• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Europe

అబూదాబీలో అద్భుతం జరగనుందా ?

28 Wednesday Feb 2024

Posted by raomk in BJP, CHINA, Congress, COUNTRIES, Current Affairs, Economics, Europe, Farmers, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, USA

≈ Leave a comment

Tags

#Farmers matter, Agri subsidies, China, Narendra Modi Failures, US trade protectionism, WTO MC13, WTO reform, WTO-Agriculture


ఎం కోటేశ్వరరావు


అబూదాబీలో ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటిఓ) సభ్య దేశాల మంత్రుల పదమూడవ సమావేశం(ఎంసి13) ఫిబ్రవరి 26-29 తేదీలలో జరుగుతున్నది. ఈ సమావేశాలలో ప్రతిదేశం తన అజెండాను ముందు పెట్టి దానికి మద్దతు కూడగడుతున్నది. రాజధాని ఢిల్లీలో సమావేశమయ్యేందుకు బయలు దేరిన రైతులను ఒక వైపు పంజాబ్‌-హర్యానా సరిహద్దుల్లో ఢిల్లీకి రెండువందల కిలోమీటర్ల దూరంలో ఫిబ్రవరి 13 నుంచి హర్యానా బిజెపి ప్రభుత్వం నిలువరించింది. ఆటంకాలను అధిగమించి ముందుకు వస్తే అడ్డుకునేందుకు రోడ్ల మీద కందకాలు, శత్రుదేశం దండెత్తి వచ్చినపుడు ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన మాదిరి అన్ని చర్యలతో ఢిల్లీలో నరేంద్రమోడీ ప్రభుత్వ పోలీసులు కాచుకొని ఉన్నారు.ఐరోపాలో అనేక దేశాల్లో రైతులు తమ సమస్యల మీద ఉద్యమిస్తున్నారు. డబ్ల్యుటిఓ నిబంధనలు రైతాంగానికి నష్టదాయకంగా ఉన్నందున దాన్నుంచి తప్పుకోవాలని దేశమంతటా రైతులు వివిధ రూపాల్లో డిమాండ్‌ చేశారు.ఈ పూర్వరంగంలో అబుదాబీలో ఏం జరగనుందనేది ఆసక్తికరంగా మారనుంది.గతంలో మాదిరి మన ప్రభుత్వం లొంగిపోతుందా ? దేశ పౌరుల ప్రయోజనాలను కాపాడుతుందా ?


ప్రపంచ వాణిజ్య సంస్థ పేరులోనే కార్పొరేట్ల వాణిజ్య ప్రయోజనాలను కాపాడేందుకు ఏర్పడిందన్న భావం ధ్వనిస్తున్నది. ప్రతిదీ లాభనష్టాల లెక్కలు తప్ప వాటికి మరొకటి పట్టదు.అక్కడ కూడా పేద-ధనిక దేశాల పెనుగులాటే జరుగుతున్నది. తమకు అనుకూలంగా ఉంటే డబ్ల్యుటిఓ నిబంధనలను అమలు జరపాలని ధనిక దేశాలు పట్టుబడతాయి. లేదనపుడు దాన్ని పక్కన పెట్టి విడివిడిగా దేశాలతో ఒప్పందాలు చేసుకుంటున్నాయి. మొత్తంగా చూసినపుడు ధనిక దేశాలకు అనుకూలంగానే ఆ సంస్థ నిబంధనలు ఉన్నాయి. వాటిని సంస్కరించాలని పేద దేశాలు పట్టుబడుతుండగా మరింతగా తమకు అనుకూలంగా మలచుకోవాలని ధనిక దేశాలు చూస్తున్నాయి. అందుకే అనేక అంశాల మీద దశాబ్దాల తరబడి ఒప్పందాలు కుదరక ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. కతార్‌లోని దోహాలో 2001లో ప్రపంచ వాణిజ్య చర్చలు ప్రారంభమయ్యాయి. అందుకే వీటిని దోహా దఫా చర్చలు అని పిలుస్తున్నారు. అప్పటి నుంచి ఇప్పుడు అబూదాబీ వరకు పదమూడు సార్లు మంత్రులు చర్చలు జరిపారు. వ్యవసాయ సబ్సిడీలకు సంబంధించి 2008లో ఏర్పడిన ప్రతిష్ఠంభన ఇప్పటికీ కొనసాగుతోంది. ముగింపు పలకాలని 2015లో అమెరికా కోరింది. చర్చలకు కాలం చెల్లిందని, దోహా దఫా ముగిసినట్లేనని 2017లో అనేక మంది విశ్లేషకులు వ్యాఖ్యానించారు. అయితే నైరోబీలో 2015లో జరిగిన మంత్రుల పదవ సమావేశంలో సంప్రదింపులు కొనసాగించాలని సభ్యులందరూ చెప్పినందున కొనసాగుతాయని డబ్ల్యుటిఓ ప్రకటించింది. తరువాత కూడా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది.


ప్రపంచ వాణిజ్య సంస్థ రూపొందించిన నిబంధనల ప్రకారం అభివృద్ధి చెందిన దేశాలు తమ వ్యవసాయ ఉత్పత్తుల మొత్తం విలువలో ఐదు, వర్ధమాన దేశాలు పదిశాతం వరకు సబ్సిడీలు ఇవ్వవచ్చు.భారత్‌, చైనా వంటి దేశాలు అంతకు మించి ఎక్కువే ఇస్తున్నాయని, భారత్‌ 60-70శాతానికి సమంగా ఇస్తున్నట్లు ఆరోపించిన అమెరికా ఆ మేరకు డబ్ల్యుటిఓకు ఫిర్యాదు చేసింది. అదే విధంగా ప్రభుత్వం ఆహార ధాన్యాలను నిల్వచేయటాన్ని దానికోసం ఎఫ్‌సిఐ నిర్వహణ, ప్రజాపంపిణీ వ్యవస్థలను కూడా వ్యతిరేకిస్తున్నాయి.ఈ కారణంగానే అమెరికా, తదితర ధనిక దేశాలను సంతుష్టీకరించేందుకు వీటికి ఎసరు పెట్టే ఎత్తుగడలో భాగంగా మూడు సాగు చట్టాలను రాష్ట్రాలతో సంప్రదించకుండా, పార్లమెంటరీ కమిటీకి పంపకుండా హడావుడిగా 2020లో ఆమోదించిన సంగతి తెలిసిందే. వాటిని వెనక్కు తీసుకున్న తరువాత ఇప్పుడు కనీస మద్దతు ధరలకు చట్టబద్దత కల్పించటం కుదిరేది కాదని, కావాలంటే మూడు రకాల పప్పులు, పత్తి, మొక్కజొన్నలను ఐదేండ్ల పాటు కనీస మద్దతు ధరలకు కొంటామని, అది కూడా రైతులు పంటమార్పిడి పద్దతిని అనుసరిస్తేనే అనే షరతు పెట్టారు. దీనికి అంగీకరిస్తే రైతుల కొంప కొల్లేరే.


మన దేశంలో వ్యవసాయం తరువాత ఎక్కువ మందికి ఉపాధితో పాటు రాబడి కల్పిస్తున్నది పాడి పరిశ్రమ. దీనికి కూడా ధనిక దేశాలు ఎసరు పెట్టాయి. డబ్ల్యుటిఓ పేరుతో పాల ఉత్పత్తులను దిగుమతి చేసుకోవాలని వత్తిడి చేస్తున్నాయి.ఆ ప్రమాదం మెడమీద కత్తిలా వేలాడుతూనే ఉంది. స్టాటిస్టా సంస్థ సమాచారం ప్రకారం ఐరోపా యూనియన్‌లోని 27 దేశాల జనాభా 49 కోట్లు కాగా ఆక్కడ పాల ఉత్పత్తి 2023లో 14.3 కోట్ల టన్నులు, నూటనలభై కోట్ల మంది ఉన్న మన దేశంలో పది కోట్ల టన్నులు, అమెరికాలో 10.4 కోట్ల టన్నులు, చైనాలో 5 కోట్ల టన్నులు ఉంది. కేవలం 52లక్షల జనాభా ఉన్న న్యూజిలాండ్‌ రెండు కోట్ల టన్నులు ఉత్పత్తి చేస్తున్నది. ఒక్క చైనా మినహా మిగిలిన దేశాలన్నీ పెద్ద ఎత్తున పాలు, పాల ఉత్పత్తులకు సబ్సిడీలు ఇచ్చి కారుచౌకగా మన దేశంలో కుమ్మరించాలని చూస్తున్నాయి. అదే జరిగితే పాడి రైతులు కుదేలు కావటం ఖాయం. గతంలో రైతులు, పారిశ్రామిక, వాణిజ్యవేత్తల నుంచి వచ్చిన వత్తిడి, దానిలో అమెరికా భాగస్వామిగా లేనందున ఆర్‌సిఇపి ఒప్పందంలో చేరేందుకు మన దేశం తిరస్కరించింది. లేకుంటే ఇప్పటికే న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా నుంచి పాల ఉత్పత్తులు ఇబ్బడి ముబ్బడిగా వచ్చి ఉండేవి. వచ్చే20 సంవత్సరాల వరకు పాల ఉత్పత్తులను దిగుమతి చేసుకోకుండా ఉంటేనే మన పరిశ్రమ మనుగడలో ఉంటుందని ఒక నివేదిక పేర్కొన్నది. పదమూడు సంవత్సరాల పాటు అముల్‌ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా పనిచేసి 2023 చివరిలో తప్పుకున్న ఆర్‌ఎస్‌ సోధీ దిగుమతుల గురించి హెచ్చరించారు. అమెరికా, ఐరోపాయూనియన్‌, ఇతర దేశాలతో స్వేచ్చావాణిజ్య ఒప్పందాలు, వాటి ఉత్పత్తులకు అనుమతి ఇస్తే పరిస్థితిని ఊహించలేమని కేంద్ర మంత్రి పియూష్‌ గోయల్‌కు రాసిన లేఖలో స్పష్టం చేశారు.న్యూజిలాండ్‌లో స్థానిక అవసరాల కంటే 14 రెట్లు ఎక్కువ ఉత్పత్తి జరుగుతోందని వారు మనదేశం మీద కన్నువేశారని చెప్పారు. మన దేశంలో సగానికి పైగా పాడి పరిశ్రమ అసంఘటిత రంగంలో ఉన్నందున ముందు రైతులు దెబ్బతింటారు.


పాడి తరువాత మనదేశంలో కోళ్ల పరిశ్రమ ముఖ్యమైనది. ఈ రంగంలో తన ఉత్పత్తులను కుమ్మరించాలని అమెరికా చూస్తున్నది.ప్రపంచ వాణిజ్య సంస్థలో మన మీద దాఖలు చేసిన కేసులో అమెరికా గెలిచింది. ఆ సాకుతో కోళ్ల ఉత్పత్తుల దిగుమతి పన్నును భారీగా తగ్గించేందుకు నరేంద్రమోడీ సర్కార్‌ అంగీకరించింది. గతంలో యుపిఏ ప్రభుత్వం అమెరికాలో వచ్చిన బర్డ్‌ఫ్లూ కారణంగా అమెరికా నుంచి దిగుమతులపై 2007లో నిషేధం విధించింది. వ్యాధి తగ్గిన తరువాత కూడా దాన్ని ఎత్తివేయలేదంటూ అమెరికా కేసు దాఖలు చేసింది.దాని మీద 2014 అక్టోబరులో తీర్పు వచ్చింది. తొలి రోజుల్లో అమలు చేసేందుకు నరేంద్రమోడీ సర్కార్‌ అంగీకరించకపోయినా, వాణిజ్య ఆంక్షలకు పూనుకుంటామని అమెరికా బెదిరించటంతో దిగుమతులతో పాటు అప్పటి వరకు ఉన్న పన్ను మొత్తాన్ని ఐదు శాతానికి తగ్గించేందుకు 2017లో మోడీ అంగీకరించారు. మన దేశంలోని కోళ్ల పరిశ్రమ దీన్ని తీవ్రంగా వ్యతిరేకించటంతో దిగుమతులు ప్రారంభం కాలేదు. దీనికి ప్రతిగా మన దేశం నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువులపై ఇస్తున్న 600 కోట్ల డాలర్ల మేర రాయితీ పన్ను డోనాల్డ్‌ ట్రంప్‌ రద్దు చేసి మన ఎగుమతులను దెబ్బతీశాడు. దీనితో పాటు మరికొన్ని వివాదాలు కొనసాగుతుండటంతో కోళ్ల ఉత్పత్తుల దిగుమతులు అమలు కాలేదు. ఇప్పటికీ అదే పరిస్థితి. ఈలోగా మన రైతులు అమెరికా కోడి కాళ్ల దిగుమతులను అనుమతించకుండా నిరోధించాలని సుప్రీం కోర్టుకు వెళ్లారు, ఆ కేసు ఇంకా తేలలేదు.ప్రస్తుతం అమెరికా కోళ్ల ఉత్పత్తులపై దిగుమతి పన్ను వందశాతం ఉంది. అయినప్పటికీ అక్కడి నుంచి దిగుమతి చేసుకుంటే మన మార్కెట్‌ ధరల కంటే తక్కువకు విక్రయించవచ్చని చెబుతున్నారు. మన వినియోగదారులకు తక్కువ ధర కావాలి గనుక మాంసం ఎక్కడిదన్నదానితో నిమిత్తం ఉండదు. మనదేశంలో ఒక టన్ను కోడి మాంసానికి 1,800 డాలర్లు ఖర్చు అవుతుంది. అదే అమెరికాలో 700 నుంచి 800 డాలర్లు, ఈ లెక్కన వందశాతం పన్ను చెల్లించి దిగుమతి చేసుకున్నప్పటికీ 1,500-1,600 డాలర్లకే అందించవచ్చు.అమెరికా పౌరులు కోడి కాళ్లను తినరు గనుక మనకు మరింత చౌకగా దొరుకుతాయి.


వ్యవసాయంతో పాటు అన్ని రకాల సబ్సిడీలను పరిమితం చేయాలి లేదా తొలగించాలన్నది ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధన. ఆ దిశగానే పదేండ్ల మోడీ పాలన సాగింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, బడ్జెట్‌, జిడిపిలతో పోలిస్తే వాస్తవ కేటాయింపు తగ్గుతున్నది. ఉదాహరణకు ఎరువుల సబ్సిడీ తీరు తెన్నులు చూద్దాం. యుపిఏ పాలనా కాలంలో 2008-2009 నుంచి 2013-14వరకు ఆరేండ్ల కాలంలో సగటున ఏడాదికి ఎరువులకు ఇచ్చిన సబ్సిడీ రు.59వేల కోట్లు. నరేంద్రమోడీ ఏలుబడి తొలి ఆరు సంవత్సరాల సగటు 71వేల కోట్లు ఉంది. ప్రపంచ వాణిజ్య సంస్థ సబ్సిడీలకు తీసుకున్న ప్రాతిపదికతో మనదేశంతో సహా అనేక దేశాలు నష్టపోతున్నాయి.1986-1988లో ఉన్న ధరలను ప్రాతిపదికగా తీసుకొని వర్ధమాన దేశాలలో మొత్తం వ్యవసాయ ఉత్పత్తుల విలువలో పదిశాతం సబ్సిడీలుగా ఇవ్వవచ్చు. అదే ఇప్పటికీ కొనసాగుతున్నది. ఈ కాలంలో పెరిగిన ద్రవ్యోల్బణం, పెరిగిన విలువను పరిగణనలోకి తీసుకోవాలని వర్ధమాన దేశాలు కోరుతున్నాయి. నిబంధనల్లో పీస్‌ క్లాజ్‌ అని ఒకటి ఉంది. దీన్నే సంధి కాలం అని కూడా అంటున్నారు. దీని ప్రకారం ఏవైనా ప్రభుత్వాలు సేకరించిన ఆహార ధాన్యాలను ఎగుమతి చేయకూడదు. అయితే గత సంవత్సరం, ఈ ఏడాది దేశంలో ఆహార ధరలు పెరిగిన కారణంగా కేంద్ర ప్రభుత్వం బహిరంగ మార్కెట్‌లో బియ్యం, గోధుమలను విక్రయిస్తున్నది. దీన్ని ఇతర దేశాలు తప్పు పడుతున్నాయి.ఇవి అంతర్జాతీయ మార్కెట్లకు చేరుతున్నాయని, ఇది నిబంధనలను ఉల్లంఘించటమే అని అభ్యంతరాలు తెలుపుతున్నాయి.


ప్రపంచ వాణిజ్య సంస్థలో తనకున్న పలుకబడిని ఉపయోగించుకొని అమెరికా రక్షణ చర్యలకు పాల్పడుతోంది. అబుదాబీ సమావేశంలో కూడా ఈ దిశలోనే తన అజెండాను ముందుకు నెట్టవచ్చు. ఈ సంస్థ అప్పీళ్ల విచారణ కోర్టులో న్యాయమూర్తుల నియామకాన్ని అడ్డుకొంటున్న కారణంగా 2019 నుంచి ఎలాంటి విచారణలూ లేవు. ఏడాదికేడాది వివాదాలు పెరుగుతున్నాయి. అమెరికా ప్రయోజనాలకే అగ్ర పీఠం అనే పద్దతిలో ఆలోచించటం, ఆ దిశగా ముందుకు పోవటం ఇటీవలి కాలంలో పెరిగింది. దానిలో భాగంగానే మనకు ఉపయోగపడని, మన మాట చెల్లుబాటుగాని డబ్ల్యుటిఓ నుంచి వైదొలగాలని అమెరికాలోని కొందరు తమ ప్రభుత్వం మీద వత్తిడి తెస్తున్నారు. ఇతర దేశాల ఉత్పత్తుల మీద దిగుమతి సుంకాలు విధిస్తూ బస్తీమే సవాల్‌ అంటున్నారు. ప్రపంచీకరణ తెచ్చిన తిరోగమన పరిణామాలు, పర్యవసానాల పూర్వరంగంలో ప్రపంచీకరణకు వ్యతిరేకత వెల్లడవుతున్నది. ఈ కారణంగానే డబ్ల్యుటిఓలో సంస్కరణలు తేవాలన్న వాంఛకు మద్దతు పెరుగుతున్నది.తనకు దక్కని ప్రయోజనాలను అమెరికా అంగీకరిస్తుందా ? ప్రపంచ వాణిజ్య సంస్థను ఒక ఆయుధంగా మలచుకొని ఇతర దేశాలను దెబ్బతీస్తుందా ? ధనిక దేశాల కూటమిని వెనక్కు కొట్టే అద్భుతం జరుగుతుందా ? అబుదాబీలో ఏం జరుగనుందో అని అన్ని దేశాలూ ఎదురు చూస్తున్నాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మూడవ ఏడాదిలో ఉక్రెయిన్‌ సంక్షోభం ! రష్యా పట్టు మరింత బిగిసింది !!

21 Wednesday Feb 2024

Posted by raomk in CHINA, COUNTRIES, Current Affairs, Europe, Germany, History, imperialism, International, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, UK, USA, WAR

≈ Leave a comment

Tags

Donald trump, Joe Biden, Russia’s military action in Ukraine, Three years Ukrain Crisis, Ukraine crisis


ఎం కోటేశ్వరరావు


ఉక్రెయిన్‌పై రష్యా ప్రారంభించిన సైనిక చర్య మూడవ ఏడాదిలో ప్రవేశించింది.2022 ఫిబ్రవరి 24న దాడులు ప్రారంభమైనప్పటికీ 21వ తేదీనే వ్లదిమిర్‌ పుతిన్‌ అధికారికంగా ఆదేశాలు జారీ చేశాడు. ఉక్రెయిన్‌ సరిహద్దుల వైపు రష్యా దళాల అసాధారణ కదలిక ఉన్నట్లు 2021నవంబరు పదవ తేదీన అమెరికా వెల్లడించింది. ఒకవేళ దాడికి దిగితే బలమైన ఆర్థిక, ఇతర చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని డిసెంబరు ఏడున అమెరికా అధినేత జో బైడెన్‌ బెదిరించాడు. నాటో కూటమిలో ఉక్రెయిన్‌ చేరకుండా నిషేధం విధించాలని పుతిన్‌ డిసెంబరు 17న ప్రతిపాదించాడు.దాన్ని జెలెనెస్కీ తిరస్కరించాడు. జనవరి 17న తన మిత్రదేశమైన బెలారస్‌తో సైనిక విన్యాసాలు జరిపేందుకు రష్యా ఆరువేల మంది సైనికులు, 60 జెట్‌ విమానాలను పంపింది. తన దళాలను సన్నద్దం చేసినట్లు జనవరి 24న నాటో ప్రకటించింది. ఫిబ్రవరి 10న పది రోజుల పాటు సాగే మిలిటరీ విన్యాసాలు 2014లో రష్యా స్వాధీనం చేసుకున్న క్రిమియా, ఉక్రెయిన్‌ సరిహద్దులో ప్రారంభమయ్యాయి. స్వాతంత్య్రం ప్రకటించుకున్న రెండు తూర్పు ప్రాంతాలపై ఫిబ్రవరి 17న ఉక్రెయిన్‌ మిలిటరీ విరుచుకుపడింది. అదే నెల 21న పుతిన్‌ సైనిక చర్యకు ఉత్తరులు ఇవ్వటంతో పాటు రెండు ఉక్రెయిన్‌ తిరుగుబాటు ప్రాంతాలు డాటెస్క్‌, లుహాన్స్క్‌లకు స్వతంత్ర దేశాలుగా గుర్తింపు ఇస్తున్నట్లు కూడా ప్రకటించాడు, 24వ తేదీన దాడులు ప్రారంభమయ్యాయి.


