• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: CHINA

ఏమి రాజకీయాల్రా బాబూ : చైనాపై అమెరికా పెద్దన్న ధ్వజం – విశ్వగురువు నరేంద్రమోడీ లొంగుబాటు !!

16 Thursday May 2024

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, Europe, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Prices, USA, WAR

≈ Leave a comment

Tags

Anti China Propaganda, Anti communist, BJP, China, CHINA TRADE, Donald trump, Import duty on EVs, Joe Biden, Narendra Modi Failures, RSS, TRADE WAR, Xi Jinping


ఎం కోటేశ్వరరావు


ఒకవైపు బెదిరించి లొంగదీసుకోవాలన్న ఎత్తుగడ. మరోవైపు జనం ముందు శత్రువు అంటూనే చైనా సంతుష్టీకరణ.ఎందుకిలా జరుగుతోంది ? ” ఉక్రెయిన్‌ యుద్ధాన్ని నరేంద్రమోడీ ఆపివేయగలిగారు. అమెరికా, రష్యా అధినేతలను సైతం శాసించగలిగిన పలుకుబడి కలిగిన విశ్వగురువుగా ఎదిగారు, ప్రపంచ నేతల్లో పలుకుబడి ఎక్కువ కలిగిన నేతగా ఉన్నారు.” మోడీ గురించి ఇలాంటి ఎన్నో అంశాలను ప్రచారం చేస్తున్నారు. జనం కూడా నిజమే కదా అని వింటున్నారు, మేము సైతం తక్కువ తిన్నామా అన్నట్లుగా వాటిని ఇతరులకు ఉచితంగా పంచుతున్నారు. వాట్సాప్‌ విశ్వవిద్యాలయం నుంచి ఎలాంటి కష్టం లేకుండానే పట్టాలు పొందుతున్నారు.ఇక తాజా విషయానికి వస్తే చైనా నుంచి దిగుమతి అవుతున్న విద్యుత్‌ వాహనాలు,కంప్యూటర్‌ చిప్స్‌, వైద్య ఉత్పత్తులపై అమెరికా సర్కార్‌ వందశాతం వరకు దిగుమతి సుంకాన్ని విధించి వాణిజ్య యుద్దాన్ని కొనసాగిస్తున్నాం కాసుకోండి అంటూ ఒక సవాల్‌ విసిరింది. మరి అదే అమెరికా మెడలు వంచారని, దారిలోకి తెచ్చుకున్నారని చెబుతున్న నరేంద్రమోడీ ఏం చేశారు ? ఇప్పటి వరకు మనదేశం విదేశీ విద్యుత్‌ వాహనాలపై రకాన్ని బట్టి 70 నుంచి 100శాతం వరకు విధిస్తున్న దిగుమతి సుంకాన్ని పదిహేను శాతానికి తగ్గించారు. అయితే చైనా కంపెనీలతో సహా ఎవరైనా 50 కోట్ల డాలర్ల మేరకు ఆ వాహనరంగంలో మనదేశంలో పెట్టుబడులు పెట్టాలి, ఉత్పత్తి ప్రారంభించేంత వరకు ఐదు సంవత్సరాల పాటు ఏటా ఎనిమిది నుంచి 40వేల వరకు వాహనాలను ప్రతి కంపెనీ నేరుగా దిగుమతులు చేసుకోవచ్చు. వాహనాల తయారీలో దేశీయంగా ఉత్పత్తి చేస్తున్న విడిభాగాల వినియోగం ప్రస్తుతం 30 నుంచి 40శాతం వరకు ఉందని, నూతన విధానం వలన మరింత పెరుగుతుందని ప్రభుత్వం చెబుతుండగా రానున్న రోజుల్లో చైనా వాహనాలతో భారత మార్కెట్‌ నిండిపోతుందని ఆ రంగ నిపుణులు హెచ్చరిక, ఆందోళన వెల్లడించారు. అమెరికా మెడలే వంచగలిగిన నరేంద్రమోడీ చైనా విషయంలో ఇప్పుడున్న పన్నును కొనసాగించకుండా ఇలా ఎందుకు లొంగిపోయినట్లు ? అమెరికా పెద్దన్న బెదిరించి లొంగదీసుకోవాలని చూస్తుంటే, విశ్వగురువు తనకు నచ్చని మాట సంతుష్టీకరణకు ఎందుకు పూనుకున్నట్లు ?


నవంబరు నెలలో జరగనున్న ఎన్నికల్లో జో బైడెన్‌కు ప్రత్యర్ధి డోనాల్డ్‌ ట్రంప్‌ చుక్కలు చూపిస్తున్నాడు.చైనా నుంచి దిగుమతులు అంటే అమెరికన్లకు ఉపాధి తగ్గటమే. అందుకే ఓటర్లను ప్రసన్నం చేసుకొనేందుకు బైడెన్‌ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఎందుకంటే అమెరికాలో విద్యుత్‌ వాహనాలను తయారు చేసే కంపెనీలు ఉన్నాయి గనుక అక్కడి వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మనదేశంలో పదేండ్లలో మోడీ అలాంటి కార్ల తయారీని ప్రోత్సహించటం, పరిశోధనా, అభివృద్ధి రంగాలను పట్టించుకోలేదు. ఈ కారణంగా మనదేశంలోని కార్పొరేట్‌ సంస్థలు చైనా కంపెనీలతో సంయుక్త భాగస్వామ్యం, దిగుమతులకు మోడీ సర్కార్‌ మీద వత్తిడి తెచ్చాయి. ఎన్నికలలో వాటి నుంచి నిధులు కావాలి గనుక ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడక ముందే వాటిని సంతుష్టీకరించేందుకు విద్యుత్‌ వాహనాల దిగుమతి, తయారీ విధానంలో వారికి అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. కొన్ని కంపెనీలు ఎన్నికల బాండ్ల రూపంలో అంతకు ముందే బిజెపికి గణనీయమొత్తాలను సమర్పించుకున్నాయి. సుప్రీం కోర్టు తీర్పు తరువాత బహుశా టెంపోలలో నోట్లను రవాణా చేసి ఉంటాయి. దిగుమతుల కారణంగా ఉపాధి తగ్గినా లేక నిరుద్యోగం ప్రాప్తించినా అమెరికా సమాజం సహించదు. మనదేశంలో అలాంటి పరిస్థితి లేదు, మతం, కులం, ప్రాంతం, విద్వేషం, తప్పుడు సమాచారం తదితర అనేక మత్తుమందులను ప్రయోగిస్తూ అసలు సమస్యల నుంచి జనాన్ని తప్పుదారి పట్టించటంలో ఎవరు అధికారంలో ఉన్నా సర్వసాధారణమైంది. జనం కూడా అలవాటు పడ్డారు.గుళ్లు, మసీదు, చర్చీలు ఇతర ప్రార్ధనామందిరాలకు వెళ్లి రోజంతా వేడుకోవటానికి కానుకల సమర్పణ, కొబ్బరి కాయలు కొట్టేందుకు సిద్దపడుతున్నారు గానీ ప్రభుత్వ విధానాలను ప్రశ్నించటానికి ఆసక్తి చూపటం లేదు.


అమెరికా పెంచిన పన్నులను రద్దు చేయాలని లేదా తాము కూడా ప్రతిచర్య తీసుకుంటామని చైనా స్పందించింది.చైనా నుంచి దిగుమతి చేసుకొనే విద్యుత్‌ వాహనాలు,అల్యూమినియం, సెమీకండక్టర్లు,బ్యాటరీలు, కొన్ని రకాల ఖనిజాలు, సోలార్‌ సెల్స్‌,క్రేన్ల వంటి వాటి మీద దిగుమతి పన్ను పెంపు కారణంగా కనీసం 1,800కోట్ల డాలర్ల మేర అమెరికా వినియోగదారుల మీద భారం పెరుగుతుంది. ఆ కారణంగా దిగుమతులు నిలిపివేస్తే ప్రత్యామ్నాయం చూపే పరిస్థితిలో అమెరికా లేదు. వాటినే ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సివస్తే భారం ఇంకా పెరుగుతుంది. గత ఏడాది చైనా నుంచి 427 బిలియన్‌ డాలర్ల విలువగల వస్తువులను దిగుమతి చేసుకున్న అమెరికా 148బి.డాలర్ల విలువగల వస్తువులను ఎగుమతి చేసింది.గతంలో చైనా కూడా ప్రతిచర్యల్లో భాగంగా పన్నులు పెంచింది. చైనా వస్తువుల మీద ఆధారపడకుండా స్వంతంగా తయారు చేసుకోవాలని, తద్వారా చైనాను ఆర్థికంగా దెబ్బతీయాలని, తమ కాళ్ల దగ్గరకు తెచ్చుకోవాలనే సంకల్పం చెప్పుకున్న అమెరికా, ఐరోపా దేశాల సరసన మనదేశం కూడా ఉంది.
అనేక దేశాలతో మనదేశం స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలు(ఎఫ్‌టిఏ) చేసుకుంది. ప్రపంచ వాణిజ్య సంస్థ ఉన్నప్పటికీ దాన్ని పక్కన పెట్టి పరస్పరం లబ్ది పొందేందుకు వీటిని చేసుకుంటున్నారు. విదేశాలు తిరిగి మనవస్తువులకు మార్కెట్‌ అవకాశాలను పెంచానని, దానితో పాటు పలుకుబడి కూడా పెరిగిందని నరేంద్రమోడీ పదే పదే చెబుతారు. కానీ గత ఐదు సంవత్సరాల వివరాలను చూసినపుడు ఎగుమతుల అంశంలో మన పలుకుబడి పప్పులు ఉడకలేదు. 2019-2024 ఆర్థిక సంవత్సరాలలో ఎఫ్‌టిఏలు ఉన్న దేశాలకు మనం ఎగుమతి చేసిన వస్తువుల విలువ 107.2 నుంచి 122.72 బిలియన్‌ డాలర్లకు(14.48శాతం) పెరిగితే, దిగుమతులు 136.2 నుంచి 187.92 బిలియన్‌ డాలర్లకు ( 37.97శాతం) పెరిగినట్లు జిటిఆర్‌ఐ నివేదిక వెల్లడించింది. ఎగుమతులపై మోడీ ప్రచార బండారాన్ని బయట పెట్టింది. మొత్తంగా చూసుకున్నపుడు ప్రపంచ వాణిజ్య ఎగుమతుల్లో 1.8శాతంతో మనదేశం 17వదిగా ఉండగా దిగుమతుల్లో 2.8శాతం వాటాతో ఎనిమిదవ స్థానంలో ఉంది. అంతా బాగుంది అని చెప్పిన 2023-24లో మన వస్తు ఎగుమతులు అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 3.11శాతం తగ్గి 437.1బిలియన్‌ డాలర్ల వద్ద ఉన్నాయి. దిగుమతి చేసుకున్న వస్తువులను కొనుగోలు చేయటం తగ్గటంతో గతేడాది 5.4శాతం తగ్గి 677.2బి.డాలర్లుగా ఉన్నాయి.


ట్రంప్‌ మాదిరి చైనా పట్ల కఠినంగా ఉండాలని జో బైడెన్‌ కూడా జనానికి కనిపించేందుకు తాజా చర్యకు పూనుకున్నాడు. గతనెలలో రాయిటర్స్‌ జరిపిన ఒక సర్వేలో ట్రంప్‌ కంటే బైడెన్‌ ఏడుపాయింట్లు వెనుకబడి ఉన్నాడు. అయితే 2020లో చైనాతో ట్రంప్‌ కుదుర్చుకున్న ఒప్పందంతో ఎలాంటి ఫలితమూ రాలేదు. పరస్పరం సహకారం పెంచుకోవాలని చెబుతూనే దిగుమతి పన్నుల పెంపుదలకు సాకుగా తాము అవసరాలకు మించి హరిత ఉత్పత్తులు చేస్తున్నామని లేనిపోని మాటలు చెబుతున్నదని చైనా విమర్శించింది. ఇది రక్షణాత్మక చర్యలకు పూనుకొనేందుకు చేస్తున్న ప్రచారమని, తనను తాను దెబ్బతీసుకోవటమేనని, గతంలో వచ్చిన అవగాహనకు భిన్నమని, రెండు దేశాల మార్గంలో గుంతలు తవ్వవద్దని హితవు చెప్పింది. బైడెన్‌ ఎన్నికల కోసం రాజకీయంగా తీసుకున్న చర్య తప్ప తమ మీద పెద్దగా ప్రభావం పడదని కూడా వ్యాఖ్యానించింది.2023 నుంచి ఈ ఏడాది మార్చినెల వరకు అమెరికా సమాచారాన్ని చూస్తే జర్మనీ నుంచి 689 కోట్ల డాలర్లు, దక్షిణ కొరియా నుంచి 622 కోట్ల డాలర్ల విలువగల విద్యుత్‌ బాటరీల వాహనాలను కొనుగోలు చేసిన అమెరికా చైనా నుంచి దిగుమతి చేసుకున్నది కేవలం 38 కోట్ల డాలర్ల విలువగలవే అని ఒక పత్రిక పేర్కొన్నది. బైడెన్‌ నిర్ణయం ప్రకారం విద్యుత్‌ వాహనాలపై పన్ను 25 నుంచి 102.5శాతానికి పెరిగింది. బాటరీలు, వాటి విడి భాగాలపై 7.5శాతం నుంచి 50శాతం వరకు పెంచారు.నౌకల నుంచి సరకులను తీరానికి చేర్చే క్రేన్లపై ఇప్పటి వరకు పన్నులేదు, వాటి మీద 25శాతం, సిరంజ్‌లు, సూదులపై 50శాతం, రక్షణకు ఉపయోగించే వైద్య కిట్లపై 25శాతం విధించారు. రానున్న సంవత్సరాల్లో ఈ పన్నులు ఇంకా పెరుగుతాయి.ఈ పెరుగుదల అంతా అమెరికా వినియోగదారుల మీదనే భారం మోపుతుంది.చైనా అనుచిత వ్యాపారాన్ని అడ్డుకొనేందుకే ఈ చర్యలని అమెరికా సమర్ధించుకుంటున్నది. ద్రవ్యోల్బణాన్ని అరికట్టే సాకుతో దేశీయంగా తయారైన వాహనాల కొనుగోలుదార్లకు అమెరికా ప్రభుత్వం ఏడున్నరవేల డాలర్లు రాయితీ ఇస్తుంది. అయితే ఇటీవల అలాంటి వాహనాల్లో చైనా విడిభాగాలు ఏవైనా ఉంటే ఆ రాయితీ వర్తించదని ప్రకటించారు.


మధ్యలో ఒకటి రెండు సంవత్సరాలు మనదేశంతో వాణిజ్య లావాదేవీల్లో అమెరికా మొదటి స్థానంలోకి వచ్చింది. దాంతో మీడియాలో కొందరు ఇంకేముంది చైనాతో మనకు పనేముంది, సరఫరా గొలుసు నుంచి బయటపడ్డాం అన్నట్లుగా సంబరాన్ని ప్రకటించారు. కానీ తిరిగి చైనా మొదటి స్థానానికి వచ్చినట్లు తాజా సమాచారం వెల్లడించింది. ఇదంతా సరిహద్దు వివాదంలో చైనా సంగతి తేలుస్తాం, బుద్దిచెబుతాం అనే పటాటోపం మధ్యనే జరిగింది.2023-24 సంవత్సరంలో రెండు దేశాల వాణిజ్యం 11,840 కోట్లు కాగా అమెరికాతో 11,380 కోట్ల డాలర్లు ఉంది.కౌంటర్‌పాయింట్‌ అధ్యయనం ప్రకారం ఉత్పాదకతతో ముడిపెట్టిన ప్రోత్సాహకం(పిఎల్‌ఐ) పధకం ఉన్నప్పటికీ మనదేశంలో చైనా బ్రాండు ఫోన్లు గణనీయమార్కెట్‌ వాటాను కలిగి ఉన్నాయి.ఈ పధకం వలన ఆపిల్‌, శాంసంగ్‌ వంటి కంపెనీలు లబ్దిపొందినప్పటికీ మార్కెట్లో వాటి వాటా దానికి తగినట్లుగా పెరగలేదని హిందూ బిజినెస్‌లైన్‌ పత్రిక రాసింది. ఇతర బ్రాండ్లతో ఉత్పత్తి కాంట్రాక్టులు కుదుర్చుకోవటం, ఎగుమతులు తప్ప భారతీయ బ్రాండ్లకు రూపకల్పన, అభివృద్ధి జరగలేదు.ఫార్మారంగంలో కొన్నింటిని పిఎల్‌ఐ కారణంగా మనదేశంలోనే తయారు చేస్తున్నప్పటికీ ఇప్పటికీ మన పరిశ్రమలు చైనా మీదనే ఎక్కువగా ఆధారపడుతున్నాయి. దిగుమతుల నిరోధానికి ఈ పధక చికిత్స పనిచేయలేదు. గతేడాది మనదేశం చేసుకున్న ఎలక్ట్రానిక్స్‌ దిగుమతుల్లో చైనా నుంచి 43.9శాతం ఉన్నాయి. కుండలో కూడు అలాగే ఉండాలి పిల్లాడు దుడ్డులా ఎదగాలి అంటే కుదరదన్న సామెత తెలిసిందే. గడచిన పది సంవత్సరాల్లో అన్నీ వేదాల్లోనే ఉన్నాయష బాపతు పెరిగింది తప్ప ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కోసం ప్రభుత్వం ఖర్చు చేయాలన్న జ్ఞానం పాలకులకు రాలేదు.గతమెంతో ఘనం అనే పిచ్చిలోనే కొట్టుకుంటున్నారు. జనాన్ని ముంచుతున్నారు. జిడిపిలో మనకంటే చైనా ఐదు రెట్లు పెద్దది. మనం 0.75శాతం పరిశోధనలకు ఖర్చు చేస్తుంటే అక్కడ 3.5శాతం ఉంది. దీని అర్ధం మనకంటే చైనాలో 25రెట్లు ఎక్కువ ఖర్చు చేస్తున్నారని ప్రొఫెసర్‌ అరుణకుమార్‌ వ్యాఖ్యానించారు.మన విశ్వవిద్యాలయాల్లో రాజకీయ, అధికార జోక్యం ఎక్కువగా ఉంది తప్ప పరిశోధన వాతావరణాన్ని సృష్టించలేదన్నారు. ఏవైనా నిధులు ఉంటే గోమూత్రం, పేడలో బంగారం, ఇతరంగా ఏమున్నాయో పరిశోధనలు చేయిస్తున్నారు.చైనా ఉత్పత్తులపై అమెరికా దిగుమతి సుంకం పెంపు పర్యవసానాలు మనదేశం మీద ఎలా ఉంటాయన్న చర్చ మొదలైంది. చైనా ఉత్పత్తులు కుప్పలు తెప్పలుగా మనదగ్గరకు వచ్చిపడతాయని, మన ఎగుమతి అవకాశాలు పెరగవన్నది ఒక అభిప్రాయం. అమెరికా, ఐరోపా యూనియన్‌ దిగుమతి పన్నులు పెంచటం, దిగుమతులను తగ్గిస్తున్న కారణంగా చైనా తన వాహనాలకు భారత్‌ ఇతర దేశాల మీద ఆధారపడుతుందని కొందరి అంచనా. ఈ అంశాలను ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నప్పటికీ నరేంద్రమోడీ చైనా నుంచి పెట్టుబడులు, దిగుమతులను పెంచేందుకు వీలుగా దిగుమతి పన్ను ఎందుకు తగ్గించారన్నది వారి ప్రశ్న. కార్పొరేట్ల లాభాల కోసం సంతుష్టీకరణ తప్ప మరొకటి కనిపించటం లేదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

పదేండ్ల పాలనలో నరేంద్రమోడీ చైనాకు ఎన్ని లక్షల కోట్లు సమర్పించారో తెలుసా !

