• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: MSP demand

రైతు నేత దల్లేవాల్‌కు వైద్యం : ఫిబ్రవరి 14నచర్చలు ! మద్దతు ధరల చట్టబద్దతపై మోడీ దిగివచ్చేనా !!

19 Sunday Jan 2025

Posted by raomk in BJP, Current Affairs, Economics, employees, Farmers, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices

≈ Leave a comment

Tags

BJP, farm crisis, Farmers agitations, Jagjit Singh Dallewal, MSP demand, Narendra Modi Failures, SKM

ఎం కోటేశ్వరరావు


నవంబరు 26వ తేదీ నుంచి రైతుల సమస్యలపై నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న సంయుక్త కిసాన్‌ మోర్చారాజకీయ రహిత సంస్థ కన్వీనర్‌ జగత్‌సింగ్‌ దల్లేవాల్‌ జనవరి 18వ తేదీ అర్ధరాత్రి వైద్య చికిత్సకు అంగీకరించారు, ఆ మేరకు ప్రభుత్వ వైద్యులు తగిన చర్యలను ప్రారంభించారు. ఫిబ్రవరి 14వ తేదీన చండీఘర్‌లో రైతు సంఘాల ప్రతినిధులతో చర్చలు జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించిన తరువాత ఈ పరిణామం చోటు చేసుకుంది. సంయుక్త కిసాన్‌ మోర్చా(రాజకీయ రహిత), కిసాన్‌ మజ్దూర్‌ మోర్చా ప్రతినిధులతో కేంద్ర అధికారులు చర్చలు జరిపారు. ఏడు పదుల వయస్సున్న దల్లేవాల్‌ ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తున్న పూర్వరంగంలో ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న సంఘాలన్నీ ఐక్యంగా ముందుకు పోవాలని చర్చలు జరపటం, బిజెపికి కీలకమైన ఢల్లీి ఎన్నికలు, దల్లేవాల్‌కు మద్దతుగా మరో 121 మంది నిరవధిక దీక్షలకు పూనుకోవటం, కేంద్ర ప్రభుత్వంపై రోజు రోజుకూ వత్తిడి పెరుగుతున్న తరుణంలో కేంద్రం ఈ మేరకు దిగివచ్చింది. ప్రధాని నరేంద్రమోడీ రైతుల గురించి మాట్లాడరు, రైతు ప్రతినిధులతో మాట్లాడేందుకు సమయం లేదంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరస్కరించారు.కోట్లాది మంది రైతుల గురించి చర్చించేందుకు సమయం లేదనటాన్ని బట్టి ఎవరి ప్రాధాన్యతలు ఏమిటో స్పష్టం అయింది. బడ్జెట్‌పై చర్చలంటూ రైతు ప్రతినిధులను మినహా మిగిలిన వారందరినీ కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించి చర్చలను జరిపింది. వీటన్నింటినీ చూసినపుడు వచ్చే నెలలో జరిగే చర్చల్లో ఒరిగేదేమిటి అన్నది పెద్ద ప్రశ్న.ఈనెల 31న పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇతర సమస్యలతో పాటు రైతుల గురించి ప్రతిపక్షాలు నిలదీసే అవకాశం ఉంది. కనీస మద్దతు ధరలకు చట్టబద్దత, గతంలో రైతు ఉద్యమం సందర్భంగా మరణించిన వారికి పరిహారం, లఖింపూర్‌ ఖేరీ హింసా కాండ బాధితులకు న్యాయం,2013 భూసేకరణ పరిహార చట్ట పునరుద్దరణ,రైతులు, వ్యవసాయ కార్మికులకు పెన్షన్‌, రైతుల రుణమాఫీ వంటి అంశాలపై రైతులు ఉద్యమిస్తున్న సంగతి తెలిసిందే.

బడ్జెట్‌ ప్రవేశపెట్టబోయే ముందు కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా వివిధ తరగతుల ప్రతినిధులతో చర్చలు జరపటం ఒక తంతుగా జరుగుతున్నది. అన్ని రోడ్లూ రోమ్‌కే అన్నట్లుగా ఏ పార్టీ చరిత్ర చూసినా గర్వకారణం ఏమీ లేదు. సంపదలలో పెద్ద పీట కార్పొరేట్‌ శక్తులకే వేస్తున్న కారణంగానే అసమానతలు ఏటేటా పెరుగుతున్నాయి. తంతుగా అయినా బడెట్‌ చర్చకు రైతు సంఘాలను కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించలేదు. కొంత మంది కొన్ని పోలికలు తెస్తున్నారు. వాటిలో ఉద్యోగులకు వేతన కమిషన్‌ ఏర్పాటుకు నిర్ణయించిందిగానీ రైతులకు ఎంఎస్‌పికి చట్టబద్దత కల్పించటం లేదన్నది వాటిలో ఒకటి. దీనిలో రెండవది వాస్తవం, ఉద్యోగులకు పది సంవత్సరాల తరువాత వేతన కమిషన్‌ ఏర్పాటును దీనికి ముడి పెట్టనవసరం లేదు. పదేండ్లకు ఒకసారి వేతన సవరణ ద్వారా వారికి అన్యాయమే జరుగుతున్నది తప్ప న్యాయం కాదు. కనీస మద్దతు ధరలకు చట్టబద్దత, ఇతర అంశాల గురించి పరిశీలించేందుకు 2022 జూలైలో కేంద్రం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఇంతవరకు అది ఏమి చేసిందో ఎవరికీ తెలియదు, వారు నివేదిక సమర్పించరు, ప్రభుత్వమూ అడగదు, అంతా ఒక నాటకంగా మారింది. ఈ లోగా 2021లో క్షమాపణలు చెప్పి మరీ వెనక్కు తీసుకున్న మూడు సాగు చట్టాలను మరో రూపంలో ముందుకు తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం పావులు కదుపుతోంది. దేశంలో భూ కమతాలు పద్నాలుగు కోట్లకు పైగా ఉన్నాయి. వాటిలో 88శాతం రెండున్నర ఎకరాల లోపు కలిగిన రైతులే ఉన్నారు. వ్యవసాయం గిట్టుబాటు కావటం లేదంటూ వారందరినీ కార్పొరేట్లకు అప్పగించేందుకు తన బాధ్యతను వదిలించుకొనేందుకు కేంద్రం చూస్తున్నది.ఒకసారి అది జరిగితే రాష్ట్రాలు కూడా అదేబాట పడతాయి.పరిశ్రమలు, వాణిజ్యాలకు అనేక రక్షణలు, రాయితీలు ఉన్నాయి. వాటి మాదిరిగానే తమకూ కల్పించాలని రైతులు కోరటం గొంతెమ్మ కోర్కె కాదు. కనీస మద్దతు ధరను ఒక్క హక్కుగా చట్టబద్దం చేయాలని కోరుతున్నారు.

పారిశ్రామిక ఉత్పత్తులకు, ఎగుమతులకు, దిగుమతులకూ రాయితీలు ఇస్తున్న ప్రభుత్వం రైతులను ఎందుకు విస్మరిస్తున్నది, పోనీ వ్యవసాయం ఉపాధి కల్పించటం లేదా పరిశ్రమలు, సేవారంగాల కంటే ఎక్కువ 44శాతం మందికి కల్పిస్తున్నది. సంఘటితంగా పోరాడే స్థితిలో వారు లేకపోవటం తప్ప మరొకటి కనిపించటం లేదు. మనకు అవసరమైన వంట నూనెల్లో 60శాతం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం, దానికి ఎన్నో రాయితీలు ఇస్తున్నది ప్రభుత్వం కానీ ఇక్కడ నూనె గింజలు పండిరచేవారికి ధరల గురించి ఒక హామీ ఇవ్వటానికి ముందుకు రావటం లేదు.మార్కెట్‌ శక్తుల దయాదాక్షిణ్యాలకు వదలివేస్తున్నది. గతేడాది సోయా, ఆవ రైతులు కనీస మద్దతు ధర కంటే తక్కువే పొందారు. మరోవైపున బియ్యం, గోధుమలు, ఉల్లి, పంచదార వంటి వాటి ఎగుమతుల మీద నిషేధం పెట్టి మార్కెట్లో రైతులకు అన్యాయం చేశారు. వినియోగదారులకు మేలు చేయటం అంటే రైతుల నోట్లో మట్టికొట్టటం కాదు కదా ! ప్రభుత్వం నిర్ణయించిన మొత్తం కంటే తక్కువకు రైతుల నుంచి చెరకును మిల్లులు కొనుగోలు చేయకూడదు(అది గిట్టుబాటు కావటం లేదు). అదే మాదిరి ఇతర పంటలకు ప్రభుత్వం ఎందుకు హామీ ఇవ్వటానికి నిరాకరిస్తున్నది ? కనీస వేతన చట్టాన్ని అమలు జరపకపోతే కార్మికులు కోర్టులకు ఎక్కే హక్కు ఉంది, కానీ రైతులకు కనీస మద్దతు ధరలకు అలాంటి అవకాశం లేదు. దాదాపు పదిహేను కోట్ల మంది రైతులు ఉండగా వారిలో తొమ్మిది కోట్ల మందికి ఏటా ఆరువేల రూపాయలు ఇచ్చి అదే మహాభాగ్యం అని చెబుతున్నది. తప్పుల తడకలతో కూడిన గణాంకాలు( వివిధ సూచికలను ప్రకటించినపుడు ప్రభుత్వమే అలా చెబుతున్నది. ఉదా : దేశ ఆకలి సూచిక) వెల్లడిరచినదాని ప్రకారం 2004-05లో వ్యవసాయ వాణిజ్య సూచిక 87.72గా ఉన్నది 2010-11 నాటికి 102.95కు పెరిగింది.దాని ప్రకారం పెట్టుబడుల కంటే పంటల అమ్మకం ద్వారా ఎక్కువ పొందారని భాష్యం చెప్పారు. అదే 202223లో ఆ సూచిక 97.21కి పడిపోయింది. అంటే రైతులు పొందుతున్నది తగ్గిపోయింది. అందుకే రైతుల కనీస మద్దతు ధరలకు చట్టబద్దత కోరుతున్నారు.


రద్దు చేసిన మూడు సాగు చట్టాలను మూడు సంవత్సరాల తరువాత కేంద్ర ప్రభుత్వం దొడ్డిదారిన మరో రూపంలో ముందుకు తీసుకురావటం ఆందోళన కలిగించే అంశం. నేషనల్‌ అగ్రికల్చర్‌ మార్కెటింగ్‌ పాలసీ(నాంప్‌)ని 2024 నవంబరు 25న కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. దీనికి వ్యతిరేకంగా సంయుక్త కిసాన్‌ మోర్చా(ఎస్‌కెఎం) ఆధ్వర్యాన డిసెంబరు 23న దేశమంతటా నిరసన తెలిపారు. అనేక మంది నిపుణులు విమర్శించారు. దాని మీద అభిప్రాయాలు తెలిపేందుకు కేవలం పదిహేను రోజులు మాత్రమే కేంద్రం గడువు ఇచ్చింది. ఇప్పుడున్న మార్కెటింగ్‌ వ్యవస్థలో ఎలాంటి లోపాలు లేవని కాదు, దాన్ని సంస్కరించకూడదని ఎవరూ చెప్పటం లేదు. అయితే ఆ పేరుతో ఇప్పుడున్నదాని కంటే ప్రమాదకరమైన ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయద్రవ్య పెట్టుబడి సంస్థలు సూచించిన పద్దతిలో సమూల మార్పులు ప్రతిపాదించటం ఆందోళనకరం. దాని ప్రకారం దేశమంతటిని అనుసంధానించే ఒకే మార్కెట్‌ను ఏర్పాటు చేస్తారు. ఇదంతా చిన్న రైతులు, చిన్న వ్యాపారుల ప్రయోజనాల కంటే కార్పొరేట్లకే ప్రాధాన్యత ఇచ్చే వ్యవహారం.రైతులు ముడి సరకును సరఫరా చేసేవారిగా మాత్రమే ఉంటారు.వాటి నుంచి ఉత్పత్తులు తయారు చేయటం,వాణిజ్యం, ఎగుమతి అంతా కార్పొరేట్లదే. ఈ క్రమంలో తేలే మిగులులో రైతుల వాటా గురించి ఎక్కడా స్పష్టత లేదు. అంతే కాదు కనీస మద్దతు ధరలకు ఎలాంటి హామీ ప్రస్తావన కూడా లేదు.అలాంటి ఉద్దేశ్యం ఉంటే ఈ పాటికి కేంద్ర ప్రభుత్వం దాని గురించి ఒక స్పష్టత ఇచ్చి ఉండేది. రైతాంగానికి గరిష్ట ప్రయోజనం, డిజిటల్‌, పారదర్శకత, జాతీయ మార్కెట్‌ సమాచారం వంటి పదజాలం ఎంతగా వల్లించినా వాటిని వినియోగించుకొనే అవకాశం ఎంత మంది రైతులకు ఉంటుందన్నది ప్రశ్న. ఇప్పుడు అనేక నియంత్రణలు ఉన్నా వాటిని ఖాతరు చేయకపోవటం, దొడ్డిదారిన ఉల్లంఘిస్తున్న కంపెనీలపై అసలు ఎలాంటి నియంత్రణలు ఉండకూడదని ఈ ప్రతిపాదనల్లో ఉన్నది. వ్యవసాయ ఉమ్మడి జాబితాలో ఉన్నప్పటికీ ఈ విధానంతో రాష్టాల హక్కులు, నియంత్రణలకు నీళ్లదులుకోవాల్సిందే. అమల్లోకి వచ్చిన తరువాత గానీ ఇతర మంచి చెడ్డలు వెల్లడి కావు.

ఫిబ్రవరి 14వ తేదీన కేంద్ర, పంజాబ్‌ రాష్ట్ర ప్రభుత్వం, రైతు సంఘాల ప్రతినిధుల మధ్య జరిగే చర్చల అజెండా ఏమిటో తెలియదు. ఎవరెవరు పాల్గ్గొనేదీ ఇంకా స్పష్టం కాలేదు. ఒకటి మాత్రం స్పష్టం, ఇది ఒక రోజులో తేలే వ్యవహారం కాదు.కనీస మద్దతు ధరలకు చట్టబద్దత కల్పించాలని 2012లోనే సిఎంగా ఉండగా నరేంద్రమోడీ కమిటీ నాటి కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. దీని గురించి తాజా పార్లమెంటరీ కమిటీ కూడా సిఫార్సు చేసినా మోడీ మొరాయిస్తున్నారు. పార్లమెంటరీ కమిటీ సిఫార్సును అమలు చేయాలంటూ కేంద్రానికి సూచించాలని రైతు సంఘాల నేతలు సుప్రీం కోర్టును కోరారు. వ్యవసాయ గ్రాంట్లపై ఏర్పాటైన కమిటీ 202425 నివేదికను గతేడాది డిసెంబరు 20న పార్లమెంటుకు సమర్పించింది.దీన్ని కేంద్రం ఆమోదిస్తే అమలుకు ఉపక్రమించాలి తిరస్కరిస్తే కారణాన్ని చెప్పాల్సి ఉంటుంది. పార్లమెంటరీ కమిటీ చేసిస సిఫార్సు ఇలా ఉన్నాయి. ప్రస్తుతం ఏడాదికి ఇస్తున్న కిసాన్‌ సమ్మాన్‌ యోజన మొత్తం రు. ఆరువేలను పన్నెండు వేలకు పెంచాలి.(దాన్ని చూసి కొంత మంది అమలు జరగనున్నట్లు ప్రచారం చేశారు) ఈ ప్రోత్సహకాన్ని కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులకు కూడా ఇవ్వాలి. కనీస మద్దతు ధరల చట్టబద్దతకు ఒక రోడ్‌ మాప్‌ను సాధ్యమైనంత త్వరలో ప్రకటించాలి. వ్యవసాయ కార్మికులకు కనీస జీవన వేతనాల నిమిత్తం జాతీయ కమిషన్‌ ఏర్పాటు. రైతులు, వ్యవసాయ కార్మికులకు రుణాల రద్దు పధకాన్ని ప్రవేశ పెట్టాలి.వ్యవసాయ శాఖ పేరులో వ్యవసాయ కార్మికుల పేరును కూడా చేర్చాలి.

కనీస మద్దతు ధరలకు అనుకూల వాదనల సారం ఇలా ఉంది. రైతులకు ధరల మీద ఒక చట్టబద్దత ఉంటుంది. మార్కెట్‌ వడిదుడుకుల నుంచి రక్షణ ఉంటుంది. మధ్యవర్తుల దోపిడీ నిరోధంగా ఉంటుంది.ఉత్పత్తి ఖర్చులను భరించేందుకు, ఆర్థిక పరమైన భద్రతను మెరుగుపరచుకొనేందుకు స్థిరమైన రాబడికి వీలు కలిగిస్తుంది. వ్యవసాయ రంగంలో పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది. ఉత్పాదకత, సామర్ధ్యాలను పెంచుతుంది. ఆహార భద్రత, కొరతలను తీరుస్తుంది, దారిద్య్ర తగ్గింపుకు తోడ్పడుతుంది.రైతాంగ జీవనాన్ని మెరుగుపరుస్తుంది. మార్కెట్‌ వడిదుడుకులను తగ్గిస్తుంది. వ్యతిరేకించే వారేమంటారంటే.. మార్కెట్లో అసమతూకానికి దారితీస్తుంది, కొన్ని పంటలను అవసరాలకు మించి ప్రోత్సహిస్తుంది. సరఫరాఅవసరాల తీరు తెన్నులను విచ్చిన్నం చేస్తుంది.ప్రభుత్వాల మీద భారం మోపుతుంది, మిగులును కొని నిల్వచేయాల్సిన అవసరాన్ని పెంచుతుంది.వనరుల కేటాయింపులో అసమర్ధతకు దారి తీస్తుంది. పంటల వైవిధ్యానికి బదులు కొన్ని పంటలనే ప్రోత్సహిస్తుంది.అవినీతిని ప్రోత్సహిస్తుంది. మధ్యవర్తులు అవకాశంగా తీసుకొని రైతులకు లబ్దిని తగ్గిస్తారు. వ్యవసాయ రంగంలో సంస్కరణలను అడ్డుకుంటుంది,ప్రతిదానికీ ప్రభుత్వం మీద ఆధారపడాల్సి ఉంటుంది. మార్కెట్‌ వ్యవస్థలో పోటీని తగ్గిస్తుంది. రైతులు కొత్త పద్దతులవైపు చూడకుండా కనీస మద్దతు ధరల మీద ఆధారపడతారు,మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా మారరు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అధికారం కోసం దేశం-ధర్మం పేరుతో అమాయక రైతులకు కాషాయ గుంపు అన్యాయం !

