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు ు అనుమతించని ముంబై పోలీసు చర్యను సవాలు చేస్తూ పార్టీ దాఖలు చేసిన దరఖాస్తును తిరస్కరించిన సందర్భంగా బాంబే హైకోర్టు చేసిన వ్యాఖ్యలను సిపిఐ(ఎం) పొలిట్‌ బ్యూరో తీవ్రంగా ఖండిస్తున్నది. ఈ సందర్భంగా పార్టీ దేశభక్తిని ప్రశ్నించేవరకూ కోర్టు వెళ్లింది. ఒక రాజకీయ పార్టీకి రాజ్యాంగం ప్రసాదించిన అంశాల గురించి లేదా పాలస్తీనియన్లు మరియు వారి న్యాయబద్దమైన మాతృభూమి హక్కుకు మన దేశం మరియు మన పౌరులు ప్రదర్శించిన సంఫీుభావ చరిత్ర గురించి గానీ హైకోర్టుకు తెలియనట్లుగా కనిపించటం హాస్యాస్పదంగా ఉంది. కోర్టు వ్యాఖ్యలు కేంద్ర ప్రభుత్వ వైఖరికి అనుగుణంగా స్పష్టమైన రాజకీయ వివక్షతో కూడినవిగా ఉన్నాయి. కోర్టు బెంచ్‌ వ్యాఖ్యలు ఇలా ఉన్నాయి, ‘‘ పాలస్తీనా లేదా ఇజ్రాయెల్‌ పక్షానికి అనుకూలంగా గానీ ఇచ్చే మద్దతు రేపే దుమ్ము(వివాదం) గురించి మీకు తెలియదు. మీరెందుకు ఇలా చేయాలని కోరుకుంటున్నారు. మీరు ప్రాతినిధ్యం వహించే పార్టీ చర్య దేశ విదేశీ వ్యవహారాలకు చేసేదేమిటో మీకు అర్ధం కావటం లేదని స్పష్టంగా కనిపిస్తున్నది. మీ సంస్థ భారత్‌లో నమోదైన వాటిలో ఒకటి. చెత్త కుమ్మరింపు, కాలుష్యం, మురుగు, వరదల వంటి అంశాలను మీరు తీసుకోవచ్చు. మేం కొన్ని ఉదాహరణలు మాత్రమే చెబుతున్నాం. మీరు వాటి మీద నిరసనలు తెలపటం లేదు కానీ దేశానికి కొన్నివేల మైళ్ల దూరంలో జరుగుతున్నదాని మీద చేస్తున్నారు.’’
గత శతాబ్ది 40వ దశకంలో మహాత్మాగాంధీ, జాతీయోద్యమం, తరువాత స్వతంత్ర భారత్‌ విదేశాంగ విధానం గానీ పాలస్తీనియన్ల స్వేచ్చాహక్కు మరియు మాతృభూమికి మద్దతు ఇవ్వటానికి సంకోచించలేదు. ఐరాస సంస్థలు మరియు అంతర్జాతీయ న్యాయస్థానం వెల్లడిరచిన వైఖరులు మరియు ఇజ్రాయెల్‌ చర్యలకు వ్యతిరేకంగా ప్రపంచ వ్యాపితంగా అసందిగ్దంగా తెలుపుతున్న మద్దతు వాస్తవాన్ని గానీ కోర్టు గుర్తించినట్లు లేదు. స్వేచ్చ, ప్రజాస్వామ్యాలను ప్రేమించే దేశ పౌరులు ఇలాంటి గర్హÛనీయమైన వైఖరిని ఎలాంటి శషభిషలు లేకుండా తిరస్కరించేందుకు మాతో కలవాలని విజ్ఞప్తి చేస్తున్నాం ’’ అని పేర్కొన్నది.


బాంబే హైకోర్టు న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలను పూర్తిగా సిపిఐ(ఎం) తన ప్రకటనలో ప్రస్తావించలేదు. మీడియాలో వచ్చిన వార్తల్లోని అంశాలు కొన్ని దిగువ విధంగా ఉన్నాయి. ‘‘ మన దేశానికి చాలా సమస్యలున్నాయి. ఇలాంటి వాటిని మేము కోరుకోవటం లేదు. మీరు సంకుచిత దృష్టితో ఉన్నారని చెప్పాల్సి వచ్చి నందుకు నేను విచారిస్తున్నాను. మీరు గాజా మరియు పాలస్తీనా సమస్యలను చూస్తున్నారు మీ స్వంత దేశం గురించి చూడండి.దేశ భక్తులుగా ఉండండి, ఇది దేశభక్తి కాదు.(డెక్కన్‌ హెరాల్డ్‌)’’ సిపిఐ(ఎం) చేసిన ప్రకటన కోర్టులను ధిక్కరించేదిగా, న్యాయవ్యవస్థ మీద విశ్వాసాన్ని పోగొట్టేదిగా ఉన్నందున స్వయంగా హైకోర్టు చర్య తీసుకోవాలని కోరుతూ సీనియర్‌ న్యాయవాది ఎస్‌ఎం గోరవాద్‌కర్‌ దాఖలు చేసిన దరఖాస్తును హైకోర్టు కొట్టి వేసింది. ఎలాంటి చర్యలూ అవసరం లేదని పేర్కొన్నది, తమ వ్యాఖ్యల మీద ఆ పార్టీ తన అభిప్రాయాన్ని వెల్లడిరచిందని మాత్రమే చెప్పింది. హైకోర్టు న్యాయమూర్తులు వెల్లడిరచిన అభిప్రాయాలను ఆసరా చేసుకొని ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రిక ఆర్గనైజర్‌ కమ్యూనిస్టుల మీద మరోసారి విషం కక్కింది.ఆధారం లేని ఆరోపణలు చేసింది. వారెప్పుడూ రష్యా, చైనాలకు విధేయులుగా ఉంటారని వ్యాసకర్త సెలవిచ్చారు. దశాబ్దాల నాటి మైండ్‌ సెట్‌ నుంచి ఇంకా బయటపడినట్లు లేదు, రష్యాను కూడా కమ్యూనిస్టు దేశంగా ఇప్పుడు కూడా పేర్కొన్నారు. పాడిరదే పాడరా అన్నట్లుగా అరిగిపోయిన రికార్డును మళ్లీ వినిపించారు.


‘‘ పాలస్తీనా పక్షం లేదా ఇజ్రాయెల్‌ పక్షానికి అనుకూలంగా గానీ ఇచ్చే మద్దతు రేపే దుమ్ము(వివాదం) గురించి మీకు తెలియదు ’’ అంటూ సిపిఎంకు చెప్పిన సుభాషితం ప్రధాని నరేంద్రమోడీకి వర్తిస్తుందా ? ఆయన దేశభక్తుడా కాదా ? హమస్‌ సాయుధులు 2023 అక్టోబరు ఏడవ తేదీన గాజా నుంచి ఇజ్రాయెల్‌లో ప్రవేశించి 1,195 మందిని చంపి 251 మందిని బందీలుగా పట్టుకున్నారు. ఆ మరుసటి రోజు నుంచి హమస్‌ సాయుధులను పట్టుకొనే పేరుతో ఇజ్రాయెల్‌ మిలిటరీ జరుపుతున్నదాడుల్లో ఇప్పటి వరకు 61వేల మందిని చంపారు, వారిలో సగానికి పైగా పిల్లలు, మహిళలు. మరో లక్షా 52వేల మందిని గాయపరిచారు. లక్షలాది ఇండ్లు, ఆసుపత్రులు, విద్యా సంస్థలను నేలమట్టం గావించారు. గాజా ప్రాంతాన్ని పూర్తిగా ఆక్రమించేందుకు పూనుకున్నారు. హమస్‌ చర్యను మనదేశంలో ఏ ఒక్క పార్టీ కూడా సమర్ధించలేదు. పాలస్తీనియన్ల మీద, వారికి ప్రాతినిధ్యం వహించే సాయుధ సంస్థలతో ఇజ్రాయెల్‌ మిలిటరీ, దాని మద్దతు ఉన్న సాయుధ బృందాల మధ్య దాడులు, ప్రతిదాడులు ఈ నాటివి కాదు. వాటి కొనసాగింపుగా హమస్‌ దాడులు చేసింది, నిరాయుధులుగా ఉన్న పాలస్తీనా పౌరులు లేదా ఇజ్రాయెల్‌ పౌరులను చంపటం ఎవరు చేసినా తప్పే. హమస్‌ దాడుల గురించి గుండెలు బాదుకుంటున్నవారు, గడచిన ఎనిమిది దశాబ్దాలుగా పాలస్తీనా ఆక్రమణకు పూనుకోవటం, ఇజ్రాయెల్‌ చేస్తున్న మారణకాండ గురించి పల్లెత్తు మాట్లాడటం లేదు.హమస్‌ దాడి తరువాత మన ప్రధాని నరేంద్రమోడీ ఇజ్రాయెల్‌కు మద్దతుగా మాట్లాడారు, దానికి మద్దతుగా ఉంటామని చెప్పారు. పాలస్తీనియన్లను హత్య కావించటం తప్పు అంటారే తప్ప దానికి బాధ్యురాలైన ఇజ్రాయెల్‌ను ఇంతవరకు ఖండిరచలేదు. మనదేశంలో ఎన్నో సమస్యలుండగా ఎక్కడో జరిగిన వాటి మీద నరేంద్రమోడీ, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని దేశంలో ప్రతిపక్షాలన్నీ తప్పు పట్టాయి. హైకోర్టు న్యాయమూర్తుల సుభాషితాల ప్రకారం మోడీ నోరు మూసుకొని ఉండాలి కదా, ఎందుకు ఇజ్రాయెల్‌కు మద్దతుగా మాట్లాడినట్లు ? రాజ్యాంగం ప్రకారం ప్రధాని ఒక రాజకీయ పార్టీ నాయకుడు, ఇజ్రాయెల్‌ పట్ల గత ప్రభుత్వాలు తీసుకున్న వైఖరికి భిన్నంగా వ్యవహరించి ‘‘ దుమ్ము(వివాదం)’’ రేపారు. తమ మీద తిరుగుబాటు చేసి భారత్‌లో ప్రవాస ప్రభుత్వం ఏర్పాటు చేసిన దలైలామా 90వ జన్మదినోత్సం, అంతకు ముందు అరుణాచల్‌ ప్రదేశ్‌ సందర్శన సందర్భంగా చైనా అభ్యంతరాలు తెలిపినా మన ప్రభుత్వం, ప్రధాని కూడా ఖాతరు చేయలేదు, అది రెండు దేశాల మధ్య ‘‘దుమ్ము ’’ రేపింది. చైనా తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్‌లో అధికారానికి వచ్చిన చైనా వ్యతిరేక ప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి తన ప్రతినిధిని పంపి బిజెపి ‘‘ దుమ్ము ’’ రేపింది. ప్రధానిగా ఉంటూ అమెరికా పర్యటనకు వెళ్లి అక్కడ ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో సత్కారాలు పొంది తిరిగి రావాల్సిన నరేంద్రమోడీ అబ్‌కీబార్‌ ట్రంప్‌ సర్కార్‌ అని పిలుపిచ్చి ‘‘ దుమ్ము ’’ రేపారు. ఈ చర్య అమెరికా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం, మన విదేశాంగ విధానానికి వ్యతిరేకం.


ఒక పార్టీ నేతగా ప్రధాని మోడీకి ఇజ్రాయెల్‌ను సమర్ధించే హక్కు ఉన్నపుడు మరో పార్టీకి విమర్శించే, నిరసించే హక్కు ఉంటుందని న్యాయమూర్తులకు తెలియదా ? అధికారంలో ఉన్న పార్టీ అడుగుజాడల్లోనే నడవాలా ? అమెరికా మొదలు ఆస్ట్రేలియా, ఐరోపా నుంచి ఆఫ్రికా వరకు అన్ని ఖండాలు, దేశాలలో లక్షలాది మంది పాలస్తీనియన్ల మీద సాగిస్తున్న మారణకాండకు పలు రూపాల్లో నిరసన తెలుపుతున్న అంశాన్ని న్యాయమూర్తులు పరిగణనలోకి తీసుకోరా ? ఆ దేశాల్లో వారికి స్థానిక సమస్యలు లేక లేదా పనిపాటలు లేక అంతర్జాతీయ అంశం మీద స్పందిస్తున్నారా ? వియత్నాం మీద యుద్ధానికి వ్యతిరేకంగా స్వంత ప్రభుత్వ తీరునే తప్పు పడుతూ అమెరికాలో పెద్ద ఉద్యమమే నడిచిన చరిత్రను మరువగలమా ? మానవత్వం, మానవహక్కులను పరిరక్షించాలన్న వాంఛ ఈ నిరసనల్లో ఉందని న్యాయమూర్తులు గ్రహించలేని స్థితిలో ఉన్నట్లు కనిపిస్తున్నది. స్వాతంత్య్రం వచ్చిన తరువాత పుట్టిన తరాలలో గత చరిత్ర, ప్రజా ఉద్యమాలకు అంతర్జాతీయ సంఫీుభావం వంటి అంశాల పట్ల ఆసక్తి లేదు. నయా ఉదారవాద విధానాలు అమల్లోకి వచ్చిన తరువాత సంకుచిత ధోరణలు మరింతగా పెరుగుతున్నాయి. దీనికి సమాజంలో ఎవరూ మినహాయింపుగా కనపడటం లేదు. మణిపూర్‌లో 2023 మే 3వ తేదీ నుంచి ప్రారంభమైన హింసాకాండలో ఒక మహిళను వివస్త్రను గావించి ఊరేగించిన దుర్మార్గం జరిగినప్పటికీ తెలిసి కూడా ప్రధాని నరేంద్రమోడీ పట్టించుకోలేదు. ఆ ఉదంతం సామాజిక మాధ్యమంలో వైరల్‌ అయిన తరువాత జూలై మూడున మరోమార్గం లేక నోరు విప్పాల్సి వచ్చింది. రెండు సంవత్సరాలు దాటిన తరువాత కూడా ఆ రాష్ట్రాన్ని సందర్శించేందుకు తీరికలేని ప్రధాని ఈ కాలంలో అనేక దేశాలను సందర్శించి ప్రసంగాలు చేసి వచ్చారు. ఈ తీరు న్యాయమూర్తులకు పట్టదా ? స్వదేశీ సమస్యలను పట్టించుకోండి, దేశభక్తుడిగా ఉండండి అని మోడీకి సలహా ఇవ్వగలరా !

Share this:

  • Tweet
  • More
Like Loading...

లెబనాన్‌ ఆక్రమణ బాటలో ఇజ్రాయెల్‌ – ప్రతిగా ఇరాన్‌ క్షిపణి దాడి !

02 Wednesday Oct 2024

Posted by raomk in Current Affairs, History, imperialism, International, INTERNATIONAL NEWS, Opinion, USA, WAR

≈ Leave a comment

Tags

Gaza Deaths, Hamas, Hezbollah, Iran-Israel Tensions, israel attack lebanon, Israel genocide, Joe Biden, MIDDLE EAST

ఎం కోటేశ్వరరావు

లెబనాన్‌, గాజాలపై ఇజ్రాయెల్‌ జరుపుతున్న దాడులకు ప్రతిస్పందనగా మంగళవారం నాడు క్షిపణులతో జరిపిన తమ దాడి ముగిసిందని ఇరాన్‌ ప్రకటించింది. అయితే ఇజ్రాయెల్‌ వైపు నుంచి దాడులు కొనసాగితే తాము మరింత గట్టిగా స్పందిస్తామని పేర్కొన్నది. తమ శత్రువు మిలిటరీ కేంద్రాలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేసినట్లు తెలిపింది. ఇదిలా ఉండగా ఇజ్రాయెల్‌ సేనలు లెబనాన్‌లో ప్రవేశించి దాడులను కొనసాగిస్తున్నాయి. వేలాది మంది నివాసాలు వదలి వెళ్లాలని ప్రకటించాయి.దాడులను తిప్పికొడుతున్న హిజబుల్లా ప్రకటించింది. బుధవారం నాడు కూడా దాడులు కొనసాగాయి. అటు ఇజ్రాయెల్‌, ఇటు లెబనాన్‌లో జరిగిన నష్టాల వివరాలు వెల్లడికాలేదు. ఇజ్రాయెల్‌పై జరుగుతున్న క్షిపణి దాడులను అడ్డుకోవాలని అమెరికా మధ్యప్రాచ్యంలో తిష్టవేసిన తన సేనలను అమెరికా ఆదేశించింది. ఇరాన్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయెల్‌ ప్రకటించింది. తాజా పరిణామాలతో ప్రామాణిక బ్రెంట్‌ రకం ముడి చమురు అక్టోబరు ఒకటిన 70.4 డాలర్లుగా ఉన్నది రెండవ తేదీన 74.78డాలర్లకు పెరిగింది. పరిస్థితి నివురు గప్పిన నిప్పులా ఉంది.