30 Tuesday Apr 2024

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Politics

≈ Leave a comment

Tags

Anti China Propaganda, BJP, CHINA TRADE, India Trade with China, Narendra Modi Failures, RSS


ఎం కోటేశ్వరరావు


పేరు పెట్టి చెప్పకపోయినా చైనాకు పరోక్ష హెచ్చరికలు చేయటంలో మననేతలు తక్కువ తినలేదు. అవి సరిహద్దు సమస్యల మీద కావచ్చు, చైనా స్థానంలో ప్రపంచ ఫ్యాక్టరీగా మనం మారబోతున్నాం అన్న కోతలు ఏవైనా కావచ్చు. మాటలు కోటలు దాటినా చేతలు గడపదాటటం లేదన్న సామెత తెలిసిందే. గత పదేండ్లుగా మేకిన్‌ ఇండియా, మేడిన్‌ ఇండియా, ఆత్మనిర్భరత వంటి నినాదాలు మన చెవుల తుప్పు వదలగొడుతున్నాయి. కానీ పదేండ్ల పాలనలో చైనాకు నరేంద్రమోడీ సమర్పించిన మొత్తం ఎంతో తెలుసా ? యాభై లక్షల కోట్ల రూపాయలకు పైమాటే అంటే ఎవరైనా నమ్ముతారా ? తమ విశ్వగురువు ఇలా చేశారంటే వీర భక్తులు అసలు నమ్మరు. కానీ చేదు నిజం. గడచిన పది సంవత్సరాలలో చైనాతో మన వాణిజ్య లోటు 614బిలియన్‌ డాలర్లు.(గత ఐదేండ్లలో 387బి.డాలర్లు) బిలియన్‌కు వంద కోట్లు అంటే 61,400, ఒక డాలర్‌కు మన రూపాయి మారకం విలువ ఇది రాసిన సమయంలో 83.47 ఉంది. ఆ లెక్కన చైనాకు మనం సమర్పించుకున్న మొత్తం రు.51,25,058 కోట్లు. ఈ వివరాలను 2024 ఫిబ్రవరి 29న ఫైనాన్సియల్‌ ఎక్స్‌ప్రెస్‌ పత్రికలో విశ్లేషణ రాసిన గ్రూప్‌ కెప్టెన్‌ ప్రవీర్‌ పురోహిత్‌(ఐఎఎఫ్‌ విశ్రాంత ఉద్యోగి) పేర్కొన్నారు.” చైనాతో పెరుగుతున్న భారత వాణిజ్యలోటు వ్యూహాత్మక దుర్బలత్వం ” అనే శీర్షికతో సదరు విశ్లేషణ ఉంది. ఒక వైపు ఏటికేడు చైనా నుంచి దిగుమతులను పెంచుకుంటూ మరోవైపు చైనా నుంచి ముప్పువస్తోంది గనుక అమెరికాతో చేతులు కలపాలి, ఆయుధాలు కొనుగోలు చేయాలి అంటూ జనాన్ని తప్పుదారి పట్టిస్తున్న నరేంద్రమోడీ విధానాలను ఎలా అర్ధం చేసుకోవాలి ?మన దేశం కూడా ఇతర దేశాలతో పోటీ పడి వృద్ధి చెందాలని, జనానికి ఉపాధి కల్పించి సరిపడా ఆదాయకల్పన చేసి మెరుగైన జీవితం గడపాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. దానికి అనువైన విధానాలను అనుసరించటం లేదనేదే పాలకుల మీద విమర్శ. మనోభావాలను రేకెత్తించటం మీద ఉన్న శ్రద్ద అభివృద్ది మీద లేదు. తమ సరకులను దిగుమతి చేసుకోవాలని ఏ దేశాన్నీ చైనా దేబిరించటం లేదు. మా ఊళ్లో దుకాణం తెరవాలని గ్రామస్తులు ఎవరినైనా వేడుకుంటారా ? ఉన్న దుకాణానికి తోడు కొత్తది వెలిస్తే అక్కడ తక్కువ ధరలకు వస్తువులను అమ్మితే జనం అక్కడే కొనుక్కుంటారు.ప్రపంచ మార్కెట్‌లో ఎప్పటినుంచో ఉన్న అమెరికా, జపాన్‌, జర్మనీ,బ్రిటన్‌ సరసనే చైనా కూడా దుకాణం తెరిచింది.అక్కడ సరసమైన ధరలకు ఇస్తున్నందున ప్రపంచ దేశాలన్నీ ఎగబడి కొనుక్కుంటున్నాయి. గిరాకీని తట్టుకోలేకపోతున్నాము, ఎవరైనా వచ్చి మా దేశంలోనే వస్తూత్పత్తి చేయండి అంటే వివిధ దేశాల నుంచి పెట్టుబడిదారులు అక్కడకు వెళ్లి ఉత్పత్తి చేసి నాలుగురాళ్లు వెనుకేసుకుంటున్నారు. ఆపని చేయలేక మనం కూడా చైనా, ఇతర దేశాల నుంచి కావాల్సినవి కొనుక్కుంటున్నాం.ఎవరూ ఎవరిని బలవంతం చేయటం లేదు. చైనా వస్తువులను బహిష్కరించాలని మనదేశంలో చాలా మంది వాట్సాప్‌ ద్వారా సందేశాలను పంపారు. పెద్ద జోకేమిటంటే అందుకోసం వారు కూడా చైనా ఫోన్లనే వాడుతున్నారు.


తాజాగా గ్లోబల్‌ ట్రేడ్‌ రిసర్చ్‌ ఇనీషియేటివ్‌(జిటిఆర్‌ఐ) అనే సంస్థ వెల్లడించిన సమాచారం ప్రకారం పదిహేను సంవత్సరాల క్రితం మనం దిగుమతి చేసుకున్న పారిశ్రామిక వస్తువులలో చైనా వాటా 21 ఉంటే ఇప్పుడు 30శాతానికి పెరిగింది. విదేశాల మీద ప్రత్యేకించి చైనా మీద ఆధారపడటాన్ని తగ్గించటమే కాదు, అసలు మనమే ప్రపంచానికి ఎగుమతి చేద్దామంటూ నరేంద్రమోడీ ఎంతో హడావుడి చేస్తున్నపుడే ఇదంతాజరిగింది.ఇప్పటికి తాను చేసింది ట్రైలర్‌ మాత్రమే అని చెప్పిన మోడీ రానున్న రోజుల్లో చైనా నుంచి ఇంకా పెద్ద ఎత్తున దిగుమతులకు పూనుకుంటారా ? మరింత గట్టిగా పని చేస్తానంటూ రెండవసారి అధికారానికి వచ్చిన తరువాత గత ఐదేండ్లలో చైనాకు మన ఎగుమతులు ఏటా 16బిలియన్‌ డాలర్లకు అటూ ఉండగా అక్కడి నుంచి దిగుమతులు 70.3 నుంచి 101 బి.డాలర్లకు పెరిగాయి. ఇది సమర్ధతా, అసమర్ధతకు చిహ్నమా ? చైనా మీద ఆధారపడటం పెరుగుతున్న తీరు ఆందోళనకరంగా ఉందని జిటిఆర్‌ఐ అన్నది, దేశం కోసం, ధర్మం కోసం అంటూ కబుర్లు చెప్పే నరేంద్రమోడీలో అలాంటిదేమైనా ఉందా ? రామాలయం మీద, దాని ద్వారా ఓట్లు దండుకోవాలన్న యావలో కొంచెమైనా పారిశ్రామికీకరణ మీద ఉందా ? రాజ్యసభలో వైసిపి సభ్యుడు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి చైనాతో పెరుగుతున్న మనదేశ వాణిజ్య లోటు గురించి ఒక ప్రశ్న అడిగితే దానికి 2023 డిసెంబరు ఎనిమిదిన కేంద్ర ప్రభుత్వం ఒక సమాధానమిచ్చింది.దానిలో గడచిన తొమ్మిది సంవత్సరాల్లో ఎంతో మార్పు వచ్చిందంటూ గాలిపోగేసి రోజూ చెప్పే కబుర్లను పునరుద్ఘాటించటం తప్ప అసలు సంగతి మన ఎగుమతులు ఎందుకు పెరగటం లేదో దిగుమతులు రికార్డులను ఎందుకు బద్దలు కొడుతున్నదీ చెప్పలేదు.


మనకు అవసరమైన వస్తువులు లేదా ముడి పదార్దాలను చైనా నుంచి దిగుమతి చేసుకోవాలా మరొక దేశం నుంచా అన్న అంశం మీద కూడా చర్చ జరుగుతున్నది. మనవి కానపుడు ఎక్కడి నుంచి దిగుమతి చేసుకున్నా ఒకటే. ప్రపంచ వాణిజ్య సంస్థలో చేరాం గనుక చైనా నుంచి కొన్ని దిగుమతులు చేసుకోక తప్పదు అంటూ కొందరు సన్నాయి నొక్కులు నొక్కుతారు. అదే వాస్తవమైతే పాకిస్తాన్‌ కూడా దానిలో సభ్యురాలే కదా ? అక్కడి నుంచి ఎందుకు దిగుమతులు చేసుకోవటం లేదు. పూర్తిగా చైనా మీద ఆధారపడితే ప్రపంచ రాజకీయాల్లో తేడా వస్తే, అక్కడి నుంచి నిలిచిపోతే పరిస్థితి ఏమిటని కొందరు అంటున్నారు. అసలు అలాంటి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి. మన విధానాలు సరిగా ఉంటే ఎవరితో నైనా వివాదాలు ఎందుకు వస్తాయి. అమెరికా లేదా దాని కనుసన్నలలో పనిచేసే దేశాల మీద ఆధారపడినా అదే జరగదా ? గతంలో అంతర్జాతీయంగా తమ కూటమిలో చేరకుండా ఉన్నందుకే కదా పరిశ్రమలు, అంతరిక్ష ప్రయోగాలకు అలాంటి సహకారం అందించేందుకు అమెరికా నిరాకరించింది. ఆ కారణంగానే మన దేశం సోవియట్‌ వైపు మొగ్గింది.చైనాను మనదేశం శత్రుదేశంగా భావిస్తే ఏ ప్రధానీ కలవనన్ని సార్లు చైనా నేతలను రికార్డు స్థాయిలో నరేంద్రమోడీ ఎందుకు కలసినట్లు ? ఇరు నేతలూ అటు ఊహాన్‌ ఇటు మహాబలిపురంలో కలసి ఉయ్యాలలూగారు. గాల్వన్‌లోయ ఉదంతాల తరువాత చైనా నుంచి వచ్చే పెట్టుబడులు మనదేశానికి ముప్పు తెస్తాయంటూ కేంద్ర అనుమతి లేకుండా అంగీకరించకూడదని గిరిగీసుకున్నది మనమే. దానికి ప్రతిగా చైనా మన దిగుమతుల మీద లేదా అక్కడి నుంచి వస్తుదిగుమతుల మీద ఎలాంటి ఆంక్షలు లేవు. మరింత పెరిగాయి, వాటితో ముప్పురాదా ?


పోనీ చైనా మీద ఆధారపడటాన్ని తగ్గించారా అంటే అదీ లేదు. ఇతర దేశాలతో పోలిస్తే చైనా నుంచి దిగుమతుల వేగం 2.3రెట్లు పెరిగిందని, 2023-24 మనదేశం 677.2 బి.డాలర్ల మేర దిగుమతులు చేసుకుంటే దానిలో 101.8 బి.డాలర్లు చైనా నుంచి అంటే 15శాతం ఉన్నట్లు జిటిఆర్‌ఐ నివేదిక పేర్కొన్నది.కీలక రంగాలలో దిగుమతులు ఎక్కువగా ఉన్నట్లు కూడా తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-జనవరి మధ్య మనదేశం మొత్తం 67.8 బి.డాలర్ల మేర ఎలక్ట్రానిక్స్‌, టెలికాం, ఎలక్ట్రికల్‌ ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటే వాటిలో చైనా నుంచి చేసుకున్నవాటి విలువ 26.1 బిలియన్‌ డాలర్లు, 38.4శాతం,యంత్రాల దిగుమతిలో కూడా అక్కడి నుంచి 39.6శాతం,రసాయనాలు, ఫార్మా ఉత్పత్తులు 29.2శాతం ఉంది.మొత్తం దిగుమతుల్లో 50శాతం యంత్రాలు, ఇతర ఉత్పాదక సంబంధమైనవే ఉన్నాయి. శత్రుదేశమంటూ మన మీడియా, సంఘపరివార్‌కు చెందిన సంస్థలు సామాజిక మాధ్యమాల్లో దుమ్మెత్తి పోస్తున్నా చైనా వాటిని పెద్దగా పరిగణనలోకి తీసుకోవటం లేదు. జపాన్‌ తదితర దేశాల సముద్ర ఉత్పత్తులను తిరస్కరించినట్లుగా, ఆస్ట్రేలియా ఉత్పత్తుల మీద ఆంక్షలు విధించినట్లుగా మన వస్తువులను తిప్పిపంపిన దాఖలాలు లేవు. చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువులు ఇతర దేశాల్లో కూడా దొరుకుతాయి, అయితే అంత చౌకగా దొరకవు గనుక మోడీ ప్రభుత్వ మెడలు వంచి దిగుమతిదారులు, పారిశ్రామికవేత్తలు విదేశీమారకద్రవ్యాన్ని కేటాయింప చేసుకొని వస్తు దిగుమతులు చేసుకుంటున్నారు. మనదేశంలో చిన్న పరిశ్రమలకు పెద్ద ఎత్తున ప్రోత్సాహమిస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారు.ఎంఎస్‌ఎంఇ సంస్థలు మనదేశంలో ఉత్పత్తి చేయగలిగిన వస్త్రాలు, దుస్తులు,గాజువస్తువులు, ఫర్నీచర్‌, కాగితం, చెప్పులు, బొమ్మలను కూడా దిగుమతి చేసుకుంటున్నట్లు జిటిఆర్‌ఐ నివేదిక ఆవేదన వెలిబుచ్చింది.రానున్న రోజుల్లో మనదేశ రోడ్ల మీద తిరిగే ప్రతి మూడు విద్యుత్‌ వాహనాల్లో ఒకటి చైనా సంస్థలు లేదా వాటితో భాగస్వామ్యం కుదుర్చుకున్న లేదా దిగుమతి చేసుకున్నవే ఉంటాయని జిటిఆర్‌ఐ పేర్కొన్నది.మన మార్కెట్‌లోకి చైనా సంస్థలు ప్రవేశిస్తే వాటి ఉత్పత్తులకు అవసరమైన విడిభాగాలన్నింటినీ చైనా నుంచి దిగుమతి చేసుకొనేందుకే ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉన్నందున దిగుమతులు మరింతగా పెరుగుతాయని తెలిపింది.మన జిడిపిలో పారిశ్రామిక ఉత్పత్తి ఇప్పుడున్న 17 లేక 18శాతం స్థితి నుంచి 25శాతానికి పెరగాలంటే చైనా నుంచి మరిన్ని దిగుమతులు అవసరమని పారిశ్రామికవేత్తలు చెబుతున్నారు.


అమెరికా ప్రారంభించిన వాణిజ్య యుద్దంలో భాగంగా చైనా నుంచి దిగుమతి చేసుకున్న వస్తువుల మీద భారీ మొత్తంలో దిగుమతి పన్ను విధిస్తున్నారు. ఆ మొత్తం అక్కడి వినియోగదారుల మీదనే మోపుతున్నారు తప్ప దిగుమతులను నిలిపివేయలేదు. ప్రత్యక్షంగా వాణిజ్య పోరుకు దిగినట్లు ప్రకటించకపోయినా మనదేశం కూడా చేస్తున్నది అదే. రెండుదశాబ్దాల క్రితం ప్రపంచ వాణిజ్య సంస్థలో చైనా ప్రవేశించినపుడు మనదేశంతో వాణిజ్య లావాదేవీల విలువ 3.6బిలియన్‌ డాలర్లు మాత్రమే. దానిలో మనలోటు కేవలం 0.19బి.డాలర్లు మాత్రమే. అదే 2022లో ద్విపక్ష వాణిజ్యం 136 బి.డాలర్లకు చేరగా మనలోటు 101బి.డాలర్లు ఉంది.మరుసటి ఏడాది పరిస్థితి కూడా అలాగే ఉంది.దిగుమతులు మన పరిశ్రమలు, వాణిజ్యం మీద ప్రతికూల ప్రభావం చూపుతుండటంతో కేంద్ర ప్రభుత్వం 2016 నుంచి దిగుమతి పన్ను 500 రెట్లు పెంచింది. అయినా తగ్గలేదు, అంటే పెంచిన పన్ను మొత్తాలను భరిస్తున్నది మన వినియోగదారులే. మన దేశంలోనే వస్తూత్పత్తి చేసి జనానికి ఉపాధితో పాటు చౌకగా సరకులను అందించాల్సిన నరేంద్రమోడీ దిగుమతి చేసుకున్న వస్తువుల మీద కూడా పన్నులు మోపి జనం జేబులు గుల్లచేస్తున్నారు.రష్యా నుంచి చౌకగా దిగుమతి చేసుకున్న ముడి చమురు మీద కూడా అంతే చేస్తున్న సంగతి ఎరిగిందే.వినియోగదారులకు ఒక్క పైసా అయినా తగ్గించారా ? ఫార్మాదిగుమతులపై పన్ను పెంపును మనదేశంలోని పరిశ్రమ వర్గాలు వ్యతిరేకించటంతో 76 ఔషధాలపై పెంపుదలను వెనక్కు తీసుకున్నారు. అనేక వస్తువులపై దిగుమతి పెంపును ఉత్పత్తిదారులు స్వాగతిస్తే దిగుమతిదారులు వ్యతిరేకించారు. ఆర్థికశాఖ తీసుకున్న నిర్ణయాలను ఇతర మంత్రిత్వశాఖలు వ్యతిరేకించాయి.ఈ ఏడాది తాత్కాలిక బడ్జెట్‌కు ముందు అనేక వస్తువులపై పన్నులను తగ్గించారు. ఉత్పాదకత ఎగుమతులతో ముడిపెట్టిన ప్రోత్సాహక పధకం(పిఎల్‌ఐ) రాయితీలను ఉపయోగించుకున్న సంస్థలు పన్నెండింటిలో పదకొండు చైనా సరఫరా గొలుసు భాగస్వాములు లేదా సేవలు అందించే సంస్థలున్నట్లు వార్తలు వచ్చాయి. గత పది సంవత్సరాల కాలంలో అనేక ప్రోత్సాహాకాలు, రక్షణ చర్యలు చేపట్టినా మన పారిశ్రామిక ఉత్పత్తి వాటా జిడిపిలో 15శాతం చుట్టూ తిరుగుతున్నది తప్ప పెరగలేదు. గాల్వన్‌ ఉదంతాల తరువాత మనదేశం నుంచి ఎగుమతులు నిలిపివేస్తే చైనా మన కాళ్లదగ్గరకు వస్తుందని అనేక మంది కలలు గని అలాంటి పిలుపులే ఇచ్చారు. మొత్తం చైనా చేసుకునే దిగుమతుల్లో మనదేశ వాటా కేవలం మూడుశాతమే, అదే మనం దిగుమతి చేసుకుంటున్నది 15శాతం ఉన్నాయి.చెరువు మీద అలగటం మంచిది కాదని మన విధాన నిర్ణేతలకు అర్ధమైంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

చిన్న దేశం – పెద్ద సందేశం : మాల్దీవుల ఎన్నికల్లో ” విజేత చైనా ” !

24 Wednesday Apr 2024

Posted by raomk in BJP, CHINA, COUNTRIES, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

#Anti China, BJP, Maldives, Maldives Parliamentary Election 2024, Mohamed Muizzu, Narendra Modi Failures


ఎం కోటేశ్వరరావు


ఆదివారం ఏప్రిల్‌ 19, 2024న జరిగిన మాల్దీవుల పార్లమెంటు ఎన్నికల్లో విజేత చైనా అంటూ టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా పత్రిక శీర్షిక పెట్టింది. దాదాపు అన్ని పత్రికలూ చైనా అనుకూల పార్టీ సూపర్‌ మెజారిటీ సాధించినట్లు నివేదించాయి.పీపుల్స్‌ మజ్లిస్‌ (పార్లమెంటు)లోని 93 స్థానాలకు గాను పీపుల్స్‌ నేషనల్‌ కాంగ్రెస్‌(పిఎన్‌సి), దాన్ని బలపరుస్తున్న వారికి 75, భారత అనుకూల మాల్దీవియన్‌ డెమోక్రటిక్‌ పార్టీకి 15 స్థానాలు వచ్చినట్లు వార్తా సంస్థలు తెలిపాయి.పోటీచేసిన మహిళలు ముగ్గురూ విజేతలు కాగా వారు అధికార పార్టీకి చెందినవారే. మొత్తం 368 మంది పోటీ చేశారు. వారిలో 130 మంది స్వతంత్రులు కాగా మిగిలిన వారు ఏడు రాజకీయ పార్టీలకు చెందిన వారు. ఈ ఎన్నికల పర్యవసానాల గురించి సహజంగానే విశ్లేషణలు మొదలయ్యాయి.2019లో జరిగిన ఎన్నికల్లో మాల్దీవుల డెమోక్రటిక్‌ పార్టీ 45.83 శాతం ఓట్లతో 87 స్థానాలకు గాను 65 తెచ్చుకుంది. ఆ ఎన్నికల నాటికి నూతన పార్టీగా పిఎన్‌సి 6.63శాతం ఓట్లు, మూడు సీట్లు తెచ్చుకుంది.గతేడాది సెప్టెంబరు 9న జరిగిన ఎన్నికల్లో ఎవరికీ అవసరమైన 50శాతంపైగా మెజారిటీ రాకపోవటంతో 30న జరిగిన తుది దఫా ఎన్నికల్లో ఈ పార్టీ నేత మహమ్మద్‌ ముయిజ్జు 54.04శాతం ఓట్లతో అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు, నవంబరు 17న బాధ్యతలను స్వీకరించాడు.