23 Sunday Jun 2024

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, Economics, Farmers, History, INDIA, Loksabha Elections, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices

≈ 1 Comment

Tags

#Farmers matter, #Farmers Protest, Anti Farmers, BJP, Minimum Support Prices, MSP demand, Narendra Modi Failures, RSS


ఎం కోటేశ్వరరావు


మూడవ సారి నరేంద్రమోడీ ప్రధాని పదవి చేపట్టారు. ఎంతో వేగంగా పని చేస్తారనే ప్రచారం పెద్ద ఎత్తున చేశారు. దానికి పక్కా నిదర్శనం జమ్మూ-కాశ్మీరుకు రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్‌ 370ని ఎంత వేగంగా రద్దు చేశారో దేశం చూసింది. 2019 జూలై చివరి వారంలో అసాధారణ రీతిలో కాశ్మీరులో భద్రతా దళాలను మోహరించారు.ఆగస్టు రెండవ తేదీ శుక్రవారం నాడు అమరనాధ్‌ యాత్రీకులకు ముప్పు ఉందంటూ యాత్ర నిలిపివేయాలని భద్రతా హెచ్చరిక కాశ్మీరు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది.ఆదివారం నాడు రాష్ట్ర మంతటా 144సెక్షన్‌ ప్రకటించారు, ఇంటర్నెట్‌ నిలిపివేశారు. సోమవారం నాడు ఆర్టికల్‌ 370ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దానికి ముందు అదేరోజు రాష్ట్రపతి ఉత్తరువు వెలువడింది. వెంటనే మంత్రివర్గ సమావేశం, అనంతరం అదే రోజు దాని మీద రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టారు.సభ్యులకు దాని కాపీలు ఇవ్వలేదు. ఉదయం పదకొండు గంటలకు సభ సమావేశమైతే గంటన్నరలో అంటే 12.30లోగా 57పేజీల పత్రం మీద కావాలంటే సవరణలు ప్రవేశపెట్టవచ్చంటూ చెప్పారు. వాటిని చదివేందుకు కూడా ఆ సమయం చాలదు. అదే రోజు సభలో ఆమోదం కూడా పొందారు.మరుసటి ఏడాది కరోనాను అవకాశంగా తీసుకొని మూడు సాగు చట్టాలనూ అంతే వేగంగా ఆమోదించి అమలు చేసేందుకు పూనుకున్నారు.వేగంగా పనిచేసే నాయకత్వ ఘనత గురించి నరేంద్రమోడీ భక్తులు, గోడీ మీడియా పండితులను అడిగితే కొండవీటి చాంతాడంత జాబితాను మన ముందుంచుతారు. రైతుల మహత్తర ఉద్యమం కారణంగా స్వాతంత్య్రానంతరం దేశంలో తొలిసారిగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాలను క్షమాపణ చెప్పి మరీ 2021లో వెనక్కు తీసుకోవటం కూడా వేగంగా జరిగినట్లే !


ఈ వేగం కోట్లాది మంది కోట్లాది మంది రైతులు కోరుతున్న, గతంలో నరేంద్రమోడీ కూడా డిమాండ్‌ చేసిన కనీస మద్దతు ధరలకు చట్టబద్దత కల్పించేందుకు ఎందుకు లేదు ? రెండు సంవత్సరాల క్రితం ఎంఎస్‌పితో సహా రైతాంగ సమస్యలపై నియమించిన కమిటీ నుంచి ఇంతవరకు తాత్కాలిక నివేదికను కూడా ఎందుకు తెప్పించుకోలేదు ? ఇష్టంలేని పెళ్లికి తలంబ్రాలు పోసినట్లుగా ప్రభుత్వ తీరు ఉంది. మూడు సాగు చట్టాలను 2021నవంబరులో రద్దుచేసినపుడు వెంటనే ఒక కమిటీని వేస్తామన్నారు. వెంటనే అంటే ఎనిమిది నెలలు, 2022 జూలై 12న కమిటీని వేశారు. ఆలస్యం ఎందుకంటే కొన్ని రాష్ట్రాలలో ఎన్నికల కారణంగా ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వలేదని, సంయుక్త కిసాన్‌ మోర్చా(ఎస్‌కెఎం) నుంచి స్పందన కోసం ఎదురుచూడాల్సి రావటం అని వ్యవసాయ మంత్రి సాకులు చెప్పారు. ఆ కమిటీకి నివేదించిన అంశాలు, కమిటీలో ప్రతిపాదించిన వ్యక్తుల పట్ల అభ్యంతరాలు తెలుపుతూ మోర్చా తన ప్రతినిధులను పంపేందుకు తిరస్కరించింది. కేంద్ర ప్రభుత్వం-ఎన్నికల కమిషన్‌ మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలను అందించాలని సమాచార హక్కు కింద కోరగా అలాంటి రికార్డులు లేవని సమాధానం ఇవ్వటాన్ని బట్టి అసలు బండారం వెల్లడైంది.అంతే కాదు రైతు సంఘాలతో సంప్రదింపుల సమాచారం కూడా లేదని 2023 డిసెంబరు నాలుగవ తేదీన మరో సమాచార హక్కు ప్రశ్నకు సమాధానం వచ్చింది. ఇక ప్రభుత్వం నియమించిన కమిటీ తీరుతెన్నులను చూస్తే ఎస్‌కెఎం ఎందుకు బహిష్కరించిందో వివరణ అవసరం లేదు. మొత్తం 29 మంది సభ్యులలో ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ సంస్థలు, కాలేజీల్లో పనిచేసే వారే 18 మంది ఉన్నారు. మిగిలిన పదకొండు మంది అధికారేతర సభ్యులలో ఎస్‌కెఎం నుంచి ముగ్గురిని నియమిస్తామని ప్రభుత్వం ప్రతిపాదించింది. మరో ఎనిమిది మంది అధికారపార్టీ కనుసన్నలలో వ్యవహరించే రైతు ప్రతినిధులే ఉన్నారు. ఈ కమిటీకి అధ్యక్షుడు సంజరు అగర్వాల్‌. వివాదాస్పద మూడు సాగు చట్టాలను ప్రతిపాదించినపుడు వ్యవసాయశాఖ కార్యదర్శి. మరో సభ్యుడు ఇఫ్‌కో చైర్మన్‌ దిలీప్‌, ఇతగాడు గుజరాత్‌ బిజెపి మాజీ ఎంపీ. మరొకరు ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ బికెఎస్‌ జాతీయ కార్యవర్గ సభ్యుడైన ప్రమోద్‌ చౌదరి, ఐదవ సభ్యుడు సయ్యద్‌ పాషా పటేల్‌ మహారాష్ట్ర బిజెపి మాజీ ఎంఎల్‌సి, ఇలా అందరూ గత సాగు చట్టాలను అడ్డంగా సమర్దించిన వారితోనే నింపిన తరువాత ఎస్‌కెఎం గళానికి అవకాశం ఎక్కడ ఉంటుంది.


ఇక ఈ కమిటీ తొలి పద్దెనిమిది నెలల కాలంలో 35 సమావేశాలు జరిపినట్లు, ఎప్పుడు నివేదిక సమర్పిస్తుందో చెప్పకుండా పార్లమెంటుకు ప్రభుత్వం జవాబిచ్చింది.ఫిబ్రవరి తరువాత మరో రెండు సార్లు సమావేశమైనట్లు వార్తలు.ఈ కమిటీ అనేక ఉపసంఘాలను ఏర్పాటు చేసింది. వాటి నివేదికలు ఇవ్వాలని కోరినా అందుబాటులో లేవన్నదే ప్రభుత్వ సమాధానం. గతంలో స్వామినాధన్‌ కమిషన్‌, తరువాత నరేంద్రమోడీ ఏర్పాటు చేసిన 2016కమిటీ కూడా అనేక అంశాలను చర్చించింది. అందువలన కొత్త కమిటీ చర్చల పేరుతో కాలయాపన తప్ప మరొకటి కాదు. వాటి సిఫార్సులకు వ్యతిరేకంగా మూడు సాగు చట్టాల్లోని అంశాలు ఉన్నాయి. అయినా మోడీ వాటిని రద్దు చేస్తూ 2021లో చేసిన ప్రసంగంలో రైతులకు కొత్త ఆశలను రేకెత్తించారు.2014 ఎన్నికల సమయంలో బిజెపి చేసిన వాగ్దానానికి వ్యతిరేకంగా మోడీ సర్కార్‌ సుప్రీం కోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. దేశ 75వ స్వాతంత్య్రదినోత్సవం (2022) నాటికి రైతుల ఆదాయాలను రెట్టింపు చేస్తామని 2016 ఫిబ్రవరి 28 బడ్జెట్‌ సందర్బంగా మోడీ చెప్పారు. అదే ఏడాది ఏర్పాటు చేసిన అశోక్‌ దలవాయి కమిటీ 2012-13 ఎన్‌ఎస్‌ఎస్‌ఓ అంచనా ప్రాతిపదికన 2015-2016లో ఒక రైతు రాబడి ఏడాదికి రు.96,703, నెలకు రు.8,058 ఉంటుందని అంచనా వేసి 2022-23నాటికి అది రు.2,71,378- రు.22,610 ఉండాలని, దాన్ని సాధించాలంటే ఏటా 10.4శాతం పెరుగుదల ఉండాలని చెప్పింది. ఇప్పుడు ఎంత ఉందో ఎక్కడా ప్రభుత్వం ప్రకటించలేదు. అయితే 2018-19లో 77వ రైతు కుటుంబాల పరిస్థితి అంచనా సర్వే ప్రకారం రాబడుల మొత్తాలు రు.1,22,616-రు.10,218 ఉన్నట్లు తేలింది. ఈ నివేదికను 2021లో విడుదల చేశారు. దీని ప్రకారం చూస్తే వార్షిక పెరుగుదల కేవలం 2.8శాతమే ఉంది. పదేండ్ల యూపిఏ పాలన సగటు మూడు శాతం కంటే తక్కువ. అయితే ఏ ప్రాతిపదిక లెక్కించారో చెప్పకుండా కొన్ని పంటలకు 2022 ఆర్థిక సంవత్సరంలో రాబడి రెట్టింపు ఉన్నట్లు ఎస్‌బిఐ పరిశోధనా విభాగం చెప్పిన అంకెలను బిజెపి పెద్దలు ఊరూవాడా ప్రచారం చేశారు. గోడీ మీడియా దాన్ని ఇంకా ఎక్కువ చేసింది. నిజంగా అంత పెరిగి ఉంటే రైతాంగం ఈ ఎన్నికల్లో అనేక చోట్ల బిజెపి, దాని మిత్రపక్షాలను ఎందుకు మట్టికరిపించినట్లు ? అనేక చోట్ల రైతులు కనీస మద్దతు ధరలకంటే తక్కువకే అమ్ముకుంటున్నారు. రైతుల రాబడి రెట్టింపు ఎంతవరకు వచ్చిందన్న ప్రశ్నకు 2023 డిసెంబరులో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ స్పందిస్తూ వ్యవసాయం రాష్ట్రాల అంశం గనుక అవి చూసుకుంటాయని దాట వేశారు. మూడు సాగు చట్టాలను రాష్ట్రాలతో సంప్రదించకుండా వాటి ఆమోదం లేకుండా అమలుకు పూనుకున్నపుడు ఈ అంశం గుర్తులేదా ? రైతుల్లో పెరుగుతున్న అసంతృప్తిని గమనించి గత ఎన్నికలకు ముందు కొంత మంది రైతులకు నెలకు రు.500 ఏడాదికి ఆరువేల చొప్పున పిఎం కిసాన్‌ నిధిపేరుతో ఇస్తున్నారు. ఐదేండ్లలో పెరిగిన వ్యవసాయ ఖర్చులతో పోల్చితే ఇది ఏమూలకూ రాదు. ఈ మొత్తాన్ని ఎనిమిది వేలకు పెంచనుందనే లీకులను వదిలి రైతాంగాన్ని మభ్యపెట్టేందుకు చూసింది. ఇప్పుడు దాని గురించి మాట్లాడటం లేదు.


తాజాగా వర్తమాన ఖరీఫ్‌ పంటలకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరలను ప్రకటించింది. ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని గతేడాది ఏడుశాతం పెంచగా ఇప్పుడు ఓట్లతో నిమిత్తం లేదు గనుక 5.4శాతం మాత్రమే పెంచారు. తాజా ఎన్నికల్లో 159 గ్రామీణ నియోజకవర్గాలలో ఓడిపోయిన బిజెపి దాన్నుంచి ఎలాంటి పాఠం నేర్చుకోలేదన్న సంయుక్త కిసాన్‌ మోర్చా వ్యాఖ్యను గమనించాలి.ఈ సందర్భంగా పదేండ్ల యుపిఏ పాలనలో పెరిగింది ఎంత, రాబడిని రెట్టింపు చేస్తామన్న నరేంద్రమోడీ ఎంత పెంచారు అన్నది మీడియాలో చర్చకు వచ్చింది. దీన్ని గోడీ మీడియా మూసిపెట్టేందుకు చూసింది.ప్రభుత్వ సమాచారం ప్రకారమే మచ్చుకు సోయాబీన్‌కు గత పాలకులు, 175, పత్తికి 115శాతం పెంచగా మోడీ పదేండ్లలో 80,79శాతాల చొప్పునే పెంచారు. అనేక పంటల ధరల పెరుగుదల శాతాల తీరు తెన్నులు దిగువ విధంగా ఉన్నాయి. దీనికి ఆధారం కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ వద్ద ఉన్న సమాచారం.ఈ కనీస మద్దతు ధరలు కూడా రైతాంగంలో కేవలం పద్నాలుగుశాతం మాత్రమే పొందుతున్నారన్నది అంచనా.


పంట××××× యుపిఏ ×× మోడీ ఏలుబడి

వరి ముతక×× 138.2 ×× 66.7
గోధుమ ×× 122.2 ×× 62.5
చెరకు ×× 187.7 ×× 50.0
ఆవాలు ×× 90.6 ×× 85.3
పత్తి ××114.5 ×× 78.9
మొక్క జొన్న ××1594 ×× 59.5
శనగలు ×× 121.4×× 75.5
కందులు ×× 216.2×× 62.8
నరేంద్రమోడీ సర్కార్‌ రైతులకు చేసిన మేలు ఇలా ఉంది గనుకనే అనేక చోట్ల బిజెపి ఎదురుదెబ్బలు తిన్నది, గత ఎన్నికల కంటే సీట్లు, ఓట్ల శాతాన్ని కూడా కోల్పోయింది. దేశాన్ని ఊపివేస్తున్న నీట్‌ పరీక్షా పత్రాల కుంభకోణం ఎన్నికలకు ముందే వెలువడి ఉంటే దాని పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోవచ్చు. దేశం కోసం-ధర్మం కోసమంటూ కబుర్లు చెప్పిన కాషాయదళం తీరుతెన్నులు వచ్చే ఐదు సంవత్సరాలూ వ్యవసాయ రంగంలో ఇదే విధంగా ఉండకూడని అనేక మంది కోరుతున్నారు.పెడచెవిన పెడితే రైతాంగ ఉద్యమాలు వెల్లువెత్తుతాయి. జిడిపిలో వ్యవసాయ రంగం వాటా 15-16శాతమే ఉన్నప్పటికీ జనాభాలో 45శాతం మందికి ఉపాధి చూపుతున్నది. ఇది కూడా కుదేలైతే గ్రామీణా ప్రాంతాలలో అలజడి రేగుతుంది. జూలై పదవ తేదీన సంయుక్త కిసాన్‌మోర్చా జనరల్‌ బాడీ సమావేశం ఎన్నికల అనంతర పరిస్థితి గురించి సమీక్ష, కార్యాచరణ గురించి చర్చించనుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

నరేంద్రమోడీ రెండు ముఖాలు : రైౖతుల మద్దతు కోసం పాకులాట – ఉద్యమ సంఘాలపై పగసాధింపు !

22 Saturday Jun 2024

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, Farmers, History, INDIA, Loksabha Elections, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices

≈ Leave a comment

Tags

#Failed Narendra Modi, #Farmers matter, AIKS, BJP, Minimum Support Prices, MSP demand, Narendra Modi Failures, PM Kisan Nidhi, Samyukta Kisan Morcha, SKM


ఎం కోటేశ్వరరావు


ఐదు సంవత్సరాల క్రితం ప్రారంభించిన కిసాన్‌ సమ్మాన్‌ యోజన పదిహేడవ విడత నిధులను మూడోసారి అధికారానికి వచ్చిన తరువాత పెద్ద ఆర్భాటంతో ప్రధాని నరేంద్రమోడీ విడుదల చేశారు.(ఆంధ్రప్రదేశ్‌ మాజీ సిఎం వైఎస్‌ జగన్‌ మీట నొక్కుడును గుర్తుకు తెచ్చింది) అంతకు ముందు తొలిసంతకం దాని మీదే చేసినట్లు కూడా ప్రచారం జరిగింది.వెంటనే తాను ఎన్నికైన లోక్‌సభ స్థానం వారణాసి వెళ్లి రైతులతో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. ఎగుమతుల ద్వారా భారత ఆహార వస్తువులను ప్రపంచంలో ప్రతి ఒక్కరి కంచంలో చూడాలని ఉందన్నారు. గతంలో ఎన్నడూ పిఎం కిసాన్‌ యోజన నిధుల విడుదలకు ఇంత హంగామా చేయలేదు. నిజానికి ఈ సొమ్ము ఏ కార్పొరేట్ల నుంచో ధనికుల నుంచో వసూలు చేసి ఇవ్వటం లేదు. మనం కొనుగోలు చేసే పెట్రోలు మీద లీటరుకు రు.2.50, డీజిలు మీద రు.4.00 సెస్‌ల పేరుతో కేంద్రం వసూలు చేసి దాన్నుంచి ఇస్తున్నది. ఇదే కాదు మొత్తం 29 వస్తువులపై ఈ పేరుతో పన్ను మీద 15శాతం సెస్‌ల రూపంలో వినియోగదారుల జేబుల నుంచి కొట్టివేసి దాన్నుంచే కొన్ని పథకాలను అమలు చేస్తున్నది. ఎప్పుడూ లేనిది కిసాన్‌ సమ్మాన్‌ నిధి విడుదలను ప్రచారానికి ఎందుకు వినియోగించుకున్నట్లు ? అదేమీ అర్ధంగాని తత్వం లేదా బ్రహ్మ పదార్ధం కాదు.తాజా లోక్‌సభ ఎన్నికల్లో రైతుల నుంచి వెల్లడైన వ్యతిరేకత అనేక ప్రాంతాల్లో ఓటమిలో వారి పాత్రను చూశారు. తత్వం తలకెక్కి రాబోయే రాష్ట్రాల అసెంబ్లీ ముఖ్యంగా హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో దగ్గరయ్యే ఎత్తుగడతో వారికోసం తాను తపిస్తున్నట్లు కనిపించేందుకు చేసిన యత్నం తప్ప మరొకటి కాదు.కొందరి విశ్లేషణ ప్రకారం గత లోక్‌సభలో 543 స్థానాలకు గాను బిజెపి 201గ్రామీణ నియోజకవర్గాలలో విజయం సాధించగా తాజా ఎన్నికల్లో 126 చోట్ల మాత్రమే గెలిచింది.వ్యవసాయదారులను నిర్లక్ష్యం చేసిన కారణంగా 159 చోట్ల బిజెపి ఓడిపోయిందని, రైతుల ప్రతినిధులను బడ్జెట్‌ చర్చల ప్రక్రియలో భాగస్వాములను చేయకుండా అహంకారాన్ని ప్రదర్శిస్తే, రైతాంగాన్ని నిర్లక్ష్యం చేస్తే దేశవ్యాపితంగా ఆందోళన తప్ప మరొక మార్గం లేదని ఆలిండియా కిసాన్‌ సభ (ఏఐకెఎస్‌) స్పష్టం చేసింది.


