Tags
#Farmers matter, #Farmers Protest, #i stand with farmers, 2024 Farmers Protest, BJP, MSP demand, Narendra Modi Failures
ఎం కోటేశ్వరరావు
పంజాబ్-హర్యానా సరిహద్దులో హర్యానా పోలీసులు, భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో పిల్లెట్లు తగిలి ముగ్గురు రైతులు కళ్లు కోల్పోయినట్లు పంజాబ్ ఆరోగ్య మంత్రి డాక్టర్ బల్బీర్ సింగ్ చెప్పారు. కాలం చెల్లిన, ప్రైవేటు కంపెనీల మందుగుండును రైతుల మీద ఉపయోగిస్తున్నారని, అవి లెక్కల్లో చూపరని రైతు నేత సర్వాన్ సింగ్ పాంధెర్ చెప్పారు. కనీస మద్దతు ధరల మీద మరోకమిటీ వేసేందుకు ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అదే నిజమైతే అది కాలయాపన తప్ప మరొకటి కాదు. ఇప్పటికే ఒక కమిటీ ఉంది, అదేమి చేస్తున్నదో తెలియదు. వచ్చే ఎన్నికల్లో తాము 400 సీట్లు సాధించబోతున్నామని, అవి రైతుల సమస్యల పరిష్కారానికే గనుక రాజకీయం చేయవద్దని బిజెపి నేత అశోక్ తన్వర్ చెప్పారు. ” ఈ సమస్య రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అంశం కూడా,దీనికి పరిష్కారం కనుగొనాలంటే వ్యవధి అవసరం. ” మరోసారి ప్రారంభమైన రైతు ఉద్యమం ముందుకు తెచ్చిన డిమాండ్ల మీద కేంద్ర మంత్రి అర్జున్ ముండా ఫిబ్రవరి పదమూడున చెప్పిన మాట. పదిహేనవ తేదీ రాత్రి రైతు ప్రతినిధులతో జరిపిన చర్చలు ఎలాంటి ఫలితాలు లేకుండా ముగిశాయి. పద్దెనిమిదవ తేదీ సాయంత్రం మరోసారి చర్చలు జరుపుతామని కేంద్ర మంత్రి ప్రకటించారు. పరిష్కారం తేలేవరకు ఆందోళన కానసాగుతుందని రైతు సంఘాలు వెల్లడించాయి. ఢిల్లీ చలో అన్న నినాదంతో సాగిన ఉద్యమానికి ఇచ్చిన పిలుపుకు మూడు సంవత్సరాలు నిండిన సందర్భంగా 2023 నవంబరు 26 నుంచి 28వరకు చండీఘర్లో నిరసన తెలపాలని పంజాబ్ రైతులు పిలుపు నిచ్చారు. దాని కొనసాగింపే తాజా ఢిల్లీ చలో నిరసన. అప్పటి నుంచి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఏమి చేస్తున్నట్లు ? మంత్రి మాటలను బట్టి ఏదో విధంగా కాలయాపన చేసి ఆందోళనను అణచివేసేందుకు లేదా మరో విధంగా ముగించేందుకు కేంద్రం చూస్తున్నట్లు కనిపిస్తోంది.
