• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Monthly Archives: February 2025

ఐరాసలో ఉక్రెయిన్‌ తీర్మానాలు : జెలెనెస్కీ వాషింగ్టన్‌ పర్యటన- ` డోనాల్డ్‌ ట్రంప్‌ మడమ తిప్పుతాడా !

26 Wednesday Feb 2025

Posted by raomk in CHINA, Current Affairs, Europe, History, imperialism, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, USA, WAR

≈ Leave a comment

Tags

Donald trump, Russia- Ukraine peace plan, Ukraine crisis, Vladimir Putin, Volodymyr Zelensky, Xi Jinping

ఎం కోటేశ్వరరావు

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ తన రెండవ పదవీ కాలం తొలి నెల రోజుల్లో చేసిన ప్రకటనలు, తీసుకున్న నిర్ణయాల పరిణామాలు, పర్యవసానాల గురించి పరిపరి కథనాలు వెలువడుతున్నాయి. నిజంగా ఏం జరిగేది ఎవరూ చెప్పలేని స్థితి. రష్యాను దగ్గరకు తీసుకొని చైనాకు వ్యతిరేకంగా నిలపాలనే ఎత్తుగడతో అమెరికా ఉందని చెబుతున్నారు.సోమవారం నాడు ఐరాసలో జరిగిన పరిణామాలు ఆసక్తి కలిగిస్తున్నాయి.తమపై నాలుగో ఏడాదిలో ప్రవేశించిన రష్యా సైనిక చర్యలను ఖండిస్తూ దాడులు నిలిపివేయాలని ఐరాస సాధారణ అసెంబ్లీలో ఉక్రెయిన్‌ సోమవారం నాడు ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. దానికి అనుకూలంగా 93, వ్యతిరేకంగా 18 దేశాలు ఓటు చేయగా, భారత్‌, చైనాతో సహా 65 దేశాలు తటస్థంగా ఉన్నాయి. గతంలో 140దేశాలు రష్యా చర్యను ఖండిరచే తీర్మానానికి మద్దతు ఇవ్వగా ఈసారి 93కు తగ్గాయి. ఉక్రెయిన్‌ తన తీర్మానాన్ని వెనక్కు తీసుకొని ‘‘ త్వరగా సంక్షోభాన్ని ముగించాలని ’’ తాను ప్రతిపాదించిన దానికి మద్దతు ఇవ్వాలని అమెరికా వత్తిడి చేసింది. మరోవైపున రష్యా మీద ఎలాంటి విమర్శ చేయకుండా సంక్షోభాన్ని ముగించాలని కోరుతూ భద్రతా మండలిలో అమెరికా ప్రవేశపెట్టిన తీర్మానానికి మద్దతుగా పది ఓట్లు రాగా ఐదుదేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. వాటిలో వీటో హక్కు కలిగిన బ్రిటన్‌, ఫ్రాన్సు కూడా ఉండటం విశేషం.ఈ పరిణామాల తరువాత శుక్రవారం నాడు జెలెనెస్కీ వాషింగ్టన్‌ వెళుతున్నాడని, విలువైన ఖనిజాల మీద ట్రంప్‌తో ఒక ఒప్పందం కుదుర్చుకోవచ్చని బుధవారం నాడు వార్తలు వచ్చాయి. ఇదే జరిగితే ట్రంప్‌ ఇప్పటి వరకు చెప్పినదానికి పూర్తి విరుద్దంగా వ్యవహించినా ఆశ్చర్యం లేదు. విలువైన ఖనిజాల కోసం ఉక్రెయిన్ను ట్రంప్‌ బెదిరిస్తున్నాడని గతంలో కొన్ని వార్తలు వచ్చాయి.

తమకు నాటో సభ్యత్వమిస్తే పదవి నుంచి వైదొలగటానికి కూడా సిద్దమే అని, తమ ప్రాంతాలను ఆక్రమించిన పుతిన్‌ అక్కడే తిష్టవేయటాన్ని అంగీకరించేది లేదని జెలెనెస్కీ అంతకు ముందు చెప్పాడు. తాము చేసిన ప్రతి డాలరు మిలిటరీ సాయానికి రెండు డాలర్లు చెల్లించాలని అమెరికా డిమాండ్‌ చేస్తోందన్నాడు. ఐదువందల బిలియన్‌ డాలర్ల ఖనిజాలను అప్పగించాలన్న వాషింగ్టన్‌ వత్తిడికి లొంగేది లేదని కూడా చెప్పాడు, అవసరమైతే వచ్చే పదితరాల వారు తమ రుణాలను తీర్చుకుంటారని అన్నాడు. విలువైన ఉక్రెయిన్‌ ఖనిజాల్లో 350 బిలియన్‌ డాలర్ల విలువ గలవి రష్యా అధీన ప్రాంతాల్లోనే ఉన్నాయని ఉపప్రధాని యులియా చెప్పాడు. ఉక్రెయిన్‌కు మద్దతు తెలిపేందుకు సోమవారం నాడు అనేక మంది ఐరోపా నేతలు కీవ్‌ చేరుకున్నారు. ఉక్రెయిన్‌పై ఒక నిర్ణయం తీసుకొనేందుకు, ఐరోపా రక్షణ గురించి చర్చించేందుకు మార్చినెల ఆరవ తేదీన సమావేశం కానున్నారు. రానున్న రెండు వారాల్లో రెండవ సారి సమావేశమయ్యేందుకు అమెరికా, రష్యా ప్రతినిధులు సన్నద్దమవుతున్నారు. తప్పుడు సమాచార బుడగలో ట్రంప్‌ ఇరుక్కు పోయాడని అన్న జెలెనెస్కీని నియంత అని ట్రంప్‌ వర్ణించటాన్ని అర్ధం చేసుకోదగినదే అని రష్యా సమర్ధించింది.

రష్యాను దగ్గరకు తీసుకొని చైనాకు వ్యతిరేకంగా నిలపాలని నిజంగా ట్రంప్‌ భావిస్తే అది ఇప్పటికైతే ఊహాజనితమే. ఒకవేళ అదే జరిగితే ఇప్పటికే మరోవైపు ఉన్న భారత్‌, మూడో వైపు ఉన్న జపాన్‌తో కథ నడిపించి చైనాను దెబ్బతీయాలన్న వ్యూహం ఉందన్నది ఒక దృశ్యం. ఇది కార్యరూపం దాలిస్తే ఐరోపాలో అమెరికా ప్రాబల్యం తగ్గి చైనా పలుకుబడి పెరుగుతుందని మరికొందరి హెచ్చరిక. ఉక్రెయిన్ను ఫణంగా పెట్టి రష్యాతో ఒప్పందం కుదుర్చుకుంటే ప్రపంచంలో అమెరికాను నమ్మే పరిస్థితి ఉంటుందా ? ట్రంప్‌ను నమ్మి రష్యా ముందుకు పోతుందా అన్నది ప్రశ్న. గతంలో ఇదే అమెరికన్లు జి7 కూటమిని జి8గా మార్చి రష్యాను చేర్చుకొనేందుకు చూశారు. అది బెడిసికొట్టటంతో రష్యాను వ్యతిరేకించటమే గాదు, దానికి ముప్పు తెచ్చేందుకు చూశారు. ఉక్రెయిన్‌ సంక్షోభానికి కారణం అదే కదా ! గడచిన మూడు సంవత్సరాలుగా ఆంక్షలతో ఆర్థికంగా దెబ్బతీసేందుకు చూసిన తీరు, ఉక్రెయిన్‌ పోరులో సంభవించినట్లు చెబుతున్న ప్రాణ, ఆర్థిక నష్టాలను మరచి రష్యన్లు కొత్త బాటలో నడుస్తారా ? కష్ట సమయంలో ఆదుకున్న చైనాకు వ్యతిరేకంగా జట్టుకడుతుందా ? పుతిన్‌ లేదా పాలకవర్గం లొంగిపోయినా జనం సమ్మతిస్తారా ? అమెరికాయే చేతగాక బేరసారాలకు దిగుతుంటే రష్యన్లు చైనాను కట్టడి చేయగలరా ? ఇలాంటి అనేక ఊహాజనిత దృశ్యాలను కొందరు ఆవిష్కరిస్తున్నారు.

చరిత్రను చూస్తే నాటి సోవియట్‌చైనా కమ్యూనిస్టు పార్టీల మధ్య తలెత్తిన సైద్దాంతిక వివాదాలు, దేశాల మధ్య విబేధాలకు దారి తీశాయి.1969లో ఆరు నెలలకు పైగా సరిహద్దులో ఇరు సైన్యాలను మోహరించటమే గాదు, స్వల్ప ఘర్షణలు కూడా చోటుచేసుకున్నాయి. దాన్ని వినియోగించుకొని సోవియట్‌ను దెబ్బతీసేందుకు అమెరికన్లు ప్రజా చైనాను గుర్తించి భద్రతా మండలిలో ప్రాతినిధ్యానికి అంగీకరించారన్నది ఒక అభిప్రాయం. తమ సమస్యల నుంచి బయటపడేందుకు విదేశాలకు మార్కెట్‌ను తెరిచే సంస్కరణలు అవసరమని చైనా కమ్యూనిస్టు పార్టీ నిర్ణయించింది. ఈ అవకాశాన్ని అక్కడ ఉన్న విస్తారమైన శ్రమశక్తిని కారుచౌకగా పొందేందుకు, మార్కెట్లో ప్రవేశించేందుకు అమెరికా వినియోగించుకుందన్నది మరొక సూత్రీకరణ. అంతిమంగా నాలుగు దశాబ్దాల అనుభవంలో ఎవరు ఎవరిని వినియోగించుకున్నారని బేరీజు వేస్తే ఎగుమతులతో చైనా దిగుమతులతో అమెరికా, ఐరోపా లబ్దిపొందాయి. కొన్ని లాటిన్‌ అమెరికా దేశాలు ఎగుమతి ఆధారిత వ్యవస్థలతో కొనసాగిన మాదిరి చైనా కూడా అలాగే ఉంటుందని భావించిన అమెరికా ఘోరంగా దెబ్బతిన్నది. అన్ని రంగాలలో తననే సవాలు చేసే విధంగా మారుతుందని అది అంచనా వేయలేకపోయింది, గుర్తించేసరికే తమ చేతులు దాటిపోయినట్లు గమనించింది. దాని పర్యవసానమే డోనాల్డ్‌ ట్రంప్‌ తొలి పాలనా కాలంలో ప్రారంభించిన వాణిజ్య యుద్ధం. ఇప్పుడు దాని కొనసాగింపుతో మరోసారి ముందుకు పోనున్నట్లు సూచనలు.


చైనా గురించి మరోసారి అమెరికా అంచనాలు తప్పనున్నాయా ? అట్లాంటిక్‌ పత్రిక వ్యాఖ్యాత కథనం చైనాకు ప్రపంచాన్ని అప్పగించనున్న ట్రంప్‌ అంటూ సాగింది. ఇది సామ్రాజ్యవాదుల కోణంలో ఆలోచిస్తున్నవారి బుర్రలో పుట్టిన బుద్ది అని చెప్పవచ్చు.‘‘ అమెరికా ప్రపంచ నాయకత్వం ముగుస్తున్నది. ఇది అమెరికా దిగజారి లేదా బహుధృవ ప్రపంచం ఉనికిలోకి వచ్చి కాదు లేదా అమెరికా ప్రత్యర్ధుల చర్యలతో జరుగుతున్నది కాదు. నాయకత్వ ముగింపు ఎందుకంటే అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ దానికి ముగింపు పలకాలని కోరుకుంటున్నాడు గనుక. ఇంటా బయటా ట్రంప్‌ విధానాలు అత్యంత వేగంగా అమెరికా అధికార పునాదులను నాశనం చేస్తున్నాయి. ప్రపంచ అగ్రశక్తిగా ప్రస్తుతం అమెరికాను పక్కకు నెట్టి దాని స్థానాన్ని ఆక్రమించాలని చూస్తున్న చైనా నేత షీ జంపింగ్‌ ప్రధాన లబ్దిదారు అవుతాడు. ప్రపంచాన్ని హ్రస్వదృష్టితో చూస్తున్న ట్రంప్‌కు తానేం చేస్తున్నదీ తెలియటం లేదు, అతడి చర్యలు అంతర్జాతీయ భద్రతకు ముప్పు తెస్తున్నాయని, అమెరికా భవిష్యత్‌ కూడా దానితోనే ముడిపడి ఉందని తెలుసుకోలేకపోతున్నాడు, అమెరికా వదలిన ఖాళీలో చైనా ప్రవేశాన్ని ఇతర ధనిక దేశాలు అడ్డుకోవలేవంటూ ఆ పత్రిక విశ్లేషణ కొనసాగింది.


వాణిజ్య యుద్దం గురించి అమెరికా గతంలో వేసుకున్న అంచనాలు తప్పాయి. 2024లో అమెరికా వాణిజ్య లోటు లక్ష కోట్ల డాలర్లుగా ఉంటే చైనా వాణిజ్య మిగులు కూడా అంతే ఉంది. అమెరికా, ఐరోపాలో కోల్పోయిన మార్కెట్లను మరోచోట పొందేందుకు చైనా ముందుకు పోతున్నది.ట్రంప్‌ ప్రకటించినట్లుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ వంటి వాటి నుంచి అమెరికా వైదొలిగినా, యూఎస్‌ఎయిడ్‌ ఆకస్మికంగా నిలిపివేసినా ఆ స్థానాన్ని చైనా ఆక్రమిస్తుందని కొందరు ఇప్పటికే హెచ్చరించారు. ఇప్పటి వరకు ఉద్దరించే పేరుతో సాయం బిస్కెట్లతో పలు దేశాల్లో పాగా వేయాలని చూసిన అగ్రదేశపు అమెరికా ఎత్తుగడ ఫలించలేదు. అలాంటిది అంతశక్తిలేని చైనా వల్ల అవుతుందా ? నిజానికి చైనా నేరుగా అప్పులిస్తున్నది తప్ప అమెరికా, జపాన్‌, మరొక ధనిక దేశం మాదిరి సాయం పేరుతో షరతులతో కూడిన నిధులు ఇవ్వటం లేదు, అలాంటి ఏర్పాట్లు కూడా లేవు. అమెరికా సాయం పొంది బాగుపడిన దేశాలేమిటంటే ఎవరూ చెప్పలేరు, కానీ అనేక దేశాలలో మౌలిక సదుపాయాలలో చైనా పెట్టుబడుల ఫలితాలు కనిపిస్తున్నాయి. చరిత్రలో మార్కెట్ల కోసం ఏకంగా దేశాలనే ఆక్రమించుకోవటం తెలిసిందే. తొలి వాణిజ్య యుద్దం చైనా`బ్రిటన్‌ మధ్య నల్లమందు దిగుమతుల మీద జరిగింది.రెండవది కూడా అదే సమస్య మీద బ్రిటన్‌, ఫ్రాన్స్‌ కలసి చేశాయి. తొలి యుద్దంలో నల్లమందును ధ్వంసం చేసినందుకు చైనా నష్టపరిహారం చెల్లించటంతో పాటు హాంకాంగ్‌ దీవులను బ్రిటన్‌కు 99 సంవత్సరాల పాటు కౌలుకు ఇచ్చేందుకు ఒప్పందం జరిగింది. రెండవ యుద్దంలో నల్లమందు విక్రయాలను చట్టపరంచేసేందుకు ఒప్పందాన్ని రుద్దారు. వర్తమాన వాణిజ్య యుద్దాన్ని చైనా మీద అమెరికా 2018లో ప్రారంభించింది.ట్రంప్‌ దిగిపోయినా బైడెన్‌ కొనసాగించాడు, తిరిగి ట్రంప్‌ వచ్చాడు. అప్పటికీ ఇప్పటికీ తేడా ఏమిటంటే అప్పుడూ చైనా కుంగిపోలేదు, ఇప్పుడు మరింత సమర్ధవంతంగా ఎదుర్కొనే బలాన్ని కలిగి ఉంది.వాణిజ్యపోరు కరెన్సీ పోరుకు విస్తరించింది.

కెనడా, మెక్సికోల మీద 25శాతం పన్ను విధిస్తానన్న ట్రంప్‌ చైనా దగ్గరకు వచ్చేసరికి పదిశాతమే అన్నాడు.నిజానికి 2024లో జో బైడెన్‌ చైనా నుంచి దిగుమతి చేసుకొనే విద్యుత్‌ వాహనాలపై 100, సోలార్‌ సెల్స్‌, సెమీ కండక్టర్ల మీద 50, లిథియం అయాన్‌ బాటరీలపై 25శాతం చొప్పున దిగుమతి సుంకాలు విధించాడు. తాజాగా ట్రంప్‌ చేసిన ప్రకటనను అసలు చైనా పట్టించుకోలేదనే చెప్పాలి. కొన్ని నామమాత్ర చర్యలు తీసుకుంది. అవి అమెరికా నుంచి దిగుమతయ్యే వాటిలో పదో వంతు వస్తువుల మీదనే అని వార్తలు.పెద్ద మొత్తంలో సుంకాలు విధిస్తే ఎక్కువగా నష్టపోయేది అమెరికాయే గనుక ఎంతవరకు ముందుకు పోతుందో చూద్దాం అన్నట్లుగా చైనా ఉంది. ఎనిమిదేండ్ల నాటితో పోలిస్తే తాజా బెదిరింపు లెక్కలోది కాదని భావిస్తోంది. అందుకే ట్రంప్‌ ప్రకటనలను అది ఖాతరు చేయటం లేదు.దీని అర్ధం అసలేమీ ప్రతికూల ప్రభావాలు ఉండవని కాదు.


ట్రంప్‌ తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదం అవుతున్న పూర్వరంగంలో అమెరికా పాలకవర్గం చూస్తూ ఊరుకుంటుందా ? శత్రువుగా పరిగణించే చైనాతో పాటు తన కనుసన్నలలో నడిచే కెనడా, మెక్సికో, ఐరోపా దేశాలు, చేతులు కలిపేందుకు తహతహలాడుతున్న భారత్‌ మీద కూడా బస్తీమే సవాల్‌ అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. ఆయా దేశాలతో బేరమాడేందుకు అయితే సరే, మొదటికే మోసం వస్తే పాలకవర్గం సహించే సమస్యే లేదు. దాని డిఎన్‌ఏలో ఎలాంటి మార్పులు ఉండవు. ఎన్నికల్లో ఓటర్లు ఎక్కువగా పాల్గ్గొనేందుకు ప్రోత్సహించటానికి మనమెందుకు డబ్బు ఇవ్వాలంటూ ట్రంప్‌ చేసిన ప్రకటన అమెరికా సామాన్యులను ఆకట్టుకుంటుందనటంలో ఎలాంటి సందేహం లేదు. కానీ సాయం పేరుతో జరుపుతున్న కార్యకలాపాలు వేరు. ఇప్పటి వరకు జరిపిన వాటితో ఫలితం లేకపోతే సమీక్షల తరువాత కొత్త రూపాలతో అమెరికా రంగంలోకి దిగుతుంది తప్ప వెనక్కు తగ్గే అవకాశం లేదు !ఉక్రెయిన్‌ విషయంలో ట్రంప్‌ ఎన్ని మాటలు చెప్పినప్పటికీ వైఖరిని మార్చుకోవటానికి ఇప్పటికీ సమయం మించిపోలేదని, రష్యన్ల ఊబిలో చిక్కుకోవద్దని అమెరికా మేథోమధనంలో నిమగ్నమైన వారు సూచిస్తున్నారు.అమెరికాను ప్రధమ శత్రువుగా పరిగణిస్తున్న రష్యాను దగ్గరకు తీసుకోవాలను కోవటం జరిగేది కాదని, కనిపిస్తున్నదానికి భిన్నంగా ఉక్రెయిన్‌ ఇంకా ఓడిపోలేదని లేదా అమెరికాతో సంబంధాలు తెగలేదని, తన చర్యలు స్వయం ఓటమికి దారితీస్తాయని గ్రహిస్తే ట్రంప్‌ యంత్రాంగం ప్రకటించినదానికి పూర్తి విరుద్దమైన వైఖరిని తీసుకోవటానికి విముఖత చూపకపోవచ్చని ఛాతమ్‌ హౌస్‌ విశ్లేషణలో పేర్కొనటం గమనించదగిన అంశం. సామ్రాజ్యవాదులు ఏది లబ్ది అనుకుంటే దానికి మొగ్గుచూపుతారనటంలో ఎలాంటి సందేహం లేదు. అయితే వారు కూడా పప్పులో కాలేసిన చరిత్రను కూడా మరచిపోరాదు. ఎవరి మీదా భ్రమలు పెట్టుకోనవసరం లేదు. ఏం జరుగుతుందో చూద్దాం !