నిజంగా వ్యవసాయం, దాని మీద ఆధారపడిన రైతులు, కూలీల గురించి కేంద్ర ప్రభుత్వానికి అంతశ్రద్ద ఉందా ? పదేండ్ల ఆచరణ చూస్తే అలా కనిపించదు. ఉమ్మడి జాబితాలో ఉన్న వ్యవసాయ రంగంలో రాష్ట్రాలలో చర్చ, ఆమోదంతో నిమిత్తం లేకుండా కరోనా సమయంలో అమల్లోకి తెచ్చిన మూడు రైతు వ్యతిరేక సాగు చట్టాలు, వాటికి వ్యతిరేకంగా ఏడాది పాటు సాగిన రైతు ఉద్యమం తెలిసిందే.విధి లేని స్థితిలో క్షమాపణలు చెప్పిమరీ మోడీ వాటిని వెనక్కు తీసుకున్నారు. ఆ మహత్తర ఉద్యమానికి నాయకత్వం వహించింది అనేక రైతు సంఘాలతో కూడిన సంయుక్త కిసాన్‌ మోర్చా(ఎస్‌కెఎం). ఆ వేదికలో కీలక పాత్రపోషించిన ఆలిండియా కిసాన్‌ సభ(ఎఐకెఎస్‌) దేశంలో అతి పెద్ద రైతు ఉద్యమ సంస్థ, తొలి వరుసలో ఉంది. మూడు సాగు చట్టాల రద్దు కొనసాగింపుగా కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరలు, ఇతర అంశాల గురించి 2022 జూలైలో ఒక కమిటీని వేసింది. అది ఏం చేస్తున్నదో నివేదిక ఎప్పుడు సమర్పిస్తుందో తెలియదు. బడ్జెట్‌ రూపకల్పన సందర్భంగా వివిధ తరగతులు ఏ కోరుకుంటున్నారో తెలుసుకొనేందుకు ప్రభుత్వం సంస్థలు, వ్యక్తులను కూడా పిలిచి ప్రతి ఏడాది సంప్రదింపులు జరుపుతుంది. లోక్‌సభ ఎన్నికల కారణంగా ఆమోదం పొందిన తాత్కాలిక(ఓట్‌ ఆన్‌ ఎకౌంట్‌) స్థానంలో పూర్తి బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు కేంద్రం ఇప్పుడు ఆ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఈ చర్చలకు ఎస్‌కెఎం, ఏఐకెఎస్‌లను దూరంగా పెట్టింది. ఇది రైతులను అవమానించటం, కక్ష సాధింపు అనేందుకు పక్కానిదర్శనం.ఈ వైఖరిని ఆలిండియా కిసాన్‌ సభ ఒక ప్రకటనలో తీవ్రంగా నిరసించింది. కనీస మద్దతు ధరలను సిఫార్సు చేసే వ్యవసాయ ఖర్చులు, ధరల కమిషన్‌(సిఏసిపి) ప్రతి ఏటా ఎఐకెఎస్‌ను ఆహ్వానించి అభిప్రాయాలను తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఎస్‌కెఎం నాయకులను కూడా చర్చల నుంచి మినహాయించటాన్ని కూడా ఎఐకెఎస్‌ ఖండించింది.


మూడవసారి అధికారానికి వచ్చిన నరేంద్రమోడీ వ్యవసాయం గురించి సరికొత్తగా ఆలోచించి కార్యాచరణ చేపట్టాలని అనేక మంది చెబుతున్నారు. మోడీ సర్కార్‌ పారిశ్రామిక వస్తు ఎగుమతుల్లో విఫలమైంది. సముద్ర ఉత్పత్తులను వ్యవసాయ ఉత్పత్తులు, ఆహార ఉత్పత్తులకు జతచేసిి మొత్తం వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతిగా చూపుతున్నారు.2014-15 సంవత్సరంలో మొత్తం ఎగుమతులు 36.18బిలియన్‌ డాలర్లుండగా 2020-21నాటికి 38.32 బి.డాలర్లకు పెరిగినట్లు ఏటా పెరుగుదల శాతం 0.96శాతంగా ఉన్నట్లు ఆహార తయారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపినట్లు బిజినెస్‌ టుడే పత్రిక 2021 డిసెంబరు 10న ప్రచురించిన వార్తలో పేర్కొన్నది.సముద్ర, తోటల ఉత్పత్తులను మినహాయించి కేవలం వ్యవసాయ ఉత్పత్తుల విలువ 2020-21లో 29.81 బిలియన్‌ డాలర్లు ఉన్నట్లు మంత్రిత్వశాఖ పేర్కొన్నది. చిత్రం ఏమిటంటే మోడీ అధికారానికి రాకముందు 2013-14 సంవత్సరంలో మొత్తం వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల విలువ 37.292బి.డాలర్లు. ఈ అంశాన్ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ వెల్లడించినట్లు పిఐబి 2014జూలై తొమ్మిదిన తెలిపింది.దీంతో పోల్చుకున్నా, ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే వాస్తవ విలువ తిరోగమనంలోనే ఉంటుంది. జనాన్ని మభ్యపరిచేందుకు పాలకుల కనుసన్నలలో పనిచేసే అధికార యంత్రాంగం ఎన్నితిప్పలు పడుతుందో పిఐబి 2024 ఫిబ్రవరి 17న వెల్లడించిన మరో సమాచారాన్ని చూస్తే తెలుస్తుంది. మోడీ అధికారానికి వచ్చిన పదేండ్లలో సాధించిన విజయాల గురించి కీర్తించటం తెలిసిందే. దానిలో భాగంగానే 1987-88లో అపెడా( వ్యవసాయ మరియు ఆహార ఉత్పత్తుల అభివృద్ధి సంస్థ) ఎగుమతులు కేవలం 0.6బిలియన్‌ డాలర్లేనని అలాంటిది 2022-23నాటికి 26.7బి.డాలర్లకు పెరిగినట్లు , ఇది మోడీ గొప్పతనం అన్నట్లు చిత్రించింది. ఈ ఏడాదిలో వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల విలువ 53.1బి.డాలర్లని కూడా తెలిపింది. ఈ లెక్కన చూసుకున్నా పదేండ్లలో పెరిగింది 53.1-37.29=15.81 బి.డాలర్లు మాత్రమే. తాను వచ్చిన తరువాత భారత ప్రతిష్టను, విదేశాల్లో తిరిగి మార్కెట్లను పెంచానని, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు చేశామని చెప్పుకున్న నరేంద్రమోడీ ప్రచారానికి ధీటుగా ఈ పెరుగుదల లేదు. యాహూ న్యూస్‌ 2024 మార్చి 21వ తేదీ విశ్లేషణ ప్రకారం 2022లో వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేసే 20 అగ్రదేశాలలో మనది 11వ స్థానం, చైనా ఆరవదిగా ఉంది.


మన రైతులు నేరుగా ఏ దేశానికైనా ఎగుమతులు చేసుకొనేందుకు, దేశంలో ఎక్కడైనా అమ్ముకొనేందుకు వీలుగా మూడు సాగు చట్టాలను తీసుకొచ్చినట్లు నరేంద్రమోడీ సర్కార్‌ చెప్పుకున్న సంగతి తెలిసిందే.కానీ అదే ప్రభుత్వం లోక్‌సభ ఎన్నికలకు ముందు గోధుమలు, బియ్యం, పంచదార, ఉల్లిపాయల ఎగుమతులపై ఆంక్షలు, నిషేధం ఈ జాబితాలో ఉన్నాయి. ఇవి పండే ప్రాంతాలలో ఎక్కువ చోట్ల బిజెపి లోక్‌సభ ఎన్నికల్లో చావుదెబ్బతిన్నది. ఆంక్షల వలన 2023 ఏప్రిల్‌-అక్టోబరు మాసాల మధ్య బాస్మతి బియ్యం ఎగుమతులు 16శాతం పెరిగినా ఇతర ఉత్పత్తుల్లో నాలుగు బిలియన్‌ డాలర్ల మేర ఎగుమతులు జరగలేదు. తొమ్మిదిశాతం ఎగుమతులు తన పరిధిలో తగ్గినట్లు అపెడా పేర్కొన్నది. వ్రతం చెడ్డా ఫలం దక్కలేదు అన్నట్లుగా బిజెపి రైతుల ఆగ్రహాన్ని చూడాల్సి వచ్చింది. ఉల్లి ఎగుమతులపై నిషేధం కారణంగా నేపాల్‌, ఇతర దేశాలు మన బదులు పాకిస్తాన్‌, చైనాల నుంచి కొనుగోలుకు పూనుకున్నాయి. అంటే ఎగుమతి అవకాశాన్ని తన ఎన్నికల లబ్దికోసం మోడీ అనిశ్చితిలో పడేశారు. పోనీ మనదేశంలో ఉల్లి దిగుబడిని పెంచేందుకు ఏమైనా చర్యలు తీసుకున్నారా అంటే అదీ కనపడదు. చైనాలో హెక్టారుకు 21.85 టన్నుల దిగుబడి ఉండగా మనదేశంలో 16.12 టన్నులు మాత్రమే ఉంది. ప్రపంచ ఉత్పత్తిలో రెండు దేశాలూ ఒకటి రెండు స్థానాల్లో ఉంటున్నాయి.


వ్యవసాయ రంగంలో నెలకొన్న సంక్షోభాన్ని పరిష్కరించేందుకు అవసరమైన చర్యలకు బదులు రైతాంగాన్ని కార్పొరేట్లకు అప్పగించేందుకు మూడు సాగు చట్టాల పేరుతో చేసిన యత్నం బెడిసి కొట్టింది. తరువాత కూడా అదే వైఖరి. కనీస మద్దతు ధరల(ఎంఎస్‌పి) విధానాన్ని ఎత్తివేయాలన్న ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌ ఆదేశాల అమలుకు చూస్తున్నారు. ఆ కారణంగానే ఎంఎస్‌పికి చట్టబద్దత కల్పించేందుకు మొరాయిస్తున్నారు. మరో ఐదు సంవత్సరాల వరకు పార్లమెంటు ఎన్నికలు లేవు గనుక ఎగుమతి వ్యాపారంలో ఉన్న బడా సంస్థల కోసం వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులపై ఆంక్షలను త్వరలో ఎత్తివేసి అవి రైతులకోసమే అని చెప్పినా ఆశ్చర్యం లేదు. మూడు సాగు చట్టాల తరువాత వేసిన కమిటీతో మరో రూపంలో ఆ చట్టాల్లోని అంశాలనే చెప్పించి కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పించటానికి సాకుల కోసం చూస్తున్నారు. ఆ పేరుతో ప్రపంచవాణిజ్య సంస్థ, ఐఎంఎఫ్‌, ప్రపంచ బాంకులను సంతుష్టీకరించేందుకు పూనుకోవచ్చు.మన వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులపై ఆంక్షలు విధించిన నరేంద్రమోడీ మరోవైపు పప్పుధాన్యాలు, ఖాద్యతైలాల దిగుమతులపై పన్నులు తగ్గించారు. దీంతో మనదేశంలో వీటిని సాగుచేసే రైతాంగం తీవ్రంగా నష్టపోతోంది. ద్రవ్యోల్బణ అదుపు చర్యలంటూ ఎగుమతులపై ఆంక్షలు, దిగుమతులపై పన్నుల తగ్గింపు కారణంగా అంతిమంగా నష్టపోయింది రైతులు మాత్రమే. ఎన్నికలు జరుగుతున్నపుడు కిలో ఇరవై రూపాయలున్న ఉల్లి ఫలితాలు వచ్చిన వెంటనే యాభై రూపాయలకు పెరిగింది. దీంతో రైతులెంత లబ్దిపొందుతారో తెలియదు గానీ వినియోగదారుల జేబులకు చిల్లి పడింది.

తొలిసారి నరేంద్రమోడీ అధికారానికి రావటానికి, కాంగ్రెస్‌ ఘోరంగా ఓడిపోవటానికి కారణాల్లో ద్రవ్యోల్బణం-ధరల పెరుగుదల కూడా ఒకటి.అందుకే తాజా ఎన్నికలకు ముందు దాన్ని కృత్రిమంగా అదుపులో ఉంచేందుకు పైన పేర్కొన్న చర్యలను తీసుకున్నారు.అయినప్పటికీ ఆహార ద్రవ్యోల్బణం 2023 నవంబరు నుంచి ఎనిమిదిశాతానికి అటూ ఇటూగా ఉంది. ఆ మేరకు పప్పులు, నూనెలు, ఇతర ఆహార వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. బిజెపిని దెబ్బతీసిన అంశాలలో ఇది కూడా ఒకటి. ఈ నేపధ్యంలో బడ్జెట్‌లో రైతులు ఏం కోరుతున్నారో తెలుసుకోవాలంటే వారి సమస్యలపట్ల నిత్యం పని చేస్తున్న సంయుక్త కిసాన్‌ మోర్చా, ఆలిండియా కిసాన్‌ సభ వంటి సంస్థలను, రైతాంగ సమస్యలపై అధ్యయనం చేస్తున్న మేధావులను సంప్రదించకుండా కుదిరేది కాదు. ఆ దిశగా కేంద్ర తీరు లేదంటే దాని అర్ధం ఏమిటి ? చర్చలకు పిలిస్తే ఎవరేం కోరుతున్నారో రైతులకు స్పష్టత వస్తుంది, వాటిని అమలు జరపకపోతే పాలకుల మీద వత్తిడి పెరుగుతుంది. అందుకే దూరంగా పెట్టారు.తన కోడి కూయకపోతే ఎలా తెల్లవారుతుందో చూస్తానని ఒక ముసలమ్మ అనుకుందట.అలాగే ప్రభుత్వం అవకాశం కల్పించనంత మాత్రాన ఉద్యమ సంస్థల వాణి రైతులకు చేరకుండా ఉంటుందా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

గోధుమ ధరలపై మూడు నెలల్లోనే బిజెపి వాగ్దాన భంగం !

13 Wednesday Mar 2024

Posted by raomk in BJP, Current Affairs, Economics, Farmers, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, Women

≈ Leave a comment

Tags

#Farmers matter, #Farmers’ protest, #Indian Farmers, BJP, MSP demand, Narendra Modi Failures, SKM, Wheat farmers


ఎం కోటేశ్వరరావు


గోధుమ రైతులకు కనీస మద్దతు ధరకంటే అదనంగా చెల్లిస్తామని వాగ్దానం చేసిన బిజెపి నామమాత్రంగా పెంచి చేతులు దులుపుకుంది. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా గోధుమ రైతులకు క్వింటాలుకు రు.2,700 చొప్పున చెల్లిస్తామని బిజెపి వాగ్దానం చేసింది. మధ్య ప్రదేశ్‌లో బిజెపి వరికి రు.3,100 చెల్లిస్తామని ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నది. గోధుమ కనీస మద్దతు ధర రు.2,275 కాగా తమను ఎన్నుకుంటే బోనస్‌ రూపంలో ఇచ్చేదానితో పాటు రు.2,700 చెల్లిస్తామని నమ్మబలికింది. తాజాగా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం రు.125 మాత్రమే పెంచి రు.2,400 ఇస్తామని ప్రకటించాయి.బహిరంగ మార్కెట్లో ప్రస్తుతం నాణ్యతను బట్టి క్వింటాలు గోధుమల ధర రు.2,700 నుంచి 3,000 ఉంది. ప్రభుత్వ నిర్ణయంతో ధరలు పడిపోవచ్చని రైతులు ఆందోళన చెందుతున్నారు.లోక్‌సభ ఎన్నికల్లో ఇది చర్చనీయాంశమయ్యే అవకాశం ఉంది.రెండు రాష్ట్రాల బిజెపి ప్రభుత్వాలు క్వింటాలుకు రు.125 బోనస్‌ ప్రకటించటంతో అక్కడ నిరసన, ఆ మాత్రమైనా ఉత్తర ప్రదేశ్‌, హర్యానాలో ఉన్న ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు పెంచవు అనే వత్తిడి తలెత్తే అవకాశం ఉంది.

రైతులను మోసగించటంలో బిజెపి రాష్ట్ర ప్రభుత్వాలు నిమగమైతే అసలు రాజధాని ఢిల్లీకే రాకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుకొని ఫిబ్రవరి 13నుంచి వేలాది మంది రైతులను పంజాబ్‌-హర్యానా సరిహద్దుల్లో నిలవేసింది.గతంలో ఏడాది పాటు ఆందోళన నిర్వహించిన సంయుక్త కిసాన్‌ మోర్చా(ఎస్‌కెఎం) మార్చి 14వ తేదీ ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో తలపెట్టిన కిసాన్‌ మజ్దూర్‌ మహా పంచాయత్‌కు అనుమతి ఇవ్వకుండా అడ్డుకున్న కేంద్రం వత్తిడికి తట్టుకోలేక చివరకు ఒక రోజు ముందుగా అనుమతి ఇచ్చింది. రైతుల ఉద్యమాన్ని తీవ్రతరం చేసేందుకు అక్కడ సంకల్ప పత్ర పేరుతో తీర్మానం చేయనున్నారు.లోక్‌సభ ఎన్నికలు కూడా జరుగనుండటంలో భవిష్యత్‌ కార్యాచరణను కూడా ఇక్కడ ప్రకటిస్తారు. సంయుక్త కిసాన్‌ మోర్చా నుంచి విడిపోయిన కొందరు, గత ఆందోళనకు దూరంగా ఉన్నవారు కలసి ఎస్‌కెఎం(ఎన్‌పి)గా ఏర్పడి ఢిల్లీ చలోకు పిలుపు ఇచ్చారు. వారిని అడ్డుకొనేందుకు అసాధారణ రీతిలో పోలీసులు రాజధానికి వచ్చే రోడ్ల మీద కందకాలు తవ్వటం, మేకులు కొట్టి, పెద్ద పెద్ద సిమెంట్‌ బ్లాకులు, మట్టి, రాళ్లతో నింపిన కంటెయినర్లను రోడ్ల మీద అడ్డంగా పెట్టిన అంశం తెలిసిందే. రామ్‌లీలా మైదానంలో జరిగే మహాపంచాయత్‌కు కేంద్ర కార్మిక సంఘాలు, రంగాల వారీగా పనిచేస్తున్న ఉద్యోగ, కార్మిక సంఘాలు మద్దతు ఇచ్చాయి.యువజన, విద్యార్ధి,మహిళా సంఘాలు కూడా భాగస్వాములు కానున్నాయి.


ఫిబ్రవరి 22వ తేదీన ఈ సభ గురించి ఎస్‌కెఎం ప్రకటించినప్పటికీ అనుమతి గురించి ఎటూ తేల్చకుండా చివరి నిముషంలో అనుమతి ఇచ్చినప్పటికీ పంజాబ్‌ నుంచి వందలాది బస్సులు, ట్రక్కులు, రైళ్లలో బయలుదేరి 50వేల మంది వస్తున్నట్లు ఆ రాష్ట్రనేతలు చెప్పారు. తమతో పాటు రొట్టెలు చేసుకొనేందుకు పిండి, కూరగాయలు, స్టౌవ్‌లు, గ్యాస్‌ సిలిండర్లు కూడా తెచ్చుకుంటున్నారని, రాజధానిలోని గురుద్వారాలలో రైతులకు వసతి ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. సమీప హర్యానా, రాజస్థాన్‌, ఉత్తర ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌,ఉత్తరాఖండ్‌ నుంచి కూడా రైతులు తరలివస్తున్నట్లు ఎస్‌కెఎం నేతలు చెప్పారు.హర్యానాలోని బిజెపి ప్రభుత్వం పంజాబ్‌ నుంచి రైతులు రాకుండా ప్రధాన రహదార్లపై అనేక ఆటంకాలను కల్పించినప్పటికీ ప్రత్యామ్నాయ మార్గాలలో వస్తున్నారు. రైతు కుటుంబాల నుంచి మహిళలు కూడా గణనీయంగా వస్తున్నట్లు నిర్వాహకులు చెప్పారు.


