• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: Hamas Israel

గాజాలో మారణకాండకు ఏడాది : ఆయుధాలతో ఇజ్రాయెల్‌,తప్పుడు వార్తలతో మీడియా దాడి !

09 Wednesday Oct 2024

Posted by raomk in Asia, COUNTRIES, Current Affairs, Europe, Germany, History, imperialism, INTERNATIONAL NEWS, Opinion, UK, USA, WAR

≈ Leave a comment

Tags

fake news, Hamas Israel, Israel genocide, Joe Biden, media bias, media credibility, Netanyahu, Palestinians, Propaganda War, Western media propaganda


ఎం కోటేశ్వరరావు


తమ్ముడు తనవాడైనా ధర్మాన్ని ధర్మంగా చెప్పాలన్న లోకోక్తి తెలిసిందే. వర్తమాన ప్రపంచంలో అలా జరుగుతోందా ? నూటికి నూరుశాతం లేదు. పక్షపాత తీర్పులు, వైఖరులే వెల్లడౌతున్నాయి. గాజాపై ఇజ్రాయెల్‌ మారణకాండ ప్రారంభమై అక్టోబరు ఏడవ తేదీతో ఏడాది గడిచింది. ప్రపంచ ప్రధాన స్రవంతి మీడియా ఇజ్రాయెల్‌ మీద హమస్‌ ఉగ్రవాదులు జరిపిన దాడికి సంవత్సరం నిండిరది అంటోంది. హమస్‌దాడిని ఎవరూ సమర్ధించటం లేదు. ఐక్యరాజ్య సమితి 1948లో ఇజ్రాయెల్‌ను ఏర్పాటు చేసిన తరువాత అప్పటి వరకు ఉన్న పాలస్తీనా ఉనికిలో లేకుండా పోయింది. ఏదో ఒకసాకుతో దానికి కేటాయించిన ప్రాంతాలన్నింటినీ ఆక్రమించుకోవటంతో పాటు వేలాది మందిని చంపి, లక్షల మందికి నిలువనీడ లేకుండా చేస్తూ పాలస్తీనా దేశం ఏర్పడకుండా ఇజ్రాయెల్‌కు మద్దతుగా అమెరికాతో సహా పశ్చిమదేశాలన్నీ మద్దతు ఇస్తున్నాయి. దానికి వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేస్తున్న బృందాలలో హమస్‌ ఒకటి. దాని దాడులు గత ఏడాదే ప్రారంభం కాలేదు. కానీ అది చేసిన దాడి సాకుతో గాజాలో ఏడాది కాలంగా మారణకాండ సాగిస్తున్నారు. ఇప్పటి వరకు 42వేల మందిని చంపారు.పదివేల మంది జాడ తెలియటం లేదు, లక్ష మంది వరకు గాయపడ్డారు.లక్షలాది ఇండ్లను నేలమట్టం గావించారు. గాజాలోని 23లక్షల మందిని ఇండ్ల నుంచి వీధుల్లోకి నెట్టారు. మారణకాండ ఇంకా కొనసాగుతోంది. వెస్ట్‌బాంక్‌ ప్రాంతానికి విస్తరించారు. ఇదంతా ఎందుకు అంటే హమస్‌ జరిపిన దాడిలో 815 మంది సాధారణ పౌరులతో సహా 1,195 మంది ఇజ్రాయెలీలు మరణించారు, ఆ సందర్భంగా కొందరు విదేశీయులతో సహా 251 మందిని బందీలుగా పట్టుకున్నారు, వారిలో కొందరిని విడుదల చేశారు, మరికొందరు మరణించగా మరో 95 మంది హమస్‌ వద్ద బందీలుగా ఉన్నారు. దీనికి ప్రతీకారం అని చెబుతున్నారు. ఏ రీత్యా చూసినా ఇజ్రాయెల్‌ చర్య గర్హనీయం, అంతర్జాతీయ న్యాయస్థానంలో యుద్ధ నేరాల కింద దీనికి బాధ్యులైన వారిని శిక్షించాలి.


ఈ దారుణకాండ గురించి ప్రపంచ మీడియా వార్తలు ఇస్తున్న తీరు కూడా సభ్యసమాజం ఆమోదించేదిగా లేదు. అంతర్జాతీయ వార్తా సంస్థలన్నీ పశ్చిమ దేశాలకే చెందినవి కావటంతో అవి అందచేసిన తప్పుడు సమాచారాన్నే వాస్తవాలుగా చెబుతున్నారు. అయితే తప్పుడు, వక్రీకరణ, కుహనా వార్తలను ఇవ్వటం కొత్తగా జరుగుతున్నది కాదు. ప్రపంచం మీద ప్రచారదాడి జరుగుతున్నది. గాజాలో తలెత్తిన మానవ సంక్షోభ తీవ్రత అక్కడి నుంచి వార్తలు పంపుతున్న పశ్చిమదేశాల విలేకర్లలో ఎక్కడా కానరాదు. ప్రపంచానికి వారు అందచేస్తున్నవి తప్ప ప్రత్యామ్నాయ సంస్థలు లేవు. గాజాలో మరణించిన, గాయపడిన వారిలో నూటికి 80శాతం మంది నిరాయధులైన మహిళలు, పిల్లలే ఎందుకు ఉన్నారో ఏ మీడియా అయినా చెబుతోందా? హమస్‌ ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తోందో చూడండి అంటూ అందచేస్తున్న వీడియోలలో ఒక శాతమైనా ఇజ్రాయెల్‌ దుర్మార్గాలకు సంబంధించి లేవంటే అతిశయోక్తి కాదు. వైమానికదాడులు, టాంకుల ఫిరంగి గుళ్లకు 128 మంది జర్నలిస్టులు మరణించగా వారిలో 123 మంది పాలస్తీనియన్లు, ఇద్దరు ఇజ్రాయెలీలు, ముగ్గురు లెబనీస్‌ ఉన్నారు. మరో 35 మంది గాయపడ్డారు. ఏకపక్షంగా జరుగుతున్న మారణకాండకు ఇది ఒక నిదర్శనం.ఎక్కడో ఏసి గదుల్లో కూర్చొని కంప్యూటర్‌ గ్రాఫిక్‌లు సృష్టిస్తున్నదెవరో, యుద్ధరంగంలో ప్రాణాలకు తెగించి వాస్తవాలను నివేదించేందుకు పని చేస్తున్నదెవరో అర్ధం అవుతోంది. మేము సైతం అన్నట్లుగా సాధారణ పౌరులతో పాటు పాలస్తీనా జర్నలిస్టులు పని చేస్తున్నారు, ప్రాణాలర్పిస్తున్నారు.


ఇజ్రాయెల్‌ మిలిటరీ, ప్రభుత్వ పెద్దలు అందిస్తున్న సమాచారాన్ని స్వయంగా చూసినట్లు పశ్చిమదేశాల విలేకర్లు, సంస్థలు చిత్రిస్తున్నాయి. ఐరోపాలో అతి పెద్ద మీడియా సంస్థ జర్మన్‌ యాక్సెల్‌ స్ప్రింగర్‌ అప్‌డే అనే ఒక యాప్‌ను రూపొందించింది. ఇజ్రాయెల్‌ ప్రతినిధులు చెప్పే కథనాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, పాలస్తీనీయుల మరణాలను తగ్గించి చూపాలని తన సిబ్బందికి ఆదేశాలిచ్చినట్లు దాని అంతర్గత పత్రాల ద్వారా వెల్లడైందని ఇంటర్‌సెప్ట్‌ అనే పత్రిక పేర్కొన్నది. అంతేకాదు మరీ తప్పనిసరైతే తప్ప పాలస్తీనియన్ల గురించి ప్రస్తావించవద్దని అమెరికా న్యూయార్క్‌టైమ్స్‌ పత్రిక కూడా తన సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది. యజమానులే అలాంటి వైఖరి తీసుకున్నతరువాత నిజం రాసినా, చూపినా అవి పాఠకులు, వీక్షకుల వద్దకు చేరుకోవు అన్నది మీడియాలో పని చేసేవారందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. అందుకే హమస్‌ను ఒక రాక్షసిగా, దాన్ని మట్టుపెట్టేందుకు పూనుకున్న అపరశక్తిగా, బాధిత దేశంగా ఇజ్రాయెల్‌ను చిత్రించారు. సెంటర్‌ ఫర్‌ మీడియా మోనిటరింగ్‌ ( మీడియా పరిశీలక కేంద్రం) అనే సంస్థ అంతర్జాతీయ మీడియా ఛానల్స్‌ ప్రసారం చేసిన లక్షా 80వేల వీడియోలు,బ్రిటీష్‌ మీడియా సంస్థలు రాసిన 26వేల వ్యాసాలను వడగట్టి తేల్చింది కూడా ఇదే. అక్టోబరు ఏడు నుంచి జరుగుతున్నదాడులకు ముందు కూడా మీడియా తీరు ఇలాగే ఉంది, పాలస్తీనా కోసం పోరాడుతున్నవారిని ఉగ్రవాదులుగా చిత్రించించటం తెలిసిందే. ఇటలీ మీడియా 2019`21 సంవత్సరాల తీరుతెన్నులను ఐరోపా సమాఖ్య నిధులతో ఒక పరిశోధన చేశారు. మూడు పత్రికలను పరిశీలించగా అంతర్జాతీయ వార్తలలో 32శాతం ఇజ్రాయెల్‌ ప్రధాని, నరహంతకుడు నెతన్యాహు చుట్టూ తిరిగాయని తేలింది. గతేడాది కాలంగా సాగిస్తున్న మారణకాండ ఇటాలియన్‌ మీడియాకు పట్టలేదు. ‘‘ గాజా నుంచి రాకెట్ల ప్రయోగం, గాజా నుంచి 430 రాకెట్లతో దాడి, ఇజ్రాయెల్‌కు ఆత్మరక్షణ హక్కు ఉంది ’’ ఇలాంటి శీర్షికలతో జనాన్ని తప్పుదారి పట్టించారు. దాని దుర్మార్గాలను సమర్ధించారు.


హమస్‌ దాడిచేసి 40 మంది పసిపిల్లల గొంతు కోసిందంటూ ఇజ్రాయెల్‌ అల్లిన అవాస్తవ కథనాన్ని యావత్‌ ప్రపంచ మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. చివరకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కూడా ఖండిస్తూ మాట్లాడాడు. ఇలాంటి ప్రకటనలు చేసే ముందు నిర్ధారణ చేసుకుంటే మంచిది లేకుంటే పరువు పోతుంది ముసలోడా అంటూ అతగాడి సిబ్బంది తరువాత జాగ్రత్త చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పటికీ ఈ కట్టుకథ సామాజిక మాధ్యమాల్లో తిరుగుతూనే ఉంది, ముస్లిం వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు దాన్ని ఉదహరిస్తూనే ఉన్నారు. ముస్లింలు జీహాద్‌ ప్రకటించారు, ప్రపంచ మొత్తాన్ని కబళించేందుకు పూనుకున్నారు, తమ జనాభా సంఖ్యను పెంచుతున్నారు అంటూ సాగిస్తున్న అనేక కుట్ర కథనాలతో దశాబ్దాల తరబడి జరుపుతున్న గోబెల్స్‌ ప్రచారాన్ని బుర్రలకు ఎక్కించుకున్నవారిని ఇలాంటివి వెంటనే ఆకర్షిస్తాయి. అదేగనుక వాస్తవమైతే ఇజ్రాయెల్‌ చుట్టూ ఉన్నది ముస్లిం దేశాలే, అవన్నీ ఒక్కసారిగా దండెత్తి ఉంటే ఈ పాటికి అది అదృశ్యమై ఉండేది, పాలస్తీనియన్లు ఏడున్నర దశాబ్దాలుగా అష్టకష్టాలు పడి ఉండేవారు కాదు. కానీ అలా జరగలేదే ! అలాంటిది ముస్లింలు ప్రపంచం మొత్తాన్ని ఆక్రమిస్తారంటే నమ్మేవారికి బుర్రల్లో పదార్ధం లేదన్నది స్పష్టం.ఇరాక్‌లో సద్దాం హుస్సేన్‌ మారణాయుధాలను గుట్టలుగా పోసి ప్రపంచానికి ప్రమాదం తెచ్చిపెట్టాడన్న నాటి జార్జి డబ్లు బుష్‌, మీడియా ప్రచారాన్ని అమెరికాతో పాటు అనేక దేశాల్లో జనం నమ్మారు. తరువాత అది వాస్తవం కాదని అదే అమెరికా అంగీకరించాల్సి వచ్చింది. పాలకులతో పాటు మీడియా కూడా విశ్వసనీయతను కోల్పోయింది.