రెండు సంవత్సరాల ఈ సంక్షోభాన్ని స్థూలంగా చూసినపుడు ఉక్రెయిన్‌పై రష్యా పట్టు మరింత బిగిసింది. భారీ ఎత్తున ఆయుధాలు ఇచ్చిన పశ్చిమ దేశాలు ప్రచారం చేసిన మాదిరి ఉక్రెయిన్‌ ఎదురుదాడులు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేదు. రెండు వైపులా ఎందరు మరణించిందీ ఇంతవరకు విశ్వసనీయమైన ఆధారాలు లేవు.లక్షల్లో ప్రాణ నష్టం ఉంటుందని భావిస్తున్నారు. రష్యా మీద ప్రకటించిన ఆర్థిక, ఇతర ఆంక్షలు దేనికీ కొరగాకుండా పోయాయి.ఈ సంక్షోభం ఇంకా ఎంతకాలం కొనసాగుతుందో తెలియదు.ఉక్రెయిన్‌ ఎక్కువ కాలం ప్రతిఘటన సాగించలేదని, పశ్చిమ దేశాల్లో వైరుధ్యాల గురించి పుతిన్‌, రష్యా గురించి పశ్చిమ దేశాలు వేసుకున్న తొలి అంచనాలు తప్పాయి. పశ్చిమ దేశాలకు ధీటుగా రష్యా కూడా ప్రచారదాడులతో జవాబిచ్చింది. దీంతో జనాల బుర్రలు ఖరాబు అయ్యాయి. తమ నేతలు చెప్పిన అంశాలు, పలికిన ప్రగల్భాల గురించి పశ్చిమ దేశాల జనాల్లో అనుమానాలు, సందేహాలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. అటు అమెరికా, ఇటు రష్యాలోనూ ఎన్నికల్లో ఇది ఒక ప్రధాన అంశంగా మారనుంది. దీంతో రెండింటికీ ఈ సంక్షోభం ప్రతిష్టాత్మకంగా మారింది. రానున్న రోజుల్లో అనూహ్య పరిణామాలు సంభవిస్తే తప్ప అమెరికా నాయకత్వంలోని నాటో కూటమి మరింతగా ఆయుధాలు, ఆర్థిక సాయం అందించటం తప్ప దళాలను ప్రత్యక్షంగా దించే అవకాశాలు కనిపించటం లేదు. ఇవేవీ ఇంతవరకు రష్యాను వెనుకడుగు వేయించలేకపోయాయి. ఈ సంక్షోభానికి ఎప్పుడు,ఎలా తెరపడుతుంది అన్న చర్చ జరుగుతున్నది.


తాజా పరిణామాలను చూద్దాం. తూర్పు ఉక్రెయిన్‌లోని అడీవికా ప్రాంతాన్ని రష్యన్‌ దళాలు స్వాధీనం చేసుకున్నాయి. జన నష్టాన్ని నివారించేందుకు తామే ఖాళీ చేసినట్లు ఉక్రెయిన్‌ ప్రకటించుకుంది. గత ఏడాది మేనెల తరువాత రష్యన్లకు ఇది పెద్ద విజయంగా చెబుతున్నారు. తగిన సంఖ్యలో మిలిటరీ, ఉన్నవారి దగ్గర మందుగుండు లేకనే ఇది జరిగిందని వార్తలు.అడీవికా పతనం కాగానే తమ వద్ద ఉన్న శతఘ్నులను మొత్తం ఇస్తామని డెన్మార్క్‌ ప్రకటించింది. మీరు ఇచ్చినా వాటిని వెంటనే వినియోగించే స్థితిలో లేమని ఉక్రెయిన్‌ చేతులెత్తేసింది. గత రెండు రోజులుగా రష్యా మరిన్ని దాడులకు పూనుకుంది. మ్యూనిచ్‌ నగరంలో జరుగుతున్న భద్రతా సమావేశంలో జెలెనెస్కీ మాట్లాడుతూ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందని దయచేసి మమ్మల్ని అడగకండి, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, పుతిన్‌ ఇప్పటికీ కొనసాగించటానికి ఎలా వీలవుతున్నదో చూడండి అని ఐరోపా సమాఖ్యతో అన్నాడు. ఈ సంక్షోభంలో తాము తటస్థంగా ఉన్నామని చైనా మరోసారి స్పష్టం చేసింది. అన్ని స్థాయిల్లో చైనాతో సంబంధాలు కొనసాగుతున్నాయని ఉక్రెయిన్‌ ప్రకటించింది. ఐరోపాకు రష్యా ముప్పుకొనసాగుతూనే ఉందని, అది కొన్ని నెలలు, సంవత్సరాలు, ఒక తరం వరకు ఉండవచ్చని బ్రిటన్‌ లేబర్‌ పార్టీ నేత డేవిడ్‌ లామీ అన్నాడు. ఉక్రెయిన్‌ ఇప్పుడు జీవన్మరణ స్థితిలో ఉందని, దాని విధిని నిర్ణయించేది తామేనని పుతిన్‌ ప్రకటించాడు.తాము మద్దతు ఇస్తున్నప్పటికీ ఉక్రెయిన్‌తో ఆహార ధాన్యాలు, ట్రక్కుల రవాణా సమస్యలు ఉన్నట్లు పోలాండ్‌ మంత్రి సికోరిస్కీ చెప్పాడు. ఉక్రెయిన్‌కు భద్రత ఉండాలంటే తమ సభ్యత్వం ఇవ్వాలని ఐరోపా యూనియన్‌ ప్రతినిధి జోసెఫ్‌ బోరెల్‌ అన్నాడు. మరో పద్దెనిమిది నెలల పాటు ఉక్రెయిన్‌ పౌరులకు వీసాలను పొడిగిస్తున్నట్లు బ్రిటన్‌ తెలిపింది.దీన్ని బట్టి పశ్చిమ దేశాలకు ఈ సమస్య పరిష్కారం పట్ల ఆసక్తి లేదన్నది స్పష్టమౌతోంది.


రెండు సంవత్సరాల తరువాత రష్యాను శత్రుదేశంగా చూస్తున్నప్పటికీ ఐరోపాలో యుద్ధ ఆయాసం కనిపిస్తోంది. ఉక్రెయిన్‌కు రానున్న రోజుల్లో విజయాలు సంభవిస్తే ఫరవాలేదు లేకుంటే మరింత నీరసం, దాన్నుంచి ఎందుకీ తలనొప్పి అనే భావం కూడా తలెత్తవచ్చు. మొత్తం మీద ఎన్ని మల్లగుల్లాలు పడినా నాటో కూటమి ఐక్యంగానే ఉంది. ఫిన్లండ్‌ కొత్తగా చేరగా స్వీడెన్‌ ఆ బాటలో ఉంది. ఉక్రెయిన్‌లో రష్యా గెలిస్తే అంతర్జాతీయ రాజకీయ వ్యవస్థ వైపు తిరిగే మలుపు పశ్చిమ దేశాల ప్రయోజనాల ఫణంగా జరుగుతుందని భావిస్తున్నారు. బాల్టిక్‌ దేశాలు ఉక్రెయిన్‌కు గట్టి మద్దతు ఇవ్వాలని కోరుతుండగా నాటోలోని హంగరీ, స్లోవేకియా పెదవి విరుస్తున్నాయి.నెదర్లాండ్స్‌,స్లోవేకియాలో గతేడాది జరిగిన ఎన్నికలు నాటో ఐక్యత మీద ప్రశ్నలను ముందుకు తెచ్చాయి. జెలెనెస్కీకి మిలిటరీ మద్దతులో కోత పెట్టాలనే నినాదంతో పోటీ చేసిన పచ్చిమితవాద ఫ్రీడమ్‌ పార్టీ నెదర్లాండ్స్‌లో గెలిచింది.రష్యాకు అనుకూలంగా ఉండాలన్న వైఖరితో ఉన్న స్లోవాక్‌ సోషల్‌ డెమోక్రసీ పార్టీ 22.9శాతం ఓట్లతో పెద్ద పార్టీగా అవతరించింది. అయితే ఈ రెండు చోట్లా ఈ పార్టీలకు సంపూర్ణ మెజారిటీ లేదు. ఉక్రెయిన్‌కు యాభై నాలుగు బిలియన్‌ డాలర్ల అదనపు సాయం అందించాలన్న ప్రతిపాదనను అడ్డుకొనేందుకు హంగరీ ప్రయత్నించింది. ఇప్పటి వరకు చూస్తే జెలెనెస్కీ దళాలకు తాము ఇచ్చిన ఆధునిక ఆయుధాలను ఉపయోగించటంలో నాటో దేశాలు శిక్షణ ఇస్తున్నాయి తప్ప ముందే చెప్పినట్లు ప్రత్యక్షంగా పాల్గొనటం లేదు. అంతర్జాతీయ వేదికల మీద రాజకీయ మద్దతు, రష్యాను ఒంటరి చేసేందుకు చేయాల్సిందంతా చేస్తున్నాయి.


డోనాల్డ్‌ ట్రంప్‌ గతంలో అధికారంలో ఉన్నపుడు మా నుంచి రక్షణ పొందేది మీరు, దానికయ్యే ఖర్చును కూడా మేమే భరించాలా ? కుదరదు మీ కేటాయింపులు పెంచాలని తెగేసి చెప్పాడు. ఇప్పుడు అమెరికా ఎన్నికల్లో ఇది కూడా ఒక సమస్యగా ముందుకు వచ్చింది. ఐక్యతకే ముప్పు తెచ్చేదిగా ఉందని కొరదరు చెబుతున్నారు. అవసరాలకు అనుగుణ్యంగా నిధులు కేటాయించని దేశాలకు రక్షణ ఇవ్వాలనుకోవటం లేదని ఇటీవల ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌ చెప్పాడు.ఈ అంశంలో బైడెన్‌-ట్రంప్‌ వైఖరిలో చాలా తేడా ఉంది. అది కేవలం ఎన్నికల్లో ఓట్ల కోసమే అనే వారు కూడా లేకపోలేదు. ఎవరేం మాట్లాడినా అంతిమంగా అమెరికా ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తారు. నాటో దేశాలు పైకి బింకంగా కనిపిస్తున్నప్పటికీ ఉక్రెయిన్‌ సంక్షోభం నుంచి ఎలా బయటపడాలో వాటికి తోచటం లేదు.నష్టదాయకమైన షరతులతో రష్యాతో రాజీకి అంగీకరించటమా లేక పోరును పొడిగించి ఓటమిని మూటగట్టుకోవటమో ఏదో ఒకటి జరుగుతుందని అనేక మంది నమ్ముతున్నారు.ఏది జరిగినా ప్రపంచ రాజకీయాల్లో అమెరికా, దాని మిత్ర దేశాలకు ప్రతికూలత మరింత పెరుగుతుంది.


కొందరు కొరియా నమూనాలో పోరు ముగియవచ్చు అని చెబుతున్నారు. 1950దశకంలో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరి ఒకే దేశంగా ఉండాల్సిన కొరియా రెండు భూభాగాలుగా ఉంది తప్ప సాంకేతికంగా యుద్ధ విరమణ ఒప్పందం ఇప్పటికీ లేదు.దక్షిణ కొరియా రక్షణకు హమీ ఉన్నట్లుగా ఉక్రెయిన్‌కు నాటో రక్షణ హామీని రష్యా ఎట్టి పరిస్థితిలో అంగీకరించదు గనుక అది కూడా జరగకపోవచ్చన్నది మరొక వాదన. ఉక్రెయిన్‌ సంక్షోభం మొదలైన తరువాత చైనా -రష్యా సంబంధాలు మరింత బలపడటమే గాక రెండూ దగ్గరయ్యాయి. అంటే ప్రచ్చన్న యుద్ధకాలంలో మాదిరి రెండు శిబిరాలుగా ప్రపంచం చీలిందని సూత్రీకరించేవారు కూడా లేకపోలేదు. తటస్థంగా ఉన్నా, ఆయుధాలను సరఫరా చేయకున్నా, పశ్చిమ దేశాల ఆంక్షల ప్రభావం నుంచి తప్పించేందుకు చైనా ఇటీవలి కాలంలో రష్యా నుంచి తన దిగుమతులను పెంచుకొన్నది.ఈ పరిణామంతో అట్లాంటిక్‌ ప్రాంత దేశాలు వీటికి వ్యతిరేకంగా దగ్గర అవుతున్నాయి.రక్షణ బడ్జెట్లను, మిలిటరీని పెంచుతున్నాయి.గత ప్రచ్చన్న యుద్ధానికి ఇప్పటిదానికి చాలా తేడా ఉన్నది. సోవియట్‌-చైనా బంధం కంటే ఇప్పుడు చైనా-రష్యా బంధం ఎంతో ప్రాధాన్యత కలిగింది.నాడు చైనా ఆర్థికంగా మిలిటరీ రీత్యా నేటి మాదిరి బలం కలిగి లేదు. గతంలో సోవియట్‌-చైనా మధ్య ఉన్న విబేధాలను అమెరికా వినియోగించుకుంది, ఇప్పుడు అలాంటి అవకాశం లేదు.
ప్రస్తుత పరిస్థితిని చూస్తుంటే ఏ పక్షమూ గెలిచే లేదా ఓడిపోయే స్థితి లేదని మరికొంతకాలం కొనసాగుతుదంటున్నవారు కొందరు. గత ఏడాది ఆర్భాటం చేసి ప్రారంభించిన ఎదురుదాడిలో మొత్తంగా చూసినపుడు ఉక్రెయిన్‌కు మరిన్ని నష్టాలు, కొత్త ప్రాంతాలను కోల్పోవటం, ఆత్మరక్షణలో భారీ సంఖ్యలో ప్రాణాలను బలిపెడుతున్నది. మరోవైపు రష్యా కూడా ప్రాణాలను పెద్ద సంఖ్యలో కోల్పోవటంతో పాటు యుద్ధ సామగ్రిని కూడా భారీగా నష్టపోతున్నది. రానున్న ఎన్నికల కారణంగా పెద్ద సంఖ్యలో మిలిటరీ రిక్రూట్‌మెంట్లు కూడా చేసే పరిస్థితి లేదు. జనాభా రీత్యా తక్కువ సంఖ్య ఉన్న ఉక్రెయిన్‌కు ఇంకా కష్టం. పశ్చిమ దేశాలు ఊహించినదానికి భిన్నంగా పుతిన్‌ తనకు కావాల్సిన ఫిరంగి గుండ్లు ఇతర వాటిని ఇరాన్‌, ఉత్తర కొరియా నుంచి పొందుతున్నాడు.ఉక్రెయిన్‌కు నాటో సరఫరాలు సరేసరి. ఉక్రెయిన్‌ లొంగుబాటు తప్ప మరే చర్చలు లేవని పుతిన్‌ తెగేసి చెప్పాడు.పదేండ్ల నాడు కోల్పోయిన క్రిమియాతో సహా అన్ని ప్రాంతాలను తిరిగి తమకు అప్పగిస్తే తప్ప రాజీ లేదని జెలెనెస్కీ చెప్పటం, ఈ ఏడాది నవంబరులో అమెరికా ఎన్నికల ఉన్నందున ఏడాది పొడవునా పోరు కొనసాగవచ్చు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ప్రహసన ప్రాయంగా పాకిస్థాన్‌ ఎన్నికలు !

14 Wednesday Feb 2024

Posted by raomk in Current Affairs, Europe, History, imperialism, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, USA

≈ Leave a comment

Tags

2024 Pakistan Elections, cia, imran khan, pakistan, Pakistan Politics, PTI


ఎం కోటేశ్వరరావు


ఫిబ్రవరి ఎనిమిదిన పాకిస్థాన్‌ జాతీయ అసెంబ్లీ(పార్లమెంట్‌), నాలుగు రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికలు జరిగాయి.రాష్ట్రాలలో ఒక్క సింధులో మాత్రమే పీపుల్స్‌ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వచ్చింది. జాతీయ అసెంబ్లీ, మిగిలిన మూడు రాష్ట్రాలలో ఏ పార్టీకీ మెజారిటీ రాలేదు. జాతీయ అసెంబ్లీలో ఇమ్రాన్‌ ఖాన్‌ నాయకత్వంలోని నిషేధిత పాకిస్థాన్‌ తెహరిక్‌ ఏ ఇన్సాఫ్‌(పిటిఐ) పార్టీ మద్దతుదార్లు స్వతంత్ర అభ్యర్ధులుగా పోటీ చేసి ఇతర పార్టీల కంటే ఎక్కువ సీట్లు తెచ్చుకున్నారు. అసెంబ్లీలో మొత్తం 336 స్థానాలకు గాను 266 నియోజకవర్గాలలో ఎన్నికలు జరిగాయి. మిగిలిన 70 సీట్లలో 60 మంది మహిళలను రాష్ట్రాల వారీగా పార్టీలు తెచ్చుకున్న ఓట్లను బట్టి దామాషా పద్దతిలో నియమిస్తారు.దేశమంతటి నుంచి మరో పది మంది ముస్లిమేతర సామాజిక తరగతులకు చెందిన వారిని నామినేట్‌ చేస్తారు. ఎన్నికలు జరిగిన స్థానాలలో రెండు ఖాళీగా ఉన్నాయి. పార్టీల వారీ పిటిఐ బలపరిచిన స్వతంత్రులు 101 గెలిచినట్లు వార్తలు వచ్చాయి. ఇది రాసిన సమయానికి 91 మంది పిటిఐ స్వతంత్రులు, ముస్లింలీగ్‌(ఎన్‌) 80, పీపుల్స్‌ పార్టీ 54, ముత్తాహిదా క్వామీ మువ్‌మెంట్‌(ఎంక్యుఎం) 17 సీట్లు తెచ్చుకోగా ఐదుగురు ఇతర స్వతంత్రులు, మరో పది చిన్న పార్టీలకు 17 స్థానాలు వచ్చాయి. అంతిమంగా పార్లమెంటు సమావేశాల నాటికి పార్టీల బలాబలాల్లో మార్పులు ఉండవచ్చు. ఓటర్లలో 47శాతం మంది పాల్గొన్నారు.


నాలుగు రాష్ట్రాల ఎన్నికల వివరాలు ఇలా ఉన్నాయి. ఖైబర్‌ ఫక్తూన్‌లోని 145 మొత్తం స్థానాలకు గాను ఎన్నికలు జరిగిన 115లో 84 స్థానాలను పిటిఐ స్వతంత్రులు గెలుచుకున్నారు. అతి పెద్ద పంజాబ్‌లో 371కి గాను ఎన్నికలు జరిగిన 297లో ముస్లిం లీగుకు 137, పీటిఐ స్వతంత్రులు 116, పీపుల్స్‌ పార్టీ పది స్థానాలు గెలుచుకుంది.మరో రాష్ట్రమైన సింధులో 168కి గాను ఎన్నికలు జరిగిన 130లో పీపుల్స్‌ పార్టీ 84, ఎంక్యుఎం 28, పిటిఐ స్వతంత్రులు 11 మంది గెలిచారు. ఇక్కడ పీపుల్స్‌ పార్టీకి ఎవరి మద్దతు అవసరం లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది.బలూచిస్తాన్‌లో 65కు గాను ఎన్నికలు జరిగిన 51 చోట్ల పీపుల్స్‌ పార్టీ, జమాతే ఉలేమాకు పదకొండు చొప్పున ముస్లింలీగ్‌కు పది, మిగిలినవి స్వతంత్రులు, చిన్న పార్టీలకు వచ్చాయి. పంజాబ్‌లో ముస్లిం లీగ్‌కు మద్దతు ఇస్తామని, దానికి బదులు ప్రధాని పదవిని తమకు ఇవ్వాలని పీపుల్స్‌ పార్టీ తన డిమాండ్‌ను ముందుకు తెచ్చింది. పాకిస్థాన్‌లో 12.85కోట్ల మంది నమోదైన ఓటర్లు ఉన్నారు. వీరిలో 5.6 కోట్ల మంది 35 సంవత్సరాలలోపు వారే.36-45 సంవత్సరాల వారు 2.9 కోట్ల మంది.మొత్తం ఓటర్లలో మహిళలు 46శాతమే. కాశ్మీరు నుంచి ఆక్రమించుకున్న ప్రాంతంతో పాటు గిల్గిట్‌-బాల్టిస్థాన్‌కు జాతీయ అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేదు. వాటిని స్వతంత్ర విముక్త ప్రాంతాలుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అక్కడ విడిగా ఎన్నికలు నిర్వహిస్తారు. జాతీయ అసెంబ్లీకి 5,121 మంది, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో 12,695 మంది పోటీ చేశారు. వీరిలో 882 మంది మహిళలు, నలుగురు ట్రాన్స్‌ జెండర్లు ఉన్నారు.అభ్యర్దులలో 11,785 మంది స్వతంత్రులు, వారిలో 607 మంది మహిళలు.


పాకిస్థాన్‌ గద్దెమీద ఇమ్రాన్‌ ఖాన్‌ ఉండటం అమెరికాకు సుతరామూ ఇష్టం లేదు. అతగాడు చేసిన ”పాపం” ఏమిటంటే అమెరికాతో పాటు చైనా, రష్యాలతో కూడా సామరస్యంగా ఉండాలన్న వైఖరి తీసుకోవటమే. తటస్థంగా ఉండటం కూడా తమను వ్యతిరేకించటమే అన్నది అమెరికా భావన, అందుకే అనేక దేశాధినేతలను కుట్ర చేసి కూల్చివేసిన చరిత్ర తెలిసిందే. ఇస్లామాబాద్‌లో ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ తమకు మాత్రమే విధేయత చూపాలని అది కోరుకుంటున్నది. ఉక్రెయిన్‌ మీద రష్యా ప్రారంభించిన సైనిక చర్య 2022 ఫిబ్రవరి 24 నుంచి జరుగుతున్న సంగతి తెలిసిందే. సరిగ్గా అదే రోజున మాస్కోలో వ్లదిమిర్‌పుతిన్‌-ఇమ్రాన్‌ ఖాన్‌ భేటీ జరిగింది. వివాదాన్ని సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవాలని ఖాన్‌ చెప్పాడు. రష్యాపై విధించిన ఆంక్షలను కూడా వ్యతిరేకించాడు. అది అమెరికాకు నచ్చలేదు. మార్చి నెల ఆరవ తేదీన ఇమ్రాన్‌ ఖాన్‌ ఒక పెద్ద బహిరంగ సభ నిర్వహించాడు. దానిలో ఒక కాగితాన్ని చూపుతూ ” రష్యాను ఖండించాలని, వ్యతిరేకంగా ఓటు వేయాలని కోరుతూ ఐరోపా యూనియన్‌ రాయబారులు ఒక లేఖ రాశారు. మీరు మా గురించి ఏమనుకుంటున్నారు. మీరేం చెబితే దాన్ని చేయటానికి మేము మీ బానిసలమా ? మేము రష్యాకు, అమెరికాకు, చైనాకు, ఐరోపాకూ స్నేహితులమే. మేము ఎవరి శిబిరంలోనూ లేము.పాకిస్థాన్‌ తటస్థంగా ఉంటుంది, ఉక్రెయిన్లో యుద్ధాన్ని ముగించేందుకు చూసేవారితో కలసి పని చేస్తుంది ” అని ప్రకటించాడు. ఆ మరుసటి రోజే కుట్రకు తెరలేచింది.