కనీస మద్దతు ధరలకు ప్రభుత్వ సంస్థలు కొనుగోలు చేయటం, ఆహార భద్రత కోసం ప్రభుత్వ ధాన్య సేకరణ ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలకు విరుద్దం. అయితే ఈ అంశంపై గత రెండు దశాబ్దాలుగా ఒక ఒప్పందం జరగని కారణంగా వాటిని కొనసాగిస్తున్నారు. అబూదాబీ సమావేశాల్లో కూడా ధనిక దేశాలు ఈ అంశం మీద పట్టుపట్టాయి. వాటిని సంతుష్టీకరించేందుకు కరోనా కాలంలో రైతులు రోడ్ల మీదకు రారనే అంచనాతో నరేంద్రమోడీ మూడు సాగు చట్టాలను తెచ్చారు. నిజానికి గత కొద్ది సంవత్సరాలుగా సాగు మీద వస్తున్న రైతుల ఆదాయాలు పడిపోతున్నట్లు ప్రభుత్వ గణాంకాలే వెల్లడిస్తున్నాయి. అనేక మంది రైతులు కూలీపని చేసి అదనపు ఆదాయం పొందుతున్నారు. వ్యవసాయ అనుబంధ, పాడి, కోళ్ల పెంపకం వంటి ఇతర వనరుల ద్వారా వస్తున్న రాబడి పెరుగుతున్నది. అందుకే సాగే ప్రధానంగా ఉన్న పంజాబ్‌, హర్యానా, ఇతర ఉత్తరాది ప్రాంతాల రైతులు కనీస మద్దతు ధరలను తమ ప్రాణవాయువుగా చూస్తున్నారు. వాటిని తీసివేస్తే ప్రాణాలు పోతాయని భయపడుతున్నారు గనుకనే, ఎన్ని నిర్బంధాలు ప్రయోగించినా ఆందోళనలకు సిద్దం అవుతున్నారు. కొన్ని రాష్ట్రాల్లో తాము అధికారానికి వస్తే గోధుమలు, ధాన్య ధరలను కనీస మద్దతు ధరలకంటే పెంచుతామని బిజెపి చెబుతున్నపుడు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం అదే పని ఎందుకు చేయటం లేదు ? దేశంలోని ఇతర ప్రాంతాల రైతుల నుంచి వ్యతిరేకత పెద్ద ఎత్తున రాకపోవటాన్ని అవకాశంగా తీసుకొని రద్దు చేసిన మూడు సాగు చట్టాలను తిరిగి తీసుకురావాలని కార్పొరేట్ల ప్రయోజనాలను కాపాడే వారు ఇప్పుడు వాదిస్తున్నారు. సాగు చట్టాల రద్దు సందర్భంగా సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన కమిటీ కూడా వాటి వలన రైతులకు మేలు జరుగుతుందని, వెనక్కు తీసుకోవటం సరైంది కాదని చెప్పింది. అందువల్లనే ఆ కత్తి ఇప్పటికీ రైతాంగం మెడమీద వేలాడుతూనే ఉంది. నరేంద్రమోడీ మరోసారి అధికారానికి వస్తే రద్దుచేసిన వాటిని తిరిగి ప్రవేశపెట్టబోరనే గ్యారంటీ లేదు. మీడియాలో లోక్‌సభ ఎన్నికలను గమనంలో ఉంచుకొని మోడీ గ్యారంటీలంటూ చెబుతున్నవాటిలో కనీస మద్దతు ధర అంశం లేదని వేరే చెప్పనవసరం లేదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఏడాదిలోపు రెండుసార్లు చెరకు ధర ప్రకటన ! రైతుల ఓట్లు కొల్లగొట్టేందుకు మోడీ ఎత్తుగడ !!

23 Friday Feb 2024

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, Farmers, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Prices

≈ Leave a comment

Tags

BJP, Fair and Remunerative Price, GannaKisan, MSP demand, Narendra Modi Failures, sugarcane, sugarcane farmers

ఎం కోటేశ్వరరావు


కేంద్రా ప్రభుత్వం తాజాగా క్వింటాలు చెరకు ధరను రు.25 పెంచింది. దీంతో 2024-25 సీజన్‌కు రు.340కి చేరిందని, రైతులకిచ్చిన ఈ బ హుమతితో పండగ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. మన దేశంలో సీజన్‌ అంటే ఆర్థిక సంవత్సరానికి చెప్పే నిర్వచనం వేరు, పంటలకు వేరు. ఏప్రిల్‌ నుంచి మార్చి నెలవరకు ఆర్థిక సంవత్సరం. అదే పత్తి, చెరకు సంవత్సరాలు అక్టోబరు నుంచి సెప్టెంబరు వరకు లెక్కిస్తారు.దీని ప్రకారం 2024-25 సీజన్‌ అంటే ఈ ఏడాది అక్టోబరు నుంచి వచ్చే ఏడాది సెప్టెంబరు వరకు. కనుక ప్రకటించిన పెంపుదల వర్తమాన సంవత్సరానికి కాదు. ఈ ఏడాది ధరను సీజనుకు ముందుగా గతేడాది జూన్‌లోనే ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల తరువాత జూన్‌లో చేయాల్సిన ప్రకటనను రైతుల ఓట్ల కోసం నాలుగు నెలల ముందే ప్రకటించారు. అందుకే నిజంగా రైతులు దీంతో సంతోషిస్తారా ? పంజాబ్‌ రైతులు చలో ఢిల్లీ పేరుతో రావటాన్ని పంజాబ్‌-హర్యానా సరిహద్దులో బిజెపి ప్రభుత్వం అడ్డుకుంది. ఫిబ్రవరి 13 నుంచి ఢిల్లీకి రెండు వందల కిలోమీటర్ల దూరంలో వారు రెండు చోట్ల తిష్టవేశారు.వివిధ రూపాల్లో ఆందోళనకు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. పోలీసుల దాష్టీకానికి ఒక రైతు మృతి చెందాడు. త్వరలో లోక్‌సభ ఎన్నికల నోటిపతిికేషన్‌ వెలువడనున్న పూర్వరంగంలో నాటకీయ పద్దతిలో కేంద్ర మంత్రివర్గం ఫిబ్రవరి 21 సమావేశం, దానిలో చెరకు ధర పెంపు నిర్ణయాన్ని నరేంద్రమోడీ వెల్లడించారు.


న్యాయమైన మరియు గిట్టుబాటు ధర(ఎంఆర్‌పి) పేరుతో చేస్తున్న జిమ్మిక్కుతో రైతులకు ఒరిగేదేమిటి ? షరతులు వర్తిస్తాయి అన్నట్లుగా క్వింటాలుకు 10.25శాతం పంచదార దిగుబడి వస్తేనే ఈ ధర దక్కుతుంది. ప్రస్తుత సీజన్‌లో 2023-24కు రు.315గా 2023జూన్‌లో కేంద్రం ప్రకటించింది. వచ్చే ఏడాది నిర్ణీత ప్రామాణిక శాతానికి మించి ఎక్కడైనా పంచదార దిగుబడి పెరిగితే 0.1శాతానికి రు.3.32 అదనంగా చెల్లిస్తారు. అదే మాదిరి తగ్గితే తగ్గుతుంది. తమ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తరువాత 2014-15 నుంచి ఈ మాదిరి పెరుగుదల లేదు అని కేంద్ర ప్రభుత్వం చెప్పుకున్నది నిజమే. పదేండ్ల వివరాలను చూసినపుడు చెరకు ధరను రు.220 నుంచి రు.315కు పెంచారు. అంటే పదేండ్లలో పెరిగింది కేవలం రు.95 మాత్రమే. ఏడాదికి సగటు పెంపు రు.9.50 మాత్రమే. అలాంటిది ఏకంగా రు.25 పెంచారంటే ఎన్నికల కోసమే అంటే తప్పేముంది. పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌ రైతాంగంలో పలుకుబడి కలిగిన ఆర్‌ఎల్‌డి పార్టీ బిజెపితో చేతులు కలిపింది, చెరకు పండేది కూడా అక్కడే ఎక్కువ, ఆర్‌ఎల్‌డి మద్దతుదార్లు ఈ రాజకీయ అవకాశవాదాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని, నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నట్లు వార్తలు వచ్చిన పూర్వరంగంలో వారిని మచ్చిక చేసుకొనేందుకు మోడీ పూనుకున్నారు. దానిలో భాగంగా చెరకు ధర పెంపుతో పాటు మాజీ ప్రధాని చరణ్‌సింగ్‌కు భారత రత్న ప్రకటన వెనుక కూడా చెరకు రైతుల మద్దతు కోసమే అన్నది స్పష్టం. గతంలో సాగిన రైతు ఉద్యమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న జాట్‌ రైతాంగాన్ని ఈ సారి ఆందోళనకు దూరంగా ఉంచాలన్న ఎత్తుగడ కూడా ఉంది. మహారాష్ట్రలో బిజెపిని వ్యతిరేకిస్తున్న శరద్‌ పవార్‌ నాయకత్వంలోని పార్టీకి చెరకు రైతులే ప్రధాన మద్దతుదార్లు, వారిని ఆకర్షించటం కూడా దీని వెనుక ఉంది. గడచిన పదేండ్లలో నాలుగు సంవత్సరాలు అసలు పెంచలేదు. ఒకేడాది ఐదు, మూడు సార్లు పది వంతున, ఒకసారి 15, మరొకసారి రు.20 పెంచారు.2019 ఎన్నికలకు ముందు రు.20పెంచారు. అదీ ఎన్నికల కోసమే అనివేరే చెప్పనవసరం లేదాు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న మోడీ హామీలో భాగమే తాజా పెంపుదల అని ప్రచారం చేస్తున్నారు. ఆ లెక్కన ధర రు.440కి పెరగాలి. అందుకే జుమ్లా అని రైతులు వర్ణిస్తున్నారు. యుపిఏ హయాంలో 2009-10లో ఉన్న ధర రు.129 నుంచి 2013-14 నాటికి రు.210కి అంటే ఐదు సంవత్సరాల్లో రు.81 పెరిగింది. పదేండ్ల మోడీ ప్రభుత్వం పెంచింది కేవలం రు.95 మాత్రమే. ఏ ఎలిమెంటరీ విద్యార్ధిని అడిగినా మోడీ ఏలుబడిలో తక్కువే అని చెబుతారు.


దేశంలో చెరకు ధరకు రెండు పద్ధతులను అనుసరిస్తున్నారు.ఒకటి కేంద్రం ప్రకటించే ఎఫ్‌ఆర్‌పి కాగా రెండవది కొన్ని రాష్ట్రాలు ప్రకటిస్తున్న రాష్ట్ర సలహా ధర(ఎస్‌ఏపి) సహజంగా కేంద్రం కంటే ఎక్కువగా ఉంటుంది.ఉదాహరణకు పంజాబ్‌లో రు.391, ఉత్తర ప్రదేశ్‌లో రు.370 ఉంది. అందువలన కేంద్ర ప్రకటించిన ధరతో ఎవరికి ప్రయోజనం?ప్రస్తుతం ఉన్న రు.315 ధర పంచదార దిగుబడి 9.5శాతం అన్న అంచనాతో నిర్ణయించారు. అందువలన దిగుబడి పెరిగితేనే రైతుకు ఉపయోగం లేకపోతే నష్టమే.దిగుబడి రైతు చేతిలో ఉండదు. ప్రైవేటు రంగంలో ఉన్న ఏ ఒక్క పంచదార ఫ్యాక్టరీ దిగుబడి గురించి వాస్తవ సమాచారాన్ని వెల్లడించదు. అందువలన దిగుబడితో నిమిత్తం లేకుండా ధర చెల్లించాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. కేంద్రమైనా, రాష్ట్రాలు ప్రకటించే ధరలైనా వాస్తవ ఖర్చులను పరిగణనలోకి తీసుకోవటం లేదని, పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లో సాగు ఖర్చు టన్నుకు రు.440 అవుతుందని రైతులు చెబుతున్నారు. అందుక పెంపుదలను ముష్టి విదిల్చినట్లుగా భావిస్తున్నారు. మిల్లు యజమానులు పంచదార, తదితర ఉత్పత్తులను అమ్మిన తరువాతే రైతులకు డబ్బు చెల్లిస్తున్నారు. అంటే రైతుల పెట్టుబడితో మిల్లులు నడుస్తున్నాయి.ఒక టన్ను చెరకు నుంచి వంద కిలోల పంచదార, నలభై కిలోల మొలాసిస్‌ వస్తుంది.దీన్నుంచి పది లీటర్ల మేర ఇథనాల్‌ వస్తుంది. ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదలకు అనుగుణంగా కేంద్రం లేదా రాష్ట్రాలు చెరకు ధర పెంచటం లేదు. గడచిన మూడు సంవత్సరాల్లో చెరకు ధర 5.7శాతం పెరిగితే కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు 19 శాతం కరవు భత్యం పెంచిందని రైతులు గుర్తు చేస్తున్నారు. ఉత్తర ప్రదేశ్‌లో సమాజవాదీ పార్టీ పాలన 2012 నుంచి 2017వరకు 26శాతం చెరకు ధర పెంచితే నరేంద్రమోడీ అచ్చేదిన్‌, యోగి బుల్డోజర్‌ పాలన ఏడు సంవత్సరాల్లో పెంచింది 17.46శాతమే.


స్వామినాధాన్‌కు భారతరత్న ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి ఆయన సూచించిన పద్దతి ప్రకారం మద్దతు ధరలను నిర్ణయించేందుకు మొరాయిస్తున్నది. ఉదాహరణకు చెరకు సంగతే చూద్దాం. 2023లో కేంద్రం ప్రకటించిన ఎఫ్‌ఆర్‌పి రు.315(దానికి తాజాగా వచ్చే ఏడాదికి మరో 25 పెంచింది), వివిధ రాష్ట్రాలలో ప్రకటించిన సలహాధరలు, స్వామినాధన్‌ పద్దతిలో ఉండాల్సిన ధర, ఒక క్వింటాలకు (రు.315 ఎఫ్‌ఆర్‌పి ప్రకారం) రైతులు నష్టపోతున్న మొత్తాల గురించి ఆలిండియా కిసాన్‌ సభ రూపొందించిన వివరాలు దిగువ విధంగా ఉన్నాయి.
రాష్ట్రం×××××× రాష్ట్ర ధర×××× స్వామినాధన్‌××××రైతుల నష్టం

ఆంధ్రప్రదేశ్‌ ×× 357 ×××× 535.50 ×××× 220.50

బీహార్‌ ×× 241 ×××× 361.50 ×××× 46.50

గుజరాత్‌ ×× 289 ×××× 433.50 ×××× 118.50

హర్యానా ×× 327 ×××× 490.50 ×××× 175.50

కర్ణాటక ×× 258 ×××× 387.00 ×××× 72.00

మహరాష్ట్ర ×× 214 ×××× 321.00 ×××× 6

పంజాబ్‌్‌ ×× 298 ×××× 447.00 ×××× 132

తమిళనాడు ×× 299 ×××× 448.50 ×××× 133.50

తెలంగాణా ×× 332 ×××× 498.00 ×××× 183

ఉత్తరప్రదేశ్‌ ×× 310 ×××× 465.00 ×××× 150

ఆలిండియా ×× 292 ×××× 438.75 ×××× 123.50

ఈ పూర్వరంగంలో క్వింటాలకు రు.500 ధర నిర్ణయించాలని అఖిలభారత కిసాన్‌ సభ డిమాండ్‌ చేసింది. సహకార, ప్రభుత్వ రంగంలో ఉన్న పంచదార మిల్లులను జాతీయం చేయరాదని, ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయాలని కూడా కోరింది. వర్తమాన సంవత్సరంలో రు.315 అంటే దిగుబడిలో 10.25 శాతం దాటిన తరువాత పెరిగే ప్రతి 0.1శాతానికి అదనంగా రు.3.07 చెల్లిస్తారు, తగ్గితే ఆ మేరకు కోత పెడతారు. సగటు దిగుబడి 9.5శాతమే ఉన్నందున క్వింటాలు ధర రు.315గా చెప్పినా రైతుకు దక్కేది రు.292 మాత్రమే. చెరకు ఉత్పత్తి ఖర్చుకు వందశాతానికి మించి గిట్టుబాటు ధర చెల్లిస్తున్నట్లు ప్రభుత్వం నమ్మబలుకుతోంది.అసలు కిటుకు అక్కడే ఉంది. క్వింటాలుకు సాగు ఖర్చును కేవలం రు.157 మాత్రమే 2023-24 సంవత్సరానికి లెక్కగట్టి రు. 315 ప్రకటించామంటే రెట్టింపే కదా అని చెబుతున్నారు. రైతులు మరీ అంత అమాయకంగా కనిపిస్తున్నారా ? ప్రభుత్వం చెబుతున్నది వ్యవసాయ పంటల ధరల నిర్ణాయక సంస్థ సూచించిన మొత్తం. అది వాస్తవ సాగు ఖర్చును పరిగణనలోకి తీసుకోవటం లేదని ప్రారంభం నుంచి విమర్శలు వస్తూనే ఉన్నాయి. అందుకే స్వామినాధన్‌ కమిషన్‌ పద్దతి ప్రకారం సాగు ఖర్చును, మద్దతు ధరలను నిర్ణయించాలని, వాటికి చట్టబద్దత కల్పించాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. గతంలో ఏడాది పాటు చేసిన ఉద్యమం, తాజాగా జరుగుతున్న ఆందోళనకు నాయకత్వం వహిస్తున్నవారు కూడా కోరుతున్నది అదే.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ముగ్గురు రైతుల కళ్లు పోగొట్టిన పోలీసులు : మరో కమిటీ నాటకం, తన సిఫార్సుల అమలుకు తానే మొరాయిస్తున్న మోడీ ?

18 Sunday Feb 2024

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, Farmers, History, INDIA, Loksabha Elections, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices

≈ Leave a comment

Tags

#Farmers matter, #Farmers Protest, #i stand with farmers, 2024 Farmers Protest, BJP, MSP demand, Narendra Modi Failures


ఎం కోటేశ్వరరావు


పంజాబ్‌-హర్యానా సరిహద్దులో హర్యానా పోలీసులు, భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో పిల్లెట్లు తగిలి ముగ్గురు రైతులు కళ్లు కోల్పోయినట్లు పంజాబ్‌ ఆరోగ్య మంత్రి డాక్టర్‌ బల్బీర్‌ సింగ్‌ చెప్పారు. కాలం చెల్లిన, ప్రైవేటు కంపెనీల మందుగుండును రైతుల మీద ఉపయోగిస్తున్నారని, అవి లెక్కల్లో చూపరని రైతు నేత సర్వాన్‌ సింగ్‌ పాంధెర్‌ చెప్పారు. కనీస మద్దతు ధరల మీద మరోకమిటీ వేసేందుకు ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అదే నిజమైతే అది కాలయాపన తప్ప మరొకటి కాదు. ఇప్పటికే ఒక కమిటీ ఉంది, అదేమి చేస్తున్నదో తెలియదు. వచ్చే ఎన్నికల్లో తాము 400 సీట్లు సాధించబోతున్నామని, అవి రైతుల సమస్యల పరిష్కారానికే గనుక రాజకీయం చేయవద్దని బిజెపి నేత అశోక్‌ తన్వర్‌ చెప్పారు. ” ఈ సమస్య రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అంశం కూడా,దీనికి పరిష్కారం కనుగొనాలంటే వ్యవధి అవసరం. ” మరోసారి ప్రారంభమైన రైతు ఉద్యమం ముందుకు తెచ్చిన డిమాండ్ల మీద కేంద్ర మంత్రి అర్జున్‌ ముండా ఫిబ్రవరి పదమూడున చెప్పిన మాట. పదిహేనవ తేదీ రాత్రి రైతు ప్రతినిధులతో జరిపిన చర్చలు ఎలాంటి ఫలితాలు లేకుండా ముగిశాయి. పద్దెనిమిదవ తేదీ సాయంత్రం మరోసారి చర్చలు జరుపుతామని కేంద్ర మంత్రి ప్రకటించారు. పరిష్కారం తేలేవరకు ఆందోళన కానసాగుతుందని రైతు సంఘాలు వెల్లడించాయి. ఢిల్లీ చలో అన్న నినాదంతో సాగిన ఉద్యమానికి ఇచ్చిన పిలుపుకు మూడు సంవత్సరాలు నిండిన సందర్భంగా 2023 నవంబరు 26 నుంచి 28వరకు చండీఘర్‌లో నిరసన తెలపాలని పంజాబ్‌ రైతులు పిలుపు నిచ్చారు. దాని కొనసాగింపే తాజా ఢిల్లీ చలో నిరసన. అప్పటి నుంచి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఏమి చేస్తున్నట్లు ? మంత్రి మాటలను బట్టి ఏదో విధంగా కాలయాపన చేసి ఆందోళనను అణచివేసేందుకు లేదా మరో విధంగా ముగించేందుకు కేంద్రం చూస్తున్నట్లు కనిపిస్తోంది.