అన్నెం పున్నెం ఎరుగని పసిపిల్లలను నిజంగా ఒక్కరిని చంపినా ఖండిరచాల్సిందే. ఆగస్టు 15నాటికి గాజాలో 42వేల మందిని ఇజ్రాయెల్‌ చంపితే వారిలో 17వేల మందికి పైగా పిల్లలు, పదకొండువేల మంది మహిళలు ఉన్నారు. ఏ పశ్చిమదేశాల మీడియా సంస్థలైనా దీన్ని గురించి ఎన్ని వార్తలను ఇచ్చాయి. ఇంతటి దుర్మార్గానికి పాల్పడిన తరువాత కూడా ఇంకా హమస్‌ గురించే అవి చెబుతున్నాయి.నలభై రెండువేల మందిని చంపి దాదాపు ఒక లక్ష మందిని గాయపరచి, పదివేల మందిని అదృశ్యం కావించిన యూదు దురహంకారులు పాలస్తీనియన్లను తిప్పికొట్టేందుకు చేసిన పనిగా అందమైన మాటలతో పచ్చి దుర్మార్గాన్ని పశ్చిమదేశాలు వర్ణిస్తున్నాయి. బిబిసి తీరును పరిశీలిస్తే గతేడాది అక్టోబరు 10 నుంచి డిసెంబరు రెండవ తేదీ వరకు 23సార్లు హమస్‌ సాయుధులు ఇజ్రాయెలీలపై మారణకాండ జరిపారని వర్ణిస్తే ఒక్కసారే పాలస్తీనియన్ల మీద మారణకాండ పద ప్రయోగం జరిగిందని తేలింది. అంటే దొంగే దొంగని అరచినట్లుగా బిబిసి తీరు ఉంది. ఈ తీరుకు నిరసనగా 2023 అక్టోబరులోనే ఇద్దరు ఆ సంస్థ జర్నలిస్టులు రాజీనామా చేశారు. గాజాపై దాడిని ఖండిస్తూ వెయ్యి మంది అమెరికా జర్నలిస్టులతో పాటు సంతకం చేసిన న్యూయార్క్‌ టైమ్స్‌ మాగజైన్‌ ఎడిటర్‌ జాజ్‌ హగ్స్‌ మీద యాజమాన్యం వత్తిడి తేవటంతో రాజీనామా చేసి తప్పుకోవాల్సి వచ్చింది. ఆ జాబితానుంచి పేరు తొలగించాలని అసోసియేటెడ్‌ ప్రెస్‌ విలేకరిని యాజమాన్యం ఆదేశించింది. ఇలా లాస్‌ ఏంజల్స్‌ టైమ్స్‌ వంటి అనేక పత్రికలు, మాగజైన్లు కూడా ఇజ్రాయెల్‌కు అనుకూలంగా వత్తిడి చేసి అనేక మంది జర్నలిస్టులను తొలగించటం, నోరు మూయించటం వంటి దుర్మార్గాలకు పాల్పడ్డాయి. పాలస్తీనియన్ల మీద తప్పుడు వార్తలు ఒక ఎత్తయితే వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ అనే ప్రముఖ అమెరికా పత్రిక రాసిన ఒక ఆధారం లేని వార్త కారణంగా గాజాలో నిరాశ్రయులకు అందాల్సిన 45 కోట్ల డాలర్ల సాయం నిలిచిపోయింది. గాజాలో ఐరాస నిర్వహిస్తున్న శిబిరంలో పనిచేస్తున్న పన్నెండు మంది సిబ్బందికి హమస్‌తో సంబంధాలు ఉన్నాయని, వారంతా దాడుల్లో పాల్గ్గొన్నారని ఆ పత్రిక కేవలం ఇజ్రాయెల్‌ కట్టుకథనే తనదిగా రాసింది.నిజానికి దానికి ఎలాంటి ఆధారాలు లేవు.అమెరికా సిఎన్‌ఎన్‌, బ్రిటన్‌ బిబిసిలో పని చేస్తూ గాజా పరిణామాలపై వార్తలు ఇచ్చిన పది మంది విలేకర్లు ఇజ్రాయెల్‌ అనుకూల వైఖరితో పనిచేసినట్లు వెల్లడిరచారు.న్యూస్‌ రూముల్లో ఉన్న సీనియర్లు జోక్యం చేసుకొని ఇజ్రాయెల్‌ చేసిన దుర్మార్గాలను తక్కువ చేసి చూపాలని వత్తిడి చేసినట్లు వెల్లడిరచారు.ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చిన చిత్రం ద్వారా బిబిసి భాషలో పాలస్తీనీయన్ల మీద వ్యతిరేకతను ఎలా రెచ్చగొట్టారో జరిపిన ఒక పరిశీలన వచ్చింది. అదే మంటే మారణకాండకు గురైనట్లు 23సార్లు ఇజ్రాయెల్‌ గురించి చెప్పగా ఒక్కసారి మాత్రమే పాలస్తీనా పేరును ప్రస్తావించారు. ఊచకోతకు గురైనట్లు ఇరవైసార్లు ఇజ్రాయెల్‌ గురించి చెప్పగా ఒక్కసారి కూడా పాలస్తీనా పేరు రాలేదు.


తమ పత్రికలు ఎన్ని తప్పుడు కథనాలు, అవాస్తవాలు రాసినా అమెరికా యువత ముఖ్యంగా విద్యార్థులు పాలస్తీనా అనుకూల వైఖరి తీసుకోవటం గమనించాల్సిన అంశం. వారు మీడియా కతలను నమ్మటం లేదన్నది వాస్తవం. ఇజ్రాయెల్‌ మారణకాండకు పాల్పడుతున్నదని నమ్మిన కారణంగానే ఈ పరిణామం. ఇది అక్కడి పాలకవర్గాలకు ఆందోళన కలిగించే అంశం. ప్రచారదాడి ఎదురు తిరిగితే వారి పునాదులను కదలించే కదన శక్తిగా యువత మారుతుంది.ప్రపంచ ప్రఖ్యాతిగాంచి పర్యావరణ ఉద్యమ కార్యకర్త 21 సంవత్సరాల స్వీడిష్‌ యువతి గ్రేటా థన్‌బెర్గ్‌ పాలస్తీనా అనుకూల ప్రదర్శనలో పాల్గొన్నందుకు కోపెన్‌హాగన్‌ నగరంలో అరెస్టు చేశారు. మీడియా కూడా ఆమె మీద పెద్ద ఎత్తున విమర్శలకు దిగింది.యువతలో వచ్చిన ఈ మార్పును కూడా మూసిపెట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఒకసారి నీవు బాధితుడవైనందుకు గాను ఇతరుల మీద నిరంతరం దాడి కొనసాగిస్తానంటే కుదరదు, దేనికైనా ఒక హద్దు ఉంటుంది. దాన్ని మీరి గాజాలో పాలస్తీనియన్ల మీద ఇజ్రాయెల్‌ దుర్మార్గాలకు పాల్పడుతున్నది. పశ్చిమ దేశాల మీడియా దానికి మద్దతు ఇస్తున్నది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

రెచ్చిపోతున్న ఇజ్రాయెల్‌ : వెస్ట్‌బాంక్‌కు విస్తరించిన దాడులు !

04 Wednesday Sep 2024

Posted by raomk in Current Affairs, History, imperialism, International, INTERNATIONAL NEWS, Opinion, USA, WAR, Women

≈ Leave a comment

Tags

Donald trump, Gaza, Hamas Israel, Joe Biden, Netanyahu, West Bank


ఎం కోటేశ్వరరావు


గతేడాది అక్టోబరు ఏడు నుంచి పాలస్తీనాలోని గాజా ప్రాంతంపై మారణకాండ సాగిస్తున్న ఇజ్రాయెల్‌ గత ఏడు రోజులుగా ఉగ్రవాదులను ఏరివేసే పేరుతో వెస్ట్‌ బాంక్‌ ప్రాంతమంతటా దాడులు చేస్తోంది.అనేక మంది ప్రాణాలు తీసింది. విచక్షణా రహితంగా అరెస్టులు చేస్తోంది.అక్కడేమీ హమస్‌ పార్టీ లేదా దాని మద్దతుదారులెవరూ లేరు.ఒక వైపు గాజాలో పసిపిల్లలకు పోలియో చుక్కలు వేసేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు చెబుతూనే మరోవైపు మిలిటరీదాడులు చేస్తోంది.గాజాలోని ఒక సొరంగంలో శనివారం నాడు ఆరుగురు బందీల మృతదేహాలు దొరకటంతో ఇజ్రాయెల్‌ పౌరులు దేశమంతటా లక్షలాది మంది నిరసన ప్రదర్శనలు జరపటంతో పాటు సాధారణ సమ్మె పాటించారు. ప్రధాని నెతన్యాహు దీనికి బాధ్యత వహించాలని రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.తాము బందీల వద్దకు వెళ్లటానికి కొద్దిసేపటి ముందే హమస్‌ వారిని చంపిందని ఇజ్రాయెల్‌ ఆరోపించింది.ఇజ్రాయెల్‌ దాడుల్లోనే వారు మరణించారని హమస్‌ చెబుతోంది.సోమవారం నాటికి ఇజ్రాయెల్‌ దాడులలో గాజాలో 40,786 మంది మరణించగా 94,224 మంది గాయపడ్డారు. మరణాలతో పాటు గాజాలో ఇప్పటి వరకు 60శాతం నివాస గృహాలు, 80శాతం వాణిజ్య సముదాయాలు,65శాతం సాగు భూమి, 65శాతం రోడ్లు పనికి రాకుండా చేశారు.ఆసుపత్రులు 36 ఉండగా వాటిలో 17మాత్రమే పాక్షికంగా పని చేస్తున్నాయి. అదే మాదిరి 85శాతం పాఠశాల భవనాలను నేలమట్టం చేశారు. హమస్‌ సాయుధులు వీటిని కేంద్రాలుగా చేసుకొని దాడులు చేస్తున్నట్లు ఇజ్రాయెల్‌ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.గాజాలోని ఒక పాఠశాలలో నిర్వహిస్తున్న హమస్‌ కమాండ్‌ కేంద్రాన్ని తమ వైమానిక దళం నాశనం చేసిందని ఇజ్రాయెల్‌ చెప్పుకుంది. పాలస్తీనాలో జోర్డాన్‌ నది పశ్చిమంగా ఉన్న ప్రాంతానే ్న వెస్ట్‌బాంక్‌ లేదా పశ్చిమ గట్టు అంటున్నారు. అది 5,650చదరపు కిలోమీటర్లలో ఉంది.జనాభా 30లక్షలు.దానికి ఒకవైపు జోర్డాన్‌, మరోవైపు ఇజ్రాయెల్‌,మూడోవైపు మృత సముద్రం(డెడ్‌ సీ) ఉంది.గాజాకు వెళ్లాలంటే ఇజ్రాయెల్‌ ప్రాంతాల నుంచే దారి ఉంది.అది పూర్తిగా పాలస్తీనాకు చెందినప్పటికీ అనేక ప్రాంతాలను ఇజ్రాయెల్‌ ఆక్రమించింది.దాంతో 8లక్షల 71వేల మంది పాలస్తీనియన్లు తమ స్వంతగడ్డమీదే శరణార్ధులుగా శిబిరాలలో ఉన్నారు. ఇప్పుడు ఇజ్రాయెల్‌ వాటి మీద కూడా దాడులు చేస్తున్నది.తక్షణమే హమస్‌తో రాజీకి వచ్చి వారి వద్ద ఉన్న వందకు పైగా ఉన్న బందీలను విడిపించాలని కోరుతున్నట్లు అనేక సర్వేలు వెల్లడిరచినప్పటికీ నెతన్యాహు ఖాతరు చేయటం లేదు.మరోవైపు ఇటీవల ఇరాన్‌ జరిపిన క్షిపణుల దాడి తరువాత సామాన్య జనంలో భయాందోళనలు పెరుగుతున్నాయి.ఆపరేషన్‌ ట్రూ ప్రామిస్‌ పేరుతో సెకనుకు ఒకటి చొప్పున 100 క్షిపణులను ప్రయోగించి ఉక్కిరిబిక్కిరి చేసింది.దీన్ని అమెరికా, ఇజ్రాయెల్‌ ఊహించలేదు.మా తడాఖా ఇది అని ఇరాన్‌ ప్రదర్శించిన తరువాత దాడి నిలిపివేసింది. అందువలన ఎప్పుడేం జరుగుతుందో తెలియటం లేదు.