Share this:

  • Tweet
  • More
Like Loading...

అమెరికా సాయం అసలు కథేంటి ? మోడీ సర్కార్‌ ఎందుకు మౌనంగా ఉన్నట్లు ?

22 Saturday Feb 2025

Posted by raomk in Africa, BJP, CHINA, Congress, COUNTRIES, Current Affairs, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Politics, USA

≈ Leave a comment

Tags

BJP, China, Donald trump, Joe Biden, Narendra Modi Failures, RSS, sangh parivar, USAID

ఎం కోటేశ్వరరావు


మన ఎన్నికలలో ఓటర్లు ఎక్కువగా పాల్గొనేందుకు ప్రోత్సాహ చర్యలు తీసుకొనేందుకు అమెరికా ప్రభుత్వ ఆధ్వర్యాన నడిచే ఏజన్సీ ఫర్‌ ఇంటర్నేషనల్‌ డెవలప్‌మెంట్‌ (యూఎస్‌ఎయిడ్‌) సంస్థ 21 మిలియన్‌ డాలర్లు (రు.182 కోట్లు) మంజూరు చేసింది. దీన్ని జో బైడెన్‌ సర్కార్‌ కేటాయిస్తే డోనాల్డ్‌ ట్రంప్‌ సర్కార్‌ ఆ నిర్ణయాన్ని 90 రోజుల పాటు స్థంభింపచేస్తూ జనవరి 20న ట్రంప్‌ ఆదేశాలు జారీ చేశాడు. నిజానికి ఈ మొత్తాన్నే కాదు, ప్రపంచమంతటా వివిధ దేశాలకు ఇస్తున్న మొత్తాలపై ఈ నిర్ణయం జరిగింది. భారత్‌ దగ్గర చాలా డబ్బుంది, అక్కడ ఓటర్లను ప్రోత్సహించేందుకు మనమెందుకు డబ్బివ్వాలంటూ ట్రంప్‌ ఇటీవల వ్యాఖ్యానించాడు. ఈ సొమ్మును గతంలో ఇచ్చారా, రాబోయే రోజుల్లో ఖర్చుచేసేందుకు మంజూరు చేశారా, విడుదల చేశారా లేదా అన్నది స్పష్టం కావాల్సి ఉంది. బిజెపి నేతలు అమిత్‌ మాలవీయ, రాజీవ్‌ చంద్రశేఖర్‌ల స్పందన చూస్తే ఈ మొత్తం ఖర్చు చేసినట్లుగా అర్ధం అవుతున్నది. ‘‘ ఓటర్లు బారులు తీరేందుకు 21 మిలియన్‌ డాలర్లా ? ఇది కచ్చితంగా భారత్‌ ఎన్నికల ప్రక్రియలో విదేశీ జోక్యమే. దీన్నుంచి ఎవరు లబ్ది పొందారు ? అధికారపక్షమైతే కచ్చితంగా కాదు ’’ అని అమిత్‌ మాలవీయ చెప్పారు. రాజుగారి చిన్న భార్య అందగత్తె అంటే పెద్ద భార్య అనాకారి అనేకదా అన్నట్లుగా అధికారంలో ఉన్న బిజెపి గాకపోతే కాంగ్రెస్‌ లబ్దిపొందినట్లు ఆరోపించటమే కదా ? ఈ మాత్రం అర్ధం చేసుకోలేనంత అమాయకంగా మన జనాలు ఉన్నారా ?ప్రజాస్వామ్యాలను బలహీనపరచటం, జోక్యం చేసుకోవాటానికి ఇది నిదర్శనం అని మాజీ కేంద్ర మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ ప్రకటించారు.ఒక వైపు ప్రజాస్వామిక విలువల గురించి చర్చ చేస్తూ మరోవైపు నిర్లజ్జగా ప్రజాస్వామిక దేశాలను బలహీనపరిచేందుకు పూనుకోవటం దిగ్భ్రాంతి కలిగిస్తున్నదన్నారు. దీని మీద కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి వివరణ ఇవ్వలేదు. శుక్రవారం నాడు విదేశాంగశాఖ ప్రతినిధి మాట్లాడుతూ తామీ సమాచారాన్ని చూశామని, సహజంగానే ఇది ఎంతో ఆందోళన కలిగిస్తుంది, భారత అంతర్గత వ్యవహారాల్లో విదేశీ జోక్యం గురించి ఆందోళనకు దారి తీసింది. సంబంధిత శాఖలు, ఏజన్సీలు దీని గురించి చూస్తున్నాయి, ఈ దశలో బహిరంగంగా ప్రకటించటం తొందరపాటు అవుతుంది,తరువాత చెబుతాము అన్నారు.

నిజానికి ఇంత స్వల్ప మొత్తంతో ప్రభావితమై ఒక రాష్ట్రం లేదా దేశంలో ఓటర్లు కుప్పలు తెప్పలుగా పోలింగ్‌ కేంద్రాలకు వచ్చి ఓట్లు వేస్తారా ? ఒక్కో ఎంపీ అభ్యర్థి వంద కోట్లు, ఎంఎల్‌ఏ పాతిక కోట్ల వరకు ఖర్చు పెడుతుంటేనే మాకు ఇవ్వాల్సింది ఇవ్వలేదు, వేరేవారికి ఎక్కువ ఇచ్చారంటూ నిరసనలతో అందరూ రావటం లేదు. ఏ మూలన చీమ చిటుక్కుమన్నా పసిగట్టే అమెరికన్లకు ఇంత చిన్న విషయం తెలియదా ? తామిచ్చే 182 కోట్లతో ఓటర్లు బారులు తీరతారా ? సాక్షాత్తూ అమెరికా ప్రభుత్వం వెల్లడిరచిన ఈ అంశం మీడియాలో చర్చకు దారితీసింది. వాస్తవాలను వెల్లడిరచేవరకు ఇది చర్చలో ఉంటుంది. సూది కోసం సోదికి పోతే పాత బాగోతాలన్నీ బయటపడినట్లు ఈ వ్యవహారంలో ఎంత పాత్ర ఉందో తెలియదు గానీ అమెరికాలో స్థిరపడిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వీణా రెడ్డి అనే ఆమె 2021 ఆగస్టు నుంచి 2024 జూలై వరకు అమెరికా సాయ ఏజన్సీ భారత డైరెక్టర్‌గా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఎవరినో గెలిపించేందుకు ప్రయత్నించారని తాను ఊహిస్తున్నట్లు ట్రంప్‌ ఒక సాధారణ వ్యాఖ్య చేశాడు. 2014కు ముందు పెద్ద మొత్తంలో అమెరికా సాయం వచ్చిందని, తాము అధికారంలోకి వచ్చాక నామమాత్రమని బిజెపి పెద్దలు చెబుతున్నారు. అదే నిజమైతే ఆ సొమ్మును మోడీ గెలుపుకోసం వినియోగించినట్లు ఎందుకు భావించకూడదు ? ఒక వేళ కాంగ్రెస్‌ కోసం ఖర్చు చేసి ఉంటే పదేండ్ల నుంచి బిజెపి పాలకులు నిజాల నిగ్గుతేల్చకుండా ఏ గుడ్డి గుర్రాలకు పండ్లుతోముతున్నట్లు ? బిజెపి మాజీ ఎంపీ మహేష్‌ జత్మలానీ వీణా రెడ్డి గురించి ఒక ట్వీట్‌ చేశారు. ఎన్నికలు ముగిసిన తరువాత ఆమె అమెరికా వెళ్లారని ఇక్కడ ఉంటే దర్యాప్తు సంస్థలు ఈ సొమ్ము గురించి ప్రశ్నించి ఉండేవారన్నారు. తప్పించుకుపోయారన్న అర్ధం దీని వెనుక ఉంది. అమెరికాలో ఉంటే మాత్రం మన కేంద్ర ప్రభుత్వానికి అడిగే అవకాశం లేదా ? యూఎస్‌ఎయిడ్‌ ప్రభుత్వ సంస్థ, అందువలన నేరుగా మన ప్రభుత్వమే వివరాలు ఇవ్వాలని ఈ పాటికే ఎందుకు అడగలేదు ? జనానికి చెవుల్లో కమలంపూలు పెడుతున్నట్లుగా ఉంది. అమెరికా ప్రభుత్వ సమాచారాన్ని ఉటంకించిన ఇండియా టుడే వార్త ప్రకారం వీణా రెడ్డి హయాంలో మన దేశానికి అమెరికా సాయం రు.720 కోట్ల నుంచి 2022లో రు.2,500 కోట్లకు పెరిగినట్లు, 2023లో రు.1,515 కోట్లు, 2024లో రు.1,304 కోట్లు వచ్చాయి. ఈ సొమ్మును దేనికి ఖర్చు చేశారో నిగ్గుతేల్చాల్సింది పోయి, కాంగ్రెస్‌ మీద మరొక పార్టీ మీద నిందలు వేస్తే కుదరుతుందా ? ఓటర్లను పెద్ద ఎత్తున రప్పించేందుకు ఇచ్చినట్లు చెబుతున్న 21మిలియన్‌ డాలర్లు(రు.182 కోట్లు) అమెరికా కేంద్రంగా పని చేస్తున్న కన్సార్టియం ఫర్‌ ఎలక్షన్స్‌ అండ్‌ పొలిటికల్‌ ప్రోసెస్‌ స్ట్రెంతనింగ్‌`సిఇపిపిఎస్‌( ఎన్నికలు, రాజకీయ క్రమాన్ని పటిష్ట పరిచేందుకు ఏర్పడిన సహవ్యవస్థ)కు కేటాయించారు. ఇది అమెరికాలో ఉన్న ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్‌ ఫర్‌ ఎలక్ట్రొరల్‌ సిస్టమ్స్‌, ఇంటర్నేషనల్‌ రిపబ్లికన్‌ ఇనిస్టిట్యూట్‌, నేషనల్‌ డెమోక్రటిక్‌ ఇనిస్టిట్యూట్‌ అనే సంస్థలతో కూడిన కూటమి. ఎలన్‌ మస్క్‌ నిర్వహిస్తున్న ప్రభుత్వ సామర్ధ్య శాఖ(డోజె) వెల్లడిరచిన సమాచారమే ఇది.

సాయం పేరుతో ఎంత ఖర్చు చేస్తే అంతగా ఆర్థికంగా, రాజకీయంగా అమెరికా లబ్ది పొందింది తప్ప ఊరికే ఒక్క డాలరు కూడా వెచ్చించలేదు.అమెరికా సాయ సంస్థ 1949లో అధ్యక్షుడు ట్రూమన్‌ హయాం నుంచి తరువాత కాలంలో అనేక మార్పులు, చేర్పులతో సహా అనేక దేశాలకు నిధులు కేటాయిస్తున్నది. వాటిని కమ్యూనిస్టు వ్యతిరేక, తనను వ్యతిరేకించే దేశాలకు వ్యతిరేకంగా ప్రచారం, కుట్రలు, పాలకులు, ప్రభుత్వాలను కూలదోయటం, అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులను ఆకట్టుకొనేందుకు, ఉగ్రవాదులతో సహా ఎన్‌జిఓలు, మరొక పేరుతో ప్రపంచ మంతటా తన తొత్తులను, విద్రోహులను సమకూర్చుకోవటం దానిపని. అందుకోసం ప్రపంచమంతటా పదివేల మంది సిబ్బంది, ఏటా వందబిలియన్‌ డాలర్ల వరకు బడ్జెట్‌తో నడుస్తున్నది. గూఢచార సంస్థ సిఐఏతో అనుసంధానించుకొని ప్రజాస్వామిక సంస్కరణలు, అభివృద్ధి పేరుతో కథనడిపిస్తున్నది. మన దేశం, చైనాకు వ్యతిరేకంగా కుట్రలు చేసేందుకు 2004లో మిలీనియం ఛాలెంజ్‌ కార్పొరేషన్‌ (ఎంసిసి) ఏర్పాటు చేసి శ్రీలంక, నేపాల్‌ దేశాలను దానిలో చేరాలని వత్తిడి చేసింది. మొత్తం 29 దేశాలతో 2019 నాటికి 37 ఒప్పందాలు చేసుకుంది. 1990కి ముందు సోవియట్‌ యూనియన్‌తో ప్రచ్చన్న యుద్ధం సాగించిన కాలంలో దాని పనితీరు ఒక విధంగా ఉంటే తరువాత కొన్ని మార్పులు చేసుకుంది. అవి ఏవైనప్పటికీ ప్రపంచంలో మార్కెట్‌ సంస్కరణలతో సహా అమెరికా ప్రయోజనాలకు అనుగుణమైనవి, రాజకీయంగా వ్యతిరేకించేవారిని లక్ష్యంగా చేసుకున్నవే. తమ మిలిటరీ, రాజకీయ ఎత్తుగడలో భాగంగా ముందుకు తెచ్చిన క్వాడ్‌ కూటమిలో చేరాలని బంగ్లాదేశ్‌పై అమెరికా వత్తిడి తెచ్చింది. చిట్టగాంగ్‌ ప్రాంతంలోని సెయింట్‌ మార్టిన్‌ దీవిని తమకు కౌలుకు ఇవ్వాలని, అక్కడ మిలిటరీ కేంద్రం ఏర్పాటు చేస్తామని చేసిన ప్రతిపాదనను షేక్‌ హసీనా వ్యతిరేకించారు. ఆ కారణంగానే ప్రభుత్వాన్ని కూల్చివేసి, ఆమెను దేశం నుంచి తరిమివేసిన శక్తుల వెనుక ‘‘ అమెరికా సాయం ’’ ఉందని వార్తలు వచ్చాయి. నిజానికి ఆ కేంద్రాన్ని చైనాను దెబ్బతీయాలని చెప్పినప్పటికీ అది మన దేశానికీ ముప్పు తలపెట్టేదే.


ప్రజాస్వామ్యం, స్వేచ్చా మార్కెట్‌ ఆర్థిక వ్యవస్థ పేరుతో రెండు దశాబ్దాల పాటు ఆఫ్ఘనిస్తాన్‌ దురాక్రమణకు అమెరికా దాదాపు రెండులక్షల కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. దీనిలో అభివృద్ధి కోసం చేసిన ఖర్చు కేవలం 3,240 కోట్ల డాలర్లు మాత్రమే ఉంది. చివరకు తాలిబాన్లకు సలాం గొట్టి అన్నింటినీ వదలివేసి 2021 అమెరికా సేనలు అక్కడి నుంచి పారిపోయాయి. తమ సాయం ఆకలి, దారిద్య్ర నిర్మూలన, విద్య, వైద్యం వంటి వాటికి ఖర్చు చేస్తున్నట్లు అమెరికా చెబుతుంది. ఇరవై ఏండ్ల దురాక్రమణ తరువాత అక్కడ చూస్తే సర్వనాశనం. ముఫ్పైవేల మంది పౌరులతో సహా 1.74లక్షల మంది ఆప్ఘన్‌లు మరణించారు, 30లక్షల మంది పిల్లలు బడికి దూరం, 1.89 కోట్ల మంది తీవ్రమైన ఆహార కొరతను ఎదుర్కొన్నారు.తాలిబాన్లతో సాగించిన పోరులో భయానక చర్యలెన్నో. 950 కోట్ల డాలర్ల మేర ఆఫ్ఘన్‌ జాతీయ సంపదలను దోచుకున్నారు. ఇలాంటి ఉదాహరణలను ఎన్నో చెప్పవచ్చు. మన దేశంలో కాశ్మీరు, పంజాబ్‌, ఈశాన్య రాష్ట్రాల వేర్పాటు వాదులు, ఉగ్రవాదుల వెనుక అమెరికా సాయ హస్తం గురించి చెప్పుకోనవసరం లేదు. హాంకాంగ్‌ స్వాతంత్య్రం పేరుతో గతంలో విద్యార్థులను రెచ్చగొట్టి రోడ్లెక్కించటం వెనుక, చైనాలో అంతర్భాగంగా ఐరాస గుర్తించిన తైవాన్‌ స్వాతంత్య్ర నినాదం, టిబెట్‌ వేర్పాటు వాదుల వెనుక అమెరికా హస్తం, సాయం బహిరంగ రహస్యమే.


అమెరికా మేథో సంస్థ కౌన్సిల్‌ ఆన్‌ ఫారిన్‌ రిలేషన్స్‌(సిఎఫ్‌ఆర్‌) ఫిబ్రవరి ఏడవ తేదీన రాసిన విశ్లేషణలో ప్రతి ఏటా అమెరికా సాయం ఎలా ఉంటుందో వెల్లడిరచింది. 2023 సంవత్సరంలో ప్రపంచవ్యాపితంగా 7,200 కోట్ల డాలర్లను అందించగా దానిలో 61శాతం యుఎస్‌ఎయిడ్‌ ద్వారా పంపిణీ జరిగింది. దీని ద్వారా జరుగుతున్నట్లు చెబుతున్న సాయంలో ఒక డాలరులోని వంద సెంట్లకు గాను 10 నుంచి 30 మాత్రమే అవసరమైన వారికి అందుతున్నదని ఇటీవల సిబిఎస్‌ మీడియాతో అమెరికా ఎంపీ బ్రియాన్‌ మాస్ట్‌ చెప్పాడు. చైనా తప్పుడు ప్రభావాన్ని ఎదుర్కొనే పేరుతో 2024 సెప్టెంబరులో 32.5 కోట్ల డాలర్లను అమెరికా పార్లమెంటు మంజూరు చేసింది.2023 నుంచి 2027వరకు ఇదే కార్యక్రమాలకు మొత్తం 162.5 కోట్ల డాలర్లను ఖర్చు చేసేందుకు నిర్ణయించారు. ఇంత మొత్తాన్ని ఎవరి పర్యవేక్షణలో ఎలా ఖర్చు చేస్తారో వెల్లడిరచలేదు గానీ యుఎస్‌ఎయిడ్‌ ప్రతినిధే ఉంటాడు. ఎందుకు ? ఎలా అంటే 2021లో జింబాబ్వే బడా పత్రిక హెరాల్డ్‌ అసలు విషయాన్ని వెల్లడిరచింది. ఆఫ్రికా ఖండంలో చైనా పెట్టుబడుల గురించి తప్పుడు వార్తలను ఎలా వండాలో స్థానిక విలేకర్లకు శిక్షణ ఇచ్చేందుకు అమెరికా నిధులు అందచేసిందట. మన దేశంలో కొన్ని పత్రికలు, టీవీలలో వస్తున్న కథనాలు, విశ్లేషణల వెనుక అమెరికా సాయం ఉందంటే తప్పు పట్టాలా ?