అధ్యక్ష ఎన్నికలు, తాజాగా జరిగిన పార్లమెంటు ఎన్నికలకు ఒక ప్రత్యేకత ఉంది.చిన్నదైనా పెద్దదైనా ఏ దేశంలోనూ విదేశాలతో సంబంధాల ప్రాతిపదికన ఎన్నికలు జరిగిన దాఖలాలు లేవు. చైనా – భారత్‌ మధ్య పోటీగా ఇక్కడ జరిగాయి. అందుకే అసలు విజేత చైనా అన్నట్లుగా వ్యాఖ్యానాలు వెలువడ్డాయి. ” అధ్యక్ష ఎన్నికలు తమ పౌరుల దేశ భక్తికి ఒక ప్రతిబింబమని, మా ఇరుగు పొరుగు వారు, భాగస్వాములు తమ స్వాతంత్య్రం, సర్వసత్తాకతను పూర్తిగా గౌరవించాలని ఇచ్చిన ఒక పిలుపు ” అని పీపుల్స్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ ప్రతినిధి వ్యాఖ్యానించాడు.పార్లమెంటు ఎన్నికలు మరింత తీవ్రంగా జరిగాయి. చైనా బిఆర్‌ఐ పధకం కింద పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసిన గత ప్రభుత్వంలో గృహశాఖ మంత్రిగా ముయిజ్జు పని చేశాడు. తాను అధికారానికి వస్తే రెండు దేశాల మధ్య మరో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతానని ఎంతో ముందుగానే ప్రకటించాడు.చెప్పినట్లుగానే భిన్నమైన రీతిలో వ్యవహరిస్తున్నాడు.గతంలో మాల్దీవుల్లో ఎవరు అధికారానికి వచ్చినా తొలి విదేశీ పర్యటన భారత్‌తోనే ప్రారంభమయ్యేది. అలాంటిది ముయిజ్జు తొలుత టర్కీ, తరువాత యుఏయి, చైనా పర్యటించాడు.2019లో మనదేశంతో కుదుర్చుకున్న జలవాతావరణ(హైడ్రాలజీ) పరిశీలన పధకం నుంచి మాల్దీవులు వైదొలిగింది. అక్కడ ఉన్న కొద్ది మంది మన సైనికులను కూడా దశలవారీ మే 10వ తేదీలో వెనక్కు వెళ్లాలని కోరింది. రద్దీగా ఉండే తూర్పు-పశ్చిమ దేశాల నౌకా రవాణా మార్గంలో మాల్దీవులు కీలకమైన ప్రాంతంలో ఉంది. అమెరికా విశాల మిలిటరీ వ్యూహంలో హిందూ మహాసముద్రం ఎంతో ముఖ్యమైనది. బ్రిటీష్‌ ఆక్రమించిన మారిషస్‌కు చెందిన డిగోగార్సియా దీవులను అమెరికా తన ఆధీనంలోకి తెచ్చుకొని ఖాళీ చేసేందుకు మొరాయిస్తున్నది. అక్కడ ఒక సైనిక స్థావరాన్ని కూడా నిర్మించింది. మనదేశంలోని కన్యాకుమారికి ఆ దీవులు 1,796కిలో మీటర్ల దూరంలో ఉన్నాయి. అది మనదేశంతో పాటు పరిసరాల్లోని అన్ని దేశాలకూ ఆందోళన కలిగించే అంశమే. బంగాళాఖాతం,హిందూ మహాసముద్రం, అరేబియా సముద్ర ప్రాంతంలోని కొన్ని దేశాలు అమెరికా పట్టునుంచి విడివడటం, అవి క్రమంగా చైనాకు సన్నిహితం కావటం పశ్చిమ దేశాలకు ఆందోళన కలిగిస్తోంది. తమ విదేశాంగ విధానంలో కొన్ని మార్పులు చేశాం తప్ప ఎవరివైపూ మొగ్గటం లేదని ముయిజ్జు ప్రకటించాడు.


మాల్దీవుల ప్రాంతానికి ఉన్న ప్రాధాన్యత కారణంగా 1965లో బ్రిటన్‌ ఆక్రమణ నుంచి స్వాతంత్య్రం పొందిన తరువాత మన దేశం అన్ని రంగాలలో దగ్గరయ్యేందుకు చూసింది. 1988లో దాదాపు రెండు వందల మంది తమిళ ఉగ్రవాదులు మాల్దీవులకు వెళ్లి నాటి అధ్యక్షుడు అబ్దుల్‌ గయూమ్‌ మీద తిరుగుబాటు చేసి కీలకమైన ప్రాంతాలన్నింటినీ పట్టుకున్నారు. తమను అదుకోవాలని అనేక దేశాలను గయూమ్‌ కోరినా ఎవరూ ముందుకు రాలేదు. భారత్‌ స్పందించింది, ఆపరేషన్‌ కాక్టస్‌ పేరుతో కుట్రను విఫలం చేసి అనేక మంది కుట్రదారులను కాల్చి చంపి, కొందరిని బందీలుగా పట్టుకుంది. అప్పటి నుంచి సంబంధాలు మరింతగా బలపడ్డాయి. తరువాత జరిగిన పరిణామాల్లో దీవుల ఆర్థిక సమస్యలను, పౌరుల జీవితాలను మెరుగుపరచటంలో పాలకుల వైఫల్యం కారణంగా జనంలో అసంతృప్తి తలెత్తింది. సరిగ్గా అదే సమయంలో చైనా తన బిఆర్‌ఐ పధకాన్ని ముందుకు తెచ్చింది. ఐఎంఎఫ్‌, ప్రపంచబాంక్‌, అమెరికా, ఇతర పశ్చిమదేశాల మాదిరి కఠినమైనవి కాకుండా సాధారణ షరతులతో ప్రాజెక్టులకు చైనా రుణాలు ఇచ్చింది. దాంతో 2013లో అధికారానికి వచ్చిన అబ్దుల్లా యామిన్‌ చైనాతో సంబంధాలను పెంచుకున్నాడు.2018లో గెలిచిన ఇబ్రహీం సాలి భారత్‌కు పెద్ద పీట అనే విధానంతో మన దేశానికి సన్నిహితంగా భాగస్వామ్య ఒప్పందాలను చేసుకున్నాడు. అది ఎన్నికల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ప్రతిపక్షాలుగా ఉన్న మాల్దీవుల ప్రోగ్రెసివ్‌ పార్టీ, పీపుల్స్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ ఒక కూటమిగా ఏర్పడి ” భారత్‌ను బయటకు పంపాలి( భారత్‌ అవుట్‌) ” అనే నినాదమిచ్చాయి. మనదేశం అనుసరించిన కొన్ని విధానాలు, అంతర్గత వ్యవహారాల్లో జోక్యంతో జనంలో ఉన్న భారత వ్యతిరేక మనోభావాలు కూడా దీనికి దోహదం చేశాయి. మనదేశానికి చెందిన జిఎంఆర్‌ కంపెనీ మాలెలోని విమానాశ్రయ అభివృద్ధి నిర్వహణ బాధ్యతలు తీసుకుంది.విదేశీ ప్రయాణీకులతో పాటు మాల్దీవుల పౌరుల మీద అభివృద్ధి పన్ను విధించటంతో అక్కడ వ్యతిరేకత వెల్లడైంది. దాని వెనుక మాజీ అధ్యక్షుడు నషీద్‌ మద్దతు ఉందని జనం భావించారు. అవినీతి ఆరోపణల కేసులో అరెస్టు కాకుండా తప్పించుకొనేందుకు అతగాడు భారత రాయబార కార్యాలయంలో ఆశ్రయం పొందాడు. అది కూడా జనంలో మనదేశం మీద వ్యతిరేకత పెరిగేందుకు దోహదం చేసింది.


మాల్దీవుల విదేశాంగ విధానంలో వచ్చిన మార్పులో చైనా వైపు మొగ్గుదల మననేతలకు సహజంగానే రుచించలేదు.ఒక స్వతంత్ర దేశం, అందునా కీలక ప్రాంతంలో ఉన్నందున దెబ్బతిన్న సంబంధాలను తిరిగి పునరుద్దరించుకొనేందుకు, కనీసం మరింత దిగజారకుండా చూసుకొనేందుకు ప్రయత్నించటం రాజనీతిజ్ఞుల లక్షణం.ఏ కారణంగానైనా దూరంగా జరిగినా, వైరం పెరిగినా ప్రత్యర్థుల ఆర్థిక మూలాను దెబ్బతీయటం ఒక ప్రధాన ధోరణిగా కనిపిస్తోంది.వాణిజ్య యుద్దాలు, దిగుమతులు, ఎగుమతులు, సాంకేతిక పరిజ్ఞానం అందచేత, పెట్టుబడులపై నిషేధాలు వాటిలో భాగమే. ఒక దేశం, దేశనేతలను కించపరిస్తే ఎవరూ సహించాల్సిన అవసరం లేదు. అధికారికంగా నిరసన తెలపటం అనేక ఉదంతాల్లో జరిగింది. సామాజిక మాధ్యమాల్లో మన ప్రధాని నరేంద్రమోడీని అవమానించినందుకుగాను మాల్దీవులకు తగిన బుద్ది చెప్పాలని, అందుకు మన విహార యాత్రీకులు అక్కడికి వెళ్లటం మానుకోవాలని మన దేశంలోని వారు సామాజిక మాధ్యమంలో పిలుపులు ఇచ్చారు. ఒక విమానయాన సంస్థ నిరవధికంగా ప్రయాణాలను నిలిపివేసినట్లు ప్రకటించింది. మోడీ, భారత్‌ను సామాజిక మాధ్యమంలో కించపరుస్తూ వ్యాఖ్యానించినందుకు మల్షా షరీఫ్‌, మరియం షిహునా, అబ్దుల్లా మఝూన్‌ మజీద్‌ అనే ముగ్గురు ఉప మంత్రులను అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు సస్పెండ్‌ చేశారు. మోడీని వారు హాస్యగాడు, ఉగ్రవాది, ఇజ్రాయెల్‌ తొత్తు అని, మన దేశంలో పరిశుభ్రత తక్కువ అని పేర్కొన్నారు.అరేబియా సముద్రంలోని మన లక్షద్వీప్‌లో విహార యాత్రలను ప్రోత్సహించేందుకు గాను మోడీ ఒక బీచ్‌లో కూర్చున్న వీడియోను పోస్టు చేసిన తరువాత ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి.తమ దేశానికి యాత్రీకులు రాకుండా చేసేందుకే ఇలా చేశారని అక్కడి కొందరు భావించారు. ప్రధానిని కించపరచటం గురించి మాలే లోని మన రాయబారి అక్కడి ప్రభుత్వానికి నిరసన తెలిపారు. మాల్దీవుల ప్రతిపక్ష నేతలు అధ్యక్షుడి మీద అవిశ్వాస తీర్మానం పెడతామనేవరకు వెళ్లారు. సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలను తాము గమనించామని, అవి వారి వ్యక్తిగతం తప్ప అధికారిక వైఖరి కాదని అక్కడి ప్రభుత్వం ఒక ప్రకటన కూడా చేసింది. జరిగినదాని మీద అధ్యక్షుడు ముయిజ్జు విచారణకు ఆదేశించారని రాయిటర్స్‌ పేర్కొన్నది. కారణాలు ఏమైనప్పటికీ మనదేశం నుంచి మాల్దీవులకు వెళుతున్న పర్యాటకుల సంఖ్య గణనీయంగా తగ్గింది. అక్కడి ప్రభుత్వం తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం గతేడాది జనవరి-మార్చి మాసాల మధ్య మన దేశం నుంచి 56,208 మంది మాల్దీవులకు వెళితే ఈ ఏడాది 34,847కు (38శాతం) తగ్గింది. అదే చైనా నుంచి వచ్చిన వారు 17,691 నుంచి 67,399 (281శాతం) పెరిగారు. అక్కడకు విదేశాల నుంచి వచ్చేవారిలో చైనా వాటా పది నుంచి అగ్రస్థానానికి చేరగా, మనదేశం మూడు నుంచి ఆరవ స్థానానికి తగ్గింది.


అధ్యక్షుడు ముయిజ్జు అనుసరిస్తున్న విధానాలతో విబేధించిన ప్రతిపక్షం పార్లమెంటులో తనకు ఉన్న మెజారిటీని ఆధారం చేసుకొని అభిశంసన తీర్మానం ద్వారా తొలగించేందుకు కూడా చూసింది. తాజా ఎన్నికల్లో అధికార పక్షం నాలుగింట మూడువంతులకు పైగా స్థానాలు సాధించటంతో అలాంటి ముప్పు తొలగటమే గాక అధ్యక్షుడికి మరింత పట్టుదొరికింది. జనవరిలో చైనా పర్యటన జరిపిన ముయిజ్జు అనేక ఒప్పందాలు చేసుకున్నాడు. ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయాలను జనం బలపరిచినట్లు ఫలితాలు స్పష్టం చేశాయి. ఇంతవరకు మనదేశ పర్యటనకు రాలేదు. మాల్దీవులకు భారత్‌ స్నేహ హస్తం చాచేందుకు విముఖత చూపితే చైనాపై మరింతగా ఆధారపడతారని అంతర్జాతీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మాల్దీవులకు పర్యాటకులు వెళ్ల వద్దని అధికారికంగా మన ప్రభుత్వం చెప్పకపోయినా జరిగిన పరిణామాలను చూస్తే నష్టం జరిగిందన్నది స్పష్టం. దూరమౌతున్న ఇరుగు పొరుగు దేశాలను మరింత దూరం చేయచూస్తున్న మత విద్వేషకులు ఎలాగూ మారరు. దేశం ఏమైనా వారికి పట్టదు. హనైమధూ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌తో సహా అనేక మౌలిక సదుపాయాల అభివృద్ధి పథకాలలో దాదాపు వెయ్యి కోట్ల రూపాయల వరకు మనదేశం పెట్టుబడులు ఉన్నాయి. వాటికి ఎలాంటి ముప్పు రాదు.మాల్దీవు ఎన్నికల్లో చైనా-భారత్‌లతో సంబంధాల గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అంత మాత్రాన వెల్లడైన తీర్పును ఆ ఒక్క అంశానికే ఆపాదించటం, మనదేశానికి వ్యతిరేకంగా పరిగణించాల్సిన అవసరం లేదు. అభివృద్ది పథకాలకు పెట్టుబడులు కావాలని కోరినపుడు అనేక పశ్చిమ దేశాలు అక్కడ హక్కులకు భంగం కలిగించే పాలకులు ఉన్నారంటూ నిరాకరించాయి. ఆ సమయంలో చైనా ముందుకు వచ్చింది. హక్కులు, పాలన అనేది ఆయాదేశాల అంతర్గత వ్యవహారాలు, వాటికి పెట్టుబడులను ముడిపెడితే రాజకీయ పరిణామాలు, పర్యవసానాలు ఎలా ఉండేది చెప్పలేము..

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఇరాన్‌-ఇజ్రాయెల్‌ ఉద్రిక్తతలు : మధ్య ప్రాచ్యానికి యుద్ధ ముప్పు !

17 Wednesday Apr 2024

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, International, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, UK, USA, WAR

≈ Leave a comment

Tags

Iran-Israel Tensions, Joe Biden, MIDDLE EAST, Netanyahu


ఎం కోటేశ్వరరావు


సామ్రాజ్యవాదుల కుట్రల కారణంగా మధ్యప్రాచ్యంలో ఎప్పుడేం జరుగుతుందో తెలియని స్థితి. గిల్లి కజ్జాలు పెట్టుకొని ఇరాన్ను రెచ్చగొట్టి యుద్దంలోకి లాగాలని చూస్తున్నారు. దానిలో భాగమే సిరియా రాజధాని డమాస్కస్‌లో ఉన్న ఇరాన్‌ రాయబార కార్యాలయంపై ఏప్రిల్‌ ఒకటిన జరిపిన ఆకస్మికదాడి. ఇజ్రాయెల్‌ అక్కడ ఉన్న ఏడుగురు ఇరాన్‌ మిలిటరీ అధికారులను హత్య చేసింది.దానికి ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించిన ఇరాన్‌ ఏప్రిల్‌ 13 శనివారం రాత్రి మూడు వందల క్షిపణులు, డ్రోన్లతో దాడిచేసింది. దీనికి తగు సమయంలో స్పందిస్తామని, తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని సోమవారం నాడు ఇజ్రాయెల్‌ ప్రకటించింది. అలాంటి దాడులే జరిపితే క్షణాల్లో ప్రతిదాడులకు తెగబడతామని, గతంలో ఎన్నడూ ఉపయోగించని ఆయుధాలను రంగంలోకి తెస్తామని ఇరాన్‌ హెచ్చరించింది. ఒకవేళ యూదు దురహంకారులకు మద్దతుగా అమెరికా ప్రత్యక్ష పోరులో పాల్గొంటే తాము కూడా దిగుతామని రష్యా హెచ్చరించింది. ఇరాన్‌ దౌత్యకార్యాలయంపై దాడి గురించి అసలు తమకు తెలియదని, దానితో సంబంధం లేదని ప్రకటించిన అమెరికా ఇజ్రాయెల్‌ దాడి గురించి భిన్నవైఖరి తీసుకుంది.ఇరాన్‌ ముందుగా ఎలాంటి హెచ్చరిక చేయలేదని, తాము ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలుస్తామని జో బైడెన్‌ వెంటనే ప్రకటించాడు. అయితే తాము నేరుగా దాడుల్లో పాల్గొనబోమని చెప్పినట్లు వార్తలు.అవునంటే కాదనిలే కాదంటే అవుననిలే అన్నట్లుగా అమెరికా, ఇతర పశ్చిమదేశాల మాటలను నమ్మలేము. ఇజ్రాయెల్‌-ఇరాన్‌ దాడులను చూసినపుడు రాజకీయ కోణంతో పాటు ఆయుధపాటవాన్ని పరీక్షించుకోవటం కూడా కనిపిస్తున్నది. పశ్చిమ దేశాలను యుద్ధంలోకి దింపేందుకు ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు వలపన్నుతున్నాడని ఒక వైపు ఇరాన్‌పై పరిమిత దాడులకు ఇజ్రాయెల్‌ పధకం వేస్తున్నదని అమెరికా భావిస్తున్నట్లు మరోవైపు వార్తలు వచ్చాయి.


దాడులు, ప్రతిదాడుల వెనుక ఉన్న కారణాలు తెలిసినప్పటికీ ఇతర అంశాల మీద కూడా విశ్లేషణలు వెలువడుతున్నాయి. రెండు దేశాలు ఆత్మరక్షణ, ఎదురుదాడుల బలాబలాలను సరి చూసుకుంటున్నట్లు చెప్పటం వాటిలో ఒకటి. ఇటు ఇరాన్‌ అటు అమెరికా కూడా పూర్తిస్థాయి పోరుకు సిద్దంగా లేవని, అయితే అమెరికా, ఇతర పశ్చిమ దేశాల నుంచి మరింత సాయం పొందేందుకు ఇజ్రాయెల్‌ వివాదాన్ని రెచ్చగొడుతున్నదని, నివారించలేని స్థితిలో అమెరికా ఉందని చెబుతున్నారు. తన సత్తాను చూపేందుకు ఇరాన్‌ గరిష్టంగా ఆయుధ ప్రయోగం చేయగా, వాటిని తట్టుకొనేందుకు పశ్చిమ దేశాలు తనకు కల్పించిన రక్షణ వ్యవస్థ ఎలా ఉందో ఇజ్రాయెల్‌ పరీక్షించుకుంది. రెండు దేశాలకూ ఉన్న పరిమితులను వెల్లడించాయి. మా దెబ్బేమిటో చూడండని కేవలం రుచిచూపేందుకు మాత్రమే ఇరాన్‌ దాడి పరిమితం కాలేదు. పశ్చిమ దేశాలు తమను కాపాడతాయని భావించినప్పటికీ కొన్ని క్షిపణులు ఇజ్రాయెల్‌ ప్రాంతాలను తాకాయి. కనీసం తొమ్మిది క్షిపణులు రక్షణ వలయం నుంచి తప్పించుకున్నాయని, ఐదు నెవాటిమ్‌ అనే వైమానిక స్థావరం మీద పడి సి-130 రకం రవాణా విమానాన్ని, రన్‌వేను, ఖాళీగా ఉన్న గోదామును ధ్వంసం చేసినట్లు, మరో నాలుగు వేరే వైమానిక స్థావరం మీద పడినట్లు వార్తలు వచ్చాయి. సహజంగానే నష్టాన్ని తక్కువగా చూపేందుకు, అసలేమీ జరగలేదని చెప్పేందుకూ చూస్తారన్నది తెలిసిందే. క్షిపణులను మధ్యలోనే కూల్చివేసే ఏరో-3 అనే ఆధునిక వ్యవస్థను తొలిసారిగా ఏర్పాటు చేశారని, దాన్ని తప్పించుకొని తొమ్మిది క్షిపణులు రావటం ఇజ్రాయలీలను ఆందోళనకు గురిచేస్తున్నట్లు చెబుతున్నారు. దాడి గురించి తాము నాలుగు రోజుల ముందే అమెరికాతో సహా ఇరుగు పొరుగుదేశాలన్నింటినీ హెచ్చరించామని ఇరాన్‌ ప్రకటించింది. బహుశా ఈ కారణంగా విమానాలు, ఇతర ఆయుధాలను వైమానిక స్థావరాల నుంచి వేరే చోటికి ఇజ్రాయెల్‌ తరలించి ఉండవచ్చు.


ఇజ్రాయెల్‌ రక్షణ దళాల ప్రతినిధి వెల్లడించిన సమాచారం ప్రకారం ఇరాన్‌ ప్రయోగించిన వాటిలో 170డ్రోన్లు,120క్షిపణులు ఉన్నాయి, ఇరాన్‌, ఇరాక్‌, ఎమెన్‌,లెబనాన్ల నుంచి 350 రాకెట్లను వదిలారు. నాలుగు గంటల పాటు దాడి జరిగింది. రెండు దేశాల మధ్య 1,600 కిలోమీటర్ల దూరం ఉంది. తూర్పు మధ్యధరా సముద్రంలోని తమ యుద్ధ నౌకలు నాలుగు నుంచి ఆరు క్షిపణులు, 70డ్రోన్లను కూల్చివేసినట్లు అమెరికా అధికారులు చెప్పారు.దాడి జరిగిన తరువాత జో బైడెన్‌ ఇజ్రాయెల్‌ నేత నెతన్యాహుతో మాట్లాడుతూ మద్దతుగా ఉంటాం తప్ప ఇరాన్‌ మీద జరిపే ఏ దాడిలోనూ తాము ప్రత్యక్షంగా పాల్గనేది లేదని చెప్పినట్లు వార్తలు వెలువడ్డాయి.ఆదివారం నాడు జి7 దేశాల ప్రతినిధులు వీడియో కాన్ఫరెన్సులో సమావేశమై ఇరాన్‌ దాడిని ఖండించారు. ఈ చర్య అదుపు చేయలేని పరిస్థితికి దారితీస్తుందని హెచ్చరించారు. ఆదివారం నాడు సమావేశమైన ఇజ్రాయెల్‌ యుద్ధ మంత్రివర్గం ఎలా స్పందించాలనే దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే వాయిదా పడింది.సోమవారం నాడు కూడా తీవ్ర తర్జనభర్జనలు జరిపింది.పరిస్థితి మరింత విషమించకుండా చూడాలని బైడెన్‌ ప్రకటించటం, ప్రతి దాడికి అవసరమైన ఎత్తుగడలను రచించేందుకు సమయం తీసుకొనేందుకు, అమెరికా మీద మరింత వత్తిడి పెంచేందుకు వ్యవధి తీసుకుంటున్నట్లు, ఇజ్రాయెల్‌కు తాము కల్పించిన రక్షణ కవచం పనితీరును పశ్చిమదేశాలు సమీక్షిస్తున్నట్లు కనిపిస్తోంది. నెపం ఎవరి మీద, ఎలా నెట్టాలన్నది కూడా ఆలోచించటం సహజమే.