వాషింగ్టన్‌లో పాక్‌ రాయబారి అసాద్‌ మజీద్‌ ఖాన్‌తో జరిపిన సమావేశానికి దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాల అమెరికా సహాయ మంత్రి డోనాల్డ్‌ లు, మరో అధికారి వచ్చారు. ఆ సమావేశంలో డోనాల్డ్‌ లు మాటల సారం ఇలా ఉంది. ఉక్రెయిన్‌ అంశంలో పాక్‌ వైఖరి అమెరికా, ఐరోపాకు ఆందోళన కరంగా ఉంది. తటస్థం అని చెప్పుకోవచ్చుగాని అలా కనిపించటం లేదు. ప్రధాని మీద అవిశ్వాస తీర్మానం నెగ్గితే రష్యా పర్యటనను కేవలం ప్రధాని తీసుకున్న నిర్ణయంగా పరిగణించి మిగతా అందరినీ అమెరికా క్షమించి వేస్తుంది. లేకుంటే గట్టిగా వ్యవహరించాల్సి వస్తుంది. ఐరోపా దీన్ని ఎలా చూస్తుందో చెప్పలేము, నేననుకోవటం వారి స్పందన కూడా ఇలాగే ఉంటుంది. ఖాన్‌ గనుక అధికారంలో కొనసాగితే ఐరోపా, అమెరికా అతన్ని ఒంటరిపాటు చేస్తాయి. అమెరికా అధికారి మాట్లాడిన దాని మీద పాక్‌ రాయబారి స్పందన సారం ఇలా ఉంది. అమెరికా నేతల నుంచి ఎలాంటి స్పందన, సంప్రదింపులు లేవు.దీన్ని బట్టి మారు మాట్లాడకుండా మీకు అవసరమైన వాటన్నింటికీ పాకిస్తాన్‌ మద్దతు పలుకుతుందనే భావనలో మీరున్నట్లు, మమ్మల్ని ఖాతరు చేయటం లేదని మావారు అనుకున్నారు. ఉక్రెయిన్‌-రష్యా పోరు మన సంబంధాల మీద ప్రభావం చూపదు. దీని మీద లూ మాట్లాడుతూ మీరు అనుకుంటే అనుకున్నారు కొంత నష్టం జరిగినా అదేమీ పెద్దది కాదులే.ఖాన్ను సాగనంపిన తరువాత మన సంబంధాలు తిరిగి మామూలు స్థితికి చేరతాయి. ఇప్పటికే కొంత దెబ్బ తగిలింది. కొద్ది రోజుల్లో మీ దేశ రాజకీయ పరిస్థితి మారుతుందో లేదో చూద్దాం.మారితే ఈ సమస్య గురించి మాకు పెద్ద విబేధాలేమీ ఉండవు, లేదో దీని సంగతి తేల్చుకోవాల్సి ఉంటుంది, ఎలా అదుపులోకి తేవాలో నిర్ణయిస్తాం అన్నాడు. ఈ సమావేశం జరిగిన తరువాత మార్చి ఎనిమిదవ తేదీన అవిశ్వాస తీర్మానం పెట్టారు. నెల రోజుల తరువాత అమెరికా జోక్యం గురించి ఇమ్రాన్‌ ఖాన్‌ బహిరంగంగానే తన మద్దతుదారులతో సభలో చెప్పాడు.


అమెరికా సిఐఏ కుట్ర ప్రకారం సాకులు చూపి పాక్‌ చరిత్రలో తొలిసారి ఒక ప్రధాని మీద అవిశ్వాస తీర్మానం పెట్టి 2022 ఏప్రిల్లో ఖాన్ను పదవి నుంచి తొలగించారు. పిటిఐ పార్టీలో అంతర్గత ఎన్నికలు తమకు సంతృప్తి కలిగే విధంగా నిర్వహించలేదని సాధారణ ఎన్నికల్లో పోటీకి ఎన్నికల కమిషన్‌ అనర్హత వేటు వేసింది, ఎన్నికల చిహ్నం క్రికెట్‌ బాట్‌ను స్థంభింప చేసింది. దాంతో ఆ పార్టీ అభ్యర్ధులందరూ స్వతంత్రులుగా వేర్వేరు గుర్తులతో పోటీ చేయాల్సి వచ్చింది. వారంతా పార్లమెంటులో మరొక కొత్త పార్టీ పేరుతో ఒక బృందంగా ఏర్పడతారా, ఏం జరుగుతుందో తెలియని స్థితి. వారిని చేర్చుకొనేందుకు ప్రధాన పార్టీలు ప్రలోభాలు, బెదరింపులకు పాల్పడుతున్నట్లు వార్తలు. పాక్‌ నిబంధనల ప్రకారం వచ్చిన ఓట్ల దామాషా ప్రకారం పార్టీలకు నామినేటెడ్‌ సీట్లను కేటాయిస్తారు. పిటిఐ ప్రస్తుతం ఒక పార్టీగా గుర్తింపు లేనందున దానికి వచ్చే అదనపు సీట్లేమీ ఉండవు. గత ఎన్నికల్లో 31.82శాతం ఓట్లతో పెద్ద పార్టీగా అవతరించి 336కు గాను 149 సీట్లను కైవశం చేసుకుంది.ఈ సారి ఏ పార్టీ కూడా సంపూర్ణ మెజారిటీకి అవసరమైన 169 సీట్లను తెచ్చుకొనే పరిస్థితి లేదు. ముస్లింలీగ్‌, పీపుల్స్‌ పార్టీ సంకీర్ణ కూటమి సర్కార్‌ ఏర్పాటుకు పూనుకున్నట్లు వార్తలు. డెబ్బయి ఒక్క సంవత్సరాల ఇమ్రాన్‌ ఖాన్‌కు మూడు కేసుల్లో 31 సంవత్సరాల జైలు శిక్షతో పాటు పదేండ్ల పాటు ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయకూడదనే అనర్హతను కూడా కోర్టు ప్రకటించింది.


ఈ పూర్వరంగంలో జరిగిన ఎన్నికలు ఎంత ప్రహసనంగా సాగిందీ అర్ధం చేసుకోవచ్చు. ఓట్ల రిగ్గింగు, లెక్కింపును సాగదీశారని, 24 చోట్ల గెలిచినట్లు ప్రకటించిన వారికి వచ్చిన మెజారిటీ కంటే చెల్లవని ప్రకటించిన ఓట్లే ఎక్కువని తేలింది. వాటిలో 13 సీట్లు ముస్లింలీగ్‌కు, ఐదు పీపుల్స్‌ పార్టీ, నాలుగు చోట్ల పిటిఐ-స్వతంత్రులు, మరోరెండు చోట్ల ఇతర స్వతంత్రులు గెలిచారు.ఎన్నో ఆరోపణలు వెల్లువెత్తినప్పటికీ 91 మంది పిటిఐ మద్దతుదార్లు గెలిచారంటే పాక్‌ ఓటర్లు ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటున్నారని, మిలిటరీ, న్యాయవ్యవస్థ కుట్రలను వ్యతిరేకిస్తున్నారని, అన్నింటికీ మించి ముఖ్యంగా యువత అమెరికా పట్ల వ్యతిరేకతను వెల్లడిస్తున్నారన్నది స్పష్టంగా కనిపిస్తోంది. అనేక విదేశీ మీడియా సంస్థలు వెల్లడించిన అభిప్రాయం కూడా ఇదే. ఈ అక్రమాల గురించి పిటిఐ మద్దతుదార్లు, సాధారణ ప్రజానీకం ఎలా స్పందించేదీ చూడాల్సి ఉంది. దేశ రాజ్యాంగం ప్రకారం ఎన్నికల ఫలితాల నోటిఫికేషన్‌ వెలువడిన తరువాత 21రోజుల్లోపు(ఫిబ్రవరి 29) కొత్త పార్లమెంటు సమావేశం కావాల్సి ఉంది. అంతకు ముందే కూడా ఏర్పాటు కావచ్చు. తొలుత స్పీకర్‌ ఎన్నిక ,తరువాత సభా నేత ( ప్రధాని )ఎన్నిక నిర్వహిస్తారు. ఈ పదవికి ఎందరైనా పోటీ పడవచ్చు. సాధారణ మెజారిటీ 169 ఓట్లు తెచ్చుకున్నవారిని విజేతగా ప్రకటిస్తారు. ఆ మేరకు రాకపోతే ఎక్కువ ఓట్లు తెచ్చుకున్న తొలి ఇద్దరి మధ్య మరోసారి ఎన్నిక నిర్వహిస్తారు. తొలి రోజు సభ్యుల ప్రమాణ స్వీకారం, మార్చినెల ఒకటిన స్పీకర్‌, రెండవ తేదీ ప్రధాని ఎన్నిక జరుగుతుంది. తరువాత సెనెట్‌ ఎన్నికలు జరుగుతాయి.


1985లో పార్టీ రహిత ప్రాతిపదికన ఎన్నికలు జరిగాయి. గెలిచిన వారందరినీ స్వతంత్రులుగా పరిగణించారు. తరువాత అత్యధికులు తాము పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌ అనే పార్టీగా ఏర్పడినట్లు ప్రకటించుకున్నారు. తరువాత ఆ పార్టీలో చీలికలు వచ్చాయి.ఇప్పుడు కూడా పిటిఐ మద్దతుతో గెలిచిన స్వతంత్రులు ఏదో ఒక పార్టీ పేరుతో ఏర్పడతారా లేదా అన్నది చూడాల్సి ఉంది.ఒక వేళ అలా ఏర్పడితే ప్రభుత్వం వేధింపులకు పాల్పడే అవకాశం ఉంది. ఇప్పటికే అనేక మందిని అకర్షించేందుకు ప్రధాన పార్టీలు బేరసారాలు, బెదిరింపులకు దిగినట్లు వార్తలు వచ్చాయి. అందువలన పార్లమెంటు సమావేశం నాటికి పార్టీల బలాబలాల్లో మార్పులు జరిగే అవకాశం లేకపోలేదు. నోటిఫికేషన్‌ ఇచ్చిన తరువాత మూడు రోజుల్లో స్వతంత్ర అభ్యర్ధులు పార్టీలను ఎంచుకోవచ్చు. తరువాత పార్టీలకు వచ్చిన ఓట్ల దామాషాలో నామినేటెడ్‌ సీట్లను కేటాయిస్తారు. తరువాత అసెంబ్లీ సమావేశం జరుగుతుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఎన్నిబాంబులు వేస్తే అంతగా లాభాలు :యుద్ధం వద్దు శాంతి ముద్దు !

07 Wednesday Feb 2024

Posted by raomk in CHINA, Current Affairs, Europe, Germany, History, imperialism, INTERNATIONAL NEWS, Japan, Opinion, RUSSIA, UK, USA, WAR

≈ Leave a comment

Tags

#Anti China, Anti Russia, Arms Trade, Donald trump, Gaza Deaths, imperialism, Joe Biden, MIDDLE EAST, NATO, NATO allies, NATO massive arms buildup, Ukraine crisis


ఎం కోటేశ్వరరావు


” అక్కడ మిగిలిందేమీ లేదు ” ఐరాస సహాయ సంస్థ గాజాలో పరిస్థితి గురించి తాజాగా చెప్పిన మాట ఇది. ఇజ్రాయెల్‌ ధ్వంసంగావించిన తమ ఒక ఆసుపత్రి చిత్రాన్ని చూపుతూ ఎక్స్‌లో వ్యాఖ్యానించింది. ఇజ్రాయెల్‌ నౌకల నుంచి జరుపుతున్న దాడుల కారణంగా తమ ఆహార సరఫరా వాహనాలకు ఆటంకం కలుగుతున్నదని సంస్థ డైరెక్టర్‌ థామస్‌ వైట్‌ పేర్కొన్నాడు. గాజాలో బందీలకు బదులుగా ఇజ్రాయెల్‌ జైళ్లలో ఉన్న పాలస్తీనా వాసుల విడుదల గురించి అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్‌ మధ్య ప్రాచ్యదేశాల పర్యటనలో ఉన్నాడు. అక్టోబరు ఏడు నుంచి ఇప్పటి వరకు గాజాలో 27,478 మందిని హత్య చేసిన ఇజ్రాయెల్‌ 66,835 మందిని గాయపరచింది. వారిలో 70శాతంపైగా మహిళలు, పిల్లలే ఉన్నారు.ఇరాక్‌, సిరియా, ఎమెన్‌లపై దాడులకు పూనుకున్న అమెరికా యుద్ధాన్ని విస్తరిస్తున్నదని భద్రతా మండలిలో రష్యా విమర్శించింది.తమ దాడులు ఆరంభం మాత్రమేనని అమెరికా అంతకు ముందు ప్రకటించింది. నాటోతో కలసి తమకు ముప్పు తలపెట్టిన ఉక్రెయిన్‌ మీద రష్యా ప్రారంభించిన సైనిక చర్య 713వ రోజులో ప్రవేశించింది.ఎంతగా వర్షాలు పడితే అంతగా పంటలు పండుతాయని రైతాంగం, జనం మురిసిపోతారు, కానీ యుద్ధోన్మాదులకు ఎన్ని బాంబులను కురిపిస్తే అంతగా లాభాలు వస్తాయని చరిత్ర రుజువు చేసింది. అందుకే ఏక్కడో ఒక దగ్గర ఉద్రిక్తతలను రెచ్చగొట్టి యుద్ధాల వరకు కొనిపోవటం నిత్యకృత్యంగా మారింది.ఐరోపాలో ఉక్రెయిన్‌ సంక్షోభం, మధ్య ప్రాచ్యంలో గాజాపై ఇజ్రాయెల్‌ జరుపుతున్న మారణకాండ సారమిదే. 1990దశకంలో ప్రచ్చన్న యుద్ధంలో తామే గెలిచామని అమెరికా ప్రకటించుకున్నప్పటికీ వర్తమానంలో తిరిగి నాటి పరిస్థితిని అది సృష్టిస్తున్నది. దాని విదేశాంగ విధాన వైఫల్యాలు పెరుగుతున్న కొద్దీ ప్రపంచ మిలిటరీ ఖర్చు కూడా పెరుగుతున్నది. ఎనిమిది సంవత్సరాల వరుస పెరుగుదలలో 2022లో ప్రపంచ మిలిటరీ ఖర్చు 2.24లక్షల కోట్ల డాలర్లకు చేరింది.


గత సంవత్సరం అమెరికా విదేశాలకు అమ్మిన ఆయుధాల విలువ 238 బిలియన్‌ డాలర్లు.ఉక్రెయిన్‌ సంక్షోభం ఈ పెరుగుదలకు ప్రధాన కారణంగా తేలింది.ఐరోపాలోని అనేక దేశాలు తమ వద్ద ఉన్న పాత ఆయుధాలను ఉక్రెయిన్‌కు బదిలీ చేసి కొత్తవాటిని కొనుగోలు చేస్తున్నాయి.ఐరోపా వెలుపల ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, జపాన్‌, కెనడా, కతార్‌ తదితర దేశాలు ఎక్కువగా కొనుగోలు చేశాయి.ఆయుధాల అమ్మకం అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఉత్తేజాన్ని ఇస్తున్నది. అమెరికా ప్రభుత్వం నేరుగా అమ్ముతున్న ఆయుధాలు, మిలిటరీ సేవల విలువ 2022తో పోలిస్తే గతేడాది 51.9బి.డాలర్ల నుంచి 80.9కి పెరిగింది. ఆయుధ వ్యాపారులు నేరుగా అమ్మిన వాటి విలువ 157.5బి.డాలర్లు. ప్రభుత్వమే నేరుగా ఆయుధ వ్యాపారం చేస్తున్నదంటే యుద్ధాలను ప్రోత్సహించే విదేశాంగ విధానాలను మరింతగా కొనసాగిస్తున్నదనేందుకు సూచిక. ఆయుధాలను అమ్ముతూ ప్రపంచానికి ముప్పుగా పరిణమించిన రష్యాను దెబ్బతీసేందుకే తామీపని చేస్తున్నట్లు చెప్పుకొంటున్నది. పుతిన్‌ దళాల నుంచి ఐరోపాను రక్షించే పేరుతో ఉక్రెయిన్‌కు 50బిలియన్‌ డాలర్ల నిధులు ఇవ్వాలని ఐరోపా సమాఖ్య తాజాగా నిర్ణయించింది.అక్టోబరు ఏడున గాజాపై మారణకాండను ప్రారంభించిన ఇజ్రాయెల్‌ చర్య కూడా మిలిటరీ ఖర్చు, ఆయుధ విక్రయాలు పెరిగేందుకు దారి తీస్తున్నది.


అమెరికా తన ఆయుధాలను ఇతర ప్రాంతాలలో నేరుగా ప్రయోగించి వాటి పనితీరును ఎలా పరీక్షిస్తున్నదో ఇజ్రాయెల్‌ కూడా తన ఆయుధాలు, నిఘా పరికరాలను గాజా, పశ్చిమగట్టు ప్రాంతాలలో పాలస్తీనియన్లు ప్రయోగ సమిధలుగా వాడుకుంటున్న దుర్మార్గానికి పాల్పడుతున్నది. హైఫా నగర కేంద్రంగా ఉన్న ఎల్‌బిట్‌ సిస్టమ్స్‌ అనే సంస్థ తాను రూపొందించిన ఐరన్‌ స్టింగ్‌ అనే మోర్టార్‌ బాంబు ఎలా పని చేసేదీ 2021 నుంచి తన వెబ్‌సైట్‌లో ప్రచారం చేసుకుంటున్నది. గాజాలో ఇప్పుడు హమస్‌ను అణచేపేరుతో వాటిని ప్రయోగించి చూస్తున్నారు. పట్టణ ప్రాంతాలు, బహిరంగ ప్రదేశాల్లో కూడా నిర్ణీత లక్ష్యాలను చేరేవిధంగా వీటిని తయారు చేశారు.గాజా జనసమ్మర్ధం గల పట్టణ ప్రాంతమన్నది తెలిసిందే. గురితప్పకుండా ఇక్కడ లక్ష్యాలను చేరితే ప్రపంచవ్యాపితంగా ఎవరికి కావాల్సివస్తే వారికి అమ్మేందుకు ఈ ప్రయోగాలు చేస్తున్నారు. గతంలో ఇలాంటి ప్రయోగాల్లో మారణకాండను సృష్టించిన అనేక ఆయుధాలను ఇప్పుడు ఇజ్రాయెల్‌ ఎగుమతి చేస్తున్నది. అలాంటి వాటిలో ఏకంగా నలభై గంటల పాటు ప్రయాణించి నాలుగు క్షిపణులను మోసుకుపోగల ఇటాన్‌ అనే డ్రోన్ను ఇజ్రాయెల్‌ 2007లో గాజా పౌరుల మీద ప్రయోగించింది, అప్పుడు కూడా వీటి దాడిలో పిల్లలే ఎక్కువగా మరణించారు. ఇప్పుడు వాటిని భారీగా విక్రయిస్తున్నది. మన దేశం వందకు పైగా వీటిని కొనుగోలు చేసి అగ్రస్థానంలో ఉంది. ఇజ్రాయెల్‌ నుంచి ఆయుధాలను కొనుగోలు చేస్తున్న 130కి పైగా దేశాలలో కొలంబియా ఒకటి. అక్కడి అధ్యక్షుడు గుస్టావ్‌ పెట్రో గాజాలో జరుపుతున్న మారణకాండను ఉగ్రవాదంగా వర్ణిస్తూ ఖండించాడు.దాంతో కొలంబియాకు ఆయుధ విక్రయాలను ఇజ్రాయెల్‌ నిలిపివేసింది. ఆయుధ వ్యాపార ఒప్పందాన్ని ఇజ్రాయెల్‌ ఆమోదించలేదు.మారణకాండ, మానవాళిపై నేరాలకు పాల్పడేవారికి ఆయుధాల విక్రయాన్ని ఆ ఒప్పందం నిషేధిస్తున్నది. అందువలన ఇజ్రయెల్‌ జరిపే లావాదేవీలన్నీ రహస్యంగానే ఉంటాయి. ఎవరు, ఎవరికి అమ్మిందీ చెప్పదు, కొనుగోలు చేసిన వారు కూడా వెల్లడించరని 2019లో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ ప్రకటించింది. అందువలన లావాదేవీలు ఎంత అన్నది కూడా అంచనా కష్టం.దక్షిణాఫ్రికాలో స్థానిక ఆఫ్రికన్‌ జాతీయులను అణచివేసిన జాత్యహంకార పాలకులకు విక్రయించింది.అవసరమైతే అణ్వాయుధాలను కూడా ఇచ్చేందుకు సిద్దపడినట్లు బహిర్గతం కావించిన పత్రాలు వెల్లడించాయి. ఎల్‌ సాల్వడార్‌లో తిరుగుబాటుదార్లను అణచివేసేందుకు అక్కడి నియంతలకు నాపాం బాంబులు, ఇతర ఆయుధాలను విక్రయించింది, వాటితో 75వేల మంది పౌరులు మరణించారు. ఎనిమిది లక్షల మంది ప్రాణాలు కోల్పోయిన ర్వాండా మారణకాండలో కూడా ఇజ్రాయెల్‌ తయారీ తుపాకులు, బుల్లెట్లు,గ్రెనేడ్‌లు వాడినట్లు తేలింది.బోస్నియా మీద దాడులు చేసిన సెర్బియాకూ, మయన్మార్‌ మిలిటరీ పాలకులకూ, అజర్‌బైజాన్‌కూ ఆయుధాలను విక్రయించింది. అమెరికా, ఐరోపా దేశాల మాదిరి ఎలాంటి ఆంక్షలనూ విధించదు గనుక ఇజ్రాయెల్‌ నుంచి ఆయుధాలను కొనుగోలు చేయాలని 2018లో నాటి ఫిలిఫ్పీన్స్‌ అధ్యక్షుడు రోడ్రిగో డుటెర్టె ప్రకటించాడు. తాజాగా సవరించిన నిబంధనల ప్రకారం ఎలాంటి అనుమతులతో నిమిత్తం లేకుండా ఎవరికైనా ఆయుధాలను విక్రయించవచ్చు. ప్రస్తుతం గాజాలో మరణించిన, గాయపడిన పాలస్తీనియన్లను పరీక్షించినపుడు కాలిన, ఇతర గాయాలను చూసినపుడు అవి ఎలా జరిగాయన్నది వైద్యులకు సమస్యగా మారింది. గతంలో ఇలాంటి వాటిని చూడలేదని చెప్పారు. దీన్ని బట్టి కొత్త ఆయుధాలను ప్రయోగించారని అనుమానిస్తున్నారు.