గాజాతో పాటు వెస్ట్‌బాంక్‌ ప్రాంతం మీద కూడా జరుపుతున్న దాడులను చూస్తే పశ్చిమాసియాలో మరో ప్రాంతీయ యుద్ధానికి రెచ్చగొడుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇదంతా అమెరికా కనుసన్నల్లోనే అని వేరే చెప్పనవసరం లేదు.అయితే ఈ దాడులతో ఇజ్రాయెల్‌ మరింతగా సంక్షోభంలో కూరుకుపోతున్నదని చెప్పవచ్చు.పాలస్తీనియన్ల రెండవ తిరుగుబాటు 2000 నుంచి 2005వరకు జరిగింది. ఆ సందర్భంగా ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో మూడువేల మందికిపైగా మరణించారు. తరువాత మరోసారి ఇప్పుడు తెగబడుతోంది.ఇరాన్‌ మద్దతు ఉన్న ఉగ్రవాదులను అణచే సాకుతో ఇప్పుడు దాడులకు దిగుతోంది.ఈ పరిణామాన్ని గాజా 2.0గా వర్ణిస్తున్నారు. గాజా మారణకాండ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు వెస్ట్‌బాంక్‌లో అడపాదడపా జరుపుతున్న దాడుల్లో 150 మంది పిల్లలతో సహా 650 మంది మరణించారు.ఇప్పటి వరకు 10,300 దాడులు జరిగాయి, ఆ ప్రాంతంలోని యూదు ఆక్రమణదార్లకు వేలాది ఆయుధాలను అందించి అరబ్బులపై దాడులకు రెచ్చగొడుతున్నది. గతవారం రోజులుగా అనేక పట్టణాల్లో ఉన్న నిర్వాసితుల శిబిరాలపై మిలిటరీ దాడులు చేస్తున్నది. ఓస్లో ఒప్పందాల ప్రకారం వెస్ట్‌ బాంక్‌లో పాలస్తీనా ఫతా ప్రభుత్వం ఉన్నప్పటికీ అక్కడ అది చేసేదేమీ లేదు. అడుగడుగునా ఇజ్రాయెల్‌ మిలిటరీ, సాయుధ దళాలు ఉన్నాయి.పాలస్తీనియన్‌ ప్రాంతాల ఆక్రమణ, వాటిలో యూదుల నివాసాల ఏర్పాటు, జనాభా నిష్పత్తిని మార్చివేసే కుట్ర కొనసాగుతూనే ఉంది.వాటిని ప్రతిఘటించేవారిని అణచివేసేందుకు యూదుల రక్షణ పేరుతో ఇజ్రాయల్‌ మిలిటరీ తిష్టవేసింది. విదేశాంగ మంత్రి ఇజ్రాయెల్‌ కాట్జ్‌ మాట్లాడుతూ ‘‘ గాజాలో ఉగ్రవాదుల వ్యవస్థను దెబ్బతీస్తున్నట్లుగానే ఇక్కడ కూడా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని, విజయం సాధించాలని ’’ ప్రకటించాడు. వెస్ట్‌బాంక్‌పై దాడికి ఇజ్రాయెల్‌ చెబుతున్న సాకులన్నీ అబద్దాలేనని జోర్డాన్‌ విదేశాంగ మంత్రి అయమాన్‌ సఫాదీ వర్ణించాడు.పాలస్తీనియన్లను తమ ప్రాంతాల నుంచి తరిమివేసే ఏ చర్యనైనా తాము వ్యతిరేకిస్తామన్నాడు.


తాజా పరిణామాలో వెస్ట్‌బాంక్‌లో కూడా ప్రతిఘటించటం మినహా పాలస్తీనియన్లకు మరోదారి లేదు.ఇజ్రాయెల్‌ కోరుకుంటున్నది కూడా అదే కావటంతో కావాలని రెచ్చగొడుతున్నది. ఇటీవల చైనా మధ్యవర్తిత్వంలో పాలస్తీనా విముక్తి సంస్థలన్నీ ఒక అవగాహనకు వచ్చిన సంగతి తెలిసిందే.ఇప్పటి వరకు హమస్‌ను వ్యతిరేకిస్తున్న పరిమిత అధికారాలున్న పాలస్తీనా అధ్యక్షుడు మహమ్మద్‌ అబ్బాస్‌ కూడా పిఎల్‌ఓలో హమస్‌ భాగస్వామ్యాన్ని అంగీకరించాడు. గత కొద్ది సంవత్సరాలుగా ఇజ్రాయెల్‌ దిగ్బంధనంతో వెస్ట్‌బాంక్‌లో పరిస్థితి రోజురోజుకూ దిగజారుతున్నది. సహజంగానే అబ్బాస్‌ మీద వ్యతిరేకతను పెంచుతుంది. నేడు గాజాలో జరుగుతున్నది రేపు తమ మీద కూడా జరగవచ్చనే ఆందోళన వెస్ట్‌బాంక్‌లో తలెత్తింది.దీన్ని గమనించే అబ్బాస్‌ కూడా గత వైఖరిని మార్చుకోవాల్సి వచ్చింది.హమస్‌ కూడా ఒక అడుగు వెనక్కు తగ్గింది. ఈ కారణంగానే వెస్ట్‌బాంక్‌లో రాజకీయ విబేధాలతో నిమిత్తం లేకుండా పాలస్తీనియన్లు ప్రతిఘటిస్తున్నారు.ఇది అమెరికా, ఇజ్రాయెల్‌ మీద వత్తిడిని పెంచుతుంది, మరో మాటలో చెప్పాలంటే ఊహించని పరిణామం. తాజా దాడులకు ఇది ఒక కారణం. దీన్ని చూపి దిగజారుతున్న తన ప్రతిష్టను నిలుపుకొనేందుకు నెతన్యాహు చూస్తున్నాడు. రెండుదశాబ్దాల నాటి పరిస్థితికీ ఇప్పటికీ వచ్చిన తేడాను యూదు దురహంకారులు గుర్తించటం లేదు.గాజా పరిణామాలు పక్కనే ఉన్న జోర్డాన్‌ రాజు అబ్దుల్లాకు ఎసరుతెచ్చేవిగా ఉన్నాయి.వెస్ట్‌బాంక్‌లో దాడుల కారణంగా పాలస్తీనియన్లు నిర్వాసితులైతే జోర్డాన్‌ వారికి ఆశ్రయం కల్పించే స్థితిలో లేదు. తిరస్కరించే పరిస్థితి కూడా రాజుకు లేదు. పాలస్తీనియన్ల మీద దాడులు పెరిగితే జోర్డానియన్లు సహించరు.ఈజిప్టు,యుఏయి,మొరాకో, బహరెయిన్‌ దేశాల పాలకులు ఇజ్రాయెల్‌తో మిత్ర సంబంధాలు కలిగి ఉన్నారు.వారి మీద కూడా జనం నుంచి వత్తిడి పెరుగుతుంది.ఒక్క గాజా, వెస్ట్‌బాంక్‌ ప్రాంతాల నుంచే కాదు, గోలన్‌ గుట్టలు,లెబనాన్‌లోని ఆక్రమిత ప్రాంతాల నుంచి కూడా ఇజ్రాయెల్‌ వైదొలగాలనే డిమాండ్‌ పెరుగుతుంది.వెస్ట్‌ బాంక్‌ ప్రాంతంలో రెండవ తిరుగుబాటు జరిగినపుడు 2002లో 70వేల యూదుల నివాసాలు ఉంటే వాటిని ఇజ్రాయెల్‌ 2024నాటికి ఎనిమిది లక్షలకు పెంచింది. వాటన్నింటినీ ఖాళీ చేసి అక్రమంగా ప్రవేశపెట్టిన యూదులందరినీ అక్కడి నుంచి తరలించాల్సి ఉంది.తూర్పు జెరూసలెం రాజధానిగా గణతంత్ర పాలస్తీనా ఏర్పడాలన్న ఐరాస తీర్మానం అమలు తప్ప మరొక పరిష్కారం లేదు.
ఇజ్రాయెల్‌ జరుపుతున్న మారణకాండకు అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు నిస్సిగ్గుగా మద్దతు ఇస్తున్నాయి.గాజా మారణకాండకు నిరసనగా ఇరాన్‌ ఒకవేళ దాడులకు దిగితే అడ్డుకొనేందుకు అమెరికా తన నౌక,వైమానిక దళాలను పెద్ద ఎత్తున ఎర్ర సముద్ర ప్రాంతానికి తరలించింది.