అమెరికా సాయాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించగానే కొంత మంది సరికొత్త పల్లవి అందుకున్నారు. ఇప్పటికే బిఆర్‌ఐ పథకాలతో అనేక దేశాలలో చైనా పాగా వేస్తున్నదని, ఇప్పుడు అమెరికా సాయం ఆగిపోతే అది మరింతగా విస్తరించి అనేక దేశాలను అదుపులోకి తీసుకుంటుందనే పాటపాడుతున్నారు. ఇది రెండు అంశాలను తేటతెల్లం చేస్తున్నది. ఒకటి ఇన్ని దశాబ్దాలుగా సాయం పేరుతో అమెరికా తన ఆధిపత్యం కోసం ప్రయత్నించిందని నిర్ధారించటం, మరొకటి చైనా ఆధిపత్యం పెరుగుతుందనే భయాన్ని రెచ్చగొట్టటం. ఇంతకు ముందే చెప్పుకున్నట్లుగా ఆఫ్ఘనిస్తాన్‌లో సోవియట్‌ జోక్యాన్ని నివారించే పేరుతో తాలిబాన్లను తయారు చేయటం, తరువాత ఏకుమేకైన వారి మీదే పోరు సాగించిన అమెరికా మాదిరి ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడైనా చైనా వ్యవహరించిందా ? రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత రెండు కొరియాలు ఐక్యం కావాల్సి ఉండగా దాన్ని పడనీయకుండా దక్షిణ కొరియాలో అమెరికా మిలిటరీ తిష్టవేసి కొనసాగిస్తున్నది. ఆ మాదిరి చైనా ఎక్కడైనా కేంద్రాలను ఏర్పాటు చేసిందా ? అమెరికా సాయం పేరుతో మన దేశంలో సాగించిన తప్పుడు పనులను బహిర్గతం చేసేందుకు మోడీ సర్కార్‌ ముందుకు వస్తుందా ? వాటిలో సంఘపరివార్‌ సంస్థలేమైనా ఉంటే అసలు రంగు బయటపడుతుందని భయపడి మూసి పెడుతుందా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

అసలేం జరుగుతోంది ! ఉక్రెయిన్‌పై క్షణక్షణానికి మారుతున్న మాటలు !

19 Wednesday Feb 2025

Posted by raomk in Current Affairs, Europe, Germany, History, imperialism, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, USA, WAR

≈ Leave a comment

Tags

Donald trump, Joe Biden, Ukraine crisis, Vladimir Putin

ఎం కోటేశ్వరరావు


అమెరికా అధినేత డోనాల్డ్‌ ట్రంప్‌ రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఫిబ్రవరి 12న జరిపిన ఫోన్‌ సంభాషణ ప్రపంచంలో ఎంతో ఆసక్తి రేపింది. ఉక్రెయిన్‌ సమస్య పరిష్కారానికి చర్చలు జరపనున్నట్లు ప్రకటించాడు. పరస్పర విరుద్ద వార్తలు, వ్యాఖ్యానాలు, విశ్లేషణలు, ఉక్రెయిన్‌ సంక్షోభం ముగింపు గురించి నేతలు చేస్తున్న ప్రకటనలు చూస్తుంటే అసలేం జరుగుతోంది అని సామాన్యుడు ఎటూ తేల్చుకోలేని స్థితి. ఒక ప్రకటన, పరిణామం వాస్తవం అనుకుంటే తలెత్తే సందేహాలు ఎన్నో. మంగళవారం నాడు సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో అమెరికారష్యా ఉన్నత ప్రతినిధి వర్గాలు భేటీ అయ్యాయి. చర్చలను కొనసాగించాలని నిర్ణయించారు. డోనాల్డ్‌ ట్రంప్‌వ్లదిమిర్‌ పుతిన్‌ కూడా అక్కడి చేరుకోవచ్చని వార్తలు వాస్తవం కాదని, ఇంకా ఎలాంటి నిర్ణయం జరగలేదని ప్రకటించారు. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెనెస్కీ బుధవారం నాడు అక్కడికి చేరుకోనున్నట్లు వార్త. ఐరోపాకు చర్చల్లో ఎలాంటి ప్రమేయం ఉండదనే ఊహాగానాల పూర్వరంగంలో సోమవారం నాడు పారిస్‌లో కొన్ని దేశాల నేతలు సమావేశం జరిపి పరిస్థితిని సమీక్షించారు. ఉక్రెయిన్‌పై 2022 ఫిబ్రవరి 24న రష్యా సైనిక చర్య ప్రారంభమైంది. వేగంగా మారుతున్న పరిణామాలను చూస్తే నాలుగో ఏడాదిలో ప్రవేశించక ముందే దానికి ముగింపు పలుకుతారా ? ఈ సమస్యను ఇంత సులభంగా పరిష్కరించే అవకాశం ఉంటే మూడు సంవత్సరాలు ఎందుకు కొనసాగించినట్లు ? కోట్లాది మంది జనాలను, అనేక దేశాలను ఎందుకు ఇబ్బందులు పెట్టినట్లు ? దీనికి ఎవరిది బాధ్యత ? ఎంతో సంక్లిష్టమైన ఈ వివాదం ఒక్క భేటీతో నాటకీయంగా ముగుస్తుందా ? చర్చల పేరుతో కొత్త ఎత్తుగడలకు ప్రాతిపదిక వేస్తున్నారా?


జెలెనెస్కీ, ఐరోపా సమాఖ్యతో నిమిత్తం లేకుండానే చర్చలు జరిపి ఒక ముగింపు పలుకుతామని అమెరికన్లు చెప్పారు. తమతో నిమిత్తం లేకుండా జరిగే చర్చలను అంగీకరించేది లేదని జెలెనెస్కీ ప్రకటించాడు. పుతిన్‌ అబద్దాల కోరు, అసలు తమకు చర్చల గురించి సమాచారమే లేదన్నాడు. ముసాయిదా ప్రతిపాదనల్లో తమ భద్రతకు ఎలాంటి హామీ లేదన్నాడు. తమకూ అంగీకారం కాదని ఐరోపా దేశాలు స్పష్టం చేశాయి. మరి జెలెనెస్కీ సతీసమేతంగా రియాద్‌ ఎందుకు వస్తున్నారంటే ‘‘ అది ఎప్పుడో నిర్ణయించిన పర్యటన ’’ అని అతగాడి ప్రతినిధి వివరణ ఇచ్చాడు. రష్యాఉక్రెయిన్‌ ఖైదీల మార్పిడి గురించి చర్చలు జరిపేందుకు జెలెనెస్కీ ఆదివారం నాడు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ చేరుకున్నాడు. సౌదీ పర్యటన గురించి గతంలో ఎలాంటి వార్తా లేదు. ఎవరి ప్రమేయం లేకుండా చర్చలు జరుగుతాయని ట్రంప్‌ సలహాదారులు స్పష్టంగా చెప్పారు. దానికి పూర్తి విరుద్దంగా శాంతి చర్చల్లో జెలెనెస్కీ పాల్గొంటారని ఆదివారం నాడు డోనాల్డ్‌ ట్రంప్‌ చెప్పినట్లు రాయిటర్స్‌ వార్త పేర్కొన్నది. ఐరోపా నుంచి వ్యతిరేక స్పందన వెలువడటంతో అమెరికా మాట మార్చింది.సౌదీలో చర్చలకు అమెరికా ప్రతినిధివర్గ నేత మార్క్‌ రూబియో సిబిఎస్‌ టీవీతో మాట్లాడుతూ అసలు పుతిన్‌ నిజంగా చిత్తశుద్దితో ఉన్నాడా లేదా అన్నది పరీక్షించేందుకు చర్చలను ముందుకు తెచ్చామని, నిజమైన సంప్రదింపుల్లో ఉక్రెయిన్‌, ఐరోపాకు భాగస్వామ్యం ఉంటుందని చెప్పాడు. ఎందుకంటే రష్యాపై ఆంక్షల్లో ఐరోపా కూడా ఉందన్నాడు. పైకి ఏమి చెప్పినప్పటికీ అమెరికా అధికారులు ప్రయివేటు సంభాషణల్లో ఐరోపా వారితో మీ అంగీకారం లేకుండా ఏదీ జరగదని చెబుతున్నట్లు మీడియా పేర్కొన్నది. ఏ రోటి దగ్గర ఆ పాట పాడినట్లు వ్యవహరిస్తున్నారా ? దీన్ని చూస్తుంటే పరిణామాలు ఏ మలుపు తిరిగేదీ ఊహించలేము.

ట్రంప్‌ ఫోన్‌ సంభాషణకు ముందు జరిగిన పరిణామాలను సింహావలోకనం చేసుకోవాల్సి ఉంది. ఉక్రెయిన్‌ పోరులో తాము చేసిన సాయం లేదా చేసిన ఖర్చును తిరిగి చెల్లించే స్థితిలో లేనందున ప్రతిగా టిటానియం,యురేనియం, లిథియం వంటి 500 బిలియన్ల విలువగల ఖనిజ సంపదలున్న ప్రాంతాల్లో సగం తమకు అప్పగించాలని అమెరికా బేరం పెట్టింది. దాని కోసం తన ఆర్థిక మంత్రి స్కాట్‌ బిసెంట్‌ను కీవ్‌ పంపిన సంగతి తెలిసిందే ప్రస్తుతం రష్యా, దాని అనుకూల శక్తుల ఆధీనంలో ఉన్న నాలుగో వంతు భూ భాగంలో ఈ ఖనిజాలు ఉన్నాయి. సంక్షోభానికి ముందు ఉన్న ప్రాంతాలు తిరిగి కావాలని కోరుకోవద్దని కూడా ట్రంప్‌ యంత్రాంగం జెలెనెస్కీకి సూచించింది. అలాంటపుడు ఖనిజాల గురించి ఎందుకు బేరం పెట్టినట్లు? రష్యాను అడ్డుకొనేందుకు ఐరోపా దేశాలు కూడా పెద్ద మొత్తంలో ఖర్చు చేశాయి. ఖనిజాలతో అమెరికా తన ఖర్చుతాను రాబట్టుకుంటే తమ సంగతేమిటని అవి ప్రశ్నిస్తాయి. అయితే సంక్షోభం ప్రారంభమైన తరువాత ఐరోపా దేశాలు 300 బిలియన్‌ డాలర్ల విలువగల రష్యన్‌ ఆస్తులను స్థంభింప చేశాయి. వాటిని స్వాధీనం చేసుకోవటం గురించి కొందరు ఆలోచనలు చేస్తున్నారు. దీనికి రష్యా అంగీకరించే సమస్యే ఉత్పన్నం కాదు.2014లో రష్యా స్వాధీనం చేసుకున్న క్రిమియా ద్వీపకల్పంతో సహా ఆక్రమిత ప్రాంతాలన్నింటినీ తమకు అప్పగించాలని జెలెనెస్కీ డిమాండ్‌ చేశాడు. ఒక వైపు చర్చల గురించి సిద్దం అవుతూనే రష్యా తన దాడులను కొనసాగిస్తూనే ఉంది. ఉక్రెయిన్‌ ప్రతిఘటన కూడా సాగుతోంది.

నువ్కొకందుకు పోస్తే నేనొకందుకు తాగాను అన్నట్లుగా పుతిన్‌ చాలా జాగ్రత్తగా స్పందిస్తున్నాడు. ఎవరూ ఎవరిని నమ్మే స్థితిలో లేరు. అమెరికాఐరోపా యూనియన్‌ మధ్య ఉన్న మిత్ర వైరుధ్యం ప్రస్తుతానికి శత్రు వైరుధ్యంగా మారుతుందని చెప్పలేము గానీ ట్రంప్‌ పుతిన్‌ ఫోన్‌ చర్చల తరువాత తేడా మరింత పెరిగింది. అలా అయితే ఏం చేయాలి ఇలాజరిగితే ఏం చేద్దామనే సంప్రదింపులు ఐరోపాలో ప్రాధమికంగా ప్రారంభమయ్యాయి. ఇప్పుడు ఐరోపా దేశాలన్నింటికీ కలిపి ఎంత మిలిటరీ ఉందో అంతకంటే ఎక్కువగా రష్యా కలిగి ఉంది. అందువలన ఆచితూచి అడుగేస్తున్నాయి. అది వాటి బలహీనత అయితే దాన్ని సొమ్ముచేసుకోవాలని చూడటం అమెరికా బలం. అమెరికాకు అగ్రపీఠం అనే తన అవగాహనను ట్రంప్‌ మరింత ముందుకు తీసుకుపోయేట్లయితే ఐరోపాకు దానితో ఘర్షణ పడటం లేదా లొంగిపోవటం తప్ప మరొక మార్గం లేదు. అమెరికా బలహీనతలు కూడా తెలిసినందున ఐరోపా ధనిక దేశాలు అంత తేలికగా సాగిలపడతాయని చెప్పలేము. ప్రపంచ బలాబలాల్లో కొత్త సమీకరణకు తెరలేచే అవకాశాలు కూడా ఉన్నాయి. అదే జరిగితే అమెరికా ఏకాకి అవుతుంది, దానికి సిద్దపడుతుందా ? అలాంటి అవకాశమే లేదని చెప్పవచ్చు.

ఐరోపా మీద డోనాల్డ్‌ ట్రంప్‌ దాడి అంటూ ఎకనమిస్టు పత్రిక ఒక వ్యాఖ్యా విశ్లేషణ చేసింది. ఉక్రెయిన్‌ మీద ఒక ఒప్పందం చేసుకొనేందుకు పుతిన్‌కు ట్రంప్‌ పంపిన ఆహ్వానం నాటో కూటమిని గందరగోళంలోకి నెట్టిందని పేర్కొన్నది. ఐరోపా భద్రతకు తామింకే మాత్రం ప్రాధమిక హామీదారుగా ఉండేది లేదంటూ ముందుగా అమెరికా రక్షణ మంత్రి పేట్‌ హెగ్‌సేత్‌ చేసిన ప్రకటన షాకిచ్చింది. కొద్ది గంటల తరువాత పుతిన్‌తో సంప్రదింపుల గురించి ట్రంప్‌ ప్రకటించాడు. ఆ తరువాత వార్షిక మ్యూనిచ్‌ భద్రతా సమావేశంలో ఉపాధ్యక్షుడు జెడి వాన్స్‌ నొప్పించే రీతిలో ఐరోపా మీద దాడి చేశాడు.ఉక్రెయిన్‌ గురించి మాట్లాడాల్సిన వాన్స్‌ తన ప్రసంగమంతా ఐరోపా మీద కేంద్రీకరించాడు.ఐరోపాకు ఉందని చెబుతున్న ముప్పు రష్యా నుంచి కాదు, అంతర్గతంగానే ఉందన్నాడు. దాని అర్ధం వలసల సమస్య. పుండు మీద కారం చల్లినట్లుగా ఉక్రెయిన్‌లో అమెరికా రాయబారి కెయిత్‌ కెలోగ్‌ కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడాడు. సంప్రదింపుల్లో ఐరోపాకు స్థానం ఉంటుందా అన్న ప్రశ్నకు అది జరుగుతుందని అనుకోవటం లేదన్నాడు. దీంతో ఐరోపా భద్రత తమ కళ్ల ముందే కుప్పకూలుతుందా అన్నట్లుగా అనేక మంది నేతలు, అధికారులు భావించినట్లు ఎకనమిస్టు వర్ణించింది. ట్రంప్‌ ప్రతిపాదించిన చర్చలు ఎవరి అజెండా మేరకు జరుగుతాయన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్న. వస్తున్న వార్తలన్నీ పుతిన్‌ డిమాండ్లకే అమెరికా అంగీకరించవచ్చని సూచిస్తున్నాయి.ఒక వేళ నిజంగా అదే జరిగితే రానున్న రోజుల్లో ఏ ఒక్కదేశం కూడా అమెరికా మాటలు, హామీల మీద ఆధారపడి వ్యవహరించే అవకాశాలు మరింతగా కుచించుకుపోతాయి. ఇంతవరకు దాన్ని నమ్మిబాగుపడిన దేశం లేదనే అభిప్రాయాన్ని మరింతగా బలపరిచినట్లు అవుతుంది. ప్రపంచాన్ని తమ గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తున్న అమెరికా సామ్రాజ్యవాదులు ఆత్మహత్యకు పాల్పడతారా ? సోమవారం నాడు ఫ్రెంచి అధ్యక్షుడు మక్రాన్‌ ఎంపిక చేసిన కొన్ని దేశాలతో పారిస్‌లో సంప్రదింపులు జరిపాడు. వాటి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

మూడు సంవత్సరాలుగా ఉక్రెయిన్‌ శాంతి చర్చలను సాగనివ్వని అమెరికన్లు ఆకస్మికంగా ఎందుకు రష్యాతో సంప్రదింపులకు సిద్దపడుతున్నారు ? ఒకటి ఐరోపాలోని నాటో కూటమి దేశాలు అవసరమైతే రంగంలోకి దిగుతామని కబుర్లు చెబుతున్నప్పటికీ నేరుగా ఉక్రెయిన్‌ తరఫున యుద్దంలో పాల్గొనే అవకాశాలు లేవు. వేల కిలోమీటర్ల దూరం నుంచి అమెరికా సేనలు వచ్చి రష్యాతో తలపడేందుకు సిద్దం కాదు. ఆఫ్ఘనిస్తాన్‌ తాలిబాన్లకే సలాంగొట్టి కాళ్లు గడ్డాలు పట్టుకొని ప్రాణాలు అరచేత పట్టుకొని వెళ్లిన వారు అణుశక్తి రష్యాతో తలపడగలరా ? రష్యా తొలి నుంచీ కోరుతున్నదేమిటి ? గతంలో తమకు హామీ ఇచ్చినట్లుగా ఉక్రెయిన్‌కు సభ్యత్వమిచ్చి నాటో కూటమి ఆయుధాలను తమ ముంగిట్లో ఉంచకూడదు. సంక్షోభానికి ముందు ఉన్న సరిహద్దులు, ప్రాంతాల గురించి ఉక్రెయిన్‌ మరచిపోవాలి.శాంతి పరిరక్షణ, మరొక పేరుతో నాటో కూటమి దళాలు తమ సరిహద్దులో తిష్టవేయకూడదు. ఉక్రెయిన్‌ మిలిటరీపై పరిమితులు పెట్టాలి.స్వాతంత్య్రం ప్రకటించుకున్న ఉక్రెయిన్‌లోని ప్రాంతాలకు అంతర్జాతీయ గుర్తింపు ఇవ్వాలి. ఏ విషయంలోనూ రాజీ పడేందుకు పుతిన్‌ సిద్దంగా లేడని ఐరోపా గూఢచారులు నివేదించినట్లు వార్తలు. పుతిన్‌ షరతుల మేర ఒప్పందం కుదుర్చుకుంటే అమెరికాకు వచ్చేదేముంది ? వారు మరీ అంత అమాయకులా ?