గత శనివారం నాడు లెబనాన్‌లోని హిజబుల్లా పార్టీ నేత హసన్‌ నస్రల్లాతో పాటు మరికొందరిని ఇజ్రాయెల్‌ హత్య చేసింది. ఇజ్రాయెల్‌ జరుపుతున్న దాడుల్లో 1,873 మంది మరణించారని, 9,134మంది గాయపడినట్లు ప్రకటించారు. 1960లో జన్మించిన నస్రల్లా 1992లో హిజ్‌బుల్లా బాధ్యతలను స్వీకరించి ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. అందుకు ముందు నేతగా ఉన్న అబ్బాస్‌ ముసావీని కూడా ఇజ్రాయెల్‌ ఇదే విధంగా హత్య చేసింది.1997లో జరిగిన ఘర్షణల్లో ఇజ్రాయెల్‌ జరిపిన దాడిలో నస్రల్లా పెద్ద కుమారుడు హడీ మరణించాడు. 2006లో ఇజ్రాయెల్‌తో జరిపిన 33 రోజుల పోరులో నస్రల్లా నాయకత్వంలో సాధించిన విజయంతో పలుకుబడి పెరిగింది. తాజా హత్యలను నిస్సిగ్గుగా సమర్ధించిన అమెరికా సామ్రాజ్యవాద దుష్టత్వాన్ని మరోమారు ప్రపంచానికి వెల్లడిరచింది. అది అందచేసిన సమాచారం, విద్రోహుల కారణంగానే ఇరాన్‌, ఇరాక్‌, లెబనాన్‌లలో తమ వ్యతిరేకులను ఇజ్రాయెల్‌ హతమార్చుతోంది.అమెరికా అండ చూసుకొని గాజాలో జరుపుతున్న మారణకాండను వ్యతిరేకిస్తున్న ఇరుగుపొరుగుదేశాలన్నింటి మీదా తెగబడుతోంది. ఈ పూర్వరంగంలో మధ్య ప్రాచ్యంలో పరిణామాలు యుద్ధానికి దారితీస్తాయా అన్న ఆందోళన కలిగిస్తున్నాయి. లెబనాన్‌పై ప్రత్యక్ష దాడి వెనుక కారణాలేమిటన్నది ఆసక్తి కలిగించే అంశం. యుద్ధం చెలరేగుతుందా లేదా అన్నది పక్కన పెడితే మధ్యప్రాచ్యంలో పరిస్థితి మరింత దిగజారటం ఖాయంగా కనిపిస్తోంది.లెబనాన్‌ తరువాత ఎమెన్‌ మీద దాడులకు దిగవచ్చని చెబుతున్నారు. ఈ నెల ఏడవ తేదీ నాటికి గాజాలో మారణకాండకు ఏడాది నిండ నుంది, ఆ తరువాత పరిణామాలు ఏ మలుపు తిరిగేదీ చెప్పలేము. గడచిన రెండు నెలల కాలంలో ఇజ్రాయెల్‌ చేసిన హత్యలు, దాడుల గురించి ఇరాన్‌, సిరియా, హమస్‌, హిజబుల్లా తక్కువ లేదా తప్పుడు అంచనాతో ఉన్నట్లు కనిపిస్తోందన్న కొందరి విశ్లేషణలను కొట్టిపారవేయలేము. అందుకే వ్యూహాలను తిరిగి రచించుకొనేందుకు కొంత వ్యవధి పట్టవచ్చు.

మధ్యప్రాచ్య పరిణామాలు భారత్‌తో సహా అనేక దేశాల మీద ఆర్థిక ప్రభావాలు చూపుతాయి.ముడి చమురు ధరలు పెరుగుతాయన్నది వాటిలో ఒకటి.1973లో ఇజ్రాయెల్‌ దాడులకు వ్యతిరేకంగా చమురు ఉత్పత్తి దేశాలు చమురును ఒక అస్త్రంగా ఉపయోగించాయి. దానికి అన్ని రకాలుగా మద్దతు ఇస్తున్న అమెరికా, జపాన్‌, కెనడా, బ్రిటన్‌, నెదర్లాండ్స్‌ వంటి దేశాలకు చమురు ఎగుమతులను నిలిపి వేశాయి. దాంతో పీపా ధర మూడు నుంచి 11 డాలర్లకు పెరిగింది. ఇప్పుడు కూడా అలాంటి పెరుగుదల, దానితో పాటు ఆర్థిక వ్యవస్థల కుదేలు జరగవచ్చని అంటున్నారు. ఇప్పటికే ఎమెన్‌లోని హౌతీలు జరుపుతున్నదాడులతో ఎర్ర సముద్ర ప్రాంతంలో నౌకల రవాణాకు ఆటంకం కలుగుతూ ఆఫ్రికా గుడ్‌హోప్‌ ఆగ్రం చుట్టూ తిరిగి రావటంతో ఖర్చులు పెరుగుతున్నాయి. గతేడాది అగస్టు పదకొండవ తేదీతో ముగిసిన వారంలో 70 ఓడలు ఎర్ర సముద్రం బాబ్‌ అల్‌ మండాబ్‌ జల సంధి గుండా ప్రయాణించగా ఈ ఏడాది అదే వారంలో కేవలం 23 మాత్రమే వచ్చినట్లు ఐఎంఎఫ్‌ రేవుల విభాగం గుర్తించింది. పరిసర దేశాల్లోని చమురు క్షేత్రాలు, శుద్ధి కేంద్రాల మీద దాడులు జరిగితే సంక్షోభం తలెత్తవచ్చు. చరిత్ర పునరావృతం కావచ్చు గానీ ఒకే విధంగా జరుగుతుందని చెప్పలేము.ఈ కారణంగానే భిన్న దృశ్యాలతో రాగల పరిణామాలను అంచనా వేస్తున్నారు. గతేడాది అక్టోబరు ఏడవ తేదీన హమస్‌దాడులు, ఆ పేరుతో ఇజ్రాయెల్‌ ప్రారంభించిన మారణకాండ పర్యవసానాల గురించి ప్రపంచబ్యాంకు మూడు అంచనాలు చెప్పింది, వాటినే ఇప్పుడు విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. స్వల్ప ఆటంకం ( లిబియాలో అంతర్యుద్ధం జరిగిన 2011 ఏడాది మాదిరి) ప్రపంచ చమురు సరఫరాలోలో ఐదు లక్షల నుంచి ఇరవైలక్షల పీపాల వరకు రోజుకు తగ్గవచ్చు, చమురు ధరలు మూడు నుంచి 13శాతం పెరగవచ్చు. రెండవది (2003లో ఇరాక్‌ సమయంలో మాదిరి) సరఫరా 30 నుంచి 50లక్షల పీపాల వరకు తగ్గవచ్చు, ధరలు 21 నుంచి 35శాతం పెరుగుదల, మూడవది 1973 చమురు సంక్షోభం మాదిరి ఎనభైలక్షల పీపాల మేరకు సరఫరా తగ్గుదల, 56 నుంచి 75శాతం మేరకు ధరలు పెరగవచ్చు.

ఈ నెల ఏడవ తేదీ నాటికి గాజాలో ప్రారంభమైన ఇజ్రాయెల్‌ మారణకాండకు ఏడాది నిండుతుంది.ఇప్పటి వరకు 41,586 మంది మరణించగా 96,210 మంది గాయపడ్డారు, పది వేల మంది జాడ కనిపించటం లేదు.లక్షలాది నివాసాలు నేలమట్టమయ్యాయి. పాఠశాలలు, ఆసుపత్రులు, ఐరాస నిర్వహించే సహాయశిబిరాలు దేన్నీ దాడులలో వదలటం లేదు. అయినప్పటికీ హమస్‌ సాయుధులను అంతం చేస్తామన్న ఇజ్రాయెల్‌ పంతం నెరవేరే సూచనలు కనిపించటం లేదు. ఇదే సమయంలో పాలస్తీనా దురాక్రమణ, గాజా మారణకాండను వ్యతిరేకిస్తున్న హిజబుల్లాను అణచేపేరుతో లెబనాన్‌ మీద వైమానికదాడులకు దిగింది.దాని అధిపతి, ఇతర ముఖ్యనేతలను హతమార్చవచ్చు తప్ప పూర్తిగా అణచివేయటం ఇజ్రాయెల్‌ తరం కాదని అందరూ చెబుతున్నారు. ఎందుకు అంటే హమస్‌తో పోల్చితే దాని పోరాట యోధులు, ఆయుధ సంపత్తి కూడా ఎక్కువే. ఇజ్రయెల్‌ మిలిటరీతో పోల్చితే దాని ఆయుధాలు, సాయుధుల సంఖ్య చాలా తక్కువ అని కూడా గమనించాలి.హిజబుల్లా దగ్గర 30 నుంచి 50వేల మంది వరకు ఉన్నారని అంచనా. అయితే తమ యోధుల సంఖ్య లక్షకు పైబడే అని ఇటీవల హత్యకు గురైన నస్రల్లా గతంలో ప్రకటించాడు. ఐదు నుంచి 500 కిలోమీటర్ల దూరం వరకు వెళ్లే క్షిపణులు లక్షా ఇరవైవేల నుంచి రెండు లక్షల వరకు ఉన్నట్లు అంచనా, ఇవి గాక ఇరాన్‌ సరఫరా చేసిన మానవరహిత విమానాలు కొన్ని, ఉపరితలం నుంచి ఉపరితలం మీదకు క్షిపణులను ప్రయోగించే సంచార వాహన వ్యవస్థలు కూడా ఉన్నాయి. ఇజ్రాయెల్‌లోని ఏ ప్రాంతం మీదనైనా దాడికి ఇవి ఉపయోగపడతాయి. అయితే ఇజ్రాయెల్‌ వద్ద త్రివిధ దళాల రెగ్యులర్‌ మిలిటరీ, రిజర్వు దళాల మొత్తం 1,69,500 నుంచి 6,34,500 మంది ఉన్నారు. తమ మీదకు వదిలే క్షిపణులను ముందుగా లేదా మధ్యలో గుర్తించి కూల్చివేసే ఆధునిక రక్షణ వ్యవస్థలు, భారీ క్షిపణులు, వందలాది విమానాలు, నౌకలు ఉన్నాయి. ఇన్ని ఉన్నప్పటికీ ఎటువైపు నుంచి ఏ దాడి జరగనుందో అనే భయంతో వణికిపోయే జనం, వారి రక్షణకు ప్రతి నగరంలో భూగర్భ గృహాలు కూడా ఉన్నాయి. ఇజ్రాయెల్‌కు ఇంత బలం ఉన్నప్పటికీ తన రక్షణ కోసం అవసరం అంటూ గతంలో దక్షిణ లెబనాన్‌ ప్రాంతాన్ని ఆక్రమించింది. ఇరాన్‌లో అయాతుల్లా ఖొమైనీ అధికారానికి వచ్చిన తరువాత 1979లో షియా ముస్లిం తెగకు చెందిన కొద్ది మందితో హిజబుల్లా (దేవుడి పార్టీ)ను ఏర్పాటు చేశారు. అయితే 1982లో ఇజ్రాయెల్‌ దురాక్రమణకు పాల్పడిన తరువాతే అది ప్రాచర్యంలోకి వచ్చింది. 1985లో లెబనాన్‌ అంతర్యుద్ధం సందర్భంగా అక్కడి వివిధ షియా సంస్థలన్నీ హిజబుల్లా నాయకత్వంలో ఐక్యమయ్యాయి. తరువాత ఇజ్రాయెల్‌ దురాక్రమణకు వ్యతిరేకంగా సాయుధ పోరును ప్రారంభించింది.2006లో ఇజ్రాయెల్‌ వైదొలగే వరకు అది పోరుబాటలో ఉంది. ఈ క్రమంలోనే అది రాజకీయ సంస్థగా కూడా రూపుదిద్దుకుంది. ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూనే తన సాయుధ విభాగాన్ని కొనసాగిస్తున్నది. దీనికి లెబనాన్‌ ప్రభుత్వ గుర్తింపు కూడా ఉంది.ప్రస్తుతం సంకీర్ణ మంత్రివర్గంలో ఇద్దరు సభ్యులు, 128 మందితో ఉన్న పార్లమెంటులో 15 స్థానాలతో హిజబుల్లా పెద్ద పక్షంగా ఉంది.

పలు చోట్ల తనను వ్యతిరేకించే సంస్థల నేతలను దొంగదెబ్బలతో హత్య కావించటం, పేజర్లు, వాకీటాకీలను పేల్చి లెబనాన్‌లో హిజబుల్లాపై దాడుల ద్వారా తనకు ఎదురులేదని ఆప్రాంతంలోని వ్యతిరేకులను బెదిరించటమే ఇజ్రాయెల్‌ దానికి మద్దతు ఇస్తున్న సామ్రాజ్యవాద శక్తుల లక్ష్యంగా కనిపిస్తోంది. అయితే తాడిని తన్నే వాడుంటే వాడి తలదన్నేవాడొస్తాడన్నట్లు చరిత్ర రుజువు చేసింది.నస్రల్లా ఉన్న బంకర్‌ను బద్దలు చేసేందుకు అమెరికా సరఫరా చేసిన ఎఫ్‌15 విమానాలతో వెయ్యి కిలోల బరువుండే 85బాంబులను ప్రయోగించి హత్యచేశారు. నాలుగు పెద్ద భవనాలు నేలమట్టమయ్యాయి. నస్రల్లా హత్యతో అనేక మంది బాధిత కుటుంబాలకు న్యాయం జరిగిందని జో బైడెన్‌ అన్నాడు. ఈ చర్యలన్నీ ఇరాన్ను రెచ్చగొట్టి యుద్ధంలోకి దించే అమెరికా కుట్రలో భాగం తప్ప మరొకటి కాదన్నది పదే పదే చెప్పనవసరం లేదు. ఐరాస సాధారణ అసెంబ్లీ సమావేశంలో నెతన్యాహు మాట్లాడుతూ ఒక మాప్‌ను చూపుతూ దానిలో ఉన్న లెబనాన్‌, ఇరాన్‌, సిరియా, ఇరాక్‌ ఒక చీడ అంటూ దాన్ని దాన్ని తొలగించేందుకు తాము కట్టుబడి ఉన్నామని చెప్పాడు.అమెరికా మద్దతుతో అనేక మంది అనుకుంటున్నదాని కంటే ముందే ఈ కలను సాకారం చేస్తామని కూడా చెప్పాడు. పాలస్తీనా ఉనికే లేని నూతన మధ్య ప్రాచ్యాన్ని ఏర్పాటు చేస్తామన్నాడు. నస్రల్లాను చంపిన బాంబుదాడి జరిపిన విమానపైలట్‌ మాట్లాడుతూ తాము ప్రతివారినీ, ప్రతి చోటా దెబ్బతీస్తామన్నాడు. ఎలాగైనా సరే ప్రపంచాన్ని గెలుచుకుంటామంటూ అమెరికా చెబుతున్నది కూడా అదే.


తాజా దాడుల విషయానికి వస్తే హిజబుల్లాను లక్ష్యంగా చేసుకొని చేస్తున్నట్లు ఇజ్రాయెల్‌, పశ్చిమదేశాల మీడియా చిత్రిస్తున్నప్పటికీ వాటి తీరుతెన్నులను చూస్తే సామాన్య జనం మీదనే జరుగుతున్నట్లు కనిపిస్తోంది. మరణించిన వారిలో అత్యధికులు మహిళలు, పిల్లలే ఉన్నారు. వేలాది గృహాలను నేలమట్టం చేశారు. గాజా, బీరూట్‌, లెబనాన్‌ కేంద్రాలుగా పనిచేస్తున్న సాయుధ సంస్థలు తమ ఆయుధాలను సొరంగాల్లో దాస్తున్నాయి తప్ప పశ్చిమ దేశాల మీడియా చెబుతున్నట్లు సాధారణ పౌరుల ఇండ్లలో కాదు. అయితే ప్రతిఘటన పట్టణ ప్రాంతాల్లో జరుగుతున్న కారణంగా పరిస్థితి అడవుల్లో మాదిరి ఉండదని వేరే చెప్పనవసరం లేదు. అందుకే ఇజ్రాయెల్‌ దాడులు చేసినపుడు పౌరులు ఇండ్లను ఖాళీచేయాలని పదే పదే చెబుతోంది. గాజాలో మాదిరే బీరూట్‌, పరిసరాల మీద కూడా దాడులు జరుగుతున్నాయి. పాలస్తీనా విమోచన సంస్థ(పిఎల్‌ఓ) లెబనాన్‌ నుంచి తమ మీద దాడులు జరుపుతోందని, అందువలన రక్షణగా కొన్ని ప్రాంతాలు తమకు అవసరమంటూ 1982 ఇజ్రాయెల్‌ ఆక్రమణలకు పూనుకుంది. నిజానికి సిరియా`లెబనాన్‌ మధ్య వివాదం ఉన్న గోలన్‌ గుట్టలను 1967 తరువాత 1973, 1981లో కూడా కొత్త ప్రాంతాలను ఇజ్రాయెల్‌ ఆక్రమించింది. ఇప్పటికీ ఆ ప్రాంతం దాని ఆక్రమణలోనే ఉంది. జెనీవా ఒప్పందాల ప్రకారం ఆక్రమిత ప్రాంతాల పౌరులకు ప్రతిఘటించే హక్కును గుర్తించారు. ఆ విధంగా ఇజ్రాయెల్‌ ఆక్రమణలోని లెబనాన్‌ ప్రాంతాల విముక్తికి తాము పోరాడుతున్నట్లు హిజబుల్లా చెబుతోంది. నస్రల్లా మరణం తరువాత ఉపనేత నయిమ్‌ ఖాసిం దేశ పౌరులను ఉద్దేశించి మాట్లాడుతూ నస్రల్లా మరణ సమయంలో 20 మంది నేతలతో సమావేశం జరుగుతున్నదని వారంతా మరణించారని ఇజ్రాయెల్‌ చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. పార్టీ మిలిటరీ కమాండర్‌, ఇరాన్‌ రివల్యూషనరీ గార్డుల డిప్యూటీ కమాండర్‌, భద్రతా సిబ్బంది అక్కడ ఉన్నారని చెప్పాడు. 2006లో మాదిరే ఇజ్రాయెల్‌ను వెనక్కు కొడతామని విజయం మనదే అని ప్రకటించారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఎన్నిబాంబులు వేస్తే అంతగా లాభాలు :యుద్ధం వద్దు శాంతి ముద్దు !