రైతులు ముందుకు తెచ్చిన సమస్య మీద గానీ, తానే ప్రకటించిన కమిటీ నివేదికను సత్వరం తెప్పించటం గురించిగానీ కేంద్రానికి చిత్తశుద్ధి ఉందా ? రాష్ట్రాలతో చర్చించాలని కనీస మద్దతు ధరల కమిటీ ప్రకటించిన 20నెలల తరువాత(2022జూలై) మంత్రి మాట్లాడుతున్నారు. గతంలో ఉద్యమం సందర్భంగా జరిగిన పరిణామాలను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలి. వ్యవసాయం ఉమ్మడి జాబితాలో ఉన్నప్పటికీ ప్రధానంగా అమలు జరిపేది రాష్ట్రాలే. మూడు సాగు చట్టాలను తెచ్చినపుడు కేంద్రం రాష్ట్రాలతో సంప్రదించకుండానే ఏకపక్షంగా తెచ్చింది. వెనక్కు తీసుకొనేటపుడు కూడా చర్చలు జరపలేదు. ఆ సందర్భంగా ఎంఎస్‌పి కమిటీ ఏర్పాటు ముందు కూడా రాష్ట్రాల వైఖరిని తెలుసుకోలేదు. ఇప్పుడు రాష్ట్రాలతో చర్చించాలని చెప్పటం వంచన తప్ప మరొకటి కాదు. చర్చలు జరపకుండా ఇంతకాలం ఎవరు అడ్డుపడ్డారు ? కేంద్ర ప్రభుత్వం ఎందుకింత మొండితనంతో వ్యవహరిస్తున్నది ? అడిగేవాటికి సమాధానం రావటం లేదు. 1991లో ప్రారంభించిన ఆర్ధిక సంస్కరణల సమయంలో కేంద్ర ప్రభుత్వం ప్రపంచ బ్యాంకుతో కుదుర్చుకున్న ఒప్పందాలు లేదా బ్యాంకు నిర్దేశించిన షరతులు ఏమిటో, ఆ తరువాత గత ప్రభుత్వాలు నియమించిన కమిటీలు ఏమి చెప్పాయో తెలుసుకుంటే తప్ప మోడీ సర్కార్‌ ఆచరణను అర్ధం చేసుకోలేము.


2004 డిసెంబరు 13న నం. 164తో లోక్‌సభలో ఒక ప్రశ్న అడిగారు. భారత ఆహార సంస్దను పునర్వ్యస్ధీకరించేందుకు మెకెన్సీ కంపెనీని నియమించిందా ? అభిజిత్‌ సేన్‌ కమిటీ, హైదరాబాద్‌ అడ్మినిస్ట్రేటివ్‌ కాలేజీ(ఆస్కి) నివేదికలు ఉన్నాయా ? వాటి ప్రధాన సిఫార్సులేమిటి అన్నది దాని సారాంశం. దానిలో ఈ నియామకాలన్నీ బిజెపి నేత అతల్‌ బిహారీ వాజ్‌పేయి ఏలుబడిలో జరిగాయి. ఆస్కీ నివేదికలో చేసిన ముఖ్యమైన సిఫార్సులు ఇలా ఉన్నాయి. లెవీ పద్దతిలోనే ఎఫ్‌సిఐ ధాన్యం కొనుగోళ్లు చేయాలి.నాణ్యతా ప్రమాణాలను సడలించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకూడదు, వివిధ పధకాలకు, ఆపద్దర్మ నిల్వలకు అవసరమయ్యే ఆహార ధాన్యాల మొత్తాలను మాత్రమే కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలి. రాష్ట్రాలు తమ స్వంత సేకరణ పద్దతులను అభివృద్ది చేసుకోవాలి, విత్త సంబంధ మద్దతు కోసమే కేంద్రంపై ఆధారపడాలి. ఆహార ధాన్యాలను ఆరుబయట నిల్వచేయటాన్ని నిలిపివేయాలి. గ్రామీణ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం నిధులకు బదులు ఆహారధాన్యాలను కేటాయించాలి. ఆపద్దర్మ నిల్వలకు కేంద్ర ప్రభుత్వం గ్రాంటులు ఇవ్వాలి తప్ప బ్యాంకుల నుంచి రుణాలు తీసుకో కూడదు.కనీస మద్దతు ధరలకు కొనుగోలు, కేంద్ర జారీ ధరలు, ఎంత మొత్తం సేకరించాలనే అంశాలపై ఎఫ్‌సిఐ కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. ధాన్య సేకరణ, నిల్వ, పంపిణీలను వేరు చేయాలి. జాతీయ ఆపద్దర్మ నిల్వలను వ్యూహాత్మక ప్రాంతాలలో మాత్రమే ఎఫ్‌సిఐ నిర్వహించాలి.మార్కెట్లలో ఏజంట్ల కమిషన్‌ నిలిపివేయాలి. ధాన్య సేకరణకు, స్వంత సేకరణ ధరల నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వాలను ప్రోత్సహించాలి. వ్యవసాయాన్ని వివిధీకరించేందుకు ప్రత్యేకించి పంజాబ్‌, హర్యానాలలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ఆహారధాన్యాల మార్కెట్లో ప్రయివేటు రంగం మరియు బహుళజాతి కార్పొరేషన్లను ప్రోత్సహించాలి.


దీర్ఘకాలిక ధాన్య విధాన రూపకల్పనకు సిఫార్సులు చేసేందుకు ఏర్పాటు చేసిన ఫ్రొఫెసర్‌ అభిజిత్‌ సేన్‌ కమిటీ చేసిన ముఖ్య సిఫార్సులేమిటో చూద్దాం. కనీస మద్దతు ధరలను అత్యంత సమర్ధవంతమైన ప్రాంతాలలో సి2 ఖర్చు ప్రాతిపదికన (అంటే కుటుంబసభ్యుల శ్రమ, స్వంత పెట్టుబడి, భూమి కౌలు) నిర్ణయించాలి. కనీస మద్దతు ధరల కింద కొనుగోలు చేసే వాటి మీద కేంద్ర ప్రభుత్వం గరిష్టంగా నాలుగుశాతం పన్నులు మరియు లెవీలు చెల్లించాలి. పంజాబ్‌, హర్యానా వంటి రాష్ట్రాల నుంచి ధాన్య సేకరణ నుంచి ఎఫ్‌సిఐ ఉపసంహరించుకొని తన మానవనరులను తూర్పు, మధ్య భారత్‌లో నియమించాలి. రాష్ట్రాలకు మరింత ఆకర్షణీయంగా, వికేంద్రీకరణ సేకరణను మెరుగుపరచాలి. ఎఫ్‌సిఐ ధాన్య సేకరణలో మెరుగైన సగటు ప్రమాణాలను పాటించాలి. రైస్‌ మిల్లరు లెవీ ఇచ్చే విధానాన్ని రద్దు చేయాలి.సి2 స్ధాయికి కనీస మద్దతు ధరలను నిర్ణయించటంతో పాటు రాష్ట్రాలకు పరిహార పాకేజ్‌లను అమలు జరపాలి.వాటితో పంటల వివిధీకరణను ప్రోత్సహించాలి. వేగంగా వాణిజ్య ప్రాతిపదికన నిర్ణయం తీసుకొనే విధంగా ఎఫ్‌సిఐ మారాల్సిన అవసరం ఉంది. ఆహారధాన్యాల ఎగుమతి పూర్తిగా ప్రయివేటుకే అప్పగించాలి. ఎగుమతులకు మాత్రమే సబ్సిడీలు ఇవ్వాలి. కనీస మద్దతు ధరలకు చట్టబద్దత కల్పించాలి, వాటిని సిఫార్సు చేసే సిఏసిపిని సాధికార చట్టబద్దమైన సంస్దగా మార్చాలి.


2020డిసెంబరు 18వ తేదీన ప్రధాని నరేంద్రమోడీ మధ్యప్రదేశ్‌ రైతులతో వీడియో కాన్పరెన్సుద్వారా మాట్లాడారు. ఇప్పుడు తీసుకున్న చర్యలు 25-30 సంవత్సరాల క్రితమే అమలు జరపాల్సినవి. తెల్లవారేసరికి ఇవి రాలేదు. ప్రతి ప్రభుత్వమూ వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో గత 20-22 సంవత్సరాలుగా విస్తృతంగా చర్చించినవే అని ప్రధాని చెప్పారు.పైన పేర్కొన్న అభిజిత్‌ సేన్‌, ఆస్కీ సిఫార్సులు ఇరవై సంవత్సరాల నాటి వాజ్‌పేయి సర్కార్‌ హయాంలోనివే.వాటిలో కొన్నింటిని ప్రభుత్వాలు అమలు జరిపాయి. ప్రధాని చెప్పిన 25-30 సంవత్సరాల విషయానికి వస్తే అంతకు ముందుకు అంటే 30 సంవత్సరాల నాటి ప్రపంచ బాంకు షరతులు ఏమిటో తెలుసుకుంటే ఆ మాటలకు అర్ధం తెలుస్తుంది. మూడు వ్యవసాయ చట్టాల బండారం మరింతగా బయటపడుతుంది. ప్రపంచబ్యాంకు మన కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి, సమాచారం తీసుకొని పద్దెనిమిది నెలల సమయం తీసుకొని ఒక నివేదికను రూపొందించింది. ఇండియా 1991 కంట్రీ ఎకమిక్‌ మెమోరాండం( రిపోర్ట్‌ నం.9412 ఇండియా) పేరుతో 1991 ఆగస్టు 23న రెండు సంపుటాలుగా తయారు చేశారు. దాన్ని రెండు దశాబ్దాలు రహస్యంగా ఉంచి 2010 జూన్‌ 12న బహిర్గతం చేశారు. వీటిలో ముఖ్యమైన సిఫార్సులను చూద్దాం. వాటి నేపధ్యంలోనే గత మూడు దశాబ్దాలలో కేంద్రంలో, రాష్ట్రాలలో ఏ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా అనేక చర్యలు అమలు జరిపి ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌ను సంతృప్తి పరచారు. ఇప్పుడు నరేంద్రమోడీ గారు అదే సంతుష్టీకరణపనిలో ఉన్నారు. కరోనా కనుక ఎవరూ వ్యతిరేకంగా ఆందోళన చేసేందుకు ముందుకు రారనే అంచనాతో జూన్‌లో ఆర్డినెన్స్‌, సెప్టెంబరులో పార్లమెంట్‌లో చర్చలేకుండా బిల్లులు, వెంటనే రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయించి చూశారా నేను ఎంత వేగంగా పని చేస్తానో అని దేశ-విదేశీ కార్పొరేట్ల ముందు రొమ్ము విరుచుకున్నారు. వ్యవసాయ రంగాన్ని ఇప్పటికే కొంత మేరకు విదేశీ-స్వదేశీ కార్పొరేట్లకు తెరిచారు. ఒకప్పుడు నూతన విత్తనాలను రూపొందించటం, ఉత్పత్తి ప్రభుత్వరంగ సంస్ధలే చేసేవి. ఇప్పుడు ఎక్కడా వాటి ఊసేలేకుండా చేశారు. మూడు వ్యవసాయ చట్టాలతో మార్కెట్‌ను మరింతగా తెరిచేందుకు, ప్రభుత్వం బాధ్యతల నుంచి తప్పుకొనేందుకు ప్రాతిపాదిక వేశారు. రైతుల ఆందోళనతో వెనక్కు తగ్గారు.


ఇంతకీ ప్రపంచబ్యాంకు వ్యవసాయరంగం గురించి ఆదేశించిన లేదా సూచించిన సిఫార్సులేమిటి ? అవి మూడు రకాలు. తక్షణం చేపట్టవలసినవి, మధ్యంతర, దీర్ఘకాలిక చర్యలుగా సూచించారు.1ఏ). వ్యవసాయానికి ఉన్న – ఎరువులు, నీటి, విద్యుత్‌, బ్యాంకురుణాల సబ్సిడీలన్నింటినీ రద్దు చేయాలి. విదేశీవాణిజ్యానికి వ్యవసాయ మార్కెట్‌ను తెరవాలి. నాలుగు సంవత్సరాల వ్యవధిలో ఎరువుల సబ్సిడీలను ఎత్తివేయాలి. బి) ప్రాధాన్యతా రంగానికి నిర్ణీత శాతాలలో రుణాలు ఇవ్వాలనే నిబంధన కింద వ్యవసాయానికి ఇచ్చే కోటాను ఎత్తివేయాలి. సబ్సిడీలను ఎత్తివేసి వడ్డీ రేటు పెంచాలి.సి) సాగు నీరు, పశువైద్యం వంటి విస్తరణ సేవలకు వసూలు చేస్తున్న చార్జీల మొత్తాలను పెంచాలి. వీటిలో ప్రయివేటు రంగానికి పెద్దపీట వేయాలి, పెట్టుబడులకు అవకాశం ఇవ్వాలి.డి) వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులకు సంబంధించి ఉన్న రక్షణలన్నింటినీ తొలగించాలి. తొలిచర్యగా ఖాద్యతైలాల గింజలను అనుమతించాలి. వ్యవసాయ ఎగుమతులపై ఉన్న ఆంక్షలను తొలగించాలి.ఇ) ప్రయివేటు పరిశోధనా సంస్ధల విత్తనాలను ప్రోత్సహించాలి, ప్రయివేటు మార్కెటింగ్‌పై నిబంధనలను తొలగించాలి, విత్తన సబ్సిడీలను ఎత్తివేయాలి.ఎఫ్‌) వ్యవసాయేతర చార్జీల స్ధాయికి వ్యవసాయ విద్యుత్‌ ఛార్జీలను కూడా పెంచాలి.


2. మొత్తం ఆహార సేకరణ మరియు ప్రజాపంపిణీ వ్యవస్ధను రద్దు చేయాలి.ఏ) భారత ఆహార సంస్ద ప్రత్యక్ష పాత్రను తగ్గించాలి. కొనుగోలు, రవాణా, ధాన్య నిల్వ వంటి పనులన్నీ లైసన్సు ఉన్న ప్రయివేటు వారి ద్వారా చేపట్టాలి. రైతులు నిల్వ చేస్తే ప్రోత్సాహకాలు ఇవ్వాలి.బి)ఆపద్దర్మ నిల్వలను కొద్దిగా నిర్వహించాలి. కొరత వచ్చినపుడు ప్రపంచ మార్కెట్లవైపు చూడాలి. విదేశీమారక ద్రవ్యం ఎంత ఉందో చూసుకొని కొరత ఉన్న సంవత్సరాలలో బయటి నుంచి కొనుగోలు చేయాలి.సి) మద్దతు ధరల కార్యక్రమాలను ప్రభుత్వం సేకరణకు అమలు చేయకూడదు. డి) అధికారయుతంగా పేదలుగా గుర్తించిన వారికి మాత్రమే ఆహార సబ్సిడీలు ఇవ్వాలి. ప్రయివేటు రంగం ద్వారా పంపిణీ పద్దతిని కూడా వినియోగించాలి. పైన పేర్కొన్నవి మూడు దశాబ్దాల నాటి ప్రపంచ బ్యాంకు ఆదేశాలు. అధికారంలో ఎవరున్నా వాటిని అమలు జరపటం తప్ప వెనక్కు పోవటం లేదు. ఆ తరువాత ఎన్ని కమిటీలు వేసినా కొన్ని సిఫార్సులు అదనంగా చేయటం తప్ప ప్రపంచ బ్యాంకు అజెండా పరిధిలోనే ఉన్నాయి. యుపిఏ హయాంలో అన్ని సంస్కరణలూ చేయలేదనే కోపంతో కార్పొరేట్‌ శక్తులు నరేంద్ర మోడీ వెనుక సమీకృతం అయ్యాయి. ఇప్పుడు ఆచరణ చూస్తున్నాము.
కనీస మద్దతు ధరలు, వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ వ్యవస్ధలను ప్రభావితం చేసే (రద్దుచేసిన) మూడు సాగు చట్టాలలో ఎక్కడా కనీసం మద్దతు ధరల ప్రస్తావన లేదు. కనుకనే రైతాంగం కనీస మద్దతు ధరలను చట్టబద్దం చేయమంటోంది. 2011లో గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నరేంద్రమోడీ నాయకత్వంలోని ముఖ్యమంత్రుల కమిటీ కనీస మద్దతు ధరలకు చట్టబద్దత కల్పించాలని ఆషామాషీగా కేంద్రానికి సిఫార్సు చేసిందా ? ఈ కమిటీలో నాటి మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు ముఖ్యమంత్రులు ఇతర సభ్యులు. సిఎంగా ఉన్న మోడీ చేసిన సిఫార్సును పిఎం మోడీ ఎందుకు పక్కన పడేశారు? ఇప్పుడు రాష్ట్రాలను సంప్రదించాలని ఎందుకు కబుర్లు చెబుతున్నారు. ఇంతకీ 2011 నివేదికలో మోడీ కమిటీ చేసిన సిఫార్సు ఏమిటి ? నివేదికలోని క్లాజ్‌ బి.3లో ఇలా ఉంది.” చట్టబద్దంగా ఎంఎస్‌పి అమలు : మార్కెట్‌ పని చేయటంలో మధ్యవర్తులు కీలకమైన పాత్ర పోషిస్తున్నారు మరియు ఆ సమయంలో వారు ముందుగానే రైతులతో ఒప్పందం చేసుకుంటున్నారు. అన్ని నిత్యావసర వస్తువులకు సంబంధించి చట్టబద్దమైన అంశాలతో శాసనం ద్వారా రైతుల ప్రయోజనాలను కాపాడాలి. అదేమంటే రైతు-వ్యాపారి లావాదేవీల్లో ఎక్కడా నిర్ణీత కనీస మద్దతు ధరలకు తగ్గకూడదు.” దీని అర్ధం ఏమిటి ? చట్టబద్దత కల్పించాలనే కదా ! మరి ఇప్పుడు సాకులతో ఎందుకు మొరాయిస్తున్నట్లు ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

బాల రామాలయం ఓకే, కాలయాపన కమిటీలు, కోట్లాది రైతుల సంగతేమిటి మోడీ గారూ !