ఒకేసారి పలు రంగాలలో దాడులకు నెతన్యాహు ఎందుకు పాల్పడుతున్నాడనే ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది.లెబనాన్‌,ఇరాన్‌లలో హమస్‌ నేతలను హత్య చేయటం,హిజబుల్లాను రెచ్చగొట్టటం,గాజాతో పాటు ఇప్పుడు వెస్ట్‌బాంక్‌పై దాడులకు దిగటం చూస్తున్నాము.నెతన్యాహు అమెరికా పర్యటన జరిపి చర్చలు జరిపి వచ్చిన తరువాత వెస్ట్‌బాంక్‌ మీద దాడులకు దిగింది.ఎవరెన్ని వివరణలు, భాష్యాలు చెప్పినప్పటికీ పొసగటం లేదు. అమెరికా ఎన్నికలు ముగిసేవరకు వర్తమాన పరిణామాలు ఇలాగే కొనసాగవచ్చు.ఉద్రిక్తతలను మరింత పెంచటం ద్వారా బైడెన్‌ మీద వత్తిడి పెరుగుతుందని అది తన విజయానికి బాట వేస్తుందనే అంచనాతో ట్రంప్‌ ఉన్నట్లు, అతగాడి నుంచి వచ్చిన సూచన మేరకు నెతన్యాహు రెచ్చిపోతున్నట్లు ఒక భాష్యం.బైడెన్‌ అమెరికాలో పలుకుబడి కలిగిన యూదుల మద్దతు పొందటానికి వారిని సంతుష్టీకరించేందుకు దాడులకు మద్దతు ఇస్తున్నాడని, దానికి అనుగుణ్యంగానే ఇజ్రాయెల్‌ వ్యవహరిస్తున్నదనే కథనాలు కూడా ఉన్నాయి. ప్రాంతీయ యుద్ధం తలెత్తితే అది ఎన్నికల్లో తమకు లాభిస్తుందని డెమోక్రాట్లు భావిస్తున్నారని కూడా చెబుతున్నారు. అయితే ఇప్పటికే ఉక్రెయిన్లో తగులుతున్న ఎదురుదెబ్బలు, భారీ ఖర్చును చూసిన తరువాత అమెరికా మరో రంగంలో చేతులు కాల్చుకుంటుందా, పరువు పోగొట్టుకొని పలుచన అవుతుందా ? కారణాలేమైనప్పటికీ అమెరికా పన్నిన వలలో చిక్కుకొనేందుకు ఇరాన్‌ తదితర దేశాలు సిద్దంగా లేవు.అయితే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అది సిద్దమౌతోంది.సౌదీతో ఉన్న విబేధాలను పరిష్కరించుకోవటంలో అదే కనిపిస్తున్నది. హమస్‌తో రాజీకి వచ్చినా తనదే పైచేయి అని చెప్పుకొనేట్లుగా నెతన్యాహు చూస్తున్నాడు, లేనట్లయితే ప్రతిపక్షం వెంటనే దాడి ప్రారంభిస్తుంది. అందుకే అసాధ్యమైన షరతులను విధిస్తున్నట్లు చెబుతున్నారు.గాజా`ఈజిప్టు సరిహద్దులో ఫిలడెల్ఫీ,నెట్‌జారిమ్‌ కారిడార్లలో తమ మిలిటరీని అనుమతించాలన్నది వాటిలో ఒకటి. దానికి హమస్‌ ససేమిరా అంటున్నది.అక్కడ తీవ్రమైన ప్రతిఘటన ఉన్నప్పటికీ మిలిటరీ కొనసాగాల్సిందేనని ఇజ్రాయెల్‌ యుద్ధ కాబినెట్‌ తీర్మానించింది. అమెరికాలో నవంబరులో ఎన్నికలు జరిగి జనవరిలో కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు పాలస్తీనాలో మారణకాండ సాగేట్లు కనిపిస్తున్నది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన చైనా : పధ్నాలుగు పాలస్తీనా విముక్తి సంస్థల ఒప్పందం !

01 Thursday Aug 2024

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, International, INTERNATIONAL NEWS, Left politics, Opinion, USA, WAR

≈ Leave a comment

Tags

Fatah, Hamas and Fatah agreement, Hamas Israel, Israel genocide, Palestine Solidarity Day, Xi Jinping


ఎం కోటేశ్వరరావు


మధ్యప్రాచ్య చరిత్రలో మరో చారిత్మాత్మక ఘట్టానికి తెరలేచింది.పాలస్తీనా విముక్తికోసం పోరాడుతున్న పధ్నాలుగు ప్రజా సంస్థలు, పార్టీలు తమ విబేధాలకు స్వస్తిపలుకుతూ ఐక్యతను పటిష్ట పరిచేందుకు 2024జూలై చివరి వారంలో చైనా మధ్యవర్తిత్వంలో ఒక ఒప్పందానికి వచ్చాయి. వీటిలో ఉప్పు-నిప్పుగా ఉన్న ఫతా – హమస్‌ కూడా ఉండటం విశేషం.ఈ ఒప్పందం పధ్నాలుగు సంస్థల ఐక్యత, అవి సమాధానపరుచుకోవటానికి అంకితమని చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యి ప్రకటించాడు. గతేడాది అక్టోబరు ఏడు నుంచి ఇజ్రాయెల్‌ మిలిటరీ పాలస్తీనాలోని గాజా ప్రాంతంలో సాగిస్తున్న మారణకాండ, పశ్చిమగట్టు ప్రాంతంలో సాగిస్తున్నదాడులు, అరబ్బు ప్రాంతాల ఆక్రమణలు కొనసాగిస్తున్న పూర్వరంగంలో ఈ ఒప్పందం కుదిరింది. పాలస్తీనా పౌరులందరికీ ఏకైక అధీకృత ప్రతినిధిగా పాలస్తీనా విముక్తి సంస్థ(పిఎల్‌ఓ)ను గుర్తించటం దీనిలో కీలకమైన అంశం.ప్రస్తుతం కొనసాగుతున్న గాజా మారణకాండ అనంతర పాలనతో పాటు తాత్కాలిక జాతీయ ప్రభుత్వ ఏర్పాటుకు కూడా అంగీకారం కుదిరింది.పశ్చిమాసియాలో చిచ్చుపెట్టి తన ఆధిపత్యాన్ని నెలకొల్పుకొనేందుకు అమెరికా కుట్రలు పన్నుతుండగా వాటిని వమ్ముచేసే క్రమంలో ఐక్యతను సాధించేందుకు చైనా తన పలుకుబడి, అనుభవాన్ని వినియోగిస్తున్నది. ఈ క్రమంలో ఇది రెండవ ఉదంతం. ఇరాన్‌-సౌదీ అరేబియా మధ్య సయోధ్యను కుదిర్చిన సంగతి తెలిసిందే. ఈ ఒప్పందంలో నాలుగు ప్రధాన అంశాలున్నాయి. తాత్కాలిక జాతీయ ఐక్యతా ప్రభుత్వం ఏర్పాటు,భవిష్యత్‌ ఎన్నికలకు ముందు ఐక్య నాయకత్వ పొందిక, నూతన పాలస్తీనా జాతీయ మండలికి స్వేచ్చగా ఎన్నికలు, ఇజ్రాయెల్‌ దాడుల పూర్వరంగంలో ఐక్యతా ప్రకటన. తాము చారిత్రాత్మక కూడలిలో ఉన్నామని, తమ పోరాటాలకు జనం స్పందిస్తున్నందున ఇంతకు మించి మరొక మార్గం లేదని చర్చలలో పాల్గన్న సంస్థల ప్రతినిధులు చెప్పారు.గాజాలో జరుగుతున్న మారణకాండే ఈ ఐక్యత వెనుక ప్రధాన కారణం అని వేరే చెప్పనవసరం లేదు. ఐక్యతా ఒప్పందం పాలస్తీనా పార్టీల అంతర్గత వ్యవహారం, అయితే అంతర్జాతీయ సమాజ మద్దతు లేకుండా సాధించలేరని చైనా ప్రతినిధి లిన్‌ జియాన్‌ చెప్పాడు. ఈ ఒప్పందాన్ని వమ్ము చేసేందుకు అమెరికా, ఇజ్రాయెల్‌ సకల యత్నాలూ చేస్తాయి.ముఖ్యంగా ఫతా సంస్థను రెచ్చగొట్టేందుకు, వత్తిడి పెంచేందుకు ఇప్పటికే రంగంలోకి దిగాయి.


పాలస్తీనా విముక్తి సంస్థ అనేక పార్టీలు, సంస్థలతో కూడిన ఒక ఉమ్మడి వేదిక. యాసర్‌ అరాఫత్‌ దీని నేతగా ఉన్న సంగతి తెలిసిందే.1993లో ఇజ్రాయెల్‌తో ఓస్లో ఒప్పందం చేసుకుంది. దాని ప్రకారం ఇజ్రాయెల్‌ ఆక్రమిత గాజా-పశ్చిమ గట్టు ప్రాంతంలో పాలస్తీనా సాధికార సంస్థ(పిఏ) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దీనిలో, అదే విధంగా పిఎల్‌ఓలో కూడా ఫతా అనే పార్టీ ప్రధాన పాత్రధారిగా ఉంది.ఈజిప్టు కేంద్రంగా పని చేస్తున్న ముస్లిం సోదరత్వం అనే సంస్థ ప్రభావం పక్కనే ఉన్న గాజా ప్రాంతంపై ఉంది. దానితో సంబంధం ఉన్న శక్తులు 1987లో హమస్‌గా ఉనికిలోకి వచ్చాయి. పిఎల్‌ఓ, దానిలో ఉన్న భాగస్వామ్య పక్షాలతో దానికి ఏకీభావం లేదు. ఓస్లో ఒప్పందాలలో భాగస్వామి కాదు. ఇజ్రాయెల్‌ ఉనికిని అది గుర్తించలేదు. పాలస్తీనా సాధనకు సాయుధ పోరాటాన్ని మార్గంగా ఎంచుకుంది. ఆ తరువాత జరిగిన పరిణామాల్లో గాజాలో తిరుగులేని రాజకీయ,మత,సాయుధ శక్తిగా ఎదగటమే కాదు, ఎన్నికల్లో తన సత్తాను చూపి అధికారానికి కూడా వచ్చింది.పశ్చిమగట్టు ప్రాంతంలో ఫతా పార్టీ అధికారంలో ఉంది.పాలస్తీనా విముక్తి కోసం అనేక సంస్థలు తమవైన పద్దతుల్లో పోరాడుతున్నాయి.కొన్ని అంశాలు, పద్దతులపై వాటి మధ్య ఏకీభావం లేని మాటవాస్తవం. దీన్ని అవకాశంగా తీసుకొని సామ్రాజ్యవాదుల మద్దతుతో ఇజ్రాయెల్‌ అణచివేతకు, తాజాగా గాజాలో మారణకాండకు పూనుకుంది.ఇజ్రాయెల్‌ను అధికారికంగా హమస్‌ గుర్తించకపోయినా 1967నాటి సరిహద్దుల ప్రాతిపదికన పాలస్తీనా ఏర్పాటు జరగాలని 2017లో అది చేసిన ప్రతిపాదనకు అర్ధం పరోక్షంగా అంగీకరించినట్లే.