కొద్ది నెలలు, వారాల క్రితం వరకు కూడా రష్యాను నిలువరించేందుకు ఏం చేయాలి ? ఎలాంటి ఆయుధాలను ఉక్రెయిన్‌కు అందించాలి అని తర్జన భర్జనలు పడిన ఐరోపా నేతలు, వ్యూహకర్తలు ఇప్పుడు ట్రంప్‌ తెచ్చిపెట్టిన పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలా అని మల్లగుల్లాలు పడుతున్నారు. తాము విధించిన ఆంక్షలతో బలహీనపడిన పుతిన్‌ నాయకత్వాన్ని మరింతగా ఎలా వంటరిపాటు చేయాలా అని చూశారు.ట్రంప్‌ చర్యతో పుతిన్‌ ఆ స్థితి నుంచి తాత్కాలికంగా అయినా బయటపడ్డారు. దీని అర్ధం ఎవరిదారి వారు చూసుకోవటం అని కాదు.ఇప్పుడున్న పరిస్థితిలో అమెరికాఐరోపాలకు పరస్పర సహకారం అవసరం. మమ్మల్ని, మా భద్రతను అర్దంతరంగా ఎలా వదలి వెళతారని అడిగితే ఐరోపా మరింత చులకన అవుతుంది. అమెరికా పట్టుమరింతగా దాని మీద బిగుస్తుంది. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన సమయంలో మాదిరి పశ్చిమ ఐరోపా ఆర్థికంగా బలహీనంగా లేదు. గడచిన ఏడు దశాబ్దాల్లో మొత్తంగా పెట్టుబడిదారీ వ్యవస్థలన్నీ సమస్యలను ఎదుర్కొంటున్నప్పటికీ పశ్చిమ ఐరోపా పరిస్థితి మెరుగుపడిరది. అందుకే ఫ్రాన్సు, జర్మనీ పాలకవర్గాలు స్వంతంగానే భద్రతను చూసుకోగలమనే సంకేతాలను పంపుతున్నప్పటికీ మొత్తంగా ఐరోపాను ఆదుకొనేంత ఆర్థిక శక్తి వాటికి లేదు.. మొత్తం మీద ప్రపంచ రాజకీయాల గురించి మీడియాలో గతంలో ఎన్నడూ లేని చర్చ జరుగుతోంది. సౌదీలో ఏం జరగనుంది ? తురుపు ముక్కలను ఎవరు ఎలా ప్రయోగిస్తారు. చూద్దాం !

Share this:

  • Tweet
  • More
Like Loading...

మరణశయ్య మీద ఉన్న కన్నతల్లిని కూడా చూడనివ్వని ‘‘హిందూత్వ కర్కశత్వం ’’ క్షమా సావంత్‌కు వీసా నిరాకరించిన మోడీ సర్కార్‌ !

17 Monday Feb 2025

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, Left politics, NATIONAL NEWS, Opinion, Political Parties, Religious Intolarence, USA, Women

≈ Leave a comment

Tags

BJP, caste discrimination in US, Hindu Fundamentalism, hindutva, Kshama Sawant, Narendra Modi Failures, RSS, VHP

ఎం కోటేశ్వరరావు

తాను అందరి మాదిరి జీవ సంబంధంగా పుట్టలేని ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు. రాగద్వేషాలు లేని కర్మయోగి, విశ్వగురువు అని అభిమానులు గర్వంగా చెప్పుకుంటారు. ఆయన కన్నతల్లి వృద్ధాప్యంలో ఉన్నపుడు, చివరి రోజు వరకు చూసేందుకు అనేక సార్లు వెళ్లారు, సేవ చేశారని వార్తలు చదివాం, చిత్రాలను చూశాం. కానీ అలాంటి మరో తల్లిని చూసేందుకు ఆమె కుమార్తెకు వీసా నిరాకరించిన అదే పెద్దమనిషి తీరును ఎలా చూడాలి. ఎందుకు అలా చేశారు ? భారతీయ సంప్రదాయం, నైతికత అయితే కాదు, మరి రాజకీయ కక్షా ? అది అంత అమానవీయంగా ఉంటుందా ? అనేక వ్యాధులతో దినదిన గండగా నేడో రేపో అన్నట్లుగా గడుపుతున్న 82 ఏండ్ల కన్నతల్లిని చూసేందుకు ఒక కుమార్తెకు వీసా ఇచ్చేందుకు మోడీ ప్రభుత్వం నిరాకరించింది. ఆమె వీసా సమస్య గురించి విదేశాంగ మంత్రి జై శంకర్‌కు పూర్తిగా తెలుసు.జూన్‌ 26 నుంచి జూలై 15 మధ్య బెంగలూరు వచ్చేందుకు తనను అనుమతించాలని ఆమె జై శంకర్‌కు 2024 జూన్‌ 13న ఒక లేఖ రాశారు. రెండు సంవత్సరాల నుంచి తన తల్లి చికిత్స పొందుతున్నదని, దానికి సంబంధించిన వైద్యుల వివరణను కూడా జత చేసినా కనీసం లేఖ అందినట్లుగానీ, అనుమతి గురించి గానీ ఎలాంటి సమాధానం మంత్రి నుంచి రాలేదని ఆమె పేర్కొన్నారు. తాను కేవలం తల్లిని చూడటానికి మాత్రమే వస్తున్నట్లు, ఇతర కారణాలేమీ లేవని కూడా స్పష్టం చేసినప్పటికీ పట్టించుకోలేదు. విశ్వగురువు, అపరమానవతావాదిగా ప్రశంసలు పొందిన నరేంద్రమోడీ నాయకత్వంలోని అధికారులు ఒకసారి కాదు ఏడాదిలో ఏకంగా మూడు సార్లు తిరస్కరించారు. దీని గురించి అమెరికా మీడియాలో వార్తలు వచ్చిన తరువాత కూడా స్పందించలేదంటే కచ్చితంగా కావాలనే నిరాకరిస్తున్నట్లు భావించాల్సి వస్తోంది.

ఈ ఏడాది జనవరి తొమ్మిదిన ఆన్‌లైన్‌ ద్వారా క్షమ, ఆమె భర్త వీసా దరఖాస్తులను సమర్పించగా దాదాపు నెల రోజుల పాటు దరఖాస్తును తొక్కి పట్టి ఏ కారణం చెప్పకుండా మానసిక ఆందోళనకు గురిచేశారు. చివరికి భర్త కాల్విన్‌ ప్రీస్ట్‌కు మంజూరు చేసి క్షమకు తిరస్కరించారు. బెంగలూరులో ఉంటున్న తల్లి వసుంధరా రామానుజమ్‌ను పరామర్శించే నిమిత్తం ఇండియన్‌అమెరికన్‌ మహిళ క్షమా సావంత్‌(51) గతేడాది మే నెల నుంచి మూడు సార్లు దరఖాస్తు చేశారు. అమెరికాలోని మన దౌత్య కార్యాలయాలు అత్యవసర వీసా నిరాకరించాయి.తీవ్ర నేరారారోపణలతో జైళ్లలో ఉన్న నిందితులకు, శిక్షలు పడిన వారికి కూడా ఇలాంటి కారణాలతో పరిమిత బెయిలు మంజూరు చేసిన ఉదంతాలు మనకు తెలిసిందే. క్షమ సావంత్‌ నేరస్థురాలు కాదు, మన దేశ ఉగ్రవాద లేదా మరొక నిషేధిత జాబితాలో ఆమె పేరు లేదు. ఎలాంటి కేసులు లేవు. కానీ కారణాలు చూపకుండానే మీరు తిరస్కరణ జాబితాలో ఉన్నారంటూ అమెరికా వాషింగ్టన్‌ రాష్ట్రంలోని సియాటిల్‌ నగరంలో భారత కాన్సులేట్‌ దౌత్య కార్యాలయం 2025 ఫిబ్రవరి మొదటి వారంలో వీసా నిరాకరించింది. కారణం ఏమిటో చెప్పాలంటూ గట్టిగా అడిగినందుకు, చెప్పాల్సిన పని లేదని, కార్యాలయంలో అక్రమంగా ప్రవేశించారంటూ పోలీసులను పిలిపించింది. భర్త కాల్విన్‌ ప్రీస్ట్‌కు వీసా మంజూరు చేసి తనకు నిరాకరించటానికి నరేంద్రమోడీ విధానాలను వ్యతిరేకించే రాజకీయ కారణాలు తప్ప మరొకటి కాదని ఆమె ఎక్స్‌లో పేర్కొన్నారు.

మోడీ సర్కార్‌ తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(సిఏఏ), జాతీయ పౌరనమోదు (ఎన్‌ఆర్‌సి)లను ఖండిస్తూ ఆమె ప్రాతినిధ్యం వహించిన సియాటిల్‌ నగరపాలక సంస్థలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కులవివక్షకు వ్యతిరేకంగా 2023లో అదే సంస్థలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదం పొందారు. కొన్ని కులాల వారి పట్ల వివక్ష చూపకూడదంటూ అమెరికా చరిత్రలో అధికారికంగా ఒక నగరంలో తీర్మానించటం ఇదే ప్రధమం.ఈ పరిణామం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించటమే గాక భారత్‌లో ఉన్న వివక్ష గురించి చర్చకు దారితీసింది. ఆమె సోషలిస్టు ప్రత్నామ్నాయం అనే సంస్థలో సభ్యురాలు. వీసా నిరాకరించిన కారణం చెప్పనందుకు తాను, తన భర్త , మద్దతుదారులతో కలిసి శాంతియుత పద్దతిలో ధర్నా చేశామని, వివరణ ఇచ్చేందుకు వారు తిరస్కరించారు, తెలుసుకోకుండా కదిలేది లేదని మేము తిరస్కరించటంతో వారు పోలీసులను పిలుస్తామని బెదిరించారంటూ ఆమె ఎక్స్‌లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా తన మీద, మద్దతుదారులపై కూడా చేయి చేసుకున్నట్లు ఆ తెలిపారు. తనకు వీసా ఇవ్వకపోవటానికి నరేంద్రమోడీ ప్రభుత్వ తిరస్కరణ జాబితాలో పేరుండటమే అని ఒక అధికారి తనతో చెప్పినట్లు కూడా ఆమె మరో పోస్టులో పేర్కొన్నారు. వారాల తరబడి ఎలాంటి స్పందన లేకపోగా ఫోన్‌ ద్వారా సంప్రదించినా సమాధానం లేదన్నారు. వాషింగ్టన్‌ రాష్ట్రంలోని అతి పెద్ద నగరమైన సియాటిల్‌ సిటీ కౌన్సిల్లో సిఏఏ, ఎన్‌ఆర్‌సిలకు వ్యతిరేకంగా తాను తీర్మానాలు ప్రవేశ పెట్టటమే దీనికి కారణమని కూడా క్షమ పేర్కొన్నారు. నరేంద్రమోడీ ప్రభుత్వ విధానాల పట్ల విమర్శనాత్మక వైఖరిని వెల్లడిరచిన స్వీడన్‌లో ఉన్న భారతీయ ప్రొఫెసర్‌ అశోక్‌ సవాయిన్‌, బ్రిటన్‌లో ఉన్న రచయిత నితాషా కౌల్‌కు సైతం ఇలాంటి అనుభవాలే ఎదురయ్యాయి. విదేశాల్లో ఉంటూ తమ ప్రభుత్వాన్ని విమర్శించటం ఏమిటన్న దురహంకారం, కక్ష తప్ప దీనిలో మరోటి కనిపించటం లేదు.

క్షమ సావంత్‌ మహారాష్ట్రలోని పూనాలో ఒక తమిళ కుటుంబంలో జన్మించారు. తల్లి స్కూల్‌ పిన్సిపల్‌గా పని చేశారు. క్షమ 13 ఏండ్ల వయస్సులో ఇంజనీరైన తండ్రి ఒక ప్రమాదంలో మరణించారు. ముంబైలో ఆమె చదువుకొని సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరయ్యారు.1996లో అమెరికా వెళ్లిన తరువాత అర్థశాస్త్రంలో పిహెచ్‌డి చేసి కొంతకాలం ప్రొఫెసర్‌గా పని చేశారు. అక్కడే ఆమె 2006లో వామపక్ష రాజకీయాల్లో అడుగుపెట్టారు.అంతకు ముందు ఆమెకు రాజకీయాలతో సంబంధం లేదు. 2012లో వాషింగ్టన్‌ ప్రజాప్రతినిధుల సభకు పోటీచేసి ఓడిపోయారు. తరువాత సియాటిల్‌ నగరపాలక సంస్థ ఎన్నికల్లో గెలిచి 2014 నుంచి 2024వరకు ప్రాతినిధ్యం వహించారు. ఆ సమయంలో కులవివక్ష వ్యతిరేక తీర్మానాన్ని ఆమోదింప చేయించటంతో పాటు కనీసం వేతనం గంటకు 15 డాలర్ల చట్టాన్ని అమలు జరిపించటంలో కూడా ఆమె పట్టుబట్టారు. కుల వివక్షకు వ్యతిరేకంగా తీర్మానాన్ని ఆమోదింప చేసేందుకు ఆమె కృషి చేయటాన్ని, సిఎఎ, ఎన్‌ఆర్‌సి చట్టాలను ఖండిస్తూ తీర్మానాలను చేయించటాన్ని అమెరికాలోని హిందూత్వశక్తులు జీర్ణించుకోలేకపోయాయి.


కుల వివక్ష వ్యతిరేక తీర్మానం చేయించటంలో కీలక పాత్ర పోషించటాన్ని హిందూ సంస్థలు తీవ్రంగా వ్యతిరేకించాయి. వీసా తిరస్కరణ వెనుక ఈ అంశం ఉందా అన్న ప్రశ్నకు ఇంతకు మించి బిజెపి ప్రభుత్వ రాజకీయ నిర్ణయం వెనుక మరొక కారణం కనిపించటం లేదు అన్నారు. నేను ఒక సోషలిస్టును, పదేండ్ల పాటు కార్మికవర్గ ప్రతినిధిగా సియాటిల్‌ కౌన్సిల్లో ఉన్నాను, ఆ సమయంలో నేను ప్రజా ఉద్యమ నిర్మాణానికి, కనీసవేతనం గంటకు 15డాలర్లకు పెంచాలని కోరుతూ నా పదవిని వినియోగించాను. ఇప్పుడది 20.76 డాలర్లకు పెరిగింది. అమెరికాలో ఇది గరిష్టం. పేదల గృహ నిర్మాణాలకు కార్పొరేట్‌ సంస్థలు వాటా చెల్లించాలని కూడా నేను పని చేశాను.2020 ఫిబ్రవరిలో సిఏఏ, ఎన్‌ఆర్‌సి చట్టాలను ఖండిస్తూ సియాటిల్‌ కౌన్సిల్లో పెట్టిన తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ శాన్‌ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్‌ కార్యాలయం నాకు ఒక లేఖ పంపింది. అమెరికాలోని హిందూత్వ శక్తులు, మోడీ మద్దతుదార్లనుంచి వ్యతిరేకత ఎదుర్కొన్నాం.2023 ఫిబ్రవరిలో కులవివక్షపై చారిత్రాత్మక నిషేధాన్ని ప్రకటించటంలో విజయం సాధించాం. మాకు విశ్వహిందూ పరిషత్‌ నుంచి తీవ్ర వ్యతిరేకత వెల్లడైంది. మితవాద హిందూ అమెరికన్‌ ఫౌండేషన్‌, ఉత్తర అమెరికా హిందువుల సంఘటన మాకు వ్యతిరేకంగా పని చేశాయి. అందువలన మోడీ ప్రభుత్వం, అమెరికాలోని దాని మద్దతుదార్లు మాకు వ్యతిరేకంగా ఉన్నారనటంలో ఎలాంటి సందేహం లేదు. వారందరికీ నా రాజకీయ అభిప్రాయాలు ఏమిటో తెలుసు. అనారోగ్యంతో ఉన్న తల్లిని చూసేందుకు అనుమతించకపోవటం అమానుషం, ఏ రకమైన ప్రభుత్వమిది. నా వీసా తిరస్కరణ వెనుక రాజకీయ కారణాలు లేవని మోడీ సర్కార్‌ చెప్పుకోవాలంటే వీసా మంజూరు చేసి నిరూపించుకోవచ్చని క్షమ పేర్కొన్నారు.

అమెరికాకు వెళ్లిన వారు అందరూ అని కాదు గానీ ఎక్కువ మంది తమతో పాటు కులతత్వాన్ని, కులవివక్షను కూడా తీసుకుపోయారు. ఈ మధ్య దానికి మతాన్ని కూడా తోడు చేశారు. మన దేశంలో మత ప్రాతిక మీద పని చేసే సంస్థలన్నింటికీ అమెరికా శాఖలు ఉన్నాయి. దక్షిణాసియా నుంచి వచ్చిన దళితులు, ఇతర అణచివేతకు గురైన కులాల వారు అమెరికాలో కూడా దాన్ని తప్పించుకోలేకపోతున్నారు.కార్నెగీ ఎండోమెంట్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ పీస్‌ అనే సంస్థ జరిపిన అధ్యయనం ప్రకారం విద్యాపరంగా మూడిరట ఒక వంతు, పని స్థలాల్లో , మూడిరట రెండువంతుల మంది వివక్షను ఎదుర్కొన్నట్లు తేలింది. తక్కువగా చూడటం, సూటిపోటి మాటలు, లైంగిక వేధింపుల గురించి 30 మంది దళిత మహిళా సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు తమ అనుభవాలను బహిరంగ లేఖ రూపంలో వెల్లడిరచారు. సిస్కో సిస్టమ్స్‌ కంపెనీలో అగ్రవర్ణాలుగా భావించబడుతున్నవారు తనకు రావాల్సిన ఉద్యోగోన్నతి, వేతన పెంపుదలను ఎలా అడ్డుకుంటున్నారో వెల్లడిస్తూ దాఖలు చేసిన కేసును ఒక దళత సామాజిక తరగతికి చెందిన ఇంజనీరు గెలిచారు. ఆ తరువాత వందలాది మంది తాము ఎదుర్కొన్న వివక్ష గురించి గళం విప్పారు. ఈ పూర్వరంగంలోనే క్షమ సావంత్‌ సియాటిల్‌ సిటీ కౌన్సిలర్‌గా వివక్షకు వ్యతిరేకంగా ఒక తీర్మానాన్ని ప్రతిపాదించి ఆమోదింప చేయించారు. లేని సమస్య ఉన్నట్లు, అతిగా చేసి పరువు తీస్తున్నారంటూ హిందూత్వ సంస్థలు, అగ్రకుల నాయకత్వంలోని సంస్థలు ఆమె మీద ధ్వజమెత్తాయి. సియాటిల్‌ కౌన్సిల్లో డెమోక్రటిక్‌ పార్టీకి చెందిన వారు ఎక్కువ మంది కౌన్సిలర్లు ఉన్నారు. వారు తొలుత తీర్మానానికి మద్దతు ఇవ్వలేదు. మితవాదులు ముందుకు తెచ్చిన వాదనలనే వారు వల్లించారు. చివరి వరకు ఏదో విధంగా అడ్డుకోవాలని చూశారు. అయితే వారి మీద వచ్చిన వత్తిడి కారణంగా ఒకరు తప్ప మిగతావారందరూ ఓటు వేయటంతో తీర్మానం నెగ్గింది.