యుద్ధం అనేక అనర్ధాలకు మూలం అవుతున్నది. ప్రత్యక్షంగా ఎన్ని ప్రాణాలు పోతాయో, ఎంత మంది దిక్కులేనివారౌతారో, ఎన్ని కుటుంబాలు ఇబ్బందులు పడతాయో, ఎంత బాధ, వేదన కలుగుతుందో చెప్పలేము. పరోక్షంగా జనాల మీద ప్రత్యేకించి కష్టజీవుల మీద విపరీత భారాలను మోపుతుంది. కార్పొరేట్‌ మీడియా వార్తలను ఇస్తుంది తప్ప అది యుద్ధానికి వ్యతిరేకం కాదు. ఇజ్రాయెల్‌ జరుపుతున్న మారణకాండను ఆత్మరక్షణ పేరుతో సమర్థిస్తున్న వారికి మద్దతు ఇస్తున్నది. రష్యాకు నాటో తలపెట్టిన ముప్పును మూసిపెట్టి అది జరుపుతున్న సైనిక చర్య మీద చిలవలు పలవలుగా వార్తలు ఇస్తున్నది. దీనంతటికి అమెరికా, దాన్ని సమర్ధించేదేశాల లాభాల కాంక్ష, యుద్ధోన్మాదమే కారణం. ఏ నేతా శాంతివచనాలు వల్లించటంలో వెనుకబడటం లేదు.ఆచరణలో ఏదో ఒకసాకుతో మిలిటరీ ఖర్చు పెంచుతున్నారు. గతంలో సోవియట్‌ యూనియన్ను మాత్రమే బూచిగా చూపే వారు, ఇప్పుడు రష్యా, చైనాలను పేర్కొంటూ ఆయుధాలను మరింత ఎక్కువగా అంటగట్టేందుకు పూనుకున్నారు. 2020లో డెమోక్రటిక్‌ పార్టీ మిలిటరీ ఖర్చును తగ్గిస్తామని చెప్పింది. గతంలో రిపబ్లికన్‌ డోనాల్డ్‌ ట్రంప్‌ మాదిరి జో బైడెన్‌ అధికారానికి వచ్చిన తరువాత ప్రతి ఏటా పెంచి మరోసారి ఎన్నికలకు సిద్దమౌతున్నాడు. ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ యుద్ధాలను రెచ్చగొట్టటం, ఆయుధాల వ్యాపారం, లాభాలు పిండుకోవటం మామూలే. మిలిటరీ ఖర్చు విషయానికి వస్తే 230 దేశాల్లో ఒక్క అమెరికా చేస్తున్న ఖర్చు 227దేశాల మొత్తానికంటే ఎక్కువ. ఆయుధాల ఎగుమతుల్లో కూడా అదే విధంగా ఉంది. నాటో దేశాలు మిలిటరీ ఖర్చును పెంచాలని డోనాల్డ్‌ ట్రంప్‌ తెచ్చిన వత్తిడిని జో బైడెన్‌ కూడా కొనసాగిస్తున్నాడు. అమెరికా చేస్తున్న ఖర్చులో రష్యా మొత్తం పదిశాతం కంటే తక్కువే.
తాము ఎదురులేని శక్తి అని విర్రవీగుతున్న అమెరికాకు ప్రతి చోటా పరాభవమే మిగులుతోంది. దాన్ని నమ్మితే ఇంతే సంగతులని అనేక దేశాలు అంతర్గతంగా భావిస్తున్నప్పటికీ మిలిటరీ శక్తిగా ఉన్నందున భయపడుతున్నమాట వాస్తవం. చైనా, రష్యాల ముందు అమెరికా పప్పులుడకవని తేలిపోయింది. ఈ పూర్వరంగంలోనే ఐరోపాకు సోవియట్‌ నుంచి ముప్పు ఉందని చెప్పి నాటోను ఏర్పాటు చేశారు. ఇప్పుడు అదే చెబుతూ రష్యాను చుట్టుముట్టేందుకు పూనుకున్నారు. దాన్ని మరింత బలపరుస్తున్నారు. మరోవైపు చైనా నుంచి ఆసియాకు ముప్పు అని ఏ క్షణంలోనైనా తైవాన్ను ఆక్రమిస్తుందని ప్రచారం చేస్తున్నారు.ఈ దశాబ్ద్ది చివరికి చైనా వెయ్యి అణ్వాయుధాలను సమకూర్చుకోనుందని అమెరికా రక్షణశాఖ తప్పుడు నివేదికలను ప్రచారంలో పెట్టింది. ఇవన్నీ చైనా ప్రపంచ మిలిటరీ శక్తిగా ఎదుగుతోంది జాగ్రత్త అని ఇరుగు పొరుగుతో పాటు ప్రపంచ దేశాలను ఆయుధపోటీకి ప్రోత్సహించే ఒక వ్యూహంలో భాగమే. అణ్వాయుధాలు ప్రపంచానికి ముప్పు అన్నది నిజం, ముందుగా ఎవరు మీట నొక్కినా కొద్ది క్షణాల్లో ఇతరులు కూడా అదేపని చేస్తారన్నది కూడా తెలిసిందే.అదే జరిగితే ప్రపంచం మిగలదు. ఎవరికి వారు తగుజాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇతర దేశాలన్నీ తమ మీద కుట్ర చేస్తున్నట్లు, ముప్పు తలపెట్టినట్లు స్వజనాన్ని నమ్మించటం అమెరికా నిత్యకృత్యాలలో ఒకటి. ఆ పేరుతో అన్ని ఖండాలలోని 80 దేశాలలో 800కు పైగా చిన్నా, పెద్ద సైనిక కేంద్రాలను ఏర్పాటు చేసింది. అంటే ఎక్కడికైనా కొద్ది గంటల్లోనే తన మిలిటరీని దింపగలదు. ఇంతవరకు అమెరికా మీద దాడి చేసిన దేశం ఒక్కటంటే ఒక్కటీ లేదు. బ్రిటన్‌ నుంచి స్వాతంత్య్రం పొందిన తరువాత 1,776 నుంచి ఇప్పటి వరకు అమెరికా 68 దేశాల మీద దాడి చేసింది.అందువలన ముప్పు అమెరికా నుంచి రావాలి తప్ప మరొకదేశం నుంచి వచ్చే అవకాశమే లేదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

”విశ్వగురువు” కు ”పెద్దన్న” ఆదేశంబెట్టిదనిన……అమృతకాలం, ఆత్మనిర్భరత కబుర్లు కట్టిపెట్టండి !

04 Sunday Feb 2024

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, Europe, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, USA

≈ 1 Comment

Tags

Aatmanirbhar Bharat, america first, Amritkal, BJP, China, China–United States trade war, Donald trump, Eric Garcetti, Indo_US Trade, IPEF, Joe Biden, Narendra Modi Failures


ఎం కోటేశ్వరరావు


ఈ గడ్డ మీద పుట్టి ఇక్కడి తింటూ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడతారంటూ తమ రాజకీయ, సామాజిక, ఆర్థిక విధానాలను విమర్శించిన వారి మీద కాషాయ దళాలు విరుచుకుపడుతున్నది తెలిసిందే. పన్నెండు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న అమెరికాలోని వాషింగ్టన్‌ నుంచి ఢిల్లీ వచ్చి అమెరికా రాయబారిగా ఉన్న వ్యక్తి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అమృత కాలం, ఆత్మనిర్భర భారత్‌ పధకాలను పూచికపుల్ల తీసివేసినట్లుగా మాట్లాడితే ఎలాంటి స్పందనలూ లేవు. ఎవరూ నోరెత్తరు ! అమృతకాలం, ఆత్మనిర్భర (స్వావలంబన) భారత్‌ వాగాడంబరాన్ని కట్టిపెట్టండిి, మేం చెబుతున్న మార్పులు చేస్తేనే మీకూ మాకూ మంచిది ఆపైన మీ ఇష్టం అన్నట్లుగా మన దేశంలో అమెరికా రాయబారి ఎరిక్‌ గార్సెటీ నిర్మొహమాటంగా చెప్పాడు. జనవరి 30వ తేదీన ఢిల్లీలో ” అమృత కాలం, ఆత్మనిర్భర భారత్‌లో భారత-అమెరికా సంబంధాలు ” అనే అంశం గురించి ఇండో-అమెరికన్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, ఉత్తర భారత కౌన్సిల్‌ మహాసభలో గార్సెటీ ప్రసంగించాడు. దురాక్రమణదారులు వచ్చి గుంజుకు పోతారనే పాతకాలం కాదిది, స్వావలంబన అన్నది దుర్భేధ్యమైన కోటగా భావించరాదని తమ దేశం కోరుతున్నదని గార్సెటీ అన్నాడు. పెట్టుబడులు, మేథోసంపత్తి హక్కులు, ఎగుమతి-దిగుమతులు, పన్నుల వ్యవస్థలో భారత్‌ మార్పులు చేయాలి. ప్రభుత్వం స్వావలంబన వైపు మొగ్గు చూపితే వాణిజ్యం, ఆర్థిక వృద్ధి వేగం తగ్గుతుంది. ప్రస్తుతం రక్షణ, ఆధునిక సాంకేతికతలు, ముఖ్యమైన ఖనిజాలు, సెమికండక్టర్ల వంటి అంశాలలో రెండు దేశాలూ వేగంగా ముందుకు పోతున్నప్పటికీ వాణిజ్యం, పెట్టుబడుల అవకాశాలను పూర్తిగా ఉపయోగించుకోవాలంటే ఇవి చాలవు. ఎగుమతి ఆంక్షలు, విదేశీ పెట్టుబడులు, కార్పొరేట్‌ పన్ను వంటి అంశాలు పారదర్శకంగా లేవు, భారత్‌లో పెట్టుబడులు పెట్టే అమెరికా కంపెనీలకు ఆటంకాలను తొలగించాలి, వీటి గురించి మరింత నిర్మొహమాటంగా ఇద్దరం మాట్లాడుకోవాలి అన్నాడు.


చైనా నుంచి విదేశీ పెట్టుబడులు(ఎఫ్‌డిఐ) భారత్‌కు రావాలని అమెరికా కోరుకుంటున్నది, కానీ వాస్తవ అంకెలను చూస్తే రావాల్సినంత వేగంగా ఎఫ్‌డిఐ భారత్‌కు రావటం లేదు, ఆగేయాసియాలోని వియత్నాం వంటి దేశాలకు పోతున్నది. భారత్‌ స్వావలంబనతో ఉండాలని అమెరికా కూడా వాంఛిస్తున్నది, దాన్నొక దుర్భేధ్యమైన కోటగా చూడకూడదని కూడా కోరుకుంటున్నది.ఎందుకంటే భారత కంపెనీలు కూడా ప్రపంచంలో ఎక్కడైనా పెట్టుబడులు పెడుతున్నాయి, ఉద్యోగాలను సృష్టిస్తున్నాయి గనుక పాతకాలపు ఆలోచనలను వదలి పెట్టాలి. ఏ ఒక్క దేశమూ ఇంకేమాత్రమూ స్వావలంబనతో ఉండలేదు. భారత్‌ నుంచి సరఫరా గొలుసులు అమెరికాకు కీలకంగా ఉండాలని మేం కోరుకుంటున్నాం, ప్రతిదీ భారత్‌లోనే తయారు చేయాలని వాక్పటిమను ప్రదర్శిస్తే వేగం తగ్గుతుంది. ఉత్పత్తి మీద మీరు పన్నులు వేస్తే మా మీద వేసినట్లు కాదు, మార్కెట్‌ను రక్షించినట్లు కాదు, మేం పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టాలని కోరుకుంటుంటే మీరు దానికి పరిమితులు విధిస్తున్నట్లు. కార్పొరేట్ల పన్నుల్లో పారదర్శకత ఉండాలని మేం కోరుకుంటాం. ఇక్కడ ఉండాలని కోరుకుంటున్న మా కంపెనీలకు అదొక ఆటంకంగా ఉంది. ఒక అమెరికా కంపెనీ భారత్‌లో అడుగుపెట్టేందుకుగాను రెండు కోట్ల డాలర్లను పెట్టుబడిగా పెట్టింది. అదే కంపెనీ వియత్నాంలో ఇరవై కోట్ల డాలర్లు పెట్టింది, ఎందుకంటే దిగుమతి చేసుకున్న వాటి మీద అక్కడ పన్నులు లేవు అని ఉదాహరణగా గార్సెటీ చెప్పాడు. కోర్టులు తరచూ మేథోసంపత్తి హక్కుల ఉల్లంఘన జరిగిందని తీర్పులు ఇస్తాయి. తరువాత దాని కొనసాగింపేమీ ఉండదు అన్నాడు.


అమెరికా రాయబారి ప్రసంగమంతా ఇలానే కొనసాగింది. ప్రపంచీకరణ, స్వేచ్చా వాణిజ్యం అంటూ కబుర్లు చెప్పిన అమెరికా, తదితర ధనిక దేశాలు దాన్ని పక్కన పెట్టి రక్షణాత్మక చర్యలు తీసుకుంటూ దేశాలతో విడివిడిగా ఒప్పందాలు చేసుకొనేందుకు వత్తిడి తెస్తున్నాయి. ఇలాంటి ఒప్పందాలు గతంలో మనకు పెద్దగా ఒరగబెట్టిందేమీ లేదని తేలింది. తమ షరతులను మన మీద రుద్దుతున్న కారణంగా అమెరికాతో తలపెట్టిన సమగ్ర వాణిజ్య ఒప్పంద ప్రక్రియ ముందుకు పోవటం లేదు. ఎక్కడన్నా బావేగానీ వంగతోట దగ్గర కాదన్నట్లుగా అమెరికాకే అగ్రతాంబూలం అనే విధానాన్ని యాంకీలు బలంగా ముందుకు తీసుకుపోతున్నారు. దానికోసం ఎంతకైనా తెగిస్తున్నారు. డోనాల్డ్‌ ట్రంప్‌-నరేంద్రమోడీ ఇద్దరూ కావిలించుకొని, చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. పరస్పరం పొగడ్తలను గుప్పించుకున్నారు. అదే ట్రంప్‌ మన దేశం నుంచి దిగుమతి చేసుకొనే కొన్ని వస్తువులపై ఎన్నో ఏండ్లుగా ఇస్తున్న (జిఎస్‌పి ) రాయితీలను 2019లోనే రద్దు చేసిన తరువాతే ఇద్దరూ విడదీయరాని బంధంతో ఉన్నట్లు ప్రదర్శించారు.జిఎస్‌పి కింద మనదేశం 2017లో ఎలాంటి దిగుమతి పన్నులు లేకుండా అమెరికాకు ఎగుమతి చేసిన సరకులు విలువ 570 కోట్ల డాలర్లు. ఆ రాయితీని పునరుద్దరించాలని మన దేశం వినతులు మీద వినతులు చేయటమేతప్ప ఇప్పటి వరకు బైడెన్‌ సర్కార్‌ పట్టించుకున్న పాపాన పోలేదు.మనకున్న పలుకుబడికి ఇది నిదర్శనం. దీనికి బదులు చైనాను చూపి మనల్ని భయపెట్టటం, వారి ఆయుధాలను మనకు అమ్మి సొమ్ము చేసుకోవటం విపరీతంగా పెరిగింది. చిత్రం ఏమిటంటే మనతో సహా మిగతా ప్రపంచాన్ని భయపెట్టేందుకు చూస్తున్న అమెరికా తాను మాత్రం అదే చైనాతో వాణిజ్య లావాదేవీలను జరపటానికి ముందుకు సాగుతూనే ఉంది.


అమెరికాలో ఎవరిని కదలించినా చైనా నుంచి మనకు ముప్పు ఉందని చెప్పేవారే, ఎందుకంటే అది వారికి లాభసాటిగా ఉంది. రిపబ్లికన్‌ పార్టీలో పలుకుబడి కలిగిన కాలిఫోర్నియా ఎంపీ డారెల్‌ ఇసా జనవరి 30 అమెరికాలోని హడ్సన్‌ సంస్థలో పరిశోధకురాలిగా ఉన్న అపర్ణా పాండేతో మాట్లాడుతూ చైనా నుంచి తలెత్తిన ముప్పు కారణంగా పద్దతైన స్వేచ్చావాణిజ్య ఒప్పందంతో సహా అనేక ఒప్పందాలను అమెరికా-భారత్‌ కుదుర్చుకోవాల్సి ఉందన్నాడు.ప్రస్తుతం రెండు దేశాల మధ్య ఉన్న సంబంధాలపై చైనా ముప్పు ప్రభావం చూపతున్నదన్నాడు.చైనాలో తయారు చేస్తున్న వస్తువులనే అదే ధరలకు భారత్‌లో కూడా తయారు చేయవచ్చు, కానీ దానికిగాను బలమైన ఒప్పందాలు కావాలి అన్నాడు. అమెరికాలో ఇది ఎన్నికల సంవత్సరం రెండు పార్టీలూ ఓటర్లను ఆకర్షించేందుకు నానా గడ్డీ కరుస్తున్నాయి.తాను గనుక మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికైతే పన్నుల యుద్ధాన్ని ప్రారంభిస్తానని, తద్వారా అమెరికా ప్రయోజనాలను కాపాడతానని, విదేశాలకు తరలిన ఆటోమొబైల్‌ పరిశ్రమను తిరిగి వెనక్కు తీసుకువస్తానని రిపబ్లికన్‌ పార్టీ ఎన్నికల ప్రచారంలో డోనాల్డ్‌ ట్రంప్‌ చెబుతున్నాడు. గతేడాది జూన్‌లో ఒక సందర్భంగా మాట్లాడుతూ ” అమెరికా తయారీ వస్తువులపై భారత్‌, చైనా లేదా మరో ఏదేశమైనా వంద లేదా రెండువందల శాతం దిగుమతి పన్నులు విధిస్తే మేం కూడా అదే విధంగా బదులు తీర్చుకుంటాం.మరో మాటలో చెప్పాలంటే వందశాతమంటే వందశాతమే. వారు గనుక అమెరికా మీద విధిస్తే మనం కూడా విధిస్తాము.కంటికి కన్ను, పన్నుకు పన్ను, ఎంతైతే అంత ” అన్నాడు. అమెరికన్లనే శాసించుతున్నారని చెప్పుకుంటున్న విశ్వగురువుకు ఎలాంటి మినహాయింపులు లేవన్నది స్పష్టం.” ఇప్పటికే 55శాతం ఆటోమొబైల్‌ పరిశ్రమ అమెరికా నుంచి వెళ్లిపోయింది.నేను గనుక అధ్యక్షుడిగా ఎన్నిక కాకుంటే మిగిలింది కూడా అదే దారిలో ఉంటుంది. చైనా లేదా ఇతర దేశాలన్నీ అమెరికాలో అమ్ముకోవాలంటే ఇక్కడే తయారు చేయాలి, మా కార్మికులతోనే పని చేయించాలి. ఇప్పుడు వారు మెక్సికోలో పెద్ద కర్మాగారాలను నిర్మిస్తున్నారు, పన్నులు లేకుండా అమెరికాలో కార్లు అమ్ముకుంటున్నారు.” అని ట్రంప్‌ పేర్కొన్నాడు. తాను గనుక ఎన్నికైతే అమెరికా దిగుమతి చేసుకుంటున్న మూడులక్షల కోట్ల డాలర్ల విలువగల వస్తువులపై పదిశాతం, చైనా వస్తువులపై 60శాతం పన్ను విధించే అవకాశాలను పరిశీలించాలని తన సలహాదారులను కోరినట్లు వాషింగ్టన్‌ పోస్టు పత్రిక రాసింది.


డోనాల్డ్‌ ట్రంప్‌ ఏలుబడిలో చైనా వస్తువులపై విధించిన పన్నులు ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలకు విరుద్దం. అది చివరికి అమెరికాకే నష్టమని తేలటంతో ట్రంప్‌ ఇంటిదారి పట్టాల్సి వచ్చింది. ఇప్పుడు అంతకంటే ఎక్కువ పన్నులు విధిస్తానని చెబుతున్నాడు అంటే జనం, కార్పొరేట్స్‌ ఎలా స్పందిస్తాయో చూడాల్సి ఉంది. అమెరికా ప్రారంభించిన క్రీడలో భాగస్వాములయ్యేందుకు ఐరోపా యూనియన్‌ దేశాలు సిద్దంగా లేవు. అందుకే ఫిబ్రవరి మొదటి వారంలో బ్రసెల్స్‌లో జరిగిన మూడవ ఇండో-పసిఫిక్‌ వేదిక సమావేశానికి అమెరికా, చైనా రెండు దేశాలనూ ఆహ్వానించలేదు. గతేడాది అమెరికా పొల్గొన్నది. అసలు ఏ సమావేశానికీ చైనాను ఆహ్వానించలేదు. దీని అర్ధం ఏమిటంటే ఈ రెండింటిలో ఏదో ఒక దేశం వెనుక చేరటం గాకుండా ఎవరి ప్రయోజనాల మేరకు వారు వ్యవహరించాలని చెప్పటమే అని విశ్లేషకులు భాష్యం చెప్పారు. రెండింటి నుంచి వీలైన మేరకు ఎక్కువ రాయితీలు పొందే ఎత్తుగడ కూడా కావచ్చు. దీన్నుంచి మన దేశం పాఠాలు నేర్చుకుంటుందా ? పెరుగుతున్న చైనా పలుకుబడిని అడ్డుకునేందుకు అమెరికా ముందుకు తెచ్చిన ఐపిఇఎఫ్‌ (ఇండో-పసిఫిక్‌ ఎకనమిక్‌ ఫ్రేమ్‌వర్క్‌ ) పట్ల అమెరికా నేతలే ఆసక్తి చూపటం లేదని తాజాగా విశ్లేషణలు వెలువడ్డాయి.ఈ కూటమిలో అమెరికా, జపాన్‌, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, బ్రూనే,భారత్‌, ఇండోనేషియా, మలేసియా, ఫిజీ, న్యూజిలాండ్‌, ఫిలిప్పీన్స్‌, సింగపూర్‌, థారులాండ్‌, వియత్నాం ఉన్నాయి. వాణిజ్యం మీద ఒప్పందం కుదుర్చుకోవాలని గతేడాది నవంబరులో జరిగిన సమావేశంలో చూసినప్పటికీ అమెరికాలోని పలువురు ఎంపీలు లేవనెత్తిన అభ్యంతరాల కారణంగా కుదరలేదు. ఇది ఆలస్యం కాదు, పూర్తిగా వెనక్కుపోయినట్లే అని బ్రౌన్‌ అనే ఎంపీ మీడియాతో చెప్పాడు.చైనాను దెబ్బతీసేందుకు పన్నెండు పసిఫిక్‌ ప్రాంత దేశాలతో కూడిన టిపిపి కూటమిని అమెరికా ముందుకు తెచ్చింది. అయితే దాన్నుంచి తాము వైదొలుగుతున్నట్లు ప్రకటించిన అమెరికా ఐపిఇఎఫ్‌ను ముందుకు తెచ్చింది. దీన్లో కూడా తమకు పెద్దగా ప్రయోజనం లేదనే భావనతో అమెరికా ఉంది. ఈ ఒప్పందానికి ట్రంప్‌ పెద్దగా ఆసక్తి చూపటం లేదు. విదేశాల నుంచి వస్తున్న దిగుమతులతో అమెరికా పారిశ్రామిక ఉత్పత్తి పడిపోయింది, కార్మికులకు ఉపాధి పోయింది. జనంలో ఉన్న అసంతృప్తిని సొమ్ము చేసుకొనేందుకు మరోసారి అమెరికాను గొప్పగా తయారు చేయాలనే పిలుపుతో డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రచారంతో ముందుకు పోతున్నాడు. ఒక వేళ జో బైడెన్‌ గెలిచినప్పటికీ ఐపిఇఎఫ్‌లో వాణిజ్యం అనే నాలుగువ స్థంభాన్ని నిర్మించటం సాధ్యం కాదని జపాన్‌-ఆసియా ట్రేడ్‌ నిపుణుడు డేవిడ్‌ బోలింగ్‌ చెప్పాడు.ఈ పూర్వరంగంలో మన మార్కెట్లో తన వస్తువులను గుమ్మరించటానికి, పెట్టుబడులకు రాయితీలు పొందటానికి అమెరికా తెస్తున్న వత్తిడికి రాయబారి ప్రసంగం తీరు నిదర్శనం. తమ ప్రయోజనాలను ఫణంగా పెట్టి విదేశీ సంస్థలకు పెద్ద పీట వేస్తామంటే మన కార్పొరేట్‌ సంస్థలు అంగీకరిస్తాయా ? వీలైతే వాటితో చేతులు కలిపి లబ్ది పొందుతాయి లేకుంటే ప్రతిఘటిస్తాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

పోరుబాటలో ఐరోపా రైతాంగం, బుధవారం నాడు అనేక దేశాల్లో రోడ్ల దిగ్బంధనం !