07 Wednesday Feb 2024

Posted by raomk in CHINA, Current Affairs, Europe, Germany, History, imperialism, INTERNATIONAL NEWS, Japan, Opinion, RUSSIA, UK, USA, WAR

≈ Leave a comment

Tags

#Anti China, Anti Russia, Arms Trade, Donald trump, Gaza Deaths, imperialism, Joe Biden, MIDDLE EAST, NATO, NATO allies, NATO massive arms buildup, Ukraine crisis


ఎం కోటేశ్వరరావు


” అక్కడ మిగిలిందేమీ లేదు ” ఐరాస సహాయ సంస్థ గాజాలో పరిస్థితి గురించి తాజాగా చెప్పిన మాట ఇది. ఇజ్రాయెల్‌ ధ్వంసంగావించిన తమ ఒక ఆసుపత్రి చిత్రాన్ని చూపుతూ ఎక్స్‌లో వ్యాఖ్యానించింది. ఇజ్రాయెల్‌ నౌకల నుంచి జరుపుతున్న దాడుల కారణంగా తమ ఆహార సరఫరా వాహనాలకు ఆటంకం కలుగుతున్నదని సంస్థ డైరెక్టర్‌ థామస్‌ వైట్‌ పేర్కొన్నాడు. గాజాలో బందీలకు బదులుగా ఇజ్రాయెల్‌ జైళ్లలో ఉన్న పాలస్తీనా వాసుల విడుదల గురించి అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్‌ మధ్య ప్రాచ్యదేశాల పర్యటనలో ఉన్నాడు. అక్టోబరు ఏడు నుంచి ఇప్పటి వరకు గాజాలో 27,478 మందిని హత్య చేసిన ఇజ్రాయెల్‌ 66,835 మందిని గాయపరచింది. వారిలో 70శాతంపైగా మహిళలు, పిల్లలే ఉన్నారు.ఇరాక్‌, సిరియా, ఎమెన్‌లపై దాడులకు పూనుకున్న అమెరికా యుద్ధాన్ని విస్తరిస్తున్నదని భద్రతా మండలిలో రష్యా విమర్శించింది.తమ దాడులు ఆరంభం మాత్రమేనని అమెరికా అంతకు ముందు ప్రకటించింది. నాటోతో కలసి తమకు ముప్పు తలపెట్టిన ఉక్రెయిన్‌ మీద రష్యా ప్రారంభించిన సైనిక చర్య 713వ రోజులో ప్రవేశించింది.ఎంతగా వర్షాలు పడితే అంతగా పంటలు పండుతాయని రైతాంగం, జనం మురిసిపోతారు, కానీ యుద్ధోన్మాదులకు ఎన్ని బాంబులను కురిపిస్తే అంతగా లాభాలు వస్తాయని చరిత్ర రుజువు చేసింది. అందుకే ఏక్కడో ఒక దగ్గర ఉద్రిక్తతలను రెచ్చగొట్టి యుద్ధాల వరకు కొనిపోవటం నిత్యకృత్యంగా మారింది.ఐరోపాలో ఉక్రెయిన్‌ సంక్షోభం, మధ్య ప్రాచ్యంలో గాజాపై ఇజ్రాయెల్‌ జరుపుతున్న మారణకాండ సారమిదే. 1990దశకంలో ప్రచ్చన్న యుద్ధంలో తామే గెలిచామని అమెరికా ప్రకటించుకున్నప్పటికీ వర్తమానంలో తిరిగి నాటి పరిస్థితిని అది సృష్టిస్తున్నది. దాని విదేశాంగ విధాన వైఫల్యాలు పెరుగుతున్న కొద్దీ ప్రపంచ మిలిటరీ ఖర్చు కూడా పెరుగుతున్నది. ఎనిమిది సంవత్సరాల వరుస పెరుగుదలలో 2022లో ప్రపంచ మిలిటరీ ఖర్చు 2.24లక్షల కోట్ల డాలర్లకు చేరింది.


గత సంవత్సరం అమెరికా విదేశాలకు అమ్మిన ఆయుధాల విలువ 238 బిలియన్‌ డాలర్లు.ఉక్రెయిన్‌ సంక్షోభం ఈ పెరుగుదలకు ప్రధాన కారణంగా తేలింది.ఐరోపాలోని అనేక దేశాలు తమ వద్ద ఉన్న పాత ఆయుధాలను ఉక్రెయిన్‌కు బదిలీ చేసి కొత్తవాటిని కొనుగోలు చేస్తున్నాయి.ఐరోపా వెలుపల ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, జపాన్‌, కెనడా, కతార్‌ తదితర దేశాలు ఎక్కువగా కొనుగోలు చేశాయి.ఆయుధాల అమ్మకం అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఉత్తేజాన్ని ఇస్తున్నది. అమెరికా ప్రభుత్వం నేరుగా అమ్ముతున్న ఆయుధాలు, మిలిటరీ సేవల విలువ 2022తో పోలిస్తే గతేడాది 51.9బి.డాలర్ల నుంచి 80.9కి పెరిగింది. ఆయుధ వ్యాపారులు నేరుగా అమ్మిన వాటి విలువ 157.5బి.డాలర్లు. ప్రభుత్వమే నేరుగా ఆయుధ వ్యాపారం చేస్తున్నదంటే యుద్ధాలను ప్రోత్సహించే విదేశాంగ విధానాలను మరింతగా కొనసాగిస్తున్నదనేందుకు సూచిక. ఆయుధాలను అమ్ముతూ ప్రపంచానికి ముప్పుగా పరిణమించిన రష్యాను దెబ్బతీసేందుకే తామీపని చేస్తున్నట్లు చెప్పుకొంటున్నది. పుతిన్‌ దళాల నుంచి ఐరోపాను రక్షించే పేరుతో ఉక్రెయిన్‌కు 50బిలియన్‌ డాలర్ల నిధులు ఇవ్వాలని ఐరోపా సమాఖ్య తాజాగా నిర్ణయించింది.అక్టోబరు ఏడున గాజాపై మారణకాండను ప్రారంభించిన ఇజ్రాయెల్‌ చర్య కూడా మిలిటరీ ఖర్చు, ఆయుధ విక్రయాలు పెరిగేందుకు దారి తీస్తున్నది.


అమెరికా తన ఆయుధాలను ఇతర ప్రాంతాలలో నేరుగా ప్రయోగించి వాటి పనితీరును ఎలా పరీక్షిస్తున్నదో ఇజ్రాయెల్‌ కూడా తన ఆయుధాలు, నిఘా పరికరాలను గాజా, పశ్చిమగట్టు ప్రాంతాలలో పాలస్తీనియన్లు ప్రయోగ సమిధలుగా వాడుకుంటున్న దుర్మార్గానికి పాల్పడుతున్నది. హైఫా నగర కేంద్రంగా ఉన్న ఎల్‌బిట్‌ సిస్టమ్స్‌ అనే సంస్థ తాను రూపొందించిన ఐరన్‌ స్టింగ్‌ అనే మోర్టార్‌ బాంబు ఎలా పని చేసేదీ 2021 నుంచి తన వెబ్‌సైట్‌లో ప్రచారం చేసుకుంటున్నది. గాజాలో ఇప్పుడు హమస్‌ను అణచేపేరుతో వాటిని ప్రయోగించి చూస్తున్నారు. పట్టణ ప్రాంతాలు, బహిరంగ ప్రదేశాల్లో కూడా నిర్ణీత లక్ష్యాలను చేరేవిధంగా వీటిని తయారు చేశారు.గాజా జనసమ్మర్ధం గల పట్టణ ప్రాంతమన్నది తెలిసిందే. గురితప్పకుండా ఇక్కడ లక్ష్యాలను చేరితే ప్రపంచవ్యాపితంగా ఎవరికి కావాల్సివస్తే వారికి అమ్మేందుకు ఈ ప్రయోగాలు చేస్తున్నారు. గతంలో ఇలాంటి ప్రయోగాల్లో మారణకాండను సృష్టించిన అనేక ఆయుధాలను ఇప్పుడు ఇజ్రాయెల్‌ ఎగుమతి చేస్తున్నది. అలాంటి వాటిలో ఏకంగా నలభై గంటల పాటు ప్రయాణించి నాలుగు క్షిపణులను మోసుకుపోగల ఇటాన్‌ అనే డ్రోన్ను ఇజ్రాయెల్‌ 2007లో గాజా పౌరుల మీద ప్రయోగించింది, అప్పుడు కూడా వీటి దాడిలో పిల్లలే ఎక్కువగా మరణించారు. ఇప్పుడు వాటిని భారీగా విక్రయిస్తున్నది. మన దేశం వందకు పైగా వీటిని కొనుగోలు చేసి అగ్రస్థానంలో ఉంది. ఇజ్రాయెల్‌ నుంచి ఆయుధాలను కొనుగోలు చేస్తున్న 130కి పైగా దేశాలలో కొలంబియా ఒకటి. అక్కడి అధ్యక్షుడు గుస్టావ్‌ పెట్రో గాజాలో జరుపుతున్న మారణకాండను ఉగ్రవాదంగా వర్ణిస్తూ ఖండించాడు.దాంతో కొలంబియాకు ఆయుధ విక్రయాలను ఇజ్రాయెల్‌ నిలిపివేసింది. ఆయుధ వ్యాపార ఒప్పందాన్ని ఇజ్రాయెల్‌ ఆమోదించలేదు.మారణకాండ, మానవాళిపై నేరాలకు పాల్పడేవారికి ఆయుధాల విక్రయాన్ని ఆ ఒప్పందం నిషేధిస్తున్నది. అందువలన ఇజ్రయెల్‌ జరిపే లావాదేవీలన్నీ రహస్యంగానే ఉంటాయి. ఎవరు, ఎవరికి అమ్మిందీ చెప్పదు, కొనుగోలు చేసిన వారు కూడా వెల్లడించరని 2019లో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ ప్రకటించింది. అందువలన లావాదేవీలు ఎంత అన్నది కూడా అంచనా కష్టం.దక్షిణాఫ్రికాలో స్థానిక ఆఫ్రికన్‌ జాతీయులను అణచివేసిన జాత్యహంకార పాలకులకు విక్రయించింది.అవసరమైతే అణ్వాయుధాలను కూడా ఇచ్చేందుకు సిద్దపడినట్లు బహిర్గతం కావించిన పత్రాలు వెల్లడించాయి. ఎల్‌ సాల్వడార్‌లో తిరుగుబాటుదార్లను అణచివేసేందుకు అక్కడి నియంతలకు నాపాం బాంబులు, ఇతర ఆయుధాలను విక్రయించింది, వాటితో 75వేల మంది పౌరులు మరణించారు. ఎనిమిది లక్షల మంది ప్రాణాలు కోల్పోయిన ర్వాండా మారణకాండలో కూడా ఇజ్రాయెల్‌ తయారీ తుపాకులు, బుల్లెట్లు,గ్రెనేడ్‌లు వాడినట్లు తేలింది.బోస్నియా మీద దాడులు చేసిన సెర్బియాకూ, మయన్మార్‌ మిలిటరీ పాలకులకూ, అజర్‌బైజాన్‌కూ ఆయుధాలను విక్రయించింది. అమెరికా, ఐరోపా దేశాల మాదిరి ఎలాంటి ఆంక్షలనూ విధించదు గనుక ఇజ్రాయెల్‌ నుంచి ఆయుధాలను కొనుగోలు చేయాలని 2018లో నాటి ఫిలిఫ్పీన్స్‌ అధ్యక్షుడు రోడ్రిగో డుటెర్టె ప్రకటించాడు. తాజాగా సవరించిన నిబంధనల ప్రకారం ఎలాంటి అనుమతులతో నిమిత్తం లేకుండా ఎవరికైనా ఆయుధాలను విక్రయించవచ్చు. ప్రస్తుతం గాజాలో మరణించిన, గాయపడిన పాలస్తీనియన్లను పరీక్షించినపుడు కాలిన, ఇతర గాయాలను చూసినపుడు అవి ఎలా జరిగాయన్నది వైద్యులకు సమస్యగా మారింది. గతంలో ఇలాంటి వాటిని చూడలేదని చెప్పారు. దీన్ని బట్టి కొత్త ఆయుధాలను ప్రయోగించారని అనుమానిస్తున్నారు.


యుద్ధం అనేక అనర్ధాలకు మూలం అవుతున్నది. ప్రత్యక్షంగా ఎన్ని ప్రాణాలు పోతాయో, ఎంత మంది దిక్కులేనివారౌతారో, ఎన్ని కుటుంబాలు ఇబ్బందులు పడతాయో, ఎంత బాధ, వేదన కలుగుతుందో చెప్పలేము. పరోక్షంగా జనాల మీద ప్రత్యేకించి కష్టజీవుల మీద విపరీత భారాలను మోపుతుంది. కార్పొరేట్‌ మీడియా వార్తలను ఇస్తుంది తప్ప అది యుద్ధానికి వ్యతిరేకం కాదు. ఇజ్రాయెల్‌ జరుపుతున్న మారణకాండను ఆత్మరక్షణ పేరుతో సమర్థిస్తున్న వారికి మద్దతు ఇస్తున్నది. రష్యాకు నాటో తలపెట్టిన ముప్పును మూసిపెట్టి అది జరుపుతున్న సైనిక చర్య మీద చిలవలు పలవలుగా వార్తలు ఇస్తున్నది. దీనంతటికి అమెరికా, దాన్ని సమర్ధించేదేశాల లాభాల కాంక్ష, యుద్ధోన్మాదమే కారణం. ఏ నేతా శాంతివచనాలు వల్లించటంలో వెనుకబడటం లేదు.ఆచరణలో ఏదో ఒకసాకుతో మిలిటరీ ఖర్చు పెంచుతున్నారు. గతంలో సోవియట్‌ యూనియన్ను మాత్రమే బూచిగా చూపే వారు, ఇప్పుడు రష్యా, చైనాలను పేర్కొంటూ ఆయుధాలను మరింత ఎక్కువగా అంటగట్టేందుకు పూనుకున్నారు. 2020లో డెమోక్రటిక్‌ పార్టీ మిలిటరీ ఖర్చును తగ్గిస్తామని చెప్పింది. గతంలో రిపబ్లికన్‌ డోనాల్డ్‌ ట్రంప్‌ మాదిరి జో బైడెన్‌ అధికారానికి వచ్చిన తరువాత ప్రతి ఏటా పెంచి మరోసారి ఎన్నికలకు సిద్దమౌతున్నాడు. ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ యుద్ధాలను రెచ్చగొట్టటం, ఆయుధాల వ్యాపారం, లాభాలు పిండుకోవటం మామూలే. మిలిటరీ ఖర్చు విషయానికి వస్తే 230 దేశాల్లో ఒక్క అమెరికా చేస్తున్న ఖర్చు 227దేశాల మొత్తానికంటే ఎక్కువ. ఆయుధాల ఎగుమతుల్లో కూడా అదే విధంగా ఉంది. నాటో దేశాలు మిలిటరీ ఖర్చును పెంచాలని డోనాల్డ్‌ ట్రంప్‌ తెచ్చిన వత్తిడిని జో బైడెన్‌ కూడా కొనసాగిస్తున్నాడు. అమెరికా చేస్తున్న ఖర్చులో రష్యా మొత్తం పదిశాతం కంటే తక్కువే.
తాము ఎదురులేని శక్తి అని విర్రవీగుతున్న అమెరికాకు ప్రతి చోటా పరాభవమే మిగులుతోంది. దాన్ని నమ్మితే ఇంతే సంగతులని అనేక దేశాలు అంతర్గతంగా భావిస్తున్నప్పటికీ మిలిటరీ శక్తిగా ఉన్నందున భయపడుతున్నమాట వాస్తవం. చైనా, రష్యాల ముందు అమెరికా పప్పులుడకవని తేలిపోయింది. ఈ పూర్వరంగంలోనే ఐరోపాకు సోవియట్‌ నుంచి ముప్పు ఉందని చెప్పి నాటోను ఏర్పాటు చేశారు. ఇప్పుడు అదే చెబుతూ రష్యాను చుట్టుముట్టేందుకు పూనుకున్నారు. దాన్ని మరింత బలపరుస్తున్నారు. మరోవైపు చైనా నుంచి ఆసియాకు ముప్పు అని ఏ క్షణంలోనైనా తైవాన్ను ఆక్రమిస్తుందని ప్రచారం చేస్తున్నారు.ఈ దశాబ్ద్ది చివరికి చైనా వెయ్యి అణ్వాయుధాలను సమకూర్చుకోనుందని అమెరికా రక్షణశాఖ తప్పుడు నివేదికలను ప్రచారంలో పెట్టింది. ఇవన్నీ చైనా ప్రపంచ మిలిటరీ శక్తిగా ఎదుగుతోంది జాగ్రత్త అని ఇరుగు పొరుగుతో పాటు ప్రపంచ దేశాలను ఆయుధపోటీకి ప్రోత్సహించే ఒక వ్యూహంలో భాగమే. అణ్వాయుధాలు ప్రపంచానికి ముప్పు అన్నది నిజం, ముందుగా ఎవరు మీట నొక్కినా కొద్ది క్షణాల్లో ఇతరులు కూడా అదేపని చేస్తారన్నది కూడా తెలిసిందే.అదే జరిగితే ప్రపంచం మిగలదు. ఎవరికి వారు తగుజాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇతర దేశాలన్నీ తమ మీద కుట్ర చేస్తున్నట్లు, ముప్పు తలపెట్టినట్లు స్వజనాన్ని నమ్మించటం అమెరికా నిత్యకృత్యాలలో ఒకటి. ఆ పేరుతో అన్ని ఖండాలలోని 80 దేశాలలో 800కు పైగా చిన్నా, పెద్ద సైనిక కేంద్రాలను ఏర్పాటు చేసింది. అంటే ఎక్కడికైనా కొద్ది గంటల్లోనే తన మిలిటరీని దింపగలదు. ఇంతవరకు అమెరికా మీద దాడి చేసిన దేశం ఒక్కటంటే ఒక్కటీ లేదు. బ్రిటన్‌ నుంచి స్వాతంత్య్రం పొందిన తరువాత 1,776 నుంచి ఇప్పటి వరకు అమెరికా 68 దేశాల మీద దాడి చేసింది.అందువలన ముప్పు అమెరికా నుంచి రావాలి తప్ప మరొకదేశం నుంచి వచ్చే అవకాశమే లేదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