క్షమా సావంత్‌ అలుపెరగని పోరాట యోధురాలిగా ఉన్నారు.కార్మికవర్గాన్ని దోచుకుంటున్న ధనికులు, వారికి మద్దతు ఇస్తున్న అధికార రిపబ్లిక్‌, ప్రతిపక్ష డెమోక్రటిక్‌ పార్టీల వైఖరిని నిరసిస్తూ ఫిబ్రవరి 22న సియాటిల్‌ నగరంలో ఒక సభను ఆమె నాయకత్వంలో పని చేస్తున్న వర్కర్స్‌ స్ట్రైక్‌ బాక్‌ సంస్థ నిర్వహిస్తున్నది. డెమోక్రటిక్‌ సోషలిస్టుగా ఉన్న బెర్నీ శాండర్స్‌ కూడా అందరికీ అందుబాటులో వైద్యం వంటి అంశాలలో జో బైడెన్‌ ప్రభుత్వ నిర్ణయాన్ని ఆమోదించారని కూడా ఆమె విమర్శించారు. ఆ రెండు పార్టీలకు ప్రత్నామ్నాయంగా మరొక పార్టీ నిర్మాణం జరగాల్సిన అవసరం ఉందని గతంలో ప్రకటించారు. దళితుల సమస్యల మీద ఆ సామాజిక తరగతికి చెందిన వారు మాత్రమే సక్రమంగా స్పందించగలరని వారు మాత్రమే పోరాటాలకు నాయకత్వం వహించాలని చెబుతున్న వారు క్షమ పోరాటం, ఆమె ఎదుర్కొంటున్న వేధింపులను చూసిన తరువాత తమ సంకుచిత వైఖరిని మార్చుకోవాలని సూచించటం తప్పుకాదేమో !

Share this:

  • Tweet
  • More
Like Loading...

మోడీ అమెరికా వెళ్లారు, వచ్చారు – వారికి సమర్పించుకున్నదేమిటి ? మన దేశానికి తెచ్చిందేమిటి ?

15 Saturday Feb 2025

Posted by raomk in BJP, CHINA, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, USA

≈ Leave a comment

Tags

Donald trump, MAGA, MIGA-Modi, Narendra Modi Failures, Narendra Modi US Visit

ఎం కోటేశ్వరరావు

హమ్మయ్య ఒక పనైపోయింది. తెలుగువారి కళారూపాల్లో ఒకటైన ఏక పాత్రాభినయం గురించి తెలిసిందే. డోనాల్డ్‌ ట్రంప్‌ తన పట్టాభిషేకానికి నన్నెందుకు ఆహ్వానించలేదు, నన్ను పక్కన పెడితే పెట్టారు, చైనా నేత షీ జింపింగ్‌కు పెద్ద పీటవేయనేల, అతగాడు రాడని తెలిసి కూడా ఆహ్వానమేల, పోనీ వచ్చేందుకు తిరస్కరించిన తరువాత కూడా నన్ను పిలవాలని తట్టలేదా ? గత ఆలింగనాలు, చెట్టపట్టాలు గుర్తుకు రాలేదా ? అంతలా మర్చిపోతారా ? విదేశాంగ మంత్రి జై శంకర్‌ వెళ్లి చేసిన నిర్వాకం ఏమిటి ? పరిపరి విధాల ఇలాంటి స్థితిలో ఎట్టకేలకు ప్రధాని నరేంద్రమోడీకి ట్రంప్‌ నుంచి ఆహ్వానం వచ్చింది. ఫిబ్రవరి 13,14 తేదీలలో వెళ్లారు. ట్రంప్‌తో కరచాలనాలు, ఆలింగనాల తరువాత భేటీ జరిగింది. పరస్పరం పొగడ్తలకు ఎలాంటి లోటు జరగలేదు. అసలే 56 అంగుళాల ఛాతీ అంటారు, ట్రంప్‌ మర్యాదలతో అది మరింతగా పొంగిన స్థితిలో మోడీ స్వదేశానికి తిరిగి వచ్చారు. ఇంటి పెద్ద ఏదైనా ప్రయాణం చేసి వచ్చినపుడు కుటుంబంలోని వారు తమకేమి తెచ్చారా అని ఎదురు చూడటం సహజం. ఇప్పుడు మన మోడీ ఏం తెచ్చారని మన జనం ఆసక్తి కనపరుస్తున్నారు. మోడీ తిరిగి రాకముందే వచ్చిన వార్త ఏమింటే సుంకాల విధింపులో తగ్గేదేలేదు, భారత్‌ అయినా మరొకరైనా మా మీద విధిస్తే మేమూ అంతే చేస్తాం అన్న ప్రకటన పతాక శీర్షికల్లో వచ్చింది.పరస్పర వడ్డింపులు అందరికీ వర్తిస్తాయి, ఎవ్వరికీ మినహాయింపులేదు.వాణిజ్యం విషయంలో మా శత్రుదేశాల కంటే మిత్ర దేశాలు అధ్వాన్నంగా ఉన్నాయి. భారత్‌ పెద్ద మొత్తంలో పన్నులు విధిస్తున్నది. ఆ కారణంగా హార్లే డేవిడ్స్‌న్‌ తమ మోటారు సైకిళ్లను అమ్ముకోలేకపోయిందని నాకు గుర్తువస్తున్నది. తమ జరిమానాలను తప్పించుకోవాలంటే ఇతర దేశాలు తమ పన్నులు ఎత్తివేయాలి లేదా తగ్గించాల్సిందే అని ట్రంప్‌ చెప్పాడు. తాను తీసుకొనే చర్యలు అంతిమంగా అమెరికా కంపెనీలకు మేలు చేస్తాయన్నాడు. 2030 నాటికి రెండు దేశాల మధ్య వాణిజ్యాన్ని 500 బిలియన్‌ డాలర్లకు పెంచుతామని, రక్షణ రంగంలో సహకారం, పౌర అణుఒప్పందంలో అమెరికా కంపెనీలకు అనుకూలమైన నిర్ణయాలు, ఇతర అనేక అంశాల గురించి మరో సందర్భంలో చర్చించుకోవచ్చు, పరిమితంగా కొన్ని అంశాలను చూద్దాం.

మోడీ పర్యటన గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే డోనాల్డ్‌ ట్రంప్‌కు భారీగా సమర్పించుకొని వచ్చారు తప్ప అక్కడి నుంచి తెచ్చిందేమీ లేదంటే కొందరు నొచ్చుకోవచ్చుగానీ అది మింగలేని నిజం. అంత తొందరగా నిర్ణయానికి రావటమెందుకు తరువాత ఫలితాలు వస్తాయోమో అనే వాళ్లను నిరుత్సాహపరచటం లేదు. ట్రంప్‌ ఏం చెప్పాడు ? భారత్‌అమెరికా వాణిజ్యంలో మేం లోటులో ఉన్నాం, ఆ మేరకు మా దగ్గర నుంచి సరకులు కొనుగోలు చేయాలి. ప్రపంచంలో ఏ దేశంలోనూ లేనంత ముడి చమురు మా దగ్గర ఉంది, భారత్‌కు అది అవసరం, మా నుంచి కొనుగోలు చేయాలి. మా వస్తువుల మీద దిగుమతి పన్ను తగ్గించాలి, వాటిని దిగుమతి చేసుకోవాలి అని నిర్మొహమాటంగా చెబితే, సరే ఇంకేం చేస్తాం అంటూ మోడీ తలూపి వచ్చారు. ఇతర దేశాల కంటే ఎక్కువగా అమెరికా నుంచి ముడిచమురు, గ్యాస్‌ కొనుగోలు చేస్తామని అంగీకరించి వచ్చారు.మన దేశానికి అమెరికా ఐదవతరం ఎఫ్‌35 యుద్ధ విమానాలు విక్రయిస్తామని ట్రంప్‌ చెప్పాడు. ఇంకేముంది చైనాను నిలువరించేందుకు వచ్చేసినట్లే అన్నట్లుగా మీడియాలో కొందరు చిత్రించారు. నిజానికి ఆలూలేదూ చూలూ లేదు. అసలు ఒప్పందమే లేదు. ఎప్పుడో చేసుకున్న ఒప్పందాల ప్రకారం మనకు అవసరమైన పాతతరం ఇంజన్లు సరఫరా చేసేందుకే అమెరికా జాప్యం చేస్తున్నది.

మన దేశం తేలిక రకం తేజాస్‌ యుద్ధ విమానాలను తయారు చేసే క్రమంలో ఉంది.వాటిని సాంకేతికంగా ఉన్నతీకరిస్తున్నారు. ఎంకె1ఏ రకం విమానానికి అవసరమైన ఇంజన్ల కోసం సందేహాలున్నప్పటికీ అమెరికా జిఇ కంపెనీతో మన హిందూస్తాన్‌ ఏరోనాటిక్స్‌ 2021లో ఎఫ్‌404రకం 99 ఇంజన్ల సరఫరా, నిర్వహణ ఒప్పందం చేసుకుంది. సరఫరా గడువు దాటింది, ఒప్పందం ప్రకారం అపరాధ రుసుం వేసినప్పటికీ ఇంతవరకు ఒక్కటంటే ఒక్క ఇంజన్‌ కూడా మనకు రాలేదు. అవే రాలేదనుకుంటే నరేంద్రమోడీ 2023లో అమెరికా వెళ్లినపుడు ఎల్‌సిఏ ఎంకె2కు అవసరమైన జిఇ 414 ఇంజన్ల సరఫరా ఒప్పందం కూడా చేసుకున్నారు. మొదటిదానికే దిక్కులేదు. ఎందుకు సరఫరా చేయటం లేదు అంటే దానికి అవసరమైన విడిభాగాలను సరఫరా చేసే దక్షిణ కొరియా కంపెనీ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉందని సాకు చెబుతున్నారు. అలాంటిది ఆధునిక ఎఫ్‌35 యుద్ద విమానాలను మనకు విక్రయిస్తుందా ? అంతే కాదు అమెరికా తయారు చేసిన ఎఫ్‌16 యుద్ద విమానం ఇప్పుడు పాతబడిపోయింది.దానికి రంగులు మార్చి లేదా పరిమితమైన మార్పులు చేసి ఎఫ్‌21పేరుతో మనకు విక్రయించేందుకు లాక్‌హీడ్‌ మార్టిన్‌ కంపెనీ చూస్తున్నదని వార్తలు. అది ఐదవతరం ఎఫ్‌22 రాప్టర్‌కు ఒక అడుగు మాత్రమే వెనుక ఉన్నట్లు కూడా చెప్పారు. ట్రంప్‌మోడీ ఏమోయ్‌ అంటే ఏమోయ్‌ అనుకునేట్లుగా ఉన్న సమయంలోనే పాకిస్తాన్‌కు అమెరికా ఎఫ్‌16 విమానాలను అందచేసిందని, 2019 ఫిబ్రవరి 27న మన వైమానిక దళం వాటిలో ఒకదాన్ని కూల్చి వేసిందని గుర్తుకు తెచ్చుకోవాలి.


మేక్‌ అమెరికా గ్రేట్‌ ఎగైన్‌ – మాగా (అమెరికాను మరోసారి గొప్పదానిగా చేయాలి) అన్నది ట్రంప్‌ నినాదం. దానికి అడ్డువచ్చే వారిని ఎవరినీ సహించడు అని వేరే చెప్పాల్సిన పనిలేదు. అన్ని రంగాల్లో సవాలు విసురుతున్న చైనా ఒక వైపు ఉంటే భారత్‌ కూడా అలాగే తయారవుతానంటే అంగీకరిస్తాడా ? కానీ నరేంద్రమోడీ గారు మాగాకు పోటీగా మిగా అని ఎక్స్‌ చేశారు. వికసిత భారత్‌ లక్ష్యాన్ని మేక్‌ ఇండియా గ్రేట్‌ ఎగైన్‌ అని మేం కూడా అనొచ్చు అన్నారు. అమెరికా అంటే గతంలో అన్ని రంగాల్లో ముందున్నది, ప్రాసకోసం తప్ప వస్తు తయారీలో మనం ఎప్పుడు ముందున్నాం ? పదేండ్ల క్రితం ఉన్న జిడిపిలో ఉన్న స్థాయిలో కూడా నేడు మన తయారీ రంగం లేదన్నది దాస్తే దాగుతుందా ? గత చరిత్ర మొత్తం అమెరికా మనలను అడ్డుకున్నదే.తొలిసారిగా 1962లో మన దేశం చైనాతో యుద్ధానికి దిగినపుడు ఫైటర్‌ జెట్లు కావాలని నాటి ప్రభుత్వం కోరితే వాటికి బదులు రవాణా విమానాలు, రాడార్లను ఇచ్చిందట. తరువాత పాకిస్తాన్‌కు 12 సూపర్‌ సోనిక్‌ ఫైటర్‌జెట్లను ఇస్తే వాటిని 1965లో మన మీద ప్రయోగించారు. ఆ తరువాతే మనం సోవియట్‌ యూనియన్‌ నుంచి మిగ్‌ 21 విమానాలను కొనుగోలు చేశాము.1998లో మన దేశం అణుపరీక్షలు జరిపితే అమెరికా మనలను ఆర్థికంగా దెబ్బతీసేందుకు అనేక ఆంక్షలను విధించింది. అక్రమచొరబాటుదార్లను గుర్తించేందుకు ఉపగ్రహ ఆధారిత వ్యవస్థలు కావాలని కోరితే అమెరికా నిరాకరించింది. తరువాత మనమే సొంతంగా రూపొందించుకున్నాం. గాల్వన్‌లోయలో జరిగిన ఉదంతాల వెనుక అమెరికా ఇచ్చిన తప్పుడు సమాచారం ఉందని కూడా చెబుతారు. తరువాత అరుణాచల్‌ ప్రదేశ్‌లో చైనా అక్రమంగా గ్రామాల నిర్మాణం చేస్తోందంటూ కూడా ఇచ్చిన తప్పుడు సమాచారాన్ని మన మిలిటరీ తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. వారి ప్రాంతంలో ఎప్పుడో నిర్మించి పాతబడిన వాటిని తిరిగి నిర్మిస్తున్నది తప్ప కొత్తవి కాదని ప్రకటించారు.

ఇల్లలక గానే పండగ కాదన్నట్లుగా నరేంద్రమోడీ డోనాల్డ్‌ ట్రంప్‌ మధ్య కుదిరిన అవగాహనలేమిటో, వాటి పరిణామాలు, పర్యవసానాలను చూడాల్సి ఉంది. నమస్కార బాణం వేసినట్లు ముందుగానే మన వైపు నుంచి అమెరికా వస్తువులకు కొన్ని రాయితీలు ఇవ్వటానికి సిద్దం అనే సంకేతాలు ఇచ్చాము.అయితే ట్రంప్‌కు అవి సంతృప్తి కలగలేదు గనుకనే భారత్‌ ఎంత సుంకం విధిస్తుందో మేమూ అంతే వేస్తాం అంటూ కరాఖండితంగా ముందే చెప్పాడు. తమ వస్తువులను మనదేశంలో కుమ్మరించేందుకు తొలిసారి అధికారానికి వచ్చినపుడే ట్రంప్‌ ఎత్తుగడ వేశాడు.ఇస్తినమ్మా వాయనం పుచ్చుకుంటినమ్మా వాయనం అన్నట్లు తాము చేసినదానికి ప్రతిగా భారత్‌ రాయితీలు ఇవ్వలేదంటూ 2019లో ప్రత్యేక వాణిజ్య భాగస్వామిగా మన దేశం నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువుల మీద ఇస్తున్న ప్రాధాన్యత (జిఎస్‌పిాజనరలైజ్‌డ్‌ సిస్టమ్‌ ఆఫ్‌ ఫ్రిఫరెన్సు)ను రద్దు చేసి సుంకాలు విధించాడు. దానికి ప్రతిగా మన దేశం కూడా పన్నులు విధించింది. ఎక్కడైనా బావేగాని వంగతోట దగ్గర కాదన్నట్లుగా మోడీ పర్యటన సందర్భంగా ట్రంప్‌ ఎన్ని మెచ్చుకోలు మాటలు చెప్పినా తాను తీసుకున్న చర్యను వెనక్కు తీసుకోవటం గురించి ఒక్క మాటా లేదు. మీ ఇంటి కొస్తే మాకేం పెడతావ్‌ మా యింటికొస్తే మాకేం తెస్తావ్‌ అన్నట్లుగానే ఉంది.

ఇప్పుడున్న పరిస్థితిని చూస్తే అమెరికా వస్తువులపై మనం విధించే పన్నుల గురించి ట్రంప్‌ గుర్రుగా ఉన్నాడు. పన్నుల రారాజు అంటూ మన దేశాన్ని గతంలో వర్ణించాడు. నరేంద్రమోడీ పర్యటన సందర్భంగా కూడా తన అంతరంగాన్ని దాచుకోలేదు. అమెరికన్‌ కార్ల వంటి వాటి మీద 70శాతం పన్ను విధిస్తున్నారని, ఇది పెద్ద సమస్య అన్నాడు. అనేక వస్తువుల మీద 30,40,60 చివరికి 70శాతం పన్ను కూడా భారత్‌ విధిస్తున్నది, వాటిని తగ్గిస్తామని మోడీ చెప్పారు. 70శాతం పన్ను ఉంటే అమెరికా కార్లను ఆమ్ముకోలేం, భారత్‌తో దాదాపు వంద బిలియన్‌ డాలర్ల మేర తమకు లోటు ఉంది అన్నాడు. మా దగ్గర ఏ దేశంలోనూ లేనంతగా ఉన్న చమురు, గ్యాస్‌ను విక్రయించి ఆలోటును పూడ్చాలనుకుంటున్నాం అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడు. ఇటీవలి అంతర్జాతీయ పరిణామాల కారణంగా రష్యా నుంచి అత్యధికంగా ముడి చమురు కొనుగోలు చేస్తున్నాం.2024 ఏప్రిల్‌ నుంచి నవంబరు వరకు ఎనిమిది మాసాలలో మన దేశం దిగుమతి చేసుకున్న ముడిచమురులో రష్యా వాటా 37.6, ఇరాక్‌ 19.9, సౌదీ అరేబియా 13.3,యుఏయి 9.1 అమెరికా 4.3, ఇతర దేశాల నుంచి 16.4శాతం వాటా ఉంది. ఆ తరువాత రష్యా నుంచి చమురు రవాణా చేసే నౌకల మీద కూడా అమెరికా ఆంక్షలు విధించటంతో ఈ ఏడాది, ఫిబ్రవరి, మార్చి నుంచి పెద్ద మొత్తంలో తగ్గే అవకాశం ఉంది. ఇప్పుడు రష్యా స్థానాన్ని అమెరికా ఆక్రమిస్తుందా అన్నది చూడాల్సి ఉంది.