ప్రధాని నెతన్యాహు ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నామని ఇజ్రాయెల్‌ మిలిటరీ అధిపతి హెర్జీ హల్‌వెల్‌ చెప్పగా, ఏవైనా ప్రతిదాడులు జరిగితే క్షణాల్లో స్పందిస్తామని ఇరాన్‌ ఉపవిదేశాంగ మంత్రి అలీ బగేరీకాన్‌ చెప్పాడు. తన సార్వభౌమత్వాన్ని రక్షించుకుంటూ పరిస్థితి చేయిదాటకుండా ఇరాన్‌ వ్యవహరించగలదని చైనా ఆశాభావం వ్యక్తం చేసింది.పరిస్థితి మరింతగా దిగజారటం ఎవరికీ మంచిది కాదని రష్యా పేర్కొన్నది. ఇరాన్‌తో యుద్ధాన్ని తాము కోరుకోవటం లేదని, ఎప్పుడు, ఎలా స్పందించాలన్నది నిర్ణయించుకోవాల్సింది ఇజ్రాయిలేనని అమెరికా చెప్పింది.సిరియాలోని ఇరాన్‌ రాయబారకార్యాలయంపై చేసిన దాడిని తాము సమర్దిస్తున్నట్లు బ్రిటన్‌ పేర్కొన్నది.ఇజ్రాయెల్‌పై దాడి తరువాత మరిన్ని ఆంక్షల గురించి ఆలోచిస్తున్నట్లు బ్రిటన్‌ విదేశాంగ మంత్రి చెప్పాడు. గత రెండు రోజులుగా ఇజ్రాయెల్‌ మీదుగా ప్రయాణించే విమానాలను అనేక సంస్థలు వేరే మార్గంలో నడుపుతున్నాయి.భద్రతా కారణాల రీత్యా ఇరాన్‌ తన అణుకేంద్రాలను ఆదివారం నాడు మూసివేసింది. వాటిపై ఇజ్రాయెల్‌ దాడి జరపవచ్చని అంతర్జాతీయ అణుఇంథన సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ రాఫెస్‌ గ్రోసీ ఆందోళన వ్యక్తం చేశారు. చైనా మధ్యవర్తిత్వంలో ఇరాన్‌-సౌదీ అరేబియా సాధారణ సంబంధాలను నెలకొల్పుంటున్న సంగతి తెలిసిందే. దాని చెడగొట్టేందుకు తప్పుడు సమాచారాన్ని వ్యాపింపచేస్తున్నారు. ఇరాన్‌ ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లను మధ్యలో కొన్నింటిని సౌదీ అరేబియా అడ్డుకున్నదంటూ ఇజ్రాయెల్‌ మీడియా సంస్థలు కొన్ని వార్తలను అల్లాయి.ఈ వార్తలను సౌదీ వర్గాలు ఖండించాయి.


మధ్యప్రాచ్యంలో జరుగుతున్న పరిణామాలను వ్లదిమిర్‌ పుతిన్‌ తనకు అనుకూలంగా మార్చుకోవచ్చని కొందరు విశ్లేషకులు పశ్చిమదేశాలకు హితవు చెప్పారు.బహుశా ఈ అంశం అమెరికా దృష్టిలో ఉన్న కారణంగానే తొందరపడవద్దని ఇజ్రాయెల్‌కు సలహా ఇచ్చి ఉండవచ్చని భావిస్తున్నారు. పశ్చిమ దేశాల దృష్టి మధ్య ప్రాచ్యంవైపు మళ్లితే ఇప్పటికే తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న ఉక్రెయిన్ను చావు దెబ్బతీయటం మరింత సులభం అవుతుంది.ఇప్పటికే ఉక్రెయిన్‌ విద్యుత్‌ వ్యవస్థ నాశనానికి రష్యా దాడులు జరుపుతున్నది. అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు తమ వనరులన్నింటినీ ఇరాన్‌ మీద కేంద్రీకరిస్తే అమెరికా నాటోలోని తన అనుయాయి దేశాలకు భద్రత కల్పించలేదన్న భావన మరింతగా పెరుగుతుంది. ఇప్పటికే ఉక్రెయిన్‌కు అందించాల్సిన అమెరికా సాయం ఆలశ్యం అయిందన్న అభిప్రాయం ఉంది.దాదాపు ఆరునెలల క్రితం ప్రకటించిన 60బిలియన్‌ డాలర్ల సహాయం గురించి ఇంతవరకు పార్లమెంటు ఖరారు చేయలేదు. మరోవైపు రష్యా, ఉత్తర కొరియా, ఇరాన్‌ బంధం మరింత పటిష్టం అవుతుంది. మధ్య ప్రాచ్యం, పశ్చిమాసియాలో రష్యా ప్రభావం మరింతగా పెరుగుతుంది. ఇప్పటికే రష్యా అందించిన సాంకేతిక పరిజ్ఞానంతో ఇరాన్‌ తయారు చేసిన డ్రోన్లను ఉక్రెయిన్‌పై ప్రయోగిస్తున్న సంగతి తెలిసిందే. ఎత్తుగడలు, లక్ష్యాలు ఎలా ఉన్నప్పటికీ సమస్యలు కూడా ఉన్నాయి.బింకంగా మాటలు చెప్పవచ్చు, ప్రకటనలు ఎలా ఉన్నప్పటికీ ఇజ్రాయెల్‌ వెంటనే స్పందించకపోవటానికి దాని మీద ఉన్న వత్తిడి ఒక కారణం. ఎన్నికల్లో ఉన్న బైడెన్‌కు ఇప్పుడు పూర్తిస్థాయి పోరు నష్టం కలిగించే అవకాశం ఉంది. ఆరునెలలు దాటినా సాధారణ పౌరులపై మారణకాండ, గాజాలో విధ్వంసకాండ సాగించటం తప్ప బందీలుగా ఉన్న తమవారిని విడిపించుకోలేకపోయింది. రోజు రోజుకూ ఈ అంశం వత్తిడి పెంచుతున్నది. హమస్‌ సాయుధులను అణచివేస్తామన్న మాటలు ప్రగల్భాలుగానే ఉన్నాయి. యుద్ధం అంటూ మొదలైతే ఇజ్రాయెల్‌ మీద రెండు మూడు వైపుల నుంచి దాడులు జరుగుతాయి. ఇరాన్‌పై ప్రతిదాడుల అంశంలో ఇజ్రాయెలీ యుద్ధ మంత్రివర్గంలో భిన్నాభిప్రాయాలు వెలువడ్డాయి.


ఉక్రెయిన్‌ సంక్షోభం నుంచి గౌరవ ప్రదంగా ఎలా బయటపడాలో తెలియని పశ్చిమ దేశాలు 194 రోజుల గాజా మారణకాండ తరువాత తదుపరి ఏమిటన్నదానిపై మల్లగుల్లాలు పడుతున్నాయి.ఇప్పటి వరకు 33,843 మంది మరణించగా, 76,575 మంది గాయపడ్డారు. ఇరాన్‌ దాడులు జరిపిన వెంటనే ఇజ్రాయెల్‌ వైమానిక దళం దక్షిణ లెబనాన్‌లోని హిజబుల్లా స్థావరాలపై ప్రతిదాడులు జరిపింది. ఇజ్రాయెల్‌కు మద్దతు ఇస్తున్న జోర్డాన్‌ పాలకులకు వ్యతిరేకంగా అక్కడ ప్రదర్శనలు జరుగుతున్నట్లు వార్తలు మొత్తంగా చూసినపుడు రెండు దేశాలూ ఎలా ప్రతీకారం తీర్చుకుంటాయి, వాటికి మద్దతుగా ఉన్న దేశాల పాత్ర ఎలా ఉంటుంది అనే అంశాలు ప్రపంచాన్ని భయపెడుతున్నాయి.ఐరోపా దేశాలు కూడా ప్రతిదాడులు వద్దని ఇజ్రాయెల్‌ను కోరాయి. ఈ వారంలో ఢిల్లీ పర్యటనకు రావాల్సిన అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్‌ సులివాన్‌ వాయిదావేసుకున్నారు. తమ రాయబార కార్యాలయం మీద జరిగిన దాడికి ప్రతిగా ఇరాన్‌ స్పందించి ఒక దాడితో ముగించింది. దీనికి ప్రతిగా ఇజ్రాయెల్‌ తెగబడితే అది అంతటితో ఆగదు అని వేరే చెప్పనవసరం లేదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం : చైనా పేర్లు ఎందుకు మార్చుతున్నది, అమెరికా ఆడుతున్న నాటకం ఏమిటి ?

13 Saturday Apr 2024

Posted by raomk in BJP, CHINA, Congress, CPI(M), Current Affairs, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, Japan, Left politics, Loksabha Elections, NATIONAL NEWS, Opinion, Political Parties, USA, WAR

≈ Leave a comment

Tags

#Anti China, #India-China border, Aksai Chin, Arunachal pradesh, BJP, China, Chinese Names, Indo-China, Indo-China standoff, Narendra Modi Failures, RSS


ఎం కోటేశ్వరరావు


ఇరుగు పొరుగుదేశాలతో వివాదాలు ఉన్నపుడు అధికారంలో ఉన్నవారు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉంటుంది.బిజెపి నేతలు, వారిని నడిపించే సంఘపరివార్‌ సంస్థలకు చెందిన వారు నిరంతరం తమకు అనుకూలంగా ఏదో ఒక వివాదాన్ని ముందుకు తీసుకువస్తున్నారు. ఉదాహరణకు గతంలో భారత్‌-శ్రీలంక మధ్య కుదిరిన ఒప్పందం మేరకు కచ్చాతీవు దీవిని శ్రీలంకకు అప్పగించారు. దాన్ని డిఎంకె, కాంగ్రెస్‌ మీద వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు బిజెపి ఎన్నికల సందర్భంగా ముందుకు తెచ్చింది. ఆ దీవిని వెనక్కు తీసుకొనేందుకు పదేండ్ల పాటు అధికారంలో ఉన్న నరేంద్రమోడీ ఏమైనా చేశారా ? పోనీ ఇప్పుడేదైనా కొత్త ప్రతిపాదనను ముందుకు తెచ్చారా అంటే అదీ లేదు. ఇదే నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత ఎవరివో నిర్ధారణగాని ప్రాంతాలపై బంగ్లాదేశ్‌తో ఒప్పందం చేసుకున్నారు. 2015లో కుదుర్చుకున్న అవగాహన మేరకు 17,160 ఎకరాల విస్తీర్ణం ఉన్న లంకలు, ప్రాంతాలను బంగ్లాదేశ్‌కు అప్పగించి,7,110 ఎకరాలను మనదేశం తీసుకున్నది. దీని గురించి మాత్రం బిజెపి, మోడీ మాట్లాడరు. కచ్చాతీవు గురించి తమను విమర్శించినందుకు కాంగ్రెస్‌ ఈ అంశాన్ని ప్రస్తావించి ఈ నిర్వాకం సంగతేమిటని నిలదీసింది. ఈ రెండు ఉదంతాలు చెబుతున్న పాఠమేమిటి ? ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ ఇరుగు పొరుగుదేశాలతో ఇచ్చిపుచ్చుకొనే పద్దతిలో వివాదాలను పరిష్కారం చేసుకోవాలనే కదా ?


ఇక మరొక పొరుగుదేశమైన చైనా వ్యతిరేకతను కాషాయదళాలు రెచ్చగొడుతూనే ఉన్నప్పటికీ కీలక సమయాల్లో నరేంద్రమోడీ ఆచితూచి మాట్లాడుతున్నారు.కొత్తగా మన భూభాగాన్ని చైనా ఆక్రమించలేదు అని గాల్వన్‌ ఉదంత సమయంలో చేసిన ప్రకటన వాటిలో ఒకటి. తాజాగా అమెరికా పత్రిక న్యూస్‌వీక్‌తో మాట్లాడిన అంశాలు ఆలోచింపచేసేవిగా ఉన్నట్లు చైనా పత్రిక గ్లోబల్‌టైమ్స్‌ పేర్కొన్నది. రెండు దేశాల మధ్య సంబంధాల గురించి నరేంద్రమోడీ మృదుస్వరంతో మాట్లాడినట్లుందని అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్‌ ప్రారంభవాక్యాలతోనే తన విశ్లేషణ ప్రారంభించింది.మోడీ అశక్తత, పిరికితనం కనిపించిందని, గాల్వన్‌ ఉదంతంలో ప్రాణాలు అర్పించిన వారికి అవమానకరంగా ఉన్నట్లు కాంగ్రెస్‌ వర్ణించింది. ఇంతకీ నరేంద్రమోడీ ఏం చెప్పారు ? సరిహద్దుల్లో దీర్ఘకాలంగా సాగుతున్న పరిస్థితి మీద తక్షణమే మాట్లాడుకోవాల్సి ఉందని, తద్వారా రెండు దేశాల మధ్య ఉన్న అసాధారణతను వెనక్కు నెట్టవచ్చని, స్థిరమైన,శాంతియుత సంబంధాలు కేవలం రెండు దేశాలకే కాదు మొత్తం ప్రాంతానికి ముఖ్యమని నరేంద్రమోడీ చెప్పారు. దౌత్య రంగం, మిలిటరీ అధికారులు అప్పుడప్పుడూ రెండు దేశాల మధ్య సంబంధాల గురించి చేసిన వ్యాఖ్యలు కొన్నిసార్లు మృదువుగా కొన్ని సార్లు కఠినంగా ఉన్నాయని, అయితే మోడీ నేరుగా చెప్పిన మాటలు ప్రత్యేకించి స్పష్టమైన వైఖరి వెల్లడించటం అసాధారణం, సమయాన్ని జాగ్రత్తగా ఎంచుకున్నారని, సానుకూల సంకేతాలు పంపారని గ్లోబల్‌టైమ్స్‌ పేర్కొన్నది. భారత్‌-చైనా సంబంధాలను బలహీనపరచాలని చూస్తున్న అమెరికాలో కొందరికి మోడీ మాటలు అంత వినసొంపుగా ఉండకపోవచ్చని కూడా చైనా పత్రిక పేర్కొన్నది.రెండు దేశాలను ఘర్షణ దిశగా తీసుకుపోవాలని అమెరికా చూస్తున్నదని కూడా చెప్పింది.


అరుణాచల్‌ ప్రదేశ్‌లో కొన్ని ప్రాంతాలకు చైనా లిపిలో-టిబెటన్‌ పేర్లు ఖరారు చేస్తూ మూడవ జాబితాను ఇటీవల చైనా విడుదల చేసింది.అరుణాచల్‌ను టిబెట్‌లోని జాంగ్‌నాన్‌ ప్రాంతంగా చైనా పరిగణిస్తున్నది. ఒక దగ్గర స్విచ్‌ వేస్తే మరోదగ్గర లైటు వెలిగినట్లుగా అంతర్జాతీయ రాజకీయాల్లో దాదాపు అన్ని సందర్భాల్లో లైటు వెలగటమే కనిపిస్తుంది గానీ స్విచ్‌ ఎక్కడుంది, ఎవరు, ఎందుకు వేశారన్నది అంతగా తెలియదు. జపాన్‌ తదితర దేశాల ప్రతినిధులు పరిశీలకులుగా అమెరికా, ఇతరదేశాలతో కలసి పశ్చిమబెంగాల్లోని కలైకుండ వైమానిక స్థావరంలో ఏప్రిల్‌ 11-23వ తేదీలలో మనదేశం వైమానిక యుద్ధ విన్యాసాలు జరపటాన్ని వ్యతిరేకిస్తున్నట్లు హెచ్చరిస్తూ అరుణాచల్‌ ప్రదేశ్‌లో పేర్ల జాబితాను చైనా విడుదల చేసిందని డిప్లొమాట్‌ పత్రిక సంపాదకులలో ఒకరైన సుధా రామచంద్రన్‌ పేర్కొన్నారు. అరుణాచల్‌ ప్రదేశ్‌ తమ టిబెట్‌లో అంతర్భాగమని చైనా వాదిస్తున్నది. అందువల్లనే సందర్భం వచ్చినపుడల్లా తమ ప్రాంతమే అని చైనా బహిరంగంగా చెబుతున్నది.ఇప్పుడు జరుగుతున్న విన్యాసాలను చైనా తీవ్రంగా పరిగణిస్తున్నదని అంతర్జాతీయ మీడియాలో విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రపంచంలో ఆధునిక యుద్ద విమానాలు, ఇతర వ్యవస్థలను రప్పించి తరంగశక్తి తొలి దశ పేరుతో ఆగస్టులో మరోసారి తొలిసారిగా విన్యాసాలు జరపనున్నారు. ఈ విన్యాసాలలో చైనా, రష్యాలను వ్యతిరేకించేదేశాలే భాగస్వాములుగా ఉన్నాయి.అమెరికా, జర్మనీ,ఫ్రాన్స్‌,ఆస్ట్రేలియా తదితర దేశాల వైమానిక దళాలు పాల్గొంటాయి. సహజంగానే ఇలాంటి విన్యాసాలు తనను ఉద్దేశించి జరుపుతున్నట్లు భావించే ఏ దేశమైనా తనదైన శైలిలో స్పందిస్తుంది.


చైనా తాజాగా ప్రకటించిన 30 పేర్ల గురించి గతంలో మాదిరే మనదేశం స్పందించింది.మన ప్రాంతాలకు మరొక దేశం తన పేర్లు పెట్టుకున్నంత మాత్రాన వారి ప్రాంతాలవుతాయా, వాస్తవాలను మారుస్తాయా అంటూ అభ్యంతరం వ్యక్తం చేసింది.మనదేశంలో మీడియా మరోసారి తీవ్రంగా స్పందించింది. రేటింగ్స్‌ను పెంచుకొనేందుకు టీవీ ఛానళ్లు చూశాయి.రెండవ సారి 2017లో పేర్లు పెట్టిన వాటిలో రెండు నివాసిత ప్రాంతాలు, ఐదు పర్వతాలు, రెండు నదులు, మరో రెండు ప్రాంతాలు ఉన్నాయి. మరో 15 ప్రాంతాలకు 2021లో చైనా పేర్లు పెట్టింది.తమవి అని చెప్పుకుంటున్న వివాదాస్పద ప్రాంతాలకు ఏ దేశమైనా తన పేర్లు పెట్టుకోవటం కొత్తదేమీ కాదు. ప్రస్తుతం చైనా ఏలుబడిలో ఉన్న ఆక్సారు చిన్‌ ప్రాంతం ఉంది. అది మనదే అని మన ప్రభుత్వం చెబుతుంది. దాన్ని లడఖ్‌ ప్రాంతంలోని లే జిల్లాగా పిలుస్తారు. అరుణాచల్‌ ప్రదేశ్‌ మీద ఉన్న వివాదం కూడా అలాంటిదే. దాన్ని చైనా వారు జింగ్‌నాన్‌ అనే పేరుతో వ్యవహరిస్తారు.మన పురాణాల్లో మానస సరోవరంగా పిలిచే సరస్సు చైనాలోని టిబెట్‌లో ఉంది. అక్కడ దాని పేరు మాపాంగ్‌ యంగ్‌.


రెండు దేశాల మధ్య లడఖ్‌, అరుణాచల్‌ ప్రాంతాలపై వివాదం ఉంది. దాన్ని బ్రిటీష్‌ వారు సృష్టించారు.మన దేశం బ్రిటీష్‌ వారి నుంచి 1947లో స్వాతంత్య్రం పొందింది. మనదేశం మాదిరి చైనాను బ్రిటన్‌ పూర్తిగా ఆక్రమించలేకపోయింది. వివిధ ప్రాంతాలలోని యుద్ధ ప్రభువులు బలంగా ఉండటంతో అమెరికాతో సహా ఐరోపా దేశాలన్నీ తమకు కావాల్సిన వాణిజ్యం మీద వివిధ ఒప్పందాలను చేసుకున్నాయి తప్ప వారి పాలనను రుద్దలేకపోయాయి. అయితే చైనా వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నారు. నదులు, రేవులు, వాణిజ్యాలపై అనేక హక్కులను పొందారు. హంకాంగ్‌ దీవులను 99 సంవత్సరాలకు బ్రిటీష్‌ వారు కౌలుకు తీసుకున్నారు. అలాగే మకావో దీవులను పోర్సుగీసు వారు కౌలుకు తీసుకున్నారు. పేరుకు దేశం క్వింగ్‌ రాజరిక పాలనలో ఉన్నప్పటికీ దేశం మొత్తం మీద అదుపులేదు. యుద్ద ప్రభువులు పెత్తనం చెలాయించేవారు. వారి మధ్య ఉన్న విబేధాలను విదేశాలు ఉపయోగించుకున్నాయి. ఈ నేపధ్యంలో ఎనిమిది దేశాల కూటమి క్వింగ్‌ వంశ రాజు మీద అనేక ఒప్పందాలను రుద్దింది.దేశాన్ని కుక్కలు చింపిన విస్తరిమాదిరి చేశారు. దాంతో దేశభక్తులు రాజరికాన్ని కూలదోసి రిపబ్లిక్‌ను ఏర్పాటు చేసేందుకు ఉద్యమం సాగించిన ఫలితంగా 1911లో చైనా రాజరికం నుంచి రిపబ్లిక్‌గా మారింది. మనకు జాతిపితగా మహాత్మాగాంధీ ఎలాగో చైనాలో సన్‌ ఏట్‌ సేన్‌ దానికి నాయకత్వం వహించాడు. అధికారం వచ్చిన తరువాత యుద్ధ ప్రభువులు కేంద్ర ప్రభుత్వ పెత్తనాన్ని అంగీకరించకుండా తిరుగుబాటు, కుట్రలకు పాల్పడ్డారు.1949లో కమ్యూనిస్టులు అధికారానికి వచ్చిన తరువాతే ఒకే ప్రభుత్వ ఏలుబడిలోకి చైనా వచ్చింది. సామంత రాజ్యంగా ఉన్న టిబెట్‌ను రెచ్చగొట్టి స్వతంత్రదేశంగా మార్చి తమ స్థావరంగా చేసుకోవాలని చూసిన బ్రిటన్‌, తరువాత అమెరికా జరిపిన కుట్రల కారణంగా టిబెట్‌ పాలకుడిగా ఉన్న దలైలామా తిరుగుబాటు,మనదేశానికి పారిపోయి రావటం తెలిసిందే.