రైతులు ముందుకు తెచ్చిన సమస్య మీద గానీ, తానే ప్రకటించిన కమిటీ నివేదికను సత్వరం తెప్పించటం గురించిగానీ కేంద్రానికి చిత్తశుద్ధి ఉందా ? రాష్ట్రాలతో చర్చించాలని కనీస మద్దతు ధరల కమిటీ ప్రకటించిన 20నెలల తరువాత(2022జూలై) మంత్రి మాట్లాడుతున్నారు. గతంలో ఉద్యమం సందర్భంగా జరిగిన పరిణామాలను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలి. వ్యవసాయం ఉమ్మడి జాబితాలో ఉన్నప్పటికీ ప్రధానంగా అమలు జరిపేది రాష్ట్రాలే. మూడు సాగు చట్టాలను తెచ్చినపుడు కేంద్రం రాష్ట్రాలతో సంప్రదించకుండానే ఏకపక్షంగా తెచ్చింది. వెనక్కు తీసుకొనేటపుడు కూడా చర్చలు జరపలేదు. ఆ సందర్భంగా ఎంఎస్పి కమిటీ ఏర్పాటు ముందు కూడా రాష్ట్రాల వైఖరిని తెలుసుకోలేదు. ఇప్పుడు రాష్ట్రాలతో చర్చించాలని చెప్పటం వంచన తప్ప మరొకటి కాదు. చర్చలు జరపకుండా ఇంతకాలం ఎవరు అడ్డుపడ్డారు ? కేంద్ర ప్రభుత్వం ఎందుకింత మొండితనంతో వ్యవహరిస్తున్నది ? అడిగేవాటికి సమాధానం రావటం లేదు. 1991లో ప్రారంభించిన ఆర్ధిక సంస్కరణల సమయంలో కేంద్ర ప్రభుత్వం ప్రపంచ బ్యాంకుతో కుదుర్చుకున్న ఒప్పందాలు లేదా బ్యాంకు నిర్దేశించిన షరతులు ఏమిటో, ఆ తరువాత గత ప్రభుత్వాలు నియమించిన కమిటీలు ఏమి చెప్పాయో తెలుసుకుంటే తప్ప మోడీ సర్కార్ ఆచరణను అర్ధం చేసుకోలేము.
2004 డిసెంబరు 13న నం. 164తో లోక్సభలో ఒక ప్రశ్న అడిగారు. భారత ఆహార సంస్దను పునర్వ్యస్ధీకరించేందుకు మెకెన్సీ కంపెనీని నియమించిందా ? అభిజిత్ సేన్ కమిటీ, హైదరాబాద్ అడ్మినిస్ట్రేటివ్ కాలేజీ(ఆస్కి) నివేదికలు ఉన్నాయా ? వాటి ప్రధాన సిఫార్సులేమిటి అన్నది దాని సారాంశం. దానిలో ఈ నియామకాలన్నీ బిజెపి నేత అతల్ బిహారీ వాజ్పేయి ఏలుబడిలో జరిగాయి. ఆస్కీ నివేదికలో చేసిన ముఖ్యమైన సిఫార్సులు ఇలా ఉన్నాయి. లెవీ పద్దతిలోనే ఎఫ్సిఐ ధాన్యం కొనుగోళ్లు చేయాలి.నాణ్యతా ప్రమాణాలను సడలించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకూడదు, వివిధ పధకాలకు, ఆపద్దర్మ నిల్వలకు అవసరమయ్యే ఆహార ధాన్యాల మొత్తాలను మాత్రమే కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలి. రాష్ట్రాలు తమ స్వంత సేకరణ పద్దతులను అభివృద్ది చేసుకోవాలి, విత్త సంబంధ మద్దతు కోసమే కేంద్రంపై ఆధారపడాలి. ఆహార ధాన్యాలను ఆరుబయట నిల్వచేయటాన్ని నిలిపివేయాలి. గ్రామీణ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం నిధులకు బదులు ఆహారధాన్యాలను కేటాయించాలి. ఆపద్దర్మ నిల్వలకు కేంద్ర ప్రభుత్వం గ్రాంటులు ఇవ్వాలి తప్ప బ్యాంకుల నుంచి రుణాలు తీసుకో కూడదు.కనీస మద్దతు ధరలకు కొనుగోలు, కేంద్ర జారీ ధరలు, ఎంత మొత్తం సేకరించాలనే అంశాలపై ఎఫ్సిఐ కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. ధాన్య సేకరణ, నిల్వ, పంపిణీలను వేరు చేయాలి. జాతీయ ఆపద్దర్మ నిల్వలను వ్యూహాత్మక ప్రాంతాలలో మాత్రమే ఎఫ్సిఐ నిర్వహించాలి.మార్కెట్లలో ఏజంట్ల కమిషన్ నిలిపివేయాలి. ధాన్య సేకరణకు, స్వంత సేకరణ ధరల నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వాలను ప్రోత్సహించాలి. వ్యవసాయాన్ని వివిధీకరించేందుకు ప్రత్యేకించి పంజాబ్, హర్యానాలలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ఆహారధాన్యాల మార్కెట్లో ప్రయివేటు రంగం మరియు బహుళజాతి కార్పొరేషన్లను ప్రోత్సహించాలి.