పాలస్తీనా ప్రజలు చరిత్ర నిర్మిస్తున్నారు

02 Tuesday Jan 2024

Posted by raomk in Current Affairs, imperialism, International, INTERNATIONAL NEWS, Opinion, USA, WAR

≈ Leave a comment

Tags

2023 Israel–Hamas war, Gaza Deaths, Israel genocide, Netanyahu, Recep Tayyip Erdoğan


డాక్టర్‌ కొల్లా రాజమోహన్‌


2023 అక్టోబరు 7న హమాస్‌ ఇజ్రాయెల్‌పై దాడి తరువాత పాలస్తీనాలోని గాజాపై ఇజ్రాయెల్‌ ప్రతీకార దాడులతో మారణకాండకు పూనుకుంది. ఆసుపత్రులు, పాఠశాలలు, శరణార్ధుల కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని కార్పెట్‌ బాంబుదాడులను సాగిస్తోంది. కొరియా, వియత్నాంలపై దురాక్రమణ యుద్ధాలలో ఒక్క అంగుళంకూడా వదలకుండా ఇలాగే అమెరికా మారణహౌమాన్ని సష్టించింది. అదే చరిత్రను పునరావతం చేస్తూ, ఇజ్రాయెల్‌ సైన్యం గాజాలో ఇళ్ళను భూమట్టంచేస్తూ తన పై దాడి చేసిన హమాస్‌ వారిని పట్టుకోలేక, 22 వేలమందికి పైగా సామాన్య అమాయక ప్రజలను హతమార్చింది. ఇందులో 70 శాతం మంది చిన్న పిల్లలు, మహిళల తోపాటుగా జర్నలిస్టులు , డాక్టర్లు కూడా వున్నారు. తీవ్ర అననుకూల పరిస్ధితులలోవార్తలను సేకరిస్తూ, సంఘర్షణలను, బాంబుదాడులను చిత్రీకరిస్తూ 90 మంది జర్నలిస్టులు తమ ప్రాణాలనర్పించారు. హ్యూమన్‌ రైట్స్‌ వాచ్‌ గత వారం ఇజ్రాయెల్‌ ప్రభుత్వం యుద్ధ నేరానికి పాల్పడిందని ప్రకటించింది. ప్రజలకు ఆహారం, నీరు అందకుండా కత్రిమ కరువు ను సష్టించి ప్రజల ప్రాణాలను తీస్తున్నఇజ్రాయల్‌ ప్రధాని నెతన్యాహూని ఈ నాటి హిట్లర్‌ అని టర్కీఅధ్యక్షుడు ఎర్డోగాన్‌ అన్నాడు. అంతేకాకుండా గాజాపై ఈ ఉన్మాద దాడులను ఆపేయాలి అన్నాడు. పాలస్తీనా ప్రజలకు అండగా మేమున్నామంటూ, ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజా ప్రదర్శను ఇస్తాంబుల్‌ పట్టణంలో నిర్వహించారు. మలేసియా ప్రధాని అన్వర్‌ఇబ్రహీమ్‌ తమది ఒక స్వతంత్ర సార్వభౌమ దేశమని, అమెరికా వత్తుడులకు లోంగమన్నారు. తమహక్కులకోసం, స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న పాలస్తీనియన్లకు పూర్తి సహకారం అందిస్తామని పెద్ద ప్రజా ప్రదర్శనను నిర్వహించారు. కొలంబియా అధ్యక్షుడు పెట్రో. దక్షిణ ఆఫ్రికా అధ్యక్షుడు రామపోసా , అమెరికా, జర్మనీ, బ్రిటన్‌, తదితర దేశాల్లో ప్రజలు గాజా ప్రజలకుఅండగా వుంటామన్నారు.

మానవ కల్పిత కరువు

గాజాలోని పాలస్తీనియన్లకు అవసరమయిన ఆహారంలో కేవలం 10 శాతం మాత్రమే అందుతున్నదని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. ఐరాస ఏజెన్సీలు మరియు స్వచ్చంద సహాయ సంస్థల భాగస్వామ్యం అయిన ఇంటిగ్రేటెడ్‌ ఫుడ్‌ సెక్యూరిటీ ఫేజ్‌ క్లాసిఫికేషన్‌ ప్రచురించిన ఒక నివేదికలో, గాజాలో ఉన్న కుటుంబాలు సంక్షోభంలో తీవ్రమైన ఆహార అభద్రతతో బాధపడుతున్నట్లు పేర్కొంది. గాజాలోని మొత్తం 23 లక్షల జనాభా అతిపెద్ద మానవ కల్పిత కరువు ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నదని హెచ్చరించింది.తక్షణ కాల్పుల విరమణ కోసం ఐ రా స పిలుపునిచ్చేందుకు వీల్లేదని అమెరికా వీటోని ప్రయోగించి తన సామ్రాజ్యవాద స్వభావాన్ని మరోసారి నిరూపించుకున్నది. గాజాలో మానవతావాద పరిస్థితి మరింత భయంకరంగా మారడంతో ఇజ్రాయెల్‌ సైనిక చర్య సమర్థించలేనిదిగా మారడంతో, బలమైన మద్దతుదారు అమెరికా, జర్మనీ, బ్రిటన్‌ లలోకూడా ప్రజలు తీవ్ర నిరసనతెలపుతున్నారు. ప్రభుత్వాలు ఇరుకున పడుతున్నాయి.ఎర్ర సముద్రంలోని ”ఇజ్రాయెల్‌- సంబంధిత” నౌకలపై యెమెన్‌ హౌతీ మిలీషియా దాడులను తీవ్రతరం చేయడంతో వివాదం మధ్యప్రాచ్యంలోని ఇతర ప్రాంతాలకు వ్యాపిస్తోంది. ఇజ్రాయల్‌-పాలస్తీనాకు పరిమితమయిన యుద్ధం సముద్రానికి మారింది.

పాలస్తీనాకు మద్దతిస్తున్న హౌతీ రెబెల్స్‌ ఎర్రసముద్రంలో ఇజ్రాయల్‌తో సంబంధమున్న దేశాల నౌకలపై డ్రోన్లు, క్షిపణు లతో దాడులను చేస్తున్నారు. ప్రపంచ వాణిజ్య రంగంలో ముఖ్యమైన నౌకా రవాణా రంగంలో అత్యంత కీలకమైన మార్గమిది. అమెరికా, ఐరోపా దేశాలు ఆసియా, ఆఫ్రికా దేశాలతో వ్యాపారం చేసి లాభాలను ఆర్జిస్తూన్నాయి. ఆఫ్రికా చుట్టూ తిరిగిరాకుండా ఈజిప్ట్‌లోని సూయజ్‌ కాలువ-ఎర్రసముద్రం మీదుగా ఆంతర్జాతీయ వాణిజ్యంసాగుతోంది. బాబ్‌ ఎల్‌ మండెప్‌ జలసంధి వద్ద మార్గం చాలా సన్నంగా 29 కి.మీ. మాత్రమే వుండటం వలన నౌకలపై దాడులకు అనువుగా వుంది. పక్కనే ఉన్న ఎమెన్‌ స్ధావరంగా చేసుకుని హౌతీ రెబెల్స్‌ వాణిజ్య నౌకలపై దాడుల ద్వారా గాజాలో మారణహౌమాన్ని ఆపాలని వత్తిడి తెస్తున్నారు. ఇజ్రాయల్‌, అమెరికా, యూరప్‌లను హడలెత్తిస్తున్నారు. మొత్తం ఆంతర్జాతీయ సమాజానికి అల్టిమేటం ఇస్తున్నారు. పది దేశాల మిలిటరీ బలగాలను ఎర్రసముద్రం లోకి దించి హౌతీలను ఎదుర్కోవాలని అమెరికా”ఆపరేషన్‌ ప్రాస్పరిటీ గార్డియన్‌” వ్యూహాలను రచిస్తున్నది. యుద్ధ నౌకల పహారాతో నౌకలను దాడులనుండి రక్షించటానికి ఎర్రసముద్ర సంకీర్ణ రక్షణ కూటమిని ఏర్పాటు చేసింది. ఈ కూటమిలో అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, బహరైన్‌, షెషల్స్‌, స్పెయిన్‌, నార్వే, నెదర్లాండ్‌, కెనడా, ఇటలీతో 10 దేశాలున్నాయి. ప్రాంతీయ దేశాలలో బలమైన సౌదీ అరేబియా, ఈజిప్టు చేరలేదు. ఒక్క బహ్రైన్‌ చేరింది. కూటమిలో చేరటానికి అన్ని నాటో దేశాలు ఉత్సాహం చూపటంలేదు.

గాజాపై దాడులు ఆపకపోతే ప్రపంచ ఇంటర్నెట్‌పై కూడా దాడి చేస్తామని హౌతీలు హెచ్చరించారు. బాబ్‌ ఎల్‌ మండెప్‌ జలసంధికి దగ్గర సముద్ర కేబుల్‌ నెట్‌ వర్క్‌ వైర్‌లను కత్తిరించేస్తామన్నారు. హౌతీలు వాణిజ్య నౌకల పైననే కాకుండా , అమెరికా యుద్ధనౌకలపైనా, ఇజ్రాయల్‌ రేవులపౖౖె కూడా దాడులను మొదలెట్టారు. వందలకొలదీ నౌకలు సముద్రంలో లంగరు వేసి ఆగిపోయాయి. అతి పెద్ద, యం.స్‌.సీ యునైటెడ్‌ వాణిజ్య నౌక పై డిసెంబర్‌ 26న హౌతీ మిలిటరీ మిస్సైల్‌ తో దాడి చేసినట్లుగా వెల్లడించింది. గెలక్సీ లీడర్‌ అనే ఇజ్రాయల్‌ వ్యాపారి నౌకను హైజాక్‌ చేసి 25 మంది సిబ్బందిని ఎమెన్‌ లో నిర్బంధించారు. ఇజ్రాయల్‌ తో అంటకాగుతున్న ఇండియా నౌకలను కూడా వదలలేదు. ఇండియా వస్తున్నఎం.వి.కెమ్‌.ఫ్లూటో నౌక పైనా, సౌదీనుండి వస్తున్న ఎం.వి.సాయిబాబా నౌకల పైన కూడా డ్రోన్‌ దాడులు జరిగాయి. భారతదేశం 3 యుద్ధ నౌకలను కాపలాగా పంపించింది. అందులో”ఐ యన్‌ యస్‌ మారముగో”గైడెడ్‌ మిస్సైల్‌ విధ్వంసక నౌక కూడా వుంది.

ప్రపంచ ప్రజలు ఉద్యమించాలి

నౌకలు రెడ్‌ సీ ద్వారా రోజుకి 16 నాటికల్‌ మైళ్ళ వేగంతో ప్రయాణించి 25 రోజులలో యూరప్‌ ని చేరగల్గుతున్నాయి. ఎర్రసముద్రాన్ని తప్పించి ఆఫ్రికా చుట్టూ తిరిగి గుడ్‌ హౌప్‌ మార్గం ద్వారా ప్రయాణించటానికి 43 రోజులు పడ్తుంది. వ్యయ ప్రయాసలకోర్చిరూట్‌ మార్చే ప్రయాణానికి 9 రోజులనుండి 30 రోజులు ఆలస్యమవుతుంది. 15 రోజులు ప్రయాణ కాలం పెరిగితే నౌకకు ఇంధనం ఖర్చు అదనంగా 10లక్షల డాలర్ల వుతాయి. వందకు పైగా వాణిజ్య నౌకలు రూటు మార్చుకున్నాయి. ఆఫ్రికా చుట్టూ తిరిగి వెళ్తున్నాయి. భీమా కంపెనీలు ప్రతి కంటైనర్‌ మీద 700 డాలర్ల సర్‌ ఛార్జి విధిస్తున్నాయి. నిత్యవసరవస్తువులన్నిటికీ ఆసియా, ఆఫ్రికా దేశాలపై ఆధారపడిన అమెరికా యూరప్‌ దేశాలు సరుకుల రవాణా ఆలస్యాన్ని భరించలేవు. ఖర్చు పెరుగుతుంది. ఆసియా ధేశాలకు చమురు సహజ వాయువు దిగుమతులు కష్టవుతాయి. ప్రపంచవ్యాపితంగా ధరలు పెరిగి ద్రవ్యోల్బణం సంభవించి ఆర్ధిక సంక్షోభానికి దారి తీస్తుంది. అంతర్జాతీయ వాణిజ్యానికి ప్రమాదంగా పరిణమించిన సమస్యను పరిష్కరించాలంటే గాజా పై ఇజ్రాయల్‌ మానవ హననాన్ని ఆపేటట్లుగా ప్రపంచ ప్రజలు ఉద్యమించాలి.

టెక్నాలజీ, ఆయుధాలు సమస్యలన్నిటినీ పరిష్కరిస్తాయనే విశ్వాసం అన్నిసార్లూ వాస్తవం కాదని పాలస్తీనీయులు, హౌతీలు నిరూపించారు. ప్రపంచంలో అత్యంత ఆధునిక టెక్నాలజీ సహాయంతో ఏదైనా ముందే కనుక్కోగలమనే ఇంటలిజెన్స్‌ నెట్‌ వర్క్‌ వున్నదనుకుని విర్రవీగే ఇజ్రాయల్‌ ప్రభుత్వం, హమాస్‌ దాడిని ముందే పసిగట్టలేకపోయింది. హఠాత్తుగా జరిగిన అక్టోబర్‌ 7 దాడిని జీర్ణించుకోలేక సాగిస్తున్నవిశంఖలదాడులు హమాస్‌ ని పట్టుకోవటం లో విఫలం చెంది విచక్షణారహితంగా సామాన్యప్రజలను హతమారుస్తున్నారు. 200 డాలర్లతో తయరయ్యే డ్రోన్‌ ల తో , లక్షలకోట్ల డాలర్ల విలువ చేసే నౌకలను హౌతీలు హడలెత్తిస్తున్నారు. అంతర్జాతీయ వాణిజ్యం సంక్షోభం లోకి జారేటట్లున్నది. వరస ఎదురుదెబ్బలు తింటూ, డాలర్‌ పతనం ప్రారంభమయి, ఉక్రెయిన్‌ లోకూడా భంగపడబోతున్న అమెరికాకు ఇజ్రాయల్‌ దుశ్చర్యలను చివరకంటా బలపరచటం సాధ్యంకాదు. ప్రజలే చరిత్రను నిర్మిస్తున్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఐరాస ప్రధాన కార్యదర్శినీ ధిక్కరించిన వైనం : గాజాలో నరమేథ పాత్రధారి ఇజ్రాయెల్‌ – సూత్రధారి అమెరికా !

09 Saturday Dec 2023

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, International, INTERNATIONAL NEWS, Opinion, Politics, UK, USA, WAR

≈ Leave a comment

Tags

Gaza Deaths, Israel Attack 2023, Israel genocide, Israel-Hamas war, Joe Biden, UNSC Failures, US Veto


ఎం కోటేశ్వరరావు


శుక్రవారం నాడు అనుకున్నట్లే జరిగింది. వర్తమాన మానవాళి చరిత్రలో మరోదారుణ మారణకాండ, గాజాలో మొత్తం పాలస్తీనియన్లనే లేకుండా చేసే దుర్మార్గానికి పూనుకున్న ఇజ్రాయెల్‌కు మీకు అండగా నేనున్నా ముందుకుపోండి, సర్వనాశనం చేయండి అంటూ అమెరికా నిస్సిగ్గుగా ముందుకు వచ్చింది. పొద్దున లేస్తే ప్రపంచానికి మానవహక్కుల గురించి సుభాషితాలు చెప్పే అమెరికన్లు గాజాలో తక్షణమే మానవహననాన్ని నిలిపివేయాలని కోరిన భద్రతా మండలి తీర్మానాన్ని అడ్డుకున్నారు. ఐరాస ప్రధాన కార్యదర్శి ఆటోనియో గుటెరస్‌ తనకున్న ప్రత్యేక అధికారాన్ని ఉపయోగించి ఆర్టికల్‌ 99 ప్రకారం చేసిన వినతినీ పెడచెవిన పెట్టింది. కాల్పులను విరమించాలంటూ అరబ్‌ దేశాల బృందం తరఫున యుఏయి ప్రతిపాదించిన తీర్మానాన్ని అమెరికా వీటో అధికారంతో తోసిపుచ్చింది.పదిహేను మంది సభ్యులుండే మండలిలో మిగిలిన 14 మందిలో పదమూడు మంది మద్దతు ప్రకటించారు. అమెరికా అడుగులకు మడుగులొత్తే బ్రిటన్‌ ఓటింగ్‌కు దూరంగా ఉండి నేనూ మీ వైపే ఉన్నానంటూ ఇజ్రాయెల్‌కు మద్దతు పలికింది. దారుణాన్ని నివారించేందుకు సమయం ఆసన్నమైందంటూ చరిత్ర, ప్రపంచ నేత్రాలు చూస్తున్నట్లు అంతకు ముందు గుటెరస్‌ అన్నాడు. గాజాలో 339 విద్యా సంస్థలు, 26 ఆసుపత్రులు, 56 ఆరోగ్యకేంద్రాలు, 88 మసీదులు, మూడు చర్చ్‌లను కూల్చివేశారు. అరవైశాతం గృహాలను నాశనం చేశారు, 85శాతం జనాభాను ఇళ్ల నుంచి తరమివేశారు, వేలాది మంది ప్రాణాలు తీశారని చెప్పాడు. ఎక్కడా రక్షణ లేదన్నాడు. శనివారం ఉదయానికి అందిన సమాచారం ప్రకారం మరణాల సంఖ్య 17,487కు పెరిగింది. తీర్మానాన్ని అడ్డుకోవద్దంటూ చివరి ప్రయత్నంగా సౌదీ విదేశాంగ మంత్రి ఫర్హాన్‌ అమెరికా విదేశాంగమంత్రి ఆంటోని బ్లింకెన్‌న్ను కోరినప్పటికీ వినిపించుకోలేదు. గాజాలో జాతి నిర్మూలన లక్ష్యంగా ఇజ్రాయెల్‌ ఉందనే వాస్తవం తెలియదని నటించేందుకు మనం ఇక్కడున్నామా అని ఐరాసలో పాలస్తీనా శాశ్వత ప్రతినిధి రియాద్‌ మన్సూర్‌ సభ్యులను అడిగాడు. దాడులను విరమిస్తే మరో యుద్ధానికి విత్తులు చల్లినట్లే అవుతుందని అంతకు ముందు అమెరికా ప్రతినిధి రాబర్ట్‌ ఉడ్‌ చెప్పాడు. రెండు దేశాలు ఏర్పడాలని అసలు హమస్‌ కోరుకోవటం లేదని ఆరోపించాడు. ఆర్టికల్‌ 99ని ప్రయోగించటం ద్వారా గుటెరస్‌ పక్షపాతంగా వున్నట్లు తేలిందని ఇజ్రాయెల్‌ ఆరోపించింది. వందకు పైగా దేశాలు యుఏయి తీర్మాన సహప్రతిపాదకులుగా ఉన్నాయి. వారిలో ఒకటైన చైనా ప్రతినిధి ఝాంగ్‌ జున్‌ మాట్లాడుతూ మాటలకందని మానవ విషాదమిది, ఒక్క క్షణం ఆలస్యం చేసినా మరిన్ని మరణాలు సంభవిస్తాయి, ప్రస్తుత తరుణంలో కాల్పుల విరమణ తప్ప మరొక మార్గం లేదన్నాడు.