మన ప్రభుత్వ సాయంతో హిమచల్‌ ప్రదేశ్‌లోని ధర్మశాలలో ప్రవాసంలో ఉన్న 88 సంవత్సరాల పద్నాలుగవ దలైలామా అరుణాచల్‌ ప్రదేశ్‌ ప్రాంతం టిబెట్‌లో అంతర్భాగమే అని 2003లో చెప్పాడు. తరువాత వైఖరి మార్చుకున్నాడు.బ్రిటీష్‌ అధికారి మెక్‌మోహన్‌ గీసిన సరిహద్దు రేఖ ప్రకారం భారత్‌లో అంతర్భాగమే అని మాట మార్చాడు. మెక్‌మోహన్‌ రేఖను సరిహద్దుగా 1914లోనే బ్రిటన్‌-టిబెట్‌ గుర్తించాయనే వాదనను ముందుకు తెచ్చాడు. అయితే ఆ ఒప్పందాన్ని చైనా ప్రభుత్వం అంగీకరిస్తేనే అమల్లోకి వస్తుందనే అంశం ఉంది. సదరు ఒప్పందాన్ని చైనా గుర్తించలేదు. ఒక సామంత ప్రాంతానికి విదేశాలతో ఒప్పందం చేసుకొనే హక్కులేదు.ఆక్సారుచిన్‌ ప్రాంతాన్ని కూడా బ్రిటీష్‌ అధికారులు నిర్దిష్టంగా గుర్తించకపోవటంతో అది కూడా వివాదాస్పద ప్రాంతంగా మారింది. వారి గీతలు ఎలా ఉన్నప్పటికీ స్వాతంత్య్రం వచ్చేనాటికి అరుణాచల్‌ప్రదేశ్‌ మన పాలనలో, ఆక్సారుచిన్‌ చైనా ఏలుబడిలో ఉంది. మనం దీని గురించి అడిగితే వారు దాని సంగతేమిటని ప్రస్తావిస్తున్నారు.1962లో రెండు దేశాల మధ్య యుద్ధం వచ్చినపుడు చైనా సైన్యాలు అరుణాచల్‌ను దాటి నేటి అసోంలోని తేజ్‌పూర్‌ వరకు వచ్చాయి. తరువాత వెనక్కుపోయి, వాస్తవాధీనరేఖకు అవతల గతంలో మాదిరే ఉన్నాయి. తమ మీద తిరుగుబాటు చేసిన దలైలామాకు మనదేశం ఆశ్రయం ఇవ్వటాన్ని చైనా వ్యతిరేకిస్తున్నది.2017లో దలైలామా అరుణాచల్‌ ప్రదేశ్‌లో వారం రోజుల పర్యటనను చైనా వ్యతిరేకించింది. అతడిని ఆపకపోతే తీవ్ర పర్యవసానాలు ఉంటాయని చైనా పత్రికల్లో వార్తలు వచ్చాయి. దలైలామా పర్యటన తరువాత తొలిసారిగా కొన్ని ప్రాంతాలకు తమ పేర్లను చైనా ప్రకటించింది. ఆ తరువాతే 73రోజుల పాటు డోక్లామ్‌ ప్రతిష్ఠంభన కొనసాగింది.తరువాత 2021లో మరోసారి కొన్ని ప్రాంతాలకు పేర్లు ప్రకటించింది.


టిబెట్‌ను చైనా అంతర్భాగమని మనదేశం గుర్తించింది, కానీ అదే సమయంలో మానవతాకారణాలను సాకుగా చూపి తిరుగుబాటు చేసిన దలైలామాకు ఆశ్రయం కల్పించటం,ప్రవాస ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అనుమతించింది. రెండు దేశాల మధ్య తెగని వివాదాల్లో ఇదొకటి.తమ వ్యతిరేకశక్తులకు భారత్‌ ఆశ్రయమిస్తున్నదని చైనా విమర్శిస్తున్నది.చైనాతో ఉన్న వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని అవిభక్త కమ్యూనిస్టు పార్టీలో ఉన్ననేతలు(తరువాత వారు సిపిఎంగా ఏర్పడ్డారు) కొందరు 1962లో కోరినందుకు వారిని దేశద్రోహులుగా, చైనా ఏజంట్లుగా చిత్రించి జైలుపాలు చేశారు. తరువాత అదే కాంగ్రెస్‌ పాలకులు చైనాతో వివాదాన్ని కొనసాగిస్తూనే సాధారణ సంబంధాలను నెలకొల్పుకున్నారు.వర్తమానంలో నరేంద్రమోడీ గత ప్రధానులెవరూ కలవనన్ని సార్లు చైనా నేతలతో భేటీలు జరిపి రికార్డు సృష్టించారు.గాల్వన్‌లోయ ఉదంతాలకు ముందు ఇరుదేశాల నేతలు కలసి ఉయ్యాలలూగటాన్ని ఊహాన్‌, మహాబలిపురం నగరాల్లో చూశాము.ఇప్పుడు జరుగుతున్న పరిణామాల వెనుక భారత్‌ భుజం మీద తుపాకి పెట్టి అమెరికన్లు తమను కాల్చాలని చూస్తున్నట్లు చైనా అనుమానిస్తుండటం ఒక కారణం. అరుణాచల్‌ భారత్‌లో అంతర్భాగంగా తాము గుర్తిస్తున్నట్లు 2024 మార్చినెల తొమ్మిదవ తేదీన అమెరికా ఒక ప్రకటన చేసింది. వివాదాన్ని పెంచటానికి గాకపోతే ఇరుదేశాలకు సంబంధించిన అంశాల మీద దానికి సంబంధం ఏమిటి ? పాక్‌ ఆక్రమిత కాశ్మీరును భారత్‌ అంతర్భాగంగా గుర్తిస్తున్నట్లు అమెరికా ఇంతవరకు ఎక్కడా చెప్పలేదు. ఎందుకని ? అదే అమెరికా ఆడుతున్న రాజకీయం,అలా ప్రకటిస్తే పాకిస్తాన్‌ ఎక్కడ చైనాకు మరింత దగ్గర అవుతుందేమో అన్నదే దాని భయం.మన స్వతంత్ర విదేశాంగ విధానం ప్రకారం వివాదాలను పరిష్కరించుకోవాలి తప్ప అమెరికా వలలో చిక్కుకొని కొత్త సమస్యలు తెచ్చుకోవద్దన్నదే అనేక మంది చెబుతున్నమాట.

Share this:

  • Tweet
  • More
Like Loading...

భారత్‌ను ముంచెత్తనున్న విద్యుత్‌ వాహనాలు – చైనా మీద మోడీ సర్కార్‌కు ఎక్కడలేని ప్రేమ ఎందుకబ్బా !

04 Thursday Apr 2024

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, History, INDIA, International, INTERNATIONAL NEWS, Loksabha Elections, NATIONAL NEWS, Opinion, Political Parties, Politics, Prices

≈ Leave a comment

Tags

BJP, China, China imports to India, Chinese E vehicles, Chinese investment, Narendra Modi Failures, RSS


ఎం కోటేశ్వరరావు


సరిహద్దు సమస్యల గురించి మాతో రహస్యంగా భారత్‌ లోతైన చర్చలు జరుపుతున్నదని, మరోవైపు విదేశాంగ మంత్రి రాజీపడేది లేదని ప్రకటిస్తారని, ఇదంతా నెపం మా మీద నెట్టేందుకు, బేరమాడేందుకు చేస్తున్న ట్రిక్కు అని చైనా విదేశాంగశాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నది. గత నెలలో బీజింగ్‌లో రెండు దేశాల ప్రతినిధులు సరిహద్దు వివాదాల గురించి 29వ దఫా చర్చలు జరిపారు. రెండు దేశాల మధ్య సాధారణ సంబంధాలు నెలకొనాలంటే సరిహద్దులో సాంప్రదాయ పద్దతిలో బలగాలను మోహరించితేనే సాధ్యమని చర్చల అనంతరం మలేషియా భారతజాతీయుల సమావేశంలో జై శంకర్‌ చెప్పారు. సరిహద్దు సమస్యపై రాజీపడేది లేదన్నారు. భారత్‌లో జరగనున్న ఎన్నికల్లో లబ్దిపొందేందుకే జైశంకర్‌ ఇంత గట్టిగా మాడ్లాడారని చైనా విశ్లేషకులు పేర్కొన్నారు. సరిహద్దు వివాదానికి బాధ్యత చైనాదే అని ప్రపంచానికి చెప్పే యత్నం కూడా దీనిలో ఉందన్నారు. అరుణాచల్‌ ప్రదేశ్‌ను భారత్‌ అంతర్భాగంగా తాము ఎన్నడూ గుర్తించలేదని, మరోసారి దాన్ని గురించి ప్రస్తావించటం కూడా ఎన్నికల కోసమే అని విమర్శించారు. అరుణాచల్‌ ప్రదేశ్‌ను చైనా జాంగ్‌నాన్‌ అని పిలుస్తున్నది, పురాతన కాలం నుంచి అది చైనా ప్రాంతమే అని వాదిస్తున్నది. స్వాతంత్య్రం వచ్చిన సమయానికి అది మనదేశ అంతర్భాగంగా ఉంది.అదే విధంగా మనదని చెబుతున్న ఆక్సారుచిన్‌ ప్రాంతం చైనా ఆధీనంలో ఉంది. ఇది రెండు దేశాల మధ్య తెగని సరిహద్దు వివాదంగా కొనసాగుతున్నది. పరస్పరం చొరబడకుండా వాస్తవాధీన రేఖకు అటూ రెండు దేశాలూ కాపలా కాస్తుంటాయి.ఉద్రిక్తతలు తలెత్తినపుడు మిలిటరీని మోహరిస్తున్నాయి. లడక్‌ ప్రాంతంలోని గాల్వన్‌ లోయ 2020 ఉదంతం తరువాత మోహరించిన మిలిటరీలు కొనసాగుతున్నాయి. వాటి ఉపసంహరణ గురించి చర్చలు జరుగుతున్నా కొత్త వివాదం తలెత్తలేదు తప్ప పూర్వపు స్థితి నెలకొనలేదు.


ఒక వైపు మనదేశంలోని సంఘపరివార్‌, ఇతర కొన్ని శక్తులు చైనా వ్యతిరేకతను నిరంతరం రెచ్చగొడుతూ ప్రచారం చేస్తుంటాయి. మరోవైపు అదే చైనా నుంచి మన దేశం రికార్డు స్థాయిలో దిగుమతులు చేసుకుంటున్నది. గత రికార్డులను నరేంద్రమోడీ బద్దలు కొట్టారు.ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి మాసాల్లో గతేడాది అదే నెలలతో పోలిస్తే 15.8శాతం తమతో వాణిజ్యం పెరిగిందని చైనా కస్టమ్స్‌ శాఖ ప్రకటించింది. తూర్పు చైనాలో ప్రధాన వాణిజ్య కేంద్రంగా ఉన్న షియాంగ్‌సు రాష్ట్రం నుంచి బ్రెజిల్‌,భారత్‌,రష్యా, దక్షిణాఫ్రికా దేశాలతో గతేడాదితో పోలిస్తే 2024జనవరి, ఫిబ్రవరి మాసాల్లో 36శాతం పెరిగి 14.4బిలియన్‌ డాలర్లకు చేరిందని వెల్లడించారు.షియాంగ్‌షు రాష్ట్రం నుంచి ప్రధానంగా విద్యుత్‌ వాహనాలు, వాటిలో వినియోగించే లిథియమ్‌ అయాన్‌ బాటరీలు, ఫొటోవోల్టాయిక్‌ ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి.పైన పేర్కొన్న నాలుగుదేశాలతో పాటు చైనాను కలిపి బ్రిక్స్‌ అని పిలుస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరి నుంచి దీనిలో సౌదీ అరేబియా, ఈజిప్టు,ఇరాన్‌, యుఏయి. ఇథియోపియా కూడా చేరటంతో దీన్ని బ్రిక్స్‌ ప్లస్‌ అని పిలుస్తున్నారు. ఒక వైపు చైనా మీద ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని, మనదగ్గర నుంచే మేకిన్‌ ఇండియా, మేడిన్‌ ఇండియాలో భాగంగా ఇతర దేశాలకు వస్తువులను ఎగుమతి చేసే అవకాశం వచ్చిందని మీడియా ఊదరగొడుతున్నది. మరోవైపు మనదేశం చైనా, ఐరోపా సమాఖ్య మీద ఆధారపడటం పెరుగుతున్నదని తాజాగా ఐరాస సంస్థ ” అంక్టాడ్‌ ” ప్రకటించింది.
మనదేశం అందించిన వివరాలను విశ్లేషించిన ఆ సంస్థ కరోనా తరువాత, రష్యా-ఉక్రెయిన్‌ వివాదం ప్రారంభమైనప్పటి నుంచి చైనా, ఐరోపా సమాఖ్యపై భారత్‌ ఆధారపడటం 1.2శాతం పెరిగిందని, సౌదీ అరేబియాపై 0.6శాతం తగ్గిందని పేర్కొన్నది. భారత్‌లో ఉత్పాదకతతో ముడిపడిన ప్రోత్సాహక పథకం(పిఎల్‌ఐ) అమలు, చైనా నుంచి వస్తున్న దిగుమతులపై నాణ్యతా ప్రమాణాల ఉత్తరువుల పేరుతో పరిమితులను విధించిన తరువాత కూడా భారత్‌ ఆధారపడటం పెరిగింది. గడచిన రెండు సంవత్సరాలుగా అంతర్జాతీయ వాణిజ్యం స్థిరంగా ఉండటం, రాజకీయాల ప్రాతిపదికన వాణిజ్యం పెరిగినప్పటికీ చైనా మీద ఆధారపడటం ఎక్కువైంది. చైనాపై ఆధారపడటాన్ని 2023లో అమెరికా 1.2శాతం తగ్గించుకుంటే మనదేశం పెంచుకుంది. ఈ కాలంలోనే చైనాపై ఆధారపడిన రష్యా వాణిజ్యం 7.1శాతం పెరగ్గా, ఐరోపా మీద 5.3శాతం తగ్గింది.2022 నుంచి ప్రపంచ వస్తు వ్యాపారం క్రమంగా తగ్గుతున్నది, సేవల లావాదేవీలు పెరుగుతున్నాయి. పొద్దున లేస్తే చైనా వ్యతిరేకతను రెచ్చగొడుతున్న కారణంగా చైనాతో పెంచుకుంటున్న వాణిజ్య లావాదేవీల గురించి చెప్పుకొనేందుకు మన మీడియా సిగ్గుపడుతున్నదని చెప్పవచ్చు. మన ఆర్థిక సంవత్సరపు లెక్కలను మన అధికారులు వెల్లడిస్తే చైనా జనవరి నుంచి డిసెంబరు ప్రాతిపదిక వార్షిక లెక్కలు ప్రకటిస్తుంది. అందువలన రెండుదేశాల లెక్కల్లో తేడాలు కనిపిస్తాయి.చైనా నుంచి జనవరిలో వస్తువులు ఎగుమతి జరిగి అవి మనదేశానికి వచ్చే సరికి ఒకటి రెండు నెలలు పడుతుంది. ఇది లెక్కల్లో తేడాలకు ఒక కారణం.


మనదేశ వాణిజ్య శాఖ సమాచారం ప్రకారం 2021-22 నుంచి 2023-24వరకు మూడు సంవత్సరాలలో 95.266 నుంచి 99.389 బిలియన్‌ డాలర్లకు చైనాతో వాణిజ్యం పెరిగింది. ఇదే సమయంలో చైనా వెల్లడించిన సమాచారం ప్రకారం 110.361 నుంచి 116.953 బిలియన్‌ డాలర్లకు చేరింది. చైనా లెక్కలు తప్పు మనం అంతగా దిగుమతులు చేసుకోలేదు అని కొందరు వాదించవచ్చు. అంకెల్లో తేడాలున్నా చైనా నుంచి దిగుమతులు పెరిగాయన్నది స్పష్టం.లేకపోతే కొంత మంది చెబుతున్నట్లు దిగుమతి చేసుకున్న వస్తువుల విలువను తగ్గించి లేదా పెంచి చూపుతున్నట్లు వార్తలు. దాన్ని నిర్ధారించుకోవటం కష్టమేమీ కాదు. కొన్ని వస్తువులు చైనా బదులు హాంకాంగ్‌ నుంచి వచ్చినట్లుగా మనదేశం నమోదు చేస్తే చైనా నుంచి తక్కువ మొత్తాలు కనిపించవచ్చు. మనదేశం చైనాతో పోటీ పడాల్సిన అవసరం ఉందని, కానీ నిర్లక్ష్యం చేశారని, నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత ప్రాధాన్యత ఇచ్చినట్లు విదేశాంగ మంత్రి జై శంకర్‌ సూరత్‌లో చెప్పినట్లు వార్తలు వచ్చాయి. మేకిన్‌, మేడిన్‌ ఇండియా అని పిలుపులు ఎన్ని ఇచ్చినా పారిశ్రామిక వస్తుఉత్పత్తి పెద్దగా పెరగటం లేదు.2010 నుంచి 2022వరకు ఉన్న వివరాల ప్రకారం వార్షిక సగటు జిడిపిలో పారిశ్రామిక రంగం వాటా 14.92శాతం ఉంది.స్టాటిస్టా అందించిన వివరాల ప్రకారం 2010లో 17శాతం ఉన్నది 2022నాటికి 13కు తగ్గింది. చైనాలో 2013 నుంచి 2023వరకు వార్షిక సగటు 40శాతం కాగా, 2013లో 44.2 నుంచి 2023లో 38.3శాతానికి తగ్గింది. దీన్ని బట్టి ప్రపంచ ఫ్యాక్టరీగా చైనాను వెనక్కునెట్టటం మరో పదేండ్లు పదవిలో ఉన్నా నరేంద్రమోడీ వల్లకాదని అనుభవం తేల్చింది. అందువలన జైశంకర్‌ చెబుతున్న మాటలు మోడీని మునగచెట్టు ఎక్కించటానికి మాత్రమే పనికివస్తాయి.


చైనా నుంచి వచ్చే పెట్టుబడులను నిరుత్సాహపరచాలని గతంలో తీసుకున్న నిర్నయాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కు తీసుకుంది. విద్యుత్‌ వాహనాల తయారీలో మనదేశంలో 50 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టి స్థానికంగా ఉత్పత్తి చేస్తే చైనాతో సహా ఏ కంపెనీలనైనా అనుమతిస్తామని మన అధికారులు వెల్లడించారు. అలాంటి కంపెనీలు ఉత్పత్తిని ప్రారంభించే వరకు దిగుమతి చేసుకొనే వాహనాలపై ఇప్పుడున్న 70-100శాతం పన్ను మొత్తాన్ని 15శాతానికి తగ్గిస్తున్నట్లు కూడా ప్రకటించింది. టిక్‌టాక్‌ యాప్‌తో మన సమాచారం అంతా చైనా సంగ్రహిస్తుందని నిషేధించిన పెద్దలు ఇప్పుడు చైనా పెట్టుబడితో ఫ్యాక్టరీలు పెట్టటాన్ని ఎలా అనుమతిస్తున్నట్లు ? చైనా మీద ప్రేమతో లేదా నరేంద్రమోడీ మారుమనసు పొంది కాదు. కార్పొరేట్ల వత్తిడే కారణం ! 2022-23లో మన దేశం 20.3బిలియన్‌ డాలర్ల మేరకు ఆటో విడిభాగాలను దిగుమతి చేసుకుంటే వాటిలో 30శాతం చైనా నుంచే ఉన్నాయి. రానున్నది విద్యుత్‌ వాహనాల యుగం. ప్రస్తుతం చైనా ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది. స్థానికంగా వాటిని తయారు చేసే కంపెనీలకు చైనా విడిభాగాలు అవసరం. తమ పెట్టుబడులను అడ్డుకుంటామంటే చైనా ఊరుకుంటుందా ? ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కుతుంది. విద్యుత్‌ వాహనాలకు అవసరమైన బ్యాటరీల ఉత్పత్తిలో 75శాతంతో చైనా ముందుంది.వాహనతయారీ ఖర్చులో 40శాతం బ్యాటరీలదే. ప్రస్తుతం ప్రపంచ విద్యుత్‌ వాహనాల ఉత్పత్తి, ఎగుమతుల్లో చైనా 50శాతం వాటా కలిగి ఉంది. రానున్న కొద్ది సంవత్సరాల్లో భారత రోడ్లపై తిరిగే ప్రయాణ,వాణిజ్య విద్యుత్‌ వాహనాల్లో ప్రతి మూడింటిలో ఒకటి చైనా సంస్థలు లేదా వాటితో భాగస్వామ్యం కలిగినవే ఉత్పత్తి చేయనున్నాయని ఆ రంగ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే కొన్ని కంపెనీలు ఆమేరకు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. అందువలన అనివార్యమై కేంద్ర ప్రభుత్వం చైనా పెట్టుబడులు, వాహనాలకు అనుమతి ఇచ్చింది.వాటిలో ఒకటైన బ్రిటన్‌కు చెందిన ఎంజి మోటార్స్‌ ఇండియా ఈ ఏడాది సెప్టెంబరు నుంచి ఉత్పత్తి ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. అనేక చైనా కంపెనీలు రంగ ప్రవేశం చేయనున్నాయి.దీంతో చైనా నుంచి విడిభాగాల దిగుమతులు కూడా ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతాయి.టెస్లా, విన్‌ఫాస్ట్‌ వంటి ఇతర దేశాల కంపెనీలు కూడా చైనా వాహనాలతో పోటీ పడేందుకు చూస్తున్నాయి. దీని వలన మన వినియోగదారులకు మేలు జరుగుతుందని వేరే చెప్పనవసరం లేదు.