దీర్ఘకాలిక ధాన్య విధాన రూపకల్పనకు సిఫార్సులు చేసేందుకు ఏర్పాటు చేసిన ఫ్రొఫెసర్ అభిజిత్ సేన్ కమిటీ చేసిన ముఖ్య సిఫార్సులేమిటో చూద్దాం. కనీస మద్దతు ధరలను అత్యంత సమర్ధవంతమైన ప్రాంతాలలో సి2 ఖర్చు ప్రాతిపదికన (అంటే కుటుంబసభ్యుల శ్రమ, స్వంత పెట్టుబడి, భూమి కౌలు) నిర్ణయించాలి. కనీస మద్దతు ధరల కింద కొనుగోలు చేసే వాటి మీద కేంద్ర ప్రభుత్వం గరిష్టంగా నాలుగుశాతం పన్నులు మరియు లెవీలు చెల్లించాలి. పంజాబ్, హర్యానా వంటి రాష్ట్రాల నుంచి ధాన్య సేకరణ నుంచి ఎఫ్సిఐ ఉపసంహరించుకొని తన మానవనరులను తూర్పు, మధ్య భారత్లో నియమించాలి. రాష్ట్రాలకు మరింత ఆకర్షణీయంగా, వికేంద్రీకరణ సేకరణను మెరుగుపరచాలి. ఎఫ్సిఐ ధాన్య సేకరణలో మెరుగైన సగటు ప్రమాణాలను పాటించాలి. రైస్ మిల్లరు లెవీ ఇచ్చే విధానాన్ని రద్దు చేయాలి.సి2 స్ధాయికి కనీస మద్దతు ధరలను నిర్ణయించటంతో పాటు రాష్ట్రాలకు పరిహార పాకేజ్లను అమలు జరపాలి.వాటితో పంటల వివిధీకరణను ప్రోత్సహించాలి. వేగంగా వాణిజ్య ప్రాతిపదికన నిర్ణయం తీసుకొనే విధంగా ఎఫ్సిఐ మారాల్సిన అవసరం ఉంది. ఆహారధాన్యాల ఎగుమతి పూర్తిగా ప్రయివేటుకే అప్పగించాలి. ఎగుమతులకు మాత్రమే సబ్సిడీలు ఇవ్వాలి. కనీస మద్దతు ధరలకు చట్టబద్దత కల్పించాలి, వాటిని సిఫార్సు చేసే సిఏసిపిని సాధికార చట్టబద్దమైన సంస్దగా మార్చాలి.
2020డిసెంబరు 18వ తేదీన ప్రధాని నరేంద్రమోడీ మధ్యప్రదేశ్ రైతులతో వీడియో కాన్పరెన్సుద్వారా మాట్లాడారు. ఇప్పుడు తీసుకున్న చర్యలు 25-30 సంవత్సరాల క్రితమే అమలు జరపాల్సినవి. తెల్లవారేసరికి ఇవి రాలేదు. ప్రతి ప్రభుత్వమూ వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో గత 20-22 సంవత్సరాలుగా విస్తృతంగా చర్చించినవే అని ప్రధాని చెప్పారు.పైన పేర్కొన్న అభిజిత్ సేన్, ఆస్కీ సిఫార్సులు ఇరవై సంవత్సరాల నాటి వాజ్పేయి సర్కార్ హయాంలోనివే.వాటిలో కొన్నింటిని ప్రభుత్వాలు అమలు జరిపాయి. ప్రధాని చెప్పిన 25-30 సంవత్సరాల విషయానికి వస్తే అంతకు ముందుకు అంటే 30 సంవత్సరాల నాటి ప్రపంచ బాంకు షరతులు ఏమిటో తెలుసుకుంటే ఆ మాటలకు అర్ధం తెలుస్తుంది. మూడు వ్యవసాయ చట్టాల బండారం మరింతగా బయటపడుతుంది. ప్రపంచబ్యాంకు మన కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి, సమాచారం తీసుకొని పద్దెనిమిది నెలల సమయం తీసుకొని ఒక నివేదికను రూపొందించింది. ఇండియా 1991 కంట్రీ ఎకమిక్ మెమోరాండం( రిపోర్ట్ నం.9412 ఇండియా) పేరుతో 1991 ఆగస్టు 23న రెండు సంపుటాలుగా తయారు చేశారు. దాన్ని రెండు