గాజాలో జరుగుతున్న దారణాలను జరుపుతున్నది ఇజ్రాయెల్‌ అయితే దాని వెనుక సూత్రధారి అసలైన యుద్ధ నేరస్తురాలు అమెరికా అన్నది స్పష్టం. గాజాలో జరుగుతున్న అత్యాచారాలకు ఇజ్రాయెల్‌ బాధ్యురాలు కాగా దానికి ఆయుధాలు అందిస్తున్నది, దౌత్యపరమైన రక్షణ కవచాన్ని కల్పిస్తూ యుద్ధ నేరాల్లో అమెరికా భాగస్వామి అవుతున్నదని, రెండు దేశాలూ కలసి పాలస్తీనియన్లను శిక్షిస్తున్నాయని మానవహక్కుల నిఘా సంస్థ ప్రకటించింది. భద్రతా మండలిలో అమెరికా వీటో తరువాత ఈ ప్రకటన వెలువడింది. గాజా పౌరుల మీద దాడులు చేస్తున్న ఇజ్రాయెల్‌ టాంకులకు అవసరమైన 45వేల ప్రాణాంతక మందుగుండ్లను విక్రయించేందుకు అనుమతించాలని జో బైడెన్‌ యంత్రాంగం పార్లమెంటును కోరింది. ఒక జర్నలిస్టుతో సహా అనేక మంది పురుషులను డ్రాయర్లతో తిప్పుతూ వారంతా హమస్‌ తీవ్రవాదులంటూ తీసిన చిత్రాలను ఇజ్రాయెల్‌ విడుదల చేసింది. అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా మానవతాపూర్వక, వైద్య సాయం అందించే బృందాలను అనుమతించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇజ్రాయెల్‌ను కోరింది. గాజాలో ఇజ్రాయెల్‌ దాడులు ప్రారంభమైన తరువాత తొలిసారిగా శుక్రవారం నాడు ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌లో ఉన్న అమెరికా రాయబార కార్యాలయం మీద రాకెట్ల దాడి జరిగింది. అమెరికా అందించిన మారణాయుధాలతో ఇజ్రాయెల్‌ జరిపిన రెండు వైమానికదాడుల్లో డజన్లకొద్దీ పౌరులు మరణించినట్లు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ పేర్కొన్నది. రెండు చోట్లా ఇటీవలే అమెరికా సరఫరా చేసిన బోయింగ్‌ తయారీ ఆయుధాల కిట్లు కనిపించాయి. మరోవైపు పౌరుల ప్రాణాలను కాపాడాలంటూ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ ఇజ్రాయెల్‌కు సుభాషితాలు వినిపించారు.డెబ్బయి శాతం పిల్లలు, మహిళలతో సహా 17వేల మంది మరణించిన తరువాత ఈ కబుర్లు చెప్పారు. మేం చెప్పేది చెబుతాం మీపని మీరు కానివ్వండి అన్నట్లుగా అమెరికా నేతల తీరుతెన్నులు ఉన్నాయి. ఇజ్రాయెల్‌-హమస్‌ చర్యల్లో ఉన్న యుద్ధ నేరాలను విచారించటం తమ ప్రాధాన్యత అని అంతర్జాతీయ నేర కోర్టు ప్రధాన ప్రాసిక్యూటర్‌ కరీమ్‌ ఖాన్‌ చెప్పాడు. అయితే ఈ కోర్టు అధికారాన్ని అమెరికా గుర్తించటం లేదు. ఇజ్రాయెల్‌ మీద విచారణ తూతూ మంత్రంగా ఉందని పాలస్తీనా అధికారులు, బాధితులు, న్యాయనిపుణులు విమర్శించారు. ముందుగా ఇజ్రాయెల్‌ను సందర్శించిన తరువాత పశ్చిమ గట్టు ప్రాంతంలో కరీమ్‌ ఖాన్‌ విచారణ జరిపాడు. కేవలం పదినిమిషాల్లో బాధితులు చెప్పదలచుకున్నదానిని ముగించాలని కోరటంతో వచ్చిన వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు గంటసేపు విన్నారు. ఆ గంటలో ఆలకించిన తీరు చూసిన తరువాత ద్వంద్వ ప్రమాణాలు పాటించినట్లు, కేవలం హమస్‌ చేసిందాన్ని గురించి విచారించటానికే వచ్చినట్లుంది తప్ప ఇజ్రాయెల్‌ రెండు నెలలుగా చేస్తున్న తీవ్ర దాడులు పెద్దగా పట్టినట్లు లేదని బాధితులు విమర్శించారు. ఆసుపత్రులు, శరణార్ధి శిబిరాలు, ఐరాస కేంద్రాల మీద దాడులతో సహా తాము చేస్తున్నవన్నీ చట్టబద్దమే అని ఇజ్రాయెల్‌ బుకాయిస్తున్నది. వాటిని హమస్‌ మానవ కవచాలుగా మార్చుకున్నందున దాడులు చేయకతప్పదని అంటున్నది.


ఇజ్రాయెల్‌ చెబుతున్న కథలన్నింటినీ నిజమే అని అమెరికా సమర్ధిస్తున్నది. ఇజ్రాయెల్‌ చేస్తున్నది కార్పెట్‌ బాంబింగ్‌(ఒక్క అంగుళాన్ని కూడా వదల కుండా నాశనం చేయటం) కాదని, అది వేరే అని అధ్యక్షుడు జో బైడెన్‌ చెబుతున్నాడు. ఆసుపత్రుల మీద దాడులు చేసినపుడు ఇజ్రాయెల్‌ వైద్యులు,అంబులెన్సులను కూడా తమతో పాటు తీసుకువచ్చిందని తమకు సమాచారం ఉందన్నాడు. అయినా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నాం గదా అన్నాడు. తాము దాడులు చేస్తున్న ప్రాంతాల నుంచి వెళ్లిపోవాలని జనానికి చెబుతున్నందున ఇజ్రాయెల్‌ వారి మీద దాడులు చేస్తున్నట్లు ఎలా అవుతుందని అమెరికా భద్రతా సలహాదారు జేక్‌ సులివాన్‌ వాదిస్తున్నాడు. ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకొని పౌరులకు పరిమితహాని కలిగే విధంగా ఒక సార్వభౌమత్వదేశం ముందుకు పోవద్దని ఎలా చెబుతారని ఎదురు ప్రశ్నించాడు. యుద్ధంలో రెండు పక్షాలూ చట్టాలను ఉల్లంఘిస్తాయి అని అమెరికా గూఢచార శాఖలో మానవ హక్కుల డైరెక్టర్‌గా పనిచేసిన అలైస్‌ బోర్నీ చెప్పింది. ఒకవైపు పౌరుల మరణాలు పెరుగుతుండగా మరోవైపు దాడులు కొనసాగుతున్నకొద్దీ అమెరికా మద్దతు తగ్గిపోతుందేమోనని ఇజ్రాయెల్‌ ఆందోళన చెందుతున్నట్లు మాజీ భద్రతా సలహాదారు హులాటా చెప్పాడు. మా మద్దతు ఇక ఉండదు అని అమెరికా చెప్పే తరుణం రావచ్చు అన్నాడు. అమెరికా ఎన్నికలు దగ్గరపడే కొద్దీ సహజంగానే బైడెన్‌ మీద వత్తిడి పెరుగుతుంది.


శరణార్ధి శిబిరాల్లో ఖాళీలేకపోవటంతో రహదారులు, ఖాళీ ప్రదేశాల్లో పాలస్తీనియన్లు ఉంటున్నారు. అంతర్జాతీయ న్యాయ సూత్రాల ప్రకారం జనాన్ని ఖాళీ చేయించినపుడు మరోచోట వారికి తగినన్ని ఏర్పాట్లు చేయాలని గాజాలో ఎక్కడా అలాంటి ఆనవాళ్లు లేవని ఐరాస బాలల నిధి ప్రతినిధి జేమ్స్‌ ఎల్డర్‌ చెప్పటం మానవతాపూర్వక సాయం అందిస్తున్నట్లు పశ్చిమ దేశాలు చేస్తున్న ప్రచారం బండారాన్ని వెల్లడించింది. ఇరవై మూడులక్షల మంది పౌరుల్లో 19లక్షల మంది నెలవులు తప్పారు, పదిలక్షల మంది ఐరాస శిబిరాల్లో పేర్లు నమోదు చేసుకున్నారు. భవిష్యత్‌లో తమ మీద దాడులు జరగకుండా గాజా ప్రాంతాన్ని మిలిటరీ రహితంగా ఉంచాలన్న ఇజ్రాయెల్‌ ప్రతిపాదనను అమెరికా కూడా వ్యతిరేకించింది. అది పాలస్తీనా ప్రాంతంగా ఉండాల్సిందేనని పేర్కొన్నది.గాజా ఎలా ఉండాలన్నది అక్కడి పౌరులు నిర్ణయించాలని టర్కీ పేర్కొన్నది. ఇజ్రాయెల్‌ మారణకాండ ప్రారంభమైనప్పటి నుంచి ఎమెన్‌లోని హౌతీ సాయుధశక్తులు అడపాతడపా ఎర్ర సముద్రంలో ఇజ్రాయెల్‌, దానికి మద్దతు ఇస్తున్న అమెరికా, ఇతర పశ్చిమ దేశాల నౌకల మీద దాడులు చేస్తున్నాయి. లక్షల మంది సాయుధులతో పాటు దాని దగ్గర నౌకా దళం నుంచి ప్రయోగించే ఖండాంతర క్షిపణులు, సాయుధ డ్రోన్లు కూడా ఉన్నాయి. ఇజ్రాయెల్‌ దాడులను ఆపివేయించేందుకు అమెరికా మీద వత్తిడి తేవటమే ఈ దాడుల లక్ష్యం.

ఇప్పటి వరకు అమెరికా పాటించిన సంయమనాన్ని ముందు కూడా కొనసాగించాలని తాజాగా సౌదీ అరేబియా కోరింది. ఈ దాడుల వెనుక ఇరాన్‌ హస్తం ఉందని అమెరికా ఆరోపిస్తూ కవ్విస్తున్నది.ఇటీవలి కాలంలో ఇరాన్‌తో సయోధ్య కుదుర్చుకున్న సౌదీ ఇజ్రాయెల్‌ దాడులను ఆటవిక చర్యలంటూ ఖండిస్తున్న సంగతి తెలిసిందే. అంతకు ముందే అమెరికా కుట్రలో భాగంగా ఇదే సౌదీ తొమ్మిదిన్నర సంవత్సరాల పాటు హౌతీ తిరుగుబాటుదార్లను అణచేందుకు విఫల యత్నం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వారితో నేరుగా చర్చలు జరుపుతూ శాంతి క్రమం ముందుకు పోవాలని కోరుకుంటున్నది. ఎమెన్‌ పౌరులు,అరబ్బు. ఇస్లామిక్‌ దేశాల్లో స్వేచ్చను కోరుకొనే జనాల ఆకాంక్షల మేరకు పాలస్తీనియన్లకు మద్దతుగానే తాము దాడులు చేస్తున్నట్లు ఎమెన్‌లో అధికారాన్ని చేజిక్కించుకున్న శక్తులు ప్రకటించాయి. దాడులను విరమించే వరకు కొనసాగిస్తామని కూడా స్పష్టం చేశాయి. వారు ప్రయోగిస్తున్న క్షిపణులు సౌదీ గగనతలం నుంచే వెళుతున్నందున అమెరికా ప్రతిదాడులకు పూనుకుంటే మధ్యలో సౌదీ ఇరుక్కుపోయే అవకాశం ఉంది. అందువలన వివాదం మరింత ముదరకుండా చూసుకొనేందుకే సంయమనం పాటించాలని కోరిందన్నది స్పష్టం.ఎర్ర సముద్రంలో అమెరికా యుద్ధ నౌకలు తిష్టవేసి ఆ ప్రాంత దేశాల మీద బెదిరింపులకు దిగిన అంశం ఎరిగినదే. హమస్‌ వద్ద బందీలుగా ఉన్నవారిని విడిపించేందుకు చర్యలు తీసుకోవటం లేదంటూ ఇజ్రాయెలీలు నెతన్యాహు ప్రభుత్వానికి నిరసన తెలుపుతున్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

రెండు నెలల గాజా మారణకాండ మరింత తీవ్రం – సొరంగాల్లో ఉప్పునీరు !

07 Thursday Dec 2023

Posted by raomk in Current Affairs, History, imperialism, International, INTERNATIONAL NEWS, Opinion, USA, WAR, Women

≈ Leave a comment

Tags

Gaza Deaths, Gaza Tunnels, HAMAS attacks 2003, Israel Attack 2023, Israel-Hamas war, Joe Biden, Netanyahu


ఎం కోటేశ్వరరావు


మానవాళి చరిత్రలో అత్యంత విషాదానికి దారితీసే విధంగా గాజాలో పరిస్థితి ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి రిచర్డ్‌ పీపర్‌కోన్‌ చెప్పాడు. రెండు నెలలుగా మారణకాండ సాగుతోంది. ఐక్యరాజ్యసమితి దీన్ని నివారించటంలో ఘోరంగా విఫలమైంది.గాజాలోని రెండవ పెద్ద పట్టణమైన ఖాన్‌ యూనిస్‌లో ఇజ్రాయెల్‌ మిలిటరీకి అడుగడుగునా ప్రతిఘటన ఎదురవుతున్నట్లు వార్తలు. ఎర్ర సముద్రంలో ఇజ్రాయెల్‌ నౌకలపై ఎమెన్‌ సాయుధ శక్తుల దాడి, సంయమనం పాటించాలని అమెరికాను కోరిన సౌదీ అరేబియా.ఇప్పటికైనా మానవతా సంక్షోభాన్ని నివారించండని భద్రతా మండలిని తొలిసారిగా కోరిన ఐరాస ప్రధాన కార్యదర్శి.ఈ పరిణామాలన్నీ గాజాలో సాగుతున్న మారణకాండ, దాని పర్యవసానాలు మధ్యప్రాచ్యం పడుతున్న తీరు, మొత్తం మీద దిగజారుతున్న పరిస్థితిని సూచిస్తున్నాయి. పశ్చిమ గట్టు ప్రాంతంలో కూడా పాలస్తీనా పౌరుల మీద దాడులు కొనసాగుతున్నాయి. అంబులెన్సులను కూడా ఇజ్రాయెల్‌ మిలిటరీ అడ్డుకుంటున్నది. గాజాలో పౌరుల సామూహిక వధను ఆపాలని, ఐరాస సభ్యదేశాలు ఈ సంక్షోభంలో జోక్యం చేసుకోవాలని పాలస్తీనాలో మానవహక్కులపై ఐరాస ప్రత్యేక నివేదకురాలు ఫ్రాన్సెస్కా అల్బనీస్‌ మంగళవారం నాడు కోరారు. ఈ విషాదం మీద స్పందించటంలో అంతర్జాతీయ సమాజం పక్షవాతానికి గురైనట్లుగా ఉందని, ప్రసుతం తీవ్ర మారణహౌమ ముప్పు ఉందని హెచ్చరించారు. గాజాలో సంభవిస్తున్న మరణాల్లో సగమే వెల్లడౌతున్నాయని గతంలో తాను చేసిన వ్యాఖ్యకు కట్టుబడి ఉన్నట్లు స్పష్టీకరించారు. ఆత్మ రక్షణ కోసం దాడులు జరుపుతున్నట్లు ఇజ్రాయెల్‌ చెప్పటాన్ని కూడా ఆమె తిరస్కరించారు.కేవలం హమస్‌ను మాత్రమే కాదు మొత్తం గాజాను నాశనం చేయటం లక్ష్యమని అల్బనీస్‌ అన్నారు.