31 Wednesday Jan 2024

Posted by raomk in Current Affairs, Economics, Environment, Europe, Farmers, Germany, History, International, INTERNATIONAL NEWS, Opinion, Prices

≈ Leave a comment

Tags

#Farmers Protest, Agri subsidies, Agriculture, Europe Farmers Protests, European Commission, farm crisis, Ukraine crisis


ఎం కోటేశ్వరరావు


బ్రసెల్స్‌లో జరుగుతున్న ఐరోపా యూనియన్‌ సమావేశాల సందర్భంగా తమ నిరసన వెల్లడిస్తూ బెల్జియం, ఫ్రాన్స్‌, ఇటలీ తదితర దేశాల్లో రైతులు (జనవరి 31) బుధవారం నాడు ఆందోళనకు దిగారు. నౌకాశ్రయాలు,ఇతర ఆర్థిక కేంద్రాలలో లావాదేవీలను జరగకుండా చేశారు. అనేక చోట్ల ట్రాక్టర్లు, ఇతర వ్యవసాయ వాహనాలతో రోడ్లను దిగ్బంధనం చేశారు.బ్రసెల్స్‌ నగరంలో ప్రవేశించేందుకు పెద్ద ఎత్తున నలుమూలల నుంచీ తరలి వస్తున్నట్లు వార్తలు వచ్చాయి. గురువారం నాడు నిరసన తెలపనున్నట్లు ప్రకటించారు. అనేక చోట్ల పౌరజీవనానికి కూడా ఆటంకం కలిగింది. రైతుల సమస్యలను వినాల్సి ఉందని బెల్జియం ప్రధాని అలెగ్జాండర్‌ డెకరో అన్నాడు. వాతావరణ మార్పుల నుంచి పర్యావరణ కాలుష్యం వరకు అనేక పెద్ద సమస్యలను వారు ఎదుర్కొంటున్నారని చెప్పాడు. తీవ్ర వ్యతిరేకత వెల్లడవుతున్న కారణంగా దక్షిణ అమెరికా దేశాలతో స్వేచ్చావాణిజ్య ఒప్పందాన్ని తాత్కాలికంగా పక్కన పెడుతున్నట్లు ఫ్రెంచి అధ్యక్షుడు మక్రాన్‌ ప్రకటించాడు. ఐరోపా యూనియన్‌ పార్లమెంటు ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. పార్టీలన్నీ సిద్దం అవుతుండగా వివిధ దేశాల్లో రైతులు పోరుబాట పడుతున్నారు.నిన్న జర్మనీ, రుమేనియాలో, నేడు ఫ్రాన్సు, ఇతర దేశాల్లో రైతులు రోడ్డెక్కారు. అనేక దేశాల్లో వివిధ రూపాల్లో ఆందోళనలు జరుగుతున్నాయి. అక్కడ రైతులు మన మాదిరిగా జెండాలు పట్టుకొని ప్రదర్శనలు చేయటానికి బదులు ట్రాక్టర్లు, ట్రక్కుల వంటి వాటితో వచ్చి ఎక్కడికక్కడ రోడ్ల మీద నిలిపివేసి నిరసన తెలుపుతున్నారు.అనేక యాప్‌లు అందుబాటులోకి వచ్చాయి. టిక్‌టాక్‌ వంటి వాటిలో నిరసన వీడియోలు నింపుతూ ప్రచారంలో పెడుతున్నారు. ఐరోపా సామాజిక మాధ్యమాల్లో ఆకర్షిస్తున్న పదాల జాబితాలో ” రైతులు ” కూడా చేరిందంటే సమస్యల తీవ్రతకు అద్దం పడుతున్నది.


ఐరోపా యూనియన్‌ దేశాల్లో రుమేనియాలో అత్యధికంగా 35లక్షల మంది రైతులు ఉన్నారు. జనవరి పది నుంచి వీరితో పాటు రవాణారంగ కార్మికులు అనేక సందర్భాలలో కలిసే ఆందోళనలు చేస్తున్నారు. ప్రభుత్వానికి సమర్పించిన 47 డిమాండ్ల జాబితాలో డీజిల్‌ పన్ను తగ్గింపు, మోటారు వాహనాలపై పౌర సంబంధ బీమా ప్రీమియం తగ్గింపు వంటి అంశాలతో పాటు ఉక్రెయిన్‌ సంక్షోభం ముందుకు తెచ్చిన ప్రధాన అంశాలు ఉన్నాయి.ఐరోపా దేశాల్లో రవాణాకు పర్మిట్లు అవసరం, ఉక్రెయిన్‌ సంక్షోభం తరువాత వాటిని ఎత్తివేశారు. దాంతో రవాణా ఖర్చులు తక్కువగా ఉండే ఉక్రెయిన్‌ వాహనాల నుంచి వచ్చిన పోటీని రుమేనియా, ఇతర దేశాల ట్రక్కుల యజమానులు తట్టుకోలేకపోతున్నారు. అంతేకాదు, అక్కడి నుంచి చౌకగా దిగుమతి చేసుకుంటున్న ధాన్యం వంటి వ్యవసాయ ఉత్పత్తుల కారణంగా మిగతా దేశాల్లో ధరలు పడిపోయి రైతాంగానికి గిట్టుబాటు కావటం లేదు. రుమేనియా రాజధాని బుఖారెస్ట్‌లో నిరసన తెలిపేందుకు వచ్చిన వారిని జనవరి పదిన అడ్డుకున్నారు. దాంతో ఇరవై కిలోమీటర్ల పొడవున రైతులు భైఠాయించారు. పది రోజుల తరువాత 21వ తేదీన అనుమతి ఇచ్చారు. అంతకు ముందు ఉక్రెయిన్‌తో రెండు చోట్ల సరిహద్దులను రైతులు దిగ్బంధించారు. మన దేశంలో నిరసన తెలిపిన వారిని రైతులు కాదని ఎలా నిందించారో రుమేనియాలో కూడా అదే జరిగింది. సాధారణ రైతులతో పాటు వ్యవసాయ రంగంతో సంబంధం ఉన్న చిన్న, మధ్య తరగతి వ్యాపారులు కూడా బాసటగా నిలిచారు.
నాలుగుశాతం భూమిని సాగు చేయకుండా వదలి వేయాలని, పంటల మార్పిడి పద్దతిని విధిగా పాటించాలని, రసాయన ఎరువుల వాడకాన్ని ఇరవై శాతం తగ్గించాలనే నిబంధనలను ఐరోపా యూనియన్‌ అమలు చేయనుంది. దీని వలన ప్రపంచంలో ఇతర రైతులతో చౌకగా వచ్చే దిగుమతులతో తాము పోటీపడలేమని స్థానిక రైతులు చెబుతున్నారు.దీనికి తోడు ద్రవ్యోల్బణం కారణంగా తమకు నేరుగా ఇచ్చే నగదు విలువకూడా తగ్గుతున్నదని ఆందోళన వెల్లడిస్తున్నారు. ఉక్రెయిన్‌ సంక్షోభం ఐరోపా అంతటా రైతాంగాన్ని ప్రభావితం చేయటంతో వారు వీధుల్లోకి వస్తున్నారు. ఉక్రెయిన్లో సగటు కమత విస్తీర్ణం వెయ్యి హెక్టార్లు కాగా, ఐరోపా ఇతర దేశాల సగటు కేవలం 41హెక్టార్లు మాత్రమే. అందువలన గిట్టుబాటులో కూడా తేడా ఉంటున్నది.ఉక్రెయిన్‌ దిగుమతులను నిరసిస్తూ పోలాండ్‌ రైతులు జనవరి 24న దేశవ్యాపితంగా ఆందోళన చేశారు.ఉక్రెయిన్‌ ధాన్యాన్ని ఆఫ్రికా, ఆసియా మార్కెట్లకు పంపాలి తప్ప ఐరోపా దేశాలకు కాదని పోలాండ్‌ రైతు సంఘ ప్రతినిధి చెప్పాడు.

ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా ఇప్పటి వరకు స్పెయిన్‌, ఇటలీ,పోర్చుగీసు రైతులు ప్రభావితం కాలేదని, అయితే పర్యావరణ రక్షణ చర్యలు వారిని కూడా వీధుల్లోకి తీసుకురానున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.స్పెయిన్‌, పోర్చుగీసులో కొన్ని ప్రాంతాల్లో అనావృష్టి కారణంగా వ్యవసాయానికి వాడే నీటిపరిమాణం మీద ప్రభుత్వాలు ఆంక్షలు విధించాయి. జరిగిన నష్టాలకు తమకు పరిహారం ఇవ్వటం లేదని రైతులు విమర్శించారు. ఒక్కోచోట ఒక్కో సమస్య ముందుకు వస్తుండటంతో గత కొన్ని సంవత్సరాలుగా వివిధ ఐరోపా దేశాల్లో రైతులు రోడ్లెక్కటం ప్రారంభించారు.పర్యావరణ పరిరక్షణలో భాగమంటూ నత్రజని వాయువు విడుదలను పరిమితం చేసేందుకు పూనుకోవటంతో 2019లో నెదర్లాండ్‌ అంతటా రైతులు రోడ్లను దిగ్బంధించారు. గతేడాది డిసెంబరులో కూడా నిరసన తెలిపారు. ఉక్రెయిన్‌ డ్రైవర్లకు పర్మిట్‌ పద్దతి అమలు జరపాలని కోరుతూ పోలాండ్‌ ట్రక్కరు సరిహద్దులను మూసివేసి అడ్డుకున్నారు. ఉక్రెయిన్‌ నుంచి వస్తున్న చౌక దిగుమతులను అడ్డుకోవాలని రైతులు జనవరి ప్రారంభంలో వీధుల్లో ప్రదర్శనలు చేశారు. వ్యవసాయ సబ్సిడీల కోత ప్రతిపాదనలకు నిరసనగా జర్మన్‌ రైతులు వేలాది మంది బెర్లిన్ను దిగ్బంధం చేశారు. తాజాగా ఫ్రాన్సులో పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నారు, కొన్ని చోట్ల హింసారూపం తీసుకుంది.


వివిధ దేశాల నుంచి చౌకగా దిగుమతులు చేసుకుంటూ తమ పొట్టగొడుతున్నారని ఆగ్రహించిన ఫ్రెంచి రైతులు తమ దేశం గుండా స్పెయిన్‌ నుంచి మొరాకో వెళుతున్న వైన్‌, కూరగాయల రవాణా ట్రక్కులను అడ్డుకొని ధ్వంసం చేశారు. తమను ఫణంగా పెట్టి మక్రాన్‌ ప్రభుత్వం ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు పూనుకుందని, ఫలితంగా ఆహార ఉత్పత్తిదారులు ధరలను తగ్గించాల్సి వచ్చిందని, హరిత విధానాల పేరుతో తీసుకుంటున్న చర్యలు కూడా తమను దెబ్బతీస్తున్నాయని రైతులు నిరసన తెలుపుతున్నారు.జీవ వైవిధ్యం పేరుతో ఐరోపా యూనియన్‌ నుంచి సహాయం పొందాలంటే నాలుగుశాతం భూమిని ఖాళీగా ఉంచాలని, రసాయన పురుగుమందులను వాడకాన్ని తగ్గించాలనే షరతులు పెడుతున్నట్లు చెబుతున్నారు. ఇటలీ నుంచి వస్తున్న కమలాలు కిలో 6.3 డాలర్లకు లభిస్తుండగా పురుగుమందులు తక్కువ వాడుతున్న కారణంగా ఉత్పత్తి ఖర్చులు పెరిగిన తమ సరకు 8.57 డాలర్లకు విక్రయించాల్సి వస్తున్నందున పోటీ ఎక్కువగా ఉందని రైతులు వాపోతున్నారు. అటు వినియోగదారులు, ఇటు రైతులూ ఇద్దరూ నష్టపోతున్నారు. ఇటీవల జరిగిన ఒక సర్వేలో 82శాతం మంది పౌరులు రైతాంగానికి మద్దతు తెలిపారు. ఫ్రాన్సులో మూడో వంతు మంది రైతులు దారిద్య్రరేఖకు దిగువున ఉండగా సగటున రోజుకు ఇద్దరు ఆత్మహత్య చేసుకుంటున్నట్లు పర్యావరణవేత్త యానిక్‌ జడోట్‌ చెప్పాడు. మట్టిపిసుక్కొనే వారని మన దేశంలో చిన్న చూపు చూస్తున్నట్లే ఫ్రాన్స్‌లో కూడా రైతులంటే చిన్న చూపు ఉంది. రైతుల ఆందోళన కారణంగా వ్యవసాయ ఇంథనంపై పన్నులు పెంచాలనే ప్రతిపాదనను వెనక్కు తీసుకుంటున్నట్లు ఫ్రెంచి నూతన ప్రధాని గాబ్రియెల్‌ అటాల్‌ జనవరి 26న ప్రకటించినప్పటికీ నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి.


ఉక్రెయిన్‌ నుంచి చౌకధరలకు వస్తున్న ధాన్యం, పంచదార, కోడి మాంసం, గుడ్లు కారణంగా తమ దేశాల్లో సమస్యలు తలెత్తిన కారణంగా వాటి మీద ఆంక్షలు విధిస్తామని తూర్పు ఐరోపా దేశాలను గతంలో ఫ్రాన్సు తప్పుపట్టింది. ఇప్పుడు అదే పాలకులు రైతుల ఆందోళన కారణంగా తమ వైఖరిని మార్చుకొని దిగుమతులను అడ్డుకోవాలని చెబుతున్నారు.బెల్జియంలో కూడా రైతులు నిరసన తెలిపారు. రాజధాని బ్రసెల్స్‌లో స్పెయిన్‌ నుంచి వస్తున్న ఐదు లారీల కూరగాయలను ధ్వంసం చేశారు. పారిస్‌కు దారితీసే రోడ్లను దిగ్బంధం చేయటం అంటే గీత దాటటమేనని, గ్రామీణ జీవనాన్ని నాశనం చేస్తున్నారని ప్రభుత్వం జనవరి 29న హెచ్చరించింది.రైతులు రాజధానిని దిగ్బంధం చేయనున్నారనే వార్తలతో అధ్యక్షుడు మక్రాన్‌ పారిస్‌ ముట్టడి అనే అంశం గురించి మంత్రులతో అత్యవసర సమావేశం జరిపాడు.పరిస్థితిని ఎదుర్కొనేందుకు మొత్తం ప్రభుత్వం, అధ్యక్షుడు కూడా సిద్దపడినట్లు ప్రభుత్వ ప్రతినిధి స్పష్టం చేశారు. నగరంలోకి ట్రాక్టర్లను అడ్డుకొనేందుకు పదిహేను వేల మంది పోలీసు, ఇతర సిబ్బందిని సిద్దం చేశారు. విమానాశ్రయాలు, ప్రధాన ఆహార మార్కెట్లకు ఆటంకం కలగకుండా చూడాలని ఆదేశించారు. రైతుల దిగ్బంధన ఆందోళన కారణంగా తాము దక్షిణ ఫ్రాన్సులో ప్రవేశించలేకపోతున్నామని బ్రిటన్‌ పౌరులు కొందరు చెప్పారు. తమ ఆందోళన పౌరులకు ఇబ్బంది కలిగించటం కాదని, సమస్య తీవ్రతను ప్రభుత్వానికి తెలియచేయటమే అని రైతులు చెప్పారు.


అనేక దేశాల్లో ప్రభుత్వాలు విఫలమైన కారణంగా మితవాద శక్తులు పేట్రేగిపోతున్నాయి. జూన్‌లో జరగనున్న ఐరోపా యూనియన్‌ పార్లమెంటు ఎన్నికల్లో తమ సత్తాచాటాలని చూస్తున్నాయి.ఐరోపా యూనియన్‌ కారణంగానే అన్ని తరగతుల వారూ సమస్యలను ఎదుర్కొంటున్నారని ప్రచారం చేస్తున్నారు. ఇటీవలి ఒక సర్వే ప్రకారం ఆస్ట్రియా, బెల్జియం, చెక్‌, ఫ్రాన్స్‌, హంగరీ, ఇటలీ, నెదర్లాండ్స్‌, పోలాండ్‌, స్లోవేకియాలలో మితవాద శక్తులది పైచేయి కావచ్చని, మరో తొమ్మిది దేశాలలో రెండవ, మూడవ స్థానాలలో ఉండవచ్చునని తేలింది.ఈ శక్తులు సామాజిక మాధ్యమంలో పెద్ద ఎత్తున ప్రవేశించాయి. రుమేనియాలో 2019లో కేవలం 1.75వేలుగా ఉన్న టిక్‌టాక్‌ వినియోగదారులు 2023నాటికి 78.5లక్షలకు పెరిగారు. ఫ్రాన్సులో 2.14 కోట్లు, జర్మనీలో 2.09కోట్లు, ఇటలీలో 1.97 కోట్ల మంది టిక్‌టాక్‌ వినియోగదారులు ఉన్నారు. రుమేనియాలో చౌక థరలకు లభిస్తున్న ఇంటర్నెట్‌ కారణంగా రైతుల ఉద్యమానికి ఎంతో ప్రచారం లభించిందని, మితవాద శక్తులు ప్రభుత్వాల పట్ల వ్యతిరేకతను పెంచుతున్నాయని కొంత మంది ఆరోపించారు. అసలు సమస్యలు తలెత్తకుండా ఎవరెన్ని ప్రచారాలు చేసినా జనం స్పందించరన్న సంగతి వేరే చెప్పనవసరం లేదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఆక్స్‌ఫామ్‌ 2024 నివేదిక : కనీవినీ ఎరుగని అసమానతల ప్రపంచం !

25 Thursday Jan 2024

Posted by raomk in Africa, Current Affairs, Economics, Europe, History, imperialism, INTERNATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

Berni sanders, billionaires, Davos, inequality, Jeff Bezos, Oxfam 2024, wealth inequality, WEF


ఎం కోటేశ్వరరావు


”ఇక్కడ తిరుగులేని ఆర్థిక వాస్తవం ఉంది. దాన్ని మనం తప్పనిసరిగా ఎదుర్కోవాల్సిందే. ఇంత ఆదాయ, సంపద అసమానతను, సంపదల కేంద్రీకణను చరిత్ర చూడలేదు ” అమెరికా డెమోక్రటిక్‌ సోషలిస్టు బెర్నీ శాండర్స్‌ ఆక్స్‌ఫామ్‌ 2024 అసమానతల నివేదికకు రాసిన ముందు మాటలో చెప్పిన మాటలివి. దవోస్‌ ప్రపంచ ఆర్థికవేదిక 54వ వార్షిక సమావేశాల సందర్భంగా దీన్ని విడుదల చేశారు. దీనిలో పేర్కొన్న వివరాలు కొందరికి నమ్మశక్యం కానంతగా ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. అమెరికా సమాజంలో దిగువన ఉన్న సగం మంది కంటే ముగ్గురు ఎక్కువ సంపదలను కలిగి ఉన్నారు. అరవైశాతం మంది కార్మికులు చాలీచాలని వేతనాలతో జీవిస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానం కారణంగా కార్మికుల ఉత్పాదకత భారీ ఎత్తున పెరిగినప్పటికీ యాభై సంవత్సరాల నాటి కంటే అమెరికా కార్మికుల సగటు వేతనాలు నేడు తక్కువగా ఉన్నాయని శాండర్స్‌ పేర్కొన్నాడు. ఆక్స్‌ఫామ్‌ చెప్పినట్లు ఇది ఒక్క అమెరికా సమస్య మాత్రమే కాదు అన్నాడు.2020 తరువాత ఐదు వందల కోట్ల మంది జనం పేదలుగా మారితే ఐదుగురు కుబేరుల సంపద రెండు రెట్లు పెరిగింది. ఇది ప్రపంచానికి చెడువార్త అన్నాడు. రాబడి, సంపదల అసమానతల తీవ్రతకు ఒక మచ్చుతునక అమెజాన్‌ సంస్థ అధిపతి జెఫ్‌ బెజోస్‌ ఉదంతం. అతగాడు ప్రపంచ కుబేరుల్లో ఒకడు. సంపద విలువ 167.4 బిలియన్‌ డాలర్లు.దీనిలో 2020 తరువాత పెరిగిన మొత్తమే 32.7బి.డాలర్లు ఉంది.అందుకే దాన్ని ఏం చేయాలో తోచక 550 కోట్ల డాలర్లు ఖర్చుచేసి తన కంపెనీ తయారు చేసిన రాకెట్లో ఆకాశపు అంచులదాకా వెళ్లి వచ్చాడు. ఆహా ఎంత అదృష్టం అనుకున్నాం తప్ప ఆ సొమ్ముతో ఎంతో మంది పేదలకు విద్య, వైద్య సౌకర్యాలు కల్పించవచ్చని ఆలోచించలేకపోయాం. ఆర్టీసి బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ వీలు కల్పిస్తున్న ప్రభుత్వాలను విమర్శించే వారు అమెజాన్‌ అధిపతి పది నిమిషాల పది సెకండ్ల పాటు అంతరిక్షంలో విహరించటానికి అతగాడు చేసిన నలభై అయిదు వేల కోట్ల రూపాయలతో ఒక ఏడాది పాటు దేశమంతటా మహిళలకు ఆర్టీసీల్లో ఉచిత ప్రయాణం కల్పించవచ్చు. తన కంపెనీలో యూనియన్‌ ఏర్పాటు చేసుకోవటాన్ని అడుగడుగునా అడ్డుకుంటున్న ఆ ధనమదాంధుడిని ఎప్పుడైనా నిరసించారా ? తమ కంపెనీ హౌల్‌ ఫుడ్స్‌ ద్వారా విక్రయించే రొయ్యలను శుద్ది చేసే అతగాడి ఫ్యాక్టరీలో పనిచేసే మహిళలను విశ్రాంతికి, చివరికి పానీయం కూడా తాగేందుకు సమయం ఇవ్వని పెద్దమనిషని ఎంతమందికి తెలుసు ?