గాల్వన్‌ ఉదంతం తరువాత 2020 జూన్‌లో కేంద్ర ప్రభుత్వం షీ ఇన్‌తో పాటు చైనాకు చెందిన 58 యాప్‌లను నిషేధించింది. వీటి ద్వారా దేశ సార్వభౌమత్వం, సమగ్రత,రక్షణ, భద్రతలకు ముప్పు తలెత్తినట్లు కారణంగా చెప్పారు. తరువాత జాబితాను 270కి పెంచారు. షీ ఇన్‌ ప్రపంచంలో అతి పెద్ద ఆన్‌లైన్‌ ఫాషన్‌ దుస్తుల విక్రయాల కంపెనీ. 2022 ఏప్రిల్‌ నాటికి 150 దేశాల్లో దాని లావాదేవీల విలువ 100బిలియన్‌ డాలర్లు. కంపెనీ ప్రధాన కార్యాలయం ఇప్పుడు సింగపూర్‌లో ఉంది కనుక గతంలో మన ప్రభుత్వం దానిపై విధించిన నిషేధం ఇప్పుడు వర్తించదని రిలయన్స్‌ దానితో ఒప్పందం చేసుకోవచ్చని, మన ప్రభుత్వం తిరిగి అనుమతించనున్నదని పత్రికలు రాశాయి. అసలు సంగతి ఏమంటే మరింతగా విస్తరించేందుకు, పన్నుల భారాన్ని తగ్గించుకొనేందుకు గాను తన ప్రధాన కార్యాలయాన్ని 2019లోనే చైనా నుంచి సింగపూర్‌కు మార్చుకుంది. 2020లో నిషేధం విధించేటపుడు అది చైనా కంపెనీ అని చూశారు తప్ప దాని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందని కాదు. ఇప్పటికీ అది చైనా కంపెనీనే కదా ! రిలయన్స్‌ దానితో ఒప్పందం చేసుకోనుంది గనుక దాని వత్తిడి మేరకు సింగపూర్‌ పేరును ముందుకు తెచ్చారు. ఇప్పుడు విద్యుత్‌ వాహనాలు,పెట్టుబడులకు గేట్లు తెరిచారు.కార్పొరేట్లు రంగంలోకి దిగితే నరేంద్రమోడీ తనమాటలను తానే దిగమింగుతారు. కాషాయమార్కు దేశభక్తి మరి !

Share this:

  • Tweet
  • More
Like Loading...

చమురు రాజకీయం : అమెరికా చంకనెక్కి రష్యాకు చేయిచ్చిన విశ్వగురువు మోడీ !

28 Thursday Mar 2024

Posted by raomk in CHINA, Current Affairs, Europe, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RUSSIA, USA, WAR

≈ Leave a comment

Tags

Anti Russia, BJP, China, crude imports from Russia, India Oil Imports, Joe Biden, Narendra Modi Failures, world oil politics


ఎం కోటేశ్వరరావు


ప్రపంచ రాజకీయాల్లో మనదేశం రష్యాను దూరం చేసుకొంటున్నదా ? పరిణామాలను చూస్తుంటే అలాగే కనిపిస్తోంది. గత రెండు సంవత్సరాలుగా రాయితీ ధరలకు, రూపాయి మారకంతో రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్న ముడి చమురు కొనుగోలును మన దేశం ఇప్పుడు దాదాపు నిలిపివేసింది. దానికి బదులు అమెరికా నుంచి భారీ మొత్తంలో అధిక ధరలకు కొనుగోలు చేసేందుకు పూనుకుంది. అంతర్జాతీయ పరిణామాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ప్రధాని నరేంద్రమోడీ విశ్వగురువుగా అగ్రరాజ్యం అమెరికాను సైతం తన కాళ్ల ముందుకు రప్పించుకోగలరు అని భక్తులు చెబుతారు.అయితే దానికి ఎక్కడా రుజువులు కానరావు. దశాబ్దాలుగా భారత్‌కు మిత్రదేశంగా, బ్రహ్మౌస్‌ ఖండాంతర క్షిపణులు, ఎకె-47రైఫిళ్ల తయారీలో భాగస్వామిగా ఉన్న రష్యాను పక్కన పెట్టి ఇప్పుడు నరేంద్రమోడీ అమెరికా ముందు చేతులెత్తేశారు. రష్యా నుంచి చౌకగా వస్తున్న ముడి చమురు బదులు ఎలాంటి రాయితీలు లేని అమెరికా సరకును దిగుమతి చేసుకొనేందుకు నిర్ణయించారు.వచ్చే నెల నుంచి రోజుకు రెండున్నరలక్షల పీపాల ముడి చమురును అమెరికా నుంచి దిగుమతి చేసుకొనేందుకు ఒప్పందాలు చేసుకున్నట్లు రాయిటర్స్‌ వార్తా సంస్థ తెలిపింది.అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు రష్యా ప్రభుత్వరంగ నౌకల కంపెనీపై విధించిన ఆంక్షల కారణంగా రష్యా పశ్చిమ ప్రాంతంలోని బాల్టిక్‌ సముద్ర రేవుల ద్వారా చమురు ఎగుమతుల రవాణా ఖర్చు పెరుగుతోంది.ఆరు నుంచి ఎనిమిది శాతం అదనంగా కానుందని అంచనా. తద్వారా రష్యాను దెబ్బతీయాలని చూస్తున్నాయి.దీంతో రష్యా ఎగుమతులకు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నది.లేదా కొనుగోలు చేసే దేశాలకు ఆ మేరకు ధర తగ్గించి విక్రయించాల్సి ఉంటుంది. అమెరికా కొత్త ఆంక్షలు, బెదిరింపుల కారణంగా మనదేశానికి బయలుదేరిన కోటి పీపాల పరిమాణం గల సరకుతో బయలుదేరిన రష్యన్‌ టాంకర్లు ఇప్పుడు చైనా, ఇతర దేశాలవైపు వెళుతున్నాయి.


ఉక్రెయిన్‌పై సైనిక చర్య అంశంలో మనదేశం తటస్థంగా ఉన్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి అనుగుణంగానే స్వతంత్ర విదేశాంగ విధానం అనుసరిస్తున్నామని కారణంగా గత రెండు సంవత్సరాలుగా రష్యాపై విధించిన ఆంక్షలను సమర్ధించటం లేదని, ఎక్కడ చౌకగా ఉంటే అక్కడ మనకు ఇష్టమైన దగ్గర చమురుకొనుగోలు చేస్తామని మన ఇంథన, విదేశాంగశాఖ మంత్రులు చెప్పారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆంక్షలు, కొత్త పరిణామాలేవీ లేవు. విదేశాంగ విధానంలో మార్పులు వచ్చినట్లు కూడా ప్రకటించలేదు. కానీ రష్యా నుంచి కొనుగోలు నిలిపివేశారు. మూడు భారీ టాంకర్లు, ఇతర నౌకల ద్వారా 76లక్షల పీపాల చమురు అమెరికా నుంచి బయలుదేరినట్లు కెప్లర్‌ సంస్థ తెలిపింది. రష్యా నుంచి చమురు కొనగూడదని రిలయన్స్‌, ఇతర కంపెనీలు నిర్ణయించాయి. ఇప్పటి వరకు రష్యా నుంచి రాయితీ ధరకు ముడి చమురు కొనుగోలు చేసి చమురు ఉత్పత్తులను ఐరోపా, అమెరికాలకు మనదేశం నుంచి ఎగుమతి చేస్తున్నారు. అమెరికా నుంచి చమురు ఎగుమతులపై 2015వరకు నిషేధం ఉండేది. అనేక దేశాలతో వాణిజ్య లోటు ఉండటం, ఎగుమతులకు అనుమతించాలని అమెరికా చమురు కంపెనీల వత్తిడి కారణంగా ఎత్తివేశారు.అచిర కాలంలోనే అమెరికా నుంచి చమురు దిగుమతి చేసుకొనే దేశాలలో భారత్‌ అగ్రస్థానానికి చేరుకుంది. ఇటీవలి వరకు అమెరికా దిగుమతి దేశంగా ఉండి ఇప్పుడు ఎగుమతి చేసేదిగా మారింది. గత ఏడాది రోజుకు 40లక్షల పీపాలను ఎగుమతి చేసింది. రాతి పొరల నుంచి చమురు (షేల్‌ అయిల్‌) తీసేందుకు భారీ మొత్తాలలో పెట్టుబడులు పెట్టిన కార్పొరేట్‌ సంస్థలు ఇప్పుడు లాభాలు పిండుకొనేందుకు చూస్తున్నాయి.రానున్న రోజుల్లో ఎగుమతులపై ఎలాంటి నిషేధం విధించబోమని 2015లో అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ఒక బిల్లును ఆమోదించాడు. ఆ ఏడాది రోజుకు కేవలం పదిలక్షల పీపాల ఎగుమతి జరగ్గా గతేడాదికి 40లక్షలకు పెరిగాయి.తన పలుకుబడితో అనేక దేశాల మీద వత్తిడి తెచ్చి చమురు ఎగుమతి చేస్తున్నది. ఉక్రెయిన్‌పై రష్యాను రెచ్చగొట్టటం వెనుక ఐరోపా, ఆసియా చమురు మార్కెట్‌లో ప్రవేశించే అమెరికా ఎత్తుగడ ఉన్నట్లు స్పష్టమైంది.అమెరికా వలలో చిక్కిన దేశాలు ఇప్పుడు ఆంక్షల పేరుతో రష్యా నుంచి కొనుగోళ్లను నిలిపివేశాయి.


ప్రపంచ రాజకీయాలనే శాసించే స్థితికి చేరామని చెప్పుకుంటున్న మనదేశం ఎంతో చిన్నదైన ఉత్తర కొరియా పాటి ధైర్యాన్ని ప్రదర్శించలేకపోతున్నది.రష్యాపై విధించిన ఆంక్షలను వ్యతిరేకిస్తున్నామని చెబుతూనే అమలు జరపటం మనదేశ ప్రతిష్టను పెంచుతుందా, తగ్గిస్తుందా ? అణుపరీక్షలను జరుపుతున్న కారణంగా ఐరాస ఉత్తర కొరియా మీద విధించిన ఆంక్షలను ధిక్కరించి రష్యా చమురు ఎగుమతి చేస్తున్నది. దానికి ప్రతిగా ఉత్తర కొరియానుంచి అవసరమైన ఆయుధాలను పొందుతున్నది. ఒపెక్‌ దేశాలతో కుదిరిన ఒప్పందం ప్రకారం జూన్‌ నాటికి రోజుకు 90లక్షల పీపాల చమురు ఉత్పత్తిని తగ్గించాలని రష్యా కోరింది.దానిలో భాగంగా తన ఉత్పత్తిలో కోత పెట్టి 4.71లక్షల పీపాల ఎగుమతులను కూడా తగ్గించనుంది. ఇదంతా అంతర్జాతీయ చమురు ధరలను తగ్గకుండా చూసేందుకు జరుగుతున్నది. ఐదు సంవత్సరాల క్రితం రష్యా రోజుకు 117లక్షల పీపాలను ఉత్పత్తి చేసేది.ప్రస్తుతం 108లక్షలకు తగ్గించింది. సరిహద్దుల్లో ఉన్న చమురు శుద్ధి కేంద్రాలపై ఉక్రెయిన్‌ దాడులు జరుపుతున్నది. దీని వలన రోజుకు ఆరులక్షల పీపాల చమురు శుద్ది సామర్ధ్యం తగ్గింది. అయితే కొద్ది వారాల్లోనే తిరిగి పూర్వపు స్థితికి చేరుకుంటుందని చెబుతున్నారు. మార్చినెల ఒకటవ తేదీ నుంచి నాటో కూటమి రష్యా ఇంథన ఎగుమతులపై మరిన్ని ఆంక్షలను అమలు జరుపుతున్నది. ఆధునిక పరిజ్ఞానం అందకుండా అమెరికా అడ్డుకుంటున్నప్పటికీ రష్యాలో స్వంత పరిజ్ఞానంతో చమురు డ్రిల్లింగ్‌ భారీఎత్తున జరుగుతున్నది.ఒకవైపు చైనా ఆర్థిక రంగం కుదేలైందని పశ్చిమ దేశాలు ప్రచారం చేస్తుండగా మరోవైపున చైనా పెట్రో సంస్థలు రికార్డు స్థాయిలో లాభాలు ఆర్జించినట్లు వార్తలు వచ్చాయి. 2022 నాటి వినియోగస్థాయికి చేరుకున్నట్లు లాభాలు 8.3శాతం పెరిగినట్లు ప్రకటించారు.చైనా, భారత్‌ రెండూ ఇంథనాన్ని దిగుమతి చేసుకునే దేశాలే.మార్చి 25వ తేదీన చైనాలో పెట్రోలు ధర 1.18 డాలర్లుండగా మనదేశంలో 1.25, పాకిస్థాన్‌లో 1.007డాలర్లు, బంగ్లాదేశ్‌లో 1.112 డాలర్లు ఉంది. అమెరికా వత్తిడి మేరకు మిత్రదేశమైన రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపివేత పర్యవసానాలు ఎలా ఉండేది అప్పుడే చెప్పలేము.

Share this:

  • Tweet
  • More
Like Loading...

వల్లించేది శాంతి ప్రవచనాలు – ఆచరణలో అశాంతి బీజాలు !

20 Wednesday Mar 2024

Posted by raomk in CHINA, Current Affairs, Europe, History, imperialism, International, INTERNATIONAL NEWS, Opinion, USA, WAR

≈ 1 Comment

Tags

#US Lies, Donald trump, Joe Biden, MIDDLE EAST, Ukraine crisis, US military-industrial complex


ఎం కోటేశ్వరరావు


ప్రపంచ శాంతికోసమే తాము తాపత్రయపడుతున్నట్లు చెప్పిన వారందరూ చరిత్రలో అశాంతికి మూలకారకులుగా రుజువైంది. ఇప్పటికీ ఆదే జరుగుతోందా ? పాలస్తీనా ప్రాంతాలను కబళించిన ఇజ్రాయెల్‌ ఇప్పుడు మొత్తం అరబ్బులనే అంతం చేసేందుకు, వారి ప్రాంతాల నుంచి వెళ్లగొట్టేందుకు జరుపుతున్న మారణకాండ మంగళవారం నాటికి 165వ రోజులో ప్రవేశించింది. గాజాలో ఇజ్రాయెల్‌ దాడుల్లో మరణించిన వారి సంఖ్య 32వేలకు చేరుకుంది.గాయపడిన వారు, నిలువ నీడ, సర్వస్వం కోల్పోయిన వారు, ధ్వంసమైన గృహాల సంఖ్య సరేసరి.మానవహక్కులు, మానవాదానికి అసలు సిసలు ప్రతినిధులుగా చెప్పుకుంటున్నవారు పడక కుర్చీలకే పరిమితమయ్యారు. గతేడాది అక్టోబరు ఏడు నుంచి జరుపుతున్న ఇజ్రాయెల్‌ దాడులతో పాటు మధ్య ప్రాచ్యంలో అమెరికా మిలిటరీ, ఆధునిక ఆయుధాల మోహరింపు కూడా పెరిగింది. ఆసియాలో పరిస్థితి ఇదైతే ఐరోపా దేశాలకు ముప్పు పేరుతో గత ఎనిమిది దశాబ్దాలుగా తిష్టవేసిన అమెరికా ఇప్పుడు ఉక్రెయిన్‌ సంక్షోభం ముసుగులో ఆ దేశాలకు ముప్పును మరింత పెంచేవిధంగా ప్రయత్నించటం శాంతిని కోరుకొనే వారికి ఆందోళన కలిగిస్తోంది. నాటి జర్మనీ రెండవ ప్రపంచ యుద్ధానికి ప్రధాన కారకురాలిగా ఉంటే ఇప్పుడు అమెరికా చర్యలు మూడవ ప్రపంచ పోరుకు దారితీసేవిగా ఉన్నట్లు అనేక మంది చెబుతున్నారు.


ఆసియా ఖండంలోని సహజ సంపదలు, రాజకీయ ఆధిపత్యం మీద కన్నేసిన అమెరికా ఒక్కో దశలో ఒక్కోకారణాన్ని సాకుగా చూపి తిష్టవేస్తోంది. మధ్య ప్రాచ్యంలో పరిణామాలు దేనికి దారితీసేదీ ఎవరూ ఊహించలేని స్థితి.బాధితులకు ఆహార సరఫరా చేస్తున్నట్లు చెబుతూనే అంతకంటే ఎక్కువగా అమెరిన్లు మిలిటరీ కేంద్రీకరణకు పూనుకున్నారు. గాజా మీద దాడులకు నిరసన లేదా ప్రతీకారంగా ప్రపంచంలో ఎంతో కీలకమైన నౌకా మార్గం ఉన్న ఎర్ర సముద్రంలో ఇజ్రాయెల్‌ వైపు ప్రయాణించే నౌకల మీద ఇరాన్‌ మద్దతు ఉన్న ఎమెన్‌లోని హౌతీ దళాలు దాడులకు దిగటం, వాటి మీద అమెరికా జరుపుతున్న దాడుల గురించి తెలిసిందే. కొద్ది గంటల్లోనే గాజాలోని హమస్‌ సాయుధులను అదుపు చేస్తామని ప్రగల్భాలు పలికిన ఇజ్రాయెల్‌ ఇప్పటి వరకు సామాన్య పౌరులు, వారిలో కూడా 70శాతం మంది పిల్లలూ, మహిళలు, వృద్ధులు, ఆసుపత్రులలో రోగులనే చంపుతున్నది. ఎంతకాలం అవసరమైతే అంతకాలం తాము మధ్య ప్రాచ్యంలోనే తిష్టవేస్తామని అమెరికా మిలిటరీ అధికారులు చెబుతున్నారు. ఇక్కడి నుంచి వెళ్లిపోవటం అంత తేలిక కాదని అమెరికా మిలిటరీ కమాండర్‌ మిగుయెజ్‌ చెప్పాడు. ఆహార సరఫరా పేరుతో ఆయుధాలను పెద్ద ఎత్తున ఎర్ర సముద్ర ప్రాంతానికి చేరవేస్తున్నారు.లెబనాన్‌లోని హిజబుల్లా, హౌతీ సాయుధులను ఎదుర్కొనేందుకు మధ్య ప్రాచ్యంలోని జలాల్లోకి ఐషెన్‌హౌవర్‌, యుఎస్‌ఎస్‌ గెరాల్డ్‌ ఫోర్డ్‌ అనే రెండు విమానవాహక యుద్ధ నౌకలను అమెరికా మోహరించింది. వాటికి అనుబంధంగా అనేక ఇతర మిలిటరీ నౌకలు ఉన్నాయి. నీటిలో, నేల మీద ఎలా అవసరమైతే అలా ప్రయాణించే యుద్ధ వాహనాలు, ఎఫ్‌-16 యుద్ధ విమానాలను పెద్ద ఎత్తున తరలించారు. గతంలో ఇరాక్‌లో మోహరించిన లక్షా 60వేలు, ఆఫ్ఘ్‌నిస్తాన్‌కు తరలించిన లక్ష మంది మిలిటరీతో పోలిస్తే ఇప్పుడు మధ్య ప్రాచ్యంలో ఉన్న తమ సేనలు తక్కువే అని అమెరికా సమర్ధించుకుంటున్నది. దీర్ఘకాలంగా మిలిటరీ స్థావరాలున్న కతార్‌, బహరెయిన్‌, యుఏయిలతో పాటు జోర్డాన్‌, ఇరాక్‌, సిరియాలలో కూడా వేలాది మంది సైనికులు ఉన్నారు.


తమ మిలిటరీ, పరికరాలను సిద్దంగా ఉంచినప్పటికీ యుద్ధం కోసం కాదని అమెరికా రక్షణశాఖ పెంటగన్‌ ప్రపంచాన్ని నమ్మించేందుకు చూస్తున్నది.అక్టోబర్‌ ఏడవ తేదీ తరువాత ఇప్పటి వరకు హౌతీ దళాలు 170 దాడులను జరిపాయి. వాటిని నిలువరించటంలో అమెరికా ఎలాంటి పురోగతినీ సాధించలేదు. దీంతో రవాణా నౌకలు ఆఫ్రికా గుడ్‌హౌప్‌ ఆగ్రం చుట్టి తిరిగి రావాల్సి వస్తోంది. దీని వలన సరకు రవాణా ఆలశ్యం కావటమే గాక ఖర్చు కూడా పెరుగుతున్నది. దీనికి పూర్తి బాధ్యత అమెరికా, ఇజ్రాయెల్‌దే అన్నది స్పష్టం. మధ్య ప్రాచ్యంలో ఎన్నో ఏండ్లుగా 30వేలకు పైగా అమెరికా దళాలు ఉన్నాయి. ఇవిగాక తాత్కాలికం, అదనపు దళాల పేరుతో మరికొన్ని వేల మందిని, ముందే చెప్పుకున్నట్లు పెద్ద సంఖ్యలో యుద్ధ నౌకలను దించారు. ఒక్క సిరియాలో తప్ప మధ్య ప్రాచ్య, పశ్చిమాసియాలోని దేశాలన్నింటా ఏదో ఒక పేరుతో అనుమతి తీసుకొనే అమెరికా తిష్టవేసింది. కొన్ని చోట్ల ఆయాదేశాల దళాలకు శిక్షణ, ఇస్లామిక్‌ తీవ్రవాదులను ఎదుర్కొనే పేరుతో ఇదంతా జరిగింది. నిజానికి ఇరాన్‌ మద్దతు ఉన్న సాయుధ బృందాలను అరికట్టేందుకే ఇదంతా అన్నది బహిరంగ రహస్యం. జోర్డాన్‌లో ఉన్న మిలిటరీ స్థావరం సరిహద్దుల్లో ఉన్న ఇరాక్‌, సిరియాలపై దాడులు చేసేందుకే ఉంది. తూర్పు సిరియాలో ఇరాన్‌ మద్దతు ఉన్న సాయుధ దళాలు ఉన్నాయి. మధ్య ప్రాచ్యంలో తిష్టవేసిన అమెరికా దళాల గురించి చూద్దాం.