ప్రస్తుత యుద్ధం ముగిసిన తరువాత గాజాను మిలిటరీ రహిత ప్రాంతంగా మారుస్తామని ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు ప్రకటించాడు. పోరు ఎంతకాలం సాగినా కొనసాగించేందుకు తాము సన్నద్దంగా ఉన్నట్లు హమస్‌ సీనియర్‌ నేత ఒసామా హందన్‌ చెప్పాడు. పాలస్తీనా అనుకూల మరియు పర్యావరణ పరిరక్షణ కోరే బృందాల పట్ల కఠినంగా వ్యవహరించిన తీరు కారణంగా ప్రపంచ పౌరహక్కుల సూచికలో జర్మనీ దిగజారినట్లు ప్రకటించారు. గాజాలో జరుగుతున్న మానవ సర్వనాశనం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని, అంతర్జాతీయ చట్టాలను పాటించాలని, రెండు దేశాల ఏర్పాటు పరిష్కారానికి యత్నాలను తీవ్రతరం గావించాలని కతార్‌-సౌదీ సమన్వయ కమిటీ కోరింది. తమ వైమానిక దాడుల్లో అనేక మంది హమస్‌ నేతలను హతమార్చినట్లు ఇజ్రాయెల్‌ చెప్పుకుంది..


ఏడు రోజుల విరామంలో హమస్‌ వద్ద ఉన్న వారిలో వంద మంది బందీలు, ఇజ్రాయెల్‌ జైళ్లలో అక్రమంగా నిర్బంధంలో ఉన్న పాలస్తీనా పౌరుల్లో 240 మంది విడుదల తరువాత పెద్ద ఎత్తున గాజా మీద ఇజ్రాయెల్‌ దాడులకు దిగింది. ఇంకా హమస్‌ వద్ద 138 మంది బందీలు, వేలాది మంది పాలస్తీనా పౌరులు జైళ్లలో ఉన్నారు. బుధవారం ఉదయానికి అందిన సమాచారం మేరకు గత రెండు నెలల దాడుల్లో 16,248 మంది పాలస్తీనియన్లు మరణించారు. దాదాపు 50వేల మంది గాయపడ్డారు.మరికొన్ని వేల మంది శిధిలాల కింద మరణించి ఉంటారని భయపడుతున్నారు. కూల్చిన భవనాల శిధిలాలను తొలగించే అవకాశం కూడా లేదు. దాడులను విరమించే వరకు చర్చల ప్రసక్తే లేదని హమస్‌, దాడులను కొనసాగించి తీరుతామని ఇజ్రాయెల్‌ ప్రకటించాయి. ఇదిలా ఉండగా బందీల విడుదలకు ప్రధాని నెతన్యాహు ప్రయత్నించటం లేదంటూ ఇజ్రాయెల్‌లో కుటుంబసభ్యులతో పాటు అనేక మంది తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇజ్రాయెల్‌ మారణకాండలో 70శాతంపైగా పిల్లలు, మహిళలే ఉండటం, ఆసుపత్రులు, ఐరాస కేంద్రాలతో సహ నిర్వాసితుల శిబిరాలపై కూడా మారణకాండను కొనసాగించటంతో ప్రపంచ మంతటా తీవ్ర నిరసన వెల్లడి అవుతోంది. దీంతో ఇజ్రాయెల్‌ ప్రభుత్వం, దానికి వంతపాడే బిబిసి వంటి మీడియా సంస్థలు, నిస్సిగ్గుగా మద్దతు ఇస్తున్న జో బైడెన్‌ వంటి వారు అరవై రోజుల తరువాత కొత్త పల్లవి అందుకున్నారు. గాజాలోని సొరంగాల్లో దాగి ఉన్నారని భావిస్తున్న హమస్‌ సాయుధులను వెలుపలికి రప్పించేందుకు విష పూరిత వాయువులను పంపాలని గతంలో ఇజ్రాయెల్‌ ఆలోచించింది. ఇప్పుడు దాని బదులు మధ్యధరా సమద్రం నుంచి నీటిని తోడి సొరంగాల్లోకి పంపాలని చూస్తున్నది.


హమస్‌ సాయుధులు అక్టోబరు ఏడవ తేదీన ఇజ్రాయెల్‌ మీద జరిపిన దాడి సందర్భంగా అనేక మంది పిల్లలతో సహా మహిళలపై అత్యాచారాలు చేశారని, అంగవిచ్చేదనలకు పాల్పడ్డారంటూ కొత్త కథనాలను ప్రచారంలోకి తెచ్చారు.ఎలాంటి సందిగ్దతకు, మినహాయింపులకు తావు లేకుండా ఇజ్రాయెల్‌ మహిళలపై జరిపిన అత్యాచారాలను ఖండించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ అన్నాడు. అంతర్జాతీయ మానవహక్కుల సంస్థలు, బృందాల నుంచి ఎలాంటి ఖండన ప్రకటనలను తాను వినలేదు, చూడలేదని ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు చెప్పాడు.దక్షిణ గాజాలో రెండు లక్షల మందికి పైగా జనాభా ఉన్న ఖాన్‌యూనిస్‌ పట్టణాన్ని సర్వనాశనం చేసేందుకు మంగళవారం నుండి ఇజ్రాయెల్‌ సేనలు విమానాలు, టాంకులతో దాడులు జరుపుతున్నాయి. అక్కడ ఎందరు ప్రాణాలు కోల్పోయిందీ ఇంకా వెల్లడి కాలేదు. పౌరులు పట్టణాన్ని ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మరింత దక్షిణంగా అంటే ఈజిప్టు సరిహద్దువైపు వెళ్లాలంటూ వెదజల్లిన కరపత్రాలలో పేర్కొన్నారు. తమ భూభాగంలోకి శరణార్ధులు రాకుండా ఈజిప్టు సరిహద్దులను మూసివేసింది. ఉత్తర గాజాతో పోలిస్తే దక్షిణ ప్రాంతంలో జన నష్టం జరగకుండా నిర్దిష్ట సమాచారంతో దాడులు జరుపుతున్నట్లు ప్రపంచాన్ని నమ్మించేందుకు ఇజ్రాయెల్‌ చూస్తున్నది. జనాన్ని అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు వెళ్లిపోవాలని తరుముతున్న ఇజ్రాయెల్‌ మిలిటరీ నుంచి అమాయకులైన పౌరులకు ఎక్కడా రక్షిత ప్రాంతమంటూ లేకుండా పోయింది. ఒకసారి ఖాళీ చేసిన ప్రాంతానికి తిరిగి అనుమతించటం లేదు. ఖాన్‌ యూనిస్‌ పట్టణం చుట్టూ ఆరుకిలోమీటర్ల పరిధిలో 150 ఇజ్రాయెలీ టాంకులు, సాయుధులతో కూడిన అనేక వాహనాలు ఉన్నట్లు ఉపగ్రహ చిత్రాలు చూపుతున్నాయి.యుద్ధ విమానాలు కూడా దాడులు జరుపుతున్నాయి.మరోసారి అక్టోబరు ఏడున హమస్‌ జరిపిన మాదిరిదాడులు పునరావృతం కాకుండా చూసేందుకు ఆ సంస్థ మిలిటరీ మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసే దిశగా తాము దాడులు జరుపుతున్నట్లు ఇజ్రాయెల్‌ చెబుతున్నది.


గత రెండు నెలల దాడుల్లో ఐదువేల మంది హమస్‌ తీవ్రవాదులను మట్టుపెట్టామని ఇజ్రాయెల్‌ చెప్పటం తప్ప ఎలాంటి ఆధారాలను చూపలేకపోయింది.తమ దాడుల్లో మరణించిన నిరాయుధులైన పౌరులను హమస్‌ తీవ్రవాదులుగా చిత్రిస్తున్నది. తమ సైనికులు 86 మంది మరణించినట్లు ప్రకటించింది.అన్ని రకాల మత, నైతిక, మానవతా విలువలను ఉల్లంఘిస్తున్న ఇజ్రాయెల్‌ ఆక్రమిత పాలస్తీనాలో మారణకాండ జరుపుతున్నదని ఏడు రోజుల దాడుల విరామం, బందీలు, ఖైదీల విడుదల చర్చలకు మధ్యవర్తిత్వం వహించి కతార్‌ పాలకుడు హమద్‌ అల్‌ తానీ దోహాలో జరిగిన అరబ్‌ నేతల సమావేశంలో విమర్శించాడు. ఆత్మరక్షణ పేరుతో ఇదంతా చేస్తున్నారని మారణకాండ నేరాన్ని ఆత్మరక్షణ అనుమతిస్తుందా అని ప్రశ్నించారు. కతార్‌లో హమస్‌ రాజకీయ కార్యాలయంతో పాటు అనేక మంది నేతలు అక్కడే ఉంటున్నారు. ఇజ్రాయెల్‌ షిన్‌బెట్‌ భద్రతా సంస్థ అధిపతి రొనెన్‌ బార్‌ ఒక ఆడియో ప్రకటన చేస్తూ కతార్‌తో సహా హమస్‌ నేతలు ఎక్కడ ఉన్నా వారిని అంతం చేస్తామని బెదిరించాడు. గాజా మీద రెండవ దశ పేరుతో పెద్ద ఎత్తున దాడులు చేస్తున్న ఇజ్రాయెల్‌ సరిహద్దులో ఉన్న లెబనాన్ను కూడా కవ్విస్తున్నది.అక్కడ ఉన్న హిజబుల్లా సాయుధులపై జరిపిన దాడిలో లెబనాన్‌ మిలిటరీ పోస్టులో ఉన్న ఒక సైనికుడి ప్రాణాలు పోయినట్లు లెబనాన్‌ ప్రకటించింది. సరిహద్దు ఆవల నుంచి తమ మీద దాడి జరిగిందని, క్షిపణులు జనం లేని చోట పడినట్లు, తమ విమానాలు హిజబుల్లా మిలిటరీ కేంద్రాల మీద దాడులు చేసినట్లు ఇజ్రాయెల్‌ చెబుతున్నది. ఇజ్రాయెల్‌ ఆక్రమించిన గోలన్‌ గుట్టల మీద అక్టోబరు ఎనిమిది నుంచి హిజబుల్లా అడపాదడపా దాడులు జరుపుతున్నది.తరువాత మొత్తం సరిహద్దు వెంబడి ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.


గాజాలో జరుపుతున్న నేరాలను ఇతర ప్రాంతాలకు విస్తరించవద్దని టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్‌ ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహుకు హితవు చెప్పాడు. అదే జరిగితే మొత్తం ప్రాంత భద్రతకు ముప్పు ఏర్పడుతుందని హెచ్చరించాడు. రాజకీయ మనుగడకోసం నెతన్యాహు మొత్తం ప్రాంతాన్ని ప్రమాదంలోకి నెడుతున్నాడని విమర్శించాడు. తమ గడ్డ మీద ఉన్న హమస్‌ సభ్యులను లక్ష్యంగా చేసుకొని దాడులు జరపవద్దని టర్కీ హెచ్చరించింది. ఇజ్రాయెల్‌ భద్రతా సంస్థ అధినేత రొనెన్‌ బార్‌ చేసిన ప్రకటనలో లెబనాన్‌, టర్కీ, కతార్‌లలో ఎక్కడ ఉన్నా హతమారుస్తామని బెదిరింపు ప్రకటన తరువాత టర్కీ నుంచి ఈ ప్రకటనవెలువడింది. గతంలో విదేశీ శక్తుల చట్టవిరుద్ద పనులను తాము అడ్డుకున్నట్లు గుర్తు చేసింది. అనేక సంవత్సరాలుగా ఇజ్రాయెల్‌ మొసాద్‌ ఏజంట్లు అనేక దేశాల్లో తమ వ్యతిరేకులను హత్య చేస్తున్న సంగతి తెలిసిందే. హమస్‌ ఒక విముక్త సంస్థ తప్ప ఉగ్రవాది కాదని అందుకు వారికి ఆశ్రయం కల్పిస్తున్నట్లు గతంలో ఎర్డోగన్‌ ప్రకటించాడు.


హమస్‌ సాయుధుల జాడ కనుగొనటంలో విఫలమైన ఇజ్రాయెల్‌ తొలుత వారు తలదాచుకుంటున్నట్లు భావిస్తున్న సొరంగాల్లో విషవాయువులను నింపి వెలుపలికి వచ్చేట్లు చేయాలని చూసింది. తాజాగా వాటిని సముద్రపు నీటితో నింపాలని ఏర్పాట్లు చేస్తున్నది. ఈ దుష్ట ఆలోచన గురించి అమెరికా పత్రిక వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ వెల్లడించింది. అదే జరిగితే ఇప్పటికే కాలుష్యమైన గాజా ప్రాంతంలో మరిన్ని పర్యావరణ సమస్యలతో పాటు రానున్న అనేక తరాల మీద ప్రతికూల ప్రభావం పడుతుందని, మంచి నీటి వనరులన్నీ ఉప్పునీటితో నిండుతాయని అనేక మంది హెచ్చరిస్తున్నారు. నవంబరు రెండవ వారంలోనే ఆల్‌ షాతి నిర్వాసిత శిబిరం సమీపంలో ఐదు భారీ పంపులను ఏర్పాటు చేసింది. మధ్యధరా సముద్రం నుంచి నీటిని తోడి సొరంగాల్లో నింపేందుకే ఈ ఏర్పాటు. హమస్‌ సాయుధులను ఏరివేసేందుకు తాము అనేక పద్దతుల గురించి పరిశీలిస్తున్నామని వాటిలో ఒకటి నీటితో నింపటమని ఇజ్రాయెల్‌ మిలిటరీ అధికారి చెప్పినట్లు అమెరికా పత్రిక పేర్కొన్నది. అదే జరిగితే అంతర్జాతీయంగా వెలువడే ఖండనలు జో బైడెన్‌ ప్రభుత్వానికి ఇబ్బంది కలిగిస్తాయని అమెరికా మాజీ అధికారి ఒకడు చెప్పాడు. ఈజిప్టు 2015లో తన భూభాగంలో ఉన్న సొరంగాలను ఉప్పునీటితో నింపి దొంగ రవాణాను అరికట్టేందుకు పూనుకున్నపుడు ఆ ప్రాంత పంటలు దెబ్బతినట్లు రైతులు ఆందోళన చేశారు.అమెరికా ఇతర ఐరోపా ధనికదేశాల అండచూసుకొని చెలరేగుతున్న ఇజ్రాయెల్‌ మారణకాండకు ఇంకా ఎంత మంది బలికావాలన్న ప్రశ్న తలెత్తింది. ఈ దారుణాన్ని నివారించటంలో ఐక్యరాజ్యసమితి ఘోరంగా విఫలమైంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఇజ్రాయెల్‌ మారణకాండలో ఎక్కువగా పిల్లలు, మహిళలే బలి ! ఏకపక్ష దాడి తప్ప పోరు అబద్దం !!

01 Wednesday Nov 2023

Posted by raomk in Africa, CHINA, Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, Opinion, USA, WAR, Women

≈ Leave a comment

Tags

2023 Israel–Hamas war, Gaza Deaths, Israel genocide, israel massacre, Joe Biden, Netanyahu, US strikes in Syria


ఎం కోటేశ్వరరావు


గాజా ప్రాంతంలో అమాయక పౌరులపై కొనసాగుతున్న ఇజ్రాయెల్‌ మారణకాండ. నెతన్యాహును ఎవరూ నమ్మటం లేదు, ఇజ్రాయెల్‌ యుద్ధ మంత్రివర్గంలో విబేధాలు.వివాద విస్తరణకు సిరియాపై అమెరికా దాడులు. లెబనాన్‌ సరిహద్దులో హిజబుల్లా – ఇజ్రాయెల్‌ మిలటరీ పరస్పరదాడులు, దాడులను ఆపేది లేదన్న యూదు దురహంకారులు. ఈ వార్తల తీరు తెన్నులు చూసినపుడు మధ్య ప్రాచ్యంలో మంటలు రేపేందుకు పశ్చిమ దేశాలు పూనుకున్నాయా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. గాజాలో భీకర పోరు జరుగుతున్నట్లు కొన్ని పత్రికల్లో తప్పుడు వార్తలను ప్రచురిస్తున్నారు. అక్టోబరు ఏడు నుంచి నవంబరు ఒకటి ఉదయం వరకు వచ్చిన వార్తల ప్రకారం గాజాలో 8,525 మంది మరణించారు. వారిలో 3,542 మంది పిల్లలు, 2,187 మంది మహిళలు. వీరుగాక పశ్చిమ గట్టు ప్రాంతంలో మరో 120 మందిని ఇజ్రాయెల్‌ మూకలు బలితీసుకున్నాయి. గాజాలో ఇంతవరకు తొమ్మిది మంది తమ సైనికులు మరణించినట్లు ఇజ్రాయెల్‌ చెప్పటం తప్ప నిర్దిష్ట సమాచారాన్ని వెల్లడించలేదు.అక్కడ జరుగుతున్నది ఏకపక్ష మారణహౌమం తప్ప మరొకటి కాదు. రోజుకు మరణిస్తున్న లేదా గాయపడుతున్న పిల్లల సంఖ్య రోజుకు 420గా ఉంది. గడచిన నాలుగు సంవత్సరాల్లో 24 దేశాల్లో జరిగిన దాడులు, ఘర్షణల్లో ఏ ఒక్క సంవత్సరంలో కూడా ఇంత మంది పిల్లలు చనిపోలేదు. పిల్లల్ని రక్షించండి(సేవ్‌ చిల్డ్రన్‌) అనే సంస్థ ఆదివారం నాడు వెల్లడించిన సమాచారం ప్రకారం 2020లో ఇరవై రెండు దేశాల్లో 2,674 మంది,ఇరవైనాలుగు దేశాల్లో 2021లో 2,515 మంది, 2022లో 2,985 మంది మరణించారు. ఈ ఏడాది కేవలం అక్టోబరు ఏడు నుంచి 31వ తేదీ వరకు ఒక్క గాజాలో 3,542, పశ్చిమగట్టులో 36 మంది మరణించారు. తాము చంపుతున్నది హమస్‌ తీవ్రవాదులను అని చెబుతున్న ఇజ్రాయెల్‌ ప్రకటనలను నిస్సిగ్గుగా సమర్ధిస్తున్న అపర మానవతావాదులు ఈ వివరాల గురించి ఏమంటారో !