పాలస్తీనా నేషనల్‌ ఇనీషియేటివ్‌ సంస్థ అధ్యక్షుడు ముస్తఫా బర్గౌటీ తాజా ఒప్పందం గురించి మాట్లాడుతూ అన్ని పక్షాలూ పిఎల్‌ఓలో చేరేందుకు అంగీకరించాయని అదొక్కటే పాలస్తీనియన్ల నిజమైన ప్రతినిధి అన్నాడు. రెండు భిన్న పార్టీల పాలనలో ఉన్న పాలస్తీనాలోని గాజా-పశ్చిమ గట్టు ప్రాంతాలను ఒకే పాలనా వ్యవస్థ కిందకు తెచ్చేందుకు 2017లో హమస్‌-ఫతా మధ్య కుదిరిన ఒప్పందం అమలు కాలేదు.2007వరకు గాజా కూడా ఫతా నాయకత్వంలోని ప్రభుత్వ ఆధీనంలోనే ఉంది. అదే ఏడాది అధికారానికి వచ్చిన హమస్‌ యంత్రాంగం ఫతాను అక్కడి నుంచి బహిష్కరించింది. కొన్ని అరబ్‌ దేశాలూ, ఈజిప్టు తెచ్చిన ఒత్తిడి మేరకు పదేండ్ల వైరాన్ని విరమించుకొనేందుకు చేసుకున్న ఒప్పందం విఫలమైంది. పాలస్తీనా అధారిటీ ప్రధాన మంత్రి రామీ హమదల్లా 2018లో గాజా సందర్శనకు వచ్చినపుడు హత్యాయత్నం జరిగింది. దానికి హమసే కారణమని ఫతా ఆరోపించింది. గతం కంటే నిర్దిష్టంగా కొన్ని చర్యలు తీసుకొనేందుకు తాజా ఒప్పందంలో అంగీకరించినట్లు ముస్తఫా చెప్పారు. మొత్తంగా పాలస్తీనాను అంతం చేసేందుకు ఇజ్రాయెల్‌ పూనుకున్నందున దానికి వ్యతిరేకంగా ఐక్యమౌతున్నట్లు చెప్పారు. ఏకాభిప్రాయ సాధనతో ఉమ్మడి ప్రభుత్వం ఎప్పుడు ఏర్పడుతుందనే అంశంపై కూడా ఒప్పంద పక్షాల్లో స్పష్టత ఉన్నట్లు కనిపిస్తోంది. ఒక వైపు అమెరికా ఇతర దేశాల అండచూసుకొని ఇజ్రాయెల్‌ మారణకాండను కొనసాగిస్తూనే ఉంది. అది ముగిసిన తరువాత ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడుతుందా ? బీజింగ్‌ ఐక్యతా చర్చల్లో పాల్గొన్న హమస్‌ ప్రతినిధి హసమ్‌ బద్రన్‌ మాట్లాడుతూ ధ్వంసమైన ప్రాంతాల పునర్‌నిర్మాణం, తగిన సమయంలో ఎన్నికలు జరపాలన్న నిర్ణయం జరిగిందని, అయితే దాడులు కొనసాగుతున్నప్పటికీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడవచ్చని, అది కాల్పుల విరమణకు దోహదం చేయవచ్చన్నాడు. ఈ ఏడాది ఏప్రిల్‌లో బీజింగ్‌లో హమస్‌-ఫతా ప్రతినిధుల మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి.తరువాత చైనా నేత షీ జింపింగ్‌ మధ్య ప్రాచ్య దేశాలకు ప్రత్యేక రాయబారిని పంపి అంతర్జాతీయ శాంతి సభ జరపటానికి గల అవకాశాలను పరిశీలించారు. ఈప్రక్రియకు ముందు ఇరాన్‌-సౌదీ అరేబియా మధ్య చెలిమి అసాధ్యం అనుకున్న దాన్ని చైనా సుసాధ్యం గావించింది.మధ్య ప్రాచ్యం, పశ్చిమాసియాలో అమెరికాతో పోలిస్తే చైనా పాత్ర పరిమితమే. అయినప్పటికీ తంపులు పెట్టే అమెరికాతో పోలిస్తే దానికి భిన్నమైన వైఖరితో ఉన్నందున బీజింగ్‌ పట్ల విశ్వసనీయత పెరుగుతోంది.


గాజాలో మారణకాండ పూర్వరంగంలో అంతర్జాతీయ సమాజ అభిప్రాయం ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా మారుతున్నది. గత 57 సంవత్సరాలుగా తూర్పు జెరూసలెం, గాజా, పశ్చిమ గట్టు ప్రాంతాలను ఆక్రమించటం చట్టవిరుద్దమని అంతర్జాతీయ న్యాయ స్థానం(ఐసిజె) వ్యాఖ్యానించింది. ఓస్లో ఒప్పందం ప్రకారం పశ్చిమ గట్టు ప్రాంతంలలో పాలస్తీనా అధారిటీ పాలన కొనసాగుతున్నప్పటికీ యూదుల నివాసాల ముసుగులో ఇజ్రాయెల్‌ దురాక్రమణలు కొనసాగుతూనే ఉన్నందున ఫతా సంస్థ వైఖరిలో మార్పురాక తప్పలేదు. ఈ ఏడాది ఇప్పటి వరకు 23.7చదరపు కిలోమీటర్ల మేర ఇజ్రాయెల్‌ ఆక్రమించిందని పీస్‌ నౌ అనే స్వచ్చంద సంస్థ పేర్కొన్నది.గత రెండు దశాబ్దాల్లో ఆక్రమించినదానికంటే ఇది ఎక్కువ. అమెరికా మధ్యవర్తిత్వలో 1993లో కుదిరిన ఓస్లో ఒప్పందం ప్రకారం పశ్చిమ గట్టును ఏబిసి ప్రాంతాలుగా విభజించారు. ఏ తరగతి పాలస్తీనా అధారిటీ ఏలుబడిలో, బి ప్రాంతాలు ఇజ్రాయెల్‌-పాలస్తీనా ఉమ్మడి పాలన, సి ప్రాంతాలు ఇజ్రాయెల్‌ ఆధీనంలో ఉంటాయి. మూడవ ప్రాంతంలో యూదుల నివాసాల ఏర్పాటుతో పాటు అరబ్బు రైతాంగాన్ని ఇజ్రాయెల్‌ క్రమంగా తొలగిస్తున్నది.పాలస్తీనా పశ్చిమ గట్టు ప్రాంతంలో 1990దశకంలో ఇజ్రాయెల్‌ తీసుకువచ్చిన యూదుల సంఖ్య రెండున్నర లక్షలు కాగా ప్రస్తుతం ఏడు లక్షలకు పెరిగారు. పాలస్తీనా రాజధానిగా ఉండే తూర్పు జెరూసలెంలో అలాంటి వారిని 800 నుంచి మూడు వేలకు పెంచారు. గాజాలో మారణకాండ ప్రారంభించిన ఇజ్రాయెల్‌ పశ్చిమ గట్టు ప్రాంతంలో కూడా దాడులకు పూనుకుంది. ఇప్పటి వరకు 513 మంది పాలస్తీనియన్లను మిలిటరీ చంపివేసింది.వందలాది మందిని గాయపరచింది.ప్రతి ఏటా ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతూనే ఉంది.


ఒప్పందాన్ని తామింకా సమీక్షించలేదంటూ గాజాలో హమస్‌ పాత్రను తాము సమర్ధించే ప్రసక్తే లేదని అమెరికా ప్రకటించింది. ఒక ఉగ్రవాద సంస్థకు ప్రభుత్వంలో పాత్ర ఉండకూడదని ప్రతినిధి మిల్లర్‌ చెప్పాడు.ప్రస్తుత యుద్ధం ముగిసిన తరువాత రెండు ప్రాంతాల్లో ఒకే ప్రభుత్వం ఉండాలని తాము కోరుకుంటున్నట్లు చెప్పాడు. పాలస్తీనా ఐక్యతా ఒప్పందం అమలు జరుగుతుందా ? భాగస్వామ్య పక్షాలు కట్టుబడి ఉంటాయా, భవిష్యత్‌లో హమస్‌ పాత్ర ఏమిటి అంటూ మీడియా, ప్రభుత్వాలలో చర్చలు జరుగుతున్నాయి. ఐక్యతను దెబ్బతీసేందుకు చాణక్య నీతిని ప్రయోగించేందుకు అమెరికా, ఇతర పశ్చిమదేశాలు చూస్తున్నాయి. సందేహాలు లేవనెత్తుతున్నవారందరినీ ఒకేగాటన కట్టలేము గానీ కొన్ని ఆచరణాత్మక సమస్యలు ముందుకు వచ్చినప్పటికీ మొత్తానికే ఎసరు పెడుతున్న సామ్రాజ్యవాదుల కుట్ర, చర్యల కారణంగా వాటిని పరిష్కరించుకొనే పరిణితిని పాలస్తీనా సంస్థలు ప్రదర్శిస్తాయి.దానిలో పెద్ద ముందడుగే తాజా ఒప్పందం.ఒప్పందమైతే జరిగింది గానీ దాని అమలు గురించి అనేక మందికి సందేహాలున్నా అవసరాలు వివిధ పక్షాల వైఖరుల్లో మార్పులకు దోహదం చేస్తున్నాయి.అనేక పరిణామాలను చూసినపుడు ప్రతి పాలస్తీనా సంస్థ అనేక గుణపాఠాలు నేర్చుకుంది. ఐక్యత కోసం రాజీలకు, సర్దుబాట్లకు సిద్దంగాక తప్పని స్థితిలో పడ్డాయి. మొదటికే మోసం తెస్తున్న ఇజ్రాయెల్‌ను నిలువరించటం ప్రధమ కర్తవ్యంగా భావించాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

పాలస్తీనియన్లపై మారణకాండ : ఆపితే నెతన్యాహు, కొనసాగిస్తే జో బైడెన్‌ పతనం !!

08 Wednesday May 2024

Posted by raomk in Asia, COUNTRIES, Current Affairs, History, imperialism, International, INTERNATIONAL NEWS, Opinion, WAR

≈ Leave a comment

Tags

Donald trump, Gaza, Hamas Israel, Israel’s Gaza Onslaught, Joe Biden, Netanyahu, Rafah