ఎర్ర సముద్రంలోకి ఫిబ్రవరిలో దించిన ఐషెన్‌ హౌవర్‌ విమాన వాహక యుద్ధ నౌకతో పాటు నియంత్రిత క్షిపణిదాడుల నౌక, ప్రత్యర్ధుల క్షిపణులను అడ్డుకొనే రెండు నౌకలు, హెలికాప్టర్లు, యుద్ధ విమానాలు, ఐదువేల మంది నౌకాదళ సిబ్బంది ఉన్నారు. ఇది ఇరాన్‌కు హెచ్చరికగానే జరిగింది. అణుశక్తితో నడిచే ఓహియో తరగతి జలాంతర్గాములను కూడా సూయజ్‌ కాలువ ద్వారా సమీకరించారు. ఇవి ఎక్కడా ఎలాంటి హడావుడి చేయవు. ఒక్కొక్క జలాంతర్గామి 154 తోమహాక్‌ క్రూయిజ్‌ క్షిపణులను మోసుకుపోగలదు. మధ్యధరా సముద్రంలో ఉన్న ఫోర్డ్‌ కారియర్‌ అనే యుద్ధ నౌకను కూడా తరలించారు.దీనిలో ఒక విమానవాహక యుద్ధ నౌకతో పాటు మూడు ఖండాంతర క్షిఫణి రక్షణ నౌకలు కూడా ఉన్నాయి.ఎమెన్‌ నుంచి ప్రయోగించిన క్షిపణులను కూల్చివేసిన నౌకతో పాటు ఇతర అనేక యుద్ధ నౌకలను మధ్యధరా సముద్రం నుంచి ఎర్ర సముద్రంవైపు తరలించారు. ఇవన్నీ ఇజ్రాయెల్‌కు మద్దతుగా, దాన్ని వ్యతిరేకించే దేశాలను బెదిరించటం, అవసరమైతే దాడులకు దిగేందుకే అన్నది స్పష్టం. నౌకా దళాలు కాకుండా 45వేల మంది వివిధ దేశాల స్థావరాల్లో ఉన్నారు.వీటన్నింటిని చూసుకొనే ప్రపంచం, ఐరాస సాధారణ అసెంబ్లీ ఖండించినా, భద్రతా మండలిలో తీర్మానాలు ప్రవేశపెట్టినా, అంతర్జాతీయ కోర్టులలో కేసులు దాఖలు చేసినా ఇజ్రాయెల్‌ ఏమాత్రం ఖాతరు చేయకుండా గాజాలో మారణకాండ, పశ్చిమగట్టు ప్రాంతంలో నిరంతరం దాడులు జరుపుతున్నది. అమెరికా తీరు వివాదం విస్తరించటానికే దోహదం చేస్తున్నది.


ఆసియాలో ఇలా ఉంటే ఐరోపాలో ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని మరింత తీవ్రతరం గావించేందుకు అమెరికా పూనుకుంది.ఉక్రెయిన్‌కు 61బిలియన్‌ డాలర్ల ఆయుధ సరఫరాను అంగీకరించకపోతే ఆ దేశాన్ని,ఐరోపా, మొత్తం స్వేచ్చా ప్రపంచాన్ని ముప్పులో ఉంచినట్లేనని అధ్యక్షుడు జో బైడెన్‌ అమెరికా పార్లమెంట్‌ను బెదిరించాడు.2014కు ముందు ఉన్న ఉక్రెయిన్‌ సరిహద్దులను పునరుద్దరించేందుకు రష్యాను ఓడించాలన్న జో బైడెన్‌ కలను చూస్తుంటే గతంలో వియత్నాం, ఉత్తర కొరియా,ఆఫ్ఘనిస్తాన్‌, ఇరాక్‌ సిరియా, ఎమెన్‌ తదితర దేశాలలో మాదిరి ఓటములు గుర్తుకు వస్తున్నట్లు అనేక మంది చెబుతున్నారు. అమెరికా గనుక 2022 ఏప్రిల్‌లోనే టర్కీ ముందుకు తెచ్చిన శాంతి ప్రతిపాదనలను అంగీకరించి ఉంటే ఇంతదాకా వచ్చేది కాదని, శాంతికి బదులు అమెరికా, నాటో కూటమి పోరును మరింతగా ఎగదోసేందుకే ఒక సాధనంగా చేసుకుంటున్నారన్నది స్పష్టం. ఉక్రెయిన్‌ వ్యవహరంలో అమెరికా వినాశకర విధానాన్ని అనుసరించటానికి కారకులైన వారిలో ఒకరిగా ఆరోపిస్తూ విక్టోరియా న్యూలాండ్‌ అనే విదేశాంగశాఖ ఉప మంత్రిని పదవీ కాలం ఉండగా ముందుగానే తొలగించారు. అంతకు రెండు వారాల ముందు ఆమె ఒక సమావేశంలో మాట్లాడుతూ ఉక్రెయిన్‌ పోరు మొదటి ప్రపంచయుద్ధానికి దారితీసిన ఘర్షణ స్థాయికి దిగజారిందని, ఉక్రెయిన్‌కు ప్రతిపాదించిన 61బిలియన్‌ డాలర్ల ఆయుధ సాయానికి ఒక వేళ పార్లమెంటు ఆమోదం తెలపకపోతే బైడెన్‌ దగ్గర మరొక ప్రత్యామ్నాయం లేదని వెల్లడించారు. ఈ కారణంగానే ఆమెను తొలగించారని, లేదూ బైడెన్‌ విధానాలకు నిరసనగా ఆమే రాజీనామా చేసినట్లు కూడా కొందరు చెబుతున్నారు.
ఉక్రెయిన్‌పై రష్యా దాడులు 2022 ఫిబ్రవరి చివరి వారంలో ప్రారంభమైతే నెల రోజుల తరువాత అధ్యక్షుడు జెలెనెస్కీ మాట్లాడుతూ తమ లక్ష్యం శాంతి, సాధ్యమైనంత త్వరలో సాధారణ జీవన పునరుద్దరణ అని చెప్పాడు. కానీ అమెరికా,బ్రిటన్‌,ఫ్రెంచి నేతలు రంగంలోకి దిగి శాంతి చర్చలు కొనసాగకుండా చేశారు. అంతే కాదు పెద్ద సంఖ్యలో నాటో దళాలను ఉక్రెయిన్‌కు పంపుతున్నట్లు ఫ్రెంచి అధ్యక్షుడు మక్రాన్‌ ప్రకటించాడు.దాన్ని నమ్మిన జెలెనెస్కీ వారి మాయలో పడి శాంతి ప్రక్రియ నుంచి వైదొలిగాడు. ఇప్పటి వరకు ఆయుధాలు తప్ప దళాలను నాటో పంపలేదు. సంక్షోభం ప్రారంభమైపుడు ఉక్రెయిన్‌ జనాలకు హెల్మెట్లు, రాత్రుళ్లు పడుకొనేందుకు బ్యాగులు పంపితే సరిపోతుందని జర్మనీ చెప్పిందని, ఇప్పుడు వారే మరిన్ని క్షిపణులు, యుద్ధ టాంకులు అవసరమంటున్నారని మక్రాన్‌ చెబుతున్నాడు. ప్రతి దశలోనూ ఆరు నుంచి ఎనిమిది నెలలు వెనుబడి ఉన్నామని కూడా అన్నాడు. ఒక వేళ గనుక ఇప్పుడు నాటో దళాలు ప్రత్యక్షంగా రంగంలోకి దిగితే అది రష్యా-నాటో యుద్దంగా మారుతుందని రష్యా హెచ్చరించింది. అవసరమైతే అణ్వాయుధాలను ప్రయోగించేందుకు కూడా వెనుకాడబోమని పుతిన్‌ చెబుతున్నాడు. అయితే ఇప్పటికే కొన్ని ప్రత్యేక నాటో దళాలు ఉక్రెయిన్‌లో ఉన్నట్లు పెంటగన్‌ పత్రాలు వెల్లడించాయి. ఉక్రెయిన్‌ చేరిన వేలటన్నుల ఆయుధాలు ఎక్కడకు వెళుతున్నదీ తెలుసుకొనేందుకు కొందరు తమ మిలిటరీ అధికారులు అక్కడ ఉన్నట్లు అమెరికా జాతీయ భద్రతా మండలి ప్రతినిధి అంగీకరించాడు. ఉక్రెయిన్‌ సంక్షోభం తొలి రోజుల్లో రష్యా యుద్ధ పాటవం పెద్ద లెక్కలోది కాదని ఐరోపా, ఇతర దేశాల జనాలను నమ్మించిన నాటో కూటమి ఇప్పుడు రష్యాను ఒక బూచిగా చూపుతున్నది. సోవియట్‌ యూనియన్‌ ఉనికిలో ఉన్నపుడు ఐరోపాను ఉపయోగించుకున్న అమెరికా, తాజాగా అదే ఐరోపా దేశాలతో కలసి ఉక్రెయిన్‌న్ను పరిశోధన శాలల్లో గినియా పందుల మాదిరి, తరువాత మరోసారి అమెరికా ఐరోపాను సమిధగా వినియోగించుకోవచ్చని పరిశీలకులు చెబుతున్నారు. రష్యన్లు ఐరోపాను ఆక్రమించుకుంటారన్న ప్రచారం దానిలో భాగమే అన్నది స్పష్టం. అమెరికా గద్దె మీద ఎవరున్నా తమ కార్పొరేట్ల, రాజకీకీయ ప్రయోజనాలు, ప్రపంచాధిపత్యానికే అగ్రపీఠం వేస్తారని తెలిసిందే.

Share this:

  • Tweet
  • More
Like Loading...

దివ్యాస్త్రం అగ్ని క్షిపణి చైనా, పాకిస్థాన్లను దెబ్బతీస్తుందా ?

12 Tuesday Mar 2024

Posted by raomk in BJP, CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Science, USA, WAR

≈ 1 Comment

Tags

Ababeel Missile, Agni V, Agni-V missile test, Arms race, BJP, China, Dongfeng 41, MIRV technology, Missile Matters, Mission Divyastra, Narendra Modi, RSS


ఎం కోటేశ్వరరావు


ఒకేసారి పలు లక్ష్యాలను దెబ్బతీసే ఎంఐఆర్‌వి సాంకేతిక పరిజ్ఞానంతో అగ్నిా5 తరం క్షిపణి తొలి ప్రయోగం జయప్రదంగా జరిగినట్లు ప్రధాని నరేంద్రమోడీ 2024 మార్చి 11న ప్రకటించారు. దాన్ని దివ్యాస్త్రంగా వర్ణించారు. ఈ విజయానికి కారకులైన డిఆర్‌డిఓ శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.ఈ ప్రకటనతో మీడియా, సామాజిక మాధ్యమంలో పలు రకాల స్పందనలు వెలువడ్డాయి. ఒక్క క్షిపణితో చైనాలోని పలు లక్ష్యాలను దెబ్బతీయవచ్చు అని కాషాయ దళాలు నడిపే పత్రిక స్వరాజ్య ఒక విశ్లేషణను ప్రచురించింది. మిలిటరీ ఉన్మాదంతో ఊగిపోయే వారికి అలా కనిపించటంలో ఆశ్చర్యం లేదు. పరస్పర అనుమానాలు, కుట్ర సిద్దాంతాలు పెద్ద ఎత్తున ప్రచారంలో ఉన్న నేపధ్యంలో ఏ దేశానికి ఆ దేశం తన రక్షణకు అవసరమైన పాటవాన్ని సమకూర్చుకుంటున్నది, అది ప్రతిదేశానికి ఉన్న హక్కు. అందుకే మనదేశం అణుపరీక్షలు జరిపినా, అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం(ఎన్‌పిటి) మీద సంతకం చేయకపోయినా కమ్యూనిస్టులతో సహా అందరూ మనదేశ వైఖరిని సమర్ధించారు. సరిగ్గా ఎన్నికల ముందు పరీక్ష నిర్వహించటం, దాని గురించి ప్రధాని ప్రకటించటం, దానికి చైనా వ్యతిరేకతను నూరిపోస్తూ మీడియా స్పందించటం అర్ధం కానంత బ్రహ్మవిద్యేమీ కాదు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో సాధించిన విజయాలు తమ ఘనతే అని రాజకీయపార్టీలు చెప్పుకోవటం ఓట్ల రాజకీయమే. ప్రధాని నరేంద్రమోడీ లాగులు లేదా నిక్కర్లు వేసుకొని తిరుగుతున్న వయస్సులోనే 1958లో అంతకు ముందు విడిగా ఉన్న కొన్ని సంస్థలను కలిపి డిఆర్‌డిఓ ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి సమిష్టి కృషితో అనేక విజయాలను మన శాస్త్రవేత్తలు సాధించారు, అదే క్రమం కొనసాగుతోంది. మన జాగ్రత్తలో మనం ఉండటం సమర్ధనీయమే, బస్తీమే సవాల్‌ అని ఎదుటివారి మీద తొడగొట్టటం వేరు. రెండవది ప్రమాదకరం అని ప్రపంచ చరిత్ర చెబుతున్నది.


ఓట్ల కోసం మనోభావాలను ముందుకు తేవటం, విద్వేషాన్ని నూరిపోయటం గత పది సంవత్సరాలు, అంతకు ముందు నుంచీ చూస్తున్నదే. కొన్ని వాస్తవాలను గమనించాల్సిన అవసరం ఉంది. ఐదవతరం అగ్ని క్షిపణితో నిజంగా పాకిస్థాన్‌, చైనాలను దెబ్బతీయగలమా ! కచ్చితంగా తీయగలం, ఎప్పుడు ? వాటి దగ్గర అలాంటివి లేనపుడు, ఉన్నా సన్నద్దంగా లేనపుడు. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉందా ? ప్రతి దేశమూ పోటా పోటీగా ఆయుధాలను అభివృద్ధి చేస్తున్నాయి. మనం జరిపింది తొలి పరీక్ష మాత్రమే, ఇది ఐదువేల కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను దెబ్బతీయవచ్చునని చెబుతున్నారు. ఇలాంటి క్షిపణులను మనకంటే ఎంతో ముందుగా అమెరికా, రష్యా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, చైనా, పాకిస్థాన్‌ సమకూర్చుకున్నాయి. మన క్షిపణి ఒకేసారి ఎన్ని బాంబులను మోసుకుపోగలదో తెలియదు, నాలుగు అంటున్నారు. మిగతా దేశాల(రష్యా శాటన్‌-2) దగ్గర 16 బాంబులు(అదే సంఖ్యలో లక్ష్యాలు) మోసుకుపోగలవి ఉన్నట్లు మీడియాలో వెతికితే వివరాలు ఉన్నాయి.మనం తొలిపరీక్ష ఇప్పుడు చేస్తే చైనా 2016నాటికే ఏడు పరీక్షలు జరిపింది, తరువాత కూడా చేస్తున్నది. చైనా వద్ద ఆధునిక డిఎఫ్‌-41క్షిపణి 12 నుంచి 15వేల కిలోమీటర్లు అంటే అమెరికాలో ఉన్న లక్ష్యాలను కూడా తాకగలదు.మనం గనుక ఎదురుదాడికి దిగి క్షిపణిని వదిలితే ఎవరూ పసిగట్టలేరని చెబుతున్నారు. ఇదే సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ఏ దేశం ఎదురుదాడికి దిగినా అదే జరుగుతుంది. మనకు ఇతరులెంత దూరమో వారికి మనమూ అంతేదూరంలో ఉంటాం. దక్షిణాసియాలో తొలిసారిగా ఎంఐఆర్‌వి సాంకేతిక పరిజ్ఞానంతో పాకిస్థాన్‌ అబాబీల్‌ క్షిపణిని రూపొందించిందని గమనంలో ఉంచుకోవాలి. దాని పరిధి 2,200కిలోమీటర్లని వార్తలు. ఒకసారి పరీక్షలు మొదలైన తరువాత విస్తరించటం పెద్ద కష్టమేమీ కాదు. మీడియాలో వచ్చినట్లుగా మనమే ఎదురుదాడికి దిగితే మనకంటే బలంగా ఉన్న చైనా ఊరుకుంటుందా ? ఇప్పటికే అది భూమి,మోటారు వాహనాలు, రైళ్ల మీద నుంచి ప్రయోగించే ఎంఐఆర్‌వి క్షిపణులను కలిగి ఉంది.2019లోనే అలాంటి వాటిని మిలిటరీకి అందచేసింది. మనం పరీక్షించిన తాజా క్షిపణిని మిలిటరీకి అందించాలంటే మరికొన్ని సంవత్సరాలు పడుతుంది.


గ్లోబల్‌ ఫైర్‌ పవర్‌ అనే సంస్థ ప్రతిదేశానికి సంబంధించి 60అంశాలను పరిగణనలోకి తీసుకొని 145 దేశాలకు 2024 సంవత్సర సూచికలను ఇచ్చింది.దాని ప్రకారం 0.0000 పాయింట్లు వస్తే ఆ దేశం పక్కాగా ఉన్నట్లు. ఈ ప్రాతిపదికన మొదటి స్థానంలో ఉన్న అమెరికాకు 0.0699, రెండవదిగా ఉన్న రష్యాకు 0.0702, మూడవది చైనాకు 0.0706 రాగా నాలుగవ స్థానంలో ఉన్న మనదేశానికి 0.1023 మార్కులు వచ్చాయి. అంటే చైనా కంటే ఎంతో దిగువన ఉంది. తొలి పది స్థానాల్లో మన తరువాత దక్షిణ కొరియా, బ్రిటన్‌,జపాన్‌, టర్కీ, పాకిస్థాన్‌, ఇటలీ ఉన్నాయి. ఒక వేళ యుద్దమే వస్తే ఇప్పుడున్న ప్రపంచ రాజకీయాలు, సమీకరణల్లో చైనా, పాకిస్థాన్‌ ఒక్కటయ్యే అవకాశం, రష్యా పరోక్షంగా చైనాకు సహరించే పరిస్థితి ఉందని యుద్దం గురించి రంకెలు వేసేవారు గమనించాలి. మన దేశానికి వ్యతిరేకంగా దశాబ్దాల పాటు పాకిస్థాన్ను అమెరికా ప్రోత్సహించిన కారణంగానే అది ప్రపంచ మిలిటరీలో తొమ్మిదవ స్థానంలో ఉంది. ఆర్థికంగా ఎంత ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ మిలిటరీ ఖర్చుకు వెనకాడటం లేదు. దాని ఆర్థిక స్థితి దిగజారటానికి ఇది కూడా ఒక కారణం.చైనా జిడిపి, దాని విదేశీమారక ద్రవ్యనిల్వల వంటి అంశాలు మిలిటరీకి పెద్ద ఎత్తున ఖర్చు పెట్టేందుకు వీలు కల్పిస్తున్నది, మనమాపరిస్థితిలో ఉన్నామా ? మనకు వచ్చే ముప్పు గురించి స్వంత నిఘా, సమాచారాన్ని బట్టి వ్యవహరించాల్సి ఉంటుంది. అమెరికా చెప్పేదాన్ని నమ్ముకుంటే నట్టేటమునుగుతాం. గాల్వన్‌ ఉదంతాల తరువాత చైనా దళాల కదలికల గురించి అమెరికా చెప్పిన మాటలను నమ్మి ముందుగానే మన మిలిటరీ లడక్‌ పర్వతాల మీదకు వెళ్లి కూర్చున్నది.తరువాతే చైనా దళాలను మోహరించినట్లు వెల్లడైంది. ఇప్పుడు మనం కొండలనుంచి దిగిరాలేని స్థితి, ఖర్చు విపరీతంగా అవుతున్నది.చైనా వైపునుంచి కొత్తగా దురాక్రమణ యత్నాలు ఉన్నట్లు మన ప్రభుత్వం ఇంతవరకు చెప్పలేదు.అరుణాచల్‌ సరిహద్దులో చైనా కొత్తగా గ్రామాలను కడుతున్నట్లు కూడా కొన్ని బొమ్మలను చూపి అమెరికా మనలను తప్పుదారి పట్టించేందుకు చూసిన సంగతి తెలిసిందే. ఆధునిక ఆయుధాలు, నిధులతో ఉక్రెయిన్‌లో రష్యా సేనలను ఒక్కదెబ్బతో వెనక్కు కొట్టగలమని అమెరికన్లు ఇతర నాటో దేశాలను నమ్మించారు. రెండు సంవత్సరాలు గడిచినా అలాంటి పరిస్థితి కనిపించటం లేదు. మధ్యలో ఇరుక్కున్న ఉక్రెయిన్‌ చావుదెబ్బలు తింటున్నది.