ఇజ్రాయెల్‌ పాలక యంత్రాంగంలో ఉన్న విబేధాలు, కుమ్ములాటలు బయటికి వచ్చాయి. అక్టోబరు ఏడవ తేదీన జరిగిన హమస్‌దాడి గురించి తనకు ముందుగా ఎవరూ ఎలాంటి సమాచారం అందించలేదని ఆదివారం తెల్లవారు ఝామున ప్రధాని నెతన్యాహు ఒక ట్వీట్‌లో పేర్కొన్నాడు. హమస్‌ భయపడిందని, ఒక పరిష్కారానికి సిద్దంగా ఉందనే విశ్లేషణను మిలిటరీ, గూఢచార అధిపతులు అందించారని ఆరోపించాడు. దాంతో తీవ్ర ఆగ్రహం, ఆందోళన వెల్లడి కావటంతో వెంటనే తన ట్వీట్‌ను వెనక్కు తీసుకోవటమేగాక తాను ఉపయోగించిన పదజాలం తప్పని క్షమించాలని కోరాడు. పాలకుల్లో ఉన్న విబేధాలకు ఇది నిదర్శనమని విశ్లేషకులు పేర్కొన్నారు. మిలిటరీ ఎంతో కష్టమైన దాడులను కొనసాగిస్తున్నపుడు ప్రధానిగా ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడటం ఏమిటని ప్రశ్నించారు. దేశ భద్రత, బందీలుగా ఉన్నవారి గురించి గాక కేవలం రాజకీయాలు చేస్తున్నాడని ధ్వజమెత్తారు. నెతన్యాహు తొలుత 1996లో అధికారానికి వచ్చాడు, మధ్యలో విరామం వచ్చింది, ఇప్పటివరకు మొత్తం పదమూడు సంవత్సరాలు పదవిలో ఉన్నాడు.


ఇజ్రాయెల్‌ ఇరుగుపొరుగున ఉన్న దేశాలను కూడా యుద్ధంలోకి లాగేందుకు అమెరికా పూనుకుంది. అంతా చేస్తున్నది ఇరాన్‌ అంటూ రెచ్చగొడుతున్నది. వివిధ దేశాల్లో ఉన్న సాయుధ సంస్థలకు వెన్నుదన్నుగా ఉన్నట్లు ప్రచారం చేస్తున్నది. సిరియాలోని అలెప్పో నగర పరిసరాల శరణార్ధి శిబిరాల్లో ఇరాన్‌ మద్దతుదారులైన సాయుధులు ఇరాక్‌, సిరియాల్లోని తమ స్థావరాల మీద దాడులు చేశారని, తాము ఆత్మరక్షణ ప్రతిదాడులు చేసినట్లు అమెరికా అమెరికా రక్షణ మంత్రి లాయడ్‌ ఆస్టిన్‌ ప్రకటించాడు. గత కొద్ది రోజుల్లో పదమూడు సార్లు దాడులు జరిగినట్లు ఆరోపించాడు. ఈ ప్రాంతంలో పరిస్ధితులు దిగజారాలని తాము కోరుకోవటం లేదని తెర వెనుక నుంచి ఇరాన్‌ దాడులు చేయిస్తున్నట్లు ఆరోపించాడు. తమ మీద దాడి చేస్తే తాము వారిని వదలబోమన్నాడు. గాజాలో హమస్‌, లెబనాన్‌లో హిజబుల్లా, ఎమెన్‌లో హౌతీలు, ఇరాక్‌, సిరియాల్లోని వివిధ సాయుధ బృందాలకు ఇరాన్‌ ఆయుధాలు, నిధులు అందుతున్నాయన్నాడు. మరోవైపున లెబనాన్‌లో ఉన్న హిజబుల్లా సాయుధ బృందాలపై అక్టోబరు ఏడు నుంచి ఇజ్రాయెల్‌ రెచ్చగొట్టే దాడులు జరుపుతోంది. ఇంతవరకు హిజబుల్లా రంగంలోకి దిగలేదు. రెచ్చగొట్టే సాయుధ కవ్వింపులతో పాటు మీడియా ద్వారా పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారదాడి ముఖ్యంగా ఇరాన్‌పై సాగిస్తున్నారు.


గతంలో 1890దశకంలో అమెరికాలో న్యూయార్క్‌ వరల్డ్‌, న్యూయార్క్‌ జర్నల్‌ అనే రెండు పత్రికల మధ్య పోటీ తలెత్తి సంచలనాత్మక, వక్రీకరణ, కుహనా వార్తలను పెద్దక్షరాలతో ప్రచురించి పాఠకులను పెంచుకొనేందుకు చూశాయి.దీన్ని ఎల్లో జర్నలిజం అని పిలిచారు. ఆ క్రమంలోనే స్పెయిన్‌ ఆధీనంలో ఉన్న వలసలను ఆక్రమించేందుకు అమెరికా ప్రభుత్వం వాటికి మద్దతు కూడా ఇచ్చింది. స్పానిష్‌-అమెరికా యుద్ధానికి మద్దతుగా మైనే అనే అమెరికా నౌకను స్పెయిన్‌ ముంచివేసిందనే తప్పుడు వార్తను న్యూయార్క్‌ జర్నల్‌ ప్రచురించింది. ఆ పోరులో గెలిచిన అమెరికన్లు క్యూబా, ఫిలిప్పీన్లను తమ స్వాధీనంలోకి తెచ్చుకున్నారు. నాటి నుంచి నేటి వరకు సామ్రాజ్యవాదులు జరిపే దాడులకు జనాన్ని తప్పుదారి పట్టించేందుకు అలాంటి తప్పుడు వార్తలను మీడియాలో ప్రవేశపెడుతూనే ఉన్నారు. హమస్‌, ఇరాన్‌, చైనా, రష్యా ఇలా సంస్థలు, దేశాల మీద ఎన్నో కట్టుకథలను రాయిస్తున్నారు. అనేక వారాల ముందే ఇజ్రాయెల్‌ మీద అక్టోబరు ఏడున జరిగిన దాడి కుట్రకు ఇరాన్‌ సాయం చేసిందని వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ మరుసటి రోజే కథ అల్లింది. తరువాత రోజు మరో పిట్టకత చెప్పింది. ఇరాన్‌-సౌదీ అరేబియా మధ్య సయోధ్య కుదిర్చేందుకు చైనా ప్రయత్నిస్తున్నపుడే ఏప్రిల్‌ నుంచి హమస్‌ తదితర సంస్థలకు ఇరాన్‌ శిక్షణ ఇవ్వటం ప్రారంభించిందని కూడా రాశారు. ఆ ముక్క ఇజ్రాయెల్‌కు లేదా అమెరికా పాలకులకు సదరు పత్రిక ఎందుకువెల్లడించలేదు ? ఇరాన్‌ మీద చమురు ఆంక్షలను అమలు జరపటంలో బైడెన్‌ విఫలమైన కారణంగా వచ్చిన చమురు సొమ్ముతో హమస్‌ సంస్థకు ఇరాన్‌ సాయం చేసిందని కూడా కధ అల్లింది. మరోవైపు అమెరికా మంత్రి ఆంటోని బ్లింకెన్‌ ఇరాన్‌ పాత్ర గురించి ఆధారాలు లేవు అని చెబుతాడు. ఇజ్రాయెల్‌ వేగులు కూడా దాన్ని పసిగట్టలేదని ఒక వైపు వారు నెత్తీనోరు కొట్టుకుంటుండగా కొద్ది వారాల ముందే కుట్ర జరిగిందని సదరు పత్రిక రాసింది. ఇలాంటి అమెరికా కట్టుకథల ఉదాహరణలను అనేకం చెప్పవచ్చు. న్యూయార్క్‌టైమ్స్‌ పత్రిక విలేకరి ఒకడు 2002లో ఇరాక్‌ తన అణ్వాయుధ కార్యక్రమాలకు అవసరమైన అల్యూమినియం గొట్టాలను సేకరించేందుకు పూనుకుందని రాశాడు. బాంబులు తయారు చేయగలిగిన వారు గొట్టాలను రూపొందించలేరా ? పాలస్తీనా ఏర్పాటుకు కేటాయించిన ప్రాంతాలను ఇజ్రాయెల్‌ దురాక్రమించటం గతం, తాజా పరిణామాలకు కారణం అన్నది తెలిసిందే. వారి ప్రాంతాల నుంచి వైదొలిగితే ఎవరి బతుకు వారు బతుకుతారు.దాన్ని దాచి పెట్టి అమెరికా ఒక వాణిజ్య మార్గాన్ని ఏర్పాటు చేయదలచిందని, దానికి ఈజిప్టులోని సూయజ్‌ కాలువ, ఇరాన్‌-ఎమెన్‌లను కలిపే హార్ముజ్‌ జలసంధి, ఎమెన్‌-జిబౌటీ మధ్య ఉన్న ఎర్ర సముద్రం-అరేబియా సముద్రాన్ని కలిపే బాబ్‌ అల్‌ మండే జలసంధులు కీలకమని, ఈ వాణిజ్య మార్గాన్ని అడ్డుకొనేందుకు హమస్‌ దాడులు చేసినట్లు కథలను వ్యాపింపచేశారు.


మధ్యప్రాచ్యంలో ప్రాంతీయ యుద్ధం చెలరేగితే తమకు ఇబ్బడి ముబ్బడిగా లాభాలు వస్తాయని అమెరికా ఆయుధ వ్యాపారులు, ఉత్పత్తిదారులు కోరుకుంటున్న సంగతి తెలిసిందే. అదే జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందనే చర్చ ఇప్పుడు మొదలైంది.పొరుగున ఉన్న ఈజిప్టు, సిరియా, లెబనాన్‌, జోర్డాన్‌, ఆ ప్రాంత దేశాలైన ఇరాన్‌, కతార్‌ తదితర దేశాల పాత్ర ఉండే అవకాశం ఉంది. ప్రస్తుత ఈజిప్టు అధ్యక్షుడు అబ్దుల్‌ ఫతా ఎల్‌ సిశి 2013 నుంచి అధికారంలో ఉన్నాడు. అంతకు ముందు ముస్లిం బ్రదర్‌హుడ్‌ అధికారంలో ఉంది. హమస్‌సంస్థకు చెందిన వారు దాని నుంచి విడగొట్టుకున్నవారే. తాజా పరిణామాలతో జనంలో ఇజ్రాయెల్‌ మీద ఉన్న వ్యతిరేకత, పాలస్తీనియన్లకు మద్దతు కారణంగా అనేక ఆంక్షల మధ్య పరిమితంగా కైరో, ఇతర చోట్ల నిరసన ప్రదర్శనలకు ఎల్‌ సిశి ప్రభుత్వం అవకాశం కల్పించింది తప్ప ఇష్టం ఉండి కాదు. స్వేచ్చగా అనుమతిస్తే ఆ ప్రదర్శనల పేరుతో ప్రతిపక్షం తనకు వ్యతిరేకంగా జనాన్ని సమీకరించే అవకాశం ఉందనే భయం కూడా ఉంది. అందువలన ప్రాంతీయ యుద్ధం వస్తే ఈజిప్టు పాల్గొనే అవకాశాలు లేవన్నది కొందరి భావన. గాజా నుంచి నిర్వాసితులు వస్తే తనకు సమస్యలు వస్తాయని కూడా భయపడుతున్నాడు.అందుకే గాజాతో ఉన్న సరిహద్దు తెరిచేందుకు సిద్దంగా లేడు.


లెబనాన్‌ ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యల కారణంగా జనంలో అసంతృప్తి ఉంది. ఈ దశలో ఇజ్రాయెల్‌తో యుద్దాన్ని అది కోరుకోవటం లేదు. అక్కడ ఉన్న షియా ముస్లిం సామాజిక తరగతికి చెందిన హిజబుల్లా మిలిటెంట్‌ సంస్థ సరిహద్దులో ఇజ్రాయెల్‌తో ఇప్పటికే అడపాతడపా పోరాడుతోంది. యుద్ధం జరిగితే 2006 నుంచి రెండు దేశాల మధ్య నెలకొన్న శాంతి దెబ్బ తింటుంది. దానికి తోడు క్రైస్తవ-ఇస్లామిక్‌ వర్గాల మధ్య గతంలో జరిగిన మాదిరి అంతర్యుద్ధం పునరావృతమైనా ఆశ్చర్యం లేదు. అయితే హిజబుల్లా సంస్థ లెబనాన్‌ ప్రభుత్వంలో పాతుకుపోయింది. లక్ష మంది సాయుధులున్న దాన్ని విస్మరించటం ప్రభుత్వానికి సాధ్యం కాదు. అక్కడి మిలిటరీ కంటే ఇదే శక్తివంతమైనది, అందువలన ప్రభుత్వం కూడా దాన్ని అనుసరించటం మినహా మరొక మార్గం లేదు. ఈ సంస్థకు ఇరాన్‌ నుంచి సాయం అందుతోంది. అందువలన ఇరాన్‌ అనుమతి మీదనే హిబబుల్‌ నిర్ణయం ఉంటుందని చెబుతున్నారు. ఇజ్రాయెల్‌తో ఉన్న సరిహద్దులోని అనేక గ్రామాల్లో ఉన్న జనాన్ని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇటీవలి వారాల్లో జరిగిన చిన్న చిన్న ఘర్షణల్లో తమ మిలిటెంట్లు 50 మంది మరణించినట్లు హిజబుల్లా ప్రకటించింది. గాజాలో భారీ ఎత్తున హత్యాకాండ కొనసాగితే హిజబుల్‌ జోక్యానికి మద్దతు ఇస్తామని జనం చెబుతున్నట్లు వార్తలు వచ్చాయి. లెబనాన్‌లో కూడా పాలస్తీనియన్ల హమస్‌, ఇతర సాయుధ బృందాలు ఉన్నాయి.వారు లెబనాన్‌ ప్రాంతం నుంచి కొన్ని రాకెట్లను ఇజ్రాయెల్‌ మీద ప్రయోగించారు. సిరియాలో 2011 నుంచి అంతర్యుద్ధం జరుగుతోంది. అధ్యక్షుడు బషెర్‌ అల్‌ అసాద్‌కు ఇరాన్‌, రష్యా మిలిటరీ మద్దతు ఉంది. ఆ కారణంగానే ,ఇజ్రాయెల్‌ అమెరికా, ఇతర పశ్చిమ దేశాలూ కిరాయి మూకలు, ఉగ్రవాద సంస్థలకు ఎంతగా సాయపడినా అది నిలదొక్కుకుంటున్నది. అక్టోబరు ఏడు తరువాత రాజధాని డమాస్కస్‌, అలెప్పో నగరాలపై ఇజ్రాయెల్‌, అమెరికా జరిపిన దాడుల్లో ఎనిమిది మంది సిరియా సైనికులు మరణించారు. ఇక్కడ కూడా ఇరాన్‌ మద్దతు ఉన్న సాయుధశక్తి ఉంది. మరోదేశం కతార్‌కు ముస్లిం బ్రదర్‌హుడ్‌ సంస్థతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. హమస్‌ రాజకీయ కార్యాలయం కతార్‌లోని దోహాలో ఉంది. ఆర్థికంగా కూడా పెద్ద ఎత్తున తోడ్పడుతోంది. ఇటీవల హమస్‌ వద్ద ఉన్న బందీలలో నలుగురిని విడిపించటంలో కతార్‌ కీలక పాత్ర పోషించింది.ఈ ప్రాంతంలో తన పలుకుబడిని పెంచుకోవాలని చూస్తున్న కతార్‌కు ఇజ్రాయెల్‌తో దౌత్య సంబంధాలు లేవు, ఎలాంటి పాత్ర పోషించేది ఇంకా స్పష్టం కాలేదు. మొత్తం మీద చూసినపుడు ఇరాన్‌ కీలకంగా ఉన్నందున దాన్ని కవ్వించేందుకు అమెరికా పూనుకుంది.ఏం జరిగేదీ ఎవరూ ఊహించలేకపోతున్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

హమస్‌ ఎప్పుడు ఉనికిలోకి వచ్చింది ? అవాస్తవాల ప్రచారం, నిజాలేమిటి ?

14 Saturday Oct 2023

Posted by raomk in Current Affairs, Europe, Germany, History, imperialism, INTERNATIONAL NEWS, Opinion, UK, USA, WAR

≈ Leave a comment

Tags

Gaza Deaths, Hamas, HAMAS attacks 2003, israel massacre, Joe Biden, Palestinian People


ఎం కోటేశ్వరరావు


టీవీలు, పత్రికల్లో ప్రస్తుతం హమస్‌ అనే సంస్థ గురించి వార్తలు వస్తున్నాయి. ఇజ్రాయెల్‌-పాలస్తీనా తాజా పరిణామాలపై ఎన్నో అవస్తవాలు, వక్రీకరణలు వెల్లువెత్తుతున్నాయి. వాటిలో కొన్నింటిని చూద్దాం. చరిత్రనంతటినీ ప్రస్తావించటం ఇక్కడ సాధ్యం కాదు గనుక క్లుప్త వివరణకే ఇది పరిమితం.