అమెరికా నుంచి దిగుమతి చేసుకొనే చమురు ధరలో ఎలాంటి రాయితీ ఉండదు, దూరం గనుక రవాణా ఖర్చులు పెరుగుతాయి, సమయమూ ఎక్కువ పడుతుంది. ఆ భారం మొత్తం వినియోగదారులే భరించాల్సి ఉంటుంది. దీనికి తోడు అమెరికా రకం ముడి చమురును శుద్ది చేయాలంటే మన రిఫైనరీలలో మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటుందని, అది కంపెనీల మీద అదనపు భారం మోపుతుందని చెబుతున్నారు. అమెరికా బెదిరింపులకు లొంగి ఇప్పటికే ఇరాన్‌ నుంచి చమురు కొనుగోలు నిలిపివేశాము. ఇప్పుడు రష్యా, ఇతర దేశాల నుంచి కూడా నిలిపివేసి ఒక్క అమెరికా మీదనే ఆధారపడితే మన జుట్టును దాని చేతికి ఇచ్చినట్లే అవుతుంది. అదే జరిగితే మన ఇంథన భద్రతకే ముప్పు వస్తుంది. వ్యూహాత్మకంగా కావచ్చు లేదా మరొక కారణంతో గానీ ట్రంప్‌`మోడీ భేటీలో చైనా ప్రస్తావన పెద్దగా రాలేదు. గతంలో ట్రంపు అధికారంలో ఉండగానే చైనాతో సరిహద్దులోని గాల్వన్‌లోయలో ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే. ఇరుదేశాలు ఆ ఉదంత పూర్వపు స్థాయికి సంబంధాలను నెలకొల్పుకొనేందుకు ఇటీవలనే ఒప్పందం చేసుకొని ముందుకు పోతున్నాయి. కావాలంటే సరిహద్దు సమస్యలో సాయం చేసేందుకు నేను సిద్దం అని మోడీతో ట్రంప్‌ అన్నట్లు వార్తలు వచ్చాయి. సాయం సంగతి దేవుడెరుగు తంపులు పెట్టకుండా ఉంటే చాలు. ఇరుగు పొరుగు దేశాలతో సమస్యలను పరిష్కరించుకోలేనంత అసమర్ధంగా మనదేశం లేదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మన్మోహన్‌ సింగ్‌ పదేండ్లలో రు.38లక్షల కోట్లు, నరేంద్రమోడీ అప్పు రు.129లక్షల కోట్లు ఎవరి కోసం చేసినట్లు !

12 Wednesday Feb 2025

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

BJP, India debt matters, Manmohan Singh, Narendra Modi Failures, UPA

ఎం కోటేశ్వరరావు


ఉచిత పథకాలు, నగదు బదిలీల వంటి రాజకీయ పార్టీల వాగ్దానాల కారణంగా జనాలు సోమరులుగా మారుతున్నారని, పరాన్నజీవులవుతున్నారంటూ సుప్రీం కోర్టు న్యాయమూర్తులు బుధవారం(ఫిబ్రవరి 12,2024) వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చాయి. చిత్రం ఏమిటంటే ఇలాంటి వాటి గురించి కేసులు వేసేవారు ఉంటారు తప్ప ప్రోత్సాహకాల పేరుతో వేళ్లమీద లెక్కించదగిన కార్పొరేట్‌ సంస్థలకు లక్షల కోట్ల రాయితీలు, బాంకు అప్పుల మాఫీలు,రికార్డు స్థాయిలో ప్రభుత్వాలు చేస్తున్న అప్పుల గురించి ఎవరైనా సుప్రీం కోర్టులో కేసు దాఖలు చేశారా ? పోనీ న్యాయమూర్తులు మీడియాలో వస్తున్న వార్తలపై స్పందించారా అంటే అదీ కనపడదు. అప్పులు తెచ్చేది ఎందుకు అంటే అభివృద్ధి కోసం అని అధికార పార్టీ నుంచి తడుముకోకుండా చెప్పే సమాధానం. ఆ మేరకు దాని ఆనవాళ్లు లేవేమి అంటే ఫలితాలు వెంటనే ఎలా కనిపిస్తాయి, రానున్న రోజుల్లో చూడండి అంటారు. స్వాతంత్య్రం తరువాత దేశాన్ని పాలించిన ప్రధానులందరూ కలసి 2004 నాటికి కేంద్ర ప్రభుత్వానికి మిగిల్చిన అప్పు రు.17,79,763 కోట్లు. పదేండ్ల మన్మోహన్‌ సింగ్‌ పాలనలో 2014మార్చి నెల నాటికి బడ్జెట్‌ పత్రాల సమాచారం ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి మిగిల్చిపోయిన అంతర్గత, విదేశీ అప్పుల మొత్తం రు.55,87,149 కోట్లు, అది 2025 మార్చి నాటికి రు.185.11లక్షల కోట్లని, 2026 మార్చి నెలాఖరుకు రు.200.16లక్షల కోట్లకు చేరుతుందని అంచనా వేశారు. పదేండ్ల క్రితం ఇప్పుడు కూడా చర్చ అభివృద్ధి మీదే. పదేండ్లలో యుపిఏ పాలనలో అదనంగా 38లక్షల కోట్ల అప్పు చేస్తే దేశాన్ని అప్పుల పాలు చేశారు, అభివృద్దీ చేయలేదు అంటూ నరేంద్రమోడీ నాడు ధ్వజమెత్తారు. తన ఏలుబడిలో 2025మార్చినెలతో ముగిసే ఆర్థిక సంవత్సరం నాటికి అదనంగా చేసిన అప్పు 129లక్షల కోట్లు. ఇది చాలక ఈ ఏడాది మరో 15.68లక్షల కోట్లు కొత్తగా అప్పులు తీసుకొనేందుకు నిర్ణయించారు. తీరా ఇంత చేసినా 80కోట్ల జనాభా ఉచితంగా నెలనెలా ఐదు కిలోల ఆహారధాన్యాలు ఉచితంగా తీసుకుంటే తప్ప గడవని స్థితికి దేశాన్ని దిగజార్చారు. మరో 22 సంవత్సరాల్లో (2047నాటికి) దేశాన్ని ఎక్కడికో తీసుకుపోతామని కబుర్లు చెబుతున్నారు. నమ్మే మాటలేనా ?

అంతకు ముందు కాంగ్రెస్‌ పాలనకు పదకొండు సంవత్సరాల నరేంద్రమోడీ పాలనకు పెద్ద తేడా ఏమిటి ? మన్మోహన్‌ సింగ్‌ మాకు పెద్ద మొత్తంలో అప్పులు మిగిల్చిపోయారు, వాటిని తీర్చటానికే సరిపోతోందని వాదించవచ్చు. అప్పుల్లో మోడీ సరికొత్త రికార్డు సృష్టించారు గనుక అది తర్కానికి నిలిచేది కాదు.201415లో మోడీ సర్కార్‌ అసలు, వడ్డీ మొత్తాలను తీర్చేందుకు ఖర్చు చేసిన మొత్తం రు.3,13,169 కోట్లు కాగా 2026 మార్చి నాటికి తీర్చాల్సిన మొత్తం రు.12,76,338 కోట్లుగా నిర్మలమ్మ తాజా బడ్జెట్‌లో ప్రతిపాదించారు.ఈ ఏడాది బడ్జెట్‌ మొత్తం రు.50.65లక్షల కోట్లకు గాను రు.15.68లక్షల కోట్లు అప్పుల ద్వారా సేకరిస్తామని చెప్పారు. మూడు సంవత్సరాల తీరుతెన్నులను చూస్తే వడ్డీ, అసలు చెల్లింపుల మొత్తం ఏడాదికి లక్ష కోట్ల వంతున పెరుగుతోంది. ఈ లెక్కన మోడీ మూడోవిడత పాలన ముగిసే నాటికి ఎంత అప్పు తెస్తే అంతమొత్తం పాత అప్పులకే సరిపోతుందని వేరే చెప్పనవసరం లేదు.ఒక వైపు అప్పుల కుప్ప పెరుగుతోంది,జనం మీద జిఎస్‌టి, చమురు మీద సెస్‌ల భారం కొనసాగుతూనే ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గినా ఒక్క పైసా కూడా వినియోగదారులకు తగ్గించకుండా 2022 ఏప్రిల్‌ మొదటి వారం నుంచి ఒకే ధర కొనసాగిస్తూ జేబులను కొల్లగొడుతూనే ఉన్నారు. తెచ్చిన అప్పుల మేరకైనా సంపదలను పెంచే మూలధన పెట్టుబడులుగా పెడుతున్నారా అంటే అదీ లేదు.202324లో రు.16.54లక్షల కోట్ల మేర అప్పులు తెస్తే మూలధన పెట్టుబడులకు రు.7.88 లక్షల కోట్లు మాత్రమే కేటాయించారు, మరుసటి ఏడాది రు.15.69లక్షల కోట్ల అప్పులో రు.8.47లక్షల కోట్లు సవరించిన బడ్జెట్‌ కాగా 202526లో మూలధన పెట్టుబడిగా రు.8.95లక్షల కోట్లుగా ప్రతిపాదించారు. అంతకు ముందు 9.18లక్షల కోట్లు కేటాయించి దాన్ని కుదించినట్లే వచ్చే ఏడాది కూడా అంత మొత్తం ఖర్చు చేస్తారన్న హామీ లేదు. వడ్డీ చెల్లింపుల మాదిరి శాశ్వత ఆస్థుల కల్పన లేదు. అందుకే నరేంద్రమోడీ ఏలుబడి గొప్పతనం ఏమిటి అని ప్రశ్నించాల్సి వస్తోంది.

తమ పాలనలో విదేశీ అప్పులు పెద్దగా తీసుకోలేదని బిజెపి నేతలు గొప్పలు చెప్పుకుంటారు. అంకెలేమి చెబుతున్నాయి. 2014 మార్చి నాటికి విదేశీ అప్పుల మొత్తం మన కరెన్సీలో రు.1.82లక్షల కోట్లు, ఈ మొత్తం 2026 మార్చి నాటికి 6.63లక్షల కోట్లకు పెరుగుతుందని నిర్మలమ్మ బడ్జెట్‌లో చెప్పారు.గత పది సంవత్సరాలలో ఇంత మొత్తం అప్పులు తెచ్చిందెవరు ? మోడీ ఏలుబడిలో రూపాయి విలువ 62 నుంచి 86కు పతనమైంది. దీని వలన జరిగిందేమిటి ? పదేండ్ల క్రితం మోడీ ఒక డాలరు విదేశీ అప్పు తీసుకుంటే దాన్ని మరుసటి ఏడాది చెల్లించాలంటే నాడున్న మారకపు విలువ ప్రకారం రు.62, దానికి నామమాత్రంగా వడ్డీ చెల్లిస్తే సరిపోయేది. అదే డాలరును ఎలాంటి వడ్డీ లేకుండా పదేండ్ల తరువాత ఇచ్చే ఒప్పందం మీద ఎవరైనా ఉదారంగా అప్పు ఇస్తే ఇప్పుడు 86 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.మోడీ దిగిపోయే 2029 నాటికి వందకు పతనమైనా ఆశ్చర్యం లేదు.అధికారానికి వచ్చిన వెంటనే అప్పు తీర్చి ఉంటే ఇంత ఆముదం జనానికి అంటేది కాదు కదా ! ఇదీ మోడీ ఘనత.

ఇప్పుడు కార్పొరేట్లు తమకు మరిన్ని రాయితీలతో పాటు తాము తయారు చేసే వస్తువులు, అందించే సేవలను కొనుగోలు చేసేందుకు మధ్యతరగతికి ఆదాయపన్ను రాయితీలు ఇవ్వాలని, కొందరైతే కార్మికులకు వేతనాలు పెంచాలని కూడా సూచించారు. పన్నెండు లక్షల వరకు ఆదాయానికి పన్ను మినహాయింపు ఇచ్చారు. దీని వలన ఏటా లక్ష రూపాయలవరకు ఆలోపు రాబడి ఉన్నవారికి మిగులుతుందని అంచనా.ఈ మొత్తంతోనే దేశంలో పడిపోయిన వినియోగం పెరుగుతుందా ? ఈ స్వల్ప మిగులుతో గతంలో చేసిన అప్పులు కూడా తీర్చుకోవచ్చు, వస్తువులే కొనాలని లేదు. లేదా పెరిగిన ఖర్చులకు సరిపెట్టుకోవచ్చు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించటం, స్వదేశీ పెట్టుబడిదారులకు మరింత ఊతం ఇచ్చే పేరుతో కార్పొరేట్‌ పన్ను 30 నుంచి 22 శాతానికి తగ్గించారు. కొత్తగా పెట్టే సంస్థలకు 15శాతమే అన్నారు. ఈ రాయితీలతో పరిశ్రమలు, వాణిజ్య సంస్థల లాభాలు విపరీతంగా పెరిగాయి, వాటాదార్లకు డివిడెండ్లు వచ్చాయి తప్ప ఆ మొత్తం పెట్టుబడుల రూపంలో తిరిగి రాలేదు, ఆ మేరకు ఉపాధి కూడా పెరగలేదు. అదే జరిగి ఉంటే వస్తువినియోగం పెరిగి ఉండేది, రూపాయి రూపాయి లెక్కించుకోవాల్సి వచ్చేది కాదు. సంపదలు కొద్ది మంది దగ్గర పోగుపడుతున్న తీరు స్పష్టంగా కనిపిస్తోంది. 201314లో ఏడాదికి 50లక్షల రూపాయల రాబడిని చూపి పన్ను చెల్లించిన వారు 1.85లక్షలుంటే 2023`24లో వారి సంఖ్య 9.34లక్షలకు పెరిగింది. అయితే ఇంకా పన్ను ఎగవేసేవారు, రాబడిని చూపని వారు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు.


దేశంలో 2011జనాభా లెక్కల ప్రకారం రైతులుగా నమోదైన వారు 11.88 కోట్లు, వ్యవసాయ కార్మికులు 14.43 కోట్లు. కార్పొరేట్‌ పన్ను చెల్లించే సంస్థలు 2021లో 9,67,054. నిర్మలా సీతారామన్‌ స్వయంగా వెల్లడిరచినదాని ప్రకారం పైన పేర్కొన్న కార్పొరేట్‌ పన్ను తగ్గింపు కారణంగా ప్రభుత్వం ఏటా రు.1.45 లక్షల కోట్ల రాబడి కోల్పోతున్నది. పిఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి పేరుతో పెట్టుబడి ఖర్చులకు గాను ఏటా 10.32 కోట్ల మంది రైతులకు 63వేల కోట్ల రూపాయలను మాత్రమే కేంద్రం ఇస్తున్నది. అయిన వారికి ఆకుల్లో కాని వారికి కంచాల్లో అంటే ఇదే. రైతులు ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్నారా, కార్పొరేట్‌ సంస్థలు ఎక్కువ మందికి పని చూపుతున్నాయా ? ఎందుకీ వివక్ష ? రైతులకు ఇచ్చే ఆ మొత్తంతో కార్పిరేట్లు విక్రయించే విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, వ్యవసాయ పరికరాల వంటి వాటిని కొనుగోలు చేసేందుకు ఖర్చు చేస్తారు. దానిలో కూడా కార్పొరేట్లకు లాభాలు, ప్రభుత్వాలకు పన్నుల రూపంలో రాబడి వస్తుంది.కానీ కార్పొరేట్లకు ఇస్తున్న రాయితీలతో వారేమైనా వస్తువులు, సేవల ధరలు తగ్గించిన దాఖలా ఉందా ? ఆదాయపన్ను రాయితీలు ఒకటైతే ఎగమతి ప్రోత్సాహకాలు, వెనుకబడిన ప్రాంతాల్లో పరిశ్రమలు పెట్టినందుకు ప్రోత్సాహకాల రూపంలో ఇచ్చే రాయితీలను కూడా పరిగణనలోకి తీసుకుంటే వారికి కట్టబెడుతున్న మొత్తాలు ఇంకా ఎక్కువే ఉంటాయి.


ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తానన్న వాగ్దానాన్ని పాక్షికంగా నెరవేర్చినా జిడిపి వృద్ది రేటు, కొనుగోలు శక్తి దిగజారి ఉండేది కాదు.పని చేసేందుకు ఏ దేశంలోనూ లేనంత మంది యువత ఉన్నదని గొప్పలు చెప్పుకోవటం తప్ప వారికి ఉపాధి సంగతి తరువాత గత పదేండ్లలో పనిచేసేందుకు ముందుకు వచ్చేవారికి కనీసం నైపుణ్యం అయినా కల్పించారా అంటే అదీ లేదు. నైపుణ్యశిక్షణ పేరుతో తగలేసిన వేల కోట్ల రూపాయలు ఒక పెద్ద కుంభకోణంగా చెప్పవచ్చు. దరిద్రం ఏమిటంటే అసలు ఎంత మంది నిపుణులున్నారో కూడా తెలియదు. అందుకే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆ లెక్కలు సేకరిస్తానని ఇప్పుడు చెబుతోంది.నైపుణ్య భారత్‌ కార్యక్రమం కింద కోటీ 40లక్షల మందికి నైపుణ్య శిక్షణ ఇచ్చామని, మరో 54లక్షల మందికి నైపుణ్యాలను పెంచటం లేదా తిరిగి శిక్షణ ఇచ్చామని 2024 కేంద్ర ప్రభుత్వం చెప్పుకుంది. జాతీయ నైపుణ్య అభివృద్ధి కార్పొరేషన్‌(ఎన్‌ఎస్‌డిసి) 2024లో వెల్లడిరచిన అధ్యయన వివరాల ప్రకారం దేశంలో 10.3కోట్ల మంది నైపుణ్య కార్మికులు అవసరం కాగా 7.4కోట్ల మందే ఉన్నారు. మారుతున్న అవసరాలకనుగుణ్యంగా నిన్న నేర్చుకున్న నైపుణ్యం రేపటికి పనికి రావటం లేదు. అందువలన వీరిలో ఎందరు పనికి వస్తారన్నది కూడా ప్రశ్న.చైనాలో 40 కోట్ల మంది కార్మికులు ఉంటే వారిలో 20 కోట్ల మంది నిపుణులైన వారు కాగా ఆరు కోట్ల మంది అత్యంత నైపుణ్యం కలిగిన వారని, ఇతర దేశాలతో పోటీ పడేందుకు తమకు ‘‘ నూతన ఉత్పాదక శక్తులు ’’ ఇంకా ఎంతో మంది కావాలని చైనా చెబుతోంది.మహాకుంభ మేళాలో రికార్డు స్థాయిలో జనాలను గంగలో ముంచి స్నానాలు చేయించేందుకు ఇచ్చిన ప్రాధాన్యత పరిశోధన మరియు అభివృద్ధికి నిధుల కేటాయింపు, నైపుణ్య శిక్షణలో ఎక్కడా కనిపించటం లేదు. ఇలాంటి వారు దేశాన్ని, దేశమంటే మట్టి కాదోయ్‌ మనుషులోయ్‌ అన్న గురజాడ చెప్పిన స్పూర్తితో ముందుకు తీసుకుపోతారా !

Share this:

  • Tweet
  • More
Like Loading...

డోనాల్డ్‌ ట్రంప్‌ తీరు తెన్నులు : నరనరాన భారత్‌పై విద్వేషం ! అయినా ఆలింగనాలకోసం నరేంద్రమోడీ తహతహ !!