24 Wednesday Jan 2024

Posted by raomk in BJP, Communalism, Current Affairs, Farmers, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Politics, RELIGION, Uncategorized

≈ 1 Comment

Tags

#Balk Ram, BJP, Farm Bills, MSP demand, Narendra Modi Failures, National Turmeric Board, Railway Zone in Vizag, Ram Temple politics, RSS, SC Sub-Categorisation, South Coast Railway Zone


ఎం కోటేశ్వరరావు


ఎట్టకేలకు అయోధ్య బాలక్‌ రామాలయ ప్రాణ ప్రతిష్ట జరిగింది. జనవరి 22న ఆ కార్యక్రమ కోసం ప్రధాని నరేంద్రమోడీ దేశం నలుమూలలా ఎంతలా తిరిగిందీ, ఎన్ని పొర్లుదండాలు, ఎక్కడ ఎన్ని మొక్కులు మొక్కిందీ చూశాము. భక్తి శివుడి మీద చిత్తం చెప్పుల మీద అన్నట్లుగా లోక్‌సభ ఎన్నికలు కనిపిస్తున్నందున ఈ తాపత్రయాన్ని అర్ధం చేసుకోవటం కష్టం కాదు. పోయిన దేశ ప్రతిష్టను, దానితో పాటు విదేశీ పెట్టుబడులను తీసుకువచ్చే పేరుతో అధికారానికి వచ్చిన కొత్తలో విదేశాలు తిరిగిన తీరు, చేసిన హడావుడి చూశాము.సరే ఎవరెన్ని విమర్శలు చేసినా ఖాతరు చేయని చరిత్రకెక్కిన పాలకుల సరసన చేరిన నరేంద్రమోడీ రామాలయ ప్రారంభాన్ని ప్రభుత్వ-సంఘపరివార్‌ కార్యక్రమంగా మార్చివేశారు. మతానికి ప్రభుత్వానికి ఉన్న గీతను చెరిపివేశారనే విమర్శలను ఎదుర్కొన్నారు. ఎన్ని దేశాలు తిరిగినా, మనదేశ ప్రతిష్టను పెంచినట్లు ప్రచారం చేసుకున్నా చెప్పినంతగా పెట్టుబడులు రాలేదు.పలుకుబడి పెరుగుదలకు రుజువూ లేదు. మేడిన్‌, మేకిన్‌ ఇండియా, ఆత్మనిర్భరత సాకారం కాలేదు. ఇప్పుడు రామాలయం కోసం తిరిగినదానికి వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఓట్లు వస్తాయా ? ఏం జరిగిందీ, ఎందుకు జరిగిందీ దేశమంతా చూసింది. ఏం జరగనుందో చూద్దాం !


రామాలయం మీద చూపిన శ్రద్ద ప్రజల సమస్యల మీద నరేంద్రమోడీ చూపారా ? తమది పనిచేసే ప్రభుత్వమని మోడీ, బిజెపి కూడా చెప్పుకుంటుంది.పదేండ్లలో అలాంటిదేమీ కనిపించలేదు.అచ్చేదిన్‌లో ఆకలో రామచంద్రా అన్న పరిస్థితిని అంగీకరిస్తూ సబ్సిడీతో కూడా జనాలు కొనుక్కోలేని స్థితిలో (లేకుంటే ఉచితంగా ఇవ్వాల్సిన పనేముంది) ఉన్నారన్న వాస్తవాన్ని గ్రహించి ఉచిత ఆహార ధాన్యాల అందచేత పథకాన్ని పొడిగించారు. కొన్ని అంశాల్లో మోడీ సర్కార్‌ ఎక్కడలేని వేగాన్ని కనపరిచిన మాట వాస్తవం.బహుశా కనపడని శక్తి ఏదో నెడుతూ ఉండాలి. ఉదాహరణకు మూడు సాగు చట్టాలనే తీసుకుందాం.2020 సెప్టెంబరులో 17న లోక్‌సభ, 20తేదీన రాజ్యసభ ఆమోదం, 27న రాష్ట్రపతి అంగీకారం, పది రోజుల్లో అంతా జరిగింది. వ్యవసాయం ఉమ్మడి జాబితాలో ఉన్నప్పటికీ రాష్ట్రాలను సంప్రదించలేదు. ఎంత వేగంగా చట్టాలను రుద్దారో ప్రతిఘటన కూడా అంతే తీవ్రంగా ఎదురైంది. రాష్ట్రపతి ఆమోదం పొందక ముందే సెప్టెంబరు 25న భారత బంద్‌కు పిలుపు ఇచ్చారు.వివిధ ప్రాంతాల్లో ఆందోళనలు జరిగాయి. రైతులను రాజధానిలో ప్రవేశంచకుండా అడ్డుకోవటంతో నవంబరు 26 నుంచి రైతులు ఢిల్లీ శివార్లలో తిష్టవేశారు.చట్టాల అమలు మీద 2021 జనవరి 12 సుప్రీం కోర్టు స్టే విధించి, రైతుల చెబుతున్నదానిని వినాలంటూ ఒక కమిటీని వేసింది. అయినా రైతులు తగ్గలేదు.చివరకు నరేంద్రమోడీ దిగివచ్చి క్షమాపణలు చెప్పి మూడు చట్టాలను వెనక్కు తీసుకుంటున్నట్లు నవంబరులో ప్రకటించారు. డిసెంబరు ఒకటిన పార్లమెంటులో రద్దు బిల్లుతో ఉపసంహరించుకున్నారు.


రైతులు ముందుకు తెచ్చిన కనీస మద్దతు ధరలకు చట్టబద్దత అంశంతో సహా కనీస మద్దతు ధరలు, సేంద్రీయ సాగు గురించి సిఫార్సులు చేసేందుకు 2022 జూలై 18న కేంద్ర ప్రభుత్వం 26 మందితో ఒక కమిటీని వేసింది. కమిటీలో అత్యధికులు తాన తందాన వారే ఉన్నందున దానిలో చేరేందుకు రైతుల ఆందోళనకు నాయకత్వం వహించిన సంయుక్త కిసాన్‌ మోర్చా తిరస్కరించింది. ఆ కమిటీలో వివిధ అంశాల మీద సిఫార్సులు చేసేందుకు మరో ఐదు ఉపకమిటీలు ఏర్పాటు చేశారు. ఇక్కడే అసలు కథ ప్రారంభం. చిత్రం ఏమిటంటే ఈ కమిటీ నివేదికకు నిర్దిష్ట కాలపరిమితి విధించలేదు.ఇంతవరకు అదేమి చేసిందో మనకు తెలియదు. గతేడాది జూన్‌లో ఉప కమిటీలు నివేదికలు సమర్పిస్తాయని చెప్పారు. తరువాత ఎలాంటి సమాచారమూ లేదు. సాగు చట్టాలను వేగంగా తెచ్చిన ప్రభుత్వం దీని నివేదిక పట్ల ఎందుకు అంత శ్రద్ద చూపటం లేదు ? గతంలో సుప్రీం కోర్టు కమిటీ వేసిన నివేదిక, ఆ సాగు చట్టాలను వెనక్కు తీసుకున్న తరువాత నాలుగు నెలలకు బహిర్గతమైంది. దానిలోని అంశాలు అంతకు ముందు ప్రభుత్వం చేసిన వాదనలు తప్ప మరొకటి కాదు. అందుకే రైతు సంఘాలు తిరస్కరించాయి. ప్రభుత్వం వేసిన కనీస మద్దతు ధరల కమిటీ నివేదిక లోక్‌సభ ఎన్నికలకు ముందే వస్తే అది రైతుల్లో చర్చకు దారి తీస్తుందన్న భయంతోనే కాలపరిమితి నిర్దేశించలేదు. కనీసం ముసాయిదా నివేదికలు కూడా సమర్పించలేదు. అది ఎప్పుడు వస్తుందో, ఏమి సిఫార్సు చేస్తుందో అయోధ్య బాల రాముడికే ఎరుక.
రామాలయ నిర్మాణం పూర్తిగాక ముందే ప్రారంభోత్సవం జరపటం గురించి శంకరాచార్యులు అభ్యంతరం తెలిపారు.మనం కొత్త ఇల్లు కట్టుకున్నపుడు పూర్తిగాక ముందే ప్రవేశ పూజలు చేసి తరువాత మిగతా పనులు చూసుకోవటంలేదా అని అనేక మంది సమర్ధించారు. నిజమే, ఇదే పద్దతి ఇతర వాటికి ఎందుకు వర్తింప చేయటం లేదు ?

తెలంగాణా అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్రమోడీ నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని వాగ్దానం చేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామని చెప్పుకొనేందుకు అక్టోబరు నాలుగవ తేదీన కేంద్ర ప్రభుత్వం బోర్డు ఏర్పాటుకు నోటిఫికేషన్‌ కూడా ఇచ్చింది. ఇంతవరకు బోర్డును ఏర్పాటు చేయలేదు, ఆఫీసు ఏర్పాటు లేదు.దీని ఏర్పాటుకు వివాదాలేమీ లేవు. వేల కోట్ల ఖర్చూ కాదు. ఎందుకు తదుపరి చర్యలు లేవు. ముందు బోర్డును ఏర్పాటు చేస్తే దానికి నిర్దేశించిన కార్యకలాపాలు ప్రారంభమౌతాయి. పరిశోధనలకు అవసరమైన భూమి కేటాయించకపోతే రాష్ట్ర ప్రభుత్వం మీద వత్తిడి తేవటానికి వీలుంటుంది. చిత్రం ఏమిటంటే కనీస మద్దతు ధరల పంటల జాబితాలో పసుపు లేదు. పసుపు బోర్డు ఎప్పుడు ఏర్పడుతుంది, అది రైతులకు ఎలా మేలు చేస్తుంది ? రాబోయే కాలానికే వదలివేద్దాం. అంతకు ముందు పసుపు రైతులకు బాండ్లు రాసిచ్చిన బిజెపి నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌ సుగంధ ద్రవ్యాల బోర్డు విస్తరణ కార్యాలయాన్ని ఏర్పాటు చేయించి పసుపు బోర్డు కంటే ఇదే గొప్పది అని చెప్పుకున్నారు. అది రైతుల్లో పేలకపోవటంతో పసుపు బోర్డు గురించి మరో అంకాన్ని ప్రారంభించారు.


ప్రకటనలు చేయటం మీద ఉన్న శ్రద్ద అమలులో లేదని పదేండ్ల అనుభవం నిరూపించింది. రాష్ట్ర విభజన 2014చట్టంలో ఆంధ్రప్రదేశ్‌కు నూతన రైల్వే జోన్‌ ఏర్పాటును పరిశీలించాలని ఉంది. ప్రత్యేక హౌదా వాగ్దానంపై మడమ తిప్పిన ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర ప్రభుత్వం దానికి బదులు ప్రత్యేక పాకేజి ఇస్తామంటూ కొత్త ప్రతిపాదనను ముందుకు తెచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఈ పరిణామం బిజెపి మీద తీవ్ర వ్యతిరేకతను పెంచింది. దాంతో 2019 ఫిబ్రవరి 27న లోక్‌సభ ఎన్నికలకు ముందు కేంద్ర మంత్రి పియూష్‌ గోయల్‌ విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌ ప్రకటన చేశారు. అంతకు ముందు బిజెపి రాష్ట్ర నేతలు కేంద్రానికి ఒక వినతి పత్రం ఇచ్చినట్లు, దాని మీద స్పందించినట్లు ప్రచారం చేశారు.వారు ఐదేండ్లు ఏ గుడ్డి గుర్రాలకు పండ్లుతోమారో తెలియదు. మరోసారి లోక్‌సభ ఎన్నికలు రాబోతున్నాయి. ఇంతవరకు రైల్వే జోన్‌ ఏర్పడలేదు. అసలు నోటిఫికేషనే ఇవ్వలేదు. అదుగో ఇదిగో అంటూ చెప్పటమే తప్ప అడుగు ముందుకు పడలేదు. రాష్ట్ర ప్రభుత్వం కార్యాలయాల ఏర్పాటుకు స్థలం ఇవ్వలేదన్నారు. ఫలాన చోట ఇస్తామని చెప్పిన తరువాత దాని మీద నిర్ణయం తీసుకోలేదంటూ కాలంగడుపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్థలం ఇవ్వకపోతే జోన్‌ ఏర్పాటు చేసి యంత్రాంగాన్ని ఉంచేందుకు విశాఖలో అద్దె భవనాలే దొరకవా ? ఇచ్చిన స్థలంలో భవనాలు నిర్మించిన తరువాతే జోన్‌ ఏర్పాటు చేస్తారా ? రాజకీయం గాకపోతే మరొకటేమైనా ఉందా ?


విశాఖ ముడసర్లోవలో ప్రతిపాదిత రైల్వేజోన్‌ ప్రధాన కేంద్రానికి 52.2ఎకరాలు ఇస్తామని రాష్ట్రం ప్రతిపాదించింది. ఇంకా భూమిని గుర్తించాల్సి ఉందని, దాన్ని ఆమోదించాలని, ప్రాజెక్టు నివేదిక సిద్దంగా ఉందని 107 కోట్ల రూపాయలను మంజూరు చేశామని డిసెంబరులో కేంద్ర రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ లోక్‌సభలో తెలుగుదేశం ఎంపీ కె రామమోహన్నాయుడి ప్రశ్నకు సమాధానంలో చెప్పారు.2023-24 బడ్జెట్‌లో పది కోట్లు కేటాయించి ప్రాజెక్టు రిపోర్టు తయారు చేయాలని కోరినట్లు మంత్రి వెల్లడించారు. జోన్‌ ఎప్పుడు ప్రారంభమౌతుంది, నిర్మాణాలు ఎప్పటికి పూర్తవుతాయన్న ప్రశ్నలకు సమాధానం లేదు. బిజెపి రాజ్యసభ సభ్యుడు జివిఎల్‌ నరసింహారావు నెల రోజుల క్రితం మాట్లాడుతూ ముడసర్లోవ భూములను అధికారులు ఖరారు చేశారని, నిర్మాణ జాప్యం ఎందుకో అర్దం కావటం లేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం భూమి ఖరారులో చాలా ఆలశ్యం చేసిందన్నారు.విశాఖ జోన్‌ ప్రత్యేకత ఏమిటంటే ప్రధాన కార్యాలయం ఉన్న విశాఖ డివిజన్ను రద్దు చేసి మూడు ముక్కలుగా విడగొట్టి ఒక ముక్కను రాయఘఢలో మరో ముక్కను ఖుర్దా, మూడో భాగాన్ని విజయవాడ డివిజన్‌లో విలీనం చేస్తారు. ఈ జోన్‌లో విజయవాడ, గుంటూరు, గుంతకల్‌ డివిజన్లు ఉంటాయి. ప్రధాన కేంద్రంలో డివిజన్‌లేని జోన్‌గా ఇది చరిత్రలో నిలుస్తుంది.


బిజెపి ఓట్ల రాజకీయంలో భాగంగా తెలంగాణా ఎన్నికలకు ముందు షెడ్యూలు కులాల ఉపవర్గీకరణ గురించి వాగ్దానం చేసింది. కానీ దానికి ఎలాంటి ఫలితమూ దక్కలేదు.అయిననూ ప్రయత్నించి చూడవలె అన్నట్లుగా ఈ అంశం మీద కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం వర్గీకరణ అంశం సుప్రీం కోర్టులో ఏడుగురు సభ్యులున్న బెంచ్‌ విచారణలో ఉంది. లోక్‌సభ ఎన్నికల కోసం తప్ప ఈ కమిటీ ఏం చేస్తుందన్నది అనేక మందిలో ఉన్న సందేహం.ఎప్పటి నుంచో నడుస్తున్న ఈ సమస్య మీద దశాబ్దం క్రితం అధికారానికి వచ్చిన బిజెపి చేసిందేమిటి? అన్నది సమాధానం లేని ప్రశ్న.ఉభయ సభల్లో పూర్తి మెజారిటీ ఉన్నందున నిజానికి చిత్తశుద్ధి ఉంటే రాజ్యాంగ సవరణ చేసి అమలు చేసేందుకు పూనుకోవచ్చు.ఆ పని చేయలేదు. కాబినెట్‌ కార్యదర్శి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కమిటీ అధికార యంత్రాంగం తీసుకోవాల్సిన చర్యలను పరిశీలిస్తుందని చెబుతున్నారు. సుప్రీం కోర్టు తీర్పుకు కేంద్రం కట్టుబడి ఉంటుందా ?ఉండేట్లయితే కమిటీ చేసే పనేమిటి ? కోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తే ఏం చేస్తారు ? అందుకే దీన్ని ఓట్ల ఆకర్షణ కమిటీ అంటున్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అది పంటల కనీస మద్దతు ధర కాదన్నా – మోసం జరుగుతున్న తీరిది చూడు రైతన్నా !

10 Saturday Jun 2023

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, Farmers, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, Uncategorized

≈ Leave a comment

Tags

#Farmers matter, BJP, MSP 2023-24 kharif crops, MSP demand, Narendra Modi Failures



ఎం కోటేశ్వరరావు


ఖరీఫ్‌ పంటలకు కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధరలు ద్రవ్యోల్బణం తగ్గించేందుకు తోడ్పడుతాయని ఆర్థికవేత్తలు స్పందించారు. ఎన్నికల సంవత్సరంలో ధరలు పెరగకుండా, తద్వారా బిజెపికి జనం దూరం కాకుండా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కసరత్తులో భాగమే ఇది,రైతులకు మేలు చేసేది కాదు అని వేరే చెప్పనవసరం లేదు. సావిత్రీ నీపతి ప్రాణంబు దక్క వరాలు కోరుకోమన్నట్లుగా కనీస మద్దతు ధరలకు చట్టబద్దత కల్పించటం మినహా రైతులు ఏమైనా కోరు కోవచ్చని ఏడాది పాటు సాగిన రైతుల ఆందోళన సందర్భంగా బిజెపి నేతలు చెప్పారు. విధిలేని పరిస్థితిలో ప్రధాని నరేంద్రమోడీ దేశానికి క్షమాపణలు చెప్పి మూడు సాగు చట్టాలను వెనక్కు తీసుకున్నట్లు ప్రకటించారు, కనీస మద్దతు ధరల గురించి సిఫార్సు చేసేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. మద్దతు ధరలను సిఫార్సు చేసేందుకు బిజెపి అధికారానికి రాక ముందు నుంచే ఒక వ్యవస్థ ఉంది. ఆ విధానానికి చట్టబద్దత కల్పించాలని రైతులు కోరుతున్నారు, సిఎంగా ఉన్నపుడు నరేంద్రమోడీ కూడా డిమాండ్‌ చేశారు. ఇప్పుడు కాదు పో పొమ్మికన్‌ అన్నట్లుగా రైతుల పట్ల వ్యతిరేకంగా ఉన్నారు. వేసిన కమిటీలో అందరూ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేవారు, మూడు సాగు చట్టాలను రూపొందించిన పెద్దలే ఉన్నందున తామా కమిటీని బహిష్కరిస్తున్నట్లు సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కెఎం) ప్రకటించింది. తరువాత గత ఏడాది కాలంగా ఆ కమిటీ ఏం చేస్తున్నదో, ఏం చెబుతుందో తెలియదు. రైతుల ఆదాయాలను 2022 నాటికి రెట్టింపు చేస్తామన్న నరేంద్రమోడీ బాసల గురించి మన్‌కీబాత్‌లో కూడా మాట్లాడేందుకు నోరు రావటం లేదు.