అంతరిక్షంలో అమెరికా మిలిటరీ ఆధిపత్యాన్నే సవాలు చేసే స్థితికి చైనా చేరుకుందనే అంశం మనదేశంలో యుద్ధం గురించి కలలు కనేవారికి తెలుసా? ఇటీవలి కాలంలో ఈ రంగంలో అమెరికాకు దగ్గరగా చైనా వచ్చిందని, అమెరికా నిశ్చింతగా లైటార్పి పడుకున్నట్లుగా కనిపిస్తోందని ఆ రంగంలో నిపుణుడు డీన్‌ చెంగ్‌ చెప్పినట్లు 2023 డిసెంబరు 13న అమెరికా ఎన్‌బిసి న్యూస్‌ పేర్కొన్నది. ప్రపంచమంతటా అంతరిక్ష ఉపగ్రహాల ద్వారా మిలిటరీ నియంత్రణలో అమెరికా ముందున్నది.వాటిని దెబ్బతీసే, పనికిరాకుండా చేసే, ఆయుధాలను చైనా తయారు చేస్తున్నదని అమెరికా రక్షణశాఖ పెంటగన్‌ నివేదికలు గగ్గోలు పెడుతున్నాయి. చైనా 2019-21 సంవత్సరాలలో తన ఉపగ్రహాల సంఖ్యను 250 నుంచి 499కి పెంచుకుందని రక్షణ నిఘా సంస్థలు పేర్కొన్నాయి. ఆధునిక నిఘా బెలూన్లు,హైపర్‌సోనిక్‌ క్షిపణులను ఉపగ్రహాలకు దిగువన, విమానాలు ఎగిరే ఎత్తుకు ఎగువన చైనా మోహరించింది. ఇటీవల ఉపగ్రహాలకు తిరిగి ఇంథనాన్ని నింపే ప్రయోగాన్ని కూడా విజయవంతంగా నిర్వహించింది.భూమి లేదా గగనతలం నుంచి క్షిపణులను, లేజర్లను ప్రయోగించి అంతరిక్షంలోని శత్రు ఉపగ్రహాలను ధ్వంసం చేసే పరిశోధనలు కూడా చేస్తున్నదని అమెరికా నిపుణులు హెచ్చరిస్తున్నారు.ధ్వనికంటే కనీసం 20రెట్ల వేగంతో ప్రయాణించే క్షిపణులు భూమిని చుట్టివచ్చి లక్ష్యాలను దెబ్బతీసేవాటిని చైనా పరీక్షిస్తున్నదని కూడా అమెరికా భయపడుతోంది. అందువలన మన అగ్ని క్షిపణితో చైనాను దెబ్బతీయగలమని ఎవరైనా కలగన్నా, చెప్పినా అది వాస్తవ విరుద్దం తప్ప మరొకటి కాదు. భూతలం నుంచి ప్రయోగించే ఖండాంతర క్షిపణుల అంశంలో రెండు దేశాల మధ్య ఉన్న తీవ్ర అంతరం కొంత మేర తగ్గుతుంది.నౌకా దళ బలాబలాల్లో మన దేశం ఎంతో వెనుకబడి ఉంది. జలాంతర్గాములు చైనా వద్ద 61 ఉండగా మనకు 18 మాత్రమే ఉన్నాయి.


ప్రతి దేశమూ తన మిలిటరీ పాటవాన్ని పెంచుకొనేందుకే చూస్తున్నది. ఈ విషయంలో పాకిస్థాన్‌ కూడా వెనుకబడిలేదు.మనకంటే ముందే 2023 అక్టోబరు చివరిలో ఎంఐఆర్‌వి సాంకేతిక పరిజ్ఞానంతో అబాబీల్‌ అనే క్షిపణి ప్రయోగం జరిపినట్లు డిప్లోమాట్‌ పత్రిక నవంబరు 18న ఒక విశ్లేషణ వెలువరించింది.మనదేశం బాలిస్టిక్‌ క్షిపణి రక్షణ వ్యవస్థ(బిఎండి)ను ఏర్పాటు చేస్తున్నందున దానికి విరుగుడుగా ఎంఐఆర్‌వి క్షిపణులను పాకిస్థాన్‌ రూపొందించినట్లు దానిలో పేర్కొన్నారు. రాజస్థాన్‌లోని ఉదయపూర్‌ సమీపంలో నిర్మిస్తున్న బిఎండి రాడార్‌ కేంద్రం 2024లో అందుబాటులోకి వస్తుందని, మరో కేంద్రాన్ని మధ్య ప్రదేశ్‌లో నిర్మిస్తున్నట్లు కూడా డిప్లొమాట్‌ రాసింది. నౌకల మీద కూడా ఇలాంటి రాడార్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. ఐఎన్‌ఎస్‌ అన్వేష్‌ అలాంటి నౌకే. ఇవి రెండు నుంచి ఐదువేల కిలోమీటర్ల పరిధిలో క్షిపణులను పసిగట్టి మధ్యలోనే కూల్చివేస్తాయి. తొలిదశలో న్యూఢిల్లీ, ముంబై నగరాలకు రక్షణ కల్పిస్తారు.


మార్చి 11-16 తేదీల మధ్య ఎప్పుడైనా తాము మూడున్నర వేల కిలోమీటర్ల పరిధిలో క్షిపణి ప్రయోగం జరపవచ్చని ఆ పరిధిలోకి వచ్చేవారు తగు జాగ్రత్తలు పాటించాలని మన రక్షణశాఖ ముందస్తు హెచ్చరికలు జారీచేయటం తెలిసిందే. ఆ సంగతి తెలిసే అగ్ని – 5 క్షిపణి ప్రయోగాన్ని చూసి భయపడిన చైనా తన గూఢచారి నౌకను విశాఖపట్టణానికి 260 నాటికల్‌ మైళ్ల దూరంలో లంగరు వేసినట్లు ఒక పత్రిక రాసింది.చైనా తాను జరుపుతున్న ప్రయోగాల గురించి కూడా ముందుగానే ప్రకటిస్తుంది. మనం కూడా చైనా సమీపంలోని అంతర్జాతీయ జలాల్లోకి నౌకలను పంపి నిఘావేయవచ్చు. ఎంఐఆర్‌వి సాంకేతిక పరిజ్ఞానాన్ని సంపాదించుకొనేందుకు 2012 నుంచి మన శాస్త్రవేత్తలు పని చేస్తున్నది, మన అగ్ని క్షిపణుల సామర్ధ్యం బహిరంగ రహస్యం.గతంలో ఒక చైనా నౌక శ్రీలంకకు వచ్చినపుడు,ప్రస్తుతం మాల్దీవుల సమీపంలో ఉన్న మరొక నౌక గురించి కూడా ఇలాగే రాశారు. ఇతరుల బలాబలాలను తెలుసుకొనేందుకు మనదేశం ఎలా ప్రయత్నిస్తుందో ప్రతిదేశమూ అదే చేస్తుందన్నది కూడా అందరికీ తెలిసిందే.మనకే అలాంటి హక్కు ఉండాలి, ఇతరులకు కూడదు అంటే కుదురుతుందా ! అమెరికా విమానవాహక యుద్ధ నౌకలు, ఇతర మిలిటరీ నౌకలు నిత్యం ప్రపంచమంతటా తిరుగుతుంటాయి, అనేక ప్రాంతాల్లో లంగరు వేయటం తెలిసిందే. అవి విహారయాత్రలు చేస్తున్నట్లు చెప్పగలమా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

పదేండ్ల మోడీ రామరాజ్య పాలన : మహిళలకు ఉపాధి, శాంతి, భద్రతలూ కరవే !

08 Friday Mar 2024

Posted by raomk in Africa, BJP, CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Women, Women

≈ Leave a comment

Tags

BJP, Modi Rama Rajya, Narendra Modi Failures, RSS, Women in India, women labour force


ఎం కోటేశ్వరరావు


పదేండ్ల నరేంద్రమోడీ పాలన, వెనక్కు తిరిగి చూసుకుంటే జనాభాలో సగభాగమైన మహిళల స్థితి ఏమిటి ? వచ్చే ఎన్నికల్లో ఓట్ల మోడీ గ్యారంటీల పేరుతో ఊదరగొడుతున్నారు. తమ మోడీని ప్రపంచనేతగా గుర్తించారని కీర్తిస్తున్నారు బిజెపి అభిమానులు.ఎవరు గుర్తించారో, ప్రాతిపదిక ఏమిటో ఎవరూ చెప్పలేరు. ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత. తమకు అవసరమైనపుడు వెంపల చెట్లకు నిచ్చెన వేసి ఎక్కేవారిని కూడా ఆజానుబాహుడని పొగడేవారికి ప్రపంచంలో కొరత లేదు. మహిళలకు శాంతి, రక్షణ సూచికలో మనమెక్కడున్నామో తెలుసా ? మన మిత్ర లేదా సహజ భాగస్వామ్య దేశంగా మోడీ అండ్‌ కో చెప్పుకుంటున్న అమెరికాలోని జార్జిటౌన్‌ సంస్థ రూపొందించిన 2023 విశ్లేషణ ప్రకారం 177దేశాలలో 128వ స్థానంలో ఉన్నాం.మోడీ గొప్పదనం గురించి చెప్పుకొనేందుకు ఆయన భక్తులు నిత్యం వల్లించే పాకిస్థాన్‌ 158 స్థానంలో ఉండటం ఎంతో ”ఊరట” కలిగిస్తుందని వేరే చెప్పనవసరం లేదు. బేటీ పడావో, బేటీ బచావో నినాదంతో పాటు అచ్చేదిన్‌ వాగ్దానం చేసిన మోడీ ఏలుబడిలో తొమ్మిది సంవత్సరాల తరువాత పరిస్థితి ఇది. పోనీ మెరుగుపడే ఆశ ఉందా ? 2017 నివేదిక ప్రకారం మన దేశం 131వ స్థానంలో ఉన్నది కాస్తా 128కి ఎగబాకింది.ఇదేమీ పెద్ద మెరుగుదలా, పెరుగుదలా కాదు. పాయింట్ల పరంగా చూస్తే 0.580 నుంచి 0.595కు(15) చేరినప్పటికీ రాంకులో పెద్దగా మెరుగుదల లేదంటే దాని అర్ధం మిగతా దేశాల్లో పరిస్థితి బాగా మెరుగుపడినట్లు. ఉదాహరణకు పాకిస్థాన్నే తీసుకుందాం. ఇదే కాలంలో దాని పాయింట్లు 0.441 నుంచి 481కి(40) పెరిగినప్పటికీ రాంకు 150 నుంచి 158కి దిగజారింది. పాయింట్ల వారీ చూస్తే మన కంటే పాకిస్థాన్‌లో మెరుగుదల చాలా ఎక్కువగా ఉంది. మరో పొరుగుదేశమైన చైనా రాంకు ఈ కాలంలో 87నుంచి 82కు పెరిగింది. పాయింట్ల వారీ చూస్తే 0.671 నుంచి 0.7కు(29) చేరింది. ఇరుగుదేశమైన బంగ్లాదేశ్‌ 127 నుంచి 131కు దిగజారింది, అయినా అక్కడ పాయింట్ల వారీ చూస్తే 0.585 నుంచి 0.593కు పెరిగింది. స్త్రీ-పురుష తేడా 2023 సూచికలో మనదేశం ప్రపంచ ఆర్థిక వేదిక నివేదిక ప్రకారం 146దేశాల్లో 127వదిగా ఉంది. మోడీ అధికారానికి వచ్చిన 2014లో అది 142 దేశాల్లో 114వ స్థానంలో ఉంది. ఈ సంస్థ వెల్లడించిన సమాచారం ప్రకారం 2022లో 135వదిగా ఉంది. ఒక్క ఏడాదిలో ఎనిమిది స్థానాలు ఎలా పెరిగిందన్నది ఆలోచించాల్సిన అంశం. ఒక వేళదాన్నే ప్రామాణికంగా తీసుకుంటే 114 నుంచి 135కు ఎందుకు దిగజారినట్లు ? ఏ రీత్యా చూసినా గడచిన పదేండ్లలో మొత్తం మీద ఈ అంతరం తగ్గకపోగా పెరిగిందని స్పష్టంగా కనిపిస్తోంది. లింగ అసమానతలో 2021 సూచిక ప్రకారం చైనా 48, శ్రీలంక 92, నేపాల్‌ 113, మనదేశం 122, బంగ్లాదేశ్‌ 131, పాకిస్థాన్‌ 149 స్థానాల్లో ఉన్నాయి.మహిళలకు అత్యంత ప్రమాదకరమైన దేశాల సూచికలో ఆఫ్‌ఘనిస్తాన్‌ 1, పాకిస్థాన్‌ 4, భారత్‌ 9, బంగ్లాదేశ్‌ 17, చైనా 23, శ్రీలంక 65 స్థానాలలో ఉన్నాయి. మనదేశం గురించి ఇలాంటి సూచికలన్నీ ప్రపంచ మంతటా అందరికీ తెలిసినప్పటికీ నరేంద్రమోడీని ప్రపంచ నేతగా గుర్తించిందని బిజెపి నేతలు ప్రచారం చేయటం విడ్డూరం కాదా !


అంబానీ కుటుంబంలో పెండ్లి వేడుకకు తన స్నేహితురాలితో కలసి వచ్చిన బిల్‌గేట్స్‌ దేశంలో జరిగిన అభివృద్ధి తనను ఎంతగానో ముగ్దుడిని చేసిందని పేర్కొన్నారు. ఇలాంటి ప్రశంసలను చూసి మోడీ భక్తులు ఊగి తూగుతారని వేరే చెప్పనవసరం లేదు. ఇంట్లో ఈగల మోత బిల్‌గేట్స్‌కు ఎలా తెలుస్తుంది. పదేండ్ల పాలన గురించి ప్రసార మాధ్యమాల్లో మోడీ గ్యారంటీల గురించి ఎంత ఊదరగొట్టినా పరిస్థితుల్లో పెద్ద మార్పులేదు, దిగజారుడే కనిపిస్తోంది.మహిళల శాంతి, భద్రతల గురించి తాజా సూచికల గురించి అంతర్జాతీయ మీడియాలో పేర్కొన్న అంశాలు నరేంద్రమోడీ పరువును మరింత పోగొట్టేవిగా ఉన్నాయి తప్ప మరొకటి కాదు. స్టాటిస్టా అనే సంస్థ సమీక్ష జార్ఖండ్‌లో స్పానిష్‌-బ్రెజిలియన్‌ పర్యాటకరాలి మీద ఆమె భర్త ముందే ఎనిమిది మంది చేసిన అత్యాచార ఉదంతంతో ప్రారంభమైంది.ఇది అంతర్జాతీయంగా సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే.ప్రపంచంలో మహిళలకు రక్షణ లేని దేశాల సరసన చేర్చి మన గురించి చర్చించుకుంటున్నారు. దేశంలో రోజుకు 86 అత్యాచారాలు జరుగుతున్నట్లు 2022లో నమోదైంది. దేశంలో మహిళలపై జరుగుతున్న దాడులు, వేధింపులు పెరుగుతున్నట్లు నమోదైన నివేదికలు వెల్లడిస్తున్నాయి. అసలు పోలీసుల వరకు రాని కేసులు ఎన్నో. ప్రధాని మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న, ఒక యోగి పాలనలోని ఉత్తర ప్రదేశ్‌ 2022లో ప్రధమ స్థానంలో ఉంది.


ప్రపంచం మొత్తం మీద చూసినపుడు స్త్రీల కంటే పురుషుల సంఖ్య ఎక్కువ. అయితే ఇదే స్థితి అన్ని చోట్లా లేదు. కొన్ని దేశాల్లో పురుషులు, కొన్ని చోట్ల మహిళలు ఎక్కువగా ఉన్నారు.అయితే ఈ పరిస్థితి శాశ్వతంగా ఒకే విధంగా ఉండదు. తూర్పు ఐరోపా కొన్ని దేశాల్లో గతంలో రెండవ ప్రపంచ యుద్ధ కారణంగా, ప్రస్తుతం పురుషుల వలసలు, జీవిత కాలం ఎక్కువగా ఉన్నందున మహిళల సంఖ్య ఎక్కువగా ఉంది.మధ్య ప్రాచ్య దేశాల్లో కార్మికులుగా పురుషులు ఇతర దేశాల నుంచి పెద్ద ఎత్తున వచ్చిన కారణంగా అక్కడ మహిళల శాతం తక్కువగా ఉంది. వర్తమాన పార్లమెంటులో చివరి బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌ బ్రహ్మాండమైన నారీశక్తి (మహిళా సాధికారత) అవుతుందని చెప్పారు.నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ” మహిళా సాధికారత పండగ ” అని కూడా వర్ణించారు.నూతన పార్లమెంటు భవనంలో జరిగిన తొలి సమావేశంలో నారీశక్తి అభియాన్‌కు ఆమోదాన్ని చూశారని, జనవరి 26న కర్తవ్యపథ్‌లో మహిళాశక్తిని చూశారని అన్నారు. గతంలో బేటీ బచావో, బేటీ పఢావో అని పిలుపు ఇచ్చారు.దాని ఫలితం ఏమిటో పైన చూశాము. ఇండియా టుడే వెబ్‌సైట్‌ 2023 జూన్‌ పదకొండున రోషిణీ చక్రవర్తి రాసిన విశ్లేషణకు ” భారత్‌లో తగ్గుతున్న మహిళా శ్రామికులు, ఎందుకు మహిళలు పని చేయటం లేదు ” అనే శీర్షిక పెట్టింది. భారత్‌లో వేతనాలు చెల్లించే ఉపాధిలో మహిళలు ఇరవైశాతానికి లోపుగానే ఉన్నట్లు ప్రపంచ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) నివేదికను దానిలో ఉటంకించారు. ఐఎల్‌ఓ నివేదిక ప్రకారం ఉపాధిలో కేవలం 19.2శాతం మంది మాత్రమే మహిళలు ఉండగా పురుషుల్లో 70.1శాతం ఉన్నారు. ప్రపంచ ఆర్థిక వేదిక లింగ అసమానతల నివేదిక 2022 ప్రకారం 146 దేశాల జాబితాలో 135వ స్థానంలో భారత్‌ ఉంది.ప్రపంచ శ్రామిక శక్తిలో లింగ సమానత్వం రావాలంటే 132 సంవత్సరాలు పడుతుందని ఆ నివేదిక పేర్కొన్నది. అట్టడుగున్న ఉన్న మన దేశానికి ఇంకా ఎక్కువ వ్యవధి పడుతుందని వేరే చెప్పనవసరం లేదు. 2005లో 32శాతంగా ఉన్న మహిళా శ్రామిక శక్తి 2021నాటికి 19.2శాతానికి తగ్గింది.


అధికారిక సమాచారాన్ని విశ్లేషించినపుడు 2004లో గరిష్టంగా 35శాతం మంది మహిళలు ఉపాధి పొందగా 2022 నాటికి అది 25శాతానికి తగ్గినట్లు అజీమ్‌ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయానికి చెందిన ఆర్థికవేత్త రోజా అబ్రహాం చెప్పారు. సిఎంఐయి ఉపాధి నిర్వచనం ప్రకారం 2022లో పని చేసే వయస్సులో ఉన్నవారిలో కేవలం పదిశాతం మంది మాత్రమే అంటే 3.9 కోట్ల మంది మాత్రమే పని చేస్తూ ఉండటం లేదా పని కోసం ఎదురు చూస్తున్నవారున్నారని , అదే పురుషుల విషయానికి వస్తే 36.1కోట్ల మంది ఉన్నట్లు పేర్కొన్నది. పని చేయగలిగిన వయస్సు వారి పెరుగుదలకు అనుగుణంగా ఉపాధి పెరగటం లేదని, గత దశాబ్దిలో మంచి ఉద్యోగాలు గణనీయంగా తగ్గినట్లు, తక్కువ వేతనాలతో పని చేయటం కంటే ఇంటి దగ్గర ఉండి ఇల్లు, పిల్లలను చూసుకోవటం మరింత లాభదాయకమని వారి కుటుంబాలు భావిస్తున్నారని సిఎంఐఇ డైరెక్టర్‌ మహేష్‌ వ్యాస్‌ చెప్పారు. శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యం పదిశాతం పెరిగితే జిడిపి 552 బిలియన్‌ డాలర్ల మేరకు అదనంగా పెరుగుతుందని 2018లో మెకెన్సీ నివేదిక పేర్కొన్నది. క్వాల్‌ట్రిక్స్‌ డాట్‌కామ్‌ సమాచారం ప్రకారం 2022లో ప్రపంచంలోని 180దేశాలలో శ్రామిక శక్తిలో 52.7శాతం మహిళలతో ఆర్మేనియా మొదటి స్థానంలో ఉంది.ప్రపంచ సగటు 39.49శాతం.మన దేశం 23.54శాతంతో 166వ స్థానంలో ఉంది.మనకంటే ఎగువన 147లో నేపాల్‌, 153, 156 స్థానాలలో శ్రీలంక, బంగ్లాదేశ్‌, దిగువున 168వ స్థానంలో పాకిస్తాన్‌ ఉంది. మనతో జనాభాలో పోటీ పడుతున్న చైనా 45.17శాతంతో 89వ దేశంగా ఉంది. పరిస్థితి ఇంతదారుణంగా ఉంటే ఏం చేశారని ఓట్లు అడుగుతున్నట్లు ? కేంద్రంలో, మెజారిటీ రాష్ట్రాల్లో బిజెపి లేదా దానితో జతకట్టిన వారి ప్రభుత్వాలే ఉన్నాయి గనుక అతివల స్థితి అధ్వానంగా ఉండటానికి కారకులు ఎవరంటే మోడీని చూసి ఓటువేయాలని బిజెపి చెబుతున్నందున మోడీనే అని చెప్పాల్సి వస్తోంది. కాదంటారా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • చైనాతో వాణిజ్యంపై ఆందోళన – నిజా నిజాలేమిటి !
  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!

Recent Comments

pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • చైనాతో వాణిజ్యంపై ఆందోళన – నిజా నిజాలేమిటి !
  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!

Recent Comments

pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • చైనాతో వాణిజ్యంపై ఆందోళన – నిజా నిజాలేమిటి !
  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!

Recent Comments

pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 246 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d