12 Wednesday Feb 2025

Posted by raomk in Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

BJP, Donald trump, Elon Musk, JD Vance, Narendra Modi Failures, normalising indian hate:, Racist, RSS

ఎం కోటేశ్వరరావు


మేకతోలు కప్పుకుంటే పులి చారలు కనిపించవు తప్ప దాని స్వభావం మారుతుందా ?నరేంద్రమోడీని డోనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి ఆలింగనాలతో ముంచి తేల్చవచ్చు తప్ప అతగాడి అంతరంగం బయటపడకుండా ఉంటుందా ! మన దేశమన్నా, మన పౌరులన్నా విద్వేషం వెళ్లగక్కేవారు అమెరికాలో ఎందరో ! వారిలో ఒకడైన మార్కో ఎలెజ్‌(25) అనే సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరు అమెరికా మీడియాను ఆకర్షించాడు. సామాజిక మాధ్యమంలో వాడు పెట్టిన పోస్టులలో ‘‘ భారతీయుల మీద విద్వేషాన్ని సాధారణీకరించండి ’’ అన్నది ఒకటి. శ్వేతజాతి దురహంకారులు ఇలాంటి పోస్టులు పెట్టటం సర్వసాధారణం, ప్రతిదాన్నీ పట్టించుకోనవసరం లేదు. మరి మార్కో ప్రత్యేకత ఏమిట ? అమెరికా అసలైన అధ్యక్షుడిగా అధికారం చెలాయిస్తున్న ఎలన్‌ మస్క్‌, ఆంధ్రా అల్లుడు అంటూ మన జనాలు పొంగిపోయిన ఉపాధ్యక్షుడు జెడి వాన్స్‌, చివరిగా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ అందరూ వాడిని సమర్ధించారు, ఉద్యోగానికి రాజీనామా చేసి ఇంటికి పోతే పిలిచి తిరిగి ఇవ్వాలని చెప్పారు. కొద్ది రోజుల్లో భారత ప్రధాని నరేంద్రమోడీ అమెరికా పర్యటనకు వస్తున్నాడని వారికి తెలుసు, అయినా భారత్‌ మీద విద్వేషం వెళ్లగక్కిన వాడిని సమర్ధించటం ఏమిటి ? ఈ పరిణామం మీద ఆత్మగౌరవం గురించి కబుర్లు చెప్పే కాషాయ దళాలుగానీ, కేంద్ర ప్రభుత్వం గానీ నోరుమెదపలేదు. దీన్ని లొంగుబాటు అనాలా ? బానిస మనస్తత్వం అనాలా !


సామర్ద్యం లేని ప్రభుత్వ ఉద్యోగులందరనీ ఊరికే కూర్చో పెట్టి మేపుతున్నాం, వారందరినీ ఇంటికి పంపిస్తాం అని డోనాల్డ్‌ట్రంప్‌ చెప్పాడు. అందుకు గాను ప్రపంచ కుబేరుడు, మనందరీకీ తెలిసిన సామాజిక మాధ్యమవేదిక ఎక్స్‌ అధిపతి ఎలన్‌ మస్క్‌ను కొత్తగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ సామర్ధ్య శాఖ మంత్రిగా నియమించాడు. అతగాడు ఇప్పుడు 23లక్షల ప్రభుత్వ సిబ్బందికి ఒక ఆదేశం జారీ చేసి స్వచ్చందంగా తప్పుకొనేవారికి ఒక అవకాశం ఇస్తున్నాం, మిగిలిన వారి సంగతి తరువాత చూస్తాం అని ప్రకటించాడు. అమెరికాలో వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ అనే దినపత్రిక అత్యధికంగా కాపీలు ముద్రించేదిగా ముందున్నది. అది డోనాల్డ్‌ ట్రంప్‌ చర్యల పట్ల విమర్శనాత్మక వైఖరిని ప్రదరిస్తుంది గనుక వ్యతిరేక పత్రికగా ముద్రవేశారు. ఆ పత్రిక ఎలన్‌ మస్క్‌ కంపెనీ స్పేస్‌ ఎక్స్‌లో పని చేసిన మార్కో ఎలెజ్‌కు ఎలన్‌ మస్క్‌ తన శాఖలో ఎందుకు ఉద్యోగం ఇచ్చాడనో ఇతర కారణాలతో గానీ సమాచారాన్ని సేకరించి మార్కో ఎలెజ్‌ ఒక జాత్యహంకారి అని అతడు గతంలో పెట్టిన పోస్టులను ఉటంకిస్తూ, ప్రస్తుతం వాటిని సామాజిక మాధ్యమం నుంచి తొలగించినట్లు ఆ పత్రిక ఒక వార్తను ప్రచురించింది. అలాంటి వారికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వకూడదు. వార్త ప్రచురణ తరువాత తనను తొలగిస్తారనే అంచనాతో తానే రాజీనామా చేశాడు. అతగాడు గాజా, ఇజ్రాయెల్‌ అనే రెండిరటినీ భూమి మీద నుంచి లేపేసినా నేను పట్టించుకోను, స్వజాతి(మన దేశంలో కులం, గోత్రం, మతాలను పరిగణనలోకి తీసుకుంటారు) కాని వారిని వివాహం చేసుకున్నందుకు ప్రతిఫలం చెల్లించాల్సిన అవసరం లేదు వంటి పోస్టులు పెట్టాడు.


అలాంటి వాడిని వాడి మానాన వదిలేస్తే వేరు . అతన్ని తిరిగి ఉద్యోగంలోకి తీసుకుంటాం అని ఎలన్‌ మస్క్‌ ప్రకటించటమే కాదు, ఉపాధ్యక్షుడు జెడి వాన్స్‌ సమర్దించటం అన్నింటికీ మించి డోనాల్డ్‌ ట్రంప్‌ మాట్లాడుతూ వాన్స్‌ చెప్పాడా అయితే నా అభిప్రాయమూ అదే అంటూ ఆమోద ముద్రవేశాడు. అలాంటి వ్యక్తితో మన ప్రధాని నరేంద్రమోడీ భేఠీ అయ్యేందుకు తాపత్రయపడుతున్నారు. ఏం మాట్లాడతారో, ఏం చేస్తారో చూసిన తరువాత దాని గురించి మాట్లాడుకుందాం. మానవులు తప్పులు చేస్తే దేవతలు క్షమిస్తారు అంటూ ఎలన్‌ మస్క్‌ వెనకేసుకు రాగా కుర్రవాడికి రెండో అవకాశం ఇవ్వాలి అంటూ జెడి వాన్స్‌ సమర్ధించాడు. బుద్దిహీన సామాజిక మాధ్యంలో కార్యకలాపాల కారణంగా ఒక పిల్లవాడి జీవితాన్ని నాశనం చేయకూడదు అన్నాడు. మార్కో రాజీనామా గురించి విలేకర్లు అడగ్గా దాని గురించి తనకు తెలియదని ట్రంప్‌ చెప్పాడు, అయితే మీ ఉపాధ్యక్షుడు తిరిగి తీసుకొనేందుకు అంగీకరించాడు కదా అని విలేకర్లు చెప్పగా అలానా అయితే ఒకే అన్నాడు. మార్కోను తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలా వద్దా అన్న సర్వేలో పాల్గొన్న వేలాది మందిలో 78శాతం అనుకూలంగా ఓటు వేసినట్లు తేలిసింది. గత పదకొండు సంవత్సరాలుగా నరేంద్రమోడీ అమెరికా నేతలతో రాసుకుపూసుకు తిరిగి మనదేశ ప్రతిష్ట, పలుకుబడిని పెంచినట్లు ఊదరగొట్టిన తరువాత అమెరికాలో మనదేశం పట్ల వెల్లడైన విద్వేషతీరు ఇది.అయినా సరే దాన్ని పట్టుకువేలాడేందుకు పడుతున్న తాపత్రయాన్ని ఎలా అర్ధం చేసుకోవాలో ఎవరికి వారే నిర్ణయించుకోవచ్చు.


మార్కో ఎలెజ్‌ ఉదంతాన్ని అమెరికాలోని భారతీయ సంతతి వారు జీర్ణించుకోలేకపోతున్నారు. పుండు మీద కారం చల్లినట్లుగా ఎలెజ్‌ను సమర్ధించటంతో మండిపడుతున్నారు. జెడి వాన్స్‌ సతీమణి భారతీయ సంతతికి చెందిన చిలుకూరి ఉష. అందుకే కొందరు జెడి వాన్స్‌ను ఆంధ్రా అల్లుడు అని కూడా వర్ణించారు.తనను భార్యను కూడా తూలనాడినప్పటికీ ఆ పెద్దమనిషి ఎలెజ్‌ను పల్లెత్తుమాట అనకపోగా విమర్శకులు తనను భావోద్వేగాలతో బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారని ఎదురుదాడి చేశాడు.రిపబ్లికన్‌ పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడు రో ఖన్నా అమెరికన్‌ ఇండియన్‌.ఎలెజ్‌ను తిరిగి తీసుకొనే ముందు అతడి చేత క్షమాపణ చెప్పిస్తావా ? ఇది మన బిడ్డల కోసం అని వ్యాఖ్యానించాడు. వాన్స్‌ కబుర్లు చెప్పటం సరే, రోజంతా ఆయన బిడ్డలకు భద్రత ఉంటుంది. ఇంటర్నెట్‌లో వేధింపులకు గురయ్యే అవకాశం ఉన్న భారతీయుల పిల్లల సంగతేమిటి ? అంటూ అనేక మంది ప్రశ్నించారు. మార్కో ఎలెజ్‌ను పిలిచి మరీ ఉద్యోగమివ్వటం అంటే జాత్యంహంకార, భారత్‌ వ్యతిరేక శక్తులను బహిరంగంగా ప్రోత్సహించటం తప్ప మరొకటి కాదు. గాయపడిన భారతీయుల మనోభావాలను నరేంద్రమోడీ పరిగణనలోకి తీసుకుంటారా ? డోనాల్డ్‌ ట్రంప్‌తో ఆలింగనాల్లో అన్నీ మరచిపోతారా ?


అమెరికాలో ఇప్పుడు రెండు పరిణామాలు జరుగుతున్నాయి. ఒకటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు సమర్ధవంతంగా పనిచేయటం లేదనే పేరుతో వారి సంఖ్యను తగ్గించటం, తద్వారా మిగిలే సొమ్మును కార్పొరేట్లకు,దుర్మార్గాలకు పాల్పడుతున్న ఇజ్రాయెల్‌ వంటి వాటికి మళ్లించేందుకు లేదా బడ్జెట్‌లోటును పూడ్చేందుకు చూస్తున్నారు.ట్రంప్‌ సర్కార్‌ బెదిరింపులు, విసిగిపోవటం తదితర కారణాలో గడువులోపల 65వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు స్వచ్చంద ఉద్యోగవిరమణకు అంగీకరించారు. అయితే దీని గురించి వాద ప్రతివాదనలు వినేందుకు ఒక కోర్టు ఇచ్చిన గడువు సోమవారంతో ముగిసింది. ప్రభుత్వ ఉద్యోగులు ఆఫీసుకు వచ్చేందుకు సిద్దంగా లేరు, వారిని వదలించుకొని ఉన్నత అర్హతలున్నవారిని నియమిస్తామని ట్రంప్‌ పత్రికా కార్యదర్శి కరోలిన్‌ లీవిట్‌ అన్నారు. స్వచ్చంద ఉద్యోగ విరమణకు అర్హత ఉన్న 23లక్షల మంది ఉద్యోగుల్లో 65వేలంటే చాలా తక్కువ అని చెప్పనవసరం లేదు. మిలిటరీ, పోలీసు వంటి కొన్ని తరగతులకు అనుమతి లేదు. మొత్తంగా పదిశాతం మంది ఉద్యోగుల తగ్గింపు విద్య, వైద్యం వంటి రంగాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుందనే హెచ్చరికలు కూడా వెలువడ్డాయి.తాను తీర్పు ఇచ్చే వరకు స్వచ్చంద ఉద్యోగ విరమణ అమలు నిలిపివేయాలని ఒక కోర్టు ఆదేశం ఇచ్చింది.


అమెరికాకు అక్రమంగా వలస వచ్చిన వారిని వెతికి పట్టుకొని వారి దేశాలకు బలవంతంగా పంపటం ఇప్పటికే ప్రారంభమైంది. నిజానికి ఇది కొత్తేమీ కాదు, గతేడాది అక్రమంగా వలస వచ్చిన 90వేల మంది భారతీయులను అరెస్టు చేసినట్లు వార్తలు వచ్చాయి. 2022 నాటి సమాచారం ప్రకారం అక్కడ కోటీ పది లక్షల మంది అక్రమవలసదారులు ఉన్నారు. వారిలో 48లక్షల మంది పక్కనే ఉన్న మెక్సికోవారే. మూడిరట రెండువంతుల మంది మెక్సికో, లాటిన్‌ అమెరికా దేశాల వారే ఉన్నారు. ఎల్‌ సాల్వడార్‌ నుంచి 7.5లక్షలు, భారత్‌ 7.25, గౌతమాలా 6.75, హొండురాస్‌ 5.25 లక్షల వంతున ఉన్నారు. ఇలా వచ్చిన వారు వ్యవసాయం,హోటల్‌,ఇతర చిన్న చిన్న పనులు చేస్తున్నారు.వీరందరూ ఇప్పుడు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఉన్నారు. ఎప్పుడేం జరుగుతుందో తెలియని స్థితి. అయితే వీరితో పని చేయించుకొనే వారికి కూడా సమస్యే. ఒక్కసారిగా వీరంతా లేకపోతే ఏం చేయాలి ? ఇప్పటికే అనేక ప్రాంతాల పొలాల్లో నిలువు మీద ఉన్న పంటలు దెబ్బతినట్లు వార్తలు వచ్చాయి. వలసదారుల సమస్య ఫెడరల్‌ ప్రభుత్వానిది, అయితే తమ నేత ట్రంప్‌ మెప్పు పొందేందుకు రిపబ్లికన్‌ పార్టీకి చెందిన ఫ్లోరిడా రాష్ట్ర గవర్నర్‌(మన ముఖ్యమంత్రి మాదిరి) రాన్‌ డెశాంటిస్‌ హడావుడి చేస్తున్నాడు. ఆ రాష్ట్ర శాసన సభ్యులు తనకు సహకరించాలని కోరుతున్నాడు. ట్రంప్‌ సర్కార్‌ అక్రమవలసదారులను బలవంతంగా తిప్పి పంపేందుకు తీసుకున్న కార్యక్రమానికి సహకరించని స్థానిక ఉద్యోగులను ఇంటికి పంపే అధికారం తనకు కావాలని కోరుతున్నాడు. ఫ్లోరిడాలో ఉంటూ విదేశాలకు డబ్బు పంపేవారు వాటి వివరాలను అందచేయాలని, తద్వారా వారి వలస స్థితిని గుర్తించవచ్చంటున్నాడు.


రాన్‌ డెశాంటిస్‌ తీరుతెన్నులను చూసి అనేక మంది అపహాస్యం చేస్తున్నారు. కొన్ని చట్టాలను చేసేందుకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల ఏర్పాటుకు పరిశీలించాలంటూ ఒక జర్నలిస్టు వ్యంగ్యంగా రాసినప్పటికీ అక్రమవలసదారులను వెనక్కు పంపితే తలెత్తే పరిస్థితి ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. వాటిలో కొన్ని ఇలా ఉన్నాయి. ఫ్లోరిడాలో నమోదైన పౌరులకు ‘‘ పొలాల్లో పనిచేసే స్వేచ్చా చట్టం 2025 ’’ చేయాలి.తద్వారా పొలాల్లో మిరియాలు, చెరకు, ఇతర పంటలు ఎండి, చెడిపోకుండా ఎలా తీసుకురావాలో పౌరులకు శిక్షణ ఇవ్వాలి. ‘‘ దేశభక్తులైన ఈ కార్మికులకు ’’ పొలాల్లోకి రాను పోను బస్‌లను ఏర్పాటు చేయాలి, అవసరం ఉన్నా లేకున్నా ప్రతి నాలుగు గంటలకు వారికి ఐదు నిమిషాల పాటు మంచినీరు తాగేందుకు విరామం ఇవ్వాలి. పని చేసే సమయాల్లో తగిలే దెబ్బలు లేదా వడదెబ్బ లేదా తలెత్తే మానసిక వత్తిడితో భూ యజమానులకు ఎలాంటి సంబంధం లేదని పనిచేసే వారు హామీ పత్రం మీద సంతకాలు చేయాలి. ఫ్లోరిడా చొరవలో సహాయకులు అనే పథకం కింద ఇండ్లలో పనిచేసే వారికి నైపుణ్యాల శిక్షణ ఇవ్వాలి.హోటళ్లు కార్మికుల కొరత ఎదుర్కొంటున్నపుడు అత్యవసర పని చేసేందుకు సిద్దంగా ఉండాలి.అతిధేయ రంగంలో వారికి వారం పాటు శిక్షణ ఇవ్వాలి.మరుగుదొడ్లు శుభ్రం చేయటం, పరుపుల మీద దుప్పట్లు వేయటం, కార్పెట్ల మీద ఎలాపడిరతో తెలియని మరకలను తుడిచివేయటం వాటిని వారు నేర్చుకోవాలి. ఈ దేశభక్తులైన ఫోరిడియన్లు వలసదారులను పంపివేసినపుడు తలెత్తే కొరత లేకుండా ఆతిధ్య రంగంలో పనిచేసేందుకు రాష్ట్ర గవర్నర్‌ క్లీన్‌ స్వీప్‌ రియాక్షన్‌ ఫోర్సుగా పని చేయాలి. శిక్షణ తరువాత వీరికి ప్రతిష్టాత్మ మాగా (మేక్‌ ఎగైన్‌ గ్రేట్‌ అమెరికా) మెయిడ్‌ అనే హోదాతో అవార్డు ఇవ్వాలి.


క్లీన్‌ ప్లేట్‌ ఫండ్‌(కంచాలను శుభ్రం చేసేందుకు నిధి) ఏర్పాటు చేయాలి. రెస్టారెంట్ల నుంచి తొలగించిన వలస కార్మికుల వలన ఏర్పడే కొరత నివారణకు నమోదైన ఫ్లోరిడియన్లకు అంట్లు తోమే సేవలను అప్పగించాలి.రెస్టారెంట్లలో భోంచేసిన వారు తాము తిన్న ప్లేట్లను తామే కడిగితే అలాంటి వారికి బిల్లులో 20శాతం రాయితీ ఇవ్వాలి.గమనిక కొత్తగా నియమితులైన కార్మికులు తొలగించిన వారి మాదిరి కష్టపడి పని చేస్తారని భావించకూడదు. తొలగించిన ఒక్కొక్క హైతియన్‌ లేదా గౌతమాల కార్మికుడి స్థానంలో ముగ్గురు అంట్లుతోమే అమెరికన్‌ పౌరులను నియమించటం మంచిది. మామ్మల బెడ్‌ పాన్‌ చొరవ పేరుతో సేవా పనికి సిద్దం కావాలి. అక్రమవలసదార్లను వెనక్కు పంపటాన్ని పండగ చేసుకుంటూ మంచాల మీద ఉన్న వృద్ధుల సేవకు సిద్దం కావాలి. వారి పక్క బట్టలు మార్చటంతో పాటు బెడ్‌పాన్‌లు మార్చాలి. వృద్ధులను మంచాల మీదే ఉంచి పక్కలు మార్చటం మీకు తెలుసా, దీని గురించి ఫ్లోరిడా రాష్ట్రం ఇచ్చే నూతన శిక్షణ కార్యక్రమం ఎంతో ఉద్వేగపరుస్తుంది. ఇంటి ఆవరణలో పెరిగే గడ్డి మొక్కలను సంరక్షించటం, ఎక్కువగా పెరిగిన వాటిని కత్తిరించటం, రాలిన ఆకులను తొలగించటం, ఇంట్లో వంటగది, బాత్‌రూమ్‌లో మార్పులు, మరమ్మత్తులు, కప్పుల నుంచి నీరు కారటాల వంటి వాటిని కూడా స్వయంగా చేసుకుంటూ ఎంతో ఆనందాన్ని పొందవచ్చని మీరెప్పుడైనా అసలు ఊహించారా, ఇప్పుడు అలాంటి సదవకాశం వచ్చింది.ఈ క్రమంలో నిబంధనలను అతిక్రమించినా ఎలాంటి తనిఖీలు, జరిమానాలు ఉండవు, ఇది ఒక గోడకూలిన శబ్దం కాదు, స్వేచ్చా ధ్వని సంకేతం !