తమ ప్రభుత్వ హయాంలో 2014-15లో ఏ గ్రేడ్‌ వరి మద్దతు ధర రు.1,400 నుంచి 2023-24లో రు.2,203కు అంటే రు 803 పెంచినట్లు మోడీ సర్కార్‌ గొప్పగా చెప్పుకుంటున్నది.సగటున వార్షిక పెంపుదల 5.7శాతం. అంతకు ముందు కాంగ్రెస్‌ ఏలుబడిలో 2004-05 రు.590 నుంచి రు.1,400కు పెరిగింది. రు.810 పెరిగింది. సగటు వార్షిక పెరుగుదలలో చూస్తే 14శాతం ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో పత్తి గణనీయంగా సాగు చేస్తారు. కాంగ్రెస్‌ ఏలుబడిలో పొడవు పింజ పత్తి ధర రు.1,760 నుంచి రు.4,050 పెరిగింది. నిఖర పెరుగుదల రు.2,290 వార్షిక సగటు 13శాతం, అదే నరేంద్రమోడీ కాలంలో రు.4050 నుంచి రు.7,020కి పెంచారు.నిఖర పెరుగుదల రు.2,970 కాగా వార్షిక సగటు 7.3శాతమే. ఎవరు రైతులకు మేలు చేసినట్లు ? దీని అర్ధం కాంగ్రెస్‌ రైతులను ఏదో ఉద్దరించిందని చెప్పటం కాదు, పెరిగిన సాగు ఖర్చులతో పోలిస్తే అది కూడా తక్కువే. దానితో పోలిస్తే మంచి రోజులను తెచ్చి అమృత కాలంగా మార్చి రైతుల రాబడి రెట్టింపు చేస్తామన్న నరేంద్రమోడీ పాలనలో మరింత దిగజారింది అని చెప్పేందుకే ఈ పోలిక. అంకెలన్నీ మన ముందున్నాయి. ఎవరికి వారు పోల్చి చూసుకోవచ్చు.


కనీస మద్దతు ధరలను పెంచితే దాని ప్రభావం బియ్యం, వస్త్రాలు-దుస్తుల ధరల పెరుగుదలకు దారి తీస్తుంది కదా అని ఎవరైనా వాదించవచ్చు. రైతులు గొంతెమ్మ కోరికలను కోరటం లేదు. సాగు గిట్టుబాటు కావాలి-వినియోగదారులకు సరసమైన ధరలకు అందుబాటులో ఉండాలి. పంటల సాగుకు అవసరమైన పెట్టుబడుల ధరలను స్థిరంగా ఉంచితే రైతులు కూడా మద్దతు ధరల పెంపుదలను అడగరు. అన్నింటికీ మించి ఎవరేమి చెప్పినా రైతు బతకాలి, సాగు సాగాలి. అందుకే కదా రైతుల రాబడిని రెట్టింపు చేస్తామని మోడీ సర్కార్‌ చెప్పింది. దాన్ని అమలు జరపమనే కదా రైతులు అడుగుతోంది. ఎన్నికలు జరిగే సంవత్సరంలో ధరలను కాస్త ఎక్కువగా పెంచటం గతంలో కాంగ్రెస్‌ చేసింది. సేమ్‌ టు సేమ్‌ అదే జిమ్మిక్కు నరేంద్రమోడీ కూడా కొనసాగిస్తున్నారు. ఉదాహరణకు 2014-15 నుంచి 2017-18వరకు మూడు సంవత్సరాల్లో ఏ గ్రేడ్‌ వరికి పెరిగింది మొత్తం రు.190 మాత్రమే, సగటున ఏడాదికి రు.63 మాత్రమే. అదే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని 2018-19లో పెంచిన మొత్తం రు.180. తరువాత నాలుగు సంవత్సరాల్లో రు.1,770 నుంచి 2022-23 వరకు రు,2,060కి అంటే రు.290, ఏడాదికి సగటున రు.72.50 కాగా వచ్చే ఏడాది ఎన్నికల కారణంగా ఈ సారి రు.143 పెంచారు. ఎంఎస్‌ స్వామినాధన్‌ కమిషన్‌ చేసిన సిఫార్సులను పక్కన పెట్టి వార్షిక ద్రవ్యోల్బణ ప్రాతిపదికన నామమాత్రంగా పెంచుతున్నారు తప్ప సాగు ఖర్చులను పరిగణనలోకి తీసుకోవటం లేదు. మరోవైపు మార్కెట్లో గోధుమలు, బియ్యం ధరల పెరుగుదల కనీస మద్దతు ధరల కంటే ఎక్కువగా ఉంటున్నది, దీనికి కారణం ఏమిటో ఎవరూ చెప్పరు. ప్రతిదానికీ ఉక్రెయిన్‌ సంక్షోభం అని చెప్పి తప్పించుకుంటున్నారు. అది ప్రారంభంగాక ముందే మన దేశంలో ధరల పెరుగుదల మొదలైందన్నది చేదునిజం. ప్రతి ఆరునెలలకు ఒకసారి దానికి అనుగుణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరవు భత్యం పెంచటమే దానికి తిరుగులేని నిదర్శనం.


2021 నవంబరు 19వ తేదీన నరేంద్రమోడీ దేశమంతటికీ క్షమాపణలు చెప్పి మూడు సాగు చట్టాలను వెనక్కు తీసుకున్నట్లు చెప్పారు. వాటిని అమలు జరిపితే రైతుల కష్టాలు తీరుస్తాయన్నారు. వాటిని రద్దు చేసిన తరువాత ఇంతవరకు వాటి బదులు కష్టాలు తీర్చే చర్యలేమీ తీసుకోలేదు. అంటే తాను చెప్పినట్లు వినలేదు గనుక రైతులకు ఒక పాఠం చెప్పాలని మోడీ నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. ప్రజాస్వామ్యానికి నిబద్దులై ఉండేవారి లక్షణం కాదిది. వెంటవెంటనే నిర్ణయాలు తీసుకోవటంలో తమకు తామే సాటి అని చెప్పుకొనే వారు సాగు చట్టాల రద్దు తరువాత ఐదు నెలలకు ఒక కమిటీని వేశారు. ఆ కమిటీ పరిధి ఏమిటి ? ఏ అంశాలను అది పరిశీలిస్తుందో వివరించాలని రైతు ఉద్యమం నడిపిన సంయుక్త కిసాన్‌ మోర్చా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తే సమాధానం లేదు. అందువలన ఆ కమిటీలో ఉండి చేసేదేమీ లేదు గనుక ప్రతినిధుల పేర్లను ప్రతిపాదించటం లేదని స్పష్టం చేసింది. ఈ కమిటీ చైర్మన్‌ ఎవరంటే రైతులు తిరస్కరించిన మూడు సాగు చట్టాలను రచించిన వ్యవసాయశాఖ మాజీ కార్యదర్శి సంజయ అగర్వాల్‌. ఆ చట్టాలను ఎలా రూపొందించాలో సలహా ఇచ్చిన నీతిఅయోగ్‌ సభ్యులు రమేష్‌ చాంద్‌ .కనీస మద్దతు ధరలకు చట్టబద్దత కల్పించకూడదని చెప్పిన ఆర్థికవేత్తలను నిపుణుల పేరుతో చేర్చారు. ప్రభుత్వ ప్రతినిధులు సరేసరి, వీరుగాక రైతుల ఆందోళనను వ్యతిరేకించిన ఐదు సంఘపరివార్‌ సంఘాలకు చెందిన వారిని చేర్చారు. ఆందోళనకు నాయకత్వం వహించిన వారిని మూడు పేర్లు ఇవ్వాలని కోరారు. నూరు కాకుల్లో ఒక్క కోకిల మాదిరి ఈ ముగ్గురూ ఆ కమిటీలో ఉండి చేసేదేమీ ఉండదు. పోనీ వీరు లేకుండా ఇప్పటి వరకు కమిటీ చేసిందేమిటి అంటే నాలుగు ఉపసంఘాల ఏర్పాటు తప్ప మరేమీ లేదు. కనీస మద్దతు ధరలకు చట్టబద్దత ప్రతిపాదన ప్రస్తావన లేని కమిటీ ఇది. రైతుల రాబడి రెట్టింపుకు మూడు సాగు చట్టాలే ఆక్సిజన్‌ అని చెప్పారు. ఇంతవరకు వాటి బదులు ఏం చేస్తారో చెప్పలేదు. రైతులను నట్టేట ముంచినట్లేనా !


మూడు సాగు చట్టాలను అమలు జరపకుండా 2022 నాటికి రైతుల రాబడిని రెట్టింపు చేయటం కుదరదని నీతిఅయోగ్‌ సభ్యులు రమేష్‌ చాంద్‌ రైతుల ఆందోళన సమయంలో చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలు అమలుకు అవసరమైన మేరకు చర్యలు కూడా తీసుకోలేదని అన్నారు. అసలు రాష్ట్రాలతో సంప్రదించకుండా సాగు చట్టాలను రుద్దారు.నీతిఅయోగ్‌ సిఫార్సులు చేయటం తప్ప వాటిని కేంద్రమే పట్టించుకోదు.తమ ప్రభుత్వం అమలు జరుపుతున్న స్కీములతో రైతుల రాబడి పెరుగుతున్నదని కేంద్ర ప్రభుత్వం నమ్మించ చూస్తున్నది.2021లో పార్లమెంటు చర్చల్లో కేంద్ర ప్రభుత్వం ఇవిగో తమ పథకాలంటూ 17తో ఒక జాబితాను అందించింది, వాటికి గాను రు.17,540 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెప్పింది.2020-21 సంవత్సరానికి గాను వాటికి కేటాయించిన బడ్జెట్‌లో మూడో వంతు అంటే రు.5,787 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. వాటిలో మూడు పథకాలకైతే ఒక్క పైసా కూడా ఖర్చు లేదు. అంతే కాదు మొత్తం ఖర్చు చేసినప్పటికీ కేవలం పదిశాతం మంది రైతులకే ఈ పధకాలు అమలు అవుతాయని కూడా కేంద్రమే చెప్పింది. మోడీ సర్కార్‌ అమలు జరుపుతున్న పిఎం కిసాన్‌ పథకంలో ఏడాదికి ఆరువేల చొప్పున ఇస్తున్నది కేవలం 10.74 కోట్లు లేదా పదిశాతం మంది రైతులకే. అంటే దీని ద్వారా కుటుంబానికి అదనపు రాబడి నెలకు రు.500 మాత్రమే.


2022 నాటికి రైతుల రాబడిని రెట్టింపు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.ఇటీవలి కాలంలో ఎక్కడా దాని గురించి మాట్లాడటం లేదు.2016 ఏప్రిల్లో మంత్రులతో ఒక కమిటీని వేశారు.2018 సెప్టెంబరులో అది ఒక నివేదికను ఇచ్చింది. దానిలో ఏడు అంశాలను పేర్కొన్నారు. 1. పంటల ఉత్పాదకత పెంపుదల,2.పశువుల ఉత్పాదకత పెంపుదల, 3.వనరులను సమర్ధవంతంగా వినియోగించటం-ఉత్పత్తి ఖర్చు తగ్గింపు, 4.పంటల సాంద్రతను పెంచటం, 5.అధిక విలువనిచ్చే పంటల వైపు మళ్లింపు,6.రైతుల పంటలకు గిట్టుబాటు ధర, 7. అదనంగా ఉన్న మానవ వనరులను వ్యవసాయేతర రంగాలకు మళ్లించటం. వీటిల ఏ ఒక్క అంశంలోనైనా అప్పటి నుంచి ఇప్పటి వరకు సాధించిన అభివృద్ది ఏమిటో ఎక్కడా మనకు కనిపించదు. కేంద్రం ప్రభుత్వం జూన్‌ ఏడున ప్రకటించిన మద్దతు ధరల్లో ఒక్కటంటే ఒక్క పంటకు కూడా ాస్వామినాధన్‌ కమిషన్‌ సూచించిన సి2 ప్లస్‌ 50 ప్రకారం ధరలను ప్రకటించటం లేదు. అఖిల భారత కిసాన్‌ సభ వంటి రైతు సంఘాలు కేంద్రం మోసాన్ని ఆధార సహితంగా నిరూపించాయి. ధాన్యానికి క్వింటాలకు రూ.2183, జొన్నకు రూ.3180, కందికి రూ.7000, పత్తికి రూ.6620 చొప్పున కేంద్రం ఎంఎస్‌పి ప్రకటించింది. కానీ సి2 ప్లస్‌ 50 పర్సెంట్‌ ప్రకారం ధాన్యానికి క్వింటాలుకు రూ.2866.5, జొన్నకు రూ.2833, కందికి రూ.8989.5, పత్తికి రూ.8679 ప్రకటించాలి. ఆ మేరకు రైతులు నష్టపోతున్నారు. రైతు వ్యవసాయ ఖర్చులు, ధరల కమిషన్‌ (సిఎసిపి) అంచనాల కంటే ఆంధ్రప్రదేశ్‌, బీహార్‌, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, పంజాబ్‌, తమిళనాడు, తెలంగాణ, పశ్చిమ బెంగాల్‌ వంటి చోట్ల పెట్టుబడులు అధికంగా ఉంటున్నాయి. జాతీయ సగటు కంటే అధికంగా ఎంఎస్‌పి ఇచ్చామంటున్నారు. ఎక్కువ ఖర్చు ఉన్న చోట రైతుల నష్టాన్ని ఎవరు భరించాలి ? వరి సాగు ఖర్చు (సి2) క్వింటాలకు కనీసం తెలంగాణాలో రు.3300, ప్రకటించింది రు.2,183 మాత్రమే. ఇతర రాష్ట్రాలలో కూడా ఇదే విధమైన తేడాలు ఉన్నాయి. రైతుల రాబడిలో కూడా ఒక రాష్ట్రానికి ఒక రాష్ట్రంతో పొసగదు. అందువలన సగటు లెక్క అనేది అశాస్త్రీయం. కొన్ని ప్రాంతాలకు ప్రత్యేక విధానాలను అమలు జరుపుతున్నట్లే సాగు ఖర్చు ఎక్కువగా ఉన్న చోట రైతును ఆ మేరకు ఆదుకోవాలి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మద్దతు ధర చట్టబద్దతకు మోడీ మొరాయింపు వెనుక అసలు కథేంటి !

11 Saturday Dec 2021

Posted by raomk in CHINA, Current Affairs, Economics, Farmers, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, USA

≈ Leave a comment

Tags

Agricultural Produces, Farmers Delhi agitation, Minimum Support Prices, MSP demand, Narendra Modi Failures, WTO-Agriculture, WTO-India


ఎం కోటేశ్వరరావు


ప్రపంచ వాణిజ్య సంస్ధ(డబ్ల్యుటిఓ) నిబంధనలు, అవగాహన మేరకు మన దేశంలో 23 పంటలకు అమలు చేస్తున్న కనీస మద్దతు ధరలు ఆహార భద్రతా చర్యల్లో భాగం. దానిలో భాగమే సేకరణ, పంపిణీ నిర్వహణ. ఈ విధానం మేరకు వర్దమాన దేశాలకు అనుమతించిన పరిమితులకంటే ఎక్కువగా మన దేశం సబ్సిడీ ఇస్తున్నదని డబ్ల్యుటిఓలో మన మిత్ర, సహజ భాగస్వామి అని చంకలు కొట్టుకుంటున్న అమెరికా, కెనడా కేసు దాఖలు చేశాయి. మన మీద ఐక్యంగా దాడి చేస్తున్న ధనిక దేశాలు తమలో తాము కుమ్ములాడుకోవటమే కాదు, కేసులు కూడా దాఖలు చేస్తున్నాయి. మన మీదే కాదు చైనా మీద కూడా అమెరికా అలాంటి కేసునే దాఖలు చేసింది. పరిమితికి మించి చైనా రైతులకు సబ్సిడీలు ఇస్తున్నదని డబ్ల్యుటిఓ 2019 మార్చినెలలో తీర్పు చెప్పింది. దాని మీద చైనా వినతి మేరకు ప్రస్తుతం సమీక్ష జరుపుతున్నారు. దానిలో తృతీయ పక్షంగా మన దేశం మరికొన్ని దేశాలు చేరాయి. అది ఎప్పటికి పూర్తవుతుందో, ఎలా పరిష్కారం అవుతుందో చెప్పలేము.ప్రపంచ వాణిజ్య సంస్ధ(డబ్ల్యుటిఓ) ఇది ప్రపంచ వ్యవసాయదారుల సంస్ధ కాదు. పారిశ్రామిక, సేవ, వ్యవసాయ రంగాలన్నిటినీ వాణిజ్యంగా పరిగణించి ఆ దృక్పధంతోనే వాటి విధిని నిర్ణయిస్తోంది. అందువలన దానికి యజమానులు తప్ప ఆ రంగాల్లో పనిచేసే వారి గురించి పెద్దగా పట్టదని వేరే చెప్పనవసరం లేదు.


అమెరికా లేవనెత్తిన అంశాలు మనకూ ఆసక్తి-ఆందోళన కలిగించేవే. బరాక్‌ ఒబామా హయాంలో ఈ కేసు దాఖలైంది. చైనా ఇస్తున్న సబ్సిడీల కారణంగా తమ మొక్కజొన్న, గోధుమ, వరి రైతులు నష్టపోతున్నారని, ప్రపంచ వాణిజ్య సంస్ధలో చేరిన సమయంలో అంగీకరించిన మొత్తాలకంటే ఎక్కువ మొత్తాలు ఇస్తున్నట్లు ఆరోపణ. ఈ కారణంగా చైనాలో అధికంగా ఉత్పత్తి చేస్తున్నారని, ఫలితంగా ప్రపంచ స్ధాయి నాణ్యత కలిగిన ఉత్పత్తులను తమ రైతులు చైనాకు ఎగుమతి చేయలేకపోతున్నారని, ఇది వాణిజ్య నిబంధనలకు విరుద్దమని ఫిర్యాదు చేసింది. ఒక బుషెల్‌ (25.4కిలోలు) గోధుమలకు మద్దతు ధరగా పది డాలర్లను(మన కరెన్సీలో రు.750,మన ప్రభుత్వం 2021-22కు ప్రకటించింది క్వింటాలుకు రు.2015) చైనా మద్దతు ఇస్తోందని, ఇది ప్రపంచ ధరల కంటే చాలా ఎక్కువన్నది అమెరికా ఆరోపణ. మన దేశంలో వరి, గోధుమలకు గరిష్టపరిమితిగా ఉన్న పదిశాతానికి మించి 60,70శాతం వరకు మద్దతు ధరల రూపంలో సబ్సిడీ ఇస్తున్నట్లు అమెరికా చిత్రిస్తున్నది.


ఆయా దేశాలకు ఇచ్చిన సబ్సిడీలను పరిమిత వ్యవధిలోపల ఎత్తివేయకపోతే కేసులో గెలిచిన దేశాలు ప్రతికూల పన్నులు విధించవచ్చునని డబ్ల్యుటిఓ నిబంధనలు చెబుతున్నాయి. పంటల విలువలో 8.5శాతానికి మించకుండానే తమ సబ్సిడీలు ఉంటాయని అంగీకరించిన చైనా అంతకు మించి అదనంగా వంద బిలియన్‌ డాలర్లు ఇచ్చిందన్నదే వివాదం. నిబంధనల మేరకు వర్ధమాన దేశాలు పదిశాతం వరకు సబ్సిడీలు ఇవ్వవచ్చు. చైనా అధిక ఉత్పత్తి మరియు రక్షణ చర్యలు దీర్ఘకాలం కొనసాగుతున్న కారణంగా అమెరికా రైతులు దెబ్బతింటున్నారు. చైనా సబ్సిడీల కారణంగా ఏడాదికి 70కోట్ల డాలర్ల మేర నష్టపోతున్నారని అమెరికా గోధుమ ఎగుమతిదారు విన్స్‌ పీటర్సన్‌ ఆరోపించాడు. గోధుమలు, వరికి కనీస మద్దతు ధర ఉన్నకారణంగానే రైతులు వాటివైపు మొగ్గుచూపుతున్నారని వాదించేవారి గురించి తెలిసిందే. ఆ మద్దతు ధర గురించి అదే అమెరికా మన మీద కూడా దాడి చేస్తోంది.
అమెరికా, ఇతర ధనిక దేశాల దాడులు, వత్తిడి నుంచి తప్పుకొనేందుకు రైతులు ఎక్కడైనా అమ్ముకోవచ్చు, ఎగుమతి చేసుకోవచ్చు అంటూ కొత్త పల్లవి అందుకొని మోడీ సర్కార్‌ హడావుడిగా మూడు సాగు చట్టాలను తెచ్చిన అంశం తెలిసిందే. చైనా ఇస్తున్న మద్దతు ధర చెల్లదని ప్రపంచ వాణిజ్య సంస్ధ ఇచ్చిన తీర్పు తమకు మంచి అవకాశమని అమెరికా రైస్‌ అనే వ్యాపార సంస్ధ చైర్మన్‌ చార్లీ మాథ్యూస్‌ చెప్పాడు. ఏ ఏడాదైనా తమ పంటలో సగాన్ని ఎగుమతి చేస్తామని ఇతర దేశాలు కూడా అదనంగా ఇస్తున్న మద్దతు ధరను తగ్గిస్తే అంతర్జాతీయంగా మంచి అవకాశాలు వస్తాయని అన్నాడు. దీని అర్ధం ఏమిటి ? భారత్‌, చైనా వంటి దేశాల రైతులకు ధర గిట్టుబాటుగాక సాగుమానేస్తే తమ పంటలను మనవంటి దేశాలకు ఎగుమతి చేసి సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారు.