ఈ ప్రపంచం కొద్ది మందికి భూతల స్వర్గం అయితే అత్యధికులకు భూతాల నిలయం.2020 నాటికి ఉన్న సంపదతో పోలిస్తే బిలియనీర్లు మూడు సంవత్సరాల్లో 34శాతం లేదా 3.3లక్షల కోట్ల డాలర్ల మేర పెంచుకున్నారు. ద్రవ్యోల్బణం వీరికి మూడు రెట్ల సంపదను పెంచింది.దీన్ని మరోవిధంగా చెప్పాలంటే ఆ మేరకు సామాన్యుల జేబుల నుంచి మాయమైంది. సంపద అంతా జనాభాలో కేవలం 21శాతం మంది ఉండే ధనికదేశాల్లోనే కేంద్రీకృతమైంది.ప్రయివేటు సంపదల్లో 69శాతం, ప్రపంచ బిలియనీర్లలో 74శాతం మంది ఇక్కడే ఉన్నారు. ద్రవ్య సంబంధ ఆస్తులలో ప్రపంచంలోని ఒకశాతం మంది వద్ద 43శాతం, ఐరోపాలో 47, ఆసియాలో 50శాతం ఉన్నాయి. 1995-2015 మధ్య కాలంలో 60 ఫార్మాకంపెనీలు పదిగా మారాయి. కేవలం రెండు అంతర్జాతీయ కంపెనీలు ప్రపంచ విత్తన మార్కెట్‌లో 40శాతం వాటా కలిగి ఉన్నాయి.నాలుగు కంపెనీలు ప్రపంచ పురుగుమందుల మార్కెట్‌లో 62శాతం వాటా కలిగి ఉన్నాయి. ఆన్‌లైన్‌ ప్రకటనల్లో మూడువంతుల ఖర్చు ఫేస్‌బుక్‌, ఆల్ఫాబెట్‌, అమెజాన్‌ కంపెనీలకే పోతోంది.వెతుకులాటలో 90శాతం గూగుల్‌ ద్వారానే జరుగుతోంది. ఎకౌంటింగ్‌ మార్కెట్‌లో 74శాతం నాలుగు కంపెనీలదే. గుత్తాధిపత్యం పెరుగుతున్నదని, అది అసమానతలకు దారి తీస్తున్నదని ఐఎంఎఫ్‌ వంటి సంస్థలు అంగీకరించినా నివారణకు ఎలాంటి చర్యలూ తీసుకోవటం లేదు.ప్రపంచంలో నిజవేతనాలు తగ్గుతున్నట్లు, దీంతో అసమానతలు పెరుగుతున్నట్లు ప్రపంచ కార్మిక సంస్థ(ఐఎల్‌ఓ) పేర్కొన్నది. ద్రవ్యోల్బణానికి అనుగుణంగా వేతనాలు పెరగని కారణంగా గడచిన రెండు సంవత్సరాల్లో 79.1 కోట్ల మంది కార్మికులు 1.5లక్షల కోట్ల డాలర్లు నష్టపోయినట్లు పేర్కొన్నది. ఉమ్మడి రాష్ట్రంలో సవరించటం తప్ప తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌ రెండుగా విడివడిన పది సంవత్సరాల్లో ఒక్కసారి కూడా కనీసవేతనాలను సవరించకపోవటం లేదా ముసాయిదా పేరుతో అడ్డుకోవటం తెలిసిందే.ప్రపంచమంతటా ఇదే వైఖరి.


విద్య, వైద్యం వంటి సేవలను వస్తువులుగా మార్చి వాటిని ప్రభుత్వం రంగం నుంచి తప్పించి ప్రయివేటు కార్పొరేట్‌లు స్వంతం చేసుకొని లాభాలు దండుకోవటం కూడా అసమానతలకు దారితీస్తున్నది. కాలుష్యాల నిరోధ చర్యలు తీసుకోకుండా గతంలో లబ్ది పొందిన కార్పొరేట్లే ఇప్పుడు వాటి నివారణ పేరుతో ప్రభుత్వాల నుంచి పెద్ద ఎత్తున రాయితీలు, సబ్సిడీలు పొందుతున్నాయి.పేద, మధ్య తరగతి దేశాలు రుణభారంతో సతమతం కావటంతో పాటు తీవ్ర అసమానతలు పెరుగుతున్నాయి. ప్రపంచ మొత్తం పేదల్లో 57శాతం(240 కోట్ల) మంది పేద దేశాల్లో ఉన్నారు. జీవన పరిస్థితి దిగజారటంతో ప్రపంచమంతటా సమ్మెలు, ఆందోళనలు పెరుగుతున్నాయి. అమెజాన్‌ కంపెనీలో పని చేస్తున్నవారు 30దేశాల్లో 2022లో ఆందోళనలు చేశారు.జీవన వ్యయాల పెరుగుదలకు నిరసనగా 2023లో 122 దేశాల్లో ఆందోళనలు జరిగాయి. కరోనా తరువాత కోట్లాది మంది పౌరుల పరిస్థితి పూర్వపు స్థితికి చేరుకోలేదు. 2017-2020తో పోలిస్తే ప్రపంచ అతి పెద్ద కార్పొరేట్‌ సంస్థలు 2021,2022లో 89శాతం లాభాలను పెంచుకున్నాయి. 2023తొలి ఆరునెలల వివరాలను పరిశీలిస్తే గత రికార్డు లాభాల చరిత్రను బద్దలుకొడుతున్నట్లు కనిపిస్తున్నది. చమురు, విలాసవస్తువులు, విత్త సంబంధ కంపెనీలకు లాభాలు విపరీతంగా పెరిగాయి. ప్రపంచంలోని 0.001శాతం కార్పొరేట్లు అన్ని కార్పొరేట్ల లాభాల్లో మూడోవంతు పొందాయంటే సంపదల కేంద్రీకరణ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అమెరికా కంపెనీల్లో 89శాతం వాటాలు తెల్లవారి చేతుల్లో ఉండగా ఆఫ్రికన్లకు 1.1,హిస్పానిక్‌లకు 0.5శాతం ఉన్నాయి. పదకొండుశాతం మంది ప్రపంచ బిలియనీర్లు అధికారంలో లేదా రాజకీయ నేతలుగా ఉన్నారు.గడచిన నాలుగు దశాబ్దాలకాలంలో 30 ఐరోపా దేశాలలో మూడు వేల విధానపరమైన ప్రతిపాదనలను పరిశీలించగా ధనికులు మద్దతు ఇచ్చిన వాటినే అమలు జరిపారు తప్ప పేదల వాటిని పట్టించుకోలేదు.


అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్‌) జరిపిన పరిశోధనలో కార్పొరేట్‌ శక్తుల గుత్తాధిపత్యం పెరగటం వలన అమెరికాలోని వస్తు ఉత్పాదక రంగంలో 76శాతం మంది కార్మికుల ఆదాయాలు తగ్గాయని తేలింది. ఈ సంస్థలు, కార్మికుల వేతనాలనే కాదు మార్కెట్లను అదుపు చేస్తాయి. అవసరమైన వస్తువులు, సేవలను అందుబాటులో లేకుండా చేస్తాయి. నవకల్పనలు, కొత్త సంస్థలను ఎదగనివ్వకుండా చూస్తాయి. తమ లాభాల కోసం ప్రభుత్వ సేవలను ప్రైవేటీకరించేట్లు చూస్తాయి. తమ లాభాలకు ముప్పురాకుండా ధరలను కూడా పెంచుతాయి. వీటికి ప్రభుత్వాలు ఎల్లవేళలా మద్దతు ఇస్తాయి. అందుకే కొన్ని కార్పొరేట్లు దేశాల జిడిపి కంటే ఎక్కువ సంపదలను కలిగి ఉన్నాయి. ఉదాహరణకు యాపిల్‌ కంపెనీ విలువ మూడు లక్షల కోట్ల డాలర్లనుకుంటే 2023లో మన దేశ జిడిపి 3.7లక్షల కోట్లని అంచనా. ప్రపంచంలోని ఇలాంటి ఐదు పెద్ద కంపెనీల సంపదలు మొత్తం ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా, కరీబియన్‌ దేశాల మొత్తం జిడిపి కంటే ఎక్కువ. మొత్తం బహుళజాతి కంపెనీల లాభాల్లో 1975లో పెద్ద కంపెనీల వాటా నాలుగుశాతం కాగా 2019నాటికి పద్దెనిమిది శాతానికి పెరిగింది.


ఇప్పుడు ప్రపంచాన్ని ఏలుతున్నది ద్రవ్య పెట్టుబడి అన్న సంగతి తెలిసిందే.2009 నుంచి ఈ రంగంలో ఉన్న కొన్ని కంపెనీలు ప్రస్తుతం 5.8లక్షల కోట్ల డాలర్ల ప్రైవేటు పెట్టుబడిదారుల ఆస్తులను నిర్వహిస్తున్నాయి. ఇవిగాక బ్లాక్‌ రాక్‌, స్టేట్‌స్ట్రీట్‌, వాన్‌గార్డ్‌ అనే ఫండ్స్‌ సంస్థలు 20లక్షల కోట్ల డాలర్ల మేర ద్రవ్య ఆస్తులను నిర్వహిస్తున్నాయి. ఇంత పెద్ద సంస్థలు ప్రభుత్వ విధానాలను, దేశాధినేతలను శాసించటంలో ఆశ్చర్యం ఏముంది. గుత్త సంస్థలు ప్రపంచానికి కొత్త కాదు. ఇంగ్లీష్‌ ఈస్టిండియా కంపెనీ ప్రారంభమైన 1,600 సంవత్సరం నుంచి ఎన్నిదేశాలను ఆక్రమించుకొని దోచుకున్నదీ ఎరిగిందే.వర్తమానంలో రాక్‌ఫెల్లర్‌ కంపెనీ ప్రపంచ చమురు సామ్రాజ్యం, సిసిల్‌ రోడెస్‌ ప్రపంచ వజ్రాల మార్కెట్‌ను శాసిస్తున్న సంగతీ తెలిసిందే. ఒక దశను దాటిన తరువాత ప్రజాస్వామిక రాజ్యం కంటే ప్రైవేట్‌ అధికారం పెరిగితే స్వేచ్చకు హామీ ఉండదని అమెరికా మాజీ అధ్యక్షుడు ఫ్రాంక్లిన్‌ డి రూజ్‌వెల్ట్‌ చెప్పాడు. గుత్త సంస్థలను అడ్డుకున్నందుకే అవి కుట్రచేసి మిలిటరీ తిరుగుబాటుద్వారా చిలీ కమ్యూనిస్టు నేత సాల్వెడార్‌ అలెండీని అధికారం నుంచి కూల్చివేసిన సంగతి తెలిసిందే. పదహారు వందల బడాకంపెనీల మీద ఒక సర్వే నిర్వహించగా కేవలం 0.4శాతం మాత్రమే కార్మికులకు జీవన వ్యయ వేతనం ఇస్తున్నట్లు అంగీకరించాయి.కార్మిక సంఘాలను ఏర్పాటు కానివ్వకుండా అడ్డుకోవటం, అణచివేతల కారణంగా యూనియన్లలో చేరుతున్నవారి సంఖ్య తగ్గుతోంది.ఓయిసిడి దేశాలలో 1985లో 30శాతం మంది చేరగా 2017నాటికి 17శాతానికి పడిపోయింది.


మహిళలకు జరుగుతున్న అన్యాయం, వేతనాల చెల్లింపు కూడా దారుణంగా ఉంది. మధ్య ప్రాచ్యం,ఉత్తర ఆఫ్రికాలో ఒక పురుషుడు ఎలాంటి చెల్లింపులు లేని సంరక్షణ పనిలో వారానికి ఒకటి నుంచి ఐదు గంటల వరకు ఉంటుండగా అదే మహిళలు 17 నుంచి 34గంటలు పని చేస్తున్నారు. ప్రపంచమంతటా వీరి పని విలువను నగదు రూపంలో లెక్కిస్తే ఏటా 10.8లక్షల కోట్ల డాలర్లుగా తేలింది. అధికవేతనాలు ఉన్నాయని అనుకుంటున్న ప్రపంచ టెక్నాలజీ కంపెనీల్లో చెల్లిస్తున్నదాని కంటే ఇది మూడు రెట్లు ఎక్కువ.ఐరోపా సూపర్‌ మార్కెట్లకు సరఫరా చేసే పండ్లు, ద్రాక్ష క్షేత్రాల్లో పని చేసే కోస్టారికా, దక్షిణాఫ్రికా మహిళలకు ఒక సీసా వైన్‌ విక్రయించే ధరలో కేవలం 1.2శాతమే వేతనాల రూపంలో లభిస్తుండగా సూపర్‌ మార్కెట్లకు 50శాతం పైగా దక్కుతున్నది. సంపదలు కార్పొరేట్ల వద్ద పేరుకు పోవటానికి, అసమానతలు పెరగటానికి పన్నుల తగ్గింపు కూడా ఒక ప్రధాన కారణం.ఓయిసిడి దేశాలలో 1980లో కార్పొరేట్‌ ఆదాయపన్ను 48శాతం ఉండగా 2022నాటికి 23.1శాతానికి తగ్గింది. ప్రపంచవ్యాపితంగా ఇదే ధోరణి.నూటనలభై ఒక్క దేశాలలో 111 చోట్ల 2020-2023 కాలంలో తగ్గాయి. ప్రపంచమంతటినీ చూస్తే 23 నుంచి 17శాతానికి పడిపోయాయి. విదేశాల్లో పొందిన లాభాల్లో 35శాతం ఎలాంటి పన్నులు లేని ప్రాంతాలకు చేరాయి. పన్ను విధానాలపై కార్పొరేట్ల ప్రభావానికి ఇది నిదర్శనం. ఈ మేరకు ప్రభుత్వాలకు రాబడి తగ్గటంతో సంక్షేమ కార్యక్రమాలకు కోత విధిస్తున్న కారణంగా ప్రపంచమంతటా అశాంతి పెరుగుతున్నది..

Share this:

  • Tweet
  • More
Like Loading...

సబ్సిడీల ఎత్తివేతపై జర్మన్‌ రైతుల నిరసన, రౌడీ ఆందోళన అన్న మీడియా !

21 Sunday Jan 2024

Posted by raomk in COUNTRIES, Current Affairs, Economics, Europe, Farmers, Germany, History, INTERNATIONAL NEWS, Opinion, Prices

≈ Leave a comment

Tags

Agri subsidies, EU farmer protests, German Farmers' Association, German farmers’ protests


ఎం కోటేశ్వరరావు


” ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు, మరింత సాయం వస్తుందని నేను చెప్పలేను, మీకు మరింత స్వేచ్చ, మీ పనికి మర్యాద కోసం కావాలంటే నేను కూడా మీతో కలసి ఆందోళన చేస్తా , నేను కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాడినే ” జనవరి ప్రారంభం నుంచి ఆందోళన చేస్తున్న రైతులతో జర్మనీ ఆర్థిక మంత్రి క్రిస్టియన్‌ లిండ్‌నర్‌ అన్న మాటలి. ప్రభుత్వ వైఖరికి నిరసనగా బెర్లిన్‌తో సహా అనేక పట్టణాల్లో రోడ్ల మీద ట్రాక్టర్లను నిలిపి ఆందోళన చేస్తున్న అన్నదాతలను రౌడీ రైతులుగా చిత్రించి మీడియా వార్తలకు శీర్షికలిచ్చింది.2024 బడ్జెట్‌తో ప్రారంభించి వ్యవసాయ యంత్రాలు, డీజిల్‌కు ఇస్తున్న సబ్సిడీలను దశలవారీ ఎత్తివేస్తామని జర్మన్‌ ప్రభుత్వం డిసెంబరులో ప్రకటించింది. సబ్సిడీలకు వ్యతిరేకంగా కోర్టు తీర్పు ఇచ్చిందంటూ ప్రభుత్వం చేసిన ఈ ప్రకటనతో రైతాంగంలో ఆగ్రహం పెల్లుబుకింది. దీంతో ఒకడుగు వెనక్కు వేసి కొత్త వ్యవసాయ యంత్రాలకు పన్ను రాయితీలు ఇస్తాం తప్ప డీజిల్‌ సబ్సిడీలు ఎత్తివేస్తామని చెప్పింది. శాంతించని రైతులు జనవరి మొదటి వారం నుంచి వివిధ రూపాలలో ఆందోళనలు చేస్తున్నారు.పదిహేనవ తేదీన బెర్లిన్‌లో దేశమంతటి నుంచి వచ్చిన 30వేల మంది రైతులు పెద్ద సంఖ్యలో ట్రాక్టర్లతో సహా తరలి వచ్చి ప్రదర్శన చేశారు. దాంతో నగరంలో ట్రాఫిక్‌ నిలిచిపోయింది. బస్‌లు, ట్రామ్‌లు నడిచే మార్గాలను మూసివేయాల్సి వచ్చింది. ఆ సందర్భంగా రైతుల నుద్దేశించి మాట్లాడేందుకు మంత్రి ప్రయత్నించగా వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతుల ఆందోళనకు ప్రతిపక్ష మితవాద పార్టీలు మద్దతు ప్రకటించటంతో ఇంకేముంది ఆందోళన వెనుక మితవాదులు చేరారు అంటూ మీడియాలో పక్కదారి పట్టించే వార్తలు, వ్యాఖ్యానాలు వెలువడుతున్నాయి.(మన దేశంలో రైతులు ఢిల్లీ శివార్లలో తిష్టవేసి ఏడాది పాటు చేసిన ఆందోళనను బిజెపి ప్రభుత్వం కూడా ఇలాగే ఉగ్రవాదులతో ముడిపెట్టి తప్పుడు ప్రచారం చేసిన సంగతి తెలిసిందే). జర్మన్‌ రైతులు తమ నిరసన వ్యక్తం చేసేందుకు గ్రామ ప్రవేశ ద్వారాల వద్ద విడిచిన బూట్లు,పక్కనే వెలుగుతున్న కొవ్వొత్తులున్న డబ్బాలను ప్రదర్శిస్తున్నారు.రైతుల నిరసనలతో కాస్తవెనక్కు తగ్గిన సర్కార్‌ వ్యవసాయ వాహనాల పన్నులను తగ్గించేది లేదని, డీజిల్‌పై పన్నులను దశలవారీ ఎత్తివేస్తామని చెప్పింది. దీన్ని రైతులు అంగీకరించటం లేదు. సోమవారం (జనవరి 22న) ప్రభుత్వంతో చర్చలు జరుపుతామని, తమకు అంగీకారం కానట్లయితే మరోసారి ఆందోళనకు దిగుతామని జర్మనీ రైతు సంఘం ప్రకటించింది.


రైతులకు ఇచ్చే సబ్సిడీలను తగ్గించేందుకు ప్రభుత్వం ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని సాకుగా చూపింది. బెర్లిన్‌లో నిరసన తెలిపిన రైతులతో మంత్రి లిండ్‌నర్‌ మాట్లాడుతూ స్కూళ్లు, రోడ్లు, పారిశ్రామిక ఇంథన సబ్సిడీలకు నిధులు అవసరమని చెప్పటంతో రైతులు మరింత ఆగ్రహించారు. దాంతో స్వరం పెంచిన మంత్రి ఐరోపాలో స్వేచ్చకు మరోసారి ముప్పు వచ్చినందున భద్రత నిమిత్తం ఉక్రెయిన్‌ యుద్ధం కోసం నిధులు కావాలని అన్నాడు. ఉక్రెయిన్‌కు నిధులు ఇస్తే ఇచ్చుకోండిగానీ దానికి తమను ఎందుకు బలిపెట్టాలని రైతులు ప్రశ్నిస్తున్నారు. జర్మనీతో సహా అనేక దేశాల్లో రైతుల ఆందోళనకు ఉక్రెయిన్‌ సంక్షోభం ఒక తక్షణ కారణమైంది. ఉక్రెయిన్‌ నుంచి వస్తున్న ధాన్యంతో పోటీ పెరిగిందని, తమకు గిట్టుబాటు కావటం లేదని ఉక్రెయిన్‌ సరిహద్దులో రుమేనియా రైతులు ఆందోళన చేశారు.