దశాబ్దాలు రహస్యంగా ఉంచి 2010 జూన్ 12న బహిర్గతం చేశారు. వీటిలో ముఖ్యమైన సిఫార్సులను చూద్దాం. వాటి నేపధ్యంలోనే గత మూడు దశాబ్దాలలో కేంద్రంలో, రాష్ట్రాలలో ఏ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా అనేక చర్యలు అమలు జరిపి ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్ను సంతృప్తి పరచారు. ఇప్పుడు నరేంద్రమోడీ గారు అదే సంతుష్టీకరణపనిలో ఉన్నారు. కరోనా కనుక ఎవరూ వ్యతిరేకంగా ఆందోళన చేసేందుకు ముందుకు రారనే అంచనాతో జూన్లో ఆర్డినెన్స్, సెప్టెంబరులో పార్లమెంట్లో చర్చలేకుండా బిల్లులు, వెంటనే రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయించి చూశారా నేను ఎంత వేగంగా పని చేస్తానో అని దేశ-విదేశీ కార్పొరేట్ల ముందు రొమ్ము విరుచుకున్నారు. వ్యవసాయ రంగాన్ని ఇప్పటికే కొంత మేరకు విదేశీ-స్వదేశీ కార్పొరేట్లకు తెరిచారు. ఒకప్పుడు నూతన విత్తనాలను రూపొందించటం, ఉత్పత్తి ప్రభుత్వరంగ సంస్ధలే చేసేవి. ఇప్పుడు ఎక్కడా వాటి ఊసేలేకుండా చేశారు. మూడు వ్యవసాయ చట్టాలతో మార్కెట్ను మరింతగా తెరిచేందుకు, ప్రభుత్వం బాధ్యతల నుంచి తప్పుకొనేందుకు ప్రాతిపాదిక వేశారు. రైతుల ఆందోళనతో వెనక్కు తగ్గారు.
ఇంతకీ ప్రపంచబ్యాంకు వ్యవసాయరంగం గురించి ఆదేశించిన లేదా సూచించిన సిఫార్సులేమిటి ? అవి మూడు రకాలు. తక్షణం చేపట్టవలసినవి, మధ్యంతర, దీర్ఘకాలిక చర్యలుగా సూచించారు.1ఏ). వ్యవసాయానికి ఉన్న – ఎరువులు, నీటి, విద్యుత్, బ్యాంకురుణాల సబ్సిడీలన్నింటినీ రద్దు చేయాలి. విదేశీవాణిజ్యానికి వ్యవసాయ మార్కెట్ను తెరవాలి. నాలుగు సంవత్సరాల వ్యవధిలో ఎరువుల సబ్సిడీలను ఎత్తివేయాలి. బి) ప్రాధాన్యతా రంగానికి నిర్ణీత శాతాలలో రుణాలు ఇవ్వాలనే నిబంధన కింద వ్యవసాయానికి ఇచ్చే కోటాను ఎత్తివేయాలి. సబ్సిడీలను ఎత్తివేసి వడ్డీ రేటు పెంచాలి.సి) సాగు నీరు, పశువైద్యం వంటి విస్తరణ సేవలకు వసూలు చేస్తున్న చార్జీల మొత్తాలను పెంచాలి. వీటిలో ప్రయివేటు రంగానికి పెద్దపీట వేయాలి, పెట్టుబడులకు అవకాశం ఇవ్వాలి.డి) వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులకు సంబంధించి ఉన్న రక్షణలన్నింటినీ తొలగించాలి. తొలిచర్యగా ఖాద్యతైలాల గింజలను అనుమతించాలి. వ్యవసాయ ఎగుమతులపై ఉన్న ఆంక్షలను తొలగించాలి.ఇ) ప్రయివేటు పరిశోధనా సంస్ధల విత్తనాలను ప్రోత్సహించాలి, ప్రయివేటు మార్కెటింగ్పై నిబంధనలను తొలగించాలి, విత్తన సబ్సిడీలను ఎత్తివేయాలి.ఎఫ్) వ్యవసాయేతర చార్జీల స్ధాయికి వ్యవసాయ విద్యుత్ ఛార్జీలను కూడా పెంచాలి.