అమెరికా, కెనడా మన మీద ప్రధానంగా పప్పుధాన్యాలకు మద్దతు ఇవ్వటాన్ని సవాలు చేశాయి.2018-19 సంవత్సరానికి ప్రకటించిన మద్దతు ధరలు అనుమతించినదానికంటే 26రెట్లు అదనంగా ఇచ్చినట్లు ఫిర్యాదు చేశాయి. పప్పుధాన్యాల విలువను మన దేశం రు.2,677 కోట్లుగా లెక్కిస్తే అమెరికా, కెనడా దాన్ని రు.69,923 కోట్లుగా చూపాయి. ఎందుకీ తేడా వచ్చింది ? మద్దతు ధర పధకం కింద కేంద్రం లేదా రాష్ట్రాలు సేకరిస్తున్న పరిమాణానికే మనం విలువ కడుతుండగా, అమెరికా, కెనడాలు మొత్తం ఉత్పత్తిని తీసుకొని దాని మీద చూపుతున్నాయి. మరొకటేమంటే మన దేశం విలువను డాలర్లలో లెక్కిస్తుండగా మన మీద ఫిర్యాదు చేసిన దేశాలు రూపాయల్లో లెక్కించాయి. అమెరికన్లు చైనా మీద మొక్కజొన్న, గోధుమ, వరి మీద ఫిర్యాదు చేయగా మన మీద పప్పుధాన్యాల మీద వేయటానికి కారణం వాటిని ప్రత్యేకించి బఠానీలను మనకు ఎగుమతి చేయాలని చూస్తున్నాయి. తరువాత మిగతావాటి మీదా వేస్తాయి. చైనాకు వ్యతిరేకంగా రెచ్చగొడుతూ ఈ రోజు మనల్ని కౌగిలించుకుంటున్న దేశాలన్నీ ఎక్కడన్నా బావే కానీ వంగతోట దగ్గర కాదన్నట్లుగా మన మీద ఫిర్యాదు చేసినవే. చెరకు రైతులకు రాష్ట్రాలు ప్రకటించే సూచిక ధరలను రైతులకు ఇస్తున్న సబ్సిడీలుగా చూపుతూ ఆస్ట్రేలియా ఫిర్యాదు చేసింది. సౌరపలకలు, గోధుమలు, వరి, పత్తికి సబ్సిడీ ఇస్తున్నట్లు అమెరికా, ఉక్కు ఉత్పత్తులపై జపాన్‌ అదేపని చేశాయి.


ఇతర దేశాల మీద విరుచుకుపడుతున్న అమెరికా తాను చేస్తున్నదేమిటి ? డబ్ల్యుటిఓలో వ్యవసాయంపై కుదిరిన ఒప్పందం మేరకు ధనిక దేశాలు తమ సబ్సిడీలను ఐదుశాతానికి, మిగతాదేశాలు పదిశాతానికి పరిమితం చేయాలి. అసలు కథ ఇక్కడే ప్రారంభమైంది. ఒప్పందం కుదిరిన మరుక్షణం నుంచే నిబంధనలను ఉల్లంఘించే మార్గాలను వెతికారు. సబ్సిడీల్లో మూడు రకాలు. ఒకటి గ్రీన్‌ బాక్స్‌, రెండు అంబర్‌బాక్స్‌, మూడవది బ్లూబాక్స్‌. గ్రీన్‌ బాక్సు తరగతి సబ్సిడీలు వ్యాపారాన్ని వికృతీకరించకూడదు, లేదా పరిమితంగా ఉండాలి. అవి ప్రభుత్వం ఇచ్చేవిగా, మద్దతు ధర ప్రమేయం లేనివిగా ఉండాలి.పర్యావరణాన్ని, ప్రాంతీయ అభివృద్ధి కార్యక్రమాలకు రక్షణ కల్పించేవిగా ఉండాలి. నిర్దిష్ట ప్రమాణాలకు లోబడి ఉంటే వాటికి ఎలాంటి పరిమితులు లేవు. గ్రీన్‌, బ్లూబాక్స్‌ సబ్సిడీలు కానివన్నీ అంబర్‌బాక్సు తరగతిలోకి వస్తాయి. ఉత్పత్తి పరిమాణంతో నేరుగా సంబంధం ఉండే సబ్సిడీలు లేదా మద్దతు ధరల వంటివి దీనిలో ఉన్నాయి. బ్లూబాక్స్‌ అంటే షరతులతో కూడిన అంబర్‌ బాక్సు సబ్సిడీలు, వికృతీకరణను తగ్గించేవిగా ఉండాలి. అంటే రైతులు ఉత్పత్తిని పరిమితం చేసేవిగా ఉండాలి.ప్రస్తుతం ఈ సబ్సిడీలకు కూడా ఎలాంటి పరిమితులు లేవు.


మన మద్దతు ధరలపై వేసిన కేసు విచారణ, తీర్పు వచ్చే వరకు వ్యవధి పట్టవచ్చు. చైనా మాదిరి మనకూ వ్యతిరేకంగా తీర్పు రావచ్చు. ఈ లోగా కేసు వేసిన దేశాలతో మనదేశం సంప్రదింపుల ప్రక్రియ ఉంటుంది. ఈలోగా మన దేశం కూడా కొన్ని మార్పులు చేయవచ్చు. చైనా వివాదం రెండున్నర సంవత్సరాలు పట్టింది. మరికొన్ని దేశాలు కూడా మన మీద కేసులో చేరవచ్చు. మన దేశం ఇస్తున్న మద్దతు ధరలను ఆహార భద్రతా చర్యల్లో భాగంగా చూపుతున్నాము గనుక అవి గ్రీన్‌ బాక్సు తరగతిలోకి వస్తాయని మన నిపుణులు భావిస్తున్నారు. గోధుమల మద్దతు ధరల వివాదంలో చైనాకు వ్యతిరేకంగా తీర్పు వచ్చిన తరువాత 2019లో నరేంద్రమోడీ రెండవ సారి లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కొన్నారు. బహుశా ఈ తీర్పు నేపధ్యంలో మద్దతు ధరలకు మంగళం పాడే ఉద్దేశ్యంతో లేదా మార్పులు చేశామని చూపేందుకు, సబ్సిడీ మొత్తాలకు కోత పెట్టేందుకు నేరుగా నగదు అందచేసే పేరిట ఏటా ఆరువేల రూపాయల సాగు లేదా ఆదాయ మద్దతు పేరుతో కిసాన్‌ సమ్మాన్‌ పధకాన్ని ప్రకటించారనుకోవాలి. ఇది ప్రపంచ బాంకు ఆదేశాల్లో భాగమే. తెలంగాణాలో, దేశంలో ధాన్య ఉత్పత్తి పెరిగిందనే వాదనలు, ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలనే పల్లవి, పాట అందుకున్నారు.ఉప్పుడు బియ్యం కొనుగోలు చేసేది లేదని కేంద్రం అంటే కొనాలని మేము అడగం అంటూ ముఖ్యమంత్రి కెసిఆర్‌ రాతపూర్వకంగా ఒప్పందం చేసుకోవటం, వరి సాగు వద్దని, ఇతర పంటలు వేసుకోవాలని చెప్పటాన్ని చూస్తుంటే వీటన్నింటికీ సంబంధం లేదని ఎవరైనా చెప్పగలరా ? చైనా సర్కార్‌ ఇస్తున్న మద్దతు ధరల కారణంగానే అక్కడ ఉత్పత్తి పెరిగిందని, అది తమ ఎగుమతులను దెబ్బతీసిందని అమెరికా చేసిన వాదన మనకూ, మనలాంటి ఇతర దేశాలకూ వర్తించదా ?


విడదీసి పాలించాలనే బ్రిటీష్‌ వారి ఎత్తుగడను అమెరికా అమలు చేస్తోంది. దానిలో భాగంగానే మనకూ-చైనాకు మరోసారి తగదా పెట్టటంలో జయప్రదమైంది. రైతులకు మద్దతు ఇచ్చే అంశంలో మనమూ-చైనా కూడా ప్రపంచవాణిజ్య సంస్ధలో ఒకే వాదనను ఐక్యంగా ముందుకు తెస్తున్నాము. సవాలు చేసేందుకు వీలు లేని గ్రీను బాక్సు సబ్సిడీల పేరుతో అమెరికా, కెనడా, ఐరోపా ధనిక దేశాలు అమలు చేస్తున్న అంబర్‌ బాక్సు సబ్సిడీల సంగతేమిటని నిలదీస్తున్నాయి. అవి మన దేశంలో అమలు చేస్తున్న మద్దతు ధరలతో పోలిస్తే చాలా ఎక్కువ. గోధుమ రైతులకు చైనా ఇస్తున్న మద్దతు ధరలతో అంతర్జాతీయంగా ధరలు తగ్గి తమకు నష్టం వస్తోందని వాదించిన అమెరికా చేసిందేమిటి ? అమెరికా సర్కార్‌ పత్తి రైతులకు ఇస్తున్న మద్దతు ప్రపంచ మార్కెట్‌ను వక్రీకరిస్తోందంటూ 2002లో బ్రెజిల్‌ సవాలు చేసింది.1995-2002 మధ్య పత్తి ధరలు గణనీయంగా పడిపోవటానికి, అదే కాలంలో అమెరికా పత్తి ఎగుమతులు రెట్టింపు కావటానికి సబ్సిడీలే కారణమని ప్రపంచ వాణిజ్య సంస్ధ విచారణలో నిర్ధారణైంది. పశ్చిమ ఆఫ్రికాలోని పేద దేశాల పత్తి రైతులు నష్టపోయినట్లు కూడా తెలిపింది. మార్కెట్‌ సహాయ రుణాలు, మార్కెట్‌ నష్టాన్ని పూడ్చే పేరుతో అమెరికా రాయితీలు ఇచ్చింది.


ఈ తీర్పు తరువాత అమెరికా రాజీకి వచ్చి బ్రెజిల్‌ పత్తి రంగ సామర్ధ్యం పెరుగుదలకు తన ఖర్చుతో శిక్షణ ఇస్తామని ప్రకటించింది. దీనికి తోడు 2014 అమెరికా వ్యవసాయ బిల్లులో కొన్ని మార్పులు చేయటంతో బ్రెజిల్‌ మౌనం దాల్చింది. అయితే అమెరికా ఆ బిల్లును 2019లో సవరించి పది సంవత్సరాలలో వివిధ రూపాలలో 867బిలియన్‌ డాలర్ల మేరకు రైతుల పేరుతో రాయితీలు ఇచ్చేందుకు నిర్ణయించింది. దీనిలో ఉన్న అనూహ్య అంశం ఏమిటో తెలుసా ! పొలంలో పని చేయకపోయినా రైతు మేనళ్లు, మేన కోడళ్లు,ఇతర బంధువులు కూడా రైతుల పేరుతో సబ్సిడీలను పొందవచ్చు. ధనిక దేశాల ఉత్పత్తులకు మనమూ, చైనా వంటి దేశాలు మార్కెట్లను తెరిచి దిగుమతులు చేసుకుంటే ఎలాంటి కేసులూ ఉండవు. మనం దిగుమతులకు అనుమతిస్తే పారిశ్రామిక రంగం విదేశీ సరకులతో కుదేలైనట్లే వ్యవసాయం కూడా మరింత సంక్షోభానికి లోనవుతుంది.


ప్రపంచ వాణిజ్య సంస్ధలో తొలిసారిగా బాలీ సంధికాల నిబంధనను గతేడాది, ఈ ఏడాది ఉపయోగించుకున్న దేశం మనదే. వరికి ఇస్తున్న రాయితీ పదిశాతం దాటటమే దీనికి కారణం.2019-20లో బియ్యం ఉత్పత్తి విలువ 46.07బిలియన్‌ డాలర్లు కాగా ఇచ్చిన రాయితీ 6.31బి.డాలర్లని ఇది 13.7శాతానికి సమానమని మన దేశం డబ్ల్యుటిఓకు తెలిపింది. అయినప్పటికీ ఇది సమర్దనీయమే అంటూ సంధికాల నిబంధనను ఉపయోగించుకుంటున్నట్లు తెలిపింది. దీని ప్రకారం ఎఫ్‌సిఐ ద్వారా సేకరణను కొనసాగించవచ్చు. రాయితీలు తమ అంతర్గత ఆహార భద్రత కోసం ఇచ్చినవి గనుక వాణిజ్య వికృతీకరణ జరగలేదు. ప్రభుత్వం సేకరించిన నిల్వల నుంచి విదేశాలకు వాణిజ్యపరమైన ఎగుమతులు జరపలేదు. బహిరంగ మార్కెట్లో ప్రభుత్వం విక్రయిస్తున్న వాటిని కొనుగోలు చేసిన వారు ఇతర దేశాలకు వాటిని ఎగుమతి చేయకూడదనే షరతు ఉన్నందున ఎవరికీ నష్టం జరగలేదు, అందువలన భారత్‌పై చర్యలు తీసుకోకూడదన్నది మన వాదన. దీన్ని సమర్ధించుకొనేందుకే కరోనా కాలంలో ఇచ్చిన ఉచిత బియ్యాన్ని ఆహార భద్రత పధకం కింద చూపారు. వాటి సరఫరాను విరమించినట్లు ప్రకటించిన కేంద్రం తిరిగి కొంత కాలం కొనసాగించనున్నట్లు ప్రకటించిన అంశం తెలిసిందే. ఈ కారణాలను ఎవరూ సవాలు చేసేందుకు వీలులేదు. ఈ నిబంధన ఒక్క బియ్యానికే కాదు, ఇతర పంటలకూ వర్తిస్తుంది.


మద్దతు ధరలకు చట్టబద్దత కల్పిస్తే సంభవించే పర్యవ సానాల గురించి ఏకాభిప్రాయం లేదు. ప్రభుత్వం తలచుకుంటే దాన్ని సాధించటం అసాధ్యం కాదు. ఇప్పటికే చెరకు పంటకు ఒక చట్టబద్దత ఉంది. ప్రభుత్వం సూచించిన ధరకంటే తక్కువకు కొనుగోలు చేసేందుకు మిల్లులకు అవకాశం లేదు. ఆ ధర ఎక్కువా తక్కువా, రికవరి లెక్కల్లో మోసాలు వేరే అంశం. పేరుకు ఇరవై మూడు పంటలైనా ఆచరణలో అన్నింటినీ ప్రభుత్వం సేకరించే అవసరం రావటం లేదు, నిర్ణీత ధరలకంటే ఎక్కువ లేదా వాటికి దరిదాపుల్లో ఉన్నందున రైతులు ప్రభుత్వం మీద ఆధారపడటం లేదు. గతేడాది బియ్యం ఉత్పత్తిలో 49శాతం, గోధుమలను 40శాతమే ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఉత్పత్తి పెరిగితే ఇంకాస్త పెరుగుతుంది తప్ప అసాధారణంగా ఉండదు. కొన్ని సందర్భాల్లో పత్తి సేకరణ అవసరమే ఉండటం లేదు. మద్దతు ధరలు ప్రకటిస్తున్న 23 పంటల మొత్తం విలువ పన్నెండులక్షల కోట్ల రూపాయలని (2020-21) అంచనా. కుటుంబ అవసరాలకు, పశుదాణాకు పోను మార్కెట్‌కు వస్తున్నదానిలో ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నదాని విలువ రు.నాలుగులక్షల కోట్లు. మరొక ఐదులక్షల కోట్ల మేరకు బహిరంగ మార్కెట్లో విక్రయాలు జరుగుతున్నాయి. కోట్లాది మంది రైతులు, కూలీలతో, ఇతరంగా ఆధారపడే వారికి సంబంధించిన దీనికి హామీ ఇవ్వటానికి ప్రభుత్వానికి సత్తా, అవకాశాలు లేవా ?


ఒక అంచనా ప్రకారం మన దేశంలో ఏటా ప్రతి రైతుకూ సగటున 260డాలర్ల మేర సబ్సిడీలు ఇస్తున్నారు. అదే కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో 100రెట్లు ఎక్కువ. మరొక అంచనా ప్రకారం భారత్‌లో 200 డాలర్లు ఇస్తుంటే అమెరికాలో 50వేల డాలర్లు ఇస్తున్నారు. ప్రపంచ వాణిజ్య సంస్ధ నిబంధనల ప్రకారం కనీస మద్దతు ధరల నిర్ణయం చట్టవిరుద్దం. మన కార్పొరేట్‌ మేథావులు ఈ వాదనను భుజానవేసుకొని దాన్నే వల్లిస్తున్నారు.నిజానికి మనకు ఆ హక్కు నిబంధనలకు లోబడే ఉంటుందన్నది మరొక అభిప్రాయం. మరి నరేంద్రమోడీ సర్కార్‌ ఏదో ఒక వాదనను తన వైఖరిగా తీసుకుంటే అదొక తీరు. రైతు ఉద్యమం సాగిన ఏడాది కాలంలో చెప్పిందేమిటి ? గతంలో చట్టబద్దత లేదు కదా, కొనసాగిస్తామని రాతపూర్వకంగా ఇస్తామంటున్నాం కదా, ఏటా ధరలను సవరిస్తూనే ఉన్నాం అని అటూ ఇటూ తిప్పటం తప్ప చట్టబద్దత కుదురుతుందో లేదో కుదరకపోతే కారణాలేమిటో చెప్పకుండా నాటకం ఎందుకు ఆడినట్లు , ఇప్పుడు ఒక కమిటీ వేస్తామని ఎందుకు చెప్పినట్లు ? అసలు సంగతేమంటే అన్ని రంగాలనుంచి ప్రభుత్వం బాధ్యతల నుంచి తప్పుకొంటున్న మాదిరే వ్యవసాయాన్ని కూడా ప్రయివేటు రంగానికి అప్పగించాలనే తాపత్రయమే. అందుకే రైతు ఉద్యమంలో ఐక్యత కీలకమైన ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికల కారణంగా మోడీ సర్కార్‌ క్షమాపణలు చెప్పి మరీ వెనక్కు తగ్గింది తప్ప మారుమనసు కలిగి కాదన్నది స్పష్టం. అందుకే కనీస మద్దతు ధరల చట్టబద్దతపై కమిటీ వేసినా దానికి అంగీకరిస్తారా అన్నది అనుమానమే. అందుకే రైతుల ఆందోళన అంతం కాదు, మరో ఆరంభానికి విరామమే అని చెప్పాల్సి వస్తోంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d