ఎం కోటేశ్వరరావు


పాలస్తీనాలోని గాజా ప్రాంతంపై ఇజ్రాయెల్‌ మారణకాండ బుధవారం నాటికి 215వ రోజుకు చేరుకుంది. కాల్పుల విరమణ ఒప్పందం గురించి చర్చలు సాగుతున్నాయి.తమకు అంగీకారమే అని హమస్‌ చెప్పింది.ఎటూ తేల్చకపోగా రఫా నగరం మీద సైనిక చర్యకు ముందుకు పోవాలని ఇజ్రాయెల్‌ యుద్ధ మంత్రివర్గం ఏకగ్రీవంగా నిర్ణయించింది.మరొకవైపు చర్చలకు తమ ప్రతినిధులను పంపుతామని చెబుతూనే సోమవారం రాత్రి నుంచి మంగళవారం తెల్లవారే వరకు వైమానిక దాడులు జరుపుతూ రాఫా-ఈజిప్డు సరిహద్దు ద్వారం దగ్గర పాలస్తీనా వైపు ప్రాంతాన్ని ఇజ్రాయెల్‌ దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ చర్యను చర్చల మధ్యవర్తి కతార్‌ ఖండించింది. దాడులు కొనసాగుతున్నాయి. గాజాలోని పౌరులకు ఐరాస అందిస్తున్న సహాయాన్ని కూడా అడ్డుకుంటున్నాయి.దాడుల్లో అనేక మంది మరణించారు. మధ్యవర్తులు ముందుకు తెచ్చిన ప్రతిపాదనలను హమస్‌ ఆమోదించినప్పటికీ తమకు అంగీకారం కాదని, తమ డిమాండ్లకు చాలా దూరంగా ఉందని నెతన్యాహు కార్యాలయం చెప్పింది. మంగళవారం నాటికి గాజాలో 34,789 మందిని ఇజ్రాయెల్‌ చంపివేసినట్లు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. గాయపడిన వారు 78,204 మంది. రాఫాను ఖాళీ చేయాలని పౌరులను ఇజ్రాయెల్‌ ఆదేశించింది. ఇతర దేశాలకు ప్రత్యేకించి పక్కనే ఉన్న ఈజిప్టుకు వెళ్లకుండా దిగ్బంధనం గావించింది.ఇది రాసిన సమయానికి ఏం జరగనుందో తెలియని స్థితి.జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ఒకటి స్పష్టం.ఏదో ఒక ఒప్పందం చేసుకొని హమస్‌ వద్ద బందీలుగా ఉన్న వారిని విడిపించాలని నెతన్యాహు మీద రోజు రోజుకూ వత్తిడి పెరుగుతోంది.మరోవైపు హమస్‌ను తుడిచిపెట్టకుండా వెనుదిరిగితే మీ సంగతి చూస్తామనే దురహంకారులు.మారణకాండకు మద్దతు ఇవ్వటాన్ని ఏమాత్రం సహించం అంటున్న విద్యార్థులపై జో బైడెన్‌ సర్కార్‌ కాల్పులకూ పాల్పడింది. గాజా దక్షిణ ప్రాంతంలోని రాఫా నగరం మీద దాడులకు దిగితే అక్కడ ఉన్న పిల్లలు పెద్ద సంఖ్యలో మరణించే అవకాశం ఉన్నందున హమస్‌ ఒక అడుగు వెనక్కు తగ్గేందుకు నిర్ణయించినట్లు కనిపిస్తోంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే మారణకాండను కొనసాగించకపోతే నెతన్యాహు, ముందుకు పోతే ఎన్నికల్లో జో బైడెన్‌ పతనం ఖాయంగా కనిపిస్తోందన్న వ్యాఖ్యలు వెలువడుతున్నాయి. మారణకాండను అంతర్జాతీయ న్యాయ స్థానం కూడా అడ్డుకోలేకపోయింది. తన ఆదేశాన్ని ధిక్కరించిన ఇజ్రాయెల్‌ను ఏమీ చేయలేని అశక్తురాలిగా మారింది.పాలస్తీనా పౌరులకు సంఘీభావం తెలుపుతున్న విద్యార్థులు యూదు వ్యతిరేకులంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ నిందించి మరింతగా రెచ్చగొట్టారు.


మంగళవారం తెల్లవారు ఝామున ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో అనేక మంది మరణించినట్లు వార్తలు. వైమానిక దళం జరిపినదాడుల్లో అనేక భవనాలు నేలమట్టం కాగా అనేక మంది శిధిలాల్లో చిక్కుకు పోయారు. ఎందరు గాయపడింది, మరణించిందీ ఇంకా స్పష్టం కాలేదు. తమ ఆసుపత్రికి పదకొండు మృతదేహాలు వచ్చినట్లు రాఫాలోని కువాయిట్‌ ఆసుపత్రి వెల్లడించింది. హమస్‌ వద్ద ఉన్న తమ బందీలను విడిపించే వరకు దాడులు కొనసాగిస్తూనే ఉంటామని మరోవైపు చర్చలకు తమ ప్రతినిధి బృందాన్ని పంపుతామని ఇజ్రాయెల్‌ ప్రకటించింది. ఇరవైలక్షల మందికి పైగా పాలస్తీనియన్లు గాజాలో వున్నారు. వారి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ఇజ్రాయెల్‌ మిలిటరీ తరలిస్తున్నది.ఈ క్రమంలో 64చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న రాఫా నగరం, పరిసరాల్లో లక్షల మంది తలదాచుకుంటున్నారు. హమస్‌ సాయుధులు జనంలో కలసిపోయినందున వారిని పట్టుకోవాలంటే పెద్ద ఎత్తున దాడులు చేయకతప్పదని ఇజ్రాయెల్‌ చెబుతున్నది. అసలు ఆ సాకుతోనే ఏడు నెలలుగా దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే.రాఫా నుంచి వెళ్లిపోవాలని ఆదేశించటం ఏ మాత్రం సహించరాదని ఐరాస ప్రధాన కార్యదర్శి చెప్పారు. ఈ దాడులను వ్యతిరేకిస్తున్నట్లు అమెరికా కబుర్లు చెబుతున్నది. బందీల విడుదలకు తాత్కాలిక కాల్పుల విరమణ అని ఇజ్రాయెల్‌ చెబుతుండగా పూర్తిగా గాజా నుంచి వైదొలగాని హమస్‌ పట్టుబట్టటంతో ఈజిప్టు రాజధాని కైరోలో జరుగుతున్న చర్చలు నిలిచిపోయాయి. సంప్రదింపుల ప్రక్రియ వెంటిలేటర్‌ మీద ఉంది, అందుకే ఒక మధ్యవర్తిగా ఉన్న కతార్‌తో చర్చలు జరిపేందుకు సిఐఏ డైరెక్టర్‌ బిల్‌ బరన్స్‌ వెళ్లినట్లు ఇజ్రాయెల్‌ మీడియా పేర్కొన్నది. మూడు దశల్లో ఒప్పందం అమలు జరుగుతుందని, తన వద్ద బందీలుగా ఉన్న 132 మందిలో 33 మందిని 42 రోజుల వ్యవధిలో విడుదలు చేస్తుందని దీనికి ఇరు పక్షాలూ అంగీకరించినప్పటికీ తదుపరి రెండు దశల గురించి వివాదం ఏర్పడిందని తొలుత వార్తలు వచ్చాయి. కొత్త ప్రతిపాదనలను అంగీకరిస్తున్నట్లు సోమవారం హమస్‌ ప్రతినిధి ఈజిప్టు, కతార్‌ మంత్రులకు ఫోన్‌ ద్వారా తెలిపినట్లు వార్తలు. ఇజ్రాయెల్‌ వైపు నుంచి ఎలాంటి స్పందన లేకపోగా రాఫా ప్రాంతం నుంచి పాలస్తీనియన్లు వెళ్లిపోవాలని విమానాల నుంచి వెదజల్లిన కరపత్రాల్లో ఆదేశించటమేగాక, రాత్రి నుంచి దాడులను కూడా ప్రారంభించింది. ఒప్పందం కుదిరినా కుదరకున్నా దాడులు చేసి తీరుతామని నెతన్యాహు చెబుతున్నాడు.


కైరో చర్చలు సఫలమౌతాయని, తక్షణ, శాశ్వత కాల్పుల విరణమకు దారితీస్తాయని కతార్‌ విదేశాంగశాఖ ప్రతినిధి మహమ్మద్‌ అల్‌ అన్సారీ చెప్పారు.వ్యవధి కోసం హమస్‌ నాటకమాడుతున్నదని, దాడులను నిలిపివేసేందుకు, చర్చల వైఫల్య నెపం తమపై నెట్టేందుకు చూస్తున్నదని ఇజ్రాయెల్‌ ఆరోపిస్తున్నది.రాఫా ఇప్పుడు బాలల నగరంగా మారిందని, దాడులు జరిగితే పెద్ద ఎత్తున ప్రాణనష్టం ఉంటుందని యూనిసెఫ్‌ ఆందోళన వ్యక్తం చేసిందని, రక్షణ కోసం పిల్లలు ఎక్కడకు వెళ్లాలో తెలియని స్థితిలో ఉన్నారని సంస్థ డైరెక్టర్‌ కాథరీన్‌ రసెల్‌ చెప్పారు. ఇప్పటికే అక్కడి పిల్లలు భౌతికంగా, మానసికంగా ఎంతో బలహీనపడ్డారని, పిల్లలతో పాటు మొత్తం జనాన్ని రక్షించాల్సి ఉందన్నారు. ఇజ్రాయెల్‌ దాడులకు ముందు నగరం, పరిసరాల జనాభా రెండున్నరలక్షలు కాగా ప్రస్తుతం అక్కడ పన్నెండు లక్షల మంది తలదాచుకుంటున్నారని, వారిలో దాదాపు ఆరులక్షల మంది పిల్లలే ఉంటారని చెబుతున్నారు.హమస్‌ ఒక మెట్టు దిగిరావటానికి ఇది కూడా ఒక కారణం అని చెప్పవచ్చు. దాడుల ప్రభావం పెద్దల మీద కంటే పిల్లల మీద ఎక్కువగా ఉంటుందని యూనిసెఫ్‌ హెచ్చరించింది. రాఫా మీద దాడి అంటే ఏదో విహారయాత్ర అని భావిస్తే పొరపాటు తమ వారిని రక్షించేందుకు పూర్తి సన్నద్దంగా ఉన్నామని హమస్‌ ప్రకటించింది. దాడులకు పాల్పడవద్దని సౌదీ అరేబియా విదేశాంగశాఖ ఇజ్రాయెల్‌ను హెచ్చరించింది.


తమ నేత జో బైడెన్‌కు గాజా మరో వియత్నాంగా మారుతున్నదని, అయితే డోనాల్డ్‌ ట్రంప్‌ను వెనక్కు కొట్టేందుకు తాను బైడెన్‌కు మద్దతు ఇస్తున్నట్లు డెమోక్రటిక్‌ సోషలిస్టు నేత బెర్నీ శాండర్స్‌ ప్రకటించాడు.గాజాలో మారణకాండను ఖండిస్తూ అమెరికా విద్యార్ళులు పెద్ద ఎత్తున నిరసనలకు దిగటంతో ఎన్నికలలో పోటీ చేస్తున్న అధ్యక్షుడు జో బైడెన్‌ ఇరకాటంలో పడ్డాడు. ఉద్యమాన్ని అణచివేసేందుకు పూనుకోవటంతో పాటు ప్రపంచాన్ని నమ్మించేందుకు ఇజ్రాయెల్‌ మీద వత్తిడి తెస్తున్నట్లు నాటకం ప్రారంభించాడు.రాఫాపై దాడులను వ్యతిరేకిస్తున్నట్లు బైడెన్‌ స్పష్టం చేసినట్లు జాతీయ భద్రతా మీడియా సలహాదారు జాన్‌ కిర్బీ చెప్పాడు. అర్ధగంటపాటు నెతన్యాహు-జో బైడెన్‌ ప్రైవేటుగా నిర్మాణాత్మకంగా మాట్లాడుకున్నారని అన్నాడు. నెతన్యాహుతో మాట్లాడిన తరువాత జో బైడెన్‌ వైట్‌హౌస్‌లో జోర్డాన్‌ రాజు రెండవ అబ్దుల్లాకు అనధికారిక మధ్యాహ్న విందు ఏర్పాటు చేశాడు. ఇజ్రాయెల్‌ గనుక రాఫాపై దాడులకు దిగితే పెద్ద ఎత్తున మారణకాండ జరిగే అవకాశముందని అబ్దుల్లా హెచ్చరించినట్లు వార్తలు వచ్చాయి. ఏడు నెలల దాడుల తరువాత గాజాలో తీవ్రమైన కరవు పరిస్థితి ఏర్పడిందని ఐరాస ప్రపంచ ఆహార కార్యక్రమ అధిపతి సిండీ మెకెయిన్‌ చెప్పాడు.తన మీద ప్రపంచ నేతలెవరూ ఏమాత్రం వత్తిడి తేలేరని, ఏ అంతర్జాతీయ సంస్థా ఇజ్రాయెల్‌ తనను తాను కాపాడుకోవటాన్ని అడ్డుకోజాలదని నెతన్యాహు ఆదివారం నాడు చెప్పాడు.