Share this:

  • Tweet
  • More
Like Loading...

డోనాల్డ్‌ ట్రంప్‌కు మతి చలించిందా ! సుంకాలను వ్యతిరేకించేవారంతా చైనా అదుపులో ఉన్నట్లేనట !!

04 Tuesday Feb 2025

Posted by raomk in CHINA, Current Affairs, Economics, Europe, History, imperialism, International, INTERNATIONAL NEWS, Opinion, Uncategorized, USA

≈ Leave a comment

Tags

Canada, Donald trump, Mexico wall, Trade Protectionism, TRADE WAR, Trump tariffs, US-CHINA TRADE WAR, Xi Jinping

ఎం కోటేశ్వరరావు


డోనాల్డ్‌ ట్రంప్‌ ఎన్నికల ముందునుంచీ ప్రకటించినట్లుగానే ప్రపంచ వాణిజ్య పోరుకు తెరతీశాడు. తన పన్నులను వ్యతిరేకించే విదేశమైనా లేక అమెరికాలో ఉన్న కంపెనీ అయినా సరే వారంతా చైనా అదుపులో ఉన్నట్లే అన్నాడు. ఇది రాసిన సమయంలో చెప్పిన మాటలకు, పాఠకులకు చేరే సమయానికి మార్పులు, విస్తరణ జరిగే రీతిలో ట్రంప్‌ వేగం కనిపిస్తోంది. కెనడా, మెక్సికోల మీద విధించిన పన్నుల అమలు కొంతకాలం వాయిదా వేస్తామనంటతో పాటు ఐరోపా మీద త్వరలో విధిస్తా ,వారు అమెరికా పట్ల భయంకరంగా వ్యవహరించారు, లాభాలకు ఒక అవకాశంగా తీసుకున్నారు, చైనా మీద ప్రకటించిన మొత్తాన్ని పెంచుతా అన్నాడు. స్వంత జనాలు, కంపెనీలతో పాటు ప్రపంచ వృద్ధికి నష్టం, అమెరికా పలుకుబడికీ దెబ్బ అన్న అనేక మంది ఆర్థికవేత్తల హెచ్చరికలను ఖాతరు చేయటం లేదు. కెనడా, మెక్సికోలపై 25శాతం, చైనా వస్తు దిగుమతుల మీద పదిశాతం పన్ను విధిస్తూ ఫిబ్రవరి ఒకటవ తేదీన ఉత్తరువులు జారీ చేశాడు. ఇప్పటి వరకు వెల్లడైన వైఖరులను చూస్తే అదిరించి బెదిరించి దారికి తెచ్చుకోవాలన్న ఎత్తుగడ కనిపిస్తోంది.పన్నులను వ్యతిరేకిస్తున్న వారు ఎవరైనా కుహనా వార్తల వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌, స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టే(హెడ్జ్‌ ఫండ్స్‌) వారు లేదా సంస్థలు చైనా అదుపుల్లో ఉన్నట్లే అన్నాడు. తన నిర్ణయాలకు అద్భుత స్పందన వస్తున్నదని చెప్పుకున్నాడు. ఇతర దేశాలకు రాయితీల రూపంలో అమెరికా లక్షల కోట్ల డాలర్లు నష్టపోతున్నదన్నాడు. జనాలకు ఆర్థికంగా కొంత నొప్పి కలగవచ్చుగానీ అమెరికా ప్రయోజనాలకు ఆ మాత్రం భరించక తప్పదన్నాడు. దక్షిణాఫ్రికా భూములను గుంజుకుంటున్నదని, కొన్ని సామాజిక తరగతుల పట్ల చెడుగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ, ఆ దేశానికి రానున్న రోజుల్లో నిధులు నిలిపివేస్తామని, గతంలో ఇచ్చిన వాటి మీద దర్యాప్తు చేస్తామని చెప్పాడు.


ఖండనలతో పాటు యావత్‌ ప్రపంచం అప్రమత్తమై ఎలా ఎదుర్కోవాలా అన్న శోధనలో పడిరది. అక్రమంగా దిగుమతి అవుతున్న ఫెంటానిల్‌ నిరోధానికి జాతీయ అత్యవసర పరిస్థితిని ట్రంప్‌ ప్రకటించాడు.కృత్రిమ సింథటిక్‌ మరియు నల్లమందుతో తయారు చేసే నొప్పి నివారణ, మత్తు మందును ఫెంటానిల్‌ అని పిలుస్తున్నారు. దీన్ని ఔషధంగా వినియోగించటానికి అనుమతి ఉంది. మాదక ద్రవ్యంగా కూడా వినియోగిస్తున్నారు.అక్రమంగా దిగుమతి అవుతున్న ఫెంటానిల్‌ అమెరికాలో లక్షల మంది ప్రాణాలు తీసిందని అధ్యక్ష భవన మీడియా కార్యదర్శి కారోలిన్‌ లీవిట్‌ ఆరోపించారు. డోనాల్డ్‌ ట్రంప్‌ అంటే అమెరికా, అమెరికా అంటే ట్రంప్‌ అన్నట్లుగా పరిస్థితి తయారు కావటంతో కొంత మంది ఇప్పుడు ట్రంపెరికా అని పిలుస్తున్నారు. తాము చర్చలను తప్ప ఘర్షణను కోరుకోలేదని, కానీ ప్రతికూల చర్యలకు పూనుకోక తప్పటం లేదని మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షియిన్‌బామ్‌ ఎక్స్‌ ద్వారా ప్రకటించారు. మెక్సికో ప్రయోజనాల రక్షణకు అవసరమైన చర్యలన్నింటినీ తీసుకోవాలని తమ ఆర్థిక మంత్రిని కోరినట్లు తెలిపారు. మాదక ద్రవ్యాల ముఠాలతో మెక్సికో ప్రభుత్వం కుమ్మక్కు అయినందునే తాము పన్నులు విధించాల్సి వస్తోందంటూ అధ్యక్షభవనం చెప్పిన సాకును ఆమె ఖండిరచారు. అమెరికా నుంచి దిగుమతి అయ్యే ఏఏ వస్తువులను లక్ష్యంగా చేసుకోవాలో ఇంకా వెల్లడిరచలేదు. స్వతంత్ర మెక్సికో చరిత్రలో జరిగిన అతిపెద్ద దాడులలో ఇదొకటని, అమెరికాకెనడామెక్సికో కుదుర్చుకున్న ఒప్పందానికి ఇది విరుద్దమని పాలకపార్టీ నేత రికార్డో, ఆర్థిక మంత్రి ఎబ్రార్డ్‌ ప్రకటించాడు. తాము నష్టపడతామని, వారికీ అదే జరుగుతుందన్నారు.ప్రస్తుతం అమెరికాకు ఎగుమతుల్లో చైనాతో మెక్సికో పోటీపడుతోంది. మూడోవంతు మెక్సికో జిడిపి అమెరికాకు ఎగుమతులపై ఆధారపడి ఉంది. ఎగుమతి, దిగుమతుల్లో మెక్సికో వాణిజ్య మిగుల్లో ఉంది. అమెరికా నుంచి దిగుమతి చేసుకొనే పంది మాంసం, జున్ను, వ్యవసాయ ఉత్పత్తులు, ఉక్కు, అల్యూమినియం వస్తువుల మీద ఐదు నుంచి 20శాతం వరకు పన్నులు విధించాలని ఆలోచిస్తున్నది. బీరు,వైన్‌,పండ్లు, పండ్ల రసాలతో సహా అమెరికా నుంచి వచ్చే వస్తువులపై 25శాతం పన్ను విధించనున్నట్లు కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రుడేవ్‌ ప్రకటించాడు. తొమ్మిదివేల కిలోమీటర్ల దూరం ఉన్న సరిహద్దులో ఇరు దేశాల వాణిజ్య లావాదేవీలు రోజుకు రెండున్నర బిలియన్ల డాలర్ల మేర జరుగుతున్నాయి. పన్నుల విధింపు తమ మీద ఆర్థిక యుద్ధం ప్రకటించటం, రెండు దేశాల మధ్య ఉన్న చారిత్రక బంధాన్ని ఉల్లంఘించటమే అంటూ దీన్ని తాము, కెనడియన్లతో కలసి ప్రతిఘటిస్తామని బ్రిటీష్‌ కొలంబియా ప్రధాని డేవిడ్‌ ఇబై ప్రకటించాడు. డాలర్‌కు డాలర్‌ అన్న పద్దతిలో దెబ్బతీస్తామని కెనడాలోని ఓంటారియో రాష్ట్ర నేతలు చెప్పారు. తమ మీద అడ్డగోలుగా పన్ను విధిస్తే గట్టిగా ప్రతి స్పందిస్తామని ఐరోపా యూనియన్‌ ప్రతినిధి వ్యాఖ్యానించాడు.


ట్రంప్‌ చర్యను ఖండిస్తూ చర్చలకు ద్వారాలను తెరిచే ఉంచామని చైనా వాణిజ్య, ఆర్థిక మంత్రిత్వశాఖలు ప్రకటించాయి. ప్రపంచ వాణిజ్య సంస్థలో పన్నుల విధింపును సవాలు చేస్తామని ప్రకటించాయి. ఫెంటానిల్‌ అమెరికా సమస్య. దాని మీద ఏ చర్య తీసుకున్నా తాము మద్దతు ఇస్తామని చైనా స్పష్టం చేసింది. తాము ఇప్పటికే అమెరికాకు సహకరిస్తున్నామని, గణనీయమైన ఫలితాలు కూడా వచ్చాయన్నారు. ట్రంపు పన్నులు చైనా ఆర్థిక వ్యవస్థకు పెద్ద దెబ్బ కాదని వాణిజ్య రంగ నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ ఆర్థిక రంగం మీద అమెరికా పన్నులు ఎలాంటి ప్రభావితం కలిగిస్తాయో అన్న ఆందోళన చెందుతున్నట్లు జపాన్‌ ఆర్థిక మంత్రి కాటో చెప్పాడు.తమ మీద ప్రభావం ఎలా ఉంటుందో చూసి తగిన చర్యలు తీసుకుంటామన్నాడు. మెక్సికోలో ఉత్పత్తి కేంద్రాలున్న దక్షిణ కొరియా కంపెనీల మీద ఎలాంటి ప్రభావం పడుతుందో సన్నిహితంగా గమనించాలని ఆ దేశ తాత్కాలిక అధ్యక్షుడు చోయ్‌ శాంగ్‌ మోక్‌ ప్రభుత్వ సంస్థలను ఆదేశించాడు. కొన్ని కంపెనీలు అమెరికాలో ఉత్పత్తి జరపాలని ఆలోచిస్తున్నాయి. పీజా, కార్ల ధరలు పెరుగుతాయి సిద్దంగా ఉండండి అంటూ అమెరికా సెనెట్‌లో ప్రతిపక్ష డెమోక్రటిక్‌ పార్టీ సెనెటర్‌ చార్లెస్‌ ష్కమర్‌ హెచ్చరించాడు. కార్ల విడి భాగాల దిగుమతులపై పన్ను విధించి ధరలు పెరిగేందుకు దోహదం చేయవద్దని అమెరికన్‌ ఆటోమోటివ్‌ పాలసీ మండలి అధ్యక్షుడు మాట్‌ బ్లంట్‌ కోరాడు. పరిణామాలు, పర్యవసానాలను ఎదుర్కొనేందుకు భారత్‌తో సహా వర్ధమాన దేశాలన్నీ సిద్దం కావాలని కోటక్‌ మహీంద్ర బ్యాంక్‌ స్థాపకుడు ఉదయ్‌ కోటక్‌ కోరారు. తమకు నష్టం చేసే దేశాలన్నింటి మీద పన్నులు వేస్తానని ట్రంప్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. అమెరికా వస్తువులను అన్యాయంగా భారత్‌ అడ్డుకుంటున్నదని ఆరోపించాడు.

ట్రంప్‌ పన్నులతో జరిగేదేమిటి అన్న చర్చ ఎన్నికలకు ముందే ప్రారంభమైంది. బస్తీమే సవాల్‌ అంటూ అన్ని దేశాల మీద తొడగొట్టిన కారణంగా మిగతా దేశాలన్నింటికీ కలిపి ఎంత నష్టం జరుగుతుందో ఒక్క అమెరికాకు అంత ఉంటుంది. ఏ ఏ వస్తువుల మీద పన్నులు విధిస్తారు, చేసిన ప్రకటనలు, ఇచ్చిన ఆదేశాలకు ట్రంప్‌ కట్టుబడి ఉంటాడా అన్నది కూడా చూడాల్సి ఉంది. బెదిరించటం వెనక్కు తగ్గటం అతని చరిత్ర. తొలిసారి అధికారానికి వచ్చినపుడు అక్రమ వలసలను నివారింటచంలో విఫలమైనందున మెక్సికో వస్తువులపై ఐదు నుంచి 25శాతం పన్నులు విధిస్తానని ప్రకటించాడు. తరువాత వెనక్కు తగ్గాడు. నిఘంటువులో దేవుడు, ప్రేమ, మతం తరువాత అందమైన పదం పన్నులు అని ట్రంప్‌ వర్ణించాడు. అమెరికా చరిత్రలో 1890దశకంలో 25వ అధ్యక్షుడు విలియమ్‌ మెకన్లీ ఎడా పెడా పన్నులు విధించిన నేతగా నమోదయ్యాడు. ఇప్పుడు ట్రంప్‌ అదే బాటలో నడుస్తున్నట్లు వర్ణిస్తున్నారు.ఇప్పటికే పెద్ద ఎత్తున లోటుబడ్జెట్‌తో ఉండగా పన్నులు తగ్గించాలని ట్రంప్‌ తలపెట్టాడు, తద్వారా వచ్చిన నష్టాన్ని విదేశీ దిగుమతులపై పన్ను విధింపుతో పూడ్చాలని చూస్తున్నాడు. అయితే దానికి దేశకార్మికవర్గాన్ని ఫణంగా పెట్టాలని చూస్తున్నాడు. దిగుమతి పన్నులు వేల కోట్ల డాలర్లు బహుశా లక్షల కోట్లు కూడా తమ ఖజానాలోకి వచ్చిపడవచ్చని ప్రపంచ ఆర్థికవేదిక సమావేశాల్లో ట్రంప్‌ చెప్పాడు.
అమెరికా విధించే పన్నులు ఎలా ఉండబోతున్నాయి, సామాన్యుల మీద ఎంత భారం పడుతుందన్నది ఇప్పుడు పెద్ద చర్చగా ఉంది. టాక్స్‌ ఫౌండేషన్‌ సంస్థ చెబుతున్నదానిని బట్టి కెనడా, మెక్సికోల మీద పన్ను కారణంగా అమెరికా జిడిపి 0.8శాతం దిగజారుతుంది, 1.3 ఎగుమతులు, 2.8శాతాల చొప్పున దిగుమతులు తగ్గుతాయి.లక్షా 84వేల ఉద్యోగాలు పోతాయి. ఎంత భారం పడుతుందనే లెక్కలు అన్నీ ఒకే విధంగా లేవు. పన్ను మొత్తం 272 బిలియన్‌ డాలర్లు ఉంటే కుటుంబానికి ఏటా 2,600 డాలర్లు అదనపు భారం అని కార్పే క్రాస్‌ బోర్డర్‌ సొల్యూషన్స్‌ పేర్కొన్నది. కెనడా, మెక్సికో దిగుమతుల మీద 25శాతం చొప్పున అమలు చేస్తే 232.5 బి.డాలర్లు, చైనా వస్తువులపై 43.2 మొత్తం 275.7బి.డాలర్లని దీని ప్రకారం 33 కోట్ల జనాభాలో తలకు 835 డాలర్ల చొప్పున నలుగురున్న ప్రతి కుటుంబం మీద 3,342 డాలర్లని మరో లెక్క.చైనా వస్తువులపై 60శాతం, మిగతా వాటిపై 20శాతం విధిస్తే ఏటా కుటుంబం మీద 2,600 డాలర్ల భారమని పీటర్సన్‌ ఇనిస్టిట్యూట్‌, మొత్తం మీద పదిశాతం విధిస్తే 2,045 డాలర్లని టాక్స్‌ ఫౌండేషన్‌, నేషనల్‌ రిటెయిల్‌ ఫెడరేషన్‌ అంచనా ప్రకారం 7,600 డాలర్లు ఉంటుంది. ఈ పన్నులతో కంపెనీలు, వినియోగదారుల నుంచి ప్రతిఘటన ఎదురు కావచ్చని కూడా చెబుతున్నారు. తొలిసారి అధికారానికి వచ్చినపుడు ట్రంప్‌ విధించిన పన్నులకు ప్రతిగా ఐరోపా యూనియన్‌, చైనా చర్యలు తీసుకున్నాయి.వ్యవసాయ రంగంలో ట్రంప్‌ మద్దతుదార్లు, ఇతరులూ నష్టపోయారు. జూరిచ్‌ విశ్వవిద్యాలయం,మచాసుచెట్స్‌, హార్వర్డ్‌, ప్రపంచ బ్యాంకు చేసిన అధ్యయనాల ప్రకారం ట్రంప్‌ విధించిన పన్నులు అమెరికాలో ఉపాధిని పునరుద్దరించలేదని అలాగని ఉపాధిని తగ్గించలేదని కూడా తేలింది. అందువలన ఇప్పుడు ట్రంప్‌ చెబుతున్న మాటలు, చేతల ప్రభావం, పరిణామాలు, పర్యవసానాలు వెంటనే వెల్లడయ్యే అవకాశాలు లేవు.భారత్‌తో సహా వివిధ దేశాలలో స్టాక్‌మార్కెట్లు, కరెన్సీ విలువల్లో ఒడుదుడుకులు మాత్రం కనిపిస్తున్నాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

Recent Posts

  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !
  • ఆ గట్టునుంటావా ఈ గట్టుకొస్తావా : నరేంద్రమోడీకి విషమ పరీక్ష పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • జర్మన్‌ హిట్లర్‌ బాటలో శాస్త్రవేత్తలను బయటకు పంపుతున్న ట్రంప్‌ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !
  • ఆ గట్టునుంటావా ఈ గట్టుకొస్తావా : నరేంద్రమోడీకి విషమ పరీక్ష పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • జర్మన్‌ హిట్లర్‌ బాటలో శాస్త్రవేత్తలను బయటకు పంపుతున్న ట్రంప్‌ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !
  • ఆ గట్టునుంటావా ఈ గట్టుకొస్తావా : నరేంద్రమోడీకి విషమ పరీక్ష పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • జర్మన్‌ హిట్లర్‌ బాటలో శాస్త్రవేత్తలను బయటకు పంపుతున్న ట్రంప్‌ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d