అనేక పారిశ్రామిక దేశాల్లో మాదిరి జర్మనీలో రైతుల ఆత్మహత్యల రేటు ఎక్కువ.మన దేశంలో మాదిరి వ్యవసాయం గిట్టుబాటుగాక అప్పులపాలై పురుగుమందులు తాగి ప్రాణాలు తీసుకుంటున్నవారు అక్కడ కూడా ఉన్నారు. అనేక మంది సాగుభూములను వదలి వేశారు.వ్యవసాయం చేసే వారికి జీవిత భాగస్వాములు దొరకటం కూడా సమస్యే. సబ్సిడీ చెల్లించే నిబంధనలను ఎప్పటికప్పుడు మారుస్తుండటంతో ఇబ్బందులు పడుతున్న రైతులకు కొదవలేదు. వారి నుంచి ఉత్పత్తులు కొనుగోలు చేసే సూపర్‌మార్కెట్లు కూడా ప్రపంచ ధరల తీరు పేరుతో ఎప్పటి కప్పుడు మార్చివేస్తుండటంతో రైతులకు ఒక అనిశ్చిత పరిస్థితి ఉంది.ఐరోపా యూనియన్‌ దేశాలలో సాగు గిట్టుబాటుగాక ప్రతి రోజూ వెయ్యి మంది రైతులు వ్యవసాయానికి దూరం అవుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ముఖ్యంగా చిన్న రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. పెద్ద్ద కమతాలైతేనే సాగు గిట్టుబాటు అవుతుందనే సూత్రీకరణలు పశ్చిమదేశాల ఆర్థికవేత్తలు చేస్తున్నారు. అది వాస్తవం కాదని అనేక దేశాల్లో జరుగుతున్న ఆందోళనలు స్పష్టం చేస్తున్నాయి. పులిని చూసి నక్కవాతలు పెట్టుకున్నట్లుగా మన దేశంలో కూడా కార్పొరేట్ల లాబీయిస్టులు కొందరు అదే పాట పాడుతున్నారు. పారిశ్రామిక-వర్ధమాన దేశాలలో వ్యవసాయ సంక్షోభ తీరుతెన్నులు భిన్నంగా ఉండవచ్చు గానీ సంక్షోభం మాత్రం వాస్తవం.పూర్తిగా మార్కెట్‌ శక్తులకు వదలి వేస్తే మెరుగైన ధరలు వచ్చి రైతులు లబ్ది పొందుతారని కొందరు చేస్తున్న వాదనలు వట్టి బూటకమని జర్మనీ రైతుల ఆందోళన వెల్లడిస్తున్నది. వారి ఉత్పత్తులకు తగిన గిట్టుబాటు ధర వస్తే యంత్రాలు, డీజిలుపై సబ్సిడీ చెల్లించాలని రోడ్డెక్కాల్సిన అవసరం ఉండేది కాదు. డీజిల్‌ సబ్సిడీలను ఎత్తివేస్తే ఏటా జర్మన్‌ రైతులు ఐదు నుంచి పదివేల యూరోలు( మన కరెన్సీలో ఒక యూరో విలువ 91 రూపాయల వరకు ఉంది) నష్టపోతారని అంచనా.


కార్పొరేట్‌ సాగు మాత్రమే గిట్టుబాటు అవుతుంది అని చెబుతున్నవారు అది అమలు జరుగుతున్న, భారీ కమతాలున్న ధనిక దేశాల్లో ఎందుకు రైతులు ఆందోళనలు చేస్తున్నారో, ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ఎందుకు సబ్సిడీలు ఇస్తున్నాయో చెప్పాలి. ప్రపంచ వాణిజ్య ఒప్పందం కుదరకపోవటానికి ధనిక దేశాలు ఇస్తున్న వ్యవసాయ సబ్సిడీలపై తలెత్తిన వివాదమే ప్రధాన ఆటంకంగా ఉన్న సంగతి తెలిసిందే. జర్మనీ పార్లమెంటుకు సమర్పించిన ఒక నివేదికలో 2010-20 దశాబ్ద కాలంలో 36వేల వ్యవసాయ క్షేత్రాలు మూతపడ్డాయి. పక్కనే ఉన్న ఫ్రాన్స్‌లో 2021డిసెంబరులో విడుదల చేసిన వివరాల ప్రకారం పదేండ్లలో లక్ష మూతపడ్డాయి. ఐరోపా మొత్తంగా 2005 నుంచి 2020 వరకు మొత్తం 53లక్షల వ్యవసాయ క్షేత్రాలు అదృశ్యమయ్యాయి. అంటే కుటుంబ సాగు బడాకంపెనీల చేతుల్లోకి భూమి పోతున్నది. కమతాల్లో భూమి ఎంత ఎక్కువగా ఉంటే సాగు ఖర్చు అంత తక్కువ అని ఒకవైపు చెబుతారు. అమెరికా, ఐరోపాల్లో హెక్టార్ల వంతున సబ్సిడీ చెల్లిస్తున్నారు తప్ప వేరు కాదు.అందుకే చిన్న రైతులకు గిట్టుబాటు కావటం లేదు. అమెరికాలో ప్రత్యక్ష, పరోక్ష సాగు సబ్సిడీలకు గాను 130 పధకాలున్నాయి. ఏడాదికి 30బిలియన్‌ డాలర్ల సబ్సిడీ ఇస్తున్నారు. అంటే ధనిక దేశాల్లో కార్పొరేట్‌ సాగు కూడా సబ్సిడీలు లేకుండా నడవదా లేక ప్రభుత్వాలు వాటికి అప్పనంగా దోచిపెడుతున్నట్లా ? అమెరికాలో గడచిన నాలుగు దశాబ్దాలలో 33 సంవత్సరాలు ఉత్పత్తి ఖర్చు గిట్టుబాటు కాలేదని తేలింది. అందుకే అక్కడ భారీగా సబ్సిడీలు ఇస్తున్నారు. కార్పొరేట్‌ సాగే అలా ఉంటే కుటుంబ సాగు పరిస్థితి చెప్పనవసరం లేదు. మన దేశంలో కూడా ఒక్క పంజాబ్‌లో తప్ప దేశమంతటా ధాన్య రైతులుఉ నష్టపోవటం లేదా ఖర్చులు రావటమే అన్నట్లుగా పరిస్థితి ఉంది.


ఐరోపా దేశాల్లో పర్యావరణ పరిరక్షణ అంటూ కాలుష్యాన్ని తగ్గించే పేరుతో డీజిల్‌, పురుగుమందులు, ఎరువుల మీద సబ్సిడీల తగ్గింపుకు తీసుకుంటున్న చర్యలు సాగు రంగాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తున్నాయి. 2050 నాటికి పర్యావరణానికి హాని కలిగించే వాయువుల విడుదల నిలిపివేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించారు. దానిలో భాగంగా 2030 నాటికి రసాయన పురుగు మందుల వాడకాన్ని 50శాతానికి తగ్గించాలనే నిబంధనలు విధించారు. రైతులను నిరుత్సాహపరిచేందుకు వీటికి ఇస్తున్న సబ్సిడీలను రద్దు చేస్తున్నారు. వీటితో పాటు ఉక్రెయిన్‌ నుంచి చౌకగా దిగుమతి చేసుకుంటున్న ధాన్యం అనేక దేశాల్లో రైతులను రోడ్ల బాట పట్టిస్తున్నది. నీటి పొదుపు చర్యల పేరుతో బోరు బావుల తవ్వకాన్ని నిషేధించటంతో స్పెయిన్‌ రైతులు అక్రమంగా తవ్వుతున్నారు. బావుల నిబంధనలకు వ్యతిరేకంగా స్పెయిన్‌ రైతులు, నీటి తీరువా ,డీజిల్‌ ధరల పెరుగుదలకు నిరసనగా ఫ్రెంచి రైతులు ఇటీవల కాలంలో ఆందోళన చేశారు. వ్యవసాయ పెట్టుబడుల ధరలు పెరిగిన విధంగా ఉత్పత్తులకు పెరగటం లేదు. బీమా ప్రీమియం పెంపు, సబ్సిడీల నిలిపివేతకు నిరసనగా రుమేనియా రైతులు, ట్రక్కు డ్రైవర్లు దేశమంతటా ట్రాక్టర్లు, ట్రక్కులతో రోడ్ల మీద నిరసనలు తెలిపారు.డీజిల్‌పై పన్నులు తగ్గించాలని, రుణాల వసూలు వాయిదా వేయాలని, సబ్సిడీలను వెంటనే చెల్లించాలని డిమాండ్‌చేశారు. మొక్కజన్నలపై సబ్సిడీ ఇవ్వాలని, పన్నులు పెంచరాదని పోలాండ్‌ రైతులు ఆందోళన చేశారు. ప్రభుత్వం అంగీకరించటంతో ఆందోళన విరమించారు.


జర్మనీలో ఆందోళన చేస్తున్న రైతులకు అక్కడ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న మితవాద ఎఎఫ్‌డి పార్టీ మద్దతు ఇస్తున్నది. దాన్ని చూపి నయా నాజీలు, మితవాదులు రైతులను రెచ్చగొడుతున్నారని, ఆందోళన వారి చేతుల్లోకి పోతోందని జర్మన్‌ పాలక కూటమి ఆరోపించింది. తమ డిమాండ్లకు ఎవరు మద్దతు ఇచ్చినా స్వీకరిస్తామని రైతులు చెబుతున్నారు. అనేక దేశాల్లో ఎన్నికలు జరగనుండటంతో మితవాద శక్తులు మౌనంగా ఉండవు. అధికారపక్షాల మీద వ్యతిరేకతను సహజంగానే రెచ్చగొడతాయి. పాలకులు ప్రజా సమస్యలను పట్టించుకుంటే వాటికి అలాంటి అవకాశం రాదు. ఉదారవాద పాలకపార్టీల వైఫల్యం అనేక దేశాల్లో మితవాద పార్టీలు అధికారానికి రావటం లేదా సవాలు చేసే స్థితికి ఎదిగాయి. వాటిని ఎదుర్కోవాలనటంలో ఎలాంటి పేచీ లేదు గానీ ఆ బూచిని చూపి న్యాయమైన డిమాండ్లను తిరస్కరిస్తే జనాన్ని ఆ శిబిరంలోకి నెట్టినట్లే. తాము అధికారానికి వస్తే సాగు సబ్సిడీలను తగ్గిస్తామని పార్టీ కార్యక్రమంలో పేర్కొన్నది. అయితే ప్రభుత్వం మీద ఉన్న ఆగ్రహంతో కొందరు రైతులు ఆ పార్టీవైపు కూడా మొగ్గుచూపవచ్చని విశ్లేషకులు చెబుతున్న మాటలకు అర్ధం ఇదే.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మధ్య ప్రాచ్య సంక్షోభం : ఎమెన్‌పై అమెరికా,బ్రిటన్‌ దాడులు !

17 Wednesday Jan 2024

Posted by raomk in Africa, Current Affairs, Europe, History, imperialism, INDIA, International, Opinion, UK, USA, WAR

≈ Leave a comment

Tags

2023 Israel–Hamas war, iran, Joe Biden, MIDDLE EAST, Red Sea crisis, US, US Attack on Yemen


ఎం కోటేశ్వరరావు


పశ్చిమాసియా, మధ్య ప్రాచ్యంలో పరిణామాలు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. తమ శత్రువులు, ఇజ్రాయెల్‌ గూఢచార కేంద్రాలపై దాడులు చేసినట్లు ఇరాన్‌ ప్రకటించింది. ఇజ్రాయెల్‌కు మద్దతుగా ఉండే నౌకలపై కొనసాగిస్తున్న దాడులను ఎమెన్‌లోని హౌతీ సాయుధులు తీవ్రం చేశారు. వారి మీద అమెరికా, బ్రిటన్‌ ప్రత్యక్షంగా దాడులు చేస్తుండగా పది దేశాలు వాటికి వివిధ రూపాలలో సాయపడుతున్నాయి. గాజాపై యూదు దురహంకారుల మారణకాండ, విధ్వంసం కొనసాగుతూనే ఉంది. ఈ ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే ముడి చమురు ధరలు ఇప్పుడున్న బ్రెంట్‌ రకం 78 డాలర్ల నుంచి ఏప్రిల్‌ నాటికి 110 డాలర్ల వరకు పెరగవచ్చని కొందరు జోశ్యాలు చెబుతున్నారు. తాము పాలస్తీనాకు మద్దతుదార్లమే అనే సంకేతాలు ఇచ్చేందుకు ఎర్ర సముద్రంలో ప్రవేశించే అనేక నావలు చైనా, రష్యా సిబ్బందితో నడుస్తున్నట్లు సంకేతాలు పంపుతున్నాయి. ఇవి నిజంగా ఆ దేశాల కంపెనీలకు చెందినవేనా లేక దాడులను తప్పించుకొనేందుకు అలా సూచిస్తున్నాయా అన్నది నిర్ధారణ కాలేదు.ఉత్తర గాజా ప్రాంతంలో పౌరుల ప్రాణ రక్షణకు అవసరమైన ఆహారం, ఔషధాలు,మంచినీరు, ఇతర అవసరాలను అందచేస్తున్న సంస్థలను ఇజ్రాయెల్‌ అడ్డుకుంటున్నదని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. ఇప్పటివరకు గాజాలో 24వేల మందికి పైగా పౌరులను ఇజ్రాయెల్‌ చంపింది, 61వేల మంది గాయపడ్డారు. తాను గనుక అధ్యక్షుడిగా ఉండి ఉంటే పరిస్థితిని ఎంతో వేగంగా చక్కదిద్ది ఉండేవాడినని డోనాల్ట్‌ ట్రంప్‌ చెప్పుకున్నాడు. తాను పదవిలో ఉంటే అసలు ఇజ్రాయెల్‌ దాడే చేసి ఉండేది కాదన్నాడు. అమెరికా చరిత్రలో జో బైడెన్‌ పరమ చెత్త అధ్యక్షుడని వర్ణించాడు.


ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్‌ దళం (ఐఆర్‌జిసి) సోమవారం నాడు ఇరాక్‌, సిరియాల్లోని శత్రు కేంద్రాలు,స్థావరాలపై ఖండాంతర క్షిపణులతో దాడులు జరిపింది. ఇరాక్‌లోని కర్దిష్‌ పాక్షిక స్వయం పాలిత ప్రాంత రాజధాని ఎర్బిల్‌ నగరంలోని ఇజ్రాయెల్‌ గూఢచార కేంద్రంపై దాడులను కేంద్రీకరించింది.పేలుళ్ల కారణంగా జరిగిన నష్టం గురించి వెల్లడి కాలేదు గానీ ఐదుగురు మరణించినట్లు కర్దిష్‌ డెమోక్రటిక్‌ పార్టీ ప్రకటించింది. ఈనెల ప్రారంభంలో ఇరాన్‌లోని కెర్మెన్‌ పట్టణంలో జరిపిన దాడుల్లో వంద మంది మరణానికి కారకులం తామే అని ఐఎస్‌ఐఎల్‌ ప్రకటించింది. సోమవారం నాడు సిరియాలోని ఆ సంస్థ కేంద్రాలపై ఇరాన్‌ దాడులు చేసింది.సిరియాలోని ఐఎస్‌ఐఎస్‌ తుర్కిస్తాన్‌ ఇస్లామిక్‌ పార్టీ కేంద్రాలను లక్ష్యంగా చేసుకొని ఇరాన్‌ సోమవారం నాడు దీర్ఘశ్రేణి క్షిపణిదాడి జరిపిందని, నిజానికి ఇది ఇజ్రాయెల్‌ను హెచ్చరించటమే అని ఇరాన్‌ మిలిటరీ వ్యవహారాల జర్నలిస్టు మహమ్మద్‌ షల్‌టౌకీ చెప్పాడు. ఆ క్షిపణి పన్నెండు వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించిందని, ఇంతకు ముందెన్నడూ ఇలాంటి దాడి జరపలేదని అన్నాడు.తాను తలచుకొంటే నేరుగా ఇజ్రాయెల్‌లోని లక్ష్యాలను గురిచూసి కొట్టగలనని చెప్పటమే ఇదన్నాడు.హమస్‌ను ఓడించటం జరిగేది కాదని అయినప్పటికీ లక్ష్యాన్ని సాధించాల్సిందేనని ఇజ్రాయెల్‌ న్యాయశాఖ మాజీ మంత్రి, ప్రస్తుత యుద్ధ కాబినెట్‌ మంత్రి గిడియన్‌ సార్‌ చెప్పాడు.వంద రోజులుగా జరుపుతున్న దాడుల మీద పెద్ద ఎత్తున వత్తిడి వస్తున్నది. గాజాపై యుద్ధాన్ని సమర్ధిస్తున్నందుకు గాను ఇద్దరు ముఖ్యమైన అధికారులు జో బైడెన్‌కు తమ రాజీనామాలను సమర్పించారు. ఎర్ర సముద్రంలో అమెరికా వస్తురవాణా నౌక ఎంవి జిబ్రాల్టర్‌ ఈగిల్‌పై ఎమెన్‌ కేంద్రంగా ఉన్న హౌతీ సాయుధులు క్షిపణులతో దాడులు జరిపారు. అది మార్షల్‌ ఐలాండ్స్‌ పతాకంతో ఉంది. పెద్దగా నష్టం లేదని, ప్రయాణం కొనసాగిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. ఎమెన్‌లోని హౌతీ స్థావరాలపై అమెరికా, బ్రిటన్‌ దాడులు జరుపుతున్నాయి. సోమవారం నాడు ఒక విమానాశ్రయం వద్ద పేలుళ్లు వినిపించాయి. ఇజ్రాయెల్‌ వైపు వెళ్లే నౌకలపై దాడులను కొనసాగిస్తూనే ఉంటామని హౌతీ నేతలు ప్రకటించారు. అమెరికా మద్దతు ఉన్న ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన హౌతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రం, ఏడెన్‌ జలసంధికి దగ్గరగా ఉన్న కీలక ప్రాంతం, రాజధాని సనాతో సహా ముఖ్యమైన ప్రాంతాలన్నీ హౌతీ సాయుధుల ఆధీనంలో ఉన్నాయి.తమదే అధికారం అని ప్రకటించుకున్నాయి. ఎమెన్‌పై దాడులను ఆపాలని ఇరాన్‌ ప్రభుత్వం అమెరికా,బ్రిటన్‌లను కోరింది. ఆ దాడులు చట్టవిరుద్దమని ప్రకటించగా తాము ఆత్మరక్షణ కోసం జరుపుతున్నట్లు అమెరికా చెప్పుకుంటున్నది.హౌతీలకు ఇరాన్‌ మద్దతు ఉన్న సంగతి తెలిసిందే. ఎమెన్‌ అంతర్యుద్ధంలో హౌతీలకు వ్యతిరేకంగా అమెరికా అనుకూల శక్తులకు దాదాపు పది సంవత్సరాలపాటు మద్దతు ఇచ్చిన సౌదీ అరేబియా ఇటీవల ఇరాన్‌తో దౌత్య సంబంధాలను పునరుద్దరించుకుంది.దాంతో హౌతీలపై చేస్తున్న దాడులకు సాయాన్ని నిలిపివేసింది. ఈ పరిణామం మింగుడుపడని అమెరికా ఇప్పుడు ఎర్రసముద్రంలో నౌకల రక్షణకు గాను తాము ఎమెన్‌పై దాడులు జరుపుతున్నట్లు సాకు చూపుతున్నది.హౌతీల వెనుక ఇరాన్‌ ఉన్నట్లు ఆరోపిస్తున్నది.


అమెరికా నౌకపై దాడి దానికి ప్రతిగా బ్రిటన్‌తో కలసి అమెరికా దళాలు చేస్తున్న దాడుల తరువాత హౌతీలు ఏమాత్రం వెనక్కు తగ్గేది లేదని ప్రకటించటంతో అమెరికా కూటమి సామర్ధ్యం గురించి విశ్లేషకులు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.సమీప భవిష్యత్‌లో తాము ఎల్‌ఎన్‌జి రవాణా నౌకలను ఎర్ర సముద్రంలోకి పంపే అవకాశం లేదనని కతార్‌ ప్రకటించింది. గురువారం నాటి అమెరికా,బ్రిటన్‌ దాడుల తరువాత ఆ మార్గంలో ప్రయాణించే నౌకలు తగ్గాయి.గత ఆరువారాల్లో హౌతీలు 30సార్లు నౌకలపై జరిపారు. గాజాపై ఇజ్రాయెల్‌ దాడులను నిలిపివేస్తే తాముకూడా స్వేచ్చగా నౌకల రవాణాను అనుమతిస్తామని ప్రకటించారు. తమ దాడులు ఒక హెచ్చరిక మాత్రమేనని, నిరంతరం కొనసాగిస్తామని చెప్పలేదని బ్రిటన్‌ రక్షణ మంత్రి గ్రాంట్‌ షాప్స్‌ చెప్పాడు.ఐరాస గుర్తింపు పొందిన ఎమెన్‌ ప్రభుత్వం హౌతీలను ఓడించాలంటే తమకు మిలిటరీ ఆయుధాలు, శిక్షణతో పాటు గూఢచార సమాచారాన్ని అందించాలని పశ్చిమ దేశాలను కోరింది. తొమ్మిది సంవత్సరాల పాటు సౌదీ అరేబియా చేసిన ప్రయత్నాలు ఫలించలేదని, వైమానిక దళ శక్తి చాలదని మేజర్‌ జనరల్‌ ఇదారస్‌ చెప్పాడు.హౌతీల క్షిపణులు భూగర్భంలో ఉంటాయని వాటిని పసిగట్టటం కష్టమని కూడా చెప్పాడు.ఆదివారం నాడు ఎమెన్‌ పిఎల్‌సి ప్రభుత్వ ప్రధాని మయీన్‌ అబ్దుల్‌ మాలీతో బ్రిటన్‌ రాయబారి భేటీ అయ్యాడు. మరుసటి రోజు తాము ఇజ్రాయెల్‌ను సమర్ధించటం లేదని, పాలస్తీనియన్లకు మద్దతు ఇస్తున్నట్లు ఎమెన్‌ ప్రకటించింది. తొలిసారిగా ఎమెన్‌పై అమెరికా,బ్రిటన్‌ దాడులకు దిగినప్పటికీ వాటిని ఎదురుదాడులుగా పరిగణించలేమని కొందరు చెబుతున్నారు.ఎర్ర సముద్రంలో స్వేచ్చగా తమ నౌకలు తిరిగే హక్కుందని స్పష్టం చేయటమే అసలైన లక్ష్యమని చెబుతున్నారు. ఈ దాడులకు ఆస్ట్రేలియా, బహరెయిన్‌, కెనడా, నెదర్లాండ్స్‌ తదితర దేశాల మద్దతు ఉంది.హౌతీల చరిత్ర చూసినపుడు వారిని ఎవరూ తక్కువ అంచనా వేయకూడదని చెబుతున్నారు.అమెరికా యుద్ధ నౌక డెస్ట్రాయర్‌ మీద జరిపిన దాడి తరువాత సోమవారం నాడు అమెరికా వాణిజ్య నౌక మీద హౌతీలు దాడులు జరిపారు. ఎర్ర సముద్రం నుంచి సూయజ్‌ కాలువకు వెళ్లే మార్గంలో కీలకమైన బాబ్‌ అల్‌ మండెబ్‌ జలసంధితో సహా ఎమెన్‌ కీలక ప్రాంతాలన్నీ హౌతీల చేతుల్లో ఉన్నాయి. ఉద్రిక్తతలు మరింత దిగజారకుండా చూడాలని జో బైడెన్‌ పైకి చెబుతున్నప్పటికీ ఇజ్రాయెల్‌కు ఆయుధాలు పంపేందుకు ఇప్పటికి రెండు సార్లు అమెరికా పార్లమెంటును పక్కన పెట్టి తన అధికారాలను వినియోగించాడు. రానున్న రోజుల్లో ఎమెన్‌ మీద దాడులు జరిపితే పరిస్థితి విషమించవచ్చు.