కొలంబియా విశ్వవిద్యాలయాన్ని అదుపులోకి తీసుకున్న న్యూయార్క్‌ పోలీసుల్లో ఒకడు విద్యార్థుల మీద కాల్పులు జరిపినట్లు వార్తలు వచ్చాయి. వారి వెనుక బయటి శక్తుల హస్తం ఉందనే సాకుతో ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తున్నది.దీనికి కార్పొరేట్‌ మీడియా మరింతగా ఆజ్యం పోస్తున్నది.ప్రభుత్వ యంత్రాంగం ఎంతగా రెచ్చగొడుతుంటే అంత ఎక్కువగా విద్యార్థులు ఆందోళనలకు దిగుతున్నారు. గుడారాలను పీకివేస్తే వెంటనే కొత్త వాటిని ఏర్పాటు చేస్తున్నారు. దొంగే దొంగని అరచినట్లుగా విద్యార్థుల నిరసనలను తప్పుదారి పట్టించేందుకు ఇజ్రాయెల్‌ అనుకూలురను రెచ్చగొట్టి పోటీ ప్రదర్శనలను చేయించటం, ఆ ముసుగులో పౌరదుస్తుల్లో ఉన్న పోలీసులు, బయటివారిని రప్పిస్తున్నట్లు అనేక చోట్ల స్పష్టమైంది.వారు విద్యా ప్రాంగణాల్లో ప్రవేశించి దాడులు చేస్తున్నారు. యూదు వ్యతిరేక నినాదాలు చేస్తూ విద్యార్ధుల ఆందోళనను తప్పుదారి పట్టించేందుకు చూస్తున్నారు. ఇలాంటి వారి చర్యలను చూపి మీడియా దాడులకు దిగుతున్నది. మీడియాకు జరుగుతున్నదేమిటో తెలిసినప్పటికీ ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నది కనుక దాని ప్రాపకం కోసం కట్టుకథలు రాస్తున్నది పిట్టకతలు చెబుతున్నది. పార్లమెంటు సభ్యుల కమిటీల పేరుతో విద్యా సంస్థల చాన్సలర్లు, అధ్యక్షులు, ఇతర అధికారులతో సమావేశాలను ఏర్పాటు చేసి ఆందోళనను అదుపు చేసేందుకు తీసుకుంటున్న చర్యలేమిటని అడ్డదిడ్డంగా ప్రశ్నిస్తున్నారు. గట్టిగా వ్యవహరించకపోతే రాజీనామా చేసి ఇంటికి పోండని వత్తిడి తెస్తున్నారు. విద్యార్థుల ఆందోళనలను అణచివేయకపోతే తాము ఇచ్చిన విరాళాలను స్థంభింప చేస్తామని బెదిరించేందుకు దాతలను రంగంలోకి దించారు. నిజానికి వీరంతా బయటివారు తప్ప ఆందోళన చేస్తున్న వారు లేదా వారికి మద్దతు ఇస్తున్నవారు కాదు. ఇలాంటి వారిని చూసి ఆందోళనలకు దూరంగా ఉన్నవారు తొలి రోజుల్లో పొరపాటు పడిన అనేక మంది ఇప్పుడు తోటి విద్యార్థులతో చేతులు కలుపుతున్నారు. మహిమగల దుస్తులు వేసుకున్నానంటూ దిగంబరంగా వీధుల్లోకి వచ్చిన రాజును చూసి నిజం చెబితే రాజుగారి దెబ్బలకు గురికావాల్సి వస్తుందని ప్రతి వారూ రాజుగారి దుస్తులు బహుబాగున్నాయని పొగుడుతుంటే భయమంటే ఏమిటో తెలియని ఒక పిల్లవాడు రాజుగారి గురించి నిజం చెప్పినట్లుగా విద్యార్థులు ఆందోళన ద్వారా అనేక మంది కళ్లు తెరిపిస్తున్నారు. దిగంబర అమెరికా పాలకుల నైజాన్ని బయటపెడుతున్నారు.ఉన్మాద పులిని ఎక్కిన ఇజ్రాయెల్‌ నెతన్యాహు ఇప్పుడు వెనక్కు తగ్గితే రాజకీయంగా పతనమే, గాజాలో మారణకాండ ఇంకా కొనసాగితే దాన్ని నిస్సిగ్గుగా బలపరిస్తే ఎన్నికల్లో జో బైడెన్‌కు ఓటమి తప్పదంటున్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఆరు నెలల ఇజ్రాయెల్‌ మారణకాండ ! పాలస్థీనియన్ల ప్రతిఘటన !!

10 Wednesday Apr 2024

Posted by raomk in BJP, Current Affairs, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, USA, WAR

≈ Leave a comment

Tags

Hamas Israel, Israel’s Gaza Onslaught, Joe Biden, Narendra Modi Failures


ఎం కోటేశ్వరరావు


2023 అక్టోబరు ఏడు నుంచి పాలస్తీనాలోని గాజా ప్రాంతంలో యూదు దురహంకారులు జరుపుతున్న మారణకాండ, దానికి పాలస్థీనియన్ల ప్రతిఘటనకు ఆరు నెలలు దాటింది. అమెరికా, ఇతర పశ్చిమదేశాల దన్ను చూసుకొని గాజాలో సాగిస్తున్న హత్యలు, విధ్వంస కాండ ఎప్పుడు, ఎలా ముగుస్తుందో తెలియదు.ఈ దారుణాన్ని నివారించలేని పనికిమాలిన సంస్థగా ఐరాస పేరుతెచ్చుకుంది.ఎన్ని కబుర్లు చెప్పినా ఆచరణకు వచ్చేసరికి న్యాయం వైపు ఎవరు నిలిచారో, అన్యాయం, అక్రమాలను ఎవరు సమర్ధిస్తున్నారో లోకానికి వెల్లడైంది.ఇజ్రాయెల్‌ జరుపుతున్న మారణకాండకు మద్దతు ఇస్తున్న జర్మనీపై అత్యవసరంగా ఆంక్షలు విధించాలని అంతర్జాతీయ కోర్టులో వామపక్ష నేత డేనియల్‌ ఓర్టేగా అధ్యక్షుడిగా ఉన్న లాటిన్‌ అమెరికాలోని నికరాగువా దాఖలు చేసిన పిటీషన్‌పై హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానం విచారణ ప్రారంభించింది. మారణకాండకు మద్దతు ఇవ్వటమేగాక పాలస్థీనా నిర్వాసితులకు సాయం చేస్తున్న ఐరాస సంస్థకు జర్మనీ నిధులను నిలిపివేసిందని కూడా నికరాగువా పేర్కొన్నది. తక్షణమే గాజాలో దాడులను విరమించాలని, యుద్ధం, నేరాలకు జవాబుదారీ ఎవరో తేల్చాలని తాజాగా ఐరాస మానవహక్కుల మండలిలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెడితే ఓటింగ్‌ నుంచి మనదేశం, మరోపన్నెండు తప్పుకున్నాయి.చైనాతో సహా 28 దేశాలు అనుకూలంగా, అమెరికాతో పాటు మరో ఆరు వ్యతిరేకంగా ఓటు వేశాయి. విశ్వగురువులం కదా ! మనం ఎటున్నట్లు ? మానవహక్కుల రక్షణకా భక్షణకా ? బేటీపడావో బేటీ బచావో అని చెప్పిన పెద్దలకు గాజాలో మరణిస్తున్నవారిలో 70శాతం మంది పిల్లలు, మహిళలు ఉన్న సంగతి తెలియదా ? ఈ దారుణాలకు పాల్పడుతున్న ఇజ్రాయెల్‌ను నిలదీసేందుకు ఎందుకు నోరు రావటం లేదు ? ముస్లిం వ్యతిరేకత తప్ప ఎవరిని సంతుష్టీకరించేందుకు ఈ వైఖరి ?


గాజాలో జరుగుతున్నదేమిటి ? తమ మాతృదేశ పునరుద్దరణ జరగాలన్న పాలస్థీనియన్ల అణచివేత తప్ప మరొకటి కాదు. ఎవరు చేస్తున్నారు ? సామ్రాజ్యవాదుల మద్దతుతో వారి చేతిలో పావుగా ఉన్న ఇజ్రాయెల్‌, అంటే సామ్రాజ్యవాదులే దాడి కారకులు.చరిత్రలో వారు చేసిన దాడులన్నీ దారుణాలుగా నమోదయ్యాయి. అందుకు అత్యంత దుర్మార్గ ఉదాహరణ 1968 మార్చి 15వ తేదీన వియత్నాంలోని మై లాయి ఊచకోత. విలియం కాలే అనే అధికారి ఉత్తరువుల మేరకు ఎర్నెస్ట్‌ మెదీనా అనే అమెరికన్‌ కెప్టెన్‌ కదులుతున్న ప్రతిదాన్నీ అంతం చేయమని ఆదేశాలు జారీ చేస్తే అమెరికా సైనికులు ఐదు వందల మందిని చంపివేశారు. ఇప్పుడు గాజాలో జరుగుతున్నదానికి దానికి తేడా ఏమైనా ఉందా ? ఆసుపత్రులు, స్కూళ్లు, నిర్వాసితుల కేంద్రాలు, సహాయ శిబిరాలు, అన్నదానం చేస్తున్నవారు ఎవరు కనిపించినా హతమార్చాలని నెతన్యాహు ఆదేశాలు జారీ చేస్తే ఇజ్రాయెల్‌ సైనికులు అమలు చేస్తున్నారు. గత ఆరునెలల్లో 33,482(ఏప్రిల్‌ 10వ తేదీ నాటికి) మందిని చంపివేశారు. మరో విధంగా చెప్పాలంటే గాజాలోని ప్రతి 70 మందికి ఒకరిని, రోజుకు 180మందిని చంపారు. వీరుగాక 75,815 మందిని, రోజుకు 400 మందిని, ప్రతి 30 మందిలో ఒకరిని గాయపరిచారు. విధ్వంసమైన భవనాల గురించి చెప్పనవసరం లేదు. ఇరవై రెండు లక్షల మంది జనాభాలో 19లక్షల మంది నిరాశ్రయులు కావటం లేదా నెలవులు తప్పారంటే ప్రభావితం కాని కుటుంబం లేదంటే అతిశయోక్తి కాదు. ఇంతటి దుర్మార్గానికి పాల్పడుతున్న ఇజ్రాయెల్‌కు అమెరికా అన్ని రకాల ఆయుధాలను అందించటమే కాదు, ఎర్ర సముద్రంలోకి తన యుద్ధ నావలను దింపి బాసటగా నిలుస్తున్నది. ఆ ప్రాంత దేశాలు జోక్యం చేసుకోకుండా బెదిరిస్తున్నది.