పాలస్తీనా – ఇజ్రాయెల్‌ ఉనికి !
ఈ రోజు మనం పాలస్తీనా అని చెబుతున్న ప్రాంతం లేదా చరిత్రలో ఉందని భాష్యం చెబుతున్న ఇజ్రాయెల్‌ గానీ ఎన్నడూ ఒక స్వతంత్ర దేశంగా లేవు. ఏదో ఒక సామ్రాజ్యంలో భాగాలుగా చేతులు మారుతూ వచ్చాయి. క్రీస్తు పూర్వమే ఈ రెండు పేర్లూ వాడుకలో ఉన్నట్లు చరిత్ర చెబుతోంది. పేరు ఏదైనా అవి ఏదో ఒక సామ్రాజ్యంలో భాగాలు, సామంతదేశాలే. రోమన్‌, లేదా ఒట్టోమన్‌ మాదిరి యూదుల సామ్రాజ్యం అనేది లేదు. తొలుత క్రీస్తు పూర్వం ఏడవ శతాబ్దంలో అస్సీరియన్లు యూదుల మీద దాడి చేసి జుడా రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. యూదులను తరిమివేశారు. తరువాత క్రీస్తుశకం మధ్యయుగాల్లో మత యుద్దాల్లో యూదులు అనేక ప్రాంతాలకు పారిపోయారు. చరిత్రలో పాలస్తీనా-ఇజ్రాయెల్‌ ప్రాంతం చివరిగా టర్కీ కేంద్రంగా పాలన సాగించిన ఒట్టోమన్‌ సామ్రాజ్యంలో భాగంగా ఉంది. జనాభాలో తొంభైశాతంపైగా అరబ్బులే ఉన్నారు. ప్రపంచమంతటినీ ఆక్రమించిన బ్రిటీష్‌, ఫ్రెంచి ఇతర సామ్రాజ్యవాదులకు అది స్వాధీనం కాలేదు. మొదటి ప్రపంచ యుద్దంలో దాన్ని విచ్చిన్నం చేసేందుకు బ్రిటీష్‌ పాలకులు అనేక పాచికలను వాడారు. వాటిలో ఒకటి ఒట్టోమన్‌ సామ్రాజ్యం నుంచి స్వాతంత్య్రం కోరుతున్న అరబ్బులకు పాలస్తీనాను ఏర్పాటు చేస్తామని ఒక వైపు ఆశచూపారు. మరోవైపు యూదులకు ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేస్తామని వారి మద్దతును కూడగట్టేందుకు పూనుకున్నారు. ఎందుకంటే అనేక దేశాల్లో యూదులు బాంకర్లుగా, ఇతరత్రా ధనవంతులుగా ఉన్నారు కనుక వారి అవసరం ఉన్నందున అలా చేశారు. బ్రిటీష్‌ , తరువాత వారి స్థానాన్ని ఆక్రమించిన అమెరికన్‌ సామ్రాజ్యవాదులు పెట్టిన చిచ్చే పాలస్తీనా-ఇజ్రాయెల్‌ వివాదం.


మొదటి ప్రపంచ యుద్దంలో ఒట్టోమన్‌ సామ్రాజ్యం పతనమైన తరువాత సామ్రాజ్యవాదుల పంపకాల్లో పాలస్తీనా ప్రాంతాన్ని బ్రిటీష్‌ వారు తీసుకున్నారు. అప్పటికే పశ్చిమాసియాలో చమురు నిల్వలు, ఇతర ప్రాంతాల్లో సహజ సంపదలను గమనించి ఆ ప్రాంతంలో తమకు నమ్మకమైన బంటు ఉండాలంటే ఇజ్రాయెల్‌ ఏర్పాటు ఒక సాధనంగా బ్రిటీష్‌ వారు భావించారు. అందుకు గాను అనేక దేశాల్లో దాడులకు గురైన యూదులందరినీ పాలస్తీనాకు అక్రమంగా రప్పించారు. అక్కడ వారు నివాసాలను ఏర్పాటు చేసుకొనేందుకు అవకాశం కల్పించారు. స్థానికంగా ఉన్న అరబ్బులను వారి ప్రాంతాల నుంచి గెంటివేయటం అప్పుడే ప్రారంభమైంది. బ్రిటీష్‌ వారి కుట్రను గమనించేలోగా రెండవ ప్రపంచ యుద్దం, తరువాత యూదుల వలసలు మరింత పెరిగాయి. తరువాత పాలస్తీనా ప్రాంతాన్ని మూడుగా విభజించి పాలస్తీనా, ఇజ్రాయెల్‌ దేశాలుగా ఏర్పాటు, జెరూసలెం పట్టణం, పరిసరాలను ఐరాస ఆధీనంలో ఉంచాలంటూ చేసిన ప్రతిపాదనకు ఐరాస సాధారణ అసెంబ్లీలో 1947 నవంబరు 29న మెజారిటీ ఆమోదం వచ్చేట్లు సామ్రాజ్యవాదులు చూశారు. దానిని ఆ ప్రాంత దేశాలు, అరబ్బులు అంగీకరించలేదు. ఐరాస తీర్మానం సాకుతో అప్పటికే సాయుధంగా సిద్దంగా ఉన్న యూదులు తీర్మానాన్ని పక్కన పెట్టి పాలస్తీనా ప్రాంతాలను కూడా ఆక్రమించి అరబ్బులను తరిమివేశారు.దాంతో అరబ్బులు ప్రతిఘటన ప్రారంభించారు. నాటి నుంచి నేటి వరకు పాలస్తీనా ఏర్పడలేదు. ఇజ్రాయెల్‌ ముందుగా వేసుకున్న పధకం ప్రకారం పాలస్తీనా ప్రాంతాల ఆక్రమణకు పూనుకోవటంతో పక్కనే ఉన్న ఈజిప్టు, సిరియా, జోర్డాన్‌, ఇరాక్‌ పాలస్తీనా ప్రాంతాలను దురాక్రమణ నుంచి కాపాడి కొన్నింటిని తమ అదుపులోకి తీసుకున్నాయి. ఐరాస తీర్మానాన్ని గుర్తించేందుకు ఇజ్రాయెల్‌ నిరాకరిస్తోంది. తన భద్రతకు కొన్ని పాలస్తీనా ప్రాంతాలు కావాలని చెబుతోంది. దానికి అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు మద్దతు పలుకుతున్నాయి.


హమస్‌ ఎప్పుడు ఏర్పడింది ?
పాలస్తీనా విముక్తి కోసం పిఎల్‌ఓ ఏర్పడింది. అది శాంతియుత, సాయుధ పద్దతుల్లో పోరాడుతోంది. 1980 దశకం నాటికి అరబ్బుల్లో అసహనం పెరిగింది. పిఎల్‌ఓ సమర్దవంతంగా ఎదుర్కోవటం లేదనే అసంతృప్తి ఉంది. ఈ పూర్వరంగంలో హమస్‌ అనే సంస్థ 1987లో ఉనికిలోకి వచ్చింది. దాన్ని ఏర్పాటు చేయటంలో మత పెద్దలు కూడా ఉన్నారు.1973లో ముస్లిం బ్రదర్‌హుడ్‌ అనే సంస్థ ఈజిప్టులో ఏర్పడింది. దానిలో పాలస్తీనా ప్రాంతానికి చెందిన వారు కూడా ఉన్నారు. ఆ సంస్థలో చీలిక వచ్చి హమస్‌ ఏర్పడింది.1988ఆగస్టున హమస్‌ ప్రణాళిక పేరుతో తొలిసారిగా ఆ పేరును వెలుగులోకి తెచ్చారు. తమ ప్రభుత్వం మీద పోరాడే ప్రతివారినీ ఉగ్రవాద ముద్రవేసి ఇజ్రాయెల్‌ అణచివేస్తున్నది. అంతకు ముందు పిఎల్‌ఓ, తరువాత హమస్‌ ఇతర సంస్థలనూ అదే మాదిరి పరిగణించింది. 1994 ఫిబ్రవరిలో రంజాన్‌ ప్రార్ధనలు చేస్తున్న ముస్లింలను 29 మందిని గోల్డ్‌ స్టెయిన్‌ అనే యూదు దురహంకారి మిలిటరీ దుస్తులతో వెళ్లి పశ్చిమ గట్టు ప్రాంతంలోని హెబ్రాన్‌ నగరంలోని ఒక మసీదులో కాల్చి చంపాడు. తరువాత జరిగిన ఉదంతాలలో మరో 19 మంది పాలస్తీనియన్లను భద్రతా దళాలు చంపి వేశాయి. సామాన్య పౌరులు, మిలిటెంట్లకు తేడా చూపకుండా ఇజ్రాయెల్‌ చర్యలు ఉన్నందున తాము కూడా అదే బాట పడతామని హెబ్రాన్‌ ఉదంతం తరువాత హమస్‌ ప్రకటించింది.అప్పటి నుంచి అది ఇజ్రాయెల్‌ పోలీసులు, భద్రతా దళాల దుశ్చర్యలకు ప్రతిగా తానూ దాడులు జరుపుతోంది. అది సరైందా కాదా అంటే పౌరుల మీద ఎవరు దాడులు జరిపినా సమర్దించనవసరం లేదు. ఇజ్రాయెల్‌ యూదులు సామాన్యపౌరుల మీద బాంబులు విసురుతుంటే పాలస్తీనా అరబ్బులు రసగుల్లాలు విసురుతారా ? ఇదే సమయంలో పిఎల్‌ఓ-ఇజ్రాయెల్‌ మధ్య కుదిరిన ఓస్లో ఒప్పందాన్ని అది వ్యతిరేకించింది. దానిలో భాగంగానే 1996లో జరిగిన పాలస్తీనా ఎన్నికలను,2005లో పాలస్తీనా అధ్యక్ష ఎన్నికను బహిష్కరించింది. యాసర్‌ అరాఫత్‌ మరణించిన తరువాత 2006లో జరిగిన జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసింది. గాజా ప్రాంతంలో మెజారిటీ సీట్లు తెచ్చుకొని అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. వెస్ట్‌ బాంక్‌ ప్రాంతంలో ఫతా అధికారంలో ఉంది. మన దేశంలో రాష్ట్ర ప్రభుత్వాలకు అంతర్జాతీయ గుర్తింపు ఉండదు, అలాగే గాజాలోని హమస్‌ ప్రభుత్వానికి అంతర్జాతీయ గుర్తింపు లేదు, ఎందుకంటే అది పాలస్తీనాలోని ఒక ప్రాంత ప్రభుత్వం మాత్రమే. హమస్‌ ప్రభుత్వానికి మిలిటరీ లేదు, హమస్‌ గెరిల్లాలు మాత్రమే దాడులు చేస్తున్నారు. ఇజ్రాయెల్‌ మిలిటరీ ఆ గెరిల్లాలను అణచేపేరుతో జనావాసాలపై దాడులు చేసి పౌరులను హతమారుస్తున్నది. విమానాలతో బాంబులు వేస్తున్నది, గాజా వాసులకు మంచినీరు, విద్యుత్‌, ఆహారం, ఔషధాల సరఫరాలను నిలిపివేసిందంటే సామాన్య పౌరుల మీద దాడి తప్ప మరొకటి కాదు.గాజా ప్రాంతం నుంచి తప్పుకున్న 2006 నుంచి ఇప్పటి వరకు ఇజ్రాయెల్‌ పదిసార్లు మిలిటరీదాడులు జరిపింది.


జో బైడెన్‌ అబద్దమాడాడా !
అమెరికాలోని యూదు సంస్థల ప్రతినిధులతో సమావేశమైన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఇలాంటి దృశ్యాలను చూడాల్సి వస్తుందని తాను అనుకోలేదని చెప్పినట్లు వార్తలు వచ్చాయి. హమస్‌ సాయుధులు ఇజ్రాయెలీ పిల్లలను చంపుతున్న దృశ్యాల చిత్రాలను చూసిన తరువాత బైడెన్‌ స్పందించినట్లు మీడియా పేర్కొన్నది.ఇజ్రాయెల్‌ ప్రభుత్వం, నేతలు చెప్పిన మాటలను బట్టి అలా మాట్లాడారు తప్ప బైడెన్‌ ఎలాంటి ఫొటోలను చూడలేదని అధ్యక్ష భవనం వివరణ ఇచ్చింది. పిల్లలను హతమారుస్తున్నట్లు ఎలాంటి దాఖలాలు లేవని తరువాత వెల్లడైంది. కానీ తప్పుడు ఫొటోలను ఇజ్రాయెల్‌ , అమెరికా, ఐరోపా పత్రికలు ప్రచురించి పెద్ద ఎత్తున హమస్‌ మీద అసత్యవార్తలను జనంలో పెట్టాయి. పశ్చిమ దేశాల పాలకులు, వారి కనుసన్నలలో నడిచే మీడియా ఎలాంటి తప్పుడు వార్తలను ప్రచారంలో పెడుతుందో తెలిసిందే.1991లో ఇరాక్‌ మీద దాడి చేయదలచుకున్న అమెరికా, ఐరోపా దేశాలు అంతకు ముందు ఒక కట్టుకథను ప్రచారంలో పెట్టాయి. కువాయిట్‌ ఆసుపత్రిల్లోని ఇంక్యుబేటర్లలో ఉన్న వందలాది మంది పిల్లలను ఇరాకీ సైనికులు చంపివేశారని నమ్మించేందుకు చూశారు. అంతేకాదు నాటి ఇరాక్‌ పాలకుడు సద్దాం హుసేన్‌ మారణాయుధాలను గుట్టలుగా నిల్వ చేశాడని కూడా ప్రచారం చేసిన సంగతి, తీరా తాము చేయదలచుకున్నది చేసి సద్దాంను హత్య చేసి లక్షలాది మంది ఇరాకీల జీవితాలను నాశనం చేసిన తరువాత అబ్బే అలాంటి గుట్టల ఆయుధాలు ఎక్కడా కనిపించలేదని చెప్పిన సంగతి తెలిసిందే. ఇక జో బైడెన్‌ పెద్ద అబద్దాల కోరని గతంలోనే రుజువైంది. నెల్సన్‌ మండేలాను కలిసేందుకు వెళ్లినపుడు 1970దశకంలో తనను అరెస్టు చేశారని 2020 ఎన్నికల ప్రచారంలో పచ్చి అబద్దం చెప్పాడు.


ఇజ్రాయెల్‌ నిఘా వైఫల్యమా ! కుట్రా !!
పాలస్తీనాకు చెందిన గాజా ప్రాంతాన్ని ఇజ్రాయెల్‌ ప్రభుత్వం ఒక నిర్బంధశిబిరంగా మార్చివేసింది. దాని చుట్టూ సరిహద్దులో మనుషులు దాటటానికి వీలులేని ఆరు మీటర్ల ఎత్తున పెద్ద ఇనుప ముళ్ల కంచెను ఏర్పాటు చేసింది. దాని పొడవు 65కిలోమీటర్లు, డ్రోన్లు, రిమోట్‌ కంట్రోలు మెషిన్‌ గన్లు, కెమెరాలు దానికి అమర్చి ఉంటాయి. ఏదైనా అలజడి సమాచారం ఉంటే ఐదు నిమిషాల్లో దాడులు చేసే హెలికాప్టర్లు సిద్దంగా ఉంటాయి. బుల్డోజర్లతో తప్ప ఆ కంచెను మానవ మాత్రులు ధ్వంసం చేయలేరు. దాన్ని దాటి 400 మంది హమస్‌ గెరిల్లాలు ట్రాక్టర్ల మీద వచ్చారని చెబుతున్నారు. ఒకవైపు ఈజిప్టు, మరోవైపు మధ్యధరా సముద్రం, రెండు వైపులా ఇజ్రాయెల్‌ మిలిటరీ ఉంటుంది. గాజా వాసులు వెలుపలికి రావాలంటే ఇజ్రాయెల్‌ అనుమతి లేకుండా కుదరదు.హమస్‌ గెరిల్లాలు కంచెను దాటి కొందరు క్షిపణులు ప్రయోగించారు. కొన్ని చోట్ల కంచెలోపలి నుంచే వదిలారు. దీన్ని ఇజ్రాయెల్‌ పసిగట్టలేకపోయింది.ఏదో జరగబోతోందని ముందే తాము హెచ్చరించామని ఈజిప్టు నిఘా అధికారులు చెప్పారు. తాము కూడా మిలిటరీని హెచ్చరించామని ఇజ్రాయెలీ గూఢచారులు కూడా చెబుతున్నారు. తమకెలాంటి సమాచారమూ లేదని మిలిటరీ చెప్పింది. తెలిసినా ఇజ్రాయెల్‌ మిలిటరీ కావాలనే నిరోధించలేదని చెబుతున్నారు. ఇది ఒక రహస్యంగా మిగిలిపోయింది.


హమస్‌ను అంతం చేయటం సాధ్యమా ?
పాలస్తీనా ప్రాంతాల మీద ఇజ్రాయెల్‌ దాడులు చేయటం ఇదే ప్రధమం కాదు. గతంలో అనేకసార్లు దాడులు చేసింది. తమ వ్యతిరేకులను అణచివేసినట్లు చెప్పుకుంది. ఇప్పుడు కూడా అదే చెబుతోంది. హమస్‌ లేదా మరొక తిరుగుబాటుదార్లను అణచివేయటం నిజంగా సాధ్యమౌతుందా ? ప్రజల మీద దాడులు కొనసాగినంత కాలం ప్రతిఘటన వీరులు పుడుతూనే ఉంటారన్నది చరిత్ర చెప్పిన సత్యం. హమస్‌గాకపోతే మరొక పేరుతో మరో సంస్థ పుట్టుకువస్తుంది. హమస్‌ కంటే ముందుకు కూడా సాయుధదాడులు చేసిన వారు ఉన్నారు కదా ! పాలస్తీనాకు 1947 తీర్మానం ప్రకారం దాని ప్రాంతాలను దానికి అప్పగిస్తేనే ఇజ్రాయెల్‌ మీద తిరుగుబాటు లేదా ఆత్మరక్షణ దాడులు నిలిచిపోతాయి. లేకుంటే మరో ఏడు దశాబ్దాలు గడిచినా చరిత్ర పునరావృతం అవుతూనే ఉంటుంది. వందల సంవత్సరాల నాడు మత యుద్ధాలలో, రెండవ ప్రపంచ యుద్దానికి ముందు హిట్లర్‌ యూదులను లక్షల సంఖ్యలో హతమార్చినా వారు అంతరించలేదు. అలాంటిది పాలస్తీనియన్లు లేదా అరబ్బులను అణచివేయటం, పూర్తిగా తుడిచిపెట్టటం సాధ్యమౌతుందా ? ఈ పాఠాన్ని యూదులు, వారిని సమర్ధించేవారు మరచిపోతే ఎలా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d