2. మొత్తం ఆహార సేకరణ మరియు ప్రజాపంపిణీ వ్యవస్ధను రద్దు చేయాలి.ఏ) భారత ఆహార సంస్ద ప్రత్యక్ష పాత్రను తగ్గించాలి. కొనుగోలు, రవాణా, ధాన్య నిల్వ వంటి పనులన్నీ లైసన్సు ఉన్న ప్రయివేటు వారి ద్వారా చేపట్టాలి. రైతులు నిల్వ చేస్తే ప్రోత్సాహకాలు ఇవ్వాలి.బి)ఆపద్దర్మ నిల్వలను కొద్దిగా నిర్వహించాలి. కొరత వచ్చినపుడు ప్రపంచ మార్కెట్లవైపు చూడాలి. విదేశీమారక ద్రవ్యం ఎంత ఉందో చూసుకొని కొరత ఉన్న సంవత్సరాలలో బయటి నుంచి కొనుగోలు చేయాలి.సి) మద్దతు ధరల కార్యక్రమాలను ప్రభుత్వం సేకరణకు అమలు చేయకూడదు. డి) అధికారయుతంగా పేదలుగా గుర్తించిన వారికి మాత్రమే ఆహార సబ్సిడీలు ఇవ్వాలి. ప్రయివేటు రంగం ద్వారా పంపిణీ పద్దతిని కూడా వినియోగించాలి. పైన పేర్కొన్నవి మూడు దశాబ్దాల నాటి ప్రపంచ బ్యాంకు ఆదేశాలు. అధికారంలో ఎవరున్నా వాటిని అమలు జరపటం తప్ప వెనక్కు పోవటం లేదు. ఆ తరువాత ఎన్ని కమిటీలు వేసినా కొన్ని సిఫార్సులు అదనంగా చేయటం తప్ప ప్రపంచ బ్యాంకు అజెండా పరిధిలోనే ఉన్నాయి. యుపిఏ హయాంలో అన్ని సంస్కరణలూ చేయలేదనే కోపంతో కార్పొరేట్ శక్తులు నరేంద్ర మోడీ వెనుక సమీకృతం అయ్యాయి. ఇప్పుడు ఆచరణ చూస్తున్నాము.
కనీస మద్దతు ధరలు, వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ వ్యవస్ధలను ప్రభావితం చేసే (రద్దుచేసిన) మూడు సాగు చట్టాలలో ఎక్కడా కనీసం మద్దతు ధరల ప్రస్తావన లేదు. కనుకనే రైతాంగం కనీస మద్దతు ధరలను చట్టబద్దం చేయమంటోంది. 2011లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నరేంద్రమోడీ నాయకత్వంలోని ముఖ్యమంత్రుల కమిటీ కనీస మద్దతు ధరలకు చట్టబద్దత కల్పించాలని ఆషామాషీగా కేంద్రానికి సిఫార్సు చేసిందా ? ఈ కమిటీలో నాటి మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ముఖ్యమంత్రులు ఇతర సభ్యులు. సిఎంగా ఉన్న మోడీ చేసిన సిఫార్సును పిఎం మోడీ ఎందుకు పక్కన పడేశారు? ఇప్పుడు రాష్ట్రాలను సంప్రదించాలని ఎందుకు కబుర్లు చెబుతున్నారు. ఇంతకీ 2011 నివేదికలో మోడీ కమిటీ చేసిన సిఫార్సు ఏమిటి ? నివేదికలోని క్లాజ్ బి.3లో ఇలా ఉంది.” చట్టబద్దంగా ఎంఎస్పి అమలు : మార్కెట్ పని చేయటంలో మధ్యవర్తులు కీలకమైన పాత్ర పోషిస్తున్నారు మరియు ఆ సమయంలో వారు ముందుగానే రైతులతో ఒప్పందం చేసుకుంటున్నారు. అన్ని నిత్యావసర వస్తువులకు సంబంధించి చట్టబద్దమైన అంశాలతో శాసనం ద్వారా రైతుల ప్రయోజనాలను కాపాడాలి. అదేమంటే రైతు-వ్యాపారి లావాదేవీల్లో ఎక్కడా నిర్ణీత కనీస మద్దతు ధరలకు తగ్గకూడదు.” దీని అర్ధం ఏమిటి ? చట్టబద్దత కల్పించాలనే కదా ! మరి ఇప్పుడు సాకులతో ఎందుకు మొరాయిస్తున్నట్లు ?