సామ్రాజ్యవాదుల వర్తమాన రక్త చరిత్రలో విస్మరించరాని దుర్మార్గమిది. కొందరు సైనికులు చేసిన దారుణం కాదిది, వ్యవస్థాపూర్వకమైనది. ఎవరికి ఏది నేర్పితే దాన్నే పాటిస్తారు.ఇజ్రాయెల్‌ రక్షణ దళాల్లో ప్రతి యువకుడు కొంతకాలం విధిగా పని చేయాలి. ఆదేశించిన దుర్మార్గాలను అమలు చేయాలి.తిరస్కరిస్తే ఏం చేస్తారు ? ప్రజాస్వామిక హక్కని వదలి వేయరు. విదేశాల్లో ఉన్న ఒక యువ ఇజ్రాయెలీ కమ్యూనిస్టు ఈ దళాల్లో చేరేందుకు తిరస్కరించాడు. గాజా మారణకాండను నిరసిస్తూ జరిగిన ప్రదర్శనల్లో పాల్గొని అరెస్టయ్యాడనే కారణాన్ని చూపి అతని పౌరసత్వాన్ని ఇజ్రాయెల్‌ ప్రభుత్వం రద్దు చేసింది. దేశంలోకి రావటాన్ని నిషేధించింది.రాజ్య అణచివేత, మిలటరీ విధానాలను నిరసించాలని, అణచివేతను వ్యతిరేకించాలని సోదర ఇజ్రాయెలీలకు అతను రాసిన లేఖలో పేర్కొన్నాడు. మధ్య ప్రాచ్య సోషలిస్టు ఫెడరేషన్‌లో భాగంగా ఇజ్రాయెల్‌-పాలస్తీనా సోషలిస్టు ఫెడరేషన్‌ ఏర్పాటు జరిగినపుడే ఈ ప్రాంతంలోని జనాలందరూ సుఖంగా ఉంటారని పేర్కొన్నాడు. గాజాలో మారణకాండను విమర్శించినందుకు ఇజ్రాయెల్‌ పార్లమెంటులోని కమ్యూనిస్టు పార్టీ సభ్యుడు ఒఫెర్‌ కాసిఫ్‌ను 2023 అక్టోబర్‌ 18న 45 రోజుల పాటు సస్పెండ్‌ చేస్తూ పార్లమెంటరీ నైతిక నియమాల కమిటీ తీర్మానించింది. అయినప్పటికీ ఖాతరు చేయని ఒఫెర్‌ అంతర్జాతీయ కోర్టులో దక్షిణాఫ్రికా దాఖలు చేసిన కేసును సమర్దిస్తూ ఒక పిటీషన్‌పై సంతకం చేశాడనే సాకు చూపి ఏకంగా పార్లమెంటు సభ్యత్వాన్నే రద్దు చేసేందుకు పూనుకున్నారు.దానిలో భాగంగా 85 మంది ఎంపీలతో తీర్మానాన్ని ప్రతిపాదించారు.దాన్ని పార్లమెంటరీ కమిటీ జనవరి 30న 14-2 ఓట్ల మెజారిటీతో ఆమోదించింది. దక్షిణాఫ్రికా చర్య కుట్ర అని ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా సాయుధపోరాటాన్ని సమర్ధించటమేనని వర్ణించింది. ఫిబ్రవరి 19న పార్లమెంటులో ఓటింగ్‌ జరగ్గా అది వీగిపోయింది. నూట ఇరవై మంది సభ్యులకు గాను పదకొండు మంది వ్యతిరేకంగా, 24 మంది ఓటింగ్‌కు దూరంగా ఉండగా 85 మంది అనుకూలంగా ఓటు వేశారు. ఒక సభ్యుడిని తొలగించాలంటే 90 మంది మద్దతు అవసరం. దేశంలో ఎవరూ వ్యతిరేకంగా ఉండకూడదనే దుర్మార్గం తప్ప దీని వెనుక మరొకటి లేదు.పార్లమెంటులోని ఇతర వామపక్ష వాదులకూ ఇదే జరుగుతుందని హెచ్చరించటమే.


ఆరునెలల మారణకాండ తరువాత వెనక్కు తిరిగి చూసుకుంటే గాజా సర్వనాశనమైంది. అక్కడ బతికి ఉన్నవారు తిరిగి సాధారణ జీవితాలను ప్రారంభించే అవకాశం ఉంటుందా ? ఇంకా ఎందరిని బలితీసుకుంటారనే ప్రశ్నలకు ఇప్పటికైతే సమాధానాలు లేవు. రంజాన్‌ మాసం తరువాత మరింత పెద్ద ఎత్తున దాడులు జరిపేందుకు ఇజ్రాయెల్‌ సన్నాహాలు జరుపుతున్నట్లు వార్తలు. అది ఒక్క గాజాకే పరిమితం అవుతుందా లేక మొత్తం మధ్య ప్రాచ్య దేశాలకు విస్తరిస్తుందా అన్నది చూడాల్సి ఉంది. గాజాలో మరణించిన వారందరూ హమస్‌ సాయుధులే అన్నట్లుగా ప్రపంచాన్ని నమ్మించేందుకు ఇజ్రాయెల్‌ చూస్తున్నది. ఒప్పందం ప్రకారం కొందరు బందీలను విడిపించుకోవటం తప్ప హమస్‌ వద్ద ఉన్న ఇతర బందీల జాడను కూడా తెలుసుకోలేకపోయింది. చీమ చిటుక్కుమన్నా కనుగొనే నిఘా వ్యవస్థను ఏమార్చి హమస్‌ సాయుధులు సరిహద్దులోని ఇజ్రాయెల్‌ ప్రాంతంపై ఎలా దాడి చేశారన్నది ఇప్పటికీ వీడని రహస్యంగానే ఉండిపోయింది. దాడులు, హత్యాకాండతో పాలస్థీనియన్లను లొంగదీసుకోలేమని గ్రహించిన ఇజ్రాయెల్‌ వారిని రోగాలు, ఆకలితో మాడ్చి చంపేందుకు పూనుకున్నట్లు తాజా పరిణామాలు వెల్లడిస్తున్నాయి. గాజా మారణకాండను ఎలా ఆపాలన్నదాని కంటే అది కొనసాగితే ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు, ఈ ఏడాది జరగనున్న ఎన్నికల్లో జో బైడెన్‌ భవితవ్యం ఎలా ఉండనున్నదో అంటూ అనేక మంది విశ్లేషణల్లో నిమగమయ్యారంటే వారి చర్మం ఎంత మందంగా తయారైందో అర్ధం చేసుకోవచ్చు. కొందరైతే హమస్‌ చేసిన దుర్మార్గాలంటూ ఇంకా చిలవలు పలవలుగా వర్ణిస్తూ గాజాలో జరుపుతున్నదారుణాలను తక్కువ చేసి చూపేందుకు చూస్తున్నారు.


గత ఆరునెలల్లో జరిగిన పరిణామాల్లో ఎమెన్‌పై అమెరికా నేరుగా యుద్ధానికి దిగటం ఒక ముఖ్యాంశం.ఇది కూడా ఇజ్రాయెల్‌ సంబంధిత పరిణామాల్లోనే జరుగుతోంది. ఉగ్రవాదంపై పోరు ముసుగులో గతంలో సౌదీ అరేబియా ద్వారా దాడులు చేయించింది. అమెరికాలో తయారైన విమానాలతో అక్కడి నుంచే వచ్చిన బాంబులతో జరిపించిన దాడిలో వేలాది మంది యెమెనీలు మరణించారు. ఇరాన్‌తో సయోధ్య కుదరటంతో సౌదీ నిలిపివేసింది.ఇప్పుడు నేరుగా అమెరికా ఆ పని చేస్తున్నది. ఎమెన్‌ అంతర్యుద్ధంలో రాజధానితో సహా ఉత్తర ఎమెన్‌పై పైచేయి సాధించిన హౌతీలు లేదా అన్సరల్లా సాయుధులు గాజా మారణకాండకు నిరసనగా ఎర్ర సముద్రం ద్వారా ఇజ్రాయెల్‌ వైపు వెళ్లే నౌకల మీద దాడులను జరుపుతున్నారు. దానికి ప్రతిగా నౌకల రక్షణ పేరుతో అమెరికా రంగంలోకి దిగి ప్రతిదాడులు చేస్తున్నది.సూయజ్‌ కాలువ ద్వారా ఎర్ర సముద్రంలో ప్రవేశించి హిందూ మహాసముద్రంలోకి రాకపోకలు సాగించే నౌకల రవాణాపై తీవ్ర ప్రభావం పడింది. అవి ఆఫ్రికా ఖండంలోని గుడ్‌హౌప్‌ ఆగ్రంను చుట్టి వస్తున్నాయి. దాంతో ఖర్చులు విపరీతంగా పెరిగాయి. ఎర్ర సముద్రం నుండి ఏడెన్‌ జలసంధి ద్వారా అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రంలోకి నౌకలు ప్రవేశించే కీలక ప్రాంతం బాబ్‌ అల్‌ మాండెబ్‌. ఈ కారణంగా ఎమెన్ను తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని సామ్రాజ్యవాదులు ఎప్పటి నుంచో చూస్తున్నారు. ఆసియలోని ఎమెన్‌కు ఎదురుగా ఆఫ్రికా ఖండంలోని జిబౌటీ ఉంది. ఈ కారణంగానే ఎప్పుడు ఏ అవసరం వస్తుందో అన్నట్లుగా అక్కడ అనేక దేశాలు తమ మిలిటరీ కేంద్రాలను ఏర్పాటు చేసుకున్నాయి.


గాజా మారణకాండ నుంచి ప్రపంచ దృష్టిని మళ్లించేందుకు సామ్రాజ్యవాదం మార్గాలను వెతుకుతున్నది. మధ్యప్రాచ్యం, పశ్చిమాసియాకు వివాదాన్ని విస్తరించేందుకు అమెరికా చూస్తున్నది.ఇరాన్ను ఒంటరిపాటు చేసేందుకు దీర్ఘకాలంగా అనుసరిస్తున్న ఎత్తుగడలకు ఎదురుదెబ్బ తగిలింది.చైనా చొరవతో ఉప్పు నిప్పుగా ఉన్న సౌదీ అరేబియా-ఇరాన్‌ సాధారణ సంబంధాలను నెలకొల్పుకున్నాయి. సౌదీ-ఇజ్రాయెల్‌ మధ్య సయోధ్య కుదర్చాలని అమెరికా ఎంతగా చూసినా కుదరలేదు. పాలస్థీనా స్వతంత్రదేశం ఏర్పడే వరకు సాధారణ సంబంధాలు కుదరవని సౌదీ స్పష్టం చేసింది. గాజాపై దాడులతో అది మరింత వెనక్కు పోయింది. కీలకమైన మధ్య ప్రాచ్య ప్రాంతాన్ని తన చేతుల్లో ఉంచుకోవాలన్న ప్రయత్నాన్ని అమెరికా కొనసాగిస్తూనే ఉంది.ఐరోపాలో రష్యాకు వ్యతిరేకంగా నాటో కూటమిని ఏర్పాటు చేసినట్లే ఇరాన్ను దెబ్బతీసేందుకు అలాంటి మరోకూటమి ఏర్పాటు చేయాలని, దానిలో ఇజ్రాయెల్‌కు కీలకపాత్ర ఉండేట్లు చూడాలన్నది లక్ష్యం. అమెరికా, ఇజ్రాయెల్‌ను గట్టిగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసి కూడా సౌదీ అరేబియా నేతలు ఇరాన్‌తో సయోధ్య కుదుర్చుకోవటం అమెరికా ఊహించినట్లు కనపడదు. ఇరాన్‌కు మద్దతుగా చైనా, రష్యా నిలవటం మరొక కొత్త పరిణామం. ఉక్రెయిన్‌ వివాదం, గాజా మారణకాండ దాన్ని మరింత పటిష్టం చేసిందని చెప్పవచ్చు. కొందరైతే ఈ కూటమితో అమెరికా ప్రచ్చన్న యుద్ధం చేస్తున్నదనే వర్ణిస్తున్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d