విశ్లేషకుల అంచనాలు తప్ప వచ్చు, పోరు తమకు లాభం చేకూర్చుతుందని అమెరికా, దాని మిత్ర దేశాలు భావిస్తే ఆ ప్రాంతాన్ని యుద్ధ రంగంలోకి లాగవచ్చు. అదే జరిగితే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి. ప్రపంచ కంటెయినర్‌ రవాణా 30, పన్నెండుశాతం ప్రపంచ వాణిజ్యం ఎర్ర సముద్రంగుండా జరుగుతున్నది. ఐరోపాతో మన దేశ వస్తువాణిజ్యం 80శాతం ఈ మార్గం నుంచే ఉంది. రవాణా వ్యయం పెరిగి మనం చేసుకొనే దిగుమతుల ఖర్చు పెరిగితే వాటిని మనజనం మీద మోపుతారు. అదే మన ఎగుమతుల రవాణా ఖర్చు పెరిగితే వాటిని కొనేవారు లేకపోతే పరిస్థితి ఏమిటన్నది సమస్య. ఇప్పటి వరకైతే ఎలాంటి సమస్య లేదు గానీ జనవరి నుంచి ప్రారంభం అవుతుందని అధికారులు చెబుతున్నారు. నవంబరు మధ్య నుంచి సూయజ్‌ కాలువ ద్వారా ఎర్ర సముద్రంలో ప్రవేశించాల్సిన నౌకలలో 95శాతం ఆఫ్రికాలోని గుడ్‌ హౌప్‌ ఆగ్రంను చుట్టి వస్తున్నాయి. దీని వలన నాలుగు నుంచి ఆరువేల నాటికల్‌ మైళ్ల దూరం అదనంగా ప్రయాణించాల్సి రావటం, 14 నుంచి 20రోజులు అదనపు ప్రయాణం చేయాల్సి ఉంది. ఇజ్రాయెల్‌ దాడులను కొనసాగించినంతకాలం హౌతీల దాడులు కొనసాగుతూనే ఉంటాయి. అదే జరిగితే ప్రపంచ ముడిచమురు సరఫరా వ్యవస్థ దెబ్బతినవచ్చని ఆరు నుంచి ఎనిమిది మిలియన్ల పీపాల సరఫరాలోటు ఏర్పడవచ్చని అక్టోబరు చివరిలో ప్రపంచ బాంకు హెచ్చరించింది.ఫలితంగా 56 నుంచి 75శాతం వరకు ధరలు పెరిగి 140 నుంచి 157 డాలర్ల వరకు పీపా ధర పెరగవచ్చని పేర్కొన్నది. అయితే చమురు వ్యాపారులు మార్చి, ఏప్రిల్‌ నెలల్లో పీపాధర 110 డాలర్లవరకు పెరగవచ్చనే అంచనాతో 30 మిలియన్ల పీపాల మీద పందెంకాశారు.( అంతకంటే తక్కువ ధర ఉంటే వారు చెల్లిస్తారు ఎక్కువ ఉంటే ఇతరుల నుంచి తీసుకుంటారు.చమురు చేతులు మారదు) దీనికి ప్రధాన కారణం ఇరాన్‌ పూర్తి మద్దతు ఉన్న హౌతీ సాయుధుల చర్యలే. అదే విధంగా మే, జూన్‌ మాసాల్లో 130 డాలర్లు ఉండవచ్చని కూడా పందెం కాస్తున్నారు. మార్కెట్‌ విశ్లేషకులు మాత్రం ఈ ఏడాది ఆరునెలల్లో వంద డాలర్లకు పైగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. మధ్య ప్రాచ్యంలో పెద్ద పరిణామాలేవీ జరగకపోవచ్చని అనేక మంది చెబుతున్నారు. డిసెంబరులో రాయిటర్స్‌ సర్వేలో 34 మందిలో ఒక్కరే ఈ ఏడాది 90 డాలర్లకంటే ఎక్కువ ఉండవచ్చని చెప్పారు.అమెరికా, ఇతర పశ్చిమదేశాలు అనుసరిస్తున్న వైఖరి కారణంగా మొత్తం మీద పరిణామాలు ఆందోళనకరంగా మారుతున్నాయి.తమ మీద దాడులు జరిగిన తరువాత కూడా అమెరికా నౌకల మీద హౌతీలు దాడులు చేశారు. ఇవి ప్రాంతీయ యుద్ధానికి దారితీసే అవకాశం లేకపోలేదని చెబుతున్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనాలో ఏం జరుగుతోంది ? ఆర్థిక రంగం పతన దశలో ఉందా !

06 Saturday Jan 2024

Posted by raomk in CHINA, COUNTRIES, Current Affairs, Economics, Europe, History, INDIA, International, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

#Anti China, China, China economy, China exports, India PMI, Narendra Modi Failures, Xi Jinping


ఎం కోటేశ్వరరావు


చైనాలో ఏం జరుగుతోంది ? చాలా మందికి అర్థంగాని, గందరగోళ పరిచే ప్రశ్న. అక్కడి వ్యవస్థ, ఆర్థికరంగం గురించి గతంలో చెప్పిన, వర్తమానంలో చెబుతున్న జోశ్యాల సంగతేమిటి ? భారత ఉత్పాదక రంగ పిఎంఐ (పర్చేజింగ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌) 2023 డిసెంబరుల్లో పద్దెనిమిది నెలల కనిష్టానికి నవంబరులో ఉన్న 56 నుంచి 54.9కి తగ్గిందన్నది వార్త. ఎందుకటా కొత్త ఆర్డర్లు, ఉత్పత్తి బలహీనంగా పెరగటం వలన ఈ పరిస్థితి ఏర్పడింది. ఈ సూచిక 50 అంతకు మించి ఉంటే ఉత్పాదకరంగం విస్తరిస్తున్నట్లు, తగ్గితే దిగజారుతున్నట్లు లెక్క. గడచిన 30నెలలుగా 50కిపైగా నమోదు అవుతోంది. చైనాలో నవంబరులో ఉన్న 50.7పిఎంఐ డిసెంబరులో 50.8కి పెరిగిందని కాయిక్సిన్‌ సర్వే వెల్లడించింది.చిత్రం ఏమిటంటే చైనా ప్రభుత్వం ప్రకటించిన వివరాల ప్రకారం గడచిన ఆరునెలల్లో డిసెంబరులో ఫ్యాక్టరీ ఉత్పాదకత తగ్గింది. ప్రభుత్వం సర్వేకు ఎంచుకున్న బడా కంపెనీలకు, కాయిక్సిన్‌ ఎంచుకున్న చిన్న, మధ్య తరహా సంస్థలు కాస్త బాగా పని చేస్తున్నట్లు కొందరు అదీ ఇదీ రెండు సరైనవే అని చెప్పారు. చైనాలో జరుగుతున్న ఆర్థిక మార్పులు కొన్ని సమస్యలను ముందుకు తెచ్చిన మాట వాస్తవం. గతంలో శ్రామికశక్తి ఎక్కువగా ఉన్న పరిశ్రమలు, వ్యాపారాల స్థానంలో ఆధునిక ఉత్పాదక, సాంకేతిక మార్పులు ప్రవేశించాయి. ఈ కారణంగా ఉపాధి రంగం మీద కొన్ని ప్రతికూల ప్రభావాలు పడి సర్దుబాటు సమస్య తలెత్తింది. ఇది ప్రతిదేశంలోనూ జరిగిందే, జరుగుతున్నదే. ఒకనాడు మన దేశంలో సాధారణ డిగ్రీ చదువుకుంటే మెరుగైన ఉపాధి లభించేది, ఇప్పుడు అది కొరగానిదిగా మారింది.దాన్ని చేతపట్టుకొని ఉపాధి పొందలేకపోతున్నారు. అందుకే మన కేంద్ర ప్రభుత్వం నైపుణ్యాల అభివృద్ధి(స్కిల్‌ డెవలప్‌మెంట్‌) పధకాలను అమలు జరుపుతున్నది. అది ఎంతమేరకు పనికి వచ్చేది, దానిలో శిక్షణ లేకుండా సర్టిఫికెట్లు ఇస్తూ ఎంత అవినీతి జరిగేదీ, నైపుణ్యపాలు ఎంత అన్నది వేరే సంగతి. చైనాలో పరిశ్రమల్లో వస్తున్న మార్పులు శిక్షణ సమస్యలనే ముందుకు తెస్తున్నాయి. వాటిని పరిష్కరించేదిశగా ప్రభుత్వం ఉంది అంటే కొందరికి నమ్మకం కలగటం లేదు.చైనా ఏం చెప్పినా, ఏం చేసినా నమ్మనివారు ఎప్పుడూ ఉంటారు.


మార్కెట్లో అనిశ్చితి కారణంగా జపాన్‌లో కూడా ఫ్యాక్టరీ కార్యకలాపాలు తగ్గాయి. పిఎంఐ అంతకు ముందు నెలలో ఉన్న 48.3 నుంచి డిసెంబరులో 47.9కి తగ్గింది. యాభైకంటే తక్కువగా ఉన్నప్పటికీ జపాన్‌ మాంద్యంలో ఉందని చెప్పరుగానీ అంతకంటే ఎక్కువ ఉన్న చైనాలో మాంద్యం ఉందని చిత్రిస్తారు. గ్లోబల్‌ ఎకానమీ డాట్‌కామ్‌ సమాచారం ప్రకారం ఉత్పత్తి, సేవారంగాల సంయుక్త పిఎంఐ వివిధ దేశాల పరిస్థితి దిగువ విధంగా ఉంది.(న అంటే నవంబరు, డి అంటే డిసెంబరు 2023గా గమనించాలి)
దేశం ×××× తాజాపిఎంఐ×× మూడునెలలక్రితం×× ఏడాది క్రితం
భారత్‌ ××× 57.40న ××× 60.90 ××××××× 56.70
చైనా ××× 51.60న ××× 51.70 ××××××× 47.00
జపాన్‌ ××× 50.40డి ××× 52.10 ××××××× 49.70
అమెరికా×× 51.00డి ××× 50.20 ××××××× 45.00
యూరో××× 47.00డి ××× 47.20 ××××××× 49.30
ఎగువ వివరాలను చూసినపుడు ఏడాది క్రితం పరిస్థితి పోల్చుకుంటే ఎక్కడ ఎలాంటి సమస్య ఉందో ఎవరికి వారు నిర్ధారణకు రావచ్చు.పిఎంఐలను బట్టే మాంద్యాల్లోకి పోయినట్లు లేదా బయటపడినట్లు పూర్తిగా చెప్పలేము. అది ఒక సూచిక మాత్రమే. చైనా, ఇతర దేశాల కంటే మనదేశ సంయుక్త పిఎంఐ ఎక్కువగా కనిపిస్తోంది. అదే వాస్తవమైతే వస్తు, సేవల ఎగుమతుల్లో అది ప్రతిబింబించాలి.2023 గణాంకాలు ఇంకా ఖరారు కానందున 2022ను ప్రామాణికంగా తీసుకుంటే ప్రపంచంలో తొలి పది వస్తు ఎగుమతి దేశాల జాబితాలో మనకు చోటు లేదు.పోనీ అంతర్గత డిమాండ్‌ పెరిగితే డిసెంబరు నెలలో వస్తూత్పత్తి పిఎంఐ పద్దెనిమిది నెలల కనిష్టానికి ఎందుకు తగ్గినట్లు ? విజువల్‌ కాపిటలిస్ట్‌ డాట్‌కామ్‌ సేకరించిన సమాచారం ప్రకారం 2022లో వివిధ దేశాల వస్తు ఎగుమతులు ఇలా ఉన్నాయి.1.చైనా 3.6లక్షల కోట్ల డాలర్లు,2.అమెరికా 2.1ల.కో.డా, 3.జర్మనీ 1.7లకోడా,4.నెదర్లాండ్స్‌ 965.5బిలియన్‌ డాలర్లు, 5.జపాన్‌ 746.9 బి.డా,6. దక్షిణ కొరియా 683.6బి.డా,7.ఇటలీ 656.9 బి.డా, 8. బెల్జియం 632.9 బి.డా, 9.ఫ్రాన్స్‌ 617.8 బి.డా,10.హాంకాంగ్‌ 609.9బి.డా, 11.యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ 598.5బి.డాలర్లుగా ఉన్నాయి.మన ఎగుమతులు 453.58బి.డాలర్లు.


ముందే చెప్పుకున్నట్లు పిఎంఐ ఒక దేశ ఆర్థికరంగ పరిస్థితిని పూర్తిగా ప్రతిబింబించదు. అది ఇతర దేశాల పరిస్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది.ఉదాహరణకు 2015 డిసెంబరు రెండున మింట్‌ పత్రిక విశ్లేషణలో వివిధ దేశాల పిఎంఐల వివరాలను ఇచ్చింది. దాని ప్రకారం జపాన్‌ 52.6తో అగ్రస్థానంలో ఉండగా భారత్‌ 50.3, తైవాన్‌ 49.5, వియత్నాం 49.4, దక్షిణ కొరియా 49.1,చైనా 48.6, మలేషియా 47, ఇండోనేషియా 46.6గా ఉంది. అంటే మనదేశం అప్పుడే చైనా కంటే మెరుగైన స్థితిలో ఉన్నట్లే. అలాంటిది ఇన్ని సంవత్సరాల తరువాత కూడా ఎగుమతుల్లో ఎందుకు ఎదుగుదల లేదు.మేకిన్‌, మేడిన్‌ ఇండియాల జాడ ఎక్కడ ? పిఐబి 2022 జూలై 29న విడుదల చేసిన సమాచారం ప్రకారం 2017-18లో జిడిపిలో వస్తు ఎగుమతుల శాతం 11.4కాగా 2021-22లో 13.3శాతంగా పేర్కొన్నారు. ఐదు సంవత్సరాల సగటు 11.78శాతం ఉంది. వస్తు, సేవల ఎగుమతులు ఈ కాలంలోనే 18.8 శాతం నుంచి 21.4శాతం మధ్య ఉన్నాయి. సగటు 19.5శాతమే ఉంది. అందువలన వాటిలో కూడా పెద్దగా పెరుగుదల లేదు.మాక్రోట్రెండ్స్‌ అనే పోర్టల్‌ నిర్వహిస్తున్న సమాచారం ప్రకారం 2004 నుంచి 2013వరకు ఏటా సగటున మన దేశ జిడిపిలో 22.1శాతం ఎగుమతులు జరిగాయి. ఈలెక్కన మోడీ ఏలుబడిలో దిగుమతులు పడిపోయినట్లా పెరిగినట్లా ?


చైనాలో మాంద్యం… ఒప్పుకొన్న జింపింగ్‌ అనే శీర్షికలతో పాటు అనేక వ్యాఖ్యానాలు వెలువడ్డాయి.ఆర్థికంగా చైనా ఎంతో ఇబ్బందుల్లో ఉందని వాణిజ్యాలు గడ్డు స్థితిని ఎదుర్కొంటున్నాయని, జనాలు ఉపాధి పొందలేకపోతున్నారని, కొంత మందికి రోజువారీ అవసరాలు తీరటం లేదని వర్తమాన స్థితి గురించి దేశాధినేత షీ జింపింగ్‌ నూతన సంవత్సర సందేశంలో చెప్పినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. అసలు చైనా నేత ఏం చెప్పారు ? షీ జింపింగ్‌ చైనా భాషలో ఇచ్చిన సందేశాన్ని విదేశీ మంత్రిత్వశాఖ ఆంగ్లంలో అనువదించి విడుదల చేసింది. దానిలో అనేక ఆకాంక్షలను వెలిబుచ్చారు. వాటితో పాటు దిగువ మాటలను చెప్పారు.” ప్రయాణంలో మనం కొన్ని ఎదురుగాలులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.కొన్ని సంస్థలు గడ్డుపరిస్థితిని ఎదుర్కొన్నాయి.కొంత మంది పౌరులు ఉపాధిని వెతుక్కోవటంలో, మౌలిక అవసరాలను తీర్చుకోవటంలో ఇబ్బందిని ఎదుర్కొన్నారు. కొన్ని ప్రాంతాలు వరదలు, తుపాన్లు, భూ కంపాలు లేదా ఇతర ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొన్నాయి. ఇవన్నీ నా మదిలో అగ్రభాగాన ఉన్నాయి.”. ఈ మాటలను పట్టుకొని చైనా ఆర్థిక స్థితి గురించి చిలవలు పలవలుగా వ్యాఖ్యానాలు చేశారు. జింపింగ్‌ గడచిన సంవత్సరంలో చైనా ఎదుర్కొన్న అంశాలను ప్రస్తావించారు. సాధించిన విజయాలను కూడా పేర్కొన్నారు.వాటిని విస్మరించి ఇబ్బందుల్లో ఉందన్న ప్రచారం చేస్తున్నారు. దాని వలన కొంత మంది తప్పుదారి పట్టటం తప్ప చైనాకు వచ్చే నష్టమేమీ లేదు. ఇక్కడ గమనించాల్సిందేమంటే చైనా జింపింగ్‌ దాచేందుకు ప్రయత్నించలేదు.


ఇంతకీ అసలు మాంద్యం అంటే ఏమిటి ? చైనాలో ఆ పరిస్థితి ఉందా ? మందగమనం అంటే మాంద్యమని అర్ధమా ? న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రికలో 1974లో రాసిన ఒక విశ్లేషణలో అమెరికా కార్మిక గణాంకాల కమిషనర్‌ జూలియస్‌ షిష్కిన్‌ ఒక భాష్యం చెప్పారు. వరుసగా రెండు త్రైమాసిక (ఆరునెలలు) కాలాల్లో వాస్తవ జిఎన్‌పి(జాతీయ మొత్తం ఉత్పత్తి) తగ్గినా, ఆరునెలల్లో పారిశ్రామిక ఉత్పత్తి పతనమైనా దాన్ని మాంద్యం అంటారు. దీని తీవ్రత నిజ జిఎన్‌పి 1.5శాతం తగ్గినపుడు, వ్యవసాయేతర ఉపాధి 15శాతం పతనమైనపుడు, నిరుద్యోగం రెండు శాతం పెరిగి ఆరుశాతం స్థాయికి చేరినపుడు, ఇక వ్యాప్తి గురించి చెప్పాల్సి వస్తే వ్యవసాయేతర రంగంలో 75శాతం పైగా పరిశ్రమల్లో ఆరునెలలు, అంతకు మించి ఉపాధి తగ్గినపుడు మాంద్యంలో ఉన్నట్లు పరిగణించాలని షిష్కిన్‌ చెప్పాడు. ఇలాంటి పరిస్థితి చైనాలో ఉందా ? జింపింగ్‌ నోట మాంద్యం అనే మాట వచ్చిందా ? కరోనా తరువాత చైనా ఆర్థికరంగం మందగమనంలో ఉంది తప్ప మాంద్యంలో కాదు.చైనాలో గడచిన నాలుగున్నర దశాబ్దాల పారిశ్రామిక విధానం వేరు, ఇప్పుడు అనుసరిస్తున్నది వేరు. తన ఉత్పత్తిని పెంచుకొనేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని దిగమతి చేసుకున్న చైనా ఇప్పుడు స్వంతంగా రూపొందించుకున్నదానితో ఆ రంగంలో ముందున్న దేశాలతో పోటీపడేందుకు చూస్తోంది. సాంప్రదాయ పరిశ్రమల స్థానంలో ఆధునికమైనవి వస్తున్నాయి. వాటికి అవసరమైన పరిశోధన-అభివృద్ధి ఖర్చులో మన వంటి దేశాలతో పోలిస్తే ఎంతో ముందున్నా ధనికదేశాలతో పోలిస్తే ఇంకా వెనుకబడే ఉంది. దాన్ని అధిగమించే క్రమంలో ఉంది.అడ్డుకొనేందుకు పశ్చిమ దేశాలు చూస్తున్నాయి.దానిలో భాగమే చిప్‌ వార్‌. కృత్రిమ మేథ(ఏఐ)లో పశ్చిమ దేశాలకు సవాలు విసురుతోంది. చైనా అంటే ఇష్టంలేని మీడియా సంస్థలు అక్కడ జరుగుతున్నదాని గురించి జనాలను తప్పుదారి పట్టిస్తున్నాయి. వైఫల్యాలను వారేమీ దాచటం లేదు. చైనా గురించి గతంలో చెప్పినవన్నీ అర్ధసత్యాలుగానూ అవాస్తవాలుగా తేలాయి. కూలిపోతుంది, విఫలమౌతుందని చెప్పిన జోశ్యాలన్నీ తప్పాయి. గతంలో మాదిరి రెండంకెల పెరుగుదల లేదు గానీ ధనిక దేశాల కంటే వృద్ధి రేటు అధికంగా ఉంది. అవి పతనం కానపుడు చైనాకే ఆ దుర్గతి ఎలా పడుతుంది ? ఇంత చిన్న తర్కాన్ని అర్ధం చేసుకోలేని స్థితిలో ఉన్నామా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • చైనాతో వాణిజ్యంపై ఆందోళన – నిజా నిజాలేమిటి !
  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!

Recent Comments

pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • చైనాతో వాణిజ్యంపై ఆందోళన – నిజా నిజాలేమిటి !
  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!

Recent Comments

pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • చైనాతో వాణిజ్యంపై ఆందోళన – నిజా నిజాలేమిటి !
  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!

Recent Comments

pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 246 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d